Sunday, March 29, 2026

Shukracharya curses Yayati - శుక్రాచార్యులు యయాతికి శాపం బొసంగుట

శుక్రాచార్యులు యయాతికి శాపం బొసంగుట

రాజైన యయాతి పూర్వం శుక్రాచార్యులు చెప్పిన మాటలు జవదాటరానివై గుర్తు ఉన్నప్పటికీ శర్మిష్ఠను జూచి మన్మథ బాధకు గురై ఆమెను మదనసుఖాలలో మురిపించాడు. దైవనిర్ణయాలు త్రోసివేయజాలం కదా! ఒక చక్రవర్తియైన యయాతి అందకత్తె అయిన శర్మి
ష్ఠతో సుఖించకుండా ఉండగలడా!

ఈ విధంగా యయాతివల్ల శర్మి
ష్ఠ గర్భవతియై ద్రుహ్యుడు, అనువు, పూరువు అనే పేర్లు గల ముగ్గురు కుమారులను కన్నది. దేవయాని ఈ విషయాన్ని గ్రహించి కోపించి తండ్రి శుక్రాచార్యుని వద్దకు వెళ్ళింది. ఒడలు తెలియని కోపాన్ని వహించిన దేవయాని వెంట యయాతి వెళ్ళి ఇలా అన్నాడు.

ఓ సరోజాక్షీ! దేవయానీ! ఈ విషయాన్ని మామ అయిన శుక్రాచార్యునికి చెప్పడమెందుకు? మానుము. నేను శర్మి
ష్ఠతో సంసారసుఖం అనుభవించి తప్పు చేశాను. కామంతో శర్మిష్ఠను పొందిన నన్ను కరుణించు. నీ తండ్రి మాటకంటె నా మాట వినడం నీకు తగినది.

ఈ విధంగా యయాతి పలికి దేవయాని పాదాలపై పడ్డాడు. అయినా దేవయాని ఒడంబడలేదు. ఈ విషయాన్ని తెలిసికొన్న శుక్రాచార్యుడు ఇలా అన్నాడు.

ఓ యయాతి మహారాజా! నేను నా వివాహ సమయంలో చెప్పిన మాటలు పెడచెవినిపెట్టి రాక్షస రాజ తనూజ శర్మి
ష్ఠతో సుఖించావు. నేను చెప్పిన మాట ఏమిటి? నీవు చేసిన పని ఏమిటి? కాముకులకు, విషయలంపటులకు సత్యవాక్యం పైని నియమం ఉంటుందా!

అని శుక్రాచార్యుడు పల్కి ఓ యయాతీ! నీవు స్త్రీలందరూ అసహ్వించుకొనే ముసలితనం పొందుతావు అని శపించేసరికి యయాతి ఇలా అన్నాడు.

ఓ మామా! నాపై కోపంవద్దు. నీ సుత అయిన దేవయానిపై నాకు వాంఛ తీరలేదు. ఆమెతో మరికొంత కాలం రమించి ఆ తరువాత నేను ముసలితనాన్ని అనుభవిస్తాను.

అని చెప్పి యయాతి శుక్రుని అనుజ్ఞనుపొంది దేవయానిని వెంటబెట్టుకొని నగరానికి వెళ్ళి పెద్దకొడుకు అయిన యదువును పిలిచి ఇలా అన్నాడు.

ఓ పుత్రా! యదునామధేయా! నా తండ్రీ! నా కుమారా! నీ తల్లినిగన్న శుక్రాచార్యునివల్ల నేను నేడే ముసలితనాన్ని పొందాను. నీ యౌవనాన్ని నాకు ఇమ్ము. నేను తృప్తి పొందేలా కొన్ని సంవత్సరాలు మన్మథ సౌఖ్యాలతో శృంగారినై తిరుగుతాను.

యయాతి పల్కులు విని తండ్రియైన యయాతితో కుమారుడైన యదువు ఇలా అన్నాడు.

తండ్రీ! స్త్రీలు సహించనిది, చెడుమాటలకు నిలయమైనది, భరింపరాని కందూతితో కూడినది, చింతకు మూలమైనది, పడిసెమనే రోగంతో కూడినది, చెమట, కురుపులు వణకు, శ్రమ, బొబ్బలు మొదలైన జబ్బులు గలది ముసలితనం. అటువంటి ముదిమిని ఎవరైనా ఇష్టపడి సుఖానుకూలమైన యౌవననిధిని ఊరకే ఇతరులకు ఇవ్వగలరా?

