హిరణ్యకశిపుండు ప్రహ్లాదుని వివిధోపాయంబుల హింసించుట
వయస్సు అయిదేండ్లు, అయినా కన్నతండ్రి నయిన నా పద్ధతిని నిందిస్తున్నాడు, ఏ కొద్దిభాయమూ లేకుండా నాకు శత్రువైన విష్ణువును పొగడుతున్నాడు, పిల్లవాడు గదా! అని వారిస్తే వినడు. వీడి తీరు చూడగా, కుమారునిరూపాన, శరీరంలో రోగం పుట్టినట్లుగా ఉంది. రాక్షసులారా! వీణ్ణి తీసికొనిపోయి చంపి రండి. మీ మీ సమర్థతలు వీణ్ణి సంహరించడంలో ప్రదర్శించండి.
(తనయుని మీద తండ్రికి కసి - ద్వేషం పెరిగింది. తన వంశనాశకుడైన వ్యక్తిని పనిగట్టుకొని కీర్తిస్తూ ముల్లోకాలలో ఎదురులేని తనను ధిక్కరిస్తూ, తృణీకరిస్తూ, ఆ అయిదేళ్ళ పిల్లవాడు తనకు ప్రత్యర్థిగా నిల్వడం రాక్షసరాజు జీర్ణించుకోలేకపోతున్నాడు మరి!)
వైద్యుడు రోగికి అవసరమైనపుడు, ఆతని శరీరంలో ఒక భాగానికి మాననిరోగం ఏర్పడినపుడు, ఆ రోగం కారణంగా మొత్తం శరీరమే రోగగ్రస్తమయ్యే ప్రమాదమున్నపుడు, ఆ రోగంవున్న అవయవాన్ని ఖండించి, తొలగించి, మిగిలిన శరీరభాగాన్నంతటినీ రక్షిస్తాడు. ఆ ఒక్కభాగం కారణంగా మొత్తం శరీరం పాడుగావడం సహించడు. అనుమతించడు. అదే విధంగా రాక్షసవంశాన నా తనయుని రూపంలో వ్యాధి ఒకటి పుట్టుకొచ్చింది. దీనిని ఈ విధంగా వదలివేస్తే, నా రాక్షసవంశ శరీరమంతా ఈ వ్యాధివ్యాపించి, మొదటికే మోసం జరగవచ్చు. కాబట్టి నా కులానికి పుండువంటి ఈ పుత్రుణ్ణి తెగటార్చి నా అన్వయాన్ని రక్షించుకుంటాను. కొడుకునైనా కులరక్షణకై కడతేర్చిన గొప్పవాడు అనే మహాకీర్తిని వహిస్తాను. కులాన్ని దోషరహితంచేసి తీరుతాను.
(వ్యక్తి తాను చేసే మంచిచెడ్డలకు కారణాలు చూపడానికి ప్రయత్నిస్తాడు. తాను ఉన్నతాసనం పైన ఉన్నపుడు, ఇక్కడ హిరణ్యకశిపుడు అదే చేస్తున్నాడు. తానుచేసే పుత్రవధను తాను సమర్థించుకొంటున్నాడు. ఇక్కడ 'వీరవ్రతం' పరిశీలించదగింది. సమరమని లేదా పోరాటమని నిశ్చయం అయ్యాక తన కెదురయినవారందరు విరోధులే. అహితులే. ఆ కారణంవలన ప్రహ్లాదుడు కూడా అహితుడే. పోరాటంలో అహితుణ్ణి తన బాటనుండి తప్పించడం సమరాలలో పాటించే వీరకృత్యం. ఇదే 'వీరవ్రతం'. ఈ 'వీరవ్రతం' కారణంగానే హిరణ్యకశిపుడు తపస్సు చేశాడు.
కేశవుడు - శోభనమైన కేశములు కలవాడు, కేశి అను రాక్షసిని సంహరించినవాడు. విష్ణువు శివుడు తానే అయినవాడు. బ్రహ్మ రుద్రులు ఈయనయందు జన్మించారు. బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడైనవాడు.)
దనుజేంద్రుడు ప్రహ్లాదుని యెడ దయ చూపరాదంటున్నాడు, వీడు ముమ్మాటికి చంపవలసినవాడే. పోనీపాపం! రక్షిద్దామని అనుకోడానికిగూడ అర్హుడు గాడు. వాడు వెళ్ళవలసినది యమధర్మరాజుగ్భహానికి మాత్రమే. ఇంకెక్కడికీ కాదు. కాబట్టి, నిర్బంధంగా చంపిగాని మరలి రావద్దు.
అని రాక్షసరాజు పల్కినవెంటనే వాడికోరలున్న చాలమంది రాక్షసులు చేతుల్లో శూలాలను ధరించి ఉత్సాహంతో, నోళ్లు తెరచి పెడబొబ్బలు పెడుతూ, రాగిలోహంవంటి జుట్టుకలిగి ఒకేసారి గట్టిగా అరవడం, కొట్టడం, నరకడం చేస్తూ
మహారాజా! ఆ రాక్షసులందరు ప్రహ్లాదుని జూచి, అయ్యో! ఇతడు చిన్నపిల్లవాడు, రాజపుత్రుడు, పైగా దయాశీలి. కాబట్టి, చంపదగ్గవాడు కాడు-అని అనుకోకుండా క్రూరంగా భయంకర దూషణలతో ఏమరపాటులేకుండా తమ బల్లేలతో అతని అవయవాలను పొడిచి హింసించారు. ఆ హింసాచరణను హిరణ్యకశిపుడు ఏమాత్రం వద్దనలేదు.
(ప్రహ్లాదుడు అవధ్యుడనడానికి కారణాలుగా కవి అయిదు విశేషణాలు వాడాడు. అవి బాలుడు, రాజకుమారుడు, జనులపై దయగలవాడు. సాధుశీలం కలవాడు, సుశీలుడు. ఇవన్నీ ఏపాటి మనసున్నవాడైనా కనికరించి వదలివేయ దగ్గవే. మొదట అతడు బాలుడు. స్త్రీ బాలవృద్దులు అవధ్యులనేది జగమెరిగిన నీతి. చివరగా అతడు లోకం మెచ్చిన శీల సంపదగలవాడు. అయినా క్రూరచిత్తుల కది పట్టలేదు.)
ఎందరో దానవులు కలిసి శూలాలతో పొడిచినా ప్రహ్లాదుని ఒడలు ఏమాత్రం చిట్లలేదు. ఒడలిలోపలిభాగంలో అయినా రక్త ముబ్బలేదు. అసలు అతని దేహం కందనైనా కందలేదు. ఎముకలు విరుగలేదు, కంటిచూపు తగ్గలేదు. ముఖసౌందర్యం క్షీణించలేదు-చంద్రబింబంవంటి ముఖం కాంతిమంతంగానే ఉంది. బల్లెపుపోటులవల్ల కొత్తబాధయినా ఆ దేహాన పొడకట్టదు. ఇంత జరిగినా ఆ బాలునిలో దీనత్వం కనబడలేదు.
ఆ రాక్షససేన తనను ఆవిధంగా ఎంత పొడిచినా ఆ బాలుడు మాత్రం ఏడ్వడం లేదు, బెదరిపోయి వణకడం లేదు. పైగా మాటిమాటికి ఆ దేవదేవుని, ఓ పన్నగశాయీ! ఓ జగదీశా! ఓ ఆపన్నశరణ్యా! అంటూ పలువిధాల స్తుతిస్తున్నాడు.
రాక్షసుల బల్లైములకు చిక్కి బాధించబడే బాలుడు ప్రహ్లాదుడు, అక్కడినుండి లేచి అటు ఇటు పరుగెత్తడు. ఆ శూలాల పోట్లు తప్పించుకొనడానికి చేతులైనా అడ్డుపెట్టడు. దగ్గరున్న చుట్టాలగుంపులో దూరి ఆ పోటులనుండి రక్షణపొందడానికి ప్రయత్నించడు. రక్షణకోసం సమీపానగల రాణివాసం-బంగారుగ్భహంలోనికయినా వెళ్ళడు. 'రక్షించండి' అంటూ అరవనైనా అరవడు. అసలు ఆ శూలఘాతాలకు బాధపడుతున్నట్లయినా కన్పడడు. ఇంత హింసకు గురౌతున్నా అతనిలో కంటగింపు ఏమాత్రం కనబడదు. నిమ్మకు నీరెత్తినట్లు స్థిమితంగా ఉన్నాడు.
రాక్షససేన క్రూరకృత్యాలు ఒకవైపు ప్రహ్లాదుని శరీరంపై కొనసాగుతుండగా, ఆ భక్తుడు మాత్రం తన మనస్సును మహావిష్ణువునందు లగ్నంజేసి, తానే ఆ పరబ్రహ్మస్వరూపం వహించినట్లు, అంతటానిండి ఉండే పరమాత్మగా తానే మారిపోయినట్లు నిశ్చలంగా నిర్వికారంగా నిలిచి ఉన్నాడు. ఆ దృశ్యం చూచిన హిరణ్యకశిపుడు, పాపియెడ ప్రయుక్తాలయిన సత్క్రియలవలె తన మారణ ప్రయత్నాలన్నీ నిష్ఫలాలై నిలవడం చూస్తూ తనలో తాను ఇలా తలపోస్తున్నాడు.
వీడు పసివాడు. రాక్షసులు నిరంతరం శూలాలతో పొడిచి హింసించినా క్రిందపడడు. భయపడి పారిపోడు. బల్లెములతో పొడిచినా చావడు. తన తండ్రినైన నన్ను చేరి, శ్రీహరి పక్షం మానివేశాను అని అంటూ నా కాళ్ళమీద తన నొసలు ఆనించి నమస్కరించడు. ఇవన్నీ జరుగకున్నాా ఏ ఆపదా, గాయము లేకుండా ఎలా ఉండగల్గుతున్నాడు? దీనికి ఏమి కారణమో?
(ఇన్ని కష్టాలుపడుతున్నా ప్రహ్లాదుడు పరబ్రహ్మ స్వరూపమైన విష్ణువు తాను అనే భావంతో, తన్మయత్వంతో వుండడంచేత శారీరక శిక్షలేవి అతనికి అంటలేదు.)
అని ఇలా సందేహపడుతూ
ఏ విధంగానైనా, తప్పక చంపవలసిందే అనే తలపుతో రాక్షసరాజు తన కుమారుణ్ణి, దిగ్గజాల కాళ్ళక్రింద తొక్కించాడు. భయంకర విషసర్పాలతో కరిపించాడు. జ్వాలలుపైకెగసే నిప్పులో తోయించాడు. గట్లుదాకి పైకెగసిపడే అలలుగల సముద్రంలో ముంచేందుకు పంపాడు. విషం పెట్టి, నరికి, కొండలపైనుండి తోసి, కట్టిపడవేసి, హింసించి ఇలా నానావిధాల చంప జూచాడు.
హిరణ్యకశిపుడు కొడుకుపై పగబట్టి క్రోధంతో అనేకవిధాల నిర్బంధంగా చంపడానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నాలు ఇవి, ఒకసారి చేతబడులవంటి హోమాలతో, మరొకసారి మండుటెండలలో నిలబెట్టి, మరొక పర్యాయం వానలలో తడిపి తడిపి, ఇంకొకతూరి నవరంధ్రాలు మూసిపెట్టి, ఒకసారి తన మాయతో బెదరించి, ఇంకొకసారి మంచులో ఒంటరిగా నిలబెట్టి, ఒకసారి పెనుగాలులకు ఎదురునిల్పి, మరొకసారి భూమిలో పాతిపెట్టి, ఇంకొకవేళలో కూడు, నీళ్ళు లేకుండా జేసి, కొరడాలతో కొట్టించి, బండరాళ్ళు మీదికి త్రోయించి, గదలతో మోదించి, వాడిబాణాలతో పొడిపించి తనకు విరోధిగా మారిన కుమారుని చంప ప్రయత్నించాడు.
