Saturday, March 21, 2026

Vamana Avatar Story - వామనచరిత్ర కథాప్రారంభము

వామనచరిత్ర కథాప్రారంభము

పై విధంగా చెప్పిన శుకునితో పరీక్షిత్తు ఇలా అన్నాడు.

హరి బలిచక్రవర్తిని ఎందుకొరకు మూడడుగుల భూమిని యాచించినాడు? విష్ణువు పూర్ణపురుషుడు, పూర్ణకాముడు, నిర్వికారుడు, లక్ష్మీదేవితో కూడినవాడు. అటువంటివాడు బలిచక్రవర్తి వద్దకు దీనునివలె ఎందుకు పోయినాడు? తప్పేమీలేని నిష్కలుషుడైన బలిని ఎందుకు బంధించినాడు? ఈ కథ వినాలని కుతూహలంగా ఉంది.

(రమాసంపన్నుడైన విష్ణువు యాచకుడుగా వెళ్ళటం ఒక వింత. మూడడుగులనేలను యాచనచేసి పుచ్చుకొని దాత అయిన బలిని బంధించడంలో వంచన కనిపిస్తుంది. జగత్త్రయోన్నత న్యాయపీఠమైన విష్ణువు నిరపరాధిని దండించటం ఏమి? బలిచక్రవర్తి కథలో ఈ సందేహాలు జిజ్ఞాసువులకు తప్పక కలుగుతాయి. దీనికి సమాధానంగానే బలి- వామనమూర్తుల కథాగమనం జరుగుతుంది.)

పై విధంగా పలుకగా శుకముని ఈ విధంగా చెప్పాడు.

బలిచక్రవర్తి ఇంద్రునిచేతిలో ఓడిపోయి శుక్రాచార్యుని అనుగ్రహంచే తేరుకొన్నాడు. శుక్రునికి దయకలిగేటట్లు శిష్యుడై సేవించినాడు. బలి భక్తికి శుక్రుడు మెచ్చుకున్నాడు. బలిచేత నియమపూర్వకంగా విశ్వజిద్యాగాన్ని చేయించినాడు. బలిచక్రవర్తికి బంగారు పట్టముచే ఒప్పు రథమూ; సూర్యుని గుర్రాలతో సమానమగు గుర్రాలను, సింహపతాకాన్నీ దివ్యధనువునూ, అంబులపొదులజంటను, కవచమును మొదట హోమపావకుడిచ్చినాడు. తర్వాత తన తాతగారు ప్రహ్లాదుడు వాడిపోని తామరపూవులదండను, శుక్రుడు చంద్రునివంటి తెల్లని శంఖాన్ని ఇచ్చినారు.

ఈ విధంగా, బలిచక్రవర్తి బాణాలూ, రథమూ, ఖడ్గమూ, అంబులపాదీ, విల్లూ, పూలదండా, గుర్రమూ, కవచమూ, రత్నఖచితసువర్ణ కంకణాలూ సాధించినాడు.

బలిచక్రవర్తి బ్రాహ్మణులకు పలురకములైన దానాలిచ్చి, వారి ఆశీస్సులను పొందినాడు. పెద్దలకు నమస్కరించినాడు, విశిష్టదేవతలను నిండు భక్తితో పూజించినాడు. నిర్మలచరిత్రుడైన ప్రహ్లాదుని పిలిపించుకొని నమశిరస్కుడై నమస్కరించినాడు. దివ్యకాంతులతో తేజరిల్లు రథమునెక్కి పర్వతశిఖరముపై ప్రజ్వరిల్లుతున్న దావాగ్నివలె జాజ్వల్యమానుడైనాడు (ప్రకాశించాడు).

బలిచక్రవర్తితో సమానమైన బలముగల దైత్యసేనాధిపతులు ఆయనముందు వినమ్రులై నిలిచినారు. వారు మృత్యుదేవతయైన, యముడినే దండింపగల ఉద్దండులు. దేవతలూ, సిద్దులూ, సాధ్యులూ, గంధర్వులూ మొదలయినవారిని భంగపరచినవారు. దిక్కులను పిండిగొట్టగలిగినవారు.

పరీక్షిన్నరేంద్రా! బలిచక్రవర్తి తన చూపులతో ఆకాశాన్ని మింగుతూ, నింగినీ నేలనూ తలకిందులుగా చేయడానికి ప్రయత్నిస్తూ దేవతల రాజధానినగరానికి బయలుదేరినాడు.

ఈ విధంగా బలశాలియైన బలిచక్రవర్తి దేవేంద్రుని జయించి పగతీర్చు కోవటానికి వేగంగా దీర్ఘమైన ప్రయాణం సాగించి.

పుణ్యాత్ములు నివసించుటకు తగినది, వ్యాధులనూ, నీద్రనూ, బాధనూ, అన్నం తినటం మొదలయిన దుఃఖాలను బాపునదీ, పూలచేత చిగుళ్లచేత పండ్లచేత గొప్పవయిన చెట్లగుంపులచే ఒప్పునదీ, ఎగురుతున్న జెండాలుకలదీ, సంచరిస్తున్న విమానస్థులగుంపు కలదీ, ఇంద్ర వైభవము కలదీ అగు స్వర్గాన్ని చూచెను. అది దేవేంద్రుని రాజధాని - అమరావతి.

బలిచక్రవర్తి చాలా విశాలమైన దేవతలపట్టణాన్ని సమీపిస్తూ వేగంగా ముందుకు సాగినాడు. తొలుత పెద్దతోటలు కనిపించినాయి. ఆ తోటలలోని చెట్లు ఎప్పుడూ అందంగా పొటమరించే చిగుళ్లతో, రెమ్మలతో, మొగ్గలతో, అరవిచ్చిన విరులతో, విరబూసిన పూలగుత్తులతో, పిందెలతో, లేతకాయలతో, దోరగాయలతో, పండ్లగెలలతో నిండి బరువెక్కి వంగి ఉన్నాయి.

దట్టమయిన ఆ తోటలలో తుమ్మెదలగుంపుల జంటలు వదలక సొగసైన కొత్తపూలతో నిండి ఉన్న పూతేనియను కొసరి కొసరి తాగి బలసి కైపెక్కి జుంజుమ్మని సంతోషంతో విహారంచేస్తున్నాయి. కోయిలగుంపులు జంటబాయక కలసిమెలసి గున్నమామిడి చెట్ల కొమ్మలలో ముసరి సొంపుగా చిగురుటాకులు మెక్కి ఉత్సాహంతో గానం చేస్తున్నాయి. చిలుకల గుంపులు మత్తెక్కి త్వరపడుతూ పోరాడుతూ చెలరేగి నేర్పుతో తియ్యని పండ్లుతిని కలకలధ్వనులు సలుపుతున్నాయి. పావురాలు చిలుకలనుమించి ఆకసానికి ఎగురుతూ ఆడపావురాలను దగ్గరకు పిలుస్తూ అటూ ఇటూ పోనీయక అడ్డుకొంటూ తమ నెలవులపై వ్రాలి ఇంపుగా గుబాళిస్తున్నాయి.

రాజహంసలు అందమైన సరస్సులవద్ద ఉత్సాహంగా ఆడ హంసలతో కలిసి తమ వాడిముక్కులతో లేత తామరతూడులు చీల్చి తిని సంతోషంతో సవ్వడి చేస్తున్నాయి. అందమైన ఆ సరస్సులు హంసల కాంతికంటె అధికంగా మిలమిలమెరుస్తూ సిరికి నెలవులవంటి బంగారుతామరలతో విరాజిల్లుతున్నాయి. ఆ సరస్సుల అలలలో తడిసిపోయి వడవడ వణకుతూ అల్లిబిల్లిగా అల్లుకొని నేలవ్రాలిన దట్టమైన తీగల సందులలో జొరబడి ఇంపైన పూలవాసనలతో బరువెక్కి లోపలకు దూరలేక చల్లగాలులు చతికిలపడుతున్నాయి. ఆ గాలులతో కలిసి పై కెగిరిన పుప్పొడులు ఆకసంలో నిండి రంగురంగుల మేలుకట్టు చాందినీలను సృష్టిస్తున్నాయి.

పుప్పొడి రంగులతో కలిసిన కాలువల గట్లమీద ఇచ్చ వచ్చినట్లుగా పచ్చిక గుబురులు మేస్తూ మైమరచి నెమరువేస్తూ తమ పెద్దపొదుగులు కదలిస్తూ కామధేనువులు నడచి వస్తున్నాయి. వాటి దూడలు వాడవాడలలో చెంగుచెంగునదూకి ఆడుకుంటూ తల్లుల వెంట వెళ్లుతున్నాయి. కామధేనువులు దూడలతోకూడి ఇండ్ల వాకిండ్లు చేరి పౌరులు కోరినన్ని పాలు కురుస్తున్నాయి. కోరినవారి కోరికలు తీర్చే కల్పవృక్షాలు ఆ కామధేనువులకు నిలువ నీడనిస్తున్నాయి. ఆ కల్పవృక్షాల చిగుళ్ళనూ పూలగుత్తులనూ కోసి మదపుటేనుగులు ఆడఏనుగులకు ప్రేమతో ఇచ్చి సంతోషాన్ని కలుగజేస్తున్నాయి. ఆ మదపుటేనుగులు క్రీడాపర్వతాల సాగసుతో ఒప్పారుతున్నాయి. అవి పడుచులకు నడకలు నేర్పు ఒజ్జలై మురువుగా నడుస్తున్నాయి. ఆ ఏనుగుల శరీరాలు రాచుకోవడం వల్ల కరకుతనం పోయి నున్నబడుతున్న మకరతోరణ స్తంభాలు కనువిందు కలిగిస్తున్నాయి.

మకరతోరణాల స్తంభాల వద్ద రంభ మొదలయిన అప్సరసలు నిలబడి ఉన్నారు. వారు మన్మథుడు ఒరలోనుండి తీసిన పదునుకత్తులవలె మెరుస్తున్నారు, నిలుకడగల మెరుపుతీగలవలె ఉన్నారు. కాళ్ళూ చేతులూ మొదలయిన అవయవాలు కలిగిన నెలవంకవలె ఉన్నారు. రూపుదాల్చిన మోహినీ విద్యలవలె చూపులకు హాయి కలిగిస్తూ శృంగార రహస్యాలు తెలుసుకోవటంలో పేరుగాంచినవారై, విమానాలపై స్వర్గలోకానికి వచ్చే పుణ్యాత్ములకు త్వరగా ఎదురుపోయి కొందరిని సగౌరవంగా వాహనాలపై ఎత్తుకొని/మోసుకుంటూ మరి కొందరని తోడ్కొని పోతున్నారు.

ఆ నగరానికి చుట్టూ అందమైన అగడ్తలు ఉన్నాయి. ఆ అగడ్తల నీటిలో అంచలూ రాయంచలూ, చక్రవాకాలూ, బెగ్గురు పక్షులూ విహారం చేస్తుంటాయి. అందలి కలువలలోనూ, కమలాలలోనూ తుమ్మెదలు సంతోషంతో సంచరిస్తుంటాయి.

ఆ అగడ్తలు అడ్డులేని తరంగాలుగల గంగానది ఆకాశానికి పొంగినట్లు వెరగు కలిగిస్తుంటాయి దేవకన్యలు గుంపులు గుంపులుగాచేరి వాటిలోని తేటనీటిలో అందంగా హాయిగా జలకా లాడుకొంటుంటారు.

ఆ నగరం ముంగిలిలో భద్రమైన బంగారు తలుపులుగల పెద్దగోపురా లున్నాయి. ఆ గోపురాల గడపలను అక్కడి దేవవేశ్యలు పూజిస్తుంటారు. ఆ ద్వారాల ప్రక్కన అరుగులపైన రత్నకాంతులు వెదజల్లే ఇంద్రనీలాలస్తంభాలు ఉన్నాయి. ఆ నాలుగు ద్వారాలకూ పద్మరాగాల మాలలు వేలాడుతున్నాయి. ఆ ద్వారాల దగ్గర ఉన్న చావిళ్ళలో పరాక్రమ వంతులయిన ద్వారపాలకులు ఆయుధాలు ధరించి మెలకువతో కాపలాకాస్తున్నారు. వారు దేవదానవుల యుద్దాల ముచ్చటలు ముచ్చటించుకుంటుంటారు. అచ్చటి ఎత్తెన మెట్ల వరుసలు వీరరస సముద్రపు చెలియలికట్టల వంటి అచ్చమైన పాలరాళ్ళతో కట్టబడి ఉన్నాయి. అక్కడి కోటలు అత్యంత శోభాయమానమై వజ్రాలతోనూ వెండితోనూ నిర్మించబడి ఉన్నాయి. ఆ కోటల పైభాగాలు చంద్రుని కిరణాలు వెల్లివిరిసే తెల్లని అద్దాలవలె ఉన్నాయి. వాటికాంతులు చుక్కలను ధిక్కరిస్తుంటాయి. ఆ నగరలక్ష్మి ప్రాయంతో నిండిన యువతివలె మేఘాలను చూస్తూ బ్రహ్మను ప్రార్థించి సంపాదించిన బంగారు పరదాలవలె పెద్ద పెద్ద వెండి ప్రాకారాలు ప్రకాశవంతాలై ఉన్నాయి. ఆ ప్రాకారాలపై మరకతమణులతో నిర్మించిన బురుజులున్నాయి. కోట్ల కొలది గంధర్వ సైనికులు రణసన్నద్ధులై వాటిని కాపాడుతుంటారు. ఆ బురుజులపై ఎత్తైన వజ్రాల స్తంభాలున్నాయి. వాటిమీద శత్రువీరుల ప్రాణాలు తీసే ఫిరంగులు అమర్చబడి ఉన్నాయి. వాటికి ఇరువైపులా రథాల ఇరుసులు రాచుకొంటూ ఆరిపోని దీపాలవలె సూర్యచంద్ర మండలాలు ప్రాకాశిస్తుంటాయి.

ఆ నగరంలోని మేడలు ఆకాశా న్నంటుతుంటాయి. అందలి సుందరీమణులు చంద్రబింబాన్ని నిగ్గుటద్దంగా తలచి తొంగి చూస్తూ తమ నొసటిపైని వ్రేలాడే ముంగురులను సరిదిద్దుకొని తిలకాలను అలంకరించుకొంటుంటారు. అప్పుడు వారి వెనుక వైపుగా వచ్చిన వారి ప్రియుల ప్రతిబింబాలు కనిపించగానే తమ భర్తలు ఇతరస్త్రీలను వలచి వారికి వశులైనారని భ్రమించి తత్తరపాటుతో వెనుదిరిగి అంతలో ప్రతిబింబాలు మాసిపోగానే ఆ స్త్రీలు ఏకాంతంగా తమ ప్రియులకోసం నిరీక్షిస్తుంటారు. ముత్యాల హారాలతో కూడిన ఆ ముద్దుగుమ్మల గుబ్బచన్నుల సొగసుతో ప్రక్కల చుక్కలు మెరుస్తుండగా ఆ మేడల శిఖరాలను సింగారిస్తూ బంగారు కలశాలు ప్రకాశిస్తున్నాయి. ఆ మేడలలోపల బంగారు మయములైన పరుపులూ కిటికీలు ఉయ్యాలలూ మెట్లూ మొదలైనవి ఎంతో మనోహరంగా ప్రకాశిస్తున్నాయి.

ఆ మేడల బంగారు కిటికీల సందులగుండా కర్పూరమూ కుంకుమపువ్వూ సాంబ్రాణి సువాసనల పొగలు వస్తుంటాయి. ఆ పొగలను మేఘాలని భ్రమపడిన నెమళ్లు అనుకోకుండా తమకు పండుగ వచ్చిందని ఆనందంతో తమ రంగురంగుల పింఛాలు విప్పి చెట్లకొమ్మలపై నాట్యాలు చేస్తుంటాయి. అవి మన్మథుని శృంగారవిద్యలకు టీకల విధంగా కేకలు వేస్తుంటాయి. అప్పుడు నెమళ్ల పింఛాలను అల్లెత్రాళ్లుగానూ, వాటికేకలను ధనుష్టంకారాలుగానూ భావించి వెంటనే సూర్యుని పైకి ఉరికే రాహువువలె జెండాలు ఆకాశానికి ఎగురుతున్నాయి. జెండాలు గొడుగులూ తమ యుద్ధ లక్షణాలుగా అవక్రపరాక్రమంతో విజృంభించి పెద్దపులులవలె, ఏనుగులవలె, సింగాలవలె, శరభాలవలె, తోకచుక్కలవలె శత్రువులను లెక్కచేయకుండా కేకలు వేస్తూ గుములు గుములై వీరసైనిక సమూహాలు రాక్షసులతో ద్వంద్వయుద్దాలు చేయటం కోసం దుముకుతున్నారు.

ఖడ్గాలూ శూలాలూ మొదలయిన ఆయుధాలు తళతళమెరుస్తూ దిక్కుల చివరివరకూ వ్యాపించగా చక్రాల ధ్వనులు ఉరుములవలె ధ్వనింపగా వీరుల శరవర్షాలతో మేఘాలవలె ఒప్పుతున్న తేరులు వెలుగొందుతున్నాయి. ఆ తేరులకు సూర్యునిగుర్రాలను వాయువునూ మనస్సునూ మీరిన వేగంతో పరుగెత్తగల గుర్రాలు పూన్చబడి ఉన్నాయి. ఆ నగరంలో ఎత్తైన తెల్లని మదపుటేనుగులున్నాయి. వాటి చెక్కిళ్ళ మీది మదజలబిందువుల సమూహాలు వేయికళ్ళవేలుపురేని (ఇంద్రుని) ఔదార్యవిశేషాలను లెక్కకడుతున్నట్లు ఉంటాయి. ఇంద్రుణ్ణి సందర్శించటానికి గుమికూడిన సమస్త దిక్పాలకుల శుభకరాలైన చేతుల బంగారు మురువులనుండి రాలిన ధూళికణాలతో ఆ పట్టణంలోని వీధులన్నీ నిండి ఉన్నాయి. ఆ దారులకు పై భాగాలలో లక్షల విమానాలు రాకపోకలు జరుపుతూ ఉంటాయి. అవి రోహణ పర్వతం చరియలవలె వెలుగులను వెదజల్లుతుంటాయి. ఆ విమానాలలో తమ ప్రియులతో విహరించే అందగత్తెలు భేరీ వీణా పణవమూ మద్దెలా బాకా శంఖం మొదలయినవాటిని మ్రోగిస్తూ వాటికి తగినట్లు పాటలు పాడుతూ నాట్యాలు చేస్తుంటారు. ఆ నగరంలోని చతుష్పథాలలోని గృహ పరంపరల ముంగిళ్ళలో పెద్దపెద్ద రత్నదీపాలు వెలుగుతుంటాయి. దేదీప్యమానాలైన సభామంటపాలలో చింతామణులు ప్రకాశిస్తుంటాయి.

'స్వర్గ నగరం సముద్రంలా అనిమిషకౌశిక వాహినీవిశ్రుతమై ఉన్నది (చేపలతోనూ నదులతోనూ పేరెన్నికగన్నది/ దేవతలతో ఇంద్రునితో ఆకాశగంగతో పేరెన్నికగన్నది). ఆ నగరం వేదవాక్యంలా ఆకల్మషసువర్ణ ప్రభూతమై ఉన్నది (పవిత్రమైన అక్షరాలతో నిండినది / నిర్మలమైన బంగారంతో అతిశయించినది). ఆ పురం శివుని కంఠం మాదిరిగా భోగిరాజకాంతమై ఉన్నది (సర్పరాజుతో ప్రకాశిస్తున్నది / ధనవంతులయిన ప్రభువులతో ఒప్పుతున్నది). ఆ పట్టణం జవరాలి వక్షోజం వలె సువృత్తమై ఉన్నది (గుండ్రముగానున్నది / మంచి చరిత్రకలిగినది). ఆ నగరం శ్రీరామచంద్రుని తేజస్సువలె ఖరదూషణాది దోషాచరులకు చేరరానిదై ఉన్నది (ఖరుడు, దూషణుడు మొదలయిన రాక్షసులకు చేరటానికి శక్యంకానిది / కఠినమైన నిందలు మొదలగు దోషములు ఆచరించువారికి పొంద శక్యంకానిది). ఆ పురం విద్వాంసుని చరిత్రవలె అమలాంతరంగ ద్యోతమానమైనది (స్వచ్చమైన హృదయాలకు స్ఫురించేది / నిర్మల మనస్కులయిన ఫుణ్యాత్ములతో ప్రకాశించేది).

ఆ నగరం అభిమానవంతుని ప్రవర్తనం వలె సన్మార్గభాతి సుందరమైనది (మంచిమార్గంలో మిక్కిలిచక్కగా ప్రకాళించేది/ ఆకాశమార్గమందలి చుక్కలతో మిక్కిలి చక్కనైనది). ఆ పట్టణం అందమైన ఉద్యానవనం వలె రంభాంచితాశోకపున్నాగమైనది (అరటి చెట్లతో కూడిన అశోకవృక్షాలు పున్నాగ వృక్షాలు కలది / రంభతో కూడి ఆనందంగా ఉన్న పురుషశ్రేష్ఠులు కలది). ఆ పురం సురపొన్నవృక్షంవలె సురభిమనో విశేషమైనది (సుగంధంతోకూడిన పుష్పాలతో అతిశయించినది / కామధేనువులతోను దేవతలతోను నిండినది). ఆ నగరం ఆదిశేషుని శిరస్సువలె ఉన్నత క్షమావిశారదమైనది (మహోన్నతమైన భూమండలం కలది / విశేషమైన క్షమాగుణంతో ఒప్పారుతున్నది). ఆ పట్టణం శరత్కాలం మాదిరిగా ధవళజీమూత ప్రకాశితమైనది (తెల్లని మేఘాలతో విరాజిల్లునది / తెల్లని కొండలతో ప్రకాశించునది). ఆ నగరం కృష్ణాజిన దానంవలె సరస తిలోత్తమమైనది. (మంచి నువ్వులతో ఒప్పారినది / సరసురాలైన తిలోత్తమతో ఒప్పారినది). ఆ పురం ఉత్తమపురుషుని వాక్కు వలె అనేక సుధారస ప్రవర్షమైనది (అఖండమైన తియ్యదనాన్ని వర్షించేది / అఖండమైన అమృతవర్షాన్ని వర్షించేది).

ఆ పట్టణం వర్షఋతువు ప్రారంభంవలె ఉల్లసదింద్రగోపమైనది (ప్రకాశించే ఆరుద్రపురుగులు గలది/ ప్రకాశించే ఇంద్రునిచేత రక్షింపబడేది). ఆ నగరం నందీశ్వరుని మూపురంవలె విచక్షు రార్యాలంకృతమైనది (శివపార్వతులతో అలంకరింపబడినది / వెల్పుపెద్దలతో విరాజిల్లునది). ఈ విధంగా ఐశ్వర్యవంతమై పరమధన్యమైన ఆ అమరావతీ నగరానికి చేరి బలిచక్రవర్తి పట్టణం కోటను చుట్టుముట్టడానికి సైన్యాలకు ఆజ్ఞ ఇచ్చినాడు. అన్ని దారులనూ అరికట్టి గట్టి పట్టుదలతో ఉన్నాడు.

(అమరావతీ నగరవర్ణనం రెండేసి అర్థాలుగ శ్లేషతో సాగింది. ఇలాంటి వర్ణనలు బాణభట్టు, దండి మొదలయినవారి బాణిలో సాగును.)

అమరావతీ పురాన ఉండే స్త్రీలకు మలినంపొందుట, కన్నులార్చుట, ముసలితనం పొందుట, దుర్మార్గులను చేరుట, పుణ్యాత్ములను విడుచుట అనేవి లేవు.

దానవనాథులు చేసిన శంఖారావములు భయంకరంగా వినిపించటంచే దేవతాస్త్రీల గర్భాలు పగిలి ఆ గర్భాలలోని శిశువులు భయంతో రోదించినారు.

బలిచక్రవర్తి అమరావతిని ముట్టడించటాన్ని గమనించిన ఇంద్రుడు కోటకు బలమైన కాపలా పెట్టించినాడు. సేనాధిపతులతో సమాలోచన ప్రారంభించినాడు. దేవగురువు మంత్రియు అగు బృహస్పతిని పిలిపించినాడు. దండయాత్రనుగురించి వివరించినాడు. 'వాడు(బలి) ప్రళయాగ్నివలె మండిపడుతున్నాడు. బలవంతులైన రాక్షసులతో కూడి ఉన్నాడు. మనతో ఓడిపోయి మరల ఇప్పుడు వచ్చినాడు. ఏ తపస్సుచేత వీడికి ఇంతటి బలం వచ్చింది? ఈ దురాత్మునికి ఎవడు సహకారి అయినాడు? వీడిని గెలవడానికి దారి ఏది? ఏమి చేద్దాము? వీడిని ఎదిరించి నిలువగల వీరుడు ఎవడు అని పలికినాడు.

ఈ బలిచక్రవర్తి మేరుపర్వతానికన్నా ఎత్తుగా విజృంభిస్తూ ఆకాశాన్ని మింగేటట్లున్నాడు. లోకాలను మింగివేసే కాలాంతకునివలె ఉన్నాడు. ఎదిరిస్తే వీడు బ్రహ్మనుకూడా భంగపరుస్తాడు.

"ఓ గురువర్యా! రాజ్యమంతాకూడా బలిచక్రవర్తికి ఈయలేము. యుద్ధం చేయటానికీ పోలేము, పోతే వాడి నుండి తప్పించుకొనలేము. చూచి చూచి చావలేము. ఇక మీదట ఏది దారి?"

అని పలికిన దేవేంద్రునితో బృహస్పతి ఇలా అన్నాడు.

ఓ ఇంద్రా! వినుము. భృగుప్రవరులు బలికి బలసంపదను సమకూర్చినారు. ఈ రాక్షసుని ఎదుట నిల్చుటకు హరిహరులకుతప్ప ఇతరులకును, నీకును, నీకన్నా అధికులకును శక్యంకాదు. నీవు ఇప్పుడు రాజ్యాన్ని విడిచిపోవటమే మంచిది. విరోధులకు కష్టాలు వచ్చినపుడు పసిగట్టి మరల అమరావతికి చేరటం మేలని నా అభిప్రాయం. వేదపండితులైన విప్రుల వాగ్బలముచె వీడికి ఇంతటి శక్తి సమకూరింది. ఇకపై వీడు బ్రాహ్మణులను గౌరవించడు. అందువల్ల వీని పరాక్రమం సన్నగిల్లుతుంది. అంతవరకు శత్రునామం కూడా స్మరింపక తొలగిపోవటం మేలు.

విరోధిని జయించటమో, సమానంగా పోట్లాడటమో, చావటమో జరగాలి. జయించటమో, చావులేని పక్షంలో పారిపోవటమో మంచిది.

(పరిస్థితులు అనుకూలించనప్పుడు ఉన్న వాటినే పట్టుకొనివ్రేలాడటం వివేకం కాదు. అహంకారం పనిచేయదు. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు తప్పుకోవటం మంచిదనే నీతిని ఈ పద్యం బోధిస్తుంది.)

దేవగురువైన బృహస్పతి ఏపని చేయాలో ఎప్పుడు చేయాలో చక్కగా దర్శింపగలిగినవాడు. ఇంద్రాదిదేవతలకు సమయోచిత కర్తవ్యాన్ని బోధించినాడు. ఆయన చేసిన ఉపదేశము విన్న దేవతలు తమకు ఇష్టమైన రూపాలు ధరించి అనుకూలమైన తావులకు వెళ్లిపోయినారు. అప్పుడు శత్రువులు విడిచిపెట్టిన అమరావతిని బలి ఆక్రమించినాడు. బలి మూడులోకాలను తనవశం చేసికొని విశ్వవిజయుడై చాలాకాలం రాజ్యం చేసినాడు. శుక్రాచార్యుడు మొదలయిన దానవవాత్సల్యం కలవారు అతనిచేత నూరు అశ్వమేధయాగాలను చేయించినారు.

బలిచక్రవర్తి పాలనలో యాచించే దుస్థితి ఎవ్వరికీ లేదు. దానమిచ్చే దాతకు లోటులేదు. ప్రయత్నాలన్నీ ఫలిస్తున్నాయి. ఎవ్వరికీ శత్రువులు లేరు. దేవాలయాలలో మహోత్సవాలు వేడుకలు జరిగేవి. వేదవేత్తలైన బ్రాహ్మణుల కెటువంటి కోరికలు లేవు. వారు సంపూర్ణ మనోరథసిద్ధి గలవారు. సకాలానికి సరియైన వానలు పుష్కలంగా కురిసేవి. భూమికి 'వసుంధర' (బంగారును ధరించేది) అనే పేరు సార్థకమైనది.

బలిచక్రవర్తి చేతిలో దేవతలంతా ఓటమి చెంది పారిపోయి అజ్ఞాతంగా ఎక్కడో దాగినారని తెలిసిన దేవమాత అదితి దుఃఖంతో అనాథవలె కుమిలిపోతూ ఉంది. ఒకనాడు ఆమె భర్తయగు కశ్యపప్రజాపతి తపస్సును విరమించి ఆమెవద్దకు వచ్చాడు. ఆమె భర్తకు చేయవలసిన సేవలన్నీ చేసింది. ఆమె ముఖము విచారముతో కందిపోవటాన్ని గమనించిన కశ్యపుడు ప్రేమగా ఆమె చిబుకాన్ని పట్టుకొని బుజ్జగిస్తూ ఏల ఏడ్చెదవంటూ

ఓ ఇంతీ! వేదములు చదివిన బ్రాహ్మణులు ఏ లోటులేక సుఖంగా ఉన్నారా? దేవతార్చనాది ఆచారాలు జరుగుతున్నాయా? గృహస్థులు ప్రతిదినము చేయవలసిన అగ్ని హోత్రాదికర్మములను సమయముతప్పకుండా చేస్తున్నారా? కుమారులు ధర్మము తప్పకుండా నడుస్తూ ఉన్నారా? అభ్యాగతులకు అన్నపానాదులు సరిగా ఇచ్చుచుంటివా? యాచకులను, సేవకులను, సుజనులను, పరాకులేకుండా గౌరవించుచుంటివా?

అన్నంకానీ, మజ్జిగకానీ, నీళ్లుకానీ, కూరకానీ, తమకు ఉన్నంతలో అతిథులకు లేదనకుండా పెట్టాలి. అలా పెట్టనివారు ఎంత ధనవంతులైనా పేదవారే!

విష్ణువుకు ముఖము అగ్ని మరియు బ్రాహ్మణులు. కనుక అగ్ని బ్రాహ్మణులు తృప్తిపొందితే విష్ణువుకూడా తృప్తిని పొందుతాడు. విష్ణువు తృప్తిపడితే సమస్తలోకాలూ కూడా తృప్తిపడతాయి.

నీ కుమారులు నీవంటే భయభక్తులతో ఉంటున్నారా? నీ కోడండ్లందరూ నీకు ఎదురుచెప్పి ఇబ్బందిపెట్టక ప్రవర్తిస్తున్నారా? ఇంటిలో ఏ ఇబ్బందీ లేదుకదా?

ఈ విధంగా అడిగిన కశ్యపప్రజాపతితో అదితి ఇలా అన్నది.

హృదయేశ్వరా! కొంచెంకూడా ప్రేమలేక దితి కుమారులూ, మనుమలూ గొప్పబలంతో దేవతలనందరిని పారదోలి సాహసంతో విరోధులై అమరావతిని ఆక్రమించి ఏలుతున్నారు. నీకేమని చెప్పుదును? మేలు కలిగేటట్లు ఆలోచించి చూడు.

అక్కచెల్లెండ్లమై యున్నను దితి నాతో కలహాన్ని మానదు. రాక్షసులు దేవతలను మొత్తుచుండగా చూచి తగదని వారింపదు. బాగు బాగు అంటూ మెచ్చుకొంటుంది.

ఎండ అంటే ఎట్టిదో ఎరుగని సుకుమారియైన ఇంద్రుని ఇల్లాలు శచీదేవి దీనత్వంతో పరులపంచల పడింది. మూడులోకములను పాలించు దేవేంద్రుడు అడవుల పాలయినాడు. ఇంద్రుని ముద్దుబిడ్డలు జయంతుడు మొదలయినవారు చెంచుపిల్లల వెంటపోయినారు. దేవతలకు ఆధారంగా ఉండే అమరావతీపట్టణం రాక్షసులకు ఉనికిపట్టయినది. జగములన్నింటను బలి ప్రబలుతున్నాడు. ఇంద్రుడు వానిని గెలువలేడు. అతడే యజ్ఞభాగమంతాకూడా తింటున్నాడు. ఒక్క ముద్దకూడా దేవతలకీయడు.

మహాత్మా! నీవు కొడుకులకందరికి సమానుడవు. కడుపారగా బిడ్డలకన్న బ్రహ్మదేవుడవు. అయినాకూడా నీ సంతానంలోని దుష్టులను నిజంగా దండించవలదా?

మంగళప్రదుడా! ఉత్తములైన వేల్పులు కష్టాలపాలైనారు. సంపదలు కోల్పోయినారు. వారి దుఃఖాన్ని తొలగించు. వారిని అమరావతిలో నెలకొల్పడం, రాక్షసులను శిక్షించడం చేయదగిన మంచిపని. ఈ సత్కార్యం సిద్ధించే మార్గాన్ని ఆలోచించు. నీ కరుణామృత ప్రవాహంతో మమ్ములను తృప్తిపరచు.

అలా పలికిన తన ఇల్లాలి మాటలు విని కశ్యపప్రజాపతి కొంచెం సేపు చింతించి, జ్ఞాన దృష్టితో రాబోయేకాలంలోని సంగతులను తెలుసుకుని ఇలా అన్నాడు.

ఓ ఇల్లాలా! తండ్రి ఎవడు? కొడుకెవడు? పుట్టిన చోటులేవి? పుట్టుకకు కారణమేది? శరీరాలెలా ఉంటాయి? సంసారాలు ఎట్టివి? వినుము! ఇదంతా భగవంతుడగు హరిమాయ. మరేమీలేదు. దీని కంతటికీ మోహబంధం మూలకారణం. దిగులు పడకు.

ఐనప్పటికీ ఇప్పటికి తగిన కార్యాన్ని చెపుతాను విను.

ప్రియురాలా! భగవానుడూ, పురుషోత్తముడూ, జనార్దనుడూ, దయావారిధీ, సర్వాంతర్యామీ, జగదీశ్వరుడూ అయిన హరిని ఆరాధించు. ఆయన ప్రసన్నుడై నీకోరికలను నెరవేరుస్తాడు. ప్రయోజనం చేకూరుతుంది. భగవంతుని సేవించి సకలసౌభాగ్యాలను పొందవచ్చుకదా!

అలా పలికిన కశ్యపునిమాటలను విని అదితి ఈ విధంగా అంది.

నారాయణమూర్తిని ఏ విధంగా ధ్యానించాలి? ధ్యానానికి తగిన మంత్రమేది? దాని నియమాలేవి? పూజించవలసిన కాలమేది. చెప్పండి స్వామీ!

పై విధంగా అడిగిన అదితికి కశ్యపుడు 'పయోభక్షణం' అనే పాలతోచేసే వ్రతాన్ని ఉపదేశించినాడు. అందుకు తగిన కాలాన్నీ మంత్రాన్నీ నియమాన్నీ వ్రతకాలంలో పాటించవలసిన ఉపాసనా విధినీ, దాన భోజనాది విధానాలనూ బోధించినాడు. అదితి ఫాల్గుణమాసం శుక్షపక్షం మొదటిదినాన ఆ వ్రతాన్ని మొదలు పెట్టినది. పన్నెండు దినాలు యథావిధిగా భగవంతుని పూజించినది. వ్రతం అయిపోగానే నియమవంతురాలయిన ఆమెకు విష్ణుదేవుడు ప్రత్యక్షమైనాడు. ఆయన చతుర్బాహుడు. శంఖాన్నీ చక్రాన్నీ గదను ధరించి ఉన్నాడు. పచ్చని పట్టువస్త్రాన్ని కట్టుకొని ఉన్నాడు. కన్నులకు కానరాని భగవంతుడు ఆమె కన్నుల ఎదుట సాక్షాత్కరించినాడు. ఆమె ఆ దేవుని దర్శించింది.

(ఇక్కడ పయోవ్రతమంటే పాలతో చేసే వ్రతం తప్పా నీటితో చేసే వ్రతం కాదు.)

సంతోష బాష్పాలు చనుకట్టుపయిన పడి గగురుపాటుకల దేహంతో నెన్నుదుట దోసిలియొగ్గి నమస్కారములు, స్తోత్రములు చేసి

అదితి హరిరూపాన్ని చూపులతో తనివితీరా త్రాగింది. చాల సంతోషంతో మైమరచి ఆ స్వామివారిని మృదువైన తీయనిమాటలతో ఇలా నుతించింది.

యజ్ఞేశ్వరా! విశ్వంభరా! అచ్యుతా! ఈలోకాలన్నీ నీ స్వరూపమే. నీ పేరు చెవులార విన్నవారికి శుభాలు చేకూరుతాయి. ఆపన్నులగు భక్తులకు దుఃఖాలను పోగొట్టేవాడవు. నీ పాదాలు లోకాలను తరింప చేస్తాయి. ఈ విశ్వము పుట్టుకకు నిలబడుటకు అంతమగుటకు నీవే కారణం. పరిమితి లేని ఆనందమే విలాసంగా కలవాడవు. నిన్ను స్తోత్రం చేసినవారికి కల్పవృక్షంవలె కోరినవి సమకూరుస్తావు. సృష్టిలోని గుణాలన్నీ నీ కంఠసీమలో హారాలై మెరుస్తుంటాయి. సర్వవేదాలసారం నీవే. నిన్ను చక్కగా స్తోత్రం చేసిన వారిని వాత్సల్యంతో కటాక్షిస్తావు. పద్మాక్షా! పరమపురుషా! ఆయువు, శరీరం చక్కగా ఉండటం, వైభవం, రాజ్యం, స్వర్గం, ధర్మం, అర్ధం, కామం, వైదికజ్ఞానం, శత్రువిజయం అనేవి నిన్ను సేవించని నరులకు లభించటం సాధ్యంకాదు.

