Monday, March 9, 2026

Pitru Shapam(Sapam) Stree Shapam Dosha(Dosham) - పితృశాపం - స్త్రీ శాపం

పితృశాపం - స్త్రీ శాపం

తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు వస్తుంది. దాన్నే జాతకంలో పితృశాపం అని, స్త్రీ శాపం అని అంటారు. నన్నడిగి కన్నావా? కన్నప్పుడు భరించాలి అంటూ పిల్లలు అరవడం చూస్తుంటాము. అడిగి కనడం కాదు, వారిని తల్లిదండ్రులుగా నీవే ఎంచుకున్నావు. జీవుడు తను చేసిన కర్మ వల్లనే రాబోయే జన్మలో తన తల్లిదండ్రులను, కుటుంబాన్ని ఎంచుకుంటాడు. ఆ కుటుంబంలో ఎవరైనా స్త్రీలకూ అన్యాయం చేస్తే స్త్రీ శాపం తగులుతుంది. అది రాబోయే తరాలకు సంక్రమిస్తుంది. 

సర్పాలను చంపినప్పుడు సర్పశాపం, పితృదేవతలకు శ్రాద్ధం నిర్వహించనందువలన పితృశాపం సంక్రమిస్తాయి. వీటి కారణంగా జీవితంలో ఎదుగుదల ఉండదు, ఉద్యోగాలు రావు, వచ్చినా అభివృద్ధి ఉండదు, సంతానం కలగదు, వ్యాపారంలో నష్టం మొదలైనవి వస్తాయి. ఇవన్నీ పూర్వీకులు చేసిన కారణంగా తర్వాతి తరం అనుభవిస్తుంది. 

అలాగే గురుగ్రహం యొక్క అనుగ్రహం లేనప్పుడు పిల్లల జీవితంలో వృద్ధి ఉండదు. పిల్లలను చూసి తల్లిదండ్రులు భాధ పడతారు. నిజానికి అనుభవించేవారికంటే వారిని చూసేవారి బాధే అధికంగా ఉంటుంది. 

'గురుధ్యానం ప్రపద్యామి పుత్ర పీడోపశాంతయే' అని శాస్త్ర వాక్కు. గురు/బృహస్పతి ధ్యానం వలన సంతానం వలన కలిగే భాద తొలగుతుంది. ఒక వ్యక్తి ఒక కుటుంబంలో పుట్టినప్పుడు, అతడు తన కర్మతో పటు ఆ కుటుంబానికి చెందిన కర్మను కూడా స్వీకరిస్తాడు. అతడిపై దాని ప్రభావం ఉంటుంది. ఈ లోకంలో ఉండే అన్ని జీవుల్లో దేవుడు ఉన్నాడు. తెలిసో తెలియకో ఇతరులను విమర్శించడం అంటే దేవుడిని అవమానించడం, విమర్శించడమే. అదికూడా కొంత పాపాన్ని సమకూర్చిపెడుతుంది. అది కూడా గురుశాపానికి కారణమవుతుంది. 

పచ్చని చెట్లపై గురు ప్రభావం ఉంటుంది. పచ్చని మొక్కలు/చెట్లను నరికితే, అది జాతకంలో గురుదోషంగా కనిపిస్తుంది. కళ్ళ ముందే పిల్లలు మరణించడం, స్త్రీ సంతానం ఉంటే వారు వైధవ్యం పొందడం వంటివి జరుగుతాయి. అంటే ఆ పిల్ల పుటింట్లో కూర్చుని ఏడుస్తుంది, ఆమెను చూసి తల్లిదండ్రులు ఏడుస్తారు. అదే పండ్లు, కాయలు, పుష్పాలతో ఉన్న చెట్లను నరికితే సంతానం కూడా కలగని సందర్భాలుంటాయి. దానికి కారణం ఆ బిడ్డ తల్లిదండ్రులు చేసిన పాపం. అందుకే పిల్లలు కలవారు పచ్చని చెట్లు కొడుతుంటే, పిల్లలున్న వాడివి పచ్చని చెట్లు కొడుతున్నావ్, ఎంత తప్పు చేస్తున్నావో అని పెద్దలంటారు. 

కొందరు భూములు లాక్కుంటారు. ముఖ్యంగా రాజకీయనాయకులు, బడా వ్యాపారవేత్తలు తమ అక్రమసంపాదనను సక్రమంగా చూపించడం కోసం పేద రైతులను మోసం చేసో, మరొక విధంగానో భూములులను ఆక్రమించుకుంటారు. వ్యవసామే మీద పన్ను లేదు కనుక ఆ భూమిలో పండిన దానిపై వచ్చిన ఆదాయంగా తమ అక్రమసంపాదనను చూపి సక్రమం చేసుకుంటారు. 

ఒక కుటుంబంలోని వారికీ ఒక భూమి వంశపారంపర్యంగా సంక్రమించినప్పుడు, దానికి పితృదేవతల అనుగ్రహం ఉంటుంది. భూమిని బలవంతంగా లాక్కుంటే, పితృదేవతలు ఏడుస్తారు. అది శాపంగా మరి లాక్కున వారి కడుపు కొడుతుంది. వారి పిల్లలు అకాల మరణం చెందుతారు. లేదా జీవచ్ఛవాలుగా మిగిలిపోతారు. దీనికి కారణం ఆ  తల్లిదండ్రులు చేసిన పాపం. 

దానికి ముందు వెనుక బాగా ఆలోచించాలి. యోగులైతే ఒక భూమిని కొనేముందు పితృదేవతలను సంప్రదిస్తారు. మీరు ఉచితంగా ఇస్తానన్నా, వారు తీసుకోరు. ఎందుకంటే తమ వారసులు అనుభవించకుండా భూములు అమ్ముకోవడం పితృదేవతలకు ఇష్టం ఉండదు. ఏ వ్యక్తి అయినా సంపాదించేది తన కోసం, తన పిల్లల కోసం, వారు బాగుండడం చూసి ఆనందించాలని అనుకుంటాడు. అక్రమంలో అతడు అవినీతికి పాల్పడితే, ఇతరులకు ద్రోహం చేస్తే, వారి ఏడుపు వీరికి శాపంగా మారుతుంది. ఆ అవినీతి పరులు బాధపడేది వారి పిల్లలకు హాని కలిగినప్పుడే. అందుకే వారి పిల్లలు అకాలమరణం పాపవుతారు. ఇలా ఎన్నో రకాలుగా తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు సంక్రమిస్తుంది. కాబట్టి, తస్మాత్ జాగ్రత్త.

కర్మ - ఫలితం

Grihastha Pujalu Dharma Sandehalu - గృహస్థులు- పూజాలూ - ధర్మసందేహాలు

గృహస్థులు- పూజాలూ - ధర్మసందేహాలు

పూజ గది విడిగా లేని వారు పంచముఖ హనుమంతుడి ని పెట్టకూడదు,హనుమంతుడి ఫోటో కానీ విగ్రహం గాని ఏది పూజ గది విడిగా లేని వారు ఉంచకూడదు.

సూర్యుడి విగ్రహం ఇంట్లో పెట్టకూడదు,ఆయనే ప్రత్యక్షంగా కనిపిస్తారు కాబట్టి నేరుగా నమస్కరించాలి.

ఉగ్ర రూపంలో ఉన్న నరసింహ స్వామి ఫోటో గాని విగ్రహం కానీ ఉంచకూడదు, లక్ష్మీ నరసింహ, యోగ నరసింహ, లేదా ప్రహ్లాద అనుగ్రహ నరసింహ స్వామి ఫోటో పెట్టికొని పూజ చేయవచ్చు.

చేతిలో ఫ్లూట్ ఉన్న కృష్ణుడు విగ్రహం ఇంట్లో ఉండకూడదు, కృష్ణుడి విగ్రహం అవుతో ఉన్న ఫొటో గాని చిన్న పరిమాణంలో విగ్రహం కానీ ఉండవచ్చు.

లక్ష్మీ దేవి విగ్రహం ముందు కానీ ఫోటో ముందు కానీ ఒక చిన్న గిన్నెలో(వెండి అయితే మంచిది) బియ్యం, అందులో కొన్ని గవ్వలు వేసి ఉంచాలి.

విగ్రహం పరిమితి చాలా చిన్నదిగా ఉంటే మంచిది , పండో పాలో పెట్టి కూడా హారతి ఇస్తే సరిపోతుంది, విగ్రహాల పరిమితి పెద్దదిగా ఉంటే రోజు మహా నివేదన, వారంలో ఒక్కసారి అయినా అభిషేకం, ఉండాలి... పూజ లేకుండా ఉండకూడదు.

ఇంట్లో నటరాజ స్వామి విగ్రహం పెట్టుకోకూడదు, నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్యం నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్కడ ఉండవచ్చు.

నిత్యం పూజ లో ఉన్న విగ్రహాలు పూజ గది నుండి తీసి వేయాల్సి వస్తే గుడిలో పెట్టండం మంచిది.

ఇంట్లో ఎక్కడా లక్ష్మీ దేవి నిల్చుని ఉన్నట్టుగా ఉండకూడదు, లక్ష్మీ దేవి పచ్చరంగు చీరతొ అటూఇటూ ఏనుగులు ఉన్న ఫొటో కి గృహస్థులు పూజించడం చాలా మంచిది.

అప్పుల బాధలు తీరాలి అంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి..ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదంతో దీపారాధన చేయాలి... నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం అవునేతి దీపం పెట్టాలి, శత్రు పీడల, గండాలు ఆస్తి వివాదాలు ఇంట్లో వారి అనారోగ్యం తొలుగుటకు తెలుపు నువ్వుల నూనె తో నిత్యా దీపారాధన చేయాలి.

పచ్చి పాలు నైవేద్యం పెట్టకూడదు, కాచి చల్లారిన పాలు అభిషేకం కి వాడకూడదు.

ఇంట్లో తరచుగా సాంబ్రాణి వేస్తూ ఉండాలి నెగటివ్ ఎనర్జీ దూరంగా ఉంటుంది.. ఇంట్లో గాలి శుభ్రం అవుతుంది.


ఏ ప్రదేశాల్లో జపం చేస్తే ఎంత ఫలితం ఉంటుంది?
గృహంలో ఎంత చేస్తే అంత ఫలితం ఉంటుంది. నది ప్రాంతంలో చేస్తే రెట్టింపు ఫలితం వస్తుంది. గోశాలలో చేస్తే వంద రెట్లు, యాగశాలలో అంతకు మించి ఫలితం వస్తుంది.

పుణ్య ప్రదేశాల్లో, దేవతా సన్నిధిలో చేస్తే పదివేల రెట్లు వస్తుంది. శివసన్నిధిలో చేస్తే మహోన్నతమైన ఫలం వస్తుంది.

వెదురు తడక మీద కూర్చుని జపం చేస్తే దరిద్రం ఆవహిస్తుంది. రాతి మీద కుర్చుని జపిస్తే రోగాలు వస్తాయి. నేల మీద కూర్చొని చేస్తే దుఃఖం, గడ్డి మీద చేస్తే కీర్తి నాశనం అవుతుంది.

ద్వారానికి పైనున్న కమ్మి లక్ష్మి స్వరూపం అందుకే దానికి మామిడి తోరణం కడతారు. కింద కమ్మి పవిత్రమైనది, కనుక దానికి పసుపు రాస్తారు. శాస్త్రపరంగా చెప్పాలంటే గడపకు పసుపు రాయడం వల్ల క్రిమికీటకాలు, విష పురుగులు ఇంట్లోకి రాకుండా ఉండటానికి అనుకోవచ్చు.

పంచామృతం
ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదారల మిశ్రమాన్ని పంచామృతం అంటారు. దీనిని పూజలో దేవునికి నివేదిస్తారు.

పంచగవ్యాలు
ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రంల మిశ్రమమే పంచగవ్యం. దీనిని పంటల రోగనివారణకు వాడతారు.

తీర్థాన్ని మూడుసార్లు తీసుకుంటారు. ఎందుకు?
తొలితీర్థం శరీర శుద్ధికి, శుచికి. రెండవ తీర్థం ధర్మ, న్యాయ ప్రవర్తనకు, మూడవ తీర్థం పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదం కొరకు.

కర్మ - ఫలితం

Karma - Phalitham - కర్మ - ఫలితం

కర్మ - ఫలితం

కృష్ణుడు కంసుని సంహరించిన వెంటనే తన తల్లిదండ్రులైన వసుదేవుడు దేవకి లను చూడటానికి, చూచి వారిని కారాగారం నుండి విముక్తి కలిగిద్దామని వారిని ఉంచిన కారాగారానికి వెళ్ళాడు.

దేవకీమాత కృష్ణుని చూసిన వెంటనే 'నాయనా! నీవే పరమాత్మవి కదా!, నీకు ఎన్నో దైవిక శక్తులు ఉంటాయి, అయినా నువ్వు ఎందుకు 14 సంవత్సరాలు ఆగావు కంసుని సంహరించడానికి, కారాగారం నుంచి మమ్మల్ని విడిపించడానికి' అని అడిగింది.

అప్పుడు కృష్ణుడు "అమ్మా! నన్ను క్షమించు, నీవు నన్ను 14 ఏళ్ళు అరణ్యవాసం చేయమని అడవులకు ఎందుకు పంపావు నా గత జన్మలో?' అని చిరునవ్వు తో! 
అన్నాడు. దేవకి ఆశ్చర్య చకితురాలయింది,

దేవకీ "కృష్ణా ఇది ఎలా సాధ్యము? ఎందుకు ఇలా అంటున్నావు?" అని అడిగింది. అప్పుడు కృష్ణుడు "అమ్మా! గత జన్మ గురించి నీకు ఏది జ్ఞాపకం ఉండదు. కానీ నీవు గత జన్మలో కైకేయివి, నీ భర్త దశరథుడు!" దేవకి మరింతగా ఆశ్చర్యపడి కుతూహలంగా కృష్ణుణ్ణి "అయితే మరి కౌసల్య ఎవరు ఈ జన్మలో?" అని 
అడిగింది.

అపుడు కృష్ణుడు "ఇంకెవరు? యశోద మాత! 14 సంవత్సరాలు తల్లి ప్రేమకు ఆమెని దూరం చేశావు గత జన్మలో, అది ఈ జన్మలో ఆమె తిరిగి పొందగలిగింది." అని
 అన్నాడు, 

ఎంతటి వారైనా కర్మ ఫలాలను అనుభవించక తప్పదు, భగవద్భక్తులైనా, అవతార పురుషులైనా వాటి నుండి తప్పించుకోలేరు, ఇంకా మానవ మాత్రలం మనమెంత!

అలాగే యశోద మాత కృష్ణుని వివాహం చూడలేదని తపించింది. కలియుగంలో  వకుళ మాతగా పుట్టి తన చేతులమీదుగా దగ్గరవుండి మరీ శ్రీనివాసుని కళ్యాణం జరిపించి తన కోరికను తీర్చుకుంది. 

ఇలాంటి కర్మలు పరమాత్ముని లీలల వల్ల మనకు తెలిశాయి. మనం మానవమాత్రులము కావున మనం చేసే ప్రతికర్మ లేదా మనకు జరిగే ప్రతి కర్మ భూత, భవిషత్తు మరియు వర్తమానాల మీద ఆధార పడుతాయి. మనం ముందు జన్మలో చేసిన కర్మల వల్ల ఈ జన్మలో ప్రతిఫలం పొందుతాము. అది మంచి అయినా చెడు అయినా. వర్తమానం లో చేసిన కర్మ ఫలితాలు భవిషత్తులో కానీ తదుపరి జన్మలో మంచి కానీ, చేడు కానీ అనుభవించ వలసిందే. 

కావున కర్మను ఎవ్వరూ తప్పించలేరు. భూత, భవిషత్ కలలో ఏమి జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి, వర్తమాన కాలంలో అనగా ప్రస్తుత జన్మలో ధర్మబద్ధంగా, ధర్మకార్యాలు చేస్తూ నిజాయితీగా వ్యవహరిస్తూ తమ ఇష్ట దైవాన్ని పూజిస్తూ, స్మరిస్తూ జీవనం గడిపే వానికి అంతా శుభం భూయాత్.

పితృశాపం - స్త్రీ శాపం

Narada Muni encouraged Prajapati Daksa's second group of sons (the Savalasvas/Shabalashva) by awakening their natural affinity for their brothers (the Haryasvas) - నారదుండు శబళాశ్వులకు నివృత్తి మార్గంబు నుపదేశించుట

నారదుండు శబళాశ్వులకు నివృత్తి మార్గంబు నుపదేశించుట

ఈ విధంగా ఘోరతపస్సు చేస్తున్న శబలాశ్వులను మోక్షపథగాములుగా చేయడానికి నారదుడు ఇదివరకటిలాగే వచ్చి వారికి ధర్మబోధ చేశాడు. 'మీ అన్నలు ఏ మార్గాన్ని ఆశ్రయించి ముక్తిని పొందారో మీరు ఆ మార్గాన్నే ఆశ్రయించవలసి ఉంది. ఎవ్వడైనా సోదరులు చూపిన మార్గాన్ని అనుసరించి వెళ్లేవాడే విశేషజ్ఞుడు అని పెద్ద లంటారు. అందువల్ల ఆ మార్గంలోనే మీరు ప్రవర్తించి ఎల్లవేళలా దేవతలతో కలిసి స్వర్గంలో సుఖంగా ఉండండి' అని చెప్పి వెళ్ళిపోయాడు. నారదుని మాటలను నమ్మిన శబలాశ్వులు విరాగులై

ఓ రాజా! నేను చెప్పేది విను. మంచి గుణవంతులైన ఆ శబలాశ్వులు ఇంతవరకు ఆచరించిన ఐహిక కర్మలకు సిగ్గుపడి, తమ అన్నలు వెళ్ళిన మోక్షమార్గాన్ని అనుసరించి పున్నమినాటి రాత్రి గతించిన తరువాత చంద్రకళలు క్రమంగా క్షీణించిన విధంగా కర్మ క్షయాన్ని పొంది వారు మోక్షాన్ని చేరుకున్నారు.

అదే సమయంలో దక్షునికి అనేక విధాలైన దుశ్శకునాలు గోచరించాయి. ఆయన మనస్సు అధికమైన వ్యథతో క్షోభించింది. తన పుత్రులు గతించడానికి కారణం

నారదుని కారణంగానే ఇలా జరిగిందని గ్రహించిన దక్షుడు మిక్కిలి కోపంతో అతని వద్దకు వెళ్ళి ఆపలేని బాధకు గురైనవాడై మిక్కిలి ఆగ్రహంతో

దక్ష ప్రజాపతికి మిక్కిలి కోపంతో ముఖం ఎర్రబడింది, కనుబొమలు ముడివడినాయి. కన్నులలో నిప్పులు రేగాయి. పెదవులు అదిరాయి. పండ్లు పటపట కొరుకుతూ నారదునితో ఇలా అన్నాడు.

పరమసాధువులాగా ఉంటూ ధూర్తుడవై చిన్నపిల్లలైన నా పుత్రులకు సన్న్యాసమార్గాన్ని బోధించావు. నా కుమారులు ఈ దుస్థితి పొందగా నేను బాధపడకుండ ఉండగలనా? ఇందుకు కారణమైన దుష్టుడవగు నిన్ను నా శాపాగ్నిజ్వాలలో పడదోసి బాధిస్తాను.

