ఉభయతోముఖ గోదానం
ఉభయతో ముఖగోదానం అంటే అప్పుడే ఈనుతున్న ఆవుని దానం చెయ్యటం. ఈ దానాన్ని ఏవిధంగా చెయ్యాలంటే! ప్రసవిస్తున్న ధేనువుకి బంగారు కొమ్ములతో, వెండి గిట్టలతో, ముత్యాల తోకతో, కంచుతో చేసిన పాలు పితికేపాత్రతో, దూడతో సహా యోగ్యుడైన విప్రుడికి దానం చేయాలి. అలా చేసిన వాడికి అఖండమైన పుణ్యం లభిస్తుంది.
దూడ ఇంకా సగంలోపలే వుండి గర్భం విడవనంత వరకూ ఆ గోవు పర్వతాలతో నదులతో, సముద్రాలతో కూడిన భూమండలంతో సమానం. ఇలాంటి ధేనువుని తగిన దక్షిణతో సహా దానం చేస్తే నాలుగు సముద్రాలు హద్దుగా వున్న సమస్త భూమండలాన్నీ దానం చేసినంత ఫలితం లభిస్తుంది. ఆ ప్రసవించే ఆవుకి దాని దూడకి ఎన్ని వెంట్రుకలున్నాయో అన్ని మహా యుగాల వరకూ స్వర్గలోకనివాసం లభిస్తుంది. మంచి దక్షిణతో ప్రసవిస్తున్న ధేనువుని దానం చేస్తే పితృ పితామహ ప్రపితామహులు తరిస్తారు. ఈనుచున్న ఆవుకి వెనక వైపునుంచి మొదట దూడతల బైటికి వస్తుంది. అలా వచ్చినప్పుడు ఆ ఆవు చూడటానికి రెండుతలలతో కనిపిస్తుంది. అందుకే దీన్ని ఉభయతోముఖీ గోదానం అంటారు.
కృష్ణాజిన (జంకచర్మం) దానం
కృష్ణాజినం అంటే నల్లటి మచ్చలున్న జింకచర్మం. వైశాఖపూర్ణిమ (గురుపూర్ణిమ) చంద్ర-సూర్యగ్రహణాలు, మాఘపూర్ణిమ, ఆషాఢ, కార్తీక పూర్ణిమలు, ఉత్తరాయన - దక్షిణాయనాలు, ద్వాదశితిథి ఈ రోజుల్లో కృష్ణాజనాన్ని విప్రుడికి దానం చేస్తే మంచిది. ఈ కృష్ణాజినాన్ని ఏవిధంగా దానం చేయాలంటే
ముందుగా గోమయంతో(ఆవుపేడతో) నేలని శుభ్రంగా అలికి అక్కడ మంచి తివాచీని పరచాలి. కొమ్ములు, గిట్టలతో వున్న కృష్ణాజినాన్ని దానిమీద పరిచి,ఆ జింక కొమ్ములకి బంగారుతొడుగులు, వెండి దంతాలు, ముత్యాలతో, నూలుతోక కుచ్చుని అమర్చి నూవులతో ఆ చర్మాన్ని కప్పి దానిమీద నూతన వస్త్రాలని ఉంచి బంగారంతో రత్నాలతో గంధంతో అలంకరించాలి. ఈ ఆసనం చుట్టూ నాలుగు దిక్కుల్లో నాలుగు కాంస్య పాత్రల్ని ఉంచాలి. అలాగే నాలుగు మట్టి పాత్రలు కూడా వీటిలో తూర్చునించి వరుసగా నేయి, పాలు, పెరుగు, తేనె పోయాలి. వీటికి బైట ఒక సంపెంగ కొమ్మని, రంధ్రంలేని మంచి కడవని ఉంచాలి.
ఈ జింక చర్మానికి అన్ని అంగాలలో వేరువేరుగా కొత్త పసుపుపచ్చని వస్త్రాల్ని పాదాల దగ్గర మట్టి పాత్రల్ని ఉంచాలి. "నేను లోభంతో చేసిన అన్నిరకాల పాపాలు ఈ లోహపాత్రదానం వల్ల వెంటనే నశించుగాక" అని మనసులో అనుకుని ఒక లోహ పాత్రని జింక ఎడమపాదంపై నువ్వులతో నింపి ఉంచాలి.
"నేను కామవశాన చేసిన పాపాలన్నీ నేను చేసే ఈ కాంస్య (కంచు) పాత్ర దానంతో నశించుగాక" అని అనుకుని జింక చర్మం కుడిపాదం దగ్గర తేనెతో నింపిన కాంస్య పాత్రని ఉంచాలి
"ఇతరుల్ని నిందించటం, చాడీలు చెప్పటం మాంస భక్షణం వంటి పాపాలు నేను చేసే ఈ తామ్ర (రాగి) పాత్ర దానంతో నశించి పోవుగాక!” అని భావిస్తూ ఒక రాగి పాత్రని అదేవిధంగా "స్త్రీల విషయంలో అబద్దాలు చెప్పటం, గోవుల్ని అపహరించటం నేను చేసే ఈ వెండి పాత్ర ద్వారా నశించుగాక! అని పలికి ఈ రాగి, వెండి పాత్రల్ని జింక చర్మం ఎడమకుడి పాదాల దగ్గర వుంచాలి.
వేయి జన్మాంతరాలలో నేనుచేసిన పాపమంతా నేను ఇచ్చే సువర్ణపాత్ర దానం ద్వారా నశించుగాక! అని భావించుకుని జనార్ధనా నీకు నమస్మారం అని విష్ణువుని ప్రార్థించి ఒక బంగారు పాత్రని లేడి చర్మం దగ్గర ఉంచాలి. బంగారం, ముత్యాలు, పగడాలు, దానిమ్మపళ్ళు, మాదీఫలాలు, ఒక మంచిపాత్రలో వుంచాలి. అలాగే జింక చర్మానికున్న చెవులు, గిట్టలు, కొమ్ములు మధ్య భాగంలో కూరలు ఇతరఫలాలు ఉంచాలి.
ఈ విధంగా అలంకరించిన జింక చర్మాన్ని దానంగా గ్రహించాలనుకునే బ్రాహ్మణుడు స్నానంచేసి కొత్త పంచెని ధరించి యథాశక్తిగా అలంకరించుకోవాలి. ఈ దానాన్ని ఆ విప్రుడు జింక చర్మంతోక వైపు వుండి గ్రహించాలి. దానమంత్రం "ఓ నల్లని కృష్ణాజినమా నల్లని కంఠం కలిగిన వాడు, కృష్ణాజినాన్ని ధరించినవాడు అయిన వృషభధ్వజుడు ఈ దానంతో సంప్రీతుడవుగాక! నా పాపాలన్నీ నశించిపోవుగాక!" అని పఠించి దానం ఇవ్వాలి.
ఈ విధంగా కృష్ణాజినాన్ని దానం చేసిన తరువాత దానం పుచ్చుకున్న విప్రుణ్ణి తాకకూడదు. ఎందుకంటే ఆ సమయంలో అతడు చితిలోవున్న యూపకాష్ఠం(కాలేకట్టెతో)సమానం. దానం చేసే సమయంలో శ్రాద్ధకాలంలో బ్రాహ్మణ్ణి తాకకుండా దూరంగావుండాలి. తరువాత దానంపుచ్చుకున్న విప్రుణ్ణి సగౌరవంగా ఇంటికి పంపి దాత మంగళస్నానం చేయాలి. ఎలాగంటే! చంపక వృక్షం కొమ్మతో వున్న కుంభంలోని నీళ్ళతో ఆచార్యుడు దాత తలమీద "ఆప్యాయస్వ" సముద్ర జ్యేష్ఠా? అనే మంత్రాలు చదువుతూ జలాన్ని ప్రోక్షించాలి. తరువాత దాత నూతన వస్త్రాలని ధరించి ఆచమనం చేస్తే శుచివంతుడవుతాడు. ఇక ఆ కుంభంలో మిగిలిన నీళ్ళని అందులోని కొమ్మల్ని నాలుగు దోవలు కలిసేచోట పారవేయాలి.
ఈ విధంగా శాస్త్రోక్తంగా శ్రద్ధాభక్తులతో కృష్ణాజిన దానం చేస్తే కలిగే ఫలితం, భగవత్ప్రీతి ఇంత అని చెప్పటానికి దేవతలకి కూడా సాధ్యంకాదు. దీనివల్ల సమగ్రంగా భూదానం చేసిన ఫలితం లభిస్తుంది. కామరూపధారియై స్వర్గానికి చేరుకోగలడు. ప్రకయాంతం వరకూ స్వర్గసుఖాలు అనుభవించగలడు.
అతడికి ఎప్పటికీ భార్యా పుత్రులతో, మిత్రులతో వియోగం సంభవించదు. ధనత్యాగం, దేశత్యాగం చేయవలసిన అవసరం ఏర్పడదు. కృష్ణుడికి ఇష్టమైన ఈ కృష్ణమృగచర్మాన్ని యోగ్యుడైన విప్రుడికి దానంచేస్తే శోకరాహిత్యం, సర్వాభీష్టసిద్ధి కలుగుతాయి.
సతీసావిత్రి చరిత్ర
No comments:
Post a Comment