Friday, February 27, 2026

After receiving blessings for his devotion and an exalted position, a mature Dhruva returns to his kingdom to be welcomed by his father, King Uttanapada - ధ్రువుండు మరల దన పురంబునకు వచ్చుట

ధ్రువుండు మరల దన పురంబునకు వచ్చుట

అంటూ ఆ ధ్రువుడు దుఖపడ్డాడు. ఆ మైత్రేయముని విదురుడితో ఇలా చెప్పాడు. మనోహరమైన శ్రీహరి పదపద్మరేణువులచే సంస్కరింపబడిన శరీరాలు గలవారు. అనుకోకుండా లభించిన దానివలన, తృప్తి పడుతూ సంతోషంగా జీవిస్తుంటారు. అలాంటి మీ బోటివాళ్లు ఆ వెన్నుని పాదపద్మసేవ తప్ప మిగతావాటిని తలవనైనా తలవరు సరికదా మరొకదానిని దేనినీ పొరపాటున కూడ ఇచ్చగించరు. మనువు వర్తనవంటి నడవడి కలవాడా! ఈ రీతిని విష్ణుదయను పొందిన తన కన్న కొడుకు ధ్రువుడు తిరిగివస్తున్నవార్తను ఉత్తానపాదుడు చారునివల్ల విన్నాడు. ఆ సమయంలో.
మనసులో ఇలా అనుకున్నాడు.

ప్రాణం పోయినవాళ్లు మళ్లీ తిరిగి రావడమా? అదే కాక ఇలాంటి వృత్తాంతాలు ఎక్కడన్నా జరిగి ఉంటాయా? ఎపుడూ మేలు ఎరుగనట్టి నాకు అంతటి శుభాలు వాటిల్లుతాయా? అని ఆలోచించాడు నమ్మకం కుదర లేదు. అయినా 'అతి తొందరలో నీ కుమారుడు తిరిగి రాగలడు' అన్న నారదముని మాటలు గుర్తుకు వచ్చాయి. ఆ మాటలమీద గురి ఏర్పడింది. కృతార్థత సమకూరిన వాడయ్యాడు.

తన కొడుకు వస్తున్నాడనే శుభవార్తను తెచ్చిన ఆ ఘనుడికి(చారుడికి) ధనాన్ని ముత్యాలపేరులను మనస్సు హర్షిల్లగా కానుకలుగా ఇచ్చాడు. తన పుత్రుణ్ణి చూడాలనే ఆనందంలో లోపల చుట్టుముట్టుగా

ధ్రువుడికై ఎదురు చూపులుచూస్తున్న ఉత్తానపాదుడు కొడుకును చూడాలనే ఉబలాటంతో ఉత్తమజాతి అశ్వాలను కట్టిన పసిడి తేరును ఎక్కాడు. కులవృద్దులు, బంధువర్గం, మంత్రులు దానిచుట్టువారు రాసాగారు. వేదమంత్ర ఘోషలు, శంఖం, బాకా, వేణువువంటి ఊదే వాద్యాల ధ్వనులు, మంగళ వాద్యాలమోతలు పిక్కటిల్లాయి. నగలు సింగారించుకుని పల్లకీలు ఎక్కివచ్చిన సునీతి, సురుచి, ఉత్తముడితో కూడ వెంటపోయారు. ఇలా అట్టహాసంతో ఆ పట్టణం పొలిమేరల్లో అంతా కలియగూడి వేగవంతంగా వెళుతూ నగర ఉద్యానవనం దరిగా వస్తున్న ధ్రువుణ్ణి చూసి ఆ రాజు స్వయంగా.

కొడుకును చూచి పొంగిన మమకారంతో ఉత్సహించి గబగబా రథం దిగాడు. విష్ణుపదసేవతో పాపాలన్ని పోగొట్టు కున్నవాడు, ఈశ్వరానుగ్రహంతో అన్ని కోరికలు తీరినవాడు తన కొడుకు అని పులకించి పోయాడు. ఆ ఆనంద పారవశ్యంలో

ఆ రాజు గట్టిగా కవుగలించుకున్నాడు. ముఖమంతా నిమిరాడు. తలను మూచూచాడు. గడ్డాన్ని చేతి మునివేళ్లతో పట్టుకున్నాడు. మోదించాడు. ఆ కన్నీటి ధారాపాతంలో ముంచెత్తాడు దీవించాడు. అప్పుడు శాశ్వత యశోవంతుడైన ఆ ధ్రువుడు

తండ్రి ఆశీస్సులు పదే పదే అందుకున్నాడు. ఆ సంతోషం పట్టలేకపోయాడు. కన్నతండ్రి అడుగులకు తన నొసలు అంటేటట్లుగా నమస్కరించాడు. తండ్రి సేవలో తన్మయుడై పోయాడు.

(ధ్రువుడు మునుపు తండ్రివలన పొందిన అవమానాన్ని స్మరింపకపోవటం గమనింపదగిన విషయం)

ఆవల మంచివాళ్లల్లో ముందటివాడైన ధ్రువుడు తల్లులిద్దరికీ వినమ్రుడై మొక్కాడు. సురుచికి వేరుగా నమస్కరించాడు. ఆమె కుమారుణ్ణి అలా చూసి పైకి ఎత్తి, నవ్వుతూ అక్కున చేర్చుకుంది

ఆ సురుచి సంతోషాతిరేకంవల్ల బొంగురుపోయిన గొంతుతో 'వందేళ్లు జీవించు' అంటూ దీవించింది. నీరు పల్లం వైపుకి ప్రసరించే విధాన ఆ భగవంతుడు వాత్సల్యంతో ఎవరిపట్ల మిత్రభావంతో ఉంటాడో, ఎవరిమీద దయ చూపి ప్రసన్నుడవుతాడో వాని పట్ల ఈ భూమిలోని సర్వ ప్రాణికోటి తనంతాతానే మిక్కిలి అనుకూలంగా వుంటుంది. అలాంటిదే సురుచిన్ని. ఆమె వెనకటి వృత్తాంతాన్ని తలవకనే ఆ ధ్రువుడి ఘనతపై ప్రీతి చూపింది. ఈ నేలమీది విష్ణుభక్తి నిండినవారు పరిశుద్దాత్ము లవడంవల్ల వాళ్లపై ఎవరూ కోపంతో ఉండరు.

ఉత్తముడూ, ధ్రువుడూ ఎంతో ప్రేమగా ఒకరినొకరు కౌగిలించుకొన్నారు. ఒంటి పులకరింతలతో; ఆనందబాష్పాలతో తడిసి ముద్దయిపోయారు. అంతలో సునీతి కూడ తన ప్రాణంలో ప్రాణమైన తన తనయుని అక్కున చేర్చుకుంది. ఆ తనుస్పర్శానుభూతితో ఎంతో ఆనందపడింది. వెనకటి బాధనంతా వెనక్కి పెట్టింది. ఆ సంతోషపు కన్నీటి ధారలతో తడిసిపోయిన ఆమె పాలిండ్ల స్తన్యమున్నూ కన్నీటితో కలసిపారింది.

ఆ నగర పౌరులందరూ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతూ ఆ ధ్రువుడి తల్లిని తృప్తికరంగా దర్శించారు. నీకు వాటిల్లిన ఇన్నాళ్ల దుఃఖాన్ని తొలగించినవాడు నీ కొడుకు. ఎక్కడికో ఏనాడో వెళ్లి, ఇంతవరకు కనపడని నీ కుమారుణ్ణి ఈ దినాన నీ పుణ్యం కొద్దీ తిరిగి పొందగల్గావు. ఈ ధ్రువుడు తన గొప్పమహిమతో ఈ భూభాగాన్నంతా పరిపాలిస్తాడు. ఆ తామరసాక్షుని స్మరించే గొప్ప గొప్ప యోగులు జయింప శక్యంకాని మృతిని సైతం జయించగల్గుతారు. అలాంటి వినయశీలుల పీడలను తీర్చే ఆ విష్ణుమూర్తిని కొలవగల్గడం నీ వల్లనే అయింది అనేది సత్యమైన మాట. అని నుతించారు. అలా పౌరజనంచే అనునయించబడ్డ ధ్రువుణ్ణి ఉత్తానపాదుడు ఉత్తముడితోపాటు గజారూఢుని చేశాడు. స్తోత్రపాఠాలు వింటూ మనస్సున గొప్పగా ఆనందపడుతూ తన రాజధానికి చేరుకున్నాడు.

ఆ నగరం బంగారు తాపడంగల ఇళ్ళ పైకప్పులు, అచ్చమైన గోడలు, తలవాకిళ్లు, అందమైనగోపురాలు, చక్కనైన ప్రాకారాలు కల్గి ఉంది. పళ్లు, పూలగుత్తులు వేలాడుతున్న అరటిబోదెలు, లేతపోకచెట్లు మొదలైన అలంకరణలతో విశేషంగా ఉంది. కర్పూరం, కస్తురి, చందనంవంటి పరిమళద్రవ్యాలు కలబోసిన నీళ్లతో ఒత్తుగా కలయంపి చల్లిన బాటలుగల అంగళ్లు కలిగి ఉంది. ప్రీతి పుట్టించే నవరత్నఖచిత రంగవల్లులతో ప్రతి ఇంటి ముంగిలి కళకళలాడుతున్నది. పుణ్యనదీజలంతో నిండిన మంగళ కలశాలతో ఒప్పుతూ ఉంది. బీయ్యం, సువర్ణపుష్పాలు, పేలాలు, యవలు/పసుపు కలిపిన బీయ్యం, పువ్వులు, పళ్సు, వంటి పూజోపహారాల సముచ్చయంతో విలసిల్లుతూ ఉంది. ఇలా అన్ని ప్రక్కలా అలంకరణలతో ఆ పట్టణం పండుగదనంతో చూడచక్కగా ఉంది.

