రాజుభార్యము, మంత్రిభార్యయు శోకదానము నోముపట్టిరి. రాజుభార్య యన్ని ఒక్కమారే ఇచ్చెదనిని ఊరుకున్నదట మంత్రిభార్య తోటకూర మడివేసి రోజూ ఒక బ్రాహ్మణునకు ఒక డబ్బు ఒక కట్ట తోటకూర యిచ్చుచుండెను. ఈ ప్రకారము ఏడాదియిచ్చెను. ఇట్లు యిచ్చుటవల్ల కడుపుశోకములేకుండ సిరిసంపదలతో మంత్రిభార్య సుఖముగా నుండెను. రాజు భార్య ఎప్పుడో చేయుదునని యూరకున్నందువలన శోకము ఎక్కువయినదట. ఆశోకము భరించలేక యడవిలోనికి బోయి ఒకచోట ఏడ్భుచు కూర్చుండియుండగా పార్వతీ పరమెశ్వరులు విహారానికి నిమిత్తమైవచ్చి-“ఏమి అమ్మా! ఇలాఏడ్చెదవ”ని యడిగిరి. “ఏమీలేదు, అస్తమానమూ నాకు ఏడువవలెన”ని బుద్ధి అందుచేత యిలా యేడ్చుచున్నాను” అని చెప్పెను. అందుకు వారు-'అలాకాదమ్మా! నీవు శోకదానము నోముపట్టి తిన్నగా యిచ్చినావుకావు. అందుచేత నీకు శోకము వచ్చినది. ఇప్పుడు మళ్ళీ యింటికి వెళ్ళి ఈ నోముపట్టి మరచిపోకుండా నిత్యమును ఒక డబ్బు, కూర బ్రాహ్మణునకు తప్పకుండా దానమిచ్చిన యెడల ఈ శోకము పోవునని చెప్పి యదృశ్యులైరి.
అప్పుడామె యింటికివచ్చి నిత్యమూ ఒక డబ్బు ఒక కూర ఒక బ్రాహ్మణునకు దానమిచ్చుచుండెను. అది లగాయితు ఆమె శోకముపోయి సిరిసంపదకలిగి సుఖముగా నుండెను. అప్పుడంతా "యేమి నోము పట్టినావు? యేమి నోము పట్టినావు శోకము పోవుటకు?" యని యడుగగా ఆమె "శోకదానము నోము పట్టినా" నని చెప్పెను. అప్పుడంతా ఆ నోముపట్టి ఉద్యాపనము చేసికొనిరి.
ఉద్యాపనము: తోటకూర మడి చల్లి బ్రాహ్మణునికి తలంటి నీళ్లుపోసి జామారుయిచ్చి పదమూడు డబ్బులు, దక్షిణయిచ్చి తోటకూర ఆ బ్రాహ్మణునకు వాయనము యియ్యవలయును.
ఉద్యాపనము: తోటకూర మడి చల్లి బ్రాహ్మణునికి తలంటి నీళ్లుపోసి జామారుయిచ్చి పదమూడు డబ్బులు, దక్షిణయిచ్చి తోటకూర ఆ బ్రాహ్మణునకు వాయనము యియ్యవలయును.
కథ లోపమైనను వ్రతలోపము కాకూడదు. భక్తి తప్పినను ఫలము తప్పదు.
No comments:
Post a Comment