గ్రహణ స్నానవిధి
మనువు మత్స్యరూపాన్ని ధరించిన శ్రీమన్నారాయణుడిని చంద్ర-సూర్య గ్రహణాలు సంభవించినప్పుడు ఏవిధంగా స్నానాన్ని ఆచరించాలి దాని విధి విధానాల్ని తెలియచేయమనికోరగా, నారాయణుడు మనువుకి ఇలా తెలియచేసాడు.
చంద్ర-సూర్య గ్రహణాలు సంభవించటానికి ముందే బ్రాహ్మణులతో స్వస్తి పుణ్యాహవాచనాలు జరిపించుకోవాలి. నలుగురు బ్రాహ్మణుల్ని శ్రద్ధగా, తెల్లని వస్త్రాలతో గంధ, ద్రవ్యాలతో పూజించాలి. గ్రహణానికి ముందుగానే దర్భల్ని, ఓషధుల్ని సేకరించుకోవాలి. చిల్లులు లేని నాలుగు కడవల్ని నాలుగు సముద్రాలుగా భావించి వేరువేరుగా నాలుగు వైపులా వుంచాలి. రథాలు,
గుర్రాలు, ఏనుగులు ఆవులు సంచరించే ప్రదేశం నుంచి, పుట్టలు, నదులు, నదీ సాగర సంగమ ప్రదేశాల నుంచి, పెద్ద పెద్ద చెరువుల నుంచి, రాజద్వారం ముందున్న ప్రదేశం నుంచి, మట్టిని తెచ్చి ఆ కుండల్లో వేయాలి.
తరువాత పంచగవ్యాలు, మంచి ముత్యాలు, గోరోచనం, కలువపూలు, శంఖాలు, ఐదురకాల రత్నాలు, స్ఫటికం, తెల్లచందనం, తెల్ల ఆవాలు, తీర్థజలం, ఏనుగుదంతం, వట్టివేళ్ళు, గుగ్గిలం ఈ వస్తువుల్ని కూడా ఆ కుండల్లో వేసి ఈ క్రింద తెలిపిన మంత్రాలతో ఆయా దేవతల్ని కుండల (కడవ)లోకి ఆవాహన చేయాలి.
సర్వేషు సముద్రాన్సరితస్తీర్థాని జలదానదాః ఆయాన్తు యజమానస్య దురితక్షయ కారకాః । యోஉసౌవజ్రధరో దేవ ఆదిత్యానాం ప్రభుర్మతః॥
సహస్ర నయనశ్చేంద్రో గ్రహపీడాం వ్యపోహతు ।
సజలాధిపతిశ్చన్ద్ర గ్రహపీడాం వ్యపోహతు।
యోஉసౌనిధిపతిద్దేవః ఖడ్గ శూలగదాధరః॥
చంద్రోపరాగపాపాని శీఘ్రంనాశయ శంకర।
అన్ని సముద్రాలు, నదులు, దివ్యతీర్ణాలు, మేఘాలు, నదాలు యజమాని దురితాల్ని నశింపచేయటం కోసం ఈ కుంభం (కలశం)లోకి వచ్చుగాక! వజ్రధరుడు ఆదిత్యులకి ప్రభువు, వేయికళ్ళు కలిగిన ఇంద్రుడు గ్రహపీడల్ని పోగొట్టుగాక! సకల దేవతలకీ ముఖంలాంటివాడు, అమితమైన దివ్య ప్రకాశం కలిగినవాడు అయిన అగ్నిదేవుడు చంద్రగ్రహణం వల్ల కలిగిన పీడని తొలగించు గాక! రాక్షసగణాలకి అధిపతి, ప్రళయాగ్ని లాంటివాడు, ఖడ్గాన్ని ధరించి
అతిభయంకరంగా వుండే నిరృతి గ్రహబాధల్ని తొలగించుగాక!
