పంచారామ క్షేత్రాలలో ద్రాక్షారామ ఆలయం భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లా, రామచంద్రపురం మండలం, ద్రాక్షారామం గ్రామంలో, గోదావరి నది తూర్పు ఒడ్డున ఉంది. ఈ ఆలయంలో ప్రధాన మూర్తి శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి.
వ్యుత్పత్తి శాస్త్రం
ఈ పట్టణాన్ని పూర్వం ధక్షతపోవన మరియు ధాక్షవాటిక అని పిలిచేవారు. దక్ష ప్రజాపతి అయిన దక్షుడు "నిరీశ్వర యాగం" అనే యజ్ఞం చేసిన ప్రదేశం ఇది. ఈ ప్రదేశం యొక్క పూర్వపు నామం 'దక్ష ఆరామం'. దీని అర్థం 'దక్ష నివాసం'. 'దక్ష ఆరామం' గా పిలువబడి కాలక్రమేణా అది ద్రాక్షారామంగా మారింది. ఈ ప్రదేశాన్ని జగద్గురు ఆది శంకరాచార్య మహాశక్తి పీఠ శ్లోకంలో 'మాణిక్యే దక్షవాటిక' 'ద్రాక్షారామ మాణిక్యాంబ దేవి' ని సూచించే దక్షవాటిక అని కూడా పేర్కొన్నారు. దక్షుడు 'నీరీశ్వర యాగం' చేసిన ప్రదేశాన్ని ఇప్పటికీ ఇక్కడ భక్తులు సందర్శిస్తారు.
ఈ నిరీశ్వర యజ్ఞానికి తన భర్తకి ఆహ్వానం లేకపోయినప్పటికీ పుట్టింటిపై ప్రేమతో ఆ యజ్ఞానికి వచ్చి అవమాన పడిన పరమశివుని సతి సతీదేవి ఆత్మాహుతి చేసుకున్న ప్రదేశం ఇదే. తన భార్యను అవమాన పరిచినందుకు గాను శివుడు వీరభద్రుడిని సృష్టించి దక్షుడి తల నరికించాడు.
సతీదేవి వియోగ వివశత్వం నుంచి శివుడిని బయటపడేయడం కోసం శ్రీ మహా విష్ణువు ఆమె శరీరాన్ని 18 ఖండాలుగా చేశాడు. ఆమె శరీర అవయవాలు పడిన ప్రదేశాలు అష్టాదశ శక్తిపీఠాలుగా అవతరించాయి.
ద్రాక్షారామం ఆలయాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఈ ఆలయం శివ పంచారామాలలో ఒకటి, 18 శక్తి పీఠాలలో ఒకటి. కనుక ఇది శివ క్షేత్రంగానూ, శక్తి క్షేత్రంగానూ ప్రసిద్ధి చెందింది.
ఆలయ చరిత్ర
ఆలయంలోని శాసనాలు 9వ మరియు 10వ శతాబ్దాల మధ్య తూర్పు చాళుక్యుల రాజు భీమునిచే నిర్మించబడినట్లు తెలుపుతున్నాయి. దేవాలయం యొక్క పెద్ద మండపాన్ని ఒడిశాకు చెందిన తూర్పు గంగా రాజవంశ రాజు నరసింగ దేవ I యొక్క కోడలు గంగా మహాదేవి నిర్మించారు. వాస్తుపరంగా మరియు శిల్పపరంగా, ఈ ఆలయం చాళుక్యుల మరియు చోళ శైలుల సమ్మేళనాన్ని ప్రతిబింబిస్తుంది.
ఈ ఆలయం చారిత్రాత్మకంగా ప్రముఖమైనది. ఈ ప్రాంతాన్ని పాలించిన తూర్పు చాళుక్యులు దీనిని నిర్మించారు. ఇది 892 CE మరియు 922 CE మధ్య నిర్మించబడిన సామర్లకోట (సామల్కోట్) లోని భీమేశ్వరస్వామి ఆలయానికి పూర్వం నిర్మించబడిందని నమ్ముతారు.
