Saturday, April 11, 2026

Chapter 37 Shiva and Brahma worshipping Sridevi - అధ్యాయము 37 శ్రీదేవిని శివబ్రహ్మలు ప్రస్తుతించుట

శ్రీ దేవీ భాగవతం తృతీయస్కంధము - అధ్యాయము 37

శ్రీదేవిని శివబ్రహ్మలు ప్రస్తుతించుట

బ్రహ్మ యిట్లనియె: అని యీ ప్రకారముగ దేవదేవుడగు విష్ణువు జగదంబను సంస్తుతించి విరమించిన పిమ్మట శర్వుడగు శంకరుడా తల్లి మ్రోల చేతుల జోడించి యిట్లు నుతించెను: 

శంకరుడు యిట్లనియె:సకలలోకవిధాన నిపుణవగు ఓ శివా! బ్రహ్మయు విష్ణువును నీ సత్ప్రభావము వలననే జన్మించి సగుణరూపుడ నైతిని. విశ్వజననీ! నీవే భూమి నీరు అగ్ని వాయువు ఆకాశము జ్ఞానేంద్రియములు కర్మేంద్రియంబులు మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అన్నియును నీవే. తల్లీ! తెలియనివారు బ్రహ్మవిష్ణుమహేశులే యీ జగములనెల్ల రచించిరందురు. కాని, యది సరిగాదు. నిజముగ నీ ముమ్మూర్తులను పుట్టించినది నీవే కదా తల్లీ! నీ దయామృతశక్తివలననే వారీ జగములను నిర్మింపజాలుదురు. ఈ చరాచర జగములెల్ల పంచతన్మాత్రలు త్రిగుణములు నింగి గాలి యగ్ని నీరు నేల అను పంచభూతములతో మాత్రమే సృజింపబడుచున్నవందుమా? అది సరిగాదు. మరేమన - వానిలో నీ చైతన్యజ్యోతి లేనిచో వానికి జీవన తత్త్వము గలుగ నేరదు. హరిహర బ్రహ్మలు నీ దయచేతనే యీ చరాచర జగములు నిర్మించిరి. అందు నీవు బహు నామరూపములలో నీ నచ్చిన వేషము దాల్చి భూతములతో స్వేచ్ఛగ రమింతువు. విరమింతువు. లోకైక జననీ! హరిహరబ్రహ్మ లీ లోకాలను సృష్ట చేయదలచి నీ పదపద్మము లందలి ప్రేమ మధు కణములు గ్రోలుదురు. పిదప వారీ సర్వమును చిత్రవిచిత్రగతుల నిర్మింపజాలుదురు. తల్లీ! నీవు నిత్యసత్యస్వరూపపు దయామృతలహరివి! మఱి హరిని సత్వగుణునిగ బ్రహ్మను రజోగుణయుతునిగ నన్ను తమోగుణిగ నిట్లు భిన్నరూపులనుగ నేల సృజించితివి? అమ్మా! నీ బుద్ధి విషమముగ నున్నదని తలతుము. కానిచో నీ జగములను రాజు మంత్రి సేవకులు ధని దరిద్రుడు నను వై విధ్యముతో నేల సృజింతువు! నీ సత్వరజస్తమోగుణములచే హరి విధి శివులు సృజింపబడిరి. వారు పాలన సృష్టి సంహారము లొనరింతురు. ఈ ముజ్జగములకు వారు కారణభూతులు. హరిహరబ్రహ్మలమగు మేము నీ దివ్యవిమానమున బయనించునపుడు మార్గమధ్యమున మే మనంతపుణ్యలోకములు గంటిమి. అవి నిత్యసవ్యములుగ నున్నవి. వాని నెవ్వరు నిర్మించిరో మాకు దయతో తెలియబలుకుము. నీవు నీ యమృతకళలతో నెల్ల భువనములను బుట్టించి పెంచి త్రుంపదలతువు. నీవాత్మ పతితో పూర్ణసంయోగ మంది నిత్యానంద మనుభవింతువు. మాకు మాత్రము నీ దివ్యమార్గము లెట్టివో బోధపడుట లేదు.

మే మాడుదనమున నున్నవారము. మాకు నీ చరణ కమల ములందలి భక్తి ప్రసాదమిమ్ము. పురుషుడైనను నీ పదాంబుజంబులు నిక్కము భజింపని వాడు నిత్యసుఖములకు నోచుకొనడు. ఈ జగములందు నా మనస్సు నీ పదపద్మ సేవకు తప్ప మరెచ్చటికిని బోదు. నేను పురుషత్వమందినను త్రిభువనాధిపత్య మందినను నీ పదకమలములు పాసి యుండుటుకు నా మనసొప్పుటలేదు. నీ పాదపద్మముల సన్నిధినుండగ నా కెట్టి కొఱతయులేదు. నీ పదపద్మములు నా కన్నుల కెల్లవేళల గనబడుచున్న నదే పదివేలు-నేను పురుషత్వమును గోరుకొనను. యువతిగ నున్న నేను నీ చరణకమలము లాశ్రయించినచో నాకీ ముల్లోకములందు శాశ్వతయశము చేకురును! భవబంధములు తెగును! ఈ భూమిపై నీ పదసన్నిధి సౌభాగ్యమును గాలదన్ని నిష్కంటకమైన రాజ్యము గోరుకొను వాడెవ్వడు? ఒకవేళ నెవడేని నీ పదాంబుజములను తూలనాడినచో వాడు యుగములవఱకు జన్మ పరంపర లెత్తవలసిన వాడే యగును. ఏ మునులు నీ పదకమల మందలి భక్తి వదలి నిర్మలతప మొనరింతురో వారుగూడ విధివంచితు లగుదురు. ఏలన-వారు త్రిగుణమయులు. నీ సదమలభక్తిలేమిచే వారు ముక్తికి దూరులగుదురు. ముక్తిలక్ష్మి తపమునగాని దమమునగాని సమాధిచేగాని యాగాదులవలనగాని సాధ్యముగాదు. నీ పదజలములం దాత్యంతిక భక్తి యున్నప్పుడే మోక్షము కరతలామలక మగును.

ఓ సర్వ మంత్రాత్మికా! నా యెదలో నీ దయామృతరేణువు కొంత చిందింపదలచినచో నుత్తమము పావనము నగు నీ నవార్ణ మంత్ర రాజము నాకు ప్రసాదింపుము. నేను దానిని నిత్యము జపింతును. ఆత్మ చింతన సుఖమున నిత్యమోలలాడుదును. భవతారిణీ! జననీ! పూర్వజన్మమున నేను నవాక్షర మంత్ర మెఱింగితిని. కాని, యిపుడు నాకది స్ఫురించుట లేదు కనుక, నీభవార్ణవము దాటుటకు ఆ నవార్ణ మంత్ర ముపదేశింపుము. 

ఈ ప్రకారముగ మహాతేజస్కుడగు శివుడు పలుకగనే కరుణామయిదేవి శివునకు నావాక్షర మంత్రము స్పష్టమున నుపదేశించెను. శివుడు దేవివలన నవాక్షర మంత్రము స్వీకరించి యమితానందభరితుడై దేవీ పాదపద్మములకు వినయాంజలులు ఘటించి యచ్చోగూరుచుండెను. ఆ మంత్రము కామమోక్షప్రదము. దానిని బీజాక్షరములతో దీకగ చక్కగ శివుడు జపించుచు వెలుగొందుచుండెను. అట్లు లోకశంకరుడగు శంకరుడు మంత్రప్రభావమున శోభిల్లుటగని నేనును మహామాయా సన్నిధికేగి యామెతో నిట్లంటివి! 

బ్రహ్మ యిట్లనియె : ఓ జనయిత్రి! లోకధాత్రి! వేదములుగూడ నిన్ను గుఱించి సమగ్రముగ నభివర్ణింపనోపవు. ఓ యజ్ఞరూపిణి! నీవు యాగము లందు వేల్చునపుడు స్వాహానామమున పిలువబడుదువు. ఈ త్రిభువనములందు నీ వొక్కతెవే సర్వజ్ఞురాలవు! ఈ వింతలు గొల్పు ముల్లోకములకు నేను కర్తను. ఈ చరాచర జగములందు నాకంటె నితరుడెవ్వడును సమర్థుడు లేడు. నేనే కడు ధన్యుడను. సర్వశ్రేష్ఠుడనని గర్వాతిరేకమున దలచుచు నీ సంసార జలధిలో మునుకలు వేయుచున్నాను. ఓ ముక్తిప్రదాయినీ! భయనివారిణీ! ఈశ్వరీ! నేడు నీ సుప్రసాదమున నీ పదపద్మ సన్నిధి జేరిన నే నెంతయో ధన్యుడనని గర్వపడుచున్నాను. నాలోని మోహము గడియదీసి వెలుగుబాట జూపించుము అని నిను సవినయముగ వేడుకొనుచున్నాను. కావున నోమాతా! నీ చరణకమల ప్రభావమున నా మదినిండ శాంతికాంతులు నిండినవి. ఓ శివంకరి! ఇంక నీ యాన జవదాటను. నీ కింకరుడను. మోహ జలధిలో మునిగిన నన్ను గాపాడుము! నీ మహనీయ పవిత్ర చరిత్ర నెఱుంగని మూర్ఖులు నన్ను ప్రభువని తలంతురు. యాజకులు స్వర్గముగోరి యాగములు చేతురు.

