Monday, April 27, 2026

Lokaloka Parvathamu - లోకాలోక పర్వతము

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము - లోకాలోక పర్వతము

నారాయణుడిట్లనెను : దానికిపైని లోకాలోకమను పర్వతము గలదు. ఆ పర్వత మధ్యభాగమున సూర్యప్రకాశము పడుచుండును. ఈ పర్వతముపై మేలిమి బంగరు నేల గలదు. అది మానసోత్తరము నుండి మేరువువర కెంత పొడవంత పొడవు గలదు. ఆ బంగారు భూమి నిగ్గుటద్దమువలె నిగ్గులుదేరి యుండును. అందు వేల్పులు తిరుగుచుందురు. అందే వస్తువు పడినను స్వర్ణమయమగును. 

ఓ నారదా ! అందువలన నందే ప్రాణియు నుండదు. ప్రజల కగమ్యమైన దగుటచేత నది లోకాలోకమని వ్యాఖ్యానించబడెను. ఈ సువర్ణస్థలము లోకాలోక పర్వతము మధ్యభాగమున సొంపారుచుండును. భగవంతు డీలోకాలోకమును ముల్లోకముల నట్టనడుమ నుండునట్టు లేర్పఱచెను. సూర్యునినుండి ధ్రవతారవఱకుండు కిరణములన్ని యును లోకాలోక పర్వతమునకు వశమై యవి మూడు లోకములను దాటి పోజాలకున్నవి. 

దేవఋషీ! ఈ పర్వతరాజమెంతెంతయో యెత్తుగ విశాలముగ నుండుటచేత సూర్యకిరణములు దీనిని దాటి యావలికి పోజాలవు. ఈ పర్వతములోకము లన్నింటికిని మానదండముగ నున్నది. ఇది యేబదికోట్ల యోజనములంత విస్తారముగ గలదని కవులందురు. 

ఓయి మునీ ! ఈ లోకాలోకాచలముమొత్తము భూగోళములో నాల్గవవంతు గలదు. స్వయంభువుడగు బ్రహ్మదానికి నలుదెసల నాల్గుస్థానము లేర్పఱచెను. అతడు గిరికి నాల్గు వైపుల దిగ్గజముల నుంచెను. వాని పేర్లు వినుము. ఋషభము, పుష్పచూడము వామనము అపరాజిత మనునవి పేర్లు.

ఎల్లలోకములయునికీ దిగ్గజములు జీవనాడులవంటివందురు. భగవానుడు వానిలోని సంపదలను వీర్యములను పెంపోందింపజేయును. అతడు దాని విశుద్ద సత్త్వమును పెన్నిధుల నినుమడింపచేయును. ఇట్లు భగవానుడగు హరి యచట నెనిమిది సిద్దులను విష్వక్యేనాదులను గూడి విలసిల్లుచుండును. పరమేశ్వరుడెల్లలోకముల మేలుగోరి తన దివ్యాయుధములు దాల్చి యందు వెలుగొందుచుండును. 

సనాతనుడగు శ్రీమహావిష్ణువు తన మాయారచితమగు దీనిని కల్పాంతమువఱకు గాపాడు చుండును. వీని లోపలి వైశాల్యమును బట్టి యాలోక పరిమాణము తెల్పబడెను. దానికి బయట లోకాలోక పర్వతము గలదని చెప్పబడెను. 






Krauncha Dvipam - క్రౌంచ ద్వీపం

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము - క్రౌంచ ద్వీపం

నారదు డిట్లనెను : ఓ సర్వార్థ దర్శనా ! మిగిలిన దీవుల ప్రమాణముల గూర్చియు నెఱింగింపుము. వాని నెఱిగి నందువలన పరమానందము చేకూరును. 

నారాయణు డిట్టులనియెను : కుశ ద్వీపము చుట్టు నేతిసంద్రము గలదు. దానికి రెండింతల పరిమాణముతో క్రౌంచద్వీప మొప్పుచుండును. దీనికి చుట్టును పాలసంద్రము తనరును. ఈ ద్వీపమున క్రౌంచాద్రి యుండుట వలన దీనికి క్రౌంచద్వీపమను పేరు గల్గెను. మున్ను కుమారస్వామి తన శక్తి బాణముతో దీని నడిమి భాగము చీల్చెను. దానిని వరుణుడు పాలసంద్రముచేత తడిపి కాపాడెను. 

దీని కధినాయకుడు ప్రియవ్రతుని కొడుకగు ఘృత పృష్ఠుడు . ఇతడు సర్వలోకవందితుడై విరాజిల్లుచున్నాడు. ఇతడును తన యేడ్గురు కొడుకుల పేర్లమీద నేడువర్షము లేర్పరిచి వారి కప్పగించెను. అతడు స్వయముగ శ్రీ భగవానుని శరణు జొచ్చెను. ఆమము - మధురుహము- మేఘపృష్ఠము- సుధామకము-భ్రాజిష్ఠము-లోహితార్ణము- వనస్పతి-యను నేడువర్షములు. అందేడేసి సంఖ్యలలో నదీ పర్వతములు లలరారు చుండును. శుక్లము-వర్ధమానము-భోజనము-ఉపబర్హణము-నందము- నందనము-సర్వతోభ్రదమనున వచటి గిరి ముఖ్యములు. అభయ-అమృతౌఘ - ఆర్యక- తీర్థపతి-వృత్తి రూపవతి-శుక్ల-పవిత్రవతి-యనునవినదులు. వీని పుణ్యజలములు నాల్గు వర్ణములు ప్రజలు గ్రోలుదురు. పురుష-ఋషభ-ద్రవిణ-దేవక-లను నాలుగు వర్ణములు వార లచట వసిందురు. అచటి ప్రజలు జలమయుడు-జలాధిపతి-యగు దేవుని గొల్తురు.

