Tuesday, September 1, 2026

Parikshinmaharaju Shukayogindru Nadigedu Prashna - పరీక్షిన్మహారాజు శుకయోగీంద్రు నడిగెడు ప్రశ్న

శ్రీమహాభాగవతము ఏకాదశస్కంధము - పరీక్షిన్మహారాజు శుకయోగీంద్రు నడిగెడు ప్రశ్న

“అయ్యా! పుట్టుకకు కారణమైన కర్మ అనే రోగం తొలగిపోవడానికి కారణమైన దివ్యమైన మందు కాబట్టి శ్రీమన్నారాయణునికి సంబంధించిన కథలనే అమృతం తాగు” మని ఇలా అన్నాడు.

శ్రీకృష్ణుడు గొప్ప భుజబలం కలవాడై బలవంతమైన సేనతో గొప్ప రాక్షసవీరులందరిని యుద్ధంలో అనతికాలంలోనే సంహరించాడు. భూభారం ఇంకా ఎక్కువగా ఉండడంచేత జూదం అనే క్రీడ కారణంగా యుద్ధంలో చావడానికి కౌరవ పాండవసేనలు భూమండలం కంపించే విధంగా నడిచాయి.

అప్పుడు తనయందు (శ్రీకృష్ణుని) సహజమైన భక్తి గల యాదవవీరులు(యుద్ధంలో నశింపక) ఎంతగానో సంతసించారు. (వీరిని చూచిన) మహర్షులు, నందుడు మొదలైన వారికి కూడా ఎంతో సంతోషమైంది.

దేవతలందరిచేత సేవింపబడి ప్రసిద్ధుడైన శ్రీకృష్ణుడు దుర్మదాంధులైన భూపాలకులను అణచివేసి, కంసుడు మొదలైన వాళ్లను సమూలంగా సంహరించి, భూభారం తగ్గించి ఎంతో సంతోషంతో ఉండగా యాదవసేనలు విజృంభించి, నేల దద్దరిల్లేటట్లు అతి భయంకరంగా దుస్సహంగా నడిచాయి (దీనివల్ల భూభారం అధికమైంది).

శ్రీకృష్ణుడీవిధంగా పూతన, శకటాసురుడు, తృణావర్తుడు, వత్సాసురుడు, ధేనుకాసురుడు, ప్రలంబకాసురుడు, అఘాసురుడు మొదలైన రాక్షసులను; చాణూర ముష్టికులనూ; సాల్వ, శిశుపాల, దంతవక్త్ర, కంస, పౌండ్రకాదులను సంహరించి, ఆపైన కురుబలాన్ని అణచివేసి, ధర్మరాజును చక్రవర్తిగా అభిషేకించాడు. ధర్మరాజు రాజ్యపాలన చేస్తుండగా సంతోషపడినాడు. తన భక్తులైన యాదవులను పరిశీలనగా చూచి “వీళ్లు ఇతరుల వల్ల పరాభవం(అవమానం) పొందరు. వీళ్లను సంహరించడానికి నేను తప్ప ముల్లోకాలలోనూ మరొక దైవం లేదు” అని భావించాడు.

యాదవులను పరిమార్చడానికి తాను తప్ప మరొక దైవం లేదని లోకప్రభువైన శ్రీకృష్ణుడు బాగా ఆలోచించాడు. ఎంతో పెద్దదైన వెదురుగుబురును (పొదను) లోపలి బొంగులు ఒకదానిని మరొకటి రాసుకోవడంవల్ల పుట్టిన అగ్ని దహించే విధంగా యాదవసేనలలో పరస్పర శత్రుత్వాలు కలిగించి ఆ సేనలను నాశనం చేస్తానని నిశ్చయించాడు. దానికి బ్రాహ్మణశాపాన్ని మూలకారణంగా తలచాడు. అనుకొన్నవిధంగా యాదవులను నశింపజేశాడని చెప్పిన శుకమహర్షితో రాజశ్రేష్ఠుడైన పరీక్షిత్తు ఇలా అన్నాడు.

ఓ మునిసత్తమా! ఆలోచించి చూస్తే శ్రీహరి పాదకమలాలను ఆసక్తితో సేవించే యాదవులకు బ్రాహ్మణశాపం ఎలా కలిగిందో ననిపిస్తున్నది. ఆ కారణాన్ని తలియజేయండి.

అలా అడిగిన రాజుకు మునిశ్రేష్ఠుడైన శుకుడు గొప్పవైన, గంభీరాలైన వాక్ప్రవాహస్ఫూర్తితో వినుమని ఇలా చెప్పడం ఆరంభించాడు.

విశ్వామిత్ర వశిష్ఠ నారదాది మహర్షులు శ్రీకృష్ణ సందర్శనంబుకు వచ్చుట






శ్రీ మహాభాగవతము ఏకాదశస్కంధము

Sunday, August 30, 2026

Sree Maha Bhagavathamu Part 11 - శ్రీ మహాభాగవతము ఏకాదశస్కంధము

శ్రీరస్తు శ్రీమహాభాగవతము ఏకాదశస్కంధము 

శ్రీ సీతాపతి! లంకే, శాసురసంహారచతుర! శాశ్వత! నుత వా 
ణీసత్యధిభూభవవృ, త్రాసురరిపుదేవజాల! రామనృపాలా!

శ్రీ జానకీనాయకా! లంకకు ప్రభువైన రావణుణ్ణి వధించడంలో నేర్పుచూపినవాడా! సుస్థిరుడా! సరస్వతీదేవి భర్త అయిన బ్రహ్మదేవుడు, శివుడు, వృత్రాసురుని శత్రువైన ఇంద్రుడు, దేవతలసమూహం స్తుతించిన లేదా వాళ్ల స్తుతికి పాత్రమైన ఓ రామభూపాలా!

ఉత్తమగుణాలు ఉండడంచేత ఎంతో గొప్పవారైన వైశంపాయనాది మునిశ్రేష్ఠులతో పురాణాలన్నిటిని వివరణాత్మకంగా చెప్పగల సూతమహర్షి ఇలా అన్నాడు. అలా ప్రాయోపవేశదీక్షను పూనిన పరీక్షిత్తు అనే మహారాజును చూచి శుకమునివర్యుడు

పరీక్షిన్మహారాజు శుకయోగీంద్రు నడిగెడు ప్రశ్న









శ్రీ మహాభాగవతము ఏకాదశస్కంధము

Srikrishnudu Mruthulayina Viprasutula Decchuta - శ్రీకృష్ణుడు మృతులయిన విప్రసుతుల దెచ్చుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం -
శ్రీకృష్ణుడు మృతులయిన విప్రసుతుల దెచ్చుట

పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుడు ఒకపర్యాయం కుశస్థలీ నగరంలో అతిథిగా ఆనందిస్తుండగా, ఒక బ్రాహ్మణుని భార్య ప్రసవించింది. పుట్టిన కొడుకు పురిటిలోనే మరణించాడు. బ్రాహ్మణుడు మహాశోకంతో శిశువు శవాన్ని మోసుకొనివచ్చి, రాజద్వారం ముందరపెట్టి, విధిని, తనను నిందిస్తూ అమితమైన దుఃఖంతో దీనాలాపాలు చేస్తూ

అక్కడ మూగి ఉన్న ప్రజలతో “బ్రహ్మద్వేషియై శాస్త్ర ధర్మాల్ని పాటించక, వర్ణాశ్రమ ధర్మాలు మంటగలిపి పాలించే రాజు పాపంవల్ల నా కుమారుడు చనిపోయాడు. హింసాత్మకుడై, అన్యాయాలు చేస్తూ భౌతిక సుఖాలకు లొంగి, పరిపాలన చేసేరాజు పాలించే దేశంలో ప్రజలు అమితంగా కష్టాలు పొందుతారు” అంటూ శాపనార్థాలు పెడుతూ; ఏడుస్తూ అక్కడ నిలువక వెళ్లిపోయాడు. 

ఈ విధంగా విధివశాత్తు పుట్టిన ప్రతిపిల్లవాడు చనిపోతుంటే ప్రతిపర్యాయం ఆ కుమారుని శవాన్ని తీసుకొని వచ్చి రాజభవనం ముందుంచి విలపిస్తూ, రాజు ధర్మవిరుద్ధవర్తనుడు, తత్కారణంగా ఈ అకాలమరణాలని ఏకరువుపెడుతూ రోదిస్తూ శాపనార్థాలు పెడుతూ బ్రాహ్మణుడు ఎనిమిదిసార్లు రావడంకాక, తొమ్మిదవసారి అదేవిధంగా తన కొడుకు చనిపోగా అతణ్ణి భుజానవేసుకునివచ్చి ఎప్పటిలా రోదిస్తుంటే ఆ బ్రాహ్మణుణ్ణి చూచి, అనుకోకుండా అక్కడికి వచ్చిన అర్జునుడు ఇలా అన్నాడు.

'నువ్వీ విధంగా ఆక్రందనలు చేస్తుంటే నీ బాధతీర్చీ యోధుడు (విలువిద్య తెలిసినవాడు) ఒక్కడూ ఈ రాజ్యంలోలేడు. ఇది ఈ రాజ్యప్రజలు చేసికొన్న పాపం” అని అర్జునుడు ఊరడించాడు.

"పుత్రులను కోల్పోయి దుఃఖిస్తున్న బ్రాహ్మణులు ఏ రాజ్యంలో ఉంటారో, ఆ దేశమేలే రాజును నటుడిగా భావించాలి. నేను నీ కుమారుణ్ణి బతికిస్తాను. అలాచేయలేకుంటే అగ్ని ప్రవేశం చేస్తాను” అని బ్రాహ్మణుడు ఆశ్చర్యపడేలా అర్జునుడు ప్రతిజ్ఞ చేయగా, బ్రాహ్మణుడు విని అంత వెర్రిమాటలెందుకు? బలరామ, శ్రీకృష్ణాదులు(చేయలేని పని మీరు చేయగలరా? అన్నాడు)

మహాపరాక్రమవంతులైన ప్రద్యుమ్నాది యదువీరులు చేయలేని పనిని నీవెలా సాధించగలవు. అనవసర ప్రగల్భాలు మాని నీ తోవను నీవు వెళ్లమన్నాడు. అప్పుడు అర్జునుడు (ఇలా అన్నాడు)

బ్రాహ్మణుని తిరస్కారవాక్యాలకు, తన మనసులో దురభిమానం పెరిగి; అర్జునుడు కోపంతో అదుపు తప్పినవాడై అక్కడి ప్రజలు వినేలా ఇలా అన్నాడు.

నీ వింతకు ముందు చెప్పిన బలరాముడనో, కృష్ణుడనో, ప్రద్యుమ్నుడనో, అనిరుద్ధుడనో కాను, నేనెవ్వరంటే శత్రుసమూహాలను పీనుగల పెంటలుగా చేసే గాండీవం ధరించిన అర్జునుణ్ణి అని తనను ప్రశంసించుకొన్నాడు.

అంతేకాక, త్రిపురారియైన పరమశివుణ్ణే భుజబలంతో ఒంటరిగా ఎదుర్కొని యుద్ధంచేసిన నన్ను నీవెరుగవా? మృత్యుదేవతను భయపెట్టి, గర్వమణచి, నీ కుమారులనిపుడే తెచ్చియివ్వగలను.

(జననజరామరణాలు భగవత్సంకల్పాలు. కృష్ణుడు భగవంతుడు. అర్జునుడు భౌతిక వాది. భుజాస్త్ర బలము నమ్మినవాడు.)

పార్థుడు బ్రాహ్మణునికి నమ్మకం కలిగేలా పలికాడు. బ్రాహ్మణుడు దుఃఖంనుండి ఉపశమనంపొంది, అర్జునుణ్ణి అభినందించి, తన ఇంటికి మరలిపోయాడు. కొంతకాలానికి అతడి భార్య తిరిగి గర్భవతిఅయి, నవమాసాలుమోసి, పురిటి నొప్పులు పడుతూఉండగా, బ్రాహ్మణుడు రాజమందిరానికివచ్చి, అర్జునునకు సమాచారం ఇచ్చినాడు. అపుడు అర్జునుడు

అర్జునుడు పవిత్ర నదులనుండి స్వీకరించిన జలాలతో ఆచమనంచేసి, పవిత్ర స్థలంలో నిలబడి; శుచియై శివుణ్ణి ధ్యానించి, అస్త్రమంత్రాది దేవతల మంత్రాలు స్మరించి, ధ్యానించి, గాండీవం చేతబట్టి, ఎక్కుపెట్టుకొని, బాణాలపొది రెండు భుజాలకు రెంటిని కట్టుకొని మృత్యు దేవతపై యుద్దానికి సిద్ధమయ్యాడు.

పైన చెప్పినవిధంగా అర్జునుడు వివిధాస్త్రాలు, గాండీవం ధరించి యుద్ధసన్నద్దుడై - ఆ సమయంలో

బ్రాహ్మణుని వెంబడి అతని ఇంటికివెళ్లి అర్జునుడు ప్రసూతి గృహానికి దశదిశలా సందులేకుండా బాణాలువెేసి పంజరంవలె నిర్మాణంచేసి మృత్యువు చొరకుండాచేసి జాగరూకుడై కాపలాకాసినాడు. బ్రాహ్మణుని భార్యకు మగబిడ్డ పుట్టినాడు. అక్కడ వింతగా చేరిన జనం పోయాడు పోయాడని ఆర్తనాదాలు చేశారు. ఈ సారి ప్రాణాలు పోవడంకాదు, బిడ్డ బొందితో మాయమైనాడు. 

మృత బాలుని శరీరం మాయంకాగానే ఆ బ్రాహ్మణుడు బాగా చింతించి తనరాజైన కృష్ణుని వద్దకు విలపిస్తూ వెళ్ళి శ్రీకృష్ణుని ముందట నిలబడి ఆర్తితో ముకుందా! మునివినుతా! నందకుమారా! కీర్తిమంతుడా! కృష్ణా! గోవిందా! హరీ!

దేవా! విను. పౌరుషంలేని అర్జునుడు చేతకాకున్నా వ్యర్థమైన దంభాలు పలికి నా కుమారుణ్ణి రక్షిస్తానంటే నమ్మి, నా కొడుకును పోగొట్టుకున్నాను. నన్ను నేను నిందించుకోవాలి. సర్వలోకాల సృష్టి స్థితిలయాలకూ కారణభూతుడవైన నీవే వారింపలేక ఉండగా ఈ విపత్తును ఈ అర్జునుడనే మానవమాత్రుడు నివారించగలడా! అని ఇంకా

అర్జునుడు ఒక పెద్ద విలుకాడా? వీని బలం ఏమిటికి? వీని గాండీవం ఏపాటిది? వీని దివ్యాస్త్రాలు ఏపాటివి?; ఏమనాలి?

పై విధంగా అసమర్థుడని తనను నిందించగా విన్న అర్జునుడు మిక్కిలిగా కలతపడి, తన విద్యామహత్వంచేత వెంటనే యమలోకానికి వెళ్లాడు.

పైలోకాలకు తన మహిమతో వెళ్లి, ముందట యముని ఆలయమైన నరకంలో పరిశీలించి, అక్కడ బ్రాహ్మణ పుత్రుడు కనిపించని కారణంగా, అష్టదిక్పాలకుల స్థానాలలో మిగిలిన ఏడింటినీ పరిశీలించాడు.

అష్టదిశల పిదప, మిగిలిన దేవ, యక్ష కింపురుషాది సమూహాలు నివసించే వారివారి నివాసాలకు వెళి, ఎక్కడా బ్రాహ్మణ కుమారుల జాడ కానక, తిరిగి భూలోకానికివచ్చి, తన శపథంమేరకు అగ్నిలో ప్రవేశించటానికి సిద్ధపడ్డాడు.

అర్జునుడు బ్రాహ్మణ బాలకరక్షణలో విఫలుడైనందువల్ల తన ప్రతిజ్ఞమేరకు అగ్నిలో ప్రవేశించడానికి సిద్ధంకాగా, శ్రీకృష్ణుడు విషయమంతా తెలిసికొని, ఈ బ్రాహ్మణపుత్రులను నీకు చూపుతాను అని అగ్నిలో ప్రవేశించకుండ ఆపి, అప్పుడు

అతిశ్రేష్ఠమైనమణులు తాపడంచేసిన బంగారురథాన్ని ఎక్కుతున్న కృష్ణుడు ఉదయాద్రినెక్కే సూర్యునివలె ప్రకాశించినాడు. అర్జునుణ్ణి ఎక్కించుకొని, శరీరకాంతులు దిక్కులలో ప్రకాశించగా; బ్రాహ్మణ బాలురను వెదకడానికి బయలుదేరాడు.

(శ్రీకృష్ణుడు సూర్యునివలె, తనురశ్మి సూర్యరశ్మివలె, కాంచన రథం ఉదయపర్వతంలాగా, మణికాంతులు సూర్యకిరణాలలాగా, సూర్యకాంతులు దిక్కులు నిండినట్లు కృష్ణుని తనుకాంతులు అన్ని దిశలా వ్యాపిస్తున్నట్లు వర్ణించడంచేత సూర్యునివలెనే కృష్ణుడు సర్వలోక సందర్శనానికి బయలేరాడని - సూచింపబడుతోంది. ఇక్కడ శ్రీకృష్ణుడు సవితృమండల మధ్యవర్తి. విష్ణువువలె సృష్టి స్థితిలయములు ఆయన చేతిలోనివి. ఇది సంపూర్జావతారలక్షణమనడానికి ఉన్న ఎన్నో ప్రమాణాలలో ఇది ఒకటి.)

పట్టణాలు, వాటి బహిఃప్రదేశగోశాలలు, దుర్గాలు, అడవులు, పల్లెలు, బోయతండాలు; గొప్పనైన నదీనదాలు; సరోవరాలుగల భూప్రపంచంచుట్టి; సప్తసముద్రాలు; వాటిమధ్య భూఖండాలు, కులపర్వతాలుదాటి, ఆపై మేరుపర్వతం దాటి, వాయువేగంతో శ్రీకృష్ణుని రథం ముందుకు సాగుతుండగా

శ్రీకృష్ణుడు అర్జున సహితుడై రథారూఢుడై ప్రయాణిస్తూ అతిభీకరమైన అంధకార ప్రపంచంలోకి ప్రవేశించాడు. సాహసించి ఇంకాముందుకు పోగా, చీకటి దట్టమై కన్నుగానక, గుఱ్ఱాలు శక్తిహీనాలై తోవతప్పి, మోకాళ్లపై కూలబడినాయి. శ్రీకృష్ణుడు ఆ చీకటిని తొలగించడానికి

(20వ శతాబ్దంలోని అంతరిక్ష పరిశోధకుల్లో ఖగోళశాస్త్ర వేత్తయైన ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ కూడా ఊర్థ్వలోకంలో చొచ్చుకుపోయేకొద్దీ దట్టమైన కటికచీకటి (Pitch Darkness/Dark Matter) ఉందని దాని తర్వాత వెల్గురేకలున్నట్లు తెలుస్తున్నదన్నారు. కాని, ఆ 'కటిక చీకటి' గురించి, దాని తత్త్వమేమిటో తెలియడం లేదన్నారు.

"పెను చీకటి” తత్త్వం ఆ కృష్ణునికే తెలుసు. మానవులబుద్దికి పరిశోధనలకు అందడం లేదు. దీనినే ఉపనిషత్తు ఒకే వాక్యంలో “తమసోమా జ్యోతిర్గమయ” అని చెప్పినది. ఇది సృష్టితత్త్వ రహస్యం.)

