Sunday, May 3, 2026

Radha Devi is Ganga Devi - రాధాదేవియే గంగాదేవి

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - రాధాదేవియే గంగాదేవి

మహర్షీ! గంగానదికి “త్రిపథగ” అనేపేరు ఉంది అన్నావు. అది ఎలా ఎర్చడింది ? ఎలా ఎక్కడెక్కడ ఆ నది మూడు మార్గాలలో ప్రవహించింది? అక్కడి ప్రజలు ఎవరు? ఈ విశేషాలు తెలుసుకోవాలని ఉంది - అన్నాడు నారదుడు. వెంటనే నారాయణమహర్షి ఆరంభించాడు-

గోలోకంలో ఒక కార్తికపూర్ణిమనాడు రాధామహోత్సవం జరిగింది. రాసమండలంలో రాధాదేవిని పూజించి శ్రీకృష్ణుడు ఆమె సన్నిధిలో మహోల్లాసంగా ఉన్నాడు. రాధాదేవికూడా పూజలు అందుకొన్న ఆనందంలో ఉత్సాహంగా ఉంది. బ్రహ్మాదిదేవతలూ సనకననందనాది మహర్షులూ రాధాకృష్ణులను పరివేష్టించి కొలువుతీరి కూర్చున్నారు. అంతలోకి సరస్వతీదేవి తన వీణను శ్రుతిచేసి కృష్ణస్తుతిరూపమైన సంగీతాన్ని అత్యద్భుతంగా వినిపించింది. అందరూ సంతోషించారు. కానుకలు కురిపించారు. బ్రహ్మ దేవుడు రత్నహారాన్నీ, శివుడు మణిహారాన్నీ కృష్ణుడు కౌస్తుభహారాన్నీ, రాధాదేవి మాణిక్యహారాన్నీ, నారాయణుడు మరో మనోహరమాలికనూ, లక్ష్మి కనకకుండలాలనూ, దుర్గాదేవి బ్రహ్మభక్తినీ, ధర్ముడు ధర్మబుద్దిని, అగ్నిదేవుడు పరిశుభ్రవస్త్రాన్నీ, వాయుదేవుడు మణినూపురాలనూ కానుకలుగా మెచ్చి సమర్పించారు.

బ్రహ్మదేవుడు శివుణ్ణి ప్రేరేపించి నువ్వుకూడా కృష్ణసంగీతం వినిపించు అని కోరాడు. శివుడు విజృంభించి గానం చేశాడు. శ్రోతలందరూ పరవశించి మైమరిచిపోయారు. శిలాప్రతిమలైపోయారు. ఆ పారవశ్యంనుంచి నెమ్మదిగా తేరుకుని కళ్ళు తెరిచి చూసేసరికి గోలోకమంతా జలమయమై కనిపించింది రాధాకృష్ణులు ఏమైపోయారో కనపడలేదు. అందరూ అంతటా వెదికి వేసారారు. దుఃఖం పట్టలేక గోపగోపీజనమూ దేవతలూ పెద్దపెట్టున విలపించారు. ఏమి జరిగిందో తెలుసుకుందామని బ్రహ్మదేవుడు ధ్యానంలో కూర్చుని అంతర్దృష్టిని సారించాడు. శివుడి సంగీతానికి కరిగిపోయి రాధాకృష్ణులు ద్రవరూపం చెందారని గ్రహించాడు.

ఆ విషయాన్ని విష్ణు మహేశ్వరులకు తెలియజెప్పాడు. అందరూ కలిసి రాధాకృష్ణుల సందర్శనం కోసమని పరాత్పరుణ్ణి స్తుతించారు. అంతలోకీ అశరీరవాణి వినిపించింది. అది శ్రీకృష్ణుడి కంఠమే.

బ్రహ్మాది దేవతలారా! ఈ జలమంతా మా స్వరూపమే. దీన్ని మీరు ఉపాసించండి, ఆరాధించండి. పూర్ణరూపాలలో మమ్మల్ని చూడాలనుకుంటే శివుడు నా ఆజ్ఞను పాటించాలి. వేదశాస్త్రాలను అవలోడించి అపూర్వ మంత్రాలను సేకరించి స్తోత్రాలను నిర్మించి ధ్యానమంత్రస్తోత్ర కవచయుతంగా పూజావిధానం ఏర్పరిచి నన్ను పూజించాలి. అది నా మంత్రం కావాలి. ఆ మంత్రాన్నీ ఆ పూజావిధానాన్నీ గోప్యంగా ఉంచాలి, లక్షకు ఒకడుమాత్రమే మన్మంత్రోపాసకుడు కావాలి. అతడు గోలోకవాసి అవుతాడు. కొందరు భూలోకవాసులూ కొందరు స్వర్గలోకవాసులూగా ఏర్పాటు ఉండాలి. లేకపోతే సృష్టి అంతా నిష్ఫలమవుతుంది. ప్రతిజ్ఞాపూర్వకంగా శివుడు ఈ పూజను ఆచరిస్తే మేము మీకు దర్శనం ఇస్తాం. లేకపోతే లేదు.

అశరీరవాణిగా శ్రీకృష్ణుడు వినిపించిన ఆజ్ఞను శివుడు శిరసావహించాడు. అతడు జ్ఞానానికి అధిదేవత. వెంటనే అక్కడి జలాన్ని దోసిటిలోకి తీసుకుని విష్ణుమాయామహామంత్రాలను జపించి స్తోత్రాలను సమకూర్చి అర్చించాడు. ఈ నీటిని స్పృశించి అసత్యం పలికినవాళ్ళు శాశ్వతంగా కాలసూత్రమనే నరకానికి పోతారు అని ప్రతిజ్ఞ చేశాడు.

శంకరుడు ఇలా పలకగానే రాధాకృష్ణులు ప్రత్యక్షమయ్యారు. గోపగోపీసురబృందాలు ఆనందంతో కేరింతలు కొట్టారు. మళ్ళీ మహోత్సవం జరిపారు. అటుపైని శివుడు ముక్తిదీపాన్ని వెలిగించాడు.

నారదా! ద్రవరూపం చెందిన రాధాదేవియే ఈ గంగానది. రాధాకృష్ణుల సంయుక్తరూవంగా గోలోకంలో ఆ నది అర్చింపబడుతోంది. భుక్తిముక్తి ప్రద. శ్రీకృష్ణుడు లోకానుగ్రహకాంక్షతో ఈ గంగానదిని ముల్లోకాలకూ ప్రవహింపజేసి అక్కడక్కడ నిలువరించాడు. కృష్ణస్వరూపగా సర్వబ్రహ్మాండపూజిత అయ్యింది ఈ పవిత్ర నదీమతల్లి. 

నారాయణ మహర్షి! కలియుగంలో అయిదువేల సంవత్సరాలు గడిచాక మరి ఈ గంగానది ఎక్కడికి వెళ్ళింది ?

నారదా! సరస్వతి శాపంవల్లకదా గంగాదేవి భారతభూభాగానికి వచ్చింది. అయిదువేల సంవత్సరాల తరవాత శాపవిమోచనమై మళ్ళీ వైకుంఠానికే వెళ్ళిపోయింది. అలాగే సరస్వతీ పద్మావతీనదులూ లక్ష్మీదేవి తులసి వీరంతా హరిసన్నిధికే చేరుకున్నారు. గంగా లక్ష్మీసరస్వతులతోపాటు నాల్గవదిగా తులసి కూడా నారాయణప్రియ అయ్యింది.

మహర్షీ! నాది మరొక చిన్న సందేహం. గంగాదేవిని విష్ణుపాదోద్భవ అంటారుకదా! ఒకసారి ఎప్పుడో బ్రహ్మదేవుడి కమండలువులో బందీ అయ్యిందిట. ఎవరో చెప్పగా విన్నాను. ఆ వృత్తాంతం సమగ్రంగా తెలుసుకోవాలని ఉంది. తెలియజెప్పవూ!

గంగాదేవి విష్ణుపాదోద్భవ


The story of the descent of Ganga - గంగావతరణగాథ

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - గంగావతరణగాథ

హిరణ్యగర్భతనయా! సూర్యవంశంలో సగరుడు అనే మహారాజు ఉన్నాడు. అతడికి వైదర్భి శైబ్య అని ఇద్దరు భార్యలు. శైబ్యకు అసమంజుడు అనే కుమారుడు జన్మించాడు. వైదర్భి సంతానం కోనం శివుణ్ణి ఆరాధించింది. శివుడి అనుగ్రహంతో గర్భిణి అయ్యింది. నూరేళ్ళు మోసి ఒక మాంసపిండాన్ని ప్రసవించింది. ఆ పిండాన్ని చూసి వైదర్భి చలించిపోయింది. దారుణంగా విలపిస్తూ శివుణ్ణి ధ్యానించింది. శివుడు బ్రాహ్మణరూపంలో వచ్చి ఆ పిండాన్ని ఆరవైవేల తునకలు చేసి ప్రాణాలు పోశాడు. అందరూ మహాబలపరాక్రమసంపన్నులైన పుత్రులు అయ్యారు. ఒక్కొక్కడూ గ్రీష్మమార్తాండుడిలా ప్రజ్వరిల్లుతున్నారు. ఒకనాడు కపిలనుహార్షి శాపంవల్ల అందరూ భస్మమైపోయారు. సగరుడు దుఃఖం పట్టలేక రాజ్యం వదిలిపెట్టి అరణ్యాలకు వెళ్ళిపోయాడు గంగానదిని ఆ భస్మరాశులపై ప్రవహింపజేస్తే తన సోదరులు సజీవులవుతారని తెలుసుకున్న అసమంజుడు గంగాదేవికోసం తపస్సు ప్రారంభించాడు. లక్ష సంవత్సరాలు తపస్సు చేసి కాలధర్మం చెందాడు. అతడి కొడుకు అంశుమంతుడు ఇదే దీక్షతో తపస్సు కొనసాగించాడు.