వారు భక్తితో జలాంజలులతో పెక్కు విధముల నిట్లు నుతింతురు. '' ఓ జలదేవాః నీవు పురుషోత్తముని వీర్యమవు. నీవలన భూర్‌ - భువః - స్వర్లోకములు పునీతములై యున్నవి. నిన్ను తాకుచున్న మా మేనుల నాత్మరూపుడవై పవిత్రమొనరింపుము.'' అను మంత్రజపముతో వివిధ స్తుతులతో నచటి వారు జలపతిని నుతింతురు. ఇట్లు క్రౌంచద్వీపము ముప్పది రెండు లక్షల యోజనముల విస్తీర్ణము గల్గి క్షీరసాగరముచేత చుట్టబడియుండును. 

అంతే పరిమాణముగలదధిసముద్రముచేత శాకద్వీపము చుట్టబడియుండును. అందు కోకొల్లలుగ శాకవృక్షములు గలవు. నారదా! అది తన క్షేత్ర వైశాల్యమున కడు పెద్దది. ఆ దీవికి ప్రియవ్రతుని పుత్రుడు మేధాతిథియనువా డధిపతిగ నుండెను. అతడును దాని నేడు భాగములు చేసి తన యేడుగురు కొడుకుల పేర్లు పెట్టి వారి కిచ్చి తాను యోగమార్గ మవలంభించెను. పురోజవము- మనః పూర్వజవము-పవమానకము-ధూమ్రానీకము- చిత్రరేఫము-బహురూపము-విశ్వధృక్కు-అనునవి ప్రసిద్ధవర్షములు. - నదులు నేడు గలవు. 

ఈశానము-ఉరుశృంగము-బలభద్రము- శతకేశరము-సహస్రస్రోతకము- దేవపాలము-మహాశనము- ననునవి ప్రసిద్ధ గిరుల నామములు. ఏడు నదుల పేర్లు వినుము: అనఘ-ఆయుర్ద ఉభయస్పృష్టి- అపరాజిత-పంచపది-సహస్రశ్రుతి- నిజధృతి-యను నవి పేరొందిన నదీమతల్లులు. అచటి జనులెల్లరును-సత్యవ్రత-క్రతువత-దానవ్రత-అనువ్రత-యను నాల్గు వర్ణముల నొప్పుచుందురు. వారు వాయుదేవుని ప్రాణాయామ పూర్వకముగ నుతింతురు.

వారు రజస్తమస్సులులేని సత్త్వరూపుడగు శ్రీహరిని గొల్తురు. ఆ దేవుడు ప్రాణరూపమున భూతములందు జొచ్చి ప్రాణములను భరించును. ఈ జగములన్నియు నతని వసమందుండును. అట్టి సర్వాంతరుడైన యీశ్వరుడు మమ్ముగాపాడుతమని వారు నుతింతురు. 

దధిసముద్రమునకు మిక్కిలి విశాలముగ పుష్కరద్వీపము గలదు. పుష్కరద్వీపకుశాక ద్వీపమునకు రెండింతులు గలదు. అది తనంతటి పరిమాణముగల మంచినీటి సంద్రముచే చుట్టబడియున్నది. ఈ ద్వీపమందు నగ్నివలయములవలె పుష్కరములు(కమలములు) పసిడిరేకులతో వేనకువేలు చెన్నొందును. ఈ పుష్కరములను సర్వలోకములు రచింపగోరిన లోకగురవగు బ్రహ్మదేవుడు తన కమలాసనముగ కల్పించెను. 

ఈ దీవియందు నాటినుండి నేటి వఱకు నలరుచున్న యొకేయొక గిరి గలదు. అది మానసోత్తరగిరి. ఇది తన పొడవు-వెడల్పు-నందు పదివేల యోజనములంత గలదు. దీని నలుదెసల నాల్గు పురములు విలసిల్లుచున్నవి. ఈ పురము లింద్రాదిలోకపాలకులవి. వీనికి పైగా మేరుగిరికి ప్రదక్షిణముగ భాస్కరుడు వెల్గుచు తిరుగుచుండును. ఇచట సంవత్సరమందలి యుత్తరాయణ-దక్షిణాయనములు దేవతల కొక పగలు - రేతిరి యగును. 

ప్రియవ్రతుని పుత్రుడు వీతిహోత్రుడు దీని కధినేత. ఇతనికిర్వురు కుమారులు. అతడు వారిపేర్ల మీద రమణము -ధాతకి-యను పేర్లుంచిన రెండు వర్షము లేర్పఱచి వారిని వాని కధిపతులుగా జేసెను. అతడును తన పూర్వజుల పగిది భగవద్బక్తి తత్పరుడయ్యెను. అచటి ప్రజలు బ్రహ్మరూపియగు పరమేశుని ధ్యానింతురు. వారు తమ దేవుని కర్మయోగముతో గొల్తురు. వారు శీలసంపన్నులై బ్రహ్మసాలోక్యమునకు సాధనములు వెదకుదురు. ఏకాంతము - అద్వయము-శాంతము-నగు భగవానునకు వారభివందనములు చేతురు.

లోకాలోక పర్వతము






Description of the Plakshadi Dweepashtaka - ప్లక్షాది ద్వీపషట్క వర్ణన

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము - ప్లక్షాది ద్వీపషట్క వర్ణన

శ్రీ నారాయణు డిట్లనెను: ఈ జంబూ ద్వీపమెంత పరిమాణము గలదో యంతియ పరిమాణము గల క్షార సముద్రముచే నీ జంబూద్వీపము చుట్టబడియున్నది. మేరుగిరి జంబూద్వీపముచే చుట్టబడెను. జంబూద్వీప పరిమాణమునకు రెండింతలు పరిమాణముగల ప్లక్షద్వీపముచేత క్షారసముద్రము చుట్టబడెను. 

