Wednesday, March 18, 2026

Halahala, Kalakuṭa (most deadly and venomous poison in the universe) Emerged - హాలాహలం జనించుట

హాలాహలం జనించుట

ఆ తరువాత

అంతలోనే, అల్లకల్లోలమైన ఆ సముద్రంలోనుండి హాలాహలమనే విషం కోలాహలమైన అగ్ని జ్వాలలతో బయటపడింది. దాన్ని చూసి భయపడి సురాసురులు వాసుకిని వదలిపెట్టి పారిపోయారు.

అలా పుట్టిన హాలాహలం ప్రళయకాలంలో రుద్రుని నేత్రాగ్నికి నూరు రెట్లు భయంకరంగా ఉంది. కల్పాంతంలో పుట్టే అగ్నికి వెయ్యింతలు తీవ్రంగా; ప్రళయకాల సూర్యాగ్నికి లక్ష రెట్లు అధికంగా తేరిచూడరానిదిగా ఉంది. ప్రళయరాత్రిలో మెరిసే మేఘాల నుండి కురిసే పిడుగుల్లాగా భయంకరంగా ఉంది. భగభగమని పంచభూతాలు ఒక్కసారిగా మండినట్టుంది. భుగభుగ మనే పొగలతో ఛటఛటమనే నిప్పుకణాలతో, ధగధగమనే పెనుమంటతో ఫటఫటమంటూ ఆ మహావిషాగ్ని ఆకాశానికి ఎగిసింది. దిక్కులన్నిటా వ్యాపించింది. పైకి బయళ్ళలోకి ఎగిసి పడింది. మందరపర్వతాన్ని దాటిపోయి సముద్రంలో నాలుగువైపులా అలుముకొని, గట్లను దాటుకొని, దేవదానవులకు తగిలి; కొండగుహలలో చిక్కుపడిపోక ఎత్తయిన కులపర్వత శిఖరాలలో నిప్పులు చెరిగింది. అడవుల్ని తగలబెట్టింది. పొదరిండ్లలోని పూల గుత్తుల్ని బూడిదచేసింది. గ్రామాలను బూడిద చేసింది. నదీనదాలను నాశనంచేసింది. దిగ్గజాల కుంభస్థలాల పైకి సోకింది. సూర్యగోళాన్ని నక్షత్రాలను అణగదొక్కింది. మహర్లోకాన్ని మసిచేసింది. పై లోకాలకు తీగలు సాగిపోయింది. చుట్టుముట్టుకొని కమ్ముకొని బ్రహ్మాండం పేలిపోయేలా విస్తరించింది. పాతాళలోకంలో వేళ్ళు పాకింది.

దాన్ని ఆపడానికి ఎవరికి చేతగాని తీరులో లోకాలలో అన్నింటా తానే అన్నట్టు వ్యాపించింది. జింకలాగా గెంతింది. పాములాగా పాకింది. సింహంలాగా దూకింది. పక్షిలాగా ఎగిరిపోయింది. ఏనుగులాగా కదలకుండా నిలబడింది. లోకాలలో గగ్గోలు పుట్టించింది. ఆ పెనుమంటల వేడిమికి తట్టుకోలేక దేవతలు కొందరు భస్మమయ్యారు. రాక్షసులు కాలి నేలరాలారు. చుక్కలు రాలిపోయాయి. కిన్నర దంపతులు రూపు మాసిపోయారు. గంధర్వుల విమానాలు కాలిపోయాయి. సిద్దుల గుంపులు చెదరిపోయాయి. గ్రహాలు సంకటంలో పడ్డాయి. ఋషుల తాటాకు గుడిసెలు కాలిపోయాయి. నదులు ఇగిరిపోయాయి. సముద్రాలు ఇంకిపోయాయి. అడవులు మాడి మసి అయ్యాయి. పట్టణాలు బావురుమన్నాయి. పురుషులు చొక్కిపోయారు. పుణ్యస్త్రీలు పొగిలి పొగిలి ఏడ్చారు. కొండలు బద్దలయ్యాయి. జీవరాసులన్నీ మాడి బూడిదయ్యాయి. లోకాలన్నీ వేడిమితో వేగిపోయాయి. దిక్కులు కలత పొందాయి. చెట్లు తలకిందులయ్యాయి. నేలలు ముక్కలు చెక్కలయ్యాయి; అకాలంలో ప్రళయం వచ్చి పడ్డట్టు అయింది.

ఆ మహావిషాగ్నికి అడ్డంపోయి, నిలువరించి దాని బారినుండి జగత్తును కాపాడే మహనీయులెవరూ లేకపోయారు. ఆలుబిడ్డలనే తేడా లేకుండా అందరూ చచ్చిపోయారు.

అప్పుడు బ్రహ్మాది దేవతలంతా కైలాసానికి వెళ్ళారు. ఆ మహేశుని మందిరం ముందు చేరారు. ద్వారపాలకులు అడ్డగించగా తొలగండని చెప్పిలోనికి వెళ్ళారు. దుఃఖంలో ఉన్న భక్తుల్ని ఆదుకోవడంలో వేగిరపడే ఆ లీలా మహిమాన్వితమైన పరమేశ్వరునితో “స్వామీ! శరణు! శరణు! మా మొఱ విను. మనస్సులో మామీద కృప గల్గి మా మనవిని చేకొనవయ్యా! దయతో చూడవయ్యా!” అంటూ ఆయన్ని చూశారు.

దయామయుడైన శివుడు ఆ సమయంలో పార్వతీ దేవితో కైలాసంలో ప్రమథగణాలతో కూడిన నిండు సభలో ఉన్నాడు. అయినా దేవతలు దీనులుగా రావడాన్ని గ్రహించి స్వామి వారికి వెంటనే దర్శనం ఇచ్చాడు.

అపుడు ప్రజాపతులు శివునికి సాష్టాంగపడి స్తుతులతో ఇలా ప్రార్థించారు.

ఓ భూతాత్మా! భూతేశా! భూతభావన రూపా! దేవా! మహాదేవా! దేవవంద్యా! నీకు నమస్కారం. ఈ లోకాలకు అన్నింటికి ప్రభువు నీవే. బంధ మోక్షాలు రెండూ నీ వల్లనే కలుగుతాయి. ఆర్హులకు శరణు గోరదగ్గ తండ్రివి నీవే. బుద్ధిమంతులు నీపై ఆసక్తితో పూజిస్తారు. సకల జగత్తును సృష్టించి - పోషించి - నశింపచేస్తావు. నీవే బ్రహ్మ - విష్ణు శివులన్న పేర్లతో వ్యాపించి ఉన్నావు. అతి రహస్యమైన బ్రహ్మతత్తం నీవే. నీవు సదసత్తులకు అతీతమైన వాడివి. నీవు శక్తిమంతుడివి. శబ్ద బ్రహ్మవు నీవే. జగదంతరాత్మ నీవే. సకల జగత్తుకు ప్రాణాధారం నీవే.

పరమేశ్వరా! అన్ని లోకాలూ నీలోనే పుడతాయి. నీలోనే నివసిస్తాయి. నీలోనే నశిస్తాయి. నీ ఉదరం సకల భూతరాశికీ నివాసం.

పరమేశా! నీ ముఖమే అగ్ని. జీవాత్మ పరమాత్మల కలయికే నీ ఆత్మ. కాలమే నీగతి. భూమే నీ (పాదం); వాయువే నీ శ్వాస; వరుణుడే నీ నాలుక; దిక్కులే చెవులు; స్వర్గమే నాభీ. సూర్యుడే నీ దృష్టి. నీరే నీ వీర్యం. సముద్రాలే నీ గర్భం. ఆకాశమే శిరస్సు. ఓషధులే వెండ్రుకలు. పర్వతాలే ఎముకలు, చంద్రుడే మనస్సు. వేదాలే నీ ధాతువులు. ధర్మశాస్త్రమే నీ హృదయం. ఉపనిషత్తులే నీ ఐదు ముఖాలు. నీ రూపం పరతత్త్వం. స్వయంజ్యోతివి నీవు. సకలానికీ మూలం నీవే.

(శివుడికి ఐదు ముఖాలు. 1. సద్యోజాతముఖం, 2. తత్పురుష ముఖం, 3. వామదేవ ముఖం, 4.అఘోర ముఖం, 5. ఈశాన ముఖం)

ఓ మహాదేవా! కొందరు నీ వున్నావంటారు. కొందరు లేవంటారు. కొందరు నీవు నిర్గుణుడివంటారు. మరికొంతమంది నీ వున్నావో లేవో అని సందేహపడుతుంటారు.

('కలడో లేడో' అని గజేంద్రుడు పడ్డ సందేహం విష్ణువు విషయంలోనే కాదు - శివుడి విషయంలోనూ అంతే.)

దేవాధిదేవా! దీనరక్షకా! పురాణపురుషా! చంద్రచూడా! సర్వరూపా! ఆలోచిస్తే ప్రాణం, ఇంద్రియాలు, ద్రవ్యగుణాలు అన్నీ నీ స్వభావంలోనే ఉన్నాయి. కాలమూ, యజ్ఞమూ నీవే, సత్యమూ, ధర్మమూ, ఓంకారమూ, మోక్షమూ నీవే అన్నింటికీ ఆధారం నీవే. నీవే వేద రూపుడివి. సత్త్వరజస్తమో గుణాలు నీకు నేత్రాలు. నుదుటి కంటి మంటతో యమాదులనే అవలీలగా కాల్చిన నీకు; మన్మథుడు కాని, త్రిపురాసురులు కాని, కాలకూటం కాని ఒక లెక్కలోనివి కావు. ఇవేవీ నీకు హాని కల్గజేయవు.

ఓ ఫాలనేత్రా! త్రిమూర్తులకూ, త్రిలోకాలకూ, త్రికాలాలకూ మూలం నీవే. మొదట భేదాలతో కనిపించి తుదకు అభిన్నంగా ఏకమాత్రంగా ప్రకాశించే పరబ్రహ్మతత్త్వం నీవే.

ఓ స్వామీ! సదసద్రూపమైన ఈ సకల చరాచరజగత్తు నీలోనే ఉంది. బ్రహ్మాదులు కూడా నిన్ను స్తుతించడానికి భయపడి పెదవులు విప్పరు. అలాంటప్పుడు మేము నిన్ను పట్టుబట్టి స్తుతించడానికి ఎంతటి వాళ్ళం?

పరమేశ్వరా! దేవతలు, రాక్షసులు తమ బాహుబలంతో పాలసముద్రాన్ని చిలుకగా అందులో నుండి హాలాహలమనే విషం పుట్టి ప్రపంచాన్నంతా కోలాహలం చేసోంది. దాన్ని ఎవరూ ఆపలేకుండా ఉన్నారు. నీవు దయతో దాన్ని అవలీలగా పరిగ్రహించి ప్రాణికోటిని కాపాడవా ప్రభూ!

పరమేశ్వరా! లోకుల కష్టాల్ని తొలగించడానికి, ఐశ్వర్యాన్ని విజయాన్ని ప్రసాదించడానికి, క్రూరుల్ని నాశనం చేయడానికి చక్కగా నీవే తగినవాడిని.

నీకన్నా మాకు ఇంకోటి తెలియదు. నీకన్నా గొప్పగా లోకాల్ని రక్షించగలవారూ ఎవరూ లేరు. లోకాలన్నిటికీ ప్రభువు నీవే. ఇతరులెవరున్నారు? ఇలా స్తుతిస్తున్న దేవతల్ని చూసి, సకలభూత సమవర్తి అయిన శివుడు తన సతితో ఇలా అన్నాడు.

శివుండు దేవప్రార్థితుండై హాలాహలమును బానము సేయుట

The Kurma Avatar Story - కూర్మావతార కథా ప్రారంభము

కూర్మావతార కథా ప్రారంభము

విష్ణుదేవుడు దేవతలపైన ప్రేమ వెల్లడికాగా, ఒక మహాకూర్మరూపాన్ని ధరించాడు. అది లక్షయోజనాల వెడల్పు కల్గి, మిక్కిలి కఠినమైన డిప్ప కల్గినది. సమయం వస్తే బ్రహ్మాండాన్ని అంతా తినివేయగల పెద్ద గుహలాంటి నోరు దానికి ఉంది. సకల చరాచర జీవరాసులన్నింటినీ తనలో ఇముడ్చుకోగల పెద్ద పొట్ట ఉంది. ప్రపంచంమీద మరో ప్రపంచం పడి ఆగినా కదలని పెద్ద పెద్ద కాళ్ళున్నాయి. లోనికీ బయటకీ వచ్చిపోయే పెద్ద మూతి ఉంది. తామరల్లాంటి కన్నుల జంట ఉంది.

(కులపర్వతాలు చాలా పెద్ద ఆకారం కల్గినవి. అందుకే స్వామి లక్ష యోజనాల వెడల్పుగల మరొక ద్వీపమా అన్నట్టు ఆ కొండ కిందికి దూరి దాన్ని మోయడానికి సిద్ధపడ్డాడు. ఇలా సమయాన్ని బట్టి తన స్వరూపాన్ని నిర్ణయించుకోవటమె 'స్వేచ్చ'. స్వామివారి అవతారాలన్నీ ఇలా శత్రుసంహారానికి, భక్తరక్షణకు కావలసిన రూపాన్ని యథేచ్చగా పొందుతాయి.)

తాబేలుగా మారిన శ్రీహరి సముద్రంలోకి తేలికైన ఒక ముత్తెపు చిప్పలాగా ప్రవేశించాడు. అవలీలగా అడుగున ఉన్న మందరపర్వతాన్ని మహాసర్పమైన వాసుకిని ఒకేసారి పైకెత్తాడు. దీన్ని చూసి ఇంద్రాది దేవతలు తలలు ఊపుతూ “బాగు! బాగు! అమ్మ బాబోయి! శ్రీహరీ! నీకే శరణు” అంటూ నమస్కారాలు పెడుతూ జయజయధ్వానాలు చేశారు. ఆ ధ్వనులు భూమిలో, దిక్కులలో, ఆకాశంలో మారుమోగాయి.

ఈ విధంగా, శ్రీహరి చిలికేవారిలో తానూ ఒకడయ్యాడు. సముద్రమనే మజ్జిగ కడవకు కుదురు తానే కవ్వమూ తానే - రాట కట్టేతాడూ కవ్వపు తాడూ తానే. ఆహాహా; శ్రీమహావిష్ణువు లీలలు అతనికే తెలుసు.

సముద్రాన్ని కడవగా, పర్వతాన్ని కవ్వంగా చేసి చిలకడానికి; లక్ష్మిని, అమృతాన్ని సంపాదించడానికి ఒక్క శ్రీమహావిష్ణువు తప్ప మరొక శక్తిమంతుడు ఉన్నాడా!

గొల్లల బ్రతుకు తక్కువైందేమీ కాదు. ఎందుకంటే పాలసముద్రాన్ని గొల్లల లాగానే దేవతలు, హరి చిలికారు. అంచేత దేవతలూ గొల్లలయ్యారు. శ్రీహరి తానూ గొల్ల అయ్యాడు. అమృతాన్ని దేవతలు; లక్షిని శ్రీహరి పొందారు.

ఈ విధంగా విష్ణువు సహాయంతో సముద్ర మథనం ప్రారంభించిన దేవతలు రాక్షసులు కవచాలు ధరించారు. దట్టీలు కట్టుకొన్నారు. బట్టల్ని పిరిచుట్లు చుట్టుకున్నారు. చేతులు చేతులు చరుచుకున్నారు. భుజాలు భుజాలూ రాసుకున్నారు - “లేవండి. లేవండి. రండి. చిలకటం మొదలు పెట్టండి” అంటూ హెచ్చరికలు చేసారు. వేగంగా పెరుగు చిలికే గొల్లపల్లె గోపాలకుల్లాగా సముద్రం నడుమ కవ్వంగా ఉండే మందర పర్వతానికి తాడైన పాము తలా తోకా పట్టుకొని మధింపసాగారు. వారి పెద్ద పెద్ద కేకలతో బ్రహ్మాండం నిండిపోయింది. గుబగుబమని శబ్దిస్తూ కవ్వపు కొండ గిరగిరమని తిరుగుతుండగా; దాని వేగానికి 'భుగభుగ' మనే శబ్దాలు ఆకాశం నిండాయి. లెక్కకు మిక్కిలిగా ఉన్న చుక్కలతో ప్రతిఫలిస్తూ ఆ పాలమీగడ తేటలోని కాంతి నిండిన తుంపరల పరంపరలు పైకి ఎగిరాయి. తమ చేతుల్లో గట్టిగా పట్టుకొని క్రమక్రమంగా లాగుతున్న తిరుగుతున్న ఆ వాసుకి పడగలలో నుండి పుట్టిన భయంకరమైన విషాగ్ని కీలలవల్ల వారికి దాహం వేసింది. అయినా పట్టు వదలకుండా వారు మథనం కొనసాగించారు. సముద్రతీరంలోని కొండమల్లెపూల గుత్తులనుండి వెదజల్లబడుతున్న స్వచ్చమైన మకరందాల గుబాళింపును మోసుకువస్తున్న పిల్లగాలులు వారి దేహాలపై పట్టిన చెమటల్ని తాకగానే ఆ చెమటలు ఇగిరిపోయాయి. ఒకరినొకరు పరిహసించుకొంటూ, గొప్పలు చెప్పుకొంటూ, భళిభళీ అని మెచ్చుకుంటూ, ఇలాకాదు అలా అని అంటూ; అసూయాగ్రస్తులై ఒకరిమీద ఒకరు స్పర్ధతో సముద్రంలో అటూ ఇటూ ఊగుతున్న మందరపర్వతం యొక్క భ్రమణం వల్ల పుట్టిన ఘుంఘుం అనే శబ్దమూ; ఆ వాసుకి నోటినుండి బయట పడుతున్న భయంకరమైన బుసబుసలు; పెద్దదైన ఆ పర్వతాన్ని సముద్రంలో ఉంచి చిలకటం వల్ల గుంపులు గుంపులుగా ఒదిగిపోతూ, పైకి ఎగరడానికి వీలుకాక భయపడిన తాబేళ్ళు, ఎండ్రకాయలు, పాములు, మొసళ్ళు, పెద్దచేపలు, తిమింగలాలు, హంసలు, చక్రవాకాలు, కొంగలు, కప్పలు, బెగ్గురుపక్షులు చేస్తున్న ఆర్తనాదాలూ, కలిసి మూడింతలుకాగా; సురాసురవీరులు చేస్తున్న అట్టహాసాలు, గర్జనలు, పెడబొబ్బలు నాల్గింతలు కాగా, పది దిక్కుల గోడలు మొత్తినట్లు పేట్లురేగి రాలిపోయాయి. ఒకడిని మించి మరొకడు వేగంగా చిలుకుతూ అసూయతో పౌరుషాలు పలుకుతున్నారు. అమృతం కోసం ఉబలాట పడసాగారు. కొత్త వస్తువుల పుట్టుక కోసం ఎదురుచూస్తున్నారు. 'ఇంకా ఎంతసేపు చిలుకుదాం' అని శ్రీహరిని అడిగారు. ఎడతెగని ఆశతో పట్టినపట్టు వదలకుండా మథింపసాగారు.

