శ్వేతవరాహావతారమెత్తి భూమిని సముద్రం నుండి పైకి ఎత్తి తెచ్చిన శ్రీమహావిష్ణువు, ఏనుగు సునాయాసంగా తామరమొగ్గను ఎత్తే విధంగా ముల్లోకాలకు శుభం కలిగించే శ్రీకృష్ణుడు విలాసంగా ఒక చేతితోనే గోవర్ధన పర్వతాన్ని పైకెత్తాడు.
ఎన్నో బ్రహ్మాండాలను చెండులవలె ఎగురవేసి పట్టుకొనే శ్రీమహావిష్ణువుకు గోవర్థనపర్వతం అనే కొండను పెల్లగించి ఎత్తడం సులువైన పనేకానీ బరువైనపని కాదు.
ఇలా కొండనెత్తి
బాలుడు ఆడుకుంటూ పూలగుత్తిని గొడుగుగా భావించి అందమైన తన అరుణహస్తంతో పూలగుత్తిని ధరించినట్లుగా, కృష్ణుడు చిరునవ్వుతో ఆ గోవర్ధన మహాపర్వతాన్ని పైకెత్తి కుడిచేత ధరించి, ఆకాశంనుండి వర్షించే కఠినమైన రాళ్లతో చీకాకుపడుతూ ఉండిన యాదవస్త్రీలు, పురుషులు, గోవులపంక్తులకు విశాలమైన గొడుగుగా పట్టుకొన్నాడు.
ఈ విధంగా యాదవకులాగ్రణి అయిన శ్రీకృష్ణుడు గోవర్దనగిరిని గొడుగులాగా పట్టుకొని ఇలా అన్నాడు.
శ్రీకృష్ణుడు అందరినీ ఇలా పిలుస్తున్నాడు. అమ్మా రా! నాన్నా రండి! గోపస్త్రీపురుషులారా! ఇలా రండి! వినండి! మీ గోవులమందతోకూడా ఈ దిగుడు ప్రదేశంలో ఇష్టంవచ్చిన స్థలంలో ఉండండి.
చుట్టాలయిన ఓ గోపకులారా! ఇతడు (నేను) పసివాడు. కొండ ఏమో గొప్పది. దానిబరువు భరించగలడో లేదో అని దీనికింద నిలవడానికి సంశయించవలసిన పనిలేదు. కొండలు, సముద్రాలు, నానాజంతువులతో కూడిన భూమి అంతా వచ్చి ఈ కొండమీద పడినా సరే నాచేయి అటూ ఇటూ కదలదు. మీరందరూ సంతోషంగా వచ్చి, ఈ కొండ కింద నిలవండి అని శ్రీకృష్ణుడు పలికాడు.
ఇలా తమను చూచి చెపుతున్న కృష్ణునిమాటలు విని, నమ్మి, అందరూ కొండకింద తమకు ఇష్టమైన ప్రదేశాల్లో కొడుకులు, మిత్రులు, భార్యలు మొదలైనవారితోను, గోవులతోను, కృష్ణునికరుణగలిగిన చూపులు అమృతవర్షంలా సోకడంవల్ల ఆకలిదప్పులు మరిచిపోయి, కృష్ణసంబంధమైన కథలు చెప్పుకుంటూ వినోదంగా ఉండిపోయారు.
శ్రీకృష్ణుడు ఎత్తిపట్టిన గోవర్థనపర్వతం గొడుగువలె విలసిల్లింది. ఎలాగంటే ఆ గొడుగుకు శ్రీకృష్ణుని బాహుదండమే కాడ. కొండశిఖరమే గొడుగు గుబ్బ. కృష్ణుడు ధరించిన రత్నాలహారాలు జారిపడుతున్న వర్షప్రనీటి బిందువులు. గోపస్త్రీల కడగంటి చూపులతో కూడిన నవ్వులకాంతులు గోవర్ధన పర్వతంలోని రత్న సమూహం. ఆ గొడుగు దేవేంద్రుని దుర్గర్వాన్ని అణచేది, మేఘాలనుండి కురిసే వర్షంలో తడుస్తున్న గోపకులను స్థిరంగా ఆనందపరచేది అయింది.
ఓ పరీక్షిన్మహారాజా! కమలాక్షుడైన శ్రీకృష్ణునిచేతిలో ఆ గోవర్ధనగిరి ఒక కమలంవలె విలసిల్లింది. ఆ కొండమీదనున్న మేఘాలగుంపు తుమ్మెదల గుంపులాగా శోభిల్లింది.
అధిపా! దేవేంద్రుని ఆజ్ఞచే మిక్కిలి వేగంతో ఏడు పగళ్లూ, రాత్రుళ్లూ జడివాన నిరంతరాయంగా కురిసింది. ఆ సమయంలో గోపీగోపకులు గోవర్ధనగిరి అనే గొడుగుకింద వానలో తడవకుండా బతికారు.
