Sunday, March 29, 2026

Vishwamitra Charitra - విశ్వమిత్రుని చరిత్రము

విశ్వమిత్రుని చరిత్రము




గాధికి అగ్నితో సమానమైన తేజస్సుగల విశ్వామిత్రుడు జన్మించాడు. ఈ విశ్వామిత్రుడు రాజు అయినప్పటికి తన రాజధర్మాన్ని, క్షాత్రధర్మాన్ని వదిలి తన తపోబలంతో బ్రహ్మర్షి అయ్యాడు. నూర్గురు సుతులను కన్నాడు.

భృగువంశంలో జన్మించిన అజీగర్తుడు అనే వానికొడుకు శునశ్శేపుడు హరిశ్చంద్రునికి తన తల్లిదండ్రులచే యజ్ఞపశువుగా అమ్మబడ్డాడు. అతడు యజ్ఞస్తంభానికి కట్టివేయబడగా బ్రహ్మ మొదలైన దేవతలను స్తుతించి, మెప్పించి పితృదేవతల చేత బంధవిముక్తుడయ్యాడు. ఆ శునశ్శేఫునియందు దయగలిగిన విశ్వామిత్రుడు తన పుత్రులతో ఇలా అన్నాడు.

(అజీగర్తుడు భృగువంశంలో జన్మించాడు. ఒక సమయంలో క్షామం వచ్చింది. ఆహారంలేక అందరూ బాధపడుతున్నవేళ ఈ అజీగర్తుడు తన కుమారుడైన శునశ్శేపుణ్ణి హరిశ్చంద్రునకు అమ్మివేసినాడు. హరిశ్చంద్రుడు ఈ శునశ్శేపుణ్ణి యాగపశువును చేసి యూపస్తంభానికి కట్టాడు. ఈ శునశ్శేఫుడు తనను యజ్ఞపశువుగా బలి చేస్తారనే భయంతో బ్రహ్మాది దేవతలను ప్రార్ధించాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. పితృదేవతలచే శునశ్శేపునకు బ్రహ్మ దయవల్ల బంధవిముక్తి అయ్యింది. హరిశ్చంద్రునకు యాగఫలం లభించేలా చేశాడు. బ్రహ్మ దేవతలు వచ్చి ఈ శునశ్శేఫుని విడిపించారు. కాబట్టి ఇతనికి దేవరాతుడనే పేరు వచ్చింది. ఈ శునశ్శేఫుడనే దేవరాతునిమీద విశ్వామిత్రునకు ప్రేమ కలిగింది.

శునశ్శేఫుని అమ్మిన కారణంగా తదుపరి అజీగర్తునకు పిశాచత్వం వచ్చింది. తన మూలంగా తండ్రికి పిశాచత్వం వచ్చిందని తెలిసికొన్న శునశ్శేపుడు గౌతమీతీరంలో తపస్సు చేశాడు. శివుడు విష్ణువు ప్రత్యక్షం అయ్యారు. వారి అనుగ్రహంతో ఈ శునశ్శేఫుడు తన తండ్రికి వచ్చిన పిశాచత్వాన్ని పోగొట్టాడు.)

ఈ శునశ్శేఫుణ్ణి నేను కళ్ళారా చూచాను. ఇతడు నాకు ప్రియమైన కుమారుడు. వీనిని మీరందరూ ప్రేమతో అన్న అన్న అని పిలవండి. ఇతణ్ణి గౌరవించండి అని విశ్వామిత్రుడు తన కొడుకులతో అనగా వారు మదించిన వారై

ఇతడు మాకు అన్న అగునా! బాగు బాగు. మేము ధన్యులమయ్యాం అంటూ గేలి చేస్తున్న తన కుమారులను చూచి, సంయమనం విడిచి "మీరు మ్లేచ్చులు అయిపొండి" అని శపించి వెళ్ళిపోతూ ఉండగా

ఆ సమయంలో తండ్రి ఇచ్చిన శాపానికి భయపడి విశ్వామిత్రసుతులలో నడిమివాడైన మధుచ్చందుడనే వాడు యాభైమంది సోదరులతోవచ్చి తండ్రికి నమస్కారంచేసి 'ఓ తండ్రీ నీవు చెప్పిన విధంగా ఈ శునశ్శేపుని మేము మాకు అన్నగా భావించి మన్నించి నమస్కరిస్తాము అని అనగా విశ్వామిత్రుడు ఆనందించి మంత్రద్రష్ట్ర అయిన శునశ్శేపుని వారిలో పెద్దవాణ్ణి చేసి (ఆ యాభై మందికి అగ్రజుని గావించి) మధుచ్చందునితో ఇలా అన్నాడు.

ఓ కుమారులారా! తండ్రిమాటను వినాలనే ధర్మం మీరు తప్పని కారణంగా ఈ శునశ్శేఫుడు నాకు కొడుకయ్యాడు. మీరంతా ఈ దేవరాతునితో ప్రేమతో ప్రవర్తించి మీరు కడుపారా సుతులను పొందండి.

అలా విశ్వామిత్రుడు మధుచ్చందాదులతో చెప్పాడు. శునశ్శేఫుడు దేవతలచేత విముక్తి పొందడంచేత దేవరాతుడని పేరు పొందాడు. మధుచ్చందుడు మొదలైన ఏబదిమంది దేవరాతునకు సోదరులయ్యారు. పెద్దవాళ్ళైన అష్టక, హారీత, జయంత, సమదులు మొదలైనవారు ఏబదిమంది వేరుగా వెళ్ళిపోయారు. ఈ క్రమంలో విశ్వామిత్రుని సుతులు, రెండు విధాలుకాగా విశ్వామిత్ర సుతులలోనే మరొక ప్రవర కలిగింది అని చెప్పి భాగవతాన్ని పరీక్షిత్తుకు చెప్పే శుకుడు ఇలా అన్నాడు.

ఆ పురూరవుని కొడుకైన ఆయువునకు నహుషుడు, క్షత్రవృద్దుడు, రజి, రంభుడు, అనేనస్సు అనేవారు జన్మించారు. వారిలో క్షత్ర వృద్దుడు అనేవానికి కుమారుడైన సుహోత్రునకు కాశ్యుడు, కుశుడు కృత్స్నమదుడు అనే ముగ్గురు సుతులు కలిగారు. ఆ కృత్స్నమదునకు శునకుడు, శునకునకు శౌనకుడు, గొప్పవాడైన శౌనకునకు బహ్వృచ ప్రవరుడు జన్మించారు. ఆ బహ్వృచప్రవరుడు నియమవంతుడై తపస్సు చేసికోవడానికి వెళ్ళాడు.

ఇక కాశ్యుడు అనేవానికి కాశి, కాశికి రాష్ట్రుడు, రాష్ట్రునకు దీర్ఘతపుడు అనేవారు జన్మించారు.

(విశ్వామిత్రుని కొడుకులు రెండు భాగాలుగా విడిపోయారు. తండ్రి మాట విని శునశ్శేఫుని సోదరునిగా గ్రహించిన మధుచ్చందాదులు ఒకవర్గం, తండ్రి మాట వినక శాపగ్రస్తులైన అష్టక హారీత జయంత సమదాదులు వేరొక వర్గంగా ఏర్పడ్డారు. ఈ విధంగా విశ్వామిత్ర సుతులలో రెండు ప్రవరలు ఏర్పడ్డాయి. ప్రవర అంటే పై తరాల చరిత్ర.)

ఆ దీర్ఘతపుడనేవానికి విష్ణుమూర్తి అంశతో ఆయుర్వేదం తెలిసినవాడు, ఎల్లరు కొలువదగినవాడు అయిన 'ధన్వంతరి' జన్మించాడు. ఆ ధన్వంతరిని కీర్తనచేస్తే కష్టాలు బాధలు తీరుతాయి.

శ్రీ విష్ణుమూర్తి అంశతో జన్మించిన ధన్వంతరి యజ్ఞంలోని హవిస్సులు స్వీకరింప అర్హుడు. ధన్వంతరికి కేతుమంతుడు, అతనికి భూమరథుడు, భూమరథునకు దివోదాసుడని చెప్పబడే ద్యుమంతుడు జన్మించారు. ఆ ద్యుమంతునకు ప్రతర్దనుడు జన్మించాడు. ఆ ప్రతర్దనుడు శత్రుజిత్తని, ఋతధ్వజుడని పిలువబడ్డాడు. ఆ ప్రతర్దనునకు కువలయాశ్వుడు జన్మించాడు.

