Sunday, April 19, 2026

Rohit's escape - Harishchandra's waterlogging - రోహితుడి పలాయనం - హరిశ్చంద్రుడికి జలోదరం

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - రోహితుడి పలాయనం - హరిశ్చంద్రుడికి జలోదరం

రాజు సంతోషముతో తన కార్యములు తానొనరించుచుండెను. వరుణు డిట్లు మాటిమాటికి వచ్చుట గని తెలివిగల రాకొమరుడు యాగసమయము దాపగు టెఱిగి చింతాక్రాంతుడయ్యెను. రాజకుమారుడు తన తండ్రి శోక కారణము వారి-వీరి- వలన నెఱింగి తనకు చావు మూడుట తెలుసుకొని యచ్చోటు వదలిపెట్ట నిశ్చయించుకొనెను. అతడు తన తోడి మంత్రికుమారులతోడ చక్కగ నాలోచించి వెళ్ళుటకు నిర్ణయించుకొని నగరు వెదలి వనముల కేగెను.

అట్లు రాకొమరుడు వెళ్లుటవలన రాజు దుఃఖితుడై తనకొడుకును వెదుకదలచి భటుల నంపెను. కొంతకాలము గడిచిన మీదట వరుణుడు మరల రాజభవనమునకు వచ్చి శోకతప్తుడగు రాజుతో యాగము చేయుమనెను. 

అంత రాజతనికి మ్రొక్కి యిట్లనెను: ఓ దేవదేవా! నా కుమారుడు భయాకులుడై యెచటికో పారిపోయెను. పోయినజాడ తెలియుటలేదు. ఇపుడేమి చేతును? వరుణదేవా! అంతట గిరిదుర్గములందు నా దూతల నంపి వెదకించితిని. కాని నా కొడుకు కనబడలేదు. 

మహారాజా! సర్వజ్ఞా! నా కొడుకు వెళ్ళిపోయెను. ఇపుడు నేనేమి చేయవలయునో నన్నాజ్ఞాపింపుము. అంతయు నా దురదృష్టము. రాజు మాటలువిని వరుణుడు మహాకోపముతో నన్ను నీ వెన్నియోసారులు వంచించి తివి. 

రాజా! నీవు మాట నిలువబెట్టుకొనలేక నన్ను మోసగింతివి. కనుక నీకు జలోదరమను దారుణవ్యాధి సంక్రమించు గాక! అని శపించెను. వరుణుడు రాజును శపింపగ రాజపుడు దుఃఖము గలిగించు వ్యాధిచే నెంతయో పీడితుడయ్యెను. 

ఇట్లు వరుణుడు రాజును శపించి తన చోటి కేగెను. రాజు మహారోగ పీడితుడై మిక్కిలి దుఃఖించెను.

వ్యాసుడిట్లనెను: వరుణుడు వెళ్ళిన పిదప రాజు మిక్కిలి రోగపీడితుడయ్యెను. అతడు దుర్బర దుఃఖమును నెక్కువ క్లేశముననుభవించెను. తనతండ్రి రోగపీడితుడైన విషయము వనమందున్న రాకుమారుడు వినెను. అతడు పితృ భక్తి గలవాడై తన తండ్రి సన్నిధి కేగదంచెను. 

ఒక యేడాది గడిచిన పిమ్మటరోహితుడు తన తండ్రిని చూచుటకు వెళ్లదలచుట యెఱిగి యింద్రుడతని చెంతకేగెను. ఇంద్రుడు విప్ర వేషమున వచ్చి తన తండ్రిని జేరబోవుచున్న కుమారు నుపాయముతో నిలిపి వేసెను. 

ఇంద్రుడిట్లనెను : ఓ రాజపుత్త్రా! నీవు దుర్లభమైన రాజనీతి నెఱుగవు. అందులకే నీవు మూఢుడవై నీ తండ్రి చెంతకేగదలచితివి. నీవక్కడకేగినచో నీ తండ్రి వేదపారగులగు విప్రులచేత నిన్ను మండెడు నగ్నిలో హోమము చేయించును. ఎల్ల ప్రాణల కాత్మ ప్రియమైనది గదా! 

భార్యా-పుత్రులు-ధనము సర్వమాత్మ కొఱకే ప్రియమగుచున్నది. తన రోగ నివారణకు దేహ రక్షణకు నీ తండ్రి ప్రియుసుతుడవగు నిన్ను తప్పక హోమము చేయగలడు. 

కనుక రాచపట్టీ! నీ విపుడు నీ తండ్రి చెంతకరుగవలదు. నీ తండ్రి మరణించిన పిమ్మట నపుడు రాజ్యమునకుతప్పక వెళ్ళవచ్చును. ఇట్లులింద్రుడు రాకుమారు నడ్డగింపగ నతడు మఱిమొక యేడువఱ కడవిలోనే యుండెను. ఆ పిదప హరిశ్చంద్రుడు చాల దుఃఖితుడగుట విని రోహీతుడు చావుదీనకు తెగించి తన తండ్రిని జేర నిశ్చయించుకొనెను. 

అజీగర్తుడి ధనలోభం

శ్రీ దేవీ భాగవతం ప్రథమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము

శ్రీ దేవీ భాగవతం పంచమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Harishchandra's longing for his son - హరిశ్చంద్రుడి పుత్రవ్యామోహం

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - హరిశ్చంద్రుడి పుత్రవ్యామోహం

ఒకనాడు హరిశ్చంద్రుడు వసిష్ఠాశ్రమముజేరి మునికి తలవంచి మనస్కరించి తనకు సంతానములేని లోటు వెల్లడించెను. ఓ ధర్మజ్ఞా! నీవు దైవజ్ఞుడవు. మంత్రవిద్యావిశారదుడవు. మానదా! నా సంతతి కేదైన నుపాయము తెల్పుము. 

ద్విజవర్యా! సంతులేనివానికి సద్గతులు లేవనుట నీకును దెలియును గదా! నీవు శక్తిమంతుడవు. నా దుఃఖ మెఱిగియు నీవేల యూరకున్నావు? నాకన్న పక్షు లెంతయో ధన్యములు. అవి పిల్లలను గని పెంచును. నేను భాగ్యహీనుడను. అందుచే రేబవళ్ళు లోన కుమిలిపోవుచున్నాను. అని రాజు దుఃఖముతో బలుకగ విని వసిష్ఠముని తన మదిలో చక్కగ నాలోచించుకొని యిట్లనెను:

మహారాజా! నీవు పల్కినదంతయు నిజమే. ఈ సంసారమున సంతానము లేనివాడు పొందు దుఃఖము మరెవ్వడును పొందడు. కనుక రాజేంద్రా! నీవు వరుణదేవుని గొలుపుము. అతడు తప్పక నీ కోర్కి దీర్పగలడు. 

ఓ దర్మిష్ఠా! సంతాన మిచ్చుటలో వరుణుని మించిన దేవుడు లేడు. నీ వతని నారాధించుము. నీ కోర్చి తీరగలదు. రాజులు దైవమును-పురుషకారమును-రెంటిని పాటించవలయును. ప్రయత్నము లేనిచో ఏ కార్యమైనను నెఱవేరజాలదు. తత్వ మెఱిగినవారు న్యాయ ముగ తప్పక ప్రయత్నము చేయవలయును. 

రాజా! ప్రయత్నించిన సిద్ధించును. లేనిచో సిద్దించదు. అమిత తేజస్వియగు గురుని మాటలువిని యతనికి నమస్కరించి రాజు తపము చేయదలంచి వెడలెను. 

అతడు గంగాతీరమున మంచి యాశ్రమ మేర్పరచుకొని పద్మాసనమున వరుణుని ధ్యానించుచు తీవ్రముగ తపించెను. 

అట్లు రాజు తప మొనర్చుచుండగ ప్రసన్నముఖ కమలముగల వరుణుడు దయతో దర్శన మిచ్చెను. అపుడు వరుణుడు హరిశ్చంద్రునితో నిట్లనెను : దర్మజ్ఞా! నేను సంతో షించితిని. నీ తపము గొప్పది. ఏదేని వరము గోరుకొనుము.

రాజిట్లనియెను : దేవేశా! నేను ఋణత్రయము బాపుకొనుటకు ప్రయత్నించుచున్నాను. కనుక సుఖము గల్గించు నొక్క పుత్రుని ప్రసాదింపుము. అని రాజు కన్నీరు ప్రవహింపగపలుకగ విని వరుణుడు తన యెదుట నున్న రాజుతో నవ్వుచు నిట్లనెను: 

రాజా! నీవు కొరినట్లుగ గుణవంతుడగు పుత్రుడు గల్గినచో నీ కార్యము సిద్ధించిన పిమ్మట నాకేమి ప్రియము గూర్చగలవు? 

రాజా! నీవు నీ పుత్రుని పశువుగ బంధించి విచారము చెందక నా యజ్ఞము చేయుటకొప్పుకొన్నచో నీకుపుత్రుని ప్రసాదించగలను. 

రాజిట్లనెను : దేవా ! నాకు సంతాన హీనత్వము లేకున్ననంతే చాలు తప్పక నీకు యజ్ఞమొనర్ప గలను. నా కొడుకును పశువుగ చేయుదును. నా మాట నిజము. నమ్ముము. 

మానదా! ఈ ప్రపంచమున సంతానము లేకుం డుట భరింపరాని దుఃఖము. సుతుడు నరుల శోకాగ్ని చల్లార్చగలడు. కొడుకు నిమ్ము. 

వరుణుడిట్లనెను: రాజా! నీకు తప్పక సుతుడు గలుగగలడు. ఇక నీ యింటి కేగుము. నీవు నాతో బలికిన వాక్కును సత్యమొనరింపుము. అని వరుణుడు పలుకగ హరిశ్చంద్రుడు తన యింటికేగి వరుణుని వరప్రదానము గూర్చి తన భార్యకు తెల్పెను. 

ఆ రాజున కందాల భార్యలు నూర్గురు కలరు. వారిలో శైబ్య పట్టమహిషి. ధర్మపత్ని. పతివ్రత. కొంత కాలమున కావరవర్ణిని గర్బము దాల్చెను. ఆమెకు వేవిళ్లు గల్గుట విని రాజు ప్రమోదభరితుడయ్యెను. ఆమెకు రాజు యథావిధిగ సంస్కారము లొనరింపజేసెను. 

పిమ్మట పదవ నెలలో నొక శుభదినమున నామె ప్రసవించెను. అపుడు తారాబలము గ్రహబల మనుకూలముగ నుండెను. దేవకుమారుని బోలు కుమారుడు పుట్టగనే రాజు స్నానమాడి విప్రులను దర్శించెను. 

జాతకర్మాదులొనరించి భూరిదానము లొసగెను. పుత్ర జన్మమున రాజున కమితానంతము గల్గెను. ఆ సమయమున రాజు విశేష దానము లొనరించి యుదారముగ ధన ధాన్యములు దానముచేసి సంగీత నృత్య గోష్ఠులు జరిపించెను.

అట్లు రాజభవనమున పుత్ర మహోత్సవము జరుగుతుండగ వరుణుడు బ్రాహ్మణ వేషమున నేతెంచెను. రాజా! నేను వరుణుడను. నీకు మేలు గల్గుగాక! నీ కిపుడు కొడుకు గల్గెను గదా! అతనినో నాయజ్ఞము వేగ మొనరింపుము. నా వరప్రభావమున నీ వంధ్యత్వము తొలగినది గదా! 

ఇపుడు నీవు మునుపు నా కిచ్చినమాట నిలబెట్టుకొనుమని వరుణు డనెను. వరుణుని పల్కులు విని హరిశ్చంద్రు డిట్లు తనలో తలపోసెను. కమలమువంటి ఈ నా సుకుమార కుమారు నెట్లు చంపగలను? మహశక్తిగల నరుణుడు విప్రవేషమున వచ్చియున్నాడు. మేలుగోరుకొను వాడెవ్వడును దేవత లను పరిహసించి నిందింపరాదు. ఎల్ల ప్రాణులకు పుత్ర వాత్సల్యము ఛేదింపంరాని-తెలియని-యనుబంధము. ఇపుడేమి చేతును? నాకు సంతానసౌఖ్య మెట్లు గల్గును? అని రాజు తలంచుకొని ధైర్యము తెచ్చుకొని వరుణునకు నమస్కరించి పూజించి సవినయముగ తీయగ నిట్టు లనియెను: 

దేవదేవా! దయానిధీ! నీ యనుజ్ఞ పాటింపగలను. వేదోక్త విధానముగ యజ్ఞ మొనర్చి దానదక్షిణ లొనరింపగలను. కొడుకు పుట్టిన పదినాళ్లకు తండ్రికి శుద్ధి యగును. తల్లికి నెల నాళ్లకు శుద్ధి యగును. దీనికి దంపతులు కారణము. వరుణదేవా! పరమేశ్వరా! నీవు ధర్మజ్ఞుడువు. కనుక నాయెడ దయయుంచి యొక్క నెలవఱకు క్షమించుము. అనగనే 

వరుణుడు రాజుతో నిట్లనెను: రాజా! నీకు మేలు గల్గుగాక! నేను వెళ్ళుచున్నాను. నీ పనులు చక్కబెట్టుకొనుము. నేను మరల నొకనెలకు రాగలను. అపుడు తప్పక హోమము చేయవలయును రాజా! అప్పటి వఱకు జాతకార్మాది విధు లొనరింపుము. అని వరుణుడు రాజుతో తీయగ పలికి వెళ్ళగ హరిశ్చంద్రుడు ప్రమోద మొందెను. 

అటు పిమ్మట రాజు బంగరుతో నలకరించినవియు కుండలంతపోదుగులుగలవియు అగు కోట్ల యావులను తిలపర్వతములను దానమొసంగెను. రాజు తన కుమారుని మన ముఖలక్షణములు వీక్షించి పరమానందమంది యతనికి యధావిధిగ రోహితుడను పేరు పెట్టేను.

ఒక నెల గడిచిన పిదప వరుణుడు మరల విప్రవేషమున రాజభవనమునకు వచ్చి యిపుడే యజ్ఞ మొనర్పుమని పల్మారు లనెను. రాజు వరుణుని జూచి శోకసాగరమున మునిగి యతని కాతిధ్య మొసంగి దోసిలొగ్గి యిట్లనెను. 

జలాధిపతీ! నా యదృష్టముననే నీవు వచ్చితివి. గృహము పావనమైనది. నీ యిష్టానుసారముగ యజ్ఞ మొవర్తును. నోటిపండ్లు రానిది యాగవశవుగ నుండరాదని వేదవిదు లంచురు. కనుక నా కొడుకునకు పండ్లు వచ్చిన పిమ్మట నీ యజ్ఞ మొనర్తును. అని రాజు పలుకగ వరుణుడు సరేయని వెళ్ళిపోయెను. హరిశ్చంద్రుడు తన యింట సంసారసుఖము లనుభవించుచుండెను. 

రాకుమారునకు దంతములు మొలిచిన పిదప వరుణుడు మరల విప్రవేషమున రాజు నింటికి వచ్చి తన పని నెఱవేర్పుమని యడిగెను. రాజు విప్రరూపమున నున్న వరుణునిగాంచి నమస్కరించి సగౌరవముగ నాసన మొసంగి సమ్మానించి పూజించెను: ఆ పిదప వినయముగ తలవంచి నుతించి 

రాజిట్లనెను: ''దేవా! తప్పక భూరిదక్షిణలతో నీ యజ్ఞ మొనరింపగలను. నా బాలున కింకను చూడాకరణము చేయలేదు. పుట్టువెండ్రుకలున్నవాడు యజ్ఞపశువుగ తగడని పెద్దలందరు. ఓ జలాధి నాధా! నీవు శాశ్వతవిధి నెఱగిన వాడవు. కాన నంతవఱకు క్షమించుము. నా శిశువునకు వెండ్రుకలు తీసిన మీదట నీయాగ మొనర్పగలను.'' అను రాజు మాటలువిని 

వరుణు డతని కిట్లనెను: ''రాజా! ఏమేమో చెప్పి నన్ను మాటిమాటికి మోస గించుచున్నావు. ఇపుడు నీకడ యజ్ఞసామగ్రి యంతయును గలదు గదా! కేవలము పుత్రవాత్సల్యమున జిక్కుకొని నన్నిట్లు మోసగించుచున్నావు. నీవు క్షౌరకర్మమున్నగు విధులైన పిదపనైన యాగము చేయుకున్నచో కోపముతో నిన్ను దారుణ ముగ శపింపగలను. 

రాజా! మానదా! ఇప్పటికి నీ మాట మీద వెళ్ళుచున్నాను. నీ విక్ష్వాకు వంశజుడవు. నీ మాట వమొనపరింపకుము.'' అని పలికి వరుణుడు రాజ గృహము వెడలి చనెను. రాజు తన భవనమున సుఖముగ నుండెను.

అటు పిమ్మట పుట్టువెండ్రుకలు తీయు మహోత్సవమున వరుణుడు మరల రాజప్రాసాదమున కేతెంచెను. ఆ మహోత్సవమున రాణి తన కుమారుని తన తొడపై నిడుకొని రాజు ప్రక్కనుండెను. అంతలో వరుణు డేగుదెంచెను. వరుణుడగ్ని హోత్రుడు ప్రత్యక్షమైనట్లు విప్ర వేషమున వెలుగుచుండెను. అతడు రాజుతో తన పని నెఱవేర్పుమని కచ్చితముగ నడిగెను. ఆపుడు రాజు వరుణుని గాంచి వ్యాకుల చిత్తముతో గడగడలాడుచు చేతులు జోడించి నమస్కరించెను. ఆ పిదప సవినయనుగ రాజు చక్కగా వరుణుని పూజించి యతని కిట్లనెను. ఓ స్వామీ! నీ కార్యము యధావిధిగా నొనరింపగలను. నీతోనొక మాట చెప్పదలచుకొంటిని. నీవు నన్ను మన్నించి చెప్ప వచ్చునన్న చెప్పగలను. నిశ్చలముగ వినుము. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులను మువ్వురను ద్విజులందురు. వీరికి సంస్కారము లావశ్యకములు. తక్కిన వారిని శూద్రులని వేదవాదులందురు. కనుక నా కొడుకిపుడు శూద్రునివలె నున్నాడు. వడుగైనవాడు కర్మకు యోగ్యుడగునని వేదములు నిర్ణియించినవి గదా! విప్రుల కెనిమిదవయేట రాజులకు పదునొకండవయేట వైశ్యులకు పండ్రెండవయేట నుపనయనము చేయవలయును గదా! దేవేశా! నేను దీనుడను. నీ సేవకుడను. నా యెడ దయ బూనినచో నా కొడుకును వడుగు చేసిన పిదప నతనిని యాగ పశువుగా నొనరింపగలను. నీవు లోకపాలకుడవు. ధర్మజ్ఞుడవు. సర్వ శాస్త్రవిశారదుడవు. నా మాటమీద నీకునమ్మకమున్నచో నీవు నీ యింటి కెగుము అను రాజు మాటలు విని వరుణుడు దయతలచి యొప్పకొని వెడలిపోయెను. రాజును సంతోషించెను. 

వరుణుడు వెళ్ళిన మీదట రాజు పుత్రోత్సాహముతో సుఖముగ కాలము గడుపుతుండెను. ఈ విధముగా హరిశ్చంద్రచక్రవర్తి రాజ కార్యములు చక్క పెట్టుచుండగనే యతని కొడుకు పదేండ్ల వాడయ్యెను.

అపుడు శాంతులగు విప్రులు మంత్రులు ననుమతింపగ రాజు తన శక్తికి తగినటు లుపనయన సామాగ్రి సమకూర్చెను. తన తనయునకు పదుకొకండవ యేడు వచ్చిన వెంటనే యధావిధిగ నపనయన సంస్కార మొనరింతెను. కాని మదిలో చింతాతురుడై యుండెను. రాకుమారునకుపనయన సంస్కారము జరుగుచున్న సమయమునందు వరుణుడు బ్రహ్మణ వేషమున మరల నచటికి వచ్చెను. 

అంత రాజు తన యెట్టయెదుట నున్న వరుణువి జూచి వెంటనే కైమోడ్చి నమస్కరించి ప్రీతితో నతిని కిట్లనెను. దేవా! వడుగైన పిదప నా కొడుకు యాగపశువుగ తగినవాడగును. నీ దయవలననే నా వంధ్యత్వదోషము పాసెను. ధర్మజ్ఞా! సమయము వచ్చినప్పుడు గొప్పగ దక్షిణలిచ్చి నీ జన్నము పూర్తి చేయగలను. ఇప్పుడు నేను నిజముగ బలుకుచున్నాను. నా కొడుకునకు సమావర్తనము జరిగిన పిమ్మట నీ కోరిక నెఱవేర్పగలను. నా యెడ దయయుంచి యంతదనుక తాళుము. 

వరుణు డిట్లనెను: ఓ మహామతీ! రాజా! నీవు పుత్రవాత్సల్యమున వ్యాకులుడవై మోహితుడై యుక్తియుక్తముగ నేర్పుతో నన్ను మోసగించుచున్నావు. మహారాజా! ఇపుడుకూడ నీయిష్ట ప్రకారముగ వెళ్ళుచున్నాను. సమావర్తనమ్మునాటికి తిరిగి రాగలను. అనిపలికిరాజును వీడ్కొని వరుణు డేగెను.

రోహితుడి పలాయనం - హరిశ్చంద్రుడికి జలోదరం

శ్రీ దేవీ భాగవతం ప్రథమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము

శ్రీ దేవీ భాగవతం పంచమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

A physical paradise for Trishanku - త్రిశంకుడికి సశరీర స్వర్గం

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - త్రిశంకుడికి సశరీర స్వర్గం

అపుడు మహాతపస్వియగు విశ్వామిత్రుడు తన మదిలో నాలోచించుకొని యజ్ఞ ద్రవ్యములు కూర్చుకొని మునుల కాహ్వానములు పంపెను. మునులెల్లరును విశ్వామిత్రుని మంత్రితులై యాగముగూర్చి వినిరి. కాని వసిష్ఠుడు వారింపగ వారు యాగమునకు వెళ్ళలేదు.

ఇదంతయును విశ్వామిత్రుడు విని మనసు కలతజెందగ బాధపడి త్రిశంకు రాజున్న చోటి కరిగెను. ''రాజా! వసిష్ఠుడాటంకము చేయగ బ్రాహ్మణు లెల్లరును నీ యజ్ఞమునకు వచ్చుట మానివేసిరి. ఐన నేమి నేను నాతపశ్శక్తి వలన నిన్నపుడే స్వర్గమున కంపి నీ కోర్కి దీర్చగలను. అని మునివరుడు దోసిట నీళ్ళు దీసికొని గాయత్రితో నభిమంత్రించి తన గాయత్రీ జప పుణ్య మతనికి ధారపోసెను. 

ముని రాజునకు తన పున్నెము ధారపోసి రాజా! నీ విపుడు స్వేచ్ఛగ స్వర్గమున కేగుము. రాజేంద్రా! నేనెంతయో కాలము శ్రమము వెచ్చించి సంపాదించిన గాయత్రీ జప పుణ్య మున స్వర్గమేగుము. అట నీకు మేలగునని మునియనెను. 

విశ్వామిత్రుడు ఇట్లు పలికిన వెంటనే త్రిశంకుడు ముని తపో బలముతో పక్షివలె పైకెగిరెను. అట్లు రాజు స్వర్గ పురమున కెగయగనే దేవగణములు క్రూర చాండల రూపముననున్న రాజును చూచిరి.

దేవతలింద్రున కిట్లనిరి: దేవతవలె వాయువేగమున నాకాశమున చండాల రూపమున వచ్చువాడెవడు? ఇంద్రుడు వెంటనే లేచి వచ్చుచున్న పురుషాధముని జూచి యతనిని త్రిశంకునిగ నెఱిగి తిరస్కారముతో నిట్లనియెను. 

'ఓరి చండాలుడా! ఈ కంపుగొట్టు రూపముతో దేవలోకమున కేల వచ్చుచున్నావు? నేలమీదికి వెళ్ళుము. ఇచట నుండుటకు నీవు తగవు'. 

రాజా! అటు లింద్రునివలన పున్నెము నశించిన అమరునివలె త్రిశంకుడు స్వర్గసీమనుండి క్రిందపడు చుండెను. 

అపుడు విశ్వామిత్రా : కాపాడుకాపాడుము. దుఃఖార్తితో స్వర్గమునుండి క్రిందపడుచున్నాను. అని రాజు బిట్టురోదించెను. అట్లు పెద్దగ నేడ్చుచున్న రాజుని గని విశ్వామిత్రముని ఆగుమాగుమని పలికెను. 

త్రిశంకుడు స్వర్గమునుండి భ్రష్టుడైనను మరల ముని తపః ప్రభావమున నాకాశమున నడుమ నాగెను. అపుడు విశ్వామిత్రు డచట రెండవ స్వర్గలోకము నిర్మింపదలచి యజ్ఞము చేయుటకు నీరుముట్టి సంకల్పించెను. ముని పూనిక తెలిసికొని యింద్రుడు త్వరితముగ విశ్వామిత్రుడున్నచోటికేగి యిట్లనెను. 

ఓ బ్రాహ్మణోత్తమా! సాధూ! మునివర్యా! ఈ కోపమేమి? ఈ చేయునదేమి ఇక నీ ప్రతిసృష్టి చాలించుము. నీకేమి కావలయునో కోరుము.

విశ్వామిత్రు డిట్లనియెను : ఓ విభూ ! త్రిశంకురాజు స్వర్గచ్యుతుడయ్యెను. దుఃఖించుచున్న త్రిశంకుని ప్రీతితో మరల నీ లోకమునకంపుము అనెను. విశ్వామిత్రుని తపోబల మింద్రునకు తెలియును. అందుచే నింద్రు డతనికెదురాడలే కటులే యని యంగీకరించెను. 

ఇంద్రుడు త్రిశంకుని దివ్యదేహునిగజేసి వామానమున గూర్చుండబెట్టి విశ్వామిత్రు ననుమతి పడసి స్వర్గమేగెను. ఇంద్రుడు త్రిశంకుని వెంటతీసుకొని స్వర్గమేగిన పిమ్మట విశ్వామిత్రుడు తన యాశ్రమములో సుఖము లతో నుండెను. 

విశ్వామిత్రుని మహోపకారమున తన తండ్రి స్వర్గమేగుట విని హరిశ్చందుడు సంతోషించి దేశమును చక్కగ నేలెను. అయోధ్యాపతియగు హరిశ్చందుడు సంప్రీతితో రూపము నిండుపరువము నేర్పగల తన భార్యతో సుఖముల తేలి యాడుచుండెను. ఎంత కాలమైనను రాణి గర్బిణి గాలేదు. అందులకు రాజు చింతాక్రాంతుడై లోలోన మిక్కిలి విచారించుచుండెను. 

హరిశ్చంద్రుడి పుత్రవ్యామోహం

Trishankudiki Vishwamitruni Pratyupakaram - త్రిశంకుడికి విశ్వామిత్రుని ప్రత్యుపకారం

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - త్రిశంకుడికి విశ్వామిత్రుని ప్రత్యుపకారం

యామె తన పతి కిట్లనియెను: మునివర్యా! నీవు వెళ్ళిన పిమ్మట నేను దారుణమైన కరవు కాల మెట్లు గడిపితినో వినుము. మన పుత్రులంద ఱన్నము లేక మిక్కిలి దుఃఖించిరి. ఆకలిగొన్న బాలురను జూచి ధాన్యమునకై వనమువనము తిరిగితిని. అట్లు విచార ముతో తిరుగుచుండగ నాకు కొన్ని ఫలములు కనిపించెను.

వానితో కొంత ధాన్యముతో నెట్లో కొన్ని నెలలు గడిపితిని. కాంతా! కొంతకాలమున కవియు దొరుకక నేనెంతయో కుమిలితిని. ఈ కరవు దినములలో నింత బిచ్చము పెట్టువారులేరే! అడవిలో ధాన్యములేదే! చెట్లకు పండ్లులేవు. భూమిలో కందమూలములు లేవు. 

నాబాలు రాకటి బాధచే బావురుమని యేడ్చుచున్నారు. ఇపుడెక్కడికేగుదును? ఏమి చేతును? ఈ యాకలిచే పీడితుల కేమి సమాధానము చెప్పుదును. అని మదిలో చింతించి తుదకిట్లు నిశ్చయించితిని. 

ఒక కుమారునే ధనవంతున కైన నమ్మి డబ్బు తీసికొని దానితో బాలురను త్కనకి పోషింపవలయును. ఇటు లాకలిచే పీడితులను బోషింతును. వీరిని పెంచుటకు మఱి యితరోపాయము లేదు. అని తలచి యొక బాలు నమ్మదలచితిని. 

మహానుభావా! ఆ బాలుడు పల్మారు క్షుధార్తితో నేడ్చుచుండెను. అట్టివానిని తీసికొని నేను సిగ్గుమాలి బయలుదేరితిని. అంతలో త్రోవలో సత్యవ్రతుడను రాజర్షి దిక్కులేని నన్ను జూచి యీ బాలు డేల యేడ్చుచున్నాడని యడిగెను. 

మునిసత్తమా! అపుడు నేనతని కిట్లు పలికితిని. నేనీ బాలు నమ్ముటకు వెళ్ళుచున్నాను. నా మాటలు వినగనే రాజు గుండె కరగెను. 

అతడిట్లనెను: ఈ చిన్నారి బాలుని తీసుకొని నీ యింటి కేగుము. ముని తిరిగి వచ్చునంతవఱకు నేనీ కుమారకులకు తగిన మాంసము పంప గలను. ఆ రాజు దయతో ప్రతిదినము పందులను జింకలను వేటాడి వాని మాంసము నొక చెట్టుపై నుంచి వెళ్ళుచుండెను.

అతని వలననే మన బాలకులీ దుఃఖసాగరము దాటగల్గిరి. అట్టి రాజు నా కారణమున వసిష్ఠునిచే శపింపబడెను. ఒకనాడడవిలో మాంసము దొరకనందున నతడు వసిష్ఠునియావును చంపెను. 

గాన వసిష్ఠునకు కోపము వచ్చెను. ముని యతనిని చండాలునిగ శపించెను. ఇట్లు కోపము గోవధ చండాలత్వ - మీమూటి వలన రాజునకు త్రిశంకుడని పేరు పెట్టెను. 

ఓ కౌశికా! అతనికి గల్గిన దుఃఖమునకు నేనెంతయో వగచితిని. నా వలన రాజకుమారుడు చండాలుడయ్యెను కనుక ఏ ఉపాయము చేతనైనను నీ ప్రబల తపము వలన నైన నా రాజును బ్రోచుట మంచిది. 

అను భార్య మాటలు విని కౌశిక ముని దీనముగ నున్న తన పత్ని నోదార్చి యామె కిట్లనెను 

''కమలలోచనా! అతడు నీ కుపకారము చెసెను. అడవిలో నీ వతని వలన రక్షింపబడితివి. కనుక నేను రాజును శాపముక్తుని జేయగలను. నా విద్యా తపోబలము నతని దుఃఖము బాప గలను.'' అని పరమార్థవిదుడగు కౌశికుడు తన భార్య నూరడించెను. 

త్రిశంకున కెట్లు దుఃఖము తొలగునాయని కౌశికముని యెంతయో యోజించి తుదకు రాజున్న చోటికేగెను. అపుడు త్రిశంకుడొక మాలపల్లెలో దీనముగ చండాల రూపమున నుండెను. 

తన చెంతకు వచ్చుచున్న మునిని గని రాజచ్చెరువందెను. రాజు వెంటనే ముని పాదములకు దండ ప్రణామము లొనర్చెను. ముని రాజును లేపి చల్లనిమెల్లని మాటలతో నిట్లనెను. 

ఓ రాజా! నీవు నా కొఱకు ముని చేత శపింపబడితివి.

రాజిట్లనెను: నేను మున్ను యాగము చేయించుమని వసిష్ఠుని ప్రార్థించితిని. మునివర్యా! నేనొక యజ్ఞము చేయదలచితిని. ఆ యాగము వలన నేను స్వేచ్ఛగ స్వర్గమేగ దలచితిని. దానిని జరిపించుమని మునినడిగితిని. నేనీ శరీరముతోడనే స్వర్గ సుఖములంద గోరితిని. 

అపుడు వసిష్ఠుడు కోపించి నన్ను దుర్మతీ! అని సంబోధించి యిట్లనెను : ఈ నర దేహముతో స్వర్గ వాసము నీకెట్లు గల్గును? అనగా అపుడు నేను మరల స్వర్గ లోభముచే నిట్లంటిని. 

''అట్లయిన నేను వేరొక్కని పురోహితునిగ నియమించుకొని నాయుత్తమ యజ్ఞ మొనర్తును'' అపుడు నేను మునిచే చండాలుడుగ శాప్తుడనైతిని. ఇట్లు నీకు నాశాప కారణము తెల్పితిని. 

మునీశ్వరా! నా దుఃఖము తొలగించుటకు నిన్ను వేడుచున్నాను. అని శోకార్తుడగు రాజు మిన్నకుండెను. అంత కౌశికుడును రాజు శాపము తొలగించుటకు నెమ్మది చక్కగ తలంచెను.

త్రిశంకుడికి సశరీర స్వర్గం

Story of Viswamitra Svapachula - విశ్వామిత్ర - శ్వపచుల కథ

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - విశ్వామిత్ర - శ్వపచుల కథ

రాజిట్లనెను: రాజాజ్ఞవలన హరిశ్చంద్రుడు మంత్రులచే రాజుగ చేయబడెను. మరి త్రిశంకుడు చండాలదేహము నుండి యెట్లు ముక్తుడయ్యెను. అతడు నట్టడవిలో మరణించెనా? గంగలో కొట్టుకొనిపోయెనా? లేక గురుడు దయదలచి యతనిని శాపముక్తుని జేసెనా? ఈ త్రిశంకు వృత్తాంతమంతయును విన వేడుకగుచున్నది. నా కా రాజు చరిత్ర సమస్తము తేటపఱచుము. 

వ్యాసుడు ఇట్లనెను: తన కుమారు డభిషిక్తుడుగుటవిని త్రిశంకుడు ప్రమోదమొంది శ్రీశివకుటుంబినియగు శివదేవిని స్మరించుచు కాలము గడిపెను. ఇట్లు కొంతకాలము సాగిన పిమ్మట విశ్వామిత్రుడు నియమముతో తప మొనర్చిన పిదప తన భార్యను సుతులనుజూడ నేతెంచెను. 

విశ్వామిత్రుడుడేతెంచి సుఖముగనున్న తన వారిని చూచి ప్రమోదమొంది తనకు సేవ చేయదలచిన భార్యతో నిట్లనెను. 

సులోచనా! అప్పటి కరవుకాటకముల కాలమెట్లు గడిపితివి? అన్నములేక మలమలలాడు బాలుర నెవరు పోషించిరో తెల్పుము. 

సుందరీ! శోభనాంగీ! నేను ఘేరతపమున మునిగియుండుచే రాజాలకపోతిని. నీ యొద్దధనము లేదు గదా. అందులకు నీవేమి చేసితివి? అంతటి కరవుకాలము దాపురించినపుడు బీద వాడనగు నేను వచ్చి మాత్రము ఏమ వెలుగబైట్టుదునని తలచి రాలేదు. 

వామోరూ! నేను వనమందొకనాడాకలి మంటకు తాళలేక శ్వపచుడి(చండాలునింట) దొంగవలె ప్రవేశించితిని. చండాలుడు నిదురించుటగని యాకలి బాధ కోర్వజాలక వంటశాల లోని తినుబండారములు వెదకితిని. అపుడొక కుండలో వండి కుక్కమాంసము చూచి తినుటకు తీసుకొను నంతలో నింటి వాని కంటబడితిని. 

నీవెవరవు? ఈ నడిరేయి నాయింటి కేల వచ్చితివి? ఈకూటికుండ నేల తీసికొంటివి? నీ కేమి పని తెల్పుమని చండాలు డనెను.

సుకేశీ! చండాలుడట్లడుగగ నా కట నకనకలాడుచు డగ్గుత్తికతో తొట్రుపడు మాటలతో నేనతని కిట్లంటిని. 

మహాత్మా! నేను బ్రాహ్మణుడను. తాపసుడను. పేరాకట బాధపడువాడను. అందుచే దొంగవలె నన్నము కుండ వెదకుచున్నాను. 

మహామతీ ! నేను నీ యింటికి దొంగగ వచ్చిన యతిథిని. ఆకలిగొన్నవాడను. వండిన మాంసము దినుట కనుమతి యిమ్ము అంటిని. ఆ చండాలుడు నా మాటలు విని నిశ్చయించుకొని యిట్లనెను: 

''ఓ బ్రాహ్మణుడా! ఇది మాలయిల్లు, తనకుము. మానవ జన్మము దుర్లభమైనది. అందును ద్విజత్వము లభించుట కడు దుర్లభతరము. ద్విజత్వము నందుబ్రాహ్మణత్వము దుర్లభతమమని తెలియదా! 

ఉత్తమ లోకములు గోరుకొనువాడు నీచజాతుల వారి యన్న మెప్పుడును తినరాదని మనువు మున్నగువారు తెలిపిరి. 

విప్రా! నేను కర్మచే చండాలుడను. దూరముగ నుండదగినవాడను. అందువలన నిన్ను తినవద్దనుచున్నాను. కాని లోభమున గాదు.

ద్విజోత్తమా వర్ణసంకర దోషము నీకు గల్గరాదు. అనెను. 

నేను (విశ్వామిత్రుడు) ఇట్లంటిని: ధర్మజ్ఞా ! నీవు చండాలుడవైనను నీ బుద్ది నిర్మలమైనది. నీకు ధర్మ సూక్ష్మము చెప్పుచున్నాను వినుము. ఆపద్ధర్మ మొకటి గలదు. దాని వలన తప్పకాపదలందు దేహమును పోషించుకొనవచ్చును. 

పాపము చేసిన పిదప నివృత్తి కొఱకు ప్రాయశ్చిత్తముచేసి కొనవచ్చును. ఆపద లేనపుడు పాపము చేసిన దానివలన దుర్గతి గల్గును. 

ఆకలిచే చచ్చినవానికి నరకము గల్గును. ఇది నిజము. కనుక మేలు కోరుకొనువాడేదియో విధముగ నాకలి మంట చల్లార్చుకొనవలయును. 

కనుక చండాలుడా! నేను దొంగ వృత్తితో నా శరీరమును పోషించుకొనదలచితిని. వానలు లేనపుడు దొంగతనము చేయుట పాపమని పండితులందురు. మేఘము వానకురియనిచో నా దోషము మేఘునిదే. 

కాంతా! నేనిట్లు పలుకగనే వెంటనే మేఘము వర్షించెను. ఆకసము నుండి యేనుగు తొండము లావు ధారలతో వానపడెను. ఉఱుములు మెఱుపులు మొయిళ్ళు వాన-చూచినేనెంతయో ముదమొందితిని. 

అపుడు నేనా చండాలుని యిల్లు వదలి బయటికి వెళ్లితిని. వరారోహా! ఇంక నీవెట్లు కాలము గడిపితివో తెలుపుము. ఈ కరవు చాల ఘోరమైనది. ఈ వనము మలమల మాడినది. ప్రాణుల కాహారము దొరకుటలేదు. అను మాటలు విని యామె తన పతి కిట్లనియెను

త్రిశంకుడికి విశ్వామిత్రుని ప్రత్యుపకారం

Trishankudi's physical longing for heaven - త్రిశంకుడి సశరీర స్వర్గ వాంఛ

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - త్రిశంకుడి సశరీర స్వర్గ వాంఛ

త్రిశంకునకు హరిశ్చంద్రుడుదయించెను. అతడందగాడు. శాస్త్రమున చెప్పిన శుభలక్షణములు గలవాడు. త్రిశంకుడు అట్టి తన కుమారుని రాజుగజేసి యీ మానవశరీరముతోడ స్వర్గ మనుభవింప మది దలంతెను. 

అతడు వసిష్ఠు నాశ్రమమేగి విధివిధానమున నమస్కరించి చేతులు ముకుళించి నెమ్మదితో 

ముని కిట్లనెను: ఓ తాపసోత్తమా! బ్రహ్మపుత్రా! మహానుభావా! సర్వమంత్ర విశారదా! మంచి మనస్సుతో నా విన్నప మాలింపుము. ఈ మానవ శరీరముతో స్వరలోక సుఖములు భోగించవలయునని నాకు కోరిక గల్గినది. 

నందనవనమందు దేవకన్యలతో నల్లిబిల్లిగగూడి యుండుటకు మధుర మైన దేవగంధర్వగానము వినుటకు కోర్కి గల్గినది. ఓ మహామునీ! ఈ శరీరముతోడ స్వర్గమేగ గల్గునట్టి యజ్ఞము చేయించుము. 

మునివర్యా! ఇపుడ నాతో యాగము చేయించుటకు నీవే సమర్థుడవు. వేగమే యజ్ఞముచేసి నన్ను స్వర్గము జేర్పుము.

వసిష్ఠు గిట్లనెయెను : రాజా ! ఈ మానవ శరీరముతో స్వర్గవాసము సాధ్యముకాదు. చచ్చినవాడు తన పుణ్యకర్మ బలముమ స్నర్గమేగును. సర్వజ్ఞా! నీ కోరిక దుర్లభమగుట వలన నాకు భయమగుచున్నది. బ్రతికినవాడచ్చరతో నుంట దుర్లభము 

కనుక మహాత్మా! మొదట యజ్ఞము చేయుచు. చచ్చి స్నర్గమేగగలవు. అను మునివాక్కులు విని రాజు మది కలత జెందెము. త్రిశంకుడు వసిష్ఠునితోమరల నిట్లనెను. ఓ బ్రాహ్మణుడా! వెనుకటి కోపముతో గర్వావేశముతో నీవు నన్ను యజ్ఞము చేయించుటలేదు. 

కనుక నేనిపుడువేరొకపురోహితునితో యజ్ఞము జరిపింతును. రాజుమాటలువినగానే వసిష్ఠునకు కోపము వచ్చెను. ఓరిదుర్మతీ! నీవిపుడే త్వరితముగా నిదే శరీరముతో చండాలుడవు గమ్మని వసిష్ఠుడు రాజును శపించెను. 

ఓరి! నీవు స్వర్గమార్గము చెడగొట్టికొంటివి. గోవధ చేసి నిందితుడవైతివి. బ్రహ్మణ పత్నిని హరించిన నీచుడవు. ధర్మ మార్గమును దూలనాడితివి ఓరి పాపీ! నీవు చచ్చిన పిమ్మట నైనను స్వర్గమునకు వెళ్ళవురా! అను గురు వాక్కులను త్రిశంకుడు విని అదే క్షణమున నదే శరీరముతో చండాలుడయ్యెను. అదే క్షణమున నతని బంగారు కుండలములు రాళ్ళుగా మారెను.

ఒకప్పుడు మంచి గంధములు పరిమళించిన దేహమున నిపుడు భరింపరాని దుర్వాసనలు పుట్టెను. మేనిపై దివ్వపీతాంబరములు నల్ల రంగుగ మారెను. మహాత్ముడగు వసిష్ఠుని శాపము కారణము రాజు శరీర మేనుగు శరీరము వలె నల్లగా మారెను. 

రాజా ! మహా శక్తి నుపాసించు వారి కోపమునకు ఫలిత మిట్లుండును. కనుక శ్రీశక్తి భక్తుల నెన్నడు నవమానింపరాదు. వసిష్ఠుడు విరంతరముగ శ్రీ గాయత్రి జప నిష్ఠాగరిష్ఠుడై బ్రహతేజము మూర్తిభవించియుండెను. తన దేహము చండాల దేహముగ నిందింప-శపింప-బడుట వలన త్రిశంకువు తీపని దుఃఖము జెంది దైన్వముతో తన యింటి కేగక వనములకు వెళ్ళెను. 

త్రిశంకుడంత దుఃఖర్తితో శోకించుచు మనసు చెడి యిపుడేమిచేతును? ఎక్కడికేగుదును? నా దేహము మిక్కిలి నిందిపబడినది. ఇపుడు నా యిశోకము నశించు నుపాయము లేదు. నేనొకవేళ నా యింటి కేగినచో నా కొడుకే మనోవ్వధ నందును. నన్ను చండాలునిగ జూచి నా భార్యయు నన్ను కన్నెత్తి చూడదు. 

నా యీ కురూపము చూచి నా మంత్రులు నన్నాదరింపరు. ఇక దాయాదులు చుట్ట పక్కములు నన్ను చేరరానేరురు. కొలువరు. ఇందఱిచేత విడువలసిన నేను బ్రతుకుట కన్న చచ్చుటమేలు కనుక నేను విషము మ్రింగియె నీటిలో దుమికియె మెడకుకురిపోసికొనియె ప్రాణములు వదులను. బలము కొలదితప్పక మండు నిప్పులతో దేహము వేల్తును. 

కూడు నీరు మాని యి ప్రాణాలు వదలగలను. వీనిలో నేను చేసికొన్నను జన్మ జన్మముల కాత్మహత్మా పాతకము నన్ను వెంటాడును. ఈ యాత్మహత్మ వలన చండాలత్వము తీరని శాపముగ నన్ను వెంబడించగలదు. అని పెక్కు రీతుల రాజు తన మనస్సులో నాలోచించుకొని ఆత్మహత్య చేసికొనుట తగదని తలంచెను.

ఈ యడవిలోనే నీ దేహముతో స్వయంకృతాపరాధ మనుభవించుట మంచిది. దీని నిపుడే యనుభవించుటవలన నది యిక్కడనే నశించును. ప్రాకబ్ధకర్మము లనుభవింపకున్న నెన్నటికిని తీరవు. నేను చేసిన మంచిగాని చెడుగాని నేనే యనుభవించవలయును. 

కనుక నేనిపుడు పావనపుణ్యతీర్దములు సేవించుచు పుణ్యాశ్రమములందు వసించుచు సాధుల సేవించుచు జగదంబను స్మరింపగలను. ఇట్లు వనములు దిరుగుచు కర్మములు బాపుకొనగలను. నా యదృష్టము పండినచో నొకవేళ నాకు సత్పురుషుల సంగమము గలుగవచ్చును. 

ఇట్లు తలపోసి రాజు తన నగరమున కేగక గంగాతీరమేగి యచట పశ్ఛాత్తాముతో కాలము గడపుచుండెను. అంత హరిశ్ఛంద్రరాజు తన తండ్రి శాపగ్రస్తుడగు టెఱింగి దుఃఖించి మంత్రులను తండ్రివి వెదుక పంపించెను. వారు చండాలరూపముతో పల్మారు నిట్టూర్పుచున్న త్రిశంకునిగని వినయముతో మ్రొక్కి యిట్లనిరి. 

ఓ రాజా! మేము మంత్రులము. నీ కొడుకగు హరిశ్చంద్ర మహారాజు పంపగ నతని యాజ్ఞ తలదాల్చి వచ్చితిమని మమ్మేఱుంగుము. యువరాజకుమారుడు మాతో పల్కినపలుకులు వినుము. మీరు నాతండ్రిని గౌరవించి కొనితెండు. 

కనుక రాజా! దిగులుమాని రాజ్యమునకు రమ్ము. నీ ప్రజలు మంత్రు లెల్లరును నీకు పరిచర్యలు చేయగలరు. గురుని ప్రసన్నుని చేయుదుము. అతడు ప్రసన్నుడైనచో నీ దుఃఖముతొలగిపోవును. గురుడు మహాతేజస్వి. రాజా! ఇట్లు నీ కొడుకు మాతో నెంతగనో చెప్పెను. 

కనుక నీ విపుడు నీ యింటికి త్వరగ బయలుదేరుము. అను వారి మాటలు వినియు చండాలాకృతిగల రాజు తన యింటి కేగుటకు నిశ్చయుంచుకొనలేదు. రాజు మంత్రుల కిట్లనెను: 

ఓ మంత్రులాలా! మీరు నగరమునకు వెళ్ళుడు. మహాత్ములారా! మీరు నామాటగ నిట్లు చెప్పుడు.

పుత్రా! నేను రాను. రాజ్యమును వివేకముతో పాలించుము. బ్రాహ్మణులను సమ్మానింపుము. దేవతలను పూజింపుము. యజ్ఞము లాచరింపుము. మహాత్ములు నిందించు ఈ చండాల వేషముతోనయెధ్యానగరములోనడుగు పెట్టజాలను. 

మంత్రలారా! మీరువెళ్ళుడు. మహాబలుడగుతు నాహరిశ్చంద్ర కుమారుని గద్దెపై నెక్కించి మీరెల్లరు నా యాజ్ఞతో రాజకార్యములు నిర్వహింపుడు. అని త్రిశంకు డాదేశింపగ మంత్రులు మిక్కిలి యేడ్చి రాజునకు వనమునుండి వేగనగరు వైపు నడచిరి. 

వారయోధ్యజేరి యొక శుభమూహర్తమునందు విధి ప్రకారముగ హరిశ్చంద్రు నభిషేకించిరి. అట్లు రాజాజ్ఞచే మంత్రులు తన్నభిషేకించగ హరిశ్చందుడు తన తండ్రిని దలంచుచు తేజము వెలుగులు చిమ్మగ రాజ్యము చక్కగ పాలించెను.

విశ్వామిత్ర - శ్వపచుల కథ

Saturday, April 18, 2026

Aruna's moral teaching - అరుణుడు చేసిన నీతిబోధ

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - అరుణుడు చేసిన నీతిబోధ

పుత్రా! ధర్మమందు బుద్ధి నిల్పుము. విప్రులు గౌరవపాత్రులు. న్యాయముగ ధనము సంపాదించవలయును. ప్రజలను కన్నబిడ్డలవలె పాలింపవలయును. ఎప్పుడు నసత్య మాడరాదు. చెడు మార్గము పట్టరాదు.

తాపసులు పూజనీయులు. క్రూర దానవులను చంపవలయును. ఇంద్రియములు జయింపవలయును. రాజు కార్యసిద్ధికొఱకు మంత్రివరులతో మంత్రాంగము నెఱపవలెను. రహస్యమును వెల్లడించరాదు.

కుమారకా! శత్రువు కొలది వాడైనను నుపేక్షించి యుండరాదు. ఇతరులను జేరిన మంత్రి వినయముగ నున్నను నమ్మి యుండరాదు. శత్రులను మిత్రులను చారదృష్టితో కనిపెట్టి యుండవలయును. నిత్యము దానధర్మములందు మనస్సు నిలుకడ జెందవలయును.

వట్టి మాటలు కట్టిపెట్టుము. చెడు సంగతి విడిచిపెట్టుము. పెక్కులు జన్నము లొనరింపుము. మహర్షులు పూజనీయులు. ఎన్నడును స్త్రీని స్త్రీ స్వభావముగలవానిని జూదగానిని నమ్మరాదు. వేటయందు చెడ్డ తమకము తగదు.

జూదము త్రాగుడు పాటలు వారవని తలు- అను విషయములందు తగుల్కొనక ప్రజలను వాని జోలికి పోనిక ఉండవలయును. తెలతెలవారక మున్నే మేల్కొన వలయును. తప్పత యథావిధిగ స్నాన సంధ్య లోమరింపవలయును.

పుత్త్రా: శ్రీపరాశక్తి పరమపూజను పరమభక్తితో దీక్షాపరత నొనర్పలయును. పరాశక్తి పదార్చనమున జన్మము తరించును. శ్రీదేవీ మహాపూజను జీవితకాలమం దొక్కసారియైన చేసి దేవీ పాదతీర్థము సేవించినవాడు మరల తల్లి గర్బము తప్పక ప్రవేశింపడు.

ఆ మహాదేవియే దృశ్యము-దృష్ట-సాక్షి-అన్ని యామెయే అను నిశ్చల భావముతో నిర్బయ ముగ తన్మనస్కుడై యుండవలయును. నిత్యవిధు లొనరించి శ్రీదేవీ మహాసభలు జరిపి యందు తెలిసిన బ్రాహ్మణుల నాహ్వానించి దేవితత్త్వమును ధర్మముగూర్చి యడుగవలయును.

వేదవేదాంగపారగులగు బ్రాహ్మణులను సంపూజింపవల యును. తగిన వారికి గోవులు-భూమి-బంగారము దాన మీయవలయును. చదువురాని విప్రుని పూజింపరాదు. మూర్ఖున కెప్పుడు నన్నము మాత్రము పెట్టవలయును. మరేదియు నీయరాదు.

పుత్రా! ఎన్నడును లోభమువలన ధర్మమును త్రోసి పుచ్చరాదు. అన్నిటికన్న ముఖ్యముగ విప్రుల నెన్నడు నవమానింపరాదు. బ్రాహ్మణులు భూదేవతలు. వారు క్షత్రియులకు తప్పక కారణభూతులు. మఱి ఆదరణీయులు. నీటినుండి నిప్పు బ్రహ్మతేజమునుండి క్షాత్రము రాతినుండి లోహము గల్గును.

ఇవి పరస్పర వైరముగలవయ్యు తమ కారణమునందే తాములయముజెందును. కనుక సుఖసంపదలు గోరుకొను రాజు తప్పక విశేషముగ వినయముతో దానములతో బ్రాహ్మణులను సేవించి గౌరవించవలయును. రాజు ధర్మశాస్త్రముసారముగ దండనీతి ప్రయోగించవలయును. న్యాయముగ ధనము గడించి నిలువ చేయవలయును.

తన తండ్రి ఇట్లు ప్రబోధింపగ త్రిశంకుడు విని ప్రేమతో గద్గదమయిన వాక్కుతో నట్లేయని పలికెను. అపుడు రాజు వేదశాస్త్రవిశారదులు మంత్రవిదులునైన బ్రాహ్మణులను రావించి వెంటనే యభిషేకసామగ్రి సమకూర్చెను. అతడు సర్వతీర్థముల జలములు తెప్పించి రాజులను మంత్రులను ప్రజలనందఱ నాహ్వానించెను. 

రాజొక పుణ్యశుభముహూర్తమున విధివిధానమున తనత్రిశంకు కుమారుని రాజ్యమందభిషేకించి యాసన మప్పగించెను. ఆతడు పిదప తన భార్యతో వనములకేగి వానప్రస్థాశ్రమము స్వీకరించి గంగాతీరమునందు తీవ్ర తప మొనరించెను. మరణకాలము సమీపించగనే యరుణుడు స్వర్గమేగి సురపూజితుడై యింద్రాసనము సమీపమున సూర్యునివలె వెల్గుచుండెను.

రాజిట్లనెను : మున్ను గోవును చంపుటవలన వసిష్ఠుడు సత్యవ్రతుని శపించెనని కథాసందర్బమున నీవు చెప్పితివి. ప్రభూ! గురువు కోపించగా సత్యవ్రతుడు పిశాచత్యము పొంది తిరిగి పిశాచత్వమునుండి యెట్లు ముక్తుడయ్యెనను సంశయము గల్గుచున్నది. 

శాపగ్రస్తుడు సింహాసన మెక్కుటకు తగడు కదా. ముని యేకర్మమువలన నతనిని పిశాచత్వముక్తిని జేసెనో తెల్పుము. విప్రర్షీ! నా కీతని శాపమోక్షణమగూర్చి తెలుపుము. అట్టి పిశాచాకారము గలవాని నతని తండ్రి యొట్లు రప్పించెను. 

సత్యవ్రతుడు వసిష్ఠుని శాపమును వెంటనే పిశాచత్వమొంది కుచ్చితుడు-దుస్సహుడు-క్రూరుడు-లోక భయంకరుడు నయ్యెను.

సత్యవ్రతుడు శ్రీదేవిని భక్తప్రపత్తులతో నుపాసింపగ దేవి సుప్రసన్నయై క్షణములో నతనికి దివ్యదేహము ప్రసాదించెను. శ్రీత్రిభువనేశ్వరీదేవి దయామృతమున నతని పిశాచత్వము తొలగెను. 

పాపములు పటాపంచయ్యెను. అతడు పాపరహితుడు తేజస్వి యయ్యెను. దేవి దయవలన వసిష్ఠుడును ప్రన్నుడయైను. 

సత్యన్రతుని తండ్రియును కొడుకు నెడల ప్రేమగలవాడయ్యెను. తన తండ్రి మరణించగ త్రిశంకుడు సనాతనియగు దేవదేవిని గూర్చి ధర్మమతితో పెక్కులు దేవీ మహాయజ్ఞము లొనరించెను.

త్రిశంకుడి సశరీర స్వర్గ వాంఛ

Rohit's escape - Harishchandra's waterlogging - రోహితుడి పలాయనం - హరిశ్చంద్రుడికి జలోదరం

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - రోహితుడి పలాయనం - హరిశ్చంద్రుడికి జలోదరం రాజు సంతోషముతో తన కార్యములు తానొనరించుచుండెను. వరుణు డిట్లు మాటిమా...