Sunday, March 22, 2026

Vamanamurthy went to the palace of Emperor Bali - బలిచక్రవర్తి కడకు వామనమూర్తియేతెంచుట

బలిచక్రవర్తి కడకు వామనమూర్తియేతెంచుట

ఈ విధంగా ఉపనయనం పూర్తి అయిన తర్వాత మాయాబ్రహ్మచారి ఇతరదేశాలనుండి వచ్చిన కొందరు బ్రాహ్మణులను చూచి ఇలా అడిగినాడు.

దానాలు తీసుకోవటానికి బ్రాహ్మణులు దాతలదగ్గరకు పోతున్నారా? వారు కోరిన సంపదల్ని దాతలు ఇస్తున్నారా? మీరున్నూ అలా సంపదలు తెచ్చుకుంటున్నారా? ఈ విధంగా అర్థులకు అడిగింది ఇచ్చే దానవీరుడు ఎవడో చెప్పండి?

వామనా! దానం చేసేవారూ ఉన్నారు. ధనాన్ని గ్రహించేవారూ ఉన్నారు. బ్రాహ్మణులు తమ కోర్కెలను నెరవేర్చుకుంటున్నారు. కాని, దాతలలో బలిచక్రవర్తికి సమానమైనవాడులేడు. ఆయన శుక్రాచార్యులు చెప్పినట్లు నూరు యజ్ఞాలు చేసినాడు. అతనిని అడిగితే సకలభాగ్యాలూ పొందవచ్చు.

(అధ్వర శతము : నూరుయజ్ఞాలు గురువైన శుక్రాచార్యుని ఆశీస్సులతో చేసినవాడు బలిచక్రవర్తి, నూరుయజ్ఞాలు చేసినవాణ్ణి శతమఖుడు అంటారు. ఇంద్రునికి శతమఖుడని పేరు. బలి ఇంద్రుణ్ణి ఓడించి దేవలోకాన్ని ఆక్రమించడానికి కారణం అతడు 'శతమఖుడు' కావడమే.)

ఈ విధంగా తెలియచెప్పిన బ్రాహ్మణుల మాటలు విని లోకాలకు మెలుచేసేటందుకై లాభపుమాటలు అంగీకరిస్తూ, తల్లిదండ్రుల ఆనతి పొంది ఒక శుభముహూర్తాన వామనుడు బయలుదేరి. 

వామనమూర్తి బాగా హీనత్వాన్ని పొందిన ఇంద్రుని రక్షించేటందుకు ఆసక్తికలవాడయినాడు. వెంటనే పేదవానివలె దానం కోసం బలిచక్రవర్తి మందిరానికి వెళ్లడానికి సంకల్పించాడు.

అయ్యయ్యో! లక్ష్మీదేవిని తన వక్షఃస్థలాన కలిగినవాడు విష్ణువు. అయినా ఇంద్రుని కోసం రాక్షసుని (బలిచక్రవర్తిని) బిచ్చమడగటానికి వెళ్ళినాడు. ఇతరులకు మేలుచేయాలన్న బుద్దిగల గొప్పవారికి భూమిమీద యాచించటంకూడా ఒక అలంకారం వంటిదే. 

సకలలోకభారాన్నీ వహించే (విష్ణువగు) వామనుడు వెళుతున్నప్పుడు ఆయన బరువును మోయలేక భూమి క్రుంగి పోయింది. (భూమిని మోస్తున్న) ఆదిశేషుడుకూడా వంగిపోయినాడు.

వామనుడు ప్రయాణం చేస్తూ నర్శదానదిని దాటి 
ఉత్తరతీరాన ప్రవేశించినాడు. ఆ నది శుభాలు కలిగించేది. యముని దండ ఘాతాలను తగులకుండా కవచంలా కాపాడేది. ముక్తికాంత మనసులోని గుట్టును తెలిపేది. తన నీళ్ళతో దోషాలను నివారించేది.

(వామనుడు నర్శదానదిని దాటి ఉత్తరతీరాన ప్రవేశించినాడు. కనుక అదితికశ్యపుల ఆశ్రమం నర్మదకు దక్షిణాన ఉంటుందనుకొనవచ్చు. ప్రాచీనభూగోళశాస్త్రాన్ని పరిశోధించేవారికి ఇదొక ఆధారంగా నిలుస్తుంది.)

మంచితేజస్సుగల వామనుడు బలిచక్రవర్తి యాగశాలను చూచినాడు. అక్కడ దనుజులు అనేక విధాలుగ పెద్దగా ప్రేలాపన చేస్తున్నారు. ఆ యజ్ఞంలో పాల్గొన్న ఉద్దండులైన మునులను చూచి దేవతలూ సిద్దులూ భయపడుతున్నారు. ఆ స్థలానికి ముందువైపు ద్వారంలో ఏనుగులూ, గుర్రాలూ, సైన్యాలూ నిండి ఉన్నాయి. అక్కడి యజ్ఞకుండాల పొగలతో సూర్యుని రథం గుర్రాలు పూర్తిగా కప్పబడిపోతున్నాయి.

అలా వామనుడు బలిచక్రవర్తి చేస్తున్న అశ్వమేధ యజ్ఞవాటికను సమీపిస్తున్న సమయాన

'శివుడో విష్ణువో బ్రహృదేవుడో సూర్యుడో అగ్నిహోత్రుడో మాయావేషంతో వచ్చి ఉంటాడు. కాని, ఈ భూమిమీద బ్రాహ్మణుడెవ్వడూ ఇంత ప్రకాశంగా అందంగా ఉండడు' అంటూ ఆశ్చర్యంతో భ్రాంతిచెంది అక్కడివారు వామనుని చూచి చాటుమాటుగా సంభాషించుకున్నారు.

వామనుడగు బ్రహ్మచారిరాకకు గుసగుసలాడుకొంటూ, కలత పొందుతూ, ఎక్కువగా తొట్రుపడుతూ సభలో ఉన్న వారంతా కలవరపడినారు.

ఆ సమయంలో బలిచక్రవర్తి సభామంటపాన్ని చేరి, చెవులకు ఇంపుగా సామవేదం పఠించే ఉద్గాతల గానాలు విన్నాడు. మంత్రతంత్రాలను వివరిస్తూ హోమం చేసే హోతలను కలుసుకొన్నాడు. హోమకుండంలో త్రేతాగ్నులను ప్రజ్వలింపచేసే ఋత్విజులను చూచినాడు. యోగ విధులను నేర్పుగా పేర్కొంటున్న సభాపతులను సమీపించినాడు. ఆ సభను బాగా ఆకర్షించాలని కొంతసేపు వామనుడు ఆ సభలో తిరుగాడినాడు. ఇదంతా చేసిన వామనుడైన విష్ణువునకు పుట్టుకే లేదు. ఆయన అదితికొడుకుగా పుట్టినాడు. లక్ష్మికి ఆటపట్టైనవాడు, వామనుడు.

అంతేగాక, భయపడుతూ, వంగుతూ, పడుతూ, తొట్రుపాటుతో జనాలగుంపుల దగ్గరకుపోతూ, హరినామసంకీర్తనం చేస్తూ చాటునకు పోతూ, ఉలికిపడుతూ వామనుడు కొంతసేపు అక్కడ నటించాడు.

వామనుడు కొందరితో చర్చలు చేస్తాడు, కొందరితో వేదానికి సంబంధించిన జటపనసలను చెప్తాడు. కొందరితో ప్రసంగిస్తాడు. కొందరితో వాదిస్తాడు. కొందరితో సరదాగా మాట్లాడుతాడు. కొందరిని చూచి నవ్వుతాడు.

(క్రమ - జటా - ఘనా మొదలైనవి వేదాన్ని పఠించే పద్ధతులు. 'పనస' అంటే యజుర్వేద సంహిత భాగంలో ఉండే ఒక విభాగం పేరు.)

అంతేకాక అందరితోనూ అనేకవిధాలుగా వ్యవహరిస్తూ ఆనందించసాగినాడు.

చిన్ని నడకలు నడుస్తూ, అడుగులు వేసినపుడల్లా భూమి చలించి కుంగిపోతుండగా, తొట్రుపాటుతో కూడిన మాటలు మాట్లాడుతూ వామనుడు బలిచక్రవర్తిని సమీపించినాడు.

ఇతడే దానవచక్రవర్తి! దేవేంద్రుడూ అగ్నీ యముడూ మొదలయిన దిక్పాలకుల గర్వాన్ని తొలగించిన మొనగాడు ఇతడే! అత్యాశలేని నిండైన హృదయం కలవాడు ఇతడే! అనేకవిధాల యజ్ఞాల పుణ్యకార్యాలలో ప్రీతితో దానం చేసేవాడు ఇతడే! దేవతాస్త్రీల మనస్సులను కలవరపెట్టే వెన్నెలవంటి కీర్తకలవాడు ఇతడే! ఇతడే సత్యంతో దయతో ధర్మంతో ప్రకాశించే స్వరూపం కలవాడు.

ఈ విధంగా పలికి కుశపవిత్రంతోనూ అక్షతలతోనూ కుడి చెయ్యి ముందుకు చాపి ఇలా అన్నాడు.

ముల్లోకాలనూ శాసించగలవానికీ, నవ్వుకుంటూ అవలీలగా ఇంద్రుడిని జయించగలవానికీ, గొప్ప ఉన్నత పదములతో మెలిగేవానికీ, మునీంద్రుల పొగడ్తలనుపొందిన శుభకరమైన యాగకార్యాలలో విహరించేవానికీ, దేవతాస్త్రీల మెడలలోని బంగారుమంగళసూత్రాలను తొలగించేవానికీ, సమస్త రాక్షసలోక సార్వభౌమునికీ (నీకు) మంగళం.

ఆ విధంగా ఆశీర్వదించిన వామనుడు కరచరణాలతో మానవాకారాన్ని ధరించిన వేదరాశివలె బలిచక్రవర్తిముందు నిలబడినాడు. వంపులు లేకుండా జడలుగట్టిన జుట్టూ, దండమూ, గొడుగూ, కమండలమూ ధరించి ఉన్నాడు. ఆయన చంకలో భిక్షాపాత్ర వ్రేలాడుతూ ఉంది. అతని ముఖం చంద్రబింబంవలె అందంగా ఉంది. అప్పుడు ఆయన కొన్ని చతురోక్తులచే నటించినాడు. సూర్యుని కిరణాలతో కప్పబడిన ఇతరగ్రహాలు వెలవెలపోయినట్లు ఆ బ్రహ్మచారి ముందు భృగువంశపు బ్రాహ్మణులు మరుగున పడిపోయినారు. వారు లేచి నిలబడి వామనుని క్షేమాన్ని అడిగి మధురవాక్కులతో గౌరవించినారు. బలిచక్రవర్తికూడా ఆయనకు మొక్కి ఆసనంపై కూర్చొన బెట్టినాడు. తన ఇల్లాలగు వింధ్యావళి బంగారుకలశంతో నీళ్ళుపోయగా బలి వడుగు అడుగులను కడిగి తుడిచినాడు.

('దినకరకిరణపిహితంబులైన గ్రహంబుల చందంబునన్‌' అని పై వచనంలో ఒకచోట చెప్పబడింది. బృహస్పతి, శుక్రుడు, బుధుడు మొదలయిన శుభగ్రహాలు కూడా సూర్యునితో సమాగమంలో ఉన్నపుడు తమ ప్రభావాన్ని పూర్తిగా కోల్పోతాయి. సూర్యకిరణాల ప్రభావం మిగతా గ్రహాల కిరణాలను నిస్తేజం చేస్తుంది. జ్యోతిశ్శాస్త్రంలో దీనిని మౌ
ఢ్యము అంటారు. గురు, శుక్ర గ్రహాలకు సంబంధించి గురుమౌఢ్యం, శుక్రమౌఢ్యం అంటారు. అలాగే వామనుని తేజస్సునకు భృగ్వాదులు తిరోహితులయినారని గ్రహించవచ్చు.)

గంగను శివుడు జటాజూటంలో ధరించినట్టు, బ్రహ్మచారికాళ్ళుకడిగిన ఉదకాన్ని మంగళప్రదమని బలిచక్రవర్తి తన శిరస్సున చల్లుకొన్నాడు.

బలి మళ్లీ వామనునితో ఇలా అన్నాడు, ఓ బ్రహ్మచారీ! నీవెవ్వరి వాడవు? ఎవ్వడవు? నివాసస్థలమేది? నీవిక్కడికి రావడంవల్ల నా వంశం, నా జన్మం సఫలమైనాయి. మిగులధన్యుడనైతిని. ఈ యజ్ఞం పవిత్రమైంది. నా కోరికలు నెరవేరినాయి. అగ్నిహోత్రాలు బాగా వేల్వబడినాయి. ఈ కాలం చాలా మంగళప్రదమైంది.

ఓ బ్రాహ్మణోత్తమా! నీకేమి కావాలి? మేలిమివస్త్రాలా? రూకలా? పండ్లా? అడవిసంపదలా? ఆవులా? గుర్రాలా? రత్నాలా? రథాలా? మంచి భోజనాలా? కన్యలా? ఏనుగులా? బంగారమా? భవనాలా? గ్రామాలా? భూములా? భూభాగమా? ఇవిగాక ఇంకా ఏమైనా కావాలా?

('మాడ' అంటే 'వరాహా'లో సగం. రూకల్లో విశేషం.)

ఇలా ధర్మప్రకారంగా బలిచక్రవర్తి పలికిన పలుకులకు సంతోషించి వామనుడు ఈ విధంగా అన్నాడు.

ఇది నా నివాసస్థానం అని ఏ విధంగా చెప్పగలను? అంతటా ఉంటాను. ఎవరి చిన్నవాడ నని చెప్పగలను? నేను నాయంతవాడనై స్వేచ్చగా నడుచుకుంటాను. ఇలాంటి నడవడిక కలవాడనని ఎలా చెప్పగలను? పూనికతో మూడు పోకడలూ పోగలను. ఇది నేర్చుకున్నాను, అది నేర్చుకున్నాను అని అనడమెందుకు? అన్నీ నేను నేర్చుకున్నాను. ఇతరులెవరూ నాకు సాయం చేయరు కానీ ఇతరులందరకూ నేను సాయం చేస్తుంటాను. నేను ఒంటరివాడను. నాకెవ్వరూ చుట్టాలు లేరు. మునుపు నాకు సిరి (లక్ష్మి) ఉండేది. ఎక్కువగా నేను మంచివారితో ఉంటాను. అదే నా నివాసం.

రాజా! నీ పలుకులు నిజం. మంచి కీర్తిని ఇచ్చేదీ, నీ వంశానికి తగింది, ధర్మంతో కూడింది, మీ కులంలో కనికరం గలవారు ఆత్మబలం కలవారు తప్ప వేరేవారు జన్మించలేదు. యుద్ధంచేయడానికీ, దానం చేయడానికీ మీ వంశంలో భయపడేవారే లేరు. ప్రత్యర్థులకు పరాక్రమంతోను, అర్థులకు దానంతోనూ తృప్తి కలిగిస్తారు. మీ తాతలందరు బలిచక్రవర్తికి విరోచనుడు తండ్రి, ప్రహ్లాదుడు మొదటితాత, హిరణ్యకశిపుడు రెండవతాత, హిరణ్యాక్షుడు మూడవతాత పౌరుషశాలులు. మీ వంశాన ప్రహ్లాదుడు ఆకాశాన చంద్రునిలా ప్రకాశిస్తాడు. మీ వంశం సమృద్ధమైన యశస్సుతో సముద్రంవలె వృద్ధి చెందుతుంది.

(వామనుని చతురసంభాషణం ఈ పద్యంలో దాగి ఉంది. మాటకు కట్టుబడి ఉండటం, వంశప్రతిష్ట అనే రెండు అభిమానాలతో బలిచక్రవర్తి ముందరికాళ్లకు బంధంవేసే ప్రయత్నం ఈ మాటల్లో ఉంది.)

మునుపు నీ మూడవ తాతయైన హిరణ్యాక్షుడు విశ్వాన్ని జయించి గదాదండాన్ని ధరించి భూలోకమంతటా తిరిగినాడు. ఎక్కడా శత్రువు కనిపించలేదు. చివరకు ఆయనను శ్రీహరి వరాహరూపంలో పరిమార్చినాడు. ఆ సంగతిని హిరణ్యాక్షుని తమ్ముడైన హిరణ్యకశిపుడు విన్నాడు, విష్ణువు శౌర్యానికి ఆశ్చర్యపడినాడు. విష్ణువు విజయాన్ని బలాన్నీ తూలనాడినాడు. వెంటనే విష్ణువు నగరమైన వైకుంఠంపైకి దండెత్తినాడు.

(ప్రత్యర్థులైన హిరణ్యాక్ష హిరణ్యకశిపుల పరాక్రమాన్ని సుదీర్ఘంగా పొగడి విష్ణు పరాక్రమాన్ని తేల్చి చెప్పడం సందర్భోచిత వాక్యరచనలోని సొగసు.)

శూలపాణియై యమునివలె వస్తున్న హిరణ్యకశిపుని చూచి విష్ణువు సమయాసమయాలను గుర్తించి మాయచేయాలని మనస్సులో ఇలా ఆలోచించినాడు.

(విష్ణువును 'మాయావి' అని పిలవడం దైత్యుల కలవాటు. మాయగుణశీలుడు అనటం 'విష్టమాయి'కు చెందినది.)

ఈ హిరణ్యకశిపుని ఎదుర్కొని పోరాడి గెలిచేటందుకు శక్యంకాదు. అలాకాకుండా నేను ఎక్కడికైనా వెళ్లిపోతే లోకంలోని ప్రాణులపైకి మృత్యుదేవతవలె వెంటబడతాడు. ఆ విషయం తెలుసుకున్న హరి సూక్ష్మమైన రూపంతో ముక్కురంధ్రంద్వారా హిరణ్యకశిపుని గుండెలో ప్రవేశించినాడు.

ఆ తర్వాత హిరణ్యకశిపుడు వైకుంఠం చొచ్చి ఆయన కోసం వెదకినాడు. కానీ శత్రువు కనిపించలేదు. విష్ణువు కోసం ఆ రాక్షసుడు కోపంతో ఆకాశాన్నీ భూలోకాన్నీ స్వర్గాన్నీ గాలించినాడు. దిక్కులనూ, భూగర్భాలనూ, సముద్రాలనూ, పట్టణాలనూ, అడవులనూ అన్వేషించినాడు. లోకంలో ఎక్కడా శ్రీహరి జాడ చిక్కలేదు. చివరకు వెతకటం చాలించి తనలో ఇలా అనుకున్నాడు.

నా పగవాడు చచ్చి ఉంటాడు. అలా కాకుంటే కనపడకుండా ఉంటాడా? చచ్చిన విరోధిపై పగబూనటం మంచిది కాదని అధికారబలంతో తన పగను విడిచిపెట్టాడు.

బాధకు లోనయిన బ్రాహ్మణులవలె ఇంద్రాదులు మీతండ్రిని వేడగా ఆయన వారికి తన ప్రాణాన్ని (ఆయువును) ఇచ్చినాడు. ఈ ప్రపంచాన నీవుకూడా సామాన్యుడవుకావు.

(బలితండ్రి విరోచనుడు. ఆయన దేవతలకు ఆయువు దానం చేసిన కథను మాయావటువు జ్ఞాపకం చేస్తున్నాడు.)

నీవు మూడులోకాలను పాలించినావు. ఇంద్రాది దేవతలను వెడలగొట్టినావు, దానమివ్వటంలో మీ పూర్వులను పోలినావు. రాక్షసులను కాపాడటంలో సమర్థుడ వైనావు.

రాజ్యమున్నందుకు పూజింపదగినవారికీ, యాచకులకూ బ్రాహ్మణులకూ ధనాదికాన్ని పంచి మంచివాడుగ బ్రతకాలి. అలాకానప్పుడు వాని బతుకూ, ధనం, ఇల్లూ విడువదగినవే.

దాతలను లెక్కించేటప్పుడు ముల్లోకాలలోనూ గొప్పవాడ వని నిన్నే ముందుగా ఎన్నిక చేస్తారు. ఇన్ని దినాలనుండి ఎన్నడుకూడా నిన్ను పెట్టుమని పీడించిన వాడనుకాను.

రాక్షసరాజా! నాకు నీవు దానంచేయాలని కుతూహలపడుతున్నావు. నేను ఒంటిగాడను. నాకు సొమ్ములు, భూములు అవసరంలేదు. ఒకటి, రెండు (మూడు) అడుగులనేల మాత్రం ఇవ్వు. దానితో తృప్తిచెంది బ్రహ్మానందం పొందుతాను.

ఓ బ్రాహ్మణుడా! నీవన్న మాటలన్నీ నిజం. సత్యమైన విషయాలు పెద్దలు సమ్మతిస్తారు. అడుగదలచినావు కానీ కొంచెపుకోరికను కోరినావు. అయ్యో! దాత గొప్పతనపు తీరును తలచవద్దా!

భూభాగాన్ని కోరినావా? ఏనుగులను కోరినావా? గుర్రాలను కోరినావా? యువతులను కోరినావా? పసిబాలుడవు. నీకు అడగడం తెలియదు. ఇంతటి రాక్షసచక్రవర్తిని ఇంత చిన్న కోరికకోరినావు. అల్పమైనదానిని ఎలా ఇస్తాడు?

బలిచక్రవర్తి ఆ మాటనగా చిరునవ్వుతో శ్రీహరి బలితో ఇలా అన్నాడు.

నాకు గొడుగో, జందెమో, కుండికయో, ముంజిత్రాటిమొలతాడో, దండమో అవసరం. అంతేకాని బ్రహ్మచారిని అయిన నాకు ఏనుగులు, స్త్రీలు, గుర్రాలు ఎందుకు? కాదనక నేను కోరిన మూడడుగుల నేల ఇస్తే అదే నా పాలిటికి బ్రహ్మాండం (చాల గొప్పదానం).

అంతేగాక, ఆశించక, దుఃఖపడక, దొరికింది కొంచెమైనా దానినే పదివేలుగా భావిస్తూ తృప్తిపొందనివానికి ఏడు దీవులను ఇచ్చినాకూడా బాగుపడడు. (తృప్తిపడడు).

(సప్తద్వీపాలు= జంబూ, ప్లక్ష, కుశ, శాక, శాల్మల, క్రౌంచ, పుష్కరములు.

ఓ మహారాజా! ఆశ అనే తాడు చాలా పొడవయినది. దానికి అంతులేదు. పూర్వం వేనుని కుమారుడు పృథుచక్రవర్తి, గయుడు మొదలయిన రాజులు సముద్రాలదాకా వ్యాపించిన సామ్రాజ్యాన్ని సంపాదించి పాలించినారు. వారుకూడా కష్టపడినారు కానీ అర్ధకామాన్ని వదలలేదు. వారి ఆశలు నెరవేరనూ లేదు.

తృప్తి కలిగినవాడు మూడులోకాలలోను గౌరవింపబడుతాడు. సంతోషం కలవానికి ఎప్పుడూ సుఖం కలుగుతుంది. సంతోషం లేకపోవటమే సంసారంలో చిక్కుకోవడానికి కారణం. ఆనందంచే ముక్తికాంత లభిస్తుంది. ఏ పూటకు ఆపూట దొరకిన దానితో తృప్తిని పొందితే తేజస్సు పెరుగుతుంది. సంతోషం లేకపోతే నీళ్లవల్ల నిప్పు నశించినట్లు తేజస్సు తగ్గిపోతుంది. నీవు రాజువని నేను అన్నీ కోరటం న్యాయం కాదు. నాకు తగినట్లుగా నేనడిగిన మూడడుగుల చోటే కాదనకుండా ఇవ్వు. అదే చాలు, అంతే చాలు.

అలా పలికిన వామనునికి మూడుడుగుల నేలను దానం చేయటానికి బలిచక్రవర్తి జలకలశం తీసుకొన్నాడు. అంతలో రాక్షసరాజ్యనిర్మాణధుర్యుడైన శుక్రాచార్యుడు దానశీలుడైన దానవ చక్రవర్తితో ఇట్లా అన్నాడు.

ఓ రాక్షసరాజా! ఇతడు బ్రాహ్మణుడు కాదు. దేవతలపనిని నెరవేర్చేందుకు కశ్యపునికొడుకుగా అదితిగర్భంలో పుట్టినవాడు. తెలియక ఈతని కోరికను తీరుస్తానని చెప్పినావు. రాక్షసులకు హాని సంభవిస్తుంది. నీ ధనం, తేజం, స్థానం, ఐశ్వర్యం అన్నీకూడా ఈ వామనుడు మోసంతో తీసుకొని ఇంద్రునికి ఇస్తాడు. విశ్వరూపాన్ని ధరించి ప్రపంచాలన్నింటినీ మూడడుగులతో ఆక్రమించుకొంటాడు. సకలభాగ్యాలను హరికి సమర్పించి దీనునివలె నీవు ఎట్లా బ్రతుకుతావు?

ఈయన ఒక అడుగుతో భూలోకాన్నీ ఇంకొక అడుగుతో స్వర్గలోకాన్నీ తొక్కి (ఆక్రమించి) విశ్వరూపంతో దిక్కులూ ఆకాశమూ తానై సహింపశక్యం కాకుండా ఉన్నపుడు నీ వెక్కడికి పోతావో చెప్పు.

ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే వచ్చే నరకాన్ని త్రోసిపుచ్చడానికి నీవు సమర్థుడవుకావు. ఏ దానం చేయటంవల్ల హాని సంభవిస్తుందో అలాంటి దానం దానమే కాదని జ్ఞానులంటారు. దానం, యజ్ఞం, తపస్సు, కర్మం మొదలైనవాటిని భాగ్యవంతుడై ఉన్నపుడే చేయటానికి ఆలోచించాలి. తనకున్న ధనమంతా ఐదుభాగాలుగా చేసి ధర్మానికీ, అర్ధానికీ, కామానికీ, కీర్తికీ, ఆశ్రితులకూ సమానంగా ఇచ్చేవాడు ఇహపర లోకాలలో సంతోషంగా ఉంటాడు. తనకుమాలిన ధర్మం పనికిరాదు.

అంతేకాక ఈ విషయంలో పెక్కు విధాలుగా ప్రసిద్ధమైన ఒక ఋగ్వేదసూక్తి ఉంది. దానిని చెపుతాను శ్రద్ధగా విను.

ఓ రాజా! ఏది ఇస్తే సర్వమూ నష్టమవుతుందో ఆ దానం ఇవ్వరాదు. ఇస్తానని మాట ఇచ్చినా సరే, దానివల్ల అసత్యదోషం అంటదు. ఎందుకంటే దేహం అనే చెట్టుకు అసత్యమే మూలం. అటువంటి దేహ వృక్షానికి సత్యం, పూలు పండ్లుగా ఉంటాయి. అసత్యం అనే మూలం బాగుంటే దేహం అనే వృక్షం చెడదు. మొదలు చెడితే చెట్టుకూడా చెడుతుంది. పూలూపండ్లూ చెడుతాయి. పండ్లూ, పూలూ లేకపోయినా మొదలు బాగా ఉంటే చెట్టుబాగా ఎదుగుతుంది. కాబట్టి మొదటికి చేటుకలుగకుండ, లోటురాకుండ, పదుగురిలో పలుచన కాకుండ దానం చేసేదాత చెడడు. అందువల్ల సత్యం కోసం నీవు ఇతనికి దానమిస్తే నీకు మిగిలేది ఇక ఏమీ ఉండదు.

(శుక్రాచార్యుడు దానవ గురువు. కనుక, దానవకుల క్షేమాన్ని కోరినవాడుగా అసత్యమాడుమని ధర్మపన్నాలను చెప్పినాడు. పై పద్యంలోని శుక్రుని భావాలు వేదతత్త్వానికి వక్రభాష్యం. ఆత్మ అంటే దేహమని అర్థం. అది నిలపాలంటే అసత్యం పలకాలని శుక్రనీతి.)

అన్ని విషయాలలో ఇది వర్తించదు. సమస్తమూ ఉన్నా అడిగిన వస్తువు లేదని అబద్ధం చెప్పరాదు. ఆ విధంగా చెప్పేవాడు నీచుడు, పిరికివాడు. వాడు ప్రాణమున్న శవం. వాని బ్రతుకు వ్యర్థం.

దీనిలో ఇంకో విశేషముంది. వివరిస్తాను.

రాజా! ఆడవాళ్ల విషయంలోను, పెళ్లిళ్ల విషయంలోను, ప్రాణ ధన మానాలకు హాని వాటిల్లినప్పుడూ, భయపడిన గోవులనూ, బ్రాహ్మణులనూ ఆదుకొనేటప్పుడు అబద్ధం ఆడవచ్చు, పాపం రాదు.

ఉత్తమదాతా! కులాన్ని రాజ్యాన్ని పరాక్రమాన్ని నిలుపుకో. ఈ వామనుడు ప్రపంచాన్నంతా భరించేవాడు. కొంచెంతో పోయేవాడుకాదు. త్రివిక్రముడై బ్రహ్మాండాన్నంతా ఆక్రమిస్తాడు. ఇతనిని ఒక్కడుకూడా అడ్డగించలేడు. నా మాటవిని ఈ దానం చేయవద్దు. ఈ బ్రహ్మచారిని పంపించివేయి.

ఈ విధంగా శుక్రాచార్యుడు మేలుకోరి చెప్పగా క్షణకాలం కన్నులుమూసి ఆలోచించి యశస్వి అయిన బలిచక్రవర్తి ఇలా అన్నాడు.

ఓ మహానుభావా! నీవు నిజం చెప్పినావు. గృహస్థధర్మం ఇదే. ధనం, కోరిక, కీర్తి, జీవనోపాధి, వీటిలో ఏది కోరినా కూడా ఇస్తానని చెప్పినాను. ద్రవ్యలోభంతో యాచకునికి లేదని చెప్పి తిప్పిపంపలేను. ఇచ్చినమాట తప్పటంకంటె పాపంలేదు. పూర్వం భూదేవి 'ఎలాంటి చెడ్డపని చేసినవానినైనా మోస్తాను, కానీ ఆడిన మాటను తప్పిన వానిని మాత్రం మోయలేను అని బ్రహ్మతో చెప్పిందికదా! రణంలో వెనుకంజవేయక ప్రాణాలు విడువటం, మాటకు కట్టుబడి సత్యంతో బ్రతకటమూ మానధనులకు మేలైన మార్గాలు.

వ్యవసాయదారునికి మంచిపొలం, మంచి విత్తనాలు, ఒకేచోట దొరికినట్లుగా దాతకు తగిన ధనమూ, దానిని దానంగా గ్రహించే యోగ్యుడూ సమకూరటం అనే భాగ్యం ఉంటుందా?

శుక్రాచార్యా! రాజులులేరా? రాజ్యాలు లేవా? వారు అతిశయమయిన గర్వాన్ని పొందలేదా? అలాంటివారు ఎక్కడ ఉన్నారు?, వారు సంపదను మూటకట్టుకొని పోయినారా? భూమిమీద వారి పేరైనా ఉందా? శిబిచక్రవర్తి మొదలయినవారు కీర్తికోసం యాచకుల కోర్కెలను తీర్చలేదా? అలాంటి వారిని ఇప్పుడు కూడా జనులు మరచిపోలేదుకదా?

మహాత్మా! ఎడతెగని యజ్ఞాలు చేయటంచేత, తపస్సులు చేయటంచేతకూడా చూచేందుకు వీలుకాని గొప్పవాడయిన విష్ణువు ఆకృతియందు చిన్నవాడై నన్ను యాచిస్తున్నాడు. కనుక ఆయన కోరిన దానిని ఇవ్వటంకంటె నావంటి వానికి ఇంకేం కావాలి?

విష్ణవంతటివాడు చెయ్యిచాచి అడుగుతున్నాడు. ఆ చెయ్యి ఎంతోగొప్పది. మొదట లక్ష్మీదేవి కొప్పుపైన, శరీరం పైనా, భుజంపై ఉండే పైటపైన, పదపద్మాలపైన, చెక్కిళ్లపైన, పాలిండ్లపైన సరికొత్త గౌరవాన్ని పొందే ఆ చెయ్యి కిందుగా ఉండటం, నా చేయి మీదుగా ఉండటం మంచిదికాదా? ఈ రాజ్యం గీజ్యం శాశ్వతమా? శరీరం స్థిరంగా ఉంటుందా?

ఓ ధీమణీ! నరకమైనా, చెర అయినా భూమి అంతా నశించినా, దుర్మరణం సంభవించినా? వంశనాశనమైనా, జరుగవలసింది జరుగుతుంది, జరుగనీ! భయంలేదు. అభ్యాగతుడు శివుడైనా, విష్ణువైనా, బ్రహ్మదేవుడైనా, ఎవరైనా సరే! ఏమైనా సరే! వేయిమాటలెందుకు? నా నాలుకకు ఇవ్వననే మాట రాదు.

స్వచ్చమైనచరిత్రకలవాడా! అన్నమాట ప్రకారం ఆలస్యం చేయక ఇస్తానని చెప్పిన దానమిస్తే శ్రీహరి ఎందుకు బంధిస్తాడు? ఇది ఎక్కడిమాట! ఒకవేళ బంధించినా తనంత తానే కరుణించి విడిచిపెడతాడు. వదలిపెట్టకున్నా సరే!

మేరుపర్వతం తలకిందులైనా, సముద్రం ఇంకి పోయినా, భూమి పొడియైపోయినా, నక్షత్రమార్గం గతి తప్పినా తప్పకుండా ఈ దానాన్ని ఇస్తాను.

పూజ్యుడా! ఈ వామనుడు ఎప్పుడూ ఇతరులను వేడడట. సాయంలేనివాడట. తలిదండ్రులూ అన్నదమ్ములూ లేనివాడట. అన్ని విద్యల మూలాన్ని తెలుసుకున్న నేర్పరియట. నా ముందు చేతులొగ్గి నిలువగా ఈ ముద్దు బాలుని పొమ్మనేందుకు బుద్ధిపుట్టటంలేదు.

(ఇది వామనుని సామాన్య సాధారణ పరిస్థితిగా కనిపించినాకూడా నిదానించి పరికిస్తే ఇది పరమాత్ముని లక్షణాలను చెప్పిన పద్యం.)

పై రీతిగా పలికిన బలిచక్రవర్తి సత్యమార్గం నుంచి చలించలేదు. ఆ మార్గంనుండి ఆయనను మార్చడానికి వీలుకాదు. అతని మనస్సు దృఢమైంది. కీర్తి నిర్మలమైంది. ఆయన దానం అడిగేవారికి సమీపబంధువు. అతడు వామనునికి దానమిచ్చే కుతూహలంతో తహతహలాడటం చూచి అతనిపై శుక్రాచార్యుడు కోపపడినాడు. 'నా ఆనతిని మీరినావు. కనుక త్వరలో పదభ్రష్టుడవైపోతావు' అని శపించినాడు. గురువు శాపానికి గురిఅయికూడా బలిచక్రవర్తి బాధపడలేదు. ఆయన అసత్యమార్గాన్ని అవలంబించలేదు.

బాగా బతికినా, బాగా కష్టాలకు గురైనా, బీదతనం వచ్చినా, ప్రాణానికీ ధనానికీ చేటు వచ్చినా, చివరకు చావే సంభవించినాకూడా మానధనులు మాట తప్పలేరు.

బలిచక్రవర్తిభార్య వింధ్యావళి పెనిమిటి చేసిన సంజ్ఞను తెలిసికొని బ్రహ్మచారిపాదాలు కడుగుటకు బంగారు కలశంతో నీళ్లు తెచ్చింది.

అపుడు వామనునితో బలిచక్రవర్తి ఇలా అన్నాడు.

బాలకశ్రేష్ఠుడా! రమ్ము! లెమ్ము! నీ కోరికను లేదనకుండా ఇస్తాను. నీ పాదాలు కడుగనిమ్ము ఇక ఆలస్యం చేయటం ఎందుకు?

బలిచక్రవర్తి తన రెండు చేతులతోనూ కడగడానికి అనుకూలంగా వామనుడు తన పాదాన్ని చాచినాడు. ఆ పాదం మునులచే, దేవతలచే ప్రార్ధించబడునది, సంపద నిచ్చునది, లక్ష్మీదేవి నొసటి కస్తూరి బురదతో కూడినది, పద్మంవలె పరిమళాన్ని వెదజల్లేది, రత్నాల అందెగా చేయబడిన వేదాలుకలది.

దేవలోకాన్ని కాపాడేదీ, నిత్యం సంపత్తును కలుగచేసేదీ, సర్వోపనిషత్తులకూ భూషణమైనదీ, భవబంధాలను పోగొట్టేదీ అయిన హరిచరణాన్ని బలిచక్రవర్తి కడిగినాడు.

ఈ విధంగా వామనుని కుడిఎడమ పాదాలను బలిచక్రవర్తి కడిగినాడు. పవిత్రమైన ఆ జలాలను నెత్తిపై చల్లుకొన్నాడు. ఆచమించినాడు. దేశమూ కాలమూ మొదలయినవాటిని లెక్కించినాడు (సంకల్పం చెప్పినాడన్నమాట).

'విష్ణుస్వరూపుడవూ, ప్రకటమయిన వ్రతం కలవాడవూ, వేదప్రామాణ్యం తెలిసినవాడవూ, బ్రాహ్మణుడవూ అయిన నీకు మూడడుగుల భూమిని ఇస్తున్నాను అంటూ బ్రహ్మచారి అయిన వామనుని చేయి సాచి పూజించి 'పరబ్రహ్మ ప్రీతికై ఇస్తున్నాను' అని ప్రపంచమంతా ఆశ్చర్యం చెందేటట్లుగా ధారవోసినాడు.

నీటిధార పడకుండా శుక్రాచార్యుడు కలశం రంధ్రానికి అడ్డుపడి ఆపినాడు. ఆ సంగతి తెలిసిన వామనుడు దర్భకొనతో పొడిచినాడు. దానివల్ల శుక్రునికి దర్భకొన కంటిలోగుచ్చుకొంది. శుక్రుడు ఒక కన్నువాడైనాడు.

బలిచక్రవర్తి (దానమిస్తున్నట్లు తెలిపే ) పవిత్రోదకాన్ని ధారపోసి నాడు. ఆ నీటి బిందువులకు వామనుడు తన చెయ్యిని ఒడ్డినాడు. ఆ చెయ్యి రాక్షసుల తలలను ఖండించినట్టిది. లక్ష్మీదేవిని ఆకర్షించటంలో మెలైనది. రమాదేవి శిరోజాలచే సేవించబడినది. నిర్మలమైన శ్రీదేవి కుచాగ్రాలమీద ఉంచబడినది.

బలిచక్రవర్తి అందించిన దానధారను వామనుడు గ్రహించినాడు. ఆ జలధార మునీశ్వరుల దాననియమాల సంకల్పాలకు ఆధారమైనది. రాక్షసస్త్రీలను కన్నీటిపాలు చేసేది. రాక్షసరాజు బలిని నిరాధారునిగ మార్చేది.

విష్ణువును, కాలాన్ని దేశాన్ని శుక్రాచార్యుని మాటలను, నాశనమును ఎరిగికూడా బలిచక్రవర్తి ఆ దానం యోగ్యమైనదిగా భావించి ఇచ్చినాడు. భూమిమీద ఆతనికన్న మరొకదాత ఉంటాడా? (లేడు)

పరీక్షిన్మహారాజా! సకల భూతాలకూ విష్ణువు అధిపతి. ఆయనకు బలిచక్రవర్తి దానం చేయగానే దిక్కుల ధ్వనులతో, పంచభూతాలూ బళి బళి అని పొగడినాయి.

భూమిని దానమిచ్చినవానికీ, దానిని ప్రీతితో పుచ్చు కొన్నవానికీ పాపాలు నశిస్తాయి. వారు సంతోషంగా నూరేండ్లు స్వర్గంలో విహరిస్తారు.

'అందువల్ల ఏ దానమూ భూదానానికి సమానంకాదు. భూదానం ఇచ్చిన నీకు రెండులోకాలలోనూ కీర్తి, పుణ్యం కలుగుతుంది.' అని పలికి మాయావటుడు మళ్లీ ఇలా అన్నాడు.

నేనెందుకు దీనిని అడిగినానని నీ మనస్సులో విచారింపక దానమివ్వు, సత్యం పెంపొందేవిధంగా దీనిని అడిగినాను. ఈ మూడడుగులు ఇస్తే మాకు మూడులోకాలు ఇచ్చినట్లే.

అలా పలికిన వామనుని మాటలకు బలిచక్రవర్తి చాలా సంతోషించి

'పుట్టిన తర్వాత నేర్చెనో పుట్టకముందే నేర్చెనో కానీ, ఈ చిట్టి పొట్టి పాపని పొట్టనిండ మాయలే' అంటూ నవ్వి బలి భూమిని దానమిచ్చినాడు.

Sri Chakra

 


Sri Lalitha Devi 25 Namalu - శ్రీ లలితా మహాత్రిపురసుందరి 25 (ఇరవై ఐదు) నామాలు

శ్రీ లలితా మహాత్రిపురసుందరి 25 (ఇరవై ఐదు) నామాలు 

ఇది బ్రహ్మా మహాపురాణం యొక్క ఉత్తరాభాద్ర అనే లలితోపాఖ్యానంలోనూ, మూడవది భండాసురునితో యుద్ధానికి ముందుకు వచ్చినప్పుడు దేవతలు శ్రీదేవిని, ఆమె శక్తి సేనుని స్తుతించారు. ఈ శ్రేణిలోని మొదట శ్రీ వారాహి దేవి యొక్క పన్నెండు నామాలు, రెండవది, శ్రీ శ్యామల యొక్క పదహారు నామాలు మరియు చివరగా శ్రీ లలితా మహాత్రిపురసుందరి యొక్క ఇరవై ఐదు నామాలు.

శ్రీ అగస్త్య ముని కోరిన విధంగా శ్రీ హయగ్రీవ సమేత శ్రీ లలితా దేవి రచించిన లలితోపాఖ్యాన, కాంచీపురంలోని కామాక్షి ఆలయంలో

అగస్త్య ఉవాచ:
వజ్రవత్ర మహాబుద్ధే ప ~ న్చ విమ్షతి నమోభిః 

లలితా పరమేశన్యా దేహి కర్ణ రసానామ్ 


అగస్త్యుడు ఇలా అంటాడు, "ఓ గుఱ్ఱం ఎదురయింది ప్రభూ! దయచేసి చెవులకు మకరందం లాంటి ఆ ఇరవై ఐదు పేర్లు చెప్పండి "

1. సింహాసనేశి,
2. లలితా,
3. మహారాజ్ఞి,
4. వరానకుషా,
5. చాపిని,
6. త్రిపుర,
7. మహాత్రిపురసుందరి,
8. సుందరి,
9. చక్రనాథ,
10. సామ్రాజ్ని,
11. చక్రిని,
12. చక్రేశ్వరి,
13. మహాదేవి,
14. కామేశి,
15. పరమేశ్వరి,
16. కామరాజప్రియ,
17. కామకోటిక,
18. చక్రవర్తిని,
19. మహావిద్య,
20. శివారంగవల్లభ,
21. సర్వపాఠల,
22. కులనాథ,
23. అమ్నయనాథ,
24. సర్వన్మాయనవాహిని,
25. శృంగారనాయక.


Sandhya Deepam - సంధ్యా దీపం

సంధ్యా దీపం

శుభం కరోతి కళ్యాణం
ఆరోగ్యం ధన సంపద,
శత్రు బుద్ధి వినాశాయ 
దీప జ్యోతిర్ నమోస్తుతే,

దీప జ్యోతిః పరబ్రహ్మ 
దీప జ్యోతి జనార్దనః 
దీపో హారతి మే పాపం
దీప జ్యోతిర్ నమోస్తుతే,

ఏ దీపజ్యోతి ఐతే శుభం, మంచి ఆరోగ్యం, ధనసంపదలు నాకు ప్రసాదిస్తుందో, చెడు తలుపులను తొలగిస్తుందో ఆ దీపజ్యోతికి ప్రణమిల్లుతున్నాను. 

ఏ దీపజ్యోతి పరబ్రహ్మమో, ఏ దీపజ్యోతి జనార్దనుడో ఏ దీపజ్యోతి నన్ను పాపములు చేయకుండా కాపాడుతుందో ఆ దీపజ్యోతికి ప్రాణముల్లుతున్నాను.

నిత్య పారాయణ శ్లోకాలు

నిత్య స్తోత్రావళి

పంచాంగం

The Event of the Appearance of Vamanamurthy - వామనమూర్త్యావిర్భావఘట్టము

వామనమూర్త్యావిర్భావఘట్టము

మట్టమధ్యాహ్నం - గ్రహాలు, నక్షత్రం, చంద్రుడు శుభప్రదమైన చోట ఉండగా అభిజిల్లగ్నాన భాద్రపద మాసం శుక్ల పక్ష ద్వాదశిని వ్రతశీల పతివ్రత అగు అదితికి వామనుడై హరి జన్మించినాడు.

(పగలు పదునాలుగు గడియలమీద రెండు గడియల కాలంతో కూడిన లగ్నం అభిజిత్‌ లగ్నం.)

వామనుడు పుట్టినపుడు ఆయనకు నాలుగు చేతులూ ఆ చేతులలో శంఖమూ, చక్రమూ, గదా, పద్మమూ ఉన్నాయి. కపిలవర్ణంగల వస్త్రమూ, మకరకుండలాలతో మెరిసే చెక్కిళ్ళు, రొమ్ముపై శ్రీవత్సమూ, కమలాలవంటి కన్నులూ కలిగి ఉన్నాడు. తుమ్మెదలు మూగిన అందమైన వనమాల మెడలో కదలుతున్నది. రత్నాలుకూర్చిన బంగారు ఒడ్డాణం, బాహుపురులూ, కిరీటమూ, హారాలూ, కాలి అందెలూ కాంతులు వెదజల్లుతున్నాయి. కమనీయమైన కంఠభాగాన కౌస్తుభమణి మెరుస్తున్నది. ఆయన రూపం అందరి మనసులనూ ఆకర్షిస్తున్నది.

వామనుడు పుట్టగానే యక్షులు, గరుడులు, దేవతలు, సిద్దులు, నాగపతులు దుఃఖాన్ని వదలినారు. సాధ్యులూ, చారణులూ, ఋషులునూ, ఋత్విజులూ, విద్యాధరులూ సంతోషించినారు. సూర్యచంద్రులు కాంతులు విరజిమ్మినారు. కింపురుషులూ, గంధర్వులూ, కిన్నరులూ పాటలతో వాద్యాలు మోగిస్తూ ఆకాశంలో నాట్యాలు చేసినారు.

దిశల చీకటి పోయింది. సప్తసముద్రాలూ చాలా నిర్మలంగా అయినాయి. భూమి బ్రాహ్మణులచేత, ఆకాశం దేవతలచేత సేవించబడింది.

దేవతలు గుంపుగా పూలవానలను కురిపించినారు. పూలతేనియలు తుంపరలుగా రేగినవి. పుప్పొడిబురదచే భూభాగమంతా ఎక్కువగా కప్పబడింది.

'ఈ మహానుభావుడు ఇంతకాలం నా కడుపులో ఎలా ఉన్నాడా' అని అదితి ఆశ్చర్యపడింది. కశ్యపుడు ఆనందంతో కూడిన జయజయ శబ్దాలతో స్వామిని సంస్తుతించినాడు.

ఆ తర్వాత వామనుడు ఆయుధాలూ అలంకారాలూ కలిగిన తన దివ్యరూపాన్ని వదలి కపటవటునిగా మారురూపాన్ని ధరించినాడు. పొట్టిపిల్లవాడై వడుగు చేయదగిన వయసు కలవాడైనాడు. మారురూపం పొందిన ఆ కొడుకును చూచి అదితి ఆనందంతో పరవశించింది.

“ననుగన్న తండ్రీ! నా పాలి దేవుడా! నా తపములపంటా! నా కొడుకా! నా వడుగుపాపా! నా వంశాన్ని ప్రకాశింపచేసేవాడా! నా సంపదలకుప్పా! రావయ్యా!” అంటూ అదితి వామనుని పిలిచింది.

నాన్నా! దగ్గరకు రా! అని అదితి వామనుని పిలిచింది. బిడ్డ చేరువకు రాగానే ఆమె చనుబాలు జాలువారినవి. అక్కున చేర్చుకుంది. అతని చిన్నారి మొగాన్ని తడిమింది. కన్నులారా చూచింది.

'ఈ అదితికి లక్ష్మీ పార్వతులే సమానమైనవారు. ఇతరులు సరికారు' అంటూ పుణ్యాంగనలు బాలెంతరాలుకు పదిరోజులు పురుడు జరిపినారు.

ఆ తర్వాత వామనునికి వడుగు చేయటానికై కశ్యపప్రజాపతిని ముందుంచుకొని మునీంద్రులు తగిన కార్యకలాపాలు చేసినారు. వామనునికి సూర్యుడు గాయత్రీ మంత్రాన్ని ఉపదేశించినాడు. బృహస్పతి జన్నిదాన్నీ, కశ్యపుడు ముంజదర్భల మొలతాడునూ, అదితి కౌపీనాన్నీ, భూదేవి నల్లనిజింకచర్మాన్నీ, చంద్రుడు దండాన్నీ, ఆకాశం గొడుగునూ, బ్రహ్మ కమండలాన్నీ, సరస్వతీదేవి జపమాలికనూ; సప్తర్షులు పవిత్రమైన దర్భలనూ ఇచ్చినారు.

పరీక్షిన్మహారాజా! కుబేరుడు వామనునికి భిక్షాపాత్రను ఇచ్చినాడు. పార్వతీదేవి 'అక్షయం' అంటూ ఆ వటునికి పూర్ణభిక్షను పెట్టింది.

పరిశుద్దులయిన బ్రహ్మర్షులచే పూజించబడినవాడై మంత్రాలను చదువుతూ ప్రశస్తమయిన అగ్నిహోత్రాన పూర్వాచారాన్ని అనుసరించి వటుడు హోమం చేసినాడు.

Saturday, March 21, 2026

Vamana Avatar Story - వామనచరిత్ర కథాప్రారంభము

వామనచరిత్ర కథాప్రారంభము

పై విధంగా చెప్పిన శుకునితో పరీక్షిత్తు ఇలా అన్నాడు.

హరి బలిచక్రవర్తిని ఎందుకొరకు మూడడుగుల భూమిని యాచించినాడు? విష్ణువు పూర్ణపురుషుడు, పూర్ణకాముడు, నిర్వికారుడు, లక్ష్మీదేవితో కూడినవాడు. అటువంటివాడు బలిచక్రవర్తి వద్దకు దీనునివలె ఎందుకు పోయినాడు? తప్పేమీలేని నిష్కలుషుడైన బలిని ఎందుకు బంధించినాడు? ఈ కథ వినాలని కుతూహలంగా ఉంది.

(రమాసంపన్నుడైన విష్ణువు యాచకుడుగా వెళ్ళటం ఒక వింత. మూడడుగులనేలను యాచనచేసి పుచ్చుకొని దాత అయిన బలిని బంధించడంలో వంచన కనిపిస్తుంది. జగత్త్రయోన్నత న్యాయపీఠమైన విష్ణువు నిరపరాధిని దండించటం ఏమి? బలిచక్రవర్తి కథలో ఈ సందేహాలు జిజ్ఞాసువులకు తప్పక కలుగుతాయి. దీనికి సమాధానంగానే బలి- వామనమూర్తుల కథాగమనం జరుగుతుంది.)

పై విధంగా పలుకగా శుకముని ఈ విధంగా చెప్పాడు.

బలిచక్రవర్తి ఇంద్రునిచేతిలో ఓడిపోయి శుక్రాచార్యుని అనుగ్రహంచే తేరుకొన్నాడు. శుక్రునికి దయకలిగేటట్లు శిష్యుడై సేవించినాడు. బలి భక్తికి శుక్రుడు మెచ్చుకున్నాడు. బలిచేత నియమపూర్వకంగా విశ్వజిద్యాగాన్ని చేయించినాడు. బలిచక్రవర్తికి బంగారు పట్టముచే ఒప్పు రథమూ; సూర్యుని గుర్రాలతో సమానమగు గుర్రాలను, సింహపతాకాన్నీ దివ్యధనువునూ, అంబులపొదులజంటను, కవచమును మొదట హోమపావకుడిచ్చినాడు. తర్వాత తన తాతగారు ప్రహ్లాదుడు వాడిపోని తామరపూవులదండను, శుక్రుడు చంద్రునివంటి తెల్లని శంఖాన్ని ఇచ్చినారు.

ఈ విధంగా, బలిచక్రవర్తి బాణాలూ, రథమూ, ఖడ్గమూ, అంబులపాదీ, విల్లూ, పూలదండా, గుర్రమూ, కవచమూ, రత్నఖచితసువర్ణ కంకణాలూ సాధించినాడు.

బలిచక్రవర్తి బ్రాహ్మణులకు పలురకములైన దానాలిచ్చి, వారి ఆశీస్సులను పొందినాడు. పెద్దలకు నమస్కరించినాడు, విశిష్టదేవతలను నిండు భక్తితో పూజించినాడు. నిర్మలచరిత్రుడైన ప్రహ్లాదుని పిలిపించుకొని నమశిరస్కుడై నమస్కరించినాడు. దివ్యకాంతులతో తేజరిల్లు రథమునెక్కి పర్వతశిఖరముపై ప్రజ్వరిల్లుతున్న దావాగ్నివలె జాజ్వల్యమానుడైనాడు (ప్రకాశించాడు).

బలిచక్రవర్తితో సమానమైన బలముగల దైత్యసేనాధిపతులు ఆయనముందు వినమ్రులై నిలిచినారు. వారు మృత్యుదేవతయైన, యముడినే దండింపగల ఉద్దండులు. దేవతలూ, సిద్దులూ, సాధ్యులూ, గంధర్వులూ మొదలయినవారిని భంగపరచినవారు. దిక్కులను పిండిగొట్టగలిగినవారు.

పరీక్షిన్నరేంద్రా! బలిచక్రవర్తి తన చూపులతో ఆకాశాన్ని మింగుతూ, నింగినీ నేలనూ తలకిందులుగా చేయడానికి ప్రయత్నిస్తూ దేవతల రాజధానినగరానికి బయలుదేరినాడు.

ఈ విధంగా బలశాలియైన బలిచక్రవర్తి దేవేంద్రుని జయించి పగతీర్చు కోవటానికి వేగంగా దీర్ఘమైన ప్రయాణం సాగించి.

పుణ్యాత్ములు నివసించుటకు తగినది, వ్యాధులనూ, నీద్రనూ, బాధనూ, అన్నం తినటం మొదలయిన దుఃఖాలను బాపునదీ, పూలచేత చిగుళ్లచేత పండ్లచేత గొప్పవయిన చెట్లగుంపులచే ఒప్పునదీ, ఎగురుతున్న జెండాలుకలదీ, సంచరిస్తున్న విమానస్థులగుంపు కలదీ, ఇంద్ర వైభవము కలదీ అగు స్వర్గాన్ని చూచెను. అది దేవేంద్రుని రాజధాని - అమరావతి.

బలిచక్రవర్తి చాలా విశాలమైన దేవతలపట్టణాన్ని సమీపిస్తూ వేగంగా ముందుకు సాగినాడు. తొలుత పెద్దతోటలు కనిపించినాయి. ఆ తోటలలోని చెట్లు ఎప్పుడూ అందంగా పొటమరించే చిగుళ్లతో, రెమ్మలతో, మొగ్గలతో, అరవిచ్చిన విరులతో, విరబూసిన పూలగుత్తులతో, పిందెలతో, లేతకాయలతో, దోరగాయలతో, పండ్లగెలలతో నిండి బరువెక్కి వంగి ఉన్నాయి.

దట్టమయిన ఆ తోటలలో తుమ్మెదలగుంపుల జంటలు వదలక సొగసైన కొత్తపూలతో నిండి ఉన్న పూతేనియను కొసరి కొసరి తాగి బలసి కైపెక్కి జుంజుమ్మని సంతోషంతో విహారంచేస్తున్నాయి. కోయిలగుంపులు జంటబాయక కలసిమెలసి గున్నమామిడి చెట్ల కొమ్మలలో ముసరి సొంపుగా చిగురుటాకులు మెక్కి ఉత్సాహంతో గానం చేస్తున్నాయి. చిలుకల గుంపులు మత్తెక్కి త్వరపడుతూ పోరాడుతూ చెలరేగి నేర్పుతో తియ్యని పండ్లుతిని కలకలధ్వనులు సలుపుతున్నాయి. పావురాలు చిలుకలనుమించి ఆకసానికి ఎగురుతూ ఆడపావురాలను దగ్గరకు పిలుస్తూ అటూ ఇటూ పోనీయక అడ్డుకొంటూ తమ నెలవులపై వ్రాలి ఇంపుగా గుబాళిస్తున్నాయి.

రాజహంసలు అందమైన సరస్సులవద్ద ఉత్సాహంగా ఆడ హంసలతో కలిసి తమ వాడిముక్కులతో లేత తామరతూడులు చీల్చి తిని సంతోషంతో సవ్వడి చేస్తున్నాయి. అందమైన ఆ సరస్సులు హంసల కాంతికంటె అధికంగా మిలమిలమెరుస్తూ సిరికి నెలవులవంటి బంగారుతామరలతో విరాజిల్లుతున్నాయి. ఆ సరస్సుల అలలలో తడిసిపోయి వడవడ వణకుతూ అల్లిబిల్లిగా అల్లుకొని నేలవ్రాలిన దట్టమైన తీగల సందులలో జొరబడి ఇంపైన పూలవాసనలతో బరువెక్కి లోపలకు దూరలేక చల్లగాలులు చతికిలపడుతున్నాయి. ఆ గాలులతో కలిసి పై కెగిరిన పుప్పొడులు ఆకసంలో నిండి రంగురంగుల మేలుకట్టు చాందినీలను సృష్టిస్తున్నాయి.

పుప్పొడి రంగులతో కలిసిన కాలువల గట్లమీద ఇచ్చ వచ్చినట్లుగా పచ్చిక గుబురులు మేస్తూ మైమరచి నెమరువేస్తూ తమ పెద్దపొదుగులు కదలిస్తూ కామధేనువులు నడచి వస్తున్నాయి. వాటి దూడలు వాడవాడలలో చెంగుచెంగునదూకి ఆడుకుంటూ తల్లుల వెంట వెళ్లుతున్నాయి. కామధేనువులు దూడలతోకూడి ఇండ్ల వాకిండ్లు చేరి పౌరులు కోరినన్ని పాలు కురుస్తున్నాయి. కోరినవారి కోరికలు తీర్చే కల్పవృక్షాలు ఆ కామధేనువులకు నిలువ నీడనిస్తున్నాయి. ఆ కల్పవృక్షాల చిగుళ్ళనూ పూలగుత్తులనూ కోసి మదపుటేనుగులు ఆడఏనుగులకు ప్రేమతో ఇచ్చి సంతోషాన్ని కలుగజేస్తున్నాయి. ఆ మదపుటేనుగులు క్రీడాపర్వతాల సాగసుతో ఒప్పారుతున్నాయి. అవి పడుచులకు నడకలు నేర్పు ఒజ్జలై మురువుగా నడుస్తున్నాయి. ఆ ఏనుగుల శరీరాలు రాచుకోవడం వల్ల కరకుతనం పోయి నున్నబడుతున్న మకరతోరణ స్తంభాలు కనువిందు కలిగిస్తున్నాయి.

మకరతోరణాల స్తంభాల వద్ద రంభ మొదలయిన అప్సరసలు నిలబడి ఉన్నారు. వారు మన్మథుడు ఒరలోనుండి తీసిన పదునుకత్తులవలె మెరుస్తున్నారు, నిలుకడగల మెరుపుతీగలవలె ఉన్నారు. కాళ్ళూ చేతులూ మొదలయిన అవయవాలు కలిగిన నెలవంకవలె ఉన్నారు. రూపుదాల్చిన మోహినీ విద్యలవలె చూపులకు హాయి కలిగిస్తూ శృంగార రహస్యాలు తెలుసుకోవటంలో పేరుగాంచినవారై, విమానాలపై స్వర్గలోకానికి వచ్చే పుణ్యాత్ములకు త్వరగా ఎదురుపోయి కొందరిని సగౌరవంగా వాహనాలపై ఎత్తుకొని/మోసుకుంటూ మరి కొందరని తోడ్కొని పోతున్నారు.

ఆ నగరానికి చుట్టూ అందమైన అగడ్తలు ఉన్నాయి. ఆ అగడ్తల నీటిలో అంచలూ రాయంచలూ, చక్రవాకాలూ, బెగ్గురు పక్షులూ విహారం చేస్తుంటాయి. అందలి కలువలలోనూ, కమలాలలోనూ తుమ్మెదలు సంతోషంతో సంచరిస్తుంటాయి.

ఆ అగడ్తలు అడ్డులేని తరంగాలుగల గంగానది ఆకాశానికి పొంగినట్లు వెరగు కలిగిస్తుంటాయి దేవకన్యలు గుంపులు గుంపులుగాచేరి వాటిలోని తేటనీటిలో అందంగా హాయిగా జలకా లాడుకొంటుంటారు.

ఆ నగరం ముంగిలిలో భద్రమైన బంగారు తలుపులుగల పెద్దగోపురా లున్నాయి. ఆ గోపురాల గడపలను అక్కడి దేవవేశ్యలు పూజిస్తుంటారు. ఆ ద్వారాల ప్రక్కన అరుగులపైన రత్నకాంతులు వెదజల్లే ఇంద్రనీలాలస్తంభాలు ఉన్నాయి. ఆ నాలుగు ద్వారాలకూ పద్మరాగాల మాలలు వేలాడుతున్నాయి. ఆ ద్వారాల దగ్గర ఉన్న చావిళ్ళలో పరాక్రమ వంతులయిన ద్వారపాలకులు ఆయుధాలు ధరించి మెలకువతో కాపలాకాస్తున్నారు. వారు దేవదానవుల యుద్దాల ముచ్చటలు ముచ్చటించుకుంటుంటారు. అచ్చటి ఎత్తెన మెట్ల వరుసలు వీరరస సముద్రపు చెలియలికట్టల వంటి అచ్చమైన పాలరాళ్ళతో కట్టబడి ఉన్నాయి. అక్కడి కోటలు అత్యంత శోభాయమానమై వజ్రాలతోనూ వెండితోనూ నిర్మించబడి ఉన్నాయి. ఆ కోటల పైభాగాలు చంద్రుని కిరణాలు వెల్లివిరిసే తెల్లని అద్దాలవలె ఉన్నాయి. వాటికాంతులు చుక్కలను ధిక్కరిస్తుంటాయి. ఆ నగరలక్ష్మి ప్రాయంతో నిండిన యువతివలె మేఘాలను చూస్తూ బ్రహ్మను ప్రార్థించి సంపాదించిన బంగారు పరదాలవలె పెద్ద పెద్ద వెండి ప్రాకారాలు ప్రకాశవంతాలై ఉన్నాయి. ఆ ప్రాకారాలపై మరకతమణులతో నిర్మించిన బురుజులున్నాయి. కోట్ల కొలది గంధర్వ సైనికులు రణసన్నద్ధులై వాటిని కాపాడుతుంటారు. ఆ బురుజులపై ఎత్తైన వజ్రాల స్తంభాలున్నాయి. వాటిమీద శత్రువీరుల ప్రాణాలు తీసే ఫిరంగులు అమర్చబడి ఉన్నాయి. వాటికి ఇరువైపులా రథాల ఇరుసులు రాచుకొంటూ ఆరిపోని దీపాలవలె సూర్యచంద్ర మండలాలు ప్రాకాశిస్తుంటాయి.

ఆ నగరంలోని మేడలు ఆకాశా న్నంటుతుంటాయి. అందలి సుందరీమణులు చంద్రబింబాన్ని నిగ్గుటద్దంగా తలచి తొంగి చూస్తూ తమ నొసటిపైని వ్రేలాడే ముంగురులను సరిదిద్దుకొని తిలకాలను అలంకరించుకొంటుంటారు. అప్పుడు వారి వెనుక వైపుగా వచ్చిన వారి ప్రియుల ప్రతిబింబాలు కనిపించగానే తమ భర్తలు ఇతరస్త్రీలను వలచి వారికి వశులైనారని భ్రమించి తత్తరపాటుతో వెనుదిరిగి అంతలో ప్రతిబింబాలు మాసిపోగానే ఆ స్త్రీలు ఏకాంతంగా తమ ప్రియులకోసం నిరీక్షిస్తుంటారు. ముత్యాల హారాలతో కూడిన ఆ ముద్దుగుమ్మల గుబ్బచన్నుల సొగసుతో ప్రక్కల చుక్కలు మెరుస్తుండగా ఆ మేడల శిఖరాలను సింగారిస్తూ బంగారు కలశాలు ప్రకాశిస్తున్నాయి. ఆ మేడలలోపల బంగారు మయములైన పరుపులూ కిటికీలు ఉయ్యాలలూ మెట్లూ మొదలైనవి ఎంతో మనోహరంగా ప్రకాశిస్తున్నాయి.

ఆ మేడల బంగారు కిటికీల సందులగుండా కర్పూరమూ కుంకుమపువ్వూ సాంబ్రాణి సువాసనల పొగలు వస్తుంటాయి. ఆ పొగలను మేఘాలని భ్రమపడిన నెమళ్లు అనుకోకుండా తమకు పండుగ వచ్చిందని ఆనందంతో తమ రంగురంగుల పింఛాలు విప్పి చెట్లకొమ్మలపై నాట్యాలు చేస్తుంటాయి. అవి మన్మథుని శృంగారవిద్యలకు టీకల విధంగా కేకలు వేస్తుంటాయి. అప్పుడు నెమళ్ల పింఛాలను అల్లెత్రాళ్లుగానూ, వాటికేకలను ధనుష్టంకారాలుగానూ భావించి వెంటనే సూర్యుని పైకి ఉరికే రాహువువలె జెండాలు ఆకాశానికి ఎగురుతున్నాయి. జెండాలు గొడుగులూ తమ యుద్ధ లక్షణాలుగా అవక్రపరాక్రమంతో విజృంభించి పెద్దపులులవలె, ఏనుగులవలె, సింగాలవలె, శరభాలవలె, తోకచుక్కలవలె శత్రువులను లెక్కచేయకుండా కేకలు వేస్తూ గుములు గుములై వీరసైనిక సమూహాలు రాక్షసులతో ద్వంద్వయుద్దాలు చేయటం కోసం దుముకుతున్నారు.

ఖడ్గాలూ శూలాలూ మొదలయిన ఆయుధాలు తళతళమెరుస్తూ దిక్కుల చివరివరకూ వ్యాపించగా చక్రాల ధ్వనులు ఉరుములవలె ధ్వనింపగా వీరుల శరవర్షాలతో మేఘాలవలె ఒప్పుతున్న తేరులు వెలుగొందుతున్నాయి. ఆ తేరులకు సూర్యునిగుర్రాలను వాయువునూ మనస్సునూ మీరిన వేగంతో పరుగెత్తగల గుర్రాలు పూన్చబడి ఉన్నాయి. ఆ నగరంలో ఎత్తైన తెల్లని మదపుటేనుగులున్నాయి. వాటి చెక్కిళ్ళ మీది మదజలబిందువుల సమూహాలు వేయికళ్ళవేలుపురేని (ఇంద్రుని) ఔదార్యవిశేషాలను లెక్కకడుతున్నట్లు ఉంటాయి. ఇంద్రుణ్ణి సందర్శించటానికి గుమికూడిన సమస్త దిక్పాలకుల శుభకరాలైన చేతుల బంగారు మురువులనుండి రాలిన ధూళికణాలతో ఆ పట్టణంలోని వీధులన్నీ నిండి ఉన్నాయి. ఆ దారులకు పై భాగాలలో లక్షల విమానాలు రాకపోకలు జరుపుతూ ఉంటాయి. అవి రోహణ పర్వతం చరియలవలె వెలుగులను వెదజల్లుతుంటాయి. ఆ విమానాలలో తమ ప్రియులతో విహరించే అందగత్తెలు భేరీ వీణా పణవమూ మద్దెలా బాకా శంఖం మొదలయినవాటిని మ్రోగిస్తూ వాటికి తగినట్లు పాటలు పాడుతూ నాట్యాలు చేస్తుంటారు. ఆ నగరంలోని చతుష్పథాలలోని గృహ పరంపరల ముంగిళ్ళలో పెద్దపెద్ద రత్నదీపాలు వెలుగుతుంటాయి. దేదీప్యమానాలైన సభామంటపాలలో చింతామణులు ప్రకాశిస్తుంటాయి.

'స్వర్గ నగరం సముద్రంలా అనిమిషకౌశిక వాహినీవిశ్రుతమై ఉన్నది (చేపలతోనూ నదులతోనూ పేరెన్నికగన్నది/ దేవతలతో ఇంద్రునితో ఆకాశగంగతో పేరెన్నికగన్నది). ఆ నగరం వేదవాక్యంలా ఆకల్మషసువర్ణ ప్రభూతమై ఉన్నది (పవిత్రమైన అక్షరాలతో నిండినది / నిర్మలమైన బంగారంతో అతిశయించినది). ఆ పురం శివుని కంఠం మాదిరిగా భోగిరాజకాంతమై ఉన్నది (సర్పరాజుతో ప్రకాశిస్తున్నది / ధనవంతులయిన ప్రభువులతో ఒప్పుతున్నది). ఆ పట్టణం జవరాలి వక్షోజం వలె సువృత్తమై ఉన్నది (గుండ్రముగానున్నది / మంచి చరిత్రకలిగినది). ఆ నగరం శ్రీరామచంద్రుని తేజస్సువలె ఖరదూషణాది దోషాచరులకు చేరరానిదై ఉన్నది (ఖరుడు, దూషణుడు మొదలయిన రాక్షసులకు చేరటానికి శక్యంకానిది / కఠినమైన నిందలు మొదలగు దోషములు ఆచరించువారికి పొంద శక్యంకానిది). ఆ పురం విద్వాంసుని చరిత్రవలె అమలాంతరంగ ద్యోతమానమైనది (స్వచ్చమైన హృదయాలకు స్ఫురించేది / నిర్మల మనస్కులయిన ఫుణ్యాత్ములతో ప్రకాశించేది).

ఆ నగరం అభిమానవంతుని ప్రవర్తనం వలె సన్మార్గభాతి సుందరమైనది (మంచిమార్గంలో మిక్కిలిచక్కగా ప్రకాళించేది/ ఆకాశమార్గమందలి చుక్కలతో మిక్కిలి చక్కనైనది). ఆ పట్టణం అందమైన ఉద్యానవనం వలె రంభాంచితాశోకపున్నాగమైనది (అరటి చెట్లతో కూడిన అశోకవృక్షాలు పున్నాగ వృక్షాలు కలది / రంభతో కూడి ఆనందంగా ఉన్న పురుషశ్రేష్ఠులు కలది). ఆ పురం సురపొన్నవృక్షంవలె సురభిమనో విశేషమైనది (సుగంధంతోకూడిన పుష్పాలతో అతిశయించినది / కామధేనువులతోను దేవతలతోను నిండినది). ఆ నగరం ఆదిశేషుని శిరస్సువలె ఉన్నత క్షమావిశారదమైనది (మహోన్నతమైన భూమండలం కలది / విశేషమైన క్షమాగుణంతో ఒప్పారుతున్నది). ఆ పట్టణం శరత్కాలం మాదిరిగా ధవళజీమూత ప్రకాశితమైనది (తెల్లని మేఘాలతో విరాజిల్లునది / తెల్లని కొండలతో ప్రకాశించునది). ఆ నగరం కృష్ణాజిన దానంవలె సరస తిలోత్తమమైనది. (మంచి నువ్వులతో ఒప్పారినది / సరసురాలైన తిలోత్తమతో ఒప్పారినది). ఆ పురం ఉత్తమపురుషుని వాక్కు వలె అనేక సుధారస ప్రవర్షమైనది (అఖండమైన తియ్యదనాన్ని వర్షించేది / అఖండమైన అమృతవర్షాన్ని వర్షించేది).

ఆ పట్టణం వర్షఋతువు ప్రారంభంవలె ఉల్లసదింద్రగోపమైనది (ప్రకాశించే ఆరుద్రపురుగులు గలది/ ప్రకాశించే ఇంద్రునిచేత రక్షింపబడేది). ఆ నగరం నందీశ్వరుని మూపురంవలె విచక్షు రార్యాలంకృతమైనది (శివపార్వతులతో అలంకరింపబడినది / వెల్పుపెద్దలతో విరాజిల్లునది). ఈ విధంగా ఐశ్వర్యవంతమై పరమధన్యమైన ఆ అమరావతీ నగరానికి చేరి బలిచక్రవర్తి పట్టణం కోటను చుట్టుముట్టడానికి సైన్యాలకు ఆజ్ఞ ఇచ్చినాడు. అన్ని దారులనూ అరికట్టి గట్టి పట్టుదలతో ఉన్నాడు.

(అమరావతీ నగరవర్ణనం రెండేసి అర్థాలుగ శ్లేషతో సాగింది. ఇలాంటి వర్ణనలు బాణభట్టు, దండి మొదలయినవారి బాణిలో సాగును.)

అమరావతీ పురాన ఉండే స్త్రీలకు మలినంపొందుట, కన్నులార్చుట, ముసలితనం పొందుట, దుర్మార్గులను చేరుట, పుణ్యాత్ములను విడుచుట అనేవి లేవు.

దానవనాథులు చేసిన శంఖారావములు భయంకరంగా వినిపించటంచే దేవతాస్త్రీల గర్భాలు పగిలి ఆ గర్భాలలోని శిశువులు భయంతో రోదించినారు.

బలిచక్రవర్తి అమరావతిని ముట్టడించటాన్ని గమనించిన ఇంద్రుడు కోటకు బలమైన కాపలా పెట్టించినాడు. సేనాధిపతులతో సమాలోచన ప్రారంభించినాడు. దేవగురువు మంత్రియు అగు బృహస్పతిని పిలిపించినాడు. దండయాత్రనుగురించి వివరించినాడు. 'వాడు(బలి) ప్రళయాగ్నివలె మండిపడుతున్నాడు. బలవంతులైన రాక్షసులతో కూడి ఉన్నాడు. మనతో ఓడిపోయి మరల ఇప్పుడు వచ్చినాడు. ఏ తపస్సుచేత వీడికి ఇంతటి బలం వచ్చింది? ఈ దురాత్మునికి ఎవడు సహకారి అయినాడు? వీడిని గెలవడానికి దారి ఏది? ఏమి చేద్దాము? వీడిని ఎదిరించి నిలువగల వీరుడు ఎవడు అని పలికినాడు.

ఈ బలిచక్రవర్తి మేరుపర్వతానికన్నా ఎత్తుగా విజృంభిస్తూ ఆకాశాన్ని మింగేటట్లున్నాడు. లోకాలను మింగివేసే కాలాంతకునివలె ఉన్నాడు. ఎదిరిస్తే వీడు బ్రహ్మనుకూడా భంగపరుస్తాడు.

"ఓ గురువర్యా! రాజ్యమంతాకూడా బలిచక్రవర్తికి ఈయలేము. యుద్ధం చేయటానికీ పోలేము, పోతే వాడి నుండి తప్పించుకొనలేము. చూచి చూచి చావలేము. ఇక మీదట ఏది దారి?"

అని పలికిన దేవేంద్రునితో బృహస్పతి ఇలా అన్నాడు.

ఓ ఇంద్రా! వినుము. భృగుప్రవరులు బలికి బలసంపదను సమకూర్చినారు. ఈ రాక్షసుని ఎదుట నిల్చుటకు హరిహరులకుతప్ప ఇతరులకును, నీకును, నీకన్నా అధికులకును శక్యంకాదు. నీవు ఇప్పుడు రాజ్యాన్ని విడిచిపోవటమే మంచిది. విరోధులకు కష్టాలు వచ్చినపుడు పసిగట్టి మరల అమరావతికి చేరటం మేలని నా అభిప్రాయం. వేదపండితులైన విప్రుల వాగ్బలముచె వీడికి ఇంతటి శక్తి సమకూరింది. ఇకపై వీడు బ్రాహ్మణులను గౌరవించడు. అందువల్ల వీని పరాక్రమం సన్నగిల్లుతుంది. అంతవరకు శత్రునామం కూడా స్మరింపక తొలగిపోవటం మేలు.

విరోధిని జయించటమో, సమానంగా పోట్లాడటమో, చావటమో జరగాలి. జయించటమో, చావులేని పక్షంలో పారిపోవటమో మంచిది.

(పరిస్థితులు అనుకూలించనప్పుడు ఉన్న వాటినే పట్టుకొనివ్రేలాడటం వివేకం కాదు. అహంకారం పనిచేయదు. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు తప్పుకోవటం మంచిదనే నీతిని ఈ పద్యం బోధిస్తుంది.)

దేవగురువైన బృహస్పతి ఏపని చేయాలో ఎప్పుడు చేయాలో చక్కగా దర్శింపగలిగినవాడు. ఇంద్రాదిదేవతలకు సమయోచిత కర్తవ్యాన్ని బోధించినాడు. ఆయన చేసిన ఉపదేశము విన్న దేవతలు తమకు ఇష్టమైన రూపాలు ధరించి అనుకూలమైన తావులకు వెళ్లిపోయినారు. అప్పుడు శత్రువులు విడిచిపెట్టిన అమరావతిని బలి ఆక్రమించినాడు. బలి మూడులోకాలను తనవశం చేసికొని విశ్వవిజయుడై చాలాకాలం రాజ్యం చేసినాడు. శుక్రాచార్యుడు మొదలయిన దానవవాత్సల్యం కలవారు అతనిచేత నూరు అశ్వమేధయాగాలను చేయించినారు.

బలిచక్రవర్తి పాలనలో యాచించే దుస్థితి ఎవ్వరికీ లేదు. దానమిచ్చే దాతకు లోటులేదు. ప్రయత్నాలన్నీ ఫలిస్తున్నాయి. ఎవ్వరికీ శత్రువులు లేరు. దేవాలయాలలో మహోత్సవాలు వేడుకలు జరిగేవి. వేదవేత్తలైన బ్రాహ్మణుల కెటువంటి కోరికలు లేవు. వారు సంపూర్ణ మనోరథసిద్ధి గలవారు. సకాలానికి సరియైన వానలు పుష్కలంగా కురిసేవి. భూమికి 'వసుంధర' (బంగారును ధరించేది) అనే పేరు సార్థకమైనది.

బలిచక్రవర్తి చేతిలో దేవతలంతా ఓటమి చెంది పారిపోయి అజ్ఞాతంగా ఎక్కడో దాగినారని తెలిసిన దేవమాత అదితి దుఃఖంతో అనాథవలె కుమిలిపోతూ ఉంది. ఒకనాడు ఆమె భర్తయగు కశ్యపప్రజాపతి తపస్సును విరమించి ఆమెవద్దకు వచ్చాడు. ఆమె భర్తకు చేయవలసిన సేవలన్నీ చేసింది. ఆమె ముఖము విచారముతో కందిపోవటాన్ని గమనించిన కశ్యపుడు ప్రేమగా ఆమె చిబుకాన్ని పట్టుకొని బుజ్జగిస్తూ ఏల ఏడ్చెదవంటూ

ఓ ఇంతీ! వేదములు చదివిన బ్రాహ్మణులు ఏ లోటులేక సుఖంగా ఉన్నారా? దేవతార్చనాది ఆచారాలు జరుగుతున్నాయా? గృహస్థులు ప్రతిదినము చేయవలసిన అగ్ని హోత్రాదికర్మములను సమయముతప్పకుండా చేస్తున్నారా? కుమారులు ధర్మము తప్పకుండా నడుస్తూ ఉన్నారా? అభ్యాగతులకు అన్నపానాదులు సరిగా ఇచ్చుచుంటివా? యాచకులను, సేవకులను, సుజనులను, పరాకులేకుండా గౌరవించుచుంటివా?

అన్నంకానీ, మజ్జిగకానీ, నీళ్లుకానీ, కూరకానీ, తమకు ఉన్నంతలో అతిథులకు లేదనకుండా పెట్టాలి. అలా పెట్టనివారు ఎంత ధనవంతులైనా పేదవారే!

విష్ణువుకు ముఖము అగ్ని మరియు బ్రాహ్మణులు. కనుక అగ్ని బ్రాహ్మణులు తృప్తిపొందితే విష్ణువుకూడా తృప్తిని పొందుతాడు. విష్ణువు తృప్తిపడితే సమస్తలోకాలూ కూడా తృప్తిపడతాయి.

నీ కుమారులు నీవంటే భయభక్తులతో ఉంటున్నారా? నీ కోడండ్లందరూ నీకు ఎదురుచెప్పి ఇబ్బందిపెట్టక ప్రవర్తిస్తున్నారా? ఇంటిలో ఏ ఇబ్బందీ లేదుకదా?

ఈ విధంగా అడిగిన కశ్యపప్రజాపతితో అదితి ఇలా అన్నది.

హృదయేశ్వరా! కొంచెంకూడా ప్రేమలేక దితి కుమారులూ, మనుమలూ గొప్పబలంతో దేవతలనందరిని పారదోలి సాహసంతో విరోధులై అమరావతిని ఆక్రమించి ఏలుతున్నారు. నీకేమని చెప్పుదును? మేలు కలిగేటట్లు ఆలోచించి చూడు.

అక్కచెల్లెండ్లమై యున్నను దితి నాతో కలహాన్ని మానదు. రాక్షసులు దేవతలను మొత్తుచుండగా చూచి తగదని వారింపదు. బాగు బాగు అంటూ మెచ్చుకొంటుంది.

ఎండ అంటే ఎట్టిదో ఎరుగని సుకుమారియైన ఇంద్రుని ఇల్లాలు శచీదేవి దీనత్వంతో పరులపంచల పడింది. మూడులోకములను పాలించు దేవేంద్రుడు అడవుల పాలయినాడు. ఇంద్రుని ముద్దుబిడ్డలు జయంతుడు మొదలయినవారు చెంచుపిల్లల వెంటపోయినారు. దేవతలకు ఆధారంగా ఉండే అమరావతీపట్టణం రాక్షసులకు ఉనికిపట్టయినది. జగములన్నింటను బలి ప్రబలుతున్నాడు. ఇంద్రుడు వానిని గెలువలేడు. అతడే యజ్ఞభాగమంతాకూడా తింటున్నాడు. ఒక్క ముద్దకూడా దేవతలకీయడు.

మహాత్మా! నీవు కొడుకులకందరికి సమానుడవు. కడుపారగా బిడ్డలకన్న బ్రహ్మదేవుడవు. అయినాకూడా నీ సంతానంలోని దుష్టులను నిజంగా దండించవలదా?

మంగళప్రదుడా! ఉత్తములైన వేల్పులు కష్టాలపాలైనారు. సంపదలు కోల్పోయినారు. వారి దుఃఖాన్ని తొలగించు. వారిని అమరావతిలో నెలకొల్పడం, రాక్షసులను శిక్షించడం చేయదగిన మంచిపని. ఈ సత్కార్యం సిద్ధించే మార్గాన్ని ఆలోచించు. నీ కరుణామృత ప్రవాహంతో మమ్ములను తృప్తిపరచు.

అలా పలికిన తన ఇల్లాలి మాటలు విని కశ్యపప్రజాపతి కొంచెం సేపు చింతించి, జ్ఞాన దృష్టితో రాబోయేకాలంలోని సంగతులను తెలుసుకుని ఇలా అన్నాడు.

ఓ ఇల్లాలా! తండ్రి ఎవడు? కొడుకెవడు? పుట్టిన చోటులేవి? పుట్టుకకు కారణమేది? శరీరాలెలా ఉంటాయి? సంసారాలు ఎట్టివి? వినుము! ఇదంతా భగవంతుడగు హరిమాయ. మరేమీలేదు. దీని కంతటికీ మోహబంధం మూలకారణం. దిగులు పడకు.

ఐనప్పటికీ ఇప్పటికి తగిన కార్యాన్ని చెపుతాను విను.

ప్రియురాలా! భగవానుడూ, పురుషోత్తముడూ, జనార్దనుడూ, దయావారిధీ, సర్వాంతర్యామీ, జగదీశ్వరుడూ అయిన హరిని ఆరాధించు. ఆయన ప్రసన్నుడై నీకోరికలను నెరవేరుస్తాడు. ప్రయోజనం చేకూరుతుంది. భగవంతుని సేవించి సకలసౌభాగ్యాలను పొందవచ్చుకదా!

అలా పలికిన కశ్యపునిమాటలను విని అదితి ఈ విధంగా అంది.

నారాయణమూర్తిని ఏ విధంగా ధ్యానించాలి? ధ్యానానికి తగిన మంత్రమేది? దాని నియమాలేవి? పూజించవలసిన కాలమేది. చెప్పండి స్వామీ!

పై విధంగా అడిగిన అదితికి కశ్యపుడు 'పయోభక్షణం' అనే పాలతోచేసే వ్రతాన్ని ఉపదేశించినాడు. అందుకు తగిన కాలాన్నీ మంత్రాన్నీ నియమాన్నీ వ్రతకాలంలో పాటించవలసిన ఉపాసనా విధినీ, దాన భోజనాది విధానాలనూ బోధించినాడు. అదితి ఫాల్గుణమాసం శుక్షపక్షం మొదటిదినాన ఆ వ్రతాన్ని మొదలు పెట్టినది. పన్నెండు దినాలు యథావిధిగా భగవంతుని పూజించినది. వ్రతం అయిపోగానే నియమవంతురాలయిన ఆమెకు విష్ణుదేవుడు ప్రత్యక్షమైనాడు. ఆయన చతుర్బాహుడు. శంఖాన్నీ చక్రాన్నీ గదను ధరించి ఉన్నాడు. పచ్చని పట్టువస్త్రాన్ని కట్టుకొని ఉన్నాడు. కన్నులకు కానరాని భగవంతుడు ఆమె కన్నుల ఎదుట సాక్షాత్కరించినాడు. ఆమె ఆ దేవుని దర్శించింది.

(ఇక్కడ పయోవ్రతమంటే పాలతో చేసే వ్రతం తప్పా నీటితో చేసే వ్రతం కాదు.)

సంతోష బాష్పాలు చనుకట్టుపయిన పడి గగురుపాటుకల దేహంతో నెన్నుదుట దోసిలియొగ్గి నమస్కారములు, స్తోత్రములు చేసి

అదితి హరిరూపాన్ని చూపులతో తనివితీరా త్రాగింది. చాల సంతోషంతో మైమరచి ఆ స్వామివారిని మృదువైన తీయనిమాటలతో ఇలా నుతించింది.

యజ్ఞేశ్వరా! విశ్వంభరా! అచ్యుతా! ఈలోకాలన్నీ నీ స్వరూపమే. నీ పేరు చెవులార విన్నవారికి శుభాలు చేకూరుతాయి. ఆపన్నులగు భక్తులకు దుఃఖాలను పోగొట్టేవాడవు. నీ పాదాలు లోకాలను తరింప చేస్తాయి. ఈ విశ్వము పుట్టుకకు నిలబడుటకు అంతమగుటకు నీవే కారణం. పరిమితి లేని ఆనందమే విలాసంగా కలవాడవు. నిన్ను స్తోత్రం చేసినవారికి కల్పవృక్షంవలె కోరినవి సమకూరుస్తావు. సృష్టిలోని గుణాలన్నీ నీ కంఠసీమలో హారాలై మెరుస్తుంటాయి. సర్వవేదాలసారం నీవే. నిన్ను చక్కగా స్తోత్రం చేసిన వారిని వాత్సల్యంతో కటాక్షిస్తావు. పద్మాక్షా! పరమపురుషా! ఆయువు, శరీరం చక్కగా ఉండటం, వైభవం, రాజ్యం, స్వర్గం, ధర్మం, అర్ధం, కామం, వైదికజ్ఞానం, శత్రువిజయం అనేవి నిన్ను సేవించని నరులకు లభించటం సాధ్యంకాదు.

దైత్యశ్రేష్ఠులు దేవతలను భయపెట్టి పారదోలి స్వర్గాన్ని పరిపాలిస్తున్నప్పటినుండి కూడా నా కంటికి నిద్ర కరువైంది. నా గర్భశోకాన్ని మానిపి రక్షించవయ్యా!

అని పలికిన అదితి మాటలు విని శ్రీహరి చిరునవ్వు చిందించినాడు. ఆశ్రయించినవారికి కామధేనువయిన ఆ పరమాత్ముడు అదితితో ఇలా అన్నాడు.

నీ కోడళ్ళూ, నీ కొడుకులూ; నీ మగడూ; నీవూ మిక్కిలి పొగడేటట్టు, భార్యాభర్తలు చాలా సంతోషించెటట్టు, రాక్షసులు దుఃఖించేటట్లు, నీ కడుపున తేజశ్శాలినై జన్మిస్తాను. నీ కుమారుడనై తిరుగుతూ ఆడుకోవాలని నాకూ వేడుకగా ఉంది.

సహనంతో కూడిన ఉపాయంతో తప్ప, బలాన్ని ప్రదర్శించి రాక్షసులను చంపడానికి వీలులేదు. నీ నియతినీ భక్తినీ నేను మెచ్చుకున్నాను. ఇంద్రుడూ, దేవగణమూ, శచీదేవీ మెచ్చుకొనే విధంగా స్వర్గాన్ని రాక్షసులనుండి అపహరించి ఇంద్రునికిస్తాను. ఇంక విచారమెందుకు?

నా రూపాన్ని మనసులో పెట్టుకొని నీ భర్తను సేవించు. నేను నీ గర్భంలో ప్రవేశిస్తాను. నన్ను దయతో ప్రేమతో పెంచుము తల్లీ!

దేవతలచే స్వర్గాన్ని ఏలిస్తాను. శచీదేవి సౌభాగ్యాలను కాపాడుతాను. రాక్షసులను అధికారంనుంచి తొలగిస్తాను. వారి ఇల్లాండ్ర సొమ్మును ఊడదీయిస్తాను.

ఈ విధంగా భక్త పరాధీనుడయిన పురాణపురుషుడు (విష్ణువు) సెలవిచ్చి మాయమయ్యెను. అదితి సంకల్పము నెరవేరెను. ఆమె సంతోషముతో తన భర్తయగు కశ్యపుని ఆశ్రయించి ప్రేమతో సేవిస్తూ ఉండగా అటు తర్వాత ఒకనాడు

కశ్యపుడు సమాధిలో ఉండి హరి అంశము తనయందు ప్రవేశించగా అదితియందు అధికమగు తన వీర్యాన్ని 'గాలి అగ్నిని కర్రయందు చేర్చినట్లు' చేర్చినాడు.

రాజా! పై విధంగా కశ్యపుడు చాలాకాలంగా మహాతపస్సు చేసి విశేషంగా సంపాదించిన వీర్యంవల్ల అదితి గర్భాన్ని ధరించింది. ఆమె మనస్సు చాలా ఉల్లాసాన్ని పొందింది.

ఒకనెల గడిచింది. అదితి కడుపులో క్రమక్రమంగా ద్రవరూపమూ, మెత్తనిరూపమూ, గడ్డకట్టి పిండరూపమూ ఏర్పడింది. నెల తప్పింది. గొంతుతోపాటు తల ఏర్పడి గర్భం నిలిచింది.

('చీరచిక్కుట' అనే ప్రయోగం గర్భధారణకు పర్యాయపదంగా ప్రయోగించటం పూర్వకవులలో కనిపిస్తుంది.)

అదితికి గర్భమై ఒకటి రెండు మూడు నాలుగు నెలలు గడచినవి. క్రమంగా నెలలు పెరిగినాయి. రాక్షసనాశనానికి కూడా నెలలు సమీపించినాయి.

రాజా! అదితి కడుపులో అవయవాలతోకూడిన ఆ శిశువు గొప్ప మేఘాలు కప్పిన పదివేల సూర్యబింబాల వెలుగుతో కదలాడసాగినాడు.

అదితి గర్భంలో ఆ శిశువు బ్రహ్మాండభాండాన్నీ సముద్రాలనూ సమస్తలోకాలనూ తన కడుపులో ఇముడ్చుకొని సన్ననైన చిన్నని ఆకారంతో అందంగా అణగి మణగి ఉన్నాడు.

అదితికి క్రమంగా గర్భలక్షణాలు స్పష్టంగా కనిపించసాగినవి. ఆమె కనురెప్పలు అందంగా ఒప్పినాయి. కన్నులు నిర్మలంగా ఉన్నాయి. చనుమొనలు నల్లబడినాయి. ఒడ్డాణం బిగువైంది. ముఖం తెల్లబడింది. వక్షోజాలు గట్టిపడినాయి. పిరుదులు బరువెక్కినాయి. నడుము విస్తరించింది. మనస్సు తేలికపడింది. దేహం మహత్త్వాన్ని పొందింది.

(ముత్తెదువలు) అదితి నుదుట విభూతిని పెట్టినారు. తిలకం దిద్దినారు. పట్టుబట్టల జతను కట్టించినారు. గర్భానికి రక్ష కట్టినారు.

అదితి గర్భంలో విశ్వగర్భుడైన భగవంతుడు పూట పూటకూ పెరిగినాడు. గర్భం బరువెక్కింది. ఆమె నీళ్లాడే సమయం దగరపడింది.

ఆ సమయంలో బ్రహ్మదేవుడు అదితిగర్భంలో కదలాడే భగవంతునుద్దేశించి ఈ విధంగా స్తోత్రం చేసినాడు.

అదితిగర్భంలో వర్ధిల్లుతున్న స్వామీ! నీవు మూడులోకాలను జయించగలవాడవు. ఓ దేవ! పెద్దపెద్ద అంగలువేస్తూ నడిచే సామర్థ్యం గలవాడివి. రెండడుగులతోనే భూమ్యాకాశాలు కొలిచినవాడివి. విశాలమైన హృదయం గలవాడివి. ప్రాణులయందు అంతర్యామియైనట్టి వాడివి. 'పృశ్ని' యొక్క పుత్రుడవైనట్టివాడివి. ప్రీతితో ముల్లోకాలను నాభియందు గలవాడివి. ముల్లోకాలకు అతీతుడైనవాడివి. ఈ లోకాలకు ఆదిమధ్యాంతాలు నీవే. చరాచర ప్రపంచం పుట్టడానికి కారణం నీవే. కాలస్వరూపుడవై సమస్తమూ నీలోపలనే ధరిస్తావు. ప్రవాహం ప్రాణికోటిని ధరించినట్లు సమస్త జీవులనూ నీలోనే నిలుపుకొంటావు. సృష్టికర్తలైన బ్రహ్మలకు పుట్టినిల్లు నీవే. స్వర్గలోకాన్ని పోగొట్టుకొని దేవతలు కష్టాలకడలిలో మునిగిపోయినారు. వారిని రక్షించి గట్టుకు చేర్చే తెప్పవు నీవే,

మహాత్మా! దేవతలు చాలాకాలం నుంచీ స్వేచ్చలేక సంతోషంగా ఉండాలని ఆరాటపడుతున్నారు. వారికి ఆనందం కలిగించేటందుకు అదితిగర్భంనుండి బయలుదేరి రావయ్యా!

Vaivasvata Manvantara Details - వైవస్వత మన్వంతర వివరణ

వైవస్వత మన్వంతర వివరణ

ఓ రాజా! ప్రస్తుత మన్వంతరాన్ని ఏడవమనువైన వైవస్వతుడు నిర్వహిస్తున్నాడు. ఆయనను శ్రాద్ధదేవుడని అంటారు. ఆయనకు ప్రసిద్ధులైన, మహాబలవంతులయిన పదిమంది కుమారులున్నారు.

వారు ఇక్ష్వాకుడు, నభగుడు, ధృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, నాభాగుడు, దిష్టుడు, కరూశకుడు, పృషద్ధ్రుడు, వసుమంతుడు, అనేవారు. ఈ పదిమందీ రాజులైనారు. పురందరుడనేవాడు ఇంద్రుడైనాడు. ఆదిత్యులూ, మరుత్తులూ, అశ్వినులూ, రుద్రులూ, వసువులూ అనేవారు దేవతలైనారు. గౌతముడూ, కశ్యపుడూ, అత్రీ, విశ్వామిత్రుడూ, జమదగ్నీ, భరద్వాజుడూ, వసిష్ఠుడూ అనేవారు సప్తర్షులైనారు. వారిలో కశ్యపునికి అదితి అనే భార్యయందు విష్ణుమూర్తి వామనమూర్తియై జన్మించి ఉపేంద్రుడు(ఇంద్రుని తమ్ముడు) అయినాడు. ఇంతవరకు ఏడు మన్వంతరాలను గురించి చెప్పినాను. ఇక రాబోవు మన్వంతరాలను గురించి విష్ణువు పరాక్రమాన్ని గురించి వివరిస్తాను. శ్రద్ధగా విను అని శుకుడు ఇలా అన్నాడు.

(చాలామంది వ్యక్తులపేర్లు చకచకా చెప్పాలి. కనుక పద్యంలో కన్న వచనంలో చెప్పటమే సుగమంగా ఉంటుందని ఈ వచనం సువ్యక్తం చేస్తుంది.)

ఓ రాజా! సూర్యునికి సంజ్ఞాదేవి, ఛాయాదేవి అనే భార్యలున్నారు. వారు విశ్వకర్మ కుమార్తెలు. ఇంతకు ముందే ఈ విషయం చెప్పినాను. వారిద్దరేకాక 'బడబ' అనే భార్యకూడా ఉంది. సంజ్ఞాదేవికి యముడు, శ్రాద్ధదేవుడు, యమునాదేవి పుట్టినారు. ఛాయకు సావర్ణి, శనైశ్చరుడు, తపతీదేవి పుట్టినారు. తపతీ దేవిని సంవరణుడు పెళ్ళాడినాడు. బడబకు అశ్వినీ దేవత లిద్దరు పుట్టినారు. రాబోయే కాలంలో సావర్ణి ఎనిమిదవమనువు అవుతాడు. అతడు ప్రస్తుతం తపస్సు చేస్తున్నాడు.

ఓ రాజా! ఒక పర్యాయం కనిపించి మరొక పర్యాయం కనిపించక మాయమయ్యే సిరులకోసం ఒక్కొక్క మనువు దిగిపోయే సమయానికి ఒక్కొక్కమనువు కాచుకొని ఉంటాడు.

(భౌతికమైన సిరిసంపదలు ఎంత చంచలమూ, అశాశ్వతమైనవో! భౌతికమైన ఉన్నత పదవులు కూడ చంచలమూ, అశాశ్వతమైనవని అంతరార్థం! ఈ చిన్ని కందపద్యం లోకనీతిని, రీతిని అద్దం పడుతున్నది. 'చేటువేళ' అనే పదబంధం అత్యంత సాభిప్రాయం. జీవితము ఒక కాలపరిమితికి ఎలా లోబడినదో, ఉన్నత పదవులు కూడ ఒక కాలపరిమితికి లోబడినవేనన్న పరమార్ధమిందులో దాగి ఉన్నది. ఈ లోకంలో ఏదీ శాశ్వతంకాదు. ఆఖరికి బ్రహ్మపదవికూడ శాశ్వతంకాదు. ఇది తెలిసి ప్రవర్తించేవాడే నిజమైన బుద్ధిమంతుడు.)

సూర్య సావర్ణి పరిపాలించే ఎనిమిదవ మన్వంతరంలో ఆయన కుమారులైన నిర్మోహుడు, విరజస్కుడు మొదలయినవారు రాజులవుతారు. సుతపులు, విరజులు, అమృతప్రభులు దేవతలవుతారు. గాలవుడు, దీప్తిమంతుడు, పరశురాముడు, ద్రోణుని కొడుకైన అశ్వత్థామ, కృపుడు, వ్యాసుడు, ఋష్యశృంగుడు సప్తర్షులవుతారు. ఇప్పుడు వారు తమ తమ యోగబలాలతో తమ ఆశ్రమాలలో ఉన్నారు. విరోచనుని కొడుకైన బలిచక్రవర్తి ఇంద్రుడవుతాడు.

ఓ రాజా! పూర్వం బలిచక్రవర్తి బలవంతుడై స్వర్గలోకాన్ని వశం చేసుకోగా శ్రీహరి వామనుడుగా వెళ్ళి ఆయనను మూడడుగులనేలను దానమడిగినాడు. దానమిచ్చిన బలిచక్రవర్తిని త్రివిక్రముడు బద్దుని చేసినాడు. తరువాత బలికి అమరావతికంటె అందమైన పాతాళలోకాన్ని ఇచ్చినాడు. దానిలో బలి సుఖంగా ఉన్నాడు. ఆ తర్వాత విష్ణువు వేదగుహికీ సరస్వతికీ "సార్వభౌముడు" అనే పేరుతో జన్మిస్తాడు, ఇంద్రుని పదవినుండి తొలగిస్తాడు. ఆ పదవిలో బలిచక్రవర్తిని నెలకొలుపుతాడు. విష్ణువు నుండి బలి ఇంద్రపదవిని పొందినప్పటికి అతడు మొదట విష్ణువునకు దానం చేసిన పుణ్యం చెడదు.

ఆ తర్వాతి కాలంలో వరుణుని కొడుకైన దక్షసావర్ణి తొమ్మిదవ మనువు అవుతాడు. అతని కొడుకులయిన ధృతకేతువు, దీప్తకేతువు మొదలయినవారు రాజులవుతారు. పరుడూ, మరీచులూ, గర్గుడూ మొదలయినవారు దేవత లవుతారు. అద్భుతుడు అనేవాడు ఇంద్రు డవుతాడు. ద్యుతిమంతుడు మొదలయినవారు సప్తఋషులు అవుతారు.

విష్ణువు ఆయుష్మంతునికీ అంబుధారకు జన్మిస్తాడు. అతని రక్షణలో దేవేంద్రుడైన అద్భుతుడు మూడు లోకాలను సంతోషంగా పరిపాలిస్తాడు.

ఓ రాజా! ఆ పిమ్మట ఉపశ్లోకుని కుమారుడైన బ్రహ్మసావర్ణి పదవ మనువు అవుతాడు. ఆయన కొడుకులైన భూరిషేణుడు మొదలయినవారు రాజులవుతారు. హవిష్మంతుడు మొదలయినవారు సప్తర్షులవుతారు. శంభుడనేవాడు ఇంద్రుడవుతాడు. విబుద్ధి మొదలయినవారు దేవతలవుతారు.

విష్ణువు విశ్వసృజునికీ విషూచికీ 'విష్వక్సేనుడు' అనే పేరుతో జన్మించి శంభునికి స్నేహితుడై లోకాన్ని కాపాడుతాడు.

ఆ పిమ్మట వచ్చే కాలంలో ధర్మసావర్ణి పదకొండవమనువు అవుతాడు. ఆయన కుమారులయిన సత్యధర్ముడు మొదలయినవారు పదిమందీ రాజులవుతారు. విహంగములు, కామగమనులు, నిర్వాణరుచులు దేవతలవుతారు. వైధృతుడనేవాడు ఇంద్రుడవుతాడు. అరుణుడు మొదలయినవారు సప్తర్షులవుతారు.

విష్ణువు 'ధర్మసేతువు' అనే పేరుతో సూర్యుని కుమారునిగా జన్మిస్తాడు. ఆయన మహిమలతో సంపన్నుడై వైధృతుడు సంతోషించేటట్లు మూడు లోకాలను కరుణతో కాపాడుతాడు.

ఓ రాజా! ఆ పిమ్మట రాబోయేకాలంలో భద్రసావర్ణి పన్నెండవ మనువు అవుతాడు. అతని కొడుకులయిన దేవవంతుడు, ఉపదేవుడు, దేవజ్యేష్ఠుడు మొదలయినవారు రాజులవుతారు. ఋతధాముడనేవాడు ఇంద్రుడవుతాడు. హరితులు మొదలయినవారు దేవతలవుతారు. తపోమూర్తి, తపస్వి, అగ్నీధ్రకుడు మొదలయినవారు సప్తర్షులవుతారు.

(తప ఆగ్నీద్ర అనే పాఠం వ్యాకరణరీత్యా సరిపోతుంది. (తవ అగ్నీధ్ర పాఠం సరికాదు) పోతన భాగవతముద్రిత ప్రతులన్నింటిలో ఋతుధాముడనే ఉన్నది. ఈ పాఠం సరికాదు. సంస్కృతమూలంలో ఋతధాముడని ఉన్నది. దీనికి ప్రమాణం వాల్మీకిరామాయణం.)

ఆ కాలాన విష్ణువు సత్యతపునికి సూనృతకు 'స్వధాముడు' అనే పేరుతో జన్మిస్తాడు. మనువు సంతోషించేటట్లు లోకాన్ని రక్షిస్తాడు.

ఓ రాజా! ఆ తరువాతి కాలంలో దేవసావర్ణి పదమూడవ మనువు అవుతాడు. అతని కొడుకులయిన చిత్రసేనుడూ విచిత్రుడూ మొదలయినవారు రాజులవుతారు. సుకర్ములూ సుత్రాములూ దేవతలవుతారు. దివస్పతి అనేవాడు ఇంద్రుడవుతాడు. నిర్మోహుడూ తత్త్వదర్శుడూ మొదలయినవారు సప్తర్షులవుతారు.

ఓ రాజా! విష్ణువు దేవహోతకూ బృహతికీ 'యోగవిభుడు' అనే పేరుతో జన్మిస్తాడు. ఇంద్రునికి చాలా సాయం చేస్తాడు.

ఆ పిమ్మట వచ్చేకాలంలో ఇంద్రసావర్ణి పదునాలుగవ మనువు అవుతాడు. అతని కుమారులు ఉరుగంభీరుడు, వసువు మొదలయినవారు రాజులవుతారు. పవిత్రులు, చాక్షుషులు దేవతలవుతారు. శుచి అనేవాడు ఇంద్రుడవుతాడు. అగ్ని, బాహువు, శుచి, శుక్రుడు, మాగధుడు మొదలయినవారు సప్తర్షులవుతారు. ఇంకా

ఆ కాలాన విష్ణువు సత్రాయణునకు వితానకు 'బృహద్భానుడు' అనే పేరుతో జన్మిస్తాడు. దేవతలు సంతోషించేటట్లు క్రియాకలాపాలను విస్తరిస్తాడు.

ఓ రాజా! మూడుకాలాల్లోనూ ప్రఖ్యాతి పొందే మనువుల విధానాన్ని చెప్పినాను. పదునాలుగుమంది మనువులు అంతరించి వెయ్యియుగాలు గడిస్తే బ్రహ్మకు ఒక దినం అవుతుంది. అని శుకుడు చెప్పగా పరీక్షిన్నరేంద్రుడు ఇలా అన్నాడు.

ఓ శుభచరితా! ఈ పదవులలో మనువులను ఎవరు నియమిస్తారు? ఎందువల్ల వారు గొప్ప వైభవాన్ని పొందారు? ఆ మన్వంతరాలలో ఎందుకు విష్ణువు జన్మిస్తాడు? నాకు తెలిసేటట్లు చెప్పు. అని అడిగిన పరీక్షిత్తుతో శుకుడిలా అన్నాడు.

మనువులు, మునులు, మనువుల తనయులు, ఇంద్రుడు, దేవతలు విష్ణుమూర్తి ఆనతికి లోబడి ఉంటారు. యజ్ఞుడు మొదలయినవారు విష్ణుదేవుని అంశంతో రూపుదాలుస్తారు. అతని సహాయంవల్ల మనువులు లోకాన్ని పాలిస్తారు. క్రమంగా నాలుగుయుగాల చివర వేదాలను కాలం మింగి వేస్తుంది. పుణ్యాత్ములయిన మునులు తమ తపశ్శక్తివల్ల మళ్లీ వేదాలను దర్శిస్తారు. పూర్వం వలె ధర్మం నాలుగు పాదాలతో నడుస్తుంది. విష్ణువు ఆజ్ఞ చెల్లుబడి అవుతుంది. తమ తమ కాలాలలో రాజులు లోకాన్ని పంచుకొని పరిపాలిస్తారు.

విష్ణుమూర్తి ప్రాప్తమున్నవారిని ఇంద్రపదవులలోను, పెక్కు విధాలయిన దేవతల పదవులలోను నియమిస్తాడు. వారు తమకు నిర్ణయించబడిన నియమాలతో ముల్లోకాలను పాలిస్తారు. లోకాలు సుభిక్షంగా ఉంటాయి.

ఓ నిర్మల చరితుడా! శాశ్వతుడైన విష్ణువు యోగీంద్రుని రూపంతో యోగం బోధిస్తాడు. మౌనిరూపంతో కర్మానుష్ఠానాన్ని బోధిస్తాడు. ప్రజాపతి రూపంతో సృష్టిచేస్తాడు. ఇంద్రుడై రాక్షసుల పొగరును అణచివేస్తాడు. సిద్ధరూపంతో జ్ఞానోపదేశం చేస్తాడు. కాలస్వరూపంతో కడతేరుస్తాడు. అవ్యయుడైన ఆ శ్రీపతి పెక్కుపేర్లతో అనేక రూపాలతో ఉంటాడు. అతడు విషయాసక్తుల కంటికి కనిపించడు. అతడు జరిగిన, జరుగుతున్న, జరుగబోయే కాలాలలో అనేక విధాలుగా వేరువేరు రూపాలతో వెలుగొందుతాడు.

Vamanamurthy went to the palace of Emperor Bali - బలిచక్రవర్తి కడకు వామనమూర్తియేతెంచుట

బలిచక్రవర్తి కడకు వామనమూర్తియేతెంచుట ఈ విధంగా ఉపనయనం పూర్తి అయిన తర్వాత మాయాబ్రహ్మచారి ఇతరదేశాలనుండి వచ్చిన కొందరు బ్రాహ్మణులను చూచి ఇలా అడి...