Saturday, March 7, 2026

Yamadharmaraju’s explanation to his messengers (Yamadutas) about Lord Vishnu - యమధర్మరాజు తన దూతలకు విష్ణువును గూర్చి దెలుపుట

యమధర్మరాజు తన దూతలకు విష్ణువును గూర్చి దెలుపుట

అజామిళుని కథను పూర్తిగా విన్న పరీక్షిత్తు శుక మహర్షితో ఓ మహర్షీ! యమకింకరుల ద్వారా జరిగిన కథను మొత్తం విన్న యముడు ఏమన్నాడు? ఈ విధంగా యముని ఆజ్ఞ తిరస్కరింపబడిన సందర్భం ఇంతకు ముందు ఏదైనా ఉందా? ఎక్కడైనా జరిగిందా? తెలియజేయగలరు. ఇలాంటివాటికి మీరు తప్ప ఇంకెవరు సమాధానం చెప్పగలరు? అందువల్ల మీ సుధామయవాక్కులతో నన్ను అనుగ్రహించగలరు అని కోరగా శుకుడు ఇలా అన్నాడు.

శ్రీమహావిష్ణువుదూతలచే నిశ్చేష్టితులైన యమభటులు, తమచేత బంధింపబడిన అజామిళుడు దేవదూతలచే విడిపింపబడిన వృత్తాంతాన్ని యమునికి పూర్వం తెలియజేసి ఉన్నారు. ఆ సంగతిని నీకు చక్కగా వివరిస్తాను వినుము.

యముని సన్నిధిని చేరిన యమకింకరులు ఓ స్వామీ! జీవులు సత్త్వ, రజస్తమో గుణాలచే, మనోవాక్కాయ కర్మలచే చేసిన పలురకాల కర్మలకు ఫలితాన్ని నిర్ణయించేవారు మీరు కాక ఇంకా ఎవరైనా ఉన్నారా? తెలియజేయుమని కోరారు.

ఓ యమధర్మరాజా! లోకంలో నీవు కాక శిక్షలు వేసేవారు ఇంకా చాలామంది ఉంటే, ఈ జనన మరణ సంబంధాలైన క్రియా కలాపాలు ఈ లోకంలో సక్రమంగా ఎలా జరుగుతాయి?

లోకంలో చిన్న చిన్న అధిపతులను కూడా శాసకులని ఎలా అంటామో అలాగే లోకంలోని కర్మఫలాలకు శిక్షను విధించేవారు ఎక్కువగా ఉన్నట్లైతే 'శాసకుడు' అనే మాట కేవలం మర్యాదకోసమే అవుతుంది తప్ప నిజం కాదు కదా?

ఓ ధర్మపాలకా! ఈ ముల్లోకాలలో జీవుల కర్మలకు అనుగుణంగా ఫలితాన్ని నిర్ణయించగలిగే సమర్దుడైన అధికారివి నీవు మాత్రమే కదా? మరి అలాంటి తిరుగులేని నీ శాసనాన్ని మార్చగలిగే శక్తిమంతులు ఎవరైనా ఉన్నారా?

ఓ సూర్యపుత్రా! ఈ జీవుల కర్మలకు నిష్పక్షపాతంగా శిక్షలు నిర్ణయించ గలిగేది నీవు ఒక్కడివే కదా! అందుకే నిన్ను పాశహస్తుడని అంటారు. అలాంటి నువ్వు కాక ఇంకెవరైనా శాసకులు ఉన్నారా?

ఈ ముల్లోకాలలో నిరాటంకంగా మీ ఆజ్ఞయే ప్రవర్తిస్తూ ఉండగా, ఈనాడు మీ ఆజ్ఞతో భూలోకంనుండి మేము తీసుకురాబోయిన దుర్మార్గుని జీవాత్మను మానుండి నలుగురు దివ్యపురుషులు లాగుకొని, విడిపించి మమ్మల్ని భయపెట్టి, అడ్డగించి తరిమి వారు ఇష్టానుసారంగా వెళ్ళిపోయారు. వారు ఎక్కడి నుండి వచ్చారో ఎవ్వరో దయచేసి మాకు తెలియజేయండి.

అని అడిగారని చెబుతూ శుకమహర్షి తిరిగి ఇలా అన్నాడు. తన కింకరుల ద్వారా జరిగినదంతా తెలుసుకున్న యమధర్మరాజు సర్వం గ్రహించినవాడై నారాయణుని పాదపద్మాలను మనసులో నిలుపుకొని పరమభక్తితో నమస్కరిస్తూ తన భటులకు ఇలా సమాధాన మిచ్చాడు.

ఉన్నాడు. నాకంటే ఘనుడైనవాడు ఒకడున్నాడు. అతడు బయటికి కానరాకుండా ప్రపంచమంతటా నిండి ఉన్నాడు. అత్యద్భుతంగా సమగ్రంగా చీరలో దారాల రీతిగా వ్యాపించి ఉన్నాడు. అతని ఆజ్ఞానుసారం జీవులందరూ త్రాళ్లతో కట్టబడిన పశువుల మాదిరిగా ఆ యా నామాలతో సంకేతాలతో గిరగిర తిరుగుతున్నారు. నేను చేసే పూజలన్నీ ఆయన పాదాలకే అంకితం. ప్రాణులు పుట్టటం బ్రతకటం మరణించటం అన్నీ ఆయన లీలావిలాసాలే. ఈ సమస్త జగత్తూ ఆయనలోనే లీనమై ఉంటుంది. ఆయన నామాలు ఉచ్చరిస్తే చాలు సమస్త కర్మబంధాలూ నిర్మూలమైపోతాయి.

ఇంకా చెబుతాను వినండి. నేనేకాదు. ఇంద్రుడు, వరుణుడు, అగ్ని నిరృతి, వాయుదేవుడు; సూర్యచంద్రులు; బ్రహ్మ, ఈశ్వరుడు, రుద్రుడు, ప్రమథగణాలు, బ్రహ్మర్షులు మొదలైన వారు ఎవరు కూడా ఆ పరమ పురుషుణ్ణి దర్శించలేరు.

సత్త్వగుణప్రధానులై ఉండికూడా పొరపాటున రజస్తమో గుణాలకు వశులైనవారు, శ్రీహరియొక్క సదా ఏకత్త్వంతో ఉండే తత్త్వాన్ని దర్శింపలేరు. ఇక నిరంతరం త్రిగుణాలతో కూడినవారికి ఆ దివ్యతత్త్వాన్ని దర్శించడం సాధ్యమా? (సాధ్యంకాదు).

జన్మలేనివాడూ, ప్రమాణాలకు దొరకనివాడూ, నాశం లేనివాడూ, అంతంలేనివాడూ, నిత్యసత్యమైనవాడూ, సకలజీవుల్లో జీవాత్మ, పరమాత్మ అనే రెండు రూపాల్లో తానే ప్రకాశిస్తుండేవాడూ, అయిన పురుషోత్తముణ్ణి త్రికరణవైభవంతో గరిష్ఠులై బాహ్యంగా ఎంత శోధించికూడా ఆ వెర్రిజీవులు అన్ని వస్తువులను స్పష్టంగా చూడగల్గిందైనా - కన్ను తనను తాను చూడలేనట్లుగా - ఆ భగవంతుణ్ణి చూడలేరు.

ఆయన పరమాత్ముడు. భక్తులను పరిపాలించేవాడు. దుష్టులను సంహరించేవాడు. గరుత్మంతునిపై అధిష్టించి సమస్త లోకాలలో విహరిస్తూ ఉంటాడు. ఆ మహానుభావుని ప్రియమైన దూతలుకూడా ఆకారంలో, గుణాలలో స్వభావంలో ఆ శ్రీహరినే పోలి ఉంటారు. ఆ దేవుని దూతలకు దేవేంద్రుడు సైతం చేతులు మోడ్చి నమస్కరిస్తాడు. అటువంటి విష్ణుదూతలు తమ దేహకాంతులు దిక్కులనిండా వ్యాపింపగా లోకమంతటా సంచరిస్తుంటారు.