అతడూ ఒక లక్ష సంవత్సరాలు తపస్సు చేసి గతించాడు. అటుపైని అతడి పుత్రుడు భగీరథుడు తపస్సు చేశాడు. ఇతడికి శ్రీకృష్ణుడు కోటిసూర్యప్రభలతో దర్శనమిచ్చాడు. ద్విభుజుడై మురళీ ధరుడై కిశోరగోపవేషంలో త్రిమూర్తి సంస్తుతుడై దర్శనమిచ్చిన ఆ స్వేచ్చామయపరబ్రహ్మను పరిపూర్ణతమ ప్రభువును చిరునవ్వులు చిందిస్తున్న ఆ నిర్లిప్త నిర్గుణ పరప్రకృతిని చూస్తూనే భగీరథుడు మోకరిల్లి భక్తి ప్రపత్తులతో స్తుతించాడు. తన వాంఛితాన్ని విన్నవించాడు. సగరపుత్రులను ఉద్ధరించి వంశాన్ని తరింపజెయ్యమని ప్రార్థించాడు.

అప్పుడు శ్రీ కృష్ణపరమాత్మ గంగాదేవిని ఆజ్ఞాపించాడు. హే గంగే! సరస్వతీశాపం ఉందికదా! వెంటనే బయలుదేరి భారతభూమికి అవతరించు. సగరపుత్రులను ఊద్ధరించు. ఇది నా ఆజ్ఞ. నీ నీరు సోకినా నీ గాలి తాకినా అందరూ పరిపూతులవుతారు. కోటిజన్మార్జితాలైన పాపాలు నశిస్తాయి. నా రూపాలు పొంది నాలోకంలో విహరిస్తారు. మౌసలస్నానం చేస్తే చాలు బ్రహ్మహత్యాది మహాపాతకాలుకూడా అంతరిస్తాయి. పుణ్యాహస్నానానికి ఉన్న ఫలమెంతో వేదాలుకాదు త్రిమూర్తులైనా చెప్పలేరు. సామాన్య దివసస్నానంకన్నా మౌసలస్నానం వల్ల పుణ్యం పదింతలు ఎక్కువ లభిస్తుంది. సూర్యసంక్రమణం నాడు గంగాస్నానం చేస్తే ముప్ఫయిరెట్లు అధికంగా పుణ్యం వస్తుంది. అమావాస్యనాడైనా అంతే. దక్షిణాయన పుణ్యదినాన చేస్తే ద్విగుణంగా పుణ్యం చేకూరుతుంది. ఉత్తరాయణకాలంలో అయితే పదిరెట్లు అధికపుణ్యం. చాతుర్మాస్యదీక్షలో పున్నమినాడయితే అనంతంగా లభిస్తుంది. అక్షయ పుణ్యదినాన అక్షయపుణ్యమే. ఉగాది మాఘసప్తమి భీష్మాష్టమి అశోకాష్టమి హరినవమి సూర్యచంద్రగ్రహణాల రోజున పట్టు విడుపుల నమయాలలోనూ చేసే గంగాస్నానాలు అశేష పుణ్యప్రదాలు. గంగా! ఇవి నీకు నేను ఇస్తున్న వరాలు - అని చెప్పి శ్రీకృష్ణుడు విరమించాడు.

ఈ మాటలు విన్న గంగాదేవి సవినయంగా తన సందేహాన్ని వెలిబుచ్చింది. నాథా! సరన్వతీశాపం వల్లనైతేనేమి ఈ రాజేంద్రుల తపన్సువల్లనైతేనేమి నీ ఆజ్ఞమేరకు నేను భరతభూమికి వెడతాను. బాగానే ఉంది. అయితే నేను అక్కడ ఎంతకాలం ఉండాలి? మళ్ళీ నీ సన్నిధికి రావడం ఎప్పుడు? పాపాత్ములందరూ వచ్చి నాలో మునిగి పాపాలు సమర్పిస్తూంటే నాకు వాటినుంచి విముక్తి ఎలాగ? ఇంకా నా మనస్సులో ఉన్న సంశయాలేమిటో అన్నీ ఎరిగినవాడవు. నువ్వే తగిన ఉపాయం ఉపదేశించు - ఆంది.

గంగాదేవి! నీ వాంఛితమేమిటో నాకు తెలుసు. ద్రవరూపంలో భూమికి అవతరిస్తున్న నీకు అక్కడ సముద్రుడు భర్త అవుతాడు. సముద్రుడు నా అంశావతారమే. నువ్వు లక్ష్మీస్వరూపిణివే. నెరజాణకు నెరజాణ దొరకడం ఆనందదాయకమేకదా! భారతభూభాగాన సరస్వతీ ప్రభృతి నదులు ఎంతకాలం ఉంటాయో అంతకాలమూ నువ్వూ వారితోపాటు సౌభాగ్యసంపదలతో ఉంటావు. దేవీ! ఈనాటినుంచి కలియుగంలో అయిదువేల సంవత్సరాలు గడిచేవరకూ నువ్వు భారతావనిలో ఉండక తప్పదు. నిత్యమూ నీకు సముద్రుడితో రహస్య సంగమం జరుగుతూనే ఉంటుంది. అతడు రసికుడు, నువ్వు రసికవు.

భారతీయులందరూ నిన్ను భాగీరథిగా స్తుతిస్తారు. అర్చిస్తారు. కణ్వశాఖోక్తపద్ధతిలో ధ్యానిస్తారు, పూజిస్తారు. నిన్ను స్తుతించిన వారికి అశ్వమేథఫలం లభిస్తుంది. స్తుతించలేక దర్శించలేక యోజనాల దూరంనుంచే గంగా! గంగా! అంటే చాలు అతడు పాపవిముక్తుడై వైకుంఠం చేరుకుంటాడు.

వెయ్యిమంది పాపాత్ములు నీలో మునగనీ. ఒక్క విష్ణుభక్తుడు మునిగితే చాలు నువ్వు మళ్ళీ పరిపూతవు అవుతావు. ఎన్ని శవాలు నీలో తేలినా విష్ణు మంత్రోపాసకుడి స్నానంతో పాపప్రక్షాళన అవుతుంది. దోషాలన్నీ తొలగిపోతాయి. నువ్వు అఘమోచనకు అధిష్టాత్రివి. నిన్ను తలుచుకుంటూ ఏ నదిలో ఏ రేవులో మునిగినా అది గంగాతీర్థమే అవుతుంది. నీ రేణువు సోకితే చాలు మహాపాతకికూడా పరిపూతుడవుతాడు. జ్ఞానులు నా నామాన్ని జపిస్తూ నీలో మునిగి ప్రాణాలు వదిలితే సరాసరి నా సాయుజ్యం పొందుతారు. నాకు శాశ్వతంగా పార్షదులవుతారు. ఎంతో పుణ్యం చేసుకున్నవాడి శవమే నీలో కలుస్తుంది. అతడు సరాసరి వైకుంఠం చేరుకుంటాడు. అతడికి సారూప్యం ఇచ్చి పార్షదుణ్ణి చేసుకుంటాను. తెలియక ఆజ్ఞానంతో నీలో మునిగినా నీలో ప్రాణాలు విడిచినా అతడికీ సాలోక్యం ఇస్తాను. పార్షదుణ్ణి చేస్తాను. నీపేరు జపిస్తూ ఎక్కడ ప్రాణాలు విడిచినా వారికికూడా శాశ్వతంగా సాలోక్యం అనుగ్రహిస్తాను. రత్నాల పల్లకీలో గోలోకానికి తోడ్కొని వెడతాను. నా మంత్రాన్ని ఉపాసించేవారూ నాకు నివేదన చేసి భుజించేవారూ ముల్లోకాలనూ పవిత్రం చెయ్యగల సమర్థులు. వారినీ ఇలాగే రత్నాలపల్లకిలో గోలోకానికి తీసుకువెడతాను. వారి బంధువులూ వారి పెంపుడు జంతువులూ వారి సేవకులూ అందరికీ ఇదే మన్నన జరుగుతుంది.

ఇలా శ్రీకృష్ణుడు గంగాదేవిని ఊరడించి భగీరథా! ఈ గంగాదేవిని భక్తితో స్తుతించు. శ్రద్ధతో అర్చించు అన్నాడు. భగీరథుడు భక్తిశ్రద్దలతో స్తుతిపూజనలు నిర్వహించాడు. కాథుమశాఖోక్తంగా సామవేద మంత్రాలతో మళ్ళీ మళ్ళీ స్తుతించాడు. శ్రీకృష్ణపరమాత్మనూ స్తుతింతి ప్రణమిల్లాడు. గంగాదేవీ స్తుతించి నమస్కరించింది. శ్రీకృష్ణుడు ఆంతర్జానం చెందాడు - అని నారాయణమహర్షి చెప్పగానే, భగీరథుడు చేసిన పూజావిధానాన్నీ స్తుతినీ తెలియజెప్పమని నారదుడు అభ్యర్థించాడు.

నారదా! భగీరథుడు స్నానంచేసి ధౌతవస్త్రాలు ధరించి శుచిగా నిత్యక్రియలు అనుష్టించి ఏకాగ్ర చిత్తంతో భక్తితో దేవషట్కాన్ని ఆరాధించి అప్పుడు గంగాదేవిని స్తుతించాడు. విఘ్నవినాశం కోనం గణేశ్వరుణ్ణి, ఆరోగ్యంకోసం సూర్యుణ్ణి, శౌచంకోసం అగ్నినీ, లక్ష్మికోసం విష్ణువునూ, జ్ఞానంకోసం శివుణ్ణి ముక్తికోసం శివానినీ పూజించాలి. ఈ ఆరుగురు దేవతలనూ ముందుగా పూజించినవాడికే ఏ పూజ చెయ్యడానికైనా అధికారం లభిస్తుంది. లేకపోతే విషమఫలితాలు తప్పవు.

కణ్వశాఖోక్తమైన గంగాధ్యానం పాపప్రణాశకం. గంగాదేవి తెల్లకలువలాగా ఉంటుంది. కృష్ణమూర్తి నుంచి ఆవిర్భవించింది. కృష్ణతుల్య. అగ్నిజ్వాలలాంటి ఆంశుకాన్ని ధరిస్తుంది. రత్నభూషణాలు ఆలంకరించుకొంటుంది. ఒక్కసారిగా శరత్పూర్ణిమా చంద్రబింబాలు నూరు ఉదయించినంత ఆహ్లాదకరంగా ఉంటుంది. చిరునవ్వులు పండిస్తూ ఉంటుంది. ఎప్పుడూ యౌవనంలోనే ఉంటుంది. నారాయణప్రియ, శాంతన్వరూప, సౌభాగ్యసమన్విత, విశాలమైన కబరీభారం అందులో మాలతీపుష్పమాలికలు. చెక్కిళ్ళమీవ సిందూర చందన కస్తూరీ బిందువులతో మకరికా పత్రాలంకరణ. దొండపండుల్లాంటి పెదవులు. ముత్యాలకోవలాంటి పలువరుస. అందమైన ముఖం. అందమైన బొట్టు. అందమైన కన్నులు. క్రీగంటి వాలుచూపులతో మరింత మనోహరంగా ఉంటుంది. ఉన్నతమైన వక్షఃస్థలం. విశాలమైన జఘనభాగం. మెట్టతామరలవంటి పాదాలు. వాటికి రత్నపాదుకలు. లత్తుకతో పారాణి దిద్దిన పాదాలు. దేవేంద్రుడి శిరస్సుమీద ఉన్న మందారపుష్పం నుంచి జారిపడిన ఎర్రని మకరంద బిందువుతో పారాణి దిద్దుకున్నట్టుంటుంది.

సురసిద్ధమునింద్రగణాలు సమర్పించిన అర్ఘ్యలతో ఆర్ద్రంగా ఉండే పాదపద్మాలు. తపస్వుల శిరస్సులు అనే తుమ్మెదలు బారులుతీరి మూగే పాదపద్మాలు. ముముక్షువులకు ముక్తిప్రదాలు. బుభుక్షువులకు భోగప్రదాలు. వరేణ్య, వరద, భక్తానుగ్రహకారిణి. శ్రీ విష్ణుపదదాత్రి. విష్ణుపది. అటువంటి గంగాదేవికి నమస్కరిస్తున్నాను - అనే ధ్యానశ్లోకాలతో ఆ త్రిపథగను ధ్యానించాలి. షోడశోపచారాలు చెయ్యాలి. ఆసన - పాద్య - అర్ఘ్య - స్నాన - అనులేపన - ధూప - దీప - నైవేద్య - తాంబూల - శీతోదక - వసన - భూషణ - మాల్య - గంధ - ఆచమనీయ - తల్ప సమర్పణలు షోడశోపచారాలు.

వీటిని చేసి భక్తితో సాష్టాంగనమస్కారం చెయ్యాలి. ఇలా పూజ చేస్తే అది అశ్వమేధ ఫలాన్ని ఇస్తుంది. నారదా! ఇరవైయొక్క శ్లోకాలలో విష్ణుమూర్తి చేసిన గంగాస్తవం మరింత పుణ్యప్రదం. ఆలకించు -

శివుడి సంగీతానికి పరవశించిన విష్ణుమూర్తి శరీరంనుంచి ఆవిర్భవించింది. రాధాశరీరంనుంచి జాలువారిన జలంతో వరదగట్టింది. సృష్టికన్నా ముందు గోలోకంలో రాసమండలంలో శంకరుడి సన్నిధానంలో జన్మించింది. గోపగోపీజనంతో కోలాహలంగా జరుగుతున్న రాధామహోత్సవంలో కార్తిక పూర్ణిమ రోజున అవతరించింది. కోటియోజన విస్తీర్ణమూ అంతకన్నా లక్షరెట్లు పొడుగూ ఉండి గోలోకమంతటా వ్యాపించిన గంగమ్మకు వందనాలు.

ఆరవైలక్షల యోజనాల విస్తీర్ణమూ అంతకు నాలుగురెట్లు పాడవూగా వైకుంఠంలో వ్యాపించిన గంగమ్మకు దండాలు. ముప్పయి లక్షల యోజనాల విస్తీర్ణమూ అంతకు అయిదు రెట్లు పాడవుగా బ్రహ్మలోకంలో ప్రవహించే గంగమ్మకు ఏటికోళ్ళు. అంతే విస్తీర్ణమూ అంతకు నాలుగురెట్లు పాడవుతో శివలోకంలో సంచరించే గంగమ్మకు నమస్సులు. ఇలాగే ధ్రువలోక - చంద్రలోక - సూర్యలోక - తపోలోక - జనలోక - మహర్లోక - కైలాస - ఇంద్రలోక - పాతాళలోకాలలో ప్రవహించే గంగాదేవికి నమోవాకాలు. ఇంద్రలోకంలో మందాకినిగా పాతాళంలో భోగవతిగా కీర్తింపబడే గంగాభవానికి నమస్కారాలు. ఒక క్రోశమాత్ర విస్తీర్ణంతో అక్కడక్కడా ఇంకా క్షీణించి అలకనందగా భూలోకంలో ప్రవహించే గంగమ్మకు డింగిడీలు.

సత్యయుగంలో పాలనురువులాగా, త్రేతాయుగంలో వెన్నెలలాగా, ద్వాపరయుగంలో మంచిగంధంలాగా, కలియుగంలో నీళ్ళలాగా, స్వర్గంలోమాత్రం అన్నియుగాల్లొనూ పాలలాగా ప్రవహించే గంగమ్మకు నతులు. గంగా జలకణాన్ని రవ్వంత స్పృశిస్తే చాలు పాపాత్ములకుకూడా జ్ఞానోదయమవుతుంది. కోటి జన్మల పాపాలు నశిస్తాయి, బ్రహ్మహత్యామహాపాతకంకూడా అంతరిస్తుంది.

నారదా! ఈ గంగాలహరిని (లహరి = స్తోత్రం) నిత్యం భక్తితో పఠించి గంగమ్మను అర్చించినవారికి అశ్వమేధయాగఫలం దక్కుతుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది. అవివాహితులకు వివాహమవుతుంది. రోగులకు ఉపశమనం రోగవిముక్తి లభిస్తాయి. మూర్ఖుడుకూడా పండితుడవుతాడు. యశస్వి అవుతాడు. ప్రాతఃకాలంలో పఠిస్తే దుఃస్వప్నదోషాలు నశిస్తాయి. గంగాస్నానఫలం దక్కుతుంది.

శ్రీకృష్ణుడి ఆజ్ఞ ప్రకారం భగీరథుడు ఇదే స్తోత్రాన్ని చేసి గంగానదిని తన వెంట తీసుకువెళ్ళాడు. సగరపుత్రుల చితాభస్మాలమోద ప్రవహింపజేశాడు. వెంటనే వారందరూ వైకుంఠానికి చేరుకున్నారు. భగీరథుడు తెచ్చాడు కనక అప్పటినుంచీ ఈ నదికి భాగీరథి అనే పేరు ఏర్పడింది. బ్రహ్మనందనా! ఇది గంగావతరణ గాథ. పుణ్యప్రదం, మోక్షప్రదం. ఇంకా ఏమేమి కథాసారాలు తెలుసుకోవాలనుకుంటున్నావో అడుగు, చెబుతాను - అని ముగించాడు నారాయణ మహర్షి

రాధాదేవియే గంగాదేవి


Bhudana Phalalu - భూదానఫలాలు

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - భూదానఫలాలు

నారాయణ మహర్షీ! భూదాన హరణాది మహాపాపాలు ఏవేవో చెప్పావు. అవి ఏమిటి? ఏ రకంగా పాపాలయ్యాయి? వాటి ఫలితాలేమిటి? ఇంకా ఏమైనా పాపాలున్నాయా? వాటి ప్రతీకారం ఎమిటి? విస్తరంగా తెలియజేస్తే నాబోంట్లు జాగ్రత్తపడతారు - అని నారదుడు అభ్యర్థించాడు. నారాయణడు అందుకున్నాడు-

బ్రహ్మనందనా! నిరంతరం సంధ్యావందనం చేసుకునే విప్రుడికి ఒక జానెడు నేల దానం చేసినవాడు జన్మాంతంలో కైలాసం చేరుకుంటాడు. శివమందిరంలో నివసిస్తాడు. సస్యలక్ష్మితో విరాజిల్లే భూమిని దానం చేసినవాడు ఆ భూమిలో రేణువులు ఎన్ని ఉన్నాయో అన్ని సంవత్సరాలపాటు వైకుంఠంలో నివసిస్తాడు. అగ్రహారాన్నిగానీ భూమినిగానీ ధాన్యాన్నిగాని నైష్ఠికుడైన బ్రాహ్మణుడికి దానం చేస్తే సకల పాపాలనుంచీ ఆ క్షణంలోనే విముక్తి లభిస్తుంది. దాతృప్రతిగ్రహీతలిద్దరూ తరిస్తారు. దేవీ సాన్నిధ్యం పొందుతారు. భూదానానికి సాక్షిగా ఉండి ఆమోదించిన సజ్జనుడు పుత్రమిత్ర సమన్వితంగా వైకుంఠం చేరుకుంటాడు. తాను ఇచ్చినదిగానీ పరులు ఇచ్చినదిగానీ భూదానాన్ని అపహరించినవాడు సూర్యచంద్రులున్నంతకాలం నరకంలోనే హింసలు అనుభవిస్తుంటాడు. వాడి వంశం గర్భదరిద్రులై అంతరిస్తుంది. గోవులు తిరిగే దారినీ తటాకాలనూ భూదానంగా సమర్పించేవాళ్ళు కుంభీపాక - అసిపత్రనరకాలలో నూరు దివ్యవత్సరాలపాటు లేదా పధ్నాల్గురు ఇంద్రులు గతించేదాకా యమయాతనలు అనుభవిస్తారు. పంచపిండాలను ఉద్ధరించకుండా వెళ్ళి పరుల నూతిలో స్నానం చేసేవాడు రౌరవానికి పోతాడు. కాముకుడై రాత్రిపూట రహస్యంగా నేలమోద వీర్యస్ఖలనం చేసుకునేవాడు రేణువుకి ఒక్క సంవత్సరంగా రౌరవంలో నరకయాతన అనుభవిస్తాడు. అంబువాచిగా ఉన్నప్పుడు భూమిని దున్నినవాడు కృమిదంశ నరకానికి పోయి నాలుగు యుగాలపాటు పరితపిస్తాడు. పూడుకుపోయిన ఇతరుల నూతిలో నుయ్యి తవ్వించి నాది అన్నవాడు, పూడుకుపోయిన చెరువులో చెరువు తవ్వించి నాదన్నవాడు తప్తకుండంలో పడతాడు. పుణ్యఫలంమాత్రం ఆ మొదటి దాతలకే దక్కుతుంది. ఇతరుల చెరువుల్లో నుంచి మట్టిని తొలగించి వాటిని ఉపయోగంలోకి తెచ్చేవాడు రేణుప్రమాణ నంవత్సరాల పాటు బ్రహ్మలోకంలో నివసిస్తాడు.

తండ్రికీ రాజుకీ పిండప్రదానం చెయ్యకుండా శ్రాద్ధకర్మలు ముగించినవాడు నరకానికి పోతాడు. వట్టినేలమీద దీపం వెలిగించినవాడు ఏడుజన్మల దాకాగుడ్డివాడవుతాడు. ఏ ఆచ్చాదనాలేని వట్టి నేలమీద శంఖాన్ని పెడితే వాడికి జన్మాంతరంలో కుష్ఠరోగం వస్తుంది. అలాగే ముత్యం, మాణిక్యం, రత్నం, బంగారం, మణులూ వీటినికూడా వట్టి నేలమోద ఉంచకూడదు. అలా ఉంచినవాళ్ళు ఎడు జన్మలకీ అంధులవుతారు. శివలింగాన్నిగానీ శివామూర్తినిగానీ పూజాద్రవ్యాలనుగాని కనీసం ఆకునైనా అడ్డంవేసి ఉంచాలే తప్ప వట్టినేలమీద ఉంచినవాళ్ళు శతమన్వంతరాలు కృమిభక్షకులు అవుతారు. అలాగే యంత్రాలనూ పువ్వులనూ తులసీదళాలనూ నేలమోద ఉంచకూడదు. ఉంచితే నరకానికి పోతారు. జపమాల, కర్పూరము, గోరోచనము, గంధపు చెక్క, రుద్రాక్ష, దర్భలు, పుస్తకం, యజ్ఞోపవితం - వీటిని వట్టి నేలమోద ఉంచడమూ నరకహేతువే. యజ్ఞం చేసి ఆ నేలను పాలతో అలకనివాడు ఎడేడు జన్మలకీ నరకంలోనే ఉండిపోతాడు. భూకంపం వచ్చిన రోజునగానీ గ్రహణంనాడుగానీ భూమిని తవ్వినవాడు జన్మాంతరంలో అంగవికలుడవుతాడు.

నారదా! భూమి అంటే సమస్త ప్రాణికోటికీ పుట్టిల్లు మహాభవనం. ఇది కశ్యపుడి సొత్తు. కనక కాశ్యపి అనే పేరు. ఇది అచల. ఇది స్థిర. చరాచర జీవజాలాన్ని భరిస్తోంది అనంతకాలంగా. అందుచేత విశ్వంభర. పృథుకన్య కాబట్టి పృథివి అయ్యింది. విశాలంగా పృథురూపంలో ఉంటుంది కనకనూ ఆ పేరు ఏర్పడింది.

నారాయణ మహర్షీ! పృథివీ వృత్తాంతాన్ని మనోహరంగా వినిపించావు. ధన్యుణ్ణి చేశావు. ఇంక గంగావతరణ గాథను వినాలని ఉంది. సరస్వతి శాపంవల్ల గంగాదేవి భారతభూమికి అవతరించింది కదా! న్వయంగా విష్ణుపది ఆయిన ఆ పరమపావన స్వరూప ఎలా ఎప్పుడు ఎక్కడ అవతరించిందో ఆ క్రమమంతా తెలుసుకోవాలని ఉంది. అది పుణ్యప్రదమూ పాపఘ్నమూను. కనక అనుగ్రహించు - అని నారదుడు కోరాడు. నారాయణుడు యథావిధిగా ఆరంభించాడు.

గంగావతరణగాథ


Boons of Lord Varaha to Goddess Earth - భూదేవికి వరాహస్వామి వరాలు

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - భూదేవికి వరాహస్వామి వరాలు

శౌనకాది మహామునులారా! శ్రద్ధగా వింటున్నారా? అని హెచ్చరించి నారద నారాయణ సంవాదాన్ని సూతుడు కొనసాగించాడు. నారదుడు నారాయణమహర్షిని మళ్ళీ ఇలా అడిగాడు -

మహర్షీ! మహాదేవికి రెప్పపాటు కాలంలో బ్రహ్మదేవుడు అంతరిస్తాడు అన్నావు. ప్రాకృతిక ప్రళయం వస్తుంది అన్నావు. సృష్టి అంతా జలమయమై భూగోళం అదృశ్యమవుతుంది అన్నావు. అప్పుడు మరి ఆ మహాదేవి ఎక్కడ ఉంటుంది? పునన్సృష్టికి ఆవిడ ఎలా ఆవిర్భవిస్తుంది ఏ రూపాన్ని ధరిస్తుంది? మంగళప్రదమైన దేవీ జన్మకథను వినిపించి నన్ను అనుగ్రహించు - అని నారదుడు వేడుకొన్నాడు. నారాయణ మహర్షి సంతోషించి కథనం ఆరంభించాడు.

నారదా! సర్వసృష్టికీ ఆదియందు మహాదేవి ఉంటుంది అని వేదం చెబుతోంది. ఆరంభంలో ఆవిర్భావమూ ప్రళయాంతంలో తిరోభావమూ సహజం. ఇంక వసుధ ఎలా ఆవిర్భవించిందో చెబుతాను తెలుసుకో. మధుకౌటభుల మేదస్సుతో ఎర్పడిందనీ అందుకే మేదిని అనే పేరు వచ్చిందనీ కొందరన్నారు. పుష్కరక్షేత్రంలో ధర్ముడు చెప్పగా విన్న మరొక వృత్తాంతం ఉంది. అదేమిటంటే జలమయమైన సృష్టిలో మునిగి ఉన్న మహావిరాట్‌ స్వరూపుడి శరీరంలోకి రోమరంధ్రాలద్వారా ఈ భూమి ప్రవేశించి అదృశ్యమవుతుందట. పునస్పృష్టికి ఆతడి మనస్సు సంకల్పించినప్పుడు మళ్ళీ అవే రోమరంధ్రాల నుంచి భూమి ఆవిర్భవించి గట్టిపడి నీటిలో తేలుతుందట. ఇది ప్రతిప్రళయంలోనూ జరుగుతూనే ఉంటుంది.

ప్రతి విశ్వంలోనూ ఇలా వసుంధర శైల కానన సాగర ద్వీప గ్రహచంద్రార్క సంయుతంగా అవిర్భవిస్తూ ఉంటుంది. త్రిమూర్తులూ దిక్పాలకులూ దేవతలూ యథాతథంగా అవతరిస్తుంటారు. ఇదంతా మహావిరాట్‌ స్వరూపుని సంకల్పమూ ఆజ్ఞాను. పుణ్యతిర్థాలూ, పుణ్యభారతమూ బంగారు వేలలూ సప్తస్వర్గాలూ సప్త పాతాళాలూ బ్రహ్మలోకమూ ధ్రువలోకమూ అంతా పునస్సృష్టి జరుగుతుంది. ఇలా నిర్మింపబడే సమస్త విశ్వాలూ కృత్రిమాలు. కనక నశ్వరాలు. ప్రళయంలో అంతరిస్తాయి. సృష్టి - లయాలు మాత్రమే నిత్యాలు. ఇవి రెండూ శ్రీకృష్ణుని ఆత్మ సంకల్పాలు. మహావిరాట్‌ స్వరూపుడికన్నా పురాతనాలు.

ఈ వసుంధరను వరాహస్వరూపుడైన విష్ణుమూర్తికి భార్యగా మునులూ మనువులూ స్తుతించారు. వీరి కుమారుడు మంగళుడు. ఇతని తనయుడు కుంభసంభవుడు. పంచీకరణమార్గంలో మూలప్రకృతి నుంచి ఆవిర్భవించిన ఈ వసుంధర వరాహావతారకాలంలో వారాహిగా అర్చింపబడింది. ఆ పూజావిధానం బహుమంగళ ప్రదం. అదికూడా తెలియజేస్తాను విను. వరాహావతారాన్ని మున్ముందుగా బ్రహ్నదేవుడు స్తుతించాడు. హిరణ్యాక్షుడనే రాక్షనుణ్టి సంహరించి భూగోళాన్ని ప్రళయజలధినుంచి ఉద్దరించడంకోసం శ్రీహరి వరాహావతారం ధరించాడు. తన బంగారు కోరతో భూమిని పైకి లేవనెత్తి నీటిమీద పద్మపత్రంలాగా నిలబెట్టాడు. అప్పుడు ఆ భూగోళంమీద సర్వమనోహరమైన విశ్వాన్ని బ్రహ్మదేవుడు నిర్మించాడు.

ఆ సమయంలో భూగోళాధిదేవతను వసుంధరను చూసి శ్రీహరి సమ్మోహితుడయ్యాడు. సుందరాకారుడై భూదేవితో ఒక దివ్య సంవత్సరకాలం రహస్యంగా కామక్రీడలు సాగించాడు. ఆ సంభోగ సంస్పర్శల సుఖాతిశయానికి పరవశించిన భూదేవి ఆనందసమ్మూర్చిత అయ్యింది. నెరజాణల సంగమం పరస్పరం అత్యంత సుఖప్రదంకదా!

విష్ణుమూర్తికి భూదేవి కౌగిలింతలో అహోరాత్రాలు క్షణాల్లాగా గడిచిపోయాయి. దివ్య సంవత్సరం గడిచేదాకా స్పృహ రానేలేదు. అప్పటికి తేరుకుని స్పృహలోకి వచ్చి ఆ కాముకుడు ఆ కాముకిని విడిచిపెట్టాడు. లీలావిలాసంగా మళ్ళీ వరాహరూపం ధరించాడు. ధరణీదేవిని ధ్యానించి ధూపధీప నైవేద్యాలతో సిందూరానులేపనాలతో వస్త్ర పుష్ప బలిప్రదానాలతో అర్చించి కృతజ్ఞతా సూచకంగా దివ్యవరాలు ప్రసాదించాడు.

సర్వాధారా! శుభస్వరూపిణీ! వనుంధరా! ఈ రోజునుంచీ నువ్వు దేవదానవ మానవకోటులందరి చేతా పూజింపబడతావు. శంకుస్థాపనలు చెయ్యాలన్నా గృహప్రవేశాలు జరగాలన్నా వాపీకూప తటాకాదుల్ని నిర్మించాలన్నా వ్యవసాయం మొదలుపెట్టాలన్నా - మానవులందరూ ముందుగా నిన్ను అర్చిస్తారు. అంబువాచిత్యాగదినాన తప్పక పూజలు అందుకుంటావు. ఇది నా వరం. అర్చించని మూఢులు నరకానికి పోతారు. ఇది నా శాపం.

(ప్రతి నెలా ఆర్ద్రానక్షత్రం నుంచి మూడురోజులు భూదేవి రజస్వలగా ఉంటుంది. అప్పుడు అమెకు అంబువాచి అని పేరు. ఆ మూన్నాళ్ళు భూమిని దున్నరాదని నియమం.)

ఈ వరానికి సంతోషించిన వసుధాదేవి వరాహస్వామిని మరొక్కవరం అడిగింది. నాథా! నీ ఆజ్ఞను శిరసావహించి ఈ చరాచరజగత్తును అంతటినీ నేను భరిస్తాను. కానీ ముత్యము, ఆల్చిప్ప హరిపూజాద్రవ్యాలు, శివలింగము, శివామూర్తి, శంఖము, దీపము, యంత్రము, మాణిక్యము, రత్నము, యజ్ఞసూత్రము, పుష్పము, పుస్తకము, తులసీదళము, జపమాల, పుష్పమాల, కర్పూరము, బంగారము, గోరోచనము, చందనము, సాలగ్రామశిల - వీటినిమాత్రం భరించలేను. కాబట్టి వీటిని ఎవ్వరూ సాక్షాత్తుగా నామీద ఉంచకుండా నాకు సమర్పించకుండా కట్టడి చెయ్యమని అభ్యర్థించింది. శ్రీహరి సమ్మతించాడు. ఈ ద్రవ్యాలను నీకు సమర్పించినవారూ నీమీద సాక్షాత్తుగా ఉంచినవారూ నరకానికి పోతారని శాసించాడు. అదృశ్యమయ్యాడు. అటు పైని వసుంధర గర్భిణియై మంగళుడిని ప్రసవించింది.

నారదా! అప్పటినుంచి అందరూ శ్రీహరి ఆజ్ఞమేరకు కాణ్వశాఖోక్త ప్రకారంగా భూమిపూజ చేస్తున్నారు. మూలమంత్రాన్ని జపిస్తున్నారు. పృథ్వీరూపాన్ని ధ్యానిస్తున్నారు. స్తుతులూ నైవేద్యాలూ సుప్రసిద్ధాలు. మంగళప్రదమైన ఆ మూలమంత్రాన్నీ ధ్యాన స్తవనవిధానాలనీ తెలియజేస్తాను. శ్రద్ధగా ఆలకించి ఆచరించు.

మొట్టమొదటగా పృథివీదేవిని వరాహమూర్తి శ్రీహరి పూజించాడు. అటు పైని బ్రహ్మదేవుడు అర్చించాడు. ఆ తరువాత మునులూ మనువులూ మానవులూ ఉపాసించారు. ధ్యాన స్తవన మంత్రాలు ఏమిటంటే - ఓం - హ్రీం - శ్రీం - క్లీం వసుధాయై స్వాహా అనే మంత్రంతో విష్ణువు అర్చించాడు. భూదేవి తెల్లకలువ రంగులో ఉంటుంది. శరత్పూర్ణిమనాటి చంద్రబింబంలాంటి ముఖం. శరీరమంతటా చందనం పులుముకొని రత్నభూషణభూషితయై విరాజిల్లుతూ ఉంటుంది. ఆవిడ రత్నాధార. రత్నగర్భ రత్నాకరసమన్విత. (రత్నాకరం = సముద్రం). అగ్నిజ్వాలవంటి పరిశుభ్రమైన వస్త్రంతో చిరునవ్వులు చిందిన్తూ ఉంటుంది. అటువంటి భూదేవికి నమస్కరిస్తున్నాను అనేది స్తోత్రం.

శ్వేతపంకజవర్ణాభాం శరచ్చంద్రనిభాననామ్‌
 ।
చందనోక్షితసర్వాంగీం రత్నభూషణభూషితామ్‌ ॥

రత్నాధారాం రత్నగర్భాం రత్నాకరసమన్వితామ్‌
 ।

వహ్నిశుద్దాంశుకాధానాం పస్మితాం వందితాం భజే ॥

కా
ణ్వ శాఖోక్తమైన స్తవనం కూడా ఒకటి ఉంది. అది కూడా శ్రీహరి ప్రోక్తమే. దానినే అటు తరువాత బ్రహ్మాదిదేవతలూ మునులూ అందరూ వినియోగించారు. యథాతథంగా చెబుతున్నాను విని ధారణ చెయ్యి.

జయ జయే జలాధారే జయశీలే జలప్రదే
 ।
యజ్ఞసూకరజాయే త్వం జయం దేహి జయావహే ॥

మంగళే మంగళాధారే మాంగళ్యే మంగళప్రదే ।
మంగళార్థం మంగళేశే మంగళం దేహి మే భవే ॥

సర్వాధారే చ సర్వజ్ఞే సర్వశక్తి సమన్వితే
 ।
సర్వకామ ప్రదే దేవి సర్వేష్టం దేహి మే భవే ॥

పుణ్యస్వరూపే పుణ్యానాం బీజరూపే సనాతని ।
పుణ్యాశ్రయే పుణ్యవతామాలయే పుణ్యదే భవే ॥

సర్వసస్యాలయే సర్వసస్యా
ఢ్యే సర్వసస్యదే ।
సర్వసస్యహరే కాలే సర్వసస్యాత్మికే భవే॥

భూమే భూమిపసర్వస్వే భూమిపాలపరాయణే ।
భూమిపానాం సుఖకరే భూమిం దేహి చ భూమిదే ॥

ఇదం స్తోత్రం మహాపుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్‌
 
కోటిజన్మసు స భవేద్బలవాన్‌ భూమిపేశ్వరః 

నారదా ! ఈ స్తోత్రాన్ని పఠించినవారికి భూదాన ఫలం లభిస్తుంది. భూమిదానహరణపావం నశిస్తుంది. అంబువాచీభూఖనన పాపమూ అంతరిస్తుంది. ఇతరుల నూతిలో నుయ్యి తవ్వడం, పరభూమిని అపహరించడం, నేలమోద వీర్యాన్ని చిందించడం, దీపాన్ని వెలిగించడం మొదలైన మహాపాపాలు పటావంచలవుతాయి. అశ్వమేధాలు నూరు చేసిన పుణ్యఫలం లభిస్తుంది. ఇది సర్వకల్యాణ కారకమైన భూదేవీస్తవం.


భూదానఫలాలు


Friday, May 1, 2026

Pruthvi Stotram -Stavanam - పృథ్వీ స్తోత్రం - స్తవనం

పృథ్వీ స్తోత్రం

శ్వేతపంకజవర్ణాభాం శరచ్చంద్రనిభాననామ్‌ ।
చందనోక్షితసర్వాంగీం రత్నభూషణభూషితామ్‌ ॥

రత్నాధారాం రత్నగర్భాం రత్నాకరసమన్వితామ్‌ ।
వహ్నిశుద్దాంశుకాధానాం పస్మితాం వందితాం భజే ॥

కాణ్వ శాఖోక్తమైన స్తవనం శ్రీహరి ప్రోక్తం

జయ జయే జలాధారే జయశీలే జలప్రదే ।
యజ్ఞసూకరజాయే త్వం జయం దేహి జయావహే ॥

మంగళే మంగళాధారే మాంగళ్యే మంగళప్రదే ।
మంగళార్థం మంగళేశే మంగళం దేహి మే భవే ॥

సర్వాధారే చ సర్వజ్ఞే సర్వశక్తి సమన్వితే ।
సర్వకామ ప్రదే దేవి సర్వేష్టం దేహి మే భవే ॥

పుణ్యస్వరూపే పుణ్యానాం బీజరూపే సనాతని ।
పుణ్యాశ్రయే పుణ్యవతా మాలయే పుణ్యదే భవే ॥

సర్వ సస్యాలయే సర్వసస్యాఢ్యే సర్వసస్యదే ।
సర్వ సస్యహరే కాలే సర్వసస్యాత్మికే భవే॥

భూమే భూమిప సర్వస్వే భూమిపాలపరాయణే ।
భూమిపానాం సుఖకరే భూమిం దేహి చ భూమిదే ॥

ఇదం స్తోత్రం మహాపుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్‌ ।
కోటిజన్మసు స భవేద్బలవాన్‌ భూమిపేశ్వరః ॥

భూమి దానకృతం పుణ్యం లభ్యతే పఠనా జ్జనైః.

ఈ స్తోత్రాన్ని పఠించినవారికి భూదాన ఫలం లభిస్తుంది. భూమిదానహరణపాపం నశిస్తుంది. అంబువాచీభూఖనన పాపమూ అంతరిస్తుంది. ఇతరుల నూతిలో నుయ్యి తవ్వడం, పరభూమిని అపహరించడం, నేలమోద వీర్యాన్ని చిందించడం, దీపాన్ని వెలిగించడం మొదలైన మహాపాపాలు పటావంచలవుతాయి. అశ్వమేధాలు నూరు చేసిన పుణ్యఫలం లభిస్తుంది. ఇది సర్వకల్యాణ కారకమైన భూదేవీస్తవం.

Regeneration - పునస్సృష్ఠి

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - పునస్సృష్ఠి

అప్పుడు జగత్తు అంతా అరాచకమవుతుంది. ఆరు రేయింబవళ్ళు కుండపోతగా స్థూలధారలతో వర్షం కురుస్తుంది. భూగోళం జలమయమైపోతుంది. వృక్షాలుకానీ గృహాలుకానీ దేశాలుగానీ ఏమీ ఉండవు. అటుపైని ద్వాదశాదిత్యులు ఉదయిస్తారు. నీరంతా ఆవిరైపోతుంది. నేల ఎండుతుంది, కృతయుగం ప్రారంభమవుతుంది. సత్త్వగుణ సంపన్నుడూ తపోనిరతుడూ ధర్ముడు అవతరిస్తాడు. ధర్మనిరతులూ వేదవేత్తలూ మహర్షులు ఆవిర్భవిస్తారు. ఇంటింటా పతివ్రతలు వెలుస్తారు. రాజులు మనస్వులై తేజస్వులై ధర్మిష్ఠులై పుణ్యకర్మరతులై జనరంజకంగా పరిపాలన సాగిస్తారు. వైశ్యాది జాతులవారంతా పెద్దలను గౌరవిస్తూ తమ తమ వృత్తులలో ధార్మికులై ప్రజాసేవ చేస్తారు. చతుర్వర్ణాలవారూ దేవీభక్తి పరాయణులవుతారు. అందరూ దేవీమంత్ర జప పరాయణులూ ధ్యానపరాయణులూ అవుతారు. శ్రుతి స్మృతి పురాణజ్ఞులై తదనుగుణంగా జీవయాత్ర సాగిస్తారు. కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలా నడుస్తుంది. అధర్మం కలికానికైనా కనిపించదు. సత్సంతానంకోసం ఋతుకాల సంపర్కాలే తప్ప దంపతులమధ్య విపరీత కామోపభోగాలు ఉండవు. త్రేతాయుగంలో మూడు పాదాలు, ద్వాపరంలో రెండు పాదాలు, కలియుగారంభంలో ఒక పాదమూగా నడిచిన ధర్మం చిట్టచివరికి పూర్తిగా లోపిస్తుంది. కృతయుగంలో పునరుజ్జీవించి నాలుగుపాదాలా నడుస్తుంది.

నారదా! కృతయుగంలో కాలవిభజన స్పష్టంగా ఉంటుంది. నాలుగు జాములకాలం (మూడు గంటలు = జాము) ఒక పగలు. అలాగే ఒక రాత్రి. రేయీ పగలూ కలిసి ఒక వాసరం (రోజు). ఎడు రోజులు ఒకవారం. పదహారు తిథులు ఉంటాయి. పదిహేను రోజులు ఒకపక్షం. రెండు పక్షాలు కలిసి ఒక మాసం. అంటే ముప్పయి రోజులు. రెండు నెలలు ఒక ఋతువు. ఆరు నెలలు ఒక ఆయనం. పన్నెండు నెలలు(రెండు అయనాలు) ఒక సంవత్సరం. 
ఈ సంవత్సరాలు అయిదు విధాలు. 

మానవులకు ఒక సంవత్సరమైతే దేవతలకు అది ఒక పగలూ రేయీని. అంటే ఒకరోజు. ఇది దేవమానం. మానవులకు మూడువందల అరవై యుగాలు గడిస్తే దేవతలకు అది ఒక యుగమవుతుంది దేవతలకు డెబ్బయ్యొక్క(71) యుగాలు ఒక మన్వంతరం. ఇంద్రుడి వయస్సు ఒక మన్వతరం. ఇరవైయెనిమిదిమంది ఇంద్రులు గడిస్తే అది బ్రహ్మదేవుడికి ఒక అహోరాత్రం. అటువంటి రోజులతో నూటెన్మిది సంవత్సరాలు బ్రహ్మదేవుడి ఆయుర్దాయం. అది నిండితే ప్రాకృతప్రళయం సంభవిస్తుంది. అంత జలమయమైపోతుంది. భూగోళం కనిపించదు. బ్రహ్మ విష్ణు శివాదులు ఉండరు. ఇలాంటి ప్రాకృతి ప్రళయం జరిగేవరకూ ఉన్న కాలమంతా కలిపి శ్రీదేవికి ఒక్క నిమేషమాత్రంగా లెక్క. మహాదేవి కాలప్రమాణం అంతటిది. బ్రహ్మాయుష్షు శ్రీమాతకు నిమేషమాత్రం.

నారదా! అమ్మవారికి రెప్పపాటు కాలంలో బ్రహ్మాండాలు సృష్టింపబడుతున్నాయి, నశిస్తున్నాయి, మళ్ళీ సృష్టింపబడుతున్నాయి. ఇలా ఇప్పటికి ఎన్ని సృష్టిలయాలు అయ్యాయో, ఎన్ని కల్పాలు వెళ్ళాయో వచ్చాయో, ఎందరు బ్రహ్మలు అవతరించారో అంతరించారో, ఎన్ని బ్రహ్మాండాలు ఏర్పడ్డాయో నశించాయో లెక్క తేల్చి చెప్పడం మానవమాత్రుడికి అయ్యే పనేనా? అలా చెప్పగలిగినవాడు ఒక్కడే ఒక్కడు - అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు. సర్వేశ్వరుడు. సచ్చిదానంద రూపధారి. బ్రహ్మాదిదేవతలంతా అతడి అంశావతారాలు. మహా విరాట్‌ స్వరూపంకూడా అతడి అంశమే. అందులో ఒక అంశం విరాట్‌ స్వరూపం. అదే (పరా) ప్రకృతి. ఆ ప్రకృతినుంచే అర్ధనారీశ్వరుడు ఆవిర్భవిస్తున్నాడు. అతడే కృష్ణుడు. ద్విభుజ - చతుర్భుజ రూపాలతో ద్విధాభూతుడవుతున్నాడు. చతుర్భుజుడు వైకుంఠంలో ఉంటే ద్విభుజుడు స్వయంగా గోలోకంలో ఉంటున్నాడు. నారదా! బ్రహ్మాది తృణపర్యంతం సమస్తమూ ప్రాకృతికమే (ప్రకృతి సంభవమే). ప్రాకృతికమైన సృష్టి సర్వస్వమూ నశ్వరమైనదే. కాలాంతరాన ప్రళయంలో నశించిపోయేదే.

ఇటువంటి సృష్టికి హేతుభూతమైనది పరబ్రహ్మతత్త్వం. అది సత్యం, నిత్యం, సనాతనం, స్వేచ్చామయం, నిర్గుణం, ప్రకృతికి ఆవలిది, ఉపాధిరహితం, ఆకారరహితం, భక్తానుగ్రహకాతరం. దానిని తెలుసుకున్నందువల్లనే బ్రహ్మదేవుడు ఈ బ్రహ్మాండాలను సృష్టించగలుగుతున్నాడు, శివుడు మృత్యుంజయుడై ఉపసంహరించగలుగుతున్నాడు, విష్ణుమూర్తి మహామహిమాన్వితుడై కాపాడగలుగుతున్నాడు. ఈ ముగ్గురికీ ఈ మూడు శక్తులూ ఆ పరబ్రహ్మ తత్త్వోపాసనవల్లనే లభిస్తున్నాయి. అదే మహామాయ. అదే పరాప్రకృతి. సర్వశక్తిమయి. ఈశ్వరి. భగవతి. సచ్చిదానందరూపిణి. ఆ తత్త్వాన్ని సేవించడంవల్లనే సావిత్రి వేదమాతయై వేదాధిష్ఠాన దేవత కాగలిగింది. వేదవేత్తల పూజలు అందుకుంటోంది. సర్వవిద్యాధిదేవతగా విశ్వమానవకోటితో ఆరాధింపబడుతోంది. ఆ మహామాయయే సర్వగ్రామాధిదేవత, సర్వసంపత్ప్రదాయిని, సర్వేశ్వరి, సర్వవంద్య, సర్వులకూ పుత్రదాయిని, సర్వస్తుత, సర్వజ్ఞ, సర్వదుర్గార్తినాశిని, కృష్ణవామాంశ సంభూత, కృష్ణ ప్రాణాధిదేవత, కృష్ణ ప్రాణాధిక - రాధిక. పత్నిగా కృష్ణుడి వక్షఃస్టల౦లో శాశ్వతంగా స్థానం సంపాదించుకొంది.

ఆ మహాదేవి ఒకప్పుడు శతశృంగపర్వతంమీద దివ్య వర్షసహస్రాలు తపస్సు చేసింది. కృష్ణుడు ఆమెను వక్షఃస్థలంమాద నిక్షేపించుకున్నాడు. కృపాన్వితుడై విలపించాడు. అతిదుర్లభమైన వరాన్ని ఆమెకు అనుగ్రహించాడు.

ప్రాణప్రియా! నువ్వు శాశ్వతంగా నా వక్షఃస్థలంమిదనే ఉండు. నాకు భక్తురాలివై ఉండు. సౌభాగ్యంలో గౌరవంలో ప్రేమలో నువ్వే శ్రేష్ఠవు, నువ్వే జ్యేష్ఠవు. నాకు అత్యంత ప్రేయసివి. వరిష్ఠవు, గరిష్టవు. నేను నిన్ను స్తుతిస్తాను. పూజిస్తాను. నేనెప్పుడూ నీకు వశుడను, నీకు సాధ్యుడను - అని శ్రీకృష్ణ పరమాత్మ ఆ లలనకు వరమిచ్చి సపత్నీరహితయైన ప్రాణవల్లభగా స్వీకరించాడు. మిగతా దేవీమూర్తులందరూ ఈ మహాశక్తిని సేవించినందువల్లనే ఆయా శక్తులను పొంది లోకారాధ్యలు అవుతున్నారు. ఎవరు ఎటువంటి తపస్సు చేస్తే వారికి అటువంటి శక్తులు లభించాయి. హిమాలయాలలో వెయ్యి దివ్య వత్సరాలు తపస్సు చేసి దుర్గాదేవి శివుడికి ఇల్లాలై జగదారాధ్య అయ్యింది. సరస్వతీదేవి గంధమాదన పర్వతంమీద లక్ష దివ్యవసంతాలు తపస్సు చేసి బ్రహ్మదేవుని ఇల్లాలై సకలవిద్యాధిదేవతయై పూజలు అందుకుంటోంది. పుష్కరక్షేత్రంలో లక్ష్మీదేవి నూరు దివ్య యుగాలు తపస్సు చేసి మహాశక్తి అనుగ్రహానికి పాత్రురాలై శ్రీమన్నారాయణుడికి ఇల్లాలై సకలసంపదధిష్ఠానదేవత కాగలిగింది. సావిత్రీదేవి కూడా ఇలాగే అరవైవేల దివ్యశరత్తులు ధ్యానించి వేదాధిష్ఠాన దేవత అయ్యింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక్కొక్కరూ శతమన్వంతరాలు తపస్సుచేసి ఆదిపరాశక్తి అనుగ్రహానికి పాత్రులై సృష్టి స్థితిలయ శక్తులను పొందగలిగారు. ఆయా పదవులను అందగలిగారు. శ్రీకృష్ణుడు స్వయంగా ఆ పరాశక్తిని దశమన్వంతరాలు ఆరాధించి గోలోకాధిపత్యం పొందగలిగాడు. ఇప్పటికీ ఆక్కడ ఆనందిస్తున్నాడు. ధర్ముడు కూడా దశమన్వంతరాలు ఉపాసించి సర్వప్రాణుడూ సర్వపూజ్యుడూ సర్వాధారుడూ కాగలిగాడు. ఇలాగ దేవిని ఆరాధించినవారంతా లోకారాధ్యులు అయ్యారు. మునులూ మనువులూ రాజులూ బ్రాహ్మణులూ దేవిని ఆరాధించి శక్తిసంపన్నులై ప్రజలకు ఆరాధ్యులయ్యారు.

