నిర్జల ఏకాదశి
ఏకాదశి తిథి ఉపవాసం, విష్ణు ఆరాధనతో ముడిపడి ఉంటుంది. ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల మనస్సుపై నియంత్రణ, ఆధ్యాత్మిక పురోగతి, పాప విముక్తి లభిస్తాయని నమ్మకం. అలాగే ఏకాదశి తిథిని హిందూ మత ఆచారాల ప్రకారం పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి వంటి తిథులకు మరింత విశిష్టత ఉంటుంది.
ఈరోజున ప్రత్యేకించి తులసి చెట్టును ఆరాధిస్తారు. కుదిరితే 21 ప్రదక్షిణలు చేస్తారు. అయితే, ఏడాదిలో వచ్చే ఏకాదశి తిథుల్లో ఒక్కో తిథికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఆయా తిథిని బట్టి ఏకాదశి రోజు తలస్నానం చేసి, ధూప దీప నైవేద్యాలతో శ్రీమహావిష్ణువుని ఆరాధిస్తే ఆ వాసుదేవుడి అనుగ్రహం కలిగి సిరి సంపదలు, శ్రేయస్సు కలుగుతాయని విశ్వాసం. అలాగే ఏకాదశి రోజు ఆచరించే ఉపవాసం కూడా ఎంతో విశిష్టమైనదిగా పండితులు చెబుతారు.
ఈ ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువును భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే వారు వైకుంఠానికి వెళ్తారని బలమైన విశ్వాసం. అలాగే ఏకాదశి రోజు భక్తి శ్రద్ధలతో శ్రీమహావిష్ణువుని ఆరాధిస్తే పాపాలన్నీ తొలగిపోతాయని కూడా నమ్మకం.
జ్యేష్ఠ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని నిర్జల లేదా భీమసేని ఏకాదశి అంటారు. ఏడాది పొడవునా వచ్చే అన్ని ఏకాదశులలో ఇది అత్యంత విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఏడాదిలోని అన్ని ఏకాదశులను ఆచరించినంత ఆధ్యాత్మిక పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతారు.
మహాభారత కథలో నిర్జల ఏకాదశి గురించి వేదవ్యాసుడు వివరించాడు. ఈ పర్వదినాన శ్రీ విష్ణువు, లక్ష్మీదేవిని పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని, తెలిసి, తెలియక చేసిన పొరపాట్ల నుంచి ఉపశమనం లభిస్తుంది.
నిర్జల ఏకాదశి విశిష్టత: ఈ ఏకాదశిని పాండవ నిర్జల ఏకాదశి అని కూడా పిలుస్తారు. హిందూ సనాతన ధర్మంలో ఇది అత్యంత ముఖ్యమైన ఏకాదశిగా పరిగణించబడుతుంది. ఈ రోజున నీరు కూడా తాగకుండా (నిర్జలంగా) ఉపవాసం ఉండి, శ్రీమహావిష్ణువును ఆరాధిస్తే మిగతా అన్ని ఏకాదశుల ఫలితాలు దక్కుతాయని భక్తుల విశ్వాసం.
వ్రత కథ
ఈ వ్రత కథ మహాభారతం మరియు పద్మ పురాణంలో వివరించబడింది. పాండవ సోదరులలో రెండవవాడైన భీముడు తన అపారమైన ఆకలిని నియంత్రించుకోలేక ఏకాదశి ఉపవాసాలు చేయలేకపోయేవాడు. కానీ, అతనికి కూడా విష్ణుమూర్తిని పూజించి, ఏకాదశి వ్రత ఫలితాన్ని పొందాలని బలంగా ఉండేది.
దీనికి పరిష్కారం చెప్పమని భీముడు వ్యాస మహర్షిని కోరాడు. అప్పుడు వ్యాస మహర్షి, "భీమా! ఏకాదశి నాడు అన్నం తినడం మాత్రమే కాదు, ఒక్క చుక్క నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉండాలి. అదే నిర్జల ఏకాదశి వ్రతం" అని వివరించాడు. ఏడాది పొడవునా వచ్చే 24 ఏకాదశుల వ్రతాలను ఆచరిస్తే ఎంత పుణ్యం వస్తుందో, అంత పుణ్యమూ ఈ ఒక్క నిర్జల ఏకాదశిని నియమనిష్టలతో ఆచరిస్తే లభిస్తుందని వ్యాసుడు అభయమిచ్చాడు.
వ్యాసుని మాటలపై నమ్మకంతో భీముడు జ్యేష్ఠ శుక్ల ఏకాదశి నాడు సంపూర్ణంగా నిర్జల ఉపవాసం (నీరు కూడా తాగకుండా) ఆచరించాడు. ఆ కారణంగానే ఈ ఏకాదశిని భీమ ఏకాదశి లేదా పాండవ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున శ్రీమహావిష్ణువును ఆరాధించి, దానధర్మాలు చేయడం వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ఉపవాస దీక్ష నియమాలు:
నిర్జల ఏకాదశి వేళ తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి.
ఏడాది పొడవునా వచ్చే 24 ఏకాదశి తిథులలో నిర్జల ఏకాదశి చాలా కఠినమైనది.
ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరించే వారు చుక్క నీరు కూడా తీసుకోకూడదు.
అయితే అనారోగ్యంతో ఉండే వ్యక్తులు ఉపవాస వేళ నీటిని, పండ్లను తీసుకోవచ్చని శాస్త్రాలలో పేర్కొనబడింది.
నిర్జల ఏకాదశి రోజున శ్రీ విష్ణుమూర్తి ఫోటో లేదా ప్రతిమను తాజా పువ్వులతో, తులసి మాలతో అలకరించి పూజించాలి.
పూజా సమయంలో పండ్లు సమర్పించి, తులసి మొక్కకు పూజ చేసి దీపారాధన చేయాలి.
తులసి మొక్క చుట్టూ 5 లేదా 7 సార్లు ప్రదక్షిణలు చేయాలి. అనంతరం ఏకాదశి కథను చదివి హారతి ఇవ్వాలి. ఈ రోజంతా ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే మంత్రాన్ని జపించాలి. అంతేకాదు నిర్జల ఏకాదశి వేళ ఉపవాస దీక్షను ఆచరించే వారు పగటిపూట నిద్రపోకూడదు. విష్ణుమూర్తిని స్మరించుకుంటూ రాత్రి భజన, కీర్తనలు కూడా చేయాలి. అనంతరం మరుసటి రోజు అంటే ద్వాదశి ఉదయం బ్రహ్మముహుర్తంలో పూజలు చేసి ముందుగా అన్నం తినాలి. అప్పుడే ఉపవాస దీక్ష పూర్తవుతుంది. ఇలా చేయడం వల్ల శ్రీ విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని చాలా మంది నమ్ముతారు.
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం