Tuesday, June 9, 2026

Disti Gummadikaaya - దిష్టి గుమ్మడికాయ

దిష్టి గుమ్మడికాయ

ఇంటి ముందర గుమ్మడికాయ కట్టడం అనగానే మనందరికీ గుర్తొచ్చేది కేవలం "దిష్టి" (నరఘోష) మాత్రమే. కానీ, మన పెద్దవాళ్లు ఏ ఆచారం పెట్టినా దాని వెనుక ఒక బలమైన శాస్త్రీయ, ఆధ్యాత్మిక మరియు ఆరోగ్య కారణాలు ఉంటాయి.

గుమ్మడికాయ కట్టడం వెనుక ఉన్న అసలైన విశేషాలు:

1. శాస్త్రీయ కారణం (ఎయిర్ ప్యూరిఫైయర్ లాంటిది)
గుమ్మడికాయకు గాల్లో ఉండే కాలుష్యాన్ని, బ్యాక్టీరియాను మరియు వైరస్లను పీల్చుకునే అద్భుతమైన శక్తి ఉంది. ఇంటి గుమ్మానికి కట్టిన గుమ్మడికాయ, ఆ దారి గుండా ఇంట్లోకి వచ్చే గాలిని శుద్ధి చేస్తుంది. అది క్రమంగా కుళ్ళిపోతోంది అంటే అర్థం, ఇంట్లోకి రావాల్సిన చెడు బ్యాక్టీరియాను లేదా నెగెటివ్ ఎనర్జీని అది తనలోకి లాగేసుకుంది అని.

2. మానసిక శాస్త్రం (Psychology)
ఎవరైనా కొత్తవాళ్లు లేదా ఈర్ష్యా భావం ఉన్నవాళ్లు మన ఇంటికి వచ్చినప్పుడు, వారి మొదటి చూపు నేరుగా మన ఇల్లు లేదా మన వస్తువులపై పడకుండా, గుమ్మానికి వేలాడుతున్న ఆ పెద్ద గుమ్మడికాయపై పడుతుంది.

దీనివల్ల వారి నుంచి వచ్చే మొదటి చూపులోని తీవ్రత (ఆ నెగెటివ్ వైబ్రేషన్) ఇళ్లపై పడకుండా ఆ కాయ గ్రహిస్తుంది. దాన్నే మనం దిష్టి తగలకుండా ఉండటం అంటాం.

3. ఆధ్యాత్మిక కారణం (మహా లక్ష్మి నివాసం)
శాస్త్రాల ప్రకారం గుమ్మడికాయను సాక్షాత్తు "సాత్విక బలి" గా భావిస్తారు. పూర్వకాలంలో నెగెటివ్ ఎనర్జీలు పోవడానికి జంతు బలులు ఇచ్చేవారు. కానీ, సనాతన ధర్మంలో జీవహింస తప్పు కాబట్టి, జంతువుకు ప్రత్యామ్నాయంగా గుమ్మడికాయను బలి ఇవ్వడం (పగలగొట్టడం) లేదా గుమ్మానికి కట్టడం అలవాటు చేశారు.

గుమ్మడికాయలో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని నమ్ముతారు. అందుకే కొత్త ఇల్లు కట్టినా లేదా వ్యాపార సంస్థల్లోనైనా దీనికి పూజ చేసి కడితే సిరిసంపదలు కలుగుతాయని నమ్మకం.

నియమాలు: ఈ గుమ్మడికాయను సాధారణంగా అమావాస్య, మంగళవారం, లేదా శనివారం నాడు కట్టడం మంచిది.

దీనిని గుమ్మం మధ్యలో కాకుండా, ఇల్లు లేదా షాపు ప్రధాన ద్వారానికి ఇరువైపులా లేదా పైభాగంలో వేలాడదీయాలి.

కూష్మాండ దేవి

Matsyavatara Sri Vedanarayana Swamy Temple, Nagalapuram, Tirupati District - మత్స్యావతార శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం, నాగలాపురం, తిరుపతి జిల్లా

మత్స్యావతార శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం, నాగలాపురం, తిరుపతి జిల్లా

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏకైక మరియు అత్యంత ప్రసిద్ధ మత్స్యావతార దేవాలయం శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం. దీనిని నాగలాపురం మత్స్య జయంతి ఆలయం అని కూడా పిలుస్తారు.