ఆదిదేవీ! నాలుగు వర్ణములుగల ప్రజలను బుట్టింపుమని నీవు నన్ను జ్యేష్ఠునిగ బ్రహ్మగ నేర్పరచితివి. కాని, నా కంటె నితరుడెవ్వడు గలడను నహంకారముతో కన్ను మిన్ను గానకున్నాను. నా యపరాధము క్షమించుము! అష్టవిధయోగమార్గములలో శ్రమించి సమాధినిష్ఠులైనవారు సైతము నీ నామ మహిమ నెఱుగలేరు. కాని నీ దివ్యనామము కపటముగ బల్కినను సరే, అది ముక్తికి సోపానమగును. సాంఖ్యులు నీ దివ్యనామము పరిత్యజించి మూఢులై వర్తిల్లుదురు. అట్టి వారిని భవవారిధి నుండి దాటించి యుమృతత్వ మొసగుతల్లివి నీవే. ఆద్యులగు హరి హరులను గొల్చినను నీ పరమతత్వ మెఱింగినవారు నీ నామ మహిమ నెఱుంగగలరు. వారు నిన్ను మహాశక్తీ శివా ఈశ్వరీ అంబికా యని నీ దివ్యనామమును నిమిషమైన వదలక జపించుచుందురు. విశ్వజననీ! నీ కటాక్ష వీక్షణము మాత్రనే నీ వీ నలు తెఱుంగుల నున్న జగములను నిర్మింపజాలుదువు. ఐనను నన్ను సృజించి నాచేత సృష్టి విదింపజేయుట చూడగ నిదంతయు నీ వినోదలీలగ భాసించుచున్నది. శ్రీహరి విశ్వపాలకుడు. అతడు జలధి మధ్యమున నుండగ మధుకైటభ దానవుల బారినుండి యాహరిని బ్రోచిన తల్లివి నీవే. ఆ శివుడును నీ చేత హరింపబడి మరల ప్రళయాంతమున నీ కనుబొమల నడుమనుండి యుద్భవించును. ఓ విశ్వమాత! నీ పావన జన్మమునకు మూలమేదో మేమింతవఱకు కనివిని యెఱుగము. ఓ భవాని! నీ వొక్కతెవే యాద్య శక్తివి. సర్వతంత్ర స్వతంత్రవని మేము నిన్ను సంబోధింతుము. నీ శక్తి తోడున్ననే హరి విశ్వరక్షణమును రుద్రుడు సంహారమును నేను సృష్టిని చేయగల్గుచున్నాము. నీ చైతన్య శక్తి తోడులేనిచో నెంతటివాడైన నేమియు జేయజాలడు. హరి శివుడు నేనువలెత్రిమూర్తులు మరెవ్వరేనిగలరా? పూర్వముండిరా? ఇదంతయు సత్తు, అసత్తను వితర్కమును మూఢమతులే యొనరింతురు.

నీ యీ విచిత్రలీలా వినోదముల నాద్యదేవుడు నిర్గుణుడు నిర్వికల్పుడు నిరుపాధికుడు విశ్వేశ్వరుడునగు విశ్వుడే యవలోకింపగలడని విధిజ్ఞులు పలుకుచుందురు. చరాచర భేదములుగల యీ రేడు లోకములందు నీ కంటె నన్యుడెవ్వడును లేడు. వేదవాక్కెప్పుడును రిత్తగ బలుకదు. అదియ ద్వైతమునే వక్కాణించును. కాని నేడు నా యెదలో ద్వైతము భాసించుచున్నది. ద్వైతము వేద విరుద్ధము. దీనిని గూర్చి నాకు సంశయము గల్గుచున్నది. ఒకటియే. రెండవ వస్తువు లేదు అని వేదము లుద్ఘోషించును. నీవట్టి బ్రహ్మవా? లేక ఆదిశక్తివా? నా యీ సందియ ముడుపుము. నాది క్షుద్రబుద్ధి. నీ వాస్తవికత నెఱుంగ లేక నా మది కొట్టుమిట్టాడుచున్నది. నా యీ తీరని సంశయము సంప్రాప్తించినది. తల్లీ! నీవు నిజముగ పురుషుడవా? యువతివా?! నా కింతకు నిజము పలుకుము. పరాశక్తివగు నీ దయకు పాత్రుడనై నేనీ మహా మాయాసాగరమునుండి విముక్తుడనగుదును.

అధ్యాయము 38 శ్రీదేవి త్రిమూర్తులతో సృష్టి క్రమమును తెల్పుట

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

పంచాంగం

Chapter 36 Lord Vishnu praising Sridevi - అధ్యాయము 36 శ్రీదేవిని శ్రీవిష్ణువు సంస్తుతించుట

శ్రీ దేవీ భాగవతం తృతీయస్కంధము - అధ్యాయము 36

శ్రీదేవిని శ్రీవిష్ణువు సంస్తుతించుట

బ్రహ్మ యిట్లనియె: ఆ జనార్దనుడు మరల నీ విధముగ నుద్బోధించెను. 'మన మెల్లరమిపు డీ దేవి సన్నిధి కరిగి యా తల్లి పదపద్మముమీద పదేపదే మన తలలుంచుదము. ఈ మహామాయ మన కోరిన కోరిక లెల్ల తీర్చగలదు. మన మీ దేవి సమక్షమునకేగి నిశ్చింతగ నామెను సన్నుతించుదము. ఒకవేళ ద్వారపాలురు మనల నడ్డగించినచో మన మచటనే నిలుచుండి తదేకచిత్తముతో శ్రీమహాదేవీ స్తోత్రము పఠించుదము.' ఈ ప్రకారముగ విష్ణువు పలికినమీదట మేమందఱము హర్షము వెలిపుచ్చి ఆ జగదంబ సన్నిధానమున కేగదలంచితిమి. మేము విమానము దిగి శంకించుచునే దేవిద్వారము చెంత కేగితిమి. 

మేము ద్వారము ముందునకు జేరగనే దేవి మమ్ము చూచి చిరునగవు నగి మమ్ము స్త్రీ రూపిణులుగ మార్చెను. మేమంతట సురూపములతో చెలగు చక్కని పడుచుకన్నెలమైతిమి. మా రూపములు చూచుకొని మాలో మే మాశ్చర్య మందుచు శ్రీదేవి సమక్షమున కేగి ఆ యతిలోకసుందరాంగి పదకమలముల మ్రోల స్త్రీరూపములతోనే మేము నిలుచుంటిమి. ఆ దేవి మమ్ము ప్రేమపూర్ణమైన చూపులతో గాంచెను. స్త్రీ రూపిణులమగు మే మా మహాదేవికి భక్తిప్రపత్తులతో వినయాంజలు లర్పించి ఒకరి మొగము లొకరము చూచుకొంటిమి. ఆ శ్రీదేవి పాదపీఠము నానా మణిగణ విభూషితము సూర్యకోటి ప్రతీకాశమునై కాంతులు విరజిమ్ముచుండెను. మే మా మణిపీఠమును నేత్రపర్వముగ దర్శించుచు కైమోడ్చి నిలుచుంటిమి.

ఆ దేవి సన్నిధానమునందు దేవి చెలికత్తియలు వేనకువేలు గలరు. వారిలో గొందఱు రక్తాంబరములు కొందరు పీతాంబరములు దాల్చిరి. ఆ జ్యోతిర్మయులగు దేవతలెల్లరు విచిత్ర వస్త్రభూషణములు దాల్చి శోభలు వెలార్చుచు ఆ శ్రీమాతను జేరి సంసేవించుచుండిరి. కొందఱు నర్తించుచుండిరి. ఇంక కొందఱు దేవి నుపాసించుచుండిరి. ఇతరుల హృదయములు పులకరింప మధురముగ వీణలు మీటిరి. వేణువులూదిరి. 

ఓ దేవర్షీ! ఇంతయేల? అచట మేముగన్న మహాద్భుతము వక్కాణింతును వినుము. ఆ విశ్వజనని పదకమలములందలి నఖములనెడి చరణములలో చరాచరమైన బ్రహ్మాండములు విష్ణువు రుద్రుడు నేను రవి వహ్ని యముడు వాయువు వరుణుడు కుబేరుడు ఇంద్రుడు మున్నగు దిక్పతులు పర్వతాలు సాగరాలు నదులు అప్సరసలు విశ్వావసువు చిత్రకేతువు శ్వేతుడు చిత్రాంగదుడు నారద తుంబురులు అశ్వినులు వసువులు సిద్ధులు సాధ్యులు పితరులు శేషాదినాగులు కిన్నరులు రాక్షసులు బ్రహ్మలోకము వైకుంఠము పర్వతోత్తమమైన కైలాసము సమస్తము ప్రతిబింబించుచుండెను. నేను నా జన్మకారణమగు మహా పద్మమును ఆ పద్మమందున్న బ్రహ్మను శేషశాయి యగు శ్రీహరిని మధుకైటభులను గంటిని. ఇట్లా జగదంబ పదకమలముల కొనగోళ్ల వెల్గులందు సర్వవిశ్వముగని యెంతకు నంతుపట్టనివింతతో నే నాశ్చర్యమందితిని. శివవిష్ణువులును విస్మయ భరితులైరి. మేమంత నాదేవిని విశ్వమాతగ నొక్కుమ్మడిగ నంగీకరించితిమి. ఆ ప్రకారముగ నా యమృత కాంతులీను ద్వీపమందు మేము స్వేచ్ఛగ విహరించితిమి. ఆ దేవి మహనీయత గనుటలో మాకు నూరేండ్లు నిండెను. అచట మేలిమి సొమ్ములతో జిగజిగమని మెఱయుచు ప్రమోదమందుచున్న దేవాంగనలు మమ్ము తమ చెలికత్తియలుగ చూచుకొనిరి. మేమును వారి యందచందములకు లీలావిలాస వినోదములకు విభ్రాంతులమై సంతసిల్లి లోలోన వారి దివ్యభావములు దలపోయుచుంటిమి.

అప్పుడొకసారి స్త్రీ రూపమందున్న శ్రీ విష్ణువా శ్రీ త్రిభువనేశ్వరీదేవిని గూర్చి యిట్లు మహాద్భుతముగ స్తోత్రము చేయదొడగెను: 

శ్రీదేవికి ప్రకృతి విధాత్రి అమృతత్వ రూప కల్యాణి కామద వృద్ధి-సిద్ధి-శ్రీ సచ్చిదానంద స్వరూపిణి సంసారారణి పంచకృత్య విధాత్రి త్రిభువనేశి అగు దేవికి నమస్సులు. సర్వాధిష్ఠాన స్వరూప కూటస్థ అర్ధమాత్రార్థ రూప హృల్లేఖ అగు దేవికి వినయాంజలులు సమర్పింతును. జనయిత్రీ! ఈ విశ్వబ్రహ్మాండములు నీయందుండి యుద్భవించి నీవలన నెలవైయుండి మరల నీయందే లయమగునని నే నెఱింగితిని. ఇవి అన్నియు చేయు విధాత ప్రభావము నీ శక్తికే కలదనియు సకల లోకమయి వనియు నెరింగితిని. ఆకాశ వాయువులు నీ సద్రూపములు అమూర్తములు. అగ్ని జల భూములు నీ యసద్రూపములు మూర్తములు. వీనినన్నిటిని నీవు జీవరూపుడైన పురుషునకు తగిన సమయమున జూపింతువు. నీవు మా సంతోషమునకు పదారు సాంఖ్యతత్త్వములను నేడు మహదాదులను కల్పింతువు. ఇదంతయు నీ యింద్రజాలమని మాకు భాసించుచున్నది. నీ యనుగ్రహశక్తి లేనిచో నెంత వస్తువైనను చలింపదు. నీ చైతన్య శక్తియే యెల్ల పదార్థములందు నిండి నిబిడీకృతమై యున్నది. నీ శక్తిలేనిచో పురుషుడుగూడ శక్తిరహితుడే యగునని ధీమంతులు వచింతురు. నీవేనీ చైతన్య ప్రభావమున విశ్వమంతటిని ప్రకాశ శక్తితో నింపుదువు. నీ విశ్వాత్మ తేజముతో సమస్తమును వెల్లడి చేయుదువు. కల్పాంతమందీ విశ్వము నంతమొందింతువు. ఇట్టి నీ యద్భుత చరిత్ర వైభవమెవ్వడెఱుగగలడు? జననీ ! భవానీ ! అలనాడు మధుకైటభుల బారినుండి మమ్ము బ్రోచితిని. మాకు దయతో నీ విశాల దివ్యలోకములు జూపితివి. మమ్ము దివ్యానంద ధామములకు జేర్చితివి. నీ దివ్యదర్శనము మహా ప్రభావసంపన్నమైనది. తల్లీ! బ్రహ్మయు శివుడును నేనును నీ దుర్విభావ్యమైన పవిత్రచరిత్రము తెలిసికొనలేకున్నాము. ఇంక సామాన్యుడేమి తెలిసికొనగలడు? నీ విశ్వరచనా కళా కలాపమునందెన్నెన్ని భువనాలు రవణిల్లుచున్నవో చెప్పగలవాడెవ్వడు?

మే మీ భువనమునందు ప్రసిద్ధ ప్రభావములుగల హరిహరబ్రహ్మలను గంటిమి. ఈ త్రిమూర్తు లితర లోకాలలో గూడ నుందురా యేమి? మనోవాక్కుల కందని నీ విచిత్ర ప్రతిభా ప్రభావ సంపదలు మా కేనాటికి నంతుజిక్కుటలేదు. ఈ మా దీనులదొకే యొక విన్నపము అవధరింపుము. ఆనందనిలయమగు నీ దివ్యమంగళ విగ్రహము మా హృదయ పీఠములందు నిచ్చలు నివాళులందుకొననిమ్ము. నీ హ్రీంకారతారక నామామృతము తనివితీర మా నాల్కలపై నిత్యము ప్రవహింపనిమ్ము. నన్ను నీ దాసునిగ భావించుము. నిన్ను నా స్వామినిగ నేలికగ నెమ్మదిలో నిత్యము దలంతును. ఇట్టి తల్లికొడుకుల ప్రేమలు తెగకుండనిమ్ము. మమ్ము నీ కన్నబిడ్డలవోలె గాపాడుము. జగన్మాతా! ఈ యెల్లభువనముల రహస్యము నీకే తెలియును. నీవు సర్వజ్ఞవు. సర్వము నీయందే పరిసమాప్తమగును. నేను వట్టి పామరుడను. నీకు చెప్పగలవాడను గాను. నీవు మాకేది యుక్తమని తోచునో దానినే యొనరింపుము. బ్రహ్మ యీ లోకాలను పుట్టించును, విష్ణువు బ్రోచును, రుద్రుడు సంహరించునను నానుడి జగములందు ప్రసిద్ధమై యున్నది. ఇదంతయు నిజమేనా? ఏది యేమైన మేము మాత్రము నీ దివ్యశక్తితో యుక్తులమై నీ యిష్టప్రకారము వ్యవహరించువారము. పార్వతీ! ఈ సమస్తమును భూమి మోయుటలేదు. నీ ఆధారశక్తియే సర్వభారమును మోయుచున్నది. ఆ సూర్యుడుగూడ నీ స్వయంప్రకాశము గ్రహించియే జగములు వెలిగించుచున్నాడు. ఇటులెల్లవేళల నెల్లెడల నీవే నిర్మల రూపమున ప్రతిభాసించుచున్నావు.

ఓ జననీ! బ్రహ్మ శివుడు నేను నీ సత్ప్రభావమువలన నీ దయవలన జన్మించితిమి. మే మనిత్యులము. ఇక శతక్రతువగు నింద్రాదులు నిత్యు లెట్లగుదురు? నీవే సత్యవు; నిత్యవు; పురాణ ప్రకృతివి. శాశ్వతవు. నీవే పురాణపురుషుని కనికరింతువను సంగతి యిన్నాళ్లు నీ సామీప్యమున నండుటవలన గ్రహింపగలిగితిని. తెలియని ప్రతివాడును నన్నే విభుడని యాద్యుడని యీశుడని నిరీహుడని విశ్వాత్ముడని తలచి యహంకారమయమైన తమఃప్రకృతి గలవాడగును. పండితుల యందలి విద్య శక్తిమంతులయందలి శక్తి మనుజలోకమందలి కీర్తి-కాంతి-తుష్టి నీవే. ముక్తిప్రదవు కమలవు విశ్రాంతి ప్రదాయినివి నీవే. వేదమాతయగు గాయత్త్రి అర్ధమాత్ర స్వాహా స్వధా భగవతియగు సగుణనీవే. దేవతలు మొదలగు జీవుల బ్రతుకుదెరువునకు నీవే వాదాలు నిర్మించితివి. ఎల్లజీవులు నీ యనుగ్రహమునకు పాత్రులై తరించుటకే నీ వీ ప్రపంచములను లీలగ సృజింతువు. అనాదినిధనుడు అనఘుడు పరిపూర్ణుడునైన పరమాత్మయొక్క యంగమే యీ జీవాత్మ. ఈ సకలమును తుదకు నీవే యంతమొందింతువని నీ మహామహిమ నెఱింగిన జీవుడు శాంతుడగును. చమత్కారమయమైన నాటకమందొక నటుడాడి యాడి తుదకు విశ్రమించును. ఈ జీవులందఱు నటులే చివరకు నీ చెంతనే విశ్రమింతురు. ఈ కాలము సుఖదుఃఖములతో దాగుడుమూత లాడును. ఈ దుఃఖదాయకమైన కాలమునుండి మోహసాగరమునుండి మమ్ము వెన్నంటి గాపాడుము. తల్లీ! మేము నీ శ్రీచరణములకు శరణార్థులము. మహావిద్యా! శివస్వరూపా! సర్వార్థప్రదాయినీ! దేవాధిదేవీ! నీ పదకమలములమీద మా తలలుంతుము. మమ్మీ మోహసాగర మీద నిమ్ము. నీ విజ్ఞానమను వెలుగుబాట చూపుము. మము బ్రోచు భారము నీదే!

అధ్యాయము 37 శ్రీదేవిని శివబ్రహ్మలు ప్రస్తుతించుట

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

పంచాంగం

SRI DEVI BHAGAVATHAM PART 3 - శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము







Chapter 35 Trimurthulu Trimurthula is awe-inspiring - అధ్యాయము 35 త్రిమూర్తులు త్రిమూర్తులను గని విస్మయమందుట

శ్రీ దేవీ భాగవతం తృతీయస్కంధము - అధ్యాయము 35

త్రిమూర్తులు త్రిమూర్తులను గని విస్మయమందుట

బ్రహ్మ యిట్లనియె: ఆ దివ్యవిమానము మనోవేగమున మరొక చోటి కేగినది. మా కచట నీరు కనిపింపలేదు. అందులకు మే మాశ్చర్యము జెందితిమి. ఆ ప్రదేశమందంతట పర్వతములు మధుర ఫలభరితములై కోకిలల కుహూకుహు రాగములుగల వృక్షము శోభలతో నొనరు వనోపవనములు-స్త్రీ పురుషులు పశుసంపదలు పసిడిపంటలు నదీనదములు సెలయేళ్లు వాపీకూప తటాకములు నీటి చిలుపలు యాగశాలలు ఎత్తైన ప్రాకారములు పలు సుందరభవనాలు గల్గి కలకలలాడు నగరములు నిండి కన్నులపసండువుగ నుండును. మే మా దివ్యనగరమునుంగాంచి యిది స్వర్గసీమ గాబోలు! ఇంత మహాద్భుతముగ దీని నెవరు నిర్మించిరో కదా? ఆహా! ఏమి వింత! అనుకొని పరమాశ్చర్య మందితిమి. అంతలో నచ్చట వేటాడుచు విహరించుచు ఇంద్రుని బోలు ఆ నగరపు రాజును విమానముపై తేజరిల్లు జగదంబికయు కనబడిరి. ఆ విమాన మొక్క మూర్తమాత్రమున వేగమున మరొక మనోహరప్రదేశమున కరిగెను.

అచట మేము నందనవనమును నందులో చల్లని పారిజాతపు నీడ చలువలో సుఖించు కామదేనువును గాంచితిమి. దానికి సమీపమందు నాల్గుదంతములుగల మహాగజము గలదు. అచ్చట మేనక మున్నగు నచ్చరలు రాగ తాళ మధుర బావములతో నాట్యమాడుచుండిరి. గంధర్వ విద్యాధరులు నందన వన వాటికలో గుమిగూడి గానములతో ఆనందపరవశులై యుండిరి. ఇంద్రాణీ సహితముగ నింద్రుడు మాకు గనబడెను. రవి యమ వరుణ కుబేరులు నచట నుండిరి. మే మచట నటు లాసురలనుగాంచి విస్మయమందితిమి. అంతలో ఆ నగరపు రాజు దేవరాజువలె అక్షోభ్యుడగు నరవాహనముగల పల్లకిలో నెక్కి బయలువెడలెను. మా విమాన మటులు మాతోకూడ మహావేగమున మరల ముందుకు సాగి సర్వదేవ నమస్కృతమగు బ్రహ్మలోకమును జేరెను. అచట కమలాసనుడగు బ్రహ్మనుగని శివకేశవులు చోద్యమందిరి. ఆ బ్రహ్మసభలో వేదములు సాంగములుగ రూపుదాల్చి వెలుగొందుచుండెను. అచ్చో దివ్యసాగరమును నదీపర్వతములును మాకు నయనానందము గల్గించినవి. అంత శివకేశవు లీ క్రొత్త బ్రహ్మ యెవరని నన్నడిగిరి. నేను రెండవ సృష్టికర్త నెరుంగనంటిని. ఇతడెవరో! నేనెవరనో! ఇదంతయు నాకే మాత్రము దోచుటలేదు' అని నేనను నంతలో మా విమానము మనోవేగముగ ముందునకు సాగెను.

అట్లు మా విమానము సాగిసాగి కైలాసగిరి జేరెను. అచట యక్షగణములు జేరి శివుని భక్తిమీర గొల్చుచుండిరి. కీరకోకిలములు మధుర గానముల నలరొందు మందారవనములును నట గలవు. పరమశివుడు వీణామురజ వాద్యములనుండి వెడలు చల్లని మధురరాగములను చెవులపండువుగ వినుచుండెను. ఆ శివుడు మా విమానమునుగని కైలాసమును వదలి పెట్టెను. ఆ రీతిగ నెలతాలుపు పంచాననుడు దశభుజుడు ముక్కంటి వృషవాహనుడునగు శంభుభగవానుడు కైలాసము నుండి బయటికి వెడలెను. ఆ సాంబసదాశివుడు మొలయందు పులితోలును పైని నేనుగు తోలుత్తరీయమును దాల్చియుండెను. ఆ పురాణదంపతుల కిరుప్రక్కల మహావీరులగు గణపతి కుమారు లుండిరి. అట్లు నంది మున్నగు గణశ్రేష్ఠములు తన కూర్మి తనయులు తన్ను గొలువ శివుడు బయలుదేరెను. ఆ శివగణములు శివుని వెంటజేరి హరహర మహాదేవశంభో యని నినాదములు సేయుచుండెను. ఆ యభినవ శంకరుని గాంచి మేము విస్తుపోతిమి. ఆ శివుడు మాతృకలను గూడియుండెను. పిదప మా విమాన రాజము క్షణములో గాలివాలున ముందుకు దూసికొని పోయినది. శ్రీరమారమణుని మందిరమైన వైకుంఠధామము జేరినది. అచట మేమెన్నడును కనివిని యెరుగని పెక్కులు దివ్యవిభూతులు కనులార గాంచితిమి. మే మా రమణీయమైన పురముగాంచి విస్మయానందము లందితిమి. మా విమానము మఱికొంతముందున కేగెను. అచట రాజీవనయనుడు పీతాంబరుడు అగిసె పూశోభనలరువాడు చతుర్భుజుడు గరుడవాహనుడు దివ్యభూషణభూషితుడు చామరములు చేతదాల్చి చల్లగ మెల్లగ వీచుచున్న రమాకాంతతోగూడి రాజిల్లువాడునగు హరిని మేము మా భాగ్యముకొలది సందర్శించితిమి. ఆ సనాతనుని వైకుంఠునిగనిన మా యాశ్చర్యమునకు మేర లేకుండెను.

అపుడు మా యాసనములందు కూర్చుండి మే మొకరి మొగా లొకరము వింతగ జూచుకొంటిమి. అంతలో నొక పెనుగాలి వాలున మా విమానము మఱికొంత ముందునకు సాగెను. అంతలో మేము పలువిధముల జలచరములతో నువ్వెత్తుగ లేచు కెరటములతో డెంద ముప్పొంగజేయు నమృతసాగరము చూచితిమి. దాని నడుమ మందార పారిజాతాది తరువులు చిత్రవిచిత్ర వస్తువులు పెక్కాసనములు-మేలుజాతి ముత్తియముల హారాలు అశోకవకుళకురవక తరువులు - నలుగడల ఘుమఘుమలాడుచు కనులపండువు సేయుచున్న మొగలి సంపెంగ మున్నగు పూలచెట్లు కోయిలల కుహూకుహూరావ మధిరిమలు-గండుతుమ్మెదల ఝంకారములు గల్గి తనరారు నొక్కదీవి గలదు. ఆ దీవియందు శివాకారమున చెలువొందు మంచ మొకటి సుమనోహరముగ నున్నది. అది నవరత్నకాంతులతో పొదుగబడెను. మేము దూరమందుండియే దాని శోభ కన్నులనిండ తిలకించితిమి. దానిపై నాసనములు పెక్కులు గలవు. ఆ పర్యంక మింద్రచాపము భాతిగ చిత్రశోభలతో నలరుచుండెను. అందొక పరమలావణ్యవతి యగు దివ్యాంగన సుఖాసీనయై యొప్పారుచుండెను. ఆ జగదేకసుందరి రక్తమాల్యాంబరధర రక్తగంధానులేపన కోట్ల మెరుపుకాంతులతో మిరుమిట్లు గొల్పుచుండెను. ఎఱ్ఱజీఱల కనుదమ్మలు గలది, కోట్ల పసిండిచాయల మిసిమివన్నె గలది, రవి బింబములను వెన్నుదన్నుకాంతి గలది. చారు వదన రక్తదంత విరాజిత-లావణ్యసీమ. పాశాంకుశములదాల్చి వరదాభయ ముద్రలతో వాత్సల్యము గురియు తల్లి, చిరుతనవ్వు వెన్నెలలు కనుగొలంకుల ముని పెదవుల చిందులాడునది, అపూర్వసుందరి ఐన శ్రీత్రిభువనేశ్వరీదేవి విరాజిల్లుచుండెను.

ఆ నవ¸యవన దివ్యాంగన తన నవ్వు రాజిల్లెడు మోమునుండి దయామృతము గురియుచుండెను. ఆ దేవిచుట్టును జేరి హ్రీంకార జపనిష్ఠలో మేనులు మరచిన పక్షిబృందములు దేవిని జపించుచుండెను. ఎల్ల రసరాజము లామె సింగారములో చోటు చేసికొన్నవి. ఆమె చిగురునవ్వుల మోహనకాంతుల ముఖకమలముతో బలు తమ్మి మొగ్గలను త్రోసిరాజను గబ్బివట్రువ గుబ్బలతో నొప్పుచుండెను. పెక్కు మేలైన జాతిమణుల సొమ్ములతో బంగారపు కేయూరాంగద కిరీటములతో ధగధగలాడుచుండెను. ఆమె ముఖకమలము శ్రీచక్రము విధముగ నున్న తాటంకవిటంకములతో చెన్నొందుచుండెను. 'జయహో! హృల్లేఖ! శ్రీభువనేశి' యని దేవి చెలియలు ఆమెను స్తుతించుచు దేవీజప పరాయణులై యుండిరి. ఆ దేవి భువనేశ్వరి మహేశ్వరి హృల్లేఖ మొదలుగాగల దేవకన్యలతో కొలువు తీర్చియుండెను. ఆ కొలువులో ననంగ కుసుమాది దేవతలును గలరు. ఇట్లా దేవి షట్కోణమధ్యమున నలరు యంత్రరాజమున నలరుచుండెను. మేమా దేవిని దర్శించి, ఈమె యెవరో? ఈమె శుభనామ మెద్దియో తెలియుట లేదేయని పరమ విస్మయమందితిమి. ఈమె వేయికనుల దయామృతలహరి - వేయికేలుదమ్ముల వరదాయిని - వేయివదనాల సుప్రసాదచంద్రిక యని దూరమందుండియే మాకామె దోచుచుండెను. ఈమె యచ్చరగాని గంధర్వకన్యగాని దేవాంగనకాని కాదు. కాని, ఈ పరదైవ మెవ్వరై యుండునోయని తెలిసికొననేరక మేము సంశయములో కొట్టుమిట్టాడుచుంటిమి.

