Sunday, February 22, 2026

Kardama Created Self-Moving Aerial Mansion (Vimana) with Yogic Powers For his Wife - కర్దమప్రజాపతి యోగప్రభావంబుచే విమానంబు గల్పించి భార్యతో గూడి విహరించుట

కర్దమప్రజాపతి యోగప్రభావంబుచే విమానంబు గల్పించి భార్యతో గూడి విహరించుట

ఈ విధంగా స్వాయంభువమనువు తన కుమార్తె దేవహూతిని కర్దమమునికిచ్చి పెండ్లి జరిపించి తిరిగి తన నగరానికి వెళ్లిపోయాడు. అటు తరువాత దేవహూతి పతిభక్తితో పార్వతీదేవి పరమేశ్వరునికి పరిచర్య చేసినట్లు భర్తయైన క
ర్దమునికి సేవచేయనారంభించింది. భర్తయే తనకు దిక్కు అని భావించింది. భర్త మనస్సులోని అభిప్రాయాలకు అనుగుణంగా రోజురోజుకు ద్విగుణీకృతయైన భక్తి శ్రద్ధలతో, అనురాగంతో మిక్కుటమైన తేజస్సుతో ప్రకాశిస్తూ పతిని సేవిస్తున్నది. కామం క్రోధం కపటం లోభం మొదలైన దుర్గుణాలు లేకుండా శరీరాన్ని పరిశుభ్రంగా, సౌందర్యవంతంగా ఉంచుకొంటూ, చాతుర్యంతో ఆదరణతో ప్రేమతో భర్తనే భగవంతుడుగా భావించి మృదువుగా మధురంగా ఆయనతో మాట్లాడుతూ సేవలో ఎలాంటి ఉపేక్ష లేకుండా ప్రవరిస్తూ ఉన్నది. దైవేచ్చను సైతం తప్పింప సమర్ధుడైన కర్దమముని తనను సేవించడంలో కలిగిన కష్టంతో చిక్కిపోయిన శరీరంగల దేవహూతిని కరుణారసం పొంగిపొరలే కడకన్నులతో చూచి శ్రావ్యమైన మాటలతో ఇలా అన్నాడు.

తనకు శుశ్రూష చేసిన భార్యపై దయతో క
ర్దముడు ఇలా అంటున్నాడు. దేవహూతీ! మాననీయమైన ధర్మమార్గం వల్ల మహిమ కలుగుతుంది. ఆ మహిమాతిశయంవల్ల గొప్పతపస్సు, దానివల్ల ఏకాగ్రత కలుగుతాయి. వాటివల్ల ఆత్మజ్ఞానం లభిస్తుంది. దానివల్ల ఆత్మయోగం సిద్ధిస్తుంది. ఆత్మయోగంతో భగవత్కటాక్షం సమకూడుంది. ఆ కారణంగా పాపరహితమై విరాజిల్లే గొప్ప ఐశ్వర్యాలతో కూడిన అనంతాలైన శుభపరంపరలు సంప్రాప్తిస్తాయి. ఈ విధంగా నాకు సమకూడిన ఐశ్వర్యపరంపరలు నన్ను భక్తితో సేవించిన నీకు సంక్రమిస్తాయి. అంతేగాక నీకు తిరుగులేని దివ్యదృష్టిని కూడా అనుగ్రహిస్తున్నాను.

(క
ర్దముని వర్ణాశ్రమధర్మాలకు ఏ లోపమూ రానీకుండా నియమానుసారంగా దేవహూతి ఆయనను సేవించింది. దానితో కర్దముడు ధ్యాన ఉపాసనాదులు సక్రమంగా అనుష్టించడానికి వీలైంది. ఆ ఉపాసనాదులవల్ల ఆయనకు భగవత్ప్రసాదం, దానివల్ల అనంతాలైన శుభాలు, సంపదలు చేకూరినాయి. ఆయనను సర్వాత్మనా సేవించడంవల్ల అవన్నీ ఆమెకు కూడా లభించాయి. ఆ సిద్దులన్నిటినీ ప్రత్యక్షంగా చూడడానికి కావలసిన దివ్యదృష్టిని ప్రసాదిస్తానంటున్నాడు కర్దముడు.

భవభవానీ దాంపత్య ఉపమానంవలన వారు అర్ధనారీశ్వర తత్త్వానుసంధానం కలవారయ్యారుకనుక తపస్సు మొదలైనవాని ఫలాన్ని ఏకరూపంగా పొందారు.)

ఓ సుందరీ! నేనిచ్చిన ఆ దివ్యదృష్టివల్ల సర్వమూ నీకు కనిపిస్తుంది చూడు. భగవద్దత్తాలుకాని ఇతర నీచమైన ఐశ్వర్యాలు విష్ణుదేవుడు కనుబొమలు చిట్లించినంత మాత్రాననే నశించిపోతాయి. ఇక ఇతర విషయాలను గురించి వేరే చెప్పడమెందుకు?

(ఇంద్రియాలకు గోచరించనివాటిని కూడా చూడగలిగేశక్తి దివ్యదృష్టి. ఇది దైవసంబంధమైన శక్తి. ఇలాంటి శక్తిగలవారు దివ్యులు. సృష్టి సమస్తం శ్రియః పతి ఆజ్ఞాబద్ధమై ఉంటుందని, ఆయన ఆజ్ఞ లేనిది తృణమైనా చలించదని 'కమలపత్రనయను బొమముడి మాత్రాన నాశమందు' అనడంవల్ల దృఢమవుతున్నది.

'సాటిలేని రాజ్యవైభవాలతో గర్వంతో కనులుమూసుకుపోయి పాప మార్గాలలో పయనించే రాజులు పొందలేని ఈ దివ్యభోగాలు నీ పాతివ్రత్య మహిమవల్ల నీకు లభించాయి. వాటిని సమబుద్ధితో అనుభవించు. నీకు కార్యసిద్ధికూడా కలుగుతుంది' అని యోగమాయలందు సమర్ధుడైన క
ర్దముడు చెప్పగా దేవహూతి తన భర్తను తిలకించింది. ఆమె మనోవ్యథ తొలగిపోయింది. కడకన్నులతో, పాడమిన సిగ్గుతో మోము వంచుకొంది. వినయంతో చనువుతో పారవశ్యంతో ముద్దుముద్దుగా తన భర్తతో ఇలా అన్నది.

'ఓ పుణ్యస్వరూపా! నీవు అమోఘమైన యోగమాయలకు అధిపతివి. సర్వసమర్జుడవు. నీయందు సాటిలేని దివ్య భోగాలుండడం సత్యం. అది నాకు తెలుసు. నీ సాంగత్యంవల్ల ఆ భోగాలన్నీ నాకు లభిస్తాయి. అయినప్పటికీ దేవా! నీవు సంతానం కలిగేవరకే నాతో శరీరసంగమం కలిగి ఉంటానని ఆనాడు ఒక నియమం ఏర్పరచావు. ఆ నియమాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని నీ సాంగత్యాన్ని నాకు దయతో అనుగ్రహించు. నీ సంయోగాభిలాషతో చిక్కిపోయిన ఈ తనువు స్నానపాన భోజనాలవల్ల ఎలా తుష్టిపొందుతుందో. అలాంటి నా కోరికను తీర్చడానికి రతిరహస్యాలను తెలియజేసే కామశాస్త్రపద్ధతులను నాకు బాగా నేర్పు. అందుకు తగిన అనేకవిధాలైన వస్త్రాలు, ఆభరణాలు, పూలదండలు, మైపూతలు, శయనమందిరాలు, ఉద్యానవనాలు మొదలైన ముఖ్యవస్తువులను విరివిగా సమకూర్చి నన్ను దయచూడు' అని పలికిన దేవహూతి మాటలు విని గొప్పవాడైన ఆ క
ర్దముడు తన యోగమాయాబలంతో ఆ క్షణంలోనే ఒక దివ్యవిమానాన్ని సృష్టించాడు.

ఆ విమానంలో అందమైన వివిధ మందిరాలు ఉన్నాయి. ఆ మందిరాలన్నీ మణిమయ స్తంభాల కాంతులతో విలసిల్లుతూ ఉన్నాయి. గరుడపచ్చలు పొదిగిన నడవలతో, మంచిరకం వజ్రాలు తాపిన గోడలు తలుపులతో, పగడాలు తాపిన గడపలుగల వీథులతో చూడముచ్చటగా ఉన్నాయి. ఆ మందిరాలపై ఇంద్రనీలమణుల శకలాలు పొదుగబడి మెలిమిబంగారుతో నిర్మితమైన కలశాలు అమర్చబడి ఉన్నాయి. ఆ కలశాలు ధగధగమని మెరుస్తూ ఉన్నాయి. ఆ మెరుపులకు తగినట్లు పద్మరాగాల మొగ్గలు చెక్కిన వైడూర్యపు చూరులు సొగసుగా ఉన్నాయి. మందిరాలపై గాలికి రెపరెపలాడుతూ జెండాలు అమరి ఉన్నాయి. కర్ణపేయంగా ఝంకారం చేసే తుమ్మెదల బృందంతో కూడి వ్రేలాడుతున్న పూలదండల తోరణాలతో ఆ మందిరాలు మనోహరంగా అలరారుతున్నాయి.

(క
ర్దమమహాముని క్షణంలోనే సృష్టించిన దివ్యవిమానంలో అందమైన మందిరాలున్నాయి. ఆ మందిర నిర్మాణంలో వాడబడినవి - మణులు, మరకతాలు, వజ్రాలు, విద్రుమాలు, హరినీలాలు, పద్మరాగాలు, వైడూర్యాలు. ఇవన్నీ ఎంతో విలువైన రత్నాలు. ఇవి నవరత్నాలలోనివి. ఆ మందిరాల నిర్మాణంలో వాడినవి నవరత్నాలలో ఏడుమాత్రమే. ఇక మిగిలిన రెండు - కెంపులు, గోమేధికాలు. భార్య కోరిక మేరకు సృష్టింపబడిన మందిరాలు ఎంత అందంగా ఉంటే ఆమెకంత సంతోషంగా ఉంటుందని భావించి కర్దముడు చేసిన అపూర్వ సృష్టి అది.)

ఆ విమానంలోగల మందిరాలలోని గదులలో జిలుగువస్త్రాలు, చీనాదేశపు పట్టువస్త్రాలు, పట్టు చీరలు, పలురకాలైన వస్త్రాలు అందంగా కనిపిస్తున్నాయి. ఆశ్చర్యకరమైన రంగురంగుల పట్టెమంచాలు అమర్చబడి ఉన్నాయి.

(చీనాంబరమంటే సాధారణంగా పట్టువస్త్రమని అర్థం. చీనా (చైనా) దేశంలో తయారైనది కావడంవల్లనే చీనాంబరమని పేరేర్పడింది. ప్రాచీనకాలంలో తూర్పు ప్రాచ్యదేశాలనుండి అరుదైన వస్తువులను దిగుమతి చేసుకొనేవారు. అలాంటి వస్తువులలో చీనాంబరం ముఖ్యమైంది. ప్రాచీన సాహిత్యంలో చీనాంబరాల ప్రస్తావన కనిపిస్తున్నది.)

అక్కడ సుందరమైన ఉద్యానవనాలలో విలాసంగా విహరిస్తున్న రాజహంసలు, కోయిలలు, పావురాళ్లు, జక్కవపిట్టలు, నెమళ్లు మొదలైన పక్షులు మందిరాల గోడలమీద చెక్కబడిన కృత్రిమపక్షులను చూచి తమ జాతికి చెందిన నిజమైన పక్షులుగానే భావించి ఎంతో ఉత్కంఠతో వాటిని పలుకరిస్తూ అక్కడగల చెట్లకొమ్మల పై అటూ ఇటూ దాటుతూ కేరింతలు కొడుతూ ఆడుతూ ఉంటాయి.

(మూలంలో హంసలు, పావురాళ్లు మాత్రమే చెప్పబడగా పోతన ఇంకా కోయిలలను, చక్రవాకాలను, చిలుకలను, నెమళ్లను కూడా చేర్చి చెప్పడంవల్ల ఆ పక్షులన్నింటి కృత్రిమ రూపాలను గోడలమీద చెక్కినట్లు అర్థమవుతుంది. అందువల్ల మందిరాలగోడలు అందంగా కనిపించాయి. మూలంలో 'వికూజితం' అని ఒకేమాటలో పక్షులు శబ్దం చేస్తున్నాయని వ్యక్తం చేయబడగా పోతన 'కుతూహలియై పల్కుచు నాడుచుండున్‌' అని వ్యాఖ్యానప్రాయంగా వ్రాశాడు.)

ఇంకా ఆ విమానంలోపలి భవనాలు శయ్యలతో, గద్దెలతో, క్రీడాగ్భహాలతో, కల్పితమైన క్రీడాపర్వతాలతో, పాలరాతిభవనాలతో ఫలవృక్షాల వనాలతో కూడి ఉన్నవి.

సమస్తఋతువులశోభలతో, సకలసుఖాలతో, సర్వసంపదలతో సమస్త సుఖాలు అనుభవించడానికి యోగ్యమై, ఎల్ల కోరికలను నెరవేర్చగలదై, అందమైన అలంకారాలతో ఒప్పుతున్నది.

అలాంటి సర్వసంపదలతో, అలంకారాలతో ఒప్పుతున్న మహిమాన్వితమైన విమానాన్ని సృష్టించిన క
ర్దమమహాముని అందులో కంటికింపైన చిత్రచిత్రపు శోభావిశేషాలను నిర్మాణం చేసిన తానుకూడా తెలుసుకోలేనంతటి ఆశ్చర్యకరమై నిర్మాణపు పనితనం గలిగిన ఆ విమానాన్ని తనభార్య దేవహూతికి చూపించాడు. ముగ్ధయైన దేవహూతి ఆ విమానాన్ని చూచి సంతోషపడలేదు. ఆ విషయం తెలిసి సమస్తప్రాణుల అంతరంగాలలోగల అభిప్రాయాలను గ్రహించగలవాడూ, సంతోష హృదయుడూ అయిన కర్దమమహాముని దేవహూతితో ఇలా అన్నాడు.

ఓ సుందరీ! భగవంతుడు నిర్మించినది, సమస్తశుభాలకు ఆకరమైనది అయిన ఈ జలాశయం బిందుసరోవరమనే సరస్సు. ఆసక్తితో ఈ సరస్సులో స్నానం చేసిన ప్రాణులకు కోరిన కోరికలు నెరవేరుతాయి. కావున నీవు కూడా.

'దేవహూతీ! సిగ్గుపడకు. నీవు ఈ సరస్సు నీళ్లలో ఎంతో భక్తితో స్నానంచేసి సంతోషంగా ఈ విమానాన్ని అధిరోహించు' అని క
ర్దమమహాముని బుజ్జగిస్తూ పలికాడు.

కలువరేకులవంటి కనులుగల దేవహూతి భర్తమాటలు విన్నది. ఆమె పతిని సేవించడంలో అలసిపోయింది. చీరమాసిపోయి ఉంది. వెండ్రుకలు జడలు కట్టినాయి. శరీరం ధూళిధూసరితమై కృశించింది. వక్షస్థ్సలం వివర్ణమైపోయింది(ఎండిపోయినట్లయింది). తన భర్త ఆజ్జననుసరించి ఆమె సరస్వతీనది జలాలతోను, జలచరాలతోను నిండిన బిందుసరోవరంలో స్నానం చెయ్యడానికి దిగింది. ఆ సమయంలో ఆ జలప్రవాహంలో అందమైన వలిపములు కట్టుకొన్నవారూ, నవయౌవనంలో ఉన్నవారూ, కలువపూల పరిమళం కలవారూ అయిన కన్యలు వేలమంది దేవహూతిని చూచి ఆమెతో ఇలా అన్నారు.

ఓ యువతీ! మేము ధర్మకార్యాలను ఆచరిస్తూ ఉంటాం. నీకు నిర్మలమైన భక్తితో సేవ చేయగలం. మమ్ములను దయతో కూడిన చూపులతో వీక్షించు.

(వేలమంది కన్యలు పరిచారికలుగా దేవహూతికి సేవలు చేస్తామన్నారు. ఆ సేవకూడా ధర్మాచరణే. వాళ్లదగ్గర సంచిత ధర్మముంది. ఎప్పుడూ ధర్మాచరణ చేస్తూ ఉంటారు కాబట్టి ధర్మం వాళ్లదగ్గర మిగిలే ఉంటుంది. అలా మిగిలిన ధర్మం సంచిత (కూడబెట్టుకొన్న) ధర్మంగా ఉంటుంది.)

సేవలు చేస్తామని చెప్పిన కన్యలు దేవహూతి వద్దకు వెళ్లారు. ఆమెకు నలుగు పెట్టారు. బంగారు బిందెలలో నింపిన చందన కర్పూర పరిమళాలు వెదజల్లే నీళ్లతో ఆమెకు స్నానం చేయించారు. శరీరంమీద తడిని తెల్లని వస్త్రాలతో తుడిచారు. అగరు ధూపం వేశారు. కస్తూరి పంకంతో ఒడలికి పూతలు పూశారు. మధురంగా ధ్వనించే మణిమంజీరాలు పాదాలకు తొడిగారు. చిరుగంటల సవ్వడితో కూడిన ఒడ్డాణం నడుముకు అలంకరించాడు. రత్నాలు తాపిన ఆభరణాలను చెవులకు అలంకరించారు. ఉంగరాలు, కంకణాలు మొదలైన సముచితమైన విలువైన బంగారు ఆభరణాలను కైసేశారు. మంగళప్రదమైన పూలమాలలు సమర్పించారు. మైపూతలు, విలువైన వస్త్రాలు ఇచ్చారు. షడ్రసోపేతమైన పలురకాల భోజనంతో సంతృప్తి పరిచారు.

డ్రసోపేత భోజనంతో దేవహూతిని సంతృప్తిపరిచి ఆ కన్యలు ఆమెకు బంగారు పళ్లెరాలలో శాంత్యుదకాలు నింపి అందులో కర్పూరం వెలిగించి హారతులు పట్టారు. మనోహరమైన పీఠంమీద కూర్చుండబెట్టి అద్దం చేతికిచ్చారు. దేవహూతి ఆ అద్దంలో ప్రతిఫలించిన తన రూపం చూచుకొని భర్తయైన కర్దముని మనస్సులో భావించింది. ఆ క్షణంలోనే కర్దముడూ, వేల కన్యలూ ఆమెముందు సాక్షాత్కరించారు. తన భర్త యోగమాయా ప్రభావానికి ఆమెకు ఆశ్చర్యం కలిగింది. అప్పుడు కర్దముడు స్నానం చేసి ఉన్న దేవహూతిని చూచాడు. పెండ్లికి ముందు ఆమె ఏ విధంగా ఉండినదో ఇప్పుడూ అలాగే చక్కదనంతో ఉన్నందుకు కర్దముడు ఆనందభరితుడయ్యాడు. కన్యలందరూ భార్యనూ, తననూ సేవిస్తూ ఉండగా సతీసమేతుడై తన విమానం ఎక్కి చుక్కలతో చుట్టబడిన రోహిణీ సహితుడైన చంద్రుని వలె ప్రకాశించాడు. ఆ తరువాత-

నిత్య మంగళస్వరూపుడైన ఆ క
ర్దమముని సమస్త దిక్పాలురూ విహరించడానికి యోగ్యమైనది, మనోహరంగా వీచే మందమారుతంతో శోభించేది, సమీపంలో గైరికాది ధాతుమయములైన సెలయేళ్ల నీళ్లతో ప్రవహించే నీళ్లతోనూ, చల్లని మంచుతోనూ ఒప్పునట్టి మేరుపర్వత గుహకు వెళ్లి దేవవనితలతో కూడిన కుబేరునివలె విహరించాడు.

(కుబేరుడు యక్షరాజు. యక్షుడు అంటే పూజింపబడువాడు. ఇతనికి ధనాధిపుడని మరొకపేరు. ధనాధిపుడంటే ధనాన్ని రక్షించువాడని అర్థం. పైగా శివుని సఖుడు. అందువల్లనే క
ర్దముడు కుబేరునివలె విహరించాడని చెప్పబడింది.

ప్రధాతునిర్ఝర - సెలయేరు కొండలపై నుండి గైరికాది ధాతువులను తనలో కలుపుకొని క్రిందికి ప్రవహిస్తుంది. గిరౌ భవం గైరికం(పర్వతమున పుట్టినది) అని గైరిక శబ్దానికి వ్యుత్పత్తి. హరిదళం, గంధకం మొదలైన శిలావికారాలు ధాతువులు. హరిదళం ఎరుపుగా, గంధకం పసుపుపచ్చగా ఉంటాయి కాబట్టి గైరికాది ధాతువులంటే పర్వతాలమీద గల ఎర్రని పసుపుపచ్చని మట్టి విశేషాలని చెప్పవచ్చు.)

ర్దమమహాముని భార్యాసమేతుడై కామగమనంగల విమానం ఎక్కి దేవతల ఉద్యానవన భూములను తిలకించాడు. కొత్త పూదోటలున్న ప్రదేశాలు సందర్శించాడు. వికసించిన కలువలతో పద్మాలతో విరాజిల్లుతూ ఉన్న మానససరోవర తీరాలను చూచాడు. మదికింపైన పొదరిండ్లను అవలోకించాడు. కుబేరుని ఉద్యానవనమైన చైత్రరథాన్ని సంతోషంతో దర్శించాడు.

(దేవతల ఉద్యానవనం నందనవనం. నందనవనం దేవేంద్రుని స్వాధీనంలో ఉంటుంది. ఈ వనంలోకి వెళితే ఆనందం కలుగుతుంది. అందుకని దీనికి నందన(నందయతీతి నందనం = సంతోషింపజేయునట్టిది) వనమనిపేరు. ఇక్కడ చెప్పబడినవన్నీ విహారానికి అనువైన ఆరామాలు, పూపొదరిండ్లు, సరోవరతీరాలు. భర్తతో కలసి విహరించాలనే కోరికగల దేవహూతిని ఈ విహారయోగ్యమైన ప్రదేశాలకే క
ర్దముడు తీసుకొని వచ్చాడు. విస్రంభంతో, నెయ్యంతో చూచాడనడం ఎందుకంటే తొందరలేకుండా, ఎవరి బెదిరింపు లేకుండా సావకాశంగా తిలకించాడని చెప్పడానికి.)

ఈ విధంగా క
ర్దముడు భార్యతో కలసి విమానంమీద వాయువేగంతో, కలయదిరిగి విమానమెక్కి సంచరించేవాళ్లందరిని మించి లోకాలన్నీ సంచరించాడు. మోక్షప్రదాత, పరమపూజ్యుడు అయిన విష్ణుదేవుని స్తుతించి సేవించే పుణ్యాత్ములకు పొందరాని వస్తువులుంటాయా? ఇలా కర్దముడు దేవహూతికి సమస్త భూమండలం చూపించి మరల తన నివాసానికి తీసుకొని వచ్చాడు. తనభార్య కామకేళీ వినోదానికి ఇష్టపడుతున్నట్లు గుర్తించాడు. రతిక్రీడాపరాయణుడైనాడు. ఆ దంపతులు పలువిధాలైన సుఖభోగాలను అనుభవిస్తూ అనేక సంవత్సరాలు క్షణాలవలె గడిపారు. సరసమైన చూపులతో, తగిన కౌగిలింతలతో, సంభాషణలతో, కాలం గడవడమే తెలియకుండా వారు నూరేండ్లు గడిపారు.

ఒకనాడు క
ర్దమముని కుతూహలంతో తనదేహాన్ని తొమ్మిది దేహాలుగా చేసుకొని క్రమంగా తన వీర్యాన్ని తన భార్య దేవహూతి గర్భంలో తొమ్మిది విధాలుగా నిలిచేటట్లు చేశాడు.