ఒకపెద్ద లోతైన యగడ్త వనములను చుట్టినట్టులిది యును చుట్టి యుండును. అదు బంగారు కాంతిరేఖలు వెల్గుచుండును. అచట ప్రియవ్రతుని కుమారుడు సప్తజిహ్వుడనువాడు గలడు. ఇధ్మజిహ్వుడా ద్వీపమున కధిపతి. అతడు దాని నేడు వర్షములుగ విభజించి తన యేడుగురు కొడుకులకు పంచి యిచ్చెను. తుద కత డాత్మ ప్రియమగు యోగమార్గ మవలంబించి యాత్మవిచారయోగముతో భగవంతునిలో లీనుడయ్యెను. 

శివము-యవసము-భద్రము-శాంతము-క్షేమము-అమృతము-అభయ-మను నేడు వర్షములతని యేడుగురు కొడుకుల పేర్లమీద నేర్పడెను. అందేడునదులు నేడు గిరులును ముఖ్యములు. అరుణ-నృవ్ణు-అంగీరస-సావిత్రి-సుప్రభాతిక-ఋతంభర-సత్యంభర-యనునవిముఖ్య జీవనదులు. మణికూటము-వజ్రకూటము-ఇంద్రసేనము-జ్యోతిష్మంతము-సువర్ణము-హిరణ్యష్ఠీవము-మేఘమాల-యనునవి ప్లక్షద్వీపమందలి పర్వతరాజములు. 

ఆ దివ్యవాహినుల జలమును తాకిన-త్రాగిన -క్రుంకిన -మాత్రన ప్రజల యజ్ఞాన పాపములు తొలగింపోవును. ఈ ప్లక్షద్వీపమందు హంస-పతంగ-ఊర్ద్వాయన-సత్యాంగము-లను నాల్గు వర్ణములు వారుందురు.వారు వేయేండ్లు బ్రదుకుదురు. వారు దేవతలను పోలిన ఆకృతులు కలవారు. వారు త్రయీ విద్యావిధానము స్వర్గ ద్వారమనబడు సూర్యభగవాను నీ విధముగ బూజింతురు. 

పురాణపురుషుడు - శ్రీ విష్ణుస్వరూపుడు-సత్యధర్మముల కధిష్టానదేవత-బ్రహ్మస్వరూపుడు- శుభాశుభముల ప్రేరకుడు-నగు సూర్యాత్ముని శరణు వేడుచున్నాను. ఈ ప్లక్ష ద్వీపము నందును మఱి మిగిలిన యైదు దీవులందు నుండు వారి కాయువు ఇంద్రియము ఓజస్సు బుద్ధిబలము ప్రాణము పరాక్రమము ననువి సహజసంపదలుగ గల్గుచుండును. 

ఈ ప్లక్షద్వీపము చుట్టును చెఱకు సముద్రము గలదు. ఈ దీవికి రెండింతల పరి మాణముతో శాల్మలీద్వీపము గలదు. ఈ దీవి తనంతటి వైశాల్యముగల సురాసాగరముచే చుట్టబడియున్నది. ఈద్వీప మందు శాల్మలీద్వీపవృక్షములు ప్లక్షద్వీపవృక్షము లంత మిక్కిలిగ గలవు. ఆ ద్వీపము పక్షిరాజగు గరుడ భగవానుని నివాసస్థానము. అ దీవి కథిపతి ప్రియవ్రతుని కొడుకు యజ్ఞబాహుడు. అతడు తన యేడుగురు కొడుకుల కేడు వర్షములు పంచియిచ్చెను. 

ఆ వర్షముల నామముల వినుము. సులోచనము--సౌమనస్యము-సౌమనస్యము-రమణము-దేవవర్షకము-పారిభద్రము-అప్యాయనము-విజ్ఞాతము-ననునవి వాని పేర్లు. అ వర్షములందేడు నదులు నేడు పర్వతములు ప్రధానములు. సరసము-శతశృంగము-వామదేవము-కందకము-కుముదము-పుష్పవర్షము-సహస్రశ్రుతి-యునవి యేడు గిరుల పేర్లు. ఇంకనదుల పేర్లు చెప్పబడుచున్నవి. అనుమతి -సినీవాలి-సరస్వతి-కుహు-రజని-నంద-రాక యనునవి ముఖ్యనదులు.

ఆ వర్షములందు శ్రుతధర- వీర్యధర-వసుంధర-ఇషుదర-యను నాల్గు వర్ణముల వారు గలరు. తన కిరణ కాంతులచే శుక్ల కృష్ణ పక్షములు విభజించుచు పితరులను తనువుచుండు వేదమయుడు భగవానుడు నగు సోమేశ్వరు నచటి వారు గొల్తురు. ఆ సోము డెల్ల ప్రజల కోర్కులు దీర్చుచుండును. 

ఈ సురాసముద్రమునకు రెండింతలుగ నేతిసంద్రము తన రారును. ఈ నేతిసంద్రముచేత కుశద్వీపము చుట్టబడియున్నది. అచట కుశస్తంబము లుండుటవలన దీనిని కుశద్వీపమందురు. కుశ స్తంబములు తమ యంకురముల కాంతులు విరజిమ్ముచుండును. ఆ దీవికి ప్రియవ్రతుని కొడుకు హిరణ్యరేతు డధిపతి. 

