వైశాఖ మాసం
వైశాఖ మాసం ప్రారంభం అయింది. వసంత ఋతువులో రెండవ మాసం వైశాఖ మాసం. దీనికి వైదిక సాంప్రదాయంలో 'మాధవ' మాసం అంటారు. వైశాఖ మాసం లక్ష్మీ నారాయణుల ఆరాధనకి చాలా ప్రసిద్ధమైనది. వైశాఖంలో రకరకాల వ్రతాలు చెప్పారు. వైశాఖ మాసంలో సూర్యుడు మేష సంక్రమణంలో ఉండగా ప్రాత: స్నానం చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. మాసాలన్నింట్లో వైశాఖమాసం ఉత్తమమైనది. విశేషదానాలకు ఎంతో పుణ్య ప్రదమైన మాసంగా పురాణాలలో చెప్పబడింది.
శ్రీ మహా విష్ణువు కు ప్రీతికరమైన ఈ వైశాఖ మాసం లో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువు ను లక్ష్మీ దేవితో కలిపి పూజించిన వారికి ముక్తి దాయకం. ఈ మాసం లో ఏక భుక్తం, నక్తం అయాచితం గా భుజించడం ఉత్తమంగా చెప్పబడింది. వైశాఖ మాసం దేవతలతో సహా అందరికీ పూజనీయమైనది. యజ్ఞాలకు, తపస్సులకు పూజాదికాలకు, దాన ధర్మాలకు ఎంతో ఎక్కువ ఫలమిచ్చి శాంతినిచ్చి కోరికలను తీరుస్తుంది.
చాంద్రమానం పాటించే మనకు చైత్రం మొదలుకుని ఫాల్గుణం వరకు పన్నెండు నెలలు ఉన్నాయి. ఒక్కో మాసానికి ఒక్కో ప్రత్యేకత, విశిష్టత ఉన్నాయి. కార్తీక మాఘమాసాల తర్వాత అంతటి మహత్యాన్ని స్వంతం చేసుకున్న పుణ్యప్రదమైన మాసం వైశాఖం. ఈ నెలలోనే పూర్ణిమ తిథినాడు విశాఖ నక్షత్రం ఉండడం వల్ల ఈ మాసానికి వైశాఖ మాసం అనే పేరు ఏర్పడింది. ఆద్యాత్మికత, పవిత్రత, దైవశక్తి ఉన్న నెలల్లో వైశాఖమాసానికి ప్రత్యేక స్థానం ఉంది.
అత్యంత పవిత్రమైన మాసంగా చెప్పబడుతూ ఉన్న వైశాఖమాసంలో ప్రతి దినమూ పుణ్యదినమే. అటువంటి ముప్పై పుణ్యదినాలు కలిగిన ఈ మాసంలో ఆచరించాల్సిన విధులు పురాణా గ్రంధాల్లో వివరించబడ్డాయి. ముఖ్యంగా స్నాన, పూజ, దానధర్మాల వంటి వాటిని ఈ నెలలో ఆచరించడం వల్ల మానవుడికి ఇహలోకంలో సౌఖ్యం, పరలోకంలో మోక్షం సిద్ధిస్తాయని పురాణ కథనం.
వైశాఖమాసంలో నదీ స్నానం ఉత్తమమైనదిగా చెప్పబడింది. అందుకు అవకాశం లేని స్థితిలో గంగ, గోదావరి వంటి పుణ్యనదులను స్మరించుకుంటూ కాలువల్లోగానీ, చెరువులోగాని, బావుల వద్దగానీ అదీ కుదరకపోతే ఇంట్లోనే స్నానం చేయాలి నీటియందు సకల దేవతలు కొలువుతీరి ఉంటారని పురాణాలు చెబుతున్నాయి.
’వైశాఖే మాధవో, రాధో’
వైశాఖమాసాన్ని ’మాధవామాసం’ అని అంటారు. ఈ మాసంలో విష్ణుస్మరణతో, అభీష్ట దేవతారాధనతో నియమపాలన చేయడం ఇహ పర శ్రేయస్సునిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. వైశాఖమాసాన్ని మహిమాన్వితమైన దివ్యమాసంగా శాస్త్రాలు వర్ణించాయి. ఈ మాసాన ప్రాతః కాలాన లేచి మధుసూదనుని స్మరిస్తూ స్నానం చేయడం విశేష ఫలప్రదం.
ప్రాతః సనియమ స్నాన్యే ప్రీయతాం మధుసూదనః।
"మాధవే మేషగే భానౌ మురారే మధుసూదన
ప్రాతః స్నానేన మే నాథ ఫలదోభవ పాపహన్॥
అనే ప్రార్థనతో తీర్థాదులలో చేసిన స్నానం దివ్యఫలాన్నిస్తుంది.
తులసీ కృష్ణ గౌరాభ్యాం తయాభ్యర్చ్య మధుద్విషమ్।
విశేషేణ తు వైశాఖే నరో నారాయణో భవేత్ ॥
మాధవం సకలం మాసం తులస్యాయోర్చయే న్నరః।
త్రిసంధ్యం మధుహంతారం తస్యనాస్తి పునర్భవః ॥
వైశాఖమాసమంతా శ్రీ మహావిష్ణువును తులసీ దళాలతో అర్చించితే శ్రేష్ఠం.
వైశాఖమాసంలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తూ ఉంటాడు. కనుక ఎండలు అధికంగా ఉండి మానవులను ఇబ్బందులను గురిచేస్తూ ఉంటాయి. కనుక వేడిమి నుంచి ఉపసమనం కలిగించేవాటిని దానం ఇవ్వాలనేది శాస్త్రవచనం, నీరు, గొడుగు, విసనకర్ర, పాదరక్షలు, వంటివి దానం చేయడం, పళ్ళరసాలు, మజ్జిగ వంటి పానీయాల శాలలని నిర్వహించడం శ్రేష్టం. అట్లే దాహంతో ఉన్నవారికి మంచినీటిని ఇవ్వడం, చలివేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల దేవతానుగ్రహం కలుగుతుంది.
సంధ్యావందనాలు ఆచరించడంతో పాటు శ్రీమహావిష్ణువును తులసీదళాలతో పూజించవలెను. శ్రీమహావిష్ణువు వైశాఖమాసం మొదలుకొని మూడునెలలపాటూ ఈ భూమి మీద విహరిస్తూ ఉంటాడు. అతనికి అత్యంత ప్రీతికరమైన తులసీదళములతో అర్చించడం వల్ల సంతుష్టుడై సకల సౌభాగ్యాలను, సౌఖ్యాన్ని ప్రసాదిస్తాడని చెప్పబడుతున్నది.
శ్రీ మహా భాగవతము
జ్యోతిషశాస్త్రము
నిత్య స్తోత్రావళి
పంచాంగం
No comments:
Post a Comment