ఆ క్షీరసాగరంలో అలా నిరంతరం గిరగిరమంటూ ఆ పర్వతం తిరగగా తిరగగా ఆ శబ్దం బ్రహ్మాండ భాండమంతా నిండిపోయింది. బ్రహ్మాదేవుడి చెవులు కూడా గింగురుమన్నాయి. ఇంక ఏం చెప్పాలి?

ఆ సమయంలో ఆ సముద్రం మధ్యలో

సర్పరాజు తోక తల పట్టుకొని దేవతలు రాక్షసులు చోట్లు మారుతూ తొందర తొందరగా లాగుతూండగా మంధరపర్వతం సముద్రంలో ఎడమనుండి కుడికి తరువాత కుడినుండి ఎడమకు తిరుగసాగింది.

అలా ఆ పర్వతాన్ని ఉంచి సముద్రాన్ని చిలకగా అందులో ఉన్న పక్షులు, తాబేళ్ళు, మొసళ్లు, పాములు సుళ్ళుపడి చీకాకు పడ్డాయి. తొట్రుపడ్డాయి. గట్లపై పడ్డాయి. ఎగిరి బయటపడ్డాయి. పొర్లిపడుతున్నాయి.

ఓ రాజా! అలా దేవతలు, రాక్షసులు తమ తమ చేతుల్లో తిప్పడం వల్ల తిరుగుతున్న ఆ మందరపర్వతం పుట్టించిన రాపిడివల్ల ఆ కూర్మరాజు వీపు దురద ఏమాత్రం తగ్గలేదు.

హాలాహలం జనించుట

A Powerful Crocodile Attacked and Grabbed Gajendra's Leg - మొసలి గజేంద్రుడుని పళ్ళతో కరిచి పట్టుట

మొసలి గజేంద్రుడుని పళ్ళతో కరిచి పట్టుట

ఇలాగ గజరాజు క్రీడిస్తున సమయంలో ఉన్నట్టుండి భుగభుగమనే చప్పుళ్ళతో పెద్ద పెద్ద బుడగలు పుట్టి ఆకాశానికి ఎగిరే విధంగా ఆ సరస్సులో నుండి ఒక పెద్ద మొసలి పైకెగిసింది.

లోకమంతా భయపడే విధంగా ఫూత్కార శబ్దాలు చేస్తూ ఆ సరస్సులోని ఇతరములైన మొసళ్ళు, చేపలు అదిరిపోయేలా ఒక ఉదుటున అది పైకి లంఘించింది.

తన తోకను ఒకసారి ఝాడించి, ప్రళయ కాలంలోని సుడిగాలి లాంటి ఝంఝను సృష్టించి సరస్సులో సుడిగుండాలు సృష్టిస్తూ పైకి ఎగిరింది.

ఆ అలల తాకిడికి గుట్టమీద ఉన్న చెట్లు వేళ్ళతో సహా నేలపై పడిపోయే విధంగా భయంకరమైన హుంకారం చేస్తూ అది గగుర్పాటు కల్గిస్తూ ఆకసంలోకి లేచి కిందపడుతూ ఒక్క ఉదుటున ఒడుపు తెలిసి ఆ గజరాజును పళ్ళతో కరిచి పట్టింది.

ఆ గజేంద్రుడు వేగంగానే ఆ మొసలి పట్టును తప్పించుకొని తన పొడవైన తొండం పైకెత్తి మొసలిపై ఒక దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బతో ఆ మొసలి చచ్చినట్టు నీళ్ళలో పడి వెంటనే తేరుకొని అతివేగంగా ఆ ఏనుగు ముందరి కాళ్ళను పట్టుకొంది.

ఆ గజేంద్రుడు ఎంతో ధైర్యవంతుడు. ఏ మాత్రం భయం లేకుండా తన దంతాల మొనలతో ఆ మొసలి బొరుసుల కింది భాగాలు కదిలిపోయేలా చిట్లిపోయేలా పొడిచాడు; ఆ మొసలి కూడా కాళ్ళను వదలిపెట్టి ఏనుగుతోక మూలాన్ని కరిచింది.

మొసలి ఏనుగును మడుగులోకి లాగింది. ఏనుగు మొసలిని గట్టువైపు ఈడ్చింది. పరస్పరం ద్వేషం పెంచుకొని పోరాడుతుండగా, ఏనుగు కన్నా మొసలి, మొసలి కన్నా ఏనుగు - బలంగా కనిపిస్తున్నాయే అంటూ అతల, కుతల లోకాలలోని వీరులు బెదరిపోయారు.

(అతల-కుతల-సుతల-వితల-తలాతల -రసాతల-పాతాల లోకాలు అధోలోకాలు ఏడు.)

ఈ విధంగా ఆ ఏనుగూ, మొసలీ రెండూ ఒకదానితో ఒకటి విజృంభించిన శరీరాలు కలవై ఒకదాన్ని మరొకటి మించాలని ఢీకొన్నాయి. అన్నిలోకాలూ వీటి పోరాటాన్ని చూచి భయపడిపోయాయి. వాటికి ఒకదాన్ని మరొకటి ఓడించాలన్న పట్టుదల తప్ప మరేమీ లేకపోయింది. ఈ అలజడితో సరస్సులోని నీరంతా కలుషితమైపోయి గొప్ప సంక్షోభం ఏర్పడింది. సింహాన్ని మరో సింహం, కొండను మరో కొండ వెనుదీయకుండా ఎదిరించినట్లు నీళ్ళలో అవి రెండూ పెనుగులాడుతూ, ఒకదాన్ని మరొకటి ఆక్రమిస్తూ పోరాడాయి. ఒకటి లోపలికి లాగితే మరొకటి బయటికి లాగుతూ ఆ కొలనును మలినపరచాయి. మిక్కిలి వేగంతో అటుబడి ఇటుబడి తొట్రుపాటు లేకుండా పోరాడాయి. బుడబుడమని, బుగులు బుగుల్లని శబ్దాలు పుట్టగా నురుగులు గట్టి నీళ్ళు పైకి ఎగిశాయి. ఆ నీటి తుంపరల్ని చప్పరిస్తూ నిరంతరమూ తమ గుహలవంటి నోళ్ళను తెరుస్తూ మూస్తూ వాడివై, మిక్కిలి భీకరములయిన తమ దంతాలతో ఒకటి మరోదాన్ని ముట్టెలతో తాకుతూ తలలు చిన్న చిన్న ముక్కలుగా అయ్యేటట్టు అమరికలు తప్పి నెత్తురు చిప్పిల్లే విధంగా హుమ్మంటూ వాడి పండ్లతో పొడుచుకుంటున్నాయి. ఒకదానిని మరొకటి లాగేటప్పుడు కాళ్ళమొదళ్ళలోని తమ పట్టును వదలకుండా దృఢంగా నిలదొక్కుకున్నాయి. వాటి పరిభ్రమణ వేగానికి సరస్సులోని నీళ్ళు సుళ్ళు తిరిగాయి. ఆ నీటిలోని మొసళ్ళు, తాబేళ్ళు, ఎండ్రకాయలు, చేపలు, కప్పలు మొదలైన నీటి జంతువుల ప్రాణాలు గాలిలో కలిశాయి. బింకంతో మొసలి, ఏనుగూ ఒకదాన్ని మరొకటి అణగదొక్కి చీకాకుపరిచాయి. బలం కోల్పోయి బాగా అలసిపోయాయి. పరస్పరం దెబ్బలు తప్పుకోడానికి అక్కడ దొరికిన నాచును, కప్పచిప్పలను అడ్డంగా పడవేయసాగాయి. రెండింటికీ శరీరాలపైన ఆశ విడిచి గెలిచి తీరాలనే పట్టుదలతో పోరాడాయి. రాత్రింబవళ్ళలాగా ఒకదాని తరువాత మరొకటి పరాక్రమించటం మొదలుపెట్టి, పోరాటమనే ఆటలో పడి నిద్రాహారాలు మాని మొక్కపోని పరాక్రమంతో ఘోరంగా చెలరేగి చాలాకాలం అవి పోరాడుతూ ఉండిపోయాయి.

వేగం, పట్టుదల, శక్తి కల్గిన గజేంద్రుడు ఈ భూమి మీద ఎన్నో విధాలుగా మకరంతో పోరాడుతుండగా, ఆకాశంలోని మకర, మీన, కర్కట రాశి సముదాయం ఒక్కసారిగా భీతి పొంది సూర్యమండలంలోకి దూరాయి.

నీటిలోకి మళ్లీమళ్ళీ ఈడుస్తున్న ఆ మొసలిని ఓడించడానికి ఎంతో శ్రమించి ఏనుగుల రాజు గగ్గోలు చేశాడు. వజ్రాయుధంలాంటి తన బలమైన దంతాలతో దాని రొమ్ము పగిలేటట్టుగా పొడిచాడు. ఇంద్రునిభుజం వంటి తన తొండంతో దాని మెడ చుట్టి పట్టి విసిరిపారేశాడు.

ఆ సమయంలో

అలా ఆ మొసలితో పోరాడుతున్న గజరాజును ఒంటరిగా వదలివెళ్ళి పోవడానికి మనసొప్పక ఆడ ఏనుగులు ఆత్రంగా అలాగే చూస్తూ నిలబడిపోయాయి. ఎందుకంటే భార్యాభర్తల అనుబంధం విడదీయరానిది కదా!

అప్పుడు ఏమయిందంటే.

ఇలా పోరాడగా పోరాడగా నీటిలో ఉన్న మొసలికి జీవనాధారం నీరే కాబట్టి దాని బలం, పట్టుదల అంతకంతకూ పెరిగాయి. ఎవరికైనా స్థానబలం గొప్పదికదా! నేలపై తిరిగే గజరాజు యోధుడే అయినా నీటిలో అతని 'శక్తి' చాలలేదు. కృష్ణపక్షంలోని చంద్రకాంతి తరిగి పోయినట్టుగా అతని బలం సన్నగిల్లి అలసిపోయాడు.

ఇక మొసలి విజృంభించింది. సింగంలాగా హుంకరించి దాని కుంభస్థలం మీదికి ఒక్క ఉదుటున ఉరికింది. పాదాలను ఆక్రమించింది. మెడను, వీపును చరిచింది. సులువుగా పైకెగసి దాని తోకపై ఒక దెబ్బకొట్టింది. నలిగిపోయేట్టు ఢీ కొట్టింది. ఎముకలు, దంతాలు విరిగిపోయేలా కొట్టింది. అంతటి ఏనుగునూ నీళ్ళలో ముంచివేసింది. తానూ మునిగింది. నక్కి నక్కి ఒక్కసారిగా ఆ ఏనుగుపైన పడుతోంది.

ఆ మొసలి కనిపించకుండా గుట్టుగా నీటిలో దాగుతూ ఉండి ఏనుగు గట్టుకు వెళ్ళేటప్పుడు అడ్డంగా కనిపిస్తుంది. దానికాళ్ళను పెనవేసుకొని బంధిస్తుంది. ముందుకు పోనీక వెనక్కిరానీక భయంతో కూలిపోయేలా తోకతో కొడుతుంది. లేస్తే ఒళ్ళు ఝాడించి పైకెగురుతుంది; శౌర్యంతో చీలుస్తుంది. పక్కకు వెళ్ళిపోతుంది. వెనక్కి మరలిపోతుంది. మళ్ళీవచ్చి పట్టుకొంటుంది. కోపిస్తూ బాధపెడుతుంది.

ఈ విధంగా అవక్ర పరాక్రమంతో (ఆ మొసలి) తన జాతి మొసళ్ళనన్నిటినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తూ మహామాయ అనే పెను చీకటి అల్ప హృదయునియొక్క జ్ఞానదీపాన్ని కప్పివేసిన రీతిగా రానురాను ఉత్సహిస్తూ, కలహ ప్రయత్నాలు చేస్తూ, అనేక విధాలుగా నీటిలో మునగడంలో తేలడంలో సామర్థ్యం కల్గిన ఆ మకరం మిక్కిలి సాహసం

ఆ మొసలి రెండు కాళ్ళను నేలపై దృఢంగా ఆనించింది. ఊపిరి బిగబట్టి పంచేంద్రియాల వ్యామోహాన్ని అణగించింది. బుద్ది అనే తీగకు మారాకు తొడిగి, ఆనంద స్వరూపమైన పరమాత్మ స్థానాన్ని ఆశ్రయించి ఆనందించే పరమయోగి పుంగవుడిలాగా ఆ ఏనుగు పాదాలను కదలకుండా వదలకుండా గట్టిగా పట్టుకొని తన పరాక్రమం చూపింది.

(యోగులు రెండు పాదాలు నేలపై నిలిపి ఉచ్చ్వాసనిశ్వాసాలను నియమించి అయిదు జ్ఞానేంద్రియాల వ్యామోహాన్ని అరికడతారు. తద్వారా బుద్ధికి వికాసం కలిగిస్తారు. అలా దుఃఖరహితమైన బ్రహ్మపదాన్ని ఆశ్రయించి ఆనందిస్తారు. ఈ స్థితిని మకరంతో సమన్వయిస్తూ సాగిన పద్యమిది.)

గజేంద్రుని బాధిస్తున్న మొసలిని చూచి స్వర్గంలో ఉండే ఐరావతమే తెల్లబోయింది. అది దేవేంద్రుని కింద పడదోసి దేవతలు పట్టుకోడానికి రాగా దొరక్కుండా ఆకాశంలో పరుగెత్తింది.

ఆ గజేంద్రుడు ఊహ తలకిందై కలత చెందాడు. బతుకు మరుగులో పడి, మహామోహమనే తీగతో కట్టివేయబడ్డ తన పాదాన్ని విడిపించుకోలేని స్థితిలో సందేహస్థితిలో దీనంగా భయంకరమైన మొసలి యొక్క వాడి కోరలకు చిక్కి కరవబడి గాయమైన కాలిగిట్టలతో, ఇంకా పోరాడుతూనే ఉన్నాడు.

(సంసారంలో ఉన్న జీవుడు జీవనమనే గహన ప్రదేశంలో చిక్కుకుంటాడు. మోహలతాబంధనాన్ని విడిపించుకోలేడు. పలు సంశయాలకు పాత్రమవుతాడు. అట్టివాని దీనదశతో ఇక్కడ గజేంద్రుని దీనావస్థ పోల్చబడింది.)

ఆ గజేంద్రుడు ఆ మొసలితో అలసిపోకుండా, స్రుక్కిపోకుండా, విసుగులేకుండా, పగళ్ళు, సంజలు, రాత్రులు - ఎడ తెరిపిలేకుండా వేయి సంవత్సరాలపాటు పోరు సాగించాడు.

గొప్పబలంతో గజరాజు ఆ మకరరాజుతో పలు సంవత్సరాలు పోరాడి బాగా చితికిపోయాడు. తన బలాన్ని మొసలి బలాన్ని పోల్చి చూచుకొని ఇలా ఆలోచించాడు. ఇంకా దీన్ని గెలవాలన్న అడియాస కూడదు. దీనితో సమంగా పోరాడే శక్తి నాలో లేదు; అనుకొంటూ పూర్వజన్మలో చేసిన పుణ్యకర్మ ఫలమైన దివ్యజ్ఞానం స్ఫురించగా ఈ విధంగా అనుకొన్నాడు.

(భగవంతుడు చరాచర జగత్తుకంతా ప్రభువు. మనుష్యులకే కాక ఆ దేవుడు పశుపక్ష్యాదులకు తన అపారమైన అనుగ్రహం చూపుతాడు. అందువల్లనే క్లిష్టదశలో ఉన్న గజేంద్రునికి పూర్వపుణ్యఫలమైన దివ్యజ్ఞానం సిద్ధించింది. అదే అతనికి తరుణోపాయం అయింది.)



The Story of Gajendra Moksham - గజేంద్ర మోక్షణ కథా ప్రారంభము

గజేంద్ర మోక్షణ కథా ప్రారంభము

నాల్గవ మనువు కాలంలో జరిగిన విశేషాలను చెబుతాను.