పురంలోకి ప్రవేశించి రాచబాటలో వేంచేస్తూ ఉండగా అదే సమయంలో సింహాలవలె సన్నటి నడుములుగల ఆ నగర రమణులు మేడలపైన వరుసలుకట్టి నిల్చున్నారు. ఆ భగవద్భక్త పుంగవునిపై మెరుస్తున్న తెల్లఆవాలు, పళ్లు, అక్షతలు, పూలు, చల్లుతున్నారు. లేతగడ్డిపరకల కట్టలతో పెరుగు కలిపిన నీటిని చిలుకరిస్తున్నారు. ఆ చిలకరింపుల్లో వాళ్ల చేతుల బంగారు గాజుల ఝణ ఝణ ధ్వనులు ఇంపుగొల్పుతున్నాయి.

ఈ విధంగా వాత్సల్యంతో చల్లుతూ నిక్కమైన పలుకులతో ఆ స్త్రీలు ఆశీర్వాదం చేశారు. పసిడిపళ్లాల్లో సమకూర్చిన మణిదిపాలతో హారతులు పట్టారు. పట్టణప్రజలు, పల్లెలప్రజలు, స్నేహితులు, మంత్రులు, బంధువర్గం మొదలైన వాళ్లంతా చుట్టూ నడుస్తుండగా ధ్రువుడు రాజప్రాసాదానికి పోసాగాడు.

ఆ రాజభవనాలు, పచ్చలు తాపిన బంగారు గోడలతో; రత్నాలరాసుల గుట్టలతో మిలమిల లాడ్తున్నాయి. పాలనురుగులవలె తెల్లనైన, బంగారు పరికరాలతో కూర్చిన, విలువైన వస్త్రాలు పరచిన పరుపులు ఇంపుగా ఉన్నాయి. పూలతోటలు, 'చక్కటి కల్పవృక్షాలతో, చిలుకలు, కోకిలల కలరవాలతో, తుమ్మెదజంటల ఝుంకారాలతో అలరిస్తున్నాయి. దిగుడుబావులు, ఎంతో విలువైన వైడూర్యాలతో కూర్చిన మెట్లతో, తళతళమనే స్వచ్చమైన నీటితో నిండుగా ఉన్నాయి. కొలనులు, విరబూసిన ఎర్రకలువలతో, అప్పుడప్పుడే వికసిస్తున్న తామరపూలతో, తెల్లకలువలతోనూ, కొంగలు, జక్కవలు, రాజహంసలు, బెగ్గురులు, కణుజు పిట్టల కిలకిల నాదాలతో ఆహ్లాదింపచేస్తున్నాయి.

ఇంకా ముచ్చటగొల్పే రకరకాల వస్తువులతో నిండుగా ఉన్నట్టి, స్త్రీ పరిజనంతో కూడు కున్నట్టిది, పుష్కలత్వంలో అమిత ప్రీతిదాయకంగా ఒప్పి ఉన్నట్టిది, అయిన తన తండ్రి మందిరాన్ని సంతోషంగా స్వర్గంలో ప్రవేశించే దేవేంద్రుడి వలె ధ్రువుడు తన తండ్రి యింట ప్రవేశించాడు.

ధ్రువుడు అపరదేవేంద్రుడిలా జనకుని గృహంలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత రాజర్షియగు ఆ ఉత్తానపాదుడు కుమారుడి అద్భుతమైన మహిమను చెవులారా విన్నాడు. కళ్లారా చూచాడు. మనసులో ఎంతో విస్తుపోయాడు. ధ్రువుడికి ప్రజలపైగల మమకారం, ప్రజలకు ధ్రువుడిపట్ల అభిమానం, యువక ప్రాయం పూర్తిగా నిండినవాడునూ అయిన ధ్రువునికి యౌవరాజ్య పట్టాభిషేకం చేశాడు. వయస్సుపై బడ్డట్టుగా తనను తానే గమనించుకొని, ఆత్మ తత్త్వాన్ని తెలుసుకోవాలను కున్నాడు. విరాగియై అడవుల్లోకి వెళ్లిపోయాడు. ఆ తరువాత ఆ ధ్రువుడు శింశుమార ప్రజాపతి కూతురు 'భ్రమి'ని వివాహమాడాడు. ఆమెవల్ల కల్పుడు, వత్సరుడనే ఇద్దరు పుత్రుల్ని కన్నాడు. ఇంకా వాయుపుత్రిక అయిన 'ఇల' వల్ల 'ఉత్కలుడు' అనే పేరుగల కొడుకును, మిక్కిలి సాగసుగల కన్యకను పొందాడు. ఆ లోపల అవివాహితుడిగా ఉన్న తన సోదరుడు ఉత్తముడు వేటకై అడవికి వెళ్లి హిమవత్పర్వతం మీద ఒక యక్షునిచే చంపబడ్డాడు. ఆతడి తల్లికూడా ఆ కడుపుశోకంతో వనంలోకి వెళ్లి ఆ అడవిమంటల్లో చిక్కుకుని చనిపోయింది. ధ్రువుడు సోదరుడి చావువార్త విని రోషపడి ఓర్మిలేనివాడై ఆ దుఃఖంతో కలవరపడి పోయాడు. జైత్రం అనే రథం ఎక్కి ఉత్తరం వైపుకి వెళ్లాడు. హిమవత్పర్వత సానువుల్లోని అలకాపట్టణాన్ని చూశాడు. ఈ పట్టణం భూతగణాలతో కొలువబడుతుంది. యక్షులతో పరివ్యాప్తమై ఉంది. గొప్ప భుజ బలంగల ఆ ధ్రువుడు.

ధ్రువుండు కుబేరానుచరులైన గుహ్యకులతో యుద్ధము సేయుట

Narasimha Dwadashi - నరసింహ ద్వాదశి

నరసింహ ద్వాదశి

నరసింహ ద్వాదశి (ఫాల్గుణ శుక్ల ద్వాదశి) విష్ణుమూర్తి యొక్క నరసింహ అవతారాన్ని పూజించే అత్యంత పవిత్రమైన రోజు.

నరసింహ ద్వాదశిని గోవింద ద్వాదశి అని కూడా పిలుస్తారు.

పురాణం:
పురాణాల ప్రకారం, ఒకప్పుడు అసుర రాజు హిరణ్యకశ్యపుడు తన సోదరుడి మరణానికి కారణమైన విష్ణువుపై ప్రతీకారం తీర్చుకోవాలని బ్రహ్మా గూర్చి ఘోరతపస్సు చేసాడు. బ్రహ్మ నుండి వరం పొంది, వరగర్వంతో విర్రవీగుతున్న తరుణంలో తనకుమారుడే ఆ శ్రీమహావిష్ణువు పరామభక్తుడని తెలిసి క్రోధం చెంది అతన్ని చంపడానికి చాలాసార్లు ప్రయత్నించాడు కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. తదుపరి ఒకనాడు హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడిని విష్ణువు ఉనికికి కోరగా, హరి అంతటా తానై వున్నాడు అని ప్రహ్లాదుడు పలుకగా, 
హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడిని విష్ణువుని ఈ స్తంభంలో చూపించు అని కోపంగా హిరణ్యకశ్యపుడు తన గదను స్తంభానికి కొట్టగా అంత  నరసింహుడి ఉగ్ర రూపంలో విష్ణువు స్తంభం నుండి ప్రత్యక్షమై హిరణ్యకశ్యపుని చంపాడు.

ప్రహ్లాదుడు తన శత్రువుపై సాధించిన విజయాన్ని చెడుపై మంచి విజయంగా భావిస్తారు. విష్ణువు పట్ల అతని భక్తి అతని ప్రాణాలను కాపాడింది. అందుకే, నరసింహ అవతారాన్ని భక్తులు పూజిస్తారు.

ఇది హిరణ్యకశిపుని సంహరించి, భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించిన సంకేతంగా, దుష్టశిక్షణ-శిష్టరక్షణకు ప్రతీకగా జరుపుకుంటారు.

ఈ రోజున ఉపవాసం, నరసింహ స్వామి పూజ, మరియు మంత్ర పారాయణం చేయడం వల్ల భయం, వ్యాధులు తొలగిపోయి, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.

నరసింహ మహా మృత్యుంజయ మంత్రం
ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖమ్‌ 
నృసింహం భీషణం భద్రం మృత్యోర్‌ మృత్యుం నమామ్యహం 

నరసింహ స్తోత్రం 
జ్వలత్ కరాళ జిహ్విక ధగత్ కఠోర ధంష్ట్రికా 
ప్రగీత దిగ్వి దిక్పట ప్రచండ అగ్ని కీలక 
నఖ సహస్ర శత సహస్ర కోటి కోటి కేసర 
ప్రభాసమాన భద్ర నారసింహతే నమో నమః 

పూజా విధానం:
ఉదయాన్నే స్నానం ఆచరించి, నరసింహ స్వామిని భక్తిగా పూజించి ఉపవాసం (నిర్జల లేదా ఫలాహారం) ఉండటం వల్ల విశేష ఫలితాలు ఉంటాయి. 

ఉపవాసం అనగా స్వామికి దగ్గరగా వాసం చేయడం అంటే నిరంతరం స్వామి నామం జపిస్తూ, భక్తిగా దీక్షగా స్వామిని జపించడం. 

ఈ రోజున నరసింహ స్వామిని పూజించడం వల్ల దుష్టశక్తుల నుండి రక్షణ, కుటుంబంలో ఆనందం మరియు శ్రేయస్సు కలుగుతుందని విశ్వాసం.

నరసింహ స్వామిని 12 పేర్లతో (నరసింహ ద్వాదశ నామ స్తోత్రం) పూజించడం చాలా ప్రసిద్ధి.