ఆలయం యొక్క ప్రత్యేకతలు:
ఈ ఆలయం భారతదేశంలోనే చాలా అరుదైనది. మహావిష్ణువు దశావతారాలలో మొదటిదైన మత్స్యావతారం (చేప రూపం) లో ఇక్కడ పూజలందుకుంటారు స్వామి.

గర్భగుడిలో స్వామివారి రూపం:
ఇక్కడ ఉన్న విగ్రహం చాలా విలక్షణమైనది. స్వామివారి శరీరం పైభాగం మానవ రూపంలో (విష్ణుమూర్తిగా చతుర్భుజాలతో), కింది భాగం చేప (మత్స్యం) రూపంలో ఉంటుంది. స్వామివారి వెనుక వైపు దేవేరులైన శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు ఉంటారు.

సూర్య పూజ / సూర్య కిరణాల అద్భుతం :
ఈ ఆలయంలో జరిగే అతిపెద్ద అద్భుతం సూర్య కిరణాలు స్వామివారిని తాకడం. ప్రతి సంవత్సరం మార్చి నెలలో (తెలుగు పంచాంగం ప్రకారం ఫాల్గుణ శుద్ధ ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి రోజుల్లో) సూర్య కిరణాల ఉత్సవం జరుగుతుంది.

మొదటి రోజు: సూర్య కిరణాలు రాజగోపురం గుండా ప్రవేశించి స్వామివారి పాదాలను తాకుతాయి.
రెండవ రోజు: కిరణాలు స్వామివారి నాభి (బొడ్డు) భాగాన్ని తాకుతాయి.
మూడవ రోజు: కిరణాలు నేరుగా స్వామివారి ముఖాన్ని (శిరస్సును) అభిషేకిస్తాయి.

ఆలయ చరిత్ర:
పురాణ గాథ: సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని వద్ద నుండి వేదాలను దొంగిలించి సముద్రంలో దాచేస్తాడు. అప్పుడు మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి, ఆ రాక్షసుడిని సంహరించి వేదాలను రక్షించి తీసుకొస్తాడు. వేదాలను తెచ్చినందుకు గాను ఇక్కడ స్వామివారిని వేదనారాయణ స్వామి అని పిలుస్తారు.

నిర్మాణం:ఈ ఆలయాన్ని విజయనగర సామ్రాజ్య చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయలు తన తల్లి నాగలాంబ జ్ఞాపకార్థం నిర్మించారు. అందుకే ఈ ఊరికి నాగలాపురం అనే పేరు వచ్చింది. ఈ ఆలయ శిల్పకళ విజయనగర శైలిలో అద్భుతంగా ఉంటుంది.

ఈ 
ఆలయం నాగలాపురం, తిరుపతి జిల్లా (గతంలో చిత్తూరు జిల్లాలో ఉండేది) ఉంది.

మార్గం: ఇది తిరుపతికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో, మరియు చెన్నైకి దాదాపు 85 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి నుండి బస్సు లేదా టాక్సీ ద్వారా ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు.

Monday Lord Shiva - సోమవారం - పరమశివుని ఆరాధన

సోమవారం - పరమశివుని ఆరాధన

సోమవారం రోజున పరమశివుని  పూజించడం సహజం. సోమవారం రోజును "సోముని రోజు"గా భావిస్తారు. ఇక్కడ "సోమ" అంటే చంద్రుడు. చంద్రుడు పరమశివుడి జటాజూటంపై స్థానం పొందినవాడు కాబట్టి ఈ రోజు శివారాధనకు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.

పురాణల ప్రకారం, దక్షప్రజాపతి శాపం వల్ల చంద్రుడు తన కాంతిని కోల్పోయి క్షీణించసాగాడు. అప్పుడు చంద్రుడు పరమశివుని కోసం కఠిన తపస్సు చేశాడు. శివుడు ప్రసన్నమై చంద్రుణ్ని తన తలపై ధరించి శాప ప్రభావం తగ్గించాడు. అందుకే శివుడికి "చంద్రశేఖరుడు" అనే నామం వచ్చింది.

