Wednesday, March 4, 2026

Rushaba Teaches Ethics to His Sons - ఋషభుండు పుత్రులకు నీతి యుపదేశించుట

ఋషభుండు పుత్రులకు నీతి యుపదేశించుట

ఋషభుడు ఈ ప్రకారంగా కొంతకాలం రాజ్యపరిపాలనం సాగించాడు. అతడు ఇహలోక ఫలాన్ని ఏ మాత్రం అపేక్షించలేదు. సంసార వ్యామోహాన్ని వదలిపెట్టాడు. కొడుకులకు రాజ్యమంతా అప్పగించాడు. ఆ తరువాత మెల్లగా బ్రహ్మావర్త దేశానికి పయనించాడు. కొడుకులూ, మంత్రులూ ఆ ఋషభుని అనుసరించారు. అక్కడ బ్రహ్మావర్త దేశంలో మహాత్ములైన మునిజనుల సమక్షంలో కుమారులనందరినీ దగ్గరికి పిలిచాడు. మహాపుణ్యాత్ముడైన ఆ ఋషభదేవుడు సంతోషంతో ఇలా అన్నాడు.

(బ్రహ్మావర్తం అంటే ఢిల్లీకి వాయవ్యభాగంలో ఉండే దేశ విశేషం.)

బిడ్డలారా! ఈ గడ్డమీద పుట్టిన మనుష్యులు కామానికి లొంగిపోతే కుక్కలకు కూడా రాని కష్టాలు వారికి ఎదురవుతాయి. అందువల్ల కోరికలకు మీరు దూరంగా ఉండాలి.

(ఈ భాగం మానవాళికంతా సందేశం. మానవజన్మ వచ్చాక జీవుడు జంతువులకు భిన్నంగా వ్యవహరించాలి. ఆధ్యాత్మిక జీవన పురోగతికై స్వచ్చందంగా దేహపరమయిన కష్టాలు స్వీకరించడమే మానవ జన్మకు అర్ధం. శునక సూకరాదులకు కూడా లభించే జీవనానికి మానవజీవితం ఉద్దేశింపబడలేదు.

అంతేకాదు, సహజ సంరక్షకుడయిన తండ్రి తమపై ఆధారపడిన వారికి బోధ కావించడం అవసరమని చెప్పక చెప్పడం.)

తపస్సువల్ల మానవులకు తరగని సుఖం కలుగుతుంది. అలాంటి తపస్సు అవలంబించితే బ్రహ్మానందం తప్పక సిద్ధిస్తుంది. వృద్దులనూ, దీనులనూ దయతో కాపాడండి. చెడుమార్గాలలో నడిచే కాముకుల తోడి కలయిక పూర్తిగా వదలిపెట్టండి. మీకు శుభం కలుగుతుంది.

ఆడువారంటే మోజుపడి కామవాంఛ తీర్చుకోవడమే ప్రధానమనుకొన్నవారికి సంసారం ప్రత్యక్షనరకమే అవుతుంది. పెద్దల సహవాసం మోక్షానికి దారి తీస్తుంది. పెద్దలయిన మహాత్ములు ఎవరని అంటారా? వినండి. వీడు విరోధి, వీడు స్నేహితుడు అనే భేదభావం లేకుండా సమదృష్టి కలవారూ, శాంతస్వభావులూ, ఏ మాత్రం కోపం లేనివారూ, సమస్త జీవులపట్ల పరమ కారుణ్య స్వభావం కలవారూ, కపటం లేనివారూ, మహాత్ములని పిలువబడతారు. అలాంటి మహానుభావులకు నాయందే పరిపూర్ణ భక్తి ఉంటుంది. అందువల్ల వారు విషయలంపటులయిన దుర్మార్గులపట్ల ప్రీతి గలిగి ఉండరు. తమ ఇల్లన్నా దేహమన్నాా మిత్రులన్నా, భార్యాపుత్రులన్నా వారికి వ్యామోహం ఏ మాత్రం ఉండదు.

ఇంద్రియసుఖాలకు లోనయినవాడు పనికిరాని పాడుపనులు చేస్తుంటాడు. చెడ్డపనులు చేసేవాడు పాపం కొనితెచ్చుకొంటాడు. దుఃఖ కారణమయిన దేహాన్ని మోస్తుంటాడు. అందువల్ల మీరు పాపాలకు మూలమయిన కోరికలను కోరకండి. యథార్థ జ్ఞానం ప్రాప్తించనంతవరకూ మీకు ఆత్మతత్త్వం బోధపడదు. ఆ తత్త్వం తెలియని కారణం వల్ల దేహికి దుఃఖం మిక్కుటమవుతుంది. లింగదేహ మెంతకాలం ఉంటుందో అంతకాలం మనస్సు కర్మవశమై ఉంటుంది. జ్ఞానం లభించదు. అవిద్య వదలదు. శరీరం కర్మమూలం. అందుచేత కర్మలు చేయడం తగదు. వాసుదేవుడినైన నామీద ఆసక్తి కుదరనంతవరకూ మిమ్మల్ని దేహధర్మాలు బాధిస్తాయి. ఎంత చదువుకున్నవాడయినా, దేహేంద్రియ సుఖములందు ఆసక్తుడై సంభోగసుఖప్రధానమయిన గృహస్థాశ్రమం స్వీకరిస్తాడు. ఆ ఆశ్రమంలో ఆత్మస్మృతి కోల్పోవడం తథ్యం. అటువంటివాడు మూఢుడై సంసారక్లేశాలకు లోనౌతాడు.

సంసారికి ఇల్లన్నా పొలాలన్నాా కొడుకులన్నా ఆప్తులన్నాా ధనమన్నా నేను, నాది అనే వ్యామోహం పెరుగుతుంది. స్త్రీపురుషుల కలయికవల్ల సంతానం కలుగుతుంది. ఆ సంతానంకోసం ఇల్లు కట్టడమో, పొలాలు కొనడమో, ధనం సంపాదించడమో జరుగుతుంది. వాటివల్ల మోహం పెంచుకోవడంతో వానికి మోక్షమార్గం దూరమవుతుంది. సంసారంలో మునిగి ఉన్నవారికి ఎపుడయితే మోక్షాసక్తి కలుగుతుందో అపుడే అతడు సంసారాన్ని వదలిపెడతాడు.

పరమేశ్వరుడనైన నా మీద భక్తి కలిగి ఉండడం, కోరికలు లేకపోవడం, సుఖ దుఃఖాలలో సహనం, సమస్త జీవుల కష్టాలపట్ల సానుభూతి కలిగి ఉండడం, భగవద్విషయమైన జ్ఞానమునందు ఆసక్తి తపస్సు, నా కథలనూ, లీలలనూ ఆలకించడం, నన్నే దైవంగా భావించడం, నా గుణాలను కీర్తించడం, ఎవరితోనూ విరోధభావం లేకుండడం, సర్వత్ర సమబుద్ధి కలిగి ఉండడం, శాంతంతో జీవించడం, నా గేహం, నా దేహం అనే బుద్దిని వదలి పెట్టడం, అధ్యాత్మయోగం అవలంబించడం, ఏకాంత భక్తిభావం, ఇంద్రియాలను జయించడం, కర్తవ్య పరాయణత్వం, సత్కార్యములందు శ్రద్ధ, బ్రహ్మచర్యం, జాగరూకత, వాక్కులను సంయమనంతో వాడడం, అన్నిటిలో నన్నే చూడడం - జ్డానం విజ్ఞాన విజృంబితమయిన యోగం, గుండెదిటవు, సాత్విక ప్రవృత్తి మున్నగు విధానాలతో లింగదేహాన్ని జయించి మానవుడు శాశ్వత సుఖం సంపాదించాలి.

