Saturday, February 14, 2026

Parikshit asked Sukadeva (Suka) about the creation of the universe - పరీక్షితు౦డు శుకుని బ్రపంచోద్భవాదికంబు నడుగుట

పరీక్షితు౦డు శుకుని బ్రపంచోద్భవాదికంబు నడుగుట

అప్పుడు 
పరీక్షిత్తు శుకయోగి తో ఇలా అన్నాడు- "మునీంద్రా! బ్రహ్మదేవుడు నారదమునికి భగవద్దర్శనం కలగడానికి చెప్పిన ఉపాయం దయతో నాకూ చెప్పండి. సత్వరజస్తమోగుణాలకు అతీతుడూ, పద్మనేత్రుడూ అయిన శ్రీహరి కథలు లోకానికి మంగళం కలిగిస్తాయి. అవి నాకు తెలియజేయండి! మీరు చెప్పినది విని సంగరహితమైన నాహృదయంలో శుభచరిత్రుడూ, తుదిమొదళ్ళు లేనివాడూ, చిన్మయ స్వరూపుడూ, పాపరహితుడూ, లక్ష్మీసమేతుడూ అయిన కృష్ణుణ్ణి నిలుపుకొంటాను. చంచలం, త్యజింపదగిన పదార్థాలకు నెలవూ అయిన ఈ శరీరాన్ని పరిత్యజిస్తాను.

అంతేకాక ఎవడు శ్రద్దా భక్తులు కలిగి కృష్ణుని గుణగణాలను ఇతరులు కీర్తిస్తుంటే వింటాడో, తాను గూడా స్వయంగా కీర్తిస్తాడో, అట్టి భక్తుని హృదయకమలంలోనికి శ్రవణరంధ్రాలద్వారా కృష్ణుడు ప్రవేశిస్తాడు, అక్కడ విశ్రమిస్తాడు. నీటిలోని మురికిని శరదృతువు తొలగించినట్లు మనస్సులోని మాలిన్యాన్ని తొలగిస్తాడు. అందుచేత-

అడవుల్లో సంచరిస్తూ వేసవికాలంలోని మండుటెండల తాపానికి పరితప్తుడైన బాటసారి బడలి దప్పిక జెంది చివరికి తన ఇల్లు చేరుకొంటాడు. అక్కడ హాయిగా అలసట తీర్చుకొంటాడు. అక్కడనుండి మళ్ళీ ఎక్కడికీ కదలడు. అట్లే రమాకాంతుని చరణకమలయుగళంతో సంబంధం కలిగి ఆ ఆనందం చవి చూచినవాడు మళ్ళీ దాన్ని వదలడు.

అంతేకాదు. సమస్త భూతాల తోటి కలయిక లేని ఆత్మకు భూతాలతో సాంగత్యం ఎలా కల్గింది? అది అకారణంగా కలిగిందా? లేక కర్మవల్ల సంభవించిందా? ఈ వైనం నాకు వివరించు-

ఓ పరమ దయామయా! యోగవంశాబ్ధిచంద్రా! ఎవని నాభిలో సమస్తలోకాల ఉనికికి హేతువగు పద్మం పుట్టిందో, ఆ పద్మంలో పుట్టి సర్వాంగసుందరంగా ప్రకాశించే బ్రహ్మదేవుడు ఎవని అనుగ్రహం వల్ల ఔత్సుక్యంతో సకలప్రాణులనూ సృష్టించాడో, అట్టి బ్రహ్మ ఏ రీతిగా సర్వేశ్వరుని రూపాన్ని సాక్షాత్కరింపజేసికొన్నాడో, అట్టి పరంజ్యోతి స్వరూపుడైన పద్మాక్షునికీ, బ్రహ్మకూ అవయవ విన్యాసంలోనూ, భావగమనంలోనూ వ్యత్యాసం ఉన్నదా? ఉంటే వివరించు.

భూతాలకు అధినాథుడైన సర్వేశ్వరుడు ఉత్పత్తికీ, స్థితికీ, లయానికీ హేతువైన తన మాయను వదలి మాయా నియామకుడై ఏ ఏ స్థలాలలో శయనించాడు? అంతేకాక పూర్వం విరాట్పురుషుని అవయవాలతో ఇంద్రుడు మొదలైన లోకపాలకులతో కూడిన లోకాలు ఎలా సృష్టింపబడ్డాయి? మహాకల్పాలు, అవాంతరకల్పాలు, భూతభవిష్యద్వర్తమానకాలాలు, శరీరాభిమానంతో జన్మించే దేవతలు, పితరులు, మానవులు మొదలగు వారికి కలిగే ఆయుఃప్రమాణాలు నాకు చెప్పు.

మహాకాలాన్నీ, సూక్ష్మకాలాన్నీ అనువర్తించి జీవులు ఏ ఏ కర్మలు చేసి ఏ ఏ లోకాలకు ప్రయాణం సాగిస్తారు? ఏ ఏ కర్మలవల్ల వాళ్లకు దేవతా శరీరాలు వస్తాయి? అట్టి కర్మమార్గపద్ధతి నాకు వివరించు.

ఇంకా సత్వాది గుణాలకు ఫలాలైన దేవాది స్వరూపాలు కోరే జీవులు ఏయే కర్మలు ఏ విధంగా చేయాలి? ఆ కర్మలను ఎవరికి సమర్పించాలి? వాటిని ఎవరు స్వీకరిస్తారు?

భూమి, పాతాళం, దిక్కులు, ఆకాశం, గ్రహాలు, నక్షత్రాలు, పర్వతాలు, నదులు, సముద్రాలు, దీవులు ఎలా ఉద్భవించాయి? ఆ యా చోట్ల ఉండే జీవుల జన్మలు ఎలాంటివి?

వెలుపలా, లోపలా బ్రహ్మాండం కొలత ఎంత? మహాత్ముల చరిత్రలు ఎటువంటివి? వర్ణాశ్రమ నియమాలు, క్రమంగా ఏర్పడి ఆశ్చర్యం కలిగించే శ్రీమన్నారాయణునిఅవతార కథలు, నాలుగుయుగాలు, ఆ యుగాల ప్రమాణాలు, యుగధర్మాలు, ప్రతియుగంలోనూ మానవులు పాటించవలసిన సాధారణ ధర్మాలు, విశేషధర్మాలు, ఆ యా జాతులకు సంబంధించిన ధర్మాలు, రాజర్షుల ధర్మాలు, జీవన సాధనాలైన ఆపద్ధర్మాలు, మహత్తు మొదలైన తత్త్వాలసంఖ్య, వాటి లక్షణం, ఆ తత్త్వాలకు హేతువులయిన లక్షణాలు, భగవానుణ్ణి ఆరాధించే పద్ధతి, యమనియమాదులైన అష్టాంగాలతో కూడిన యోగక్రమం, యోగిశ్రేష్ఠులైన వారి అణిమ, మహిమ మొదలగు అష్ఠసిద్ధుల స్వరూపం, అర్చిరాది మార్గాలలో ఆ యోగులు పయనించే తీరు, లింగశరీరాల వినాశం, ఋక్కు, యజుస్సు, సామం, అధర్వం అనే నాలుగు వేదాలు, ఆయుర్వేదం మొదలైన ఉపవేదాలు, ధర్మశాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాలు ఆవిర్భవించిన పద్ధతి, అన్ని భూతాలకూ ఏర్పడే అవాంతర ప్రళయం, వాటిస్థితి, మహాప్రళయం, ఇష్టాపూర్తాలనబడే యజ్ఞాది వైదిక కర్మలు, బావులు, మడుగులు, చెరువులు, దేవాలయాలు మొదలగు వాటి నిర్మాణం, అన్నదానం, ఆరామ ప్రతిష్ట మొదలైన స్మృతుల్లో చెప్పిన కర్మలు, కామ్య కర్మలైన అగ్నిహోత్రాదులు నిర్వర్తించే విధానం, జీవుల సృష్టి ధర్మం, అర్ధం, కామం అనే త్రివర్గాలను ఆచరించే తీరు, మలిన శరీరులైన పాషండుల పుట్టుక, జీవాత్ముడు బంధింపబడదే రీతి, ఆపై మోక్షం పొందే పద్ధతి, స్వస్వరూపంతో నెలకొనే ప్రకారం, దేనికీ లోబడక అన్నిటా స్వతంత్రుడైన ఈశ్వరుడు తన మాయతో సమస్త కర్తలకూ సాక్షిగా ఉంటూనే ఆ మాయకు అతీతుడై ఉదాసీనునిలాగా ప్రభువై క్రీడించే పద్ధతి- ఈ సంగతులన్నీ విపన్నుడనై ప్రపన్నుడనైన నాకు
వివరించు.

"నీవు బ్రాహ్మణ శాపంవల్ల దుఃఖీస్తున్నావు, నీ మనస్సు కలత జెంది ఉంది, పైగా నిరాహారదీక్షతో ఉన్నావు! నేను చెప్పే ఈ విషయాలు ఎలా వినగలవు?" అని సంశయింప వద్దు. నేను మీ ముఖపద్మం నుండి వెలువడే శ్రీమన్నారాయణ కథా సుధను తనివి దీరా తాగాలన్న కుతూహలంతో ఉన్నాను. అట్టి నాకు ఇంద్రియాలు స్వాధీనంలోనే ఉన్నాయి. కాబట్టి నేను అడిగిన ప్రశ్నలు అన్నిటికీ సమాధానాలు సవిస్తరంగా ఆనతిచ్చి నన్ను కృతార్థుణ్ణి కావించు. నీవు బ్రహ్మతో సమానుడవు. నీవు మాత్రమే ప్రాచీన సంప్రదాయాన్ని అనుసరించి వాటిని వివరించడానికి తగినవాడవు".

ఈ విధంగా విష్ణురాతుడైన (విష్ణువుచే రక్షితుడైన) పరీక్షిన్మహారాజు (బ్రహ్మరాతుడైన బ్రహ్మచే వ్యాసునికి పుత్రుడుగా అనుగ్రహింపబడిన) శుకమహాయోగిని అడిగాడు.

అప్పుడు శుకమహర్షి "రాజా! బ్రహ్మ నారదుల సంవాదరూపమూ, ఒకే సంప్రదాయానికి చెందింది, క్రమపద్ధతిలో పరంపరగా వస్తున్నదీ అయిన భాగవతమనే మహాపురాణమున్నది. అది వేదంతో సమానం. దానిని పూర్వం సర్వేశ్వరుడు బ్రహ్మకల్పంలో బ్రహ్మకు ఉపదేశించాడు. అది నీకు తెలియపరుస్తాను, విను," అని చెప్పి పరీక్షిత్తుతో ఇలా అన్నాడు. 

రాజోత్తమా! "జీవుడు భూతాలకు మేలు చేకూర్చేవాడు, జ్ఞానమే స్వరూపంగా కలవాడు, అలాంటివానికి శరీరంతో సంబంధం ఎలా కలిగింది" అంటావా? జగతీతలమంతా వ్యాపించి ఉన్న ఈశ్వరుని మాయ అనేది లేకపోతే జీవునికి దేహంతో సంబంధం కలుగదు. నిద్రించే వేళ స్వప్నంలో దేహాలతో సంబంధం గోచరిస్తుంది కదా! అలాగే నారాయణుని యోగమాయాప్రభావంవల్ల జీవుడు పంచభూతాలతో కూడిన దేహంతో సంబంధం కలవాడవుతాడు. ఆ మాయాగుణాలవల్లనే క్రమంగా బాల్యం, కౌమారం, యౌవనం అనే దశలు పొందుతాడు. మనుష్య, దేవతాది ఆకారాలను కూడా స్వీకరిస్తాడు. నేను అనే అహంకారాన్నీ నాది అనే మమకారాన్నీ పెంచుకొంటాడు. సంసారమాయలో బద్దుడవుతాడు.

ఇలా బద్దుడై వర్తించే జీవుడికి భగవంతుని మీది భక్తితో ముక్తి ఎలా కల్గుతుంది అంటావా? వివరిస్తాను, విను. ప్రకృతికీ, పురుషుడికీ అతీతమైన బ్రహ్మస్వరూపాన్ని జీవుడు ఎప్పుడు తీవ్రంగా ధ్యానిస్తాడో అప్పుడు మోహంనుండి విడివడుతాడు. అహంకార మమకార మయమైన సంసారంనుండి విడుదల పొందుతాడు.

అంతేకాదు, జీవుడికీ, ఈశ్వరుడికీ శరీరాలతో, సంబంధాలు కనిపిస్తున్నాయి. భగవంతుడు కూడ శరీరం ధరించే ఉన్నాడు. అట్టి భగవంతుడి మీద భక్తి కలిగివుంటే జీవుడికెలా ముక్తి సిద్ధిస్తుంది? అని ప్రశ్నించావు.

అవిద్యకు లోనైనవాడు జీవుడు. అవిద్యా ప్రభావంవల్ల అతడు కర్మననుసరించి సంప్రాప్తించిన శరీరాన్ని ధరిస్తాడు. ఆ దేహం మిథ్యారూపమైనది. భగవంతుడు యోగమాయతో గూడినవాడు. ఆయన తన యోగమాయా ప్రభావంవల్ల తన ఇష్టానుసారం జ్ఞానమయమైన లీలాశరీరం కల్పించుకొంటాడు. అందువల్ల మోక్షానికి సాధనమైన జ్ఞానానికై తనసేవ కల్పించబడిందని భగవంతుడైన ఈశ్వరుడు బ్రహ్మతో చెప్పాడు. బ్రహ్మ నిష్కపటంగా తపస్సు చేసి పరమేశ్వరుని ఆరాధించాడు. అప్పుడు తన జ్ఞానానందఘనమైన స్వరూపం బ్రహ్మకు చూపిస్తూ ఈశ్వరుడు పై రీతిగా తెలిపాడు.

అందువల్ల జీవుడికి భగవద్భక్తి తప్పక మోక్షం ప్రసాదిస్తుంది. ఈ విషయం నిరూపించే ఇతిహాసం ఒకటి ఉన్నది. అది వివరిస్తాను, విను. దానివల్ల నీ సందేహం తీరుతుంది అని చెప్పి యోగివర్యుడైన శుకుడు రాజవర్యుడైన పరీక్షిత్తుతో ఇలా అన్నాడు.


నారాయణుండు బ్రహ్మతపంబునకు మెచ్చివరంబు లిచ్చుట

Srimannarayana Leela Avatara Varnanam - శ్రీ మన్నారాయణుని లీలావతారంబుల యభివర్ణనము

శ్రీ మన్నారాయణుని లీలావతారంబుల యభివర్ణనము

సూరిజనానికి వినుతింప దగినవాడవగు పండితవర్యుడా! రేయింబవళ్ళూ ఇతరకథా ప్రసంగాలు వింటూ ఏ మాత్రం పుణ్యం పొంత పోని వీనులకు విష్ణుకథలు విందు చేస్తాయి. సకల లోకాలకీ పూజనీయమై వెలుగొందే ఆ దేవుని దివ్యమంగళ కథాసుధారసాన్ని నేను నీకందిస్తాను. ఆసక్తితో ఆస్వాదించయ్యా!

ఈ విధంగా పలికి నారదుణ్ణి చూస్తూ బ్రహ్మదేవుడు మళ్ళీ అతనితో ఇలా అన్నాడు.

పూర్వం హిరణ్యాక్షుడనే రక్కసుడుండేవాడు. వాడు భుజబలాటోపంతో భూచక్రాన్ని చాప చుట్టినట్టు చుట్టి సముద్రగర్భంలో దాచాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు యజ్ఞవరాహరూపం ధరించి ఆ దానవుణ్ణి మార్కొన్నాడు. సముద్ర మధ్యంలో కోరలతో క్రుమ్మి ఆ రాక్షసుణ్ణి హతమార్చాడు. వాడు వజ్రాయుధం వేటుకు నేలకూలే మహాపర్వతంవలె అతిభీకరంగా క్రిందపడ్డాడు. ఇది యజ్ఞవరాహావతార చరిత్ర.

ఇక సుయజ్ఞావతారం ఎలా సంభవించిందో చెబుతాను విను. అంటూ నారదునితో బ్రహ్మ మళ్ళీ ఇలా చెప్పాడు.

పూర్వం రుచి అనే ప్రజాపతికీ, స్వాయంభువమనువు పుత్రికయగు ఆకూతి అనే గుణవతికీ సుయజ్ఞుడు పుట్టాడు, అతడు దక్షిణ అనే వనితను ధర్మపత్నిగా స్వీకరించాడు. ఆమె గర్భాన 'సుయములు' అన్న పేరుగల దేవతలను జనింపజేశాడు. ఇంద్రుడై దేవతలకు నాయకుడయ్యాడు. విష్ణువులాగా అఖిలలోకాల దుఃఖాన్ని తొలగింపజేశాడు. తాత అయిన స్వాయంభువమనువు తన మనుమని చరిత్రకు ఎంతో సంతసించి 'ఈ పుణ్యాత్ముడు శ్రీహరియే' అని అన్నాడు. మునీంద్రా! ఆ కారణాన ఉత్తమజ్ఞాననిధియైన సుయజ్ఞుడు శ్రీహరి అవతారంగా ప్రసిద్ధి పొందాడు.

బ్రహ్మ సుయజ్ఞుని గూర్చి చెప్పి ఆపై షడ్దర్శనాలలో ఒకటియగు సాంఖ్యయోగాన్ని ప్రవర్తింపజేసిన ఆచార్య శ్రేష్టుడు కపిలుని అవతారగాథను ఆలకించుమంటూ ఇలా అన్నాడు.

దేవహూతి అను ఆమె నిశ్చలమతియైన సతి. దివ్యతేజోవంతుడైన కర్దమప్రజాపతి ఆమె పతి. ఆ దంపతులకు సంతోషం అతిశయింపగా తొమ్మిదిమంది కూతుళ్ళతో పాటు శ్రీహరి కపిలుడన్న పేరుతో జన్మించాడు. ఏ యోగంతో శ్రీహరిని చేరడానికి సాధ్యమవుతుందో, ఆ మనోజ్ఞమైన సాంఖ్యయోగాన్ని ఆయన తల్లియగు దేవహూతికి బోధించాడు. అలా ఆమె పాపాలు రూపుమాపి మునులు అనుభవించే మోక్షాన్ని ఆమెకు ప్రసాదించాడు.

(ష
డ్దర్శనాలు-(1) న్యాయదర్శనం, (2) వైశేషికదర్శనం, (3) సాంఖ్యదర్శనం, (4) యోగదర్శనం (5)పూర్వమీమాంసా దర్శనం మరియు (6) ఉత్తరమీమాంసాదర్శనం. ఇందులో మూడవదైన సాంఖ్యయోగానికి ప్రవర్తకుడు కపిలమహర్షి)

ఇక దత్తాత్రేయుని అవతారం ఎలా వచ్చిందో, వివరిస్తాను. ఆలకించు.

మునులలో మేటియైన అత్రిమహర్షి తనకు పుత్రుణ్ణి అనుగ్రహించుమని విష్ణుని ప్రార్ధించాడు. అందుకు శ్రీహరి "మునీంద్రా! నేను నీకు దత్తుడ నయ్యాను" అని అన్నాడు. అందుచేత హరియే దత్తాత్రేయుడై అత్రికుమారుడుగా జన్మించాడు. ఆ మహాత్ముని పాదపద్మధూళి సోకి హైహయ వంశానికీ, యదువంశానికీ చెందినవారంతా పవిత్ర దేహులయ్యారు. ఆయన అనుగ్రహంవల్లనే ఇహ పరలోకాలలో యోగబలం ఆర్జించుకొన్నారు. జ్ఞానఫలాన్నీ, సుఖాన్నీ, ఐశ్వర్యాన్నీ, శక్తినీ, శౌర్యాన్నీ పొందారు. తమ కీర్తి మింట ప్రకాశిస్తుండగా ఉభయలోకాలలో ప్రసిద్ధి వహించారు. అట్టి దివ్యమూర్తి యగు హరిని నుతింపదరమా?

ఇక సనకుడు ,మున్నగు బ్రహ్మ మానస పుత్రుల అవతారాన్ని గూర్చి వివరిస్తాను, ఆలకించు.

పుణ్యాత్మా! నారదా! నేను కల్పారంభంలో విశ్వాన్ని సృష్టించాలనుకొన్నాను. అందుకై తపస్సు చేస్తూ 'సన' అని పలికాను. ఆ కారణంచేత 'సన' అన్న పేరుతో సనందనుడు, సనకుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అనే నలుగురు కుమారులు పుట్టారు. వారు బ్రహ్మ మానసపుత్రులుగా ప్రసిద్ధి పొందారు. గత కల్పాంతంలో అంతరించిపోయిన ఆత్మజ్ఞానాన్ని వాళ్ళు లోకంలో సంప్రదాయబద్ధంగా ప్రవర్తింపజేశారు. నయ శీలుడవగు నారదా! ఆ విష్ణుని కళలతో జన్మించిన వాళ్ళు నలుగురైనా నిజానికి వారి అవతారం ఒక్కటిగానే పరిగణింపబడవలసియున్నది.

ఇంకా నరనారాయణులెలా అవతరించారో, విను.

వినుతి కెక్కిన గుణాలు గలవారూ, మిక్కిలి పావనమూర్తులూ అయిన నరుడూ, నారాయణుడు అన్నవారు ధర్మానికి అధిష్టానమైన ధర్మునికీ, దక్షుని సుతయగు మూర్తికీ జన్మించారు.

పరమ పవిత్రులైన ఆ నరనారాయణులు బదరీవనంలో తపోనిష్టులయ్యారు. అది చూచి ఇంద్రుడు వారి తపస్సుచే తన పదవికి గండం ఏర్పడవచ్చునన్న చింతకు లోనై దేవతా స్త్రీలలో మేలైన దేవతావనితలను పిలిపించి ఇంద్రుడు 'నరనారాయణుల తపస్సుకు అంతరాయం కలిగించండి' అని చెప్పి పంపాడు. ఆ కాంతలు ఎంతో సంతసంతో మన్మథునిసేనలా అన్నట్లు బయలుదేరి బదరీవనానికి పోయారు.

నరనారాయణులు ఉన్న వనంలో

అక్కడ నరుడూ, నారాయణుడూ తపస్సు చేస్తున్న చోటికి దేవకాంతలు సవిలాసంగా వెళ్ళారు. అందచందాలతీరూ, కళానైపుణ్యాల సౌరూ ఉట్టిపడునట్లుగా పరిహాసవచనాలు పలుకుతూ, ఆటలాడుతూ, పాటలుపాడుతూ, విహరించారు. అలా తపోవనంలో విహరిస్తున్న అమరకాంతలను ఆ నరనారాయణులు చూచారు. వారు ఏ మాత్రం చలించలేదు. కామునికి లొంగలేదు. నిశ్చింతులై, నిర్మోహులై వాళ్ళు అలాగే నిరతిశయ నిశ్చల ధ్యానంలో, తపస్సులో నిమగ్నులైవుండి పోయారు.