ఓ రాజా! ఉత్తముని తమ్ముడైన తామసుడు నాల్గవ మనువయ్యాడు. అతని కొడుకులైన కేతువు, వృషుడు, నరుడు, ఖ్యాతి మొదలైన పదిమంది మహావీరులు రాజులయ్యారు. సత్యకులు, హరులు, వీరులు మొదలైనవారు దేవతలయ్యారు. త్రిశిఖుడు దేవేంద్రుడయ్యాడు. జ్యోతిర్వ్యోముడు మొదలైనవారు సప్తమహర్షులయ్యారు. హరిమేధునికి, హరిణికి కుమారుడుగా శ్రీమహావిష్ణువు హరి అనే పేరుతో అవతరించాడు. ఆ హరియే మొసలికి చిక్కిన గజేంద్రుణ్ణి విడిపించి ప్రాణభయం పోగొట్టాడు. ఆ ప్రభువు సకలలోకాలకు అధిపతి. దయాసాగరుడాయన - అని శుకమహర్షి చెప్పగా పరీక్షిత్తు ఆ గజరాజు - మొసలి కథను వినగోరి

మొసలి నీటిలో తిరుగుతుంది. ఏనుగు అడవిలో తిరుగుతుంది. ఈ రెండూ ఒక దానిని మరొకటి సమీపించవు. అలాంటి వాటి నడుమ యుద్ధం ఎందుకు జరిగింది? ఏదీ ఒక మహత్తర కారణం లేకుండా వీటి మధ్య పోరు అసంభవం. ఈ పోరును పురుషోత్తముడైన హరి ఏ విధంగా తీర్చాడు? గజరాజు బాధ ఎలా తొలగింది? అందులోనూ ఆ అడవిలో ఆ ఏనుగును పురుషోత్తముడు తప్ప ఎవరు కాపాడగలరు.

ఓ మునీంద్రా! ఈ కథ ఎలా జరిగిందో నాకు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. దయతో వినిపించండి. ఆ కథలు నా చెవులకు పెద్ద పండుగ ఉండి మనసును కూడా ఆహ్లాదపరుస్తాయి.

పుణ్యజీవులైన పండితులు ఏ కథలతో మోక్షప్రదాత అయిన శ్రీమహావిష్ణువును వర్ణిస్తారో, ఆ కథలు మోక్షానికి దారి చూపిస్తాయని పండితులు ఎంతో ఆనందంగా వింటారు.

ఇలా ప్రాయోపవేశంలో ఉన్న పరీక్షిత్తు శుకమహర్షిని అడిగాడని సూతుడు సభలో ఉన్నవారికి చెప్పాడు. శుకుడు పరీక్షిత్తుకు గజేంద్రమోక్ష గాథను వినిపించడం ప్రారంభించాడు.

ఓ రాజా! క్షీరసాగరంలో త్రికూటమనే అందమైన పర్వతం విరాజిల్లుతూ ఉంది. అది పదివేల ఆమడల పొడవు, అంతే వెడల్పు కల్గి ఉంటుంది. దానికి బంగారు, వెండి, ఇనుములతో ఏర్పడిన మూడు ఎత్తెన శిఖరాలున్నాయి. ఆ కొండ చరియలలో, శిఖరాల్లో ఉండే రత్నాలవల్ల, గైరికాది ధాతువులవల్ల అన్ని దిక్కులు, భూమి, ఆకాశం చిత్రమైన రంగురంగులుగా ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ కొండలో పెద్దపెద్ద చెట్టు, తీగలు, పొదలు, మోగుతూ పారే సెలయేరులు, అలవాటుగా తిరుగాడే దేవతల విమానాలు కనిపిస్తాయి. ఆ కొండ చరియలలో కిన్నరులు విహారాలు చేస్తుంటారు.

ఆ త్రికూట పర్వతం నిండా మాదిఫలం, లవంగం, పుల్ల మాదీఫలం, మామిడి, మొగలి, జీడి, అంబాళం, తెల్ల తెగడ, పనస, రేగు, పొగడ, పుబ్బ, మర్రి, కొండమల్లె, మొల్ల, ఎర్ర గోరంట; తుమ్మ, కోవిదారం, ఖర్జూరం, కొబ్బెర, వావిలి, చందనం, వేము, మందారం, నేరేడు, నిమ్మ, పూలగురివెంద, ఇప్ప, తాడి, తక్కోలం, కానుగ, గిరకతాడి, రసాలం, మద్ది, మోరటి, మారేడు, ఉసిరిక, పోక, కడిమి, గన్నేరు, అరటి, వెలగ, ఉమ్మెత్త, కలజువ్వి, దిరిసెన, ఇరుగుడు, అశోకం, మోదుగు, పొన్న సురపొన్న, సంపెంగ, తామెర, మరువం, మంచిమల్లె మొదలైనవి ఉండేవి. నిరంతరం వసంత ఋతువు అక్కడ కొలువు తీరినట్టుగా కొమ్మలు రెమ్మలు చిగుళ్ళతో, మొలకలతో, పూలతో, పండ్లతో అద్భుతంగా కనిపిస్తుండేది. ఆ తోటలలో ముత్యాల చిప్పలతో కూడిన ఇసుకతిన్నెలు కుప్పలుతెప్పలుగా ఉండేవి.

ఆ చెట్ల కొమ్మలమీద చిలుకలు, కోయిలలు గుమిగూడి వాడియైన తమ ముక్కుపుటాలతో పండిన పండ్లను పొడుస్తుండగా, ఆ పండ్ల రంధ్రాలనుండి నిరంతరం ధారగా పళ్ళరసం కాలువలుగా పారుతూ కనిపించేది.

ఆ కొలనులోని నీళ్ళు బంగారు వన్నెతో మిరుమిట్లు గొలుపుతూ ఉండేవి. ఆ నీటిలో బంగారు కాంతి గల తెల్లకలువలు, ఎర్రకలువలు, తామరలు విస్తరించి ఉండేవి. సువాసనను గుబాళిస్తున్న ఆ పూలలోని మకరందాన్ని తనివితీరా నిరంతరం తాగుతూ మదించిన గండు తుమ్మెదలు తమ ప్రియురాండ్రతో విహరిస్తూ కనిపించేవి. వాటి పక్కనే శకుంత పక్షులు, కలహంసలు, కారండవ పక్షులు, నీటికోళ్ళు, చక్రవాకాలు, కొంగలు, కొక్కెరలు, చీకుకొక్కెరలు అందంగా తిరుగాడుతూ కనిపించేవి. ఆ పక్షులు చేసే ధ్వనులు భూమికి ఆకాశానికి మధ్యగల ప్రాంతాన్ని చెవుడు పడేలా చేసేది. ఆ కొండలో చంద్రకాంతమణులు, మరకతాలు, వజ్రాలు, వైడూర్యాలు, నీలాలు, గోమేధికాలు, పుష్యరాగాలు మిక్కిలి మనోహరంగా నిండి ఉండేవి. బంగారు, వెండి శిఖరాలున్న ఆ కొండ చరియల్లో విద్యాధరులు, దేవతలు, సిద్ధులు, చారణులు, గరుడులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు తమతమ ప్రియురాండ్లతో కలిసి జంటలు జంటలుగా క్రీడిస్తూ ఉండేవారు. వారు సరస సంభాషణలు చేస్తూ చాలా అందంగా పాడుతూ ఉండగా ఆ ప్రాంతమంతా మంగళప్రదంగా ప్రకాశిస్తూ ఉండేది. ఆ కొండలో మదపుటేనుగులు, గురుపోతులు, గండభేరుండాలు, ఖడ్గమృగాలు, సింహాలు, శరభాలు, పులులు, కుందేళ్ళు, చమరీమృగాలు, ముండ్లపందులు, కోతులు, పెద్దపెద్ద పాములు, అడవి పిల్లులు తిరుగుతుండేవి. ఆ పోరాటాల సంరంభాన్ని చూసి యమభటులు కూడా భయపడి 'శరణు' వేడుతూ ఉండేవారు. 
(ఈ పర్వతంలోని వృక్షాలు, జంతువులు, పక్షులు, పుష్ప ఫలాల వర్ణన దాదాపు అంతా మూలభాగవతంలో ఉన్నదే. అదనంగా ఒక అంశం మూలంలో ఉంది.

తస్య ద్రోణ్యాం భగవతో వరుణస్య మహాత్మనః
ఉద్యానమృతుమన్నామ ఆక్రీడం సురయోషితామ్‌ ॥


ఆ కొండ లోయలో వరుణదేవుని ఉద్యానవనముంది. ఋతుమత్‌ - అని దానిపేరు. సర్వ ఋతువుల లక్షణాలు నిరంతరంగా కనిపించే దివ్య ఉద్యానవనమది. అందులో దేవతాస్త్రీలు విహరిస్తారని మూలం వివరిస్తోంది.

పురాణాలలోని ప్రకృతి వర్ణన ఈనాటి మనకు చాలా వివరాల్ని అందిస్తుంది. చాలా చెట్లపేర్లు, పూలపేర్తు, జంతుపక్షుల పేర్లు ఈనాడు మనకు పరిచయంలేని కారణంగా ఒకప్పటి ప్రకృతి వైవిధ్యం (బయో - డైవర్సిటి) ఎంత విస్తారమైనదో ఈ వర్ణనద్వారా మనం అర్ధం చేసుకోవచ్చు.)

ఆ త్రికూట పర్వత సమీపంలోని అడవిలో చెంచెతలు, చెంచులు, తిరుగుతూ ఉండేవారు. క్రూరమృగాలయిన అడవి దున్నలు, ఎలుగుబంట్లు, పాములు, ఖడ్గమృగాలు, గురుపోతులు, గండ్రంగులు, చమరీమృగాలు, పావురాలు, అడవికోతులు, శరభమృగాలు, అడవిపందులు మొదలైనవి కొట్లాడుతుండగా ఎక్కడ చూసినా కాకులు, గుడ్లగూబలు సంచరిస్తూ ఉండేవి. అలాంటిది ఆ అడవి.

(మూలంలో ఉద్యానవనంలాగా కనిపించే 'వరుణ' వనాన్ని తరువాతి కథతో అన్వయం బాగా కుదరడానికి ఈ అడవిని పోతనగారు స్వకపోలవర్ణనగా పెంచారు.)

ఆ అడవిలో కొన్ని ఏనుగులు మదించిన తమ దేహాలతో అన్య మృగాలకు కన్నెత్తి చూడ శక్యంగాని విధంగా ఉంటాయి. భయంకరమైన తమ పరాక్రమంలో దిగజాలను కూడా మించిపోతాయి. అలాంటి ఆ ఏనుగుల గుంపు ఒకటి అలా సరదాగా చెర్లాటలు ఆడుకుంటూ తిరగాలని బయలుదేరి, తిరిగి తిరిగి, ఆడి ఆడి, అలసిపోయి దప్పిక చేత నీటిమడుగుల్లో దిగుదామన్న కోరికతో నీటిగాలి వచ్చేవైపు నడక సాగించాయి.

ఆ అడవి ఏనుగులు ఎంత నల్లగా ఉన్నాయంటే పగటిపూటంతా సూర్యుని వెలుతురుకు భయపడి కొండగుహల్లో దాక్కొని ఉండి సాయంకాలం కాగానే సూర్యుని వెలుతురు శక్తి సన్నగిల్లిన సమయం చూసుకొని చీకట్లు గుహల్లో నుండి బయటికి వచ్చాయా అన్నట్టుగా ఉంది.

(ఒకవైపు అడవి ఏనుగులు నల్లటి కాంతిని వివరిస్తూ ఈ పద్యం, మనోహరమైన ఉపమానంతో సూర్యుడు 'వృద్దుడు' కావటమనే పలుకుబడిని పరిచయం చేస్తోంది. ఉదయాన సూర్యుడు బాలుడు, మధ్యాహ్నసమయంలో యువకుడు, సాయంకాలాన వృద్దుడు. శత్రువు బలహీనపడటం చూచి వాడి శత్రువు విజృంభిస్తాడు. అది ఈ పద్యంలోని లోకనీతి. కవితాచమత్కృతి.)

పెద్ద ఏనుగులే కావు - గున్నఏనుగులు కూడా పరాక్రమంలో పెద్ద వాటికి ఏమీ తీసిపోవు. వాటి బలసంపత్తి అలాంటిది. కొండలను చూసి కూడా పక్కకు పోవు. ఢీకొంటాయి. సింహాలను చూచి కూడా వెనక్కి తిరగవు. ఎదిరిస్తాయి. పిడుగులు పడినా భయపడవు. లెక్క చేయకుండా ముందుకు సాగిపోతాయి.

ఆ అడవి ఏనుగులు అతిభయంకరంగా విహరించడం ప్రారంభించగానే వాటి ధాటికి భయపడి పులులన్నీ పొదరిండ్లలోకి దూర్తాయి. ఎలుగుబంట్లు గుహల్లోకి చొరబడతాయి. అడవి పందులు గోతుల్లోకి చేరిపోతాయి. జింకలు దిక్కుల కొసలకు పరుగెత్తుతాయి. అడవి దున్నలు నీటిమడుగుల్లో దాక్కుంటాయి. కోతులు కొండల పైని బండల మీదికి ఎగబాకుతాయి. పాములు పుట్టల్లోకి ఒదిగిపోతాయి. నెమళ్ళు ఆకాశంలోకి ఎగిరిపోతాయి. చమరీమృగాలు తమ కుచ్చుతోకలతో ఆ ఏనుగుల అలసట పోయేలా విసరుతాయి.

ఆ మదగజాల నుండి జాలువారుతున్న చెమట సుగంధపరిమళ భరితమైనది. వాటిని త్రాగటం, తుమ్మెదలకు చాలా ఇష్టమైన పని. పడుచు తుమ్మెదల గుంపులు ఆ మదజలాన్ని తనివితీరా మిక్కిలి ఆసక్తితో కడుపుల నిండా తాగి సంతోషంతో తిరుగుతూ జుంజుమ్మని పాటలు పాడుతున్నాయి.

ఒక గండు తుమ్మెద తన ప్రియురాలైన ఆడ తుమ్మెదకు మాటిమాటికి గజ మదజల సుగంధాన్ని ఎందుకు ఇవ్వాలని ఆలోచించి తనను సమీపించిన ఆడు తుమ్మెదకు నిండు మగతనాన్నంతా ఆ మదజలగంధం అందించింది.

(ఆడు తుమ్మెదలు మగ తుమ్మెదల వద్దనున్న గజమదజలంలోని సువాసన చేత ఆకర్షింపబడుతున్నాయని ఇందులోని విశేషం. జంతు పరిశోధనల్లో కూడా ఈ అంశంమీద ప్రస్తావన ఉంది. మహాకవులు తమ దివ్య దర్శనంతో ఇలాంటి శాస్త్రీయరహస్యాన్ని తమ కావ్యాల్లో దాచిపెట్టారు.

నిండుబోటుంతనము - వంటివి అందమైనప పద బంధాలు. 'మగంటిమి' - అన్న మాటకు వివరణ ఇది. పోటు మగడు - వంటి మాటల్లో ఈ అర్ధాన్ని చూడవచ్చు.)

మదగజాల నుండి స్రవించే జలధారల సుగంధాలను ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తూ ఆడ తుమ్మెదల గుంపులు ఆ మత్తులో కదలిక లేకుండా స్తబ్దమై పోయాయి. కాని ఝంకారాన్ని వదలకుండా తిరగసాగాయి.

ఆడుతుమ్మెదలు ఏనుగుల మదజలం ప్రియమైనదని భావించి దానిపై గుంపుగాపోయి ముసరగా, మగ తుమ్మెదలు మదజలంపై అపేక్ష వీడి ఆడుతుమ్మెదలతో ఎల్ల ఉల్లాసాలు పొందాయి.

ఆ సమయంలో 

ఇక గున్న ఏనుగులు కూడా విజృంభించసాగాయి. నీటిగుంటలను వాసన చూస్తూ తొక్కుతూ, పండ్లతో కూడిన చెట్లను రాచుకుంటూ, చిగుళ్ళను గబగబాతింటూ, పులుల్ని ఎనుబోతుల్ని జింకల్ని అటూఇటూ పోనీక నిలువరిస్తూ, నీటిమడుగుల్లోకి చొరబడి నీటిని కలగుండు పెడుతూ; కొండలపైన గుండ్రంగా తిరుగుతూ వినోదిస్తూ చెర్లాడుతున్నాయి.

ఆ మదగజాలు తమ తొండాలతో, మదజలం నిండిన తమ చెక్కిళ్ళతో, కుంభస్థలాలతో కొండల్ని ఢీ కొట్టేవి. ఆ ఘట్టనంతో కొండలు తలకిందులై పడేవి. దిక్కులు ఆ శబ్దానికి బద్దలైపోయేవి. దీన్ని చూసి అన్నిలోకాలూ గడగడలాడేవి.

అలా ఎక్కడ పడితే అక్కడ తిరుగాడుతున్న ఏనుగుల సమూహంలో ఒక్క గజేంద్రుడు కొన్ని ఆడ ఏనుగులు తన వెంట సేవిస్తూ వస్తుండగా దారితప్పి వెనుకబడి ఒంటరివాడయ్యాడు.

ఆ గజరాజు తనకు అన్నివైపులా(ముందు, వెనుక, ఇరుపక్కలా) దప్పికతో అలిసి పోయి వస్తున్న ఏనుగుల గుంపును పట్టించుకోకుండా, భగవంతుని సంకల్పంచేత తెలివికోల్పోయి, ఆ గుంపునుండి వేరుపడి, దారి తప్పిపోయాడు. తాను, తన ఆడ ఏనుగుల గుంపుతో మరోదారిలో ముందుకు సాగిపోయాడు.

బల్లిదుడైన ఆ గజరాజు తన ప్రియురాండ్రకు నీటిగుంటల పక్కన ఉంటే లేత పచ్చికను మచ్చికతో అందిస్తోంది. చిగుళ్ళ గుత్తులను, పూలకొమ్మలను కోసి అందరికీ పంచిపెడుతోంది. మదజలంతో తడిసిన విసనకర్రల వంటి తన చెవులతో వాటి చెమటల్ని పోగొడుతోంది. తన దంతాలతో వాటి మెడలను గోకుచూ భార్యల వెనుకవైపు చేరి మూచూచి, ఋతుసమయాన్ని గుర్తిస్తూ, క్రీడిస్తూ, తొండాన్ని ఆకాశంలోకి చాస్తూ, విశ్రమిస్తూ విలాసంగా ఆడుకొంటున్నది.

ఆ గజరాజు యొక్క కుంభస్థలాల నిండుదనాన్ని చూసి ఓడిపోయిన స్త్రీల స్తనాలు పైటకొంగుచాటున చేరాయి. అతని నడకలు ఠీవికి సరిపోక స్త్రీల నడకలు అందెలను ఆశ్రయించాయి. అతని తొండం యొక్క శోభని చూసి స్త్రీల చిన్న తొడలు ఒడ్డాణాల డాబుసరిని తోడు తెచ్చుకున్నాయి. ఆ గజరాజు దంతాల తెల్లదనానికి సరిపోవటం లేదని స్త్రీల దంతాల ముఖమనే చంద్రుని కాంతిని ముసుగుగా వేసుకున్నాయి. అతడి మనోహరమైన శరీరాన్ని మనసారా చూడగోరి అంజన, అభ్రమువు, కపిల మొదలైన దిగ్గజాల భార్యలందరూ తనవెంట మనసుపడిరాగా అందాల సొగసుగాడు ప్రకాశించాడు.

(దిగ్గజాలు ఎనిమిది - 1) ఐరావతం 2) పుండరీకం 3) వామనం 4) కుముదం 5) అంజనం 6)పుష్పదంతం 7)సార్వభౌమం 8) సుప్రతీకం. వారి భార్యల పేర్లు 1) అభ్రమువు 2) కపిల ౩) పింగళ 4) అనుపమ 5) తామ్రపర్ణి 6) శుభదంతి 7) అంగన 8) అంజనావతి.)

ఇంకా ఆ గజరాజు ఎన్నో అడవులలో ఇలా విహరించి విహరించి ఆ మత్తులో పడి దారితప్పి దప్పికతో అతని మనస్సు స్వాధీనం తప్పి పోగా ఆడ ఏనుగులతో పాటు తాను కూడా ఎటుబడితే అటు నీటి ఆదరువు కోసం చూస్తూ ప్రయాణం సాగించాడు.

గజరాజు ఆ సమీపంలోనే ఒక నీటిమడుగు చూశాడు. అందులో అప్పుడే విచ్చుకున్న తామరలు - కలువలు ఉన్నాయి. వాటిలో తుమ్మెదలు ఆడుతున్నాయి. తాబేళ్ళు, చేపలు, మొసళ్ళు భయంకరంగా నీటిని ఎగజిమ్ముతూ తిరుగుతున్నాయి. హంసలు, కొంగలు, చక్రవాకాలు అందులో బాగా తిరుగుతున్నాయి. ఆ మడుగు గట్టున మర్రి, తాడి, మామిడి, మద్ది చెట్లతోపాటు పూలతీగలు, పొదరిండ్లు ఉన్నాయి. అలాంటి మనోహరమైన సరస్సును చూశాడు.

(సాధారణంగా కమలాలు వికసించే సమయంలో కలువలు ముడుచుకొంటాయి. అందుకే కమలాలకు మిత్రునిగా సూర్యుని, కలువల మిత్రుడుగా చంద్రుని చెబుతారు.

ఇక్కడ పోతనగారు అప్పుడు విచ్చుకొంటున్న కమలాలు, కలువలు - రెండూ ఆ సరస్సులో ఉన్నాయని చెబుతున్నారు. అది క్షీరసాగరంలోని త్రికూటపర్వత సానువుల్లోని అడవిలో ఒక మడుగు. కాబట్టి ఈ విశేషవర్ణన ఆ దివ్యభూమికి సంబంధించినదే.

గజ లక్షణం ఏమిటంటే చెట్లు, పూల తీగలు, పొదరిండ్లు - వీటిని చూడగానే రెచ్చిపోవటం. అందుకే దప్పికతోపాటు తమ విహారానికి అనుకూలంగా ఉన్న ఆ మడుగును గజరాజు చూసి అదే తమకు తగిన చోటని భావించాడు. అందుకే ఈ వర్ణన.)

ఇతరులెవరూ కనిపించడం లేదు. మనుష్యజంతుసంచారమేదీ లేని చోటని అర్థం.

మదించిన ఆ ఏనుగుల శరీరాలకు పద్మ గంధంతో కూడిన చల్లని పిల్లగాలులు హాయిని కూర్చాయి. తామర తూండ్లు తింటూ మధురశబ్దాలు చేసే ఆ మడుగులోని రాయంచల గొంతుకలు వాటి చెవులకు విందు గూర్చాయి. విరిసిన తామరల, కలువల వాసనలు ముక్కులకు తృప్తిని కలిగించాయి. నిర్మలమైన అలలతోడి నీటితుంపరలు గుహలవంటి ఆ ఏనుగుల నోళ్ళలో పడి దప్పికను తీరుస్తున్నాయి. ముల్లోకాలలోను ఇలాంటి సరస్సు లేదన్నట్టుగా శోభిస్తున్న ఆ సరస్సు వాటి నేత్రాలకు విందు సమకూరుస్తూంది. ఆ మడుగును సమీపించగానే ఏనుగులన్నీ తమ ఇంద్రియ వ్యాపారాలను మరచిపోయాయి. మడుగులోకి ఒక్కసారిగా దిగబడ్డాయి.

ఆ ఏనుగుల గుంపు తొండాలలో నీళ్ళు బాగా నింపుకొని, సరదాగా చెక్కిళ్ళ పైన చల్లుకొని, గళగళమని శబ్దాలు మెండుగా జేస్తూ, తమ పెద్ద కడుపులు నిండేలా బాగా నీళ్ళు తాగాయి.

ఆ సమయంలో.

ఇంకా ఆ గజరాజు తన తొండంలోని నీళ్ళు బాగా పీల్చినాడు. మునిగాళ్ళపైన నిక్కి నుంచుని వేగంగా కదిలించి నీటిని పైకి ఆకాశంలోకి చిమ్మినాడు. ఆ మోతతో నీటిలో నుండి పైకి ఎగిరిన నల్ల మొసళ్ళు, మొసళ్ళు, చేపలు ఆకాశంలో తిరిగేటువంటి మీన కర్మాటకములను పట్టుకోబోతున్నాయి. ఈ దృశ్యాన్ని చూచి దేవతలు ఆశ్చర్య చకితులయ్యారు.

ఇంకా ఆ గజరాజు అడ్డు లేకుండా విహరించసాగాడు.

ఆ పద్మాల సరస్సులో అడ్డు లేకుండా విహరిస్తున్న గజరాజు పైన ఆడ ఏనుగులు తమ తొండాలతో నీళ్ళు చల్లాయి. ఆ నీటి బిందువులతో తడిసిన అతడు సెలయేళ్ళతో కూడిన నీలాద్రిలాగా ప్రకాశించాడు.

ఆడ ఏనుగులు అతని శరీరం నిండా పద్మాలు అలంకరించాయి. వాటితో గజరాజు వేయికన్నులున్న దేవేంద్రుడిలాగా విలసిల్లినాడు.

గున్న ఏనుగులు ఇంకా అతనిపై కలువ పుప్పొడి చల్లగా అతను బంగారు కొండలాగా వెలిగిపోయాడు.

మళ్ళీ ఆ ఆడ ఏనుగులు కలువతూండ్లతో తమ నాథుని అలంకరించారు. దానితో సర్పాలను ధరించిన శివుడిలాగా గజరాజు కొత్త శోభను సంతరించుకొన్నాడు. అతనిపై ముత్యాలచిప్పలను భార్యలు విసరగా వాటితో మెరుపు తీగలలోని మేఘాలను మించి పోయి గజేంద్రుడు కొత్త కాంతులు చిమ్మాడు (నల్లటి శరీరం ఏనుగుది - కనుక మేఘం; ముత్యాలచిప్పలు మెరుపు తీగలు)

గజరాజు చేసిన ఆ విశేషమైన సంచారాల వల్ల ఆ సరస్సు అందచందాలు మాసిపోయి ఒక కొత్త సొగసును సంతరించుకొంది. గడుసువాడైన విటునితో రతిక్రీడలో కౌగిళ్ళలో పడి నలిగిపోయి కంపిస్తున్న కుసుమ సుకుమారిలాగా ఒప్పింది. మదించిన తుమ్మెదలు చెదిరిన ముంగురుల్లాగా; శుష్కించి పోయిన పద్మాలు ముఖంలాగాా తమ స్థానాల నుండి జారిపోయిన చక్రవాకాలు స్తనాల్లాగా  నలిగిన ఇసుక తిన్నెలు అలసి సొలసిన పిఱుదుల్లాగా నీరసపడిపోయి కనిపించాయి.

ఇలాగ గజరాజు క్రీడిస్తున సమయంలో

మొసలి గజేంద్రుడుని పళ్ళతో కరిచి పట్టుట

Story of Ksheera Sagara Madhanam - క్షీరసాగర మథన కథా ప్రారంభము

క్షీరసాగర మథన కథా ప్రారంభము

అని పలుకగా పరీక్షిత్తు శుకమహర్షితో ఇలా అన్నాడు.

ఓ మహర్షీ! నామనవి వినండి. శ్రీమహావిష్ణువు క్షీరసాగరాన్ని ఎందుకు మధించాడు? కూర్మరూపం ధరించి సముద్రంలో ప్రవేశించి కవ్వంగా వాడబడుతూ ఉండిన అంత పెద్ద మందర పర్వతాన్ని ఎలా మోశాడు? దేవతలకు అమృతం ఎలా లభించింది? సముద్రంలో ఏమేమి పుట్టాయి? అంతా ఆశ్చర్యంగా ఉంది. దయతో నాకు ఆ వివరాల్ని చెప్పండి.

ఓ పండితోత్తముడైన శుకమహర్షీ! ఇప్పటివరకు ఎన్నో భగవంతుని కథల్ని చెప్పారు. ఎంత విన్నా నాకు సంతృప్తి కావడం లేదు. ఇంకా వినాలని ఉంది. నా చెవులనిండుగా శ్రీమహావిష్టు కథలను ఇంకా వినిపించు.

ఈ విధంగా పరీక్షిత్తు అడగ్గా శుకమహర్షి సంతోషించి విష్ణుకథలు చెప్పడానికి ఉపక్రమించాడు అని సూతుడు శౌనకాదిమునులతో ఇలా అన్నాడు - ఈ విధంగా శుకుడు పరీక్షిత్తును చూచి

శుకుడు ఇలా చెప్పాడు : “రాజా! రాక్షసులు కసి పెంచుకొని అతి సుకుమారమైన ఆయుధాలతోనే దేవతల ప్రాణాలు తీశారు. వీరి యుద్ధ విజృంభణకు తాళలేక వారిని ఎలా జయించాలో తెలియక దేవతలు శక్తి కోల్పోయారు. ఓడిపోయారు. చాలామంది చనిపోయారు.

ఆ సమయంలో కొందరు దేవముఖ్యులు ఇంద్రుడు, వరుణుడు, అగ్ని మొదలైన దిక్పాలకులతో, కలిసి మేరు పర్వతంమీద ఉన్న బ్రహ్మాదేవుని దర్శించారు. దేవతలు బ్రహ్మాదేవుని ఎన్నో విధాలుగా స్తుతించారు. ఎంతో బాధతో దేవతలందరూ రాక్షసుల దుర్మార్గాలను ఇలా విన్నవించారు.

దుర్వాసుని శాపంవల్ల ఇంద్రునితోపాటు సంపదలు లేనివయ్యాయి. పలువురు దేవతలు మరణించారు. వేడుకలు లేక శోభలేనివయ్యాయి.

వారివారి స్థానాలు వదలివచ్చి కాంతి విహీనులై కనిపిస్తున్న దేవతలను చూసి, బ్రహ్మదేవుడు పరమాత్ముడైన శ్రీమహావిష్ణువును ధ్యానించి నమస్కరించుకొని, వికసించిన ముఖంతో ఇలా వారికి తెలియజేశాడు.

నేను, మీరు, ఈ కాలమూ, మానవులు, పక్షులు, జంతువులు, తీగలు, చెట్లు, చెమట నుండి పుట్టె సూక్ష్మజీవులు, ఏ పరమాత్ముని తేజోరూపాలుగా జన్మించామో; ఆ భగవంతునికి నమస్కరిద్దాం. అంతే తప్ప దీనికి ఏడవటం ఎందుకు?

చంపదగినవాడు, రక్షింపదగ్గవాడు, కష్టపెట్టదగ్గవాడు, గౌరవింపదగ్గవాడు - అనే తేడాలు లేని ఆ భగవంతుడు మాత్రమే సృష్టి రక్షణ, లయ - అనే మూడు వ్యాపారాలను జరుపుతాడు. కాబట్టి మన చింతలు తీర్చుటకు ఆ పరమాత్ముడే తగినవాడు. (అతనినే శరణు వేడుకుందాం)

వరప్రదాత, లోకగురువు, దయామయుడు అయిన పరమాత్ముని మనం దర్శిస్తే మన దుఃఖ జ్వరాలు అన్నీ శమిస్తాయి అని వారికి విశ్వాసం కల్పించి బ్రహ్మదేవుడు వారందరితో కలిసి 'అజిత' భగవానుని నివాసానికి వెళ్ళాడు.

బ్రహ్మదేవుడు దేవతలతో కలిసి త్వరగా అజిత భగవానుని నివాసం చేరి, అదృశ్యరూపుడుగా ఉన్న ఆ ప్రభువును దివ్యమైన వేదమంత్రాలతో ఇలా స్తుతించాడు.

ఈ సమస్త జగత్తూ ఎవని మాయవల్ల మోహంలో మునిగిపోతుందో - ఎవని మాయదాట రానిదో; ఎవరు తన మాయచేత జగత్తు అంతా గెల్చుకున్నాడో, ఎవనిని మహాఋషులు కూడా చూడలేరో, సకలభూతాల విషయంలోనూ ఎవరు సమంగా ప్రవర్తిస్తారో, అలాంటి పరమాత్మ నుండే ఈ జగత్తు ఏర్పడింది. భూమి అతని పాదాలు. చంద్రుడు మనస్సు. అగ్ని ముఖం. కన్నులు సూర్యచంద్రులు. చెవులు దిక్కులు. వీర్యం జలం. త్రిమూర్తులకు మూలమితడే. అతని గర్భంలో జగత్తంతా దాగి ఉంది. ఆకాశమే అతని తల - ఇలా ప్రకాశించే ఆ పరమాత్మునికి నమస్కరిస్తాను.

ఏ పరమాత్ముని బలంచేత ఇంద్రుడు, అనుగ్రహంచేత దేవతలు, కోపం వల్ల రుద్రుడు, పౌరుషంచేత బ్రహ్మ అవయవాల నుండి వేదాలు, మునులు, పురుషావయవం నుండి ప్రజాపతి, వక్షస్థలం నుండి లక్ష్మీదేవి; నీడ నుండి పితృదేవతలు; రొమ్మునుండి ధర్మం; వీపు నుండి అధర్మం; తలనుండి స్వర్గం, నవ్వునుండి అప్పరసలు, గుహ్యావయవం నుండి బ్రహ్మ; ముఖంనుండి బ్రాహ్మణులు, భుజాలనుండి రాజులు, తొడలనుండి వైశ్యులు; పాదాలనుండి శూద్రులు; క్రింది పెదవినుండి లోభం, పైపెదవినుండి ప్రేమ; ముకుపుటాల నుండి కాంతి, స్పర్శవల్ల కామం, కనుబొమలనుండి కాలధర్మం, పక్కనుండి కాలం పుట్టాయి. అతని యోగమాయనుండే ద్రవ్యం, కర్మలు, గుణ విశేషాలు ప్రభవించాయి. నాలుగు విధాలైన జీవరాసుల పుట్టుక అతని స్వయం నిర్మాణ చాతుర్యమే; లోకాలు, లోకపాలకులు అతనినుండే పుట్టి వృద్ధి పొందుతుంటారు. దేవతలకు ఆయుస్సు, బలమూ ఆయనే. ప్రజలను పుట్టించి, వారి రక్షణం కోసం పుట్టిన యజ్ఞయాగాదుల కోసం జన్మించిన అగ్ని దేవుడూ ఆయనే. సముద్రంలోని ధాతుసమూహమంతా ఆయన సృష్టే సకల సృష్టీ ఆయనలోనే నిండి ఉంది. ముక్తికి ద్వారమూ అతనే. చావు బ్రతుకు రెండూ అతని రూపాలే. చరాచరప్రాణి సంఘానికి చైతన్యదాత ఆయనే. తేజస్సు, మనోబలం, బలం, వాయురూపాలతో, ప్రాణుల అవయవాలలో, ఆత్మలో, శరీరంలో నిండి ఉండి - అంతటా వ్యాపించిన మహా 'విభూతి' స్వరూపం ఆయనదే. ఆ పరమశక్తియుతుడు మాపై దయజూపు గాక!

చెట్టుకు పాదులో నీళ్ళుపోస్తే చిటారుకొమ్మలలోనూ, కాండంలోనూ(చివరికి వేళ్ళలో కూడా) చల్లదనం పొంది ఆనందిస్తుంది. అలాగే విష్ణుదేవునికి మొదట నమస్కరిస్తే సకలదేవతలు, నేను (బ్రహ్మ) సంతోషిస్తాము.

(మంత్రాలను 'హరిఃఓమ్‌” అని ప్రారంభించడంలోని అర్ధం ఇదే. పూజానంతరం 'సర్వం శ్రీకృష్ణార్ణణమస్తు' అనటంలోని రహస్యమూ ఇదే. శ్రీహరి సకలదేవతారూపుడు.

'సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి' అని అనటంలోని వివేకం ఇదే. నదులన్నీ సముద్రంలో కలిసిన విధంగా దేవతలందరికీ చేసిన పూజలు ఆ మహానారాయణ తత్త్వానికే చివరికి చెందుతాయి.)