శ్రీ నృసింహ ద్వాదశనామావళిః

Sri Narasimha Dwadasa Namavali - శ్రీ నృసింహ ద్వాదశనామావళిః

శ్రీ నృసింహ ద్వాదశనామావళిః

1. ఓం మహాజ్వాలాయ నమః
2. ఓం ఉగ్రకేసరీ నమః
3. ఓం వజ్రదంష్ట్రాయ నమః
4. ఓం విశారదాయ నమః
5. ఓం నారసింహాయ నమః
6. ఓం కశ్యపమర్దనాయ నమః
7. ఓం యాతుహన్తాయ నమః
8. ఓం దేవవల్లభాయ నమః
9. ఓం ప్రహ్లాద వరదాయ నమః
10. ఓం అనంత హస్తాయ నమః
11. ఓం మహారుద్రాయ నమః
12. ఓం దారుణాయ నమః


శ్రీ నరసింహ కవచం




దశావతారస్తుతి

నిత్య స్తోత్రావళి

పంచాంగం

Sri Narasimha Dwadasa Nama Stotram - శ్రీ నృసింహ ద్వాదశ నామ స్తోత్రం

శ్రీ నృసింహ ద్వాదశ నామ స్తోత్రం


ప్రథమంతు మహాజ్వాలో ద్వితీయం తు ఉగ్రకేసరీ ।
తృతీయం తు వజ్రదంష్ట్రశ్చ చతుర్థం తు విశారదః ॥ 01 


పంచమం నారసింహశ్చ షష్ఠః కశ్యపమర్దనః ।
సప్తమో యాతుహంతా చ అష్టమో దేవవల్లభః ॥ 02 


నవమం ప్రహ్లాద వరదో దశమోऽనంత హస్తకః ।
ఏకాదశో మహారుద్రో ద్వాదశో దారుణస్తదా ॥ 03 


ద్వాదశైతాని నామాని నృసింహస్య మహాత్మనః ।
మంత్రరాజ ఇతి జ్ఞాతం సర్వపాప వినాశనమ్ ॥ 05 


క్షయాపస్మార కుష్ఠాది తాపజ్వర నివారణం ।
రాజద్వారే మహాఘోరే సంగ్రామే చ జలాంతరే ॥ 06 


గిరిగహ్వర అరణ్యే వ్యాఘ్ర చోరామయాదిషు ।
రణేచ మరణేచైవ శమదం పరమం శుభమ్ ॥ 07 


శతమావర్తయేద్యస్తు ముచ్యతే వ్యాధి బంధనాత్ ।
ఆవర్తయత్ సహస్రం తు లభతే వాంఛితం ఫలమ్ ॥ 08 


॥ ఓం శ్రీ లక్ష్మి నృసింహాయ నమః 

Pleased by Dhruva devotion, Vishnu appeared and Dhruva Praised Lord Vishnu - సాక్షాత్కరించిన భగవంతుని ధ్రువుండు స్తుతించుట

సాక్షాత్కరించిన భగవంతుని ధ్రువుండు స్తుతించుట

ఆ సర్వవ్యాపకమైన ఆ దైవస్వరూపాన్ని కళ్లారా జుర్రుకుంటున్నట్లుగా, ముఖంతో ముద్దు పెట్టుకుంటున్నట్టుగా భావించుకుంటూ మొక్కాడు. చేతులతో కౌగలించుకుంటున్నట్టుగా అనుభూతి పొందుతూ సాగిలపడ్డాడు.

ఇలా అనుభవిస్తూ సాగిలబడి నమస్కరించాడు. రెండు చేతులు జోడించి కీర్తించడానికి సంకల్పించాడు. వర్ణించడానికి ధ్రువుడి చేత కాలేదు. సర్వాంతర్యామి విష్ణువు ధ్రువుడి ఇంగితాన్ని గమనించాడు. వేదాత్మకమైన తన శంఖంతో ధ్రువుడి బుగ్గలను నిమిరాడు. ఆ స్పర్శతో ధ్రువుడికి జీవాత్మ పరమాత్మల వేరుపాటును చక్కగా పసికట్టగల జ్ఞానం కల్గింది. ధ్రువుడు భక్తియందు శ్రద్ధాళువు అయ్యాడు. సమస్తభువన ప్రఖ్యాతుడగు నారాయణుని మహత్తరమహిమచే చెప్పబడ్డవై ధ్రువుడి వేదమయ వాక్కులుగా వెలువడుతున్నాయి. ఆ విష్ణువును ఆ తన మాటల్లో ఇలా స్తుతించాడు. ఓ దైవమా! అనంతశక్తి సమన్వితుడవు, సర్వాంతర్యామివి ఐన నువ్వు, నాలో సంలీనమై ఉన్ననా మాటలకూ, నా శ్వాసకూ, చేతులు, కాళ్లు, చెవులు, చర్మం మొదలైన ఇంద్రియాలకూ, నీ చైతన్యసామర్థ్యంచే దయ చూపిన దైవమవు, పరమాత్మవు అయిన నీకు నమస్కరిస్తున్నాను. అనన్యుడవయిన నువ్వు మహత్తు మొదలైనవి ప్రధానంగా కల ఈ సకల చరాచర ప్రపంచాన్ని మాయ పేరిట నీ స్వతంత్రమైన ఇచ్చతో సృజించావు. ఆ మాయామయ ప్రపంచంలో త్వగాది ఇంద్రియ రూపాల్లో చొచ్చి ఉన్నావు. ఆ యా దేవతల స్వరూపాల్లో అన్నిరకాల కట్టెల్లో దాగి ఉండే నిప్పువలె బహు ప్రకారంగా కనిపిస్తుంటావు.

(ప్రాణేంద్రియములు

1. ప్రాణములు. ఇవి ఐదు. 1.ప్రాణము, 2.అపానము, 3.వ్యానము, 4.ఉదానము, 5.సమానము

2. ఇంద్రియములు - ఇవి కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు - రెండు రకాలు.

కర్మేంద్రియములు ; వాక్కు, పాణి, పాదము, పాయువు, ఉపస్థ.

జ్ఞానేంద్రియములు : త్వక్కు, చక్షువు, శ్రోత్రము, జిహ్వ, ఘ్రాణము.)

దీనబాంధవా! నిద్రనుంచి లేచినవాడు మళ్లీ ప్రపంచాన్ని చూసినట్లు బ్రహ్మదేవుడు నిన్ను శరణుపొంది నీవు ప్రసాదించిన జ్ఞానం చేత ఈ సమస్త ప్రపంచాన్ని సందర్శించాడు. మోక్షం కోరేవాడికి శరణాలయిన నీ పాదాలను ఉపకారం మరువని సజ్జనుడు ఎలా మరచిపోతాడు? (మరచిపోడు)

మహాత్మా! నువ్వు చావుపుట్టుకల విముక్తికి నిమిత్తుడవు. అనన్యమైన కల్పవృక్షం వంటివాడవు. భక్తులు ఎవ్వరైనా తాము కోరినదాని కోసం ప్రయత్నించే వాళ్లు నీ మాయకు లోనవుతారు. చతుర్విధ పురుషార్థాల భోగాలకోసం తమను తాము అప్పగించుకుంటారు. అది త్రిగుణమయమైన శారీరక సుఖాలకోసంగా మనస్సున సంకల్పించుకుంటారు. సంసార తాపాన్ని పాపే గుణకథన మాధుర్యం గలవాడా! ఈశా! మాధవుడా! ముకుందా! అలాంటివాళ్లకు ఇంద్రియార్థాల వల్ల కల్గే సౌఖ్యం నరకంలోనూ వర్తిల్లుతుంది.

పద్మనాభా! సాధుజనావన! నీ చరణాలను స్మరించడంవల్లా, మిక్కిలి ప్రేమతో అలరింపచేసే నీ గాథలను వినడంవల్లా, సమకూడిన ఆనందాన్ని తననే ఆహ్లాదింపచేసే బ్రహ్మానందంలోనూ లేవట. యముడి కాలదండంచే భగ్నమై విరిగిపడే విమానాలనుంచి ఎడం లేకుండా నేలకూలే ఆ దివ్యుల గూర్చి ఇక చెప్పుకునేది ఏమి ఉంటుంది.

(దానధర్మాది పుణ్యకార్యాల వల్ల స్వర్గానికి వెళ్లిన వారు తిరిగి భూలోకానికి వస్తారు. కాని మోక్షం కోసం ప్రయత్నించి వెళ్లినవారు భూలోకానికి తిరిగిరారు. స్వర్గానికి మోక్షానికి ఇది భేదం.)

ఓ వెన్నుడ! నీ ఆరాధన విధానంలో నియమంతో మనస్సు పెట్టే వాళ్లయొక్క నీదు మూర్తిపైనే దృష్టిపెట్టిన భక్తవరుల యొక్క సహవాసాన్ని నాకు సమకూర్చు. ఆ సజ్జన సాంగత్యంచేత రుచికరమైన నీ కథామృతపానంచేత ఉన్మత్తుడనవుతాను. ఆ పారవశ్యంతో దాటశక్యంకాని కష్టాల కడలిని సులభతమంగా దాటేస్తాను.

ఓ సర్వాంతర్యామీ! లక్ష్మీవల్లభా! ముక్తిదాయకా! హరీ! ఎప్పుడూ నీ పాదపద్మాల సేవా పరిమళంలో మునిగి తేలే మనస్సు కలవాళ్లు ఎంతో ప్రియమైన తమ శరీరం నశ్వరత్వాన్ని గ్రహిస్తారు. అలాంటి వాళ్లు తమ భార్యల్ని, బిడ్డల్ని మిత్రుల్ని ఇంటిని, బంధువుల బలగాన్ని మరచిపోతారు.

