శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం -
బలరాముడు హస్తినాపురమును గంగలో ద్రోయ బూనుట
శ్రీకృష్ణుని కుమారుడైన సాంబుడు - (సాంబుడు జాంబవతి శ్రీకృష్ణుల తనయుడు) దుర్యోధనునికూతురు శుభ లక్షణములు గల లక్షణ అనే పేరుగల కన్యకను - ఆమెవివాహసమయంలో అతిసాహసంతో ఎత్తుకొని పోగా - దుర్యోధనాదులైన కౌరవులందఱు ఒక కుర్రవాడు ఇలా వివాహమండపంనుండి మన కన్నెపిల్లను దొంగిలించుకొని పోతూఉంటే మనం చూస్తూ ఉపేక్షించడం పారుషం కాదు. కాబట్టి, ఆ కుర్రవాణ్ణి పట్టి తీసుకొనివచ్చి చెరలో పెడదాం. ఆ తరువాత యాదవులైన శ్రీకృష్ణాదులు ఏమి చేస్తారో చూద్దాం! అనే ఆలోచనతో తమపెద్దల అనుమతిని పొందినవారై
ఇలా ప్రయత్నంతో యుద్దానికి సిద్ధపడిన బలవంతులు, పరాక్రమవంతులు అయిన కర్ణుడు, శల్యుడు, భూరిశ్రవనుడు, యజ్ఞకేతుడు, దుర్యోధనుడు మొదలైన కౌరవులు మిక్కిలి ఎత్తైన రథాల్ని అధిరోహించి, సాంబుని సమీపానికి వెళ్లి అతణ్ణి అదిలించి, నిలువు నిలువు మంటూ చుట్టుముట్టినా - వీరిని చూచి సాంబుడు భయపడక రత్నఖచితమై ప్రకాశిస్తున్న వింటిని ధరించి సింహంలా గర్జిస్తూ
అట్లు ఎదిరించిన సాంబునిమీద కౌరవులు తీక్ష్ణములైన బాణాలూ ఎడతెగక ప్రయోగించి కొండపై మంచుకమ్మినట్లు సాంబుని రథాన్ని బాణాలతో కప్పివేశారు.
ఇంకనూ
ఉత్సాహంతో కూడినశూరత్వంతో విజృంభించి మేరుపర్వతమా అన్నట్లు చలింపక నిలిచి ఉన్న సాంబునిమీద లెక్కలేనన్ని బాణాలు ప్రయోగించారు. కానీ, సాంబుడు శక్యంగాని పరాక్రమోపేతుడై విజృంభించి వాడియైన బాణాలు గుప్పించి శత్రువుల బాణాలనన్నింటినీ ధ్వంసం చేశాడు.
అతనివీరకృత్యాన్ని ఆకాశంనుంచి చూస్తున్న దేవతలు ఆనందంతో వాద్యాలను వాయించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆ సాంబుడు ఇంకా అతిశయించిన శౌర్యంతో
ఈ తీరుగా యుద్ధరంగంలో ఉండేవారినందర్నీ తానొక్కడే ఎదిరించడానికి పూనుకొని (అనేకబాణాలతో) వారి రథాలు, సారథులు, జెండాకర్రలు, జెండాలు, గొడుగులు అన్నింటినీ నుగ్గుచేసి, వారు ధరించిన కవచాలన్నింటికీ చిల్లులు పడేలా చేయగా, కౌరవులు పూచినఎర్రనిమోదుగులనుపోలిన నెత్తుటితో పూయబడిన దేహాలు కలవారయ్యారు. అటు పిమ్మట
ఆ కౌరవులు తాము సంఖ్యాబలంచే అనేకులుండికూడా, బలవంతులైనప్పటికీ, ఎన్నో యుద్దాల్లో నేర్పు ప్రదర్శించి గడితేరిన వారైనా, ఒంటివాడైన సాంబుణ్ణి ఏమీ చేయలేక వానికి భయపడి, సిగ్గుపడి, ఎంతో విచారంతో ఒకరితో ఒకరు చేరి ఆలోచిస్తూ మనవల్ల కావటంలేదని తొలగిపోతూ, మళ్లీ కలుస్తూ దుఃఖంతో వేడి నిట్టూర్పులు విడుస్తూ ఏమి చేయాలి అంటూ ఆలోచిస్తూ
ఆ కౌరవులు తిరిగి యుద్ధం చేయడానికి తొందరపడి
కౌరవులందరూ ఒక్కసారిగా గుమిగూడి సాంబుణ్ణి చుట్టుముట్టి వాడియైనబాణాలు అదేపనిగా ప్రయోగించి, ఎడతెరపి లేకుండా యుద్ధంచేసి అతణ్ణి ఆ బాణపరంపరలో ముంచివేశారు.
