Wednesday, March 11, 2026

Chitraketu Engaged in Deep Meditation for Seven days, completely focusing his mind on Lord Sankarshana (Vishnu) and got his blessings - చిత్రకేతుండు తపం బాచరించి భగవత్ప్రసాదంబు నొందుట

చిత్రకేతుండు తపం బాచరించి భగవత్ప్రసాదంబు నొందుట

సుఖదుఃఖాలతో సంబంధం లేకుండా, అన్ని విషయాలలో ఉపేక్ష భావంతో ఉండే పరమాత్మ అయిన ఆ పరమేశ్వర స్వరూపుడ నైన నాకు మీకు సంబంధం ఏమున్నది? మీరు దుఃఖించవలసిన పనిలేదు అని చెప్పి ఆ జీవుడు వెళ్ళిపోయాడు. చిత్రకేతుమహారాజు, అతని బంధువులు మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. దుఃఖాన్ని వదలిపెట్టారు. మోహాన్ని దరిచేర నివ్వలేదు. యమునానదీతీరంలో ఆ కుమారునకు ఉత్తరక్రియలు చేశారు. గొప్ప బురదలో కూరుకుపోయిన ఏనుగు బయటపడిన రీతిగా ఇల్లు అనే చీకటినూతినుండి చిత్రకేతుమహారాజు బయటపడ్డాడు. యమునానదికి వెళ్ళాడు. శాస్త్రవిధిగా స్నానంచేసి మౌనం వహించి నారదునకు నమస్కరించాడు. నారదుడు ప్రసన్నుడయ్యాడు. భగవంతుని మంత్రాన్ని విధివిధానంతో చిత్రకేతు మహారాజుకు ఉపదేశం చేశాడు. అంగిరసునితో కలసి నారదుడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు.

నారదుడు చెప్పిన రీతిగా చిత్రకేతుడు ఆహారాన్ని విడిచిపెట్టి సమాధి స్థితిలో నారాయణ స్వరూపం అయిన ఆ నారదోపదేశ విద్యను ఆరాధించి ఏడు రాత్రుల చివర ఎదురులేని విద్యాధర పరిపాలనాధికారం పొంది, కాంతులు చిమ్మే రత్నాలతో కూడిన గొప్ప విమానాన్ని పొంది, నారాయణుని దయను పొందినవాడై ముల్లోకాలలో మనోవేగంతో తిరుగుతూ ఉండగా కొన్ని రోజులకొక ప్రాంతంలో

ముత్యాలహారాలతో, గంధంతో సమానమైన తెల్లని దేహం కలవాణ్ణి, అందమైన పీతాంబరం ధరించినవాణ్ణీ, మణులతోకూడిన కిరీటకాంతులు నిండిన శిరస్సులు గలవాణ్ణీ, కడియాలు, భుజకీర్తులు నిండిన చేతులు కలవాణ్ణీ, స్వర్ణమయకాంతులతో కూడిన మొలతాళ్లు కలవాణ్ణి, కదలాడే యజ్ఞోపవీతాలు కలవాణ్ణీ, దయతోకూడిన ముఖపద్మాలు కలవాణ్ణీ, యౌవనకాంతితో విప్పారిన నేత్రాలు కలవాణ్ణి, సిద్ధమండలం సేవించగా పుణ్యప్రసిద్ధితో వెలసిన గొప్ప చరిత్రగలవాణ్ణి, తామరస నేత్రుడైన శ్రీ విష్ణుమూర్తికి పాదపీఠమై ఉన్న మహాత్ముడైన ఆదిశేషుణ్ణి చిత్రకేతుమహారాజు చూశాడు.

చిత్రకేతు మహారాజు ఆ ఆదిశేషుణ్ణి చూచినంతనే, ఆయన పాపాలన్నీ పోయాయి. మనసు ప్రశాంతమయింది. అధికభక్తియుతుడై రాజు శరీరం రోమాంచితంకాగా, ఆనందబాష్పాలతో ఆదిశేషునకు నమస్కారం చేశాడు.

చిత్రకేతు మహారాజు ఆనందబాష్పాలతో అనంతుణ్ణి అభిషేకించాడు. పట్టరాని ఆనందంతో గద్గదకంఠుడై మాట్లాడలేక మాట్లాడలేక కొంతసేపటికి

చిత్రకేతుమహారాజు మనసును చిక్కబట్టుకొన్నాడు. బాహ్యవిషయాలను మాత్రమే గుర్తిస్తున్న జ్ఞానేంద్రియాలను ఒకచోటకు చేర్చాడు. మనసు మాట ఈ రెండు ఒకటే కాగా వాటిని తత్త్వంలో నిలిపి శాశ్వతాకారుడు, దయ గలవాడు, ప్రశాంత స్వభావుడు, జగద్గురువు అయిన ఆదిశేషుణ్ణి స్తుతింప నారంభించాడు.

ఓ హరీ! అనంతా! నీవు ఎవరిచేతను జయింప శక్యం కానివాడవై ఉండికూడా ఇప్పుడు నీ భక్తులచే జయింపబడినావు. నీ భక్తులు కూడా నీ చేత జయింపబడ్డారు. నిన్ను గూర్చి ఆసక్తితో పూజింపనివారు నిన్ను పొందలేరు కదా!

ఓ పరమాత్మా! ఈ ప్రపంచం సృష్టి స్థితి, లయ అనే కార్యక్రమాలతో నిండి ఉండటం నీ వైభవమే. ఈ ప్రపంచాన్ని సృష్టించేవారు నీ అంశలు పొందిన వారే. ఈ సృష్టి స్థితి, లయ అనే పనులు చేయగలిగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నీ సుగుణ సముద్ర తీరాన్ని చూడలేక తెలివిగల వారమనుకొని నీ గురించి చర్చచేసుకొంటూ ఉంటారు.

స్వామీ! నీవు వేదవేత్తవు. ఆది మధ్యాంతాలు నీ వశంలో ఉంచుకున్నవాడవు. పరమాణువు మొదలుకొని పరమోత్కృష్టమైన పదార్థంవరకూ వ్యాపించి ఉన్నావు. నీవు శాశ్వతుడవు.

పృథ్వి, జలం, తేజస్సు, వాయువు, ఆకాశం అనే పంచభూతాలూ; మహత్తూ, అహంకారమూ అనే ఏడున్నూ ఒకదానికంటె ఒకటి పదిరెట్లు పెద్దవిగా కూర్చబడి ఉంటాయి. దీనినే అండకోశం అంటారు. ఇటువంటి బ్రహ్మాండాలు ఎవరిలో ఒక అణువువలె ఉంటాయో అతడు అనంతుడని పిలువబడతాడు.

పశుస్వభావంగల మానవులు కొంతమంది ఒక్కొక్కచోట ఇంద్రియాలను, వాటి కోరికలను తీర్చుకోవాలని తీవ్రమైన ఆలోచనతో పరతత్త్వం అయిన నిన్ను వదిలిపెట్టి, ఐశ్వర్యాన్ని కోరుకొనేవారై మిగిలిన దేవతలను సేవిస్తూ ఉంటారు. నీవు కాక ఇతర దేవతలు ఇచ్చే సంపదలు అశాశ్వతులైన ఆ దేవతలతోపాటే నాశనం పొందుతాయి. నిజానికి ఇంద్రియ విషయాలను కోరుకొనేవారైనా ఇతర దేవతలనుకాక నిన్ను ఆరాధిస్తే, వేయించిన విత్తనం ఎలా మొలకెత్తదో అలా మరో దేహాన్ని ధరించే పునర్జన్మ పొందరు. నీవు నిర్గుణడవే. నీవు జ్డాన విజ్ఞానరూపుడవే. నిన్ను జ్ఞానులు గుణసమేతునిగా భావన చేస్తారు. వేయి మాటలెందుకు? నిన్ను ఏ రకంగా పూజించి సేవించినా మోక్షాన్ని పొందుతారు. సనత్కుమారులు మొదలైనవారు నీవు ఏ విధంగా భాగవత ధర్మాన్ని నిర్ణయించావో ఆ విధంగానే అన్నిటికంటె, అందరికంటె గొప్పవాడవైన నిన్ను మోక్షం పొందాలనే ఆలోచనతో సేవిస్తారు.

నీవు చెప్పిన భాగవతధర్మంలో జ్జానం లేనివాడు ఒక్కడు కూడా లేడు. ఈ భాగవతధర్మంగాక ఇతరమైన కోరికలతో సమంకాని బుద్ధిచేత మిగిలినవారు నేను, నీవు, నాకు, నీకు అనే స్వపరభేదంతో ప్రవర్తించి అధర్మాన్ని ఆచరిస్తూ నశిస్తారు. చైతన్యంగలవి, చైతన్యంలేనివి అయిన ఈ స్థావర జంగమ ప్రాణుల సమూహం విషయంలో నీచే ప్రవచింపబడిన భాగవతధర్మాన్ని అనుసరించే మానవునకు నీ దర్శనంవలన పాపం పోవడంలో విచిత్రం ఏముంది?! ఈ సమయంలో నీ పాదదర్శనంచేత నేను స్వచ్చతను పొందాను. ఏమీ ఎరుగని మూఢుడనైన నాకు గతంలో దయతో నారదుడు భగవద్ధర్మాన్ని తెలియజేశాడు. ఆ నారదుడు చెప్పిన విషయం ఈనాడు నాకు వరదుడవైన నీవలన స్పష్టంగా దర్శనం అయింది. మహాత్మా! మిణుగురు పురుగులకు సూర్యుడు గోచరించనట్లే సామాన్య మానవులకు జగదంతర్యామివైన నీ మహత్త్వం గోచరం కాదు. సృష్టి స్థితిలయాలకు హేతుభూతుడవై భగవంతుడవైన నీకు నమస్కరిస్తున్నాను.

బ్రహ్మ మొదలైన సురశ్రేష్ఠులు ఏ మహాత్ముణ్ణి అనుసరించి భక్తియుక్తులతో ప్రశంసిస్తూ ఉంటారో, ఈ విశాల విశ్వం ఏ భగవానుని శిరస్సుపై ఆవగింజవలె సూక్ష్మ ఆకారాన్ని వహించి ఉంటుందో ఆ సహస్రఫణి అయిన ఆదిశేషుణ్ణి నేను సేవిస్తాను.

విద్యాధరులకు అధిపతి అయిన చిత్రకేతువు ఇలా అనంతుని స్తుతించగా, ఆ ఆదిశేష హరిరూపుడైన అనంతుడు ప్రేమతో ఓ స్వచ్చ మనస్కా! నీ బుద్ధి వైభవాన్ని మెచ్చుకుంటున్నాను అన్నాడు.

ఓ చిత్రకేతూ! నారదుడు, అంగిరసుడు నీకు నా తత్త్వాన్ని తెలియజేశారు. దానివల్ల నీవు నన్ను దర్శించగలిగావు. నాపై భక్తి కలిగింది. నా మార్గంపై నీకు అచంచలమైన విశ్వాసం కలిగింది.

ఈ విశాల విశ్వంలోని సమస్త ప్రాణులూ నా స్వరూపాలే. ఈ విశ్వంలోని అన్ని ప్రాణుల హృదయాలను ఎరిగి నిర్ధేశించువాడనూ, బ్రహ్మమూ, శబ్దబ్రహ్మమూ నేనే. నేను శాశ్వత శరీరాలు ధరిస్తున్నాను. ఆత్మస్వరూపంతో అఖిలలోకాలలో నేను ఉన్నాను. లోకాలన్నీ నాలో ఉన్నాయి. నేను అన్ని లోకాలలో ఉండటం, అన్ని లోకాలూ నాలో ఉండటం అనే ఉభయ క్రియలూ నాలో ఉన్నాయి. ఈ ఉభయ కృత్యాలూ నాకు అనుకూలంగా నడుస్తూ ఉంటాయి. సమస్త ప్రపంచంలో నేను లీనమై ఉంటాను. నిద్రించేవాడు స్వప్నంలో ప్రపంచమంతటినీ దర్శించి మెలకువ వచ్చిన తరువాత తాను ఎక్కడ ఉన్నాడో గ్రహించినట్లు జీవుడు తిరిగి తిరిగి ఒకనాటికి మాయనుండి విడివడి పరమధర్మాన్ని తెలుసుకొంటాడు.

జీవుడు నిదురించేవేెళ నిద్రలో మునిగి ఇంద్రియాలకు అతీతుడై ఉంటాడు. అతనిని గుణాలేవీ స్పృశింపవు. అటువంటి ఇంద్రియాతీతమైన ఆనందస్థితినే బ్రహ్మంగా గుర్తించు. ఆ బ్రహ్మస్వరూపమే నేనుగా తెలుసుకో.

జీవుడు నిదురించేవేళ కలగంటాడు. ఆ కలలో వివిధ విషయాలను దర్శిస్తాడు. మెలకువ వస్తుంది. మెలకువ వచ్చిన తరువాత కలలో చూచిన విషయం సత్యంకాదని గ్రహిస్తాడు. కలలో దృశ్యాన్ని చూచి, మెలకువ వచ్చిన తరువాత సత్యాన్ని గ్రహించి కలయొక్క సత్యంయొక్క లక్షణాన్ని సమన్వయం చేసుకోగల గొప్పజ్ఞానం ఏదైతే జీవునకు ఉంటుందో ఆ తత్త్వాన్ని 'నేను' అని గ్రహించాలి.

లోకంలో నరజన్మం పరమదుర్లభం. కావాలంటే లభించేది కాదు. అటువంటి ఉత్తమ జన్మమెత్తి కూడా ఆత్మస్వరూపం తెలుసుకోని వాడికి ఏమాత్రం సుఖం లభించదు. మానవులు సుఖప్రాప్తికోసం, దుఃఖనివృత్తికోసం ప్రయత్నిస్తుంటారు. ప్రవృత్తిమార్గాన్నీ నివృత్తి మార్గాన్నీ అవలంబిస్తారు. కాని వారి సంకల్పం కోరికతో కూడినందువల్ల వారికి సుఖం ప్రాప్తించదు. దుఃఖం తొలగిపోదు. కొందరు సుఖంకోసం దాంపత్యధర్మాన్ని ఆశ్రయిస్తారు. దీనిలో కూడా పరస్పరం వియోగం కలిగినప్పుడు విషాదం తప్పదు. అందువల్ల సంసారసంబంధంలో సైతం సుఖదుఃఖాలు ప్రాప్తిస్తూనే ఉంటాయి. నన్ను విస్మరించి దుఃఖకారణమైన ఈ బంధాలలో చిక్కుకున్నవారికి మోక్షం ఎట్లా దక్కుతుంది!

(మానవజన్మ దుర్లభమైంది. మానవుడు విషయలోలుడు కాకుండా ఆత్మతత్త్వాన్ని గ్రహించాలి. ప్రవృత్తిమార్గం నివృత్తిమార్గం అని రెండు మార్గాలున్నాయి. ప్రాపంచిక విషయాలలో కొట్టుమిట్టాడటం ప్రవృత్తిమార్గం. లోకంలో లౌకికంగా ప్రవర్తించకుండా ఉండడం నివృత్తిమార్గం. అంటే లౌకిక విషయాలకు పరాఙ్ముఖంగా ఉండటం, మనసును లోకం వైపునుండి ఆత్మతత్త్వం వైపు మళ్ళించడం. ప్రవృత్తివల్ల దుఃఖం, నివృత్తివల్ల సుఖం కలిగి తీరుతాయి. ఈ సంసారంలో ఉండే జీవికి సుఖదుఃఖాల పరంపర తప్ప, మోక్షం లభించదు. నిజానికి సుఖంగా భావించేది కూడా సుఖంకాదు. అదికూడా దుఃఖమే కాని మానవుడు ఆ దుఃఖాన్ని సుఖభ్రాంతితో చూస్తాడు. అన్ని దుఃఖాలకూ మూలం ఈ సంసారం అని అందరికీ తెలిసికూడా పరమాత్మను మనసులోనైనా ధ్యానించకుండా సంసారదుఃఖ ప్రవాహంలో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఈ మానవుడు జీవిస్తూ ఉంటాడు. విషయ పరాఙ్ముఖత్వం అలవాటు చేసుకొంటూ చిత్తం పరబ్రహ్మంపై నిలపటం నిజమైన మోక్షహేతువు.)

మానవులు విజ్ఞానాన్ని అభిమానిస్తారు. అటువంటివారు మిక్కిలి సూక్ష్మమైన ఆత్మమార్గంలో జాగృత్‌, స్వప్న, సుషుప్తి అనే మూడు స్థితులు దాటిన నాల్గవదైన తురీయస్థితిని తెలుసుకొని, ఇహలోక, పరలోక విషయాలచేత, విచక్షణ అనే వివేకం యొక్కబలంచేత నియోగింపబడి జ్ఞాన విజ్ఞాన విషయాలలో ఎవడు సంతృప్తిని పొందుతాడో అటువంటి జీవుడు నాకు భక్తుడవుతాడు. ఈ విధంగా ఎవరు ఉంటారో వారు యోగమార్గనిపుణులై తమయొక్క ఆత్మచేత పరమాత్మను తెలుసుకోగలుగుతారు.

నీవు అదేవిధంగా నా యందు భక్తిశ్రద్ధలు గలవాడవై విజ్ఞానసంపదతో కూడిన మాటలచేత నన్ను స్తోత్రంచేసి ముక్తి పొందావు. విషయప్రపంచంనుండి బయటపడ్డావు అని ఆదిశేషుడైన అనంతపరమాత్మ విద్యాధరులందరికి ప్రభువైన చిత్రకేతుమహారాజుతో చెప్పి అదృశ్యంఅయిపోయాడు. ఏ దిక్కులో స్వామీ, సర్వాత్మకుడూ అయిన అనంతపరమాత్మ అదృశ్యం అయ్యాడో ఆ దిక్కునకు విద్యాధరరాజు చిత్రకేతువు నమస్కారం చేశాడు. ఆకాశమార్గంలో సంచరిస్తూ ఆ చిత్రకేతువు లక్షల దివ్యసంవత్సరాలు ఎదురులేని ఇంద్రియబలంతో ఎంతోమంది పరమయోగిపుంగవులు, దివ్యమునీంద్రుల, సిద్ధులు, చారణులు, గంధర్వులు స్తుతించే ద్రోణాది పర్వతాలను, రమ్యప్రదేశాలను, మనసులో అనుకున్నంత మాత్రంచేత ఆ సంకల్పాన్ని సిద్ధింపచేసే ప్రదేశాలను చూచి ఆనందిస్తూ, శ్రీమన్నారాయణుడు తనకు అనుగ్రహించిన దివ్యవిమానంలో సంచరిస్తూ

చిత్రకేతుమహారాజు కృష్ణార్పణబుద్ధితో బాగా గానంచేయగల యక్ష కిన్నర కాంతలచేత విష్ణుమూర్తికి సంబంధించిన గొప్పవైన నాటకరీతులనూ, గుణవిశేషాలను నృత్యాలుగా ఆడిస్తాడు. పద్మపత్ర నేత్రుడైన విష్ణువుయొక్క బిరుదులతో కూడిన ప్రఖ్యాతమైన గీతాలను పాడిస్తాడు. నిరంతరం వారి నోట గోవిందుని అనంత నామావళులను పలికిస్తాడు.

చిత్రకేతు మహారాజు అన్నివేళలా విష్ణుప్రీతిగా ఈ క్రింది పనులు చేస్తూ చేయిస్తూ ఉంటాడు. అవి, వైష్ణవజ్ఞానం తనలో నిలుపుకుంటాడు. భగవద్భక్తుల కైంకర్యం కోరుకుంటాడు. పద్మాక్షుడైన హరిని తులసీమాలాదులతో అలంకరిస్తాడు. విష్ణుకథామహాత్యాన్ని భాషిస్తూ ఉంటాడు. విష్ణుమూర్తి గుణసమూహాన్ని ఎలుగెత్తి పలుకుతాడు. పరతత్త్వాన్ని గుర్తించి దాన్ని వృద్ధి చేసుకొంటాడు. శ్రీకృష్ణసేవకులను సేవిస్తూ ఉంటాడు. పరమాత్మకు పూజాదికాలు సంతోషంతో సమర్పిస్తాడు. వైకుంఠప్రభువుయొక్క లీలలూ, రూపమూ, ప్రవర్తనా, గుణాలూ, నామాలూ వీటితోకూడిన దివ్యప్రబంధాలను సంగీత శాస్త్రానుసారంగా తాను పాడుతూ, ఇతర భక్తులచేత పాడిస్తూ ఉంటాడు.

The Story of King Chitraketu - చిత్రకేతూపాఖ్యానము

చిత్రకేతూపాఖ్యానము

ఈ విధంగా పరీక్షిత్తు శుకయోగీంద్రుని అడిగాడు అని సూతుడు శౌనకాది మహర్షులకు చెప్పి మరల ఇలా అన్నాడు. శౌనకాది మహర్షులారా! ఆ విధంగా హస్తినాపుర ప్రభువైన పరీక్షిత్తు ఆసక్తితో అడిగిన ప్రశ్నకు వ్యాసపుత్రుడైన శుకయోగీంద్రుడు శ్రద్ధతో హరిస్మరణ గావించి ఇలా అన్నాడు. "ఓ పరీక్షిన్మహారాజా! పూర్వం నా తండ్రి వ్యాసభగవానుడు, నారదుడు, దేవలుడు అనే పేరు గల మహర్షులు నాకు తెలియజేసిన ఇతిహాసం ఒకటి ఉంది. దాన్ని నీకు తెలియజేస్తాను సావధానంగా వినూ" మని ఇలా చెప్పాడు.

చిత్రకేతుడు అనే పేరుగల రాజు అంతులేని సంపదతో, మహేంద్రసమానుడై, శూరసేన దేశాలకు రాజై ప్రజలు ఆనందపడేలా పాలన చేస్తున్నాడు. అతనికున్న ఓర్పు అనే సుగుణం అన్ని కోర్కెలు తీరుస్తూ ఉండగా, సుగుణాలంకార భూషితుడై, సత్కీర్తిని పొందుతూ ప్రసిద్ధికెక్కాడు.

మెచ్చుకోదగిన యౌవనమందున్న మన్మథుని గుర్రాల వంటివారు, మన్మథుని విజయానికై అవతరించిన ఖడ్గలతలు, మన్మథమంత్ర అధిష్ఠాన దేవతలు, మదనుని బందీలు, సమస్త ప్రపంచాన్ని అపహసించి లోబరచుకోగల బొమ్మలు, మనోజుని సంసిద్ధమైన సేనవంటివారు, ఇక్షుకోదండధారియైన మన్మథుని విస్తారమైన కాంతులు, శంబరారి బాణాలు వీరేనేమో అనేటట్లున్న కోటిమంది పద్మముఖులు ఆ రాజైన చిత్రకేతువునకు భార్యలుకాగా స్వచ్చకీర్తిని, సంపదను ఇచ్చే సన్మార్గంలో ప్రవర్తిస్తూ అతడు ప్రజాపాలన చేస్తున్నాడు.

రాజైన చిత్రకేతువు తనకు ఎంత సంపద ఉన్నప్పటికీ, ఎంతమంది భార్యలు కలిగినప్పటికీ, సంతతి ఒక బిడ్దకూడా లేని కారణంగా వేసవి తాపానికి ఎండిపోయే మడుగువలె బాధపడుతున్నాడు.

ఆ చిత్రకేతు మహారాజు పుత్రసంతానం లేక పొందిన బాధను అతనిరూపం, పౌరుషం, దేవేంద్ర వైభవం, యౌవనం, సత్ప్రవర్తన, దిగ్విజయశక్తి సత్యనిష్ఠ ప్రపంచమంతా అలుముకొన్న ఖ్యాతి, భార్యలు, వైభవాలు ఇవేవీ పోగొట్టలేకపోయాయి.

ఈ విధంగా సంతానంలేక ఎంతగానో దుఃఖిస్తున్న ఆ రాజు భవనానికి అంగిరసుడు అనే మహర్షి వచ్చాడు. రాజుచేత అతిథి గౌరవాలు పొందాడు. కుశల ప్రశ్నలు వేశాడు. "రాజా! రాజ్యం నీ అధీనంలోనే ఉంది కదా. పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశాలతోపాటు మహత్తు అహంకారం అనే ఏడింటిచేత జీవుడు రక్షింపబడిన తీరుగా రాజుకూడా మంత్రులు, ప్రజలు, కోట, ఆర్థికసంపద, సైన్యం, మిత్రులు అనే సప్తాంగాల చేత రక్షింపబడతాడు. నీవు అలాగే రక్షింపబడుతున్నావా? మంత్రులపై భారంపెట్టి రాజ్యసుఖాలు అనుభవిస్తున్నావా? భార్యలు, ప్రజలు, మంత్రులు, సేవకులు, మంత్రాంగం చెప్పేవారు, పురప్రజలు, గ్రామప్రజలు, రాజులు నీకు వశవర్తులై ఉన్నారా? అన్నీ కలిగిన మహారాజువైనా నీ మొగం ఎందుకో చిన్నబోయినట్లుంది. కారణం ఏమిటో?" అనిన ఆ మునిశ్రేష్ఠునితో రాజు ఇలా అన్నాడు. అయ్యా! తపోబలం కలిగిన మీరు ఎరుగనిది ఏముంది అని తలవంచి మౌనంగా కూర్చున్నాడు.

రాజు అభిప్రాయాన్ని సమస్యను ఎరిగిన అంగిరసుడు దయాళువై పుత్రకామేష్టి చేసి యజ్ఞప్రసాదాన్ని చిత్రకేతు మహారాజు పట్టమహిషి కృతద్యుతి అనే ఆమెకు ఇచ్చాడు. నీకు పుత్రుడు లభిస్తాడు, అతనివలన సుఖదుఃఖాలు అనుభవిస్తావు రాజా! అని చెప్పి వెళ్ళిపోయాడు. మహారాణి కృతద్యుతి యజ్ఞప్రసాదాన్ని స్వీకరించి గర్భం ధరించి తొమ్మిది నెలలు నిండగా కుమారుణ్ణి కన్నది. ఆ పుత్రోదయ సమయంలో రాజైన చిత్రకేతువు స్నానంచేసి, ఆభరణాలు ధరించి, గ్రామాలను, ఏనుగులను, గుర్రాలను, గోవులను, అరవైకోట్ల ద్రవ్యాన్ని దానంచేసి ప్రాణులకు మేఘుడు వర్షం కురిపించినట్లుగా ఇతరులందరికీ కోర్కెలను కురిపించి ఆనందంతో ఉన్నాడు. పుత్రమోహంతో మహారాణిపై ఎక్కువ ప్రేమను చూపిస్తున్నాడు మహారాజు. కృతద్యుతి పై ప్రేమను చూపడం వల్ల సంతానం లేని మిగిలిన రాణులకు బాధ కలిగింది. ఈర్ష్య కలిగింది. క్రూరచిత్తంతో మిగిలిన రాణులు ఆ రాజకుమారునకు విషం పెట్టారు. ఆ కుమారుడు సుఖనిద్ర పొందిన వానివలె మృతి చెందాడు. తెల్లవారగా దాది రాజపుత్రుణ్ణి మేల్కొల్పటానికి వెళ్ళి రాజపుత్రుడు విగతజీవుడై వికృతాకారంతో ఉండటంచూచి ఆశ్చర్యంతో, దుఃఖంతో, భయంతో శోకించి భూమిపైపడి దుఃఖించింది.

మృతుడై పడి ఉన్న ఆ రాజపుత్రునిజూచి దాది భూమిపై నిట్టనిలువుగా పడి దీనంగా అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఎక్కువ ఆతృతతో ఏడ్చింది. అది విని భయంతో రాజు భార్య వెంటనే అక్కడికి వస్తూ

ఒక్కగానొక్క బిడ్డ క్రమక్రమంగా పెరుగుతున్నవాడు అతడే వంశకర్త. తాపసి అయిన అంగిరసుని వరంవల్ల జన్మించినాడు. అటువంటి కుమారుడు చనిపోయిన తీరుచూచి తల్లి దుఃఖించసాగింది.

చిత్రకేతుని భార్య కృతద్యుతి పుత్రమరణాన్ని సహించలేకపోయింది. ముఖంమీద పెట్టుకొన్న కుంకుమబొట్టుయొక్క ఎరుపు, కంటికి పెట్టుకొన్న కాటుక నలుపు కలిసిన కంటినీటి ధారలతో తన వక్షఃస్థలం తడిసిపోగా, బంగారు కంకణాలు ధరించిన చిగురులవంటి సుకుమార హస్తద్వయంతో హృదయాన్ని మోదుకుంటూ బాధతో కోకిల గొంతువంటి మధురమైన శబ్దంతో ఏడ్చింది.

(పంచమ స్వరం అంటే కోకిలగొంతు అని అర్ధం. 'పికః కూజతి పంచమం' అని ఉక్తి. అంటే పంచమస్వరంతో కోకిల కూస్తుంది అని అర్థం.)

కృతద్యుతిచేసిన దుఃఖ ధ్వనిని విని రాజైన చిత్రకేతువు భయపడ్డాడు. తాను రాజును అన్న గంభీర భావాన్ని విడిచిపెట్టి సుతుని వద్దకు వేగంగా వచ్చి మోహంతో తన కుమారునిపై వాలి చిత్రకేతువు ఇలా అంటున్నాడు. "ఓ కుమారా! నీ మరణవార్త వజ్రాయుధమై నన్ను కూలగొట్టక ఇలా నిలబెట్టి ఎందుకు జాలి తలచిందో! ఇకపై నా బతుకు ఎలా ఉంటుందో. ఈ నీ మరణవార్త విన్న మీ తల్లికి దుఃఖం ఎలా ఉపశమిస్తుందో కదా!"

ఈ ప్రకారంగా కిందు మీదులు తెలియకుండా భటులతో, మంత్రులతో, బంధువులతో కూడి ఆ రాజు దుఃఖిస్తున్నాడు. ఆ రాజు బాధ తెలుసుకొని అంగిరసుడు నారద మహర్షితో కలసివచ్చాడు. మరణించిన తన కొడుకు పాదాల దగ్గర శవంలా పడి ఉన్న రాజును చూచి అంగిరసుడు ఇలా అన్నాడు.

ఓ సార్వభౌమా! ఈ బాలుడు నీ కేమి అవుతాడు? నీవు ఎవరికొరకు దుఃఖిస్తున్నావు? ఈ పుత్రులు, ఈ మిత్రులు పూర్వజన్మలో ఎవరివారో నీవు ఎరుగుదువా! నదిలోని ప్రవాహ వేగంవల్ల ఇసుక ఒకప్పుడు ఒకచోట మేటవేసి మరొకప్పుడు విడిపోయినట్లుగా ప్రాణులకు చావు పుట్టుకలు జరుగుతూ ఉంటాయి. విష్ణుమాయ వలన మమకారం కలిగి జీవులకు జీవులు జన్మిస్తాయి. దీనికి బాధపడవలసిన పనిలేదు. ధైర్యం కోల్పోకూడదు. ఈ విషయాన్ని నీవు ఆలోచించుకోవాలి కదా!

'ఓ రాజా! వినవయ్యా! మేము, నీవు, మిగిలిన వారందరూకూడా ఈ నడుస్తున్న కాలంలో జన్మించి మృత్యువులో విశ్రాంతి పొందుతాము. ఇపుడే లేకుండా పోతాము. చావు, పుట్టుక ఈ రెండూ నిజం కాదు. పరమేశ్వరుడు తన మాయాప్రభావంతో జీవులచేత జీవులను పుట్టించి, ఆ జీవుల చేతనే రక్షింపజేసి, ఆ జీవులచేతనే మరణించేలా చేస్తాడు.

ఈ సృష్టి స్వతంత్రమైనది కాదు. భగవంతునికి ప్రత్యేకమైన ఉద్దేశం లేదు. అందుకే ఆ భగవంతుడు ఈ సృష్టి విషయంలో ఎటువంటి అపేక్ష లేకుండా బాలునివలె ఉంటాడు. పితృదేహంచేత పుత్రదేహం మాతృదేహంవల్ల కలుగుతుంది. ఈ విధంగా బీజాలవల్ల బీజాలు పుడుతూ ఉంటాయి. దేహికి ఈ జననమరణ దేహాలు శాశ్వతంగా జరుగుతూనే ఉంటాయి. పూర్వం సామాన్య విశేషాలు సన్మాత్ర వస్తువులయందు ఏ విధంగా ఏర్పడ్డాయో ఆ ప్రకారంగానే దేహానికి జీవునకు ఒకదానికి ఒకటి విభజింపబడటం అజ్ఞానంవల్ల కల్పింపబడింది. జన్మ ఫలితాలను చూచేవారికి మండుతున్న మంట అనేక ఆకారాలలో ఎలా కనబడుతుందో అలాగే ఒకే జీవుడు అనేక దేహాలతో వివిధకాలాలలో వెలుగుతూ ఉంటాడు. ఆత్మజ్ఞానం లేకపోవడంవల్ల దేహి దేహం ఒకటే అనుకోవడం జరుగుతుంది.

స్వప్నంలో భయంకరమైన విషయాన్ని చూచి ఆ స్వవ్న విషయం తనను ఏమీ చేయదని తెలియక అది తనకే జరిగినట్లు భయపడి; మెలకువ వచ్చిన తరువాత ఈ భయం అన్నది కేవలం కల మాత్రమేనని తనకు ఏమాత్రం అంటదని తెలుసుకొన్నరీతిగా, జీవుడే తాను అనే విషయం జ్ఞానికి మాత్రమే తెలుస్తుంది. కావున ఈ దేహాలు, జన్మ పరంపరలు కేవలం మనస్సుకు సంబంధించినవే అని తెలిసికొని మోహం అనే చీకటిని విడిచి భగవంతుడైన వాసుదేవునిపై చిత్తాన్ని నిలిపి, నిర్మలమైన మనస్సు కలవాడవు కమ్ము" అని బోధించగా చిత్రకేతుడు లేచి అంగిరస నారదులతో ఇలా అన్నాడు.

అయ్యా! యతిరూపాలను ధరించి గుప్తంగా వచ్చిన మీరు ఎవరు? నాబోటి అజ్ఞానులను ప్రబోధించడానికి వచ్చిన పుణ్యాత్ములా? సనత్కుమార, నారద, ఋ షభాదులా? దేవలుడు అసితుడు అను ధీరులా? వ్యాస, వసిష్ఠ, దుర్వాస, మార్కండేయ, గౌతమ, శుక, రామ, కపిలుడు మొదలైనవారా? యాజ్ఞవల్క్యుడు, సూర్యుడు, ఆరుణి, చ్యవనుడు, రోమశుడు, ఆసురి, జాతుకర్ణుడు దత్తాత్రేయుడు, మైత్రేయుడు మొదలైనవారా! భరద్వాజునిచే గుర్తింపబడిన పంచశిఖులా! పరాశరుడు మొదలైన మునులా?

నేనన్న వారిలో మీరు ఎవరు? దేవతలు, చారణులు, గంధర్వులు, సిద్దులు మొదలైన వారి సమూహంలోని వారలా? ఆలోచించిచూడగా ఎవరియందు ఇటువంటి సుజ్ఞానం మూలకారణమై ఉంటుంది?

అయ్యా! అజ్ఞానం వల్ల ఏర్పడిన పశుత్వంతో గొప్ప దుఃఖమనే చీకటిలో ఉన్న నాకు దివ్యజ్ఞానం అందజేసిన మీరు ఎవరో తెలియజెప్పండి.

అంగిరసుడు చిత్రకేతునితో ఇలా అన్నాడు. 'పుత్రుని కోరుకున్న నీకు పుత్రుని ప్రసాదించిన అంగిరసుడను నేను. ఇతడు చతుర్ముఖబ్రహ్మకుమారుడైన నారదుడు. అంతులేని పుత్రశోకంలో ఉన్న నిన్ను అనుగ్రహించి, నిజమైన జ్ఞానాన్ని ఉపదేశించడానికి వచ్చాము. నీ దుఃఖాన్ని చూచి చనిపోయిన నీ కుమారుని బ్రదికించినా, పుత్రులు గలవారు పొందే దుఃఖం నీవు అనుభవించక తప్పదు. ఈ ప్రకారంగా లోకంలో భార్యలు, ఇళ్ళు, సంపదలు, శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం మొదలైన విషయాలు, రాజ్య సంపదలు ఇవన్నీ నిశ్చలమైనవి కావు. చంచలములు మాత్రమే. అంతేకాదు, భూమి, బలం, ధనం, భటులు, మంత్రులు, స్నేహితులు మొదలైనవన్నీ దుఃఖాన్ని మోహాన్ని భయాన్ని బాధను కలిగించేవే కాని సుఖాన్ని ఇచ్చేవి కావు.

గగనంలో కనిపించే గంధర్వ నగరంలాగా కలలో కనబడే వస్తువులు కోరికలు తీర్చినట్లు ఉంటాయి కాని అవి మాయం అయిపోయేవే. మన హృదయగత భావాలు స్వప్నంలో సాక్షాత్కరించి అదృశ్యం అవుతాయి. జీవియొక్క దేహం - ద్రవ్యం, జ్ఞానం, క్రియ అనే వాటిచేత దేహికి అనేకరకాలైన దుఃఖాలను, తాపాలను కలుగజేస్తూ ఉంటుంది. కాబట్టి నీవు నిర్మలమయిన మనసుతో ఆత్మ తత్త్వాన్ని గ్రహించి సత్యపదాన్ని పొందు' అని చెప్పాడు. తరువాత నారదుడు ఇలా అన్నాడు. 'ఉపనిషత్తులలో రహస్యంగా దాగి ఉన్న నేనిచ్చే మంత్రాన్ని ఏడు రాత్రులు ఎవడు మననం చేస్తాడో వాడు సంకర్షణుడనే భగవంతుణ్ణి దర్శించగలుగుతాడు. సమస్త ప్రపంచానికీ ఆశ్రయమైన శ్రీమన్నారాయణుని పాదాలు సేవించి ఈ మోహాన్ని వదిలి వెంటనే ఉత్తమపదాన్ని పొందు. ఈ కుమారుని వలన ఇప్పుడు నీకు ప్రయోజనం లేదు చూడు అంటూ చనిపోయిన బాలకుని శరీరాన్ని చూచి 'ఓ జీవుడా! నీకు శుభం కలుగుగాక! మీ తల్లిదండ్రులను, బంధుజనులను చూచి, వీళ్ళ దుః ఖాన్ని పోగొట్టి, ఈ కళేబరంలో ప్రవేశించి, మిగిలిన నీ జీవితాన్ని అనుభవించి మీ తండ్రి ఇచ్చే సింహాసనంపై కూర్చో' అనగా ఆ బాలుడు ఇలా అన్నాడు.

ఓ మునిసత్తమా! నా పూర్వకర్మల కారణంగా ఇప్పటివరకు నేను దేవతలలో, పశుపక్ష్యాదులలో, నరులలో జన్మించి ఉంటాను. ఇప్పుడు నా ఎదురుగా ఉన్న వీరు ఏ జన్మలో నాకు తల్లిదండ్రులో తెలియజేయండి.

ఒకొక్క జన్మలో ఒక్కొక్కరు బాంధవులుగా, దాయాదులుగా, కుమారులుగా, శత్రువులుగా, మిత్రులుగా, పట్టించుకోనివారుగా, మధ్యస్థులుగా సంబంధాలు కలిగి ఉంటారు. ఇవన్నీ గమనిస్తే ప్రాణికుండే వావివరుసలు, సంబంధ బాంధవ్యాలు శాశ్వతాలా? కావు.

అమ్మకాలు, కొనుగోళ్ళు జరిగేటప్పుడు బంగారమూ, రత్నాలూ మన ఇష్టానిష్టములను బట్టి మారినట్లుగా ఈ జీవుడు అనేక దేహాలలోకి మారుతూ తిరుగుతూ ఉంటాడు. ఈ వేళ ఒక దేహంలో ఉన్న దేహి లేక ఆత్మ రేపు మరొక దేహంలోకి మారుతూ తిరుగుతూ ఉంటాడు. దేహాలు మారవచ్చునేమో గాని జీవుడు మాత్రం నశించక శాశ్వతంగా ఉంటాడు.

నారాయణుడు ఒక్కడు. అతడు నిత్యుడు. ఆద్యంతాలు లేనివాడు. జన్మాదులు లేనివాడు. సర్వంలోనూ తానుంటాడు. ఆయనలో సర్వమూ ఉంటుంది. అన్నిటికీ ఆతడే ఆశ్రయుడు. సూక్ష్మం స్థూలం తానే అయి, స్థూలానికి సూక్ష్మానికి తానే ఉదాహరణమై తన తేజస్సుతో తానే సయంప్రకాశుడై ఉంటాడు. సమస్తమూ తాను చూడగలడు. అన్నిటిపై తన ప్రభావం చూపగలడు. సమస్త విశ్వాన్ని తనలో ఇముడ్చుకోగలడు. తన మాయాగుణాలతో ఈ సమస్త ప్రపంచాన్ని ఆత్మమయంగా సృష్టి చేస్తుంటాడు. ఈ సమస్త ప్రపంచాలను జీవింపచేసే సంజీవనుడు ఆ నారాయణుడే.

ప్రపంచంలోని ప్రాణులందరి ఆత్మలలో ఉండే ఘనుడు, గుణముల సాక్షి అయిన పరమాత్మకు భార్యలు, కుమారులు, భర్తలు, మిత్రులు, శత్రువులు, బంధువులు, ప్రియులు అనే సంబంధం ఉండదు. పరమాత్మ అందరి ఆత్మలో ఉంటూ, అన్నీ సాక్షిభూతంగా చూస్తుండేవాడే తప్ప, బంధాలలో, బంధుత్వాలలో చిక్కేవాడు కాదు.


చిత్రకేతుండు తపం బాచరించి భగవత్ప్రసాదంబు నొందుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

పంచాంగం

Tuesday, March 10, 2026

The war between the Devas and Vritrasura - దేవ వృత్రాసుర సంగ్రామము

దేవ వృత్రాసుర సంగ్రామము

వృత్రాసురుడు రాక్షసవంశాన పావనుడు. లోకాలను కబళించి మింగివేయడమే తన మార్గంగా ఎన్నుకున్నవాడు; శత్రువును చంపడంగాని, జాలితో వదలివేయటంగాని మాటప్రకారం చేసి చూపేవాడు. దేవతలు అనే పాములను మింగడానికి తగిన కొండగుహవంటి నోరు గలవాడు - అంటే మింగేసేవాడు. శత్రువినాశకరుడు. అటువంటి వృత్రుడు తన విరోధిరాకను చూచి యుగాంతాన యమునివలె రాక్షసనాయకులు అనేకులు తనను వెన్నంటిరాగా, మదపుటేనుగుల మధ్య నడిచి వస్తున్న కొండవలె వృత్రుడు కోపంతో, గర్వంతో శత్రువును ఎదుర్కొన్నాడు.

రాజా! రుద్రుడు కోపంతో వడివడిగా యముని పైకి వెళ్ళినట్లు, ఆ వృత్రుడు పెద్ద అరుపుతో తూర్పు దిక్కు పిక్కటిల్లేలా ఎదురు నడిచాడు.

ఇంద్రసేనలలో రుద్రులు, మరుత్తులువంటి ఆరు దేవజాతుల గుంపులు, అగ్ని యముడువంటి దిక్పాలకులు, సిద్దులు, సాధ్యులవంటి మహాయోధులు; వృత్రుసేనలలో, నముచి, శంబరుడు, అనర్వుడు వంటి ఇరవై తొమ్మిదిమంది మహాయోధులు, దైతేయులు, యక్షులు, రాక్షసులు వంటి లెక్కలేనంతమంది యోధులు పరస్పరం తలపడి పోరాడారు. అప్పుడు

దేవదానవులకు గొప్ప యుద్ధం జరిగింది. వారు రోకళ్ళు, గదలు, కత్తులు, ఇనుపగుళ్ళు, శూలాలు, చక్రాలతో ఒకరినొకరు మోదుకొంటూ పెద్దగా బొబ్బలు పెట్టి, ఆ శబ్దాలు ఆకాశాన్ని నింపివేయగా తమను తాము పరస్పరం ఆయుధాలతో ముంచెత్తుకొన్నారు.

దేవాసురులు పరస్పరం మించిపోతూ బాణాఘాతాలతో ఆకాశాన్ని ముంచెత్తారు. అప్పుడు ఆ వినువీధిలోని బాణపరంపర ప్రళయకాలపు గొప్ప ఉల్కాపాతాన్ని(తోకచుక్కలు భూమిపై పడటాన్ని) గుర్తుకు తెస్తూ అందంగా కనిపించింది.

దేవతలు కంటికి కనిపించకుండా తమ బాణపరంపరతో ఆకాశస్థలమంతటినీ ఆక్రమించి సంధ్యాసమయాన్ని కల్పించారు. రాక్షసవీరులు దానికి బదులుగా తమ బాణాలవరుసలతో వారి బాణాలను రూపుమాపి, ఆ సాయం సమయాన్ని విశాలమైన చీకటిగా మార్చి వేశారు.

యుద్ధమదంతో కన్నుగాననివారైన దేవదానవయోధులు తమ తమ కాళ్ళు భూమిని ఒరిపిడి చేసినందువలన పైకెగసిన దుమ్మురేణువులు యుద్ధభూమినంతటినీ చీకటిగా మార్చివేయగా, మనస్సులలో క్రోధమనే నిప్పుల సెగ లెగయగా, తమ తమ కళ్ళు ఆ చీకట్లలో చికాకుపడగా, తెగని పట్టుదలతో పోరు సాగించారు.

