Thursday, June 25, 2026

Visakha Nakshatra - విశాఖ నక్షత్రము

విశాఖ నక్షత్రము

నక్షత్రం - విశాఖ
అధిపతి - గురువు
గణము - రాక్షస
జాతి - స్త్రీ
వృక్షం - నాగకేసరి
జంతువు - పులి
నాడి - అంత్య
పక్షి - గరుడుడు
అధిదేవత - ఇంద్రుడు, అగ్ని
రాశి - 1,2,3 పాదాలు తుల, 4వ పాదం వృశ్చికము

విశాఖ నక్షత్ర జాతకుల గుణగణాలు
నక్షత్రములలో విశాఖ నక్షత్రం 16వ నక్షత్రం. విశాఖ సూర్యుని జన్మ నక్షత్రంగా పేరొందినది. విశాఖ శాంతి నక్షత్రం. విశాఖ గురుగ్రహ నక్షత్రము, రాక్షస గణము, అధిదేవతలు, ఇంద్రుడు, అగ్ని, జంతువు పులి, రాశ్యధిపతి కుజుడు. గురుదశతో జీవితము ప్రారంభం ఔతుంది కనుక బాల్యము సుఖముగా జరుగుతుంది.

తల్లి తండ్రులు కుటుంబ సభ్యుల మధ్య గారాబంగా జీవితము మొదలౌతుంది. వైద్య, వ్యాపార, సాంకేతిక రంగాలలో, అర్ధికపరమైన వ్యాపారాలలో పట్టు సాధిస్తారు. మంచి సలహాదారుల వలన ప్రయోజనాలు ఉంటాయి.

వంశపారంపర్య ఆస్థులు సంక్రమిస్తాయి. స్వంతగా అంతకంటే అధికమైన ఆస్తులు సంపాదిస్తారు. సంతానము వలన ఖ్యాతి లభిస్తుంది. అన్యభాషలు నేర్చుకుంటారు. సాంకేతిక రంగం ఆధారముగా ఇతర రంగాలలో ప్రవేశించి ఆ రంగములో విజయము సాధించి ప్రాముఖ్యత సాధిస్తారు.

కుటుంబ సభ్యుల మీద తప్ప ఇతరుల మీద ప్రేమాభిమానాలు తక్కువ. భయము, పొదుపు, జాగ్రత్త, విజ్ఞానము జీవితములో సమపాళ్ళలో ఉంటాయి. ఏభై సంవత్సరాల అనంతరము జీవితము సుఖవంతముగా జరుగుతుంది కనుక వృద్ధాప్యము సుఖవంతముగా జరుగుతుంది.

ఈ నక్షత్రం వారు అన్నివేళలా పనిచేయడానికి ఇష్టపడతారు. వేడుకలు, ప్రేమ మరియు విలాసం అనేవి వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా పరిగణిస్తారు. వీరు ఎంతో మర్యాదపూర్వకంగా, సామాజికంగాను ఉంటారు మరియు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు.

విద్యాపరంగా, వీరి పరిస్థితి చాలా బాగుంటుంది. బృహస్పతి యొక్క ప్రభావం కారణంగా, వీరు వీరి బాల్యం నుండి జ్ఞానాన్ని పొందడం కొరకు ఉత్సాహాన్ని కనపరుస్తారు. బాగా చదువుతారు, అందువల్లనే ఉన్నత విద్యను పొందుతారు.

వీరు మెదడును ఎక్కువగా ఉపయోగిస్తారు. ఒకవేళ వీరు సామాజిక కోణాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లయితే, చాలా స్నేహపూర్వకంగా ఉంటారు కనుక వీరి సర్కిల్ చాలా పెద్దది. వ్యక్తులచే ప్రేమించబడతారు మరియు గౌరవించబడతారు.

సామాజిక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనే సంస్థలకు వీరు అనుబంధంగా ఉంటారు. వీరి స్వరం ఎంతో శక్తివంతమైనది, అందువల్లనే ప్రజలను వీరు ఆకర్షిస్తారు. అందువల్లనే, ఒకవేళ వీరు రాజకీయాల్లో ఉన్నట్లయితే, అనేక సామాజిక సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు.

రోజువారీ సంపాదన విషయానికి వస్తే, వ్యాపారం చేయడం కంటే ఉద్యోగం చేయడానికి వీరు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ప్రభుత్వ ఉద్యోగం పొందడం కొరకు వీరు చాలా కష్టపడతారు. ఆర్థికంగా వీరి పరిస్థితి ఎంతో బాగుంటుంది. మరియు హఠాత్తుగా ఆర్థికపరమైన ప్రయోజనాలు వీరికి కలగవచ్చు.

లాటరీలు మొదలైన వాటి ద్వారా కూడా వీరు లాభాన్ని పొందవచ్చు. వీరు ఇప్పటికే డబ్బును ఆదా చేయడాన్ని ఆస్వాదిస్తారు మరియు అన్ని విషయాలు కూడా వీరికి ఎంతగానో సహాయపడతాయి. వీరికి ఎన్నడూ ఆర్థికపరమైన ఇబ్బందులు కలగవు మరియు ఒకవేళ అటువంటి సమస్యలు ఏర్పడినట్లయితే, అవి తాత్కాలికంగానే ఉంటాయి.

విశాఖ నక్షత్రం మొదటి పాదం
విశాఖ నక్షత్ర అధిపతి గురువు. విశాఖ రాక్షసగణ నక్షత్రం కనుక వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది. వీరు ధర్మపక్షపాతం కలిగి ఉంటారు. నిర్వహణ సామర్థ్యం అధికంగా ఉంటుంది. ఉన్నతోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వంటి వృత్తులు వీరికి అనుకూలం. అలాగే విద్యుత్, అగ్ని భూ సంబంధిత ఉద్యోగాలు వీరికి అనుకూలంగా ఉంటాయి.

ఆధ్యాత్మిక విషయాలలో కూడా వీరికి ఆసక్తి ఉంటుంది. విద్యాభ్యాసం కొంత వరకు బాగానే సాగుతుంది. కాలేజి చదువులలో మందకొడితనం నెల కొంటుంది. ప్రయత్నపూర్వకంగా విజయం సాధించవలసిన అవసరం ఉంది.

14 సంవత్సరాల వయసు వరకు సౌఖ్యంగా జీవితం గడుస్తుంది. తల్లి తండ్రుల ఆదరాభిమానాలకు పాత్రులు ఔతారు. తరువాత వచ్చే 19 సంవత్సరాల శనిదశ కారణంగా సౌఖ్యం కొంత తగ్గుతుంది. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం కలుగవచ్చు. సంపాదించిన దానికంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. కనుక జాగ్రత్త వహించవలసిన అవసరం ఉన్నది. స్థిరాస్తులు ఏర్పరచుకోవడం జీవితకాలం సహకరిస్తుంది.

