Monday, March 9, 2026

Daksha cursed Narada to wander the universe forever without a fixed home - దక్షుండు నారదుని శపియించి ప్రజాసర్గం బొనరించుట

దక్షుండు నారదుని శపియించి ప్రజాసర్గం బొనరించుట

అది ఎలాగంటే - వీరు బాలురు. దేవఋషి పితృబుణాలు తీర్చుకోలేదు. ఏ కర్మలను చేయలేదు. కర్మల అనిత్యత్వాన్ని వీరెరుగరు. అటువంటి చిన్నపిల్లల బుద్దిని తప్పుత్రోవ పట్టించి వారిని ఈ లోకంలోను, పరలోకంలోను కూడా శ్రేయస్సు పొందకుండగా చేశావు. నీవు చేసిన ఈ పాపంవలన భగవద్భక్తులందరిలోను సిగ్గులేని వాడవై అపకీర్తి పాలవుతావు. నా పుత్రులు నిరపరాధులు. నీపైనవారికి శత్రుత్వం లేదు. అటువంటివారికి ద్రోహం చేశావు. నీవు తప్ప మిగిలిన భాగవతోత్తములందరూ ప్రాణులపట్ల అనుగ్రహం కలవారే. నీవు చాలా ఆసక్తిగా మిత్రులమధ్య ఉన్న స్నేహబంధాన్ని ఛేదిస్తావు. నీవలన మిత్రులమధ్య విరోధం ఏర్పడుతుంది. శత్రుత్వాలు నీవలన శాంతింపవు. ఇకపైన ఎవరికీకూడా విషయసుఖాలు అనుభవించకుండా అవి దుఃఖహేతువులనే విషయం తెలియదు. జ్ఞానం స్వయంగా కలుగుతుందేతప్ప నీబోటివాళ్ళు చెప్పినంతమాత్రాన కలుగదు. నీవు నిరంతరం లోకాలన్నీ తిరుగుతూనే ఉంటావు. నీకెక్కడా నివాసస్థానమంటూ ఉండదు అని దక్షుడు నిర్దయగా నారదుణ్ణి శపించాడు. అయినా నారదుడు కోపగించుకోలేదు. ఆ శాపాన్ని అంగీకరించాడు. అటువంటి శాంతస్వభావం ఉంటే ఏ వ్యక్తి అయినా అన్ని ద్వంద్వాలకూ అతీతుడయి సర్వేశ్వరుడనబడతాడు కదా!

దక్షుడు ప్రజలను సృష్టించాలనే తన కోరిక తీరకపోవడం చేత చాలా దుఃఖపడ్డాడు. అపుడు బ్రహ్మ వచ్చి సృష్టికి ఉపాయం చెప్పాడు. దక్షుడు తన భార్యయైన అసిక్నియందు అరవైమంది కూతుళ్ళను కన్నాడు. వారిలో పదిమందిని ధర్ముడికిచ్చాడు. పదుముగ్గురిని కశ్యపుడికిచ్చాడు. ఇరవైయేడుగురిని చంద్రుడి కిచ్చాడు. భూతుడి కిద్దరిని, ఆంగిరసుడి కిద్దరిని, కృశాశ్వుడి కిద్దరిని ఇచ్చాడు. చివరి నల్గురిని తార్క్ష్యుడనే పేరుకల కశ్యపుడి కిచ్చాడు. పైన చెప్పిన వరుసలోనే కూతుళ్ళనిచ్చాడు. ఆ కూతుళ్ళ పేర్లు విను.

(ప్రతి వ్యక్తి పుడుతూనే మూడు ఋణాలతో పుడతాడు. అవి దేవఋణం, ఋషిబుణం, పితృఋణం.

దేవఋణం : దేవతలు వర్షాలు కురిపించి తద్ద్వారా మనకాహారాన్ని సమకూరుస్తున్నారు. అందుకు మనం వారికి ఋణపడి ఉన్నాం. ఆ ఋణం తీర్చుకొనే ఉపాయం ఏమిటంటే యజ్ఞాలు చేసి మనం ఇచ్చే ఆహుతులద్వారా వారిని సంతోషపరచడమే.

ఋషిబుణం : ఋషులు మనకు వేద వాఙ్మయాన్నిచ్చారు. అందువలన మనం వారికి ఋణపడి ఉన్నాం. అది తీర్చుకొనే ఉపాయం బ్రహ్మచర్యం. అంటే వేదాధ్యయనం చెయ్యడమే.

పితృఋణం : పితృదేవతలు మనకు శరీరాన్నిచ్చారు. అందువలన మనం వారికి ఋణపడి ఉన్నాం. అది తీర్చుకొనే ఉపాయం వంశం కొనసాగేవిధంగా సత్సంతానాన్ని కనడమే.

ఈ మూడు ఋణాలూ తీర్చుకొనిన తరువాతనే మనస్సును మోక్షమార్గంలో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ఇవేవీ తీర్చుకొనని తన పుత్రులను మోక్షమార్గంలో ప్రవేశపెట్టి నారదుడు వారిని భ్రష్టుల్ని చేశాడు - అని దక్షుడి అభిప్రాయం)

దక్షుని కూతుళ్ళు ఎంత పుణ్యం చేశారో కదా! అందరూ సాటిలేని సవతులే అయినా ముల్లోకాలూ వారి సంతానమయ్యేంతగా సంతానవతులయ్యారు. ఏ తల్లి వారిని కన్నదో కదా!

దక్షప్రజాపతికి అరవైమంది పుత్రికలు. వారిలో పదిమంది ధర్ముని భార్యలు. వారి పేర్లు - భానువు, లంబ, కకుప్పు, జామి, విశ్వ, సాధ్య, మరుత్వతి, వసువు, ముహూర్త, సంకల్ప. వారిలో భానువు కొడుకు వేదఋషభుడు. వేదఋషభుని కొడుకు ఇంద్రసేనుడు. లంబయొక్కపుత్రుడు విద్యోతుడు. విద్యోతుని పుత్రులు స్తనయిత్నువులు. కకుబ్దేవి యొక్క పుత్రుడు సంకుటుడు. సంకుటుని పుత్రుడు కీకటుడు. కీకటునికి దుర్గాభిమాని దేవతలు పుత్రులు. దుర్గభూములకధిష్ఠాన దేవతలు జామిదేవియొక్క పుత్రులు. ఆ దేవతల పుత్రులు స్వర్గుడు, నంది.

విశ్వయొక్క పుత్రులు విశ్వేదేవతలు. విశ్వేదేవతలకు సంతానం లేదు. సాధ్యయొక్క పుత్రులు సాధ్యగణాలు. సాధ్యగణాల పుత్రుడు అర్థసిద్ధి. మరుత్వతికి మరుత్వంతుడు, జయంతుడు అని ఇద్దరు పుత్రులు. అందులో జయంతుడు వాసుదేవుని అంశతోపుట్టి ఉపేంద్రుడనే ప్రసిద్ది పొందాడు. ముహూర్తకు మౌహూర్తికులనే పుత్రులు కలిగారు. వారు ప్రాణులకు కాలాన్ననుసరించి ఫలం ఇస్తారు. సంకల్ప కొడుకు సంకల్పుడు. సంకల్పుని కొడుకు కాముడు. వసువునకు ద్రోణుడు, ప్రాణుడు, ధ్రువుడు, అర్ముడు, అగ్ని, దోషుడు, వస్తువు, విభావసువు అనే ఎనమండుగురు వసువులు పుట్టారు. వారిలో ద్రోణుని భార్య అభిమతి. వారికి హర్షుడు, శోకుడు, భయుడు అనేవారు జన్మించారు.