యుద్ధభూమిలో సేనలు తమ దేహాలనుండి ఎక్కువగాకారే నెత్తురుతో కూడిన దెబ్బలతో చూపరులకు తమ తమ తనువులలో ఎగసిపడే కోపపు నిప్పుల రవ్వలు ఆ రూపంగా పైకి కనిపిస్తున్నాయా అన్నట్లు ఉన్నారు.

రాక్షసులు దేవతలు యుద్ధం చేస్తున్న ఆ సంగరరంగంలో పెద్దగా ధ్వనించే వీరుల ధనుష్ఠంకారాలు వారి సింహనాదాలను మించుతున్నాయి. అశ్వరాజాల భీషణ హేషారావాలు ఏనుగుల ఘీంకారాలను ఆక్రమిస్తున్నాయి. విశృంఖలంగా మోగుతున్న శంఖధ్వానాలు రథచక్రధ్వనులను కిందు పరుస్తున్నాయి. సంకులంగా చెలరేగిన దుందుభి నినాదాలు వీరుల వికటాట్టహాసాలను మరుగు పరుస్తున్నాయి. శస్త్రాస్త్రాల పరస్పర ఘర్షణవల్ల ఉద్భవించిన అగ్నికణాల కాంతులు వారి కిరీటాలలోని రత్నాల కాంతులను తిరస్కరిస్తున్నాయి.

ప్రళయకాలాన ఎత్తెన అలలతో, భయంకర ధ్వనులతో ఎగసిపడే మహాసముద్రాలవలె, యుగాంతాన ఝంఝా అనే గాలులతో విజ్బంభిస్తూ, నేలను కుదిపివేసే భీకర మేఘాలవలె, రెండుసేనలు కలియబడిన సమయంలో యుగాంతాన యముడు భూమిపై గల సకల ప్రాణిసమూహాన్ని కబళింపజూసే విధంగా సేనలు రెండూ పరస్పర సంహారానికి సమకట్టాయి. పదాతులు, ఆశ్వికులు, గజయోధులు, రథయోధులు - అనే నాల్గు విధాల సేనలు (రథ గజ తురగ పదాతులు) పరస్పరం భీకరరీతిలో బాణాలతో, గదలతో, కత్తులతో, ఈటెలతో, గండ్రగొళ్ళతో, రోకళ్ళతో, ఇనుప గుదియలతో, చక్రాలతో, శూలాలతో, పరస్పరం నరుకుకొంటూ, మోదుకొంటూ కాళ్ళు, చేతులు, మోకాళ్ళు, తొడలు, నడుములు, పక్కటెముకలు పరస్పరం ఖండించుకొంటూ, మెడలు కోసి, ముక్కులు త్రుంచి, ఒకరినొకరు క్రూరకర్మలతో హింసించుకొంటూ, ఎదిరిసేనల రథాలను, రథికులను, గొడుగులను, ధనుస్సులను విరిచివేస్తూ, ధనుస్సుల అల్లెత్రాళ్ళను తెంచుకొంటూ, ఎదిరిసేనల జంతుజాలాలను తునుమాడుతూ, వైరులను తుండెములుగా ఖండములుగా కకావికలు చేస్తూ ఎదుటివారి ఛత్రచామరాలను తునాతునకలు చేస్తూ, రణరంగాన్ని రక్తమాంసాలతో, కొవ్వులతో బురదమయంగా మార్చివేశారు. ఆ సమయంలో

దేవదానవుల సైన్యాలు రెండూ సమానమైన పరాక్రమం కలవి. సమానమైన యుద్ధనైపుణ్యం కలవి. సమానమైన శ
స్త్రాస్త్ర సముదాయం కలవి. అందువల్ల జయాపజయాలుకూడా సరిసమానంగానే ఉన్నాయి. దేవేంద్రుని సేనానాయకులతో తలపడి వృత్రాసురుని అండదండలు గల రాక్షససేనానాయకులు ఘోరాతి ఘోరంగా పోరాడసాగారు.

అక్కడ నెత్తురు ఏరులై పారింది. ఆ ఏరులలో భూతాలు ఉత్సాహంతో దుమికి మెడల వరకు మునిగి తెగ సంబరపడినాయి. శాకినులు నృత్యాలు చేస్తూ, ఎర్రని మాంసాలను మత్తుగా తింటూ సంతోషించాయి. డాకినులు నాట్యం చేస్తున్నట్లు పేగులతో పరస్పరం సరసాలాడుతూ, మెత్తని మెదళ్ళను ఆరగిస్తూ, చూపరులకు భీతిగొల్పుతుండగా ఆ యుద్ధం సాగింది.

ఈ విధంగా నర్మదానదీతీరంలో కృతయుగంలో ప్రారంభమైన దేవదానవుల పోరాటం త్రేతాయుగం ప్రేవేశించేవరకు భయంకరంగా సాగుతూనే ఉంది. వృత్రాసురుని బాహుబలసంపదతో పెంపొందిన రక్కసి గుంపులు తెంపుచేసి విజ్బంభీంచి దేవతలమీద పెద్ద పెద్ద వృక్షాలనూ, రాళ్ళనూ, కొండశిఖరాలనూ కురిపించగా

రాక్షసులు కొండలూ బండలూ చెట్లు తమమీద వర్షిస్తూ ఉంటే, దేవతలు కఠోరమైన బాణాలను గుంపులు గుంపులుగా ప్రయోగించి వాటిని ముక్కలు ముక్కలుగా ఖండించారు. ఈ విధంగా తమ బలప్రయోగాలన్నీ భగ్నం కాగా దానవసేనాపతులు మదోద్రేకంతో మరింత చెలరేగారు.

సురసైన్యాల మీద అసురవీరులు ఎడతెరిపి లేకుండా శరపరంపరలు కురిపించారు. ఐతే సజ్జనుల విషయంలో దుర్జనుల దూషణలు లాగా రాక్షసుల బాణాలు దేవతలను స్పృశింపలేక వృథా అయిపోయాయి.

రక్కసులు శక్తు లుడిగి, సిగ్గుమాలి, దేవతల శ
స్త్రాస్త్రాలకు తాళలేక, వెనుకటి పంతాలు మాని దేవతలు అరుస్తూ ఉండగా ఎగిరెగిరి పారిపోయారు.

కొండలవంటి పెద్ద దేహాలు గల రక్కసులు శక్తి నశించి, తమ ధనుస్సులు మొదలయిన ఆయుధాలనన్నింటినీ యుద్ధరంగంలో దిగవిడిచి, ఒకరినాకరు దాటుకుంటూ పారిపోయారు. అది చూచి దేవతలు జయజయధ్వానాలు చేశారు.

ఈ విధంగా తన బలాన్ని శంకించినట్లు యుద్ధరంగం నుండి పారిపోయే సేనానులతో పకపక నవ్వుతూ వృత్రుడు ఇలా అన్నాడు.

ఈ నీచ ప్రవృత్తి మీవంటి యోధులకు తగునా? కీర్తిని సంపదలను కలిగించే శూరునికి యుద్ధమరణం కోరినా కలుగుతుందా? ఈ విధంగా భయపడి యుద్ధధర్మం మాని తొలగిపోవడం న్యాయమా? అయినా మహామల్లయోధుడైన వృత్రుని అండను మీరు ఎరుగరా? నేనుండగా మీకు చావెక్కడిది.

జీవికి చావు నిత్యసత్యం, తప్పించుకోలేనిది. అయినపుడు లోకాన రెండు చావులు శ్రేష్ఠాలు. ఒకటి యుద్ధరంగాన పోరి చావడం, రెండు యోగమార్గాన కోరి కావలసినపుడు చావడం. ఈ రెండువిధాలుకాని చావు చావుగాదు. వ్యర్థం.

ఈ విధంగా వాసుదేవుని తేజోవిశేషంవల్ల దావాగ్ని జ్వాలలవలె వెలుగుతూ అసుర సైనికుల వెంటబడి తరుముతున్న అమరవీరులను చూసి వృత్రాసురుడు అహంకారంతో హుంకారం చేసి ఇలా అన్నాడు. "ఓరీ! మీకు నాలుగు కాలాలపాటు స్వర్గంలో సుఖంగా జీవించాలని కోరిక లేకపోతే రండి. నా ముందుకు వచ్చి నిలబడండి. నన్ను ఎదుర్కొనండి" అంటూ ఆ దానవవీరుడు కల్పాంత కాలమేఘం లాగా గంభీర కంఠస్వరంతో కఠోరంగా గర్జించాడు. ప్రళయకాల ప్రభంజనంవల్ల భగభగ మండే అగ్నికీలలను తృణీకరించే కుటిల వీక్షణాలు ప్రసరింపజేస్తూ లయకాల మహారుద్రునివలె రౌద్రాకారం ధరించి మహోద్రేకంతో బ్రహ్మాండభాండం బద్దలయ్యేటట్లు పెద్ద శబ్దం చేయగా

వృత్రుని అరుపుకు అన్ని లోకాలూ ఒక్కటయ్యాయి, సూర్యచంద్రులు అస్తమించారు. కొండలు కదలాడాయి. ఆకాశం బద్దలయింది. సముద్రాలు ఇంకిపోయాయి. నక్షత్రాలు, గ్రహాలు తమ తమ స్థానాలు తప్పిపోయాయి. దిక్కులు పగిలాయి, భూమి కుంగింది. బ్రహ్మాండం ఒక కుండవలె అల్లాడింది. బ్రహ్మదేవుడు భయపడ్డాడు.

రాజా! వృత్రాసురుని బొబ్బకు ఖేచరులు పడిపోయారు. దిక్పాలకులు ఒరిగిపోయారు. దేవతలు కిందపడిపోయారు. సర్పరాజులు తూలిపోయారు, మరుత్తులు అనే దేవగణం ఛిన్నాభిన్నమైంది. అశ్వినులు దీనులైపోయారు. రుద్రులు చేష్టలుడిగి బాధపడ్డారు. సూర్యచంద్రులు స్థానాలు తప్పారు. తమ కీళ్ళు ఊడినట్లు దేవతల సమూహాలు తమ చేతి ధనుస్సులు నేలకు విడిచి, వాటితోపాటు తామూ కిందపడి మూర్చపోయారు.

రక్కసుని ఆ కేకకు, పిడుగు పడినపుడు జీవులు కిందబడినట్లుగా దేవతలు తమ ఒడలు మరచి యుద్ధరంగాన పడి మూర్చపోయారు. అపుడు ఆ కఠినుడు తన కాలి తన్నులతో భూమండలాన్ని వణికింపజేస్తూ, వాడి శూలమొకటి చేతబూని, మదించిన రాచ ఏనుగు తామరకొలనులో ప్రవేశించి దానిని అతలాకుతలం చేసినట్లు కళ్ళు మూసికొని, కాళ్ళతో దేవతల ఆకారాలు నశించేట్లు తన్నుతూ, స్వేచ్చగా యుద్ధక్రీడ సాగించాడు. ఆ రాక్షసునిజూచి ఇంద్రుడు వజ్రశత సమానమైన గొప్ప గదను, యుగాంతాన సూర్యుని చుట్టూ కనిపించే వెలుగువలె గిరగిర తిప్పి అతనిపై వేయగా,
ఇంద్రుని గద గగనమండలం నిండా పెనుమంటలు కక్కుతూ మహావేగంతో వచ్చి దనుజేంద్రుణ్ణి  తాకింది. వృత్రాసురుడు ఆ గదాదండాన్ని ఎడమచేతితో అవలీలగా పట్టుకొని ఇంద్రుని వాహనమైన ఐరావతం కుంభస్థలం మీద గట్టిగా ఒక్క పెట్టు పెట్టాడు.

రక్కసుని కఠోర ఘాతానికి, ఆ ఐరావతం గిర గిర తిరిగి, నెత్తురులు కారగా, తల పగిలి ఓటమిని ఒప్పుకున్నట్లుగా ఎగురుకుంటూ పరుగుపెట్టింది.

రక్కసుని దెబ్బతో పారిపోతున్న ఐరావతాన్ని ఇంద్రుడు తన అంకుశంతో అదిలించి నిలిపి, అమృతరసాన్ని ఆస్వాదించే తన చల్లని హస్తంతో మెల్లగా నిమిరాడు.

ఈ విధంగా ఐరావతాన్ని ఓదారుస్తూ తన ఎదుట నిలబడి ఉన్న ఇంద్రుణ్ణి చూసి, తన సహోదరుణ్ణి చంపిన తెగువను స్మరించి, మోహం శోకం రెండూ ఏకకాలాన కలగడంతో తారుమారై, తబ్బిబ్బుతో నవ్వుతూ, తాను యుద్ధం కోసమే వచ్చినట్లు తేటపరుస్తూ వృత్రుడిలా అన్నాడు.

నీకు సద్గురువు, నాకు అన్న, దీనులకు ప్రాపు, అయిన అందరికీ మేలుకూర్చే చల్లనిచూపు గలవాణ్ణి; పాపబుద్ధితో, పేరాసతో చంపావు. ఇపుడు ఇక్కడ లోకులందరూ చూచినవ్వగా, నా భుజబలానికి చిక్కి ఉన్నావు. నిన్ను ఈ శూలంతో దడదడ కొట్టుకొంటున్న నిన్ను గుచ్చి కడదేర్చి, నేను మా అన్నగారి ఋణం తీర్చుకొని ఆనందిస్తాను.

లోకాన ఎంత నీచుడైనా తన బతుకుకోసం, తనకు బంధువు, గురువు మీదు మిక్కిలి పుణ్యమూర్తి, బ్రహ్మవంశాన పుట్టినవాడూ అయినవానిని పశువును చంపినట్లు నీవలె చంపగలడా?

ఓరీ! ఇంద్రా! దయాదాక్షిణ్యాలు కోల్పోయి, సత్యాన్ని పరిత్యజించి, ధర్మాన్ని విడిచి, కీర్తిని పోగొట్టుకొని, సిరిసంపదలను దూరం చేసుకొని పౌరుషాన్ని పారదోలి, పదిమందీ చీవాట్లు పెట్టే పాడు పని చేశావు. ఇటువంటి నీచుడవయిన నీ చావుకు సజ్జనులైన వారెవ్వరూ బాధపడరు. నిర్భాగ్యుడవైన నీ మృతకళేబరాన్ని నక్కలు కూడా ముట్టుకోవు. రాబందులు, గద్దలు సైతం అంటుకోవు.

నిజమైన పాపాలతో నా పాలబడినావు. నిన్నిపుడు నా ఈ వాడి శూలపు మొనకు గుచ్చి చంపి, నీ మాంసాన్ని నక్కలు, కుక్కలు తినేటట్లు చేస్తాను.

నీకు దిక్కున్నవా డెవడైనా ఉంటే ఇక్కడికి రమ్మను. దుర్వారమైన గర్వోద్రేకంతో కదనరంగంలో దూకి నా పదునైన శూలం అంచున భగ భగమండే అగ్విజ్వాలలో సోమయాజి మేకలను వేల్చినట్లు నిన్ను వేల్చి పిశాచాల కన్నింటికీ తృప్తిగా విందు చెస్తాను.

ఒకవేళ ఎదుర నిల్చి వాడిగల వజ్రాయుధంతో నీవే నన్ను నిర్జింప గలిగినట్లయితే ఈ పంచభూతాలలో కలిసిపోయి రణవీరుల పవిత్ర పాద పద్మపరాగంలో భాగం సంపాదించుకొని కృతార్థుణ్ణి అవుతాను.

ఇంద్రా! సందేహించక భయంకరమైన నీ చేతిలోని వజ్రాయుధాన్ని నామీద ప్రయోగించు. లోభి దానానికి ఆలసించినట్లుగా కాలయాపన చేయకు. ఆ ఆయుధం వ్యర్థంగాదు. కారణం - దానికి విష్ణుతేజస్సు, దధీచి దానవీర్యం తోడై, ప్రాభవాతిశయంతో ప్రాకాశిస్తున్నది. కాబట్టి విష్ణువు ఆదేశాన్ని పాటించి శత్రువులను నశింపజేసి, గెలుపొందుము. విష్ణువు ఎక్కడుంటే అక్కడ విజయమూ, సౌభాగ్యమూ స్వయంగా వచ్చి వరిస్తాయి. కాబట్టి నన్ను కడతేరిస్తే, నేను ఆ సర్వేశ్వరుని పాదాలమీద మనస్సును లగ్నం చేస్తాను.

"ఇప్పుడు నీ వజ్రాయుధం వేటుకు నా సంసార బంధాలన్నీ తెగిపోతాయి. పాంచభౌతికమైన ఈ శరీరాన్ని పరిత్యజించి సర్వేశ్వరుని సన్నిధికి చేరుకుంటాను. నేను నారాయణ భక్తపరాయణుడను. నాకు స్వర్గ మర్త్య పాతాళ లోకాలలో గల భోగభాగ్యాలు ఏవీ రుచించవు. ధర్మార్థ కామాల జంజాటాలు ఏమాత్రం లేని మహైశ్వర్యాన్ని ప్రసాదించే భగవంతుని అనుగ్రహం అనుపమానమైంది. అన్యులకు అగోచరమైంది. నేను ఆ దేవాదిదేవుని పాదాలు సేవించే దాసులకు దాసాను దాసుడను" అని వృత్రాసురుడు పరమేశ్వరుణ్ణి గురించి

స్వామీ! నా హృదయం భక్తులను పరిపాలించే భవదీయ సద్గుణ సముదాయాన్ని సర్వదా సంస్మరణం చేయాలి. నా వాక్కు నిన్నే ఎల్లప్పుడూ సన్నుతించాలి. నా శరీరం నిత్యమూ నీకు సేవ చేయాలి. ఇదే నా కోరిక. ఇంతకుమించి నేను ధ్రువలోకాన్ని గాని, ఇంద్రభోగాన్ని గాని, బ్రహ్మపదాన్ని గాని ఆశించను.

శ్రీహరీ! దూడలు ఆకలితో తల్లి ఆవులకై వేచినట్లు, ఈకలురాని పిట్టలు తల్లి పక్షులకై ఎదురు చూచినట్లు, మదన బాధ కలిగిన ఒక యువతి దేశం విడిచి వెళ్ళిన మగనికోసం నిరీక్షించినట్లు, నా మనస్సు నిన్ను చేరడానికి తహతహలాడుతున్నది.

శ్రీహరీ! నాకు స్నేహం సజ్జనులతో, సత్కీర్తిమంతులతో మాత్రమే కలిగించు. అంతేగాని జ్ఞానహీనులతోనూ, నిరంతరం సంసారమే జీవిత పరమావధిగా ప్రవర్తించే వారితోనూ ఏర్పడకుండా చూడు.

అనంత కల్యాణగుణుడు, సర్వాంతర్యామి అయిన శ్రీహరిపై వృత్రాసురుడు తన మనస్సును లగ్నం చేశాడు. సంతోషంతో శరీరమంతా పొంగిపోగా మరణాన్ని రణవిజయాన్ని సమానంగా భావించాడు. సంతోషంతో చూపరులకు భయం కలిగిస్తూ, పొగరుతో తనకు ఎదురులేనివాడై, తన బరువు భరించలేక నేల వణకగా, దిక్కులు అదిరిపడగా, యుద్దొత్సాహం అతిశయించగా, ప్రళయకాలపు అగ్నివలె రగులుతూ ఇంద్రునిపై కురికాడు.

సృష్టికి ముందు అనంతమైన జలరాశిపై కైటభుడనే రాక్షసుడు విష్ణువుపై పోరాటానికి దుమికినట్లుగా, హుంకరిస్తూ వృత్రుడు రోషావేశంతో శూలపాణియై ఇంద్రుని మీదికి కుప్పించి దూకాడు.

వృత్రుడు ప్రళయాగ్నివలె జ్వాలలు ఎగసిపడే తన శూలాన్ని తిప్పుతూ, 'ఓ నీచుడా! దీనితో చావు' అంటూ ఇంద్రుని పైకి విసరివేయగా, అది ఆకాశాన కోటి సూర్యుల కాంతితో తనపైకి రావడం చూచిన ఇంద్రుడు వెంటనే దాన్ని తన వజ్రాయుధంతో ఆశ్చర్యకరంగా ఖండించాడు. అది చూచి దేవతలు ఆనందంతో పొంగిపోయారు.

ఆ సమయాన ఇంద్రుడు శూలాన్ని తుంచివేయడంతో ఆగక, వెంటనే వృత్రుని ఎదుర్కొని, అతని భుజాన్ని ఖండించాడు. రాక్షసుడు కోపించి ఒంటి చేతితోనే ఇనుపగుదియను తీసికొని ఇంద్రునిపై పడి అతని దౌడలు పగులగొట్టాడు.

వృత్రుడు ఇనుపగుదియను తిప్పుతూ ప్రళయకాలాన కలిగే కాంతివలయంవలె రోషంతో జ్వలిస్తూ ఆ పరిఘతో, ఐరావతం తలను పగులగొట్టి, ఇంద్రుని దౌడలను ముష్టి ఘాతాలతో నొప్పించగా

వృత్రుని దెబ్బతో ఐరావతం శక్తి నశించి గుండ్రంగా తిరుగుతూ పెద్దగా ఘీంకారం చేస్తూ ఉండటం చూచిన ఇంద్రుడు తానూ విభ్రాంతుడై, తన చేతనున్న వజ్రాయుధాన్ని నేలపై వదలివేశాడు. ఈ దృశ్యం చూచిన లోకాలు రాక్షసుని పరాక్రమానికి గజిబిజిగా భీతిల్లాయి.

గరుత్మంతుణ్ణి చేజిక్కిన పామువలె, వృత్రాసురుని పరాక్రమానికి లోబడిన ఇంద్రుని దురవస్థ చూచిన లోకాలు అయ్యో! అంటూ దుఃఖించాయి.

ఐరావతం అసురుని దెబ్బతో పెద్దగా బొబ్బలు పెడుతూ గిరగిర తిరిగింది. దీనుడై తాను చేతి ఆయుధాన్ని రణరంగాన జారవిడిచాడు - అంటే, నిరాయుధుడై నిలిచాడు. ఆ సమయంలో సామాన్య విరోధి ఎవడైనా మీదబడి కడతేరుస్తాడు. కాని వృత్రుడు యుద్ధధర్మం పాటించి మిన్నకున్నాడు. ఇది చూచిన ఇంద్రుడు సిగ్గుతో తల వంచుకొన్నాడు.

రణరంగంలో శుత్రువు ముందు తనచేతినుండి జారిపడిన వజ్రాయుధాన్ని తిరిగి తీసికోకుండా ఆశ్చర్యంతో నిశ్చేష్టుడై ఉన్న ఇంద్రునితో వృత్రాసురుడు ఇలా అన్నాడు.

ఇంద్రా! యుద్దాన ఆయుధం వదలినవారిని, శరణుజొచ్చినవారిని చంపము. అంతగా ఎందుకు భయపడతావు? వజ్రాయుధం తీసుకో. నిరాయుధుడవైన నిన్ను నేను తాకను.

ఇంద్రా! ఈ విధంగా భయపడటానికి ఇది వేళగాదు. వజ్రాయుధంచేత బూని విరోధిని గెలువు. ఎక్కడైనా అన్నింటికీ ఏలికైన విష్ణువును గాదని, ఈ మరణశీలురైనవారికి గెలుపులు కలుగునా? జ్ఞానదృష్టితో పరికించు. ఈ లోకపాలకులందరూ ఎవనికి వశమై తమ తమ విధులను నిర్వర్తిస్తున్నారో చూడు. తెలివిమాలి, విష్ణుని లీలలను గ్రహించక, ఈ మరణించే సేనలవలన గలిగే జయం తమ దనుకొంటున్నారు.

దేవేంద్రా! యంత్రనిర్మితమైన జంతువుల వలె, కొయ్యతో కూర్చబడిన యువతివలె ఈ ప్రపంచంలోని ప్రాణులందరూ మహావిష్ణువు మాయాతంత్రంవల్ల కదులుతున్న జంత్రపు బొమ్మలని తెలుసుకో.

సృష్టిలోని పంచభూతాలకు - పృథివి - మట్టి, అప్‌ - నీరు, తేజస్‌ - కాంతి, వాయు - గాలి, ఆకాశ - ఆకసం ఈ ఐదింటికి, పంచ - ఇంద్రియాలకు - కన్ను ముక్కు చెవి నాలుక చర్మాలకు బానిసై నరుడు దేవుని దయకు దూరంగా, ప్రకృతికి దగ్గరగా బ్రతుకుతూ, అజ్ఞానిగా, తనను తాను స్వతంత్రునిగా భావించుకొంటూ ప్రకృతి సుఖాలను అనుభవిస్తుంటాడు. జీవులనుండి జీవులుపుట్టి, మళ్ళీ వాటితోడనే నశిస్తుంటాయి. ఇది ప్రకృతి లక్షణం. జీవుడు తనకు సంక్రమించిన పుణ్యాన్ననుసరించి కీర్తిని, సుఖాన్ని సంపదను పొందినవాడై, అది తీరిన తరువాత, ఎంత ఆరాటపడినా మరలవాటిని పొందలేడు. చావుబ్రతుకులు, మంచిచెడులు, సుఖదుఃఖాలు, గెలుపు ఓటములు సమానంగా జీవికి ప్రాప్తిస్తాయి. పరిశీలిస్తే ఈ ద్వంద్వాలు - సుఖదుఃఖాదులు, వాటికి కర్త, భోక్త సర్వమూ ఆ నారాయణుడే. ఇతరమేదీ లేదు. ఇప్పుడు నేను ఒకే చేయి కలిగి ఆయుధహీనునిగా ఉన్నా నిన్ను చంపగలిగి ఉన్నాను చూడు అంటూ వృత్రుడు మరల ఇంకా ఇలా అన్నాడు.

ఈ యుద్ధం ఒక జూదం. దీనిలో వాహనాలైన ఏనుగులు, గుర్రాలు, రథాలు జూదపుగళ్ళు; బాణాలే పాచికలు. ప్రాణాలే పందెములు, ఈ ఆటలో గెలుపు ఓటమి ఎవరిదో తెలియదు.

వృత్రుని మాటలు విన్న దేవేంద్రుడు ఆశ్చర్యపడ్డాడు. శత్రువులోని గొప్పతనానికి, తన మనస్సులో చెడు తలపు మాని, శత్రువును తన పాలిట దేవుడుగా భావించి, తాను జారవిడిచిన ఆయుధాన్ని తిరిగి చేతపట్టినాడు. ఆ సమయంలో లోకాలన్నీ దేవతలసమూహంతోపాటుగా సంతోషించాయి.

వజ్రాయుధం ధరించిన దేవేంద్రుడు గ్రహణానంతరం రాహుగ్రహం ముఖంనుండి వెలువడి కిరణ సముదాయంతో ప్రకాశించే సూర్యవింబంలాగా విరాజిల్లాడు.

ఇంద్రుడు కిందబడ్డ ఆ ఆయుధాన్ని తిరిగి చేతబట్టి, దాని కాంతి వలయాలతో దిక్కులన్నీ వెలుగులు చిమ్ముతుండగా, ఆశ్చర్యంతో కూడిన చిరునవ్వు చిందే పద్మంవంటి ముఖంతో పరికిస్తూ వృత్రునితో ఇలా అన్నాడు.

రాక్షస రాజా! నీ బుద్ది ఉపనిషత్సారాన్ని నిండుగా గ్రహించి, తత్త్వజ్ఞాన వికాసంతో ఒప్పారుతున్నది. నీవు పురాణ పురుషుడు, కమలాక్షుడు అయిన విష్ణుదేవునకు గొప్ప భక్తుడవు.

లోకాలలో విష్ణమాయచేసే లీలలన్నీ నీ వెరుగుదువు. అది జగత్తులతో నిండిపోయి, తనలోనే జగాలను నింపుకొని, జీవులకు కష్టసుఖాలు, సరాగవిరాగాలు కల్పిస్తూ క్రీడించే తీరును నీ సూక్ష్మబుద్ధితో గ్రహించావు. మరి ఇపుడు ఈ రాక్షసపు తీరు తెన్నులెందుకు? రాక్షసరూపాన్ని వదలి పరమపవిత్రమైన నారాయణుని స్వరూపాన్ని సంతోషంగా ధరించు.

ఏ దీక్షను, ఏ గొప్ప తపస్సును చేశావో! రజోగుణంతో నిండిన, ద్వేషరోషాలకు నెలవైన నీ బుద్ధిలో అద్భుతంగా విష్ణుభక్తి కలిగింది. అది మనస్సులను - వాటి ప్రవృత్తులను నిగ్రహించి నిలిచిన వారికిగాని కలుగనిది. అట్టి మహానుభావుల మనస్సులు అనే కొలనులలో నారాయణుడు రాజహంసయై విహరిస్తుంటాడు. విష్ణువు ప్రశాంతచిత్తులలో నివసిస్తాడు.

మహాత్మా! విష్ణువుయొక్కరూపం అనే అమృత సముద్రంలో విహరించే భక్తుడు గుంటలలోని నీళ్లతో తృప్తిపడగలడా?

ఈ విధంగా తనను పొగడుతున్న ఇంద్రుణ్ణి చూచి వృత్రుడు యుద్ధసంఘర్షణను కోరినవాడై, శత్రువును ప్రేరేపిస్తూ, తన ఎడమచేతితో ఇనుప గుదియను తిప్పుతూ, క్రోధంతో ఎగసిపడుతూ, బ్రహ్మాండభాండాన్ని ఘోరశబ్దాలతో పగులగొడుతూ, బలిసిన మదపుటేనుగు ఎద్దుపైకి ఉరికినట్లు ఇంద్రునిపైకి ఎగసి, అతడి వక్షఃస్థలాన్ని గురిచూచి మోదగా, ఇంద్రుడు తన వజ్రాయుధంతో దాన్ని మసిజేసి, వెంటనే వృత్రుని ఎడమచేతిని కూడా నరికాడు. ఇలా రెండు చేతులూ పోయి, నెత్తురులొలుకుతూ వృత్రుడు పూర్వకాలాన ఇంద్రుడు రెక్కలు నరకగా జారిపడుతున్న కొండవలె, లయకాలపు చూడరాని భయంకర భ్రుకుటితో, తన రెండు దౌడలను పైదవడతో ఆకాశాన్ని కిందిదానితో భూమిని అదిమిపట్టి, తన తుదిమొదలు కానరానీయక, వికారంగా నోరుదెరచి, మందరపర్వతంతో దేవదానవులు సముద్రమథనం చేసినపుడు వెలువడిన భీకర విషజ్వాలవంటి నాలుకతో ఆకాశాన్ని నాకుతూ, యుగాంతపు యమునిచేతి దండాల వంటి కోరలతో ముల్లోకాలను మింగబోయేవానివలె మహాకాయుడై, కొండలను అటూ ఇటూ త్రిప్పుతూ, నడిచే కొండలాగా నేలనూ నింగినీ ఆక్రమించాడు. ఆ సమయంలో

ప్రళయకాలంలో మృత్యుదేవత ముఖంనుండి వెలువడినట్లు, తన నోటినుండి అగ్నిజ్వాలలు వెలువడుతుండగా, దేవసమూహం భయంతో వణుకుతుండగా, లోకాలన్నీ 'ఆహా' అంటూ అరుస్తుండగా ఐరావతాన్ని ఆయుధంతో చుట్టివేసి, పట్టుకొని ఇంద్రుణ్ణి మహా ఆశ్చర్యకరంగా మింగివేశాడు వృత్రుడు.

అపుడు లోకాలన్నీ చీకాకుపడ్డాయి. చీకటి ముసిరింది. ఆకాశంనుండి చుక్కల గుంపులు నేలరాలిపడ్డాయి. చిరుజల్లు కురిసింది. సూర్య చంద్ర అగ్నుల కాంతులు నశించాయి. దిక్కులు తబ్బిబ్బుపడ్డాయి.

వృత్రుడు మింగినా ఇంద్రుడు అతడి కడుపులో చెక్కుచెదరకుందా, నిబ్బరంగా ఉన్నాడు. ఎందుకంటే, అతనిని శ్రీహరి రక్షిస్తూ ఉన్నాడు. ఇంద్రుడు గూడ జయాన్ని ఆనందాన్ని అందించే వైష్ణవీ విద్యను మనస్సులో నిలిపి, కందకుండా, భయపడకుండా, వణకకుండా, తత్తరపడకుండా, ఏ విశేషాన్నీ చెప్పకుండా నిశ్చలంగా ఉన్నాడు.

ఈ విధంగా శ్రీహరి కృపనే కవచంగా ధరించినవాడై ఇంద్రుడు, వృత్రుని పొట్టను వజ్రాయుధంతో చీల్చి, ఐరావతంతో కూడా బయటపడి, శత్రువు మెడను నరకడానికి వజ్రాన్ని ప్రయోగిస్తే అది అతివేగంతో తిరుగుతూ సంవత్సరపు సంధికాలాన, సూర్యాది గ్రహనక్షత్రాలు, దక్షిణాయనం - ఉత్తరాయణం అంటూ తిరిగే కాలానికి మధ్యలో, పగటికి చీకటికి నడుమ, వృత్రుని చేరి అతని తలను పెద్ద కొండనువలె త్రుంచి నేలగూల్చింది. అప్పుడు,

ఆ సమయంలో ఆకాశంలో దేవదుందుభులు మ్రోగాయి. గంధర్వులూ, దేవతలూ, సాధ్యులూ, సిద్దులూ, మునీంద్రులూ మిక్కిలి ఆనందించి వృత్రసంహారం చేసిన ఇంద్రుడి తేజో వైభవాన్ని ప్రకాశింపజేసే ప్రశస్తతర మంత్రాలు పఠిస్తూ పూలవానలు కురిపించారు. వృత్రుని తలతెగిన పిదప అతని శరీరం నుండి దివ్యకాంతి ఒకటి బయల్వెడలి, లోకులలెల్లరూ చూస్తుండగా అంతవరకు చూడని లోకమైన విష్ణులోకానికి చేరి విష్ణువులో లీనమైంది.

ఇలా వృత్రుని చావుతో ఎల్లలోకాలూ కష్టాలుపోయి శాంతించాయి. దేవతలు, ఋషులు, పితృదేవతలు, రాక్షసగణంతో కలిసి, ఇంద్రునకు చెప్పకుండా తమ తమ నెలవులకు వెళ్ళారు. అని శుకుడు పరీక్షిత్తునకు చెప్పగా ఆయన శుకునితో ఇలా అన్నాడు.

సురలు ఇంద్రునితో చెప్పకుండా వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి? అలాంటప్పుడు వారు ఎలా సుఖశాంతులు పొందారు? ఇంతకూ, ఇంద్రునికి కీడు ఎలా జరిగింది? చెప్పవయ్యా శుకయోగీ!

పరీక్షిన్మహారాజుతో శుకుడిలా అన్నాడు- వృత్రుని శక్తికి భీతిల్లిన దేవతలు, ఋషులు పూర్వం వృత్రుని చంపమని ఇంద్రుని వేడగా, అతడు బ్రాహ్మణహత్య చేయలేక, "ముందుగూడ విశ్వరూపుణ్ణి చంపినపాపాన్ని భరించలేక, దాన్ని స్త్రీలకు కొంత, నేలకుకొంత, నీటికికొంత, చెట్లకుకొంత అప్పగించాను. ఇపుడు మళ్లీ మరొక బ్రహ్మహత్యచేస్తే, దాని పాపఫలితాన్ని ఎట్లా తొలగించుకోవాలి" అన్నాడు. అపుడు దేవమునివర్గం ఈ పాపాన్ని అశ్వమేధయాగం చేయించి, యాగపురుషుడైన విష్ణువును మెప్పించి, నిన్ను పాపవిముక్తుని చేయగలం. సహజంగానే బ్రాహ్మణులను, తండ్రులను, ఆవులను, తల్లులను చంపినవారే అయినా, శ్రీహరిని సేవించి పాపవిముక్తులవుతారు. అశ్వమేధయాగ నిర్వహణతో శ్రీహరిని సేవిస్తే వృత్రుని చంపినందువల్ల కలిగిన పాపం నిన్ను ఏమిచేస్తుంది అని ఇంద్రుణ్జి అంగీకరింపజేశారు. ఇంద్రుడు అంగీకరించి వృత్రుణ్ణి వధించి, దానివలన పాపం పొంది, ఆ పాపాన్ని భరించలేని దుర్దశను పొందాడు.

బ్రహ్మహత్య భయంకరాకారంతో దేవేంద్రుణ్ణి వెంబడించింది. ఆ మహాపాపం చండాలరూపం ధరించి ముసలితనంతో ఒడలంతా ముడతలుపడి గడగడ వణుకుతూ నడచి వస్తున్నది. క్షయరోగంతో కుష్టరోగంతో దాని శరీరమంతా నెత్తురు చిమ్ముతున్నది. నెరసిన జుట్టు విరబోసుకొని 'ఆగు ఆగు!', 'పోకు పోకు!', 'ఉండు ఉండు!' అంటూ వెంటాడసాగింది. దేహమంతా దుర్గంధంతో వాంతి వచ్చి పేగులు తరుక్కుపోయే కంపుకొడుతున్నది. ఇంద్రుడు ఏ పక్కకుపోతే ఆ పక్కకూ పరుగెత్తుతూ వెంటబడి తరుముతున్నది. 'ఇదిగో! నాకు లోబడకుండా నన్ను అనుభవించకుండా ఎక్కడికి పోతావో ఎట్లా పోతావో చూస్తాగా. నీవెంత!' అంటూ అరుస్తున్నది. వెంట పరుగిడుతూ వస్తున్న బ్రహ్మహత్యను తిరిగి తిరిగి చూస్తూ భయంతో సిగ్గుతో దేవేంద్రుడు పారిపోసాగాడు.

బ్రహ్మహత్యాపాపం చండాల రూపంతో తనను వెంటాడి తరుమగా, ఇంద్రుడు దిక్కుతోచక, నింగిని నేలను అంతటను తిరిగి తిరిగి, నిట్టూర్పులతో పరుగెత్తి ఈశాన్యదిక్కుకు చేరాడు. అది ఈశ్వర రక్షితం గాబట్టి, ఆ చోటికి ఈ పాపరూపచండాల చేరలేకపోయింది. ఇంద్రుడు దాక్కోవడానికి చోటు వెతుక్కుంటూ, మానస సరోవరంలో ప్రవేశించి అందులో ఒక తామర తూడులోని దారమై శ్రీహరిధ్యానంలో వేయేళ్ళు గడిపాడు. ఆ సమయంలో స్వర్గాన్ని నహుష మహారాజు తన విద్య, తపస్సు, యోగాల బలంతో పాలిస్తూ, పొగరు తలకెక్కి శచీదేవిని తాను ఇంద్రస్థానాన ఉన్నాడు గాబట్టి తనకు భార్య కావాలని ఆశించాడు. బృహస్పతి సూచనతో బ్రహ్మర్షిగణం తన పల్లకిని మోస్తుండగా నహుషుడు శచిని జేరబోతుండగా అగస్త్య శాపగ్రస్తుడై కొండచిలువగా పుట్టాడు. అప్పుడు బ్రహ్మఋషుల పిలుపు మేరకు ఇంద్రుడు స్వర్గానికి మరలివచ్చాడు. శ్రీహరిస్మరణ, శివకృప కారణంగా ఆ పాపంనుండి విముక్తుడై, అశ్వమేధ యాగానికి దీక్ష తీసికొన్నాడు. దేవతలు, మహర్షులు పొగడగా తిరిగి తన ముల్లోకాల రాజరికాన్ని గైకొని భోగభాగ్యాలతో విలసిల్లాడు.

ఈ ప్రకారంగా దేవేంద్రుడు మరీచి మొదలైన మహామునుల సహాయంతో యథావిధిగా అశ్వమేధయాగం చేసి యజ్ఞేశ్వరుడూ జగదీశ్వరుడూ పరమేశ్వరుడూ అయిన శ్రీహరిని సేవించి బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకొని పరిశుద్దుడై ప్రకాశించాడు.

శ్రీమన్నారాయణుడు పునర్జన్మకు కారణాలైన క్రూరకృత్యాలనే సముద్రాన్ని తాగివేసే అగస్త్యమహర్షి వంటివాడు. మహాపాతకాలనే అరణ్యాలను భస్మంచేసే అగ్నిహోత్రునివంటివాడు. భక్తజనుల కల్మషాలనే కాలకూటాన్ని అలవోకగా కబళించే పరమశివునివంటివాడు. అంతులేని కలుషరాసులనే కటికచీకట్లను పటాపంచలు చేయటంలో ప్రభాకరునివంటివాడు. ఆ నారాయణదేవుని నామసంకీర్తనం సమస్తమైన మోక్షసామ్రాజ్యాన్ని సంపాదించి పెట్టి సకల భోగభాగ్యాలను సమకూరుస్తుంది.

పాపరహితుడవైన ఓ పరీక్షిన్మహారాజా! ఈ పురాణకథ ప్రభావమిది. ఎల్లబాధలనూ హరిస్తుంది; అన్ని ప్రయోజనాలనూ సంతోషంగా నెరవేరుస్తుంది; నిర్మలమైన భక్తి ప్రభావాతిశయాన్ని చూపిస్తుంది; సాటిలేని భక్తులను గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగిస్తుంది; పండితులకు అనేక విజయాలను సమకూరుస్తుంది; వృత్రుడు మింగగా ఇంద్రుడు విడుదల అయిన తీరుతెన్నులు వివరిస్తుంది; బ్రహ్మహత్య వలని కష్టనష్టాలను విశదీకరిస్తుంది; సత్పురుషులకు సర్వదా కాంక్షింపదగినది. అలాంటి ఈ పురాణకథను విన్నా ప్రతిదినం చదివినా, వ్రాసినా, అట్టివారికి ఆయుస్సు, ఆరోగ్యం, గెలుపు, సంపదలు పెరుగుతాయి, దుష్కర్మలు తొలగిపోతాయి. తుదకు ముక్తి లభిస్తుంది.

వృత్రాసురుని వృత్తాంతం అంతా విన్న అనంతరం పరీక్షిత్తు శుకమహర్షితో ఇలా అన్నాడు. యోగీంద్రా! వృత్రుని వృత్తాంతం విన్నది మొదలు నా హృదయం ఆశ్చర్యంతో కళవళపడుతున్నది. ఏమంటే వృత్రుడు రజోగుణమూ తమోగుణమూ ప్రధానంగా ప్రవర్తించేవాడు. దుష్టస్వభావుడు. అటువంటి వానికి నారాయణుని పాదపద్మాలపై భక్తి ఎలా సంభవించింది? సత్వగుణ సంపన్నులు, సమబుద్దులు, తపోనిష్ఠులు, నిర్మల స్వభావులు, ధర్మమూర్తులు ఐన మహానుభావులకు, దేవతలకు, మహర్షులకు సైతం అలభ్యమై మోక్షానికి మూలకారణమైన భగవద్భక్తి పరమరాక్షసుడైన వీనికి ఎలా పట్టుబడింది?

ఈ భూతలంపై ఎన్ని రేణువులున్నాయో లెక్కింపలేము. అలాగే ఈ భూమిపై లెక్కలేనన్ని జీవసమూహాలు ఉన్నాయి. ఇన్ని జీవకోట్లలో ధర్మమార్గంలో వసించేవారు మానవులు. ఈ మనుష్య సమూహంలో కోరికలను విడిచిపెట్టి మోక్షాన్ని కోరేవారు తక్కువ. ఈ మోక్షం ఆత్మమూలం అని గ్రహించే ముక్తులైన వారు దొరకరు. ఆలోచించి చూస్తే ప్రశాంతపరుడు, పరమసుజ్ఞాని, భద్రగుణుడు, ప్రేమతో వాసుదేవ పరాయణుడు అయిన ముక్తుడు అరుదుగా కనిపిస్తాడు.

సకలలోక కంటకుడూ, దుస్సాంగత్యం కలవాడూ అయిన వృత్రాసురుడికి ఇంతటి దివ్యమైన జ్ఞానం ఎలా కలిగింది? రణరంగంలో ధర్మయుక్తమైన పౌరుషంతో దేవేంద్రుణ్ణి ఎలా మెప్పించగలిగాడు? ఈ విషయమంతా నాకు వివరించి చెప్పు.


చిత్రకేతూపాఖ్యానము

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

పంచాంగం

The Story of Vritrasura - వృత్రాసుర వృత్తాంతము

వృత్రాసుర వృత్తాంతము

విశ్వరూపుడు చనిపోయేసరికి అతని తండ్రియైన త్వష్టకు దుఃఖం కలిగింది. ఆ దుఃఖంవల్ల కలిగిన తీవ్రకోపంతో ఆయన మండిపడిపోయాడు. ఇంద్రుణ్ణి చంపడం కోసం ఒక మారణ క్రతువు చేశాడు. ఆ హోమాగ్ని నుండి ఒకడు పుట్టాడు. అతని చూపులు కల్పాంతాగ్ని జ్వాలల్లా ఉన్నాయి. ఆ చూపులతో ముల్లోకాలు క్షోభించిపోయాయి.