(ఈ వచనంలో భక్తిమార్గం, మోక్షమార్గం విశదం చేయబడ్డాయి.

లింగదేహము= సూక్ష్మశరీరము= అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు, అయిదు ప్రాణములు, బుద్ధి, మనస్సు అను ఈ పదిహేడు కలిసి లింగదేహమనబడుతుంది.)

అజ్ఞానంనుండి పుట్టిన హృదయబంధనమనే తీగెను యోగం అనే చురకత్తితో ధైర్యంగా తెంపివేయాలి.

(కర్మలను త్రెంపడమంటే పనులు ఎగగొట్టడం కాదు. ఆలుబీడ్డలను బంధుమిత్రాదులను వదలడం కాదు. వారితో తమకుగల వ్యామోహ బంధాలను త్రెంపడమే. కర్తవ్యాలు మిగలకుండా ఆచరించడమే.)

అటువంటి యోగం అనుష్ఠించే వ్యక్తి గురువయితే శిష్యులనూ, తండ్రి అయితే బిడ్డలనూ, రాజయితే ప్రజలనూ తాను నేర్చిన యోగమార్గంలో పెట్టవలెనే గాని కర్మఫలాలపై ఆసక్తులను చేయకూడదు.

ప్రజలందరు ఏదో ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పనులు చేస్తూంటారు. మూర్ఖులయి ఎల్లప్పుడూ మనసులో ఐహిక ఫలాలు కోరుతుంటారు. అల్పసౌఖ్యంకోసం ఒకరిపై మరొకరు వైరం పెంచుకొంటారు. అంతులేని దుఃఖంలో మునిగిపోతారు. అందుచేత గురువయినవాడు తానే ముందు నడిచి మాయామోహాలకు లోబడి మూర్ఖులయిన జీవులపట్ల సానుభూతి చూపాలి. కళ్లున్నవాడు గ్రుడ్డివారికి దారి చూపిన విధంగా అజ్ఞానులకు బోధించి సహాయపడాలి. సాటిలేనిదీ, దివ్యమయినదీ అయిన మోక్షానికి మార్గం చూపాలి.

అంతేగాదు. తండ్రిగానీ, తల్లిగానీ, గురువుగానీ, బంధువుగానీ చివరకు భర్త అయినా సరే అక్షయమైన మోక్షమార్గం చూపలేకపోతే వారెవరూ హితులుకారు.

నా శరీరంఎలా ఏర్పడిందో మీరేమాత్రం ఊహించలేరు. నా మనస్సు సత్త్వగుణంతో కూడింది. ధర్మంతో కూడింది. పాపరహితమైంది. అందు వల్లనే ఆర్యులు నన్ను 'ఋషభు'డన్నారు. శుద్ధసాత్వికమయిన నా శరీరం నుండి పుట్టిన వారే మీరందరూ. కుమారులారా! తోడ బుట్టినవాడూ, మీ అందరికీ పెద్దవాడూ, మహాత్ముడూ అయిన భరతుణ్ణి నాలాగే భావించి సద్బుద్ధితో సేవించండి. అదే మీరు నాకు చేసే శుశ్రూష కూడా. ప్రజలను పాలించడమే మీకు ధర్మం. అని ఋషభదేవుడు మరల ఇలా అన్నాడు.

సమస్త జీవరాసులలో వృక్షాలు శ్రేష్ఠమైనవి. చెట్లకంటె సర్పాలు శ్రేష్ఠమైనవి. పాములకంటె మేధావులు ఉత్తములు, బుద్ధిమంతులకంటె భూపతులు గొప్పవారు. రాజుల కంటె సిద్ధులు, కిన్నరులు, గంధర్వులు శ్రేష్ఠులు. వారి కంటె దేవతలు గొప్పవారు. వారిని మించి ఇంద్రాది దిక్పాలకులు, వీరికంటె దక్షుడు మొదలయిన ప్రజాపతులు ఉత్తములు. ప్రజాపతులకంటె రుద్రుడు; రుద్రుని కంటె బ్రహ్మ బ్రహ్మకంటె విష్ణువు అధికులు. విష్ణుడు బ్రాహ్మణులను ఆదరిస్తాడు. అందుచేత మానవులకు బ్రాహ్మణుడే దైవం.

