Thursday, April 2, 2026

Devaki Devi Stuti to Lord Vishnu - దేవకీదేవి స్వామిని స్తుతించుట

దేవకీదేవి స్వామిని స్తుతించుట

ఈ విధంగా పుట్టిన బిడ్డతో వసుదేవుడు అంటూ ఉండగా, దేవకీదేవికూడా, మహాపురుషలక్షణాలు కలవాడు, గొప్ప సదసద్వివేకజ్ఞానం కలవాడు, మిగుల కోమలమైన దేహం కలవాడు అయిన తన కుమారుణ్ణి చూచి, కంసునిభయంతో స్వచ్చమైన ఒక నవ్వునవ్వుతూ ఈ విధంగా అనింది.

అటువంటి, ఇటువంటిది అని వివరించటానికి సాధ్యం కానిది, సమస్తానికి మూలమై ఉండేదీ, సర్వత్ర వ్యాపించింది, ప్రకాశిస్తూ ఉండేదీ, త్రిగుణాలలో ఏ గుణమూ లేనిది, ఒకే విధమైంది, సత్యమైంది. తాను తప్ప మరేదీ లేనిది, కర్మలు లేనిది, వాక్కుకు అందనిది అయిన ఏ రూపాన్ని వేదాలు ఎల్లప్పుడు చెపుతున్నాయో ఆ రూపాని వౌతూ, ఆత్మజ్ఞానానికి దీపానివై, బ్రహ్మదేవుని ఆయుస్సులో రెండవసగభాగం పూర్తి అయిన తరువాత, లోకాలు నశించినవేళ, పంచమహాభూతాలు సూక్ష్మభూతంలో కలిసిపోగా, ఆ సూక్ష్మభూతం మూలప్రకృతిలో, మూలప్రకృతి వ్యక్తతత్త్వంలో లీనంకాగా, చివరకు ఆ వ్యక్తతత్త్వం కూడా లయం కాగా - శేషసంజ్ఞచేత స్వయంజ్యోతివై సుందర స్వరూపమై ఉంటావు.

(దేవకీదేవి తనకు జన్మించిన కుమారుణ్ణి మానవమాత్రునిగ కాకుండా పరమాత్మునిగానే భావించి, పరమాత్మతత్త్వాన్ని తలచుకొంటూ చేసిన స్తోత్రం ఇది. పరమాత్మ “సత్యం, శివం, సుందరం” కనుక సర్వమూ లయించినా ఆయన మాత్రం సత్యశివసుందరాత్మకంగానే ఉంటాడు.)

ఓ మాధవా! నీవు పరిపూర్ణ జ్ఞానస్వరూపుడివే అయినా, ఈ జగత్తును సృష్టి స్థితిలయాలతో విలాసంగా త్రిప్పుతూ ఉంటావు. కనుక, అవిద్య అనే మాయకు నీవు చుట్టానివి. కాలాతీతుడవైన నీకు శాశ్వతమైన కాలమంతా మాయ మాత్రమే. జగన్నాథా! నీవు శుభాలరాశివి. కోరి నిన్నెవ్వడు ఆరాధిస్తాడో అతడు శాశ్వతసంపద గలిగి, మృత్యువును జయించి, సుఖసంతోషాలతో భయం లేనివాడై ఉంటాడు.

(పరమాత్మ పరిపూర్ణ జ్ఞానస్వరూపుడు. ఆలాంటప్పుడు ఆయన అవిద్యకు బంధువు ఎలా అవుతాడు? పరమాత్మ పరిపూర్ణజ్ఞానస్వరూపుడే. కాని, ఈ జగత్తు మాయ. జగత్తే మాయ అయినపుడు సృష్టి స్థితి, లయాలు కూడ మాయయే! మాయయే అవిద్య. ఈ మాయామేయ జగత్తును సృజించి, దాన్ని పోషించి, లయం చేస్తున్నప్పుడు పరమాత్మ అవిద్యకు చుట్టమౌతాడు కదా!)

ఓ పద్మనయనా! పురాతనులైన మహాయోగులు (సనక సనందనాదులు) యోగమార్గంలో అత్యంతదీక్షతో ఒంటరిగా తమకు తాము సాధన చేసి, ఇప్పుడు అగుపిస్తున్న నీ దివ్యరూపాన్ని చూచామంటారు గానీ; నిజంగా వారు చూచి ఉండరు. ఇప్పుడు నేను చూచాను. శుభాన్ని పొందాను. ఈ భౌతిక నేత్రాలతో ఇక చూడలేను. అనాది అయిన నీ దివ్యస్వరూపాన్ని ఉపసంహరించుకో. నమస్కరిస్తున్నాను.

ఓ పురుషోత్తమా! ప్రళయకాలంలో ఈ జగత్తునంతా ఎంతో పెద్దదైన కడుపులో దాచుకొనే గొప్పనటుడివి నీవు. ఆలాంటి నీవు, ఇప్పుడు నా కడుపున పుట్టడం ఒక పెద్దమాయే కదా!

తామరులవంటి కన్నులు కలవాడా! నీవు నాకు తప్పక జన్మిస్తావని ఆ దుర్మార్గుడైన కంసుడు చాలకాలంగా నన్నూ నీ తండ్రినీ, ఈ చెరసాలలో బంధించి ఉంచాడు. ఆ దుర్మార్గుణ్ణి శిక్షించి, మమ్మల్ని కాపాడు. నేను నోచిన నోములన్నీ ఏ కొరత లేకుండా నీ రూపంలో ఫలించాయి.

దేవకీవసుదేవాల పూర్వజన్మముల వృత్తాంతము

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

Hanuman Mandala Initiation Rules - హనుమాన్ మండల దీక్ష – నియమములు

హనుమాన్ మండల దీక్ష – నియమములు

దీక్షను హనుమాన్ మందిరంలో అర్చక స్వాముల సమక్షంలో స్వీకరించి 41 రోజుల పాటు కలశ ఆరాధన చేసి కఠినమైన మండలదీక్ష ను ప్రారంభించాలి. 
బ్రహ్మచర్యం, సాత్వికాహారం, నిత్య హనుమాన్ చాలీసా పారాయణం, కాషాయ వస్త్రధారణ, మరియు గుడిలో ప్రదక్షిణలు చేయడం ఈ దీక్షా నియమాలలో ముఖ్యాంశాలు. భక్తులు చెప్పులు ధరించకుండా, దురుసు మాటలకు దూరంగా ఉంటూ, ఉదయం-సాయంత్రం స్నానాచరణతో హనుమంతుని స్మరిస్తూ దీక్షను పూర్తి చేయాలి

సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత రాత్రి పూట పూజను నిర్వహించాలి. అనంతరం దీక్షా స్వాములు వారి వారి ఇండ్లలో పీఠపూజను చేసుకొని భజన కార్యక్రమాన్ని నిర్వహించాలి .

హనుమాన్ దీక్షలో చాల కఠినమైన నిబంధనలు ఉండడంతో ఒక్కసారి మండలదీక్షను స్వీకరించిన స్వాముల్లో తప్పకుండా మార్పు వస్తుంది. ఆ మార్పే నిత్య జీవితంలో ఉపయోగపడుతుంది.

హనుమాన్ దీక్ష వహించిన భక్తులు భక్తితో పూజ, పీఠానికి హారతి, సన్నిదానంలో నిద్రించుట, ప్రతి నిత్యం మందిర దర్శనం, మాటిమాటికి హనుమంతుని నామస్మరణం రామనామ స్మరణం చేయటం, దీని ద్వార ప్రతీ ఇంట్లో సుఖ శాంతులు ఏర్పడడం చెప్పుకొదగ్గ విషయం. దీనిని నిత్య జీవితంలో పాటిస్తే కుటుంబాలు బాగా ఉంటాయని మనిషి జీవితంలో పురోగతి ఉంటుందని నమ్మకం.

అంతేకాక రోగనివారణకు, శత్రునాశనముకు, ఆత్మస్థైర్యమునకు హనుమాన్ దీక్ష ఎంతగానో దోహదపడుతుంది.

దీక్ష విరమణ అయినంత వరకు కల్షంలోని కొబ్బరిని తీసుకొని గుమ్మానికి కట్టుతారు. పీఠం మీద ఉన్న బియ్యాన్ని వండుకొని అన్నప్రసాదంగా స్వీకరిస్తారు

హనుమాన్ మండల దీక్షా నియమాలు - విధివిధానాలు:
దీక్షా కాలం: సాధారణంగా 41 రోజులు (మండల దీక్ష) లేదా 21, 11, 5 రోజుల పాటు దీక్ష చేస్తారు.

దీక్షా స్వీకరణ: గురుస్వామి సమక్షంలో లేదా హనుమాన్ ఆలయంలో, చైత్ర పౌర్ణమి (హనుమజ్జయంతి) వంటి పవిత్ర దినాలలో మాలాధారణ చేస్తారు.

దుస్తులు: కాషాయ వస్త్రాలను మాత్రమే ధరించాలి.

ఆహార నియమాలు: శాకాహారం (సాత్వికాహారం) మాత్రమే తీసుకోవాలి. ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం, మద్యపానానికి దూరంగా ఉండాలి.

నిత్య ఆచరణ:ఉదయాన్నే (బ్రహ్మ ముహూర్తంలో) స్నానం చేసి, కాషాయ వస్త్రాలు ధరించాలి.
రోజూ హనుమాన్ ఆలయాన్ని సందర్శించి, కనీసం 40 లేదా 108 ప్రదక్షిణలు (ప్రదక్షిణలు) చేయాలి.

హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం ప్రతిరోజూ 5 లేదా అంతకంటే ఎక్కువ సార్లు చదవాలి.

నుదుట సింధూరం ధరించాలి.

దీక్షా నిష్ఠ:

బ్రహ్మచర్యం కచ్చితంగా పాటించాలి.

నేలపై పడుకోవాలి (భూశయనం).

పాదరక్షలు (చెప్పులు) ధరించకూడదు.

క్షౌర కర్మ (కటింగ్, షేవింగ్) చేయించుకోకూడదు.

మగవారిని 'స్వామి' అని, ఆడవారిని 'అమ్మ' అని పిలవాలి.

దీక్షా విరమణ (ఇరుముడి): 41వ రోజున హనుమాన్ ఆలయంలో అభిషేకం, వడమాల సమర్పణ చేసి, గురుస్వామి చేతుల మీదుగా మాల విరమణ (తీసివేయడం) చేస్తారు.

ఈ కఠినమైన నియమాలను పాటిస్తూ చేసే హనుమాన్ దీక్ష వల్ల శారీరక, మానసిక రుగ్మతలు తొలగి, ఆత్మవిశ్వాసం, విజయం కలుగుతాయని నమ్ముతారు.


హనుమాన్

విష్ణు

శ్రీరామ

శ్రీకృష్ణ

శ్రీ వెంకటేశ్వర

నిత్య స్తోత్రావళి

పంచాంగం

Nettikanti Anjaneyaswamy Kasapuram - నెట్టికంటి ఆంజనేయస్వామి - కసాపురం

నెట్టికంటి ఆంజనేయస్వామి - కసాపురం

అందరి భయాలను పోగొట్టే శ్రీ ఆంజనేయస్వామి భవిష్యత్ బ్రహ్మ. ధర్మాన్ని, సత్యాన్ని ఆచరించడంలో ఆయన నిష్టాగరిష్టుడు. శ్రీరామ నామ జపం విన్నంత మాత్రానే ఆయన ప్రసన్నుడు అవుతాడు. 

అనంతపురం జిల్లా కసాపురంలో వెలిసిన హనుమంతుడు భక్తులు కోరికలను తీర్చుతూ వారిపై చల్లని చూపును ప్రసరిస్తున్నాడు. దేశం నలు మూలల నుంచి ఇక్కడకు వేలాది మంది భక్తులు వస్తుంటారు. అంతే కాకుండా వారి కష్టాల నుంచి గట్టెక్కిస్తుంటాడు.

స్థల పురాణం:16వ శతాబ్దంలో విజయ నగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణ దేవరాయలు ప్రజారంజకంగా పరిపాలించేవాడు. ఒకసారి ఆయనకు గండం ఏర్పడింది.ఆ సమయంలో రాజ్య పాలన చేయడం మంచిది కాదని జ్యోతిష్యులు చెప్పడంతో కొన్ని ఘడియలు రాజ్యపాలన చేసేందుకు కృష్ణదేవరాయల గురువైన వ్యాసరాయలు సింహాసనం అధిష్టించారు.

తరువాత తిరిగి కృష్ణదేవరాయలు రాజ్యాధికారాన్ని చేపట్టారు. కొన్ని ఘడియలు రాజ్యాధికారం చేసిన వ్యాసరాయలు విజయనగరాన్ని వదలి తీర్ధ యాత్రకు బయలు దేరుతాడు. ఆయనకు ఆంజనేయస్వామి మీద భక్తి ఎక్కువ యాత్రలో భాగంగా ఆయన కర్నూలు జిల్లాలోని చిప్పగిరి (శిల్పగిరి) చేరుకుంటాడు.

అయితే ఒక నాటి రాత్రి ఆంజనేయ స్వామి కలలో కనిపించి. సమీపంలోని నెట్టికల్లు (కసాపురం) గ్రామంలో ఎండుపుల్ల చిగురించిన చోట గుడి కట్టించమని ఆజ్ఞాపించాడట.మరుసటి దినం రాయలవారు నెట్టికల్లు గ్రామాన్ని సందర్శించి స్వామికి ప్రీతికరమైన స్థలం కనుగొని అక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేశారు. నెట్టికల్లు గ్రామం వద్ద గుడి ఉండడం వల్ల నెట్టికంటి ఆంజనేయస్వామి అని స్వామికి పేరు వచ్చింది.

నెట్టికల్లు గ్రామం కాలగర్భంలో కలిసిపోయిందని చెప్పడానికి ఆనవాళ్లు కూడా ఉన్నాయి.ఆ గ్రామానికి అనుకునే కసాపురం ఉంది. దీంతో స్వామిని కసాపురం ఆంజనేయ స్వామి అని పిలుస్తారు.


నెట్టి కంటి ఆంజనేయస్వామి దేవాలయం, అనంతపురం జిల్లాలోని గుంతకల్లు పట్టణంలోని కసాపురం అనే గ్రామంలో ఉంది. కన్నడంలో నెట్టె అంటే నేరుగా అనిఅర్థం. నెట్టెకంటి అంటే నేరుగా చూచే కన్ను కలిగిన అని అర్థం. ఈ కసాపురంలో స్వామి వారి కుడివైపు భాగం మాత్రమే మనకు దర్శనమిస్తుంది. కనుక కుడి కన్ను మాత్రమే మనకు కనిపిస్తుంది. అది నేరుగా చూస్తున్నట్లు ఉండటం వల్ల స్వామి తననే చూస్తున్నట్లు ప్రతివారికీ అనిపిస్తుంది. నేరుగా చూసే స్వామి కనుక నెట్టెకంటి ఆంజనేయస్వామి అని అంటారు.భక్తులకు ఈయనే "కల్పతరువు", "వరప్రదాత". ప్రతిరోజు వేలాది మంది దర్శించుకునే ఈ ఆలయం భూత, ప్రేత, దుష్ట గ్రహపీడ నివారణ క్షేత్రంగా ఖ్యాతికెక్కింది.

స్వామిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్ర ప్రజలే కాదు, పక్క రాష్ట్రమైన కర్నాటక నుండి కూడా అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో ఉన్న హనుమాన్ ఆలయాలన్నింటిలోకీ పెద్దది.

శ్రీకృష్ణదేవరాయల గురువైన వ్యాసరాయలవారు ఏకకాలంలో కసాపురం, నేమకల్లు, మూరడి అనే మూడు ఊళ్లల్లో ఏకకాలంలో ఆంజనేయ విగ్రహాలను ప్రతిష్ఠించారని చెబుతారు. కసాపురం, నేమకల్లు, మూరడి అనే ఈ మూడు ఊళ్ళల్లోని ఆంజనేయస్వామివార్లను శ్రావణమాసం శనివారం రోజున దర్శించుకోవడం అత్యంత విశేషఫలప్రదం అని చెబుతారు. ఇందుకోసం ప్రతి సంవత్సరం శ్రావణమాసం శనివారం రోజున ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ప్రత్యేక బస్సు సర్వీసులను కూడా గుంతకల్లు నుండి నడుపుతారు. లేదా స్వంత వాహనాల్లో గానీ, ఆటోల్లో గానీ కూడా అనేకమంది యాత్రికులు ఈమూడు క్షేత్రాలలోని స్వామివారిని దర్శించుకొంటూ ఉంటారు. ఆ క్షేత్రాల్లో ఒకటైన కసాపురం వివరాలను తెలుసుకొందాం.

ఇంకొక కథ, విజయనగర సామ్రాజ్య కాలంలో సా.శ.1521 లో శ్రీ వ్యాసరాయలవారు తుంగభద్ర నది ఒడ్డున ధ్యానం చేసేవాడు. వ్యాసరాయలవారు చిత్రకారుడు. ప్రతిరోజు తాను ధరించే గంధంతో ఎదురుగా ఉన్న ఒక రాయి మీద శ్రీ ఆంజనేయ స్వామి రూపం చిత్రించేవాడు. అలా చిత్రించిన ప్రతిసారి హనుమంతుడు నిజరూపం ధరించి అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడట. ఇది గమనించిన వ్యాస రాయలవారు హనుమంతుని శక్తిని వేరోకచోటికి వెళ్ళనీయకుండా, స్వామివారి ద్వాదశ నామాల బీజాక్షరాలతో ఒక యంత్రం తయారు చేసి, దానిలో శ్రీ ఆంజనేయ స్వామి వారి నిజరూపాన్ని చిత్రించారట. దాంతో స్వామి ఆ యంత్రంలో బంధింపబడి అందులో ఉండిపోయారట.

ఇప్పటి కర్నూలు జిల్లాలో ఉన్న చిప్పగిరి మండలంలో ఉన్న శ్రీ భోగేశ్వర స్వామి వారి ఆలయంలో ఒకరోజు వ్యాసరాయలు నిద్రిస్తుండగా ఆంజనేయస్వామి కలలో వచ్చి, "నేను ఫలానా ప్రాంతంలో ఉన్నాను, నాకు గుడి కట్టించు" అని చెప్పాడట. ఆ ప్రాంతం ఎక్కడుందో ఉపదేశించమని వ్యాస రాయలు కోరగా స్వామి వారు ఈ విధంగా అనుగ్రహించాడు -"దక్షిణం వైపున వెళితే ఒక ఎండిన ఒక వేప చెట్టు కనిపిస్తుంది, దానికి దగ్గరగా వెళితే ఆది చిగురిస్తుంది, అక్కడ భూమిలో తాను ఉంటాను". మరునాడు ఉదయాన్నే లేచి దక్షిణం వైపు ప్రయాణం గావించి చివరకు ఆ ఎండిన వేపచెట్టును కనుగొంటాడు వ్యాస రాయలు. రాయలు ఆ చెట్టు వద్దకు చేరుకోగానే, ఆ చెట్టు చిగురిస్తుంది. ఆశ్చర్యచకితుడైన వ్యాసరాయలు వెంటనే అక్కడ భూమిని తవ్విస్తాడు. తవ్వకాల్లో ఒంటి కన్ను గల ఆంజనేయస్వామి వారి విగ్రహం కనిపిస్తుంది. రాయలవారు ఆ విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠించి, ఆలయాన్ని నిర్మిస్తాడు. ప్రతి ఏడాది ఒక చర్మకారుడు ఏక భుక్తం ఉంటూ, బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఆంజనేయ స్వామికి చెప్పుల జత తయారు చేసి సమర్పిస్తాడు. మర్నాడు వచ్చి చూస్తే అది అరిగిపోయినట్లు, చిరిగిపోయినట్లు కనిపించటం విశేషం. స్వామి ఆ చెప్పులు ధరించి రాత్రి పూట విహారానికి వెళ్ళి వస్తూంటాడని భక్తుల నమ్మకం. స్వామి వారి అనుగ్రహం ప్రతి ఏటా వైశాఖ, శ్రావణ, కార్తీక, మాఘ మాసాలలో శనివారం నాడు అసంఖ్యాకంగా భక్తులు స్వామిని సందర్శించి తమ మనోభీష్టాలను నెరవేర్చుకుంటారు.

ఏటా, నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో వేలాది మంది భక్తులు కాషాయ వస్త్రాలు ధరించి హనుమద్దీక్షలు తీసుకుంటారు. హనుమద్ వ్రతానికి, పూజలకు కూడా ఈ ఆలయం ప్రసిద్ధి. ఇందులో బస చేయడానికి తగినన్ని సత్రాలు, కాటేజీలు అందుబాటులో ఉన్నాయి.

రవాణా సౌకర్యాలుసమీప విమానాశ్రయం 60 కిమీ దూరంలో ఉన్న బళ్లారిలో ఉంది. గుంతకల్ రైల్వే జంక్షన్ సమీప రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ దేశంలోని అన్ని పెద్ద నగరాలతో, పట్టణాలతో అనుసంధానించబడి ఉంది. గుంతకల్ నుండి ప్రభుత్వ బస్సులు, ఆటోల ద్వారా కసాపురం చెరుకోవచ్చు.

ఇతర ప్రదేశాలుభక్తులు మొదట నెట్టికంటి ఆంజనేయస్వామి వారిని దర్శించుకొన్న తర్వాత, ఆలయానికి దగ్గరలోని గుట్టపై వెలిసిన బాల ఆంజనేయస్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ. ప్రధాన ఆలయం నుండి కొద్ది దూరంలో ఒక గుట్టపై ఉన్న కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని కూడా భక్తులు దర్శిస్తారు. ఇంకా కసాపురం నుండి తిరుగు ప్రయాణంలో గుంతకల్ వెళ్లే మార్గంలో శనీశ్వరుని ఆలయం, అయ్యప్ప స్వామి ఆలయం కూడా చూడవచ్చు. 14 కిలోమీటర్ల దూరంలోని చిప్పగిరిలో గల శ్రీ భోగేశ్వర స్వామి వారి ఆలయం కూడా దర్శించవచ్చు.కసాపురం నుంచీ మద్దికెరకు పోయే దారిలో 5కిలోమీటర్ల దూరంలో తప్పనిసరిగా దర్శించుకోవలిసిన బుగ్గ రామలింగేశ్వరాలయము కూడా ఒక ముఖ్యమైన దర్శనీయ స్థలము.

మన దేవాలయాలు చారిత్రక నగరాలూ

Anjanadri Hill - అంజనాద్రి కొండ

అంజనాద్రి కొండ

కొప్పల్ జిల్లాలో ఉన్న, హంపి నుండి తుంగభద్ర నదికి ఆవల ఉన్న ఆనెగుండికి దగ్గరగా, అంజనాద్రి కొండలు హనుమంతుని జన్మస్థలంగా నమ్ముతారు.

అంజనకు జన్మించిన హనుమంతుడిని ఆంజనేయుడు అని కూడా పిలుస్తారు, అందుకే ఈ కొండను అంజనాద్రి కొండలు అని పిలుస్తారు, దీనిని 
హనుమంతుని జన్మస్థలం అని నమ్ముతారు.

మంత్రముగ్దులను చేసే ప్రకృతి దృశ్యాల విశాల దృశ్యాలు, ఆశ్చర్యపరిచే సూర్యాస్తమయ దృశ్యాలు మరియు పర్వతాలు మరియు రాళ్ల మధ్య తుంగభద్ర నది ప్రవహించే సుందర దృశ్యాలు మీ ఒత్తిడిని లేదా అలసటను దూరం చేస్తాయి. హంపి శిథిలాలు మరియు పరిసరాల్లోని ఇతర గంభీరమైన కొండలను కూడా చూడవచ్చు.

ఇది సుమారు 516 మీటర్ల ఎత్తులో ఉండి, చుట్టూ తుంగభద్ర నది మరియు అద్భుతమైన ప్రకృతి దృశ్యాలతో కూడిన రాతి కొండల మధ్య ఉంది. ఇక్కడ 575 (లేదా సుమారు 462) మెట్లు ఎక్కి, కొండపైన ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకోవచ్చు.

వరి పొలాలు, కొబ్బరి తోటలు,  రాకీ పర్వతాలు ఒక వైపు మరియు మరోవైపు తుంగభద్ర కొండపై నుండి అద్భుతమైన దృశ్యాలు అధిరోహించదగినవి. హనుమంతుని జన్మస్థలమైన ఆలయ సారాన్ని సందర్శించడమే కాకుండా కొండను ఎక్కడానికి పర్యాటకులకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది .

అంజనాద్రి కొండల అభివృద్ధిని ప్రకటించి, 'విశ్వాసానికి నిదర్శనం' అని ప్రకటించారు. అంజనాద్రి కొండలు హనుమంతుని జన్మస్థలం అనే చెప్పటానికి ఎటువంటి ఆధారాలు అవసరం లేదు. పురాణాల ప్రకారం కిష్కింద అని పిలువబడే ఈ ప్రదేశాన్ని హనుమాన్ భక్తులు సందర్శిస్తారు.

ఆంజనేయ స్వామి తల్లి అంజనా దేవి తపస్సు చేసిన ప్రదేశం, ఇక్కడే హనుమంతుడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి.

ఈ ప్రదేశం రామాయణ కాలంలోని కిష్కింధగా భావిస్తారు. కొండపై రామ, సీత మరియు అంజనా దేవి ఆలయాలు కూడా ఉన్నాయి.

కొండ పైనుండి హంపిలోని రాతి కట్టడాలు, తుంగభద్ర నది మరియు ఆనెగుంది పరిసరాల యొక్క అద్భుతమైన సూర్యోదయ, సూర్యాస్తమయ దృశ్యాలను చూడవచ్చు.

అక్టోబర్ నుండి మార్చి వరకు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

రోడ్డు మార్గం: హంపి నుండి ఆనెగుంది మీదుగా ఆటోలు లేదా టాక్సీల ద్వారా సులభంగా చేరుకోవచ్చు.

ఆనెగుంది నుండి 4 కి.మీ, హంపి నుండి 23 కి.మీ, హోస్పేట్ నుండి సుమారు 25-30 కి.మీ దూరంలో ఉంది.

మన దేవాలయాలు చారిత్రక నగరాలూ

Wednesday, April 1, 2026

The incarnation of Lord Krishna - శ్రీ కృష్ణావతార ఘట్టము

శ్రీ కృష్ణావతార ఘట్టము

దేవకీదేవి ప్రసవవేదన పడుతుండగా దుర్జనుల మనస్సుల్లో బాధ కలగటం, సజ్జనుల్లో బాధలు తొలగటం అగుపించింది.

దేవకీదేవి దేవదేవుడైన శ్రీకృష్ణుణ్ణి ప్రసవించగానే, సప్తసముద్రాలు స్వచ్చజలాలతో ఉప్పాంగాయి. మేఘాలు మనోహరధ్వనులతో గర్జించాయి. ఆకాశం గ్రహాలతో, నక్షత్రాలతో ప్రకాశించింది. దిక్కులు మిక్కిలి కాంతితో వెలిగాయి. చల్లనిగాలి కమ్మనివాసనలతో అల్లన వీచింది. హోమాగ్నులు చూడముచ్చటగ వెలిగాయి. కొలనులు తామరలతో, తుమ్మెదలతో శోభాయమానంగా కళకళలాడాయి. నదులు మిక్కిలి నిర్మలమైన నీటితో ప్రవహించాయి. భూమి శ్రేష్ఠాలైన నగరాలతో, పల్లెలతో, ఆలమందలుగల ఊళ్లతో అలరారింది. అడవులు, ఉద్యానవనాలు పక్షుల కిలకిలారావాలతో, పూలతో, పండ్లతో శోభిల్లాయి. దేవతా శ్రేష్ఠులందరు పూలవానలు కురిపించారు.

(దుష్టులను శిక్షించటానికి, శిష్టులను రక్షించటానికి, భూభారం తగ్గించటానికి పరమాత్మ అవతరించగానే ప్రకృతి మొత్తం ఆనందంతో ఉప్పొంగింది.)

గంధర్వ శ్రేష్ఠులు(విశ్వావస చిత్రసేనాదులు) ఆనందంతో గానం చేశారు. రంభ మొదలైన అప్పరసలు నాట్యం చేశారు. సిద్దులు సంతోషంతో సమావేశ మయ్యారు. చారణులు నిర్భయులయ్యారు. దేవతల భేరులు మ్రోగాయి.