అంతేకాక, వెంటవెంటనే వాడియైన బాణాలు ప్రయోగించి, రథాన్ని గుర్రాల్ని సారథిని, వింటినికూడా తెగనరికారు. రథం ధ్వంసం కావడంతో సాంబుడు ఎటూ వెళ్లలేక నిలిచి ఉండగా వాణ్ణి సమీపించి పట్టుకోగా
కౌరవుల విజ్బంభణకు ఆ సాంబుడు ఏ విధంగానూ తప్పించుకోవడానికి గాని, ఏదైనా చేయడానికి గాని శక్యంగాక పోవడంతో వీరికి పట్టుబడ్డాడు. కౌరవులు ఆనందంతో వేడుకతో సాంబుడిని తమ ఆడపడుచు లక్షణతో పాటుగా హస్తినాపురానికి తీసుకొనివచ్చి తమ వైభవాన్ని ప్రకటిస్తూ
ఇక్కడ సాంబుడి స్థితి ఇలా కౌరవులచే పట్టుబడి ఉండగా అక్కడ ద్వారకానగరంలో
జాంబవతికుమారుడైన సాంబుడు కౌరవులచేత చిక్కాడనే విషయాన్ని త్రిలోకసంచారి అయిన నారదమహర్షి చెప్పగా విన్న యాదవులమనస్సులలో కౌరవులతో యుద్ధం చేయాలనే వేడుక పుట్టడమే కాదు - కౌరవకులాన్నంతా ఒకేసారి సంహరించాలి అన్నంత కోపంతో - ఉగసేనమహారాజుఅనుమతి తీసుకుని, సకలసైన్యాల్నీ
తమవారందరూ సేనను కూర్చుకొని ఆవిధంగా దండు వెడలడం చూచి బలరాముడు - ధృతరాష్ట్రునికొడుకులు మనకు ఎంతో దగ్గరిచుట్టాలు కదా! వారిమీదికి మీరిలా కోపంతో దండెత్తి వెళ్లడం న్యాయమా? అని ప్రశ్నించాడు.
బలరాముడు - దగ్గరబంధువులైన దుర్యోధనాదులమీద దండెత్తి పోవడం తగదని సైన్యాన్ని ఆపి, బంధుప్రీతిగలవాడై వెంటనే బయలుదేరి - అగ్నివలె, సూర్యునివలె ప్రకాశిస్తున్న బంగారురథాన్ని ఎక్కి తనకు ప్రియమైన బ్రాహ్మణులు, ఉద్ధవుడు మొదలైన కులవృద్దులునూ వెంటరాగా హస్తినాపురానికి వెళ్లి, ఆ పట్టణం పొలిమేరలో ఉన్న ఒక తోపులో విడిది చేశాడు.
ఆ తోపులో - పరిమళభరితాలయిన పూలతో, పళ్లతో నిండినచెట్లనీడల్లో చంద్రకాంతశిలలతో నిర్మించిన అరుగులమీద విశ్రమించి, తాము వచ్చిన పనిని కౌరవులకు తెలియజేయడానికి బుద్ధిమంతుడైన ఉద్ధవుణ్ణి పంపాడు. ఉద్ధవుడు కౌరవులవద్దకు వెళ్లి, ముందుగా ధృతరాష్ట్రునికి నమస్కరించి, ఆ తరువాత ద్రోణునికి, భీష్మునికి, దుర్యోధనునికీ నమస్కరించి, మొక్కి వారి ప్రశంసలందుకొని ఇలా చెప్పాడు.
విశేషమైన కీర్తియే ధనంగాగల ప్రభువులారా! బలరాముడు మీ పట్టణం పొలిమేరలోగల తోటలో విడిది చేశాడు - అని ఉద్ధవుడు చెప్పగానే కారవులు చాలా ఉత్సాహంతో బలరాముణ్ణి చూడాలి అనే కుతూహలంతో తగిన కానుకలు పట్టుకొని, బలరాముణ్ణి చేరి ఆయనకు అర్ఘ్యపాద్యాదిమర్యాదలు చేసి, గోవును ఇచ్చి, సన్మానించి - అందరూ పదేపదే అతనికి నమస్కరించి, తగిన విధంగా కూర్చున్నారు. అప్పుడు బలరాముడు దుర్యోధనుణ్ణి చూచి - కుశలప్రశ్నలు అడిగాడు. మీరంతా క్షేమమేకదా! మేము క్షేమమే అని, అక్కడి జనులందరికీ స్పష్టంగా తెలిసేటట్లు ఇలా అన్నాడు.
మీరు మా రాజైన ఉగ్రసేనుని ఉత్తరువును శిరసావహించి తప్పక ఆచరించాలి. మీరు ఎంతోమంది మహాయోధులు ఒక్కుమ్మడిగా ఒంటరిగాడైన మా పిల్లవానితో పోరి, చుట్టుముట్టి యుద్ధంలో గెలవడం మీ తప్పు. మీరు ఇంత ఆదర్మంగా చేసిన యుద్దాన్ని అది తప్పిదమే అయినా, మా రాజు మన్నించాడు. మా రాజు బంధుప్రీతి కలవాడు కావడం వల్ల మీ తప్పుల్ని సహించాడు - అన్నాడు - బలరాముడు.
బలరాముడు చెప్పిన మాటలు విన్న దుర్యోధనుడు మనస్సులో చాల కోపించినవాడై యాదవులతో, “చాలును మీ మర్యాద ఔరా! ఏమి ఈ కాలవైపరీత్యం! - దీన్ని ఏమనగలం! కాలికింద ఉండవలసిన పాదరక్షలు తమంతట తామే తలకెక్కాయి. మన సేవకులుగా ఉండవలసినయాదవులు మనల్నే హెచ్చరిస్తున్నారు - ఏమి కాలగతి?” అన్నాడు.
మనము బంధుప్రీతితో గౌరవించడంవల్లనే కదా యాదవులు రాజ్యభోగాలు అనుభవించడమూ, పేరుప్రతిష్ఠలు గల్గి ప్రసిద్ధి పొందడం జరిగింది. నిజానికి వారికి అనుభవించే అవకాశం లేనట్టి
మనం బంధుప్రీతితో గౌరవించడం చేతనేకదా!, ఈ యాదవులు రాజ్యభోగాలు అనుభవించడం? తమకంటూ పేరు ప్రతిష్టలు ఏర్పడడం, వారికి అనుభవించడానికి తగిన తెల్లగొడుగులు, వింజామరలు, శంఖాలు, కిరీటాలు, పానుపులు, సింహాసనాలు, మేడలు పొంది సుఖిస్తుండడం?
మనం వారి విషయం పట్టించుకోక ఉపేక్షించడంవల్లనే వారు గర్వంతో ఈనాడు తమ స్దానం మరచి, మనతో సరిసమానులైన వారివలె ప్రవర్తిస్తున్నారు. యాదవులతో బంధుత్వాలు, సంబంధాలు, స్నేహాలు ఇంతమట్టుకు చాలు. పాములకు పాలుపోసి పెంచినా వాటివిషం పోదుకదా!
అలాగే వీరు మనల్ని ఇప్పుడు వాళ్ల ఆజ్ఞను పాటించి నడుచుకోవాలంటున్నారు. సిగ్గు లేకపోబట్టే కదా ఆ మాటలు! పై పెచ్చు అస్త్రవిద్యల్లో ఆరితేరిన భీష్మదోణకృపాశ్వత్ధామకర్ణాదులయిన వీరవరులచేత చిక్కినవాణ్ణి విడిపించడం మహేంద్రునికైనా సాధ్యమా?