(కల్పమంటే బ్రహ్మాదేవుడి కొక పగలు, మానవలోకం లెక్కలను అనుసరించి నాల్గు యుగాలూ వేయి మారులు తిరిగితే అది బ్రహ్మ కొకపగలు. ఆ పగటి చివర ప్రళయం. క్రతువంటే యాగం. ఆయా దేవతల నుద్దేశించి ద్రవ్యత్యాగం. హోమమంటే ఆ ద్రవ్యాలను అగ్నిలో సమర్పించటం.)

ప్రళయకాలంలో జగాలను సంహరించే రుద్రునికంటె అధికమైన ఒడ్డూ పొడుగూ కలవాడవుతూ, నానాటికీ శరీరం బాణపు వేటంతగా పెరుగుతూ, కాలినపర్వతంలా ఉన్న శరీరం సంధ్యాకాలంలోని ఎరుపురంగుతో ఉండగా పుట్టం పెట్టిన రాగిరంగుతో మెరుస్తున్న మీసాలు జుట్టు కొసలు కలిగి మధ్యాహ్నపు సూర్యబింబంలా ఉన్న కన్నుల కొసలతో దిక్కులను వణికిస్తూ, వజ్రాయుధంలా మెరిసే కోరలతో ప్రకాశించే గుహవంటి ముఖంతో

నింగినీ నేలనూ తాకే అంతగా ఎత్తుగా ఉన్నాడు. అతని శిరస్సుపై వ్యాపించిన మంటలవలలో నింగి నున్న గ్రహాలు జారిపడిపోతున్నాయి. శరీరానికి తగలకుండగానే భయం కల్గించేది పదునైనదీ, దిటవైనదీ, సూర్యబింబంలా తీక్ష్ణంగా ఉన్నదీ అయిన శూలాన్ని అనాయాసంగా చేతితో పట్టుకొని మహానందంతో నేలవణికేలా పరవశించి గంతులు వేస్తూ

వృత్రాసురుడు నిరంతరంగా నోరు తెరిచి ఆకాశాన్నిచరుస్తున్నాడు. నాలుక చాపి గ్రహాలను నక్షత్రాలను నాకుతున్నాడు. పెద్దనవ్వులు నవ్వుతూ లోకాలను మింగడానికి ప్రయత్నిస్తున్నాడు. తన భయంకరమయిన కోరలు తిప్పుతూ దిగ్గజాల దంతాలను ముక్కలు చేస్తున్నాడు. త్వష్ట తపోబలంచేత బలం సంపాదించి వృత్రాసురుడు అఖిలలోకాలనూ ఆక్రమించి, ఎవ్వరికీ లొంగకుండా విజృంభిస్తున్నాడు.

దేవతలు ఆ వృత్రుని మీదకు పెద్ద పెద్ద సేనలతో పోయి గొప్ప అస్త్రాలను ప్రయోగించారు. ఆ అస్త్రాలను అన్నింటినీ పట్టుకొని వృత్రుడు మింగివెేసి శౌర్యంతో ఉత్సాహంతో కేకలు పెట్టాడు.

వృత్రాసురుడు దేవతలు ప్రయోగించిన దివ్యాస్త్రాలనన్నింటినీ మింగేసరికి దేవతలు ఆవృత్రాసురుణ్ణి చూడడానికి కూడా భయపడి తమను రక్షించేది ఎవరా అని చింతిస్తూ పారిపోయారు.

వృత్రాసురుడు ఆయుధాలు, రథాలు మొదలయిన సాధనాలతో బాటుగా సత్పురుషులందరినీ మింగేసరికి దేవేంద్రాదులు ఆశ్చర్యపడి ఏం చెయ్యాలో తెలియక ఆయన తేజస్సుకి భయపడి వాడిపోయిన హృదయాలతో విష్ణువుతో మొరపెట్టుకోవాలని

ఈ వృత్రాసురుడు జయింపశక్యంకానివాడు. మన ఆయుధాలు మింగాడు. వాడికి సాటి యోధుడు కనపడడంలేదు. మన బ్రతుకేది? మనకు గొప్ప ఆపద వచ్చిపడింది. సహాయం చెయ్యడానికి శ్రీహరి తప్ప మరెవ్వరూలేరు. శ్రీహరిని ప్రార్థిద్దాం. మంచివీరులతో కలుద్దాం. గీతాలు పాడుదాం. చూచీ చూడడంతో శ్రీహరి సంకోచించకుండా ఈ వృత్రాసురుడు నశించే ఉపాయం చెప్తాడు. స్వర్గానికి కష్టాలు తప్పుతాయి.

దేవతలు తమలోతాముపై విధంగా ఆలోచిస్తూ దుఃఖపడుతూ; తడబడుతూ; తూలుతూ; అంతటిరాక్షసుణ్ణి చూచిన కన్నులు బెదురుతూ ఉండగా శ్రీహరిని సమీపించారు.

భయార్తులైన దేవతలు శ్రీమహావిష్ణువు దగ్గర మొరపెట్లుకోవడానికి వెళుతున్నారు. ముందుగా పాలసముద్రాన్ని సమీపించారు. పాలసముద్రం పెద్ద పెద్ద కెరటాలమీద పెద్ద పెద్ద నురుగుముద్దలతో తెల్లగా ఉంది. ఆ నురుగుముద్దలు శ్రీహరి కీర్తిలతపూచిన పూలగుత్తుల్లా ఉన్నాయి. పెద్ద పెద్ద సుడులున్నాయి. ఆ సుడులలో గిరగిర దక్షిణావర్త శంఖాలు తిరుగుతున్నాయి. ఆ శంఖాలు విష్ణుసేవవలన విష్ణు భక్తులకు లభించిన పుణ్యఫలాల్లా ఉన్నాయి. పాలసముద్రంలో భయంకరమైన జలచరాలున్నాయి. తమ ఆహారాన్ని మింగడానికి తీవ్రవేగంతో కదులుతున్నాయి. ఆ కదలికలవలన లేచిన కెరటాలు ఒకదానితోఒకటి ఢీ కొంటున్నాయి. అప్పుడు లేచిన నీటితుంపురులు ఆకాశంలో నక్షత్రాల్లామెరుస్తున్నాయి. పాలసముద్రంలో పర్వతాలున్నాయి. పాలకెరటాలు ఆ పర్వతాలమీద ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ దృశ్యం శ్రీహరి అంతః పురకాంతలు విహరించడానికి యోగ్యమైన, చక్కగా కడగబడిన, కొత్త సున్నంతో వెల్లవేసిన, మేడలను నిర్మించే పనిలో పాలసముద్రం నిమగ్నమయినట్లుంది. పాలసముద్రంలో పగడాల తీగలమొలకలు ప్రకాశిస్తున్నాయి. అవి శ్రీహరి తన భార్యలపై చూపించిన అనురాగంలా ఉన్నాయి. కెరటాలు మేఘాలను తాకుతున్నాయి. ఆ రెండింటితాకిడివల్ల గొప్ప ఘోష పుడ్తోంది. దానితో భూమ్యాకాశాల మధ్యభాగం నిండిపోతోంది. తెల్లగా ఉన్న పాలసముద్రం భూమినంతా చుట్టుకొని ఉంది. కనుక భూదేవతకు అలంకరించిన తెల్లని పట్టుచీరలా ఉంది. పాలసముద్రం హరిహరాది సకలదేవతలకు అమృతాన్ని అనేక సంపదల్నీ ఇచ్చిన గొప్ప నిధిలా ఉంది. పాలసముద్రపుటొడ్డున దేవతావృక్షాలున్నాయి. అవి వైకుంఠ పురవాసులకోరికలన్నింటినీ తీరుస్తూ ఉన్నాయి. కుబేరుని కోశాగారం పద్మ మహాపద్మ శంఖ మకర కచ్చప ముకుంద కుంద నీల వర అనే పేర్లు గల నవవిధులతో ప్రకాశిస్తోంది. అదే విధంగా పాలసముద్రం పద్మాలతో మహాపద్మాలతో శంఖాలతో మకరాల(మొసళ్ళ)తో కచ్చపాల(తాబేళ్ళ)తో ముకుందాల(ఒకజాతి మాణిక్యాల)తో కుందుని(విష్ణువు)తో నీలాల(ఇంద్రనీలమణులుతో వరాల (శ్రేష్ఠవస్తువుల)తో ప్రకాశిస్తోంది. విష్ణువు పాణిపద్మం సుదర్శనం(చక్రం) యొక్క బ్రమణాలతో ప్రకాశిస్తోంది. అంటే విష్ణువు చేతిలో సుదర్శనచక్రం తిరుగుతూ ఉంటుంది. అదే విధంగా పాలసముద్రంకూడా సుదర్శన(చూడదగిన) ఆవర్తాల(సుడుల)తో ప్రకాశిస్తోంది. కైలాసపర్వతం అమృతకళాస్థానశేఖరుని(శివుని) పదార్పణాలతో (పాదాలు ఉంచడం)తో ప్రకాశిస్తోంది. అదే విధంగా పాలసముద్రంకూడా అమృతానికి, కళలకు(ఓడలకు) స్టానమై శేఖరాలమీద కొండకొనలమీద, పదార్పణల (అడుగులుంచడం= ప్రవహించడం)తో ప్రకాశిస్తోంది. ఇంద్రుని వైభవం కల్పవృక్షం కామధేనువు చింతామణులవలన వృద్ధిపొందినది. అదే విధంగా పాలసముద్రం కల్పవృక్షం, కామధేనువు, చింతామణులు అనే విశేషాలు కలది.

పంచమహాభూతాలచేత నిర్మింపబడిన ఈ జగత్తునకు గురువు బ్రహ్మదేవుడు. అతడూ మేమూ ఎల్లవేళలా శ్రీహరిని పూజిస్తున్నాం. అతడు వేదాలచే స్తుతింపబడేవాడూ సర్వం తానైనవాడూ, కోరికలులేనివాడూ, అహంకారంలేనివాడూ, శాంతుడూ, దయాస్వభావుడు. అతణ్ణి విడిచి మరొకరిని సేవించాలనుకునే పంచనాశీలం గల అతి పాప కర్మ బుద్ధి...అంటే కుక్కతోకపట్టుకొని సముద్రం దాటాలనుకోవడమే.

జలప్రళయమందు శ్రీహరి తాను మత్స్యావతారమెత్తి భూమిని నావగాచేసి తన కొమ్మునకు ఆ ఓడను గట్టిగాకట్టి సత్యవ్రతుడనే మనువును ఓడలో ఉంచి రక్షించాడు. ఆ శ్రీహరి మాపాలిటి అదృష్ట దేవత అయి వృత్రాసురునివలన కలిగిన ఆపద నుండి మమ్ము రక్షించుగాక.

జలప్రళయ సమయంలో పెనుగాలులతో పెద్దశబ్దంచేస్తూ, కంపిస్తూ, భయంకరంగా పడిలేచే కెరటాలతో, అదుపుచేయరాక, అంతటా వ్యాపించిన సముద్రజలాల్లో పడిపోయి విలపిస్తున్న బ్రహ్మను తన నాభికమలంలోకి చేర్చి రక్షించినవాడూ ఇంతంతనరానివాడూ అయిన అద్వితీయుడు మమ్ములను దయతో ఆదరించుగాక!

మేముదేవతలం. శ్రీహరి దేవదేవుడు. సర్వలోకాలకూ శరణు ఇవ్వగలిగినవాడు. ఆ శ్రీహరిని శరణుపొంది వృత్రాసురుని వలన మాకు కలిగిన ఆపదలను తొలగించుకొని శుభాలు పొందగలం.

ఇలా స్తుతిస్తున్న దేవతల భక్తవత్సలుడైన శ్రీహరి సంతుష్టుడై సాక్షాత్కరించాడు. ఆ సమయంలో

దేవతలు కనుల విందుగా కరవు తీరేవిధంగా శ్రీహరిని దర్శించుకున్నారు. ఆ శ్రీహరి శంఖచక్రగదలను ధరించాడు. శ్రీవత్సలాంఛనసౌందర్యంతో, కౌస్తుభం అనే మణి అందంతో ప్రకాశిస్తున్నాడు. మాణిక్యాలు పొదిగిన కిరీటం ధరించాడు. దివ్యాలంకారాలు ధరించాడు. కేశపాశానికి అలంకారాలున్నాయి. చెవులకు కుండలాలున్నాయి. వక్షఃస్థలం పైన లక్ష్మి ఉంది. ఆయన సేవకులందరూ ఆయన వలెనే ఉన్నారు. పలుచనైన పచ్చని వస్త్రం ధరించాడు. ఆయన కన్నులు తెల్లతామరపూవులవలె ఉన్నాయి. నవ్వు అమృతద్రవంలా ఉంది.

సేవకులరూపం శ్రీహరి రూపం ఒకే విధంగా ఉన్నా శ్రీవత్సం కౌస్తుభం లక్ష్మి ఈయనే శ్రీహరి అని శ్రీహరిని గుర్తించే విధంగా చేస్తున్నాయి. ఆయన కన్నులు తామరపూలు ఏవి ఏవో తెలిసికోడానికి వీలులేకపోయినా కన్నులలో పొంగే కరుణ ఇవి శ్రీహరి నయనాలు అని గుర్తింప చేస్తోంది. శ్రీహరితో కాపురంచేసే లక్ష్మివలన సకలలోకాల భాగ్యాలకూ మూలభూతమయిన భాగ్యం ఇదే అని తెలుస్తోంది. అన్నిటినీ సృష్టించే బ్రహ్మను సృష్టించిన నాభికమలాన్ని చూస్తే ఈ శ్రీహరి తేజస్సే మూడు మూర్తుల తేజస్సులకూ మూలమైన తేజస్సు అని తెలుస్తోంది. శ్రీహరి పాదాలనుండి పుట్టి అన్నిటినీ పవిత్రం చేసే గంగను చూస్తే శ్రీహరియే అఖండ పుణ్యం అని తెలుస్తోంది; అటువంటి శ్రీవత్సకౌస్తుభాదులతో ఇంతని చెప్పవీలుకాని; పుట్టుకలేని, వ్యక్తంకాని; నాశంలేని; అన్నిటినీ సంతోషింపచేసే శ్రీహరి ప్రకాశించాడు.

ఈ విధంగా జగత్తులను మోహింపచేసే సౌందర్యంకల శ్రీహరియొక్క దయాపూర్ణమయిన చూపులు ప్రసరించేసరికి దేవతలకు మహానందం కలిగింది. వారందరూ శ్రీహరికి సాష్టాంగ దండప్రణామాలు చేసి దోసిలి నుదుటచేర్చి నమస్కరించి ఈ విధంగా అన్నారు.

ఓ ఆదిపురుషుడా! దుర్లభాలైన స్వర్గాది ఫలాలను పుట్టించే సామర్థ్యంకల నీకు నమస్కారం.

యోగీశ్వరుల స్తుతులందుకొనే నీకు నమస్కారం. శార్‌ఙ్గమనే విల్లుకల నీకు, కుండలములచేత అలంకరింపబడిన నీకు; భయంకరమైన యుద్దాలు చేసే నీకు, గజరాజును రక్షించిన నీకు; రాక్షసులను సంహరించే నీకు; పూర్ణచంద్రబింబం వంటి ముఖం కల నీకు; భయంకరమైన తేజస్సుకల నీకు; పుణ్యకర్మలే ప్రధానంగా కల నీకు; వైకుంఠమే స్థానంగాకల నీకు; ఆశ్రితులను రక్షించడంలో శ్రద్ధకల నీకు; ఆదిశేషుడే శయ్యయైన నీకు దండం.

ఓ శ్రీహరీ! యుద్ధంలో దేవతలు వృత్రునికి వశమైపోయారు. ఆకాశసంచారులు చెల్లాచెదరైపోయారు. సాధ్యులు కృశించిపోయారు. పన్నగులు; యక్షులు వృత్రునిచేతిలో ఓడిపోయారు. మిగిలిన వారినైనా ఆపదలనుండి గట్టెక్కించు.

వినాశానికే వినాశమైన ఓ శ్రీహరీ! సమూలంగా నశించిపోయిన రాక్షసులకు తిరిగి ఊపిరిపోసి, మాకు కష్టాలు కలిగిస్తూ, తుది మొదలు తెలియనంతగా మహాకాయుడైపోయిన ఆ రాక్షసుణ్ణి అంతంచెయ్యి.

అందరికి దిక్కైనమాకు ఇపుడు కాలు ఊనుకోవడానికి కూడా చోటు లేదు. మా దీనదశచూచి మాకు శరణు అనుగ్రహించు. దిక్కులేనివారికి నీవే దిక్కు.

ఓ పద్మనాభా! నీ భక్తులు కానివారు గతిలేనివారే. ఇహపరాలలో సుఖించాలనుకొనేవారికి నిన్ను శరణుపొందటమే కర్తవ్యం.

ఓ శ్రీహరీ! వృత్రుడు మా తేజస్సుల్నీ మా ఆయుధాల్నీ మ్రింగి, ముల్లోకాల్నీ మింగడానికి చూస్తున్నాడు. భీకరాకారం గల వాడి మదం అణచి; మా ఆపద తొలగించు.

ఓ పరమపురుషా! దుఃఖనాశకా! పరమేశా! భక్తవరదా! కృష్ణా! పుట్టుకలేనివాడా! పద్మాలవంటి కన్నులు కలవాడా! నిన్ను శరణుపొందుతున్నాం. మా భయాన్ని పోగొట్టి రక్షింపుము.

భగవంతుడవైన నారాయణా! వాసుదేవా! ఆదిపురుషా! గొప్పమహిమకలవాడా! పరమమంగళ స్వరూపా! గొప్పశుభాలనిచ్చేవాడా! పరమహంసపరివ్రాజకులు, గొప్పదైన ఆత్మనిష్ఠకలవారు. ఆత్మనిష్ఠయందలి ఏకాగ్రతచేత వారి అంతఃకరణాలు పరిశుద్దాలవుతాయి. వాటిలో సర్వసంగ పరిత్యాగుల ధర్మాలైన పరమశాంతి; ఇంద్రియ నిగ్రహం మొదలయినవి ప్రకాశిస్తాయి. వాటి ప్రభావంచేత చిత్తం అనే మోక్షద్వారానికున్న అజ్ఞానపు తలుపులు తెరుచుకొంటాయి. అక్కడ ఆత్మకాంతి మాత్రమే ఉంటుంది. ఆ కాంతిలో ఆత్మగోచరిస్తుంది. ఆత్మానందం అనుభవానికి వస్తుంది. ఆత్మానందానుభూతిరూపుడవే నీవు. ఆత్మలోభాసించే శరీరాదుల ఉత్పత్తి స్థితిలయాలకు కారణం నీవే. నీవు సామాన్య జీవునివలె లోకంలో త్రిగుణకార్యాలయిన శరీరాదులయందు ఆత్మభావం కలవాడవై; పరాధీనుడవై పుణ్యపాపాలను చేసి వాటి ఫలాలైన సుఖదుఃఖాలను అనుభవిస్తావు. షడ్గుణైశ్వర్య సంపన్నుడవైన నీవు ఆత్మయందే క్రీడించేవాడవు అయినా అపరిమిత గుణాలకు ఆశ్రయమై ఉన్నావు. ఈశ్వరుడవైన నీమాహాత్యం ఊహింపశక్యంకానిది. తెలిసికొనశక్యం కానిది. కొత్త కొత్త వికల్పాలు, వితర్కాలు, విచారాలు మొదలయిన ప్రమాణాభాసలతో కూడి జటిలమైన కుతర్కాలలోపడి కర్మశప్రజ్ఞలుకల విద్వాంసులు మొండి పట్టుదలతో వాదించుకొంటూ ఉంటారు. ఆ వివాదాలలో ఉన్నావని లేవని వాదనలు చోటుచేసుకుంటాయి. మాయామయుడవైన నీవు ఆ వాదనలకు అందేవాడవు కాదు. నీవు సమవిషమరూపాలలో ప్రవర్తిస్తూ ఉంటావు. తాడునందు పాము అని భ్రాంతి కలిగినట్లు నీయందు ప్రపంచభ్రమ కలుగుతోంది. నీవు సమస్త జగత్తునకూ కారణం. సర్వప్రాణులకూ అంతరాత్మవు నీవు. అందువలన అనేకగుణాలు కలిగినట్లు కన్పిస్తావు.

నీ మహిమ అపారమైన అమృతసముద్రం. భాగవతులు ఆ సముద్రంలోని ఒక చుక్కరుచిచూచి అఖండానందాన్ని అనుభవిస్తారు. ఆ ఆనందపారవశ్యంవలన కన్నవాటివలనా విన్నవాటివలనా కలిగే కించిత్తు సుఖాన్ని లెక్కచెయ్యరు. నీ పాదసేవను విడిచిపెట్టరు.

ముల్లోకాలలో నిండి ఉండే మహానుభావా! మూడడుగులతో ముల్లోకాలను ఆక్రమించినవాడా! ముక్కంటీ! నీ మహిమ ముల్లోకాల మనస్సును హరించేది. దనుజాదులు నీ విభూతిభేదాలే. వారి అంత్యకాలం ఆసన్నమయిందని తెలిసి నీ మాయాబలంతో దేవతగానో, మనుష్యునిగానో, జంతువుగానో, జలచరంగానో ఇంకా అలాంటి రూపాలతో అవతరించి వారిని తగినవిధంగా శిక్షిస్తావు.

ఓ భక్తవత్సలా! నీ ముఖపద్మంనుండి వెలువడే తియ్యని వచనామృత తరంగాలతో నీ దాసులమైన మా హృదయతాపాన్ని ఉపశమింపచెయ్యి. ఈ జగత్తుయొక్క సృష్టి స్థితిలయాలకు కారణమయిన మూలప్రకృతి(మాయ)నీకు అధీనమై ఉంటుంది. సృష్టిలోని సమస్తప్రాణులకు లోపల ప్రత్యగాత్మగా బయట పరమాత్మగా వెలుగొందేది నీవే. ఆ పరమాత్మ స్వరూపమే అయిన మూలప్రకృతి రూపాలయిన దేశం కాలం, దేహం, అవస్థలు. వీటికి మూలకారణమయిన దాని అనుభవంకలిగి అన్ని అనుభవాలకూ అన్ని విషయాలకూ సాక్షివై పరబ్రహ్మస్వరూపుడవైన నీకు మేమేమని మనవి చేసుకోగలం.

సమస్తవిశ్వానికీ ఆశయం నీవు. అనేక దుఃఖాలతో కూడి ఉండే సంసారపుతాపాన్ని ఉపశమింపచేసే నీ చరణ పద్మాల్ని మేము ఆశ్రయిస్తున్నాం. అని స్తుతించి ఈ విధంగా అన్నారు.

ఓ జగత్రభూ! యుద్ధం ఆరంభంకాగానే క్రమంగా వృత్రాసురుడు మా పరాక్రమాన్ని మా ఆయుర్దాయాన్ని మా ఆయుధాల్ని కబళించివేశాడు. ఇంక మాకు విజయం ఎక్కడ?