శుద్ధ స్వరూపుడా! పరమాత్మా! భవభయాన్ని దూరంగా తోసేవాడా! పరమముని కీర్తనీయా! అంతంలేని భాగ్యంకలవాడా! పద్మదళనయనా! లక్ష్మీనాథా! నీ స్థూలమైన విశ్వరూపం మానవులు, దేవతలు, పశువులు, జంతువులు, రాక్షసులు, పాములు, పక్షులు మొదలైన పెక్కు ప్రాణి కోటితో నిండి ఉంటుంది. ప్రకృతి, పురుషుడు వంటి సత్‌, అసత్‌ భేదాలు కలది. మహత్తత్త్వాదులకి హేతువైనట్టిది అని నాకు తెలుసును. కాని నిత్యం క్షేమదాయకం అయినదీ, ఎపుడూ ఐశ్వర్యరూపంతో ఉండేదీ, అనేక శబ్దాదుల వ్యవహారం లేనిదీ అయిన మిగిలిన బ్రహ్మరూపం గూర్చి నాకు ఏమీ తెలియదు.

యుగాంతవేళ ఈ బ్రహ్మాండాన్ని నీలో కలుపుకొని శేషుణ్ణి తోడుగా చేసుకొని ఆ శేషతల్పం పైననే పరుంటావు. యోగనిద్రాసక్తిలో ఉంటావు. బొడ్డు అనే నదిలో పుట్టిన బంగరు పద్మం దుద్దునుంచి బ్రహ్మను ఒద్దికగా పుట్టిస్తావు. ఆ పద్మం తేజస్సును బయలుపరచే బ్రహ్మ స్వరూపంలో నువ్వే ఉంటావు. ఓ శుభప్రవర్తనుడా! పద్మదళనయనుడా! నిత్య భద్రకరరూపా! అక్షీణ ఆనందరూపా! గోవిందా! నారాయణా! ముక్తిదాయకా! అట్టి నీకు నియమవంతుడనై మొక్కుతాను.

అలా యోగనిద్రలో మునిగి ఉన్నప్పటికిన్నీ జీవులకంటే వేరైన వాడవే. ఆ విలక్షణం అయిన మతిస్థితి విశేషంవల్ల మొక్కవోని స్వశక్తికలవాడవు. ఆ సామర్థ్యంచే విశ్వపాలనంకోసం యజ్ఞాధిష్ఠాతవు అయ్యావు. నువ్వు నిత్య విమోచనుడివి, నిత్యపావనుడవు, సర్వం తెలిసినవాడవు, సర్వానికి ఆత్మరూపుడవు, స్తిమితపరుడువు, మూలపురుషుడవు, ఐశ్వర్యం, ధర్మం, కీర్తి, ధనం, తెలివి, వైరాగ్యాది లక్షణాలుగల భగవానుడవు. త్రిగుణాధిపతివై వర్తిస్తుంటావు. నిర్భాగ్యుడైన జీవుడిలో ఈ గుణాలకు తావుండదు. పరస్పర విరుద్దాలైన పలుసామర్థ్యాల యొక్క కలయిక గల సర్వేశ్వరుడవు. దాంట్లో అవిద్యాదుల వరుసలు లయమవుతూ ఉంటాయి. అలాంటి సర్వవ్యాపక కారకమూ, అద్వితీయమూ, అనంతమూ, మూలభూతమూ, ఆనందమయమూ, నిర్వికారమూ అయిన పరబ్రహ్మ స్వరూపుడవు నీవు. నీకు నమస్మారం. ఓ దేవా! నిష్కాములైన వారు నిన్నే సర్వతోముఖఫలంగా భావిస్తారు. వారికి రాజ్యం మొదలయిన వాంఛలలో పరమార్థమైన ఫలం సర్వాంతర్యామివైన నీ పవిత్రపాదసేవనమే, ఇది నిశ్చయం. కాని గోవు లేగదూడను నిత్యం చనుబాలుకుడిపి, తోడేళ్లవంటి వన్యమృగాల బారినుంచి గోవును కాపాడినట్లు నీవు కాముకులైన దుఃఖితుల కోరికలు తీరుస్తుంటావు. భవభీతినుంచి వాళ్లను దూరం చేస్తుంటావు. ఇలా యథార్థసంకల్పుడు, సద్వివేకి అయిన ధ్రువుడు ఆ దేవదేవుని ప్రస్తుతించాడు. భక్తుల పై వాత్సల్యం కురిపించే ఆ భగవంతుడు ఆ స్తుతుల తనివితో ఇలా మాటిచ్చాడు.

నిశ్చితమైన నియమం పట్టినవాడా! ఓ క్షత్రియ పుత్రకా! నీ మనస్సులో అట్టిట్టాడే సంకల్పం ఏమిటో నేను పసికట్టాను. నిజానికి అది నెరవేర్చరానిదే అయినా తప్పక నెరవేరుస్తాను.

ఆ దుర్లభం ఎట్టాంటిదో విను. కేంద్రస్థానమైనగుంజ చుట్టూ తిరుగుతుండే ఎద్దు వలె గ్రహాలూ నక్షత్రాలూ తారలగుంపులూ అనే కాంతిమండలం, చుక్కలరూపు పొందిన ధర్ముడు, అగ్ని కశ్యపుడు, శక్రుడు, సప్తర్షులు ఏడుగురూ తారకలను కలుపుకుని ఒక ధ్రువకేంద్రం చుట్టువార తిరుగుతూనే ఉంటారు. ఆ భాగం మరొకరు చేరరానిది. పొందరానిది ముల్లోకాల ముంపులోనూ చెక్కు చెదరనిది, మహాకాంతిమంతమైంది 'ధ్రువక్షితి' అనే స్థానం. ఇక రాబోయే 6000 ల ఏళ్లు గడిచాక ఈ చోటును నువ్వు పొందుతావు. ఆ పదం ప్రాప్తించే లోపు నీ తండ్రి వానప్రస్థానికి వెళ్తాడు. ఆ రాజ్యాన్ని నువ్వు న్యాయవంతంగా ఆదరణీయంగా ఇంద్రియాలకు లోను గానివాడవై పరిపాలిస్తావు. నీ తమ్ముడు వేట వ్యసనంవల్ల అరణ్యంలోకి పోయి మరణిస్తాడు. అతణ్జి వెతుకులాడుతూ అతని మీదే ప్రాణం పెట్టుకుని బ్రతుకుతున్న ఆతని తల్లి ఆ అడవుల్లోకి పోయి కార్చిచ్చుల్లో చిక్కుకొని నాశమవుతుంది. అదియునుగాక,

(మూలగ్రంథాల్లో 26 వేలనియూ 36 వేల సంవత్సరాలు ధ్రువుడు రాజ్యపాలనం చేశాడని ఉంది.)

పుణ్యశీలీ! ఆ తర్వాత నువ్వు యజ్ఞశరీరధారినైన నన్ను విరివిగా దక్షిణలిచ్చే ఎన్నోయాగాలచేత యజిస్తావు. నిజమైన ప్రాపంచిక సౌఖ్యాలన్నిటిని అనుభవిస్తావు. చివరిక్షణాల్లో నన్నే మనస్సున స్మరించుకుంటావు. సమస్తజనులు చేతులెత్తి మోకరిల్లేది, ఇహలోకంలోకి మళ్లి తిరిగి రాలేనిది, ఋషిమండలంకంటే పైన ఎత్తున ఉన్న ఆ పరంధామాన్ని తగిన సమయంలో చేరుకోగలవు అని ఆ విష్ణుమూర్తి ధ్రువుడు కోరిన కోరికలను తీర్చాడు. అలా ఆ ధ్రువుడి కళ్ల ముందే గరుడ వాహనం ఎక్కి సంతోషంగా తన వైకుంఠపురికి తరలి వెళ్తాడు.

ఓ విదుర! విశిష్టచరిత! ఆ ధ్రువుడుకూడా ఆ విష్ణుపాదకమలాల మీది భక్తివల్ల ఉత్తమవరాలు అందుకున్నప్పటికీ మానసిక సంతృప్తిలేకనే తిరిగి వెల్లిపోయాడు.

ఇలా మైత్రేయముని ధ్రువుడు భక్తి యోగమార్గాన విష్ణువుచే ధన్యుడైన వృత్తాంతం అంతా పూసగుచ్చినట్టు మొదటి నుంచి చివరిదాకా విదురుడికి వినిపించాడు. అది విన్న విదురుడు అతి వినమ్రంగా మైత్రేయుణ్ణి గూర్చి ఇలా పలికాడు.

మునిశ్రేష్టా! విను. కాముకులు పొందలేనిది, విష్ణుపాదసేవకులైన మునులు మాత్రమే చేరకల్గింది అని చెప్పుకునే ఆ నారాయణుని ధామాన్ని ఎన్నో పుట్టుక లెత్తితేగాని పొందరాని ఆ విష్ణుపదాన్ని ధ్రువుడు ఒకే ఒక జన్మలోనే పొందాడు. ఆ ధ్రువుడు పురుషార్థం తెలిసినవాడు. అయినా కోరిక తీరలేదని ఎందుకు అనుకున్నాడు? అనగానే మైత్రేయుడిలా సమాధానం పలికాడు.

పుణ్యుడా! పినతల్లి తనను ఉద్దేశించి పలికిన పారుష్యపు మాటలు అనే అమ్ములు గుచ్చుకున్న మనస్సు కలవాడై వాటినే స్మరించు కోవడంచేత, 'మోక్షాన్ని కోరుకోలేక పోయాననే చింత'ను మనస్సున పెట్టుకున్నాడు.

