Saturday, March 7, 2026

Ranga Panchami Deva Panchami - రంగ పంచమి దేవ పంచమి

రంగ పంచమి దేవ పంచమి

దీపావళిని ఎలా అయితే 5 రోజుల పాటు చేసుకుంటారో. అలానే కొన్ని ప్రాంతాలలో హోలీని కూడా ఐదు రోజులు జరుపుకుంటారు. వాటిల్లో చివరి నాడు జరిపే పండగే రంగ పంచమి.

హోలీ మాదిరిగానే ఈ పండగకు కూడా రంగులు చల్లుకుని సంతోషంగా గడుపుతారు. అయితే ఈ పండగకు మరో విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. ఈ రంగ పంచమి నాడు స్వయంగా దేవతలు భూమి మీదకు దిగి వచ్చి, హోలీ ఆడతారని నమ్ముతారు. అందుకే ఈ పండగను దేవ పంచమి అని కూడా అంటారు. ఈ రోజున రంగులతో ఆడుకోవడం వల్ల, ప్రపంచవ్యాప్తంగా దేవతల సాత్విక శక్తి వ్యాప్తి చెందుతుందని, దీని ద్వారా జనాలు, దేవతల స్పర్శను అనుభూతి చెందుతారని పండితులు చెబుతున్నారు.

ఈ రోజున గ్రహ స్థానాలు సరైన క్రమంలో ఉండి ప్రాణ శక్తిని మేల్కొలిపి సమతుల్యత మరియు ఆధ్యాత్మిక వృద్ధిని ఇస్తాయని నమ్ముతారు. సాంప్రదాయ రంగ పంచమిలో మూలికలు, పువ్వులు మరియు సహజ వర్ణద్రవ్యాలతో కలిపిన రంగులను నిర్దిష్ట క్రమంలో పూయడం జరుగుతుంది. ఇది ఆధ్యాత్మిక శక్తి మార్గాలైన నాడులను శుభ్రపరుస్తుంది, వాటిలో నిద్రాణమైన ప్రాణ శక్తిని మేల్కొలిపి జాగృతం చేస్తుంది. అంతేకాక మనలో దాగి ఉన్న సహజ శక్తులను కూడా మేల్కొల్పుతుంది.

పూర్వం రంగులు మూలికలు మరియు ప్రత్యేకమైన వృక్షాల బెరడులతో తయారు చేసేవారు.
పాల్గుణ పౌర్ణమి నుండి క్రమంగా వేసవి కాలం ప్రారంభం కావున మూలికలతో తయారు చేసిన రంగులను మరియు రంగు నీళ్లను చల్లుకోవడం వల్ల వేసవి ఉష్ణోగ్రతల వల్ల చర్మ సమస్యలు మరియు ఆరోగ్య సమస్యలు రాకుండా మనకు సహాయకారిగా ఉంటుంది.

కానీ ప్రస్తుత కల్తీ ప్రపంచంలో రసాయనాలతో తయారయిన రంగుల వల్ల మేలు కన్నా కీడు జరుగుతుంది కావున రంగుల విషయంలో కొంచం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతో వుంది.

అయితే ఈ రంగ పంచమి దేశంలోని అన్ని ప్రాంతాల్లో జరుపుకోరు. మరీ ముఖ్యంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మధుర, బృందావనం ప్రాంతాల్లో ఎంతో వేడుకగా జరుపుకుంటారు.

ముఖ్యంగా గుజరాత్ లో ఈ పండుగను గర్బా మరియు దాండియా నృత్యాలతో జరుపుకుంటారు, ఇక్కడ బహిరంగ ప్రదేశాలలో వేదికలు ఏర్పాటు చేసి సాంప్రదాయ ఆచారాలను ప్రదర్శిస్తూ ఒకరిపై ఒకరు రంగులు వేసుకుంటారు.

రాజస్థాన్ లో జానపద నృత్యాలు, సామూహిక విందులు మరియు రంగుల తో జరుపుకుంటారు. ఉదయపూర్ మరియు జైపూర్‌లలో, యువకులు భక్తిగా హోలీ పాటలు పాడుతూ వీధుల్లో తిరుగుతూ, స్థానిక దేవతలకు రంగులను సమర్పిస్తారు.

మధ్యప్రదేశ్ లో ఐక్యత మరియు సామూహిక కలయికను సూచిస్తూ పెద్ద రంగుల ఊరేగింపులు నిర్వహిస్తారు.

మహారాష్ట్ర (షిమ్గా/షిమ్గో) - సాంప్రదాయ పాల్ఖీ నృత్యాలు మరియు జానపద ప్రదర్శనలు నిర్వహిస్తారు. వ్యవసాయ ప్రారంభాన్ని చిహ్నంగా జరుపుకుంటారు. అంతేకాక సామూహికంగా జరుపుకోవడం వల్ల కాలానుగుణ మార్పులతో ముడిపడి ఉన్న ధైర్యం మరియు బలాన్ని పొందుతామని భావిస్తారు.

గోవా (షిగ్మో పండుగ) లో ఆలయ ఆచారాలను సాంస్కృతిక పద్దతులతో కలిపే పెద్ద షిగ్మో ఉత్సవాల్లో భాగంగా రంగ పంచమిని జరుపుకుంటారు.

బృందావనం మరియు మధుర ఆలయలో  హోలీ వేడుకలు రంగ పంచమితో ముగుస్తాయి, కృష్ణభక్తులు రాధా కృష్ణులకు రంగులు సమర్పించి ఆశీర్వాదాలు పొంది ఈ పండుగను ముగిస్తారు.
రేపల్లెలో స్వయంగా పూజారులే కృష్ణ ప్రసాదంగా రంగులను భక్తులపై కురిపిస్తారు. అది చూడడానికి ఎంతో మనోహరంగా ఉంటుంది. అది చూసి పాల్గొని అనుభవించవలసిందే.

గ్రామీణ ఉత్తర భారతదేశం - హోలీ వేడుకల కొనసాగింపుగా, గ్రామాలు ఉత్సవాలు, ఊరేగింపులు మరియు సామూహిక ప్రదర్శనలు నిర్వహిస్తారు, అయితే నృత్యం, సంగీతం మరియు స్థానిక ఆచారాలు సామాజిక బంధాలను బలోపేతం చేస్తాయి.

రంగ పంచమి రోజున దేవతలు హోలీ ఆడటం కోసం భూమి మీదకు వస్తారని ప్రతీక. అలా వచ్చిన దేవతలు భక్తుల కోరికలన్నింటినీ తీరుస్తారని నమ్ముతారు. ఈ రంగ పంచమి రోజున దేవుళ్లతో హోలీ ఆడటం వల్ల మన జీవితంలోని కష్టాలు, బాధలు తొలగిపోతాయని, జీవితంలో సానుకూల పరిస్థితులు ఏర్పడతాయని భావిస్తారు. రంగ పంచమి నాడు రంగులు పైకి ఎగరవేయడం ద్వారా భక్తులు, దేవతలతో కలిసి హోలీ ఆడతారని, ఫలితంగా, భక్తుల జీవితంలోని కోరికలన్నీ తీరి కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు.


నిత్య స్తోత్రావళి

పంచాంగం

No comments:

Post a Comment