గణపతి - ఏకదంతుడు
మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత, ఆ మహత్తర చరిత్రను ప్రపంచానికి అందించాలని వేదవ్యాస మహర్షి సంకల్పించారు. కానీ వేలాది శ్లోకాలతో కూడిన ఈ మహాగ్రంథాన్ని తాను చెప్పే వేగానికి తగ్గట్టు ఎవరు రాయగలరా ఆలోచించారు.
అప్పుడు బ్రహ్మ దేవుని సలహాతో వ్యాస మహర్షి వెంటనే శ్రీ గణపతిని ధ్యానించి ప్రార్థించాడు. ఆయన భక్తికి ప్రసన్నమైన గణపతి ప్రత్యక్షమై, "నేను రాస్తాను. కానీ నీవు ఒక్క క్షణం కూడా ఆగకుండా చెప్పాలి" అని ఒక షరతు పెట్టాడు.
దానికి వ్యాస మహర్షి కూడా, "మీరు ప్రతి శ్లోకం యొక్క అర్థాన్ని పూర్తిగా గ్రహించిన తర్వాతే రాయాలి" అని మరో షరతు పెట్టారు. గణపతి అంగీకరించాడు.
అలా వ్యాస మహర్షి మహాభారతాన్ని చెప్పడం ప్రారంభించగా, గణపతి వేగంగా లిఖించడం మొదలుపెట్టాడు. మధ్యలో ఒకసారి రాస్తున్న కలం విరిగిపోయింది.
కానీ రచన ఆగకూడదనే సంకల్పంతో, శ్రీ గణపతి తన దంతాన్ని విరిచి కలంగా ఉపయోగించి మహాభారతాన్ని పూర్తి చేశాడు. అందుకే ఆయనను "ఏకదంతుడు" అని కూడా పిలుస్తారు.
ఏ శుభకార్యమైనా, ఏ గొప్ప పనైనా విఘ్నాలు లేకుండా పూర్తవ్వాలంటే ముందుగా గణపతిని ప్రార్థించాలనే విశ్వాసంతో ఆయన ఈ దివ్య కార్యాన్ని గణేశుడితోనే ప్రారంభించారు.
అలాగే గణపతి కూడా తన భక్తుడి సంకల్పం నెరవేరేందుకు తన దంతాన్నే త్యాగం చేసి, ధర్మగ్రంథమైన మహాభారతాన్ని ప్రపంచానికి అందించాడు.
ఇంకో పురాణం కథనం ప్రకారం
పరశురాముడు, వినాయకుడి మధ్య జరిగిన యుద్ధం. వారిద్దరి మధ్య యుద్ధం ఎందుకు జరిగింది అంటే... ఒకసారి పరశురాముడు శివుడిని కలవడానికి కైలాస పర్వతానికి చేరుకున్నారట.
పరమశివుడిని దర్శించుకోవడానికి వచ్చిన పరశురాముడిని, శివపార్వతులు ఏకాంతంలో ఉన్నారని గణేశుడు ద్వారం వద్ద అడ్డుకున్నాడు. పరశురాముడు ఎంత వేడుకున్నా వినాయకుడు వినలేదట.
దీంతో సహనం కోల్పోయిన పరశురాముడు తనను ఎవ్వరూ అడ్డుకోరనే భావించిన పరశురాముడు కోపంతో గణేశుడితో యుద్ధానికి దిగాడు. చివరకు శివుడు ప్రసాదించిన పరశు(గొడ్డలి)ని గణేశుడిపై విసిరాడు.
ఆ గొడ్డలి తన తండ్రి శివుడు ఇచ్చిన ఆయుధమని గుర్తించిన గణేశుడు, దానిని అవమానించకూడదనే భావంతో ఎదిరించలేదు. ఆ పరశు తాకడంతో ఆయన ఒక దంతం విరిగిపోయింది. అప్పటి నుంచే గణపతికి "ఏకదంతుడు" అనే పేరు వచ్చింది.
No comments:
Post a Comment