ఈ పనికిమాలినమాటలతో ప్రయోజనం లేదు అంటూ నిందావాక్యాలు పల్కుతూ దుర్యోధనుడు దిగ్గనలేచి తన మందిరానికి వెళ్లిపోయాడు. దుర్యోధనునిమాటలకు బలరాముడు ఉలికిపడి
దుర్యోధనుడు అలా మంచీ మర్యాదా లేకుండా మాట్లాడిన మాటలకు బలరామునికి మనస్సులో పట్టరానికోపం వచ్చి - ప్రళయకాలసూర్యునిలాగా ఎర్రనైన కండ్లతో మండిపడుతూ - తనవారైన యాదవులలోని పెద్దవారిని చూచి - మించిన రాజ్యసంపదమదంతో; కన్నుమిన్ను కానక దుర్యోధనుడు వాగినవాగుడు మీరుకూడా చక్కగా విన్నారుకదా! అని అన్నాడు బలరాముడు.
ఎక్కడైనా ఐశ్వర్యంవల్ల కన్ను కానక కొవ్విఉండే దుష్టులు కేవలం మంచితనంతో బాగుపడతారా? వేటాడే బోయవాడు మృగాలమీద చూపే ఉగ్రతవలె - యుద్ధంలో భుజబలం ప్రదర్శించి పరాక్రమం చూపవలసిందే! సామంతో చక్కబడే సందర్భం కాదిది. యుద్ధనైపుణి ప్రదర్శించి ఎదుటివారిపొగరు అణచవలసిందే! - అని బలరాముని భావం!
కౌరవులను చంపాలి అనే ఉత్సాహంతో యదువీరాగ్రగణ్యులూ శ్రీకృష్ణుడూ సన్నద్ధులై బయలుదేరుతుండగా, కౌరవులూ మనవాళ్లు బంధువులు అనే వాత్సల్యభావంతో నేను వారందరినీ నివారించి - నేను వచ్చాను గదా!
ఏ దేవుణ్ణి ఇంద్రుడు మున్నగు దిక్పాలకులు వరుసగా సేవకులై సేవిస్తుంటారో, కోరిన కోర్కెల్ని తీర్చే కల్పవృక్షం, సుధర్మ అనే పేరుగల సుందరసభాసంపద ఏ దేవుని ఇంటిలో ఉందో, ఎల్ల లోకాలకు తల్లియైన లక్ష్మీదేవి ఏ దేవుని పాదపద్మాల్ని నిరంతరం సేవిస్తూ ఉంటుందో, ఏ దేవుని దివ్యకళలో అంశాలుగా బ్రహ్మ, రుద్రుడు, నేను ఉద్భవించామో, అటువంటి దేవుడు, దుష్టసంహారకుడు, పాపాలన్నింటినీ హరించే శ్రీకృష్ణుడు చెప్పిన పనులు ఉగ్రసేనమహారాజు చేస్తూండగా - ఆయన పాలించే సమస్తరాజ్యసంపద ఈ కౌరవులు దయతో మనకు ఇచ్చిందట! విన్నారా? -
అంతేగాక ఏ దేవునియొక్క పాదధూళిని ఇంద్రుడు మొదలగు దిక్పాలకులు తమ కిరీటాలకు అలంకారంగా గ్రహిస్తున్నారో - (కిరీటాలు గల తలలు వంచి ఆయాదేవతలు శ్రీకృష్ణునికి పాదనమస్కారం చేయగా ఆ దేవుని పాదధూళి కిరిటాలకు మరింత సొంపుకూర్చిందని తాత్పర్యం). ఏ దేవుని పాదధూళి భూలోకంలోని నదుల్ని, నీటి కొలనుల్ని అత్యంత పవిత్రీకరిస్తుందో అట్టి శ్రీకృష్ణదేవునిఅనుగ్రహంవలన పొంది, అభివృద్ధి చెందుతున్న రాజ్యంగల మేము రాజ్యచిహ్నాల్ని ధరించకూడదు అనటం ఎంత ఆశ్చర్యంగా ఉందో! (చూచారా! యని బలరాముని మాట).
ఈ నీచబుద్ధిగల దుర్యోధనుడు ఆడినమాటలు ఎట్లున్నాయో చూడండి! కౌరవులు తలలట! మేము కాళ్ళకు తొడుగుకొనే పాదరక్షలమట! రాజ్యసంపదతో క్రొవ్వెక్కి ఈ అధముడైన ఈ దుర్యోధనుడు పలికిన మాటకు ఏమి అనగలం?