ఓ దయానిలయా! తేజోరూపా! పుణ్యాత్మా! ఆపదలో ఉన్నవారూ, నిన్ను చూడాలని తపించేవారూ నీ ముఖ కమలాన్ని చూడగానే తక్షణమే సమయమెరిగి సంపదలను పొందుతారు. నీ ముఖ దర్శనం కల్గించు స్వామీ!

అని ఈ విధంగా దేవగణాలతో కూడి అనేక విధాలుగా కీర్తిస్తున్న ఆ బ్రహ్మదేవుని కరుణించి మిక్కిలి దయాగుణం కల్గిన వారిలో శ్రేష్ఠుడైన విశ్వగర్భుడు (పరమాత్ముడు) అక్కడ ఉదయించాడు (కనిపించాడు)

వేయి సూర్యులకాంతి ఒకచోట చేర్చి పోతపోసినట్టు, ఆ కాంతులన్నీ ఒకేసారి వచ్చినట్టు హరి అక్కడ ప్రత్య క్షం కాగా దేవతల చూపులు చెదిరిపోయాయి. విషాదం పొందారు. తేరిపార చూడటానికి సాహసించలేదు. కొంతసేపు అలాగే ఉండిపోయారు. ఆ తేజోరూపాన్ని చూడటానికి వాళ్ళకు సాధ్యమా!

ఆ సమయంలో శ్రీమన్నారాయణుడు దివ్యమైన హారాలతో, కిరీటంతో భుజకీర్తులతో, కాలి అందెలతో, మొలనూలుతో, కంకణాలతో, కౌస్తుభమణినితో, శంఖ చక్ర గదాది ఆయుధాలతో దర్శనమిచ్చాడు. మరకతం లాంటి అతని దేహం, పద్మాలవంటి కన్నులు, కుండలాల కాంతితో మెరుస్తున్న చెక్కిళ్లతో, బంగారురంగు పట్టువస్తంతో, కంఠంలో వనమాలతో మిక్కిలి సుందరంగా ప్రకాశిస్తున్న దివ్యసౌభాగ్య రూపుడైన ఆ స్వామివారిని రుద్రాది దేవతలతోపాటు బ్రహ్మ తాను కూడా దర్శించి సంతోషంతో పొంగిపోయాడు. వినయంతో ఈ విధంగా స్వామివారిని స్తుతించటానికి పూనుకొన్నాడు.

('వనమాల' అంటే వెజయంతి మాల అని కొందరు అంటారు. కాబట్టి తులసీమాలనే వనమాల అనటం సంప్రదాయంగా ఉంది.)

సృష్టి స్థితి లయములు లేనివానిని, ఋషులచేత నిరంతరం పొగడబడేవానిని; మోక్షసౌఖ్యసముద్రుని, చిన్నవాటికన్నా చిన్నవాడును; గొప్పవాటికన్నా గొప్పవాడుగా ప్రకాశించే ఆ పుణ్యాత్ముని, మహానుభావుని ప్రస్తుతిస్తాను.

ఓ పురుషోత్తముడా! అన్ని లోకాలలోనూ నీ రూపం పరమశ్రేష్ఠమైంది. ఆ రూపం శాశ్వతమైన వేదసంబంధం కూడి మాకు మీయందే కనిపిస్తున్నది.

కుండకు మట్టి ఎలా ఆధారమవుతున్నదో అలాగే నువ్వు ఈ సృష్టికి ఆది మధ్యాంతాలు అవుతున్నావు. నీ విశ్వరూపంలో ఇవన్నీ కనిపిస్తున్నాయి అని అర్థం.

నీవు నీ యోగమాయతో ఈ ప్రపంచాన్ని పలుమార్లు సృష్టించి అంతటా నీవే నిండి ఉంటావని వైదిక రహస్యం తెలిసిన పరమయోగులు గుణాతీతుడైన నీ అవతార మహిమను సగుణరూపంతో 'విష్ణువు' గా కనుగొంటారు.

ఈ భూమిలో అన్నాన్ని; గోవులలో పాలను; కట్టెలలో అగ్నిని; ఎలా పొందుతారో అలాగే యోగమార్గంలో ఆత్మజ్ఞానవిదులు బుద్ధిచేత నిన్ను ఈ విశ్వంలో చూస్తారు.

(అన్నం 'భూమిలో' కనిపించదు. 'పాలు' ఆవులో కనిపించవు, అలాగే 'అగ్ని' కట్టెలలో కనిపించదు. 'బుద్ధి' ద్వారా(వివేకం) వీటిలో 'గుణ' రూపంగా ఇవి పరిణామంలో బయట పడుతున్నాయని జ్ఞానులు గుర్తిస్తారు. భగవత్‌ తత్త్వమూ అంతే. విశ్వంద్వారా 'ఆత్మ' స్వరూపాన్ని ఇలాగే గుర్తిస్తాం.

కట్టెను మథిస్తేనే నిప్పు పుడుతుంది; భూమిలో వ్యవసాయం చేస్తేనే ఆహారం పుడుతుంది. అలాగే ఆవుకు గడ్డివేసి పితికితేనే పాలు వస్తాయి - ఈ ప్రయత్నాలవంటిదే భగవంతుని గుర్తించడానికి గుణప్రకృతుల రూపంలో పనిచేస్తున్న 'కర్త' మరొకటి ఉందని గుర్తించడం కూడా. దానికి 'యోగమే' సాధనం.

మేము ఏ ఆశ్రయమూ లేక చాలా విధాలుగా క్రుంగిపోయాము. చిట్టచివరికి నిన్ను దర్శించాము. ఇక మా కష్టాలు తీరినట్టె. మా కోరిక తప్పక నెరవేరుతుంది. ఇప్పటి మా పరిస్థితి ఎలా ఉందంటే - మిక్కిలి వేడిమితో కూడిన కార్చిచ్చులో కాలిపోతున్న ఏనుగుల గుంపు ఉప్పాంగుతున్న నదిలోని నీటిని చూసినట్టుగా సంతోషంగా ఉంది.

(ఇంతకు మునుపు వర్ణించినట్టు స్వామి దయాసముద్రుడు. ఆ దయాగుణమే ఇక్కడ గంగానది. రాక్షసుల బాధలు కార్చిచ్చు. ఇంత గంభీరమైన 'ఉపమా' సామగ్రిని పోతనగారు యథామూలంగా గ్రహించి భాగవతాన్ని రామాయణ భారతాలతో సదృశంగా తీర్చిదిద్దారు.)

ఓ విశ్వసాక్షీ! నీకు మేము కొత్తగా చెప్పవలసింది ఏముంది! నీకు తెలుసుగదా! లోకాన్ని అంతటినీ నిరంతరం చూస్తూ ఉంటావు నీవు. నీ పాదదర్శనం మాకు శుభాల్ని కల్గిస్తుంది. అగ్నిలోని విస్ఫులింగాలలాగా నేను, లోకపాలకులు, ఈ దేవతలు - అందరం నీలోని అంశాలమే.

ఈ విధంగా బ్రహ్మాదులు స్వామివారికి విన్నపం చేశారని చెప్పి శుకుడు పరీక్షిత్తుతో ఇలా చెప్పాడు.

ఈ విధంగా బ్రహ్మాది దేవతలు స్తుతించగా, సంతోషించిన వాడై, పులకరించిన శరీరాలు కలిగినవారు; అప్పుడే కష్టాల నుండి గట్టెక్కిన వారు ప్రేమపాత్రులు, ప్రారబ్ధమనే భయంకరమైన సముద్రాన్ని చిలకడానికి, కోరికతో ఉన్న దేవతలను చూచి, నిండుగా మేఘ గంభీర స్వరంతో ఇలా అన్నాడు.

(క్షీరసాగరమథన కథాసారాంశాన్ని అంతా ఈ పద్యంలోని ఒక మాటలో ఇమిడ్చి పోతనగారు నిరూపించారు. ఆ అంశమే 'ప్రారబ్ధమనే' 'సముద్రం' చిలకడమనేది. రాక్షసులు, దేవతలు చిలికింది క్షీరసాగరాన్ని కాదు. తమతమ ప్రారబ్దాలనే. దానికి అనుగుణమైన ఫలితాన్ని పొందారు.)

ఓ బ్రహ్మా! ఓ ఇంద్రా! ఓ రుద్రా! ఓ దేవతోత్తములారా! దానవులతో ఈ సమయంలో పోరాటం లేకుండా స్నేహంతో బ్రతకటమే తగినపని.

అది ఎలాగంటే (ముందు చెబుతున్నాడు).

తనకు ఎప్పటికి బలం సిద్ధిస్తుందో(అనువు దొరుకుతుందో) అందాకా శత్రువును చూస్తూ కూడా ఎలుక గమనించకుండా పాము ఎలా దాక్కుని ఉండి ఒక్కసారి పైన పడుతుందో; అలాగే తమ ఉనికిని సంరక్షించుకోవాలి.

దేవతలారా! ఒక మార్గం ఉంది. తొలుత అమృతాన్ని ఉత్పాదనం చేయటానికి ప్రయత్నించటం తగినపని. ఎందుకంటే అమృతం తాగిన ప్రాణులకు దీర్ఘాయుస్సు కలిగి మృతిలేని రీతిగా బతుకగలుగుతారు(మరణాన్నే జయిస్తారు).

స్వామి పాలసముద్రం ఎలా చిలకాలో చెబుతున్నాడు. “క్షీరసముద్రంలో అన్నివిధాలైన తృణాలను, లతలను, ఓషధులను దండిగా సంపాదించి వేయండి. మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకిని కవ్వపు తాడుగా సిద్ధం చేసుకొని, వెంటనే, నా సహాయంతో మీరందరూ (రాక్షసులతో కలిసి అని) జాగ్రత్తగా చిలకండి. మీదట దాని ఫలితం లభిస్తుంది. పాపచింతన కల్గిన దానవులు చాలా దుఃఖాల పాలవుతారు. మీరు ఇబ్బంది పడకుండానే అన్ని సంపదలూ పొందుతారు. సముద్రంలో విషం పుడుతుంది. మనసులు వికలం చేసుకొని భయపడి పారిపోకండి. ఎన్నో వస్తువులు పుడతాయి. వాటికోసం కోరికలూ కినుకలూ వద్దు.

అని ఆదేశించిన వాడై, ఆద్యంతరహితుడు, నాశరహితుడు అయిన శ్రీమహావిష్ణువు ఈ విధంగా వారిని ఆజ్ఞాపించి మాయమయ్యాడు. అంత బ్రహ్మ, రుద్రుడు దేవతలను వీడ్కొని తమతమ స్వస్థానాలకు వెళ్ళిపోయారు.

ఇక దేవతలు యుద్ధం చేయటానికి ఇష్టపడక బలి చక్రవర్తిని చేరి స్నేహంగా ఉంటూ నమస్కారాలు పెడుతూ; కానుక లిస్తూ, అతడు దేవద్వేషి అని తెలిసినా, వాడికి అనుకూలంగా ఉంటూ సేవలు చేశారు.

ఇలా బలహీనులుగా తనకు వశవర్తులుగా మంచితనం నటిస్తూ సేవిస్తున్న దేవతల్ని, కసి పెరిగి రాక్షసులు చంపేద్దామని ముందుకు రాగా, రాజనీతి తెలిసిన బలిచక్రవర్తి నేర్పుతో వారిని వారించాడు.

ఆ విధంగా చంపడానికి సిద్ధమైన రక్కసిమూకను నివారిస్తూ బలి చక్రవర్తి ఇలా చెప్పాడు.

శత్రువులు శరణు వేడినప్పుడు ధీరులైనవారు తమ పరాక్రమం చూపరాదు. సమయాన్ని గమనించాలి. అందుచేత దేవతలపైన ఇప్పుడు మనం పరాక్రమం చూపరాదు.

కొలువుకూటంలో రాక్షసులంతా బలిచక్రవర్తిని చుట్టుముట్టి సేవిస్తుండగా; ఆ బలి అన్ని లోకాల రాజ్యాలను గెలుచుకున్న వైభవంతో, సకల దేవతా వీరుల్ని జయించానన్న అహంకారంతో సుఖంగా కొలువుతీర్చి సంతోషపడుతుండినాడు. అప్పుడు ఇంద్రుడు మంచి మంత్రిలాగా బలిని చూచి ఓదార్పుమాటలు చెప్పి అతనికి శాంతి కల్గించాడు. శ్రీహరి బోధించిన నీతి మార్గాన్ని అనుసరించి అక్కడ చేరిన రాక్షస ప్రముఖులైన శంబరుడు, అరిష్టనేమి, త్రిపురాసురులు; జంభుడు, హయగ్రీవుడు, నముచి, తారకుడు, బాణుడు, విప్రచిత్తి, శకుని, విరోచనుడు, ప్రహేతి, మయుడు, మాలి, సుమాలి, కుంభుడు, నికుంభుడు, పౌలోముడు, కాలకేయులు, నివాతకవచులు, వజ్రదంష్ట్రి మొదలైన వారిలో ఒక్కొక్కరిని ఒక్కోవిధంగా స్నేహం ప్రకటించి వశుల్ని చేసుకొని ఇలా అన్నాడు. “అక్కా చెల్లెండ్ల సంతానమైన మనమధ్య పగ తగదు. కలిసికట్టుగా ఒకే లక్ష్యసిద్ధికోసం పనిచేసి ఎదురులేకుండా బ్రదుకుదాం. మనలో ఒకరి నొకరు ద్వేషించుకోవటం ఎందుకు? ముందు ఇలా విరోధం పెట్టుకునే చాలా ఇబ్బందులు పడ్డాం. ఇకముందు దేవతలకు, రాక్షసులకు బలిచక్రవర్తే రాజు. అందరం కలిసి అతని ఆజ్ఞను పాటిద్దాం. మన రెండు వంశాలు వృద్ధిపొందే ఉపాయం చెబుతానని క్షీరసాగర మథనం ఎలా చేయాలో తెలియజెప్పాడు. ఆ తరువాత దేవతలు రాక్షసులు ఇంద్రుని, బలిని నాయకులుగా గ్రహించి గొప్ప పూనికతో అమృతాన్ని సంపాదించాలని నిశ్చయించుకొని, ఐకమత్యంతో, త్వరితగతిన, మందరపర్వతం దగ్గరికి వెళ్ళారు.

దేవతలు రాక్షసులు దేవతల శిల్పి త్వష్ట పదునుపెట్టిన గునపాలతో(తవ్వుగోలలతో) కొంత తవ్వారు. రోకండ్లను లోనికి చొప్పించి అడుగున దిగబడిన కొండను కదిల్పారు. పొడుగాటి తాళ్ళతో బిగించి కట్టారు. ఆ కొండను మెల్లగా కుళ్ళగించి, చేతులతో గట్టిగా పట్టి కదిలించారు. తమ తమ పేర్లు, బిరుదులు ప్రకటిస్తూ, బిగ్గరగా కేకలు వేస్తూ, కొండను ఊడబెరికి పైకి ఎత్తుకొని బలమైన తమ చేతులతో, తలలతో, భుజాలతో కొండ జారకుండా ఆని పట్టుకున్నారు. మెల్లగా కదులుతూ తప్పటడుగులు వేస్తూ 'బరువు ఎక్కువగా ఉంది, జాగ్రత్తగా పట్టండి' అంటూ గబగబా ఆ కొండను సముద్రం వైపుకు మోసుకొని తీసుకువచ్చారు.

దేవదానవులు ఆ మందరపర్వతాన్ని మోయలేకపోవటంచేత అది ఆశ్చర్యకరంగా అందరిమీదా పడిపోయింది. కొందరు భూమిమీద పడి చనిపోయారు. కొందరు నుగ్గునుగ్గయ్యారు. కొందరు భయంతో పరిగెత్తారు.

శ్రీహరి దగ్గరికి ఎందుకు వెళ్ళాము? ఆయన మాట మీద ఈ పనికి ఎందుకు పూనుకొన్నాము? ఎందుకింత పెద్ద పర్వతాన్ని లీలగా ఊడబెరికి తెచ్చాము? ఎందుకింత మంది మధ్యలో చనిపోయారు? ఇదంతా మన ప్రారబ్ధం కాక మరేమిటి?

ఆయన మనకు ఈ పని ఎందుకు పెట్టాడు? మన బోటివారికి ఇంతలేసి పెద్ద పనులు ఎందుకు? (ఊరికే ఉండక అని) ఇంకా ఆ శ్రీపతి మనకు సహాయంగా రాలేదేమిటి? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఎందుకు మనల్ని మరచిపోయాడు?

ఆ మందరపర్వతం పడిపోవటం వల్ల పుట్టిన కష్టాన్ని ఓర్చుకోలేక దుఃఖిస్తున్న దేవదానవుల భయాన్ని అందరిలోనూ వ్యాపించి ఉండే ఆ శ్రీహరి మనసులో గుర్తించినవాడై వారి సమీపంలో ప్రత్యక్షమయ్యాడు.

శ్రీహరి గరుడునిపై కూర్చొని, దయతో, కోటిసూర్యుల కాంతితో ప్రకాశిస్తూ, గదాద్యాయుధాలు ధరించి వారి ముందు ప్రత్యక్షమై 'అరే! ఎందుకు భయపడతారు?' అంటూ లీలగా ఒక చేతితో బంతిలాగా ఆ కొండను తీసుకొని ఆడుకోవటం ప్రారంభించాడు. దయామృతం నిండిన చూపులతో వారిని కాపాడాడు.

దేవదానవులు శ్రీహరిని సేవిస్తుండగా; 'క్షీరసముద్రానికి తీసుకుపో' అని స్వామివారు సెలవివ్వగానే గరుత్మంతుడు తనమూపుపై స్వామిని, ఆ పర్వతాన్ని అవలీలగా ధరించి అతి శీఘ్రంగా పాలకడలి దగ్గరికి ఎగిరిపోయాడు.

