Wednesday, May 6, 2026

Previous life of Sankhachudu - శంఖచూడుడి పూర్వజన్మ

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - శంఖచూడుడి పూర్వజన్మ

పద్మసంభవా! శంఖచూడుడు దానవేంద్రుడే కావచ్చు. దేవతలనందరినీ పారద్రోలి ఉండవచ్చు. కానీ అతడి వృత్తాంతం అంతా నాకు తెలుసు. అతడు పూర్వజన్మలో గోలోకవాసి. గోపకుడు. మహాతేజస్వి. అతడిపేరు సుదాముడు. నాకు పార్షదుడు. రాధాదేవి శాపంవల్ల దానవుడయ్యాడు.

ఒకనాడు నేను నా మందిరంనుంచి రాసమండలానికి వెళ్ళాను. నాతోపాటు ప్రాణాధికప్రియ విరజనుకూడా తీసుకు వెళ్ళాను. ఆక్కడ విరజతో నేను క్రీడిస్తున్న సంగతి దూతికద్వారా రాధకు తెలిసింది. కోపంగా వచ్చింది. నేను తిరోధానం చెందాను. విరజనుమాత్రం నదివైపామ్మని శపించింది. తన మందిరానికి వెళ్ళిపోయింది. అక్కడ సుదాముడితో సరససంభాషణచేస్తూ నేనున్నాను. రాధికను చూస్తూనే నేను మౌనం వహించాను. ఆయినా కోపం ఆపుకోలేని రాధ నన్ను నిష్టురంగా నిందించింది. చేపేవన్సీ చేస్తావు, ఏమీ ఎరగనట్టు కూచుంటావు. నిన్ను ఏమి చేసినా తప్పులేదని దెప్పి పొడిచింది. కానీ ఎన్నిసార్లు తప్పించుకుంటావో చూస్తాను, చిక్కకపోతావా ? అప్పుడు చెబుతాను నీపని అంటూ పళ్ళు బిగి చూపుడువేలుతో బెదిరించింది.

ఇదంతా చూస్తున్న సుదాముడు రాధికాదౌష్ట్యాన్ని భరించలేకపోయాడు. అతడికి నామీద భక్తి గౌరవం ప్రేమ ఎక్కువాయె. దానితో చర్రునలేచి రాధికను అదే స్థాయిలో అదే చూపుడు వేలుతో అలాగే బెదిరించాడు. రాధాదేవి కోపానికి ఆజ్యం పోసినట్టయ్యింది. కళ్ళు చింతనిపులయ్యాయి. నా సన్నిధిలో నా సేవకుడు తనను కించపరచడం అవమానించడం బెదిరించడం అస్సలు భరించలేకపోయింది. వీడి బయటకు నెట్టివెయ్యండి అని ఆజ్ఞాపించింది. రాధిక వెంట ఉన్న వేనవేల చెలికత్తెలు చుట్టుముట్టి, ఎదేదో ఇంకా వాగుతున్న ఆ తేజస్విని బైటకు లాక్కుపోయారు. ఉక్రోషం ఆపుకోలేక ఆ బలశాలి సుదాముడు చెలికత్తెల్లో చాలామందిని అందినమటుకు అందినట్టు చావబాదాడు. ఇది తెలిసి రాధాదేవి కోపం మరింత భగ్గుమంది. దానవజన్మ ఎత్తరా - అని దారుణంగా శపించింది.

ఆ సుదాముడు శప్తుడై, విలపిస్తూ, వెళ్ళిపోతూ, ఆగి ఆగి వెనక్కి చూస్తూ మాకు నమస్మరిస్తూంటే రాధికాదేవికి గుండె కరిగిపోయింది. కోపం రాలి వాత్సల్యం చిగురించింది. కళ్ళల్లో నీళ్ళు కమ్ముకున్నాయి.

వత్సా! ఆగు. ఆగు. ఎక్కడికి వెడతావంటూ తానూ వెంటబడింది. గోపికలు విలపిస్తూ అనుసరించారు. ఆప్పుడు నేను కల్పించుకుని అందరినీ నిలువరించి, అరక్షణంలో నీ శాపాన్ని ఆనుభవించి సుదాముడు హాయిగా తిరిగి ఇక్కడికి వస్తాడు. ఇంతలోకే బెంబేలుపడకు అని చెప్పి రాధికను ఓదార్చాను. వెనక్కి తీసుకువచ్చాను. అందరినీ సముదాయించాను. విరించీ! గోలోకంలో అరక్షణమంటే భూలోకంలో ఒక మన్వంతరం. నీకు తెలుసుగదా!

ఈ రకంగా సుదాముడు శంఖచూడుడై దానవవంశంలో జన్మించి మన్వంతరం గడిచింది. అతడీ అవతారం త్వరలోనే ముగియనుంది. అతడు యోగవిద్యా విశారదుడు. మహాబలిష్టుడు సర్వమాయా విశారదుడు. కనక - శివా! నీకొక శూలం ఇస్తాను. దానితో రాక్షస సంహారం చెయ్యి. శంఖచూడుడి మెడలో సర్వమంగళ కారకమైన నా కవచం ఉంటుంది. నిరంతరం ధరించే ఉంటాడు. అది ఉన్నంతవరకూ అతడిని ఎవరూ ఏమీ చెయ్యలేరు. విజయం ఎప్పుడూ అతనిదే. అంచేత నేను విప్రరూపంలో వెళ్ళి ఆ కవచాన్ని యాచించి స్వీకరిస్తాను.

చతుర్వదనా! మరొక విషయం. శంఖచూడుడికి నువ్వొక విచిత్రమైన వరం ఇచ్చావు. గుర్తుందా? ఇతడి భార్యకు శీలభంగం అయితే తప్ప శంఖచూడుడు మరణించడు. అది జరిగినప్పుడే ఇది జరుగుతుందనికదా నీ వరం!

అంచేత నేను వెళ్ళి రహస్యంగా తులసీగర్భంలో వీర్యనిక్షేపణం చేస్తాను. శంఖచూడుడు మరణిస్తాడు. అటుపైని తులసి దేహత్యాగం చేస్తుంది. గోలోకానికి విచ్చేసి మళ్ళీ నాప్రియ గోపిక అవుతుంది.

ఇంతగా వివరించి చెప్పి జగన్నాథుడు శివుణ్ణి పిలిచి శూలం అందించి తన అభ్యంతర మందిరంలోకి నిష్క్రమించాడు. బ్రహ్మ రుద్రాది దేవతలందరూ భారతభూమికి పయనమయ్యారు.

శివదూత రాయబారం


Tulsi - sankka chudula marriage - తులసీ - శంఖచూడుల పరిణయం

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - తులసీ - శంఖచూడుల పరిణయం

తులసీదేవి ఇక్కడికి ప్రసంగం చాలించింది. ఇద్దరూ క్షణకాలం మౌనంగా ఉండిపోయారు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి శంఖచూడా! ఏం చేస్తున్నావ్‌? కబుర్లు చెబుతూ కూర్చున్నావా? గాంధర్వ పద్ధతిలో తులసీదేవి పాణిగ్రహణం చెయ్యి. నువ్వు పురుషరత్నానివి, ఈవిడ స్త్రీరత్నం. నెరజాణకు నెరజాణతో కలయిక ఆనందప్రదమేకదా! నిర్విరోధంగా లభించే ఉత్తమ సుఖాన్ని ఎవరయివా వదులుకుంటారా? అలా వదులుకునేవాడు శుద్ధపశువు.

కాంతామణీ! ఇంకా ఎన్ని పరీక్షలు పెడతావు. ఎంతసేపు పరీక్షిస్తావు? ఇటువంటి గుణవంతుడు కోటికొక్కడుకూడా ఉండడు. దేవ దానవులను జయించిన మహావీరుడు. లక్ష్మీశ్రీహారులలాగా రాధాకృష్ణులలాగా నేనూసరస్వతిలాగా భవుడూభవానీలాగా ధరాదేవీవరాహమూర్తుల్లాగా అనసూయ అత్రిమహర్షుల్లాగా నలదమయంతులలాగా రోహిణీచంద్రుల్లాగా రతిమన్మథుల్లాగా దితికశ్యపుల్లాగా వసిష్ఠారుంధతుల్లాగా అహల్యాగౌతముల్లాగా కర్దమదేవహూతుల్లాగా తారాబృహస్పతుల్లాగా శతరూపామనువుల్లాగా దక్షిణాయజ్ఞదేవతల్లాగా స్వాహాహుతాశనుల్లాగా శచీదేవేంద్రుల్లాగా పుష్టిదేవీ గణపతుల్లాగా దేవసేనా షణ్ముఖుల్లాగా తులసీశంఖచూడులు మీరిద్దరూ దంపతులై సాభాగ్యసంపదలతో వర్ధిల్లండి. సుఖసంతోషాలను యథేచ్చగా అనుభవించండి. అటుపైని గోలోకం చేరుకుందురుగావి. తులసీ! నువ్వు అప్పుడు కృష్ణపరమాత్మను కలుసుకుందువుగాని అన్నాడు.

నారాయణమహర్షి ఇంతవరకూ చెప్పి కాసింత విశ్రాంతి తీసుకున్నాడు. నారదుడు మళ్ళీ మొదలుపెట్టాడు. మహర్షీ! నాకన్నీ సందేహాలే! అన్నీ సంశయాలే. నీవంటి జ్ఞాని దారికినప్పుడే అన్నీ తీర్చేసుకోవాలి. విసిగిస్తున్నాను అనుకోవద్దు. చాలా విచిత్రమైన ఉపాఖ్యానం చెప్పావు. ఇలాంటివి ఇప్పటికి చాలా చెప్పావు. అయినా నాకు తృప్తి కలగడంలేదు. తులసీ శంఖచూడుల కథ ఆటుపైని ఏమయ్యింది, ఆ విశేషాలు వినాలని ఉంది అని అడిగాడు. నారాయణుడు గొంతు సవరించుకుని మిగతా కథ చెప్పనారంభించాడు.

నారదా! బ్రహ్మదేవుడు అలా ఇద్దరినీ ఆశీర్వదించి తన లోకానికి వెళ్ళిపోయాడు. తులసీ  శంఖచూడులు గాంధర్వవివాహం చేసుకున్నారు. దేవలోకంలో దుందుభులు మ్రోగాయి. పారిజాత పుష్పవృష్టి కురిసింది. వివిధ శృంగారక్రీడల్లో తేలియాడారు. తులసీదేవి నవసంగమ సమ్మూర్చిత అయ్యింది. నీరులేని సుఖసాగరంలో మునిగితేలింది. కామశాస్త్రంలో చెప్పిన చతుష్షష్టి బంధ విశేషాలతో ఆ రసికదంపతుల కలయిక నిత్యనూతనంగా అనుక్షణమధురంగా సాగింది. అంగ ప్రత్యంగ సంశ్లేషాలతో సర్వాంగచుంబనలతో ప్రణయకలహాలతో పరస్పర సాంత్వనాలతో పుష్పోద్యాననదీతీరాలలో పొదరిళ్ళలో చందనచర్చలతో నిర్విరామంగా వారి సంభోగ శృంగార లతిక చిగురులు తొడిగింది. లీలావిలాసాలతో తులసీదేవి, రాసిక్యవైభవంతో శంఖచూడుడూ పరస్పరం మనస్సులు దోచుకున్నారు. కౌగిలింతలకు చందనచర్చలు పేటులెత్తాయి. స్వేదజలానికి సిందూరతిలకాలు చెమ్మగిల్లాయి. నఖక్షతాలతో దంతక్షతాలతో తులసీదేవి సర్వాంగీణంగా చిగురించిన తీగలాగా ఉంది. శంఖచూడుడి గుండెలమీద బుజాలమీద క్షతాలతోపాటు తులసీదేవి ధరించిన కంకణాద్యాభరణాలు ఒత్తుకుని గుర్తులేర్పడ్డాయి. ఆలింగన చుంబన జంఘాదిమర్దనలతో కవ్వింపులతో కొసరింతలతో బెదిరింపులతో చిరునవ్వులతో నిట్టూర్పులతో తాంబూలసేవనలతో పల్లటీ కూతలతో(మణిత ధ్వనులు) సంస్కారసంపన్నమైన శృంగారానుభవంతో రేయింబవళ్ళు సంతృప్తి చెందుతున్నారు. ఏపూటకాపూట విలువైన వస్త్రాలూ ఆభరణాలూ సుగంధానులేపనాలూ పుష్పాలంకరణలతో పరస్పరం కన్నులపండువు చేసుకుంటున్నారు.

జరారోగహరమైన పారిజాతకుసుమాన్నీ అమూల్య రత్నాంగుళీయకాన్నీ త్రిలోకదుర్లభమైన అనర్ఘమణినీ తులసీదేవి శంఖచూడుడికి బహూకరించిది. నీ దాసిని నేనని మాటిమాటికీ పలవరిస్తూ భక్తిగా పాదాభివందనం చేసింది. శంఖచూడుడు లేవనెత్తి గుచ్చి కౌగిలించుకున్నాడు. నేనే నీ దాసుణ్ణి అన్నాడు. వరుణదేవుడినుంచి జయించి తెచ్చిన అమూల్యవస్త్రాలనూ త్రిలోక దుర్లభమైన రత్నమాలికనూ మంజీరాలనూ కేయూర కుండలాలనూ కంకణాంగుళీయకాలనూ విశ్వకర్మ ఇచ్చిన అపూర్వశంఖాన్నీ పద్మపత్ర నిర్మితమైన శయ్యనూ తులసికి బహూకరించి ఆమె చిబుకం పట్టుకుని ముఖం పైకెత్తి కళ్ళల్లోకి చూస్తూ చిరునవ్వులు కురిపించాడు. ముద్దులతో నింపాడు. కబరీభరంలో మాంగళ్యభూషణాన్ని అలంకరించాడు. చందనకుంకుమబిందు నిర్మితమైన మకరికాపత్రాలను చెక్కిళ్ళపై చిత్రించాడు. సిందూర తిలకం దిద్దాడు. నల్లని జుట్టుమధ్య అది దీపంలా వెలిగిపోయింది.

పాదపద్మాలకు లత్తుక, గోళ్ళకు రంగు తీర్చిదిద్ది ఆ పాదాలను తన గుండెలకు హత్తుకుని దేవీ! నీ దాసుణ్ణి అంటూ మైమరిచి పలవరించాడు. మెల్లగా కౌగిలించుకున్నాడు. గుండెలపై పరుండబెట్టుకున్నాడు.

ఇలా ఎంతకాలం గడిచిందో వారికే తెలీదు. ఒకనాడు ఎందుకనో ఇద్దరూ కలిసి ఆ తపోవనాన్ని విడిచిపెట్టేసి మలయపర్వత సీమలకు వెళ్ళిపోయారు. అక్కడ ప్రతిశిఖరంమీద ప్రతి సానువులోనూ ప్రతి వనంలోనూ ప్రతి పొదరింటా ప్రతిగుహలోనూ ప్రతి సరస్సులోనూ ప్రతి నదీతీరంలోనూ ప్రతి పులినతలంమీద తామే అయి క్రీడించారు. పుష్పభద్రానదిలో జలక్రీడలు సాగించారు. అటునుంచి గంధమాదనంమీద మరికొంతకాలం వినోదించి నందనంలో విహరించారు. చంపక కేతకీ మాలతీ కుంద కుముద వనాలలో ఆనందించారు. ప్రతి కల్పవృక్షచ్భాయలోనూ నిర్జన కాంచన శిఖరాలమీదా వలపులు పండించుకున్నారు, పుంస్కోకిలల కలకూజితాలతో గండుతుమ్మెదల ఝంకారాలతో కోరికలు తీర్చుకున్నారు. అయివా కామం చల్లారలేదు. ఆజ్యంపోసినట్టు కామాగ్ని మరింతగా ప్రజ్వరిల్లింది.

దానవేంద్రుడు శంఖచూడుడు తులసీదేవితో తన రాజధానిలోకి ప్రవేశించాడు. మనోహర కేళీమందిరం కల్పించి అందులో ఇద్దరూ ఆనందించారు. అక్కడినుండే ఆ ప్రతాపశాలి సాధారణ పరిపాలన సాగించాడు. ఇలా ఒక మన్వంతరం గడిచింది. ఇంతకాలమూ దేవదానవ సంగ్రామాలు లేవు. అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. దానవవీరులూ తమ తమ ఇల్లాండ్రతో ఆనందాలనుభవించారు.

దానవుల చేతిలో పరాజితులై స్వర్గలోకాన్నీ అధికార భోగభాగ్యాలనూ కోల్పోయిన దేవతలు భిక్షుకులై సంచరిస్తున్నారు. వారంతా గుమికూడి బ్రహ్మదేవుడి సన్నిధికి వెళ్ళారు. తమ దుస్థితి విన్నవించి గొల్లుమన్నారు. బ్రహ్మతో కలిసి కైలాసానికి వెళ్ళి శివుణ్ణి తీసుకుని వైకుంఠానికి వెళ్ళారు.

అది వైకుంఠం. అత్యంతదుర్లభం. పరమపదం. జరామృత్యుహరం. దానిద్వారం దగ్గర ఇరువైపులా ద్వారపాలకులున్నారు. రత్న సింహాసనాలమీద కూర్చుని ఉన్నారు. రత్నాభరణాలతో పీతవస్త్రాలతో వన మాలికాలంకృతులై సాక్షాత్తు విష్ణుమూర్తుల్లాగా శ్యామసుందర విగ్రహులై చతుర్భుజులై గదాశంఖచక్ర పద్మధారులై పద్మనేత్రులై హసన్ముఖులై కావలికాస్తున్నారు. బ్రహ్మదేవుడు తమ రాకనూ కారణాలమా వారికి విన్నవించాడు. వారు అనుజ్ఞ ఇచ్చారు. ఆమీదట అందరూ లోపలికి ప్రవేశించారు. ఇలాంటి ద్వారాలు వరుసగా పదహారున్నాయి. ఆంతటా ఇదే పరిస్థితి, ఇదే అవస్థ. అన్నీ గడిచి ప్రధాన సభామంటపం చేరుకున్నారు. అక్కడ శ్రీమన్నారాయణుడు దేవర్షి పరివృతుడై కొలువుతీరి ఉన్నాడు. చతుర్భుజులూ నారాయణ స్వరూపులూ కౌస్తుభాలంకృతులూ అయిన పార్షదులు పరివేష్టించి ఉన్నారు. 

ఆ నభామంటపం చతురస్రాకారంలో ఉంది. చంద్రమండలంలాగా వెన్నెలలు వెదజల్లుతోంది. మణిమయహారాలు తోరణాలుగా వేలాడుతున్నాయి. అంతటా రత్నాలు పొదిగారు. శ్రీహరి కేవలం ఇచ్చామాత్రంతో సృష్టించినట్టుంది. ఎటుచూసినా మేలిమిముత్యాల అలంకరణలు. నేలంతా మణికుట్టిమం, జలభ్రాంతిని కలిగిస్తోంది. నాలుగువైపులా గోడలకు మండలాకార మణిదర్పణాలు. మధ్యమధ్య అపూర్వంగా చిత్రరేఖలు. పద్మరాగమణులతో శిల్పం చెక్కిన పద్మాలు. వాటిమీద ఎగురుతున్నట్టు ఇంద్రనీలమణులతో తుమ్మెదలు. చుట్టూ లోపలితట్టునే శ్యమంతక మణులతో నిర్మించిన విశాల సోపాన నిశ్రేణి. ఇంద్రనీలమణి స్తంభాలు. ప్రతిస్తంభం దగ్గరా రతమయ పూర్ణకుంభాలు. వాటినుంచి పట్టుదారాలతో పాకిస్తున్న చందన లతలు - వాటికి చిగుళ్ళు. 

సభామంటపానికి వెలుపల పారిజాతవృక్షాలు. వాటి పరిమళం చల్లగా మెల్లగా అంతటా వ్యాపిస్తోంది. లోపల కస్తూరీ కుంకుమ చందనాగురు సుగంధాలు విటితో పోటీపడుతున్నాయి.

సహస్రయోజన విస్తీర్ణమైన ఆ మహామంటపంలో ఒకవైపున విద్యాధరస్త్రీలు మనోహరంగా నృత్యాలు చేస్తున్నారు. మంద్రస్వరంతో విద్యాధరులు నేపథ్యగానం అందిస్తున్నారు. భవనానికి లోపలా వెలుపలా ఆయుధపాణులై హరికింకరులు కావలి తిరుగుతున్నారు.

ఆ సభామంటపానికి మధ్యభాగంలో శ్రీహరి చుక్కల్లో చంద్రుడులాగా వెలిగిపోతున్నాడు. అదొక సింహాసనం. అమూల్యరత్నసింహాసనం. దానిమీద శ్రీహరి. కిరీటి. కుండలి. వనమాలి. చందనచర్చిత నీల శరీరుడు. చేతిలో కేళీపద్మం. ఎట్టయెదుట నృత్యగీతాలను ఆస్వాదిస్తున్నాడు. చిరునవ్వులు ఆరబోస్తున్నాడు. శాంతన్వరూపుడై ఉన్నాడు. లక్ష్మీసరస్వతులు పాదాలు ఒత్తుతున్నారు. తాంబూలం సేవిస్తున్నాడు. ఆ పరిమళాలు వ్యాపిస్తున్నాయి. గంగాదేవి తెల్లని వింజామర వీస్తోంది.

సభాసదులందరూ భక్తివినమ్రులై స్తోత్రపాఠాలు చేస్తున్నారు. పరిపూర్ణతముడైన ఆ ప్రభువును దర్శించి బ్రహ్మేశానదేవతలందరూ శిరసువంచి నమస్కరించారు. బహుధా స్తుతించారు. అందరి తనువులూ పులకాంకురితాలే. అందరి గొంతులూ భక్తిగద్గదాలే. అందరి కన్నులూ అశ్రుజలపూర్ణాలే.

జగద్విధాత బ్రహ్మదేవుడు మరింత చేరువకి వెళ్ళి శిరస్సున అంజలిబంధంతో వినయంగా వంగి నిలబడి మెల్లగా యావద్వృత్తాంతమూ విన్నవించాడు. అంతా విన్న శ్రీహరి ఒక్క మందహాసం చేసి రహస్యంగా పలికాడు.

శంఖచూడుడి పూర్వజన్మ


Tuesday, May 5, 2026

Tulasi Sankha Chudula Sanvadam - తులసీ - శంఖచూడుల సంవాదం

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - తులసీ - శంఖచూడుల సంవాదం

అంతలోకీ శంఖచూడుడు అనే తరుణవయస్కుడు అటువైపు వచ్చాడు. పుష్కరక్షేత్రంలో జైగీషవ్యుని ఉపదేశంపై నిష్ఠగా తపస్సుచేసి శ్రీకృష్ణ మహామంత్రంవల్ల సిద్దుడైన యోగీశ్వరుడతడు. సర్వమంగళ ప్రదమైన కవచాన్ని కంఠసీమలో హారంగా ధరించి బ్రహ్మదేవుడి ఆజ్ఞమేరకు అక్కడికి వచ్చాడు. మనోవాంఛాసిద్ధిరస్తు - అని విరించి వరమిచ్చి ఆశీర్వదించి మరీ పంపించాడు.

తనవైపు నడిచివస్తున్న శంఖచూడుణ్ణి చూసింది తులసీదేవి. నవయౌవన సంపన్నుడు. సాక్షాత్కరించిన మన్మథుడు. సంపెంగ పువ్వులాగా ఉన్నాడు. రత్నభూషణభూషితుడు. శరత్పూర్ణిమనాటి చంద్రబింబంలాంటి ముఖం శరత్పంకజాల్లాంటి కన్నులు. దివ్యరత్నవిమానం నుంచి దిగివస్తున్నాడు. కదలాడుతున్న రత్నకుండలాల కాంతులు చెక్కిళ్ళ పై లాస్యం చేస్తున్నాయి. అలంకరించుకున్న పారిజాత పుష్పమాలికల పరిమళాలు బహుపరాకులు పలుకుతున్నాయి. చిరునవ్వులు చిందిస్తున్నాడు. నొసటనున్న బొట్టు కస్తూరీచందనగంధాలను వెదజల్లుతోంది. మదగజగమనంతో ఆ మనోహరుడు చేరువకి వచ్చి నిలబడ్డాడు.

తులసీదేవి తానెప్పుడు లేచి నిలబడిందో తనకే తెలియలేదు. మేలిముసుగులో ముఖం దాచుకుని తలవంచి చిరునవ్వులు చిందిస్తూ కాలికొనగోట నేలను గీరుతూ క్రీగంట పులుకుపులుకున తిలకిస్తూ పులకించిపోతోంది.

శంఖచూడుడు తులసీదేవిని సన్నిహితంగా చూశాడు. శరచ్చంద్రుణ్ఞి నిందించే ఆమె ముఖం. మాలతీపుష్పమాలికలు అలంకరించిన కబరీభారం. రత్నాలు పొదిగిన అమూల్య విచిత్ర కుండలాలు. ఆ కాంతులలో బుగ్గలు మరీ మెరిసిపోతున్నాయి. రత్నతారహారాలు పీనోన్నతవక్షఃస్తలంమీద నిట్టూర్పులకు కదలాడుతున్నాయి. రత్నకంకణాలు. రత్నకేయూరాలు. చిన్ని చిన్ని సంకులు కూర్చి కట్టిన దండ. (సంకువు = శంఖం). అన్నివేళ్ళకూ రత్నాంగుళీయకాలు. పాదాలకు మణిమయమంజీరాలు. కాలు కదుపుతూంటే మనోహరంగా సవ్వడి చేస్తున్నాయి. లాక్షాలంకృత పాదపద్మాలు. రాసిబోసిన సౌందర్యంలాగా ఉన్న ఆ లలితసుందరమూర్తిని ఆపాదమస్తకం తిలకించాడు. కామభావపరవశుడయ్యాడు. మధురంగా పలకరించాడు.

కల్యాణీ! ఎవరి అమ్మాయివి ? నీపేరేమిటి ? కన్యకామణులలోకెల్లా ధన్యురాలివి, మాన్యురాలివి, సర్వకల్యాణదాయినివిగా కనిపిస్తున్నావు. నేను నీ సేవకుణ్ణి. సుందరీ! దయచేసి సంభాషించి నన్ను అనుగ్రహించు.

కామవాంఛాపరిప్లుతుడై శంఖచూడుడు ఇలా పలకరించేసరికి ఆ వామలోచన తానూ ఆదే పరిస్థితిలో అదే ఉద్దేశంతో ఉంది కనక తలవంచుకునే బదులు పలికింది.

నేను ధర్మధ్వజుడి కన్నకూతిరిని. ఈ తపోవనంలో చాలాకాలం నుంచీ తపన్నుచేస్తూ తపస్వినిగానే ఉంటున్నాను. నువ్వు ఎవరివో! ఇటు ఎందుకు వచ్చావో! నీ దారిన నువ్వు సుఖంగా వెళ్ళు. ఉత్తమ వంశంలో పుట్టిన శీలవతులను ఏకాంతంలో ఇలా పలకరించడం నీవంటి సజ్జనులకు తగదు. ఇది శాస్త్ర విరుద్ధంకూడా,

వేదం తెలియనివాడూ లంపటుడూ ధర్మశాస్త్రాన్ని తిరస్కరించినవాడూ అసత్కులంలో పుట్టినవాడూ మాత్రమే ఇలా ఏకాంతంలో కాముకుడై కామినీమణులతో సంభాషణకు దిగుతాడు. ఆటువంటి పురుషులు మెచ్చుకునేదీ ఇష్టపడేదీ అటువంటి కాంతలనే.

నీకు తెలుసో తెలీదో, అసలు స్త్రీలు అంటేనే పయోముఖ విషకుంభాలు. ఆపాతమధురంగా మాట్లాడతారు. హృదయంలోమాత్రం మదమత్తలై ఉంటారు. వాళ్ళ మనస్సు మంగలికత్తిలా ఉంటుంది. వచస్సు పూలగుత్తిలా ఉంటుంది. తమ కోరికలు తీర్చుకోవడం తప్ప వారికి మరొక ధ్యాస ఉండదు.

పని ఉంది అంటే స్వామికి వశవర్తినులై ఉంటారు. పని తీరిపోయిందంటే తల ఎగరేస్తారు. హృదయంలో మాలిన్యమూ ముఖంలో మాటల్లో ప్రసన్నత వీరి లక్షణం. పురాణగాథలు చూడు. స్త్రీల చరిత్రలు ఎంత దూషితాలో తెలుస్తాయి. అటువంటి స్త్రీలను తెలివైనవాడు ఎవడూ నమ్మడు. నమ్మాడు అంటే వాడు మూర్ఖుడైనా అయ్యుండాలి, దుష్టుడైనా అయ్యుండాలి.

ఆడవారికి హితులూ అహితులూ అని రెండు విభాగాలు ఏమీ ఉండవు. ఎప్పటికప్పుడు కొత్తవాడు కావాలి. అందగాడూ యువకుడూ అయితే చాలు. శత్రువా మిత్రుడా అనే తేడా ఏమీ లేదు.

వీళ్ళు ప్రదర్శించే పాతివ్రత్యమంతా కేవలం బాహ్యాడంబరమే. ప్రయత్నపూర్వకంగా ఆ ప్రదర్శన చేస్తారు. మనసుల్లో నిరంతరం కామవాంఛలే. బాహ్యశరీరాన్ని లోకం కన్నుగప్పడానికి పాతివ్రత్యంతో ఖేదపరుచుకుంటూ అంతరంగంలో మదనక్రీడలు సాగిస్తుంటారు. రహస్యంగా ప్రియుడిమీదకి నవ్వులు రువ్వుతూ బహిరంగంలో సిగ్గరితనం నటిస్తుంటారు.

మైథునం లేనివేళ వీళ్ళకోపానికి అవధులుండవు. సివంగులై కయ్యాలకు దిగుతారు. సుదీర్ఘ సంభోగానికి సంతసిస్తారు. స్వల్పసంభోగానికి దుఃఖిస్తారు. మృష్టాన్నపానీయాదులకన్నా వీరు తహతహలాడేదీ ఆరాటపడేదీ సుందరుడూ రసికుడూ గుణవంతుడూ అయిన యువకుడికోసమే.

రసికుడంటే వీళ్ళకి కొడుకుమీదకన్నా ప్రేమ. సంభోగ కుశలుడైన ప్రియుడు వీళ్ళకి ప్రాణాధికుడు, మగడు ముసలివాడైనా సంభోగచతురుడు కాకపోయినా అతడే వీళ్ళకి ప్రథమశత్రువు. అనుక్షణమూ అతడిని తిట్టిపోస్తూ జగడాలాడుతుంటారు. పెనుసర్పం ఎలకపిల్లను తిన్నట్టు సూటిపోటిమాటలతో దెప్పరాలతో కొరుక్కుతినేస్తుంటారు. స్త్రీ అంటే దుస్సాహసస్వరూప. సర్వదోషాలకూ నిలయం. బ్రహ్మాది దేవతలకుకూడా దుస్సాధ్య. కేవలం మోహస్వరూపిణి. మోక్షద్వారానికి తలుపుచెక్క. తపస్సులకి అడ్డగడియ. విష్ణుభక్తికి అడ్డుపుల్ల. సమస్తమాయలకూ దాపుడుకుండ. సంసారకారాగారంలో ఇనపసంకెల. ఇంతి అంటే అదొక ఇంద్రజాలం. అదొక మిథ్య. అదొక స్వప్నం. పైకి కనిపించే అవయవాలన్నీ ఆందంగానే ఉంటాయి. లోపల అంతటా కుళ్ళే. మలమూత్రసంకులమై దుర్గంధభూయిష్టమై నెలకు మూడునాళ్ళు రక్తసిక్తమై సంస్కారవిరహితమై ఆ రహస్యాంగం కుత్సితంగా ఉంటుంది.

బ్రహ్మదేవుడు మాయావులకోసమని ఈ మాయారూపాన్ని సృష్టించాడు. అందుకే ముముక్షువులు ఈ స్త్రీని విషరూపంగా తిరస్కరిస్తారు. భోగలాలసులు మాత్రం కామవాంఛలతో ఎగబడి అందుకోలేక తృప్తిపాందలేక బోరగిలబడతారు.

నారదా! తులసీదేవి తాను స్త్రీఅయినా ఇంత సుదీర్హంగా స్త్రీనింద చేసింది. మనస్సులో అనురాగం ఉన్నా మాటల్లో కాఠిన్యాన్ని ప్రదర్శించింది. శంఖచూడుడు నిబ్బరంగా బదులు పలికాడు.

దేవీ! నువ్వు అన్నది పూర్తిగా అసత్యమూ కాదు, అలాగని పూర్తిగా సత్యమూ కాదు. సగం అదీ, సగం ఇదీ. కనక నేను చెప్పేదికూడా కొంచం విను.

బ్రహ్మదేవుడు స్త్రీలను రెండు రకాలుగా సృష్టించాడు. కొందరు సుగుణవతులు. కొందరు దుర్గుణవతులు. సృష్టి అన్నాక ఆన్ని రకాలూ ఉంటాయి. లక్ష్మి- సరస్వతి - దుర్గ - సావిత్రి - రాధిక వీరంతా స్త్రీరూప సృష్టికి ప్రథమావతారాలు. సృష్టిసూత్రస్వరూపిణులు. కాబట్టి నిజానికి సృష్టిలో స్త్రీ రూపం వీరి అంశమే. స్త్రీలందరూ వీరి అంశావతారాలే. కనక స్త్రీమూర్తి సర్వమంగళకారకం. శతరూప, దేవహూతి, స్వధాదేవి, స్వాహాదేవి, దక్షిణాదేవి, ఛాయావతి, రోహిణి, వరుణాని, శచి, కుబేరపత్ని, దితి, అదితి, లోపాముద్ర, అననూయ, తులసి, అహల్య, అరుంధతి, మేనాదేవి, తార, మందోదరి, దమయంతి, వేదవతి, గంగ, మనసాదేవి, పుష్టి తుష్టి సతి మేధా దేవతలు, కాళిక, వసుంధర, షష్టీదేవి, మంగళచండీక, ధర్మకామిని, స్వస్తి శ్రద్దా శాంతి కాంతి క్షాంతి దేవతలు, నిద్రా క్షుత్‌ పిపాసా సంధ్యా రాత్రి దేవతలు, సంపత్తి ధృతి కీర్తి క్రియా శోభా శివామూర్తులు - వీరంతా ఉత్తమాంగనలు. పతివ్రతలు. శక్తి స్వరూపిణులు. యుగయుగాలుగా వీరు స్త్రీమూర్తులై అవతరిస్తూనే ఉన్నారు. పవిత్రంగా జీవితాలు గడుపుతూనే ఉన్నారు. కానీ నువ్వన్నట్టు కొందరు పుంశ్చలీరూపిణులూ ఉన్నారు. వారిని నిందించడం తగునుగానీ సత్వగుణ ప్రధానలైన సాధ్వీమణులనుకూడా వారితో సమంగా జమచేసి మొత్తం స్త్రీజాతినే నిందించడం తగదుగాక తగదు.

స్త్రీలలోగానీ పురుషులలోగానీ గుణాధిక్యాన్ని బట్టి ఉత్తమ మధ్యమ అధమ భేదాలు ఏర్పడతాయి సత్త్వగుణ ప్రధానులది ఉత్తమశ్రేణి. రజోగుణులది మధ్యమశ్రేణి. తమోగుణులది అధమశ్రేణి. పండితుడై ఉత్తమవంశంలో పుట్టి సత్త్వగుణ ప్రధానుడైన వాడెవడూ ఎంతటి అవకాశం లభించినా పరస్త్రీ వాంఛించడు.

అయితే అథముడివా, ఇక్కడికి ఇలా ఎందుకు వచ్చావు? అని నువ్వు అడగవచ్చు. నా రాకకు తగినంత కారణం ఉంది. బ్రహ్మదేవుడి ఆజ్ఞమేరకు నేను వచ్చాను. నిన్ను గాంధర్వవివాహం చేసుకుంటాను. నేనే శంఖచూడుణ్ణి. ప్రస్తుతం దానవుణ్ణి. దేవతలకు శత్రువుని. పూర్వజన్మలో గోలోకాన హరి సాన్నిధ్యాన్ని అనుభవించిన సుదాముణ్జి. శ్రీకృష్ణుడికి అత్యంతాప్తులైన ఎనమండుగురు పార్షద గోపకులలో ఒకడిని, రాధికాదేవి శాపంవల్ల ఇప్పుడిలా రాక్షసుణ్ణి అయ్యాను. కృష్ణమంత్రప్రభావంవల్ల జాతిస్మరుణ్ణి. నువ్వూ జాతిస్మరవే. తులసివి. పూర్వజన్మలో శ్రీకృష్ణుని సాహచర్యాన్ని అనుభవించినదానవు. రాధికా శాపంవల్ల భూలోకంలో అవతరించావు.

గోలోకంలో ఉన్నప్పుడు నిన్ను చూసి ఎంతగానో అనురక్తుణ్ణి అయ్యాను. నీ దర్శనంకోపం నీ స్పర్శనంకోసం ఉవ్విళ్ళూరే మనస్సుతో అనుక్షణం పరితపించేవాడిని. అయితే రాధికాదేవికి భయవడి నా అనురాగాన్ని నాలోనే అణుచుకునేవాణ్ణి. దేవీ! నేనెవరో నువ్వెవరో రాధాశాపమేమిటో శ్రీకృష్ణుడి వరమేమిటో బ్రహ్మదేవుడి ఆజ్ఞ ఏమిటో అంతా వివరించాను. ఇక నీ ఇష్టం. నీదయ, నా ప్రాప్తం. - ఆని ముగించాడు శంఖచూడుడు.

తులసీదేవికి సందేహాలు తీరి సంతృప్తి కలిగింది. మరింత విలాసంగా నవ్వుతూ - దానవేంద్రా నీవంటి సజ్జనుడు ఎంతటి ప్రశంసకైనా అర్హుడు. ఇటువంటి అందగాడినే ఏ కాంతామణి అయినా కోరుకుంటుంది. ఇష్టపడుతుంది. నిజానికి ఇప్పుడు నువ్వు బుద్ధికుశలతతో నన్ను ఓడించావు. ఇది సత్యం అందుచేత సర్వాత్మనా అభినంద్యుడివి. ఇలాకాక - రూపవిలాసాలకు సమ్మోహితుడై స్త్రీ  చేతిలో ఓడిపోయి దాసుడుగా మారినవాడు పరమ నింద్యుడు. మిత్ర బంధు దేవగణాలందరూ అతడిని నిందిస్తారు. తల్లీ తండ్రీ సోదరులూ ఆంతా మనస్సులో అసహ్యించుకుంటారు. దూషిస్తారు.

పురుడు మైలలాంటి ఏ అశౌచాలు వచ్చినా బ్రాహ్మణుడు పదిరోజులకీ క్షత్రియుడు పన్నెండు రోజులకీ వైశ్యుడు పదిహేనురోజులకీ శూద్రుడు నెలనాళ్ళకీ శుద్ధిపాందుతారని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. స్త్రీజితుడు మాత్రం శ్మశానంలో కట్టెల్లో కాలేదాకా శుద్ధిపాందడు. ఆంతటిది సుమా ఆ అశౌచం. వాడుపెట్టిన పిండాలను పితృదేవతలు ముట్టరు. అతడిచ్చే పాద్యాలనూ నైవేద్యాలనూ దేవతలు స్వీకరించరు. పరస్త్రీ లంపటుడు ఎంత జ్ఞాని అయితేనేమీ ఎంత తపస్వి అయితేనేమీ! అతడి జపమూ తపమూ పూజలూ హోమాలూ చదువులూ పేరూ ప్రఖ్యాతీ అన్నీ వ్యర్థం.

ఈ తెలివిడి ఉన్నదానను కనక నిన్ను పరీక్షిద్దామని స్త్రీనింద చేశాను. నిన్నూ నిష్టురాలు ఆడాను. పరీక్షించకుండా ఏ కామినీ ఎవ్వరినీ వరించదుగదా! కన్యకలేకాదు కన్యాదాతలుకూడా వరుణ్ణి పరీక్షించకుండా పిల్లనిచ్చి పెళ్ళిచేస్తారా? గుణహీనుడు వృద్ధుడు అజ్ఞాని దరిద్రుడు మూర్ఖుడు రోగిష్టి కుత్సితుడు కోపిష్టి దుర్ముఖుడు ఆంగవికలుడు కుంటివాడు అంధుడు బధిరుడు (చెవిటి) జడుడు (చైతన్యం లేనివాడు) మూగవాడు నపుంసకతుల్యుడు పాపాత్ముడు - ఇలాంటి వరుడికి కూతురు నిచ్చినవాడు బ్రహ్మహత్యా మహాపాతకి అవుతాడు. అందుచేత బాగా వాకబుచేసి పరీక్షించి శాంతస్వభావుడూ గుణవంతుడూ యువకుడూ పండితుడూ సజ్జనుడూ అయిన వరుడికే పిల్లను ఇవ్వాలి. ఆలా ఇచ్చి వివాహం జరిపించిన కన్యాదాత పది మహాయజ్ఞాలు చేసిన ఫలాన్ని పొందుతాడు.

కూతురిని పెంచి పెద్దచేసి ధనలోభంతో అమ్ముకునేవాడు కుంభీపాకనరకానికి పోతాడు. అక్కడ కన్యామూత్ర పురీషాలు తింటూ పురుగుకాట్లు భరిస్తూ కాకి పోట్లు చవిచూస్తూ - ఇంద్రులు పధ్నాలుగు మంది మారేటంతకాలం నరకయాతన ఆనుభవిస్తాడు. అటుపైని రోగిష్టిగా జన్మించి మాంసం అమ్ముకుంటూ నీచంగా జీవయాత్ర సాగిస్తాడు.

తులసీ - శంఖచూడుల పరిణయం


Tulsi story - తులసీ వృత్తాంతం

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - తులసీ వృత్తాంతం

నారదా! నువ్వడిగిన తులసీ వృత్తాంతం ఇప్పుడు చెబుతున్నాను విను. కుశధ్వజుడి సోదరుడున్నాడే ధర్మధ్వజుడు మాధవీదేవిని వివాహం చేసుకున్నాడు. గంధమాదనపర్వత గుహలలో అరణ్యాలలో పొదరిళ్ళలో సరస్సులలో ఆ దంపతులు కామకేళీపరవశులై విహరించారు. రేయింబవళ్ళు తేడాలేకుండా నూరు దివ్యసంవత్సరాలు శృంగారం లోతులు చూశారు. అప్పటికి రాజుగారికి తెలివి వచ్చింది. రాజ్యమూ పాలనమూ స్పృహలోకి వచ్చాయి. శృంగారక్రీడ చాలించి రాజధానికి వచ్చాడు. మాధవీదేవికి మాత్రం తనివి తీరలేదు. అయినా రాకతప్పిందికాదు. గర్భిణీ అయ్యింది. నెలలు నిండాయి. కార్తికపూర్ణిమా శుక్రవారంనాడు శుభముహూర్తాన ఆడపిల్లను ప్రసవించింది. సాక్షాత్తు లక్ష్మీదేవి అవతరించింది. ఆ కనుముక్కు తీరూ ఆ వర్చస్సూ ఆ సౌందర్యమూ ఎర్రని చేతులూ కాళ్ళూ బంగారు శరీరకాంతీ - సుందరీమణులలోకెల్లా సుందరీమణిగా ఉన్న ఆ బాలికను చూసినవారంతా ఆశ్చర్యపోతున్నారు. ముగ్దులవుతున్నారు. ఈమెకు సాటి ఇంకెవ్వరూ లేరంటే లేరు అని నిశ్చయించుకుంటున్నారు. అలా ఆ బిడ్డకు తుల (సాటి)లేనిది కనక తులసి అనే పేరు స్థిరపడింది. అందరూ ఆలాగే పిలవనారంభించారు.

తులసికూడా వేదవతిలాగే సద్యోయౌవనవతియై తపస్సు కోసమని బదరికావనానికి వెళ్ళింది. లక్ష దివ్యవత్సరాలు తపస్సు చేసింది. నారాయణుడే తనకు భర్తకావాలి ఆనే దృఢసంకల్పంతో తీవ్ర తపస్సు సాగించింది. గ్రీష్మంలో పంచాగ్నిమధ్యంలో నిలిచి, శీతర్తువులో తడిబట్టలు ధరించి, వర్షర్తువులో ఆరుబయట వానలో కూర్చుని, రేయింబవళ్ళు తపస్సు చేసింది. నీళ్ళూ పళ్ళూ తప్ప మరింక ఏ ఆహారామూ లేదు. ఒక ముప్ఫయివేల ఏళ్ళు కేవలం ఆకులు తిని, మరో నలభైవేల సంవత్సరాలు కేవలం వాయుభక్షణతోను, మరొక పదివేల వసంతాలు నిరాహారంగాను ఘోరతపస్సు చేసింది. శరీరాన్ని పూర్తిగా నిర్లక్ష్యంచేసి ఒంటికాలి బొటనవేలిమిద నిలబడి నిష్ఠగా తపస్సు చేస్తూంటే ఒకనాడు హఠాత్తుగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. తులసీదేవి సవినయంగా ఆ హంసవాహనుడికి నమస్కరించింది.

తులసీ! నీ తపస్సుకి మెచ్చాను. వరం ఇస్తాను. నీ ఇష్టం ఏదైనా కోరుకో. హరిభక్తి కావాలా? హరిదాస్యం కావాలా? అజరామరత్వం కావాలా? ఏది కావాలంటే అది ఇస్తాను. అడుగు - అన్నాడు చతుర్ముఖుడు.

తాతా! నా మనసులో ఉన్నమాట చెబుతున్నాను విను. నువ్వు సర్వజ్ఞుడివి. నీముందు దాపరికమేమిటి, సిగ్గు ఏమిటి? నేను తులసిని. ఒకప్పుడు గోలోకవాసినిని. గోపికను. గోవిందుడితో శృంగారక్రీడలో నేను పరవశించి ఉండగా రాసేశ్వరి రాధికాదేవి వచ్చి చూసింది. కోపావేశంతో గోవిందుణి బెదిరించింది. తనతో లాక్కుపోయింది. పోతూ నన్నుశపించింది. భూలోకంలో మానవకాంతగా పుట్టమంది. అప్పుడు గోవిందుడు నన్ను ఓదార్చుడు. నా అంశావతారమైన చతుర్భుజ నారాయణుడిని భర్తగా పొందుతావు. బ్రహ్మదేవుడు వరమిస్తాడు. భారతభూభాగాన తపస్సు చెయ్యి - అన్నాడు. అంతర్థానం చెందాడు. నేను రాధాదేవికి భయపడి తనువు చాలించాను. భూలోకాన మానవకాంతగా జన్మించాను, హే సృష్టికర్తా! శాంతసుందర విగ్రహుడైన శ్రీమన్నారాయణుడు నాకు భర్తగా లభించాలి. అదే నేను నిన్ను కోరుతున్న వరం. దయచేసి అనుగ్రహించు.

తులసీదేవీ! తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది. శ్రీకృష్ణాంగ సముద్భవుడైన గోపకుడు సుదాముడు గోలోకంలో ఉండేవాడు. గుర్తుందా? అతడిప్పుడు రాధికాశాపంవల్ల భూలోకంలో దనువంశంలో జన్మించాడు. మహాతేజస్వి. కృష్ణుడి అంశతో ఆవిర్భవించిన సుందరుడు. శంఖచూడుడు అనే పేరుతో ముల్లోకాలలోనూ విఖ్యాతి గడించాడు. గోలోకంలో ఉన్నప్పుడు ఇతడు (సుదాముడు), నిన్ను చూసి కామపరవశుడవుతూండేవాడు. రాధికాదేవికి భయపడి అప్పట్లో ఏ సాహసమూచెయ్యలేకపోయాడు. ప్రస్తుతం అతడు భూలోకాన జాతిస్మరుడు. నువ్వూ అలాగే జాతిస్మరవే. నిన్ను చూడగానే తప్పకుండా గుర్తుపడతాడు. కనక వెళ్ళు. ఇప్పటికి అతణ్జి భర్తగా స్వీకరించు. తరవాత సాక్షాత్తు నారాయణుడినే వరిద్దువుగాని.

గోపికా! మరొక విశేషం. నారాయణుడి శాపంవల్లా దైవయోగంవల్లా నువ్వు ఒక పవిత్రమైన వృక్షరూపాన్ని పాందుతావు. విశ్వపావనివి అవుతావు. నీ పువ్వులు విష్ణుమూర్తికి ప్రాణాధిక ప్రియాలు అవుతాయి. నువ్వులేవి పూజలన్నీ నిష్పలమవుతాయి. బృందావనంలో నీపేరు బృందావని. నీ దళాలతోనే గోపగోపీజనం మాధవుణ్ణి అర్చిస్తారు. నువ్వు వృక్షాధిదేవతవు అవుతావు. ఆ రూపంతో నిరంతరం స్వేచ్చగా శ్రీకృష్ణుడితో విహరిస్తావు. ఇది నా వరం. ఇక ఈ ఘోరతపస్సు చాలించు.

బ్రహ్మదేవుడి వరానికి సంతోషించి తులసీదేవి చిరునవ్వులు చిందించింది. మరొక్కసారి శిరసువంచి నమస్కరించింది. మెల్లగా తన అంతరంగం బయటపెట్టింది.

పరమేష్టీ! నిజం చెబుతున్నాను. ద్విభుజుడూ శ్యామసుందరుడూ అయిన గోలోక కృష్ణుడిమీదనే ఉంది నా మనను. అంతగా చతుర్భుజుడిమీద లేదు. అలనాడు శృంగారభంగమయ్యింది. అప్పటినుంచీ అసంతృప్తిగానే ఉంది. అయినా ఆ గోవిందుడే ఆజ్ఞాపించాడు అంటున్నావు కనక అంగీకరిస్తున్నాను. అదీకాక నీ వరానుగ్రహంవల్ల, సుదుర్లభుడైన ఆ గోలోక గోవిందుణ్ణి మళ్ళీ పాందగలుగుతాను కనక సమ్మతిస్తున్నాను. కానీ నా హృదయంలో నాటుకుపోయిన రాధాభయం ఇప్పటికీ వేధిస్తూనే ఉంది. దాన్ని తొలగించుకునే ఉపాయం చెప్పూ,

తులసీ! దానికి ఒక దివ్యమైన ఉపాయం ఉంది. షోడశాక్షరమైన రాధికామంత్రాన్ని ఉపదేశిస్తాను స్వీకరించు. ఈ మంత్రాన్ని జపిస్తే నువ్వు రాధికాదేవికి ప్రాణప్రియవు అవుతావు. రాధికా సమానురాలివై గోవిందుడికి ప్రీతిపాత్రవు అవుతావు. మీ ఇద్దరి రహస్య శృంగారాన్ని రాధిక తెలుసుకోలేదు - అని చెప్పి మంత్రాన్ని ఉపదేశించి స్తోత్రమూ కవచమూ పూజావిధానమూ వివరించి అంతర్జానం చెందాడు.

తులసీదేవి ఆ మంత్రాన్ని ఉపాసించి మహాలక్ష్మీ సమానురాలయ్యింది. మహాభోగాలన్నీ అందుబాటులోకి వచ్చాయి. తపఃక్లేశాన్ని మరచిపోయింది. ఫలం సిద్ధిస్తే దుఃఖంకూడా సుఖం అనిపిస్తుంది కదా 

ధర్మధ్వజ మహారాజుగారి కూతురు తులసీదేవి తపోవనంలోనే రాజభోగాలు అనుభవిస్తోంది. నిత్యమూ చెలికత్తెలతో విందులూ వినోదాలే. ఒకరోజు రాత్రి విందులు ఆరగించి పుష్పచందన చర్చితమైన మనోహరశయనంమీద మేను వాల్చింది.

నవయౌవనంలో ఒంటరిగా ఉన్న ఆ సుందరాంగిమీదకి మన్మథుడు నిర్దాక్షిణ్యంగా తన అయిదుబాణాలు గురిపెట్టాడు. ఆ దాడికి తట్టుకోలేక తులసీదేవి విలవిలలాడింది. శరీరం పులకించగా కన్నులు ఎరుపెక్కాయి. క్షణంలో మేను వాడిపోయింది. మూర్భపోయింది. క్షణంలో తేరుకుంది. క్షణం నిద్రపోయింది. మరుక్షణంలో మేలుకొంది. క్షణం ఉద్విగ్న అయ్యింది. క్షణంలో దహించుకొనిపోయింది. క్షణంలో ప్రసన్నురాలయ్యింది. క్షణకాలం చేతనత్వం, క్షణకాలం విషణ్ణత. క్షణం కూర్చోవడం, క్షణం లేచి నిలబడటం. క్షణం మేను వాల్చడం, క్షణం లేచి తిరగడం. క్షణం పరుగులు తియ్యడం, క్షణం స్థాణువు కావడం. ఏమి చేస్తోందో ఏమి జరుగుతోందో ఆమెకే తెలియడంలేదు. వుష్పచందనతల్పం కంటకశయనమయ్యింది. (కంటకం = ముల్లు). ఫలాలూ జలాలూ విషతుల్యమయ్యాయి. రాజమందిరం కొండగుహ అనిపించింది. సన్ననివస్త్రం అగ్నికీల అయ్యింది. చెక్కిలిమీద చిత్రించుకున్న సిందూరమకరికాపత్రం పుండులా బాధించింది.

ఒక సుందరాంగుడు రసికేశ్వరుడు యువకుడు చందనచర్చితుడు రత్నభూషణభూషితుడు పుష్పమాలికాసమలంకృతుడు ఎదురు వస్తున్నట్టూ తన ముఖపద్మాన్ని కన్నులతో ఆస్వాదిస్తున్నట్టూ చెవిలో రహస్యంగా మధురంగా రతికథాలాపాలు చేస్తున్నట్టూ తల్పంపైని తనను కౌగిలించుకొని అలరిస్తున్నట్టూ అంతలోనే లేచి వెళ్ళిపోతున్నట్టూ, నిలు నిలు ప్రాణేశా! ఎక్కడికి ఈ పయనం అంటూ తాను వెంటపడుతున్నట్టూ అతడు వెనుదిరిగి మళ్ళీ తన దగ్గరికి వస్తున్నట్టూ - భ్రాంతిలోనే అయినా ఏవేవో మధురానుభవాలు కలుగుతున్నాయి. ఇది అంతా వట్టి భ్రాంతి అని మరుక్షణంలో తెలిసివస్తోంది, ఆ తెలివిడి రాగానే ఆపుకోలేని దుఃఖంతో విలపిస్తోంది. ఇలా నవయౌవనం ఏడిపిస్తూంటే తులసీదేవికి ఆ రాత్రి గడవటం కష్టమయ్యింది. అలాగే విలపిస్తూ కూర్చుంది.

తులసీ - శంఖచూడుల సంవాదం


Sita - Chayasita - Draupadi - సీత - ఛాయాసీత - ద్రౌపది

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - సీత - ఛాయాసీత - ద్రౌపది

కాలం గడిచింది. కృతయుగం వెళ్ళి త్రేతాయుగం వచ్చింది. వేదవతి జనకమహారాజు ఇంట సీతాదేవిగా అవతరించింది. పూర్వజన్మ తపఃఫలంగా శ్రీరాముణ్జీ పరిణయమాడింది. సీతారాములిద్దరూ చాలాకాలం వివిధ కామోపభోగాలతో ఆనందించారు. గతజన్మ తపఃక్లేశాలకు విరుగుడుగా సీతమ్మ సుఖసంతోషాలు అనుభవించింది.

తండ్రి మాటను నిలబెట్టడంకోసం సత్యసంధుడైన రాముడు అరణ్యవాసం చేశాడు. కాలం బలీయంకదా! సీతాలక్ష్మణ సహితుడై దాశరథి సముద్ర తీరారణ్యంలో నివసిస్తుండగా ఒకనాడు అగ్నిదేవుడు విప్రవేషంలో వచ్చాడు. అడవుల్లో కష్టాలు పడుతున్న రాముణ్ణి చూసి ఎంతగానో దుఃఖించాడు. ఏకాంతంలో కలుసుకున్నాడు.

రామా! ఒక నిజం నీకు చెప్పి వెడదామని వచ్చాను. దైవం ఎవరికైనా దుర్నివార్యం. దైవం కన్నా బలీయమేదీ లేదు. కనక నేను చెప్పేది శ్రద్ధగా ఆలకించు. ఇది సీతాపహరణకాలం కాబట్టి ఈ జగన్మాతను నాకు అప్పగించు. ఛాయా సీతను నువ్వు కాపాడుకో. పరీక్షాసమయం వస్తుంది. అప్పుడు తిరిగి నీ సీతను నీకు అప్పగిస్తాను. దేవతలు పంపితే వచ్చాను నేను. కేవలం విప్రుణ్ణి కాదు. హంతాశనుణ్ణి.

రాముడు ఆలకించాడు. శ్రద్దగా ఆలకించాడు. ఏ మార్పూ ముఖంలో కనపడనివ్వలేదు. హృదయంలో మాత్రం కుమిలిపోయాడు. అగ్నిదేవుడు చెప్పినదానికి అంగీకరించాడు. హంతాశనుడు తన యోగశక్తితో ఛాయాసీతను సృష్టించి రాముడికి అప్పగించాడు. అసలు సీతను తీసుకుని వెళ్ళిపోయాడు. ఇది అత్యంతగోప్యంసుమా అని హెచ్చరిక చేసి మరీ వెళ్ళాడు. నారదా! ఈ రహ్యం లక్ష్మణుడికికూడా తెలియదంటే రాముడు ఎంత గోప్యంగా ఉంచాడో గ్రహించు.

అగ్నిదేవుడు అటు వెళ్ళాడో లేదో బంగారులేడి రాముడి కంటపడింది. దాన్ని పట్టి తెమ్మని సీతాదేవి రాముణ్ణి కోరింది. లక్ష్మణుడిని సీతకు కాపలాఉంచి రాముడు బయలుదేరాడు. బంగారులేడిని వెంబడించి చివరికి బాణం వేశాడు. అది “హా లక్ష్మణా!” అని రామకంఠంతో అరిచి ప్రాణాలు వదిలింది ప్రాణాలు వదిలే సమయంలో రాముణ్ణి దర్శించింది కనక దివ్యరూపంతో రత్నవిమానంలో వైకుంఠాన్ని చేరుకున్నాడు ఆ మాయామృగరూపధారి మారీచుడు. వైకుంఠ ద్వారపాలకులకు కింకరుడై అటుపైని వారి అనుమతితో లోపలికి ప్రవేశించాడు.

హా! లక్ష్మణా! అని వినిపించిన రామకంఠధ్వనిని విని సీతాదేవి భయపడింది. రాముడికి ఏదో ఆపద వచ్చింది సహాయపడమని లక్ష్మణుడిని పంపించింది. అతడు అలా వెళ్ళగా చూసి రావణుడు వచ్చి సీతను లంకకు అపహరించుకుపోయాడు.

రామలక్ష్మణులు అడవిలో కలుసుకున్నారు. లక్ష్మణుడిని చూసి రాముడు ఆశ్చర్యపోయాడు, ఇద్దరూ కలిసి ఆశ్రమానికి వచ్చారు. పర్ణశాల బోసిపోయింది. సీతమ్మ లేదు. రాముడు దుఃఖించి దుఃఖించి మూర్భపోయాడు. తేరుకున్నాడు. ఇద్దరూ అడవులన్నీ గాలించారు.

రావణుడు అపహరించుకుపోయాడనే వార్త గోదావరీతీరాన తెలిసింది. అటుపైని వానరులతో సఖ్యంచేసి సముద్రానికి వారధి కట్టి లంకలో ప్రవేశించిన రాముడు స్వయంగా బాణం సంధించి రావణుడిని సంహరించాడు.

సీతకు అగ్నిపరీక్ష పెట్టాడు. అప్పుడు అగ్నిదేవుడు అసలు సీతను పవిత్రంగా రాముడికి అందించాడు. ఛాయాసీత అగ్నిదేవుడికీ రామచంద్రుడికీ సవినయంగా నమస్కరించి నా కర్తవ్యమేమిటో ఉపదేశించండి అని అభ్యర్థించింది. పుష్కరక్షేత్రానికి వెళ్ళి తపస్సు చేసుకోమనీ అక్కడే స్వర్గలక్ష్మివి అవుతావు అనీ చెప్పి పంపించారు.

ఛాయాసీత పుష్కరక్షేత్రంలో మూడులక్షల దివ్యసంవత్సరాలు తపస్సుచేసి స్వర్గలక్ష్మి అయ్యింది. ఆమెయే అటుతరవాత ద్వాపరయుగంలో ద్రుపదుడి ఇంట యజ్ఞకుండంనుంచి ఆవిర్భవింది ద్రౌపది అయ్యింది. ఇలా మూడు యుగాలలోనూ ఉంది కనక ఈమెకు త్రిహాయణి అనే పేరు ఏర్పడింది.

పుష్కరక్షేత్రంలో ఛాయాసీత తపస్సు చేస్తున్నప్పుడు శంకరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. ఆమె కామాతురయై పతిని ఇయ్యి పతిని ఇయ్యి ఆని ఆవేశంగా అయిదుసార్లు అంది. రసికేశ్వరుడైన శివుడు పగలబడి నవ్వి “ప్రియా! నీకు అయిదుగురు భర్తలుంటా” రని వరమిచ్చి అదృశ్యుడయ్యాడు.

నారదా! అందుచేతనే ద్రౌపదికి పాండవులు అయిదుగురూ భర్తలయ్యారు. ప్రస్తావనలో వచ్చిందీ కనక ఈ విషయమూ చెప్పాను. అదిసరే.

అసలు సీతను స్వీకరించి, లంకారాజ్యానికి విభీషణుడిని పట్టాభిషిక్తుణ్ణి చేసి రాముడు ఆయోధ్యకు తిరిగివచ్చాడు. పదకొండువేల సంవత్సరాలపాటు రాజ్యం పరిపాలించాడు. అటు పైని సర్వలోకాలతో పాటూ తానూ వైకుంఠానికి వెళ్ళిపోయాడు. లక్ష్మీదేవి అంశయైన వేదవతి లక్ష్మీదేవిలో ప్రవేశించింది. చతుర్వేదాలూ మూర్తిమంతాలై వేదవతి నాల్కమీద నాట్యమాడుతూ ఉండేవిట! అతి పవిత్రమూ పాపనాశకమూ పుణ్యప్రదమూ అయిన వేదవతీ వృత్తాంతం చెప్పాను. తరువాత కథ ఆలకించు.

తులసీ వృత్తాంతం


Monday, May 4, 2026

Mahabaleshwar Temple - Mahabaleshwar- Maharashtra - మహాబలేశ్వర్ దేవాలయం - మహాబలేశ్వర్ - మహారాష్ట్ర

మహాబలేశ్వర్ దేవాలయం, మహాబలేశ్వర్, మహారాష్ట్ర
మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఉన్న మహాబలేశ్వర్ ఆలయం (పాత మహాబలేశ్వర్) 16వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ స్వయంభూ శైవ క్షేత్రం. హేమాద్‌పంతి శైలిలో నిర్మితమైన ఈ దేవాలయంలో 6అడుగుల నల్ల రాతి శివలింగం (మహాబలి) ప్రధాన ఆకర్షణ. ఇది దట్టమైన అడవుల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో ఉంది.

మహాబలేశ్వర్ లో ఉన్న మహాబలేశ్వర్ స్వయంభూ దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రంలోని విశిష్టత ఏమిటంటే, ఇక్కడి శివలింగం రుద్రాక్ష ఆకారంలో ఉండటం. దీనినే 'మహాలింగం' అని కూడా పిలుస్తారు. దీని ప్రాచీన వాస్తుశిల్పం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, బయట ఎలాంటి అలంకరణ లేకుండా పిరమిడ్ ఆకారంలో ఉన్న గోపురం ఉంటుంది. లోపలి భాగాలు శిల్పాలతో అలంకరించబడి ఉంటాయి. ఈ ఆలయం హేమడ్ పంతి(హేమదంత) శైలిలో నిర్మించబడింది. ఇక్కడ నంది మరియు కాలభైరవుల విగ్రహాలు మరియు శిల్పాలు ఉన్నాయి. ఆలయం యొక్క నిరాడంబరతకు, దాని వెనుక ఉన్న గంభీరమైన సహ్యాద్రి పర్వత శ్రేణులు మరింత శోభను చేకూరుస్తాయి.

ఆలయ చరిత్ర మరియు విశేషాలు:
ఇది సుమారు 6 అడుగుల పొడవు ఉంటుంది. కానీ నేల పైకి కేవలం చిన్న భాగం మాత్రమే కనిపిస్తుంది. ఈ లింగం ఉపరితలం రుద్రాక్ష కాయ లాగా గరుకుగా, ఎగుడుదిగుడుగా ఉంటుంది. అందుకే దీనిని రుద్రాక్ష శివలింగం అంటారు.

దీనిని త్రిగుణాత్మక లింగంగా భావిస్తారు (అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ ఈ లింగంలోనే ఉన్నారని నమ్మకం).

పురాణ గాథ (చరిత్ర):
శివలింగం ఆవిర్భావం వెనుక ఉన్న పౌరాణిక కథ యొక్క ప్రస్తావన స్కంద పురాణంలోని సహ్యాద్రి విభాగం యొక్క మొదటి మరియు రెండవ అధ్యాయాలలో చూడవచ్చు. 

పురాణాల ప్రకారం, పద్మకల్పంలో, మానవుల సృష్టి కోసం బ్రహ్మదేవుడు సహ్యాద్రి అడవులలో తపస్సు చేస్తున్నప్పుడు, మహాబలి, అతిబలి అనే ఇద్దరు రాక్షస సోదరులు ఇక్కడ తపస్సు చేసి శివుడిని మెప్పించారు. అయితే వారు మునులు, ఋషులను మరియు ప్రజలను హింసించేవారు.

వారి దురాగతాలు పరాకాష్టకు చేరడంతో, ఆ ప్రాంత వాసులను రక్షించడానికి విష్ణుమూర్తి వారితో పోరాడవలసి వచ్చింది. కానీ, మహాబలుడు ఇచ్చామరణం వరం పొందినందున, విష్ణుమూర్తి అతిబలుడిని మాత్రమే సంహరించగలిగాడు.

మహాబలుడి బారి నుండి విముక్తి కలిగించమని బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు శివుడిని, ఆదిమయ దేవిని ప్రార్థించారు. ఆదిమయ దేవి తన సౌందర్యంతో మహాబలుడిని మంత్రముగ్ధుడిని చేసి, బంధించింది. చివరగా మహాబలి తన తప్పు తెలుసుకుని తన పేరు మీద ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందాలని శివుడు ఈ ప్రదేశంలో తనతో శాశ్వతంగా నివసించాలనే షరతుపై అతను తన ప్రాణాలను అర్పించడానికి అంగీకరించాడు. అలా ఈ ప్రాంతానికి 'మహాబలేశ్వర్' అనే పేరు వచ్చింది.

మహాబలుడి కోరిక మేరకు శివుడు అతనితో ఉండటానికి రుద్రాక్ష శివలింగం రూపంలో అవతరించాడు, ఈ కారణంగానే మహాబలేశ్వర్ ఆలయంలో మంచం, త్రిశూలం, డమరుకం మరియు రుద్రాక్ష ఉన్నాయి. జానపద కథల ప్రకారం, ప్రతి ఉదయం మంచం నలిగిపోయి కనిపించడం వల్ల, శివుడు ప్రతి రాత్రి ఆలయాన్ని సందర్శిస్తాడు అని విశ్వాసం.

ఆలయ నిర్మాణం:
13వ శతాబ్దానికి చెందిన ఒక యాదవ పాలకుడు కృష్ణా నది మూలం వద్ద క్రీ.శ. 1215 లో ఒక చిన్న ఆలయాన్ని మరియు నీటి ట్యాంక్‌ను నిర్మించాడని ఒక ఇతిహాసం చెబుతుంది . మహాబలేశ్వర్ చుట్టుపక్కల ప్రాంతమైన జావళి లోయను , బీజాపూర్ ఆదిల్‌షాహీ సుల్తానేట్‌కు సామంతులుగా ఉన్న మోరే (వంశం) పాలించారు . ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని 16వ శతాబ్దంలో జావళి లోయ పాలకుడు రాజు చందా రావు మోర్ నిర్మించగా, 1656లో, మరాఠా సామ్రాజ్య స్థాపకుడు, ఛత్రపతి శివాజీ, చంద్రారావు మోరేను చంపి , ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేశారు. ఆ సమయంలో శివాజీ మహాబలేశ్వర్ సమీపంలో ప్రతాప్‌గడ్ కోట అనే కొండ కోటను కూడా నిర్మించారు.

ఇతర ఆసక్తికర విషయాలు:
ఛత్రపతి శివాజీ మహారాజ్ తన తల్లి జిజాబాయి గారి కోరిక మేరకు ఇక్కడే బంగారంతో 'తులదానం' నిర్వహించి, ఆ బంగారాన్ని పేదలకు పంచారని చరిత్ర చెబుతోంది.

పంచగంగ ఆలయం: ఈ ఆలయానికి సమీపంలోనే కృష్ణ, కోయ్న, వెన్న, సావిత్రి మరియు గాయత్రి అనే ఐదు నదులు కలిసే 'పంచగంగ' దేవాలయం కూడా ఉంది.

ముఖ్యమైన విశేషాలు:
మహాబలేశ్వర్ అనేది మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఉన్న ఒక చిన్న పట్టణం. హిందువులు పవిత్రంగా భావించే కృష్ణా నది దాని ఐదు ఉప నదులతో పాటు ఇక్కడే ఉద్భవించిన పుణ్యస్థలం. బ్రిటిష్ పాలకులు ఈ పట్టణాన్ని ఒకహిల్ స్టేషన్‌గా అభివృద్ధి చేసి బొంబాయి ప్రెసిడెన్సీకి వేసవి రాజధానిగా నిర్మించారు.

మహాబలేశ్వర్ భారతదేశ పశ్చిమ తీరం వెంబడి ఉత్తరం నుండి దక్షిణం వరకు విస్తరించి ఉన్న పశ్చిమ కనుమల యొక్క సహ్యాద్రి పర్వత శ్రేణిలో ఉంది . మహాబలేశ్వర్ 150 చదరపు కిలోమీటర్ల (58 చదరపు మైళ్ళు ) విస్తీర్ణం గల ఒక విశాలమైన పీఠభూమి , దీనికి అన్ని వైపులా లోయలు ఉన్నాయి. ఇది సముద్ర మట్టానికి 1,439 మీటర్ల (4,721 అడుగులు) ఎత్తులో ఉన్న తన ఎత్తైన శిఖరాన్ని విల్సన్/సన్‌రైజ్ పాయింట్ అని పిలుస్తారు. ఈ పట్టణం పూణేకు నైరుతి దిశలో సుమారు 122 కిలోమీటర్లు (76 మైళ్ళు) మరియు ముంబై నుండి 285 కిలోమీటర్లు (177 మైళ్ళు) దూరంలో ఉంది .

మహాబలేశ్వర్‌లో 
మూడు గ్రామాలు ఉన్నాయి. మాల్కం పేఠ్, పాత మహాబలేశ్వర్, మరియు షిందోలా గ్రామంలోని కొంత భాగం.

మహాబలేశ్వర్ ప్రాంతం కృష్ణా నదికి మూలం. ఈ నది మహారాష్ట్ర, కర్ణాటక , తెలంగాణ, మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది . కృష్ణా నది యొక్క మూడు ఉపనదులైన కోయినా , వెన్నా (వేణి) , మరియు గాయత్రి కూడా మహాబలేశ్వర్ ప్రాంతంలోనే ఉద్భవిస్తాయి. నాల్గవ నది అయిన సావిత్రి కూడా ఈ ప్రాంతంలోనే ఉద్భవిస్తుంది, కానీ మహాద్ మీదుగా పశ్చిమ దిశగా అరేబియా సముద్రంలోకి ప్రవహిస్తుంది.

ఈ ప్రాంతంలోని వాతావరణం స్ట్రాబెర్రీల సాగుకు అనుకూలంగా ఉంటుంది; దేశంలోని మొత్తం స్ట్రాబెర్రీ ఉత్పత్తిలో మహాబలేశ్వర్ స్ట్రాబెర్రీ సుమారు 85 శాతం వాటాను కలిగి ఉంది.

పాత మహాబలేశ్వర్‌లోని పంచగంగ దేవాలయం, 1850లలో

1819లో, మరాఠా సామ్రాజ్యం పతనమైన తరువాత, బ్రిటిష్ ప్రభుత్వం మహాబలేశ్వర్ చుట్టూ ఉన్న కొండలను సతారా అనే సామంతుల రాజ్యానికి అప్పగించింది . కల్నల్ లాడ్విక్ (తరువాత జనరల్ సర్ లాడ్విక్) మహాబలేశ్వర్ సమీపంలోని పర్వతాలను అధిరోహించిన తరువాత, బొంబాయి ప్రెసిడెన్సీ గవర్నర్ సర్ జాన్ మాల్కమ్‌కు బ్రిటిష్ దళాల కోసం ఆ ప్రదేశాన్ని ఒక ఆరోగ్య కేంద్రంగా సిఫార్సు చేశారు . 1828 లో బ్రిటిష్ వారికి మహాబలేశ్వర్ దక్కినందుకు బదులుగా సతారా రాజుకు ఇతర గ్రామాలు మంజూరు చేయబడ్డాయి. పాత రికార్డులలో మహాబలేశ్వర్‌ను గవర్నర్ పేరు మీద మాల్కమ్ పేఠ్ అని కూడా పిలిచేవారు.

సర్ మౌంట్‌స్టువర్ట్ ఎల్ఫిన్‌స్టోన్ , ఆర్థర్ మాలెట్ (ఇతని పేరు మీదుగానే "పాయింట్ ఆర్థర్" వద్ద ఉన్న పీఠానికి పేరు వచ్చింది), కార్నాక్ మరియు అనేక ఇతర బొంబాయి ప్రెసిడెన్సీ బ్రిటిష్ అధికారులు తరచుగా సందర్శకులుగా మారినప్పుడు మహాబలేశ్వర్ ప్రాముఖ్యతను సంతరించుకోవడం ప్రారంభించింది . నిరంతరం ప్రవహించే నీటి బుగ్గల నుండి నీటిని సేకరించడానికి 1842లో వెన్నా సరస్సును నిర్మించారు; ఈ సరస్సు నుండి వెన్నా నది ప్రవహిస్తుంది. 1850లలో సతారా కమీషనర్ అయిన బార్ట్లీ ఫ్రేర్, సతారా నుండి మహాబలేశ్వర్ వరకు రహదారిని నిర్మించాడు . 1800ల మధ్యలో, మహాబలేశ్వర్‌ను బొంబాయి ప్రెసిడెన్సీకి వేసవి రాజధానిగా చేశారు . ప్రభుత్వ వ్యయం ఈ ప్రాంతం యొక్క వేగవంతమైన అభివృద్ధికి దారితీసింది.

బ్రిటిష్ అధికారులు సంవత్సరంలో కొంత భాగాన్ని ఈ ప్రాంతంలో గడిపేవారు. వారి భార్యలు మహాబలేశ్వర్ మరియు సమీపంలోని పంచగనిలోని స్థానిక బోర్డింగ్ పాఠశాలల్లో ఉన్న తమ పిల్లలతో ఉండటానికి సంవత్సరంలో ఎక్కువ కాలం ఈ ప్రాంతంలో గడిపేవారు . బ్రిటిష్ పాలకులు హిల్ స్టేషన్లలో ఇంగ్లీష్ ప్రకృతి దృశ్యాన్ని పునఃసృష్టించాలని కోరుకున్నారు మరియు ఆ లక్ష్యంతో, మహాబలేశ్వర్‌లో స్ట్రాబెర్రీలు వంటి యూరోపియన్ వృక్షజాలాన్ని ప్రవేశపెట్టారు మరియు గ్రంథాలయాలు, థియేటర్లు, బోటింగ్ సరస్సులు మరియు క్రీడా మైదానాలు వంటి సౌకర్యాలను నిర్మించారు.

అనేక అద్భుతమైన సుందరమైన ప్రదేశాలతో పాటు, మహాబలేశ్వర్ పీఠభూమిలోని నిరంతర సెలయేళ్ళు, ప్రవాహాలు మరియు జలపాతాలు, అలాగే ఏడాది పొడవునా ఉండే అద్భుతమైన వాతావరణం ఆంగ్లేయులను మరియు ఇతరులను మహాబలేశ్వర్‌కు ఆకర్షించాయి. 19వ శతాబ్దం చివరి నాటికి, ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆకర్షణీయమైన, ప్రసిద్ధ హిల్ స్టేషన్‌గా మారింది. మహారాష్ట్ర గవర్నర్ వేసవి నివాసమైన రాజ్ భవన్ కూడా ఇక్కడే ఉంది. "ది టెర్రసెస్" అనే పాత భవనాన్ని 1884లో కొనుగోలు చేసి, 1886లో గిరి దర్శన్‌గా పేరు మార్చారు.

"బాబింగ్టన్ హౌస్" అనే శిలువ ఆకారంలో, లోతైన వరండా, విస్తృతమైన లోహపు పనితో కూడిన రెయిలింగ్ మరియు విశాలమైన బయటి గదులతో నిర్మించబడిన అద్భుతమైన భవంతి. 1970ల ప్రారంభంలో దీనిని రాహేజాలకు అమ్మే ముందు, ఇది బొంబాయికి చెందిన పార్శీ ఓడల సామాగ్రి వ్యాపార రాజవంశమైన దుబాష్ కుటుంబం యొక్క గ్రామీణ నివాసాలలో ఒకటిగా ఉండేది. దీనిలో 24 మంది కూర్చునే విలాసవంతమైన బల్లతో కూడిన ఒక భోజనశాల మరియు దుబాష్ కుటుంబం, ముఖ్యంగా పుస్తక ప్రియుడు మరియు కళా సేకరణకర్త అయిన జంషెడ్జీ "జిమ్మీ" కవాస్జీ దుబాష్ సేకరించిన మొదటి ముద్రణ పుస్తకాలతో కూడిన ఒక గ్రంథాలయ మండపం ఉన్నాయి.

విల్లిసన్ పాయింట్ సూర్యోదయం
మహారాష్ట్రలో మహాబలేశ్వర్ ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఇక్కడి ఆకర్షణలలో బాంబే పాయింట్, ఆర్థర్ సీట్, కేట్స్ పాయింట్, లాడ్విక్-విల్సన్ పాయింట్, మరియు ఎల్ఫిన్‌స్టన్ పాయింట్ వంటి అనేక కొండప్రాంత వీక్షణ కేంద్రాలు ఉన్నాయి, ఇక్కడ నుండి చుట్టుపక్కల కొండలు, లోయలు మరియు అడవుల దృశ్యాలు కనిపిస్తాయి. మహాబలేశ్వర్‌లో సూర్యోదయం మరియు సూర్యాస్తమయం రెండూ కనిపించే ఏకైక ప్రదేశం విల్సన్ పాయింట్. 

ఈ పట్టణంలో బ్రిటిష్ కాలం నాటి వెన్నా సరస్సు అనే మానవ నిర్మిత సరస్సు కూడా ఉంది . ఈ సరస్సు బోటింగ్ కోసం ఒక ప్రసిద్ధ ప్రదేశం. దీని చుట్టూ పర్యాటకులను ఆకర్షించే మార్కెట్ మరియు ఆహార దుకాణాలు ఉన్నాయి. ఇతర ఆకర్షణలలో లింగమల జలపాతం కూడా ఉంది. పాత మహాబలేశ్వర్ దాని మహాదేవ్ ఆలయంతో ఒక పుణ్యక్షేత్రం. 

ఇది సహజంగా చల్లని ప్రదేశం కావడంతో, మహాబలేశ్వర్ మరియు చుట్టుపక్కల కొండలలో స్ట్రాబెర్రీలు, రాస్ప్బెర్రీలు మరియు మల్బెర్రీలు వంటి అనేక సమశీతోష్ణ ప్రాంత పంటలను పండిస్తారు. ఈ పంటలలో ప్రధానమైనది స్ట్రాబెర్రీలు. స్ట్రాబెర్రీ తోటలు మరియు వాటి ఉత్పత్తులు కూడా ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. 

ప్రతాప్‌గడ్:
ఛత్రపతి శివాజీ నిర్మించిన చారిత్రాత్మక ప్రతాప్‌గడ్ కోట సందర్శించడానికి ఒక ప్రసిద్ధ ప్రదేశం . ఇది శివాజీ మహారాజ్ మరియు బీజాపూర్ సేనాపతి అఫ్జల్ ఖాన్ మధ్య జరిగిన పోరాటానికి వేదిక , ఇక్కడ అఫ్జల్ ఖాన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ చేతిలో ఓడిపోయి మరణించాడు. ఇక్కడ చిన్న దుకాణాలు, రెస్టారెంట్లు మరియు ఒక హస్తకళల దుకాణం ఉన్నాయి. అనేక పాఠశాలలు కూడా ఈ కోటకు విద్యా యాత్రలను ఏర్పాటు చేస్తాయి. ఈ కోట ఆ ప్రాంతంలోని అనేక ట్రెక్కింగ్ మార్గాలలో కూడా ఉంది.

విల్సన్ పాయింట్:
మహాబలేశ్వర్ యొక్క అత్యంత ఎత్తైన ప్రదేశం 1439 మీటర్ల ఎత్తులో ఉంది. దీనికి బొంబాయి ప్రెసిడెన్సీ గవర్నర్ లెస్లీ విల్సన్ (10 డిసెంబర్ 1923 - 8 డిసెంబర్ 1928) పేరు పెట్టారు. ఇక్కడ సూర్యోదయం చూడటానికి పర్యాటకులు విశేషంగా వస్తారు. ముఖ్యంగా సూర్యోదయం సమయంలో అద్భుతమైన దృశ్యాలను అందిస్తుంది.

దర్శన సమయాలు: ఉదయం 5:00 నుండి రాత్రి 9:00 వరకు

సందర్శనకు ఉత్తమ కాలం: నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మహాశివరాత్రి సమయంలో ఇక్కడ ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి.

హిల్ స్టేషన్ అందాలను ఆస్వాదిస్తూ ఆధ్యాత్మిక అనుభూతిని పొందడానికి ఈ ఆలయం ఉత్తమమైన ప్రదేశం

వసతి: మహాబలేశ్వర్‌లో వివిధ బడ్జెట్‌లకు సరిపోయే హోటళ్లు మరియు వసతి సౌకర్యాలు ఉన్నాయి.

రోడ్డు మార్గం: మహాబలేశ్వర్ బస్ స్టాండ్ నుండి పాత మహాబలేశ్వర్ సుమారు 6 కి.మీ దూరంలో ఉంది. టాక్సీ లేదా స్థానిక వాహనాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు.

రైలు మార్గం: మహాబలేశ్వర్‌కు అత్యంత సమీప రైల్వే స్టేషన్ సతారా, ఇది 60 కి.మీ. దూరంలో ఉంది. సమీపంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో పూణే (120 కి.మీ.), సాంగ్లీ రైల్వే స్టేషన్ (170 కి.మీ.) ఉన్నాయి. ఈ ప్రదేశాల నుండి మహాబలేశ్వర్‌కు ప్రభుత్వ బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఖేడ్ సమీపంలోని కొంకణ్ రైల్వేపై ఉన్న దివాన్ ఖవతి రైల్వే స్టేషన్ నుండి పోలాద్‌పూర్ మీదుగా మహాబలేశ్వర్‌కు 60 కి.మీ. మార్గం ఉంది.

వాయు మార్గం: మహాబలేశ్వర్ నుండి 120 కి.మీ. దూరంలో ఉన్న పూణే నగరానికి సేవలు అందించే పూణే అంతర్జాతీయ విమానాశ్రయం సమీప విమానాశ్రయం . ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం 270 కి.మీ. దూరంలో ఉంది.

మన దేవాలయాలు చారిత్రక నగరాలూ

Mantram Moola Mantram - మంత్రం మూలమంత్రం

సిద్ధి మంత్రం:

సిద్ధిం మే సంవిధాస్యంతి దేవాస్సర్షిగణాస్త్విహ 


బ్రహ్మాస్వయంభూర్భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే 

సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృత్ 


వరుణః పాశహస్తశ్చ సోమాదిత్యౌ తథైవ చ 

అశ్వినౌ చ మహాత్మానౌ మరుతశ్శర్వ ఏవ చ 


సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవ యః ప్రభుః 

దాస్యంతి మమ యే చాన్యే హ్యదృష్టాః పథి గోచరాః 

సరస్వతీ మూలమంత్రం
ఓం - ఐం - హ్రీం - క్లీం - శ్రీం సరస్వత్యై స్వాహా(4 లక్షలు)

తులసి మూల మంత్రం:
ఓం శ్రీం హ్రీం శ్రీం ఐం బృంధాన్యై స్వాహ

పృథివీదేవి మూలమంత్రం
ఓం - హ్రీం - శ్రీం - క్లీం వసుధాయై స్వాహా

మహా లక్ష్మీ మూల మంత్రం:
"ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః"

వటుక భైరవ మూల మంత్రం
ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం స్వాహా

దుర్గా మూల మంత్రం :
"ఓం దుం దుర్గాయై నమః"

ఓం శ్రాం శ్రాంకర్యే స్వాహా

ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః

కామాక్షి మూల మంత్రం: 
ఓం హ్రీం శ్రీం క్లీం కామేశ్వరీ కామాక్షి క్లీం శ్రీం హ్రీం స్వాహా

చాముండా మూలమంత్రం:
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వాహా

భద్రకాళి మూల మంత్రం:
ఓం హ్రీం శ్రీం భద్రకల్యై నమః

ఓం జయంతి మంగళ కాళీ భద్రకాళి కపాలిని, దుర్గా శివ క్షమా ధాత్రీ నారాయణి నమోస్తుతే"

Previous life of Sankhachudu - శంఖచూడుడి పూర్వజన్మ

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము -  శంఖచూడుడి పూర్వజన్మ పద్మసంభవా! శంఖచూడుడు దానవేంద్రుడే కావచ్చు. దేవతలనందరినీ పారద్రోలి ఉండవచ్చు. కానీ అతడి వృ...