ఆ కారణంగా క
ర్దమమునివల్ల దేవహూతి తొమ్మిదిమంది కూతుండ్రను కన్నది. ఆమె తనమనస్సులో ఎంతో సంతోషించింది. తరువాత కర్దమముని -

దేవహూతి తొమ్మండుగురు కూతుళ్లను కన్నతరువాత క
ర్దమముని సన్యాసం తీసుకోవాలనుకొన్నాడు. ఆ విషయం తెలుసుకొన్న దేవహూతికి మనస్సులో ఆవేదన అధికమైంది. చింత కలిగింది. చెక్కిలిమీద చేయిచేర్చి కాలివేళ్లతో నేలపై రాస్తూ భర్తతో ఇలా అన్నది.

అనఘా! సంతానం కలిగేవరకు నాతో కలసి ఉంటానని ముందు నీవు చెప్పావు. కొమార్తెలను ప్రసాదించావు. ఇప్పుడు ఈ యువతులు తమకు తామే భర్తలను ఎలా వెదకుకోగలరని భయపడుతున్నాను. కావున ఈ పుత్రికలకు తగిన పెండ్లికొడుకులను వెదకి వాళ్లకు పెండ్లిండ్లు చేసి, నాకు తత్త్వవిషయాలు తెలియజేయగల కుమారుని ప్రసాదించు. సాధుజనస్తవనీయా! సంసారదుఃఖాన్ని తొలగించడానికి సమర్థుడవు నీవే. గడచిన కాలమంతా కామసుఖంపైగల మోహంతో ముక్తిమార్గాన్ని గురించి ఆలోచించకుండా వ్యర్థంగా గడచిపోయింది.

మహాత్మా! నాకు ఈ లోకసంబంధాలైన సుఖానుభవాలలో ఆసక్తి నశించింది. ముందు నేను చంచలభావంతో నీతో రతిసాంగత్యాన్ని అపేక్షించి స్వచ్చమైన నీ భావాన్ని తెలుసుకోలేక ఏ వేవో కోరాను. ఆ కోరికలను తీర్చావు. నిన్ను నిర్మలమైన భక్తితో సేవిస్తే ముక్తి లభించదా? తప్పక లభిస్తుంది.

('అచ్చపుందలంపు' అంటే క
ర్దముని యోగమాయాతత్త్వం. దాన్ని పూర్తిగా తెలుసుకోవడం. అన్ని సంవత్సరాలు కర్దమునితో కలసిఉన్నా దేవహూతికి ఆయన మహత్తు పూర్తిగా తెలియలేదు. దానికి కారణం ఆమెకుగల కామభోగాసక్తత. ఆయనను కామదృష్టితోనే ఇన్నాళ్లూ చూచింది. ఇప్పుడామెకు భోగదృష్టి పోయింది. అనుభవించాలనే ఆసక్తి నశించింది. ఆమె మనోనేత్రం మేలుకొంది. గడచినకాలం ఎంత వృథాగా పోయిందో అర్థమైంది. అప్పుడామెకున్నది చంచలస్వభావం. ఇప్పుడు ముక్తిని గురించి ఆలోచించే స్థిరచిత్తంతో ఉంది. కర్దముడే ముక్తి నివ్వగల మహత్తు కలవాడని గ్రహించగలిగింది.)

అంతేగాక అందరియెడల సమానబుద్ధితో ప్రవర్తించే సజ్జనులమైత్రి ఉత్తమగతికి కారణమవుతుంది. అల్పబుద్ధిగల చంచలచిత్తులైన దుష్టపురుషుల మైత్రి దుర్గతికి కారణమవుతుంది. యోగిజనసన్నుతా! ఈ విషయాన్ని మనస్సులో భావించి నిన్ను నేను సేవిస్తాను. ప్రాణుల సమాగమంవల్లనే ఎట్టివారికైనా పుణ్యాలో పాపాలో ప్రాప్తిస్తాయి.

(దేవహూతి వైరాగ్యభావంతో మాట్లాడుతూ ఉంది. సజ్జనులతో సాంగత్యం కలిగి ఉంటే అది పుణ్యహేతువు అవుతుంది. అంటే- సంసార క్లేశనివారణ హేతువవుతుంది. అదే అసజ్జనులతో సాంగత్యం ఏర్పరచుకొంటే ఆ సంబంధం పాపానికి దారితీస్తుంది. అంటే - సంసార దుఃఖం కలుగుతుంది. అందరి దుఃఖాన్ని నిశ్శేషంగా నశింపజేసి వారికి ఆనందాన్ని ఇవ్వగల సమర్థుడు కర్దముడు. ఇన్నాళ్లూ ఆయనతో కలసి ఉండినా ముక్తిని గురించి మాట్లాడక పోవడం ఎంతో దుఃఖం కలిగించే విషయమని దేవహూతి బాధపడుతూ ఉంది.)

ఇలా మిక్కిలి బాధతో పరితపిస్తూ పలికిన దేవహూతిని చూచి శ్రీహరి మాటలు తలపుకు తెచ్చుకొని కర్దముడు ఆమెతో ఇలా అన్నాడు.

దేవహూతీ! నీవు మనస్సులో దుఃఖించవద్దు. భగవంతుడు, అనఘుడు, అక్షరుడు, జనార్దనుడు అయిన శ్రీహరి అచిరకాలంలోనే తప్పక నీ గర్భంలో ప్రవేశిస్తాడు.

(తన కాలమంతా వృథాగా గడచిపోయిందని, ముక్తిమార్గాన్ని గురించి తెలుసుకొనే అవకాశాన్ని ఉపయోగించుకోలేక పోయానని పరితపిస్తూ ఉన్న దేవహూతికి క
ర్దముడు కలిగించిన సాంత్వనమిది. ఆమె తనకు తత్త్వబోధ చేయగల కొడుకును ప్రసాదించమన్నది. శ్రీహరే ఆమెకు కుమారుడుగా అవతరింబోతున్నాడని చెప్పి కర్దముడు ఆమెను సంతోషపరిచాడు.)

నీవు ఉత్తమనియమాలు, వ్రతాలు, నిష్ఠలు - ఇవన్నీ ఆచరించు. గొప్ప నిగ్రహంతో కూడిన మనస్సు కలదానివై నిండైన తపస్సు, ధనత్యాగం, దానం చేస్తూ శ్రద్ధాభక్తులతో కూడినది కాగా.

(తపోధన - అన్నపుడు తపోధనం అని అర్ధం చెప్పవచ్చు. ఇలా చెప్పడమే సమంజసంగా కూడా ఉంటుంది. అయితే మూలంలో 'తపోద్రవిణదానైశ్చ' అని తపస్సు, ధనం (ద్రవిణం) దానం వేరువేరుగా స్ఫురింపజేయడంవల్ల ప్రతిపదార్థంలో తపస్సు, ధనం వేరువేరుగా చూపబడినాయి. ఇవన్నీ 'నియుక్త అంతరంగంతో' నిర్వర్తించుమని ఉండడంవల్ల ధనం సంగ్రహించుకోవడం కాకుండా ఉన్నధనాన్ని కూడా వదిలించుకోవలసిన అవసరముంది. బాహ్యేంద్రియ నియమం, ఆంతరికమైన నియమం కలసి నియుక్త అంతరంగం. ఇలాంటి అంతరంగాన్ని సాధించాలంటే ధనత్యాగం చేయాలి. అందుకని 'ధన' కు ధనత్యాగం అని అర్థవివరణ చేయబడింది.)

శ్రీమన్నారాయణుని పాద పద్మాలను నిండైన భక్తితో పూజించు పురుషోత్తముడైన ఆ భగవంతుడు మనస్సులో నీ పూజకు సంతృప్తిచెంది నీ గర్భంలో నివసించి (నీ పుత్రుడుగాపుట్టి) నీ మనస్సులో ఏర్పడిన సందేహాల ముడులను ఛేదిస్తాడు.

(ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకొని ముక్తిమార్గానుగాములైన వాళ్లకు మనస్సులో అనేక సందేహాలుంటాయి. ప్రతి సందేహమూ ఒక ముడిలాంటిదే. ఒక సందేహంతీరితే మరొక సందేహం కలుగుతుంది. అందుకే శంకాగ్రంథిని సందేహాలముడులు అనడం.)

దేవహూతి గర్భంబున విష్ణుండు గపిలాచార్యుండుగా నుదయించుట

The Marriage of Kardama Muni and Devahuti - కర్థముండు భగవదనుజ్ఞ వడసి దేవహూతిని బెండ్లియాడుట

కర్దముండు భగవదనుజ్ఞ వడసి దేవహూతిని బెండ్లియాడుట

పుణ్యాత్ముడైన విదురా! విను. కృతయుగంలో బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించడానికి కర్దమమునీశ్వరుని నియమించాడు. కర్దముడు మనస్సులో సంతోషం కలిగినవాడై.

ధీరగుణాలుగల క
ర్దమమహాముని సరస్వతీ నదీతీరంలో పట్టుదలతో పదివేల దివ్యసంవత్సరాలు క్రమంగా తపస్సు చేశాడు. ఒకదినం తపోనిష్ఠలో ఉండి ఏకాగ్రచిత్తుడై అత్యంత సంతోషంతో 
ర్దమమహాముని వరదుడూ, దయగలవాడూ, కోరిన కోర్కెలు నెరవేర్చడానికి వరాలు ఇచ్చే మంచి స్వభావంగలవాడూ, దురిత విదూరుడూ, చేతియందు సుదర్శన చక్రంగలవాడూ, లక్ష్మీవల్లభుడూ అయిన విష్ణువును ఆరాధించాడు. విష్ణువు దయగలవాడై ప్రత్యక్షమయ్యాడు.

సూర్యకిరణాలు సోకి వికసించిన తామరపూలతోను, చంద్రకిరణాలు సోకి వికసించిన కలువపూలతోను కట్టిన పూలమాలలు ధరించిన విలాసుడు; చేతులకు కంకణాలు, పాదాలకు అందెలు, కంఠాభరణాలు, అంగుళీయకాలు, స్వర్ణహారాలు, మకరకుండలాలు, కిరీటం ధరించి మనోజ్ఞంగా ఉన్నవాడు; సౌందర్యవతియైన లక్ష్మీదేవితో, కౌస్తుభమణితో, ఆభరణాలతో ధగధగమెరిసే వక్షఃస్థలం కలవాడు; సొగసైన చిరునవ్వువెన్నెలతో ధవళితం చేయబడిన ముద్దులొలికే చెక్కుటద్దాలతో ప్రకాశించేవాడు; శంఖం, చక్రం, గద, పద్మం నాలుగు చేతులలో ధరించినవాడు; తుమెదలవంటి నల్లనిముంగురులతో ప్రకాశించే ఫాలతలం కలవాడు; పసుపుపచ్చని పట్టువస్త్రం ధరించినవాడు; కరుణాతరంగితమైన మందహాసంతో కూడిన కటాక్ష వీక్షణాలు కలవాడు; పొక్కిలి యందు పద్మం కలవాడు అయిన విష్ణువును,

శబ్దబ్రహ్మమే శరీరంగాను, అస్తిత్వమే ఆత్మగాను కలిగి ఒక్క జ్ఞానం చేతనే తెలుసుకోదగినవాడై; గరుత్మంతుని మూపుపై పాదపద్మాలు మోపి ఉన్న జనార్దనుని చూచి క
ర్దమమహాముని ఆనందతరంగాలు పొంగులెత్తగా నెరవేరిన కోరికలు గలవాడవుతూ ఆ స్వామికి సాష్టాంగనమస్మారాలు సలిపాడు. ఆ తరువాత -
(శబ్దం ఆకాశానికి గుణం. ఆకాశం పరమాత్మనుండి వచ్చిన మొదటి భూతం. కాబట్టి అదికూడా బ్రహ్మమువలె కొలతలకు అందనిది.)

కరకమలాలు మోడ్చి నిర్మలమైన భక్తి భావంతో తన్నుతాను మరచిన వాడవుతూ, వికసించిన పద్మములవంటి కన్నులుగల విష్ణువు ముఖాన్ని అవలోకిస్తూ ఆయనతో క
ర్దమమహాముని ఇలా విన్నవించాడు.

ఓ పుండరీకాక్షా! నీవు సమస్త ప్రాణుల అంతరాత్మవుగా ప్రసిద్దుడివి. అలాంటి నీ దర్శనంకోసం అనేక జన్మలలో పుణ్యకార్యాలు చేసి పొందిన ఫలాలతో నిరంతర యోగాభ్యాస నిపుణులైన యోగీశ్వరులు మనస్సులలో పరితపిస్తూ ఉంటారు. యోగీశ్వరులకే ఈశ్వరుడవైన నీ పాదపద్మాల దర్శనం నేను పొందగలిగాను. సంసార సముద్రాన్ని దాటగలిగాను. ధన్యుడనైనాను. మాధవా! ముకుందా! దయార్ద్రహృదయా! లక్ష్మీరమణా! నాకు కన్నులున్నందుకు ఫలం లభించింది.

అదీగాక దేవా! నీ మాయవల్ల అజ్ఞానులై, బుద్ది నశించి నీచమైన కోరికలను నెరవేర్చుకోవడంకోసం సంసార సముద్రాన్ని దాటించేవి అయిన నీ చరణకమలాలను ఆరాధించే నరకగాములైన కాముకుల కోరికలను కూడా తీరుస్తూ ఉంటావు. అలాంటివాళ్లను గర్హించే నేనుకూడా పెండ్లి చేసుకోవాలనే కోరికతో ఉన్నాను. గృహయజ్ఞనిర్వహణలో గోవువలె ఉపకరించేది, అన్నిటికి మూలమైనది, ధర్మార్థకామాలను అనుష్ఠించడంలో సహాయపడేది, నాప్రవర్తనకు అనుగుణమైన ప్రవర్తన కలదీ అయిన వధువును వివాహమాడాలనే కోరికతో కల్పవృక్షమూలాలకు సమానమైన నీ పాదపద్మాలను సేవించాను.

అయినా ఒక విశేషముంది. మనవి చేస్తాను అవధరించు. పరబ్రహ్మమే ఆత్మగా కలవాడవైన నీ మాటలు అనే తాళ్లతో బంధింపబడి లోకంలోని ప్రజలు కామానికి వశులైనారట. నేనుకూడా అలాంటి కాముకులను అనుసరించినవాడనే. కాలాత్మకుడవైన నీకు ఇష్టమైనట్లు కర్మమయమైన నీ ఆజ్ఞాచక్రాన్ని అనుసరించి (సృష్టిని వృద్ధిచేయటానికి) నడచుకోవటానికే నాకు వివాహం. కామతృష్టతీర్చుకోవటానికి మాత్రంకాదు.

నీవు మాయతో నిర్మించిన కాలాత్మకమైన చక్రం మహావేగం కలది. శాశ్వతమైన భ్రమణం కలిగి పరబ్రహ్మను అనుసరించి తిరుగుతుంది. అధికమాసంతో కలిపి ఆ కాలచక్రం పదమూడు నెలలు అనే ఆకులుగలది. మూడువందల అరవై అహోరాత్రాలు (పగళ్లు, రాత్రులు) అనే కణుపులు కలది. ఆరు ఋతువులు అనే చక్రంచుట్టూ పట్టాగలది. మూడు చాతుర్మాస్యాలు అనే నడిమిబొడ్డు కలది. అపరిమితమైన సూక్ష్మ క్షణాలు అనే ఆకులతో విరాజిలేది.

కాలాత్మకమై మిక్కిలి వేగంతో కూడిన ఆ కాలచక్రం సమస్త జీవుల ఆయుస్సును మింగడానికి ఆసక్తి కలదై ఉంటుంది. అయినా కామానికి లోబడినవారిని అనుసరించే పశుస్వభావం గలవారైన లోకులను మాత్రమే ఆ కాలచక్రం పరిత్యజిస్తుంది (చీకాకు పరుస్తుంది). సంసారతాపాన్ని శాంతింపజేసే నీ పాదాలనే గొడుగునీడలను ఆశ్రయించినవారు, నీ గుణవర్ణనమనే అమృతరసాస్వాదన వైభవలహరులలో ఉంటున్నవారు, సమస్త శారీరక ధర్మాలను లెక్క చేయనివారు అయిన భగవద్భక్తజనం యొక్క ఆయువును హరించడానికి ఆ కాలచక్రం సమర్థంకాదు అని కర్దమమహాముని భగవంతునితో చెప్పాడు. ఇంకా అలా అన్నాడు.

(ఈ వచనంలో కాలచక్రానికి సంబంధించిన విషయాలున్నాయి. సంవత్సరానికి పన్నెండే  మాసాలు. కాని 360 అరలుగల చక్రాన 365 1/3 అహోరాత్రములుంటాయి. తిథులనుబట్టి పన్నెండు మాసాల పరిధులు ఓక సంవత్సరంగా తిరుగుతాయి. సంవత్సరానికి పది తిథుల చొప్పున ఎక్కువగా మిగిలిపోగా మూడు సంవత్సరాలకు ముప్పదితిథులు మిగిలి అధికమాసం ఏర్పడుతుంది. దానితో కలసి పదమూడు విభాగాలు ఏర్పడుతున్నాయి. సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి భూమికి కావలసిన కాలాన్ని సౌరసంవత్సరమంటారు. ఇది 365 1/3 అహోరాత్రాలు గలది. ఇదిగాక 360 అహోరాత్రాలలో సంవత్సరం కొలత మరొకటుంది. దీనికి సావన సంవత్సరమని పేరు. ఇదిగాక పన్నెండు పూర్ణిమలు, పన్నెండు అమావాస్యలతో మరొక సంవత్సరమానముంది. దీనికి చాంద్రమాన సంవత్సరమని పేరు. దీన్ని సౌరసంవత్సరంతో సరిపెట్టడానికి మూడు సంవత్సరాల కొకసారి అధికమాసం కలపాలి.

కాల స్వరూపంలో వేగం పుడుతుంది. అందులో కేంద్రం ఏర్పడి దాని చుట్టూ పరిధులు తిరుగుతూ ఉంటాయి. ఆ పరిధులలో పదమూడు విభాగాలు కనిపిస్తాయి. అదే సంవత్సరాత్మకమైన కాలచక్రం.

లోకాన్ని అనుసరిస్తూ కాలాత్మకుడైన భగవంతుని పూజిస్తూ భార్యను అడగడానికి కారణం కామవాంఛతో కాదు. దేవఋషి పితృ ఋణాలనుండి విముక్తి కోసం పుత్రకళత్రాదుల అవసరం ఉంది. అందుకే అలాంటి కోరిక కోరుతున్నానని క
ర్దముని అభిప్రాయం.)

పుణ్యాత్ముడవైన పరమాత్మా! విశ్వవంద్యా! సర్వేశ్వరా! ఒక్కడవే అయినా నీవు నిర్మించిన మాయవల్ల కలిగిన సత్త్వం మొదలైన శక్తులకు ఉనికి ఏర్పడుతున్నది. ఆ శక్తుల ద్వారా నీవు సాలెపురుగు సాలెగూడును తయారుచేసి మళ్లీ తనలోనే లీనం చేసుకొన్నట్లు జగత్తు పుట్టడానికి, వృద్ధి కావడానికి, నాశనం కావడానికి కారణమైన మాయామహిమతో కూడి ఉంటావు. అలాంటి గొప్పదైన నీ లీలా విలాసమనే సముద్రాన్ని దాటడానికి ఎవరికైనా సాధ్యమవుతుందా? సాధ్యంకాదని భావం.

(ఓ పుణ్యపురుషా! నీవు ఒక్కడవే అయినా నీ మాయచేత త్రిగుణరూపాలైన మూడు శక్తులుగా ప్రవర్తిస్తావు. రజోగుణంతో బ్రహ్మవై లోకాలను పుట్టిస్తావు. సత్వ గుణంతో విష్ణుడవై లోకాలను కాపాడుతావు. తమోగుణంతో రుద్రుడవై లోకాలను నశింపజేస్తావు. కాని ఈ పనులకు నీవు అంటకుండా ఉంటావు. సాలెపురుగు తన శరీరంనుండే దారాలు తీసి వేరుగా తనకొక ఇల్లు ఏర్పరచుకొంటుంది. అదే విధంగా నీవు ఇన్ని రూపాలను నీ నుండే నీకన్నా వేరుగా కల్పిస్తున్నావు. అలాంటి నిన్నుగాక లోకం మరెవ్వరని స్తుతిస్తుంది? సాలెగూడు సాలెపురుగుపై ఆధారపడినట్లు ఈ లోకాలన్నీ నీపైనే ఆధారపడి ఉన్నాయి. సృష్టి రహస్యాన్ని బోధించడానికి ఉపమానంగా గ్రహించిన ఊర్ణనాభిగతి (సాలెపురుగుపద్ధతిలో
)

దేవా! శబ్దాది విషయాలచే సుఖం కలిగించేదైన సృష్టి స్వరూపాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయడమనేదంతా మమ్ములను అనుగ్రహించడానికే గాని నీకోసం కాదు. నీ మాయవల్ల ప్రవర్తితం అవుతున్న లోకవ్యాపారం కలిగి మా కోరికలనే అమృతాన్ని నిండుగా వర్షించేవాడవైన నీకు నమస్కరిస్తున్నానని కర్ద
మమహాముని భగవంతునితో చెప్పాడు. 

(సృష్టి పంచభూతాత్మకం. అలాగే ప్రాణి శరీరం కూడా పంచభూతాత్మకమే. భూమి, నీరు, అగ్ని వాయువు, ఆకాశం పంచభూతాలు. పంచభూతాత్మకమైన ప్రాణికి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలద్వారా సుఖదుఃఖాలు కలుగుతాయి. చెవి, చర్మం, కన్ను, నోరు, ముక్కు అనే జ్ఞానేంద్రియాలతో తెలుసుకొనేవి తన్మాత్రలు. తత్‌ అంటే పరమాత్మ. మాత్ర అంటే కొలమానం. అంటే పరమాత్మను తెలుసుకోడానికి ఆధారమైనవి తన్మాత్రలు. చెవి మొదలైన జ్ఞానేంద్రియాలకు తన్మాత్రలు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. శబ్దాది విషయాలంటే ఇవే. సృష్టిలోని ప్రాణులకు సుఖాన్ని కలిగించేవి శబ్దాది విషయాలే.

లోకవ్యాపారమంటే సృష్టి స్థితిలయాలతో కూడిన విషయం. లోకవ్యాపారాలన్నీ పరమాత్మ మాయవల్ల ప్రవర్తిస్తూ ఉంటాయి. ఆత్మకూ పరమాత్మకూ మధ్యగల సంబంధం సరిగా అర్ధంకాకపోవడమే మాయ.)

అని ఈ విధంగా క
ర్దమముని స్తుతించగా సరోజాక్షుడైన విష్ణుదేవుడు విన్నాడు. గరుత్మంతుని మూపుపై ఒయ్యారంగా కూర్చొని అందంగా కనిపించే ఆ స్వామి ప్రేమతో కూడిన చిరునవ్వు వెన్నెలలు వెల్లివిరిసే చూపులతో, అతిశయమైన దయతో మునీశ్వరుడైన కర్దముని అవలోకించి సొగసు అతిశయిస్తూ ఉండగా ఇలా చెప్పాడు.

ర్దమమునీంద్రా! మనస్సులో ఏ కోరిక కోరి నీవు గొప్ప భక్తి శ్రద్ధలతో నన్ను ఆరాధించావో నీకు ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది సుమా!

కోరిన కోరిక తప్పక నెరవేరుతుందని చెప్పి విష్ణుదేవుడు క
ర్దమునితో ఇంకా ఇలా అన్నాడు. బ్రహ్మదేవుని కుమారుడు, రాజాధిరాజు అయిన స్వాయంభువమనువు బ్రహ్మావర్తదేశం ప్రధానంగా ఏడుసముద్రాల మధ్యలోగల భూమండలాన్ని పరిపాలిస్తున్నాడు. పుణ్యాత్ముడైన ఆ మనువు శతరూప అనే తన భార్యతో కలసి పెండ్లి కావలసిన పుత్రికను వెంటబెట్టుకొని రేపు నీ చెంతకు వస్తాడు. వయస్సులో, శీలంలో, సంకల్పంలో, సుగుణాలలో నీకు తగినటువంటి తన కొమార్తెను నీకిచ్చి వివాహం చేస్తాడు. ఆ వివాహం వల్ల నీ కోరిక సఫలమవుతుంది. నన్ను మనస్సులో నిత్యం స్మరిస్తూ ఉండే ఆ మనువు కూతురు నిన్ను పెండ్లాడి నీ తేజస్సును ధరించి ఎంతో అందగత్తెలైన తొమ్మిదిమంది తనయలను కంటుంది. ఆ తొమ్మిదిమందికి మునీశ్వరులవల్ల ఉత్తములైన కొడుకులు పుడతారు. నీవునా ఆజ్ఞను పాటించి నీవు చేసే సమస్త కర్మఫలాలను నాకే అర్పిస్తూ ఉండు. ఏకాగ్రమైన మనస్సుతో ప్రాణులకు అభయమిస్తూ, దానాలుచేస్తూ, కరుణామూర్తివి సుజ్ఞానివి అయి లోకాలన్నీ నాలోనే ఉన్నాయని, నీలో నేను ఉన్నానని తెలుసుకొని నన్ను ఆరాధిస్తూ ఉండు. అంత్యకాలంలో నన్ను చేరుకొంటావు. నేను నీ తేజస్సుతో, నా కళాంశతో నీ భార్య గర్భంలో ప్రవేశించి నీకు పుత్రుడుగా జన్మిస్తాను. నీకు తత్త్వవిద్యను బోధిస్తాను. అని తెలియజేసి కర్దమమహాముని చూస్తూ ఉండగానే విష్ణుదేవుడు అంతర్జానమయ్యాడు.

(బ్రహ్మావర్తదేశం - ఎక్కడ బ్రహ్మవిద్య ప్రభవించి విస్తరించిందో ఆ దేశం. బ్రహ్మవిద్య అంటే వేదవిద్యే. ఈ ప్రాంతంలోనే వేదవిద్య పుట్టి వికసించింది. వేదఋషులు బ్రహ్మవిద్యను ఇక్కడనుండే ప్రచారం చేశారు. ప్రస్తుతం ఢిల్లీ నగరానికి వాయవ్య దిశగా ఉన్న ప్రాంతం అప్పటి బ్రహ్మావర్తదేశం. తత్త్వ సంహిత - అంటే తత్త్వజ్ఞానం లేక తత్త్వవిద్య. ఈ విద్యను గురించి చెప్పేది తత్త్వశాస్త్రం. మనం చూస్తూ ఉన్నలోక స్వభావం ఎలా ఉంటుందో లోతుకు దిగి విచారణ చేస్తూ పోతే ఏర్పడే యథార్థమైన జ్ఞానమే తత్త్వజ్ఞానం. తత్‌ అంటే అది అనగా పరబ్రహ్మ అని అర్థం. నామరూపాత్మకంగా కనిపిస్తున్నలోకం అలా భాసిస్తుందేగాని నిజానికి లోకమంతా సచ్చిదాత్మకమైన పరబ్రహ్మస్వరూపమే అని తెలుసుకోవడమే తత్త్వజ్ఞానం. ఇంకా సులువుగా చెప్పాలంటే ఆత్మ, పరమాత్మ, ప్రకృతి అనే మూడింటి సంబంధాన్ని చెప్పేదే తత్త్వజ్ఞానం.)

పవిత్రమైన సరస్వతీనదీజలంతో పెంపొందిన గున్నమామిడి చెట్లతో అందగిస్తున్న ఎత్తెన గట్లతో కూడిన బిందుసరోవరంనుండి బయలుదేరి(విష్ణుదేవుడు) ఒప్పుచున్న గరుత్మంతుని అధిరోహించి, అతని ఉన్నతమైన రెక్కల కదలికలచే పుట్టిన చప్పుళ్లు సలక్షణమైన సామవేదగానంగా ఒప్పుతూ ఉండగా పరవశత్వంతో వింటూ,

(గరుడుడు వేదస్వరూపుడు. 'వేదాత్మా విహగేశ్వరః'. గరుత్మంతుడు, సుపర్ణుడు అని కూడా గరుడునికి పేర్లు. ఈ రెండు పేర్లు ఇతని రెక్కల శక్తిని తెలుపుతాయి. ఇంద్రుని వజ్రాయుధం దెబ్బకు కూడా చలింపనివీ రెక్కలు. సుపర్ణుడనే శబ్దానికి అలాంటి చలింపని రెక్కలని అర్థం. మహావిష్ణువుకు వాహనమైన గరుడుడు ఆకాశాన ఎగురుతూ ఉంటే కదులుతూ ఉన్న రెక్కలనుండి పుట్టిన గాలి చేసే శబ్దం వేదగానంగా వినిపిస్తున్నది.)

శ్రీహరి వైకుంఠానికి వెళ్లిన తరువాత కోరికలతో కూడినవాడు, జనవంద్యుడు అయిన క
ర్దమముని మోహావేశంతో ఫలించబోయే కోరికలు మనస్సులో అధికమవుతూ ఉండగా వెంటనే బిందుసరోవరానికి వెళ్లాడు. అక్కడ భక్త్యతిశయమైన మనస్సుతో లక్ష్మీనాథుడైన శ్రీహరిని స్మరిస్తూ ఉన్నాడు.

(క
ర్దమముని దైవకార్యమైన సృష్టిని వృద్ధిచేయటానికి వివాహమాడాలని నిర్ణయించుకొన్నాడు. శ్రీహరిని ఆరాధించాడు. శ్రీహరి ప్రత్యక్షమై కోరిక నెరవేరుతుందని ఆశీర్వదించాడు. స్వాయంభువమనువు తన కొమార్తెను వెంటబెట్టుకొని రేపు నీవద్దకు వచ్చి ఆమెనిచ్చి నీకు వివాహం చేస్తాడని కూడా చెప్పాడు. ఇప్పుడు కర్దమముని తనకు కాబోయే భార్యకోసం ప్రతీక్షిస్తున్నాడు. ఆమె వస్తుంది తనకు వివాహం అవుతుంది అని తెలియడంవల్ల మనస్సు ఆనందంలో తేలిపోతూ ఉంది. 'ముందటవచ్చు కోరికల్‌ పిరిగొనుచుండన్‌' అంటే కాబోయే భార్యను, జరగబోయే వివాహాన్ని గురించి ఆలోచించినపుడు మనస్సులో కోరికలు అధికం కావడమని భావం.)

తరువాత స్వాయంభువమనువు భార్యతో కలసి బంగారు రథం ఎక్కి భర్తయందు కోరికగలదైన అనగా పెండ్లివయస్సులో ఉన్న తనయను వెంటబెట్టుకొని ఆమెకు అర్హుడైన వరుని వెదకుతూ లోకాలన్నీ కలయదిరిగాడు. కాని అలాంటి వరుడు ఎక్కడా కనపడలేదు. తిరిగి తిరిగి వచ్చి.

విష్ణుదేవుడు క
ర్దమమహామునిని కారుణ్యానందాతిశయంతో వీక్షించినపుడు కర్దముని కన్నులనుండి రాలిన ఆనందాశ్రువులు నేలపైపడి ఒక ప్రవాహమై సరస్వతీనదిని చుట్టుకొని ప్రవహించి బిందుసరోవరం అనే పేరుతో వర్ధిల్లింది. ఆ పుణ్యతీర్జాన్ని పండితోత్తముడైన స్వాయంభువమనువు తన కన్నుల ఎదురుగా దర్శించాడు.

(క
ర్దమమహామునిని శ్రీహరి ఆనందం కరుణ కలిసిన దృక్కులతో వీక్షించాడు. కర్దముడు శ్రీహరిని ఆరాధించి వివాహం చేసుకోవాలని, దైవకార్యమైన సృష్టిని అభివృద్ధి చేయాలని కోరుకోవడం శ్రీహరికి ఆనందదాయకమైంది. అదే ఆయన కర్దమునిపై కారుణ్యం వర్షించడానికి కారణమైంది. కర్దమునికి దేవహూతికి తాను కపిలుడుగా జన్మించి తత్త్వోపదేశం చేయవలసి ఉంది. కర్దముడు శ్రీహరికి తండ్రి కాబోతున్నాడు. అది ఆయన సంతోషానికి మరొక కారణం. కర్దముని కన్నులనుండి రాలిన ఆనందాశ్రువులు బిందువులుగా నేలపై పడి ప్రవాహంగా మారి సరస్వతీనది చుట్టూ ప్రవహించి ఒక సరస్సుగా రూపొందడంవల్ల బిందు సరోవరమని పేరు ప్రఖ్యాతమైంది.)

ఆ బిందుసరోవరం పక్కనే క
ర్దముని తపోవనం ఉన్నది. ఆ వనంలో కానుగచెట్లు, మద్దిచెట్లు, పొగడచెట్లు, ఏరుమద్దిచెట్లు, వేపచెట్లు, కడిమిచెట్లు, కలిగొట్టుచెట్లు, చందనవృక్షాలు, కొబ్బరిచెట్లు, కర్పూరవృక్షాలు, దిరిసెనపుచెట్లు, మామిడిచెట్లు, ఎర్రగంధపుచెట్లు, పోకచెట్లు, సంపెంగచెట్లు, మారేడుచెట్లు, వెలగచెట్లు, ఇప్పచెట్లు ఉన్నాయి. లవంగలతలు, మల్లెపొదలు, మొల్లపొదలు మొదలైన చక్కని పొదరిండ్లతో ఆశ్రమవాటిక అందంగా కనిపిస్తున్నది.

ఆ యాశ్రమంలో బాగా పండిన పండ్లబరువుతో చెట్ల కొమ్మలు కిందికి వంగి ఉన్నాయి. ఆ కొమ్మలమీద నివసించే పక్షులగుంపుల కలకలధ్వనులతో దిగంతాలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ దృశ్యం చూడడానికి ఆహ్లాదకరంగా ఉంది.

పండినపండ్లను మిక్కిలి వాడిగా ఉన్న తమముక్కులతో పొడిచి ఆ సందులనుండి కారుతూ ఉన్న ఫలరసాన్ని తాగి రాచిలుకలు సంతోషంతో చేస్తున్న రుచిరార్థంతో కూడిన వేదవాక్యములరవళి వీనులవిందుగా వినిపిస్తున్నది.

లేత మామిడి చిగుళ్లను మెక్కి వగరెక్కిన గొంతులతో కోయిలలు ఎంతో రమ్యంగా అవ్యక్తమధురంగా కూస్తున్నాయి.

ఆ యాశ్రమంలో దట్టంగా ఉండిన కానుగచెట్లను చూచి మేఘాలుగా భ్రాంతిపడి నెమళ్లు పురులు విప్పి చూడముచ్చటగా నృత్యం చేస్తున్నాయి.

కన్నెలేళ్లతో, నీటికోళ్లతో, బెగ్గురు పక్షులతో, కొంగలతో, చక్రవాకాలతో, గండుతుమ్మెదలతో, కలహంసలతో, కమలాలతో, తెల్లకలువలతో, ఎర్రకలువలతో విరాజిల్లే సరోవరాలు గల ఆశ్రమం ఎంతో రమ్యంగా ఉంది.

ఆ ఆశ్రమ పరిసరాల్లో ఏనుగులు, పెద్దపులులు, తోడేళ్లు, అడవి దున్నలు, కుందేళ్లు, ఎలుగుబంట్లు, చమరీమృగాలు, సింహాలు, వరాహాలు, ఖడ్గమృగాలు, గురుపోతులు, కోతులు, ఒంటెలు మొదలైన అడవిమృగాలు సంచరిస్తున్నాయి. 

(పైన కనిపించే అడవి జంతువుల్లో జింకలు, కుందేళ్ల వంటి సాధుజంతువులు కూడా ఉన్నాయి. సాధుజంతవులు, క్రూరజంతువులు కలసిమెలసి ఆశ్రమపరిసరాల్లో సంచరిస్తున్నాయి. మహర్షుల తపోమహిమవల్ల ఆశ్రమవాతావరణంలో శాంతి నెలకొని అక్కడి ప్రాణులలోగల సహజ క్రూరత్వం, వైరం అణగి పోతాయి. పెద్దజంతువులు చిన్నజంతువులను, క్రూరజంతువులు సాధుజంతువులను బాధించకుండా స్నేహంతో, ప్రేమతో కలసిమెలసి సంచరిస్తూ ఉంటాయి.)

అలాంటి క
ర్దమముని తపోవనం దర్శించి స్పాయంభువమనువు కొద్దిపాటి పరివారంతో ఆశ్రమంలోకి ప్రవేశించాడు.

ఆశ్రమంలో ప్రవేశించిన మనువు క
ర్దమమునిని దర్శించాడు. పవిత్రమైన బ్రహ్మచర్యవ్రతానికి తగిన తపః ప్రవృత్తిచేత కర్దముని శరీరం చక్కగా ప్రకాశిస్తున్నది. దేహం మిక్కిలి కృశించిపోయినప్పటికి శ్రీహరి సంకీర్తనమనే అమృతరసాన్ని చెవులనే దోసిళ్ళతో ఆస్వాదించి ఆ మాధుర్యానికి పారవశ్యం చెంది ఉండిన కారణంగా ఆ కృశత్వం కనపడలేదు. ఆయన జడలూ, నారచీరలూ, జింకచర్మమూ ధరించి విశాలమైన నేత్రాలతో కనిపిస్తున్నాడు. సానబట్టని, వెలకట్టలేని నూతన రత్నంవలె ఉన్నాడు. అలా కనిపిస్తున్న కర్దముని పాదాలకు స్వాయంభువమనువు భక్తితో నమస్కరించాడు.

(క
ర్దమముని కృశీభూతాంగుడైనా శ్రీహరి సంకీర్తనమనే అమృతరసాన్ని ఆస్వాదించడంవల్ల శరీర కృశత్వం కనిపించక పోవడానికి అతడు గొప్పభక్తుడు కావడం కారణం. భగవంతుడు అతనిని వాత్సల్యంతో చూడడం కూడా ఇందుకు హేతువు. కర్దముని ఈ లక్షణమే తనకూతురికి ఆయన తగిన భర్త అని మనువు అనుకొనేటట్లు చేసింది. కర్దముడు సానబట్టని, వెలకట్టలేని రత్నంవలె వెలిగిపోతున్నాడని చెప్పడంలో అతని నిగూఢమైన భక్తి తత్పరత దాగి ఉంది.

"కన్యా వరయతే రూపం మాతా విత్తం పితా శ్రుతమ్‌
బాన్థవాః కులమిచ్చన్తి మృష్టాన్నమితరే జనాః”


"వరునిలో కన్య రూపాన్ని కోరుకుంటుంది. తల్లి సంపదను, తండ్రి విద్యావైభవాన్ని బంధువులు కులమర్యాదను, తక్కినవారు తృప్తి కలిగించే భోజనాన్నీ కోరుకుంటారు" అనే శ్లోకాన్నిబట్టి ఈ పద్యంలో ఇంచుమించు అవన్నీ ఉన్నాయనే అర్థాన్ని కవి ధ్వనిమార్గంలో తెలియజేస్తున్నాడు. రూపవర్ణన ఉంది. తపస్సంపద కానవస్తున్నది. తండ్రి ఆయన పాదాలకు నమస్కరించటం విద్యాదీప్తీ, కులమర్యాదా అభివ్యక్తం అవుతున్నాయి.)

ఇలా నమస్కరించిన స్వాయంభువమనువును క
ర్దమమహాముని తన ఇంటికి వచ్చిన అతిథిగా గౌరవించాడు. పూజాద్రవ్యాలు, పాదప్రక్షాళానికి జలం సమర్పించి ఆనందింపజేశాడు. ముందు విష్ణుదేవుడు ఆదేశించి ఉండిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకొని స్వాయంభువమనువుతో ఇలా అన్నాడు.

(పూజనీయులైన పెద్దవాళ్లు వచ్చినప్పుడు అర్ఘ్యం సమర్పించడం ఒక సంప్రదాయం. తేనె, పెరుగు, నెయ్యి, అక్షతలు, గరిక, నువ్వులు, పువ్వులు, దర్భ, పుష్పం - అన్నీ కలిపి అర్ఘ్యం అవుతుంది. ఇవన్నీ కలిపిన పూజాద్రవ్యంతో అర్చిస్తారు.)

శ్రేష్ఠమైన గుణాలకు స్థానమైనవాడా! భగవంతునియెడల భక్తిగలవాడవైన నీవు సజ్జనులను రక్షించడానికి, దుర్జనులను శిక్షించడానికి లోకమంతా పర్యటిస్తూ ఉంటావు గదా! ఓ పుణ్యపురుషా! సూర్య, చంద్ర, వాయు, యమ, వరుణ, ఇంద్రుల అంశలు కలవాడవు. విష్ణుస్వరూపుడవు. అలాంటి నీకు నేను పరమభక్తితో నమస్కరిస్తున్నాను. పాపరహితా! నీవు ఎప్పుడూ సమస్తలోకాలను జయించగలదైన నేమిగల మణులుతాపిన బంగారుమయమైన రథాన్ని అధిరోహించి, చేత విల్లుధరించి అడ్డూ ఆపూలేని సైనికుల పాదాల రాపిడిచేత భూమి దద్దరిల్లగా (జైత్రయాత్ర) సాగిస్తూ ఉంటావు.

రాజా! నీవు సూర్యునివలె నిరంతరం సంచరించకపోతే లోకాలన్నీ గాఢనిద్రలో మునిగిపోతాయి బ్రహ్మచే కల్పించబడిన(సృష్టింపబడిన) వర్ణాశ్రమాలు, గొప్ప సముద్రానికి చెలియలికట్టవంటి సదాచారక్రియలు భ్రష్టమై, జాతిసంకరమేర్పడి దొంగలభయంవల్ల లోకాలన్నీ ఎక్కడనో నశించిపోతాయి గదా!

(ఇక్కడ మనువు ఒక రాజుగా సూర్యునితో పోల్చబడినాడు. సూర్యుని వెలుగు లోకమంతా ప్రసరించినట్లు రాజు దృష్టికూడా అతని రాజ్యమంతా ప్రసరించాలి. అలా ప్రసరించినప్పుడే లోకంలోని మంచి చెడ్డలను గ్రహించగలుగుతాడు. లోకమంటే జనం. వర్ణాలు, ఆశ్రమాలు వాళ్లకు సంబంధించినవే. ఆ వర్ణాశ్రమాలు సాంకర్యదోషం పాలుకాకుండా చూడవలసిన బాధ్యత రాజుది. సూర్యుడు లేకపోతే ఉదయమే లేకపోవడంవల్ల లోకులు నిద్రలోనే ఉండిపోతారు. అలాగే రాజు నిరంతరం తన బాధ్యతను నిర్వర్తిస్తూ ఉండకపోతే వర్ణాశ్రమ సాంకర్యం ఏర్పడుతుంది. వర్ణాలు ఆశ్రమాలు గొప్పవి, విస్తృతమైనవి. అందువల్లనే అవి పాథోనిధితో పోల్చబడినాయి. సదాచార సంపత్తి పాథోనిధికి చెలియలికట్ట వంటిది.)

అని చెప్పి క
ర్దమముని "నీ రాకకు కారణం ఏమిటి?" అని స్వాయంభువుని అడుగగా యథావిధిగా నిత్యమూ వైదికాచారాలను నిర్వర్తించేవాడైన కర్దమ మునీంద్రునితో స్వాయంభువమనువు ఇలా అన్నాడు.

(మానవులకు నిత్యములు, నైమిత్తికములు, కామ్యములు అని మూడువిధాలైన కర్మములు విధ్యుక్తములై ఉన్నాయి. అందులో సంధ్యావందనం మొదలైనవి నిత్యకర్మములు, పూర్ణిమ, అమావాస్య మొదలైన పర్వదినాలలో చేయవలసినవి నైమిత్తికములు. పుత్రకామేష్టి మొదలైనవి కామ్యములు.)

మునివరేణ్యా! బ్రహ్మదేవుడు తాను రచించిన వేదాలన్నిటిని ఈ భూమిమీద బయలుపరచడానికి మిమ్ములను తన ముఖంనుండి సృష్టించాడు.

(వేదాలు అపౌరుషేయాలన్నారు గదా! మరి బ్రహ్మ రచించినట్లు చెప్పడం ఎలా? వేదాలు పరమాత్మ నుండి లోకంలోకి వచ్చినట్లు ఒక సంప్రదాయం చెపుతున్నది. సమస్త సృష్టికి, స్థితికి, లయానికి పరమాత్మే కారణమైనప్పటికి సృష్టిచేసే అధికారం బ్రహ్మదేవుని కిచ్చి ఆయనచేతనే సృష్టికార్యం చేయించాడు. అందువల్ల బ్రహ్మకే సృష్టికర్తగా పేరొచ్చింది. అలాగే వేదాల ఆవిర్భావానికి కూడా బ్రహ్మదేవుడే కర్త అని చెప్పే సంప్రదాయం ఉంది. అంతేగాక విశ్వంలోని ప్రతిదాని ఆవిర్భావమూ బ్రహ్మద్వారానే జరిగిందని చెప్పడమూ ఉంది.)

పాపస్వరూపులైన దొంగలు కలిగించే బాధలకు గురికాకుండా సమస్తభూమినీ పరిపాలించడానికి మమ్ములను తన భుజాలనుండి బ్రహ్మ సృష్టించాడు.

బ్రహ్మదేవునికి బ్రాహ్మణులు అంతఃకరణంగా, క్షత్రియులు శరీరంగా ప్రసిద్దులైనారు. శ్రీహరికి ఈ రెండు జాతులవాళ్లు అవశ్యం రక్షింపదగిన వాళ్లు.

అందువల్ల విష్ణుస్వరూపుడవు, దుర్జనులకు కనపడనివాడవు అయిన నిన్ను దర్శించగలగడం నా అదృష్టంవల్ల ప్రాప్తించింది. నీ పాదపద్మాలలోని కేసరాలవల్ల ఎర్రనయిన నా తలా, నీ మాటలనే అమృతంతో నిండిన నా చెవులూ శుభాలకు స్థానాలై సఫలత్వాన్ని పొందాయి. నేను ధన్యుడనయ్యాను. కొమార్తెపైగల వాత్సల్యంవల్ల కలిగిన దుఃఖంతో మనస్సులో ఆందోళనపడుతూ దేశాలన్నీ(పెండ్లికొడుకు కోసం) తిరిగి అలసిపోయాను. నా ప్రార్థనను ఆలకించు అని మనువు కర్దమమహామునితో మరలా ఇలా అన్నాడు.

మహా యోగీశ్వరుడవైన క
ర్దమా! దేవహూతి అనే పేరుగల ఈ అందగత్తె నా కొమార్తె ఈమె మిక్కిలి సాందర్యవంతులు, గుణశ్రేష్ఠులు అయిన పురుషులను ఎవరినీ వివాహమాడడానికి అంగీకరించడంలేదు. ఇప్పుడు తొందరతో నారదమహర్షి పంపించడంవల్ల మిమ్ములను (కర్దమమునిని) వివాహమాడాలని ఇక్కడకు వచ్చింది. నీవు ఈ శుభకార్యాన్ని అంగీకరించి, స్థిరమైన సంకల్పంతో ఈ కన్యాదానాన్ని స్వీకరించు.

శుభస్వభావంగల కర్దమ మహామునీ! పవిత్రమైన గృహస్థాశ్రమ కృత్యాలకు తగిన సుగుణాలతో, మంచి స్పభావరీతులతో కూడి ఒప్పుతున్న ఈ కన్యను సంతోషంతో భార్యగా స్వీకరించు.

(గృహస్థాశ్రమం నాలుగాశ్రమాలలో అతిముఖ్యమైంది. మిగిలిన మూడు ఆశ్రమాలు గృహస్థాశ్రమం మీదనే ఆధారపడతాయి. గృహస్థాశ్రమానికి వివాహవ్యవస్థ మొదటిదశ. వివాహమై భార్యాభర్తలైన తరువాత సాగించే సంసారం గృహస్థాశ్రమధర్మాల పై ఆధారపడి సాగుతుంది. సక్రమంగా భార్యాభర్తలు గృహస్థాశ్రమధర్మాలను నిర్వర్తించాలంటే ఆ భార్యాభర్తల మధ్య చక్కని ఆనురూప్యం ఉండాలి. భర్త రూపానికి, గుణశీలాలకు తగినట్లు భార్య ఉండాలి. అలాగే భార్యరూపానికి, గుణశీలాలకు తగినట్లు భర్త ఉండాలి. ఇలా ఉన్నప్పుడే ఆ భార్యాభర్తలను చూచినవారు 'వీళ్లమధ్య ఈడూజోడూ కుదిరింది. అనుకూలమైన దాంపత్యం' అని ప్రశంసిస్తారు.)

పుణ్యాత్ముడైన ఓ కర్దమ మునీంద్రా! అనురాగం లేనివారికైనా అయాచితంగా తమంతతామే లభించిన సుఖాలను వదలిపెట్ట కూడదన్నారు పెద్దలు. అలాంటప్పుడు అనుకోకుండా లభించిన ఇష్టమైన సుఖాలను కోరికలుగలవారు వదలుకొంటారా? వదలుకోరు.

ర్దముమునీ! ఒక ప్రయోజనాన్ని ఆశించి పనిచేయడానికి పూనుకొన్నవాడు ఆ పనికోసం ఒకలోభి సాయం కోరితే అలా కోరినవాని కీర్తీ అభిమానమూ రెంటికీ భంగం కలుగుతుంది. నీవు వివాహం చేసుకోవాలనే కోరికతో ఉన్నావని తెలుసుకొని ఇక్కడికి (వచ్చాం).

(కార్యనిర్వహణలో లోభి సహకారం కోరితే కార్యం చెడడమే కాకుండా కోరినవారి అభిమానమూ చెడుతుంది. ఇది అందరూ తెలుసుకోవలసిన నీతి. మనువు తన పుత్రికను క
ర్దమునికిచ్చి పెండ్లి చేయాలనే తలంపుతో వచ్చాడు. కర్దముడు కాదంటే తనపని నెరవేరకపోవడడమేగాక తన అభిమానం దెబ్బతింటుంది. కర్దముడు వివాహేచ్చతో శ్రీహరిని ఆరాధించిన విషయం మనువుకు తెలుసు. కొమార్తెను తీసుకొని కర్దముని ఆశ్రమానికి వెళితే ఆమె వివాహం కర్దమునితో జరుగుతుందనే నమ్మకంతో వచ్చాడు మనువు. కార్యం జరగకపోవడం, తన కీర్త్యభిమానాలకు భంగం కలగడం ఉండవని తెలిసే ఆయన వచ్చాడు.)

ఇక్కడికి నేను వచ్చిన సంగతి విన్నవించాను. నా విన్నపాన్ని అంగీకరించి నా కొమార్తెను ఇష్టంగా భార్యగా అంగీకరించండి అన్నాడు మనువు. ఆ మాటలు వినిన క
ర్దమమహాముని స్వాయంభువమనువును తన వైపుకు తిప్పుకొని మిక్కిలి సంతోషంతో ఇలా చెప్పాడు.

ఓ పుణ్యాత్ముడా! ఇతరుల నందరినీ కాదని నీవు నాకోసం తీసుకొనివచ్చిన ఈ లతాంగి రూపరేఖావిలాసాలలో మనోహరమైనది. పవిత్రురాలైన లక్ష్మీదేవితో సమానురాలు. ఒకనాటి రాత్రి వెన్నెలలో తెల్లగా కనిపిస్తున్న తన మేడపై ఈమె పాదాలకు బంగారుఅందెలు అలంకరించుకొని తన చెలికత్తెలతో బంతియాట ఆడుతున్నది. ఆ సమయంలో విమానంలో వెళుతున్న విశ్వావసుడు అనే గంధర్వరాజు ఈ తరుణీమణి సౌందర్యాన్ని తిలకించి మోహంతో శరీరస్పృహ లేకుండా విమానంనుండి తూలి భూమి మీద పడ్డాడు.

(విశ్వావసుడు : ఒక గంధర్వుడు. ఇతడు దేవహూతిని చూచి మోహించాడు. ఆ పాపంతో తన స్థానంనుండి తప్పి కిందపడిపోయాడు. ఇది భాగవతంలోని విషయం. భారతంలో ఇతడొక గంధర్వరాజు. ఇతనికి మేనకవలన ప్రమద్వర అనే కూతురు కలుగుతుంది. తరువాత తల్లిదండ్రులిద్దరూ ఆ బిడ్డను వదలి వెళ్లిపోతారు.

విశ్వావసుడు వివాహానికి అధిదేవతగా శాస్త్రాలలో చెప్పబడ్డాడు. ఏ కన్యనైనా అతడు మొదట వరించి భూమిపై పడిన తరువాత భర్త కాబోయేవాడు వరించునని వేదమంత్రాలు చెపుతున్నాయి. విశ్వావసువనగా పురుషుల సంపదయగు యౌవనమధురభావం. అతడు వరించనిదే ఏ కన్యనూ ఎవరూ వరించలేరు.)

పుండరీకాక్షుడైన శ్రీహరిని ఎరుగని నరాధములు ఈ అందగత్తె జాడ తెలుసుకోలేరు. అటువంటి కాంతాలలామ అదృష్టవశాన తనంతతానుగా వచ్చి వరించినపుడు అంగీకరింపనివాడు ఎవడైనా ఉంటాడా? ఉండడు.

గుణం, రూపం, నడవడి విషయంలో ఈ కన్యామణికి నాకూ సమానత్వం కనిపిస్తున్నది. అందువల్ల ఇది పుణ్యకార్యంగా భావించి ఈమెను నేను భార్యగా స్వీకరిస్తాను.

(తనకూ(కర్దమునికి) కన్యారత్నానికి(దేవహూతికి) గుణరూపవర్తనలలో సమానత్వముందని క
ర్దమమహామునే చెప్పడం ఇక్కడ గమనింపదగి ఉంది. ఆయన మహర్షి కాబట్టి భార్యాభర్తలమధ్య వివాహానికి కావలసిన అంశాలేవో ఆయనకు తెలుసు.)

ఓ పుణ్యాత్ముడా! మాకు వివాహం జరగడానికి ఒక నియమం ఉంది. ఆ ఒడంబడిక ఏదో తెలియజేస్తాను విను. ఉత్తమ గుణాస్పద అయిన ఈమెకు సంతానం కలిగేవరకు సాంసారికధర్మాన్ని నిర్వర్తిస్తాను.

("ప్రజాతన్తుం మవ్యవచ్చేత్సీః'-సంతానమనే తంతువును త్రెంపివేయవద్దు. అని వేదానుశాసనం. దాంపత్యానికి సంతానమే ముఖ్యఫలం. కర్దముడు ఆ ధర్మాన్ని మనస్సులో ఉంచుకొని ఈ నియమాన్ని ప్రకటిస్తున్నాడు.

జ్ఞానచరితా! అటు తరువాత శ్రీహరి ఆజ్ఞ ప్రకారం ఆయన ఆనతిని తలదాల్చి శమదమాదులతో కూడిన యోగమార్గాన్ని అవలంబించి సన్యాసం స్వీకరిస్తాను.

ఓ రాజా! ఆ రమాకాంతునివల్లనే ఈ ఎల్లలోకాలు ఆవిర్భవిస్తాయి. వృద్ధిపొందుతాయి. నశిస్తాయి. బ్రహ్మాదుల అభ్యుదయానికి ఆయనే కారణభూతుడై ఉన్నాడు.

అలా ఉన్నదికాబట్టి ఆ దేవదేవుని ఆజ్ఞ అతిక్రమించరానిది అన్నాడు క
ర్దమహాముని. ఆ మాటలు వినిన స్వాయంభువమనువు తన సుతను కర్దమునికి ఇవ్వాలని అనుకొంటున్న భార్య శతరూపయొక్క అభిప్రాయాన్ని, కర్దమునే వివాహమాడాలనుకొంటున్న కొమార్తె దేవహూతి అభిప్రాయాన్ని తెలుసుకొన్నాడు. కర్దమమునీంద్రుని నియమానికి ఒప్పుకొన్నాడు. ఎంతో సంతోషంతో ఉత్తమగుణసంపన్నుడైన ఆ కర్దమునికి దేవహూతినిచ్చి వేదశాస్రోక్త పద్ధతిననుసరించి వివాహం జరిపించాడు. ఆ తరువాత శతరూప పారిబర్హములనే పేరుగల (అరణంపేరుతో చలామణిలో ఉన్న) వివాహ సందర్భానికి తగిన దివ్యవస్త్రాలనూ, దివ్యాభరణాలనూ దేవహూతీ కర్దములకు బహూకరించింది. ఆ ప్రకారంగా తన కులాచార పద్ధతి ననుసరించి వివాహం జరిపించి బరువు బాధ్యతలు తీర్చుకొన్నాడు మనువు. కుమార్తెను వదలి వెళ్లవలసి రావడంతో ఆమె ఎడబాటు ఆయనకు ఎంతో కలతను కలిగించింది. కుమార్తెను కౌగిలించుకొన్నాడు. వాత్సల్యంతో గడ్డం నిమిరాడు. చెంపను ముద్దాడి తలను స్పృశించాడు. ప్రేమాతిశయంతో ఉబికిన కన్నీళ్లతో ఆమె శిరస్సును తడుపుతూ తల్లీ! వెల్లివస్తానన్నాడు. అల్లుడైన కర్దముని వీడ్కోలు అందుకొని తన భార్యతో కలసి రథం అధిరోహించి పరిజనంతో కూడి బయలుదేరాడు.

చలిస్తున్న అలలపంక్తులతో ఎగురుతూ అందంగా కనిపిస్తున్న బిందుసరస్సు, సరస్వతీ నదులలో పద్మాలు అధికంగా ఉన్నాయి. పక్కనే ఆశ్రమవ్ఫక్షాలు అందంగా అమరి ఉన్నాయి. బిందుసరస్సు, సరస్వతీనదుల తీరప్రాంతాలలో మహనీయులైన మునిశ్రేష్ఠులు నివాసముండే ఆశ్రమాలు చాలా ఉన్నాయి. స్వాయంభువమనువు ఆ యాశ్రమాల వైభవాలను దర్శిస్తూ ముప్పిరిగొన్న ఆనందంతో తన పట్టణమార్గాన్నిబట్టి వెళ్లాడు.

(మనువు బ్రహ్మావర్తదేశానికి సమ్రాట్టుగా ఉండినట్లు చెప్పబడింది. పురాణప్రమాణాలనుబట్టి బ్రహ్మావర్త దేశమంటే సరస్వతి-దృషద్వతి అనే రెండునదుల నడిమి ప్రదేశం. అక్కడ రురువు అనే పేరుతో నల్లజింకలు సంచరిస్తూ ఉంటాయి. అందువల్ల ఆ ప్రదేశమంతా యజ్ఞయాగాది క్రతువులతో శ్రేష్ఠమైన బ్రహ్మజ్ఞానాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తుంది. స్థూలంగా ఈ ప్రదేశమిప్పుడు ఉత్తరభారతదేశంలో హిమాలయాలకు దిగువను, వింధ్య పర్వతాలకు పైనను ఉంది. మొట్టమొదట మానవజాతి భూగోళంపై అవతరించి ప్రదేశమిదేనని చెపుతారు.)

అలా ప్రయాణం చేసి మనువు బ్రహ్మావర్తదేశం చేరాడు. బ్రహ్మావర్తదేశంలో అతని నగరం ఉంది. అక్కడ పూర్వం శ్రీహరి యజ్ఞవరాహరూపం ధరించి శరీరాన్ని గట్టిగా విదిలించగా ఆయన శరీరంపై గల వెండ్రుకలు ఆ ప్రదేశంలో రాలాయి. ఆకుపచ్చని రంగుతో కనిపించిన ఆ వెండ్రుకల నుండి శ్రేష్ఠమైన దర్భలు, రెల్లుగడ్డి, యజ్ఞకార్యాలు చేయడానికి తగిన అగ్ని పుట్టాయి. వాటితో ఋషులందరూ యజ్ఞాలు నిర్వహించారు. యజ్ఞాలకు ఆటంకాలు కలిగిస్తున్న రాక్షసులను తుదముట్టించారు. ఆ ఋషులవల స్వాయంభువమనువు కూడా అక్కడ విష్ణువునుద్దేశించి యజ్ఞం చేసి గొప్పప్రజ్ఞతో విరాజిల్లాడు. అటువంటి తన పట్టణాన్ని (ఆయన సమీపించాడు).

(వైదిక కర్మకాండలో అంటే యజ్ఞ నిర్వహణలో దర్భలకు, రెల్లుగడ్డికి ప్రాధాన్యం ఉంది. దర్భ రెల్లుగడ్డి జాతికి చెందిన తృణం. పదిరకాల దర్భలున్నాయి. కుశం, కాశం, యవం, దూర్వం, విశ్వామిత్రం, ఉసీరం, కుందురం, గోధూమం, వ్రీహి, ముంజం అనేవి ఆ పదిరకాలు. దర్భలను కృష్ణపక్షమందలి పాడ్యమినాడు మంత్రపఠనం చేస్తూ సేకరిస్తారు. దర్భలు మంత్రాలను శక్తిమంతం చేస్తాయి. యజ్ఞసమయంలో, యోగసాధన సమయంలో ఆసనంగా వాడే చాప దర్భాసనం. ఈ చాపను రెల్లుగడ్డితో తయారుచేస్తారు. యజ్ఞదీక్షలో ఉన్నవారు దర్భ ఉంగరాలను ధరిస్తారు.)

స్వాయంభువమనువు పట్టణంలో ప్రవేశించగానే పౌరులు కానుకలు సమర్పించి అనేక విధాలుగా స్తుతించారు. మంగళవాద్యాలు కోలాహలంగా ధ్వనిస్తూ ఉండగా ఆయన అంతఃపురంలో ప్రవేశించాడు.

ఇలా అంతఃపురంలో ప్రవేశించి స్వాయంభువమనువు ఆధ్యాత్మిక ఆధిభౌతిక ఆధిదైవికాలనే మూడు తాపాలనూ శాంతపరచే భగవద్భక్తిని పెంపొందించుకొంటూ పుత్ర మిత్ర ఆప్తబాంధవులతో కూడి పరమానందంగా ఉన్నాడు. తాపత్రయము - ఆధ్యాత్మికము - దేహసంబంధమైనరోగాదులు. ఆధిభౌతికము- ఇతర ప్రాణులవల్ల కలిగే ఆపదలు. ఆధిదైవికము- భూకంపాలు, గాలివానలు మొదలైనవి.

స్వాయంభువమనువు ప్రతిదినమూ అతిశయించిన భక్తితో శ్రీహరియందే మనస్సునిల్పి వీణను మేళవించి శ్రీహరికంకితంగా సంగీతయుక్తమైన భక్తిగీతాలు పాడుకొంటూ ఆనందంతో భోగభాగ్యాలమీద ఆసక్తి లేనివాడై, నారాయణుని సేవయందే ముఖ్యాసక్తి కలిగి అనంత మహిమతో... (ఉన్నాడు).

(ప్రాచీనకాలంలో విద్య లయబద్ధమైన గీతాలద్వారా నేర్పబడుతూ ఉండేది. గీతాలద్వారా నేర్చుకొంటే లయజ్ఞానం ద్వారా నేర్చుకొన్న అంశాలు స్మృతిలో ఉంటాయి. సంగీత విద్యకు గాంధర్వవేదమనిపేరు. వాల్మీకిమహర్షి విరచిత శ్రీమద్రామాయణకావ్యం లవకుశులు మొదట్లో పాడడంద్వారానే ప్రచారమైనట్లు పాఠ్యే గేయే చ మధురం అని ప్రసిద్ధి పొందింది. రచింపబడినవన్నీ సంగీత ప్రబంధాలే. ఇక్కడ ప్రబంధమంటే ఒక కావ్యమని కాదు. సంగీతాత్మకమైన ఒక గీతం కూడా ప్రబంధమే.)

స్వాయంభువమనువు శ్రీహరి పాదపద్మాలపై సమర్పింపబడిన తులసీదళాల పరీమళాన్ని ఆఘ్రాణిస్తూ, ఆ భగవంతుని కథలను స్మరిస్తూ, స్తుతిస్తూ, పరామర్శిస్తూ, ఆలకిస్తూ, ఆ దేవునిసేవలకు ఆటంకాలై సంసారబంధాలైన ధర్మార్థకామాలను తిరస్కరించి మోక్ష పదవి పొందడానికి కావలసిన కార్యాలు చేయడం ప్రారంభించాడు.

(ధర్మార్థకామమోక్షాలు చతుర్విధ పురుషార్థాలు. పురుషుడు సాధించవలసినవి పురుషార్థాలు. ఈ నాలుగింటిలో ధర్మం మొదటిది, ముఖ్యమైనది. అర్థకామాలు ధర్మబద్ధంగా ఉండాలని సూచించడానికే ధర్మం మొదటనే కనిపిస్తున్నది. ధర్మార్థకామాలు మానవుని లౌకిక జీవితానికి, మోక్షం అలౌకిక జీవితానికి సంబంధించినవి. ధర్మార్థకామాలను చక్కగా అనుష్టించగలిగితే మానవజీవితం శాంతిధామమవుతుంది. మోక్షమంటే ముక్తి ప్రాపంచిక జీవితంనుండి విడుదల పొందడమే మోక్షం.

వేదార్థాలకు మాత్రమే అగపడువాడనదగు శ్రీహరియొక్క కథలను ప్రస్తావించడంలో ఆసక్తిగల ఆ స్వాయంభవమనువుకు ఎన్ని జాములు గడచినా గడవనట్లుగా ఉంది.

(శ్రీహరి కథా ప్రస్తావనలో మునిగిన మనువుకు కాలం గడచిపోతున్న విషయమే తెలియడంలేదు. ఒక జాము గడచిపోయి మరొక జాము వస్తున్నట్లు తెలుస్తున్నదేగాని తెల్లవారినట్లు తెలియడం లేదు. అతనికి కాలం గడుస్తున్న విషయమే తెలియలేదని భావం. అతని ధ్యాస అంతా శ్రీహరి చరితంమీదనే ఉంది. మూడుగంటలకాలం ఒక జాము. ఒక రాత్రికి నాలుగు జాములు.)

స్వాయంభువమనువు పవిత్రమైన శ్రీహరి కథలను వింటూ, ఆయన స్వరూపాన్ని మనస్సులో నిలుపుకొంటూ, ఆయన గుణనామాలను పాడుకొంటూ, ఆయనను ఆరాధిస్తూ, తన స్వవ్న జాగ్రత్‌ సుషుప్తి అవస్థలకు అతీతంగా ప్రవర్తించాడు. పుణ్యాత్ముడైన మనువు విష్ణుదేవుని భక్తుడు కాబట్టి దేహానికీ, మనసుకూ చెందిన బాధలు పొందలేదు. దైవశక్తులవల్ల, మానవచేష్టలవల్ల, పంచభూతాలవల్ల కలిగే కష్టాలలో చిక్కుకోలేదు. ఉత్తమ మునీశ్వరుల ఆశయాలకు తగినట్లుగా వర్ణాశ్రమ ధర్మపద్ధతులను తప్పకుండా నడుపుతూ ఆ ధర్మాలతో సంబంధం కలిగి, ప్రాణులకు మేలుచేయడమే నడవడిగా, సాటిలేనివిధంగా ప్రఖ్యాతి పొందుతూ, ఆనందాతిశయంతో డెబ్బదియొక్కయుగాలు పాలించి సచ్చరిత్రుడై విరాజిల్లాడు.

(శ్రీహరి దివ్యమంగళ కథాకర్ణన ధ్యానాను గానాలలో మునిగిన మనువుకు స్వప్నజాగ్రత్సుషుప్తులు లేవని చెప్పడం వల్ల ఆయన నిరంతరం ఇతర చింతలన్నిటిని వదలి తదేక ధ్యానంలో ఉన్నాడని, అందువల్లనే ఆయనకు ఎలాంటి బాధలు కలగలేదని అర్థమవుతున్నది. తన్నే నమ్మి శరణాగతి చేసిన ఎలాంటి భక్తునికైనా శ్రీహరి ఎలాంటి చింతలను దరిచేరనివ్వడనడానికి మనువుకథ ఒక ఉదాహరణం.

భగవదాజ్ఞతో మనువు భూమిని పరిపాలిస్తాడు. పరిపాలకుడైనవాడు వర్ణాశ్రమ ధర్మాలను కాపాడాలని ధర్మశాస్త్రాలు చెపుతాయి. అలాకాకుంటే సమాజం సాంకర్యదోషంతో చెడిపోతుంది. ఆ దోషం పరిపాలకునికి చెందుతుంది. అందువల్ల ప్రాచీన శాస్త్ర సాహిత్యం ఈ విషయాన్ని వివరంగా పేర్కొన్నది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర- నామాలతో వర్ణాలు నాలుగు. గుణకర్మలనుబట్టి చేయబడిన విభాగమిది. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసములనే పేర్లతో ఆశ్రమాలు నాలుగు. ఒక్కొక్క వర్ణంవారికి ఆశ్రమధర్మాలు ఒక్కొక్క విధంగా ఉంటాయి. డెబ్బెయొక్క యుగాల కాలాన్ని మన్వంతరం అంటారు.)

అలా జరిగిందని ఆ మనువుచరిత్రను మైత్రేయమహర్షి దయతో విదురునికి తెలియజేశాడు. తరువాత క
ర్దమమహాముని చరిత్రను తెలియజేస్తాను వినుమని సంతోషంతో అన్నాడు.

కర్దమప్రజాపతి యోగప్రభావంబుచే విమానంబు గల్పించి భార్యతో గూడి విహరించుట

Yakshas were created by Brahma to protect the primordial waters - చతుర్ముఖుండొనర్చు యక్షాదిదేవతాగణ సృష్టి దెలుపుట

చతుర్ముఖుండొనర్చు యక్షాదిదేవతాగణ సృష్టి దెలుపుట

మైత్రేయమహర్షి ఇలా చెప్పాడు. జగత్తునంతా తనలోనే ఉంచుకొన్నవాడైన భగవంతుడు జీవులకు అగోచరుడు. ఆ పురుషోత్తముడు యోగమాయా సమేతుడు. కాలస్వరూపుడు. ఎలాంటివికారాలకు లోనుకానివాడు. అలాంటి భగవంతుడు మొదట జీవులను ఎలా సృష్టించాలని కలతపడినాడు. జగత్తుకు ప్రభువైన ఆ భగవంతునినుండి సత్త్వం, రజస్సు, తపస్సు అనే మూడుగుణాలు పుట్టాయి. ఆ త్రిగుణాలనుండి మహత్తత్త్వం పుట్టింది. ఆ మహత్తత్త్వం రజోగుణసంబంధి కావడంచేత ముందుగా దానినుండి మూడుగుణాల అంశలు కలిగిన అహంకారం పుట్టింది. తరువాత అహంకారం నుండి పంచతన్మాత్రలు పుట్టాయి. పంచతన్మాత్రలనుండి సమస్త సృష్టికి కారణమవుతున్న పంచభూతాలు పుట్టాయి.

సృష్టికి కారణమైన ఆ పంచభూతాలు కూడా విడివిడిగా ఏ ఒక్కదానికీ లోకాన్ని సృష్టించడం చేతకాలేదు. పంచభూతాలు అన్నీ సమష్టిగా కలిసి పాంచభౌతికమైన ఒక బంగారు గుడ్డును సృష్టించాయి. ఆ గుడ్డు నీటిలోపల ఉంటూ వృద్ధి పొందుతూ ఉండినది.

(పాంచభౌతికమంటే నేల, నీరు, అగ్ని వాయువు, ఆకాశం అనే ఐదు ప్రకృతులకు సంబంధించినదని అర్థం. ఈ ఐదూ కలిసి ఏర్పడేదే సృష్టి. ఈ పంచప్రకృతులు బంగారు గుడ్డులో కలిసిపోయి ఉన్నాయి. ఆ బంగారు గు
డ్డునుండి సృష్టి ఏర్పడబోతున్నది కాబట్టి సృష్టి పాంచభౌతికం అవుతుంది.)

నారాయణుడు అనే పేరుతో గొప్పగా ప్రకాశించే పరబ్రహ్మ (భగవంతుడు) ఆ హిరణ్మయమైన అండాన్ని క్రమంగా వెయ్యి దివ్య సంవత్సరాలు అధిష్టించి ఉన్నాడు. ఆ వాసుదేవుని (శ్రీమన్నారాయణుని) బొ
డ్డునుండి వేయి సూర్యులకాంతితో ప్రకాశిస్తూ సమస్తప్రాణులతో కూడినదైన (సమస్త ప్రాణులకు ఆశ్రయమైన) ఒక పద్మం పుట్టింది. ఆ పద్మంలో భగవంతుని ఆశ్రయంగా చేసుకొని స్వయంప్రకాశంగల బ్రహ్మ జన్మించాడు. ఆ బ్రహ్మదేవుడు నామం, రూపం, గుణం మొదలైన సంకేతాలు (గుర్తులు) కలవాడై సమస్తజగాలను సృష్టించాడు. ఇంకా తన నీడతో -
(పరమాత్మ బ్రహ్మాదేవునిద్వారా సృష్టినిర్మాణం జరిపే అంశాన్ని ఈ పద్యం వివరిస్తున్నది. 'భగవదధిష్ఠితుండై' అనడంవల్ల బ్రహ్మకు స్వయంగా సృష్టి చేయగల శక్తి లేదని, భగవదంశతో జన్మించినవాడు కావడంవల్ల భగవంతుని ఇచ్చానుసారం వర్తిస్తూ సమస్త సృష్టిని చేశాడని అర్థమవుతూ ఉంది.

దివ్యవర్షంబు - 360 మానవ సంవత్సరాలు ఒక దివ్య సంవత్సరం. సృష్టికి సంబంధించిన విషయం సత్త్వరజస్తమ స్వరూపమైన ప్రధానం లేదా ప్రకృతి నిర్వికారావస్థలో ఉండింది. ఊహింపనలవి కాని దైవం అంటే జీవుని అదృష్టం, ప్రకృతి కధిష్ఠాత అయిన మహాపురుషుడు, కాలం అనే వాటిచే ప్రకృతి క్షుభితం కాగా దాని నుండి మహత్తత్త్వం ఉత్పన్నమైంది. దైవప్రేరితం, రజోగుణప్రధానం అయిన ఈ మహత్తత్త్వంనుండి త్రిగుణాలు, అహంకారం ఉత్పన్నమైనాయి. రజోగుణ ప్రధానమైన ఈ మహత్తత్త్వంనుండి ఈశ్వరుని ప్రేరణవలన అహంకార తత్త్వ ముత్పన్నమైంది. మహత్తత్త్వం స్వయంగా సత్త్వగుణప్రధానమైనా అహంకారోత్పత్తి కాలంలో కార్యానురూపమగు రజః ప్రధానమవుతుంది. ఆ యహంకారం గుణత్రయ స్వరూపమవుతుంది. ఈ యహంకారం ఇంకా ఐదైదుగా జేసి ఆకాశాదులను సృష్టించింది. దానినుండి పంచతన్మాత్రలు, పంచమహాభూతాలు, పంచజ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, వాటికి అధిష్టాన దేవతలయిదుగురు జన్మించారు. పంచతన్మాత్రాదులు ఒక్కొక్కటి స్వతంత్రంగా సృష్టిచేయ జాలక పోవుటవల్ల అవి ఈశ్వరుని శక్తితో కలసి భౌతికమగు ఒక సువర్ణాండమును సృష్టించాయి. ఆ యండకోశం సమష్టిజీవుని మేలుకొలుపలేక పోవుటచే అచేతనమై ఒక వెయ్యిసంవత్సరాలకాలం కారణార్ణవజలంలో ఉండింది. తరువాత భగవంతుడు ఆ యండకోశాన్ని గర్భోదశాయి రూపంతో అధిష్టించాడు. అప్పుడాయన నాభిప్రదేశం నుండి ఒక పద్మం ఉదయించింది. వేయిమంది సూర్యులవలె తీక్ష్ణమైన కిరణాలతో కూడిన ఆ పద్మమే సర్వజీవులకు అధిష్టానస్వరూపమై ఉండడంవల్ల దానినుండి బ్రహ్మ జన్మించాడు. సలిలంలో శయనించిన విష్ణువుచే అధిష్టితుడై ఆ బ్రహ్మ నామరూపాది క్రమంతో వెనుకటి కల్పంవలె లోకాలను సృష్టించాడు.

బ్రహ్మదేవుడు తన ఛాయ(నీడ)తో తామిస్రము, అంధతామిస్రము, తమము, మోహనము, మహామోహనము అనే ఐదు మోహరూపాలతో అవిద్యను పుట్టించాడు. ఆ సమయంలో తన కది తమోమయమైన శరీరమనే భావన కలిగింది. అందువల్ల బ్రహ్మ ఆ శరీరాన్ని వదలివేశాడు. అలా వదలి పెట్టిన శరీరం ఆకలిదప్పులకు స్థానం, రాత్రిమయం అయింది.

ఆ శరీరంనుండి యక్షులు పిశాచాలు పుట్టారు. వాళ్లకు ఆకలిదప్పులు అధికమైనాయి. ఆ యక్షపిశాచాలలో కొందరు బ్రహ్మను తిందామన్నారు. కొందరు బ్రహ్మను రక్షిద్దామన్నారు.
(అవిద్య అంటే అజ్ఞానం. విమనస్కుడు కావడం మోహం. చేతనత్వాన్ని మూఢత్వం కప్పివేయడం అజ్ఞానం. దీనినే మోహం అని కూడా అంటారు. విపరీత జ్ఞానం అవిద్య, తామిస్రం, అంధతామిస్రం, తమం, మోహనం, మహామోహనం అనే ఈ పంచమోహాలు అవిద్యలో భాగాలు. మొట్టమొదటి పాంచభౌతికమైన సప్తధాతుమయశరీరం వ్యుత్పత్తి వివరింపబడింది. తన నుండి భౌతికదేహం ఉద్భవింపగా అది మోహరూపాన వ్యక్తమైంది. జీవకణాలు, అణువులు, పరమాణువులు, అందు పనిచేయు ప్రజ్ఞలైన దేవతలు చేరినచో భౌతికదేహమవుతుంది. వారందరి అస్తిత్వం కనిపించకుండా అది మొత్తం ఒక దేహంగా కనిపించుటయే మోహం. ఉన్నది కనిపించక లేనిది కనిపించటం మోహమనబడుతుంది. ఏ ద్రవ్యమైనా ఉన్నట్లు కనిపిస్తుందే కాని దానికి అస్తిత్వముండదు. అందలి అంతర్భాగాలకే అస్తిత్వముంటుంది. కనుక భౌతిక దేహదృష్టి మోహరూపంగా చెప్పబడింది. దానియందు తన ప్రజ్ఞ పనిచేయక అందు తానుండుటవలన జడపదార్థంవలె కనిపిస్తుంది. దానికి సంబంధించినవే తామిస్రము మొదలైన స్థితులు. ధరింపబడిన భౌతిక దేహమునకు విడవడం తప్పనిసరి అవుతుంది కాబట్టి బ్రహ్మ ఆ దేహాన్ని విడిచాడని చెప్పబడింది.)

ఇలా మాట్లాడుకొంటూ ఆ యక్షరక్షస్సులు బ్రహ్మ సమీపానికి వచ్చారు. బ్రహ్మ భయంతో వ్యాకులత చెంది. 'నేను మీ తండ్రిని. మీరు నా కుమారులు. నన్ను హింసించవద్దు' రక్షించండి అంటూ "మా మాజక్షత","రక్షత" అనే మాటలు అన్నాడు. ఆ కారణంగా వాళ్లకు యక్షులు, రాక్షసులు అనే పేర్లు ఏర్పడినాయి. తరువాత బ్రహ్మ తేజోమయమైన మరొక శరీరం ధరించాడు. సత్వగుణ శ్రేష్టులు, కాంతిమంతులు అయిన దేవతలను ముఖ్యమైనవారుగా సృష్టించాడు. అనంతరం బ్రహ్మ ఆ తేజోమయమైన శరీరాన్ని వదలిపెట్టాడు. అలా వదలిపెట్టబడిన శరీరం పగలుగా రూపొంది దేవతలకందరికీ ఆశ్రయమైంది. తరువాత బ్రహ్మ తన కటిప్రదేశంనుండి మిక్కిలి చంచల స్వభావులైన రాక్షసులను పుట్టించాడు. వాళ్లు ఎక్కువగా కామదృష్టి కలవారయ్యారు. తమను పుట్టించిన బ్రహ్మనే పిలిచి రతిక్రియను కోరారు. సిగ్గువిడిచిన రాక్షసులు తనవెంటపడగా బ్రహ్మ నవ్వుతూ పరుగెత్తాడు. అలా పరుగెత్తి శరణాగతుల బాధలను తీర్చేవాడూ, భక్తులకు ఇష్టమైన రూపంలో కనిపించేవాడూ అయిన శ్రీమన్నారాయణుని దగ్గరకు వెళ్లాడు. ఆయన పాదాలకు నమస్కరించి ఇలా అన్నాడు. 
(ఈ వచనంలో దేవతలను, రాక్షసులను సృష్టించిన విషయం ఉంది. దేవతల, రాక్షసుల స్వభావం వివరింపబడింది. అతికాముకత్వం రాక్షసలక్షణంగా చెప్పబడింది. ఆలుమగల ద్వంద్వానికి మిథునం అని పేరు. మిథునం అనేమాటకు సంగమం, రతి అని కూడా అర్థాలున్నాయి. మిథునానికి సంబంధించినది మైథునం. మైథునం అన్నా రతి అనే అర్ధం. అయితే ఈ రతి ఆలుమగల మధ్యగల సంగమంగా ఉండాలి. దేవతలకు పగలు ఆశ్రయమైతే రాక్షసులకు రాత్రి ఆశ్రయమనే చెప్పాలి. అందుకే రాక్షసులకు రాత్రించరులు అని పేరు వచ్చింది.)

దేవతలచేత స్తుతింపబడువాడా! లోకాన్ని రక్షించేవాడా! ఉపేక్ష చేయకుండా నన్ను రక్షించు. ఈ మాట విను. నీ ఆనతిని పాటించి సమర్థతతో నేను క్రమంగా ప్రజలను సృష్టించే ఏర్పాటును చేశాను. అలా సృష్టింపబడిన వారిలో పాపస్వభావులైన రాక్షసులు ఇప్పుడు నన్ను రమించాలనే దుష్టబుద్ధితో దగ్గరకు వస్తున్నారు. కలతచెంది ఇక్కడికి వచ్చాను. ఓ సుచరిత్రా! నన్ను రక్షించు.

అంతేగాక లోకులకు కష్టాలను కలిగించడానికి, కష్టాలు పడేవాళ్ల కష్టాలను దూరంచేయడానికి నీవు కాకుండా సమర్ధులైన ఇతరులున్నారా? అని స్తోత్రం చేయగా బ్రహ్మాదేవుని దైన్యాన్ని పూర్తిగా తెలుసుకొని అందరి హృదయాలను లోతుగా సందర్శింపగల శ్రీహరి 'ఓ బ్రహ్మదేవా! ఘోరమైన ఈ నీ శరీరాన్ని వదలిపెట్టు' అని ఆనతిచ్చాడు. బ్రహ్మదేవుడు అలాగేనని తన శరీరాన్ని వదలి వేశాడు.

కొత్తబంగారంలో మణులు పొదిగిన అందెలు శబ్దిస్తున్న పాదపద్మాలు కలది, పట్టుచీరపై మొలనూలుకలది, ఇసుక తిన్నెలను పోలిన గొప్పపిరుదులుకలది; ఒకదానితో ఒకటి ఒరసికొంటూ ప్రకాశించే ఏనుగుకుంభస్థలములను పోలిన పెద్ద కుచముల భారంతో చలిస్తున్న నడుముకలది, మద్యపానం కలిగించిన మత్తుతో చలిస్తూ అప్పుడే వికసించిన అరవిందాలవంటి కనుదోయి కలది, కృష్ణపక్షం అష్టమినాటి చంద్రుని పోలిన ఫాలభాగం కలది, మదించిన తుమ్మెదలను పోలిన శిరోజాలు కలది, మృదువైన సంపెంగ పుష్పానికి సాటివచ్చే అందమైన ముక్కుకలది, చిరునవ్వులు చిందే చూపులుకలది, తామరలవంటి చేతులుకలది.

అలా అనదగిన సంధ్యారూపంతో ఒక విలాసవతి సాక్షాత్కరించింది. అప్పుడా రాక్షసులందరూ ఆమెను చూచి వెంటనే కౌగిలించుకొని తమలో తాము ఇలా మాట్లాడుకొన్నారు.
(రాత్రికి పగటికి మధ్యకాలం సంధ్య. సూర్యాస్తమయానికి పూర్వం మూడు గడియల కాలం, సూర్యోదయానికి ముందు ఐదు గడియలకాలం సంధ్యాకాలంగా చెప్పబడింది. మధ్యాహ్నసంధ్య కూడా ఉంది. త్రిసంధ్యలలో ధ్యానం చేయడం కనిపిస్తుంది. 'అహోరాత్రాభ్యామితి వా సంధ్యా' అనడంవల్ల అహోరాత్రాలచే సంధింపబడునది సంధ్య. పైన 'సంధ్యారూపంబు' అనే మాట సౌందర్యరూపం అనే అర్ధంలో వాడబడినట్లుంది.)

ఈ సుకుమారత్వం, ఈ యౌవనం, ఈ సౌందర్యవిధం, ఈ గాంభీర్యం, ఈ వైభవవిశేషం ఆలోచించి చూస్తే ఏ స్త్రీలకు ఉంటుంది? ఉండదు. ఇది చిత్రంగా ఉంది.

ఆమెను చూచి ఆ రాక్షసులందరూ ఇలా అనుకొన్నారు. "ఈ అందగత్తెను చూచినప్పటినుండి మనం కామభావంతో తన చుట్టూ తిరుగుతూ ఉండగా ఈమె మనస్సులో మన మీద ఇష్టం లేకపోవడానికి కారణం ఏమై ఉంటుంది?" అని అనేకవిధాలుగా అనుకొంటూ ఆ సంధ్యాసుందరితో 
ఇలా అన్నారు.

ఓ అరటిబోదెలవంటి ఊరువులు కలదానా! నీ కులమేది? ఊరేది? ఎవరి కొమార్తెవు? ఇక్కడ ఇలా ఏకాంతంగా ఎందుకు తిరుగుతున్నావు? మాకు తెలియజెప్పు.

అందమైన నీ రూపసంపదతో ఒప్పుచున్న పుణ్యభూమిలో నీ వలపులో బంధింపబడి భరించలేని వారమైనాము. అలాంటి మమ్మల్ని నీవు ఎందుకు దగ్గర తీసుకోవడంలేదు? మాకు మన్మథబాధ ఎక్కువయిందికదే!
(ప్రమదాకృతి ధరించిన ఆ సంధ్య (సంధ్యాసుందరి) సౌందర్య సంపదతో ఈ భూమి ఎంతో పుణ్యం చేసుకొన్నది. అంటే ఆమె ఈ భూమిపై ప్రభవించడంవల్ల భూమి ఎంతో పుణ్యవంతమైందని భావం.

పుష్పాస్త్రుడు= పువ్వులు బాణములుగా కలవాడు మన్మథుడు.

మన్మథుడికి పంచబాణుడని మరొకపేరుంది. అంటే ఐదురకాల పుష్పాలు బాణాలుగా కలవాడని అర్ధం. అరవిందం, అశోకం, చూతం, నవమల్లిక, నీలోత్పలం- అనేవి ఆ ఐదుపుష్పాలు.)

ఇంకా వాళ్లు ఆమె అందాన్ని వర్ణించడానికి అలవిగాక అంటే మాటలురాక ఆలోచిస్తూ,

పెద్దవైన కుచాలభారంవల్ల సంకోచించిన నడుము ఆకాశంకాగా; మృదువైన చిగురాకువంటి చేతిలో ప్రకాశించే పూలచెండు అస్తమించే సూర్యబింబంకాగా; మృదువై నల్లగా మెరుస్తున్న విరివియైన కొప్పుముడి చీకటిగుంపుకాగా, స్వచ్చమైన, ఇంపైన భావాలను స్ఫురింపజేసే చూపులు నక్షత్ర  సమూహంకాగా; శరీరంపై పూసుకొన్న అంగరాగం అనగా మంచిగంధం సంధ్యారాగం కాగా; స్త్రీరూపం ధరించిన ఆ సంధ్యా సుందరిని మనస్సులలో మోహావేశం ఎక్కువైన ఆ రాక్షసులందరూ చుట్టుముట్టి మళ్లీ ఇలా అన్నారు.

నూతనంగా వికసించిన తామరపువ్వువంటి ముఖం కల ఓ సంధ్యా సుందరీ! పద్మం ఒకే స్థలంలో ఉంటుంది. అది ప్రసిద్ధంగా తెలిసినవిషయం. కానీ నీపాదాలనే పద్మాలు భూమిపై అనేకస్థలాలలో ప్రకాశిస్తున్నాయి కదా!
(ఆమె పాదపద్మాలు అనేక ప్రదేశాల్లో కనిపిస్తున్నాయి అంటే ఆమె అనేక ప్రాంతాల్లో సంచరిస్తూ ఉన్నదని అర్థం. ఆమె పాదాలే పద్మాలుగా మారినట్లు చెప్పడంలో ఆమె అతిలోకసౌందర్యం ద్యోతకమవుతున్నది.)

అని అంటూ మనస్సులలో ప్రేమలు అధికంగా కలగగా ఆ రాక్షసులందరూ ఆ సంధ్యాసుందరిని పట్టుకొన్నారు. ఆ దృశ్యం చూచిన బ్రహ్మ మనస్సులో ఎంతో సంతోషపడినాడు.

అక్కడ బ్రహ్మ తన చేతిని వాసన చూశాడు. అప్పుడు గంధర్వులు, అప్సరసలు పుట్టారు. వెంటనే బ్రహ్మకూడా తన శరీరాన్ని వదలివేశాడు.
(గంధర్వులను, అప్సరస్త్రీలను దేవతాభేదాలుగా అమరకోశం పేర్కొన్నది.

విద్యాధరోప్సరో యక్షరక్షోగంధర్వకిన్నరాః
పిశాచో గుహ్యకస్సిద్దో భూతో
మీ దేవయోనయః

సువాసనను పొందినవారు గంధర్వులు (సౌరభం గంధం అర్వన్తి గంధర్వాః), నీటిలో పుట్టినారు అప్పరసలు (అద్బ్యఃసరన్తీతి అప్సరసః), రంభామేనకాదులు అప్సరసలు.

వెన్నెలరూపం పొందిన ఆ శరీరాన్ని విశ్వావసువు మొదలగు అగ్రేసరులైన గంధర్వులు, అప్సరసలు గ్రహించారు. మరలా బ్రహ్మ కునుకుపాటు, ఉన్మాదం, ఆవులింత, నిద్రలతో కూడిన శరీరం ధరించి పిశాచ గుహ్యక సిద్ధభూత సమూహాలను పుట్టించాడు. వాళ్లు దిగంబరులై వెండ్రుకలు విరబోసుకొని ఉండడం చూచి బ్రహ్మ కన్నులు మూసుకొని ఆ శరీరాన్ని వదలివేశాడు. అలా వదలివేయబడిన శరీరాన్ని పిశాచ గుహ్యకాదులు తీసుకొన్నారు. తరువాత బ్రహ్మ తనను అన్నవంతుడుగా భావించి అదృశ్యశరీరుడై పితృదేవతల సాధ్యుల సమూహాలను పుట్టించాడు. వాళ్లు తమను పుట్టించిన అదృశ్యశరీరానికి కార్యమైన దేవభావాన్ని గ్రహించారు. ఆ కారణం చేత పితృగణాలను, సాధ్యగణాలను ఉద్దేశించి హవ్యకవ్యాలను సమర్పిస్తారు.
(బ్రహ్మ తనను అన్నవంతునిగా భావించాడు అంటే జ్ఞానవంతునిగా అనుకొన్నాడని అర్థం. అంటే లోకజ్ఞానమంతా పొందినవాడని అర్ధం. బ్రహ్మ సృష్టిక్రమాన్ని ఏర్పరచే పనిలో ఉన్నాడు కాబట్టి ఆయనకు లోకజ్ఞానం అవసరం. సృష్టిలో ఏయే ప్రాణులను ఎలా యెలా సృష్టించాలో తెలియడం లోకజ్ఞానం. 'అన్నం' అంటే దేనిని తిని ప్రాణిబ్రతుకుతుందో అది. ఆహారం అని సాధారణార్థం. అనాత్మ ప్రపంచమని విశేషార్ధం. దీనివల్లనే జ్ఞానం కలుగుతుంది. అందువల్ల జ్ఞేయప్రపంచమంతా 'అన్నం' అనే మాటద్వారా వ్యక్తమవుతుంది.

శ్రాద్ధం - శాస్త్రోక్తంగా నిర్వహించే పితృకర్మ శ్రాద్ధం. ఆబ్ధికం అని కూడా దీనికి పేరు. మృతులైన పితరులకు పిండప్రదానాలు చేయడం శ్రాద్ధక్రియ.

హవ్యం - దేవతలకు సమర్పించే అన్నం. అంటే దేవతలను ఉద్దేశించి అగ్నిలో సమర్పించే అన్నమని అర్థం.

కవ్యం - పితృదేవతలకు సమర్పించే అన్నం.

'హవ్యకవ్యే దైవపైత్రే అన్నే' - అని అమరకోశం చెపుతున్నది. దేవతలకు, పితృదేవతలకు సమర్పించే అన్నానికి హవ్యమని, కవ్యమని పేర్లు).

సజ్జనస్తుతుడవైన ఓ పరీక్షిన్మహారాజా! విను. బ్రహ్మ నేర్పుతో అదృశ్యశక్తివల్ల నరులను, సిద్ధులను, విబుధులను, కిన్నరులను పుట్టించాడు. వాళ్లకు తిరోధానము అనే పేరుగల శరీరాలను ఇచ్చాడు. తరువాత బ్రహ్మ తనకు ప్రతిబింబమైన శరీరంనుండి కిన్నరులను, కింపురుషులను పుట్టించాడు. వాళ్లు బ్రహ్మదేవుని ప్రతిబింబాలైన శరీరాలను ధరించి ఇద్దరిద్దరు జతగూడి బ్రహ్మాదేవునికి సంబంధించిన గీతాలను గానం చేస్తూ ఉన్నారు. తరువాత బ్రహ్మ ఆత్మలో-
(మాయమైపోవడం, అంతర్థానమైపోవడం అనేది ఒక శక్తి ఈ శక్తి దేవతలకు ఉంటుంది. ఇలా మాయంకాగలిగిన శక్తికి తిరోధానశక్తి అనిపేరు. బ్రహ్మతనకు ప్రతిబింబంగా ఉన్న శరీరం నుండి కిన్నరులను కింపురుషులను సృష్టించడంవల్ల దేవతలతోపాటు వీళ్లకూ తిరోధానశక్తి ఉంటుంది.

అశ్వముఖం కలిగినవారు కిన్నరులు. 'కించిత్పురుషః కింపురు
షః' అనే వ్యుత్పత్తిని బట్టి కొద్దిగా పురుషాకృతి కలిగినవారు కింపురుషులు. విశేషంగా తెలిసినవారు విబుధులు.)

బ్రహ్మ తాను చేసిన సృష్టి వృద్ధి చెందకపోవడంవల్ల కోపపడినాడు. ఎంతో బాధపడినాడు. తన కాళ్లూ చేతులూ గట్టిగా విదిలించాడు. అలా విదిలించడంవల్ల రాలిన వెండ్రుకలన్నీ సర్పాలుగా మారినాయి.

బ్రహ్మ తన పని నెరవేరినట్లు భావించాడు. తన ఆత్మలో సంతోషపడి సమస్తలోకాలలో పవిత్రులైనవారు, త్రిలోకాలలో శ్రేష్టులైనవారు అయిన మనువులను సృష్టించాడు.
(మన్వంతరాలు ఎవరి పేరుమీద ఏర్పడ్డాయోవారు మనువులు, బ్రహ్మ లోకపాలనకోసం మనువులను సృష్టించాడు.)

అలా మనువులను పుట్టించి బ్రహ్మ వాళ్లకు పురుషరూపమైన తన శరీరాన్ని ఇచ్చాడు. ఆ మనువులు తమకంటె ముందుగా సృష్టింపబడిన వాళ్లతో కలిసి బ్రహ్మతో ఇలా అన్నారు. 'ఓ బ్రహ్మదేవా! సకలలోకాలకూ సృష్టికర్తవైన నీవు చేసిన ఈ విశాలమైన, మంగళకరమైన సృష్టి ఎంతో ఆశ్చర్యకరంగా ఉంది. యజ్ఞాది క్రియలన్నీ మనువులను సృష్టించడంవల్ల ప్రశంసనీయమైనాయి. యజ్ఞక్రియలలో సమర్పింపబడే హోమద్రవ్య భాగాలను నాలుకలతో చవిచూచే అవకాశం మాకు కలిగింది' అంటూ అధికమైన సంతోషం పొందుతూ బ్రహ్మదేవుని ప్రస్తుతించారు.
(మనువు మొదటి పాలకుడు. మనువుకు ప్రజాపతి అని కూడా పేరు. ఒక మనువు పాలనాకాలానికి మన్వంతరం అనిపేరు. 71 మహాయుగాలు ఒక మన్వంతరం. మనువులు 14 మంది ఉన్నారు. ప్రతి మనువు పేరుమీద మన్వంతరం ఏర్పడుతుంది. స్వాయంభువుడు, స్వారోచిషుడు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షుషుడు, వైవస్వతుడు, సూర్యసావర్ణి, దక్షసావర్ణి, బ్రహ్మసావర్ణి, రుద్రసావర్ణి, ధర్మసావర్ణి, ఇంద్రసావర్ణి, భౌమ్యసావర్ణి - అని పదునలుగురు మనువులు. ఆరు మన్వంతరాలు గడిచిపోయాయి. ప్రస్తుతం ఏడవ మన్వంతరమైన వైవస్వత మన్వంతరం జరుగుతూ ఉంది. వైవస్వత మన్వంతరంలో 27 మహాయుగాలు గడచిపోయాయి. ప్రస్తుతం కలియుగం ప్రథమపాదం నడుస్తున్నది. పదునాలుగు మన్వంతరాల కాలం బ్రహ్మకు ఒకరోజుతో సమానమవుతుంది.)

మనువులను సృష్టించిన తరువాత బ్రహ్మ శ్రేష్ఠమైన తపస్సు, యోగం, విద్య, సమాధులతో కూడిన ఋషివేషం ధరించి, ఇంద్రియాలతో కూడిన ఆత్మస్వరూపుడై ఋషుల సముదాయాన్ని సృష్టించాడు. వాళ్లకు తన శరీరాంశాలైన సమాధి, యోగం, ఐశ్వర్యం, తపస్సు, విద్య, వైరాగ్యం అనే వాటిని క్రమంగా ఒక్కొక్కఋషికి ప్రదానం చేశాడు అని మైత్రేయమహర్షి తెలియజేయగా ఆ విషయాలను పరమానందంతో అందుకొన్న విదురుడు గోవిందుని పాదారవిందాలను మనస్సులో స్మరించి మళ్లీ మైత్రేయుని చూచి ఇలా అన్నాడు.
(తపస్సు, యోగం, విద్య, సమాధి ఇత్యాదులన్నీ ఆర్ష లక్షణాలు. ఈ లక్షణాలున్నవాడే ఋషి. హృషీకాత్ముండు - ఇంద్రియాలతో కూడిన ఆత్మస్వరూపుడు. స్వకర్మ ఫలాన్ని అనుభవించేది ఆత్మ. ఇంద్రియాల మూలంగా శరీరం చేసే కర్మలద్వారా ఏర్పడే ఫలానికి భోక్త ఆత్మ. ఇంద్రియాలు మూడు విధాలు.

1. కర్మేంద్రియాలు - వాక్కు, పాణి, పాదం, పాయువు (మలద్వారం), ఉపస్థ అనేవి.

2. జ్ఞానేంద్రియాలు - త్వక్కు (చర్మం), చక్షువు, శ్రోత్రం, జిహ్వ, ఘ్రాణం అనేవి.

3. అంతరింద్రియాలు - మనోబుద్ధి చిత్త అహంకారాలు.

యోగం - 'యోగశ్చిత్తవృత్తి నిరోధః' అనే పాతంజలసూత్రాన్ననుసరించి చిత్తవృత్తులను నిరోధించడం యోగం.

విద్య - ఆధ్యాత్మికవిద్యే విద్య. లౌకికంగా చతుర్దశవిద్యలు, అష్టాదశవిద్యలు ఉన్నాయి.

సమాధి - యమ నియమాది అష్టాంగాలలో చివరిది సమాధి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధులు అప్టాంగాలు. ఇంద్రియాలను జయించడం, అదుపులో ఉంచడం, అహింసను పాటించడం మొదలైనవి అష్టాంగాలలో ముఖ్యమైనవి.

సమాధి అంటే చక్కగా నిలపడం అని అర్ధం. స్థిరమైన మనోగతి సమాధి. మనస్సును ఆత్మరూపంతో ఏకంచేసి అందులోనే నిలిపి ఉంచడం సమాధి.)

సుగుణ సంపదగల ఓ మైత్రేయమహర్షీ! భువిలో స్వాయంభువమనువంశం సంప్రదాయాన్నీ ధర్మాన్నీ తప్పకుండా నడచుకొనేదని, ఆ వంశంలో సాంసారికవ్యవస్థతో అనగా స్త్రీపురుషసంయోగంతో సంతానం వృద్ధి పొందిందని చెప్పావు. అంతేగాక స్వాయంభువమనువుకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారనీ అన్నావు. ఆ ఇరువురు ఏడుదీవులతో కూడిన భూమినంతటినీ ధర్మమార్గాలు ఏమాత్రం తప్పకుండా పుణ్యప్రవర్తకులై ఎలా పాలించారు? ఓ మునీంద్రచంద్రమా! వాళ్ల చరిత్రనంతటినీ దయార్ద్రబుద్ధితో నాకు అర్ధమయేటట్లు చెప్పు.
(మిథునక్రియ అంటే స్త్రీపురుష సంయోగం. స్త్రీ పుంసౌ మిథునం ద్వంద్వం' అని అమరకోశం చెపుతుంది. దీన్ని బట్టి 
స్త్రీ పురుషుల జంట మిథునం. మిథునానికి సంబంధించినది మైథునం. ఈ మాటకు స్త్రీసంగమని అర్ధం. మైథునమే మిథునక్రియ. మిథునమంటే స్త్రీ పురుషుల జంట అని చెప్పినపుడు ఆ స్త్రీ పురుషులు ఎవరో ఎవరో కాకూడదు. వాళ్లు భార్యాభర్తలుగానే ఉండాలి. భార్యాభర్తలనే మిథునమనాలి. భార్యాభర్తలైనవారి సంగమంవల్లనే వంశవృద్ధి జరగాలని శాస్త్రవిధి. భారతీయ వివాహవ్యవస్థ సత్సంతానం కోసమే ఏర్పాటైంది. దీనివల్ల వంశవృద్ధి, తద్ద్వారా ప్రపంచవృద్ధి జరుగుతుంది. సత్సంతానం ఉత్తమ పౌరులుగా వంశాభివృద్దికి కారణమవుతుంది. అందువల్ల మిథునక్రియ భారతీయ వివాహవ్యవస్థలో ఒక పవిత్రకార్యం. మిథునేతర సంయోగం అవాంఛనీయం, పాప పంకిలం.

సప్తద్వీపాలు - చుట్టూనీళ్లు ఉన్న భూమిని 'ద్వీపం' అంటారు. విశ్వంలో అలాంటి ద్వీపాలు ఏడు ఉన్నాయి. 1. జంబూద్వీపం, 2. ప్లక్షద్వీపం, 3. శాల్మలీద్వీపం, 4. కుశద్వీపం, 5. క్రౌంచద్వీపం, 6. శాకద్వీపం, 7. పుష్కరద్వీపం ఈ ఏడుద్వీపాలలో భారతదేశం జంబూద్వీపంలో ఉంది.)

అంతేకాకుండా ఆ స్వాయంభువ మనువు అదృష్టజాతక లక్షణాలతో కూడిన తన కొమార్తె దేవహూతి అనే కన్యారత్నాన్ని కర్థముడనే ప్రజాపతికి ఇచ్చి ఏ విధంగా వివాహం చేశాడు? ఆ దేవహుతివలన మహాయోగీశ్వరుడైన క
ర్థమప్రజాపతి ఎలా సంతానాన్ని పొందాడు? అదీగాక ఆ కర్థమప్రజాపతి తన పుత్రిక రుచి అనే కన్యను దక్షప్రజాపతికిచ్చి వివాహం చేశాడని చెప్పావు. ఆ రుచియందు దక్షప్రజాపతి ప్రజలను ఎలా సృష్టించాడు. ఈ విషయాలన్నీ అర్థమయ్యేటట్లు వివరంగా తెలియజేయుమని విదురుడు మైత్రేయుని అడిగాడు. అపుడు మైత్రేయుడు ఇలా అన్నాడు.
(స్రష్టా ప్రజాపతి ర్వేధా విధాతా విశ్వసృడ్విధిః అని అమరకోశంలో బ్రహ్మకు పలు పేర్లున్నాయి. ఈ పేర్లలో ప్రజాపతి ఒకటి. ప్రజలకు పతి అని ఆ మాటకర్థం (ప్రజానాం పతిః). బ్రహ్మ ముందు మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడు, దక్షుడు, భృగువు, నారదుడు అనే పదిమందిని సృష్టించి వారిద్వారా ప్రజాసంతతిని వృద్ధిచేసినట్లు పురాణాలు చెపుతాయి. వీళ్లను బ్రహ్మ లేక ప్రజాపతి అని కూడా అనడం ఉంది. వీళ్లలో దక్షప్రజాపతి ఒకడు.

కర్థముండు భగవదనుజ్ఞ వడసి దేవహూతిని బెండ్లియాడుట

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

Saturday, February 21, 2026

The Battle Between Boar Varaha Avatar and Hiranyaksha - హిరణ్యాక్షుండు యజ్ఞవరాహంబగు హరినెదిరించి పోరుట

హిరణ్యాక్షుండు యజ్ఞవరాహంబగు హరినెదిరించి పోరుట

నారదుడు పాతాళానికి పొమ్మని చెప్పగానే హిరణ్యాక్షుడు అగ్గిలాగ మండి పడ్డాడు. విష్ణువుతో తలపడి తీరాలని భావించి పెద్దగద నొకదాన్ని చేత తాల్చాడు. తన భుజబలాన్ని ప్రదర్శించాలని విర్రవీగుతూ భీకరరూపంతో పాతాళానికి వెళ్ళాడు.

హిరణ్యాక్షుడు పాతాళం ప్రవేశించి నీటి మధ్య

సురవైరియగు హిరణ్యాక్షుడు పాతాళంలో స్వామిని నిగాగా చూచాడు. ఆయన విస్తారమైన కోరలతో వెల్గుతున్నాడు. భూమిని ఉద్దరించటానికి పూని ఉన్నాడు. మొయిలువన్నెతో నిక్కపొడుచుకున్న రోమాలతో యజ్ఞవరాహరూపాన్ని ధరించిన దేవవిభుణ్ణి చూశాడు.

హిరణ్యాక్షుడలా ఎత్తి వచ్చిన సందర్భంలో 'సూకరాకృతిధరించిన' శ్రీహరి కూడా

మహావిష్ణువు తామరకాంతిని గుత్త బుచ్చుకొన్న తన చూపుల తీవ్రతచేత రక్కసుని శారీరకవిజృంభణాన్ని ఒక్కపెట్టున మటుమాయం చేశాడు.

అప్పుడా యజ్ఞవరాహస్వామి అపారవిక్రమంతో విచ్చలవిడిగా చక్రభ్రమణం చేస్తున్నాడు. ఆ విహారం ఎదురులేనిది.

ఆ ఆదివరాహం రాక్షసుని గుండెలు గుభేలు మనేట్లు యుద్ధోత్సాహంతో కొంతసేపు ముట్టెతో అంచులు మూలాన్ని సోకేటట్లు కులపర్వతాల్ని చిమ్మింది. బ్రహ్మాండభాండం పగిలి చిల్లులు పడేట్లు కొమ్ములతో జీరాడింది. సప్తసాగరాలు బురదలాగ గజిబిజి అయ్యేట్టు తనగిట్టలతో ఇంకిపోయేట్లు గోకుతుంది. తన తోకను తిప్పుతూ చంద్రుణ్జీ సూర్యుణ్ణీ ఒక మూలకు నెట్టివేస్తున్నది. గునగున నడుస్తుంది. ఊపిరి బిగబట్టి ఎగిసిపడుతుంది. ఎగిరి దాటుతుంది. విజృంభిస్తుంది. పైకొంటుంది. బొరకలుపడేట్లు నేలని బరుకుతుంది.

ఆ తర్వాత ఇంకా,

ముట్టెపై భూమిని ధరించి కళ్ళల్లో నిప్పులు చెరుగుతూ ఆ యజ్ఞవరాహం రక్కసునికి ఎదురుపడింది. ఆ రక్కసుడు దాన్ని చూచి 'ఇది అడవిజంతువు గదా జలచర మెట్లైందో' అనుకొన్నాడు.

'వనచరం జలచరమైందే' అని సంభ్రమాశ్చర్యాలు పొందిన హిరణ్యాక్షుడు, రాక్షసులపొగరు అణచగల ఆ యజ్ఞవరాహరూప మెత్తిన విష్ణువుతో ఇట్లన్నాడు.

ఓ తెలివిలేని వరాహమా! నేను బ్రహ్మవల్ల రసాతలగతమైన ఈ భూమిని వరదానంగా పొందాను. ఇది ఎప్పటికైనా నాదే. అని రాక్షసుడు విష్ణువుతో అన్నాడు.

ఓయీ! నీవు భూమిని లేపుకొని పోవద్దు. ఇక్కడే వదలిపెట్టు. కాదు కూడదని పెకలించి తీసికొని పోవాలని ప్రయత్నిస్తే నీ ప్రాణం తీస్తాను. నా మాట విను. ఎందుకు నీ కంత పట్టుదల?

ఏదో నీ మోసబుద్ధితో ఇప్పుడు ఈ భూమిని దొంగిలించుకొని పోవాలనుకున్నావేమో, దాన్ని చూస్తూ ఊరుకోను. నా భుజబలంతో నిన్ను అణచి మట్టు పెడతాను అన్నాడు అసురుడు.

ఓరీ! యోగమాయవల్ల దక్కిన మగతనం నీది. ఒక్కపెట్టున నీ బలాన్ని అణచివేసి, మా సంగడికాండ్రకు, సేవకులకు, మా కులానికంతటికి సంతోషం గొల్పుతాను. నీ బలం ఉడిగి నా గదదెబ్బ రుచి చూచిన నీ దేవతలెల్లరు బిక్కుమంటారు. చచ్చి చెడతారు అని ఇట్లు వదరుతున్న రక్కసుని మాటలు విని ఆ యజ్ఞవరాహస్వామి బ్రహ్మాదిసురలకు రాబోయే ఉపద్రవాన్ని పసిగట్టి, అప్పుడా భూదేవిని తన వాడికోరపై మోపి విలసిల్లాడు.

వరాహస్వామి రక్కసుని దుం
దుడుకు మాటలకు రెచ్చిపోయి 'గజరాజు భయభ్రాంతమైన తన ఆడఏనుగును పొదువుకొన్నట్లు' భూమిని ముట్టెపై నిల్పి విలసిల్లాడు.

వరాహస్వామి దంతకాంతులు ఆకాశాన్ని వెల్గిస్తున్నాయి. అప్పుడాయన పాతాళంనుండి బయలుదేరాడు. అంతభయంకరా కృతి ధరించిన ఆ విష్ణుమూర్తి వెనుక - రాక్షసుడు వస్తూ -

గజరాజును పట్టుకోబోయే మొసలిలాగ ఆ రక్కసుడు శ్రీమన్నారాయణుని వెంటబడ్డాడు. ఆ స్వామి సముద్రాన్ని తరించివస్తున్నాడు. గిట్టల్తో మేరునగాన్ని సైతం ఎగురమీటగలసత్తువగలవాడు. వరాహరూపాన్ని ఎత్తివున్నాడు.

ఇది అవమానమే అనుకోకుండ, సిగ్గువిడిచి, మోసంతో యుద్ధం చేసి, విజయాన్ని కైవసం చేసుకోవాలనుకొన్నావు. ఇక్కడేమో పిరికివానిలాగ కాలికి బుద్ధి చెప్పావు. ఇది వీరలక్షణమా? (కాదనిభావం).

హిరణ్యాక్షు డిలా ఎదిరించి మాట్లాడగా, శ్రీహరి మనసు కోపంతో ఉడికిపోతూ,

అప్పుడా వరాహస్వామి నీటిపై భూమిని నిల్పి దానికి ఊతగా, తనబలాన్ని అడ్డుపెట్టాడు. దేవతలు ఆనందించారు.

అప్పుడు బోరుమని పూలవాన కురిసింది. వైభవంగా సురభేరులు మ్రోగాయి. గంధర్వుల పాటలు విన్పించాయి. అచ్చరలేమలు ఆనందంగా నాట్యమాడారు.

యజ్ఞవరాహావతారుడైన ఆ శ్రీమన్నారాయణుడు బంగారుపోగులు, భుజకీర్తులు, హారాలు, కాళ్ళకు కడియాలు, వేళ్ళకు ఉంగరాలు మొదలైన ఆభరణాలు ధరించి అసురునితో తలపడడానికి సిద్ధమైనాడు.

చేతబుచ్చుకొని మణులు తాపిన సరికొత్త బంగారుకవచం ధరించిన రాక్షసుడు ప్రయోగించిన వాడిబాణాలు స్వామివారి అంతరింద్రియాల్ని సోకుతున్నాయి. వాడు చెలరేగి ముందుకువస్తుంటే, ఆయన కోపావిష్టుడయ్యాడు.

రాక్షసుని దురుసుమాటలకు, వేసిన వాడిబాణాలకు స్వామికి కోపం కల్గింది. కాని ఆయన నవ్వుతూ ఇలా అన్నాడు.

ఓరి దుష్టుడా! నీవు మహా దురహంకారివై నన్ను ఎల్లప్పుడు 'అడవిజంతువా!' అని కారుకూతలు కూస్తుంటావు. నీవన్నట్లే నేను అడవిమెకాన్నే. అయితే పొలికలని(యుద్ధభూమి)లో నా ధాటికి ఆగి నిల్చిన నీవంటి కుక్కల్ని ఈ రోజే మట్టుపెడతా.

ఓరీ దుర్మార్గుడా! నీకు సత్తావుంటే నాతో పోటొడ్డి యుద్దానికి సిద్ధపడు. నేటితో నీ కోర్కెను నెరవేరుస్తాను. అంతేగాని మాటిమాటికి నీ గొప్పలెందుకు చెప్పుకుంటావు?

ఓరీ రాక్షసాధమా! ఆ మాటలన్నీ కట్టిపెట్టి విను. యుద్ధకోవిదులైన ఎందరో మహాత్ములు మిత్తికోరల్లో చిక్కిన వారైనను నీ మాదిరి ఇలాగా తమగొప్పలు చెప్పుకోరు. ఎందుకు నీకీ సొంతపొగడ్తలు? అది వీరుల ప్రజ్ఞలవుతాయా? (కావని భావం)

అరె దేవ విరోధీ! ఇదిగో చూడు. పాతాళంలో వుందంటున్నావే - ఆ నిధిని మహాపరాక్రమంతో కైవసం చేసుకొంటాను. నన్నేదో సిగ్గులేని వానిగా నీ వంటున్నావు. కానిమ్ము,దాక్కొని నీతో కయ్యమాడుతాను. నీ గదను చూచి పరుగెత్తానంటున్నావు గదూ! సరే నన్నెదిరించి చూడు-నీ కోర్కె వేగంగా నెరవేరుతుంది.

ఓ రాక్షసా! నీవీ కాల్బంట్లకు నాయకుడవు. ఈ యుద్ధరంగంలో పోటుమగాడవై నన్నెదిరిస్తే తప్పక నీ ఉసురు తీస్తాను. నీ బలాన్ని అణచి వేస్తాను. నా పరాక్రమంతో నిన్ను హతమార్చి 'భూమిలో రక్కసులు లేకుండా చేస్తాను. ఇదే నా ప్రతిజ్ఞ' అన్నాడు వరాహస్వామి.

రక్కసికులంలో అధముడైన ఓరీ! యుద్ధరంగంలో నన్నెదిరించే మొనగాడవైతే రా. నీ పరాక్రమం, ధైర్యం, బలిమి ఉంటే ప్రదర్శించు. నీ స్నేహితుల కన్నీళ్ళు తుడవగల పోటు మానిసివైతే రా. నాతో తలపడు- ఈ వ్యర్థపు మాటలు ఎందుకు? (వదరుబోతు కూతలు మాని నాతో కయ్యానికి దిగుమని వరాహస్వామి రక్కసుని గద్దించాడు).

'నిన్నిక్కడే పాతిపెడతా' నన్నావు. నిజంగా నీ వంతటివాడవే. ఇదో ముందుగానీవు నీ ప్రియమైన బంధువులందరిని చూచిరా. యమలోకానికి కాపురం చేయటానికి పోవలసి ఉంటుంది. నీ ప్రియమైన బంధువులందరిని చూచిరా అని వరాహస్వామి రాక్షసుణ్ణి గేలి చేశాడు.

పద్మలోచనుడైన వరాహస్వామి 'యమపురి కేగుటకు సిద్ధంగా ఉండిమని గేలిచేయగానే ఆ రక్కసుడు కోపోద్రేకంతో రేగిన మనస్సుగలవాడై తోకద్రొక్కిన సర్పరాజులాగా మండి పడ్డాడు.