(హోమాలు అనేకరకాలు. తనకోసం, తనవారికోసం చేసేవి కొన్ని. ఆ విధంగా కాకుండా శత్రువులపట్ల ద్వేషంతో చేసే హింసాత్మకమయిన హోమం అభిచారహోమం. ఇటువంటివి రహస్యంగా ఆచరించేవారు.)
వర్ణించినవే గాక, ఇంకా ఏవేవో ఉపాయాలతో సాధనాలతో కుమారుని చంపబోయాడు తండ్రి. కాని తనయుడు పాపరహితుడు శ్రీహరిప్రియుడు గాబట్టి చావకపోగా చెక్కు చెదరలేదు. ఇది తండ్రికి కొడుకుమీద పగబట్టినవానికి దుఃఖకారణమైన చింతగా మారింది. ఆ చింతాభారంతో అలసిపోయిన ఆ రాక్షసరాజు తనలో తాను ఈ విధంగా తలపోయసాగాడు.
సముద్రాలలో ముంచాను, గదలతో మోదాను, కొండలపైనుండి క్రిందికి పడద్రోయించాను. ఆయుధాలతో పొడిపించాను, ఏనుగుల కాళ్ళకింద తొక్కించాను, ఛీత్కారంతో అసహ్యించుకున్నాను, తిట్టాను. భయంకరంగా అడవుల్లో నలుదిక్కులా కమ్ముకొనే నిప్పుల్లో త్రోయించాను, ఇంకా ఎన్నో హింసలపాలు జేశాను. అయినా వీడు చావడు. ఇదేమిటి విచిత్రంగా ఉంది!
(ప్రాణి చావడానికి అవసరమైన, జీవిని సంహరించడానికి కావలసిన అన్ని ఉపాయాలూ రాక్షసరాజు తన తనయుని పట్ల ప్రయోగించి చూచాడు. తన ఘోరక్రూరయత్నాలన్నీ ఆ అర్భకునిముందు కొరగానివిగా మిగిలిపోగా అతనిలో క్రోధం భయంగా మారబోతున్నది.)
ఎన్నివీధాల చంపబోయినా చావకపోగా మీదు మిక్కిలి దేదీప్యమానంగా వెలుగొందుతున్నాడు. చావకుండ బదికే మందు లేమైనా తెలుసా అంటే, అదీ లేదు. వీడికి రక్షకులెవరూ ఇక్కడ లేరు. పెట్టే బాధలతో బెదరడమూ లేదు. ఒక క్షణమైనా బేలగా అసహాయుడుగా కనిపించడు. వీడిని నేను ఏవిధంగా చంపాలి? అలసిపోయాను. వీడి శక్తి ఏదో దివ్యంగా, అంతుపట్టనిదిగా ఉంది.
పూర్వకాలంలో అజీగర్తుడనే ముని, తనకొడుకును శునశ్శేపుడనేవాడిని, తన జీవికకై, యజ్ఞంలో చంపే బలిపశువుగా ఇచ్చేస్తాడు. వాడు నరకంలో యముని మెప్పించి బ్రతికి తిరిగి తండ్రిని చేరుతాడు. అయినా తనను తనతండ్రి పశువుగా అమ్మినట్లు భావించడు. వాడివలెనే వీడూ (ప్రహ్లాదుడుగూడ) తనను (రాక్షసరాజును) కీడు చేసినవాడినిగా చూడడం లేదు.
(కఠోపనిత్తులో చెప్పబడిన నచికేతుడు కూడ తండ్రి తనను యమునికి దానంచేసినప్పటికీ పితృభక్తిని కోల్పోక తండ్రి తనను స్వీకరించాలనే వరాన్ని కోరుతాడు. వేదకాలంలోని శునశ్శేపునివలె, ఉపనిషత్కాలంలోని నచికేతునివలె ఇతిహాసకాలంలో శ్రీరామునివలె, పురాణకాలంలో ప్రహ్లాదుడు పితృభక్తి తత్పరుడు.)