చంద్రునికి ప్రత్యేకించి ఆలయం లేనందున శివుని ఆరాధించడం ఆనవాయితీగా వస్తోంది. అంతేకాదు సోమ అనే శబ్దాన్ని స+ఉమ అని విడగొడితే ఉమాసహితుడు అనే అర్థం వస్తుంది.

ఉమాసహితుడైనవాడు అంటే పార్వతీపతి అంటే శివుడు. ఆ విధంగా సోమవారం శివునికి ప్రత్యేక దినంగా రూపాంతరం చెందింది. స్కాందపురాణంలో సోమవార వ్రతమహిమ ఉంది. ఈ రోజున శివుడు ఉమాసహితుడై భక్తులను అనుగ్రహిస్తాడు.

సోముడంటే కుబేరుడు అనే అర్థం కూడా ఉంది. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్ఛేత్.. ఈశ్వరుడు ఐశ్వర్యదాయకుడు. శివుని ఆరాధించిన కుబేరుడు ఐశ్వర్యవంతుడైన రోజు కనుక ఈ రోజును సోమవారం అని పిలుస్తున్నారని పెద్దలు చెప్పారు.

సోమవారం రోజున శివారాధన చేస్తే, మనశ్శాంతి, దోష నివారణ, ఆరోగ్యం, ఐశ్వర్యం కోరికల సిద్ధి కలుగుతాయని భక్తుల విశ్వాసం.


సోమవారం శివునికి ఏ విధంగా పూజ చేయాలి:
శివారాధనకు సోమవారం విశిష్టమైనది. మిగిలిన రోజులకన్నా సోమవారం రోజు శివయ్యను ఆరాధిస్తే శివానుగ్రహం శ్రీఘ్రంగా లభిస్తుందని భక్తుల విశ్వాసం. స్కంద పురాణం ప్రకారం పరమ శివుడు తన శిరస్సున సోముడు అంటే చంద్రుని ధరిస్తాడు కాబట్టి సోమవారం శివారాధనకు శ్రేయస్కరమని తెలుస్తోంది.

దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేకుంటే సోమవారం రోజు ఆవు పాలు, నల్ల నువ్వులు శివయ్యకు సమర్పించాలి. అనంతరం మహా మృత్యుంజయ మంత్రాన్ని 11 సార్లు జపించాలి. ఇలా 11 సోమవారాలు చేస్తే శివయ్య అనుగ్రహంతో అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.

ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం కుదరని వారు సోమవారం రోజు సూర్యోదయం సమయంలో కుంకుమ కలిపిన జలంతో శివలింగానికి అభిషేకం చేసి శివునికి ఎండుద్రాక్ష నైవేద్యంగా సమర్పించాలి. ఇలా 11 సోమవారాలు చేస్తే త్వరగా వివాహం అవుతుంది.

ప్రతి సోమవారం 'ఓం నమః శివాయ' అనే పంచాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపించడం వలన చేసే ప్రతి పనిలోనూ విజయం లభిస్తుందని శాస్త్రవచనం.

పార్వతీదేవి కూడా శివుడి అనుగ్రహం పొందడానికి సోమవారం వ్రతం చేసిందట. ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడు, అర్జునుడు కూడా సోమవారం వ్రతం చేసి దివ్య శక్తులను పొందినట్లు ఉంది. అందువల్ల ఈ కలియుగంలో కూడా సోమవారం శివుడికి పూజ చేయడం వల్ల కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.

సోమవారం శివుడికి అభిషేకం చేయడం వల్ల పూర్వ జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయట. ప్రస్తుత జీవితంలో మనశ్శాంతి కలుగుతుందట. బాధలు పోయి సుఖ సంతోషాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.

Thursday, June 4, 2026

Tuesday Subrahmanya Swamy - మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి

మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి

పార్వతీపరమేశ్వరుల తనయుడైన సుబ్రహ్మణ్య స్వామి సకల శుభకారకుడు. సర్వ దోష నివారకుడు. ఈ స్వామిని తొమ్మిది వారాల పాటు నియమనిష్టలతో ఆరాధిస్తే కుజ దోషాలు పోతాయి. ముఖ్యంగా కుజుడు వివాహం, సంతాన కారకుడు. కాబట్టి వివాహం ఆలస్యమయ్యే వారు, సంతానం కోసం ఎదురు చూసే వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే శీఘ్రంగా వివాహం అవుతుంది, చక్కని సంతానం కలుగుతుంది.

