శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - ప్రకృతి నిర్వచనం
వత్సా ! నారదా ! ప్రకృతి లక్షణాన్ని వివరించి చెప్పగల సామర్థ్యం ఎవరికైనా ఉందని నేను అనుకోను. అయినా అడిగావు కనక నేను విన్నంత, తెలుసుకున్నంత నీకు తెలియజెప్పుతాను. ఆలకించు. ప్రకృతి అనే పదంలో ప్ర అనేది ఉపసర్గ. ప్రకృష్టవాచకం. కృతి అనేది సృష్టివాచకం. ఈ సృష్టిలో ప్రకృష్టమైనది కనక ఆ దేవి ప్రకృతి అని కీర్తింపబడుతోంది.
గుణాలలోకెల్లా ఉత్తమోత్తమమైనది సత్వగుణం. దానికి సూచకం ప్రశబ్దం. మధ్యమ రజోగుణానికి కృశబ్దం, చివరి తమోగుణానికి తిశబ్దమూ వాచకాలు. త్రిగుణాత్మకస్వరూపిణి కనక, సృష్టికి ప్రధానకారణం కనుక ఆదిపరాశక్తిని ప్రకృతి ఆంటున్నారు. కృతిశబ్దం సృష్టివాచకం. దానికి ప్రథమ భాగంలో ఉన్నది ప్రశబ్దం. అంటే సృష్టికి ఆదిలో ఉండే దేవి కనక ప్రకృతి అని స్తుతింపబడుతోంది.
ఆ ప్రకృతిస్వరూపిణి సృష్టికి ఆరంభంలో యోగశక్తితో తనను తాను (ఆత్మ) రెండుగా విభజించుకుంటుంది. కుడిభాగం పురుషుడుగా. ఎడమభాగం స్త్రీగా (ప్రకృతిగా) రూపు ధరిస్తుంది, అందుకనే యోగీంద్రుల దృష్టిలో స్త్రీ పురుషభేదం ఉండదు. అంతా బ్రహ్మమమయే. ఆ పరాశక్తి కేవలం బ్రహ్మస్వరూప. నిత్య. సనాతని. ఆత్మ అన్నా శక్తి అన్నా రెండింటికి భేదం లేదు. అగ్నినీ వేడిమినీ ఎలా విడదీయలేమో అలాగే అత్మశక్తుల్ని విడదీయలేము.
No comments:
Post a Comment