నేను క్రోధంతో తనను అణచడానికి చేసిన, చేయగూడని క్రూరకర్మలన్నిటినీ మనస్సులో తనకు చేసిన ఉపకారాలుగానే భావిస్తాడు. కాని ఇతరులతోగూడ చెడుగా చెప్పడు. తాను బాధపడటమూ ఉండదు.
ప్రహ్లాదునితో పగకారణంగా హిరణ్యకశిపుడు, తనకు చావు గలుగుతుందని, ప్రహ్లాదుడు మహాశక్తి సంపన్నుడని నిశ్చయించుకొని ఖిన్నుడై చేష్టలుడిగి క్రిందిచూపులు చూస్తూ విషాదంలో మునిగి ఉండగా గురుపుత్రులు సమీపించి ఇలా అంటున్నారు.
(హిరణ్యకశిపుడు తాను వేయించిన శిక్షలకు లొంగని ప్రహ్లాదుని దైవాంశ సంభూతునిగా భావించి శాపం వలన తనకు మరణమాసన్నమైనదని మనస్సులో అనుకొని చింతిస్తున్నాడు.)
రాక్షసరాజా! నీ ప్రతాపం ఆశ్చర్యకరం. నీ కీర్తి స్వచ్చమై మెరుస్తున్నది! నీవు సామాన్యుడివి కావు. యుద్దాలలో నీ కనుబొమలు క్రోధంతో కదిలితే చాలు. దిక్పాలకులు బెదరిపోతారు. ఈ సమస్త విశ్వాన్ని ఎదరులేకుండా ఏలినవాడివి. అట్టి నీకు ఈ అర్భకుడెంత? వీడి అబద్ధపు సంభాషణలు నీవు లెక్కించదగినవి కావు సుమా!
నరుడు మొదట బాల్యంలో చెడుప్రవర్తన గలవాడైనా, పెద్దలైన గురువులవద్ద సేవ చేసి తన తెలివి తేటలను నీతి నియమాలనూ మార్చుకొని ప్రకాశిస్తాడు. ఆ తరువాత వయస్సు పెరిగి సక్రమంగా వ్యవహరిస్తాడు. ఈ బాలుడుగూడ మున్ముందు ఇంద్ర ద్వేషిగా మారగలడని(మార్చగలనని) భావించి నీ రోషాన్ని చాలించు. శుక్రాచార్యులు వచ్చిన తరువాత అంతా చక్కబడుతుంది. అంతవరకు ఈ ప్రహ్లాదుడు గూడ సరిగా నడుచుకుంటాడు.
హిరణ్యకశిపుని ఆజ్ఞానుసారం గురుపుత్రులు, ప్రహ్లాదునికి గృహస్థుడు ఆచరించదగ్గ ధర్మాలను, ధర్మం, అర్ధం, కామం అనువానిని-ధర్మప్రవర్తన, అర్థ ఆర్జన, కామతృప్తి అనువానిని బోధించారు. అయితే ప్రహ్లాదుడు వాటిని స్వీకరించలేదు. అవి ఇతరులకు దప్ప తనకు కావని, పైగా అవి నిష్ప్రయోజనాలని భావించాడు. ప్రయోజనరహితాలను ప్రయోజన సహితాలుగా ఎంచటం భ్రాంతికరంగూడ అని నిర్ధారణకువచ్చి, వారు బోధించిన అంశాలను ఉచితమైనవిగా గూడ భావించక, వారు గృహకార్యార్థం వెళ్ళిన సమయాలలో
ప్రహ్లాదుడు తన తోటి విద్యార్థులకు విష్ణు తత్త్వం గూర్చి వివరించుటశ్రీ మహా భాగవతముశ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధముశ్రీ మహా భాగవతము తృతీయస్కంధముశ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధముశ్రీ మహా భాగవతము పంచమస్కంధముశ్రీ మహా భాగవతము షష్టస్కంధముశ్రీ మహా భాగవతము సప్తమస్కంధముపంచాంగం