ఆ వేళలో, అశ్విని మొదలైన నక్షత్రాలు, సూర్యచంద్రాది గ్రహాలు మిక్కిలి శుభఫలాల నిచ్చేరీతిగ సంచరిస్తుండగా, రాక్షసులను తల్లడిల్ల చేసేవాడు, భక్తులముఖాలకు వికాసం కలిగించేవాడు, శత్రువులను గెల్చే స్వభావం కలవాడు, అన్నిలోకాల వెలుపల, లోపల వ్యాపించి ఉండేవాడు అయిన విష్ణుమూర్తిని కుమారునిగ దేవకీదేవి అర్ధరాత్రిసమయంలో ప్రసవించింది.

ఓ పరీక్షిన్మహారాజా! మెరపు తీగవంటి దేవకీదేవి భక్తులపట్ల అపారదయగల విష్ణుమూర్తిని సునాయాసంగా ప్రసవించి, పున్నమినాటిచంద్రుణ్ణి కన్న తూర్పుదిక్కువలె ఎంతో ప్రకాశించింది.

ఆ వేళలో, మేఘంవంటినల్లనిదేహకాంతి కలవాడు, మోకాళ్ళను తాకే పొడవైన నాలుగుచేతులు కలవాడు, పద్మాలవంటి పెద్దకన్నులు కలవాడు, విశాలమైనవక్షఃస్థలం కలవాడు, అందమైన గదాశంఖచక్ర పద్మాలతో శోభిల్లేవాడు, మెడలోని కౌస్తుభమణి కాంతితో వెలిగేవాడు, మనోహరాలైన మొలత్రాడు, కడియాలు, బాహుపురులు కలవాడు; వక్షఃస్థలంమీద శ్రీవత్సమనే పుట్టుమచ్చ శోభిల్లగా విహరించేవాడు, గొప్పమకరకుండలాల కాంతులతో విరాజిల్లే ముంగురులుగల నుదురు కలవాడు; వైడూర్యాది వజ్రాలు పొదిగిన శ్రేష్ఠమైన కిరీటం ధరంచినవాడు, నిండుచంద్రునివలె వెలుగువాడు, భక్తులను కాపాడువాడు, సుగుణాలకు ఉనికిపట్టయినవాడు, అపారకరుణ గలవాడు అయిన బాలకుణ్ణి చూచి వసుదేవుడు ఆనంద పరవశుడయ్యాడు. ఆశ్చర్య చకితుడయ్యాడు. ఉప్పాంగిపోయాడు. మహోత్సాహభరితుడయ్యాడు.

వసుదేవుడు కారాగారంలో ఉన్నందువల్ల స్నానం చేయటానికి అవకాశం లేక ఆనందరససాగరంలో మునిగి, బ్రాహ్మణులకు పదివేలగోవులను దానం ఇవ్వాలని సంకల్పించి, తన మనస్సులోనే వాటిల్ని ధారపోశాడు.

ఇంకా, ఆ వసుదేవుడు ఈ పురిటింటికి ఎంతో కాంతిగల దీపంలా వెలుగుతున్న ఈ బాలుడు, ఆ నాలుగుముఖాల పాపడైన బ్రహ్మను కన్న మహానుభావుడే ఈ శ్రీమహావిష్ణువని భక్తితో భావించి
సాష్టాంగ నమస్కారంచేసి, లేచి నిలబడి, వెంటనే రెండు చేతులు జోడించి నొసట నిలుపుకొని, పసిబాలుడనీ, తన కుమారుడనీ, వెనుకాడకుండ ఆ బాలుని పూర్వచర్యలన్నీ గుర్తుకు తెచ్చుకొని పొగడడానికి పూనుకొన్నాడు.

సాక్షిభూతుడవై సకలలోకాలను చూస్తున్నవాడవు, జ్ఞానానందస్వరూపుడవు, శాశ్వతుడవు, సర్వతంత్రస్వతంత్రుడవు, మాయామయాలైన జననమరణాదులు లేనివాడవు. ఆలాంటి నిన్ను పుత్రునిగా పొందాను. ఇంతకంటే వింత లోకంలో ఇంకొకటి ఏముంటుంది?

(భగవంతుడు జ్ఞానానందస్వరూపుడు. అందుకే 'విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్‌', 'ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్‌' అని తైత్తిరీయ ఉపనిషత్తు ప్రవచించింది.)

సృష్టికి ముందు ఏదీ లేని స్థితిలో, స్పష్టంగా నీ మాయతో నీవు ఈ త్రిగుణాత్మకమైన జగత్తును సృజించావు. ఇందులో నీవు ప్రవేశించినా, ప్రవేశించనట్లే ఉంటావు. అందువల్ల ఇందులో నీ ప్రవేశం లేదు; నీ ప్రవేశం లేకుండడమూ లేదు.

నీ చేత సృజింపబడిన ఈ జగత్తులో నీవు ఉండికూడా - ఉండకుండడం, ఎట్లంటే మహత్తత్త్వం మొదలగువాటిల్ని సరిపోలినట్టిదై, దేనికది ప్రత్యేకమైన సూక్ష్మశక్తులు అయిదు, వికారాలు పదహారు కూడి పరమాత్ముడివైన నీవు విరాట్టను పేరుతో విశాలమైన జగత్తును ఏర్పాటు చేసుకొని, అందులో ఉండికూడ, ఉండకుండా ఉంటావు. ఈ సృష్టికి ముందే నీవు ఉన్నావు కనుక సూక్ష్మభూతాలకు, వికారాలకు లోనైన పుట్టుక నీ కేర్పడదు. ఇది తెలుసుకొనడానికి, అనువైన ఇంద్రియాల్లో నీవు ఉన్నాా వాటి అధీనంలో నీవుండవు. ఇంద్రియాలకు అతీతుడవై ఈ లోకాల్లో అంటే, నీ విరాట్‌శరీరంలో ఉన్నట్లే ఉంటావు గాని ఉండవు.

('విశేషేణ రాజత ఇతి విరాట్'  - అనగా అత్యుత్తమంగా ప్రకాశించునది.)

సర్వానికీ ప్రభువువైనవాడా! ఈ జగత్తు మొత్తం నీ లోనే ఉంది. కనుక నీవు జగత్స్వరూపుడివి. ఆత్మస్వరూపుడవైన సర్వం నీవే కనుక, నీకు లోపల, మధ్య, వెలుపల అనేవి ఏవీ లేనే లేవు.

ప్రభూ! పరమాత్మవల్ల ఏర్పడిన దేహాదులను పరమాత్మకంటె వేరైనవని అనుకొనే వాడు మహామూర్తుడు. అందువల్ల ఈ విశ్వమంతా నీవే! నీవు కాని దేదీ లేదు.

అంతేకాక, ఇంకా ఓ స్వామీ! ఏ గుణం, ఏ మార్పు, ఏ కోరిక లేని నీ వల్లనే ఈ జగత్తు పుట్టడం, పెరగడం, నశించడం జరుగుతూందని చెప్పటం తప్పు కాదు. జగత్తుకంతా ప్రభుడివి. పరబ్రహ్మానివి నీవే. అయినా, నిన్ను సేవించే సత్త్వాదిగుణాలు నీ ఆజ్ఞల ప్రకారం ప్రవర్తిస్తున్నాయి కనుక, భటుల శౌర్యాలు ప్రభువుకు చెందినట్లుగా, నీ మాయతో కూడి ప్రవర్తిల్లే గుణాల విధాలు నీకు చెందినవే అని అనిపిస్తాయి. నీవు రక్తవర్ణంతో రజోగుణరూపుడివై ఉన్నప్పుడు జగత్తును సృజిస్తావు. తెలుపురంగుతో సత్త్వగుణరూపుడివై ఉన్నప్పుడు జగత్తును రక్షిస్తావు. నలుపురంగుతో తమోగుణరూపుడివై ఉన్నప్పుడు జగత్తును నశింపచేస్తావు. అదేవిధంగా రాక్షసుల్ని శిక్షించటానికి, భూమిని కాపాడటానికి ఈ రోజు అవతరించావు.

(పరమాత్మ నిర్గుణుడు; నిర్వికారుడు; నిత్యతృప్తుడు. మాయవల్లనే ఆయనకు గుణాలు, వికారాలు, కోరికలు ఏర్పడతాయి. ఈ మాయకూడా ఆయన సృష్టే తాను సృష్టించిన ఆ మాయకు ఒకమారు లోబడతాడు, మరోమారు లోబడడు. అదే పరమాత్మ వైచిత్రి!

ఇంతకు మునుపు తాను ఆకాశవాణివల్ల విన్న మాటల కారణంగా కంసుడు ధైర్యాన్ని కోల్పోయి, నీవు నాయింట జన్మిస్తావని, నీ కంటే ముందు పుట్టిన నీ అన్నల్ని చంపివేశాడు. కంటిమీద కునుకు లేకుండా కాలం గడుపుతున్నాడు. ఇప్పుడు ఈ చెరసాల భటులు నీవు జన్మించావని చెప్పగానే అతడు ఆలస్యం చేయకుండ నిన్ను చంపటానికి సన్నద్ధుడై వస్తాడు.


