Monday, March 9, 2026

Karma - Phalitham - కర్మ - ఫలితం

కర్మ - ఫలితం

కృష్ణుడు కంసుని సంహరించిన వెంటనే తన తల్లిదండ్రులైన వసుదేవుడు దేవకి లను చూడటానికి, చూచి వారిని కారాగారం నుండి విముక్తి కలిగిద్దామని వారిని ఉంచిన కారాగారానికి వెళ్ళాడు.

దేవకీమాత కృష్ణుని చూసిన వెంటనే 'నాయనా! నీవే పరమాత్మవి కదా!, నీకు ఎన్నో దైవిక శక్తులు ఉంటాయి, అయినా నువ్వు ఎందుకు 14 సంవత్సరాలు ఆగావు కంసుని సంహరించడానికి, కారాగారం నుంచి మమ్మల్ని విడిపించడానికి' అని అడిగింది.

అప్పుడు కృష్ణుడు "అమ్మా! నన్ను క్షమించు, నీవు నన్ను 14 ఏళ్ళు అరణ్యవాసం చేయమని అడవులకు ఎందుకు పంపావు నా గత జన్మలో?' అని చిరునవ్వు తో! 
అన్నాడు. దేవకి ఆశ్చర్య చకితురాలయింది,

దేవకీ "కృష్ణా ఇది ఎలా సాధ్యము? ఎందుకు ఇలా అంటున్నావు?" అని అడిగింది. అప్పుడు కృష్ణుడు "అమ్మా! గత జన్మ గురించి నీకు ఏది జ్ఞాపకం ఉండదు. కానీ నీవు గత జన్మలో కైకేయివి, నీ భర్త దశరథుడు!" దేవకి మరింతగా ఆశ్చర్యపడి కుతూహలంగా కృష్ణుణ్ణి "అయితే మరి కౌసల్య ఎవరు ఈ జన్మలో?" అని 
అడిగింది.

అపుడు కృష్ణుడు "ఇంకెవరు? యశోద మాత! 14 సంవత్సరాలు తల్లి ప్రేమకు ఆమెని దూరం చేశావు గత జన్మలో, అది ఈ జన్మలో ఆమె తిరిగి పొందగలిగింది." అని
 అన్నాడు, 

ఎంతటి వారైనా కర్మ ఫలాలను అనుభవించక తప్పదు, భగవద్భక్తులైనా, అవతార పురుషులైనా వాటి నుండి తప్పించుకోలేరు, ఇంకా మానవ మాత్రలం మనమెంత!

అలాగే యశోద మాత కృష్ణుని వివాహం చూడలేదని తపించింది. కలియుగంలో  వకుళ మాతగా పుట్టి తన చేతులమీదుగా దగ్గరవుండి మరీ శ్రీనివాసుని కళ్యాణం జరిపించి తన కోరికను తీర్చుకుంది. 

ఇలాంటి కర్మలు పరమాత్ముని లీలల వల్ల మనకు తెలిశాయి. మనం మానవమాత్రులము కావున మనం చేసే ప్రతికర్మ లేదా మనకు జరిగే ప్రతి కర్మ భూత, భవిషత్తు మరియు వర్తమానాల మీద ఆధార పడుతాయి. మనం ముందు జన్మలో చేసిన కర్మల వల్ల ఈ జన్మలో ప్రతిఫలం పొందుతాము. అది మంచి అయినా చెడు అయినా. వర్తమానం లో చేసిన కర్మ ఫలితాలు భవిషత్తులో కానీ తదుపరి జన్మలో మంచి కానీ, చేడు కానీ అనుభవించ వలసిందే. 

కావున కర్మను ఎవ్వరూ తప్పించలేరు. భూత, భవిషత్ కాలాలలో ఏమి జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి, వర్తమాన కాలంలో అనగా ప్రస్తుత జన్మలో ధర్మబద్ధంగా, ధర్మకార్యాలు చేస్తూ నిజాయితీగా వ్యవహరిస్తూ తమ ఇష్ట దైవాన్ని పూజిస్తూ, స్మరిస్తూ జీవనం గడిపే వానికి కర్మ నశిస్తోంది. కర్మ నశించినవానికి పునర్జన్మ ఉండదు. ముక్తి లభిస్తుంది.

కర్మకు రెండు లక్ష్యములు. ఒకటి దుఃఖమును తొలగించుకొనుట. రెండు సుఖములు పొందుట. కాని ఈ లక్ష్యములు సిద్ధించవు. కర్మవలన మరింత దుఃఖము కలుగుతుంది. 

ఈ శరీరమే నాదికాదు. ఈ శరీరము ఉండునది లేదు. ఈ రోజు ఈ దేహము ఉండవచ్చు. కానీ, రేపే నశించవచ్చు. కావున, శరీరమే నాది కానపుడు భార్యా పుత్రులు, ధనధాన్యములు, వస్తువాహనములు, కృత్యులు పరివారములు నా వారలు ఎట్లవుతారు? 

శరీరము పోయినపుడు ఇవేవియు వెంటరావు. ఇవి పురుషార్ధములవలె కనిపించును. అదొక భ్రమ. నిజమునకు అవి అనర్థములు, ఆత్మ ఒక్కటే అనంతమైనది. అవ్యయమైనది. ఆనందదాయకమైనది.

శరీరము ఆత్మ ఒక్కటికాదు. శరీరము వేరు ఆత్మ వేరు. ఆత్మ అనంతము శరీరము పంచభూతాత్మకము. 

శరీరమునే ఆత్మగా భావించువాడు. దానితో అనేక కర్మలు చేయించును. కర్మల వలన తిరిగి దేహము కలుగును. దానితో మరల కర్మలు చేయించును. ఇదొక విషవలయము. 

శుభం భూయాత్.

పితృశాపం - స్త్రీ శాపం

No comments:

Post a Comment