యదువు తండ్రి మాటలకు అంగీకరింపలేదు. యయాతి తన మిగిలిన పుత్రులు తుర్వసుడు, ద్రుహ్యుడు అనేవారిని అడుగగా వారుకూడా యదువు చెప్పినట్లే సమాధానం చెప్పారు. అప్పుడు యయాతి కడగొట్టు కుమారుడైన పూరువుతో ఇలా అన్నాడు.

ఓ కుమారా! నీవు వయసులో పిన్నవాడవు కాని బుద్ధులలో పెద్దవాడవు. నీవు నా ఆజ్ఞను దాటవు కదా! నీవు వినయ సంపన్నుడవు. నీవు నీ అన్నలు చెప్పినట్లు ఎదురు చెప్పకు. నా ముసలితనాన్ని నీవు స్వీకరించి నీ యౌవనాన్ని నాకు అందించు.

తండ్రి యయాతి మాటలువిని పెద్దలపై భక్తిగల పూరుడు ఇలా అన్నాడు.

ఓ తండ్రీ! నీవు నన్ను ఇంతగా ప్రార్థించాలా! నీ యాజ్ఞను అతిక్రమించి పనులు చేయడానికి, నీకెదురు మాట్లాడటానికి నేను న్యాయం తెలియనివాడనా? నీ ముసలితనాన్ని నేను ఇష్టంగా వహించి నా యౌవనాన్ని నీకిస్తాను తండ్రి ఆజ్ఞను తలదాల్బక తగువులాడే పుత్రుడు క్రిమితో సమానుడు కాడా?

(యయాతి తన ముసలితనాన్ని స్వీకరించి యావనాన్ని ఇమ్మని సుతులను కోరాడు. కుమారులెవ్వరు అంగీకరించలేదు. పూరుడుమాత్రం అంగీకరించాడు. యయాతి తనసుతులను యౌవనాన్ని ఇమ్మనికోరడం సమంజసమా, కాదా అన్న అంశాన్ని అలా ఉంచితే, ఇస్తానని అంగీకరించడం పూరువు గొప్పతనం. పైగాకోరింది తారుణ్యాన్ని. వృద్ధత్వాన్ని ధరించవలసింది కుమారుడు. ముదిమి ఎటువంటిదో ముందు పద్యాలలో చెప్పబడింది. 'జన్మ కష్టం జరాకష్టం' అని పెద్దలు చెప్పనే చెప్పారు. ముసలితనం కడుభయంకరమైన కష్టం. ఎన్నో చేయాలని ఉన్నా చేయలేని అశక్తతా, చింత, ఆశ ఇత్యాదిలక్షణాలతో ఉండేది ముదిమి. తెలిసికూడా పూరువు తనతండ్రి యయాతి ముదిమిని స్వీకరిస్తానన్నాడు; దాన్ని కూడా నెయ్యంతో స్వీకరిస్తానన్నాడు. అంతేకాదు తండ్రిమాట శిరసావహింపని కుమారుడు క్రిమితో సమానుడన్నాడు. ఎప్పుడో జరిగిన ఈ చరిత్ర ఇప్పటికీ మనం జ్ఞప్తిలో ఉంచుకోవాలి. తల్లిదండ్రుల ముసలితనాన్ని మనం స్వీకరించి మనయౌవనం వారికివ్వలేకపోయినా, యౌవనంతో ఉన్న మనం వృద్ధులైన తల్లిదండ్రుల బాధ్యతను ప్రేమతో స్వీకరిస్తే మనం కూడా పూరువు అంతటి వాళ్ళం అవుతాము. ఇంత మాత్రపు ఆలోచన యువకులకు కలిగితే భాగవత పఠనం సార్ధకం అయినట్లే.)

అదే కాకుండా, ఓ రాజా! మంచి మార్గమును పొందడానికి మునివృత్తిని అనుసరించి, కృశించవలసిన పనిలేదు. కన్నతండ్రి ఆజ్ఞను తలదాల్చినవానికి ఆ సుగతి కొంగుబంగారం కదా!