దైత్యశ్రేష్ఠులు దేవతలను భయపెట్టి పారదోలి స్వర్గాన్ని పరిపాలిస్తున్నప్పటినుండి కూడా నా కంటికి నిద్ర కరువైంది. నా గర్భశోకాన్ని మానిపి రక్షించవయ్యా!

అని పలికిన అదితి మాటలు విని శ్రీహరి చిరునవ్వు చిందించినాడు. ఆశ్రయించినవారికి కామధేనువయిన ఆ పరమాత్ముడు అదితితో ఇలా అన్నాడు.

నీ కోడళ్ళూ, నీ కొడుకులూ; నీ మగడూ; నీవూ మిక్కిలి పొగడేటట్టు, భార్యాభర్తలు చాలా సంతోషించెటట్టు, రాక్షసులు దుఃఖించేటట్లు, నీ కడుపున తేజశ్శాలినై జన్మిస్తాను. నీ కుమారుడనై తిరుగుతూ ఆడుకోవాలని నాకూ వేడుకగా ఉంది.

సహనంతో కూడిన ఉపాయంతో తప్ప, బలాన్ని ప్రదర్శించి రాక్షసులను చంపడానికి వీలులేదు. నీ నియతినీ భక్తినీ నేను మెచ్చుకున్నాను. ఇంద్రుడూ, దేవగణమూ, శచీదేవీ మెచ్చుకొనే విధంగా స్వర్గాన్ని రాక్షసులనుండి అపహరించి ఇంద్రునికిస్తాను. ఇంక విచారమెందుకు?

నా రూపాన్ని మనసులో పెట్టుకొని నీ భర్తను సేవించు. నేను నీ గర్భంలో ప్రవేశిస్తాను. నన్ను దయతో ప్రేమతో పెంచుము తల్లీ!

దేవతలచే స్వర్గాన్ని ఏలిస్తాను. శచీదేవి సౌభాగ్యాలను కాపాడుతాను. రాక్షసులను అధికారంనుంచి తొలగిస్తాను. వారి ఇల్లాండ్ర సొమ్మును ఊడదీయిస్తాను.

ఈ విధంగా భక్త పరాధీనుడయిన పురాణపురుషుడు (విష్ణువు) సెలవిచ్చి మాయమయ్యెను. అదితి సంకల్పము నెరవేరెను. ఆమె సంతోషముతో తన భర్తయగు కశ్యపుని ఆశ్రయించి ప్రేమతో సేవిస్తూ ఉండగా అటు తర్వాత ఒకనాడు

కశ్యపుడు సమాధిలో ఉండి హరి అంశము తనయందు ప్రవేశించగా అదితియందు అధికమగు తన వీర్యాన్ని 'గాలి అగ్నిని కర్రయందు చేర్చినట్లు' చేర్చినాడు.

రాజా! పై విధంగా కశ్యపుడు చాలాకాలంగా మహాతపస్సు చేసి విశేషంగా సంపాదించిన వీర్యంవల్ల అదితి గర్భాన్ని ధరించింది. ఆమె మనస్సు చాలా ఉల్లాసాన్ని పొందింది.

ఒకనెల గడిచింది. అదితి కడుపులో క్రమక్రమంగా ద్రవరూపమూ, మెత్తనిరూపమూ, గడ్డకట్టి పిండరూపమూ ఏర్పడింది. నెల తప్పింది. గొంతుతోపాటు తల ఏర్పడి గర్భం నిలిచింది.

('చీరచిక్కుట' అనే ప్రయోగం గర్భధారణకు పర్యాయపదంగా ప్రయోగించటం పూర్వకవులలో కనిపిస్తుంది.)

అదితికి గర్భమై ఒకటి రెండు మూడు నాలుగు నెలలు గడచినవి. క్రమంగా నెలలు పెరిగినాయి. రాక్షసనాశనానికి కూడా నెలలు సమీపించినాయి.

రాజా! అదితి కడుపులో అవయవాలతోకూడిన ఆ శిశువు గొప్ప మేఘాలు కప్పిన పదివేల సూర్యబింబాల వెలుగుతో కదలాడసాగినాడు.

అదితి గర్భంలో ఆ శిశువు బ్రహ్మాండభాండాన్నీ సముద్రాలనూ సమస్తలోకాలనూ తన కడుపులో ఇముడ్చుకొని సన్ననైన చిన్నని ఆకారంతో అందంగా అణగి మణగి ఉన్నాడు.

అదితికి క్రమంగా గర్భలక్షణాలు స్పష్టంగా కనిపించసాగినవి. ఆమె కనురెప్పలు అందంగా ఒప్పినాయి. కన్నులు నిర్మలంగా ఉన్నాయి. చనుమొనలు నల్లబడినాయి. ఒడ్డాణం బిగువైంది. ముఖం తెల్లబడింది. వక్షోజాలు గట్టిపడినాయి. పిరుదులు బరువెక్కినాయి. నడుము విస్తరించింది. మనస్సు తేలికపడింది. దేహం మహత్త్వాన్ని పొందింది.

(ముత్తెదువలు) అదితి నుదుట విభూతిని పెట్టినారు. తిలకం దిద్దినారు. పట్టుబట్టల జతను కట్టించినారు. గర్భానికి రక్ష కట్టినారు.

అదితి గర్భంలో విశ్వగర్భుడైన భగవంతుడు పూట పూటకూ పెరిగినాడు. గర్భం బరువెక్కింది. ఆమె నీళ్లాడే సమయం దగరపడింది.

ఆ సమయంలో బ్రహ్మదేవుడు అదితిగర్భంలో కదలాడే భగవంతునుద్దేశించి ఈ విధంగా స్తోత్రం చేసినాడు.

అదితిగర్భంలో వర్ధిల్లుతున్న స్వామీ! నీవు మూడులోకాలను జయించగలవాడవు. ఓ దేవ! పెద్దపెద్ద అంగలువేస్తూ నడిచే సామర్థ్యం గలవాడివి. రెండడుగులతోనే భూమ్యాకాశాలు కొలిచినవాడివి. విశాలమైన హృదయం గలవాడివి. ప్రాణులయందు అంతర్యామియైనట్టి వాడివి. 'పృశ్ని' యొక్క పుత్రుడవైనట్టివాడివి. ప్రీతితో ముల్లోకాలను నాభియందు గలవాడివి. ముల్లోకాలకు అతీతుడైనవాడివి. ఈ లోకాలకు ఆదిమధ్యాంతాలు నీవే. చరాచర ప్రపంచం పుట్టడానికి కారణం నీవే. కాలస్వరూపుడవై సమస్తమూ నీలోపలనే ధరిస్తావు. ప్రవాహం ప్రాణికోటిని ధరించినట్లు సమస్త జీవులనూ నీలోనే నిలుపుకొంటావు. సృష్టికర్తలైన బ్రహ్మలకు పుట్టినిల్లు నీవే. స్వర్గలోకాన్ని పోగొట్టుకొని దేవతలు కష్టాలకడలిలో మునిగిపోయినారు. వారిని రక్షించి గట్టుకు చేర్చే తెప్పవు నీవే,

మహాత్మా! దేవతలు చాలాకాలం నుంచీ స్వేచ్చలేక సంతోషంగా ఉండాలని ఆరాటపడుతున్నారు. వారికి ఆనందం కలిగించేటందుకు అదితిగర్భంనుండి బయలుదేరి రావయ్యా!

Vaivasvata Manvantara Details - వైవస్వత మన్వంతర వివరణ

వైవస్వత మన్వంతర వివరణ

ఓ రాజా! ప్రస్తుత మన్వంతరాన్ని ఏడవమనువైన వైవస్వతుడు నిర్వహిస్తున్నాడు. ఆయనను శ్రాద్ధదేవుడని అంటారు. ఆయనకు ప్రసిద్ధులైన, మహాబలవంతులయిన పదిమంది కుమారులున్నారు.

వారు ఇక్ష్వాకుడు, నభగుడు, ధృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, నాభాగుడు, దిష్టుడు, కరూశకుడు, పృషద్ధ్రుడు, వసుమంతుడు, అనేవారు. ఈ పదిమందీ రాజులైనారు. పురందరుడనేవాడు ఇంద్రుడైనాడు. ఆదిత్యులూ, మరుత్తులూ, అశ్వినులూ, రుద్రులూ, వసువులూ అనేవారు దేవతలైనారు. గౌతముడూ, కశ్యపుడూ, అత్రీ, విశ్వామిత్రుడూ, జమదగ్నీ, భరద్వాజుడూ, వసిష్ఠుడూ అనేవారు సప్తర్షులైనారు. వారిలో కశ్యపునికి అదితి అనే భార్యయందు విష్ణుమూర్తి వామనమూర్తియై జన్మించి ఉపేంద్రుడు(ఇంద్రుని తమ్ముడు) అయినాడు. ఇంతవరకు ఏడు మన్వంతరాలను గురించి చెప్పినాను. ఇక రాబోవు మన్వంతరాలను గురించి విష్ణువు పరాక్రమాన్ని గురించి వివరిస్తాను. శ్రద్ధగా విను అని శుకుడు ఇలా అన్నాడు.

(చాలామంది వ్యక్తులపేర్లు చకచకా చెప్పాలి. కనుక పద్యంలో కన్న వచనంలో చెప్పటమే సుగమంగా ఉంటుందని ఈ వచనం సువ్యక్తం చేస్తుంది.)

ఓ రాజా! సూర్యునికి సంజ్ఞాదేవి, ఛాయాదేవి అనే భార్యలున్నారు. వారు విశ్వకర్మ కుమార్తెలు. ఇంతకు ముందే ఈ విషయం చెప్పినాను. వారిద్దరేకాక 'బడబ' అనే భార్యకూడా ఉంది. సంజ్ఞాదేవికి యముడు, శ్రాద్ధదేవుడు, యమునాదేవి పుట్టినారు. ఛాయకు సావర్ణి, శనైశ్చరుడు, తపతీదేవి పుట్టినారు. తపతీ దేవిని సంవరణుడు పెళ్ళాడినాడు. బడబకు అశ్వినీ దేవత లిద్దరు పుట్టినారు. రాబోయే కాలంలో సావర్ణి ఎనిమిదవమనువు అవుతాడు. అతడు ప్రస్తుతం తపస్సు చేస్తున్నాడు.

ఓ రాజా! ఒక పర్యాయం కనిపించి మరొక పర్యాయం కనిపించక మాయమయ్యే సిరులకోసం ఒక్కొక్క మనువు దిగిపోయే సమయానికి ఒక్కొక్కమనువు కాచుకొని ఉంటాడు.

(భౌతికమైన సిరిసంపదలు ఎంత చంచలమూ, అశాశ్వతమైనవో! భౌతికమైన ఉన్నత పదవులు కూడ చంచలమూ, అశాశ్వతమైనవని అంతరార్థం! ఈ చిన్ని కందపద్యం లోకనీతిని, రీతిని అద్దం పడుతున్నది. 'చేటువేళ' అనే పదబంధం అత్యంత సాభిప్రాయం. జీవితము ఒక కాలపరిమితికి ఎలా లోబడినదో, ఉన్నత పదవులు కూడ ఒక కాలపరిమితికి లోబడినవేనన్న పరమార్ధమిందులో దాగి ఉన్నది. ఈ లోకంలో ఏదీ శాశ్వతంకాదు. ఆఖరికి బ్రహ్మపదవికూడ శాశ్వతంకాదు. ఇది తెలిసి ప్రవర్తించేవాడే నిజమైన బుద్ధిమంతుడు.)

సూర్య సావర్ణి పరిపాలించే ఎనిమిదవ మన్వంతరంలో ఆయన కుమారులైన నిర్మోహుడు, విరజస్కుడు మొదలయినవారు రాజులవుతారు. సుతపులు, విరజులు, అమృతప్రభులు దేవతలవుతారు. గాలవుడు, దీప్తిమంతుడు, పరశురాముడు, ద్రోణుని కొడుకైన అశ్వత్థామ, కృపుడు, వ్యాసుడు, ఋష్యశృంగుడు సప్తర్షులవుతారు. ఇప్పుడు వారు తమ తమ యోగబలాలతో తమ ఆశ్రమాలలో ఉన్నారు. విరోచనుని కొడుకైన బలిచక్రవర్తి ఇంద్రుడవుతాడు.

ఓ రాజా! పూర్వం బలిచక్రవర్తి బలవంతుడై స్వర్గలోకాన్ని వశం చేసుకోగా శ్రీహరి వామనుడుగా వెళ్ళి ఆయనను మూడడుగులనేలను దానమడిగినాడు. దానమిచ్చిన బలిచక్రవర్తిని త్రివిక్రముడు బద్దుని చేసినాడు. తరువాత బలికి అమరావతికంటె అందమైన పాతాళలోకాన్ని ఇచ్చినాడు. దానిలో బలి సుఖంగా ఉన్నాడు. ఆ తర్వాత విష్ణువు వేదగుహికీ సరస్వతికీ "సార్వభౌముడు" అనే పేరుతో జన్మిస్తాడు, ఇంద్రుని పదవినుండి తొలగిస్తాడు. ఆ పదవిలో బలిచక్రవర్తిని నెలకొలుపుతాడు. విష్ణువు నుండి బలి ఇంద్రపదవిని పొందినప్పటికి అతడు మొదట విష్ణువునకు దానం చేసిన పుణ్యం చెడదు.

ఆ తర్వాతి కాలంలో వరుణుని కొడుకైన దక్షసావర్ణి తొమ్మిదవ మనువు అవుతాడు. అతని కొడుకులయిన ధృతకేతువు, దీప్తకేతువు మొదలయినవారు రాజులవుతారు. పరుడూ, మరీచులూ, గర్గుడూ మొదలయినవారు దేవత లవుతారు. అద్భుతుడు అనేవాడు ఇంద్రు డవుతాడు. ద్యుతిమంతుడు మొదలయినవారు సప్తఋషులు అవుతారు.

విష్ణువు ఆయుష్మంతునికీ అంబుధారకు జన్మిస్తాడు. అతని రక్షణలో దేవేంద్రుడైన అద్భుతుడు మూడు లోకాలను సంతోషంగా పరిపాలిస్తాడు.

ఓ రాజా! ఆ పిమ్మట ఉపశ్లోకుని కుమారుడైన బ్రహ్మసావర్ణి పదవ మనువు అవుతాడు. ఆయన కొడుకులైన భూరిషేణుడు మొదలయినవారు రాజులవుతారు. హవిష్మంతుడు మొదలయినవారు సప్తర్షులవుతారు. శంభుడనేవాడు ఇంద్రుడవుతాడు. విబుద్ధి మొదలయినవారు దేవతలవుతారు.

విష్ణువు విశ్వసృజునికీ విషూచికీ 'విష్వక్సేనుడు' అనే పేరుతో జన్మించి శంభునికి స్నేహితుడై లోకాన్ని కాపాడుతాడు.

ఆ పిమ్మట వచ్చే కాలంలో ధర్మసావర్ణి పదకొండవమనువు అవుతాడు. ఆయన కుమారులయిన సత్యధర్ముడు మొదలయినవారు పదిమందీ రాజులవుతారు. విహంగములు, కామగమనులు, నిర్వాణరుచులు దేవతలవుతారు. వైధృతుడనేవాడు ఇంద్రుడవుతాడు. అరుణుడు మొదలయినవారు సప్తర్షులవుతారు.

విష్ణువు 'ధర్మసేతువు' అనే పేరుతో సూర్యుని కుమారునిగా జన్మిస్తాడు. ఆయన మహిమలతో సంపన్నుడై వైధృతుడు సంతోషించేటట్లు మూడు లోకాలను కరుణతో కాపాడుతాడు.

ఓ రాజా! ఆ పిమ్మట రాబోయేకాలంలో భద్రసావర్ణి పన్నెండవ మనువు అవుతాడు. అతని కొడుకులయిన దేవవంతుడు, ఉపదేవుడు, దేవజ్యేష్ఠుడు మొదలయినవారు రాజులవుతారు. ఋతధాముడనేవాడు ఇంద్రుడవుతాడు. హరితులు మొదలయినవారు దేవతలవుతారు. తపోమూర్తి, తపస్వి, అగ్నీధ్రకుడు మొదలయినవారు సప్తర్షులవుతారు.

(తప ఆగ్నీద్ర అనే పాఠం వ్యాకరణరీత్యా సరిపోతుంది. (తవ అగ్నీధ్ర పాఠం సరికాదు) పోతన భాగవతముద్రిత ప్రతులన్నింటిలో ఋతుధాముడనే ఉన్నది. ఈ పాఠం సరికాదు. సంస్కృతమూలంలో ఋతధాముడని ఉన్నది. దీనికి ప్రమాణం వాల్మీకిరామాయణం.)

ఆ కాలాన విష్ణువు సత్యతపునికి సూనృతకు 'స్వధాముడు' అనే పేరుతో జన్మిస్తాడు. మనువు సంతోషించేటట్లు లోకాన్ని రక్షిస్తాడు.

ఓ రాజా! ఆ తరువాతి కాలంలో దేవసావర్ణి పదమూడవ మనువు అవుతాడు. అతని కొడుకులయిన చిత్రసేనుడూ విచిత్రుడూ మొదలయినవారు రాజులవుతారు. సుకర్ములూ సుత్రాములూ దేవతలవుతారు. దివస్పతి అనేవాడు ఇంద్రుడవుతాడు. నిర్మోహుడూ తత్త్వదర్శుడూ మొదలయినవారు సప్తర్షులవుతారు.

ఓ రాజా! విష్ణువు దేవహోతకూ బృహతికీ 'యోగవిభుడు' అనే పేరుతో జన్మిస్తాడు. ఇంద్రునికి చాలా సాయం చేస్తాడు.

ఆ పిమ్మట వచ్చేకాలంలో ఇంద్రసావర్ణి పదునాలుగవ మనువు అవుతాడు. అతని కుమారులు ఉరుగంభీరుడు, వసువు మొదలయినవారు రాజులవుతారు. పవిత్రులు, చాక్షుషులు దేవతలవుతారు. శుచి అనేవాడు ఇంద్రుడవుతాడు. అగ్ని, బాహువు, శుచి, శుక్రుడు, మాగధుడు మొదలయినవారు సప్తర్షులవుతారు. ఇంకా

ఆ కాలాన విష్ణువు సత్రాయణునకు వితానకు 'బృహద్భానుడు' అనే పేరుతో జన్మిస్తాడు. దేవతలు సంతోషించేటట్లు క్రియాకలాపాలను విస్తరిస్తాడు.

ఓ రాజా! మూడుకాలాల్లోనూ ప్రఖ్యాతి పొందే మనువుల విధానాన్ని చెప్పినాను. పదునాలుగుమంది మనువులు అంతరించి వెయ్యియుగాలు గడిస్తే బ్రహ్మకు ఒక దినం అవుతుంది. అని శుకుడు చెప్పగా పరీక్షిన్నరేంద్రుడు ఇలా అన్నాడు.

ఓ శుభచరితా! ఈ పదవులలో మనువులను ఎవరు నియమిస్తారు? ఎందువల్ల వారు గొప్ప వైభవాన్ని పొందారు? ఆ మన్వంతరాలలో ఎందుకు విష్ణువు జన్మిస్తాడు? నాకు తెలిసేటట్లు చెప్పు. అని అడిగిన పరీక్షిత్తుతో శుకుడిలా అన్నాడు.

మనువులు, మునులు, మనువుల తనయులు, ఇంద్రుడు, దేవతలు విష్ణుమూర్తి ఆనతికి లోబడి ఉంటారు. యజ్ఞుడు మొదలయినవారు విష్ణుదేవుని అంశంతో రూపుదాలుస్తారు. అతని సహాయంవల్ల మనువులు లోకాన్ని పాలిస్తారు. క్రమంగా నాలుగుయుగాల చివర వేదాలను కాలం మింగి వేస్తుంది. పుణ్యాత్ములయిన మునులు తమ తపశ్శక్తివల్ల మళ్లీ వేదాలను దర్శిస్తారు. పూర్వం వలె ధర్మం నాలుగు పాదాలతో నడుస్తుంది. విష్ణువు ఆజ్ఞ చెల్లుబడి అవుతుంది. తమ తమ కాలాలలో రాజులు లోకాన్ని పంచుకొని పరిపాలిస్తారు.

విష్ణుమూర్తి ప్రాప్తమున్నవారిని ఇంద్రపదవులలోను, పెక్కు విధాలయిన దేవతల పదవులలోను నియమిస్తాడు. వారు తమకు నిర్ణయించబడిన నియమాలతో ముల్లోకాలను పాలిస్తారు. లోకాలు సుభిక్షంగా ఉంటాయి.

ఓ నిర్మల చరితుడా! శాశ్వతుడైన విష్ణువు యోగీంద్రుని రూపంతో యోగం బోధిస్తాడు. మౌనిరూపంతో కర్మానుష్ఠానాన్ని బోధిస్తాడు. ప్రజాపతి రూపంతో సృష్టిచేస్తాడు. ఇంద్రుడై రాక్షసుల పొగరును అణచివేస్తాడు. సిద్ధరూపంతో జ్ఞానోపదేశం చేస్తాడు. కాలస్వరూపంతో కడతేరుస్తాడు. అవ్యయుడైన ఆ శ్రీపతి పెక్కుపేర్లతో అనేక రూపాలతో ఉంటాడు. అతడు విషయాసక్తుల కంటికి కనిపించడు. అతడు జరిగిన, జరుగుతున్న, జరుగబోయే కాలాలలో అనేక విధాలుగా వేరువేరు రూపాలతో వెలుగొందుతాడు.

Srihari (Vishnu) appeared as Mohini, the enchantress, to Shiva - శ్రీహరి తన మోహినీ రూపంబుచే నీశ్వరుని మోహింపంజేయుట

శ్రీహరి తన మోహినీ రూపంబుచే నీశ్వరుని మోహింపంజేయుట

పై విధంగా చెప్పి విష్ణువు మాయమైనాడు. పార్వతీసమేతుడైన శివుడు 'హరి ఎక్కడకు వెళ్ళినాడో! ఎక్కడ ఉన్నాడో!” అనుకుంటూ పదిదిక్కులా అంతటా చూస్తుండగా తన (శివుని) ఎదుట.

ఒక ఉద్యానవనంలోని చెట్లవరుసలో ఒకానొక చెట్టునీడలో, స్తనకలశాలపైనగల పైట తొలగిపోగా, కొప్పుముడి కదలాడగా, నొసటిపై ముంగురులగుంపులు ముసురుకొనగా, ఉన్నదా లేదా అని సందేహించేటట్లున్న నడుము కదలాడగా, చెక్కిళ్లపై చెవులకమ్మల వెలుగులు చిందులాడగా, పిరుదుల బరువుతో అడుగులు తొట్రుపడగా, చూపుల వెలుగుల గుంపులు దిక్కులను కప్పివేయగా, జారిపోయిన చీర ఎడమచేతితో పట్టుకొని, బంగారు అందియల జంట గలగలమని శబ్దించగా, చేతిగాజుల ఝణఝణమనే శబ్దాలు అతిశయిల్లగా, పుట్టచెండుతో ఆడుకొంటూ ఉన్న చెలువను చూచెను.

(శివుడు దర్శించిన మోహినీరూపం తీరిచిదిద్ది అలంకరించుకొన్న రూపం కాదు. బంతి ఆటలో చెదరిన సహజ సుందరరూపం.)

ఆ విధంగా చూచి అదివరకే మగువవలపుతో సగమయిన శివుడు ఆ మగువ ప్రాయమూ, అందమూ, స్వభావమూ, విలాసాలూ తనను బాగా ఆకట్టుకొనగా గుడ్లప్పగించి ఎడతెరపి లేకుండ చూచి మెత్తబడిన చిత్తంతో

'ఈ కనిపించే అన్నులమిన్న ఎవరిదోకదా! ఈ అందమైన నెలతను మునుపు ఏ కల్పంలోనూ చూడలేదు. ఈమెను బ్రహ్మ సృష్టించలేదనడం నిజం. ఇల్లాలుగా ఈ వయ్యారిని పొందగలిగే అదృష్టవంతుడెవడో! విహారాలకు నా కీ చెలువ లభిస్తుందా!' అనుకొన్నాడు శివుడు.