క్షీరాభిషేకం: ఆ స్వామికి ముందుగా మన సంకల్పం చెప్పుకుని ఎవరు వివాహం లేదా సంతానాన్ని కోరుకుంటున్నారో వారి పేరు, జన్మ నక్షత్రం మీద మంగళవారం నాడు సుబ్రహ్మణ్యునికి క్షీరాభిషేకం జరిపిస్తే మంచిది. 

కుజ గ్రహానికి ఎరుపు రంగు సంకేతం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి ఎరుపు రంగు వస్త్రం, ఎర్రని పూలు, ఎర్ర చందనం, దానిమ్మ పండు వంటివి నైవేద్యంగా సమర్పిస్తే మంచిది.

ఇలా తొమ్మిది మంగళవారాలు జరిపించిన అనంతరం వచ్చే కృత్తికా నక్షత్రం రోజున కానీ, శుద్ధ ష్షష్ఠి రోజున శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం జరిపించుకుంటే సకల దోషాలు పోయి అనుకున్న పనులు నెరవేరుతాయి.

అలాగే సమీపంలో ఉన్న ఏ దేవాలయంలోనైనా నాగ ప్రతిష్ఠ ఉంటే ముఖ్యంగా రావిచెట్టు కింద నాగ ప్రతిష్ఠ ఉన్నట్లయితే ఇక్కడ కూడా ప్రతి మంగళవారం క్షీరాభిషేకం చేస్తే సుబ్రహ్మణ్యుని పూజించిన ఫలితమే వస్తుంది. సుబ్రహ్మణ్యుని విభూతి ధరించడం వలన సకల గ్రహ దోషాలు, పీడలు తొలగిపోతాయి.

Tuesday, June 2, 2026

Temple to visit on Vidiya Tidhi - విదియ తిధి రోజు దర్శించవలసిన దేవాలయం

విదియ తిధి రోజు దర్శించవలసిన దేవాలయం

ప్రతి నెలలో మనకు రెండు పక్షాలు (శుక్ల పక్షం, కృష్ణ పక్షం) ఉంటాయి కాబట్టి, రెండు విదియ తిథులు వస్తాయి..

1. అమావాస్య తర్వాత వచ్చే విదియ (శుక్ల పక్ష విదియ / చంద్ర దర్శన విదియ)

2. పౌర్ణమి తర్వాత వచ్చే విదియ (కృష్ణ పక్ష విదియ)

ఈ రెండు తిథులకు ప్రకృతిలో, మన జాతకంలో ఉండే శక్తి వేరువేరుగా ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో ఏ ఆలయాలకు వెళ్లాలో ఇప్పుడు చూద్దాం:

1. అమావాస్య తర్వాత వచ్చే విదియ (శుక్ల పక్ష విదియ):-
దీనిని "చంద్ర దర్శన విదియ" లేదా "బాలచంద్ర విదియ" అంటారు. అమావాస్య చీకట్ల తర్వాత చంద్రుడు చిన్న రేఖలా మనకు కనిపించే మొదటి రోజు ఇదే. ఈ తిథి పెరుగుదలకు (అభివృద్ధికి) చిహ్నం.

వెళ్లవలసిన ఆలయం: శివాలయం (చంద్రశేఖర స్వామి):
శివుడు తన తలపై ధరించిన చంద్రుడు ఈ విదియ నాటి చంద్రుడే. జాతకంలో చంద్రుడి బలం పెరగాలన్నా, మానసిక ప్రశాంతత కలగాలన్నా, అనుకున్న పనులు పెరగాలన్నా (అభివృద్ధి చెందాలన్నా) ఈ రోజు శివాలయానికి వెళ్లాలి.

ప్రత్యేక పూజ: సాయంత్రం వేళ శివాలయంలో నెయ్యి దీపం వెలిగించి, ఆకాశంలో చంద్రుడిని చూసి నమస్కరించుకోవాలి.

2. పౌర్ణమి తర్వాత వచ్చే విదియ (కృష్ణ పక్ష విదియ)
పౌర్ణమి తర్వాత వచ్చే ఈ విదియ నుండి చంద్రుని కళలు తగ్గుతూ ఉంటాయి. ఆధ్యాత్మికంగా ఇది మనలో ఉండే అహంకారాన్ని, చెడు ఆలోచనలను, మనశ్శాంతిని పాడుచేసే నెగిటివ్ ఎనర్జీని తగ్గించుకోవడానికి అనుకూలమైన రోజు.

వెళ్లవలసిన ఆలయం: శ్రీ మహావిష్ణువు లేదా లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం
కృష్ణ పక్షానికి అధిపతి విష్ణుమూర్తి. మన మనస్సులోని భయాలు, శత్రు బాధలు, రుణాలు (అప్పులు) మరియు నెగిటివ్ ఆలోచనలు తొలగిపోవడానికి నరసింహ స్వామి లేదా వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం చాలా మంచిది.

ప్రత్యేక పూజ: స్వామి వారికి తులసి దళాలతో (తులసి ఆకులతో) అర్చన చేయించడం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.

సంక్షిప్తంగా: అమావాస్య తర్వాత వచ్చే విదియ నాడు శివాలయానికి, పౌర్ణమి తర్వాత వచ్చే విదియ నాడు విష్ణు ఆలయానికి (నరసింహ స్వామి లేదా పెరుమాళ్) వెళ్లడం అత్యంత శ్రేష్ఠం.

నిత్య స్తోత్రావళి

పంచాంగం

Parijata Puja - పారిజాత పూజ

పారిజాత పూజ

పురాణాల ప్రకారం, క్షీరసాగర మథనంలో ఉద్భవించిన పారిజాతం దేవతా వృక్షం, దీని పువ్వులతో సోమవారం నాడు పరమశివుడిని పూజిస్తే పరమేశ్వరునితో పాటు, లక్ష్మి నారాయణల సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది.

పారిజాత చెట్టుతో సంబంధం ఉన్న మరొక పురాణం ఉంది, మహాభారతంలో పాండవులు తన తల్లి కుంతితో కలిసి అడవిలో నివసించినప్పుడు, కుంతీదేవి శివారాధన చేసేందుకు పువ్వులు లేకపోయే సరికి అర్జునుడి ప్రార్ధన మేరకు దేవేంద్రుడు పారిజాత చెట్టును భూమి మీదకి తెచ్చాడు.

అలా భూమికి వచ్చిన ఈ చెట్టును ఆరాధిస్తే, కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది భక్తులు నమ్ముతారు. ఇది చాలా శక్తివంతమైన చెట్టు అని వారి ప్రగాఢ విశ్వాసం.

పరమశివునికి అత్యంత ప్రీతికరమైన మరియు సముద్ర మథనం నుండి పుట్టిన పారిజాత పుష్పాలతో సోమవారం పూజిస్తే, జాతకంలోని చంద్రదోషాలు తొలగిపోయి, లక్ష్మీ కటాక్షంతో అపారమైన మనశ్శాంతి లభిస్తుంది.

ఈ చెట్టుకి కాసే పువ్వులు చాలా అందంగా తెల్లని రేకులు మరియు నారింజ-రంగు కాడలతో చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. అందుకే సోమవారం పూట ఈ చెట్టును పూజించిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.

దేవలోకపు పవిత్ర సువాసనలు గల ఈ పూలతో సోమవారం వేద మంత్రోచ్ఛారణల మధ్య అభిషేకం, అర్చన జరిపిస్తే.. ఇంట్లోని దారిద్ర్యం, నెగటివ్ ఎనర్జీ క్షణాల్లో మాయమవుతాయి.

పారిజాత పుష్పాలు రాత్రి పూసి, తెల్లవారేసరికి రాలిపోతాయి; ఇవి అహంకారాన్ని వదిలి, సర్వస్వాన్ని శివుడి పాదాలకు సమర్పించాలనే పరమ సత్యాన్ని సూచిస్తాయి.