అంత ఆ ధ్రువుడు ఇలా చింతించాడు. 'ఇంద్రియ నిగ్రహులు, మహామహిములు అయిన సనందాది మునులు అడ్డులేని భక్తితో ఏ చోటనైనా ఏ కాలంలో అయినా ఏ జన్మలోనైనా కొంతకొంతగా సంతరించి పెట్టుకున్న సమాధి యోగంవల్ల ఎవ్వరి పాదపద్మాల గురించి తెలుసు కోగల్గుతారో అలాంటి పరమేశుని, సర్వేశుని, నిర్వికారుని, అపరిమితుని, అజేయుని, ఆదిదేవుని,

నేను ఆరు మాసాలు మాత్రమే సేవించి మహాయోగసాధనతో ఆ హరి పాదపద్మాల నీడను ఆశ్రయించగలిగాను. అయినా అన్యదృష్టితోనే ఉన్నాను. అయ్యో! ఇలాంటి దురదృష్టవంతుణ్ణి నేను. భవబంధాలను తెగ్గొట్టే ఆ నారాయణుని కన్నారా చూచి అశాశ్వతమైన వరా లడిగాను. ఇలాంటి దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా? తమ తమ ఉనికి పట్టుకంటే ఉచ్చదశకు చేరుకుంటా ననే అక్కసుతో దేవతలు నా బుద్దిని వ్యాకులపరిచారేమో! ఆనాటి నారదముని వాక్కులన్నీ యథార్థ మయ్యాయి. ఆ ముని మాటలు పెడచెవిన పెట్టిన నేను నీచుణ్జి. స్వాప్నికావస్థానుభూతిలో ఉన్నవాడు, దైవికమైన మాయచేత అన్యదృష్టిని పోయేవిధంగా నేనూ అపరభావం లేదని తెలిసీ అన్నదమ్ముడనే విరోధిత్వంతో వ్యథపొందాను, లోకస్వరూపుడూ, సుప్రసాదుడూ, సంసారతాపం తొలగించేవాడూ, అయిన ఈశ్వరుని కొలిచి ఆ దేవుడిదయను కూడ పొందగలిగాను. ఆయుర్ధాయం మూడిన రోగి చికిత్సను వలె ఎందుకూ పనికిమాలిన, అస్థిరమైన వరాలడిగాను అని మైత్రేయుడు చెప్పి మళ్లీ

(భేద దర్శనుడనయి : ధ్రువుడు - సవతి తల్లిమీది కోపంతో తపస్సుచేశాడు. తాను వేరు తల్లి వేరు - అనే భేదజ్ఞానం తొలగిపోలేదు. తనయందు సకలభూతములందు - ఒక భంగి అనే సమహితత్వం - ధ్రువునిలో రాలేదు. అందుకు తగ్గట్లే వరం లభించింది. అదీ ధ్రువుని బెంగ.)

మహారాజును ఆశ్రయించిన నిరుపేద మితిమీరిన అహంతో ధాన్యం గింజల్ని దానం చెయ్యమని కోరినట్లుంది నా స్థితి. మోక్షఫలాన్ని ప్రతిఫలంగా ఇవ్వగల ఆ విష్ణువే తనివితీరా ప్రత్యక్షమయ్యాడు. కాగా ఆ దేవుణ్ణి ప్రాపించికమైన కోరికలు ప్రసాదించమని వేడాను. నా వంటి వట్టి తెలివి తక్కువ దద్దమ్మ ఎవరైనా ఈ మట్టిమీద పుట్టి ఉంటారా? ఉండరని భావం.

ధ్రువుండు మరల దన పురంబునకు వచ్చుట

Sage Narada instructed the five-year-old Prince Dhruva to chant the twelve-syllabled Vishnu mantra: "Om Namo Bhagavate Vasudevaya" - ధ్రువు౦డు నారదోపదేశంబు వడసి తపంబు సేయుట

ధ్రువు౦డు నారదోపదేశంబు వడసి తపంబు సేయుట

స్వధర్మాన్ని వెల్లడింపచేసే తదేకమైన మతితో ఆ దేవుణ్ణి పూజించుకో, ఆ ఘనుడైన విష్ణుమూర్తి కన్న నీ చింతను తీర్చేవారు మరెవ్వరూ ఉండబోరు అని సునీతి తేల్చి చెప్పింది. ఆ తల్లి మాటలు నచ్చాయి. అవి ప్రయోజనవంతమైన కార్య సాఫల్యానికి మూలకారణా లన్పించాయి. తనను తానే కట్టడి చేసుకున్నాడు. పట్టణం దాటిపోయి వెళ్తున్నట్టి సమయంలో నారదుడికి ఈ విషయం మూలముట్టుగా తెలియవచ్చింది. ధ్రువుడి దగ్గరకు చేరుకున్నాడు. ఆ ధ్రువుడి అభిలషిత కర్తవ్యాన్ని అర్ధం చేసుకున్నాడు. పవిత్రమైన తన చేత్తో ధ్రువుడి తలను నిమిరాడు. అహో! తమ ఆత్మగౌరవ విఘాతాన్ని తట్టుకోలేని క్షత్రియుల తేజం చిత్రం కదా! ఈ చిఱుతవయస్సులో చిన్నతల్లి పరుషమైన మాటలకు బెంగ పెట్టుకొని ఇలా వెళ్లి పోతున్నట్లున్నాడనే భావం చాల చిత్రంగా అన్పించింది. ఓ బుడుతడా! సర్వ భోగభాగ్యాలతో నింపుగల ఇంటిని కాదని ఇలా ఏకాకిగా ఎక్కడికని పోతావు. నీకు కావాల్సిన వాళ్లు చేసిన నిరాకరణం నిన్ను బాగా దిగాలు పరచిందని నా కన్పిస్తుంది. అనగానే ధ్రువుడు ఇలా పలికాడు. సవతితల్లి పలుకులనే ములుకుల తాకిడి గాయాన్ని 'దైవధ్యానయోగం' అనే తృప్తికరమైన మందుతో మాన్పుకుంటాను అన్నాడు. ఆ వాక్కులు విన్న నారదుడు ఆ ధ్రువుడితో ఇలా అనునయంగా చెప్పాడు.

ఓ తండ్రీ! విను. నువ్వు చిఱుతడివి. ఎపుడూ ఆటలమీది అపేక్షతో మనసారా తిరుగుతూ కాలంగడిపే కుర్రవయస్సు నీది. అవమర్యాద, మర్యాదలు పట్టని చిన్నతనం నీది.

అవమానం, మానం గూర్చిన విభేదజ్ఞానం నీకీ చిన్నవయస్సులో ఉండినా ఉండవచ్చు. అయినా సుఖజీవులకు ఆ మంచిచెడు విడమరచి చెప్పే నేర్చు వారివారి పూర్వకర్మానుసారంగా తట్టుతూ ఉంటుంది. అందువల్ల ఎక్కువ సుఖాలు గాని, ఎక్కువ దుఃఖాలుగాని అవిచ్చిన్నంగా పొందుతుంటారు.

కాన వివేకి తనకు దక్కిన సుఖదుఃఖాలు ఈశ్వరాధీనం అనుకుంటాడు. ప్రాప్యమైనంతలో సంతుష్టుడవుతుంటాడు. "నీవుకూడా నీ తల్లి చెప్పినట్టి ధ్యాన యోగశాస్త్ర పద్ధతితో ప్రవర్తించి ఆ జగన్నాథుని దయను సంపాదిస్తాను" అని అంటావనుకో.

నిష్కల్మషుడా! మహా మహా యోగీశ్వరులంతా తెంపులేని భూలోకజన్మల్లో సంసారం పట్టక సదా మనన మతితోనే ఉంటారు. ధర్మబద్ధంగా శ్రద్దాళువులై యోగసాధన చెస్తారు. నిశ్చలసమాధి యోగస్థితిలోనూ ఆ దైవం తెరవును ఆ యోగులు కనుక్కో లేకున్నారు. అందువల్ల నీకు కేవలం ఆరాధన మాత్రాన ఆ దైవం శక్యుడు గాడు. ఈ అదనులో వృథా అయిపోయే ఆ యోగవిద్యాభ్యాసప్రయత్నాన్ని విరమించు. అలా కాదు ముముక్షువును కాదలచాను అంటే ఆ పూనిక పట్టు. కావడికుండలవంటి సుఖదుఃఖాలు రెంటిలో ఏది ఎంత విధివిహితంగా సంప్రాప్తిస్తుందో అంతే ఆత్మసంతృప్తితో ఈ విశ్వంలో మనగల్గినవాడు నిజమైన విజ్ఞానిగా పేరుపొందుతాడు.

ఆ విజ్ఞాని ఇంకా సద్గుణవంతుణ్లి చూసి మురియాలి. గుణవంతుడివలె నటించేవాళ్లమీద దయతలవాలి. సరిసాటి వారితో చేతులు కలపాలి. ఇలా ఉంటుండేవాడు ఆధ్యాత్మికాది కష్టాలు మూటినీ, విడనాడ గల్గుతాడు అని నారదుడు తెలియచెప్పాడు. అది విని ధ్రువుడు ఇలా అన్నాడు. ఓ పావనుడ! ఈ మెతకస్వభావం సుఖదుఃఖ పీడిత మనస్కులకు పొంద వీలుకానిదని అపారదయామయుడవైన నీనోట విన్నాను. అలాంటపుడు శత్రువులకు దడపుట్టించే రాచగుణం నాది. వినమ్రత లేక పోవడం సహజం. అలాంటి నేను సురుచి దురుసు మాటల బాణాల పెట్టువల్ల పగిలిన గుండె కలవాడను. అందువల్ల నా ఎదలో శాంతిపాఠం నిలకడగా పట్టి ఉండదు. కాన మూడులోకాల్లోకి మేల్తరమైంది, మరొకరిది కానిది, వాసయోగ్యమైనది అయిన చోటును పొందాలని ఆశపడుతున్నాను. నా కొక మంచి దోవనుచూపు. నువ్వు పరదైవం అయిన బ్రహ్మ తొడనుంచి పుట్టినవాడవు. వీణావాదనంలో బహు నేర్పరివి. ఈ లోకం శ్రేయస్సు కోసరమే సర్వం సంచరిస్తుండే అపరసూర్యుడివి అనగానే విని

నారదుడు ధ్రువుడితో మళ్లీ ఇలా అన్నాడు. ఓ పుణ్యుడ! ఓ బిడ్డ! విను. నిన్ను ఇపుడు ముక్తి పథానికి ప్రేరేపించినవాడు. ధీరోత్తములలో ముఖ్యుడైన వాసుదేవుడే

నువ్వన్నూ ఆ కీర్తిమంతుణ్ణి తెరపి ఇవ్వని తదేకమైన ధ్యానం వైపుకే మొగ్గు చూపే మనస్సుతో ఆరాధించు.

