Saturday, March 7, 2026

The Story of Prachetas Daksha refers to the Prajapati Daksha - ప్రజాపతి దక్షుడి పునర్జన్మ

ప్రజాపతి దక్షుడి పునర్జన్మ

ప్రాచేతసుని కుమారులైన ప్రాచీన బర్హిషులు పదిమంది ఒకనాడు సముద్ర గర్భంనుండి బుద్ధిపూర్వకంగా బయటకు వచ్చి భూమిపై సర్వత్రా వ్యాపించిన చెట్లను చూచి కోపగించి వారి నోటినుండి గాలితో కూడిన అగ్నిని పుట్టించి ఆ చెట్లను సమూలంగా దహించబోయారు. అది చూచిన చంద్రుడు భయపడి వారి కోపాన్ని పోగొట్టడానికి వారితో మృదువుగా మాట్లాడుతూ ఓ మహాత్ములారా! ఏ దిక్కూలేని ఈ చెట్లను నాశనం చేయడం ఉచితమేనా? అని ప్రశ్నించాడు.

(ఓషధులు మొదలైన వృక్షసంతతికి చంద్రుడు అధిపతి. అందుకే అతణ్ణి ఓషధీపతి అంటారు. కనుకనే పై సంఘటనలో చంద్రుడు స్పందించవలసి వచ్చింది.)

పూర్వం అభ్యుదయంపొందుతూ ఉన్న మిమ్మల్ని భగవంతుడు దయామూర్తులైన సృష్టికర్తలుగా పేర్కొన్నాడు. సృష్టికి మూలమైన అటువంటి మీరు ఈ విధంగా చెట్లను నశింపచేయడం తగునా? (తగదు).

ఓ ప్రచేతసులారా! సృష్టికి ప్రారంభంలో ప్రజాపతులకు అధిపతి అయిన శ్రీమన్నారాయణుడు వనస్పతులనూ ఓషధులనూ సృష్టించాడు. అఖిలలోకాధినాథుడూ అచ్యుతుడూ అయిన ఆ పద్మలోచనుడు జీవులకు పోషకంగా ఇష్టమైన ఆహారం కోసమూ, శరీరానికి శక్తి ఇవ్వటం కోసమూ ఈ వృక్షాలను ఏర్పాటు చేశాడు. చరాలూ పాదచారులూ అయిన జీవులకు అచరాలూ, పాదరహితాలూ అయిన వాటిని ఆహారంగా కల్పించాడు. రెండుచేతులు, రెండుకాళ్లు గల ప్రాణులకు నాలుగు కాళ్ల జంతువులనూ, వృక్షాలనూ ఆహారంగా ఏర్పాటు చేశాడు. అందువలన మీరు ఈ విధంగా చెట్లను కాల్చివేయటం న్యాయం కాదు. అదీగాక మీరు తపస్సుచేసి పుణ్యవంతులై ఉండటానికి ఆ దయామయుడైన నారాయణుని అనుగ్రహమే గదా కారణం. ఆ మహానుభావుడైన అచ్యుతుడేగదా మీకు లోకమంతటా “అనఘులు” అనే ప్రఖ్యాతిని కల్పించింది.

నిజానికి బ్రహ్మదేవుడు మిమ్మల్ని సృష్టి చేయడానికి నియమించాడు. అలాంటి మీకు సృష్టి నాశనంచేయాలని, ఈ వృక్ష దహనం మీద కోరిక ఎలా కలిగింది?

ఎల్లప్పుడూ గొప్ప సత్త్వగుణాలను కలిగివుంటూ సత్పురుషులుగా పేరు పొందండి. మీ తండ్రులు, తాతలు, పెద్దలు ఏనాడూ పొందని కోపతాపాలకు మీరు లోనుకాకండి. కోపంతో కూడిన పాపపు ఆలోచనలను విడిచి అదిగో జాలి చూపులతో భీతిల్లుతున్న వృక్షసమూహాలపై కరుణ చూపించండి.

బిడ్డలకు తల్లిదండ్రులు, కళ్ళకు కనురెప్పలు, భార్యకు భర్త, ప్రజలకు పాలకుడు, యాచకునికి ఇంటి యజమాని, మూర్ఖులకు జ్ఞాని మొదలగువారు నిజమైన క్షేమాన్ని కోరే ఆప్తబాంధవులు. అంతే తప్ప ఆపద సమయంలో ఆదుకోలేని కఠినచిత్తులు నిజమైన బంధువులు కానేకారు.

ఇంకా చంద్రుడు ప్రాచేతసులను ఇట్లా వేడుకొన్నాడు - సమస్త జీవరాసుల దేహాలలోపల సర్వేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు ఆత్మస్వరూపంలో ఉన్నాడని మీరు తెలుసుకోవాలి. అట్లా తెలుసుకొని సర్వత్ర నిండి ఉన్న ఆ ఇందిరారమణుడైన గోవిందుని లోచూపులతో తనివితీరా చూడాలి. అట్లా చూచినట్లయితే పరిశుద్దాత్ములూ జ్ఞానస్వరూపులూ అయిన మిమ్మల్ని ఆ భగవంతుడు ఎంతో మెచ్చుకుంటాడు. అట్లా మెచ్చుకొన్న పరాత్పరుడు మీరు చూచే ప్రదేశమంతటా అన్నిట్లోనూ ఉన్నాడని తెలుసుకొని మీరు మీ కోపాన్ని శాంతింపజేసుకోవాలి. ఆగ్రహాన్ని త్యజించినవారై మీరు దహింపగా మిగిలిన వృక్షాలను ఇకనైనా సంతోషంగా బ్రతుకనీయాలి. ఓ పుణ్యాత్ములారా! మీరు నా ప్రార్థనను అంగీకరించాలి.