ఈ చరాచరప్రపంచంలో నాకు తెలిసినంతవరకు బ్రాహ్మణులకు సాటి అయిన దైవంలేదు. విధి విహితంగా అగ్నులలో వేల్చే హవిస్సుకంటె బ్రాహ్మణులు భోజనం చేస్తూండేటప్పుడు నాకు ఎక్కువ సంతోషం కలుగుతుంది.

నా దేహం పరబ్రహ్మ స్వరూపం, వేదమయం, దీనికి ఆదిలేదు. ఆలాంటి వేదరూపమైన నా దేహన్ని బ్రాహ్మణోత్తములు ధరిస్తారు. సత్వగుణం కలవాడు, జితేంద్రియుడూ, దయాళువూ, సత్యసంధుడూ, తపస్వీ, సహనశీలీ అయిన బ్రాహ్మణుడే మంచి గురువు. అందుచేత నేను పరమభక్తులూ, మహానుభావులూ అయిన బ్రాహ్మణుల దేహంతో కనిపిస్తుంటాను. పైన చెప్పిన గుణాలు కలిగిన బ్రాహ్మణులను నా రూపంగా భావించుకుని పూజచేయడం నన్ను పూజించడమే అవుతుంది అని మళ్ళీ ఇలా అన్నాడు.

ఈ రహస్యం తెలుసుకొని బ్రహ్మవేత్తలయిన విప్రులను పూజించే మానవుడు మాయాతీతుడవుతాడు. భూలోకంలో మోక్షానికి మార్గం గుర్తిస్తాడు.

సదాచార సంపన్నులయిన కుమారులకు, లోకానికి వెల్లడించు నిమిత్తం అవసరమైన ఆచారాలను ఋషభదేవుడు ఉపదేశించాడు. మహానుభావుడూ, లోకబాంధవుడూ అయిన భగవంతుడు ఋషభుని రూపంలో కర్మసన్యాసం కావించి శాంతస్వభావులైన మునులకున్నూ, భక్తి జ్డాన వైరాగ్యాదులతో కూడిన పరమహంస ధర్మాలను ఉపదేశించాలని ఎంచాడు. ఆయన తన నూరుమంది కొడుకులలో పెద్దవాడు, పరమభాగవతుడైన భరతునికి పట్టంగట్టి రాజ్యభారం అప్పగించాడు. అనంతరం శరీర మాత్రసహాయుడై, దిగంబరుడై, చింపిరిజుట్టుతో, పిచ్చివానిలాగా ప్రవర్తిస్తూ అగ్నుల్ని తనలో ఆరోపించుకొని కొంతకాలంగడిపాడు. తర్వాత బ్రహ్మావర్తదేశాన్ని వదలిపెట్టి వెళ్ళిపోయాడు. జడునిలాగా, చెవిటివానిలాగా, మూగవానిలాగా, పిశాచం ఆవహించినవాడుగా, పిచ్చివాని విధంగా అవధూత వేషం ధరించాడు. ఎవరయినా పలకరించినా బదులు చెప్పకుండా మౌనవ్రతం చేపట్టాడు.

నగరాలు, గ్రామాలు, పల్లెలు, తోటలు, శిబిరాలు, బిడారులు, గొల్లపల్లెలు, గొడ్లపాకలు, కొండలు, తపోవనాలు, ఋష్యాశ్రమాలు దాటిపోసాగాడు. అక్కడక్కడ కొందరు వెంటపడేవారు. దుండగులు కొడుతున్నా తిడుతున్నా, రాళ్ళువిసురుతున్నా దుమ్ముచల్లుతున్నా తనపై మూత్రవిసర్జనం చేసినా, ఉమ్మివేసినా, కుళ్ళినవస్తువులు పైకి విసరివేసినా, బూతుకూతలు కూస్తున్నా ఏ మాత్రం పట్టించుకోకుండా జోరీగలను లెక్కపెట్టక, అడవి యేనుగులాగా ముందుకు నడచి పోతున్నాడు. ఏ మాత్రం దేహాభిమానం లేకుండా, నిశ్చలమైన చిత్తంతో ఏకాకిగా సంచరిస్తున్నాడు.

అతని చేతులు, కాళ్ళు, ఉరోభాగం చాలా సుకుమారంగా ఉన్నాయి. భుజాలు, కంఠసీమ, ముఖంమొదలయిన అవయవాలు విశాలంగా తీర్చినట్లున్నాయి. అతని రూపం సహజ సుందరంగా ఉంది. పద్మం వంటి ముఖంలో స్వతస్సిద్ధమైన చిరునవ్వులు చిందుతున్నాయి. కొంగ్రొత్త తామర రేకులలాగ చల్లని కనుపాపలు కనిపిస్తున్నాయి. విప్పారిన కళ్ళల్లో ఎర్రదనం ప్రకాశిస్తున్నది. చెక్కిళ్ళుగాని, చెవులుగాని, మెడభాగంగాని ముకుపుటాలుగాని ఏ మాత్రం లోపం లేకుండా దిద్ది తీర్చినట్లున్నాయి. అతని పెదవుల లోపలి చిరునవ్వు ఇతరులను భ్రమింపజేసేవిధంగా ఉంది. అటువంటి ఆతని దివ్యమంగళ విగ్రహం ముద్దుగుమ్మలను మోహంలో ముంచెత్తుతున్నది.

(అవధూత= అ అంటే అక్షరస్వరూపం తెలిసి, వ= సర్వజీవుల్లోనూ శ్రేష్ఠుడై, ధూ= సర్వబంధాలను త్రోసివేసి, త= నేనే పరమాత్మనను అనుభూతి పొంది ఆనందస్వరూపుడై ఉండేవాడు.

ధూళి కొట్టుకొని ఋషభుని జుట్టు ధూసరవర్ణం ధరించింది. వెండ్రుకలు జడలుకట్టి గోరోచన వర్ణంతో మెరిసిపోతున్నాయి. అటువంటి వేషంతో అతడు ఎవరూ తనను గుర్తుపట్టకుండా తిరుగుతున్నాడు.

(ప్రాపంచిక అనుబంధం పోగొట్టుకోనివాడు, ఆ అనుబంధాన్ని ఆనందంగా భావించేవాడు అందరూ తన్ను గుర్తుపట్టాలని కోరుకొంటాడు. కాని, ఈ అనుబంధాన్ని తెంచుకొన్నవాడు కోరడు. పైగా తన్ను గుర్తు పట్టకూడదని భావిస్తాడు.)

ఆ ఋషభుడు పిశాచం పట్టిన వానిలాగా, మురికిపట్టిన అవయవాలతో అవధూత వేషంతో సంచరించ సాగాడు.

తన అవధూత వేషం, తన యోగవిధానం ప్రజలకు వింతగా ఉంటుందని ఋషభుడు గ్రహించి ఒకేచోట కొండచిలువలాగా నేలపై పడివుండి లభించినవాటినే ఆహారంగా తీసుకుంటూ ఉండేవాడు.

(తన ప్రవర్తన లోకవిరుద్ధమని ఋషభుడు తెలుసుకొన్నాడు. నగరం వదిలాడు. అడవుల్లో తిరిగాడు. జనసంచార స్థలాలు వర్జించాడు. చివరకు నిలబడి సంచరిస్తే ఎవరి దృష్టికైనా బాధగాని, వింతగాని కలుగుతుందేమోనని నేలపై పడుకొని కొండచిలువలాగా ఉండసాగాడు.)

