తిరుప్పావై - ఇరవై తోమిదవ పాశురము
శ్రీ గురుభ్యోనమః
జై శ్రీ కృష్ణ
జై శ్రీమన్నారాయణ
నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ!
స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః
ప్రియ భగవత్ బంధువులారా!
ఈ రోజు ధనుర్మాసం 29 వ రోజు.
ఈ పాశురంలో గోపికలు.. శ్రీ కృష్ణ పరమాత్మ ని ఈ విధంగా ప్రార్థిస్తున్నారు...మార్గశీర్ష మాసంలో గోపికలు తమ పెద్దల అనుమతిపై వర్షం కోసం చేసిన వ్రతమే.. ఈ ధనుర్మాస వ్రతము. పెద్దల సంతృప్తి కోసం తాము స్నానవ్రతాన్ని ఆచరిస్తామని, ఆ వ్రతమునకు పఱ అను వాద్యము కావలెనని.. బయలుదేరి శ్రీకృష్ణుని చేరి ఆ పఱ ను ఇచ్చి, తమచేత ఆ వ్రతమును పూర్తిచేయించి, దాని ఫలముగా అలంకారములను, పరమాన్న భోజనములు చేయింపుము అని శ్రీకృష్ణుని ప్రార్థించారు. అప్పుడు శ్రీకృష్ణుడు తన మనసులో 'ఈ గోపికలు పఱ అంటున్నది మామూలు పఱ కాదు. వీరు ఇంకేదో కోరుకుంటున్నారు.. వారే చెప్తారులే - అని తాను మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. అప్పుడు గోపికలు 'అయ్యో ! మన ఆర్తీ, తొందర ఇతనికి తెలియడం లేదే అని భావించి తమ కోరికను శ్రీకృష్ణునికి తెలిపి నిత్యకైంకర్యమును - ఫలమును నీవే సమకూర్చవలెనని ఈ పాశురమున గోపికలు చెప్తున్నారు.
ఈ పాశురాన్ని చదువుదాం.
శిత్తమ్ శిఱుకాలే వన్దున్నై చ్చేవిత్తు, ఉన్న
పొత్తామరైయడియే పోత్తుమ్ పొరుళ్ కేళాయ్
పెత్త మ్మేయ్ త్తుణ్ణు కులత్తిల్ పిఱన్దు నీ
కుత్తేవ లెంగళై క్కొళ్ళామల్ పోకాదు
ఇత్తై ప్పఱై కొళ్వా నన్రుకాణ్, గోవిందా!
ఎత్తైక్కు మేళేళుపిఱవిక్కుమ్, ఉన్దన్నో
డుత్తోమే యావో మునక్కే నామాళ్ శెయ్ వోమ్
మత్తై నంగామంగళ్ మాత్తేలో రెంబావాయ్ || 29 ||
ఈరోజు ఆండాల్ తన వెంట ఉన్న గోపికలతో, తను ఏం కోరి వచ్చిందో నిరూపించిన రోజు. మనవాళ్లు మేం పరిశుద్ధులమై వచ్చాము అని గతంలో కూడా రెండు సార్లు చెప్పారు. మేము ఏ ఇతర ఫలితాలు కోరి రాలేదు. ఏ ఉపాయాలు కూడా వాళ్ల దగ్గర లేవని నిన్న చెప్పారు. ఈ రోజు స్వామి ముందర తమ ఆర్తిని ఆవిష్కరిస్తున్నారు. మేము రావడం సాధన కాదు. మా ఆర్తిని చూసైనా అనుగ్రహించాలని నీకు అనిపించడం లేదా! అని అంటున్నారు.
శిత్తమ్ శిఱుకాలే అంటే ఇంకా చీకటి తొలగని తెలతెలవారే సమయంలో మేము నీ దగ్గరికి వచ్చాము. మాలో ఆర్తిని పెంచింది నీవే కదా! మాకు జ్ఞానం కలగాలని ఎంతో కాలం నుంచి నీవు ప్రయత్నిస్తున్నా మాకు ఇన్నాళ్ళకి ఈ జ్ఞానం కలిగింది. ఇది నీవు చేసిన కృషే కదా!ఉన్నై చ్చేవిత్తు అన్నీ నువ్వే చేసినవాడివి.
శబరి లాంటి వారి దగ్గరికి నీవే స్వయంగా వెళ్లి వాళ్లను అనుగ్రహించావు.కానీ ఇప్పుడు మేం చేయవలసి వస్తుంది. మేము నిన్ను సేవిస్తున్నాం. మాకు ఉన్న జ్ఞానంతో మేము ఒక్కసారి మేము నీ వాళ్ళమే అని చెప్పగలిగితే చాలు.
ఉన్ పొత్తామరై యడియే పోత్తుమ్
పద్మములవంటి నీ దివ్య పాదములకు మంగళం పాడుతున్నాం.
(ఈ లోకంలో అద్భుతమైన పురుషార్థం కోసం వాడికున్న కొంత ఆస్తి చూసి, వాడే నాయకుడని వాడి చుట్టూ తిరుగుతూనే వుంటారు జనం. ఎంత అమాయకం! ఎంత ఆశ్చర్యమో కదా)
"సమస్త జీవులకు నాథుడు, పురుషోత్తముడు ఆయనే కదా! ఆయనే మూడు లోకాలనూ నడిపేవాడు. చేతులు కట్టుకుని ఒక్కసారి మనసులో నేను నీ వాడిని అని స్మరిస్తే చాలు ఆయన పరమపదాన్ని ఇస్తాడు" అని కులశేఖరాల్వార్ చెప్పినట్లుగా మేము నీ పాదాలను పాడడానికి వచ్చాం అని చెప్పారు.