ఖడ్గాన్ని పాశాన్ని ధరించినవాడు, మకర వాహనుడు, జలానికి అధిపతి అయిన వరుణుడు చంద్రగ్రహణ పీడని తొలగించుగాక! ప్రాణ స్వరూపుడుగా లోకాలన్నిటినీ రక్షించేవాడు, కృష్ణమృగం (నల్లలేడి) మీద ప్రీతికలిగినవాడు అయిన వాయుదేవుడు చంద్రగ్రహణం వల్ల కలిగిన దోషాల్ని నశింపచేయుగాక! నిధులకి పతి, ఖడ్గశూల గదాధరుడు అయినకుబేరుడు చంద్రగ్రహణ దోషాల్ని పాపాల్ని పోగొట్టుగాక! చంద్రవంకని ధరించినవాడు పినాకధారి, వృషభవాహనుడు అయిన శంకరుడు చంద్రగ్రహణ పాపాన్ని నశింపచేయుగాక! ముల్లోకాలలో వున్న స్థిర చర భూతాలు, బ్రహ్మ విష్ణు సూర్యాది దేవతలు అందరూ గ్రహణ పాపాల్ని పోగొట్టు గాక!
ఈ విధంగా అన్ని మంత్రాలతో మంత్రించబడ్డ పవిత్ర కుంభాల(కడవల)లోని నీటితో, ఋక్యజు సామ మంత్రాలు పఠిస్తుండగా యజమాని స్నానం చేయించుకోవాలి. స్నానం చేసిన తరువాత తెల్లని పూలతో, తెల్లని సుగంధ ద్రవ్యాలతో, వస్త్రాలతో, గోవులతో బ్రహ్మోణుల్ని తమ ఇష్ట దేవతల్ని పూజించాలి.
తరువాత పై తెలిపిన మంత్రాలని పత్రాలమీద వ్రాసి వాటిని గంగలో వుంచి, వాటితోపాటు బంగారాన్ని రత్నాలని అందులో వేసి ఒక వస్త్ర ఖండం మీదకానీ జంపకానామీదకానీ యజమానిని 'గరగ' తో సహా కూర్చోబెట్టాలి. తరువాత మంత్రాన్ని లిఖించిన పత్రాలు గల 'గరగ' ని యజమాని తలమీద ఉ౦చాలి. తరువాత ఆ యజమాని తూర్పు ముఖంగా తిరిగి దేవతలకి నమస్కరించి
చంద్రగ్రహణం పూర్తయ్యేంత వరకూ అలాగే కాలం గడపాలి.
చంద్రగ్రహణం విడిచిన తరువాత కేశఖండనం చేయించుకుని, స్నానం చేయించిన బ్రాహ్మణులకి తాను అంతవరకూ కూర్చున్న వస్త్రాన్ని (ఆసనాన్ని) దానంగా ఇవ్వాలి. ఈ విధానం ప్రకారం చంద్రగ్రహణ స్నానాన్ని చేసిన వారికి గ్రహపీడలు ఎప్పటికీ కలుగవు. వారి బంధువులకి కూడా ఎలాంటి ఆపదలు రావు. అందరూ క్షేమాన్ని ఆయురారోగ్యాల్ని పొందుతారు.
సూర్యగ్రహణం సంభవించినప్పుడు మంత్రాలతో పాటు సూర్యుడి నామాలని కూడా కీర్తించాలి. చంద్ర-సూర్యగ్రహణాలు వచ్చినప్పుడు పద్మరాగమణుల్ని మంచి కపిలగోవుల్ని దానంచేస్తే చాలామంచిది.
య ఇదంశృణుయాన్నిత్యం శ్రావయేద్వాసమాహితః ।
సర్వపాప వినిర్ముక్త శ్శివలోకే మహీయతే ॥ (అధ్యా-67 శ్లో-27)
ఈ గ్రహణ స్నానవిధి అధ్యాయాన్ని విన్నా చదివినా వారు సర్వపాపాల నుంచీ విముక్తులై శివలోకంలో సుఖిస్తారు.
శుక్ర- పూజావిధి
ఎవరైనా యాత్రలు చేసే సందర్భంలో యాత్రకి ముందు తరువాత శుక్ర దోషశాంతి (చుక్కెదురు) కోసం శుక్రోదయ కాలంలో శుక్రపూజ చేయాలి.
బంగారంతోకానీ, వెండితోకానీ, కంచుతోకానీ చేసిన పాత్రలో తెల్లని వస్త్రాన్ని పరచాలి. అందులో తెల్లని బియ్యాన్ని పోసి దానిమీద వెండితో చేసిన శుక్రుడి ప్రతిమని స్థాపించాలి. మంచి ముత్యాలతో ఆయన్ని అలంకరించి ఈ మంత్రంతో పూజించాలి.
నమస్తే సర్వలోకేశ నమస్తే భృగునందన ।
కవే సర్వార్ధ సిద్ధ్యర్ధం గృహాణార్ఘ్యం నమోస్తుతే ॥ (అధ్యా-73, శ్లో॥4)
“సర్వలోకేశా, భృగుపుత్రా, కవీ! నీకు నమస్కారం. మేము నీకు సమర్పించే అర్ఘ్యంన్ని అందుకుని మా కోరికలు తీర్చు” ఈ విధంగా ప్రార్థించి నమస్కరిస్తే అన్ని దోషాలూ విఘ్నాలూ తొలగిపోయి చేయదలుచుకున్న యాత్ర సుఖప్రదంగా సాగిపోతుంది.
గురుపూజావిధి
బంగారుపళ్లెంలో బృహస్పతి బంగారు ప్రతిమని పచ్చని వస్త్రంతో సహా ప్రతిష్టించాలి. యజమాని ఆవపిండి, ఆవనూనెలతో, మోదుగ, రావి, చిగుళ్ళతో, పంచగవ్యాలతో కూడిన నీళ్ళతో స్నానంచేసి, పట్టుపీతాంబరాలు ధరించి, నేయితో బృహస్పతి హోమం చేయాలి. హోమం చేసిన తరువాత యోగ్యుడైన బ్రాహ్మణుడికి నమస్మరించి గోవుతో సహా బృహస్పతి ప్రతిమని ఈ మంత్రం చెబుతూ దానం చేయాలి.
నమస్తే వచసాం నాథ వాక్పతేஉథ బృహస్పతే ।
క్రూరగ్రహైః పీడితానా మవనాయ నమోనమః ॥ (అధ్యా-73, శ్లో॥ 10)
వచస్సులకి నాథుడైనవాడా! వాక్కులకి పతీ! బృహస్పతీ! క్రూరమైన గ్రహాలద్వారా పీడించబడేవారిని రక్షించేవాడా నీకు నమస్మారం.
సంక్రాంతి సమయంలో కానీ, యాత్రలు చేసే సమయంలో కానీ, శుభకార్యాలలో గానీ, బృహస్పతి పూజచేసేవారికి సకల కామ్యాలూ సిద్ధిస్తాయి. (ఇక్కడ యాత్ర అంటే! రాజులు యుద్దానికి బయలుదేరే సమయం, రాచకార్యాలమీద ఇతర ప్రాంతాలకి బయలుదేరటం, స్త్రీలు పుట్టింటికి లేదా అత్తవారింటికి బయలుదేరటం, ఎవరైనా వ్యాపారం, వ్యవహారం పనులమీద పొరుగు ప్రాంతానికి బయలుదేరటం, లేదా తీర్ధయాత్రకి వెళ్ళటం అని భావం) ఈ శుక్ర గురుపూజా విధానాలని పిప్పలాదమహర్షి యుధిష్ఠిరుడికి బోధించాడు.
నవగ్రహ స్వరూపం
పరమేశ్వరుడు నారదుడికి నవగ్రహాల స్వరూపం గురించి ఇలా చెప్పాడు.
