పెద్ద సంక్రమణ దీపాల నోము కథ
"ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని పురాణాలువిన్నా, అజ్ఞానాంధకారము వదలిపోకుండా వున్నది. ఎటుచూచినా చీకటే, ఎటుచూచినా అంధకారమే, ఏమిచేతును? ఏ నోము నోతును? ఏమి వ్రతము చేతును చెప్పవయ్యా తండ్రీ" అని సోమయాజులుగారి కూతురు తండ్రీ నడిగినదట. అడిగితే తండ్రి "అజ్ఞానాంధ కారము వదలిపోయె నోము, అంతరంగశుద్దిచేసే నోము, అఖండజ్యోతి గనపరచే నోము పెద్ద సంక్రమణ దీపాలు పెట్టవమ్మా!" అన్నాడు. అప్పుడాపిల్ల ఆ నోము పట్టి తండ్రి చెప్పినట్లు ఉద్యాపనము చేసికొని ధన్యురాలై యీశ్వరుని కృపచే ఇహపరాలు చూరగొన్నది.
ఉద్యాపనము: సంక్రమణ ప్రవేశము కాగానే శివాలయము లోనికివెళ్ళి తొలియెడు సేరునెయ్యి, సేరునూనెతో రెండు దీపాలు వెలిగించవలెను. నేతి దీపమునకు భమిడివత్తి, నూనెదిపమునకు కొండవత్తి వరహాయెత్తు చొప్పున గింజతీసిన పత్తి వత్తులుచేసి రెండుదీపాలు రెండు వరాయెత్తులు వెలిగించవలెను. దీపాలు వెలిగించి శక్తికొలది ఒకరికో ఇద్దరికో ఎందరికో బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. ఈలాగున ఐదేండ్లు దీపములు పెట్టవలెను. మొదటియేడు వరాయెత్తు ప్రత్తి రెండవయెడు రెండువరాలెత్తు, మూడవయేడు మూడు వరాలెత్తు, నాల్గవయేడు నాల్గవరాలెత్తు, ఐదవయేడు ఐదువరాలెత్తు చొప్పున భమిడిపత్తి కొండపత్తి తెచ్చుకొని మొదటియేడు సేరునెయ్యి, సేరునూనె, రెండవ యేడు రెండుసేర్ల నెయ్యి, రెండుసేర్ల నూనె మూడవయేడు మూడు సేర్ల నెయ్యి, మూడు సేర్ల నూనె నాలుగవయేడు నాలుగుసేర్ల నెయ్యి, నాలుగుసేర్ల నూనె, అయిదవయేడు అయిదు సేర్ల నెయ్యి, అయిదుసేర్ల నూనెపోసి నేతికి భమిడిపత్తి, నూనెకు కొండపత్తి వత్తులుచేసి శివాలయములో అయిదేండ్లు దీపాలు వెలిగించవలెను. ప్రతియేడు శక్తికొలది బ్రాహ్మణ భోజనము పెట్టవలెను. దక్షణ తాంబూలము లీయవలెను.
No comments:
Post a Comment