శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - శాంతి హోమాలు
నారదా! శమీసమిధలతో భూత రోగ గ్రహాదుల ఉపశమనంకోసం శాంతిహోమం చెయ్యాలి. పాలుగారే చెట్టునుంచి పచ్చి పేళ్ళు తెచ్చి హోమం చేస్తే ఇంకా మంచిది. శలలతో (మద్ది) చేసినా భూతరోగశాంతి కలుగుతుంది.
సూర్యుడికి ముందుగా జలతర్పణం చెయ్యాలి. మోకాలిబంటి నీటిలో నిలిచి. చేస్తే దోషాలన్నీ ఆంతరిస్తాయి. మెడబంటి లోతులో నిలబడి చేస్తే ప్రాణాంతకభయాలు తొలగిపోతాయి. శాంతికర్మలన్నింటికీ నీటిలో నిలిచి జపం చెయ్యడమే ఉత్తమం.
బంగారం వెండి రాగి మట్టి పాత్రల్లోగానీ బొడిపెలులేని కొయ్యపాత్రలోగానీ పంచగవ్యాన్ని నింపుకొని క్షీర వృక్షకాష్ఠాలతో జ్వలితాగ్నిలో సమంత్రకంగా హోమం చెయ్యాలి. సహస్రాహుతులు చెయ్యాలి. మిగిలిన పంచగవ్యంలో దర్భలు ముంచి ప్రదేశమంతా సంప్రోక్షించాలి. బలిప్రదానం చెయ్యాలి. పరదేవతను ధ్యానించాలి. అభిచారాలు పాపాలూ నశిస్తాయి. దేవ భూత పిశాచాదులు వశమవుతాయి. గృహ గ్రామ రాష్ట్రాలను విడిచి దుష్టగ్రహ పిశాచాదులు పారిపోతాయి.
మండలంలో శూలముద్ర లిఖించి అభిమంత్రించి ఇలాగే సహస్రహోమం చేసి నిఖనం చేస్తే సర్వశాంతులూ సిద్ధిస్తాయి. పూర్వోక్తమైన పాత్రకు సూత్రవేష్టనం చేసి నేలలోగానీ ఇసుకలోగానీ పాతిపెట్టి మంత్రజలాలు నింపి నాలుగు దిక్కులనుంచీ తీరజలాలను ఆవాహనచేసి వివిధపుష్పాలూ బిల్వపత్రాలూ బియ్యమూ నువ్వులూ ఆవాలూ పాలుగారే చెట్ల చిగురాకులూ అందులో వెయ్యాలి.
కుశకూర్చంతో(దర్భలతో చేసిన పొడవుపాటి ముడి) మంత్రాలు చదువుతూ కలియద్రిప్పాలి. అటుపైని ఆనీరు జల్లుకోవాలి. బ్రాహ్మణులపై జల్లాలి. అందరూ పవిత్రులవుతారు. భూతరోగాదులూ చేతబడులూ(అభిచారాలు) తొలగిపోతాయి.
ఈ అభిషేకంతో విప్రుడు మృత్యువు నోటినుంచికూడా బయట పడగలడు. దీర్ఘాయుర్దాయం కోరుకునేవారందరూ ఈ అభిషేకం జరిపించుకోవాలి. ఇది చేసిన విప్రులకి నూరుగోవులూ సంతృప్తికరంగా దక్షిణలూ ఇవ్వాలి.
శనివారంనాడు రావిచెట్టు దగ్గర మంత్రజపం చెయ్యడం, భూతరోగాభిచారాది శాంతికరం. పాలుగారే గుడూచి సమిధలతో(తిప్పతీగ) హోమం చేస్తే సర్వరోగాలూ ఉపశమిస్తాయి. దీన్ని మృత్యుంజయహోమమంటారు.
ఇలాగే జ్వరశాంతికి చూతహోమం క్షయరోగోపశమనానికి వచాహోమం. రాచపుండు(రాజయక్ష్మ) తగ్గడానికి మధుత్రితయహోమం - చెప్పబడ్డాయి. అన్నంతో పాయసం వండి సూర్యుడికి నివేదించి హోమంచేసి మిగిలినదాన్ని భుజిస్తే రాజయక్ష్మ (రాచపుండు) తగ్గుతుంది.
తిప్పతీగ కణుపులతో సోమదేవతాకంగా హోమంచేస్తే క్షయరోగం ఉపశమిస్తుంది. శంఖవృక్ష పుష్పాలతో హోమం కుష్ఠురోగనివారిణి. అపామార్గ పుష్పాలను బియ్యంతోకలిపి చేసే హోమం అపస్మారరోగానికి ఉపశమనం.
క్షీరవృక్ష సమిధలతో హోమం ఉన్మాదరోగ నివారకం. ఔదుంబర సమిధలతో చేసే హోమం ఆతిమేహరోగాన్ని నయం చేస్తుంది. ఇక్షుమధుహోమంతో ప్రమేహరోగశాంతి. మధుత్రితయహోమం మసూరికా నివారకం. కపిలాహోమంకూడా ఇంతే.
ఇంటిలో చీమలూ దోమలూ వగైరా క్రిమి క్రీటకాలు నశించాలంటే శమీసమిధలు హోమం చెయ్యాలి. వనవేతనహోమం(అడవి పుబ్బలి) వారంరోజులు చేస్తే పిడుగుపాటుల నుంచీ భూకంపాలనుంచీ నివారణ లభిస్తుంది. శతమంత్రజపం చేసి లోష్టాన్ని తాకిన్తూ ఏ దిక్కున ఎంతదూరం వెడితే ఆ మార్గంలోని ప్రదేశాలన్నీ ఆగ్ని - మారుత - శత్రుభయ రహితాలవుతాయి.
మనస్సులోనే ఈ జపం చేస్తే బంధవిమోచన కలుగుతుంది. అభిమంత్రితజలపానం భూతపిశాచవిమోచకం. అలాగే అభిమంత్రించి విభూతి పెట్టినా శిరసున జల్లినా సర్వవ్యాధులూ సర్వభయాలూ తొలగిపోతాయి. నూరేళ్ళు సుఖంగా జీవిస్తాడు.
ఈ హోమాలన్నీ ఎవరికివారే చేసుకోవడం ఉత్తమం. అశక్తులు భూరిదక్షిణలిచ్చి బ్రాహ్మణులతో చేయించుకోవచ్చు. పుష్పాలతో చేసే హోమాలు కొన్ని ఉన్నాయి. అవి పుష్టికరాలు. లక్ష్మీప్రదాలు.
ఎర్రకలువలతో హోమం చేస్తే సంపదలు పెరుగుతాయి. బంగారం దొరుకుతుంది. బిల్వపత్ర, బిల్వపుష్ప, బిల్వఫల, బిల్వ సమిధలతో చేసే హోమాలు ఏవైనా సంపత్ప్రదాలే. వీటిని నేతితో అభిమంత్రించి నూరుచొప్పున సప్తాహహోమం చేస్తే లక్ష్మీదేవి స్వయంగా వచ్చి ఇంటిలో తిష్ఠవేస్తుంది.
త్రిమధులాజహోమం(పేలాలు) కన్యాలాభం కలిగిస్తుంది. ఇదే స్త్రీలు చేస్తే కోరిన వరుడు లభిస్తాడు. సూర్యదేవతాకంగా జలహోమం చేస్తే నీటిలో పడిపోయిన బంగారం చేతికందుతుంది. అన్నహోమం అన్నవర్ధకం. వ్రీహిహోమం(బియ్యం) వ్రీహివర్ధకం. పిడకలతో చేసే హోమాలు పశుసంపదను పెంచుతాయి.
ప్రియంగు - పాయస - ఆజ్యహోమాలు సంతాన ప్రాప్తికరాలు. భాస్కరుడికి హోమంచేసి మిగిలిన పాయసాన్నం ఋతుస్నాతలు భుజిస్తే గర్భధారణ జరుగుతుంది. పుత్రసంతానం కలుగుతుంది. మొలకలు వచ్చిన తడిగింజలతో హోమం ఆయుర్వర్ధకం. ఇటువంటి ఎర్రగింజలూ మధుత్రయమూ వ్రీహి - కలిపి శతహోమం చేస్తే పట్టిందల్లా బంగారమవుతుంది. ఆయుర్దాయం పెరుగుతుంది.
సువర్ణకుట్మలాలు(సంపంగి మొగ్గలు) హోమం చేసినా కర్తకు ఆయుర్దాయం పెరుగుతుంది. గరిక పాలు తేనె నెయ్యి - సప్తాహహోమం చేస్తే అపమృత్యువు తొలగిపోతుంది. అన్నమూ పాలూ నెయ్యి వీటితో చేసిన హోమానికీ ఇదే ఫలం. న్యగ్రోధసమిధలూ(మర్రి) పాయసమూ రోజుకి నూరుగా ఏడురోజులు హోమం చేసి ఆ ఏడురోజులూ పాలుత్రాగి గడిపి మంత్రజపం చేస్తే మృత్యువును జయిస్తాడు.