చాలా అందంగానూ నేర్పుగానూ భక్తితోనూ దేవతలు చేసిన స్తుతివిని శ్రీహరి అమృతంలాంటి మాటలతో గంభీరంగా ఈ విధంగా అన్నాడు.

నన్ను స్తుతించేందు కుపయోగించిన మీ జ్ఞానానికి నేను సంతోషించాను. సంతృప్తి చెందాను. నామీద కలిగిన భక్తి ఎప్పుడూ వ్యర్థంకాదు.

నారాయణ దేవుడు తనను కలసి వృత్రహింసలబారినుండి తమకు విముక్తి కల్పింపమని వేడుకొన్న ఇంద్రాది దేవతలతో అన్నమాటలివి.

“నేను లెస్సగా ప్రీతి చెందితే నానుండి నా భక్తులు సర్వమూ పొందగలరు. నానుండి వారు పొందరానిది ఏదీ ఉండదు. అదీగాక నన్ను పొందడమే తనకు గొప్పలాభంగా కలిగినవాడు ఇతర వరాలు యాచించడు. లోకంలోని వస్తుస్వరూప స్వభావాలు సంపూర్ణంగా గుర్తెరిగినవాడు విషయసుఖాలనుండి విరక్తుడౌతాడు. వైరాగ్యంతో సంసార జీవనానికి దూరంగా నిలుస్తాడు. అందువల్ల మీకు మేలు కలుగుతుంది. దధీచి అనే పేరుగల ఋషి ఉన్నాడు. ఆయన శరీరం నా శక్తితో కూడి, మిక్కిలి ప్రభావవంతమై ఉంది. అతణ్ణి యాచించి ఆ శరీరాన్ని పొందండి. అతడు గొప్ప దానశీలి.

పూర్వం అతడు అశ్వినీదేవతలకు అశ్వశిరోనామమనే విద్యను ఉపదేశింపగా, వారు జీవన్ముక్తులయ్యారు. దేవశిల్పి అయిన త్వష్టకు కుమారుడైన విశ్వరూపునకు నారాయణాత్మకమైన కవచాన్ని కూడా ఆ దధీచి ఇచ్చాడు. కాబట్టి అశ్వినీ దేవతలు ప్రార్థిస్తే, తప్పకుండా తన శరీరాన్ని దానం చేస్తాడు. అతని ఎముకలతో విశ్వకర్మ నూరుఅంచులుగల ఆయుధాన్ని నిర్మించి ఇస్తాడు. అది నా శక్తితో కూడినదై, వృత్రాసురుని శిరస్సును ఖండించడానికి సమర్థమై ఉంటుంది. ఆ పిదప మీరు మరల మీ మీ తేజోవిశేషాలతో వెలుగుతూ పూర్వ వైభవాన్ని పొందగలరు.

లోకంలో నా భక్తవరేణ్యులు ఎవరికైనా అజేయులుగా నిలుస్తారు. మీకు మేలు కలుగుతుంది" అంటూ దేవుడు అదృశ్యుడైనాడు. తరువాత, దేవతలు దధీచిమహర్షిని దర్శించారు. అపుడు ఇంద్రుడు దధీచితో ఇలా అన్నాడు.

ప్రాణిలోకం శరీరం పొందిన వెంటనే సుఖంకోసం ఆరాటపడుతుంది. అది లోకనైజం. జీవి తన దేహాన్ని జీవితాంతాన తప్ప మరెప్పుడూ విడువడు - విడువలేడు; కాని, ఓ దధీచీ! దేహవంతుడా! మేము దేవతలం. మా దేహాలకోసం - ప్రాణాలకోసం- సుఖాలకోసం నీ దేహాన్ని యాచిస్తున్నాము. ఇయ్యవయ్యా మహాత్మా!

ఏ లోకాలలోనూ, ఎవ్వరుగాని, ఎప్పుడుగాని కోరని ఒక కొత్త కోరికను, నేడు మా ఆపదల నుండి రక్షించుకోవడం కారణంగా కోరడానికై నీ దగ్గరకు వచ్చా. దైవనిర్ణయంకాక ఇది మేము కల్పించుకొన్నది కాదు. మేము చేసే ఈ యాచన దాతను తొక్కివేసేది. ఇలాంటి యాచన లోకాలలో ఎవరైనా తమను తాము అసహ్యించుకోకుండా చేయగలరా? చేయలేరు.

తెలివితేటలు ఎన్ని ఉన్నా ఎవరైనా అడుక్కోవడం హీనమైన పని అని తెలిసికూడా, అడగగూడని దాన్ని అడిగితే, అలాంటివారు యాచకులలో హీనులుగా చూడబడరా!

మహాత్మా! దధీచీ! లోకంలో యాచకులెవరైనా యాచన సమయాన ఇంగితజ్ఞానం కలిగి అడుగరాని వాటినిగాక అడుగదగినవాటినే యాచిస్తారు. మేము మాత్రం అడుగరానిదగు మీ శరీర సర్వస్వాన్ని అడిగాము. అర్థులకు జాలి, దయ ఉండవు గదా!

దేవతల పల్కులు విన్న దధీచి తన దేహం దేవకార్యం కోసం ఉపయోగపడనున్నదని తెలిసి లోపల ఆనందించాడు. కానీ, ఆ ఆనందపు గుర్తులు కనిపించకుండా నవ్వుతూ, ఓ దేవతలారా! మీరేనాడయినా మీ మనస్సులలో జీవులకు గలిగే అపమృత్యుభయాన్ని గూర్చి దయతోనయినా ఆలోచించారా? అంటూ ప్రేమతోనే భావపూర్ణ వాక్యాలతో ప్రసంగించాడు.

బ్రతుకుమీద ప్రీతితో జీవించాలని కోరుకునేవారికి దేహమే గదా ప్రీతిపాత్రం. బ్రతుకు దేహంమీదే గదా కొనసాగేది. అటువంటి దేహాన్ని స్వయంగా నారాయణుడు వచ్చి యాచించినా ఇచ్చేవారు ఉంటారా! ఉండరు.

అంతే కాక, లోకాన ఎక్కడైనా డబ్బునో కాక, ఒక ప్రయోజనాన్నో యాచించేవారు ఉంటారుగాని దాతను తన దేహాన్నే ఇమ్మని కోరే యాచకుడు ఉంటాడా? దాతలయినా అర్థుల కోర్కెలు తీర్చేవారు ఉంటారుగాని, తమ దేహాలను వస్తువులవలె అర్థికి అర్పించేవారు ఉంటారా? ఒకవేళ దాత తన శరీరాన్ని ఇచ్చినా, యాచకుడు అతనిని చంపగలడా? అంతటితో ఆగక ఆ శరీరంలోని ఎముకలను ఏరుకొని పంచుకొనే బీచ్చగాండ్రు లోకంలో ఉన్నారా? అయినా లోకాలను రక్షించే దేవతలు స్వయంగా హింసకు తలపడటం ఎట్లా సంభవించింది? ప్రాణం తమకు ఎంత ప్రియమో ఎదుటివారికీ అంతే ప్రియమని అనుకోవద్దా?

దధీచి మాటలకు దేవతలు ఇలా అన్నారు "మహర్షీ! మీవంటివారు ప్రాణులన్నింటియెడ దయాగుణం కలిగి ఉంటారు. పవిత్రమైన వర్తనం మీది. మీరు సత్కీర్తిని కోరుకుంటారు. గొప్ప బుద్ధిగలవారు. అటువంటి మీకు ఈయరాని వస్తువంటూ ఒకటి ఉండదు.

యాచకుడు అడుగరానిదానినైనా అడుగుతాడు. ఇచ్చే దాత యాచకునితో వాద ప్రతివాదాలకు దిగడు. యాచకుడు ప్రాణమడిగినా ఇచ్చేస్తాడే గాని, దాత దాచుకోడు.

దేవతలు స్వార్థ దృష్టితప్ప ఎదుటివారి కష్టాన్ని పట్టించుకోకుండా ఋషిశరీరాన్ని యాచిస్తే, ఋషి లోకస్వభావం ఎరిగినవాడై ఉండికూడా చిరునవ్వుతో ఒకింతసేపు వారితో యాచనను గూర్చి యాచకుని గూర్చి వాదించి చర్చించి, తరువాత 'ఎపుడైనా వదలక తప్పని ఈ దేహాన్ని దేవకార్యంకోసం త్యజించడం నాకు సమ్మతమే. ప్రాణం పోయిన పిదప కాకులు కుక్కలు నక్కలు - వంటివాటి పాలుగాకుండ, కష్టాలకు దైన్యాలకు పాత్రమైన ఈ దేహం ఒక మహాప్రయోజనంకోసం త్యజించడం మేలేగదా' అంటూ, తన ఆత్మను పరమాత్మలో నిలిపి, యోగశక్తితో తన శరీరాన్ని వదలివేశాడు. వెంటనే విశ్వకర్మ ఆ శరీరంలోని ఎముకలతో 'వజ్రము' అనే నూరంచుల ఆయుధాన్ని నిర్మించి ఇంద్రునకీయడంతో, అతడు వజ్రాయుధధారియై, దైవదత్తమైన తేజంతో వృద్ధి పొందింపబడినవాడై, ఐరావతమెక్కి దేవజాతులు - గరుడ గంధర్వ కిన్నర కింపురుషాది సైన్యబలాలతో కూడి, మునులు పొగడగా, ముల్లోకాలకు ఆనందం కలిగిస్తూ, వృత్రాసురుని మీదికి దండెత్తి వెళ్లాడు. అప్పుడు

దేవ వృత్రాసుర సంగ్రామము

Srimannarayana Kavacham - శ్రీమన్నారాయణ కవచ ప్రారంభము

శ్రీమన్నారాయణ కవచ ప్రారంభము

నారాయణ కవచం

శత్రువులకు భయం కలిగించే వజ్రకవచమూ ఆశ్రయించినవారికి పుణ్యఫలంగా సంపదలను కలిగించేదీ, అలాంటివారికి చెప్పదగినదీ అయిననారాయణ కవచాన్ని విశ్వరూపుడు దేవేంద్రునకు ఏ విధంగా బోధించాడు?

ఈ విధంగా ప్రశ్నించిన పరీక్షిన్నరేంద్రునితో శుకయోగీంద్రుడు ఇలా అన్నాడు.

ఓ రాజా! విను. మునీశ్వరుడైన విశ్వరూపుడు ఇంద్రునకు సాంగంగా నారాయణ అనే కవచాన్ని తెలియచేశాడు. ఆ కవచం విజయాన్నిస్తుంది. దాని స్వరూపం తెలియశక్యంకాదు. అది గొప్ప ఫలాన్నిస్తుంది. మంత్రంవలె అది రహస్యంగా ఉంచదగినది. అది హరియొక్క ఒకానొక మాయాశక్తి. దాన్ని వినిపిస్తాను. సావధాన మనస్సుతో విను. విశ్వరూపుడు తాను పాదాలు చేతులు కడుగుకొని ఉత్తరముఖంగా తిరిగి పవిత్రమయిన ఆసనంపై కూర్చొని అంగన్యాసకరన్యాసాలు చేసి నారాయణకవచాన్ని చేశాడు.

(అంగన్యాసము = జపించే మంత్రంయొక్క అక్షరములను ఆయా అవయవములందు స్థాపించడం; కరన్యాసము= జపించేమంత్రంయొక్క అక్షరములను చేతి వ్రేళ్ళ్యయందు స్థాపించడం. మంత్రజపం చేసే సాధకుడు ఆ మంత్రాధిష్ఠాన దైవాన్ని తనలోకి ఆవాహనం చేసుకొనే ప్రక్రియలు అంగన్యాస, కరన్యాసాలు. తద్వారా ఆ మంత్రజపసాధకుడు ఆ దైవంతో అభిన్న స్థితిని అనుభవిస్తాడు. అలాంటి దశలో మంత్రజపం సాగాలి - అనేది మంత్రశాస్త్ర ప్రసిద్ధమైన అంశం.)

ఈ విధంగా నారాయణ కవచాన్ని కూర్చి పాదాలయందు, మోకాళ్ళయందు, తొడలయందు, పొట్టయందు, హృదయమందు, వక్షఃస్థలమందు, ముఖమునందు, తలయందు ఈ విధంగా ఎనిమిది అంగములందు "ఓం నమో నారాయణాయ" అనే అష్టాక్షరీమంత్రాన్ని న్యాసం చెయ్యాలి. "ఓం నమో భగవతే వాసుదేవాయ" అనే ద్వాదశాక్షరీ మంత్రంతో కరన్యాసం చెయ్యాలి. ఈ అంగన్యాస కరన్యాసాలవలన సాధకుడు తాను మంత్రస్వరూపుడవుతాడు. అంతేకాకుండా భగవంతుడనే శబ్దానికి అర్ధమైన మొదట ఓంకారం చివర యకారం కల మహామంత్రంతో వేళ్ళయందు, బొటనవ్రేలియందు అన్ని కీళ్ళయందు న్యాసం చెయ్యాలి. అంతేకాక హృదయంలో ఓంకారాన్ని ; తలపై 'వి' అనే అక్షరాన్ని కనుబొమ్మల మధ్యలో షకారాన్ని తలమీద పిలక ఉండే ప్రదేశంలో 'ణ'కారాన్ని కన్నులయందు 'వే'కారాన్ని అన్ని కీళ్ళల్లోనూ నకారాన్ని, అస్త్రము నుద్దేశించి 'మ'కారాన్ని న్యాసం చేస్తే సాధకుడు మంత్రస్వరూపుడే అవుతాడు. ఇంకా ఓం నమః అస్త్రాయఫట్‌ అని దిగ్బంధనం చేసి పరమేశ్వరుణ్ణి ధ్యానంలో నిల్పి నారాయణకవచాన్ని పఠించాడు. ఆ కవచం జ్ఞానరూపం, తపోరూపం, ఆరు శక్తులుకలది.

(అష్టాక్షరీమహామంత్రం - ఓం నమో నారాయణాయ
ద్వాదశాక్షరీ మహామంత్రం - ఓం నమో భగవతే వాసుదేవాయ
ఆరు శక్తులు - సమగ్రములైన ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, స్త్రీ, జ్ఞానం, వైరాగ్యం.)

పాదాలు గరుత్మంతుని వీపుపై ఉంచి తన చేతులతో శంఖం, చక్రం, డాలు, ధనుస్సు, కత్తి, బాణాలు, పాశం, గద మొదలయిన సాధనాలను ధరించి, అష్టైశ్వర్యాలతో అష్టబాహువులతో కూడిన విష్ణుమూర్తి నన్ను రక్షించు గాక.

(అష్టైశ్వర్యాలు
అణిమ - మిక్కిలి సూక్ష్యమగుట - దీనిచే రాతిలో దూరగలడు.
లఘిమ - తేలిక అగుట - దీనిచే సూర్యకిరణా లాధారంగా చేసికొని సూర్యలోకం చేరగలడు.
మహిమ - వ్యాపించుట - దీనిచే సమస్త బ్రహ్మాండములందు వ్యాపించి అందలి విషయాలను గ్రహిస్తాడు.
గరిమ - బరువెక్కడం, దించడానికి, ఎత్తడానికి - వీలుకానంత బరువు అవుతాడు.
ప్రాప్తి - తాకటం - భూలోకంలోనుండి చంద్రుని స్పృశింపగలుతాడు.
ప్రాకామ్యము - కోరికకు అద్దులేకపోవటం - దీనిచే నీటిలోవలె భూమిలో ప్రవేశింపగలుగుతాడు
ఈశిత్వము - తన శరీరావయవములను సంకల్ప మాత్రము చేతనే ప్రేరేపించినట్లు భూత భౌతికములను సంకల్పమాత్రం చేతనే ప్రేరేపింప గలుగుతాడు.
వశిత్వము - సర్వమును తన వశములో నుంచు కొనుగలుగుతాడు.
ఇవి అణిమాది అష్టసిద్దులు. అష్టైశ్వర్యాలు - అష్ట విభూతులని ప్రసిద్ధి.)

గొప్పకీర్తికల మత్స్యావతారం, మొసళ్ళ రూపమయిన వరుణ పాశాల వలన నీటి వలన మరణం కలుగకుండా నన్ను రక్షించుగాక.

బ్రహ్మచారి మాయతో నటించేవాడు, బలికి కల్గు మంగళమును ప్రతిఘటించడంలో శౌర్యం చూపించినవాడు, గొప్పవైన మూడడుగులుకల వామనమూర్తి భయంకరమయిన స్థలములందు నన్ను రక్షించుగాక.

శ్రీనృసింహుడు హిరణ్యకశిపుని వధించే సమయంలో అతిభయంకరంగా ఉన్నాడు. ముఖం అట్టహాసంతో ప్రకాశిస్తోంది. పెద్దపెద్దకోరలున్న ముఖం నుండి వెలువడే మంటలతో దిక్కులన్నీ వణికిపోతున్నాయి. ఇంతని చెప్పలేని ఆకారం. అటువంటి నృసింహుడు అడవులలోను, చొరరాని చోట్ట, యుద్దాలలో, మంటలలో అన్ని ఆపదలలో ప్రశస్తమయిన రీతిలో నాకు రక్షణ కల్పించుగాక!

అన్ని లోకాలూ ఆపదలపాలయ్యే విధంగా భూమి మహాసముద్రంలో మునిగిపోయినప్పుడు ఆదివరాహమూర్తి తన కోరతో నీటిలో మునిగిపోకుండా భూమిని పైకెత్తాడు. ఆ ఆదివరాహం అగ్నితో సమానమైనది. ఆ ప్రళయజలాల్లో ఆటలాడింది. భూమికి అది భర్త , దయ కలది. నిరంతరమైన ప్రయాణం సాగే త్రోవలలో అటువంటి ఆదివరాహం నన్ను రక్షిస్తూ ఉండుగాక.

పరశురాముడు క్షత్రియ సంహారం చేశాడు. భృగువంశంలో జన్మించి దానిని శోభింపచేశాడు. సకలసద్గుణాల రాశి; శ్రీమంతుడు - వాటిచేత ప్రతిష్ఠ పొందాడు.

తాటకను చంపి, విశ్వామిత్రుని యజ్ఞాన్ని రక్షించి, శివునివిల్లు విరిచి, ధైర్యంతో విరాధుడు కబంధుడు ఖరుడు దూషణుడు మొదలైన రాక్షసుల్ని చంపి, సుగ్రీవుణ్జి చేరదీసి, వాలిని చంపి, సముద్ర గర్వం అణచి, వారధి నిర్మించి, రావణకుంభకర్ణాది వీరులను సంహరించి, విభీషణుణ్ణి లంకారాజ్యానికి అభిషిక్తుణ్ణి చేసి, సీతతో అయోధ్యకు వెళ్ళీ రాజ్యసుఖాలు అనుభవించిన శ్రీరామచంద్ర ప్రభువు స్వస్థలం విడిచి దూరప్రాంతాలలో ఉన్న సమయాలలో నన్ను రక్షించుగాక.

అన్ని ప్రమాదాలకూ కారణమయిన శత్రువులను చంపడంకోసం చేసే అభిచార కర్మలనుండి నారాయణుడు రక్షించుగాక. గర్వం కలగకుండా నరుడు యోగభ్రంశం కలగకుండా యోగేశ్వరుడైన దత్తాత్రేయుడు; గర్వంవలన బంధం కలగకుండా కపిలుడు; కామవశులం కాకుండా సనత్కుమారుడు, మార్గాలలో ఉండే దేవతలను తిరస్కరించకుండా హయగ్రీవుడు; దేవతలకు నమస్కారాలను తిరస్కరించకుండా, దేవపూజలలో లోపాలు కలగకుండా కలిగిన లోపాలవలన పాపాలు రాకుండా నారదుడూ, అన్ని నరకాలనుండి కూర్మనాథుడూ, అపథ్యం నుండి ధన్వంతరీ, సుఖదుఃఖాదులు శీతోష్ణాదులు మొదలైన ద్వంద్వాలనుండి ఋషభుడూ, జనాపవాదాలనుండి అగ్నీ, చావుపుట్టుకలకు కారణమయిన కర్మలనుండి బలరాముడూ, కాలంనుండి యముడూ, సర్పాలనుండి, అజ్ఞానంనుండి శేషుడూ, వేద బాహ్యులనుండి బుద్ధుడూ, శనినుండి కల్కి మొ॥రూపాలు ధరించి, ధర్మరక్షణ తత్పరుడయిన శ్రీమహావిష్ణువు నన్ను రక్షించుగాక. ప్రాతఃకాలం, సంగవకాల ప్రాహ్ణ, మధ్యాహ్న, అపరాహ్ణ, సాయంకాలాల్లోను, ప్రదోషార్ధరాత్రాపరరాత్ర ప్రత్యూషానుసంధ్యలను ప్రభాతంబునందు గదాద్యాయుధాలు ధరించిన కేశవ, గోవింద, నారాయణ, విష్ణు, మధుసంహర, త్రివిక్రమ, వామన, హృషీకేశ, పద్మనాభ, శ్రీవత్సధామ, సర్వేశ్వరేశ, జనార్దన, విశ్వేశ్వర, కాలమూర్తులను పేర్లు రూపాలుకల విష్ణువు నన్ను రక్షించాలి. ఓ సుదర్శన చక్రమా! నీవు ప్రళయాగ్నివలె భయంకరమయి సుడులతో అడ్డులేని గతిలో దనుజుల్ని నాశనం చేసే దానవు. ప్రచండమైన గాలివలన చెలరేగే అగ్ని ఎండిన అడవుల్ని భస్మం చేసినట్లు నాశత్రుసమూహాల్ని దగ్ధంచెయ్యి. 

నారాయణుని చేతిలోని ఓ గదా! నీవు ప్రళయకాలంలో ఉత్పాత రూపమయిన ఉరుములతో అన్ని దిక్కులూ వ్యాపించిన మహామేఘాల నుండి వెలువడేవీ, కఠినమయిన పిడుగుల తాకిడివలన కలిగినవీ అయిన అగ్ని కణాలు చిమ్ముతూ భగభగలాడే ప్రకాశం కలదానవు. నీవు నా శత్రువుల్ని యుద్దాలలో పిండి పిండి చెయ్యి. కూశ్మాండము మొదలయిన పిశాచాల్ని చూర్ణం చెయ్యి. ఓ పాంచజన్య శంఖమా! సకల పుణ్యాలనిలయం శ్రీకృష్ణుని అధరం. ఆ అధరంతో ఊదబడినది వేణువు. ఆ వేణువు వలె పవిత్రమైన దానవు నీవు. గొప్ప ధ్వని చెయ్యి. ఆ ధ్వనితో పిశాచాదులు పారిపోవాలి. మా శత్రువుల గుండెలు పగిలిపోవాలి. శత్రుస్త్రీల గర్భాలు విచ్చిన్నం అయిపోవాలి. ఓ నందక ఖడ్గమా! నీ తీవ్రమయిన అంచుతో రాక్షస సమూహాల కుత్తుకలు ఉత్తరించగా ఆ కంఠాలు చిమ్మే రక్తంతో పాపాలను కడిగే దానవు. శ్రీమహావిష్ణువు ప్రయోగించగా మా శత్రువుల సమూహాల్ని ముక్కముక్కలు చెయ్యి. ఓ డాలూ! నీవు చంద్రునివంటి బుడిపెలతో ప్రకాశిస్తున్నావు. అన్ని లక్షణాలు తెలిసినదానవు. పుణ్య రూపంనీవు. మా శత్రువుల క్రూరపుచూపుల్ని గొప్పచీకటితో కన్పించకుండా చెయ్యి. భగవంతుని పేర్లూ రూపాలూ, వాహనాలూ, ఆయుధాలూ మమ్మల్ని క్రూరగ్రహాలనుండీ, నర పశు భూతాలనుండీ రక్షించునుగాక. సామవేదమంత్రాలచేత స్తుతింపబడే గరుత్మంతుడు నన్ను రక్షించునుగాక. శ్రీహరియొక్క పేర్లూ, రూపాలూ, వాహనాలూ, దివ్యాయుధాలూ అనుచరులూ మా బుద్ధినీ ఇంద్రియాల్నీ మనస్సుల్నీ ప్రాణాల్నీ సంరక్షించుగాక. ఆదిశేషుడు ఆపదలన్నింటినీ నాశనం చేయుగాక. జగత్తును ఈశ్వరరూపంగా ధ్యానించేవారికి ఆయుధాలనూ అలంకారాలనూ ధరించి భాసించే శ్రీహరి సంశయాలనుండి కలహాలనుండి నన్ను రక్షించుగాక, భయంకరాట్టహాసంతో ప్రకాశించే వదన గహ్వరంతో; అన్ని తేజస్సులనూ తిరస్కరించే గొప్ప తేజస్సుతో అవతరించిన నృసింహుడు అన్ని దిక్కులనుండి లోపలనుండి బయటనుండి కలిగే ఉపద్రవాలనుండి నన్ను రక్షించుగాక! అని నారాయణ కవచం ప్రభావాన్ని ఇంద్రుడు తెలిసికొని, ధ్యానించి, దాని మహిమవలన శత్రువుల్ని ఓడించాడు. అందువలన విమలమనస్కులైన ఎవ్వరైనా ఈ కవచాన్ని ధరించి ప్రతినిత్యమూ చదువుకుంటే అన్ని విధాలయిన ఆపదలనుండి, దుష్కర్మలవలన కలిగే ఉపద్రవాలనుండి రక్షణపొంది మనస్సు ప్రశాంతమై జయం పొందుతారు. ఏ వ్యాధీ వారి జోలికి రాదు.

1. పగలు 4 జాములు. రాత్రి 4 జాములు. 1 జాము= 3గంటలు; పగలు= 12 గంటలు దాన్ని 5 భాగాలు చేస్తే ఒక్కోభాగం 2.20 నిల వరకు ప్రాతఃకాలం అంటే సూర్యోదయం 6.00 గం॥లకు అయితే 6.00+2. 20= 8.20 నిల వఱకు ప్రాతఃకాలం. రెండో భాగం అంటే 8.20 నుండి 2.20 నిలు. 10.40 వఱకు సంగవకాలం అట్లే 3వ భాగం మధ్యాహ్నమని 4వ భాగం అపరాహ్ణమని 5వ భాగం సాయంకాలమని సాధారణమయిన గణన. ప్రకృతంలో పగలును 2 భాగాలుచేసి మూడవభాగంగా ప్రాహ్ణన్ని చెప్పడం జరిగింది.

2. ప్రదోషం అంటే సూర్యాస్తమయంనుండి 3 ముహూర్తాలు ప్రదోషం. ముహూర్తం= 2 గడియలు; 1గడియ= 24 ని॥లు ముహూర్తం= 48 ని॥లు. ప్రదోషం 48X3= 144 ని॥లు= 2 గం. 24. సూర్యాస్తమయం 6.00 అయితే 6. 00+ 2.24= 8.24 ని॥ల వఱకు ప్రదోషం.

3. ప్రత్యూషమన్నా ప్రభాతమన్నా ఒకటే= వేకువ. అదే అరుణోదయం. తెల్లవారడానికి ముందర 4 గడియలు. 1 గడియ= 24 ని॥లు.

కౌశికుడనే బ్రాహ్మణుడు నారాయణకవచాన్ని శ్రద్ధగా ఉపాసించాడు. తరువాత యోగశక్తితో ఒక ఎడారిలో తనువు చాలించాడు. చిత్రరథుడనే గంధర్వుడు విమానంలో ప్రయాణిస్తుండగా ఆ విమానం నీడ కౌశికుని అస్థిపంజరం మీద పడింది. అంతలో ఆ విమానంతోబాటు గంధర్వుడు అతని భార్యలు నేలమీద పడిపోయారు. ఆ గంధర్వుడు పైకిలేవలేకపోయాడు. చాలా కలత చెందాడు. ఆ సందర్భంలో వాలఖిల్యముని ఆ గంధర్వునితో-

ఇది నారాయణకవచమంత్రాన్ని ఉపాసన చేయడంవలన పుణ్యమైన అస్థి. దీనిని సమీపించడం నీకు శక్యంకాదు. విష్ణుభక్తులను ఏ అడ్డులేకుండా సమీపించడం ఎంతవారికైనా శక్యంకాదు.

పాడైన నీ కీళ్ళను సంధించి; ఆ మంత్రప్రభావాన్ని వారించి నీ ఆపదను తొలగించ గలిగిన ఉపాయం నదీజలాల్లో ఈ అస్థులను ఉంచడమే. అంతకంటె మరొక ఉపాయంలేదు.

అందువలన ఈ పవిత్రమయిన ఎముకల్ని తీసుకొని తూర్పుగా ప్రవహించే సరస్వతీనదీ జలాల్లో వేసినట్లయితే నీ కీళ్ళకట్లు తొలగిపోతాయి - అని చెప్పగా ఆ గంధర్వుడు అలాగే చేసి తన విమానంలో తన స్థానానికి వెళ్ళిపోయాడు. అందువలన

ఎవరు ఈ నారాయణ కవచాన్ని ప్రతిదినమూ వింటారో, చదువుతారో, వారికి ఎదురుపడినపుడు సమస్త ప్రాణులూ నమస్కరిస్తాయి.

ఇంద్రుడు విశ్వరూపుని దగ్గర ఈ నారాయణకవచాన్ని ఉపదేశంపొంది ముల్లోకాల్లోనూ గొప్ప సంపదలను అనుభవించి మహాప్రభావంకలిగి ప్రకాశించాడు.

రాజా! ఆ విశ్వరూపునకు మూడుతలలున్నాయి. వాటిలో ఒకటి మద్యం తాగుతుంది. మరొకటి సోమరసం తాగుతుంది. మరొకటి అన్నం తింటుంది. యజ్ఞం జరిగేటపుడు ఆ విశ్వరూపుడు అందరకూ తెలిసే విధంగా దేవతలకు హవిస్సులిచ్చేవాడు. ఆతని తల్లి రాక్షసవంశంలో పుట్టింది. ఆమె పట్ల భక్తిచేత రాక్షసపక్షపాతం కలిగి విశ్వరూపుడు రహస్యంగా రాక్షసులకు హవిస్సుల నిచ్చేవాడు. ఇది తెలిసి దేవేంద్రుడు భయపడి, ఆ విశ్వరూపుని తలలు ఖండించాడు.

ఈ విశ్వరూపుడు బ్రాహ్మణుడనికాని, మహాత్ముడని కాని, దేవేంద్రుడు ఆలోచించలేదు. పూర్వజన్మపాపప్రభావంచేత ఇలాంటి వంచన చెయ్యకూడదని విశ్వరూపుడాలోచించలేదు కదా! అని కూడా దేవేంద్రుడు భావించలేదు. కోపంతో ఆ విశ్వరూపుడి తలలు ఖండించాడు.

ఇంద్రుడు కోపాన్ని ఓర్చుకోలేక విశ్వరూపుని తలలు కత్తితో ఖండించాడు. సోమపానంచేసే తల కముజుపిట్ట అయ్యింది. సురాపానంచేసే తల పిచ్చుక అయ్యింది. అన్నంతినే తల తీతువుపిట్ట అయ్యింది. ముల్లోకాలకు అధిపతి అయినా ఇంద్రుడికి బ్రహ్మహత్యాపాతకం తప్పలేదు. బ్రహ్మహత్యాపాతకం ఇంద్రుణ్ణి సమీపించి తనను స్వీకరించమని ప్రార్థించింది. ఇంద్రుడు దోసిలిపట్టి ఆ పాపాన్ని స్వీకరించి ఒక ఏడాదిపాటు దాన్ని అనుభవించాడు. దాన్ని పోగొట్టుకోవాలని నేలను, నీళ్ళను, చెట్లను, స్త్రీలను నా పాపం స్వీకరించండి అని ప్రార్ధించాడు. అపుడు నేల - నాలో ఏర్పడిన గోతులు తమంతతాముగా పూడుకుపోవాలి - అనే వరం అడిగి, పొంది, ఆ పాపాన్ని చవుడునేలరూపంలో స్వీకరించింది. నీళ్ళు - నాలో ఏది కడగబడినా అది పవిత్రం కావాలి - అనే వరం అడిగి, పొంది, బుడగలు, నురుగు రూపంలో పాపాన్ని స్వీకరించింది. చెట్లు - తాము నరకబడినా తిరిగి చిగురించాలి - అనే వరం అడిగి, పొంది, జిగురు రూపంలో ఆ పాపాన్ని స్వీకరించాయి. స్త్రీలు - తాము సదా రతిసుఖాన్ని పొందాలి - అనే వరం అడిగి, పొంది, నెల నెలా రజస్వలలు కావడం అనే రూపంలో ఆ పాపాన్ని స్వీకరించారు.

వృత్రాసుర వృత్తాంతము

The Battle between the Demons (Asuras) and the Gods (Devas) in the absence of their preceptor, Brihaspati - దేవాసుర యుద్ధ ప్రారంభము

దేవాసుర యుద్ధ ప్రారంభము

'ఓ యోగీశ్వరా! ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. దేవతలపై బృహస్పతికి కోపం ఎందుకు వచ్చింది? విశ్వరూపుడు దేవతలకు కలిగిన ఏ ఆపదను తొలగించాడు? తెల్పు' మని పరీక్షిన్మహారాజు అడుగగా శుకుడు ఈ విధంగా చెప్తున్నాడు. 'ఇంద్రుడు త్రిలోకాధిపత్యగర్వంచేత సన్మార్గాన్ని లెక్కించకుండా, రంభాది అప్సరసలు నృత్యంచేస్తూ, గానంచేస్తూ తనను ప్రశంసిస్తూండగా, వసువులు, రుద్రులు, ఆదిత్యులు, మరుద్గణాలు, అశ్వినీదేవతలు, సిద్దులు, చారణులు, గంధర్వులు, మునులు తనను సేవిస్తూండగా సింహాసనం మీద గర్వంతో,

దేవేంద్రుని శిరస్సుపై పున్నమనాటి నిండు చంద్రునితో సరివచ్చే తెల్లగొడుగు ప్రకాశించగా, దేవకాంతలు చాతుర్యంతో విసిరే వింజామరల వరుసలు ఆకాశగంగా తరంగాలతో సమానంగా నెమ్మదిగా కదలుతూ ఉండగా, అనేక చింతామణి రత్నాలు పొదిగిన సింహాసనంమీద, తన ఊరువుపై శచీదేవి కూర్చొని ఉండగా; దిక్పాలకులు సేవిస్తూండగా సాటిలేని రాచఠీవితో, వైభవో పేతుడై ఇంద్రుడు కొలువు తీరాడు.

ఆ సమయంలో, నీతికోవిదుడు, దేవతలకు రహస్యాలోచనములలో మార్గదర్శకుడు, వాగ్వేత్త, దేవతలందరకును గురువు అయిన బృహస్పతి ఒకానొక ధర్మకార్యనిమిత్తంగా ఇంద్రసభకు వచ్చాడు.

గొప్ప తపస్సంపన్నుడు, దయాస్వభావుడు, వాక్పతి అయిన బృహస్పతిని చూచి కూడా ఇంద్రుడు రాజ్యగర్వంతో ఆ బృహస్పతికి ఎదురేగలేదు. కూర్చోమని ఆసనం చూపించలేదు. ఎటువంటి గౌరవాలు చెయ్యలేదు. ఆయనను ప్రసన్నుణ్ణి చేసుకోలేదు. చివరకు తన సింహాసనంనుండి లేవనైనాలేవలేదు. ఇదంతా దేవతల నిండు సభలో జరిగింది.

స్వర్గరాజ్యాధిపత్యంతో దేవేంద్రుని కన్నులు మూసుకుపోయాయి. దాని ఫలితమే బృహస్పతికి కలిగిన అవమానం. దానికి బృహస్పతి ఏ ప్రతీకారం చెయ్యకుండా చాలా బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు.

బృహస్పతి వచ్చినవాడు వచ్చినట్లు వెళ్ళిపోయేసరికి ఇంద్రునికి తాను అవివేకంచేత చేసిన గురుతిరస్కారం తెలిసొచ్చింది. జరిగినదానికి ఆశ్చర్యపోయాడు, భయపడ్డాడు, దుఃఖపడ్డాడు. ఇలా అన్నాడు. బృహస్పతి పరమపవిత్రుడు. శుభచరిత్రకలవాడు. ఆయన చరిత్రను లోకాలన్నీ స్తుతిస్తున్నాయి. ఎంతో ప్రభావంగల బృహస్పతియొక్క పాదపద్మాలను పూజింపక మూర్ఖత్వంతో చెయ్యరాని పని చేశాను.

నాయందు ప్రసన్నుడూ, సమర్థుడూ అయిన నా ఆచార్యునకు త్రిభువన సంపదలచే గర్వించిన నేను అసురభావంతో నాకు శుభాలు పోయేటట్లుగా అవమానం చేశాను.

ఎంతగొప్పవారు తన దగ్గరకు వచ్చినా చక్రవర్తి స్థానంలో ఉన్నవారు తమస్థానం నుండి లేవకూడదు అని చెప్పే పండితులను ధర్మవేత్తలుగా ఎవ్వరూ గుర్తించరు.

దుష్టమార్గంలో ఉండి చెడ్డమాటలు పలికేవారి ఉపదేశాలను అనుసరించేవారు ఉపదేశాలు చేసేవారి తత్త్వం తెలిసినా చేసిన దుష్కార్యాలను దిద్దుకోలేక తమ తప్పు లేకపోయినా రాతి పడవవలె అధోగతిపాలవుతారు.

చెడ్డమార్గంలో పయనించేవాడు అధఃపతితుడౌతాడు. నేనావిధంగా కాకుండా ప్రజలచేత నమస్కరింపబడేవాడు; కార్యవిదుడు అయిన బృహస్పతి ఇంటికి వెడతాను. వారి పాదపద్మాలకు కిరీటం తాకేవిధంగా నమస్కరిస్తాను. వారిని సేవిస్తాను. వారి మనస్సు నాకు సుముఖంగా ఉండేటట్లు వారికి నా యందు దయకలిగేటట్లూ చేస్తాను. అని ఆలోచించి ఆ దేవేంద్రుడు శీఘ్రంగా బృహస్పతి గృహానికి వెళ్లాడు.

దేవేంద్రుడు తన ఇంటికి వస్తున్నాడని తెలిసి బృహస్పతి తన మాయాశక్తి నుపయోగించి అదృశ్యడైపోయాడు. దేవేంద్రుడు బృహస్పతి గృహాన్ని బాగా పరిశీలించికూడా బృహస్పతి జాడతెలిసికోలేకపోయాడు. చాలా దుఃఖపడ్డాడు. చిన్నబుచ్చుకున్నాడు. ఈ విషయం అంతా రాక్షసులకు వేగులవలన తెలిసింది. ఇదే అదనని వారు భావించి అందరూ కలిసికట్టుగా శుక్రాచార్యుణ్ణి ఆశ్రయించారు. శుక్రుని దయ వల్ల రాక్షసులశక్తి బాగాపెరిగింది. దేవతలమీద దాడికి వారు త్రోవతీసి

రాక్షసులు వంచకులు. సమస్త పాపాలరూపాలు. అధర్మమార్గంలో సంచరించేవారు. అవినీతిలో పేరుగడించినవారు. అటువంటి రాక్షసులు దేవతలమీద యుద్దానికి వెళ్లారు.

రాక్షస సమూహాలు గొప్పపరాక్రమంతో బ్రహ్మాండం బ్రద్దలయ్యేంతగా భయంకరమయిన జయ జయ ధ్వనులు చేస్తూ ధనుర్బాణాలతో, రథాలతో, గుర్రాలతో, ఏనుగులతో దేవతలపై దండెత్తారు. దేవతలు ప్రసిద్ధ పద్ధతిలో దర్పంతో రాక్షసులతో తలపడ్డారు.

దేవతలు, రాక్షసులు ద్వేషాలు పెరిగిపోగా ఒకరి సంపదలు ఒకరు పొందాలని మదంతో యుద్ధం చేశారు. దేవతలు విజృంభించి అస్త్రం ప్రయోగిస్తే శుక్రాచార్యుల మంత్రప్రభావంచేత విశేషశక్తి పొందిన రాక్షసులు మరీ విజృంభించి గుంపులు గుంపులుగా బాణాలు నాటించేసరికి దేవతలు ముఖాముఖి యుద్దానికి శక్తిలేక పలాయనం చిత్తగించారు.

అద్భుతబలంకల దేవతలు రాక్షసవీరులు ప్రయోగించిన దివ్యాస్త్రాలచేత గాయపడి, ప్రాణాలు పోగొట్టుకోలేక ఎవరో శపించినట్లుగా పలాయనం చిత్తగించారు.

(మహాత్ముల పట్ల చేసిన అపరాధమే దేవతల ఓటమికి కారణం అని ఈ సన్నివేశం సూచిస్తోంది.)

రాక్షసులందరు తమను ఢీకొనేసరికి దేవతలు ఓడిపోయి భయవశులై కకావికలై నలుదిక్కులకూ పారిపోయారు.

రాక్షసుల గర్వం, వారి బాణ విజృంభణం, వారి ద్వేషం, వారి బలపరాక్రమాలు దేవతలకు సిగ్గు, కీడు, భయం, నిశ్చేష్టతలను కలిగించేయి. ఆ దుఃఖంతో వారు రాక్షసులను ఎదిరించలేక (దేవతలు) పారిపోయారు.

దేవతలు రాక్షసులనే బోయల చేతిలో చమరమృగాలైపోయారు. రాక్షసుల బాణాలతో గాయపడిన దేవతల శరీరాలు దుఃఖంతో తిరుగుడుపడుతున్నాయి. యుద్ధం విడిచిపెట్టి వారు దుఃఖంతో, భయంతో బ్రహ్మ దగ్గరకు వెళ్ళారు.

అపుడు దేవతలకు సంపదల నిచ్చేవాడూ, పుణ్యాత్ములయందనురాగంకలవాడూ, సర్వలోకాలకూ శ్రేయస్సును కూర్చేవాడూ, వేదోక్త ధర్మమార్గాన్ని నిర్ణయించేవాడూ, గొప్ప సంపదలకు నాయకుడూ, సర్వజగత్తులనూ జయించే మన్మథునకు సోదరుడూ, పవిత్రులయిన యోగిజనుల మనస్సులను జయించినవాడూ అయిన బ్రహ్మకు దేవతలు నమస్కరించారు.

బ్రహ్మ చిరునవ్వుతో, చెడని, నిండయిన, దయతో కూడిన మాటల జలంతో ఇంద్రాది దేవతల బడలికలు పోగొట్టాడు.

బ్రహ్మదేవుడు దయాతిశయంతో దేవతలకు అభయం ఇచ్చి ఈ విధంగా అన్నాడు.

మీరు పుట్టిననాటి నుండి మీకు జ్ఞానాన్నిచ్చి, లోకాలను పరిపాలించడానికి రాజ్యాభిషేకంచేసి మిమ్మల్ని పెంచిన దయాళువు, బ్రహ్మజ్ఞాన నిధి అయిన బృహస్పతిని లక్ష్య పెట్టక, నిగ్రహం కోల్పోయి ఐశ్వర్యం వలన పొట్టలు పెరిగి కొవ్వుపట్టి పూనికతో పాపపుపని చేసి తప్పుచేశారు. ఏం చెప్పేది?

బ్రహ్మ జ్ఞానినీ బ్రాహ్మణుడూ అయిన ఆచార్యుణ్ణి సరకుసేయక మీరు గురుద్రోహం చేశారు. ఆ దోషం శత్రురూపంలో వెంటనే దాని ఫలాన్ని అనుభవింప చేసింది. బలవంతులైన మిమ్మల్ని బలహీనులయిన రాక్షసులు జయించడం తమ ఆచార్యుడయిన శుక్రుణ్ణి ఆరాధించి ఆయన మంత్రప్రభావంతో బలవంతులు కావటం వల్లనే వారునా సత్యలోకాన్ని కూడా ఆక్రమించే సామర్థ్యం కలిగి గర్వంతో ఉన్నారు. వారికి స్వర్గాన్ని ఆక్రమించడం తృణప్రాయం. గొప్ప మంత్రబలంకల శుక్రాచార్యునకు వారు శిష్యులైన కారణంగా విప్రుల, గోవిందుని, గోవుల, ఈశ్వరుని అనుగ్రహం కలవారు మినహా మిగిలిన రాజులకు అరిష్టం తప్పదు. అందువలన మీరు త్వష్టమనువుపుత్రుడయిన విశ్వరూపుడనే మునిని ఆరాధించండి. ఆయన గొప్ప తపోమహిమకలవాడు. సత్త్వస్వభావుడు. మీరు కోరిన దానిని సమకూర్పగలడు. ఎంతటి ఆపదలనైనా తొలగింపగలడు. ఈ విధంగా బ్రహ్మ చెప్పేసరికి దేవతలకు శాంతి కలిగింది. వారు బ్రహ్మాదేవుని దగ్గర సెలవు తీసికొని విశ్వరూపుని దగ్గరకు వెళ్ళి ఈ విధంగా అన్నారు.

నాయనా! నీకు శుభం. నిన్ను ఒకటి అడగడంకోసం నీ ఇంటికి వచ్చాం. తండ్రులతో సమానులమైన మా కోరిక తీర్చి కీర్తి సంపాదించు.

