Thursday, January 1, 2026

Atla Taddi Katha - అట్లతద్ది కథ

అట్లతద్ది కథ

ఆశ్వయుజ మాసంలోని తదియ తిథినే అట్లతద్ది లేదా అట్ల తదియ అని అంటారు. ఈ పండుగను ఉయ్యాల పండుగ, గోరింటాకు పండుగ అని కూడా పిలుస్తారు. ఇది ముఖ్యంగా తెలుగు మహిళల ఆరాధన పండుగలలో ఒకటి, గౌరీదేవిని పూజిస్తూ కుటుంబ సౌఖ్యం, సుభిక్షం, మంచి వరుడు కోసం అమ్మాయిలు ఈ రోజును ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. పూరాణాల ప్రకారం, ఈ రోజున గౌరీదేవి పార్వతీ అమ్మవారి అవతారంగా పూజించబడుతుంది. సతీమణులు భర్త సౌఖ్యాన్ని కోరుకుంటూ, పెళ్లికాని అమ్మాయిలు తమకు కావలసిన గుణగణాలతో కూడిన భర్త కోసం వ్రతం చేస్తారు. ఈ వ్రతంలో ముఖ్యమైన విశేషం “అట్లు వండటం, పంచుకోవడం, ఉయ్యాల ఊగడం” కావడం.

అట్లతద్ది పుట్టుక వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. పూరాణ ప్రకారం, గౌరీదేవి శివుడిని పొందడానికి దీర్ఘకాలం తపస్సు చేసింది. తపస్సు ఫలితంగా ఆమెకు శివుడి అనుగ్రహం లభించింది. ఆ దినమే “అట్లతద్ది”గా పరిగణించబడుతుంది. అందువల్ల ఈ రోజున స్త్రీలు గౌరీదేవికి పూజలు చేసి, అట్లు (పిండివంటలు) నైవేద్యంగా సమర్పిస్తారు. పూజ అనంతరం అమ్మవారిని ఆరాధిస్తూ ఉయ్యాల ఊగడం, గోరింటాకు రాయడం, సఖులతో పాటలు పాడడం ఆచారంగా కొనసాగుతుంది. ఈ రోజు ఇంట్లో ఆనందం, స్నేహభావం, సౌందర్యం ప్రతిఫలించేలా మహిళలు చేస్తారు. పెళ్లికాని అమ్మాయిలకు ఈ రోజు ఎంతో శుభప్రదంగా భావిస్తారు. పండితుల అభిప్రాయం ప్రకారం, అట్లతద్ది రోజున ఉయ్యాల ఊగుతూ సంతోషంగా గడిపిన అమ్మాయిలకు సుగుణాలు గల భర్త లభిస్తాడు. గౌరీదేవి కృపతో వారి జీవితంలో సౌఖ్యం, శాంతి నెలకొంటుందని నమ్మకం. యుక్తవయస్క ఆడపిల్లలు ఈ రోజున స్నేహితులతో కలిసి ఆటపాటలతో గడిపితే అది గౌరీదేవికి సేవ చేసినట్లే అని పురాణాలు పేర్కొంటాయి. అందుకే గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల దాకా ఈ పండుగను మహిళలు ఎంతో ఉత్సాహంగా, ఆనందంతో జరుపుకుంటారు. అట్లతద్ది కేవలం ఆచారం మాత్రమే కాకుండా, స్త్రీ శక్తి, భక్తి, సౌభాగ్యానికి ప్రతీక గా నిలిచే ప్రత్యేక పర్వదినంగా భావిస్తారు.

వ్రత కథ
రాచవారి అక్కెమ్మ, వెలమువారి అక్కెమ్మ, బ్రాహ్మణవారి అక్కెమ్మ, కోమటివారి అక్కెమ్మ, కాపువారి అక్కెమ్మ విరైదుగురు తద్దినోము నోచుకుందామని ఉపవాసముండిరి. మూడు జాములు దాటిన తరువాత సుకుమారి అయిన రాచవారి అక్కెమ్మ మొగము తిరిగిపడిపోయెను. అంతట అన్నలు వచ్చి “యేమమ్మా! ఇట్లుపడి పోయినద”ని తల్లిని అడుగగా- నాయనా తద్దినోము నోచుకుందామని యుపవాసముండి చంద్రుడు వచ్చినదాక నుండలేక పడిపోయినదని చెప్పెను. అప్పుడొకయన్నగారు చింతచెట్లెక్కి అద్దముకట్టి అరికకుప్పకు ఆ అద్దమునకు తిన్నగా చిచ్చు పెట్టి చెల్లెలినిలేపి “అమ్మాయీ అదిగో! చంద్రుడు వచ్చినాడు. ఆ చింతచెట్టు వైపునకు చూడుమని భ్రమింపజేసి నోము నోచుకొమ్మని చెల్లెలితో చెప్పెను. ఆమె నిజముగా చంద్రుడు వచ్చినాడనుకొని సంతోషించి నోము నోచుకొని అన్నము తినెను. అంత నామెకు పదియేండ్లు వచ్చిన తరువాత పెండ్లిచేయుటకు ప్రయత్నించగా ముసలి మొగుడు వచ్చెను. ఆమె వానిని జూచి "నాకు పెండ్లి అక్కరలేదు. అయ్యో తద్దినోము నోచుకుంటే పడుచుమొగుడు వచ్చునని సాయంత్రము దాకా నుండి నోము నోచుకొని" అన్నము తింటిని. నాకీ ముసలిమగడేల దాపరించెనని విచారించు చుండెను.

అంతట తల్లిదండ్రులువచ్చి “అమ్మా ! మనది రాచకులం పెండ్లియాడకుండుట తప్పని అనేక విధముల చెప్పినను, వినక యొక రాత్రివేళ అడవివెంబడి పోవుచుండెను. అటు కొంత దూరము పోయి యొకకొలను దరినున్న మఱిక్రింద నిష్టతో తపస్సుచేయ మొదలుపెట్టెను. ఇలా కొంతకాలము తపస్సు చేయుచుండ భూపరిపాలనకై యాపొంత నరుగుచున్న పార్వతీ పరమేశ్వరులామెను చూచి-“ఓ చిన్నదానా! ఎందుచేత నీవిలా తపస్సు చేయుచుంటివ”ని యడిగిరి. అందుకామె-“మీరేమి ఆర్చెడివారా తీర్చెడివారా మీకెందుకు?” అని యుత్తరమిచ్చెను. ఆర్చెడివారమును, తీర్చెడివారమును మేమే. చెపవలయున”నని మరల వారడగిరి. అంత నామెలేచి వారికి నమస్కరించి “నేను తద్దినోము నోచుకొనుచున్నాను, నాతో నోచుకొనినవారివలె గాక నాకు ముసలిమగడు వచ్చినాడు. నేనేమి పాపము చేసితినో" యని యామె దీనయై పలికెను. “నీవు ఉపవాసమునుండి మూడుఝాములు తిరిగిన తరువాత మొగముతిరిగిపోగా నీయన్నవచ్చి చింతచెట్టుకొమ్మకు అద్దముకట్టి క్రింద చిచ్చుపెట్టి ఆ అద్దములో కనబడుచున్న మంటను చంద్రుడని భ్రమింపచేయగా నీవునిజముగా చంద్రుడు వచ్చినాడని నోము నోచుకొని భోజనము చేసినావు. ఆ కారణముచేత నీకు ముసలిమగడు వచ్చినాడు” అనివారు చెప్పి-“ఇప్పుడైన
నింటిపోయి దీపాలవేళదాకా నుండి నోము నోచుకొన్న యెడల పడుచుమగడు వచ్చునిని చెప్పిరి. అప్పుడాపిల్ల ఇంటికివచ్చి రాత్రిదాకా నుపవాసముచేసి యధావిధిగ నోము నోచుకొనియెను. అంతనామెకు పడుచు మొగుడు వచ్చెను. అప్పుడు ఆ వూరివారందరును, “ఏమి నోము నోచితివమ్మా ! ఏమి వ్రతము పట్టినావమ్మా! నీకు పడచు మగడు దొరకుటకు?” అని యడిగిరి. అందుకామె “అట్లతద్దె దీపాల వేళదాకా నుండి నోము నోచుకున్నాను. ముసలిమగడు పడుచుమగడు అయినాడు.”

ఉద్యాపనము: కలియుగమం దందరును అట్లతద్దె నోముపట్టి , పదేసి అట్లు నైవెద్యముపెట్టి పదేసి అట్లు వాయనములిచ్చి ఈవిధంగా పదేండ్లు నోచుకొని. ఈ కధచెప్పి అక్షింతలు వేసుకొని, పదేండ్లుయైన తరువాత పదిమంది ముత్తయిదువులకు పదేసి అట్లు, దక్షిణ, నల్లపూసలు, లక్కజోళ్లతో వాయన మీయవలయును.

అట్లతద్దికి ముందురోజు కాళ్ళు, చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు. గుమ్మాలకు తోరణాలు కడతారు. తెల్లవారుజామున నిద్ర లేచి, స్నానపానాదులు ముగించి సాయంత్రం వరకూ ఏమీ తినరు. ఆఖరికి మంచినీళ్ళు కూడా తాగరు. అట్లతద్దినాడు పిల్లలు, స్త్రీలు ఉయ్యాల ఊగుతారు. పరవశంగా ఊయల ఊగుతూ ‘అట్లతద్దోయ్.. ఆరట్లోయ్.. ముద్దపప్పోయ్.. మూడట్లోయ్…‘
లాంటి సరదా పాటలు పాడుకుంటారు.

Wednesday, December 31, 2025

Undralla Tadde Katha - ఉండ్రాళ్ళ తద్దె కథ

ఉండ్రాళ్ళ తద్దె కథ

పూర్వం ఒకరాజుకు ఏడుగురు భార్యలు వున్నప్పటికీ.. అతను చిత్రాంగి అనే వేశ్యపై ఎక్కువగా మక్కువ కలిగి వుండేవాడు. ఆమెతోనే సమయాన్ని గడిపేవాడు.

ఒకనాడు భాద్రపద బహుళ తదియనాడు రాజుగారి ఏడుగురు భార్యలు ఉండ్రాళ్లతద్ది అనే నోమును నిర్వహించుకుంటున్నారని చెలికెత్తెల ద్వారా చిత్రాంగి వింటుంది. అప్పుడు ఆ చిత్రాంగి, రాజుతో.. నువ్వు వివాహం చేసుకున్న నీ భార్యలతో ఉండ్రాళ్ల తద్దీ నోము చేయించుకున్నావు. నేను ఒక వేశ్య అవడంవల్ల నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు. నీ భార్యలమీద వున్న ప్రేమ నా మీద కూడా వుంటే.. ఉండ్రాళ్ల తద్దీ నోమును అవసరమైన సరుకులను నాకోసం ఏర్పాటు చేయ మని అడిగింది.

ఆమె కోరికను రాజు అంగీకరించి.. నోముకు కావలసిన పదార్థాలను, సరుకులను ఆమెకోసం ఏర్పాటు చేస్తాడు. అవి అందగానే వేశ్య అయిన చిత్రాంగి.. భాద్రపత తృతీయనాడు సూర్యోదయానికి ముందే లేచి అభ్యంగన స్నానాన్ని ఆచరిస్తుంది. సూర్యాస్తమయం వరకు ఏమీ తినకుడా ఉపవాసం వుంటుంది. చీకటి పడగానే గౌరీదేవికి బియ్యపు పిండితో తయారుచేసుకున్న
ఉండ్రాళ్లు వండుకొని ముత్తయిదువును తీసుకొనివచ్చి అయిదు ఉండ్రాళ్లు నైవేద్యము పెట్టి అయిదు ఉండ్రాళ్లు వాయనము, దక్షిణతాంబూలము ముత్తయిదువ కిచ్చి యావేశ్యకాంత యధావిధిగ నోము నోచుకొనెను. ఈ ప్రకారము అయిదేండ్లు నోము నోచుకొని అయిదుగురు ముత్తయిదువులకు తలయంటి నీళ్ళుపోసి గోరింటాకిచ్చి అయిదు రవికెల గుడ్డలను, అయిదు డబ్బులును, తాంబూలములనిచ్చి యా నోము నుద్యాపనము చేసుకొనియెను. కథలోపమైనా వ్రతలోపము కాకూడదు. భక్తితప్పినా ఫలము తప్పదు. దాని ఫలితంగా ఆమె పవిత్రంగా, సద్గతిని పొందుతుంది. 

వ్రత విధానం:
భాద్రపద తృతీయనాడు స్త్రీలు ఉదయాన్నే లేచి ముందుగా అభ్యంగన స్నానం ఆచరించాలి. సాయంత్రవరకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోకుండా ఉపవాసం వుండాలి. బియ్యపు పిండితో తయారుచేసిన ఉండ్రాళ్లను చేసి, వాటిని వండుకోవాలి. గౌరిదేవిని పూజామందిరంలో ప్రతిష్టించుకున్న తరువాత పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి.

తరువాత ఐదు ఉండ్రాళ్లను గౌరిదేవికీ, మరో ఐదు ఉండ్రాళ్లను ఐదుగురు ముత్తైదువులకు వాయనమివ్వాలి. ఇలా ఐదు సంవత్సాలవరకు ఈ నోమును ఆచరించిన తరువాత వచ్చిన వారందరి పాదాలకు పసుపు-పారాణి రాసి, వారి ఆశీస్సులను పొందాలి. పెళ్లికాని అమ్మాయిలు ఈ నోమును నోచుకుంటే మంచి భర్త లభిస్తాడు.

ఇతర విశేషాలు:
భాద్రపద బహుళ తదియరోజు స్త్రీలు సద్గతులు పొందడానికి ఉండ్రాళ్ల తద్ది నోమును ప్రత్యేకంగా ఆచరించి, నిర్వహించుకుంటారు. ఈ నోమును మోదక తృతీయ అనే మరో పేరు కూడా వుంది. ఉండ్రాళ్ల నివేదన కలిగిన నోము కావడంతో.. తద్ది అనేమాట మూడవరోజు తదియ అనే అర్థంతో ఉపయోగించబడింది. దీంతో ఇది ఉండ్రాళ్ల తద్దిగా పిలువబడుతుంది. భాద్రపదంలో పూర్ణిమ వెళ్లిన మూడోరోజున బహుళ తదియనాడు ఈ నోమును నోచుకోవాలని పూర్వీకులు నిర్ణయించారు. అంతేకాదు.. సాక్షాత్తు శివుడే స్వయంగా పార్వతీదేవికి ఈ నోము గురించి వివరించాడని ఐతహ్యం.


Padaharu Kudumula Katha - పదారు కుడుముల తద్దెకథ

పదారు కుడుముల తద్దెకథ

ఒక రాజుకూతురు పూర్వజన్మమున పదారుకుడుముల తద్దినోము పట్టి యది యుల్లంఘనము చేసినందున ఆమెకు దారిద్య్రమును, వైధవ్యమును సంభవించెను. ఆ దారిద్య్రబాధకామె యనుభవింపజాలక ప్రాణములు విడువనెంచి యొకనాడొక యడవిత్రోవను బట్టి పోవుచుండెను. అప్పుడు భూపరిపాలనకై పార్వతీ పరమేశ్వరులా దారిని వచ్చుచు నాయింతిని జూచి "నీవెవరవు? ఇట్లేల నొంటరిగా నీకారడవిలో భయములేక పోవుచున్నావ"ని యడుగగా "కుడువకూడు, కట్టబట్ట, దారిద్య్రముచేత బాధపడలేక యీ యడవులబట్ట పోవుచున్నా" ని ఆమె చెప్పెను. అప్పుడు పార్వతీదేవి - "నీవు పదియారు కుడుములబెట్టి నోముపట్టి యుల్లంఘనము చేసినావు కనుక, యిట్టి బీదతనము నిన్ను బాధించుచున్నద" ని చెప్పెను. అది విని ఆ రాజకుమార్తె "అమ్మా! యాలోటు నేనెట్లు పూర్తిచేసుకొనగలుగుదును? దయచేసి చెప్పవలయున" ని ప్రార్థించెను. అందుకు పార్వతీదేవి యామెతో "నీవిప్పుడు తిరుగనింటికిపోయి భాద్రపదశుద్ద తదియనాడు నోముపట్టికథ చెప్పుకొని యక్షింతలువేసుకొని యానోము నుద్యాపనచేయు" మన, పార్వతీ పరమేశ్వరులకు భక్తితో నమస్మారముచేసి వారివద్ద సెలవుతీసుకొని, యింటికిపోయి తలంటి నీళ్ళుపోసుకొని బిళ్లకుడుములు వండుకొని, చల్ల తెచ్చుకొనుటకై పొరుగింటి కేగెను. ఆ సమయముననొక కుక్కవచ్చి యోరగిల వేసిన తలుపుతోచుకుని యా కుడుములను తినిపోయెను. అప్పుడా రాజకుమార్తెవచ్చి కుడుములు తినిపోవుచున్న యాకుక్కను చూచి, యది కుడుములతినుట గ్రహించి నిండుమనస్సుతో నాకుక్కకే తాను తెచ్చిన చల్ల మూడుముంతలు పోసెను. ఆ కుక్క గౌరిగా మారి యామెకు ప్రత్యక్షమై ఆమెకు అఖండ అయిశ్వర్యములను ఇచ్చెను.

నాటి నుండి యారాచకూతురు సిరిసంపదలు గలదై యెటేటపదియారుబిళ్ల కుడుములు నైవేద్యముచేసి పదియారు బిళ్లకుడుముల వాయనమును, దక్షిణ తాంబూలములతో నొక ముత్తయిదువకు వాయనమిచ్చి యుద్యాపచేయుచు, భూలోకలమున నధికైశ్వర్యములననుభవించెను.

పూజ విధానము: భాద్రపదశుద్దతదియ ( తెల్లవారితే వినాయకచవితి ) నాడు ఉదయమే తలంటుకొని పసుపు తో గౌరమ్మని చేసిఓ తమలపాకులో పెట్టిపూజ ప్రారంభించాలి. ముందుగా సంకల్పము చెప్పుకొనిగౌరీ దేవిని శోడషోపచారముల తో పూజించాలి. పూజ తరువాత చేతిలో అక్షింతలు పట్టుకొనినోము కథ చదువుకోవాలి. ఆ తరువాత ఆ అక్షింతలు , కొద్దిగా అమ్మవారిపై వేసికొన్ని మన నెత్తిన చల్లుకోవాలి. ఆ పై నోములో చెప్పిన విధముగా పదహారు బిళ్ళ కుడుములు (బియ్యం పిండిలో తగినంత బెల్లము పొడిచేసి వేసికొద్ది గా నెయ్యికొద్ది గా ఇలాచీపొడి వేసిబాగా కలపాలి. ఆ పిండిని పదహారు ఉండలుగా చేసిఒక్కో ఉండను కొద్దిగా వత్తిబిళ్ళలాగా చేయాలి.) చేయాలి. రెండు కొత్త చేటలు తీసుకొనివాటికి పసుపు రాసికుంకుమ బొట్టు పెట్టిఒక చాటలో పదహారు కుడుములుపసుపుకుంకుమపెట్టి రెండో చాట తో ఆ చాటను కప్పిఒక ముతైదువుకు వాయనమిచ్చిపాదనమస్కారము చేసిఆశీర్వాదము పొందాలి. ఇది ఏనోముకైనను తప్పనిసరి.

దీనికి ఉద్యాపనము- పదియారు చేటలను, చేటయొక్కంటికి పదియారెేసి బీళ్లకుడుములు, పదియారు డబ్బులును, దక్షిణ, నల్లపూసలు, లక్కబోడు పెట్టి ఉద్యాపనము చేసుకొనవలయును. కధలోపమైన వ్రతలోపము కాకూడదు. భక్తితప్పినా ఫలము తప్పదు.

పదహారు కుడుముల నోము బాద్రపదమాసములో , వినాయక చవితి రోజున కాని , బాద్రపదశుద్ధ తదియ నాడు కాని పట్టాలి . వీలైతే అదేరోజున కూడా ఉద్యాపన చేయవచ్చు. ఉద్యాపన తప్పకుండా పుట్టింటిలోనే చేయాలి . లేదా ఆఖర్చులు పుట్టింటి వారు పెట్టాలి. సామాన్యముగా అన్ని నోములు పుట్టినింటిలో అత్తింటివారి ఆద్వర్యము లోనే పడుతారు . ఉద్యాపన పుట్టింటిలోనే చేస్తారుకాని వేరేవాటికి కన్న ఈ నోముకు మాత్రము పుట్టింటివారి భాద్యత తప్పనిసరి .

ఏనోము కైనా ఆ నోముకు ప్రత్యేకముగా చెప్పిన అమ్మవారినైతే తప్పమిగితావాటికి జగన్మాత ఐన గౌరిదేవిని పూజిస్తారు.

మంగళం
సతతమూ ఆరోగ్య భాగ్యంబు నొసగెడి
శ్రీ గౌరిదేవికి జయ మంగళం నిత్య శుభ మంగళం 
సర్వవిధ సౌభాగ్యములనిచ్చి బ్రోచెడి
శ్రీ గౌరిదేవికి జయ మంగళం
 నిత్య శుభ మంగళం 
ఇంటా బయట హెచ్చు పసుపు కుంకుమ పండ
స్త్రీల చల్లగ జూచు మా గౌరిదేవికి జయ మంగళం
 నిత్య శుభ మంగళం 
శక్తి కొలదైన భక్తి మెండుగ నున్న
అభయహస్తము జూపు అమ్మ శ్రీ గౌరికి
జయ మంగళం నిత్య శుభ మంగళం
జయ మంగళం నిత్య శుభ మంగళం.

Mooga Nomu - మోబేటి పద్మము (మూగనోము)

మోబేటి పద్మము (మూగనోము)

ఆశ్వయుజ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక శుద్ధ పూర్ణిమ వరకును మూడుపూటలు భోజనముచేసి సాయంకాల సమయమున కంఠ స్నానముచెసి శుచియై తొలియేట తులసివద్ద నాలుగు పద్మములు పెట్టుకొని నాలుగు వత్తుల దీపము పెట్టుకొని మాట్లాడకుండ నలుగురు ముత్తయిదువులకు బొట్టుపెట్టి తరువాత నాలుగు నక్షత్రములను లెక్కపెట్టవలయును.

రెండవయేట యెనిమిది పద్మములు పెట్టి యెనిమిది వత్తులదీపము వెలిగించి యెనమండుగురు ముత్తయిదువులకు బొట్టుపెట్టి యెనిమిది నక్షత్రములు లెక్కపెట్టవలయును. 

మూడవయేట పండ్రెండు పద్మములకు పండ్రెండు వత్తుల దీపమునును పెట్టి పండ్రెండుగురు ముత్తయిదువులకు బొట్టుపెట్టి పండ్రెండు నక్షత్రములు లెక్క పెట్టవలయును.

దీనికి ఉద్యాపనము - 
తొలియేట నాలుగేసి అట్లు నలుగురు ముత్తయిదువులకు వాయనమిచ్చి దక్షిణతాంబూలము, నల్లపూసలు, లక్కజోడు ఇయ్యవలెను. నోము నోచుకున్న హరలకు రెండు చేతుల మీద రెండు అట్లున్ను, రెండు డబ్బులున్నూ, రెండుకాళ్లమీద రెండు అట్లున్నను, రెండు డబ్బులున్నూవుంచి, అన్నగారు తలుపు వెనుకనుండి "తిని కుడిచే కాలానకు రాకే పెడసరగండ" అంటే "ఇప్పుడు రానా? మాపునరానా ఏం?" అని అడుగవలయును. అప్పుడు నోముపట్టిన కన్య, "యిప్పుడే రమ్ము అనవలయును". అన్న వచ్చి పుస్తకముతో నాలుగు దెబ్బలుకొట్టి నాలుగుఅట్లు, నాలుగు డబ్బులు తీసికొనవలయును. ఈ ప్రకారము రెండవయేట యెనిమిది వాయనములును, మూడవయేట పండ్రెండు వాయనములును ముత్తయిదువుల కియ్యవలెను.

నోము పాట

మోచేటి పద్మంబు పట్టేటివేళ - మొగ్గల తామర్లు పూసేటి వేళ
కాకరపువ్వుల్లు పూసేటివేళ - కడవలతో నుదకమ్ము తెచ్చేటి వేళ
అనసాపువ్వుల్లు పూసేటివేళ - అటికెలతో నుదకమ్ము తెచ్చేటి వేళ
గుమ్మడి పువ్వుల్లు పూసేటివేళ - గుండెగలతో నుదకమ్ము తెచ్చేటి వేళ
బీరపువ్వుల్లు చాలపూసేటివేళ - బిందెలతో నుదకమ్ము తేచ్చేటి వేళ
సంధివేళ దీపమ్ము పెట్టేటివేళ - చాకలి మడతలు తెచ్చెటి వేళ
ఆవూలూ గోవులూ వచ్చేటివేళ - ఆంబోతుల్లు రంకెలు వేసేటివేళ
అన్నలూ అందనా లెక్కెటి వే
ళ - తమ్ములూ తాంబూలం వేసేటి వేళ
మరుదుళ్లు మరిజూదమాడేటివేళ - కూతుళ్లు గుండిగలు దించేటివేళ
బావలూ పల్లకి లెక్కేటివేళ - మరదలూ మరిజూద మాదేటివేళ
కోడళ్ళు కొట్టుపసుపు కొట్టేటి వేళ చెల్లెలు చేమంతులు ముడిచేటివేళ

ముద్దు మొగ ముద్దానిబోలు, తన మొఖము తామర పద్మాన్నిబోలు, పద్మము
పెట్టిన చానకు పదివేళ యేండ్ల అయిదవతనమును, ముగ్గుపెట్టిన చానకు మూడువేల యేళ్ళు అయిదవతనమును, 

ఈ పాట పాడుచు తులసమ్మకు ప్రదక్షిణలు చేసి అక్షంతలు వేసికొనవలయును.

Kukshi Kukke Temple - కుక్షి కుక్కే క్షేత్రం

నాగదోష నివారణ క్షేత్రం- కుక్షి (కుక్కే)

ఉడిపితో సహా మిగిలిన అయిదు క్షేత్రాలు ఉత్తర కర్ణాటకలో సాగర తీరంలో ఉండగా ఈ ఒక్క క్షేత్రం దూరంగా దక్షిణ కర్ణాటకలో ఉంటుంది. ఈ దివ్యక్షేత్ర పురాణగాధ సత్య యుగం నాటిది. లోకకంటకులైన తారకాసుర మొదలైన రాక్షసులను సంహరించిన శివ కుమారునికి దేవేంద్రుని కుమార్తె అయిన దేవసేనతో మార్గశిర శుద్ధ షష్టినాడు ఇక్కడే జరిగిందని అంటారు. స్కందునికి మంగళ స్నానం చేయించడానికి దేవతలు అనేక పవిత్ర నదీ జలాలను తెచ్చారు. ఆ జలాల ప్రవాహమే నేటి కుమార ధార. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య కుక్కే క్షేత్రాన్ని సందర్శించినట్లుగా శంకర విజయం తెలుపుతోంది. కుక్కె నాగదోష పూజలకు ప్రసిద్ధి. గరుడుని వలన ప్రాణ భయం ఏర్పడటంతో సర్ప రాజు వాసుకి ఇక్కడ దాక్కొని సర్వేశ్వరుని గురించి తపము చేసాడు. కుమారస్వామి తన వివాహ సందర్భంగా తండ్రి ఆదేశం మేరకు నాగారాజుకి అభయమిచ్చారు. ఇద్దరూ కలిసి ఇక్కడ కొలువైనారు. అందువలన ఇక్కడ చేసే పూజలు నాగ దోషాన్ని తొలగిస్తాయి. భక్తులు వివాహం, సంతానం, ఆరోగ్యం కోసం ఇక్కడికి వస్తుంటారు. నాగప్రతిష్టలు చేస్తుంటారు. కుమారధారలో స్నానం చేయడం వలన కుష్టు వ్యాధి లాంటివి కూడా తగ్గుతాయని విశ్వసిస్తారు. ప్రతి నిత్యం వేలాది మందికి అన్నదానం జరుగుతుందిక్కడ.



NAVA GRAHA TEMPLES - నవ గ్రహ దేవాలయాలు

నవ గ్రహ దేవాలయాలు

నవగ్రహములు తొమ్మిది. ఒకొక్క గ్రహనికి ఒక్కొక్క దేవాలయము ఉన్నది.

కుంభ‌కోణం
తమిళనాడు లోని కుంభకోణం క్షేత్రానికి అతి సమీపంలో నవగ్రహ దేవాలయాలున్నాయి. వీటిని దర్శించిన భ‌క్తులు విశేషంగా గ్రహ పీడలను తొలగించుకొంటారు. ఈ ఆలయాలనే నవగ్రహ స్థలాలు అంటారు.

సూర్యనార్ కోయిల్ - తిరుమంగళంకుడి
తమిళనాడు రాష్ట్రము లోని తంజావూరు జిల్లాలో కుంభకోణం నుండి 15 k.m దూరములో గల తిరుమంగళంకుడి అను ప్రాంతములో సూర్యనార్ కోయిల్ పిలువబడే సూర్యదేవలయము వున్నది. ఈ ఆలయములో సూర్యభగవానుడు ఆయన సతీమనులు అయిన ఉష, ఛాయా సమేతముగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ ఆలయాన్ని క్రీ . శ 1075 -1120 సంవత్సరాల మధ్య కాలంలో ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయ ప్రాంగణములో కాశీ విశ్వేశ్వరుడు, విశాలాక్షిని, నవగ్రహాలచే ప్రతిష్టించిన వినాయకుని దర్శించుకోవచ్చు.
ఈ ఆలయములో సూర్యభగవానుడికి తామర పుష్పాలతో పూజలు చేయడము విశేషము.
ఈ ఆలయ పూజలు చాల నిష్ఠగా జరుగుతాయి, పూజాంనతరము (పూజ తరువాత) ఆలయము చుట్టూ 9 సార్లు ప్రదక్షణ చెయ్యవలసి వుంటుంది, మరియు ఇక్కడ పూజలు చేయిస్తే ఆయురారోగ్యాలతో ఉంటారని అక్కడి భక్తుల ద్వారా తెలుస్తుంది. 
1100వ సంవత్సరంలో కులోత్తుంగ చోళ మహారాజు సూర్య దేవాలయాన్ని నిర్మించాడు. ప్రతి ఏడాది పంటలు చేతికి వచ్చే జనవరి మాసంలో సూర్యునికి కృతజ్ఞతలు తెలియజేసేందుకు విశేషమైన ఉత్సవాన్ని ఇక్కడ నిర్వహిస్తారు.

ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. రవి సంపద ప్రదాత కూడా.

చంద్రగ్రహ దేవాలయము - తిరువైయార్
తిరువైయారుకు 5 k.m దూరములో చంద్రగ్రహ దేవాలయము వుంది. తిన్గాలుర్ కోవిల్ అని పిలువబడే చంద్ర దేవాలయములోని చంద్రభగవానుని దర్శనము సుఖాన్ని,దీర్ఘాయుస్సున్ని, ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకము. మానసిక ఒత్తిడి, దుఖాన్ని తగ్గించేవాడు చంద్రుడని చెబుతారు. సెప్టెంబర్.. అక్టోబర్ మాసాలలో వొచ్చే ఫాల్గుణ నక్షత్ర సమయాలలో చంద్రకాంతి ఇక్కడి ఆలయములోని శివలింగముపై సరాసరిగా ప్రసరించడము విశేషమయినది.


అంగారక (కుజ) గ్రహ దేవాలయము - వైథీశ్వరన్ కోవిల్
తిరువైయార్‌కు ఆరు (6 km ) కిలోమీటర్ల దూరంలో కుజ దేవాలయం ఉంది. దీనికి ‘’వైథీశ్వరన్ కోవిల్’’అని పేరు. అనేక వ్యాధులను అంగారకుడు పోగోడతాడని విశ్వాసం. ధైర్యం విజయం శక్తికి అంగారకుడే కారణం. ఇక్కడే జటాయువు, గరుడుడు, సూర్యుడు అంగారకుని పూజించారని స్థల పురాణం చెపుతోంది. ఇక్కడ అనేక వ్యాధులను అంగారకుడు రూపుమపుతాడని భక్తుల విశ్వాసము, నమ్మకము. ధైర్యము, విజయము, శక్తికి అంగారకుడే కారణము. వివాహము ఆలస్యము అయితే ఈ అంగారక క్షేత్రాని దర్శిస్తే వెంటనే వివాహము అవుతుందని స్థానికులు చెపుతున్నారు .

బుధగ్రహ దేవాలయము - తిరువెన్నాడు
అంగారక ఆలయానికి 10 k.m దూరములో బుధగ్రహ దేవాలయము వున్నది. ఇక్కడి స్వామి శ్వేతారన్యేశ్వరుడు. అమ్మవారు బ్రహ్మ విద్యయంభికాదేవి. వాల్మీకి రామాయణములో ఈ దేవాలయము గురించి వుంది అని చెబుతారు. ఇక్కడ బుధగ్రహ దేవాలయము దర్శించిన వారికి వ్యాపారాని మరియు బుద్ధిని ప్రసాదిస్తాడని ఇక్కడ ప్రజలకు నమ్మకము.

బృహస్పతి (గురు) గ్రహ దేవాలయము - ఆలంగుడి
కుంభకోణానికి 18 k.m దూరములో ఆలంగుడి లో గురు గ్రహ దేవాలయము వున్నది. ఈ ఆలయాన్ని గురు దక్షిణామూర్తి ఆలయంగా భక్తులు పిలుస్తారు. ఇది తమిళనాడులో ప్రఖ్యాతి గాంచిన దివ్యక్షేత్రము. దీనిని క్రీ.శ 1131 లో విక్రమచోల చక్రవర్తి నిర్మించారు. శివుడే దేవ గురువు బృహస్పతి నామదేయముతో గురుదక్షిణామూర్తిగా పూజలు అందుకుంటూన్న పుణ్యక్షేత్రము ఇది. పార్వతి అమ్మవారు ఇక్కడి ఆలయం లోపలున్న అమృత పుష్కరిణిలో పునర్జనం పొందిందని కధనం. ఇక్కడే శివునిలో ఐక్యమైందని చెబుతారు. భోలాశంఖరుడు ఇక్కడే హాలాహలంని సేవించి గొంతులో దాచిన స్థలము ఇదే. ఆ విధముగా ఆపద నుంచి గట్టెకించిన శివుణ్ణి ' ఆపత్ సహాయేశ్వరర్ (ఆపద్భాందవుడు) గా కొలిచారు దేవతలు. గురుడికి ఇష్టమైన గురువారము నాడు, నాన బెట్టిన శనగలను పసుపుతాడుతో మాలగ చేసి గురు గ్రహానికి దండ వేసిన చదువులో ఆటంకాలు, వెనుకబడిన వారు చదువులో మరియు ఏ పని అయిన అయిపోవలిసిన వారికి, విద్యలో ఆటంకాలు, పనిలోనూ అన్నీ తొలగి పోతాయని నమ్మకము. గురు గ్రహ దోషాలు వున్నవారు దక్షిణామూర్తి గుడి చుట్టూ 24 ప్రదక్షిణలు చేసి ఈ స్వామి సన్నిధిలో నేతితో 24 దీపాలు భక్తితో వెలిగిస్తే ఆ దోషాలు తొలిగిపోయి, గ్రహ శాంతి కలుగుతుంది అని భక్తుల ప్రగాడ విశ్వాసము.

శుక్ర గ్రహ దేవాలయము - కామ్చనూరు
కంచానూర్లో సూర్య దేవాలయానికి 3 k.m దూరములో శుక్ర గ్రహ దేవాలయము వుంది. దీనికి పలాశవనం, బ్రహ్మపరి, అగ్నిస్థలము అని పేర్లు కూడా వున్నాయి. ఇక్కడే బ్రహ్మ దేవుడు పార్వతీ పరమేశ్వరుల వివాహాన్ని దర్శించాడట. ఇక్కడ తమ భార్యల ఆరోగ్యము కొరకు తమ భర్తలు పూజలు చేస్తారు.

శని గ్రహ దేవాలయము - తిరునల్లార్
ఇది కుంభకోణానికి 53 k.m కరైకాల్‌కు 5 కి.మీ దూరంలో వున్నది. ఇక్కడి నది తీర్ధములో స్నానం చేస్తే సర్వపాపాలు హరించిపోతాయి అని భక్తుల నమ్మకము. ఈ ఆలయములో వెలిసిన స్వామివారి పేరు దర్భారన్యేశ్వరుడు. ఈ దేవుడికి గరిక అంటే చాల ప్రీతి. అందుకే ఈ గుడిలో గరిక మొక్కను అతి పవిత్రముగా భావిస్తారు . అందువల్ల ఈ స్వామిని దర్భాదిపతి అని కూడా అంటారు.
ఈ దేవాలయము దర్శించినపుడు భక్తులు దర్భల కొసలు ముడివేస్తారు. ఇలా ముడివేస్తే తమ కష్టాలు గట్టు ఎక్కుతాయని భక్తుల నమ్మకము. ఇచట నలనారాయణ అనే విష్ణు దేవాలయము వున్నది. ఇక్కడ నలదమయంతుల విగ్రహాలు వున్న గుడి ఇదే. శనీశ్వరునితో పాటు నలదమయంతులను పూజ చేస్తే శని ప్రభావము ఉండదు. ఇక్కడ బ్రహ్మదండ అనే తీర్ధము కూడ వున్నది. ఇక్కడే నల మహారాజును శని పట్టుకొని పీడించటం ప్రారంభించాడని కధ. ఇక్కడి నల తీర్ధం చాలా మహిమ కలిగింది. ఇందులో స్నానం చేస్తే పాపాలన్నీ కొట్టుకు పోతాయ‌ని భ‌క్తుల న‌మ్మిక‌. ఇక్కడ శనీశ్వరునికి నిత్యము అభిషేకము జరుగుతుంది.

రాహు గ్రహ దేవాలయము - తిరునగేశ్వరాము
కుంభకోణానికి 5 k.m దూరములో వుంది. ఇక్కడ రాహు గ్రహామునకు గల దేవాలయము ఇది ఒక్కటే. ఇక్కడ నిత్యము వచ్చే రాహుకాల సమయములో పాలాభిషేకము చేస్తారు. ఆ పాలాభిషేకము జరిపినపుడు రాహువు శిరస్సు పైన నుండి పాలు పోస్తే కంట భాగము (మెడ) దగ్గరకు వచ్చేసరికి పాలు అన్ని నీలము రంగులోకి మారతాయి. మిగిలిన సమయాలలో ఇలా జరగదు. ఇక్కడి శివుడు నాగనాద స్వామి. అమ్మవారు గిరి గుజాంబికా దేవి. ఇక్కడ ఆదిశేషుడు, దక్షుడు, కారకోటుడు రాహువు స్థలమైన ఈ శివుడిని అర్చించారు. ఇక్కడ పూజలు చేసుకునేవారికి రాహు దోషాలు పోతాయి.

కేతు గ్రహ దేవాలయము - కిల్ పేరుంపళ్లమ్
తిరువేన్నాడ్ నుండి 6 k.m దూరములో వున్నది. ఈ ఆలయములో కేతు గ్రహ దోషానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయము వద్ద ఒక ప్లేటులో 7 ప్రమిదలలో దీపము వెలిగిస్తారు.
ఇక్కడ కేతు గ్రహానికి సంబందించిన నివారణ పూజలు చేస్తారు. ఇక్కడి శివుడు మహా మహిమాన్వితుడు. రాహుకేతువులు జంట సర్పాకారంలో కలిసి ఉండి, క్షీర సాగర మథనంలో శివునికి సాయం చేశారని ప్రతీతి. ఈ ఆలయాల వద్ద గల 9 పుష్కరిణిలో స్నానములు చేసి 12 వారాలు నవగ్రహాలను ఆరాదిస్తే, ఈ నవగ్రహ అనుగ్రహము లభిస్తుంది.

అదిత్యాయచ సోమాయ మంగళాయ బుదాయచ..
గురు శుక్ర శనిభ్యచ్చ రాహావే కేతవే నమః..!!

Monday, December 29, 2025

Mukkoti Ekadashi - ముక్కోటి ఏకాదశి - ఉత్తర ద్వార దర్శనం

ముక్కోటి ఏకాదశి 
వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి దక్షిణ భారతదేశంలో ప్రముఖంగా జరుపుకుంటారు. ఏకాదశి నాడు శ్రీ హరివిష్ణువును ఆరాధిస్తారు. ఉత్తర భారతదేశంలో, పౌషమాసంలో వచ్చే ఈ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. ఏకాదశి ఉపవాసం పాటించే వ్యక్తులు మోక్షాన్ని (మోక్షం) పొంది స్వర్గలోకానికి చేరుకుంటారని నమ్ముతారు. ఈ ఉపవాసం జీవితంలో సానుకూలతను తెస్తుంది మరియు ప్రాపంచిక ఆనందాలతో నింపుతుంది.

విష్ణువు భక్తులకు ఏకాదశి ఎంతో ప్రాముఖ్యత ఉంది. భక్తులు ప్రతి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణువు అవతారములను పూజిస్తారు. 

వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత
పురాణాల ప్రకారం, ఈ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజున సముద్ర మథనం జరిగింది. ఈ సముద్ర మథనం సమయంలో అమృతం ఉద్భవించింది. కాబట్టి ఈ పవిత్రమైన రోజున మరణించిన వ్యక్తులు జీవిత మరియు మరణ చక్రం నుండి విముక్తి పొందుతారని మరియు వైకుంఠ ప్రాప్తి పొందుతారని విశ్వసిస్తారు.  

ఈ ఏకాదశిని వైకుంట ఏకాదశి అని కూడా అంటారు. పూర్వం వైఖానసుడు అనే ఒకరాజుకి.. ఒకనాడు తన తండ్రి నరకం లో ఉండిపోయి యమయాతనలు పడుతూ ఉన్నట్లు కల వచ్చింది. అందుకు వైఖానసుడు మార్గశిర శుద్ధ ఏకాదశినాడు ఉపవాసం ఉండి నియమాలతో వ్రతం చేశాడు. ఆ వ్రత ఫలితంగా అతని తండ్రి స్వర్గలోకానికి చేరాడు. తండ్రికి మోక్షం ఇప్పించిన ఏకాదశి కావడం చేత దీనికి మోక్షదైకాదశి అని పేరు వచ్చింది. ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి జనన మరణ రహితమైన మోక్షప్రాప్తి కులుగుతుందని పెద్దలు చెబుతున్నారు.

దక్షిణాది రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశిని ప్రముఖంగా జరుపుకుంటారు. శ్రీరంగం మరియు తిరుపతి ఆలయ వేడుకలు ప్రధానంగా వైకుంఠ ఏకాదశికి ప్రసిద్ధి చెందాయి. వైకుంఠ ఏకాదశిని ప్రధానంగా శ్రీ రంగనాథస్వామి ఆలయంలో జరుపుకుంటారు మరియు ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజున లక్షలాది మంది భక్తులు విచేస్తారు. ఈనాడు నామ్పెరుమాళ్ ను విలువైన పూలతో అలంకరిస్థారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి వైభవం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.

ఆంధ్రప్రదేశ్లోని భద్రాచలంలోని సీతా రామచంద్రస్వామి ఆలయంలో ఈ ఏకాదశిని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున రాముడు మరియు లక్ష్మణ విగ్రహాలను ఊరేగింపుగా బయటకు తీస్తారు.

విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః 
భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః

ఉత్తర ద్వార దర్శనం
ముక్కోటి ఏకాదశి రోజు ఆలయాల్లో భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు. అసలు ఉత్తర ద్వార దర్శనం అంటే ఏమిటి..? ఉత్తర ద్వార దర్శనం లోని అర్ధం, పరమార్ధం ఏమిటో ఒకసారి తెలుసుకుందాం.

ఈ మార్గశిర మాసం హేమంత ఋతువులో మెదటినెల. దీనినే సౌరమానాన్ని అనుసరించి ధనుర్మాసం అని, చాంద్రమానం ప్రకారం మార్గశిర మాసమని అన్నారు. ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే, మన పెద్దలు సంవత్సరకాలాన్ని ఉత్తరాయణం, దక్షిణాయణం అని రెండు భాగాలుగా విభజించారు. ఉత్తరాయణం పుణ్యకార్యాలకు ఉత్తమమైనదనీ, ఆకాలంలో మరణించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని నమ్మకం.

ముక్కోటి ఏకాదశి రోజున ఎక్కువ మంది భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీమన్నారాయణుని దర్శించుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్న వైకుంఠంలోని వాకిళ్లు ఈరోజునే తెరుచుకుంటాయి. వైకుంఠం వాకిళ్లు తెరుచుకునే పర్వదినమైన ముక్కోటి ఏకాదశినాడు శ్రీమహావిష్ణువు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిస్తాడు.

అసుర(రాక్షసుల) బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్తారు. అక్కడ ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుని దర్శించి తమ బాధలను విన్నవించుకుంటారు. దీంతో స్వామి అనుగ్రహించి రాక్షస పీడ వదిలిస్తాడు. ఉత్తరద్వారం గుండా వెళ్లి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను, దివి నుంచి భువికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ వాహనరూఢుడైన మహావిష్ణువు దర్శనానుగ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. దీన్నే ‘హరివాసరమ’ని, ‘హరిదినమ’ని, ‘వైకుంఠ దినమ’ని అంటారు. 

ఈ ఒక్క ఏకాదశి ‘మూడు కోట్ల ఏకాదశుల’తో సమానమంటున్నారు పండితులు. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశే సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు “వైకుంఠ ఏకదశీ వ్రతం” ఆచరించిన వారికి శుభఫలితాలుంటాయి. 

సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోనికి ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నాయి.

అందుకే ఈ పర్వదినాన ఉపవాసముండి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును షోడశోపచార విధితో ఆరాధించాలి. నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశి రోజున మళ్లీ భగవదారాధన ముగించుకుని పారాయణ చేసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాదులతో సత్కరించాలి.

Gayatri Stotram - గాయత్రీ స్తోత్రం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - గాయత్రీ స్తోత్రం గాయత్రీస్తోత్రం నారదా! గాయత్రీ హృదయం చెప్పానుగదా, ఇక గాయత్రీస్తోత్రం చెబుతున్నాను - విను....