'కావాలని మనుజుడు ధర్మార్ధ కామమోక్షాలవల్ల కలిగే మంచిని నేనూ లోపల పొందాలి అని కోరుకుంటే ఆ శ్రేయస్సిద్ధికి మూలం విష్ణుపాద పద్మసేవనం తప్ప మరొక దారి కానరాదు.

గుణమనోహరా! శ్రేష్ఠయిన యమునానది ఒడ్డున మధువనం ఉంది. అది అతి పవిత్రమైంది. పుణ్యప్రదమైంది. ప్రసిద్ధమైంది. ఈ క్షేత్రం విష్ణు సన్నిధికలది. అక్కడకు వెళ్లు. నీకు శుభం కల్గుతుంది.

శుభ్రమైన ఆ యమునానది జలాల్లో మునుకలు వేసి, ఆ క్షేత్రంలోని నారాయణమూర్తికి అత్యంత శ్రద్ధతో మొక్కుకో. సంసిద్ధమైన తలంపుతో యమనియమాలను ఆచరించు.

ఇంకా నువ్వు పసివాడవు. వేదం వల్లించడం వంటి తదుచిత కర్మలకు తగని వయస్సువాడవు. అయినా కూడా నీకు యుక్తంగా ఉండే కుశలు, జింక చర్మాలను స్వస్తికం మొదలైన యోగాసనాలను ఏర్పరచుకో. తడవకు మూటి చొప్పున మూడు తడవులు ప్రాణాయామం చెయ్యి. ప్రాణం, ఇంద్రియం, మనస్సు వీటిలోని దోషాల్ని నిలుకడ లేని మనస్సువల్ల దొర్లే పొరపాట్లను తుడిపేసుకో, దిట్టపడ్డ హృదయంతో.

తన రక్షణను అర్జించి వచ్చిన వాళ్లకు మంచి దయను చూపడానికి సంసిద్ధమై ఉండేవాడు, ప్రకాశవంతమైన ముఖం, నిర్మలమైన చూపులూ కలవాడూ, కోటేరులాంటి ముక్కు వంపుదీరిన రెండు కనుబొమలు, పాలుగారే బుగ్గలూ కలవాడు, వంకలులేని చక్కనైనవాడు, ఇంద్రనీలంపు సొంపులు ఒలికే ఒంటితీరు కలవాడు, మిసమిసలాడే ప్రాయం కలవాడు, ఎర్రని కన్నులూ, పెదవులూ కలవాడు, కరుణకుకడలి వంటివాడు, ధర్మార్థకామమోక్షాలకు ఆశ్రయుడు, భక్తులకు ఆశ్రయమైనవాడు అందరి బాగు కోరేవాడు, శ్రీవత్సమనే పుట్టుమచ్చతో ఎంచబడేవాడు, యావన్మందికీ దిక్కయినవాడు, సర్వానికీ సాక్షి భూతుడు, మహా మానవలక్షణం కలిగిన పుణ్యశాలి, నీలిమబ్బు చాయవాడు, మార్పులు లేనివాడు

నూటెనిమిది పేటల ముత్యాలపేరు, మకుటం, సందికడియాలు, కడియాలు వంటినగలు దిట్టంగా తొడిగినవాడు, ఆలనలో పెనుపరి అయినవాడు, మొలకు అందం తెచ్చే మొలనూలు, చెవుల్లో నప్పిన కుండలాలు, వక్షాన ఘనంగా అగుపించే కౌస్తుభమణి ధగధగలతో మెరిసిపోతున్న కంఠహారం తాల్చినవాడు, ఉల్లాసకరుడు, మనోహరమైన శంఖం, చక్రం, గద, పద్మము పట్టిన చేతులు కలవాడు, విశ్వవిఖ్యాతుడు, పుట్టుకలేనివాడు, గుప్పున గుబాళించే వనమాలికను వేసుకున్నవాడు, అజ్ఞానాన్ని తరిమికొట్టేవాడు, పసుపు పచ్చటి కొత్తపట్టుదైన పుట్టం కట్టినవాడు, అపరంజి మంజీరాలు పెట్టినవాడు, అత్యంతమైన మంచితనం గూడుకట్టినవాడు, చూడముచ్చటైనవాడు,

మంచిభావాలు నిండిన మనస్సుకూ, నేత్రాలకూ ఉల్లాసం కలిగించేవాడూ, హృదయమనే పద్మం దుద్దులో నివసించే విరివిగా వెలుగులు చిమ్మే, పెద్ద నఖాలనే మణులు అలంకారంగాగల పదపద్మయుగళుడూ, సాటిలేని మృదుహృదయుడూ మహాపురుషుడూ.

అలాంటి పురుష పుంగవుణ్ణి ఆరాధించు. మనసులో నెలకొన్నవాడూ; ప్రీతిగల చూపుకలవాడూ; కోర్కెలు తీర్చ ఉత్తముడూ; అయిన ఆ విష్ణుమూర్తిని ఏకాగ్రచిత్తంతో నిశ్చలంగా నిలిపి స్మరించుకో, గొప్ప ముక్తి సాధనమార్గంతో తపస్సు చెయ్యి. అలా ప్రతిష్టితం అయిన ఆ దివ్యమంగళరూపం తిరుగు ముఖం పట్టదు. అంతేకాదు ఏ మంత్రాన్ని ఏడు పొద్దులు జపిస్తే ఆ దివ్యులను చూడగల శక్తి అలవడుతుందో, అలాంటిదే ఓంకారంతో కూడిన పన్నెండక్షరాల వాసుదేవమంత్రం. ఇది ఏ ప్రదేశంలో ఏ వేళలో ఎలా విభక్తమో, తెలిసిన వివేకులు అనుష్టించే మంత్రం. ఈ మంత్ర మననంవల్ల

("ఓం నమో భగవతే వాసుదేవాయ" అనేది ద్వాదశాక్షరీమంత్రం. దీనికే 'వాసుదేవద్వాదశాక్షరి' అని నామాంతరం.

గడ్దిపరకల బోలిన చామనచాయకల వాసుదేవుణ్ణి గరికపోచలతో అర్చించాలి. చక్కనైన పద్మాలవంటి నేత్రాలు కలవాణ్ణి పద్మాలతో పూజించాలి. తులసిమాలలు తాల్చే వాణ్ణి మూడాకుల తులసిరెమ్మలతో సేవించాలి. నిష్కళంకమైన చరిత్ర కలవాణ్ణి పూలమాలలతో, గరుడపక్షి రెక్కలమీద విహరించేవాణ్ణి ఆకులతో, లోకాలకు మూలదుంపవంటి పరమేశ్వరుణ్ణి వనమూలికలతో, పసుపుపచ్చటి పట్టుపుట్టం కట్టుకునేవాణ్ణి చెట్టుబెరడుపట్టలతో నేసిన నారబట్టలతోనూ, భజించాలి. మన్నుతో, రాయితో, కొయ్యతో దిద్దిన విగ్రహమూర్తుల్లో గాని, ప్రసిద్ధమైన పుణ్యతీర్థాల్లో గాని, క్షేత్రాల్లో గాని ఆ నారాయణుణ్ణి కొలవాలి.

మనస్సు నిగ్రహించుకోవాలి. మృదుస్వభావం కావాలి. సంభాషణలను కట్టడి చేసుకోవాలి. సదాచారం తెలియాలి. స్తుతిమంతుడైన హరియొక్క శ్రేష్ఠ గుణాలను అలవరచుకోవాలి. కందమూలాదులను మితంగా తినాలి. ఈ తీరుగా ప్రవర్తిస్తూ ఉండాలి.

కీర్తనీయుడైన ఆ దైవం తన ప్రకృతితో తన ఇచ్చవచ్చినట్లు అవతారాలు ఎత్తుతాడు. ఊహాతీతంగా కావించే ఆయన లీలలను మనస్సుకు పట్టెటట్లు తలంచుకోవాలి. అంతేకాదు కార్యాచరణ బుద్ధితో చేసే పూజాదిక సేవలన్నింటిని ద్వాదశాక్షర వాసుదేవమంత్రంతోనే ఆ దైవానికి పొందించాలి. ఇలా త్రికరణ శుద్దిగా చేసిన కర్మలతో గుండెల్లో నిలిచిపోయేలా భక్తి పూజలతో ఉపచరించాలి. ఆ భగవన్మాయకు లోనుకాని ఆరాధకులకు, చతుర్విధపురుషార్థాల్లో కోరింది కోరినట్టుగా ప్రసాదిస్తాడు. విరాగి అయినవాడు నిత్యం స్మరిస్తూ భక్తియోగంచేత ముక్తికోసం భజిస్తాడు అని దేవర్షి చెప్పగా విన్నాడు. ఆ ధ్రువుడు నారదుడికి, ప్రదక్షిణలు చేసి నమస్కరించాడు. ఆ తరువాత ఋషిలోకసేవ్యమైనట్టి సకలఫలప్రదమైన, ఆ పరాత్పరుడి పాదపద్మాలచే అలంకరించబడి మధువనానికి వెళ్లాడు.

బ్రహ్మకుమారుడు నారదుడు ఉత్తానపాదుడి దగ్గరకు పోయాడు. ఆ రాజుచే పరిపరివిధాల గౌరవం పొందాడు. ఎంతో తృప్తిచెందాడు. ఎత్తయిన పీటమీద సుఖోపవిష్టుడై ఆ రాజువంక చూచి

ఇలా పల్కరించాడు.

ఓ అధిపా! నీ ముఖం వాడిపోయి ఉంది. నువ్వు బాగా చిన్నబోయి ఉండడానికి కారణం ఏమిటి? అన్న నారదుడితో ఆ భూపతి ఇలా బదులు చెప్పాడు.

ఓ నారదా! మంచి వివేకం కలవాడూ, ఏ పాపం పట్టనివాడూ, ఐదేళ్ల అర్భకుడు నా ప్రియపుత్రుడు. ఆ పసివాడి మీదజాలి చూపకపోగా నేను అవమానించాను. తల్లిని తీసుకొని తాను ఎక్కడికో వెళ్లిపోయాడు.

అలా వెళ్లి వెళ్లి భయంకరమైన చిట్టడవుల్లోకి దూరి పోయి ఉంటాడు. నడచినడచి సొలసిపోయి, ఉంటాడు. ఆకలి నొప్పికి మెలికలు తిరిగిపోయి ఉంటాడు. కళకళలాడే ఆ మోము మరీ వాడిపోయి ఉంటుంది. అభం శుభం తెలియని ఆ పసివాడు తోడేళ్లు, పాములు, ఎలుగుబంట్లు, ఇత్యాది వన్యప్రాణుల వాతపడ్డాడేమోనని దుఃఖిస్తున్నాను.

ఓ మునివర్యా! అంతటి ఉత్తముడయిన నా కొడుకును నా ఒడిలోకి తీసుకోకుండా నిర్లక్ష్యం చేశాను. నా కాంత మీది ఆసక్తితో చేసిన ఈ దుండగం నా పనే.

ఆ ఉత్తానపాదుడి మాటలు విన్నాక నారదుడు ఆ రాజుతో ఇలా అన్నాడు. ఆ విష్ణువు దేవతల కిరీటపు రత్నకాంతులతో విలసిల్లే చరణకమలాలు కలవాడు. పద్మదళనేత్రుడు. అట్టి ఆ భగవానుడు పిల్లవాణ్ణి కాపాడుతున్నాడు. సమస్తలోకాలు మెచ్చే యశస్సంపన్నుడు. శుభప్రవర్తనం కలవాడు. అయిన నీ పిల్లవాడి గురించిన దిగులు నీ కెందుకు?

ఆ మహానుభావుడు విష్ణుదేవుని సేవించి సమస్త దిక్పాలకులకూ పొందరాని నిత్యపదానికి అధీశ్వరు డవుతాడు. లోకపావనుడయిన నీ కొడుకు ప్రభావం నీకు తెలియదు రాజా!

అంతేగాక, నీ వంశప్రతిష్టను ఈ జగం అంతా యుగాంతపర్యంతం నిలుపగలడు. అతడు సద్గుణాల సముద్రుడు. నీ రాజధానికి తప్పక తిరిగి వస్తాడు. ఓ శుభచరితా! ఆ ధ్రువుణ్ణి గూర్చిన దిగులు మానుకో.

అని నారదుడు చెప్పిన మాటలమీద మంచినమ్మకం ఏర్పడింది. ఉత్తానపాదుడి మనసు అంతా కొడుకు తలపోతలతోనే నిండిపోయి రాచరికం శూన్యంగా తోచింది. రాచకార్యాలను అసలు పట్టించుకోవడం మానేశాడు.

అటు పై ఆ అడవుల్లో ధ్రువుడు పోగా పోగా అతడికి మధువనక్షేత్రం ఎదురపడింది. ఆ క్షేత్రం మునులు, దేవతలు, యోగులు స్తోత్రం చేసిన సద్గుణాలతో శుద్ధమైన చోటు. దుష్టజీవలోకమనే మబ్బుల్ని విడగొట్టే వాయువు వంటిది. సుకృతాలకు ముఖ్యస్థావరం వంటిది.

తన ముందరనే కనపడుతున్న మధువని చేరుకున్నాడు. యమునా నదిలో స్నానం కావించాడు. వ్రతం పట్టినవాడై మనసును కుదుటపరచుకుని ఆ విష్ణుమూర్తిని పదేపదే ధ్యానించాడు. మూడురాత్రులకు ఒక్కసారి వెలగ, రేగు పళ్లను వ్రతసమాప్తి ఆహారంగా తీసుకుంటూ కాలం వెళ్లబుచ్చాడు. శరీరం నిలుకడను బట్టి ఒక్కనెలపాటు ఇలాగే ఆ మధువనస్వామిని ఆరాధించాడు. ఆ పై రెండో నెల ప్రారంభంనుంచి ప్రతి ఆరుదినాలకూ ఎండుగడ్డి పరకలు, పండిరాలిన ఆకులను మాత్రమే నములుతూ ఆ నారాయణుని పూజించాడు. మూడో నెల మొదటినుంచి తొమ్మిది దినాలకొకసారి ఆ ఆకులలములు మాని జలం మాత్రమే పుచ్చుకుంటూ మాధవుణ్ణి సేవించాడు. నాల్గో నెల మొదలైనప్పటి నుంచి పన్నెండేసి దినాలకొక పర్యాయం ఆ నీటినికూడ తాగడం మాని గాలిని మాత్రమే ఆరగిస్తూ ఊపిరులను అనుకూలపరచుకుంటూ; ఆ పుండరీకాక్షుని సేవలతో తరించాడు. ఐదోమాసం రాగానే శ్వాసను బంధించి మనస్సు అలపు చెందని రీతిన ఒంటి కాలిమీద నిలబడి ఆ పరంధాముణ్ణి ధ్యానిస్తూ జీవంలేని మోడువలె కాలం పుచ్చాడు.

సర్వ సూక్ష్మ భూతాలకూ పంచేంద్రియాలకూ ఆధారమైన చిత్తంలో శబ్దాది విషయాలకు వేటికీ కుదురు కల్పించలేదు. మహత్తు మొదలైన పరతత్త్వస్వరూపాదులకు ఆశ్రయం ఇచ్చే ప్రకృతి పురుషులకు యజమానుడైనట్టి శాశ్వతబ్రహ్మ స్వరూపుడైనట్టి పరబ్రహ్మమును తన డెందంలో లగ్నం చేసుకున్నాడు. విష్ణువుకన్న మరోరూపం గూర్చిన చింతనలేకుండా తన మనస్సును ఆ పరబ్రహ్మమందే నిలిపి ఉంచాడు. ఆ ఘోరతపస్సుకి ముల్లోకాలూ గజగజలాడి పోయాయి. అంతటితో ఆగక మరింత పెచ్చుగా ఆ పిల్లవాడు నేలమీద ఒంటి కాలిమీద నిలుచుండి కాలిబొటన వ్రేలితో నొక్కుతూ ఉండగా.

అడ్డూ ఆపూలేని మదగజం పాదం మోపిన వైపుకు ఒరగిపోయే ఓడవలె నేల సగం సగంగా అటూ ఇటూ వాలిపోతూ ఊగడం మొదలు పెట్టింది.

ధ్రువుడు తదేకదృప్టితో చరాచరప్రపంచంలోని సర్వజీవుల ప్రాణాయామపు ఉనికిని పొంది ఉన్న ఆ ఈశ్వరునిలో తన ప్రాణాన్ని చేర్చాడు. ఆ ఐక్యతను పొందడానికి ఊపిరిని స్తంభింప చేసిన కారణంగా విష్ణువూ చలించిపోయాడు. ఆ సర్వేశ్వరుని చలనానికి లోకాలన్నీ తూగాడాయి.

చూపులకే జడుపు పుట్టించేలా లోకాలకు ఉప్పతిల్లిన ఆ పెద్ద ఉపద్రవస్థితిని పరికించారు దిక్పాలకులు. ఆ పాలకులంతా భయంతో గుంపుగా ఆ విశ్వశరణ్యుని దర్శించాలని బయలుదేరిపోయారు.

అలా వెళ్లి ఆ నారాయణునికి మొక్కుకుంటూ అంజలి ఘటించి ఇలా మొరపెట్టుకున్నారు.

ఓ హరీ! ఓ పరమాత్మా! కేశవా! చరాచరప్రాణికోటి శరీరాలను తాల్చిన వాడవు నువ్వే. కాని ఈ ప్రకారంగా అందరి శ్వాస ఒక్కమారుగా ఆడక పోవడం ఇంతకు మునుపు ఎన్నడూ మేం కని విని ఎరుగం. ఓ విశ్వనాథ! సర్వ శరణ్య! నీ పాదపద్మాలను అత్యంతప్రీతితో శరణు పొందుతున్నాం. ఈ మా పీడను బాపి ఆదుకోవా!

ఆ నారాయణస్వామి దేవతల మనవిని విన్నాడు. వాళ్ల కిలా ధైర్యం చెప్పాడు. ఆ బుడుతడు ఉత్తానపాదుడనే రాజుబిడ్డ. విశ్వాత్మకుడనైన నా యందు తన మనస్సును లీనం చేసి ఏకాగ్రతతో తపస్సు చేస్తున్నాడు. ఆ ఘోరతపం మూలంగానే మీ ఊర్పుల కదలిక ఆగిపోయింది. అలా అతిక్రమింప వీలులేని ఆతడి తపస్సును వెనక్కి మళ్లింపచేస్తాను. మీ గృహాలకు మీరు వెళ్లండి అని ఆజ్ఞాపించాడు. ఆ దేవతలు ఏ జంకూ లేనివారలై ఆ విష్ణుమూర్తికి నమస్కరించి నిశ్చింతగా తమ దివిసీమకు తిరిగి వెళ్లారు. ఆ తరువాత

వాళ్లంతా అటు వెళ్లగానే నారాయణుడైన ఆ విశ్వప్రభువు, పక్షుల్లో ఉన్నతుడైన గరుడుని వాహనంగా చేసుకొని తన భక్తుడు ధ్రువుణ్ణి చూడాలని వేడుకపడి ఆ వెంటనే తిన్నగా మధువన క్షేత్రానికి కదలివెళ్లాడు. మిక్కుటం అయిన భక్తి యోగసాధనతో ధ్రువుడి బుద్ధి పదనెక్కింది. తన మనస్సనే విచ్చీవిచ్చని తామరమొగ్గలో మెరుపు మెరిసినట్లు తళుక్కుమన్న ఆ సర్వ వ్యాపకమూర్తిమత్వం అంతరాన అంతర్ధానమయింది. ఆ మరుక్షణంలోనే తన ఎదుట ప్రత్యక్షమైంది. ఆ పూర్వ, అపూర్వజ్ఞాన చక్షువులకు ఇంతదాకా పొడగట్టిన ఆ నిండు రూపాన్ని కళ్లు విప్పి తిలకించాడు. తత్తరపడ్డాడు. ఆనందబాష్పాలు రాల్చాడు. ఒళ్లంతా పులకించి పోయింది.

సాక్షాత్కరించిన భగవంతుని ధ్రువుండు స్తుతించుట

Story of Dhruva - ధ్రువోపాఖ్యానము

ధ్రువోపాఖ్యానము

విదురా! విను. అన్ని లోకాల రక్షణార్ధం విష్ణు అంశ కలిసిన బ్రహ్మ దేవుడికి పుట్టినవాడు స్వాయంభువమనువు. ఇతడు యశోవంతుడు.

ఆ స్వాయంభువ మనువుకి శతరూప కడుపున ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కొడుకులు పుట్టారు. వాళ్లిద్దరూ లోకుల పొగడిక కన్నవారు. ఈ పిల్ల లిద్దరిలో ఉత్తానపాదుడు మంచిమనుగడ కలవాడు. ఇతడికి,

విదురా! విను. ఆ ఉత్తానపాదుడికి ఇద్దరు ఇల్లాళ్లు. సునీతి, సురుచి. వీళ్లల్లో ద్రువుడి కన్నతల్లి సునీతి మీద ఉత్తానపాదుడికి అపేక్ష తక్కువ. సురుచి మీద ప్రీతి ఎక్కువ. ఇలాగున ఉంటున్న సమయంలో,

(సునీతి చక్కటి నీతి మంతురాలు. సురుచి చక్కటి సొగసరి.)

ఒక దినాన ఉత్తానపాదుడు, ప్రేయసి సురుచి కన్నకొడుకును ఉల్లాసంగా తొడల మీద కూర్చోపెట్టుకుని లాలిస్తూ ఉన్నాడు. అదే వేళలో తానూ తండ్రితొడ ఎక్కాలని ఆసగొన్న ధ్రువుణ్ణి ఉత్తానపాదుడు చూసినా, దగ్గరకు తీయలేదు. ముద్దాడ లేదు. ఉపేక్షించి కిమ్మనక ఉన్నాడు. దానితో పొగరెక్కిన సురుచి, సపత్ని కొడుకు ధ్రువుడితో ఇలా పలికింది. ఓ సవతి కొడుకా! తండ్రి తొడ ఎక్కాలని కుతూహలపడినట్లయితే విను. నువ్వు ఆనాడే నా కడుపున పడక మరొక స్త్రీ గర్భాన పడ్డావు. తండ్రి తొడ ఎక్కి కూర్చుని ఆనందించే అదృష్టం కోరుకున్నంతమాత్రాన చిక్కుతుందా?

పుణ్యాత్మా! అందుకని నువ్వు ఆ వెన్నుని పాదారవిందాల ప్రాపును విడువక పొందు. ఆ దైవం నిన్ను నా కడుపున పుట్టిస్తాడు. ఆ విధంగా వీలుపడితే ఎడతెగని సంతోషం అనుభవిస్తావు.

ఈ రకంగా పలికిన పిన తల్లిమాటలు చెవికి ఏవగింపు పుట్టించాయి. తన తండ్రి వినేటట్టుగా తననుగురించి మాట్లాడిన కానిమాటలు ఎదను కెలికి కష్ట పెట్టగా,

కన్నకొడుకునైన తనను పట్టించుకోనట్లున్న తండ్రినుండి పక్కకు తొలగాడు. కష్టాలకడలిలో మునిగివుంటూ కర్రదెబ్బ పడ్డ పెద్దపామువలె కోపంతో

పెద్దగా ఏడుస్తున్నాడు. ఆ దుఃఖానికి రెండుకళ్లనుంచి కన్నీరు బొటబొట జాలువారుతూ ఉంది. తల్లి దరికి చేరాడు. కన్నబిడ్డను చూసి తల్లి సునీతి ఎంతో ఆప్యాయంగా ఒళ్లోకి తీసుకొని ప్రేమగా మొగం అంతా అరచేతులతో అటూ ఇటూ సవరించింది. జరిగిన సంగతంతా స్త్రీలు, రాణివాసంలో ఉండే  పరిచారికలూ చెప్పగా విన్నది. పెద్ద పెద్ద నిట్టూర్పులు వెంట వెంటగా నిగిడించింది. కంట నీరు పెట్టుకుని క్షోభపడిందై

సవతి సురుచి పల్కిన నిక్కుమాటలను పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంది. అలా పేర్చబడ్డ శోకాగ్నుల దొంతరలతో లోలోపల మగ్గిపోతూ కారుచిచ్చుల కాకల్లో తగుల్కొని ఆ వెలుతురులకు కమిలిపోయే మాధవీలతలాగా ఆమె కుమిలిపోయింది.

కాసేపటికే స్తిమితపడి ఆ సునీతి, తన పిల్లవాణ్ణి స్పృశిస్తూ తండ్రీ! ఏడవకు మంటూ ఊరడించి ఇలా తెలియపలికింది.

బాబూ! ఏదో నెపంగా ముందటి జన్మంలో చేసిన పాపభూయిష్ఠమైన వేదన వెనుకొని వెంటాడుతుంది. ఎట్లయినా మన ఈ వెతకు సంబంధించి బయటివారికి జంకవలసిన అగత్యం కల్గదు కదా.

కట్టుకున్న భర్త నోటను భార్య అని కాదు కదా కనీసం 'ఊడిగపుది' అనే పిలుపు కయినా నోచని దానను. భార్యగా గౌరవం పొందని నిర్భాగ్యురాల నన్పించుకోగల నా కడుపున పుట్టిన దౌర్భాగ్యానికి 

ఆ సురుచి నిన్ను అన్నమాటల్లో నిజం ఉంది. నీ తండ్రి తొడలపై కూర్చోవాలనేదే నీ ఆకాంక్ష అయితే నీవు సర్వరక్షకుడగు ఆ పరాత్పరుని పాదాలు ఆశ్రయించు.

కనుక మాతృసమానురాలైన ఆ సురుచి మాటప్రకారంగానే ఆ విష్ణుని ప్రాపు చేరు అని హితవు చెప్పింది. మళ్లీ ఇలా సమర్థించి చెప్పింది.

నిజానికి ఆలోచించి చూస్తే ఈలోకాల రక్షణకోసం ఇష్టపడి సత్త్వాదిగుణరూపాల్లో గోచరమయ్యే విష్ణుని పాద పద్మాలను కొలిచి ఆ బ్రహ్మ అంతఉన్నత పదవిని అందుకోగల్గాడు. మీ తాత స్వాయంభువమనువు ఔన్నత్యం కలవాడు ప్రఖ్యాతుడు. సర్వాంతర్యామి తత్త్వప్రధానమైన ఎరుకతో ఆ విష్ణువుని సవనరూపంలో అనేక దక్షిణలతో సేవించాడు. తానుగా భూలోకస్వర్గలోక సౌఖ్యాలతోపాటు ముక్తిసౌఖ్యాన్నీ అనుభవించాడు. అటువంటి అచ్యుతుని, పరుని, యోగివర్యుల సమితిచే గాలించబడే పాదపద్మాలజంట కలవాణ్ణి, అవిరామమైన కాంతిమయుణ్ణి, భక్తులయందు వాత్సల్యంకలవాణ్ణి లోకసంధాతను ఆ విష్ణుమూర్తిని (ఆశ్రయించు)

మళ్లీ, చేత లీలాపద్మం పట్టుకొని బ్రహ్మాది దేవతలు చూస్తుండగా లక్ష్మిచేత అన్వేషింపదగిన ఆ మహావిష్ణువును

ధ్రువు౦డు నారదోపదేశంబు వడసి తపంబు సేయుట

After receiving blessings for his devotion and an exalted position, a mature Dhruva returns to his kingdom to be welcomed by his father, King Uttanapada - ధ్రువుండు మరల దన పురంబునకు వచ్చుట

ధ్రువుండు మరల దన పురంబునకు వచ్చుట అంటూ ఆ ధ్రువుడు దుఖపడ్డాడు. ఆ మైత్రేయముని విదురుడితో ఇలా చెప్పాడు. మనోహరమైన శ్రీహరి పదపద్మరేణువులచే సంస్కర...