Thursday, August 27, 2026

Ushaaniruddha Sahithudai Krishnudu Dwarakapuri Karuguta - ఉషానిరుద్ధ సహితుడై కృష్ణుడు ద్వారకాపురి కరుగుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
ఉషానిరుద్ధ సహితుడై కృష్ణుడు ద్వారకాపురి కరుగుట

బాణుడు తన రాజధానీ నగరానికి వెళ్ళి, ఉషానిరుద్దులకు వివాహం చేశాడు. నగల్నీ, వస్త్రాల్నీ సేవకజనాన్నీ, శ్రేష్ఠమైన వస్తువుల సమూహాన్ని అడ్డులేని ఆసక్తితో ఇచ్చి నిండుభక్తితో

పరీక్షిన్మహారాజా! ఉషా - అనిరుద్దుల్ని బంగారు తేరుపై ఎక్కించుకొని వచ్చాడు. శ్రీకృష్ణుని ఆమోదం పొంది తన కుమార్తెతోపాటు అనిరుద్దుణ్ణీ గోవిందునికి అప్పగించాడు. శ్రీకృష్ణుడు సంతోషించాడు.

తర్వాత - కృష్ణడు శివుణ్ణి వీడ్కొల్పి, బాణాసురుణ్ణి అచ్చటనే నిల్పి, మిక్కిలి వైభవంతో చతురంగ బలసమేతుడై - అనిరుద్దుణ్ణి ముందుంచుకొని, మంగళవాద్యాల ధ్వనులు దిగంతాలకు వ్యాపిస్తుండగా తన ద్వారకానగరానికి బయలుదేరాడు.

బాగా వికసించిన ఎర్రతామరలతో, ఎత్తయిన అలలతో కూడిన సరస్సులతో, అధిక ఐశ్వర్యంతో వృద్ధి చెందుతున్నద్రీ, సుఖమనే భారాన్ని మోస్తున్నదీ, ప్రజల దుఃఖాన్ని నివారిస్తున్నదీ, సజ్జనులనే నక్షత్రాలతో ప్రకాశిస్తున్నది అయిన ద్వారకానగరాన్ని శ్రీకృష్ణుడు చూశాడు.

ద్వారకానగరంలోని పతాకలు కదుల్తూ శ్రీకృష్ణుని సందర్శించు కుతూహలంతో ఆ నగరలక్ష్మి చేతుల్తో ఆహ్వానిస్తున్నట్లు ఉన్నాయి. గొప్ప పచ్చలచే అలంకరింపబడ్డ తోరణాలతోనూ, మణులు పొదిగిన భవనాలతోనూ, బంగారం, మణులచే నిర్మింపబడిన గోపురాలూ, భవనాలూ, సౌధాలూ, వీథులున్నాయి.

బంగారు తాపడం చేసిన మేలుకట్టుతో కూర్చిన శుభప్రదమైన ముగ్గులతో ప్రకాశించేదీ; సౌందర్యంకోసం కట్టబడిన అరటిబోదెలచే, అక్షతలచే పుష్పమాలలచే అలంకరింపబడిందీ, కుంకుమ కలిపిన నీటితో తడిసిన వ్యాపారస్థలం కలదీ, శంఖం, దుందుభి, భేరీ, పటహం, కాహళం, మృదంగం మొదలైన వాద్యాలచేతా, స్తోత్రాలతో, వందిమాగధ సంగీత ప్రసంగాలతో మిక్కిలి మనోహరమైన ద్వారకానగరం, అందలి మంత్రులు, పురోహితులు, బంధువులు, నగరప్రముఖులు ఎదురురాగా, బ్రాహ్మణాశీర్వచనాలతో, ముత్తయిదువుల ఆశీస్సుల అక్షతలు స్వీకరిస్తూ, కర్పూరనీరాజనాలివ్వగా నగరప్రవేశం చేసి, సుఖంగా కాలం గడిపారు. ఆ తర్వాత

పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుని విజయం అనే ఈ గాథను చదివినవారు ఎల్లపుడు విజయాన్ని పొంది, ఇహపరలోక సౌఖ్యాల్ని ఆకల్పోన్నతినీ పొందుతారు.

ముని శ్రేష్ఠ! శ్రీకృష్ణుని చరిత్రను వినడంలో నామనస్సు ఎప్పుడూ తృప్తి చెందదు. శ్రీకృష్ణకథను వినడమే కోరుకొంటాను. దయచేసి శ్రీకృష్ణకథను చెప్పు అనే శుకయోగిని పరీక్షిన్మహారాజు కోరాడు.

శ్రీకృష్ణ కథను చెప్పవలసిందిగా కోరిన పరీక్షిన్మహారాజుతో శుకయోగీంద్రుడు ఇలా చెప్పాడు.

నృగమహారాజు చరిత్రము







Shivudu Banuni Rakshimpa Srikrishnuni Stuthinchuta - శివుడు బాణుని రక్షింప శ్రీకృష్ణుని స్తుతించుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
శివుడు బాణుని రక్షింప శ్రీకృష్ణుని స్తుతించుట

బాణునిపై శివునికి దయ ఉంది. అందువల్ల శ్రీకృష్ణుణ్ణి సమీపించి, ముకుళితహస్తుడై నమస్కరిస్తూ, పురుషసూక్తం పఠించి, ఇలా స్తుతించాడు.

ఓ కృష్ణా! నీవు బ్రహ్మస్వరూపుడివి; ప్రకాశమే స్వరూపంగా గలవాడివి, సమస్తవేద వేదాంతరహస్యాలు తెలిసినవాడివి, సమాన అధిక భేదాలు లేనివాడివి. అన్నింటా వ్యాపించినవాడివి అయిన నిన్ను నిర్మలాంతః కరణులు ఆకాశం(శూన్యం) వలె చూస్తారు. 

అంతే కాకుండ పంచోపనిషత్తులతో కూడిన నీ దేవతాపరశుభాకారాన్ని చూస్తారు. ఆ ఆకారదర్శనంలో బొడ్డులో ఆకాశాన్ని ముఖంలో అగ్నినీ, శిరస్సులో స్వర్గాన్నీ చెవుల్లో దిక్కుల్నీ కండ్లలో సూర్యుణ్ణీ, మనస్సులో చంద్రుణ్ణీ, కాళ్ళలో భూమినీ, జీవునిలో అహంభావాన్నీ కడుపులో సముద్రాల్నీ, రేతంలో నీటినీ, భుజాలలో ఇంద్రుణ్ణీ, వెండ్రుకలలో వృక్ష ఓషధీ సమూహాల్నీ తలవెండ్రుకలలో బ్రహ్మల్నీ జ్ఞానంలో సృష్టినీ, ప్రజాపతుల్నీ హృదయంలో ధర్మాన్నీ కలిగిన మహాపురుషుడవు. 

లోక సృష్టికొరకు మొక్కవోని కాంతిని దాచి సృష్టికోసం నీ అవతారంయొక్క గొప్పతనాన్ని తెలుసుకొని మిమ్ము ప్రశంసించడానికి మేమెంతవాళ్లం? నీవు సమస్త చరాచర అచరసమూహానికి మూలకారకుడివి, అద్వితీయుడివి, పురాణపురుషుడివి, సమస్తసృష్టికి కారణమైనవాడివి, ప్రభుడివి.

సూర్యుడు మేఘాల సమూహంతో కప్పబడినవాడై అనేక రూపాలు కలిగినవాడయి అనేకరీతులలో కన్పించేటట్టు, నీ అఘటితఘటనాన్ని చేసే అభిప్రాయంలో త్రిగుణాతీతుడవు అయినప్పటికీ సత్త్వం మొదలైన గుణాలతో అనేకరూపాలు కలిగినవాడివై, సత్పురుషులకు చీకటిని తొలగించి, కాంతిని ఇస్తావు.

నీ మాయచే మోహం పొందినవాళ్లు, భార్య, పుత్రులు, గృహం, ఆస్తి మొదలైన సంసారరూపంలోని పాపమనే సముద్రంలోని సుడిగుండాలలో మునుగుతూ తేలుతున్నారు. నీ పవిత్రమైన రూపానుభవాన్ని పొందలేక, ఇంద్రియాధీనుడై నీ పాదపద్మాల్ని చేరేందుకు మార్గం తెలియని మూఢుడు, తనను తాను మోసం చేసుకొనేవాడు అవుతాడు.

ప్రతికూలబుద్ధితో - ఇష్టుడవైన నిన్ను అంగీకరింపక, ఇంద్రియప్రయోజనానుభవం పొందేందుకు అమృతం వదలి, విషం గ్రహించడమే కదా! ప్రపంచసృష్టికీ, పాలనకూ, లయకూ కారకుడివైన నీవు శాంతస్వభావం కలవాడవై, సజ్జనులకు భాగ్యం ఇచ్చేవాడివై, సమానాధికభావం లేనివాడివై ఉండుటచే నిన్ను నేను, బ్రహ్మయు, మునులును సేవిస్తున్నాము. ఇంకా

(పంచ+ఉపనిషత్తులు= నారాయణ, బ్రహ్మ , తైత్తిరీయ, గార్గ, వరాహ - ఉపనిషత్తులు.)

కృష్ణా! నీవు నాశరహితుడివి, అంతం లేనివాడివి, మొదలు, నడుమ, చివర (ఆదిమధ్యాంతాలు) లేనివాడివి. చ్యుతి లేనివాడివి, సమస్తాన్ని ధరించువాడివి. అంతటా నీవున్నావు అన్నీ నీలో వ్యాపించి ఉన్నాయి.

