నరవరేణ్యుడైన నాభి సంతానార్థం భార్యాసమేతంగా, శ్రద్ధాభక్తులతో యజ్ఞపురుషుడయిన వాసుదేవుని పూజించాడు.
నాభి ప్రవర్గ్యమనే ధర్మక్రతువును శ్రద్ధతో పరిశుద్ధమయిన ద్రవ్యాలతో ఉచిత ప్రదేశంలో దేశకాలానుగుణంగా, విధివిహితంగా, మంత్రవేత్తలయిన ఋత్విక్కులలో భూరిదక్షిణలతో ఆరంభించాడు. సాధారణంగా ఎవరికీ ప్రత్యక్షంకాని భక్తవత్సలుడయిన పుండరీకాక్షుడు పరమాత్ముడు ప్రకాశవంతమయిన అవయవ సౌష్టవంతో నాభీ హృదయంలో తాను సదా నెలకొని ఉన్నప్పటికినీ ప్రత్యక్షరూపంతో కనులకు పండువుగా మనసుకు నిండుగా తన స్వరూపాన్ని అతనికి చూపాలనుకొన్నాడు.
ప్రకాశించే చతుర్భుజాలతో, పట్టుపీతాంబరాలతో, రమణీయమైన శ్రీవత్సం, కౌస్తుభమణి, శ్రీదేవి విరాజిల్లే వక్షః స్థలంతో, శంఖం, చక్రం, గద, పద్మం, ఖడ్గం మొదలయిన దివ్యాయుధాలతో, సాటిలేని నవరత్నాల కాంతులు వెదజల్లే బంగారు కిరీటంతో మకరకుండలాలూ, మొలనూలూ, మణులు చెక్కిన స్వర్ణహారాలూ, బాహుపురులూ, కాలి అందెలు ప్రకాశింపగా లక్ష్మీరమణుడు ఆ దంపతుల ముందు ప్రత్యక్షమైనాడు.
ఈ విధంగా ప్రత్యక్షమయిన భగవంతుణ్ణి ఋత్విక్కులు మున్నగువారు చూచారు. పెన్నిధిని దర్శించిన పేదవారివలె సంతోషంతో వారందరూ తలలు వంచి ఈ విధంగా స్తోత్రాలు చేశారు.
స్వామీ! నీవు పరిపూర్ణుడవు. అయినా మమ్మల్ని మరచిపోకుండా మా పూజలను స్వీకరిస్తున్నావు. పెద్దలు మాకు చెప్పినట్లు నీ చరణారవిందాలను సేవిస్తాము.
మహాత్మా! మేము నీ మహిమలు తెలిసి సంస్తుతి చేయడం లేదు. పెద్దలు మాకు ఏ విధంగా ఉపదేశించారో ఆ విధంగా ప్రస్తుతి చేస్తున్నాము.
సంసారంలో మునిగి తేలేవారికి నీవు పట్టువడవు. నీవు ఈశ్వరుడవు. ప్రకృతికన్నా, జీవునికన్నా భిన్నమైనవాడవు. పరమపురుషుడవు. అయితే మేము పంచభూతాల సృష్టికి లోనయిన నామరూపాలు ధరించిన వాళ్లం. అటువంటి మాకు నీ తత్త్వాన్ని నిరూపించడం సాధ్యం కాదు. సకల జీవరాసుల పాపసమూహాలను తొలగించడం నీ స్వభావం. అటువంటి నీ ఉత్తమ గుణాలలో ఏదో ఒక అంశమేగాని సమస్త గుణాలను నిరూపించడం ఎవరికీ ఏ మాత్రం శక్యంకాదు. నీ భక్తులు భక్తితో డగ్గుత్తికతో సంస్తుతిస్తూ, నీకర్పించే నిర్మలజలం, చిగురుటాకులు, తులసీదళాలు గరికపోచలు మొదలైన వాటితో నీవు సంతృప్తి పడతావు. అంతేకాని, నానావిధ ద్రవ్యాలు సంతరించుకొని మహావైభవంతో చేసే అశ్వమేధాది యాగాలు కూడా నీకు సంతృప్తి కలిగించవు. స్వాభావికంగానే నీవు సర్వకాలాలలోనూ సాక్షాత్కరిస్తావు. నీవు సర్వాతిశాయివి. సమస్త పురుషార్థాలు నీవే. పరమానంద స్వరూపుడవైన నీకు యజ్ఞయాగాదులవల్ల తృప్తి లేకున్నామా కోరికలను తీర్చుకోవడంకోసం మేము యజ్ఞాలు చేస్తున్నాము.
దయానిధీ! మేము మూర్ఖులం. మాకేది మంచిదో ఏది కాదో మాకే తెలియదు. అయినా ఎంతో దయతో మమ్మల్ని కాపాడి ఇహపరాలకు తగిన సకల సుఖాలను నీవు మాకు ప్రసాదిస్తున్నావు.
ఇపుడు మేము నీకు సంతుష్టి కలిగేటట్లు ఇష్టమైన పూజలు చేయకపోయినా మామీద కరుణాకటాక్ష వీక్షణాలను ప్రసరింపజేసి ప్రసన్నుడవైనావు.
నీలమేఘంలాంటి శరీరచ్చాయ కలవాడా! కోరిన కోరికలు అనుగ్రహించేవాడా! నీవే మాకు వరమివ్వడంకోసం మాముందు సాక్షాత్మరించావు. నిన్ను సందర్శించడానికి గానీ, మరి సంస్తుతించడానికి గానీ మాకు సాధ్యమవుతుందా!
మునులు కోరికలు లేనివారు. సునిశ్చితమైన జ్ఞానం కలవారు. దోషరహితులు. భగవంతుని ప్రతిరూపాలు. ఆత్మారాములు. అలాంటి మునులకు స్తోత్రార్హుడ వయినప్పటికి నీవు అందరిపట్ల అనుగ్రహం చూపుతున్నావు. కాలు జారినప్పుడూ, క్రిందపడ్డప్పుడూ, తుమ్మినప్పుడూ, ఆవులించినప్పుడూ, ముసలితనంతో పీడింపబడుతున్నప్పుడూ, చావుకు చేరువ అయినప్పుడూ, మామీద మాకే అధికారం తప్పినప్పుడూ మా పాపాలను పోగొట్టే నీ దివ్యనామాలు మా నోటివెంట వెడలునట్లు అనుగ్రహించు.
ఈ రాజర్షి అయిన నాఖి నీతో సమానమైన సంతానం కావాలని నిన్ను పూజించాడు. కోరిన కోరికలనూ, స్వర్గాన్నీ మోక్షాన్నీ సైతం ఇవ్వగల నిన్ను ఇలా అడగడం ధనంకోసం ధనవంతుని దగ్గరికివెళ్లి ఊక అడిగినట్టుంది. మోక్షప్రదాతవయిన నిన్ను సంతానంకోసం ప్రార్థిస్తున్నాడు. నీ మాయ దాటరానిది. అలాంటి మాయలకు లోబడి ఇంద్రియ కాంక్షలకు లోనుకాని వాడెవడు? ప్రతి పనిని ప్రయోజనం దృష్టిలో పెట్టుకొని చేసేవాళ్ళం మేము. గర్వాంధులము అయినా నిన్ను ఆహ్వానించిన మా అపరాధాన్ని మన్నించు. మమ్ము అనుగ్రహించు అని నమస్కరించారు. అపుడు సర్వేశ్వరుడు జంబూద్వీపంలోని ఒక వర్షానికి అధిపతి అయిన నాఖి, ఋత్విక్కులతో కలిసి చేసిన వందనాలు అందుకొంటూ దయతో ఇలా అన్నాడు.
మునులారా! నన్ను వేదమంత్రాలతో ప్రస్తుతి చేశారు. సకల శుభలక్షణాలు కలిగి నాకు సాటి రాదగిన కొడుకును ప్రసాదించవలసిందిగా ఎంతో కుతూహలంతో మీరు నన్ను కోరారు.
(భగవంతుడు వేదగోచరుడు అందువల్ల వేదవాక్కులతో ప్రస్తుతి చేయడం సమంజసమే.)
స్వర్గాదిలోకాలలో నాకు సాటిరాదగ్గ కుమారుడు ఎక్కడా కనిపించడు. నాకు సాటి నేనే. ఈ విషయం మీరు తెలుసుకొనండి.
అంతేగాక, బ్రాహ్మణులు నాకు ముఖంలాంటివారు. బ్రాహ్మణవాక్యం దాటడానికి వీలుకానిది. నాతో సమానుడైన కుమారుణ్ణి మీరు కోరారు. అందుచేత, నాభి రాజేంద్రుని పత్ని అయిన మేరుదేవికి నేనే కొడుకునై పుడతాను అని రాజదంపతులు చూస్తుండగా అంతర్థానమయ్యాడు. ఆ తర్వాత దిగంబరులూ, తాపసులూ, జ్ఞానులూ, ఊర్థ్వరేతస్కులూ అయిన నైష్ఠికులకు యోగధర్మాలు బోధించడం కోసం నాభిమీది దయతో నారాయణుడు మేరుదేవి గర్భంలో ప్రవేశించాడు.
('బ్రాహ్మణోஉస్య ముఖ మాసీత్' అని పురుషసూక్తం. అందువల్ల 'నా ముఖంబగుటం జేసి' అని చెప్పబడింది.)
సమస్త శుభలక్షణాలు కలవాడూ, శమదమాది గుణసంపన్నుడూ, మేరుధీరుడైన శ్రీహరి సమస్త జనులూ సంతోషించేటట్లు మేరుదేవికి కుమారుడుగా అవతరించాడు.
(సమస్త శుభలక్షణాలు అన్నప్పుడు సాముద్రిక లక్షణాలు, భగవల్లక్షణాలు అన్నీ చేరుతాయి. చక్కని శరీరం, శౌర్యం, బలం, సౌందర్యం, నామం, యశస్సు, ప్రభావం, ఉత్సాహం, అలాగే సర్వసమత్వం, పరమశాంతత్వం, భౌతిక భోగసుఖాలపట్ల వైరాగ్యంలాంటివి కూడా శుభలక్షణాలు. అలాగే పాదాదులందు ధ్వజ, వజ్ర, పద్మచిహ్నాలు.)
బలిష్టమైనవాడని, పరాక్రమవంతుడని, ధైర్యశౌర్యాలు కలవాడనే లక్షణాలనుబట్టి నరనాథుడయిన నాభి తన కుమారునికి 'ఋషభుడు' అని పేరు పెట్టాడు.
(సర్వశ్రేష్ఠుడు, మహాపురుషుడు అనడాన్ని ఋషభ అనే శబ్దం సూచిస్తుంది.)
బ్రాహ్మణులు, మంత్రులు, రాజపరివారం, హితులు, ప్రజలు, చుట్టాలు అనురాగాతిశయంతో ఋషభుని రాజుగానే భావించారు.
ఇంద్రుడు ఋషభుని మహిమలు విన్నాడు. అతడు అసూయాపరుడు కనుక సహించలేకపోయాడు. ఋషభుని రాజ్యంలో వర్షాభావ పరిస్థితి కల్పించాడు.
ఋషభుని మహిమలు విని ఇంద్రుడు లోలోపల కుమిలిపోయాడు. అందుచేత, ఋషభుడు పరిపాలించే రాజ్యంలో వానచినుకు పడకుండా చేయగా ఇంద్రుని దౌష్ట్యాన్ని ఋషభుడు గుర్తించాడు. తన యోగమాయాబలంతో నానాటికి సర్వసమృద్ధిగా వర్షం కురిపించాడు.
(ఇంద్రుడు వర్షాధిదేవత. త్రిలోకాధిపతి. తనకు సాటిగా మరొకరు వృద్ధి పొందడాన్ని సహించలేనివాడు. అందువల్ల ఋషభుని సాధింప తలపెట్టాడు. 'యజ్ఞాత్ భవతి పర్జన్యః' - యజ్ఞం చేయడంవల్ల వర్షాలు కురుస్తాయి అని భావం. మూలంలో 'భగవాన్ ఋషభదేవః యోగేశ్వరః' అని చెప్పబడ్డాడు. ఇందువల్ల ఆధ్యాత్మికశక్తి కలవాడని భావం.)
దేవేంద్రుని దుర్బుద్ధికి ఋషభుడు నవ్వుకొని, అజనాభమనే పేరుతో వ్యవహరింపబడే తన భూమండలాన్ని సుభిక్షం చేశాడు. తాను కోరినట్టు కొడుకు పుట్టడం, పెరగడం చూచి నాభి చాల సంబరపడ్డాడు. పుండరీకాక్షుని మాయ కారణంగానూ, భూలోకధర్మాల కనుగుణంగానూ నాభీ తన ప్రియనందనుణ్ణి నాయనా! నా తండ్రీ! అంటూ ముద్దాడాడు. ప్రజల అభిమానం చూరగొన్న వాడున్నూ అన్నివర్గాల వారికి ఆమోదయోగ్యుడూ అయిన తన కుమారుడు రాజ్యపాలనకు తగినవాడని భావించి పట్టం కట్టాడు. బ్రాహ్మణులకూ, మంత్రి వర్గానికీ అతణ్జి అప్పగించాడు. ఆ తరువాత భార్య మేరుదేవితోకూడ నరనారాయణులకు నిలయమైన బదరికాశ్రమం చేరుకొన్నాడు. అక్కడ నారాయణ స్వరూపుడూ, పురుషోత్తముడూ అయిన వాసుదేవుని తదేకధ్యానంతో ఆరాధించాడు. చివరకు సతీసమేతుడైన నాభి శ్రీహరితో తాదాత్మ్యం పొందాడు.
ఏ మహారాజు యజన సమయంలో బ్రాహ్మణోత్తములైన ఋత్విక్కులు విష్ణుమూర్తిని ప్రార్థించి ప్రసన్నం చేసుకొన్నారో, ఏ రాజు భార్య గర్భంలో ప్రవేశించి ఈశ్వరుడు తనంత తాను కొడుకుగా పుట్టాడో, అలాంటి మహారాజుకు సాటిరాగల రాజు లెవరూ భూమండలంలో లేరు.
ఆ తరువాత కథ విను.
రాజైన ఋషభుడు తన రాజ్యాన్ని కర్మాచరణకు తగిన భూమిగా భావించాడు. జనుల కందరికీ ప్రియమయ్యేటట్లు కర్మతంత్రం తెలియజేయాలనుకొన్నాడు. అందుచేత, కర్మలు ఆచరించడానికి తానే స్వయంగా గురువులవద్ద వేదాలు చదివాడు. వారి ఆజ్ఞ శిరసావహించి శతమన్యుడు ఇచ్చిన జయంతిని వివాహం చేసుకున్నాడు. ఆ జయంతివల్ల భరతుడు మొదలయిన నూర్గురు కొడుకులను కన్నాడు. పట్టణాలతో, ఆశ్రమాలతో, కొండలతో, చెట్లు చేమలతో నిండిన భూమండలం ఆ భరతుని పేరు మీదుగా భరతవర్షమనే ప్రశస్తి గడించింది.
(ఋషభుడు భగవంతుడే. సర్వజ్ఞుడు. గురువువల్ల నేర్వవలసినది ఏదీ లేకపోయినప్పటికినీ గురువునుండి ఏ విధంగా విద్యార్జన చేయాలో జనసామాన్యానికి బోధించే నిమిత్తం తానే గురువు దగ్గరికి వెళ్ళాడు. అలాగే, ఆదర్శవంతుడయిన గృహస్టుడయ్యాడు. ఋషభుని కుమారుడైన భరతుని వల్లనే ఈ దేశానికి భారతదేశమనే పేరు ఏర్పడింది.)
భారతవర్షమనే పేరుతో ప్రసిద్ధి పొందిన భూమండలంలోని ఆయా భాగాలకు భరతుడు తన తొంబది తొమ్మిదిమంది సోదరులలో కుశావర్తుడు, ఇలావర్తుడు, బ్రహ్మావర్తుడు, ఆర్యావర్తుడు, మలయకేతువు, భద్రసేనుడు, ఇంద్రస్పృక్కు విదర్భుడు, కీకటుడు అనే తొమ్మిదిమందిని ప్రధానులుగా నియమించాడు. వారి కప్పగించిన భూభాగాలు వారి వారి పేర్లతో ప్రసిద్ది పొందాయి. కవి, హరి, అంతరిక్ష ప్రబుద్ధ, పిప్పలాయన, అవిర్హోత్ర, ద్రమీఢ, చమన, కరభాజనులనే తొమ్మండుగురు భాగవత ధర్మాన్ని ప్రకాశింపజేశారు. దేవుని మహిమల్ని వ్యాప్తిచేసే వారి చరిత్రలు నీకు తర్వాత చెబుతాను. తక్కిన ఎనభైయొక్క మంది కుమారులు తమ తండ్రి అయిన ఋషభుని మాట జవదాటనివారు. వారందరు మహావినయ సంపన్నులు. వేదధర్మాలు అనుష్ఠించేవారు. యాగాలన్నాా ధర్మాలన్నా శ్రద్ధగలవారు. అందుచేత వారు బ్రాహ్మణోత్తములుగా పేరెన్నికగన్నారు.
ఋషభుడు సాంసారిక బంధాలలో చిక్కుకోలేదు. స్వతంత్రుడయి మెలిగాడు. తాను ఆనందానుభూతి కలిగిన ఈశ్వరుడయినా సామాన్యునిలా ప్రవర్తించాడు. ఆయాకాలాలలో చేయవలసిన ధర్మాలను ఆచరించేవాడు. ధర్మప్రవర్తకులపట్ల సమబుద్ధి కలిగి ఉండేవాడు. శాంతస్వభావంతో జీవులపట్ల కరుణ కలిగి మైత్రీభావంతో ఉండేవాడు. ధర్మం, అర్ధం, కీర్తి, సంతతి, ఆనందం, అమృతత్వం చక్కగా సాగడంకోసం గృహస్థాశ్రమం పాటించవలసిందిగా ప్రజలను అనుశాసించేవాడు. ఈ విధంగా ఋషభుడు నీతిమార్గం తప్పకుండా ప్రజాపాలనం చేశాడు. వేదాలలోని ధర్మరహస్యాలు తనకు అవగతమయినా బ్రాహ్మణులు బోధించినట్లు ఋత్విక్కులు ఉపదేశించినట్లు వస్తుసంభారాలతో, దేశకాలానుగుణంగా శ్రద్ధాపూర్వకంగా, తన వయస్సుకు తగినట్టు ఒక్కొక్క యాగాన్ని నూరు పర్యాయాలు యథావిధిగాజేసి సుఖజీవనం సాగించాడు.
(ప్రజానందామృతావరోధంబుచేన్- ఇచ్చటి ప్రజానంద పదమునకు ప్రజార్థోభోగః; అమృతం అను పదమునకు మోక్షః అనియు, అవరోధము అనగా సంగ్రహము అని శ్రీధరీయమునందు వివరింపబడినది.)
రాజా! ఆ ఋషభ దేవుని రాజ్యంలో పారలౌకిక ఫలమే తప్ప ఇహలోకఫలం కోరేవాడు ఒక్కడూ కనబడడు. అతడు సూర్యుని తేజస్సు వంటి తేజస్సు కలవాడు. అతని మహిమలను ఏమని వర్ణించేది?
No comments:
Post a Comment