Saturday, April 18, 2026

Aruna's moral teaching - అరుణుడు చేసిన నీతిబోధ

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - అరుణుడు చేసిన నీతిబోధ

పుత్రా! ధర్మమందు బుద్ధి నిల్పుము. విప్రులు గౌరవపాత్రులు. న్యాయముగ ధనము సంపాదించవలయును. ప్రజలను కన్నబిడ్డలవలె పాలింపవలయును. ఎప్పుడు నసత్య మాడరాదు. చెడు మార్గము పట్టరాదు.

తాపసులు పూజనీయులు. క్రూర దానవులను చంపవలయును. ఇంద్రియములు జయింపవలయును. రాజు కార్యసిద్ధికొఱకు మంత్రివరులతో మంత్రాంగము నెఱపవలెను. రహస్యమును వెల్లడించరాదు.

కుమారకా! శత్రువు కొలది వాడైనను నుపేక్షించి యుండరాదు. ఇతరులను జేరిన మంత్రి వినయముగ నున్నను నమ్మి యుండరాదు. శత్రులను మిత్రులను చారదృష్టితో కనిపెట్టి యుండవలయును. నిత్యము దానధర్మములందు మనస్సు నిలుకడ జెందవలయును.

వట్టి మాటలు కట్టిపెట్టుము. చెడు సంగతి విడిచిపెట్టుము. పెక్కులు జన్నము లొనరింపుము. మహర్షులు పూజనీయులు. ఎన్నడును స్త్రీని స్త్రీ స్వభావముగలవానిని జూదగానిని నమ్మరాదు. వేటయందు చెడ్డ తమకము తగదు.

జూదము త్రాగుడు పాటలు వారవని తలు- అను విషయములందు తగుల్కొనక ప్రజలను వాని జోలికి పోనిక ఉండవలయును. తెలతెలవారక మున్నే మేల్కొన వలయును. తప్పత యథావిధిగ స్నాన సంధ్య లోమరింపవలయును.

పుత్త్రా: శ్రీపరాశక్తి పరమపూజను పరమభక్తితో దీక్షాపరత నొనర్పలయును. పరాశక్తి పదార్చనమున జన్మము తరించును. శ్రీదేవీ మహాపూజను జీవితకాలమం దొక్కసారియైన చేసి దేవీ పాదతీర్థము సేవించినవాడు మరల తల్లి గర్బము తప్పక ప్రవేశింపడు.

ఆ మహాదేవియే దృశ్యము-దృష్ట-సాక్షి-అన్ని యామెయే అను నిశ్చల భావముతో నిర్బయ ముగ తన్మనస్కుడై యుండవలయును. నిత్యవిధు లొనరించి శ్రీదేవీ మహాసభలు జరిపి యందు తెలిసిన బ్రాహ్మణుల నాహ్వానించి దేవితత్త్వమును ధర్మముగూర్చి యడుగవలయును.

వేదవేదాంగపారగులగు బ్రాహ్మణులను సంపూజింపవల యును. తగిన వారికి గోవులు-భూమి-బంగారము దాన మీయవలయును. చదువురాని విప్రుని పూజింపరాదు. మూర్ఖున కెప్పుడు నన్నము మాత్రము పెట్టవలయును. మరేదియు నీయరాదు.

పుత్రా! ఎన్నడును లోభమువలన ధర్మమును త్రోసి పుచ్చరాదు. అన్నిటికన్న ముఖ్యముగ విప్రుల నెన్నడు నవమానింపరాదు. బ్రాహ్మణులు భూదేవతలు. వారు క్షత్రియులకు తప్పక కారణభూతులు. మఱి ఆదరణీయులు. నీటినుండి నిప్పు బ్రహ్మతేజమునుండి క్షాత్రము రాతినుండి లోహము గల్గును.

ఇవి పరస్పర వైరముగలవయ్యు తమ కారణమునందే తాములయముజెందును. కనుక సుఖసంపదలు గోరుకొను రాజు తప్పక విశేషముగ వినయముతో దానములతో బ్రాహ్మణులను సేవించి గౌరవించవలయును. రాజు ధర్మశాస్త్రముసారముగ దండనీతి ప్రయోగించవలయును. న్యాయముగ ధనము గడించి నిలువ చేయవలయును.

తన తండ్రి ఇట్లు ప్రబోధింపగ త్రిశంకుడు విని ప్రేమతో గద్గదమయిన వాక్కుతో నట్లేయని పలికెను. అపుడు రాజు వేదశాస్త్రవిశారదులు మంత్రవిదులునైన బ్రాహ్మణులను రావించి వెంటనే యభిషేకసామగ్రి సమకూర్చెను. అతడు సర్వతీర్థముల జలములు తెప్పించి రాజులను మంత్రులను ప్రజలనందఱ నాహ్వానించెను. 

రాజొక పుణ్యశుభముహూర్తమున విధివిధానమున తనత్రిశంకు కుమారుని రాజ్యమందభిషేకించి యాసన మప్పగించెను. ఆతడు పిదప తన భార్యతో వనములకేగి వానప్రస్థాశ్రమము స్వీకరించి గంగాతీరమునందు తీవ్ర తప మొనరించెను. మరణకాలము సమీపించగనే యరుణుడు స్వర్గమేగి సురపూజితుడై యింద్రాసనము సమీపమున సూర్యునివలె వెల్గుచుండెను.

రాజిట్లనెను : మున్ను గోవును చంపుటవలన వసిష్ఠుడు సత్యవ్రతుని శపించెనని కథాసందర్బమున నీవు చెప్పితివి. ప్రభూ! గురువు కోపించగా సత్యవ్రతుడు పిశాచత్యము పొంది తిరిగి పిశాచత్వమునుండి యెట్లు ముక్తుడయ్యెనను సంశయము గల్గుచున్నది. 

శాపగ్రస్తుడు సింహాసన మెక్కుటకు తగడు కదా. ముని యేకర్మమువలన నతనిని పిశాచత్వముక్తిని జేసెనో తెల్పుము. విప్రర్షీ! నా కీతని శాపమోక్షణమగూర్చి తెలుపుము. అట్టి పిశాచాకారము గలవాని నతని తండ్రి యొట్లు రప్పించెను. 

సత్యవ్రతుడు వసిష్ఠుని శాపమును వెంటనే పిశాచత్వమొంది కుచ్చితుడు-దుస్సహుడు-క్రూరుడు-లోక భయంకరుడు నయ్యెను.

సత్యవ్రతుడు శ్రీదేవిని భక్తప్రపత్తులతో నుపాసింపగ దేవి సుప్రసన్నయై క్షణములో నతనికి దివ్యదేహము ప్రసాదించెను. శ్రీత్రిభువనేశ్వరీదేవి దయామృతమున నతని పిశాచత్వము తొలగెను. 

పాపములు పటాపంచయ్యెను. అతడు పాపరహితుడు తేజస్వి యయ్యెను. దేవి దయవలన వసిష్ఠుడును ప్రన్నుడయైను. 

సత్యన్రతుని తండ్రియును కొడుకు నెడల ప్రేమగలవాడయ్యెను. తన తండ్రి మరణించగ త్రిశంకుడు సనాతనియగు దేవదేవిని గూర్చి ధర్మమతితో పెక్కులు దేవీ మహాయజ్ఞము లొనరించెను.

త్రిశంకుడి సశరీర స్వర్గ వాంఛ

Trishankudi's coronation with the grace of the Goddess - దేవీ అనుగ్రహంతో త్రిశంకుడి పట్టాభిషేకం

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దేవీ అనుగ్రహంతో త్రిశంకుడి పట్టాభిషేకం

జనమేజయు డిట్లనెను : ఓ మహానుభావా త్రిశంకురాజు వషిష్ఠునిచేత శపింపబడి తిరిగి యెట్లు శాపవిముక్తుడయ్యెనో తెల్పుము. 

సత్యవ్రతు డట్లు శపింపబడి పిశాచత్వమంది యదే యాశ్రమమునందు శ్రీదేవీ భక్తిపరాయణుడై యుండెను. ఆ రాజు శ్రీనవాక్షర మంత్రరాజమును జపించి భక్తితో బ్రాహ్మణులకు నమస్కరించి హోమము చేయదలచి వారి కిట్లనియెను. 

ఓ విప్రులారా! మీకు నమస్కారములు. నా మాట యాలింపుడు. మీరెల్లరును నేను జేయు యజ్ఞమునందు ఋత్విజులుగ నుండుడు. చెయింపుడు నేను రాజును. నా పేరు సత్యవ్రతుడు మీరు బ్రహ్మ విద్వరులు. నా సుఖముగోరి మరునా హోమము మీరు దయాపరులు-వేదవిదులు. నేను దేవీ మంత్రజప మొనరించితిని. 

కనుక కార్యసిద్ది కొఱకు నా జపములోనిదశాంశము హోమము యథావిథిగ జరిపింపుడు. అను మాటలువిని బ్రాహ్మణులు రాకొమరున కిట్లనిరి: 

నిన్ను గురుడు పిశాచత్వముబొందు మని శపించెను. కనుక నీవు యాగము చేయుటకు తగవు. నీకు వేదమం దధికారము లేదు. నీవు పిశాచత్వమంది లోక మందు నిందలు పొందితివి.

అను వారి మాటలువిని రాజు దుఃఖ మొందెను. ఇక నా జీవితము వ్యర్థము. ఈ వనమం దింక నేనేమి చేయగలను! తండ్రిచే విడువబడితిని. గురునిచే శపింపబడితిని. రాజ్యభ్రష్టత్వము-పిశాచత్వము-పొందితిని. 

ఇపుడేమి చేతును అని తలచి యా రాకుమారుడు కట్టెలతో పెద్ద చిత పేర్చి యందు ప్రవేశింపదలచి శ్రీచండికాదేవిని నెమ్మది తలంచెను. అతడు చితకు నిప్పంటించి స్నానముచేసి చితకెదురుగ దోసిలొగ్గి నిలుచుండి శ్రీమహామాయాదేవినిని సంస్మరించెను. 

చావనున్న రాజు భావమెఱిగి శ్రీభగవతీదేవి యాకాశమార్గమున నేతెంచి ప్రత్యక్షమయ్యెను. రాజా! శ్రీదేవి రాజకుమారునకు సింహారూఢయై దర్శనమిచ్చి మేఘమువలె గంభీరవాక్కుల నిట్లనియెను. 

మహాత్మా! సాధూ! నీ వేమి తలంచితివి? నీవీ మంటలలో దుముకవలదు. నీ తండ్రి ముసలివాడు. కనుక స్థిరచిత్తముతో నుండుము. నీ తండ్రి నీకు రాజ్య మప్పగించి తపమున కడవుల కేగదలచెను. 

వీరా! విచారము వదలుము. ఎల్లుండి నీ యింటికే జేరుము. నా దయవలన మంత్రులు నిన్ను గొనిపోవుటకు రాగలరు. నీ తండ్రి నిన్ను సింహాసనమున నభిషేకించును. పిదప నీ తండ్రి కామము జయించి ధ్రువముగ బ్రహ్మ సాలోక్యమందును. 

అని దేవి పలికి యచటనే యంతర్థాన మొందెను. అపుడు రాజపుత్రు డగ్నిచే మరణము తప్పించుకొని యయోధ్యానగరమేగెను. మహాత్ముడగు నారదు డంతయు నెఱిగెను. అతడు జరిగిన దంతయు నరుణునకు వేగిరమే తెలిపెను. తన కొడుకు చావతలంచుట విని రాజు దుఃఖించెను.

ధర్మాత్ముడగు రాజు పుత్రశోకములో మునిగి మనసులో పరిపరి విధముల చింతించి మంత్రులతో నిట్లు పలికెను. నేను బుద్ధిమంతుడగు నా కొడుకును వనముల కంపితిని. మీరు నా కొడుకు తలపెట్టిన మహోగ్రమైన పనిని నాకు దెలిపితిరి. 

నా కుమారుడు రాజ్యమునకు తగినవాడు-పరమార్థవిదుడు-విజ్ఞానశీలి. నే నా జ్ఞాపింపగనే నిర్జనవనములకేగి యోర్మితో బీదవాడై కష్టము లొందెను. అతడు వసిష్ఠునిచేత పిశాచముగ శపింపబడి భరింపరాని దుఃఖముచే నిప్పులో దుముకదలచెను. 

అతని దుస్సాహసమును శ్రీదేవి వారించెను. కనుక మహాబలుడగు జ్యేష్ఠపుత్రుని వేవేగ జేరవలయును. మీరు త్వరిత గతిని చల్లని మాటలతో నతని నూరడించి కొనితెండు. పరిపాలింపదగిన నా కన్నకొడుకును రాజ్యమంభిషేకింతును. 

పిదప నేను వనమునకేగి శాంతముగ తప మొనర్చుకొన నిశ్చయించుకొంటిని. అని రాజు తన మంత్రులను పంపెను. మంత్రులు రాకుమారుని తోడితెచ్చుటకు ప్రేమపూర్వకముగ వెళ్ళి యతనిని మంచిమాటలతో నోదార్చిరి. వారు మహాత్ముడగు రాచపట్టిని సగౌరవముగ నయోధ్యకు కొనితెచ్చిరి. 

సత్యవ్రతుడు కృశించి మురికిగుడ్డలు గట్టియుండెను. అతడు పెద్ద జడలుదాల్చి క్రూరముగ చింతాపరుడై యుండగ రాజు చూచి నేనెంత నిష్ఠురమైన పని చేసితినే! నా కొడుకును వెళ్లగొట్టితినే! ఇతడు రాజ్యార్హుడు- మేధావి-ధర్మనిర్ణయ మెఱిగినవాడు. 

అని రాజు తన కొడుకు శరీరమును కౌగిలించుకొనెను.

నీతి విశారదుడగు రాజు పిమ్మట తన తనయుని తన యాసనముచెంత కూర్చుండబెట్టుకొని ప్రేమగదుర నోదార్చి ప్రేమగద్గగవాక్కుల నతని కిట్లనెను.

అరుణుడు చేసిన నీతిబోధ

How Satyavrata became Trishanka - సత్యవ్రతుడు త్రిశంకుడైన తీరు

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - సత్యవ్రతుడు త్రిశంకుడైన తీరు

రాజా! మహాబలశాలీ! వివాహము జరుగునపుడు నీ కొడుకొక విప్రకన్యను బల్మి నపహరించెను. వారి సత్య వాక్కులు విని పరమధార్మికుడగు రాజు తన కొడుకుతో నిట్లనెను. 

ఓరి దుష్టుడా! నీ పేరు వ్యర్థమైనదిరా. ఓరి మందమతీ! దురాచారీ! పాపీ! ఇక నీవు నాయింట క్షణమైన నిలువవద్దు. నా యిల్లు వదలివెళ్ళము. కోపించిన తన తండ్రితో నేనెక్కడి కేగుదునని సత్యవ్రతు డడుగగ నీవు చండాలురతోగూడి తిగురుమని యరుణు డనెను. 