ఈ ప్రకారంగా మన్మథుని బాణాలు హద్దుదాటి వేటాడగా (కామహారి అనే) శివుని పెద్దబిరుదు వ్యర్థమై పోయేటట్లు మోహిని ముడిచిన కొప్పుముడి ఊడిపోయింది. కురులు భుజాలపైన మెడలపైన చెల్లా చెదరయి కదలాడినాయి. ఆమె నొసటి మీది కస్తూరిబొట్టు కరిగిపోయింది. అందమైన మోమువెలుగులు అన్ని దిక్కుల ప్రసరించాయి. చిరునవ్వులు చిందులాడుతున్నాయి. లేత చెమటలతో తొట్రుపడుతూ పులకలు మొలకలెత్తినాయి. మనసునకు ముదాన్ని కలిగించే బంతిని అందమైన చేతులతో అందుకొన్నది. ఆ బంతిని ఎదకు ఆనించుకుంది, చెక్కిలిపై చేర్చుకుంది, చిబుకానికి తాకించుకుంది, చనుమొనలపై అదిమి పట్టుకుంది, గోరులతో మీటింది. అందమైన చేతులలోని మెల్లమెల్లగా కదలాడే మేలిమి బంగారుకంకణాలు ఝణఝణ ధ్వని చేయగా కుచకలశాలు ఒకదానితో ఒకటి ఒరుసుకొనగా కుడి ఎడమలకు త్రుళ్లిపడేటట్లు చెండును ఒయ్యారంగా పైకెగురవేసింది. తనకు తానే చిన్ని చిన్ని పందాలు కట్టింది. సన్నని నడుము కదలాడేటట్లు మెడలోని హారాలు చిక్కుపడేటట్లు తిరుగులాడింది. అలా సంచరించేటప్పుడు చెవుల కమ్మల వెలుగులు చెక్కిళ్లపై చిందులాడినాయి. ఆమె గుండ్రంగా తిరుగుతూ పుట్టచెండును పట్టుకొని పక్కలకు కదలుతోంది. అప్పుడు ఆమె పైటచెంగు జారిపోయింది. ఒడ్డాణంలోని బంగారు చిరుగంటలు మ్రోగినాయి. కాలిఅందెలు గల్లుగల్లుమన్నాయి. చేతిమురువుల రతనాలు తళుక్కుమన్నాయి. ఆమె వెనువెంట పరుగెత్తి బంతిని పట్టుకొంటూ, పట్టుకొన్న బంతిని నేలపై చరస్తూ, అది పై కెగిరినపుడు రెండు చేతులూ చేర్చి చాలసార్లు కొట్టుకున్నది. బంతి ఎగిరేటప్పుడు, పడేటప్పుడు పొడవైన వలలు వేసి లాగుతున్నట్లు సోగచూపులు వ్యాపింపచేస్తున్నది. చెండును కొడుతూ ఒకటినుండి వేయిదాకా నేర్పుతో లెక్కపెడుతోంది. మోహిని ఎర్రతామరలవంటి తన కాలి ఎర్రనివెలుగులతో తూరుపుకొండపైని సూరీడును గుర్తుకు చేస్తుంది. అందమైన ఆమె మోము చందురుని వెన్నెల వెలుగులతో చంద్రమండలాలను కల్పిస్తుంది. అప్పుడప్పుడు కుచకలశాల మిట్టపల్లాలనుండి జారిపోయిన పైటకొంగును సరిచేసుకుంటున్నది. చెక్కిళ్ళపై చిందే చెమటబొట్లను కొనగోళ్లతో ఎగజిమ్ముతున్నది. ఎర్రని పెదవిని దొండపండుగా భ్రమించి వచ్చిన రాచిలుకలను అదలిస్తున్నది. పద్మం వంటి ముఖంలోని పరిమళాలకోసం మూగిన కొదమ తుమ్మెదలను అదలిస్తున్నది. అందమైన మందగమనం నేర్చుకోవటానికి వచ్చిన రాజహంసల జంటను గెంటుతున్నది. సోగచూపులకోసం ముచ్చటపడి వచ్చిన నెమళ్లజంటలకు దూరంగా వెళుతున్నది. పొదరిండ్ల దగ్గరకు వెళ్లకుండ చిగురులవంటి చేతులకు మనసుపడి వచ్చిన కోయిలజంటలకు దూరమౌతోంది. తీగల ఉయ్యాలపై ఊగుతూ పూల గురివెంద గుబురులపై ఎక్కుతూ, పుప్పొడి గుట్టలను దాటుతూ, మకరందాల మడుగులు గడుస్తూ, క్రీడా పర్వతాలపై విహరిస్తూ, చిగురుటాకుల పీటలపై సేదతీర్చుకుంటూ, తీగ ఇండ్లలో దాగుడు మూతలాడుతూ, మొగలిబోదెలకు ఆనుకొంటూ, పూలరేకుల గవాక్షాలలో తొంగిచూస్తూ, మెట్టతామరల మొక్కలను తాకుతూ, సంపెంగ పొదలగడపలలో నిలబడుతూ, అరటాకుల ద్వారాలు తెరుస్తూ, కమ్మ పుప్పొడి బొమ్మలను బుజ్జగిస్తూ, రతనాలబాటలపై విహరిస్తూ, చలువరాతి తిన్నియలను సమీపిస్తూ, రత్న పంజరాలలోని గోరువంకలకు పలుకులు నేర్పుతూ, ఇచ్చవచ్చిన దానిని చూస్తూ, చూచిన దానిని మెచ్చుకుంటూ, మెచ్చుకొన్న దానిపై అచ్చెరువు కనబరుస్తూ, మైమరుస్తూ, మైమరపిస్తూ, ఆ వాల్గంటి ఒంటరిగా ఆ తోటలో అంతులేని అందచందాలతో జగన్నోహినియై విహారం సాగించింది.

మోహిని వాలుచూపులపదనుచేత శంకరుని ధైర్యం సడలిపోయింది. అతడు తనను తాను మరచినాడు. తన అనుచరులనూ మరచినాడు. చివరకు 'అర్ధాంగి'ని కూడా మరచిపోయినాడు.

(వాలుంగంటి= కత్తిలావాడియైన కన్నులు కలది. పదునైన చూపులు కత్తిలాంటి కన్నులకుంటాయి. మోహిని జంటవాలుగంటి కాగా శివుడు ముమ్మొనవాలుకాడు. అంటే త్రిశూలం కలవాడు. కనుకనే పద్యంలో 'శూలి' అనే పదం ప్రయోగించబడింది. జంటవాలుగంటి పదును చూపులకు ముమ్మొనవాలుకాని (శూలి) ధైర్యం కోలుపోయిందన్నమాట. మోహిని చూపులయొక్క గొప్పదనం చెప్పబడిందిక్కడ. 'వాలుగంటి', 'శూలి' పదాలు సాభిప్రాయ ప్రయోగాలు. ఇది సర్వతః ప్రాసపద్యం. ప్రాస అంటేకూడా కత్తి అని అర్థం. (జంట) వాలుగంటి, శూలి (ముమ్మొనవాలుకాడు) ఇవన్నీ కత్తులకు అంటే ప్రాసలకు సంబంధించిన పదాలు. అందుకే ఇది సర్వతః ప్రాస పద్యం. పోతనగారి ప్రాసక్రీడావిలాసాలకు ఉదాహరించదగ్గ పద్యాలలో ఈ ఆటవెలది ఒకటి.)

ఆ సమయాన, మోహిని బంతిని ఎగురవేసింది. దానిని పట్టుకోవడానికి వ్యవధానం లేకపోవటంచే అది చేతికి చిక్కక జారిపోయింది. దానిని తీసుకోవడానికి వస్తుండగా గాలి తాకిడికి ఆమె చీర ఊడిపోయింది. అప్పుడు శివుని మనస్సు కంపించిపోయింది.

కడగంటి కాంతులదానిని, చీరకట్టుకొనడానికి ప్రయత్నిస్తున్న దానిని, చనులబరువుతో వంగినదానిని, రెండు చేతులతో దాచుకొన్న అంగం కలదానిని, కొప్పుముడి వీడి వ్రేలాడుతున్నదానిని, ఆ మోహినిని చూచి శివుడు కామావేశంతో చలించినాడు. సిగ్గుపడి తన భార్య చూస్తున్నా కూడా చందురునివంటి మోముగల ఆ మోహిని కేలుదామరను పట్టుకోవడానికి ముందుకు వెల్లినాడు.

అడుగుదూరంలో సమీపిస్తున్న శివుని చూచింది మోహిని. చీర ఊడి పడిపోయిన సిగ్గుతో నవ్వుతూ చెట్లచాటున దాగింది. ముక్కంటి ఆ వాల్గంటి వెంటపడినాడు.

యౌవనంలో ఉన్న ఆడుఏనుగును కామోద్రేకంతో చేరవచ్చు మదించిన మగఏనుగువలె, శివుడు మోహినివెంటపడి 'బేలా! పోవద్దు, పోవద్దు' అంటూ దగ్గరకు పరుగెత్తి తనచేతితో ఆమె కొప్పును పట్టుకొని, ఆత్రంతో కౌగిలించుకొని రతిక్రీడకు పూనుకోబోయినాడు. మోహిని శివుని కౌగిలినుండి వదలించుకొని

మోహిని జడకట్టువీడి (ఆమె) వీపుపై వ్రేలాడు తున్నది. పిరుదుల బరువు వలన అలసిపోతూ ఉన్నది. మరల మరల కవ్వింపుగా వెనుదిరిగి చూస్తున్నది. విభ్రమాలు ప్రదర్శించే జగన్నోహినివెంట ఆడఏనుగు వెంట మగమదపుటేనుగు వలె శివుడు పరుగెత్తినాడు. అది - మన్మథుడు మరల శివుని జయించెనా అనిపించింది. అలా పరుగెత్తుతూ కొండలు అడవులు, సెలయేరులు, సరస్సులు దాటి వెళ్లునపుడు శివుని అమోఘమైన వీర్యం స్ఖలనమై నేలపై పడింది. అది పడిన తావెల్లా భూమిపై వెండీ బంగారం అయింది. వీర్యం పతనమైన వెంటనే శివుడు తనంతకు తాను తెలివి తెచ్చుకున్నాడు. ఇదంతా విష్ణుదేవుని మాయవలన కలిగిన మోహమని గ్రహించినాడు.

జగదాత్మకుడయిన శివుడు తన మహిమవల్ల విష్ణమాయను తెలుసుకొని వెనుదిరిగినాడు. హరికూడా సిగ్గువిడిచినవాడై స్త్రీ రూపాన్ని విడిచిపెట్టి మగవాడుగ మారిపోయినాడు.

(మోహినీ రూపంలో స్త్రీ సహజమైన సిగ్గుకూడా హరికి ఉండేది. మోహినీ రూపంతో పాటు ఆ సిగ్గునుకూడా హరి వదలినాడు. పరమపురుషుడు నిర్వికారుడు కదా!)

మదనుని జయించవచ్చు. యముడిని ధిక్కరించవచ్చు. మృత్యుంజయుడు కావచ్చు. కానీ ఆడువారి చూపులు అనే బాణాలను జయించడం త్రిపురవైరి అయిన శివునికికూడా సాధ్యం కాదు.

ఈ విధంగా మోహినీరూపాన్ని చాలించిన విష్ణువు శివునితో ఇలా అన్నాడు.

'సకలదైవత శ్రేష్ఠా! నీవొక్కడవు తప్ప నా మాయను ఇంకెవ్వడు తెలుసుకొనలేదు. మోహినీరూపాన్ని ధరించిన నామాయలోపడి మోసపోక ధైర్యంతో పొరపాటును తెలుసుకున్నావు. ఈ మాయ కాలస్వరూపమై కాలంతోపాటు నాయందు అధివసించి ఉంటుంది. ఈ మాయ నన్ను గెలువలేదు. అల్పజ్ఞులు తెలుసుకొనలేని నామాయను నీవు తెలుసుకున్నావు' అంటూ విష్ణువు శివుని గౌరవించినాడు. స్నేహభావంతో శివుడు సంతోషించి సతీదేవితో ప్రమథగణాల సేవలందుకొంటూ తన నివాసానికి వెళ్ళినాడు.

ఓ పరీక్షిన్మహారాజా! పాలసముద్రాన్ని చిలికేటప్పుడు కుంగిపోతున్న మందర పర్వతాన్ని మోసి చక్కగా నిలబెట్టేందుకు కూర్మరూపం ధరించిన విష్ణులీలలను కీర్తించినా, విన్నా శ్రేయస్సు కలుగుతుంది. సంసారసముద్రంలో మునిగి ఉండి పాపంతో బతుకుతున్న జనాలు కూర్మావతార విశేషాలు వినినా, కీర్తించినా చక్కని మేలును సౌఖ్యాన్ని పొందుతారు.

వికాసవంతమైన సుందరి(మోహిని) రూపంతో రాక్షసులను మోసగించి(మోహించి) ఆపదలతో వణకిపోతున్న దేవతలకు(శ్రీహరి) చక్కని పద్ధతిలో అమృతాన్ని పంచాడు. స్వచ్చమైన శరీర సౌష్టవంతో, దివ్యతేజస్సుతో ప్రకాశిస్తూ లీలామోహినీ అవతారాన్ని ధరించిన శ్రీపతిని పాపపు చీకట్లను రూపుమాపే సూర్యుని స్వరూపంగా భావించి హృదయంలో స్మరిస్తాను నమస్కరిస్తాను.

Friday, March 20, 2026

Matsya Jayanti - మత్స్య జయంతి

మత్స్య జయంతి

మత్స్య జయంతి అనేది ఒక ముఖ్యమైన ఆచార సాంప్రదాయ పండుగ. వేదాలను ప్రళయం కాలంలో కాపాడిన విష్ణుమూర్తి మొదటి అవతారమైన మత్స్య (చేప) అవతార ఆవిర్భావం సందర్భముగా ఆ శ్రీమహావిష్ణువుని స్మరిస్తూ జరుపుకునే పండుగ. దీనిని చైత్ర మాసంలోని శుక్ల పక్షం మూడవ రోజు (తృతీయ) నాడు జరుపుకుంటారు, ఇది సాధారణంగా మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వస్తుంది.

