పై విధంగా చెప్పిన శుకునితో పరీక్షిత్తు ఇలా అన్నాడు.
హరి బలిచక్రవర్తిని ఎందుకొరకు మూడడుగుల భూమిని యాచించినాడు? విష్ణువు పూర్ణపురుషుడు, పూర్ణకాముడు, నిర్వికారుడు, లక్ష్మీదేవితో కూడినవాడు. అటువంటివాడు బలిచక్రవర్తి వద్దకు దీనునివలె ఎందుకు పోయినాడు? తప్పేమీలేని నిష్కలుషుడైన బలిని ఎందుకు బంధించినాడు? ఈ కథ వినాలని కుతూహలంగా ఉంది.
(రమాసంపన్నుడైన విష్ణువు యాచకుడుగా వెళ్ళటం ఒక వింత. మూడడుగులనేలను యాచనచేసి పుచ్చుకొని దాత అయిన బలిని బంధించడంలో వంచన కనిపిస్తుంది. జగత్త్రయోన్నత న్యాయపీఠమైన విష్ణువు నిరపరాధిని దండించటం ఏమి? బలిచక్రవర్తి కథలో ఈ సందేహాలు జిజ్ఞాసువులకు తప్పక కలుగుతాయి. దీనికి సమాధానంగానే బలి- వామనమూర్తుల కథాగమనం జరుగుతుంది.)
పై విధంగా పలుకగా శుకముని ఈ విధంగా చెప్పాడు.
బలిచక్రవర్తి ఇంద్రునిచేతిలో ఓడిపోయి శుక్రాచార్యుని అనుగ్రహంచే తేరుకొన్నాడు. శుక్రునికి దయకలిగేటట్లు శిష్యుడై సేవించినాడు. బలి భక్తికి శుక్రుడు మెచ్చుకున్నాడు. బలిచేత నియమపూర్వకంగా విశ్వజిద్యాగాన్ని చేయించినాడు. బలిచక్రవర్తికి బంగారు పట్టముచే ఒప్పు రథమూ; సూర్యుని గుర్రాలతో సమానమగు గుర్రాలను, సింహపతాకాన్నీ దివ్యధనువునూ, అంబులపొదులజంటను, కవచమును మొదట హోమపావకుడిచ్చినాడు. తర్వాత తన తాతగారు ప్రహ్లాదుడు వాడిపోని తామరపూవులదండను, శుక్రుడు చంద్రునివంటి తెల్లని శంఖాన్ని ఇచ్చినారు.
ఈ విధంగా, బలిచక్రవర్తి బాణాలూ, రథమూ, ఖడ్గమూ, అంబులపాదీ, విల్లూ, పూలదండా, గుర్రమూ, కవచమూ, రత్నఖచితసువర్ణ కంకణాలూ సాధించినాడు.
బలిచక్రవర్తి బ్రాహ్మణులకు పలురకములైన దానాలిచ్చి, వారి ఆశీస్సులను పొందినాడు. పెద్దలకు నమస్కరించినాడు, విశిష్టదేవతలను నిండు భక్తితో పూజించినాడు. నిర్మలచరిత్రుడైన ప్రహ్లాదుని పిలిపించుకొని నమశిరస్కుడై నమస్కరించినాడు. దివ్యకాంతులతో తేజరిల్లు రథమునెక్కి పర్వతశిఖరముపై ప్రజ్వరిల్లుతున్న దావాగ్నివలె జాజ్వల్యమానుడైనాడు (ప్రకాశించాడు).
బలిచక్రవర్తితో సమానమైన బలముగల దైత్యసేనాధిపతులు ఆయనముందు వినమ్రులై నిలిచినారు. వారు మృత్యుదేవతయైన, యముడినే దండింపగల ఉద్దండులు. దేవతలూ, సిద్దులూ, సాధ్యులూ, గంధర్వులూ మొదలయినవారిని భంగపరచినవారు. దిక్కులను పిండిగొట్టగలిగినవారు.
పరీక్షిన్నరేంద్రా! బలిచక్రవర్తి తన చూపులతో ఆకాశాన్ని మింగుతూ, నింగినీ నేలనూ తలకిందులుగా చేయడానికి ప్రయత్నిస్తూ దేవతల రాజధానినగరానికి బయలుదేరినాడు.
ఈ విధంగా బలశాలియైన బలిచక్రవర్తి దేవేంద్రుని జయించి పగతీర్చు కోవటానికి వేగంగా దీర్ఘమైన ప్రయాణం సాగించి.
పుణ్యాత్ములు నివసించుటకు తగినది, వ్యాధులనూ, నీద్రనూ, బాధనూ, అన్నం తినటం మొదలయిన దుఃఖాలను బాపునదీ, పూలచేత చిగుళ్లచేత పండ్లచేత గొప్పవయిన చెట్లగుంపులచే ఒప్పునదీ, ఎగురుతున్న జెండాలుకలదీ, సంచరిస్తున్న విమానస్థులగుంపు కలదీ, ఇంద్ర వైభవము కలదీ అగు స్వర్గాన్ని చూచెను. అది దేవేంద్రుని రాజధాని - అమరావతి.
బలిచక్రవర్తి చాలా విశాలమైన దేవతలపట్టణాన్ని సమీపిస్తూ వేగంగా ముందుకు సాగినాడు. తొలుత పెద్దతోటలు కనిపించినాయి. ఆ తోటలలోని చెట్లు ఎప్పుడూ అందంగా పొటమరించే చిగుళ్లతో, రెమ్మలతో, మొగ్గలతో, అరవిచ్చిన విరులతో, విరబూసిన పూలగుత్తులతో, పిందెలతో, లేతకాయలతో, దోరగాయలతో, పండ్లగెలలతో నిండి బరువెక్కి వంగి ఉన్నాయి.
దట్టమయిన ఆ తోటలలో తుమ్మెదలగుంపుల జంటలు వదలక సొగసైన కొత్తపూలతో నిండి ఉన్న పూతేనియను కొసరి కొసరి తాగి బలసి కైపెక్కి జుంజుమ్మని సంతోషంతో విహారంచేస్తున్నాయి. కోయిలగుంపులు జంటబాయక కలసిమెలసి గున్నమామిడి చెట్ల కొమ్మలలో ముసరి సొంపుగా చిగురుటాకులు మెక్కి ఉత్సాహంతో గానం చేస్తున్నాయి. చిలుకల గుంపులు మత్తెక్కి త్వరపడుతూ పోరాడుతూ చెలరేగి నేర్పుతో తియ్యని పండ్లుతిని కలకలధ్వనులు సలుపుతున్నాయి. పావురాలు చిలుకలనుమించి ఆకసానికి ఎగురుతూ ఆడపావురాలను దగ్గరకు పిలుస్తూ అటూ ఇటూ పోనీయక అడ్డుకొంటూ తమ నెలవులపై వ్రాలి ఇంపుగా గుబాళిస్తున్నాయి.
రాజహంసలు అందమైన సరస్సులవద్ద ఉత్సాహంగా ఆడ హంసలతో కలిసి తమ వాడిముక్కులతో లేత తామరతూడులు చీల్చి తిని సంతోషంతో సవ్వడి చేస్తున్నాయి. అందమైన ఆ సరస్సులు హంసల కాంతికంటె అధికంగా మిలమిలమెరుస్తూ సిరికి నెలవులవంటి బంగారుతామరలతో విరాజిల్లుతున్నాయి. ఆ సరస్సుల అలలలో తడిసిపోయి వడవడ వణకుతూ అల్లిబిల్లిగా అల్లుకొని నేలవ్రాలిన దట్టమైన తీగల సందులలో జొరబడి ఇంపైన పూలవాసనలతో బరువెక్కి లోపలకు దూరలేక చల్లగాలులు చతికిలపడుతున్నాయి. ఆ గాలులతో కలిసి పై కెగిరిన పుప్పొడులు ఆకసంలో నిండి రంగురంగుల మేలుకట్టు చాందినీలను సృష్టిస్తున్నాయి.
పుప్పొడి రంగులతో కలిసిన కాలువల గట్లమీద ఇచ్చ వచ్చినట్లుగా పచ్చిక గుబురులు మేస్తూ మైమరచి నెమరువేస్తూ తమ పెద్దపొదుగులు కదలిస్తూ కామధేనువులు నడచి వస్తున్నాయి. వాటి దూడలు వాడవాడలలో చెంగుచెంగునదూకి ఆడుకుంటూ తల్లుల వెంట వెళ్లుతున్నాయి. కామధేనువులు దూడలతోకూడి ఇండ్ల వాకిండ్లు చేరి పౌరులు కోరినన్ని పాలు కురుస్తున్నాయి. కోరినవారి కోరికలు తీర్చే కల్పవృక్షాలు ఆ కామధేనువులకు నిలువ నీడనిస్తున్నాయి. ఆ కల్పవృక్షాల చిగుళ్ళనూ పూలగుత్తులనూ కోసి మదపుటేనుగులు ఆడఏనుగులకు ప్రేమతో ఇచ్చి సంతోషాన్ని కలుగజేస్తున్నాయి. ఆ మదపుటేనుగులు క్రీడాపర్వతాల సాగసుతో ఒప్పారుతున్నాయి. అవి పడుచులకు నడకలు నేర్పు ఒజ్జలై మురువుగా నడుస్తున్నాయి. ఆ ఏనుగుల శరీరాలు రాచుకోవడం వల్ల కరకుతనం పోయి నున్నబడుతున్న మకరతోరణ స్తంభాలు కనువిందు కలిగిస్తున్నాయి.
మకరతోరణాల స్తంభాల వద్ద రంభ మొదలయిన అప్సరసలు నిలబడి ఉన్నారు. వారు మన్మథుడు ఒరలోనుండి తీసిన పదునుకత్తులవలె మెరుస్తున్నారు, నిలుకడగల మెరుపుతీగలవలె ఉన్నారు. కాళ్ళూ చేతులూ మొదలయిన అవయవాలు కలిగిన నెలవంకవలె ఉన్నారు. రూపుదాల్చిన మోహినీ విద్యలవలె చూపులకు హాయి కలిగిస్తూ శృంగార రహస్యాలు తెలుసుకోవటంలో పేరుగాంచినవారై, విమానాలపై స్వర్గలోకానికి వచ్చే పుణ్యాత్ములకు త్వరగా ఎదురుపోయి కొందరిని సగౌరవంగా వాహనాలపై ఎత్తుకొని/మోసుకుంటూ మరి కొందరని తోడ్కొని పోతున్నారు.
ఆ నగరానికి చుట్టూ అందమైన అగడ్తలు ఉన్నాయి. ఆ అగడ్తల నీటిలో అంచలూ రాయంచలూ, చక్రవాకాలూ, బెగ్గురు పక్షులూ విహారం చేస్తుంటాయి. అందలి కలువలలోనూ, కమలాలలోనూ తుమ్మెదలు సంతోషంతో సంచరిస్తుంటాయి.
ఆ అగడ్తలు అడ్డులేని తరంగాలుగల గంగానది ఆకాశానికి పొంగినట్లు వెరగు కలిగిస్తుంటాయి దేవకన్యలు గుంపులు గుంపులుగాచేరి వాటిలోని తేటనీటిలో అందంగా హాయిగా జలకా లాడుకొంటుంటారు.
ఆ నగరం ముంగిలిలో భద్రమైన బంగారు తలుపులుగల పెద్దగోపురా లున్నాయి. ఆ గోపురాల గడపలను అక్కడి దేవవేశ్యలు పూజిస్తుంటారు. ఆ ద్వారాల ప్రక్కన అరుగులపైన రత్నకాంతులు వెదజల్లే ఇంద్రనీలాలస్తంభాలు ఉన్నాయి. ఆ నాలుగు ద్వారాలకూ పద్మరాగాల మాలలు వేలాడుతున్నాయి. ఆ ద్వారాల దగ్గర ఉన్న చావిళ్ళలో పరాక్రమ వంతులయిన ద్వారపాలకులు ఆయుధాలు ధరించి మెలకువతో కాపలాకాస్తున్నారు. వారు దేవదానవుల యుద్దాల ముచ్చటలు ముచ్చటించుకుంటుంటారు. అచ్చటి ఎత్తెన మెట్ల వరుసలు వీరరస సముద్రపు చెలియలికట్టల వంటి అచ్చమైన పాలరాళ్ళతో కట్టబడి ఉన్నాయి. అక్కడి కోటలు అత్యంత శోభాయమానమై వజ్రాలతోనూ వెండితోనూ నిర్మించబడి ఉన్నాయి. ఆ కోటల పైభాగాలు చంద్రుని కిరణాలు వెల్లివిరిసే తెల్లని అద్దాలవలె ఉన్నాయి. వాటికాంతులు చుక్కలను ధిక్కరిస్తుంటాయి. ఆ నగరలక్ష్మి ప్రాయంతో నిండిన యువతివలె మేఘాలను చూస్తూ బ్రహ్మను ప్రార్థించి సంపాదించిన బంగారు పరదాలవలె పెద్ద పెద్ద వెండి ప్రాకారాలు ప్రకాశవంతాలై ఉన్నాయి. ఆ ప్రాకారాలపై మరకతమణులతో నిర్మించిన బురుజులున్నాయి. కోట్ల కొలది గంధర్వ సైనికులు రణసన్నద్ధులై వాటిని కాపాడుతుంటారు. ఆ బురుజులపై ఎత్తైన వజ్రాల స్తంభాలున్నాయి. వాటిమీద శత్రువీరుల ప్రాణాలు తీసే ఫిరంగులు అమర్చబడి ఉన్నాయి. వాటికి ఇరువైపులా రథాల ఇరుసులు రాచుకొంటూ ఆరిపోని దీపాలవలె సూర్యచంద్ర మండలాలు ప్రాకాశిస్తుంటాయి.
ఆ నగరంలోని మేడలు ఆకాశా న్నంటుతుంటాయి. అందలి సుందరీమణులు చంద్రబింబాన్ని నిగ్గుటద్దంగా తలచి తొంగి చూస్తూ తమ నొసటిపైని వ్రేలాడే ముంగురులను సరిదిద్దుకొని తిలకాలను అలంకరించుకొంటుంటారు. అప్పుడు వారి వెనుక వైపుగా వచ్చిన వారి ప్రియుల ప్రతిబింబాలు కనిపించగానే తమ భర్తలు ఇతరస్త్రీలను వలచి వారికి వశులైనారని భ్రమించి తత్తరపాటుతో వెనుదిరిగి అంతలో ప్రతిబింబాలు మాసిపోగానే ఆ స్త్రీలు ఏకాంతంగా తమ ప్రియులకోసం నిరీక్షిస్తుంటారు. ముత్యాల హారాలతో కూడిన ఆ ముద్దుగుమ్మల గుబ్బచన్నుల సొగసుతో ప్రక్కల చుక్కలు మెరుస్తుండగా ఆ మేడల శిఖరాలను సింగారిస్తూ బంగారు కలశాలు ప్రకాశిస్తున్నాయి. ఆ మేడలలోపల బంగారు మయములైన పరుపులూ కిటికీలు ఉయ్యాలలూ మెట్లూ మొదలైనవి ఎంతో మనోహరంగా ప్రకాశిస్తున్నాయి.
ఆ మేడల బంగారు కిటికీల సందులగుండా కర్పూరమూ కుంకుమపువ్వూ సాంబ్రాణి సువాసనల పొగలు వస్తుంటాయి. ఆ పొగలను మేఘాలని భ్రమపడిన నెమళ్లు అనుకోకుండా తమకు పండుగ వచ్చిందని ఆనందంతో తమ రంగురంగుల పింఛాలు విప్పి చెట్లకొమ్మలపై నాట్యాలు చేస్తుంటాయి. అవి మన్మథుని శృంగారవిద్యలకు టీకల విధంగా కేకలు వేస్తుంటాయి. అప్పుడు నెమళ్ల పింఛాలను అల్లెత్రాళ్లుగానూ, వాటికేకలను ధనుష్టంకారాలుగానూ భావించి వెంటనే సూర్యుని పైకి ఉరికే రాహువువలె జెండాలు ఆకాశానికి ఎగురుతున్నాయి. జెండాలు గొడుగులూ తమ యుద్ధ లక్షణాలుగా అవక్రపరాక్రమంతో విజృంభించి పెద్దపులులవలె, ఏనుగులవలె, సింగాలవలె, శరభాలవలె, తోకచుక్కలవలె శత్రువులను లెక్కచేయకుండా కేకలు వేస్తూ గుములు గుములై వీరసైనిక సమూహాలు రాక్షసులతో ద్వంద్వయుద్దాలు చేయటం కోసం దుముకుతున్నారు.
ఖడ్గాలూ శూలాలూ మొదలయిన ఆయుధాలు తళతళమెరుస్తూ దిక్కుల చివరివరకూ వ్యాపించగా చక్రాల ధ్వనులు ఉరుములవలె ధ్వనింపగా వీరుల శరవర్షాలతో మేఘాలవలె ఒప్పుతున్న తేరులు వెలుగొందుతున్నాయి. ఆ తేరులకు సూర్యునిగుర్రాలను వాయువునూ మనస్సునూ మీరిన వేగంతో పరుగెత్తగల గుర్రాలు పూన్చబడి ఉన్నాయి. ఆ నగరంలో ఎత్తైన తెల్లని మదపుటేనుగులున్నాయి. వాటి చెక్కిళ్ళ మీది మదజలబిందువుల సమూహాలు వేయికళ్ళవేలుపురేని (ఇంద్రుని) ఔదార్యవిశేషాలను లెక్కకడుతున్నట్లు ఉంటాయి. ఇంద్రుణ్ణి సందర్శించటానికి గుమికూడిన సమస్త దిక్పాలకుల శుభకరాలైన చేతుల బంగారు మురువులనుండి రాలిన ధూళికణాలతో ఆ పట్టణంలోని వీధులన్నీ నిండి ఉన్నాయి. ఆ దారులకు పై భాగాలలో లక్షల విమానాలు రాకపోకలు జరుపుతూ ఉంటాయి. అవి రోహణ పర్వతం చరియలవలె వెలుగులను వెదజల్లుతుంటాయి. ఆ విమానాలలో తమ ప్రియులతో విహరించే అందగత్తెలు భేరీ వీణా పణవమూ మద్దెలా బాకా శంఖం మొదలయినవాటిని మ్రోగిస్తూ వాటికి తగినట్లు పాటలు పాడుతూ నాట్యాలు చేస్తుంటారు. ఆ నగరంలోని చతుష్పథాలలోని గృహ పరంపరల ముంగిళ్ళలో పెద్దపెద్ద రత్నదీపాలు వెలుగుతుంటాయి. దేదీప్యమానాలైన సభామంటపాలలో చింతామణులు ప్రకాశిస్తుంటాయి.
'స్వర్గ నగరం సముద్రంలా అనిమిషకౌశిక వాహినీవిశ్రుతమై ఉన్నది (చేపలతోనూ నదులతోనూ పేరెన్నికగన్నది/ దేవతలతో ఇంద్రునితో ఆకాశగంగతో పేరెన్నికగన్నది). ఆ నగరం వేదవాక్యంలా ఆకల్మషసువర్ణ ప్రభూతమై ఉన్నది (పవిత్రమైన అక్షరాలతో నిండినది / నిర్మలమైన బంగారంతో అతిశయించినది). ఆ పురం శివుని కంఠం మాదిరిగా భోగిరాజకాంతమై ఉన్నది (సర్పరాజుతో ప్రకాశిస్తున్నది / ధనవంతులయిన ప్రభువులతో ఒప్పుతున్నది). ఆ పట్టణం జవరాలి వక్షోజం వలె సువృత్తమై ఉన్నది (గుండ్రముగానున్నది / మంచి చరిత్రకలిగినది). ఆ నగరం శ్రీరామచంద్రుని తేజస్సువలె ఖరదూషణాది దోషాచరులకు చేరరానిదై ఉన్నది (ఖరుడు, దూషణుడు మొదలయిన రాక్షసులకు చేరటానికి శక్యంకానిది / కఠినమైన నిందలు మొదలగు దోషములు ఆచరించువారికి పొంద శక్యంకానిది). ఆ పురం విద్వాంసుని చరిత్రవలె అమలాంతరంగ ద్యోతమానమైనది (స్వచ్చమైన హృదయాలకు స్ఫురించేది / నిర్మల మనస్కులయిన ఫుణ్యాత్ములతో ప్రకాశించేది).
ఆ నగరం అభిమానవంతుని ప్రవర్తనం వలె సన్మార్గభాతి సుందరమైనది (మంచిమార్గంలో మిక్కిలిచక్కగా ప్రకాళించేది/ ఆకాశమార్గమందలి చుక్కలతో మిక్కిలి చక్కనైనది). ఆ పట్టణం అందమైన ఉద్యానవనం వలె రంభాంచితాశోకపున్నాగమైనది (అరటి చెట్లతో కూడిన అశోకవృక్షాలు పున్నాగ వృక్షాలు కలది / రంభతో కూడి ఆనందంగా ఉన్న పురుషశ్రేష్ఠులు కలది). ఆ పురం సురపొన్నవృక్షంవలె సురభిమనో విశేషమైనది (సుగంధంతోకూడిన పుష్పాలతో అతిశయించినది / కామధేనువులతోను దేవతలతోను నిండినది). ఆ నగరం ఆదిశేషుని శిరస్సువలె ఉన్నత క్షమావిశారదమైనది (మహోన్నతమైన భూమండలం కలది / విశేషమైన క్షమాగుణంతో ఒప్పారుతున్నది). ఆ పట్టణం శరత్కాలం మాదిరిగా ధవళజీమూత ప్రకాశితమైనది (తెల్లని మేఘాలతో విరాజిల్లునది / తెల్లని కొండలతో ప్రకాశించునది). ఆ నగరం కృష్ణాజిన దానంవలె సరస తిలోత్తమమైనది. (మంచి నువ్వులతో ఒప్పారినది / సరసురాలైన తిలోత్తమతో ఒప్పారినది). ఆ పురం ఉత్తమపురుషుని వాక్కు వలె అనేక సుధారస ప్రవర్షమైనది (అఖండమైన తియ్యదనాన్ని వర్షించేది / అఖండమైన అమృతవర్షాన్ని వర్షించేది).
ఆ పట్టణం వర్షఋతువు ప్రారంభంవలె ఉల్లసదింద్రగోపమైనది (ప్రకాశించే ఆరుద్రపురుగులు గలది/ ప్రకాశించే ఇంద్రునిచేత రక్షింపబడేది). ఆ నగరం నందీశ్వరుని మూపురంవలె విచక్షు రార్యాలంకృతమైనది (శివపార్వతులతో అలంకరింపబడినది / వెల్పుపెద్దలతో విరాజిల్లునది). ఈ విధంగా ఐశ్వర్యవంతమై పరమధన్యమైన ఆ అమరావతీ నగరానికి చేరి బలిచక్రవర్తి పట్టణం కోటను చుట్టుముట్టడానికి సైన్యాలకు ఆజ్ఞ ఇచ్చినాడు. అన్ని దారులనూ అరికట్టి గట్టి పట్టుదలతో ఉన్నాడు.
(అమరావతీ నగరవర్ణనం రెండేసి అర్థాలుగ శ్లేషతో సాగింది. ఇలాంటి వర్ణనలు బాణభట్టు, దండి మొదలయినవారి బాణిలో సాగును.)
అమరావతీ పురాన ఉండే స్త్రీలకు మలినంపొందుట, కన్నులార్చుట, ముసలితనం పొందుట, దుర్మార్గులను చేరుట, పుణ్యాత్ములను విడుచుట అనేవి లేవు.
దానవనాథులు చేసిన శంఖారావములు భయంకరంగా వినిపించటంచే దేవతాస్త్రీల గర్భాలు పగిలి ఆ గర్భాలలోని శిశువులు భయంతో రోదించినారు.
బలిచక్రవర్తి అమరావతిని ముట్టడించటాన్ని గమనించిన ఇంద్రుడు కోటకు బలమైన కాపలా పెట్టించినాడు. సేనాధిపతులతో సమాలోచన ప్రారంభించినాడు. దేవగురువు మంత్రియు అగు బృహస్పతిని పిలిపించినాడు. దండయాత్రనుగురించి వివరించినాడు. 'వాడు(బలి) ప్రళయాగ్నివలె మండిపడుతున్నాడు. బలవంతులైన రాక్షసులతో కూడి ఉన్నాడు. మనతో ఓడిపోయి మరల ఇప్పుడు వచ్చినాడు. ఏ తపస్సుచేత వీడికి ఇంతటి బలం వచ్చింది? ఈ దురాత్మునికి ఎవడు సహకారి అయినాడు? వీడిని గెలవడానికి దారి ఏది? ఏమి చేద్దాము? వీడిని ఎదిరించి నిలువగల వీరుడు ఎవడు అని పలికినాడు.
ఈ బలిచక్రవర్తి మేరుపర్వతానికన్నా ఎత్తుగా విజృంభిస్తూ ఆకాశాన్ని మింగేటట్లున్నాడు. లోకాలను మింగివేసే కాలాంతకునివలె ఉన్నాడు. ఎదిరిస్తే వీడు బ్రహ్మనుకూడా భంగపరుస్తాడు.
"ఓ గురువర్యా! రాజ్యమంతాకూడా బలిచక్రవర్తికి ఈయలేము. యుద్ధం చేయటానికీ పోలేము, పోతే వాడి నుండి తప్పించుకొనలేము. చూచి చూచి చావలేము. ఇక మీదట ఏది దారి?"
అని పలికిన దేవేంద్రునితో బృహస్పతి ఇలా అన్నాడు.
ఓ ఇంద్రా! వినుము. భృగుప్రవరులు బలికి బలసంపదను సమకూర్చినారు. ఈ రాక్షసుని ఎదుట నిల్చుటకు హరిహరులకుతప్ప ఇతరులకును, నీకును, నీకన్నా అధికులకును శక్యంకాదు. నీవు ఇప్పుడు రాజ్యాన్ని విడిచిపోవటమే మంచిది. విరోధులకు కష్టాలు వచ్చినపుడు పసిగట్టి మరల అమరావతికి చేరటం మేలని నా అభిప్రాయం. వేదపండితులైన విప్రుల వాగ్బలముచె వీడికి ఇంతటి శక్తి సమకూరింది. ఇకపై వీడు బ్రాహ్మణులను గౌరవించడు. అందువల్ల వీని పరాక్రమం సన్నగిల్లుతుంది. అంతవరకు శత్రునామం కూడా స్మరింపక తొలగిపోవటం మేలు.
విరోధిని జయించటమో, సమానంగా పోట్లాడటమో, చావటమో జరగాలి. జయించటమో, చావులేని పక్షంలో పారిపోవటమో మంచిది.
(పరిస్థితులు అనుకూలించనప్పుడు ఉన్న వాటినే పట్టుకొనివ్రేలాడటం వివేకం కాదు. అహంకారం పనిచేయదు. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు తప్పుకోవటం మంచిదనే నీతిని ఈ పద్యం బోధిస్తుంది.)
దేవగురువైన బృహస్పతి ఏపని చేయాలో ఎప్పుడు చేయాలో చక్కగా దర్శింపగలిగినవాడు. ఇంద్రాదిదేవతలకు సమయోచిత కర్తవ్యాన్ని బోధించినాడు. ఆయన చేసిన ఉపదేశము విన్న దేవతలు తమకు ఇష్టమైన రూపాలు ధరించి అనుకూలమైన తావులకు వెళ్లిపోయినారు. అప్పుడు శత్రువులు విడిచిపెట్టిన అమరావతిని బలి ఆక్రమించినాడు. బలి మూడులోకాలను తనవశం చేసికొని విశ్వవిజయుడై చాలాకాలం రాజ్యం చేసినాడు. శుక్రాచార్యుడు మొదలయిన దానవవాత్సల్యం కలవారు అతనిచేత నూరు అశ్వమేధయాగాలను చేయించినారు.
బలిచక్రవర్తి పాలనలో యాచించే దుస్థితి ఎవ్వరికీ లేదు. దానమిచ్చే దాతకు లోటులేదు. ప్రయత్నాలన్నీ ఫలిస్తున్నాయి. ఎవ్వరికీ శత్రువులు లేరు. దేవాలయాలలో మహోత్సవాలు వేడుకలు జరిగేవి. వేదవేత్తలైన బ్రాహ్మణుల కెటువంటి కోరికలు లేవు. వారు సంపూర్ణ మనోరథసిద్ధి గలవారు. సకాలానికి సరియైన వానలు పుష్కలంగా కురిసేవి. భూమికి 'వసుంధర' (బంగారును ధరించేది) అనే పేరు సార్థకమైనది.
బలిచక్రవర్తి చేతిలో దేవతలంతా ఓటమి చెంది పారిపోయి అజ్ఞాతంగా ఎక్కడో దాగినారని తెలిసిన దేవమాత అదితి దుఃఖంతో అనాథవలె కుమిలిపోతూ ఉంది. ఒకనాడు ఆమె భర్తయగు కశ్యపప్రజాపతి తపస్సును విరమించి ఆమెవద్దకు వచ్చాడు. ఆమె భర్తకు చేయవలసిన సేవలన్నీ చేసింది. ఆమె ముఖము విచారముతో కందిపోవటాన్ని గమనించిన కశ్యపుడు ప్రేమగా ఆమె చిబుకాన్ని పట్టుకొని బుజ్జగిస్తూ ఏల ఏడ్చెదవంటూ
ఓ ఇంతీ! వేదములు చదివిన బ్రాహ్మణులు ఏ లోటులేక సుఖంగా ఉన్నారా? దేవతార్చనాది ఆచారాలు జరుగుతున్నాయా? గృహస్థులు ప్రతిదినము చేయవలసిన అగ్ని హోత్రాదికర్మములను సమయముతప్పకుండా చేస్తున్నారా? కుమారులు ధర్మము తప్పకుండా నడుస్తూ ఉన్నారా? అభ్యాగతులకు అన్నపానాదులు సరిగా ఇచ్చుచుంటివా? యాచకులను, సేవకులను, సుజనులను, పరాకులేకుండా గౌరవించుచుంటివా?
అన్నంకానీ, మజ్జిగకానీ, నీళ్లుకానీ, కూరకానీ, తమకు ఉన్నంతలో అతిథులకు లేదనకుండా పెట్టాలి. అలా పెట్టనివారు ఎంత ధనవంతులైనా పేదవారే!
విష్ణువుకు ముఖము అగ్ని మరియు బ్రాహ్మణులు. కనుక అగ్ని బ్రాహ్మణులు తృప్తిపొందితే విష్ణువుకూడా తృప్తిని పొందుతాడు. విష్ణువు తృప్తిపడితే సమస్తలోకాలూ కూడా తృప్తిపడతాయి.
నీ కుమారులు నీవంటే భయభక్తులతో ఉంటున్నారా? నీ కోడండ్లందరూ నీకు ఎదురుచెప్పి ఇబ్బందిపెట్టక ప్రవర్తిస్తున్నారా? ఇంటిలో ఏ ఇబ్బందీ లేదుకదా?
ఈ విధంగా అడిగిన కశ్యపప్రజాపతితో అదితి ఇలా అన్నది.
హృదయేశ్వరా! కొంచెంకూడా ప్రేమలేక దితి కుమారులూ, మనుమలూ గొప్పబలంతో దేవతలనందరిని పారదోలి సాహసంతో విరోధులై అమరావతిని ఆక్రమించి ఏలుతున్నారు. నీకేమని చెప్పుదును? మేలు కలిగేటట్లు ఆలోచించి చూడు.
అక్కచెల్లెండ్లమై యున్నను దితి నాతో కలహాన్ని మానదు. రాక్షసులు దేవతలను మొత్తుచుండగా చూచి తగదని వారింపదు. బాగు బాగు అంటూ మెచ్చుకొంటుంది.
ఎండ అంటే ఎట్టిదో ఎరుగని సుకుమారియైన ఇంద్రుని ఇల్లాలు శచీదేవి దీనత్వంతో పరులపంచల పడింది. మూడులోకములను పాలించు దేవేంద్రుడు అడవుల పాలయినాడు. ఇంద్రుని ముద్దుబిడ్డలు జయంతుడు మొదలయినవారు చెంచుపిల్లల వెంటపోయినారు. దేవతలకు ఆధారంగా ఉండే అమరావతీపట్టణం రాక్షసులకు ఉనికిపట్టయినది. జగములన్నింటను బలి ప్రబలుతున్నాడు. ఇంద్రుడు వానిని గెలువలేడు. అతడే యజ్ఞభాగమంతాకూడా తింటున్నాడు. ఒక్క ముద్దకూడా దేవతలకీయడు.
మహాత్మా! నీవు కొడుకులకందరికి సమానుడవు. కడుపారగా బిడ్డలకన్న బ్రహ్మదేవుడవు. అయినాకూడా నీ సంతానంలోని దుష్టులను నిజంగా దండించవలదా?
మంగళప్రదుడా! ఉత్తములైన వేల్పులు కష్టాలపాలైనారు. సంపదలు కోల్పోయినారు. వారి దుఃఖాన్ని తొలగించు. వారిని అమరావతిలో నెలకొల్పడం, రాక్షసులను శిక్షించడం చేయదగిన మంచిపని. ఈ సత్కార్యం సిద్ధించే మార్గాన్ని ఆలోచించు. నీ కరుణామృత ప్రవాహంతో మమ్ములను తృప్తిపరచు.
అలా పలికిన తన ఇల్లాలి మాటలు విని కశ్యపప్రజాపతి కొంచెం సేపు చింతించి, జ్ఞాన దృష్టితో రాబోయేకాలంలోని సంగతులను తెలుసుకుని ఇలా అన్నాడు.
ఓ ఇల్లాలా! తండ్రి ఎవడు? కొడుకెవడు? పుట్టిన చోటులేవి? పుట్టుకకు కారణమేది? శరీరాలెలా ఉంటాయి? సంసారాలు ఎట్టివి? వినుము! ఇదంతా భగవంతుడగు హరిమాయ. మరేమీలేదు. దీని కంతటికీ మోహబంధం మూలకారణం. దిగులు పడకు.
ఐనప్పటికీ ఇప్పటికి తగిన కార్యాన్ని చెపుతాను విను.
ప్రియురాలా! భగవానుడూ, పురుషోత్తముడూ, జనార్దనుడూ, దయావారిధీ, సర్వాంతర్యామీ, జగదీశ్వరుడూ అయిన హరిని ఆరాధించు. ఆయన ప్రసన్నుడై నీకోరికలను నెరవేరుస్తాడు. ప్రయోజనం చేకూరుతుంది. భగవంతుని సేవించి సకలసౌభాగ్యాలను పొందవచ్చుకదా!
అలా పలికిన కశ్యపునిమాటలను విని అదితి ఈ విధంగా అంది.
నారాయణమూర్తిని ఏ విధంగా ధ్యానించాలి? ధ్యానానికి తగిన మంత్రమేది? దాని నియమాలేవి? పూజించవలసిన కాలమేది. చెప్పండి స్వామీ!
పై విధంగా అడిగిన అదితికి కశ్యపుడు 'పయోభక్షణం' అనే పాలతోచేసే వ్రతాన్ని ఉపదేశించినాడు. అందుకు తగిన కాలాన్నీ మంత్రాన్నీ నియమాన్నీ వ్రతకాలంలో పాటించవలసిన ఉపాసనా విధినీ, దాన భోజనాది విధానాలనూ బోధించినాడు. అదితి ఫాల్గుణమాసం శుక్షపక్షం మొదటిదినాన ఆ వ్రతాన్ని మొదలు పెట్టినది. పన్నెండు దినాలు యథావిధిగా భగవంతుని పూజించినది. వ్రతం అయిపోగానే నియమవంతురాలయిన ఆమెకు విష్ణుదేవుడు ప్రత్యక్షమైనాడు. ఆయన చతుర్బాహుడు. శంఖాన్నీ చక్రాన్నీ గదను ధరించి ఉన్నాడు. పచ్చని పట్టువస్త్రాన్ని కట్టుకొని ఉన్నాడు. కన్నులకు కానరాని భగవంతుడు ఆమె కన్నుల ఎదుట సాక్షాత్కరించినాడు. ఆమె ఆ దేవుని దర్శించింది.
(ఇక్కడ పయోవ్రతమంటే పాలతో చేసే వ్రతం తప్పా నీటితో చేసే వ్రతం కాదు.)
సంతోష బాష్పాలు చనుకట్టుపయిన పడి గగురుపాటుకల దేహంతో నెన్నుదుట దోసిలియొగ్గి నమస్కారములు, స్తోత్రములు చేసి
అదితి హరిరూపాన్ని చూపులతో తనివితీరా త్రాగింది. చాల సంతోషంతో మైమరచి ఆ స్వామివారిని మృదువైన తీయనిమాటలతో ఇలా నుతించింది.
యజ్ఞేశ్వరా! విశ్వంభరా! అచ్యుతా! ఈలోకాలన్నీ నీ స్వరూపమే. నీ పేరు చెవులార విన్నవారికి శుభాలు చేకూరుతాయి. ఆపన్నులగు భక్తులకు దుఃఖాలను పోగొట్టేవాడవు. నీ పాదాలు లోకాలను తరింప చేస్తాయి. ఈ విశ్వము పుట్టుకకు నిలబడుటకు అంతమగుటకు నీవే కారణం. పరిమితి లేని ఆనందమే విలాసంగా కలవాడవు. నిన్ను స్తోత్రం చేసినవారికి కల్పవృక్షంవలె కోరినవి సమకూరుస్తావు. సృష్టిలోని గుణాలన్నీ నీ కంఠసీమలో హారాలై మెరుస్తుంటాయి. సర్వవేదాలసారం నీవే. నిన్ను చక్కగా స్తోత్రం చేసిన వారిని వాత్సల్యంతో కటాక్షిస్తావు. పద్మాక్షా! పరమపురుషా! ఆయువు, శరీరం చక్కగా ఉండటం, వైభవం, రాజ్యం, స్వర్గం, ధర్మం, అర్ధం, కామం, వైదికజ్ఞానం, శత్రువిజయం అనేవి నిన్ను సేవించని నరులకు లభించటం సాధ్యంకాదు.
దైత్యశ్రేష్ఠులు దేవతలను భయపెట్టి పారదోలి స్వర్గాన్ని పరిపాలిస్తున్నప్పటినుండి కూడా నా కంటికి నిద్ర కరువైంది. నా గర్భశోకాన్ని మానిపి రక్షించవయ్యా!
అని పలికిన అదితి మాటలు విని శ్రీహరి చిరునవ్వు చిందించినాడు. ఆశ్రయించినవారికి కామధేనువయిన ఆ పరమాత్ముడు అదితితో ఇలా అన్నాడు.
నీ కోడళ్ళూ, నీ కొడుకులూ; నీ మగడూ; నీవూ మిక్కిలి పొగడేటట్టు, భార్యాభర్తలు చాలా సంతోషించెటట్టు, రాక్షసులు దుఃఖించేటట్లు, నీ కడుపున తేజశ్శాలినై జన్మిస్తాను. నీ కుమారుడనై తిరుగుతూ ఆడుకోవాలని నాకూ వేడుకగా ఉంది.
సహనంతో కూడిన ఉపాయంతో తప్ప, బలాన్ని ప్రదర్శించి రాక్షసులను చంపడానికి వీలులేదు. నీ నియతినీ భక్తినీ నేను మెచ్చుకున్నాను. ఇంద్రుడూ, దేవగణమూ, శచీదేవీ మెచ్చుకొనే విధంగా స్వర్గాన్ని రాక్షసులనుండి అపహరించి ఇంద్రునికిస్తాను. ఇంక విచారమెందుకు?
నా రూపాన్ని మనసులో పెట్టుకొని నీ భర్తను సేవించు. నేను నీ గర్భంలో ప్రవేశిస్తాను. నన్ను దయతో ప్రేమతో పెంచుము తల్లీ!
దేవతలచే స్వర్గాన్ని ఏలిస్తాను. శచీదేవి సౌభాగ్యాలను కాపాడుతాను. రాక్షసులను అధికారంనుంచి తొలగిస్తాను. వారి ఇల్లాండ్ర సొమ్మును ఊడదీయిస్తాను.
ఈ విధంగా భక్త పరాధీనుడయిన పురాణపురుషుడు (విష్ణువు) సెలవిచ్చి మాయమయ్యెను. అదితి సంకల్పము నెరవేరెను. ఆమె సంతోషముతో తన భర్తయగు కశ్యపుని ఆశ్రయించి ప్రేమతో సేవిస్తూ ఉండగా అటు తర్వాత ఒకనాడు
కశ్యపుడు సమాధిలో ఉండి హరి అంశము తనయందు ప్రవేశించగా అదితియందు అధికమగు తన వీర్యాన్ని 'గాలి అగ్నిని కర్రయందు చేర్చినట్లు' చేర్చినాడు.
రాజా! పై విధంగా కశ్యపుడు చాలాకాలంగా మహాతపస్సు చేసి విశేషంగా సంపాదించిన వీర్యంవల్ల అదితి గర్భాన్ని ధరించింది. ఆమె మనస్సు చాలా ఉల్లాసాన్ని పొందింది.
ఒకనెల గడిచింది. అదితి కడుపులో క్రమక్రమంగా ద్రవరూపమూ, మెత్తనిరూపమూ, గడ్డకట్టి పిండరూపమూ ఏర్పడింది. నెల తప్పింది. గొంతుతోపాటు తల ఏర్పడి గర్భం నిలిచింది.
('చీరచిక్కుట' అనే ప్రయోగం గర్భధారణకు పర్యాయపదంగా ప్రయోగించటం పూర్వకవులలో కనిపిస్తుంది.)
అదితికి గర్భమై ఒకటి రెండు మూడు నాలుగు నెలలు గడచినవి. క్రమంగా నెలలు పెరిగినాయి. రాక్షసనాశనానికి కూడా నెలలు సమీపించినాయి.
రాజా! అదితి కడుపులో అవయవాలతోకూడిన ఆ శిశువు గొప్ప మేఘాలు కప్పిన పదివేల సూర్యబింబాల వెలుగుతో కదలాడసాగినాడు.
అదితి గర్భంలో ఆ శిశువు బ్రహ్మాండభాండాన్నీ సముద్రాలనూ సమస్తలోకాలనూ తన కడుపులో ఇముడ్చుకొని సన్ననైన చిన్నని ఆకారంతో అందంగా అణగి మణగి ఉన్నాడు.
అదితికి క్రమంగా గర్భలక్షణాలు స్పష్టంగా కనిపించసాగినవి. ఆమె కనురెప్పలు అందంగా ఒప్పినాయి. కన్నులు నిర్మలంగా ఉన్నాయి. చనుమొనలు నల్లబడినాయి. ఒడ్డాణం బిగువైంది. ముఖం తెల్లబడింది. వక్షోజాలు గట్టిపడినాయి. పిరుదులు బరువెక్కినాయి. నడుము విస్తరించింది. మనస్సు తేలికపడింది. దేహం మహత్త్వాన్ని పొందింది.
(ముత్తెదువలు) అదితి నుదుట విభూతిని పెట్టినారు. తిలకం దిద్దినారు. పట్టుబట్టల జతను కట్టించినారు. గర్భానికి రక్ష కట్టినారు.
అదితి గర్భంలో విశ్వగర్భుడైన భగవంతుడు పూట పూటకూ పెరిగినాడు. గర్భం బరువెక్కింది. ఆమె నీళ్లాడే సమయం దగరపడింది.
ఆ సమయంలో బ్రహ్మదేవుడు అదితిగర్భంలో కదలాడే భగవంతునుద్దేశించి ఈ విధంగా స్తోత్రం చేసినాడు.
అదితిగర్భంలో వర్ధిల్లుతున్న స్వామీ! నీవు మూడులోకాలను జయించగలవాడవు. ఓ దేవ! పెద్దపెద్ద అంగలువేస్తూ నడిచే సామర్థ్యం గలవాడివి. రెండడుగులతోనే భూమ్యాకాశాలు కొలిచినవాడివి. విశాలమైన హృదయం గలవాడివి. ప్రాణులయందు అంతర్యామియైనట్టి వాడివి. 'పృశ్ని' యొక్క పుత్రుడవైనట్టివాడివి. ప్రీతితో ముల్లోకాలను నాభియందు గలవాడివి. ముల్లోకాలకు అతీతుడైనవాడివి. ఈ లోకాలకు ఆదిమధ్యాంతాలు నీవే. చరాచర ప్రపంచం పుట్టడానికి కారణం నీవే. కాలస్వరూపుడవై సమస్తమూ నీలోపలనే ధరిస్తావు. ప్రవాహం ప్రాణికోటిని ధరించినట్లు సమస్త జీవులనూ నీలోనే నిలుపుకొంటావు. సృష్టికర్తలైన బ్రహ్మలకు పుట్టినిల్లు నీవే. స్వర్గలోకాన్ని పోగొట్టుకొని దేవతలు కష్టాలకడలిలో మునిగిపోయినారు. వారిని రక్షించి గట్టుకు చేర్చే తెప్పవు నీవే,
మహాత్మా! దేవతలు చాలాకాలం నుంచీ స్వేచ్చలేక సంతోషంగా ఉండాలని ఆరాటపడుతున్నారు. వారికి ఆనందం కలిగించేటందుకు అదితిగర్భంనుండి బయలుదేరి రావయ్యా!