Narada Muni encouraged Prajapati Daksa's sons the Haryasvas abandon their father's mandate of procreation and instead pursue spiritual liberation - నారదుండు హర్యశ్వులకు నివృత్తి మార్గంబు నుపదేశించుట

నారదుండు హర్యశ్వులకు నివృత్తి మార్గంబు నుపదేశించుట

నాయనలారా! మీరు మిక్కిలి మూఢులుగా కన్పిస్తున్నారు. మీ భవిష్యత్తును విచారించుకొనలేకున్నారు. మీరు పసిబిడ్డలు. ఈ భూమి పరిమాణమెంతో తెలియనివారు. ఇక జీవులను ఏ విధంగా సృష్టించగలరు? సర్వాంతర్యామియైన ఆత్మస్వరూపుడు పురుషుడు ఒక డున్నాడు. స్త్రీరూపిణియై అనేక రూపాలు ధరించిన ప్రకృతి ఒకటున్నది. మాయలమారి అయిన ఆ ప్రకృతి పురుషుణ్ణి లోబరచుకుంటుంది. ప్రకృతీ పురుషుడూ కలిసి సంసార ప్రవాహాన్ని సాగిస్తారు. ఈ సంసారమనే నది రెండువైపులనుండీ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవాహాన్ని అనుసరించి ఒక హంస విహరిస్తూ ఉంటుంది. ఆ హంసకు ఇరవై అయిదు మహిమ లుంటాయి. అయినప్పటికీ ఆ హంస సరియైన మార్గం కానరాక వజ్రంవలె దిట్టమై మెరుస్తున్న జలప్రవాహం పడే గోతిచుట్టూ తిరుగుతుంటుంది. ఆ గోతిలో పడితే మళ్లీ బయటపడటమంటూ లేదు.

(ఇక్కడ హంస అనేది జీవాత్మకు ప్రతీక. జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, తన్మాత్రాదిగా గల కాళ్ళు, చేతులు, వాక్కు మల, మూత్ర అవయవాలు అయిదూ కర్మేంద్రియాలు. చెవి, కన్ను చర్మం, ముక్కు నాలుక అనే అయిదూ జ్ఞానేంద్రియాలు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అయిదూ తన్మాత్రలు. భూమి, నీరు, అగ్ని వాయువు, ఆకాశం అనే అయిదూ పంచభూతాలు. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే నాలుగింటినీ అంతఃకరణ చతుష్టయం అంటారు. వీటన్నింటికీ మూలమైన శక్తి ఆత్మ. ఈ ఇరవై అయిదు రూపాల సామర్థ్యం, ఐహిక సుఖలోలత్వం కలిగి ఉండి, బయటపడే మార్గం అనగా ముక్తిమార్గం తెలియక పోవడమే సుడిగుండంలో పడటం. దానిని దాటి ముక్తిని పొందే మార్గాన్ని తెలుసుకోవాలనేదే నారదుని ఉపదేశం.)

హరిదశ్వులారా! వినండి. ఈ సంగతులను గుర్తించండి. ఇందుకు తగ్గట్టుగా ప్రవర్తించండి. ఈ సృష్టి రహస్యాన్ని ఏ మాత్రమూ తెలుసుకోకుండా కేవలం మీ తండ్రిగారి ఆజ్ఞలను కొనసాగించటానికి పూనుకొన్నారు. అటువంటి మిమ్ములను ఇంత తెలివి తక్కువ వాళ్లను ఏమనాలి?

ఈ విధంగా నారదుడు చెప్పిన విషయాన్ని హర్యశ్వులు తమ విచక్షణ బుద్ధితో తమలో తాము ఇలా చర్చించుకున్నారు.

ముందుగా చక్కగా ఆలోచించి క్షేత్రజ్ఞుడు అనగా ఏమిటి? అజ్ఞాన సంబంధమైన లింగదేహం అనగా ఏది? అనే విషయాలు ముందుగా తెలుసుకోవాలి. అవేవీ తెలుసుకోకుండా కేవలం పనికిరాని పనులు చేసిన కారాణంగా ముక్తి లభించదు.

ఈ సమస్త లోకాలకూ మూలకారణమైన భగవంతు డొక డున్నాడు. ఆయన సర్వేశ్వరుడు. పుట్టుక లేనివాడు. ఆత్మాశ్రయుడు. పురుషోత్తముడు. అటువంటి అంతర్యామి అయిన స్వామిని దర్శింపకున్నచో బ్రహృదేవునికైనా మోక్షం లభించదు.

జీవుడు సంసారమనే కూపాన్ని స్వర్గంగా భావిస్తాడు. దాని నుండి బయటపడకుండా పరబ్రహ్మాన్ని గుర్తించటం సాధ్యం కాదు. కర్మలను చేయడంవలన స్వర్గసౌఖ్యాలు లభిస్తాయి. కానీ కైవల్యం లభించదు.

సామాన్య జీవునికి మోక్షంపై ఆసక్తి కలగడం, భగవంతునియందు ఆసక్తి ఏర్పడటం చాలా కష్టం. జీవుడు మెరమెచ్చులవంటి ఐహికసుఖాలకై పాటుపడుతూ బాధపడుతూ ఉంటాడు. అలాంటి చంచలమైన మనస్సు కల్గిన వారికి మోక్షపదవి దూరం.

అనుకూలత కల్పించుకొని జీవుడు ఐహికసుఖాలలో తేలుతూ ప్రజాసృష్టి మీదుమిక్కిలిగా చేస్తూ ఆ సంసార ప్రవాహంలో కొట్టుకుంటూ అవతలి గట్టును చూచికూడా చేరలేదు. నేను అనే అహంకారం అతణ్ణి జ్ఞానానికి దూరంచేసి, చెడ్డపనులు చేయిస్తుంది. జననమరణాలనే ఈ లంపటంలో చిక్కుకున్న జీవుడు శాశ్వతసౌఖ్యం అందించే మోక్షపదవిని ఎలా అందుకోగలడు?

తన సహజ లక్షణాలు విడిచి, వక్రమార్గంలో నడిచే స్త్రీని పెళ్ళాడిన తెలివిమాలిన భర్తవలె, ఐహికసుఖాలలో దుఃఖాలలో మునిగి తేలుతూ సంచరించే జీవుడు తన నిజ స్వరూపమైన పరమాత్మను తెలుసుకోలేక దుఃఖపడుతూ రక్షణ పొందలేడు.

25 తత్త్వాలకు స్పష్టమైన అద్దం వంటిది పరతత్త్వం. వీటిని వ్యతిరేకంగా ఉపయోగించి చెడుమార్గాలలో వెళ్లే పురుషుడు ఆ సూక్ష్మతత్త్వాన్ని తెలుసుకోలేక పోతే అలాంటి వానికి ఉత్తమగతి ఎందుకు లభిస్తుంది?

(పంచ వింశతి తత్త్వరాశి అనగా జీవుని శరీరంలో ఉండి అతనికి ప్రాణశక్తిని కలిగించి, అతడిని కార్యోన్ముఖుడిని చేసేవి. అవి 1)ఐదు జ్ఞానేంద్రియాలు 2) ఐదు కర్మేంద్రియాలు 3) ఐదు తన్మాత్రలు 4) పంచభూతములు 5) మనసు, చిత్తం, బుద్ధి, అహంకారం, పురుషుడు. వీటికి లొంగినవాడు అధోగతిని, లేదా వీటికి తట్టుకొని దీటుగా నిలబడినవాడు సద్గతిని పొందుతారు.)

సంసార బంధానికి కారణం, దానినుండి విముక్తి పొందే మార్గం అనే ఈ రెండింటికి సంబంధించిన పరిపూర్ణ శాస్త్రజ్ఞానం లేక కర్మమార్గంలో పడి కొట్టుకునే వాడికి పరతత్త్వాన్ని దర్శించే ఉత్తమగతి ఎలా కలుగుతుంది?

ఈ కాలచక్రం చాలా శక్తిమంతమైనది. ఈ సమస్త జగత్తునూ చుట్టచుట్టి పట్టుకొని సున్న చుట్టి మటుమాయం చేసే కిటుకులు దానికి తెలుసు. అటువంటి కాలస్వరూపాన్ని తెలుసుకోకుండా ఊరకే కర్మలు చేస్తూ కూర్చుంటే వానికి అక్షయమైన మోక్షపదం ఎట్లా దక్కుతుంది?

ఈ సృష్టికార్యాన్ని మనతండ్రి అయిన దక్షప్రజాపతికి ఆయన తండ్రి బ్రహ్మదేవుడు అప్పగించాడు. అతి భయంకరమైన ప్రవృత్తి మార్గాన్ని అవలంబించటం ఇష్టం లేక మన తండ్రి ఆ పని చేయలేదు.

(పిత్రాజ్ఞ ఉల్లంఘించరానిదైనా అది శ్రేయాదాయకం కానప్పుడు ఉల్లంఘించడం దోషం కాదనేది ఇక్కడి ధర్మసూక్ష్మం.)

ఇలా వారిలో వారు ఆలోచించుకొని ఆ తరువాత

ఓ మహారాజా! ఇంకా చెబుతున్నా విను. నారద ప్రబోధం వల్ల నివృత్తిమార్గాన్ని అనుసరించిన దక్షుని కుమారులు తమకు ప్రబోధించిన నారదునికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి ఉత్తమగతులవైపు వెళ్లారు. అంత నారదుడు కూడ విష్ణు పాదారవిందాలలోని తేనెను ఆస్వాదించే మనస్సుతో తన మహతి అనే వీణను మీటుతూ గానం చేసుకుంటూ తనకు నచ్చిన చోటికి వెళ్ళిపోయాడు.

నారదమహర్షి దక్షప్రజాపతి దగ్గరికి వెళ్లి, ఆయన కుమారులు తండ్రిమాట కాదని నివృత్తి మార్గాన్ని అనుసరించి వెళ్లారని చెప్పగా విని, దక్షుడు దుఃఖం పొంగిపొరలగా మనస్సులో చాల బాధపడ్డాడు.

ఆ విధంగా బాధపడుతున్న దక్షుని వద్దకు బ్రహ్మ వచ్చి ఓదార్చి, తిరిగి సంతాన వృద్ధి చేయమని ఆదేశించగా, దక్షుడు తన భార్య అసిక్ని ద్వారా సౌందర్యవంతులు, సకలగుణసంపన్నలూ అయిన అనేక వేలమంది శబళాశ్వులు అనే పేరు గలవారికి జన్మనిచ్చాడు.

తమకు జన్మనిచ్చిన తండ్రి కోరికను గ్రహించి ఆ కోరికను నెరవేర్చడానికి ఆ శబలాశ్వులు తపస్సు చేయడానికి వేంటనే వెళ్ళారు.

ఈ విధంగా ఆ శబలాశ్వులు తండ్రి ఆజ్ఞమేరకు ప్రజాసృష్టి చేయడానికి తపస్సు చేయాలని నిశ్చయించుకొన్నారు. ఏ పుణ్యతీర్థం అన్ని తీర్థాల పుణ్యఫలాన్ని ఇస్తుందో, ఏ పుణ్యతీర్థాన్ని చూసినంతనే పాపాలన్నీ పటాపంచలౌతాయో అటువంటి నారాయణ తీర్ధం అనే సరస్సు దగ్గరకు వెళ్ళి అక్కడ నీటిని స్పృశించినంత మాత్రంచేతనే తమ మాలిన్యాన్ని పోగొట్టుకొని

ఆ శబలాశ్వులు బ్రహ్మాది దేవతలకు సాధ్యం కాని పరబ్రహ్మాన్ని సంపూర్ణంగా అనుభవిస్తూ, పరమాత్మ సంబంధమైన మూలమంత్రాన్ని జపిస్తూ, ఆ మూలపురుషుణ్ణి చూడాలనే కుతూహలంతో సమస్తం పరబ్రహ్మ స్వరూపంగా భావించి తపస్సు చేశారు.

ఆ దక్షపుత్రులు స్థిరబుద్ధితో ఒంటికాలిబొటన వేలిపై నిలబడి చేతులు పైకెత్తి జోడించి చూపులతో తీక్ష్ణమైన సూర్యుడిని చూస్తూ, కొంతకాలం గాలిని ఆహరంగా తీసుకుంటూ, కొంతకాలం ఏ ఆహారమూ లేకుండా సమస్త లోకాలకూ, దేవతలకూ భయం కలిగే విధంగా ఘోరతపస్సు చేశారు.

నారదుండు శబళాశ్వులకు నివృత్తి మార్గంబు నుపదేశించుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

పంచాంగం

The Hamsa-guhya Stotra is a praise of Lord Vishnu by Prajapati Daksha - దక్షుడు కావించిన హంసగుహ్యం బను స్తవరాజము

దక్షుడు కావించిన హంసగుహ్యం బను స్తవరాజము

సర్వశ్రేష్ఠుడై అనుగ్రహం చూపడానికి చైతన్య శక్తితో సాక్షాత్కరించే ఆ దేవదేవునికి నమస్కారం చేస్తాను. నిత్యం ప్రకాశించే పరమాత్మునికి వందనం చేస్తాను. అద్భుతమైన దివ్యానుభూతే రూపంగా వెలుగొందేవానికి నమస్కరిస్తాను. నిమిత్తమాత్రంగా బంధువైనట్టి సగుణసాకారమూర్తి అయిన పరమాత్మకు స్తుతులు సమర్పిస్తాను.

గుణాలలో చిక్కుకున్నవారికీ, కేవలం తాత్త్విక బుద్ధితో అన్వేషించే వారికీ నీ ఉనికి తెలియరానిది. మొదటినుండి ఉన్నవాడవు నీవు! మోక్షానికి పరమావధివై ప్రకాశించే వాడవు నీవు! అలాంటి అంతర్యామివైన స్వామిని నిన్ను ఆశ్రయిస్తున్నాను.

నీవు సర్వప్రాణుల దేహాలయందు జీవాత్మ రూపంలో ఉంటున్నావు, కానీ త్రిగుణాలచే బద్దుడైన జీవుడు తనలోనే అంతర్యామిగా వున్న నిన్ను గుర్తించలేకున్నాడు. త్రిగుణాలకు లోబడి ఇతరులతో కలసి ఉంటున్నాడు. కాని, ఓ పరమాత్మా! గుణాతీతుడవైన నీతో కలసి ఉండడమే లేదు. అలాంటి ఓ పరమాత్మా నిన్ను సేవిస్తాను.

మనసు, శరీరం, ప్రాణాలు, పంచేంద్రియాలు, పంచప్రాణాలు చక్కని వివేచనతో ప్రయత్నించకపోతే తప్ప జీవుడు తమలో ఉన్న పరమాత్మను చూడలేడు. అటువంటి సర్వగుణ సహితుడైన జీవునిలో అంతర్యామిగా ఉండేవాణ్ణి, సమస్తప్రాణులకూ మేలు కలిగించే వాడినీ, మూలపురుషుడిని ఆశ్రయిస్తాను.

మనస్సు సంకల్ప వికల్పాలకు స్థానం. మనసులో అనేక విరుద్ధ భావాలు సంఘర్షణకు గురై వస్తూ, పోతూ వుంటాయి. ఈ విధమైన మనస్సు ఇంద్రియాల విషయంలో నిగ్రహాన్ని నిలుకడను పొందగల్గితే దానిని నిర్వికల్పసమాధి అంటారు. ఈ విధమైన జ్ఞానానికి మూలమైన అంతరాత్మస్వరూపానికి నమస్కారం. కట్టెలో మిక్కిలి గూఢంగా ఉన్న అగ్నిని రాపిడిశక్తిచేత బయటకు రప్పించినట్టు, బుద్ధిమంతులు తమ మనసనే ఆకాశమందు విహరించే పరమాత్మను తమయొక్క ఇచ్చాజ్ఞానక్రియలనే ఆత్మశక్తులచేత సాక్షాత్కరింపజేస్తారు. అటువంటి ఏకాత్మరూపుడైన నిర్గుణ పరబ్రహ్మ 'ఏకోహం బహూస్యాం' అనే సంకల్పంతో అనేక నామరూపాలను ధరించి విశ్వరూపి అయ్యాడు. అటువంటి సర్వాత్మకుడు నన్ను అనుగ్రహించుగాక. అవాఙ్మానస గోచరుడు, నిర్గుణ పరబ్రహ్మ, సృష్టిస్థితి లయకారణుడు అయిన దేవదేవుణ్ణి ఆశ్రయిస్తాను. ఏ దేవుని మాయాప్రభావం కారణంగా పండితులు, పామరులు, భగవంతుని విషయంలో ఉన్నాడు, లేడు అని వాదించుకుంటారో, వారందరియందు కూడా ఒకే ఆత్మశక్తిగా ఉంటూ, యోగాది ఉపాసనా ధర్మాలు వేరైనా 'నదీనాం సాగరో గతిః' అన్నట్లు వాటన్నిటికి ఒకే గమ్యరూపమైన పరాత్పరుడు నాకు అనుకూలంగా మారునుగాక. నిర్గుణుడు, నిరాకారుడు ఐన పరమాత్మ జగత్తును రక్షించటంకోసం సద్గుణుడు, సాకారుడు అవుతున్నాడో; అటువంటి సర్వవ్యాపకుడు నాకు ప్రసన్నుడు అగుగాక. ఏ భగవానుడు జీవుల పూర్వజన్మ విశేషం కారణంగా ప్రస్తుతజన్మలలో జ్ఞానమనే జ్యోతిగా వెలుగొందుతూ, భూ పదార్థాల వాసనతో కూడుకున్న వాయువు (గాలి) మాదిరిగా అన్నింటిలో ఉంటూ, అన్నింటికి దూరంగా ఉండగలిగే నారాయణుడు నా కోరికను తీర్చుగాక. అని భక్తితో నిండినవాడై తన మాటలతో కీర్తిస్తున్న దక్షునికి, భక్తపాలకుడైన శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమైనాడు. అంత

శ్రీమన్నారాయణుడు గరుత్మంతుని మీద ఆసీనుడై ఉన్నాడు. గరుడుని రెండు భుజాలమీద చాచిన ఆ స్వామి పాదాలు మేరుపర్వతం చరియకు రెండుప్రక్కలా ప్రకాశించే ఇంద్రనీలమణుల గనులవలె ఉన్నాయి. ఆయన అష్టబాహువులూ అందంగా పైకిచాచిన అష్టదిగ్గజాల తొండాలవలె ప్రకాశిస్తున్నాయి. ఎనిమిది చేతులలోనూ చక్రమూ, ధనుస్సూ, కత్తి, శంఖమూ, ఖడ్గమూ, పాశమూ, డాలూ, గదాదండమూ విరాజిల్లుతున్నాయి. నల్లని దేహంతో నగుమోముతో సాధుజనులను సంరక్షించే చల్లనిచూపులతో బంగారురంగు పట్టుపీతాంబరంతో మణిమయకిరీటంతో నలుమూలలా కాంతులు విరజిమ్మే భూషణాలతో, మకరకుండలాలతో పుండరీకాక్షుడు దక్షునిముందు ప్రత్యక్షమైనాడు.

మకర కుండలాల కాంతి చెక్కిళ్ళపై చంద్రకాంతిలా ప్రసరిస్తుండగా, కిరీటం యొక్క శ్రేష్టమైన ప్రకాశం ఆకాశలక్షికి కుంకుమరంగు వస్త్రంగా మారగా, వక్షఃస్థలం మీద వనమాలికల కాంతి శ్రీవత్సం, కాస్తుభమణుల కాంతిలో కలిసి అతిశయిస్తుంటే, నల్లని కొండను చుట్టిన మెఱుపు తీగల మాదిరి స్వామి భుజకీర్తులు శోభిస్తుండగా, సకల లోకాలనూ సమ్మోహింపజేస్తూ, నారదుడు మొదలైన దేవర్షులు, మహర్షులు స్వామిని సేవిస్తుండగా, గంధర్వాది దేవగణాల కీర్తనలు చెవులకు ఆనందం కలిగిస్తుండగా

సర్వశక్తిమంతుడు, సర్వాత్మకుడు, సర్వవ్యాపకుడు, శాశ్వతుడు, సర్వదుడు అయిన ఆ శ్రీహరి తనను సమస్త భక్తజనులు సేవిస్తుండగా దక్షునికి ప్రత్యక్షమయ్యాడు.

ఈ విధంగా సాక్షాత్కరించిన సర్వేశ్వరుని దివ్యరూపం సర్వదిక్కులనూ వెలిగిస్తూ మహాశ్చర్యాన్ని కలిగించింది. అలా ప్రకాశించే ఆ దేవదేవుని తేజోమయమూర్తిని వీక్షించి, దక్షుని హృదయంలో భయమూ, ఆనందమూ, ఆశ్చర్యమూ ముప్పిరి గొన్నాయి. ఎలాగో ఆ తన్మయత్వంనుండి తెప్పరిల్లి తొట్రుపాటుతో దక్షుడు స్వామికి సాష్టాంగదండ ప్రణామం చేశాడు. జోడించి మోడ్చి నిలుచున్నాడు. సెలయేళ్లు కలయికతో దరులొరసి పొంగి మిన్నంటి సముద్రాన్ని దరిసిన మహానదీ ప్రవాహంవలె దక్షప్రజాపతి పులకించిన దేహంతో భగవంతుని ముందు నిలిచాడు. ఆయన పరవశించిన తన హృదయాన్ని ఎలాగో అదుపు చేసుకొని పొంగిపొరలే ఆనందంతో ఆ పరమేశ్వరునితో ఏమేమో పలుకాలి అనుకొన్నాడు. పరమ మంగళదాయకాలైన ఆయన పవిత్రనామాలను ఉచ్చరించాలనుకొన్నాడు. పరమపవిత్రాలైన ఆయన లీలలను అభివర్ణించాలనుకొన్నాడు. విబుధులకు సంతోషాన్ని కలిగించే ఆయనపరాక్రమాన్ని ప్రస్తుతించాలనుకొన్నాడు. తన మనస్సులోని కోరికను వెల్లడించాలనుకొన్నాడు. కానీ పాపం! ఏమీ చేయలేక పోయాడు. ఆ విధంగా మైమరచి నోట మాటరాక మౌనం వహించి ఉన్న ప్రజాకాముడైన ప్రజాపతిని చూచి, సర్వజ్ఞుడూ సర్వప్రాణి హృదయాంతర్యామీ అయిన ఆ స్వామి అతని అభిప్రాయాన్ని గ్రహించి, ఆర్తజనులను రక్షించే లక్షణంగల మాటలతో ఇలా అన్నాడు.

ఓ దక్షా! నీ తపస్సుకు మెచ్చాను. అందుకు ఈ క్షణంలోనే నీకు ఫలసిద్ధిని ప్రసాదిస్తున్నాను. నానుండి వరం పొందడానికి ఈలోకంలో నీకంటె అర్హుడు ఎవడున్నాడు?

ఈ నీ తపస్సు ఇక చాలు. సకల జీవరాశులకు సమస్త సంపదలు సిద్ధిస్తాయి. నీవు సృష్టి చేయాలనే కోరికతో నన్ను గూర్చి తపస్సు చేశావు. నా సంకల్పం కూడా ఇదే. నీ తపస్సు నెరవేరింది.

ఇంకా చెబుతాను విను. బ్రహ్మ, రుద్రుడు, ప్రజాపతులు, మనువులు, ఇంద్రాదులు వీరందరూ నా అంశకు చెందినవారే. వేదచోదితమైన సంధ్యావందనాదులు నా మనస్సు. జపధ్యానాదులు నాశరీరం. ధ్యానధారణాది మానవకార్యాలు నా ఆకారం. యోగాదులు అవయవాలు. ధర్మం నా ఆత్మ. దేవతాగణాలు జీవములు. వేదం నా స్వరూపం. సృష్టిపూర్వం నేను మాత్రమే ఉన్నాను. శాశ్వతుడైన నా నుండి సంకల్ప మాత్రాన ఈ బ్రహ్మాండం, బ్రహ్మ తమకు తాముగా పుట్టారు. నా తేజస్సును కలిగి ఉన్న బ్రహ్మ క్రియారహితుడై ఉన్నప్పుడు నాచే ప్రేరితుడై ఘోరతపస్సు చేశాడు. తదనంతరం నా సంకల్పంతో ప్రజాసృష్టి చేయగల మిమ్మల్ని సృష్టించాడు.

ప్రజాపతులలో ఒకడైన పంచజనుని కుమార్తె ఐన అసిక్నిని నీకు భార్యగా అనుగ్రహించాను. గృహస్థ ధర్మాన్ని పాటించి మీరు అత్యధిక ప్రజలను సృష్టించండి. నీ సంతానం కూడా నాచే ప్రభావితులై సృష్టిని పెంపొందిస్తారు అని ఆదేశించి మాయమయ్యాడు. అప్పుడు దక్షుడు స్వామి ఆజ్ఞమేరకు అసిక్నితో కూడి పదివేలమంది హర్యశ్వులకు జన్మనిచ్చాడు. వారు తండ్రి ఆజ్ఞమేరకు ప్రజాసృష్టికోసం తపస్సు చేయడానికి సింధునది సముద్రసంగమ ప్రాంతమైన విశిష్ట పుణ్యతీర్థమైన నారాయణసరస్సునుచేరి అందు స్నానం చేసి పవిత్ర మనస్కులై తపస్సు ప్రారంభించారు. ఆ సమయంలో వారి వద్దకు నారదుడు వచ్చి ఇలా అన్నాడు.

నారదుండు హర్యశ్వులకు నివృత్తి మార్గంబు నుపదేశించుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

పంచాంగం

Saturday, March 7, 2026

Ranga Panchami Deva Panchami - రంగ పంచమి దేవ పంచమి

రంగ పంచమి దేవ పంచమి

దీపావళిని ఎలా అయితే 5 రోజుల పాటు చేసుకుంటారో. అలానే కొన్ని ప్రాంతాలలో హోలీని కూడా ఐదు రోజులు జరుపుకుంటారు. వాటిల్లో చివరి నాడు జరిపే పండగే రంగ పంచమి.

హోలీ మాదిరిగానే ఈ పండగకు కూడా రంగులు చల్లుకుని సంతోషంగా గడుపుతారు. అయితే ఈ పండగకు మరో విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. ఈ రంగ పంచమి నాడు స్వయంగా దేవతలు భూమి మీదకు దిగి వచ్చి, హోలీ ఆడతారని నమ్ముతారు. అందుకే ఈ పండగను దేవ పంచమి అని కూడా అంటారు. ఈ రోజున రంగులతో ఆడుకోవడం వల్ల, ప్రపంచవ్యాప్తంగా దేవతల సాత్విక శక్తి వ్యాప్తి చెందుతుందని, దీని ద్వారా జనాలు, దేవతల స్పర్శను అనుభూతి చెందుతారని పండితులు చెబుతున్నారు.

ఈ రోజున గ్రహ స్థానాలు సరైన క్రమంలో ఉండి ప్రాణ శక్తిని మేల్కొలిపి సమతుల్యత మరియు ఆధ్యాత్మిక వృద్ధిని ఇస్తాయని నమ్ముతారు. సాంప్రదాయ రంగ పంచమిలో మూలికలు, పువ్వులు మరియు సహజ వర్ణద్రవ్యాలతో కలిపిన రంగులను నిర్దిష్ట క్రమంలో పూయడం జరుగుతుంది. ఇది ఆధ్యాత్మిక శక్తి మార్గాలైన నాడులను శుభ్రపరుస్తుంది, వాటిలో నిద్రాణమైన ప్రాణ శక్తిని మేల్కొలిపి జాగృతం చేస్తుంది. అంతేకాక మనలో దాగి ఉన్న సహజ శక్తులను కూడా మేల్కొల్పుతుంది.

పూర్వం రంగులు మూలికలు మరియు ప్రత్యేకమైన వృక్షాల బెరడులతో తయారు చేసేవారు.
పాల్గుణ పౌర్ణమి నుండి క్రమంగా వేసవి కాలం ప్రారంభం కావున మూలికలతో తయారు చేసిన రంగులను మరియు రంగు నీళ్లను చల్లుకోవడం వల్ల వేసవి ఉష్ణోగ్రతల వల్ల చర్మ సమస్యలు మరియు ఆరోగ్య సమస్యలు రాకుండా మనకు సహాయకారిగా ఉంటుంది.

కానీ ప్రస్తుత కల్తీ ప్రపంచంలో రసాయనాలతో తయారయిన రంగుల వల్ల మేలు కన్నా కీడు జరుగుతుంది కావున రంగుల విషయంలో కొంచం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతో వుంది.

అయితే ఈ రంగ పంచమి దేశంలోని అన్ని ప్రాంతాల్లో జరుపుకోరు. మరీ ముఖ్యంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మధుర, బృందావనం ప్రాంతాల్లో ఎంతో వేడుకగా జరుపుకుంటారు.

ముఖ్యంగా గుజరాత్ లో ఈ పండుగను గర్బా మరియు దాండియా నృత్యాలతో జరుపుకుంటారు, ఇక్కడ బహిరంగ ప్రదేశాలలో వేదికలు ఏర్పాటు చేసి సాంప్రదాయ ఆచారాలను ప్రదర్శిస్తూ ఒకరిపై ఒకరు రంగులు వేసుకుంటారు.

రాజస్థాన్ లో జానపద నృత్యాలు, సామూహిక విందులు మరియు రంగుల తో జరుపుకుంటారు. ఉదయపూర్ మరియు జైపూర్‌లలో, యువకులు భక్తిగా హోలీ పాటలు పాడుతూ వీధుల్లో తిరుగుతూ, స్థానిక దేవతలకు రంగులను సమర్పిస్తారు.

మధ్యప్రదేశ్ లో ఐక్యత మరియు సామూహిక కలయికను సూచిస్తూ పెద్ద రంగుల ఊరేగింపులు నిర్వహిస్తారు.

మహారాష్ట్ర (షిమ్గా/షిమ్గో) - సాంప్రదాయ పాల్ఖీ నృత్యాలు మరియు జానపద ప్రదర్శనలు నిర్వహిస్తారు. వ్యవసాయ ప్రారంభాన్ని చిహ్నంగా జరుపుకుంటారు. అంతేకాక సామూహికంగా జరుపుకోవడం వల్ల కాలానుగుణ మార్పులతో ముడిపడి ఉన్న ధైర్యం మరియు బలాన్ని పొందుతామని భావిస్తారు.

గోవా (షిగ్మో పండుగ) లో ఆలయ ఆచారాలను సాంస్కృతిక పద్దతులతో కలిపే పెద్ద షిగ్మో ఉత్సవాల్లో భాగంగా రంగ పంచమిని జరుపుకుంటారు.

బృందావనం మరియు మధుర ఆలయలో  హోలీ వేడుకలు రంగ పంచమితో ముగుస్తాయి, కృష్ణభక్తులు రాధా కృష్ణులకు రంగులు సమర్పించి ఆశీర్వాదాలు పొంది ఈ పండుగను ముగిస్తారు.
రేపల్లెలో స్వయంగా పూజారులే కృష్ణ ప్రసాదంగా రంగులను భక్తులపై కురిపిస్తారు. అది చూడడానికి ఎంతో మనోహరంగా ఉంటుంది. అది చూసి పాల్గొని అనుభవించవలసిందే.

గ్రామీణ ఉత్తర భారతదేశం - హోలీ వేడుకల కొనసాగింపుగా, గ్రామాలు ఉత్సవాలు, ఊరేగింపులు మరియు సామూహిక ప్రదర్శనలు నిర్వహిస్తారు, అయితే నృత్యం, సంగీతం మరియు స్థానిక ఆచారాలు సామాజిక బంధాలను బలోపేతం చేస్తాయి.

రంగ పంచమి రోజున దేవతలు హోలీ ఆడటం కోసం భూమి మీదకు వస్తారని ప్రతీక. అలా వచ్చిన దేవతలు భక్తుల కోరికలన్నింటినీ తీరుస్తారని నమ్ముతారు. ఈ రంగ పంచమి రోజున దేవుళ్లతో హోలీ ఆడటం వల్ల మన జీవితంలోని కష్టాలు, బాధలు తొలగిపోతాయని, జీవితంలో సానుకూల పరిస్థితులు ఏర్పడతాయని భావిస్తారు. రంగ పంచమి నాడు రంగులు పైకి ఎగరవేయడం ద్వారా భక్తులు, దేవతలతో కలిసి హోలీ ఆడతారని, ఫలితంగా, భక్తుల జీవితంలోని కోరికలన్నీ తీరి కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు.


నిత్య స్తోత్రావళి

పంచాంగం

Pitru Shapam(Sapam) Stree Shapam Dosha(Dosham) - పితృశాపం - స్త్రీ శాపం

పితృశాపం - స్త్రీ శాపం తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు వస్తుంది. దాన్నే జాతకంలో పితృశాపం అని, స్త్రీ శాపం అని అంటారు. నన్నడిగి కన్నావా? కన...