(వాసుదేవుని తత్త్వస్వరూపమిక్కడ చక్కగా చెప్పబడింది.)

అని శివుడు ప్రశంసిస్తే - కృష్ణుడు బాగా సంతోషించి చిరునవ్వుతో శంకరా! నీ మాట సత్యమే! నీకు ప్రియమైన వరం కోరుకో. దాన్నే ఇస్తాను. ఈ బాణుడు చంపదగ్గవాడు కాడు. ఎందుకంటే నాభక్తుడయిన ప్రహ్లాదునిమనుమడు. ప్రహ్లాదునివంశంలోని వారిని చంపనని వరమిచ్చాను. వీనిగర్వం అణచడానికి ప్రయత్నించాను - కనుక

బాణునిచేతులు నాలుగింటిని తప్ప మిగిలినవాటిల్ని ఖండించాను. నీ భక్తులలో మొదటివాడని పేరుపొంది ముసలితనం, మరణం లేకుండా జీవిస్తాడు.

ఈ విధంగా కృష్ణుడు అనుగ్రహించాడు. పరమేశ్వరుండు పరమానందం పొందాడు. బాణుడు రణరంగమనే యజ్ఞవేదిక పై కృష్ణుడనే దేవుని సన్నిధిలో భగభగమండుతున్న చక్రాయుధమనే మంటల్లో తన హస్తాలనే సమిధల్ని రక్తధారలనే నేతిధారలతో, హుంకారాలనే మంత్రాలతో వేల్చి పరిశుద్ధుడయ్యాడు. విజ్ఞానదీపం వెలిగింది. భుజగర్వం అనే చీకటి తొలగింది. ఎల్లప్పుడు పరమేశ్వరధ్యానంలో ఉన్న బాణుడు కృష్ణుడిచ్చిన వరంతో ఆనందించి, గోవిందుని పాదారవిందాలకు వందనం చేశాడు. తరువాత

ఉషానిరుద్ధ సహితుడై కృష్ణుడు ద్వారకాపురి కరుగుట







Banasurudu Rendavasaari Yudhamunaku Vacchuta - బాణాసురుడు రెండవసారి యుద్ధమునకు వచ్చుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
బాణాసురుడు రెండవసారి యుద్ధమునకు వచ్చుట

బాణుని రథంయొక్క చిరుమువ్వల ధ్వనులనే చిన్న గంటల ధ్వనులు ఆకాశాన్ని బద్దలయ్యేలా చేస్తున్నాయి. శత్రుజనులు భయపడేటట్లుగా బాణుని రథం బంగారు ధ్వజస్తంభాలతో, పతాకాలతో ప్రకాశిస్తుండగా, రథచక్రాల కమ్ముల ఒరిపిడికి భూమి కంపించగా, అనుకూలమూ, శక్తిమంతమూ అయిన యౌవనమందున్న గుర్రాల్ని రథానికి పూన్చి, ఎత్తైనరథాన్ని అధిష్ఠించి, దివ్యమైన బాణాలు, విల్లులు మున్నగు అరుదైన ఉపకరణాలను సమకూర్చుకొని బలం, పట్టుదల, శక్తి అధికమై సంతోషం పొంగిపొరలగా యుద్దానికి సిద్ధమై, మిక్కిలి వేగంగా నగరంనుండి యుద్ధభూమికి వచ్చాడు.

బాణాసురుడు రణభూమికి వచ్చి, రంగస్థలంలో మధ్యాహ్నకాల సూర్యునివలె తీవ్రంగా ప్రకాశిస్తూ దావాగ్ని జ్వాలవంటి కృష్ణుణ్ణి ఎదిరించాడు.

బాణుడు శ్రీకృష్ణుణ్ణి ఎదుర్కొని, యుద్ధంలో చెలరేగి, గర్వంతో, నేర్పుతో వేయిచేతులా పుంఖానుపుంఖాలుగా అతనిపై బాణాలు వదిలాడు. కృష్ణుడు వెంటనే ఆ బాణసమూహాన్ని అర్ధచంద్రాకారబాణాలతో ఖండించాడు.

అప్పుడే వికసించిన తెల్లతామరపూరేకులవంటి విశాలనేత్రాలు గలవాడైన శ్రీకృష్ణుడు ముర అనే రాక్షసుని సంహరించినవాడు, కనుకనే కోపంతో, రోషంతో తీవ్రంగా కదలాడుతున్న ఎర్రతామరరేకులవంటి నేత్రాలు గలవాడై, దితి కుమారులైన రాక్షసులనే గొప్ప అరణ్య సమూహాన్ని కాల్చివేసే దావాగ్నియై విజృంభించి, తనను ఆశ్రయించిన వారిని రక్షించేదీ; నిరంతరం ఇంద్రునిచే రక్షణకై పూజించబడేదీ, దివ్యలక్షణ లక్షితమైనదీ అగు సుదర్శన చక్రాన్ని రాక్షసరాజైన బాణునిపై ప్రయోగించాడు.

ప్రచండసూర్యమండలంలా శోభిస్తూ నూరువేల కొనలుగల వజ్రాయుధంవలె అగ్నికీలలతో కుటిల శత్రువుల గర్వాంధకారాన్ని నశింపజేస్తూ, ఇంద్రాది సమస్త దేవతల స్తుతులు అందుకుంటూ, తన దర్శనంచే రాక్షసులకు శోకం కలిగించేదీ తన స్పర్శతో సజ్జనులకు ఆనందం కలిగించేదీ, అయిన సుదర్శనచక్రాన్ని కృష్ణుడు ప్రయోగించగా - రత్నాలు పొదిగిన బంగారు చేతికడియాలతో అందగిస్తూ మదించిన ఏనుగుల తొండాల్లాగా వెలుగొందుతున్న బాణాసురుని వేయిచేతుల్లో నాల్గింటిని వదలి తక్కిన వాటిని తోటమాలి అరటిబోదెల్ని కాల్చివేసినట్లు ధ్వంసం చేసే సమయంలో

శివుడు బాణుని రక్షింప శ్రీకృష్ణుని స్తుతించుట







Banasuruniki Sahayabhutundagu Shivunaku Krishnunaku Yudhamaguta - బాణాసురునికి సహాయభూతుండగు శివునకు కృష్ణునకు యుద్ధమగుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
బాణాసురునికి సహాయభూతుండగు శివునకు కృష్ణునకు యుద్ధమగుట

భక్తులపట్ల ప్రేమకలవాడూ, కోరికల్ని తీర్చేవాడూ అయిన శివుడు బాణుణ్ణి తనకుమారులకంటే అధికంగా చూస్తాడు. కనుక, తాను బాణునిపక్షంలో యుద్ధం చేయడానికి కుమారస్వామి, ప్రమథగణాలూ వెంటరాగా శూలం ధరించినవాడై

నందీశ్వరుని కాలిగిట్టల తాకిడికి రేగిన దుమ్ము సూర్యుణ్ణి కమ్మివేసింది. తోకను కదుపగా ఏర్పడిన గాలికి మేఘాలు చెదరాయి. కొమ్ములవిసురుకు బ్రహ్మాండమనే పాత్రమూత పగిలింది. నందీశ్వరునిరంకెలకు ఆకాశం బద్దలైంది. మెడలో వేలాడే బంగారు గంటలధ్వనికి దిక్కులు కలత చెందాయి. నడచివస్తున్న వెండికొండా అన్నట్లు నందీశ్వరుణ్ణి శివుడు అధిరోహించి యుద్దానికి బయలుదేరాడు.

పరమేశ్వరుడు సమరసన్నాహసముల్లాసంతో వెళ్లి ఎదుటివారి సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. అప్పుడు ద్వంద్వయుద్ధం జరిగింది. ఆ పురాతన వీరులయుద్దాన్ని చూడడానికి బ్రహ్మ, ఇంద్రుడు, దేవతలు, మొదలైనవారు వచ్చారు. 

శ్రీకృష్ణుడూ - శివుడూ; ప్రద్యుమ్నుడూ - కుమారస్వామీ; కూపకర్ణుడూ - కుంభాండులతో, బలరాముడూ - బలుడూ - సాంబుడూ; రథికులు - రథికులతోనూ, ఆశ్వికులు - ఆశ్వికులతోనూ, గజారోహకులు గజారోహకులతోనూ, పదాతిదళం పదాతిదళంతోనూ; యుద్ధం చేశారు. సింహధ్వనులతో, హుంకరింపులతో, వింటినారిధ్వనులతో, ఏనుగుల ఘీంకారాలతోనూ, గుర్రపుసకిలింపులతో, తప్పెటల, బాకాల భేరీశబ్దాలతో, మద్దెళ్ల, ఢక్కాలు, శంఖాల ధ్వనులతో బ్రహ్మాండం బద్దలయినట్లు అయింది.

(ఇందు జగన్నాటకసూత్ర ధారి అయిన శ్రీకృష్ణుడు ఒకపక్క భక్తపరాధీనుడగు శివుడు ఒకపక్క యుద్ధభారాన్ని వహించారు. ఇందలి శ్రీకృష్ణుడు జయశీలి. బాణుడు శాపగ్రస్తుడు. విచిత్ర మేమంటే బాణుడు శివునినుండి పొందింది. వరరూపంలో ఉన్న శాపం. ఆ వరమిచ్చింది శివుడే. 