కానీ పరమాత్మ ఏమి వినిపించుకోనట్లుగా, ప్రేమతో, తదేకంగా వారినే చూస్తున్నాడు.
పోరుళ్ కేళాయ్ నిన్ను ఎందుకు స్తోత్రం చేస్తున్నామో వినవయ్యా! అని ఆయనను తట్టి చెబుతుంది గోదాదేవి.
పెత్తమ్ మేయ్ త్తుణ్ణుం కులత్తిల్ పిఱన్దు
మొదట పశువులను మేపి, అవి తిన్నాక గానీ మేం తినేవాళ్ళం కాదు. నీకు మా సంగతి తెలియదా! మరి నువ్వేం చేస్తున్నావ్ ? మాకు మీ సేవే ఆహారం. అది మాకు లభించిన తర్వాతే కదా నీవు ఆహారం తినాలి.
నీ కుత్తేవల్ ఎంగలై క్కోళ్ళామల్ పోగాదు
నీ ఆంతరంగిక సేవకి మమ్మలను స్వీకరించాల్సిందే!
"ఏవో వ్రత పరికరాలు కావాలని అడిగారు కదా ఇదిగో" అని అక్కడ పెట్టాడు పరమాత్మ.
ఇత్తై పఱై కోళ్వాన్ అన్ఱు కాణ్ ఇవి కాదు. కేవలం మాట పట్టుకొనే చూస్తావా! మా మనసులో ఏముందో నీకు తెలియదా! అని అడిగారు గోపికలు.
నాకేం తెలీదు నేను మీ గొల్లలలో ఒక్కడినే కదా!అన్నాడు శ్రీకృష్ణుడు.
ఎత్తైక్కుం ఎల్లప్పటికీ ఈ కాలం ఆ కాలంలో కాదు సర్వకాల సర్వావస్థల యందు…ఏళేర్ పిఱవిక్కుమ్ ఏడేడు జన్మలలో కూడా ఉన్దన్నోడుత్తోమే యావోం నీతో సంబంధమే కావాలి. పరమపదంలో ఉన్న సరే మాకు నీ సంబంధమే కావాలి.
ఉనక్కే నాం ఆట్చెయ్ వోం
మత్తై నం కామంగళ్ మాత్త్
కేవలం నీ ఆనందం కోసమే మేము సేవ చేయాలి. మా సేవ ఆ విధంగానే అంకితమై ఉండాలి. తెలియక ఏమైనా లోపం ఉంటే అది నీవే సరిదిద్దాలి. మా పై భారం వెయ్యొద్దు.
ఇలా వ్రతం ఆచరించిన అందరికీ ఫలితం లభించింది. శ్రీకృష్ణ సాన్నిధ్యం లభించింది దీనికి సహకరించిన వారికి కోరినవన్నీ లభించాయి ఈ రోజే పురుషార్ధం పొందిన రోజు.
ఈరోజు స్వామి గోదాదేవిని రప్పించుకొని మానవ కన్యగా ఉన్న ఆమెను తాను విగ్రహ రూపంలోనే వివాహం చేసుకున్నాడు.
గోదాదేవి తాను కోరిన వైభోగాన్ని పొందిన రోజుని భోగి అంటారు.
ఈ రోజు 29వ.పాశురంతో మన తిరుప్పావై వ్రతం పూర్తి అయింది.
గోపికలు ఆనాడు ఆచరించినటువంటి కాత్యాయనీ వ్రతాన్ని మన గోదాదేవి కూడా ఆచరించి...గోపికలు ఆనాడు శ్రీ కృష్ణభగవానుని పొందినట్లు గోదాదేవి కూడా ఈనాడు శ్రీ రంగనాధుని పొందింది. గోదాదేవి వ్రతం పూర్తి చేసే సమయానికి శ్రీరంగం నుండి ఆ శ్రీరంగనాథుడు శ్రీవిల్లిపుత్తూరు నుండి తన అంతరంగ భక్తులను ఆండాల్ తల్లిని తీసుకురమ్మని పంపించారు. ఆ కబురు విన్న వెంటనే విష్ణుచిత్తుడు తన శిష్యుడైన వల్లభరాయుడుతో ఆండాల్ తల్లిని తీసుకొని శ్రీరంగానికి బయలుదేరాడు. అప్పుడు ఆ శ్రీరంగనాథుడు ఆండాల్ తల్లిని తనలో చేర్చుకున్నాడు. అందుచేత గోదా శ్రీ రంగనాథ కళ్యాణదివసం అని మన భోగి పండక్కి భోగి అని పేరు వచ్చింది. భోగం అంటే ఆ పరమాత్మని అనుభవించడమే. ఈ వ్రతం మనకి అన్ని విధాలా మంచి ఫలితాలనిస్తుంది. అందరూ ఆచరించదగినటువంటిది ఈ వ్రతం. మనం ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా కనీసం ఈ ముప్పై పాశురాలను రోజూ మనం అనుసంధానం చేసినట్లైతే వ్రతం చేస్తే వచ్చే ఫలితం వస్తుంది.
ఆండాల్ తిరువడిగళే శరణం
No comments:
Post a Comment