విష్ణు విదియల నోము కథ
రాజు కూతురు బ్రాహ్మణునికి కూతురు విష్ణు విదియల నోము పట్టిరి. బ్రాహ్మణునికూతురు భక్తిశ్రద్దలతో నోము నోచుకొన్నది. రాజుకూతురు రాజసముచేత నోముల్లంఘనచేసినది. భక్తి శ్రద్దలతో నోము నోచుకొన్న బ్రాహ్మణ బాలిక అష్టయిశ్వర్యములతోను, అఖండ సౌభాగ్యములతోను తులతూగుచున్నది. రాజసంతో ఉల్లంఘన చేసిన రాచబిడ్డ అష్ట దరిద్రాలపాలై అష్టకష్టాలనుభవించుచు, చివరకు అరణ్యానికి పోయి పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించుచు, తన కష్టాలకు విలపించుచుండెను. అప్పుడు పార్వతీపరమేశ్వరు లాబిడ్డయెడ దయగలవారై ప్రత్యక్షమైనారు. అప్పుడా రాజబిడ్డ- "అమ్మా! అయ్యా! నాకష్టాలేలాగున నివారణమగునో చెప్పుడిని వారిని ప్రార్థించినది. అప్పుడు వారు - “అమ్మా! విష్ణు విదియల నోముపట్టి ఉల్లంఘనచేసినావు. అందుచేత నీకు కష్టాలు కలిగినవి. నీవు మరల నోముపట్టి భక్తి శ్రద్ధలతో నోచుకోవమ్మా!" అని చెప్పిరి. అప్పుడామె తెలివి దెచ్చుకొని చెంపలు వేసుకొని మరల నోముపట్టి అక్షతలువేసుకొన్నది.
శివరాత్రి వెళ్ళిన విదియనాడు మొదలుపెట్టి నెలనెలకు మరల శివరాత్రి వచ్చువరకు పదమూడు విదియలను ప్రొద్దుటలేచి స్నానముచేసి పార్వతీపరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించి, తరువాత ఎడచేర పెడచేర బియ్యముపోసి అత్తిసరువేసికొని, ఆ యన్నము, పెరుగు, అరటిపండ్లు నైవేద్యము పెట్టి ఎవ్వరితోను మాటాడకుండ ఆ అన్నము, పండ్లు, పెరుగు తినవలెను. ఇంకేమి తినరాదు.
ఉద్యాపనము: వీసె యేబులము పసుపు ఎదటి మనిషితో మాటాడకుండ కంగామంగాదంచి పదమూడు వెదురు పెట్టెలలోపోసి ఆ పెట్టెలలో పదమూడు లక్కజోళ్ళు, పదమూడు నల్లపూసలకోళ్ళు పదమూడు కుంకుమ పొట్లాలు, పదమూడు రవికెల గుడ్డలు, పదమూడు దక్షిణ తాంబూలాలుంచి, దేవి దేవరలకు నివేదనముచేసి అందులో ఒకపెట్టె మహాలక్ష్మీ పెట్టెయని తానుంచుకొని, తక్కిన పండ్రెండు పెట్టెలు పండ్రెండుగురు ముత్తయిదువులకు దక్షణ తాంబూలాలతో వాయన మియ్యవలెను.
No comments:
Post a Comment