Sunday, March 29, 2026

Puru dynasty (Paurava dynasty) - పూరు వంశం చరిత్ర(పౌరవ వంశం)

పూరు వంశం చరిత్ర(పౌరవ వంశం)

ఓ భరతవంశ సంభవా! పరీక్షిన్మహారాజా! పూర్వం మీది పూరు వంశమే. అటువంటి పూరువంశంలో జన్మించిన నీకు మీ పూర్వులు, చక్కని కీర్తియే అలంకారంగా గలవారు, ధీరులు, తమ ప్రతాపమే ధనంగా గలవారు అయిన వారిని గూర్చి వినిపిసాను.

పూరునికి జనమేజయుడు, జనమేజయునకు ప్రాచిన్వాంసుడు, ఆ ప్రాచిన్వాంసునికి ప్రవిరోధన మన్యువు అతడికి చారువు పుట్టారు. ఆ చారునకు సుద్యువు, అతనికి బహుగతుడు; అతనికి శర్యాతి, అతనికి సంయాతి, అతనికి రౌద్రాశ్వుడు, ఆ రౌద్రాశ్వునకు ఘృతాచి అనే అప్సరః కాంతవల్ల జగదాత్మభూతుడైన ప్రాణునకు పది ఇంద్రియాలవలె ఋతేపువు, కక్షేపువు, స్థలేపువు, కృతేపువు, జలేపువు, సన్నతేపువు, ధర్మేపువు, వ్రతేపువు, సత్యేపువు, వనేపువు అనే పదిమంది కొడుకులు పుట్టారు. వారిలో ఋతేపువునకు అతిసారుడు, అతిసారునకు సుమతి, ధ్రువుడు, అప్రతిరథుడు అనే ముగ్గురు పుత్రులు పుట్టారు. అప్రతిరథునకు కణ్వుడు, కణ్వునికి మేధాతిథి. అతడికి ప్రస్కందుడు మొదలైన బ్రాహ్మణులు జన్మించారు. ఆ సుమతికి రైభ్యుడు పుట్టాడు. రైభ్యునికి దుష్యంతుడు జన్మించాడు.

సముద్రంచే చుట్టబడిన విపులమైన భూభారాన్ని వహించే సామర్థ్యంగల తన కుడిచేయి శోభిల్లగా ఒకరోజున వేటయందు ఇష్టంగలవాడై ఖడ్గమృగాలు, సింహాలు, గండభేరుండాలు, కుందేళ్ళు, పాములు, అడవిపందులు, గొర్రెలు, లేళ్ళు, ఏనుగులు, పులులు, సివంగులు, భయంకరమైన శరభమనే మృగాలు, ముళ్ళపందులు, ఎలుగుబంట్లు, చమరీ మృగాలు తిరిగే అరణ్యంలో

శబ్దంచేస్తూ జంతువులను అదిలిస్తూ, పొదలలో వెదుకుతూ, వలలు త్రిప్పి అందులో జంతువులు పడేలా చేస్తూ, గురితప్పకుండా బాణాలతో జంతువులను కొడుతూ, వేటయందు ఆసక్తి ఒప్పగా

జంతువుల సమూహంవెనుక, చంద్ర సమాన సౌందర్యంగల దుష్యంతుడు, వేటయందు ఆసక్తితో, కొంతమంది వేటగాళ్ళు తనను సేవిస్తూ ఉండగా, సింహపరాక్రమం ఉట్టిపడే విధంగా వచ్చాడు.

దుష్యంతుడు క్రమక్రమంగా ముందుకు వెళ్ళి దైవయోగంవల్ల కణ్వమహాముని ఆశ్రమానికి చేరి.

బడలిక చెందిన పెనుబాముల జంటలకు తమ పింఛాలతో విసురుతున్న నెమళ్ళను, మదించిన ఏనుగులకు దయతో మేతపెట్టి ముద్దాడే సింహాలను, సివంగులు కాపలా కాస్తుండగా లేళ్ళతో కాపురంచేస్తున్న మగజింకలను, హోమధేనువుల గంగడోళ్లను మృదువుగా దువ్వే పులులను, తమలో తాము కలహించుకొన్న ఎలుకల జంటలకు స్నేహాన్ని కలిగించే గండుపిల్లులను, సహజంగా ఉండే జాతివైరాన్ని విడిచి కలసిమెలసి ఆటలు ఆడే జంతువులను ఆ కణ్వముని తపోవనంలో దుష్యంతుడు చూచాడు.

(ఆశ్రమవాతావరణం ఎంత గొప్పదో తెలుస్తున్నది. అది కణ్వముని తపోవనం. అక్కడ మృగాలకు జాతివైరం లేదు. అటువంటి వాతావరణం సమాజంలో కూడా నిర్మించుకొంటే, సర్వత్రా శాంతియుత వాతావరణం ఉంటుందని సందేశం.)

ఈ విధంగా సహజవైరంగల జంతువులు పొత్తుగూడి ఉండటం నేనెక్కడా చూడలేదని అబ్బురపడి దుష్యంతుడు తన మనస్సులో ఆ కణ్వమహాముని మహిమకు సంతోషించాడు.

దుష్యంతుడు చెంగలువలతోను, తామరపూలతోను, అలలమీదుగానూ, బాగా వికసించిన అడవిమల్లెలు, కొండమల్లెలు, మొల్లలు మొదలైన పూలమీదుగానూ వీచే మలయమారుతంతో సేదదీరినవాడై 

దుష్యంతుడు వచ్చే సమయంలో

ఓ చంద్రవంశరాజా దుష్యంతా! ఈ కణ్వాథమంలో లక్ష్మీదేవిని మించిన సౌందర్యంగల, తుమ్మెదలవంటి కురులు గల స్త్రీ ఉన్నది ఇక్కడే నీకు శుభం కలుగుతుంది. అని అన్నట్లుగా నల్లకలువలు వరుసగా పూచిన చోట తుమ్మెదలు శుభశబ్దాలు చేశాయి.

మా మన్మథుని బాణములు మామిడిపూలు. అందువల్ల ఈ మామిడిచెట్లు మాకు నిలయాలు అనేలా మామిడిచెట్ల చివరను చేరి కోకిలలు శబ్దాలు చేశాయి.

అంతట, ఈ ఆశ్రమంలో ఉన్న కణ్వమహర్షికి నమస్కరించి తిరిగివస్తాను. అనుకొని భటులను అందరిని అక్కడే ఉంచి దుష్యంతుడు ఆశ్రమానికి వెళ్ళి ఎదుట

ఆ కణ్వాశ్రమంలో, పద్మాలతో నిండిన సరస్సు ఉన్న ప్రాంతంలో, మామిడిచెట్ల నీడ, పూలతీగల మధ్య, అందమైన అరటిబోదెలతో కూడిన పొదరింట్లో, పూలతోనిండిన ప్రదేశంలో దుష్యంతుడు కనుబొమలవరకు అందంగా కదలాడుతున్న ముంగురులుగల శకుంతలను చూచాడు.

(శకుంతలయొక్క) ఒత్తైన కేశపాశం, ఎత్తెన చనుకట్టూ, బెదురుచూపులు, కదలాడే నడుము, తేనెలొలికే మోవి దుష్యంతుని మనస్సును ఉవ్విళ్ళూరిస్తూండగా

అంతట దుష్యంతుడు గణగణమని ధ్వనిచేసే మన్మథుని వింటి గంటల మోతలకు లోబడి తనమనసులో

అడవిలో దొరికే కందమూలాలు తింటూ, ఇంద్రియ నిగ్రహంతో జీవించే కణ్వునికి కొమరిత జన్మించడం ఏమిటి?! ఈ బెదురు చూపుల చిన్నది నిశ్చయంగా మునికుమారి కాదు. ఈమెపై నాకు మనసైంది. ఈమె తప్పక రాజకుమారే అయి ఉంటుంది. పురువంశంలో జన్మించిన నాకు మునికుమారిని కోరే దురాలోచన వస్తుందా! అన్యాయంగా మా పురువంశంలో వారు దేనిని కోరుకోరు కదా!

నీ వెవరి పుత్రివి అని అడిగినట్లయితే తన మనసు బాధపడేలా 'నేను రాకుమారినికాదు' అని చెప్తుందేమో అని చంద్రవదన శకుంతలను ఏమీ అడగకుండా ఆలోచిస్తూ దుష్యంతుడు కొంతసేపు తడబడ్డాడు.

మళ్లీ ఎలాగో చివరకు తన మనఃప్రేరణ నిజమయ్యేటట్లుగా భావించి ఇలా అన్నాడు.

ఓ పూర్ణచంద్రముఖీ! నీవు రాజకుమారివని (నా మనసునకు) అనిపించి నా మనసు నీపై లగ్నం అయింది. నీవారేరి? నీపేరేమి? ఇలా నిర్జన ప్రదేశంలో తిరగడం న్యాయమా!

ఇలా మాట్లాడున్న దుష్యంతుని ముఖచంద్ర చంద్రికలను తన నేత్రచకోరాలతో శకుంతల తాగుతూ తడబడుచున్నవేళ

మన్మథుడు శివునిచే నిర్వీర్యుడు అయ్యాడు అనుట అసత్యము. అతడు పూలబాణాలు తీసికొని, అల్లెతాటికి సంధించి శకుంతలపై ప్రయోగించి ఆమెను శ్రమకు గురి చేయడం ఎలా జరిగింది?

ఈ విధంగా మన్మథుని వాడివైన క్రొత్త పూలబాణాల వెడికి తాళలేక శకుంతల ఇలా అంది.

పూర్వం మేనక అనే అప్పరఃకాంత, విశ్వామిత్రుడనే రాజు అమోఘమైన తేజస్సుతో నన్ను కన్నారు. నన్ను కన్న మేనక నన్ను అడవిలో వదలి వెళ్ళిపోయింది. కణ్వమహర్షియే నన్ను పెంచిపెద్ద చేశాడు. నా జనన విషయం అంతా కణ్వమహర్షికి తెలుసు. నా అదృష్టంకొద్ది నిన్ను చూడగలిగాను. ఇకపై కృతార్ధను అవుతాను.

ఓ దుష్యంతమహారాజా! నీ పరివారము, ప్రజలు, మేము అందరును నీ వారమే నీకు సంబంధించిన వారమే. మా ఆశ్రమంలో ఈనాడు ఉండి నీవు నీ వారు కలిసి మా యింట్లో (ఆశమంలో) నివ్వరి అన్నాన్ని భుజించి మా పూజలందుకో.

ఈ విధంగా శకుంతల పలుకగా దుష్యంతుడు ఆనందపడి, చేపకన్నులవంటి కన్నులున్న శకుంతల మనసులోని ఇష్టాన్ని గ్రహించి ఇలా అన్నాడు.

ఓ పద్మాక్షీ! నీవు రాజకుమారివి అనడం సత్యం. మరొకమాట లేదు. ఓ చంద్రవదన! రాజకుమారి తనకు తగిన యువకుని పాణిగ్రహణం చేసికోవడం న్యాయమే కదా!

ఈ విధంగా తియ్యని ప్రేమపూర్వకమైన మాటలతో ఆ శకుంతలను అంగీకరింపజేసి

ప్రజలందరిచే పొగడ్తలు గొన్న గొప్ప కీర్తిగల దుష్యంతుడు, తగిన సమయం ఎరిగినవాడై, ఆ అడవిలో, ఆ మత్తేభగమన శకుంతలను, గాంధర్వ విధిప్రకారం వివాహం ఆడాడు.

No comments:

Post a Comment

Puru dynasty (Paurava dynasty) - పూరు వంశం చరిత్ర(పౌరవ వంశం)

పూరు వంశం చరిత్ర (పౌరవ వంశం) ఓ భరతవంశ సంభవా! పరీక్షిన్మహారాజా! పూర్వం మీది పూరు వంశమే. అటువంటి పూరువంశంలో జన్మించిన నీకు మీ పూర్వులు, చక్కని...