ఈ చెట్లకు కలిగిన ఆపదను పోగొట్టినందుకుగాను అప్పరస కుమార్తెయైన, వృక్షప్రుత్రిక అయిన మారిష అనే కన్యను మీకు భార్యగా ఇస్తున్నాను. కాదనక స్వీకరించి ఆనందించండి.

చంద్రుడు వారికి వీడ్కోలు పలికి మారిష అనే అప్పరసను ఆ ప్రాచీన బర్హిషులకు అప్పగించి వెళ్ళాడు. ఆ తరువాత

ఆ ప్రాచేతసులు ఆ మారిషను వివాహం చేసుకొన్నారు. వారికి ధైర్యవంతుడు, బ్రహ్మతో సమానుడు అయిన దక్షప్రజాపతి పుట్టాడు.

ఎవరి సంతానం ఈ లోకమంతా ఆవరించిందో ఆ దక్షుడు, కుండలో నీటిని సంపూర్ణంగా నింపినట్లుగా ఈ భూమండలమంతటా తన సంతానాన్ని పుట్టించాడు.

కూతురంటే ఇష్టపడే దక్షప్రజాపతి తన ఆత్మశక్తితో కొన్ని జీవరాశుల్ని పుట్టించాడు. మరికొన్ని జీవరాసుల్ని సయంగా కన్నాడు. వీటితోపాటు కొన్ని ఆకాశగమనం కలవి, మరికొన్ని భూమిపై తిరుగాడేవి, అడవుల్లో సంచరించేవి, నీళ్లలో జీవించేవి, రాత్రిళ్లు తిరిగేవి, పగటిపూట సంచరించేవి అయిన జీవులను, జంతువులను దక్షుడు పుట్టించాడు.

దక్షుడు నిశ్చలమైన బుద్ధితో దేవ, రాక్షస, మానవ, యక్ష, కిన్నర, నాగ, గరుడ, పక్షులను, వృక్షాలను, పర్వతాలను ఇలా వరుసగా అనేక జీవ, అజీవ జాతులను క్రమంగా సృష్టించి విశాలమైన యశస్సును సంపాదించాడు.

దక్షుడు ఈ విధంగా పలురకాలుగా, అనేక విధాలైన, జీవజాలాన్ని సకల లోకాలలోను ఆవిర్భవింపజేసినప్పటికీ ఏ కారణంచేతనో తృప్తినిమాత్రం పొందలేకపోయాడు.

ఈ విధంగా ప్రాణుల సృష్టితో నిండిపోయిన లోకాన్ని చూచి దక్షుడు బాధపడి ఇంకా సృష్టి చేయాలన్న కోరికను వదిలిపెట్టి పరమ పురుషుని ఆశ్రయించాలని తలచాడు.

ఈ విధంగా తాను చేసిన సృష్టి తనకే సంతృప్తి కలిగించనందువల్ల దక్షప్రజాపతి బాధపడుతూ శ్రీహరిని మెప్పించే ప్రయత్నం చేస్తున్నవాడై

ఆనందకరమైన, దుఃఖహరమైన, శబరస్త్రీల శృంగారచేష్టలతో కూడిన వీక్షణాలతో వివిధసుఖాలకు ఆస్పదమై ఒప్పుతున్న వింధ్య పర్వత ప్రాంతం వద్దకు వెళ్ళాడు.

దక్షుడు వింధ్య పర్వతం లోయలో సకల పాపహరమైన “అఘమర్షణం” అనే తీర్ధం చేరి అందు నిత్యం యజ్ఞకర్మలు

చేస్తూ నిష్టగా అతి తీవ్రమైన తపస్సు చేశాడు. దానికి సంతోషించి సాక్షాత్కరించిన శ్రీహరిని 'హంసగుహ్యం' అనే శ్రేష్ఠమైన స్తోత్రంతో ఆ ప్రజాపతి ఇలా స్తుతించాడు.

('అఘమర్షణం'= పాపపరిహారకమైంది.)


దక్షుడు కావించిన హంసగుహ్యం బను స్తవరాజము

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

పంచాంగం

No comments:

Post a Comment

Ranga Panchami Deva Panchami - రంగ పంచమి దేవ పంచమి

రంగ పంచమి దేవ పంచమి దీపావళిని ఎలా అయితే 5 రోజుల పాటు చేసుకుంటారో. అలానే కొన్ని ప్రాంతాలలో హోలీని కూడా ఐదు రోజులు జరుపుకుంటారు. వాటిల్లో చివర...