Saturday, February 21, 2026

The Battle Between Boar Varaha Avatar and Hiranyaksha - హిరణ్యాక్షుండు యజ్ఞవరాహంబగు హరినెదిరించి పోరుట

హిరణ్యాక్షుండు యజ్ఞవరాహంబగు హరినెదిరించి పోరుట

నారదుడు పాతాళానికి పొమ్మని చెప్పగానే హిరణ్యాక్షుడు అగ్గిలాగ మండి పడ్డాడు. విష్ణువుతో తలపడి తీరాలని భావించి పెద్దగద నొకదాన్ని చేత తాల్చాడు. తన భుజబలాన్ని ప్రదర్శించాలని విర్రవీగుతూ భీకరరూపంతో పాతాళానికి వెళ్ళాడు.

హిరణ్యాక్షుడు పాతాళం ప్రవేశించి నీటి మధ్య

సురవైరియగు హిరణ్యాక్షుడు పాతాళంలో స్వామిని నిగాగా చూచాడు. ఆయన విస్తారమైన కోరలతో వెల్గుతున్నాడు. భూమిని ఉద్దరించటానికి పూని ఉన్నాడు. మొయిలువన్నెతో నిక్కపొడుచుకున్న రోమాలతో యజ్ఞవరాహరూపాన్ని ధరించిన దేవవిభుణ్ణి చూశాడు.

హిరణ్యాక్షుడలా ఎత్తి వచ్చిన సందర్భంలో 'సూకరాకృతిధరించిన' శ్రీహరి కూడా

మహావిష్ణువు తామరకాంతిని గుత్త బుచ్చుకొన్న తన చూపుల తీవ్రతచేత రక్కసుని శారీరకవిజృంభణాన్ని ఒక్కపెట్టున మటుమాయం చేశాడు.

అప్పుడా యజ్ఞవరాహస్వామి అపారవిక్రమంతో విచ్చలవిడిగా చక్రభ్రమణం చేస్తున్నాడు. ఆ విహారం ఎదురులేనిది.

ఆ ఆదివరాహం రాక్షసుని గుండెలు గుభేలు మనేట్లు యుద్ధోత్సాహంతో కొంతసేపు ముట్టెతో అంచులు మూలాన్ని సోకేటట్లు కులపర్వతాల్ని చిమ్మింది. బ్రహ్మాండభాండం పగిలి చిల్లులు పడేట్లు కొమ్ములతో జీరాడింది. సప్తసాగరాలు బురదలాగ గజిబిజి అయ్యేట్టు తనగిట్టలతో ఇంకిపోయేట్లు గోకుతుంది. తన తోకను తిప్పుతూ చంద్రుణ్జీ సూర్యుణ్ణీ ఒక మూలకు నెట్టివేస్తున్నది. గునగున నడుస్తుంది. ఊపిరి బిగబట్టి ఎగిసిపడుతుంది. ఎగిరి దాటుతుంది. విజృంభిస్తుంది. పైకొంటుంది. బొరకలుపడేట్లు నేలని బరుకుతుంది.

ఆ తర్వాత ఇంకా,

ముట్టెపై భూమిని ధరించి కళ్ళల్లో నిప్పులు చెరుగుతూ ఆ యజ్ఞవరాహం రక్కసునికి ఎదురుపడింది. ఆ రక్కసుడు దాన్ని చూచి 'ఇది అడవిజంతువు గదా జలచర మెట్లైందో' అనుకొన్నాడు.

'వనచరం జలచరమైందే' అని సంభ్రమాశ్చర్యాలు పొందిన హిరణ్యాక్షుడు, రాక్షసులపొగరు అణచగల ఆ యజ్ఞవరాహరూప మెత్తిన విష్ణువుతో ఇట్లన్నాడు.

ఓ తెలివిలేని వరాహమా! నేను బ్రహ్మవల్ల రసాతలగతమైన ఈ భూమిని వరదానంగా పొందాను. ఇది ఎప్పటికైనా నాదే. అని రాక్షసుడు విష్ణువుతో అన్నాడు.

ఓయీ! నీవు భూమిని లేపుకొని పోవద్దు. ఇక్కడే వదలిపెట్టు. కాదు కూడదని పెకలించి తీసికొని పోవాలని ప్రయత్నిస్తే నీ ప్రాణం తీస్తాను. నా మాట విను. ఎందుకు నీ కంత పట్టుదల?

ఏదో నీ మోసబుద్ధితో ఇప్పుడు ఈ భూమిని దొంగిలించుకొని పోవాలనుకున్నావేమో, దాన్ని చూస్తూ ఊరుకోను. నా భుజబలంతో నిన్ను అణచి మట్టు పెడతాను అన్నాడు అసురుడు.

ఓరీ! యోగమాయవల్ల దక్కిన మగతనం నీది. ఒక్కపెట్టున నీ బలాన్ని అణచివేసి, మా సంగడికాండ్రకు, సేవకులకు, మా కులానికంతటికి సంతోషం గొల్పుతాను. నీ బలం ఉడిగి నా గదదెబ్బ రుచి చూచిన నీ దేవతలెల్లరు బిక్కుమంటారు. చచ్చి చెడతారు అని ఇట్లు వదరుతున్న రక్కసుని మాటలు విని ఆ యజ్ఞవరాహస్వామి బ్రహ్మాదిసురలకు రాబోయే ఉపద్రవాన్ని పసిగట్టి, అప్పుడా భూదేవిని తన వాడికోరపై మోపి విలసిల్లాడు.

వరాహస్వామి రక్కసుని దుం
దుడుకు మాటలకు రెచ్చిపోయి 'గజరాజు భయభ్రాంతమైన తన ఆడఏనుగును పొదువుకొన్నట్లు' భూమిని ముట్టెపై నిల్పి విలసిల్లాడు.

వరాహస్వామి దంతకాంతులు ఆకాశాన్ని వెల్గిస్తున్నాయి. అప్పుడాయన పాతాళంనుండి బయలుదేరాడు. అంతభయంకరా కృతి ధరించిన ఆ విష్ణుమూర్తి వెనుక - రాక్షసుడు వస్తూ -

గజరాజును పట్టుకోబోయే మొసలిలాగ ఆ రక్కసుడు శ్రీమన్నారాయణుని వెంటబడ్డాడు. ఆ స్వామి సముద్రాన్ని తరించివస్తున్నాడు. గిట్టల్తో మేరునగాన్ని సైతం ఎగురమీటగలసత్తువగలవాడు. వరాహరూపాన్ని ఎత్తివున్నాడు.

ఇది అవమానమే అనుకోకుండ, సిగ్గువిడిచి, మోసంతో యుద్ధం చేసి, విజయాన్ని కైవసం చేసుకోవాలనుకొన్నావు. ఇక్కడేమో పిరికివానిలాగ కాలికి బుద్ధి చెప్పావు. ఇది వీరలక్షణమా? (కాదనిభావం).

హిరణ్యాక్షు డిలా ఎదిరించి మాట్లాడగా, శ్రీహరి మనసు కోపంతో ఉడికిపోతూ,

అప్పుడా వరాహస్వామి నీటిపై భూమిని నిల్పి దానికి ఊతగా, తనబలాన్ని అడ్డుపెట్టాడు. దేవతలు ఆనందించారు.

అప్పుడు బోరుమని పూలవాన కురిసింది. వైభవంగా సురభేరులు మ్రోగాయి. గంధర్వుల పాటలు విన్పించాయి. అచ్చరలేమలు ఆనందంగా నాట్యమాడారు.

యజ్ఞవరాహావతారుడైన ఆ శ్రీమన్నారాయణుడు బంగారుపోగులు, భుజకీర్తులు, హారాలు, కాళ్ళకు కడియాలు, వేళ్ళకు ఉంగరాలు మొదలైన ఆభరణాలు ధరించి అసురునితో తలపడడానికి సిద్ధమైనాడు.

చేతబుచ్చుకొని మణులు తాపిన సరికొత్త బంగారుకవచం ధరించిన రాక్షసుడు ప్రయోగించిన వాడిబాణాలు స్వామివారి అంతరింద్రియాల్ని సోకుతున్నాయి. వాడు చెలరేగి ముందుకువస్తుంటే, ఆయన కోపావిష్టుడయ్యాడు.

రాక్షసుని దురుసుమాటలకు, వేసిన వాడిబాణాలకు స్వామికి కోపం కల్గింది. కాని ఆయన నవ్వుతూ ఇలా అన్నాడు.

ఓరి దుష్టుడా! నీవు మహా దురహంకారివై నన్ను ఎల్లప్పుడు 'అడవిజంతువా!' అని కారుకూతలు కూస్తుంటావు. నీవన్నట్లే నేను అడవిమెకాన్నే. అయితే పొలికలని(యుద్ధభూమి)లో నా ధాటికి ఆగి నిల్చిన నీవంటి కుక్కల్ని ఈ రోజే మట్టుపెడతా.

ఓరీ దుర్మార్గుడా! నీకు సత్తావుంటే నాతో పోటొడ్డి యుద్దానికి సిద్ధపడు. నేటితో నీ కోర్కెను నెరవేరుస్తాను. అంతేగాని మాటిమాటికి నీ గొప్పలెందుకు చెప్పుకుంటావు?

ఓరీ రాక్షసాధమా! ఆ మాటలన్నీ కట్టిపెట్టి విను. యుద్ధకోవిదులైన ఎందరో మహాత్ములు మిత్తికోరల్లో చిక్కిన వారైనను నీ మాదిరి ఇలాగా తమగొప్పలు చెప్పుకోరు. ఎందుకు నీకీ సొంతపొగడ్తలు? అది వీరుల ప్రజ్ఞలవుతాయా? (కావని భావం)

అరె దేవ విరోధీ! ఇదిగో చూడు. పాతాళంలో వుందంటున్నావే - ఆ నిధిని మహాపరాక్రమంతో కైవసం చేసుకొంటాను. నన్నేదో సిగ్గులేని వానిగా నీ వంటున్నావు. కానిమ్ము,దాక్కొని నీతో కయ్యమాడుతాను. నీ గదను చూచి పరుగెత్తానంటున్నావు గదూ! సరే నన్నెదిరించి చూడు-నీ కోర్కె వేగంగా నెరవేరుతుంది.

ఓ రాక్షసా! నీవీ కాల్బంట్లకు నాయకుడవు. ఈ యుద్ధరంగంలో పోటుమగాడవై నన్నెదిరిస్తే తప్పక నీ ఉసురు తీస్తాను. నీ బలాన్ని అణచి వేస్తాను. నా పరాక్రమంతో నిన్ను హతమార్చి 'భూమిలో రక్కసులు లేకుండా చేస్తాను. ఇదే నా ప్రతిజ్ఞ' అన్నాడు వరాహస్వామి.

రక్కసికులంలో అధముడైన ఓరీ! యుద్ధరంగంలో నన్నెదిరించే మొనగాడవైతే రా. నీ పరాక్రమం, ధైర్యం, బలిమి ఉంటే ప్రదర్శించు. నీ స్నేహితుల కన్నీళ్ళు తుడవగల పోటు మానిసివైతే రా. నాతో తలపడు- ఈ వ్యర్థపు మాటలు ఎందుకు? (వదరుబోతు కూతలు మాని నాతో కయ్యానికి దిగుమని వరాహస్వామి రక్కసుని గద్దించాడు).

'నిన్నిక్కడే పాతిపెడతా' నన్నావు. నిజంగా నీ వంతటివాడవే. ఇదో ముందుగానీవు నీ ప్రియమైన బంధువులందరిని చూచిరా. యమలోకానికి కాపురం చేయటానికి పోవలసి ఉంటుంది. నీ ప్రియమైన బంధువులందరిని చూచిరా అని వరాహస్వామి రాక్షసుణ్ణి గేలి చేశాడు.

పద్మలోచనుడైన వరాహస్వామి 'యమపురి కేగుటకు సిద్ధంగా ఉండిమని గేలిచేయగానే ఆ రక్కసుడు కోపోద్రేకంతో రేగిన మనస్సుగలవాడై తోకద్రొక్కిన సర్పరాజులాగా మండి పడ్డాడు.

వరాహస్వామి పల్కులకు హిరణ్యాక్షుని అవయవాలన్నీ జలదరించాయి. వాడు బుసకొడుతూ, కోపావేశంతో రెప్పలు ముడివడిగా సాహసించి హరి నెదుర్కోడానికి ముందుకు వచ్చాడు.

ఆలాంటి వేళలో హిరణ్యాక్షుడు అతి భీకరాకారంతో, కోపంతో గదని ఝుళిపించి శ్రీహరిని కొట్టబోయాడు. హరి ఆ గద వేటుని తప్పించుకొని తన గదతో వాని గదను తుత్తునియలు చేశాడు. అప్పుడా రక్కసుడు దుర్మదుడై వేరొక గదతో స్వామిపై విజృంభించాడు.

హిరణ్యాక్షుడు ప్రయోగించిన గద వేటును తప్పించుకొన్నాడు వరాహస్వామి. తర్వాత తన గదాయుద్ధకౌశలంతో ఆ రాక్షసుని రొమ్ముపై ఒక్క బలమైన దెబ్బకొట్టాడు. ఆ గద తాకిడికి వాడు కొంతసేపు మతిదప్పిపడి, అంతలోనే తేరుకొని శత్రుహంతయైన శ్రీహరిపై తన గదను సారించాడు.

వరాహస్వామి హిరణ్యాక్షు లిర్వురు విజయేచ్చతో యుద్దానికి సన్నద్దులయ్యారు. వారిర్వురి కయ్యం ఉవ్వెత్తుగా లేచిన అలలతో కూడిన ఉత్తర దక్షిణ సముద్రాలు ఢీకొన్నట్లుంది. రెండు మదపుటేనుగులు తమ తొండాలతో తాడించుకొన్నట్లుంది. కోపావేశంతో రెండు పెద్దపులులు తలపడినట్లుంది. పోతరించిన రెండు ఎడ్లు రంకెలువేస్తూ కుమ్ములాడినట్లుంది. ఆ వీరులిర్వురు సింహాలవలె విజృభించి పోరు సల్పుతున్నారు. హిరణ్యాక్షుడు ఎడమనుండి చుట్టుకొని రాగా, వరాహస్వామి కుడినుండి చుట్టి, పిడుగుపాటును పోలిన కౌమోదకితో వాని రొమ్ముపై బలంగా కొట్టాడు. ఆ రాక్షసుడు దెబ్బసోకి స్పృహనుండి కోలుకొని శ్రీహరి నొసటిని గట్టిగా గాయపరిచాడు. ఇట్లా ఇరువురు నెత్తురు చిమ్మే శరీరాలతో పుష్పించిన అశోకవృక్షాల్ని తలపించారు. ఒకరిపై నొకరు మిడిసిపడుతూ, రోజుతూ, రొప్పుతూ, కొట్టుకుంటూ, ఒండొరుల రక్తం వాసన చూస్తూ, తిట్టుకొంటూ, గేలిచేస్తూ యుద్ధం చేస్తున్న సమయంలో, ఆ వేడుక చూడాలని బ్రహ్మ మునుల్ని సిద్ధ సాధ్యుల్ని తక్కిన దేవతల్ని వెంటబెట్టుకొని అక్కడికి వచ్చాడు. భూమాతకొరకై రక్కసునితో తలపడుతున్న యజ్ఞవరాహస్వామితో ఇట్లన్నాడు.

'ఓ దివ్యమంగళమూర్తీ! పరమాత్మా! ఈ దుర్మార్గుడైన రాక్షసుడు మేమిచ్చిన వరగర్వంతో లోకుల్ని బాధిస్తున్నాడు. ఇలాంటి దుశ్చరిత్రుని మట్టుపెట్టకుండ వదలటం మంచిది గాదు. వీనిని భూదేవికి శుభం కలిగించు అని బ్రహ్మ శ్రీవరాహస్వామిని వేడుకొన్నాడు.

"కళ్యాణదాయకా! పరమాత్మా! చిన్నపిల్లవాడు భయంకరమైన పాముని చేతపట్టి ఆడినట్లు, ఈ రక్కసుణ్ణి ఇంకా చంపకుండా ఉపేక్షించటం తగునా?” అని బ్రహ్మ అన్నాడు.

అంతేగాక, ఇంకా, మహాత్మా! 'అబిజిత్తు' అనే పేరుగల యీ కాలంలోనే ఈ దైత్యుని మట్టు పెట్టండి. ఈ ముహూర్తం తప్పితే అసుర సంధ్యాసమయం వస్తుంది. అప్పుడు మాయాబలశాలియైన వీనిని చంపటం తేలిక కాదు. అందువల్ల మంచివారిని కాపాడుట యందాసక్తిగల మీరు వీనిని యిప్పుడే మట్టుపెట్టండి.

(అభిజిత్తు : ఒక నక్షత్రం, రోహిణికి ప్రక్కనే ఉంటుంది. దక్షుని కూతురు. చంద్రునికి భార్య. అందరికంటెతానే చంద్రునికి అతి ప్రియమైన భార్యకావాలని తలంచి తపస్సుచేసింది. ఆ సమయంలో ఆమె స్థానంలో కుమారస్వామి 'అగ్నిదైవత్య'మనే వేరొక నక్షత్రాన్ని నిల్పాడు. 'అభిజిత్తు'ను శుభలగ్నంగా వైదికులు భావిస్తారు.

పగలు పదునాల్గు గడియలమీద రెండుగడియల కాలాన్ని అభిజిత్తు అంటారు. (శ, ర). సహజంగా నక్ష్మత్రాల సంఖ్య 27. అశ్విన్యాదులు. కాని కార్తాంతికులు 'అభిజిత్తు'ను 28వ నక్షత్రంగా గుర్తిస్తారు.)

బ్రహ్మ 'స్వామీ! అభిజిల్లగ్నంలోనే వీనిని చంప'మని చెప్పగానే అక్కడ మూగిన దేవతలు విని ఆనందించారు. అప్పుడా స్వామి ముఖపద్మం వికసించింది. ఆయన రక్కసుని కెదురై నిలిచాడు.

సహజంగా శ్రీమన్నారాయణుని కళ్ళు తెల్లదామరల్ని పోలి ఉంటాయి. కాని ఇప్పుడు కోపావేశం చేత కొత్తగా విచ్చిన ఎర్రదామరలను పోలివున్నాయి. ఆ స్వామి గొప్పగదతో రక్కసుని చెక్కిలిపై ఒక్క దెబ్బ కొట్టాడు. వాడు ప్రక్కకు తొలగిపోయాడు.

అప్పుడా దితిబిడ్డడైన హిరణ్యాక్షుడు పరుగెత్తిపోయి ఒక భయంకరమైన గదతో తన భుజబలాన్ని ప్రదర్శిస్తూ శ్రీహరి గదను మొత్తాడు- అది పోయి సముద్రంలో పడింది.

అంతలో ఏమిజరిగిందనగా...

తన గదతాకిడికి వరాహస్వామిగద సంద్రంలో పడింది. స్వామి నిరాయుధుడయ్యాడు. రాక్షసుడు యుద్ధనీతిని స్మృతికి దెచ్చుకొని స్వామితో పోరాడటం మానుకొన్నాడు. అప్పుడాకాశంలో దేవతల ఆర్తనాదాలు బోరుమన్నాయి.

ఆ రక్కసుని యుద్ధనీతికిని, వాని ప్రతాపాతిశయానికి వరాహస్వామి ఆశ్చర్యం చెందాడు. ఆయనలోకూడ ఉత్సాహం అతిశయించింది.

యజ్ఞవరాహస్వామి భూమిని ఉద్ధరించినవాడు. ఇక రక్కసునిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించాలనుకొన్నాడు. ఆ చక్రం దితి సంతానమనే అడవిని కాల్చివేయగల కాంతిగలది. చూపరుల జయ నాదంతో ప్రతిధ్వనించే సూర్యమండల సదృశమైంది. నిరంతరం శరణుజొచ్చిన వారిని కాపాడగలది. విశ్వమంతటికి రక్షణ నివ్వగలది.

ఆ వరాహస్వామి ఎత్తిన సుదర్శన చక్రం మధ్యాహ్న సూర్యమండలకాంతివంటి కాంతితో మిరుమిట్లుగొల్పింది. దాని నుండి ఎగిసిన మంటలతాకిడికి మదించిన శత్రువుల పరాక్రమమనే చీకట్లు పటాపంచలయ్యాయి. సహింప నలవికాని దాని 'కహ కహ' శబ్దం సముద్రఘోషనే అణచినట్లయింది.