పురాణాలలో విష్ణువు యొక్క 24 అవతారాలు వివరించబడ్డాయి. వీటిలో 23 అవతారాలు భూమిపైకి వచ్చాయి. తదుపరి 24వ అవతారం అయిన 'కల్కి అవతారం' రూపంలో ఇంకా జరగాల్సి ఉంది.

ప్రాముఖ్యత:మత్స్య అవతారం విష్ణువు యొక్క పది ప్రధాన దశావతారాలలో మొదటిదిగా పరిగణించబడుతుంది . ఆయన సత్యయుగంలో, దమనక అనే రాక్షసుడి నుండి వేదాలను కాపాడుతూ, విశ్వ వినాశనం నుండి మనురాజును (లేదా సత్యవ్రతుడిని) మరియు సప్తఋషులను (ఏడుగురు ఋషులను) రక్షించడానికి అవతరించారు.

విష్ణువు యొక్క దయా కరుణ మరియు ధర్మ పరిరక్షణకు ప్రతీకగా, మానవ శరీరం కలిగిన ఒక భారీ మత్స్య రూపంలో అవతరించాడు.

భక్తులు తెల్లవారుజామున లేచి పవిత్ర స్నానం చేసి ఉపవాసం పాటిస్తారు.

విష్ణు దేవాలయాలలో షోడశోపచారాలతో స్వామిని పూజించాలి. తదుపరి మత్స్య పురాణం మరియు విష్ణు సహస్రనామం పఠించాలి.

మన స్థోమతను బట్టి దాన ధర్మాలు చేయవచ్చు. కొలనులో, చెరువులో, నదుల్లో కానీ ఉండే చేపలకు ఆహారం వేయవచ్చు 


Good and Bad Omens - శుభాశుభ శకునాలు

శుభాశుభ శకునాలు

అవయవాల స్పందన శుభాశుభ ఫలితాలు

వీపుమీద, హృదయానికి కుడివైపున గానీ అదిరితే శుభం జరుగుతుంది. అదే ఎడమవైపు అదిరితే అశుభం. కుడివైపున అదిరితే భూలాభం. నుదుటిమీద స్థానవృద్ధి, కనుబొమల మధ్య ప్రియమైన వారితో సంగమం, కళ్ళ ప్రక్కన అదిరితే సేవకులతో లాభం, కంటికొనల దగ్గర-ధనప్రాప్తి, నడుముమీద - తత్తరపాటు, కంటికొలకుల దగ్గర అదిరితే -యుద్ధంలో విజయం, కంటిచివర-
స్త్రీ సుఖం, చెవికొనలో ప్రియవార్తాశ్రవణం. ముక్కు మీద అదిరితే -సౌఖ్యం. పెదవులమీద స్త్రీ లాభం, కంఠంమీద - భోగం, భుజాలమూలల్లో -భోగవ్చద్ధి, భుజాల మీద - మిత్రులతో స్నేహలాభం, చేతుల మీద అదిరితే - ధనాగమం, వీపుమీద-పరాజయం, వక్షస్థలం మదల సద్యోజయం, కడుపుమీద - ప్రీతి, స్త్రీలకి స్తనాలపైన అదిరితే-సంతాన ప్రాప్తి, నాభిప్రదేశం మీద - స్థాన భ్రంశం,
జఘన భాగంలో అదిరితే-ధనాగమం, మోకాళ్ళ సందుల్లో-బలవంతులతో సంధి జరుగుతుంది. అరికాళ్ళలో అదిరితే-ధనకారకమైన ప్రయాణం కలుగుతుంది.

గుహ్యావయావాలలో స్పందన కలిగితే - బొబ్బలు, పుండ్లు పుడతాయి, పాదాలలో అదిరితే - ఉత్తమ స్థాన ప్రాప్తి, కలుగుతుంది. ఇక్కడ చెప్పినవన్నీ స్త్రీలకి ఎడమవైపు, పురుషులకు కుడివైపు స్పందనలు కలిగితే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇవిగాక మిగిలిన అవయవాల స్పందన ఫలితాలని దైవజ్ఞుల ద్వారా తెలుసుకోవాలి. ఒకవేళ స్పందనలతో పాటు అరిష్ట చిహ్నాలు కూడా
కనిపిస్తే బ్రాహ్మణులకి సంతర్పణ, సువర్ణ దానం చేయాలి.

స్వప్న ఫలితాలు

దుఃస్వప్నాలు :
 ఒకబొడ్డు మీద తప్ప శరీరంలోని ఇతర అవయవాల మీద గడ్డి, చెట్లు మొలవటం, తలమీద కంచు పాత్రపడి పగలటం, తలబోడిదైపోవడం, నగ్నంగా వుండటం, మలినమైన వస్త్రాలు ధరించటం, నూనెతో తలంటుకోవటం, బురదని వంటికి పూసుకోవటం, ఎత్తునుంచి క్రిందకి పడటం, ఉయ్యాలని ఎక్కటం, ఉడికించిన మాంసాన్ని తెచ్చుకోవటం, గుర్రాలని చంపటం, ఎర్రని పూల చెట్లని ముద్దుపెట్టుకోవటం, పందుల్ని ఎలుగు బంట్లని, గాడిద
ల్ని
ఒంటెల్ని ఎక్కటం, ఉడికిన మాంసాన్ని తైలాన్ని ఫలాన్ని తినటం, నర్తించటం, నవ్వటం, పెండ్లి జరిగే సన్నివేశం, తీగల్లేని వాద్యాల్ని మ్రోగించటం, నదిలో స్నానం చేయకపోవటం, ఆవుపేడతో, బురదనీళ్ళతో, మట్టితో కలిసిన నీళ్ళతో స్నానం చేయటం, మాతృగర్భంలోకి ప్రవేశించటం, చితిమీద ఎక్కటం, ఇంద్రధ్వజం నేల మీదపడటం, సూర్యచంద్రులు పడిపోవటం, అంతరిక్షంలో
ఉత్పాతాలు కనిపించటం.

దేవతలు, విప్రులు, రాజులు, గురువులు కోపించటం, కన్యలు కౌగిలించుకోవటం, పురుషులతో సంభోగించటం, తన అవయవాలకు హాని కలగటం, అనగా విరగటం, వాంతి అవటం, దక్షిణ దిశగా ప్రయాణం చేయటం, వ్యాధి రావటం, పళ్ళు రాలటం, పూలురాలటం, ఇళ్ళు పడిపోవటం, ఇళ్ళని
ఊడ్చటం, పిశాచాలతో, మాంసాహార ప్రాణులతో, వానరులతో, ఎలుగుబంట్లతో ఆడుకోవటం, ఇతరుల వల్ల అవమానించబడటం, వ్యసనాలు కలగటం, కాషాయవస్త్రాలు ధరించినట్టు కనబడటం, స్త్రీలు క్రీడించినట్టు కనిపించటం, నూనె త్రాగటం, నూనెతో స్నానం చేయటం, ఎర్రని పూలని ధరించటం, ఎర్రగంధాన్ని పూసుకోవటం.

పై తెలిపిన వన్నీ దుస్వప్నాలు. ఈ స్వప్నాలు గనుక వస్తే వాటిని ఇతరులకి చెప్పకూడదు. స్వప్నం వచ్చిన మర్నాడు ఓషథీచూర్ణంతో స్నానం చేసి తిలలతో హోమ, బ్రాహ్మణ పూజ వాసుదేవుడి స్తుతి చేసి గజేంద్ర మోక్షం కథని శ్రవణం చేయాలి. ఆవిధంగా చేస్తే దుఃస్వప్న దోష పరిహారం జరుగుతుంది.

స్వప్న ఫలితం : రాత్రిపూట మొదటియామంలో వచ్చిన స్వప్నాలు ఒక సంవృతరానికి, రెండో యామంలో వచ్చిన స్వప్నాలు 6 నెలలు వరకు, మూడవ యామంలో వచ్చినవి 3 నెలలకి నాలుగో యామంలో వచ్చిన కలలు 1 నెలకి అరుణోదయ సమయంలో వచ్చిన స్వప్నాలు ఒక వారానికి ఫలిస్తాయి.

శుభస్వప్నాలు : పర్వతాలని, మేడల్ని ఎనుగుల్ని గుర్రాల్ని వృషభాల్ని అధిరోహించటం, తెల్లపూలుపూసే చెట్టుని ఎక్కటం తన నాభి (బొడ్డు) మీద వృక్షాలు, గడ్డి మొలవటం, తనకి ఎన్నో తలలు పుట్టటం, ఎన్నో చేతులు ఏర్పడటం, జుట్టు నెరియటం, తెల్లని వస్త్రాలని, మూలల్ని ధరించటం, చంద్రుణ్ణి, సూర్యుణ్ణి, తారల్ని అందుకోవటం, భూమిని సముద్రాన్ని మింగటం, శత్రువుల్ని వధించటం, పచ్చిమాంసాన్ని, చేపల్ని పాయసాన్ని భుజించటం, ప్రేగుల్ని 
చుట్టుకుని నేలపై పడి దొర్లటం, ఆకాశం నిర్మలంగా వున్నట్టు కనిపించటం, దేవతలు, విప్రులు, గురువుల నుంచి అనుగ్రహాన్ని పొందటం, గోశృంగం నుంచి, చంద్రుడి నుంచి కారే నీళ్ళలో స్నానం చేయటం, రాజలాంఛనాలు లభించటం, తంత్రీవాద్యాలు మ్రోగించటం, సంకెళ్ళతో బంధించబడటం, మలాన్ని పూసుకోవటం, ఇళ్ళు తగలబడటం, రాజుల్ని దర్శించటం, 
దేవతామూర్తుల్ని, పవిత్రమైన జలాన్ని చూడటం ఇవన్నీ శుభస్వప్పాలు.

ఈ శుభస్వప్నాల వల్ల అప్రయత్నంగా ధనం లభించటం, రోగులకి రోగవిముక్తి జరగటం అనే శుభఫలితాలు కలుగుతాయి.

శుభాశుభ శకునాలు

అశుభశకునాలు : నల్లనిధాన్యం, దూది, ఎండుగడ్డి, ఎండుపేడ, కట్టెలు, బొగ్గులు, నూనె, బెల్లం, నూనె అంటుకున్న బోడితల, నగ్నంగా వున్నవాడు, జుట్టులేనివాడు, రోగార్తుడు, కాషాయాంబరధారి, ఉన్నత్తుడు, బలహీనుడు, దీనుడు, నపుంసకుడు, ఇనుము, బురద, కేశాలకట్ట, చర్మం, తెలకపిండి, సారంతీసేసిన పదార్థాలు, ఛండాలుడు, కారాగార రక్షకులు, కసాయివాడు,
గర్భిణీస్త్రీలు, ధాన్యంపొట్టు, భస్మం, కపాలం, ఎముకలు, పగిలిన పాత్రలు, కందులు, ఎర్రని పాత్రలు, కుండలు, అమంగళకర వాద్యాలు, భయంకరమైన ధ్వనులు అశుభశకునాలు.

ఎక్కడికి వెళుతున్నావు? ఆగు? వెళ్ళవద్దు? అనే మాటలు అశుభాన్నిస్తాయి. ధ్వజం మీద మాంసాహార పక్షులువాలటం, వాహనాలు తడబడటం, వస్త్రాలు జారిపోవటం, ద్వారానికి తలడీకొనటం, కాళ్ళకి ఎదురుదెబ్బలు తగలటం, ఛత్రం, ధ్వజం, వస్త్రం క్రిందపడటం అశుభాలు. ఇవి మొదటి సారి జరిగినప్పుడు నారాయణుణ్ణి స్తుతించటం అర్చించటం చేయాలి. రెండోసారికూడా జరిగితే ప్రయాణం మానుకుని ఇంట్లో కూర్చోవాలి.

శుభశకునాలు : తెల్లనిపూలు, పూర్ణకుంభాలు, జలపక్షులు, మాంసం, చేపలు, ఆవులు, అశ్వాలు, ఏనుగులు, ఒంటరి బౌద్ధసన్యాసి, సాధుజీవి, మేక, దేవతలు, విప్రులు, మండుతున్న అగ్ని, వేశ్య, దర్భలు, పచ్చి గోధుమలు, వెండి, రాగి, బంగారం, రత్నాలు, తెల్లని ఆవాలు, మనుషులు మోసే పల్లకి, మట్టీ, ఆయుధాలు, రాజలాంఛనాలు. నేయి, పెరుగు, పాలు, ఫలాలు, మంగళకరమైన
వాద్యధ్వని, సంగీతనాద్యాలు ఇవన్నీ శుభశకునాలు.