ప్రాణుని భార్య ఊర్జస్వతి. వారికి సహుడు, ఆయువు, పురోజవుడు అనే ముగ్గురు పుత్రులు. ధ్రువుని భార్య ధరణి. పురములు వారి సంతానం. అర్కుని భార్య వాసన. వారి పుత్రులు తార్ష్యుడు మొదలయినవారు. అగ్నిభార్య వసోర్ధార. ద్రవిణకాదులు వారి పుత్రులు. అగ్నికి కృత్తికలు కూడా భార్యలు. వారికి స్కందుడు పుత్రుడు. స్కందునికి విశాఖుడు మొదలయినవారు పుత్రులు. దోషుని భార్య శర్వరి. ఆమె పుత్రుడు శింశుమారుడు. అతడు శ్రీహరి అంశతో జన్మించాడు. వస్తువు భార్య ఆంగిరస. విశ్వకర్మ అనే శిల్పాచార్యుడు ఆమె కొడుకు. విశ్వకర్మ భార్య ఆకృతి. ఆమె పుత్రుడు చాక్షుషమనువు. ఆ మనువునకు విశ్వులు, సాధ్యులు అనేవారు పుత్రులు. విభావసుని భార్య ఉష ఆమె పుత్రులు వ్యుష్టి, రోచిస్సు, ఆతపుడు. ఆతపుని పుత్రుడు పంచయాముడు. అతడు దివసాభిమానిదేవత. భూతుడు శంకరుని అంశతో జన్మించాడు. భూతుని భార్య సురూప. కోట్లాదిమంది రుద్రగణాలు ఆమె పుత్రులు. అంతేకాదు. సురూపకు రైవతుడు, అజుడు, భవుడు, భీముడు, వాయుడు, ఉగ్రుడు, వృషాకపి, అజైకపాత్తు, అహిర్బుధ్న్యుడు, బహురూపుడు, మహాంతుడు అనేవారు, రుద్రుని అనుచరులయిన ప్రేతలు, వినాయకులు అనేవారు కూడా పుత్రులుగా ఉదయించారు.

అంగిరసుని భార్య స్వధ. పితృగణాలు ఆమె పుత్రులు. అంగిరసుని మరో భార్య సతి. ఆమెకు అథర్వాఖీమాన దేవతలు పుత్రులు. కృతాశ్వుని భార్య అర్చిస్సు. ఆమె పుత్రుడు ధూమ్రకేశుడు. వేదశిరస్సుని భార్య ధిషణ. ఆమెకు దేవలుడు, వయునుడు, మనువు అని ముగ్గురు పుత్రులు. తార్ష్యునకు వినత, కద్రువ, పతంగి, యామిని అని నలుగురు భార్యలు. వారిలో పతంగి సంతానం పక్షులు. యామిని సంతానం మిడుతలు. వినతకు ఇద్దరు కొడుకులు. గరుత్మంతుడు, అనూరుడు, గరుత్మంతుడు శ్రీహరి వాహనం. అనూరుడు సూర్యుని రథసారథి. కద్రువ సంతానం పాములు. కృత్తికాది నక్షత్రాలు చంద్రుని భార్యలు. చంద్రుడు రోహిణియందు అధికాసక్తుడయి తక్కిన భార్యలను పట్టించుకోని కారణంగా దక్షుడు చంద్రుణ్ణి క్షయ రోగగ్రస్తుడవగుము అని శపించాడు. ఆ కారణంగా సంతానం పొందే అర్హత చంద్రునికి లేకపోయింది. అటుపైన దక్షుడు అనుగ్రహించగా క్షీణించిన కళలు తిరిగి చంద్రుణ్ణి చేరాయి. ఇంతేకాక -

ఎవరు కశ్యప ప్రజాపతికి భార్యలో, ఎవరు అలౌకికమైన చరిత్ర కలిగి సమస్త జగత్తుల పూజలందుకుంటున్నారో, ఎవరి పుత్రులు, పొత్రులు బలవంతులయి ముల్లోకాలను పరిపాలించారో, ఎవరికి కొంగుబంగారమై ఎంత వ్యయం చేసినా తరుగని పుణ్యం ఉందో అటువంటి కశ్యపుని భార్యల యొక్క నానావిధాలయిన సంతతిని స్పష్టంగా నిరూపించడం అసాధ్యం. సంతానవతులయిన ఆ ప్రసిద్ధ సాధ్వీమణుల పేర్లు, వారి వంశాలు చెప్తాను. ఓ రాజా! విను.

(ముంగొంగు బంగారం అనేది తెలుగు జాతీయం. మూల్గుపుణ్యం అంటే ఎంత తీసినా తరగకుండా గుట్టలు గుట్టలుగా పడి ఉందనీ, ముంగొంగు బంగారం అంటే అవసరమయిన వెంటనే వాడుకునేందుకు వీలయినది, విలువైనది అని అర్ధం.)

మూడు లోకాల్లో ఉన్న ప్రాణులన్నీ అదితి, దితి, కాష్ఠ, దనువు, అరిష్ట తామ్ర, క్రోధవశ, సురస, సురభి, ముని, తిమి, ఇళ, సరమల సంతానమే.

తిమికి చేపలు మొదలగు జలచరాలు పుట్టాయి. సరమకు వ్యాఘ్రాది క్రూరజంతువులు పుట్టాయి. సురభికి దున్నపోతులు, ఆవులు మొదలయినవి జన్మించాయి. తామకు డేగలు, గద్దలు పుట్టాయి. మునికి అప్సరసలు, ఇళకు చెట్టు, చేమలు, క్రోధవశకు పాములు, సురసకు రాక్షసులు, అరిష్టకు గంధర్వులు, దనువునకు సుప్రసిద్ధ బలంకల పద్దెనిమిది మంది దేవతాశత్రువులయిన రాక్షసులు జన్మించారు. వారి పేర్లు, వంశాలు విను.

కశ్యపుని భార్యలలో దనువొకతె. ఆమె పుత్రులు పద్దెనిమిదిమంది. వారి పేర్లు - ద్విమూర్ధుడు, శంబరుడు, అరిష్టుడు, హయగ్రీవుడు, విభావసుడు, ఆయోముఖుడు, శంకుశిరుడు, స్వర్భానుడు, కపిలుడు, అరుణి, పులోముడు, వృషపర్వుడు, ఏకచక్రుడు, అనుతాపకుడు, ధూమ్రకేశుడు, విరూపాక్షుడు, విప్రచిత్తి దుర్జయుడు. వీరిలో స్వర్భానువు కూతురు సుప్రభ, ఆమె భర్త నముచి. వృషపర్వుని కూతురు శర్మిష్ట ఆమె భర్త యయాతి. అతడు నహుషుని కొడుకు. వైశ్వానరునకు ఉపదానవి, హయశిర, పులోమ, కాలక అని నలుగురు పుత్రికలు. ఉపదానవి హిరణ్యాక్షుని భార్య. హయశిర భర్త క్రతువు. పులోమకాలకలను బ్రహ్మవాక్యముపై కశ్యపుడు వివాహమాడాడు. పులోమకు పౌలోములు, కాలకకు కాలకేయులు పుట్టారు. వారు సమరకోవిదులు. పొలోమకాలకేయులకు అరువదివేలమంది రాక్షసులు జన్మించారు. వారు యజ్ఞాలను ధ్వంసం చేసేవారు. ఇంద్రుని ప్రీతి కొరకు నీ తాతగారైన అర్జునుడు వారిని వధించాడు. విప్రచిత్తికి సింహికయందు రాహువు, వందమంది కేతువులు మొత్తం నూట ఒక్కమంది జన్మించారు. వారు గ్రహాలు. ఆదిపురుషుడైన శ్రీహరి తన అంశతో అదితియందు జన్మించాడు. అంత అదృష్టవంతురాలయిన అదితి వంశం విను. వివస్వంతుడు, అర్యముడు, పూషుడు, త్వష్ట సవిత, భగుడు, ధాత, విధాత, అరుణుడు, మిత్రుడు, శక్రుడు, ఉరుక్రముడు అనే పేర్లుకల పన్నెండుగురు సూర్యులు అదితికి జన్మించారు. వివస్వంతునికి యముడు, యమి అనే కవలలు కలిగారు. సంజ్ఞ ఆడుగుర్రం రూపం ధరించి అశ్వినీ దేవతలను కన్నది. వివస్వంతుని మరో భార్య ఛాయ. ఆమెకు శని, సావర్ని అనే మనువు, తపతి అనే కూతురు పుట్టారు. తపతి భర్త సంవరణుడు. అర్యముని భార్య మాతృక. వారి సంతానం చర్షణులు. వారు వివేకంకల వారయిన కారణంగా వారిని ఆధారంగా చేసుకొని బ్రహ్మ మానవజాతిని రచించాడు. పూషుడు భర్గుని చూచి నవ్వగా అతడు కోపగించి పూషుని పళ్ళు రాలగొట్టాడు. అప్పటి నుంచి అతనికి పిండే తిండి. ఆ పూషునికి సంతానం లేదు. త్వష్టయొక్క భార్య రచన. ఆమె దితిపుత్రులకు చెల్లెలు. త్వష్ట రచనల కొడుకు విశ్వరూపుడు. దేవతలు బృహస్పతికి కోపం వచ్చేవిధంగా ప్రవర్తిస్తే బృహస్పతి దేవతలను విడిచి వెళ్ళిపోయాడు. అపుడు దేవతలు విశ్వరూపుణ్ణి తమ గురువుగా స్వీకరించారు. ఈ విధంగా శుకమహర్షి చెప్పగా పరీక్షిన్మహారాజు ఇలా అడిగాడు.

