మాఘ పురాణం - 6 వ అధ్యాయం
సుశీల చరిత్ర
భోగాపురమను నగరంలో సదాచారుడు, దైవభక్తుడగు ఒక బ్రాహ్మణోత్తముడు నివసించుచుండెను. అతనికి అందాలభరణివంటి ఒక కుమూార్తెగలదు. ఆ కన్య పేరు సుశీల. మంచి శీలం గలది మంచి
బుద్ధిమంతురాలు చిన్నతనమునుండియూ దైవభక్తికలదై ఎల్లప్పుడూ ఏదోఓక వ్రతమును స్వీకరించుచు, పురాణ పఠనమునందే సదా మనస్సు నిలిపి కాలము గడుపుచూ, యుక్తవయస్కురాలై పున్నమి చంద్రుని బోలు మోము కలదయి యుండెను.
ఆమె గుణములు తెలుసుకొని ఆమెవద్ద అన్ని లక్షణములు వుండుటవల్ల మృగశృంగుడు సుశీలనే పెండ్లియాడదలచాడు.
"ఒకనాడు సుశీల తన ఇద్దరి స్నేహితురాండ్రతో కలసి కావేరీ నదికి స్నానమునకు బయలుదేరి వెళ్ళినది. ఆ సమయమున నొక ఏనుగు అడవినుండి ఘీం కారం పెట్టుచువచ్చి స్నానార్ధమై వచ్చిన ఆ ముగ్గురు కన్యలను తరుమజొచ్చెను. వారు భయపడి ఏదిక్కు గానక ముందు వెనుకలు జూడక పిక్కబలం కొలది పరుగిడ బోవుచుండగా దారిలో గట్టులేని నూతిలోపడి ప్రాణములు విడిచిరి. ఆ సంగతి వారి తల్లిదండ్రులకు తెలిసివచ్చి చూచుసరికి ముగ్గురూ చనిపోయివున్నారు.
ఆ వార్త మృగశృంగునకు తెలియటచే అతడునూ వచ్చి ఆ ముగ్గురి మృత దేహములను చూశాడు. ఎక్కడ లేని దుఃఖమూ కలిగినది. వారి నెటులనైనను బ్రతికించవలయునని సంకల్పించి వారి తల్లిదండ్రులతో తమ బిడ్డల మృత దేహములను కాపాడుచుండుడని చెప్పి తాను సమీపము నున్న కావేరీ నదిలో రొమ్మువరకు దిగి ధ్యానము జేయసాగాను.
అంతలో అడవి అంతా గర్జించుకుంటూ తిరిగి ఆ ఏనుగు నీటిలో దిగి తపస్సు చేసుకుంటున్న మృగశృంగుని వద్ధకు వచ్చినది. ఐననూ మృగశృంగుడు చలించలేదు. నిర్భయముగా ధ్యానిస్తునే
వున్నాడు.
ఏనుగుకూడా మృగశృంగుని కెదురుగా నిలబడి దీక్షగా చూడసాగింది. అటుల కొంచెంసేపు నిలబడి తటాలున తన తొండముతో మృగశృంగుని పట్టుకొని తన వీపుపై కెక్కించుకొన్నది. ఐననూ ఆ బ్రాహ్మణ కుమారుడు భయపడక ఇది అంతయు శుభసూచకమని తలచినాడు. నీరు మంత్రించి ఏనుగుపై చల్లెను. తన రెండుచేతులతో దాని శరీరాన్ని నిమిరాడు. క్షణంలో ఆ ఏనుగు తన రూపం వదలి ఒక దేవతారూపంలో నిలబడి తనకు శాపవిమోచనం కలిగించిన ఆ మృగశృంగునకు నమస్కరించి దేవలోకమునకు పోయెను.
వింటివా దిలీప మహారాజా! మాఘస్నాన ఫలమువలన ఏనుగు నకు శాపవిమోచనమై ఎట్లు నిజరూపం వచ్చినదో! మిగిలిన వృత్తాంతము కూడా శ్రద్ధగా ఆలకింపుడు.
No comments:
Post a Comment