ఈ విధంగా ఆయన జుగుప్స కలిగించే తీరున నేలమీద పరుండి ఉండేవాడు. అన్నం తింటూ, నీరు తాగుతూ, మలమూత్రాదులలో పొరలుతుండేవాడు. అతని మలసుగంధంతో కూడిన వాయువు పది దిక్కులలోనూ పది ఆమడల దూరం పరిమళిస్తుండగా; భగవదంశ సంభూతుడైన ఋషభుడు ఎద్దువలె, జింకవలె, కాకివలె ప్రవర్తిస్తూ మహానందం పొందేవాడు. సర్వాంతర్యామి అయిన వాసుదేవుణ్ణి తనలో ప్రత్యక్షంగా దర్శించుకొంటూ యోగసిద్ధుడైనాడు. అపుడు ఆకాశగమనం, మనోవేగం, పరకాయ ప్రవేశం, అంతర్ధనం, దూరదర్శనం, దూరశ్రవణం మొదలయిన సిద్ధులు తమంత తాము ఋషభుణ్ణి ఆశ్రయించాయి. అయినా ఆ ఋషభుడు ఆ సిద్దులను స్వీకరించలేదు అని శుకయోగి ఋషభుని వృత్తాంతం చెప్పగా పరీక్షిత్తు తన సందేహం ఇలా వెలిపుచ్చాడు.

మునివరేణ్యా! యోగాభ్యాసంవల్ల జ్ఞానం కలుగుతుంది. కర్మలు నశిస్తాయి. అలాంటి మహనీయులకు మహాసిద్దులు ప్రాప్తిస్తాయి. అయినా తమంత తాము వచ్చిన ఐశ్వర్యాలను ఋషభుడెందుకు స్వీకరించలేదు స్వామీ!

అని పరీక్షిన్మహారాజు అడుగగా ఆ శుకమహర్షి ఇలా చెప్పాడు. "ఓ రాజా! నీవన్నది నిజమే. అడవిలోని మృగాలు వేటగానికి పట్టువడుతాయి. అయినా ఏదోవిధంగా వాణ్ణి వంచించి తప్పించుకొని బయటపడతాయి. అలాగే ఇంద్రియాలను లొంగదీసుకున్నా మనస్సు మరల ఏదోవిధంగా విజృంభించి కోరికలకు అవకాశమిస్తుంది.

మహీనాథ! మనసు చాల చిత్రమయింది. చాలకాలం శ్రమపడి సాధించుకున్న తపస్సునయినా అది హరిస్తుంది. అందుచేత పెద్దలు మనసును నమ్మరు. విటులను ఆకర్షించే జారిణిలాగా మనసు నిలకడ కోల్పోయి కామక్రోధాదులను ఆహ్వానిస్తుంది.

నరేంద్రా! కామక్రోధాది అరిషడ్వర్గాలకూ, కర్మబంధాలకూ మనస్సే మూలకారణం. అందుచేత ఆర్యులు మనస్సును సుతరామూ విశ్వసింపరు.

ఓ రాజా! మనసు గతి తెలిసినవాడు కావడంవల్ల తమంత తాము వచ్చినను యోగసాధనచే లభించిన సిద్ధులను ఋషభుడు చేపట్టలేదు. కనీసం వాటివంక చూడనయినా చూడలేదు. లోకంలో శుభం కోరేవారి అభివందనాలను ఆ మహాత్ముడు అందుకున్నాడు. వేషంలోగాని, మాటల్లోగాని ఋషభుడని గుర్తు పట్టడానికి వీలు లేనట్టుగా భగవత్స్వరూపంతో ఋషభుడు వెలిగిపోతున్నాడు. పరమయోగాన్ని ధ్యానించేవారికందరికీ దేహత్యాగం చేయదగ్గ సమయాన్ని ఋషభుడు సూచిస్తున్నాడు. మహాయోగులలో శ్రేష్ఠుడయినవాడు, మహాత్ములలో అగ్రేసరుడు, సాటిలేని దివ్యతేజస్సులో ప్రకాశించేవాడు, దేవతలకు గురువయినవాడు, పరమపురుషుడయిన ఋషభుడు శరీరం విడవడానికి నిశ్చయించాడు.

భగవంతుని అవతారమైన ఋషభుడు మనసులో దేహాభిమానాన్ని వదలుకొన్నాడు. కుమ్మరివాడు సారెను వేగంగా త్రిప్పి విడిచిపెట్టిన తర్వాత కూడా ఆ చక్రం కొంతసేపు తిరుగుతున్నట్లే, పూర్వ సంస్కార విశేషంవల్ల ఆయన దేహ సంచలనం పూర్తిగా ఆగిపోదు. ఋషభుడు లింగదేహాన్ని వదలిపెట్టినా యోగమాయావాసనల కారణంగా లౌకికంగా దేహధారిగా చరించాడు. అతడు కొంకణం, వంకం, పటం, కుటకం అనే పేర్లతో పిలువబడే దక్షిణ కర్ణాటక దేశాలవైపు కదిలాడు. కుటక పర్వత సమీపంలోని ఉపవనం చేరుకున్నాడు. అక్కడ శిలాఖండాలను నోటిలో పెట్టుకొని పిచ్చివానిలాగా జుట్టు విరియబోసుకొని దిగంబరుడై సంచరించాడు. అపుడు వీచిన సుడిగాలి విసురుకి దుమ్ము రేగింది. దుమ్ముతోకూడిన గాలికి అడవిలో నిప్పంటుకుంది. ఆ నిప్పు కార్చిచ్చులాగా అడవినంతా అలముకొనింది. ఆ కార్చిచ్చుమంటలలో ఋషభుడు కాలిపోయాడు. ఋషభుని చేతలను ఆ ప్రాంతంవారు చెప్పుకోగా అర్హతుడు అను పేరుగల ఆ రాష్ట్రాధికారి ఆలకించాడు. అతడు స్వధర్మం వదలిపెట్టి స్వదేశస్థులతో ఆ ఆచారానికి ఆమోదం తెలిపాడు. అధర్మ బహుళమయిన కలియుగంలో భవిష్యత్తుకు లోబడిపోయి తన రాష్ట్రంలోని మానవులను అయోగ్యమయిన వేద బాహ్యమతంపట్ల మొగ్గేటట్లు చేశాడు.

కలియుగంలో అధములైన మానవులు దేవమాయవల్ల మోహితులవుతారు. శాస్త్రాలలో ప్రవచనం చేయబడ్డ శౌచాలనూ, ఆచారాలనూ వదలిపెడతారు. తమకు ఇష్టం వచ్చినట్లు దేవతలను పరిహసిస్తారు. స్నానం చేయరు. ఆచమనం అసలు లేదు. శుచిత్వం సున్న. జుట్టు గొరిగించుకొంటారు. అపవిత్ర వ్రతాలను పాటిస్తారు. అధరాలు పెచ్చు పెరిగిన కలియుగంలో బుద్ధి చెడిపోగా వేదాలనూ, బ్రాహ్మణులనూ, యజ్ఞపురుషులనూ నోటికి వచ్చినట్టు అనరాని మాటలంటారు. తమ తమ అభిప్రాయాలకు తామే తెగ మురిసిపోతారు. వేదవిరుద్ధంగా ప్రవర్తిస్తారు. గుడ్డిగా వ్యాపించే దురాచారాలపట్ల నమ్మకం పెంచుకుంటారు. చివరకు అంధతమసంలో పతనమవుతారు.

రజోగుణంతో నిండిన పురుషులకు మోక్షమార్గం ఉపదేశించడం కోసమే ఋషభుని అవతారం. ఏడు సముద్రాలతో కూడిన ఈ ద్వీపాలలోని జనులు దివ్యమైన ఎవని అవతార లీలలను కీర్తిస్తారో, ఎవడు ఎంతో కీర్తి గడించిన ప్రియవ్రతుని వంశంలో జన్మించాడో, ఎవడు లోకాలకు ఆది అయిన పురాణ పురుషుడో అలాంటి ఋషభదేవుడు భూలోకంలో అవతరించి కర్మసంబంధంలేని మోక్షధర్మాన్ని ప్రబోధించాడు. యోగమాయవల్ల తనకు తామై లభించిన సిద్ధులన్నిటినీ గడ్డిపరకలనువలె తిరస్కరించాడు. అలాంటి మహావ్యక్తికి సిద్ధులకోసం ప్రయత్నించే యోగీశ్వరులు ఏ విధంగా సాటి అవుతారు?

అన్ని వేదాలకూ, అన్ని లోకాలకూ, సమస్త దేవతలకూ, బ్రాహ్మణులకూ, గోవులకూ పరమ గురువయినవాడు, భగవంతుడయినవాడు ఋషభుడు. ఆయన చరిత్రం వింటే దుశ్చరిత్రుల దురితం తొలగిపోతుంది. శుభాలు చేకూరుతాయి. ఎవరయితే ఋషభుని చరిత్రం మిక్కిలి శ్రద్ధతో వింటారో, ఎవరు ఇతరులకు వినిపిస్తారో వారికి సుదృఢమైన హరిభక్తి లభిస్తుంది. అటువంటి హరిభక్తిపట్ల తత్పరత కలిగిన పెద్దలైన భాగవతులు హరికృపవల్ల ధర్మ, అర్ధ, కామ, మోక్షాలనే పురుషార్థాలను సాధించుకొంటారు. నానావిధ పాపకారణమయిన సంసారతాపాన్ని పోగొట్టుకుంటారు. హరిభక్తి యోగమనే అమృతస్నానం చేసి పవిత్రులవుతారు. పరమపురుషార్ధమైన మోక్షాన్ని సిద్ధింపచేసుకొంటారు. ఈ విధంగా సప్త ద్వీపాలలోని జనులు నేడు కూడా ఋషభుని మహిమను పొగడుతుంటారు.

(ఈ వచనంలో ప్రధానంగా నాల్గు అంశాలున్నాయి. మొదటిది దేహత్యాగ విధానం. రెండవది 'కలియుగవర్తన' కథనం. మూడవది కర్మ సంబంధం లేని మోక్షధర్మోపాయం. నాల్గవది భాగవత మార్గం.

పరీక్షిన్మహారాజా! యాదవులకున్నూ, మీకున్నూ(పాండవులకు) కులగురువయిన శ్రీకృష్ణుడు ఆ చోట ఈచోట అనక అన్నిచోట్లా ఉన్నాడు. కొలిచేవారికి అతడు కొంగుబంగారమై తప్పక మోక్షం ప్రసాదిస్తాడు. నీవేమాత్రం దిగులుపడవద్దు.

ఋషభదేవుడు నిత్యానుభూతమైన స్వస్వరూప లాభంవల్ల తృష్ణను నివారింపజేశాడు. యోగమాయవల్ల లభించిన మహాసిద్దులచేత ఆయన బుద్ధి ఆకర్షింపబడలేదు. ఆ మహానుభావుడు లోకులందరినీ కనికరించి అభయమిచ్చాడు. నిత్యమయినదీ, దివ్యమయినదీ, ఆనందప్రదమైనదీ, సేవింపదగినదీ, సాటిలేనిది అయిన వైకుంఠలోకాన్ని అందింపగల మోక్షమార్గాన్ని అందరికీ ఉపదేశించాడు. ఆ తరువాత దేహం వదలి జనులంతా ఆశ్చర్య చకితులయ్యేటట్లు విష్ణుమూర్తితో తాదాత్మ్యం పొందాడు. ఋషభుడు సామాన్యుడు కాడు. ఆయన సాక్షాత్తు విష్ణువు.

భరతోపాఖ్యానము

No comments:

Post a Comment