పురాణం
దక్షారామం దక్ష యజ్ఞం జరిగిన ప్రదేశంగా పరిగణించబడుతుంది. వీరభద్రుడు ఈ ప్రదేశంలో చేసిన విధ్వంసం మరియు మారణహోమం తరువాత శివుడు ఈ స్థలాన్ని పవిత్రం చేశాడు.
పూర్వం తారకాసురుడు అను రాక్షసుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేయగా, శివుడు సాక్షాత్కరించాడు. ఆ రాక్షసుడు శివుని ఆత్మలింగాన్ని వరంగా కోరగా శివుడు ఆత్మలింగాన్ని ప్రసాదించాడు. క్రూర స్వభావం కలిగిన ఆ తారకాసురుడు, ఆ లింగ శక్తి వలన దేవతలను, ఋషులను, సత్పురుషులను నానా ఇబ్బందులు పెట్టుచుండగా ఆ బాధలు భరించలేక వీరంతా విష్ణుమూర్తిని ప్రార్థించారు. అపుడు విష్ణువు ఆ లింగం తొలగితేగాని ఆ రాక్షసుని శక్తి నశించదనీ, ఈశ్వరుడి అంశతో జన్మించిన వానితో తప్ప మరెవ్వరి వలనా తనకు మరణం లేకుండా వరం పొంది ఉన్నాడని చెబుతాడు. మన్మథ ప్రేరేపణచేత పార్వతీ కళ్యాణం, అనంతరం 'కుమార సంభవం' జరుగగా, ఆ కుమారస్వామి రుద్ర గణములకు నాయకత్వం వహించి తారకాసురుడితో యుద్ధం చేసినప్పుడు, స్వామి విసిరిన బాణం ఆ ఆత్మలింగానికి తగిలి అయిదు ముక్కలై, అది భూమి మీద అయిదు చోట్ల పడ్డాయి. అవే పంచారామ క్షేత్రాలుగా అవతరించాయి. వాటిలో ఒకటి ద్రాక్షారామం.
ఆలయ స్వరూప విశేషాలు
ఇక్కడి మూలవిరాట్ శ్రీ భీమేశ్వర స్వామి స్వయంభుగా వెలసిన 14 అడుగుల శివలింగం, శుద్ధ స్ఫటికాకార లింగం. రెండు అంతస్తుల పాటు లింగం విస్తరించి ఉంటుంది. ఒక మెట్ల మార్గంతో గర్భగుడి పై అంతస్తుకు చేరుకోవచ్చు. ద్రాక్షారామంలోని శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. తెల్లవారుజామున లేత సూర్యకాంతి శివలింగంపై పడుతుంది. శివలింగం పైభాగంలో నల్లటి చారలు మనకు కనిపిస్తాయి. శివుడు అర్జునుడితో యుద్ధం చేసినప్పుడు వేటగాడి వేషంలో ఉన్నప్పుడు ధరించిన పులి చర్మానికి సంబంధించిన గుర్తులని భక్తులు నమ్మకం.
భీమేశ్వర స్వామి దేవాలయం 7–8 శతాబ్దాల మధ్య తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తొంది. ఆలయంలో "సప్త గోదావరి" అని పిలువబడే పుష్కరిణి ఉంది, ఇక్కడ సప్త ఋషులు ఏడు వేర్వేరు నదుల నుండి నీటిని తీసుకువచ్చారు. సప్త గోదావరి పుష్కరిణిలో ఉన్న చిన్న మంటపంలో సప్తఋషులను చూడవచ్చు. వ్యాసుడు నిర్మించిన కాశీ విశ్వేశర ఆలయాన్ని మరియు అగస్త్య మహర్షి పూజించిన అగస్త్యేశ్వర స్వామిని సందర్శించవచ్చు. ఆలయ ప్రాంగణంలో కూడా కొన్ని మంటపాలు అందుబాటులో ఉన్నాయి. ఆలయం చుట్టూ నాలుగు గోపురాలు మరియు ఆలయ ప్రాంగణం లోపల కాల భైరవ, వీర భద్ర మరియు వటుక భైరవ ఆలయాలు వంటి కొన్ని ఆలయాలను ఉన్నాయి.
