Friday, May 1, 2026

Saraswati Puja - సరస్వతీ పూజ

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - సరస్వతీ పూజ

నారాయణమహర్షీ ! నా జన్మ ధన్యమయ్యింది. వినవలసింది అంతా విన్నాను. ఒక్క సందేహం మాత్రం ఉండిపోయింది. పరాప్రకృతి అయిదురూపాలు ధరించిందికదా! వారిలో ఏ రూపానికి ఏ పూజ ఎలా చెయ్యాలి? లోగడ ఎవరు చేశారు ? ఏ వరాలు పొందారు? సోత్రం ధ్యానం ప్రభావం -
ఇత్యాదులన్నీ తెలుసుకోవాలని ఉంది. అనుగ్రహించు - అని నారదుడు అభ్యర్థించాడు. నారాయణమహర్షి ఆరంభించాడు.

నారదా! దుర్గ - రాధ - లక్ష్మి - సరస్వతి - సావిత్రి అని సృష్టికి ఆదిలో పరాప్రకృతి అయిదు రూపాలు ధరించింది. వీరి పూజావిధానం సుప్రసిద్ధం. వీరి ప్రభావం పరమాద్భుతం. వీరి చరితం అమృత ప్రాయం - సర్వమంగళప్రదం. వీరు ప్రకృతికి అంశకళలు. సవిస్తరంగా చెబుతాను సావధానుడవై ఆలకించు. వీరితోపాటు కాళి - వనుంధర - గంగ - షష్ఠి - మంగళచండిక - తులసి - మానస - నిద్ర - స్వధా - స్వాహా - దక్షిణాదేవుల చరితలూ చెబుతాను. సంగ్రహంగా కొందరివీ విస్తరంగా కొందరివీ తెలియజేస్తాను. దుర్గా రాధలది విస్తీర్ణమైన చరిత.

బ్రహ్మనందనా! తొట్టతొలిగా శ్రీకృష్ణుడే సరస్వతీపూజను రూపొందించాడు. ఆ తల్లి అనుగ్రహం ఉన్నట్టయితే మూర్ఖుడుసైతం పండితుడవుతాడు.

కృష్ణాదేవి ముఖంనుంచి ఆవిర్భవించిన వెంటనే సరస్వతీదేవి కామపరవశయై కృష్ణుణ్ణి సమీపించింది. ఆవిడ భావాన్ని గ్రహించిన శ్రీకృష్ణుడు పరిణామంలో సుఖావహమైన హితాన్నీ సత్యాన్నీ మృదువుగా ఉపదేశించాడు.

సాధ్వీ! దేవీ! సరస్వతీ! నా అంశతో అవతరించిన ఈ చతుర్భుజనారాయణుడిని సేవించు. అతడు యువకుడు, సుందరుడు, సర్వసద్గుణ సంపన్నుడు. అన్నింటా నాకు తుల్యుడు. కామినీమణుల కామాన్ని గుర్తించగలిగినవాడు తీర్చగలిగినవాడు శతకోటి మన్మథాకారుడు అతడిని సేవించు. అలాకాక నన్నే కాంతుడుగా వరించి ఇక్కడ ఉండదలిస్తే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. నీకన్నా బలవంతురాలూ శక్తిమంతురాలూ రాధ ఉంది. నీకు క్షేమం కాదు. నేనూ కాపాడలేను. ఇతరులకన్నా బలవంతుడుకదా మరొకరిని కాపాడగలడు. నేను అశక్తుడిని అనీశ్వరుడిని పరులను ఎలా కాపాడగలను? లోకం దృష్టిలో నేను సర్వేశ్వరుడినే, సర్వశాసకుడినే, కానీ రాధను బాధించడానికి మాత్రం నేను చాలను. తేజస్సులో ఆ రాధ నాకు సమానురాలు. నా ప్రాణాధిష్ఠాన దేవత. అందుచేత రాధను హింసించడమంటే నేను ప్రాణాలను విడిచిపెట్టడమే. ఆ పని చెయ్యలేను. ప్రాణాలకన్నా తీపి మరొకటి ఉంటుందా! కాబట్టి ఓ కల్యాణీ! నువ్వు వెంటనే వైకుంఠానికి వెళ్ళు. చతుర్భుజుడిని సేవించు. నీకూ నాకూ క్షేమం. అతడిని పతిగా స్వీకరించి చిరకాలం సుఖాలు అనుభవించు. అక్కడ ఆరిషడ్వర్గవిరహిత లక్ష్మీదేవి ఉంటుంది. తేజోరూపగుణాలలో నీకు సరిసమానురాలు. ఆమెతో నీకు కాలం హాయిగా గడుస్తుంది. లోభమోహాలు లేనిది కనక నిన్ను బాధించదు. ఆ చతుర్భుజనారాయణుడు కూడా మీ ఇద్దరిపట్లా సమానమైన గౌరవాదరాలను చూపిస్తాడు.

సరస్వతీ! నీకు మరొక వరం ఇస్తున్నాను. ప్రతి విశ్వంలోనూ ప్రతి యుగంలోనూ దేవమానవజాతుల వారందరూ నిన్ను పూజిస్తారు. మాఘమాసంలో శుక్ల పంచమినాడూ, విద్యారంభం(అక్షరాభ్యాసం) లోనూ భక్తిప్రపత్తులతో నిన్ను అర్చిస్తారు. మహాప్రళయంతో సృష్టి అంతమయ్యేదాకా నీ పూజలు నిరంతరాయంగా సాగుతాయి. షోడశోపచారాలతో కణ్వశాఖోక్త పద్ధతిలో ధ్యానావాహనస్తవాలతో జితేంద్రియులై నిన్ను కొలుస్తారు. నీ రూపంతో సువర్ణ గుటికను(ప్రతిమ) తయారుచేసి కుండలో (కలశం)
గాని పుస్తకంలోగానీ నిక్షేపించి గంధచందనాదులతో అర్చించి. అటుపైని దానిని కవచంగా కంఠసీమలోనో కుడిబుజానికో ధరించినవారు నీ అనుగ్రహానికి పాత్రులవుతారు.

నారదా! ఇలా నియమించి శ్రీకృష్ణుడు ముందుగా తానే ఆ పూజను చేశాడు. అటుపైని బ్రహ్మవిష్ణు శివాదులూ అనంతుడూ ధర్ముడూ సనకాదిమునీంద్రులూ సకలదేవతలూ రాజులూ మానవులూ అందరూ చేశారు. ఈనాటికీ సకలలోకాలలోనూ సరస్వతీదేవి అర్చింపబడుతోంది - అని క్షుప్తంగా ముగించాడు నారాయణమహర్షి. నారదుడికి సంతృప్తి కలగలేదు. కణ్వశాఖోక్త పద్ధతి ఎమిటో వివరించమని అడిగాడు. పూజాద్రవ్యాలూ నైవేద్యాలూ ధ్యానకవచాదులూ తెలియజెయ్యమని కుతూహలం ప్రకటించాడు. మహర్షి వివరంగా తెలియజేశాడు.

విరించిసుతా! మాఘశుక్షపంచమినాడుగాని అక్షరాభ్యాసంనాడుగాని తెల్లవారుజామునే లేచి శుచియై సంయతుడై నిత్యక్రియలు పూర్తి చేసుకుని కలశాన్ని స్థాపించాలి. ముందుగా వినాయక పూజ జరపాలి. అటుపైని సరస్వతిని ధ్యానించి కలశంలోకి ఆవాహన చెయ్యాలి. మళ్ళీ ధ్యానించాలి. షోడశోపచారపూజలు చెయ్యాలి. పాలు పెరుగు వెన్న పేలాలు చిమ్మిలి చెరకు పటికబెల్లం తేనె - ఇత్యాదులు నైవేద్యం పెట్టాలి. తెల్లని బియ్యంతో అక్షతలు తయారుచెయ్యాలి. అటుకులు, వరి అన్నం, ఘృత సైంధవ సమ్మిశ్రితమైన హవిష్యాన్నం, యవగోధూమచూర్ణంలో నెయ్యి పాలూ పంచదారా కలిపి చేసిన ప్రసాదం, అరటిపండ్లు, క్షీరాన్నం, నారికేళం, కొబ్బరినీళ్ళు, బదరీఫలం - ఏవైనాసరే ఆయా ఋతువుల్లో ఆయా దేశాలలో దొరికే పళ్ళూ ఫలాలూ నైవేద్యానికి పనికివస్తాయి. అలాగే పువ్వులన్నీ పూజకు పనికివస్తాయి. సుగంధభరితమైన చందనంతో పూజించాలి. తెల్లని నూతనవస్త్రం కావాలి. అందమైన శంఖం కావాలి. తెల్లని పూవులతో దండకట్టి సమర్పించాలి. వేదసమ్మతమైన సరస్వతీధ్యానం తెలియజేస్తున్నాను. ఇది సకలభ్రమభంజకం. శ్రద్ధగా గ్రహించు -

సరస్వతీం శుక్లవర్ణాం సస్మితాం సుమనోహరాం ।
కోటిచంద్రప్రభాముష్ట పుష్టశ్రీయుక్త విగ్రహాం ॥

వహ్నిశుద్ధాంశుకాధానాం వీణాపుస్తకధారిణీం ।
రత్నసారేంద్ర నిర్మాణ నవభూషణ భూషితాం ॥

సుపూజితాం సురగణైః బ్రహ్మ విష్ణుశివాదిభిః ।
వందే భక్త్యా వందితాం చ మునీంద్రమనుమానవైః ॥

ఇలా ధ్యానించి, సమస్తమూ అర్పణచేసి, స్తుతించి, కవచం ధరించి సాష్టాంగనమస్కారం చెయ్యాలి. చేసినవారికి సరస్వతీదేవి కులదైవమై సకలశుభాలూ కలిగిస్తుంది. విద్యారంభంలోగాని, సంవత్సరాదినాడుగానీ, ఏ పంచమిరోజునగానీ ఈ పూజ చెయ్యవచ్చు. ఓం - ఐం - హ్రీం - క్లీం - శ్రీం అనే బీజాక్షారాలతో రెండేసితో కలిసి సరస్వత్యై స్వాహా అనేది వైదికాష్టాక్షరీ మూలమంత్రం. ఇది కల్పవృక్షం లాంటి మంత్రం.

(ఐం హ్రీం క్లీం = బీజత్రయం = తారత్రయం = సరస్వతీ లక్ష్మీ మాయా బీజాక్షరాలు)

ఈ సరస్వతీ మూలమంత్రాన్ని ఆదిలో నారాయణుడు గంగాతీరాన వాల్మీకి మహర్షికి ఉపదేశించాడు. బదరికాశ్రమంలో బ్రహ్మదేవుడు భృగువుకి ఉపదేశించాడు. పుష్కరక్షేత్రంలో సూర్యగ్రహణంనాడు భృగుమహర్షి శుక్రుడికి ఉపదేశించాడు. చంద్రగ్రహణంరోజున మరీచిమహర్షి వాక్పతికి (బృహస్పతి) అనుగ్రహించాడు. క్షీరసముద్రతీరంలో ఆస్తీకుడికి జరత్కారువూ, మేరుశిఖరంమీద విభాండకుడు ఋష్యశృంగుడికీ, శివుడు కణాదగౌతములకూ, సూర్యుడు కాత్యాయన యాజ్ఞవల్క్యులకూ, ఆదిశేషుడు పాతాళంలో పాణినికీ, భారద్వాజుడికీ, శాకటాయనుడికీ ఉపదేశించారు. నారదా! మూలమంత్రాన్ని నాలుగులక్షలు నిష్ఠతో జపించినట్టయితే మంత్రసిద్ధి కలుగుతుంది. మంత్రసిద్ధి కలిగిందంటే అతడు బృహస్పతి సమానుడయినబ్దే.

నారదా! గంధమాదన పర్వతంమిద బ్రహ్మదేవుడు భృగుమహర్షికి విశ్వజయ సంపాదకమైన సరస్వతీకవచాన్ని అనుగ్రహించాడు. ఆ సందర్భంగా జరిగిన వారిద్దరి సంభాషణనూ యథాతథంగా చెబుతున్నాను - ఆలకించు. 

భృగుమహర్షి: హే బ్రహ్మన్‌! బ్రహ్మవిదాంశ్రేష్ఠ! బ్రహ్మజ్ఞానవిశారదా! సర్వజ్ఞా! సర్వజనకా! సర్వేశా! సర్వపూజితా! విశ్వజయావహమైన సరన్వతీకవచాన్ని అనుగ్రహించు. 

వత్సా! భృగూ! సర్వవాంఛాప్రదమైన సరస్వతీకవచాన్ని ఉపదేశిన్తున్నాను గ్రహించు. ఇది శ్రుతిసారం, శ్రుతిసుఖం, శ్రుత్యుక్తం, శ్రుతిపూజితం. గోలోకబ్బంచావనంలో రాసక్రీడారతుడైన రాసేశ్వరుడు శ్రీకృష్ణుడు నాకు ఉపదేశించాడు. ఇది కల్పవృక్షసమం. అత్యంతగోపనియం. కనీవినీ ఎరుగని మంత్రాక్షరాలున్నాయి ఇందులో. ఈ కవచాన్ని ధరించిన శుక్రాచార్యుడు సర్వదైత్యగురువయ్యాడు, బృహస్పతి బుద్దిమంతుడయ్యాడు. దేవగురువు అయ్యాడు. వాల్మీకి కవీంద్రుడయ్యాడు. స్వాయంభువ మనువు సర్వపూజితుడు అయ్యాడు. దీన్ని పఠించినందువల్లా ధరించినందువల్లా విశేషఫలితాలు లభిస్తాయి. కణాద గౌతమ కణ్వ పాణిని శాకటాయన కాత్యాయన ప్రభృతులు దక్షులైన శాస్త్రకర్తలయ్యారు. వ్యాసుడు వేదాలను విభజించగలిగాడు. పురాణాలు రచించగలిగాడు. శాతాతప - సంవర్త - వసిష్ఠ - పరాశర - యాజ్ఞవల్క్య - ఋష్యశృంగ - భరద్వాజ - ఆస్తీక - దేవల - జైగీషవ్య - యయాతి ప్రముఖులు సర్వదా సర్వధా గౌరవమర్యాదలు అందుకున్నారంటే దీని మహిమవల్లనే. ఈ కవచానికి ప్రజాపతియే స్వయంగా ఋషి. బృహతీ ఛందస్సు. శారదాంబికయే దేవత. సర్వ తత్త్వపరిజ్ఞాన - సర్వార్థసాధన - కవితారచనలయందు దీని వినియోగం. బీజాక్షరాలతో సహా ఉపదేశిస్తున్నాను, గ్రహించు.

ఓం శ్రీం హ్రీం సరస్వ త్త్యై స్వాహా -శిరో మే పాతు సర్వతః
ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా -ఫాలం మే సర్వదాఽవతు.

ఓం హ్రీం సరస్వత్త్యె స్వాహా - ఇతి శ్రోత్రే పాతు నిరంతరమ్
ఓం శ్రీం హ్రీం భగవత్త్యె సరస్వత్త్య స్వాహా - నేత్రయుగ్మం సదాఽవతు

ఓం ఐం హ్రీం వాగ్వాదిన్యై స్వాహా - నాసాం మే సర్వదాఽవతు
ఓం హ్రీం విద్యాదిష్ఠాతృదేవ్యై స్వాహా - చోష్ఠం సదాఽవతు

ఓం శ్రీం హ్రీం బ్రాహ్మ్యై స్వాహేతి - దంతపంక్తిం సదాఽవతు
ఓం ఐం మిత్యేకాక్షరో మంత్రో మమ కంఠం సదాఽవతు

ఓం శ్రీం హ్రీం పాతు మే గ్రీవాం స్కంధౌ మే శ్రీం సదాఽవతు
ఓం హ్రీం విద్యాధిష్ఠాతృదేవ్యై స్వాహా - వక్షః సదాఽవతు

ఓం హ్రీం విద్యాధిస్వరూపాయై స్వాహా - మే పాతు నాభికామ్
ఓం హ్రీం క్లీం వాణ్యై స్వాహేతి - మమ హస్తౌ సదాఽవతు

ఓం సర్వవర్ణాత్మికాయై స్వాహా - పాదయుగ్మం సదాఽవతు
ఓం హ్రీం వాగధిష్ఠాతృదేవ్యై స్వాహా - సర్వాంగ సదాఽవతు

ఓం సర్వకంఠవాసిన్యై స్వాహా - ప్రాచ్యాం సదాఽవతు
ఓం సర్వజిహ్వాగ్రవాసిన్యై స్వాహా - అగ్నిదిశి రక్షతు

ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సరస్వత్త్యె బుధజనన్యై స్వాహా
సతతం మంత్రరాజోఽయం దక్షిణే మాం సదాఽవతు

ఓం ఐం హ్రీం శ్రీం క్లీం త్య్రక్షరో మంత్రో నైరృత్యాం సర్వదాఽవతు
ఓం ఐం జిహ్వాగ్రవాసిన్యై స్వాహా మాం - వారుణోఽవతు

ఓం సర్వాంబికాయై స్వాహా వాయవ్యే మాం సదాఽవతు
ఓం ఐం శ్రీం క్లీం గద్యవాసిన్యై స్వాహా మాముత్తరేఽవతు

ఓం ఐం సర్వశాస్త్రావాసిన్యై స్వాహా - ఈశాన్యాం సదాఽవతు
ఓం హ్రీం సర్వపూజితాయై స్వాహా చోర్థ్వం సదాఽవతు

ఓం హ్రీం పుస్తకావాసిన్యై స్వాహా - అధో మాం సదాఽవతు
ఓం గ్రంథబీజస్వరూపాయై స్వాహా మాం సర్వతోఽవతు  (4 - 85)

భృగుమహర్షీ! ఇది బ్రహ్మ మంత్రౌఘరూపం. బ్రహ్మరూపకం. ఈ సరస్వతీకవచానికే 'విశ్వజయము' అని మరొక పేరు. ఒకప్పుడు గంధమాదన పర్వతంమీద సూర్యుడి ముఖతః నేనిది విన్నాను. ఇప్పుడు నీమీద ప్రేమతో ఉపదేశించాను. ఇది అత్యంత గోప్యం. ఎవరికిబడితేవారికి ఉపదేశించకూడదుసుమా!

దీన్ని ఉపదేశించిన గురువును శాస్త్రీయంగా వస్త్రాలంకార చందనాదులతో అర్చించి సాష్టాంగపడి లేచి కవచధారణ చెయ్యాలి. అయిదులక్షలు జపిస్తే ఈ కవచం సిద్ధిస్తుంది. సిద్ధకవచుడు బృహస్పతి సమానుడవుతాడు. మహావాగ్గ్మి మహాకవి త్రైలోక్యవిజయి అవుతాడు. అతడికి అంతటా జయమే. కణ్వశాఖోక్తమైన కవచమిది. ఇంక స్తోత్రమూ పూజావిధానమూ ధ్యానమూ ఇత్యాదులున్నాయి. వాటినికూడా తెలుసుకోవడం మంచిది. చెబుతాను. ఆలకించు.

నారదా! బ్రహ్మదేవుడు భృగుమహర్షికి ఇలా సరన్వతీకవచాన్ని మూలమంత్ర సహితంగా ఉపదేశించి స్తోత్రాన్ని అనుగ్రహించాడు. అదికూడా నీకు తెలియజేస్తాను. తెలుసుకో.

వాగ్దేవీస్తుతి సర్వకామప్రదం. ఒకప్పుడు యాజ్ఞవల్క్యుడు ఈ స్తుతి చేశాడు. శాపవిముక్తి పొందాడు. గురుశాపంవల్ల ఆ మహాముని ఆవిద్యుడు అయ్యాడు. (నేర్చిన విద్యలన్నీ మరిచిపోయాడు). దుఃఖార్తుడై సూర్యుడి దగ్గరికి వెళ్ళాడు. అతడిని స్తుతించాడు. తన గోడు వెళ్లబోసుకుని విలపించాడు. సూర్యుడు అనుగ్రహించి వేదవేదాంగాలను చదివించాడు. వాగ్దేవిని స్తుతిస్తే పూర్వస్మృతి కలుగుతుందని సలహాచెప్పాడు. ఆమాటమీద యాజ్ఞవల్క్యుడు నదిలో స్నానం చేసి శుచియై భక్తితో శిరసువంచి సరస్వతిని స్తుతించాడు.

ఓ వాగ్దేవీ! జగన్మాతా! నన్ను దయజూడు. నా తెలివీ నా చదువూ గురుశాపంవల్ల నశించాయి. చదువులన్నీ మరుపున పడ్డాయి. ఇప్పుడు విద్యావిహీనుడిని అయ్యాను. నాకు జ్ఞానాన్ని ప్రసాదించు. స్మృతిని అనుగ్రహించు. విద్యనూ శక్తినీ కలిగించు. గ్రంథరచనాశక్తిని దయచెయ్యి. ఉత్తమశిష్యుడిని సమకూర్చు. ప్రతిభనూ సభాసత్కారాన్నీ అనుగ్రహించు. గురుశాపంవల్ల కోల్పోయిన విద్యలనన్నింటినీ తిరిగి వినూతనంగా ప్రసాదించు. కాలిపోయిన విత్తనాన్ని మొలకెత్తించే శక్తి దేవతలకు మాత్రమే ఉంటుందిట. నువ్వు బ్రహ్మస్వరూపవు. జ్యోతిస్స్వరూపవు. సనాతనివి. సర్వవిద్యాధిదేవివి. హే వాణి! నమోనమః నన్ను మళ్ళీ మొలకెత్తించు. విసర్గ బిందు మాత్రలకు అధిష్ఠాత్రివి నువ్వు. నీతివి నువ్వు, వ్యాఖ్యారూపవు, వ్యాఖ్యాధిష్ఠాత్రివి. నీ దయలేనిదే ఎంతటి పండితుడైనా నోరుమెదపలేడు. కాలసంఖ్యా స్వరూపిణీ! నమోనమః. భ్రమసిద్ధాంతరూపవు. స్మృతిశక్తి - జ్ఞానశక్తి - బుద్ధిశక్తి నువ్వే. ప్రతిభాకల్పనా శక్తులుకూడా నువ్వే.

ఒకప్పుడు సనత్కుమారుడు బ్రహ్మదేవుణ్ణి జ్ఞానోపదేశం చెయ్యమని అడిగాడు. అంతటి బ్రహ్మదేవుడూ సిద్ధాంతం చెయ్యలేక మూగవోయాడు. ఆప్పుడు అక్కడికి శ్రీకృష్ణపరమాత్మ వచ్చాడు. వాణిని స్తుతించమని బ్రహ్మకు సలహా చెప్పాడు. అతడు ఆలా స్తుతించి నీ అనుగ్రహంతో ఉత్తమోత్తమ సిద్ధాంతం చేసి సనత్కుమారుడికి జ్ఞానం ఉపదేశించాడు.

ఇలాగే ఒకప్పుడు వసుంధరాదేవి జ్ఞానోపదేశం చెయ్యమని ఆనంతుణి అభ్యర్థించింది. అతడు నోరు మెదపలేకపోయాడు. ఇదేమిటి విచిత్రమని బెంబేలుపడ్డాడు. అంతలోకీ కశ్యపుడు వచ్చి ధైర్యం చెప్పి సరస్వతిని ప్రార్థించమన్నాడు. అనంతుడు అలాగే స్తుతించాడు. సరస్వతీ! నువ్వు కరుణించావు. అప్పుడు అతడు గొప్ప సిద్ధాంతాలు చేసి వసుంధరకు జ్ఞానభిక్ష పెట్టాడు. ఆమెకు మనస్సులో ఉన్న భ్రమప్రమాదాలను తొలగించాడు.

వ్యాసుడు ఒకనాడు పురాణసూత్రం తెలియజెప్పమని వాల్మికిని అడిగాడు. ఆదికవి మౌనిగా మారి క్షణకాలం వాగ్దేవిని నిన్ను స్మరించాడు. నీ అనుగ్రహంతో వ్యాసుడికి జ్ఞానోపదేశం చేశాడు. భ్రమాంధకారాన్ని పారద్రోలే దీపంలాంటి నిర్మలజ్ఞానాన్నీ పురాణసూత్రాన్నీ వాల్మీకి వ్యాసుడికి తెలియజెప్పగలిగాడు. అటుపైని వ్యాసుడు పుష్కరక్షేత్రంలో నూరేళ్ళు సరస్వతీ మంత్రజపం చేసి నీ అనుగ్రహానికి పాత్రుడై వరం పొంది మహాకవీశ్వరుడయ్యాడు. వేదాలను విభజించగలిగాడు. మహాపురాణాలనూ ఉపపురాణాలనూ రచించగలిగాడు.

వాణీ ! తత్త్వజ్ఞానం ఉపదేశించమని ఇంద్రుడు శివుణ్ణి అడిగినప్పుడుకూడా శివుడు నిన్నే ధ్యానించాడు. ఉపదేశించగలిగాడు. అలాగే బృహస్పతి దగ్గరికి వెళ్ళి శబ్దశాస్త్రం బోధించమని ఇంద్రుడు అడిగినప్పుడు ఆ దేవగురువు వాఙ్మాతా! నిన్నే తలుచుకున్నాడు. నీ అనుగ్రహంతోనే బోధించగలిగాడు. ఇంద్రుడితోపాటు మరికొందరు శిష్యులుకూడా అప్పుడు శబ్దశాస్త్రం నేర్చుకున్నారు. అప్పటి నుంచీ వారంతా వాగ్దేవిని నిన్నే ఉపాసిస్తూ ఆ శాస్త్రాన్ని ప్రబోధిస్తున్నారు.

పలుకులతల్లి! నీ గుణగణాలను కొనియాడటానికి సహస్రముఖ - పంచముఖ - చతుర్ముఖులే (ఆదిశేషుడు, శివుడు, బ్రహ్మ) చాలరంటే ఎకముఖుణ్ణి మానవమాత్రుణ్ణి నేను ఎలా స్తుతించగలను?

యాజ్ఞవల్క్యుడు భక్తిభావనమ్రుడై శిరసువంచి సరస్వతీదేవిని ఇలా స్తుతించాడు. సాష్టాంగపడ్డాడు.
దుఃఖభారంతో రోదించాడు. జ్యోతిస్స్వరూపిణి మహామాయ ఆ సరస్వతీదేవి కటాక్షించింది. 'సుకవీంద్రుడవు కమ్ము' అని ఆశీర్వదించి వైకుంఠానికి వెళ్ళిపోయింది.

నారదా! యాజ్ఞవల్క్యుడు చేసిన ఈ వాణీస్తోత్రాన్ని పఠించినవారు కవీంద్రులవుతారు. సంభాషణచతురులవుతారు. బృహస్పతి సమానులవుతారు. మూర్ఖుడుకానీ బుద్ధిహీనుడుకానీ ఒక సంవత్సరంపాటు ఈ స్తోత్రాన్ని పారాయణచేస్తే ఆతడు పండితుడవుతాడు. కవీంద్రుడవుతాడు. మేధావి అవుతాడు. ఇది ముమ్మాటికీ నిశ్చయం.

నారదమహర్షి! వైకుంఠంలో నారాయణుడి చేరికలో ఉంటున్న సరస్వతికి ఒకనాడు గంగాదేవితో కలహమయ్యింది. గంగ ఇచ్చిన శాపంవల్ల భారతదేశంలో సరస్వతీ కళ ఒక నదిగా అవతరించింది.
పుణ్యరూప పుణ్యతీర్థ స్వరూపిణి పుణ్యాత్ములతో సేవలందుకొన్న తపోరూపిణి. తపఃఫలస్వరూపిణి  పాపాలు అనే ఎండుకట్టెలను తగులబెట్టడానికి జలరూపంలో ఉన్న జ్వలదగ్ని స్వరూపిణి. సరస్వతీనదిలో మునిగి మరణించినవారికి వైకుంఠంలో స్థిరనివాసమే. ఎంతటి పాపాత్ముడైనా ఏ రోజునగానీ ఏ సమయానగానీ తెలిసిగానీ తెలియకగానీ విలాసంగాగానీ ఆ నదిలో స్నానం చేస్తే చాలు అతడి పాపాలు అన్నీ పటాపంచలై విష్ణులోకంలో హరిసన్నిధిలో నివాసం పొందుతాడు. హరితో సారూప్యం పొందుతాడు. సరస్వతీమంత్రాన్ని ఈ నదీతీరంలో ఒకనెలపాటు జపించినవాడు మహామూర్ఖుడైనా కవీంద్రుడవుతాడు. నిరంతరం ఈ నదిలో స్నానం చేసినవారికి మరింక పునర్జన్మ ఉండదు. గర్భవాసదుఃఖం ఉండదు.

నారదా! నాకు తెలిసినంతమటుకు సరస్వతీగుణకీర్తన చేశాను. ఇంకా ఏమి తెలుసుకోవాలను కుంటున్నావో అడుగు - అని ముగించాడు నారాయణమహర్షి అప్పుడు మళ్ళీ నారదుడు అడిగాడు.

గంగా సరస్వతుల కలహం


Thursday, April 30, 2026

Sree Lashmi Narasimha Swami Temple - Singarayakonda - శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం - సింగరాయకొండ

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం - సింగరాయకొండ

సింగరాయకొండలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, శ్రీ నరసింహ స్వామి వారి పవిత్ర నివాసాలలో ఒకటి. దీనిని దక్షిణ సింహాచలం అని కూడా పిలుస్తారు.

పురాణాలు కథనం:
పురాణం ప్రకారం, ఈ ప్రాంతాన్ని ఖరసురుడు అనే రాక్షసుడు పరిపాలించి, ఒక విశాలమైన ఖరతి వంశాన్ని స్థాపించాడు. అతను నరసింహ స్వామికి పరమ భక్తుడు, ప్రతిరోజూ ఆయన దర్శనం కోసం ఈ ప్రదేశానికి వచ్చేవారు. ఒకరోజు, ఖరసురుడు స్వామిని ఒక వరం కోరగా, స్వామి తన రామ అవతారంలో (విష్ణుమూర్తి అవతారం) వరం ఇస్తానని బదులిచ్చారు. ఆగ్రహించిన ఖరసురుడు ఋషుల యజ్ఞాలకు, హోమాలకు ఆటంకం కలిగించడం ప్రారంభించాడు. రాముడు రాజ్యం నుండి అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు, దక్షిణ దిశగా ప్రయాణిస్తుండగా, ఋషులు తమ యజ్ఞాన్ని కాపాడమని రాముడిని కోరారు. నరసింహ భక్తుడైన ఖరసురుడు రాముడికి ఎదురుపడగా, రాముడు ఆ రాక్షసుడిని సంహరించడానికి ముందు నరసింహ స్వామిని ప్రతిష్ఠించి పూజలు సమర్పించారు.

నారద మహర్షి, వరాహ నరసింహ అవతారంలో తన ముందు ప్రత్యక్షమైన నరసింహ స్వామి కోసం తపస్సు చేశారని నమ్ముతారు.

దేవాలయం చరిత్ర:
శాసనాల ప్రకారం, ఈ ఆలయం క్రీ.శ. 1443-1444 మధ్య నిర్మించబడిందని తెలుస్తుంది. తదనంతరం, ఈ ఆలయాన్ని విజయనగర రాజులు పునరుద్ధరించారు. 15వ శతాబ్దంలో విజయనగర వంశానికి చెందిన కృష్ణదేవరాయల పాలనలో ఈ ఆలయం పోషణ పొందింది.

ఆలయ దర్శన సమయాలు:
ఉదయం వేళలు: ఉదయం 7:00 నుండి మధ్యాహ్నం 12:30 వరకు
మధ్యాహ్న వేళలు: మధ్యాహ్నం 2:00 గంటల నుండి సాయంత్రం 7:00 గంటల వరకు

 ఆలయానికి ఎలా చేరుకోవాలి?

విమాన మార్గం: సమీప అంతర్జాతీయ విమానాశ్రయం విజయవాడలో ఉంది, అది 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. తరువాత, అత్యంత సమీపంలోనిది తిరుపతి, ఇది ఈ ఆలయం నుండి 220 కిలోమీటర్ల దూరంలో ఉంది.

రైలు 
మార్గం: సమీప రైల్వే స్టేషన్ సింగరాయకొండలో ఉంది, ఇది 2.9 కి.మీ. దూరంలో ఉంది.

బస్సు 
మార్గం: సింగరాయకొండకు నేరుగా బస్సులు కందుకూరు, ఒంగోలు నుండి అందుబాటులో ఉన్నాయి. కందుకూరు నుండి ఆలయం 15.6 కి.మీ దూరంలో ఉంది
ఒంగోలు బస్ స్టేషన్ నుండి ఆలయం 37.3 కిలోమీటర్ల దూరంలో ఉంది.

మన దేవాలయాలు చారిత్రక నగరాలూ

Sholingar - Yoga Narasimha Swamy Temple (Thirukkadigai) - యోగ నరసింహ దేవాలయం - షోలింగర్

యోగ నరసింహ దేవాలయం - షోలింగర్

దుష్ట శిక్షణ చేసిన శ్రీ నారసింహుడు ఉగ్రరూపాన్ని ఉపసంహరించి, యోగ ముద్రలో దర్శనమిచ్చిన చోటుగా ప్రసిద్ధి చెందిన క్షేత్రం షోలింగర్. మానసిక సమస్యల నుంచి విముక్తి కలిగించే దైవంగా ఇక్కడి యోగ నరసింహుడు పూజలు అందుకుంటున్నాడు.

తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో ఉన్న షోలింగర్ ప్రసిద్ధ నారసింహ క్షేత్రాల్లో ఒకటి. దీనికి ‘తిరుక్కడిగె', ‘కడిగాచలం’ అనే ప్రాచీన నామాలున్నాయి. రాజుల కాలంలో చోళసింహపురంగా ఖ్యాతి చెందిన ఈ ప్రాంతం పేరు క్రమేపీ షోలింగర్గా స్థిరపడింది.

పురాణ గాథల ప్రకారం హిరణ్యకశిపుణ్ణి నరసింహావతారంలో మహా విష్ణువు వధించిన సందర్భంలో, ఆ భీకరాకృతిని చూసి ప్రహ్లాదుడు భయపడ్డాడు. ప్రహ్లాదుడి ప్రార్థన మేరకు ఉగ్రరూపాన్ని ఉపసంహరించుకొని, యోగముద్రలో దర్శనమిచ్చిన నృసింహ స్వామి ఇక్కడ కొలువయ్యాడు. చిన్న కొండపై యోగ ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారు. సప్త ఋషులు తనను సేవించుకోగా ముక్తిని అనుగ్రహించాడు.

ఈ యోగ నరసింహుణ్ణి సేవించి విశ్వామిత్రుడు బ్రహ్మర్షిత్వాన్ని పొందాడనీ, ఈ ఆలయంలో 24 నిమిషాలు ఉన్నట్టయితే జనన మరణ చక్రం నుంచి విముక్తులవుతారనీ స్థలపురాణం చెబుతోంది. అందుకే ఈ ప్రదేశాన్ని ‘తిరుక్కడిగై’ అని కూడా పిలుస్తారు. అంటే ఇరవై నాలుగు నిమిషాలు దర్శనమిచ్చే నరసింహుడని అర్థం.

ఇంద్రుడు తన దేవతలతో కలిసి పుష్కరిణిలో స్నానం చేసి నరసింహుడిని ప్రార్థించేవాడని కూడా నమ్ముతారు. పుష్కరిణి పేరు 'తక్కన్'.

పుష్కరిణిలో అన్ని వ్యాధులను నయం చేసే ఔషధ జలాలు ఉన్నాయని చరిత్రకారులు నమ్ముతారు.

చంద్రుని కుమారుడైన బుద్ధుడు అక్కడ దేవతను పూజించి, దుర్వాస మహర్షి ఇచ్చిన శాపం నుండి విముక్తి పొందాడు.

పుష్కరిణిలో స్నానం చేసి, ఆ రెండు కొండలపై ఉన్న దేవుళ్లకు నమస్కరించినప్పుడు అనేక మానసిక రుగ్మతలు, దుష్కార్యాలు మరియు ఏ విధమైన దీర్ఘకాలిక వ్యాధులైనా నయమవుతాయని నమ్ముతారు.

అందుకే భక్తులు చక్ర తీర్థంలో స్నానం చేసి, స్వామిని దర్శించుకుంటారు. వైష్ణవులకు పవిత్రమైన 108 దివ్య దేశాల్లో (క్షేత్రాల్లో) ఇదొకటి. ప్రధాన ఆలయానికి వెళ్ళే దారిలో బ్రహ్మతీర్థం అనే పుష్కరణి ఉంది.

108 తీర్థాలు ఇక్కడికి వచ్చి కలుస్తాయంటారు. దీని ఒడ్డున వరదరాజస్వామి ఆలయం ఉంటుంది. ఈ ఆలయానికి సమీపంలోని మరో కొండ మీద ఆంజనేయస్వామి ఆలయం ఉంది. ఆ గుడిలో హనుమంతుడు కూడా యోగముద్రలోనే కనిపించడం విశేషం.

సాధారణ వాడుకలో చోళ లింగాపురం అనే పేరు కాలక్రమేణా షోలింగాపురంగా ​​మారింది. 20వ శతాబ్దం చివరిలో, ఈ పట్టణం పేరును మరింతగా కుదించి షోలింగుర్ అని పిలిచారు, ఇది ప్రస్తుతం ఆ పట్టణం యొక్క అధికారిక నామం.

నందివర్మన్ పల్లవమల్ల తన 61వ ఏట రచించిన తిరువల్లం శాసనంలో ఒక ఘటిక గురించి ప్రస్తావించబడింది. తమిళనాడులోని ఉత్తర ఆర్కాట్ జిల్లా (కాంచీపురం జిల్లా)లోని బ్రహ్మదేశం నుండి లభించిన పార్థివేంద్రధిపతి యొక్క మూడు శాసనాలలో 'త్రైర్జ్యువ ఘటిక మధ్యస్థాన్' అనే బిరుదు గల ఒక మధ్యవర్తి గురించి కూడా ప్రస్తావించబడింది. ఈ ఘటిక బహుశా పల్లవుల రాజధాని కాంచీపురంలోని ప్రసిద్ధ ఘటికకు భిన్నమైనది. ఇది బహుశా షోలింగూర్ కొండపై ఉన్న ఘటికాచల అయి ఉండవచ్చు. నందివర్మన్ పల్లవమల్ల సమకాలికుడైన వైష్ణవ సాధువు తిరుమంగై ఆళ్వార్ రచించిన 'సిరియ తిరుమడల్' మరియు 'పెరియ తిరుమొళి'లలో ఈ ప్రదేశాన్ని 'కడిగై' అని పేర్కొన్నారు. పల్లవుల కాలంలో ఇది సంస్కృత విజ్ఞానానికి ప్రసిద్ధ కేంద్రంగా మరియు వైష్ణవానికి బలమైన కోటగా ఉండేది. తొలి వైష్ణవ సాధువు అయిన పేయల్వార్ తన అయ్యర్ప మూడవ అందదిలో ఈ ఆలయాన్ని పుంగటికై అని పేర్కొన్నారు. ఈ ప్రదేశ పరిసరాల్లో పల్లవుల ప్రభావాలు గుర్తించవచ్చు. ఏడవ శతాబ్దం ప్రారంభంలో పాలించిన మొదటి మహేంద్రవర్మకు చెందిన, కాంచీపురంలో మహేంద్రవిష్ణుగృహ అనే పేరుతో ఉన్న ఒక గుహాలయం మహేంద్రవాడిలో ఉంది. మహేంద్రవర్మన్ వారసులు అక్కడ ఒక ఘటికను స్థాపించి, ఆ ప్రదేశానికి ఘటికాచలం అని పేరు పెట్టి ఉండవచ్చు. ఘటికై కొండపై ఉన్న తిరుక్కన్నపురం గురించిన తన స్తోత్రాలలో, షోలింగూర్ కొండపై ఉన్న ఘటికలో వైష్ణవ బ్రాహ్మణులు ఉండేవారు, వీరు ఆ సంస్థ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఉన్నత విద్యా కార్యక్రమాన్ని నిర్వహించేవారు. ఈ సంస్థ బహుశా ఘటికాచలం చుట్టుపక్కల అనేక ప్రదేశాల నుండి విద్యార్థులను ఆకర్షించింది. ఈ ఘటిక బహుశా నరసింహుడికి అంకితం చేయబడిన కొండ ఆలయంలోనే నెలకొని ఉండేది. తరువాతి పల్లవ యుగంలో గొప్ప విద్యా కేంద్రంగా విలసిల్లిన షోలింఘూర్, చోళుల యుగంలో కూడా విద్యా కేంద్రంగా కొనసాగింది. ఈ రోజుకి కూడా ఈ ప్రదేశంలో ఒక సంస్కృత కళాశాల ఉంది.

ఈ పట్టణం యొక్క ప్రస్తుత పేరు చోళ-లింగ-పురం అనే పదాల సంక్షిప్త రూపం, మరియు ఒక చోళ రాజు ఇక్కడ ఒక సహజ లింగాన్ని (స్వయంభూ) కనుగొని, దానిపై శోలేశ్వర ఆలయం అని పిలువబడే ఒక ఆలయాన్ని నిర్మించినందున దీనికి ఈ పేరు వచ్చింది. ఈ ఆలయం పట్టణం మధ్యలో ఉంది.