33 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధదశ కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. 50 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల కేతుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురౌతాయి. కేతు దశ అనుకూలిస్తే విదేశీపర్యటన అనుకూలిస్తుంది. తీర్ధయాత్రలకు ఇది అనుకూల సమయం. 57 సంవత్సరాల తరువాత వచ్చే శుక్రదశ కారణంగా జీవితంలో సౌఖ్యం తిరిగి నెలకొంటుంది. మిగిలిన జీవితం సౌఖ్యంగా జరుగుతుంది.

విశాఖ నక్షత్రం రెండవ పాదం
విశాఖ నక్షత్ర అధిపతి గురువు. విశాఖ రాక్షస గణ నక్షత్రం కనుక వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది. వీరు ధర్మపక్షపాతం కలిగి ఉంటారు. స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. నిర్వహణ సామర్థ్యం అధికంగా ఉంటుంది. ఉన్నతో పాధ్యాయులు, ఉపాధ్యాయులు వంటి వృత్తులు వీరికి అత్యంత అనుకూలం. ఆధ్యాత్మిక గురువులుగా కూడా వీరు రాణించగలరు. ఆధ్యాత్మిక విశ్వాసం అధికంగా ఉంటుంది.

విద్యారంభం బాగానే ఉంటుంది. మాధ్యమిక విద్యాకాలంలో విద్యలో మందకొడితనం నెలకొంటుంది. ప్రయత్నపూర్వకంగా విజయం సాధించవలసిన అవసరం ఉంది. 10 సంవత్సరాల వయసు వరకు సౌఖ్యంగా జీవితం గడుస్తుంది.

తల్లితండ్రుల ఆదరాభిమానాలకు పాత్రులు ఔతారు. తరువాత వచ్చే 19 సంవత్సరాల శనిదశ కారణంగా సౌఖ్యం కొంత తగ్గుతుంది. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం కలుగవచ్చు. సంపాదించినా దానికంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. కనుక జాగ్రత్త వహించవలసిన అవసరం ఉన్నది. స్థిరాస్తులు ఏర్పరచుకోవడం జీవితకాలం సహకరిస్తుంది. 29 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధదశ కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది.

46 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల కేతుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురౌతాయి. కేతుదశ అనుకూలిస్తే విదేశీపర్యటన అనుకూలిస్తుంది. తీర్ధయాత్రలకు ఇది అనుకూల సమయం. 53 సంవత్సరాల తరువాత వచ్చే శుక్రదశ కారణంగా జీవితంలో సౌఖ్యం తిరిగి నెలకొంటుంది. మిగిలిన జీవితం సౌఖ్యంగా జరుగుతుంది.

విశాఖ నక్షత్రం మూడవ పాదం
విశాఖ నక్షత్ర అధిపతి గురువు. విశాఖ రాక్షసగణ నక్షత్రం కనుక వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది. నిర్వహణ సామర్థ్యం అధికంగా ఉంటుంది. వీరు ధర్మపక్షపాతం కలిగి ఉంటారు. విచక్షణా జ్ఞానం అధికంగా ఉంటుంది. వీరికి వ్యాపారం అంటే మక్కువ ఎక్కువ. మేధా సంబంధిత, విద్యా సంబంధిత, భూ సంబంధిత ఉద్యోగం, వ్యాపారం, వృత్తులు వీరికి అనుకూలిస్తాయి. విద్యలో ఆరంభం నుండి మందకొడితనం నెలకొంటుంది. ప్రయత్నపూర్వకంగా విజయం సాధించవలసిన అవసరం ఉంది.

6 సంవత్సరాల వయసు వరకు సౌఖ్యంగా జీవితం గడుస్తుంది. తల్లితండ్రుల ఆదరాభిమానాలకు పాత్రులు ఔతారు. తరువాత వచ్చే 19 సంవత్సరాల శనిదశ కారణంగా సౌఖ్యం కొంత తగ్గుతుంది. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. 25 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధదశ కారణంగా జీవితం సాఫీగా సాగుతుంది. వివాహం సకాలంలో జరుగుతుంది.

42 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల కేతుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదు రౌతాయి. కేతుదశ అనుకూలిస్తే విదేశీపర్యటన అనుకులిస్తుంది. తీర్ధయాత్రలకు ఇది అనుకూల సమయం. 49 సంవత్సరాల తరువాత వచ్చే శుక్రదశ కారణంగా జీవితంలో సౌఖ్యం తిరిగి నెలకొంటుంది. మిగిలిన జీవితం సౌఖ్యంగా జరుగుతుంది.

విశాఖ నక్షత్రం నాలుగవ పాదం
విశాఖ నక్షత్ర అధిపతి గురువు. విశాఖ రాక్షసగణ నక్షత్రం కనుక వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది. వీరు ధర్మపక్షపాతం కలిగి ఉంటారు. నిర్వహణ సామర్థ్యం అధికంగా ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలలో కూడా వీరికి ఆసక్తి ఉంటుంది. ఉన్నతోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వంటి వృత్తులు వీరికి అనుకూలం.

తల్లి తండ్రుల ఆదరాభిమానాలకు పాత్రులు ఔతారు. 2 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శనిదశ కారణంగా సౌఖ్యం కొంత తగ్గుతుంది. విద్యాభ్యాసంలో మందకొడితనం ఉంటుంది. 21 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధదశ కారణంగా జీవితం ఉన్నత విద్యలో అభివృద్ధి ఉంటుంది. సకాలంలో వివాహం జరుగుతుంది.

38 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల కేతుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురౌతాయి. కేతుదశ అనుకూలిస్తే విదేశీపర్యటన అనుకులిస్తుంది. తీర్ధయాత్రలకు ఇది అనుకూల సమయం. 45 సంవత్సరాల తరువాత వచ్చే శుక్రదశ కారణంగా జీవితంలో సౌఖ్యం తిరిగి నెలకొంటుంది. మిగిలిన జీవితం సౌఖ్యంగా జరుగుతుంది.

విశాఖ నక్షత్ర జాతకులు పెంచవల్సిన వృక్షములు:
విశాఖ నక్షత్రం వారు వెలగ, మొగలిచెట్లను పెంచడం మంచిది. ఎటువంటి పరిస్థితులనైన తట్టుకొని నిలబడడానికి, ముందుచూపుతో అన్ని విషయాలను గ్రహించి ముందుకు సాగడానికి, వృత్తిరీత్యా మంచి గౌరవ మర్యాదలు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది.

విశాఖ నక్షత్ర జాతకుల తారా ఫలాలు
తార నామం - తారలు - ఫలం

జన్మ తార - పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర - శరీరశ్రమ

సంపత్తార - పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర - ధన లాభం

విపత్తార - ఆశ్లేష, జ్యేష్ట, రేవతి - కార్యహాని

సంపత్తార - అశ్విని, మఖ, మూల - క్షేమం

ప్రత్యక్ తార - భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ - ప్రయత్న భంగం

సాధన తార - కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ - కార్య సిద్ధి, శుభం

నైత్య తార - రోహిణి, హస్త, శ్రవణం - బంధనం

మిత్ర తార - మృగశిర, చిత్త, ధనిష్ట - సుఖం

అతిమిత్ర తార - ఆరుద్ర, స్వాతి, శతభిష - సుఖం, లాభం

నక్షత్ర శాంతి: ఉత్తర దిశలో మొక్కలు పెంచాలి. శనగలు దానం ఇవ్వాలి.

నక్షత్ర మంత్రం:
।। ఓం ।।
దూరమస్మచ్ఛత్ర'వో యంతు భీతాః ।
తది' ద్రాగ్నీ కృ'ణుతాం తద్విశా'ఖే ।
తన్నో' దేవా అను'మదంతు యజ్ఞమ్ ।
పశ్చాత్ పురస్తాదభ'యన్నో అస్తు ।
నక్షత్రాణామధి'పత్నీ విశా'ఖే ।
శ్రేష్ఠా'వింద్రాగ్నీ భువ'నస్య గోపౌ ।
విషూ'చశ్శత్రూ'నపబాధ'మానౌ ।
అపక్షుధ'న్నుదతామరా'తిమ్ ॥

Rama-Lakshmana Dwadashi - Champaka Dwadashi - రామలక్ష్మణ ద్వాదశి - చంపక ద్వాదశి

రామలక్ష్మణ ద్వాదశి - చంపక ద్వాదశి

జ్యేష్ఠ మాసం శుక్ల పక్షంలో వచ్చే ద్వాదశిని రామలక్ష్మణ ద్వాదశి అనీ, చంపక ద్వాదశి అనీ అంటారు. 

వరాహ పురాణం ప్రకారం ప్రతినెలా శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి విశేషమైనదే! జ్యేష్ఠ మాసంలో వచ్చే శుక్ల ద్వాదశి నాడు మహావిష్ణువు అవతారమైన శ్రీరామచంద్రుడిని పూజించాలని సూత మహర్షి చెప్పినట్టుగా వరాహ పురాణ కథనం.

రామలక్ష్మణ ద్వాదశి (పుత్ర సంతాన వ్రతం): పుత్ర సంతానం కోసం పరితపించిన దశరథ మహారాజు వశిష్ఠ మహర్షి సూచన మేరకు ఈ వ్రతాన్ని ఆచరించాడు. దీని ఫలితంగానే శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నులు జన్మించారని పురాణాల ద్వారా తెలుస్తుంది. సంతానం లేని వారు ఈ రోజున ఉపవాస ఉండి, శ్రీరామ లక్ష్మణులను పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

ఈ సందర్భంగా జ్యేష్ఠ ఏకాదశి నాడు బంగారంతో చేయించిన (శక్తి ఉన్నవారు) రామలక్ష్మణ విగ్రహాలను పూజించి, మర్నాడు అంటే ద్వాదశి నాడు వాటిని దానంగా ఇవ్వాలని ధర్మశాస్త్ర వచనం. ఆర్థికంగా శక్తిలేని వారు మట్టి ప్రతిమలను పూజించి కూడా దానమివ్వొచ్చు. శ్రీరాముడు విష్ణుమూర్తి స్వరూపుడైతే, లక్ష్మణుడు ఆదిశేషుడి రూపం.

ఈ ఉభయులను ప్రత్యేకంగా ఆవాహన చేసి పూజించడం వల్ల గవామయన యాగం చేసిన ఫలితం కలుగుతుందని పెద్దల మాట. ఒక ఏడాది పాటు నిర్విఘ్నంగా యాగం చేయడాన్ని గవామయన యాగం అంటారు.

కేవలం రామలక్ష్మణ ద్వాదశి నాడు వారిద్దరినీ పూజించడం వల్ల అంతటి గొప్ప పుణ్యం లభిస్తుందని ప్రతీతి. 

చంపక ద్వాదశి (సంపెంగల పూజ): ఒడిశా(ఉత్కళ రాష్ట్రము)  మరియు పూరీ జగన్నాథ ఆలయం పరిసర ప్రాంతాలలో ఈ ద్వాదశిని "చంపక ద్వాదశి" అని పిలుస్తారు. ఈ రోజున స్వామివారిని సంపెంగ పువ్వులతో (చంపక పుష్పాలు) విశేషంగా అలంకరించి పూజిస్తారు.

ఆది శంకరాచార్యులు అవతార పరిసమాప్తి: జగద్గురువు ఆది శంకరాచార్యులు అవతార పరిసమాప్తి గావించింది కూడా ఈ రోజునే! ఈ క్రమంలో ద్వాదశి నాడు ఆదిశంకరుల ధ్యానం వల్ల ఆయన అనుగ్రహం కూడా లభిస్తుంది.

జ్యేష్ఠశుద్ధ ద్వాదశి రామలక్ష్మణ ద్వాదశి, చంపక ద్వాదశి, ఆదిశంకర కైలాస గమనం అని పిలుస్తారు..

ఏకాదశ్యాం సౌవర్ణరామలక్ష్మణౌ సంపూజ్య 
ద్వాదశమ్యాం బ్రాహ్మణాయ దద్యాత్| 
తథా చోక్తం వరాహపురాణే-

జ్యైష్ఠమాసేఽప్యేవమేవ సంకల్ప్య విధినా నరః|
అర్చయేత్ పరమం దేవం పుష్పైర్నానావిధైశ్శుభైః॥

స్రగ్వస్త్రయుగసంచ్ఛన్నౌ సౌవర్ణౌ రామలక్ష్మణౌ|
అర్చయిత్వా విధానేన ప్రభాతే బ్రాహ్మణాయ తౌ॥

దాతవ్యౌ మనసా కామమీహతాం పురుషేణ తు॥ 

ఇతి| తస్మాత్ ఏవ ద్వాదశ్యా రామలక్ష్మణద్వాదశీతి సంజ్ఞా స్యాత్|

ఈ రోజున రామలక్ష్మణులను పూజిస్తే రామానుగ్రహం కలుగుతుంది. జగన్నాథునకు సంపెంగలు మొదలైన అనేక పువ్వులతో విశేష అర్చనాదులు చేస్తారు. కనుక ఏ ప్రాంతంలోని వారైనా సంపెంగలు మొదలైన పూలతో విష్ణువును ఆరాధించాలి.

వ్రత విధానం
పుత్ర సంతానం కోరుకునేవారు రామలక్ష్మణ ద్వాదశి రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి శుచియై రామలక్ష్మణ విగ్రహాలను ప్రతిష్టించి, శాస్త్రోకంగా కలశ స్థాపన చేయాలి. అనంతరం రామలక్ష్మణులకు ఆవాహన, ఆచమనం వంటి 16 రకాల షోడశోపచార పూజలు చేయాలి. రామలక్ష్మణులకు వస్త్ర సమర్పణ చేయాలి. పూజ పూర్తి అయ్యేవరకు ఉపవాసం చేయాలి.