తిరిగి బాణునిపక్షాన యుద్ధం చేస్తున్నదీ, బాణుణ్ణి రక్షించే ప్రయత్నం చేసిందీ - పరమేశ్వరుడే! ఇదొక విచిత్ర యుద్ధసన్నివేసం! అయినా హరిహరుల లక్ష్యంమాత్రం దుష్టశిక్షణం, శిష్టరక్షణమే! బాణుణ్ణి కూల్చడమే! బాణుడు తన ఆరాధ్యదైవాన్నే తనతో యుద్దానికి రమ్మనడం - వాని దురహంకారానికీ, నాశనానికీ పునాది అయింది.)

శ్రీకృష్ణుడు సింహనాదం చేసి తన యుద్ధనైపుణ్యంతో, బాణప్రయోగంతో శివుడు మొదలైన యోధుల్ని బాధించాడు. శత్రుసైనికులు భయంతో కలతచెంది పారిపోయేటట్లు చేశాడు.

కృష్ణుని విజ్బంభణం చూడలేక పరమేశ్వరుడు నిప్పులు కక్కే బాణాలు వేశాడు. కృష్ణుడు వాటిని ప్రతిబాణాలతో పొడిపొడిగా చేశాడు. ఇంకా

శివుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. శ్రీకృష్ణుడు అదే బ్రహ్మాస్తంతోనే దాన్ని తేలికగా తిప్పికొట్టాడు. ఆ ప్రయోగాన్ని చూచి ఇంద్రాది దేవతలు ఆశ్చర్యపడి కృష్ణుని పొగడగా

శివుడు కృష్ణునిపై వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. కృష్ణుడు ఈ అస్త్రాన్ని పార్వతబాణంతో తుంచాడు. శివుడు ఆగ్నేయాస్త్రాన్ని వేయగా కృష్ణుడు ఐంద్రాస్త్రంతో దానిప్రభావాన్ని నిర్మూలించాడు.

శివుడు పాశుపతాస్త్రం వేశాడు. శ్రీకృష్ణుడు నారాయణాస్త్రం సంధించి, ఆ అస్త్రాన్ని మరల్చాడు. ఈ విధంగా శివుని అస్త్రాలు అన్నిటినీ కృష్ణుడు నిర్వీర్యం చేస్తుండగా

కలతచెంది నిరుత్సాహుడై ఉండే శివునిపై జయశాలి అయిన కృష్ణుడు సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు.

శివుడు సమ్మోహనాస్త్రప్రభావంతో శరీరం స్వాధీనం తప్పగా, చేష్టలుడిగి, నిద్రవచ్చి నందీశ్వరునిమూపురంపై వాలిపోయాడు.

ఈ విధంగా శివుడు నందీశ్వరునిపై నిద్రమత్తులో పడగా, కృష్ణుడు శత్రు సైనికుల్ని బాణపరంపరతో ఖండించాడు. ఖడ్గాన్ని చేపట్టి శత్రుసైనికులలో మిగిలినవారిని బాధించాడు. ఈ రీతిగా రణరంగాన్ని శవాలగుట్టగా చేశాడు.

ప్రద్యుమ్నుడు గొప్ప సైన్యంతో కుమారస్వామిని ఎదుర్కొన్నాడు. వాడిబాణాలతో బాధింపగా కుమారస్వామి దేహం రక్తపుముద్దయై బాధపడుతుంటే, శత్రువులు సంతోషంతో కేకలు పెడ్తుంటే యుద్ధం అంటే భయపడి; తన నెమలివాహనంపై రణరంగం నుండి పారిపోయాడు.

యుద్ధభూమిలో శత్రువీరుడైన సాంబుడు కోపోద్రిక్తుడై బంగారు పిళ్లుగల వాడి బాణాలు వేయగా బాణుని కుమారుడైన బలాసురుడు అధైర్యంతో ఓడి పారిపోయాడు.

బలరాముడు వజ్రాయుధంవంటి ముసలంతో కుంభాండ కూపకర్ణుల శిరస్సుపై మోదగా, వారు ముసలం దెబ్బలకు తలలు పగిలి రక్తం కక్కుతూ చచ్చారు.

ఆ సమయంలో బాణునిసైన్యం దీనత్వం పొంది, దిక్కులేనిదై, పారిపోసాగింది. బాణాసురుడు సాత్యకి లక్ష్యంగా ప్రళయకాలాగ్నివలె విజృంభించి యుద్ధం చేసి, సైన్యాన్ని తిరిగి పురికొల్పాడు. ఉభయ సైన్యాలు తీవ్రంగా పోరాడాయి.

ఇరుపక్షాల సైన్యాలు దక్షిణ ఉత్తర సముద్రాలవలె భయంకర యుద్ధం చేశాయి. గదలు, ఖడ్గాలు, గండ్రగొడ్డళ్ళు, శూలాలు, చక్రాలు, చురకత్తులు, శక్తులు, బల్లెములు, పట్టినాలు మొదలైన ఆయుధాలతో యుద్ధం జరిగింది. కాళ్లు, వేళ్లు, తలలు, చేతులు తెగాయి. కళ్ళు పాడయ్యాయి. 

గజాలు, గుర్రాలు నేలకూలాయి. గుట్టలుగుట్టలుగా పడున్న పీనుగుల్ని తినడానికై పిశాచాలు, భూతాలు, భేతాళాలు గుంపులు గుంపులుగా వచ్చాయి. ఈ భయంకరయుద్ధంవల్ల రణరంగం భీషణంగా మారింది.

బాణాలు కలువపూలుగా; వింజామరలు నురుగులుగ్గా, గొడుగులు తెల్లతామరపూలుగా, రక్తం నీరుగా, ఎముకల గుట్ట ఇసుకరాశిగా, చేతులు పాముల గుంపుగా, తలవెండ్రుకలు నాచుగా తోచుటచే రణరంగం ఎర్రటి నదిలాగా కన్పించింది.

ఆ సమయంలో బాణాసురుడు మిక్కిలి కోపంతో శ్రీకృష్ణుని పైకి రథాన్ని పరుగెత్తించి, తాను సహస్రబాహుడ ననే గర్వంతో సమీపించి

బాణాసురుడు ఒకసారిగా అయిదువందల చేతులతో ధనువులను ధరించి, మిగిలిన చేతులతో రెండేసి బాణాలను తీసుకొని సంధించేలోపలే శ్రీకృష్ణుడు ఆ బాణాల్నీ, ధనుస్సులనూ ధ్వంసం చేశాడు. సారధిని సంహరించి, రథాన్ని ధ్వంసం చేసి

శ్రీకృష్ణుడు ప్రళయకాలమేఘగర్జనతో సమానమైన శబ్దాన్ని కల్గించే పాంచజన్యాన్ని పూరించాడు. జనులందరూ భయభ్రాంతులయ్యారు. ఆ ధ్వనికి రాక్షసస్త్రీల గర్భాలు విచ్చిన్నమయ్యాయి.

శ్రీకృష్ణుని ఎదురులేని శౌర్యపరాక్రమాలకు భయపడి, బాణుడు పెడమొగం పెట్టి ఏమీ చేయలేక న్యూనతతో ఊరకుండిపోయిన సమయంలో, ఆ సమయంలో బాణునితల్లి కోటర తన కుమారుడైన బాణుణ్ణి రక్షించాలనే తలపుతో వివస్త్రయై కృష్ణుని ఎదుట నిలబడగా, అసహ్యభావంతో అతడు పరాఙ్ముఖుడయ్యాడు. 

బాణుడు మనస్సు బాధపడుతుండగా, తలపాగ ఊడిపోగా బంగారుమణిభూషణాలు పడిపోతుండగా, యాదవులు నవ్వుతుండగా తన నగరానికి పారిపోయాడు. భూతగణాలుకూడా ఎక్కడికో వెళ్ళిపోగా

మూడుతలలు, మిక్కిలి భయంకరమైన మూడుపాదాలు కలిగి కోపంతో శివజ్వరం రాగా చూచి, కృష్ణుడు మెల్లగా నవ్వుతూ

శైవవైష్ణవజ్వరాలు రెండూ, ఉపాయం, సామర్థ్యం, బలం, పరాక్రమం కలిగి పోరాడగా శైవజ్వరం ఓడిపోయింది.

వైష్ణవజ్వరం ధాటికి ఆగలేక భయపడి పారిపోయింది.

శైవజ్వరం దిక్కుతోచక ఏడుస్తూ ప్రాణభయంతో వచ్చి, కృష్ణునిపాదాల పైబడి, నమస్కరించి నన్ను రక్షించు రక్షించు అంటూ ప్రార్థించింది.

ఈ విధంగా ప్రార్థించింది.

కృష్ణా! అవ్యయుడవు, అనఘుడివి, అనంతశక్తియుక్తుడివి, బ్రహ్మరుద్రేందాదులకు ప్రభువైనవాడివి; సర్వాత్మకుడివి; జ్ఞానమయుడివి; జగదుద్భవస్థితి సంహారకారకుడివి; ఉత్తమ జ్ఞాన శక్త్యాదులచే ఒప్పునట్టివాడివి, పరమాత్మస్వరూపుడివి, ప్రభుడివి; నీ మూలప్రకృతి మహిమతో సర్వప్రాణులను మోహపరచునట్టివాడివి; గౌరవప్రదమైన వర్చస్సు కలవాడివి; ఆదిమధ్యాంతాలులేనివాడివి; సచ్చిదానంద స్వరూపుడివీ అయిన నిన్ను సేవిస్తాను.

(షట్‌+ఊర్ములు= షడూర్ములు. 'ఊర్మి' అంటే అల. యోగసాధనకు ఆటంకాలను కల్గించే ఆరువిధాలైన అలజడులే - జీవధర్మాలే షడూర్ములు. అవి క్షుత్‌ (ఆకలి), పిపాస (దప్పిక), శోకం, మోహం, జర (ముదిమి), మరణం. 

ఇవి ప్రతిజీవికి సహజమైనవే. అయితే ఇవి సమపాళ్లలో ఉండవు. ఒక్కొక్కరోజు ఒక్కొక్క తీరుగా ఉంటాయి. జీవసహజమైన ఈ అలజడులను, ధర్మాలనూ జయించడం యోగసాధనలో ఒక భాగం. షడూర్ములలో ఆకలి(ఆహారం), దప్పికలు - సూక్ష్మశరీర ధర్మాలు; శోకమోహాలు - కారణ శరీరధర్మాలు - జరామరణాలు = స్తూల శరీర ధర్మాలు.

ఈ ధర్మాలు లేనివాడు పరమాత్మ సుజ్ఞానమంటే - ఇతర సాధనాలతో అవసరంలేని, స్వయంప్రకాశకమైన తత్త్వజ్ఞానం. శక్తులు - ఇవి పరమాత్మకు సంబంధించిన సర్వజ్ఞత్వం, సర్వేశ్వరత్వం, సర్వాంతర్యామిత్వం - మొదలైనవి.)

కృష్ణా! లోకంలో భగవంతుడు అనేకవిధాలుగా కన్పిస్తాడు. కళ, కాష్ఠ ముహూర్తాలనబడేకాలాలూ, మంచిపనులూ, చెడుపనులూ, ప్రత్యక్షాదిజ్ఞానరూపాలైన జీవునికర్మలూ, స్వభావాలూ, సత్త్వరజోతమోగుణాలచే కూడిన ప్రకృతీ, బీజాంకురన్యాయంతో కార్యకారణరూపమై ప్రవాహమైన ఈ జగత్తు సత్యమేమో అనిపిస్తుంది.

ఇది నీ మాయేగాని వాస్తవం కాదు. ఆ మాయను నివారించగల నీవు పెక్కు అవతారాలెత్తి లోకనిర్మాణనిపుణులైన బ్రహ్మ ఇంద్రుడు మున్నగువారిని, పుణ్యపురుషుల్ని దేవతల సమూహాన్ని కాపాడుతున్నావు. క్రూరకర్ములగు దుష్టాత్ములను శిక్షిస్తున్నావు. నీ అవతారంయొక్క ప్రయోజనం భూభారాన్ని తగ్గించడమే! అందువల్ల నిన్ను శరణుకోరుతున్నాను.

ప్రవిమలాకారా! సంసారభయాన్ని దూరం చేసేవాడా! భక్తజనులను పోషించడంలో ఆనందం పొందేవాడా! పరమప్రరుషా! దేవా! శాంతమై, పూజనీయమై, తీక్ష్ణమై, ఉదారమై ప్రకాశించే నీ కాంతిచే తాపాన్ని పొందాను. కృశించాను, నన్ను రక్షించు. నీ పాదపద్మాలను సేవించే బుద్ధి కలిగేటంతవరకే మానవులు పాపాలు చెస్తారు. అనాథ రక్షకుడనే బిరుదు కలిగిన నీకు నన్ను కాపాడుట వింతయా?(కాదని భావం)

అనగా శ్రీకృష్ణుడు దయగలవాడై సాధనమైన జ్వరం(వైష్ణవజ్వరం) ఇతరమైన సాధనాలతో నివారణం కాదు. కానీ, నీవు నీ మనస్సులో నన్ను చూచి, (నా తత్త్వం తెలుసుకొని) శరణు కోరావు. కనుక నా వైష్ణవజ్వరతాపం ఇకపై నిన్ను బాధించదు. ఇక మనోవేదన చెందవద్దు.

('సర్వధర్మాలను పరిత్యజించి, నన్నే శరణుపొందు, సర్వపాపాలనుండి నిన్నునేను విముక్తుణ్ణి చేస్తాను. విచారించకు' అనిన గీతాచార్యుని వాక్యం - ప్రస్తుతం - శైవజ్వరశక్తి విషయంలో నిరూపితమైంది.)

ఆ శ్రీకృష్ణుడు ఇంకా ఈ విధంగా అన్నాడు. ఎవ్వరైనా ఈ శైవ వైష్ణవజ్వరాల కలహాన్నీ నీవు (శైవజ్వరం) విష్ణుప్రపత్తికి సిద్ధపడటాన్నీ మనస్సులో తలుస్తారో అట్టిపుణ్యాత్ములను శీతోష్టజ్వరాలు బాధింపవు అని చెప్పగా ఆ శైవజ్వరం కృష్ణునికి సాష్టాంగంగా నమస్కరించి తన కోరికను అనుసరించి వెళ్లింది. తరువాత బాణాసురుడు శోణపురంలో

బాణాసురుడు రెండవసారి యుద్ధమునకు వచ్చుట







Wednesday, August 26, 2026

Naraduni Valana Vruthanthamunu Vini Krishnudu Banasurunipai Dandetthuta - నారదుని వలన వృత్తాంతమును విని కృష్ణుడు బాణాసురునిపై దండెత్తుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
నారదుని వలన వృత్తాంతమును విని కృష్ణుడు బాణాసురునిపై దండెత్తుట

శరత్కాలమేఘం పాదరసంవంటి స్వచ్చమైన శరీరకాంతిగలవాడూ, సాటిలేని అదృష్టసంపన్నుడు అయిన నారదుడు దయాబుద్ధిగలవాడైై; శ్రీకృష్ణుణ్ణి సేవించడానికి వచ్చాడు.

ఈ విధంగా వచ్చిన నారదమునిని సుధర్మాసభలో శ్రీకృష్ణుడు, యదు, వృష్టి, భోజ, అంధకవీరులు అర్ఘ్యపాద్యాదులిచ్చి ఉన్నతాసనంలో కూర్చుండ పెట్టి దేవమునిని గౌరవించాడు. నారదుడు అనిరుద్ధుని వృత్తాంతమంతా స్పష్టంగా తెలిపాడు. శ్రీకృష్ణుడు బాణాసురునిపై యుద్దానికి మంచి ముహూర్తం నిర్ణయించి, సైన్యాన్ని సిద్ధం చేసేందుకు వేత్రహస్తుల్ని నియమించి, తానూ యుద్దానికి సిద్ధమయ్యాడు.

(యదు, వృష్టి, భోజ, అంధకములనేవి నాల్గు రాజవంశాల పేర్లు. యదువంశానికి చెందినవాడు నందగోపుడు, ఆయన భార్య యశోద. కృష్ణుని పెంచి పెద్ద చేసినవారు. వృష్టి వంశపురాజు వసుదేవుడు, దేవకీదేవి. శ్రీకృష్ణుని తల్లితండ్రులు, భోజవంశపురాజు కుమార్తె కుంతీదేవి. ఈయనకు కుంతిభోజుడనీ పేరు. అంధక వంశపురాజు ఉగ్రసేనుడు. ఆయన కుమారుడు కంసుడు.

తండ్రిని చెరసాలలో బంధించి సింహాసనమెక్కినవాడు, కంసుని ఆస్థానంలోని మల్లయుద్ధ వీరులైన చాణూరముష్టికులు అంధకదేశీయులు. శ్రీకృష్ణుడు ఈ మల్లయుద్ధ వీరులిద్దరినీ, మేనమామ కంసుణ్ణి సంహరించి, తాతగారైన ఉగ్రసేనుణ్ణి సింహాసనాసీనుణ్ణి చేశాడు.)

శ్రీకృష్ణుడు హారాలు, కిరీటం, భుజకీర్తులు, చేతికడియాలు, ఉంగరాలు, నూపురాలు మున్నకు అలంకారాలూ, ఆభరణాలూ ధరించాడు. చేతుల్లో గద, శంఖం, చక్రం ప్రకాశించగా సువాసనగల చందనం అద్దినవక్షఃస్ధలం పై గల, కౌస్తుభమణి కాంతులు వ్యాపించగా పసుపురంగు పట్టువస్త్రం కుచ్చిళ్లు ఏర్పడేటట్లు కట్టాడు. సారథి దారుకుడు రథాన్ని సిద్ధం చేసుకొనిరాగా, తూర్పుకొండపై సూర్యుడు ఎక్కినట్లు - సంతోషాతిశయంతో - ఆ రథాన్ని ఎక్కాడు.

శ్రీకృష్ణుడు రథం ఎక్కగానే బ్రాహ్మణులు ఆశీర్వదించారు. ముత్తైదువలు అక్షతలు చల్లారు. వందిమాగధులు కైవారాలు చేశారు. స్తోత్రపాఠకులు చేసే ప్రశంసలకు కృష్ణుడు ఆనందించాడు.

బలరాముడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు మొదలైన ప్రముఖ యదు, వృష్టి, భోజ, అంధకవీరులు శత్రుబలనిర్మూలనకై చతురంగ బలసమేతులై పండ్రెండు అక్షౌహిణులతో, పూర్వం ఆకాశగంగ భగీరథుని వెంటవెళ్లిన విధంగా కృష్ణుని వెంట నడిచారు.