గాథల ప్రకారం, నరసింహ స్వామి ప్రజలను సంస్కరించడానికి ఈ లోకంలో అనేక పునర్జన్మలు ఎత్తడమే కాకుండా, ఈ కార్యాన్ని నిర్వర్తించడానికి తన దూతలను గురువులుగా కూడా పంపేవారు. అటువంటి గురువులలో ఒకరు చోళ లింగాపురానికి చెందిన దొడ్డాచార్యుడు. ఈయన సుమారు 470 సంవత్సరాల క్రితం యోగ నరసింహర స్వామికి సేవ చేస్తూ జీవించారు.

దొడ్డాచార్యులు ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవం సమయంలో కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయాన్ని సందర్శించేవారు. ఒకానొక సంవత్సరం ఆయన అనారోగ్యానికి గురై కాంచీపురం ఆలయాన్ని సందర్శించలేకపోయారు. ప్రస్తుత తక్కన్ కుళం (పుష్కరిణి) ఒడ్డున కూర్చుని ఆయన వరదరాజ పెరుమాళ్ స్వామిని ప్రార్థించారు. ఆయన ప్రార్థనలను మన్నించి, వరదరాజ పెరుమాళ్ స్వామి కొన్ని క్షణాల పాటు ఆయన ముందు ప్రత్యక్షమయ్యారు. అదే సమయంలో, కాంచీపురంలో వరదరాజ పెరుమాళ్ విగ్రహం అదృశ్యమైంది. ఈ సంఘటన ఫలితంగా, షోలింఘూర్‌లోని ఆంజనేయర్ ఆలయం పక్కన, తక్కన్ కుళం ఒడ్డున వరదరాజ పెరుమాళ్ ఆలయానికి అంకితం చేయబడిన ఒక ఆలయాన్ని నిర్మించారు. షోలింఘూర్‌లోని ఈ వరదరాజ పెరుమాళ్ ఆలయం కాంచీపురంలో బ్రహ్మోత్సవ పండుగ రోజులలో మాత్రమే తెరిచి ఉంటుంది. ఈనాటికీ కాంచీపురంలో జరిగే బ్రహ్మోత్సవం సందర్భంగా, వరదరాజ పెరుమాళ్ విగ్రహం అదృశ్యమై, సుమారు 470 సంవత్సరాల క్రితం షోలింఘూర్‌లో దొడ్డాచార్యుల వారి ముందు ప్రత్యక్షమైన సంఘటనకు గుర్తుగా, ఆ విగ్రహాన్ని కొన్ని క్షణాల పాటు ఒక తెరతో మూసి, ఆ తర్వాత తెరుస్తారు.

చరిత్ర
ఆంగ్లో-మైసూర్ యుద్ధాల సమయంలో ఈ పట్టణం ఒక యుద్ధానికి వేదికైంది . రెండవ ఆంగ్లో-మైసూర్ యుద్ధంలో , 1781 నాటి షోలింఘూర్ యుద్ధంలో సర్ ఐర్ కూట్ ఇక్కడే టిప్పు సుల్తాన్ మరియు హైదర్ అలీకి వ్యతిరేకంగా పోరాడారు. షోలింఘూర్ బస్ టెర్మినస్ సమీపంలో, కంజా సాహిబ్ సమాధి అని పిలువబడే, ఆ యుద్ధంలో పోరాడిన టిప్పు సుల్తాన్ సైన్యానికి చెందిన సైనికులకు అంకితం చేయబడిన సమాధి స్థలాన్ని మనం చూడవచ్చు. టీవీఎస్ గ్రూప్ 1980ల ప్రారంభంలో తన మొదటి ఫ్యాక్టరీని ఇక్కడ స్థాపించి, అప్పటి నుండి ఈ ప్రాంతంలో అతిపెద్ద ప్రైవేట్ ఉద్యోగ కల్పన సంస్థలలో ఒకటిగా ఎదిగింది.

సుమారు 230 మీటర్ల ఎత్తయిన కొండ మీద ఉన్న ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే 1,300కు పైగా మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. రాజగోపురం అయిదు అంతస్థుల్లో సమున్నతంగా ఉంటుంది. ప్రధాన ఆలయంలో యోగ నరసింహ స్వామి మూలవిరాట్ ఉంటుంది. యోగముద్రలో కూర్చున్న నారసింహుడి కాళ్ళకు యోగ బంధం (పట్టీ) ఉంటుంది. ఆయన దేవేరి అమృతవల్లి అమ్మవారి మందిరం ప్రధాన ఆలయానికి కుడివైపు ఉంటుంది. ఈ ఆలయాన్ని క్రీ.శ. ఆరు నుంచి ఎనిమిదో శతాబ్దం మధ్య చోళరాజులు కట్టించారని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది.

వృద్ధులు, పిల్లల కోసం, సులభంగా ఆలయానికి చేరుకోవడానికి రోప్ కార్ సేవలు అందుబాటులో ఉన్నాయి.

టికెట్ ధర: రోప్ కార్ ఒకవైపు ప్రయాణానికి సుమారు ₹15 (రౌండ్ ట్రిప్ ₹30).
పరిసర ప్రాంతాలు: వేలూరు (51 కి.మీ), అరక్కోణం (37 కి.మీ), తిరుత్తణి(25 కి.మీ), కంచికి 65 కి.మీ.
సమయం: ఆలయం ఉదయం 8 నుండి సాయంత్రం 5.30 గంటల వరకు తెరిచి ఉంటుంది.

సందర్శనకు ఉత్తమ సమయం: శీతాకాలం లేదా వర్షాకాలం మెట్లు ఎక్కడానికి అనుకూలంగా ఉంటుంది.

Buddha Purnima - బుద్ధ పూర్ణిమ

బుద్ధ పూర్ణిమ 

బుద్ధ పూర్ణిమ వైశాఖ మాసం పూర్ణిమ తిథిని బుద్ధ పూర్ణిమ వైశాఖ పూర్ణిమ మరియు మహా వైశాఖి  అనే పేరుతో పిలుస్తారు. ఈ పూర్ణిమ రోజున ఎలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసినా కచ్చితంగా విజయం సాధిస్తారు.

మానవ జాతి, జంతు జాలం, వృక్ష జాతి, ఖనిజ సంపద. ఈ నాలుగు జాతులు భౌగోళిక జీవుల చతుర్భుజ అస్తిత్వాన్ని తెలియజేస్తాయి. అనాదిగా ఉన్న ఈ వ్యవస్థ కాలక్రమంలో మహా వైశాఖిగా, తదుపరి కాలంలో 
బుద్దుని నిర్యాణం తర్వాత ఇది బుద్ధ పూర్ణిమగానూ కూడా ప్రసిద్ధి గాంచింది.

గౌతమ బుద్ధుడు సనత్కుమారులు, పరమ గురువుల పరంపర మధ్య వారధిగా ఉంటాడని, అందువల్లే వైశాఖ పూర్ణిమ బుద్ధ పూర్ణిమగా ప్రసిద్ధి చెందింది. మునులు ఋషులకు ఆవాసమైన ఉత్తర హిమాలయ పుణ్య శ్రేణులలో ఉన్న శంబళ ప్రాంతం నుంచి దశవతారమైన కల్కి వస్తాడని, శంబళ గ్రామంలో అవతరిస్తాడని భాగవత పురాణంలో ఉంది. మధ్య హిమాలయ శ్రేణులలో ఉన్న కలాప గుహలలో ఉన్న మునులు ఋషులకు కల్కి అవతార జననం తెలుసుకుంటారని భాగవత పురాణంలో వివరించబడింది.

బుద్దుని జీవితంలో వైశాఖ పూర్ణిమ మూడుసార్లు అత్యంత ప్రాముఖ్యతను వహించింది. క్రీ.పూ. 623 లేదా 563 (సుమారుగా) లో 
కపిలవస్తు రాజు శుద్ధోధనుడు, మహామాయలకు ఓ వైశాఖ పౌర్ణమి నాడు లుంబినీ (ప్రస్తుత నేపాల్) లో  సిద్ధార్ధుడిగా జన్మించాడు. మరో వైశాఖ పూర్ణిమనాడు గయాలోని (బుద్ధగయ)  బౌది వృక్షం క్రింద జ్ఞానోదయం పొంది సిద్ధార్ధుడు బుద్ధుడిగా మారాడు. తన 80 ఏళ్ల వయసులో వైశాఖ పూర్ణిమనాడు కూచినగర్ లో నిర్యాణం చెందాడు.

తల్లి చనిపోవడంతో గౌతమి అనే మహిళ సిద్ధార్ధుని పెంచిందని. అందుకే గౌతముడనే పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతారు.

గౌతమ బుద్ధుడు తన ఉపన్యాసాలలో ఒక వ్యక్తి తన జీవితాన్ని ఎలా సంతోషంగా, విజయవంతం చేసుకోవాలో చక్కగా వివరించాడు. బుద్ధుడు చెప్పిన ఈ సూత్రాలను పాటించడం ద్వారా మనం జీవితంలోని అనేక సమస్యల నుంచి సులభంగా బయటపడొచ్చు. బౌద్ధ మతం స్థాపనలోనూ గౌతమ బుద్ధుడు కీలక పాత్ర పోషించాడు. పురాణాల ప్రకారం, శ్రీమహావిష్ణువు అవతారంగా బుద్దుడిని పరిగణిస్తారు.


గౌతముని బుద్ధుడిగా చేసిన బోధి వృక్షానికి పూజచేసే ఆచారం అ మహనీయుని జీవిత కాలంలోనే ప్రారంభమైంది. బేతవన విహారంలో బుద్ధుడు బసచేసి ఉన్న రోజులలో ఒకనాడు భక్తులు పూలు తీసుకురాగా ఆ సమయంలో గౌతముడు ఎక్కడికో వెళ్లారు. బుద్ధుని దర్శనం కోసం భక్తులు చాలా సేపు వేచి చూసి ఎంతటికీ రాకపోవడంతో నిరుత్సాహంతో పుష్పాలను అక్కడే వదలి వెళ్లిపోయారు.

శారీరక పారిభాగాది (అవయవాలు) పూజలకు అంగీకరించని బుద్ధుడు. బోధివృక్షం పూజకు అనుమతించాడు. తన జీవితకాలంలోనూ, తదనంతరమూ ఈ ఒక్క విధమైన పూజ సాగడమే తనకు సమ్మతమైందని చెప్పాడు. అప్పటినుంచీ బేతవన విహారంలో ఒక బోధివృక్షాన్ని నాటి పెంచడానికి ఆనందుడు నిర్ణయించాడు. గయలోని బోధివృక్షం నుంచి విత్తనం తెప్పించి నాటారు. అప్పడు ఒక గొప్ప ఉత్సవం సాగింది. కోసలదేశపు రాజు తన పరివారంతో వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొన్నాడు. వేలాది బౌద్ధభిక్షకులు తరలివచ్చారు.

వైశాఖ పౌర్ణమి - బోధి వృక్షపూజ
ఆనాటి నుంచి బోధివృక్ష పూజ బౌద్దులకు ప్రత్యేకమైంది. ఏడాదికి ఒకసారి వైశాఖ పూర్ణిమనాడు సాగించడం ఒక ఆచారంగా మొదలైంది. బౌద్దమతం వ్యాపించిన అన్ని దేశాల్లో వైశాఖ పూర్ణిమనాడు బోధి వృక్షపూజ సాగుతుంది. ఆనాడు బౌద్దులు బోధి వృక్షానికి జెండాలు కట్టి, దీపాలు వెలిగించి పరిమళజలాన్ని పోస్తారు. హీనయాన బౌద్ధమతాన్ని అవలంబించే బర్మాలో ఈ ఉత్సవం నేటికీ సాగుతోంది. రంగూన్, పెగు, మాండలే మొదలైన ప్రాంతాల్లో బుద్ధ పౌర్ణిమను అత్యంత వైభవంగా, నియమ నిష్ఠలతో చేస్తారు. రోజు మొత్తం సాగే ఈ ఉత్సవంలో మహిళలు పరిమళ జలభాండాన్ని తలపై ధరించి బయలుదేరుతారు. మేళతాళాలు, దీపాలు, జెండాలు పట్టుకు వస్తారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి నుంచి బయలుదేరిన సమూహాలు సాయంకాలానికి ఒక చోట కలుసుకుంటాయి.

అత్యంత వైభవంగా సాగే ఆ ఊరేగింపు బౌద్ధాలయానికి వెళుతుంది. దేవాలయంలోకి ప్రవేశించి మూడుసార్లు ప్రదక్షిణం చేస్తారు. అటు పిమ్మట కుండల్లో జలాలను వృక్షం మొదట పోస్తారు. దీపాలు వెలిగించి, చెట్టుకి జెండాలు కడతారు. హిందువులు ఆచరించే ‘వట సావిత్రి’ మొదలైన వ్రతాలు ఈ బౌద్ద పర్వం ఛాయవే అని అంటారు.

శ్రీలంకలో వైశాక్ డే
ఇది శ్రీలంక బౌద్ధులకు కూడా పండుగ రోజు. బుద్ధుని జననం, మరణం, మేల్కొలుపు జ్ఞాపకార్థం వైశాఖ పౌర్ణమి రోజున శ్రీలంకలోని బౌద్ధ సింహళీయులు "వైశాక్" జరుపుకుంటారు. ఈ రోజున వివిధ భక్తి కార్యక్రమాలు బుద్ధుని జీవిత చరిత్రను చదవటం చేస్తారు. ఈ కాలంలో మండపాలు, స్తంభాలు, దీపాలు నిర్మించి ఎక్కడ చూసినా ఉత్సవాలు నిర్వహిస్తారు. "వైశాక్" అనేది తమిళ పదం కాదు. కానీ శ్రీలంక తమిళులు దీనిని వెసాక్ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం శ్రీలంకలో కనిపించే ఈ వెసాక్ గూళ్ళు, స్తంభాల ఏర్పాటు, వెసాక్ వేడుకలు వంటి చైనీస్ సంస్కృతి నుండి వచ్చాయని చెబుతారు.

వెసక్ గూడు
ముఖ్యంగా సింహళ బౌద్ధుల ఇళ్లలో వెదురు, డేగ కర్రలతో గూళ్లు, పలుచని కాగితంతో తయారు చేసి కొవ్వొత్తులను ఇళ్లలోపలికి వేలాడదీస్తారు. వీటిని శ్రీలంకలో "వెసాక్ గూడు" అంటారు. ఈ వెసాక్ గూళ్లు రకరకాల ఆకారాల్లో ఉంటాయి. ప్రతి ఒక్కరూ తమ తమ కళాఖండాలను ఇక్కడ ప్రదర్శించేవారు.

ఇలా కాకుండా ఇళ్లలో వేలాడదీయగలిగే చిన్న తరహా వేసక్ గూళ్లను దుకాణాల్లో విక్రయిస్తారు. ఈ కాలంలో ఇవి ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. లోపల కొవ్వొత్తి వెలిగించేవి కూడా ఇవే. విద్యుత్ సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో కొవ్వొత్తులకు బదులు గూళ్లలో దీపాలను వేలాడదీసేవారు.

వేసక్ భంగిమలు
ప్రధాన కూడళ్లలో జెయింట్ ఎలక్ట్రోప్లేటింగ్‌ను కొన్ని లక్షల వ్యయంతో నిర్మించారు. బౌద్ధ చారిత్రక కథలు కవితలు, మాట్లాడే రూపంలో చిత్రించబడ్డాయి. ఆ విధంగా ఈ స్తంభాలు నిర్మించిన స్థలంలో సందర్శకులు పెద్ద సంఖ్యలో గుమికూడతారు. రద్దీ కారణంగా కొన్ని ప్రాంతాల్లో రోడ్లు మూసివేయబడతాయి. కొలంబోలో ప్రతి సంవత్సరం వెసాక్ స్తంభాలు నిర్మించబడే ప్రదేశాలు: పురక్కోట్టై అరసమరతాడిచ్ జంక్షన్, గ్రాండ్‌పాస్ జంక్షన్, థెమట్టగోడ జంక్షన్, బోరెల్లా జంక్షన్, వెల్లవట్ట, పెలియగోడ జంక్షన్ మొదలైనవి.

బౌద్ధ కాలక్రమం
బుద్ధుని జన్మదినంగా భావించే క్రీ.పూ. 563 నుండి బౌద్ధ కాలక్రమం వాడుకలో ఉంది.

పండగ జరుపుకునే సమయం
వెసాక్ ఖచ్చితమైన తేదీ ఆసియా చాంద్రమాన క్యాలెండర్ల ఆధారంగా రూపొందించబడింది. ఇది ప్రధానంగా వైశాఖ మాసంలో జరుపుకుంటారు, ఇది బౌద్ధ, హిందూ క్యాలెండర్ల రెండింటిలోనూ ఒక నెలగా వైశాఖ మాసం ఉంటుంది, అందుకే దీనికి వెసాక్ అని పేరు వచ్చింది. బుద్ధుని జన్మ దేశంగా పరిగణించబడే నేపాల్‌లో, ఇది హిందూ క్యాలెండర్‌లోని వైశాఖ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. సాంప్రదాయకంగా బుద్ధ పూర్ణిమ అని పిలుస్తారు. బౌద్ధ క్యాలెండర్‌ను అనుసరించే థెరవాడ దేశాలలో, ఇది సాధారణంగా 5వ లేదా 6వ చాంద్రమాన నెలలో పౌర్ణమి అయిన ఉపోసత రోజున వస్తుంది.

ఈ రోజుల్లో, శ్రీలంక, నేపాల్, భారతదేశం, బంగ్లాదేశ్, మలేషియాలో, గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మే నెలలో మొదటి పౌర్ణమి రోజున వెసాక్/బుద్ధ పూర్ణిమ జరుపుకుంటారు.

చాంద్రమాన క్యాలెండర్‌ని ఉపయోగించే దేశాలకు, గ్రెగోరియన్ క్యాలెండర్‌లో వెసాక్ లేదా బుద్ధుని పుట్టినరోజు తేదీ సంవత్సరానికి మారుతూ ఉంటుంది, అయితే సాధారణంగా ఏప్రిల్ లేదా మేలో వస్తుంది; లీపు సంవత్సరాలలో దీనిని జూన్‌లో జరుపుకోవచ్చు. 

భూటాన్‌లో ఇది భూటానీస్ చంద్ర క్యాలెండర్‌లోని నాల్గవ నెల 15వ రోజున జరుపుకుంటారు. థాయిలాండ్, లావోస్, సింగపూర్, ఇండోనేషియాలో, చైనీస్ చాంద్రమాన క్యాలెండర్‌లో నాల్గవ నెలలో పద్నాలుగో లేదా పదిహేనవ రోజున వెసాక్ జరుపుకుంటారు. చైనా, కొరియా, వియత్నాంలో, చైనీస్ చాంద్రమాన క్యాలెండర్‌లో నాల్గవ నెలలోని ఎనిమిదవ రోజున బుద్ధుని పుట్టినరోజును జరుపుకుంటారు.

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Virat Svarupudu - విరాట్‌ స్వరూపుడు

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - విరాట్‌ స్వరూపుడు

నారదా ! కృష్ణాదేవి విసిరివేసిన ఆ మగ శిశువు ఒక బ్రహ్మకల్ప పర్యంతం మహాజలార్ణవంలో ఏకాకిగా అలా తేలుతున్నాడు. అటుపైని రెండుగా అయ్యాడు. ఆకలితో అలమటించాడు. రోదించాడు. పాలుతాపే తల్లి లేదు. తండ్రి లేడు. నిరాశ్రయుడై అనాథబాలుడుగా పరితపించాడు. ఆకాశంవైపు చూస్తున్నాడు. ఆ శిశువు అణోరణీయాన్‌, మహతో మహీయాన్‌. తేజస్సులో కృష్ణపరమాత్మకు ఇతడు పదహారవ అంశ. సర్వవిశ్వానికీ అతడే ఆధారం. ప్రాకృత రూపంలో ఉన్న మహావిష్ణువు. మహావిరాట్‌ స్వరూపుడు.

ఇతడి రోమకూపాలలో ఎన్ని విశ్వాలు ఉన్నాయో లెక్కపెట్టి చెప్పడం కృష్ణుడికికూడా సాధ్యం కాదు. అలాగే బ్రహ్మవిష్ణుశివాదుల సంఖ్యకూడా అనంతం. ప్రతి విశ్వంలోనూ వీరున్నారు. పాతాళం నుంచి బ్రహ్మలోకాంతంవరకూ దాన్ని బ్రహ్మాండం అంటారు. దానికి పైని ఉన్నది వైకుంఠం. అది బ్రహ్మాండానికి ఆవల ఉంది. దానికి పైని పంచాశత్కోటియోజనదూరంలో గోలోకం ఉంది. కృష్ణుడు ఎలా నిత్యసత్యస్వరూపుడో అలాగా ఈ గోలోకమూ నిత్యసత్యస్వరూపం.

ఇంక భూగోళం సప్తద్విప పరిమితం. సప్తసాగరపరివృతం. ఒకటి తక్కువగా యాభై ఉపద్వీపాలున్నాయి. పర్వతాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. ఈ భూగోళానికి పైని బ్రహ్మలోకంవరకూ ఎడు స్వర్గలోకాలున్నాయి. కింది భాగాన సప్తపాతాళాలున్నాయి. ఇదంతా కలిపి బ్రహ్మాండం. భూర్లోక భువర్గోక స్వర్లోక జనలోక తపోలోక సత్యలోకాలకుపైని తప్తకాంచన సన్నిభమై బ్రహ్మలోకం ఉంది. ఇదంతా కృత్రిమం. బాహ్యాభ్యంతర వినాశంతో సర్వమూ నశిస్తుంది. ఈ విశ్వసమూహం జలబుద్బుదం లాంటిది. అనిత్యం. మొత్తం అన్నిలోకాలలోకీ నిత్యమైనవి రెండే రెండు - గోలోకమూ వైకుంఠమూ. ఇవి రెండూ అకృత్రిమాలు.

రోమరూపాలనుంచి ఆవిర్భవించిన అసంఖ్యాక బ్రహ్మాండాలలో అసంఖ్యాక త్రిమూర్తులుంటారనీ అసంఖ్యాకంగా దేవతలుంటారనీ (ఒక్కొక్క బ్రహ్మాండంలోనూ ముక్కోటి చొప్పున) దిక్పాల. నక్షత గ్రహాదులుకూడా అసంఖ్యమనీ చెప్పాను గుర్తుందికదా ! ఆది అలా ఉండనీ. ఈ భూలోకంలో చతుర్వర్థాలవారూ అసంఖ్యాకంగా ఉన్నారు. ఆధోలోకాలలో నాగజాతివారుంటారు.

నారదా ! ఆకలిగొన్న ఆ శిశువు జలార్జవంలో ఎకాకిగా తేలుతూ ఆకాశంవైపు చూస్తున్నాడు. తాను తప్ప ఎక్కడా ఎమీ కనిపించడం లేదు. దిగులు పడ్డాడు. రోదించాడు. కొంతకాలానికి జ్ఞానోదయమయ్యింది. పరమ పురుషుడైన కృష్ణుణ్ణి ధ్యానించాడు. సనాతన బ్రహ్మజ్యోతి ప్రత్యక్రమయ్యింది, అది తొలకరిమబ్బులాగా నీలంగా ఉంది. పీతాంబరం ధరించి చిరునవ్వులు చిందిస్తోంది. ఒక చేతిలో మురళి. మరొకటి అభయహస్తం. ఆ తేజస్సును చూడటంతోనే బాలకుడు సంతృప్తి చెందాడు. ఆ పరమేశ్వరుడూ ఆనందించాడు. సమయోచితంగా ఒక వరం ప్రసాదించాడు.

వత్సా! జ్ఞానయుక్తుడవై నాతో సమానుడవవుతావు. ఆకలి దప్పికలు ఉండవు. ఈ అసంఖ్యాక బ్రహ్మాండాలు నీ నిలయాలు. లయపర్యంతం ఇది నీకు వరం. నిష్కాముడవూ నిర్భయుడవూ, అందరికీ వరదుడవు. జరా మృత్యు రోగ శోక పీడా వివర్జితుడవు - అని ఆశీర్వదించి ఆ శిశువు చెవిలో షడక్ష్తరమహామంత్రాన్ని ముమ్మూరు ఉపదేశించాడు. అది సర్వవిఘ్నహరమైన మహామంత్రం. ప్రణవాది. చతుర్థ్యంతమైన కృష్ణ శబ్దం. స్వాహాంతం. ఓం కృష్ణాయ (నమః) స్వాహా -

మంత్రాన్ని ఉపదేశించాక ఆ శిశువుకి ఆహారాన్ని కల్పించాడు పరమాత్మ ఆ విశేషమూ చెబుతాను తెలుసుకో. ఈ లోకంలో విష్ణుభక్తుడు నైవేద్యంగా సమర్పించినదాంట్లో పదహారవవంతు మాత్రమే వైకుంఠ నాథస్వామికి చెందుతుంది. తక్కిన పదిహేనువంతులూ విరాడ్రూపుడైన ఆ శిశువుకే చెందుతుంది ఆని కృష్ణపరమాత్మ నియమం చేశాడు. నిర్గుణుడూ పరిపూర్ణతముడూ కేవలం ఆత్మస్వరూపుడూ అయిన కృష్ణపరమాత్మకు నైవేద్యాలతో పనిలేదు. ఎవరు ఏ నైవేద్యాలు సమర్పించినా అటు లక్ష్మీనాథుడైవ వైకుంఠుడూ ఇటు విరాడ్రూపుడైన శిశువూ - ఇద్దరే ఆస్వాదిస్తారు.

ఇలా మంత్రం ఇచ్చి, వరం ఇచ్చి, ఆహారం ఏర్పరచి కృష్ణపరమాత్మ ఆ బాలకుణ్ణి ఇంకా ఏమైవా కావాలా, అడుగు - అన్నాడు. ఆప్పుడు ఆ డింభకుడు వినయంగా పలికాడు.

పరమాత్మా ! నీ పాదపద్మాలపట్ల నాకు నిశ్చలమైన భక్తిని ప్రసాదించు. నా జీవితం క్షణమో శాశ్వతమో, అంతవరకూ నీ భక్తుడుగావే నేనుండాలి. ఈ లోకంలో నీ భక్తుడు జీవన్ముక్తుడు. నీపట్ల భక్తిలేవి జీవచ్చవం.

కృష్ణభక్తి లేనివాడు తపస్సు చేసినా యజ్ఞాలు చేసినా పూజలు చేసినా వ్రతాలు చేసినా ఉపవాసాలు చేసినా తీర్థయాత్రలు చేసినా అంతా వ్యర్థం. అతడొక మూర్ఖుడు. అతడి జీవితం వ్యర్థం. అతడి ఆత్మ అతడిని నిందిస్తుంది. అతడి శరీరంలో ఆత్మ ఉన్నంతకాలం అతడు శక్తియుతుడుగా కన్పిస్తాడు. ఆత్మ వెళ్ళిపోయాక సర్వశక్తులూ నిష్క్రమిస్తాయి. అవ్వి సర్వతంత్ర స్వతంత్రాలు. కృష్ణపరమాత్మా! ఆ ఆత్మవు నువ్వే. సర్వాత్మవు. ప్రకృతికన్నా పరుడవు. స్వేచ్చామయుడవు. సర్వాద్యుడవు. బ్రహ్మజ్యోతివి. సనాతనుడవు.

బాలకుడి మాటలకు కృష్ణపరమాత్మ మురిసిపోయాడు. మధురంగా బదులు పలికాడు. బాలకా! నాలాగే నువ్వూ చిరకాలం సుస్థిరంగా ఉండు. ఎందరు బ్రహ్మలు నశించినా నీకుమాత్రం నాశనం లేదు. ప్రతిబహ్మాండంలోనూ నువ్వు అంశమాత్రుడుగా లఘువిరాడ్రూపంలో ఉండు. నీ నాభికమలంనుంచి విశ్వస్రష్ట అయిన బ్రహ్మ అవతరిస్తాడు. ఆ బ్రహ్మకు ఫాలభాగం నుంచి ఎకాదశ రుద్రులు ఆవిర్భవిస్తారు. వారంతా శివాంశలు. సృష్టిసంహారకారణులు. వారిలో ఒకడైన కాలాగ్నిరుద్రుడు విశ్వసంహారకారకుడు. విశ్వసంరక్షకుడుమాత్రం విష్ణువే. అతడూ రుద్రాంశమే. బాలకా! నాపట్ల నీకు భక్తి నిశ్చలంగా ఉండేట్టు వరమిస్తున్నాను. ధ్యానంలో నిత్యమూ నన్నూ నావక్షః స్థలనివాసినినీ చూడగలుగుతావు. వత్సా! నా లోకానికి నేను వెడుతున్నాను. ఇక నువ్వు ఉండు - అని కృష్ణపరమాత్మ అంతర్ధానం చెందాడు.

తన లోకానికి వెళ్ళీవెళ్ళడంతోనే బ్రహ్మనూ శంకరుణ్డీ పిలిచాడు. వత్సా! చతుర్ముఖా! సృష్టిని ఆరంభించు. శిశువు నాభికమలంనుంచి ఆవిర్భవించు. నాయనా! మహాదేవా! బ్రహ్మకు ఫాలభాగంనుంచి నువ్వు అవతరించు. చిరకాలం తపస్సు చెయ్యి - అని ఆజ్ఞాపించాడు. ఇద్దరూ కృష్ణపరమాత్మకు నమస్కరించి బయలుదేరారు.

బ్రహ్మాండగోళంలో మహాజలార్ణవంలో శిశురూపంలో ఉన్న విరాడంశమూర్తిని దర్శించారు. నీరదశ్యాముడు. యువ. పీతవాససుడు. జలతల్పం మీద శయనించి ఉన్నాడు. ప్రసన్నవదనుడు, చిరువవ్వులు చిందుతున్నాడు. అతడు విశ్వవ్యాపి - జనార్దనుడు. అతడి నాభికమలంనుంచి బ్రహ్మ అవతరించాడు. పద్మనాళంలోకి దిగాడు. సృష్టి లక్షణమేమిటో తెలుసుకుందామని అన్వేషించాడు. ఎంతదిగినా ఆ పద్మనాళానికి అంతం కనిపించలేదు. మళ్ళీ పద్మంలోకి వచ్చాడు. ఎమి చెయ్యాలి, ఎలా చెయ్యాలి ? చింతాపరవశుడయ్యాడు. కృష్ణపాదపద్మాలు ధ్యానించాడు. దివ్యచక్షువులకి - జలతల్పంమీద శయనించి ఉన్న బాలుడే కనిపించాడు. అతడి రోమకూపంలో బ్రహ్మాండం కనిపించింది. అటు పైని కృష్ణపరమాత్మ కనిపించాడు. గోలోకంలో గోపగోపీ సమన్వితుడై కనిపించాడు. అతడిని స్తుతించి వరం పొంది సృష్టి ఆరంభించాడు చతుర్ముఖుడు.

బ్రహ్మదేవుడికి సనకసనందనాదులు మానసపుత్రులుగా జన్మించారు. ఎకాదశరుద్ర కళలు ఫాలభాగంనుంచి ఆవిర్భవించాయి. వామభాగంనుంచి విష్ణువు రక్షకుడుగా అవతరించాడు. అతడు చతుర్భుజుడు. శ్వేతద్వీపంలో నివాసం ఎర్పరుచుకున్నాడు.

అటుపైని విరించి విశ్వాన్ని సృష్టించాడు. స్వర్గమూ మర్త్యలోకమూ పాతాళమూ చరాచరజగత్తునీ కల్పించాడు. ఇలా ప్రతిరోమకూపంలోనూ ఒక్కొక్క విశ్వాన్ని ఒకొక్క బ్రహ్మ సృష్టించాడు. ప్రతి విశ్వంలోనూ త్రిమూర్తులున్నారు.

నారదా ! ఇది కృష్ణపరమాత్ముని గుణకీర్తనం. ఇది శుభప్రదం. మోక్షప్రదం. ఇంకా ఏమి వినాలనుకుంటున్నావో అడుగు అన్నాడు నారాయణమహర్షి.

శౌనకాది మహామునులారా! నారదనారాయణ సంవాదం శ్రద్ధగా వింటున్నారుకదా! అని సూతుడు హెచ్చరించాడు. నారదుడు మళ్ళీ నారాయణమహర్షిని అడుగుతున్నాడు. వినండి 

సరస్వతీ పూజ


Lord Krishna - Forms of Shakthi - శ్రీకృష్ణుడు - శక్తిస్వరూపాలు

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - శ్రీకృష్ణుడు - శక్తిస్వరూపాలు

నారాయణమహర్షీ ! సంగ్రహంగా దేవీచరితాన్ని తలియజెప్పావు. కానీ విసృతంగా వినాలని నా కోరిక. సృష్టికి ఆదిలో ఉండే పరాప్రకృతి, సృష్టి విధానమప్పుడు ఏరూపంతో ఎలా ఆవిర్భవించింది? అయిదుగా ఎలా విభజన పొందింది ? త్రిగుణాలూ అంశకళలుగా ఎలా రూపుదాల్పాయి ? వీటన్నింటి గురించి జన్మకథనం పూజావిధానం స్తోత్రం కవచం ఇత్యాదులన్నీ మంగళప్రదంగా సమగ్రంగా నాకు వివరించి చెప్పు. నువ్వు వేదవేదాంగవేత్తవు. ఈ చరాచర సృష్టిలో నీకు తెలియనిదంటూ ఏమీ లేదు. దయచేసి అనుగ్రహించు.

నారదా ! ఆత్మ నిత్యం, ఆకాశం నిత్యం, కాలం నిత్యం, దిక్కులు నిత్యం. అలాగే ఈ విశ్వంలో గోలోకం నిత్యం, అందులో ఒక ప్రదేశమే వైకుంఠం. అలాగే ప్రకృతి - నిత్యం. అది బ్రహ్మలీల, సనాతనం, అగ్నికి వేడిమి, చంద్రుడికి వెన్నెల, పద్మానికి శోభ, సూర్యుడికి ప్రకాశం - ఎలా అవిభాజ్యాలూ అవిభక్తాలూ అభిన్నాలో అలాగే (పరమ) ఆత్మ - ప్రకృతి ఇవి రెండూ అభిన్నాలు.

బంగారం లేనిదే కంసాలి ఆభరణాలు చెయ్యలేడు. మట్టి లేనిదే కుమ్మరి కుండలు చెయ్యలేడు. అలాగే ప్రకృతి లేనిదే (పరమ) ఆత్మ ఈ జగత్తును సృష్టించలేడు. ప్రకృతి అంటే సర్వశక్తి స్వరూప. దాని కలయికవల్లనే (పరమ) ఆత్మ శక్తిమంతుడు అవుతున్నాడు. "శక్తి" పదంలో 'శ' అనేది ఐశ్వర్యానికీ (ఈశ్వరత్వం) 'క్తి' అనేది పరాక్రమానికీ (విస్తరణ) సంకేతాలు. ఆ రెండింటినీ ఇచ్చేదీ ఆ రెండింటి స్వరూపమూ కనకనే ప్రకృతి - శక్తి అయ్యింది.

జ్ఞానమూ సమృద్ధీ సంపత్తీ యశస్సూ - వీటికి "భగమ్‌" అనిపేరు. అవి కలిగినది కనుకా, వాటి స్వరూపముకనుకా శక్తికి భగవతి అనీ భగరూప అనీ పేర్లు ఏర్పడ్డాయి. దానితో కూడిన (పరమ) ఆత్మకు భగవంతుడని పేరు. ఆ స్వేచ్చామయుడైన భగవంతుడు సాకారుడూ నిరాకారుడూను. నిరాకారుడు తేజోరూపం. దానిని యోగీశ్వరులు ధ్యానిస్తూ ఉంటారు. పరబ్రహ్మమనీ పరమానందమనీ కీర్తిస్తుంటారు. ఆది అదృశ్యరూపం. కానీ సర్వద్రష్ట (తాను కనపడదు కానీ తాను అన్నింటినీ చూడగలదు). అది సర్వజ్ఞం, సర్వకారణం, సర్వదం, సర్వరూపం.

అయితే వైష్ణవులు దీనిని అంగీకరించరు. తేజస్వి లేనిదే తేజస్సు ఎక్కడ అని ప్రశ్నిస్తుంటారు. అందుచేత తేజోమండలమధ్యస్థుడైన బ్రహ్మతేజస్విని వారు పరమాత్మ అంటారు. అది స్వేచ్చామయం, సర్వరూపం, సర్వకారణకారణం, మనోహరమైన అత్యంతసుందరరూపం. ఆ తేజస్విది కిశోరవయస్సు, శాంతుడూ సర్వకాంతుడూ, పరాత్పరుడు, నీలనీరదశరీరుడు. శరత్కాలంలో మధ్యాహ్నవేళకు పూర్తిగా వికసించిన పద్మాల శోభను అపహరిస్తాయి అతడి కన్నులు. పేర్చిన ముత్యాలవంటి పలువరుస, శిరస్సుమీద నెమలిపింఛం. మాలతీపుష్ప మాలికలు, కొనదేలిన ముక్కు, నవ్వురాజిల్లెడు మోమువాడు, భక్తానుగ్రహకారణుడు, అగ్నిజ్వాలల  లాగా పరిశుభ్రమైన పీతాంబరం ధరించినవాడు. మురళీధారి. రత్నభూషణ భూషితుడు. సర్వాధారుడు. సర్వేశుడు, సర్వశక్తియుతుడు, విభువు, సర్వైశ్వర్యప్రదుడు, స్వతంత్రుడు. సర్వమంగళప్రదుడు, పరిపూర్ణతముడు, సిద్దుడు, సిద్ధేశుడు, సిద్ధికారకుడు. ఈ సనాతనుడైన దేవదేవుణ్ణి వైష్ణవులు ధ్యానిస్తుంటారు. ఉపాసిస్తారు.

నారదా ! జన్మ మృత్యు జరా వ్యాధి శోక భీతి హరుడైన పరాత్పరుడికి బ్రహ్మాయుష్షు ఒక నిమేషమాత్రమవుతుంది. ఆ పరబ్రహ్మనే కృష్ణుడు అంటారు. ఇందులో "కృష్‌" అనేది భక్తివాచకం. 'న' అనేది దాస్యవాచకం. భక్తి - దాస్య ప్రదాత కనక కృష్ణుడయ్యాడు. అలాగే కృష్‌ శబ్దం సర్వవాచకం. నకారం బీజవాచకం. స్రష్ట తానే. సృష్టిబీజమూ తానే. కనకనే కృష్ణుడు.

ఆ స్వేచ్చామయుడు తన ఇచ్చానుసారం రెండు రూపాలుగా అయ్యాడు. వామభాగం స్త్రీరూపంగా, దక్షిణభాగం పురుషరూపంగా. మహాకామి అయిన ఈ సనాతన పురుషుడు కామాధారయైన ఆ స్త్రీమూర్తిని చూశాడు. అప్పుడే వికసించిన పద్మంలాగా కమనీయంగా ఉంది. చంద్ర బింబంలాగా ఉంది. రంభోరు. నితంబ భారాంచిత. శ్రీఫలాలవంటి వక్షోజాలు. సన్నని నడుము. పుష్పమాలికాలంకృత, శాంతస్వరూప, స్మేరవదన, వక్రలోచన. అగ్నిజ్వాలలా పరిశుభ్రమైన చీర, రత్నభూషణ భూషిత. తన నయనచకోరాలతో శ్రీకృష్ణుడి ముఖమనే చంద్రబింబంలోని వెన్నెలల్ని తదేకదీక్షగా గ్రోలుతోంది. తన్మయం చెందుతోంది.

ఆ స్త్రీమూర్తి నెన్నొసట కస్తూరిబిందువు. దానికి కింద చందన బిందువు. వాటితో సమానంగా సిందూరబిందువు. వాలుకొప్పులో తురిమిన మాలతీ పుష్పమాలికలు.

కోటిచంద్రులు ఒక్కసారిగా ఉదయించినట్టుంది ఆ స్త్రీమూర్తి. తన నడకలతో రాజహంసలనూ గజరాజాలనూ పరిహసిస్తోంది. తన కాంతుడిపట్ల కాముకి.

ఆ సౌందర్యరాశిని చూసి రాసేశ్వరుడు రాసోల్లాసమైన రాసమండలంలో రసికుడై ఆమెతో రాసక్రీడను జరిపాడు. శృంగారం మూర్తీభవించినట్టు సుఖసంభోగం సాగించాడు. బ్రహ్మమాసంలో ఒకరోజుపాటు అది సాగింది. అప్పటికి ఆ జగత్పిత అలిసిపోయాడు. నిత్యానందదాయకమైన శుభక్షణంలో ఆ స్త్రీమూర్తి యోనిలో వీర్యాధానం చేశాడు. సురతాంతంలో అలిసిపోయిన ఆమె శరీరం నుంచి హరితేజస్సువల్ల స్వేదజలం వరదలు కట్టింది. నిట్టూర్పులు నిగిడాయి. ఆ గాలి తాకిడి! స్వేదజలాలు విశ్వగోళమంతటా (సముద్రాలుగా) వ్యాపించాయి. ఆ వాయువే జీవరాశికి ప్రాణాధార మయ్యింది. ఆ వాయువుకి ఒక రూపం ఎర్పడింది. అతడి వామభాగం నుంచి మరొక స్త్రీమూర్తి ఆవిర్భవించింది. అతడికి ప్రాణవల్లభ అయ్యింది. వారిద్దిరికీ అయిదుగురు పుత్రులు జన్మించారు. అవే పంచప్రాణవాయువులు. ప్రాణ - అపాన - సమాన - ఉదాన - వ్యాన వాయువులు.

ఆ స్వేదజలానికి అధిదేవతగా వరుణుడు ఆవిర్భవించాడు. అతడికీ వామభాగంమంచి స్త్రీమూర్తి అవతరించింది. వరుణవల్లభ - వరుణాని.

ఆ చిచ్చక్తి కృష్ణాదేవి కృష్ణగర్భాన్ని ధరించింది. శతమన్వంతరాలు బ్రహ్మతేజస్సుతో ప్రకాశించింది. ఆవిడ కృష్ణుడికి ప్రాణాధిదేవి. ప్రాణాధికప్రియ. నిరంతరకృష్ణసంగిని. ఎప్పుడూ కృష్ణుడి వక్షఃస్థలంమీదవే ఉండేది. శతమన్వంతరాలు గడిచాక కృష్ణాదేవి ఒక మగబిడ్డను ప్రసవించింది. ఆ శిశువు బంగారపు రంగులో ఉన్నాడు. అతడే విశ్వాధారాలయుడు.

ఆ బిడ్డను చూస్తూనే కృష్ణాదేవికి హృదయం భగభగలాడింది. బ్రహ్మాండగోళమంతటా నిండీ ఉన్న మహాజలంలోకి విసిరేసింది - కృష్ణుడు హాహాకారాలు చేశాడు. వెంటనే శపించాడు. ఓసి కోపవా!

ఓసి నిష్ఠురా! బిడ్డను నీళ్ళల్లోకి విసిరేశావా! ఈ పాపానికి ఫలం అనుభవించు. ఇంక నీకు బిడ్డలు పుట్టరు. ఇది నిశ్చయం. ఇంతేకాదు నీ అంశరూపాలుగా జన్మించిన అప్పరసలుకూడా నిత్యయౌవనలుగా ఉండిపోతారే తప్ప వారికీ కడుపుపండదు - అని కఠినంగా శపించాడు.

అదే క్షణంలో కృష్ణాదేవి జిహ్వాగ్రభాగంనుంచి హఠాత్తుగా ఒక కన్య ఆవిర్భవించింది. తెల్లని రంగులో మనోహరంగా ఉంది. తెల్లని వస్త్రాలు ధరించింది. విణాపుస్తకధారిణి. రత్నభూషణభూషాఢ్య, సర్వశాస్త్రాధిదేవత.

అటు పైని కొంతకాలానికి ఆవిడ రెండు రూపాలు ధరించింది. వామభాగం నుంచి లక్ష్మీదేవి, దక్షిణభాగం నుంచి రాధాదేవి ఆవిర్భవించారు. అదిచూసి పరాత్పరుడు కృష్ణుడు ద్విధారూపాలు ధరించాడు. వామభాగం నుంచి చతుర్భుజుడు, దక్షిణభాగం నుంచి ద్విభుజుడు అవతరించారు.

వాణిని ద్విభుజుడికి కామినిగా, రాధను ఆమెకు తోడుగా నియమించి వారిని అక్కడే ఉండమని ఆశీర్వదించి చతుర్భుజుడికి - నారాయణుడికి - లక్ష్మీదేవిని జతపరిచి కృష్ణుడు వారితో కలిసి వైకుంఠానికి వెళ్ళిపోయాడు.

అక్కడ వాణి, ఇక్కడ లక్ష్మి ఇద్దరికీ సంతానం కలగలేదు. అప్పుడు చతుర్భుజనారాయణుడి శరీరంనుంచి చతుర్భుజులైన పార్షదులు చాలామంది ఆవిర్భవించారు. అందరూ రూపంలో తేజన్సులో వయస్సులో నారాయణుడికి ముమ్మూర్తులా ప్రతిబింబాలు. ఆలాగే లక్ష్మీదేవి శరీరంనుంచి దాసీజనం కోటినంఖ్యలో అవతరించారు.

అక్కడ గోలోకంలో ఆ గోలోకనాధుడి రోమకూపాలనుంచి అసంఖ్యాకంగా గోపకులు ఆవిర్భవించారు. అందరూ ముమ్మూర్తులా ఆ ద్విభుజుడైన గోలోకనాధుడిలాగానే ఉన్నారు. ఆ పార్షదులందరూ అతడికి ప్రాణప్రియులయ్యారు. అలాగే రాధాదేవి శరీరంలో రోమకూపాలనుంచి గోపకన్యకలు ఆవిర్భవించారు. ఆందరూ రాధాదేవిలాగానే ఉన్నారు. అదే రూపం. ఆదే వయన్సు. అదే ఆభరణాదికం.

నారదా! అలనాటి కృష్ణశాపం కారణంగా వైకుంఠంలోగానీ గోలోకంలోగానీ ఏ వనితకూ కడుపు పండలేదు. అంతలోకీ కృష్ణప్రియ, విష్ణుమాయ, సనాతని ఆ దుర్గాదేవి హఠాత్తుగా ప్రత్యక్షమయ్యింది. ఆదిపరాశక్తి, నారాయణ ప్రియ, సర్వశక్తిస్వరూపిణి బుద్దికి అధిష్టానదేవత, దేవీస్వరూపాలకు అన్నింటికీ బీజరూప, మూలప్రకృతి ఈశ్వరి, పరిపూర్ణతమ, తేజస్స్వరూపిణి, త్రిగుణాత్మిక, తప్తకాంచనవర్డ, కోటిసూర్యసమప్రభ, ఈషత్‌ హాస్య ప్రసన్నవదన. సహస్రభుజసంయుత, త్రిలోచన, నానాశస్త్రాస్త్రధారిణి, రత్తభూషణభూషిత,అగ్నిజ్వాలలా విశుద్ధవస్త్రాలంకృత. సకల స్త్రీలూ ఆమె కళాంశాంశరూపాలు. ఆవిడ మాయకు సమస్తలోకాలూ సమ్మోహితమవుతాయి. సర్వైశ్వర్యప్రదాత్రి, కృష్ణభక్తిప్రద, వైష్ణువులకు వైష్ణవి, ముముక్షువులకు మోక్షప్రదాయిని, భోగులకు సుఖప్రదాయిని. స్వర్గంలో స్వర్గలక్ష్మిగా, గృహంలో గృహలక్ష్మిగా కీర్తింపబడుతుంది. తపస్వులకు తపస్యాస్వరూప. రాజులలో శ్రీరూప, అగ్నిలో దాహకశక్తి, భాస్కరుడిలో ప్రభారూప. చంద్రుడిలో శోభారూప, పద్మాలలో శోభనరూప, పరమాత్మయైన శ్రీ కృష్ణుడిలో సర్వశక్తిస్వరూప. ఆ పరమాత్మ ఆమెవల్లనే శక్తిమంతుడవుతున్నాడు. ఈ జగత్తు ఆమెవల్లనే శక్తిమంతమవుతోంది. ఆమెయే లేకపోతే జగత్తు మృతప్రాయమే. ఈ సంసార మహావృక్షానికి (సృష్టితరువు) ఆ సనాతని బీజరూప, స్థితిరూప, (ఋ)వృద్దిరూప, ఫలరూప.

ఆ క్షుత్పిపాసాదయారూపిణి ఆ నిద్రా తంద్రా క్షమామతి స్వరూపిణి, ఆ శాంతి లజ్జాతుష్టిపుష్టి భ్రాంతికాంత్యాదిరూపిణి, ఆదిపరాశక్తి సర్వేశ్వరుడైన కృష్ణపరమాత్మను స్తుతించి ఎట్టఎదుట నిలబడింది. రాధికేశ్వరుడు రత్నసింహాసనం సమర్పించాడు.

ఆదే సమయానికి నారాయణుడి నాభికమలంనుంచి వనితాసమేతుడై చతుర్ముఖుడు ఆవిర్భవించాడు. కమండలువు ధరించి ఉన్నాడు. మహాతపస్వి, మహాజ్ఞాని, బ్రహ్మతేజస్సుతో విరాజిల్లు తున్నాడు. నాలుగు ముఖాలతోనూ నారాయణుడిని స్తుతించాడు.

అంతలోకీ కృష్ణుడు ద్విధారూపుడయ్యాడు. వామార్థం నుంచి మహాదేవుడూ దక్షిణార్ధంనుంచి గోపికాపతి ఆవిర్భవించారు. మహాదేవుడు శుద్ధస్ఫటికంలాగా ఉన్నాడు. శతకోటి సూర్యప్రభాసమన్వితుడై వెలిగిపోతున్నాడు. త్రిశూలాన్నీ పట్టిశాన్నీ ధరించాడు. పులితోలును వస్త్రంగా కట్టుకున్నాడు. రాగితీగల్లాగా ఉన్న జుట్టు గుబురుగా జడలు కట్టింది. 

శరీరమంతటా భస్మం. స్మేరవదనారవిందుడు, చంద్రశేఖరుడు, త్రినేత్రుడు, దిగంబరుడు. నీలకంఠుడు, సర్పభూషణుడు, కుడిచేతిలో రత్నమాలిక. పంచవక్త్రుడై కృష్ణపరమాత్మను  స్తుతిస్తున్నాడు. సముచిత రత్ససింహాసనంమీద కూర్చున్నాడు.

విరాట్‌ స్వరూపుడు


Gangadi Pradhanansa Svarupinulu - గంగాది ప్రధానాంశస్వరూపిణులు

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - గంగాది ప్రధానాంశస్వరూపిణులు

లోకపావనియైన గంగ ప్రధానాంశస్వరూప. విష్ణుపాదోద్భవ. ద్రవరూపిణి. సనాతని. పాపాత్ముల పాపాలు అనే ఎండుకర్రలను కాల్చివేయడానికి అగ్నిలాంటిది. సుఖస్పర్శ. స్నానపానాలతో నిర్వాణపదవిని అందించే శక్తి కలది. గోలోకాన్ని చేరుకోవాలి అంటే గంగానది సుఖంగా సోపానస్వరూపిణి. సర్వనదీ నదతీర్థాలలోకీ ఉత్తమోత్తమైనది. పరమపావని. శివుడి జటాభారానికి కొసను వేలాడేట్టు అలంకరించిన ముత్యాలదండ. తపస్సులను శీఘ్రంగా సిద్ధింపజేసే పవిత్రురాలు. వెన్నెలలాగా పాలలాగా పద్మంలాగా స్వచ్చమైన నీళ్ళతో శుద్ధసత్త్వస్వరూపిణి. నిర్మల, నిరహంకార, సాధ్వి, నారాయణప్రియ.

మరొక ప్రధానాంశస్వరూపిణి - తులసి.
 విష్ణుకామిని, విష్ణభూషణరూప, విష్ణుపాదస్థలనివాసిని, తపస్సంకల్పపూజాదులను సిద్దింపజేసే శక్తి కలది. పత్రపుష్పాలలోకెల్లా ఉత్తమోత్తమైనది. దర్శన స్పర్శనల తో నిర్వాణపదవిని ప్రసాదిస్తుంది. కలియుగంలో కలుషాలను దహించే అగ్ని. సకలతీర్ణాలనూ పవిత్రీకరించే పరమపావని. ఆత్మశుద్ధికోసం తులసీ దర్శనస్పర్శనాలను సకలసృష్టి ఆకాంక్షిస్తూ ఉంటుంది. తులసి లేకపోతే సత్కర్మలుకూడా నిష్ఫలమవుతాయి. తులసి మోక్షప్రద. సర్వకామద. భారత భూమిలో అవతరించిన కల్పవృక్షం.

మరొక్క ప్రధానాంశస్వరూప - మనసాదేవి. కశ్యప ప్రజాపతి కూతురు. శంకరుడికి ప్రియశిష్యురాలు. జ్ఞానవిశారద. అనంతుడికి సోదరి. నాగపూజిత, నాగేశ్వరి. నాగమాత, సుందరి, నాగవాహిని, నాగేంద్రగణ సంయుక్త. నాగభూషణభూషిత, నాగేంద్రవందిత, నాగశాయిని, సిద్ధయోగిని, విష్ణురూప, విష్ణుభక్త, విష్ణుపూజాపరాయణ, తపఃస్వరూప, తపస్విని, తపఃఫలప్రదాయిని. మూడు లక్షల దివ్య సంవత్సరాలు తపస్సు చేసి హరిని మెప్పించి తపస్వినులలోకెల్లా అగ్రగణుర్యాలు అయ్యింది. సర్వమంత్రాధిదేవతయై బ్రహ్మతేజస్సుతో ప్రకాశిస్తూ బ్రహ్మస్వరూపగా బ్రహ్మభావనతత్పరగా విరాజిల్లుతోంది. కృష్ణాంశ సంభవుడైన జరత్కారుమునీశ్వరుడికి ఇల్లాలై ఆస్తీకుడికి జన్మనిచ్చింది. ఆస్తీకుడు మునిప్రవరుడయ్యాడు.

నారదా ! మరొక ప్రధానాంశసంభూత దేవసేన. మాతృకలలోకెల్లా పూజ్యురాలు. ప్రకృతిలో ఆరవకళ. అందుకని షష్టి అని కీర్తింపబడుతోంది. త్రిజగద్దాత్రి. పుత్రపౌత్రాదివృద్ధిప్రదాత్రి.

ఈవిడ వృద్ధరూపిణి, యోగిని, శిశుగణ సంరక్షక, పురిటింటిలో ఆరవరోజున ఇరవైయొకటవరోజున అర్చించాలి. అటుపైని ఏడాది దాటేవరకూ నెలనెలా పూజించాలి. శిశువుల క్షేమానికి ఇది అవసరం, ఈ దేవసేన దయారూపిణి. మునివందిత. స్థల జల అంతరిక్షాలలో శిశువులకు రక్షణకారిణి.

మరొక ప్రధానాంశస్వరూపిణి - మంగళచండిక. ఈవిడ ప్రకృతి ముఖంనుంచి ఆవిర్భవించింది సర్వమంగళప్రద. సృష్టివిధానంలో మంగళరూప. సంహారసమయంలో కోపస్వరూప. అందుకే పండితులు ఈమెను మంగళచండిక అన్నారు.

ప్రతి మంగళవారంనాడూ ఈ చండికను పూజించాలి. పుత్ర పౌత్ర ధన మంగళ ఐశ్వర్య యశఃప్రదాయిని అవుతుంది. ఈవిడను సంతృప్తిపరెచినవారికి - ప్రధానంగా స్రీలకు - సకలవాంఛలూ తీరుతాయి. ఈవిడకు కోపం వచ్చిందంటే క్షణంలో సకలసృష్టినీ నాశనం చేస్తుంది. అంతటి మహేశ్వరి ఈ మంగళ చండిక.

ఇంకొక ప్రధానాంశస్వరూప - కాళిక. కమలలోచన. ఆదిపరాశక్తికి (ప్రకృతికి) నుదుటినుంచి ఈవిడ అవతరించింది. శుంభనిశుంభులతో భీషణసంగ్రామం చేస్తున్న సమయంలో ఆవిర్భవించింది. తేజస్సులో గుణంలో శక్తిలో ఈ కాళిక ఆ దుర్గాదేవిలో అర్జాంశానికి సమానురాలు. ఈవిడ రూపం కోటిసూర్యసమంగా జాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అంశసంభవలైన శక్తి స్వరూపిణులందరిలోకీ ఈ కాళిక ప్రధానురాలు. అందరికన్నా బలవంతురాలు. సర్వసిద్ధిప్రద. యోగరూపిణి. కృష్ణభక్త, తేజోవిక్రమగుణాలలో కృష్ణతుల్య. కృష్ణభావనకారణంగా ఈవిడ కృష్ణవర్ణంలోనే ఉంటుంది. ఒక నిట్టూర్పుతో సర్వబ్రహ్మాండాలనూ సంహరించగలదు. మహారాక్షసులతో యుద్ధమంటే ఈ కాళికకు ఒక వినోదక్రీడ, ధర్మార్ధకామమోక్షప్రదాయిని. బ్రహ్మాదిదేవతలూ మునులూ ఋషులూ ఈవిడను నిరంతరం స్తుతులతో పూజలతో సంతృప్తిపరుస్తుంటారు.

ప్రకృతికి ఇంకొక ప్రధానాంశస్వరూప - వసుంధర. సకల ప్రాణికోటికీ ఆధారం. పాడిపంటలకు నిలయం. రత్నాకర - రత్నగర్భ - రత్నాకరాశ్రయ అని ప్రజలు ఈ వసుంధరను కీర్తిస్తారు. సర్యోపజీవ్య, సర్వసంపద్విధాయిని. ఈ వసుంధర లేకపోతే చరాచరజగత్తు నిరాధారమైపోతుంది.

నారదా ! ప్రధానాంశసంభవలైన ప్రకృతి కళారూపిణులను గురించి చెప్పాను. ఇంక ఎయే శక్తులు ఎవరెవరికి భార్యలో చెబుతాను. ఆదికూడా తెలుసుకో.

స్వాహాదేవి అగ్నికి ఇల్లాలు. ఆవిడలేకుండా దేవతలు సైతం హవిర్దానాన్ని స్వీకరించరు. దక్షిణాదేవి యజ్ఞపత్ని, స్వధాదేవి పితృదేవతాపత్ని, ఈవిడను పూజించకుండా చేసిన పితృదానాలు నిష్ఫలమవుతాయి. స్వస్తిదేవి వాయుపత్ని, ఆదానప్రదానాలను సఫలం చేస్తుంది. పుష్టిదేవి గణపతికి పత్ని. ఈవిడను అర్చించకపోతే స్త్రీ పురుషులు క్షీణించిపోతారు. తుష్టిదేవి అనంతపత్ని, సకలదేవతలూ సకలలోకాలూ సంతుష్టిచెందేది ఈవిడ అనుగ్రహంతోనే. సంపత్తిదేవి ఈనాశాపత్ని. ఈవిడ అనుగ్రహం లేకపోతే లోకాలన్నీ దారిద్య్రంతో అలమటిస్తాయి. దృతిదేవి కపిలాపత్ని. ఈవిడను అర్చించకపోతే ఆధైర్యంతో వొణికిపోవాల్సి వస్తుంది. సతీదేవి సత్యపత్ని. ముక్తులు ఈవిడను అర్చిస్తారు. ఈవిడ ఆగ్రహిస్తే లోకం బంధుత్వరహితమైపోతుంది. దయాదేవి మోహపత్ని. ప్రతిష్ఠాదేవి పుణ్యపత్ని. వీరి అనుగ్రహం లేకపోతే జగత్తు జీవస్మృతమైపోతుంది. కీర్తిదేవి సుకర్మపత్ని. ఈవిడ కటాక్షం లేకపోతే జగత్తు  యశోహీనమైపోతుంది. క్రియాదేవి ఉద్యోగపత్ని (ఉద్యోగం = ప్రయత్నం). ఈవిడ అనుగ్రహం లేకపోతే లోకాలన్నీ విధిహినాలైపోతాయి. మిథ్యాదేవి అధర్మపత్ని. ధూర్తులు ఈవిడను పూజిస్తారు. ఈవిడ అనుగ్రహిస్తే (ఆగ్రహిస్తే) విధి నిర్మితమైన సృష్టి అంతా విచ్చిన్నమవుతుంది. సత్యయుగంలో ఈవిడ కనిపించదు. త్రేతాయుగంలో సూక్ష్మరూపిణిగా ఉంటుంది. ద్వాపరంలో సగం శరీరంతో దాగి ఉంటుంది. కలియుగంలో మాత్రం మహాప్రగల్బురాలై బలవంతురాలై స్పష్టంగా సర్వత్ర వ్యాపించి ఉంటుంది. ఇంటింటా కపటరూపంతో సోదరులతో సమానంగా సంచరిస్తూ ఉంటుంది.

నారదా ! శాంతదేవి లజ్జాదేవు లిద్దరూ సుశీలపత్నులు. వీరు లేకపోతే జగత్తు ఉన్మత్తమైపోతుంది. బుద్ది మేధా ధృతిదేవులు ముగ్గురూ జ్ఞానపత్నులు. వీరి అనుగ్రహం లేకపోతే జగత్తు మూఢమవుతుంది. మూర్తిదేవి ధర్మపత్ని. కాంతిన్వరూప. మనోహర. ఈవిడలేకపోతే విశ్వాత్మకుడైన పరమాత్మ కూడా నిరాధారుడైపోతాడు. ఈవిడ శోభారూప. లక్ష్మీకళారూప. శ్రీరూప. మూర్తిరూప. మాన్య. ధన్య. ఇక నిద్రాదేవి కాలాగ్నిరుద్రపత్ని. రాత్రిపూట యోగశక్తితో లోకాలను ఈవిడ ఆశ్రయిస్తుంది.

కాలానికి రేయి పగలు సంధ్య అని ముగ్గురు భార్యలు. వీరు లేకపోతే బ్రహ్మదేవుడుకూడా కాలాన్ని లెక్కించలేడు. క్షుత్పిపాసలు లోభపత్నులు. వీరివల్లనే లోకం చింతాతురమవుతోంది. తేజస్సుకి ప్రభా - దాహికలిద్దరూ భార్యలు. కాలకన్యలైన మృత్యుజరాదేవులిద్దరూ ప్రజ్వరపత్నులు. వీరివల్లనే జగత్తు క్షీణిస్తోంది. నిద్రా తంద్రా ప్రీతిదేవులు ముగ్గురూ సుఖపత్నులు. సకలప్రాణికోటినీ అలసటనుంచి తేర్చి ఉత్తేజపరుస్తారు. శ్రద్ధాభక్తులు వైరాగ్యభార్యలు. వీరు కారణంగానే లోకం జీవన్ముక్తమవుతోంది.

దేవతాజననిగా అదితి, గోవులకు తల్లిగా సురభి (కామధేనువు), దైత్యజననిగా దితి, నాగమాతగ్గా కద్రువ, పక్షిజననిగా వినతాదేవి - ప్రకృతికి కళాంశసంభవలుగా సృష్టివిధానంలో ఉపయోగపడి కీర్తింపబడ్డారు.

ఇంకా ఇటువంటి కళాంశాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని చెబుతాను, తెలుసుకో. చంద్రపత్నిగా రోహిణీదేవి, సూర్యపత్నిగా సంజ్ఞాదేవి, మనుపత్నిగా శతరూపాదేవి, ఇంద్రపత్నిగా శచీదేవి, బృహస్పతి భార్యగా తారాదేవి, వసిష్ఠుడి ఇల్లాలుగా అరుంధతీదేవి, గౌతమస్త్రీగా అహల్యాదేవి, అత్రి భార్యగా అనసూయాదేవి, కర్దమ జననిగా దక్షపత్నిగా దేవహూతీదేవి. ఇంకా ఇలాగే మాససి - మేనక - వింధ్యావళి (బలిభార్య) - లోపాముద్ర - కుంతి - కుబేరకామిని - వరుణాని - దమయంతి - యశోద - దేవకి - గాంధారి - ద్రౌపది - శైబ్య - సత్త్వవతి - వృషభానుప్రియ - రాధామాత - మందోదరి - కౌసల్య - సుభద్ర - కౌరవి - రేవతి - సత్యభామ - కాళింది - లక్ష్మణ - జాంబవతి - నాగ్నజితి - మిత్రవింద - రుక్మిణి - సీత - యోజనగంధ (వ్యాసమాత) - బాణపుత్రి - (ఉషాదేవి) - చిత్రలేఖ (ఉషాదేవికి సఖి)- ప్రభావతి - భానుమతి (దుర్యోధన పత్ని) - మాయావతి - రేణుక (భృగుజనని) - రోహిణి - ఏకనంద (కృష్ణసోదరి) - వీరంతా ఆదిపరాశక్తి దుర్గకు అంశసంభవలే. ఇంకా లోకంలో ఉన్న గ్రామదేవతలంతా కళాంశాంశ సంభూతలే. లోకాలకు ప్రియం కలిగించే తల్లులే.

నారదా ! లోకంలో స్త్రీలంతా అమ్మవారికి అంశావతారాలే కనక స్త్రీలను అవమానిస్తే ప్రకృతివి పరాభవించినట్టే. వారిని అర్చించిన వనితలు పతిపుత్రవతులై సుఖసంతోషాలు పొందుతారు. వస్త్రాలంకారచందనాదులతో కుమారీపూజ చేసినా (ఎనిమిదేళ్ళలోపు ఆడపిల్ల) ముత్తైదువులను అర్చించినా ఆది ప్రకృతిమాతకు చేసిన ఆరాధనగా మంగళప్రదమవుతుంది.

నారదా ! ఈ ప్రకృతి కళాంశసంభూతలైన స్త్రీమూర్తులలో ఉత్తమ - మధ్యమ - ఆథమ భేదాలున్నాయి. సత్త్వగుణ ప్రధానలై సౌశీల్యంగల పతివ్రతలు ఉత్తమ శ్రేణికి చెందుతారు. రజోగుణప్రధానలై సుఖసంభోగవివశలై స్వకార్యతత్పరలైన స్త్రీలు మధ్యమశ్రేణి. తమోగుణ ప్రధానలై అజ్ఞాతకుల సంభవలై దుర్ముఖలై కలహప్రియలై ధూర్తలై స్వతంత్రలై కులగౌరవ వినాశకలైనవారు అథమశ్రేణికి చెందుతారు. భూలోకంలో వేశ్యలూ స్వర్గోకంలో అప్పరనలూ ఈ కోవలోకి వస్తారు

వీరిలో దుర్గాదేవిని ప్రప్రథమంగా సురథుడు ఆర్చించాడు. అటు పైని రావణవధ సమయంలో రాముడు ఉపాసించాడు. ఈ దుర్గ దక్షుడికి కూతురుగా జన్మించి దానవ సంహారం చేసింది. శివనింద వినలేక, తండ్రి ఇంటిలో జరిగిన అవమానాన్ని తాళలేక దేహం చాలించింది. హిమవంతుడికి పార్వతిగా జన్మించింది. తపస్సు చేసి శివుణ్ణి భర్తగా పొందింది. కృష్ణస్వరూపుడైన వినాయకుడికీ, విష్ణుకళాసంభవుడైన కుమారస్వామికి జన్మనిచ్చింది. 

మరొక కాలంలో సావిత్రీ రూపిణిగా అశ్వపతిపూజలూ లక్ష్మీస్వరూపిణిగా మంగళభూపాలుడి పూజలూ మున్ముందుగా అందుకొంది. ఆపైని సర్వదేవతలూ సకలమునీశ్వరులూ అర్చించారు. అలాగే సరస్వతీరూపంగా బ్రహ్మదేవుడి సేవలు అందుకొంది. దేవదైత్యమానవజాతులతో సేవింపబడింది. అటుపైని ఆదిపరాశక్తి రాధాదేవిగా గోలోకంలో రాసమండల పూజలు గైకొంది. కార్తికపూర్ణిమనాడు శ్రీకృష్ణుడు గోగోపీగోపక బృందంతో ప్రథమార్చన చేశాడు. ఆపైని నారాయణుడి ఆజ్ఞమేరకు బ్రహ్మాదిదేవతలు ధూపదీపనైవేద్యాది, సకలోపచారాలూ చేశారు. భూలోకంలో సుయజ్ఞుడు అర్చించాడు. పుణ్యక్షేత్రమైన భారతదేశంలో గ్రామగ్రామానా నగరనగరానా శంకరుడి ఆజ్ఞ ప్రకారం పరాశక్తి పూజలు నేటికీ సాగుతున్నాయి. నారదా ! ఇదీ దేవీకలారూపాల మహిమ. ఇంకా ఏమి తెలుసుకోవాలనుకుంటున్నావో అడుగు. నాకు తెలిసినమటుకు చెబుతాను - అన్నాడు నారాయణమహర్షి

శ్రీకృష్ణుడు - శక్తిస్వరూపాలు


Saraswati Puja - సరస్వతీ పూజ

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము -  సరస్వతీ పూజ నారాయణమహర్షీ ! నా జన్మ ధన్యమయ్యింది. వినవలసింది అంతా విన్నాను. ఒక్క సందేహం మాత్రం ఉండిపోయింది. ప...