మహోన్నతమైన తేజస్సుతో, అత్యంత బలవంతులై, శాంతమూర్తులై, వీరులై, దేవతలచేత సేవింపబడుతున్న వారైన విష్ణుదూతలు శ్రీహరిభక్తుల రక్షణార్థమై సర్వత్రా వ్యాపించి ఈ లోకంలో సంచరిస్తూ ఉంటారు.

నాచేతా, మీచేతా, దేవతలచేతా, రాక్షసులచేతా ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఈ ముల్లోకాలలోని విష్ణుభక్తులను విష్ణుదూతలు రక్షిస్తూ ఉంటారు.

భగవంతుడు ప్రతిష్టించిన ధర్మాన్నికాని, భగవత్తత్త్వాన్నికాని, దేవతలు, గరుడులు, ఉరగులు, సిద్దులు, సాధ్యులు, మానవులు, పక్షులు, మునులు, యక్షులు, విద్యాధరులు, ఖేచరులు మొదలైనవారు ఎవరూ కూడా సంపూర్ణంగా గ్రహించలేరు. వారి బుద్ధికి అందదు కూడా!

ఇంద్రుడు, బ్రహ్మ, శివుడు వీరందరూ ఎంతటివారైనా ఏనాటికీ కూడా శ్రీహరి తత్త్వాన్ని, గొప్పతనాన్ని తెలుసుకోలేరు.

ఈ లోకంలో విష్ణుపరమైన విశేషజ్ఞానసంపదను, సత్‌, చిత్‌, ఆనంద స్వరూపాన్ని శుద్ధ, సత్త్వ, పరబ్రహ్మాన్ని పరమశివుడు, బ్రహ్మదేవుడు, కుమారస్వామి, కపిలుడు, నారదుడు, భీష్ముడు, మనుచక్రవర్తి బలిచక్రవర్తి జనకమహారాజు, ప్రహ్లాదుడు, శుకమహర్షి జ్ఞానమూర్తి వేదవ్యాసమహర్షి మొదలయినవారు కొంతవరకు మాత్రమే తెలుసుకోగలరు. వీరు తప్ప ఇంకెవ్వరూ తెలుసుకోలేరు. సాధ్యం కూడా కాదు.

ఉపనిషద్‌గోచరమైన శ్రీహరియొక్క మహాద్భుతమైన తత్త్వాన్ని పై పన్నెండుగురు మహాత్ములు మాత్రమే గ్రహించగలరు. ఇతరులు ఈ జ్ఞాన, భక్త రక్షణ రహస్యాలను ఏమాత్రం గ్రహించలేరు.

(ఇక్కడ పేర్కొన్న పన్నిద్దరు భాగవతులు 1. పరమశివుడు 2. బ్రహ్మ 3. కుమారస్వామి 4. కపిలుడు 
5. నారదుడు 6. భీష్ముడు 7. మనుచక్రవర్తి 8. బలిచక్రవర్తి 9. జనకమహారాజు 10. ప్రహ్లాదుడు 
11.శుకమహర్షి 12. వేదవ్యాసుడు అనేవారు.)

ఏ నామస్మరణ అమృతత్వాన్ని ప్రసాదిస్తుందో, ఏ నామ జపం ఉత్తమ ధర్మమార్గాన్ని చూపిస్తుందో, ఏ మంత్రమైతే భక్తితత్త్వాన్ని ఒంటబట్టిస్తుందో అదే మూర్తీభవించిన మహిమాన్వితమైన శ్రీహరినామసంకీర్తనం.

ఓ నాయనలారా! ఘోరమైన మృత్యుపాశానికి గురి అయి నరకానికి పోవలసిన అజామిళుడు తన చివరి గడియలలో కలిగిన బుద్ధి విశేషంతో నామస్మరణ చేసి యమపాశం కట్లనుండి విముక్తుడైన సంఘటనను మీరు కళ్ళారా చూశారు కదా?