వరాహస్వామి పల్కులకు హిరణ్యాక్షుని అవయవాలన్నీ జలదరించాయి. వాడు బుసకొడుతూ, కోపావేశంతో రెప్పలు ముడివడిగా సాహసించి హరి నెదుర్కోడానికి ముందుకు వచ్చాడు.

ఆలాంటి వేళలో హిరణ్యాక్షుడు అతి భీకరాకారంతో, కోపంతో గదని ఝుళిపించి శ్రీహరిని కొట్టబోయాడు. హరి ఆ గద వేటుని తప్పించుకొని తన గదతో వాని గదను తుత్తునియలు చేశాడు. అప్పుడా రక్కసుడు దుర్మదుడై వేరొక గదతో స్వామిపై విజృంభించాడు.

హిరణ్యాక్షుడు ప్రయోగించిన గద వేటును తప్పించుకొన్నాడు వరాహస్వామి. తర్వాత తన గదాయుద్ధకౌశలంతో ఆ రాక్షసుని రొమ్ముపై ఒక్క బలమైన దెబ్బకొట్టాడు. ఆ గద తాకిడికి వాడు కొంతసేపు మతిదప్పిపడి, అంతలోనే తేరుకొని శత్రుహంతయైన శ్రీహరిపై తన గదను సారించాడు.

వరాహస్వామి హిరణ్యాక్షు లిర్వురు విజయేచ్చతో యుద్దానికి సన్నద్దులయ్యారు. వారిర్వురి కయ్యం ఉవ్వెత్తుగా లేచిన అలలతో కూడిన ఉత్తర దక్షిణ సముద్రాలు ఢీకొన్నట్లుంది. రెండు మదపుటేనుగులు తమ తొండాలతో తాడించుకొన్నట్లుంది. కోపావేశంతో రెండు పెద్దపులులు తలపడినట్లుంది. పోతరించిన రెండు ఎడ్లు రంకెలువేస్తూ కుమ్ములాడినట్లుంది. ఆ వీరులిర్వురు సింహాలవలె విజృభించి పోరు సల్పుతున్నారు. హిరణ్యాక్షుడు ఎడమనుండి చుట్టుకొని రాగా, వరాహస్వామి కుడినుండి చుట్టి, పిడుగుపాటును పోలిన కౌమోదకితో వాని రొమ్ముపై బలంగా కొట్టాడు. ఆ రాక్షసుడు దెబ్బసోకి స్పృహనుండి కోలుకొని శ్రీహరి నొసటిని గట్టిగా గాయపరిచాడు. ఇట్లా ఇరువురు నెత్తురు చిమ్మే శరీరాలతో పుష్పించిన అశోకవృక్షాల్ని తలపించారు. ఒకరిపై నొకరు మిడిసిపడుతూ, రోజుతూ, రొప్పుతూ, కొట్టుకుంటూ, ఒండొరుల రక్తం వాసన చూస్తూ, తిట్టుకొంటూ, గేలిచేస్తూ యుద్ధం చేస్తున్న సమయంలో, ఆ వేడుక చూడాలని బ్రహ్మ మునుల్ని సిద్ధ సాధ్యుల్ని తక్కిన దేవతల్ని వెంటబెట్టుకొని అక్కడికి వచ్చాడు. భూమాతకొరకై రక్కసునితో తలపడుతున్న యజ్ఞవరాహస్వామితో ఇట్లన్నాడు.

'ఓ దివ్యమంగళమూర్తీ! పరమాత్మా! ఈ దుర్మార్గుడైన రాక్షసుడు మేమిచ్చిన వరగర్వంతో లోకుల్ని బాధిస్తున్నాడు. ఇలాంటి దుశ్చరిత్రుని మట్టుపెట్టకుండ వదలటం మంచిది గాదు. వీనిని భూదేవికి శుభం కలిగించు అని బ్రహ్మ శ్రీవరాహస్వామిని వేడుకొన్నాడు.

"కళ్యాణదాయకా! పరమాత్మా! చిన్నపిల్లవాడు భయంకరమైన పాముని చేతపట్టి ఆడినట్లు, ఈ రక్కసుణ్ణి ఇంకా చంపకుండా ఉపేక్షించటం తగునా?” అని బ్రహ్మ అన్నాడు.

అంతేగాక, ఇంకా, మహాత్మా! 'అబిజిత్తు' అనే పేరుగల యీ కాలంలోనే ఈ దైత్యుని మట్టు పెట్టండి. ఈ ముహూర్తం తప్పితే అసుర సంధ్యాసమయం వస్తుంది. అప్పుడు మాయాబలశాలియైన వీనిని చంపటం తేలిక కాదు. అందువల్ల మంచివారిని కాపాడుట యందాసక్తిగల మీరు వీనిని యిప్పుడే మట్టుపెట్టండి.

(అభిజిత్తు : ఒక నక్షత్రం, రోహిణికి ప్రక్కనే ఉంటుంది. దక్షుని కూతురు. చంద్రునికి భార్య. అందరికంటెతానే చంద్రునికి అతి ప్రియమైన భార్యకావాలని తలంచి తపస్సుచేసింది. ఆ సమయంలో ఆమె స్థానంలో కుమారస్వామి 'అగ్నిదైవత్య'మనే వేరొక నక్షత్రాన్ని నిల్పాడు. 'అభిజిత్తు'ను శుభలగ్నంగా వైదికులు భావిస్తారు.

పగలు పదునాల్గు గడియలమీద రెండుగడియల కాలాన్ని అభిజిత్తు అంటారు. (శ, ర). సహజంగా నక్ష్మత్రాల సంఖ్య 27. అశ్విన్యాదులు. కాని కార్తాంతికులు 'అభిజిత్తు'ను 28వ నక్షత్రంగా గుర్తిస్తారు.)

బ్రహ్మ 'స్వామీ! అభిజిల్లగ్నంలోనే వీనిని చంప'మని చెప్పగానే అక్కడ మూగిన దేవతలు విని ఆనందించారు. అప్పుడా స్వామి ముఖపద్మం వికసించింది. ఆయన రక్కసుని కెదురై నిలిచాడు.

సహజంగా శ్రీమన్నారాయణుని కళ్ళు తెల్లదామరల్ని పోలి ఉంటాయి. కాని ఇప్పుడు కోపావేశం చేత కొత్తగా విచ్చిన ఎర్రదామరలను పోలివున్నాయి. ఆ స్వామి గొప్పగదతో రక్కసుని చెక్కిలిపై ఒక్క దెబ్బ కొట్టాడు. వాడు ప్రక్కకు తొలగిపోయాడు.

అప్పుడా దితిబిడ్డడైన హిరణ్యాక్షుడు పరుగెత్తిపోయి ఒక భయంకరమైన గదతో తన భుజబలాన్ని ప్రదర్శిస్తూ శ్రీహరి గదను మొత్తాడు- అది పోయి సముద్రంలో పడింది.

అంతలో ఏమిజరిగిందనగా...

తన గదతాకిడికి వరాహస్వామిగద సంద్రంలో పడింది. స్వామి నిరాయుధుడయ్యాడు. రాక్షసుడు యుద్ధనీతిని స్మృతికి దెచ్చుకొని స్వామితో పోరాడటం మానుకొన్నాడు. అప్పుడాకాశంలో దేవతల ఆర్తనాదాలు బోరుమన్నాయి.

ఆ రక్కసుని యుద్ధనీతికిని, వాని ప్రతాపాతిశయానికి వరాహస్వామి ఆశ్చర్యం చెందాడు. ఆయనలోకూడ ఉత్సాహం అతిశయించింది.

యజ్ఞవరాహస్వామి భూమిని ఉద్ధరించినవాడు. ఇక రక్కసునిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించాలనుకొన్నాడు. ఆ చక్రం దితి సంతానమనే అడవిని కాల్చివేయగల కాంతిగలది. చూపరుల జయ నాదంతో ప్రతిధ్వనించే సూర్యమండల సదృశమైంది. నిరంతరం శరణుజొచ్చిన వారిని కాపాడగలది. విశ్వమంతటికి రక్షణ నివ్వగలది.

ఆ వరాహస్వామి ఎత్తిన సుదర్శన చక్రం మధ్యాహ్న సూర్యమండలకాంతివంటి కాంతితో మిరుమిట్లుగొల్పింది. దాని నుండి ఎగిసిన మంటలతాకిడికి మదించిన శత్రువుల పరాక్రమమనే చీకట్లు పటాపంచలయ్యాయి. సహింప నలవికాని దాని 'కహ కహ' శబ్దం సముద్రఘోషనే అణచినట్లయింది.

దాని వైభవాన్ని దేవతలెల్లరు ప్రస్తుతించారు. దాని కాంతి యింతింత అని చెప్పలేము. దాని తేజస్సు రోదసినంతటిని ఆవరించింది. అది అతి వేగంగా వచ్చి ఆ యజ్ఞవరాహస్వామి కుడిభుజాన్ని అలంకరించింది. అప్పుడాయన చక్రధారియై దేవతలెల్లరు 'జయశబ్దం' చేస్తుంటే రక్కసునికి ఎదురు నడిచాడు.

హిరణ్యాక్షుడు తనకెదురుగా వస్తున్న చక్రధారిని చూచి, వీరభటుని లాగ ఎదిరించి నిలిచి, ఒక పెద్దగదతో ఆ స్వామిని కొట్టాడు.

హిరణ్యాక్షుడు సారించిన గదను వరాహస్వామి ఒక్కకాలితాపుతో పక్కకు నెట్టాడు. ఆయనలో ఆనందం పెల్లుబికింది. మొగంపై చిర్నగవు తాండవించింది.

రక్కసుని గదను అలవోకగా కాలితో తన్ని వరాహస్వామి వానితో ఇలాగ అన్నాడు.

"ఓరీ నీచరాక్షసా! గద చేతబుచ్చుకొని యుద్ధరంగంలో నన్నెదిరింప రారా?” అని వరాహస్వామి రక్కసుని పిలిచాడు. వా డా మాటకు తెగ గర్వించి తన గదని స్వామిపై ప్రయోగించాడు. అప్పుడా హరి గరుత్మంతుడు పామును పట్టుకొన్నట్లు పట్టుకొన్నాడు.

దితికుమారుడైన హిరణ్యాక్షునికి బలాఢ్యుడైన వరాహస్వామిని ఎదిరించడం సాధ్యం కాదని తెలుసు. అయినా వాడు గర్వంతో స్వామి నెదుర్కొన్నాడు.

అంతలో

అప్పుడా రక్కసుడు ప్రళయకాలాగ్నిజ్వాలవలె ధగధగ మెరుస్తున్న ఒక శూలం చేబూని యజ్ఞవరాహావతారుడైన శ్రీమహావిష్ణువుపై విసిరాడు - అది బ్రహ్మజ్ఞుడైన సద్బ్రాహ్మణునిపై ప్రయోగించే హింసాకర్మ యోగంవలె వ్యర్థమైపోయింది. అలా చచ్చుబడి వస్తున్న ఆ శూలాన్ని స్వామి 'ఇంద్రుడు వజ్రాయుధంచేత గరుడుని రెక్కల్ని ఛేదించినట్లు' ఒక్కవ్రేటున తన చక్రాయుధంచేత తుత్తునియలు చేశాడు.

ఆ సమయంలో తనశూలం సుదర్శన చక్రంచేత పతనమైంది. రాక్షసుడది చూచాడు

అప్పుడా హిరణ్యాక్షుడు కోపావేశంతో శ్రీహరిని ఒక్క పిడికిటిపోటు పొడిచాడు. పూలమాల తాకిడివల్ల గజరాజులా వరాహమూర్తి కలతచెందక విరాజిల్లాడు.

హిరణ్యాక్షుడు శ్రీయజ్ఞవరాహస్వామి పైన వేలకొలది మాయలు పన్నాడు. భూమినుండి లేచిన దుమ్ము చీకట్లు కమ్మినట్లయింది. ఆకసం నుండి మేఘాలు పెద్దపెద్దబండలు, పెంటప్రోవులు, మూత్రం, గబ్బుకొట్టే ఎముకలు, నెత్తురులను కురిపించాయి. అప్పుడు గొప్ప ఉపద్రవసూచకమైంది

ఇంతేకాదు.

ఆకాశంలో నిలబడిన భూతాలు, దయ్యాలు, స్త్రీ పిశాచాలు జుట్లు విరబోసుకొని, దిసమొలతో, కరకుకోరలతో, దవడలతో, ఎర్రని కండ్లతో దవళ్ళు తెరచుకొని శస్త్రా
స్త్రాలు తాల్చివున్నారు. యక్షదైత్య చతురంగబలాలతో కూడి పెడబొబ్బలు పెడుతున్నారు.

ఆ తర్వాత

ఆ వరాహేశ్వరుడు మూడు వేళల - (అనగా ఉదయ మధ్యాహ్న సాయం సంధ్యలలో) యజ్ఞపాదుడు. జగానికంతటికి భీతిని గొల్పే ఆ రక్కసుని మాయచేష్టల్ని అంతమొందించే ఒక అస్త్రాన్ని వానిపై విసిరాడు.

సూర్యకాంతివంటి కాంతి గల చక్రం భూమండలమంతా వ్యాపించి ఒక్కపెట్టున ఆ రాక్షసుడు పన్నిన మాయలన్నింటిని వాడు చూస్తుండగానే పటాపంచలు చేసింది.

తర్వాత ఇక్కడ దితి ఇంట ఏమి జరిగిందో చెపుతున్నాడు.

ఇక్కడ దితి తన భర్తయైన కశ్యపుని పల్కులు స్మృతికి దెచ్చుకొంది. తన కుమారుడైన హిరణ్యాక్షుని చావు ఆమె కళ్ళకు కట్టినట్లయింది. అప్పుడామె పయోధరాల నుండి నెత్తుటి చారికలుస్రవించాయి. (కన్నీటికి మారు, లేదా పాలకు బదులు- నెత్తురు స్రవించిందని భావం. ఇది దితి దుఃఖాన్ని ప్రతిబింబించింది.)

ఆ సమయంలో హిరణ్యాక్షుడు ప్రయోగించిన వందలకొలది మాయలు, చేసిన మేలు మరిచే వానికి చేసిన ఉపకారాలవలె శ్రీహరి పైన పనిచేయలేదు. నిష్ఫలమయ్యాయి. అయినప్పటికి ఆ అసుర పట్టువీడని వీరయోధునిలా హరిచెంతకు వచ్చి రెండుచేతులు సాచి ఆయన రొమ్ముమీద గుద్దాడు. అయితే ఆయన తప్పించుకొని ప్రక్కకు పోగా ఆ రక్కసుడు ఒక్క పిడిగుద్దు గుద్దాడు. కాని ఆ దనుజవైరి అలకచెందక భయంకరరూపంతో వజ్రతుల్యమైన తన అరచేత వాని మొలపై ఒక చరపు చరిచాడు. అంతట వాడు గిరగిర తిరిగి చూపుకోల్పోయి సోలిపడబోయాడు. ఎట్లో తేరుకొని చివరకు స్వామి ఎదుట నిలబడ్డాడు.

తనకోరలతో హిరణ్యాక్షుని రొమ్మును చీల్చినవాడును, వాడియైన గిట్టలుగలవాడును, బ్రహ్మాండమనే కుండను బ్రద్దలు కొట్టగలవాడును, జూలు గలవాడునునైన ఆ వరాహావతారునికి బలముడిగిన రక్కసుడు లొంగిపోయాడు.

ఇలా హిరణ్యాక్షుడు వరాహస్వామికి లొంగిపోగా.

శ్రీహరి తన వజ్రతుల్యమైన చేతితో రక్కసుని గూబ అదరగొట్టాడు. అది చూచి ఇంద్రాదులు సంతోషించారు. అప్పుడా హిరణ్యాక్షుడు కండ్లు తేలవేసి దీనుడై పెనుగాలి తాకిడికి కూకటివ్రేళ్ళతో కుప్పకూలే చెట్టులాగ నేలపై రాలిపడ్డాడు.
(యజ్ఞవరాహావతారక్రియ ఇంతటితో ముగిసింది. సనకాదులచే శాపగ్రస్తులైన జయ విజయులు భూలోకంలో రాక్షసులై జన్మించవలసి వచ్చింది. శ్రీహరి అనుగ్రహంవల్ల ఆ యిర్వురు ఆయనకు విరోధులుగా మూడు జన్మలెత్తి పోరు సలపాలి. హిరణ్యాక్ష హిరణ్యకశిపుల వధతో ఒక రాక్షస జన్మ ముగిసిపోతుంది. స్వామి వరాహావతారమెత్తి హిరణ్యాక్షుని వధించాడు. ఇక నరసింహాకృతి తాల్చి హిరణ్యకశిపుని చంపవలసి ఉంది- అంతటితో జయ విజయులకు ఒక్క రాక్షసజన్మ సమాప్తమౌతుంది.)

తర్వాత హిరణ్యాక్షుడు హరిదెబ్బకు నెత్తురు కారుతుంటే, వికారరూప మెత్తి, కనుగ్రుడ్లు పైకి ఉబికి కనపడగా, నిలబడి పండ్లు పటపట కొరుకుతూ పడి చచ్చాడు.

నేలపైకూలిన హిరణ్యాక్షుని చూచి బ్రహ్మాదిదేవతలు 'వీనికి ఏమి యీ దురవస్థ?' అని తలంచి ఆశ్చర్యపడ్డారు. తర్వాత ఇలా అన్నారు.

పరమయోగులు యోగమార్గంలో తమ పాంచభౌతికదేహాన్ని ఆ శ్రీమన్నారాయణుని స్మరిస్తూ పరిత్యజించాలని భావిస్తారు. అయితే ఇక్కడ ఈ రక్కసుడు ఆ స్వామి పిడికిటి దెబ్బతో చచ్చి ఆయన ముఖసందర్శన చేస్తూ ప్రాణత్యాగం చేశాడు. ఆతని మహిమ ఎంత గొప్పదో అని బ్రహ్మాదులు ఆశ్చర్యపడ్డారు.

ఆశ్చర్యంతో దేవతలిలా అనుకొన్నారు -

ఈ రక్కసులు మనస్సులో సమభావం గలవారు. సనకాదుల శాపంవల్ల ఇలా దౌర్భాగ్యజన్మని ఎత్తారు. ఇప్పుడు విష్ణువువల్ల వీరికి చావు కల్గింది. తర్వాతి జన్మల్లో వీరు నిరంతరం ఆ శ్రీహరి నిత్యవాసమైన వైకుంఠంలోనే ఉంటారు. ఇక వీరికి చావుపుట్టుక లుండవు.

ఆ యోగీంద్రులు అలా రక్కసుని అదృష్టాన్ని గాంచి ఆశ్చర్యచకితులయ్యారు. తర్వాత పవిత్రదేహం ధరించినవాడును, వికసించిన కమలాలవంటి కన్నులు గలవాడును, దేవతలు, మునులు, యోగులు మొదలైన వారిని రక్షించేవాడును, రక్కసులనే ఏన్గులకు సింహసమానుడును నైన శ్రీమన్నారాయణుని చూచారు.

హిరణ్యాక్ష వధను చేసిన శ్రీహరిని చూచి,

"పద్మాక్షా! ఈ భూలోకవాసుల మాయామర్మాలు నీకు బాగా తెలుసు. అసూయతో పగబట్టిన ఈ హిరణ్యాక్షుణ్ణి చంపావు. ఇకమీదట అందరికీ శుభం కలుగుతుంది." అని దేవతలందరు తమ నొసళ్ళపై చేతులుంచి గొప్పజ్ఞానంకలవాడు మరియు పుణ్యాత్ముడు అయిన శ్రీమన్నారాయణుని వినయంతో స్తుతించారు.

ఎల్లదేవతలు, మునులు, ఋషులు హరిని సుతించిన తర్వాత

యజ్ఞవరాహరూపధారియైన శ్రీహరి రక్కసుని చంపాక, బ్రహ్మ మొదలైన దేవతలు, మునులు ఆయన్ని ప్రస్తుతిస్తుంటే తన మనస్సులో ఆయన మహానంద మొందాడు. అందరికి ఉల్లాసం కల్గేట్లు అనుగ్రహంతో చూశాడు.

అదొక గొప్పవేడుక. దానికి గుర్తుగా అప్పుడు విష్ణువు వైకుంఠపురానికి తరలి వెళ్ళాడు. దేవతలభేరులు ముమ్మరంగా మ్రోగాయి. నేలపై పూలజల్లు కురిసింది. అగ్నిగుండాలు ధగధగ వెల్గాయి. సూర్యచంద్రమండలాలు దేదీప్యమానంగా ప్రకాశించాయి.

ఇది పవిత్రమైన కథ. బ్రహ్మ దీన్ని దేవతలకు చెప్పాడు. అదే కథని మైత్రేయుడు విదురునికి చెప్పటంవల్ల ప్రఖ్యాతమైంది.

ఈ కథను శుకమహర్షి మంచిమనస్సుతో పరీక్షిన్మహారాజుకు చెప్పాడు. సూతుడనే పౌరాణికుడు శౌనకాది మునులకు ఇదే కథని మనోజ్ఞంగా విన్పించాడు.

ఆ విధంగా మైత్రేయముని విదురునికి కథను చెప్పగా విని ఆయన సంతోషించాడు.

పుణ్యప్రదమైన ఈ చరిత్రను విన్నా చదివినా ప్రజలందరికి శ్రీహరి పాదసేవ, ఇహలోక పరలోకసౌఖ్యాలు, మరియు గొప్పపేరుప్రతిష్టలు చేకూరుతాయి.

మళ్ళీ సూతుడు శౌనకాదులతో ఇలా అన్నాడు.

"పరీక్షిత్తు శుకమహర్షిని చూచి మునీంద్రా! హిరణ్యాక్షుడు చనిపోయాక భూదేవి నిలకడను పాందిన విధాన్ని, స్వాయంభువమనువును పుట్టించిన తరువాత బ్రహ్మ సమస్తమైన పశుపక్ష్యాదుల్ని మానవుల్ని సృష్టించడానికి అనుసరించిన పద్ధతుల్ని మహాభక్తుడైన విదురుడు, శ్రీకృష్ణునకు అపకారం తలంచిన పాపాత్ములైన కౌరవులను వదలి వెళ్ళిపోయి, తన తండ్రియైన వేద వ్యాసునంతవాడై మనస్సు, వాక్కు శరీరం అనే త్రికరణాల్ని శ్రీకృష్ణపరమాత్మవశంచేసి, భక్తులు సేవిస్తుండగా పుణ్యతీర్థాటనవల్ల సమస్తపాపాలనుండి విముక్తుడై మైత్రేయమునిని ఏ యే ప్రశ్నలు అడిగాడో అవన్నీ తెలిసేట్లు వివరించమని పరీక్షిన్మహారాజు శుకమహర్షిని ప్రార్ధించాడు.

"వాక్చాతుర్యం గల మహాత్మా! సకల సృష్టికి మూలపురుషుడైన బ్రహ్మ ప్రజలను సృష్టించే మనువుల్ని పుట్టించాక ఇంకేమి సృజించాలనుకొన్నాడు? బ్రహ్మ సృష్టించిన మరీచి మొదలైనవారు బ్రహ్మాదేవుని ఆజ్ఞానుసారంగా ఈ విశ్వసృష్టి ఎలా చేశారు? వారు భార్యాసమేతులై ఎలాంటి సృష్టిచేశారు? భార్యా రహితులై ఎలాంటి సృష్టిచేశారు?" అని పవిత్రమైన మనస్సుగల విదురుడు మైత్రేయుని అడిగాడు.

"ఓ కరుణార్ద్ర హృదయా! వివేకజనస్తుత! మైత్రేయా! అందరూ తమలో తామైక్యం చెంది దేనిని, దేనిని సృష్టించారు? ఇవన్నీ మాకు వివరించి చెప్పండి" అని ప్రార్థించాడు.

చతుర్ముఖుండొనర్చు యక్షాదిదేవతాగణ సృష్టి దెలుపుట

Saptapadi Seven Steps in Indian Wedding - సప్తపది (ఏడడుగులు)

సప్తపది (ఏడడుగులు)

సప్తపది (ఏడడుగులు) అంటే హిందూ వివాహ వేడుకలో అత్యంత కీలకమైన, ముఖ్యమైన సంప్రదాయం. వధూవరుల వస్త్రాలను కొంగు ముడివేసి, ఈ ప్రక్రియను నిర్వహిస్తారు, ఇది వారి ఐక్యతకు సంకేతం. వధూవరులు అగ్ని సాక్షిగా ఏడు అడుగులు నడుస్తూ, ఏడు పవిత్రమైన ప్రమాణాలు లేదా వాగ్దానాలు చేస్తూ, జీవితాంతం కలిసి ఉంటామని, ఒకరికొకరు తోడుగా ఉంటామని చేసే ప్రతిజ్ఞ ఇది.

ఏడవ అడుగు పూర్తయిన తర్వాతే వివాహం పరిపూర్ణమైనట్లుగా పరిగణించబడుతుంది.

ఇద్దరు వ్యక్తులు, రెండు కుటుంబాలను ఒకటిగా చేసేదే వివాహ బంధం. హిందూ సంప్రదాయంలో జరిగే ప్రతి క్రతువుకూ ప్రత్యేకత ఉంది. కన్యాదానం పూర్తయిన తర్వాత ముహూర్తానికి జీలకర్ర-బెల్లం తలపై పెట్టించి, ఆ తర్వాత మాంగల్యధారణ చేయిస్తారు.

అగ్ని సాక్షి: అగ్నిని దేవతా స్వరూపంగా భావించి, దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు.

మాంగల్యధారణ పూర్తయిన తర్వాత వధూవరులకు కొంగుముడి కలిపి బ్రహ్మముడి వేస్తారు. వధువు చిటికెన వేలును పట్టుకుని వరుడు అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఏడు అడుగులు నడవడాన్ని "సప్తపది" అంటారు. దీనికి విశేష ప్రాధాన్యత ఉంది. భార్యాభర్తలు అత్యంత స్నేహంతో కలిసిపోయి, పరస్పరం గౌరవించుకుంటూ, అన్యోన్యంగా, ఆదర్శవంతంగా జీవించాలనేదే సప్తపదిలోని అంతరార్థం. అందుకే పెద్దలు వివాహబంధాన్ని ఏడడుగుల బంధం అంటారు. ఇందులో వేసే ప్రతీ అడుగుకీ ఒక్కో అర్థం ఉంది.

సప్తపది అర్థం (ఏడడుగుల ప్రాముఖ్యత):

1వ అడుగు: "ఏకమిషే విష్ణుస్త్యా అన్వేతు" 
ఆహారం, పోషణ మరియు శ్రేయస్సు కోసం (జీవితాంతం ఒకరికొకరు పోషించుకోవడానికి) విష్ణువు నిన్ను అనుసరించుగాక.

2వ అడుగు: "ద్వే ఊర్జే విష్ణుస్త్యా అన్వేతు" 
బలం, సంపద మరియు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తుల కోసం విష్ణువు నిన్ను అనుసరించుగాక.

3వ అడుగు: "త్రీణి ప్రతాయవిష్ణుస్త్యా అన్వేతు" 
వ్రతాలు, ధర్మం (సమృద్ధి మరియు ఆనందం) కోసం విష్ణువు నిన్ను అనుసరించుగాక.

4వ అడుగు: "చత్వారి మయోభవాయ విష్ణుస్త్యా అన్వేతు" 
ఆనందం, కుటుంబ సౌభాగ్యం మరియు బంధం బలోపేతం కోసం విష్ణువు నిన్ను అనుసరించుగాక.

5వ అడుగు: "పంచ పశుభ్యో విష్ణుస్త్యా అన్వేతు"
సంతానం మరియు కుటుంబ బాధ్యతల కోసం విష్ణువు నిన్ను అనుసరించుగాక.

6వ అడుగు: "షడ్ ఋతుభ్యో విష్ణుస్త్యా అన్వేతు" 
ఆరోగ్యం, సంతోషం మరియు ఋతువుల వలె (జీవితంలోని అన్ని కాలాల్లో) కలిసి ఉండటం కోసం విష్ణువు నిన్ను అనుసరించుగాక.

7వ అడుగు: "సప్తభ్యో హోత్రాభ్యో విష్ణుస్త్యా అన్వేతు" 
మైత్రి, నమ్మకం మరియు ఏడు జన్మల బంధం (సహవాసం) కొఱకు విష్ణువు నిన్ను అనుసరించుగాక.

ఈ వేడుకలో భాగంగా వధూవరులు ఒకరికొకరు సఖ్యతతో, అన్యోన్యంగా, అర్థనారీశ్వర తత్వంతో జీవిస్తామని ప్రమాణం చేస్తారు.

పెళ్లంటే... రెండు మనసుల కలయిక, నూరేళ్ల సాన్నిహిత్యం...వైవాహిక జీవితంలో ప్రమాణాలు కట్టుబడి ఉంటే ఆ సంసారం స్వర్గం. ప్రమాణాలను అతిక్రమిస్తే ఆ సంసారం నరకం. మానవజీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం వివాహం. ఆ సందర్భంలో వధూవరులతో చేయించే ప్రతి కార్యక్రమానికి ప్రాధాన్యత ఉంది. జీవితంలో ఒకరితో ఒకరిని ఎక్కువకాలం కలిపి ఉంచేది భార్యాభర్తల బంధం. ఆ బంధం పటిష్టంగా ఉండటానికి పెద్దలు కొన్ని మంత్రాలను నిర్దేశించారు. వాటినే లౌకికంగా పెళ్లినాటి ప్రమాణాలని చెబుతారు. ఆప్రమాణాలను త్రికరణశుద్ధిగా ఆచరించిన దంపతుల సంసారం మూడుపువ్వులు, ఆరుకాయలుగా వర్థిల్లుతుంది.

వరుడు వధువుతో "ఏడడుగులతో నువ్వు నా ప్రాణసఖివి అయ్యావు. ఎల్లప్పుడూ నువ్వు నా స్నేహాన్ని వీడవద్దు. ప్రేమగా ఉందాం. మంచి మనసుతో జీవిద్దాం. మన ఇద్దరం సమానమైన ఆలోచనలతో మెలగుదాం" అంటాడు. అప్పుడు వధువు "ఓ ప్రాణ సుఖుడా! నువ్వెప్పుడూ పొరపాటు చేయకుండా ఉండు. నేనూ ఏ పొరపాటు చేయక నీ వెంటే ఉంటాను. నువ్వు ఆకాశమైతే నేను భూమి, నువ్వు శుక్రమైతే నేను శోణితాన్ని, నువ్వు మనసైతే నేను మాట, నేను సామవేదమైతే నువ్వు నన్ను అనుసరించే రుత్వికుడివి మనిద్దరిలో వ్యత్యాసం లేదు. కష్ట సుఖాలలో ఒకరికొకరం తోడూ నీడగా కలిసి ఉందాం" అంటుంది.

"ఓ గుణవతీ! మన వంశాభివృద్ధికి, మనకు ఉత్తమస్థితి కలగడానికి, మంచి బలం, ధైర్యం, ప్రజ్ఞావంతులై వంశ హితాన్ని రక్షించగల, న్యాయమార్గం అనుసరించే ఉత్తమ సంతానాన్ని ప్రసాదించు" అని పురుషుడు చెబుతాడు.

చట్టపరమైన గుర్తింపు: హిందూ వివాహ చట్టం ప్రకారం, సప్తపది ముగిసిన తర్వాతే వివాహం పరిపూర్ణమవుతుంది.

నిత్య స్తోత్రావళి

Jaya and Vijaya were Born as Hiranyaksha and Hiranyakashipu - జయవిజయులు దితియందు హిరణ్యాక్ష హిరణ్యకశిపులై పుట్టుట

జయవిజయులు దితియందు హిరణ్యాక్ష హిరణ్యకశిపులై పుట్టుట

కశ్యపుని భార్యయైన దితి తనకు కలుగబోయే కొడుకులు దేవతల్ని ముప్పుతిప్పలు పెట్టగలరని అనుకొంటుండగానే నూరుసంవత్సరాలు గడిచాయి. తర్వాత ఆమెకు సమస్తలోకాల్ని విధ్వంసం చేయగల కుమారులు పుట్టారు.

దితి పుత్రులను పొందిన ఆ సమయంలో

దితికి లోకద్రోహులైన కొడుకులు పుట్టగానే భూమి కదిలింది. కులాచలాలు వణికాయి. సముద్రాలు అల్లకల్లోలమయ్యాయి. నక్షత్రాలు రాలాయి. ఆకాశం బద్దలైంది. దిగ్గజాలు కిందికి వంగిపోయాయి. మెరుపులు తళుక్కుమన్నాయి. పిడుగులు భూమిపై పడ్డాయి.
(మహేంద్రం, మలయం, సహ్యం, శుక్తిమంతం, గంధమాదనం, వింధ్యం, పారియాత్రం- అని ఈ ఏడింటికి కులపర్వతములని వ్యవహారం.)

హోమాగ్నులు పొగ చూరాయి. ఎదురు గాలులు వీచాయి. చెట్లన్నీ అడ్డదిడ్డంగా కూలిపడ్డాయి. గ్రహాలు, తారలు కాంతి విహీనమయ్యాయి. మబ్బులు నెత్తురు కురిశాయి. మెరుపులు మిరుమిట్లు గొల్పాయి. రాహువు అకాలంలో సూర్యుని చెరబట్టాడు. చిమ్మచీకట్లు ప్రబలాయి. కుక్కలు గొంతెత్తి అరచాయి. పట్టపగలే నక్కలు కూశాయి. పులుగులు బాధతో కూతలు పెట్టాయి. కన్నుల్లో నీరుగ్రమ్మగా దేవతా విగ్రహాలు కూలిపడ్డాయి.

ఆవుల పొదుగుల్లో రక్తం, చీము కారింది. గాడిదలు బోరున ఓండ్ర పెట్టాయి. ఏన్గుల చెక్కిళ్ళలో మదముడిగింది. గుర్రాల తోకల్లో నిప్పులు చూపట్టాయి.

దితి కడుపున శక్తిమంతమైన కుమారులు కల్గిన సమయంలో గుహలు మారుమ్రోగాయి. శుభ గ్రహాలు దుష్టగ్రహాలతో కలిసి అడ్డదారులు త్రొక్కి భమించాయి. (గ్రహగతి మారటం అశుభసూచకం)

ఓ బుద్ధిమంతుడవైన విదురా! ఒక్క సనకాదిమునులు తప్ప తక్కిన ప్రాణికోట్లన్నీ వెరపుగొల్పే ఉత్పాతాలను చూచి 'ఇది ప్రళయకాలమా? కాక సత్పురుషులను హింసించడానికి అవతరించిన రక్కసుల ఆగడమా?' ఏదో తెలియక భయగ్రస్తమయ్యాయి.

అంత భయంకరంగా జయ విజయులు రాక్షసులై పుట్టారు.

అంతభయంకరంగా జన్మించిన ఆ రక్కసు లిర్వురు కులపర్వతాలను పోలి ఉన్నారు. వారి బాహుబలం చెప్పనలవి కానిది. వారు తమ అడుగులతో చరచినప్పుడు నేల గడగడలాడింది. తాము ధరించిన రత్నాల భుజకీర్తులు, చెవిపోగులు, మొలనూళ్ళు, కడియాలు, ఉంగరాలు, కిరీటాలు, బంగారు గజ్జెలు మొదలైన ఆభరణాల నిగనిగలు జిగేలుమన్నాయి. ఆ ఇర్వురి దేహకాంతి సూర్యరశ్మిని వెలవెలబోయేట్లు చేసింది.

రాక్షస కుమారులిర్వురు మహాతేజోధనులై వెల్గుతున్న సమయంలో వారి తండ్రియైన కశ్యపుడు దితి ఇంటికి వచ్చి, బాలురను చూచి వారికి పేర్లు పెట్టాలనుకొన్నాడు.

ఆ కశ్యపబ్రహ్మ గర్భాధాన సమయంలో దితికడుపున తానుంచిన తొలి వీర్యంవల్ల కల్గిన కుమారునికి 'హిరణ్యకశిపుడు' అనే పేరుపెట్టాడు. దితిగర్భంనుండి ముందు పుట్టిన కుమారునికి 'కాంచనలోచనుడు' (అనగా హిరణ్యాక్షుడు) అనే పేరుపెట్టాడు. తర్వాత నిజపుణ్యభూమికి తరలిపోయాడు-
(రాక్షసులుగా జన్మించిన ఈ బాలుర ప్రసవగాథ విచిత్రమైంది. కశ్యపుడు దితిగర్భాన మొదటనుంచిన వీర్య శిశువు 'హిరణ్యకళిపుడు'. ప్రసవసమయంలో ముందు పుట్టిన కుమారుడు 'హిరణ్యాక్షుడు'. దితిగర్భపుష్పంలో నిక్షిప్తమైన కశ్యపుని వీర్యం రెండుగా విభజింపబడ్డప్పుడు మొదటి బీజం గర్భంలో వెనుకగాను, రెండవబీజం ముందుభాగంలోను ఉండటం జరిగింది. ప్రసవసమయంలో రెండవ బీజం తొలుతగా, మొదటిబీజం రెండవదిగా బహిర్గతమైనట్లు వివరణ చెపుతున్నది.

తొలుత పుట్టిన బిడ్డ హిరణ్యాక్షుడు. బంగారుకళ్ళవాడు - మలివిడత పుట్టిన బిడ్డ 'హిరణ్యకశిపుడు' బంగారుసింహాసనం కలవాడు అని కశ్యపుడు వారికి నామధేయం చేశాడు.

కవలలలో ముందు పుట్టినవాడు తమ్ముడు, వెనుక పుట్టినవాడు అన్నగా పరిగణించటం ఉన్నది.)

కుమారులకు పేర్లుపెట్టి కశ్యపుడు వెళ్ళిన తర్వాత, హిరణ్యకశిపుడు బ్రహ్మవల్లపొందిన వరగర్వంతో శత్రువుల భుజగర్వాన్ని అణచి దిక్పాలురందరిని జయించి, తనకెవ్వరు ఎదురులేకుండ చేసికొని మహాసంతోషంతో మెలిగాడు. అతని తమ్ముడు హిరణ్యాక్షుడు. వాడు మదించిన ఏన్గుతొండంతో దీటైన గదను చేత దాల్చి తన్నెరించగలపగవారు లేనందువల్ల సగర్వంగా భూలోక సంచారం చేసేవాడు. తర్వాత స్వర్గానికి పోయి అక్కడ కూడ తనతో యుద్ధం చేయడానికి సాహసించని దేవతలను చులకనచేసి, బ్రహ్మవలన వరంపొంది హితులతో కలిసి, శత్రువులను కలతపరిచేవాడు. మెడలో విష్ణుమాలిక ధరించి, కాళ్ళగజ్జెలు గల్లుగల్లు మంటుంటే, తనదేహకాంతితో దిక్కులన్నింటిని వెల్గిస్తూ ఉండేవాడు. వాని దాటికాగలేక దేవతలు తమ ఇండ్లను వదలి ఎక్కడికో పారిపోయారు. దేవతలు వదిలిపెట్టిన ఇండ్లు జిల్లేడు, ఉమ్మెత్త చెట్లకు నెలవులుగా మారిపోయాయి.

"అయ్యో! ఈ దేవతలు పరాక్రమహీనులై, తమ ఉపకరణాలను వదలిపెట్టి, విక్రమింపలేక, ఏంచేయాలో తోచక భయగ్రస్తులై పారిపోయారే!” అనుకొని ఆ మేరుపర్వతమంతధైర్యశాలి హిరణ్యాక్షుడు భుజదర్పంతో విర్రవీగి సముద్రంలో దూకాడు

దేవతల దైన్యస్థితిని తలపోస్తూ హిరణ్యాక్షుడు సముద్రంలో దూకగా.

వరుణదేవుని బలాలైన జలచరాలన్నీ హిరణ్యాక్షుని ఉరవడికి తట్టుకోలేక సాహసాన్ని కోల్పోయి, ఆ సముద్ర మధ్యభాగాన ఎక్కడో దాక్కున్నాయి.

దేవవైరియగు హిరణ్యాక్షుడు జలచరాల నిట్టూర్పులవల్ల సంచలించిన అలలను తన గదతో దట్టించి రూపుమాపాడు.

అంతేగాక ఆ హిరణ్యాక్షుడు పెక్కేండ్లు సంద్రం నడుమనే యథేచ్చగా సంచరించాడు. శత్రువుని మట్టుపెట్టే క్రీడతో స్వైరవిహారం చేశాడు. తర్వాత జలధినాయకుడైన వరుణుని విభావరినగరం వెళ్ళి అక్కడ హాయిగా కాలం గడుపుతున్న వరుణుని చూశాడు.

ఆ తర్వాత

సాగరాధిపతియు, పాతాళలోకపాలకుడునైన వరుణుని చూచి హిరణ్యాక్షుడు "ఓయీ! ఈ లోకంలో దిక్పతులందరికంటె నీవే మొనగాడవని, లోకం మెచ్చుకోదగిన పోటుమగాడవని అంటారు. అంతగొప్ప వీరుడవైతే ఇపుడు నాతో తలపడు. నీ భుజబలాన్ని నీ ప్రతాపాన్ని ఇప్పుడే అణచివేస్తా అని పరిహసించాడు. అప్పుడు వరుణుడు రక్కసుని గెలుపు, బలం, పరాక్రమాలతో, తన బలాన్ని పోల్చుకొని వానితో యుద్ధం చేయడానికి పూనక.

రక్కసునితో పోరుసల్పుటకిది తగిన సమయం కాదని తలంచి వరుణుడు ఓర్పు అనే నీటితో తనలో రగులుతున్న కోపాగ్నిని ఆర్పి, మెత్తగా ఆ హిరణ్యాక్షుని ఉద్దేశించి ఇట్లన్నాడు.

ప్రసుత్తం నేను మనశ్శాంతి గల్గి ఉన్నాను. యుద్ధం చేయరాదని నియమం పెట్టుకొన్నాను. కాబట్టి యుద్ధక్రీడకు నేను ఉత్సహించను. ఇప్పుడు నీ భుజబలాన్ని ఎదుర్కొని నిలువగల్గినవాడు 'ఒక్క విష్ణుమూర్తి తప్ప తక్కిన వారెవ్వరు ఎక్కడ కూడలేరు' అని వరుణుడు హిరణ్యాక్షుని ఉద్దేశించి అన్నాడు.

ఆ మహావిష్ణువు వైకుంఠంలోఉన్నాడు. ఆయన సాహసంతో యుద్ధం చేసి ఎందరో శత్రువుల్ని మట్టుపెట్టిన వీరుడని, అనిందితచరిత్రుడని జనం వేనోళ్ళ స్తుతిస్తోంది. నీతో పోరుసల్పగలడాయన. అంతటితో నీ కథ ముగుస్తుంది.

ఓరి బుద్ధిహీనుడా! యుద్ధరంగంలో పలాయనం చేయటం అపకీర్తి గదా అని అనుకోకుండా కాలికి బుద్ది చెప్పే పిరికిపందల నెదుర్కోవటం పౌరుషమవుతుందా? అదో ఆ వైకుంఠవాసుడు నీ పని చక్కపెట్టగలడు. ఆయనతో తలపడాలని ఉంటే వైకుంఠానికి పో. ఆ స్వామి నిరంతరం రక్కసులతో పెనగి విజేతగా ఉన్నాడు.

అంతేగాక, ఇంకా.

మహర్షులచే కొనియాడబడుతున్న ఆ శ్రీహరి నాల్గు యుగాలలో అవసరమైనప్పుడు మానవాకృతి ధరించి, భుజబలంతో దుష్టరాక్షసుల్ని మట్టుపెడుతుంటాడు.

(యుగములు : ఇవి నాల్గు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం.

1. కృతయుగం : ధర్మం నాల్గు పాదాలతో నడుస్తుంది

కాలపరిమాణం : 17,28,000 మానవసంవత్సరాలు

2. త్రేతాయుగం : ధర్మం మూడుపాదాలతో ఉంటుంది

కాలపరిమాణం : 12,96,000 మానవసంవత్సరాలు

3. ద్వాపరయుగం : ధర్మం రెండుపాదాలతో ఉంటుంది

కాలపరిమాణం : 8,64,000 మానవసంవత్సరాలు

4 కలియుగం : ధర్మం ఒకేపాదంతో ఉంటుంది

కాలపరిమాణం : 4,32,000 మానవసంవత్సరాలు)

ఓరీ రాక్షసా! నీవు ఆ నారాయణుణ్ణి ఎదుర్కొన్నావో కయ్యం సంగతి దేవుడెరుగును. నీ భుజబలం కాస్త సన్నగిల్లి నేలరాలిపోతావు. తర్వాత కుక్కల పాలవుతావు. ఇప్పుడు వెంటనే నీవు వైకుంఠానికి వెళ్ళితే, నీ సత్తా ఏమిటో తేలిపోతుంది. తర్వాత ఏమి జరుగుతుందో చెప్పటం దేనికి? (నీ చావు తప్పదని భావం.)

విష్ణువునెదుర్కొన పొమ్మని వరణుడు చెప్పగానే హిరణ్యాక్షుడు మహాకోపంతో మనస్సులో ఏ మాత్రం జంకులేకుండా ఆ దేవరక్షకుడు, దుర్మార్గుల నాశనం చేసేవాడైన విష్ణువుని తప్పక యుద్ధంలో ఎదిరిస్తానని పల్కి వైకుంఠ మార్గం పట్టాడు.

వైకుంఠ మార్గంలో పోతున్న హిరణ్యాక్షునికి నారదుడు కన్పించి "ఓ రాక్షసా! ఎక్కడికి పోతున్నావు?" అని అడిగాడు. అప్పుడా రాక్షసుడు ఆయనతో ఇట్లన్నాడు.

"నేను బొడ్డుదామరవాడును, అంతం లేనివాడును అగు లక్ష్మీధవుణ్ణి, యుద్ధరంగంలో ఎదుర్కొని అతణ్ణి చంపి నా రాక్షసకులానికి సంతోషం కల్గించాలని వైకుంఠనగరాభీముఖంగా సాగిపోతున్నా" నని హిరణ్యాక్షుడు నారదునితో అన్నాడు. ఆ నారదుడు వానితో ఇలా అన్నాడు-

"భుజపరాక్రమం కలవాడైన ఆ నారాయణుడు ఇప్పుడు వైకుంఠంలో లేడు. ఆయన భూమిని ఉద్ధరించాలని ఆదివరాహావతార మెత్తి పాతాళలోకంలో మోహరించి ఉన్నాడు. ఆయన్ని ఎదిరించే సాహసముంటే అక్కడికే పో. అక్కడే యుద్ధం చేయి" అని నారదుడు చెప్పాడు.

హిరణ్యాక్షుండు యజ్ఞవరాహంబగు హరినెదిరించి పోరుట

Kardama Created Self-Moving Aerial Mansion (Vimana) with Yogic Powers For his Wife - కర్దమప్రజాపతి యోగప్రభావంబుచే విమానంబు గల్పించి భార్యతో గూడి విహరించుట

కర్దమప్రజాపతి యోగప్రభావంబుచే విమానంబు గల్పించి భార్యతో గూడి విహరించుట ఈ విధంగా స్వాయంభువమనువు తన కుమార్తె దేవహూతిని కర్దమమునికిచ్చి పెండ్లి ...