నిరాహారుడై మౌనియై మూడురేయింబవళ్ళు జపించినా యముడు దరిదాపులకి రాడు. నీటిలోదిగి జపించినా బిల్వవృక్ష సన్నిధిలో జపించినా విశేషఫలితాలుంటాయి. ఒక్క నెలపాటు ఇలా జపిస్తే చాలు వాడు రాజ్యాధికారి అవుతాడు. సమూలఫల పల్లవంగా బిల్వవృక్షాన్ని హోమంచేసినా రాజ్యం దక్కుతుంది. నూరు పద్మాల చొప్పున నెలనాళ్ళు చేసినా ఈ ఫలం లభిస్తుంది.
గంజితోహోమం చేస్తే పంటలు పండే గ్రామం దక్కుతుంది. యుద్దాలకు వెళ్ళబోయేముందు రావి సమిధలతో హోమం నిర్వహిస్తే విజయం వరించి వస్తుంది. పాలతో కలిపి వేతసపత్రపుష్ప హోమం సప్తాహదీక్షగా చేస్తే వానలు కురుస్తాయి. బొడ్డులోతు నీళ్ళల్లో నిలిచి మంత్రజపం ఏడురోజులు చేస్తే వానలు పడతాయి. నీటితో విభూతి శతహోమం చేసి అతివృష్టిని నివారించవచ్చు.
మోదుగు సమిధలతో చేసే హోమం బ్రహ్మవర్చస్సును అందిస్తుంది. పలాశకుసుమాలతో హోమం సర్వాభీష్టప్రదాయకం. పాలతో హోమం మేధాశక్తినీ నేతితో హోమం బుద్ధిశక్తినీ పెంపాందిస్తాయి. ఉప్పూ తేనె కలిపి హోమం చేస్తే కోరిన వస్తువునల్లా వశపరుచుకోవచ్చు.
ఇలాగా కోరికలు తీర్చే హోమాలు చాలా ఉన్నాయి. ఆయా నియమాలను పాటిస్తూ మంత్రాలను ఉచ్చరిస్తూ నిర్వహించాలి. బ్రాహ్మణుడు తనకోసంగానీ ఇతరులకోసంగానీ వీటిని చెయ్యవచ్చు. అన్యులకోసం చేసినా ఇవి విప్రుడికీ పుష్టిదాయకాలేకావడం మరీ విశేషం.
రోజుకి వెయ్యిగా నెలనాళ్ళు మంత్రజపం చేస్తే ఆయుష్కాముడి కోరిక నెరవేరుతుంది. ఆయురారోగ్యాలు రెండూ కావాలనుకుంటే రెండు నెలలు జపం చెయ్యాలి. సంపదలుకూడా కావలిస్తే మూడునెలలు, దారపుత్రులుకూడా కావలిస్తే నాలుగునెలలూ, వారికీ ఆరోగ్యం కావాలంటే అయిదునెలలు, వారికీ సంపదలు కావాలంటే ఆరునెలలు, వారికీ విద్యలు కావాలంటే ఏడునెలలు - ఇలాగ కోరికలు పెరుగుతున్నకొద్దీ మంత్రజపం చెయ్యాల్సిన నెలలూ పెరుగుతుంటాయి.
ఒంటికాలుమీద నిలబడి చేతులు పైకెత్తి నిరాశ్రయుడుగా నిలిచి మూడునెలలు రోజుకి మూడువందలు చొప్పున మహామంత్రం జపిస్తే ఆ విప్రుడికింక తీరని కోరికలంటూ ఉండవు. అలాగే శతోత్తర సహస్రం చొప్పున(పదకొండువందలు) జపించగలిగితే సిద్ధించనిదంటూ ఉండదు.
నీటిలో మునిగి నూరుచొప్పున నెలనాళ్ళు జపిస్తే ఇష్టఫలావాప్తి. మూడువందల చొప్పున జపిస్తే సర్వవాంఛిత సిద్ధి. రాత్రిపూట భోజనం చేస్తూ ఇదే పద్దతిలో ఏడాదిపాటు మంత్రం జపిస్తే ఋషి అవుతాడు. రెండేళ్ళు జపిస్తే అమోఘవాక్కు అవుతాడు. మూడేళ్ళు జపిస్తే త్రికాలవేత్త అవుతాడు. నాలుగేళ్ళు జపిస్తే భగవంతుడు తోడై నిలుస్తాడు. అయిదేళ్ళకి అణిమాది శక్తులు సిద్ధిస్తాయి. ఆరేళ్ళకి కామరూపధారణశక్తి వస్తుంది. ఏడేళ్ళకి అమరత్వం లభిస్తుంది. తొమ్మిదేళ్ళకి మనుత్వం, పదేళ్ళకి ఇంద్రత్వం, పదకొండేళ్ళకి ప్రజాపతిత్వం, పన్నెండేళ్ళకి బ్రహ్మత్వం సిద్ధిస్తాయి.
ఈ తపస్సుతోనే నీవంటివారు లోకాలను జయిస్తున్నారు. కొందరు శాకాలు తిని, కొందరు కందమూలాలు తిని, కొందరు ఫలాలు తిని, కొందరు పయస్సులుగ్రోలి, కొందరు నెయ్యిత్రాగి, కొందరు సోమరసం పుచ్చుకుని, కొందరు చరువు(హవిష్యం) ఆరగించి, కొందరు పదిహేను రోజులకు ఒక్కసారి మాత్రమే భుజించి, కొందరు భిక్షాన్నం తిని - ఇలాగ కఠోర నియమాలతో తపస్సులు చేస్తున్నారు. మహర్షు లనిపించుకుంటున్నారు.
ఇటువంటి దీక్షతో మంత్రజపం మూడువేలు చేస్తే రహస్యంగా చేసిన పాపాలు తొలగిపోతాయి. వెయ్యిచొప్పున నెలనాళ్ళు చేస్తే బంగారం దొంగిలించిన పాపమైనా అంతరిస్తుంది. మూడువేలు చొప్పున నెలనాళ్ళు చేస్తే సురాపానదోషం నశిస్తుంది. గురుపత్నీ సంగమదోషమైనా తొలగిపోతుంది.
అడవిలో పర్జశాల వేసుకుని ఇలా జపం చేస్తే బ్రహ్మహత్యాపాతకమూ అంతరిస్తుంది. నీళ్ళల్లో మునిగి రోజుకి వెయ్యి చొప్పున పన్నెండురోజులు జపిస్తే సర్వమహాపాతకాలూ తొలగిపోయి విప్రుడు విశుద్ధుడవుతాడు.
ప్రాణాయామానికికూడా ఇంతటి శక్తి ఉంది. అది సర్వపాప వినాశకం. నూరు ప్రాణాయామాలు చేస్తే అన్ని పాపాలూ తొలగి శుచి అవుతాడు. పర్ణశాలలో ఉంటూ రోజుకి వెయ్యిచొప్పున నెలవాళ్ళు ఉపవాసం ఉండి మంత్రజపం చేసినవాడిని నిత్యజాపి అంటారు. అతడు పవిత్రుడు.
ఇరవైనాలుగు వేలు చేస్తే అది కృచ్భసంజ్ఞితం. అరవైనాలుగువేలు చేస్తే చాంద్రాయణసమానం. ఉభయ సంధ్యల్లోనూ ప్రాణాయామం చేసి కనీసం నూరుసార్లు(గాయత్రి) మంత్రజపం చెయ్యాలి. ఇది గృహస్థుకి కర్తవ్యం తదిత్యాదిఋక్కు సర్వపాపహారం.
నీటిలోమునిగి ఈ ఋక్కును రోజుకి నూరుసార్లు జపించాలి. జపిస్తూ సూర్యరూప గాయత్రీదేవిని ధ్యానిస్తే సర్వపాప విముక్తి కలుగుతుంది.
నారదా! శాంతి శుద్ధ్యాది కల్పాలన్నీ రహస్యాతిరహస్యాలైనా నీకు సవిస్తరంగా సవ్యాఖ్యానంగా తెలియజేశాను. ఇది సదాచార సంగ్రహం. క్లుప్తంగా చెప్పాను. ఈ పద్దతిలో జీవిక సాగించినవారిని మాయాదుర్గ అనుగ్రహిస్తుంది. నిత్య - నైమిత్తిక - కామ్యకర్మలన్నింటినీ యథావిధిగా ఆచరించినవారికి భుక్తిముక్తిఫలాలు కొంగుబంగారాలు.
ఆచారమే మొట్టమొదటి ధర్మం. ధర్మానికి ప్రభువు(రక్షణ) జగదీశ్వరి అని సర్వశాస్తాలూ ఆచార ఫలాన్నీ మహత్తునూ శతధా కొనియాడుతున్నాయి. ఆచారవంతుడు ఎప్పుడూ పరిపూతుడే. అతడే సుఖి. అతడే ధన్యుడు. ఇది సత్యం.
సత్యం, సదాచారం పాటించడంకన్నా దేవీ అనుగ్రహ సంపాదనకు మరొక సులభమార్గం లేదు. దీన్ని వినడంకూడా సంపత్తి సాఖ్యదాయకమే. సదాచారంవల్ల ఐహికాముష్మిక సుఖాలు అన్నీ చేకూరుతాయనడం సారాంశం. అదే నీకు చెప్పాను, మరింకేమి వినాలనుకుంటున్నావో చెప్పు అని నారాయణమహర్షి ముగించాడు.
శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము