Thursday, April 16, 2026

Chapter 137 History of the Haihayus - అధ్యాయము 137 హైహయుల చరిత్ర

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము - అధ్యాయము 137

హైహయుల చరిత్ర

జనమేజయు డిట్లనెను : వ్యాసమునీంద్రా ! హైహయులను క్షత్రియులు బ్రహ్మహత్యాపాపమునకు వెఱవక భార్గవులను చంపిరంటివి. వారే కులమువారు? గొప్పవారికి కారణము లేక కోపమురాదు గదా! పితామహా! వారికి వైర మే కారణమున గల్గెనో తెలియబలుకుము. రాజులకు పురోహితులతో పగ యెట్లు వచ్చెను? రాజుల కంతటి కోపము గల్గుట కేదో కొలది కారణ ముండియుండును. 

కానిచో బ్రాహ్మణుల నేల చంపుదురు. విప్రులు పూజనీయులు - నిరపరాధులు గదా! రాజులు బలవంతులే. ఐనను వారికి మాత్రము పాపభీతి యేల యుండదు? ఒకవేళ విప్రులలో నేదో కొలది దోషమున్న నుండవచ్చును. అంతమాత్రమున రాజశ్రేష్టులు వారి నేల చంపుదురు? మునీశా! నా యీ సందేహము బాపుట కీవే సమర్థుడవు. అట్లు రాజు ప్రశ్నించగా వ్యాసుడు నెమ్మదిలో వారి గత చరిత్ర గుర్తుకు తెచ్చుకొని ప్రీతిగదుర నిట్లనెను : 

రాజా! హైహయరాజుల చరిత్రమతిపురాతనము ఆశ్చర్యకరము. దానిని నాకు తెలిసినంతవఱకెఱిగింతును వినుము. మున్ను హైహయవంశమందు కార్తవీర్యార్జునుడను రాజుండెను. అతడు సహస్ర బాహువు బలశాలి ధర్మవీరుడు. ఆతడు విష్ణునవతారమగు దత్తాత్రేయుని శిష్యుడు-సిద్ధుడు-శాక్తేయుడు-దాత-భృగువంశ బ్రాహ్మణులకు యజమానుడు - బ్రాహ్మణులచె యజ్ఞాదికర్మము చేయించుకొనువాడు. 

ఆతడు ధర్మనిష్ఠుడు-మహాదాత. యాగములాచరించినవాడు భార్గవుల కనేక దానధర్మము లొసంగినవాడు. అతని దానముల వలన భార్గవులు హయరత్న సంపన్నులై ధనవంతులై పేరుగాంచిరి. కొన్నాళ్ళకు కార్తవీర్యడు స్వర్గధామ మేగెను. అంత హైహయులు దైవయోగమున కడుబీదవారైరి. 

ఒకప్పుడు హైహయులకు కొంత డబ్బుకావలసి వచ్చెను. అపుడు వారు భార్గవులను యాచింపదలంచిరి. హైహయులు సవినయముగ విప్రులను ధనమడిగిరి, వారు లోభమతులై లేదులేదని వారికి చిల్లిగవ్వయు నీయకుండిరి.

కొందఱు భార్గవులు క్షత్రియులకు జంకి తమ ధనరాసులను నేలలో బాతిపెట్టిరి. మఱికొందఱు బ్రాహ్మణులకు దానమొసంగిరి. అట్లు భయార్తులగు భార్గవులు తమ దనరాసులను వేరొకచోటికి తరలించి తమతమ యాశ్రమములు వదలి గిరి దుర్గములు పట్టిపోయిరి. అట్లు తమ యజమాను లార్థిక సంకటములో నుండుట కనులార చూచియును విప్రుల ధనలోభమున వారికి ధనమీయక వనదుర్గములు పట్టిపోయిరి. 

పిదప రాజులు తమకు ధనమత్యావశ్యక మగుట వలన మిక్కిలి వగచిరి. వారు తుదకు ధనము దొరకునేమోయని భార్గవుల యాశ్రమముల జొరపడిరి. అంత భార్గవులు తమ యాశ్రమములు శూన్యము చేసి వెళ్ళిరి. అదిగని హైహయులు వారి యాశ్రమములలో ధనముండునని త్రవ్విరి. అట్లు త్రవ్వుట వలన కొందఱి యిండ్లలో ధనమెక్కువగ లభించెను. ఆ పిదప ధనమునకు వారెంయో శ్రమపడిరి. వారచ్చటచ్చట నేలలో నున్న ధనమంతయును త్రవ్వి తీసిరి. 

వారు ధనాశచే నిరుగుపొరుగు బాపల యిండ్లకు నేగిరి. అట్లంతట త్రవ్వి వారెక్కువగ ధనము బడసిరి. బ్రాహ్మణులు వందురుచు వెఱగంది చేయునది లేక రాజులను శరణు వేడుకొనిరి. ఆ విధముగ రాజులు విప్రుల యిండ్లలో ధనము గొప్పగ బడసియును శరణువేడిన బ్రాహ్మణులను కూడ కోపతీవ్రతతో బాణముల కొట్టి చంపిరి. 

వారట నుండి భార్గవులుండు గిరి దుర్గములు జేరి భార్గవులను చంపి వారి భార్యలగర్భములు జీల్చి స్వేచ్ఛగ విహరించిరి. వారు పాపభీతి లేక కంటబడిన భార్గవులనెల్ల వాడి ములుకులతో చంపిరి. మఱికొందఱి నవమానించిరి. అట్లు పాపాత్ములగు హైహయులు తమ గర్భములు ఛేదింపగ విప్రస్త్రీలు కురరిపక్షులవలె బోరున విలపించిరి.

ఆ ఘోరమును తీర్థవాసులగు నితర మునులు గాంచి 'పవిత్ర బ్రాహ్మణులపట్ల మీకీ దారుణ కోపము తగదు. ఉడుగు' డని హైహయులను వారించిరి. 'హైహయులారా! భృగుపత్నుల గర్భములు వ్రయ్యలు చేయుట మీకు తగనిపని. ఇది నీచము నింద్యము. నరుడు తీవ్రమైన పుణ్యపాపముల ఫలమిచ్చటనే పొందును కనుక తన మేలుగోరుకొనువాడిట్టి నీచకర్మము విడనాడవలయును.'' 

అంత హైహయులు కోపముతో మునుల కిట్లనిరి : మీరెల్లరు సాధుపుంగవులు. పాపకర్మమునకు సరియగు నర్థమెఱుగరు. ఈ భార్గవులు పచ్చి మోసముతో దారులు గొట్టి దోచుకొను దొంగలవలె మా పెద్దలగు పూర్వజులనుండి ధనమపహరించిరి. వీరు పరులను పీడించువారు. కొంగవృత్తితో మోసముతో బ్రతుకువారు. 

మాకొక తూరి ధనమత్యావశ్యక మయ్యెను. అపుడు మేమే సవినయముగ వీరిని ధనమిమ్మని వేడుకొంటిమి. ఐనను భార్గవులు తమ యజమాను లిబ్బందులలో నుంట నెఱిగియు ధనము లేదని మిన్నకుండిరి. వీరు మా కార్తవీర్యుని వలె గొప్పగ ధనము సంపాదించిరి. వీరు దాని నిన్ని నాళ్ళేల దాచియుంచిరి? యజ్ఞములు చేసి యాచకుల కేల దానము లీయలేదు? 

విప్రులెప్పుడు నెక్కడను ధనము కూడ పెట్టగూడదు. వారు తప్పక యజ్ఞములు చేయవలయును. ఇతరులకీయవలయును. తాము సుఖముగననుభవింపవలయును. ఎక్కడనైన ధనమున్నచో దొంగల వలన - రాజుల వలన - దోపిడిగాండ్రవలన - నిప్పువలన భయము గల్గుచుండును. 

ధనము తన్ను గాపాడు వాని నెటులైన వదలి వెళ్ళును. వాడు చచ్చినప్పుడైన తాను ధనమును వదలి పోవును. మేము నాల్గవ వంతు వడ్డీతో గూడ మొత్తము చెల్లింపగలము. అని మేమెంతయో వినయముగ ఈ విప్రులను వేడుకొంటిమి. కాని, లోభమున కొట్టుమిట్టాడుచున్న పురోహితులందుల కొప్పుకొనలేదు. ధనమునకు దానము భోగము నాశమునను మూడు దశలు గలవు. 

పుణ్యాత్ములు దానిని దానభోగములకు వినియోగింతురు. కాని, పాపాత్ములు దానిని నశింపజేతురు. ఒకనికింత పెట్టక తానింత తినక ధనమును గూడబెట్టిన పిసినిగొట్టు మోసగాడు. వాడు దుఃఃతుడు. అట్టి వానిని రాజు దండింపవలయును. ఈ విప్రాధములు మాకు గురువులే. ఐనను వారు వంచకులు. కనుక వారిని చంపుటకు పూనుకొంటిమి. మమ్ము కోపింపకుడు.

ఇట్లు హైహయులు సహేతుకముగ పలికి మునులకు నచ్చజెప్పి భార్గవుల భార్యలను వెదకుటకు వెళ్ళిరి. అపుడు భృగు పత్నులు భయత్రస్తలై వాపోవుచు హిమగిరి జేరిరి. పాపమతులను దన దాహముగలవారునగు హైహయుల చేతులలో బడి విప్రులు పీడితులై చచ్చిరి. 

లోభము మనుజునిలో దాగియున్న లోనిశత్రువు - అది దుఃఖకరము. తుదకు తీయని ప్రాణములు సైతము తీయగలది. లోభమెల్ల పాపములకు బానిసతొత్తుగ మారి తన కుల ధర్మమును గూడ విడనాడును. లోభము సొంత తల్లిదండ్రులను - బంధువులను - అన్నదమ్ములను - బావను - హితులను చంపించును. 

అది మిత్రులను పుత్రులను అక్క సెల్లెండ్రను తుదకు గురువును సైతము చంపుటకు వెనుకాడదు. పాపమతితో నెంతటి చేయరాని పనియైన చేయింపగలదు. అది కామ క్రోధాహంకారములకన్న చెడ్డది. ఆత్మవైరి. దీని మూలమున నరుడు ప్రాణములు సైతము గోలుపోవును. ఇట్టి లోభముగూర్చి యేమని చెప్పుదును? 

రాజా! నీ పూర్వజులగు కౌరవులు కర్మనిరతులు సన్మార్గులు ఐనను వారును లోభము మూలమున నిహతులైరి. భీష్ముడు ద్రోణుడు కర్ణుడు కృపుడు బాహ్లికుడు ధర్మజుడు కృష్ణార్జునులు భీముడు - వీరందఱు గొప్పవారు. వీరు బ్రతికియుండగానే కౌరవ పాండవులు తీవ్రయుద్ధమొనర్చిరి గదా! వారి కుటుంబములు సమూలముగ నాశనమయ్యెను గదా! దీనికంతటికి మూలకారణము లోభమే కదా! 

దీనివలన పోరితములో ద్రోణుడు భీష్ముడు పాండుపుత్రులు నశించిరి. ఎందఱందరో సోదరులు తండ్రులు కుమారులు నిహతులైరి కదా! లోభాత్ముడెంతటి దారుణమైన చేయగలడు కనుక లోభమతులగు భార్గవులు పాపమతులగు హైహయులచేత మడిసిరి.