మత్స్యవురాణం ఫలశ్రుతి

మత్స్య పురాణము

Matsya Purana Phalashruti - మత్స్యవురాణం ఫలశ్రుతి

మత్స్యవురాణం ఫలశ్రుతి

ఈ మత్స్య పురాణం పరమపవిత్రమైనది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే స్వయంగా మత్స్యరూపాన్ని ధరించి మనువుకి ప్రబోధించింది. ఈ పురాణ శ్రవణం వల్ల పాపాలన్నీ నశిస్తాయి. అనేక తీర్థాలు, క్షేత్రాలు, పుణ్య నదుల్లో స్నానం చేయటం వల్ల సమస్త ధర్మాలన్నీ శ్రద్ధగా ఆచరించటం వల్ల కలిగే
ఫలితాలన్నీ ఈ పురాణ శ్రవణం వల్ల పఠనం వల్ల మానవులకి లభిస్తాయి.

అస్మాత్పురాణాత్సుకృతం నరాణాం తీర్ధావలీనామహాఫలానామ్‌
 ।
సమస్త ధర్మాచారణోద్భవానామ్‌ సదైవ లాభాశ్చ మహాఫలానామ్‌ ॥

అస్మా
త్పురాణాదపి పాదమేకమ్‌ పఠేత్‌ యఃసోపి విముక్తపాపః ।
నారాయణ స్యాత్‌ పదమేతి నూనం అనంగవద్దిన్య వపుః సుఖీస్యాత్‌ ॥

అత్యంత ప్రాచీనమైన ఈ మత్స్యపురాణంలో ఒక్క శ్లోకాన్ని పఠించిన వాడుకూడా సకల పాపాలనుంచీ విముక్తుడై శ్రీమన్నారాయణుడి దివ్య ధామానికి చేరుకుంటాడు. అతడికి మన్మధుడు లాంటి దివ్యమైన శరీరం లభిస్తుంది. ఎన్నో రహస్య తత్త్వల్ని ప్రతిపాదించిన ఈ పురాణాన్ని శ్రద్ధతో వినేవాడికి, చదివే వాడికి అశ్వమేధయాగం ఆచరించిన ఫలం లభిస్తుంది.

మానవులు నిత్యం శివుణ్ణి, విష్ణువుని, బ్రహ్మని, సూర్యుణ్ణి అర్చించిన తరువాత ప్రతిరోజూ శ్రద్ధతో ఈ పురాణంలోని ఒక శ్లోకాన్నిగానీ తాత్పర్యాన్ని గానీ, కనీసం శ్లోక పాదాన్ని గానీ తాను పఠించి, ఇతరులకి వినిపిస్తే బ్రాహ్మణుడికి-విద్య, క్షత్రియుడికి -భూమి, వైశ్యుడికి -ధనం, శూద్రుడికి -సుఖం సంప్రాప్తిస్తాయి. ఇక ఈ పురాణాన్ని ఆసాంతం పఠించినవాడు ధనధాన్యవస్తువాహనాల్ని సమృద్ధిగా పొందుతాడు.

॥ సర్వేజనాః సుఖినోభవంతు 

మత్స్య పురాణము

King Duties and Responsibilities - రాజు చేయాల్సిన పనులు

రాజు చేయకూడని పనులు

రాజైనవాడు వేటని, మద్యపానాన్ని జూదాన్ని విడిచిపెట్టాలి. ఈ మూడింటినీ విడిచిపెట్టని ఎంతోమంది మహారాజులు లోకంలో క్షీణించిపోయారు. రాజన్నవాడు వ్యర్థంగా తిరగకూడదు. పగటిపూట నిద్రించకూడదు. వాక్పారుష్యం, దండపారుష్యం కూడదు. ఎవరినీ పరోక్షంగా నిందించకూడదు. రెండు విధాలైన అర్ధనష్టం చేయకూడదు. అనగా 1.ధనం 2.ఆస్తి వీటిలో
మొదటిదైన ఆస్తి అనగా తన స్వంతమైన నివాసస్థలాలని, దుర్గాలని సరిగ్గా సంరక్షించకపోవటం, అస్తవ్యస్తంగా వాస్తు విరుద్ధంగా నిర్మించటం, అనవసరంగా వాటిని కూల్చేయటం, చెడిపోయిన వాటిని బాగుచేయకపోవటం, ఒకచోట కట్టించాల్సిన వాటిని వేరొక చోట కట్టించటం - ఇలాంటివి అర్థనష్టాలు.

రెండో రకమైన అర్ధనష్టం అనగా దేశ కాల పాత్రల్ని ఎరగకుండా దానధర్మాలు చేయటం. అనవసరమైన కార్యక్రమాల కోసం ధనాన్ని వెచ్చించటం మొదలైనవి. అర్ధనష్టాన్నీ అర్ధదూషణ అనికూడా అంటారు. వీటితోపాటు కామ, క్రోధ, లోభ, మదమాన, హర్షాలని ప్రయత్న పూర్వకంగా విడిచిపెట్టాలి.

ఈ రకమైన దోషాల్ని చేయకుండా వున్న రాజు ముందుగా తన భృత్యుల్ని తరువాత తన పౌరుల్ని లోబరుచుకోవాలి.

రాజు చేయాల్సిన పనులు

రాజు తన పట్టాభిషేకం అయిన దగ్గరనుంచి తన రాజ్యాన్ని పరిరక్షించుకోవటానికి తగిన సహాయకుల్ని ఎన్నుకోవాలి. ఎందుకంటే వారి మీదే రాజ్యపాలనాభారం నిలిచి వుంటుంది గనుక. రాజు స్వయంగా పరీక్షించి గుణవంతుల్నే సహాయకులుగా ఎన్నుకోవాలి. కులీనుడు, శీలసంపన్నుడు, చతుర్వేదవిశారదుడు, హస్తి శిక్షా, అశ్వశిక్షలలో నిపుణుడు, మృదుభాషి,
శుభాశుభశకునాలు తెలిసినవాడు, వివిధరకాల చికిత్సాపద్ధతుల్ని ఎరిగినవాడు, కృతజ్ఞుడు, కార్యదర్శి, శూరుడు, కష్టాల్ని సహించేవాడు, ఋజుస్వభావుడు, వ్యూహాలు పన్నటంలో నైపుణ్యం కలిగినవాడు అయిన బ్రాహ్మణుడిని కానీ, క్షత్రియుడిని కానీ సేనాపతిగా నియోగించాలి. పొగడగరి, సురూపుడు, దక్షుడు, ప్రియవాది, పొగరులేనివాడు, అందరి మనసులకీ నచ్చేవాడు, అందరి
మనసుల్లోని భావాల్ని గ్రహించేవాడు అయిన వాడిని ప్రీతిహారి (ద్వారాధికారిగా)  నియమించుకోవాలి.

శల్యం, శాలాకృతం, శాలాక్యం, కాయచికిత్స, భూతవిద్య, కౌమార, భృత్య, అగదతంత్రం, రసాయనతంత్రం, వాజీకరతంత్రం కాయం, బాలం, గ్రహం, ఊర్థ్వంగకం, శల్యం, దంష్ట్రం, వృషభం అనే వైద్యాంగాలలో, చికిత్సా ప్రక్రియలో నిపుణుడు, వంశపరంపరా క్రమంగా వచ్చినవాడు, వేషంలో నిరాడంబరుడు, ధర్మబద్ధమైన మనసుకలిగినవాడు, ఉత్తమవంశంలో
జన్మించినవాడు, అయిన వ్యక్తిని రాజవైద్యుడుగా నియమించుకోవాలి. రాజుకి అతడు ప్రాణరక్షకుడు కనుక సాధారణ ప్రజల్లాగా రాజు వైద్యుడి మాటను మన్నించి అతడు చెప్పిన విధంగా నడుచుకోవాలి.

రాజు తన ఇష్టం వచ్చినంత మందితో సలహాలు, సంప్రదింపులు, ఆలోచనలు చేయవచ్చు కానీ, అవి వేరు వేరుగా చేయాలి. మంత్రాలోచనా పరుడైన రాజు తన మంత్రులలో కూడా ఒకరితో జరిపిన చర్చల్ని మరొకరితో చర్చించకూడదు. రాజు ఎవరినీ నమ్మకూడదు. ఆయా మంత్రులు చెప్పిన
విషయాల్ని విని తానే సరైన నిర్ణయం చేయాలి. వేదశాస్త్రాలు బాగా చదివిన పండితుల్ని రాజు పోషించి వారిని పూజించాలి. తాను వినయసంపదతో పండితుల నుంచి విషయాలని గ్రహించాలి. ఈవిధంగా చేస్తే రాజు పృథివినంతా తన వశంచేసుకోగలడు.

రాజు ప్రవర్తన
మహారాజైనవాడు వ్యసనాల్ని విడిచిపెట్టాలి. కానీ లోకం కోసం తాను ఆయా విషయాల్లో కూడా నేర్పరి నేనని తెలియచేయటానికి కృత్రిమంగా వ్యసనాల మీద ఆసక్తివున్నట్లు నటించాలి. రాజు ప్రతిపౌరుడితో చిరునవ్వులు చిందిస్తూనే మాట్లాడాలి. వధించాల్సినవారి విషయంలో కూడా కోపం
ప్రదర్శించకూడదు. రాజు ఎప్పుడూ దాతృత్వం, ఉదారత్వం కలిగివుండాలి. అలాంటివాటికి భూమండలమంతా వశమౌతుంది. రాజు ఏ పని గురించీ దీర్గంగా ఆలోచించకూడదు. కొన్ని పనుల్లో తొందర పనికిరాదు, నిదానంగా ఆలోచించి చేయాలి. రాజు ఎప్పుడూ తన మంత్రాలోచనాన్ని రహస్యంగా వుంచాలి. రాజు చేయబోయే పనులు ముందుగా ఎవరికీ తెలియకూడదు. రాజు తన వెంట ఎప్పుడూ మంత్రవేత్తని రక్షణగా వుంచుకోవాలి.

వ్యక్తి ఆకారం, ముఖకవళికలు, వాడి ఇంగితం (సైగలు - కదలికలు) నడక, మాటలు, చేష్టలు, నేత్ర వికారాలని బట్టి ఇతరుల మనసుని గ్రహించగలగాలి. రాజు తనొక్కడే ఏవిషయం గురించీ ఆలోచించకూడదు. అలాగని చాలామందితో కూడా ఆలోచనలు చెయ్యకూడదు. పరిమితంగా 
విషయ పరిజ్ఞానం కలిగిన వారితో మాత్రమే చర్చించాలి. తను ఎక్కబోయే నావని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే దాన్ని ఎక్కాలి. తాను తినే ఆహారాన్ని కూడా పరీక్షించకుండా భుజించకూడదు. తానే తల్లి తండ్రిగా తన ప్రజలందరినీ కన్న బిడ్డల్లా భావించి పరిపాలించాలి. తాను ప్రజలనుంచి స్వీకరించిన పన్నుల్ని వారి సేవకే వినియోగించాలి. శత్రువుల్ని లొంగదీసుకునే విషయంలో సామ, దాన, భేద, దండోపాయాల్ని పాటించాలి.

చోర ప్రాయశ్చిత్తం
బ్రాహ్మణుడు బుద్ధిపూర్వకంగా తనజాతివారి ధనాన్ని గానీ, ధాన్యాన్ని గానీ దొంగిలిస్తే కృచ్చార్ధం ప్రాయశ్చిత్తంగా ఆచరించాలి. స్త్రీలకి, పురుషులకి, సంబంధించిన పొలాలని, స్థలాలని, దొంగలిస్తే చాంద్రాయణ వ్రతంలో శుద్ధి అవుతుంది. అల్పసారమైన ద్రవ్యాన్ని ఇతరుల గృహాల నుంచి దొంగలిస్తే సాంతపనకృచ్చవ్రతాన్ని ఆచరించాలి. భక్ష్య, భోజ్య, శయ్య(మంచం)ఆసనాలని,
పుష్పాలని, ఫలాలని హరిస్తే పంచగవ్య ప్రాశనంతో ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. గడ్డి, కట్టెలు, చెట్లు, అన్నం, ఎండు జొన్న రొట్టె, వస్త్రం, చర్మం, మాంసం దొంగిలిస్తే మూడు రాత్రుల ఉపవాసం ఉండాలి. ముత్యాలు, మణులు, బంగారం, వెండి, ఇనుము, కాంస్యం వంటివి దొంగిలిస్తే పన్నెండురోజులు బియ్యం నూకల అన్నాన్ని తినాలి. పట్టు వస్త్రాల్ని ఉన్ని వస్త్రాలని, రెండు గిట్టల ప్రాణుల్ని ఓషధుల్ని దొంగలిస్తే మూడు రోజులు పాలతో అన్నాన్ని భుజించాలి.

శుభాశుభ శకునాలు

మత్స్య పురాణము

Vamana Avatar Story - వామనచరిత్ర కథాప్రారంభము

వామనచరిత్ర కథాప్రారంభము పై విధంగా చెప్పిన శుకునితో పరీక్షిత్తు ఇలా అన్నాడు. హరి బలిచక్రవర్తిని ఎందుకొరకు మూడడుగుల భూమిని యాచించినాడు? విష్ణు...