Tuesday, August 4, 2026

Brahmacharyam - బ్రహ్మచర్యం

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - బ్రహ్మచర్యం

అధఃశయానుడూ(నేలమీద పడుకునేవాడు). ధర్మాత్ముడూ జితేంద్రియుడూ వినయవంతుడూ మితాహారీ శాంతచిత్తుడూ నిత్య త్రిషవణస్నాయీ నిత్యశుభభాషణుడూ పాపిష్ఠస్నేహదూరుడూ - ఉత్తమోత్తముడు. 

జపహోమాది సమయాల్లో మౌనంగా ఉండాలి. ఏ సంభాషణమూ చెయ్యకూడదు. మైథునాలాపాలు (బూతులు) అస్సలు చెయ్యకూడదు. మనోవాక్కాయకర్మలలో సర్వకాలసర్వావస్థలలో మైథునప్రసక్తిని పరిత్యజించడమే బ్రహ్మచర్యమంటేను.

బ్రాహ్మణక్షత్రియులు గృహాస్థాశ్రమంలోకూడా బ్రహ్మచర్యం పాటించవచ్చు. సంస్కారవంతురాలైన సవర్ణస్త్రీని వివాహం చేసుకుని నిషిద్ధ సమయాలలో కలయికను పూర్తిగా పరిత్యజించి, అనుమతించిన దినాలలో రాత్రిపూటమాత్రమే సంగమిస్తూ సంసారం సాగిస్తే అది బ్రహ్మచర్యమే. 

దేవ పితృ ఋషి ఋణాలను తీర్చుకునే ప్రయత్నం చెయ్యనివాడికి ముక్తి లభించదు. అతడి జన్మ అజాగళస్తనంలాగా వ్యర్థమే. యజ్ఞయాగాదులతో దేవఋణం, తిలోదకాలతో పితౄణం, బ్రహ్మచర్యంతో ఋషిబుణం తీరుతుంది. అలా తీర్చేందుకే ఆశ్రమధర్మాలను పాటించడం. 

క్షీరాహారిగానీ ఫలాహారిగానీ శాకాహారిగానీ హవిష్యాహారిగానీ భిక్షాహారిగానీ చాంద్రాయణ వ్రతధారిగానీ అవుతూ మంత్రజపం చెయ్యాలి. క్షార లవణ ఆమ్ల తాంబూలాదులూ రాత్రిభోజనమూ దుష్టసహవాసమూ మద్య సేవనమూ శ్రౌతస్మార్తవిధులకు సుతరామూ పనికిరావు. అలాగే రాత్రిపూట మంత్రజపం చెయ్యకూడదు. (జపం రాత్రౌ వివర్జయేత్).

ద్యూతక్రీడలతో స్త్రీగోష్ఠులతో నిద్రతో వాదవివాదాలతో వృథాకాలయాపన చెయ్యకూడదు. దేవతా పూజలూ స్తోత్రపఠనలూ ఆగమశాస్త్ర గ్రంథ పరిశీలనలూ - వీటితో కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

భూశయనం బ్రహ్మచర్యం మౌనదీక్ష నిత్యమూ త్రిషవణస్నానం శూద్రకర్మవివర్జన నిత్యపూజ నిత్యదానం ఆనందం స్తుతికీర్తనం నైమిత్తికార్చనం దేవతలపట్ల విశ్వాసం గురువులపట్ల విశ్వాసం ఇవి పన్నెండూ జపనిష్ఠుడి ధర్మాలు. సిద్ధిదాయకాలు.

నిత్యమూ సూర్యుడికి అభిముఖంగా సూర్యోపస్థానం చేసి గాయత్రిని జపించాలి. దేవతా ప్రతిమల ముందుగానీ అర్చించిన ఆగ్నిముందుగానీ చెయ్యవచ్చు. 

బ్రాహ్మణుడు స్నాన పూజా జప ధ్యాన హోమతర్పణ తత్పరుడై నిష్కామంగా సత్కర్మలనన్నింటినీ ఆచరించి బ్రహ్మార్పణం చేస్తూ నియమం తప్పకుండా ఆయా పురశ్చరణలు చేస్తూ కాలం గడపాలి. ఆత్మకు ప్రసన్నత సిద్ధిన్తుంది. జపహోమాలపట్ల ఏకాగ్రత కుదురుతుంది. 

తపస్సుకీ ఆధ్యయనానికీ అంకితమైనవారికి భూతదయ సహజంగా ఉదయిస్తుంది. ఈ తపస్సే స్వర్గసంపాదకం. ఈ తపస్సే మహత్త్వసాధకం. తపస్వికి సాధ్యం కానిది ఏదీ లేదు. ఏయే దేవతలు ఏయే ఫలాలను ఇస్తారని ఋషులు చెప్పారో ఆదేవతలను ఆ రీతిలో ఉపాసిస్తే ఆ కోరికలు నెరవేరతాయి. పురశ్చరణమనేది సర్వకర్మలకూ సిద్ధికారకం. కనక ఆరంభంలో చెయ్యాలి.

ప్రాజాపత్యం




Pancha Pranagni Hotram - పంచ ప్రాణాగ్ని హోత్రం

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - పంచ ప్రాణాగ్ని హోత్రం

నారదా! భోజనానికి ముందు ప్రాణాగ్నిహోత్రమని ఒకటి ఉంది. అదికూడా పనిలోపని చెప్పేస్తాను. తెలుసుకో. దీన్ని తెలుసుకున్నా ఆచరించినా పాపవిమోచనం తథ్యం. ఋణత్రయ విముక్తి కలుగుతుంది. సర్వయజ్ఞ ఫలం దక్కుతుంది. ఇరవైయొక్క తరాలు తరిస్తాయి. 

ఈ పంచప్రాణాగ్నిహోత్రానికి హృదయపద్మమే ఆరణి. మనస్సు మంథానం. వాయువు అనే రజ్జువుతో అగ్నిని మధించాలి. దీనికి నేత్రాలు అధ్వర్యువు. తర్ణనీ మధ్యమాంగుష్ఠాలతో ప్రాణాగ్నికి మధ్యమానామికాంగుష్ఠాలతో అపానాగ్నికి, కనిష్ఠికానామికాంగుష్ఠాలతో వ్యానాగ్నికి, కనిష్ఠికా తర్జన్యంగుష్టాలతో ఉదానాగ్నికి, అయిదువేళ్ళతోనూ తీసుకుని సమానాగ్నికి అన్నం మెతుకులు ఆహుతులుగా లోపలికి వెయ్యాలి. 

ప్రణవాద్యాలూ స్వాహాంతాలుగా నామమంత్రాలు జపించాలి. (ఓం ప్రాణాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా - ఇత్యాదిగా). ముఖంలో ఆహవనీయాగ్ని, హృదయంలో గార్హపత్యాగ్ని నాభిలో దక్షిణాగ్ని స్మర్తవ్యాలు. అధోభాగంలో అసథ్యకులిద్దరూ సభ్యులు.

ఈ హోమానికి వాక్కు హోత, ప్రాణమేమో ఉద్గాత, చక్షువు సరే అధ్వర్యుడు, మనస్సు బ్రహ్మ, శ్రోత్రమేమో అగ్నీధ్రుడు, అహంకారమే పశువు, ప్రణవమే పయస్సు, బుద్ధియే పత్ని, గృహస్థాశ్రమ వాసి దీనికి ఆధీనుడు, వక్షఃస్థలమే యజ్ఞవేదిక, రోమాలే దర్భలు. చేతులే స్రుక్ స్రువాలు (హోమాగ్నిలోకి నెయ్యి పోసే కర్రగరిటెలు).

బంగారపు రంగులో ఉండే(రుక్మవర్ణం) క్షుధాగ్నియే ప్రాణమంత్రానికి ఋషి, ఆదిత్యుడు దేవత, గాయత్రియే ఛందస్సు, "ఓం ప్రాణాయ స్వాహా" అనీ "ఇదమాదిత్యాయ న మమ" అనీ మంత్రం. 

ఇక అపానమంత్రానికి ఆవుపాలలాగా తెల్లగా ఉండే శ్రద్దాగ్నియే ఋషి, సోముడు దేవత, ఉష్ణిక్కు ఛందస్సు. ఓం అపానాయ స్వాహా. సోమాయేదం న మమ - అనేది మంత్రం. 

వ్యానమనబడే ప్రాణవాయు మంత్రానికి పద్మవర్ణంలో ఉండే అగ్నియే ఋషి అగ్నియే దేవత, అనుష్ఠుప్పు ఛందస్సు, ఓం వ్యానాయ స్వాహా. అగ్నయ ఇదం న మమ - అనేది మంత్రం.

ఉదాన ప్రాణవాయు మంత్రానికి ఇంద్రగోపవు రంగులో ఉండే అగ్నియే ఋషి వాయువే దేవత. బృహతీఛందస్సు. ఓమ్‌ ఉదానాయ స్వాహా. వాయవ ఇదం న మమ - అనేది మంత్రం. 

సమాన ప్రాణవాయుమంత్రానికి మెరుపురంగులో విరూపుడుగా ఉండే అగ్నియే ఋషి. పర్జన్యుడు దేవత. పంక్తి - ఛందస్సు. ఓం సమానాయ స్వాహా. పర్జన్యాయేదం న మమ అనేది మంత్రం, 

ఇవి పంచప్రాణాహుతులు. ఇవి చెబుతూ అయిదుసార్లు కాసిని కాసిని మెతుకులు తిన్నాక ఆరవ ఆహుతి ఇవ్వాలి. దానికి వైశ్వానరాగ్ని దేవత. గాయత్రి ఛందస్సు. ఆత్మయే దేవత. ఓం పరమాత్మనే స్వాహా. పరమాత్మన ఇదం న మమ - అనేది మంత్రం, ఇవి ఆరూ అయ్యాక అన్నాన్ని పరబ్రహ్మస్వరూపంగా భావిస్తూ ఆరగించాలి.

భోజనం ముగించాక అమృతాపిధానమిత్యాది మంత్రాన్ని చదువుతూ కొన్ని మెతుకులు ఉచ్చిష్ఠాన్నాన్ని విస్తరి చివర నేలమీదకు తొయ్యాలి. నా వంశంలో పుట్టి అన్నకాంక్షులైన వారందరూ దీనితో తృప్తి పాందుదురుగాక అనే మంత్రం పఠించాలి.

అలాగే - రౌరవ పుణ్యనిలయ పద్మార్బుదనివాసులై దాహార్తులైన మా వూర్వీకులందరికీ ఈ ఉదకం అక్షయ్యమై అందుగాక అని ఆకాంక్షిస్తూ నీళ్ళు వదిలిపెట్టి పవిత్రగ్రంధిని(దర్భముడి) విప్పి నేలమీద(మండలంలో) పడవెయ్యాలి. భోజన పాత్రలోమాత్రం(విస్తరి) వెయ్యకూడదు. 

పొరపాటున అలా వేసినవాడు పంక్తిదూషకుడవుతాడు. అలాగే ఉచ్చిష్ఠాన్ని కుక్క తాకినా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. రాత్రి అంతా ఉపోష్యం ఉండి మర్నాడు మంచగవ్యంతో శుద్ధిచేసుకో వాలి. (అనుచ్చిష్ట సంస్పర్శకు స్నానంతో శుద్ధి).

నారదా! ఏకాహుతిప్రదానమే కోటియజ్ఞఫలం ఇస్తుంది. పంచాహుతులూ చేస్తే ఫలం అనంతం. ప్రాణాగ్నిహోత్ర విధానంలో భోక్తకూ దాతకూ పుణ్యఫలం సమానం. ఇద్దరికీ స్వర్గప్రాప్తి తప్పదు. 

పవిత్రం ధరించి భోజనం చేసే బ్రాహ్మణుడు ముద్దముద్దకూ పుణ్యాన్ని సముపార్జించుకుంటాడు. ఇలాగ నిత్యమూ త్రిసంధ్యల్లోనూ జపతర్పణ హోమాదులు చేసి బ్రాహ్మణులతో కలిసి భుజించడాన్నే పురశ్చరణమంటారు.

బ్రహ్మచర్యం




Vaishvadevam - వైశ్వదేవం

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - వైశ్వదేవం

నారదా! పురశ్చర్యాప్రసంగంతో జ్ఞాపకం వచ్చింది. వైశ్వదేవం గురించికూడా చెబుతాను విను. దేవయజ్ఞ - బ్రహ్మయజ్ఞ - భూతయజ్ఞ - పితృయజ్ఞ - మనుష్యయజ్ఞాలని పంచయజ్ఞాలు. అలాగే ఛుల్లి(పొయ్యి), పేషణి, ఉపస్కరం, కండణి, ఉదకుంభం - ఆని పంచసూనాలు. 

పొయ్యిలోగానీ ఇనపపాత్రలోగానీ భూమిమీదగానీ కుండపెంకులో(మూకుడు వగైరా) గానీ వైశ్వదేవం చెయ్యరాదు. కుండంలో లేదా స్థండిలంలో(పాత్ర) చెయ్యాలి. చేతితోగానీ చేటతోగానీ చర్మనిర్మితులతోగానీ అగ్నిని విసరకూడదు. 

విప్రముఖంనుంచి అగ్నిపుట్టింది కనక నోటితో ఊదిమాత్రమే ప్రజ్వలింపజెయ్యాలి. చర్మపటకంతో విసిరితే వ్యాధిగ్రస్తుడవుతాడు. చేటతో విసిరినవాడు ధనం నష్టపోతాడు. చేతితో విసిరినవాడు మృత్యువువాత బడతాడు. కనక నోటితో ఊదటమే కర్మసిద్ధికి ఉపకారకం.

పళ్ళూ పాలూ పెరుగూ దుంపలూ కూరగాయలూ ఇత్యాదులతో వైశ్వదేవహోమం చెయ్యాలి. ఇవ్వి ఏవీ దొరక్కపోతే పుడకలూ ఆకులూ గడ్డీ - వీటితో చెయ్యవచ్చు. నేతిలో ముంచి హోమం చెయ్యాలి. నూనెగానీ ఉప్పుగానీ తగలకూడదు. పెరుగూ(పాయసాలు) పాలల్లోనైనా ముంచి చెయ్యవచ్చు. ఇవీ దొరక్కపోతే ఆయామంతత్రాలతో రవ్వంత నీరు చిలకరించి ఆ వస్తువుల్ని (దుంపలూ కూరలూ) హోమం చెయ్యాలి. 

ఎండిపోయినవీ నిలవున్నవీ (పర్యుషితం - చద్ది) చేస్తే కుష్ఠవ్యాధి వస్తుంది. ఎంగిలివి హోమం చేస్తే(ఉచ్చిష్టం) శత్రువులకు లొంగిపోవలసి వస్తుంది. గిడచబారి గట్టిగా తయారైన వాటితో (రూక్షాలు) హోమం చేస్తే దారిద్య్రం దాపురిస్తుంది. ఉప్పుగానీ నూనెగానీ తగిలిందో మహాపాపం చుట్టుకుంటుంది.

నిప్పుల్ని బూడిదదులిపి మంటచేసి అగ్నికి ఉత్తర దిగ్భాగంలో మంత్రపూర్వకంగా హోమం చెయ్యాలి. ఇలా వైశ్వదేవం చెయ్యకుండా భోజనం చేసిన బ్రాహ్మణ గృహము కాలసూత్ర నరకకూపంలో తలకిందుల్లా పడతాడు. కూరగాయ, ఆకుకూర, దుంప, పండు ఏదో ఒకటి - తన ఆహారం ఏదైతే దాన్ని అగ్నిలో వేల్చాలి. 

ఈ వైశ్వదేవం కాకముందే భిక్షుకుడెవరైనా భిక్షార్ధియై గుమ్మంలోకి వస్తే  వైశ్వదేవంకోసమని కొన్నితీసి ప్రక్కనపెట్టి, భిక్షవేసి పంపించవచ్చు. వైశ్వదేవీకృతదోషాన్ని భిక్షుకుడు తొలగిస్తాడు తప్ప భిక్షుకృతదోషాన్ని వైశ్వదేవం తొలగించలేదు.