ఓ పరీక్షన్మహారాజా! కువలయాశ్వుడనే రాజు లలిత పుణ్యుడైన అలర్కుని కన్నాడు. ఆ అలర్కుడు భూమిని అరవై ఆరువేల ఏండ్లు పాలించాడు. అలర్కునివలె భూమిని పాలించినవారు లేరు.

ఆ అలర్కునకు సన్నతి, వానికి సునీతుడు, వానికి సుకేతనుడు, వానికి ధర్మకేతువు వానికి సత్యకేతువు, వానికి ధృష్టకేతువు, అతనికి సుకుమారుడు, అతనికి వీతిహోత్రుడు, అతనికి భర్గుడు, ఆ భర్గునకు భార్గభూమి జన్మించారు.

ఓ వంశశ్రేష్ఠా! కాశ్యవసుమతీశుని నుండి ఈ భార్గభూమి వరకు గల రాజులు క్షత్రవృద్ధుని వంశంలో పుట్టినవారై, కాశులనే పేరుతో భూమిపై ప్రసిద్ధి పొందారు.

క్షత్రవృద్దుని రెండవ కొడుకైన కుశునకు ప్రీతి, వానికి సంజయుడు, వానికి జయుడు, వానికి కృతుడు, వానికి హర్యధ్వనుడు, వానికి సహదేవుడు, వానికి భీముడు, వానికి జయత్సేనుడు, వానికి సంకృతి, వానికి జయుడు వానికి క్షత్రధర్ముడు పుట్టారు. వీరంతా క్షత్రవృద్దుని వంశంలోగల రాజులు.

రంభునికి రభసుడు, వానికి గంభీరుడు, వానికి కృతుడు జన్మించారు. ఆ కృతునకు బ్రహ్మకులం పుట్టింది. అనేనసునకు శుద్ధుడు, వానికి శుచి, శుచికి బ్రహ్మకు సారథ్యంచేసే త్రికకుత్తు జన్మించారు. ఆ త్రికకుత్తుకు శాంతరజుడు పుట్టాడు. ఆ శాంతరజుడు విజ్ఞాని, కృతకృత్యుడు విరక్తుడు.

ఓ పరీక్షన్మహారాజా! రజి అనేవానికి అధికమైన బలంగల ఐదువందల మంది కొడుకులు జన్మించారు. దేవతల ప్రార్ధనలు విని రజి ఎందరో రాక్షసులను చంపి స్వర్గాన్ని దేవేంద్రునకు ఇచ్చాడు. దేవేంద్రుడు కృతజ్ఞతగా రజి పాదాలకు నమస్కరించి, అతనికి దేవతాశరీరాన్ని ఇచ్చాడు. సంతోషంగా రజిని అర్చించాడు. కొంతకాలానికి రజి మృతి చెందాడు. అతని ఐదువందలమంది సుతులు దేవేంద్రుడు ప్రార్థించినా వినకుండా స్వర్గలోకాన్ని తామే పాలించారు. గర్వంతో యజ్ఞయాగాదులలో హవిస్సులను కూడా వారు స్వీకరించారు.

దేవతల రాజు ఇంద్రుడు దేవగురువైన బృహస్పతిచే హోమం చేయించి, ఆ హోమప్రభావంతో బలాన్నిపొంది తన వజ్రాయుధంతో రజి కుమారులను ఐదువందల మందినీ చంపి స్వర్గాన్ని తన హస్తగతం చేసికొన్నాడు.

