Friday, April 17, 2026

Kings of the Surya Dynasty - Sukanya Vritthanamu - సూర్య వంశ రాజులు - సుకన్యా వృత్తాంతము

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - సూర్య వంశ రాజులు - సుకన్యా వృత్తాంతము

జనమేజయు డిట్లనెను : ఓ మహానుభావా ! సూర్యవంశమునందు బుట్టిన ధర్మజ్ఞులగు రాజుల చరిత్ర నాకు వివరముగ వినిపింపుము. ఆన 

వ్యాసు డిట్లనెను: ఓ భారతా ! నేను మున్నొకప్పుడు ఋషిసత్తముడగు నారదునివలన సూర్యవంశ చరిత్ర విస్తరము వింటిని. ఆ వినిన విధమునే నేను నీకిపుడు తెలిపెదను. 

ఒకప్పుడు శ్రీమంతుడగు నారదముని స్వేచ్చగ పర్యటించుచు పావన సరస్వతీ తీరమందలి నాపుణ్యాశ్రమము జేరెను. అపుడు నేను నారదుని పాదములకు మ్రొక్కి యాస నమిచ్చి గౌరవించి యతనిముందు నిలుచుంటిని. అతనిని యథావిధిగ పూజించి 

నేనిటు లంటిని: 'ఓ మునివరా! నీవు లోక పూజ్యు డవు. నీ రాకవలన నేను తరించితిని. ఏడవ మనువునకు జన్మించిన రాజులు ఘనముగ పేరు ప్రతిష్ఠలు గడించిరి. వారి కథలు చరిత్రలు నాకు వినిపింపుము. 

మహానుభావా! వారి జన్మలు పుణ్యధన్యములు. వారికి వారే సాటి. వారి చరిత లత్యద్బుత ములు. అట్టి సూర్యవంశజుల చరిత్ర విపులముగ వినకుతూహలము గల్గుచున్నది. 

మునివరా! ఆ కథలను సమాస వ్యాస పూర్వకముగ (ఒక విషయమును మొదట దానియందలి అంశముల కథనముతో తెలుపుట సమాసము-వానిలో నొక్క యంశ మునే విస్తరించి అదే క్రమమున చెప్పుట వ్యాసము-పరిష్కర్త) తెలుపుము. అని నేను పరమార్థవిదుడగు నారదు నడిగితిని. అది విని నవ్వుచు నారదుడు పరమప్రీతితో నిట్లు పలుకదొడగెను. 

సత్యవతీ తనయా! వినుము. సూర్యవంశ రాజుల పవిత్ర వంశ ముత్తమమైనది. వారి వంశము పావనము. కర్ణామృతము. పరమధర్మమయము. జ్ఞానసంపన్నము. పూర్వము విష్ణువు నాభి కమలమునుండి బ్రహ్మ యుద్బవించెను. అని పురాణములందు ఘనముగ వర్ణింపబడెను. 

బ్రహ్మ స్వయంభువు సర్వజ్ఞుడు సర్వశక్తియుక్తుడు విశ్వాత్ముడు. అతడు విశ్వరచన చేయగోరి వేల యేండ్లు ఘోరముగ తపమొనరించెను. అతడు శ్రీమాతృదేవిని ధ్యానించి మహాశక్తిని సంపాదించెను. బ్రహ్మ మానసపుత్రులను సృజించెను. 

వారు శుభలక్షణలక్షితులు. వారిలో మరీచి సృష్టిరచనలో పేరెన్నిక గాంచెను.

మరీచి కుమారుడు కశ్వపుడు. అతడు విశ్వమాన్యుడు-లోక ప్రియుడు-విశ్వవిఖ్యాతుడు. దక్షుని పదుముగ్గురు కూతురు లతని భార్యలు. 

కశ్యప ప్రజాపతి వలన దేవతలు దైత్యులు యక్షులు పన్నగములు పశుపక్షులు సృజియింపబడెను. ఇది కాశ్యపసృష్టి యన మహిమ గాంచెను. ఎల్ల దేవతలలో సూర్యుడు ప్రముఖుడు. సూర్యునకు వివస్వంతు డను పేరు గలదు. 

వివస్వంతుని పుత్రుడు వైవస్వతమనువు. అతడు ఘనకీర్తి గడించెను. వైవస్వతునకు సూర్యకుల వర్ధనుడగు ఇక్ష్వాకుడు సంభవించెను. ఇక్ష్వాకుడు గాక వైవస్వతునకు మఱి తొమ్మండుగురు జన్మించిరి. వారి పేర్లు నాభాగుడు దృష్టుడు శర్యాతి నరిష్యంతుడు ప్రాంశుడు నృగుడు దిష్టుడు కరూషుడు వృషధ్రుడు వీరు మనుసంభవులు. 

వైవస్వత మనువున కిక్ష్వా కుడు జ్యేష్టపుత్రుడు. ఇక్ష్వాకునకు నూర్గురు కుమారులు. వారిలో వికుక్షి పెద్దవాడు ఆత్మవంతుడు. ఆ వైస్వత మనువునకు మరల తొమ్మండుగురు శూరులుద్బవించిరి. వారి వంశ క్రమము సంగ్రహముగ తెల్పుదును. వినుము. 

నాభాగున కంబరీషుడు జన్మించెను. ఇతడు పరమ భాగవతోత్తముడు ధర్మజ్ఞుడు సత్యసంధుడు ప్రజాపాలనతత్పరుడు. ధృష్టునకు ధార్షకులు గల్గిరి. 

వీరు రాజులైనప్పటికి బ్రహ్మభూతులు. యుద్దకాముకులు గారు. బ్రహ్మకర్మనిరతులు. శర్యాతికి ఆనర్తుడను కొడుకును చక్కని సుకన్యయను కన్యయుబుట్టి కీర్తి వహించిరి. 

శర్యాతి తన యందచందాల ముద్దుపట్టిని గ్రుడ్డి వాడగు చ్యవనున కిచ్చెను. ఆమె సౌశీర్యము-సౌజన్యము-పాతివ్రత్యము ప్రభావమున చ్యవనునకు కండ్లు వచ్చెను.

సూర్యున కశ్వి కుమారులు గల్గిరి. వారు మునికి కంటివెలుగు ప్రసాదించిరని నేను వింటిని. 