ఆ మేధావులైన నరనారాయణులు కోపం తమ తపస్సులను బాధిస్తుందని గ్రహించారు. సత్వగుణసంపన్నులు కావడంవల్ల వారు ఆ దేవవనితల మీద కించిన్మాత్రంకూడా కోపం చూపలేదు.

అప్పుడు నారాయణుడు వెంటనే తన ఊరుభాగాన్ని గోటితో చీల్చాడు. అందుండి అమరకాంతలు మెచ్చగా ఊర్వశి మున్నగు అచ్చరలు పుట్టారు.

నారాయణుని ఊరువులందు పుట్టినందువల్ల ఆమె ఊర్వశి అని ప్రసిద్ధి వహించింది. ఇంద్రుడు పంపిన దివిజకాంతలు ఊర్వశి మున్నగువారి సౌందర్యం, విలాసం, విహారం చూచి వారిముందు తమ ఆటలు సాగవని సిగ్గుజెంది ఓడిపోయారు.

మనసులో సంకల్పించినంత మాత్రాన ఆ నరనారాయణులు సృష్టిస్టితిలయాలు చేయ శక్తిగలవారు. అట్టి మహాత్ముల తపోనిష్ఠకు భంగం కల్గించాలని సురవనితలు చేసిన శృంగారచేష్టలు కృతఘ్నుడికి చేసిన ఉపకారక్రియలవలె వ్యర్థాలయ్యాయి. అందుచేత వాళ్ళు సిగ్గుతో కుంచించుకుపోయారు. ఆ ఊర్వశినే తమకు నాయకురాలినిగా చేసికొని వచ్చిన దారినే తిరిగి వెళ్ళారు.

పూర్వం రుద్రుడు మహాకోపంతో కాముణ్ణి కాల్చివేశాడు. కోపం అంత దారుణమయింది. అట్టి కోపాన్ని సైతం ఆ బుద్ధిమంతులైన నరనారాయణులు అనాయాసంగా జయించారు. ఇక వారు కామాన్ని జయించడం గురించి చెప్పనేల?

అలాంటి నరనారాయణుల అవతారం లోకాన్ని పవిత్రం చేస్తూ వెలుగొందింది. ఇక ధ్రువుని అవతారాన్ని వివరిస్తాను, వినుము. 

ఉత్తమచరిత్రుడైన ఉత్తానపాదుడనే నృపునకు ధ్రువుడు సత్పుత్రుడై సంభవించాడు, ప్రభావసంపన్నుడై పేరుగాంచాడు. చిన్న తనంలో ఒకనాడు తండ్రిచెంత ఉండగా సవతితల్లి 'సురుచి' ఆ బాలుణ్ణి నిందావచనాలనే అస్త్రాలతో నొప్పించింది. అందుకు దుఃఖించిన ధ్రువుడు గొప్ప తపస్సు చేశాడు. ఆ తపస్సు ఫలించింది. భగవానుడు సాక్షాత్కరించి ధ్రువుణ్ణి అనుగ్రహించాడు. అతడు సశరీరంగా వెళ్ళి ఆకసంలో మహోన్నతస్థానమైన ధ్రువస్థానంలో స్థిరపడినాడు. ఆచోటికి పైన ఉండే భృగువు మున్నగు మహర్షులూ, క్రింద ఉండే సప్తర్షులూ ఆ మహనీయుణ్ణి గొప్పగా ప్రశంసించారు. అతడు 'ధ్రువుడు' అనే పేరుతో విలసిల్లి విష్ణుతుల్యుడైనాడు. ఇప్పుడు కూడా ఆ పుణ్యాత్ముడు ఆ ధ్రువస్థానంలోనే వెలుగొందుతున్నాడు.

ఇంక పృథుచక్రవర్తి అవతరించిన తీరు వివరిస్తాను, శ్రద్ధగా విను.

వేనుడను రాజు భూసురుల శాపవచనాలనే వజ్రాయుధపు దెబ్బలకు గురియై సిరినీ మగటిమినీ కోల్పోయాడు. తుదకు నరకం పాలయ్యాడు. అతనికి పృథుడనే కుమారుడు శ్రీహరి కళాంశంతో జనించాడు. అతడు తండ్రిని పున్నామనరకం నుండి కాపాడాడు. భూమిని ధేనువుగా జేసి అమూల్యమైన అనేక వస్తువులను పిదికాడు.

ఇలా చెప్పి బ్రహ్మ మరల ఇలా అన్నాడు. నారదా! ఇప్పుడు వృషభుని అవతారం తెలియజేస్తాను, విను, 'అగ్నీధ్రు' డనే వానికి 'నాభి' అనే కుమారుడు కలిగాడు. నాభి భార్య సుదేవి. ఆమెకు మరొకపేరు 'మేరుదేవి'. ఆమెయందు శ్రీహరి వృషభావతారంగా జన్మించాడు. అతడు జడశీలమైన యోగం పూనాడు. ప్రశాంత చిత్తంతో ఇతరమైనవాటితో సంగం వదలి చరించాడు. 'ఇది పరమహంసల స్థితి' అని తన్ను గురించి మునులు ప్రశంసిస్తూ ఉండగా ఆ యోగంలో ప్రవర్తించాడు.

ఇక హయగ్రీవావతారం వర్ణిస్తాను, విను.

సచ్చరిత్రా! మేలిమి బంగరుకాంతిగలవాడూ, వేదస్వరూపుడూ, సర్వాంతర్యామీ, సాటిలేని యజ్ఞపురుషుడూ అయిన భగవానుడు 'హయగ్రీవుడు' అన్న పేరుతో నేను నిర్వహించిన యజ్ఞం నుండి ఆవిర్భవించాడు. సర్వాన్ని పావనంచేసే ఆ హయగ్రీవుని ముకుపుటాలలోని శ్వాసవాయువులనుండి వేదాలు ప్రాదుర్భవించాయి.

ఇంక మత్స్యావతారం వివరిస్తాను, విను.

కుమారా! ప్రళయసమయంలో సమస్తం జలమయమై పోయింది. ఆ పరిస్థితిని వైవస్వతమనువు ముందే గ్రహించి ఒక పడవపై కూర్చున్నాడు. అప్పుడు భగవంతుడు విచిత్రమైన మత్స్యావతారం దాల్చాడు. భూతలంలోని సకల జీవులకూ ఆధారమైన ఆ దేవుడప్పుడు నా ముఖంనుండి జారిపోయిన వేదశాఖలు సంకీర్ణమైపోకుండా విభజించాడు. దేవతల కోరికననుసరించి నాకు మళ్ళీ ఆ వేదశాఖల నందించాడు. వైవస్వతుణ్ణి నావపై ఎక్కించి ఆ నావ సముద్రంలో మునిగిపోకుండా కాపాడినాడు. మహామహనీయమైన ఆ మత్స్యావతారాన్ని వినుతించడానికి ఎవరికి శక్యమవుతుంది? ఇంక కూర్మావతారాన్ని గూర్చి విను.

నారదా! పూర్వం దేవతలూ, రాక్షసులూ అమృతం సాధించాలనే యత్నంతో మందరాద్రిని కవ్వంగా జేసుకుని క్షీరసముద్రాన్ని మథించారు. అప్పుడా కవ్వపు గొండ కడలి నడుమ మునిగిపోయింది. అప్పుడు శ్రీహరి తన వీపు దురద శమింపజేయటానికా అన్నట్లు గిరగిర తిరిగే గిరిని కూర్మరూపం దాల్చి ధరించాడు.

ఇక నరసింహావతారాన్ని వివరిస్తాను, వినుము.

హిరణ్యకశిపుడనే రాక్షసుడు దేవలోకంపై దాడి వెడలి దేవతలను బాధించాడు. ప్రచండ గదా దండం పైకెత్తుకొని వచ్చే ఆ దానవుణ్ణి శ్రీహరి చూచాడు. వాణ్ణి హతమార్చి ముల్లోకాలకూ క్షేమం చేకూర్చాలనుకున్నాడు. వెంటనే నిడుదకోరలతో భీతి గొలిపే నోరూ, కోపంతో ముడివడ్డ కనుబొమ్మలుగల నరసింహావతారం ధరించాడు. కరకు గోళ్ళతో ఆ రాక్షసేశ్వరుని వక్షం చీల్చి పరిమార్చాడు.

ఇక ఆదిమూలావతారాన్ని గురించి వివరిస్తాను వినుము.

నారదమునీ! పూర్వం గజేంద్రుడు మొసలిచే పట్టువడి దుఃఖించాడు. వేయి సంవత్సరాలు దానితో పోరాడి రక్షణకై మొరపెట్టుకొన్నాడు. హరి తప్ప తక్కిన దేవతలు విశ్వమయులు కారు. కాన అతని ఆపద మాన్పలేకపోయారు. అప్పుడా గజరాజు “శ్రీహరీ! నీవే నాకు శరణం” అంటూ శ్రీహరికి శరణాగతుడయ్యాడు. అతని ఆక్రందనం విని శ్రీహరి వెనువెంటనే ఆదిమూల (వైకుంఠ) రూపంలో వచ్చి పరమోత్సాహంతో మకరిని హతమార్చి కరిని కాపాడాడు.

ఇక వామనావతారం వివరిస్తాను, విను.

యజ్ఞాల కధిపతియెన విష్ణుదేవుడు అదితి సంతానంలో చిన్నవాడు. ఐనా ఉత్తమ గుణాలలో అందరికంటే జ్యేష్టుడై వెలుగొందాడు. ఆయన వామనాకారంతో బలిచక్రవర్తి చెంతకు వచ్చి అతని నేలలో మూడడుగులనేల యాచించి పుచ్చుకొన్నాడు. ఆ మూడడుగులతో ముల్లోకాలనూ ఆక్రమించాడు. వంచనతో అతని రాజమపహరించాడు. తాను సర్వేశ్వరుడైయుండి కూడా ఇంద్రుడికి రాజ్యం అప్పగించడానికై వంచనతో బలిని యాచించవలసివచ్చింది. వత్సా! బలిచక్రవర్తివంటి ధర్మాత్ముల సొమ్మును వినయంగా వెళ్ళి ఉచితపద్ధతిలో గ్రహించాలి. అంతేకాని అవివేకంతో పోట్లాడి ఆక్రమించరాదు- ఇది నిశ్చయం.

గొప్ప దాత అయిన బలిచక్రవర్తి ఆ బ్రహ్మచారి వామనుని పాదపద్మాలు కడిగిన పవిత్ర తీర్ధాన్ని ఔత్సుక్యంతో తలపై చల్లుకొన్నాడు. తనతో కూడ మూడు లోకాలనూ నారాయణునికి, ధారాదత్తం కావించాడు. విశ్వమంతటా శాశ్వతమైన కీర్తిని నిలుపుకొన్నాడు. ఆ దానం వల్ల దేవలోకాధిపత్యం పోతుందని జంకలేదు. తనకు హాని జరుగుతుందని శుక్రాచార్యుడు చెప్పినా వినలేదు.

నారదా! అంతేకాదు. ఆ పరమాత్ముడు హంసావతారం దాల్చాడు. అతిశయమైన నీభక్తియోగానికి మెచ్చాడు. నీకు ఆత్మతత్త్వం తెలిపే భాగవతమనే మహాపురాణం ఉపదేశించాడు. మనువుగా అవతరించి తన తేజోమహిమతో ఆమోఘమైన చక్రం చే బూని దుష్టులగు రాజులను దండించాడు. శిష్టులను రక్షించాడు. తనకీర్తి చంద్రికలు సత్యలోకంలో వెలిగేటట్లు చేశాడు.

ఆపై ధన్వంతరి రూపం ధరించాడు. తన నామస్మరణతోనే భూలోకంలోని ప్రజలకు రోగాలన్నీ తొలగిస్తూ ఆయుర్వేదం కల్పించాడు. ఇక పరశురామావతారం ఎలా వచ్చిందో చెబుతాను, విను.

మునీంద్రులలో అగ్రగణ్యుడవైన నారదా! పూర్వం హైహయవంశజులైన నృపులు లోకవిరోధులై దురుసుగా ప్రవర్తించారు. వారిని శిక్షించడానికి శ్రీమన్నారాయణుడు పరశురాముడుగా అవతరించాడు. రణరంగంలో ఇరవైయొక్క పర్యాయాలు ఆ రాజబృందాన్ని దారుణమైన తన గండ్ర గొడ్డలితో చెండాడినాడు. బ్రాహ్మణులు ప్రార్థించేసరికి భూమండలమంతా వారికి దానం చేశాడు. జమదగ్ని సుతుడైన ఆ పరశురాముడు అలా శాశ్వతకీర్తి పొందాడు.

ఇక శ్రీరాముని అవతారాన్ని చెబుతాను, విను.

చక్రధారియైన శ్రీమహావిష్ణువు లోకోపకారం చేయడానికి జగదభిరాముడైన శ్రీరాముడుగా అవతరించాడు. ఆయన సూర్యవంశమనే క్షీరసాగరానికి పున్నమనాటి చంద్రుడు. కౌసల్యాదేవి గర్భమనే ముత్తెపు చిప్పలో జన్మించిన మంచిముత్యం. తన భక్తుల శోకమనే చిమ్మచీకట్లను పోకార్చే సూర్యుడు. దశరథుని పుత్రకామేష్టి యాగశాల ముంగిట మొలకెత్తిన కల్పతరువు. కర్కశులైన దానవులనే కారడవులను దహించే కార్చిర్చు. రావణుని గర్వమనే పర్వతాన్ని బ్రద్దలు చేసే ఇంద్రుడు.

ఆ శ్రీరాముడు భరత లక్ష్మణ శత్రుఘ్నులనే సోదరులకు అగ్రజుడై జన్మించాడు, ఆ పవిత్రచరిత్రుడు పాపాలనే తీగలను తెగనరికే కొడవలిగా లోకంలో విలసిల్లాడు. ఆపై శ్రీరాముడు శివునిధనుర్భంగం ఓలి కాగా జనకుని కూతురు సీతాదేవిని చేపట్టాడు. ఆ దేవిపాదాలు చివుళ్లవంటివి, ఫాలం అర్ధచంద్రుని వంటిది, భుజాలు తామరతూండ్ల వంటివి, దంతాలు మొల్లల వంటివి, చేతులు పద్మాల వంటివి, కనులు కలువల వంటివి, పిక్కలు కాహళాల వంటివి, తొడలు కరభాల వంటివి, కుచాలు చక్రవాకాల వంటివి, నడుము ఆకసం వంటిది, పిరుదులు ఇసుకతిన్నెల వంటివి, కంఠం శంఖంవంటిది, చెక్కిళ్లు అద్దాలవంటివి, శరీరగంధం చందనంవంటిది, పెదవి దొండపండు వంటిది, పలుకు చిలుకపలుకువంటిది, గమనం గజగమనం వంటిది, చెవులు శ్రీకారాల వంటివి, ముక్కుసంపెంగ వంటిది, ముఖం చంద్రునివంటిది, శరీరం బంగారు వంటిది, నేత్రాలు చేపలవంటివి, కనుబొమలు ధనుస్సు వంటివి. తలవెండ్రుకలు నీలాల వంటివి, ముంగురులు తుమ్మెదల వంటివి, నవ్వు అమృతం వంటిది, బొడ్డు సుడి వంటిది.

ఆ తర్వాత, నీలిమబ్బువలె నల్లనైనవాడూ, సద్గుణాకరుడూ, ఐశ్వర్యంలో ఇంద్రతుల్యుడూ, దుష్టరాక్షసులను దునుమాడేవాడూ అయిన రామచంద్రుణ్ణి తండ్రి దశరథుడు అడవులకు పొమ్మన్నాడు.

ఈ విధంగా దశరథుడు శ్రీరాముణ్లి అడవులకు పంపగా, అడవులకు వెళ్తున్న రాముణ్ణి లక్ష్మణుడు, సీత అనుగమించారు. రఘువంశ శ్రేష్టుడైన రాముడు సివంగులూ, సింహాలూ, అడవిపందులూ, ఏనుగులూ, పులులూ, కోతులూ, ఖడ్గమృగాలూ, జింకలూ, తోడేళ్ళూ, పాములూ, ఎలుగుబంట్లూ, అడవిదున్నలూ మున్నగు అడవి మృగాలతో మిక్కిలి భయంకరమైన దండకారణ్యంలో సంతోషంతో ప్రవేశించాడు.

నరులను పావనులను గావించే నీతిలో నిపుణుడూ (నృప+అవననయశాలి= రాజరక్షణ నీతిశాలీ), దయాసాగరుడూ అయిన శ్రీరాముడు ఆ మహారణ్యంలో నివసించాడు. అక్కడ ఉన్న లోకపావనులైన మునిగణాలకు అభయప్రదానం చేశాడు.

సూర్యవంశమనే సముద్రానికి చంద్రునివంటివాడగు శ్రీరాముడు జనులందరూ ఆశ్చర్యపడగా కోపంతో మిక్కిలి భీకరమగు బాణాలు ప్రయోగించి ఖరుడనే రాక్షసుణ్ణి వధించాడు.

సింహంవంటి విక్రమంగల శ్రీరాముడు సూర్యునిపుత్రుడైన సుగ్రీవుణ్ణి అనుచరుడుగా గ్రహించాడు. ఇంద్రుని పుత్రుడగు వాలిని నేలగూల్చి యమపురికంపాడు. వానరరాజగు సుగ్రీవునికి సింహమధ్యఅగు రుమనూ, కిష్మింధారాజ్యాన్ని అప్పగించాడు.

పిమ్మట శ్రీరాముడు సీతకొరకై మూడులోకాలకూ విరోధియైన రావణుణ్ణి సంహరింపదలంచాడు. వానరసేనను వెంటబెట్టుకొని లంకవైపు పయనించి దక్షిణ సాగరతీరం చేరాడు. దాటవీలుగాని ఆ సాగరం బాట చూపనందున ఆగ్రహించాడు.

అంత ఆ మహావీరుడైన రాముడు నొసట కనుబొమలు ముడివడగా కోపంతో ఎర్రబడిన కనులతో ఆ సముద్రం వైపు చూచాడు. అలా చూడగానే సముద్రం-కాగిననీరూ, మొసళ్ళూ, తిమింగిలాలూ, నీటి కాకులూ, (ఆడు) తాబేళ్లూ, పాములూ, పవడపుతీగలూ, అలలూ, కొంగలూ, నీటికోళ్ళూ, చక్రవాక పక్షులూ, మున్నగు జలజంతువులతో సైతం తుకతుక ఉడికేసరికి ఇంకిపోయింది.

అప్పుడు సముద్రుడు దయాసాగరుడైన శ్రీరామచంద్రునికి శరణాగతుడయ్యాడు. రాము డతనిపై కరుణించాడు. యథాప్రకారం ఉండవలసినదిగా సముద్రుణ్జి అనుగ్రహించాడు. నలుడనే వానరప్రముఖునిచే వంతెన కట్టించాడు. ఆ మార్గంలో పయనించాదడు.

పూర్వం శంకరుడు ఒకే బాణంతో త్రిపురాలను దగ్ధం చేశాడు, అదే రీతిలో రాముడు పెద్దపెద్ద గోపురాలూ, మందిర ప్రాంగణాలూ, ప్రాసాదాలూ, రాజగృహాలూ, వీథులూ, తలుపులూ, రథాలూ, గుర్రాలూ, ఏనుగులూ, ఆయుధాగారాలూ, రాక్షసులతో సహా లంకానగరాన్ని చిటికలో భస్మం కావించాడు.

ఐరావతంవలె తెల్లనైన యశస్సుతో ప్రకాశించిన శ్రీరాముడు సమస్తలోకాలనూ బాధిస్తున్న రావణుని హతమార్చినాడు. అతని తమ్ముడైన విభీషణుణ్ణి ప్రీతితో లంకానగరానికి రాజుగా ప్రతిష్టించాడు.

ఆ రాముడు ధర్మరక్షకుడన్న మహిమగలిగి యుండికూడా ధర్మవిధ్వంసకుడై ప్రకాశించాడు, అనగా శివధనుర్భంగం చేశాడని భావం, ఖరదండనలో ఆభిముఖ్యంలేనివాడైనా ఖరదండనలో అభీముఖుడయ్యాడు. అంటే కఠిన శిక్షలు విధించడానికి విముఖుడైన రాముడు ఖరుడనే రాక్షసుణ్ణి దండించడానికి సుముఖుడయ్యాడు. పుణ్యజనరక్షకుడై కూడా పుణ్యజనులను వధించాడు, అనగా పుణ్యాత్ములను రక్షించి రక్కసులను శిక్షించినాడని భావం. (పుణ్యజన శబ్దానికి రాక్షసుడనే అర్ధం కలదు) ఆశ్రిత విభీషణుడు కాకున్నా ఆశ్రిత విభీషణుడయ్యాడు, అనగా ఆశ్రయించినవారిపట్ల భయంకరుడు కాడు, విభీషణునికి ఆశ్రయమిచ్చినవాడని తాత్పర్యం. మరియు రాముడు తన విస్తృత యశస్సును దశదిశలా వ్యాప్తం కావించి ప్రసిద్ధి వహించాడు. మహాసుందరుడూ, మహారాజులలో మేటీ, సుగుణాభిరాముడూ అయిన ఆ దశరథరాముణ్ణి కీర్తించడానికి లోకంలో ఎవరికీ సాధ్యం కాదు.

అటువంటి శ్రీరామచంద్రుని అవతారం లోకపావనమై మనబోటివారి ననుగ్రహించింది. ఇక కృష్ణావతారాన్ని వర్ణిస్తాను, విను.

మునివర్యుడవగు నారదా! రాక్షసాంశలతో పుట్టిన పెక్కుమంది రాజులు తమ అపార సేనాబలంతో అధర్మమార్గంలో ప్రవర్తించారు. భూదేవికి నానాబాధలు కల్గించారు. ఆమె దుఃఖిస్తూ హరితో మొరపెట్టుకొన్నది. పరాత్పరుడైన శ్రీమన్నారాయణుడు అపుడు మదోన్మత్తులైన దానవులను సంహరించి భూభారం తొలగించాలనుకొన్నాడు. యదువంశంలో వాసికెక్కిన వసుదేవునకు రోహిణి, దేవకి అనే భార్యలయందు తన తెల్లని కేశంతో బలరాముడుగానూ, నల్లని కేశంతో శ్రీకృష్ణుడుగానూ ఆ దేవుడు అవతరించాడు.

ఈ విధంగా పద్మాక్షుడైన శ్రీమన్నారాయణుడు భూభారమంతా నివారించడానికి తన రెండు వెండ్రుకలే చాలనుకున్నాడు. తన ప్రభావం తెలపడానికి తన అంశంలో పుట్టిన రామకృష్ణుల శరీరకాంతులు తెలుపునలుపులుగా చేశాడు. ధవళమూ, నీలమూ అయిన రెండు వెండ్రుకల నెపంతో రాముడు, కృష్ణుడు అను పేర్లతో అవతరించాడు. వారిలో షడ్గుణైశ్వర్య సంపన్నుడూ, సాక్షాద్విష్టుస్వరూపుడూ అయిన కృష్ణుడు ఇతర జనులు నడిచిన మార్గంలో నడిచినా మానవాతీతమైన కార్యాలెన్నో చేశాడు. అందువల్ల పరమేశ్వరుడుగానే ప్రసిద్ధి చెందాడు. ఆ మహనీయుడొనర్చిన కార్యాలు గణించడం ఎవరికీ సాధ్యం కాదు. అయినా నాకు తెలిసినంతవరకూ తెలుపుతాను, విను.

శ్రీకృష్ణుడు పురిటింట్లో పొత్తుల బిడ్డగావున్న సమయంలో పూతన అను రాకాసి చన్నులలో విషం నింపుకొని పాలివ్వడానికి వచ్చింది. దానిని గ్రహించి కృష్ణుడు పాలతోపాటు దాని ప్రాణాలు కూడా తాగి దాన్ని యమలోకాని కంపాడు.

భక్తలోకపాలకుడైన కృష్ణుడు మూడు నెలల ప్రాయంలో ఉన్నపుడే శకట రూపంలో ఒక దనుజుడు తన్ను పరిమార్చటానికి రాగా, అతణ్ణి తన కాలితన్నుతో యముని సమీపానికి పంపాడు.

కృష్ణుడు అల్లరి పనులు చేస్తున్నాడని గోపికలు యశోద వద్ద గోలపెట్టారు. యశోద అతని అల్లరిపనులు మాన్పించాలని తాడుతో రోటికి బంధించింది. వెంటనే ఆ బాలుడు పంతానికి రోలీడ్చుకుంటూ పోయి ఆకసమంటే జంట మద్దులను నేలగూల్చాడు. అప్పుడక్కడి జనులందరూ కృష్ణుణ్ణి కీర్తించారు.

నలకూబర మణిగ్రీవులు అనే ఇద్దరు గంధర్వులు శాపంవల్ల మద్దిచెట్లుగా రూపొందారు. బాలకృష్ణుడు ఆ చెట్లను నేలగూల్చి వారిని శాపవిముక్తులను గావించాడు.

యోగివర్వా! ఎన్నో అద్భుతకార్యాలు బాల్యంలోనే చేసిన కృష్ణుడు యశోద కొడుకని నేను నమ్మలేను. ఒకనాడతడు ఆ తల్లికి సమస్త చరాచర ప్రాణులూ, అడవులూ, నదినదాలూ, కొండలూ, సాగరాలూ వీటితో కూడిన వివిధ జగజ్జాలాన్ని అపూర్వప్రక్రియతో తన నోట చూపినాడు. అది చూచి తల్లి ఆశ్చర్యపడింది.

నదులు - పశ్చిమానపుట్టి తూర్పు సముద్రంలో కలిసేవి. నదములు - తూర్పునపుట్టి పశ్చిమ సముద్రంలో కలిసేవి.

యమునానదిలోని మడుగులో కాళియుడనే సర్పరాజు నివసించేవాడు. అతని నాల్కలు రెండూ భయంకరమైన విషంతో నిండియుండేవి. అతడు క్రక్కిన విషం కలిసిన నీరు త్రాగిన ప్రజలు ప్రాణాలు కోల్పోయేవారు. ఇలా ఉండగా యదుకులతిలకుడగు కృష్ణుడు కాళియుణ్జి ఆ హ్రదంనుండి వెడలగొట్టి గోపాలురనూ, గోవులనూ రక్షించాడు.

కుమారా! అది ఒకనాటిరాత్రి సమయం. గోపాలురందరూ నీద్రిస్తున్నారు. ఇంతలో అమాంతంగా కార్చిచ్చు వారిని చుట్టుముట్టింది "కృష్ణా! మంటల్లో చిక్కుకొన్నాం. మమ్మల్ని కాపాడు" అంటూ వాళ్లు తనను వేడుకొన్నారు. అప్పుడు పద్మాక్షుడు "మీరంతా కళ్ళు మూసుకోండి. ఇదిగో క్షణంలో నే నా కార్చిచ్చు నార్పుతాను" అని చెప్పాడు. వారట్లె చేశారు. కృష్ణుడు అలవోకగా ఆ దావాగ్నిని కబళించివేశాడు.

ఒకనాటి అర్ధరాత్రివేళ నందుడు ముందు వెనుకల చూడకుండా యమునానదిలో స్నానం చేస్తూ మునిగిపోయాడు. అక్కడ వరుణుని పాశాలలో చిక్కుకొన్నాడు. అప్పుడు దయామయుడైన కృష్ణుడు అతణ్ణి ఆ పాశబంధంనుండి విడిపించాడు.

మునీంద్రా! మయాసురుని పుత్రుడైన వ్యోమాసురుడనేవాడు ఒకసారి తన మాయా ప్రభావంతో కృష్ణుని అనుచరులైన గోపకులనందరినీ ఒక గుహలో ప్రవేశించునట్లు చేశాడు. గుహలోనికి రాకపోకలు సాగించే దారిని మూసివేశాడు. వెంటనే మహావేగంతో శ్రీకృష్ణుడు ఆ కుటిల రాక్షసుణ్ణి పోరాటంలో హతమార్చి గోపాలకుల నందరినీ దయతో కాపాడాడు. అట్టి కృష్ణుని మహామహిమ ఇంతింతని చెప్ప వీలగునా? కాదని భావం.

గోపాలకులు గోకులంలో ప్రతిసంవత్సరం ఇంద్రుడికి ప్రీతిగా యాగం చేసేవారు. ఆ యాగం, చేయవద్దని కృష్ణుడు వారికి బోధించాడు. గోపకులు కృష్ణుని మాట విని యాగం నిలిపివేశారు. ఇంద్రుడు కోపోద్దీపితుడయ్యాడు.

అప్పుడు వ్రేపల్లె కలతపడునట్లుగా "అతివృష్టి కురియించండి" అని ఇంద్రుడు మేఘాలను పురికొల్పాడు. అంతట ప్రచండమైన వేగానికి పైకెగిరి ప్రళయకాలంలోని సంవర్తకాలవంటి మేఘాలు భీకరంగా వ్యాపించాయి.

ఇంద్రుని ఆదేశంతో వాన ప్రారంభమయింది. అగ్ని జ్వాలల్లాగా మిరుమిట్లు గొలిపే మెరుపులతో, ఆ వర్షం అంతకంతకూ భయంకరమయింది. చీకట్లు దట్టంగా వ్యాపించాయి. సూర్యచంద్రమండలాలతో సహా ఆకాశాన్ని కప్పివేసిన కారుమబ్బులు దిగంతరాలకు వ్యాపించాయి. ధారాళంగానూ, కుండపోతగానూ వర్షం కురియసాగింది.

సప్తస్కంధ - కాళి, కరాళి, విస్ఫులింగిని, ధూమ్రవర్ణ, విశ్వరుచి, లోహిత, మనోజవ - అనే పేర్లుగల అగ్నిదేవుని నాలుకలు.

విడుపు లేకుండా పెద్దవాన కురిసింది. ఆ తాకిడికి గోకులమంతా వ్యాకులమై పోయింది. జనులందరూ మతిభ్రమకు లోనై మూర్చిల్లారు. అలా కలతజెంది బాధతో "కృష్ణా! కృష్ణా! కాపాడు. రక్షించవయ్యా" అంటూ మొరపెట్టుకొన్నారు. ఆ మొర విని అనంత దయాసముద్రుడూ, భక్తజనుల పాలిటి కల్పవృక్షమూ అయిన ఆ పద్నాక్షుడు, ఏడేండ్ల బాలుడైన కృష్ణుడు తన భుజస్తంభం పై అవలీలగా ఏడుదినాలపాటు గోవర్ధనగిరిని గొడుగులాగా అద్భుతంగా ఎత్తి పట్టుకొని, గోవులకు, గోపాలకులకు అందరికీ ప్రాణరక్షణ చేశాడు. ఏడు సముద్రాలచే ఆవరింపబడిన భూమినే ధరించిన భగవంతుడు ఈ కొండను ఎత్తడం ఏమాశ్చర్యం?

అది ఒక శరత్కాలపు రాత్రి. పండువెన్నెలలో బృందావన వీథులన్నీ తెల్లగా కనిపిస్తున్నాయి. విరబూచిన తామరలవంటి నేత్రాలు గల కృష్ణుడు ఆ వనంలో రాసకేళికి ఉపక్రమించాడు. ఆ క్రీడోల్లాసంతో పిల్లనగ్రోవి చేతపట్టాడు. దాని రంధ్రాలపై వ్రేళ్ళూని ఇంపుగా వివిధరాగాలను ఆలపించాడు. వాటిలో మంద్రస్థాయినీ, మధ్యమ
స్థాయినీ, తారస్థాయినీ వినిపించాడు. దైవతం, ఋషభం, గాంధారం, నిషాదం, పంచమం, షడ్జం, మధ్యమం అనే ఏడు స్వరాలు, కళలూ, జాతులూ, ఆరోహణావరోహణక్రమమూ తేటపడే విధంగా అవ్యక్త మధురంగా గానం చేశాడు. ఆ గానానికి మ్రోళ్ళు చివురించాయి.

శ్రీకృష్ణుని వేణువునుండి వెలువడిన మధురధ్వని విని గోపికలు పరుగెత్తుకొని వచ్చారు. అప్పుడు కుబేరుని అను యాయి యగు శంఖచూడుడనే గంధర్వుడు వాళ్ళను ఎత్తుకు పోయాడు. వాళ్ళు కృష్ణా, కృష్ణా, అంటూ మొరపెట్టుకొన్నారు. అది విని మాధవుడు వెంటనే ఆ శంఖచూడుని భుజదర్పం పోకార్చి ఆ సుందరీమణులను రక్షించాడు. అట్టి శ్రీకృష్ణుని నుతించడం ఎవరికీ సాధ్యంకాని పని.

ఆ శ్రీకృష్ణుడు నరకాసుడు, మురాసుడు, ప్రలంబుడు, కాలయవనుడు, కువలయాపీడమను ఏనుగు, ముష్టికుడు (చాణూరుడు) మొదలైన మల్లురు, కంసుడు, శంబరుడు, శిశుపాలుడు, పంచజనుడు, పౌండ్రక వాసుదేవుడు, పల్వలుడు, దంతవక్త్రుడు, ద్వివిదుడనే వానరుడు, గర్దభాసురుడు, సాల్వుడు, వత్సాసురుడు, బకాసురుడు, విదూరథుడు, రుక్మి, కేశి, దర్దురుడు, వృషభాకారాలు గల ఏడుగురు దనుజులు, ధేనుకుడు మొదలైన దుష్టులైన పెక్కుమంది రక్కసులను చిటికలో రూపుమాపినాడు.

అంతేకాక బలరాముడు, భీముడు, అర్జునుడు, మున్నగు ధనుర్ధారుల రూపాల వ్యాజంతో అవతరించి క్రూరస్వభావులూ, నీచులూ, దుష్టులూ, అయిన రాజులను యుద్ధమనే భుజబలక్రీడలో రూపుమాపి ఆ భగవంతుడు సమస్త ధరణీభారాన్ని తొలగించాడు. సజ్జనులను కాపాడినాడు. అట్టి అనంతుడైన కృష్ణ పరమాత్మను నేను సదా ఆరాధిస్తాను.

లోకోత్తరుడైన శ్రీకృష్ణభగవానుని అవతార ప్రభావం వివరించాను. ఇంక వ్యాసుని అవతారాన్ని వివరిస్తాను. శ్రద్ధగా విను. 

ప్రతియుగంలోనూ అల్పబుద్ధులూ, అల్పాయుష్కులూ, దుర్గతి పొందేవారూ అయిన మానవులుంటారు. వారికి భగవంతుడు కల్పించినవీ, శాశ్వతమైనవీ అయిన వేదాలు గోచరించవు. అట్టివారిని అనుగ్రహించాలన్న బుద్ధితో శ్రీహరి సజ్జనస్తుతి పాత్రుడై పరాశర మహర్షికి ప్రియపుత్రుడైన వేదవ్యాసుడుగా అవతరించి వేదవృక్షాన్ని శాఖలుగా విభజించాడు.

ఇంకా బుద్దుని అవతారం వివరిస్తాను, వినుము. చపలస్వభావులూ, అసత్యప్రవర్తనులూ, భేదాచారపరులూ, అధార్మికులూ, పాషండమతానుయాయులూ అయిన దితిపుత్రులు లోకాన్ని చంపుకు తినేవారు. పద్మలోచనుడు బుద్ధుడుగా అవతరించి ఆ రక్కసులను వారి దురాచారాలతో కూడ నిర్మూలించాడు.

ఇక కల్కి అవతారాన్ని గూర్చి వివరిస్తాను, విను. కలికాలంలో విప్రులు భగవంతుణ్ణి ప్రార్ధించరు, వేదవిహితమైన యజ్ఞ యాగాది కర్మలు చేయరు. వారినోటినుండి 'వషట్‌, స్వాహా, స్వధా' అనే యజ్ఞయాగాదుల్లో ఉచ్చరించే మాటలు వినిపించవు. వాళ్ళు సత్యం పాటించరు. నాస్తికులై వేదవిరుద్ధంగా ప్రవర్తిస్తారు. శూద్రులు రాజులవుతారు. ఇట్టి స్థితి సంభవించినప్పుడు భగవానుడు కల్కి రూపంతో అవతరిస్తాడు. అధర్మం తొలగిస్తాడు, ఇలలో ధర్మం స్థాపిస్తాడు.

ఇలా చెప్పి బ్రహ్మ మళ్ళీ నారదునితో ఈ విధంగా అన్నాడు. మునిఃశ్రేష్ఠా! శ్రీమన్నారాయణుడు స్వీకరించిన లీలావతార కథావిశేషాలు నే నిప్పుడు నీకు చెప్పాను. ఇంతకుముందే శ్రీహరి ఆదివరాహం మొదలైన అవతారాలు స్వీకరించి చేయవలసిన పనులన్నీ చేశాడు. మన్వంతర సంబంధమైన అవతారాలు ఇంతవరకూ జరిగినవీ ఉన్నాయి. ఇక జరగబోయేవీ ఉన్నాయి. వర్తమానకాలంలో ఆయన ధన్వంతరి, పరశురామావతారాలను ధరించివున్నాడు. భవిష్యత్తులో శ్రీరాముడు మొదలైన అవతారాలు ధరిస్తాడు. ఆ మహాత్ముడు సృష్టి మొదలైన వివిధ కార్యాలు నెరవేర్చడానికి మాయాగుణంతో నిండిన అవతారాలు స్వీకరిస్తాడు.

అనేక శక్తులతో కూడిన ఆ భగవంతుడు సృష్ట్యాదిలో తపస్సుగా, నేనుగా, ఋషులుగా, తొమ్మిదిమంది ప్రజాపతులుగా అవతరించి లోకాన్ని సృష్టిస్తూ వుంటాడు. ధర్మం, విష్ణువు, యజ్ఞాలు, మనువులు, ఇంద్రుడు మొదలైన దేవతల రూపాలతో, రాజుల రూపాలతో అవతరించి లోకాలను రక్షిస్తూ వుంటాడు. అధర్మం, రుద్రుడు, భీకరసర్పాలు, రాకాసిమూకలుగా అవతరించి విశ్వాన్ని సంహరిస్తూ వుంటాడు.

పరమేశ్వరుడూ, సర్వస్వరూపుడూ అయిన శ్రీహరి ఈ విధంగా ఈ విశాల విశ్వసృష్టికీ, స్థితికీ, లయానికీ హేతువై ప్రకాశిస్తాడు. భూమిలోని ధూళికణాలనయినా లెక్కపెట్ట వచ్చుగాని భగవంతుని లీలావతారాలలోని అద్భుతకృత్యాలను లెక్కపెట్టడం ఎవ్వరికీ అలవి కాదు. నీకు సంగ్రహంగా చెప్పాను. సవిస్తరంగా చెప్పడం నాకే సాధ్యం కాదు. ఇక ఇతరుల మాట చెప్పడమెందుకు? ఇంకా విను.

ఆ పరమాత్ముడు త్రివిక్రమావతారం దాల్పాడు. ఆయన పాదాల విసురుకు మూడు లోకాలూ తల్లడిల్లాయి. అంతే కాదు. ఆ ముల్లోకాలకు ఆవల వెలుగొందే సత్యలోకం గూడా చలించింది. అప్పుడు ఆ దేవుడు దయతో ఆ లోకాన్ని ముప్పునుండి తప్పించి రక్షించాడు. అట్టి పరమేశ్వరుని పాదాగ్రాన ఉండే శక్తి ఇట్టిదని వర్ణించడం ఎవరికీ వీలుగాదు.

శ్రీహరి మాయాశక్తిని నేనే తెలుసుకోలేకున్నాను. ఇక సనందుడు, సనకుడూ, సనత్కుమారుడు, సనత్సుజాతుడు మొదలైన సజ్జనులకు మాత్రం తెలుసుకోవడానికి వీలు కాగలదా? ఇతరమైన ఆలోచనలన్నీ మాని సదా బుద్దిని భగవత్సేవయందే నిల్పినవాడు ఆదిశేషుడు వేయినోళ్ళతో ఆ పరమేశ్వరుని చరిత్రను అనురక్తుడై కీర్తిస్తూ ఉంటాడు. అట్టి శేషుడు సైతం ఆయన మాయామహిమ ఎట్టిదో తెలియజాలడు. ఇక ఇతరులను గూర్చి చెప్పడమెందుకు?

ఎవరు ఇతర చింతలుమాని సదా శ్రీహరినే దృఢంగా నమ్మి సేవిస్తారో వారిని, భక్తులు ఆశ్రయించే పాదపద్మాలు కలిగిన కమలనాభుడు మిక్కిలి దయతో కల్లాకపటం లేని చిత్తంతో అనుగ్రహిస్తాడు. అలా భగవంతుని కృపకు పాత్రులైనవారు మాత్రమే సాటిలేని, అంతంలేని, దాటరాని మాయనుండి సులభంగా తరించగలరు.

ఇంతేకాదు. ఇంక కొందరు పుణ్యాత్ములున్నారు. వారిని గురించి చెబుతాను, విను. వాళ్ళు సంసారంలో మునిగి తేలుతూ దినాలు గడపినా చివరలో కుక్కలూ, నక్కలూ పీక్కొనితినే ఈ శరీరాలపై మమకారం పెట్టుకోలేదు. తమ దేహాలను పూర్తిగా భగవంతునికే అర్పించారు. నేను బ్రహ్మను గదా అన్న గర్వంతో ఒక్కొక్కసారి రజోగుణం నన్ను పైకొంటుంది. ఆ సందర్భంలో నే నా మహాత్ముని తత్త్వం ఇట్టిదని గ్రహింపలేను. రజోగుణం వదలి భక్తి యుక్తుడనై ఆ దేవుని పాదపద్మాలను శరణాగతి భావంతో సేవించినప్పుడు మాత్రమే ఆ భగవానుని మహిమను తెలుసుకో గల్గుతున్నాను. అందుచేతనే శాస్త్రాలను పరిశీలిస్తూ వాటిపై ఆధారపడక భక్తిజ్ఞానయోగాలతో మాత్రమే నేనా పరమాత్మను సేవిస్తాను.

నేనే కాదు, సనకుడు, సనందనుడూ, సనత్కుమారుడూ, సనత్సుజాతుడు నీవు మొదలైన వాళ్ళూ భగవంతుడైన శివుడూ, దైత్యులను పాలించే ప్రహ్లాదుడూ, స్వాయంభువుడనే మనువూ, అతని భార్య శతరూప, వారి కుమారులైన ప్రియవ్రతుడూ, ఉత్తానపాదుడూ, ప్రాచీనబర్హి అనే రాజేంద్రుడు, ఋభువు అనే మహర్షీ వేనుని తండ్రియగు అంగుడు, ఉత్తానపాదుని కుమారుడైన ధ్రువుడూ-వీరంతా భగవంతుని మాయను దాటగల్గినవారే. మరియును.

గాధి, గయుడు మున్నగువారు, ఇక్ష్వాకువూ, దిలీపుడు, మాంధాత, భీష్ముడు, యయాతి, సగరుడు, రఘుమహారాజు, ముచుకుందుడు, ఐలుడు, రంతిదేవుడు, ఉద్ధవుడు, సారస్వతుడు, ఉదంకుడు, భూరిషేణుడు, శ్రుతదేవుడు, హనుమంతుడు, శతధన్వుడు, పిప్పలుడు, బలిచక్రవర్తి, తడు, శిబిచక్రవర్తి, అర్జునుడు, విదురుడు, అంబరీషుడు, పరాశరమహర్షి అలర్కమహారాజు, దేవలుడు, సాభరి, జనకుడు, అభిమన్యుడు, ఆర్ష్ణిషేణుడు మున్నగు నిర్మల చిత్తులైన మహనీయులందరూ అనురక్తులై భక్తితో ఆ భగవానుని తమ మనస్సుల్లో నిలిపారు. ఆయనే గతి అని సేవించారు. అందుచేతనే దాట శక్యంగాని విష్ణమాయను తరించ గలిగారు.

పాపరహితుడైన నారదా! సహజంగా పవిత్రాత్ములైన పై జెప్పినవారిని గూర్చి పేర్కొనబనిలేదు. పశువులైనా, పక్షులైనా, రాక్షసులైనా, అడవిలో బ్రదుకువారైనా, పాపజీవనులైనా, స్త్రీలైనా, శూద్రులైనా, హూణులు మున్నగువారైనా, ఎవరైనా సరే ఆ శ్రీమన్నారాయణుని మీది భక్తియోగంతో అఖండమైన ఆత్మానందం పొందినవారైతే చాలు, తప్పక ఆ దేవుని మాయావైభవమనే సాగరాన్ని సులభంగా దాటుతారు.

అందుచేత మునీంద్రా! ఎల్లవేళలా ప్రశాంతుడైనవాడు, భయరహితుడు, విశ్వమయుడు, కేవలజ్ఞానస్వరూపుడు, సర్వేశ్వరుడు, శుద్దాత్ముడు, శాశ్వతుడు, సముడు, సత్తు, అసత్తులకు అతీతుడు, అయిన పరమేశ్వరుణ్ణి సదా నీ చిత్తంలో ప్రతిష్టించుకో.

ఎవరు పరమాత్మను చిత్తంలో ప్రతిష్టించుకొంటారో, అట్టి సచ్చరిత్రులూ, పుణ్యాత్ములూ, అయిన మహనీయుల చెంతకు పోలేక అవిద్య సిగ్గుతో తలవంచుకొని పెడమొగమై దూరదూరాలకు తొలగిపోతుంది. ఇంతే కాదు.

పరమాత్ముడూ, చ్యుతిలేనివాడు, తుదిలేనివాడు, అయిన శ్రీహరిని మనస్సులో స్థిరంగా భావించినవాళ్ళు శోకంలేని సుఖస్థితిని పొందుతారు. అట్టి బుద్ధిమంతులు భగవంతుని స్మరణ తప్ప ఇతరకార్యాలు ఏమరుపాటున గూడా చేయరు. ఆలోచించి చూస్తే, అది అంతే. వర్షం కురిపించే ఇంద్రుడు దప్పిగొని నీళ్ళకై బావి త్రవ్వుతాడా?

ఆ దేవుడు అందరికీ అన్ని ఫలాలూ ప్రసాదించేవాడు. అందరికీ శరణు పొందదగినవాడు. అన్ని శక్తులూ కలవాడు. లోకాలన్నిటా ప్రసిద్దుడు. అంతటా వ్యాపించినవాడు, సుదర్శనమనే చక్రాయుధం ధరించిన పరబ్రహ్మస్వరూపుడగు ఆ దేవుడు తక్కిన ఈ సమస్త ప్రాణులూ చిక్కి స్రుక్కి శిథిలమై అంతరించిపోయిన కల్పాంతరంలో కూడా ఆకాశం లాగా తానొక్కడు మాత్రం చెక్కు చెదరకుండా నిర్వికారుడై నిలిచి ఉంటాడు.

తండ్రీ! అటు కారణాలకూ, ఇటు కార్యాలకూ అన్నింటికీ కారణభూతుడైనవాడు ఆ పద్మనేత్రుడే. ఆయనకంటే ఇతరు లెవరూ ఆశ్రయింప దగినవారు లేరు. షడ్గుణైశ్వర్య సంపన్నుడూ, అంతంలేనివాడూ, ప్రపంచ సృష్టికర్తా అయిన ఆ పరమేశ్వరుని సద్గుణ పుంజాలను ఉదాత్తమైన చిత్తంతో స్తుతించాలి. అలా చేయకుంటే ప్రకృతి కతీతమైన నిర్గుణ బ్రహ్మాన్ని మనస్సులు పొందజాలవు.

వత్సా! ఈ పురాణకథ వేదార్థాలను ప్రతిపాదించడం వల్ల ప్రశస్తమైనది. మోక్షప్రదంగా ఉండేటట్లు భగవంతుడు దీన్ని రచించాడు. ఇది భగవద్భక్తుల పాలిటి కల్పవృక్షం. శాస్త్రాలన్నింటిలోనూ శ్రేష్టమైనది. ఈ పురాణకథను నేను నీకు సంగ్రహంగా వివరించాను. నీవు దీన్ని లోకంలో విస్తృతంగా ప్రచారం కావించు.

జన్మలలో పురుషజన్మ చాలా అపురూపం. అందులోనూ విప్రకులంలో జన్మించడం మరీ అరుదు. అందుచేత మనుజులు అనిత్యమైన నిష్ప్రయోజన కార్యాలలో బడి దురవస్థలపాలు కాకుండా శ్రీహరిని సేవించి నిత్యమైన పరమపదం పొందడం ఉచితం కదా!

పద్మాక్షుడూ, అన్నిటినీ మించినవాడూ, లక్ష్మీకాంతుడూ, పాపనాశకుడూ, పరమేశ్వరుడూ, చ్యుతి లేనివాడూ అయిన శ్రీహరిని నిర్మలమైన భక్తితో ఆసక్తితో భజించాలి. అట్లు చేయకుండా ఉపవాసాలు, వ్రతాలు, శౌచాలు,శీలాలు, యాగాలు, సంధ్యోపాసనలూ, అగ్ని కార్యాలు, జపాలు, దానాలు, వేదాధ్యయనాలు- మున్నగు పనులెన్ని చేసినా మోక్షం లభించదు.

మునివర్యా! పద్మనేత్రుని మహిమను ఎల్లవేళలా స్తుతించాలి. ఇతరులు స్తుతిస్తూ ఉంటే వినాలి. మనస్సులో ఆ మహిమను మననం చేస్తూ సంతసించాలి. అలా చేసేవాళ్ళు ఆ దేవుని మాయకు లొంగరు.

ఇలా పూర్వం బ్రహ్మదేవుడు మునివర్యుడైన నారదునికి ముఖ్యకథను వివరించాడు. ఆ వృత్తాంతాన్ని యోగివర్యుడైన శుకుడు మిక్కిలి భక్తితో పరీక్షిన్మహారాజుకు నివేదించాడు.

పరీక్షితు౦డు శుకుని బ్రపంచోద్భవాదికంబు నడుగుట

Friday, February 13, 2026

Narada Asked Brahma About Universe - నారదుండు బ్రహ్మను బ్రపంచ ప్రకారంబు నడుగుట

నారదుండు బ్రహ్మను బ్రపంచ ప్రకారంబు నడుగుట

నారదముని బ్రహ్మను ఇలా ప్రశ్నించాడు.

ఓ తండ్రీ! నీవు చతుర్ముఖుడవు. సురలలో పెద్దవు. లోకాలకు సృష్టికర్తవు, ఈ వేదాలన్నీ నీ  ముఖపద్మాలలోనే విరాజిల్లుతున్నాయి. వాగర్థమయమైన ఈ విశ్వమంతా నీ అరచేతి ఉసిరికపండువలె నీకు తేటతెల్లమై ఉన్నది. పైగా సరస్వతీదేవి నీకు ఇల్లాలు. ఇదిగో, ఈ నా సందేహం తీర్చు.

సరస్వతీనాథా! ఈ జగత్తుయొక్క సృష్టిని ప్రారంభించడాని కవసరమైన విజ్ఞానాన్ని నీకు ఎవడిస్తున్నాడు? ఆ ప్రారంభ సంపదకు మూలమేమి? ఈ సృష్టి నిర్మాణానికి హేతువేమి? దీనివల్ల ఒనగూడే ప్రయోజనమేమి? దీని స్వరూపమెట్టిది? సాలెపురుగులాగా విశ్రాంతి లేకుండా ఎల్లప్పుడూ సంసార నిర్మాణక్రమాన్ని కొనసాగిస్తున్నా నీకు శ్రమలేకుండా ఉన్నది. నీ జీవనవిధానం అందరికీ అందేది కాదు.

నా మట్టుకు నేను నీవే ప్రభుడవని భావిస్తున్నాను. నిజానికి నీకంటే అధికుడైన ప్రభువు మరొకడున్నాడా? నీవే అంతటికీ ప్రభుడవా? అయితే ఏ ప్రయోజనం ఆశించి నీ వీలోకాలు సృష్టిస్తున్నావు? ఈ జీవసముదాయం ఎక్కడ ఉద్భవిస్తున్నది? ఎక్కడ ఉంటున్నది? ఎక్కడ చివరకు లయమవుతున్నది? నిజం చెప్పు దేవా!

సత్తు (పరమాత్మ) అసత్తు (మాయ)ల కలయిక వల్ల నామరూపగుణాలతో గూడి కనిపించే ఈ జగత్తు నీ హృదయానికి అధీనమైనదే కదా! నీ కంటె అధికులు, నీతో సమానులూ ఎవరూ లేరు. నీ స్థానం మిక్కిలి దొడ్డది. ఇట్టి నీవు ఏ పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి నేర్పుతో తప మొనర్చావు? ఆ దారి ఏదో చెప్పవయ్యా!

పద్మజా! నీకు గూడా ఒక ఏలిక ఉన్నాడంటావా? అట్లైతే ఈ బ్రహ్మాండం ఏ ప్రభుని కటాక్షవిలాసంతో జనిస్తున్నదో, వర్ధిల్లుతున్నదో, గిట్టుతున్నదో ఆ ప్రభువును గూర్చి ఆయన స్వరూపమెట్టిదని ముచ్చటించుకోవడానికి వీలవుతుందా?

కమల సంభవా! ఈ విషయం నాకు తెలియపరచు. నా కిది బాగా అర్థమైతే నన్ననుసరించే నా పరివారానికి ఈ సత్యం తెలియజేస్తాను. వాళ్ళు ఇతర మార్గాలను అనుసరించకుండా ఉండునట్లు చేస్తాను.

స్వామీ! జరిగిన, జరుగనున్న జరుగుతున్న వ్యవహారాలన్నిటికీ నీవే కర్తవు. నీకు తెలియని విషయమేదీ లేదు. ఈ ప్రపంచ విధానం నాకు తెలియజెప్పు - అని నారదుడు అడిగాడు. అది విని విప్పారిన ముఖంతో విధాత ఇలా అన్నాడు.

పుత్రా! ఎందరు పండితులు నా వద్దకు రావడం లేదు! వారంతా వైరాగ్యం కలవారే కదా! అయినా వాళ్ళెవరూ నీవలె నన్ను ప్రశ్నించినవారు కారు. నీ మతం నాకు సంతసం కల్గించింది. ఆశ్చర్యం! నా ప్రభుని రహస్యమే నీవడిగావు.

నారదా! విను! నానా రూపాలతో ఉన్న ఈ చరాచర ప్రపంచాన్ని నాకు నేనై సృష్టించడానికి అవసరమైన తెలివి ఏ మాత్రం లేక నేను తొట్రుపడ్డాను. ఆ స్థితిలో పూర్వం ఈ సకల సృష్టినీ ఆరంభించడానికి అవసరమైన విజ్ఞానాన్ని నాకా ప్రభువు ఎంతో ఉదారంగా ప్రసాదించాడు. ఆ దేవుని ఆనతి లేకుంటే ఈ జగన్నిర్మాణశక్తి నాకెక్కడిది? 

కిల్బిషం లేని నారదా! ఈ జగత్తునంతటినీ ప్రకాశింపజేసే సామర్థ్యం నాకు లేదు. ఎవని ప్రకాశంవల్ల సూర్యుడు, చంద్రుడూ, అగ్నీ నక్షత్రాలూ, గ్రహాలు ఇంకా ఈ లోకాలన్నీ సముజ్వలంగా ప్రకాశింప చేయబడుతున్నవో, అట్టి దివ్యదీప్తితో విరాజిల్లే పరమేశ్వరునికి నేను సదా ప్రణమిల్లుతున్నాను. 

పుత్రా! ఇంకా ఈ విషయం విశదంగా వివరిస్తాను విను. మాయ ఈశ్వరుని దృష్టిపథంలో ప్రవేశించడానికి శంకించి సిగ్గుతో కుంచించుకుపోతుంది. దానివల్ల తమ తెలివి కుంఠితం కాగా బుద్ధిహీనులు నన్నే లోకానికంతా ప్రభువుగా భావించి నాకు నమస్కరిస్తూ ఉంటారు. అట్టి మూఢులను చూచి ఇది శ్రీహరి మాయవల్ల జరిగేపని కదా? అనుకొని నాలో నేను నవ్వుకొని వాళ్ళను, ధిక్కరిస్తుంటాను

అంతమాత్రమే కాదు. శరీర నిర్మాణానికి ఉపయోగపడే పృథివి మున్నగు ఐదు భూతాలూ, పుట్టుకకు హేతువులైన కర్మలూ, కర్మ ప్రవృత్తికి కారణమైన కాలమూ, దాని మార్పునకు కారణమైన స్వభావమూ, కర్మఫలం అనుభవించే జీవుడూ అంతా వాసుదేవ స్వరూపులే అని గ్రహించు. ఆ వాసుదేవునికంటె అన్యమైనదేదీ లేదు. ఇది నిజం. ఈ లోకాలన్నింటినీ నియమించేవాడు శ్రీమన్నారాయణుడే. వేల్పులందరూ ఆ దేవుని శరీరంనుండి పుట్టినవారే. వేదాలూ, యాగాలూ, తపస్సులూ, యోగాలూ, విజ్ఞానమూ అంతా నారాయణుని ఆరాధనారూపమైనవే. జ్ఞానసాధ్యమైన ఫలం కూడా నారాయణని అధీనంలోనే ఉన్నది. నిర్వికారుడూ, సర్వాంతర్యామీ, సర్వదర్శనుడు అయిన భగవానుని క్రీగంటి చూపువల్లనే నేను జన్మించాను. ఆయన కటాక్షంవల్లనే ప్రేరణ పొంది సృజింపదగిన విశ్వాన్ని సృష్టిస్తున్నాను. గుణరహితుడైన ఈశ్వరునుండి రజస్సత్త్వతమస్సులనే మూడుగుణాలు పుడుతున్నాయి. అవి ఉత్పత్తికీ, స్థితికీ లయానికీ హేతువులవుతున్నాయి. కార్యభావంలోనూ, కారణ భావంలోనూ, కర్తృభావంలోనూ ద్రవ్యాలైన పృథివ్యాది పంచభూతాలనూ, జ్ఞానరూపులైన బ్రవ్మాదిదేవతలనూ, క్రియారూపాలైన ఇంద్రియాలనూ ఆశ్రయిస్తున్నాయి. జీవుడు సదాముక్తుడే అయినా మాయతోకూడి ఉండడంవల్ల ఆ త్రిగుణాలు అతణ్ణి బంధిస్తున్నాయి. జీవుణ్ణి కప్పివేసే ఉపాధులైన ఈ మూడు గుణాలను కల్పించి తద్వారా ఈశ్వరుడు ఇతరులకు ఏ మాత్రం గోచరించక తనకు మాత్రమే గోచరించే తత్వంతో ఈ విధంగా వినోదిస్తూ ఉంటాడు.

కుమారా! ఆ పరమ్వేరుడు తుది లేనివాడు. ఆ శ్రీహరి ఈ లోకాలకూ, నాకూ, నీకూ, మాయకూ, ప్రాణివర్గానికీ ప్రభువు. ఆయనకంటె ఇతరమైనది ఈ జగత్తులో ఏదీ లేనే లేదు.

ఈశ్వరుడు మాయను నియమించేవాడు. ఆయనకు తనమాయవల్ల కాలమూ, జీవాదృష్టమూ, స్వభావం అప్రయత్నంగా సిద్ధించాయి. వాటిని ఆయన వివిధరూపాలుగా చేయాలని నిశ్చయించుకొని సృష్టికార్యానికి సహకారకాలుగా స్వీకరించాడు. ఈశ్వరుడధిష్ఠించిన మహత్తత్త్వం కారణంగా కాలంనుండి త్రిగుణాల భేదమూ, స్వభావంనుండి పరిణామమూ, జీవుని అదృష్టరూపమైన కర్మనుండి జన్మమూ సిద్ధించాయి.

రజోగుణంచేతా, సత్త్వగుణంచేతా వృద్ధిపొందిన మహత్తత్త్వం వికారానికి లోనయింది. దానినుండే తమోగుణ ప్రధానమై పంచభూతాలు, పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు రూపంగా కలదైన అహంకారం సంభవించింది. ఆ అహంకారం మరల వికృతిపొంది ద్రవ్యశక్తియైన తామసమనీ, క్రియాశక్తియైన రాజసమనీ, జ్ఞానశక్తియెన సాత్వికమనీ మూడురూపాలుగా పరిణమించింది.

పంచభూతాలకు మూలమైన తామసాహంకారంనుండి ఆకాశం పుట్టింది. ద్రష్ట అయిన ఆత్మకూ, దృశ్యమైన జగత్తుకూ బోధకమై సూక్ష్మరూపమై ఉన్న శబ్దం ఆకాశానికి గుణమయింది. వికారానికి లోనైన ఆకాశంనుండి స్పర్శగుణ ప్రధానమైన వాయువు పుట్టింది. తనకు కారణమైన ఆకాశంలోని శబ్దమూ, తనకు సహజమైన స్పర్శమూ అనే రెండు గుణాలు గాలికున్నాయి. ఆ గాలి శరీరాలలో ప్రాణరూపంలో ఉంటుంది. అది ఇంద్రియపటుత్వానికీ, మనోబలానికీ, శారీరకశక్తికీ హేతువవుతున్నది. వికారంపొందిన వాయువునుండే రూపం, స్పర్శం, శబ్దం-అనే మూడు గుణాలుగల్లిన తేజస్సు జనించింది. ఆ తేజస్సునుండి రసం, రూపం, స్పర్శం, శబ్దం అనే నాలుగు గుణాలతో గూడిన జలం కలిగింది. జలంనుండి గంధరసరూపస్పర్శశబ్దాలనే అయిదు గుణాలు గల పృథివి పుట్టింది. పై జెప్పినవన్నీ తామసాహంకారం నుండి కల్టినవే.

వికారానికి లోనైన సాత్వికాహంకారంనుండి మనస్సు జనించింది. దానికి చంద్రుడు అధిదేవత. ఆ సాత్వికాహంకారం నుండే దిక్కులూ, వాయువూ, సూర్యుడూ, వరుణుడూ, అశ్వినీదేవతలూ, అగ్ని ఇంద్రుడు, ఉపేంద్రుడూ, మిత్రుడూ, ప్రజాపతీ అనే పదిమంది దేవతలు ఉద్భవించారు.

తైజసమైన రాజసాహంకారం నుండి శ్రోత్రం మొదలైన ఐదు జ్ఞానేంద్రియాలూ, వాక్కు మున్నగు ఐదు కర్మేంద్రియాలూ, బుద్ధీ, ప్రాణమూ కలిగాయి. ఆ పదియింద్రియాల అధిదేవతల వివరమిది - శ్రోత్రేంద్రియానికి దిక్కులూ, త్వగింద్రియానికి వాయువూ, నేత్రేంద్రియానికి సూర్యుడూ, రసనేంద్రియానికి ప్రచేతసుడూ, ఘ్రాణేంద్రియానికి అశ్వినీ దేవతలూ, వాగింద్రియానికి అగ్నీ హస్తేంద్రియానికి ఇంద్రుడూ, పాదేంద్రియానికి ఉపేంద్రుడూ, గుదేంద్రియానికి మిత్రుడూ, ఉపస్థేంద్రియానికి ప్రజాపతి దేవతలుగా ఉన్నారు. బుద్ది జ్డానం కల్గించే అంతఃకరణంలో ఒక భాగం. ప్రాణం క్రియాహేతువైన అంతఃకరణం.

శ్రోత్రాదులగు దశేంద్రియాలతో గూడిన భూతాలు, ఇంద్రియాలు, మనస్సు, శబ్బస్పర్భాదులైన గుణాలు విడివిడిగా ఉన్నప్పుడు బ్రహ్మాండమనే శరీరాన్ని నిర్మించలేకపోయాయి. ఇల్లు కట్టాలంటే అనేక వస్తువులను ఒకచోట చేర్చితేగానీ సాధ్యం కాదు గదా! అదే రీతిగా పైన పేర్కొన్న భూతాలు, ఇంద్రియాలు, మనస్సు, గుణాలు, భగవంతుని శక్తివల్ల ఒకటిగా చేరాయి. సమష్టిగానూ, వ్యష్టిగానూ కలిసి చేతనాలనూ, అచేతనాలనూ, కల్పించాయి. అలా ఈ బ్రహ్మాండాన్ని నిర్మించాయి. ఆ విధంగా నిర్మించబడిన అండం కోటి సంవత్సరాల వరకూ నీళ్ళలోనే ఉండిపోయింది.

అందుమీదట కాలకర్మస్వభావాలకు లోబడనివాడూ, అన్నింటినీ ప్రాణవంతంగా చేయగలవాడూ అయిన ఈశ్వరుడు ప్రాణరహితమైనదాన్ని ప్రాణసహితంచేశాడు. కాలకర్మస్వభావాలకు ప్రేరకుడైన ఆ దేవుడు మహావరణ జలమధ్యంలో ఉండిన బ్రహ్మాండంలో జీవరూపంతో ప్రవేశించి దాన్ని మిక్కిలి విస్తృతమయ్యేటట్లు చేశాడు. చివరికి ఆ అండాన్ని భేదించుకొని వెలికి వచ్చాడు. అది ఎలా జరిగిందో వివరిస్తాను విను.

జగత్స్వరూపుడైన ఆ పరమేశ్వరుడు ఒక భవనాన్ని పోలివున్న ఈ బ్రహ్మాండాన్ని విడివిడిగా చేసి విపులమైన చతుర్దశ భువనాలుగా తీర్చిదిద్దాడు.

మేధావీ! ఆ భగవంతుడు పలుపాదాలూ, తొడలూ, భుజాలూ, ముఖాలూ, నేత్రాలూ, శిరస్సులూ, నొసళ్ళూ, చెవులూ కలిగివుంటాడు. అలా ఉంటూ అనేక ప్రాణుల శరీరాలలో నెలకొని విహరిస్తూ ఉంటాడు. పండితులు చక్కగా విమర్శించి ఆ భగవంతుని నానారూపాలైన అవయవాలలోనే సర్వ ప్రపంచపుటునికినీ ఊహిస్తూ ఉంటారు. మహనీయుడూ, ఆశ్చర్యకరమైన స్వరూపం కలవాడూ అయిన ఆ భగవంతుడు యోగుల హృదయాలచే పూజింపదగి ఉన్నాడు.

ఈ పద్నాలుగు లోకాలలో పై ఏడులోకాలు మహావిష్ణువుయొక్క నడుమునుండి పై శరీరమంటారు. అట్లే క్రింది ఏడులోకాలూ నడుమునుండి క్రింది శరీరమంటారు. ఈ ప్రపంచమే భగవంతునికి శరీరం. ఆయన ముఖంనుండి బ్రహ్మకులమూ, బాహువులనుండి క్షత్రియకులమూ, తొడలనుండి వైశ్యకులమూ, పాదాలనుండి శూద్రకులమూ పుట్టాయని వర్ణిస్తారు.

ఆ మహావిష్ణువుకు కటిస్టలం భూలోకం, నాఖి భువర్లోకం, హృదయం సువర్లోకం, వక్షం మహర్లోకం, కంఠం జనలోకం, స్తనాలు తపోలోకం, శిరస్సు సనాతనమైన సత్యలోకం, జఘనం అతలం, తొడలు వితలం, మోకాళ్లు సుతలం, పిక్కలు తలాతలం, చీలమండలు మహాతలం, కాలిమునివ్రేళ్ళు రసాతలం, అరికాలు పాతాళం. ఈ కారణంవల్ల ఆ దేవుణ్ణి లోకమయుడని భావిస్తారు.

మరి కొంతమంది ఆయన పాదతలంనుండి భూలోకమూ, బొడ్డునుండి భువర్లోకమూ, శిరస్సునుండి సువర్లోకమూ పుట్టాయని మూడు లోకాల సృష్టినీ వివరిస్తారు.

శ్రీమన్నారాయణుని ముఖంనుండి సమస్త ప్రాణుల వాక్కులూ, వాక్కుల కధిష్ఠానమైన అగ్నీ పుట్టాయి. చర్మం, రక్తం, మాంసం, మెదడు, ఎముకలు, మజ్జ, శుక్లం - ఇవి యేడు ఆ దేవుని ఏడు ధాతువులంటారు. మరొక పద్ధతిలో రోమాలు, చర్మం, మాంసం, ఎముకలు, స్నాయువులు, మజ్జ, ప్రాణాలు- ఇవి ఏడు ధాతువులని వర్ణిస్తారు.

వాటిలో రోమాలు ఉష్ణిక్‌ ఛందస్సనీ, చర్మం ధాత్రీ ఛందస్సనీ, మాంసం త్రిష్టుప్‌ ఛందస్సనీ, స్నాయువులు అనుష్టుప్‌ ఛందస్సనీ, శల్యం జగతీ ఛందస్సనీ, మజ్జ 'పంక్తి' 
ఛందస్సనీ, ప్రాణం బృహతీ ఛందస్సనీ వ్యవహరిస్తారు.

దేవతల కర్పించే పురోడాశరూపమైన హవ్యానికీ, పితృదేవతల కిచ్చే చరురూపమైన కవ్యానికీ, అమృతాన్నానికీ, మధురాదులైన ఆరురసాలకీ, రసనేంద్రియానికీ, రసానికీ అధీశ్వరుడైన వరుణుడికీ విష్ణుని రసనేంద్రియమే జన్మస్థానం. అట్లే అన్ని ప్రాణాదులకూ, వాయువుకూ, విష్ణుని నాసారంధ్రం నెలవు. దగ్గరగానూ, దూరంగానూ వ్యాపించే గంధాలకూ, ఓషధులకూ, అశ్వినీ దేవతలకూ ఆ పరమేశ్వరుని ఘ్రాణేంద్రియం స్థానం.

దేవలోకానికీ, సత్యలోకానికీ, తేజస్సుకూ, సూర్యుడికీ, సకలనేత్రాలకూ లోకనేత్రుడైన పరమాత్ముని చక్షురింద్రియమే నివాసం. దిక్కులకూ, ఆకాశానికీ, శ్రవణాంశాలకూ, శబ్దానికీ, సర్వేశ్వరుని శ్రోత్రేంద్రియం జన్మభూమి. ప్రశస్తాలైన వస్తువులకూ, కొనియాడదగిన సౌందర్యాలకూ పరమ పురుషుని శరీరమే స్థానం.

స్పర్శానికీ, గాలికీ, నైగనిగ్యానికీ, ఆ దివ్యశరీరుని త్వగింద్రియమే గృహం. యాగపశువును బంధించే స్తంభాది యజ్ఞపరికరాలైన చెట్లూ, పొదలూ, తీగలూ, మొదలైన వాటికి పురుషోత్తముని రోమాలు స్థానాలు. రాళ్ళూ, లోహాలూ ఆ విశ్వాత్మునికి గోళ్ళు. మబ్బులు ఆయన శిరోజాలు. మెరుపులు సర్వేశుని మీసాలు, భూలోక భువర్లోక సువర్లోకాలను కాపాడే లోకపాలకుల పరాక్రమాలకు, భూలోకం మున్నగు లోకాల క్షేమానికీ, శరణానికీ నారాయణుని పరాక్రమం నట్టిల్లు. ఎల్ల కోరికలకూ, శ్రేష్ఠమైన వరాలకూ ఆ పవిత్రపాదుని పాదపద్మాలే నిలయాలు.

జలాలు, శుక్లం, పర్జన్యుడు, ప్రజాపతి సృష్టి - వీటన్నింటికీ ఆ సర్వేశ్వరుని పురుషాంగం జన్మస్థలం. సంతతికీ, కామం మున్నగు పురుషార్థాలకూ, మనస్సుకు సుఖం కలిగించే ఆనందాలకూ, శరీరసుఖానికీ అచ్యుతుని గుహ్యేంద్రియం స్థానం. యమునికీ, మిత్రునికీ, మల విసర్జనానికీ ఆ దేవుని పాయ్వింద్రియం ఇల్లు. హింసకూ, నిరృతికీ, మృత్యువుకూ, నరకానికీ ఆ సర్వరూపుని గుదం నెలవు. అవమానానికీ, అధర్మానికీ, అవిద్యకూ, చీకటికీ, అంతంలేని ఆ దేవుని పృష్ఠదేశం నివాసం. నదనదీసమూహాలకు ఆ ఈశ్వరుని నాడీసంఘం పుట్టిల్లు, కొండలకు ఆ దేవుని ఎముకలు జన్మస్టానాలు. ప్రకృతికీ, అన్నరసానికీ, సముద్రాలకూ, భూతాల విలయానికీ ఆ బ్రహ్మాండగర్భుని ఉదరమే ఉనికిపట్టు. మానసిక వ్యాపారరూపమైన లింగదేహనికి గొప్ప మహిమగల ఆ దేవుని హృదయం సృష్టి స్థానం. అంతే కాదు,

నారదా! వినుము. శివునికీ, నీకూ, నాకూ, సనత్కుమారుడు మున్నగు కుమారులకూ, ధర్మానికీ, సత్త్వానికీ, బుద్ధిత
త్త్వానికీ, (విజ్ఞానానికీ) శ్రేష్ఠమైన ఉనికిపట్టు ఆ పరమేశ్వరుని ఆత్మయే.

కుమారా? నరులూ, దేవతలూ, దానవులూ, పితరులూ, ఉరగులూ, గజాలూ, మృగాలూ, గంధర్వులూ, యక్షులూ, రాక్షసులూ, వృక్షాలూ, సిద్దులూ, విద్యాధరులూ, మేఘాలూ, చారణులూ, గ్రహాలూ, నక్షత్రాలూ, అచ్చరలూ, పక్షులూ, భూతగణాలూ, మెరుపులూ, వివిధ వస్తువులూ, నీవూ, శివుడూ, మునులూ, నేనూ, నీళ్లలోనూ, ఆకసంలోనూ, నేలమీదా చరించే వివిధప్రాణులతో గూడిన ఈ విశ్వమంతా విష్ణమయమే. పెక్కు మాటలేల? ఈ బ్రహ్మాండాలన్నీ అతని ఒక్క జేనలో ఇమిడిపోతాయి. బుద్ధిబలంతో ఆ భగవంతుణ్ణి తెలుసుకోలేము. కడచన్నవీ, ఇప్పుడున్నవీ, రానున్నవీ - అగు లోకాలన్నీ శ్రీవిష్ణుదేవునిలోనే ఉన్నాయి.

సూర్యుడు తన మండలంలోనే తానుంటూ లోకాలకు కాంతిని ప్రసాదిస్తున్నాడు. అట్లే అచ్యుతుడు బ్రహ్మాండంలో ఉంటూనే లోపలా, వెలుపలా ప్రకాశింపజేస్తున్నాడు.

అట్టి అనంతశక్తి సంపన్నుడైన విశ్వాత్ముని బొడ్డుతామరలో నేను పుట్టాను. నాకు యజ్ఞం చేయాలనే బుద్ధి పుట్టింది. కాని ఆ యజ్ఞాని కవసరమైన పదార్ధాలేవీ నాకు కనిపించలేదు. అప్పుడు మిగుల స్వచ్చమైన ఆ భగవంతుని స్వరూపాన్ని దృఢంగా బుద్ధిలో నిలిపి ధ్యానం చేశాను. అప్పుడు నా మనస్సులో ఒక ఉపాయం తోచింది.

యజ్ఞపశువులూ, యజ్ఞవాటికా, యూపస్తంభమూ, పాత్రలూ, మట్టికుండలూ, మూకుళ్ళూ, యాగకాలమైన వసంత ఋతువూ, నేయి, వడ్లు మున్నగు ఓషధులూ, వివిధాలైన లోహాలూ, నల్గురుహోతలతో నిర్వర్తింపదగిన దర్శపూర్ణమాసాది వైదికకర్మలూ, జ్యోతిష్టోమాదినామాలూ, మంత్రాలూ, సంకల్పమూ, ఋగ్యజుస్సామ వేదాలలోని వషట్కారాలతో గూడిన మంత్రాలూ, దక్షిణలూ, దేవతా ధ్యానం, దానికి తగిన తంత్రాలు, వ్రతాలూ, భూసురులూ, దేవతల నుద్దేశించి చేసే కర్మ సమర్పణలూ, బోధాయనాదుల కల్పగ్రంథాలలోని కర్మవిధానం, మొదలైన యజ్ఞోపకరణాలూ - ఇవన్నీ పరమేశ్వరుని అంగాలుగా సంకల్పించాను. ఆ మీదట శాస్రోక్త విధి ననుసరించాను.

యజ్ఞమే శరీరమైనవాడూ, యజ్ఞానికి ఫలమిచ్చేవాడూ, యజ్ఞప్రభువూ, యజ్ఞనిర్వాహకుడూ అయిన పరమాత్మను యజ్ఞపురుషుణ్జిగా భావించుకొని ఆ దేవునికే యజ్ఞఫలం సమర్పించాలన్న తలంపుతో మానసయజ్ఞం చేశాను.

అప్పుడు మరీచి మున్నగు ప్రజాపతులు నేను చేసిన మానసయజ్ఞం చూచి, తాము గూడ ఉత్సుకతతో ఆ దేవునికి ప్రీతి కలిగేటట్లు యజ్ఞం నిర్వర్తించారు.

ఆ ఘటనను చూచి స్వాయంభువాది మనువులూ, దేవతలూ, దానవులూ, రాజులూ, మనుజులూ - వీరంతా వాళ్ళ వాళ్ల కిష్టమైన దేవతలను సేవిస్తూ సాటిలేనివాడూ, యజ్ఞమూర్తీ అయిన లక్ష్మీరమణునికే ఫలం చెందేటట్లు మహానిష్ఠతో యజ్ఞాలు చేశారు.

స్పష్టమైన తంత్రరూపం కలవాడూ, ఇతరులకు వ్యక్తం కానివాడూ, అంతం లేనివాడూ, జన్మ లేనివాడూ, చ్యుతి లేనివాడూ, జగత్ప్రభువూ, అవ్యయుడూ అయిన శ్రీహరి దేవతలచే సేవింపదగినవాడూ, యజ్ఞఫలాలను ప్రసాదించేవాడూ కావడంవల్ల పై జెప్పినవారంతా ఆ దేవుణ్ణి ఉద్దేశించే యజ్ఞాలు చేశారు.

మంగళకరమైన చరిత్ర గల నారదా! పరమేశ్వరుడు నిర్గుణుడు. ఐనా జగన్నిర్మాణం చేయడానికి ఆయన మాయా ప్రభావం వల్ల నేర్పుతో గుణసహితుడవుతున్నాడు. అందువల్లనే ఆయన 'భగవంతుడు' అని చెప్పబడుతున్నాడు.

విశ్వానికి ఆత్మ అయినవాడూ, విశ్వప్రభువూ, విశ్వరూపుడూ, సమస్తానికీ నాయకుడూ, జననం లేనివాడూ అయిన విష్ణుదేవుడు ఈ విశ్వం తనలో మిక్కిలిగా వెలుగొందుతుండగా తాను విశ్వంలో ప్రకాశిస్తూ ఉంటాడు.

ఆ దేవుని ఆనతి ననుసరించి నేను చరాచర ప్రాణులతో గూడిన ఈ సృష్టిని విస్తారంగా సృజిస్తున్నాను. ప్రభావ సంపన్నుడైన, విష్ణువు దీనిని పోషిస్తున్నాడు. పార్వతీపతియైన శివుడు దీనిని లయింపజేస్తున్నాడు. పద్మనాభుడూ, మొదటివేల్పూ, అచ్యుతుడూ అగు శ్రీహరి సృష్టి స్థితిలయ శక్తులకు మూలహేతువై ఉన్నాడు.

కుమారా! నీవు నన్నిప్పుడడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాను, విను. ఈ సకల విశ్వానికీ ఆధారకారణమైనది ఒకే ఒక పరబ్రహ్మమే సుమా!

శ్రీహరి జ్ఞానం, బలం, ఐశ్వర్యం, వీర్యం, శక్తి తేజమనే షడ్గుణాలు కలవాడు, అంతం లేనివాడు. అతడే ఈ సృష్టికి చెందిన కార్యకారణాలకు మూలమైనవాడు. ఆలోచించి చూడగా ఆ ప్రభునికంటె ఉత్కృష్టుడైనవాడు మరొకడు లేడు.

ఇప్పుడు నేను చెప్పినదంతా నిజం. నేను అసత్యం పలకను. పండిత స్తుతికర్హుడవైన ఓ నారదా! విను. ఔత్సుక్యంతో ఆ భగవంతుని గుణాలను ధ్యానించడంవల్ల కలిగిన ప్రభావంతో నేనేమి పలికినా అదంతా నిజమే అవుతుంది. ఓ బుద్ధిమంతుడా! నా ఇంద్రియాలు ఎప్పుడుగానీ పొరపాటున గూడా అసత్యం వైపు పోవు. అంతే కాదు. నా శరీరం వేదతుల్యమైనది. దేవేంద్రునికి సైతం ఇది నమస్కరింపదగినది. సంసారమనే గొప్ప సముద్రాన్ని దాటించేదీ, శుభాలకు కారణమైనదీ, సకల సంపదలనూ సమకూర్చేదీ అయిన ఆ దేవదేవుని పాదపద్మానికి నేను నమస్కరిస్తున్నాను.

నేను ఆ పద్మనేత్రుని కుమారుడనైనా, బ్రహ్మనైనా, యోగవిద్యలో నిపుణుడనైనా, నా పుట్టుక ఎలా జరిగిందో నాకే తెలియదు. ఇక ఆ ప్రభుని ప్రదీప్త ప్రభావం ఎలా గ్రహించగలను? ఆ లక్ష్మీనాథుడు నిర్మించిన ఈ ప్రపంచం కొంచెం కొంచెమే నాకు గోచరిస్తున్నది.

మునివర్యా! నారదా! పలుమాటలేల? ఇది విను. విశ్వస్వరూపుడైన ఆ పరమేశ్వరుడు తన మాయా మహిమను నిజంగా తుదముట్ట తానే గ్రహించలేకున్నాడు. అట్టి స్థితిలో నేనుగానీ, మీరుగానీ, ఇంద్రాది దేవతలుగానీ, కడకు శివుడైనా జ్ఞాన ప్రక్రియకు చెందిన, యుక్తులతోనూ, (జ్ఞానంతో, క్రియలతో, యుక్తులతో) నిజం తెలుసుకోగలమా? తెలియలేమని తాత్పర్యం.

ఆ మహాత్ముడైన పద్మాక్షుడు సర్వజ్ఞుడు గదా! తన మహిమ ఆయన కెందుకు తెలియదు? అని నీవు అనవచ్చు. అది వివరిస్తాను, విను.

ఆకాశం తన అంతాన్ని తాను తెలుసుకోలేదు. అట్లే ఆ దేవుడు తన సమగ్రతను తానే ఎరుగజాలకున్నాడు. ఆకాశపుష్పం లేదన్నంతమాత్రాన సర్వజ్ఞత్వానికి భంగం కలుగుతుందా? అట్లే తన అంతు తనకే తెలియదన్నంత మాత్రాన భగవంతుని సర్వజ్ఞత్వానికి లోటు వాటిల్లదు.

ఆ మహామహుడు జగద్రక్షణకు పూనుకొని ఆయా అవతారాలలో చేసిన పనులు మాబోట్లం వేయివిధాల ప్రశంసిస్తూ ఉంటాం. మహామహుడూ, తుదిలేనివాడూ, చిదచిత్స్వరూపుడూ, మొదటివాడూ, తనకు ప్రభువులేనివాడూ, తానే అంతటికీ ప్రభువైనవాడూ, అయిన ఆ దేవుని ఎంత ప్రయత్నించినా మనం తెలుసుకోగలమా? దివ్యచరిత్రుడైన ఆ దేవునకు నేను ప్రణమిల్లుతున్నాను.

పుట్టుకలేని ఆ పరమాత్ముడు ప్రతికల్పంలోనూ ఈ విశ్వాన్ని సృష్టిస్తాడు, పోషిస్తాడు, లయింపజేస్తాడు. పాపరహితుడూ, బ్రహ్మస్వరూపుడూ, శాశ్వతుడూ, జగమంతా నిండినవాడూ, కేవలుడూ, సాటిలేనివాడూ, నిర్మలజ్ఞానవంతుడూ, సర్వాంతర్యామీ, తుదిమొదళ్ళు లేనివాడూ, గుణరహితుడూ, శాశ్వతమూర్తీ అయిన పరమేశ్వరుణ్ణి నేను ధ్యానిస్తాను.

నారదమునీ! మునీశ్వరులు తమ శరీరం, ఇంద్రియాలు, మనస్సు నిర్మలంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ దేవుని మహిత కళామయమైన స్వరూపం చూడగలరు. ఎప్పుడు వాళ్ళు కుత్సితమగు తర్కవితర్కాలనే తమస్సుకు లోబడి అజ్ఞానోపహతులవుతారో అప్పుడు ఆ దేవుని దివ్యస్వరూపాన్ని దర్శించలేరు.

అని చెప్పి మళ్ళీ బ్రహ్మ నారదునితో ఇలా అన్నాడు "పాపరహితుడా! వేయితలలు, వేయినేత్రాలు, వేయిపాదాలూ కలిగి ప్రకృతిని ప్రవర్తింపజేసే ఆదిపురుషుని రూపమే మహాతేజస్వి అయిన ఆ దేవదేవుని మొదటి అవతారం. అట్టి అవతారస్వరూపంనుండి కాలం, స్వభావం అనే రెండు శక్తులు పుట్టాయి. అందుండి కార్యకారణరూపమైన ప్రకృతి పుట్టింది. ఆ ప్రకృతినుండి మహత్తత్త్వం జనించింది. దానినుండి రాజసాహంకారం, సాత్త్వికాహంకారం, తామసాహంకారం అనే మూడు అహంకారాలు ఉద్భవించాయి. వాటిలో రాజసాహంకారంనుండి ఇంద్రియాలు కలిగాయి. సాత్త్వికాహంకారంనుండి ఇంద్రియగుణాలు ప్రధానంగాకల ఇంద్రాది దేవతలు జనించారు. తామసాహంకారంనుండి పంచభూతాలకు హేతువులైన శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం అనే పంచతన్మాత్రలు పుట్టాయి. వాటినుండి ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి అనే పంచభూతాలు ప్రభవించాయి. వాటినుండి త్వక్కు, చక్షువు, శోత్రం, జిహ్వ, ఘ్రాణం అనే జ్ఞానేంద్రియాలు, వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థం అనే కర్మేంద్రియాలూ, మనస్సూ జనించాయి.

వీటన్నింటి చేరికవల్ల విశ్వస్వరూపుడైన విరాట్పురుషుడు ఉదయించాడు. అతనినుండి స్వయంప్రకాశుడైన స్వరాట్పురుషుడు ఆవిర్భవించాడు. అతనినుండి చరాచరరూపాలతో స్థావరజంగమాత్మకమైన జగత్తు జనించింది. అందుండి సత్త్వగుణస్వరూపుడైన విష్ణుడూ, రజోగుణస్వరూపుడనై హిరణ్యగర్భుడనబడే నేనూ, తమోగుణ స్వరూపుడైన రుద్రుడూ జన్మించాము. అందుండే సృష్టియొక్క ఉత్పత్తికి హేతువైన నాల్గుముఖాల బ్రహ్మ పుట్టాడు. ఆయనవల్ల దక్షుడు మున్నగు తొమ్మిదిమంది ప్రజాపతులు జనించారు. వారినుండి నీవూ, సనకాదులను యోగీశ్వరులూ, స్వర్గలోకంలో ఉండే ఇంద్రాదులు, పక్షిలోకరక్షకులైన గరుడాదులు, మానవలోకం పాలించే మనువు, మాంధాత మున్నగువారూ, తలలోకాన్ని పాలించే అనంతుడు, వాసుకి మున్నగువారూ, ఇంకా గంధర్వులు, సిద్దులు, విద్యాధరులు, చారణులు, సాధ్యులు, రాక్షసులు, యక్షులు, ఉరగులు, నాగులు నివసించే లోకాలను పాలించేవారూ, ఋషులు, పితరులు, దైత్యులు, దానవులు, భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, కూశ్మాండులు మరియు పశువులు, మృగాదులు సంభవించాయి.

ఇట్టి జగత్తుయొక్క మొట్టమొదటి పుట్టుకను మహత్తత్త్వసృష్టి అంటారు. రెండవది అండగతసృష్టి మూడవది సకలభూతగతమైన సృష్టి అందులో ఐశ్వర్యం, తేజస్సు, బలంగల పురుషులు సర్వాంతర్యామి అయిన శ్రీమన్నారాయణుని అంశయందు పుట్టినవారని గ్రహించు. ఆ పద్మాక్షుని లీలావతారాలకు అంతమే లేదు. ఆ అవతారాలలో ఆయన చేసే సత్కర్మలు లెక్కించడం ఎవరికీ శక్యం కాదు, అయినా నాకు తోచినంతవరకూ నీకు వినిపిస్తాను, విను.

శ్రీ మన్నారాయణుని లీలావతారంబుల యభివర్ణనము

Thursday, February 12, 2026

Shuka Maharshi Explaining Bhakti A Way For Mukthi - శుకుడు పరీక్షిత్తునకు భక్తిమార్గంబె ముఖ్యంబని తెలుపుట

శుకుడు పరీక్షిత్తునకు భక్తిమార్గంబె ముఖ్యంబని తెలుపుట

రాజా! ఇది ఇంకా వివరంగా చెబుతాను, విను. పూర్వం బ్రహ్మ మనస్సులో ధర్మనీతి పరాయణమైన దృష్టితో మూడు పర్యాయాలు వేదాన్ని పరామర్శించాడు. అలా పరామర్శించి భక్తితో తప్ప మరొక మార్గాన మోక్షం లభించదని నిశ్చయించుకొన్నాడు. ఆ మార్గాన్నే తరణోపాయంగా నిర్ణయించుకొని వికారానికి లోబడకుండా ఆత్మస్వరూపుడైన జనార్దనుణ్ణి భక్తితో ధ్యానించాడు.

రాజా! జగదీశ్వరుడైన శ్రీహరి సకల జీవులలో సదా ఆత్మరూపుడై ఉన్నాడు. బుద్ధి మొదలయిన లక్షణాలతో ఆ దేవుడు మనకు గోచరిస్తాడు. ఉత్తములకు ఆయన సేవింపదగినవాడు. సకలవేళలా నమస్కరింపదగినవాడు. భక్తులపై వాత్సల్యం కలవాడు. నియమనిష్ఠలు కలిగి ఏకాగ్రమైన బుద్ధితో ఆత్మస్వరూపుడగు శ్రీహరి కథాసుధను తనివి దీరా, చెవులారా గ్రోలేవారు ధన్యులు. అట్టివారు కుటిలమైన పలువిషయాలతో చెడిపోయిన తమ శరీరాలను పరిత్యజించి విష్ణుదేవుని పాదపద్మాలను చేరుకొంటారు. ఇది సిద్ధమైన విషయం.

రాజా! మానవులుగా జన్మించిన వారూ, మరణం ఆసన్నమైనవారూ, మహాజ్ఞానులూ, చేయవలసిన కర్తవ్యం ఇలా చెప్పడమైనది.

రాజా! విను. బ్రహ్మవర్చస్సు కోరేవాడు వేదవిభుడగు చతుర్ముఖ బ్రహ్మను సేవించాలి. అట్లే ఇంద్రియశక్తి కోరేవాడు ఇంద్రుణ్ణీ, సంతతికోరేవాడు దక్షుడు మొదలయిన ప్రజాపతులనూ, భోజనం ఆశించేవాడు అదితినీ పూజించాలి. స్వర్గాభిలాషి ఆదిత్యులనూ, రాజ్యాభిలాషి విశ్వదేవతలనూ, దేశప్రజలనూ, సంపదనూ స్వాధీనం చేసుకోగోరేవాడు సాధ్యులనూ, సిరిని వరించేవాడు దుర్గనూ ఉపాసించాలి. తేజస్సు కోరేవాడు అగ్నినీ, ధనాభిలాషి వసువులనూ, వీర్యార్థి రుద్రులనూ, ఆయువు అభిలషించేవాడు అశ్వినీదేవతలనూ, పుష్టికామి భూమినీ అర్చించాలి. ప్రతిష్టను అపేక్షించేవాడు లోకమాతలగు ఆకాశభూదేవతలనూ, అందచందాలు కోరేవాడు గంధర్వులనూ, కామినులను కామించేవాడు అప్పరసయైన ఊర్వశినీ, సర్వాధికారం కాంక్షించేవాడు పరమేష్ఠినీ భజించాలి. కీర్తికోరువాడు యజ్ఞమూర్తియైన విష్ణువునూ, ధనంకోరేవాడు వరుణుణ్ణీ, విద్యార్థి శివుణ్ణీ, దాంపత్య సుఖాభీలాషి పార్వతినీ కొలవాలి. ధర్మార్ధాలపై అభీలాష కలవాడు పుణ్యచరిత్రుడైన విష్ణువునూ, సంతానార్థి పితృదేవతలనూ, రక్షణ కోరేవాడు యక్షులనూ, బలం కోరేవాడు మరుద్గణాలనూ, రాచరికంపై అభిలాష గలవాడు మను రూపంలో ఉన్న దేవతలనూ, శత్రుమరణం వాంఛించేవాడు నిరృతినీ, భోగాభిలాషి చంద్రుణ్ణీ ఆరాధించాలి ఇంకా,
(వసువులు ఎనమండుగురు. 1. ఆపుడు 2. ధ్రువుడు 3. సోముడు 4. అధ్వరుడు 5. అనిలుడు 6. ప్రత్యూషుడు 7. అనలుడు 8. ప్రభాసుడు. వీర్యప్రదులగు రుద్రులు పదునొకండుగురు. 1. అజుడు 2.ఏకపాదుడు 3. అహిర్బుధ్న్యుడు 4 త్వష్ట 5. రుద్రుడు 6. హరుడు 7. శంభుడు 8. త్య్రంబకుడు 9.అపరాజితుడు 10. ఈశానుడు 11. త్రిభువనుడు.)

రాజా! పై చెప్పిన వాటినన్నింటినీ కోరినా, కోరకున్నా, పరతత్త్వసాధనలో నేర్పుగలవాడు మోక్షం మాత్రం తప్పక అభిలషిస్తాడు. తదనుగుణంగా తన హృదయంలో పరమేశ్వరుణ్ణి నెలకొల్పి భజిస్తాడు.

రాజా! పెక్కుమాట లెందుకు? పైని వివరించిన కోరికలతో ఇంద్రాది దేవతలను సేవించినట్లే, పద్మపత్రనేత్రుడైన విష్ణుని భజిస్తే నిర్మలమైన, జ్ఞానం, వైరాగ్యం, మోక్షం సిద్ధిస్తాయి. ఆ లక్ష్మీనాథుని కథాసుధారసం నిండుగా ఉన్ననదీ తరంగాలలో ఓలలాడడం గొప్పఅదృష్టం. శ్రీహరికథలు చెవులపండువు చేయకుండా ఉండునా?

ఈ రీతిగా పరీక్షిన్మహారాజుకు శుకయోగి చెప్పాడని సూతుడు పలుకగా ఆకర్ణించిన శౌనక మహర్షి ఆ సూతునితో ఇలా అన్నాడు.

ఈ రీతిగా శుకుడు పలికిన పలుకులను మిక్కిలి శ్రద్ధతో విన్న పరీక్షిత్తు శ్రేయోభిలాషతో వెనువెంటనే ఏమని ప్రశ్నించినాడో విశదీకరించి చెప్పు.

చవులూరేటట్లుగా ఉన్న మనోహరమైన నీమాటలు వింటుంటే ఇంకా ఏలాంటి మంచి మంచి విష్ణుకథలు చెపుతాడో అని మా మనస్సులలో ఉబలాటం పెల్లుబుకుతున్నది.

శౌనకు డావిధంగా చెప్పడం విని, సూతు డీరీతిగా అన్నాడు.

మునులారా! ఆ పరీక్షిత్తు బాల్యంలో సైతం తూలిపడే జులపాల జుట్టుతో తోడిబాలురతో గూడి ఆడుకొనే దినాలలో గూడ శ్రద్ధతో హరిపాదాలను అర్చించేవాడు.

అలాంటి భాగవతశ్రేష్ఠుడైన పరీక్షిత్తుతో వాసుదేవుని భక్తుడైన శుకయోగి ఇలా చెప్పాడు.

ఏ పుణ్యాత్ముడు భగవంతుని ఖ్యాతిని ప్రకటించే కథలు వింటూ కాలం గడుపుతాడో, అతని ఆయుస్సు తప్ప ఇతరుల ఆయువును సూర్యుడు ఉదయాస్తమయాలతో మోసగించి లాగుకొనిపోతుంటాడు. ఆ సంగతి గ్రహింపక మూఢుడు "నేను తప్పక చాలా సంవత్సరాలు జీవిస్తాను" అనుకుంటాడు. సంసారానికి హేతువులైన ఆలుబిడ్డలు, ఇల్లువాకిళ్ళు, తోటలు, దొడ్డు, ధనం మొదలైన వాటి తగులంలో చిక్కుకుంటాడు. అతనికి ఆయువుతీరగానే యమభటులు వచ్చి వాణ్ణి నానావిధబాధలకు గురిచేస్తూ యమపురికి తీసుకుపోతారు. అప్పుడు వాడు "అయ్యో! నేను పుణ్యం చేయలేదే! పాపం చేశానే!" అంటూ గోడు గోడున ఏడుస్తాడు.

ఆ కారణం వల్ల.

ఓ రాజా! పూగుత్తులతో ఆకసమంటుతూ అడవులలో చెట్లు జీవించడం లేదా? ఆహార మైథునాది వాంఛలతో పశువులు పల్లెసీమల్లో బ్రతకడం లేదా? కొలిమి తిత్తులు గూడా ఎడతెరపిలేకుండా ఊపిరి లోనికి వెలికి పీల్చుకొని వదలటాన్ని సాగిస్తున్నాయి గదా! ఊరపందులు, కుక్కలు గుంపులు గుంపులుగా ఇల్లిల్లు తిరుగుతూ దిక్కుమాలి దీనంగా తిరగడం లేదా! ఒంటెలు, గాడిదలు పెద్దపెద్ద బరువులు మోస్తున్నాయి కదా! అదేరీతిగా పద్మనేత్రుడైన శ్రీమన్నారాయణుని తెలియనేరని నరపశువులు అడవులందో, గృహాలందో సంసార విషయాలలో ఆసక్తిగల్గి జీవిస్తున్నారు. వారి బ్రతుకు వ్యర్థం.

భూపతీ! విష్ణుని నామసంకీర్తనలు వినని వీనులు కొండగుహలు. కురునాథా! చక్రధారి మీద పద్యాలు చదువని నాలుకలు కప్పల నాలుకలు. కీర్తిప్రియుడా! శ్రీకాంతుని చూడలేని కన్నులు నెమలిఈకల కన్నులు. సత్యవచనుడా! పద్మనేత్రుని పూజకు ఉపకరించని చేతులు పీనుగుయొక్క చేతులు. రాజర్షీ! శ్రీహరి చరణాలమీది తులసీదళాల పరిమళం ఆఘ్రాణించని ముక్కు పందిముక్కు పాపరహితా! గరుడవాహనుని సేవకు వెళ్లని పాదాలు చెట్ల వ్రేళ్ళు, విష్ణు పరం గాని చెవులు, నాలుకలు, మొదలయినవి వ్యర్థమైనవని తాత్పర్యం.

శ్రీమన్నారాయణుని యొక్క పవిత్రనామాక్షరస్మరణతో ద్రవించనివి మనస్సులు కావు, అవి కరకుబండలు. పద్మనాభుని కథలకు ఆనందబాష్పాలు రాలగా పొంగి పులకించనిది శరీరం కాదు, అది కదలని మెదలని వట్టి మొద్దు. పరమాత్మునికి ప్రణమిల్లని మూఢుని తలమీదిది బంగారు కిరీటం కిరీటం కాదు, అది కట్టెలమోపు. భగవంతునికి అర్పితం కాని మానవుని ఐశ్వర్యం ఐశ్వర్యం కాదు, అది అడవిగాసిన వెన్నెల. వాసుదేవుని సేవింపనివాడు. ప్రాణవాయువు లోపల ఉండి కదిలే పీనుగు. పద్మనాభుని పాదాల నాశ్రయింపనివాని జీవితం పొత్తినూలికాయలోని సాలెపురుగు జీవితం.

ఈ రీతిగా పలికిన శుకయోగి పలుకులకు పరీక్షిత్తు చిత్తం వికసించింది. అతడు నిర్మలమైన బుద్ధి విశేషం కలవాడై.

ఆరాజు బిడ్డలనూ, హితులనూ, బంధువులనూ, భార్యనూ, ఇతర పరిజనాన్ని, ధనాన్సీ జడత్వాన్నీ వదలిపెట్టినాడు. కమలనేత్రుడైన మాధవునిపై చిత్తం నిలిపాడు.

ఈ రీతిగా మరణభయాన్ని విడనాడి, ధర్మార్ధకామాలనే త్రివర్గాన్ని తిరస్కరించి, పరమ పురుషునియందే మనస్సును కేంద్రీకరించి శ్రీహరి లీలావిశేషాలను శుకుడు వర్ణిస్తుండగా వినాలనే తలంపుతో పరీక్షిన్మహారాజు ఇలా అన్నాడు.

విప్రోత్తమా! సర్వమూ తెలిసిన నీవు సర్వానికీ ఆత్మ అయిన వాసుదేవుణ్ణి కీర్తించేసరికి నాకుగల భ్రాంతులన్నీ తొలగిపోయాయి. నా మనస్సు సంతోష పరవశమయింది.

మునివర్యా! సర్వేశ్వరుడూ, సర్వవ్యాపీ అయిన శ్రీహరి ఈ జగత్తును ఏ రీతిగా సృష్టిస్తూ, రక్షిస్తూ, సంహరిస్తున్నాడు? అవ్యయుడైన ఆ దేవుడు అనేక శక్తులు కలిగినవాడు. అతడు మొదట ఏ శక్తుల సాయంతో బ్రహ్మ ఇంద్రుడు మొదలైన రూపాలు దాల్చి వినోదించాడు? ఆయన సత్త్వరజస్తమస్సులనే ప్రకృతికి సంబంధించిన గుణాలను, పరిగ్రహించడం క్రమంగా జరుగుతుందా? లేక ఒకే సమయంలో జరుగుతుందా? ఏకమూర్తి అయిన ఈశ్వరుడు అనేక మూర్తులు ధరించి ఎందుకలా అనేక విధాల ప్రవర్తిస్తాడు? అలా ప్రవర్తించకపోతే ఆయనకు వచ్చే నష్టమేమి? నీవు అంతా తెలిసిన మహానుభావుడవు. నా కీవిషయాలు తెలియ జెప్పు.

పరీక్షిన్మహారాజు ఆ విధంగా అడిగే సరికి మౌనం వహించకుండా తగిన సమాధానం చెప్పాలన్న కుతూహలంతో ఉత్తమగుణ సంపన్నుడైన శుకుడు తన మనస్సులో ఇలా భగవంతుణ్ణి ప్రార్ధించాడు.

ప్రకృతికంటే, జీవునికంటె భీన్నుడై, (శ్రేష్ఠుడై), అంతటికీ అధిపతియై, గొప్ప మహిమలుగలవాడై, సృష్టిస్థితి సంహారాలనే క్రీడలు గావించువాడై, త్రిమూర్తుల శక్తులు గలవాడై, అందరికీ అంతరాత్మగా వెలుగొందుచున్నవాడై, బ్రహ్మ మున్నగు దేవాధిపులు అందుకోజాలని దుస్తరపథంలో ప్రకాశించేవాడైన శ్రీహరికి నేను తత్త్వప్రాప్తి మీద అభిలాషగలిగి ప్రణమిల్లుతున్నాను.

సజ్జనుల పాపాలను పరిహరించేవాడూ, దుర్జన శిక్షకుడూ, అన్ని రూపాలూ తన రూపమే అయినవాడూ, పరమహంసా శ్రమంలో ఉండే మునుల హృదయపద్మం మధ్య వెలుగొందేవాడూ, యదుకుల తిలకుడూ, సకల కల్యాణ గుణశోభితుడూ, ఉత్తమభక్తులకు సులభమైనవాడూ, భక్తిలేనివారికి దుర్లభుడూ, అత్యుత్తమమూ, అనుపమమూ, అనంతమూ అయిన ప్రవర్తన గలవాడూ, స్వస్వరూపమయిన బ్రహ్మంలో విహరించేవాడూ అయిన ఆ పరమేశ్వరునికి ప్రణమిల్లుతున్నాను.

ఏ పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి చేసే ప్రణామం, పూజ, ధ్యానం, నామసంకీర్తనం అమోఘమైనవో, ఏ ప్రభుని లీలలు వింటే దోషాలన్నీ తొలగి లోకం మంగళాయతనమవుతుందని పెద్దలు చెబుతున్నారో, అట్టి పాపరాశిపరిహారకుడూ, భద్రమయ కీర్తనుడూ అయిన భగవంతుణ్ణి ఆశ్రయిస్తున్నాను.

ఏ పరమాత్ముని చరణయుగళిని ఎల్లకాలాల్లోనూ కోరి సేవించి నిపుణులైనవారు అంతర్ముఖమైన బుద్ధితో ఇహపరలోకాలకు చెందిన జాడ్యం వదలుకొని ఏ విధమైన తాపం లేనివారై పరబ్రహ్మను పొందుటకుపాయమైన మార్గంలో శ్రమలేకుండా చరిస్తారో, అట్టి పాపసంఘవినాశకుడూ, మంగళప్రదకీర్తనుడూ అయిన పరమేశ్వరునికి నేను ప్రణామం చేస్తున్నాను.

ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని దానాలాచరించినా, ఎన్ని జపాలు నిర్వహించినా వాటివల్ల కలిగే ఫలాలను ఏ పరమేశ్వరుడికి సమర్పించకుంటే అవన్నీ నిందాస్పదాలై ఆపదలతో గూడీనట్లు పరిణమించునో, అట్టి పాపనివారకుడూ, మంగళకీర్తనుడూ, పరిమితి లేనివాడూ అయిన పరమేశ్వరుణ్ణి సేవిస్తాను.

యవనులు, కిరాతులు, పుళిందులు, హూణులు, శకులు, కంకులు, ఆభీరులు, చండాలురు అనే వారికి చెందిన జాతులలో జనించినవారునూ, మిగిలిన పాపశీలురునూ ఏ పరమ పావనుడైన భగవానుని సేవించి, ఉత్తములైన భాగవతులను ఆశ్రయించి శుద్ధశరీరులై, మంగళాకారులై ఉంటారో అట్టి వికారరహితుడూ, సర్వసమర్థుడూ అయిన పరమాత్మకు సదా నమస్కరిస్తాను.

తపస్సులతోనో, చిత్తనిగ్రహంతోనో, నానా దానాలతోనో, వ్రతాలతోనో, జపాలతోనో, మంత్రాలతోనో, శ్రుతిస్మృతుల అధ్యయనంవల్లనో, లేక ఉత్తమ భక్తితోనో, ఇలా దేనివల్ల ఆయన దివ్యచరణాలు లభిస్తాయి? అని బ్రహ్మరుద్రాదులు ఏ పరమాత్ముణ్ణి భావిస్తుంటారో ఆ మోక్షవిభుడూ, ఆత్మస్వరూపుడూ నాకు సదా సులభుడవుగాక!

లక్ష్మీదేవికీ, యజ్ఞానికీ, ప్రజలకూ, బుద్ధికీ, జగత్తుకూ, భూమికీ, యాదవకులానికీ పతీ గతీ అయిన భగవంతుణ్ణి నేను భజిస్తాను.

ఆ దేవుడు అణుస్వరూపుడా? లేక విభుస్వరూపుడా? దిక్కాలాదులచే పరిచ్చిన్నుడా? లేక అపరిచ్చిన్నుడా? సగుణుడా? నిర్గుణుడా అంటూ పండితులు తమ తత్పాన్వేషణ ప్రయత్నం విఫలం కాగా, ఏ దేవుని చరణకమలసేవా పరాయణులై తత్త్వాన్ని దర్శిస్తున్నారో అట్టి సర్వోత్కృష్టుడూ, విశ్వాత్ముడూ అయిన విష్ణుదేవుని నేను భజిస్తాను.

బ్రహ్మకు జగన్నిర్మాణం చేయాలన్న బుద్ది పుట్టించాలని ఏ భగవానుడు పూర్వం సరస్వతిని పంపగా ఆమె బ్రహ్మను తనకు భర్తగా స్వీకరించి లోకసామ్రాజ్యంలో ఆయనను సృష్టి నిపుణుణ్జిగా చేసిందో, అట్టి సగుణుదైన భగవంతుణ్ణి సేవించుట కుపక్రమిస్తాను.

తాను పరిపూర్ణుడై అంతటా వ్యాపించి ఉండికూడా పృథివ్యాదులగు ఐదు మహాభూతాలను కలిపి శరీరాలనే పురాలను నిర్మించి వాటిలో పురుషుడనే పేరుతో ఎవడు ధీరుడై ప్రకాశిస్తుంటాడో, పంచభూతాలనూ, పదునొకండు ఇంద్రియాలనూ, ప్రకాశించునట్లు చేసి మహామహిమతో షోడశకళాస్వరూపుడై వెలుగొందుతూ ఎవడు జీవత్వమనే నృత్తకళావిలాసం ప్రదర్శిస్తుంటాడో, అట్టి అవ్యయుడూ, అచ్యుతుడూ అయిన భగవంతుడు మనోజ్ఞమైన నవరసాలనే తేనెలు జాలువారగా నా మనస్సునుండి పుట్టిన వాక్కులనే పూలదండలతో సజ్జనుల హృదయసీమల నలరించుగాక!

పదునొకండింద్రియములు- వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థ అనేవి ఐదు కర్మేంద్రియాలు, శ్రోత్రం, చర్మం, చక్షువు, జిహ్మ, ఘ్రాణం-అనేవి ఐదు జ్ఞానేంద్రియాలు, మనస్సు చేరి పదునొకండింద్రియాలు.

నవరసాలు : శృంగారం, హాస్యం, కరుణం, రౌద్రం, వీరం, భయానకం, బీభత్సం, అద్భుతం, శాంతం-అనేవి నవరసాలు. నర్తకులు నృత్తస్తమయంలో నవరసాలు ఒలికిస్తూ సామాజికుల హృదయాలను రంజింప జేస్తారన్న ప్రక్రియ ఇక్కడ నిర్ధేశించబడింది.

మానమే ధనంగా గలవారూ, మహితాత్ములూ, సమాధి నిపుణులూ అయినవారు ఏ మహనీయుని ముఖపద్మధ్యానమనే తేనె నాస్వాదిస్తూ, భయరహితులై భవబంధ విముక్తులై విరాజిల్లుతారో, అట్టి ముని జనాగ్రగణ్యుడూ, గాఢమైన అజ్ఞానమనే చీకటికి సూర్యుడూ, సజ్జనులలో ముఖ్యుడూ అయిన వేదవ్యాస భగవానునికి నేను నమస్కరిస్తాను.

ఇలా శ్రీహరికీ వ్యాసభగవానునికీ ప్రణామాలు సమర్పించి శుకయోగి పరీక్షిన్మహారాజుతో ఇలా అన్నాడు.

మనుజేంద్రా! ఇప్పుడు నీవు నన్నడిగిన విషయాన్నే పూర్వం బ్రహ్మ నారాయణుని ద్వారా విన్నాడు. నారదుడు ప్రశ్నిస్తే దానినే ఆయన వివరించాడు. తదుపరి నారదుడు నాకది ఎరిగించాడు. వినదగినదీ, ఆశ్చర్యావహమైనదీ, సంశయం తొలగించేదీ అయిన ఆ విషయం నీకు చెబుతాను విను.


నారదుండు బ్రహ్మను బ్రపంచ ప్రకారంబు నడుగుట

Shuka Maharshi Explaining Mukthi Margam - శుకుడు పరీక్షిత్తునకు ముక్తి మార్గంబుందెల్పుట

శుకుడు పరీక్షిత్తునకు ముక్తి మార్గంబుందెల్పుట

రాజా! నీ విప్పుడడిగిన ప్రశ్న చాలా మేలైనది. ఎంతో సమంజసమైన, పరిపక్వమైన ప్రశ్న ఇది. ఆత్మతత్త్వం తెలిసినవాళ్ళు ఈ ప్రశ్నను అభినందిస్తారు. ఇది సకలశుభాలనూ చేకూరుస్తుంది. లోకంలో వినదగినవిషయాలు వేలకొలదిగా ఉన్నాయి. అందులో ఇది మిక్కిలి ముఖ్యమైనది. సంసారంలో మునిగి తేలే గృహస్థులకు ఆత్మతత్త్వం ఏ మాత్రం తెలియదు. వాళ్ళకు స్త్రీసంగమంతోనూ, నిద్రతోనూ రాత్రికాలం గడచిపోతుంది. పగలంతా కుటుంబవ్యవహారాలతో, ధనార్జనబుద్ధితో సరిపోతుంది. పశువులూ, భార్యలూ, బిడ్డలూ, చుట్టాలూ, శరీరమూ ఇత్యాదిగాగల పరివారమంతా శాశ్వతమని నమ్మి వాళ్ళు కాపురాలు సాగిస్తారు. చివరికొకనాడు శాశ్వతంగా కన్నుమూసి కాటిపాలవుతారు. అంత్యకాలానికి చెందిన ఈ దుఃస్థితి తెలిసికూడా తెలియనివారుగానే ఉండిపోతారు.

రాజా! మోక్షాపేక్షగలవానికి అన్నింటికి ఆత్మ అయినవాడు, మహావైభవం కలవాడూ, సర్వవ్వాపీ, జగదీశ్వరుడూ అయిన విష్ణువే వినడానికీ, సేవించడానికీ, వర్ణించడానికీ, భావించడానికీ అన్నివిధాలా తగినవాడు.

ఆత్మానాత్మవివేకమనే సాంఖ్యయోగంతోకానీ, ధర్మానుష్టానంతోకానీ చివరికాలంలో శ్రీహరిని చింతించాలి. అలా చేయడమే మానవజన్మ దాల్చినందుకు ఫలం.

రాజా! ఉత్తమమూ, నిర్మలమూ అయిన బుద్ధిగల మహాత్ములు శాస్త్రంలో చెప్పిన విధినిషేధాలు వర్జించి గుణరహితమైన పరబ్రహ్మాన్ని ఆశ్రయిస్తారు. మనస్సులో ఎల్లవేళలా శ్రీహరిగుణాలను చింతిస్తూ ఉంటారు.

నా తండ్రి వ్యాసభగవానుడు. ద్వాపరయుగంలో భాగవతం నాచేత చదివించాడు. నేను పరబ్రహ్మంలో లగ్నమైన చిత్తం కలిగి భగవంతుని అవతారలీలలు నన్నాకర్షించడంవల్ల దీన్ని పఠించాను. నీవు పంకజాక్షుని పాదపద్మాలను ఆశ్రయించిన భక్తుడివి. అందుచేత నీకు భాగవతతత్త్వం వివరిస్తాను. వినవయ్యా మహారాజా! భాగవతశ్రవణంవల్ల విష్ణువును సేవించాలనే బుద్ధి విస్తరిస్తుంది. మోక్షం కోరేవాడికి ముక్తి లభిస్తుంది. జన్మ జరామరణాది సంసారభయాలన్నీ సమసి పోతాయి. యోగివర్యులకు వాసుదేవుని నామకీర్తనలు ఉత్తమమైన వ్రతాలు.

రాజా! విష్ణుదేవుని తెలుసుకోకుండా మత్తెక్కి సంసారంలో అనేక సంవత్సరాలతరబడి పొర్లుతూ సతమతమవుతుండే అవివేకి ముక్తికెలా పోగలడు? వాడు సంసారంనుండి ఎన్నటికీ ముక్తుడు కాలేడు. ఇది నిక్కం. ఒక్క ముహూర్తకాలమైనా హరిని స్మరిస్తే చాలు, అది ముక్తిని ప్రసాదిస్తుంది.

కౌరవనాథా! పూర్వం ఖట్వాంగుడనేరాజు సప్తద్వీపాలనూ పరిపాలిస్తుండేవాడు. ఇంద్రాదిదేవతలు యుద్ధభూమిలో భయంకరులైన దానవులచే ఓడిపోయారు. ఓడి ఆ రాజుచెంతకు వచ్చి తమకు సాయం చేయుమని అర్థించారు. ఆయన భువినుండి దివికేగి దానవేశ్వరులనందరినీ సంహరించాడు. అందుకు సంతసించిన దేవతలు ఖట్వాంగుణ్ణి ఏదైనా వరం కోరుకొమ్మన్నారు. "నే నెంతకాలం జీవిస్తానో చెప్పండి! ఇదే నేను కోరే వరం, వేరేవరంనా కక్కరలేదు" అని అతడన్నాడు. "నీకు ఆయువింక ఒక్క ముహూర్తకాలం (రెండుగడియలు) మాత్రమే ఉన్నది" అని ఆ వేల్పులన్నారు. వెనువెంటనే ఆ భూపాలుడు విమానయానంతో భూలోకానికి వచ్చాడు.

అలా దివినుంది వచ్చిన ఖట్వాంగమహారాజు కొండలవంటి గజాలనూ, గుర్రాలనూ, ప్రాణప్రియలైన సుందరీమణులనూ, సన్నిహితులైన హితులనూ, పండిత శ్రేష్ఠులనూ ప్రగాఢమైన వైరాగ్యంతో పరిత్యజించాడు.

ఆ రీతిగా సర్వసంగ పరిత్యాగం చేసిన ఖట్వాంగమహారాజు గోవిందనామ సంకీర్తన చేస్తూ, మరణభయం వదలిపెట్టి రెండు గడియలకాలంలోనే ముక్తిపొందాడు.

రాజా! విను. నీకు ఏడుదినాల తరువాతనే కదా మరణం! అప్పటివరకూ పరలోకసాధనమైన పరమశుభాన్ని ఆర్జించడానికి ఎంతో అవకాశం ఉంది. అవసానసమయం సమీపించగానే భయపడకుండా దేహధారి అయినవాడు శరీరం, పుత్రులు, భార్య మొదలయిన వారిపైగల మోహమనే వృక్షాన్ని నిష్కామమనే ఖడ్గంతో తెగనరకాలి. ఇల్లు వదలిపోయి పావనమైన తీర్ధజలాలలో స్నానమాడుతూ ప్రశాంతమైన ఏకాంతప్రదేశం చేరుకోవాలి. అక్కడ శాస్త్రం విధించినట్లు దర్భలూ, జింకచర్మం, వస్త్రం పరచుకొని కూర్చోవాలి. జగమంతా పవిత్రం చేయగలదీ, అకార-ఉకార-మకారాలనే మూడక్షరాలతో కూడినది, బ్రహ్మబీజం అయిన ఓంకారాన్ని మనస్సులో స్మరిస్తూ ఉచ్చ్వాస నిశ్వాసాలను వశపరచుకోవాలి. ఆపై విషయాలను వెన్నంటి పరుగిడే ఇంద్రియాలను బుద్ది అనే సారధితోనూ, మనస్సు అనే పగ్గంతోనూ బిగబట్టి నిగ్రహించాలి. గట్టి కర్మబంధాలలో చిక్కుకొని ఊగిసలాడే చిత్తాన్ని ప్రజ్ఞాబలంతో నిరోధించి భగవంతునిమీద నిశ్చలంగా నిలపాలి. విషయచింతలులేని చిత్తంతో ఆ దేవుని కరచరణాదులైన అవయవాలను క్రమంగా ధ్యానించాలి. రజోగుణ తమోగుణాలచేత ఆకర్షింపంబడి మోహానికి లోనయ్యే మనస్సును ఆ గుణాలవల్ల కల్గిన మాలిన్యాలనూ ధారణతో తొలగించి నిర్మలం చేయాలి. అలా చేసినవాడు సర్వోత్కృష్టమైన విష్ణుపదం చేరుకుంటాడు. ధారణానియమం సిద్ధిస్తే అతడు సుఖమయమైన విషయాన్ని దర్శిస్తాడు. అట్టి యోగి భక్తిలక్షణమైన యోగాన్ని ఆశ్రయించి మోక్షం చూరగొంటాడు. ఈ విధంగా పలికిన శుకయోగీంద్రునితో పరీక్షిన్నరేంద్రుడు ఇలా అన్నాడు.

మునివర్యా! ధారణ ఎలా నిలుస్తుంది? ధారణ స్వరూపం ఎలాంటిది? ధారణ అంటే ఏమిటి? అది జీవుని చిత్తమాలిన్యాన్ని ఎలా పరిహరిస్తుంది? దయతో ఈ విషయం నాకు తెలపండి!

రాజు చెప్పిన మాటలు విని అవధూతల్లో మేటి అయిన శుకయోగి ఆ రాజునుద్దేశించి ఇలా పలికాడు.

అక్షరత్వా ద్వరేణ్యత్వా ద్ధూతసంసారబంధనాత్‌ 

తత్త్వమస్యర్థ సిద్ధత్వా దవధూతో
భిధీయతే ॥

క్షరం(వినాశం) లేని ఆత్మస్వరూపుడు, శ్రేష్ఠపురుషుడు, సంసారబంధం వదలించుకొన్నవాడు "తత్వమసి" అన్న మహావాక్యార్థాన్ని అనుభవంలోకి తెచ్చుకొన్నవాడు అవధూత అవుతాడు. పై లక్షణ శ్లోకంలో ప్రథమపాదం మొదట 'అ' అనీ, ఆ పాదం మధ్యలో 'వ' అనీ, రెండవపాదం మొదటి 'ధూ' అనీ, మూడవపాదం మొదట 'త' అని ఉన్న నాలుగక్షరాలను కలిపితే 'అవధూత' శబ్దం సిద్ధిస్తుంది. అవధూతలు ఆత్మ వినాశనం లేనిదని గ్రహించి, సంసారాన్ని వదలించుకొని 'తత్‌+త్వం+అసి' అను ఉపదేశరూపమైన మహావాక్యాన్ని అనుభవంలోకి తెచ్చుకొంటారు. అందుచే వారు శ్రేష్ఠపురుషులు.

పండితుడైనవాడు శ్వాసవాయువుల నరికట్టి సంసారంతోడి సంగాన్ని త్యజించాలి. ఇంద్రియాలను జయించాలి. ఆపై బుద్ధిబలంతో మనస్సును విష్ణుదేవుని విశాలమైన రూపంమీదే స్థిరంగా నిలపాలి. 

రాజా! విను. భగవానుడైన విష్ణుని విరాట్‌ విగ్రహంలో జరిగిన, జరుగనున్న జరుగుతున్న ప్రపంచమంతా గోచరిస్తుంది. భూమి, జలం, అగ్ని వాయువు, ఆకాశం, అహంకారం, మహత్తత్త్వం అనే ఏడు ఆవరణాలు మహాండకోశమైన విరాట్పురుషుని శరీరాన్ని కప్పి ఉన్నాయి. ఆ శరీరంలో ధారణకు ఆశ్రయమై వైరాజపురుషుడు భాసిస్తున్నాడు. ఆ మహాత్మునికి పాతాళం అరికాలు; రసాతలం కాలిమడమ, మునివ్రేళ్ళు; మహాతలం చీలమండలు; తలాతలం పిక్కలు; సుతలం మోకాళ్ళ జంట; వితలం అతలం తొడలు; భూతలం పిరుదు; ఆకసం బొడ్డు; గ్రహాలూ, తారకలూ, జ్యోతిస్సమూహంతో కూడిన నక్షత్రలోకం వక్షఃస్థలం; మహర్లోకం మెడ; జనలోకం ముఖం; తపోలోకం నొసలు; సత్యలోకం శిరస్సు; ఇంద్రాదులు భుజదండాలు; దిక్కులు చెవులు; శబ్దం శ్రోత్రేంద్రియం; అశ్వినీదేవతలు ముక్కుపుటాలు; గంధం ఘ్రాణేంద్రియం; అగ్ని నోరు; అంతరిక్షం కళ్ళు, సూర్యుడు నేత్రేంద్రియం, రేపవళ్ళు కనురెప్పలు, బ్రహ్మపదం కనుబొమలు, జలాలు దవడలు, రసం జిహ్వేంద్రియం. సకలవేదాలు భాషణాలు, యముడు కోరలు, పుత్రాదులమీది స్నేహ కళలు దంతాలు, జనులకు పిచ్చి కల్గించే మాయావిలాసాలు నవ్వులు, తుదిలేని సృష్టులే కడగంటి చూపులు; సిగ్గు, లోభం పెదవులు, ధర్మమార్గాలు రొమ్ములు; అధర్మమార్గం వెన్ను, ప్రజాపతి పురుషాంగం, మిత్రావరుణులు వృషణాలు, సముద్రాలు కడుపు, కొండలు ఎముకలు, నదులు నాడులు, చెట్లు రోమాలు, గాడ్పు నిట్టూర్పులు, కడలేని కాలమే ప్రాయం. పలువిధాలైన ప్రాణులతో గూడిన సంసారాలు కర్మలు, మబ్బులు శిరోజాలు, సంధ్యలు కట్టుబట్టలు, ప్రధానం హృదయం, చంద్రుడు వికారాల కన్నింటికి స్థానమైన మనస్సు. మహత్తత్వం చిత్తం. రుద్రుడు అహంకారం, గుర్రాలు, కంచరగాడిదలు, ఒంటెలు, ఏనుగులు గోళ్ళు; పశువులు, మృగాదులు కటిప్రదేశం, పక్షులు చిత్రమైన మాటలనేర్పులు, మనువు బుద్ది, పురుషుడు నివాసం, గంధర్వులు, విద్యాధరులు, చారణులు, అప్సరసలు షడ్జం మొదలయిన స్వరాలు; ప్రహ్లాదుడు స్మృతి, దైత్యులు, దానవులు వీర్యం. అంతేకాదు, ఆ మహాప్రభువునకు బ్రాహ్మణులు ముఖం, క్షత్రియులు భుజాలు, వైశ్యులు తొడలు, శూద్రులు పాదాలు, వసువులు రుద్రులు, హవిర్భాగాలు ద్రవ్యాలు, యజ్ఞప్రయోగాలు కర్మలవుతున్నాయి. ఇట్టి విశ్వమయుడైన విరాట్పురుషుని విగ్రహాన్ని మోక్షం కోరేవాడు తన మనస్సులో అనుసంధానం చేసుకోవాలి అని చెప్పి శ్రీశుకమహర్షి ఇంకా ఇలా చెప్పినాడు.

వంశపావనుడవైన ఓ పరీక్షిన్మహారాజా! ఈ విశ్వమంతా విష్ణమయమే. విష్ణుదేవుడు విశ్వమయుడు. ఇందులో ఏ మాత్రం సందేహించ వలసిన పనిలేదు. విష్ణమయం కాని వస్తువు ఈ జగత్తులో ఒక్క పరమాణువు గూడా లేదు.

రాజా! జీవుడు కలలో తనకంతవరకూ తీరని కోరికలమీది ఉబలాటంతో పలుశరీరాలు ధరిస్తాడు. పలుపేర్లతో వ్యవహరింపబడతాడు. తన ఇంద్రియాలతో విశేషా లన్నింటినీ గమనిస్తాడు. ఆ మీదట తన్ను తెలుసుకొంటాడు. ఇట్లే అంతటికీ అంతరాత్మయయిన పరమాత్మ అన్నిప్రాణుల హృదయాలలో ఉండి ప్రజ్ఞతో బుద్ధి వృత్తులనన్నింటినీ పరిశీలిస్తాడు. తానే అన్నిటికీ ప్రభువు కావడంవల్ల దేనికీ బద్దుడు కాడు. ఆయన సత్యస్వరూపుడూ, ఆనందపరిపూర్ణుడూ అయిన విజ్ఞానమూర్తి. ఆయనను సేవించినప్పుడే ముక్తి సిద్ధిస్తుంది. తదితరుల సేవతో మోక్షం సిద్ధించదు. ఈ సంసారబంధం వీడదు.

రాజా! పూర్వం బ్రహ్మ జగత్తును సృష్టించాలనుకొన్నాడు. పలు సంవత్సరాలు అందుకై ప్రయత్నించాడు. అయినా అందుకు తగిన నేర్పు బ్రహ్మకు సిద్ధించలేదు. ఆపై హరిని ఏకాగ్రమైన చిత్తంతో ప్రార్ధించాడు. ఆ హరి కృపవల్ల మళ్ళీ సృష్టి క్రమాన్ని స్మరించగలిగాడు. ఆ ధారణతో ప్రాణులను సృష్టించే విధానంలో నేర్పు గడించాడు. ఫలప్రదమైన, పూజనీయమైన బుద్ధివికాసంతో ఈ జగన్నిర్మాణంలో సమర్థుడై విహరించాడు.

అవివేకియైన మానవుడు శబ్దప్రధానమైన వేదంలోని కర్మకాండ బోధించినట్లు నిరర్ధకాలైన స్వర్గాదిసుఖాలు కోరుతాడు. నిద్రించేవాడు పూర్వసంస్కారంతో కలలు కన్నట్లు మాయామయమైన మార్గంలో పరిభ్రమిస్తాడు. అంతేకాని శాశ్వతమైన మోక్షసుఖం పొందలేడు. వివేకవంతుడు అలా చేయడు. అతడు నిస్సారమైన భోగాలలో శరీరధారణకు అవసరమైనంత మేరకే భోగస్వీకారం చేస్తాడు. కడు జాగరూకుడై ఉంటాడు. సంసారం సుఖమని భావించడు. దాని కతీతమైన త్రోవలో పోతేనే సిద్ధి కల్గుతుందని భావించి అలా ప్రవర్తిస్తాడు.

సంసారంపట్ల విరక్తుడైన వివేకవంతుడు ఇలా భావన చేస్తాడు: పడుకోవడానికి తగినంత చదునైన చక్కని నేల ఉండగా దూదిపరుపు లెందుకు? పుట్టుకతో వచ్చిన దోసిళ్ళు ఉన్నాయి కదా? మరి భుజించడానికి కంచాలు మొదలైనవి ఎందుకు? నారచీరలూ, జింకచర్మాలూ, దర్భచాపలూ ఉన్నవి కదా! ఇక కట్టుకోవడానికి పట్టు పుట్టాలందుకు? నివసించడానికనువైన కొండ గుహలున్నాయి కదా! ఇక మేడలూ, రాజప్రాసాదాలూ ఎందుకు? చెట్లు తగినట్లు ఫలరసాలను ప్రసాదిస్తున్నాయి కదా! నదులలో తియ్యని నీటికి లోటు లేదుకదా! పుణ్యస్త్రీలు పుష్కలంగా భిక్షలిస్తూనే ఉన్నారు కదా! ఇవన్నీ ఉండగా తపోధనులైనవారు, ధనమదంతో కన్నూ మిన్నూ కానని సంపన్నులను ఎందుకు సేవించాలి?

దిక్కులేని వారికి దిక్కై తాను కాపాడుతానంటూ చక్రధారియైన శౌరి తానున్నాడు. అలాంటప్పుడు ఆత్మజ్ఞులైన వివేకవంతులు అసమర్థుడైన ఒక మనుజుణ్ణి రక్షించుమంటూ ప్రార్ధింపవలసిన అవసర మేమున్నది?

ఈ విధంగా భావించి బుద్ధిమంతుడైనవాడు, జీవుల హృదయంలో స్వతస్సిద్ధంగా ఉన్నవాడూ, అంతర్యామీ, ప్రీతిపాత్రుడూ, నిత్యుడైనవాడూ, సత్యస్వరూపుడూ, షడ్గుణైశ్వర్యసంపన్నుడైన భగవానుడగు వాసుదేవుణ్ణి సేవిస్తాడు. ఆ సేవవలన కలిగే ఆనందం అనుభవిస్తాడు. తద్ద్వారా సంసారానికి హేతువైన అవిద్య అనే ప్రకృతినుండి విడుదల పొందుతాడు కాబట్టి-

నృపశ్రేష్ఠా! శ్రీహరిని ధ్యానించకుండా మదోన్మత్తచిత్తుడై విషయభోగాలనే చింతిస్తూ దినాలు గడిపేవాడికి యమభటుల గదల దెబ్బలు తప్పవు. అతడు యమపురద్వారం వద్ద వైతరణీనదిలోని అగ్ని జ్వాలల్లోపడి మలమల మాడిపోతాడు.

భగవచ్చింతనలేని పాషండులను యమకింకరులు గదలతో మోదుతారు. వాళ్ళ దేహాలను మంటలపాలు చేసి మాడుస్తారు. వాటిని ముక్కలు ముక్కలయ్యేటట్లు పిసికి ఆపై వాటిలోకి చురకత్తులు దూరుస్తారు.

అంతేకాదు. శ్రీహరి పాదపద్మాలలోని పరిమళం మకరందానికున్న మాధుర్యం చవిచూడడానికి విముఖులైనవాళ్ళు తమతమ కర్మబంధాలలో చిక్కుకొంటారు. తద్ద్వారా యమనగరద్వారంవద్ద ప్రవహించే వైతరణీనదిలోని భగభగమండే అగ్ని జ్వాలల్లో కాలిపోతున్న వాళ్ళతో జతగూడుతారు. విశిష్టజ్ఞానులై జీవించే శరణాగతులు మాయకు లోబడక నేర్పుతో తమ తమ హృదయాలలోని భగవంతుని ధ్యానిస్తారు.

ఆ భగవానుడు జుత్తెడు కొలతగల శరీరం కలవాడు, దిగ్గజాల తొండాలలాగా పొడవైన నాలుగు చేతులుగలవాడు, చక్కదనంలో కోటి మంది మన్మథులకు దీటైనవాడు, మందరగిరిని ధరించినవాడు, పున్నమ నాటి జాబిల్లిని పోలిన మోము కలవాడు, సౌభాగ్యానికి నెలవైనవాడు, ప్రాతఃకాలపు సూర్య బింబంలాగా ప్రకాశించే పద్మరాగమణులు పొదిగిన కిరీట కుండలాలు తాల్చినవాడు, వక్షఃస్థలంలో శ్రీవత్సమనే పుట్టుమచ్చ గలవాడు, కమనీయమైన కౌస్తుభరత్నం పొదిగిన కంఠాభరణం మెడలో అలంకరించుకొన్నవాడు. ఎప్పుడూ సువాసన లీనే వనమాలతో ఒప్పారేవాడు, పలువిధాలైన పెద్ద పెద్దహారాలూ, భుజకీర్తులూ, కడియాలూ, మురుగులూ, మొలనూలూ, ఉంగరాలూ మొదలగు సొమ్ములతో శోభిల్లేవాడు, నొసట ముసురుకొన్న నిగనిగలాడే నీలి ముంగురులు గలవాడు, రాకాచంద్రుని వెన్నెలవలె తెల్లని మందహాసం కలవాడు, కరుణామయమైన కడగంటి చూపులతోడి భ్రూవిలాసాలతో భక్తులపై పరమానుగ్రహం ప్రసరింపజేసేవాడు, మహాయోగీశ్వరుల హృదయపద్మాలలో చివుళ్ళవంటి తన అడుగులు మోపినవాడు, సదా ఆనందస్వరూపుడు, వేయికోట్ల సూర్యులతో సమానమైనవాడు, లోకాలకు ప్రభువు అయిన ఆ పరమేశ్వరుణ్ణి విజ్ఞాన సంపన్నులు మనోధారణతో చిక్కబట్టి ఆ దేవుని చీలమండలు, అడుగులు, మోకాళ్ళు, పిక్కలు మున్నగు అవయవాలలో ఒక్కొక్కదానిని అనుక్షణం క్రమంగా ధ్యానిస్తారు. అచంచలమైన పూర్ణభక్తియోగం సిద్ధించేవరకూ ఆ పరమేశ్వరుని ధ్యానంలో నిమగ్నులై ఉంటారు. 

ఇలా చెప్పి శుకుడు మళ్ళీ ఈ రీతిగా అన్నాడు.

రాజా! ప్రారబ్ధకర్మ తీరేసరికి శరీరం పరిత్యజించాలనుకొన్న సన్న్యాసి దేశకాలాల కోసం ఎదురుచూడడు. మరణించాలన్న భావన కల్గగానే అతడు సుఖాసనస్థు డవుతాడు. మనస్సుతో ప్రాణవాయువును నిగ్రహిస్తాడు. మనోవేగాన్ని బుద్ధితో అరికడతాడు. బుద్ధిని క్షేత్రజ్ఞుడనబడే జీవాత్మతో పొందుపరుస్తాడు. జీవాత్మను శుద్దాత్మలో చేరుస్తాడు. శుద్దాత్మను పరమాత్మలో లీనం చేస్తాడు. అలాచేసి శాంతుడై పనులన్నింటినీ వదలిపెడతాడు. ఆపై శాశ్వతసుఖం కావాలని అభిలషిస్తాడు.

రాజా! విను. పరమాత్మయైన పరబ్రహ్మానికి తప్ప కాలానికి లోబడిన బ్రహ్మాదులైన దేవతలకూ, సత్త్వం, రజస్సు, తమస్సు అనే గుణాలకూ, అహంకారానికీ, మహత్తత్త్వనికీ, సమస్త సృష్టికీ మూలమైన ప్రధానమనబడే ప్రకృతికీ ఎట్టి ఆధిపత్యమూ లేదు. అందుచేత పరమాత్మకంటె భిన్నమైన పదార్థమేదీ లేదు. సత్పురుషులు శరీరాదులపై ఆత్మభావన వదలుతారు. ఇతర విషయాలపై వ్యామోహం విడనాడుతారు. పూజనీయమైన మాధవుని పాదపద్మాలను మనస్సులో అనుక్షణమూ నిల్పుకొని ఉంటారు. వైకుంఠమే అన్నిటికంటె ఉత్తమ స్థానమని గ్రహిస్తారు. ఈ రీతిగా శాస్త్రజ్ఞాన బలమనే మంటలో విషయవాసనలను తగులబెట్టి వారు దేనిపైనా అపేక్ష లేకుండా ఉంటారు.

రాజా! యోగియైనవాడు కాలిమడమతో మూలాధార చక్రాన్నీ గుదస్థానాన్ని అదిమిపడతాడు. ఆ మీదట ప్రాణ వాయువును బిగబట్టి బొడ్డు వద్దగల మణిపూరక చక్రానికి తీసుకుపోతాడు. అక్కడనుండి హృదయంలోని అనాహతచక్రానికీ, అందుండి వక్షఃస్థలంలోని విశుద్ధచక్రానికీ, అక్కడనుండి తాలుమూలానికీ, అచ్చటనుండి కనుబొమ్మల మధ్యగల ఆజ్ఞాచక్రానికీ ప్రాణవాయువును తరలిస్తాడు. ఆపై కళ్ళు, చెవులు, ముక్కు నోరు ఇవి మూసుకొని ఏ కోరికలూ లేనివాడై అర్ధముహూర్తసమయంలో ఇంద్రియాలతో ఎట్టి సంబంధమూ లేకుండా ప్రాణాలను నిగ్రహిస్తాడు. పిదప నెత్తిపై గల బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకొని బ్రహ్మంలో లీనమై పోతాడు.

శరీరం పరిత్యజించే వేళలో ఇంద్రియాలతో సంబంధం వీడనివాడు వాటితో కూడ గుణమయమైన బ్రహ్మాండంలో ఖేచరులు, సిద్దులు విహరించడానికి తగినదీ, అణిమ, మహిమ మొదలయిన ఐశ్వర్యాలన్నింటితో గూడినదీ అయిన బ్రహ్మలోకం చేరుకొంటాడు. విద్య, తపస్సు, యోగం, సమాధి-వీటిని అనుష్ఠిస్తూ లింగశరీరాన్ని వాయువులో లీనం చేసిన యోగివర్యులు బ్రహ్మాండం లోపలా, వెలుపలా సంచరిస్తూ ఉంటారని పెద్దలంటారు. కేవలం కర్మలతో అట్టిగతిని ఎవరూ పొందలేరు. బ్రహ్మలోకాభిముఖుడైన యోగి సుషుమ్నానాడి ద్వారా బయలుదేరి ఆకసంలో పయనిస్తూ అగ్ని దేవతను చేరుకొంటాడు. అక్కడ జ్యోతిర్మయమైన ప్రకాశంతో పుణ్యపాపాలు తొలగించుకొని నిర్మలుడై భాసిస్తాడు. అతడు దేనిలోనూ తగులువడడు. నక్షత్రపథం అతిక్రమించి పోతాడు. ఆపైన సూర్యమండలం మొదలు ధ్రువమండలం వరకూ అన్ని మండలాలనూ వరుసగా దాటుకొంటాడు. చివరికి విష్ణుసంబంధమైన శింశుమార చక్రం చేరుతాడు. అక్కడ ఒంటరిగా పరమాణుస్వరూపమైన లింగశరీరంతో బ్రహ్మవేత్తలకు నెలవైన మహర్షోకం ప్రవేశిస్తాడు. అక్కడే ఉండి మహాకల్పకాలం వరకూ క్రీడిస్తాడు. కల్పాంత కాలంలో అనంతుని వదనంనుండి వెలువడే కరాళాగ్ని జ్వాలల్లో దగ్ధమవుతున్న ముల్లోకాలనూ చూస్తాడు. అందువల్ల కలిగే అగ్నిదాహం సహించలేక అక్కడనుండి బ్రహ్మలోకం చేరుకొంటాడు.

భూలోకంలో పదునలుగురు మనువులూ పుట్టి గిట్టె కాలమంతా కలిస్తే బ్రహ్మలోకంలో ఒక్కదిన మవుతుంది. అక్కడ మహనీయులైన సిద్దుల విమానాలు సూర్యతేజంతో విరాజిల్లుతుంటాయి. శోకం, వార్ధక్యం, చావు, కృశత్వం, భయం, దుఃఖం, ఇలాంటి బాధలు లేని చోటది. హరిచరణాలను ధ్యానించాలనే తెలివిలేక మూఢులైనవారి శోకస్థితిని ఆ లోకంనుండి చూడవచ్చు. శ్రేష్ఠులైన సిద్ధులూ, యోగులూ అక్కడ అమృతప్రాయంగా మాట్లాడుకోవడాన్ని చెవుల పండువుగా వినవచ్చు. రాజేంద్రా! అట్టి బ్రహ్మలోకంలో అతడు నివసిస్తాడు. ఆ లోకంనుండి మళ్ళీ తిరిగిరాడు.

ఇంకనూ ఒక విశేషం ఉన్నది. గొప్ప పుణ్యంవల్ల బ్రహ్మలోకం చేరినవారు మరొక కల్పంలో తమ సుకృతంయొక్క హెచ్చుతగ్గుల ననుసరించి ఆ యా అధికారాలు పొందుతారు. బ్రహ్మాదిదేవతలను భజించి శరీరత్యాగం చేసినవారు ఆ బ్రహ్మ జీవించినంతకాలం బ్రహ్మలోకంలో జీవించి ఆపై ముక్తిపొందుతారు. శ్రీహరి పాదపద్మాలపై మిక్కిలి భక్తి గలిగి దేహం వీడినవారు స్వేచ్చతో నిరాటంకంగా పయనించి బ్రహ్మాండాన్ని ఛేదించుకొని అత్యున్నతమైన వైష్ణవస్థాన మధిష్టించి ప్రకాశిస్తారు. ఈశ్వరుడధిష్టించిన ప్రకృతి యొక్క అంశంనుండి మహత్తత్త్వం జనిస్తుంది. మహత్తత్త్వాంశతో అహంకారం కల్గుతుంది. అహంకారాంశనుండి శబ్దతన్మాత్ర ఉదయిస్తుంది. శబ్దతన్మాత్రాంశం నుండి ఆకాశం పుడుతుంది. ఆకాశంలో స్పర్శతన్మాత్ర ప్రభవిస్తుంది. స్పర్శతన్మాత్రఅంశం నుండి వాయువు జనిస్తుంది. వాయువు అంశం నుండి రూపతన్మాత్ర కల్గుతుంది. రూపతన్మాత్రాంశం నుండి తేజస్సు జనిస్తుంది. తేజోంశం నుండి రసతన్మాత్ర కల్గుతుంది. రసతన్మాత్ర అంశం నుండి జలం జనిస్తుంది. జలాంశంనుండి గంధతన్మాత్ర కల్గుతుంది. గంధతన్మాత్రాంశం నుండి పృథ్వి ఉదయిస్తుంది. వీటన్నింటి కలయికవల్ల పదునాల్గు భువనాలతో గూడిన విరాట్‌ స్వరూపం ఉద్భవిస్తుంది. ఆ రూపానికి కోటి యోజనాల విస్తీర్ణమైన పెద్ద బానవంటిది మొదటి ఆవరణమైన భూమి అవుతుంది. కొందరు దీన్ని ఏబది కోట్ల యోజనాల వైశాల్యం కలదని వర్ణిస్తారు. ఈ ఆవరణం మీద జలం, తేజం, వాయువు, ఆకాశం, అహంకారం, మహత్తత్త్వం అనే ఆరు ఆవరణాలున్నాయి. అవి క్రమంగా ఒకదానికంటె ఒకటి పదేసిరెట్లు పెద్దవి. ఆ ఏడావరణాల మీద ఎనిమిదవదైన ప్రకృత్యావరణం గొప్పగా వ్యాపించి ఉన్నది.

ఈ బ్రహ్మాండాన్ని ఛేదించుకొని విష్ణుపదం అధిస్టించినవాడు మరణాది భయంలేని వాడవుతాడు. అతడు మెల్లమెల్లగా లింగశరీరంతో పృథివీతత్త్వం పొందుతాడు. ఆ తత్త్వంలో ఘ్రాణేంద్రియంతో గంధం గ్రహిస్తాడు. జలస్వరూపుడై రసనేంద్రియంతో రసాన్ని ఆస్వాదిస్తాడు. తేజోరూపుడై నేత్రేంద్రియంతో రూపాన్ని గ్రహిస్తాడు. వాయుస్వరూపుడై త్వగింద్రియంతో స్పర్శాన్ని గ్రహిస్తాడు. గగన స్వరూపుడై శ్రోత్రేంద్రియంతో శబ్దగ్రహణం చేస్తాడు. అన్నింటినీ అతిక్రమించి ఆ యోగి ఆకాశాదులైన పంచభూతాలకూ, సూక్ష్మేంద్రియాలకూ లయస్థానమైన అహంకారావరణం చేరుకుంటాడు. అక్కడ మనోమయమూ, దేవమయమూ ఐన సాత్త్వికాహంకారంతో మహత్తత్త్వంలో ప్రవేశిస్తాడు. ఆపై సత్వరజస్తమోగుణాలు లయించిన ప్రకృతిని పొందుతాడు. ఆ ప్రకృత్యాత్మకత్వంతో దేహాన్నీ ఉపాధి పరంపరలన్నీ ముగిసిన తరువాత ప్రకృతినీ పరిత్యజించి ఆనందమయు డవుతాడు. ఆ ఆనందంతో పరమాత్మ స్వరూపమైన వాసుదేవ పరబ్రహ్మంలో లీనమవుతాడు. ఈ విధంగా చెప్పి శుకయోగి పరీక్షిన్నరేంద్రునితో ఇంకా ఇలా అన్నాడు.

కౌరవశ్రేష్ఠా! ఇది భాగవతోత్తములు అనుసరించే త్రోవ. ఈ మార్గాన పయనించిన యోగి వందలాది యుగాలు గడచినా మళ్ళీ తిరిగి రాడు. ఇందులో సందేహం లేదు.

రాజా! సద్యోముక్తి, క్రమముక్తి అనే రెండు మార్గాలను గురించి నీవు నన్నడిగావు. ఇవి రెండు వేదగీతలలో వివరింపబడి ఉన్నాయి. పూర్వం బ్రహ్మదేవుడు తన్ను ఆరాధింపగా విష్ణుదేవుడు ఆయనకు వీటిని గురించి బోధించాడు. సంసారంలో ప్రవేశించినవానికి, తపస్సు, యోగం మొదలయిన ఎన్నో మోక్షమార్గాలు ఉన్నాయి. అన్నింటికంటె భక్తిమార్గం సులభమైనది.

శుకుడు పరీక్షిత్తునకు భక్తిమార్గంబె ముఖ్యంబని తెలుపుట

Wednesday, February 11, 2026

Sree Maha Bhagavathamu Part 2 - శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము



Shuka Maharshi Came To Parikshith Place - శుకమహర్షి పరీక్షిన్మహారాజు నొద్ద కేతెంచుట

శుకమహర్షి పరీక్షిన్మహారాజు నొద్ద కేతెంచుట

అనుక్షణం అంతర్ముఖంగా పరబ్రహ్మ స్వరూపాన్ని చూచి పరవశించిన హృదయంతో బాహ్యప్రపంచాన్ని మరచినవాడు, తామరపైన గండుతుమ్మెదలవలె ముద్దులు మూటగట్టే మొగంపై ముంగురులు ముసురుకొన్నవాడు, గీతగీసి మాయను సమ్మతింపని విధంగా వస్త్రాలు ధరింపక దిగంబరుడై తిరిగేవాడు, ఇతడు సర్వసంగపరిత్యాగియైన యోగి అని చాటుతున్నట్లు పరిహాసాలు పలికే బాలురు వెంట వచ్చేవాడును, సహజసుందరములైన కాళ్లు, పిక్కలు, తొడలు, నడుము, చేతులు, భుజములు, ఉరము, కంఠము, ముఖము, నొసలు, వీనులు, కన్నులు, ముక్కు చెక్కిళ్లు, తల కలిగిన ఒక అవధూత అనుకోకుండా అచ్చటికి విచ్చేశాడు.

ఇవ్వలేదని లోకులపై కోపించి ఎగ్గులు పలుకడు. కావలెనని ఏ కోరికలను కోరడు. జనసమూహంలో చేరడు. వ్యర్థమైన సంభాషణలను చేయడు. అంతేకాదు వ్యర్థమైన ప్రపంచ విషయాలలో ప్రవేశింపడు. దైవవశమున తనకు కలిగిన దానితో సంతృప్తి చెంది, ఏమీ తెలియని అమాయకునివలె సామాన్యంగా కనిపిస్తాడు. 

ఆ మహాత్ముని పదునారేండ్ల నవయౌవనం, ఆ సుందరమందగమనం, ఆ గుణవిశేషాలు, ఆ విలాసం, ఆ నేర్పులు చూచి ముక్తియే ముచ్చటపడి మోహింపగా, ఇక ఇతర కాంతల విషయం చెప్పవలసిన దేమున్నది?

వెఱ్ఱితనం లేక పూర్తిగా విజ్ఞానమూర్తియై బ్రహ్మజ్ఞానస్ఫూర్తితో తిరిగే శుకమహర్షిని వెఱ్ఱివాడని భావించి, అతనివెంట వెఱ్ఱియెత్తినట్లు స్త్రీలు, బాలకులు వెంటనంటి వస్తున్నారు.

ఈ విధంగా వ్యాసుని పుత్రుడైన శుకమహర్షి అక్కడికి రాగా ఆ మహానుభావుని మహత్త్యం తెలిసిన మునివర్యులందరూ తమ తమ ఆసనాలనుండి లేచి ఎదురు వచ్చి స్వాగతమిచ్చినారు. పాండవపొత్త్రుడైన పరీక్షిత్తు ఆ మహాయోగీశ్వరునికి అతిథి సత్కారాలుచేసి, సాగిలబడి మ్రొక్కి పూజలు గావించినాడు. గ్రహ నక్షత్ర తారకల నడుమ మిక్కిలి వెలుగు లీను పున్నమనాటి చంద్రునివలె అక్కడ ఉన్న బ్రహ్మర్షి దేవర్షి రాజర్షుల మధ్య శుకయోగీంద్రుడు విరాజిల్లినాడు.

కురుకుల శ్రేష్ఠుడైన పరీక్షిత్తు భయభక్తులతో మరల నెన్నుదురునేల తాకేట్లు నమస్కారంచేసి చేతులు జోడించి ఇలా విన్నవించుకొన్నాడు. "మహానుభావా! వివేకమే ఆభరణమైనవాడా! దివ్యములైన భాషణములు కలవాడా! నా అదృష్టమెటువంటిదో కాని నీవు పావనమూర్తివి, పుణ్యకీర్తివి సరియైన సమయానికి నీ విప్పుడు విజయం చేసినావు.

అవధూతలలో శ్రేష్ఠుడా! నీ ఆగమనంవల్ల ధన్యుణ్ణి అయినాను. నీ సందర్శనంవల్ల నా జన్మ తరించింది. నీవంటి బ్రహ్మజ్ఞాని పావననామం ఉచ్చరించిన మాత్రాన చేసిన పాపాలన్నీ భస్మీపటలమౌతాయి. ఇక నిన్ను దర్శించి, నీ మాటలు విని, నిన్ను అర్చించి, నీ కాళ్ళు కడిగి నీళ్ళు మీద చల్లుకొని, నిన్ను స్పృశించి, నీ సేవ చేసుకునే మహాభాగ్యం లభించిన నావంటి వానికి మోక్షం సంప్రాప్తించడంలో ఆశ్చర్యమేముంటుంది?

భగవంతుడైన వాసుదేవునివలన లోకకంటకులైన నిశాచరులు నశించినట్లే పరమయోగివైన నీ పాదస్పర్శ వలన మా మహాపాపాలు మొత్తం రూపు మాసిపోతాయి.

ఏ మహానుభావుడు ప్రియమైన మఱదియై, మంత్రియై మా పితామహులైన పాండవులను నాల్గు సముద్రముల తీర రేఖలు గల విశాలమైన ఈ ధరణీచక్రానికి చక్రవర్తులను గావించెనో, ఆ మహామహుడు, లోకేశ్వరుడు, ఆ చక్రాయుధుడు అందరికి రక్షకుడై ఉన్నాడు. ఆపదలో ఉన్నవారిని ఆదుకొని ఆదరాభిమానాలతో కాపాడే రక్షకుడు ఆయన తప్ప అన్యులు ఎవ్వరున్నారు? ఆ సర్వసద్గుణ సంపన్నుని, కారుణ్యపయోనిధిని భక్తితో వేడుకొంటున్నాను. 

అయ్యా! నీవు అవధూతలలో అగ్రగణ్యుడవు. అవ్యక్తమైన గతి కలవాడవు. నీ దర్శనం వ్యర్థం కాదు. నా అభిమతం తప్పక ముమ్మాటికి ఫలించి తీరుతుంది. ఈనాడో రేపో ఈ దేహాన్ని త్యజించటానికి సంసిద్ధంగా ఉన్న జీవికి సంసారబంధాలు సమసి మోక్షం ప్రాప్తించటానికి, చింతింపవలసింది, జపింపవలసింది, చేయవలసింది, వినవలసింది, సేవలందింపవలసింది ఏమేమి కలవో దయదలచి విశదీకరించండి అని వేడుకొంటున్నాను. నీవు జగద్గురుడవు, యోగీశ్వరుడవు, నీకు తెలియందేముంది? గోవును పాలు పిదికేంత సేపు తప్ప అంతకంటె ఎక్కువసేపు ఎక్కడగాని ఉండవు. దయగల తండ్రీ! మోక్షమార్గాన్ని నాకు తెలియజెప్పు.

ఈ విధంగా పరీక్షిన్మహారాజు శుకయోగీంద్రుని ప్రశ్నించినాడు.

తామర రేకులవంటి కన్నులు కలవాడా! రాజాధిరాజుల కిరీటాలలో చెక్కిన రత్నాల కాంతులచే ప్రకాశించే పాదపద్మాలు కలవాడా! భువిలోని జనులకు కల్పవృక్షము అయినవాడా! నిరంతర విశ్వకల్యాణ భావనకలవాడా, నిత్యధర్మచింతన కలవాడా!

సాటిలేని కల్యాణ గుణాలే పుష్పమాల అయినవాడా! చంపబడుతున్న వైరి వీరులు కలవాడా! లోక జన వినుత విహారా! సీతామానసచోరా, రాక్షసమేఘాలకు సమీరమైనవాడా, దానవ వైభవాన్ని చీల్చి చెండాడినవాడా, కఠిన పాపాత్ములకు కఠోరమైనవాడా! సముద్రుని గర్వాన్ని అపహరించినవాడా!

ఇది శ్రీ పరమేశ్వరుని అనుగ్రహంవల్ల ప్రాప్తించిన అద్భుతమైన కవిత్వం కలవాడూ, కేసనమంత్రి కుమారుడూ, సహజమైన పాండిత్యం కలవాడూ అయిన పోతనామాత్యుడు రచించిన శ్రీ మహాభాగవత పురాణం. అందులో నైమిశారణ్య వర్ణన, శౌనకాదిమునుల సంప్రశ్నము, సూతుని నారాయణ కథాసూచన, వ్యాసుల వారి విచారం. నారదాగమనం, ఆయన పూర్వజన్మ వృత్తాంతం, ద్రౌపదీ పుత్రశోకం, అర్జునుడు అశ్వత్థామను బంధించి తేవడం, అశ్వత్థామ గర్వపరిహారం. భీష్మ నిర్యాణం, ధర్మరాజు పట్టాభిషేకం, శ్రీకృష్ణుని ద్వారకాగమనం, ఉత్తరాగర్భస్థుడైన అర్భకుని అశ్వత్ధామయొక్క అస్ర జ్వాలలనుండి శ్రీకృష్ణుడు కాపాడటం, పరీక్షిత్తు జననం, గాంధారీ ధృతరాష్ట్ర విదురుల నిష్మమణం, నారదుడు ధర్మరాజుకు చేసిన కాలసూచన, శ్రీ కృష్ణనిర్యాణం, పాండవుల మహాప్రస్థానం, పరీక్షిత్తు దిగ్విజయం, కలి గర్వభంజనం, ధరణీధర్శదేవుల సముద్ధరణం, పరీక్షిత్తుకు శృంగి శాపం, గంగాతీరంలో పరీక్షిత్తు ప్రాయోపవేశం, శ్రీ శుకసందర్శనం, మోక్షమార్గాన్ని పరీక్షిత్తు అభ్యర్థించడం అనే కథలతో కూడిన ప్రథమస్మంధం సమాప్తం.

శ్రీ కృష్ణార్పణమస్తు

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

Parikshit asked Sukadeva (Suka) about the creation of the universe - పరీక్షితు౦డు శుకుని బ్రపంచోద్భవాదికంబు నడుగుట

పరీక్షితు౦డు శుకుని బ్రపంచోద్భవాదికంబు నడుగుట అప్పుడు  పరీక్షిత్తు  శుకయోగి తో ఇలా అన్నాడు- "మునీంద్రా! బ్రహ్మదేవుడు నారదమునికి భగవద్దర...