కొడుకులకు తండ్రిసేవ మహాపుణ్యాన్నిస్తుంది. కొడుకులు ఉన్నతగుణాలు కలిగినవారై బ్రహ్మచారులుగానే ఉండిపోయినా, అంతేగాక ఆచార్యుడు పరబ్రహ్మస్వరూపం. తండ్రి బ్రహ్మాదేవుని రూపం. సోదరుడు ఇంద్ర స్వరూపం; తల్లి భూదేవి రూపం. సోదరి కరుణ రూపం. అతిథి ధర్మస్వరూపుడు. అభ్యాగతుడు అగ్నిదేవుని రూపం; సర్వప్రాణులు విష్ణు స్వరూపం; అందువలన నాయనా! కడు దుఃఖితులము, నీకు తండ్రితో సమానులము అయిన మమ్ము చల్లగాచూచి శత్రుభయం పోగొట్టుము. అఖండ తపస్సుతో విరాజిల్లు. మమ్ము బ్రతికించు.

బ్రహ్మజ్ఞానివైన నిన్ను ఆచార్యునిగా స్వీకరించి నీ ప్రభావంతో శత్రువుల్ని సంహరిస్తాం. తనకోసం తనకంటె చిన్నవానికి పాద నమస్కారం చెయ్యడంలో తప్పులేదని వేదాలు చెప్తున్నాయి. నమస్కారం చేస్తున్న దేవతలమైన మమ్మల్ని అంగీకరించి మాకు పురోహితునిగా ఉండడానికి అంగీకరించు అనగానే ఆ విశ్వరూపుడు గట్టిగానవ్వి ఈ విధంగా అన్నాడు.

వీరుకోరిన పౌరోహిత్యం బ్రహ్మతేజస్సును నశింపచేసేది, ధర్మశీలురచే నిందింపబడేది అని తెలిసిన నావంటి తపస్వితో ఈ దేవతలు ఇంత తేటతెల్లంగా తియ్యగా ఎలా చెప్పారో!

ప్రత్యేకంగా, శిష్యులు గురువులకు దక్షిణ రూపంలో ధనం ఈయవలసిన ఆవశ్యకతలేదు. గురూపదేశంపొంది, మంత్రవిదులై, ధర్మాన్ని అనుష్టించే శిష్యులే గురువులకు సంపదలు.

ధనహీనులైనవారికి శిలోంఛనవృత్తియే ధనం. దానిచేతనే సత్పురుషులకాతిథ్య మిచ్చి తృప్తిపడుతారు. నీచమైన పద్ధతిలో పౌరోహిత్యం వలన ధనం సంపాదింపనవసరంలేదు. కాని మీ ఆజ్ఞ ననుసరించి మీకాచార్యుడుగా ఉండటానికి అంగీకరించాను. ప్రాణాలను ధనమును దాచుకొనక మీకభీష్టమును సమకూరుస్తాను. అని విశ్వరూపుడు శపథంచేసి ఏకాగ్రతతో దేవతలకు పౌరోహిత్యాన్ని చేశాడు.

(శిలవృత్తియనగా మళ్లలోని ధాన్యపు కంకులనేరుకొని బతకడం. ఉంఛమనగా రోళ్లమొదట పడ్డ గింజలనేరుకొని జీవించడం. కొందరు శిలోంఛనమును ఒకటిగానే చెప్పటం కూడా ఉన్నది.)

శుక్రాచార్యుల నీతిచేత స్వర్గసంపదలు రాక్షసులకు వశమయ్యాయి. స్వర్గసంపదలు కలిసి రాక్షససంపదలు రెట్టింపయ్యాయి. వాటికి శుక్రాచార్యులవారి నీతియే రక్ష విశ్వరూపుడు అడ్డులేని విష్ణుమాయ ప్రభావంతో ఆ సంపదలను తెచ్చి ఇంద్రుని వశం చేశాడు.

విశ్వరూపుడు ఏ విద్యచేత ఇంద్రునికి రక్షణ కల్పించాడో, ఇంద్రుడు యుద్ధంలో రాక్షసుల్ని జయించాడో విష్ణుమాయగా ప్రసిద్ధమయిన ఆ విద్యను విశ్వరూపుడు ఇంద్రునకుపదేశించాడు.

శుకమహర్షి ఇట్లనగా పాండవ వంశీయుడైన పరీక్షిన్మహారాజు అత్యంత విశ్వాసంకల భక్తితో జగత్తులకు నివాసమైనవాడూ తామరరేకులవంటి కన్నులు కలవాడూ అయిన కృష్ణుణ్ణి మనస్సులో ధ్యానించి ఇలా అన్నాడు. దేవతలచే నమస్కరింపబడే ఓ దేవఋషీ! విశ్వరూపుడు ఏ విధంగా ఆ పవిత్రవిద్యను దేవేంద్రున కిచ్చాడో తెల్పుము.

ఓ మునీంద్రా! దేనివలన ఇంద్రుడు సర్వత్ర రక్షణపొంది అనాయసంగా రాక్షస సేనను సంహరించి దేవతలు నిర్భయంగా సుఖించే విధంగా కోరిన సంపదలు పొంది అన్నిలోకాల్నీ జయించి పరిపాలించాడో ఆ విద్యను చెప్పు. వీనులవిందుగా విని సంతోషపడతాను.

Monday, March 9, 2026

Daksha cursed Narada to wander the universe forever without a fixed home - దక్షుండు నారదుని శపియించి ప్రజాసర్గం బొనరించుట

దక్షుండు నారదుని శపియించి ప్రజాసర్గం బొనరించుట

అది ఎలాగంటే - వీరు బాలురు. దేవఋషి పితృబుణాలు తీర్చుకోలేదు. ఏ కర్మలను చేయలేదు. కర్మల అనిత్యత్వాన్ని వీరెరుగరు. అటువంటి చిన్నపిల్లల బుద్దిని తప్పుత్రోవ పట్టించి వారిని ఈ లోకంలోను, పరలోకంలోను కూడా శ్రేయస్సు పొందకుండగా చేశావు. నీవు చేసిన ఈ పాపంవలన భగవద్భక్తులందరిలోను సిగ్గులేని వాడవై అపకీర్తి పాలవుతావు. నా పుత్రులు నిరపరాధులు. నీపైనవారికి శత్రుత్వం లేదు. అటువంటివారికి ద్రోహం చేశావు. నీవు తప్ప మిగిలిన భాగవతోత్తములందరూ ప్రాణులపట్ల అనుగ్రహం కలవారే. నీవు చాలా ఆసక్తిగా మిత్రులమధ్య ఉన్న స్నేహబంధాన్ని ఛేదిస్తావు. నీవలన మిత్రులమధ్య విరోధం ఏర్పడుతుంది. శత్రుత్వాలు నీవలన శాంతింపవు. ఇకపైన ఎవరికీకూడా విషయసుఖాలు అనుభవించకుండా అవి దుఃఖహేతువులనే విషయం తెలియదు. జ్ఞానం స్వయంగా కలుగుతుందేతప్ప నీబోటివాళ్ళు చెప్పినంతమాత్రాన కలుగదు. నీవు నిరంతరం లోకాలన్నీ తిరుగుతూనే ఉంటావు. నీకెక్కడా నివాసస్థానమంటూ ఉండదు అని దక్షుడు నిర్దయగా నారదుణ్ణి శపించాడు. అయినా నారదుడు కోపగించుకోలేదు. ఆ శాపాన్ని అంగీకరించాడు. అటువంటి శాంతస్వభావం ఉంటే ఏ వ్యక్తి అయినా అన్ని ద్వంద్వాలకూ అతీతుడయి సర్వేశ్వరుడనబడతాడు కదా!

దక్షుడు ప్రజలను సృష్టించాలనే తన కోరిక తీరకపోవడం చేత చాలా దుఃఖపడ్డాడు. అపుడు బ్రహ్మ వచ్చి సృష్టికి ఉపాయం చెప్పాడు. దక్షుడు తన భార్యయైన అసిక్నియందు అరవైమంది కూతుళ్ళను కన్నాడు. వారిలో పదిమందిని ధర్ముడికిచ్చాడు. పదుముగ్గురిని కశ్యపుడికిచ్చాడు. ఇరవైయేడుగురిని చంద్రుడి కిచ్చాడు. భూతుడి కిద్దరిని, ఆంగిరసుడి కిద్దరిని, కృశాశ్వుడి కిద్దరిని ఇచ్చాడు. చివరి నల్గురిని తార్క్ష్యుడనే పేరుకల కశ్యపుడి కిచ్చాడు. పైన చెప్పిన వరుసలోనే కూతుళ్ళనిచ్చాడు. ఆ కూతుళ్ళ పేర్లు విను.

(ప్రతి వ్యక్తి పుడుతూనే మూడు ఋణాలతో పుడతాడు. అవి దేవఋణం, ఋషిబుణం, పితృఋణం.

దేవఋణం : దేవతలు వర్షాలు కురిపించి తద్ద్వారా మనకాహారాన్ని సమకూరుస్తున్నారు. అందుకు మనం వారికి ఋణపడి ఉన్నాం. ఆ ఋణం తీర్చుకొనే ఉపాయం ఏమిటంటే యజ్ఞాలు చేసి మనం ఇచ్చే ఆహుతులద్వారా వారిని సంతోషపరచడమే.

ఋషిబుణం : ఋషులు మనకు వేద వాఙ్మయాన్నిచ్చారు. అందువలన మనం వారికి ఋణపడి ఉన్నాం. అది తీర్చుకొనే ఉపాయం బ్రహ్మచర్యం. అంటే వేదాధ్యయనం చెయ్యడమే.

పితృఋణం : పితృదేవతలు మనకు శరీరాన్నిచ్చారు. అందువలన మనం వారికి ఋణపడి ఉన్నాం. అది తీర్చుకొనే ఉపాయం వంశం కొనసాగేవిధంగా సత్సంతానాన్ని కనడమే.

ఈ మూడు ఋణాలూ తీర్చుకొనిన తరువాతనే మనస్సును మోక్షమార్గంలో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ఇవేవీ తీర్చుకొనని తన పుత్రులను మోక్షమార్గంలో ప్రవేశపెట్టి నారదుడు వారిని భ్రష్టుల్ని చేశాడు - అని దక్షుడి అభిప్రాయం)

దక్షుని కూతుళ్ళు ఎంత పుణ్యం చేశారో కదా! అందరూ సాటిలేని సవతులే అయినా ముల్లోకాలూ వారి సంతానమయ్యేంతగా సంతానవతులయ్యారు. ఏ తల్లి వారిని కన్నదో కదా!

దక్షప్రజాపతికి అరవైమంది పుత్రికలు. వారిలో పదిమంది ధర్ముని భార్యలు. వారి పేర్లు - భానువు, లంబ, కకుప్పు, జామి, విశ్వ, సాధ్య, మరుత్వతి, వసువు, ముహూర్త, సంకల్ప. వారిలో భానువు కొడుకు వేదఋషభుడు. వేదఋషభుని కొడుకు ఇంద్రసేనుడు. లంబయొక్కపుత్రుడు విద్యోతుడు. విద్యోతుని పుత్రులు స్తనయిత్నువులు. కకుబ్దేవి యొక్క పుత్రుడు సంకుటుడు. సంకుటుని పుత్రుడు కీకటుడు. కీకటునికి దుర్గాభిమాని దేవతలు పుత్రులు. దుర్గభూములకధిష్ఠాన దేవతలు జామిదేవియొక్క పుత్రులు. ఆ దేవతల పుత్రులు స్వర్గుడు, నంది.

విశ్వయొక్క పుత్రులు విశ్వేదేవతలు. విశ్వేదేవతలకు సంతానం లేదు. సాధ్యయొక్క పుత్రులు సాధ్యగణాలు. సాధ్యగణాల పుత్రుడు అర్థసిద్ధి. మరుత్వతికి మరుత్వంతుడు, జయంతుడు అని ఇద్దరు పుత్రులు. అందులో జయంతుడు వాసుదేవుని అంశతోపుట్టి ఉపేంద్రుడనే ప్రసిద్ది పొందాడు. ముహూర్తకు మౌహూర్తికులనే పుత్రులు కలిగారు. వారు ప్రాణులకు కాలాన్ననుసరించి ఫలం ఇస్తారు. సంకల్ప కొడుకు సంకల్పుడు. సంకల్పుని కొడుకు కాముడు. వసువునకు ద్రోణుడు, ప్రాణుడు, ధ్రువుడు, అర్ముడు, అగ్ని, దోషుడు, వస్తువు, విభావసువు అనే ఎనమండుగురు వసువులు పుట్టారు. వారిలో ద్రోణుని భార్య అభిమతి. వారికి హర్షుడు, శోకుడు, భయుడు అనేవారు జన్మించారు.

ప్రాణుని భార్య ఊర్జస్వతి. వారికి సహుడు, ఆయువు, పురోజవుడు అనే ముగ్గురు పుత్రులు. ధ్రువుని భార్య ధరణి. పురములు వారి సంతానం. అర్కుని భార్య వాసన. వారి పుత్రులు తార్ష్యుడు మొదలయినవారు. అగ్నిభార్య వసోర్ధార. ద్రవిణకాదులు వారి పుత్రులు. అగ్నికి కృత్తికలు కూడా భార్యలు. వారికి స్కందుడు పుత్రుడు. స్కందునికి విశాఖుడు మొదలయినవారు పుత్రులు. దోషుని భార్య శర్వరి. ఆమె పుత్రుడు శింశుమారుడు. అతడు శ్రీహరి అంశతో జన్మించాడు. వస్తువు భార్య ఆంగిరస. విశ్వకర్మ అనే శిల్పాచార్యుడు ఆమె కొడుకు. విశ్వకర్మ భార్య ఆకృతి. ఆమె పుత్రుడు చాక్షుషమనువు. ఆ మనువునకు విశ్వులు, సాధ్యులు అనేవారు పుత్రులు. విభావసుని భార్య ఉష ఆమె పుత్రులు వ్యుష్టి, రోచిస్సు, ఆతపుడు. ఆతపుని పుత్రుడు పంచయాముడు. అతడు దివసాభిమానిదేవత. భూతుడు శంకరుని అంశతో జన్మించాడు. భూతుని భార్య సురూప. కోట్లాదిమంది రుద్రగణాలు ఆమె పుత్రులు. అంతేకాదు. సురూపకు రైవతుడు, అజుడు, భవుడు, భీముడు, వాయుడు, ఉగ్రుడు, వృషాకపి, అజైకపాత్తు, అహిర్బుధ్న్యుడు, బహురూపుడు, మహాంతుడు అనేవారు, రుద్రుని అనుచరులయిన ప్రేతలు, వినాయకులు అనేవారు కూడా పుత్రులుగా ఉదయించారు.

అంగిరసుని భార్య స్వధ. పితృగణాలు ఆమె పుత్రులు. అంగిరసుని మరో భార్య సతి. ఆమెకు అథర్వాఖీమాన దేవతలు పుత్రులు. కృతాశ్వుని భార్య అర్చిస్సు. ఆమె పుత్రుడు ధూమ్రకేశుడు. వేదశిరస్సుని భార్య ధిషణ. ఆమెకు దేవలుడు, వయునుడు, మనువు అని ముగ్గురు పుత్రులు. తార్ష్యునకు వినత, కద్రువ, పతంగి, యామిని అని నలుగురు భార్యలు. వారిలో పతంగి సంతానం పక్షులు. యామిని సంతానం మిడుతలు. వినతకు ఇద్దరు కొడుకులు. గరుత్మంతుడు, అనూరుడు, గరుత్మంతుడు శ్రీహరి వాహనం. అనూరుడు సూర్యుని రథసారథి. కద్రువ సంతానం పాములు. కృత్తికాది నక్షత్రాలు చంద్రుని భార్యలు. చంద్రుడు రోహిణియందు అధికాసక్తుడయి తక్కిన భార్యలను పట్టించుకోని కారణంగా దక్షుడు చంద్రుణ్ణి క్షయ రోగగ్రస్తుడవగుము అని శపించాడు. ఆ కారణంగా సంతానం పొందే అర్హత చంద్రునికి లేకపోయింది. అటుపైన దక్షుడు అనుగ్రహించగా క్షీణించిన కళలు తిరిగి చంద్రుణ్ణి చేరాయి. ఇంతేకాక -

ఎవరు కశ్యప ప్రజాపతికి భార్యలో, ఎవరు అలౌకికమైన చరిత్ర కలిగి సమస్త జగత్తుల పూజలందుకుంటున్నారో, ఎవరి పుత్రులు, పొత్రులు బలవంతులయి ముల్లోకాలను పరిపాలించారో, ఎవరికి కొంగుబంగారమై ఎంత వ్యయం చేసినా తరుగని పుణ్యం ఉందో అటువంటి కశ్యపుని భార్యల యొక్క నానావిధాలయిన సంతతిని స్పష్టంగా నిరూపించడం అసాధ్యం. సంతానవతులయిన ఆ ప్రసిద్ధ సాధ్వీమణుల పేర్లు, వారి వంశాలు చెప్తాను. ఓ రాజా! విను.

(ముంగొంగు బంగారం అనేది తెలుగు జాతీయం. మూల్గుపుణ్యం అంటే ఎంత తీసినా తరగకుండా గుట్టలు గుట్టలుగా పడి ఉందనీ, ముంగొంగు బంగారం అంటే అవసరమయిన వెంటనే వాడుకునేందుకు వీలయినది, విలువైనది అని అర్ధం.)

మూడు లోకాల్లో ఉన్న ప్రాణులన్నీ అదితి, దితి, కాష్ఠ, దనువు, అరిష్ట తామ్ర, క్రోధవశ, సురస, సురభి, ముని, తిమి, ఇళ, సరమల సంతానమే.

తిమికి చేపలు మొదలగు జలచరాలు పుట్టాయి. సరమకు వ్యాఘ్రాది క్రూరజంతువులు పుట్టాయి. సురభికి దున్నపోతులు, ఆవులు మొదలయినవి జన్మించాయి. తామకు డేగలు, గద్దలు పుట్టాయి. మునికి అప్సరసలు, ఇళకు చెట్టు, చేమలు, క్రోధవశకు పాములు, సురసకు రాక్షసులు, అరిష్టకు గంధర్వులు, దనువునకు సుప్రసిద్ధ బలంకల పద్దెనిమిది మంది దేవతాశత్రువులయిన రాక్షసులు జన్మించారు. వారి పేర్లు, వంశాలు విను.

కశ్యపుని భార్యలలో దనువొకతె. ఆమె పుత్రులు పద్దెనిమిదిమంది. వారి పేర్లు - ద్విమూర్ధుడు, శంబరుడు, అరిష్టుడు, హయగ్రీవుడు, విభావసుడు, ఆయోముఖుడు, శంకుశిరుడు, స్వర్భానుడు, కపిలుడు, అరుణి, పులోముడు, వృషపర్వుడు, ఏకచక్రుడు, అనుతాపకుడు, ధూమ్రకేశుడు, విరూపాక్షుడు, విప్రచిత్తి దుర్జయుడు. వీరిలో స్వర్భానువు కూతురు సుప్రభ, ఆమె భర్త నముచి. వృషపర్వుని కూతురు శర్మిష్ట ఆమె భర్త యయాతి. అతడు నహుషుని కొడుకు. వైశ్వానరునకు ఉపదానవి, హయశిర, పులోమ, కాలక అని నలుగురు పుత్రికలు. ఉపదానవి హిరణ్యాక్షుని భార్య. హయశిర భర్త క్రతువు. పులోమకాలకలను బ్రహ్మవాక్యముపై కశ్యపుడు వివాహమాడాడు. పులోమకు పౌలోములు, కాలకకు కాలకేయులు పుట్టారు. వారు సమరకోవిదులు. పొలోమకాలకేయులకు అరువదివేలమంది రాక్షసులు జన్మించారు. వారు యజ్ఞాలను ధ్వంసం చేసేవారు. ఇంద్రుని ప్రీతి కొరకు నీ తాతగారైన అర్జునుడు వారిని వధించాడు. విప్రచిత్తికి సింహికయందు రాహువు, వందమంది కేతువులు మొత్తం నూట ఒక్కమంది జన్మించారు. వారు గ్రహాలు. ఆదిపురుషుడైన శ్రీహరి తన అంశతో అదితియందు జన్మించాడు. అంత అదృష్టవంతురాలయిన అదితి వంశం విను. వివస్వంతుడు, అర్యముడు, పూషుడు, త్వష్ట సవిత, భగుడు, ధాత, విధాత, అరుణుడు, మిత్రుడు, శక్రుడు, ఉరుక్రముడు అనే పేర్లుకల పన్నెండుగురు సూర్యులు అదితికి జన్మించారు. వివస్వంతునికి యముడు, యమి అనే కవలలు కలిగారు. సంజ్ఞ ఆడుగుర్రం రూపం ధరించి అశ్వినీ దేవతలను కన్నది. వివస్వంతుని మరో భార్య ఛాయ. ఆమెకు శని, సావర్ని అనే మనువు, తపతి అనే కూతురు పుట్టారు. తపతి భర్త సంవరణుడు. అర్యముని భార్య మాతృక. వారి సంతానం చర్షణులు. వారు వివేకంకల వారయిన కారణంగా వారిని ఆధారంగా చేసుకొని బ్రహ్మ మానవజాతిని రచించాడు. పూషుడు భర్గుని చూచి నవ్వగా అతడు కోపగించి పూషుని పళ్ళు రాలగొట్టాడు. అప్పటి నుంచి అతనికి పిండే తిండి. ఆ పూషునికి సంతానం లేదు. త్వష్టయొక్క భార్య రచన. ఆమె దితిపుత్రులకు చెల్లెలు. త్వష్ట రచనల కొడుకు విశ్వరూపుడు. దేవతలు బృహస్పతికి కోపం వచ్చేవిధంగా ప్రవర్తిస్తే బృహస్పతి దేవతలను విడిచి వెళ్ళిపోయాడు. అపుడు దేవతలు విశ్వరూపుణ్ణి తమ గురువుగా స్వీకరించారు. ఈ విధంగా శుకమహర్షి చెప్పగా పరీక్షిన్మహారాజు ఇలా అడిగాడు.

దేవాసుర యుద్ధ ప్రారంభము

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

పంచాంగం

Chitraketu Engaged in Deep Meditation for Seven days, completely focusing his mind on Lord Sankarshana (Vishnu) and got his blessings - చిత్రకేతుండు తపం బాచరించి భగవత్ప్రసాదంబు నొందుట

చిత్రకేతుండు తపం బాచరించి భగవత్ప్రసాదంబు నొందుట సుఖదుఃఖాలతో సంబంధం లేకుండా, అన్ని విషయాలలో ఉపేక్ష భావంతో ఉండే పరమాత్మ అయిన ఆ పరమేశ్వర స్వరూప...