పంచమహాపాతకాలను పోగొట్టే పారిజాతపుష్పం
పారిజాత పుష్పాలు 9 రకాలు

1. ఎర్ర (ముద్ద) పారిజాతం

2. రేకు పారిజాతం

3. తెల్లగా ఎర్ర కాడతో ఉండే పారిజాతం (ఎక్కువగా అందుబాటులో ఉన్నది)

4. పసుపు పారిజాతం

5. నీలం పారిజాతం

6. గన్నేరు రంగు పారిజాతం

7. గులాబీరంగు పారిజాతం

8. తెల్లని పాలరంగు పారిజాతం

9. ఎర్ర రంగు పారిజాతం

ఎరుపు రంగు పారిజాతంతో విష్ణువును ఆరాధించరాదు. ఎరుపు తమోగుణం. విష్ణువు సత్వగుణం.
పారిజాత పుష్పాలు క్రింద పడిన వాటినే వాడాలి. చెట్టు నుండి కోసి వాడరాదు.

పారిజాత వృక్షం తపస్సు చేసి తన పూలను తాను ఇస్తేనే తప్ప తన నుండి ఎవరూ లాక్కోకూడదని వరం పొందినది.

రంగు,..వైశాల్యం,..గుణం,..దేవతా స్వరూపాన్ని బట్టి దేవతలను ఆరాధించాలి.

ఏ పూలను క్రింద పడ్డవి పూజకు వాడరాదు. ఒక్క తెల్లగా ఎర్రని కాడతో పారిజాత పూవు తప్ప.

భూ స్పర్శ, మృత్తికా (మట్టి) స్పర్శ, జల స్పర్శ, హస్త స్పర్శ తరువాత స్వామి స్పర్శ. ఈ 5 స్పర్శల తోను పంచ మహా పాతకాలను పోగొట్టేదే పారిజాతపుష్పం.

Ashlesha - ఆశ్లేష

ఆశ్లేష నక్షత్రము

నక్షత్రం - ఆశ్లేష
అధిపతి - బుధుడు
గణము - రాక్షస
జాతి - పురుష
వృక్షం - నాగకేసరం
జంతువు - మార్జాలం
నాడి - అంత్య
పక్షి - చిన్నపక్షి
అధిదేవత - సర్పము
రాశి - కర్కాటకం

ఆశ్లేష నక్షత్ర జాతకుల గుణగణాలు
నక్షత్రములలో ఇది తొమ్మిదవది. ఆదిశేషుడు, లక్ష్మణుడు యొక్క జన్మ తారగా చెప్పబడే నక్షత్రము ఆశ్లేష నక్షత్రము.

ఈ నక్షత్ర జాతకులు పట్టుదలను కలిగి ఉంటారు. అడ్డంకుల నడుమ వీరి చదువులు కొన సాగుతాయి, ఏది ఏమి అయిన సరే వీరు ఆయా అడ్డగింపులని దాటి పై చదువులను చదువుకొనగలుగుతారు. వీరి పట్టుదల వీరిని ఉన్నత స్థితికి తీసికొనిపోతుంది.

న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తారు. వీరు ఉద్యోగ, వ్యాపార రంగాలలో రాణించగలరు.

ఉద్యోగములో నిపుణత సాధిస్తారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతో ఓర్పు వహిస్తారు. లక్ష్యసాధన కొరకు ఎంత కాలమైనా ఎదురు చూస్తారు.

నిరంతరం ఉన్నత స్థానానికి చేరుకోవడానికి వీరి మేధస్సు మరియు నాయకత్వ సామర్థ్యాలు నిరంతరం స్పూర్తిని కలిగిస్తాయి.

వీరి స్వేచ్ఛలో ఎవరూ కూడా జోక్యం చేసుకోవడాన్ని మీరు ఇష్టపడరు. కనుక, వీరితో మాట్లాడేటప్నపుడు, వీరి మాటల్ని తిరస్కరించని విధంగా చూసుకోవాలి.

స్నేహితుల కొరకు ఏదైనా చేసే లక్షణాన్ని వీరు కలిగి ఉంటారు. వీరు చాలా స్నేహ పూర్వకంగాను మరియు సామాజికంగాను ఉంటారు.

ఒక సమస్య రావడానికి ముందు దానిని విశ్లేషించే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు. అందువల్ల, సాధారణంగా వాటికి సిద్ధమై ఉంటారు. వీరికి ఉన్నత స్థానాన్ని చేరుకునే నాయకత్వ లక్షణాలుంటాయి.

కష్టపడి పనిచేసే విషయానికి వస్తే, స్మార్ట్ వర్క్ ని ఎంచుకుంటారు. ఒక్కసారి ఏదైనా నిర్ణయించుకున్న తరువాత, కేవలం దానికే కట్టుబడి ఉంటారు.

ఆశ్లేష నక్షత్రం మొదటి పాదము
ఆశ్లేష నక్షత్ర మొదటి పాదం అధిపతి బుధుడు. అహింసాధిపతి గురుడు కనుక వీరి మీద గురు, బుధగ్రహ ప్రభావం ఉంటుంది. ఈ నక్షత్ర జాతకులకు విద్యా సంబంధిత ఉద్యోగాలలో వీరికి ఆసక్తి ఉంటుంది.

మేధా సంబంధిత ఉద్యోగాలలోనూ వీరు బాగా రాణించగలరు. విద్యా సంస్థలు స్థాపన, నిర్వహణలో వీరు సమర్థులు. వీరికి నిర్వహణ సామర్థ్యం అధికంగా ఉంటుంది. వీరు విద్యారంభంలోనే ప్రతిభను ప్రదర్శిస్తారు.

కేతువు అనుకూలంగా ఉన్న వారు సొంత ఊరికి దూరంగా (బయట ఊర్లలో లేక విదేశాలలో) విద్యాభ్యాసం చేయగలుగుతారు.

శుక్ర దశ కారణంగా విద్య పూర్తి కాగానే జీవితంలో స్థిరపడతారు. వీరు చిన్న వయసులోనే జీవితంలో స్థిరపడతారు. భూ, విద్యా, ఆభరణ సంబంధిత ఉద్యోగం, వ్యాపారం, వృత్తులు వీరికి అనుకూలిస్తాయి.

ఆశ్లేష నక్షత్రం రెండవ పాదము
ఆశ్లేష నక్షత్ర రెండవ పాదము అధిపతి బుధుడు. అహింసాధిపతి శని కనుక వీరి మీద బుధ, శని గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు వ్యాపారం అంటే ఇష్టపడతారు. బుధ గ్రహ ప్రభావం కారణంగా మేధో సంబంధిత ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి.

ఇనుము సంబంధిత ఉద్యోగ వ్యాపారాలు కూడా అనుకూలిస్తాయి. కేతుదశ కారణంగా వీరికి కొన్ని ఆటంకాలు ఎదురౌతాయి. ప్రయత్నపూర్వకంగా వాటిని అధిగమించి విజయం సాధించవచ్చు.

విద్య పూర్తికాగానే జీవితంలో స్థిరపడతారు. వివాహం సకాలంలో జరుగుతుంది. రాహుదశ కాలంలో కొన్ని సమస్యలు ఎదురౌతాయి. రాహువు అనుకూలంగా ఉంటే విదేశీవాసం, విదేశీయాత్ర చేయడానికి అవకాశం కూడా ఉంది.

ఆశ్లేష నక్షత్రం మూడవ పాదము
ఆశ్లేష నక్షత్ర మూడవ పాదము వారి మీద బుధ శని గ్రహ ప్రభావం ఉంటుంది. వీరికి వ్యాపారం అంటే ఇష్టం. బుధగ్రహ ప్రభావం కారణంగా మేధో సంబంధిత ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. వీరు స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. శ్రమించి పనిచేసే గుణం కలిగి ఉంటారు.

వీరికి వృత్తి, వ్యాపారం, ఉద్యోగాల మీద సమానంగా ఆసక్తి ఉంటుంది. మేధో సంబంధిత ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. ఇనుము సంబంధిత ఉద్యోగ వ్యాపారాలు కూడా వీరికి అనుకూలిస్తాయి.

విద్యా ఆరంభంలోనే ఆటంకాలు ఎదురౌతాయి. వాటిని అధిగమించి ముందుకు సాగవలసిన అవసరం ఉంది. వీరు ప్రయత్న పూర్వకంగా విద్య వైపు మనసును మళ్ళించి విద్యాభ్యాసం పూర్తి చేయాలి. విద్యాభ్యాసం పూర్తి కాగానే జీవితంలో స్థిరపడతారు.