ఆవిధంగా చెబుతూ కోపంతో కూడిన మనస్సుగలవాడై బలరాముడు అప్పుడు
'ఇకపై భూమిమీద కౌరవులు అనే పేరు లేకుండ చేయక తప్పదు అని బలరాముడు నిశ్చయించుకొని, భయంక రాకారుడై అతి బలగర్వాలతో తన ఆయుధమైన నాగలిని గ్రహించి, అతిశయిస్తూ
ఈ విధంగా బలరాముడు తన హలాయుధపుమొనను హస్తినాపురానికి ఒక చివర, అడుగుదాకా చొప్పించి, ప్రయత్నపూర్వకంగా పట్టణం మొత్తం పెల్లగించి, గంగలో పడవెయ్యడానికి లాగి ఎత్తాడు. అతని ప్రయత్నానికి ఆ పట్టణం మొత్తం సముద్రమధ్యంలో చిక్కుకున్న ఓడలా అల్లాడిపోతూ - గోపురాలు, ప్రాకారాలు, కోటలు, కోటలమీది కట్టడాలు, రాజుల మేడలు, వీథులు, గోడలు, తలుపులు, ద్వారబంధాలు సమస్తమూ ఒక పక్కకు ఒరిగిపోగా, పట్టణంలోని జనులకు నేలమీద కాలు నిలపడానికి వీలు లేకపోయింది.
ప్రజలందరూ ఆందోళనతో, భయంతో 'కుయ్యోమొర్రో' అని మొరపెట్టసాగారు. ఈ ఉపద్రవానికి బలరాముని కోపమే కారణమని తెలుసుకొని భీష్ముడు, దుర్యోధనుడు మొదలైన కౌరవులందరూ - ఏమీ ప్రతిక్రియ చేయలేక బలరాముని పాదాలనే శరణువేడడం మంచిదని నిర్ణయించుకొని - తమ కన్యతోకూడా సాంబునికి మణిమయ భూషణాలూ, వస్త్రాలు బహుమానంగా తీసుకొని బలరాముని సన్నిధికి చేరి, ఆయనకు సాగిలబడి మొక్కి చేతులు జోడించి ఇలా అన్నారు.
(ఈ ఘట్టంలో సంకర్షణుడైన బలరాముని దైవికమైన అతిమానుష శక్తిసామర్థ్యాలు మహాభాగవత పురాణం వెల్లడి చేసింది. పాంచరాత్ర ఆగమంలోని నాల్గువ్యూహాలలో రెండవ వ్యూహం సంకర్షణం ఆ సంకర్షణుడే బలరాముడు. ఆయన పేరులోనే 'బల' ముంది. 'బలదేవుడని' శ్రీవైష్ణవ సంప్రదాయం. సంకర్షణుడు లయకారకుడు. వేదాలు ఆయనవల్లనే నిలచి ఉన్నాయి. ఆయనే ఆదిశేషుడు. సృష్టిలో తొట్టతొలి జీవుడు. వేదవ్యాఖ్యాత. నారాయణతత్త్వం యొక్క మూలబీజం సంకర్షణ వ్యూహగతమై ఉంది.)
మేలైన మంచి ముత్యాల సరాల్ని పోలిన తెల్లని, కీర్తిగలవాడా! చంద్రుని కాంతివంటి స్వచ్చమైన, ఆహ్లాదకరమైన దేహకాంతి కలవాడా! జయానికి హద్దుగా కలవాడా! లోకంలోని ఉత్తమగుణాలకు నిలయమైనవాడా! రాజులలో శ్రేష్ఠుడైనవాడా! బలరామా!”
ఓ బలరామా! నీవు అందరికీ నాయకుడవి. ముల్లోకాలకీ మేలు చేసేవాడివి. రాగద్వేషాలు లేని బుద్ధిమంతుడివి. ఇట్టి నీ మహిమలు తెలుసుకొని పొగడటానికి మేమెంత వాళ్లం? ఏ మాత్రం తెలివిలేని మమ్మల్ని ఈ ఆపదనుండి రక్షించవయ్యా! - అని ప్రార్థించారు.
అంతశ్శత్రువుల్నీ, బాహ్యశత్రువుల్నీ జయించిన ఓ బలరామా! ఈ భూమండలాన్ని సదా మోసే ఆదిశేషునిఅంశలో పుట్టినవాడిని. విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణునికి అన్నవు. కనుక, మాబోటి తెలివిమాలిన వాళ్లు చెసే నీచకార్యాలు మాన్పటం నీకు తగిందే!
