మనోరమ సుదర్శనునితో మునుల శరణు వేడుట
వ్యాసు డిట్లనియె: ఆ విధముగ నిరువురు రాజులను శస్త్రపాణులై మోహరించి రణరంగమున నిలుచుండిరి. క్రోధ లోభవశులగు వారిరువుర మధ్య తీవ్రమైన పోరాటము సంఘటిల్లెను. యుధాజిత్తు ధనుర్బాణధారియై తన విపుల సేనతో రణమున కాయత్తు డయ్యెను. వీరసేనుడును క్షాత్రధర్మానుసారముగ సురపతి సమతేజుడై సేనాసమేతుడై సమర రంగమున బోరుటకు సంసిద్ధుడయ్యెను. సత్యపరాక్రముడగు వీరసేనుడు క్రోధోద్రిక్తుడై తన యెదుట నున్న యుధాజిత్తుపై పిడుగులు పడునట్లు మహావేగముగల వాడి బాణములతో వర్షము గురిపించెను. యుధాజిత్తు తన పైకి వచ్చు శత్రు బాణములను తన వాడి బాణములతో సగములోనే తునుకలు చేయుచుండెను. ఆ రీతిగ రథ గజ తురగ పదాతి దళముల నడుమ తుముల యుద్ధము సాగుచుండెను. సుర నర మునిగణము లా పోరు గాంచుచుండెను. కాకులు గ్రద్దలు మున్నగు పక్షుల గుంపులచే నింగి కప్పబడెను. వీర గజతురగముల శరీరములనుండి నెత్తురు టేర్లు ఘోరముగ కాల్వలు గట్టసాగెను. అవి పాపాత్ముల పాలిటి వైతరుణి ప్రవాహములవలె ఘోరముగ నుండెను. యమునానదీ తట జాతులైన-ఆట లాడుకొను బాలురచే యమునయందుంచబడిన తుంబీఫలములో యన రక్తనదీతీర మందలి నెత్తుటి తిన్నెల పై తెగిపడిన పీనుగుల తలలు పడియుండెను. ప్రేతాత్మలు తమ చక్కని తనువులను వదలిపోలేక అవశములైనను మరల వానిలో బ్రవేశింప దలంచుచున్నవో యన నరదమునుండి నేలగూలిన మృతవీరుల శవములపై కాకులును గ్రద్దలును కాట్లాడుచుండెను.
ఆ రణమందు నిహతుడై యమరుడైన యొక వీరుడు దివ్య విమాన మెక్కి తన్ను వలచివచ్చి తన యొడిలో నున్న యచ్చర లేమతో 'నో కరభోరు! బాణపు దెబ్బలకు నేలగూలిన నా చక్కని మేను గనుమా' యని యామెకు చూపుచుండెను. మఱొక్క వీరుడు హతుడై అంతరిక్షమున కేగి యమరకన్యతో దివ్య విమానమున విహరించుచుండగ నతని అబల (భార్య) సహగమనము చేసి సబలయైన దివ్యరూపమున తన పతిని కలిసికొనెను. ఇరువురు వీరులు పరస్పర శస్త్రములతో పోరి యొకేసారి యీల్గి దివి కేగి యచ్చట నొకే యందాల యచ్చరలేమ పొందికకై తగవులాడుకొనుచుండిరి. అమరుడైన వేరొక్కవీరుడు తన్నుమించిన రూప ¸యవనగుణములుగల దేవకన్యను బడసి యామెకు తనపై ప్రీతి మెండుగ నుండునట్లుగ తన గోరంతలను కొండంతలుజేసి చెప్పుకొనుచు ప్రేమతో ఆమె ననుసరించెను అత్తఱి నేలనుండి నింగి కెగసిన ధూళి సూర్యుని గప్పివేసెను. రాత్రి నొనరించెను. ఆ ధూళియే వెంటనే రక్తపు సంద్రమున బడుటవలన రవి మరల మింట వెల్గెను. ఇంకొక్క వీరుడు దివి కేగి భక్తియుక్త చారువదన యగు నొక్క దేవకామినిని జేరియు తన నిశ్చలబ్రహ్మచర్య మెక్కడ చెడిపోవునో యని తన పేరున కెక్కడ కళంక మేర్పడునోయని యా యన్నుల మిన్న కూడికకు నొప్పక మిన్నకుండెను. అట్లు దారుణముగ పోరు జరుగుచుండగ యుధాజిత్తు తన తీవ్రబాణములతో వీరసేనుని సంహరించెను. వీరసేనుడు తలతెగి నేలబడగనే యతని సమస్తబలము చెల్లాచెదరై నలుదెసలు ముట్ట పరుగెత్తెను.
తన తండ్రి రణమున నిహతుడగుట విని మనోరమ తన తండ్రి వైరియగు యుధాజిత్తువలని భయమున విహ్వల చిత్తయయ్యెను. యుధాజిత్తు తీరని రాజ్యదాహముచే దురాశయుడు-పాపాత్ముడు. అతడు తప్పక తన కొడుకునుగూడ హతమార్చునని యామె చింతిల్లెను. నే నిపుడేమి చేయుదును? నాకు దిక్కెవ్వరు? నా తండ్రి మరణించెను. నా పతియు దివంగతుడయ్యెను. ఇక నా కొడుకో! అతడు బాలుడు. లోభము చాల చెడ్డది. దాని కెంత మంచివాడైనను తలవంచి తీరును. అట్టి లోభావిష్టులైన రాజు లేదైన చేయగలరు. లోభావిష్టుడగు నరుడు తన బందుగులను అన్నదమ్ములను తలిదండ్రులను గురువులను సైతము వెనుకముందు లాడక చంపివేయగలడు. ఆతడు తినరానిది తినును. పోరాని చోట్లకు పోవును. వేయేల! లోభతృష్ణార్తుడైన నరుడేదియైన చేయజాలును. తుదకతడు స్వధర్మమునకును తిలోదకము లిచ్చును. నే నిపుడీ నగర మందుండి నా సత్పుత్త్రుని గాపాడుకొనదలచినచో నా కిట గుండె ధైర్యముతో సాయపడువాడు లేడు. నా కొమరు డొకవేళ వైరి రాజుచేత జచ్చెనా - పిమ్మట నేను చేయగలుగునదేమి? నా కీ లోకమున నా యను వాడెవ్వడు? అతనిని చూచుకొనియే గద నా బ్రదుకు వెలగవలె! నే నింకెవనికి చెప్పుకొని సుఖింతును? నా సవతి లీలావతియు నాపై నెల్లపుడు పగబూని నది కావచ్చును. ఆమె యింక నా కొమరునిపై జాలి పూనుట కల్ల. ఇప్పుడిచ్చోటికి యుధాజిత్తు వచ్చినచో నేనీ నగరము నుండి బయటకు పోజాలను. ఆతడు నా కొమరుని కారాగారబద్ధుని చేసి తీరును.
తొల్లి యింద్రుడు తన తల్లి గర్భమునందలి శిశువు నేడు ఖండములుగ చేసెను. తిరిగి యా ఖండములు ఏడు ఏడులుగ నయ్యెను. అట్టు లింద్రుడు తన తల్లి గర్భము ప్రవేశించి యొక చిన్న వజ్రము తునుకతో ఖండింపగ నలువది తొమ్మిదిమంది మరుత్తులు పుట్టి వారు దివిపై విలసిల్లుచున్నారు. మున్నొక రాజు భార్య తన సవతి గర్భవతియగుట కని యా గర్భ నాశమున కామె కింత విషము తినిపించెనని నే వింటిని. పిదప ఆమెకు పుట్టిన శిశువు విషయుతుడగుటవలన భూమండలమునందు సగరుడను విఖ్యాత నామము బడసెను. పూర్వము కైక తన సవతి కుమారుడును జ్యేష్ఠుడును నగు శ్రీరామచంద్రు నడవుల కంపగ రామ! రామ! రామ! యని యతనిని తలంచుచు దశరథుడు ప్రాణములు వదలెను గదా! ఆనాడు నా సుదర్శనునకు పట్టముగట్ట తలపెట్టిన మంత్రివర్యు లీనాడు యుధాజిత్తుని వశమున నున్నారు. ఇపుడు నా యన్నయు నన్నీ యిక్కట్టులనుండి పాపజాలినవాడు కాడు. అక్కటా! నాకు దైవదుర్విపాకమున నెంతటి సంకటము వాటిల్లెను. ఏది యెట్టులైనను ప్రయత్న మవశ్యకార్యము. కార్యసిద్ధి దైవాధీనము. కనుక నే నిపుడు నా పుత్త్ర రక్షార్థము సత్వరముపాయ మొనరింతును అని మనోరమ యీ రీతి తనలో దలపోసి సర్వకార్య నిపుణుడును అతిమానియు నగు విదల్లుడను మంత్రివర్యుని బిలిచి తన బాలుని గొని దీనాననయై 'నా తండ్రి రణమున గూలిపోయెను. నా కొడుకు బాలకుడు. యుధాజిత్తు బలశాలియగు శత్రురాజు. ఇప్పట్టున నా కర్తవ్య మేదియో యానతిమ్ము' అని యేకాంతమున నతనితో చెప్పి యేడ్చెను. 'మన మిట నుండదగదు. వనముల కేగి యచటినుండి కాశి జేరుదము. అచట మా మేనమామ సుబాహుడు గలడు. అతడు మహాబలవంతుడని ప్రఖ్యాతి గడించినవాడు. అతడు మనకు తప్పక శరణ మిచ్చును. నీవు నీ తండ్రిని దర్శించు నెపమున వెడలుము. పిమ్మట మనము రథ మెక్కి పోవచ్చును. దీనివలన నెవరికిని సందియ మావంతయు గలుగదు' అని విదల్లుడామెతో ననెను.