పక్వాన్నానికి యతి - బ్రహ్మచారులు అధిపతులు. వారికి పెట్టకుండా గృహస్థు భుజిస్తే చాంద్రాయణవ్రతం ప్రాయశ్చిత్తంగా చేసుకోవాలి. వైశ్వదేవం ముగించాక గోగ్రాసం వెయ్యాలి. ఎలాగంటే - ఓ సురభీ! వైష్ణవీ! మాతా! విష్ణుపదస్థితా! నేనిస్తున్న గ్రాసాన్ని స్వీకరించు అని అభ్యర్థిస్తూ గోభ్యశ్చ నమః అంటూ పూజించి సమర్పించాలి. ఇలా చేస్తే కామధేనువు(సురభి) అనుగ్రహిస్తుంది.

గోశాలనుంచి తిరిగివచ్చి ఇంటివాకిట్లో కొంచెంసేపు - పాలు పితికినంతసేపు (గోదోహనకాలం) - నిలబడాలి. అతిథుల కోసం ఎదురుచూడటం. ఇంటికి వచ్చి అతిథి వట్టినే తిరిగి వెళ్ళే పరిస్థితి రాకూడదు. అలా తిరిగివెళ్ళే అతిథి తన పాపాన్ని మనకు అంటగట్టి మన పుణ్యమంతా మూటగట్టుకుపోతాడు.

తల్లిదండ్రులూ సోదరులూ గురువూ బిడ్డలూ సేవకుడూ ఆశ్రితులూ అతిథులూ అభ్యాగతులూ అగ్నిదేవుడూ - వీరంతా గృహస్థుకి పోష్యులు(తాను పోషించవలసినవారు).

ఈ గృహస్థాశ్రమ ధర్మాలను తెలుసుకుని మోహవిభ్రాంతి విడిచి జీవయాత్ర సాగించాలి. వీడు - నావాడు, వీడు పరాయివాడు అనే భేదబుద్ధి ఉండకూడదు. ధర్మం తప్పకుండా ఇలా నడుచుకుంటే సోమయాగఫలం లభిన్తుంది. పంచమహాయజ్ఞాలనూ చక్కగా నిర్వహిస్తే ఎంతటి దరిద్రుడైనా ధనవంతుడవుతాడు.

పంచ ప్రాణాగ్ని హోత్రం




Mantra Purashcharana - మంత్ర పురశ్చరణ

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - మంత్ర పురశ్చరణ

నారదా! గాయత్రీ పురశ్చరణమని మరొక కార్యక్రమం ఉంది. అత్యంత పుణ్యప్రదం అభీష్టదాయకం. పర్వతాగ్రం నదీతీరం బిల్వమూలం జలాశయం గోశాల దేవాలయం అశ్వత్థవృక్షం ఉద్యానవనం తులసితోట పుణ్యక్షేత్రం గురుసన్నిధి - ఇలా ఎక్కడైనాగానీ మనస్సు ఏకాగ్రంగా ఉండేచోట కూర్చుని ఈ పురశ్చరణ చేస్తే మంత్రఫలసిద్ధి కలుగుతుంది. 

ఏ మంత్రాన్నైనా పురశ్చరణ చేసుకోవచ్చు. వ్యాహృతి త్రయసహితంగా గాయత్రిని అయుత సంఖ్యలో జపించాలి. దీంట్లో తాంత్రిక వైదికమార్గాలు రెండూ ఉన్నాయి. రెండూ అనుష్ఠించవలసినవే. నారదా! గాయత్రీదేవి అంటే వేదమాత. ఆదిపరాశక్తి. సంధ్యావందన రూపంగా ద్విజులన్న వారందరూ శైవులూ వైష్టవులూ అనే తేడాలు లేకుండా ఉపాసిస్తున్నారు. కనక అందరూ శాక్తేయుల క్రిందే లెక్క.

ఆత్మశోధన లేని మంత్రశోధన నిష్ఫలం కనక ముందుగా ఆత్మశోధనకోసం మంత్రాన్ని మూడు లక్షలు జపించాలి. కనీసం ఒక లక్షసార్లయినా జపించాలి. ఇది వేదం చెప్పిన పద్ధతిలో జరగాలి. ఆత్మశుద్ధి చేసుకోనిదే ఏ జపహోమాలు చేసినా వ్యర్థం. కనక ముందుగా దాన్ని సాధించాలి. 

తపస్సుతో శరీరాన్ని తపింపజెయ్యాలి. దేవతలనూ పితృదేవతలనూ తనియించాలి. తపస్సే స్వర్గసాధకం, మహత్వసంపాదకం, క్షత్రియుడు బాహుశక్తితో వైశ్య శూద్రులు ధనంతో బ్రాహ్మణుడు జపహోమాదులతో ఆపదలనుంచి గట్టెక్కుతారు.

అందుచేత బ్రాహ్మణుడు తపస్సే చెయ్యాలి. చాంద్రాయణాది నియమ నిష్ఠలతో వ్రతాలతో శరీరాన్ని శోషింపజెయ్యాలి. అంతశ్శుద్దిని సాధించాలి. అదే తపస్సు అంటే. 