దానాలు:
ఈ సందర్భంగా రామలక్ష్మణ ద్వాదశి ముందు నిర్జల ఏకాదశి రోజు ఆర్ధికంగా శక్తి ఉన్నవారు బంగారు రామలక్ష్మణులు విగ్రహాలను పూజించి, రామలక్ష్మణ ద్వాదశి రోజు పూజించిన బంగారు విగ్రహాలను దానంగా ఇవ్వాలని ధర్మశాస్త్ర వచనం. శక్తికొద్దీ మట్టి ప్రతిమలను కూడా దానం చేయవచ్చు. అంతేకాకుండా ఈ రోజు బ్రాహ్మణులకు గోదానం, భూదానం, వస్త్ర దానం, సువర్ణ దానం వంటి దానాలు కూడా విరివిగా చేస్తే వ్రతఫలం అధికమవుతుంది. దీనివల్ల ఒక సంవత్సరం పాటు యాగాలు చేసినంతటి ఫలితం లభిస్తుందని నమ్ముతారు.

ఆదిశంకరాచార్యుల ఆరాధన: షణ్మత స్థాపకులైన జగద్గురువు శ్రీ ఆదిశంకరులు కైలాస గమనం చేసింది కూడా ఈ పవిత్రమైన ద్వాదశి తిథి రోజే. అందువల్ల ఈ రోజున వారిని స్మరించుకోవడం కూడా చాలా విశేషం.

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Tuesday, June 23, 2026

Nirjala Ekadashi - నిర్జల ఏకాదశి

నిర్జల ఏకాదశి

జ్యేష్ఠ శుక్ల ఏకాదశిని నిర్జల ఏకాదశి 
లేదా భీమసేని ఏకాదశిగా జరుపుకుంటారు.

ఏకాదశి తిథి ఉపవాసం, విష్ణు ఆరాధనతో ముడిపడి ఉంటుంది. ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల మనస్సుపై నియంత్రణ, ఆధ్యాత్మిక పురోగతి, పాప విముక్తి లభిస్తాయని నమ్మకం. అలాగే ఏకాదశి తిథిని హిందూ మత ఆచారాల ప్రకారం పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి వంటి తిథులకు మరింత విశిష్టత ఉంటుంది.

ఈరోజున ప్రత్యేకించి తులసి చెట్టును ఆరాధిస్తారు. కుదిరితే 21 ప్రదక్షిణలు చేస్తారు. అయితే, ఏడాదిలో వచ్చే ఏకాదశి తిథుల్లో ఒక్కో తిథికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఆయా తిథిని బట్టి ఏకాదశి రోజు తలస్నానం చేసి, ధూప దీప నైవేద్యాలతో శ్రీమహావిష్ణువుని ఆరాధిస్తే ఆ వాసుదేవుడి అనుగ్రహం కలిగి సిరి సంపదలు, శ్రేయస్సు కలుగుతాయని విశ్వాసం. అలాగే ఏకాదశి రోజు ఆచరించే ఉపవాసం కూడా ఎంతో విశిష్టమైనదిగా పండితులు చెబుతారు.

ఈ ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువును భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే వారు వైకుంఠానికి వెళ్తారని బలమైన విశ్వాసం. అలాగే ఏకాదశి రోజు భక్తి శ్రద్ధలతో శ్రీమహావిష్ణువుని ఆరాధిస్తే పాపాలన్నీ తొలగిపోతాయని కూడా నమ్మకం.

జ్యేష్ఠ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని నిర్జల లేదా భీమసేని ఏకాదశి అంటారు. ఏడాది పొడవునా వచ్చే అన్ని ఏకాదశులలో ఇది అత్యంత విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఏడాదిలోని అన్ని ఏకాదశులను ఆచరించినంత ఆధ్యాత్మిక పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతారు. 

మహాభారత కథలో నిర్జల ఏకాదశి గురించి వేదవ్యాసుడు వివరించాడు. ఈ పర్వదినాన శ్రీ విష్ణువు, లక్ష్మీదేవిని పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని, తెలిసి, తెలియక చేసిన పొరపాట్ల నుంచి ఉపశమనం లభిస్తుంది.

నిర్జల ఏకాదశి విశిష్టత: ఈ ఏకాదశిని పాండవ నిర్జల ఏకాదశి అని కూడా పిలుస్తారు. హిందూ సనాతన ధర్మంలో ఇది అత్యంత ముఖ్యమైన ఏకాదశిగా పరిగణించబడుతుంది. ఈ రోజున నీరు కూడా తాగకుండా (నిర్జలంగా) ఉపవాసం ఉండి, శ్రీమహావిష్ణువును ఆరాధిస్తే మిగతా అన్ని ఏకాదశుల ఫలితాలు దక్కుతాయని భక్తుల విశ్వాసం.

వ్రత కథ
ఈ వ్రత కథ మహాభారతం మరియు పద్మ పురాణంలో వివరించబడింది. పాండవ సోదరులలో రెండవవాడైన భీముడు తన అపారమైన ఆకలిని నియంత్రించుకోలేక ఏకాదశి ఉపవాసాలు చేయలేకపోయేవాడు. కానీ, అతనికి కూడా విష్ణుమూర్తిని పూజించి, ఏకాదశి వ్రత ఫలితాన్ని పొందాలని బలంగా ఉండేది.

దీనికి పరిష్కారం చెప్పమని భీముడు వ్యాస మహర్షిని కోరాడు. అప్పుడు వ్యాస మహర్షి, "భీమా! ఏకాదశి నాడు అన్నం తినడం మాత్రమే కాదు, ఒక్క చుక్క నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉండాలి. అదే నిర్జల ఏకాదశి వ్రతం" అని వివరించాడు. ఏడాది పొడవునా వచ్చే 24 ఏకాదశుల వ్రతాలను ఆచరిస్తే ఎంత పుణ్యం వస్తుందో, అంత పుణ్యమూ ఈ ఒక్క నిర్జల ఏకాదశిని నియమనిష్టలతో ఆచరిస్తే లభిస్తుందని వ్యాసుడు అభయమిచ్చాడు.

వ్యాసుని మాటలపై నమ్మకంతో భీముడు జ్యేష్ఠ శుక్ల ఏకాదశి నాడు సంపూర్ణంగా నిర్జల ఉపవాసం (నీరు కూడా తాగకుండా) ఆచరించాడు. ఆ కారణంగానే ఈ ఏకాదశిని భీమ ఏకాదశి లేదా పాండవ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున శ్రీమహావిష్ణువును ఆరాధించి, దానధర్మాలు చేయడం వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

ఉపవాస దీక్ష నియమాలు:
నిర్జల ఏకాదశి వేళ తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి.

ఏడాది పొడవునా వచ్చే 24 ఏకాదశి తిథులలో నిర్జల ఏకాదశి చాలా కఠినమైనది.

ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరించే వారు చుక్క నీరు కూడా తీసుకోకూడదు.
అయితే అనారోగ్యంతో ఉండే వ్యక్తులు ఉపవాస వేళ నీటిని, పండ్లను తీసుకోవచ్చని శాస్త్రాలలో పేర్కొనబడింది.

నిర్జల ఏకాదశి రోజున శ్రీ విష్ణుమూర్తి ఫోటో లేదా ప్రతిమను తాజా పువ్వులతో, తులసి మాలతో అలకరించి పూజించాలి.

పూజా సమయంలో పండ్లు సమర్పించి, తులసి మొక్కకు పూజ చేసి దీపారాధన చేయాలి.

​తులసి మొక్క చుట్టూ 5 లేదా 7 సార్లు ప్రదక్షిణలు చేయాలి. అనంతరం ఏకాదశి కథను చదివి హారతి ఇవ్వాలి. ఈ రోజంతా ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే మంత్రాన్ని జపించాలి. అంతేకాదు నిర్జల ఏకాదశి వేళ ఉపవాస దీక్షను ఆచరించే వారు పగటిపూట నిద్రపోకూడదు. విష్ణుమూర్తిని స్మరించుకుంటూ రాత్రి భజన, కీర్తనలు కూడా చేయాలి. అనంతరం మరుసటి రోజు అంటే ద్వాదశి ఉదయం బ్రహ్మముహుర్తంలో పూజలు చేసి ముందుగా అన్నం తినాలి. అప్పుడే ఉపవాస దీక్ష పూర్తవుతుంది. ఇలా చేయడం వల్ల శ్రీ విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని చాలా మంది నమ్ముతారు.

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Dashapapahara Dashami - దశపాపహర దశమి

దశపాపహర దశమి

దశపాపహర దశమి అనగా జ్యేష్ఠ శుక్ల దశమి. మానవులు తెలిసో, తెలియకో చేసే పది రకాల పాపాలను (దశ పాపాలు) ఈ పవిత్రమైన రోజున గంగా నదిలో స్నానం చేయడం ద్వారా లేదా గంగాదేవిని స్మరించుకోవడం ద్వారా తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.

జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష దశమిని ‘దశ పాపహర దశమి’ అని పిలుస్తారు. ఈ రోజు గంగామాత అవతరించిన రోజు. శాస్త్ర విహితంగా కొన్ని విధులను పాటిస్తూ పండుగను జరుపుకోవడం వల్ల పది రకాలైన పాపాలు అంటే దశ పాపాలు తొలగిపోతాయి. కనుక ఈ రోజు ‘దశపాపహర దశమి’గా ప్రసిద్ధి పొందింది.

గంగానది ఆవిర్భవించిన రోజు కనుక ఉత్తరాదిన ‘గంగా దశహర గంగోత్సవం’గా పిలుస్తారు. గంగాదేవి ఆరాధనకు ఇది ప్రీతిపాత్రమైన రోజు. గంగాదేవి మాహాత్మ్యాన్ని గురించి స్కాంద పురాణంతో సహా పలు పురాణాలు, స్మృతి కౌస్తుభం, వ్రత నిర్ణయ కల్పవల్లి, వాల్మీకి రామాయణం, మహా భారతంలో గాంగేయుని (భీష్ముని) వృత్తాంతంలో వర్ణించడం జరిగింది. వనవాసానికి వెళ్తూ, సీతాదేవి గంగను పూజించి, తిరిగి వచ్చాక గంగోత్సవం జరుపుతానని మొక్కుకున్నట్టు రామాయణ కథ.

ఇంతటి మాహాత్మ్యం ఉన్న గంగామాతను ప్రస్తుతిస్తూ స్కాంద పురాణం

‘‘జ్యేష్ఠమాసి సితే పక్షే దశమీ హస్త సంయుతా
హరతే దశపాపాని తస్మార్దశ హరా స్మృతా!’’


అన్నది. ఈ రోజు గంగా స్నానం, పూజ దశ విధాలైన పాపాల నుండి విముక్తి కలిగిస్తుంది. లోకంలో మనుషులు తెలిసీ, తెలియక పాపాలను చేయడం సహజం అయితే వాటి నుండి వచ్చే ఫలాలను అనుభవించినప్పుడు కాని పరిస్థితి అర్థం కాదు. అప్పుడు మాత్రమే అశుభాలను తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అదృష్టం కొద్దీ మనం చేసిన పాపాల నుండి విముక్తి పొందడానికి ఎన్నో ఉపాయాలను మన పూర్వులు శాస్త్రాల రూపంలో మనకు అందించారు. వాటిని ఆచరించి విముక్తి పొందవచ్చు. అటువంటి అవకాశమే ‘దశ పాపహర దశమీ వ్రతం’.

పది విధాలైన పాపాలను సామాన్యంగా నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో అప్పుడు చేస్తూనే ఉంటారు. అవి శారీరక, వాచిక, మానసిక సంబంధం కలిగి ఉంటాయి. 
మనిషి తన కర్మ, వాక్కు, మనస్సు ద్వారా ఈ పది పాపాలను చేస్తాడని హిందూ ధర్మ శాస్త్రాలు పేర్కొంటున్నాయి:

శారీరకంగా చేసే పాపాలు మూడు అవి:
అపాత్రదానం, 
శాస్త్ర విరుద్ధమైన హింసకు పాల్పడటంపరస్త్రీ/పరపురుషుల పట్ల ఆకర్షితులు కావడం, వ్యామోహం కలగటం.

వాచికంగా (నోటిద్వారా) చేసే పాపాలు నాలుగు అవి:
పరుషంగా మాట్లాడడం, అసత్యం పలకడం, చాడీలు, వ్యర్థ ప్రలాపాలు చేయడం, 
అపవాదాలు (వదంతులు) వ్యాప్తి చేయడం, సమాజం వినలేని భాషను ఉపయోగించడం.

మానసికంగా (మనస్సుద్వారా) చేసే పాపాలు మూడు అవి:
పర ద్రవ్యాన్ని తస్కరించాలనే దుర్బుద్ధి, ఇతరులకు బాధ కలిగించే పనులు చేయడం, వ్యర్థమైన అహంకారాన్ని కలిగి ఉండడం. వ్రతం ఎలా చేయాలంటే. ఈ రోజున గంగాస్నానం చేయడం వల్ల ఆ పాపాలన్నిటినీ గంగాదేవి హరిస్తుందని స్కాంద పురాణం చెప్పింది. వాస్తవానికి ఇది పది రోజులు ఆచరించవలసిన వ్రతం. జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకూ అనుష్ఠించవలసి ఉంది. అందరికీ ఇలా చేయడం కుదరకపోవడంతో ఒక్క రోజుకే- అంటే చివరి రోజైన దశమి నాటికి పరిమితమైంది.

దశపాపహర దశమిరోజుచేయవలసిన విధులు:
నదీ స్నానం: వీలైతే గంగానదిలో లేదా ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేయడం శ్రేష్ఠం. అది కుదరని పక్షంలో, ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం కలుపుకుని, గంగా దేవిని స్మరిస్తూ స్నానం చేయాలి.

దానాలు: పేదలకు వస్త్రాలు, అన్నదానం లేదా జలదానం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి.ఈ పర్వదినాన్ని ఉత్తర భారతదేశంలో అత్యంత వైభవంగా 'గంగా దసరా' (గంగావతరణం జరిగిన రోజు) పేరుతో జరుపుకుంటారు.

నిత్య స్తోత్రావళి

పంచాంగం

Lord Subrahmanya Swamy's Velayudham (Spear) - సుబ్రహ్మణ్య స్వామి వేలాయుధం

సుబ్రహ్మణ్య స్వామి వేలాయుధం

ఒకప్పుడు సూరపద్ముడు అనే రాక్షసుడు తన తపస్సుతో ఎన్నో వరాలు పొంది దేవతలను, ఋషులను తీవ్రంగా బాధించసాగాడు.  అతను తన సోదరులైన తారకాసురుడు, సింహముఖులతో కలిసి లోకాలను గడగడలాడించాడు. దేవతలంతా కలిసి పరమశివుని ప్రార్థించగా, ఆ దుష్టశక్తిని సంహరించేందుకు కుమారస్వామి (సుబ్రహ్మణ్యుడు) ఆ బాధ్యత తీసుకున్నాడు.


అయితే సూరపద్ముడు సాధారణ శత్రువు కాదు. అతడికి అనేక మాయా శక్తులు, అపారమైన బలం ఉన్నాయి. అతడిని ఓడించడానికి దివ్యమైన ఆయుధం అవసరమైంది.

కుమారస్వామి జననం: దేవతలను, మునులను రక్షించడానికి పరమశివుని తేజస్సు నుండి కుమారస్వామి (సుబ్రహ్మణ్యేశ్వర స్వామి) జన్మించాడు.

అప్పుడు పార్వతీ దేవి (ఆదిపరాశక్తి) తన స్వంత శక్తిని ఒక ప్రకాశవంతమైన ఈటె రూపంలో మార్చి కుమారస్వామికి అందించింది. అదే వేల్ (వేలాయుధం).

అమ్మవారు ఇలా చెప్పారట: ఈ వేలాయుధం కేవలం ఆయుధం కాదు కుమారా! ఇందులో నా సంపూర్ణ శక్తి ఉంది. ఇది అజ్ఞానాన్ని ఛేదిస్తుంది, అధర్మాన్ని నాశనం చేస్తుంది, భక్తులను రక్షిస్తుంది.

ఆకారం: వేలు యొక్క అగ్రభాగం వెడల్పుగా (జ్ఞానం వలె విస్తృతంగా), మధ్యభాగం పదునుగా, మరియు చివరి భాగం పొడవుగా ఉంటుంది.

పై భాగం: జ్ఞానం మరియు లక్ష్యం యొక్క విశాలతను సూచిస్తుంది.

పదునైన అంచు: సూక్ష్మమైన పరిశీలనను మరియు దుష్ట శిక్షణను తెలుపుతుంది.పొడవాటి 

దండం: ఆధ్యాత్మిక సాధనలో స్థిరత్వాన్ని సూచిస్తుంది.

సూరపద్ముడి గురించి ముఖ్యమైన విషయాలు:

వంశం: అతను కాశ్యప ప్రజాపతి, దితి కుమారుడైన వజ్రాంగుని సంతానం. అతని తల్లి మాయ.

వరాలు: శివుని గురించి ఘోరమైన తపస్సు చేసి, ఎవరి చేతిలోనూ మరణం లేకుండా అజేయమైన వరాలు పొందాడు. ఆ గర్వంతో దేవతలను, మునులను తీవ్రంగా హింసించాడు.

రాజధాని: అతను సముద్రగర్భంలో 'మాయాపురి' అనే నగరాన్ని నిర్మించి దానిని రాజధానిగా పరిపాలించాడు.

సంహారం: కుమారస్వామి దేవతల సైన్యానికి నాయకత్వం వహించి సూరపద్ముడిపై భీకరమైన యుద్ధం చేశాడు. ఆరు రోజుల పాటు జరిగిన ఈ యుద్ధంలో ఆ వేలాయుధంతో సుబ్రహ్మణ్య స్వామి సూరపద్ముడిపై యుద్ధం చేసి అతని మాయలన్నింటినీ ఛేదించాడు. చివరకు సూరపద్ముడు ఒక భారీ మామిడి చెట్టుగా మారగా, స్వామి తన వేల్ తో దానిని రెండుగా చీల్చాడు.

ఆ రెండు భాగాలు నెమలి మరియు కోడిపుంజుగా మారాయి. సూరపద్ముడు తన తప్పును గ్రహించి శరణు కోరగా, స్వామి కరుణించి నెమలిని తన వాహనంగా, కోడిపుంజును తన పతాక చిహ్నంగా స్వీకరించాడు.

అందుకే వేలాయుధం అనేది కేవలం ఒక ఈటె కాదు, అమ్మవారి దివ్యశక్తికి ప్రతీక, అజ్ఞానాన్ని తొలగించి విజయాన్ని ప్రసాదించే జ్ఞానాయుధం అని భక్తులు విశ్వసిస్తారు.

విముక్తి: మరణ సమయంలో సూరపద్ముడికి జ్ఞానోదయం కలగడంతో, కుమారస్వామి అతనిని అనుగ్రహించి తన వాహనమైన నెమలిగా, మరియు తన ధ్వజస్తంభానికి చిహ్నమైన 'కోడి' (కుక్కుటం) గా మార్చుకున్నాడు.

సూరపద్ముడి సంహారం జరిగిన ప్రదేశం (తిరుచందూర్) లేదా కుమారస్వామి ఆరు పవిత్ర క్షేత్రాల (ఆరుపడైవీడు) గురించి మరింత సమాచారం కావాలంటే అడగండి. సుబ్రమణ్యస్వామి దేవాలయం (తిరుపరంకుంద్రం).

సుబ్రహ్మణ్యాష్టకం

సుబ్రహ్మణ్య


Mrigashira Karte - మృగశిర కార్తె

మృగశిర కార్తె

కార్తెలు: జోతిష్యులు 27 నక్షత్రాలు, గ్రహాల ఆధారంగా జాతకాలు,పంచాంగాలు తయారు చేశారు. సూర్యోదయం సమయానికి ఏ నక్షత్రం చంద్రుడికి దగ్గరగా ఉంటే ఆ రోజుకు ఆ నక్షత్రం పేరు పెట్టారు. పౌర్ణమి రోజు చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ నెలకు ఆ పేరు పెట్టారు. కానీ తెలుగు రైతులు మాత్రం ఇవే నక్షత్రాలతో వ్యవసాయ పంచాంగం తయారుచేసుకున్నారు. ఈ నక్షత్రాలను కార్తెలు అని పిలుచుకుంటున్నారు. 

అశ్విని నుంచి రేవతి వరకూ సూర్యుడు ఏ నక్షత్రంలోకి ప్రవేశిస్తే ఆ కార్తె మొదలవుతుంది. దాదాపు రెండువారాలకు ఓ నక్షత్రంలో సంచరిస్తాడు ప్రత్యక్షనారాయణుడు. రోహిణి నక్షత్రంలో సంచరించే సమయంలో రోహిణికార్తె అయితే, మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించే సమయంలో మృగశిర కార్తె మొదలవుతుంది. అయితే వీరి లెక్కల ప్రకారం సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ కార్తె పేరు పెట్టారు. అలా సంవత్సరానికి 27 కార్తెలు. ప్రస్తుతం రోహిణి కార్తె పూర్తై, మృగశిర కార్తె ప్రారంభమైంది. తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ పనులకు ఈ కార్తె చాలా ప్రత్యేకమైనది.

తెలుగు పంచాంగం ప్రకారం వైశాఖ మాసం చివరలో వచ్చే రోహిణి కార్తెలో ఎండలకు రోళ్లు కూడా పగులుతాయని సామెత ఉంది. రోహిణి కార్తె పూర్తి కాగానే తొలకరి చినుకులను మోసుకొస్తుంది మృగశిర కార్తె! జూన్ 8 వ తేదీ నుంచి మృగశిర కార్తె ప్రారంభం కానున్న సందర్భంగా అసలు మృగశిర కార్తెకు చేప మందుకు సంబంధం ఏమిటి? ఈ రోజున చేపలు ఎందుకు తినాలి అనే ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

తెలుగు పంచాంగం ప్రకారం, సూర్యుడు మృగశిర నక్షత్రంలో ప్రవేశించే కాలాన్ని మృగశిర కార్తె అంటారు. ఇది సాధారణంగా ప్రతి సంవత్సరం జూన్ 7 లేదా 8వ తేదీన ప్రారంభమవుతుంది. 

మృగశిర కార్తె పెట్టగానే వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది. అప్పటి వరకు వేసవి వేడితో, గ్రీష్మ తాపంతో అల్లాడిన ప్రజలు మృగశిర కార్తె రాగానే ఉపశమనం పొందుతారు. నైరుతి రుతుపవనాల ఆగమనంతో తొలకరి చినుకులతో మొదలై, భారీ వర్షాలు కురియడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తారు.

ఈ కార్తెల ఆధారంగా వ్యవసాయ దారులు, గ్రామీన ప్రాంతం వరు ఎక్కువగా వీటిపై ఆధారపడి చేతి వృత్తులు, వ్యవసాయం సాగు ఈ కాలగణనతో కార్తెల అధారంగా వారి పంటల నిర్ణయం, సాగు చేసుకుంటారు. 

మృగశిర కార్తె యొక్క ముఖ్యమైన విశేషాలు మరియు ఆచారాలు: 

తొలకరి వర్షాలు: ఈ కార్తె ప్రవేశంతోనే ఎండల తీవ్రత తగ్గి, నైరుతి రుతుపవనాలు ప్రారంభమవుతాయి. వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది.

వ్యవసాయం: వర్షాలు మొదలవడంతో రైతులు పొలాలను దున్నుకోవడం, విత్తనాలు వేయడం వంటి వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారు.

చేపల భోజనం: మృగశిర కార్తె మొదటి రోజున చేపలు (చేప ప్రసాదం) తినడం తెలుగు రాష్ట్రాల్లో ఒక బలమైన ఆనవాయితీ. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెంచడానికి మరియు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండటానికి చేపలు తినాలని పెద్దలు చెబుతారు.
 
బెల్లం-ఇంగువ: ఈ కార్తె ప్రారంభం రోజున చేపలు తినని శాఖాహారులు బెల్లంలో ఇంగువ కలుపుకుని తినడం కూడా కొన్ని ప్రాంతాలలో ఆచారంగా ఉంది. ఇంగువను బెల్లంలో కలుపుకొని ఉండలు ఉండలుగా చేసుకుని తినేవారు. అంతేకాదు ఈ కాలంలో విరివిగా దొరికే చింతచిగురు పప్పు ఇంగువ పోపుతో తింటే చేపలు తిన్నంత ప్రయోజనం ఉంటుందని పెద్దలు చెబుతారు.
ఇది వర్షాకాలంలో వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి రక్షణనిస్తుందని నమ్ముతారు.

ఈ కార్తె నుండి వర్షాలు పడతాయని మనవారి భావన. ఇదే సమయంలో మన ప్రాంతంలోకి నైఋతి ఋతుపవనాలు ప్రవేశిస్తాయి. పంచాగ ప్రకారం ఆరుద్ర నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించే సమయంలోని తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు, శకునాలు తదితర అంశాల ఆధారంగా చేసుకుని ఆ సంవత్సరం యొక్కవర్షాన్ని నిర్ణయించడం జరుగుతుంది.

Arudra Karthe - ఆరుద్ర కార్తె

ఆరుద్ర కార్తె

కార్తెలు: జోతిష్యులు 27 నక్షత్రాలు, గ్రహాల ఆధారంగా జాతకాలు,పంచాంగాలు తయారు చేశారు. సూర్యోదయం సమయానికి ఏ నక్షత్రం చంద్రుడికి దగ్గరగా ఉంటే ఆ రోజుకు ఆ నక్షత్రం పేరు పెట్టారు. పౌర్ణమి రోజు చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ నెలకు ఆ పేరు పెట్టారు. కానీ తెలుగు రైతులు మాత్రం ఇవే నక్షత్రాలతో వ్యవసాయ పంచాంగం తయారుచేసుకున్నారు. ఈ నక్షత్రాలను కార్తెలు అని పిలుచుకుంటున్నారు. అయితే వీరి లెక్కల ప్రకారం సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ కార్తె పేరు పెట్టారు. అలా సంవత్సరానికి 27 కార్తెలు. ప్రస్తుతం మృగశిర కార్తె పూర్తై, జూన్ 22 నుంచి ఆరుద్ర కార్తె ప్రారంభమైంది. తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ పనులకు ఈ కార్తె చాలా ప్రత్యేకమైనది

ఆరుద్ర ఉరిమితే ఆరు వానలు పడతాయి అంటారు పల్లె ప్రజలు. అరుద్రలో పడే వాన అమృతంతో సమానమని వ్యవసాయదారులు భావిస్తారు. మృగశిర కార్తెలో వర్షాల కదలిక మొదలైతే ఆరుద్ర కార్తెలో ఆ వర్షాలు ఇంకొంచెం పుంజుకుంటాయి. అవి ఎలా ఉంటాయి అంటే భూమి పుష్కలంగా తడిసి రైతులు వారి నాట్లు, జొన్న, మొక్కజొన్న, ప్రతి వంటి పంటల సాగుకు ఇక నడుం కట్టినట్టే. వ్యవసాయంలో ఎంతో ముఖ్యమైన అంశం అయిన మార్పులు చోటుచేసుకునే కాలాన్ని వ్యవసాయ పంచాంగంలో ఆరుద్ర కార్తె అని పిలుస్తారు.

ఆరుద్ర పురుగు:
వర్షాలు పడగానే నేలపై ఎర్రటి వెల్వెట్ గుడ్డను పరిచినట్లు అందంగా ఉండే 'ఆరుద్ర పురుగులు' బయటకు వస్తాయి. వీటిని రైతులు ప్రకృతి నేస్తాలుగా, మంచి పంటకు శుభసూచకంగా భావిస్తారు. వ్యవసాయదారులకు ఈ ఆరుద్ర కార్తెలో కనిపించే గొప్ప అతిథి ఆరుద్ర పురుగు. ఎరుపు రంగులో వెల్వెట్ క్లాత్ చుట్టుకుని ఉందా అన్నట్టుగా కనిపించే ఈ ఆరుద్ర పురుగు పంట పొలాల్లో, వ్యవసాయ భూముల్లో కనిపిస్తే ఇక రైతులు తమ పని గట్టిగా ముందుకు లాగాల్సిందే అని సుచిన ఇచ్చినట్టు అంట. వ్యవసాయం, వాతావరణ పరిస్థితుల మీద గొప్ప అవగాహన ఉన్న వాళ్లకు ప్రకృతి మార్పులను అనుసరించి ఎప్పుడు ఏ పని చేయాలి అనేది బాగా అర్థమయ్యేది.

దాన్ని అనుసరించి మంచి పంటలు సాగుచేసి పుష్కలమైన దిగుబడి సాధించేవాళ్ళు. వ్యవసాయదారుల నేస్తం అయిన ఈ ఆరుద్ర పురుగు కేవలం సంవత్సరంలో ఒక్కసారి, ఆరుద్ర కార్తె సమయంలో మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి ఆరుద్ర పురుగును చూసి నాట్లు వేయడానికి కదిలిపోవచ్చు రైతన్నలు. చాలామంది ఎవరైనా కనిపించడం తగ్గిపోయినప్పుడు, చాలారోజులు దూరంగా వెళ్ళినప్పుడు చాలా నల్లపూస అయిపోయావు, ఆరుద్రపురుగులాగా అంటూ ఉంటారు. దాని అర్థం ఆరుద్ర పురుగు కూడా సంవత్సరంలో ఒకసారి మాత్రమే కనబడుతుంది అని, అలా చాలా బిజీ అయిపోయి బొత్తిగా కనబడటం లేదని అర్థం.

సామెతలు: "ఆరుద్ర ఉరిమితే ఆరు వానలు పడతాయి" అనే నానుడి ఉంది. అంటే ఈ కార్తెలో పడే వానలను బట్టి ఆ ఏడాది వర్షపాతం, పంటల దిగుబడి ఆధారపడి ఉంటుందని నమ్ముతారు.

ఆరుద్ర కార్తెలో కోలాహలం: ఆరుద్ర కార్తెలో రైతన్నలు కోలాహలం చాలా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని పంటలు వేసేవాళ్ళు చాలా హడావిడిగా కనిపిస్తారు.

వరి పంట వేసేవాళ్ళు నారుమళ్లలో అంతరకృషి చేస్తారు. అంటే బాగా తడిసిన భూమిని దుక్కి దున్నడం, వారినాట్లు వెయ్యడం, వంటివి చేస్తారు. వర్షం సమృద్దిగా పడితే వరి నాట్లు వేయడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇవన్నీ మొదటి దశలో జరిగేవి. ఇప్పుడే ఎంతో జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా వంగడాల విషయంలో మంచి అవగాహన, సలహాలు, సూచనలు కలిగి ఉంటారు.

మొక్కజొన్న పంటలు వేసేవాళ్ళు సస్యరక్షణ చేపడతారు. అప్పటికే నాటిన మొక్కజొన్నకు రెండవ సారి ఎరువులు వేయడం వంటి పనులు చేస్తారు. అలాగే ఎరువుల ఎంపిక ఎంతో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రత్తి పంట వేసేవాళ్ళు అంతరకృషి చేస్తారు, మొక్కలను పలుచన చేయడం చేస్తారు.

ఇక పంటల నుండి తోటల పెంపకంలోకి వస్తే పండ్ల తోటల సాగు చేసేవారిలో అరటి, మామిడి, జామనాట్లు వేయడం చేస్తారు. అలాగే కొబ్బరి చెట్లకు ఎరువులు వేయడం, రేగు, దానిమ్మ వంటి చెట్ల నాట్లు వేయడం చేస్తారు. పప్పుధాన్యాల తరహా పంటలు పండించేవారు చాలా ఆలోచన చేస్తారు. వీటికి నీటి అవసరం ఎంతో ఉంటుంది. వర్షాలు ఆలస్యం అయితే కంది పంట విత్తడానికి భూమిని తయారు చేయడం, విత్తడం చేస్తారు.

కూరగాయల పంటలు ఏడాది పొడవునా సజీవి అయినా వీటిని మొదటగా అరుద్రకార్తెలో నాటితే ఏడాది మొత్తం వాటి దిగుబడి బాగుంటుందని నమ్ముతారు. బీర, సొర, పొట్ల, గుమ్మడి మొదలైన విత్తనాలు విత్తడం చేస్తారు.

ఇకపోతే సువాసన మొక్కలు అయిన నిమ్మగడ్డి, కామాక్షిగడ్డి, సిట్రొనెల్లా వంటి నాట్లు కూడా ఇదే సమయంలో వేస్తారు. ఇవన్నీ పెద్దగా సాగులో లేకపోయినా పండిన వరకు ఎన్నో లాభాలు ఇస్తాయి. ఇలా ఆరుద్ర కార్తెలో పంటల సాగులో రైతన్నలు మునిగి తేలతారు.

జ్యోతిష్య విశేషాలు: ఈ కార్తె సూర్య సంచారం వల్ల కొన్ని రాశుల వారికి ఆర్థికంగా, ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు వస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు.

ముఖ్యంగా సింహ, కన్య, వృశ్చిక, కుంభ రాశుల వారికి ఉద్యోగం, ఆర్థికం, కుటుంబ జీవితంలో అనుకూల మార్పులు కనిపించే అవకాశాలు మరియు అనుకూల ఫలితాలు.

Visakha Nakshatra - విశాఖ నక్షత్రము

విశాఖ నక్షత్రము నక్షత్రం - విశాఖ అధిపతి - గురువు గణము - రాక్షస జాతి - స్త్రీ వృక్షం - నాగకేసరి జంతువు - పులి నాడి - అంత్య పక్షి - గరుడుడు అధ...