ఆశ్లేష నక్షత్రం నాలుగవ పాదము
ఆశ్లేష నక్షత్ర నాలుగవ పాదం వారి మీద గురు బుధ గ్రహ ప్రభావం ఉంటుంది. విద్యా సంబంధిత ఉద్యోగాలలో వీరికి ఆసక్తి ఉంటుంది. మేధా సంబంధిత ఉద్యోగాలలో రాణించగలరు. వీరు విద్యారంభంలోనే కేతుదశ కారణంగా విద్యారంభంలో ఆటంకాలను ఎదుర్కొంటారు. వాటిని అధిగమించి ముందుకు సాగవలసిన అవసరం ఉంది.

శుక్రదశ కారణంగా విద్య మీద శ్రద్ధ తగ్గే అవకాశం ఉంది. కనుక ప్రయత్న పూర్వకంగా మనసును విద్య వైపు మళ్ళించి విద్యాభ్యాసం పూర్తి చేసి విజయం సాధించవలసిన అవసరం ఉంది.

నాలుగవ పాదములో జన్మించిన వారు కూడా విద్యాభ్యాసం పూర్తి కాగానే జీవితంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి. రాహు దశ కాలమో కొన్ని సమస్యలను ఎదుర్కోనవలసిన అవసరం ఉంది. రాహుదశ అనుకూలిస్తే విదేశీయానం చేసే అవకాశం ఉంటుంది.

ఆశ్లేష నక్షత్ర జాతకులు పెంచవల్సిన చెట్లు:
ఆశ్లేష నక్షత్రం వారు సంపంగి లేదా చంపక వృక్షాన్ని పెంచడం మరియు పూజించడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి.

ఆశ్లేష అధిపతి బుధుడు కావున వీరు బుధగ్రహ జప, స్తోత్ర పఠనం చేస్తూ ఉండాలి. బుధ గ్రహానికి అధిపతి విష్ణువు కావున విష్ణు సహస్ర నామం పారాయణ చేయుట ఉత్తమం.

ఆశ్లేష నక్షత్ర జాతకుల తారా ఫలాలు
తార నామం - తారలు - ఫలం

జన్మ తార - ఆశ్లేష, జ్యేష్ట, రేవతి - శరీరశ్రమ

సంపత్తార - అశ్విని, మఖ, మూల - ధన లాభం

విపత్తార - భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ - కార్యహాని

సంపత్తార - కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ - క్షేమం

ప్రత్యక్ తార - రోహిణి, హస్త, శ్రవణం - ప్రయత్న భంగం

సాధన తార - మృగశిర, చిత్త, ధనిష్ట - కార్య సిద్ధి, శుభం

నైత్య తార - ఆరుద్ర, స్వాతి, శతభిష - బంధనం

మిత్ర తార - పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర - సుఖం

అతిమిత్ర తార - పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర - సుఖం, లాభం

నక్షత్ర శాంతి: దుంప జాతి ఆహారాలను దానంగా ఇవ్వాలి. వైద్యులని సన్మానించాలి.

నక్షత్ర మంత్రం:
।। ఓం ।।
ఇదగ్మ్ సర్పేభ్యో' హవిర’స్తు జుష్టమ్” ।
ఆశ్రేషా యేషా'మనుయంతి చేతః' ।
యే అంతరిక్షం పృథివీం క్షీయంతి' ।
తే న'స్సర్పాసోహవమాగ'మిష్ఠాః ।
యే రో'చనే సూర్యస్యాపి' సర్పాః ।
యే దివం' దేవీమను సంచరంతి ।
యేషా'మశ్రేషా అ'నుయంతి కామమ్” ।
తేభ్య స్సర్పేభ్యో మధు'మజ్జుహోమి ॥


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Brahmanula Kutra - Goutamudi Saapam - బ్రాహ్మణుల కుట్ర - గౌతముడి శాపం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - బ్రాహ్మణుల కుట్ర - గౌతముడి శాపం ఇలా ఉండగా నారదుడు ఒకనాడు అక్కడికి వచ్చాడు. మహతిని మోగించుకుంటూ గాయత్రీ గుణ...