అన జనమేజయు డిట్లనెను: ఓ మహత్మా ! నీవు చెప్పిన కథలో నాకు సందేహము గల్గుచున్నది. రాజు తన కన్యను సుకన్యనొక గ్రుడ్డి ముని కిచ్చె నంటివి గదా ! లోకమున నొకని కూతురు రూపగుణములు లేనిది గావచ్చును. అతడు తన కూతురునొక గ్రుడ్డివాని కిచ్చిన ఈయవచ్చును. కాని యే మచ్చలేని చక్కదనాల చుక్కయగు తన గారాబాల కన్నియ సుముఖియగు సుకన్య నొక్క చీకుమునికంటగట్టుటకు రాజు మన సెట్టు లొప్పుకొనెను! 

మహానుభావా! నా యందు దయయుంచి దీని మూలకారణము తెలుపుము. అను జనమేజయుని మాటలను వ్యాసుడు వినెను. అతడు ప్రసన్నతతో నవ్వుచు నతనితో నెట్లనెను. 

వైవస్వతుని కుమారుడు శర్యాతిరాజు. శర్యాతికి నాల్గువేలమంది రాచకన్నియలు భార్యలైరి. వారెల్లరును సకల శుభలక్షణలు. వారెల్లరును తమ పతి కనుకూలలై పతిప్రియలై వర్దిల్లిరి. వారికి సుకన్యయను చక్కనికన్య కుమారిగ జన్మించెను. 

ఆ చిఱుతనవ్వుల సింగారి తన తల్లిదండ్రులకు ముద్దుల మూటగసొంపు మీరెను. రాచనగరికి దరిదాపున మానససరోవరమును మఱపించు సరోవరము గలదు. దానిలోనికి దిగుడు మెట్లు గలవు. ఆ కొలంకులో రాయంచలు కారండవ చక్రవాకములు స్వేచ్చావిహారములు సల్పుచుండెను. 

ఆ కొలను భరతపక్షులు సారసములు మున్నగు జలపక్షులతో శోభిల్లుచుండెను. అందైదు విధముల నొప్పు మారు కమలములు తేనెసోనలతో ఝంఝుమ్మను గండుతుమ్మెదలు మదనరాగములతో కనులవిందొన రించుచుండెను. దానికి నలుగడల పెద్ద పెద్ద సాలతమాల తరువులు అశోకములు సరల పున్నాగములు - వటవృక్షములు-రావిచెట్లు-కదంబవనములు-అరటిచెట్లు-జంబు-జంబీర-పనస-ఖర్జూరవృక్షములు-పోకమ్రాకులు-కొబ్బరిచెట్లు-మొగలిచెట్లు-కోవిదారతరువులు-మల్లియతీవియలు-చల్లగ నుల్లమున కుల్లాసముగ నలరారుచుండెను. 

మఱియు అచ్చట గున్నమావి నేరేడు చింత కరంజ కుటక మోదుగ వేప ఉసిరిగ ఖదిర మున్నగు వృక్షములు విలసిల్లుచుండెను. అందు కోయిలల కలకుహూరావములు నెమిళ్ల కేకారవములు చెవులకు తియ్యదనంబు గొల్పుచుండెను. ఆ ప్రదేశ మిట్లు పలువిధములగు తరువులతో పవిత్రమై యొప్పెను.

అది నిర్జన ప్రశాంత ప్రదేశ మగుటచేత పరమశాంతుడు దాంతుడు మహాతపస్వి భార్గవుడునైన చ్యవనమహర్షి యచ్చోట నిష్టించి ఘోరనియమములతో తప మాచరించుచుండెను. ఆ తపోధను డింద్రియములు జయించి యాహారముమాని సుఖాసనమందుండి ప్రాణాయామ పరాయణత్వమున నాత్మ విచారముతో లోచూపుతో మౌనమూని యుండెను. 

అమునీశ్వ రుడు నీరు సైతము ముట్టక హ్రీంకారిణియగు పరాభట్టారికాదేవిని హృదయకమలమున ధ్యానించుచుండెను. ఆ విధిగ నిష్ఠగ నుండగా నతని చుట్టును పైని తీవెలతో చుట్టబడిన గొప్పపుట్ట పుట్టెను. అట్లు దీర్ఘకాలము గడచుటవలన ఆ పుట్టనిండ చలి చీమలు చేరియుండెను. తన మీద చీమలపుట్టలు కోవలుగ పెరిగినను 

ప్రజ్ఞాధీరుడగు చ్యవనుడు మట్టిముద్దవలె గదలక మెదలకుండెను. ఒకనాడు శర్యాతిరాజు తన కామినీగణము వెంట రాగ వనవిహారమున కాదివ్యసరస్సును కేతెంచెను. అతడు సరస్సులోని నిర్మలజలములందు తన సుందరీ బృందమునుగూడి తమిమీర క్రీడాసక్తుడయ్యెను. 

సుకన్య మెఱుగుబోడి చప లాక్షి ; ఆమె పూలుగోయుచు కేరింత లాడుచుండెను. ఆ పడుచుపిల్ల తన మేనిసొమ్ములు తళతళలాడగా గజ్జెలందియలు ఘల్లుఘల్లు రనగ గంతులతో చ్యవన మునీశుని పుట్టదాపునకు జేరెను. ఆ చిలిపికన్నె పిల్లలాటల తమకముతో పుట్టచెంత గూరుచుండి పుట్టరంధముల నుండి మిణుంగురులను బోలు రెండు మినుకుమినుకుమను వాడి వెలుగులుగాంచెను. 

ఆ తలోదరి యిదేమి వింతయో తెలిసికొందమని వాడి ముల్లుగొని వేగిరముగవానిని పీకివేయ పూనుకొనెను. ఇట్లు కమ్మని ముంగురులబాల ప్రయత్నించి పుట్ట కెట్టుదుట నేగెను. రతీదేవివలె అందకత్తె అగు ఆమె చ్యవనునకు కనబడెను.

భార్గవుడా సుదతినిగాంచి డగ్గుత్తికతో నిట్లనెను : ''కళ్యాణీ! శోభనాంగీ! ఇదేమి చేయుచుంటివి. తలోదరీ! విశాలాక్షీ! వరారోహా! నేనొక తబిసిని. ముంటితో పుట్టను పొడువకు. దూరముగ నేగుము.'' అని చ్యవనుడు పలుకు చున్నప్పటికిని సుకన్య వానిని పెడచెవినిబెట్టి యిదేమి చూతమని ముని వెల్గుచూపులను గ్రుచ్చెను. 

అట్టులా రాచకన్నె కాలయోగమున ప్రేరితురాలై యాటలాడుచు పుట్టను గ్రుచ్చెనే కాని యామె తరువాత నేనెంతపని చేసితినని లోనలోన విచారించుచు నాచోటు వదలెను. తన కన్నులలో ముల్లు గ్రుచ్చుకొనుటవలన చ్యవనుడు వేదనతో పరితాపముతో కోపావిష్టుడయ్యెను. 

ఆ మునివరుడు వెనువెంటనే సైనికులయెక్కయు మంత్రులయెక్కయు రాజుయెక్కయు మలమూత్రములు నిరోధించెను. చ్యవనుని మహిమమున గజతురగములయెక్కయు నొంటెలయెక్కయు తక్కిన ప్రాణులయెక్కయు మలమూత్రము లొక్కపెట్టున నాగిపోవుటవలన రాజు కడు దుఃఖితుడయ్యెను. 

సైనికు లెల్లరి మలమూత్ర నిరోధముగూర్చి రాజు తెలిసికొనెను. ఇట్టి దుఃఖమొకేసారి గల్గుటకు కారణమేమోయని రాజు చింతించెను. చింతార్తుడై అతడు విచారముతో తన యింటికేగి తన సైనికులలో జనులలో నెవడేని చేయరాని పని చేసెనేమోయని తెలిసికొనెను. 

ఆ సరస్సునకు పడమటి దెసను నట్టడివిలో చ్యవనమహర్షి తీవ్రముగ తప మొనరించుచుండెను. ఆ నిప్పువంటి తపస్వి కెవరో యేదో యపరాధము చేసి యుండవచ్చును. దాని మూలమున నెల్లరికిట్టి కడగండ్లు వాటిల్లినవి. ఆ బార్గవుడు తపో వృద్ధుడు - వృద్ధుడు - మహామనీషి - పరిష్ఠుడు. అట్టి మునివర్యున కెవరో యపచారము చేసిరని తలంతును. 

ఎవరో దుష్టులు తెలిసియో తెలియకయో యా తాపసు నవమానించి యుండవచ్చును. ఈ యడ్డంకి తప్పక దాని మూలముననే జరిగి యుండవచ్చునని రాజు తలచెను. రాజు ప్రశ్నింపగసైనికులు లోన బాధజెందుచు మా మనోవాక్కాయములతో నీ మునివర్యునకెట్టి యపకారము చేయలేదని యనిరి.

సుకన్యా వృత్తాంతము

SRI DEVI BHAGAVATHAM PART 7 - శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము

శౌనకాది మహామునులారా! మా గురువుగారు వ్యాసమహర్షి తనక. భొరదుడికీ జరిగిన
సంభాషణ రూపంగా మాయాశక్తినీ మాయాస్వరూపాన్నీ వివరించి చెబితే శ్రద్ధగా ఆలకించిన జనమేజయుడుమరికొన్ని విశేషాలు అడిగి తెలుసుకున్నాడు. అవికూడా మీకు తెలియజెబుతాను వినండి అంటూసూతుడు కథను కొనసాగించాడు.

సూర్యచంద్రవంశాల్లో ఎందరెందరో మహామహులు జన్మించారనీ వారందరూ దేవీభక్తి పరా
భుణులై తరించారనీ విన్నాను. ఆ రెండు వంశాల చరిత్రలనూ సవిస్తరంగా తెలుసుకోవాలని ఉంది,
దయచేసి వివరించమని జనమేజయుడు కోరాడు. వ్యాసుడు అలాగేనని ఉపక్రమించాడు.

నారదుడికిదక్షుడి శాపం









Daksha's curse on Narada - నారదుడికిదక్షుడి శాపం

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - నారదుడికిదక్షుడి శాపం

జనమేజయా! విష్ణుమూర్తికి నాభికమలం నుంచి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. గొప్ప తపస్సు వేసి మహాదేవిని ఉపాసించి వరాలు పొంది జగత్తును సృష్టించడానికి ఉద్యుక్తుడయ్యాడు. అన్నింటినీ సృష్టీంచాడు కానీ మానవుణ్ణి సృష్టి చెయ్యడానికిమాత్రం అతడికి శక్తి చాలిందికాదు. ఎంతగానో ఆలోచించాడు. ఒక ఉపాయం తట్టింది. అశేషప్రజానీకాన్ని ఒక్కసారిగా సృష్టించలేను కనక శక్తి మేరకు కొందరినే సృష్టిద్దామనుకున్నాడు. ఏడుగురిని మానసపుత్రులుగా ఆవిర్భవింపజేశాడు. “ససర్జ మానసాన్‌ పుత్రాన్‌ సప్తసంఖ్యాన్‌ ప్రజాపతిః”. మరీచి, అంగిరసుడు, అత్రి, వసిష్ఠుడు, పులహుడు, క్రతుడు, పులస్త్యుడు అని వారి పేర్లు. వీరు కాక రోషసముద్భవుడైన రుద్రుడు, ఒడినుంచి పుట్టిన నారదుడు, బొటనవేలు నుంచి ఆవిర్భవించిన దక్షుడు - బ్రహ్మదేవుని కుమారులే. సనకసనందనాదులు మరికొందురు మానసపుత్రులున్నారు. వీరందరూ పురుషులేకాగా, ఎడమ బొటనవేలునుంచి ఒక స్త్రీ ఆవిర్భవించింది; ఆవిడే దక్షవత్ని. సర్వాంగసుందరి. ఈవిడపేరు వీరిణి. అసిక్ని అనికూడా మరొక పేరు. వీరిణీదక్షులకు నారదుడు జన్మించాడు. దేవర్షి అయ్యాడు.

జననేజయు డిట్లనెను : మహాతపస్వియగు నారదుడు దక్షునివలన వీరిణికి జన్మించెనంటివి. ఇది నాకు సందియముగొల్పుచున్నది. నారదుడు బ్రహ్మపుత్రుడు-తాపసుడు-ధర్మజ్ఞుడు గదా! అతడు దక్షుని భార్యయగు వీరిణి గర్బ మందెట్లు జన్మించెను? దక్షునివలన వీరిణికి నారదుడు సంభవించెనను విషయము నాకు విచిత్రముగ నున్నది. ఆ కథ యేమి? నాకు తేటతెల్ల మొనరింపుము. మునీశా! బ్రహ్మజ్ఞుడగు నారదు డేమహత్ముని శాపకారణమున పూర్వదేహము చాలించి మరొక జన్మమెత్తెను? అనగా 

వ్యాసు డిట్లనెను: 'స్వయంభువగు ప్రజాపతి సృష్టిక్రమము నిరంతరాయుముగ సాగవలయునను తలంపుతో ప్రజాసృష్టి చేయుమని దక్షుని ఆదేశించెను. అంత దక్ష ప్రజాపతి తన వీరిణియందు వీర్యవంతులగు నైదు వేలమంది పుత్రులను కనెను. 

వారెల్లరును ప్రజాసృష్టి తామరతంపరగ జేయదలచిరి. వారినిగాంచి నారదుడు కాలప్రేరితుడె నవ్వుచు నిట్లు పలికెను: 

మీరీ భూమి పరిమాణమెంతయో తెలిసికొనకయే ప్రజలను సృజింప పట్టుపట్టితిరి. ఇందుచే ప్రజలకు నిలువ తావుండదు. మీరు లోకమున పరిహాసపాత్రులగుదురు. కనుక మీరు భూపరిమాణ మెఱింగి సృష్టిరచనకు బూను కొన్నచో మీకు సిద్ది గల్గును. లేనిచో గలుగదు. మీరందఱును మూర్ఖులు. ఈ భోగోళచరిత్రము తెలిసికొనకయే ప్రజా రచనకు గడంగుటవలన మీ కెట్లు సిద్ధి చేకూరగలదు? అని నారదుడు పలుక గనే 

హర్యశ్వుడు మున్నగువారు నారదముని చక్కగా బలికెనని దైవయోగమున తమలో తామిట్లనుకొనిరి. వారు తొలుత భూపరిమాణము తెలిసికొనిన పిదప సృష్టి జేయుదమని తలంచి భూతలమంతయు పరిభ్రమించుటకు బయలుదేరిరి. వారిలో గొందఱు నారదుని మాట చొప్పున భూతలము నెఱుగుటకు తూర్పుగ వెళ్ళిరి. మఱికొందరు దక్షిణ దిశగ తరలిరి. ఇంక కొందరు పశ్చిమముగ వేరింక కొందరు ఉత్తరముగ మహోత్సాహముతో బయలుదేరిరి. అట్లు తన పుత్రు లెల్లరును వెళ్ళుటవలన దక్షుడతి శోకార్తు డయ్యెను.

అపుడు దక్షుడు మరల మఱికొందఱిని ప్రజాసృష్టికై పుట్టించెను. వారును ప్రజాసృష్టికి ప్రయత్నశీలురైరి. నారదుడు వారిని జూచి పూర్వమువలె వారి కిట్లనెను. మీ రెంతటి మూఢులు. మీ కీ భూపరిమాణమెంతయో తెలియదు. మీరు ప్రజల నేల సృజింప బూనుకొంటిరి అను ముని మాటలు విని. 

నిజమే యనుకొని వారును మోహితులైరి. వీరును తమ సోదరులు వెళ్ళిన త్రోవనే వెళ్ళిరి. వీరును వెళ్ళుటవలన దక్షునకు శోకము తీవ్రకోపము గలిగెను. దక్షుడు పుత్ర శోకపీడితుడై రోషావేశముతో నారదు నిట్లు శపించెను. 

నా కొడుకు లెట్లు నశించిరో నీవు నట్లే నశింతువు గాక. ఓ దుర్బుద్ధీ! ఈ పాప ఫలితముగ నీవు గర్బవాస దుఃఖ మనుభవింతువు గాక. నా సుతులు నష్టులైరి కనుక నీవు నాకు పుత్రుడవై పుట్టుము. ఇట్లు నారదుడు శపింపబడి వీరిణి గర్బమున జన్మించెను. దక్షుడు వీరిణియందరువదిమంది కన్యలను గనెను. దాని మూలమున దక్షునకు పుత్రవియోగశోకము కొంత తగ్గెను. 

ఆ పిదప ధర్మవిదుడగు దక్షుడు తన పదుముగ్గురు కన్యలను కశ్యప మహాత్మున కిచ్చెను. అతడు మఱి పదిమందిని ధర్మున కిచ్చెను. ఇరువదేడుగురిని చంద్రున కొసంగెను. ఇర్వురిని భృగువున కిచ్చెను. నల్వురి నరిష్టనేమి కొసంగెను. వారి వారికి కొడుకులు మనుమండ్రు గల్గిరి. 

ఆ పుట్టిన వారే దేవదానవులైరి. దేవదానవులు మిక్కిలి బలశాలురు. రాగద్వేష పరులు. మోహాంధులు శూరులు మాయామయులు. తమలోదాము పగలు పెంచుకొనువారునైరి. 

సూర్య వంశ రాజులు - సుకన్యా వృత్తాంతము

Vaisakh Masam - వైశాఖ మాసం

వైశాఖ మాసం

వైశాఖ మాసం ప్రారంభం అయింది. వసంత ఋతువులో రెండవ మాసం వైశాఖ మాసం. దీనికి వైదిక సాంప్రదాయంలో 'మాధవ' మాసం అంటారు. వైశాఖ మాసం లక్ష్మీ నారాయణుల ఆరాధనకి చాలా ప్రసిద్ధమైనది. వైశాఖంలో రకరకాల వ్రతాలు చెప్పారు. వైశాఖ మాసంలో సూర్యుడు మేష సంక్రమణంలో ఉండగా ప్రాత: స్నానం చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. మాసాలన్నింట్లో వైశాఖమాసం ఉత్తమమైనది. విశేషదానాలకు ఎంతో పుణ్య ప్రదమైన మాసంగా పురాణాలలో చెప్పబడింది.

శ్రీ మహా విష్ణువు కు ప్రీతికరమైన ఈ వైశాఖ మాసం లో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువు ను లక్ష్మీ దేవితో కలిపి పూజించిన వారికి ముక్తి దాయకం. ఈ మాసం లో ఏక భుక్తం, నక్తం అయాచితం గా భుజించడం ఉత్తమంగా చెప్పబడింది. వైశాఖ మాసం దేవతలతో సహా అందరికీ పూజనీయమైనది. యజ్ఞాలకు, తపస్సులకు పూజాదికాలకు, దాన ధర్మాలకు ఎంతో ఎక్కువ ఫలమిచ్చి శాంతినిచ్చి కోరికలను తీరుస్తుంది.

చాంద్రమానం పాటించే మనకు చైత్రం మొదలుకుని ఫాల్గుణం వరకు పన్నెండు నెలలు ఉన్నాయి. ఒక్కో మాసానికి ఒక్కో ప్రత్యేకత, విశిష్టత ఉన్నాయి. కార్తీక మాఘమాసాల తర్వాత అంతటి మహత్యాన్ని స్వంతం చేసుకున్న పుణ్యప్రదమైన మాసం వైశాఖం. ఈ నెలలోనే పూర్ణిమ తిథినాడు విశాఖ నక్షత్రం ఉండడం వల్ల ఈ మాసానికి వైశాఖ మాసం అనే పేరు ఏర్పడింది. ఆద్యాత్మికత, పవిత్రత, దైవశక్తి ఉన్న నెలల్లో వైశాఖమాసానికి ప్రత్యేక స్థానం ఉంది.

అత్యంత పవిత్రమైన మాసంగా చెప్పబడుతూ ఉన్న వైశాఖమాసంలో ప్రతి దినమూ పుణ్యదినమే. అటువంటి ముప్పై పుణ్యదినాలు కలిగిన ఈ మాసంలో ఆచరించాల్సిన విధులు పురాణా గ్రంధాల్లో వివరించబడ్డాయి. ముఖ్యంగా స్నాన, పూజ, దానధర్మాల వంటి వాటిని ఈ నెలలో ఆచరించడం వల్ల మానవుడికి ఇహలోకంలో సౌఖ్యం, పరలోకంలో మోక్షం సిద్ధిస్తాయని పురాణ కథనం.

వైశాఖమాసంలో నదీ స్నానం ఉత్తమమైనదిగా చెప్పబడింది. అందుకు అవకాశం లేని స్థితిలో గంగ, గోదావరి వంటి పుణ్యనదులను స్మరించుకుంటూ కాలువల్లోగానీ, చెరువులోగాని, బావుల వద్దగానీ అదీ కుదరకపోతే ఇంట్లోనే స్నానం చేయాలి నీటియందు సకల దేవతలు కొలువుతీరి ఉంటారని పురాణాలు చెబుతున్నాయి.

’వైశాఖే మాధవో, రాధో’
వైశాఖమాసాన్ని ’మాధవామాసం’ అని అంటారు. ఈ మాసంలో విష్ణుస్మరణతో, అభీష్ట దేవతారాధనతో నియమపాలన చేయడం ఇహ పర శ్రేయస్సునిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. వైశాఖమాసాన్ని మహిమాన్వితమైన దివ్యమాసంగా శాస్త్రాలు వర్ణించాయి. ఈ మాసాన ప్రాతః కాలాన లేచి మధుసూదనుని స్మరిస్తూ స్నానం చేయడం విశేష ఫలప్రదం.

ప్రాతః సనియమ స్నాన్యే ప్రీయతాం మధుసూదనః

"మాధవే మేషగే భానౌ మురారే మధుసూదన
ప్రాతః స్నానేన మే నాథ ఫలదోభవ పాపహన్


అనే ప్రార్థనతో తీర్థాదులలో చేసిన స్నానం దివ్యఫలాన్నిస్తుంది.

తులసీ కృష్ణ గౌరాభ్యాం తయాభ్యర్చ్య మధుద్విషమ్

విశేషేణ తు వైశాఖే నరో నారాయణో భవేత్ 


మాధవం సకలం మాసం తులస్యాయోర్చయే న్నరః

త్రిసంధ్యం మధుహంతారం తస్యనాస్తి పునర్భవః 


వైశాఖమాసమంతా శ్రీ మహావిష్ణువును తులసీ దళాలతో అర్చించితే శ్రేష్ఠం.

వైశాఖమాసంలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తూ ఉంటాడు. కనుక ఎండలు అధికంగా ఉండి మానవులను ఇబ్బందులను గురిచేస్తూ ఉంటాయి. కనుక వేడిమి నుంచి ఉపసమనం కలిగించేవాటిని దానం ఇవ్వాలనేది శాస్త్రవచనం, నీరు, గొడుగు, విసనకర్ర, పాదరక్షలు, వంటివి దానం చేయడం, పళ్ళరసాలు, మజ్జిగ వంటి పానీయాల శాలలని నిర్వహించడం శ్రేష్టం. అట్లే దాహంతో ఉన్నవారికి మంచినీటిని ఇవ్వడం, చలివేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల దేవతానుగ్రహం కలుగుతుంది.

సంధ్యావందనాలు ఆచరించడంతో పాటు శ్రీమహావిష్ణువును తులసీదళాలతో పూజించవలెను. శ్రీమహావిష్ణువు వైశాఖమాసం మొదలుకొని మూడునెలలపాటూ ఈ భూమి మీద విహరిస్తూ ఉంటాడు. అతనికి అత్యంత ప్రీతికరమైన తులసీదళములతో అర్చించడం వల్ల సంతుష్టుడై సకల సౌభాగ్యాలను, సౌఖ్యాన్ని ప్రసాదిస్తాడని చెప్పబడుతున్నది.


శ్రీ మహా భాగవతము

జ్యోతిషశాస్త్రము

నిత్య స్తోత్రావళి

పంచాంగం

Bugga Ramalingeswara Swamy Temple, Tadipatri, Anantapur district - బుగ్గ రామలింగేశ్వర ఆలయం, తాడిపత్రి అనంతపురం జిల్లా



బుగ్గ రామలింగేశ్వర ఆలయం, తాడిపత్రి అనంతపురం జిల్లా

మనదేశంలో వివిధ ప్రాంతాలలో మనకు ఆ పరమేశ్వరుని క్షేత్రాలు దర్శనమిస్తున్నాయి. ఒక్కో ఆలయంలో ఒక్కో పేరుతో కొలువై ఉన్న పరమేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తూ వారి కోరికలను నెరవేరుస్తున్నాడు.

అదేవిధంగా మనదేశంలో ఎన్నో శివ ఆలయాలున్నప్పటికీ ఒక్కో ఆలయానికి ఓ ప్రత్యేకతను చాటుకున్నాయి.ఇలాంటి ప్రత్యేకత చెందిన ఆలయాలలో ఒకటిగా పేరుగాంచినది బుగ్గ రామలింగేశ్వర ఆలయం.

ఈ ఆలయంలో వెలసిన శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది.అంతటి ప్రత్యేకత కలిగిన ఈ ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం.

అనంతపురం జిల్లా తాడిపత్రిలోని బుగ్గ రామలింగేశ్వర ఆలయం ఎంతో మహిమాన్వితమైన ఆలయంగా చెప్పవచ్చు.పెన్నా నది దక్షిణ
తీరంలో త్రేతాయుగంలో సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడి చేత ప్రతిష్టింపబడినది కావడంతో ఇక్కడ కొలువై ఉన్న స్వామివారిని రామలింగేశ్వరునిగా పూజిస్తారు.