అది అలా ఉండగా నహుషునకు యతి, యయాతి, సంయాతి, ఆయాతి, వియతి, కృతి అనబడే ఆరుగురు కొడుకులు ప్రాణికి, పంచేంద్రియాలు మరియు మనస్సు అనే ఆరు ఇంద్రియాలవలె జన్మించారు. వారిలో పెద్ద కొడుకైన యతికి నహుషుడు రాజ్యం ఇయ్యగా అతడు విరాగియై

(విశ్వామిత్రుడు సృష్టికి ప్రతి సృష్టి చేసినవాడు. వైదికచ్చందం తర్వాత సృష్టించబడింది లౌకికచ్చందం. విశ్వామిత్ర సంభవుడు (కొడుకు) మధుచ్చంద. ఆయన వంశపరంపరలో యతి, యయాతి, సంయాతి, నాయాతి, వియతి, కృతి అనే వారు సంభవిస్తారు. ఇవన్నీ లౌకికఛందస్సంబంధితమైన పేర్లుకావటం విశేషం. మధుచ్చంద అనగా స్రవించే మధువు, ఛందంకూడా అంతే. యతులతో ఒప్పారి కృతి చివరగా కృతి ఉద్భవిస్తుంది.)

రాజ్యం పాపానికి మొదలు. ఈ రాజ్యం వస్తే ఒళ్ళు తెలియని గర్వం వస్తుంది. ఎంతటి జ్ఞానియైన రాజ్యాధికారం వస్తే ఎవరు పూజింపదగినవారో వారిని గుర్తించలేడు. అయినా ముక్తికోరేవారికి ఈ రాజ్యాలు గీజ్యాలు అవసరం లేదు కదా!

ఈ విధంగా మాట్లాడి యతి అనేవాడు రాజ్యాన్ని వదలి వెళ్ళిపోయాడు.

ఆ నహుషుడు నూరు యజ్ఞాలుచేసి, ఇంద్రపదవిని పొంది, ఇంద్రుని భార్య శచీదేవిని పొంద గోరి, మహర్షులు మోసే పల్లకినుండి సర్పమై జారి భూమిపై పడ్డాడు.

(నహుషుడు నూరు యజ్ఞాలు చేశాడు. దాని ఫలితంగా ఇంద్ర పదవి లభించింది. యజ్ఞం అనేది పవిత్ర కార్యం. అటువంటి నూరు యజ్ఞాలు చేయడం అందరివల్లా సాధ్యం కాదు. ఇన్ని యజ్ఞాలు చేసినా ఇంద్రపదవి పొందినా నహుషుని మనసులో పావిత్య్రం లేదు. తాను ఇంద్రపదవి పొందాడు. కాన ఇంద్రుని భార్య పరమపతివ్రత శచీదేవిని పొందగోరాడు. మహర్షులు పల్లకిపై నహుషుని శచీదేవి వద్దకు తీసికొనిపోతున్నారు. ఆ మహర్షులలో అగస్త్యుని శాపంవల్ల నహుషుడు సర్పమై నేలకూలాడు.

ఎంత జ్ఞానం ఉన్నా ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎంత ఎత్తుకు ఎదిగి ఇంద్ర పదవినందినా మానసిక పావిత్య్రం లేనివానికి అధోగతి తప్పదు అని నహుషుని కథ అందరికి తెలియజేస్తుంది.)

అన్న అయిన యతి విరక్తుడు కాగా, తండ్రి అయిన నహుషుడు ఇంద్రలోకమున కేగగా యయాతి రాజై తన నలుగురు సోదరులకు నాల్గుదిక్కుల రాజ్యాన్ని భాగంగా ఇచ్చి, శుక్రుని కొమరితను, వృషపర్వుని కూతురును (ఇద్దరిని) వివాహమాడి న్యాయవర్తనుడైన యయాతి రాజ్యభారాన్ని వహించాడు.

అనగా విని పరీక్షిత్తు అనే రాజు ఇలా అన్నాడు.

యయాతి చరిత్రము

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

పంచాంగం

No comments:

Post a Comment

Puru dynasty (Paurava dynasty) - పూరు వంశం చరిత్ర(పౌరవ వంశం)

పూరు వంశం చరిత్ర (పౌరవ వంశం) ఓ భరతవంశ సంభవా! పరీక్షిన్మహారాజా! పూర్వం మీది పూరు వంశమే. అటువంటి పూరువంశంలో జన్మించిన నీకు మీ పూర్వులు, చక్కని...