నవగ్రహ దీపాల నోము కథ
సోమయాజులుగారి కూతురొకనాడు తండ్రిదగ్గరకు వెళ్ళి- "తండ్రీ పట్టినదెల్ల బంగారమగుటకు, ముట్టినదెల్ల ముత్యములగుటకు, కోరికలెల్ల కొనసాగుటకు, ఆరని నైదవతనము కలుగుటకు, కడుపుచలువ గలుగుటకు ఏమి నోచవలెనండి?” యనియడుగగా ఆయన ముద్దులకుమార్తె యుద్దేశమునకు మెచ్చి ఈనోము చెప్పినాడట. ఆమె యీ నవగ్రహదీపాల నోముపట్టి యుద్యాపనము చేసికొని యిష్టసిద్దులు పొందినదట.
ఉద్యాపనము: తొమ్మిది కొత్తమండిగలు తెచ్చుకొని మండిగ యొక్కంటికి సేరుంబావు చొప్పున నూనెపోసి మండిగ యొక్కంటికి వరహాఎత్తు వత్తి (అనగా పావలాయెత్తుకట్టె, అణాయెత్తు కట్టెవేసి యుంచినచో వరహాయెత్తు) ఏకువలెనలిపి, చమురులోముంచి, దీపము వెలిగించవలెను. నవధాన్యము తవ్వెడున్నర సోలెడుగాని, మానెడు సోలెడుగాని తెచ్చుకొని ఒక్కొక్క దీపము దగ్గర ఒక్కొక్క ధాన్యము దినుసు లుంచవలెను. తొమ్మిది తాంబూలములుంచి వానిలో ఒక్కొక్క పావులా చొప్పున దక్షణ యుంచవలెను. కొంచెము కొంచెముగా నవధాన్యములన్నియు కలిపి, మండిగల క్రింద కొంచెము పోయవలెను. విఘ్నేశ్వర పూజయు, శివునికభిషేకమును చేయించి, ఈ దీపములన్నియు శివాలయములోనే తొమ్మండుగురు బ్రాహ్మణులకు ఒక్కొక్క మండిగా ఒక్కొక్క దక్షణ తాంబూలములతో నియ్యవలెను. శక్తి కొలది ఒకరికో యిద్దరికో బ్రాహ్మణులకు సమారాధన చేయవలెను. ఈనోము కార్తీక మాసములో చేయవలెను.
No comments:
Post a Comment