దేవాసుర యుద్ధ ప్రారంభము

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

పంచాంగం

Pitru Shapam(Sapam) Stree Shapam Dosha(Dosham) - పితృశాపం - స్త్రీ శాపం

పితృశాపం - స్త్రీ శాపం

తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు వస్తుంది. దాన్నే జాతకంలో పితృశాపం అని, స్త్రీ శాపం అని అంటారు. నన్నడిగి కన్నావా? కన్నప్పుడు భరించాలి అంటూ పిల్లలు అరవడం చూస్తుంటాము. అడిగి కనడం కాదు, వారిని తల్లిదండ్రులుగా నీవే ఎంచుకున్నావు. జీవుడు తను చేసిన కర్మ వల్లనే రాబోయే జన్మలో తన తల్లిదండ్రులను, కుటుంబాన్ని ఎంచుకుంటాడు. ఆ కుటుంబంలో ఎవరైనా స్త్రీలకూ అన్యాయం చేస్తే స్త్రీ శాపం తగులుతుంది. అది రాబోయే తరాలకు సంక్రమిస్తుంది. 

సర్పాలను చంపినప్పుడు సర్పశాపం, పితృదేవతలకు శ్రాద్ధం నిర్వహించనందువలన పితృశాపం సంక్రమిస్తాయి. వీటి కారణంగా జీవితంలో ఎదుగుదల ఉండదు, ఉద్యోగాలు రావు, వచ్చినా అభివృద్ధి ఉండదు, సంతానం కలగదు, వ్యాపారంలో నష్టం మొదలైనవి వస్తాయి. ఇవన్నీ పూర్వీకులు చేసిన కారణంగా తర్వాతి తరం అనుభవిస్తుంది. 

అలాగే గురుగ్రహం యొక్క అనుగ్రహం లేనప్పుడు పిల్లల జీవితంలో వృద్ధి ఉండదు. పిల్లలను చూసి తల్లిదండ్రులు భాధ పడతారు. నిజానికి అనుభవించేవారికంటే వారిని చూసేవారి బాధే అధికంగా ఉంటుంది. 

'గురుధ్యానం ప్రపద్యామి పుత్ర పీడోపశాంతయే' అని శాస్త్ర వాక్కు. గురు/బృహస్పతి ధ్యానం వలన సంతానం వలన కలిగే భాద తొలగుతుంది. ఒక వ్యక్తి ఒక కుటుంబంలో పుట్టినప్పుడు, అతడు తన కర్మతో పటు ఆ కుటుంబానికి చెందిన కర్మను కూడా స్వీకరిస్తాడు. అతడిపై దాని ప్రభావం ఉంటుంది. ఈ లోకంలో ఉండే అన్ని జీవుల్లో దేవుడు ఉన్నాడు. తెలిసో తెలియకో ఇతరులను విమర్శించడం అంటే దేవుడిని అవమానించడం, విమర్శించడమే. అదికూడా కొంత పాపాన్ని సమకూర్చిపెడుతుంది. అది కూడా గురుశాపానికి కారణమవుతుంది. 

పచ్చని చెట్లపై గురు ప్రభావం ఉంటుంది. పచ్చని మొక్కలు/చెట్లను నరికితే, అది జాతకంలో గురుదోషంగా కనిపిస్తుంది. కళ్ళ ముందే పిల్లలు మరణించడం, స్త్రీ సంతానం ఉంటే వారు వైధవ్యం పొందడం వంటివి జరుగుతాయి. అంటే ఆ పిల్ల పుటింట్లో కూర్చుని ఏడుస్తుంది, ఆమెను చూసి తల్లిదండ్రులు ఏడుస్తారు. అదే పండ్లు, కాయలు, పుష్పాలతో ఉన్న చెట్లను నరికితే సంతానం కూడా కలగని సందర్భాలుంటాయి. దానికి కారణం ఆ బిడ్డ తల్లిదండ్రులు చేసిన పాపం. అందుకే పిల్లలు కలవారు పచ్చని చెట్లు కొడుతుంటే, పిల్లలున్న వాడివి పచ్చని చెట్లు కొడుతున్నావ్, ఎంత తప్పు చేస్తున్నావో అని పెద్దలంటారు. 

కొందరు భూములు లాక్కుంటారు. ముఖ్యంగా రాజకీయనాయకులు, బడా వ్యాపారవేత్తలు తమ అక్రమసంపాదనను సక్రమంగా చూపించడం కోసం పేద రైతులను మోసం చేసో, మరొక విధంగానో భూములులను ఆక్రమించుకుంటారు. వ్యవసామే మీద పన్ను లేదు కనుక ఆ భూమిలో పండిన దానిపై వచ్చిన ఆదాయంగా తమ అక్రమసంపాదనను చూపి సక్రమం చేసుకుంటారు. 

ఒక కుటుంబంలోని వారికీ ఒక భూమి వంశపారంపర్యంగా సంక్రమించినప్పుడు, దానికి పితృదేవతల అనుగ్రహం ఉంటుంది. భూమిని బలవంతంగా లాక్కుంటే, పితృదేవతలు ఏడుస్తారు. అది శాపంగా మరి లాక్కున వారి కడుపు కొడుతుంది. వారి పిల్లలు అకాల మరణం చెందుతారు. లేదా జీవచ్ఛవాలుగా మిగిలిపోతారు. దీనికి కారణం ఆ  తల్లిదండ్రులు చేసిన పాపం. 

దానికి ముందు వెనుక బాగా ఆలోచించాలి. యోగులైతే ఒక భూమిని కొనేముందు పితృదేవతలను సంప్రదిస్తారు. మీరు ఉచితంగా ఇస్తానన్నా, వారు తీసుకోరు. ఎందుకంటే తమ వారసులు అనుభవించకుండా భూములు అమ్ముకోవడం పితృదేవతలకు ఇష్టం ఉండదు. ఏ వ్యక్తి అయినా సంపాదించేది తన కోసం, తన పిల్లల కోసం, వారు బాగుండడం చూసి ఆనందించాలని అనుకుంటాడు. అక్రమంలో అతడు అవినీతికి పాల్పడితే, ఇతరులకు ద్రోహం చేస్తే, వారి ఏడుపు వీరికి శాపంగా మారుతుంది. ఆ అవినీతి పరులు బాధపడేది వారి పిల్లలకు హాని కలిగినప్పుడే. అందుకే వారి పిల్లలు అకాలమరణం పాపవుతారు. ఇలా ఎన్నో రకాలుగా తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు సంక్రమిస్తుంది. కాబట్టి, తస్మాత్ జాగ్రత్త.

కర్మ - ఫలితం

Grihastha Pujalu Dharma Sandehalu - గృహస్థులు- పూజాలూ - ధర్మసందేహాలు

గృహస్థులు- పూజాలూ - ధర్మసందేహాలు

పూజ గది విడిగా లేని వారు పంచముఖ హనుమంతుడి ని పెట్టకూడదు,హనుమంతుడి ఫోటో కానీ విగ్రహం గాని ఏది పూజ గది విడిగా లేని వారు ఉంచకూడదు.

సూర్యుడి విగ్రహం ఇంట్లో పెట్టకూడదు,ఆయనే ప్రత్యక్షంగా కనిపిస్తారు కాబట్టి నేరుగా నమస్కరించాలి.

ఉగ్ర రూపంలో ఉన్న నరసింహ స్వామి ఫోటో గాని విగ్రహం కానీ ఉంచకూడదు, లక్ష్మీ నరసింహ, యోగ నరసింహ, లేదా ప్రహ్లాద అనుగ్రహ నరసింహ స్వామి ఫోటో పెట్టికొని పూజ చేయవచ్చు.

చేతిలో ఫ్లూట్ ఉన్న కృష్ణుడు విగ్రహం ఇంట్లో ఉండకూడదు, కృష్ణుడి విగ్రహం అవుతో ఉన్న ఫొటో గాని చిన్న పరిమాణంలో విగ్రహం కానీ ఉండవచ్చు.

లక్ష్మీ దేవి విగ్రహం ముందు కానీ ఫోటో ముందు కానీ ఒక చిన్న గిన్నెలో(వెండి అయితే మంచిది) బియ్యం, అందులో కొన్ని గవ్వలు వేసి ఉంచాలి.

విగ్రహం పరిమితి చాలా చిన్నదిగా ఉంటే మంచిది , పండో పాలో పెట్టి కూడా హారతి ఇస్తే సరిపోతుంది, విగ్రహాల పరిమితి పెద్దదిగా ఉంటే రోజు మహా నివేదన, వారంలో ఒక్కసారి అయినా అభిషేకం, ఉండాలి... పూజ లేకుండా ఉండకూడదు.

ఇంట్లో నటరాజ స్వామి విగ్రహం పెట్టుకోకూడదు, నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్యం నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్కడ ఉండవచ్చు.

నిత్యం పూజ లో ఉన్న విగ్రహాలు పూజ గది నుండి తీసి వేయాల్సి వస్తే గుడిలో పెట్టండం మంచిది.

ఇంట్లో ఎక్కడా లక్ష్మీ దేవి నిల్చుని ఉన్నట్టుగా ఉండకూడదు, లక్ష్మీ దేవి పచ్చరంగు చీరతొ అటూఇటూ ఏనుగులు ఉన్న ఫొటో కి గృహస్థులు పూజించడం చాలా మంచిది.

అప్పుల బాధలు తీరాలి అంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి..ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదంతో దీపారాధన చేయాలి... నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం అవునేతి దీపం పెట్టాలి, శత్రు పీడల, గండాలు ఆస్తి వివాదాలు ఇంట్లో వారి అనారోగ్యం తొలుగుటకు తెలుపు నువ్వుల నూనె తో నిత్యా దీపారాధన చేయాలి.

పచ్చి పాలు నైవేద్యం పెట్టకూడదు, కాచి చల్లారిన పాలు అభిషేకం కి వాడకూడదు.

ఇంట్లో తరచుగా సాంబ్రాణి వేస్తూ ఉండాలి నెగటివ్ ఎనర్జీ దూరంగా ఉంటుంది.. ఇంట్లో గాలి శుభ్రం అవుతుంది.


ఏ ప్రదేశాల్లో జపం చేస్తే ఎంత ఫలితం ఉంటుంది?
గృహంలో ఎంత చేస్తే అంత ఫలితం ఉంటుంది. నది ప్రాంతంలో చేస్తే రెట్టింపు ఫలితం వస్తుంది. గోశాలలో చేస్తే వంద రెట్లు, యాగశాలలో అంతకు మించి ఫలితం వస్తుంది.

పుణ్య ప్రదేశాల్లో, దేవతా సన్నిధిలో చేస్తే పదివేల రెట్లు వస్తుంది. శివసన్నిధిలో చేస్తే మహోన్నతమైన ఫలం వస్తుంది.

వెదురు తడక మీద కూర్చుని జపం చేస్తే దరిద్రం ఆవహిస్తుంది. రాతి మీద కుర్చుని జపిస్తే రోగాలు వస్తాయి. నేల మీద కూర్చొని చేస్తే దుఃఖం, గడ్డి మీద చేస్తే కీర్తి నాశనం అవుతుంది.

ద్వారానికి పైనున్న కమ్మి లక్ష్మి స్వరూపం అందుకే దానికి మామిడి తోరణం కడతారు. కింద కమ్మి పవిత్రమైనది, కనుక దానికి పసుపు రాస్తారు. శాస్త్రపరంగా చెప్పాలంటే గడపకు పసుపు రాయడం వల్ల క్రిమికీటకాలు, విష పురుగులు ఇంట్లోకి రాకుండా ఉండటానికి అనుకోవచ్చు.

పంచామృతం
ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదారల మిశ్రమాన్ని పంచామృతం అంటారు. దీనిని పూజలో దేవునికి నివేదిస్తారు.

పంచగవ్యాలు
ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రంల మిశ్రమమే పంచగవ్యం. దీనిని పంటల రోగనివారణకు వాడతారు.

తీర్థాన్ని మూడుసార్లు తీసుకుంటారు. ఎందుకు?
తొలితీర్థం శరీర శుద్ధికి, శుచికి. రెండవ తీర్థం ధర్మ, న్యాయ ప్రవర్తనకు, మూడవ తీర్థం పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదం కొరకు.


తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?
సాధారణంగా చాలా మంది దేవాలయాలకు వెళ్తుంటారు. అక్కడ పూజారితో పూజలు, వ్రతాలు చేయించుకుంటాం. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తాం.

పూజలు, వ్రతాలు చేసినప్పుడో తీర్థం తీసుకుంటూ ఉంటాము. అయితే మనం గుడికి వెళ్లినప్పుడు అక్కడ మనకు తెలియ కుండానే చేతులు దేవుణ్ణి ప్రార్ధన చేస్తుంటాయి. రెండవది తీర్థం తీసుకుని తాగి మన చేతులను తలపై రాసుకుంటాము.

దేవాలయాల్లో తీర్థాన్ని తీసుకున్న తర్వాత ఆ చేతిని తలపై రాసుకోకూడదు అంటున్నారు పండితులు. చేతులు జోడించి దేవదేవునికి నమస్కరించి, ప్రార్ధన చేయవచ్చు కానీ తీర్థాన్ని తీసుకున్న తరువాత చేతులను తలపై రాయకూడదని శాస్త్రాలు చెప్తున్నాయట.

సాధారణంగా గుడిలో తీర్థాన్ని పంచామృతంతో తయారు చేస్తారు. అందులోని పంచదార, తేనే వంటివి జుట్టుకు మంచిది కాదు. తులసి తీర్థం కూడా తీసుకున్నప్పుడు తలకు రాసుకోవడం మంచిది కాదని పండితులు సూచిస్తున్నారు. తీర్థం తీసుకున్న తర్వాత చేతికి ఎంగిలి అంటుకుంటుంది.

ఆ చేయినే తలకు రాసుకోవడం మంచి ఫలితాలను ఇవ్వదని వారు చెప్తున్నారు. అందుచేత తీర్థం తీసుకున్న చేతిని నీటితో కడుక్కోవాలని పండితులు సెలవిస్తున్నారు.

తీర్థం తీసుకున్న తర్వాత ఆ చేతిని నెత్తికి రాసుకోవడం చేయకూడదు. జేబు రుమాలుతో తుడుచుకోవాలి లేదా కండువాతో తుడుచుకోవాలని వారు సూచిస్తున్నారు. కానీ గంగా జలంతో అభిషేకం చేసిన తీర్థాన్ని మాత్రమే తలపై రాసుకోవచ్చునని పండితులు అంటున్నారు.

Karma - Phalitham - కర్మ - ఫలితం

కర్మ - ఫలితం

కృష్ణుడు కంసుని సంహరించిన వెంటనే తన తల్లిదండ్రులైన వసుదేవుడు దేవకి లను చూడటానికి, చూచి వారిని కారాగారం నుండి విముక్తి కలిగిద్దామని వారిని ఉంచిన కారాగారానికి వెళ్ళాడు.

దేవకీమాత కృష్ణుని చూసిన వెంటనే 'నాయనా! నీవే పరమాత్మవి కదా!, నీకు ఎన్నో దైవిక శక్తులు ఉంటాయి, అయినా నువ్వు ఎందుకు 14 సంవత్సరాలు ఆగావు కంసుని సంహరించడానికి, కారాగారం నుంచి మమ్మల్ని విడిపించడానికి' అని అడిగింది.

అప్పుడు కృష్ణుడు "అమ్మా! నన్ను క్షమించు, నీవు నన్ను 14 ఏళ్ళు అరణ్యవాసం చేయమని అడవులకు ఎందుకు పంపావు నా గత జన్మలో?' అని చిరునవ్వు తో! 
అన్నాడు. దేవకి ఆశ్చర్య చకితురాలయింది,

దేవకీ "కృష్ణా ఇది ఎలా సాధ్యము? ఎందుకు ఇలా అంటున్నావు?" అని అడిగింది. అప్పుడు కృష్ణుడు "అమ్మా! గత జన్మ గురించి నీకు ఏది జ్ఞాపకం ఉండదు. కానీ నీవు గత జన్మలో కైకేయివి, నీ భర్త దశరథుడు!" దేవకి మరింతగా ఆశ్చర్యపడి కుతూహలంగా కృష్ణుణ్ణి "అయితే మరి కౌసల్య ఎవరు ఈ జన్మలో?" అని 
అడిగింది.