నారదా! ఇక అన్నశుద్ధి గురించి చెబుతాను. విను. ఆయాచితాన్నం, ఉంఛాన్నం, శుక్లాన్నం, భిక్షాన్నమని నాలుగువిధాలు. శుద్ధమైన భిక్షాన్నం తెచ్చి నాలుగు భాగాలు చెయ్యాలి. ఒకభాగం బ్రాహ్మణులకూ ఒకభాగం గోవులకూ ఒకభాగం ఆతిధులకూ మిగిలిన భాగాన్ని ఆలుమగలు భుజించాలి. 

కోడిగ్రుడ్డంత ముద్దలు ఎనిమిది గృహస్థ వానప్రస్థులకు గ్రాసప్రమాణం. బ్రహ్మచారులు యథేష్టంగా భుజించవచ్చు. గోమూత్ర సమ్మార్జనం అందరికీ తప్పదు. తొమ్మిదిసార్లు ఆరుసార్లు మూడుసార్లుగా ఈ సంప్రోక్షణలు చేనుకోవాలి. చెయ్యి శుభ్రంగా కడుక్కుని తదిత్యాది ఋక్కుతో గాయత్రిని ఉచ్చరిన్తూ ఇవి చేసుకోవాలి. చౌర్యాది దుష్కర్మలు ఆచరించేవారి ఇళ్ళనుంచి భిక్ష తెచ్చుకోకూడదు. అది ఆథమాన్నం. నరకహేతుపు. సరే - .

గాయత్రీ ఛందస్సులో అక్షరానికి లక్షచొప్పున ఇరవైనాల్గు లక్షలు మంత్రాన్ని పురశ్చరణ చెయ్యాలి, ఇరవైమూడు లక్షలైతే సరిపోతుందని విశ్వామిత్ర మతం. ప్రాణం లేని దేహంలాంటిది పురశ్చరణ లేని మంత్రం. ఎందుకూ పనికిరాదు.

కొన్ని రాశులూ కొన్ని నక్షత్రాలూ కొన్ని మాసాలూ కొన్ని తిథులూ కొన్ని వారాలూ పురశ్చరణకు పనికిరావు. వర్జనీయాలు. వాటిని తెలుసుకుని చంద్రతారానుకూలంగా శుక్లపక్షంలో మంచిరోజున మంచి ముహూర్తాన ప్రారంభించి పురశ్చరణ చేస్తే విశేషంగా మంత్రసిద్ధి కలుగుతుంది. ముగిశాక స్వస్తివాచన నాందీశ్రాద్దాలు యథావిధిగా చెయ్యాలి. విప్రులకు సంతర్పణ చెయ్యాలి. బట్టలు పెట్టాలి. 

అటుపైని గురువుల అనుమతితో ప్రత్యఙ్ముఖుడై శివస్థానంలో తపస్సు ఆరంభించాలి. తపస్సుకి ప్రసిద్ధిపొందిన పవిత్ర శివస్థానాలు కొన్ని ఉన్నాయి. కాశి, కేదారం, మహాకాళం, నాసికం, త్య్రంబక మహాక్షేత్రం - ఇవి భూలోకంలో పంచదీపాలు. కూర్మాసనం సర్వత్ర దీపమే. 

ప్రారంభించిన రోజునుంచి ముగించే రోజుదాకా ప్రతిరోజూ హెచ్చు తగ్గులు లేకుండా మంత్రజపం చెయ్యాలి. మునీశ్వరులైతే నిరంతరాయంగా చెయ్యాలిగానీ తక్కినవారు ఉదయంనుంచి మధ్యాహ్నం వరకూ చేసి తక్కిన సమయాన్ని ధ్యాన మంత్రార్థచింతనలతో గడపవచ్చు. 

అక్షరలక్షలుగా చేసే ఈ మంత్రపురశ్చరణలో దశాంశాన్ని హోమం చెయ్యాలి. పాలూ నెయ్యీ అన్నమూ తిలలూ పత్రపుష్పాలూ యవలూ హోమద్రవ్యాలు. దశాంశహోమం చేస్తేనేగానీ మంత్రసిద్ధి కలగదు.

చతుర్విధ పురుషార్థాలూ సిద్ధించాలంటే నిత్య నైమిత్తిక కామ్యకర్మలు మూడింటా గాయత్రిని నిష్ఠగా జపించవలసిందే. గాయత్రితో సమానమైన మంత్రం ఇహపరాలలో ఎక్కడా లేదుగాక లేదు. మధ్యాహ్న సమయాన మితంగా భుజిస్తూ మౌనం పాటిస్తూ త్రిస్నానతత్పరుడై జలమధ్యంలో నిలిచి మూడు లక్షలు జపించాలి. 

కామ్యకర్మగా చేసేట్టయితే కార్యం సిద్ధించేవరకూ మంత్రజపం సాగించాలి. సామాన్య కామ్యకర్మల విషయంలో యథావకాశంగా జపించవచ్చు. ప్రాతస్సంధ్యలో ప్రతిరోజూ సహస్రగాయత్రీజపం చెయ్యడం ఉత్తమోత్తమం. ఆయురారోగ్య ఐశ్వర్యభోగభాగ్యాలు పుష్కలంగా లభిస్తాయి. 

ఆరునెలలుగానీ మూడునెలలుగానీ చేస్తే సంవత్పరాంతానికి ఫలితం కనపడితీరుతుంది. నేతితో లక్షపద్మాలు హోమం చేస్తే మోక్షం కరతలామలకమే. మంత్రసిద్ధి కలగకపోయాక ఏ జపాలు చేసినా ఎన్ని హోమాలు చేసినా ఫలితం శూన్యం. దధిక్షీరాలతో పాతికలక్షలు హోమం చేస్తే దానిఫలం అమోఘమనీ వర్ణనాతీతమనీ అష్టాంగయోగసిద్ధికి సరిసమానమనీ మహర్షుల అభిప్రాయం. 

శక్తుడో అశక్తుడో నియతాహారులై ఆరునెలలు జపిస్తే చాలు గురుభక్తిపరులకు మంత్రసిద్ధి కలుగుతుంది. ఒకరోజు పంచగవ్యంతో, ఒకరోజు గాలి భుజించి, ఒకరోజు బ్రాహ్మణాన్నంతో గడిపేవాడు గాయత్రీజపానికి అర్హుడు. గంగాది పవిత్రనదీజలాలలో మునిగి శతమూ ఆ పవిత్రోదకాలను ఆచమించి శతమూ జపిస్తే సర్వపాప విముక్తి కలుగుతుంది. 

చాంద్రాయణ వ్రతఫలం దక్కుతుంది. బ్రాహ్మణులూ క్షత్రియులూ సొంత ఇంటిలోనే తపస్సు చేసుకోవచ్చు. గృహస్థులకూ బ్రహ్మచారులకూ వానప్రస్థులకూ ఇది వర్తిస్తుంది. మోక్షకాంక్షులు శ్రౌతస్మార్తక్రియలన్నీ నిర్వహిస్తారు. వీటిని అన్నింటినీ విద్వాంసుల దగ్గర సమగ్రంగా శిక్షణపాంది నిర్వహించాలి. (వినీ చదివీ చేసెయ్యకూడదు). భిక్షాన్నాన్నిమాత్రం ఎనిమిది ముద్దలు స్వయంగా భుజించవచ్చు.

వైశ్వదేవం




Saayam Dandhya - Evening twilight - సాయం సంధ్య

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - సాయం సంధ్య

సాయంసంధ్యవల్ల మహామాయ అనుగ్రహం లభిస్తుంది. ఆచమించి ప్రాణాయామం చేసి పద్మాసనం వేసుకుని కూర్చోవాలి. శ్రౌతస్మార్తకర్మలకు సగర్భప్రాణాయామం, ధ్యానమాత్రానికి అగర్భ ప్రాణాయామం చెప్పబడ్డాయి. భూతశుద్ధి చేసుకోవాలి. సంధ్యాదేవిని ధ్యానించాలి.

ఈమె వృద్ధ సరస్వతి, కృష్ణాంగి, కృష్ణాంబరధారిణి, శంఖ చక్ర గదా పద్మహస్త, గరుడవాహన రత్నవిభూషిత, క్వణన్మంజీరమేఖలాలంకృత, రత్నకిరీటధారిణి, తారహారావళీయుత, తాటంకధారిణి. వాటి కాంతులతో చెక్కిళ్ళు మెరుస్తూ ఉంటాయి. పీతాంబరధరకూడా. సచ్చిదానందరూపిణి, సామవేదస్వరూపిణి, ఆదిత్యపథగామిని, స్వర్లోకనివాసిని. 

సూర్యమండలంనుంచి వస్తున్న మహాదేవిని ఆవాహన చేస్తున్నాను. ఇలా ధ్యానించి సంధ్యాసంకల్పం చెప్పుకోవాలి. ఆపోహిష్టా - అగ్నిశ్చేత్యాది మంత్రాలు పఠించాలి. సంప్రోక్షించుకోవాలి. ఆచమించాలి. మిగతాది అంతా ప్రాతస్సంధ్యలాగానే. 

గాయత్రీమంత్రాన్ని ఉచ్చరిస్తూ నారాయణ ప్రీతికోసమని సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. రెండుకాళ్లూ సరిగా దగ్గరకు పెట్టుకుని నిలబడి సూర్య భగవానుడిని ధ్యానిస్తూ తదభిముఖంగా జలాంజలి విడిచిపెట్టాలి. ఈ అర్ఘ్యం నీళ్ళల్లో విడవకూడదు. అలా విడిస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అసావాదిత్యేత్యాది మంత్రంతో సూర్యోపస్థానం చెయ్యాలి. 

పీటమీద కూర్చుని గాయత్రిని జపించాలి. సహస్రమో దానిలో సగమో. ఉపస్థాన తర్పణలన్నీ ప్రాతస్పంధ్యలాగానే. వసిష్ఠుడు ఋషి. విష్ణురూప సరస్వతి దేవత. ఛందస్సు సరస్వతి. సాయంకాలీన సంధ్యాతర్పణే వినియోగః. సామవేదపురుష హిరణ్యగర్భ సరస్వతీ సంకృతి వృద్ధసంధ్యా ఉషసి నిమృజి - ప్రభృతులకు గాయత్రీమంత్రంతో తర్పణలు ఇవ్వాలి.

ఈ సాయం సంధ్యోపాసన సర్వదుఃఖహరం. వ్యాధినాశకం. మోక్షప్రదం. సదాచారాలలో సంధ్యావందనానికున్నంత ప్రాధాన్యం దేనికీ లేదు. గాయత్రీమాత సంతోషించి భక్తులకు అభీష్టాలు అన్నీ ఇస్తుంది.

మంత్ర పురశ్చరణ




Brahma Yagnam Yajna - బ్రహ్మ యజ్ఞం

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - బ్రహ్మ యజ్ఞం

నారదా! ఇక బ్రహ్మయజ్ఞం గురించి చెబుతాను తెలుసుకో. (మూడు) రెండుసార్లు ఆచమించి రెండుసార్లు మార్జన చేసుకోవాలి. సవ్యపాణితో నీటిని స్పృశించాలి. పాదాలు శిరస్సు నేత్రాలు నాసిక చెవులు హృదయం మౌళి సంప్రోక్షించుకోవాలి. దేశకాలాలు చెబుతూ బ్రహ్మయజ్ఞం సంకల్పించాలి.

రెండు దర్భలు కుడిచేత మూడు ఎడమచేత కొన్ని పీటకింద కొన్ని శిఖమీద కొన్ని పాదమూలాలలోనూ ఉంచుకోవాలి. ఇవి సర్వపాపక్షయకరాలు. సూత్రోక్త దేవతాప్రీత్యై బ్రహ్మయజ్ఞం కరోమ్యహమ్‌ ఆని ఉదకం స్పృశించాలి. 

ముందుగా ముమ్మారు గాయత్రిని జపించాలి. అగ్నిమీళే పురోహితమ్‌, యదంగ, అగ్విర్వై ఇత్యాది మంత్రాలు పఠించాలి. మహావ్రతం చైష పంథా అని పలకాలి. మఘవత్‌, ఇషేత్వోర్జ, అగ్న ఆయాహి, శంనో దేవీః, వృద్ధిరాదైచ్‌, పంచసంవత్సర, యమరస తజభన, అథాతో ధర్మజిజ్ఞాసా, అథాతో బ్రహ్మజిజ్ఞాసా, తచ్చంయో, బ్రహ్మణేనమః - ఇత్యాదికంగా పఠిస్తూ ఆయా విధులు నిర్వహించాలి. 

అనంతరం తర్పణలు చెయ్యాలి. ప్రజాపతి, బ్రహ్మ దేవతలు, వేదాలు, ఋషులు, ఛందస్సులు, ఓంకారం, వషట్కారం, వ్యాహృతులు, సావిత్రి, గాయత్రి, యజ్ఞాలు, ఆకాశం, భూమి, ఆంతరిక్షం, అహోరాత్రాలు, త్రిసంధ్యలు, సిద్ధులు, సప్తసముద్రాలు, నదులు, సప్తకులవర్యతాలు, పుణ్యక్రేత్రాలు, ఓషధులు, వనస్పతులు, గంధర్వాప్సరోనాగయక్షాదులు, పక్షులు, గోవులు, సాధ్యులు, రాక్షసులు, మంత్రాలు, విప్రులు - వీరికి తర్పణాలు స్వీకరించే అర్హత ఉంది. కనక తర్పణాలు వదలాలి.

ఇది భూతతర్పణం. ఆ తరవాత నివీతం చేసుకుని ఋషితర్పణం. శతర్చి - మాధ్యమ - గృత్సమదులకూ, విశ్వామిత్ర వామదేవ అత్రి భరద్వాజ వసిష్ఠ ప్రగాథ పావమాన్యులకూ అలాగే క్షుద్రసూక్త మహాసూక్తాలకూ సనక సనందన - సనాతన - సనత్కుమార - కపిల - ఆసురి - వోహలి - పంచశీర్షకులకూ తర్పణాలు ఇవ్వాలి.

తరవాత ప్రాచీనావీతిగా సుమంత జైమిని వైశంపాయన పైల మహాభాష్య మహాభారత ధర్మాచార్యులకూ బాహవి గార్గ్య గౌతమ శాకల బాభ్రవ్య మాండవ్య మాండూకేయ గార్గీ వాచక్రవీ బడబా ప్రాతిథేయికా సులభా మైత్రేయీ, కహోళ కౌశీతక మహాకౌశీతక భారద్వాజ పైంగ్య మహా పైంగ్య సుయజ్ఞ సాంఖ్యాయన ఐతరేయ మహైతరేయ బాష్కల శాకల సుజాతవక్త్ర ఔదవాహి సౌజామి శౌనక ఆశ్వలాయన తర్పణలు చెయ్యాలి. 

ఇంకా తక్కిన ఆచార్యులందరికీ పేరు పేరునా ఇవ్వాలి. నా వంశంలో పుట్టి సగోత్రికులై అపుత్రకులై మరణించినవారికందరికీ చెందుగాక, స్వీకరింతురుగాక అని వస్త్రనిపీడనోదకం విడిచిపెట్టాలి.

ఇలాగ విధ్యుక్తంగా బ్రహ్మయజ్ఞం నిర్వహించాలి, సర్వవేదవేదాంగపఠనఫలం దక్కుతుంది. అటుపైని వైశ్వదేవం నిత్యశ్రాద్ధం చెయ్యాలి. అతిథులకు అన్నదానంకూడా నిత్యమూ చెయ్యాలి. గోవులకు గడ్డివేసి వచ్చి బ్రాహ్మణులతో కలిసి దినపంచమభాగంలో హాయిగా సుష్టుగా భోజనం చెయ్యాలి. 

ఇతిహాస పురాణాలతో షష్ఠ సప్తమ భాగాలను గడపాలి. అష్టమ ఘటికాకాలంలో లోకయాత్ర, బహిస్సంధ్య. అటుపైని సాయంసంధ్య వార్చాలి.

సాయం సంధ్య




Madhyaahna Sandhya - Afternoon twilight - మధ్యాహ్నసంధ్య

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - మధ్యాహ్నసంధ్య

ప్రాతస్సంధ్యోపాస్తి, అది అయ్యాక దేవీపూజ - చెప్పానుగదా! ఇప్పుడింక మధ్యాహ్న సంధ్యావందనం గురించి చెబుతాను ఆలకించు. ఇది అపూర్వమూ అత్యుత్తమమూ అయిన ఫలాలను ఇస్తుంది.

మధ్యాహ్న సమయాన సంధ్యాదేవత సావిత్రి, యువతి, శ్వేతవర్ణ, త్రిలోచన, అక్షమాలాధారిణి, త్రిశూల ధారిణి, 
వరద, అభయహస్త ముద్రాంచిత, వృషారూఢ, యజుర్వేద సంహితారూప, రుద్రదేవత, గుణయుత, భువర్లోక వ్యవస్థిత, ఆదిత్యమార్గ సంచారకర్త్రి, మాయామయి. ఇటువంటి ఆదిదేవికి నమస్కరిస్తున్నాను అని ధ్యానశ్లోకం పఠించాలి. 

ప్రాతస్సంధ్యలో లాగానే ఆచమనాదికం చెయ్యాలి. అటు పైని అర్ఘ్య ప్రదానం పువ్వులతో చెయ్యాలి. పువ్వులు లేకపోతే బిల్వపత్రాన్ని నీళ్ళల్లో ముంచి ఆ నీటిని సూర్యుడికి అభిముఖంగా ఆకాశంలోకి జల్లుతూ అర్ఘ్యాన్ని ప్రతిపాదించాలి. మిగతా కార్యక్రమమంతా ప్రాతస్సంధ్యలాగానే. 

కొందరిక్కడ తదిత్యాది మంత్రంతో సావిత్రిని ధ్యానించాలి అంటున్నారుగానీ అది సంప్రదాయం కాదు. అసంప్రదాయం హానికరం. కనక ఉభయ సంధ్యల్లోనూ ఓంకారసహితమైన గాయత్రీ మంత్రంతోనే నీరు జల్లాలి. ఆకృష్ణేన - ఇత్యాది మంత్రంతో పుష్పమిశ్రితమైన జలం లేదా బిల్వదుర్వాది పత్రాలతో పూర్వోక్త పద్ధతిలో జల్లి అర్ఘ్యం ఇవ్వాలి. ఇది సంధ్యాసాఫల్యదాయకం. మందేహరాక్షస వినాశకం. 

ఆ తరవాత గాయత్రీమంత్రంతోనే యజుర్వేదపురుష హిరణ్యగర్భాదులకు తర్పణాలు విడిచి పెట్టాలి. ఉదుత్యమిత్యాది మంత్రాలతో సూర్యోపస్థానం చెయ్యాలి. అటుపైని గాయత్రీమంత్రజపం. 

దీనికీ మూడుపూటలకూ మూడు పద్ధతులున్నాయి. ప్రాతఃకాలంలో చేతులు పైకి త్రిప్పి, సాయంకాలంలో క్రిందికి త్రిప్పి మధ్యాహ్నసమయంలో గుండెల పై ఆన్చి గాయత్రిని జపించాలి.

గాయత్రీమంత్ర జప పరిగణనకుకూడా ఒక విధానం ఉంది. అనామిక మధ్య గణువుతో మొదలుపెట్టి చిటికెనవేలు గణుపులుమీదుగా చూపుడు వేలు మూలంవరకూ పదిగణుపులవుతాయి. వీటిని లెక్కించుకుంటూ గాయత్రిని జపిస్తే దశగాయత్రి అవుతుంది. దీన్ని కరమాల అంటారు.

ఇలా పదిసార్లు చేస్తే శతగాయత్రి. తర్జని మొదటి కణుపుదగ్గర (పైనుండే కణుపు) ఆపేస్తే ఎనిమిది. మొత్తం ఆష్టోత్తరశతగాయత్రి. రోజూ సహస్రగాయత్రి చేస్తే విశేషఫలితాలుంటాయి. గోహత్య పితృహత్య మాతృహత్య భ్రూణహత్య గురుపత్నీసంగమం బ్రహ్మహత్య సురాపానం ఇత్యాది మహాపాతకాలన్నీ అంతరిస్తాయి. పవిత్రుడవుతాడు. 

మానసిక వాచిక కాయిక దుష్కర్మలన్నీ తొలగిపోతాయి. గాయత్రీ మంత్రం తెలియని విప్రుడి జన్మ వ్యర్థం. నాలుగువేదాలూ చదివినా ఒక్కసారైనా గాయత్రిని జపించకపోతే ఆ చదువంతా కేవలం శ్రమమాత్రమే అవుతుంది. వేదావృత్తికన్నా గాయత్రీజపం ఉత్తమోత్తమం.

బ్రహ్మ యజ్ఞం




Brahmacharyam - బ్రహ్మచర్యం

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - బ్రహ్మచర్యం అధఃశయానుడూ(నేలమీద పడుకునేవాడు). ధర్మాత్ముడూ జితేంద్రియుడూ వినయవంతుడూ మితాహారీ శాంతచిత్తుడూ నిత్...