నీవు బ్రహ్మణ స్త్రీ నపహరించి చండాలుని పని చేసితివి. కనుక నీవు చండాలుర సహవాసముతో సుఖముగ నుండుము. ఓరి కులముచెడ పుట్టినవాడా! నీ వంటి కొడుకువలన నా కపకీర్తి గల్గినది. ఓరి దుష్టుడా ! నీ నచ్చినచోటి కేగుము. నా కీర్తి మంటగలిపితివి. 

మహాత్ముడగు తన తండ్రి కోపముతో నిట్లు పలుకగ సత్యవ్రతుడు వెంటనే పురము వెడలి చండాలురను గలిసి తిరుగసాగెను. అట్లు సత్య వ్రతుడు చండాలురను గూడి విల్లమ్ములుదాల్చి కవచము తొడిగి దయగలవాడై యుండెను. 

అరుణ మహారాజు తన కులగురు వగు వసిష్ఠుని ప్రేరణచేత నట్లు కోపించి తన కొడుకును వెడలగొట్టెను. ధర్మశాస్త్రజ్ఞుడైన వసిష్ఠుడు తన్నాపలేదని సత్యవ్రతు నకు వసిష్ఠునందు క్రోధము గల్గెను. 

తర్వాత నేదో కారణమున నరుణుడు పుత్రార్థియై తపమొనరించుటకు నగరము వదిలి వనము జేరెను. ఈ యధర్మమువలన నింద్రుడా రాజ్యములో పండ్రెండేడులు వానలు కురియలేదు.

ఆ దినములలో విశ్వామిత్రుడు తన భార్యాపుత్రులను నా రాజ్యములో వదలి కౌశికీతీర్థమున గొప్ప తప మొనరించెను. విశ్వామిత్రుని భార్య దీనయునార్తయునై దుఃఖితురాలై తన కుటుంబమును పోషించుకొనజాలకుండెను. 

తన కొడుకు లాకటిమంటచే నేడ్చుచు నీ వారన్నము యాచించుచుంటగని యా పతివ్రత బాధ పడెను. అట్లు తన కొమర లాకలిమంటచే దుఃఖార్తులై యుంటగని యీ పురమున రాజు లేడు. ఎవని యాచింతునని యామె వెత జెందెను. 

ఇపుడు నన్ను నా పుత్రు లను రక్షించువారు లేరు. నా భర్తయును నా చెంతలేడు. పిల్ల లేడ్చుచున్నారు. నా బ్రతుకెంత పనికిమాలినది. బీదరాలనగు నన్ను విడనాడి నా భర్త తపము చేసికొనవెళ్ళెను. 

అతడు సమర్థుడయ్యును దుఃఖితురాలనగు నా బాధలు తెలిసికొనుటలేదు. మగడు లేనిచో పిల్లల నెవరు పోషింతురు? నా సుతు లాకలిమంటచే నకనకలాడి చత్తురు. కనుక వీరిలో నొకని నమ్మి యా డబ్బుతో మిగిలినవారిని పోషించుట నా కిపుడు తగిన పని. 

ఇట్లు చేయ కిందఱి నాకలిమంటకు చంపుట తగదు. ఎట్లో కాల మీడ్చుట కొక్కని తప్పక విక్రయించగలను. ఆ సతి యిట్లు గుండె ఱాయి చేసికొని దర్బత్రాటిని తన పుత్రుని మెడకు వేసి బయలుదేరెను. 

ఆ మునుపత్ని నడిమివాని మెడకు త్రాడువేసి తక్కినవారిని పోషించుట కిల్లు వెడలినంతలో సత్య వ్రత రాజపుత్రు డామెను జూచి యిట్లనెను. 

ఓ శోభనాంగీ! నీవు శోకమూర్తివై యేమి పని చేయుచున్నావు. సర్వాంగ సుందరీ! ఇపు డీ బాలుని మెడకు త్రాడుగట్టి యత డేడ్చుచుండగ నీ వెచటికి గొనిపోవుచున్నావు. నిజము పలుకుము.

ఋషిపత్ని యిట్లనెను : ఓ రాకుమారా! నేను విశ్వామిత్రుని భార్యను. ఇతడు నా కొడుకు. ఈ నా కన్న బిడ్డ నీ పట్టణమున నమ్ముట కేగుచున్నాను. రాజా! నా పతి మమ్ము విడనాడి తపమున కేగెను. మేము తిండిలేక మలమల మాడు చున్నాము. తక్కినవారిని పోషించుట కితని నమ్ముచున్నాను అనెను. 

రాజిట్లనెను: ఓ పతివ్రతా! ఈ పుత్రుని కాపాడుము. నీకు భరణ మిత్తును. అంతలో నీ పతియును వనమునుండి తిరిగి రాగలడు. నీ యాశ్రమముచెంత నున్న చెట్టునకు ప్రతిదిన మన్నముమూట కట్టి వెళ్ళగలను. ఇది నా సత్యవ్రతము సుమ్ము. అట్లు రాజు పలుకగ మునిపత్ని తన కొడుకు మెడ బంధము తొలగించి తన యాశ్రమము చేరెను. 

గలమున (మెడలో) బంధ ముండుటవలన నతడు గాలవ మహాముని యయ్యెను. ఆమె తన యాశ్రమమేగి బాలకులతో సంతోషముగ కాలము గడుపుచుండెను. సత్యవ్రతుడును దయాభక్తులతో నిండి విశ్వామిత్ర మునిపత్నిని పోషించుచుండెను. 

రాజు వనమందలి జింకలను దున్నలను పందులను చంపివాని మాంసమును విశ్వామిత్రు నాశ్రమముచెంత చెట్టునకు కట్టుచుండెను. అట్లు మునిపత్ని ప్రతిదినము మాంసముబడసి తాను దీని పుత్రులకు తినిపించి సుఖముగ నుండెను. 

అరుణు డడవులకు తపమున కేగుటవలన నయోధ్యారాజ్యము నంతఃపురమును వసిష్ఠుడు పరి రక్షించుచుండెను. సత్యవ్రతుడును ధర్మాత్ముడై తండ్రి యాజ్ఞ ననుసరించి నగరు బయట వసించి వన్యజంతువులను వేటాడు చుండెను. 

ఏదో నెపమున సత్యవ్రతు డకస్మాత్తుగ వసిష్ఠునిపై కోపముతో నుండెను. తన తండ్రి ధర్మిష్ఠుడు ప్రియసుతుడగు తన్ను నడవుల కంపునపుడు వసిష్ఠుడతని వారింపలేదని సత్యవ్రతునకు కోపము గల్గెను. వివాహము పూర్తియగుటకు భార్యాభర్త లేడడుగులు కలిసి నడువవలయును. 

అది జరుగక మునుపే విప్ర భార్యను నేను గ్రహించితిని. ఆ ధర్మాత్మున కది తెలియదా అని అతడనుకొనెను. ఒక నా డడవిలో రాజునకు మృగములు కని పించలేదు. అంతలో నట్టడివిలో వసిష్ఠుని గోవతని కంటబడెను. 

అతడు నీచునివలె నాకలిమంటచే కోపముతో దానిని చంపి దాని మాంసము తిని మిగిలినది చెట్టునకు కట్టెను. సువ్రతయగు మునిపత్ని యది గోమాంసమని తెలియక మృగమాంసమని తలచి తన కొడుకుల కది తినిపించెను. 

వసిష్ఠుడు తన గోవు చంపబడు టెఱింగి కోపముతో నిట్లనెను. ఓరి దుర్మార్గుడా! పిశాచునివలె గోవును చంపి పాపము మూటకట్టుకొంటివి. కనుక స్త్రీ హరణము తండ్రి కోపము గోవధ యీ మూడు చెడు మచ్చలు నీకు గల్గుగాత. ఈ మూడు శంకలవలన నీవు త్రిశంకువుగ పేరు గాంతువు. 

నీ వెల్లరకు నీ పిశాచరూపము చూపించుచు తిరుగుచుందువు. సత్యవ్రతు డట్లు వసిష్ఠునిచే శపింపబడి తన యాశ్రమమందుండి తీవ్ర తప మాచరించెను. అత డొకానొక మునిపుత్రుని దయవలన పరా ప్రకృతి-శివాభగవతియగు శ్రీదేవియొక్క మంత్రము గ్రహించి జపింపసాగెను.

దేవీ అనుగ్రహంతో త్రిశంకుడి పట్టాభిషేకం

Son born to the father - Mandhata - తండ్రికి పుట్టిన తనయుడు - మ౦ధాత

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - తండ్రికి పుట్టిన తనయుడు - మ౦ధాత

వ్యాసు డిట్లనియెను : యవనాశ్వరాజు పరమధార్మికుడు. కాని సంతానము లేనివాడు. అతనికి నూర్గురు భార్యలు గలరు. కాని సంతులేక రాజ నిచ్చలు చింతారతంత్రుడై యుండెను.

యవనాశ్వుడు సంతుకొఱకు వనము లందున్న పుణ్య మున్యాశ్రమములు కేగి రోదించుచు దిగులు పడుచుండెను. అతడచట తాపసోత్తములగు విప్రులు కనికర ముతో కనుచుండగ వేడి నిట్టూర్పులు నిగుడించుచు కటకటపడెను.

వారు రాజుతో నిట్లనిరి : ఓ రాజా : ఏల పరితపింతువు? నీ మనసులోని వెత దెలుపుము. నిజము పలుకుము. మేమెల్ల విధముల నీ దుఃఖము తొలగు నుపాయ మాలోచింతుము.

యవనాశ్యు డిట్లనెను : ఓ మునులారా ! నాకు గొప్ప రాజ్యము- ధనము- గుఱ్ఱములు గలవు. చక్కని భార్యలు నూర్గురు గలరు. నీ కీ ముల్లోకములందును బలవంతుడగు శత్రు వొక్కడును లేడు.

ఓ తాపసులారా ! నా మంత్రిసామంతులు నా మాట జవదాటరు. కాని సంతానములేని లోటు నన్ను పీడించుచున్నది. పుత్రులులేని వానికి సద్గతులు లేవు. స్వర్గము లేనే లేదందురు. కనుక సంతానార్థమింతగ వేత జెందు చున్నాను.

మీరు వేదశాస్త్రార్థపారంగతులు. తత్త్వవిధులు-తాపసులు-శమధనులు. కనుక నాకు సంతు గల్గుటకు తగిన జన్నము దెలుపుడు. తాపసులారా! నాపై దయయున్న ఇంతమాత్రము పని చేయుడు.

వ్యాసు డిట్లనెను: అను రాజు మాటలువిని విపులు దయాంతరంగులైరి. వారంత దేవేంద్రుడు దేవత గగల యజ్ఞమును చక్కగ జరిపించిరి. విప్రుల జలపూర్ణమైన కలశమును స్థాపించిరి. వేదమంత్రములతో పుత్రార్థము జలము నభిమత్రించిరి. ఒక రేయి రాజు దప్పిగొని యజ్ఞశాల కేగెను.

అచట విప్రులందఱు నిద్రించుటగని రాజు స్వయముగ దప్పిదీర మంత్రజలము త్రాగెను. అది రాజు భార్యకొఱకు విధిగ మంత్రములచే సంస్కరింపబడినది. పిదప జలములేని కలశమునుగని విప్రు లనుమానించిరి. వారు జల మెవ్వరు త్రాగిరని రాజునడిగిరి.

రాజు జలము త్రాగెనని తెలిసి వారు దైవ బలమిదియనిరి. మునివిప్రులు యజ్ఞము సంపూర్ణము గావించి తమ తమ యిండ్లకేగిరి. రాజు మంత్ర జలబలమున గర్బముదాల్చెను. నెలలునిండిన పిదప మంత్రులు రాజు కుడి పొట్టను చీల్చియందుండి కుమారుని బయటకు తీసిరి.

దైవకృపచే రాజు చావలేదు. ఆ కుమారునకు పాలెవరిత్తురాయని మంత్రులు మిక్కిలి విచారించిరి. అంత నింద్రు డేతెంచి తన చూపు వ్రేలు చూపి 'మాంధాత' నన్ను చీకుము అని పలికెను.

నాటినుండి యతడు 'మాంధాతృ' మహీపతిగ ప్రసిద్ధుడయ్యెను. రాజా! నీ కిట్లు మాంధాతృ భూపాలచరిత్రము వివరించితిని.

ఆ మాంధాత సర్వభూగోళాన్నీ జయించి చక్రవర్తి అయ్యాడు. దస్యులు ఇతనికి భయపడి గాథారణ్యాలలోకి పారిపోయి కొండగుహలలో దాక్కున్నారు. ఈ లోకోపకారానికి సంతోషించి దేవేంద్రుడు తపదస్యుడు అనే బిరుదునిచ్చి గౌరవించాడు.

శశబిందు మహారాజుగారి గారాల కూతురు బిందుమతి ఇతనికి పట్టమహిషి - ఈ దంపతులకు ఇద్దరు తనయులు కలిగారు. పురుకుత్సుడు - ముచుకుందుడు. వీరిలో పురుకుత్సుడికి అరణ్యకుడు జన్మించాడు. పరమధార్మికుడు. ఇతని కుమారుడు పితృభక్తి పరాయణుడైన బృహదశ్వుడు. ఇతనికి హర్యశ్వుడు తనయుడు. హర్యశ్వుడి కొడుకు త్రిధన్వుడు. త్రిధన్వుడి సంతానం అరుణుడు.

సత్యవ్రతుడు త్రిశంకుడైన తీరు

The Surya Dynasty Chronicles - సూర్య వంశ రాజ వృత్తాంతము

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - సూర్య వంశ రాజ వృత్తాంతము

రాజా! ఒకానొకప్పు డష్టక శ్రాద్ధము జరుపుటకు వికుక్షిని ఇక్ష్వాకుడు మాంసము తెమ్మని యాజ్ఞాపించెను. కుమారా! నీ విపు డడవికేగి శ్రాద్దమునకు సాదరముగ మాంసము తెమ్మని ఇక్ష్వాకు డనగా వికుక్షి యట్లే యని యస్త్రము దాల్చి యడవి కేగెను. 

అతడు తన బాణములతో పందులను జింకలను కుందేళ్లను వేటాడి యాడి యలసిసొలసి యాకలి గొనెను. అత డాకలిమంటచే అష్టకశ్రాద్ధము మాట మఱచి యడవిలో కుందేటి మాంసముతిని మిగిలిన చెడిన మాంసమును తండ్రి కిచ్చెను. 

దానిని ప్రోక్షించుటకు తెచ్చినపుడు గురుడు చూచి యీ మాంసము పనికిరాదని గ్రహించి కోపించెను. ఈ మాంసము భుక్తశేషము; ప్రోక్షింపదగదు; దీనివలన శ్రాద్ధ పాకమంతయును చెడునని వసిష్ఠుడు రాజునకు తెలిపెను. రాజు తనగురుని మాటలువిని తన కొడుకు విధిలోపమున కర్మలోప మొనరించినందులకు కోపించి యతనిని దేశ బహిష్కృతుని చేసెను. 

శశమాంసము దినుటవలన నతడు శశాదుడన బరగెను. అతడు తన తండ్రి కోపమునకు గురియై కాఱడవులందు ద్రిమ్మరియై తిరుగుచుండెను. అతడు ఫలమూలములు దినుచు ధర్మతత్పరుడై కాలము గడపెను. కొంతకాలమునకు తన తండ్రి మరణించుటవిని వచ్చి రాజ్యము స్వీకరించెను. 

శశాదు డయోధ్యాపతియై రాజ్యము చేసెను. అతడు సరయూనదీతీర మున పెక్కు యజ్ఞములు పూర్ణముగ గావించెను. శశాదునకు కుకుత్థ్సుడను కొడుకు గల్గెను. అత డింద్రదాహుడు పురంజయు డను పేర్లతో విఖ్యాతి గాంచెను. 

జనమేజయు డిట్లనెను: ఆ రాకుమారునకిన్ని పేరు లేయే కారణములవలన నేయే కర్మల వలన గలిగెనో నాకు వివరించి దెలుపుము. అనగా-

వ్యాసు డిట్లనెను : శశాదుడు స్వర్గము జేరగా కుకుత్థ్సుడు రాజై ధర్మముతో తన తండ్రితాతల రాజ్య మనుభవించెను. ఆ సమయమున దేవతలు దానవుల చేతులం దోడిపోయిరి. అంత దేవతలు త్రిలోకాధిపతియు-అవ్యయుడు-నగు విష్ణుని శరణువేడగ మహావిష్ణువు దేవతల కిట్లనెను : 

అమరవరులారా! మీరు కుకుత్థ్సుని పార్శ్యరక్షకునిగ నుండుమనుడు. అతడు యుద్దమందు దానవులను చంపగలడు. అతడు ధర్మాత్ముడు. అతడు విల్లునములు దాల్చి మీకు సాయము రాగలడు. శ్రీపరా శక్తి దయవలన నతని కమితశక్తి గలదు. 

మహారాజా! అపుడింద్రాది దేవత లెల్లరును హరిమాట ప్రకార మయోధ్యకుజని కుకుత్థ్సుని గాంచిరి. ఆ వచ్చిన దేవతల నెల్లరిని రాజు ధర్మమతితో వారి రాకకు కారణ మడిగెను. నేను కడు ధన్యుడను. నేను నేడు పవిత్రుడనైతిని. నా జీవితము సాఫల్యము జెందెను. దేవతలు నాయింటి కేతెంచి నాకు దర్శనభాగ్య మిచ్చినారు. 

దేవేశులారా! మీ వచ్చిన పని తెలుపుడు. అదెంతటి దుస్సాధ్యమైనదైనను మీ మహాకార్యము చేయగలను. ఆన 

దేవత లిట్లనిరి: రాజేంద్రా: నీ సహాయసంపదనిమ్ము. ఇంద్రునకు మిత్రుడవు గమ్ము. యుద్దమున ధుర్జయులగు దానవులను జయింపుము. శ్రీపరాశక్తి యనుగ్రహమున నీకు దుర్లభమైన దేదియును లేదు. మేము విష్ణుప్రేరితులమై నీ సన్నిధికి వచ్చి తిమి. అన-

రాజిట్లనెను: ఓ సురవరులారా! ఇంద్రుడు వాహనముగ నున్నచో నేను మీకు పార్శ్వరక్షకుడుగ నుండగలను. ఇపుడు జరుగనున్న దేవదానవ యుద్దమందు దేవేంద్రునిపై నారోహించి పోరుదును. నా మాట నిజము. అపుడు దేవత లింద్రునితో నిట్లనిరి. 

ఓ యింద్రా! నీవా రాజునకు వాహనము గమ్ము. అభిమానము వీడుము. ఈ యద్బుతకార్య మొన ర్పుము. అట్లు దేవేంద్రుడు హరిచే ప్రేరితుడై సిగ్గుజెందుచు శివునికి వృషభమువలె తాను వృషభమై రాజునకు వాహనముగ నుండెను. రాజు యుద్దభూమి కేగుట కింద్రుని మూపుపై గూర్చుండెను. 

అందువలన నతడు కుకుత్థ్సుడన విఖ్యాతి గాంచెను. అతడింద్రుని వాహనముగ జేసికొనుటచే నింద్రువాహు డయ్యెను. దైత్యులపురము ధనరాశిజయించుటవలన పురంజయు డయ్యెను. అట్లుకకుత్థ్సుడు దైత్యులను గెలిచి వారి ధనరాసులు దేవతలకొసంగెను. 

ఇట్లు రాజర్షి కింద్రునితో స్నేహముకుదిరెను. కుకుత్థ్సుని వంశజు లెల్లరును భూమిపై కాకుత్థ్సు లన వన్నెయు వాసియు గాంచిరి. కకుత్థ్సున కతని భార్యయందు కాకుత్థ్సుడు-అతనికి పరాక్రమశాలియగు పృథుచక్రవర్తి జన్మించి ప్రసిద్ధిబడసిరి. 

పృథుచక్రవర్తి దేవీపదభక్తుడు. అతనికి విశ్వరంధియను పుత్రుడు గల్గెను. విశ్వరంధి కొడుకు చంద్రుడు. అతడు శ్రీమంతుడు-వంశకరుడు. అతని సుతుడు తేజముబలముగల యువనాశ్వుడు. 

యువనాశ్వుని తనయుడు శావంతి. అతడు యజ్ఞములు నిర్వహించినవాడు. అత డింద్రపురమును బోలు శావంతీపురమును నిర్మించెను. మహాత్ముడగు శావంతుని కొడుకు బృహదశ్వుడు. అతని కుమారుడు కువలయాశ్వుడు.

ధుంధువను దైత్యుని చంపుటచే నతడు ధుంధుమారుడను పేర ప్రఖ్యాతి గాంచెను. అతని కుమారుడు దృఢాశ్వుడు. అతని కొడుకు హర్యశ్వుడన పేరొందెను. అతని కొడుకు నికుంభుడు - అతని కొడుకు బర్హణాశ్వుడు. 

అతని తన యుడు ప్రేసేనజిత్తు. అతడు మహాబలశాలి అతని కొడుకు ¸యవనాశ్వుడన బరగెను. అతని నందనుడు శ్రీమాంధాతృ చక్రవర్తి. అతడు శ్రీజగదీశ్వరికై నూటయెనిమిదివేలు మందిరములు పుణ్యతీర్థములందు శ్రీదేవీప్రీతికై కట్టించెను. 

అతడు తన తల్లి గర్బమున బుట్టక అద్బుతముగ తన తండ్రి పొట్ట చీల్చుకొని బయటి కేతెంచెను. అన విని 

రాజిట్లనెను : నీవు చెప్పిన విషయము నేను మున్ను కనివిని యెఱుగను. ఓ మహానుభావా! నీవు పల్కినట్లు జన్మించుట సంభావ్యముగాదు. కనుక నిపుడు మాంధాతృ జన్మ వృత్తాంతము వివరించి తెల్పుము. రాజు పొట్టనుండి సర్వాంగసుందరుడగు పుత్రు డెట్లు గల్గెను? 

తండ్రికి పుట్టిన తనయుడు - మ౦ధాత

Revathudi's Satya Loka Yatra - రేవతుడిసత్యలోకయాత్ర

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధమురేవతుడిసత్యలోకయాత్ర

జనమేజయ డిట్లనెను: ఓ వ్యాసమహర్షీ ! రేవతుడు రేవతిని తీసికొని బ్రహ్మలోక మేగెనను విషయము నా మది కచ్చెరువు గొలుపుచున్నది. నేను మున్ను బ్రాహ్మణుల సభలో కథాప్రసంగమున నొక మాట వింటిని. 

ఏమన బ్రహ్మవిదుడు శాంతుడునగు బ్రాహ్మణుడు బ్రహ్మలోకము వెళ్ళగలడు. భూలోకవాసులకు బ్రహ్మలోకము చేరరానిది. మఱి రేవతుడు రేవతిని తీసికొని స్వయముగ నెట్లు బ్రహ్మలోకమేగ గల్గెను? చచ్చినవాడు స్వర్గమేగునని సర్వశాస్త్రములు తెల్పుచున్నవి. ఈ మానవదేహముతో బ్రహ్మలోకము చేరుటెట్లు సాధ్యము? 

ఆ స్వర్గమునుండి మానవలోకమునకు తిరిగి యెట్లు రావచ్చును? ఓ విద్వాంసుడా! రేవతుడు బ్రహ్మనుజేరి ప్రశ్నించదలచి యెట్లు వెళ్ళను. నా యీ సంశయ మిపుడు దీర్చుటకు నీవు సమర్థు డవు. అన 

వ్యాసు డిట్లనెను: ఓ రాజా! సుమేరు పర్వత శిఖరములందు సర్వలోకములు నెలకొనియున్నవి. ఇవి ఇంద్ర లోకము; అగ్ని లోకము; యమలోకము; సత్యలోకము; కైలాసము; వైష్ణవనిలయమగు వైకుంఠధామము. 

పూర్వము దనుర్ధరుడు పార్థుడునైన అర్జునుడు దేవేంద్ర నగరమున నైదు సంవత్సరములు నివసించెను. అపుడింద్రుని సన్నిధిలో నర్జునుడు మానవ శరీరముతో నుండెను. అర్జునునివలె కుకుత్థ్సుడు మొదలుగాగల రాజులు స్వర్గ మేగిరి. పిదప మహాబలశాలురగు దానవులును స్వర్గసీమను చేరిరి. వారింద్రనగరము జయించి సుఖముండిరి. 

మునుపు మహాభిషుడను మహారాజు బ్రహ్మ లోకమునకు వెళ్ళుచు త్రోవలో నతడు గంగాసుందరిని చూచెను.

అంతలో దైవవశమున కమ్మనిపిల్లగాలుల కామె మేనిమీద వస్త్రము కొంత తొలగెను. అపుడామె సగము దిగంబరగ నుండగ రాజదేవైపు ఱప్పవాల్పకచూచెను. ఆ రాజు వలరాజు బాణములకు తాళలే కామె వాడిచూపుల నెదుర్కొనుచు చిర్నవ్వు నవ్వెను. ఆ సుందరియు మరల చిర్నగవు నవ్వెను. 

ఈ యిర్వురి నవ్వులను బ్రహ్మచూచి మీరు నేలపై బుట్టుడని శపించెను. ఎల్ల దేవతలును దైత్య దానవులచేత పీడింపబడి కమలాపతియగు విష్ణునిజేరి సంస్తుతింతురు. రాజా విజ్ఞులగు మానవు లెల్లలోకముల కేగవచ్చును. ఈ విషయముగూర్చి ఆవంతయు సందేహింప బనిలేదు. 

సరపతీ! పుణ్యాత్ములు తాపసోత్తములు అటకు తప్పక వెళ్ళగలరు. వాని పుణ్య సత్యములు వారి బాటలో వారికి తోడుగ నుండును. అట్లే యజ్ఞము నిర్వర్తించు మహితాత్ములగు యజమానులు వెళ్లగలరు అనెను. 

జనమేజయు డిట్లనెను: అట్లు తన పుత్రియగు రేవతినిగొని వెళ్లిన ఆ రాజు బ్రహ్మలోకము జేరిన పిమ్మట యేమి చేసెను? బ్రహ్మ యతని కేమని పలికెను? రేవతి నెవరి కిచ్చిరి? విప్రవర్యా: అన్ని విషయములు నాకు వివరముగ దెల్పుము.

వ్యాసు డిట్లనియెను : రాజా! వినుము. రేవతుడను రాజు గలడు గదా : అతడు తన పుత్రికి తగిన వరుని తెలియు టకు బ్రహ్మలోక మేగెను. అత్తఱి నచట సంగీతసభ సాగుచుండె. అతడానందముతో నట నుండెను. అతడు తన కన్యతో సభయందు జరుగుచున్న నాదగానమాధురి చెవులార గ్రోలుచు సంతోషించెను. 

అది పూర్తికాగా బ్రహ్మకు నమస్కరించెను. రేవతుడు తన కూతును బ్రహ్మకు జూపి యిట్లు పలికెను. ఓ దేవపతీ! ఈమె నా కుమార్తె. ఈమెకు తగిన వరుడెవడో తెల్పుము. ఈమె నే రాజవరున కీయవలయునో నిన్నడుగ వచ్చితిని. ఎందఱో కులశీలములుగల రాజపుత్రులను చూచితిని. 

వారిలో నొక్కడును నా మనస్సునకు నచ్చినవాడు లేడు. అందువలన దేవదేవా! నిన్నడుగుట కిటకు వచ్చితిని. సర్వజ్ఞా: యోగ్యుడు కులీనుడు బలశాలి సర్వలక్షణ సంయుతుడునైన రాకుమారిని వరునిగ తెలుపుము. దాత ధర్మశీలుడునగు రాజ పుత్రుని నాకు తెలుపుము. 

అను రాజుమాటలకు జగత్కర్తయగు బ్రహ్మ వినెను. బ్రహ్మ కాలవైపరీత్యమునకు నవ్వుచు నిట్లు పలికెను. 

రాజా! నీ పుత్త్రికి రాజపుత్రులను వరులుగ కొందఱి నాలోచించితివి. ఇపుడు వారెల్లరును వారి తండ్రితాత లును వారి బంధువు లందఱును కాలగర్బముల గలిసిరి. ఇపుడిరువదియేడవ ద్వాపరము నడచుచున్నది. ఇపుడు నీ వంశ జులు చనిపోయిరి. నీ పురము దానవులచేత జిక్కెను. అచట నిపుడు చంద్రవంశరాజు రాజ్య మేలుచున్నాడు. అతడు యయాతి వంశజుడు. మధురానగరాధిపతి ఉగ్రసేనుడన పేరు గాంచినవాడు.

ఉగ్రసేనుని కొడుకు కంసుడు. అతడు దేవతలను ద్వేషించువాడు. బలశాలి-దైత్వాంశజుడు. తన తండ్రినే కారాగారమున బంధించెను. అతడు మదగర్వముతో నెల్లరాజుల జయించి పాలించుచున్నాడు. భారమునకు తాళలేక భూ మాత బ్రహ్మను శరణు వేడెను. క్రూర రాజసేనల భారముతో భూమి క్రుంగాపోయెను. 

దేవత లెల్లరును తమ తమ యంశములతో నవతరించిరి. కమలలోచనుడు వాసుదేవుడు నగు కృష్ణుడు దేవరూపిణియగు దేవకియం దుద్బవించెను. కృష్ణుడు నారాయణ మున్యంశమున జనించినవాడు. 

తొల్లి సనాతనుడు ధర్మపుత్రుడు నరసఖుడునగు నారాయణుడు గంగాతీరమున పావన బదరికాశ్రమందు వాసుదేవుడని శ్రీకృష్ణుడని ప్రసిద్ది గాంచుట కవతరించి పాపాత్ముడగు కంసుని చంపెను. అట్లు కంసుని చంపి యతని రాజ్యమును కృష్ణుడు గ్రసేనున కిచ్చెను. 

కంసుని మామ జరాసంధుడు - బలశాలి - పాపాత్ముడు. అతడు కోపముతో మధురపై దండెత్తి పోరు సాగించెను. కాని మహాబలుడగు జరాసంధుడు కృష్ణుని చేతిలో వోడెను. జరాసంధుడపుడు మహాబలుడగు కాలయవనుని కృష్ణునిపై యుద్ధమునకు పురికొల్పెను. 

శూరుడగు యవనపతి సైన్యముతో వచ్చుట కృష్ణుడు వినెను. అంత కృష్ణుడు మధురవదలి ద్వారకకేగెను. ఆ శిథిలపురమును శిల్పులచేత నిర్మింపజేసి జీర్ణమైన నగరమును పునరుద్ధరించెను. 

దానికి తన వశమందున్న యుగ్రసేనుని రాజుగ చేసెను. యాదవులనందఱను ద్వారకలో నివసింపజేసెను. అచట నిపుడు శ్రీకృష్ణుడు తన బంధుమిత్రులతో నివసించుచున్నాడు.

కృష్ణుని యన్న బలదేవుడు. అతడు శేషాంశవలన నవతరించినవాడు. హలాయుధుడు ; ముసలి ; వీరుడు. అతడు నీ కొమరి తకన్ని విధముల తగినవరుడు. కమలలోచనయగు నీ కన్యను బలరామున కిచ్చి యథావిధిగ వివాహ మంగళ కార్యము జరిపించుము. 

రాజా! అట్లు నీ కూతును కన్యాదానము చేసిన పిమ్మట నీవు సురారామము పావనము జనుల కోర్కెలు దీర్చునది-యగు బదరికాశ్రమమున తన మొనరించుట కరుగుము. అని పద్మయోనియగు బ్రహ్మ పలుకగా రాజు తన కన్యను వెంటగొని వేగమే ద్వారకను జేరెను. 

శుభలక్షణయగు తన కన్నియను బలదేవున కొసంగి పిదప తీవ్ర తప మొనరింప నడవుల కేగెను. అతడు నదీతీరమున మేను చాలించి స్వర్గము చేరెను. అన విని 

రాజిట్లనెను : ఓ వ్యాసమునీ! నీ వాశ్చర్యకరమైన విషయము వెల్లడించితివి. రేవతుడు బ్రహ్మలోకమున తన కూతుతో నేగి యట నూటయెనిమిదియుగము లుండె నంటివి. 

అంతటి దీర్ఘకాలమునగూడ రేవతుడుగాని రేవతిగాని ముసలివారు కాలేదా? ఇంతకాలము వారి కాయువుతీర కెట్లుండున ?.

వ్యాసు డిట్లనెను: అనఘా: బ్రహ్మలోకమునందు సతతము ముదిమి ఆకలిదప్పులు చావుభయము నిందమున్నగు దొసగులు మచ్చునకైన లేవు. శర్యాతి స్వర్గమున కేగిన పిమ్మట నతని సంతానము రాక్షసులచే పీడింపబడి కుశస్తలి వదిలి భీతితో చెల్లాచెదరయ్యెను. 

వైవస్వతమనువు తుమ్మునుండి వీర్యవంతడగు ఇక్ష్వాకు మహారాజు జన్మించి ప్రసిద్ధి గాంచెను. అతడు సూర్యకులదీపకుడు. అతడు వంశోద్ధారమునకు నారదునివలన దీక్షబొంది నిరంతరముగ హ్రీంమయియగు శ్రీదేవిని ధ్యానించి తపించెను. అతనికి నూర్గురు కొడుకులు. 

వారిలో వికుక్షి జ్యేష్ఠుడు-అతడు బలవీర్యసంయుతుడు. ఇక్ష్వాకు డయోధ్య రాజధానిగ పాలించి వాసి కెక్కెను. అతనికి శకుని మున్నగు నేబదిమంది కొడుకులు పుట్టిరి. 

రాజా! అతడు వారిలో కొందఱి నుత్తరాపథమునకు కొందఱిని దక్షిణాపథమునకు రాజులుగ చేసెను. ఆ యేబదిమందిలో నలువది యెనిమిది మందిని పాలకులుగ నియమించి తక్కిన యిద్దఱిని తన పరిచర్యల కుంచుకొనెను.

సూర్య వంశ రాజ వృత్తాంతము


Ashwini gods are entitled to drink Soma - అశ్వినీదేవతలకు సోమపానార్హత

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - అశ్వినీదేవతలకు సోమపానార్హత

జనమేజయరాజా! చ్యవనుడట్లు సోమపాత్రము చేతబునినంతనే దేవేంద్రుడు కోపముతో తన బలము చూపుచు చ్యవనున కిట్లనెను: 

ఓ బ్రాహ్మబంధూ! వీరిని సోమపానముచే గౌరవింపవలదు. అట్లు చేసిన విశ్వరూపుని చంపినట్లు నిన్ను చంపగలను. అన 

చ్యవను డిట్లనెను: ఇంద్రా! ఈ మహాత్ములు నాకు రూపసంపద నొసంగిరి. వీరి నవమానింపకుము. వీరు నన్ను రెండవ దేవునివలె మార్చివేసిరి. దేవేంద్రా! నీవు తొలుత త్రావకున్న దేవతలును త్రాగరు. 

కనుక పరంతపులగు అశ్వి దేవతలను దేవతలుగ నెఱుంగుము. 

ఇంద్రు డిట్లనెను: ఓ మందమతీ! వీరు వైద్యులు. యజ్ఞమున సోమార్హులుగారు, ఒకవేళ వారికి సోమ మిచ్చినచో నీ తల తెగవ్రేతును. ఇంద్రుని మాట లెక్కచేయక భార్గవుడతనిని బెదిరించుచు సోమము గ్రహించెను. వారు సోమపాత్రము చేతుల ధరించి దప్పి దీర్చుకొనదలచిరి. 

అంతలో నింద్రుడు చూచి యిట్లనెను : వీరికై నీవు సోమము గ్రహించినచో నిన్ను రెండవ విశ్వరూపుని చంపినట్లు నా వజ్రముతో చంపుదును. ఇట్లు దేవేంద్రుడు పలుకగనే భార్గవు డభిమానపూర్వకముగ కోపముతో నశ్వినులకొఱకు సొమము యథావిధిగ చేబూనెను. ఇంద్రు డంత కోపముతో నెల్ల సురలు చూచుచండగ సూర్యకోటి ప్రకాశముగల తన వజ్రాయుధము మునిపై విసరెను.

అట్లు ప్రేరితమైన వజ్రమును చూచి చ్యవనమహర్షి తన తపోవీర్యముచే నమితతేజముగల యింద్రుని వజ్రమును స్తంభింపజేసెను. పిదప మహాబాహువగు మునిసత్తముడు దేవేంద్రుని చంపు తలంపుతో కృత్యకొఱకు మారణమంత్రములతో నగ్నిని వేల్చెను. 

చ్యవనుని తపోబలమున కృత్య యుత్పన్నమయ్యెను. కృత్యవలన మహాబలము-గొప్పకాయముగల క్రూర మహాసురుడు గల్గెను. 

అతని పేరు మదాసురుడు. అతడు ఘోరుడు ప్రాణులకు భయంకరుడు. వాని మేను పర్వతమంత గలదు. వాని వాడికోఱలు భయంకరములు. అతని నాల్గుకోఱలు నూఱు యోజనములంత గలవు. తక్కిన కోఱలు పది యోజనములంత గలవు. వాని భుజములు పర్వతములంతటివి. చూపులు క్రూర భీకరములు. నాలుక భయంకరముగ గగన తలమును నాకునేమో యనున ట్లుండెను. 

వాని మేను గిరిశిఖరమువలె కఠిన భీకరముగ నుండెను. గోళ్ళు వాడి పులిగోళ్ళు, వెండ్రుకలు వెఱపు గొల్పునవి. వాని శరీరము నల్లగ కాటుకకొండవలె నుండెను. ముఖమతిభయంకరము. కన్నులు దావాగ్నులవలె భీషణ భయంకరములు. వాని యొక దౌడ నేలను వేరొకటి నింగిని తాకు నట్లుండెను. ఈ విధముగ పెద్ద శరీరముగల మదుడను పేరుగల యసురుడు పుట్టెను.

అతనిని చూడగనే వేల్పు లెల్లరు భయకంపితులైరి. ఇంద్రు డంతటివాడే భయత్రస్తుడై యుద్దము మాట మఱచి పోయెను. ఆ దైత్యుడు తన పెద్దనోట వజ్రము పట్టుకొని ఘోరమైన చూపులతో ముల్లోకములను వ్యాపించు నట్లుండెను. అతడు క్రుద్దుడై యింద్రుని మ్రింగబోయెను. అయ్యో! హతులమైతిమని వేల్పు లెల్ల రొక్కపెట్టున పెద్దగ విలపించిరి. 

ఇంద్రుని భుజములు కదలకస్తంభిచిపోయెను. అతడు వజ్రము వ్రేటువేయుట కశక్తుడయ్యెను. వజ్రహస్తుడగు దేవేంద్రుడు కాలాంతకుడగు దనుజుని చూచి యేమియు తోచక సమయకోవిదుడగు గురుని తలంచెను. ఉదార హృదయుడగు గురుడు తన్ను దలంచినంత మాత్రన యేతెంచెను. 

అప్పటి సమయము కష్టకాలమని యెఱింగెను. గురుడు కృత్యనుగూర్చి యాలో చించి యితడు మహామంత్రములకుగాని వజ్రమునకుగాని సాధ్యుడుగాడని యింద్రుతో ననెను. మహాబలుడగు మదాసురుడు చ్యవనమహర్షి తపోబలమున యజ్ఞకుండమునుండి పుట్టెను. 

దేవేశా! ఇపుడీ యసురుని దేవతలుగాని నీవుగాని నేనుగాని వారింపజాలము. కనుక చ్యవనమహామునిని శరణు పొందుము. శ్రీపరాభట్టారికా భక్తులకు కోపము వచ్చినచో దానినెవరును వారింపజాలరు. చ్యవనుడు తన కృత్యను తానే వారింపగలడు. 

అని గురుడు పలుకగ దేవేంద్రుడు చ్యవనముని సన్నిధికేగి భయవినయములతో తలవంచి నమస్కరించి యిట్లు పలికెను.

మునివరేణ్యా ! సర్వజ్ఞా! నా తప్పు క్షమింపుము. నా పైకి వచ్చుచున్న దనుజుని వారింపుము. ప్రసన్నుడవు కమ్ము. నీ మాట చెల్లింతును. భార్గవా: బ్రాహ్మణోత్తమా! ఈనాటినుండి యశ్వినులు సోమపానమునకు తగినవారగుదురు. నామాట నిజము. నాయెడ దయ చూపుము. 

తపోధనా! ధర్మజ్ఞా! నీ ప్రయత్నము వమ్ముగాదు. నీవు వ్యర్థమైన పనియేదియు చేయవని నాకు తెలియును. అశ్వినులు నీచే నిరంతరముగ సోమపాయులైరి. ఈ శర్యాతిరాజు కీర్తియు శాశ్వతమయ్యెను. 

మునిసత్తమా! నేను చేసిన పనియంతయును నీ తపోవీర్యము నల్గురికి వెల్లడించుటకు నిన్ను పరీక్షించుటకే చేసితిని. బ్రాహ్మణవర్యా! మదాసురుని సంహరింపుము. మమ్ము కనికరింపుము. 

ఎల్ల వేల్పులకు మేలు చేకూర్చుము. అను దేవపతి మాటలువిని పరమార్థవిదుడగు చ్యవనుడు విరోధమువలన గల్గిన కోపమును తీసివేసికొనెను. ఇట్లు భార్గవుడింద్రు నూరడించి మదాసురుని స్త్రీలు త్రాగుడు జూదము వేట యును నాల్గుచోట్లనుండ నియమించెను. 

ఇట్టు ముని దేవేంద్రునోదార్చి మదుని మదమడచి దేవతలను తమ తమ స్థానములకంపి యజ్ఞమును పూర్ణ మొనరించెను. ఆ పిదప సర్వధర్మాత్ముడగు భార్గవుడు పవిత్రమైన సోమమును దేవేంద్రునిచే అశ్వినులచే త్రాగించెను.

రాజా! ఇట్లు రవిపుత్రులు-ఆర్యులు నగు అశ్వినులను చ్యవనమహర్షి తన తపోబలమున సోమపాయులుగ జేసెను. నాటినుండి యా సరస్సు యూపమండితమై యలరారెను. చ్యవన మున్యాశ్రమము భూమిపై ప్రఖ్యాతి గాంచెను. 

అట్లు శర్యాతియు చ్యవనుని మహిమను సంతుష్టుడై జన్నము పూర్తి గావించి మంత్రులగూడి తన నగరి కరిగెను. ఇట్లు ముసుపుత్రుడగు శర్యాతి ప్రతాపముతో ధర్మజ్ఞతతో చక్కగా రాజ్య మేలెను.

అతని కొడు కానర్తుడు. ఆనర్తుని కొడుకు రేవతుడు. రేవతుడు సాగరములో కుశస్థలియను పురము నిర్మంచి యానర్తాది దేశములలోని భోగభాగ్యములను నిరాటంకముగ ననుభవించెను. 

రేవతునకు నూర్గురు కుమారులు. పెద్దవాడు కుకుద్మిఉత్తముడు. కూతురు రేవతి. ఆమె సుందరి-శుభలక్షణ. తన కొమరితకు పెండ్లి వయస్సు రాగానే రేవతుడుత్తమ కులసంజాతులగు రాజపుత్రుల గుఱించి యాలోచించెను. 

అతడు రైవతగిరిపై నివసించుచు విక్రమముతో ఆనర్తాదిదేశము లందు రాజ్యము చేసెను. అతడు తన కూతు నెవని కీయవలయునో తెలియదలచి సురపూజితుడు సర్వజ్ఞుడునైన బ్రహ్మ సన్నిధి కేగదలచెను. 

ఇట్లు తలంచి రేవతుడు రేవతిని తోడ్కొని పితామహు నడుగుటకు బ్రహ్మలోకము జేరెను. ఆ బ్రహ్మ లోకమునందు ఎల్లదేవతలు యజ్ఞములు ఛందములు గిరులు సాగరములు సరస్సులు దివ్యరూపములు దాల్చి వెలుగొందుచుండెను. అట మఱియును సిద్దులు గంధర్వులు ఋషులు చారణులు పన్నగులు మున్నగువారు చేతులు జోడించి బహ్మనుసంస్తుతించుచుండిరి.

రేవతుడిసత్యలోకయాత్ర

Aruna's moral teaching - అరుణుడు చేసిన నీతిబోధ

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - అరుణుడు చేసిన నీతిబోధ పుత్రా! ధర్మమందు బుద్ధి నిల్పుము. విప్రులు గౌరవపాత్రులు. న్యాయముగ ధనము సంపాదించవలయును...