బాలసూర్యుని కాంతివంటి కాంతితో ప్రకాశిస్తూ కృష్ణుడు ప్రయోగించిన చక్రం దూసుకువెళ్లి చీకటిని వేగంగా తొలగిస్తూపోగా దానివెంబడి ఆ వెలుగులో రథాన్ని పరిగెత్తిస్తూతోలి, చీకటి ప్రదేశాన్ని దాటినాడు. ఆ తరువాత కళ్లు మిరుమిట్లు గొలిపే మహాతేజస్సు ఆకాశంలో కనిపించింది. ఆ వెలుగును చూసి అర్జునుని భయం కలిగింది. కళ్లుమూతలు పడ్డాయి. అలా కొంతదూరం వెళ్ళి

కృష్ణుని రథానికి ముందుచీకటి, తరువాత వెలుగు, అడ్డమైనవి. ఇపుడు గొప్ప సముద్రంవంటి జలరాశి ఎదురైంది. గొప్పగా గాలివీచి సృష్టించిన మిక్కిలి చలించే అలలుగల సముద్రంవంటి ఆ జలరాశిలో ప్రవేశించగా వారికి కోటిసూర్యుల ప్రకాశంతో వెలుగుతున్న

ఆ జలరాశిమధ్యలో వేలాదిమణిస్తంభాలతో ప్రకాశించేదీ, రత్నహారాలు వేలాడుతుండేదీ, అంతులేని తేజస్సుతో ప్రకాశించేదీ, సూర్యచంద్రకాంతులు చొరలేనిదీ, జన్మరాహిత్యానికి మార్గమైందీ, ఐశ్వర్యాన్ని ఇచ్చేదీ, అంత మనేదిలేనిదీ, మహోన్నతమైంది, అనల్పవైభవాస్పదమైందీ, పరమయోగులు తాము చేరాలని కోరుకొనేదీ, హరిభక్తులు నివసించేదీ ఐన ఒక దివ్య భవనంలో

కృష్ణార్హునులు చూచిన దివ్యభవనంలో శరదృతువులోని వెన్నెలవలె, కర్పూరంవలె, మంచువలె, ముత్యాలవలె తెల్లని దేహంతో ఒప్పినవాడూ; తుమ్మెదలు, నల్లకలువలు, ఇంద్రనీలమణులవంటి నల్లని పడగకింది మెడలు గలవాడూ. ఉదయభానునివంటి లేత ఎరుపురంగులో ఉన్న పద్మరాగ మణులు నిలిచిన వేయి పడగలు (తలలు) గలవాడూ, తెరచిన నోళ్లనుండి విషధూమం బయటికి వెలువడుతున్నదా అన్నట్లున్న నాలుకలు కలవాడూ, సాయంకాలపు హోమకుండాలవంటి వేడి చూపులుగలవాడు, వెండికొండలా తెల్లని పెద్దదేహంగలవాడు ఐన ఆదిశేషుడు సుఖతల్పంగా అమరగా ఆ పడకపై...

(ఆదిశేషుని దేహం చిత్రవర్ణసమేతం. తెల్లనాగుకనుక శరచ్చంద్ర చంద్రికలవంటి దేహం నల్లనిమెడలు, వేయిపడగలపై నిల్చిన ఉదయభానునివంటి లేత ఎరుపురంగులోని వేయిమణులు, హోమకుండం వేడివంటి ఎర్రనైన చూపులు, విషధూమాన్ని అనుకరించే నల్లని రెండువేలనాలుకలు, చుట్టలుగా చుట్టి పరచుకొన్న హిమాలయంవంటి వెండిరంగు శరీరం ఇలాసాగింది మనోహరంగా వర్ణన. పగలంతా జ్వలించిన హోమకుండల్లో సాయంత్రం జ్వాలలుకాక వేడిమాత్రం రగులుతూ, తగులుతూ ఉంటుంది. కనుక వేడి చూపులకు సాయంతన హోమకుండాలతో పోలిక చెప్పబడింది.)

ఆదిశేషునితో ఏర్పడ్డ పడకపై సుఖంగా కూర్చున్న విష్ణువుకు దగ్గరగా వెళ్లిన సమయంలో

నీలమేఘంవంటి శ్యామలవర్ణంతో వెలిగేవాడు, ఆశ్రితుల్ని రక్షించడంలో ఆనందం పొందేవాడు, యోగి హృదయ పద్మాలలో నివసించేవాడు, నిండు జాబిల్లి మోమువాడు, జగత్తుకు హితంచేసేవాడు, వేకువనే వికసించిన పద్మాలవంటి కన్నులుకలవాడు, లక్ష్మీమానసోల్లాసి, పీతాంబరుడు, హారకుండలకేయురకిరీటాద్యాభరణాలు ధరించినవాడు. భవసాగరంనుండి తరింపచేసేవాడు, భక్తపోషకుడూ ఐన విష్ణు భగవానుణ్ణి.

ఇంకా, సునందాది పరిచారకులచే సేవించబడుతున్నవాణ్ణి సంతోష హృదయంకల్గినవాణ్ణి, శ్రీదేవీ, భూదేవీ సమేతుడైనవాణ్ణి, నారదాదుల సంకీర్తనలకు ఆనందించేవాణ్ణి, అవ్యయుణ్ణి, పుణ్యాత్ముడూ, అనంతుడూ, అప్రమేయుడూ, జయంకలవాడు; మార్పులు లేదు, ఆదిమధ్యాంతాలు లేనివాడు, కరుణాసముద్రుడు, చ్యుతిలేనివాడు, మహానుభావుడు, పరమాత్ముడు, పురుషశ్రేష్ఠుడు, జగదుత్పత్తి స్థితి, లయకారకుడు, జ్ఞానాజ్ఞాన ప్రభుడు, అష్టభుజుడు, కౌస్తుభశ్రీవత్సములు ఎదపై లాంఛనాలుగా కలవాడు, శంఖచక్రాది ఆయుధధారి, సర్వశక్తిమంతుడు, బ్రహ్మకు తండ్రియైనవాడు అగు శ్రీమన్నారాయణుణ్ణి కృష్ణార్జునులు దర్శించుకొని సాష్టాంగప్రణామాలు ఆచరించి, భక్తితో నుతించగా శ్రీమహావిష్ణువువారిని దయతోచూచి, చిరునవ్వుతో, ఆప్యాయంగా ఇలా అన్నాడు.

భూమికి బరువైన రాక్షసుల్ని చంపి, ధర్మరక్షణ చేసేందుకు మీరిద్దరు నా అంశతో నరనారాయణులుగా భూమిపై జన్మించారు.

భూభారంతగ్గించే గొప్ప నిష్ఠతో మీరిద్దరూ భూలోకంలో ప్రసిద్ధులుకాగా, మిమ్మల్నిద్దరినీ చూడాలని ఇక్కడి మునులు కోరగా బ్రాహ్మణకుమారులను తెచ్చే మిషతో మిమ్ము రప్పించాను - అని శ్రీ మహావిష్ణువన్నాడు.

విష్ణువిలా చెప్పి, బాలకుల్ని తీసుకొని వెళ్తండనగా, ఆయనను వీడ్కొని, నమస్కరించి, స్తుతించి బ్రాహ్మణబాలకులతో కృష్ణార్జునులు తమ కోర్కెలు ఫలించగా ఆ బాలకులను వారివారి వయస్సులకు తగిన రూపాలతో తీసుకొనివచ్చి వారితండ్రి అయిన బ్రాహ్మణునికి అప్పచెప్పారు. అతడు చాలా సంతోషించినాడు. ఆ సమయంలో

ఓ పరీక్షిన్మహారాజా! ఇంద్రసూనుడైన అర్జునుడు శ్రీకృష్ణునితోబాటు వైకుంఠానికివెళ్లి శరణాగతరక్షకుడైన ఆ శ్రీమహావిష్ణువురూపాన్ని, వైభవాన్నీ కన్నులార వీక్షించినందుకు సంబరపడి, పలుమార్లు ఆ దేవదేవుణ్ణి స్తుతించినాడు.

కమలాక్షుడు, భక్తకల్పవృక్షము, సకలేశ్వరుడు, పురుషోత్తముడు, అతిపవిత్రుడు అయిన కృష్ణుణ్ణి స్తుతిస్తూ, ఆయన పాదాలకు నమస్కరించి, పరమానందం పొందాడు అర్జునుడు.

ఈ సంఘటన తరువాత

అంతంలేనివాడు, సకలేశ్వరుడు, పుట్టుకలేనివాడు, వేదాలచే తెలియదగిన భగవంతుడైన కృష్ణుడు, బ్రాహ్మణాదులైన జాతి సర్వప్రజలను, సమస్తధన, కనక, ధాన్య, వస్తు, వాహన సమృద్ధమై సంతోషించేవిధంగా ఏలుతూ, ఆర్హులను కాపాడుతూ, ధర్మాన్ని పరమోత్సాహంగా ప్రతిష్ఠాపిస్తూ, పాపులను శిక్షిస్తూ ద్వారకలో ప్రకాశిస్తూ, తన రాజ్యప్రజలు ప్రశంసించేలా తనకు తానే నిర్ణయించి, వేదాలు చెప్పినట్లుగా పలుయజ్ఞాలు, ఎంతో ఇష్టంగా నిర్వహించాడు.

(తనకు తానే అనడంలో ఓ విశేషం ఉంది. తానే సర్వయజ్ఞాలకు భోక్త. ఇక్కడ తనను తృప్తి పెట్టేందుకు ఇతరులు యజ్ఞాదులు చేయాలి. కాని, తానే యజ్ఞకర్తయై తనకు తానే (కర్త, భోక్త) చేశాడు. ఇది ప్రజల సంతోషంకొరకు, ధర్మాచరణకొరకు చేశాడు.)

ఈ విధంగా తన రాణులందరితో అఖండమైన భోగభాగ్యాలు అనుభవిస్తూ వేదవిహితమైన మార్గంలో గృహస్థాశ్రమధర్మాన్ని నిర్వహిస్తూ, ధర్మ, అర్థ, కామాలను అనుభవిస్తూ సజ్జనులకు ఆదర్శంగా సంసారివలే ప్రవర్తిస్తున్నాడు.

పరీక్షిన్మహారాజా! దేవదానవయుద్ధంలో మరణించిన రాక్షసులు తిరిగి ద్వాపరయుగంలో రాజులై పుట్టి ప్రజలను బాధ పెట్టగా

రాక్షస అంశతో పుట్టిన ఆ రాజులను సంహరించటానికి, విష్ణువు దేవతలను యాదవులుగా పుట్టింపగా, వారు తామరతంపరగా నూటబఒక్క వంశాలుగా అభివృద్ది చెందినారు. వారిని లెక్కించటానికి బ్రహ్మకు కూడా వశం కాదు.

మహారాజా! కృష్ణుడు వేణువు ఊదితే గోపాలురు, గోపికలు, ఆయన ఉన్న వన భూములకు పరిగెత్తుకొని వస్తారే? ఎల్లప్పుడూ ఆయననే సేవించే భక్తులైన పండితులు ఆ దయాసముద్రుణ్ణి ఆరాధించకుండా ఉంటారా?

ఓ రాజా! అశుభాన్ని నశింపజేసే ఎవ్వని నామస్మరణ, హృదయంలో చేస్తారో వారి జీవనం సాథ్యం, ధన్యం అవుతుంది. సంసార సంబంధమైన దోషాలను తొలగించుకుంటారు. కాలచక్రమనేపేరుగల సుదర్శన చక్రాయుధం ధరించిన ఆ కృష్ణుడు భూభారం తొలగింపచేయడంలో వింతయేముంది?

ఈ విధంగా గోపికలకు మన్మథుడైన శ్రీకృష్ణుడు లీలగా మానవ రూపం ధరించి, తన ద్వారకానగరంలో దివ్య వైభవంతో భోగభాగ్యాలు అనుభవిస్తున్నాడు అని వివరించి, ఇంకా ఇలా అన్నాడు.

ఓ పరీక్షిన్నరేంద్రా! నేను నీకు ముల్లోకాలకు మంగళకరమైనట్టి శ్రీకృష్ణ కథఅనే అమృతాన్ని అందించాను. దీన్ని భక్తితో గ్రోలిన పుణ్యాత్ములు, ఇహలోకంలో సుఖాలుపొంది, పుణ్యాత్ములై పరలోకంలో మోక్షాన్ని పొందుతారు.

ఈ విధంగా శుకుడు, పరీక్షిన్మహారాజుకు చెప్పిన అతిమనోహరమైన భాగవతకథలలోని శ్రీకృష్ణచరిత్రమును సూతుడు యథాతథంగా మునులకు చెప్పినాడు. వారు ఆనందంగా స్వీకరించారు

మునులు కృష్ణ కథ చెప్పిన సూతుని బహుభంగుల సత్కరించి, తృప్తి పెట్టిన మహిమాభీరామమైన కృష్ణగాథను గొప్పభక్తితో స్వీకరించి భజించారు.

శ్రీకృష్ణార్పణమస్తు

శ్రీ మహాభాగవతము ఏకాదశస్కంధము

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం

జ్యోతిషశాస్త్రము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Bhrugumaharshi Trimurtula Prasasyambu Sodhinchutaku Bovuta - భృగుమహర్షి త్రిమూర్తుల ప్రాశస్యంబు శోధించుటకు బోవుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం -
భృగుమహర్షి త్రిమూర్తుల ప్రాశస్యంబు శోధించుటకు బోవుట

సమస్త సంభారాలతో అనేకాలైన చక్కటి యాగాలు సరస్వతీ నదీతీరంలో చేస్తున్న మునులు ఒకనాడు త్రిమూర్తులలో ఎవ్వరు శ్రేష్ఠులు అని తర్కించుకొన్నారు.

తాపసులు, తర్కించుకొని, త్రిమూర్తులలో ఎవరుగొప్పో నిర్ణయించుకొని రమ్మని; భృగుమహర్షికి బాధ్యత అప్పచెప్పగా అతడు బయలుదేరి, ముందట

భృగువు బ్రహ్మసభలో ప్రవేశించి, అతని సాత్విక ప్రవృత్తిని పరీక్షింపదలచి, నమస్కరించక అవిధేయతతో నిలబడగా, బ్రహ్మకు కోపంవచ్చి రుసరుసలాడుతూ

తనకు నమస్కరించలేదన్న కోపంతో బ్రహ్మ తన మనస్సులో కోపించి, భృగువు తన కొడుకు కావడంవల్ల కోపాన్ని మెల్లగా శాంతింపచేసికొన్నాడు.

భృగుమహర్షి బ్రహ్మలోకంనుండి బయలుదేరి, శివుణ్ణి చూడటానికి కైలాసానికి వెళ్లాడు. అక్కడ శివుడు, పార్వతీదేవితో బాటు విశ్రాంతిగా కూర్చుని ఉన్నాడు. బ్రహ్మకుమారుడైన భృగువురాకకు చాలా సంతోషిస్తూ, సోదరభావంతో తనను కౌగిలించుకొంటాడని వేగంగా అతని వద్దకు వెళ్లగా, అతని సాత్త్వికలక్షణం పరీక్షించాలనుకున్న భృగువు

శివుడు ఆత్రంగా ఎదురురాగా, భృగువు అతణ్ణి చూడనివానివలె ప్రవర్తించగా

ఆ అవమానాన్ని సహించని ఫాలాక్షుడు, భృగువును చూచి, ప్రళయకాలరుద్రుడై, కళ్లనుండి నిప్పులురాలగా, శూలంతీసి, అతని వక్షస్థలం పై పొడువ బోయాడు. ప్రమాదం పసిగట్టిన పార్వతీదేవి భృగువుకు హఠాత్తుగా అడ్డంవచ్చి

పార్వతీదేవి తన భర్త అయిన శివుని పాదాలపైబడి, ఆప్యాయతలతో ఊరడించి, శాంతపరిచింది. వెంటనే భృగువు అక్కడనుండి వెళ్లిపోయాడు.

భృగువు అందమైన వైకుంఠపురానికి వెళ్లి, శేషతల్పంలో లక్ష్మీసమేతుడై, కౌస్తుభమణిహారం వక్షఃస్థలంపై ధరించి, విశ్రాంతుడైన విష్ణువు వద్దకు వెళ్లి అవమానం జరుపదలచి, తనపాదంతో వక్షంపై తన్నినాడు. విష్ణువు వెంటనే మంచంనుండి లేచివచ్చి, భృగువు పాదాలకు నమస్కరించినాడు. మీరు వచ్చింది గమనించక మిమ్ము ఆహ్వానించలేదు. నన్ను దయతో అనుగ్రహించి, ఈ స్వర్ణ మణిమయ సింహాసనంపై కూర్చోండి” అని వినయంతో విష్ణువు ప్రార్థించినాడు.

మహానుభావా! నీ పాదజలాలు, నన్ను, నాకుక్షిలో ఉన్న చతుర్దశభువనాలను, లోకపాలకులనూ పవిత్రుల్ని చేస్తాయి.

"ముని శ్రేష్ఠుడైన భృగూ! మీ పాదాలతాకిడి నా వక్షఃస్థలానికి ఆభరణం సుమా! మావంటివారికి మీరాక శుభకరం. నేను ధన్యుణ్ణి అయ్యాను అని తియ్యగా సాత్త్వికగుణయుక్తంగా బుజ్జగింపుమాటలు పలుకగా, మహర్షి విష్ణునిమాటలకు ఎంతో ఆనందించి, ఆ భగవంతుని కల్యాణగుణాలను ప్రశంసించి ఆనందబాష్పాలతో మరేమీ మాట్లాడ కుండా; వీడ్కొని, సరస్వతీనదీ తీరంలోని మునుల దగ్గరకుపోయి వాళ్లను చూచి

తనను పంపించిన మునులతో, తన ప్రయాణాన్ని తనతో త్రిమూర్తులు ప్రవర్తించిన విధానాన్ని వారి స్వభావాల్నీ తెలియజేయగా, ఈ వృత్తాంతాన్ని విని, మునులు ఆశ్చర్యాన్ని పొందారు. వారు తమ మనస్సుల్లో సందేహాన్ని తొలగించుకొని, "అఖీల శుభంకరుడు, శాశ్వతుడైన విష్ణువు ఒక్కడే పరమదైవం” అని నిశ్చయించుకొని అతణ్ణి కొలిచి, అతని అనుగ్రహంతో వైకుంఠాన్ని పొందారు. అని ఇంకా శుకుడిలా అన్నాడు.

శ్రీకృష్ణుడు మృతులయిన విప్రసుతుల దెచ్చుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం

జ్యోతిషశాస్త్రము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Sivadrohambu Seyambunina Vrukasurundu Vishnumayache Madiyuta - శివద్రోహంబు సేయంబూనిన వృకాసురుండు విష్ణుమాయచే మడియుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం -
శివద్రోహంబు సేయంబూనిన వృకాసురుండు విష్ణుమాయచే మడియుట

శకుని అనే పేరుగల రాక్షసునికొడుకు వృకాసురుడు సజ్జనసంతాపకారియై, చాలా ఉపాయంగా, దాగి ఉండి; ఒకనాడు నారద మహర్షి కనబడగా

వృకుడు చేతులు మోడ్చి నారదునితో “ఓ మునీశ్వరా! వివేకివైన నీవు నా మీద దయతో చెప్పవయ్యా! బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో, శ్రద్ధగా పూజిస్తే ఈ త్రిమూర్తుల్లో ఎవరు శీఘ్రంగా భక్తులకు కోరినకోర్కెలు తీరుస్తారని వృకుడు అడుగగా నారదుడు సంతోషంగా ఇలా అన్నాడు.

నారదుడు - "తన భక్తులలో దుర్గుణమైనా సుగుణమైనా, కనబడితే అదే నిమిషంలో నిగ్రహం, అనుగ్రహం (దుర్గుణములకు కోపము, సుగుణములకు అనుగ్రహం) తో స్పందించే వాడు త్రిమూర్తులలో శివుడొక్కడే. ఫాలలోచనుని అనుగ్రహం కోరి, బాణాసుర, రావణాసురాది రాక్షసులు సామ్రాజ్యవైభవాలు ఆయన అనుగ్రహంతో పొందినారు. కాబట్టి, నువ్వు ఆయనను ఆరాధించు. నీ కోరిక వేగంగా ఈడేరుతుంది” అని చెప్పినాడు.

కేదారతీర్థమని ప్రసిద్ధిగల తీర్థానికి వెళ్లి, సర్వజనులు భయపడేంత తీవ్రంగా, శివుణ్ణిగూర్చి (కేదారనాథునిగూర్చి) తపస్సు చేశాడు. యజ్ఞంచేసి హోమగుండంలో తనశరీరాన్ని కోసుకొని మాంసపు కండలను హవిస్సుగాచేసి వేల్పినాడు. శివుడప్పటికీ ప్రత్యక్షం కాకపోవడంతో, ఏడవరోజు కేదారతీర్థంలో స్నానంచేసి శుచియై, బయటకువచ్చి మృత్యుదేవత కోరలాగా ఉండే భీకరమైన గండ్రగొడ్డలి తీసుకొని, తన తల నరికికొని హవిస్సుగా వేయడానికి సిద్ధపడగా, వెంటనే ఆ అగ్నిగుండంనుండి (శివుడు ప్రత్యక్షమైనాడు)

అగ్నికుండంలోంచి శివుడు ప్రత్యక్షమై, వృకుణ్ణి అనుగ్రహించదలచి, ఎంతోదయతో, వానిచేతిని పట్టుకొని, తలఖండించుకోకుండా ఆపి, 'అంత సాహసం వద్దు. నీ భక్తికి మెచ్చాను' అన్నాడు.

నీ మనసులో ఎలాంటి కోర్కెలున్నా సరే, కోరుకో! వెంటనే ఇవ్వగలను అని శివుడనగా వృకాసురుడు సంతోషపడి, శివుని పాదాలకు (నమస్కరించినాడు)

వృకుడు శివునిపాదములకు నమస్కరించి, “స్వామీ! నా అరచేయి ఎవని నెత్తిమీద పెడితే వాడితల నూరువ్రక్కలై చావాలి అని వరమిమ్మన్నాడు.

వృకుడు కోరిన ఆ వింతకోర్కెకు నవ్వి, శివుడు వెంటనే అనుగ్రహించినాడు. శివుడిచ్చిన వరంయొక్క ప్రభావాన్ని పరీక్షింపదలచి

వృకుడు సాహసంతో వరమిచ్చిన శివుని తలమీదే చెయ్యిపెట్టి పరీక్షించేందుకు ముందుకురాగా, నా వరాలు నాకే చుట్టుకుంటున్నాయని అయ్యో అని జడిసి ప్రాణభీతితో శివుడు

వృకాసురుడు శివునితలపై చేయిపెట్టెందుకు రాగా, శివుడు భయంతో పారిపోగా, ముల్లోకవాసులు భయంతో పారిపోయారు. వర ప్రభావానికి మారు ఉపాయంలేక, ఏమితోచని దేవతలు భయపడ్డారు.

ఆ విధంగా శివుని నెత్తిపై చేయిపెట్టదలచి, వృకుడు, అతనికి అందకుండా శివుడు పరుగెత్తి

ఆనందస్వరూపం, లోకాతీతమైన స్థానం, సూర్యచంద్రకాంతులకు అందనిదీ, స్వయంప్రకాశకమూ, శుద్ధసత్త్వగుణానికి ప్రతిరూపంగా ప్రకాశించింది, యోగీంద్రులకు గమ్యస్థానమైందీ, హరిపదదాసులకు నివాసమైందీ, మణులు తాపడం చేసిన బంగారు భవనాలు, మంటపాలు, తోరణాలు, స్తంభాలు, గోపురాలతో ప్రకాశించే విష్ణుస్థానమైన వైకుంఠనగరాన్ని చూచాడు

శివుడు వైకుంఠానికి వెళ్ళాడు. ఆ సమయంలో విష్ణువు అఖండమైన వైభవంతో శేషతల్పంపై పడుకొని, లక్ష్మీదేవిని చిరునవ్వులతో పలకరిస్తూ, భక్తులను ఆదరిస్తూ ఉన్నాడు. ఆలోచించకుండా ఇచ్చిన వరంవల్ల శివుని తలపైకి వచ్చిన కష్టాన్ని దివ్యదృష్టితో తెలుసుకొని ఆ కష్టాన్ని తొలగింపదలచాడు. లక్ష్మీదేవితోడి వినోదాలను ఆపాడు. ఆ సమయంలో

విష్ణువు చిన్నవటువు వేషాన్ని అపుడు చాలాచతురంగా ధరించినాడు. చీకటిచెట్టుకాంతివంటి కాంతిగలమేనితో; బంగారు మొలతాడు; పట్టుగొడుగు; తెల్లని జంజెము, దండము, కమండలము, పసుపు నీళ్లలో ముంచి తడి ఆరిన గోచిపాత, చిన్నపట్టెనామము, చంకలో జింకతోలు, కదిలే సిగ, వ్రేళ్లుమారుస్తున్న జపమాల, భస్మపుబొట్టు, వేలికి దర్భపవిత్రలు, అగ్నివలె తేజరిల్లే దేహం ధరించాడు. ఈ రూపంతో వచ్చి వృకాసురుణ్ణి సమీపించాడు.

విష్ణువు కపటంతో నమస్కరించి తియ్యటిమాటలతో వృకాసురుణ్ణి బుజ్జగిస్తున్నట్లు మాట్లాడినాడు. "అలసిపోతూ ఇంత దూరం ఎందుకు వచ్చావు? అన్ని సుఖాలకు ఆశయమైన శరీరాన్ని ఊరికే ఎందుకు నొప్పిస్తావు? కొంతసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకో. నీ కష్టానికి కారణమేమిటి? నీకిష్టమైతే నీ లక్ష్యమేమిటో వివరించు. చెప్పతగినదయితే చెప్పు" అని అమృతమయంగా కపటవటువు మాట్లాడగా, వృకాసురుడు సంతోషించి, తన ప్రయత్నాన్ని తెలుపగా

హరి వృకాసురునితో ఇలా అన్నాడు. "శివుడు దక్షుని శాపంవల్ల పిశాచగణానికి అధిపతియైనాడు. సత్యనిష్ఠ లేదు. బొంకులు పలుకుతాడు. అతని వరం(మాటలు) నమ్మి అతణ్ణి అనుసరిస్తూ ఇంత శ్రమకోర్చివచ్చావు. అతని ప్రవర్తన మాకు వింతకాదు."

పరమేశ్వరుడు నిజమే పలికిఉంటే నీ చేయి అతని శిరస్సుమీద పెట్టనివ్వకుండా ఎందుకు పారిపోతాడు? అతణ్జి నమ్మవలెనని ఏముంది?(నమ్మ వలసిన అవసరం లేదని భావం)

నీవు శుచిలేక శివుణ్ణి తాకరాదు. కాళ్లు చేతులు కడుక్కొని, ఆచమించి, అతణ్ణి వెంబడించి తాకవయ్యా! అని విష్ణువు కపటవటువురూపంలో చెప్పినాడు.

లేనిపోని అనుమానాలు పెట్టుకోవద్దని చెప్పగా విష్ణమాయచే విచక్షణ జ్ఞానాన్ని పోగొట్టుకొని, తమోగుణంతో ఒప్పి, తన చేయి తన తలపైననే పెట్టుకొని వజ్రాయుధం దెబ్బకు నేలకూలిన పర్వతంలాగా, కూలిపోయాడు.

ఆ విధంగా విష్ణమాయతో వృకుడు శివునిసంగతి విడిచి, యథాలాపంగా తనచేయి తన తలపైనే పెట్టుకొని నూరుముక్కలుగా పగిలి మరణించాడు.

ఈ రాక్షస సంహారానికి దేవతలంతా విష్ణువుపై పుష్పవర్షం కురిపించారు. ఆకాశంలో దేవదుందుభులు మోగించారు.

సచ్చరిత్రుడవైన ఓ ధర్మజా! రాక్షసుని చావుతో ఆనందించిన గంధర్వులు పాటలు పాడారు. అప్సరసలు, నాట్యమాడారు. సూర్యాది గ్రహాలు సంతోషంతో కూడినారు. మునులు తమహోమాది అగ్ని కార్యాలకు ఇక విఘాతం లేదని భయం వదలారు.

మురహరుడు పురహరుణ్ణి చూచి, “శివా! నీకు కీడు తలపెట్టదలచిన ఈ వృకుడు తానే స్వయంగా మరణించాడు. అని చెప్పాడు.

విష్ణువు “అలా జరుగవల్సిందే గదా! లోకంలో ఉత్తములకు అపకారం చేసినవారికి శుభం ఎలా కల్గుతుంది? అంతేకాదు - జగద్గురువువైన శివా! నీకు కీడు తలపెట్టినవాడు చావక తప్పదు. ఇలాంటి దుర్మార్గులకు ప్రమాదకరమైన వరాలు ఇవ్వడం మంచిదికాదు - అని పలికి శివునికి వీడ్కోలు చెప్పాడు. శివుడుకూడా తనను గండంనుండి తప్పించినందుకు విష్ణువును పలురీతులుగ పొగడి కైలాసానికి వెళ్లిపోయాడు అని కృష్ణుడు చెప్పిన విధంగా శుకుడు పరీక్షిత్తుకు చెప్పి; ఇంకా ఇలా అన్నాడు.

శుకుడు పరీక్షిత్తుతో “ఓ రాజా! ఈ కథ ఎవరు చదివినా, విన్నా, గొప్ప పుణ్యం సంపాదించి, సౌఖ్యాన్ని ఆనందాన్ని ఎల్లవేళల పొందడమేగాక, అంతిమంగా మోక్షాన్నీ పొందుతారు” అన్నాడు.

ఈ విధంగా ప్రవచించిన శుకుడు పరీక్షిత్తుకు ఇంకా ఇలా అన్నాడు.

శుకుడు పరీక్షిత్తుతో “రాజా! నీ కొక పురాతనకథ చెపుతాను. మహానుభావులైన మునీంద్రులు పూర్వం సరస్వతీ నదీతటంలో నివసిస్తూ

భృగుమహర్షి త్రిమూర్తుల ప్రాశస్యంబు శోధించుటకు బోవుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం

జ్యోతిషశాస్త్రము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Parikshittunaku Shukayogi Vishnu Seva Prasasthyambu Sepputa - పరీక్షిత్తునకు శుకయోగి విష్ణు సేవా ప్రాశస్త్యంబు సెప్పుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
పరీక్షిత్తునకు శుకయోగి విష్ణు సేవా ప్రాశస్త్యంబు సెప్పుట

ఓ మునిశ్రేష్ఠుడా! శివారాధకులు సదా సకలైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో ఉంటారు. విష్ణువును కొలిచేవారు ఎల్లపుడు బీదవారై ఉంటారు. దీనికి కారణమేమిటో తెలుపమని పరీక్షిత్తు కోరినాడు.

మహారాజా! నీవడిగిన ప్రశ్నకు వివరంగా సమాధానం చెపుతాను. శివుడు శక్తిమంతుడు. త్రిగుణాన్వితుడు. రాగాధీనుడు(వీతరాగుడు కాడు). కనుక సంపదల్ని అతణ్ణి కొలిచేవారికి అనుగ్రహిస్తాడు. విష్ణువేమో అనంతుడు, గుణాతీతుడు, అనఘుడు, ఆదిపురుషుడు. అతణ్ణి సేవించువారు అతనివలెనే రాగాదివ్యక్తులుకాక వీతరాగులు. అట్టివారే పురుషోత్తముని సేవిస్తారు. వారికి ద్రవ్యసుఖాలు అక్కరలేదు. ధర్మనందనుడు యాగంచేసి, ప్రియంగా కథలు వింటున్నప్పుడు

ఓ పరీక్షిన్మహారాజా! నీవు నన్ను నిండు భక్తితో ఎలా ప్రశ్నించావో అదేరీతిగా ధర్మరాజు శ్రీకృష్ణుని ప్రశ్నించగా, కృష్ణుడు చిరునవ్వుతో ఇలా పలికాడు.

ఓ ధర్మరాజా! ఎవ్వరిమీద నాకు అనుగ్రహం కలుగుతుందో అతని సంపదలన్ని హరించి నిర్ధనుణ్ణి చేస్తాను. అపుడు బంధుమిత్రాదులు అతనికి దూరమై, దుఃఖితుడై సమస్తకార్యాలు వదిలి, నాభక్తులతో స్నేహంచేసి జ్ఞానియై, ఆనందపదవి పొంది, సారూప్యముక్తిని పొందుతాడు. అందుకే కష్టాలు, బీదరికం ఉంటాయని జనులు నా సేవ వదిలి, ఇతరదేవతలను సేవిస్తారు.

(సంపదలు కలవారు భోగభాగ్యాలు అనుభవిస్తూ భగవంతుణ్ణి స్మరించరు. కష్టాలు వచ్చినపుడే భగవంతుడు జ్ఞాపకం వస్తాడు. ధనికుడు ధనంతో భోగాలేకాక ధనవృద్ధికోసంచేసే పనులతో వ్యగ్రుడై భగవన్నామం మరుస్తాడు. ఇది భగవంతుని సందేశం. అందుకే తాను తనభక్తులు బీదవారిగా ఉన్నా ఇష్టపడతాడు. భక్తి నిరతికొరకు సంపదలు తొలగిస్తాడని భగవంతునిలీలలో అది ఒకటని తాత్పర్యం.)

నన్ను వదలి, ఇతర దేవతలను కొలిచి, వారిచ్చే సంపదలను నిజమని భావించి ఆ దేవతల్ని మరచిపోయారు. మరచి పోయే(కృతఘ్నత) పనియు తమ నిత్యకృత్యంగా

మెలగుతూ ఉంటారు; ఇందుకు సంబంధించిన ఒక ఇతిహాసాన్ని నీకు చెప్తాను. దానితో నీవడిగిన ప్రశ్నకు తగిన సమాధానం లభిస్తుంది.

శివద్రోహంబు సేయంబూనిన వృకాసురుండు విష్ణుమాయచే మడియుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం

జ్యోతిషశాస్త్రము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Saturday, August 29, 2026

Sruti Geethalu - శ్రుతి గీతలు

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - శ్రుతి గీతలు

జనక శ్రుతదేవులకథ ముగించిన శుకునితో శ్రోత అయిన పరీక్షిత్తు మళ్లీ ప్రశ్నించాడు. “అయ్యా! ఘటపటాది వస్తు జాతానికి ఎలా ఉంటాయో అలా బ్రహ్మతత్త్వానికి సత్త్వరజస్తమోగుణాలు, రూపం, కార్యకారణబంధం ఉండదుగదా! అలాంటి వస్తుజాతతత్త్వాన్ని వర్ణించే స
త్త్వాదిగుణాలకు లోబడిన వేదాలు భగవత్తత్వాన్ని ఎలా నిర్వచించగలవు?” ఈ సందేహాన్ని నివృత్తి చేయుము అన్నాడు. 

అపుడు పరీక్షిత్తుతో శుకుడు ఇలా చెప్పాడు. "చేతనపదార్దాలు, చైతన్యరహిత వస్తువులు అన్నిటిలో ఉన్న ఈశ్వరుడు 'సర్వ' అనే శబ్దంతో సంబోధించబడతాడు. అన్ని ప్రాణుల్లో ప్రాణాలు, ఆత్మ, శరీరం, వాటి అంగాలు, హృదయం, మనస్సు వీటిల్ని సృష్టించి జీవులకు జ్ఞానాన్ని ఇచ్చేవాడు భగవంతుడు. 

కాబట్టి, వేదాలు భగవంతుని రూపగుణవైభవాల్ని ప్రతిపాదించేవే. అవి ముఖ్యసాధనాలు. వేదాల్లో భగవంతుణ్ణి వర్ణించే స్తోత్రాలన్నీ ఉపనిషత్తులంత గొప్పవి. వీటిని ఋషుల పరంపరచే పొంది ఎవడు శ్రద్ధాసక్తులతో అనుసంధించుకొనునో వానికి మోక్షం తథ్యం. 

నారాయణునిపేరుమీదుగాగల ఒక ఉపాఖ్యానం ఈ విధానాన్ని వివరిస్తుంది. భగవద్భక్తుడైన నారదుడు ఒకనాడు కలాపగ్రామంలోని నారాయణాశ్రమానికి వెళ్లి, ఋషులతో ఉన్న నారాయణుడనే ఋషిని, నువ్వు నన్ను అడిగినట్టే అడిగినాడు. ఆయన గతంలో ఇలాగే శ్వేతద్వీపవాసులైన సనకసనందనాదులు అడిగిన ఇదే సందేహానికి సనందనుడు చెప్పిన జవాబును నీకు (నారదునికి) తెలుపుతాను. అని చెప్పసాగాడు. 

ఒక చక్రవర్తి నిద్రించినపుడు అతని గుణగణాలు, శౌర్యము, దక్షతలను వందిమాగధులు ఎలా స్తోత్రం చేస్తారో అలాగే యోగనిద్రా పరవశుడైన భగవంతుణ్ణి, వేదాలు స్తోత్రంచేస్తున్నాయి. ఈ స్తోత్ర భాగాలైన వేదాలు అలాంటి సత్యాన్ని ప్రవచిస్తున్నాయి. అని నారదునికి చెప్పినాడు. 

ఆ 'నారాయణాఖ్యమైనగాథను' నారదునికి చెప్పిన దాన్ని విస్తారంగా శ్రుతిగీతాల రూపంలో శుకుడు మళ్ళీ చెప్పసాగాడు.

ఓ విష్ణూ! నీకు జయం. జయం. అన్ని జంతువులకు జ్ఞానం నీవల్లనే కలుగుతోంది. కనుక ఆ జ్ఞానంతో వారుచేసే దోషాల్ని సుగుణాలుగా భావించి, షడ్గుణపరిపూర్ణుల్నిచేసి, ఆత్మలలో తిరుగాడుతూ, కార్యమూ కారణమూ నీవే అయి ప్రవర్తిస్తున్న నీయందే వేదాలు ప్రవర్తిస్తాయి. సత్త్వరజస్తమోగుణాలతో కూడిన స్వభావంనుండి మాకున్న బంధం తెంపు. యోగుల హృదయాల్లో నిరంతరం ఉండేవాడా! నీకు జయం.

అంతేగాక, యోగులు ఈ భౌతిక సృష్టిని, దీనిలోని ప్రతివస్తువును బ్రహ్మస్వరూపంగానే భావిస్తారు. ప్రళయకాలంలో సర్వప్రకృతీ నశించినా నీవొక్కడవే మిగిలిపోతావు. సృష్టి, లయాలలో ఈ సర్వప్రపంచం నీలోనే పుటుతూంది. కుండలు మొ॥ మట్టితో చేసిన వస్తువులు - మట్టిలోనే కలిసినట్లు బుద్ధి వాక్‌ కర్మలు నీలోనే లీనమవుతున్నాయి.

జ్ఞానులు భూమి పైపుట్టి జీవితంలో 'అనివార్యమైన కర్మలు' చేస్తూ, తద్ద్వారా పాపాదులు, ఆపై తిరిగి జన్మలు ఎత్తడం కాక, నీపై శ్రద్ధపెట్టి సేవిస్తూ కృతార్థులు అవుతూరు.

పురాణపురుషా! కాల, లయాదిక స్వరూపమైన ఈ సృష్టిలోని ప్రాపంచికులు, సర్వపాపవినాశకరమైన నీ అమృత కథలతో తరిస్తూ

నిండు వేసవిఎండకు తీవ్రంగా మాడుతున్న బాటసారి ఒక్కసారి చల్లనినీటిస్నానంచేస్తే ఎలా ఆనందిస్తాడో, సంసారమనే తాపాన్ని భరించలేక నిన్ను సేవించే మహానుభావులు దాన్ని పోగొట్టుకుంటారు. ఇక ముసలితనం, మరణం, మనోవాంఛలు వీటినుండి నీ భక్తులు విముక్తులు అవుతారని ప్రత్యేకించి చెప్పేపనేముంది?

అంతేగాక, దేహి శాశ్వతం, దేహం అశాశ్వతం (దేహి = జీవుడు, దేహం = శరీరం)అనే అంశాలతో కూడిన పంచకోశాలు అభివృద్ది చెందుతాయి; అందులోని పంచమకోశం అయిన ఆనందమయుడివి నీవే! నీవు స్వయం ప్రకాశకుడవు. నీవు అధీనంలో ఉంచుకోవడంవల్లే ప్రకృతి, మహత్తు, అహంకారరూప ఆత్మ, పంచతన్మాత్రలు, పంచభూతాలు, వాటి తత్త్వంతో కూడిన సృష్టిలక్షణాలు, విశ్వకార్యాలు, తత్‌సాధన కారణాలు అన్నీ సర్వసమర్థంగా, నియమబద్ధంగా జరుగుతున్నాయి.

(పంచకోశవ్యవస్థ: 1. అన్నమయకోశం 2. ప్రాణమయకోశం 3. మనోమయకోశం 4. విజానమయకోశం 5. ఆనందమయకోశం. ఇందులో మొదటిది ప్రాథమికం. అట్టడుగుపొర, దానిమీదిపొర ప్రాణమయం, దానిపై పొర మనోమయం. దానిపై ఉన్నది విజ్ఞానమయం. అన్నిటికన్న పైన ఉన్నతస్థానంలో ఉండేది ఆనందమయకోశం. ఒక త్రికోణాకారంగా ఈ పంచకోశాలను సంభావిస్తే త్రికోణంలోని శిఖరాగ్రభాగమే ఆనందమయకోశం. తిరుమల శ్రీవారి దేవాలయంలో స్వామి గర్భగుడిపైగల విమానం పేరు 'ఆనందనిలయ విమానం'. ఇదే ఏడవ కొండపై స్వామి గర్భగ్భహంలో నిలబడిన అధిష్టానం, మూలవిరాట్‌ విగ్రహం. స్వామి ఆనందమయుడని దీని అంతరార్థం!)

ధీరజనులని పేరొందిన కొందరు శరీరధారులు నిన్ను సేవించి, ఇహపరసౌాఖ్యాలు పొందుతారు. (వీరుడు వేరు. ధీరుడు వేరు. వీరుడంటే యుద్ధవీరుడు. ధీరులంటే నిశ్చయాత్మమైన బుద్ది శక్తితో ప్రకాశించే, ఆధ్యాత్మికసాధకులు. వీరు సాధన చేస్తూ పోగా ఒకనాటికి ధీరజనోత్తములవుతారు.).

భగవంతుణ్ణి సేవింపనేరని దుష్టులు తమదేహాల్ని ఉచ్చ్వాసనిశ్శ్వాసాలతో నింపుతూ, తోలుతిత్తులై మారి తిరుగుతూ, దేహాన్నే ప్రేమిస్తూ, అదే తమ జీవిత సర్వస్వంగా భావిస్తుంటారు.

దేవా! సూక్ష్మదర్శనులైన మహానుభావులు కొందరు నిన్ను జఠరాగ్ని స్వరూపుడివి అని భావిస్తారు. ఆరుణులనే ఋషులు నిన్ను సుషుమ్ననాడీద్వారంలో సంచరిస్తూ హృదయస్థ సూక్ష్మరూపిగా నిన్ను భావిస్తారు. హృదయపద్మంనుండి వెడలి, బ్రహ్మరంధ్రానిచేరి పరమకాంతిరూపుడిగా నిన్ను ధ్యానించి నీలో లీనమై మోక్షంపొంది, జన్మరహితులు అవుతారు. 

(ఉదరస్థుడైనవహ్ని - వహ్ని అండే అగ్ని. ఇది వైదికమైన త్రేతాగ్నులకంటే వేరైంది. ఉదరస్థమైన అగ్ని - జఠరాగ్ని (వైశ్వానరాగ్ని)

ఈ 'జఠరాగ్ని'యే మానవులు తినే వివిధాలైన ఆహారపదార్థాలను జీర్ణంచేసి శరీరానికి శక్తినిచ్చేవిధంగా పనిచేసే అగ్ని. ఆకలికావడానికి కూడా ఈ అగ్నియే మూలకారణం. జఠరాగ్నికే 'వైశ్వానరాగ్ని' అని కూడా పేరు. సృష్టిలో ప్రతి ప్రాణి ఉదరంలో జఠరాగ్నిరూపంగా ఉండేవాడే 'వైశ్వానరాగ్ని'.)

దేవా! కట్టెల్లో ఉండే అంతర్గతుడైన అగ్నిదేవుడు, కర్రలలోని దోషాలకు అతీతంతా పరిశుద్ధంగా ఎలా ఉంటాడో అలా నీ సంకల్పంచేత సృష్టించబడ్డ ఈ జీవరాశుల్లో వాటి లోపాలతో సంబంధంలేక అంతర్యామిగా (జీవాత్మల్లో) నెలకొని, వాటి వాటి జన్మాదికాల సమయంలో గర్భంలోని రోతల్ని అంటకుండా ఉంటూ, సకల జీవరాశి ఆత్మలపట్ల సముడవైన బ్రహ్మగా నిన్ను గుర్తించి, ఇహపరాల్లోని ఫలాలతో నిమిత్తంలేక రజోగుణ భిన్నులై ఉంటూ నిన్ను సేవించేవారు కొందరు. నీ సంకల్పానికి అధీనంగా ఉండే శరీరాల్లో జీవకోటిని నీ మహద్భూతాంశగా భావించి నీ చరణారవిందాల్ని కొలిచి జన్మమృత్యు బంధచక్రాన్ని తప్పించుకొని, కృతార్ణులయ్యేవారు మరికొందరు.

పరమాత్మా! నీ లక్షణము సులభంగా అర్ధంకాదు. అర్ధం కావడం కోసం రామ, కృష్ణాది అవతారాల్ని సేవిస్తుంటారు. ఆ అవతారగాథల కథామృతంలో ఓలలాడిన ప్రశాంత చిత్తులు వేరే మోక్షంకోరరు. మరికొందరు పుణ్యాత్ములైన యోగులు ఆచరించినట్టు నీ పాదపద్మాలపై మనసులగ్నంచేసి భక్తుల్ని ఆరాధిస్తారు గాని మోక్షం కోరరు.

(భగవత్కథామృతం, భాగవతులసేవనం మోక్షంకంటె శ్రేష్ఠాలని తాత్పర్యం.)

నిత్యుడవైన ఓ స్వామీ! ఈ భూమిపై కొందరు గొప్ప భక్తిచే తమదేహాలు నీకు అర్పణచేసి, నీ పాదాలు అర్చిస్తూ, పరమానందంతో జీవిస్తారు. మరికొందరుమాత్రం, నిన్ను పూజించక, వ్యర్థంగా జీవిస్తూ అనేక జన్మలు పొంది, అనేక దేహాలతో బాధలు అనుభవిస్తూ ఉంటారు.

జితేంద్రియులు, యోగులు ఐన ముని శ్రేష్ఠులూ; విరోధభావంతో నిత్యం స్మరించే శిశుపాలాది శత్రువులూ; పాముల పడగలవంటి లేత చేతులతో నిన్ను నిత్యం కాగిలించుకొసి ప్రేమలు కురిపించే గోపికలూ; మేమూ, అందరం నీ కృపకు పాత్రులమేగదా! (జపం, తపం, యోగం, భక్తి వైరం, ప్రేమ - ఏ రూపంలోలైనా నిన్ను ఆరాధిస్తే నీ కృప లభిస్తుంది.)

ఓ పద్మాక్షా! నీ సహజస్వరూపాన్ని ప్రత్యక్షంగా చూడడం ఎవ్వరికీ సాధ్యంకాదు. శాస్త్రాలు వివేచించి, విశ్లేషించి, సమన్వయించి నీ గుణగణ ప్రవర్తనాదుల్ని కొంత తెలిసేట్టుగా చేస్తున్నాయి. ఈ సృష్టి పుట్టకముందే నీవొక రూపాన్ని ధరించగా బ్రహ్మాది దేవతలందరూ అందుండి జన్మించారు. ఆ సృష్టికి పూర్వం నువ్వెలా ఉండేవాడివో, ఏ కొంతైనా నీ విశేష రూపరేఖావిలాసాదులేవో మేము ఊహించగలమా? మేము చ్యుతులం. నీవు చ్యుతిలేనివాడివి. నీ రూపస్థితి వాక్కులకూ, మనస్సుకూ అతీతమైనది. అది ఆత్మకుమాత్రమే గోచరిస్తూంది.

సకలచరాచర జగత్స్వరూపుడవైన నిన్ను అర్ధం చేసుకోక, ఈ సృష్టికి (నీవుకాక) పరమాణువులే కారణమని చెప్పే కణ్వ, గౌతమాది పరమాణు సిద్ధాంతకారులూ, ప్రకృతియే తనకుతానుగా పుట్టిందని, దానినుండే సృష్టి అంతా పుట్టిందనీ భావించే కపిలాది సాంఖ్యసిద్ధాంతకారులూ, దేహమేతప్ప పరమాత్మ, పరలోకాదులూ ఉండవనే బౌద్ధులూ మొదలైన వారు తప్పుడు వాదనలతో తమసిద్ధాంతాల్ని సమర్థించుకొంటూ, నిన్ను తెలియలేరు. అదృష్టవంతులైన యోగులుమాత్రమే నిన్ను దర్శించగల్గుతున్నారు. వారికినీవు ప్రత్యక్షం అవుతావు కనుక పైవారి సిద్ధాంతాలు అబద్దాలు అని తేలుతున్నాయి. సకల చరాచరవస్తుజాతంలో అంతర్యామిగా నీవు ఉన్నావని తెలియక కొన్ని శాశ్వతాలు, కొన్ని అశాశ్వతాలు అని విపదీత బుద్ధితో యోచించే కొందరు నీ దివ్యతత్త్వాన్ని అర్థంచేసుకోలేరు. జగత్తే శరీరంగా ఉండీ; నిన్ను గూర్చి - కడియాలు, కిరీటాలు, కుండలాలు అంటూ వివిధ రూపాలుగా ఉన్నాా వాటిలో అన్నిటా బంగారమే ఉన్నట్టు - నీవు కూడా జగత్తులోని ప్రాణులన్నిటిలో అవి హేయంగా ఉన్నాా శత్రుభావంతో ఉన్నా శుభంకరంగా ఉన్నా అన్నిటా నీవే ఉన్నావని భగవతత్త్వాన్ని తెలుసుకొన్న జ్ఞానులు అనుభవపూర్వకంగా గ్రహిస్తారు.

ఓ కృష్ణా! నీ పాదపద్మారాధనతో నిరంతర సేవకులైన భక్తులు మృత్యువును తిరస్కరించి, సంసారమహాసముద్రాన్ని దాటి, పవిత్రులై లోకాలన్నీ పవిత్రంచేసే ప్రవర్తనలతో నిత్యశోభనకరమైన మోక్షాన్ని పొందుతారు.

(మృత్యువును తిరస్కరించి, సంసారసాగరాన్ని దాటి, పవిత్ర జీవనంతో లోకాన్ని పునీతం చేస్తూ ఏకొందరో పుణ్యాత్ములు నిత్యశోభనమైన ముక్తిని గొప్ప వైభవంతో పొందుతున్నారట! వారు భగవత్పదయుగ నిరంతర సేవాసక్తులు! ఇటువంటివారే జీవన్ముక్తులు.)

నిన్ను తిరస్కరించి, పూజించని హీనమతులను - జంతువుల్ని తాళ్లతో బంధించినట్లు - భవబంధాలరూపంలో బంధించి, అనేక నామాలు, దేహాలు (జన్మలు) ఇచ్చి దాటశక్యంగాని సంసారసముద్రంలో పడవేస్తావు.

క్రియాకర్మాదులు, తదంగాలు లేకున్నా అశరీరుడవైనా నీవు స్వతంత్రమూర్తివి. బ్రహ్మాదులు నీ అధీనులు. చరాచరరూపాలకుగల ప్రాణికోటిని నీవు నియంత్రించే అధిపతివి. నీ దయగలవారికి ముక్తి కరతలామలకం. నీ దయలేనివారికి నరకాది దుర్గతులే! వారు వివిధ జాతులలో పుట్టి, అణురూపంలో దేహాల్లో ఉంటారు. వారిలోకూడా నీవు అంతరాత్మవై ఉంటావు.

(అంతరాత్మ : భగవంతుడు సర్వ ప్రాణికోటిలో ప్రవేశించి హృదయస్థానంలో కూర్చొని అన్నింటికీ సాక్షియై గమనిస్తుంటాడు.)

ఆలోచిస్తే - భూమ్మీద నీటిబుడగలు పుట్టి నశిస్తున్నట్టు తాత్కాలికజీవితాలుగా, దేవ మనుష్య తిర్యగాదిదేహాలు అంటిపెట్టుకొని ఉండే ఈ ఆత్మలన్నింటినీ

కృష్ణా! రాక్షససంహారీ! భక్తపారిజాతా! భవబంధవిమోచనా! కమలనాభా! ప్రాణికోటిలోని ఆత్మలన్నింటినీ తిరిగి నీవు ప్రళయకాలంలో నీలో లయింపచేసికొంటావు సృష్టి అంతటికీ నీవే కారణభూతుడవు.

ఓ పరమేశ్వరా! ఇంద్రియాల్ని జయించామని అనుకొంటూన్నా - స్ధిత ప్రజ్ఞులు కానంతవరకూ-మనస్సు కోరికలతో చలిస్తూనే ఉంటుంది. కనుక స్వతంత్రంగా తిరుగుతూండే గుర్రాన్ని నూలిత్రాడుతో బంధించడం - ఎలా సాధ్యంకాదో అట్లే ఈ చంచలమైన మనస్సును వివేకంతో బంధించి, అధీనంలోకి తెచ్చుకోవాలి, అలా తెచ్చుకోలేకపోతే - మోక్షసాధనకు సరైన ఉపాయం (మార్గం) లభించక మానసికంగా దుఃభిస్తూనే ఉంటారు.

“చపల స్వభావంతో ఉండేదీ, నిలుకడలేనిదీ, అయిన మనస్సు ఏయే విషయాలపై సంచరిస్తుందో ఆయాచోట్లనుండి దాన్ని మరలించి ఆత్మలోనే స్థాపితం చేయాలి. అంటే ఆత్మకు అధీనంగా చేయాలి” అన్నాడు గీతా ప్రవక్త.

పద్మాక్షా! నీవు పరిపూర్ణుడవై ఉండగా, శ్రేష్ఠములైన నీ పాదపద్మాల్ని కొలువనివారు, చోదకుడులేని పడవనెక్కిన వ్యాపారివలె భవసాగరంలో మునిగిపోతారు సుమా!

నా భార్య, నా కొడుకు, నా ఇల్లు, నా పొలం అంటూ వాటిమీద మమకారం పెంచుకొని, జీవించేవాడు ఈ భవసాగరంనుండి ఎన్నటికీ బయటకు రాలేడు.

శ్రేష్ఠులైన భాగవతులు (భక్తులు) అనేకాలైన పవిత్ర తీర్ధాలవలె సేవింపదగినవారు. వారి ఉనికి పవిత్ర తీర్ధరాజం. తమ పుణ్యప్రవర్తనలచే ఇతరులకు ఆదర్శమైనవారూ. ఈర్షాదులులేనివారూ, నిన్ను ఆరాధించి భవబంధాలు తొలగినవారూ, ప్రాణికోటిపట్ల సమబుద్ధి కల్గినవారూ, ప్రాప్తించింది అతిహీనమైనా (ఉముక అయినా) బంగారంవలె స్వీకరించి తృప్తిపడేవారూ, కోపతాపాలు లేనివారూ, తమ పాదజలాలు తీర్ధంగా గ్రహింపదగిన పుణ్యపాదులు. అటువంటి యోగివరులే సదాసేవ్యులు. వారిని సేవించినవారికి మోక్షపదవి లభిస్తుంది.

సత్యమైన ప్రకృతివలన పుట్టిన ఈ ప్రపంచం అంతా సత్యం కావాలి. బంగారంతో చేసిన ఆభరణాల్లో బంగారమే ఉంటుందిగదా! అని సాంఖ్యులు వాదిస్తారు. సృష్టించబడనిది సత్యం కాదు. వ్యతిరేకవ్యాప్తి నియమం ప్రకారం ఇది కుదరదు. నిత్యసత్యబ్రహ్మంలో తర్కం కుప్పకూలుతుంది. ప్రపంచం మిథ్య, సత్యంకాదని అద్వైతులు పైసాంఖ్యవాదాన్ని ఖండిన్తారు. ఈ జగత్తంతా బ్రహ్మవిరచితం అయితే కార్యకారణ సిద్ధాంతం ప్రకారం కారణుడైన భగవంతుడున్నపుడు, కార్యమైన జగత్తు ఉన్నట్టేకదా! అపుడు జగత్తు మిథ్య ఎలా అవుతుంది? అని తిరిగి సాంఖ్యులు ఖండిస్తారు. బహుగ్రంథప్రతిపాదితమైన జగన్మిథ్యావాదం అబద్ధం ఎలా అవుతుంది అని అద్వైతులు వాదిస్తారు. కర్మవశులైన జడులు అవిద్యవల్ల చెడ్డ వాదనలతో కుతర్కం సాయంతో అంధులు పరంపరగా స్వీకరించే అజ్ఞానంవలె ఒక గ్రంథంనుండి మరోగ్రంథానికి అద్వైతభావనను అందించుకుంటారు. అంతేగాని, పుస్తకాల్లో ఉందని జగన్మథ్య అనడం కుదరదని, సాంఖ్యులు మొదలైనవారు అద్వైతాన్ని ఖండిస్తారు.

కారణ రూపమైన భగవంతుని రచనగా ఈ సృష్టి సూక్ష్మరూపంలో ఉంటుంది. స్థూలంగా అంతా మిథ్యే. జగత్తు బాధాకారకం. (ముక్తి ఆనందకారకం,) కాబట్టి, ఓ భగవంతుడా! ఈ సృష్టి నీకు శేషభాగమే. జీవుల ఆత్మలలో అంతర్వామివైన నీకు దేహిచేసే కర్మలవల్ల లభించే పాపపుణ్యాలు అంటవు. వాటిని అనుభవించవలసిన దేహికి సాక్ష్యంగా మాత్రం నిలుస్తావు. అలాంటి నిన్ను ప్రాణులు జ్ఞానశూన్యులై గుర్తించలేరు. కంఠానికి అతికినట్టుండే ఆభరణంలోని మణి నిత్యం ప్రకాశిస్తున్నా అది మెడలో వేసుకున్నవాడికి కనపడనట్టు వారి హృదయపద్మాల్లో ప్రకాశించే నిన్ను వాళ్లు దర్శించలేరు. బ్రహ్మాండానికి అధినాయకుడవైన నిన్నే వేదార్థాలు వివరిస్తాయని శ్రుతులు మహావిష్ణువును అభినందించిన విధాన్ని సనందన ఋషి మహర్షులకు చెప్పాడని నారాయణుడనే ఋషి నారదునికి చెప్పాడు. నారదుడు వేదవ్యాసునికి దాన్ని చెప్పగా మాతండ్రి వ్యాసుడు నాకు చెప్పినదాన్ని పరీక్షిన్మహారాజా! నీకు చెప్పాను. ఇది వేద, శాస్త్ర పురాణేతిహాససారం. ఉపనిషత్తులతో సమానమైన రహస్యం. దీన్ని విన్నవారికీ, పఠించినవారికీ సకలశుభాలు కల్గుతాయని, పాపాలు నశిస్తాయనని శుకమహర్షి చెప్పాడు. అది విని పరీక్షిత్తు శుకునితో ఇలా అన్నాడు.

పరీక్షిత్తునకు శుకయోగి విష్ణు సేవా ప్రాశస్త్యంబు సెప్పుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం

జ్యోతిషశాస్త్రము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Parikshinmaharaju Shukayogindru Nadigedu Prashna - పరీక్షిన్మహారాజు శుకయోగీంద్రు నడిగెడు ప్రశ్న

శ్రీమహాభాగవతము ఏకాదశస్కంధము -  పరీక్షిన్మహారాజు శుకయోగీంద్రు నడిగెడు ప్రశ్న “అయ్యా! పుట్టుకకు కారణమైన కర్మ అనే రోగం తొలగిపోవడానికి కారణమైన ద...