1. సూర్యుడు :
సప్తాశ్వ స్పప్తరజ్జుశ్చ ద్విభుజస్సవితా రవిః ॥
2. చంద్రుడు :
గదాపాణిర్ద్విబాహుశ్చ కర్తవ్యో వరదశ్శశీ ॥
3. కుజుడు :
చతుర్భుజో మేషగమో వరదస్సాద్దరా సుతః ॥
4. బుధుడు :
ఖడ్గచర్మగదాపాణి సింహస్ధోవరదో బుధః ॥
5, 6. గురువు, శుక్రుడు :
దేవదైత్య గురూతద్వత్పీతకేశే చతుర్భుజే ।
దండినే వరదే కౌర్యే సాక్షసూత్ర కమండులూః ॥
7. శని:
ప్రాసబాణాసన ధరః కర్తవ్యోஉర్కసుతస్సదా ॥
8. రాహువు :
నీలసింహాసనస్థశ్చ రాహురత్ర ప్రసశ్యతే ॥
9. కేతువు :
గృధ్రాసనగతా నిత్యం కేతవోనృవర ప్రదాః ॥
(అధ్యా-92, శ్లో॥ 1-8)
రవి, పద్మాన్ని ఆసనంగా కలవాడు. ఆయన చేతుల్లో పద్మాన్ని ధరిస్తాడు. ఆ పద్మం లోపల ఎలాంటి కాంతి వుంటుందో అలాంటి శరీరకాంతి కలిగినవాడు. ఆయన రథానికి ఏడు గుర్రాలు ఏడు తాళ్ళతో కట్టబడి వుంటాయి.
చంద్రుడు, రెండు భుజాలతో ప్రకాశిస్తూంటాడు. తెల్లని శరీరం గలవాడు. తెల్లటి వస్త్రాలు, గుర్రాలు, ఆభరణాలు ధరించి, గదాపాణిగా రెండు భుజాలతో ప్రకాశిస్తాడు.
అంగారకుడు (కుజుడు), ఎర్రని మాలల్ని ఆభరణాలని, వస్త్రాలని ధరించి వుంటాడు. మేషం (మేక) ఆయన వాహనం. నాలుగుభుజాలు కలిగినవాడు. శక్తి శూలం ఆయన ఆయుధాలు.
బుధుడు, పచ్చని శరీరం కలవాడు. పచ్చని వస్త్రాలు, ఆభరణాలు, మాలలు ధరిస్తాడు. పచ్చగన్నేరు పూవులాంటి శరీరకాంతి ఆయనది. ఖడ్గాన్ని చర్మా(డాలు)న్ని గదని ధరించి సింహ వాహనం మీద ఆశీనుడైవుంటాడు.
గురువు, పసుపు పచ్చని రంగుతో, శుక్రుడు, తెల్లని రంగుతో వుంటారు. వీరిద్దరూ చతుర్భుజులు. ఇద్దరూ రుద్రాక్షమాలని, కమండలాన్ని దండాన్నిధరించి వుంటారు.
శని, ఇంద్రనీలమణి లాంటి శరీరకాంతితో ప్రకాశిస్తూంటాడు. ఆయనకు శూలం ఆయుధం. వాహనం గ్రద్ద ప్రాసధనువుని ఆయుధంగా ధరిస్తాడు.
రాహువు, భయంకరమైన ఆకారాన్ని కలిగినవాడు. ఖడ్గాన్ని డాలుని, శూలాన్ని ఆయుధాలుగా ధరిస్తాడు. నల్లనివర్ణంతో ప్రకాశిస్తూ సింహాన్ని అధిరోహించి దర్శనమిస్తాడు.
కేతువు, ధూమ్ర (బూడిద) వర్ణంతో ప్రకాశిస్తూంటాడు. ఆయన ద్విబాహుడు. గదని ఆయుధంగా ధరించి వికృతముఖంతో వుంటాడు. ఆయన వాహనం గ్రద్ద.
ఈ నవగ్రహాలన్నిటినీ కిరీటాలతో సహా నిర్మించాలి. అవి రెండు అంగుళాల ఎత్తులో వుండాలి. ఈ నవగ్రహ శ్లోక మంత్రాలని ఆయారోజుల్లో కనీసం నూట ఎనిమిది సార్లు ఒక్కో శ్లోకం పఠిస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి.
మహిమాన్వితమైన అరవై ప్రతాలు
No comments:
Post a Comment