దాని వైభవాన్ని దేవతలెల్లరు ప్రస్తుతించారు. దాని కాంతి యింతింత అని చెప్పలేము. దాని తేజస్సు రోదసినంతటిని ఆవరించింది. అది అతి వేగంగా వచ్చి ఆ యజ్ఞవరాహస్వామి కుడిభుజాన్ని అలంకరించింది. అప్పుడాయన చక్రధారియై దేవతలెల్లరు 'జయశబ్దం' చేస్తుంటే రక్కసునికి ఎదురు నడిచాడు.

హిరణ్యాక్షుడు తనకెదురుగా వస్తున్న చక్రధారిని చూచి, వీరభటుని లాగ ఎదిరించి నిలిచి, ఒక పెద్దగదతో ఆ స్వామిని కొట్టాడు.

హిరణ్యాక్షుడు సారించిన గదను వరాహస్వామి ఒక్కకాలితాపుతో పక్కకు నెట్టాడు. ఆయనలో ఆనందం పెల్లుబికింది. మొగంపై చిర్నగవు తాండవించింది.

రక్కసుని గదను అలవోకగా కాలితో తన్ని వరాహస్వామి వానితో ఇలాగ అన్నాడు.

"ఓరీ నీచరాక్షసా! గద చేతబుచ్చుకొని యుద్ధరంగంలో నన్నెదిరింప రారా?” అని వరాహస్వామి రక్కసుని పిలిచాడు. వా డా మాటకు తెగ గర్వించి తన గదని స్వామిపై ప్రయోగించాడు. అప్పుడా హరి గరుత్మంతుడు పామును పట్టుకొన్నట్లు పట్టుకొన్నాడు.

దితికుమారుడైన హిరణ్యాక్షునికి బలాఢ్యుడైన వరాహస్వామిని ఎదిరించడం సాధ్యం కాదని తెలుసు. అయినా వాడు గర్వంతో స్వామి నెదుర్కొన్నాడు.

అంతలో

అప్పుడా రక్కసుడు ప్రళయకాలాగ్నిజ్వాలవలె ధగధగ మెరుస్తున్న ఒక శూలం చేబూని యజ్ఞవరాహావతారుడైన శ్రీమహావిష్ణువుపై విసిరాడు - అది బ్రహ్మజ్ఞుడైన సద్బ్రాహ్మణునిపై ప్రయోగించే హింసాకర్మ యోగంవలె వ్యర్థమైపోయింది. అలా చచ్చుబడి వస్తున్న ఆ శూలాన్ని స్వామి 'ఇంద్రుడు వజ్రాయుధంచేత గరుడుని రెక్కల్ని ఛేదించినట్లు' ఒక్కవ్రేటున తన చక్రాయుధంచేత తుత్తునియలు చేశాడు.

ఆ సమయంలో తనశూలం సుదర్శన చక్రంచేత పతనమైంది. రాక్షసుడది చూచాడు

అప్పుడా హిరణ్యాక్షుడు కోపావేశంతో శ్రీహరిని ఒక్క పిడికిటిపోటు పొడిచాడు. పూలమాల తాకిడివల్ల గజరాజులా వరాహమూర్తి కలతచెందక విరాజిల్లాడు.

హిరణ్యాక్షుడు శ్రీయజ్ఞవరాహస్వామి పైన వేలకొలది మాయలు పన్నాడు. భూమినుండి లేచిన దుమ్ము చీకట్లు కమ్మినట్లయింది. ఆకసం నుండి మేఘాలు పెద్దపెద్దబండలు, పెంటప్రోవులు, మూత్రం, గబ్బుకొట్టే ఎముకలు, నెత్తురులను కురిపించాయి. అప్పుడు గొప్ప ఉపద్రవసూచకమైంది

ఇంతేకాదు.

ఆకాశంలో నిలబడిన భూతాలు, దయ్యాలు, స్త్రీ పిశాచాలు జుట్లు విరబోసుకొని, దిసమొలతో, కరకుకోరలతో, దవడలతో, ఎర్రని కండ్లతో దవళ్ళు తెరచుకొని శస్త్రా
స్త్రాలు తాల్చివున్నారు. యక్షదైత్య చతురంగబలాలతో కూడి పెడబొబ్బలు పెడుతున్నారు.

ఆ తర్వాత

ఆ వరాహేశ్వరుడు మూడు వేళల - (అనగా ఉదయ మధ్యాహ్న సాయం సంధ్యలలో) యజ్ఞపాదుడు. జగానికంతటికి భీతిని గొల్పే ఆ రక్కసుని మాయచేష్టల్ని అంతమొందించే ఒక అస్త్రాన్ని వానిపై విసిరాడు.

సూర్యకాంతివంటి కాంతి గల చక్రం భూమండలమంతా వ్యాపించి ఒక్కపెట్టున ఆ రాక్షసుడు పన్నిన మాయలన్నింటిని వాడు చూస్తుండగానే పటాపంచలు చేసింది.

తర్వాత ఇక్కడ దితి ఇంట ఏమి జరిగిందో చెపుతున్నాడు.

ఇక్కడ దితి తన భర్తయైన కశ్యపుని పల్కులు స్మృతికి దెచ్చుకొంది. తన కుమారుడైన హిరణ్యాక్షుని చావు ఆమె కళ్ళకు కట్టినట్లయింది. అప్పుడామె పయోధరాల నుండి నెత్తుటి చారికలుస్రవించాయి. (కన్నీటికి మారు, లేదా పాలకు బదులు- నెత్తురు స్రవించిందని భావం. ఇది దితి దుఃఖాన్ని ప్రతిబింబించింది.)

ఆ సమయంలో హిరణ్యాక్షుడు ప్రయోగించిన వందలకొలది మాయలు, చేసిన మేలు మరిచే వానికి చేసిన ఉపకారాలవలె శ్రీహరి పైన పనిచేయలేదు. నిష్ఫలమయ్యాయి. అయినప్పటికి ఆ అసుర పట్టువీడని వీరయోధునిలా హరిచెంతకు వచ్చి రెండుచేతులు సాచి ఆయన రొమ్ముమీద గుద్దాడు. అయితే ఆయన తప్పించుకొని ప్రక్కకు పోగా ఆ రక్కసుడు ఒక్క పిడిగుద్దు గుద్దాడు. కాని ఆ దనుజవైరి అలకచెందక భయంకరరూపంతో వజ్రతుల్యమైన తన అరచేత వాని మొలపై ఒక చరపు చరిచాడు. అంతట వాడు గిరగిర తిరిగి చూపుకోల్పోయి సోలిపడబోయాడు. ఎట్లో తేరుకొని చివరకు స్వామి ఎదుట నిలబడ్డాడు.

తనకోరలతో హిరణ్యాక్షుని రొమ్మును చీల్చినవాడును, వాడియైన గిట్టలుగలవాడును, బ్రహ్మాండమనే కుండను బ్రద్దలు కొట్టగలవాడును, జూలు గలవాడునునైన ఆ వరాహావతారునికి బలముడిగిన రక్కసుడు లొంగిపోయాడు.

ఇలా హిరణ్యాక్షుడు వరాహస్వామికి లొంగిపోగా.

శ్రీహరి తన వజ్రతుల్యమైన చేతితో రక్కసుని గూబ అదరగొట్టాడు. అది చూచి ఇంద్రాదులు సంతోషించారు. అప్పుడా హిరణ్యాక్షుడు కండ్లు తేలవేసి దీనుడై పెనుగాలి తాకిడికి కూకటివ్రేళ్ళతో కుప్పకూలే చెట్టులాగ నేలపై రాలిపడ్డాడు.
(యజ్ఞవరాహావతారక్రియ ఇంతటితో ముగిసింది. సనకాదులచే శాపగ్రస్తులైన జయ విజయులు భూలోకంలో రాక్షసులై జన్మించవలసి వచ్చింది. శ్రీహరి అనుగ్రహంవల్ల ఆ యిర్వురు ఆయనకు విరోధులుగా మూడు జన్మలెత్తి పోరు సలపాలి. హిరణ్యాక్ష హిరణ్యకశిపుల వధతో ఒక రాక్షస జన్మ ముగిసిపోతుంది. స్వామి వరాహావతారమెత్తి హిరణ్యాక్షుని వధించాడు. ఇక నరసింహాకృతి తాల్చి హిరణ్యకశిపుని చంపవలసి ఉంది- అంతటితో జయ విజయులకు ఒక్క రాక్షసజన్మ సమాప్తమౌతుంది.)

తర్వాత హిరణ్యాక్షుడు హరిదెబ్బకు నెత్తురు కారుతుంటే, వికారరూప మెత్తి, కనుగ్రుడ్లు పైకి ఉబికి కనపడగా, నిలబడి పండ్లు పటపట కొరుకుతూ పడి చచ్చాడు.

నేలపైకూలిన హిరణ్యాక్షుని చూచి బ్రహ్మాదిదేవతలు 'వీనికి ఏమి యీ దురవస్థ?' అని తలంచి ఆశ్చర్యపడ్డారు. తర్వాత ఇలా అన్నారు.

పరమయోగులు యోగమార్గంలో తమ పాంచభౌతికదేహాన్ని ఆ శ్రీమన్నారాయణుని స్మరిస్తూ పరిత్యజించాలని భావిస్తారు. అయితే ఇక్కడ ఈ రక్కసుడు ఆ స్వామి పిడికిటి దెబ్బతో చచ్చి ఆయన ముఖసందర్శన చేస్తూ ప్రాణత్యాగం చేశాడు. ఆతని మహిమ ఎంత గొప్పదో అని బ్రహ్మాదులు ఆశ్చర్యపడ్డారు.

ఆశ్చర్యంతో దేవతలిలా అనుకొన్నారు -

ఈ రక్కసులు మనస్సులో సమభావం గలవారు. సనకాదుల శాపంవల్ల ఇలా దౌర్భాగ్యజన్మని ఎత్తారు. ఇప్పుడు విష్ణువువల్ల వీరికి చావు కల్గింది. తర్వాతి జన్మల్లో వీరు నిరంతరం ఆ శ్రీహరి నిత్యవాసమైన వైకుంఠంలోనే ఉంటారు. ఇక వీరికి చావుపుట్టుక లుండవు.

ఆ యోగీంద్రులు అలా రక్కసుని అదృష్టాన్ని గాంచి ఆశ్చర్యచకితులయ్యారు. తర్వాత పవిత్రదేహం ధరించినవాడును, వికసించిన కమలాలవంటి కన్నులు గలవాడును, దేవతలు, మునులు, యోగులు మొదలైన వారిని రక్షించేవాడును, రక్కసులనే ఏన్గులకు సింహసమానుడును నైన శ్రీమన్నారాయణుని చూచారు.

హిరణ్యాక్ష వధను చేసిన శ్రీహరిని చూచి,

"పద్మాక్షా! ఈ భూలోకవాసుల మాయామర్మాలు నీకు బాగా తెలుసు. అసూయతో పగబట్టిన ఈ హిరణ్యాక్షుణ్ణి చంపావు. ఇకమీదట అందరికీ శుభం కలుగుతుంది." అని దేవతలందరు తమ నొసళ్ళపై చేతులుంచి గొప్పజ్ఞానంకలవాడు మరియు పుణ్యాత్ముడు అయిన శ్రీమన్నారాయణుని వినయంతో స్తుతించారు.

ఎల్లదేవతలు, మునులు, ఋషులు హరిని సుతించిన తర్వాత

యజ్ఞవరాహరూపధారియైన శ్రీహరి రక్కసుని చంపాక, బ్రహ్మ మొదలైన దేవతలు, మునులు ఆయన్ని ప్రస్తుతిస్తుంటే తన మనస్సులో ఆయన మహానంద మొందాడు. అందరికి ఉల్లాసం కల్గేట్లు అనుగ్రహంతో చూశాడు.

అదొక గొప్పవేడుక. దానికి గుర్తుగా అప్పుడు విష్ణువు వైకుంఠపురానికి తరలి వెళ్ళాడు. దేవతలభేరులు ముమ్మరంగా మ్రోగాయి. నేలపై పూలజల్లు కురిసింది. అగ్నిగుండాలు ధగధగ వెల్గాయి. సూర్యచంద్రమండలాలు దేదీప్యమానంగా ప్రకాశించాయి.

ఇది పవిత్రమైన కథ. బ్రహ్మ దీన్ని దేవతలకు చెప్పాడు. అదే కథని మైత్రేయుడు విదురునికి చెప్పటంవల్ల ప్రఖ్యాతమైంది.

ఈ కథను శుకమహర్షి మంచిమనస్సుతో పరీక్షిన్మహారాజుకు చెప్పాడు. సూతుడనే పౌరాణికుడు శౌనకాది మునులకు ఇదే కథని మనోజ్ఞంగా విన్పించాడు.

ఆ విధంగా మైత్రేయముని విదురునికి కథను చెప్పగా విని ఆయన సంతోషించాడు.

పుణ్యప్రదమైన ఈ చరిత్రను విన్నా చదివినా ప్రజలందరికి శ్రీహరి పాదసేవ, ఇహలోక పరలోకసౌఖ్యాలు, మరియు గొప్పపేరుప్రతిష్టలు చేకూరుతాయి.

మళ్ళీ సూతుడు శౌనకాదులతో ఇలా అన్నాడు.

"పరీక్షిత్తు శుకమహర్షిని చూచి మునీంద్రా! హిరణ్యాక్షుడు చనిపోయాక భూదేవి నిలకడను పాందిన విధాన్ని, స్వాయంభువమనువును పుట్టించిన తరువాత బ్రహ్మ సమస్తమైన పశుపక్ష్యాదుల్ని మానవుల్ని సృష్టించడానికి అనుసరించిన పద్ధతుల్ని మహాభక్తుడైన విదురుడు, శ్రీకృష్ణునకు అపకారం తలంచిన పాపాత్ములైన కౌరవులను వదలి వెళ్ళిపోయి, తన తండ్రియైన వేద వ్యాసునంతవాడై మనస్సు, వాక్కు శరీరం అనే త్రికరణాల్ని శ్రీకృష్ణపరమాత్మవశంచేసి, భక్తులు సేవిస్తుండగా పుణ్యతీర్థాటనవల్ల సమస్తపాపాలనుండి విముక్తుడై మైత్రేయమునిని ఏ యే ప్రశ్నలు అడిగాడో అవన్నీ తెలిసేట్లు వివరించమని పరీక్షిన్మహారాజు శుకమహర్షిని ప్రార్ధించాడు.

"వాక్చాతుర్యం గల మహాత్మా! సకల సృష్టికి మూలపురుషుడైన బ్రహ్మ ప్రజలను సృష్టించే మనువుల్ని పుట్టించాక ఇంకేమి సృజించాలనుకొన్నాడు? బ్రహ్మ సృష్టించిన మరీచి మొదలైనవారు బ్రహ్మాదేవుని ఆజ్ఞానుసారంగా ఈ విశ్వసృష్టి ఎలా చేశారు? వారు భార్యాసమేతులై ఎలాంటి సృష్టిచేశారు? భార్యా రహితులై ఎలాంటి సృష్టిచేశారు?" అని పవిత్రమైన మనస్సుగల విదురుడు మైత్రేయుని అడిగాడు.

"ఓ కరుణార్ద్ర హృదయా! వివేకజనస్తుత! మైత్రేయా! అందరూ తమలో తామైక్యం చెంది దేనిని, దేనిని సృష్టించారు? ఇవన్నీ మాకు వివరించి చెప్పండి" అని ప్రార్థించాడు.


చతుర్ముఖుండొనర్చు యక్షాదిదేవతాగణ సృష్టి దెలుపుట

Saptapadi Seven Steps in Indian Wedding - సప్తపది (ఏడడుగులు)

సప్తపది (ఏడడుగులు)

సప్తపది (ఏడడుగులు) అంటే హిందూ వివాహ వేడుకలో అత్యంత కీలకమైన, ముఖ్యమైన సంప్రదాయం. వధూవరుల వస్త్రాలను కొంగు ముడివేసి, ఈ ప్రక్రియను నిర్వహిస్తారు, ఇది వారి ఐక్యతకు సంకేతం. వధూవరులు అగ్ని సాక్షిగా ఏడు అడుగులు నడుస్తూ, ఏడు పవిత్రమైన ప్రమాణాలు లేదా వాగ్దానాలు చేస్తూ, జీవితాంతం కలిసి ఉంటామని, ఒకరికొకరు తోడుగా ఉంటామని చేసే ప్రతిజ్ఞ ఇది.

ఏడవ అడుగు పూర్తయిన తర్వాతే వివాహం పరిపూర్ణమైనట్లుగా పరిగణించబడుతుంది.

ఇద్దరు వ్యక్తులు, రెండు కుటుంబాలను ఒకటిగా చేసేదే వివాహ బంధం. హిందూ సంప్రదాయంలో జరిగే ప్రతి క్రతువుకూ ప్రత్యేకత ఉంది. కన్యాదానం పూర్తయిన తర్వాత ముహూర్తానికి జీలకర్ర-బెల్లం తలపై పెట్టించి, ఆ తర్వాత మాంగల్యధారణ చేయిస్తారు.

అగ్ని సాక్షి: అగ్నిని దేవతా స్వరూపంగా భావించి, దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు.

మాంగల్యధారణ పూర్తయిన తర్వాత వధూవరులకు కొంగుముడి కలిపి బ్రహ్మముడి వేస్తారు. వధువు చిటికెన వేలును పట్టుకుని వరుడు అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఏడు అడుగులు నడవడాన్ని "సప్తపది" అంటారు. దీనికి విశేష ప్రాధాన్యత ఉంది. భార్యాభర్తలు అత్యంత స్నేహంతో కలిసిపోయి, పరస్పరం గౌరవించుకుంటూ, అన్యోన్యంగా, ఆదర్శవంతంగా జీవించాలనేదే సప్తపదిలోని అంతరార్థం. అందుకే పెద్దలు వివాహబంధాన్ని ఏడడుగుల బంధం అంటారు. ఇందులో వేసే ప్రతీ అడుగుకీ ఒక్కో అర్థం ఉంది.

సప్తపది అర్థం (ఏడడుగుల ప్రాముఖ్యత):

1వ అడుగు: "ఏకమిషే విష్ణుస్త్యా అన్వేతు" 
ఆహారం, పోషణ మరియు శ్రేయస్సు కోసం (జీవితాంతం ఒకరికొకరు పోషించుకోవడానికి) విష్ణువు నిన్ను అనుసరించుగాక.

2వ అడుగు: "ద్వే ఊర్జే విష్ణుస్త్యా అన్వేతు" 
బలం, సంపద మరియు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తుల కోసం విష్ణువు నిన్ను అనుసరించుగాక.

3వ అడుగు: "త్రీణి ప్రతాయవిష్ణుస్త్యా అన్వేతు" 
వ్రతాలు, ధర్మం (సమృద్ధి మరియు ఆనందం) కోసం విష్ణువు నిన్ను అనుసరించుగాక.

4వ అడుగు: "చత్వారి మయోభవాయ విష్ణుస్త్యా అన్వేతు" 
ఆనందం, కుటుంబ సౌభాగ్యం మరియు బంధం బలోపేతం కోసం విష్ణువు నిన్ను అనుసరించుగాక.

5వ అడుగు: "పంచ పశుభ్యో విష్ణుస్త్యా అన్వేతు"
సంతానం మరియు కుటుంబ బాధ్యతల కోసం విష్ణువు నిన్ను అనుసరించుగాక.

6వ అడుగు: "షడ్ ఋతుభ్యో విష్ణుస్త్యా అన్వేతు" 
ఆరోగ్యం, సంతోషం మరియు ఋతువుల వలె (జీవితంలోని అన్ని కాలాల్లో) కలిసి ఉండటం కోసం విష్ణువు నిన్ను అనుసరించుగాక.

7వ అడుగు: "సప్తభ్యో హోత్రాభ్యో విష్ణుస్త్యా అన్వేతు" 
మైత్రి, నమ్మకం మరియు ఏడు జన్మల బంధం (సహవాసం) కొఱకు విష్ణువు నిన్ను అనుసరించుగాక.

ఈ వేడుకలో భాగంగా వధూవరులు ఒకరికొకరు సఖ్యతతో, అన్యోన్యంగా, అర్థనారీశ్వర తత్వంతో జీవిస్తామని ప్రమాణం చేస్తారు.

పెళ్లంటే... రెండు మనసుల కలయిక, నూరేళ్ల సాన్నిహిత్యం...వైవాహిక జీవితంలో ప్రమాణాలు కట్టుబడి ఉంటే ఆ సంసారం స్వర్గం. ప్రమాణాలను అతిక్రమిస్తే ఆ సంసారం నరకం. మానవజీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం వివాహం. ఆ సందర్భంలో వధూవరులతో చేయించే ప్రతి కార్యక్రమానికి ప్రాధాన్యత ఉంది. జీవితంలో ఒకరితో ఒకరిని ఎక్కువకాలం కలిపి ఉంచేది భార్యాభర్తల బంధం. ఆ బంధం పటిష్టంగా ఉండటానికి పెద్దలు కొన్ని మంత్రాలను నిర్దేశించారు. వాటినే లౌకికంగా పెళ్లినాటి ప్రమాణాలని చెబుతారు. ఆప్రమాణాలను త్రికరణశుద్ధిగా ఆచరించిన దంపతుల సంసారం మూడుపువ్వులు, ఆరుకాయలుగా వర్థిల్లుతుంది.

వరుడు వధువుతో "ఏడడుగులతో నువ్వు నా ప్రాణసఖివి అయ్యావు. ఎల్లప్పుడూ నువ్వు నా స్నేహాన్ని వీడవద్దు. ప్రేమగా ఉందాం. మంచి మనసుతో జీవిద్దాం. మన ఇద్దరం సమానమైన ఆలోచనలతో మెలగుదాం" అంటాడు. అప్పుడు వధువు "ఓ ప్రాణ సుఖుడా! నువ్వెప్పుడూ పొరపాటు చేయకుండా ఉండు. నేనూ ఏ పొరపాటు చేయక నీ వెంటే ఉంటాను. నువ్వు ఆకాశమైతే నేను భూమి, నువ్వు శుక్రమైతే నేను శోణితాన్ని, నువ్వు మనసైతే నేను మాట, నేను సామవేదమైతే నువ్వు నన్ను అనుసరించే రుత్వికుడివి మనిద్దరిలో వ్యత్యాసం లేదు. కష్ట సుఖాలలో ఒకరికొకరం తోడూ నీడగా కలిసి ఉందాం" అంటుంది.

"ఓ గుణవతీ! మన వంశాభివృద్ధికి, మనకు ఉత్తమస్థితి కలగడానికి, మంచి బలం, ధైర్యం, ప్రజ్ఞావంతులై వంశ హితాన్ని రక్షించగల, న్యాయమార్గం అనుసరించే ఉత్తమ సంతానాన్ని ప్రసాదించు" అని పురుషుడు చెబుతాడు.

చట్టపరమైన గుర్తింపు: హిందూ వివాహ చట్టం ప్రకారం, సప్తపది ముగిసిన తర్వాతే వివాహం పరిపూర్ణమవుతుంది.

నిత్య స్తోత్రావళి

Jaya and Vijaya were Born as Hiranyaksha and Hiranyakashipu - జయవిజయులు దితియందు హిరణ్యాక్ష హిరణ్యకశిపులై పుట్టుట

జయవిజయులు దితియందు హిరణ్యాక్ష హిరణ్యకశిపులై పుట్టుట

కశ్యపుని భార్యయైన దితి తనకు కలుగబోయే కొడుకులు దేవతల్ని ముప్పుతిప్పలు పెట్టగలరని అనుకొంటుండగానే నూరుసంవత్సరాలు గడిచాయి. తర్వాత ఆమెకు సమస్తలోకాల్ని విధ్వంసం చేయగల కుమారులు పుట్టారు.

దితి పుత్రులను పొందిన ఆ సమయంలో

దితికి లోకద్రోహులైన కొడుకులు పుట్టగానే భూమి కదిలింది. కులాచలాలు వణికాయి. సముద్రాలు అల్లకల్లోలమయ్యాయి. నక్షత్రాలు రాలాయి. ఆకాశం బద్దలైంది. దిగ్గజాలు కిందికి వంగిపోయాయి. మెరుపులు తళుక్కుమన్నాయి. పిడుగులు భూమిపై పడ్డాయి.
(మహేంద్రం, మలయం, సహ్యం, శుక్తిమంతం, గంధమాదనం, వింధ్యం, పారియాత్రం- అని ఈ ఏడింటికి కులపర్వతములని వ్యవహారం.)

హోమాగ్నులు పొగ చూరాయి. ఎదురు గాలులు వీచాయి. చెట్లన్నీ అడ్డదిడ్డంగా కూలిపడ్డాయి. గ్రహాలు, తారలు కాంతి విహీనమయ్యాయి. మబ్బులు నెత్తురు కురిశాయి. మెరుపులు మిరుమిట్లు గొల్పాయి. రాహువు అకాలంలో సూర్యుని చెరబట్టాడు. చిమ్మచీకట్లు ప్రబలాయి. కుక్కలు గొంతెత్తి అరచాయి. పట్టపగలే నక్కలు కూశాయి. పులుగులు బాధతో కూతలు పెట్టాయి. కన్నుల్లో నీరుగ్రమ్మగా దేవతా విగ్రహాలు కూలిపడ్డాయి.

ఆవుల పొదుగుల్లో రక్తం, చీము కారింది. గాడిదలు బోరున ఓండ్ర పెట్టాయి. ఏన్గుల చెక్కిళ్ళలో మదముడిగింది. గుర్రాల తోకల్లో నిప్పులు చూపట్టాయి.

దితి కడుపున శక్తిమంతమైన కుమారులు కల్గిన సమయంలో గుహలు మారుమ్రోగాయి. శుభ గ్రహాలు దుష్టగ్రహాలతో కలిసి అడ్డదారులు త్రొక్కి భమించాయి. (గ్రహగతి మారటం అశుభసూచకం)

ఓ బుద్ధిమంతుడవైన విదురా! ఒక్క సనకాదిమునులు తప్ప తక్కిన ప్రాణికోట్లన్నీ వెరపుగొల్పే ఉత్పాతాలను చూచి 'ఇది ప్రళయకాలమా? కాక సత్పురుషులను హింసించడానికి అవతరించిన రక్కసుల ఆగడమా?' ఏదో తెలియక భయగ్రస్తమయ్యాయి.

అంత భయంకరంగా జయ విజయులు రాక్షసులై పుట్టారు.

అంతభయంకరంగా జన్మించిన ఆ రక్కసు లిర్వురు కులపర్వతాలను పోలి ఉన్నారు. వారి బాహుబలం చెప్పనలవి కానిది. వారు తమ అడుగులతో చరచినప్పుడు నేల గడగడలాడింది. తాము ధరించిన రత్నాల భుజకీర్తులు, చెవిపోగులు, మొలనూళ్ళు, కడియాలు, ఉంగరాలు, కిరీటాలు, బంగారు గజ్జెలు మొదలైన ఆభరణాల నిగనిగలు జిగేలుమన్నాయి. ఆ ఇర్వురి దేహకాంతి సూర్యరశ్మిని వెలవెలబోయేట్లు చేసింది.

రాక్షస కుమారులిర్వురు మహాతేజోధనులై వెల్గుతున్న సమయంలో వారి తండ్రియైన కశ్యపుడు దితి ఇంటికి వచ్చి, బాలురను చూచి వారికి పేర్లు పెట్టాలనుకొన్నాడు.

ఆ కశ్యపబ్రహ్మ గర్భాధాన సమయంలో దితికడుపున తానుంచిన తొలి వీర్యంవల్ల కల్గిన కుమారునికి 'హిరణ్యకశిపుడు' అనే పేరుపెట్టాడు. దితిగర్భంనుండి ముందు పుట్టిన కుమారునికి 'కాంచనలోచనుడు' (అనగా హిరణ్యాక్షుడు) అనే పేరుపెట్టాడు. తర్వాత నిజపుణ్యభూమికి తరలిపోయాడు-
(రాక్షసులుగా జన్మించిన ఈ బాలుర ప్రసవగాథ విచిత్రమైంది. కశ్యపుడు దితిగర్భాన మొదటనుంచిన వీర్య శిశువు 'హిరణ్యకళిపుడు'. ప్రసవసమయంలో ముందు పుట్టిన కుమారుడు 'హిరణ్యాక్షుడు'. దితిగర్భపుష్పంలో నిక్షిప్తమైన కశ్యపుని వీర్యం రెండుగా విభజింపబడ్డప్పుడు మొదటి బీజం గర్భంలో వెనుకగాను, రెండవబీజం ముందుభాగంలోను ఉండటం జరిగింది. ప్రసవసమయంలో రెండవ బీజం తొలుతగా, మొదటిబీజం రెండవదిగా బహిర్గతమైనట్లు వివరణ చెపుతున్నది.

తొలుత పుట్టిన బిడ్డ హిరణ్యాక్షుడు. బంగారుకళ్ళవాడు - మలివిడత పుట్టిన బిడ్డ 'హిరణ్యకశిపుడు' బంగారుసింహాసనం కలవాడు అని కశ్యపుడు వారికి నామధేయం చేశాడు.

కవలలలో ముందు పుట్టినవాడు తమ్ముడు, వెనుక పుట్టినవాడు అన్నగా పరిగణించటం ఉన్నది.)

కుమారులకు పేర్లుపెట్టి కశ్యపుడు వెళ్ళిన తర్వాత, హిరణ్యకశిపుడు బ్రహ్మవల్లపొందిన వరగర్వంతో శత్రువుల భుజగర్వాన్ని అణచి దిక్పాలురందరిని జయించి, తనకెవ్వరు ఎదురులేకుండ చేసికొని మహాసంతోషంతో మెలిగాడు. అతని తమ్ముడు హిరణ్యాక్షుడు. వాడు మదించిన ఏన్గుతొండంతో దీటైన గదను చేత దాల్చి తన్నెరించగలపగవారు లేనందువల్ల సగర్వంగా భూలోక సంచారం చేసేవాడు. తర్వాత స్వర్గానికి పోయి అక్కడ కూడ తనతో యుద్ధం చేయడానికి సాహసించని దేవతలను చులకనచేసి, బ్రహ్మవలన వరంపొంది హితులతో కలిసి, శత్రువులను కలతపరిచేవాడు. మెడలో విష్ణుమాలిక ధరించి, కాళ్ళగజ్జెలు గల్లుగల్లు మంటుంటే, తనదేహకాంతితో దిక్కులన్నింటిని వెల్గిస్తూ ఉండేవాడు. వాని దాటికాగలేక దేవతలు తమ ఇండ్లను వదలి ఎక్కడికో పారిపోయారు. దేవతలు వదిలిపెట్టిన ఇండ్లు జిల్లేడు, ఉమ్మెత్త చెట్లకు నెలవులుగా మారిపోయాయి.

"అయ్యో! ఈ దేవతలు పరాక్రమహీనులై, తమ ఉపకరణాలను వదలిపెట్టి, విక్రమింపలేక, ఏంచేయాలో తోచక భయగ్రస్తులై పారిపోయారే!” అనుకొని ఆ మేరుపర్వతమంతధైర్యశాలి హిరణ్యాక్షుడు భుజదర్పంతో విర్రవీగి సముద్రంలో దూకాడు

దేవతల దైన్యస్థితిని తలపోస్తూ హిరణ్యాక్షుడు సముద్రంలో దూకగా.

వరుణదేవుని బలాలైన జలచరాలన్నీ హిరణ్యాక్షుని ఉరవడికి తట్టుకోలేక సాహసాన్ని కోల్పోయి, ఆ సముద్ర మధ్యభాగాన ఎక్కడో దాక్కున్నాయి.

దేవవైరియగు హిరణ్యాక్షుడు జలచరాల నిట్టూర్పులవల్ల సంచలించిన అలలను తన గదతో దట్టించి రూపుమాపాడు.

అంతేగాక ఆ హిరణ్యాక్షుడు పెక్కేండ్లు సంద్రం నడుమనే యథేచ్చగా సంచరించాడు. శత్రువుని మట్టుపెట్టే క్రీడతో స్వైరవిహారం చేశాడు. తర్వాత జలధినాయకుడైన వరుణుని విభావరినగరం వెళ్ళి అక్కడ హాయిగా కాలం గడుపుతున్న వరుణుని చూశాడు.

ఆ తర్వాత

సాగరాధిపతియు, పాతాళలోకపాలకుడునైన వరుణుని చూచి హిరణ్యాక్షుడు "ఓయీ! ఈ లోకంలో దిక్పతులందరికంటె నీవే మొనగాడవని, లోకం మెచ్చుకోదగిన పోటుమగాడవని అంటారు. అంతగొప్ప వీరుడవైతే ఇపుడు నాతో తలపడు. నీ భుజబలాన్ని నీ ప్రతాపాన్ని ఇప్పుడే అణచివేస్తా అని పరిహసించాడు. అప్పుడు వరుణుడు రక్కసుని గెలుపు, బలం, పరాక్రమాలతో, తన బలాన్ని పోల్చుకొని వానితో యుద్ధం చేయడానికి పూనక.

రక్కసునితో పోరుసల్పుటకిది తగిన సమయం కాదని తలంచి వరుణుడు ఓర్పు అనే నీటితో తనలో రగులుతున్న కోపాగ్నిని ఆర్పి, మెత్తగా ఆ హిరణ్యాక్షుని ఉద్దేశించి ఇట్లన్నాడు.

ప్రసుత్తం నేను మనశ్శాంతి గల్గి ఉన్నాను. యుద్ధం చేయరాదని నియమం పెట్టుకొన్నాను. కాబట్టి యుద్ధక్రీడకు నేను ఉత్సహించను. ఇప్పుడు నీ భుజబలాన్ని ఎదుర్కొని నిలువగల్గినవాడు 'ఒక్క విష్ణుమూర్తి తప్ప తక్కిన వారెవ్వరు ఎక్కడ కూడలేరు' అని వరుణుడు హిరణ్యాక్షుని ఉద్దేశించి అన్నాడు.

ఆ మహావిష్ణువు వైకుంఠంలోఉన్నాడు. ఆయన సాహసంతో యుద్ధం చేసి ఎందరో శత్రువుల్ని మట్టుపెట్టిన వీరుడని, అనిందితచరిత్రుడని జనం వేనోళ్ళ స్తుతిస్తోంది. నీతో పోరుసల్పగలడాయన. అంతటితో నీ కథ ముగుస్తుంది.

ఓరి బుద్ధిహీనుడా! యుద్ధరంగంలో పలాయనం చేయటం అపకీర్తి గదా అని అనుకోకుండా కాలికి బుద్ది చెప్పే పిరికిపందల నెదుర్కోవటం పౌరుషమవుతుందా? అదో ఆ వైకుంఠవాసుడు నీ పని చక్కపెట్టగలడు. ఆయనతో తలపడాలని ఉంటే వైకుంఠానికి పో. ఆ స్వామి నిరంతరం రక్కసులతో పెనగి విజేతగా ఉన్నాడు.

అంతేగాక, ఇంకా.

మహర్షులచే కొనియాడబడుతున్న ఆ శ్రీహరి నాల్గు యుగాలలో అవసరమైనప్పుడు మానవాకృతి ధరించి, భుజబలంతో దుష్టరాక్షసుల్ని మట్టుపెడుతుంటాడు.

(యుగములు : ఇవి నాల్గు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం.

1. కృతయుగం : ధర్మం నాల్గు పాదాలతో నడుస్తుంది

కాలపరిమాణం : 17,28,000 మానవసంవత్సరాలు

2. త్రేతాయుగం : ధర్మం మూడుపాదాలతో ఉంటుంది

కాలపరిమాణం : 12,96,000 మానవసంవత్సరాలు

3. ద్వాపరయుగం : ధర్మం రెండుపాదాలతో ఉంటుంది

కాలపరిమాణం : 8,64,000 మానవసంవత్సరాలు

4 కలియుగం : ధర్మం ఒకేపాదంతో ఉంటుంది

కాలపరిమాణం : 4,32,000 మానవసంవత్సరాలు)

ఓరీ రాక్షసా! నీవు ఆ నారాయణుణ్ణి ఎదుర్కొన్నావో కయ్యం సంగతి దేవుడెరుగును. నీ భుజబలం కాస్త సన్నగిల్లి నేలరాలిపోతావు. తర్వాత కుక్కల పాలవుతావు. ఇప్పుడు వెంటనే నీవు వైకుంఠానికి వెళ్ళితే, నీ సత్తా ఏమిటో తేలిపోతుంది. తర్వాత ఏమి జరుగుతుందో చెప్పటం దేనికి? (నీ చావు తప్పదని భావం.)

విష్ణువునెదుర్కొన పొమ్మని వరణుడు చెప్పగానే హిరణ్యాక్షుడు మహాకోపంతో మనస్సులో ఏ మాత్రం జంకులేకుండా ఆ దేవరక్షకుడు, దుర్మార్గుల నాశనం చేసేవాడైన విష్ణువుని తప్పక యుద్ధంలో ఎదిరిస్తానని పల్కి వైకుంఠ మార్గం పట్టాడు.

వైకుంఠ మార్గంలో పోతున్న హిరణ్యాక్షునికి నారదుడు కన్పించి "ఓ రాక్షసా! ఎక్కడికి పోతున్నావు?" అని అడిగాడు. అప్పుడా రాక్షసుడు ఆయనతో ఇట్లన్నాడు.

"నేను బొడ్డుదామరవాడును, అంతం లేనివాడును అగు లక్ష్మీధవుణ్ణి, యుద్ధరంగంలో ఎదుర్కొని అతణ్ణి చంపి నా రాక్షసకులానికి సంతోషం కల్గించాలని వైకుంఠనగరాభీముఖంగా సాగిపోతున్నా" నని హిరణ్యాక్షుడు నారదునితో అన్నాడు. ఆ నారదుడు వానితో ఇలా అన్నాడు-

"భుజపరాక్రమం కలవాడైన ఆ నారాయణుడు ఇప్పుడు వైకుంఠంలో లేడు. ఆయన భూమిని ఉద్ధరించాలని ఆదివరాహావతార మెత్తి పాతాళలోకంలో మోహరించి ఉన్నాడు. ఆయన్ని ఎదిరించే సాహసముంటే అక్కడికే పో. అక్కడే యుద్ధం చేయి" అని నారదుడు చెప్పాడు.

హిరణ్యాక్షుండు యజ్ఞవరాహంబగు హరినెదిరించి పోరుట

Sanaka Sanandana Sanatana, and Sanatkumara Praying Narayana - సనకాదులు నారాయణుని స్తుతించుట

సనకాదులు నారాయణుని స్తుతించుట

వనజదళాక్ష భక్తజనవత్సల! దేవ! భవత్సుతుండు మ
జ్జనకుండునైన పంకరుహజాతుండు మాకు రహస్య మొప్పం జె
ప్పిన భవదీయమంగళగభీరపరిగ్రహవిగ్రహంబు మే
మనయముంజూడంగంటిమి కృతార్థులమై తగమంటి మీశ్వరా!


"తామరలవంటి కన్నులవాడా!, భక్తులపట్ల దయగలవాడా! ప్రభూ! ఓ స్వామీ! మీకు కుమారుడును మాకు తండ్రియునైన బ్రహ్మదేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడు దర్శించే మహారహస్యం చెప్పాడు. దాన్ని ఆసరాగా గ్రహించి నీ మనోజ్ఞమైన సుందరాకారాన్ని చూచి తరించాం. ధన్యులమైనాం" అని సనకాదులు విష్ణుమూర్తిని స్తుతించారు.

దేవ! దుర్దనులకు భావింప హృదయసంగతుండవై యుండియుం గానంబడవు
కడంగి నీ దివ్యమంగళవిగ్రహంబునం జేసి సమంచితాశ్రితుల నెల్లం
జేకొని సంప్రీతచిత్తులంగాంజేయు దతిశయకారుణ్యమతిం దనర్చి
కమలాక్ష! సర్వలోకైక నాయక! భవత్సందర్శనాభిలాషానులాప

విదితదృఢభక్తియోగప్రవీణు లగుచు, నర్థిమై వీతరాగులైనట్టి యోగి
జనమనఃపంకజాతనిషణ్ణమూర్తి, వని యెఱుంగుదురయ్య, నిన్నాత్మవిదులు


"ఓ ప్రభూ! నీవు సర్వాంతర్యామివి. దుష్టుల హృదయంలో కూడా ఉంటావు. అయితే వారికి కన్పించవు. కాని నీవు కనికరంతో నీ భక్తులెల్లరికి దివ్యమంగళరూప సాక్షాత్కారం కల్గించి ఆదుకొంటావు. ఓ పద్మాక్ష! లోకనాయక! నిన్ను చూడాలనే కోర్కెతో, నిన్నే స్మరించే రజోగుణవిముక్తులైన భక్తుల హృదయాల్లో నీవు పాదుకొని ఉంటావని జ్ఞానులు చెపుతారు" అని మునులు ప్రస్తుతించారు.

యుక్తిందలంప భవద్వ్యతి, రిక్తములై నట్టి యితర దృఢ కర్మంబుల్‌
ముక్తిదము లయిన నీ పద, భక్తులు దత్కర్మములను బాటింప రిలన్‌


'ఓ స్వామీ! నిన్నుద్ధేశించి కాక అన్యచింతనతో చేసే పనులవి ఎంత గొప్పవైనా, లేక ముక్తినొసంగేవైనా, నీ పాదసేవకులైన భక్తులు వాటిని ఒల్లరు'(ఇష్టపడరని భావం).

కావునంగీర్తనీయగతకల్మషమంగళతీర్థకీర్తి సు
శ్రీవిభవప్రశస్తసుచరిత్రుండ వైన భవత్పదాబ్జ సే
వా విమలాంతరంగబుధవర్గ మనర్గళభంగి నన్యమున్‌
భావమునం దలంచునె కృపాగుణభూషణ! పాపశోషణా!


ఓ స్వామీ! నీవు దయాభరణుడవు. భక్తుల పాపాలను పటాపంచలు చేయగలవాడవు. నీ చరిత్ర కొనియాడదగింది. దోషరహితమైంది. శుభకరమైంది. పుణ్యప్రదమైంది. సత్కీర్తి శోభితమై ప్రశస్తి కెక్కినట్టిది. హృదయంలో ఏ కల్మషం లేని నీ పాదసేవకులు ఇతర కర్మల జోలికిపోరు. అన్యదేవతలను కొలవరు.

పరమతపోవిధూతభవపాపులమై చరియించు మాకు నేం
డరయ భవత్పదాశ్రితుల కల్గి శపించిన భూరిదుష్కృత
స్ఫురణ నసత్పథైకపరిభూతులమై నిజధర్మహానింగా
నిరయము నొందంగా వలసె నేరము వెట్టక మమ్ముంగావవే


దేవా! మేము తపోబలంచేత జన్మసంబంధమైన పాపాలను తుదముట్టించిన వారం. కాని ఈ రోజు మీ పాదదాసులైన కావలికాండ్రని(జయ విజయుల్ని) శపించి దారితప్పినాం. అవమానానికి గురి అయ్యాం. మా ధర్మానికి హాని కల్గింది. అందుకు మమ్ముల శిక్షించకుండా కాపాడండి" అని మునులు ప్రార్ధించారు.

కర మనురక్తిషట్పదము కమసుగంధమరందవాంఛచేం
దరమిడి శాతకంటకవృతస్ఫుటనవ్యతరప్రసూన మం
జరులను డాయుపోల్కిని భృశంబగు విఘ్నములన్‌ జయించి నీ
చరణసరోజముల్‌ గొలువ సమ్మతి వచ్చితిమయ్య, కేశవా


"ఓ తండ్రీ! గోవిందా! తుమ్మెద కమ్మని తేనెను క్రోలడానికి ఉత్సాహంతో వాడియైన ముళ్ళతో కూడిన పూగుత్తులను ఆశ్రయించినట్లే మేముకూడ ఆటంకాలను ఛేదించి నీ పాదపద్మాలను సేవించాలని వచ్చాము అని సనకాదులన్నారు.

అలరు భవత్పదాంబుజయుగార్పితమై పొలుపొందునట్టి యీ
తులసి పవిత్రమైన గతిం దోయజనాభ! భవత్కథాసుధా
కలితములైన వాక్కుల నకల్మషయుక్తిని విన్నంగర్ణముల్‌
విలసితలీలమై భువింబవిత్రములై విలసిల్లు మాధవా!

ఓ లక్ష్మీనాథా! నీ పాదపద్మాలను సోకి, ఈ తులసి పవిత్రమై రాణించినట్లే, నీ కథామృతంతో కలిసిన మాటలను వింటే చెవులు పవిత్రమైతాయి.

మహితయశోవిలాసగుణమండన! సర్వశరణ్య! యింద్రియ
స్పృహులకుంగానరాక యతసీకుసుమద్యుతి నొప్పుచున్న నీ
సహజశరీర మిప్పుడు భృశంబుగంజూచి మదీయదృక్కు లిం
దహహ! కృతార్థతంబొరసె నచ్యుత! మొక్కెద మాదరింపవే!

"కీర్తదాయకమైన గుణగణాలు గలవాడా!, అందరికీ దిక్కైనవాడా! ఓ మాధవా! నీ రూపం ఇంద్రియాపేక్షగల సామాన్యులకు కన్పించదు. అది అగిసెపువ్వులాంటి నీలం వన్నె గల్గిన సహజశరీరం. దాన్ని దర్శించి మా చూపులు ధన్యమయ్యాయి. నీకు నమస్కరిస్తున్నాం. మమ్ములను ఆదుకో స్వామీ!" అని మునులు ప్రార్ధించారు.

"స్వామీ! మీ దర్శనంవల్ల మా చూడ్కులు సార్థకమయ్యా" యని సనకాదులు స్తుతించారు. మాధవుడు మహానందం చెంది మునుల నుద్దేశించి యిలా అన్నాడు.

జయుడు, విజయుడు అనే పేర్లుగల ఈ ఇద్దరు నా కావలికాండ్రు. వీరునా ఆజ్ఞను ఉల్లంఘించి, మిమ్మల్ని సరకు చేయకుండా అవమానించారు. మీరు వారు చేసిన తప్పిదానికి తగినశిక్ష విధించారు. అది నాకు సమ్మతమే. అంతేగాదు- సేవకులు చేసే అపరాధానికి యజమానియే బాధ్యుడు. అందువల్ల ఈ ఇర్వురు చేసిన తప్పునకు నన్ను మన్నించి అనుగ్రహించండని శ్రీహరి ప్రార్ధించాడు.

శరీరంలో పుట్టిన కుష్ఠురోగంవల్ల రోగి చర్మం కళతప్పినట్లే సేవకులు ఏదైనా తప్పుపని చేస్తే ప్రభువులు కీర్తిని, పేరుప్రతిష్టలను కోల్పోయి లోకంలో అపకీర్తి పాలవుతారు.

మునీంద్రులారా! మీవంటి మహానుభావులవల్ల లోకమంతా మెచ్చదగ్గ పుణ్యకీర్తి నాకు దక్కింది. అమృతతుల్యమైన నా కీర్తివైభవంచేత ఈ వైకుంఠనగరం విరాజిల్లుతోంది. ఈ నగరంపేరు వింటేచాలు దుష్టులైన చండాలజాతులవారు కూడ పుణ్యాత్ములవుతారు.

అంతటి కీర్తిగడించిన నేను, మీ వంటి మహాత్ములకు అపకారం చేసేవారెంతటివారైనా, లేక వారు నాకు భుజసమానులైనా సరే వారిని మట్టుపెడతాను. అయినప్పుడు ఇతరులను గూర్చి మీ ముందు చెప్పాలా?(చెప్పవలసిన పనిలేదు).

"లోకంలో ఉత్తములైన బ్రాహ్మణులు నా పాదపూజ చేస్తారు. వారిచ్చిన పాద్యం అతిపవిత్రమైంది. దాని వల్ల లోకుల పాపాలన్నీ పటాపంచలవుతాయి. పవిత్రమైన అర్ఘ్యపాద్యాలు పొందిన పాదాలు నావి.

మంచిమనస్సుగల శ్రీదేవి తన కడగంటిచూపులనే హారంతో నన్నాకర్షించి, నన్ను విరాగిగా తలంచక నా ఎదపై వాలింది. (వక్షఃస్థలాన్ని ఆశ్రయించిందని భావం).

మహాత్ములారా! యజ్ఞంలో అగ్నిముఖంగా వ్రేల్వబడిన, నేలితో తడిసిన హవ్యం నా మనస్సుకు ఇంపుగొల్పదు(నచ్చదు). కర్మఫలకాంక్షలులేని బ్రాహ్మణోత్తముడు భుజించే అల్పాహారమే నాకు ప్రియమైంది.

"మునీశ్వరులారా! నేను ఎల్లప్పుడు యోగమాయావైభవంతో ప్రకాశిస్తుంటాను. ధరణీసురులుగా వాసికెక్కిన బ్రాహ్మణుల పవిత్రమైన పాదధూళిని నవరత్నాలు పొదివిన నా బంగారు కిరీటంపైన ధరిస్తాను. నా పాదపద్మాలనుండి పుట్టిన గంగాజలాన్ని స్పృశించి తలపై చల్లుకొని పరమేశ్వరుడు మొదలైన దేవతలు పుణ్యాత్ములయ్యారు. బ్రాహ్మణులవల్ల ఎవరికైనా అపకారం జరిగితే, వారిపై కోపపడనివారునూ, ఆ బ్రాహ్మణులు నాతో సమానులని భావించేవారును నాకు చాలా ప్రియమైనవారు సుమా!" అన్నాడు విష్ణుమూర్తి.

మునులారా! ఆవులను, బ్రాహ్మణులను, నన్ను, దీనులను ఎవరు భేదభావంతో చూస్తారో వారు తప్పక అధోగతి పాలవుతారు. యమభటులు అలాంటివారిని పాముపగ వంటి పగతో విజృంభించి పెద్దగద్దలు ముక్కుతో పొడిచినట్లు పొడిచి ముక్కలు చేస్తారు.

"లోకంలో బ్రాహ్మణులు ఎవరినైనా అవమానిస్తే, అలా అవమానానికి గురియైనవారు ఆ బ్రాహ్మణులను చిరునవ్వులతో, మహానందభరితులై పూజిస్తే, మంచిమాటలతో వారిని స్తుతిస్తే, కొడుకులు తండ్రిని ప్రేమతో పల్కరించినట్లు పల్కరిస్తే అలాంటివారు నాకు సమానులు అన్నాడు హరి.

మహాత్ములారా! వినండి. అంత గొప్పచరిత్రగల్గిన మహానుభావులకు నేనెప్పుడూ సేవకుడుగానే ఉంటాను. అలనాడు భృగుమహర్షి నన్ను కాలితో తన్నితే సంతోషించాను.

"ఓ మునులారా! నా మనసులోని ఆంతర్యం తెలియక, ఈ ఇర్వురు మీ ఆజ్ఞని జవదాటారు. అందుకు తగిన ఫలితాన్ని చవిచూశారు. అంతేగాదు నిజానికి నా మనసులో ఉన్నది కూడ ఇదే. వీరు భూలోకంలో రాక్షసులై పుట్టి త్వరగా నా చెంతకు చేరేటట్లు వీరిని అనుమతించండి" అని శ్రీహరి ప్రార్ధించగా మునులు ఆ స్వామి తియ్యని పల్కులు విన్నారు. ఆ పల్కుల అమృతాన్ని తనివి దీర ఆస్వాదించినా, వారిలో కోపం కాటువేస్తూనే ఉంది.

సనకాదిమునులు జయవిజయులు చేసిన పరాభవాన్ని సహించలేక పోయారు. అయితే శ్రీహరి మృదుమధురమైన పల్కులకు హృదయానందాన్ని పొందారు. శ్రీహరి మాటలు గంభీరమై లోతైన అర్ధం కలవగుటచేత తేలికగా బోధపడేవి గావు. అమృతంతో సమానమైన తియ్యదనం గలవి, శబ్ద దోషం లేనివి. అలాంటి పల్కులు విని ఆ మునులు సంతోషించి 'తమలో దాము' ఇప్పుడు ప్రభువు మనలను అభినందించో లేక నిందించో అదికాకపోతే 'మన శాపానికి వెరచియో' ఏదో మరి మనల్ని సందేహానికి గురిచేశాడు అని అనుకొన్నారు. అంతలో మళ్ళీ పునరాలోచనలో పడ్డారు.

కలువలవంటి కన్నులుగల శ్రీహరి తమను దయతో చూచాడ'ని మనసులో సంతోషపడి, మునులు పులకరించిపోయారు. ఉత్కంఠతో రెండుచేతులెత్తి నమస్కరిస్తూ ఇలా అన్నారు.

సనకాదిమునులు యోగమాయావిలాసుడైన శ్రీహరి ఐశ్వర్యాన్ని బలాన్ని, మహోత్సాహాన్ని గమనించి వినయంతో ఇలా అన్నారు.

"ప్రభూ! నీవు గొప్ప ఐశ్వర్యవంతుడివి, పాపరహితుడివి, పరమపూజ్యుడవు, జయవిజయుల్ని మేము శపించటం నీ కిష్టమని చెప్పావు. నీ చరిత్రని తెలిసికోవటం మాకు సాధ్యం కాదు.

లోకాలను పవిత్రంచేయగల వాడా! ప్రాజ్ఞులను రక్షించేవాడా! సమభావంగల ఓ ప్రభూ! దేవతలకు దీటుగా పరదేవతలని కీర్తి వడసిన ఈ బ్రాహ్మణులకు నిజంగా నీవే అధిపతివి. అంత గొప్ప స్వామివైన నీకు ఆ బ్రాహ్మణులు నాయకులా? ఇది చాల విచిత్రం సుమా! అని మునులన్నారు.

ఓ దయార్ద్రమూర్తీ, పాపనాశక! కమలలోచన! దేవా! నీవు ఎన్నో అవతారాలెత్తి నీ ధర్మాన్ని నిర్వహిస్తున్నావు. అందుకే లోకం ఏ ఉపద్రవాలు లేకుండా ఉంది. చెక్కుచెదరకుండా ఉంది. నీవు వికారాలు లేనివాడివి. నీది అచలరూపం. నీ అవతారాలఫలితాలను, అందలి రహస్యాలను తత్త్వజ్ఞులు చెపుతుంటారు.
(సాధారణంగా 'దశావతారాలు' అంటారు. అంటే విష్ణువెత్తిన అవతారాల్లో పది అవతారాలు చాల ముఖ్యమైనవి. భాగవతం చెప్పిన అవతారాలు 23 అవి

1. యజ్ఞవరాహం, 2. సుయజ్ఞుడు, 3. కపిలుడు, 4. దత్తాత్రేయుడు, 5. సనకాదులు, 6.నరనారాయణులు (మునులు), 7 పృథువు, 8. పుష్కరుడు, 9. ధ్రువుడు, 10. హయగ్రీవుడు, 11.మత్స్యావతారుడు, 12. కూర్మావతారుడు, 13. నరసింహుడు, 14. నారాయణుడు(గజేంద్రుని రక్షించినస్వామి), 15. వామనుడు, 16. హంసుడు, 17. మనువు, 18. ధన్వంతరి (ఆయుర్వేదప్రచారకుడు), 19. పరశురాముడు, 20. శ్రీరాముడు, 21. శ్రీకృష్ణుడు, 22. బుద్ధుడు,
23. కల్కి)

"దయార్ద్రమూర్తి! లోకపాలక! గొప్పవివేకం గల స్వామీ! ఈ విశ్వమంతా నీ అధీనంలోనే ఉంది. అందువల్లనే మా వంటి మునులం మృత్యుభయంనుండి విడివడ్డాం. వాస్తవమిట్లుండగా 'నీవు ఇతరుల స్వాధీనంలో ఉన్నా'నని అంటున్నావు. ఇది చాల విచిత్రమైన సంగతి" అన్నారు సనకాదులు.

ప్రతినిత్యం యాచకులు వచ్చి లక్ష్మీదేవి పాదాలను సాగిలపడి మ్రొక్కినపుడు వాటి ధూళి తమ తలల కలంకారంగా ఉంటుంది. తామరపూలనుండి స్రవించిన తేనెను ఆస్వాదించడానికి వచ్చే జుంటీగ వంటి భక్తులు తులసిమాలగల నీ పాదపద్మాలను మహాభక్తితో కొలుస్తున్నారు. ఆ భక్తులయెడ ప్రేమాతిశయంగల ఓ స్వామీ! నీవు శ్రీదేవిని దయతో మన్నించకున్నావు. నిజానికి నీ మహిమ చాల విచిత్రం గదా! నీవు తామరలవంటి కన్నుల వాడవు. నీ రూపం శుభప్రదమైంది. అంతేగాదు - శ్రీదేవిహృదయాన్ని దోచుకొన్నవాడవు కూడ.

భాగ్యాలకు నెలవైన దేవా! శ్రీవత్సాన్ని రొమ్మున తాల్చిన స్వామీ! ఈ బ్రహ్మవేత్తల పాదధూళియే నీ శరీరానికి అలంకారమని అన్నావు. సమస్తలోకాలకు బ్రాహ్మణుల మహిమను చాటాలని నీవు ఈ పవిత్రాకారాన్ని ధరించావు.

బ్రాహ్మణమహిమని లోకానికి చాటటానికే గాదు, భక్తుల పాలిటి కొంగుబంగారమైన ఓ దేవా! నీవు ఎల్లప్పుడు ధర్మం తప్పని వాడవు. లోకనాయకుడవు. అలాంటినీవు రక్షింపదగిన వారిని రక్షింపకున్నచో వేదధర్మం దారితప్పుతుంది. కావున నీవు సత్త్వగుణుడవై ఈ జీవకోటిని కాపాడుతున్నావు. నీవు స్వశక్తిచేతనే అధర్మపరుల్ని దండిస్తావు. వేదధర్నాన్ని ఉల్లంఘించే పద్ధతులు నీకు నచ్చవు. బ్రాహ్మణులపట్ల నీవు దయగలవాడవు. వారిని వినయంగా పల్కరించటమే నీకు తగును.

అన్యుల నుద్దేశించి వినయంగా మాట్లాడితే నీ మహిమకు చేటని భావిస్తావేమో! అదేమీ కాదని మునులంటున్నారు.

స్వామీ! వినయంగా మాట్లాడటం నీకొక లీలకాగా ఈ విశ్వానికి కర్తవు, ఆధారుడవు, పోషించేవాడవైన నీకుగాని నీ వైభవానికి గాని హాని ఎక్కడుంటుంది? ఉండదు.

మహానుభావా! మేము మునులం. మమ్మల్ని నీవు మహానందంతో గౌరవిస్తున్నావంటె అది ఉత్తముల్ని చేరదీయటమే కదా! ఈ జయవిజయుల గూర్చి ఒక్కమాట చెప్పాలని ఉంది.

"స్వామీ! మేము కావలికాండ్రని శపించాం. ఇంతకంటె కూడ పెద్దశిక్ష విధించాలని మీరనుకొంటే అలాగే చేయండి. లేదా వీరికి ఇతోధికమైనమేలు కల్గించాలనుకొంటే వీరిని కాపాడండి" అని మునులు హరితో అన్నారు.

ఓ స్వామీ! వారిద్దరిని మీరు రక్షిస్తే మాకు సంతోషమే. ఒక వేళ ఏ తప్పు చేయనివారు, హృదయంలో ఎలాంటి కల్మషం లేనివారును అయిన జయవిజయుల్ని మేము నిష్కారణంగా శపించివుంటే మాకు మీరే శిక్ష విధించినా సమ్మతమే అని సనకాదులు దోసిలొగ్గి హరిని ప్రార్థించారు. అప్పుడా శ్రీహరి మునులను దయతో చూస్తూ ఇలా అన్నాడు.

'ఓ మునీశ్వరులారా! ఈ జయ విజయులు భూలోకానికి వెళ్ళి అక్కడ లోభమోహ పరాయణులై రాక్షసుల కడుపున జన్మిస్తారు అని భగవంతుడు సనకాదులతో అన్నాడు.

రక్కసులైన వారిరువురు దేవతలకు, ప్రజలకు హాని కల్పిస్తారు. సమస్త లోకాలను నొప్పించే పనులే చేస్తారు. నా పట్ల విరోధాన్ని పెంచుకొంటారు.

ఆ ఇర్వురు యుద్ధరంగంలో నాతో తలపడి, సుదర్శనచక్రపు తాకిడిచే కూలి, తిరిగి మహోత్సాహంతో నా సన్నిధికి వస్తారు(వారికి వైకుంఠప్రాప్తి అవుతుందని భావం).

నా సన్నిధికి రావటమేగాక, ఇంకా ఈ జయవిజయులిద్దరు భూలోకమున రాక్షసులై పుట్టి నాతో తలపడాలని బుద్ధిపుట్టి, నా ఎదుట నన్నే చూస్తూ చస్తారు. తర్వాత తమ పాపాల నుండి విడివడినవారై వైకుంఠంలో నివసిస్తారు.

"ఈ జయ విజయులకు తర్వాత మరెప్పటికి భూలోకంలో పునర్జన్మ ఉండదు. మీ కోర్కెప్రకారం నేను కూడ మనస్సులో సమాధాన పడతాను" అని హరి సనకాదులతో అన్నాడు.

'మునీశ్వరులారా! ఇక ఈ విషయాన్ని గూర్చి విచారపడవద్దు' అని హరి సనకాదులతో అన్నాడు. వారు స్వామివారి మనస్సులోని ఆంతర్యం తెలిసికొని 'దీనజన రక్షకుడును, పాపాల్ని హరించేవాడును, సముద్రంలో శయనించువాడును అయిన విష్ణుమూర్తి'ని మహోత్సాహంతో వేనొళ్ళ కొనియాడారు.

జరిగిన సంఘటనకు విచారపడవద్దని విష్ణువు సనకాదులకు చెప్పాడు. ఆ మాటకు వారు పులకించిపోయారు. కన్నులు చెమ్మగిల్లాయి. అంత నా మునులు మునిజనులను కాపాడే వాడును, దేవతలకు అధిపతియు, ఇంతటి వాడని చెప్పసాధ్యం కానివాడునునైన ఆ విష్ణువు దేహాన్ని ఆయన నివాసాన్ని కన్నులార కాంచి కమలాక్షుని యెదుట తలలు వంచారు.

ఇంతవరకు తాము పల్కిన పల్కులు(శాపాదులు) భగవంతుడైన విష్ణువు పల్కించినవిగా భావించి మునులు మహోత్సాహంతో వైకుంఠపుర వైభవాన్ని పొగడుతూ శ్రీహరిచే(అనుమతిబడసినవారై వెళ్ళారు).
('జయ విజయులను శాపగ్రస్తులను చేసిన విషయంలో తాము కేవలం నిమిత్తమాత్రులమే - అంతా ఆ విష్ణువే చేయించాడు' అని సనకాదులు గుర్తించారు. సమస్తం సర్వేశ్వరుని అధీనమే. ఆయన ఆజ్ఞలేనిది చీమైనా కదలాడదనే భావం కానవస్తుంది.)

మునులు శ్రీహరి అనుజ్ఞ గైకొని అక్కడనుండి తమ నివాసాలకు వెళ్ళిపోయారు. వెంటనే శ్రీమహావిష్ణువు జయవిజయుల్ని చూచి సాదరంగా ఇలా అన్నాడు.

జయ విజయులారా! విధిలేక మీరు రక్కసి కడుపున పుట్టవలసివచ్చింది. నేను గొప్పబలం కలవాడనైనా బ్రాహ్మణవాక్కును తిరస్కరించలేను.

బ్రాహ్మణ వాక్కును నేను తిరస్కరించను కాబట్టి, వారి శాపం ప్రకారం మీరు రాక్షసులై పుట్టండి. నాకు శత్రువులై నాతో పోరు సల్పి నన్నే ధ్యానిస్తూ నాచే చచ్చి తిరిగి వైకుంఠం చేరగలరు.

వికసించిన తామరరేకులవంటి కన్నులు గలవాడును, దేవేంద్రుడు మొదలైన దేవతల కిరీటాల మణికాంతులు సోకుటచే మెరుస్తున్న పాదాలు గలవాడును నగు శ్రీహరి భూలోకంలో రాక్షసులై పుట్టండి వెళ్లండి అని జయవిజయుల్ని ఆదేశించి లక్ష్మీదేవి తన వెంటరాగా శాంతిధామం, పుణ్యప్రదమైన తన నివాసం వైకుంఠానికి వెళ్ళాడు.

ఆ తర్వాత విష్ణుమూర్తి భార్యాసమేతుడై లోపలికి వెళ్ళగానే, భయగ్రస్తులైన జయ విజయులు దిగులుపడి, కాంతి తరిగి భూలోకం లోనికి కూలిపోయారు. ఆకాశంలో దేవతల విమానధ్వనులు మూడులోకాల్లో ప్రతిధ్వనించాయి.

"ఆ జయ విజయులే ఇప్పుడు దితిగర్భంలో ఉన్నారు. వారి శక్తియే మహాతేజస్సుగా అయి, మీ శక్తిని హరించి వేసింది" అని బ్రహ్మ దేవతలతో చెప్పాడు.

'దేవతలారా! ఇంతకు ఈ పరిస్థితులకు శ్రీమహావిష్ణువే మూలకారకుడు. ఈ జగత్తు సృష్టి, స్థితి లయాలకు కారకుడు, తుది మొదలు లేనివాడు, కారుణ్యమూర్తి ఆయనే. మీకు ఆయన మేలు చేస్తాడు. చీకుచింతలు మాని వెళ్ళండి. మీ కోర్కెలు నెరవేరుతాయి' అని బ్రహ్మ వారితో అన్నాడు.

బ్రహ్మ అలా చెప్పగానే దేవతలు అసలు కథ తెలిసికొన్నవారై దేవలోకానికి వెళ్ళారు. కశ్యపుని మాటలు విని దితి కూడ అంతగా సంతోషం లేనిదయింది.

జయవిజయులు దితియందు హిరణ్యాక్ష హిరణ్యకశిపులై పుట్టుట

Friday, February 20, 2026

sanaka sanandana Sanatana, and Sanatkumara visited Vaikuntha - సనక సనందనాదులు వైకుంఠమున కరుగుట

సనక సనందనాదులు వైకుంఠమున కరుగుట

దేవతలారా! మీకు పూర్వీకులైన సనకాదిమునులు నా కుమారులే. వారు గొప్ప పుణ్యాత్ములు- సంచారం చేసే దేవుళ్ళు. వారు తమ అపారమైన బుద్ధివిశేషంచేత మంచిచెడ్డలను గుర్తిస్తారు.

సనకాదులు ధైర్యశాలులు. ఏ కోర్కెలు లేనివాళ్ళు. ఒకరోజు భక్తితో 'శ్రీహరి పాదసేవచేయా'లనే ఆసక్తితో లోకాలన్నింట యథేచ్చగా సంచరిస్తూ వెళ్ళారు.

మహాజ్ఞానులైన ఆ సనకాదులు లోకసంచారం చేస్తూ పోయి పోయి వైకుంఠాన్ని చూచారు. ఆ వైకుంఠం నిత్వమంగళకరమైన సంపదతో అలరారుతుంది. దాన్ని దర్శించిన భక్తజనం ఆ నగరవైభవాన్ని ప్రస్తుతిస్తారు. అందులో ప్రవేశించిన వాళ్ళకు ఇక పునర్జన్మ లేదు. అది సుజనులు ప్రశంసించే ప్రదేశం. భక్తకోటిని ఆ నగరం ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. అది శ్రేష్టమైన నగరం.

ఆ వైకుంఠపురంలో నివసించేవారు తమకు కర్మఫలత్యాగమే మహాఫలమని భావిస్తారు. మోక్షమే తమపాలిటి ధర్మంగా భావించి, వైకుంఠస్వరూపులై శ్రీహరి పాదపద్నాల్ని సేవిస్తూ సంతోషిస్తుంటారు.

(నిష్కామఫలం : సకామఫలం, నిష్కామఫలం అని ఫలితం రెండు రకాలు. చేసే కర్మకు ఫలితం ఆశిస్తే అది 'సకామఫలం' అవుతుంది. ఇది సగుణోపాసకుల ధర్మం. చేసేకర్శకు ఏ ఫలితాన్ని ఆశించనట్లయితే దాన్ని 'నిష్కామఫలం' అంటాం. ఇది నిర్గుణోపాసకుల ధర్మం.)

ఆ వైకుంఠంలో నివాసమున్న స్వామి శ్రీమన్నారాయణుడు. ఆయన రజోగుణతమోగుణాలకు దూరమైనవాడు. విస్తారమైన పేరుప్రతిష్టలు గలవాడు. సత్త్వగుణోపేతుడు. ఆయనకు చావుపుట్టుకలు లేవు. సమస్తసుఖాలు ఇచ్చేవాడు. తుదిమొదలు లేనివాడు. మహాశక్తిమంతుడు. వేదవేద్యుడు. పొరపొచ్చాలు లేని ధర్మమూర్తి. ఆ నగరమందలి ఉద్యానవనాలన్నీ ఆ భగవంతుని పేర చెలామణి అవుతున్నాయి.

అది పరాత్పరుడైన శ్రీమన్నారాయణుని నివాసం వైకుంఠం. అక్కడ నివసించేవాళ్ళు నిష్కాములై శ్రీహరిని సేవిస్తారు. శుద్ధసత్వమూర్తియైన విష్ణుమూర్తి భక్తుల కానందాన్ని కూరుస్తాడు. అక్కడ “నిశ్శ్రేయస”మనే పరమార్ధస్వరూపమైన ఒక వనముంది. ఆ వనంలో అన్ని ఋతువుల్లో పూలు పూచి, కాయలు కాచే కల్పవృక్షాలు కోకొల్లలుగా ఉన్నాయి. గంధర్వులు విమానాల్లో తమ ప్రియురాండ్రతో అక్కడికి వచ్చి భగవంతుని కథల్ని గానం చేస్తారు. ఆ సరోవరానికి దగ్గర ఒక మాధవీ లత ఉంది. దాని మధురవాసనతో కూడిన పిల్లగాలి మనసులకు హాయి గొల్పుతుంది. అందర్ని ఆకర్షిస్తుంది. అయినా భక్తుల మనస్సులు మాధవీలతలకంటెకూడ మనోజ్ఞమైన హరికథలపైననే ఉంటాయి. ఆ వనమందలి తుమ్మెదలు జుమ్మని ఝంకారాలు చేస్తూ విష్ణుకథలు గానం చేస్తుంటే పావురాలు, కోయిలలు బెగ్గురుపిట్టలు, చకోరాలు, రాయంచలు, తిత్తిరిపక్షులు, నెమళ్ళు అల్లరిచేయటం మానుకొని తుమ్మెదలు గానం చేసే విష్ణుకథలనే వింటూ తలలూపి ఆనందిస్తున్నాయి. విష్ణుదేవునికి తులసి అంటె చాలప్రీతి. కాబట్టి వనంలో ఉన్న మందారాలు, మల్లెలు, సంపెంగలు, గోరంటలు, కలువలు, తామరలు, పున్నాగాలు, నాగకేసరాలు, పారిజాతాలు మంచి పరిమళం గలవే అయినా తులసి చేసిన తపస్సే గొప్పదని దాని సౌభాగ్యాన్ని మెచ్చుకుంటాయి.

ఇక లక్ష్మీదేవి గొప్ప అందగత్తె. ఆమెది చంచలస్వభావం. ఎవ్వరిదగ్గర చాలాకాలం కాపురం ఉందదు. కాని ఆమె తన స్వభావానికి స్వస్తి చెప్పి విష్ణుమందిరంలో స్థిరంగా కాపురముంటోంది. పాదపద్మాల అందెలు ఘల్లుఘల్లు మనేట్లు వైడూర్యమణులు తాపిన బంగారుగోడలతో నిర్మించిన సుందరభవనంలో నడుస్తున్నప్పుడు ఆమె దివ్యసుందరవిగ్రహం వైడూర్యమణులపై ప్రతిఫలిస్తుంది. శ్రీదేవి ని
శ్శ్రేయసవనంలో పగడపుపావంచలుగల్గి అమృతతుల్యమైన నీరుగల సరస్సులందు విహరిస్తూ వాటిలో దంతక్షతమైన తన నెమ్మోవి ప్రతిఫలిస్తే చూచి 'ఇలా తననాథుని ప్రసాదం పొందగల్గా'నని మనసులో ఉప్పాంగిపోతుంది. ఆ వనం పుణ్యానికి శరణ్యమైంది. ధర్మానికి నెలవైంది. సుకృతానికి ఆలవాలమైంది.

మాధవుడంటే గిట్టనివాళ్ళు, అన్యదేవతా విషయాల్లో ఆసక్తిగలవాళ్ళు, పాపం మూటగట్టుకొన్న వాళ్ళు, నరకానికి దారితీసేవి, అందరిచే ఈసడింపబడేవి అయిన చెడ్డకథల్లో ఆసక్తి కల్గినవాళ్లు, ఆ శ్రీనాథుని పాదపద్మాలను ఎల్లప్పుడు కొలిచే భక్తుల నివాసాన్ని(వైకుంఠం) చేరుకోలేరు.

ఇంతేగాక, ఇంకా మోక్షాధీశ్వరుడును, నిగనిగలాడే జుట్టుగలవాడును, మొదలుతుది లేనివాడును అయిన శ్రీమన్నారాయణుణ్ణి ధర్మతత్త్వజ్ఞులై, కొంత అనుభవం కూడగట్టిన కొందరు మానవులు (ఆయన్ని) సేవించాలనుకొని, ఆ సర్వేశ్వరుని మాయవల్ల వైకుంఠంలో స్వామి పాదాల్ని పొందలేకపోతున్నారు.

మంచిపనులు చేసి సుకృతాత్ములనిపించుకొనే భక్తులు వైకుంఠపు పుణ్యస్థలంలో నివసిస్తారు. ఆ పుణ్యభూముల్లో నివసించేవారు శ్రీమన్నారాయణుని పవిత్రగాథల్ని వింటూ సంతోషంతో ఉప్పాంగిన కన్నీళ్లు కారడంవల్ల వాళ్ల చెక్కిళ్లు అందంగా ఉంటాయి. బొంగురుపోయిన కంఠంతో శరీరంపై పులకలు రేగి ఉంటారు. వారికి ఏ విధమైన కోర్కెలుండవు. అహంకారం వారిలో మచ్చుకైనా కన్పించదు. (ఈ లక్షణాలు గలవాళ్ళే ఆ పుణ్యభూముల్లో ఉండటానికి అర్హులని పిండితార్థం).

ఆ వైకుంఠ ధామం ఒక సరోవరం. అక్కడొక బంగారుశాల. దాని చెంత గోపురంతోడి మేడ. ఆ మేడ కల్గిన భవనం ఒక పద్మం. ఆ మందిరంలో ధగధగమెరుస్తున్న అనంతనామక సర్పమే తామరదుద్దు. అక్కడే అనంతశయనం. దానిపైన ఆ సిరిమగడు జుంటీగలా నివసిస్తాడు.

శ్రీహరిచే పాలింపబడునది, బంగారు గోపురంకలది, సత్పురుషుల సమూహంచే ఒప్పినట్టిది, అతిశయమైన మహిమనే ప్రకాశించునది అయిన శ్రీహరి సౌధానికి, లోకశ్రేయస్సు కోరే మునీశ్వరులు సనకసనందనాదులు సంతృప్తిమనస్కులై యోగబలంతో వడివడిగా కోరివచ్చారు.

ఆ ఋషులు అన్యచింతన మానుకొని కేవలం ఆ కమలాక్షుని చూడాలనే ఉత్సాహం గలవారై పచ్చరాళ్ళమణులు పొదిగిన ద్వార తోరణాలతో వెలిగిపోతున్న గోడలు, తలుపులు, గడపలు గల ఆరు లోగిళ్ళు దాటి ఏడవకక్ష్యలో సమానమైన ఈడుగల ఇద్దరు హరివాసపు కావలికాండ్రను చూచారు.
(షట్‌ సుకక్ష్యలు : ఆరు మంచిలోగిళ్ళు ఇక్కడ అంతరార్థముంది. ఆధ్యాత్మికప్రతీకలు ఈ లోగిళ్ళు. దేహం షట్‌చక్రశోభితమనీ, ఆ ఆరింటికి పైన శిరోమధ్యభాగంలో సహస్రారమనే ఏడవ చక్రముందని యోగులు చెపుతారు.

ఆరుచక్రాలు : 1) మూలాధారం - గుదస్థానం, 2) స్వాధిష్ఠానం - పొత్తికడుపు ౩) మణిపూరం - నాభినుండిపైకి 4) అనాహతం - వక్షోభాగం, 5) విశుద్ధి - కంఠభాగం, 6) ఆజ్ఞాచక్రం - ఫాలభాగం 7)సహస్రారం - మధ్యశీర్షం. దీనికి బ్రహ్మరంధ్రమనిపేరు.)

సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు నల్గురు యోగులు వైకుంఠమునకేగి అక్కడ విష్ణుమూర్తి యొక్క మందిరం ముందు నిల్చున్న ఇర్వురు ద్వార పాలకులను చూచారు. ఆ ఇద్దరు నవరత్నాలు పొదిగిన బంగారు కడియాలు, ఉంగరాలు, హారాలు, భుజకీర్తులు, కాళ్ళ అందెలు ధరించి ఉన్నారు. వారు ఎదపై ధరించిన సువాసనగల తోమాలలగంధానికి ఆకర్షింపబడి తుమ్మెదలు మూగుతున్నాయి. చేతుల్లో గదలు తాల్చి ఉన్నారు. వారికి నాల్గేసి భుజాలున్నాయి. చాలా ఉత్సాహంగా కన్పిస్తున్నారు. కళ్ళల్లో కోపాగ్ని జ్వలిస్తోంది నొసళ్ళపై ముడుతలు వంకర దిరిగి ఉన్నాయి. చేతుల్లో బెత్తాలున్నాయి. మునులు మహాబుద్ధిమంతులు మరియు గొప్ప జ్ఞానవృద్దులు. కంటికి చాలా చిన్నవారుగా కన్పిస్తారు.

ఎంతో వృద్దులైనప్పటికి ఆత్మతత్త్వజ్ఞులైన సనకాదులు నల్వురు చూచుటకు అయిదేండ్ల ప్రాయంగలవాళ్ళలా కనిపిస్తూ మనస్సులో జంకుకొంకు లేకుండ చకచక నడుస్తూ శ్రీహరిద్వారం చేరబోయారు.

జ్ఞానశ్రేష్ఠులైన సనకాదిమునులు నల్వురు శ్రీమన్నారాయణుణ్ణి చూడాలనే కోర్కెతో ముందుకు వచ్చారు. ఇంతలో ఆ ఇద్దరు వేత్రహస్తులు తమ ఆజ్ఞను జవదాటకుండా వాళ్ళని ముందుకు సాగనివ్వలేదు.

వేత్రహస్తులు లోపలికి వెళ్ళకుండా అడ్డుకొన్నారు. అక్కడ చేరిన దేవతలు చూస్తున్నారు. అప్పుడు సనకాదులు కోపంతో ఎర్రబారిన చూపులు గలవారై వాదోపవాదాలను నివారించి, ఆ ద్వారపాలకులు, మరియు అచ్చట మూగిన దేవతలు వినేటట్లు ఇలా అన్నారు.

మునులు దేవతలనుద్దేశించి "పరమాత్ముడును, భక్తుల్ని పాలించేవాడును, చెలికాడును, దేవాధిదేవుడునునైన శ్రీమన్నారాయణుణ్ణి నిరంతరం సేవించాలని ఏ ఆటంకం లేకుండా ఇచ్చటికి వచ్చాం. మా సేవకు ఇప్పుడు అడ్డుతగులుతూ, మహోత్సాహంతో కాపలా కాస్తున్న ఈ దుర్మార్గులను మీరు చూచారు గదా!"

సనకాదిమునులు జయవిజయులతో "స్వామి హితాన్ని కోరే మావంటి నిష్కపటుల్ని మందిరంలోనికి అనుమతించడమూ, మోసగాండ్రను లోనికి వెళ్ళకుండా అడ్డుపడటం అనే ఈ రెండు ప్రవృత్తులు వేత్రహస్తుల విహితలక్షణాలని భావించి మీరు మమ్మల్ని లోనికి వెళ్ళకుండా నివారించారు. వినండి. శ్రీమన్నారాయణుడు దివ్యశక్తితో విరాజిల్లువాడు. రూపనామాలు లేనివాడు ఈ చరాచరప్రపంచమంతా ఆయన కడుపులో దాగి ఉంది. ఆయన భగవంతుడు. ఆయన పొందదగింది(ప్రాష్యం), పొందించేది(ప్రాపకం), పొందటం(ప్రాప్తి) అనే ఈ త్రిపుటియందు ఏలాటి భేదం లేనివాడు. జ్ఞానులు ఆయన్ను మహాకాశంలో ఘటాకాశపటాకాశాలు విలీనమైవున్నట్లే సమస్తమైన ఆత్మలలో దాగి ఉన్నాడని భావిస్తారు. అంతేగాక లోకంలో రాజులు తప్పుచేసిన భృత్యుల్ని దండిస్తున్నట్లే, స్వామికూడ తమ్ము దండిస్తాడు గదా అనే సందేహంతో మమ్ముల అడ్డుకొన్నట్లు అనుకొంటారేమో? అలా భావించవద్దు. ఎందుకంటే బ్రాహ్మణవేషం తాల్చిన (బ్రహ్మతత్త్వజ్ఞులు) మాకు, వైకుంఠవాసుడైన హరికి భేదం లేదు. మమ్మల్ని శంకించవద్దు. ఇదంతా తెలిసికూడ మీరు తెలివిలేనివారై మాయెడ అనుచితంగా ప్రవర్తించారు. కాబట్టి మిమ్మల్ని శపిస్తున్నాం. భూలోకంలో పుట్టండి. మిమ్మల్ని 'కామం, క్రోధం, లోభం అనే శత్రువులు పట్టి పీడిస్తాయి' అని మునులు ఆ జయవిజయుల్ని శపించారు.

జయవిజయులు సనకాదుల శాపవచనాలు విని ఉలికిపడ్డారు. బ్రాహ్మణుల శాపం వాడియైన బాణాలచేతకూడ నివారింప శక్యం కానిది కావడంవల్ల వాళ్లు తల్లడిల్లి పోయారు.

శ్రీహరి ద్వారపాలకులిర్వురు తమపై పడిన శాపానికి బాధపడుతూ సనకాదుల పాదాలపై సాగిలపడ్డారు. అనంతరం తమ నొసటిపై దోసిలొగ్గారు.

ద్వారపాలకులు ఈ విధంగా మొరపెట్టుకున్నారు. "ఓ మహాయోగీశ్వరులారా! మీరు మమ్మల్ని యిలా చాలా కఠినంగా శపించారు. ఇక అందుకు బాధపడి ప్రయోజనం లేదు. మేము అజ్ఞానులం. మీ వంటి ఉత్తములను అవమానించినందువల్లే మాకు ఈ దుర్దశ కల్గింది. అయినా మాకు మేలే జరుగుతుంది" అని జయవిజయులు మునులతో అన్నారు.

"మహాత్ములారా! మీరు మాపై దయగలవారైతే మా కోర్కె ఒక్కటే. మేము లోభమోహాలతో కూడిన జన్మ ఎత్త బోతున్నాం. ఆ కాలంలో శ్రీమన్నారాయణుని నామోచ్చారణ మరువకుండా అనుగ్రహించండి. అందువల్ల మేము మున్ముందు ఎత్తబోయే జన్మలు తరిస్తాయి" అని జయ విజయులు మునులకు మొరపెట్టుకొన్నారు.

జగన్నాయకుడును, ఆదిమధ్యాంతాలు లేనివాడును అయిన ఆ శ్రీహరి అక్కడ సనకాదులకు, వేత్రహస్తులకు మధ్య సాగుతున్న గొడవ విని భక్తుల బాధను తొలగించాలనీ, వారికి సంతోషం కల్గించాలనీ భావించి, తన అంతఃపురంలోని లోగిళ్ళు దాటి వచ్చాడు.

ఇంతేకాక, ఇంకా లక్ష్మీదేవికూడా తొట్రుపాటుతో విష్ణువువెంట వచ్చింది. పరమహంసలైన మునీశ్వరులకు వందనీయాలైన పదారవిందాల యందలి నూతనమైన మణులు పొదిగిన బంగారు అందెలు శ్రావ్యమైన శబ్దం చేస్తూ ఉండగా ఆయన నడచి వచ్చాడు. మహానుభావులు, యోగివరేణ్యులు సేవిస్తుండగా స్వామి దర్శనమిచ్చాడు.

శ్రీహరియొక్క ముంజేతికి తొడిగిన బంగారు రత్నకంకణాలు గ
ల్లుగల్లుమంటున్నాయి. అప్సరసలు రాయంచరెక్కలవంటి తెల్లని వింజామరలతో వీస్తున్నారు. వాటి గాలికి గొడుగుల అంచులలో వ్రేలాడుతున్న ముత్యాలహారాలు కదలాడుతుంటే ఆ హారాలనుండి స్రవించిన జలబిందువులు స్వామి శరీరంపై పడి నిగనిగలాడుతున్నాయి-

ఆ తర్వాత ఇంకా ఆ శ్రీమహావిష్ణువు వైకుంఠనగరానికే అలంకారంగా ఉన్నాడు. ఆ నగరం సమస్తలోకాలకు మకుటంగా విరాజిల్లుతోంది. ఇక ఆ స్వామి చుట్టు చేరిన ఋషీశ్వరులు పొగడుతుంటే ఆయన ముఖపద్మం చిరునవ్వుతో వెలిగిపోతోంది. చల్లని చూపులతో తన్నుతూ ఆ దైవం భక్తులహృదయాల్లో నివసిస్తున్నాడా అన్పిస్తుంది. ఆయన నిగనిగలాడే రొమ్ముపై విష్ణుమాలిక వ్రేలాడుతోంది. భక్తులను సంరక్షించాలనే దయార్ద్రదృష్టి ఆయన కన్నుల్లో తొణికిసలాడుతోంది. ఋషీంద్రులాయన్ని సేవిస్తున్నారు. ఆయన సత్పురుషుల్ని కాపాడగల దేవుడు.

శ్రీహరి తాను మొలకు కట్టుకొన్న పసుపుపచ్చని పట్టుపుట్టం వల్ల మొలనూలి కాంతి జిగేలు మంటున్నది. మెడకు తాల్చిన హారకాంతులవల్ల కౌస్తుభమణికాంతులు అతిశయించాయి. మెరపు తీగెల జిగిని సైతం తిరస్కరించే చెవిపోగుల తళతళలు చెక్కిళ్ళ సోయగాన్ని ఇనుమడింపజేస్తున్నాయి. స్వామి ధరించిన నవరత్నాల కిరిటప్రభలు దిక్కులన్నింట వ్యాపించాయి.

గరుత్మంతుని వీపుపై మోపిన ఎడమచేతికి చుట్టుకొన్న బాహుపురులు శోభిల్లుతున్నాయి. ఆయన కుడిచేత అందమైన విలాసపద్మం తిరుగుతోంది.

పాదపద్మాల మనోహర కింజల్కసమూహకాంతిచేత చూడముచ్చటగా ఒకింత ఎరుపెక్కిన తులసిమాల మకరంద సువాసనతో కూడిన గాలిని పీలుస్తూ తనకు సేవచెయ్యాలని ఎదురుగా వస్తున్న సనకసనందనాదులకు మానసికానందాన్ని కలిగించేవాడై, బాహ్యేంద్రియ అంతరింద్రియాల్లో పూర్తిగా నిండిన సంతోషంచేత గగుర్పొడిచిన వెంట్రుకలు కలవాడై, ఆకర్షకం, కాంతిమంతం అయిన స్వరూపంతో రమాదేవి అందం క్రిందగునట్లు ప్రకాశిస్తూ సర్వేశ్వరుండైన శ్రీహరి పాదచారియై వచ్చాడు.

ఆ స్వామి మహావైభవంగా మునులచెంతకు పాదచారియై వచ్చాడు. ఆయన కిందిపెదవి పగడపువన్నె గలదై ఎర్రని కాంతితో ఒప్పారగా, విచ్చిన మొల్లమొగ్గలను బోలిన చిరునవ్వు మోముపై తాండవిస్తుంటే సనకాదులు చూచారు. ఆ చూపుతో వారు సంతృప్తి చెందజాలక ఆ దేవుని ముఖసౌందర్యాన్ని తదేకంగా మరల మరల అలా చూస్తూ ఉండిపోయారు.

సనకాదిమునులు అలా భగవంతుడు తమకు ఎదురుపడగానే ఆ రూపాన్ని తనివిదీరా చూస్తూ తమ చూపులను మరల్చుకోలేకపోయారు. ఎలాగో చివరకు మళ్ళించి స్వామిపాదాలను చూచారు. ఆ పాదాలు పాపరహితులైన భక్తులబాధలను నివారించగలవు. మునీశ్వరులకు హృదయానందాన్ని ప్రసాదించగలవు. వైకుంఠపువాకిలిని తెరిచి ఉంచగలవు. వాటి అందెలమ్రోతలు వేదాలకు సరికొత్త భాష్యం చెప్పగలవు. (అంతటి మహిమలు గల పాదాలను మునులు చూచారని తాత్పర్యం)

మునులు శ్రీహరి పాదాలను చూచిన తర్వాత వాటిని తమయెదలో భద్రపరుచుకొన్నారు. ఆ పాదాలకు గోళ్ళు పద్మరాగమణికాంతులు గలవై మెరిసిపోతున్నాయి. తమ కోర్కెలీడేరునట్లు ఆ స్వామిపాదాలకు ఆ మునులు సారె సారెకు నమస్కరించారు. ఆ మహాత్ముడు యోగులకు సైతం చిక్కడు.

ఆ శ్రీహరి ధ్యానగమ్యుడు. తత్త్వజ్ఞులు మాత్రమే ఆయన్ని చూడగలరు. ఆయనది భక్తజనాలకు ఆనందాన్నిచ్చేరూపం. సనకాదులు మహిమగల ఆ రూపాన్ని తమ మనస్సుల్లో నిలుపుకొన్నారు.

తమ ఎదుట కన్పిస్తున్న దివ్యస్వరూపుడు మహాతేజోనిధియైన శ్రీహరిని చూచి సనకాదులిట్లు ప్రస్తుతించారు.


Maitreya tells Vidura the story of Hiranyakashipu and Hiranyaksha - మైత్రేయ మహాముని విదురునకు హిరణ్యాక్ష హిరణ్య కశిపుల వృత్తాంతం బెఱింగించుట

మైత్రేయ మహాముని విదురునకు హిరణ్యాక్ష హిరణ్య కశిపుల వృత్తాంతం బెఱింగించుట

'విదురా! విను' దక్షునిబిడ్డ దితి అనే సాధ్వికి సంతానకాంక్ష కల్గింది. ఆమె ఒకరోజు తన మనస్సులో రేగిన మదనతాపానికి తట్టుకోలేక కామాతురయై భర్తకశ్వపుని చెంతకు వచ్చింది. కశ్యపుడు అప్పుడే యజ్ఞనాథడైన శ్రీమన్నారాయణుని స్మరించి, సాయం సంధ్యానుష్థానం ముగించుకొని యజ్ఞశాలముంగిట విశ్రమించి ఉన్నాడు. అది సూర్యాస్తమయ సమయం. దితి భర్త చెంగట నిల్చి వినయంగా ఇట్లన్నది.

"ప్రాణేశ్వరా! మదోద్రేకంతో ఏనుగు అరటిబోదెల్ని ఊపునట్లు మన్మథుడు పూలబాణాలతో నా మనస్సును కకావికలు చేస్తున్నాడు. ఈ బాధ భరించలేను. అందుకే నీ పాదపద్మాల చెంతకు వచ్చాను. ఇక నీ సామర్థ్యాన్ని ప్రదర్శించి నన్ను కాపాడవా?" అని దితి కశ్యపుని అర్థించింది.

దితి భర్తయైన కశ్యపునితో మహాత్మా! నా సవతులెల్లరు నీ అనుగ్రహంవల్ల గర్భవతులై మహానందంతో ఉన్నారు. ఆ విషయం అనుకుంటే నా మనస్సు కలత చెందుతున్నది. నా బాధను మాన్పి నన్ను రక్షించండి. అది మీ ధర్మం. మీరు గొప్ప జ్ఞానులు. మీకు తెలియని దేముంది? మీ వంటి ఉత్తమపురుషులు దుఃఖభాగుల కోర్కెలు వ్యర్థం కాకుండ తీర్చటం ధర్మం" అని ఇంకా ఈ విధంగా అన్నది.

ఓ మహానుభావా! లోకంలో భర్తయొక్క ఆదరాన్ని చూరగొన్న భార్యకు ఇష్టవస్తు ప్రాప్తి మరియు శాశ్వతమైన కీర్తి చేకూరుతాయి. ఇవి లోకమంతా మెచ్చుకోదగ్గ విషయాలు గదా!

భర్త తన ఇల్లాలి గర్భాన కొడుకయి పుడతాడు. ఎట్టన ఒక దీపం వల్ల వేరొక దీపం వెల్గుతుంది- అయినా అగ్ని ఒక్కటే గదా!

'ధీమంతుడవైన స్వామీ! నేను పైన చెప్పిన అంశమే' ఆత్మా వై పుత్రః అని వేదాలు కంఠోక్తిగా వాకొంటున్నాయి. ఇది మీకు తెలియనిదేమీ గాదు. ఈ దీనురాల్ని దయతో కాపాడండి.

మహానుభావా! పురుషశ్రేష్ఠుడా! మా తండ్రికి కూతుళ్ళమీద వాత్సల్యమెక్కువ ఎంతో దయార్ద్రబుద్ధి గల ఆయన ఒకరోజు మా అందర్ని పిలిచి "తామరసాక్షులారా! మీకు ఎవరిపైన మక్కువ ఉందో చెప్పండి. ఆయనకే ఇస్తానని చెప్పాడు. మా అక్కచెల్లెళ్ళలో మేము పదముగ్గురం నిన్నే ఇష్టపడ్డాం గదా!" అని దితి కశ్యపునితో అంది.

ఇలాగా దితి కామేచ్చతో పరవశించి అనేకవిధాల భర్తృసాంగత్యం కోరింది. ఆయన మనసు కరిగింది. దయనీయురాలు, పతివ్రత అయిన తన ఇల్లాలు దితితో కశ్యపుడు ఉల్లాసంగా ఇలా అన్నాడు.

కశ్యపుడు దితితో "మానినీ! నీవు ముందన్నట్లే మగవారికి తమ భార్యలవల్లనే ధర్మం, అర్థం, కామం అనే మూడు పురుషార్థాలు సమకూరుతాయి. నావికుడు తన నావచేతనే సముద్రాన్ని తరిస్తున్నట్లు, గృహస్థాశ్రమవాసి, తక్కిన బ్రహ్మచర్య వానప్రస్థ సన్న్యాసాశ్రమవాసులకు ఆశ్రయమిచ్చి కాపాడుతాడు. గృహస్థాశ్రమసంబంధియైన కష్టాల కడలిని తరిస్తాడు. భార్య భర్తలో అర్ధభాగస్వామిని. భర్త తన ఇంటి బాధ్యతలన్నింటిని తన ఇల్లాలిపై మోపి నిశ్చింతగా సుఖీస్తాడు. దుర్గాన్ని ఏలే రాజు విరోధులను మట్టు పెడుతున్నట్లే భార్యతోకూడిన భర్త తక్కిన ఆశ్రమాలకు అసాధ్యమైన ఇంద్రియశత్రువర్గాన్ని అవలీలగా జయిస్తాడు. ఈ విజయం పురుషులకు తమ భార్యలవల్లనే సాధ్యం. అలాంటి భార్యకు ఎంత గొప్ప సత్పురుషులైనా ఎన్ని జన్మలెత్తినా తిరిగి ఉపకారం చేయలేరు. మరి మాలాంటివారు చేయగలరా? (చేయజాలరనుట) సరే-నీవేమీ ఏడ్వవద్దు" అని అనునయించాడు.

కశ్యపుడు 'చంచలాక్షీ! నీవు బిడ్డలు గల్గాలనే కోరికతో నా సాంగత్యాన్ని కోరి వచ్చావనటం నిజం. మంచివంశంలో పుట్టి చక్కని శీలం, నడవడిక గల ఇల్లాలి కోర్కెల్ని నెరవేర్చటం మగని బాధ్యత అని దితిని అనునయించాడు.

"జవ్వనీ! కొన్ని క్షణాలు ఓపికపట్టు. ఇది సంజవేళ. ఈ సమయంలో మన్మథుని మట్టు పెట్టిన పరమేశ్వరుడు ప్రమథులు వెంటరాగా ఎద్దునెక్కి ఇక్కడ సంచరిస్తాడు. ఇది తగిన సమయం కాదు. భయంకరమైన సమయంలో కామక్రీడ నిషిద్ధం. మనం ధర్మాన్ని అతిక్రమించటం ఎందుకు?

పద్మముఖీ! అదిగో అతడే నీ మరది రుద్రుడు. శ్మశానవాటికలో వీచే సుడిగాలికి లేచిన దుమ్ము ఆయన ఒంటిని కప్పేసింది. నలుపు ఎరుపు కలిసిన రంగుతో విశేషంగా వెలుగుతూ చెదరి ఉన్న జడలతో, నిలువెల్ల పులుముకొన్న బూడిదవల్ల బంగారుకాంతితో భయంకరుడుగా ప్రకాశిస్తున్నాడు.

ఓ కాంతా! తన సూర్యచంద్రాగ్ని నేత్రాలను వికసింపచేసి, మిక్కిలి కోపావేశంతో చూస్తున్నాడు. ఇప్పుడు మన బంధుత్వాన్ని గూర్చి ఆలోచించవద్దా?

ఆ పరమశివుడు సమదృష్టిగలవాడు. పంచభూత స్వరూపుడు. ఆయనకు శత్రువులు లేరు. మిత్రులు లేరు. పూజ్యులుగాని తిరస్కరింప దగినవారు గాని లేరు.

"ఓ తరుణీ! ఆయన దేవతల్లో మూలపురుషుడు. ముల్లోకాలను పవిత్రం చేయగల మహాత్ముడు. విశ్వానికే ప్రభువు. సంపదలకు నెలవు. నా సోదరుడు. అంతటి మహిమలుగల ఆ ఈశ్వరుణ్ణి నా మరదే గదా అని చూడకు, అని కశ్యపుడు దితిని హెచ్చరించాడు.

నావంటివారూ, మరియు మహానుభావులైన విజ్ఞానవంతులు - మెడలో వేసుకొని తీసి, దూరంగా విసిరివేయబడిన పూలహారంవంటి మాయాదేవిని అనుసరించి జీవిస్తాం. ఆ మాయకూడా ఆ పరమేశ్వరుని పాదసేవకు తహతహలాడుతూ ఉంటుంది.

బ్రహ్మ ఇంద్రుడు మరియు తక్కిన దిక్పాలురు తమ పదవుల్లో స్థిరంగా ఉండటానికి ఆ పరమేశ్వరుని దయే మూలకారణం. విశ్వమంతటిని ఒక కంట చూచే మాయ ఆయన ఆజ్ఞకు లోబడి ఉంటుంది. ఆయన మహిమలను చతుర్వేదాలు సైతం వివరించలేవు. ఈ సమస్తలోకాలు ఆయన్ని సేవిస్తున్నాయి. ఆయనతో సమానమైనది, సమానమైనవాడు, ఆయనకంటె అధికమైనది, అధికమైనవాడు లేడు. ఆలాంటి త్రిపురసంహారకుణ్ణి దేవ దేవుణ్ణి లోకులు ఎముకలపేరు ధరిస్తాడని, భిక్షాటన చేసి బ్రతుకుతాడని బూడిద అంటుకుంటాడని శ్మశానంలో నివసిస్తాడని గేలి చేస్తారు.

లోకంలో అవివేకులు కుక్కలు తినదగింది, మరియు ఇహపరాలకు దూరమైన శరీరం ఉత్తమమైనదని అనుకొంటున్నారు. దానికి దుస్తులు, మాలలు, ఆభరణాలు అలంకరిస్తున్నారు.

"ఓ మానినీ! శరీరమే ఆత్మయని దానికి పైపై మెరుగులు దిద్దుకొనే వారందరు గొప్ప దౌర్భాగ్యులని తెలిసికో" అని కశ్యపుడు దితితో అన్నాడు. కాని ఆమె మనస్సులో మదనబాణాలు గాఢంగా నాటుకొన్నదై భర్తతో ఇలా అంది.

భర్త తానెంతగా వారించినా వినక దితి సిగ్గుతో తలవాల్చి, ఆ సంధ్యాసమయాన నిషిద్ధమైన రతి కర్మయందే ఆసక్తి గలదై వారవనితలాగా మగణ్ణి గాఢంగా కౌగిలించుకొంది.

అలా దితి చేసిన ఒత్తిడికి తలొగ్గి కశ్యపమహర్షి పరమేశ్వరునికి దండంపెట్టి, రహస్యంగా ఆమెతో సంగమించాడు. తర్వాత సత్త్వగుణోపేతమూ, సనాతనమూ అయిన గాయత్రీ మంత్రాన్ని జపించాడు.

చేయకూడని పని చేసినందుకు సిగ్గుపడుతూ తల దించుకుని పరమేశ్వరుని వల్ల ఏ ఉపద్రవం కల్గుతుందో అని భయపడుతూ ప్రియమార - ఇలా అంది.

దితి కశ్యపునితో "స్వామీ! చరాచరప్రాణికోటికి ప్రభువు పరమేశ్వరుడు. ఆయన నేను చేసిన తప్పును మన్నించి, నా గర్భాన్ని కాపాడుగాక. ఆయన ప్రాణుల దుఃఖాన్ని నివారించేవాడు. ఆయన మహాత్ముడు. తనంతతాను వెలిగేవాడు. ఆయన ఆజ్ఞ దాటరానిది. సగుణారాధకులకు కోర్కెల్ని పండిస్తాడు. నిర్గుణోపాసకులకు మోక్షమిస్తాడు. అవసరమనుకుంటే త్రిశూల మెత్తుతాడు. అవసరం లేదంటే శూలాన్ని ఆవలపెట్టుతాడు. దుర్మార్గుల్ని శిక్షిస్తాడు. ఆయన పరమాత్ముడు. ఆయన సర్వాంతర్యామి. త్రిగుణాతీతుడు. ఏ కోర్కెలు లేనివాడు. భక్తులపాలిటి కొంగుబంగారం. భగవంతుడు - అన్ని శుభగుణాలు గల ఆ దేవునికి నమస్కరిస్తున్నా ఆయన ఆరు సంపదలు గలవాడు. లోకాలకు ప్రభువు. దయాదాక్షిణ్యాలు గలవాడు. తన ఆదేశాలను పాటించే స్త్రీలను కాపాడేవాడు. పైపెచ్చు మాసోదరి సతీదేవికి మగడు. ఆయన నన్ను రక్షించాలి అని ఆమె పరమశివుని ప్రార్థించింది.

ఇంతదాక దితికి సంతానం లేదు. ఇప్పుడు తన భర్తవల్ల కడుపు పండింది. ఆమెకు కల్గిన సంతోషానికి మేరయే లేదు.

కశ్యపుడు వెంటనే ఆ నాటి సాయంకాలం యథావిధిగా సంధ్యా వందనం నిర్వహించినాడు.

తన ఇల్లాలు గర్భవతి అయ్యిందని మారీచుడు(మరీచిమహర్షి పుత్రుడైన కశ్యపుడు) సంతోషపడలేదు. పైపెచ్చు అకాలరతికార్యానికి నొచ్చుకొని ఆమెతో ఇట్లన్నాడు.

ఓ మహాపతివ్రతా! దితీ! ఇది అనుచితకార్యమనే జంకు నీ కేమాత్రం లేదు. మదనుడు చెరకు విల్లెక్కుపెట్టి వదలిన సమ్మోహనాస్త్రాలకు నీ మనస్సు చెదిరింది. విచక్షణ కోల్పోయి సిగ్గువిడిచి, నిర్భయంగా ధర్మవిరుద్ధమైన పాపక్రీడకు వేళకాని వేళ ఒక వేశ్యలాగా పాల్పడ్డావు. దుశ్చర్యయందాసక్తి గల్గి సంగమించావు. (ఇది నీ దౌర్భాగ్యమని నింద)

అలా జరిగినందువల్ల, ఓ సాధ్వీ! ప్రమథులశక్తితో కూడుకొన్నవారు, భయంకరమైన పనులుచేసేవారు, మహాపరాక్రమవంతులు, మరియు పిశాచగణంచేత ప్రేరింపబడ్డవారు 'భద్రుడు-అనుభద్రుడు' అనే పేరుగల ఇద్దరు పుత్రులు కలుగుతారని అన్నాడు.

భద్రుడు, అనుభద్రుడనే వారిద్దరు నీకు కొడుకులుగా పుడతారు. వారు పొగరుబోతులై మంచివారిని ఎల్లప్పుడూ పీడిస్తారు. భూమికి భారంగా ఉంటారు.

ఆ ఇర్వురి దుశ్చర్యలకు తాళలేక మహాత్ములు అన్నీ తెలిసిన శ్రీమహావిష్ణువుకు మొర పెట్టుకొంటారు. ఆ స్వామి వజ్రాయుధంతో ఇంద్రుడు కొండలరెక్కల్ని ముక్కలు చేసినట్లు వారిని నేల కూలుస్తాడు.

శ్రీహరి నీ ఇర్వురి కుమారుల్ని చంపేస్తాడని భర్త చెప్పగానే దితి భయంతో చలించి పోయింది. మనస్సులో దిగులు చెందింది. భర్తమొగం చూచి ఇలా అంది.

"లోకంలో సజ్జనులను అవమానించేవారు లేదా వారికి అపకారం తలపెట్టెవారు దుష్టులు. అలాంటి వారి జీవితం, సంపదలు నశిస్తాయి. శత్రువులవల్ల వారు చస్తారు. ఇది నిజం. నీ కుమారులు మహాత్ములకు అపకారం చేసి బ్రాహ్మణుల కోపాగ్ని కెరగాకుండ, శ్రీహరిచే చావుకు గురిగావటం మంచిది" అని దితి భర్తతో అంది.

శ్రీహరి చేత చచ్చుటే తగునని దితి అన్నది. అప్పుడు కశ్యపుడు ఆమెతో నారీమణీ! నీవు చేసిన విడ్డూరపుకర్మ(అకాలసురతక్రీడ) వల్లనే ఈ దురవస్థ ఎదురైంది. దీనికై నీవు పరితపించవద్దు. నీవు శ్రీమన్నారాయణుని పాదపద్మాలను కొల్చటంవల్ల నైతేనేమి, సంతోషంతో నన్నారాధించటంవల్ల నైతేనేమి - నీకు మంచి జరుగబోతుందని పై కథతో అన్వయం.

దేవీ! నీ కొడుకులలో హిరణ్యకశిపునికి పుట్టెవారిలో మహాధర్నాత్ముడు. శ్రీహరి పాదపద్మాల్ని నిరంతరం సేవించేవాడు జన్మిస్తాడు.

అంతేగాక, ఆ హిరణ్యకశిపుని కుమారుడు మహాపుణ్యాత్ముడు మరియు మహాబుద్ధిమంతుడు అవుతాడు. ఆ పుణ్యాత్ముని కీర్తిలతలు బ్రహ్మండపర్యంతం ప్రాకుతాయి. అతడు కులాన్ని పవిత్రం చేయగలవాడు.

"సులోచనా! విను. నీ మనుమడు దుర్మార్గుని(హిరణ్యకశిపుని) కడుపున పుట్టిన బిడ్డడే అయినా, శ్రీహరి పాదసేవకుడైన భక్తుడు కాబట్టి అగ్నిశుద్ధివల్ల మసక తొలగి బంగారం స్వచ్చంగా వెల్గినట్లు రాక్షసవంశాన్ని పవిత్రం చేస్తాడు" అని కశ్యపుడు ఆమెను ఆశ్వాసించాడు.

నిరంతరం అష్టాంగయోగాన్ని సాధనచేసే మునీశ్వరులు సైతం నీ మనుమడు నడిచే ఉత్తమ మార్గంలోనే నడవాలని భావిస్తారు. (ఆతని శీల సంపద ఉదాత్తమైనదే గాక ఆదర్శప్రాయమైనదని అభిప్రాయం).
(అష్టాంగయోగ క్రియలు: ఇవి ఎనిమిది రకాలు 1. యమం 2. నియమం 3. ఆసనం 4. ప్రాణాయామం 5. ప్రత్యాహారం 6. ధ్యానం 7. ధారణ 8. సమాధి

1. యమం : అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం అనే ఐదింటిని యమమంటారు.

2. నియమం : శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వరప్రణిధానం అనేవి నియమంగా గుర్తింపు పొందాయి.

3. ఆసనం : స్థిరసుఖమాసనం-చలనం లేనిది, సుఖమైంది ఆసనం. ఇవి చాల రకాలు-పద్మాసనం, వజ్రాసనం వగైరా.

4 ప్రాణాయామం : రక్తశుద్ధికి ప్రాణాయామం ప్రాణాపానగతుల్ని నిరోధించే కార్యక్రమం.

5. ప్రత్యాహారం : చంచలమైన మనస్సును ఎక్కడెక్కడో సంచరింప నీయకుండా ఆత్మయందు నిల్పటం.

6. ధారణ : మనస్సును ఆత్మాయత్తం చేసిన తర్వాత దేన్నీ స్మరించకుండటం.

7. ధ్యానం: ఆత్మవిశుద్ధికొరకు ఆసనమందుందటం. 'ధ్యానేనాత్మని పశ్యంతి' అని గీత.

8 సమాధి : 'యోగపరిపూర్ణత అకల్మషమైన బ్రహ్మానందానుభూతి.

చిత్తవృత్తులను నిరోధించే ఈ క్రియను అష్టాంగ యోగమని మునులు నిర్వచించారు.)

ఓ దితీ! నీ మనుమడు భక్తుల్లో మేటి. మహానుభావుడు. సుగుణాలరాశి. ఆయన విష్ణుసేవయందే మనస్సును లగ్నంచేసి, తులసీమాల ధరించినవాడునూ, మోక్షాధినాథుడునూ అయిన ఆ సిరిమగణ్ణి ధ్యానిస్తూ మరో వస్తువంటే పరిహసిస్తాడు - త్రోసిపుచ్చుతాడు. (విష్ణువు తప్ప తక్కిందేదీ కూడ ఆయన మనస్సుకు పట్టదు).

"ఓ దితీ! అట్టి నీ మనుమడు జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాల పట్ల మక్కువ లేనివాడు. తాపత్రయం లేనివాడు. ఇతరులు బాగుంటే సంతోషిస్తాడు. వారు బాధపడితే తాను బాధపడతాడు. ఈ జగత్తుకంతటికి ఆయనే ప్రభువు అని తెలిసికొని ఆ విశ్వనాథుణ్ణి మనసార తదేక దృష్టితో దర్శిస్తాడు. వేసవి కాలంలో తాపానికి గురి అయ్యేవారికి ఆయన వెన్నెల సోకినట్లు హాయి గొల్పుతాడు. అన్ని లోకాలబాధలు తొలగిస్తాడు. అతనికి శత్రువులే లేరు" అని కశ్యపుడు భార్యను అనునయించాడు.

ఎల్లప్పుడు నీ మనుమడు శ్రీహరిధ్యానమందే మనస్సును నిల్పినవాడు. అంతేగాదు భగవద్భక్తుల్లో అగ్రగణ్యుడు కూడ.

అంతేకాదు. నీ మనుమడు స్వచ్చమైన అంతరింద్రియాల్లో, బాహ్యేంద్రియాల్లో, కుండలాలతో అందాన్ని సంతరించుకొన్న ఆ లక్ష్మీపతి ముఖాన్ని ఆనందాతిశయంతో తన ఇచ్చివచ్చినట్లు చూస్తూ ఉంటాడు.

మనువుతో సమానుడైన నీ మనుమడు తన మనస్సులో ఈ విశ్వమంతా విష్ణుమయమని భావిస్తాడు. మహాత్ములైన మనువుల్లో నీ మనుమడు గొప్పవాడుగా పొగడ్తలందుకొంటాడు అని కశ్యపుడు చెప్పాడు.

కశ్యపుడు అలా మనుమని గొప్పదనాన్ని గూర్చిచెప్పగా విని దితి తన మదిలో నా కుమారులిర్వురు మాధవునిచేత చస్తారనీ, నా మనుమడు అందరూ మెచ్చుకోదగ్గ హరిభక్తుడవుతాడని విని ఒకవైపు దుఃఖంతో, మరోవైపు సంతోషంతో మథనపడింది.

దుఃఖం-సంతోషం రెండింటితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నది దితి. కశ్యపునివల్లనైన తన గర్భం తేజస్సుతో వెలుగుతోంది, అంతేగాక అన్యతేజస్సులను నిర్వీర్యం చేస్తున్నది; రోజు రోజుకు పెరుగుతున్నది. ఆమె తనకడుపున పుట్టబోయే కుమారులు దేవతలను మట్టుపెడతారని ఆలోచిస్తున్నది. అలా ఆ గర్భాన్ని ఆమె నూరేళ్ళు మోసింది.

దితి గర్భంనుండి ఇతరశక్తులన్నింటిని కాలరాచే ఒక మహాతేజస్సు రూపమెత్తి బయటికి వచ్చింది. ఆ తేజస్సు భూమ్యాకాశాల్ని ఆక్రమించింది. సూర్యచంద్రుల కాంతుల్ని దిగమింగింది. సూదితో గుచ్చితే కూడ దిగనంత పెద్దచీకటి ఆవరించింది. (కన్నులు పొడుచుకున్నా కానరాని కటికచీకటి) దానితో దేవతలు భయంతో కలతచెందిన మనస్సులు కలవారైరి.

దేవతలందరు బ్రహ్మచెంతకు పోయి దేవతలకెల్లరికి 'ఆద్యుడా! పాపాలనే సముద్రాన్ని తరింపజేయువాడా! సృష్టికి మూలకారకుడా! స్వామీ!' అని ఆయన పాదపద్మాలకు మొక్కి రెండుచేతుల్ని నొసటజేర్చి మనస్సులో భయం, తొట్రుపాటు ముప్పిరిగొనగా ఇలా విన్నవించారు.

"ఓ దేవా! శారదాపతీ! స్థావరజంగమాత్మకమైన ఈ విశ్వానికి నీవే ప్రభువు. అన్నింటిని భరించేవాడివి నీవే. లోకపాలు లెల్లరికి తలమానికం లాంటివాడవు. నీ రూపం మెచ్చదగింది. ఈ బ్రహ్మాండంలో నీకు తెలియని దేమీ లేదు. మేము ఆపదల్లో చిక్కి నీ శరణు జొచ్చాము. మమ్మల్ని గూర్చి కొంచెం ఆలోచించు అని దేవతలు బ్రహ్మను ప్రార్ధించారు.

"స్వామీ! స్థావరజంగమరూపమై క్రియాత్మకంగా ఉన్న ఈ విశ్వానికి నీవే కారణుడవు. ఈ లోకాలన్నింటిని నీవే సృజించావు. ఈ ప్రాణికోట్ల ఆత్మస్వరూపం తెలిసినవాడవు నీవే. జగన్నాథుల్లో నీవే అగ్రగామివి, అనుభవజ్ఞుడవు. మాయవల్లనే నీవు విశ్వస్రష్టవైనావు. నీవు త్రిగుణాల్లో రజోగుణాధిపతివి. ఈ సమస్తలోకాలు నీలోనే దాగి ఉన్నాయి. యోగక్రియలో ఆరితేరినవారై ఏ కోర్కెలు లేనివారుగా ముద్రపడిన యోగులు ధ్యానం ద్వారా నిన్ను అన్వేషిస్తారు. శ్వాసక్రియను అదుపులో ఉంచిన కారణంచేత నీ అనుగ్రహానికి పాత్రులైన ఆ యోగులకు ఓటమి లేదు. ఈ జీవులెల్లరు తాళ్ళచే కట్టబడ్డ పశువుల్లాగ నీ మాటకు కట్టుబడి ఉంటారు. నీకు మొక్కుతున్నాము. రాత్రింబవళ్ళు అనే విభజన తెలియక, ఏ పనిచేయాలో బోధపడని ఈ జీవులను కాపాడే వాడివి నీవే. నీ శరణుజొచ్చిన మమ్ము దయార్ద్రబుద్ధితో కాపాడు. అరణిలో అగ్గిలాగా కశ్యపప్రజాపతి వీర్యశక్తి దితి గర్భంలో దాగి రోజు రోజుకు పెరుగుతూ ఉంది. అది దిక్కులన్నింటికి ప్రాకుతూ ఉంది. అని దేవతలెల్లరు మొరపెట్టుకోగా విని బ్రహ్మ వారందరిని ఆశ్వాసిస్తూ ఇలా అన్నాడు.


Brahma and the devatas (demigods) praying to Yagna Varaha Swamy - శ్రీ యజ్ఞ వరాహమూర్తిని బ్రహ్మాదులు స్తుతియించుట

శ్రీ యజ్ఞ వరాహమూర్తిని బ్రహ్మాదులు స్తుతియించుట

తర్వాత ఆ యజ్ఞవరాహరూపధారియైన శ్రీహరిని బ్రహ్మాదులు ఇలా పొగిడారు.

"దేవ! జితం జితం తే పరమేశ్వర! జితయజ్ఞభావన! శ్రుతిశరీర!”
యనుచుం గారణసూకరాకారుండగు నీకు నతిభక్తి మ్రోక్కెదమయ్య వరద!

భవదీయరోమకూపములందు లీనంబు లై యుండు నంబుధు లట్టీ యధ్వ
రాత్మకమై తనరారు నీ రూపంబు గానంగరాదు దుష్కర్మపరుల

కట్టి నీకుంబ్రణామంబు లాచరింతు, మఖిలజగదేకకీర్తి! దయానువర్తి!
భవ్యచారిత్ర! పంకజపత్రనేత్ర!, చిరశుభాకార! యిందిరాచిత్తచోర!

త్వక్కున నఖిలవేదములు, రోమంబులయందును బర్హిస్సు, లక్షులందు
నాజ్యంబు, పాదంబులందుం జాతుర్హోత్ర కలితంబులగు యజ్ఞకర్మములును,

స్రుక్కు తుండంబున, స్రువము నాసికను, నిడాపాత్ర ముదరకోటరమునందు,
శ్రవణాస్యబిలములంజమసప్రాశిత్రముల్‌, గళమున నిష్టిత్రికంబు, జిహ్వం

దగుంబ్రవర్గ్యము, నగ్నిహోత్రమును నీదు, చర్వణంబును, సభ్యావసథ్యు లుత్త
మాంగ మసువులు చయనము లగుం గిటీశ యనుచు నుతియించి రత్తఱి యజ్ఞవిభుని

అక్కడి మునులు స్వామిని ప్రస్తుతించి, నమస్కరించారు.

దేవా! నీవు జయించావు-జయించావు. నీవు నిరంతరం సత్కర్మ పరాయణుడవు. నీవు వేదమయుడవు. కోరిన వరాలనిచ్చే స్వామీ! ఈ విశ్వంభరను ఉద్ధరించటానికి నీవు వరాహాకృతిని తాల్పావు. నీ వెంట్రుకల మొదళ్ళలో ఉన్న గుంతల్లో మహాసముద్రాలే దాగి ఉన్నాయి. దుష్టులకు నీ యజ్ఞస్వరూప మహిమ అంతుబట్టదు. స్వామీ! నీ కివే మా నమస్మారాలు. ఈ విశ్వమంతటికి నీక్తీర్తి వ్యాపించింది. నీవు దయాపరుడవు. నీ చరిత్ర పవిత్రమైంది. నీ కన్నులు తామరరేకుల్లాంటివి. నీది మంగళకరమైన ఆకారం. నీవు శ్రీదేవి హృదయాన్ని ఆకర్షించిన మహానుభావుడవు.

అంతటితో ఆగక ఆ మునులు ఇంకా స్తోత్రం చేశారు.

'వరాహస్వామీ! నీ చర్మమే సమస్తవేదవేదాంగాలసమూహం. నీ వెంట్రుకల్లో యజ్ఞాగ్నులు దాగి ఉన్నాయి. కన్నుల్లో ఆజ్యం (నేయి), పాదాల్లో యాజకులచే నిర్వహింపబడుతున్న యాజ్ఞికక్రియలు ఉన్నాయి. నీ తుండమే నేతి గరిట (స్రుక్కు), ఘ్రాణేంద్రియమే స్రువం, నీ కడుపే యజ్ఞపాత్ర. చెవి భోజనపాత్ర, నోరు నీరుత్రాగేగిన్నె. నీ గొంతు మూడు యజ్ఞాలకు నిలయం. నాలుక అగ్నిహోమాదులకు అంగభూతం, నీ వారగించే ఆహారం సాక్షాత్తు వ్రేల్చబడిన అగ్నియే. నీ  శిరోభాగం హోమరహిత అగ్నిగృహం, నీ ప్రాణాలు చయనాలు' అని అక్కడచేరిన బ్రహ్మేంద్రాది మునిపుంగవులు స్వామిని ప్రస్తుతించారు.