(కొంగులోనే ఉన్న బంగారాన్ని వెదుకవలసిన పనిలేదు. తేలికగా చేతికి అందేది అనేసందర్భంలో ఈ జాతీయం వాడుతూ ఉంటారు. ఉత్తమ మార్గాన్ని పొందడానికి తండ్రిమాట తలదాల్చడం ఒక్కటి చేస్తే సరిపోతుంది. వేరే శ్రమపడవలసిన అవసరంలేదు అని భావం.)

ఓ తండ్రీ! ఉత్తములైన పుత్రులు తమతండ్రి ఆజ్ఞాపింపకయే వారికి కావలసిన పనులు చేస్తారు. మధ్యములైన పుత్రులు తండ్రి ఆజ్ఞాపింపగా వారికి అవసరమైన పనులు సమకూరుస్తారు. కాని తండ్రి కోరి ఆజ్ఞాపించినా ఎల్లవేళలా ఎదురుమాటాడి పనిచేయని కుమారులు అధములు.

అని పలికి పూరుడు యయాతియొక్క ముసలితనాన్ని స్వీకరించి తన పిన్నవయస్సును యయాతికిచ్చాడు. యయాతి యౌవనంగలవాడై

ఏడు ఖండాలుగా ఉన్న భూమండలాన్ని ఏడు వీథులుగా ఉన్న ఒక పెద్ద పట్టణంగా పరిపాలిస్తూ, ప్రజలందరికి ఏవి ఏవి అవసరమో వాటిని వెదకివెదకి సమకూర్చిరక్షిస్తూ, తోడుగా దేవయాని నిలువగా, వివిధ మన్మథ సుఖసంతోషాలలో మునిగితేలుతూ యయాతి క్రీడించాడు. ఆయా క్రీడా విశేషాలలో

దేవయాని వివిధములైన గుట్టుమట్టులతో, సాధ్వీధర్మాన్ని తప్పకుండా, ప్రాణేశుడైన యయాతిని ప్రియవాక్యాలతో, త్రికరణ శుద్ధిగా, వేరు ఆలోచన లేకుండా ఆనందపరచింది.

ఆకాశంలో మేఘాల సముదాయం దట్టమై, పలుచనై, పొడవై, ఏకమై, వివిధాకృతులుగా మారి అణగిపోయినట్లు; ఏ పరమాత్మయొక్క గర్భంలో ఈ లోకాల సముదాయం పుట్టి, ప్రవర్తిల్లి, నశించిపోతాయో ఆ పరమాత్ముడైన హరినిగూర్చి యయాతి మహారాజు విస్తారంగా యాగాలు చేశాడు.

అంతేగాక, యయాతి మహారాజు తన స్నేహితులు, గజాలు, రథాలు, భటుల సముదాయం, గుర్రాలు మొదలైనవాటిని కలలో కన్న సంపదలతో సమానంగా చూస్తూ, తనభార్య దేవయానితో వేలకొలది సంవత్సరాలు మన్మథభోగాల ప్రవాహంలో తేలిన వాడైనప్పటికీ అధికమైన తృష్ణకు అంతాన్ని కనలేక అనేక బంధాలలో చిక్కి బాధపడుతూ

ఒకనాడు యయాతి మహారాజు తన ఆత్మ జ్ఞానంవల్ల తన భార్య దేవయాని కారణంగా వంచనకు గురికావడం తెలిసికొని ఎక్కువ దుఃఖాన్నిపొంది దేవయానితో ఇలా అన్నాడు.

యయాతి దేవయానికి బస్తోపాఖ్యాన మనెడి వ్యాజంబున స్వవృత్తాంతంబు దెలుపుట

No comments:

Post a Comment

Puru dynasty (Paurava dynasty) - పూరు వంశం చరిత్ర(పౌరవ వంశం)

పూరు వంశం చరిత్ర (పౌరవ వంశం) ఓ భరతవంశ సంభవా! పరీక్షిన్మహారాజా! పూర్వం మీది పూరు వంశమే. అటువంటి పూరువంశంలో జన్మించిన నీకు మీ పూర్వులు, చక్కని...