రాజు చేయకూడని పనులు
రాజైనవాడు వేటని, మద్యపానాన్ని జూదాన్ని విడిచిపెట్టాలి. ఈ మూడింటినీ విడిచిపెట్టని ఎంతోమంది మహారాజులు లోకంలో క్షీణించిపోయారు. రాజన్నవాడు వ్యర్థంగా తిరగకూడదు. పగటిపూట నిద్రించకూడదు. వాక్పారుష్యం, దండపారుష్యం కూడదు. ఎవరినీ పరోక్షంగా నిందించకూడదు. రెండు విధాలైన అర్ధనష్టం చేయకూడదు. అనగా 1.ధనం 2.ఆస్తి వీటిలో
మొదటిదైన ఆస్తి అనగా తన స్వంతమైన నివాసస్థలాలని, దుర్గాలని సరిగ్గా సంరక్షించకపోవటం, అస్తవ్యస్తంగా వాస్తు విరుద్ధంగా నిర్మించటం, అనవసరంగా వాటిని కూల్చేయటం, చెడిపోయిన వాటిని బాగుచేయకపోవటం, ఒకచోట కట్టించాల్సిన వాటిని వేరొక చోట కట్టించటం - ఇలాంటివి అర్థనష్టాలు.
రెండో రకమైన అర్ధనష్టం అనగా దేశ కాల పాత్రల్ని ఎరగకుండా దానధర్మాలు చేయటం. అనవసరమైన కార్యక్రమాల కోసం ధనాన్ని వెచ్చించటం మొదలైనవి. అర్ధనష్టాన్నీ అర్ధదూషణ అనికూడా అంటారు. వీటితోపాటు కామ, క్రోధ, లోభ, మదమాన, హర్షాలని ప్రయత్న పూర్వకంగా విడిచిపెట్టాలి.
ఈ రకమైన దోషాల్ని చేయకుండా వున్న రాజు ముందుగా తన భృత్యుల్ని తరువాత తన పౌరుల్ని లోబరుచుకోవాలి.
రాజు తన పట్టాభిషేకం అయిన దగ్గరనుంచి తన రాజ్యాన్ని పరిరక్షించుకోవటానికి తగిన సహాయకుల్ని ఎన్నుకోవాలి. ఎందుకంటే వారి మీదే రాజ్యపాలనాభారం నిలిచి వుంటుంది గనుక. రాజు స్వయంగా పరీక్షించి గుణవంతుల్నే సహాయకులుగా ఎన్నుకోవాలి. కులీనుడు, శీలసంపన్నుడు, చతుర్వేదవిశారదుడు, హస్తి శిక్షా, అశ్వశిక్షలలో నిపుణుడు, మృదుభాషి,
శుభాశుభశకునాలు తెలిసినవాడు, వివిధరకాల చికిత్సాపద్ధతుల్ని ఎరిగినవాడు, కృతజ్ఞుడు, కార్యదర్శి, శూరుడు, కష్టాల్ని సహించేవాడు, ఋజుస్వభావుడు, వ్యూహాలు పన్నటంలో నైపుణ్యం కలిగినవాడు అయిన బ్రాహ్మణుడిని కానీ, క్షత్రియుడిని కానీ సేనాపతిగా నియోగించాలి. పొగడగరి, సురూపుడు, దక్షుడు, ప్రియవాది, పొగరులేనివాడు, అందరి మనసులకీ నచ్చేవాడు, అందరి
మనసుల్లోని భావాల్ని గ్రహించేవాడు అయిన వాడిని ప్రీతిహారి (ద్వారాధికారిగా) నియమించుకోవాలి.
శల్యం, శాలాకృతం, శాలాక్యం, కాయచికిత్స, భూతవిద్య, కౌమార, భృత్య, అగదతంత్రం, రసాయనతంత్రం, వాజీకరతంత్రం కాయం, బాలం, గ్రహం, ఊర్థ్వంగకం, శల్యం, దంష్ట్రం, వృషభం అనే వైద్యాంగాలలో, చికిత్సా ప్రక్రియలో నిపుణుడు, వంశపరంపరా క్రమంగా వచ్చినవాడు, వేషంలో నిరాడంబరుడు, ధర్మబద్ధమైన మనసుకలిగినవాడు, ఉత్తమవంశంలో
జన్మించినవాడు, అయిన వ్యక్తిని రాజవైద్యుడుగా నియమించుకోవాలి. రాజుకి అతడు ప్రాణరక్షకుడు కనుక సాధారణ ప్రజల్లాగా రాజు వైద్యుడి మాటను మన్నించి అతడు చెప్పిన విధంగా నడుచుకోవాలి.