మంత్రిమాటలు విని మనోరమ లీలావతిని జేరి నేను నా జనకుని చూడ నేగుచున్నానని పలికి సైరంధ్రితోను విదల్లునితోను రథ మెక్కి నగరమునుండి నిర్గమించెను. ఆమె విగతజీవుడై పడియున్న తన తండ్రిని గాంచి ఆర్తయు అతి దీనయు శోకసమాకులయు భయవిహ్వలయునై వణకుచు తన తండ్రికి పరలోకక్రియ లొనర్పజేసి పిదప రెండునాళ్లలో గంగాతటము చేరెను. అచట పెక్కురు శఠులు దస్యులు విషాదులు చేరి యామె ధనమును దోచుకొని రథముగొని పారిపోయిరి. అట్టులా చారువక్త్రయగు మనోరమ సైరంధ్రి చేయూతగాగ తన తనయుని వెంటబెట్టుకొని వలవల ఏడ్చుచు గ్రక్కున నొక్క పడవ యెక్కి భయాకులమతితో పుణ్యభాగీరథిని దాటి త్రికూట పర్వతము జేరెను.
పిమ్మట ఆమె త్వరత్వరగ భారద్వాజాశ్రమముజేరి యచటి తాపసులను వీక్షించి భయాకులత్వము వీడి నిర్భయత్వ మందెను. ఆమెను గని భరద్వాజ ముని 'ఓ శుచిస్మితా! నీ వెవరవు? ఎవ్వారి ధర్మపత్నివి? ఇన్ని క్లేశములతో నిక్కడి కేల వచ్చితివి? నీకు వచ్చిన బాధ యేమి? సర్వము నిజము తెలుపుము. నీవు దేవతవో! మానుషివో! ఈ బాలపుత్త్రుని గొని వచ్చుటచే నీవు రాజ్యభ్రష్టవని తోచుచున్నది.' అని పలికెను. దుఃఖసంతప్తయగు మనోరమ కన్నీరుమున్నీరుగా విలపించుచు తా బలుకలేక విదల్లుని బలుకు మనగా
విదల్లు డిట్లనియె: 'ఈ యమ ధ్రువసంధి నరేశుని ధర్మపత్ని. పేరు మనోరమ. ఆ రాజు రవి వంశజుడు. అతడొక సింహమువాత బడెను. ఈ బాలకుడతని కొడుకు. ఇతని పేరు సుదర్శనుడు. ఈ మనోరమ తండ్రియు తన మనుమని పక్షమున బోరి నిహతు డయ్యెను. అంత నీమె యుధాజిత్తువలని భీతిచే నిట్లు వనములు పట్టి మీ యాశ్రమము ప్రవేశించినది. మహానుభావుడవగు ఓ మునిసత్తమా! ఈమె తన చిన్నారి ముక్కుపచ్చలారని రాకుమారునితో నిన్ను శరణు వేడుచున్నది. నీవు వీరికి రక్షకుడవు గమ్ము. ఆర్తులకు శరణ మిచ్చుట యాగములకంటె నధికపుణ్యప్రదమని పెద్దలందురు. అందును భయత్రస్తుడు దీనుడునైన వానికిచ్చుట విశేష పుణ్యఫలప్రదము,
ఋషి యిట్లనియె: 'ఓ కల్యాణీ!సువ్రతా!నీవు నిర్భయముగ నిచట నీ కుమారుని పోషించుకొనుచుండుము. నీకిట శత్రుభీతి యేమాత్రమును గలుగదు. నీ బాలుని సుదర్శనుని కాపాడుకొనుము. ఇతడే రాజు గాగలడు. ఇట నీకు దుఃఖ శోకములు లేశమాత్రము సంభవింపవు, అని ఋషి పలికెను. భారద్వాజుని ప్రియవచనములు విని మనోరమ గుండె నిబ్బరము చేసికొని ముని చూపిన కుటీరమందు వీతశోకయై మసింపసాగెను. ఈ రీతిగ మున్యాశ్రమమున మనోరమ సైరంధ్రీవిదల్లులతో తన కుమారుని పోషించుకొనుచుండెను. అని వ్యాసముని జనమేజయునితో పలికెను.
అధ్యాయము 48 యుధాజిత్తు సుదర్శనుని జంపదలచుట
శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము
పంచాంగం
అధ్యాయము 48 యుధాజిత్తు సుదర్శనుని జంపదలచుట
శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము