అగ్ని వివిధ నామాలు
పంచభూతాలలో ఒకటయిన అగ్ని ఎన్నో కర్మలకి సాక్షం అని మన పురాణా లలో వ్యవహరించారు. అగ్ని పవిత్రతకి, శక్తికి మారు పేరు. వేదాలలో అగ్ని దేవుడు దేవతల పురోహితుడు అని చెప్పబడింది. ఈయన ఆగ్నేయానికి దిక్పాలకుడు.
అగ్ని ఉన్న ప్రదేశాన్ని బట్టి వివిధ నామాలతో పిలువ బడుతుంది.
క్రోధాగ్ని:కోపము వలన పుట్టేది క్రోధాగ్ని. ఇది ఎక్కువగా కళ్ళలో ఉంటుంది. పరమేశ్వరునికి మూడు కన్నులూ సూర్యుడు, చంద్రుడు మరియు అగ్ని. అందువలననే శివుడు మూడవ కన్ను తెరిస్తే అది అగ్ని రూపము కనుక క్రోధాగ్ని జ్వాలలలో భస్మం అవుట తధ్యం.
బడబాగ్ని:ఇది సముద్రము అడుగు భాగములో ఉండే అగ్ని. దీనినే బ్రహ్మాగ్ని అని కూడా అంటారు. దీనికి ఆహారం సముద్రోదకం అనగా సముద్రములోని నీరు.
జఠరాగ్ని: ఇది ప్రతీ ప్రాణి ఉదరములోనూ ఉండి ఆహార జీర్ణనకి ఉపయోగపడుతుంది. దీని విలువ గురించి ప్రతీ ఒక్కరూ తెలుసుకోవలసిన అవసరం ఎంతయినా ఉంది.
జ్ఞానాగ్ని: ఆత్మలో నిత్యం రగిలే అగ్నిని జ్ఞానాగ్ని అంటారు. “జ్ఞానాగ్నిః సర్వ కర్మాణి భస్మసాత్ కురుతేర్జునా” అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు. అంటే జ్ఞానం అనే అగ్ని పుడితే సర్వ కర్మలూ (ఆగామి, సంచితం, ప్రారబ్ధం) భస్మమయిపోతాయి అని అర్థం.
దావాగ్ని: ఇది ఎండు పుల్లల రాపిడి, ఘర్షణ వలన పుడుతుంది. ఎక్కువగా అడవులలో పుట్టడం వలన ఇది కలుగ చేసే నష్టం కూడా తీవ్రమయినది. యజ్ఞ యాగాదులకి ఉపయోగించేది కూడా దావాగ్నే.
వజ్రాగ్ని:ఇది ఇంద్రుని వజ్రాయుధంలో ఉండే అగ్ని. దధీచి మహర్షి వెన్నుముక వజ్రాయుధం అని మనందరికీ తెలిసినదే. మన పురాణాల ప్రకారం ప్రప్రధమంగా నిప్పును కనుగొన్నది దధీచి మహర్షి.
సూర్యాగ్ని: సూర్యుని రూపములో కనిపించే అగ్నిని సూర్యాగ్ని అంటారు. దీనినే ఆదిత్యాగ్ని అని కూడా అంటారు. “అగ్ని సోమాత్మకం జగత్” అని తైత్తరీయోపనిషత్తులో చెప్పబడింది. అంటే ఈ ప్రపంచం మొత్తం అగ్నీ, చంద్రుల రూపములో ఉందనీ, ఈ అగ్నే సూర్యుని రూపములో ప్రకాశిస్తోందనీ అర్థం.
యోగాగ్ని: అంటే కేవలం యోగము లేదా ఆలోచన వలన పుట్టేది. ఈ యోగాగ్నిని సతీదేవి, దధీచి మహర్షి పుట్టించారు. దక్షయజ్ఞ సమయములో తనకి పరాభవం ఎదురయ్యిందని సతీదేవి బాధతో కన్నీటి చుక్కను వదిలి దానిని కాలి బ్రొటన వేలితో రాసినప్పుడు అగ్ని పుట్టి అందులో ఆవిడ దగ్ధమయ్యింది. అలానే దేవతల ఆయుధాలన్నీ కావాలన్నప్పుడు దధీచి మహర్షి యోగాగ్నిని పుట్టించి దగ్ధమయ్యి తన అవయవాలను ఇచ్చాడు. దీనిని బట్టి చూస్తే గొప్ప వాళ్ళు, మహా యోగులు వారి యోగా శక్తితో తలుచుకున్న వెంటనే అగ్నిని పుట్టించి వారి శరీరాన్ని వారే దగ్ధం చేసుకునేవారని తెలుస్తుంది.
ప్రేతాగ్ని:దీనినే స్మశానాగ్ని అని కూడా అంటారు. దీనిని తలుచుకో గానే రామాయణములోని ఒక ఉపమానం జ్ఞప్తికొస్తుంది. అదేమిటంటే స్మశానాగ్ని కూడా అగ్నే అయినా మంచి పనులకి ఎలా పనికి రాదో అదే విధముగా రావణుడు ఎంత తేజోసంపన్నుడైనా రాముని ముందు పనికి రాలేదు అని. మానవ దేహం పంచభూతా లతో చేసినదే కనుక మనిషిని దహనం చేసి మళ్ళీ ఆ పంచభూతాలలో ఐక్యం చేస్తారు. ఇలా శరీర దహనానికి ఉపయోగపడే అగ్నినే ప్రేతాగ్ని అంటారు.
No comments:
Post a Comment