ఆదిశేషుని అవతారంగా పుట్టిన ఓ బలరామా! నీవు ఎల్ల దేవతలచే మొక్కులందు కొనేవాడివి. రాక్షసులకు విషసదృశుడవై నొసట కన్నుగల రుద్రునివలె భస్మం చేయగలవాడివైన దేవా! నీవలన మేము భయాతురులమై ఉన్నాం. మమ్మల్ని ఆదరించి కాపాడవయ్యా, కాపాడు అని ప్రార్ధించారు.
ఓ! బలదేవా! స్వామీ! ఇదిగాక చరాచరజంతువులతో కూడి ఈ లోకాల్ని నీవు వేడుకగా సృష్టించి, వాటితో ఆట్లాడుతుంటావు. దుష్టజనుల్ని శిక్షించడం, సజ్జనుల్ని రక్షించడం నీ వినోదంలో భాగాలే. ఈ ప్రపంచం పుట్టడానికి, పెరగడానికి, నాశం కావడానికి నీవే మూలకారణభూతుడవు అటువంటి మహాత్ముడివైన నీకు మేము మ్రొక్కుతున్నాము. మమ్మల్ని కాపాడు అంటూ ఇంకా ఇలా చెప్పసాగారు.
ఓ బలరామదేవా! నీవు నాశనం లేనివాడివి, సకలజీవుల ఆత్మస్వరూపుడివి, సర్వశక్తులు గలవాడివి, సర్వకాల సర్వావస్థలలో ఉండేవాడివి, సృష్టిస్టతిలయాలనే క్రియలతో ప్రపంచాన్ని నడిపేవాడివి, భక్తుల అజ్ఞానాన్ని పోగొట్టే సద్గురుడివి, విమలమూర్తివి అయిన నిన్ను పొగడడం బ్రహ్మతరంకూడా కాదు.
అని కౌరవులు భయభక్తులతో ప్రార్ధించగా బలరాముడు ప్రీతుడై ఆ కౌరవులతో మీరు ఇక భయపడవద్దు. మీరు మీ పనిలోని పట్టుదలతో మమ్మల్ని నిర్లక్ష్యంచేసి చిన్నచూపు చూడడం వల్ల నేను ఈ విధంగా ప్రవర్తించాను కాని, వేరే కాదు. 'ఇక భయపడకుండా పొండి' అన్నాడు. ఆ మాటలు విని దుర్యోధనుడు వినయంతో తన అల్లుడగు సాంబుణ్ణి తన కూతురు లక్షణను ఒప్పునట్లుగా
తన కూతురు లక్షణను, అల్లుడు సాంబుణ్ణి బలరాముని వెంట పంపుతూ, దుర్యోధనుడు వేయిమందిపరిచారికల్నీ, లక్షగుర్రాల్ని, రెండులక్షల ఏనుగుల్ని, ఆరువేలబంగారు రథాల్ని - అరణంగా ఆనందంతో ఇచ్చాడు.
ఈ ప్రకారంగా దుర్యోధనుడు అరణమిచ్చి, కొత్త దంపతుల్ని పంపగా బలరాముడు కొడుకును కోడలిని వెంటబెట్టుకుని ద్వారకానగరానికి వచ్చి, అచటి తమవారితో తాను హస్తినాపురానికి వెళ్లడం, దుర్యోధనాదుల దుష్ప్రలాపాలూ చెప్పి, ఆ మాటలకు ప్రతిక్రియగా తాను హస్తినాపురాన్ని నాగలితో పెకలించి గంగలో పడవేయబోవడం, కౌరవులు ఆ దెబ్బకు గజగజలాడి క్షమను కోరడం వివరించి చెప్పి, సుఖంగా కాలం గడపసాగాడు.
నేటికీ హస్తినాపురంమాత్రం దక్షిణపుతట్టు ఎత్తుగాను, ఉత్తరపుతట్టు గంగవైపు మొగ్గి ఉండి, బలరామునిమహిమను తెలియజేస్తూ ఉంది. ఆ మహాత్ముని భుజబలం ఎదురులేనిది అని శుకమహర్షి పరీక్షిత్తు మహారాజుకు చెప్పి ఇంకా ఇట్లన్నాడు.