Chapter 136 History of Nimi - అధ్యాయము 136 నిమి చరిత్రము

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము - అధ్యాయము 136

నిమి చరిత్రము

జనమేజయు డిట్లనెను : వ్యాసమహర్షీ! వసిష్ఠుని పునర్జన్మము గుఱించి వివరించితివి. అటులే నిమి యెటుల మరొక తనువుదాల్చెనో తెలుపుము.' అన 

వ్యాసుడిట్లనెను: రాజా! వసిష్ఠుడు వేరొకదేహము దాల్చెను. కాని, నిమిమాత్రము వసిష్ఠశాపమున మరొక్కమేను దాల్చలేదు. వసిష్ఠుడు నిమిని శపింపగ ఋత్విజులు బ్రాహ్మణులెల్లరు నిట్లు తలంచిరి: ఈ యజ్ఞము పూరణము గాకమునుపే రాజు శపింపబడెనే. రాజు దీక్షితుడుగదా! ఇపుడు మనమేమి చేయవలయును? ఇట్టి విపరీత పరిస్థితిలో చేయదగినదేమున్నది? కానున్నది కాగలదు. మన మీశాపమును వారింపజాలము. 

అని తలంచి వారు నిమిలోని సూక్ష్మాంశము గ్రహించి దానిని వివిధ మంత్రములతో గాపాడుచుండిరి. వారు తమ మంత్రశక్తి ప్రభావముతో నిర్వికారమైన సూక్ష్మ రూపమును పల్మారు గంధమాల్యాదులచే పూజించుచుండిరి. కొంతకాలమునకు యజ్ఞము సంపూర్ణమయ్యెను. అపుడు దైవతగణమేతెంచెను. ఋత్విజులు ప్రస్తుతింపగ దేవతలు పరమానందభరితులైరి. మునుల స్తోత్రములకు దేవతలు ప్రసన్నులైరి. 

వారు విషణ్ణుడగు రాజున కిట్లనిరి : రాజా! మేము సంతుష్టిజెందితిమి. వరము కోరుకొనుము. ఓ రాజర్షీ ! నీకీ యాగమువలన నుత్తమజన్మ లభింపగలదు. నీకు దేవశరీరము కావలయునో నరదేహము గావలయునో కోరుకొమ్ము. నీ పురోహితుడగు వసిష్ఠుడు నరజన్మమెత్తి గర్వించియున్నాడు.' 

అంత నిమిజీవాత్మ ప్రమోదమంది దేవతల కిట్లనెను : నాకీ నశ్వర శరీరముపై వాంఛలేదు. సురలారా! నేను సకల భూతముల చూపులకు పైగా నుండగోరుచున్నాను. నేనెల్ల భూతముల కన్నులపై వాయురూపము దాల్చి చలించుచుండవలయును అనెను.

అపుడు దేవతలు నిమి జీవాత్మకిట్లనిరి : రాజా ! నీవు యజ్ఞప్రియ యజ్ఞేశ్వరి యగు శివభగవతిని ప్రార్థించుము. ఆ దేవి నీ యీ జన్నమునకు తుష్టిజెందెను. ఆ తల్లి నీ కోరిక తప్పక దీర్పగలదు. అని సురలు పలుకగ నిమి పరమభక్తితో పరాంబికను వివిధ దివ్యస్తోత్రములచే సవినయముగ సంస్తుతించెను. 

అంత నిమికి సూర్యకోటి సమప్రభయగు శ్రీదేవి ప్రత్యక్షమయ్యెను. దేవి భవ్యలావణ్యపు వెలుంగుగాంచి యెల్లరానందభరితులై తమకు తాము ధన్యజీవులమనుకొనిరి. శ్రీమాత ప్రసన్నురాలుగాగా రాజిట్లు వరము వేడుకొనెను : 

ఓ తల్లీ! విమల జ్ఞానము మోక్షకారకము. అట్టి జ్ఞానము గల్గించు జన్మమిమ్ము. నన్నెల్ల ప్రాణుల నేత్రములపై నివసింపనిమ్ము. అంత జగజ్జననియగు మహేశ్వరి సుప్రసన్నయై యిట్లనెను : 

నీ ప్రారబ్ధ శేషమున నీకు విమల జ్ఞానము గల్గుగాక! నీవెల్ల ప్రాణులకన్నులపై నుండగలవు. నీ వలననే ప్రాణులకు నిమిషము (కనుమూత) గల్గుచుండును. నీ యునికి వలన నర-పశు-పక్షుల కనులు మూతలుపడును. కాని, యనిమిషులు (దేవతలు) మాత్రము కనుఱప్పలు వాల్చకుందురు. 

ఇట్లు వరదాయినియగు దేవి వరములొసింగి మునులకు ప్రియములు పలికి యచ్చోనంతర్ధాన మొందెను. దేవి యంతర్ధానమొందిన పిమ్మట మునులెల్లరు దమలో దామాలో చించుకొని నిమి దేహమును యథావిధిగ తీసికొనిరి. వారు నిమిపుత్త్రుని బడయుటకు నిమి దేహము నరణితో మథించిరి. అగ్నివేల్చిరి. 

అట్లరణితో మథింపగ సాక్షాత్తుగ నిమి వంటి సర్వలక్షణ సంపన్నుడగు కుమారుడందుండి యుద్భవించెను. ఆ బాలకు డరణి మథనమున బుట్టుటవలన మిథియనియును తన జనకుని తనువునుండి బుట్టుట వలన జనకుడనియును లోకమున పేరొందెను.

అట్లు నిమి విదేహుడుగనగుటవలన నతని వంశములోని వారెల్లరును విదేహరాజులని పిల్వబడిరి. ఈ ప్రకారముగ నిమి తనయుడు లోకమున జనకుడుగ చిరకీర్తిగాంచి గంగాతీరమున నొక సుందరనగరము నిర్మించెను. ఆ నగరు నాటి నుండి మిథాలానగరమన వన్నెగాంచెను. అందు సుందర ప్రాకారములు నున్నత భవన గోపురములు విలసిల్లెను. అది ధనధాన్య సమృద్ధమై చెన్నొందెను. 

అతని వంశమున జన్మించిన వారెల్లరును. జనకులుగ విదేహులుగ బిలువబడి జ్ఞానసంపన్నులైరి. రాజా! ఇట్లుత్తమ నిమి చరిత్రమును నతడు శాపవశమున విదేహుడగుటయు నీకు వివరించితిని. 

రాజిట్లనెను : ' వ్యాసమునీశా! నిమి శాపకారణము వివరించితివి. నా చిత్త మతిచంచలము. నిమి కథ వినగనే నాకు సంశయము గల్గుచున్నది. వసిష్ఠుడు బ్రాహ్మణ శ్రేష్ఠుడు - నిమికి పురోహితుడు - బ్రహ్మపుత్రుడు గదా! మఱియతడు రాజుచే నెట్లు శపింపబడెను? వసిష్ఠుడు తనకు గురువు కుల పురోహితుడునని నిమికి తెలియునుగదా! 

కనుక యజ్ఞదీక్షలోనున్న రాజు మునినేల క్షమించలేదు? రాజున కంత పట్టరానికోపమెట్లుగల్గెను? నిమి యిక్ష్వాకు వంశజుడు ధర్మవిదుడుగదా! అతడు తన గురువగు బ్రాహ్మణునేల శపించెను?' 

వ్యాసుడిట్లనెను : రాజా! ఇంద్రియములను జయించుటకు శక్తిలేని ప్రాణుల కోర్మియుండదు. కనుక నీ లోకమున సామర్థ్య ముండియు క్షమాశీలియగువాడు దుర్లభుడు. ఒక తాపసు డాకలిదప్పులు మాని సర్వసంగపరిత్యాగియై యోగాభ్యాసమున నిష్ఠ గల్గియుండవచ్చును.

కాని, యంతటివాడును తనలో చెలరేగుచున్న కామ-క్రోధ-లోభాహంకారములను నల్గురు శత్రువులను గెల్వనోపడు. అట్టి లోని శత్రువులను గెల్చినట్టి మానవుడు భూత వర్తమాన భవిష్యత్తులలో నొక్కడునులేడు. అట్టి లోని వైరులను గెల్చినట్టి మానవుడు బ్రహ్మవిష్ణుశివలోకములందును స్వర్గమర్త్యపాతాళములందు నొక్కడునులేడు. 

ఈ త్రిగుణములకు బ్రహ్మపుత్రులు తపసులు మునులును బద్ధులగుదురు. ఇక సామాన్యమానవుల విషయము చెప్పనేల? కపిల మహర్షి సాంఖ్యయోగ ప్రవర్తకుడు పవిత్రుడుగదా! అట్టి వాడును దైవయోగమువలన సాగరతనయులను దగ్ధుల నొనరించెను. రాజా! ఈ భువనత్రయ మహంకార కారణమున బుట్టెను. జగము నహంకారము రెండును పరస్పరము కార్యకారణ భావమున బద్ధములైనవి. 

ఇంక నహంకారము లేనిచో జగమెట్లుండును? బ్రహ్మవిష్ణుమహేశుల శరీరములందు త్రిగుణభావములు వేర్వేరుగ గల్గుచుండును. ఇక మానవులలో సత్త్వగుణము లేదనుటలో వింతయేమున్నది? ఎందులకనగా, త్రిగుణము లెల్లడలను వ్యాపించి యుండును గదా! ఒకప్పుడు సత్త్వము వేరొకప్పుడు రజస్సు మరొకప్పుడు తమము పెరుగుచుండును. 

ఒక్కొక్కప్పుడు ఇవి సరిసమానముగ నొప్పును. పరమాత్మ అవ్యయుడు - పరుడు-నిర్గుణుడు - అప్రమేయుడు-అగోచరుడు-సనాతనుడు. అటులే శ్రీదేవి పరబ్రహ్మస్వరూపిణి పరమార్థప్రదాయిని నిర్ణుణ-మాయాశక్తి-సర్వభూతాత్మ. అల్పబుద్ధులకు తెలియరానిది. ఇట్టి పరమాత్మ - పరాశక్తుల యేకత్వమన్యోన్యత్వ మెఱింగిన మనుజుడు సకల దోషములనుండి విముక్తి గాంచగలడు.

ఇట్టి నిర్మల నిశ్చలజ్ఞానమువలన మోక్షము గల్గునని వేదాంతభేరి మ్రోగుచున్నది. దీని నెఱింగిన మానవుడీ త్రిగుణమయ సంసారము దాటగలడు. జ్ఞానము రెండు తెఱంగులుగ నలరారును. అందు మొదటిది శాబ్దజ్ఞానము. అనగా బుద్ధి బలమున వేదశాస్త్రార్థ చమత్కార మెఱుగుట. ఇది బుద్ధిచే నూహించుట వలన గల్గును. 