కొన్ని దినాల తరువాత యాదవవీరులు శోణనగరం హద్దులు దాటి, ఆ నగరాన్ని చేరారు. అంతట

యాదవసైన్యం శోణపురప్రాంతానికి చేరి నదులను, సరస్సులను, విహార స్థలాలనూ, ఉద్యానవనాలను, యజ్ఞస్థలాలను నాశనం చేశారు. అనేక అగడ్తలను పూడ్చారు. యంత్రాలను పాడుచేశారు. గోపురాలను పడగొట్టారు. రాజభవనాల్ని కూలద్రోశారు. ప్రాకారాలను నేలకూల్చారు. అమితోత్సాహంతో తలుపులను బ్రద్దలుకొట్టారు.

యాదవవీరులు శోణపురాన్ని అనేకవిధాలుగా నిరోధించారు. రాక్షసరాజగు బాణుడు కోపోగ్రమూర్తియై సైన సంసిద్ధతకై యుద్ధభేరి మ్రోగించగా

భూమి కుమ్మరిసారెవలె తిరిగింది. ఆదివరాహస్వామియొక్క గిట్టల తాకిడికి కలతచెందిన నదీనదాల్లాగా సముద్రాలు క్రిందుమీదుగా లేచే అలలతో పొర్లాయి. శివుని చేతిలోని శూలం దెబ్బలకు రాలే పిడుగులవలె నక్షత్రాలు నేల రాలాయి. భయంకరమైన గాలికి ఎగిరిన బూరుగుదూది విధంగా మేఘాలు చెల్లాచెదరయ్యాయి. పర్వతాలు కంపించాయి. స్వర్గం క్షోభించింది. దేవతల గుండెలు కలతపడ్దాయి. దిక్కులు చలించాయి. విమానాలు దారితప్పాయి. సూర్యచంద్రులు మార్గం తప్పారు.

యుద్ధసన్నాహానికి సిద్ధపడ్డ బాణుడు బంగారుకవచాన్ని రత్నకాంతులతో కూడిన కిరీటాన్ని కుండలాలను, హారాలను ధరించి ప్రాసం, తోమరం, గద, ఖడ్గం మొదలైన అనేక ఆయుధాలతో తన సైన్యం శత్రు సైన్యాలకు దీటుగా ఇరువైపుల నడువగా ఉన్నతమైన రథం ఎక్కి మహాశౌర్యంతో యుద్దానికి వెళ్లాడు. ఆ సమయంలో

బాణాసురునికి సహాయభూతుండగు శివునకు కృష్ణునకు యుద్ధమగుట







Banasurudu Aniruddhuni Nagapasabadduni Jeyuta - బాణాసురుడు అనిరుద్ధుని నాగపాశబద్దుని జేయుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
బాణాసురుడు అనిరుద్ధుని నాగపాశబద్దుని జేయుట

శుభలక్షణాలతో కూడినవాడు, మన్మథ కుమారుడు, మాన్యుడు, ఆజానుబాహుడు, చెవులకు మకరకుండలాలు గలవాడు, కాంతిమంతుడు, సత్కీర్తిమంతుడు, పీతాంబరాలు ధరించినవాడును, కస్తూరి లేపనంగలవాడు, చంద్రునివలె కాంతిమంతుడు హారాలతో శోభిల్లేవాడు, కమలాలవంటి కన్నులుగలవాడు, యదుకుల తిలకుడు, తుమ్మెదలవంటి నల్లని ముంగురులు గలవాడు, నవమన్మథుడు, ప్రతాపోజ్జ్వలుడు, పాచికలాటలో కుశలుడు, సద్గుణసంపన్నుడు, మన్మథ మంత్రసిద్దుడు, పరిశుద్ధుడు, లోకప్రసిద్ధుడు, తన సౌందర్యంతో స్త్రీలను అడ్డగించేవాడు అయిన అనిరుద్ధుణ్ణి బాణుడు చూశాడు.

రాక్షసరాజైన బాణునికి కోపం అధికమై ఈ నరాధముణ్ణి 'బంధించండి, పట్టుకోండి, కొట్టండి' అని ఆజ్ఞాపించగా, ఆ రాక్షసభటులు సాటిలేని ఆయుధాల కాంతులు సూర్యతేజస్సును మాసిపోయేట్టు చేస్తుండగా, అనిరుద్దుణ్ణి బంధించడానికి దగ్గరికి వచ్చారు. అప్పుడు అనిరుద్ధుడు శక్తి బలం, ప్రావీణ్యం, దర్పం

అనిరుద్దుడు ప్రళయకాలరుద్రునివలె విజృంభించి ఇనుపగుదియను పట్టుకొని, మహోగ్రతతో భయంకరుడై రాక్షసులను ఎదిర్చి, తన ధైర్యసాహసాలను ప్రదర్శించాడు.

అనిరుద్దుని యుద్ధకౌశలానికి దానవసైనికుల పాదాలు, చేతులు, తలలు, మోకాళ్లు, పండ్లు, చెవులు, మెడలు, తొడలు, వీపులు, మూపులు చిన్నచిన్న ముక్కలుగా భూమినిండా చిందర వందరగా పడ్దాయి. అనిరుద్ధునితో యుద్ధం చేయలేక రాక్షస సైనికులు రణరంగం నుంచి దిక్కుతోచక పారిపోయారు.

ఈ విధంగా దానవసైన్యం చేవచచ్చి బాధతో భయంతో బెదరి చెదరి వచ్చి, బాణాసురుని మరుగు చొచ్చింది. బాణాసురుడు శౌర్యక్రోధాలతో అనిరుద్దునిపై దూకి భీకర యుద్ధం చేశాడు.

బాణుడు యుద్ధంలో విజృంభించి, యుద్దానికి సిద్ధపడ్డ అందగాడైన అనిరుద్దుణ్ణి తన బాణాలచేత కొట్టి నాగపాశంతో బంధించాడు

ఈ విధంగా అనిరుద్దుణ్ణి బంధించినందుకు ఉష దుఃఖంవల్ల మనస్సు కలతచెంది ఉండింది. అంతట

తీవ్రంగా గాలివీచడంచేత బాణాసురుని నీలవర్ణపతాకం వెంటనే అకారణంగా పెద్ద ధ్వనితో నేలపై కూలింది.

పతాకం పడటం చూచి బాణుడు సంతోషపడ్డాడు. శివుడు తనతో పల్కిన విధంగా జరుగుతుందనుకొని నిశ్చయించి యుద్ధం కోసం ఎదురు చూడసాగాడు.

ఓ రాజా! ద్వారకానగరంలో అనిరుద్దుని పోకా, జాడా యాదవులకు నాలుగు నెలలుగా తెలియదు. యాదవులందరును మిక్కిలి దుఃఖింపసాగారు.

నారదుని వలన వృత్తాంతమును విని కృష్ణుడు బాణాసురునిపై దండెత్తుట







Banasurudu Eswara Prasadambu Nonduta - బాణాసురుడు ఈశ్వర ప్రసాదంబు నొందుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
బాణాసురుడు ఈశ్వర ప్రసాదంబు నొందుట

పాపరహితుడవైన పరీక్షిన్మహారాజా! బలికి వందమంది కుమారులు. అందులో మిక్కిలి తీక్ష్ణమైనవాడు, దీర్ఘయశస్సు పొందినవాడు, శివుణ్ణి పూజించినవాడు, శత్రువులు అనే చీకటికి సూర్యుడు, వేయిచేతులను కలిగినవాడు, బలికి ప్రథమసంతానమైనవాడు బాణుడు.

తన పరాక్రమంచేత దేవతలను జయించిన బాణుడు కైలాసానికి వెళ్లి భక్తివశుడూ, ప్రమథగణాలతో కూడినవాడూ, మన్మథుణ్ణి జయించినవాడు, తాండవనాట్యంలో నిపుణుడైనవాడు, భక్తరక్షకుడూ అయిన శివుణ్ణి చూశాడు.

తన మనస్సులో, కూర్మి అధికం కావడంతో భూమిపై సాగిలంబడి నమస్కరించి తాండవనృత్యం చేసే సమయంలో శివుణ్ణి చూచి

బాణుడు తన బాహుశక్తికి తగినట్లుగా వాద్యం వాయిస్తూ త్రిలోకరక్షకుడైన శివుణ్ణి సంతోష పరచి, ఉచితరీతిలో ప్రశంసించి మ్రొక్కి ఈ విధంగా పలికాడు.

సుఖప్రదుడవైన ఈశ్వరా! భక్తుల హృదయాలను వశపర్చుకొన్నవాడా!, దురహంకారులైన రాక్షసులను నాశనం చేసేవాడా! ధవళనీలవర్ణ శరీరంకలవాడా!, వాసుకిని చేతికడియంగా ధరించినవాడా!, పార్వతీహృదయేశ్వరా!, యోగులహృదయ వికాసకారకా!, తాండవనృత్య క్రీడయందు ఆసక్తి కలవాడా!, భక్తులను కాపాడేవాడా! నీకు నమస్కారం.

(శివుడు అర్ధనారీశ్వరుడు - కుడివైపు తెలుపు, ఎడమవైపు నలుపు వర్ణం కలవాడు. శివుడు తెలుపు, పార్వతి నలుపు - కనుక ధవళనీలవర్ణుడు.

అని స్తుతించి

ఓ శివా! నా మనస్సులోని కోరిక నీకు స్పష్టంగా చెబుతాను. నీవూ, పార్వతీదేవీ నా నగరంలో కోటరక్షకులుగా ఉండాలి. నేను ఎల్లప్పుడూ మీ పాదపద్మాలనే ఆశ్రయించి ఉంటాను.

బాణాసురుని ప్రార్ధన మన్నించిన శివుడు - గౌరీదేవి, కుమారస్వామి, గణపతులతో - ఇంకనూ ప్రమథగణాలతో వచ్చి శోణపురద్వారందగ్గర కాపుగా నిలిచాడు. ఆ తరువాత ఒకనాడు ఆ బాణుడు

గర్వియైన బాణాసురుడు కెంపులతో కూడిన తనకిరీటాన్ని శివునిశిరస్సుకు తగిలేటట్లు ఆయనకు నమస్కరించి, ఇలా పొగడాడు.

ఓ దేవా! పరమేశ్వరా! దేవేంద్రునిచేత పొగడ్తలందినవాడా! జగన్నాథా! విస్తరించిన చరిత్రకలవాడా! పరిశుద్ధమైనవాడా! హాలాహలాన్ని మింగినవాడా! వాసుకీ మున్నగు నాగరాజులను భుజకీర్తులుగా కలవాడా! చంద్రశేఖరా! భక్తరక్షకా! సర్వలోకాతీత! సద్గుణసమూహా! పార్వతీపతీ! మోక్షప్రదాతా! వెండికొండను గృహంగా కలవాడా! గజచర్మధారీ! రాక్షససంహారకా! శూలపాణీ! లోకనాయకా! ఉత్తమభక్త సమూహాలకు పారిజాతమైనవాడా! మునిజనప్రశంసాపాత్రా!; భక్తులకోరికలను తీర్చేవాడా! శివా! మహామహిమగల నిన్ను పొగడతరమా?(కాదని భావం)

అని ప్రశంసించి

ఓ ఉమాపతీ! నీవు ప్రసాదించిన వేయిచేతుల పరాక్రమాన్ని ఎదిరించి పోరాడగల్గిన వీరుడు ఈ భూమిపై లేడు. ఈ పోరాటనను నేనెలా భరించేది? అని బాణుడు శివునితో అన్నాడు.

దిక్కులు దద్దరిల్లే విధంగా హుంకారం చేస్తూ ధనుష్టంకారం చేసేదీ, చేతుల కదలికవల్ల కలిగే కంకణాల క్రీంకారం గలది, భయంకరమైన భుజదండంలో ప్రకాశించే శ్రేష్ఠమైన ఖడ్గంచేత శత్రురాజుల సమూహాల శిరస్సులను ఖండించేదీ, శరీరాలనుండి భయంకరంగా రక్తధారలు చిమ్మేవిధంగా శూలపుపోట్లు పొడిచేదీ, మదపుటేనుగుల కుంభస్థలాలను బ్రద్దలు చేసే వీరవిజ్బంభణం గలదీ అయిన భీకర సంగ్రామంలో పరాక్రమాన్ని ప్రదర్శించలేని వట్టిచేతుల వలన ఉపయోగమేమున్నది? ఆ కరాలు నావంటి వీరులకు దుఃఖకరాలే గానీ సంతోషకరాలు కావు కాదా స్వామీ!

ఓ పరమేశ్వరా! నా శౌర్యపరాక్రమక్రీడ ఎదిరించడానికి నీవు తక్క నాకు సమానమైన బలం కలవాడు ఈ విశాల భూమండలంలో ఎక్కడా లేడని చెప్పిన బాణుని మూర్ఖత్వానికి శివుడు అసహ్యించుకొని, తనలో కోపసముద్రం ఉప్పాంగుతుండగా వానితో ఇలా అన్నాడు.

మందబుద్ధివైన బాణాసురా! ఎప్పుడు నీ తేరిజెండా అకారణంగా భూమిమీద పడుతుందో అప్పుడు నీ చేతులు తెగునట్లుగా నా అంతవానితో నీకు యుద్ధం కలుగుతుంది.

శివుని మాటలు విన్న బాణుడు కోరిక నెరవేరినవాడై, తన భుజ వినాశానికి కావలసిన పనిలో నిమగ్నుడై చాలాసంతృప్తిని పొంది తన భవనానికి వెళ్లి, భార్యలమనస్సుల్లో ప్రేమను చిగురింపచేస్తూ - హాయిగా వాళ్లతో కాలం గడుపుతూ, ఏ సమయంలో తన రథకేతనం కూలుతుందో అని వేచి ఉన్నాడు.

(దురదృష్టానికి అర్రులు చాచేవాడుంటాడా? అన్నట్లు బాణాసురుని మూ
ర్ఖ మనస్తత్వవ్యక్తీకరణానికి ఉదాహరణంగా చిత్రించబడింది. 'వినాశకాలే విపరీతబుద్ధిః' అని సూక్తి.

బాణునికుమార్తె ఉషాకుమారి తన భవనం పై భాగంలో నిద్రించింది. నిద్రలో తను ముందెన్నడూ విననీ, కననీ అసమాన సౌందర్యవంతుడైన అనిరుద్దునితో సుఖీంచినట్లుగా

స్వప్నం అనుభవించిన ఉషాకన్య మేలుకొంది. ఆమె కండ్లనుండి ఆనందంతో కన్నీరుకారుతున్నది. ఇది స్వప్నం కాక నిజమే నేమో అనే భ్రాంతి కలిగింది. కలలో కన్పించినవాని ఆకారం ముఖంపై కదులుతున్నట్లయింది. గాలిలో ఆ రూపాన్ని కౌగిట్లో గట్టిగా బంధించుకొంటూ

రసవంతాలూ, సౌమ్యాలూ అయిన సంభాషణలు, పైటనూ, జుట్టునూ లాగడం, చెక్కిళ్లను, నుదుటినీ, వడ్డాణాన్నీ చేతుల్నీ, ఎదనీ, చంకల్నీ, పొదివి పట్టుకోవడం - ఇలాంటివన్నీ మన్మథుడు అచ్చుగుద్దినట్లుగా ఉషాకన్య మనస్సుకు గట్టిగా తగిలాయి.

ఆమె చేష్టల్లో, భావంలో ప్రియునిపైగల ప్రేమ వ్యక్తమవుతూంది. హృదయంలో సిగ్గు కలిగి ఆమెశరీరంపై రోమాంచ మేర్పడుతున్నది. ఆమె మనస్సు మదనాగ్నిచే తపింపబడడానికి చిహ్నంగా ఆమె వక్షఃస్థ్సలంపై నున్న ముత్యాలహారాలు కందిపోతున్నవి.

ఆమె మనస్సు ప్రియునిపై లగ్నంకావడంతో మారుమాటలాడలేక పోతున్నది. ఆమెమనస్సులో సిగ్గు, వలపు, భయం కలిగాయి. ఆమెను మంచుక్రమ్మిన పద్మంవలె ఉంది. తొలివలపు భారంచే సంప్రదాయానుసారంగా ధరించవలసిన మేలిముసుగు కూడా ధరించలేకపోయింది.

ఉష విరహబాధను పొందుతున్నపుడు ఆమె చెలికత్తెలు ఆమెను సమీపించారు. అప్పుడు ఉష తన మనస్సులోని వికారాన్ని వారికి తలియకుండా మరుగుపరుస్తూ - అప్పుడు

మాటిమాటికీ వచ్చే నిట్టూర్పుల్ని పుక్కిట్లోనే అణచుకొని నిల్పేసింది. ఎదపై వ్యాపించిన సన్నని చెమట బిందువుల్ని మెల్లగా తుడిచింది. కన్నీటిముంపును రెప్పలచాటున దాచింది. నక్షత్రాలను చూద్దాం రండని పిలిచి, ముఖం ఆకాశం మీదికి ఎత్తి తన నాయకునిపై నుండే ప్రేమను దాచింది.

ఉష ఈ పద్ధతిలో ప్రవర్తిస్తుండే సమయంలో

ఉషకు క్రమంగా బాధ అధికమైంది. కన్నీటిప్రవాహంతో వక్షోజాలు తడుస్తున్నాయి. చెలికత్తెలవైపు చూడలేక, ముఖమెత్తి వారితో మాటాడలేక సిగ్గుపడి ఊరకుండిపోయింది.

బాణాసురుని మంత్రి కుంభాండకుని కుమార్తె చిత్రరేఖ, ఆమె ముఖసౌందర్యం చంద్రుణ్ణి మించింది. బాణుని కుమార్తె ఉషకు ఆమె బహిఃప్రాణం.

చిత్రరేఖ ఉషదగ్గరకు వచ్చి ఆమెను చూచి

ఉష తన ప్రియుణ్ణి బహిఃప్రదేశంలో వెదకుతున్నట్లుగా, ప్రాణనాథునికి దూరమై బాధపడుతున్నట్లు, చేతికి దొరకిన పతిని కోల్పోయిన భ్రాంతిని పొందినట్లు చెలికత్తె గమనించింది.

'ఉషా! నా కంటె ఇష్టమైనవారు నీకు ఎవరు ఉన్నారు? నీ కోరిక నాకు చెప్పకపోతే, మీ తండ్రిపై ఒట్టు అనగానే ఆమె సిగ్గుతో కూడిన నవ్వుగలదై చెలితో ఇలా పలికింది (ఆమె నవ్వును సిగ్గు అణిచేస్తుంటే - ఎట్లో తప్పించుకొని నవ్వింది. అంటే ఆమెకు నవ్వుకంటే ఆ సిగ్గే ఎక్కువయింది).

ఉష చిత్రరేఖను చూచి ఈ విధంగా చెప్పింది.

ఓ 
చెలీ! నా స్వప్నంలో పద్మనేత్రుడు, ముత్యాలహారాలు, రత్నకుండలాలూ, చేతి కడియాలూ, ఉంగరాలూ, అందెలూ ధరించినవాడు, బంగారువర్ణం దుస్తులు ధరించినవాడు, కోమల శరీరం కలవాడు, నీలదేహుడు, ఎత్తైన వక్షఃస్థలం కలిగి నవమన్మథుడుగా ఉన్నవాడు కన్పించాడు.

చెలీ చిత్రరేభా! ఆతడు నా మనస్సు సంతోషించేటట్లు నన్ను దగ్గరకు తీసుకొని, గాఢమైన కౌగిట చేర్చుకొన్నాడు. అధరామృతమిచ్చాడు. మన్మథక్రీడలో తేల్చి, మృదువైన మాటలు చెప్పి, దుఃఖ సముద్రంలోకి, త్రోసి వెళ్లిపోయాడు.

ఉషమనస్సు మన్మథవశమై కూడి విరహవేదన కలత పెట్టగా, ఆమె కన్నీరుమున్నీరుగా వగచి, వివర్ణమైన చెందిన ముఖం వంచుకొని మిన్నకుండిపోయింది. ఆమె బాధను చూచి బాగా ఆలోచించిన చిత్రరేఖ ఇలా అంది.

ఉషా! నీవు విచారించడం ఎందుకు? దేవతలు, మానవులు, యక్షులు, కింపురుషులు, నాగులు, కిన్నరులు, ఖేచరులు, కింపురుషులు, సిద్దులు, సాధ్యులు - ఈ జాతులకు ప్రభువులైన పురుషుల్ని చిత్రపటాలలో లిఖించి, చూపుతాను. వారిలో నీ మనస్సును హరించిన ప్రియుణ్ణి గుర్తించగానే అతణ్ణి నీ ఒద్దకు తీసుకొని వస్తాను.

అని చెప్పి ఉషాకన్యను అంగీకరింపజేసింది. మంచువలె కాంతిమంతమైన వస్త్రాన్ని సిద్ధం చేసింది. వజ్రంలాంటి తెల్లని సున్నాన్ని ఆ వస్త్రానికి పూసింది. అయిదు బంగారు, వెండి పాత్రలలో ఐదు రంగుల్ని నింపుకొనింది. ఒక చేతిలో కుంచెను ధరించి, రంగులతో నిండినపాత్రల్ని తీసుకొని ఏకాంతప్రదేశానికి వెళ్లింది.

ముల్లోకాలలో ప్రసిద్ధి చెందినవాళ్ల చిత్రాలు లిఖించింది. వారి పేర్లూ, గోత్రాలూ వ్రాసింది. అలా పూర్తి చేసిన చిత్రపటాన్ని తెచ్చిచూపింది. వీరినిగూర్చి పూర్తిగా చెబుతాను. విను అని చెప్పసాగింది.

ఉషా! సంగీతకోవిదులైన గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు - వీరే! నిత్యయౌవనులు, స్వేచ్చావిహరులు, ఆకాశగమనులు అయిన సిద్ధులు, సాధ్యులు, చారణులు - వీరే! నిర్మలమైన సౌఖ్యసంపదల మహిమగల్గిన దేవతలు, మరుత్తులు, యక్షులు, రాక్షసులు - వీరే! కళానిధులై, కామరూపులై ప్రశస్తులైన నాగకుమారులు - వీరే! చూడుము అని ఆమె చూపించగా అందు తన ప్రియుడు కన్పించనందున మిన్నకున్నది. చిత్రరేఖ అప్పుడు భూలోకంలోని రాజుల్ని చూపసాగింది.

ఓ రాజకుమారీ! వీరు - మాళవ, కొంకణ, ద్రవిడ, మత్స్య, పుళింద, కళింగ, భోజ, నేపాల, విదేహ, పాండ్య, కురు, బర్బర, సింధు, యుగంధర, ఆంధ్ర, బంగాళ, కరూశ, టేంకణ, త్రిగర్త, సుధేష్ట, మరాట, లాట, పాంచాల, నిషాద, ఘూర్జరక, సాళ్వదేశప్రభువులు చూడుము.

ఓ రాజకుమారీ! సింహపరాక్రముడూ, చంద్రుడు, హంసలు, పాలసంద్రం, మంచిగంధం - వీటివలె స్వచ్చమైన కీర్తిగలవాడు, బలగర్వితులైన శత్రురాజులనెడి చీకటిని కూల్చే సూర్యునివలె మహాతేజోవంతుడు, బృహదశ్వుని కొడుకు, మగధదేశాధీశ్వరుడూ అయిన, జరాసంధుడు - ఇతడు. చూడుము.

ఓ ఉషా! సమస్త రాజులందరిచేత పొగడ్తలందినవాడు, భుజబలసంపన్నుడు, భయంకరయుద్దాల్లో నేర్పరి, మూడలోకాల్లో ప్రఖ్యాతచరిత్ర కలవాడు, స్వచ్చమైన కాంతిమంతమైన అలంకారాలు కలవాడు, విదర్భప్రభువైన భీష్మకునివైన కుమారుడు రుక్కి అనే ఇతణ్ణి చూడమ్మా!

జింక కన్నులవంటి తళుకు బెళుకులుగల కన్నులున్న ఓ ఉషా! ఈయన శత్రు సైన్యాన్ని రణరంగంలో చెండాడేవాడు. శత్రురాజుల చతురంగబలాన్ని తన పరాక్రమంతో జయించిన మహాయశస్వి - కాళింగుడు సుప్రసిద్దుడు. అట్టి వీరాగ్రేసరుణ్ణి చూడమ్మా!

ఈశ్వరుణ్ణి మెప్పించి మహాశక్తిమంతమైన శూలాన్ని పొందినవాడు, ప్రపంచంలోని రాజుల్లో మిక్కిలి పరాక్రమవంతుడు, యుద్దొత్సాహుడు, భూదేవిమనుమడు అయిన ప్రాగ్జ్యోతిషపురప్రభువయిన భగదత్తుణ్ణి చూడవమ్మా! పద్మముఖీ!

శ్రీమన్నారాయణుడు ధరించే ఖడ్గం, చక్రం, శంఖం, గద మున్నగు చిహ్నాలు తానూ ధరించి, వాసుదేవుడనే పేరుగల శ్రీకృష్ణుణ్ణి ఎల్లపుడు ద్వేషించేవాడు, కాశీరాజుకు స్నేహితుడు అగు ఈ పౌండ్రక వాసుదేవుడు అనే కుతూహలంతో చూడమ్మా! చంద్రముఖీ!

బ్రాహ్మణుల సేవ; సత్యవ్రతం, సత్ప్రవర్తన, బాహుగర్వం, బుద్ది, విజయాటోపం, ధనుర్విద్యా నైపుణ్యం కలిగి, చంద్రవంశ ప్రదీపకులైన ధర్మరాజును, భీముణ్ణి, అర్జునుణ్ణి, నకుల సహదేవుళ్లను చక్కగా చూడు - రాజకుమారి!

కమలాక్ష! తన పరాక్రమంతో శత్రురాజులను అణచివేసి కప్పాలు తీసుకొనేవాడు; మహాప్రతాపసంపన్నుడూ, రారాజు అనే కీర్తిని పొందినవాడు అయిన, తన సోదరులతో కూడిన దుర్యోధనుణ్ణి జూడు.

ఈ విధంగా రాజులందరిని చూపుతూ, యదువంశంలో జన్మించిన శూరసేనుడు, వసుదేవుడు, ఉద్ధవుడు మొదలగువారిని చూపింది. ఇంకా

రాక్షస రాజకుమారి! శరత్కాలమందలి మేఘంవలె, పచ్చకర్పూరంవలె, చంద్రునివలె, వెన్నెలవలె, చందనంవలె, శోభిస్తున్న ఈతడు బలరాముడు. ఉత్తమనాయకుడు, మదించిన శత్రురాజులనే కాననానికి అగ్నిదేవునివంటివాడు. ప్రలంబరాక్షసుణ్ణి సంహరించినవాడు, హలాయుధుడు. ఇతణ్ణి చూడవమ్మా! ఉషాకన్యా!

రాక్షసరాజకుమారీ! కంటికి ఇంపైన శరీరసౌందర్యంగలవాడు, పద్మపత్రాలవంటి విశాలనేత్రాలు గలవాడు, పవిత్రమైన నడవడిక కలవాడు, ఎల్లప్పుడూ సత్యమే సంకల్పంగా గలవాడు, రాక్షసులను సంహరించడంలో ఉగ్రస్వరూపుడు, శివునిచే నమస్కరింపబడేవాడు, ఆదిశేషునిపై పవ్వళించినవాడు, వక్షఃస్థ్స
లంలో కౌస్తుభమణిని ధరించినవాడు, గంభీరమైన కంఠస్వరంతోపాటు గంభీరంగా, మధురంగా మాట్లాడేవాడు, ఆశ్రితుల్ని రక్షించేవాడు, నల్లని మేఘంవంటి శరీరకాంతి గలవాడు, దుష్టశిక్షణ చేసినవాడు, పీతాంబరమనే పచ్చని పట్టువస్త్రాన్ని ధరించినవాడు, పాపాలనే రోగాలకు ఔషధమిచ్చే వైద్యుడు(భవరోగ వైద్యుడు), ఉపనిషత్తులచే తెలియదగినవాడు, దివ్యులైన మునులచే కీర్తింపబడినవాడు, తన పాదస్పర్శచే ఈ భూమిని పవిత్రీకరించినవాడు, నిత్య జయశీలుడు, సద్గుణాలచే అలంకరింపబడినవాడు అయిన ఈ శ్రీకృష్ణుణ్ణి చూడవమ్మా ఉషాకుమారీ!

కోమలీ! ఈయన రుక్మిణీసుతుడయిన ప్రద్యుమ్నుడు. తన వింటినారి నుంచి విడువబడిన పుష్పబాణాల తాకిడిచే బ్రహ్మాదిదేవతలను చలింపజేయగల్గిన మన్మథుని అవతారమే ఈ ప్రద్యుమ్నుడు. చూడవమ్మా చూడు!

ఈ విధంగా బలరామకృష్ణ ప్రద్యుమ్నుల్ని చూపగా

స్త్రీలలో శ్రేష్ఠురాలైన ఉషాకుమారి కృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుణ్ణి సాలోచనగా చూచి, వెంటనే తనను వరించి, ప్రేమించి వెళ్లిన సుగుణవంతుడు ఇతడేనని మనస్సులో సందేహించి, ఆ తర్వాత పద్మపత్రనేత్రుడైన, అపర మన్మథాకారుడైన అనిరుద్దు డనే పేరుకలవాణ్ణి కనులు విప్పిచూచి సంతాపంతో ఇలా అన్నది.

చిత్రరేఖా! నా మానధనం అంతటినీ దొంగిలించిన వీనిస్వరూపాన్ని చిత్రించి చూపావు. పుణ్యస్వరూపిణివైన నిన్ను ప్రశంసించే నేర్పు నాకుందా? నీ చరిత్రలు నాకు కొత్తకాదు. ఈ వీరునికులాన్ని, పరాక్రమాన్ని నాకు తెల్పుము.

చిత్రరేఖ రాజకుమారి అయిన ఉషతో ఇలా చెప్పింది. ఈ బాలుడు యాదవ వంశమనే అమృత సముద్రానికి చంద్రునివంటివాడు. శ్రీకృష్ణునియొక్క మనుమడు గొప్పనడవడిక కలవాడు. మిక్కిలి అందగాడు, సింహ శరీరుడు. ఈయన పేరు అనిరుద్ధుడు.

అని చెప్పి నేను మిక్కిలి వేగంతో వెళ్లి ఆ కుమారుణ్ణి తీసుకొనివస్తాను. అందాకా నీవు విచారించకు మనిపల్కి ఆ క్షణమే ఆకాశయానంలో వెళ్లి ఎదుట

ఎల్లప్పుడూ శుభాలతో నిండిందీ, తనను చూచినంతనే సంసారదుఃఖాల్ని తొలగించేదీ, ముక్తిసాధనమైందీ, పుణ్యతేజస్సును కలిగించేదీ అయిన శ్రీకృష్ణుని ద్వారకానగరాన్ని చిత్రరేఖ కళ్లారా చూచింది.

ద్వారకానగరాన్ని చూచి, దాని సుందరత్వానికి చాలా సంతోషించింది. రాత్రి సమయంలో ద్వారకలో ప్రవేశించింది. అక్కడ స్త్రీల పాదాలకుగల మణులు పొదిగిన అందెలయొక్క రుణరుణధ్వనులతో ప్రతిధ్వనించే మణిగోపురాలున్నాయి. ఆ నగరంలోని మేడపైనున్న చంద్రకాంతశిలాభవనంలో హంసతూలికాతల్పం పై రతిసుఖశ్రమవల్ల నిద్రిస్తున్న అనిరుద్దుణ్ణి తన యోగవిద్యావిశేషంతో గ్రహించి, ఉషాసుందరీ భవనానికి చేర్చి, అందు ఆమెశయ్యపై పరుండబెట్టి చిత్రరేఖ ఇలా అంది.

ఉషా! మేరుపర్వతంతో సమానమైన ధైర్యవంతుడు, పరాక్రమవంతుడు, నవమన్మథుడు, సముద్రునివలె గంభీరమైనవాడు, శత్రువీరుల్ని సంహరించేవాడు, అయిన నీపతి అనిరుద్ధకుమారుణ్ణి చూడు.

చెలిపలుకులకు ఉష మనస్సులో ప్రేమకలిగింది. శరీరంలో పులకాంకురాలు కలిగాయి. సంతోషంవల్ల కళ్లనుండి నీరు కారసాగింది. ముఖంలో కాంతి అతిశయిస్తుండగా

ఉషమనస్సుకు సంతోషం కాగా చిత్రరేఖను చూచి ఈ విధంగా పలికింది.

ఓ చిత్రరేఖా! నీ స్నేహమనే సూర్యకాంతిచే నా మన్మథతాపం అనే చీకటి నశించింది. నీ సఖిత్వం అనే ఓడను ఆధారం చేసుకొని మిక్కిలి ఎడబాటు అనే సముద్రాన్ని దాటాను. నీ సంబంధం అనే అమృతవర్షంచేతనే మన్మథతాపాన్ని ఆర్పినాను. నీ స్నేహమనే అంజనంవల్ల నా ప్రియుడు అనే నిధిని కనుగొన్నాను. ఆకారాన్ని చూచిన వెంటనే చిత్రాన్ని చిత్రింపకలవారుగానీ, ఔనని అంగీకరించిన వెంటనే తీసుకొనివచ్చేవారు కానీ ఎవరైనా ఉందురా? నీటిలో దారిని ఏర్పరచడం, నీకుతప్ప ఆ స్వర్గమర్త్యపాతాళలోకాలలో ఎవ్వరికైనా సాధ్యమౌతుందా?

అని చిత్రరేఖను ప్రశంసించి, ఆమెను ఆమెభవనానికి వెళ్లవలసిందిగా చెప్పిపంపింది. తరువాత ఇతరులెవరూ ప్రవేశింపలేని భవనంలో అనిరుద్ధుడు మేల్కొని ఉషను చూచాడు. అప్పుడు

అందమైన, సుకుమారమైన సెజ్జపై బిగికౌగిలింతలు, సరసపు మాటలు, భావాలు, కళలూ - వీటియందలి నేర్పు తగినట్లుగా, మదనకళాతంత్రజ్ఞుడైన అనిరుద్ధుడు ఉషాకన్యతో శృంగారలీలావిలాసాలను అనుభవించాడు.

ఈ విధంగా మనస్సును హరించే ఆభరణాలు, పూలదండలు, మైపూతలు, షడ్రసోపేతభోజనాలు, కర్పూరతాంబూలాలు, ఆటలు, పాటలు, అగరుధూపాలు, మణిదీపాలు, వీణావాదనలు మున్నగువానితో సూర్యోదయాస్తమానాలు తెలియనంతగా ఒక్కటై కాలం హాయిగా గడిపారు.

(ఉపభోగములు : 1. అనుభవం 2. ఆస్వాదించుట 3. తినుట 4 వినియోగించుట 5. సంభోగం 6.విషయసుఖం.)

ఈ విధంగా కాలం మిక్కిలి వేగంగా గడుస్తుండగా ఉషాకన్యకు గర్భమేర్చడి చిహ్నాలు స్పష్టంగా కన్పించాయి.

రాణివాసపు కావలివారు ఉషాబాలలో కన్పించే గర్భచిహ్నాలు చూశారు. భయపడ్డారు. ఈ రాజకుమార్తెకు గర్భం ఏ విధంగా కలిగింది అనుకొంటూ బాధపడ్డారు.

ఏ విధంగా జరిగిందో అని తమలో తాము గుసగుసలాడుకొంటూ, ఈ విషయాన్ని తప్పక ప్రభువగు బాణాసురునికి చెప్పాలి అనుకొని, ప్రభువగు బాణాసురుని వద్దకుపోయి సవినయంగా నమస్కరించి

రాక్షసప్రభువైన బాణునితో కావలికాచే భటులు ప్రభూ! మేము కన్యాంతఃపురాన్ని ఎంతో రహస్యంగా, జాగ్రత్తగా కనిపెట్టి పరిశీలిస్తూ ఉంటాము. సురారీ! అందు పోతుటీగలకైనను ప్రవేశించడం కష్టం కాగా ఇక కొత్త మగవారి విషయం చెప్పడానికి వీలులేదు.

జాగ్రత్తగా కాపలాకాస్తున్నా ఏ కనుకట్టోకాని మాకెవ్వరికీ తెలియకుండ, మీ కుమార్తె గర్భవతి అయింది అనేమాటలు విన్నబాణుడు కోపోద్రిక్తుడై

ఆ సమయంలో రాక్షసశ్రేష్ఠుడైన బాణాసురుడు కోపంతో భయంకరుడై చెక్కిళ్లు అదరుతుండగా, కనుబొమలు ముడివడుచుండగా కండ్లనుండి నిప్పురవ్వలు రగులుతుండగా జూలు లాగిన సింహంవలె దాటుతూ ఖడ్గాన్ని ధరించి, ఉష భవనంలోకి మహావేశంతో ప్రవేశించి.

బాణాసురుడు అనిరుద్ధుని నాగపాశబద్దుని జేయుట







Ushaaniruddha Sahithudai Krishnudu Dwarakapuri Karuguta - ఉషానిరుద్ధ సహితుడై కృష్ణుడు ద్వారకాపురి కరుగుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం -  ఉషానిరుద్ధ సహితుడై కృష్ణుడు ద్వారకాపురి కరుగుట బాణుడు తన రాజధానీ నగరానికి వెళ్ళి, ఉషానిరుద్దులకు వ...