Sunday, January 4, 2026

Surya Padmamu Nomu Katha - సూర్యపద్మము కథ

సూర్యపద్మము కథ

ఒకానొక గ్రామమున నొక బ్రాహ్మణుండు, నొక రాజు, నొక కోమటి, 
నొకకాపు, నొక గొల్లవాడు నుండిరి. వీరయిదుగురు అయిదు కుంచములను కొనుక్కొనిరి. ఈ అయిదు కుంచములు రోజు నా గ్రామముననున్న దేవాలయమునకు బోయి తమలోతాము “నాతో నిన్న వరహాలు కొల్చినారు. నాతో
నిన్న వడ్లుకొలిచినారు” అని చెప్పుకొనుచుండిరి. వాటిలో బ్రాహ్మణకుంచము తన యజమానియగు బ్రాహ్మణునికి దరిద్రమగుటచే తనలో యేమేమి కొల్చినారో చెప్పక యూరక కూర్చుండినది.

ఒకనాడు తక్కిన నాలుగు కుంచములు యధాప్రకారముగ దేవాలయమునకు వెళ్ళెనుగాని బ్రాహ్మణకుంచ మారోజున రాలేదు. "ఎందుచేత బ్రాహ్మణకుంచమురాలేదు!" అని తమల్లో తాము కొంతసేపు తర్కించుకొని కొంతసేపు కూర్చుని తమ తమ యిండ్లకు తిరిగి వెళ్ళిపోయెను. 

మరుసటి రోజున కుంచము లన్నియు నా దేవాలయమునజేరి "నాతో నిన్న వరహాలు కొలుచుకున్నారు నాతో నిన్న వడ్లుకొలుచుకున్నారు" అని చెప్పుకొనుచున్నవి. అప్పుడు బ్రాహ్మణ కుంచము జూచి తక్కిన కుంచములు- "నిన్న నెందుకు వచ్చినావు కావు” అని అడిగినవి. "సోలెడు నూకలుండగా మాయమ్మగారు నాలో పోసి మూతవేసినందున నిన్నటి రోజున నేను వచ్చుటకు వీలులేక పోయినదిని చెప్పెను. అందు మీద తక్కినవన్నియు -"నెప్పుడు చెప్పినా నూకలు, ఆళ్ళు కొలిచారని చెప్పు చుండెదవు" యని నీరసించి పలికెను. అంత బ్రాహ్మకుంచము- "యేమి చేయమన్నారు? యెల్ల కాలము మీలాగుయుంటారా యేమిటి? కొన్నాళ్ళకు మా అమ్మకు కుమార్తె పుట్టును ఆ పిల్ల బొడ్డున మాణిక్యం పెట్టుకొనిమరి పుడుతుంది. ఆ సంగతి యొక బ్రాహ్మణుడు గ్రహించి యా బాలికను తనకిండని యడుగును. అప్పుడు మా కెంతైన భాగ్యము
కలుగును. అప్పుడు మేముకూడ వరహాలు కొలుచుకొనెదము" అని చెప్పెను. "ఎప్పుడో 
కొలుచుకుంటారట!" అని నవ్వి తక్కినకుంచములు వెళ్లిపోయెను. 

బ్రాహ్మణకుంచము తనదారిన యింటికేగెను. ఈ జరిగిన సంభాషణంతయు నొక బ్రాహ్మణుడు విని సమయముకొరకు వెచి యుండెను. అందులో బ్రాహ్మణకుంచముగల బ్రాహ్మణునికి బొద్దునుండి ప్రతిరోజున నొక మాణిక్యము పడుచుండెడి కుమార్తెను కన్నారు. దానివలన వారు కావలసినంత భాగ్యవంతులై, ఇదివరలో కుంచముల సంభాషణ విని సమయమున కెదురుచూచుచున్న బ్రాహ్మణుడు బ్రాహ్మణు కుంచముగల ఇంటికివచ్చి యజమాని గారిని " నీకూతురు నాకు యిచ్చి వివాహం చేయవలసినద" ని యడిగెను. ఆ ప్రకారము తమకూతురునిచ్చి ఆ బ్రాహ్మణునికి వివాహము గావించిరి.

తరువాత పెండ్లికుమారుడగు నా బ్రాహ్మణుడు వివాహానంతరము యింటికి వెళ్లెను. కొంతకాలమైన తరువాత తిరిగివచ్చి తన భార్యయగు ఆ పిల్లను తీసికొని పోయెను. ఈ చిన్నది వెళ్ళిన తరువాత వారు కూడా మంచి భాగ్యవంతులయిరి. ధనాశచే నా బ్రాహ్మణుడు తన భార్యను పుట్టంటికి పంపుట మానినాడు. 

ఒకనాడు చిన్నది తల్లిని చూడవలెనని తలంపుతో భర్తయెక్కడికో వెళ్లినప్పుడు తన పుట్టింటికి వెళ్లిచూచి తిరిగి వచ్చుచుండగా మార్గమధ్యమందు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షులై యా చిన్నదానిని -“ఎక్కడకు బోవుచుంటివని యడిగిరి. అప్పుడాచిన్నది. “మాయమ్మను చూడవలసియుండి వెళ్లి తిరిగి వచ్చుచున్నాన”ని చెప్పెను. అప్పుడు పార్వతీపరమేశ్వరుయీమె తో “అయ్యో వెర్రిదానా అలాకాదు నీ తల్లిదండ్రులకు నీవు పుట్టుటచేత భాగ్యమువచ్చినది.
అందుచేతవారు నిన్ను వదలి? పెట్టలేదు. ఈకారణముచేతనే నీభర్తయు నిన్ను వదలి పెట్టలేక నిన్ను పుట్టంటికి పంపినాడుకాడు అంతేగాని మరేమీకాదు" అని చెప్పివారు. "ఇప్పుడేమి చేసినట్లయితే నాకు, మావారికి కలియునో చెప్పవలె" నని వారిని యా చిన్నది ప్రార్థించెను. " క్రిందటి జన్మమున సూర్యపద్మము నోము పట్టినావు గనుక నీవు బొడ్డున మాణిక్యము పెట్టుకొని పుట్టినావు. అప్పుడు ఉదయము చూచి యుద్యాపనముచేసినావు కావు. కాబట్టి మీరిద్దరికి యిష్టము తక్కువగా నున్నది. ఇప్పుడీ నోముపట్టి యుద్యాపనచేస్తే మీరిద్దరు యిష్టముగా నుండెదరు".

ఉద్యాపన: ప్రొద్దు పొడవకుండా దంతపతులిద్దరికి తలయంటి నీళ్ళుపోసి మట్టెలు మంగళసూత్రము యిచ్చి చీర జామారు నొసంగి ప్రొద్దు పొడవకుండా యుద్యాపన చేసికొమ్మని జెప్పి పార్వతీ పరమెశ్వరులంతర్జానము నొందిరి.

No comments:

Post a Comment

Disguised as a child by yama and said the story of suyagnu - బాలవేషము దాల్చిన యముండు దెలిపెడు సుయజ్ఞోపాఖ్యానము

బాలవేషము దాల్చిన యముండు దెలిపెడు సుయజ్ఞోపాఖ్యానము తల్లీ! పరమాత్మ ఏ లక్షణాలు లేనివాడైనప్పటికీ, లక్షణాలు కలవానివలె, కర్మలతో కలిసియుండుటచే యోగా...