బ్రాహ్మణుడైన రావణాసురుడిని చంపడం వల్ల వచ్చిన పాపం నుంచి విముక్తి పొందడం కోసం శ్రీరామచంద్రుడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని విజయనగర సామ్రాజ్య పాలనలో గుత్తి-గండికోట పరిపాలిస్తున్న పెమ్మసాని రామలింగ నాయుడు 1490 - 1509 మధ్య దీనిని నిర్మించాడు.

రామాచారి అని శిల్పకారుడు దాదాపు 650 మంది శిల్పులతో కొన్ని సంవత్సరాల పాటు ఈ ఆలయాన్ని నిర్మించారని అక్కడి శాసనాలు చెబుతున్నాయి.

ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఏడాదిలో 365 రోజులు గర్భగుడిలో కొలువై ఉన్న స్వామివారి లింగం కింద నుంచి జలధార ఊరుతూనే ఉంటుంది. బుగ్గ అనగా నీటి ఊట వర్షాలు లేకపోయినా వేసవి కాలం అయినా, నీటివనరులు ఎండిపోయిన ఈ ఆలయంలో శివలింగం కింద నుంచి మాత్రం నీరు ఊరుతూనే ఉంటుంది. ఈ విధంగా స్వామివారి లింగం నుంచి నీటి బుగ్గ ఏర్పడటంవల్ల ఈ ఆలయానికి బుగ్గ రామలింగేశ్వరుడు అనే పేరు వచ్చింది. ఇప్పటికీ ఆ నీటి బుగ్గ రహస్యం ఏమిటో ఎవరికీ అంతుచిక్కడం లేదు.

దేవతలు తూర్పు ముఖంగా ఉండే ఇతర హిందూ దేవాలయాల మాదిరిగా కాకుండా, ఈ ఆలయంలో శివలింగం పశ్చిమాభిముఖంగా ఉంటుంది.

విష్ణు మందిరం ముందు ఏడు చిన్న స్తంభాలను కొట్టినప్పుడు, అవి 'సప్తస్వరాలు' (ఏడు సంగీత స్వరాలు) పలుకుతాయి. ఈ ఆలయ గోపురాలు అసంపూర్తిగా ఉన్నాయి. 

ఇది విజయనగర సామ్రాజ్య పాలనలో 1802లో కొలిన్ మెకంజీ సేకరించిన తాడిపత్రి కైఫియత్ ప్రకారం, ఈ ఆలయాన్ని విజయనగర సామ్రాజ్యంలోని గుత్తి-గండికోట ప్రాంత పాలకుడైన రామలింగ నాయుడు నిర్మించినట్లు తెలుస్తుంది.

ఈ ఆలయం మొత్తం నల్లటి రాతితో నిర్మించడం మరొక ప్రత్యేకత. 

ఉత్సవాలు: ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మాఘ మాస బహుళ అష్టమి మొదలుకొని ఫాల్గుణ మాసం శుద్ధ తదియ వరకు అనగా 11 రోజుల పాటు స్వామివారికి బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.

రైలు రోడ్డు మార్గం: బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం తాడిపత్రి రైల్వే స్టేషన్ నుండి 4 కిమీ (2.5 మైళ్ళు) దూరంలో ఉంది.

మన దేవాలయాలు చారిత్రక నగరాలూ

Oils to be used for lamp worship - దీపారాధనకు వాడవలసిన నూనెలు

దీపారాధనకు వాడవలసిన నూనెలు

హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం దీపారాధనకు వివిధ రకాల నూనెలు మరియు నెయ్యిని ఉపయోగిస్తారు. ఒక్కో రకమైన నూనెకు ఒక్కో విశిష్టత మరియు ఫలితం ఉంటుంది.

ఆవు నెయ్యి: ఇది అన్నింటికంటే అత్యుత్తమమైనది. ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు, అష్టభోగాలు మరియు అనంతమైన ఫలితాలు లభిస్తాయని నమ్మకం.

నువ్వుల నూనె: దీనిని మంచి నూనె అని కూడా అంటారు. ఇది అన్ని దేవతలకు ఇష్టమైనది, ముఖ్యంగా వినాయకుడికి మరియు శని దోష నివారణకు నువ్వుల నూనెతో దీపం పెట్టడం శ్రేష్ఠం.

విప్ప నూనె: దీనిని పూజలలో 'అధమం'గా పరిగణించినప్పటికీ, ఆరోగ్యం కోసం మరియు గ్రహ దోష నివారణకు ఉపయోగిస్తారు.

వేప నూనె : విప్ప నూనె, ఆముదం మరియు ఆవు నెయ్యితో కలిపి వేప నూనెను వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని విశ్వసిస్తారు.

కొబ్బరి నూనె: ముఖ్యంగా వినాయకుడికి చేసే పూజల్లో కొబ్బరి నూనెను ఉపయోగిస్తే శుభం జరుగుతుందని పెద్దలు చెబుతారు.

పంచ దీపం నూనె: ఇది ఐదు రకాల నూనెల (నువ్వులు, ఆముదం, విప్ప, వేప, కొబ్బరి/నెయ్యి) మిశ్రమం. ఇది ఆధ్యాత్మిక శక్తిని పెంచి శుభాన్ని కలిగిస్తుంది.

ముఖ్య గమనిక: దీపారాధనకు వేరుశెనగ నూనె ఎప్పుడూ వాడకూడదు.

మట్టి, వెండి లేదా పంచలోహాలతో చేసిన దీప కుందులను ఉపయోగించడం అత్యుత్తమం.

Chapter 152 The Effect of Illusion - Narada's Story - అధ్యాయము 152 మాయాప్రభావము - నారద వృత్తాంతము

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము - అధ్యాయము 152

మాయాప్రభావము - నారద వృత్తాంతము

వ్యాసు డిట్లనెను : ఓ మహారాజ! శ్రీమాయాదేవీ మాహాత్మ్యము నేను నారదునివలన వింటిని. దాని నంతయు నీకు తేటపరతును. చక్కగ నాలకింపుము. అట్లు నారదుడు నారీరూపము దాల్చిన కథయంతయు నతని నుండి నేను వింటిని. 

ఆ పిదప నేను సకలవిదుడగు నారదుని మరల నిట్లు ప్రశ్నించితిని : మునీశా! అటు పిమ్మట నారాయణుడు నీతో నేమి పలికెను? మాధవుడగు జగన్నాథుడు నిన్ను గూడి యెచటి కరిగెను? 

నారదు డిట్లనెను : ఆ విధముగ శ్రీహరి నాతో మనోహరమగు సరస్సుచెంత బలికిన పిమ్మట నతడు గరుత్మంతునెక్కి వైకుంఠమేగ నివ్చయించుకొనెను. అపుడు హరి నాతో నారదా! నీవు నీ యిచ్చవచ్చినచోటి కేగుము లేదా నా లోకమునకైన రమ్ము. ఇందు నీకేది యిష్టమో దాని నొనరింపు' మనెను. 