దేవకీదేవి స్వామిని స్తుతించుట



The praise of Lord Krishna, who is in the womb of Devaki, by the gods Brahma, Shiva and other deities - బ్రహ్మాది దేవతలు దేవకీ గర్భస్థుండగు శ్రీకృష్ణుని స్తుతించుట

బ్రహ్మాది దేవతలు దేవకీ గర్భస్థుండగు శ్రీకృష్ణుని స్తుతించుట

సత్యాన్నే వ్రతంగా కలవాడివి. మోక్షప్రాప్తికి సాధనరూపమైనవాడివి. భూత భవిష్య ద్వర్తమానాలు మూడింటిలో ఉండేవాడివి, పంచభూతాలకు పుట్టుక స్థానమైనవాడివి, అయిదు భూతాలలో అంతర్యామిగా ఉండేవాడివి, అయిదుభూతాలు అంతరించిన తరువాత కూడా మిగిలి ఉండేవాడివి, సత్యాన్ని మాట్లాడేవాడివి, అన్నింటినీ, అందరినీ సమానంగా చూచేవాడివి ఇట్టి నిన్ను శరణు వేడుతున్నాం. నీ మాయాశక్తిచేత జ్ఞానశూన్యులైనవారు నిన్ను అనేకవిధాలుగా అనుకొంటున్నారు. కాని జ్ఞానులుమాత్రం ఏకచిత్తంతో అన్నీ నీవే అని అంటారు.

(సమదర్శనం - అన్నింటిని, అందరిని సృష్టించింది, అన్నింటిలో, అందరిలో ఉన్నది పరమాత్మే కనుక ఆయన అన్నింటిని, అందరిని సమానంగా చూస్తాడు. ఆయనది సదా సమదర్శనమే! పరమాత్మతత్త్వాన్ని సృష్టి తత్త్వాన్ని తెలుసుకొన్న జ్ఞానిదికూడా సమదర్శనమే!)

అంతేకాకుండా, ఇంకా మూలప్రకృతి పాదుగా, సుఖదుఃఖాలు రెండు ఫలాలుగాా; సత్త్వరజస్తమోగుణాలు మూడు వేళ్ళుగా, ధర్మార్థకామమోక్షాలుగా చెప్పబడే పురుషార్థాలు నాలుగు రసాలుగా, శబ్దస్పర్శరూపరసగంధాలను తెలుసుకొనే చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు - అయిదు ఇంద్రియాలుగా - జ్ఞానేంద్రియాలుగా, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలనే ఆరు స్వభావాలుగా, ఆకలి, దప్పిక, శోకం, మోహం, ముసలితనం, మరణం అనే ఆరు ఊర్ములుగా, రసం, రక్తం, మాంసం, మేదస్సు, అస్థి, మజ్జ, శుక్రం అనే ఏడుధాతువులు పైపొరలుగా, భూమి, నీరు, అగ్ని వాయువు, ఆకాశం అనే భూతాలు అయిదు, బుద్ధీ, మనస్ఫూ, అహంకారం అనేవి మూడు - మొత్తం ఎనిమిది కొమ్మలుగా, రెండుకళ్ళు, రెండుచెవులు, ముక్కురంధ్రాలు రెండు, నోరు, మలమూత్రద్వారాలు రెండు - మొత్తం తొమ్మిది రంధ్రాలు చెట్టుతొర్రలుగా, ప్రాణాపానవ్యానోదానసమానాలనే పంచప్రాణాలు, నాగ, కూర్మ, కృకర, దేవదత్త ధనంజయాలనే అయిదు ఉపప్రాణాలు మొత్తం పదిప్రాణాలు - ఆకులుగా, జీవుడు, ఈశ్వరుడు పక్షులజంటగా ఉండే సంసారవృక్షాన్ని - పుట్టించటానికీ, రక్షించటానికీ, నశింపచేయటానికీ ప్రభువవు నీ వొక్కడివే!

(సామాన్య దృష్టికి ఇంత అద్భుతమైన ఈ సంసారమహావృక్షాన్ని సృష్టించేది బ్రహ్మ అనీ, రక్షించేది విష్ణువనీ, లయం చేసేది శివుడనీ అనిపిస్తుంది. కాని, తాత్త్వికంగా / లోతుగా చూస్తే ఉన్నది ఒక్కపరమాత్మే - "ఏకం సత్‌" పరమాత్మ నామరూప గుణాలు లేనివాడు. ఆయన తనంత తానుగా గుణాత్మకుడు - త్రిగుణాత్మకుడు - అయినపుడు సృష్టి, స్థితి, లయాలు జరుగుతున్నాయి. అందుకే "సంసారవృక్షంబు గలుగంజేయం, గావ, నడంగింప రాజ వొక్కరుండ వీవ” అని చెప్పటం జరిగింది)

జ్ఞానులైనవారు ఏది సత్యమో, ఏది నిత్యమో తెలిసినవారు ఏ వైపునకు వెళ్ళకుండా, తమ దేహాన్ని మనస్సును నీయందే నిలిపి, సంసారమనే సముద్రాన్ని నీ పాదమనే నావ ఆధారంగా, ఆవుదూడ అడుగును దాటినంత సులభంగా దాటగలుగుతారు.

(మనస్సును అన్యమైన వానివైపు పోనీయకుండా, పరమాత్మయందే లగ్నం చేయుట - అనన్య భక్తి. సంసారసాగరాన్ని దాటటానికి, మోక్షాన్ని పొందటానికి ఈ అనన్యభక్తే అద్భుతసాధనం.)

నీవు సజ్జనులకు మేలు, దుర్జనులకు కీడు కలిగించే అనేకశరీరాలు ధరించి, అన్నివేళల్లో లోకానికి క్షేమాన్ని కలుగ చేస్తూనే ఉంటావు.

కొందరు తాము అన్నీ తెలిసినవాళ్ల మనుకొని, పనికిమాలిన విషయాలు తెలుసుకొని, నీ నామమాహాత్యం తెలిసికూడ నామసంకీర్తనం చెయ్యరు. అధోగతిపాలైనవారిమార్గంలోనే తామూ పరుగులు పెడతారు. (నీచజన్మ లెత్తి మహాదుఃఖాల పాలవుతారని భావం)

ప్రభూ! గొప్పవారు నీవారై, తమ హృదయాల్ని నీయందే నిలిపి, జననమరణ భయం లేనివాళ్లై, ఏ అడ్డంకులూ లేక, ఉన్నతోన్నత స్థానమైన పరమపదంలో వర్ధిల్లుతూ ఉంటారు.

ఓ విష్ణుమూర్తి! బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్న్యాసులు అనే నాలుగుఆశ్రమాల ప్రజలు నిన్ను సేవిస్తుండగా, అన్నిలోకాల్లో సత్త్వమయం, పరిశుద్ధం, క్షేమంకరం అయిన దేహాన్ని నీవు పొందుతావు.

(హరి అంటే భక్తుల పాపాలను హరించువాడు. "హరి యను రెండక్షరములు, హరియించును పాతకంబు అని కదా కృష్ణశతక పద్యం చెపుతూ ఉంది!)

శ్రీహరీ! నీవు సత్త్వస్వరూపుడివి. అలా కాకుంటే నీ దేహం విజ్ఞానాన్ని కలిగించేది, అజ్ఞానాన్ని తొలగించేది ఎలా అవుతుంది? రజస్తమో గుణాల్లోకూడ నీవు ప్రకాశిస్తుంటావు. కాని, సత్త్వమయమైన నీ సహజస్వరూపాన్ని సేవిస్తేనే సాక్షివై నీవు సాక్ష్యాత్కరిస్తావు. మాటకు, మనస్సుకు అతీతమైన మార్గంలో- గుణాలు, జన్మలు, కర్మలు లేనట్టి నీ రూపాన్ని నీ నామాన్ని మహాత్ములు తెలుసుకొంటారు. నిన్ను భావించుకొంటూ, నిన్ను గూర్చి వింటూ, నిన్ను ధ్యానించుకొంటూ, నిన్ను స్తుతించుకొంటూ ప్రకాశించే వ్యక్తి జన్మరాహిత్యాన్ని పొందుతాడు. నీ పాదభక్తుడౌతాడు.

ఓ పురుషోత్తమా! ఓ ఈశ్వరా! నీవు జన్మించటంవల్ల భూభారం తొలగిపోయింది. నీ పాదపద్మాలు ఆదరువుగా నీ దయతో భూమ్యాకాశాలను పూర్తిగా చూడగలం.

(ద్వాపరం నాటికే దుష్టులసంఖ్య భూమిమీద పెరిగింది. భూదేవి వాళ్ళను భరించలేని స్థితి ఏర్పడింది. దుష్ట సంహరణారం శ్రీహరి అవతరణ జరగాలి. అప్పుడే భూభారం తగ్గుతుంది.)

పుట్టడం, పెరుగడం, మరణించడం, మొదలైన వికారాలు ఏవీ లేని నీవు పలుమార్లు పుట్టటం అంటే, అది కేవలం నీకు ఒక క్రీడేగాని, నిజంగా నీవు పుట్టటమా? పుట్టడం, పెరుగడం, మరణించడం మొదలైన దశలన్నీ మాయ. ఆ మాయ జీవులనన్నింటినీ ఆవరించి ఉంటుంది. కానీ, ఆ మాయ నిన్ను కూడా చుట్టుకొన్నట్లు నీ చెంతనే ఉన్నా, నిన్ను ఆవరించే శక్తి దానికి లేదు. సర్వేశ్వరా! ఆ మాయామయాలైన క్రియల్లో ఏ వ్యామోహం లేని- 'ఏకో నారాయణో హరిః' అన్నట్లు ఒంటరివాడవు నీవు మాత్రమే!

మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, హయగ్రీవ, పరశురామ, శ్రీరామావతారాలెత్తి, దుష్టులబారినుండి దయతో లోకాలను కాపాడిన నీకు మ్రొక్కుతాము. ఇప్పుడు భూభారాన్ని తొలగించు స్వామీ!