అపుడు కృష్ణుడు "ఇంకెవరు? యశోద మాత! 14 సంవత్సరాలు తల్లి ప్రేమకు ఆమెని దూరం చేశావు గత జన్మలో, అది ఈ జన్మలో ఆమె తిరిగి పొందగలిగింది." అని
 అన్నాడు, 

ఎంతటి వారైనా కర్మ ఫలాలను అనుభవించక తప్పదు, భగవద్భక్తులైనా, అవతార పురుషులైనా వాటి నుండి తప్పించుకోలేరు, ఇంకా మానవ మాత్రలం మనమెంత!

అలాగే యశోద మాత కృష్ణుని వివాహం చూడలేదని తపించింది. కలియుగంలో  వకుళ మాతగా పుట్టి తన చేతులమీదుగా దగ్గరవుండి మరీ శ్రీనివాసుని కళ్యాణం జరిపించి తన కోరికను తీర్చుకుంది. 

ఇలాంటి కర్మలు పరమాత్ముని లీలల వల్ల మనకు తెలిశాయి. మనం మానవమాత్రులము కావున మనం చేసే ప్రతికర్మ లేదా మనకు జరిగే ప్రతి కర్మ భూత, భవిషత్తు మరియు వర్తమానాల మీద ఆధార పడుతాయి. మనం ముందు జన్మలో చేసిన కర్మల వల్ల ఈ జన్మలో ప్రతిఫలం పొందుతాము. అది మంచి అయినా చెడు అయినా. వర్తమానం లో చేసిన కర్మ ఫలితాలు భవిషత్తులో కానీ తదుపరి జన్మలో మంచి కానీ, చేడు కానీ అనుభవించ వలసిందే. 

కావున కర్మను ఎవ్వరూ తప్పించలేరు. భూత, భవిషత్ కాలాలలో ఏమి జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి, వర్తమాన కాలంలో అనగా ప్రస్తుత జన్మలో ధర్మబద్ధంగా, ధర్మకార్యాలు చేస్తూ నిజాయితీగా వ్యవహరిస్తూ తమ ఇష్ట దైవాన్ని పూజిస్తూ, స్మరిస్తూ జీవనం గడిపే వానికి కర్మ నశిస్తోంది. కర్మ నశించినవానికి పునర్జన్మ ఉండదు. ముక్తి లభిస్తుంది.

కర్మకు రెండు లక్ష్యములు. ఒకటి దుఃఖమును తొలగించుకొనుట. రెండు సుఖములు పొందుట. కాని ఈ లక్ష్యములు సిద్ధించవు. కర్మవలన మరింత దుఃఖము కలుగుతుంది. 

ఈ శరీరమే నాదికాదు. ఈ శరీరము ఉండునది లేదు. ఈ రోజు ఈ దేహము ఉండవచ్చు. కానీ, రేపే నశించవచ్చు. కావున, శరీరమే నాది కానపుడు భార్యా పుత్రులు, ధనధాన్యములు, వస్తువాహనములు, కృత్యులు పరివారములు నా వారలు ఎట్లవుతారు? 

శరీరము పోయినపుడు ఇవేవియు వెంటరావు. ఇవి పురుషార్ధములవలె కనిపించును. అదొక భ్రమ. నిజమునకు అవి అనర్థములు, ఆత్మ ఒక్కటే అనంతమైనది. అవ్యయమైనది. ఆనందదాయకమైనది.

శరీరము ఆత్మ ఒక్కటికాదు. శరీరము వేరు ఆత్మ వేరు. ఆత్మ అనంతము శరీరము పంచభూతాత్మకము. 

శరీరమునే ఆత్మగా భావించువాడు. దానితో అనేక కర్మలు చేయించును. కర్మల వలన తిరిగి దేహము కలుగును. దానితో మరల కర్మలు చేయించును. ఇదొక విషవలయము. 

శుభం భూయాత్.

పితృశాపం - స్త్రీ శాపం

Narada Muni encouraged Prajapati Daksa's second group of sons (the Savalasvas/Shabalashva) by awakening their natural affinity for their brothers (the Haryasvas) - నారదుండు శబళాశ్వులకు నివృత్తి మార్గంబు నుపదేశించుట

నారదుండు శబళాశ్వులకు నివృత్తి మార్గంబు నుపదేశించుట

ఈ విధంగా ఘోరతపస్సు చేస్తున్న శబలాశ్వులను మోక్షపథగాములుగా చేయడానికి నారదుడు ఇదివరకటిలాగే వచ్చి వారికి ధర్మబోధ చేశాడు. 'మీ అన్నలు ఏ మార్గాన్ని ఆశ్రయించి ముక్తిని పొందారో మీరు ఆ మార్గాన్నే ఆశ్రయించవలసి ఉంది. ఎవ్వడైనా సోదరులు చూపిన మార్గాన్ని అనుసరించి వెళ్లేవాడే విశేషజ్ఞుడు అని పెద్ద లంటారు. అందువల్ల ఆ మార్గంలోనే మీరు ప్రవర్తించి ఎల్లవేళలా దేవతలతో కలిసి స్వర్గంలో సుఖంగా ఉండండి' అని చెప్పి వెళ్ళిపోయాడు. నారదుని మాటలను నమ్మిన శబలాశ్వులు విరాగులై

ఓ రాజా! నేను చెప్పేది విను. మంచి గుణవంతులైన ఆ శబలాశ్వులు ఇంతవరకు ఆచరించిన ఐహిక కర్మలకు సిగ్గుపడి, తమ అన్నలు వెళ్ళిన మోక్షమార్గాన్ని అనుసరించి పున్నమినాటి రాత్రి గతించిన తరువాత చంద్రకళలు క్రమంగా క్షీణించిన విధంగా కర్మ క్షయాన్ని పొంది వారు మోక్షాన్ని చేరుకున్నారు.

అదే సమయంలో దక్షునికి అనేక విధాలైన దుశ్శకునాలు గోచరించాయి. ఆయన మనస్సు అధికమైన వ్యథతో క్షోభించింది. తన పుత్రులు గతించడానికి కారణం

నారదుని కారణంగానే ఇలా జరిగిందని గ్రహించిన దక్షుడు మిక్కిలి కోపంతో అతని వద్దకు వెళ్ళి ఆపలేని బాధకు గురైనవాడై మిక్కిలి ఆగ్రహంతో

దక్ష ప్రజాపతికి మిక్కిలి కోపంతో ముఖం ఎర్రబడింది, కనుబొమలు ముడివడినాయి. కన్నులలో నిప్పులు రేగాయి. పెదవులు అదిరాయి. పండ్లు పటపట కొరుకుతూ నారదునితో ఇలా అన్నాడు.

పరమసాధువులాగా ఉంటూ ధూర్తుడవై చిన్నపిల్లలైన నా పుత్రులకు సన్న్యాసమార్గాన్ని బోధించావు. నా కుమారులు ఈ దుస్థితి పొందగా నేను బాధపడకుండ ఉండగలనా? ఇందుకు కారణమైన దుష్టుడవగు నిన్ను నా శాపాగ్నిజ్వాలలో పడదోసి బాధిస్తాను.

Narada Muni encouraged Prajapati Daksa's sons the Haryasvas abandon their father's mandate of procreation and instead pursue spiritual liberation - నారదుండు హర్యశ్వులకు నివృత్తి మార్గంబు నుపదేశించుట

నారదుండు హర్యశ్వులకు నివృత్తి మార్గంబు నుపదేశించుట

నాయనలారా! మీరు మిక్కిలి మూఢులుగా కన్పిస్తున్నారు. మీ భవిష్యత్తును విచారించుకొనలేకున్నారు. మీరు పసిబిడ్డలు. ఈ భూమి పరిమాణమెంతో తెలియనివారు. ఇక జీవులను ఏ విధంగా సృష్టించగలరు? సర్వాంతర్యామియైన ఆత్మస్వరూపుడు పురుషుడు ఒక డున్నాడు. స్త్రీరూపిణియై అనేక రూపాలు ధరించిన ప్రకృతి ఒకటున్నది. మాయలమారి అయిన ఆ ప్రకృతి పురుషుణ్ణి లోబరచుకుంటుంది. ప్రకృతీ పురుషుడూ కలిసి సంసార ప్రవాహాన్ని సాగిస్తారు. ఈ సంసారమనే నది రెండువైపులనుండీ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవాహాన్ని అనుసరించి ఒక హంస విహరిస్తూ ఉంటుంది. ఆ హంసకు ఇరవై అయిదు మహిమ లుంటాయి. అయినప్పటికీ ఆ హంస సరియైన మార్గం కానరాక వజ్రంవలె దిట్టమై మెరుస్తున్న జలప్రవాహం పడే గోతిచుట్టూ తిరుగుతుంటుంది. ఆ గోతిలో పడితే మళ్లీ బయటపడటమంటూ లేదు.