అంతలో విష్ణుభగవానుడు రవిజ్ఞాన శక్తితో నాచారుహాసినిని జగదంబగ మదినెఱింగి యిట్టనియెను: ఈ భగవతి దేవియే మన కందఱకు తరణభూతురాలు. మహావిద్య; మహామాయ; పరిపూర్ణ; మూలప్రకృతి; అవ్యయ. ఈమె కొంచెపు బుద్ధులవారికి మదికెక్కనిది. యోగగమ్య. పరమాత్ముని యిచ్ఛాశక్తి. నిత్యానిత్యస్వరూపిణి. ఈమె శివస్వరూపిణి; భాగ్యహీనులచేత గొలువబడనిది. విశ్వేశ్వరి వేదగర్భ విశాలాక్షి సర్వాది పరమేశ్వరి సనాతని. ఈ మహాశక్తి ప్రళయకాలము నందు సకల విశ్వమును బరిమార్చి యెల్లజీవుల వాసనలను దనలో విలీన మొనరించుకొని క్రీడించుచుండును. సురలారా! సర్వబీజస్వరూపిణి యీమెయే. ఈమె దివ్య సన్నిధానములో ననంత విభూతులు రూపొంది సొంపు పెంపొందుచున్నవి. చూడుడు, ఓ శివబ్రహ్మలారా! చూడుడు. ఇచ్చటివారెల్లరు మేనుల దివ్యచందనములలందుకొని మేలిమిబంగరు సొమ్ములు దాలిచి ప్రేమభక్తులు వెల్లివిరియగ నీ జగన్మాతకు పరిచర్యలు సలుపుచున్నవారు. నేడు మన మిచ్చోట జగద్ధితయగు శ్రీభగవతిని సందర్శించి ధన్యజీవులము కృతకృత్యులము మహాసౌభాగ్యవంతులము నైతిమి. మనము పూనికతో నేనాడే పుణ్యము చేసికొంటిమో యే తప మాచరించితిమో దాని ఫలితముగ మన కీనాడు శ్రీమాతృదేవి దివ్యదర్శనము లభించినది. త్యాగధనులు పుణ్యభాగులు తపస్సంపన్నులు దానరతులునైన మహాత్ములే యీ భవ్యాత్మ నవలోకింపగలరు. కాని, రాగులు మూఢులు ప్రమత్తులు నా శివాభగవతి నేనాటికిని గాంచనేరరు.

ఈమెయే ప్రకృతులకన్నిటికిని మూలప్రకృతి. ఈ ప్రకృతి జనని పురుషసంగతిజేసి పరమేశ్వర ప్రీతికొఱకీ బ్రహ్మాండములను సృజించి వెల్లడించుచుండును. దేవతలారా! ఈ కనబడు బ్రహ్మాండ మంతయును దృశ్యము. ఈ మాయాదేవియే ద్రష్ట్రి. ఈమెయే విశ్వయోని సర్వేశ్వరి సర్వమాయ పరమశివాత్మిక. ఈ విశ్వమాత యెక్కడ? మన మెక్కడ? లక్ష్మి మొదలుగాగల దేవకాంతల యంద మీమె యందములోని లక్షాంశమునకు సరిపోలవు. ఆనాడు మహాసాగరమునందు మనకు దర్శన మొసంగిన జ్యోతిఃస్వరూప మీ విశ్వజననియే. ఆ మహాదేవియే మనలను బాలురనుజేసి యాడించుచు వినోదించుచున్నది. మున్ను నేను వటపత్త్రపు పానుపుపై పరుండి నా పదారవిందమును కరారవిందముతో ముఖారవిందమున నుంచుకొని ఆ వ్రేలిరసము జుబ్బట్లాడగ జీకుచు కోమలాంగుడనై పెక్కులు బాలక్రీడలు సాగించితిని. అట్టి నాలో నీ జగన్మాతయే చేరి నన్నాడించుచు లాలిజోలలు పాడుచునుండెనని నే డీ మేనుగాంచినతోడనే నా మదికి నిశ్చయజ్ఞానము స్ఫురించెను. నా పలుకులు విశ్వసింపుడు. మనల గన్నతల్లి యీమెయే. నేను పూర్వ మనుభవించిన జ్ఞాన మిపుడు తిరిగి గుర్తునకు వచ్చినది.

అధ్యాయము 36 శ్రీదేవిని శ్రీవిష్ణువు సంస్తుతించుట

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

పంచాంగం

Chapterr 34 The glory of Sri Tribhuvaneshwari Devi - అధ్యాయము 34 శ్రీ త్రిభువనేశ్వరీదేవీ ప్రాభవము

శ్రీ దేవీ భాగవతం తృతీయస్కంధము - అధ్యాయము 34

శ్రీ త్రిభువనేశ్వరీదేవీ ప్రాభవము

వ్యాసభట్టారకు డిట్లనియె : కురుసత్తమా! నీవు నన్నడిగిన ప్రశ్నమునే నేను తొల్లి నారదమహర్షి నడిగితిని. అతడు నాకిట్లు సమాధానము చెప్పెను: 

"వ్యాసమునీ! నీ కేమని తెల్పుదును? ఒకప్పుడు నా మదిలో నేనుగూడ నీకు గల్గిన తీరని బాధనే పడితిని. అంతట నేనును మహాతేజస్వియు నా తండ్రియు నగు బ్రహ్మకడకేగి అతనిని నీ వడిగినటులే ఇట్లు ప్రశ్నించితిని - విభూ! ఈ బ్రహ్మాండమంతయు నెవరి మహాశక్తివలన సముత్పన్నమైనది? ఇదంతయు నీవే సృజించితివా? కాక విష్ణువు నిర్మించెనా? కానిచో రుద్రుడు కల్పించెనా? నా కారాధనీయుడగు సర్వశ్రేష్ఠ ప్రభువెవరు? నిక్కముగ వచియింపుము. నేను దుఃఖపూరితమైన యీ యసత్యసంసారమున మునిగిపోవుచున్నాను. కనుక నా యీ సందేహము తీర్చి యంతయు నున్న దున్నట్లు యాథార్థ్యము దెలుపుము. ఈ సందియము నా చిత్తమందు గూడుకట్టుకొని యున్నది. దీనివలన నా యెడదకు శాంతి లభించుటలేదు. ఏ దేవతలమీదకు - తీర్థములమీదకుగాని యితర సాధనములపైకిగాని నా మనస్సు పోవుటలేదు. నే నీ పరమతత్త్వ మెఱుగనంతవఱకు నా మదికి శాంతి చేకూరదు. నా మది పలుతావులలో చిక్కుకొని దేనియందును నిలుకడ చెందుటలేదు. నా కా సర్వేశ్వరు డెవరో తెలియుటలేదు. కనుక నే నెవరినని స్మరింతును - స్తుతింతును - యజింతును - అర్చింతును - శరణందుదును? సత్యవతీసుతా! నేనిట్టి కఠినమైన ప్రశ్న వేయగా లోకపితామహుడగు బ్రహ్మ నాకిట్లు ప్రతివచన మొసంగెను"

"వత్సా! నీ కెట్లు దెల్పుదును? నీ వడిగిన ప్రశ్నము కడు దుస్తరమైనది. ఆ విష్ణువు సైతము దీని కిదమిత్థమని సమాధాన మీయజాలడు. విరాగి నిష్కామి విమత్సరుడు స్వాత్మవంతుడునైనవాడే కాని ఈ జగములందు రాగి కామియైన వాడెవ్వడును దీని సమాధాన మెరుగజాలడు. పూర్వ మీ స్థావరజంగమాత్మకమైన సృష్టియంతయు నశించి జలమయమయ్యెను. అంత పంచభూతములు తన్మాత్రలు గల్గినవి. నేనొక కమలమునుండి యుద్భవించితిని. అపుడు నాకు సూర్యుడు కాని చంద్రుడు కాని యొక చెట్టుగాని గుట్టకాని యేమియు కనిపించలేదు. ఆ తమ్మిదుద్దులో నుండి నే నీ రీతిగ నాలోచనలో మునిగితిని, ఈ మహాసాగరజలమందు నే నెవరివలన జన్మించితిని. నాకు కర్త భర్త యుగాంతమందలి సంహర్త యెవరు? ఈ విశాల జలరాశి కాధారమైన భూమియు గనిపించుట లేదు. ఈ మహాపద్మ మెట్లు పుట్టినదో తెలియుటలేదు. నే నిపుడీ కమలము మూలముగందును. అక్కడ ఈ యంతులేని నీటికి మూలమైన భూమి నిస్సందేహముగ గోచరించును. అట్లు తలచి నేను పద్మమునుండి లోనికి దిగి యంతుదెలియని నీటిలోపల వేయేండ్లు వెదకితిని. కాని, నేను భూమిపొడ గాంచలేదు. అంతలో గగనసీమనుండి తప-తపయను నశరీరవాణి నా చెవుల బడెను. అపుడు నేను పద్మమందొక వేయేండ్లు తప మాచరించితిని. పిమ్మట సృష్టి సల్పుమని శబ్దము నా చెవుల బడెను. అది విని నేను మూఢుడనై, యెవని సృష్టింతును? ఏమి చేతునని యాలోచనలలో పడితిని. అపుడు మధుకైటభులను ఘోర రాక్షసులు నాకు కనిపించిరి. వారు నాతో బోరుటకు వచ్చిరని తెలిసికొని నేను భయపడితిని. నేనపుడా కమలనాళము ద్వారమున నీటిలో నడిమికి వచ్చితిని. అచ్చట నొక పరమాద్భుతశక్తిగల దివ్యపురుషుడు నాకు గనిపించెను.

ఆ పురుషోత్తముడు నిర్మల నీలమేఘశ్యామలుడు - సుందరకోమలాంగుడు - పీతాంబరుడు - వనవనమాలికాలంకృతుడు - జగన్నాథుడు. శ్రీ శంఖము-చక్రము-గద-పద్మములతో శోభిల్లు చతుర్భుజుడు. పాపఱని పాన్పున పవ్వళించిన స్వామి. ఇట్టి శ్రీవిష్ణువు నాకు దర్శనభాగ్య మొసంగెను. ఆ మహాత్భుడు యోగనిద్రలో నిశ్చలముగ పరుండియుండెను. అట్లు శేషతల్పముపై శయనించిన యచ్యుతుని నేను కనులకరవుదీర గాంచితిని. నారదా! నే నిపుడేమి చేయవలయునా యను చింత నా కపుడు గల్గినది. నే నపుడు నిద్రా దేవతను స్మరించితిని. అంత నా శివస్వరూప యగు దేవి విష్ణుని శరీరము వదలి లేచి యంతరిక్షమున కెగసెను. ఆ దేవి విశ్వభూషణ కాంతులతో మేని కాంతులు గలియుటచే దివ్యసుందరియై యొప్పారినది. అట్లు నిద్రాదేవి హరి తనువునుండి నింగిపై వెలుగొందినంతనే జనార్దనుడు నిద్దుర చాలించి మేలుకొనెను. అపు డాపరమాత్ముడు మధుకైటభులతో నైదువేలేండ్లు పోరెను. తుదకా యిర్వురు రక్కసులు హరి చేతిలో తుదముట్టిరి. ఆ హరియొక్క విపులమైన తొడలపై వారీల్గిరి. పిమ్మట మే మిరువుర మున్నతావునకు శివు డేగుదెంచెను. అంతలో నా సుమనోహారిణి దివ్యదేవి మా మువ్వురకు తన దివ్యదర్శనభాగ్య మొసంగినది. ఆమెను మేము సంస్తుతింప దొడగితిమి. అందుల కా పరమశక్తి మా యెడల సుప్రసన్నయైనది. ఆ దేవి తన ద్వికటాక్షవీక్షణములతో మమ్ము తరింపజేయుచు నిట్లు పలికెను: 'ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా! మీరు మీ మీ కార్యములు నెరవేర్చుడు. ఇంక మీరు మీ మీ నివాసము లేర్పరచుకొని నిశ్చింతగ చతురతతతో సృష్టి స్థితి సంహారము లొనరింపుడు. మీరు మీ మీ దివ్యవిభూతులతో నేర్పుమీర ప్రజలను నాల్గువిధములుగ సృజింపుడు, అను దేవియొక్క చల్లని సుకము గల్గించు నమృతము లొలుకు పలుకులు వింటిమి.

మేమా దేవి కిట్లంటిమి: 'ఓ తల్లీ! మే మశక్తులము. ప్రజాసృష్టి యెట్లొనర్పగలము? ఇదంతయును నీటిమయమే గదా! నేల కంటికే కనబడుటలేదు. ఇచట మాకు భూతములు తన్మాత్రలు నింద్రియగుణము లేవియు గనబడుటలేదు.' ఈ మా మాటలు విని యాదేవి చల్లని నవ్వులు చిందుమొగముతో తేజరిల్లెను. అంతలో నాకాశమునుండి యొక దివ్య విమానము మా ముందునకు వచ్చెను. అపుడు 'త్రిమూర్తులారా! మీరు నిర్భయముగ దీనిలోని కెక్కుడు. మీ కత్యద్భుతమైన దృశ్యము జూపింతును.' అని దేవి మాతో బలికెను. మే మా దేవి వాక్కులు విని యొప్పుకొని కింకిణీ ఝళంఝళలతో రవళించుచు ముత్యాలహారాలతో నలరుచు దేవేంద్రభవనమువలెనున్న విమాన మెక్కి కూర్చుంటిమి. జితేంద్రియులమగు మేము సుఖాసీనులమగుటగాంచి దేవి స్వశక్తితో విమానము నాకాశవీథిలో నడిపింపసాగెను.

అధ్యాయము 35 త్రిమూర్తులు త్రిమూర్తులను గని విస్మయమందుట

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

పంచాంగం

Chapter 33 Janamejaya's gratitude question regarding Tribhuvaneshwari - అధ్యాయము 33 త్రిభువనేశ్వరి విషయమున జనమేజయ కృతప్రశ్నము

శ్రీ దేవీ భాగవతం తృతీయస్కంధము - అధ్యాయము 33

త్రిభువనేశ్వరి విషయమున జనమేజయ కృతప్రశ్నము

జనమేజయు డిట్లనియెను: భగవానుడా! నీవు శ్రీదేవీ యాగ మొనరింపుమని వక్కాణించితివి. ఆ శ్రీదేవీ యెవరు? ఎట్లవతరించెను? ఎవరి వలన జన్మించెను? ఆమె స్వరూపమేమి? ఆమె యందలి గుణ విశేషము లెవ్వి? ఆ దేవి దివ్యాకృతి యెట్టిది? ఆ తల్లి యజ్ఞ మేవిధముగ జరుపవలయును? ఆ యాగ విధానమును సర్వజ్ఞుడవగు నీవు తేట పఱచుము. బ్రాహ్మణోత్తమా! ఈ విశ్వముయొక్క సృష్టి రహస్యము నీవెఱుంగుదువు. బ్రహ్మాండమన ఎట్టిది? దాని యుత్పత్తి ప్రకారమేమి? విస్తరించి చెప్పుము. 

బ్రహ్మ విష్ణు మహేశ్వరులను త్రిమూర్తులుగలరనియు, వారు త్రిగుణమయులనియు, సృష్టిపాలన సంహారము లొనరింతురనియు నేను వింటిని. ఆ త్రిమూర్తులును స్వతంత్రులా? పరతంత్రులా? ఆ మహాత్ములను గుఱించి నాకు వినవేడుక యగుచున్నది. వారికి గూడ చావు సహజమా లేక వారు సచ్చిదానంద స్వరూపులా? వార లాధ్యాత్మికము అధిదైవికము అధి భౌతికము అను తాపత్రయము గలవారా? లేక దుఃఖరహితులా? 

ఇంద్రాదులు మహాబలశాలురు గదా! వారిని కాలము కాటు వేయునా? లేదా? వారలెవరివలన నే తెఱగున ప్రాదుర్భవించిరి? అను సందియము నన్ను పీడించుచున్నది. వారికి సుఖ దుఃఖములు గలవా లేవా? వారు నిద్రాలస్యములకు వశులగుదురా కారా? వారి శరీరములు సప్తధాతుమయములా కావా? వారే యే దివ్యపదార్థములవలన గుణంద్రియముల వలన సృజింపబడిరి? వారి జీవితకాలమునకు ప్రమాణమెంత? మునివరా! ఆయా దేవతల నివాసస్థానములను వారి వారి మహావిభూతుల కథలను నాకు బోధపడునట్లు విప్పి చెప్పుము. ఇట్టి మహాత్ముల కథ లెన్నయినను నేను వినుటకు వెనుకాడను.

వ్యాసుడిట్లనియెను: 'ఓయి జనమేజయ మహారాజా! ఆ బ్రహ్మాదిదేవత లెవ్వరివలన సంభవించిరని నీవు ప్రశ్నించితివి. నీ ప్రశ్నకు సమాధానము కడు దుర్గమము. అది అంత తేలికైనదికాదు. నేను మున్ను నారదు నిదే ప్రశ్ననడిగితిని. దాని కతడు చోద్యమంది నాకు సమాధానించిన విధము నీకు వినిపింతును, ఏకాగ్రతతో నాలింపుము. 

వెనుక నొకప్పుడు నాకు పావనగంగా తీరమున పరమశాంతుడు సర్వజ్ఞుడు వేదవిదుడునగు నారదమహర్షి కనబడెను. నేను ప్రమోదమంది యా ముని సన్నిధికేగి యతని పాదపద్మముల కెఱగి యతని యనుమతితో నొక వరాసనమున గూర్చుంటిని. ఆ గంగాతటమున చల్లని యిసుకతిన్నెలపై సుఖాసీనుడై యున్న నారదుని కుశలమడిగి విని నేనతనితో మరల నిట్లంటిని: 

"మునీశ్వరా! ఈ విశాలవిశ్వమునకు మూలకర్త యెవ్వరు? ఈ బ్రహ్మాండ మే మహాశక్తివలన సముత్పన్నమైనది. ఈ సృష్టి నిత్యమా? అనిత్యమా? విధానము ననుసరించి తెలియబలుకుము. కర్తలేక కార్యము జరుగదు గదా! ఈ యింతటి బ్రహ్మాండము నొకడే నిర్మించెనా? లేక పల్వురు కలిసికట్టుగ చేసిరా? అను సందియము నా కెప్పుడును గల్గుచుండును. ఈ పలువిధములైన తర్కవితర్కములతో సందేహ సందోహములతో నే నీ విపుల సంసార సాగరములోన మునింగితిని. నన్నుద్ధరించి కడతేర్చుము. 

కొందఱు మహాదేవుడు సద్యోజాతుడు రుద్రుడు తత్పురుషుడు మహేశ్వరుడునగు శివుడు ప్రళయోత్పత్తి లేనివాడు నగు శంకరుడు కారణకారణుడని వాక్రుత్తురు. ఆ హరుడు సోముడు రుద్రుడు శంభువు శంకరుడు త్రిగుణుడు సృష్టి స్థిత్యంతకారకుడు సంసారోత్తారకుడు శివుడు శివతరుడని వక్కాణించి పల్కుదురు.

మఱికొందఱు శ్రీహరి హృషీకేశుడు మాధవుడు పద్మనాభుడు సర్వశక్తియుక్తుడు విశ్వుడు సర్వభూతాత్ముడు పరమాత్ముడగు విష్ణుని నుతింతురు. ఆ విష్ణువు భుక్తిముక్తిప్రదుడు పరమశాంతుడు విశ్వతోముఖుడు సర్వవ్యాపకుడు సర్వాద్యుడు విశ్వశరణ్యుడనాదినిధనుడునని వారు సన్నుతింతురు. 

ఇంక కొందఱు బ్రహ్మదేవుని విధాతగ లోకసృష్టి కారకునిగ సర్వవేత్తగ సర్వభూత ప్రవర్తకునిగ చతుర్ముఖునిగ సరేశునిగ కమలసంభవునిగ సత్యలోకవాసిగ సర్వలోక కర్తగా వచింతురు. ఇతరులు కొందఱు వేదవాదులు సర్వేశ్వరుడగు సూర్యుని విశ్వకర్తగ భావించి యతనిని సంధ్యలందు సమాహితమతితో సంస్తుతించి ధ్యానింతురు. వేరొక కొందరు దేవదేవుడు సహస్రాక్షుడు శతక్రతుడు సకలప్రభువగు నింద్రుని కర్తగ దలంచి యింద్రయాగ మొనరింతురు. వారా యింద్రుడు పురుహూతుడు యజ్ఞపతి సురపతి లోకపతి శచీపతి యాగభోక్త సోమపుడు సోమపాయి ప్రియుడు నని వచింతురు. ఇతరులు కొంద ఱగ్నిని యముని వరుణుని వాయుదేవుని సోముని ధనదుడగు కుబేరుని గణపతిని గొప్పగ భావింతురు. ఆ గణపతి హేరంబుడు గజవక్త్రుడు స్మరించినంతనే విఘ్నములు బాపి సిద్ధి చేకూర్చువాడు సర్వకార్యసాధకుడు కామదుడు కామగుడని సర్వభావమున సంభావించి పూజింతురు.

కొంద రాచార్యులు సర్వార్థప్రదాయిని ఆదిమాయ మహాశక్తి పురుషానువర్తిని-బ్రహ్మైక్యస్వరూప జననరక్షాలయకారిణి సర్వభూతదేవతల కడుపుపంటగ గన్నతల్లి - అనాదినిధన - పూర్ణ - సర్వలోకేశ్వరి - సగుణనిర్గుణ - శివస్వరూప సర్వప్రాణివ్యాప్త బ్రాహ్మి వైష్ణవి శాంకరి వాసవి వారుణి వారాహి నారసింహి శ్రీమహాలక్ష్మి అద్భుతరూప-వేదమాత ఏకవిద్యాస్వరూప తారిణి సర్వదుఃఖ నిహంత్రి తలచినంతనే కోర్కులు కురియు దేవి ముముక్షులకు ముక్తిదాయిని ఫలార్థులకు ఫలప్రదాయిని త్రిగుణాతితరూప గుణవిస్తారకారిక నిర్గుణ సగుణ అగు శ్రీదేవిని ఫలార్థులై ధ్యానింతురు. 

కొంతమంది నిత్యము నిరంజనము నిరాకారము నిర్లేపము నిర్గుణము అరూపము శుద్ధబుద్ధముక్తయు ప్రజ్ఞానఘనమునగు బ్రహ్మమే సర్వకారణమని పలుకుదురు. ఆ బ్రహ్మమే వేదోపనిషత్తుల సారమని పరంజ్యోతి యని వచింతురు. ముని పుంగవులా బ్రహ్మతేజమునే సహస్రశీర్షుడు సహస్రాక్షుడు సహస్రపాదుడు సహస్రకరుడు అగు పురుషోత్తమునిగ విశ్వసింతురు.

ఆ శ్రీమహావిష్ణునియొకే పాద మాకాశము అంతటను ప్రకాశించునది పరమము శాంతము విరజము విరాట్టునని మనీషులు వెల్లడింతురు. పూర్వవిదులు పురుషోత్తముడే విశ్వప్రభువని మనసార నమ్ముదురు. ఆ సర్వేశ్వరు డొక్కడేకాదని యనువారును గొందఱుగలరు. ఈ ప్రపంచ మూహింపరానిది. ఈ బ్రహ్మాండ మీశ్వరసృష్టి కాదు. ఇది అనీశ్వరమని వాదించువారును గొందఱు లేకపోలేదు. అదంతయు సన్మాత్రమే. ఇది అనీశ్వరము. ఇది సహజముగనే పరిణతి జెందుచుండును. పురుషుడకర్త. అన్నిటికి ప్రకృతియే కర్త్రియని యెలుగెత్తి చాటువారును గలరు. 

ఈ విధముగ వివ్వసృష్టిని గూర్చి సాంఖ్యులు కాపిలులు మున్నగువారలు తమ భిన్నభిన్న భావములు వ్యక్తీకరింతురు. కావున నా కెంతకు నంతుపట్టని సందియము లిట్టి వెన్నియో కల్గుచుండును. నారదమునీంద్రా! సరియైన ధర్మాధర్మ వివక్ష చేయలేక నా చిత్తము శాంతిబాసి వికల్పములకు పాల్పడుచున్నది. ఇందేది ధర్మమో గుర్తించుటకు సాధ్యము గాకున్నది. ఎల్లదేవతలు సత్త్వగుణ సంపన్నులు సత్యధర్మనిష్ఠులునై యుందురు. ఇట్టి దేవతలే పాపాత్ములగు దానవుల చేతులలో బాధలు పడుచుందురు. ఇక ధర్మస్థితికి గతి యెక్కడిది? ధర్మపరులు సదాచారులు మా వంశజులగు పాండవులే పలువిధాల యిడుమలు పడిరి. ఓ మునీశ్వరా! ఇంక ధర్మమునకు తావెక్కడిది? కాన నిట్టి సంశయములతో నా మనస్సు నిరంతరముగ కలత జెందుచుండును. ఇట్టి నా చిత్తమందలి సంశయములను బాపుటకు నీవే కడు సమర్థుడవు. కాన మోహమను జలముతో కల్లోలితమగు సంసార సాగరమునందు మునుగుచు తేలుచున్న నన్ను నీ విజ్ఞాన నావచేత తరింపజేయుము.

అధ్యాయము 34 శ్రీ త్రిభువనేశ్వరీదేవీ ప్రాభవము

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

పంచాంగం

Chapter 32 The birth Story of Astikamahamuni - అధ్యాయము 32 ఆస్తీకమహాముని జన్మవృత్తాంతము

శ్రీ దేవీ భాగవతం ద్వితీయస్కంధము - అధ్యాయము 32

ఆస్తీకమహాముని జన్మవృత్తాంతము

సూతుడిట్లనెను : జనమేజయుని మాటలు విని వ్యాసుడు పేరోలగమునందు రాజుతో నిట్లనెను : రాజా ! పుణ్యము శివము రహస్యమునైన శ్రీదేవీ భాగవత పురాణమును తొల్లి నా కుమారుడగు శుకునిచే చదివించితిని. నేను రచించిన ఆ పరమరహస్య రచన మిపుడు నీకు వినిపింతును, వినుము. అది పెక్కు కథలతో రసభరితమై యలరారుచున్నది. ధర్మార్థ కామమోక్షములకు కాణాచి. సకల వేదముల రసాయనము. దానిని వినుటవలన నిత్యశుభములు సుఖములు చేకూరును. ఆంత జనమేజయుడు ఈ యాస్తీకు డెవరి పుత్త్రుడు ? ఇతడు యాగవిఘ్నము చేయుట కేలవచ్చెను? సర్పరక్షణమున నీతని కేమి లాభము గల్గును? అదియంతయు దెలిపి పిదప శ్రీదేవీ పురాణ కథానకమంతయు నాకు విశదముగ దెలుపుము అనెను. 

వ్యాసుడిట్లనెను: 'తొలుత జరత్కారుడను శాంతుడగుముని గార్హస్థ్యము స్వీకరింపలేదు. అందువలన నతని పూర్వజులు పెద్దగుంటలో వ్రేలాడుచుండిరి. వారిని గాంచి జరత్కారువు దానికి కారణ మడుగగ 'పుత్త్రా ! నీవు పెండ్లి యాడినచో మే మీ యిక్కటులబాసి తృప్తిజెంది స్వర్గమేగుదుము. నీవు సదాచారివి గమ్ము' అని వారనిరి. పూర్వజులారా! నాతో సమానమైన నామము గలిగి యనుకూలయైన కన్య నేను కోరకయే లభించినచో నామెను తప్పక పెండ్లియాడి గృహస్థ జీవితము సాగింతును' అని వారితో పలికి జరత్కారుడు తీర్థాటనమున కేగెను.

అదే సమయమున నాగము నగ్నిలో బడుడని వారి తల్లి శపించెను. అదెట్లన - కశ్యప మహర్షికి కద్రూవినతలను నిర్వురు భార్యలుండిరి. వారొకమారు సూర్యుని రథాశ్వమును చూచి పరస్పర మిట్లు భాషించుకొనిరి: 

మొదట 

కద్రువ : 'ఆ గుఱ్ఱము తోక వర్ణమేమో త్వరగ దెలుపుము' 

వినత : ఆ గుఱ్ఱము తోక తెల్లగనున్నది. నీవే రంగుగలదని తలతువో తెలుపుము. అపు డిద్దఱము పందెము వేసికొందము. 

కద్రువ : శుచిస్మితా! అది నల్లని వర్ణము గలది. మనలో నెవరిమాట తప్పగునో వారు రెండవవారిని దాస్యము చేయవలయును. 

పిమ్మట కద్రువ తన మాట జవదాటని పాములతో 'మీరు గుఱ్ఱము తోకకు చుట్టుకొని దానిని నల్లనిదిగ జేయుడు' అనెను. కొన్ని పాములు తమ తల్లికి ప్రియము సేయు తలంపుతో తమ నల్ల పడగలతో గుఱ్ఱముతోక చుట్టును చుట్టుకొని దానిని నల్లగ జేసినవి. తన మాట విననివారిని జనమేజయుని సర్పయాగమున కాహుతి గండని కద్రువ శపించెను. అపుడక్కసెల్లెండ్రిద్దఱును గలిసి వెళ్ళి మఱల గుఱ్ఱమును గాంచిరి. వారి కపుడది నల్లగ దోచెను. అపుడు వినత మిక్కిలి పరితపించినది. 

వినత కుమారుడు గరుత్మంతుడు. మహాసత్త్వుడు. అతడు తన తల్లి దైన్యమును గని 'జననీ! ఆ సూర్యసారథి - నేను - మే విర్వుర మింకను బ్రతికియుండగ నీ వింతగ దీనముగ నుండగనేల? ఓ తల్లీ! మా కనులముందు మము కడుపు పంటగ కన్న నీవు కంటతడిబెట్టుకొన్న మా జీవితాలు వ్యర్థములు గద! తల్లి కడగండ్ల పాలయినచో నామె సుతుడు బ్రతికి యేమి లాభము? కావున నీ దైన్యకారణము దెల్పుము. వెంటనే నీ దుఃఖము తొలగింపజేతును' అని పలికెను. 

అన వినత 'కుమారా! నేను నా సవతికి దాసినై బాధ పడుచున్నాను. ఇంకేమి చెప్పవలయును? ఇంతేకాక తన నచ్చినచోటి కామె తన్ను నన్ను మోసికొని పొమ్మనుచున్నది' అనెను. గరుడుడును 'అమ్మా! ఆమె యెటు పోదలచిన నే నామెను గొనిపోవుదును. నీవు శోక ముడుగుము. నిన్ను నిశ్చింతురాలిని జేతునని వినతను కద్రువ చెంత కంపెను.

గరుత్మంతుండు తన తల్లికి దాస్యముక్తి గల్గించదలచి కద్రువను నామె పుత్త్రులను సముద్రతీరమునకు మోసికొని పోయి కద్రువకు నమస్కరించి 'ఓయమ్మా! మాయమ్మ దాసత్వమునుండి యెట్లు విమోచనము బొందునో నిజము తెలుపు' మనెను. 

కద్రువ 'నీవు దేవలోకమేగి నీ బలము చూపి యమృతము తెచ్చి మా కర్పించుము. నీ తల్లిని దాస్యమునుండి విడిపించుకొనుము' అనెను. ఆ మాటలు విని గరుత్మంతుడు వేగముగ నింద్రలోక మేగి యచ్చటివారితో బోరి యమృతకలశము గ్రహించి తెచ్చి తన తల్లి కీయగా వినత తన బానిసతనమునుండి విడుదల బొందెను. ఇట్లు వినత తన బిడ్డ యగు పక్షిరాజు సమర్థతచే దాస్యముక్తయై దుఃఖభారము దించుకొనెను. ఇట్లు గరుడుడును తల్లి గౌరవము నిలువబెట్టెను. నాగములు స్నానము చేయుట కేగిన యదను గనిపెట్టి యింద్రు డమృతభాండ మెత్తుకొనిపోయెను. పాములు వచ్చి దర్భలకంటుకొన్న సుధ నాస్వాదించుటకు కుశాగ్రములు నాకినందున వాని నాల్కలు రెండుగ చీలి నాటినుండి అవి ద్విజిహ్వములైనవి. మున్ను తల్లిచే శపింపబడిన వాసుకి మున్నగు పన్నగములు హిరణ్యగర్భుని శరణువేడి తమ శాపభీతి చెప్పుకొన –

ధాత వానితో 'జరత్కారు డను ముని గలడు. మీ రతని పేరుగల నాగకన్య నా ముని కుమారున కర్పింపుడు. వారికి బుట్టినవాడు మీ క్లేశములు గట్టెక్కించగలడు. అతడాస్తీక నామమున బరగును. ఇది నిజము' అని పలికి వారికి ధైర్యము చెప్పెను. బ్రహ్మివాక్కులు విని వాసుకి వనమునకు తిరిగి వచ్చి తన జరత్కారువను సోదరి నా జరత్కారు మునికి వినయముగ నప్పగించెను. అతడు తనతో సమనామరూపములుగల దానిగ జరత్కారువు ఎఱిగెను. ఆమె తన కప్రియము చేసినచో నామెను విడిచిపుత్తునని పలికి ఆ యొడంబడికతో ముని యామెను చేపట్టెను. వాసుకి యామె నతని కప్పగించి తన యింటి కేగెను. అంత జరత్కారుడా మహావనమందు పర్ణకుటీర మేర్పరచుకొని అందు జరత్కారువను పత్నితో నానందించసాగెను. ఒకనా డా ముని భోజనము చేసి నిద్రించెను. అపుడు జరత్కారు వతని చెంతనే యుండెను. ముని 'తన్నెట్టి పరిస్థితిలోను మేలుకొలుపవద్ద'ని భార్యతో జెప్పి నిదురించెను. అంతలో సూర్యు డస్తగిరి కేగెను. సంధ్యా వందన సమయ మయ్యెను.

అపుడామె తనలో 'ఇపుడు లేపినచో నన్ను తప్పక విడిచిపెట్టును. ఇపుడేమి చేతును? నాకిక శాంతి లేదు. మేల్కొల్పనిచో సంధ్యాకాలము దాటిపోవును' అని యామె ధర్మలోపమునకు భీతి జెందినది. ధర్మచ్యుతికంటె నతడు త్యజించుట మేలు. దానికంటె నా చావు మేలు. నరులకు ధర్మహానిచేత నరకము గల్గును, అని తలచి తుద కామె 'సువ్రతా! సంధ్యా సమయము సమీపించినది. ఇక మేలుకొను' మని తన పతిని మేలుకొలిపెను. అతడు లేచి కోపనుడై' ఇక నీవు నీ సోదరునింటి కేగుము. నా నిద్రాభంగ మొనర్చితివి. నా దారిని నేను పోదు'ననెను. అంతనామె భయపడుచు మునితో 'ఓమహామతీ! నా సోదరుడు నన్ను నీకు దేనికై సమర్పించెనో యదెట్లు సంభవించు'నన నత డామెతో (ఆస్తి) ఉన్నదిలెమ్మని పలికెను. ఆమె మునిచే వదలబడి వాసుకి యిల్లుజేరి తన సోదరుడుగగ నామె తన పతి (ఆస్తి) కలదని తన్ను వీడి తావెళ్ళెనని చెప్పెను. ఆమె మాటలు విని యా ముని సత్యవాది యని తలచి వాసుకి తన సోదరి నాశ్రయించియుండెను.

కొంతకాలము తరువాత నామె కొక బాలుడు జన్మించెను. అతడే ఆస్తీకనామమున వన్నె కెక్కెను. అట్టి యితనిచే నిపుడీ యాగము నిలిపివేయబడుచున్నది. విజ్ఞానియగు ఆ ముని తన తల్లి పక్షము వారి నిట్లు సంరక్షించెను. వాసుకి సోదరికి బుట్టిన యాస్తీకుని నీవు చక్కగ సత్కరించితివి. ఓ మహారాజా! నీవు చాల గణనీయమైన పని చేసితివి. నీకు మేలు గలుగుత! సకల భారతము వింటిని. మునులను బూజించి వారికి భూరిదానము లొసంగితివి. 

జనమేజయనరపతీ! ఇంతటి పుణ్యమునగూడ నీకు శాంతి నీ తండ్రికి స్వర్గతి లభించలేదు. నీ వంశమంతయును పావనము గాలేదు. కావున శ్రీజగదంబికాదేవికి వేవేగభక్తి శ్రద్ధలతో దివ్యమందిరము నిర్మింపజేయుము. నీవు సకల శివ ప్రదాయినిని మహాదేవిని నిండు భక్తితో బూజింపుము. దానిచే నీకు సమస్తము సిద్ధించగలదు. ఆ విశ్వమాత నీకు రాజ్యసంపదలిచ్చి ధ్రువముగ నిన్నభి''వర్ధిల్ల జేయును.

శ్రీదేవీ యజ్ఞము విధివిధానముగ నాచరించి శ్రీదేవీ భాగవత పురాణ సంశ్రవణ మొనరింపుము. అది-ఆకథ పరమపావనము-సంసారోత్తారకము-దివ్యము-నానారస సమాహారరూపము-వినిపింతును. తత్పరభావమున నాలకింపుము. ఈ పరమ దేవీపురాణముగాక వినదగినది మరొక్కటి లేదు. ఆమె పావనచరణకమలములు దప్ప భజింపదగినవి మరేవియు లేవు. ఎవరి ప్రేమసంకుల హృదయముల నాదేవి ఎల్లపుడును వసించునో వారే ధన్యజీవులు. వారే సౌభాగ్యవంతులు. వారే స్థితప్రజ్ఞులు. ఓ భారతా! ఈ పవిత్రభారత కర్మభూమిలో నా జగదంబికను సమారాధింపని మూఢులే కడగండ్లకు గురియగుదురు. బ్రహ్మాదిదేవత లెల్లరే త్రిమూర్తిరూపయగు దేవిని సంసేవించుటలో తత్పరులై నిత్యము వర్తింతురో - ఆ తల్లిని తెలిసిన వాడెవ్వడు భక్తిమీర సేవింపకుండును! పూర్వ మా భగవతి శ్రీమహావిష్ణువున కీ భాగవతము వినిపించినది. అట్టి దీని నెవడు వినునో వాని యభీష్టములు తీరును. ఈ పుణ్యపురాణ శ్రవణ పుణ్యమున నీకు చిత్తశాంతి గలిగి తీరును. నీ పితరు లక్షయ పుణ్యలోకములు జేరుదురు.

అధ్యాయము 33 త్రిభువనేశ్వరి విషయమున జనమేజయ కృతప్రశ్నము

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

పంచాంగం

Chapter 37 Shiva and Brahma worshipping Sridevi - అధ్యాయము 37 శ్రీదేవిని శివబ్రహ్మలు ప్రస్తుతించుట

శ్రీ దేవీ భాగవతం తృ తీయ స్కంధము - అధ్యాయము 37 శ్రీదేవిని శివబ్రహ్మలు ప్రస్తుతించుట బ్రహ్మ యిట్లనియె: అని యీ ప్రకారముగ దేవదేవుడగు విష్ణువు జ...