వెళ్ళి హరిని గిరిని ఆ సముద్రతీరంలో దించి, స్వామికి నమస్కరించి ఎన్నో విధాలుగా స్తుతించి గరుత్మంతుడు తన నివాసానికి వెళ్ళిపోయాడు.

ఆ సమయంలో...

ఓ రాజా! ఆ తరువాత దేవాసురులు సర్పరాజైన వాసుకిని పిలిపించారు. అతనితో మంచిమాటలు మాట్లాడి; అమృతంలో నీకూ భాగమిస్తామని చెప్పి, అతనిని ఒప్పించి; తమ చేతులతో నెమ్మదిగా ఆ వాసుకి శరీరాన్ని నిమిరి (పాము కాబట్టి); 'నీవు తప్ప ఈ పనికి ఎవరయ్యా తగినవారు? ఒప్పుకో'అని అతనిని ఒప్పించి, మందరపర్వతాన్ని బాగా చదునుగా చేసి, వాసుకి పడగల్ని పట్టుకొని శరీరాన్ని ఆ కొండకు చుట్టారు. అమృత సముద్రాన్ని కలశంగా తీర్చారు. బాగా ఆలోచించి పంచెలుపైకి ఎగగట్టి; జుట్లు ముడివేసుకొని, ఆ రెండు గుంపులవారు కలిసి చిలకటం ప్రారంభించారు.

ఆ తరువాత

శ్రీహరి, దేవతలు ఆ వాసుకి పడగల్ని పట్టుకోవడానికి సిద్ధపడుతుండగా, రాక్షసులంతా చేరి అతిశయంతో ఇలా మాట్లాడసాగారు.

“మీరంతా స్వచ్చంగా ఉండే పడగల్ని పట్టుకొని చిలుకుతుంటే మేము తోకను పట్టుకోవడమా! మేము కూడా(మీలాగా) పౌరుషం కలవారమే. మీలాగా మేమూ తపస్సు, బలము, చదువు, పౌరుషం కలిగిన వాళ్ళమై ఉండి నీచమైన ఈ పనికి (తోకను పట్టుకోవడానికి) ఏల ఒప్పుకుంటాం? మాకు పడగలే ఇవ్వండి” అన్నారు

అని పలుకు రాక్షసులను చూసి విష్ణువు(శ్రీహరి) ఆశ్చర్యంగా వారిని చూసి సరే అలాగే అంటూ పడగను వదిలివేశాడు. రాక్షసులు నవ్వుతూ గెలిచినట్టు కేకలు పెట్టారు. దేవతలు వినయంగా తోకను పట్టుకున్నారు.

ఇలా ఎవరెవరు ఏయే చోట నిలబడి లాగాలో నిర్ణయం చేసుకొని, దేవతలు తోకను, రాక్షసులు పడగలను పట్టుకొని, ఆ క్షీరసాగరం మధ్యలో పర్వతాన్ని ఉంచి, మిక్కిలి పూనికతో, అమృతం కోసం చిలుకసాగారు.

('పూర్వదేవతలు' అంటే దేవతలకన్నా పూర్వులు, పెద్దవారు అనే అర్థం. 'కశ్యపనందనాః (8-7-5) అని మూలంలో ఉన్నది. కశ్యపప్రజాపతికి దితితో దైత్యులు, అదితితో దేవతలు జన్మించారు. పెద్దవారు కాబట్టి పూర్వదేవతలు అయ్యారు.)

ఆ సమయంలో వాసుకి గట్టిగా 'వదలండి వదలండి' అని కేక పెట్టాడు. అడుగున ఏ ఆధారమూ (కుదురు) లేకుండా ఉంచటం చేత, అధిక భారానికి ఆ పర్వతం బుడబుడమని ధ్వనిచేస్తూ సముద్రంలో మునిగిపోయింది. దాన్ని చూచి సమస్తమూ గడగడ వణకి పోసాగారు.

దాని బరువు చాలా ఎక్కువ కావటం చేత బలవంతులే అయినా దేవదానవుల బలం ఆ పనికి చాలలేదు. వారు పౌరుషహీనులయ్యారు. చాల సిగ్గుపడ్డారు. బలహీనులై సముద్రతీరాన పడిపోయారు. ప్రబలమైన విధిని దాటడానికి ఎవరికీ సాధ్యం కాదు కదా!

శ్రీహరి అలా సముద్రజలాల్లో మునిగిపోతున్న ఆ కొండనూ, చింతాసాగరంలో మునిగిపోతున్న దేవతల్ని చూసి, సముద్రమధ్యంలో వారందరూ చూస్తుండగా

Gajendra Previous Birth (Past Life) Story - గజేంద్రుని పూర్వ జన్మ వృత్తాంతము

గజేంద్రుని పూర్వ జన్మ వృత్తాంతము

ఓ రాజా! ఆ తరువాత విష్ణుదేవుడు తన పొడవైన హస్తాన్ని సాచి గజరాజును మడుగులో నుండి బయటికి లాగాడు. దాని దేహం మీద మదజలరేఖలను తుడిచాడు. నెమ్మదిగా దాని దేహాన్ని నిమిరాడు. దాని దుఃఖాన్ని పోగొట్టాడు.

అలా శ్రీహరి తనను చేతితో బాగాతాకి లాలించగానే గజేంద్రుడి శరీరంలోని తాపమంతా చల్లబడింది. అతడు మునుపటి శక్తిని, ధైర్యాన్ని పొందాడు. తన ఆడ ఏనుగుల సమూహంతో కలసి సొంపుగా ఘీంకారం చేశాడు.

శ్రీహరి దయవల్ల మళ్లీ ప్రాణం పోసుకొన్న గజరాజు మరలా తన ఏనుగుల్ని చేరుకొని కలయ తిరిగాడు. మళ్ళీ మునుపటిలాగానే తొండంతో వాటిని మెల్లగా నిమిరాడు. వాటి తొండాలను తన తొండంతో పెనవెసుకొని పట్టుకొన్నాడు.

(పశుప్రవృత్తిలోని అద్భుతమైన రహస్యం ఒకటి ఇక్కడ ఉంది. మనిషి విషయం ఇంతే. మళ్ళీ బ్రతుకు కల్లగానే ఆడ ఏనుగుల్ని కలుసుకొని మునుపటి లాగానే ఉండగోరినాడు గజరాజు. ఇదే ఈ కథకు చక్కని ముగింపు.)

రాజా! గొప్పదైన ఆ మొసలి పూర్వజన్మలో 'హూహూ' అన్న పేరుగల గంధర్వుడు. దేవలుడు అనే ముని పెట్టిన శాపంవల్ల మొసలిగా మారి దుర్భర జీవితం గడిపి, గజేంద్రుడికి విమోచనం కాగానే, తన పూర్వ గంధర్వరూపాన్ని పొందాడు. అవ్యయుడడైన శ్రీహరికి అతిభక్తియుక్తుడై నమస్కరించి ఆసక్తితో స్వామివారిని స్తుతిస్తూ ఎన్నో గీతాలు పాడాడు. ఆ దేవుని కృపను పొంది, మాటిమాటికి నమస్కరిస్తూ పాపాలు పోగొట్టుకొని సంతోషంగా తన లోకానికి వెళ్ళిపోయాడు. గజరాజు కూడా శ్రీహరి హస్త స్పర్శ ప్రభావంచేత అజ్ఞానం పోయి పుణ్యం పొంది శ్రీహరిసారూప్యం పొందాడు.

(గజేంద్రుడు భగవదనుగ్రహం వల్ల భగవత్‌సారూప్యమనే మోక్షస్థితిని పొందాడు.)

ఓ రాజా! మొసలితో ఇంత ఘోరయుద్ధం చేసిన గజరాజు పూర్వజన్మలో ఇంద్రద్యుమ్నుడు అనే పేరు గలిగిన ద్రవిడ దేశాధిపతి. చాలా పుణ్యాత్ముడాయన. వైష్ణవభక్తులలో ప్రముఖుడుగా పేరు పొందినవాడు. మౌనవ్రతం పూని ఒక పర్వత శిఖరం మీద శ్రీహరి సన్నిధిని ఏర్పాటుచేసుకొని విశేషంగా పూజలు చేస్తూ ఉండేవాడు.)

ఓ రాజా! ఒకరోజు ఆ రాజు మౌనవ్రతం దాల్చి అచ్యుతుడైన శ్రీహరిని మనస్సులో ధ్యానిస్తూ నిశ్చలంగా ఉండగా, ఆ చోటికి వచ్చిన అగస్యమహర్షి తన్నుచూచి లేచి నమస్కరించి పూజించని ఆ రాజును చూచి కోపం తెచ్చుకొని 'ఓయి మూర్ఖుడా! లుబ్ధుడా! పెద్ద యేనుగు జాతిలో జన్మించు' అని శాపమిచ్చాడు.

శ్రేష్ఠుడైన అగస్యమహర్షిని పూజించకుండా అవమానించి విష్ణుభక్తులలో శ్రేష్ఠుడైన ఇంద్రద్యుమ్నుడు ఏనుగుల జాతిలో పుట్టాడు. ఇది అంతే. ఎంత గొప్ప పుణ్యాత్ములకైనా తపోధనులైన బ్రాహ్మణులను అవమానించడం తగని పని.

ఓ రాజా! ఆ విధంగా ఇంద్రద్యుమ్నుడు గజరాజు జన్మ పొందాడు. అతని సేవకులు, మున్నగువారందరూ ఏనుగులుగా పుట్టారు. ఏనుగుగా పుట్టినా పూర్వజన్మలో చేసిన హరిపూజాఫలంగా ఆ గజేంద్రునికి సారూప్యపదవి లభించింది.

భక్తుడు తన నిత్యకృత్యాలు నిర్వర్తిస్తూ విష్ణువును సేవించాలి. ఈ రెండు నియమాలను చక్కగా పాటిస్తే క్రమంగా పాపాలన్నీ పోతాయి. విష్ణుభక్తిలో ఆసక్తి ఎప్పటికీ పోదు.

దైవబలం లేని దుర్జనులకు ఏనుగులు, గుర్రాలు, ఎంత సంపదా ఉన్నా నశిస్తాయి. వారి ఆలుబిడ్డలూ నశిస్తారు. గుణవంతులైన వారు సన్మార్గంచేత చెడిపోకుండా బ్రతుకుతారు. అంతేకాక వారికి విష్ణువులో ఉన్న భక్తి, శ్రద్ధ క్రమంగా పెరుగుతాయి తప్ప, ఎన్నటికీ నశించవు.

అప్పుడు లోకానికి తండ్రి అయిన ఆ పరమాత్ముడు చిరునవ్వుతో కూడిన ముఖపద్మంతో ప్రకాశిస్తున్న లక్ష్మీదేవికి ఇలా చెప్పాడు.

తామర వంటి ముఖం కల్గిన ఓ చిన్నదానా! నా వెంబడి ఆకాశంలో వస్తూ ఉండిన సమయంలో నా చేతిలో వదలకుండా నీపైట కొంగును అలాగే పట్టుకొని ఉండినందుకు మనస్సులో నన్ను గురించి ఏమనుకొన్నావో చెప్పవా!

ఓ మగువా! నాకు అన్నీ తెలుసు. (నీ మనస్సులో ఉన్నదికూడా); నన్ను ఎవరు మరిచి పోతారో వారిని నేను కూడా మరచిపోతాను. ఇతరులను ఆశ్రయించి స్తుతించకుండా నన్ను ఎవరు మరువకుండా స్తుతిస్తారో, ఆశ్రయిస్తారో వారిని నేనూ ఎప్పుడూ మరవను.

అని చెప్పగా, చిరునవ్వు చిందే ముఖారవిందంతో ఆ లక్ష్మీదేవి విష్ణువుతో ఇలా అన్నది.

స్వామీ! నీవు సర్వానికీ అధిపతివి. నాకు నాథుడవు. నీ పాదాలను మనస్సులో ఉంచుకొని పూజించడమే నా ధర్మం. అంచేత ఏమంటాను? ఏమనకుండా నే నీ వెంట వచ్చాను. అంతేకదా! అన్నది.

(నవ విధ భక్తిమార్గాలలో అంఘ్రిసేవన(పాదసేవనం) వల్ల తరించిన భక్తురాలుగా లక్ష్మీదేవిని చెబుతారు. (తదంఘ్రిభజనే లక్ష్మీ - అన్నారు). ఆ విధంగా శ్రీనివాసునికి అత్యంత అనుకూలవతి లక్ష్మి - ఆయన హృదయం సంపూర్ణంగా ఎరిగి ఆయనను అనుసరించి ప్రతి అవతారంలోనూ తానూ పుట్టి స్వామిని అనుసరించి సేవించింది. అందుకే ఆమెను అనపాయిని (వదలనిది) అంటారు.)

దీనరక్షకా! దీనబంధూ! దీనపరాధీనా! జగత్‌ప్రభూ! దేవాధిదేవా! నిన్ను ఏమని పొగడగలమయ్యా! దీనుల మొరను ప్రీతితో విని వారిని రక్షించడమూ, మంచి మంచి దీవనలు (మంగళాశాసనాలు) పొందడం నీకే తగును.

పై విధంగా అని, ఇంకా లక్ష్మీదేవి ఎన్నో రీతుల స్వామివారిని స్తుతించింది. ఆ పరమ విష్ణుభక్తురాలిని స్వామివారు ఆదరంతో దగ్గరికి తీసుకొని, ఇంపైన మాటలతో, పరిహాసంతో, చిరునవ్వుతో ఆలింగనం చేసుకున్నారు. సపరివారంగా, గరుడ, గంధర్వ, దేవగణాలు 'జయజయ' ధ్వానాలు చేస్తుండగా, గరుడ వాహనమెక్కి తన స్థానమయిన వైకుంఠానికి చేరుకున్నారు - అని చెప్పి పరీక్షిత్తుతో శుకుడు ఇలా అన్నాడు.

నేను నీకు వివరించిన గజేంద్ర మోక్ష గాథను వినేవారు కీర్తిమంతులవుతారు. పాపాలు నశిస్తాయి. చెడ్డకలలు రావు. దుఃఖాలు రావు. ఎవరు ప్రతిరోజూ ఉదయం పవిత్రమైన నియమంతో నిర్మలమైన మనస్సుతో ఈ కథను చదువుతారో అలాంటి వారికి (జ్ఞానులకు), సంపద కల్గుతుంది. వైభవం సిద్ధిస్తుంది. ఆపదలు రావు. శుభాలు వృద్ధిపొందుతాయి. మోక్షం సులభంగా సిద్ధిస్తుంది. సంతోషంగా ఉంటారు - అని విష్ణువు సెలవిచ్చాడు. (ఇది ఫలశ్రుతి)

(మరి ఇంకా ఫలశ్రుతి వాక్యాలుగా శ్రీమహావిష్ణువు ఇలా సెలవిచ్చాడు)'ఇంతేకాదు. తెల్లవారుజామునే లేచి ప్రశాంతమైన మనస్సుతో విష్ణువును, గజరాజును, పద్మసరస్సును, శ్వేతద్వీపాన్ని, క్షీరసాగరాన్ని త్రికూట పర్వతంలోని గుహలను, అడవులను, పేము, వెదురు, పొదలతో కూడిన కల్పవృక్షాలను, విష్ణువు, బ్రహ్మ, శివుడు నివసించే త్రికూట శిఖరాలను, కౌమోదకి, కౌస్తుభం, సుందర్శనం, పాంచజన్యం - శ్రీలక్ష్మి, ఆదిశేషుడు, గరుడుడు, వాసుకి, ప్రహ్లాదుడు, నారదుడు వీరిని; మత్స్యకూర్మవరాహాది అవతారాలను; ఆ అవతారాలలో విష్ణువు చేసిన అతిమానుష కార్యాలను; సూర్యచంద్ర అగ్నులను, ఓంకారాన్ని ధర్మాన్ని తపస్సును, సత్యాన్ని వేదాన్ని వేదాంగాలను, శాస్త్రాలను, గోబ్రాహ్మణులను, సాధువులను, పతివ్రతలను, చంద్రుడి భార్యలను (27 నక్షత్రాలను); కశ్యపుని భార్యలను (వినత, కద్రువ, అదితి, దితి); గౌరిని, గంగా, సరస్వతి, యమున, సునంద మొదలైన పుణ్యనదులను, దేవతలను, దేవతా వృక్షాలను, ఐరావతాన్ని అమృతాన్ని ధ్రువుని, బ్రహ్మర్షులను, పుణ్యాత్ములైన మానవులను, తలచువారు; మరణించే సమయంలో నిర్మలమైన విష్ణువు రక్షణ పొందుతారని కూడా విష్ణువు చెప్పాడు. శంఖం పూరించాడు. దేవతలంతా స్వామిపాదపద్మాలకు నమస్కరించగా అందుకొని గరుడవాహనం అధిరోహించి స్వామి పయనించాడు. దేవతలందరూ సంతోషించారు - అని చెప్పి శుకుడు పరీక్షిత్తుతో ఇలా అన్నాడు.

ఈ గజేంద్ర మోక్షణ గాథను శ్రద్ధతో చదివే భక్తులకు శ్రీమహావిష్ణువు ఏనుగులు, గుర్రాలు, రథాలు మొదలుగా గల భోగాలను, చివరికి ముక్తిని (ఇహపరాలను) ప్రసాదిస్తాడు.

(విష్ణుదేవాలయాలలో అర్చనసమయంలో పంచస్తవాలను పఠించడం ఆనవాయితీ.
1). విష్ణుసహస్రనామం 2) భీష్మసూక్తం 3) గజేంద్రమోక్షణం 4) భగవద్గీత 5) మనుస్మృతి.)

ఓ రాజా! తామస మనువు తమ్ముడు రైవతుడు ఐదవ మనువు అయ్యాడు. అతని కొడుకులైన ప్రతివింధ్యుడు, అర్జునుడు మొదలైనవారు భూలోకానికి రాజులయ్యారు.

ఓ రాజా! ఈ మనువు కాలంలో హిరణ్యరోముడు, ఊర్ధ్వబాహుడు, వేదశీర్షుడు మొదలైనవారు సప్తర్షులయ్యారు. భూతరయుడు మొదలైనవారు దేవతలయ్యారు. శుభుడు - వికుంఠ అనే పుణ్యదంపతులకు ఆత్మతేజంతో శ్రీమహావిష్ణువు వైకుంఠుడనే పేరుతో అవతరించాడు. సర్వలోకాలలోని వారూ నమస్కరించగా వైకుంఠమనే లోకాన్ని కల్పించాడు. లక్ష్మీదేవి స్వయంగా వరించి ఆయనను పెళ్ళాడింది. ఆయన మహిమను, కల్యాణగుణాలను ఊహించడానికి సాధ్యపడుతుందా? ఈ భూమి మీది ధూళికణాలను లెక్కించవచ్చునేమో కాని హరి గుణగణాలను లెక్కించటం సాధ్యం కాదు.

ఆ తరువాత. చక్షువు కుమారుడు మహావీరుడైన చాక్షుషుడు ఆరవ మనువయ్యాడు. పురువు, పురుషుడు, సుద్యుమ్నుడు మొదలైన అతని కుమారులు రాజులయ్యారు. మంత్రద్యుముడు ఇంద్రుడయ్యాడు; ఆప్యులు మొదలైనవారు దేవతలయ్యారు. హవిష్మంతుడు, వీరకరుడు మొదలైనవారు సప్తర్షులయ్యారు. శ్రీమహావిష్ణువే సంభూతి అనే స్త్రీకి, వైరాజు అనే పురుషునికీ కుమారుడుగా 'అజితుడు' అనే పేరుతో జన్మించాడు. అతనే కూర్మరూపాన్ని ధరించి సముద్రంలో పడిపోకుండా మందరపర్వతాన్ని మోశాడు. అతనే దేవతల కోరిక మేరకు క్షీరసముద్రాన్నీ చిలికి అమృతాన్ని వారికి ఇచ్చాడు.

క్షీరసాగర మథన కథా ప్రారంభము

Gajendra Prayeing of Surrender - గజేంద్రుడు సర్వాంతర్యామిని రక్ష కోరి ప్రార్థించుట

గజేంద్రుడు సర్వాంతర్యామిని రక్ష కోరి ప్రార్థించుట

ఏ విధంగా ఈ మొసలిని గెలవగలను? ఇకపైన ఏ దేవుని ప్రార్థించేది? ఎవరిని రక్షించమని పిలిచేది? దొడ్డదైన ఈ మొసలి పరాక్రమాన్ని అడ్డగించేవారు ఎవరూ లేరా! అన్ని కార్యాలను సాధించేవారు, పుణ్యాత్ములైన మహానుభావులు ఎవరూ దిక్కులేని ఈ నా మొరను ఆలకించేవారు లేరా! ఉంటే వారికి నమస్కరిస్తాను.

(తాను శక్తిహీనుడనని గుర్తించటమే తరించడానికి మొదటిమెట్టు. శరణాగతికి మూల మీ భావనే.)

ఈ అడవిలో చాలాకాలంగా పెక్కు ఏనుగుల సమూహాలు నన్ను గౌరవిస్తూ వస్తున్నాయి. పది లక్షల కోట్ల ఆడ ఏనుగులకు అధినాథుడుగా ఉన్నాను. నా దాన జలధారలతో ఏపుగా పెరిగిన ఈ మంచి గంధపు చెట్ల నీడల్లో హాయిగా ఉండకుండా ఈ నీరాశ ఎందుకు పుట్టాలి? ఈ మడుగుకే ఎందుకు రావాలి! భయం పుడుతోంది. భగవంతుడా! ఇక నా గతి ఏమవుతుందో?

ఈ జగత్తంతా ఎవనివల్ల పుడుతోందో; ఎవని లోపల అణగి ఉంటుందో; ఎవనిలో లీనమై పోతోందో; ఎవడు పరమాత్ముడో, ఈ విశ్వానికి మూలకారణం ఎవడో, ఎవనికి పుట్టుక, పెరుగుదల, వినాశం, ఉండవో, ఎవడు అన్నీ తానే యై ఉంటాడో, తనంతట తానుగా ఎవడు పుడతాడో, ప్రభువైన ఆ విశ్వనియామకుణ్ణి శరణు కోరుతాను.

ఒకసారి ఈ లోకాలను సృష్టిస్తాడు. ఇంకోసారి తనయందు లీనం చేసుకొంటాడు. అదీ ఇదీ రెండూ తానే. అన్నిటినీ చూస్తూ ఉంటాడు. కాని దేనిచేత మలినపడని శుద్ధసత్వుడాయన. ఆత్మలకు మూలమైన పరమాత్మ స్వరూపం తనది. అతనినే ధ్యానిస్తాను.

ఈ లోకాలు, లోకపాలకులు, లోకాలలో ఉండేవారు అందరూ నశించిన తరువాత కూడా లోకరహితమైన కారుచీకట్లకు ఆవల అఖండతేజోరూపంగా నిత్యం ఎవడు ప్రకాశిస్తూ ఉంటాడో ఆ పరమాత్మను భావించి సేవిస్తాను.

ఏ దేవుడు నటుడిలాగా పెక్కు రూపాలతో నటిస్తాడో, ఋషులు, దేవతలు ఎవనిని స్తుతింపజాలరో, ఎవని ప్రవర్తన ఇతరులకు అగోచరంగా ఉంటుందో, అలాంటి పరమపురుషుని స్తుతిస్తాను.

ప్రపంచంలోని అన్ని బంధాలను వదిలి వేసిన ఋషులు, భగవద్దర్శనం కోరే పుణ్యాత్ములు, సకల ప్రాణుల మేలు కోరే సాధువులు, మంచి మనస్సున్నవారు, సాటిలేని వ్రతాలు ఆచరిస్తూ ఎవనిని అర్చిస్తారో ఆ దివ్య పదస్థానీయుడైన పరమపురుషుడే నాకు దిక్కు అతడే నన్ను కాపాడుగాక!

ఎవరు పుట్టుక, పాపం, రూపం, కర్మ నామ గుణాలు లేనివాడైనా లోకాలను సృష్టించడానికి, నశింపచేయడానికి ఆత్మ మాయాశక్తితో వీటినన్నింటినీ పొందుతున్నాడో, ఆ సార్వభౌమునికి, అనంతశక్తిమంతునికి, సకలసృష్టి కర్తకు, పుణ్యమూర్తికి, రూపాతీతునికి, చిత్రప్రవర్తన శీలం గలవానికి, సకల సాక్షిభూతునికి, ఆత్మకాంతితో ప్రకాశించే వానికి, ఆత్మమూలునికి, పరతత్త్వానికి, మాటలకు, ఊహలకు, జ్ఞానానికి అందనివానికి, పరిశుద్దునికి, కేవలం సత్త్వగుణంతో సమీపించగలవానికి, ఫలాపేక్ష రహితంగా కర్మను చేసే నేర్పరిని అభినందించే వానికి, నేను నమస్కరిస్తాను.

పరమాత్ముడు శాంతస్వరూపం గలవాడు. మోక్షమార్గ ప్రదాత. మోక్షస్థానానికి (వైకుంఠానికి) అధిపతి. స్వపరభేదం లేనివాడు. దుష్టులకు ఘోరస్వరూపంతో దర్శనమిస్తాడు. అతని తత్త్వం చాలా నిగూఢమైనది. గుణాలద్వారా అతని ధర్మాన్ని గుర్తించగలం (రూపాలద్వారా కాదని అర్ధం) సౌమ్యస్వభావుడాయన. అతని జ్ఞానం అతీతమైనది. అఖిలేంద్రియ వ్యాపారాలను చూస్తాడాయన. అన్నిటినీ గమనిస్తుంటాడు. సర్వజ్ఞు డా ప్రభువు. దయామయుడు. సర్వానికీ మూలమతడే. ఆత్మకు ఆధారమూ అతడే. ఇంద్రియ జ్ఞాపకుడు ఆయనే. దుఃఖాలను ఉపశమింపచేసేవాడూ ఆయనే. నిండుగా మాయ అనే నీడతో పాటు ప్రకాశిస్తుంటాడు. ఏకాంతమూర్తి ఆయన. అతనికన్నా ఉత్కృష్టులు ఎవరూ లేరు. అన్నిటికీ కారణభూతుడతడే. అతని ఉనికికి మాత్రం ఏకారణమూ లేదు. అలాంటి ప్రభువును నన్ను కాపాడుమని నమస్కరిస్తాను.

(విష్ణసహస్రనామంలో ఈ లక్షణాలన్నిటినీ వ్యాసమహర్షి వివరించి ఉన్నాడు. విష్ణునామాలన్నీ గుణవాచకాలే. అంచేత ఆయన 'గుణధర్మి!' ఇంద్రియాలను నియమిస్తాడు - కాబట్టే 'ఉపేంద్రు' డని అంటారు. 'గూఢ' తత్త్వం కాబట్టే భగవద్రహస్యాన్ని 'రాజగుహ్య' యోగమన్నారు. 'నిష్కారణతత్త్వం' - అనగా భగవంతుని ఉనికిని తర్కంతో నిరూపించలేమని అర్ధం. అందుకే 'నామమీయమానా' (తర్కంతో ఊహించలేము) అని అన్నారు. అందుకే వ్యాసభగవానుడు 'నిష్కారణాయాద్భుత కారణాయ' (8-3-15) అని ఆ కారణం కాని కారణం ఒక 'మహాద్భుత' మన్నాడు. భగవంతుడు ఈ అద్భుతానికి వ్యక్తీకృతి.)

యోగీంద్రులు యోగమనే అగ్నిలో తమ కర్మలను కాల్చివేసి, ఇంకాదేనినీ తలుచుకోకుండా ఏకాగ్రతలో బాగా కుదిరిన యోగంచేత ప్రకాశిస్తున్న మనస్సుల్లో ఏ దేవదేవుని సదా చూస్తుంటారో, ఆ పరమపురుషుణ్ణి నేను సేవిస్తాను.

పరమాత్ముడు అన్ని ఆగమాలకు వేదాలకూ సముద్రంలాంటివాడు. మోక్షస్వరూపుడాయన. ఉత్తమ గుణాలకు ఆలవాలం. సృష్టి లయాలలో రెండింటా ప్రవర్తించేవాడు ఆయనే (గుణాల విధ్వంసంచేత సృష్టించి, కార్యాలలోని నిరాసక్తత చేత లయింపచేసే తత్త్వమున్న వాడు); దిక్కులేని నాలాంటి జంతువుల పాపాలను పోగొట్టే వాడాయనే. అందరిలోనూ అంతరాత్మగా వెలిగే వాడూ అతడే. అవ్యయుడు, పూజింపదగ్గ భగవద్రూపుడు కూడా ఆయనే. భార్యాపుత్ర పశు ఆలయాలమీద ఆసక్తిలో మునిగిన వారికి ఎప్పుడూ ఆయన లభించడు. అలాంటి ఆ మహానుభావునికి నమస్కారాలు.

అని ఇంకా ఇలా ఆలోచించాడు.

ఎవనిని సేవించడం ద్వారా ధర్మార్థకామాలను విసర్జించి పండితులు తాము కోరిన వరాలను పొందుతారో; ఎవడు తనను సమీపించిన అంకిత భక్తులకు నాశనంలేని శరీరాన్ని ప్రసాదిస్తాడో, బంధ విముక్తులు నిరంతరం పూనుకొని ఎవరిని ధ్యానిస్తూ ఉంటారో, ఆనంద సముద్రంలో మునిగి ఉండే అంతరంగ భక్తులు (స్వామివారి నుండి) ఏమీ ఆశించకుండా ఎవని దివ్యభవ్య చరిత్రను ప్రేమతో గానం చేస్తుంటారో; ఆ మహాదేవుడే ఇన్నింటికీ ఆద్యుడు. కంటికి కాని రానివాడైనా అన్నిటికీ ప్రభువతడే. అధ్యాత్మ యోగంచేత మాత్రమే అతనిని పొందగలం. అతడు పరిపూర్ణుడు. మహోన్నతాత్ముడు. పరబ్రహ్మ స్వరూపుడాయన. అతడే సర్వశ్రేష్టుడు. ఇంద్రియాతీతుడు అతడే. బ్రహ్మాండనాయకుడతడే. స్థూలసూక్ష్మ రూపాలతో వెలిగే ఏకైక తత్త్వం ఆయనే. అతనినే నేను సేవిస్తాను.

ఇంకా ఈ విధంగా భావించడం మొదలు పెట్టాడు.

అగ్ని జ్వాలలను, సూర్యుడు వెలుగులను ప్రసరింపజేసి మరలా శమింపచేసే విధంగా; ఎవరు తన కిరణాలచేత బ్రహ్మాది దేవతలను, జీవ సముదాయాలను, లోకాలను, నానా రూప నామభేదాలతో పుట్టించి తరువాత తానే తగిన విధంగా లయింప చేస్తున్నాడో, మనస్సూ, బుద్ధీ, ఇంద్రియాలూ తానే అయి ఎవడు గుణ ప్రవాహరూపంలో ప్రవర్తిస్తాడో, ఎవడు స్త్రీ నపుంసక భేదాలకూ నరసురజంతు రూపాలకూ గుణ కర్మభావాలకూ అతీతంగా ఉంటూ; ఉన్నదీ - లేనిదీ అయిన రెండింటినీ బయటికి తెలియకుండా ఉంచి - తరువాత అన్నీ అయి ప్రకాశించే అట్టి పరంధాముని నేను ధ్యానిస్తాను.

దీనులను కాపాడటానికి భగవంతుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడని అంటారే. ఉత్తమ యోగుల సమీపంలో నిరంతరం ఉంటాడని అంటారే. అన్ని దిశలలోనూ ఉన్నాడంటారే. అలా ఉన్నాడు, ఉన్నాడు - అని చెప్పబడుతున్నవాడు ఉన్నాడో లేడో - అనే సందేహం కలుగుతోంది.

కలిమిలేమి చూడకుండా సాక్షాత్కరించే దేవుడు నేడు నా పాలిట ఉన్నాడా అని సందేహిస్తుండగా సాక్షాత్కరించడా! (నా సందేహం తీరిపోవునట్లు) దుష్టులచేత సాధువులు బాధింపబడుతున్నపుడు వారికి తప్పక అడ్డు పడుతాడే - నాకు రక్షణగా రాకుంటాడా!; నేత్రాలతో మాత్రమే కాక, అంతర్జగత్తులో ఆయననే దర్శించే వారిని కాపాడే ఆ ప్రభువునా కష్టాన్ని చూడకుండా ఉంటాడా! దీనుల మొరలు వింటూ తన్ను తాను మరిచిపోయే ఆ దయాళువు నా మొరను సులువుగా వినకుండా ఉంటాడా! అన్ని రూపాలు అతనివే. ఆయనకు ఆదిమధ్యాంతాలు లేవు. అంతటా ఆయనే వ్యాపించి ఉన్నాడు. భక్తులకు, దిక్కులేని వారికీ ఆయనే దిక్కు నా మొరను వినడా! నా స్థితిని చూడడా! నన్ను రక్షింప తలపడా! నన్ను కాపాడటానికి వేగంగా రాడా! - (తప్పక వస్తాడన్న భావన పెరుగుతోంది)

లోకాన్ని సృష్టించి లోకానికి దూరంగా ఉంటూ; అంతరాత్ముడై, లోకం చేత తెలియదగినవాడు, లోకమే తాను అయికూడా లోకాతీతుడుగా ఉండేవాడు; శాశ్వతుడు; పుట్టుక లేకుండా అన్నిటినీ పుట్టించే వాడు; జగదీశ్వరుడు, పురుషోత్తముడు అయిన (శ్రీమన్నారాయణుని) పరమాత్ముని నేను ఆరాధిస్తాను.

ఈ విధంగా అంటూ; ఆ గజేంద్రుడు అక్కడికక్కడే భగవత్సన్నిధిని తన మనస్సులో కల్పించుకొని ఇలా ప్రార్ధించాడు.

భగవంతుడా! ఇక నా దేహంలో ఏ శక్తీ లేదు. ధైర్యం సన్నగిల్లిపోయింది. పంచప్రాణాలు సడలిపోతున్నాయి. మూర్చ వస్తోంది. శరీరం డస్సిపోయింది. బాగా అలసిపోయాను. నీవు తప్ప మరో దిక్కునాకు లేదు. ఈ దీనుని క్షమించి ఆదుకో! దేవాధిదేవా! రావయ్యా! కోరిన వరాలిచ్చే దొరా. రక్షించవయ్యా!, పుణ్యాత్ముడా! నన్ను కాపాడవయ్యా!

ఓ దయాసాగరా! ప్రాణులందరి మాటలూ వింటావంటారు. నీవు ప్రవేశించరాని చోటే లేదంటారు. శరణార్థులు పిలవగానే వెంటనే 'ఇదిగో' అని సమాధానమిస్తావంటారు. అన్నిటిని చూస్తూ ఉంటావట గదా! శాస్త్రాలు చెప్పే ఇవన్నీ నిజమేనా! అనే సందేహం కలుగుతోందయ్యా!

ఓ లక్ష్మీవల్లభా! వరాలిచ్చే దొరా! స్వపరభేదాలు లేనివాడా! అయ్యో! నా బాధ ఏమని చెప్పను! కవులు యోగులు చేసే స్తుతులు అందుకొంటావే. నీవు ఉత్తమ గుణాలు కల్గినవాడివే. శరణుగోరిన వారిని అభిమానిస్తావే! నీ మహిమ చాలా నిర్మలమైనదే. రారాదా! కరుణ చూపరాదా! నన్ను గురించి పట్టించుకోరాదా! శరణు అంటున్నానయ్యా! నన్ను రక్షించవా! (రక్షించుస్వామీ అని ప్రాధేయపడ్డాడు)

ఈ విధంగా ప్రార్థించి ఇంకా ఏ రక్షణా లేనివానికి రక్షణ నిచ్చేటటువంటి భగవంతుడే ఆపదలో ఉన్న నన్ను ఇప్పుడు కాపాడుగాక! అని ఆకాశంవైపు నిక్కిచూస్తూ, నిట్టూర్పులు విడుస్తూ, అంతటా చెవులు అప్పగించి, ఘోరంగా ఆక్రోశిస్తున్న సమయంలో

గజరాజు చేసిన ఈ మొరను బ్రహ్మాది దేవతలందరూ విన్నారు. కాని వారికి విశ్వమంతటా వ్యాపించే లక్షణం లేనందున ఊరికే ఏ సాయమూ చేయలేక ఉండిపోయారు. విశ్వమయుడు, ప్రభువు, సర్వవ్యాపి, సర్వత్ర విజయమే పొందే శ్రీమన్నారాయణుడు ఆ భక్తునికి సాయంగా రాదలిచాడు.

(భాగవతం విష్ణుపారమ్యాన్ని ప్రకటించే గ్రంథం. అందువల్లనే గజేంద్రుడు మొరవిన్న అతని రక్షణకై ఇతర దేవతలు ముందుకు రాలేదని, విష్ణువు ఒక్కడే ఆ పని చేయగలిగాడని ఇక్కడ చెప్పడమయింది.)

అల వైకుంఠపురంబులో నగరిలో నా మూలసౌధంబు దా
పల మందారవనాంతరామృతసరఃప్రాంతేందుకాంతోపలో
త్పలపర్యంకరమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి
హ్వలనాగేంద్రము 'పాహి పాహి' యనంగుయ్యాలించి సంరంభియై. 

ఆ సమయంలో ఎక్కడో వైకుంఠంలో అంతఃపురంలో ప్రధానమైన మేడ ఎడమ పక్కన ఉన్న మందారవనంలోని 'అమృత' సరస్సున్న ప్రాంతంలో చంద్రకాంత శిలల అరుగుపై కలువలతో కూర్చిన పాన్పుమీద లక్ష్మీదేవితో వినోదిస్తున్నవాడై ఉండగా; భయంతో స్వాధీనం తప్పిపోయిన గజేంద్రుడు కాపాడు! కాపాడు! అని మొరపెట్టగానే ఆ 'కుయ్యి' విని, దాన్ని కాపాడటానికి ఉత్సాహంతో, వేగంతో (సంరక్షణ కార్యాన్ని చేపట్టాడు).

గజరాజు ప్రాణాలను కాపాడాలన్న ఉత్సాహంలో శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి ఒక మాటా చెప్పలేదు. శంఖచక్రాలను ధరించలేదు. సేవకులెవర్నీ పిలవలేదు. వాహనాన్ని సిద్ధం చేయుమనలేదు. చెవిలోని తామర దుద్దులదాకా జారిన జుట్టు ముడిని చక్కదిద్దుకోలేదు; ప్రణయంతో వెళ్లిపోతున్న లక్ష్మీదేవి పైట కొంగును కూడా వదిలిపెట్టలేదు.

(వ్యాస భాగవతంలో గజేంద్రుని మొరవిని భగవంతుడు గరుడుని అధీష్టించి వచ్చునట్టు వర్ణింపబడి ఉండగా, పోతన భగవంతుని భక్తరక్షణతత్పరత్యములు నొక్కివక్కాణించుటకు వాహనాదులన పేక్షింపకనే తనకు తానుగా వచ్చినాడని వర్ణించినాడు.

భక్తులను కాపాడటంలో దీక్ష కల్గిన వాడు, సకల ప్రాణుల హృదయాలనే కమలాలలో నిరంతరం నివసించేవాడు, అయిన శ్రీమహావిష్ణువు గజరాజు విన్నవించిన నానావిధ వినతులను విని, తన ప్రియురాలైన లక్ష్మీదేవితో సరససల్లాపాలు చాలించి, వేగిరపడి, అన్ని దిక్కులూ పరికించి, గజేంద్రుని రక్షించటమే పనిగా నిర్ణయించుకొని తన ఆయుధ సామగ్రిని స్మరించుకొని వస్తున్నప్పుడు

అలా స్వామి బయలుదేరగానే లక్ష్మీదేవి, ఆమె వెంట అంతఃపుర స్త్రీలు, వారి వెంట గరుత్మంతుడు, ఆయన ననుసరించి శంకచక్రాదులగు ఆయుధ సమూహం; నారదమహర్షి సేనాపతి విష్వక్సేనుడు రాగా, వైకుంఠంలోని అందరూ వారివెంట వరుసగా బయలుదేరి వచ్చారు.

ముఖపద్మంయొక్క తేనె బిందువుల సమూహం కారుటచే ఆనందించు తుమ్మెదలు కలిగిన ఆ లక్ష్మీదేవి శ్రీహరియొక్క కరపద్మంచేత లాగబడుతున్న పైటకొంగు కలదై వెళ్తూ

స్వామివారు తాను వెళ్తున్న చోటు ఏదో చెప్పడు. దిక్కులేక అలమటిస్తున్న ఏ స్త్రీల రోదనలు విన్నాడో! రాక్షసులు మళ్ళీ వేదాలను దొంగిలించారో ఏమో!; మళ్ళీ రాక్షసులు అమరావతిపై దండెత్తారో ఏమో! 'హరి ఎక్కడరా చూపండి' అంటూ భక్తులను ఏ దుర్మార్గులు దండిస్తున్నారో!

(సోమకాసురుడు వేదాలను దొంగిలించాడు (మత్స్యావతార కథ,)
భూదేవి మొరపెడితేనే అవతారాలు దాల్చాడు (రామాది అవతారాలు).
ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు బెదిరించింది హరిని చూపుమనే! ఇలాంటి గాథలలో పూర్వాపరాలు ఎలా ఉన్నా పోతనగారి లక్ష్మీదేవి శ్రీనివాసుని ఇల్లాలు కాబట్టి ఆమె త్రికాలాలలోని కథల్ని చెప్పుకోవటంలో ఆశ్చర్యం ఏమీలేదు.)

అని పరిపరివిధాలుగా ఆలోచిస్తూ (ఆయన వెంట వెళ్తోంది).

స్వామి పరుగులు తీస్తుండగా ఆయనవెంట వెళ్తూ ఉన్న లక్ష్మీదేవి చెవిపోగులు కదలాడసాగినాయి. భుజాలమీద కొప్పుముడి చిందులాడుతోంది. స్తనయుగ్మం మీద ఉన్న పైటకొంగు జారిపోతూంది. ఒడ్డాణం వదులయిపోయింది. నుదుటిపూత చెరిగిపోయింది. పైటకొంగు మాత్రం ఇంకా తన ప్రియుడి చేతిలోనే ఉండిపోయింది. స్తనభారం చేత నడుము చిక్కిపోయింది. కాని కోటి చంద్రుల కాంతితో ముఖం మాత్రం ప్రకాశిస్తూనే ఉంది.

భర్తను ఎక్కడికి వెళ్తున్నారండీ! అని అడగాలనుకొని మిక్కిలి వేగంగా వెళ్తుంది. కాని ఆయన మారుమాటలాడడని తెలిసినది కాబట్టి నడకను చాలించి ఆలోచనలో పడుతుంది. తొట్రుపాటుతో నెమ్మదిగా ఒక అడుగు ముందుకు వేస్తుంది. అలా నడిచేప్పుడు జడత్వంతో అడుగు ముందుకు మోపదు.

(లక్ష్మీదేవి సౌగసుచేత ఆమె నడక ముందుకు సాగటంలో ఎన్నో ఆటంకాలు వచ్చాయి. అందుకే నెమ్మదిగా వెళ్తోంది) మేఘశ్యాముని వెంట బయలుదేరి వస్తున్న ఆమె సొగసు మేఘం వెంబడే తళుక్కుమనే మెరుపు తీగచందంగా ఉంది. అలా వెళ్తున్నపుడు నొసటి మీద ముంగురుల్ని సవరించుకోగానే ఆమె ముఖపద్మం మీద తుమ్మెదలు ముసురుకొన్నాయి. ఆ తుమ్మెదల్ని తోలుతుండగానే దొండపండు కాంతితో ప్రకాశిస్తున్న ఆమె పెదవుల్ని చిలుకలు సమీపించాయి. ఆ చిలుకల బారినుండి తప్పించుకోగానే చేపలవంటి తన కన్నులకోసం - కండ్లనే చేపలనుకొని ఆకాశగంగలోని పెనుచేపలు ఎగిసిపడ్డాయి. వాటిని తోలి తప్పించుకోగా, తీగవంటి ఆమె శరీరంతో రాసుకుని ధన్యం కావటానికి మెరుపుతీగలు ఆకాశంలో బారులుతీరాయి. ఆ తీగల్ని అతిక్రమించి ముందుకు సాగగా చక్రవాకాలు ఆమె స్తనయుగ్మాన్ని తాకి మిడిసిపడ్డాయి.

రాక్షసుల జీవితాలనే సంపత్తిని నశింపచేసేవాడు; నిరంతరం కరుణతో వర్ధిల్లేవాడు పరమయోగి జనహృదయాలనే వనంలో ఉండేవాడు; భక్తుల గొప్పదనాన్ని శోభిల్లజేసేవాడు, కొత్త పెండ్లికూతురగు లక్ష్మీదేవికి సేవలు చేసేవాడు, జయశీలుడు, తేజోమయుడు అయిన శ్రీమహావిష్ణువు ఆకాశమార్గంలో వస్తుండగా దేవతలు చూశారు.

ఇలా చూచి.

గజరాజు ఆపదను తొలగించడానికి పరుగున వెళ్తున్న స్వామివారిని, పరివారాన్ని చూచిన దేవతలు: “అదిగదిగో! మహావిష్ణువు వచ్చాడు. పక్కలోనే లక్ష్మీదేవి కూడా - చూశారా! అదే శంఖధ్వని. అల్లదిగో సుదర్శన చక్రం. అదిగో గరుత్మంతుడు కూడా వస్తున్నాడు” అంటూ ఆకాశంలోనే 'నమోనారాయణాయ' అన్న స్తోత్రం పఠిస్తూ ఆ వేడుకను చూశారు.

(నారాయణాయ = నారాయణునికి; నమః= నమస్మారం; “ఓం నమోనారాయణాయి - అన్నది అష్టాక్షరీ మంత్రం. విష్ణుభక్తులకు తారక మంత్రమిదే.)

గజేంద్రుని కాపాడాలన్న తొందరలో ఉన్న స్వామివారు దేవతల నమస్కారాలను స్వీకరించలేదు. మనోవేగంతో ముందుకు సాగిపోయి సమీపంలోనే కరి మకరులు పోరుతున్న ఆ సరస్సును చూశారు. దానిలో శింశుమార చక్రంలో లాగా గొప్ప మొసళ్ళు, ఎండ్రకాయలు, చేపల జంటలు ఉన్నాయి. కుబేరుని కచ్చపమనే ధనాగారంలో లాగా శ్రేష్టమైన తాబేళ్ళు ఉండినాయి. అదృష్టవంతుడి భాగ్యం లాగా అనురాగమనే నీరుంది. వైకుంఠంలో లాగానే శంఖాలు, చక్రాలు, కమలాలు ఉన్నాయి. సంసారచక్రంలో లాగానే సుఖదుఃఖాలవంటి ద్వంద్వాలనే బురద నిండి ఉంది. ఆ సరస్సును చూశాడు.

(శింశుమారచక్రం: జ్యోతిశ్చక్రానికి సంబంధించిన ఖగోళవిశేషం. మొసలి, ఎండ్రకాయ, చేపల జంటల్లాగా నక్షత్రాలు కనిపించే ఒక విచిత్రసన్నివేశం. దీన్ని 'జ్యోతిర్మండలం' అని అంటారు. దీన్ని ఉపాసించటం ఉంది.

తాబేలు: కుబేరుని ధనాగారానికి 'కచ్చప' మని పేరు. అందుకే తాబేలును, చేపను (మత్స్య), మకరాన్ని ధనం కోరేవారు అర్చించే సంప్రదాయం ఉంది.

వైకుంఠంతో పోలికలు: కమల (లక్ష్మి), శంఖం (స్వామివారి పాంచజన్యం), చక్రం (సుదర్శనం) - సరస్సులో శంఖాలు, చక్రవాకాలు, పద్మాలు.

సంసారచక్రం: చక్రనేమి క్రమంలో పునర్జన్మం, మరణం - ఇలా సాగిపోయే ఈ గమనంలో సుఖదుఃఖాలు, మానావమానాలు - ఎడతెగని ద్వంద్వాలు - వీటిలోనే మనిషి తగులుకొంటాడు - అందుకే 'పంక' (బురద) మని అనటం. పంకశబ్దం పాపాన్ని కూడా బోధిస్తుంది.)

దయాసముద్రుడైన శ్రీహరి మొసలిని చంపడానికి సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. అది దేవతల్ని కాపాడేటటువంటి చక్రం. భూవలయాన్ని తన వేగంతో కంపింపచేయగల శక్తి కలిగినది. దాని అంచుల నుండి పుట్టె అగ్ని కణాలతో ఆకాశంలోని చుక్కల్ని పరాభవించునది. బ్రహ్మాండభాండాల వెలుగుల నడుమ ఎదురులేని సంచారం కలది.

(అంబరశుక్రము - పాలపుంత - నక్షత్రమండలకాంతి అనికూడా అంటారు.)

ఈ విధంగా చక్రాన్ని ప్రయోగించగా.

శ్రీహరి ప్రయోగించిన చక్రాయుధం అత్యంతవేగంతో సరస్సులోకి చొచ్చుకుపోయి అప్పుడే వికసిస్తున్న పద్మాలను కౌగిలించుకోవడానికి వచ్చిన సూర్యబింబంలాగా భాసించింది. నీటిని కలచివేసి 'గుభుల్లు గుభుల్లు' మనే ధ్వనులు పుట్టించింది. ఆ దుర్మార్గమైన మొసలి ఉండే చోటును సమీపించింది.

చక్రాయుధం రివ్వున పోయి అతిభయంకరంగా మొసలి తలను నరికి దాన్ని చంపివేసింది. దాని దేహం మేరు పర్వతంలా మెరిసిపోతోంది. అది అడవి ఏనుగులకు సైతం భయాన్ని పుట్టించే పరాక్రమం కలిగినది. కామ క్రోధాలతో నిండినది. గజరాజు రక్తధారలతో తడిపినడి. అంతులేని ఉత్సాహంతో అలసట లేకుండా గెలుపుపై మనస్సు నిలుపుకొని పోరాడుతూనే ఉంది. అలాంటి మొసలిని చక్రం చంపివేసింది.

ఇలా ఒక రెప్పపాటులో ఆ చక్రం ఆ మొసలి తలను నరికివేసింది. ఆ సమయంలో

ఇలా మొసలిని చక్రం చంపడాన్ని చూచి జగత్తులోని మొసళ్ళన్నీ భీతి పొందాయి. దిక్కున్న చోటుకుపోయాయి. సూర్యునిచాటులో రాశిచక్రంలోని మొసలి; కుబేరుని సన్నిధిలో మరోమొసలి (మకరనిధి) ఆదికూర్మం చెంత సముద్రంలోని మొసళ్ళు దాక్కున్నాయి.

ఆ మొసలిపట్టు నుండి విడువడిన గజరాజు ఉత్సాహంతో కాళ్ళు కదిలించాడు. కారుచీకటి నుండి వెలువడిన చంద్రుడిలాగా, సంసార బంధాలనుండి విముక్తి పొందిన సంసారిలాగా (విరక్తునిలాగా) కనిపించాడు. ఆదరంతో ఆడ దిగ్గజాలు తమ తొండాలతో అమృతజలంతో గజరాజును అభిషేకించాయి. ఆ జలాలలో స్నానంచేసి గజేంద్రుడు అలసట తీర్చుకొని నిజ సౌందర్యంతో ప్రకాశించాడు.

అంత శ్రీహరి విజయ సూచకంగా పాంచజన్యమనే తన శంఖాన్ని పూరించాడు. ఆ శంఖం దయాగుణానికి సముద్రం లాంటి ఔదార్యం కల్గింది. తన అద్భుతమైన ధ్వనిచేత పంచభూతాల ప్రకృష్ట చైతన్యాన్ని కదిలించి పారవేయగల్గింది. మిక్కిలి శుభ్రమైన తన తెల్లదనం చేత ఇంద్రాది దేవతలకు కూడా వెరపు పుట్టించగల్గింది. దీన జనుల కష్టాలను దూరం చేస్తుంది. శత్రు సైన్యాన్ని (రాక్షసుల్ని) పారదోలుతుంది.

పాంచజన్యం మ్రోగగానే దేవతల నగారాలు మ్రోగాయి. పద్మాల సువాసనలు నిండిన గాలులు వీచాయి. పూలవాన జల్లులు కురిశాయి. దేవతా స్త్రీలు (అచ్చర లేమలు) నృత్యం చేశారు. జీవ, జయ అనే ధ్వానాలు అన్ని దిక్కులా ప్రతిఫలించాయి. సముద్రుడు తన తరంగాలతో ఆకాశగంగ ముఖపద్మాన్ని ముద్దాడి ఒప్పానాడు (ఉప్పాంగాడు).



Halahala, Kalakuṭa (most deadly and venomous poison in the universe) Emerged - హాలాహలం జనించుట

హాలాహలం జనించుట ఆ తరువాత అంతలోనే, అల్లకల్లోలమైన ఆ సముద్రంలోనుండి హాలాహలమనే విషం కోలాహలమైన అగ్ని జ్వాలలతో బయటపడింది. దాన్ని చూసి భయపడి సురాస...