నేను మాధవునకు నమస్కరించి బ్రహ్మలోకమున కేగితిని. దేవదేవుడగు హరి వెంటనే గరుడాసన మధిరోహించెను. అట్లు హరి నన్ను సాగనంపి తను వైకుంఠధామము జేరెను. జనార్దనుడరిగిన తరువాత నేను నలువకొలువు కూటమున కేగితిని. నే నట నా తండ్రికి ప్రణమిల్లితిని. నేననుభవించిన మహాద్భుతములగు సుఖదుఃఖములు తలపోయుచు నేను నా తండ్రిముందు నిలుచుంటిని. చింతాతురుడనగు నన్నుగాంచి 

నా తండ్రి నాతో నిట్లనెను : ఓ మునీ! మహాత్మా! నీ వింతవఱకెక్కడి కేగితివి? ఏల దిగులుతో నున్నావు. మునిసత్తమా! నీ చిత్తమేలకో నేడు కొందలమందుచున్నట్లు దోచుచున్నది. నిన్నెవరేని వంచించిరా? కాకేదేని యవ్యక్తమైన మహాద్భుత విషయము గనుగొంటివా? కుమారా! నీవు వ్యాకులునివలె జ్ఞానహీనునివలె నేల కనబడుచున్నావు? అని నా తండ్రి యడుగగ నేను దర్భాసనముపై గూరుచుండి ఆ పిమ్మట కాలాత్మకమగు మాయబలమునకు గురియైన నా వృత్తాంతమంతయు నతని కిట్లు పూసగ్రుచ్చినట్లు చెప్పితిని : 

తండ్రీ! నేను ప్రభ విష్ణువగు విష్ణుని చేతిలో మోసపోతిని.

నేను పెక్కేండ్లు స్త్రీ రూపము దాల్చిన పుత్రశోకముతో తీరని దుఃఖ మనుభవించితిని. పిమ్మట కొన్నాళ్లకు మరల విష్ణుని మేలి వచనములకు తెలివొంది కొలనిలో గ్రుంకి నారదుడనైతిని. నేను మయామోహము పొందుటకు కారణమేమి? నేను వట్టి మాయకు లొంగి పూర్వ విజ్ఞానమంతయు గోల్పోతిని. 

ఈ మహామాయా ప్రభావము దాటరానిది. జ్ఞానమును నశింపజేయునది. ప్రమోహమున కిది మూలకందము. ఇట్టి మాయను నేనెన్నడు నెఱుంగనైతిని. మాయలోని మంచిచెడ్డలన్నియు ననుభవించితిని. 

తండ్రీ! నీవు కాల మాయాపరీక్షలో నే తీరుగ నిగ్గు దేలితివో యా యుపాయము నాకు కొంచెము సెలవిమ్ము అని నేను పలుకగ బ్రహ్మ ప్రేమతో నలతినగవు తళుకొత్త నాతో బలికెను : 

మాయ సకల సురమునులకును జ్ఞానులకును తాపసులకును గాలి యాహారముగల వారికిని యోగులకును తెలువరానిది. ఈ మాయాశక్తి బల మెఱుంగుటకు నే నశక్తుడను. అటులే విష్ణువుగాని శివుడుగాని దాని పుట్టుపూర్వోత్తరము లెఱుగరు. ఏమియులేని మాయ తానంతయు నాయెను. అది కాల-కర్మ-స్వభావములతో నిమిత్త కారణములతో గూడియుండును. 

సృష్టి స్థితి సంహార కార్యము లొనర్చును. ఎంతటి వారికిని తెలువ సాధ్యముగానిది. మాయా మహాబలముగూర్చి యింతగ నబ్బురమొంద నేల? మే మెల్లరము మాయా శక్తికి మోహితులమై యున్నవారమే అని నా తండ్రి వచింపగ నేనచ్చెరువందక నా తండ్రి యనుమతినొంది పుణ్యతీర్థములు దర్శించుచు నిచటి కేతెంచితిని. 

కనుక వ్యాసా! నీవును కౌరవ నాశనము గల్గిన శోకము విడనాడి యిచ్చట నిశ్చింతగా కాలము గడుపుము.

జీవుడు తాను జేసికొన్న మంచిచెడ్డలను తప్పక అనుభవించి తీరవలయునని మదిలో నిశ్చయించుకొని స్వేచ్ఛగ తిరుగుము. 

రాజా! ఈ ప్రకారముగ నారదుడు పలికి నాకు కనువిప్పు గలిగించెను. పిమ్మట నేను నారద వచనములు నెమ్మది తలపోయుచుంటిని. అపుడు నా బ్రదుకు క్రొత్త మలుపును తిరిగెను. అంత నేను సారస్వత కల్పమునం దీ సరస్వతీ తీరమందున వసించి ప్రొద్దుపోవుట కీ శ్రీదేవీ భాగవతము రచించితిని. 

రాజా! ఈ మహాదేవీ పురాణము సర్వసంశయములు పాపును. అత్యుత్తమము. పెక్కుపాఖ్యానముల కూడలి. వేద ప్రామాణ్యము నాశ్రయించినది. 

నృపవర్యా! దీనిని గూర్చి నీకు సందియ మావంతయు వలదు. ఒక గారడివాడొక కట్టెబొమ్మను తనచేత నుంచుకొనును. అది యతనికి వశమగును. అతడు దానిని తన యిచ్చ వచ్చిన రీతి నాడించును. అదే విధముగ మహామాయ యీ చరాచర జగముల నాటాడించును. ప్రతి ప్రాణికి పంచేంద్రియములు-మనస్సు-చిత్తమునుండును. 

కనుక బ్రహ్మాదిస్తంబమువఱకు గల దేవ-దనుజ-మనుజులను మాయాశక్తి యాడించును. ఈ యంతటి కన్నివిధముల మాయా త్రిగుణములే కారణములు. కారణము లేక కార్య మెప్పుడును గలుగదనుట నిజము గదా! జీవుల స్వభావములు భిన్న భిన్నములుగ నుండును. 

కనుక జీవుల పుట్టుకలు మాయాత్రిగుణముల బలమువలన గలుగును. గుణముల కారణమున నొకడు శాంతుడుగ నొక్కడు ఘోరుడుగ మఱొక్కడు మూఢుడుగ బుట్టును. ఈ ప్రపంచమునందు గుణముల మేళనమున బుట్టిన నరుడు గుణరహితు డెట్లు గాగలడు? దారములు లేక వస్త్రము లేదుగదా! 

అట్లే త్రిగుణములు లేనిచో సంసారియు లేడనుట నిక్కము. మట్టిలేక కుండలేదు. అటులే గుణములు లేక ప్రాణి లేడు. బ్రహ్మ-విష్ణు-మహేశ్వరులు మువ్వురును త్రిగుణబద్ధులే.

వీరు ఆయా గుణములవలన నొకప్పుడు శాంతులుగ వేరొకప్పు డుగ్రులుగ నింకొకప్పుడు విషాదభరితులుగ నుందురు. బ్రహ్మ సత్వగుణములతో తేజరిల్లునపుడు శాంతుడు జ్ఞాని సమాధియుతుడు సర్వభూత ప్రీతిసహితుడునై వర్తించును. 

సత్త్వము గోలుపోయినప్పుడతడు రజోగుణమున రాగిల్లి ఘోర తీవ్రరూపముతో దయమాలి యుండును. అతడు తమోగుణముతో గ్రుడ్డియైనపుడు పలువిధములగు విషాదములతో మూఢుడగును. ఇది యథార్థము. 

విశ్వాధారుడగు మాధవు డెల్లవేళల సత్త్వప్రకాశము నాశ్రయించి యుంటవలన నిత్యశాంతుడు నిత్యప్రియుడు నిత్యజ్ఞానియై విరాజిల్లును. లక్ష్మీకాంతుడు రజోగుణ పరాధీనుడైనపుడెల్ల భూతములందు దయమాలి ఘోరరూపమున వర్తిల్లును. పరమశివుడును సత్త్వసంపన్నుడై నపుడు శాంతి ప్రియములు గురియును. 

ఆ శివుడే రజోరంజితుడై కరుణమాలి ఘోరరూపమున నుగ్రుడగును. శివుడు తమోగుణమయుడై నపుడు విషాదమున మూఢత నందును. ఈ విధముగ బ్రహ్మ - విష్ణు - మహేశులను గుణబద్ధులగుదురు. 

ఇక సూర్యచంద్రవంశజులు యుగయుగమందలి చతుర్దశమన్వాదుల విషయము చెప్పనేల? ప్రపంచమందు వీరుగా కితరుల విషయ మింక చెప్ప బనిలేదు. ఈ విశ్వవిశ్వమంతయును దేవ - దానవ - నర - ప్రాణులతో నిండి నిబిడమై మాయాధీనమై ఎసంగును. 

ఇంక మాయను గుఱించి సంశయింప బనిలేదు. ప్రతి జీవుడు మాయకు వశుడై భ్రాంతుడై తత్పరుడై వ్యవహరించును. మాయ సచ్చిదానందలహరియగు పరతత్వమునకు వశ##మై తదధీనమై ప్రేరితయై యెల్లజీవులందు బాయకుండును.

కనుక జ్ఞాన ప్రకాశము గోరువాడు మాయేశ్వరి పరమేశ్వరి అఖిలేశ్వరి మాయావిశిష్ట సచ్చిదానందమయియగు భగవతిని గొలువవలయును. శ్రీదేవిని ధ్యానించవలయును. శ్రీమాత నారాధింపవలయును. శ్రీమహారాజ్ఞికి మోకరిల్లవలయును. శ్రీరాజరాజేశ్వరిని జపించవలయును. 

దాని ఫలితముగ దయామతల్లియగు లోకాలనేలు తల్లి ప్రసన్నురాలయి దయతో జీవులను బంధముక్తులుగ జేయును. జగదంబ తన దివ్యానుభూతిని తన భక్తులకు గలిగించును. జీవకోటిని మాయనుండి దాటించును. ఈ భువనములన్నియు మాయామయములు. జగదీశ్వరి భువనైక నాయిక. 

అందువలననే త్రైలోక్య సుందరియగు దేవి త్రిభువనేశ్వరీ నామమున వన్నె గాంచినది. రాజా! ఆ చిద్రూపిణియందు చిత్తము నిలుపవలయును. అట్టి వానిని సదసద్రూప యగు మాయ యేమియు కదలింపజాలదు. కనుక మాయను దాటి దాటించుట కితర దేవతలు సమర్థులుగారు. దానికి కేవలము సచ్చిదానందమయియగు శ్రీమాతయే సమర్థురాలు. పెంజీకటిని జీకట్లు పోగొట్టజాలవు గదా! 

కాని సూర్యచంద్రాగ్నుల కాంతులును మెఱపుకాంతులును చీకట్లను పాపగలవు. కనుక శ్రీదేవి స్వయంప్రకాశస్వరూపిణి - మాయాధీశ్వరి - సంవిద్రూపిణి - జగదంబ. మాయాగుణములు తొలగుటకు పరమప్రీతితో దేవి నారాధింపవలయును. 

ఈ ప్రకారముగ నీకు వృత్రాసురవధ మున్నగు ఆఖ్యానములు చక్కగ విరవించితిని. రాజా! ఇంక నీ వే విషయము వినదలతువో తెలుపుము. ఓ సత్యవ్రతా! నీకింతవరకును శ్రీకరంబగు శ్రీదేవీ భాగవతమునందలి పూర్వార్ధము వివరించితిని. ఇందు పరదేవి మాహాత్మ్యము విపులముగ తేనెలొలుకునట్లు వర్ణింపబడినది. 

శ్రీమాతృదేవీరహస్యము ప్రతివానికి చెప్పకూడదు. దీనిని దేవీభక్తుడు-జ్యేష్ఠపుత్రుడు-గురుభక్తిగల శిష్యుడునగు వారికి తెలుపవచ్చును. ఇది సకల కథలకు సారభూతమగు పురాణము. సమస్త వేదములతో సమానము. సముచితములగు ప్రమాణములతో సమకూర్చబడినది. ఈ లోకమున ఎవడు దీనిని పరమభక్తి భావమున వినునో చదువునో అతడీ లోకమున ధనవంతుడును జ్ఞానవంతుడును నగును.

శ్రీ దేవీ భాగవత పూర్వార్ధము సమాప్తము

Kings of the Surya Dynasty - Sukanya Vritthanamu - సూర్య వంశ రాజులు - సుకన్యా వృత్తాంతము

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము -  సూర్య వంశ రాజులు - సుకన్యా వృత్తాంతము జనమేజయు డిట్లనెను : ఓ మహానుభావా ! సూర్యవంశమునందు బుట్టిన ధర్మజ్ఞులగ...