రాజు తన ఇష్టం వచ్చినంత మందితో సలహాలు, సంప్రదింపులు, ఆలోచనలు చేయవచ్చు కానీ, అవి వేరు వేరుగా చేయాలి. మంత్రాలోచనా పరుడైన రాజు తన మంత్రులలో కూడా ఒకరితో జరిపిన చర్చల్ని మరొకరితో చర్చించకూడదు. రాజు ఎవరినీ నమ్మకూడదు. ఆయా మంత్రులు చెప్పిన
విషయాల్ని విని తానే సరైన నిర్ణయం చేయాలి. వేదశాస్త్రాలు బాగా చదివిన పండితుల్ని రాజు పోషించి వారిని పూజించాలి. తాను వినయసంపదతో పండితుల నుంచి విషయాలని గ్రహించాలి. ఈవిధంగా చేస్తే రాజు పృథివినంతా తన వశంచేసుకోగలడు.
రాజు ప్రవర్తన
మహారాజైనవాడు వ్యసనాల్ని విడిచిపెట్టాలి. కానీ లోకం కోసం తాను ఆయా విషయాల్లో కూడా నేర్పరి నేనని తెలియచేయటానికి కృత్రిమంగా వ్యసనాల మీద ఆసక్తివున్నట్లు నటించాలి. రాజు ప్రతిపౌరుడితో చిరునవ్వులు చిందిస్తూనే మాట్లాడాలి. వధించాల్సినవారి విషయంలో కూడా కోపం
ప్రదర్శించకూడదు. రాజు ఎప్పుడూ దాతృత్వం, ఉదారత్వం కలిగివుండాలి. అలాంటివాటికి భూమండలమంతా వశమౌతుంది. రాజు ఏ పని గురించీ దీర్గంగా ఆలోచించకూడదు. కొన్ని పనుల్లో తొందర పనికిరాదు, నిదానంగా ఆలోచించి చేయాలి. రాజు ఎప్పుడూ తన మంత్రాలోచనాన్ని రహస్యంగా వుంచాలి. రాజు చేయబోయే పనులు ముందుగా ఎవరికీ తెలియకూడదు. రాజు తన వెంట ఎప్పుడూ మంత్రవేత్తని రక్షణగా వుంచుకోవాలి.
వ్యక్తి ఆకారం, ముఖకవళికలు, వాడి ఇంగితం (సైగలు - కదలికలు) నడక, మాటలు, చేష్టలు, నేత్ర వికారాలని బట్టి ఇతరుల మనసుని గ్రహించగలగాలి. రాజు తనొక్కడే ఏవిషయం గురించీ ఆలోచించకూడదు. అలాగని చాలామందితో కూడా ఆలోచనలు చెయ్యకూడదు. పరిమితంగా
విషయ పరిజ్ఞానం కలిగిన వారితో మాత్రమే చర్చించాలి. తను ఎక్కబోయే నావని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే దాన్ని ఎక్కాలి. తాను తినే ఆహారాన్ని కూడా పరీక్షించకుండా భుజించకూడదు. తానే తల్లి తండ్రిగా తన ప్రజలందరినీ కన్న బిడ్డల్లా భావించి పరిపాలించాలి. తాను ప్రజలనుంచి స్వీకరించిన పన్నుల్ని వారి సేవకే వినియోగించాలి. శత్రువుల్ని లొంగదీసుకునే విషయంలో సామ, దాన, భేద, దండోపాయాల్ని పాటించాలి.
చోర ప్రాయశ్చిత్తం
బ్రాహ్మణుడు బుద్ధిపూర్వకంగా తనజాతివారి ధనాన్ని గానీ, ధాన్యాన్ని గానీ దొంగిలిస్తే కృచ్చార్ధం ప్రాయశ్చిత్తంగా ఆచరించాలి. స్త్రీలకి, పురుషులకి, సంబంధించిన పొలాలని, స్థలాలని, దొంగలిస్తే చాంద్రాయణ వ్రతంలో శుద్ధి అవుతుంది. అల్పసారమైన ద్రవ్యాన్ని ఇతరుల గృహాల నుంచి దొంగలిస్తే సాంతపనకృచ్చవ్రతాన్ని ఆచరించాలి. భక్ష్య, భోజ్య, శయ్య(మంచం)ఆసనాలని,
పుష్పాలని, ఫలాలని హరిస్తే పంచగవ్య ప్రాశనంతో ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. గడ్డి, కట్టెలు, చెట్లు, అన్నం, ఎండు జొన్న రొట్టె, వస్త్రం, చర్మం, మాంసం దొంగిలిస్తే మూడు రాత్రుల ఉపవాసం ఉండాలి. ముత్యాలు, మణులు, బంగారం, వెండి, ఇనుము, కాంస్యం వంటివి దొంగిలిస్తే పన్నెండురోజులు బియ్యం నూకల అన్నాన్ని తినాలి. పట్టు వస్త్రాల్ని ఉన్ని వస్త్రాలని, రెండు గిట్టల ప్రాణుల్ని ఓషధుల్ని దొంగలిస్తే మూడు రోజులు పాలతో అన్నాన్ని భుజించాలి.
శుభాశుభ శకునాలు
No comments:
Post a Comment