ఆకతాయి, దుష్టుడు, మహాపాపి ఐన అజామిళుడు చివరిక్షణంలో హరి నామస్మరణ చేసి వైకుంఠాన్ని పొందాడు కదా! మానవులు ఇలా విచారపడడం ఎందుకు? భగవన్నామకీర్తనం భయంకరమైన పాపపు అడవుల్నే కాల్చేస్తుంది. ఇందులో సందేహం లేదు.

(అంత్యకాలంలో భగవంతుని నామాన్ని తలచినవారికి వారు ఎంత పాపకర్ములైనా, సరే భగవత్కృపా పాత్రులవుతారు.)

బుద్ధీహీనులైన మానవులు దాటశక్యం కాని మహామాయలో చిక్కుకొని తమ తెలివిని కోల్పోతున్నారు. ఈ యథార్థమైన విషయాన్ని తమ మనస్సులో కొంచెమైనా ఆలోచించి తెలుసుకోలేరు.

విజ్ఞులైనవారు ఈ రీతిగా ఒకే లక్ష్యమునందు నిల్పిన చిత్తంతో, ఏకారణంలేకనే ఈశ్వరుడైన విష్ణువును హృదయంలో నిల్పుతారు. భగవద్భక్తులయొక్క కలయికచే కల్గిన పరిపాకంవల్ల భగవంతుని చేరుకొంటారు. వారిని దండించాలని మావద్దకు తీసుకురావలదు. పాపాలు తొలగిన తర్వాత దండనార్హులుగా వాళ్లను గుర్తించలేము. పైగా విష్ణుచక్రం వీళ్లను రక్షిస్తూంటుంది. దేవతలు వాళ్లను సేవిస్తుంటారు. ముక్తికారణంగా మిక్కిలి శ్రేష్ఠులు.

విష్ణుభక్తులైన మహానుభావుల కీర్తిని సిద్దులు, సాధ్యులు, ఖేచరులు లలితగీతాలతో గానం చేస్తుంటారు. అటువంటి భాగవతులు ముక్తి సౌధంలో అందమైన చంద్రశాలలలో నివసిస్తుంటారు. సాటిలేనివారూ, సౌందర్యవంతులూ అయిన వైష్ణవోత్తముల చేతులలో శంఖచక్రాలూ గదాఖడ్గాలూ విరాజిల్లుతుంటాయి.

వేదాంతసారమైన భగవంతునియందుమాత్రమే మనస్సును లగ్నం చేయగలవారు, సనకాది మునులు పొందగలిగిన శాశ్వత ఆనందాన్ని అనుభవించేవారు, విష్ణుపాదారవింద అమృతాన్ని ఆస్వాదించి తన్మయులు ఐనవారు, ఐహిక సుఖలంపట పాపాలను పోగొట్టుకో గలిగినవారు, నిత్య సత్య భగవత్స్వరూపాన్ని చూడగలవారు, భక్తి సామ్రాజ్యానికి అభిషిక్తులై ఏనాడు కష్టం పొందని వారు శ్రీమన్నారాయణుని పరమభక్తులు.

కాబట్టి దూతలారా! పరమభాగవతోత్తముల జోలికి మీరు వెళ్ళవద్దు. విష్ణవుయొక్క పాదపద్మాలను ఆశ్రయించని దుర్మార్గులను వారి మరణకాలంలో పట్టీ బంధించి తీసుకురండి.

పరిహాసానికైనా భగవన్నామం పలుకలేని చెడు మాటకారుల్ని, కలలోనైనా భగవంతుని పాదపద్మాలను దర్శించని వారినీ, వేడుకగానైనా హరికథలను వినక చెడువిషయాలు వినేవారిని, దైవసంబంధమైన ఉత్సవాల సమయంలోనైనా దేవాలయం వైపు వెళ్ళని చెడుపాదాలు కలవారిని, హరి భక్తుల పాదధూళిని పరమపవిత్రమైందిగా భావించని వారిని, అలాంటి వారికి సంబంధించినవారిని, వారితో కలిసిన వారిని కూడా ముందుగా బంధించి తీసుకురండి.

