Wednesday, March 4, 2026

Servants of vrushala raja took Bharatha for Kali Bali - వృషల రాజభృత్యులు కాళీబలికి భరతునిఁగొంపోవుట

వృషల రాజభృత్యులు కాళీబలికి భరతునిఁగొంపోవుట

భరతుడు కాపలా కాస్తున్న పొలానికి దగ్గర్లో ఒక నగరం ఉంది. ఆ నగరానికి నాయకుడైన భిల్ల రాజుకు పిల్లలు లేరు.

అందుచేత ఆయన కాళికాదేవికి నరబలి ఇవ్వడంకోసం ఒక మనుష్యుణ్ణి వెంటబెట్టుకొని పోతున్నాడు. అయితే మార్గమధ్యంలో ఆ బలిపశువు తప్పించుకొని పారిపోయాడు. సేవకులు వానికోసం గాలించారు.

ఆ రాత్రి ఎంత వెదకినా ఆ వ్యక్తి కనబడలేదు. చేనిలో ఒకచోట వీరాసనం వేసికొని పొలానికి కావలి కాస్తున్న బ్రాహ్మణకుమారుడు భరతుడు భటులకు కన్పించాడు. నరబలికి తగిన పశువు దొరికింది కదా అని భటులు ఆ బ్రాహ్మణయోగిని పట్టుకున్నారు.

(వీరాసనమనగా - కుమారసంభవము 3వ సర్గ 45 శ్లో. వ్యాఖ్యయందు మల్లినాథునిచే ఉట్టంకితం.

శ్లో
 ఏకపాదమథైకస్మిన్విన్య స్యోరౌతు సంస్థితమ్‌ 
ఇతరస్మింస్తథైవోరుం వీరాసనముదాహృతమ్‌ ॥ -అని.

ఒక తొడమీద రెండవ పాదము నుంచి, మఱియొక తొడక్రింద మరియొక పాదముంచి కూర్చుండుట.)

ఆ సేవకులు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుని వెంటనే కాళికాలయమునకు గొని పోయారు. బాగా తలంటిపోశారు.

ఈ విధంగా భరతుడికి అభ్యంజనస్నానం చేయించి కొత్త బట్టలు కట్టించారు. ఒంటినిండా గంధం పూశారు. మెడనిండా పూలదండలు వేశారు. ఆభరణాలతో అలంకరించారు. అక్షతలు చల్లారు. విందుభోజనం పెట్టారు. అమ్మవారికి ధూపం వేశారు. దీపం వెలిగించారు. పుష్పమాలలు, పేలాలు, చివుళ్ళు, పండ్లు, ఉపహారాలు సమర్పించారు. డప్పులు, డోళ్ళు, తప్పెటలు మోగించారు. బలి పశువును కాళికాదేవికి ఎదురుగా కూర్చోపెట్టారు. భిల్లరాజు నరబలితో వేడిరక్తంతో అమ్మవారిని సంతోషపెట్ట తలచాడు. కాళికామంత్రంతో అభిమంత్రించి భయంకరమయిన కత్తి పట్టుకొని తన కోరిక నెరవేరడంకోసం భరతుణ్ణి నరికి బలి ఇవ్వడానికి సిద్ధమయ్యాడు.

(పంచమహావాద్యములు -- భేరీ శంఖ కాహళ పటహ జయఘంటలు.)

భరతు డే మాత్రం తొణకలేదు. బెదరలేదు. అతడు పరబ్రహ్మ స్వరూపుడు. సర్వజీవరాసులకు మిత్రుడయినవాడు. ఎవరిపట్ల కూడా వైరభావం లేనివాడు. అటువంటి బ్రాహ్మణోత్తముడైన భరతుని తేజస్సు చూడలేక కాళికాదేవి భయపడింది. వెంటనే కాళికాదేవి ముప్పిరిగొన్న క్రోధంతో కంపించిపోతూ హుంకారంతో వికటాట్టహాసం చేసింది. పాపాత్ములూ, దౌష్ట్యానికి తలపడినవారూ, రజోగుణ తమోగుణాల ప్రేరణలతో బ్రాహ్మణహింసకు పూనుకొన్నవారూ అయిన ఆ బోయరాజు మీద అతని పరిచారకుల మీదా విజృంభించింది. వారి శిరస్సులు నేలకూల్చింది. నాయకుడైన భిల్లరాజు శిరస్సు చేత పట్టుకొని ఆడుతూ పాడుతూ ఆనందతాండవం చేసింది.

విప్రునిలో అంతర్యామిగా విష్ణువు ఉంటాడు కనుక లోకంలో ఎవరయినా సరే బ్రాహ్మణులకు అపకారం తలపెడితే వారు తప్పక చెడిపోతారు.

ఇంకనూ జడభరతుడు ఏమాత్రమూ భయం లేనివాడు. తనను చంపడానికి వచ్చిన వారిని, వారి చేతుల్లో తళతళ మెరిసే కత్తులనూ, మహాభీకరమైన కాళికను, విష్ణుస్పరూపులుగా భావించి, గుండెలో అచ్యుతుడైన విష్ణువును పదిలపరచి, ఎటువంటి అనుమానమూ లేక నిశ్చింతగా ఉండిపోయాడు.

('అచ్యుత' శబ్దమునకు తెలుగులో అచ్చుతుడు అనుట కలదు.)

ఆ తర్వాత ఆ బ్రాహ్మణశ్రేష్ఠుడు కాళికాలయాన్ని వదలి మళ్లీ తనకు అప్పగించబడిన పొలం కావలి పనిలో నిమగ్నుడు కాగా.

ఇలా కొన్ని సంవత్సరాలు గడచిపోయాయి. ఒకసారి సింధుదేశాన్ని పరిపాలించే రహూగణుడనే రాజుకు అధ్యాత్మ విద్య తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది. అందువల్ల ఇక్షుమతీ నదీతీరంలోని కపిలమహామునిని దర్శించడానికి పల్లకి ఎక్కి బయలుదేరాడు. పల్లకిమోసే బోయీలు పొలానికి కావలి ఉన్న భరతుణ్ణి చూశారు. పల్లకీ మోయడానికి వీడు చాల బలంగా ఉన్నాడు అనుకున్నారు. భరతుని తీసుకువచ్చి ఒకవైపు పల్లకి బొంగును అతని భుజంమీద పెట్టారు. అయినా భరతుడు ఎదురు చెప్పకుండా చీకూ చింతా లేకుండా మోస్తున్నాడు.

అలవాటులేని భరతుడు మనసుకు తోచినట్టు మామూలు ప్రకారం నడుస్తున్నాడు. కాని, పల్లకి సరైన పద్ధతిలో సాగడంలేదు. అందువల్ల తక్కిన బోయీల నడకతో అతని నడక జతపడలేదు. పల్లకి ఎగుడుదిగుడుగా ఊగుతుంటే రాజు బోయీలను చూచి ఇలా అన్నాడు.

మీరేమో ఎంతో శ్రమ తీసుకొని పల్లకి మోస్తున్నారు. కాని, మీ నడకలలో కుదురు కనిపించడం లేదు. మీ ఎగుడు దిగుడు నడకలవల్ల కుదుపు ఎక్కువై నాకు బాధగా ఉన్నది అని అనగానే బోయీలు రాజుగారికి ఇలా సమాధానమిచ్చారు.

మహాప్రభూ! ఈ ఎగుడుదిగుడు నడక మాది కాదు. ఈ నాల్గవ బోయవాడు సరిగా నడవడం లేదు. వీనితోపాటు మేము సరిగా నడవలేకున్నాం అన్నారు. ఆ మాటలు వినగానే సింధురాజయిన రహూగణునికి ఉన్నట్టుండి కోపం కట్టలు తెంచుకొని ప్రవహించింది. అతడు మంచివాడే. పెద్దలను సేవించినవాడే. అయినా కోపాన్ని దిగమింగుకోలేకపోయాడు. నివురుగప్పిన నిప్పులాగా కనిపించని బ్రహృతేజస్సుతో ఉన్న బ్రాహ్మణుని చూచి పరుషవాక్కులతో ఇలా గద్దించాడు.

ఓయీ! నీవు బాగా అలసిపోయావు. పైగా ముసలివాడివి. పాపం ఆకలితో నకనకలాడుతున్నావు. నీ వెన్నెముక చాలా పలుచగా ఉంది. ఈ పల్లకి ఏమో బరువయింది. ఎంతో దూరం మోశావు. ఎలా నిలబడగలుగుతున్నావో అని రాజు ఎత్తిపొడుపుగా మాట్లాడినా బ్రాహ్మణకుమారుడు భరతుడు ఏమీ బదులాడకుండా పల్లకిని అలా మోస్తూనే ఉన్నాడు.

భరతునికి ఇదే తన కడపటి జన్మమని తెలుసు. అందువలన అహంకారమమకారాలకు మనసులో అవకాశం ఇవ్వలేదు. పైగా అతడు జ్ఞాని. పరబ్రహ్మస్వరూపుడు. అందుచేత ఏమీ ఎదురుచెప్పక మౌనంగా పల్లకిని మోస్తూనే ఉన్నాడు. పల్లకి యథాతథంగా ఎగుడుదిగుడుగా సాగుతూ ఉంటే రహూగణుడు పిచ్చికోపంతో ఇలా అరిచాడు.

ఓరీ పొగరుబోతా! నడపీనుగా! నేను చెప్పింది అసలు వినిపించుకోకుండా నడుస్తున్నావు. నీ కుంటినడకలను వదిలించి సరి అయిన మార్గంలో నిన్ను నడిపిస్తాను అని అధికారమదంతో తమోగుణ ప్రకోపంతో కారుకూతలు కూశాడు రాజు. అపుడు శమదమాది గుణసంపన్నుడూ, బ్రహ్మస్వరూపుడూ, సమస్త జీవరాసుల హితంకోరేవాడూ అయిన ఆ బ్రాహ్మణుడు యోగులస్వభావం బొత్తిగా తెలియని ఆ రాజును చూచి ఇలా అన్నాడు.

భరతుండు రహూగణుని మాటలకుఁబ్రత్యుత్తరంబు లిచ్చుట

No comments:

Post a Comment