ముకుందా! దయలేని దుర్మార్గులు కంసాదులు విజృంభించి ఎల్లప్పుడు బాధించటంవల్ల లోకం దుఃఖంలో మునిగి ఉంది. ప్రీతితో దీన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. తల్లి కడుపునుండి వెడలిరా స్వామీ!

అని పలికిన తర్వాత దేవకీదేవిని చూస్తూ

అమ్మా! దేవకీదేవీ! నీ గర్భంలో ఆదిపురుషుడైన శ్రీమహావిష్ణువు ఉన్నాడు. రేపు జన్మిస్తాడు. కంసునివల్ల ఏ మాత్రం భయం లేదు. ఇది నిజం. ఇకముందు మా అందరికి శుభం కలుగుతుంది. యాదవులంతా సంతోషంతో పొంగిపోగా ఎల్లప్పుడు నీ కడుపు చల్లగా ఉండాలి (నీవు సుఖంగా ప్రసవించాలి - అని భావం)

అని ఈ విధంగా దేవతలు విష్ణుమూర్తిని స్తుతించి, దేవకీదేవిని దీవించి, శివుడు, బ్రహ్మ ముందు నడువగా తమ తమ స్థానాలకు వెళ్ళారు. తరువాత.




Krishna Satakam - కృష్ణ శతకం

కృష్ణ శతకం- నరసింహ కవి

శ్రీ రుక్మిణీశ కేశవ
నారద సంగీత లోల నగధర శౌరీ
ద్వారక నిలయ జనార్ధన
కారుణ్యము తోడ మమ్ము గావుము కృష్ణా 
॥ 01 

నీవే తల్లివి దండ్రివి
నీవే నా తోడునీడ నీవే సఖుడౌ
నీవే గురుడవు దైవము
నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా
 ॥ 02 

నారాయణ పరమేశ్వర
ధారాధర నీలదేహ దానవ వైరీ
క్షీరాబ్ధిశయన యదుకుల
వీరా ననుగావు కరుణ వెలయగ కృష్ణా
 ॥ 03 

హరి యను రెండక్షరములు
హరియించును పాతకముల నంబుజనాభా
హరి నీ నామ మహాత్మ్యము
హరి హరి పొగడంగ వశమె హరి శ్రీకృష్ణా
 ॥ 04 

క్రూరాత్ముడజామీళుఁడు
నారాయణ యనుచు నాత్మనందను బిలువన్
ఏ రీతి నేలుకొంటివి
యేరీ నీసాటి వేల్పు లెందును కృష్ణా
 ॥ 05 

చిలుక నొక రమణి ముద్దులు
చిలుకను శ్రీరామయనుచు శ్రీపతి పేరుం
బిలిచిన మోక్షము నిచ్చితివ
వలరగ మిము దలఁచు జనులకరుదా కృష్ణా
 ॥ 06 

అకౄరవరద! మాధవ!
చక్రాయుధ! ఖడ్గపాణి! శౌరి! ముకుందా!
శక్రాది దివిజ సన్నుత!
శుక్రార్చిత! నన్ను కరుణ జూడుము కృష్ణా!
 ॥ 07 

నందుని ముద్దుల పట్టిని
మందరగిరిధరుని హరిని మాధవు విష్ణున్
సుందరరూపుని మునిగణ
వందితు నిను దలంతు భక్తవత్సల! కృష్ణా!
 ॥ 08 

ఓ కారుణ్య పయోనిధీ!
నా కాధారంబ వగుచు నయముగ బ్రోవన్
నాకేల ఇతర చింతలు
నాకాధిప వినుత! లోకనాయక కృష్ణా!
 ॥ 09 

వేదంబులు గననేరని
ఆది పరబ్రహ్మమూర్తివనఘ! మురారీ;
నా దిక్కు చూచి కావుము
నీ దిక్కే నమ్మినాడ నిజముగ కృష్ణా!
 ॥ 10 

పదునాలుగు భువనంబులు
కుదురుగ నీకుక్షి నిల్పుకొను నేర్పరివై
విదితంబుగ నా దేవకి
యుదరములో నెట్టులొదిగి యుంటివి కృష్ణా!
 ॥ 11 

అష్టమి రోహిణి ప్రొద్దున
అష్టమ గర్భమునఁ బుట్టి యా దేవకికిన్
దుష్టుని కంసు వధింపవె
సృష్టి ప్రతిపాలనంబు సేయఁగ కృష్ణా!
 ॥ 12 

అల్ల జగన్నాథుకు రే
పల్లియ క్రీడార్థమయ్యె పరమాత్మునకున్
గొల్లసతి యా యశోదయుఁ
తల్లియునై చన్నుగుడిపెఁ దనరగ కృష్ణా!
 ॥ 13 

అందెలు గజ్జెలు మ్రోయఁగ
చిందులు ద్రొక్కుచును వేడ్క చెలువారంగా
నందునిసతి యా గోపిక
ముందఱ ఆడుదువు మిగుల ముఱియుచు కృష్ణా!
 ॥ 14 

హరిచందనంబు మేనునఁ
గర మొప్పెడు హస్తములను కంకణరవముల్
ఉరమున రత్నము మెఱయఁగ
పరఁగితివో నీవు బాలప్రాయము కృష్ణా
 ॥ 15 

పాణి తలంబున వెన్నయు
వేణీమూలంబునందు వెలయఁగఁ పింఛం
బాణీముత్యము ముక్కున
నాణెముగా దాల్చు లోకనాథుడ కృష్ణా!
 ॥ 16 

మడుగుకు జని కాళీయుని
పడగలపై భరతశాస్త్ర పద్ధతి వెలయన్
కడు వేడుకతో నాడెడు
నడుగులు నా మదిని దలతు నచ్యుత! కృష్ణా!
 ॥ 17 

బృందావనమున బ్రహ్మా
నందార్భకమూర్తి వేణు నాదము నీవా
మందార మూలమున గో
విందా! పూరింతు వౌర! వేడుక కృష్ణా!
 ॥ 18 

వారిజనేత్రలు యమునా
వారిని జలకంబులాడ వచ్చిన నీవా
చీరలు మ్రుచిలి యిచ్చితి
నేరుపురా యదియు నీకు నీతియె కృష్ణా!
 ॥ 19 

దేవేంద్రుఁ డలుకతోడను
వావిరిగా ఱాళ్లవాన వడిఁ గురియింపన్
గోవర్థనగిరి యెత్తితి
గోవుల గోపకులఁ గాచు కొఱకై కృష్ణా!
 ॥ 20 

అండజవాహన! విను బ్ర
హ్మాండంబుల బంతులట్ల యాడెడి నీ వా
కొండల నెత్తితివందురు
కొండిక పనిగాక దొడ్డకొండా! కృష్ణా!
 ॥ 21 

అంసాలంబితకుండల!
కంసాంతక! నీవు ద్వారకాపురిలోనన్
సంసారిరీతి నుంటివి.
హంసేంద్ర! విశాలనేత్ర! అచ్యుత కృష్ణ!
 ॥ 22 

పదియాఱు వేల నూర్వురు
సుదతులు నెనమండ్రు నీకు సొంపుగ భార్యల్
విదితంబుగ బహురూపుల
వదలక రమియింతువౌర ! వసుధను కృష్ణా!
 ॥ 23 

అంగన పసుపున దోవతి
కొంగున నటుకులను ముడిచి కొనివచ్చిన యా
సంగతి విని దయ నొసఁగితి
రంగుగ సంపదలు లోక రక్షక కృష్ణా!
 ॥ 24 

హా వసుదేవకుమారక!
కావుము నా మానమనుచుఁ గామిని వేఁడన్
ఆ వనజాక్షికి నిచ్చితి
శ్రీవర! యక్షయ మటంచుఁ జీరలు కృష్ణా!
 ॥ 25 

శుభ్ర మగు పాంచజన్యము
నభ్రంకషపగిది మ్రోవ నాహవ భూమిన్
విభ్రము లగు దనుజసుతా
గర్భంబులు పగులఁజేయు ఘనుఁడవు కృష్ణా!
 ॥ 26 

జయమును విజయున కియ్యవె
హయముల ములుకొలమోపి యదలించి మహా
రయమున ఱొప్పవె తేరును
భయమున రిపుసేన విఱిగి పాఱగ! కృష్ణా!
 ॥ 27 

దుర్జనులగు నృపసంఘము
నిర్జింపగఁదలచి నీవు నిఖిలాధారా!
దుర్జనులను వధియింపను
అర్జునునకు నీవు సాదివైతివి కృష్ణా!
 ॥ 28 

శక్రసుతుఁ గాచు కొఱకై
చక్రము చేపట్టి భీష్ముఁ జంపగ జను నీ
విక్రమ మేమని పొగడుదు
నక్రగ్రహ! సర్వలోక నాయక కృష్ణా!
 ॥ 29 

దివిజేంద్రసుతునిఁ జంపియు
రవిసుతు రక్షించినావు రఘురాముడవై
దివిజేంద్ర సుతుని గాచియు
రవిసుతుఁ బరిమార్చితౌర! రణమున కృష్ణా!
 ॥ 30 

దుర్భరబాణము రాగా
గర్భములోనుండి అభయ కావుమటన్నన్
నిర్భరకృప రక్షించితి
వర్భకు నభిమన్యుసుతుని నచ్యుత కృష్ణా!
 ॥ 31 

గిరులందు మేరు వౌదువు
సురలందున నింద్రుఁడౌదు చుక్కలలోనన్
బరమాత్మ! చంద్రుఁడౌదువు,
నరులందున నృపతివౌదు నయముగ కృష్ణా!
 ॥ 32 

చుక్కల నెన్నగ వచ్చును
గ్రక్కున భూ రేణువులను గణుతింపనగున్
జొక్కపు నీ గుణజాలము
నక్కజ మగు లెక్కబెట్ట నజునకు కృష్ణా!
 ॥ 33 

కుక్షిని సకలజగంబుల
నిక్షేపముఁజేసి ప్రళయనీరధి నడుమన్
రక్షక! వటపత్రముపై
దక్షతఁ బవళించినట్టి ధన్యుఁడ కృష్ణా!
 ॥ 34 

విశ్వోత్పత్తికి బ్రహ్మవు
విశ్వము రక్షింపఁ దలచి విష్ణుడవనఁగా
విశ్వముఁ జెఱుపను హరుడవు
విశ్వాత్మక! నీవెయగుచు వెలయుదు కృష్ణా!
 ॥ 35 

అగణిత వైభవ! కేశవ!
నగధర! వనమాలి! యాది నారాయణ! యో
భగవంతుడ! శ్రీమంతుడ!
జగదీశ్వర! శరణు శరణు శరణము కృష్ణా!
 ॥ 36 

మగ మీనమవై జలనిధి
జగతుని సోమకుని జంపి పద్మభవునకున్
నిగమములు దెచ్చి యిచ్చితి
సుగుణాకర మేలు దివ్యసుందర కృష్ణ!
 ॥ 37 

అందఱు సురలును దనుజులు
పొందుగ క్షీరాబ్ధిఁ దరుప పొలుపున నీ వా
నందముగా కూర్మమవై
మందరగిరి యెత్తితౌర! మాధవ కృష్ణా!
 ॥ 38 

ఆది వరాహుడవయి నీ
వా దనుజు హిరణ్యనేత్రు హతుఁ జేసి తగన్
మోదమున సురలు వొగడఁగ
మేదిని వడిగొడుగునెత్తి మెరసితి కృష్ణా!
 ॥ 39 

కెరలి యఱచేత కంబము
నరుదుగ వేయుటయు వెడలి యసురేశ్వరునిన్
ఉరము జీరి వధించితి
నరహరి రూపావతార! నగధర కృష్ణా!
 ॥ 40 

వడుగడవై మూడడుగుల
నడిగితివౌ భళిర భళిర అఖిలజగంబుల్
తొడిగితివి నీదు మేనున
కడు చిత్రము నీ చరిత్ర ఘనమవు కృష్ణా!
 ॥ 41 

ఇరువదొకమాఱు నృపతుల
శిరములు ఖండించితౌర! చేగొడ్డంటన్
ధర కశ్యపునకు నిచ్చియు
బరగవె జమదగ్ని రామభద్రుడ కృష్ణా!
 ॥ 42 

దశకంఠుని బరిమార్చియు
కుశలముతో సీత దెచ్చికొనియు నయోధ్యన్
విశదముగఁగీర్తినేలిన
దశరథరామావతార! ధన్యుఁడ కృష్ణా!
 ॥ 43 

ఘనులగు ధేనుకముష్టిక
దనుజులఁ జెండాడితౌర తగ భుజశక్తిఁ
అనఘాత్మ! రేవతీపతి
యనఁగా బలరామమూర్తి వైతివి కృష్ణా!
 ॥ 44 

త్రిపురాసుర భార్యల నతి
నిపుణతతో వ్రతముచేత నిలిపితి కీర్తుల్
కపటపు రాజవు బళిరే
కృపగల బౌద్ధావతార ఘనుడవు కృష్ణా!
 ॥ 45 

వలపుల తేజీ నెక్కియు
నిలపై ధర్మంబు నిలువ హీనులఁ ద్రుంపన్
కలియుగము తుదిని వేడుక
కలికివిగానున్న లోక కర్తవు కృష్ణా!
 ॥ 46 

వనజాక్ష! భక్తవత్సల
ఘనులగు త్రైమూర్తులందుఁ గరుణానిధివై
మను నీ సద్గుణజాలము
సనకాది మునీంద్రు లెన్నజాలరు కృష్ణా!
 ॥ 47 

అపరాథ సహస్రంబుల
నపరిమితములైన యఘము లనిశము నేనున్
గపటాత్ముఁడనై చేసితిఁ
జపలుని ననుఁగావు శేషశాయివి కృష్ణా!
 ॥ 48 

నరపశువు మూడచిత్తుడ
దురితారంభుఁడను మిగుల దోషగుఁడను నీ
గుఱుతెఱుఁగ నెంతవాఁడను
హరి నీవే ప్రాపు దాపు నౌదువు కృష్ణా!
 ॥ 49 

పరనారీ ముఖపద్మము
గురుతుఁగ గుచకుంభములను గొప్పును నడుమున్
అరయంగనె మోహింతురు
నిరతిని నిను భక్తిఁ గొల్వ నేరరు కృష్ణా!
 ॥ 50 

పంచేంద్రియ మార్గంబుల
కొంచెపు బుద్ధినిఁ జరింతుకొన్ని దినంబుల్
ఇంచుక సజ్జన సంగతి
నెంచగ మిమ్మెఱిఁగినాఁడ నిప్పుడు కృష్ణా!
 ॥ 51 

దుష్టుఁడ దురాచారుఁడ
దుష్ట చరిత్రుఁడను జాల దుర్బుద్ధిని నే
నిష్ట నినుఁ గొల్వనేరను
కష్టుఁడను ననుఁ గావు కావు కరుణను కృష్ణా!
 ॥ 52 

కుంభీంద్ర వరద! కేశవ!
జంభాసుర వైరి దివిజ సన్నుత చరితా!
అంభోజనేత్ర! జలనిధి
గంభీరా నన్నుగావు కరుణను కృష్ణా!
 ॥ 53 

దిక్కెవ్వరు ప్రహ్లాదుకు
దిక్కెవ్వరు పాండు సుతుల దీనుల కెపుడున్
దిక్కెవ్వరయ్యహల్యకు
దిక్కెవ్వరు నీవె నాకు దిక్కువు కృష్ణా!
 ॥ 54 

హరి! నీవె దిక్కు నాకును
సిరితో నేతెంచే మకరి శిక్షించి దయన్
బరమేష్టి సురలు పొగడఁగఁ
గరిఁగాచినరీతి నన్నుఁ గావుము కృష్ణా!
 ॥ 55 

పురుషోత్తమ! లక్ష్మీపతి!
సరసిజగర్భాదిమౌని సన్నుత చరితా!
మురభంజన! సురరంజన!
వరదుఁడ వగు నాకు భక్తవత్సల! కృష్ణా!
 ॥ 56 

క్రతువులు తీర్థాటనములు
వ్రతములు దానములు సేయవలెనా లక్ష్మీ
పతీ! మిముఁ దలచినవారికి
నతులిత పుణ్యములు గలుగుటరుదా? కృష్ణా!
 ॥ 57 

స్తంభమున వెడలి దానవ
డింభకు రక్షించినట్టి రీతిని వెలయన్
అంభోజ నేత్ర! జలనిధి
గంభీరుఁడ! నన్నుఁగావు కరుణను కృష్ణా!
 ॥ 58 

శతకోటిభాను తేజుఁడ!
యతులిత సద్గుణగణాఢ్య యంభుజనాభా!
రతినాథ జనక! లక్ష్మీ
సతిహిత! ననుగావు భక్తవత్సల కృష్ణా!
 ॥ 59 

మందుఁడ నేదురితాత్ముఁడ
నిందల కొడిగట్టినట్టి నీచుని నన్నున్
సందేహింపక కావుము
నందుని వరపుత్ర! నిన్ను నమ్మితి కృష్ణా!
 ॥ 60 


గజరాజ వరద! కేశవ!
త్రిజగత్కల్యాణమూర్తి! దేవమురారీ!
భుజగేంద్ర శయన! మాధవ
విజయాప్తుఁడ! నన్నుఁగావు వేడుక కృష్ణా!
 ॥ 61 

గోపాల దొంగ మురహర
పాపాలను బాఱఁద్రోలు ప్రభుఁడవు నీవే
గోపాలమూర్తి! దయతో
నా పాలిటఁ గలిగి ప్రోవు నమ్మితి కృష్ణా!
 ॥ 62 

దుర్వార చక్రధర కర!
శర్వాణీ ప్రముఖ వినుత! జగదాధారా!
నిర్వాణనాథ! మాధవ!
సర్వాత్మక! నన్ను గావు సరుగున కృష్ణా!
 ॥ 63 

సుత్రామనుత! జనార్దన!
సత్రాజిత్తనయనాథ! సౌందర్యకళా
చిత్రావతార! దేవకి
పుత్రా! ననుఁగావు నీకుఁ బుణ్యము కృష్ణా!
 ॥ 64 

బల మెవ్వఁడు కరిబ్రోవను
బల మెవ్వఁడు పాండుసుతుల భార్యను గావన్
బలమెవ్వఁడు రవిసుతునకు
బలమెవ్వఁడు నాకు నీవు బలమౌఁ కృష్ణా!
 ॥ 65 

పరుసము సోఁకిన యినుమును
వరుసగ బంగారమైన వడుపున జిహ్వన్
హరి నీ నామము సోకిన
సురవందిత! నేను నటుల సులభుఁడ కృష్ణా!
 ॥ 66 

ఒకసారి నీదు నామము
ప్రకటముగాఁ దలఁచువారి పాపప్ము లెల్లన్
వికలములై తొలఁగుటకును
సకలాత్మ యజామిళుండు సాక్షియె కృష్ణా!
 ॥ 67 

హరి సర్వంబునన్ఁ గలఁడని
గరిమను దైత్యుండు పలుక గంబములోనన్
ఇరవొంద వెడలి చీల్పవె
శరణనఁ బ్రహ్లాదకుండు సాక్షియె కృష్ణా!
 ॥ 68 

భద్రార్చిత పదపద్మ! సు
భద్రాగ్రజ! సర్వలోకపాలన! హరి! శ్రీ
భద్రాధిప! కేశవ! బల
భద్రానుజ! నన్నుఁబ్రోవు భయహర కృష్ణా!
 ॥ 69 

ఎటువలెఁ గరిమొఱ వింటివి
యెటువలెఁ బ్రహ్లాదు కభయ మిచ్చితి కరుణన్
అటువలె నను రక్షింపుము
కటకట! నిను నమ్మినాఁడ గావుము కృష్ణా!
 ॥ 70 

తటపట లేటికిఁ జేసెదు
కటకట పరమాత్మ నీవు ఘంటాకర్నున్
ఎటువలె నిపుణునిఁ జేసితి
నటువలె రక్షింపుమయ్య యచ్యుత కృష్ణా!
 ॥ 71 

తురగాధ్వరంబు జేసిన
పురుషులకును వేఱె పదవి పుట్టుట యేమో
హరి! మిముఁ దలచిన వారికి
నరుదా కైవల్య పదవి యచ్యుత కృష్ణా!
 ॥ 72 

ఓ భవనంధ విమోచన!
యో భరతా గ్రజ! మురారి! యోరఘు రామా!
యో భక్త కామధేనువ!
యో భవహర! నన్నుఁగావుమో హరి కృష్ణా!
 ॥ 73 

ఏ తండ్రి కనక కశ్యపు
ఘాతకుఁడై యతని సుతుని గరుణను గాచెన్
బ్రీతి సురకోటి పొగడఁగ
నా తండ్రీ! నిన్ను నేను నమ్మితి కృష్ణా!
 ॥ 74 

ఓ పుండరీకలోచన!
యో పురుషోత్తమ! ముకుంద! యో గోవిందా!
యో పురసంహార మిత్రుడ!
యో పుణ్యుఁడ! నన్నుఁ బ్రోవు మో హరికృష్ణా!
 ॥ 75 

ఏ విభుఁడు ఘోర రణమున
రావణు వధియించి లంక రాజుగ నిలిపెన్
దీవించి యా విభీషణు,
నా విభు నేఁ దలఁతు మదిని నచ్యుత కృష్ణా!
 ॥ 76 

గ్రహభయదోషముఁ బొందదు
బహుపీడలు చేర వెఱచుఁ బాయును నఘముల్
ఇహపర ఫలదాయక విను,
తహతహలెక్కడివి నిన్నుఁ దలచిన కృష్ణా!
 ॥ 77 

గంగ మొదలైన నదులను
మంగళముగఁ జేయునట్టి మజ్జనమునకున్
సంగతి గలిగిన ఫలములు
రంగుగ మిముఁ దలచుఁ సాటి రావుర కృష్ణా!
 ॥ 78 

ఆ దండ కావనంబునఁ
గోదండముఁ దాల్చినట్టి కోమలమూర్తీ!
నాదండ కావరమ్మీ
వేదండముఁ గాచినట్టి వేల్పవు కృష్ణా!
 ॥ 79 

చూపుము నీ రూపంబును
బాపవు దుష్కృతములెల్లఁ బంకజనాభా!
పాపుము నాకును దయతో
శ్రీపతి! నిను నమ్మునాఁడ సిద్ధము కృష్ణా!
 ॥ 80 

నీ నామము భవహరణము
నీ నామము సర్వసౌఖ్య నివహకరంబున్
నీనామ మమృత పూర్ణము
నీ నామము నేఁ దలంతు నిత్యము కృష్ణా!
 ॥ 81 

పరులను నడిగిన జనులకుఁ
గురుచ సుమీ ఇది యటంచు గు!రుతుగ నీవున్
గురుచ్ఁడవై వేడితి మును
ధ్రఁ బాదత్రయము బలిని దద్దయు కృష్ణా!
 ॥ 82 

పాలను వెన్నయు మ్రుచ్చిలఁ
ఱోలను మీ తల్లి గట్ట రోషముతోడన్
లీలావినోదివైతివి
బాలుఁడవా బ్రహ్మఁగన్న ప్రభుఁడవు కృష్ణా!
 ॥ 83 

రఘునాయక నీనామము
లఘుమతితోఁ దలఁపఁగలనె లక్ష్మీరమణా!
అఘములఁ బాపుము దయతో
రఘురాముఁడ వైన లోక రక్షక కృష్ణా!
 ॥ 84 

అప్పా! యిత్తువు దయతో
నప్పాలను నతిరసంబు లనుభవశాలీ
అప్పా! ననుఁ గను్గొనవే
యప్పా! ననుఁ బ్రోవు వేంకటప్పా! కృష్ణా!
 ॥ 85 

కొంచెపువాఁడని మదిలో
నుంచకుమీ వాసుదేవ! గోవింద! హరీ!
యంచితముగ నీ కరుణకుఁ
గొంచెము నధికంబు గలదె కొలతయు కృష్ణా!
 ॥ 86 

వావిరి నీ భక్తులకున్
గావరమున నెగ్గు సేయు గర్వాంధులనున్
దేవ! వధించుట వింటివి
నీ వల్లను భాగ్యమయ్యె నిజముగ కృష్ణా!
 ॥ 87 

అయ్యా! పంచేంద్రియములు
నుయ్యాలల నూచినట్టు లూచఁగ నేనున్
జయ్యన్ గలుచుఁచు నుంటిని
గుయ్యాలింపుము మహాత్మ గుఱుతుగ కృష్ణా!
 ॥ 88 

కంటికి రెప్పవిధంబున
బంటుగదా యనుచు నన్నుఁ బాయక యెపుడున్
జంటయు నీవుండుట నే
కంటక మగు పాపములను గడచితి కృష్ణా!
 ॥ 89 

యమునకు నిఁక నే వెఱువను
కమలాక్ష! జగన్నివాస! కామితఫలదా!
విమల మగు నీదు నామము
నమరఁగఁ దలఁచెను వేగ ననిశము కృష్ణా!
 ॥ 90 

దండమయా! విశ్వంభర!
దండమయా! పుండరీక దళనేత్ర హరీ!
దండమయా! కరుణానిధి!
దండమయా! నీకు నెపుడు దండము కృష్ణా!
 ॥ 91 

నారాయణ! లక్ష్మీపతి!
నారాయణ! వాసుదేవ! నందకుమారా!
నారాయణ! నిను నమ్మితి!
నారాయణ! నన్నుఁ బ్రోవు నగధర కృష్ణా!
 ॥ 92 

తిరుమణి దురితవిదూరము
తిరుమణి సౌభాగ్యకరము త్రిజగములందున్
తిరుమణి పెట్టిన మనుజుఁడు
పరమ పవిత్రుండు భాగ్యవంతుంఁడు కృష్ణా!
 ॥ 93 

శ్రీలక్ష్మీనారాయణ!
వాలాయము నిన్నుఁ దలఁతు వంద్యచరిత్రా!
ఏలుము నను నీ బంటుగఁ
జాలఁగ నిను నమ్మినాను సరసుఁడ కృష్ణా!
 ॥ 94 

శ్రీధర! మాధవ! యచ్యుత!
భూధర! పురుహూత వినుత! పురుషోత్తమ! నీ
పాద యుగళంబు నెపుడు
మోదముతో నమ్మినాఁడ ముద్దుల కృష్ణా!
 ॥ 95 

శిరమున రత్నకిరీటము
కరయుగమున శంఖచక్ర ఘనభూషణముల్
ఉరమున వజ్రపుఁ బతకము
సిరినాయక! యమరవినుత శ్రీహరి కృష్ణా!
 ॥ 96 

అందెలఁ బాదము లందును
సుందరముగ నిల్పినావు సొంపమరంగా
సుందర! మునిజనసన్నుత!
నందుని వరపుత్ర! నిన్ను నమ్మితి కృష్ణా!
 ॥ 97 

కందర్పకోటి సుందర!
మందరధర! భానుతేజ! మంజుల దేహా!
సుందర విగ్రహ! మునిగణ
వందిత, మిముఁ దలతు భక్తవత్సల కృష్ణా!
 ॥ 98 

దుర్మతిని మిగుల దుష్టపుఁ
గల్మషములు జేసినట్టి కష్టుండ ననున్
నిర్మలునిఁ జేయవలె ని
ష్కర్ముఁడ నిను నమ్మినాను సతతము కృష్ణా!
 ॥ 99 

అనుదినము కృష్ణశతకము
వినినఁ బఠించినను ముక్తి వేడుకఁ గలుగున్
ధనధాన్యము గోగణములు
తనయులు నభివృద్ధి బొందుఁ దద్దయ కృష్ణా!
 ॥ 100 

భారద్వాజసగోత్రుఁడ
గారవమున గంగమాంబ కరుణాసుతుఁడన్
పేరు నృసింహ్వాయుఁడను
శ్రీరమయుత! నన్నుఁ గావు సృష్టిని కృష్ణా!
 ॥ 101 

శతకం

నిత్య పారాయణ శ్లోకాలు

నిత్య స్తోత్రావళి

పంచాంగం

Devaki Devi Stuti to Lord Vishnu - దేవకీదేవి స్వామిని స్తుతించుట

దేవకీదేవి స్వామిని స్తుతించుట ఈ విధంగా పుట్టిన బిడ్డతో వసుదేవుడు అంటూ ఉండగా, దేవకీదేవికూడా, మహాపురుషలక్షణాలు కలవాడు, గొప్ప సదసద్వివేకజ్ఞానం ...