(ఇక్కడ హంస అనేది జీవాత్మకు ప్రతీక. జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, తన్మాత్రాదిగా గల కాళ్ళు, చేతులు, వాక్కు మల, మూత్ర అవయవాలు అయిదూ కర్మేంద్రియాలు. చెవి, కన్ను చర్మం, ముక్కు నాలుక అనే అయిదూ జ్ఞానేంద్రియాలు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అయిదూ తన్మాత్రలు. భూమి, నీరు, అగ్ని వాయువు, ఆకాశం అనే అయిదూ పంచభూతాలు. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే నాలుగింటినీ అంతఃకరణ చతుష్టయం అంటారు. వీటన్నింటికీ మూలమైన శక్తి ఆత్మ. ఈ ఇరవై అయిదు రూపాల సామర్థ్యం, ఐహిక సుఖలోలత్వం కలిగి ఉండి, బయటపడే మార్గం అనగా ముక్తిమార్గం తెలియక పోవడమే సుడిగుండంలో పడటం. దానిని దాటి ముక్తిని పొందే మార్గాన్ని తెలుసుకోవాలనేదే నారదుని ఉపదేశం.)

హరిదశ్వులారా! వినండి. ఈ సంగతులను గుర్తించండి. ఇందుకు తగ్గట్టుగా ప్రవర్తించండి. ఈ సృష్టి రహస్యాన్ని ఏ మాత్రమూ తెలుసుకోకుండా కేవలం మీ తండ్రిగారి ఆజ్ఞలను కొనసాగించటానికి పూనుకొన్నారు. అటువంటి మిమ్ములను ఇంత తెలివి తక్కువ వాళ్లను ఏమనాలి?

ఈ విధంగా నారదుడు చెప్పిన విషయాన్ని హర్యశ్వులు తమ విచక్షణ బుద్ధితో తమలో తాము ఇలా చర్చించుకున్నారు.

ముందుగా చక్కగా ఆలోచించి క్షేత్రజ్ఞుడు అనగా ఏమిటి? అజ్ఞాన సంబంధమైన లింగదేహం అనగా ఏది? అనే విషయాలు ముందుగా తెలుసుకోవాలి. అవేవీ తెలుసుకోకుండా కేవలం పనికిరాని పనులు చేసిన కారాణంగా ముక్తి లభించదు.

ఈ సమస్త లోకాలకూ మూలకారణమైన భగవంతు డొక డున్నాడు. ఆయన సర్వేశ్వరుడు. పుట్టుక లేనివాడు. ఆత్మాశ్రయుడు. పురుషోత్తముడు. అటువంటి అంతర్యామి అయిన స్వామిని దర్శింపకున్నచో బ్రహృదేవునికైనా మోక్షం లభించదు.

జీవుడు సంసారమనే కూపాన్ని స్వర్గంగా భావిస్తాడు. దాని నుండి బయటపడకుండా పరబ్రహ్మాన్ని గుర్తించటం సాధ్యం కాదు. కర్మలను చేయడంవలన స్వర్గసౌఖ్యాలు లభిస్తాయి. కానీ కైవల్యం లభించదు.

సామాన్య జీవునికి మోక్షంపై ఆసక్తి కలగడం, భగవంతునియందు ఆసక్తి ఏర్పడటం చాలా కష్టం. జీవుడు మెరమెచ్చులవంటి ఐహికసుఖాలకై పాటుపడుతూ బాధపడుతూ ఉంటాడు. అలాంటి చంచలమైన మనస్సు కల్గిన వారికి మోక్షపదవి దూరం.

అనుకూలత కల్పించుకొని జీవుడు ఐహికసుఖాలలో తేలుతూ ప్రజాసృష్టి మీదుమిక్కిలిగా చేస్తూ ఆ సంసార ప్రవాహంలో కొట్టుకుంటూ అవతలి గట్టును చూచికూడా చేరలేదు. నేను అనే అహంకారం అతణ్ణి జ్ఞానానికి దూరంచేసి, చెడ్డపనులు చేయిస్తుంది. జననమరణాలనే ఈ లంపటంలో చిక్కుకున్న జీవుడు శాశ్వతసౌఖ్యం అందించే మోక్షపదవిని ఎలా అందుకోగలడు?

తన సహజ లక్షణాలు విడిచి, వక్రమార్గంలో నడిచే స్త్రీని పెళ్ళాడిన తెలివిమాలిన భర్తవలె, ఐహికసుఖాలలో దుఃఖాలలో మునిగి తేలుతూ సంచరించే జీవుడు తన నిజ స్వరూపమైన పరమాత్మను తెలుసుకోలేక దుఃఖపడుతూ రక్షణ పొందలేడు.

25 తత్త్వాలకు స్పష్టమైన అద్దం వంటిది పరతత్త్వం. వీటిని వ్యతిరేకంగా ఉపయోగించి చెడుమార్గాలలో వెళ్లే పురుషుడు ఆ సూక్ష్మతత్త్వాన్ని తెలుసుకోలేక పోతే అలాంటి వానికి ఉత్తమగతి ఎందుకు లభిస్తుంది?

(పంచ వింశతి తత్త్వరాశి అనగా జీవుని శరీరంలో ఉండి అతనికి ప్రాణశక్తిని కలిగించి, అతడిని కార్యోన్ముఖుడిని చేసేవి. అవి 1)ఐదు జ్ఞానేంద్రియాలు 2) ఐదు కర్మేంద్రియాలు 3) ఐదు తన్మాత్రలు 4) పంచభూతములు 5) మనసు, చిత్తం, బుద్ధి, అహంకారం, పురుషుడు. వీటికి లొంగినవాడు అధోగతిని, లేదా వీటికి తట్టుకొని దీటుగా నిలబడినవాడు సద్గతిని పొందుతారు.)

సంసార బంధానికి కారణం, దానినుండి విముక్తి పొందే మార్గం అనే ఈ రెండింటికి సంబంధించిన పరిపూర్ణ శాస్త్రజ్ఞానం లేక కర్మమార్గంలో పడి కొట్టుకునే వాడికి పరతత్త్వాన్ని దర్శించే ఉత్తమగతి ఎలా కలుగుతుంది?

ఈ కాలచక్రం చాలా శక్తిమంతమైనది. ఈ సమస్త జగత్తునూ చుట్టచుట్టి పట్టుకొని సున్న చుట్టి మటుమాయం చేసే కిటుకులు దానికి తెలుసు. అటువంటి కాలస్వరూపాన్ని తెలుసుకోకుండా ఊరకే కర్మలు చేస్తూ కూర్చుంటే వానికి అక్షయమైన మోక్షపదం ఎట్లా దక్కుతుంది?

ఈ సృష్టికార్యాన్ని మనతండ్రి అయిన దక్షప్రజాపతికి ఆయన తండ్రి బ్రహ్మదేవుడు అప్పగించాడు. అతి భయంకరమైన ప్రవృత్తి మార్గాన్ని అవలంబించటం ఇష్టం లేక మన తండ్రి ఆ పని చేయలేదు.

(పిత్రాజ్ఞ ఉల్లంఘించరానిదైనా అది శ్రేయాదాయకం కానప్పుడు ఉల్లంఘించడం దోషం కాదనేది ఇక్కడి ధర్మసూక్ష్మం.)

ఇలా వారిలో వారు ఆలోచించుకొని ఆ తరువాత

ఓ మహారాజా! ఇంకా చెబుతున్నా విను. నారద ప్రబోధం వల్ల నివృత్తిమార్గాన్ని అనుసరించిన దక్షుని కుమారులు తమకు ప్రబోధించిన నారదునికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి ఉత్తమగతులవైపు వెళ్లారు. అంత నారదుడు కూడ విష్ణు పాదారవిందాలలోని తేనెను ఆస్వాదించే మనస్సుతో తన మహతి అనే వీణను మీటుతూ గానం చేసుకుంటూ తనకు నచ్చిన చోటికి వెళ్ళిపోయాడు.