దీనిలో పెక్కులు కల్పితములై యుండును. వీనిచే చిత్తభ్రాంతి గల్గును. దీనివలన బుద్ధినాశము - దానివలన జ్ఞాననాశము గల్గును. ఇక రెండవది అనుభవజన్య జ్ఞానము. ఇది కడుంగడు దుర్లభము. దీనినెఱిగిన సద్గురువు వలన సత్సాంగత్యమువలన నిది లభ్యమగును. శాబ్దజ్ఞానమువలన ఏనాటికిని వస్తు-కార్య-సిద్ధిగానేరదు. శాబ్దజ్ఞానము వలన లోకోత్తరమైన యాత్మానుభవజ్ఞానము గలుగదు. 

జన్మజన్మముల యజ్ఞానపు పెంజీకటుల తెరలను శబ్దజ్ఞానము ఛేదింపజాలదు. ఎట్లనగ, దీపము గూర్చి తెలసినంత మాత్రాన చీకట్లు వ్రీలిపోవుగదా! ఏది బంధకారణముగాదో యదే నిజమైన కర్మ. దేనివలన విముక్తిగల్గునో యదే విద్య. ఇతర కర్మలన్నియు నాయాసము గల్గించునవే. ఇతర విద్యలన్నియును నాయా శిల్పాదికళలలో నేర్పుమాత్రమే కల్గించును. 

కనుక సచ్ఛీలము-ఓరిమి-ధృతి-కోపము లేకుండుట - పరోపకారము - సంతోషము మున్నగునవి పరావిద్యకు పండిన దివ్యఫలపురసములు. రాజా ! విద్య తపము యోగాభ్యాసమనునవి ముఖ్యములు. ఇవి లేనిచో కామాది శత్రువులు నశింపరు. జీవుల మనస్సు సహజముగ చంచలమైనది. వశముగానిది. దానికి లోబడిన ప్రాణులు లోకమున ముత్తెఱగుల నుందురు. చంచల చిత్తమువలన కామక్రోధాది భావములు గల్గును. మనస్సును జయించినచో కామాదులు గలుగవు. 

కనుక నిమిరాజున కోర్పులేకపోయెను. యయాతి తిరిగి కోపముతో శుక్రాచార్యుని శపించలేదు. యయాతి ముసలితనమునే స్వీకరించెను. నిమి యయాతులలో నొకరాజు క్రూర స్వభావుడు - వేరొకడు శాంతస్వభావుడు. ఇట్టి భిన్న భావములుండుటవలనప నెవనిని దోషిగ నెన్నగలము? మున్ను హైహయగణము ధనాశవలన తమ పురోహితులగు భార్గవులను హింసించిరి. వారు బ్రాహ్మణులను కన్ను మిన్ను గానని కోపముతో సమూలముగ నశింపజేసిరి. పిదప నట్టి క్షత్రియగణమునకు బ్రహ్మహత్యాపాతకము చుట్టుకొనెను.

అధ్యాయము 137 హైహయుల చరిత్ర

Chapter 135 The story of Vasishtha's previous birth - అధ్యాయము 135 వసిష్ఠుని పూర్వజన్మ వృత్తాంతము

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము - అధ్యాయము 135

వసిష్ఠుని పూర్వజన్మ వృత్తాంతము

జనమేజయు డిట్లనెను : ఓ వ్యాస! మహాత్మా! వసిష్ఠుడు బ్రహ్మ మానస పుత్త్రుడు కదా! అతనిని మైత్రావరుణుడని యంటివి. అతనికా పేరెట్లు వచ్చెను? వాక్య విశారదా! అతనికా పే రతని కర్మ వలన గలిగెనా? లేక గుణము వలన గలిగెనా? ఆ కారణము నాకు విశదీకరించుము. 

వ్యాసుడిట్లనెను : 'ఓ రాజా! వసిష్ఠుడు బ్రహ్మమానస పుత్త్రుడు. అతడు నిమిశాపమున తన మేను చాలించి పునర్జన్మమందెను. ఆ మఱుజన్మలో నతడు మిత్రావరుణులకు జన్మించుటవలన లోకమున మైత్రావరుణి నామధేయముతో ప్రసిద్ధి కెక్కెను.' 

రాజిట్లనెను : 'వసిష్ఠుడు బ్రహ్మతేజోబలుడు బ్రహ్మజుడు ధర్మ స్వరూపుడు. అట్టి వాడొక రాజు శాపమునకు దారుణముగ గురియగుట వింతగనున్నది. ఏ పాప మెఱుగని బ్రహ్మర్షిని రాజేల శపించెనో యా కారణమును వినిపింపుము.' అన 

వ్యాసుడిట్లనెను : 'రాజా! నేనీ యింతటికిని కారణము పూర్వమే తెల్పితిని. ఈ జగములు త్రిగుణములచే వ్యాపించియున్నవి. పూర్వము తెలిపిన రాజులు ధర్మమాచరించి యుందురుగాక! తబిసి తపము చేసియుండుగాక! కాని, వారి వారి కర్మములు మాయాగుణబద్ధములయ్యెను. కనుక నవి సాత్త్వికత్వము గాంచలేకుండెను. 

రాజులను మునులును కాలక్రమమున కామక్రోధములకు లోభాహంకారములకు లోనై దారుణ తపము లొనర్చిరి. రాజులు రజోగుణముతో యాగము లొనర్చిరి. విప్రడెవ్వడును సత్త్వగుణముతో వెలుగొందలేడు. కనుక నిమివలన మునియు ముని వలన నిమియును పరస్పరము విధివశమున శపించుకొని క్లేశములు కొనితెచ్చుకొనిరి. ఈ జగము గుణత్రయ బద్ధము కనుక నెల్ల జీవులకు చిత్తశుద్ధి క్రియాశుద్ధి మనఃశుద్ధియును మూడును దుర్లభములు. 

ఇదంతయు నా దివ్యపరాశక్తి మాయాప్రభావమున గల్గును. దానినెంత వాడును మీఱజాలడు. ఆ దయామయి యెవని ననుగ్రహించునో వాడు ముక్తుడగును. ఇంతయేల? ఆ మాత దయలేనిచో హరి హర బ్రహాదులును ముక్తులు గాజాలరు. పామరులు సత్యవ్రతాదులవలె దేవి దయవలన తరింతురు. ఆ సర్వేశ్వరి హృదయపులోతు లెఱుగువా డీ ముల్లోకములలో లేదు. ఐనను ఆ తల్లి దేవీ భక్తులకు వశమై యుండును. కనుక దోషములెల్ల తొలగుటకు సాత్త్విక శాశ్వత భక్తి ముఖ్యాతిముఖ్యము. భక్తిలో రాగదంభములు తావు చేసికొన్నచో నది దుఃఖదాయక మగును.

పూర్వ మిక్ష్వాకు వంశమునందు నిమియను రాజుండెను. అతడు రూపగుణసంపన్నుడు; ధర్మజ్ఞుడు; లోకరంజకుడు. అతడు సత్యవాది దాత జ్ఞాని పవిత్రుడు యాజకుడు ధీశాలి ప్రజాపాలనతత్పరుడు. తన తండ్రికి పండ్రెండవ తనయుడు. అతడు గౌతమాశ్రమముచెంత జయంతు పురమను నగ్రహారమును బ్రాహ్మణుల మేలుగోరి వారికై నిర్మింపజేసెను. 

అతనికి భూరిదక్షిణలతో రాజసూయాగము చేయవలయుననెడు కోరిక చాలకామునుండి యుండెను. అంత నతడు తన తండ్రి యాజ్ఞ బడసి గొప్పవారి నుండి కావలసిన యాగ సామగ్రి సమకూర్చుకొనెను. పిమ్మట నతడు భృగువు అంగిరుడు వామదేవుడు గౌతముడు వసిష్ఠుడు పులస్త్యుడు పులహుడు ఋచీకుడు క్రతువు మున్నగు వేదపారగులు సర్వజ్ఞులు యజ్ఞ విద్యానిపుణులు తాపసులునగు వారిని యజ్ఞమున కాహ్వానించెను. 

అట్లు రాజు యాగసామగ్రి నంతయు సమకూర్చుకొని సవినయముగ తన గురువగు వసిష్ఠుని పూజించి యిట్లనియెను : మునివరా! దయామయా! నేను యజ్ఞ మాచరింతును. యాగ మొనరింపజేయుము. నీవు సర్వవిదుడవు. నాకు కులగురుడవు. ఆప్తుడవు నా కార్యము నెఱవేర్చుము. నేను యాగ ద్రవ్యము లన్నియు చక్కగ సమకూర్చుకొంటిని. ఐదువేలేండ్లు పూర్తిగ యాగదీక్ష వహింపదలచితిని. నేను శ్రీ జగదంబికా దేవి నారాధింపగలను. దేవీ ప్రీత్యర్థముగ దేవీ మహాయజ్ఞము విధివిధానముగ నాచరింపగలను'' అను నిమి వాక్కులు విని 

వసిష్ఠుడిట్లనెను : 'ఇంద్రు డింతకు పూర్వమే నన్నొక యాగమున కాహ్వానించెను. అతడైదువందల యేండ్లవఱకు శ్రీపరాశక్తి మహాయజ్ఞమాచరింప బద్ధకంకణు డయ్యెను. అతని యజ్ఞము పూర్తియగువఱ కెదురు చూడుము. ఇంద్రుని యాగము పూర్తిచేసి వత్తును. అంతవఱ కోపికపట్టుము.'

రాజిట్లనెను : ''నే నీ యజ్ఞమున కితరమునుల నెల్ల నాహ్వానించితిని. యజ్ఞసంభారము లెల్ల తెచ్చుకొంటిని. ఇప్పుడు దాని నెట్లు మానుకొందును? విప్రవరా! నీవు వేదవిదుడవు. ఇక్ష్వాకుల కులగురుడవు. ఇపుడు నా కార్యము వదలి నీ వెట్లు వెళ్ళగలవు? ద్విజవరా! నా యాగము వదలివెళ్ళుట నీకు తగదు. నీవు లోభముతో ధనాశతో వెళ్ళుచున్నావు' అని నిమి యెంతయో వారించెను. ఐనను వసిష్ఠుడింద్రుని యాగమునకు వెళ్ళెను. అపుడు రాజు విమనస్కుడై తన యజ్ఞము కొనసాగింప గౌతముని నియమించెను. 

అతనిని పూజించి సత్కరించి హిమాలయముచెంత గల సాగరతీరమున జన్నమునకు పూనుకొనెను. ఆ యజ్ఞమునందు నిమి విప్రులకు భూరి దక్షిణ లొసంగెను. అట్లు నిమియైదు వేలేండ్లు దీక్షతో దేవీ మహాయజ్ఞమాచరించెను. అందు రాజు ఋత్విజులను చక్కగ బూజించి వారికి విశేషముగ గోధనము లొసంగెను. 

అట నింద్రుని యైదు వందల యేండ్ల దేవీయాగము పూర్తి యయ్యెను. ఆ పిదప వసిష్ఠుడు నిమి యాగము గాంచుటకు వచ్చి రాజదర్శనము కెదురు చూచుచుండెను. ఆ సమయమున నిమి గాఢనిద్రలో నుండుటచే సేవకు లతనిని మేలుకొల్పలేదు. కనుక రాజు ముని చెంతకు రాలేకపోయెను. 

అంత మునిసత్తముడగు వసిష్ఠునకు కోపము తీవ్రరూపము దాల్చెను. అతడు నిమిని నేను నీ గురుడను. నన్ను త్రోసిరాజని వేరొక్కని గురువుగ నెన్నుకొంటివి. మందమతీ! నేనెంతజెప్పినను నా మాట కాలదన్ని యోపిక లేక నీవు దీక్ష వహించితివి. నన్ను నిందించితివి. కాన నీవు నీ శరీరము పడిపోయి విదేహుడవగుము' అని యెలుగెత్తి శపించుట సేవకులు వినిరి.

వారు రాజును మేలుకొల్పి వసిష్ఠుడు కోపముతో నతనిని శపించిన తెఱుంగెఱింగించిరి. నిమి యే కల్మషములేని శుద్ధాత్ముడగు రాజు. అతడు యుక్తి యుక్తముగ సహేతుకముగ సవినయముగ నిట్లనెను : 

ఓ ధర్మజ్ఞా! ఇందు నా దోషమావంతయును లేదు. నీకు ధనకాంక్ష మెండయ్యెను. నేను నీ యజమానుడను. నేనెంతయో ప్రార్థించితిని. ఐనను నీవు నన్ను లెక్కచేయక వెళ్ళితివి. ఇట్టి నింద్యకర్మ మొనరించియు నీకు సిగ్గు గల్గుటలేదా? బ్రాహ్మణుని ముఖ్య ధర్మము సంతోషము అని వేదవేదాంత విదుడవు బ్రహ్మపుత్త్రుడవునగు నీ వెఱుందువు. 

కాని, విప్రధర్మములలోన ధర్మ సూక్ష్మ మెఱుగలేకపోతివి. నీ దోషము నాయందారోపించి వ్యర్థముగ నన్ను శపించితివి. క్రోధము చండాలునికంటె చెడ్డది. సజ్జనులు దానిని చెంతకు చేరనీయరు. నీవు పట్టరాని కోపముతో వట్టిగ నన్ను శపించితివి. క్రోధము చండాలునికంటె చెడ్డది. సజ్జనులు దానిని చెంతకు చేరనీయరు. నీవు పట్టరాని కోపముతో వట్టిగ నన్ను శపించితివి. కోపముతో భగ్గున మండితివి. 

కనుక నీ దేహమును పడి పోవుగాక! ఇట్లు మునిచేత రాజు రాజుచేత మునియు శపింపబడిరి. ఇట్లు వారు పరస్పరము శపించుకొని తిరని దుఃఖము లనుభవించిరి. అంత వసిష్ఠుడు వంతజెంది బ్రహ్మను శరణు వేడెను. తన్ను రాజు శపించిన విధమును విసిష్ఠు డిట్లతనికి తెలిపెను : 

నీ శరీరము పడిపోవుగాక అని నేను నిమిచే శపింపబడితిని. తండ్రీ! ఇపుడీ దేహపతనమున పెద్ద యిక్కట్టువచ్చి పడినది. నే నిపుడేమి చేతును? నాకు జన్మ మొసగు తండ్రి యెవడో తెలుపుము. నాకు పూర్వ దేహమే కలుగవలయును. ఈ దేహ మందున్న జ్ఞానము వేరొక దేహమునందును గలుగవలయును. నా మీద దయజూపుట కీవే సమర్థుడవు' అను వసిష్ఠుని దీనవచనములువిని 

బ్రహ్మ తన తనయునితో నిట్లనెను : నీవు మిత్రావరుణి తేజములో ప్రవేశించి స్థిరముండుము. అంత సుకాలమున తప్పక నయోనిజుడవై వెలుగొందగలవు. ఆ దేహము బడసి నీవు విశ్వాభూతాత్మకుడవు ధర్మయుతుడవు వేదవిదుడవు సర్వజ్ఞుడవు సర్వపూజితుడవు గాగలవు.'

అపుడు వసిష్ఠుడు పితామహునకు ప్రదక్షిణ నమస్కారము లాచరించి వరుణాలయ మేగెను. అచట వసిష్ఠుడు తన దేహము చాలించి జీవరూపముతో మిత్రావరుణుని దేహములో ప్రవేశించెను. 

ఒకప్పుడూర్వశి తన చెలియలు వెంటరాగా రాగము లొలికించుచు స్వేచ్ఛా విహారములు సల్పుచు వరుణాలయము జేరెను. ఊర్వశి రూప¸యవనసంపన్న. వియచ్చర దేవకామిని. ఆ సొబగులాడిని గాంచగనే మిత్రావరుణుల హృదయములు మదన పరవశము లయ్యెను. వారు కామపీడితులైరి. వారిర్వురు మనోరమ సర్వాంగసుందరి వేల్పుకన్నియ యగు 

నూర్వశితో నిట్లు పలికిరి : శోభనాంగీ! మమ్ము వరింపుము. వరవర్ణినీ! మాతో నీ యిచ్చమెచ్చునట్లు విహరించుము. అని వారు పలుకగనే యూర్వశి వారియందనురాగవతియై మిత్రావరుణుల యింటిలో నివాస మేర్పరచుకొనెను. ఆమె యచట వారి భావముల కనుకూలముగ మసలుకొనుచుండెను. అంతలో దైవయోగమున మిత్రావరుణుల వీర్య మొక మూతలేని కుండలో పడెను. 

అందుండి యిర్వురు సుకుమారముని కుమారులుద్భవించిరి. వారిలో మొదటివాడగస్త్యుడు, రెండవవాడు వసిష్ఠుడు. ఇట్లు మిత్రావరుణుల వీర్యమువలన ఋషిసత్తములగు తాపసు లుద్భవించిరి. అగస్త్యుడు బాల్యమునందే తపమునకు వనముల కరిగెను. వసిష్ఠు డిక్ష్వాకు రాజునకు పురోహితుడుగ వరింపబడెను. రాజతనిని తన పూర్వ వసిష్ఠునిగ నెఱిగి ప్రీతితో తన వంశము మేలుకొఱ కతనిని గౌరవించుచుండెను. 

రాజా! నీ కీ విధముగ వసిష్ఠుని పూర్వ చరిత్రము తెలిపితిని. అతడు శాపవశమున మిత్రావరుణులకు సుతుడగుటయు తేటతెల్ల మొనరించితిని.

అధ్యాయము 136 నిమి చరిత్రము

Chapter 134 Harishchandra's recovery - అధ్యాయము 134 హరిశ్చంద్రుడు రోగముక్తుడగుట

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము - అధ్యాయము 134

హరిశ్చంద్రుడు రోగముక్తుడగుట

ఇంద్రుడిట్లనెను : ''ఈ విధముగ మున్ను నీ తండ్రి హరిశ్చంద్రుడు తన కోడుకును యాగపశువుగ జేసి యాగమొనర్తునని వరుణునకు మాటయిచ్చెను. కనుక నీవీ పరిస్థితిలో వెళ్ళినచో నీ తండ్రి దయమాలి యూపస్తంభమునకు నిన్ను పశువుగ గట్టి చంపగలడు.' ఇట్లు తేజశ్శాలియగు మహేంద్రుడు వారించుటచే మాయామోహవతుడగుట వలన రాకుమారు డచ్చటనేయుండ నిశ్చయించుకొనెను. 

మొదట తన తండ్రి రోగపీడితుడై యున్నాడని వినినపుడతడు వెళ్ళుటకు తలంచెను. కాని, యంతలో నింద్రుడు వచ్చి యతనిని వారించెను. అట హరిశ్చంద్రుడు దుఃఖార్తుడై యుండెను. 

ఒకనాడతని మేలుగోరు వసిష్టుడతని చెంత నొంటిగ నుండగ నతడు ముని కిట్లనియెను : 

ఓ మహాత్మా! నేను శోకార్తుడను. ఏమి చేతును? ఈ తీరని భీకర వ్యాధిచే బాధపడుచున్నాను. నన్ను గాపాడుము. 

వసిష్ఠు డిట్లనెను : రాజా! వినుము. నీ రోగము తొలగుట కొక యుపాయము గలదు. ధర్మశాస్త్రములందు పుత్రులు పదమూడు విధములుగ జెప్పబడినారు. కనుక నీవొక విప్రునకు కోరిన ధనమిచ్చి యతని కొడుకును కొనితెచ్చి యాగమొనరింపుము. అట్లు యాగము చేయుట వలన నీవు రోగముక్తుడవగుదువు. వరుణుడును తప్పక ప్రసన్నుడుగాడలడు.' ముని మాటలు విని రాజు తన మంత్రితో నిట్లనియెను : 

'మంత్రీ! నీవు మహామతివి. నీవు బాగుగ యత్నించి మనదేశమందలి యొక విప్రకుమారుని కొనితెమ్ము. ధనాశగలవాడెవడైన తన కొడుకు నమ్ముకోగలడు. అతనికి కోరినంత ధనమిచ్చి యతని కొడుకును కొనితెమ్ము. నీవు నా యాగమున కెల్ల భంగులనొక విప్రబాలుని తేవలయును. నా యీ కార్యసాధనకు వెనుకచూపు చూడవలదు. నీ వే బ్రాహ్మణునైన సమీపించి యతనికి ధనమిచ్చి యతని బాలుని యాగపశువుగ నుండుట కిచ్చుట కతని నడుగుము. ఇట్లు మంత్రి రాజునాజ్ఞబడసి రాజకార్యము సాధించుట కూరురు నిల్లిల్లు వెదకుచుండెను.

ఇట్లు మంత్రి వెదుకుచుండగ నొకచోట అజీగర్తుడను పేద విప్రునకు మువ్వురు కొడుకులుండిరి. అపుడు మంత్రి యజీగర్తునకు కోరినధనమిచ్చి నడిమివాడగు శునశ్శేపుని తనవెంట గొనితెచ్చెను. అట్లు కార్యసాధకుడగు మంత్రి శునశ్శేవుని గొనితెచ్చి యీ విప్రకుమారుడు పశుత్వమునకు యోగ్యుడని రాజునకు చెప్పెను. అందులకు రాజు ముదమంది వేదవిధులను పిలిపించి యాగద్రవ్యములు సమకూర్చెను. యజ్ఞము ప్రారంభమయ్యెను. అంతలో నటకు విశ్వామిత్ర మహర్షి యరుగుదెంచెను. 
అట్లు శునశ్శేపుడు గట్టుపడుటగాంచి ముని రాజును యాగమాపుమనుచు : 

''రాజా! దుస్సాహసము వలదు. ఈ విప్రబాలుని విడువుము. నిన్ను నేను వేడుకొనుచున్నాను. నీకు మేలగుత! ఈ బాలుడు విలపించుచున్నాడు. ఇతనిని చూడగనే నా గుండె చెఱువగుచున్నది. నా మాట విని యితనిపై దయబూనుము. తొల్లి క్షత్త్రియవీరులు పరులను రక్షించిరి. వారు స్వర్గకాములై రణములందు తనువులు బాసిరి. 

ఇపుడు నీవు నీ శరీర రక్షణకొక విప్రబాలుని బలిచేయుచున్నావు. పాపము చేయకుము. ఈ బాలునిపై జాలి బూనుమ. ప్రతి ప్రాణికి తన ప్రాణములమీద తీపియుండును గదా! ఇది నీకును దెలియును. కనుక నీ మాట ప్రమాణముగ నమ్మి యితనిని విడువుము'' అనెను. కాని, దుఃఖార్తుడగు రాజు మునిమాటలు లెక్కచేయక బాలుని వదలలేదు. అంతట విశ్వామిత్రుడు రాజుపై కోపించెను. వేదవిదుడగు విశ్వామిత్రుడు దయతో శునశ్శేపునకు వరుణమంత్ర ముపదేశించెను. చావుబాధపడుచున్న శునశ్శేపుడు మంత్రమును ప్లుతస్వరముతో జపించుచు వరుణదేవుని దీనముగ ప్రార్థించెను. 

వరుణుడు కరుణరస సముద్రుడు. అతడు తన్ను నుతించునట్టి విప్రకుమారుని చెంతకేతెంచి యతనిని బంధముక్తుని చేసెను.

వరుణుడు రాజును సైతము రోగముక్తునిజేసి తనచోటికేగెను. అట్లు విశ్వామిత్రుడు విప్రబాలుని మృత్యుముఖము నుండి కాపాడెను. రాజు విశ్వామిత్రుని మాట పెడచెవిని బెట్టినందువలన ముని రాజునెడ రోషముబూని యుండెను. 

ఇది ఇట్లుండ ఒకనాడు హరిశ్చంద్రుడు ఒక పందిని చంపదలచి కౌశికీతీరమునకు వేటకుపోయెను. ఆ మధ్యాహ్న సమయమున విశ్వామిత్రుడొక ముసలి బ్రాహ్మణుని వేషమున వచ్చి రాజును ప్రార్థించి మోసముతో నతని రాజ్యమంతయు తన కైవసము చేసికొనెను. తన యజమానుడగు హరిశ్చంద్రుడట్లు కష్టాలపాలగుట వసిష్టుడెఱిగెను. 

అతడొకనాడడవిలో తనకంటబడిన విశ్వామిత్రునితో నిట్లనెను : 

'క్షత్రియాధమా! దుర్మతీ! నీవు బ్రాహ్మణవేషముదాల్చి దంభాచారుడగు కొంగవలె ప్రవర్తించి వట్టి గర్వము బొందెదవేల? మూఢుడా! హరిశ్చంద్రుడు నా యజమానుడు. నిరపరాధుడు. అట్టి వానిని నీవేల దుఃఖములపాలు చేసితివి? నీవు బక ధ్యానము బూనితివి. కనుక కొంగవగుము.' అని వసిష్ఠుడు శపించెను. 

విశ్వామిత్రుడంత నిట్లనెను : ''ఓ యాయుష్మంతుడా! నీవు ఆడి యను పక్షివగుదువుగాక!' ఇట్లు వారిర్వును కోపముతో శపించుకొనిరి. వెంటనే వారిర్వురు నొక సరస్సుచెంత ఆడీ బక పక్షులుగ బుట్టిరి. అటనొక చెట్టుపై నొక గూడుగట్టుకొని బకరూపుడగు విశ్వామిత్రుడు కొలనిగట్టున జీవించుచుండెను. వేరొకచెట్టుపై గూడుగట్టుకొని వసిష్ఠు డాడియను పక్షి రూపముతో వసించుచుండెను. 

ఆ రెండును పరస్పర క్రోధద్వేషములతో ప్రతిదినమును పోరుచుండెను. అవి లోకమునకు భీతిగల్గునట్లు గోళ్ళు ఱక్కలు ముక్కులు మున్నగువానితో పోరెను. ఆ రెంటి శరీరములు పూచిన మోదుగులవలె నెత్తుట దోగియుండెను. ఇట్లవి పెక్కేండ్లు పక్కిరూపములలో నుండెను.

ఇట్లు మునులు శాపబద్ధులైయుండిరి. అన రాజినట్లనెను. 'ఆ ముని వర్యులు తిరిగి యెట్లు శాపముక్తులైరి? ఓ మునివరా! దానిని వినుటకు నాకుత్కంఠ గల్గుచున్నది. తెలుపుము.' 

వ్యాసుడిట్లనెను : 'అట్లు వారు పోరుచుండుట లోకపితామహుడగు బ్రహ్మగాంచెను. అపుడు బ్రహ్మ దయామయులగు దేవతలను వెంటగొని యచటి కరుదెంచెను. బ్రహ్మ వారి కూరటగలిగించి పోరు మానిపించెను. వారి పరస్పర శాపములను తొలగించెను. పిమ్మట దేవతలు తమ తమ నెలవుల కరిగిరి. బ్రహ్మయును హంసవాహనమెక్కి సత్యలోకమేగెను వసిష్ఠ విశ్వామిత్రులును తమ తమ యాశ్రమములకు జనిరి. 

వారు బ్రహ్మ యొసగిన యాదేశమును పాటించిరి. నాటినుండి యిర్వురు నేస్తముతో నుండిరి. ఇట్లు వసిష్ఠుడు సైతము నిష్కారణముగ పోరెను. మైత్రావరుణియగు వసిష్టుడట్లు విశ్వామిత్రునితో క్లేశకరమగు పోరు సలిపెను. ఈ లోకములో దేవ-దానవ-మానవాదికమగు ప్రాణులు గలరు. వీరిలో నహంకారమును జయించి సుఖముగ నుండి వాడెవ్వడును లేడు. 

కనుక రాజా! చిత్తశుద్ధి మహితాత్ములకు సైతము దుర్లభము. దానిని ప్రయత్నముతో నెటులైన సాధింపవలయును. అహంకారము గెల్వనిచో తీర్థ - దాన - తపస్సులు సత్యధర్మ సాధనములన్నియు వ్యర్థము. (జీవులు ధర్మకర్మలు నిర్వర్తించుటకు శ్రద్ధ యత్యవసరము. అది సాత్త్వికము రాజసము తామసమని ముత్తెఱంగుల నొప్పును. 

అందును లోకమందు సాత్త్వికశ్రద్ధ దుర్లభము. అది పూర్ణఫలము నిచ్చును. విధి పూర్వకముగ ఆచరించిన కర్మములును రాజసశ్రద్ధ ఇచ్చుదానిలో సగము ఫలమే ఇచ్చును. రాజా! తామసశ్రద్ధ కామక్రోధముల వలన గల్గును. ఇది నిష్ఫలము. అపకీర్తికరమైనది.) కనుక శ్రద్ధాళువులు శ్రవణాదుల వలన చిత్తమును వాసనారహిత మొనర్చుకొనవలయును. 

శ్రీదేవీ పూజా తత్పరులై పుణ్యతీర్థములందు వసింపవలయును. ఈ కలిదోషపీడితుడు శ్రీమాతృదేవి దివ్య మధుర నామము లుచ్ఛరింపవలయును. శ్రీ లలితాంబా పాదపద్మములు సంస్మరింప వలయును. నిత్యము దేవీ ధ్యానము చేయుచుండ వలయును. ఇట్టు లాచరించువాని కేనాటికిని కలిభయము సంక్రమించదు. ఇట్టు లాచరించినచో నెంతటి పాపియైనను తప్పక తేలికగ సంసార ముక్తుడగును. ఇది ధ్రువము.

Chapter 133 The beginning of the story of Harishchandra - అధ్యాయము 133 హరిశ్చంద్ర కథారంభము

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము - అధ్యాయము 133

హరిశ్చంద్ర 
కథారంభము

జనమేజయు డిట్లనెను : మునిసత్తమా! దేవతలు మానవులు సేవింపదగిన పుణ్యతీర్థములు పుణ్యక్షేత్రములు పుణ్య నదులేవేవిగలవో వానిని తెల్పుము. ఏ పవిత్ర తీర్థమున యథావిధిగ స్నానదానాదులు చేసిన ఏమి ఫలము గల్గునో యా తీర్థయాత్రల నియమములేవో వానిని తేటపఱచుము. అన 

వ్యాసుడిట్లనెను : రాజా! ఏయే పుణ్యతీర్థములందు శ్రీదేవి మందిరములు విలసిల్లునో యయా వివిధ తీర్థములుగూర్చి తెలుపుదును. ఆలకింపుము. పావనపుణ్యనదులందు గంగ యమున సరస్వతి నర్మద గండకి సింధు గోమతి కావేరి చంద్రభాగ వేత్రవతి చర్మణ్వతి సరయు తాపి సాభ్రమతి (సబర్మతి) మున్నగునవి పవిత్ర పుణ్యనదులు. 

ఇవికాక భూమిపై పెక్కు నదులు గలవు. వానియందు సముద్రములో గలియు నదులన్నియు అధికతర పుణ్యప్రదములు. జలధిలో చేరనివి తక్కువ పుణ్యప్రదములు. నదులు మహావేగముతో సాగరములో గలిసినచో నవి మహాపుణ్యవంతములు. నదులు శ్రావణ భాద్రపద మాసములందు వర్షములు వలన అపరిశుద్ధమగు నీటితో ప్రవహించును. 

ఇట్లు అవి రజస్వల లగును. పుష్కరము కురుక్షేత్రము మిగుల పావనమగు ధర్మారణ్యము ప్రభాసము ప్రయాగ నైమిశారణ్యము అర్బుదారణ్యము పావనము లని ప్రసిద్ధి గాంచినవి. ఇవ పవిత్ర పర్వతము లెన్నియో కలవు వానిలో శ్రీశైలము మేరువు గంధమాదనము ముఖ్యములు. ఇట్లే పవిత్ర సరస్సులును గలవు. 

వానిలో మానస సరోవరము బిందురసము అచ్ఛోదము ప్రముఖములు. ఆత్మవంతులగు మునీశులు నివసించు పవిత్రాశ్రమములు గలవు. అవి పుణ్యప్రదములు. ఆశ్రమములందు నరనారాయణులు తప మొనరించిన బదరికాశ్రమము మిక్కిలి పుణ్యప్రదమని వన్నెయు వాసియు గాంచెను. 

ఇట్లు వామనాశ్రమమును శతయూపాశ్రమమును పుణ్యకరములే. తప మొనరించిన తాపసుల పేర్లతో నాశ్రమ నామము లేర్పడును. ఈ విధముగ భూతలమునందు లెక్క లేనన్ని పుణ్యతీర్థములు వెలసినవి. ఇవి మునీశుల పావన గీతములతో గానము చేయబడినవి. ఈ పుణ్యక్షేత్రములం దెల్లెడల శ్రీదేవీ స్థానములు విలసిల్లును. ఆ స్థానములను దర్శించిన మాత్రన పాపపంకము లింకిపోవును.

వీనిలో ముఖ్యముగా గొన్నిటిని ప్రసంగానుసారముగ వివరింపగలను. రాజా ! సర్వతీర్థ-వ్రత-దాన-యాగములు ఎల్ల తపములు పుణ్యకర్మములు పరస్పరము పుణ్యమునకు దోహదకారులు. ద్రవ్యశుద్ధి క్రియాశుద్ధి చిత్తశుద్ధి యత్యావశ్యకములు. వీనివలననే ఎల్ల తపములు వ్రతములు తీర్థములు పావనములు పుణ్యదములునై చెన్నలరారును. 

ఒకప్పుడు ద్రవ్యశుద్ధి క్రియా శుద్ధి రెండే యుండవచ్చును. కాని, యెల్లరి కెల్లచోటుల చిత్తశుద్ధి గల్గుట మాత్ర మతి దుర్లభము. ఏలన, చిత్తమతి చంచలము. అది పలు విషయములందు పరిభ్రమించుచుండును. ఇట్లు పెక్కు విధముల భావములకు తావలమైన చిత్త మెట్లు పరిశుద్ధమగును? చిత్తమును కామక్రోధములు మదలోభాహంకారములుండును. 

ఇవి సకల తీర్థవ్రత తపముల విషయమున విఘ్నకారులు. అహింస సత్యము పవిత్రత ఇంద్రియ నిగ్రహము దొంగిలింపకుండుట స్వధర్మపాలన యనునని సకలతీర్థసేవా ఫలములు గల్గింపగలవు. సంగదోషము నిత్యకర్మలోపము అను దోషములు గలవు. ఈ రెండును తీర్థయాత్రల వలన గల్గును. వీనివలన పాపము తగులును. తీర్థము లొడలిమీది మురికిని మాత్రమే పోగొట్టగలవు. అవి చిత్తమాలిన్యమును కడుగజాలవు. 

అవి చిత్తకాలుష్యము బాపజాలినచో గంగాతీర వాసులగు మును లీశ్వర సేవాపరులై యుండిన ద్రోహము లేల యొనర్తును? వసిష్ఠ విశ్వామిత్రాది మునులు వినయశీలురు. వారును రాగద్వేషములకు కామక్రోధములకు వశులై వ్యవహరించిరే! కనుక చిత్తశుద్ధి యను తీర్థము గంగాది తీర్థములకంటె నత్యుత్తమమైనది. 

దైవయోగమున సాధుసజ్జనుల సత్సంగతి లభించవచ్చును. అపుడు చిత్తమాలిన్యము కడుగబడును. వేదశాస్త్రములు దానవ్రతములు తపోయాగములును వీనిలో నే యొక్కటియును చిత్తశుద్ధి గలిగింపజాలవు. వషిష్ఠ మహర్షి బ్రహ్మపుత్రుడు వేదవిద్యా నిష్ణాతుడు గంగాతీరవాసి. అంతటి మహాత్ముడును రాగద్వేషములకు తల యొగ్గెను. వసిష్ఠ విశ్వామిత్రుల పనికిమాలిన ద్వేషము కారణముగ నాడీ బక మహాయుద్ధము సంఘటిల్లెను. అది వేల్పులకును నబ్బురము గలిగించెను.

విశ్వామిత్రుడు తొల్లి హరిశ్చంద్రుని కారణమున వసిష్ఠునిచే శపింపబడి కొంగ యయ్యెను. వసిష్ఠుడును విశ్వామిత్రునిచే శపింపబడి ఆడీరూపము దాల్చెను. ఇట్లు లా మునివరు లాడీ బక రూపములు దాల్చిరి. అవి రెండును మానస సరోవరతీరమున మనుగడ సాగించుచు తమతమ గోళ్లతో ముక్కులతో తీవ్రముగ పోట్లాడుకొనుచుండెను. 
ఆ ఋషు లట్లు రోషముతో మత్తసింహముల మాడ్కి పదివేలేండ్లు పోరిరి. 

రాజిట్లనెను : వారిరువురును ధర్మపరులు తాపసులు మునివరులును గదా! ఐనను వారు పరస్పర మేల శపించుకొనిరి? 

వ్యాసు డిట్లనెను : పూర్వము త్రిశంకుని తనయుడు హరిశ్చంద్రు డను నతడు ప్రసిద్ధి గాంచెను. అతడు సూర్యవంశజుడు శ్రీరామునకు పూర్వుడు. అతనికి సంతులేదు. వరుణుని దయచే తనకు పుత్త్ర ప్రాప్తి గల్గినచో వరుణప్రీతికి తన పుత్త్రుని నరమేథ మొనర్తునని యతడు దుష్కరమగు ప్రతిన బూనెను. అతని యజ్ఞనియమమునకు వరుణుడు సంతుష్టిజెందెను. 

అంతట హరిశ్చంద్రుని భార్య గర్భవతి యయ్యెను. తన భార్య గర్భిణియగుట గని రాజు సమ్మోదముతో నామెకు యథావిధిగ గర్భసంస్కారము లొనరించెను. ఆమె సర్వ లక్షణ సంపన్నుడగు కుమారుని గనెను. రాజు పరమానందబరితుడయ్యెను. అతడా పిల్లవానికి చక్కగ జాతకర్మాది సంస్కారములు జరిపి బ్రాహ్మణులకు బంగారము, పాలిచ్చు గోవులు దానమొనరించెను. 

అట్లు పుత్త్రజనన మహోత్సవము జరుగుచుండగ వరుణుడు విప్రవేషముతో రాజ గృహమున కేతెంచెను, రాజతనిని సత్కరించి కూర్చుండ నియోగించి యతని రాకకు కారణ మడిగెను. 'నేను వరుణుడను. నీ సుతుని పశువుగ జేసి నాకు యజ్ఞ మొనరింపుము. బలి యిమ్ము. నీవు మున్ను నాకు మాట యిచ్చితివి. దాని నిపుడు నిలువబెట్టు కొను' మని వరుణు డనెను.

వరుణుని వాక్కులు వినగనే రాజు నిశ్చేష్టుడై పడి కొంత వడికి తన్నుతా నిబ్బరించుకొని మోడ్పుకేలు నిగుడించి యిట్లనెను : 

స్వామీ! తొల్లి నీకు మాట యిచ్చిన మాట నిజమే. నీకు యథావిధిగ యాగ మొనర్చి సత్యవాది నగుదును. సురవరా ! ఒక నెలకు నా భార్యకు శుద్ధి యగును. ఆమె శుద్ధయైనంతనే నరమేధ మొనర్పగలను అని రాజనగనే వరుణుడు తన నెలవున కరిగెను. రాజు అప్పటికి సంతసించెను. 

కాని లోన దిగులు మాత్ర మతనిని వదలలేదు. ఒక నెల గడిచెను. ప్రియవాదియగు వరుణుడు పిమ్మట పాశము చేతబూని రాజు పరీక్షింప తిరిగి విప్రవేషముతో రాజప్రాసాదమున కేతెంచెను. అంత రాజు వరుణున కాసనమిచ్చి పూజించి సవినయముగ సహేతుకముగా నిట్లు పలికెను : 

స్వామీ! నా కుమారుడింకను సంస్కృతుడు కాలేదు. అట్టి వాని నెట్టుల యూపస్తంభమునకు బంధింపగలను? 

కనుక నతని నొక క్షత్రియునిగ సంస్కరించిన పిదప నుత్తమ నరయాగ మొనర్తును. దేవా! నేను దీనుడను. నీ సేవకుడను. నన్ను కనికరింపుము. సంస్కారహీనుడగు బాలున కెందు నధికారము లేదు గదా! 

వరుణు డిట్లనెను : రాజా! నన్ను మోసగించి మాటిమాటికి రమ్మనుచున్నావు. పుత్రహీనుడవగు నీకు పుత్త్ర వాత్సల్యము మెండు, దీనికి మితి లేకున్నది. 

కనుక నీ మాట చొప్పున తిరిగి నా గృహ మేగుచున్నాను. కొంతకాల మెదురుచూచి తిరిగి నీ యింటికి రాగలను. అపుడైన నీవు నీ మాట నిలువ బెట్టుకొనుము. కానిచో కోపముతో నిన్ను శపింతును. 

రాజిట్లనెను : వరుణదేవా! నా కుమారునకు సమావర్తనము జరుగగానే యతనిని పశువుగ నుంచి యాగమొనర్పగలను. అను రాజు మాటలు విని వరుణుడు హర్షించి యట్లే యని వేగ నేగెను. రాజును శాంతుడయ్యెను. అతని కుమారుడు రోహితనామమున పెరిగి యెల్ల విద్యలందు విశారదు డయ్యెను. అతడు యాగహేతువు నంతయును విని తనకు చావు మూడినందులకు భీతుడయ్యెను. అందుచే అతడు తన తండ్రినుండి పరుగెత్తి యొక గిరి గుహలో వసించెను.

తగిన సమయమునకు యజ్ఞార్థియగు వరుణుడు రాజుచెంత కరిగి యజ్ఞము చేయుమని యడిగెను. అంత రాజు వాడిన మోముతో దిగులొందిన మనముతో నేనిపుడేమిచేతును? నా కొడుకెటకో పారిపోయె' ననియెను. అట్లు రాజు బొంకులాడెను. రాజు మాటలు విని వరుణుడు కోపమున రాజా! నీవు పచ్చిమోసగాడవు. నన్నే మోసగించితివి. 

కనుక నీవు జలోదరమను వ్యాధిచే పీడితుడవగుదువుగాక! అని శపించి తన చోటికి తానేగెను. రాజు తన యింట వ్యాధిపీడితుడై చింతాతురుడై పడియుండెను. శాపవశమున తన తండ్రి రోగపీడితుడగుట రోహితుడు వినెను. ఎట్లన, 

ఒక తెరువరి రోహితుని కిట్లనెను : రాకుమారా! నీ తండ్రి శాపవశమున జలోదర వ్యాధిచే పీడింపబడి దుఃఖించుచున్నాడు. దుర్మతీ! నీ బ్రతుకంతయు పనికిమాలినది. నీ జన్మము నిరర్థకము. నీ తండ్రి దుఃఖించుచుండగ నతనిని విడనాడి నీవీ గిరిగుహలందు సుఃఖింతువా? నీవు కుపుత్త్రుడవు. నీకీ శరీరముండి యేమిలాభము? నీవు పుట్టి మాత్రము ప్రయోజనమేమి? 

అట నీ తండ్రి దుఃఖించుచుండ నీవిట సుఖమున్నావు. తన కన్నతండ్రి మేలుకొఱకు కన్నకొడుకు తన ప్రాణములు సైతము వదల వలయును. నీ తండ్రి వ్యాధిపీడతో నిన్ను తలచితలచి యచట వంతజెందుచున్నాడు.' అది విని రోహితుడు బాటసారివలన సత్యధర్మములగు నీతివాక్యములు గ్రహించి దుఃఖితుడగు తన తండ్రిని గాంచుటకు నిశ్చయించుకొనెను. 

అంతలో నింద్రుడు విప్రవేషమున నతనిని సమీపించి దయగలవానివలె రహస్యముగ నతని కిట్లనియెను : 

''ఓ రాజకుమారా! నీవెంతటి మూర్ఖుడవు. నీ తండ్రి వ్యాధిపీడితుడయ్యెనో లేదో సరిగ నెఱుగక యచ్చోటికి వెళ్లదలతువేల?

అధ్యాయము 134 హరిశ్చంద్రుడు రోగముక్తుడగుట

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము

Chapter 132 The greatness of Sridevi's name - అధ్యాయము 132 శ్రీదేవీ నామ మాహాత్మ్యము

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము - అధ్యాయము 132

శ్రీదేవీ నామ మాహాత్మ్యము

జనమేజయు డిట్లనెను : ''ఓ ద్విజపరా ! ఈ భూమి భార మణచుటకు శ్రీరామకృష్ణాదు లవతరించి రంటివి. దానిని గూర్చి నా యెడదలో నొక శంక గల్గుచున్నది. భూదేవి ద్వాపరాంతమున భూభరణము సాధ్యముకాక దీనయు నార్తయునై గోరూపమున బ్రహ్మను శరణు పొందెను. అంత బ్రహ్మ కమలాపతియగు విష్ణునిజేరి 

దేవా ! ఈ పుడమి బరువు తగ్గింపుము. సాధువులను పరిరక్షింపుము. ఈ భారతకండమునం దెల్ల దేవతలతో గలిసి వసుదేవు నింట సత్వర మవతరింపుమని ప్రార్థించెను. ఇట్లు బ్రహ్మ సన్నుతింపగ విష్ణువు భూభారము బాపుటకు బలరామునితో దేవకియం దవతరించెను. అపుడు శ్రీ కృష్ణుడు దురాచారులు దుష్టులు పాపులునగు నరపతుల నెందఱనో తునుమాడి కొంత భూభారము తగ్గించెను. 

ఈ చనినవారిలో భీష్ముడు ద్రోణుడు కర్ణుడు ద్రుపదుడు విరాటుడు బాహ్లిక సోమదత్తులు నుండిరి. పెక్కురు దుష్టులు విష్ణు భార్యల నపహరించి వారి సొమ్ములు దోచుకొనిరి. కాని, యీ పాపాత్ములు చంపబడలేదు. ఇంకను పెక్కురు గొల్లలు శకులు వ్లచ్ఛులు నిషాదులు మిగిలిరి. విజ్ఞుడగు కృష్ణుడు వారిని చంపక వదలెను. అందువలన భూభారము పూర్తిగా నెట్లు తగ్గిపోయెను? 

ఈ కలియుగమందలి ప్రాణులు పాపమతులు. కనుక భూభార హరణము గూర్చి నాకు సందేహము గల్గుచున్నది.'' అన 

వ్యాసు డిట్లనెను : ''రాజా! ఏ యుగమందలి ప్రజల స్వభావము లా యుగమునకు సంబంధించి యుండును. దీని కంతటికి యుగధర్మము ముఖ్యకారణము. దీనికి భిన్నముగ నేనాడును జరుగదు. ఎల్లరిని చంపినచో సృష్టి ప్రవాహ మాగిపోవును. అందువలన నతడు తక్కిన వారిని చంపక వదలెను. సత్యయుగమున నెల్లరు ధర్మనిరతులు (ధర్మమందే ఆసక్తి కలవారు) ఉండిరి. త్రేతాయుగమందు ధర్మార్థనిరతు లుండిరి. ద్వాపరమున ధర్మార్థకామనిరతు లుండిరి. కలియుగమునందు కామార్థపరులు సంభవింతురు. యుగధర్మ మేనాటికిని మారదు. ధర్మాధర్మములకు కాలమే కర్త యగును. అన 

జనమేజయుడిట్లనెను : 'మహానుభావా! సత్యయుగమునందు ధర్మపరులు పుణ్యనిరతు లుండిరి గదా! వారిప్పు డెచ్చట నున్నారు? త్రేతాద్వాపర యుగము లందలి దానవ్రతపరు లిపు డెచట నున్నారు? నా కదంతయు దెలుపుము. ఈ కలియుగమందు దేవనిందకులు పాపులు దురాచారులు అసత్యవాదులు సిగ్గులేనివారు గలరు. వీరు సత్యయుగమున నేమగుదురు? 

మహాత్మా! ఈ ధర్మసందేహము లన్నియు వినవేడుక గలుగుచున్నది. నా కన్నియు ససాకల్యముగ నెఱింగింపుము.'' అని యడుగ 

వ్యాసుడిట్లనెను : రాజా! కృతయుగమునందు జన్మించినవారు పుణ్యకార్యము లాచరించి దేవలోకమున సుఖముందురు. బ్రహ్మ క్షత్రియ వైశ్యశూద్రులు స్వధర్మనిరతులై తమ తమ కర్మలకు దగిన లోకముల కేగుదురు. సత్య-దయా-దానములు ఏకపత్నీ వ్రతము సర్వభూతసమత గలిగియుండుట ద్రోహద్వేషములు లేకుండ మున్నగు సామాన్యధర్మము లాచరించిన రజకాదులును కృతయుగమున తమ తమ ధర్మములందు నిరతులై స్వర్గము జేరెడివారు. 

ఇటులే త్రేతా ద్వాపరములందలి వారును స్వధర్మపరులై స్వర్గసీమ లలంకరించిరి. కాని, కలియుగమందలి వారు పాపాత్ములై నరకయాతన లనుభవింతురు. వారు యుగము మార్పుజెందువఱకు నరకమున బాధలు పడిపడి తిరిగి మనుజులై పుట్టుదురు. కలియుగ మంతమై సత్యయుగము ప్రారంభమగునపుడు స్వర్గమందలి పుణ్యాత్ములు తిరిగి జన్మింపగలరు. ద్వాపరము చివరలో గలియుగారంభమున పాపులు నరకములనుండి లేచి నరులై జన్మింతురు.

కాలగతి యీ గతిగ నుండును. దీనికి భిన్నముగ నేనాడును జరుగదు. కలియుగము చెడుపనులు చేయించును. కలియుగ ప్రజలు కలి ప్రభావమున చెడుభావములు గల్గియుందురు. ఒకప్పుడు దైవయోగముచే వీరి జన్యములలో వ్యత్యాసములును గలుగును. కలిలోని సాధు సజ్జనులు కొందఱు ద్వాపరమున జన్మింతురు. 

మఱికొందఱు త్రేతాయుగమునను నింకను కొందఱు సత్యయుగమునను జన్మింతురు. సత్యయుగమందలి దుర్మార్గులు కలియుగమున బుట్టుదురు. ప్రాణులు తమ పూర్వ కర్మానుసారముగ సుఖదుఃఖము లనుభవింతురు. ఐనను వారు యుగప్రభావమున యుగధర్మము లాచరింతురు. 

అన మహాత్మా! నాకు యుగధర్మములన్నిటిని వివరింపుము. ఏ యుగమందెట్టి ధర్మము నడచునో యెఱుగగోరుచున్నాను. అను ప్రశ్నమునకు వ్యాసుడిట్లనెను : రాజా! యుగధర్మము వివరింతును. ఆలింపుము. ఎంతటి సత్పురుషుల చిత్తమైనను యుగధర్మానుసారముగ చలించుచుండును. నీ తండ్రి మహాత్ముడే. ధర్మాత్ముడే. ఐనను నతడు కలిప్రేరణమున నొక విప్రుని నవమానించెను. 

కలిప్రేరణలేనిచో యయాతివంశజుడు సుక్షత్రియుడునగు నొక రాజొక తబిసి మెడలో నేల చచ్చిన పామును వైచును? కనుక నంతటికి యుగబలము కారణమని పండితులు వాక్రుత్తురు కావున ధర్మకర్మములు జక్కగ పూనికతో నాచరింపవలయును. సత్యయుగమునందలి బ్రాహ్మణులు వేదపారగులు శ్రీదేవీదర్శన లాలసులు శ్రీపరాశక్తి పూజా తత్పరులు నిరంతర గాయత్త్రీజప నిరతులు శ్రీగాయత్త్రీధ్యాన పరాయణులు ప్రణవ నిమగ్నులు మాయా బీజ తప తత్పరులు. నయియుండిరి. 

ఆ యుగమున గ్రామ గ్రామమున శ్రీ మాతృ మందిర నిర్మాతలు-దేవిమహోత్సవౌత్సాహికులు - స్వధర్మనిరతులు - సత్యశౌచదయాన్వితులు వెలసిరి. క్షత్త్రియులు తత్వజ్ఞాన విశారదులు - వైదిక ధర్మానుష్ఠానపరులు-ప్రజాపాలన తత్పరులు నై యొప్పెసగిరి. వైశ్యులు వ్యవసాయము-వ్యాపారము-గోరక్షణము మున్నగు పనులు నిర్వర్తించిరి. శూద్రులు తక్కిన మూడు వర్ణములవారికి సేవలు సేయుచు నుండిరి.

సత్యయుగమున నెల్ల వర్ణములవారును పరాభట్టారికా పూజాతత్పరులై యుండిరి. త్రేతాయుగమున ధర్మస్థానము కొంత తగ్గెను. సత్యయుగధర్మములు ద్వాపరమున నింకను తగ్గెను. వెనుకటియుగాల రాక్షసులు కలియుగమున బ్రాహ్మణులైరి. వీరు పాషండ మతస్థులు మోసగాండ్రు వేదధర్మరహితులు కల్లలాడువారు దంభాచారులు అభిమానమత్తులు లోకజ్ఞానమున నేర్పరులు శూద్రసేవాపరులు నానాధర్మప్రవర్తకులు వేదనిందకులు క్రూరాత్ములు ధర్మకర్మభ్రష్టులు అతివాదులునై యుందురు. 

కలికాల మధికముగ పెరుగుచుండుకొలది సత్యమూలమగు ధర్మము నంత యధికముగ క్షీణించును. ఇక క్షత్రియ వైశ్య శూద్రులు ధర్మరహితులై వర్తింతురు. తక్కిన వర్ణములవారు పాపుల కల్లబొల్లి మాటలాడువారు నగుదురు. విప్రులు శూద్ర ధర్మమాచరించువారు దాన ప్రతిగ్రహీతలు నగుదురు. ఇట్లు కలికాలమున నధర్మము పెచ్చు పెరుగును. యువతులు కామలోభమోహములు ముప్పిరిగొన కామచారలై వర్తింతురు. 

వారు పాపిష్ఠురాండ్రు బూటకములాడువారు నిత్తెము వంతలగుందువారు తమ పతులను మోసగించువారు నయియు ధర్మపన్నాలు వల్లించువారగుచు పాపచిత్తలై వర్తింతురు. సాత్త్వికాహారమున చిత్తశుద్ధి గల్గును. చిత్తశుద్ధివలన ధర్మబుద్ధి గల్గును. వృత్తిసంకరమున ధర్మసంకరమును గల్గును. ధర్మసంకరమున వర్ణసంకరము గల్గును. ఇట్లు కలియుగము పుణ్యధర్మ శూన్యమగును.

కలిలో స్వధర్మవర్ణముల రక్షణ ప్రసక్తి లేకపోవును. ధర్మ మెఱింగిన మహాత్ములు నధర్మ మాచరింతురు. ఇదంతయును కలి స్వభావప్రభావమున గల్గును. దీనిని తొలగింప సాధ్యముగాదు. కలిమాయా ప్రభావమును బట్టి నరులు పాపకార్యము లొనర్తురు. ఇట్టి పాపములకు ప్రాయశ్చిత్త మేయుపాయమునను లేదు.'' అన 

జనమేజయు డిట్లనెను : 'మహాత్మా! నీవు సర్వధర్మజ్ఞుడవు. సర్వశాస్త్రవిదుడవు. ఇట్టి అనీతి అధర్మము గల కలియుగమున మనుజులకు సద్గతి ఎట్లు? దీని కేదే నుపాయ మున్నచో దయతో సెలవిమ్ము.'' అన 

వ్యాసుడిట్లనెను : 'రాజా! దీని కొకే యొక యుపాయము గలదు. అది కా కింకొకటి లేనేలేదు. సర్వకలిదోషములు నశించుటకు శ్రీదేవీ పాదపద్మములు భక్తిప్రేమములతో ధ్యానింపవలయును. ఈశ్వరీ దివ్యనామమున నెంతటి పాపరాసులైన దహించు మహత్తరశక్తి గలదు. ఆ శక్తిచే నశించని పాపము లీ లోకాలలో లేనేలేవు. ఎంతటి మహాపాపమైనను శ్రీదేవి మధురనామమున నాశము గాగలదు. ఇక భయమేల? 

ఎంతటి పాపియైనను స్వాధీనము తప్పికాని విలాసమునగాని శ్రీమాతృ దివ్యనామ మొక్కసారియేని నుచ్చరించినచో నతనికే మేమి సత్ఫలములు గలుగునో వానిని శివాదులు నెఱుగజాలరు. శ్రీదేవి మధురనామ సంస్మరణము సకల పాపములకు ప్రాయశ్చిత్తము. కలిభయముగలవారు పుణ్యతీర్థములందు నివసింపవలయును. 

వారు నిరంతరము శ్రీపరాంబానామ సంస్మృతి యొనరింపవలయును. ఒక డీ జగమందలి ప్రాణులను హింసించి చంపవచ్చును. కాని యతడు శ్రీదేవిని భక్తి శ్రద్ధలతో ప్రపత్తి జెందినచో వానిని పాపము లంటజాలవు. ఇది సకల శాస్త్రరహస్యము. దీనిని నీకు తెలిపితిని. ఇది అంతయును చక్కగ నెమ్మది నాలోచించుకొని శ్రీదేవీ దివ్యపాదకమలము లాశ్రయింపుము. 

ప్రాణు లెల్లరును సహజముగ నిత్యమా జపాగాయత్త్రిని జపించుచుందురు. కాని యా దేవి మహిమ నొక్కడు నెఱుగడు. దానికి కారణ మా దేవి మాయా ప్రభావమే. బ్రాహ్మణు లందఱును శ్రీగాయత్త్రీమాతను తమ హృదయసీమలందు జపింతురు. వాస్తవముగా గాయత్త్రీ మహిమ నెవరు నెఱుగరు. దీనికి కారణ మా దేవీమాయా ప్రభావ వైభవమే. 

రాజా ! ఇట్లు నీ వడిగిన ప్రశ్నల కన్నిటికిని సమాధానము లొసంగితిని. యుగధర్మ వ్యవస్థలు తెలిపితిని. ఇంకేమి వినగోరుదువో తెలుపుము.

అధ్యాయము 133 హరిశ్చంద్ర కథారంభము

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము

Chapter 131 Karmagati - అధ్యాయము 131 కర్మగతి

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము - అధ్యాయము 131

కర్మగతి


జనమేజయు డిట్లనియె : ''ఓ మహనీయా! ఇంద్రు డద్భుత చరిత్రుడు. అతని స్థానభ్రంశము దుఃఖప్రాప్తి మరల నింద్రత్వమందుట వివరించి తెల్పితివి. అందు దేవాధిదేవియగు శ్రీమాతృదేవి మహిమము విపులముగ వెల్లడించితివి. కాని నాకొక్క సందేహము గల్గుచున్నది. అదేమన, ఇంద్రుడు మహాతపస్వి. అతడింద్రత్వమునకై నూరుయాగము లొనరించియు దేవాధిపత్యము బడసియును ఘోరక్లేశము లనుభవించెను. 

అతడు దేవేశత్వమందియును పదభ్రష్టుడెట్లు గావలసివచ్చెను? దయామయా! వీటి హేతువులన్నియును నాకు తెల్ల మొనరింపుము. నీవు బహుపురాణకర్తవు. మునిప్రవరుడవు. సర్వజ్ఞుడవు. మహాత్ములకు శ్రద్ధాళురగు శిష్యులకు చెప్పరానిదుండదు గదా! మహానుభావా! నా యీ సందేహము దీర్పుము.'' 

అని యిట్లు జనమేజయుడడిగిన ప్రశ్నములను వ్యాసుడు విని ప్రసన్నుడై యీ ప్రకారముగ క్రమముగ నతనికి చెప్పసాగెను. 

'నృపవరా! నీవడిగిన వానికద్భుతములగు హేతువులు గలవు. వానినన్నిటిని సమగ్రముగ నాలకింపుము. తత్త్వవిదులు కర్మము ముత్తెఱంగులుగ నుండునందురు. అవి సంచితము వర్తమానము ప్రారబ్ధమనబడును. ఈ కర్మగతి గహనమైనది. ఈ కర్మము మరల సాత్త్వికము రాజసము తామసమునని మూడువిధములుగ నలరును. పెక్కు పూర్వజన్మములలో జేసిని కర్మము సంచితమనబడును. 

కర్మము మంచిదైనను చెడుదైనను. నేనాటిదైనను జీవుడు తప్పక ఆ పుణ్యపాపముల ఫలము లనుభవించవలసినదే. ఇట్లు జన్మజన్మల సంచితకర్మఫలము శతకోటి కల్పములకైన జీవులనుభవింపక తప్పదు. ఇప్పుడిక్కడ చేయబడుచున్న పని వర్తమాన మనబరగును. దేహముదాల్చిన ప్రతి దేహియు నిచటి మంచిచెడ్డ లాచరించవలసినదేకదా! ఈ తనువు దాల్చునపుడు జీవుడు సంచితములోని కొంతభాగ మనుభవించుటకు ప్రేరింపబడును. దానిని ప్రారబ్ధమందురు.

ప్రారబ్ధమనుభవించిన గాని తీరదు. ప్రాణులీప్రారబ్ధకర్మము నిస్సంశయముగ ననుభవింతురు. ఇట్లు జీవులు తాము మునుపుజేసిన మంచిచెడ్డలను తప్పక యనుభవింపవలయును. ఈ కర్మమే సుర-అసుర-దేవ-గంధర్వ-కిన్నర-నర తనువుల దాల్చుటకు మూలకారణము. కర్మము నశించినచో ప్రాణికిక జన్మములేదు. బ్రహ్మ-విష్ణు-రుద్ర-ఇంద్రాది దేవతలును-దానవులు-యక్ష-గంధర్వులెల్లరును కర్మవశులే. 

ఇట్టి కర్మములేనిచో కర్మబంధ సంబంధ మెట్లు గల్గును? జీవులు సుఖదుఃఖము లనుభవించుట కిట్టి కర్మబంధము ముఖ్య హేతువు. సంచిత కర్మములు తొంటి పెక్కు జన్మములకు సంబంధించి యుండును. అందుండి కాలవశమున గల్గిన కర్మవేగము ప్రారబ్దమగును. దానినిబట్టి జీవుడు పుణ్యము లాచరించును. లేక యతడు పాపము లొనర్చును. 

ఈ పుణ్యపాపములు నరులెట్టు లాచరింతురో దేవతలు నట్టులే యాచరింతురు. తొల్లి ధర్మపుత్త్రులగు నరనారాయణు లుండిరి. వారు కర్మవశమున కృష్ణార్జునులుగ నవతరించిరి. వీరు నారాయణాంశజులని మునులు పురాణములందు కీర్తించిరి. అధిక విభుత్వముగల వానిని దేవాంశ సంభూతుడని యెఱుగుము. ఋషిగానివాడు కవి గాజాలడు. రుద్రుడు గానివాడు రుద్రునర్చింపజాలడు. దేవాంశసంభూతుడుకానివా డన్న దానము చేయజాలడు. విష్ణునంశలేనివాడు రాజుగాలేడు. 

రాజా ! ఈ దేహమింద్ర - అగ్ని - యమ - విష్ణు - కుబేరుల వలన గలిగెను. ఈ మేను వారినుండి వరుసగ ప్రభుత్వము - ప్రభావము - కోపము - పరాక్రమము - వైభవము గ్రహించి యేర్పడును. ఈ లోకమునందు బలము భాగ్యము భోగము చదువు గలవాడు దేవాంశ సంజాతుడని పేరెన్నిగ గాంచును. 

కనుకనే పాండవులు దేవాంశజులని ప్రఖ్యాతి వహించిరి. ప్రతిభా ప్రభావశాలియగు వాసుదేవుని నారాయణ స్వరూపినిగ భావింపుము. ఈ ప్రాణుల శరీరము సుఖదుఃఖములకు నిలయము. దేహి సుఖ దుఃఖము లొకదాని వెంట నొకటి యనుభవించుచుండును.

ఏ దేహికిని స్వాతంత్య్రమెప్పుడు నుండదు. అతడు దైవాధీనుడు. అతడు పరాధీనుడై జన్మమరణములు సుఖదుఃఖములు ననుభవించుచుండును. పాండవులడవులందు జన్మించిరి. పిదప తమ గృహముల కరిగి. మరల వారు రాజసూయయాగమాచరించిరి. పిమ్మట దుఃఖకరములగు వనవాస క్లేశము లనుభవించిరి. 

అర్జునుడు ఘోరతమొనర్చెను. దానికి సంతోషించి దేవతలతనికి వరములు ప్రసాదించిరి. వారు వనములందు బుట్టి జేసిన పుణ్యమంతయు నేమయ్యెనోకదా! తొల్లి నరుడు బదరికాశ్రమమం దుగ్రతపమాచరించెను. దాని ఫలితమతనికేల దక్కకుండెను? 

కనుక ప్రాణిగణముల దేహ సంబంధముతో గలుగు కర్మగతి యెవరికిని బోధపడదు. వాసుదేవుడు సైతము బాధాకరమగు కారాగృహమును బుట్టి వసుదేవునిచేత నందునింటికి గొనిపోబడెనుగదా! అచట కృష్ణుడు పదునొకండేండ్లు గడపి పిదప మధురకేగి కంసుని సంహరించెను. కృష్ణుడు దుఃఖితులగు తన తల్లిదండ్రులను బంధముక్తులనుజేసి మధురకుగ్రసేనుని రాజుగనొనర్చెను. వ్లచ్ఛరాజగు కాలయువనునకు వెఱచి ద్వారక కేగెను. 

అట్లు కృష్ణుడు దైవవశమున పౌరుషమవలంబించెను. అతడు ద్వారకలో నతిమానుషము లత్యద్భుతములునగు కార్యములాచరించి ప్రభాసతీర్థమున వైకుంఠమేగెను. కృష్ణుని పుత్రపౌత్రులు మిత్రులు భాత్రలు మున్నగువారెల్లరు విప్రశాపమున నశించిరి. రాజా! ఇట్లు నీకు తెలియరాని కర్మగతి గూర్చి వివరించితిని. వాసుదేవుడు సైతము తుదకొక వ్యాధుని బాణముచే ప్రాణములు వదలెను.

అధ్యాయము 132 శ్రీదేవీ నామ మాహాత్మ్యము

Chapter 137 History of the Haihayus - అధ్యాయము 137 హైహయుల చరిత్ర

శ్రీ దేవీ భాగవతం  షష్ఠ స్కంధము  - అధ్యాయము 137 హైహయుల చరిత్ర జనమేజయు డిట్లనెను : వ్యాసమునీంద్రా ! హైహయులను క్షత్రియులు బ్రహ్మహత్యాపాపమునకు ...