నారదా! గురుముఖతః నేను విన్న పురాణగాథను సమగ్రంగా నీకు వివరించాను. ఇంకా ఏమి వినాలనుకుంటున్నావో చెప్పు - అని ముగించాడు నారాయణ మహర్షి

భూదేవికి వరాహస్వామి వరాలు


Kaliyuganlakshaṇalu - కలియుగంలక్షణాలు

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - కలియుగంలక్షణాలు

సాలగ్రామాలూ శివశక్తులూ జగన్నాథుడూ కలియుగంలో పదివేల సంవత్సరాల తరవాత భారతభూమిని విడిచిపెట్టి స్వస్థలం చేరుకుంటారు. సాధువులు పురాణాలు శంఖాలు శ్రాద్ధతర్పణాలు వేదోక్తకర్మలు దేవపూజలు దేవనామధేయాలు గుణకీర్తనలు వేదాంగాలు సకలశాస్త్రాలు సత్యధర్మాలు వేదాలు గ్రామదేవతలు వ్రతాలు తపస్సులు ఉపవాసాలు - ఇత్యాదులన్నీ వారితోపాటే తరలివెళ్ళిపోతాయి. అటు పైని భూగోళంనిండా వామాచారులు మిగులుతారు. కపటులూ మిథ్యావాదులూ మిగులుతారు. తులసి కలికానికైనా కనిపించదు. ఏ పూజలూ ఉండవు - పొట్టపూజ తప్ప, అందరూ శఠులూ క్రూరులూ దాంభికులూ అహంకారులూ చోరులూ హింసకులూ అయిపోతారు. స్త్రీ పురుష భేదం తప్ప తక్కిన వావివరసలు ఆంతరిస్తాయి. నిర్భయంగా జరిగే వివాహాలు ఉండవు. వస్తువులకు భద్రత ఉండదు. ఎక్కడ చూసినా ఇంటింటా ఆడపెత్తనమే సాగుతుంది. తర్జనభర్త్పనలతో భార్యలు భర్తలను కొడుతూ ఉంటారు.

ఇల్లాలే ఇంటికి అధిపతి. మొగడు సేవకుడికన్నా అధముడు. అత్తమామలు దాసీదాససమానులు. ఇళ్ళల్లో రక్తసంబంధులే తప్ప విద్యాసంబంధులు ఎవ్వరూ కనపడరు. విద్యా సంబంధులతో మాటలే ఉండవు. మనుషులంతా అపరిచితుల్లాగా మెలుగుతుంటారు. ఆడవాళ్ళ ఆజ్ఞలేనిదే ఎవ్వరూ ఏ వనీ చెయ్యలేని దుర్బలులైపోతారు.

కలియుగంలో వర్ణాశ్రమధర్మాలు అన్నీ అంతరిస్తాయి. సంధ్యావందన యజ్ఞ సూత్రాది కర్మలు కనిపించవు. చతుర్వర్ణాలవారూ మ్లేచ్ఛాచారులైపోతారు. మ్లేచ్చ విద్యలే నేర్చుకుంటారు. మ్లేచ్చ శాస్త్రాలే పఠిస్తారు. అగ్రవర్ణాలవారు అట్టడుగువారికి సేవకులు అవుతారు. ప్రజలందరూ సత్యహీనులవుతారు. మేదినీ మండలంలో సత్యానికి తావే ఉండదు. తరువులు ఫలహీనాలవుతాయి. తరుణులు సంతానహీనలు అవుతారు. గోవులు క్షీరహీనమవుతాయి. క్షీరంలో వెన్న ఉండదు. దంపతులు ప్రీతిహీనులవుతారు. గృహస్థులు సత్యహీనులవుతారు. రాజులు ప్రతాపహీనులవుతారు. ప్రజలు కరపీడితులు (పన్నుల బెడద) అవుతారు. నదీనద వాపీకూపతటాకాదులు జలహీనాలు అవుతాయి. చతుర్వర్ణాలవారూ ధర్మహీనులూ పుణ్యహీనులూ అవుతారు. కోటికొక్కడైనా పుణ్యాత్ముడు కనిపించడు. బాలబాలికలు కుత్సిత వికృతాకారులవుతారు. అంతటా కుత్సిత కువార్తలే వినిపిస్తాయి.

కొన్ని నగరాలూ గ్రామాలూ నరశూన్యాలైపోతాయి. భయానకంగా మారిపోతాయి. కొన్నిచోట్ల ఒక కుటీరంలో ఒక మనిషి మిగులుతాడు. నగరాలలో గ్రామాలలో అరణ్యాలు పెరుగుతాయి. అరణ్యవాసులు కూడా కరపీడితులు (పన్నుల బెడద) అవుతారు. తటాక నదీతీరాలలో మాత్రమే పంటలు పండుతాయి. ఉన్నత వంశాలవారు నీచపడతారు. అసత్యవాదులూ ధూర్తులూ అవుతారు. సారవంతమైన భూములు నిస్సారమైపోతాయి. పంటలు పండవు. నీచులు ధనవంతులవుతారు. దైవభక్తులు నాస్తికులవుతారు. పౌరులు దయావిహీనులూ హింసకులూ నరఘాతకులూ అవుతారు. సాలప్రాంశులు కనిపించరు. స్త్రీ పురుషులందరూ వామనులూ వ్యాధి పీడితులుగానే ఉంటారు. అల్పాయుష్కులూ గదాపీడితులూ (గదా = అదొక రోగం). యౌవనమే కనిపించదు. ఇరవై ఏళ్ళకే వృద్ధులైపోతారు. ఎనిమిదేళ్ళకే యువతులు రజస్వలలై గర్భిణులవుతారు. సంవత్సరానికి ప్రసవించి పదహారేళ్ళకే ముసలమ్మలవుతారు. పతిపుత్రవతులు అరుదుగా కనిపిస్తారు. ఎక్కువమంది గొడ్రాళ్ళుగానే మిగిలిపోతారు. చతుర్వర్ణాలవారూ నిస్సంకోచంగా కన్యావిక్రయం చేస్తారు. కుటుంబంలో మగవారు జారులపై ఆధారపడి జీవనం సాగిస్తారు. వారు అందించే సామ్ముతో పొట్టపోసుకుంటారు. కలియుగంలో ఇంకా దారుణమేమంటే - శ్రీహరి నామంకూడా ఒక వ్యాపారవస్తువు అవుతుంది. (హరేర్నామ్నాం విక్రయిణో భవిష్యంతి కలౌయుగే).

ధనవంతులు కీర్తికోసమనీ ప్రచారంకోసమనీ దానాలు చేస్తారు. అటు తరువాత తామిచ్చిన దానాలను తామే ఆక్రమించుకుంటారు. దాన నియమాలను ఉల్లంఘిస్తారు. దేవవృత్తి బ్రహ్మవృత్తి గురువృత్తి (కులవృత్తి) - అన్ని భూములనూ ఆక్రమించుకోవడమే. స్వదత్తమా పరదత్తమా అనే విచక్షణ కూడా ఉండదు.

అత్తగారు వదినగారు సవతితల్లి మరదలు రక్త సంబంధీకురాలు - ఇలాంటి వావివరసలు అంతరిస్తాయి. తల్లిని తప్పించి అందరితోనూ అక్రమ సంబంధాలు పెచ్చరిల్లుతాయి. ఎవరు ఎవరికి ఇల్లాలో నిర్ణయించడం కష్టమవుతుంది

నారదా! కలియుగంలో లాక్షాలోహ రసాలతోనే కాదు ఉప్పుతోకూడా వ్యాపారం చేస్తారు. విప్రులు వృషవాహకులూ అన్యశవదాహకులూ అవుతారు. చెయ్యకూడనిచోట భోజనాలు చేయడం పరస్త్రీలతో సంగమించడంలాంటి దోషాలకు వెనుకాడరు. పంచయజ్ఞాలు అంతరిస్తాయి. యజ్ఞోపవీతాలు ఉండవు. సంధ్యాశౌచాలు వదిలేస్తారు. డబ్బుల్ని వడ్డీకి తిప్పే వనితలూ, తార్పుడు గత్తెలూ, జారిణులూ, ముట్టుతలూ విప్రుల ఇళ్ళల్లో వంటగత్తెలవుతారు.

సారాంశంగా ఒక్కమాట చెబుతాను - కలియుగంలో ఆహార నియమంకానీ, విహార నియమంకానీ ఆశ్రమ నియమంకానీ ఎమీ ఉండదు. సమస్తమూ మ్లేచ్చమయమైపోతుంది. హస్తప్రమాణ వృక్షాలూ అంగుష్ఠప్రమాణ మానవులూ తయారవుతారు. (హస్తప్రమాణే వృక్షే చ అంగుష్ఠే చైవ మానవే) ఈ స్థితి వచ్చేసరికి విష్ణుయశస్కుడు అనే విఫ్రుడికి పుత్రుడుగా కల్కి నామధేయంతో నారాయణుడు కళాంశగా అవతరిస్తాడు. మహాబలిష్ఠుడై సుదీర్ఘ కరవాలంతో ఎత్తయిన గుర్రంమీద భూగోళమంతటా వీరవిహారం చేన్తూ మ్లేచ్చుల్ని సంహరిస్తాడు. మూడు రాత్రులలో పృథివిని మ్లేచ్చశూన్యం చేస్తాడు. వెంటనే అంతర్థానం చెందుతాడు.

పునస్సృష్ఠి


Radha Devi is Ganga Devi - రాధాదేవియే గంగాదేవి

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము -  రాధాదేవియే గంగాదేవి మహర్షీ! గంగానదికి “త్రిపథగ” అనేపేరు ఉంది అన్నావు. అది ఎలా ఎర్చడింది ? ఎలా ఎక్కడెక్కడ ఆ న...