ఇతడును తన యేడుగురు కొడుకుల పేరులేడు వర్షముల కుంచెను. వసువు-దృఢరుచి-నాభిగుప్తము-స్తుత్యవ్రతము-వివిక్తము-నామదేవక-మను నవి వర్షముల పేర్లు. వానియందేడుగిరులు గలవు. అందేడు నదులు గలవు. వాని పేర్లు వినుము. చక్రము చతుః శృంగము-కపిలము-చిత్రకూటము-దేవానీకము-ఊర్ద్వరోమము-ద్రవిణము-నను నవి యేడు గిరులు. రసకుల్య-మధుకుల్య-మిత్రవింత-శ్రుతివింద-దేవగర్బ-ఘృతచ్యుత- మందమాలికయను నవి యేడు నదుల పేర్లు. 

కుశధ్వీపవాసు లీ నదుల జలము లుపయోగించుకొందురు. కుశల- కోవిద-అభియుక్త- కులక- యను నాల్గు వర్ణముల ప్రజలచట నివాసము చేతురు. వారు సర్వవిదులు- దేవతాస్వరూపులు-కర్మకుశలురు- అగ్నిదేవుని సేవించువారలు. ఓ జాతవేదా!(ధనమునకు కీర్తికి మూలభూతుడా) నీవు సాక్షాత్తుగ పరబ్రహ్మమునకు హవ్యమును అందజేయువాడవు. మా దేవతాయజ్ఞనముల ఫలితములు పరమేశున కందజేయుము. అని కుశద్వీపవాసు లగ్నిలో వేల్తురు.

క్రౌంచ ద్వీపం






Sunday, April 26, 2026

Bharatha Varsham - భారత వర్షం

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము - భారత వర్షం

శ్రీనారాయణు డిట్లనెను : ఇంక నాల్గు వేదములు పుట్టిన జీవధాత్రి కర్మభూమియగు పావన భారతవర్షమునందు నే నాదిపురుష రూపమున విరాజిల్లుదును. నన్ను నీవి విధముగ సంస్తుతింతువు. 

నారదు డిట్టనును : శాంతికి నెలవు దరిద్రుల పాలిటి పెన్నిధి ఋషిశిఖామణి అహంకారరహితుడు పరమహంస పరమగురువు ఆత్మారాముల కధిపతి యగు నరనారాయణుడను భగవానునకు నా ప్రణామముల. ఈ సకల విశ్వమునకు కర్త యయ్యును కర్మచేత బద్ధుడుగాని వాడును దేహియయ్యును దేహబాధలు లేనివాడును ద్రష్ట యయ్యును విషయములచే చెడని చూపుగలవాడును సంగమములేని వివిక్తసాక్షియు నగు దేవునకు ప్రణామములు. 

ఓ యోగీశ్వరా ! అంత కాలమందున నిర్గుణుడవగు నీయందు పరమభక్తితో మనస్సు నిలిపి తనువు చాలించుటే యోగ నైపుణ్యమని యా హిరణ్యగర్బుడు పలికెను. ఎవడు విద్యాంసుడయ్యు నిహపరలోకములందు లంపటుడో ఎవ్వడు ధన-దార-సుతులయం దాసక్తుడగునో యీ వట్టి మట్టి తనువు వదలుటకు బాధ పడునో యట్టి వాని జ్ఞానమంతయును బూడిదలో బోసిన పన్నీరే; శ్రమమాత్రమే సుమా ఓ యధోక్షజా ! నీ మాయవలన శరీరమందలి యహం కార మమకారములు చెలరేగును. వానిని రూపుమాపగల్గు నీ సహజమైన ప్రేమభక్తియోగము మా కీయగదవే ! 

ఈ విధముగ సకల సారవిదుడు మునివరుడు నగు నారదమహర్షి నిత్యమనామయుడగు శ్రీనారాణుని సంస్తుతించుచుండును. 

ఓ దేవ ఋషీ! ఈ భారతవర్షమందలి నదీ-పర్వతముల గూర్చి వివరింతును. సావధానముగ నాలకింపుము. శ్రీమలయగిరి మంగల ప్రస్థము మైనాకము చిత్రకూటము ఋషభకూటము కోల్లము సహ్యము దేవగిరి ఋష్యమూకము శ్రీశైలము శ్రీవేంకటాచలము మహేంద్రము వారి ధారము వింధ్యము ముక్తిమంతయు ఋక్షగిరి పారి యాత్రము ద్రోణము చిత్రకూటగిరి గోవర్థనము రైవతకము కుకుభము నీలగిరి గౌరముఖము ఇంద్రకీలము కామగిరి మున్నగునవి కాకింకెన్నో పుణ్యప్రదములగు పర్వతములు విలసిల్లుచున్నవి.

వీనినుండి పుట్టిన వందల-వేల-నదీ-నదములు చూచిన-త్రాగిన గ్రుంకిన-కీర్తించిన మాత్రన పావన మొనర్చును. ఇవి జీవుల ముడు విధముల పాపములను నశింపజేయును. తామ్రపర్ణి చంద్రవంశ కృతమాల వటోదక వైహాయసి కావేరి పయస్విని తుంగభద్ర కృష్ణ శర్కరావర వేణ గోదావరి భీమరథి నిర్వింధ్వ పయోష్ణి తాపి రేవ నర్మద సురస సరస్వతి చర్మణ్వతి సింధు అంధశోణ ఋషికుల్య త్రిసామ వేదస్మృతి మహానది కౌశికి యమున మందాకిని దృషద్వతి గోమతి సరయు రోధవతి సప్తవతి సుషోమ శతద్రు చంద్రభాగ మరుద్వృధ వితస్త అసిక్ని విశ్వ మున్నగు నదీనదములు జీవన ప్రదములై పుణ్యభారతభూమిపై ప్రసిద్ధములై యున్నది. 

భారతవర్షమందలి జనులు కారణజన్ములు. వారు సత్త్వము-రజస్సు-తమస్సుల కారణముగ తెలుపు-ఎఱుపు-నలుపులుగల స్వర్గ-భూ-నరభోగము లనుభవింతురు. ఇచట నివసించు వార లెల్ల భోగము లనుభవింతురు. ఆయా వర్ణముల ధర్మము ననుసరించి ఎల్లరికి ముక్తి గల్గును. ఎల్ల కార్యములు తేలికగ సిద్ధి బొందుట యీ భారతవర్షముయొక్క విశిష్టలక్షణము. అని వేదవిదులగు మునులు స్వర్గవాసులను పల్కుచుందురు. 

శ్రీహరి విశేషించి భారతీయులపట్ల ప్రసన్నత వహించును. వీరు భారతదేశమున జన్మించి హరిచరణ కమలసేవచేసి మాకును కనువిప్పు గల్గింతురు గదా ! ఆహా! ఈ భారతీయు లెంతటి పుణ్యవంతులో కదా! తీరని యింద్రభోగముల మాటున మా శ్రీ నారాయణుని పాదకమలచింతన మఱుగుపడెను గదా! ఇక దుష్కర తపోదానత్రములవలన స్వర్గప్రాప్తివలన మా కేమి లాభము? 

కల్పాయువుతో స్వర్గమం దుండుటకంటె నల్పాయువుతో భారతమున జన్మించుట లెస్స. ఇచట ప్రజ్ఞావంతులు క్షణకాలమున సర్వమును త్యాగముచేసి యభయమైన హారిచరణకమలము నాశ్రయింతురు. వైకుంఠ కథాసుధారసము భాగవత - సాధుల-సత్సంగతి యజ్ఞేశుని యాగ మహోత్సవములను లేని యింద్రలోక మేనాటికిని చేరగూడదు. 

ఇంతటి మహిమగల భారతమునందు మానవులుగ జన్మించి జ్ఞాన-క్రియా-ద్రవ్య సంపద గల్గియును ఎవరు పునర్జన్మము లేకుండుటకు యత్నింపరో వారు మరల జంతువులలె బంధింపబడుదురు. దర్బలచేత పవిత్ర మై నవస్తువులను మంత్రపూతముగ నాయా దేవతల పేర్లు చెప్పి యెవరు వేల్తురో వారిచ్చిన వస్తువులను హరి ప్రీతితో స్వీకరించును. 

సత్య మేమనగ భగవానుడు కోరినవారి కోర్కెలు దీర్చును. కాని పరమార్థము మాత్రమీయడు. ఎవ్వాని కర్థించు స్వభావములేదో యెవడు నిష్కామముగ హరిని సేవించునోయట్టివాని కోర్కెలను భగవాను డీడేర్చును. వానికి తన శ్రీ పాదకమలము లొసంగును. మాకు స్వర్గసుఖ మేదైన మిగిలియున్నను మా వెనుకటి యిష్టాపూర్తములు మంచి స్థితిలో నున్న యెడల మాకు కమలనాభుని సంస్మరణ గల్గించు బంగరు భూమియగు భారతవర్షమున జన్మముగల్గి, సుఖసంపదలు గల్గుగాత. 

అని స్వర్గమందలి యెల్ల దేవతలును సిద్ధ-ఋషులును శ్రీమంతమైన భారతవర్ష మహాత్మ్యము గానముచేయుచు అభివర్ణింతురు. ఈ బంజూద్వీపమునకు సమీపమున మఱి యెనిమిది యుపద్వీపములు గలవు. వీనిని సాగర పుత్రులుపాయముతో నేర్పఱచిరి. స్వర్ణప్రస్థ-చంద్రశుక్ర-ఆవర్తన-రమణక-మందర-హరిణ-పాంచజన్య-సింహళ-లంక-యను నెనిమిది యుపద్వీపములు. ఈ విధముగ జంబూద్వీపపు ప్రమాణ మంతయును విపులముగ చెప్పబడెను.







Hiranmaya Varshamu - హిరణ్మయ వర్షము

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము - హిరణ్మయ వర్షము

నారాయణు డిట్లనెను: ఇంక హిరణ్మయవర్షమున యోగపతియగు కూర్మ భగవానుడు విరాజిల్లును. అతని నర్యముడీ విధముగ పూజించి సంస్తుతించును.

సర్వసత్త్వగుణ విశిష్టుడును గుర్తింపరాని జలనివాసము గలవాడును సుఖములు గురియువాడును సర్వగతుడును సర్వాధారుడునునగు భగవానునకు నమస్కారములు. ఈ దృశ్యమంతటిని తన మాయచేతసృజించినవాడు అనంతరూపుడు నిరూపించి లెక్కింపరాని యువతారములు గలవాడు నగు దేవునకు నమస్కారములు. ఈ యండ-పిండ-స్వేదజనులును ఉద్బిదములును దేవ-ఋషి-పితృ-భూతములును సకల చరాచరములును నింగి-దివి-భువి-గిరులు-వనులు-సత్తులు-సాగరములు-దీవులు-గ్రహతారకలును ఇంద్రియములు మున్నగునవన్నియును నీవే కదా!

సాంఖ్యు లెవనియందు విశేషనామరూపములుగల యిరవదినాల్గు తత్త్వములుగలవనిరో తత్త్వదృష్టితో చూడ నెవనియం దిట్టి సంఖ్యకు తావులేదో యట్టి సాంఖ్య నిదర్శనుడగు వానికి చేయెత్తి మ్రొక్కుదును ఈ విధముగ నర్యము డా వర్షమందున్న భగవానుని సర్వభూతకారకుడగు ప్రభుని గానము చేయుచు సంస్తుతించును. ఆ వర్షమునకు నుత్తరమున నుత్తర కురుప్రదేశమున యజ్ఞపురుషుడగు నాది వరాహ భగవానుడు భూదేవిచేత నిత్యపూజలందుకొనును. 

ఆ దైత్యమర్దనుడగు యజ్ఞవరాహమూర్తిని యథావిధిగ భక్తిరసార్దృ హృదయయై భూదేవి యిట్లు ప్రస్తుతించును. మంత్రతత్త్వమున నెఱుంగదగిన మహాయజ్ఞస్వరూపుడు యజ్ఞానుష్ఠానము చేయించువాడు యజ్ఞక్రతువు యుగత్రయరూపుడు శుభకరుడగు వరాహభగవానునకు నమస్కారము. రెండు కట్టెలను మథించుటవలన నగ్నిని బడయవచ్చును. 

అటులే రసహృదయులగు పండితులు గుణవివేకములను మథించి నిన్ను బబడయుదురు నీవు కర్మఫలములచే నెఱుగబడవు. నిన్ను గనగోరువారు జ్ఞానమున గందురు. అట్టి నీకు నమస్కారములు. ద్రవ్య-క్రియా-దేవతా-దేహ-కాలములు మున్నగు మాయావస్తు గుణములచేత తెలియబడు రూపము. గలవాడును యమనియమాదుల నాత్మవిచారణచేయు స్థిత ప్రజ్ఞులచే మాయారహితుడుగ తెలియబడువాడు నగు దేవునకు నమస్కారములు.

ఇను మయస్కాంత సన్నిధిచే నాకర్షింపబడును. అట్లే యాత్మసన్నిధిచేత మాయ పరిభ్రమించును. ఈ మాయ సృష్టిస్థితిప్రళయములు గల్గించును. వీనియందు నీ కెట్టి కామమును లేదు. గుణకర్మలకు సాక్షిభూతుడవైన నీకు నమస్కారములు. తన్నెదుర్కొన్న దైత్యుని పోరాటమున దునుమాడి సాగరమందుండి నన్నుద్ధరించి తన కోరలపై నన్నొక యాటవస్తువుగ ధరింపగల్గిన యాదివరాహ విభునకు నమస్కారములు. కింపురుషవర్షమందు సర్వేశ్వరుడు ఆదిపురుషుడు దాశరథియగు సీతారాముని శ్రీహనుమానుడు నిరంతర మిట్లు సంస్తుతించును.

ఆర్య లక్షణములు శీలవ్రతములు గలవాడు నుత్తమశ్లోకుడు నిగృహీతాత్ముడు-సాధువాదదక్షుడు-బ్రహ్మణ్యదేవుడు-మహాపురుషుడు-మహాభాగ్యుడు-విశుద్ధానుభవముగలవాడు- తన మహాతేజముచే నితర గుణవ్యవస్థను తిరస్కరించు వాడును-మహాప్రశాంతుడు-స్థితప్రజ్ఞులచే తెలియబడువాడు-నామరూపాహంకారములు లేనివాడును-నగు శ్రీరామ ప్రభువును శరణు పొందుచున్నాను. 

నీ వీ మానవాకారము దాల్చుట మానవులకు మార్గము చూపుటకే కాని కేవలము రక్కసుల నుక్కడగించుటకు గాదు. అట్లు గాదేని యాత్మారాముడవైన నీకు సీతా కారణమున విరహబాధ గట్లుటేమి? స్త్రీసంగవిరహ బాధ సహింపరానిదని తెల్పుటకే నీ వట్లు చేసితివి గదా ! ఆ వాసుదేవ భగవానుడు జ్ఞానులపాలిటి సుహృత్తముడు. ముల్లోకము లందును దేనియందును నాసక్తిలేనివాడు. అతనికి స్త్రీ సంబంధమగు దోష మేమాత్రమంటలేదు. దుర్వాసుడు వచ్చినపుడు లక్ష్మణుడునిగూడ వదలిపెట్టడు. శ్రీరామచంద్రునకు కేవలము పరభక్తి-లోకారాధన ప్రియమైనది. అంతేకాని జనుల గొప్పలు సౌభాగ్యమువాక్చాతురి బుద్ధికుశలత అందము ప్రియములు గావు. 

శ్రీరాముడీ సుగుణములులేని కోతిమూకతో నెయ్యము నెఱపెను గదా ! అమరుడు-రాక్షసుడు-నరుడు-నారి యెవరైనను సర్వాత్మభావమున మానవాకృతి దాల్చిన సుకృతజ్ఞుడు మర్యాదా పురుషోత్తముడు నగు శ్రీరామభద్రుని గొల్చిన ముక్తి చెందును. రాము డుత్తర కోసలవాసుల నెల్లరను దివికి గొంపోవుటే నిదర్శనము. ఇట్లు కింపురుషవర్షమందు రాజీవలోచనుడు సత్యపరాక్రముడు దృఢసంకల్పుడు నగు శ్రీరాముని వానరోత్తముడగు హనుమంతుడు సన్నుతించును. గానము చేయును. పరభక్తితో నెల్లవిధముల బూజించును. ఇట్టి శ్రీరామచంద్రుని దివ్యచిత్ర కథామృతమును చెవులారగ గ్రోలవలయును. అట్టి రామభక్తులు పాపముక్తులై శుద్ధచిత్తులై శ్రీరఘునాథుని సాలోక్య మందగలరు.







Hari Varshamu - హరి వర్షము

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము - హరి వర్షము

శ్రీనారాయణు డిట్లనెను: ఇక హరి వర్షము నందు యోగయుక్తుడు భక్తానుగ్రహకారకుడు పాపనాశనుడు నగు లక్ష్మీనరసింహ భగవానుడు నెలకొని యుండును. అచటి ఆ నరసింహస్వామి దివ్యరూపము సందర్శించి విష్ణుగుణతత్త్వ మెఱింగిన యసురుడగు ప్రహ్లాదభాగవతోత్తముడు భక్తితత్పరత నిట్లు సంస్తుతించును. 

ప్రహ్లాదు డిట్లనును : నరసింహ భగవానునకు నమస్కారము. తేజస్సునకును తేజస్సగు దేవునకు నమస్కారము. అతిప్రకటుడవు గమ్ము. ఓ వజ్రదంష్ట్రా! మా వాసనలు నిర్దహించుము. మాయజ్ఞానమును మ్రింగుము మ్రింగుము. నాయందభయము నెలకొనుగాత: సర్వ విశ్వమునకు మేలగుత! దుష్టుడు శిష్టుడగు గాక ! ఎల్ల భూతములు సహయోగముతో శుభమును ధ్యానించు గాత ! మనస్సు భద్రము గోరుత ! అధోక్షజునందు నా నిర్హేతుకమైన మతి తగుల్కొనుత! నాకు భార్యా-గృహ-పుత్ర-ధన-బంధులందు సంగము లేకుండుత! ఏ ప్రొద్దును పరమ భాగవతోత్తముల సత్సాంగత్యము గల్గుత ! 

ఆత్మవంతుడు తన ప్రియ ప్రాణములను హరియందే నిల్పి యత్యానందమున రసమోదమొందును. ఇంద్రియ విషయలోలు డాత్మసుఖమునకు నోచుకొనడు. పుణ్యతీర్థములందు మాటిమాటికి గ్రుంకినచో నొడలి మురికిపోవును. హరిభక్తుల సత్సంగతియను దివ్యతీర్థసంగమున హరికీర్తనలు చెవులకు సోకినంతనే మనస్సులోని వాసనలనెడు మురికి తొలగును. అట్టి పుణ్యతీర్థుడగు హరి నెవడు సేవింపకుండును ! ఎవ్వానికి భగవానునందకించన (నిర్వ్యాజ) భక్తిపాదుకొనునో యట్టి మహనీయుని సురగణములును భుజించుచుండును. 

సువిమలతీర్థుడగు విష్ణునందు నిర్మలభక్తిలేనివానికి సుగుణములబ్బవు. అట్టివాడు బయటి విషయమనో రథములను వెంటాడును. శ్రీహరియే సాక్షాత్తుగ భగవంతుడు. చేపలకు నీరువలె నారాయణుడెల్ల ప్రాణులకు జీవనాధారము-జగదీశుడు-ప్రభువు. అంతటి మహాత్ముని వదలి గృహములందు తగుల్కొన్న దంపతుల బ్రదుకు నిరర్థకము. కనుక రజో రాగములు-విషాద భయములు-కోపమానములు-దైన్యము-స్పృహ-మున్నగువానికి నెలవగు నీ సంసారచక్రవాళమగు నింటిని వదలి శ్రీనరహరి దేవపదనులు గొల్చువారికి భయమెక్కడిది? 

ఇట్లు ప్రహ్లాదుడు. భక్తుడు పాపగజహరియును హృదయకమల విహారియునగు శ్రీహరిని పరమభక్తితో రేయింబవళ్ళు సంస్తుతించును. 

ఇంక కేతుమాలవర్షమున శ్రీహరి మన్మథరూపమున చెన్నొందుచుండును. అతడా వర్షమందలి భక్తులచేత నిత్య పూజలందుకొనును. కడలిరా పట్టియగు లక్ష్మీదేవి యచటి భక్తుల కోర్కులు దీర్చుచు శ్రీహరి నిట్లు సంస్తుతించుచు నుపాసించుచుండును.

రమ యిట్లనును : హృషీకేశ భగవానునకు-సుగుణ లక్షణలక్షితుడగు సర్వాత్మునకు క్రియాజ్ఞానసంకల్ప విశేషణముల కధిపతికి -షోడశకళాత్మునకు-ఛందోమయునకు-అన్నమయునకు - అమృతమయునకు-సర్వమయున కోజోమయునకు-బలకాంతి కామయుతునకు-భగవానునకు నమస్కారములు. లోకమందు స్త్రీలు వ్రత నియమములతో విశ్వపతి హృషీకేశుడు నగు హరి నారాధించియు నితరుని గొలిచినచో నట్టి స్త్రీలను వారి భర్తలుగాని సంతతిగాని గాపాడజాలరు. ఏలన వారు ధన సంపాదనమున నాయువున స్వతంత్రత లేనివారు.

స్వయముగ భయము లేనివాడును ఇతరుల భయము బాపువాడును నిజమైన పతి యనబడును. భగవానుడొక్కడే నిజమైన పతి. ఇతరులు స్వార్థము తప్ప వేరు తలంపరు. స్త్రీలు నీ పాదకమలములను నిష్కామముగసేవింతురు. అంతే కానివారు విషయలంపటలే నిన్ను గొల్వరు. వారు ఫలమాశించి నిన్ను సేవించినచో ఫలబోగము తర్వాత భగ్నకాములై మరల బాధలు పడుదురు. నా దయకొఱకు బ్రహ్మ-శివుడు-సురాసురులు-విషయకామరతితో ఘోరముగతపింతురు. కాని అజితా! నేను నీహృదయకమలమందు నెలకొనియుండుటవలన నీ దివ్యపదపద్మ పరాయణులుగాని వారికి నేను లభింపను. 

ఓ యచ్యుతా ! సర్వపతీ! నీవు భక్తులచేత నుతింపబడి వరదాయకమగు నీకరకమలము వారికి చేయూతగా నందింతువు. అట్టిచేయి నాపై నుంచుము. నన్ను నీ వక్షఃస్థలమున ధరింతువు గదా ! ఈశ్వరుడవగు నీ మాయాచేష్టలెవడెఱుగ గలడు! ఇట్లు త్త్రైలోక్యకుటుంబినియగు లచ్చి వరేణ్యుడగు హరిని సంస్తుతి సేయుచుండును. అట్లే యావర్షమందలి వారును కోర్కులు తీరుటకు శ్రీహరిని సన్నుతిజేయుదురు.

ఇక రమ్యకవర్షమునందున్న మత్స్యమూర్తి దేవాసురులచేత పూజింపబడుచుండును. అచటి యర్చామూర్తిని మను వీరీతిగ నిరంతరను పూజించుచుండును.

విశ్వాగ్రణి-మహాసత్త్వడు-ఓజస్వి-మహోజ్జ్వలుడు-ప్రాణబలుడు-నగు మత్స్యభగవానునకు నమస్కారములు. ఏ దేవుడు లోన బయటనే లోకపాలురకు సైతము కానరాక మహావిక్రమముతో విహరించునో యట్టి యీశ్వరుడవు నీవు. నీ వీ విశ్వమును జంత్రగాని చేతి కీలుబొమ్మవలె నాడింతువు. లోకపాలు రహంకారరోగపీడితులై నిన్ను వదలినచో వారికి గతి లేదు. 

వారందఱొక్కటిగ కలిసియును ద్విపాత్‌-చతుష్పాత్తులను సరీసృపములను కనబడు స్థావర జంగమములనెల్లను రక్షింపజాలరు. యుగాంతమైనప్పు డువ్వెత్తుగలేచు సంద్రము కెరటాలపైని నీవు విహరింతువు. ఈ సకలౌషధులు తీగలు గల భూమిని నన్నును మహాపరాక్రమముతో దాల్చితివి. అంతటి విశ్వ ప్రాణాత్మకుడవగు నీకు నాప్రణామములు. ఈ విధముగ సంశయ నివారకుడు దేవేశుడు మత్స్యావతారుడునగు శ్రీహరిని నరదేవుడగు మనువు సంస్తుతించును. 

ఈ ప్రకారముగమహాభాగవతోత్తముడగు మనువు శ్రీహరిధ్యానమున కల్మషములు పాసి పరమభక్తితో శ్రీపతిని సేవించుచు కాలము గడపుచుండును.

హిరణ్మయ వర్షము






Bhadrashva Varshamu - భద్రాశ్వ వర్షము

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము - భద్రాశ్వ వర్షము

నారాయణు డిట్లనెను: భద్రాశ్వవర్షమునందు ధర్మపుత్రుడు భద్రశ్రవో నామముతో నుపాసింపబడును. అతని గొల్చు వంశజులను భద్రసేవకు లందురు. ఆ భద్రాశ్వవర్షమందు ప్రసిద్ది జెందిన వాసుదేవుని హయగ్రీవమూర్తి వెలుగొందుచున్నది. భాగవతులు నిశ్చల చిత్తముతోడి సమాధిలో మునింగి యా దివ్యమూర్తి నీ రీతిగ నుపాసింతురు.

భద్రశ్రవసు లిట్లందురు : ఆత్మచింతనచేయు ధర్మస్వరూపుడగు భగవానునకు నమస్కారము లని యుపాసింతుము. దైవము చేతలు చాలవిచిత్రములు. ఎల్లభూతములు మృత్యువాత బడుచుండుట స్వయముగ చూచియును జనము సత్యమును నమ్మరు. కొడుకునకుగాని తండ్రికిగాని దహనాదులు చేసియును జనము తిరిగి విషయము లనుభవింపజూచును. ఈ విశ్వము నశ్వరమని కవులు-పండితులు-వక్కాణింతురు. సమాధిలో మునిగిన యాత్మవిదులు నటులే యందురు.

ఓ రాజా! ఐనను విచిత్రమైన యీ మాయాకృతికి జనము ప్రమోహము జెందును. అట్టి మహిమాతిశయముగల నీకు నమస్కారములు. ఈ విశ్వమును నీవు పుట్టించి పెంచి లయింపజేతువు. ఐనను నిన్నావరణములేని యకర్తగ చెప్పుదురు. ఇదంతయును కార్యకారణుడవు సర్వాత్మకుడవు నగు నీవు మాయవలన సృజింతువు. వాస్తవముగ నీవు నిరుపాధికుడవు-అకర్తవు. యుగాంతమున తమోవృతములగు వేదములు దొంగిలింపబడగ నీవు హయగ్రీవరూపము దాల్చి రసాతలమునుండి వానిని తెచ్చి బ్రహ్మ యాచింపగ నతని కెవడిచ్చెనో యట్టి సత్యరూపుడు విశ్వహితుడు నగు వానిని నమస్కరింతుము.

ఇట్లు హయగ్రీవుడగు శ్రీహరిని భద్రశ్రవసులు సంస్తుతించి యతని గుణగణము లభివర్ణింతురు.
వీరి యీ దివ్యచరితలు విని చదువువారు పాపమను కుబుసమునుండి ముక్తులై శ్రీదేవీ లోకమును జేరగలరు.

హరి వర్షము






Lokaloka Parvathamu - లోకాలోక పర్వతము

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము -  లోకాలోక పర్వతము నారాయణుడిట్లనెను : దానికిపైని లోకాలోకమను పర్వతము గలదు. ఆ పర్వత మధ్యభాగమున సూర్యప్రకాశము పడ...