మాణిక్యాంబా దేవి శక్తి పీఠం
ద్రాక్షారామ భీమేశ్వరాలయ ప్రాకారంలో ఈశాన్యంలో అష్టాదశ శక్తి పీఠాలలో 12వ శక్తిపీఠం మాణిక్యాంబ ఆలయం కొలువై ఉంది.
శ్రీ మాణిక్యంబా అమ్మవారు యావత్భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన అష్టాదశ శక్తి పీఠాలలో 12 వ శక్తిపీఠంగా వెలసింది.తెలుగుకు ఆ పేరు త్రిలింగ అన్న పదం నుంచి ఏర్పడిందని కొందరి భావన. ఆ త్రిలింగమనే పదం ఏర్పడేందుకు కారణమైన క్షేత్ర త్రయంలో ద్రాక్షారామం ఒకటి. మిగిలిన రెండు క్షేత్రాలలో ఒకటి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం కాగా, మరొకటి శ్రీశైలం. త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా, అష్తాదశ శక్తిపీఠాలలో ద్వాదశ పీఠంగా, దక్షిణ కాశీగా, వ్యాస కాశీగా ద్రాక్షారామానికి ప్రశస్తి ఉంది.
శాతవాహన రాజైన హాలుని కాలానికే ఈ ఆలయం ఉన్నట్లు లీలావతీ గ్రంథం అన్న ప్రాకృతభాషా కావ్యంలో పేర్కొన్నారు. ఈ ఆలయాన్ని, సామర్లకోట లోని భీమేశ్వరాలయాన్ని కూడా చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని చెబుతారు. అందుకే ఈ రెండు గుడులు ఒకే రీతిగా ఉండటమేగాక, రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయికూడ ఒకటేరకంగా ఉంటుంది. ఈ క్షేత్రాన్ని గురించిన ప్రశంస శ్రీనాథకవి భీమేశ్వర పురాణంలో వివరించాడు. దుష్యంతుడు, భరతుడు, నలుడు, నహషుడు ఈ స్వామిని అర్చించారని వ్రాశాడు. తిట్టుకవిగా ప్రసిద్ధి నందిన వేములవాడ భీమకవి "ఘనుడన్ వేములవాడ వంశజుడ, ద్రాక్షారామ భీమేశునందనుడన్.... " అని చెప్పుకొన్నాడు.
శ్రీ లక్ష్మీనారాయణుడు ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడిగా ఉన్నాడు. ద్రాక్షారామం త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా, పంచారామాల్లో ఒకటిగా, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రాన్ని గురించి శ్రీనాథ కవి సార్వభౌముడు తన కావ్యాల్లో పేర్కొన్నాడు. ఇక్కడి స్వామివారిని అభిషేకించడానికి సప్తఋషులు కలిసి గోదావరిని తీసుకు వచ్చారనీ పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి. అందువలన అంతర్వాహినిగా ప్రవహించే ఈ గోదావరిని సప్త గోదావరి' అని పిలుస్తూ వుంటారు. ఇక్కడి పంచలోహ విగ్రహాలు తామ్ర మూర్తులు 8 వ శతాబ్దం నుంచి ఉన్నవిగా భావిస్తున్నారు.
అష్ట సోమేశ్వరములు
ఈ భీమేశ్వరుడికి ఎనిమిది దిక్కులలోను ఎనిమిది శివలింగాలను చంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించాడని విశ్వసించబడుతుంది. వీటిని అష్టలింగములు లేదా అష్ట సోమేశ్వరములు అంటారు. తూర్పున కోలంక, పడమర వెంటూరు, 'దక్షిణాన కోటిపల్లి ఉత్తరాన వెల్ల ఆగ్నేయంలో దంగేరు. నైరుతిలో కోరుమిల్లి వాయువ్యంలో సోమేశ్వరం ఈశాన్యాన పెనుమళ్ళ ప్రాంతాలలో ఈ అష్ట సోమేశ్వర ఆలయాలు ఉన్నాయి. ఈ భీమేశ్వర ఆలయ ప్రాంగణంలో ఇంద్రేశ్వర, యజ్ఞేశ్వర, సిద్దేశ్వర, యోగీశ్వర, యమేశ్వర, కాళేశ్వర వీరభద్రేశ్వర లింగాలు దర్శనమిస్తాయి. ఇక తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ దిశగా ఉన్న ఒక్కో గాలి గోపురాన్ని ఒక్కో అమ్మవారు పర్యవేక్షిస్తున్నట్టు స్థలపురాణం వివరిస్తుంది.
రవాణా సౌకర్యం
ద్రాక్షారామము అమలాపురం నుండి 25 కిమీ , కాకినాడ నుండి 28 కిమీ , రాజమండ్రి నుండి 50 కిమీ దూరంలో ఉంది. రైలులో రాజమండ్రి మరియు కాకినాడ చేరుకుని అక్కడి నుండి రోడ్డు మార్గంలో దాక్షారామం చేరుకోవచ్చు. రాష్ట్ర రహదారి భారతదేశంలోని అన్ని ప్రధాన పట్టణాలు మరియు నగరాలతో కలుపుతుంది. తరచుగా బస్సు సేవలు అందుబాటులో ఉన్నాయి. సమీప విమానాశ్రయం రాజమండ్రి విమానాశ్రయం.
రోడ్డు మార్గం:
రాజమండ్రి చేరుకుని బస్సులో రామచంద్రపురం వెళ్లవచ్చు లేదా రావులపాలెం చేరుకుని రామచంద్రపురం వరకు బస్సులో వెళ్లవచ్చు. రామచంద్రపురం నుండి కోటిపల్లి లేదా యానాం మరియు ఇతర బస్సులలో ద్రాక్షారామ చేరుకోవాలి.
రైలు మార్గం:
ఒకరు కాకినాడ చేరుకుని ద్రాక్షారామకు రైలులో ప్రయాణించవచ్చు కానీ ఇప్పుడు ఒక రైలు బస్సు మాత్రమే నడుస్తోంది మరియు అది నిరంతరం నడవదు.
వాయు మార్గం:
రాజమండ్రి వరకు ప్రయాణించి, విమానాశ్రయం నుండి క్యాబ్లో ఒకటిన్నర గంటలో ద్రాక్షారామ చేరుకోవచ్చు.
ఉత్సవాలు:
ప్రతీ ఏకాదశీ పర్వదినములలో ఏకాంతసేవ, పవళింపుసేవ. ప్రతీ మాసశివరాత్రి పర్వదినములలో గ్రామోత్సవం. ప్రతీ కార్తీక పూర్ణిమతో కూడిన క్రృత్తికా నక్షత్రం రోజున జ్వాలాతోరణ మహోత్సవం.
ప్రతీ మార్గశిర శుద్ధ చతుర్ధశి రోజున శ్రీ స్వామివార్ల జన్మ దినోత్సవం. ప్రతీ ధనుర్మాసంలోనూ క్షేత్రపాలకులు అయిన శ్రీ లక్ష్మీ సమేత శ్రీ నారాయణ స్వామి వార్లకు ధనుర్మాస పూజలు
ప్రతీ మాఘశుద్ధ ఏకాదశీ ( భీష్మ ఏకాదశి ) రోజున శ్రీ స్వామి వారి, అమ్మవార్లకు దివ్య కల్యాణ మహోత్సవం జరుగుతాయి.
ప్రతీ మహాశివరాత్రి పర్వదినాలలో శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి.
శరన్నవరాత్రులు (దేవీనవరాత్రులు) - ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు జరుగుతాయి
కార్తీక మాసం ప్రత్యేక ఉత్సవాలు - జ్వాలాతోరణం (కార్తీక పున్నమి నాడు)
సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవం- మార్గశిరశుద్ధ షష్ఠి నాడు.
వసతి సౌకర్యాలు, అన్నదాన సత్రాలు అందుబాటులో ఉన్నాయి.
మన దేవాలయాలు చారిత్రక నగరాలూ