ఓ భటులారా! సకల పాపకార్యాలకూ నెలవైన సంసారమనే ఇంటిలో ఉంటూ, జ్ఞానం నశించి, మహాత్ములైన యోగుల సాంగత్యానికి దూరంగా ఉండే నీచ మానవులను పట్టుకురండి.

హరిభక్తులకందరికీ ముక్తి తంగేటిజున్నులాగా సులభ సాధమై ఉంది. హరినామం నుడువనివానికీ, హరిచరణధ్యానం చేయనివానికీ, ముక్తి హరిభక్తులకువలె సులభసాధ్యమవుతుందా? (సులభసాధ్యం కాదు).

శ్రీహరిమీది భక్తి మాత్రమే కైవల్యానికి సోపానమని పూర్తిగా విశ్వసించినవారినీ, వారి బంధువర్గాన్నీ వారితో కలిసి వున్నవారినీ పట్టుకోకండి. వారి మార్గాలవైపు ఏమాత్రం వెళ్ళకండి.

ఈ విధంగా చెప్పి శుకమహర్షి పరీక్షిత్తుతో ఇంకా ఇలా అన్నాడు. శ్రీకృష్ణనామ సంకీర్తనం లోకాలకు శుభాలను ప్రసాదిస్తుందనీ, లోకాలను సమ్మోహింపజేస్తుందనీ, లోకులందరిచేతా విశేషంగా గానం చేయబడుతుందనీ, పలువిధాలైన మాయాబంధాలనూ తెంపివేస్తుందనీ, అమోఘాలయిన హరిపరాక్రమ గాథలను ఆకర్షించేవారి అంతరంగాలు అత్యంత నిర్మలంగా ఉంటాయనీ, ఈ విధంగా వ్రతాల ఆచరణచే కానీ మనస్సులు పవిత్రంకావనీ, శ్రీకృష్ణదేవుని పాదపద్మాలను హృదయపద్మంలో నిలుపుకొని ఆరాధించేవారిని ఇతరపాపాలుగానీ, అజ్ఞానంగానీ, వ్యసనాలుగానీ అంటనేరవని యమధర్మరాజు తన కింకరులకు ఉపదేశించాడు. తమ ప్రభువుచేత కీర్తింపబడిన దేవదేవుని మహామహిమలను విని కాలకింకరులు ఆశ్చర్యచకితులైనారు. వారు ఆనాటి నుంచీ విష్ణుభక్తుల వైపు కన్నెత్తి చూడటానికి సైతం భయపడసాగారు. ఓ పరీక్షిన్మహారాజా! పరమరహస్యమైన ఈ ఇతిహాసాన్ని సర్వజ్ఞుడైన అగస్త్యమహర్షి సమస్త దుఃఖాలనూ విలయం చేసేదీ, సమస్త పుణ్యాలకూ నిలయమైందీ అయిన మలయపర్వతంమీద దేవాదిదేవుడైన వాసుదేవుణ్ణి ఆరాధిస్తూ నాకు ఈ వృత్తాంతాన్ని తెలియచేశాడు. అని చెప్పిన శుకయోగీంద్రుని మాటలు విని పరీక్షిన్నరేంద్రుడు ఆశ్చర్యం, ఆనందం నిండిన హృదయంతో ఇలా అన్నాడు.

అయ్యా! శుకమహర్షీ! ఇంతకుముందు స్వాయంభువ మనువు వృత్తాంతం చెప్పావు. ఆయన పరిపాలించే కాలంలో దేవతలు, రాక్షసులు, పక్షులు, పాములు, మానవులు మొదలైన ప్రాణుల సృష్టిక్రమాన్ని గూర్చి కొంతకొంత చెప్పావు. ఆ విషయాన్నే ఇంకా విస్తారంగా వివరించి చెప్పు.

ఈ విధంగా పరీక్షిత్తు ప్రశ్నించగా, హృదయ సంస్కారంతో ఆనందించినవాడై శుకమహర్షి సమాధానం చెప్పాడు. ఓ మునులారా! ఏమరుపాటులేకుండా శ్రద్ధగా వినండి.

ప్రజాపతి దక్షుడి పునర్జన్మ

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

No comments:

Post a Comment