వెండియు ముహుర్ముహు ర్భగవదావిర్భావంబు దీక్షణీయేష్టి యగు. నీదు దంష్ట్రలు ప్రాయణీయంబను దీక్షానంతరేష్టియు, నుదయనీయంబను సమాప్తేష్టియు, యుష్మద్రేతంబు సోమంబును, ద్వదీయావస్థానంబు ప్రాతస్సవనాదులు, నీదు త్వ
ఙ్మాంసాది సప్తధాతువు లగ్నిష్టోమోక్థ్యషోడశీ వాజపేయాతిరాత్రాప్తోర్యామంబులను సంస్థాభేదంబులును ద్వాదశాహాదిరూపంబులైన బహు యాగ సంఘాతరూపంబులు నగు; సర్వ సత్త్రంబులు భవదీయశరీర సంధులు; ససోమాసోమంబులగు యజ్ఞక్రతువులు నీవ; మఱియును నీవు యజనబంధనంబులచే నొప్పుచుందు వదియునుం గాక.

బ్రహ్మాదులు యజ్ఞవరాహావతారాన్ని మరింతగా అభివర్ణిస్తూ స్తుతిస్తున్నారు. "దేవా! మాటిమాటికి పెచ్చరిల్లిన నీ అవతారం" దీక్షణీయేష్టి(సలసల మండుతున్న యాగాగ్ని), నీ కోరలు ప్రాయణీయేష్టి (నిలకడగామండుతున్నఅగ్ని), చివరి యజ్ఞాంతరూపం 'ఉదయనీయేష్టి(ఉపశమించిన యజ్ఞాగ్ని), నీ ఇంద్రియమే సోమరసం. నీ ఉనికి ఉదయకాలపు ధ్యానసంధ్యానుష్ఠానాదులు. శుక్లం, రక్తం, మాంసం, ఎముక, తోలు, చీము, మెదడులతో కూడిన నీ సప్తధాతువులు అగ్నిష్టోమం, ఉక్థ్యం, షోడశి, వాజపేయం, అతిరాత్రం, ఆప్తోర్యామం అనే ఏడు యాజ్జిక విధులూ, ద్వాదశాహం మొదలైన అనేక యాగవిధులూ అవుతాయి. సమస్తయాగాలు నీ శరీరసంధులే. అంతేగాక సోమపానంతోడి యజ్ఞాలు,
సోమపాన రహిత యజ్ఞాలు నీవే అయివున్నావు. నీవు ఎల్లప్పుడు యజ్ఞబంధితుడవై వెలుగొందుతావు అని మునులు దేవాదిదేవుణ్ణి స్తుతించారు.

హవరూపివి! హవనేతవు!, హవభోక్తవు! నిఖిలహవఫలాధారుండవున్‌!
హవరక్షకుండవు నగు నీ కవితథముగ నుతు లొనర్తుమయ్య ముకుందా!


"స్వామీ! నీవు యజ్ఞస్వరూపుడివి. యజ్ఞాధిపతివి. యజ్ఞఫలాన్ని భుజించేవాడివి. సమస్త యజ్ఞఫలాలకు నీవే ఆధారం. యజ్ఞరక్షకుడవు కూడ నీవే. ముకుందా! మచ్చలేని హృదయంతో నిన్ను పూజిస్తాము. 

అక్కడచేరిన మునులు ఫలాకాంక్ష లేనివారై యజ్ఞవరాహస్వామిని వేనోళ్ల ప్రస్తుతించారు. వారి స్తుతివాక్యాల్లో ఏ విధమైన ఫలాసక్తి లేదు.

సత్వగుణమున సద్భక్తి సంభవించు, భక్తియుతముగం జిత్తంబు భవ్య మగును
హృదయపద్మంబునందోలి నెఱుంగంబడిన, యట్టి నీకు నమస్కారమయ్య వరద!


కోరినకోర్కెల నెరవేర్చే ప్రభూ! సత్త్వగుణంవల్లనే ఉత్తమమైన భక్తి కల్గుతుంది. భక్తి గల్గినచో మనస్సు యోగ్యమౌతుంది. గుండెనిండుగ స్మరించుకోదగ్గ నీకు ఇవే మా నమస్మారాలు.

అరవిందోదర! తావకీనసితదంష్ట్రాగ్రావలగ్నక్షమా
ధరనద్యబ్ధినదాటవీయుతసమిద్ధక్ష్మాతలంబొప్పె భా
సురకాసారజలావతీర్ణమదవచ్చుండాలరాడ్దంత శే
ఖరసంసక్త సపత్రపంకజము రేఖంబొల్పు దీపింపంగన్‌


పద్మనాభా! పర్వతాలు, నదీనదాలు, సముద్రాలు, అడవులు మొదలైన వాటితో కూడిన ఆ భూమి, నీ తెల్లని కోరపైన విశ్రమించటం ఎలా ఉందంటే, ఒక మదపుటేనుగు సరోవరంలో ప్రవేశించి పత్రభరితమైన తామరని తన దంతాలపై పొదువుకొన్నట్లు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంది.

చతురామ్నాయవపుర్విశేషధర! చంచత్సూకరాకార! నీ
సిత
దంష్ట్రాగ్ర విలగ్నమైన ధర రాజిల్లెం గులాద్రీంద్ర రా
జితశృంగోపరిలగ్నమేఘముగతిం జెల్వారి, విద్వజ్జనాం
చితహృత్పల్వలలోల! భూరమణ! లక్ష్మీనాథ! దేవోత్తమా! 


దేవా! నీవు నాల్గువేదాలు శరీరంగా కలవాడవు. నీది దేదీప్యమానంగా వెల్గుతున్న వరాహరూపుడవు! నీవు విద్వాంసుల హృదయాలనే పడియల్లో దాగినవాడవు. భూదేవికి ప్రియుడవు. ఉత్తమదైవమవు. ఇందిరభర్తవు. నీ కోరపై ఒదిగిన భూదేవి కులపర్వతశిఖరం పై తగుల్కొన్న మేఘంలాగా ఉంది.

సమధికస్థావరజంగమాత్మకమైన వసుమతీచక్ర మవక్రలీల
నుద్ధరింపుము; కరుణోపేతచిత్తుండ వగుచు నస్మన్మాత యయ్యె ధరణి;
మాతయౌ టెట్లని మదిందలంచెదవేనిం జర్చింప మాకు విశ్వమున కీవు
జనకుండ వగుట యుష్మత్పత్ని భూదేవి యగుట మాకును దల్లి యయ్యె; నిపుడు

ధరకు నీతోడంగూడ వందన మొనర్తు, మరణియందును యాజ్జికుం డగ్ని నిలుపు
కరణి మీ తేజ మీ ధరాకాంతయందు, నిలుప ధరణి పవిత్రయై నెగడుం గాన. 

“ఓ యజ్ఞవరాహమూర్తీ! దేవా! ఈ చరాచరాత్మకమైన భూచక్రాన్ని దయతో అవలీలగా పైకెత్తు. ఈమె మా తల్లి. 'మీకు తల్లి ఎట్లయింద'ను కొంటావేమో! చూడు. మాకు మరియు ఈ విశ్వానికంతటికి నీవే తండ్రివి. ఈ భూదేవి నీ భార్య. కాబట్టి ఆమె మాకు తల్లి అయింది. అందువల్ల ఇప్పుడు నీతోపాటు ధరిత్రీమాతకు కూడ నమస్కరిస్తాం. యజ్ఞకర్త 'అరణి' యందు అగ్నిని వ్రేల్చునట్లు, మీ దివ్యతేజస్సును ఈమె యందు నిల్పినట్లయితే ఈమె మహాపవిత్రురాలవుతుంది" అని మునీంద్రులు వరాహరూపుణ్ణి కొనియాడారు.

(అరణి: ఇది ఒక కర్ర-యజ్ఞంచేసే యాజకుడు రెండు అరణుల్ని రాచి అగ్నిని రగుల్కొల్పుతాడు. ఆ అగ్నిమూలంగా యజ్ఞకుండం ధగద్ధగాయమానమౌతుంది. అలా పుట్టించిన అగ్నిని 'ఆహవనీయం' అని పేర్కొంటారు.)

తలంప రసాతలాంతరగతక్షితింగ్రమ్మఱ నిల్పినట్టి నీ
కలితన మెన్న విస్మయము గాదు; సమస్తజగత్తు లోలిమైం
గలుంగంగం జేయు టద్భుతము గాక, మహోన్నతి నీ వొనర్చు పెం
పలరిన కార్యముల్‌ నడప నన్యులకుం దరమే రమేశ్వరా?


ఓ లక్ష్మీపతీ! పాతాళం చేరిన భూదేవిని తిరిగి పైకి లేపటంలో నీవు చూపిన చొరవ ఏమంత ఆశ్చర్యకరం కాదు. నీవు లోకాలన్నింటిని సృజించటం చాల గొప్పవిషయం. అంతేకాదు నీవు చేసే ఘనకార్యాలు మరి ఇతరులెవ్వరైనా చేయగలరా? (అసంభవమని భావం).

సకలజగన్నియామకవిచక్షణలీలం దనర్చునట్టి నం
దకధర! తావకస్ఫురదుదారత మంత్రసమర్థుండైన యా
జ్ఞికుండరణిన్‌ హుతాశనుని నిల్పిన కైవడి మన్నివాస మౌ
టకుందలపోసి యీ క్షితి దృఢంబుగ నిల్పితివయ్య యీశ్వరా! 

"నందకమనుపేరుగల ఖడ్గాన్ని చేత ధరించిన ఓ ప్రభూ! నీవు ఈ పదునాల్గు లోకాలను నియమించగల సమర్థుడవు. వేదమంత్రోచ్చారణలో నిష్ణాతుడైన యాజకుడు అరణిలో అగ్నిని నిల్పినరీతిగా ఈ భూమిని నీవు మాకు శాశ్వతనివాస యోగ్యంగా నిల్పావు" - అని మునులు కృతజ్ఞతతో పల్కారు.

సలలితవేదశాస్త్రమయసౌకరమూర్తిం దనర్చుచున్‌ రసా
తలముననుండి వెల్వడు నుదారత మేను విదుర్పం దత్సటో
చ్చలితములైన బిందువుల సాధుతపోజనసత్యలోకవా
సులమగు మేము దోంగి పరిశుద్ధి వహించితిమయ్య మాధవా!


"ఓ మాధవా! వేదశాస్త్రమయమైన యజ్ఞవరాహరూపుడవు నీవు. పాతాళలోకం నుండి భూమిని ఉద్ధరిస్తూ, ఒక్కపెట్టున ఉదారబుద్ధితో నీ మేనును విదిల్పినపుడు నీ జూలు కంటిన నీటి బిందువుల్లో మునిగి తపోలోక, జనలోక, సత్యలోక వాసులమైన మేమెల్లరం పరిశుద్దులమయ్యాము” అని మునులు కృతజ్ఞతను చాటారు.

(సౌకరమూర్తి : సూకరసంబంధమూర్తియే సౌకరమూర్తి సూకర మనగా వరాహమని అర్థం. తత్సంబంధమైన విగ్రహం 'సౌకరమూర్తి' అవుతుంది.

విశ్వభవస్థితిప్రళయవేళలయం దవికారసత్త్వమున్‌
విశ్వము నీవ యీ నిఖీలవిశ్వము లోలి సృజింతు విందిరా
ధీశ్వర! యీశ! కేశవ! త్రయీమయ! దివ్యశరీర! దేవ! నీ
శాశ్వతలీల లిట్టి వని సన్నుతి సేయంగ మాకు శక్యమే?


ఓ శ్రీనాథా!, ఈశ్వరా! సుందరమైన శిరోజాలు గలవాడా! ఋక్‌, యజుస్‌, సామవేదాలు స్వరూపంగా వెలసిన ప్రభూ! దేదీప్యమానమైన దేహంతో ప్రకాశించువాడా! యజ్ఞవరాహస్వామీ! ఈ విశ్వసంబంధమైన త్రిమూర్తులు చేసే సృష్టిస్థితిలయాల్లో నీవు ఏవికారాలు లేని శాంతస్వరూపుడవుగా ఉంటావు. సమస్తవిశ్వాన్ని వ్యాపించి ఉంటావు. ఈ లోకాలన్నింటిని ఒకక్రమపద్ధతిలో సృష్టించే వాడివి నీవే. నీవి శాశ్వతమైన చర్యలు. వాటి స్వరూపాన్ని ఇదమిత్థమని మేము స్తుతింపగలమా?

పంకజోదర నీ వపారకర్ముండవు భవదీయకర్మాబ్ధిపార మేద
నెఱింగెద నని మది నిచ్చగించిన వాండు పరికింపంగా మతిభ్రష్టు గాక
విజ్ఞానియే? చూడ విశ్వంబు నీ యోగ మాయాపయోనిధి మగ్న మౌటం
దెలిసియుం దమ బుద్ధిం దెలియని మూఢుల నేమన నఖిలలోకేశ్వరేశ!

దాసజనకోటి కతిసౌఖ్యదాయకములు, వితతకరుణాసుధాతరంగితములైన
నీ కటాక్షేక్షణములచే నెఱయ మమ్ముం, జూచి సుఖులను జేయవే సుభగచరిత?


ఓ పద్మనాభా! నీవు చేసే పనులకు అంతు లేదు. ఈ కర్మరూప సముద్రాన్ని తరించగలనని ఏ మతిహీనుడైనా అనుకొంటే వాడు అజ్ఞానియే. ఈ విశ్వమంతా నీ యోగమాయ అనే సముద్రంలో మునిగివుంది. ఓ దిక్పాలాధిపతీ! ఈ వాస్తవం తెలిసికూడ తెలియనట్లు వ్యవహరించే అవివేకుల్ని ఏమని పిలవాలి? స్వామీ! సుందరాకారా! నీ కడగంటి చూపులు భక్తులకు అనంతసుఖాన్ని ఇస్తాయి. అంతేగాదు కరుణామృతరసంలో ఓలలాడిస్తాయి. అలాంటి చల్లని చూపుల్ని మాపై పరపి సుఖంగా జీవించేలా చేయవా? (చేయగలడనే విశ్వాసం).

అని బ్రహ్మవాదు లగు స, న్మునివర్యులు భక్తియోగమున వినమితులై
మనమున మోదము ముప్పిరి, గొనం బొగడిరి ఖురవిదళితగోత్రిం బోత్రిన్‌.


బ్రహ్మజ్జులైన అక్కడి మునీంద్రులందరు భక్తిభావంతో తలలువంచి మహానందభరితులై గిట్టలతాకిడిచేత భూమిని పాతాళం నుండి పైకి లేవనెత్తిన ఆ యజ్ఞవరాహస్వామిని వేనోళ్ళ కొనియాడారు.

లోకాల్ని ఆత్మగా తాల్చినవాడును, సత్త్వరజస్తమోగుణాలకు నెలవైనవాడును అగు ఆ యజ్ఞవరాహమూర్తి సవిలాసంగా లోతైన సముద్రపు నీటిని తన గిట్టలచే ఎగమీటి, ఆ తర్వాత దాన్ని నీటిపై నిల్పి అంతర్జానం చెందాడు.

ఈ యజ్ఞవరాహస్వామి కథ చాల శుభప్రదమైంది. దీన్ని ఎవరైనా మహాభక్తితో చదువుతూ ఉంటే, విన్నవారికి (శ్రోతలకు) ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహం కల్గుతుంది. ఆ విధంగా ఆ స్వామియొక్క దయకు పాత్రులైన భక్తులకు సమస్త శుభాలు ఒనగూడుతాయి. ఏ మాత్రం సందేహం లేదు అని మైత్రేయుడు విదురునితో చెప్పాడు. అనుగ్రహఫలమే కాదు-మరేదోకూడ ఉన్నాయంటున్నాడు.

విష్ణుమూర్తి ప్రసన్నుడైతే సర్వశుభాలు చేకూరటమే కాదు. మరిన్ని లాభాలున్నాయి. ఆ స్వామి తన భక్తుల హృదయాల్లో పదిలంగా నివాసముంటాడు. సజ్జనులకు తాము కోరిన వస్తువులు లభిస్తాయి. వారికి శాశ్వతమైన మోక్షపదవి కైవసమౌతుంది. ఇక ఇన్ని ఉత్తమ ఫలితాలు చేకూరుతాయన్నప్పుడు అస్థిరమైన తాత్కాలిక సుఖభోగాల గూర్చి చింతించటం దండుగ సుమా!

శ్రీహరి కథలు లోకవిఖ్యాతి గాంచినట్టివి. అట్టి కథామృతాన్ని చవి చూచిన భక్తులనాలుక అనుచితమైన అన్యకథలనే ఉప్పునీటిని రుచిచూడ నొల్లదు. కల్పతరువుయొక్క తేనెలోని తియ్యదనాన్ని ఆస్వాదించే జుంటీగ వేపచెట్ల దరికి చేరుతుందా?

మై
త్రేయముని విదురునికి చెప్పిన ఈ కథ శ్రీశుకుడు పరీక్షిన్నరేంద్రునికి వివరించి, ఇంకా ఈ విధంగా అన్నాడు.

యజ్ఞవరాహుణ్ణి గూర్చి వివరించిన మైత్రేయునితో విదురుండు "ఓ మహానుభావా! రాక్షసజాతిని తుదముట్టించిన ఆ విష్ణుమూర్తి గొప్పచరిత్ర విన్నా నా మనస్సుకు సంతృప్తి కలుగలేదు" అని అన్నాడు.

"మునులలో మేటివాడవైన మైత్రేయా! నీ దయవల్ల ఆ యజ్ఞవరాహస్వామి వృత్తాంతం అంతా విన్నాను. అయినా మరింత వివరంగా వినాలని ఉంది. ఆ శ్రీహరియొక్క అమృతాయమానమైన కీర్తనల్ని చెవికింపుగా వింటేగాని ప్రజల జన్మసంబంధులైన బాధలు తీరవు" అని విదురుడు మైత్రేయునితో అన్నాడు. కావున 

వివరంగా శ్రీహరికథల్ని వినాలని ఉంది కాబట్టి వాటిని సమగ్రంగా విన్పించమని విదురుడు మైత్రేయుణ్జి అర్ధించాడు.

విదురుడు మైత్రేయుణ్ణి "మునీంద్రా! దామోదరుడు యజ్ఞవరాహరూప మెత్తి హిరణ్యాక్షుడనే రాక్షసుణ్ణి మట్టు పెట్టాడని ఇంతకు ముందే నీవు నాతో అన్నావు. ఆ వరాహం తనకోరపైన భూమిని ఎలా ధరించింది? నారాయణునికి హిరణ్యాక్షునితో విరోధమెందుకు కల్గింది? ఆయన వాణ్ణి ఎలా సంహరించాడు? ఈ కథను నాకు సవిస్తరంగా చెప్పు" అని కోరాడు. అప్పుడామైత్రేయుడు "అయ్యా! హరికథలను వినాలని ఉత్సాహంతో ఉన్న నీకు జన్మఫలం తప్పక సిద్దిస్తుంది. అనుమానం లేదు. విష్ణమాయని తెలిసికోవటం ఆ బ్రహ్మకు కూడ అసాధ్యమే" అని విదురునితో అన్నాడు.

ఓ అనఘాత్మా! నీవు అడిగిన విధంగానే పూర్వం ఇదే కథను ధ్రువుడు విష్ణుకీర్తన తత్పరుడైన నారదమునీంద్రుణ్ణి అడిగాడు. ఆ మహర్షి తెలిపిన ఆ శ్రీహరికథలను చెవులారా విని, ఆ రాజు తరించాడు.

"అయ్యా విదురా! ధ్రువుడు శ్రీహరి పంపిన విమాన మెక్కబోతూ తన్ను సమీపించిన మృత్యుదేవత తలపై అవలీలగా ఎడమకాలు మోపి ఇహపరలోకాలలో కీర్తిగడించాడు. బ్రహ్మ విష్ణుసంకీర్తన మహిమను దేవతలకు చెప్పాడు. దాన్ని నీ కిప్పుడు విన్పిస్తా నని మైత్రేయుడన్నాడు.

ఆ తర్వాతి కథను శ్రద్ధగా విను.

The Battle Between Boar Varaha Avatar and Hiranyaksha - హిరణ్యాక్షుండు యజ్ఞవరాహంబగు హరినెదిరించి పోరుట

హిరణ్యాక్షుండు యజ్ఞవరాహంబగు హరినెదిరించి పోరుట నారదుడు పాతాళానికి పొమ్మని చెప్పగానే హిరణ్యాక్షుడు అగ్గిలాగ మండి పడ్డాడు. విష్ణువుతో తలపడి తీ...