Wednesday, April 22, 2026

Mahadevi - Shatakshi Shakambari - మహాదేవి - శతాక్షి శాకంభరి

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - మహాదేవి - శతాక్షి శాకంభరి

జనమేజయు డిట్లనెను : రాజర్షి-ధార్మికుడు-శతాక్షి పాదభక్తుడునైన హరిశ్చంద్రుని చరిత్రము మహాద్బుతము-విచిత్రము. ఓ మునివరా! ఆ శివాభగవతీ పరాదేవీ యెట్లు శతాక్షి యయ్యెనో వెల్లడించుము. నా జన్మము పార్ధకమొనరిపించుము. శ్రీరాజరాజేశ్వరి యెక్క దివ్యగుణములు వినుట కాసపడిన నిర్మలచిత్తున కెట్లు తనివి తీరను? శ్రీదేవీనిగూర్చిన ప్రతి పదము నశ్వమేధముచే కలుగు శాశ్వతఫల మొసంగును. 

వ్యాసు డిట్లనెను: రాజా! ఆవధరింపుము. శ్రీశతాక్షీదేవి దివ్య సంభవము తేటపఱతును. నూవు శ్రీదేవి భక్తుడవు. నీకు చెప్పరానిది లేదు. మున్ను హిరణ్యాక్షుని వంశమున రురుకుమారుడు గలడు. ఆతడు దుష్టదైత్యుడు-పరమదారుణుడు-మూర్ఖుడు-అతని పేరు దుర్గముడు. దేవతలకు వేదములు జీవగఱ్ఱలు. వేదములు నష్టమైనచో వారును నశింతురు. 

కనుక వేదములను నశింపచేయవలయను. అనితలపోసి యతడు హిమాలయమున కేగి వాయుభక్షుడై బ్రహ్మను గూర్చి ధ్యానించుచు ఉగ్రతప మొనరించెను. అట్లతడు వేయేండ్లు తీవ్రతప మొనరింపగ నతని తపము వేడిమి కెల్ల లోకములును సురాసురులును కడు సంతాపము జెందిరి. 

అంచ నలుమోముల బ్రహ్మ నవ్వు లొలుకు మోముతమ్ములతో రాయంచ నెక్కి యతనికి వరము లీయవత్తెను. సమాధిలో మునిగి కనులు ముసికొనిన దుర్గమునితో బ్రహ్మ యిట్లనెను. నీ మదిలోని కోర్కి కోరుకొనుము. నీకు మేలగుత. నీ తపమునకు మెచ్చితిని. వరము లీయ వచ్చితిని. అని బ్రహ్మ పలుకగవిని దుర్గముడు సమాధి చాలించి లేచెను. 

అతడు బ్రహ్మాను పూజించి యిట్లనెను: ఓ సర్వేశ్వరా! నాకు వేదము లిమ్ము. ఈ ముల్లోకములందు విప్రులచెంత సురలదగ్గఱ నెన్నియో వేదమంత్రములు గలవు. అవన్నియును నా సన్నిధి నుండవలయును. మఱియు నెల్లదేవత లోడిపోవునట్టి బలము నాకిమ్ము. అను దైత్యుని మాటలువిని యట్లేయని మాట యిచ్చి నాలుగు వేదములు తెలిసిన బ్రహ్మ సత్యలోకమునకేగెను.

అనాటినుండి విప్రులు వేదములు మఱచిరి. అందుతే స్నానసంద్యాదులు నిత్సహోమములు శ్రాద్ధజపములు లోపించెను. భూమిపై పెద్ద యల్లకల్లోలము బయలుదేరును. ఏమి ఈ వింత! యని విప్రులు తమలోతా మనుకొనిరి. వేదములులేక మేమేమి చేయగలమని వారనిరి. 

అపుడు భూమిపై నున్న వారికి భరింపరాని యనర్థము చుట్టకొనెను. హవిర్బాగములు లభించనందువలన నిర్జరులు ముసలివారలైరి. అపుడు దుర్గము డమరావతిపై దండెత్తెను. వజ్రకాయుడగు దైత్యునితో బోరాడజాలక దేవతలు పలాయనము చిత్తగించిరి. 

దేవతలు గిరి దుర్గములందలి రత్న సానువులందును గుహలందును దాగి యుండి పరాంబికాశక్తిని మనసార ధ్యానించుచుండిరి. అగ్నిలో హోమములు లేనందున వానలు కురియుటలేదు. వర్షములు లేనందున నేల యెండి బీటలు పాఱను. ఎల్లబావులు-దిగుడు బావులు-చెఱవులు-నదులు-నింకిపోయెను. ఈ యనావృష్టి నూరేండ్లవఱ కుండెను. అపుడు లెక్కకు మిక్కిలిగ జనులు-ఆవులు-పశువులు-చనిపోయెను. 

ప్రతి యిల్లు పీనుగుల పెంటతో నిండెను. ఇన్ని యనర్థములు వాటిల్లగశాంతచిత్తులగు బ్రాహ్మణులు హిమగిరికేగి శ్రీశివాపరాంబిక నారాధింపదలంచిరి. వారాకలిదప్పులు మాని శ్రీమాతృదేవికి శరణాగతులై సమాధి-ధ్యాన-పూజలతో దేవిని సంతుష్టి పఱచిరి. 

ఓ మహేశ్వరీ! యంబికా! మేము పామరులము. సర్వాపరాధులము. మమ్ము కనికరించు మమ్మా. మమ్మింతగ కోపించుట తగదమ్మా. ఓ దేవేశ్వరీ! సర్వాంతర్యామినీ! తల్లీ! కోపించకుము. నీ వెట్లు ప్రేరించిన నట్లే జరుగును గదా. ఇపుడు మాకు నీవు తక్క వేరే దిక్కులేదు. మహేశ్వరీ! నీ వెట్లు తలంతువో యట్లు చేయుటకు శక్తురాలవు.

అమ్మా! మహేశానీ! ఈ ఘోర సంకటమునుండి మమ్ము కడతేర్చుమమ్మా! జీవనమైన నీరే లేనిచో మే మెట్లు జీవింపగలము. సర్వేశ్వరీ! ఓ జగదంబికా! అఖిలాండకోటి బ్రహ్మాండ నాయికా! నీకు నమస్కారమమ్మా! మాయోడల సుప్రసన్నురాలవు గమ్ము. 

నీవు కూటస్వరూపిణివి. వేదాంతవేద్యవు-చిద్రూపిణివి-త్రిభువనేశ్వరివి. నీకు వందనములు తల్లీ! ఎల్ల వేదములు సర్వమును త్రోసిపుచ్చి ఏ యేకైక పరాదేవతనే భావించునో యట్టి సర్వకారణకు నుతులు. 

అట్లు బ్రాహ్మణులు సన్నుతింపగ త్రిభువనేశ్వరి-మహేశ్వరి-యగు పార్వతి యనంతనేత్రములతో వారికి ప్రత్యక్షమయ్యెను. ఆమె నల్లని కాటుక కొండవలె నుండెను. ఆమె కన్నులు నల్లకమలమువలె నెసగెను. ఆమె స్తనము లెత్తుగ బిగి వట్రునలుగ నలరెను. అమె తన చేతులందు కమలము-బాణము-కారగాయలు-సరసములైన తీయనిపండ్లు-పూలు-చిగులుటాకులు- దాల్చెను. ఆమె చేత నున్న వన్నియు నాకలిదప్పులు పోగొట్టునవి. 

ఆమెచేత చాపమును గలదు. ఆమె యందాల కందాలరాశి. లావణ్యసీమ. ఆమె సూర్యకోటిసమాన-దయారస తరంగిణి-జగద్ధాత్రి-అనంత నయనములతో నుద్బవించినది. ఇట్లు దేవి ప్రత్యక్షమయ్యెను. ఆ తల్లి తన యన్ని వేల కన్నులనుండి లోకములందు వర్షధారలు కురుసెను. 

దేవి కంటి నీటిధారలు నవరాత్రములు కుంభవృష్టిగ గురిసెను. ఆ తల్లి దుఃఖార్తులను గాంచి కన్నీరు వదలి లోకముల నన్నిటిని సంతృప్తి పఱచెను. మఱల నేలపై నోషధు లుద్బవించెను. 

రాజా! ఆ జలములచే నదీనదములు దరులుతన్ని ప్రవహింపసాగెను. మున్ను దిగియున్న దేవతలు బయటి కేతెంతిరి. అపుడు బ్రహ్మణులు దేవత లెల్లరును గలిసి శ్రీదేవి నిటుల నభినుతించిరి. 

ఓ వేదాంతవేద్యా! బహ్మస్వరూపిణీ! నీకు నమస్కారము. తన మాయచే లోకములు సృజించు తల్లికి నమస్కారము. భక్తుల పాలిటి కల్పతరువా! దేవీ! నీవు భక్త సంరక్షణకు దేహము దాల్చితివి.

నిత్యతృపా: భువనేశ్వరి! సాటిలేనిదానా! నీకు నమస్కారము. నీవు మా యెల్లర సుఖశాంతులకొఱకు వేయి కన్నులతో వెల్గుచున్నావు. పెక్కు కన్నులుంట నీవు శతాక్షియను పేర ప్రసిద్ధి గాంచుము తల్లీ! అమ్మా! ఆకలిదప్పులచే పీడితులమైన మాకు నిన్ను నుతింప శక్తి చాలకున్నది. 
అంబికా! మహేశానీ! దయయుంచి వేదములు మాకిమ్ము. 

అను వారి మాటలు శివాభగవతి వినెను. ఆమె చేతులలోని కూరగాయులు తీయని ఫలమూలములు వారికి తినుట కొసంగెను. ఆ తల్లి వారికి వివిధ భక్ష్యభోజ్యములు నొసంగెను. పశువుల మేత మొసంగెను. 

రాజా! ఆమె నవసరము లొలుకుకోర్కులు తీర్చునట్టివి-మరల కొత్త పంటలు పండువరకు సరిపోవునవి- అగు శాకము లొసంగుటవలన నానాటినుండి శాకం భరినామ మున పెరెన్నిక గనెను. 

దుర్గమాసురనాశిని

No comments:

Post a Comment