నారదమహర్షి దక్షప్రజాపతి దగ్గరికి వెళ్లి, ఆయన కుమారులు తండ్రిమాట కాదని నివృత్తి మార్గాన్ని అనుసరించి వెళ్లారని చెప్పగా విని, దక్షుడు దుఃఖం పొంగిపొరలగా మనస్సులో చాల బాధపడ్డాడు.

ఆ విధంగా బాధపడుతున్న దక్షుని వద్దకు బ్రహ్మ వచ్చి ఓదార్చి, తిరిగి సంతాన వృద్ధి చేయమని ఆదేశించగా, దక్షుడు తన భార్య అసిక్ని ద్వారా సౌందర్యవంతులు, సకలగుణసంపన్నలూ అయిన అనేక వేలమంది శబళాశ్వులు అనే పేరు గలవారికి జన్మనిచ్చాడు.

తమకు జన్మనిచ్చిన తండ్రి కోరికను గ్రహించి ఆ కోరికను నెరవేర్చడానికి ఆ శబలాశ్వులు తపస్సు చేయడానికి వేంటనే వెళ్ళారు.

ఈ విధంగా ఆ శబలాశ్వులు తండ్రి ఆజ్ఞమేరకు ప్రజాసృష్టి చేయడానికి తపస్సు చేయాలని నిశ్చయించుకొన్నారు. ఏ పుణ్యతీర్థం అన్ని తీర్థాల పుణ్యఫలాన్ని ఇస్తుందో, ఏ పుణ్యతీర్థాన్ని చూసినంతనే పాపాలన్నీ పటాపంచలౌతాయో అటువంటి నారాయణ తీర్ధం అనే సరస్సు దగ్గరకు వెళ్ళి అక్కడ నీటిని స్పృశించినంత మాత్రంచేతనే తమ మాలిన్యాన్ని పోగొట్టుకొని

ఆ శబలాశ్వులు బ్రహ్మాది దేవతలకు సాధ్యం కాని పరబ్రహ్మాన్ని సంపూర్ణంగా అనుభవిస్తూ, పరమాత్మ సంబంధమైన మూలమంత్రాన్ని జపిస్తూ, ఆ మూలపురుషుణ్ణి చూడాలనే కుతూహలంతో సమస్తం పరబ్రహ్మ స్వరూపంగా భావించి తపస్సు చేశారు.

ఆ దక్షపుత్రులు స్థిరబుద్ధితో ఒంటికాలిబొటన వేలిపై నిలబడి చేతులు పైకెత్తి జోడించి చూపులతో తీక్ష్ణమైన సూర్యుడిని చూస్తూ, కొంతకాలం గాలిని ఆహరంగా తీసుకుంటూ, కొంతకాలం ఏ ఆహారమూ లేకుండా సమస్త లోకాలకూ, దేవతలకూ భయం కలిగే విధంగా ఘోరతపస్సు చేశారు.

నారదుండు శబళాశ్వులకు నివృత్తి మార్గంబు నుపదేశించుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

పంచాంగం

The Hamsa-guhya Stotra is a praise of Lord Vishnu by Prajapati Daksha - దక్షుడు కావించిన హంసగుహ్యం బను స్తవరాజము

దక్షుడు కావించిన హంసగుహ్యం బను స్తవరాజము

సర్వశ్రేష్ఠుడై అనుగ్రహం చూపడానికి చైతన్య శక్తితో సాక్షాత్కరించే ఆ దేవదేవునికి నమస్కారం చేస్తాను. నిత్యం ప్రకాశించే పరమాత్మునికి వందనం చేస్తాను. అద్భుతమైన దివ్యానుభూతే రూపంగా వెలుగొందేవానికి నమస్కరిస్తాను. నిమిత్తమాత్రంగా బంధువైనట్టి సగుణసాకారమూర్తి అయిన పరమాత్మకు స్తుతులు సమర్పిస్తాను.

గుణాలలో చిక్కుకున్నవారికీ, కేవలం తాత్త్విక బుద్ధితో అన్వేషించే వారికీ నీ ఉనికి తెలియరానిది. మొదటినుండి ఉన్నవాడవు నీవు! మోక్షానికి పరమావధివై ప్రకాశించే వాడవు నీవు! అలాంటి అంతర్యామివైన స్వామిని నిన్ను ఆశ్రయిస్తున్నాను.

నీవు సర్వప్రాణుల దేహాలయందు జీవాత్మ రూపంలో ఉంటున్నావు, కానీ త్రిగుణాలచే బద్దుడైన జీవుడు తనలోనే అంతర్యామిగా వున్న నిన్ను గుర్తించలేకున్నాడు. త్రిగుణాలకు లోబడి ఇతరులతో కలసి ఉంటున్నాడు. కాని, ఓ పరమాత్మా! గుణాతీతుడవైన నీతో కలసి ఉండడమే లేదు. అలాంటి ఓ పరమాత్మా నిన్ను సేవిస్తాను.

మనసు, శరీరం, ప్రాణాలు, పంచేంద్రియాలు, పంచప్రాణాలు చక్కని వివేచనతో ప్రయత్నించకపోతే తప్ప జీవుడు తమలో ఉన్న పరమాత్మను చూడలేడు. అటువంటి సర్వగుణ సహితుడైన జీవునిలో అంతర్యామిగా ఉండేవాణ్ణి, సమస్తప్రాణులకూ మేలు కలిగించే వాడినీ, మూలపురుషుడిని ఆశ్రయిస్తాను.

మనస్సు సంకల్ప వికల్పాలకు స్థానం. మనసులో అనేక విరుద్ధ భావాలు సంఘర్షణకు గురై వస్తూ, పోతూ వుంటాయి. ఈ విధమైన మనస్సు ఇంద్రియాల విషయంలో నిగ్రహాన్ని నిలుకడను పొందగల్గితే దానిని నిర్వికల్పసమాధి అంటారు. ఈ విధమైన జ్ఞానానికి మూలమైన అంతరాత్మస్వరూపానికి నమస్కారం. కట్టెలో మిక్కిలి గూఢంగా ఉన్న అగ్నిని రాపిడిశక్తిచేత బయటకు రప్పించినట్టు, బుద్ధిమంతులు తమ మనసనే ఆకాశమందు విహరించే పరమాత్మను తమయొక్క ఇచ్చాజ్ఞానక్రియలనే ఆత్మశక్తులచేత సాక్షాత్కరింపజేస్తారు. అటువంటి ఏకాత్మరూపుడైన నిర్గుణ పరబ్రహ్మ 'ఏకోహం బహూస్యాం' అనే సంకల్పంతో అనేక నామరూపాలను ధరించి విశ్వరూపి అయ్యాడు. అటువంటి సర్వాత్మకుడు నన్ను అనుగ్రహించుగాక. అవాఙ్మానస గోచరుడు, నిర్గుణ పరబ్రహ్మ, సృష్టిస్థితి లయకారణుడు అయిన దేవదేవుణ్ణి ఆశ్రయిస్తాను. ఏ దేవుని మాయాప్రభావం కారణంగా పండితులు, పామరులు, భగవంతుని విషయంలో ఉన్నాడు, లేడు అని వాదించుకుంటారో, వారందరియందు కూడా ఒకే ఆత్మశక్తిగా ఉంటూ, యోగాది ఉపాసనా ధర్మాలు వేరైనా 'నదీనాం సాగరో గతిః' అన్నట్లు వాటన్నిటికి ఒకే గమ్యరూపమైన పరాత్పరుడు నాకు అనుకూలంగా మారునుగాక. నిర్గుణుడు, నిరాకారుడు ఐన పరమాత్మ జగత్తును రక్షించటంకోసం సద్గుణుడు, సాకారుడు అవుతున్నాడో; అటువంటి సర్వవ్యాపకుడు నాకు ప్రసన్నుడు అగుగాక. ఏ భగవానుడు జీవుల పూర్వజన్మ విశేషం కారణంగా ప్రస్తుతజన్మలలో జ్ఞానమనే జ్యోతిగా వెలుగొందుతూ, భూ పదార్థాల వాసనతో కూడుకున్న వాయువు (గాలి) మాదిరిగా అన్నింటిలో ఉంటూ, అన్నింటికి దూరంగా ఉండగలిగే నారాయణుడు నా కోరికను తీర్చుగాక. అని భక్తితో నిండినవాడై తన మాటలతో కీర్తిస్తున్న దక్షునికి, భక్తపాలకుడైన శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమైనాడు. అంత

శ్రీమన్నారాయణుడు గరుత్మంతుని మీద ఆసీనుడై ఉన్నాడు. గరుడుని రెండు భుజాలమీద చాచిన ఆ స్వామి పాదాలు మేరుపర్వతం చరియకు రెండుప్రక్కలా ప్రకాశించే ఇంద్రనీలమణుల గనులవలె ఉన్నాయి. ఆయన అష్టబాహువులూ అందంగా పైకిచాచిన అష్టదిగ్గజాల తొండాలవలె ప్రకాశిస్తున్నాయి. ఎనిమిది చేతులలోనూ చక్రమూ, ధనుస్సూ, కత్తి, శంఖమూ, ఖడ్గమూ, పాశమూ, డాలూ, గదాదండమూ విరాజిల్లుతున్నాయి. నల్లని దేహంతో నగుమోముతో సాధుజనులను సంరక్షించే చల్లనిచూపులతో బంగారురంగు పట్టుపీతాంబరంతో మణిమయకిరీటంతో నలుమూలలా కాంతులు విరజిమ్మే భూషణాలతో, మకరకుండలాలతో పుండరీకాక్షుడు దక్షునిముందు ప్రత్యక్షమైనాడు.

మకర కుండలాల కాంతి చెక్కిళ్ళపై చంద్రకాంతిలా ప్రసరిస్తుండగా, కిరీటం యొక్క శ్రేష్టమైన ప్రకాశం ఆకాశలక్షికి కుంకుమరంగు వస్త్రంగా మారగా, వక్షఃస్థలం మీద వనమాలికల కాంతి శ్రీవత్సం, కాస్తుభమణుల కాంతిలో కలిసి అతిశయిస్తుంటే, నల్లని కొండను చుట్టిన మెఱుపు తీగల మాదిరి స్వామి భుజకీర్తులు శోభిస్తుండగా, సకల లోకాలనూ సమ్మోహింపజేస్తూ, నారదుడు మొదలైన దేవర్షులు, మహర్షులు స్వామిని సేవిస్తుండగా, గంధర్వాది దేవగణాల కీర్తనలు చెవులకు ఆనందం కలిగిస్తుండగా

సర్వశక్తిమంతుడు, సర్వాత్మకుడు, సర్వవ్యాపకుడు, శాశ్వతుడు, సర్వదుడు అయిన ఆ శ్రీహరి తనను సమస్త భక్తజనులు సేవిస్తుండగా దక్షునికి ప్రత్యక్షమయ్యాడు.

ఈ విధంగా సాక్షాత్కరించిన సర్వేశ్వరుని దివ్యరూపం సర్వదిక్కులనూ వెలిగిస్తూ మహాశ్చర్యాన్ని కలిగించింది. అలా ప్రకాశించే ఆ దేవదేవుని తేజోమయమూర్తిని వీక్షించి, దక్షుని హృదయంలో భయమూ, ఆనందమూ, ఆశ్చర్యమూ ముప్పిరి గొన్నాయి. ఎలాగో ఆ తన్మయత్వంనుండి తెప్పరిల్లి తొట్రుపాటుతో దక్షుడు స్వామికి సాష్టాంగదండ ప్రణామం చేశాడు. జోడించి మోడ్చి నిలుచున్నాడు. సెలయేళ్లు కలయికతో దరులొరసి పొంగి మిన్నంటి సముద్రాన్ని దరిసిన మహానదీ ప్రవాహంవలె దక్షప్రజాపతి పులకించిన దేహంతో భగవంతుని ముందు నిలిచాడు. ఆయన పరవశించిన తన హృదయాన్ని ఎలాగో అదుపు చేసుకొని పొంగిపొరలే ఆనందంతో ఆ పరమేశ్వరునితో ఏమేమో పలుకాలి అనుకొన్నాడు. పరమ మంగళదాయకాలైన ఆయన పవిత్రనామాలను ఉచ్చరించాలనుకొన్నాడు. పరమపవిత్రాలైన ఆయన లీలలను అభివర్ణించాలనుకొన్నాడు. విబుధులకు సంతోషాన్ని కలిగించే ఆయనపరాక్రమాన్ని ప్రస్తుతించాలనుకొన్నాడు. తన మనస్సులోని కోరికను వెల్లడించాలనుకొన్నాడు. కానీ పాపం! ఏమీ చేయలేక పోయాడు. ఆ విధంగా మైమరచి నోట మాటరాక మౌనం వహించి ఉన్న ప్రజాకాముడైన ప్రజాపతిని చూచి, సర్వజ్ఞుడూ సర్వప్రాణి హృదయాంతర్యామీ అయిన ఆ స్వామి అతని అభిప్రాయాన్ని గ్రహించి, ఆర్తజనులను రక్షించే లక్షణంగల మాటలతో ఇలా అన్నాడు.

ఓ దక్షా! నీ తపస్సుకు మెచ్చాను. అందుకు ఈ క్షణంలోనే నీకు ఫలసిద్ధిని ప్రసాదిస్తున్నాను. నానుండి వరం పొందడానికి ఈలోకంలో నీకంటె అర్హుడు ఎవడున్నాడు?

ఈ నీ తపస్సు ఇక చాలు. సకల జీవరాశులకు సమస్త సంపదలు సిద్ధిస్తాయి. నీవు సృష్టి చేయాలనే కోరికతో నన్ను గూర్చి తపస్సు చేశావు. నా సంకల్పం కూడా ఇదే. నీ తపస్సు నెరవేరింది.

ఇంకా చెబుతాను విను. బ్రహ్మ, రుద్రుడు, ప్రజాపతులు, మనువులు, ఇంద్రాదులు వీరందరూ నా అంశకు చెందినవారే. వేదచోదితమైన సంధ్యావందనాదులు నా మనస్సు. జపధ్యానాదులు నాశరీరం. ధ్యానధారణాది మానవకార్యాలు నా ఆకారం. యోగాదులు అవయవాలు. ధర్మం నా ఆత్మ. దేవతాగణాలు జీవములు. వేదం నా స్వరూపం. సృష్టిపూర్వం నేను మాత్రమే ఉన్నాను. శాశ్వతుడైన నా నుండి సంకల్ప మాత్రాన ఈ బ్రహ్మాండం, బ్రహ్మ తమకు తాముగా పుట్టారు. నా తేజస్సును కలిగి ఉన్న బ్రహ్మ క్రియారహితుడై ఉన్నప్పుడు నాచే ప్రేరితుడై ఘోరతపస్సు చేశాడు. తదనంతరం నా సంకల్పంతో ప్రజాసృష్టి చేయగల మిమ్మల్ని సృష్టించాడు.

ప్రజాపతులలో ఒకడైన పంచజనుని కుమార్తె ఐన అసిక్నిని నీకు భార్యగా అనుగ్రహించాను. గృహస్థ ధర్మాన్ని పాటించి మీరు అత్యధిక ప్రజలను సృష్టించండి. నీ సంతానం కూడా నాచే ప్రభావితులై సృష్టిని పెంపొందిస్తారు అని ఆదేశించి మాయమయ్యాడు. అప్పుడు దక్షుడు స్వామి ఆజ్ఞమేరకు అసిక్నితో కూడి పదివేలమంది హర్యశ్వులకు జన్మనిచ్చాడు. వారు తండ్రి ఆజ్ఞమేరకు ప్రజాసృష్టికోసం తపస్సు చేయడానికి సింధునది సముద్రసంగమ ప్రాంతమైన విశిష్ట పుణ్యతీర్థమైన నారాయణసరస్సునుచేరి అందు స్నానం చేసి పవిత్ర మనస్కులై తపస్సు ప్రారంభించారు. ఆ సమయంలో వారి వద్దకు నారదుడు వచ్చి ఇలా అన్నాడు.

నారదుండు హర్యశ్వులకు నివృత్తి మార్గంబు నుపదేశించుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

పంచాంగం

Daksha cursed Narada to wander the universe forever without a fixed home - దక్షుండు నారదుని శపియించి ప్రజాసర్గం బొనరించుట

దక్షుండు నారదుని శపియించి ప్రజాసర్గం బొనరించుట అది ఎలాగంటే - వీరు బాలురు. దేవఋషి పితృబుణాలు తీర్చుకోలేదు. ఏ కర్మలను చేయలేదు. కర్మల అనిత్యత్వ...