ఈ విధంగా శ్రీకృష్ణుడు ఏడుపగళ్లు, ఏడురాత్రులు గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకోగా దేవేంద్రుడు విసిగివేసారి, కృష్ణుని కథలువిని ఆశ్చర్యపడి, తనకోరిక ఫలించనివాడై, మేఘాలను మరలించుకొని వెళ్లిపోయాడు. అప్పుడు ఆకాశమండలంలో సూర్యమండలం ప్రకాశించడం తెలుసుకొని గోవర్థనధరుడైన కృష్ణుడు గోపాలకులతో ఇలా అన్నాడు.
గాలీ వానా ఆగిపోయాయి. నదుల వేగం తగ్గింది. వరదలు తగ్గుముఖంపట్టాయి. ఇక కొండకింద ఉండకుండా గోపజనులారా! మీ కొడుకులు, కోడండ్రు, భార్యలు, గోవులతో వెలుపలికి రండి. (అని కృష్ణుడు అన్నాడు)
శ్రీకృష్ణుడు ఇలా చెప్పగానే, గోపాలకులు అందరూ బండ్లు మొదలైన తమ పనిముట్లతో కూడి గోవులు, తామూ కొండ అడుగును విడిచివచ్చారు. శ్రీకృష్ణుడు కూడా వెంటనే గోవర్ధనగిరిని దాని స్వస్థానంలో ఉంచాడు. అపుడు గోపాలకులందరూ కృష్ణుణ్ణి కౌగిలించుకొని, ఉచితవిధంగా సత్కరించి, దీవించారు. గోపికలు అక్షతలువేసి, పెరుగన్నంముద్దలు చేసి ఇచ్చి, ఆశీర్వదించారు. నందుడు, బలరాముడు, రోహిణి, యశోద కృష్ణుణ్ణి కౌగిలించుకొని క్షేమ శుభవాక్యాలు పలికారు. సిద్దులు, సాధ్యులు, గంధర్వులు పువ్వులు కురిపించారు. దేవతలు శంఖాలు, దుందుభులు మోగించారు; తుంబురుడు మొదలగు ముఖ్యులైన గంధర్వులు గానంచేశారు. అప్పుడు.
గోపస్త్రీలు తనకథలు పాడుతూ ఉండగా, కమలనేత్రుడైన శ్రీకృష్ణుడు గోపకులతో కలిసి, గోకులం చేరాడు.
ఆ సమయంలో కృష్ణునిచరితలు తలచుకొని, నివ్వెరపోతూ గోపకులు నందునితో ఇలా అన్నారు.
కన్నులు తెరవని చిన్ని పాపడుగా ఉండగానే రాక్షసియైన పూతనయొక్క చనుబాలు తాగి ఆ పూతనను చంపాడు. ముద్దుల బాలుడుగా ఉంటూ మూడోనెలలోనే బండిరూపంలో వచ్చిన శకటాసురుణ్ణి కాలితో తన్ని చంపేశాడు. ఏడాది కుర్రవాడై ఉండగానే తృణావర్తుడు అనే రాక్షసుణ్ణి మెడబట్టుకొని కూల్చివేసి పరిమార్చాడు. వెన్నలకోసం ఇతరుల ఇండ్లకు వెళ్తున్నాడని తల్లి యశోదమ్మ రోలుకు కట్టివేయగా, కృష్ణుడు రెండు మద్దిచెట్ల మధ్య దూరి, రోలును ఈడ్చుకుంటూ వెళ్లి వాటిని పడిపోయేట్లు లాగాడు. గోవులను, దూడలను మేపడానికి వెళ్లి బకుడు అనే రాక్షసుణ్ణి చంపాడు. వత్సుడు అనే రాక్షసుణ్ణి వెలగచెట్టుతో కొట్టి సంహరించాడు. బలరామునితో కలసి ఖరుడు అనే రాక్షసుణ్ణి చంపేశాడు. ఈ సాహసకృత్యాలు అన్నీ భావించి చూస్తే బాలకృష్ణుడు మనుష్య మాత్రుడా? అనిపిస్తుంది. (కాదని భావం)
(పూతన, శకటాసురుడు, తృణావర్తుడు, బకుడు, వత్సుడు అనే వాళ్లందరూ రాక్షసులు. కంసుడు పంపగా కృష్ణుణ్ణి చంపడానికి వచ్చారు. బాలకృష్ణునిచేతిలో హతులయ్యారు.)
బాలకృష్ణుడు సాహసియై అన్న బలరామునిచేత ప్రలంబాసురుణ్ణి చంపించాడు. ఘోరదావాగ్నిని మింగాడు. కాళీయుని ప్రాభవం చెడేటట్లు కాళీయుణ్ణి పాదాలతో తొక్కి చంపకుండా, కాళింది మడుగునుండి బయటికి తరిమేశాడు.
ఏడేండ్ల బాలు డెక్కడ? వేడుకగా ఆటవలె ఏనుగు తామరపువ్వును ఎత్తినట్లు, ఒక చేత్తోనే విలాసంగా గోవర్ధన గిరిఎత్తడం ఎక్కడ? ఆశ్చర్యం గదా!
ఓ తండ్రీ! గోపవల్లభుడవైన నందుడా! నీ కొడుకు కృష్ణుడు చేసే నేర్పరిపనులు మనుష్యులకు శక్యమైనవేనా? అతడు అందరిలాంటి సాధారణ మానవుడా?
ఇలా గోపకులు అనగానే నందుడు తనకు పూర్వం గర్గమహాముని చెప్పిన రహస్యాన్ని గుర్తుకు తెచ్చుకొన్నాడు. సందేహం లేదు. కృష్ణుడు పద్మాక్షుడైన శ్రీహరి అంశే అని అంతరంగంలో భావిస్తుంటాను అన్నాడు. అది విన్న గోపాలకులు ఆశ్చర్యంతో కృష్ణుడు శ్రీమహావిష్ణువే అని పూజించారు. ఆ తర్వాత
హరి ఒక చేతో గోవర్ధనగిరిని ఎత్తి వర్షజలంవల్ల బాధపడుతున్న యాదవులకు, గోవులకు శరణుగా నిలిచాడు. అపుడు ముల్లోకరాజ్యం ఏలుతున్నాననే పొగరు తొలగిపోగా దేవేంద్రుడు గర్వం వదిలి, తన ప్రాభవం చెడి, కామధేనువుతో కూడా వచ్చి, దుష్టరాజుల దుర్గర్వాన్ని నిరాకరించేవాడు, కరుణతో వర్ధిల్లే వాడూ అయిన శ్రీకృష్ణుణ్ణి దర్శించాడు.
కృష్ణుణ్ణి దర్శించి, మునుల హృదయాలకు అలంకారాలుగా ఉండేవి, అణకువగలవారిని ఉద్ధరించేవి అయిన శ్రీకృష్ణుణ్ణి చరణాలను, సూర్యకాంతితో సమానమైన తన కిరీట కాంతులతో దేవేంద్రుడు పూజించాడు.
దేవేంద్రుడు హరికి నమస్కరించి, హస్తపద్మాలు జోడించి ఇలా అన్నాడు.
కృష్ణా! నీ స్వరూపం సత్త్వగుణోపేతం. శాంతగుణంకలది. రజస్తమోగుణాలను అణచివేసేది. నిత్యమూ అధికతపోమయం. మాయతో వర్ధిల్లే గుణాలు నీకు లేవు. నీవు గుణరహితుడవు కాబట్టి గుణాలవలన పుట్టె లోభం మొదలైన దుర్గుణాలు నీలో చేరవు. అయినా, దుష్టశిక్షణం, శిష్టరక్షణంకోసం లోకాధిపతులు భీతిల్లేటట్లు దండధారివై లోకహితం చేస్తావు. ఓ లోకేశ్వరేశ్వరా! నీవు జగత్పతివి, గురుడివి, తండ్రివి.
(శ్రీహరి గుణరహితుడు కాబట్టి ఆయనకు ఎవరిమీదా కోపమూ, ఎవరిమీదా ప్రేమా ఉండవు. కానీ, లోకకల్యాణార్థం దుష్టశిక్షణలో కోపం, భక్తులమీద ప్రేమ చూపించడం ఆయన లీలలే!)
లక్ష్మీవల్లభా! ఈశా! నావంటి జ్ఞానశూన్యులను నీవు శిక్షిస్తే తక్కినవారు గర్వం వీడి, బుద్దితెచ్చుకొని, సజ్జనుల మార్గాలను అనుసరిస్తారు.
ఓ శ్రీహరీ! ఒక్కొక్క లోకాన్ని రక్షిస్తూ ఎంతో గర్వంతో; 'మేమే ఈశ్వరులం' అనుకుంటూ ఆనందించే నాబోటి అజ్ఞానులు నీ మహిమ నెరుగలేరు! ఇది నిజం.
(ఒక్కొక్కలోకానికి ప్రభువు దేవేంద్రునివంటివాళ్లు. సర్వలోకాలకు ప్రభువు శ్రీమహావిష్ణువు. ఇది తెలుసుకోలేనివారు అజ్ఞానులేగదా!)
వసుదేవా! కృష్ణా! నీవు స్వతంత్రుడవు! జ్ఞానస్వరూపుడవు! మహాత్ముడవు! సర్వపుణ్యపురుషుడవు! సర్వభూతాల్లోను భీజరూపంలో ఉన్న పరబ్రహ్మవు! నిష్కలంకుడవు! నీకు వందనం.
మాధవా! సర్వేశ్వరా! నీ సామర్థ్యం తెలుసుకోలేక, గోపకులు నన్ను ఉద్దేశించి యాగం చేయడం లేదని, నీ గోకులాన్ని భయంకరమైన, తీవ్రమైన జడివానతో ముంచెత్తాను. నీ మహిమవల్ల నా ప్రయత్నం ఇలా వృథా అయింది. నేను నీ సేవకుణి! అపరాధం చేసినవాణ్ణి! నన్ను దయతోచూడు.
దేవా! సర్వాంతర్యామీ! నిన్ను బ్రహ్మాది దేవతలే తెలుసుకోలేరు. నేను జడుణ్ణి! ముల్లోకాలను రక్షిస్తున్నాననే దురభిమానగరిష్ఠుణ్ణి చెడ్డ పాండిత్యం కలవాళ్లలో మేటిని. వినయాన్ని త్యజించినవాళ్లలో శ్రేష్ఠుణ్ణి! దుర్జనులలో, గర్వులలో, శ్రేష్ఠుణ్ణి, నీ ఘనలీలా వైభవాతిశయాన్ని తెలియడానికి నేనెంతటివాణ్ణి?
(నిష్ఠుండు, గరిష్ఠుడు, భూయిష్ఠుడు, వరిష్ఠుడు, శ్రేష్ఠుడు అనేవి శ్రేష్ఠతా వాచకాలు. వీటిని సాధారణంగా మంచివాటికి విశేషణాలుగా వాడుతుంటారు. ఇక్కడ దుర్గుణాలకు విశేషణాలుగా వాడడం విశేషం.)
ఇలా అనగా విని, నవ్వుతూ మేఘగంభీరమైన కంఠధ్వనితో ఇంద్రునితో శ్రీకృష్ణుడు ఇలా పలికాడు.
జంభారీ! దేవేంద్రా! రాజ్యసంపదచే అంధుడవై ఉన్ననీ మదోద్రేకాన్ని అణచివేయడానికి, ఈయజ్ఞం నేనే తప్పించాను. సిరిసంపదలతో మదించినవారు నన్ను తెలుసుకోలేరు. ఎవరిని నేను నిజంగా రక్షించాలనుకుంటానో, వారిని నిర్ధనులుగా చేస్తాను.
ఐరావతగమనా! దేవేంద్రా! నా ఆనతిని శిరసావహించు! నీ పదవిని నిలుపుకో! రాజ్యలక్ష్మీయుతుడి వయ్యావని గర్వించకు! నీకు శుభాలు కలుగుతాయి! వెళ్లు!
అని ఇలా ఇంద్రునితో పలుకుతున్న కృష్ణునికి మ్రొక్కి గోవుల మందతో వచ్చిన కామధేనువు భక్తజన సురభి అయిన శ్రీకృష్ణునితో ఇలా పలికింది.
విశ్వేశ్వరా! విశ్వభావనా! విశ్వాకారా! మునులకు వందనీయా! వినండి! నీవల్ల మేం శాశ్వతులం అయ్యాము. ఇప్పుడు శాశ్వతానందాన్ని పొందగలిగాము.
దేవా! నీవు మాకు పరమదైవానివి, ఇంద్రుడివు, బ్రాహ్మణుల, గోవుల, దేవతల, సజ్జనుల సుఖాలకోసం నిన్ను ఇంద్రునిగా చేసి పట్టం కట్టుమని బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించి పంపించాడు. నీవు భూమండలం యొక్క గొప్పదైన బరువు నివారించడానికి అవతరించిన శ్రీమహావిష్ణుడివి అని పలికి తర్వాత.
కామధేనువు క్షీరంతోను, ఐరావతం తన తొండంతో తెచ్చిన సురగంగాజలంతోను, దేవేంద్రుడు దేవమాత అయిన అదితితోను, మహర్షులతోను కలిసి పద్మాక్షుడు, సాధుసంరక్షకుడు, యుద్దాల్లో శత్రువులను జయించేవాడు అయిన పద్మాక్షుడైన కృష్ణుని అభిషిక్తుని చేసి 'నీవు గోవిందుడివి' అని విశేషంగా ప్రశంసించాడు.
వసుదేవసుతుడైన శ్రీకృష్ణునిఅభిషకసమయంలో తుంబురుడు నారదుడు మొదలైనవారు, దేవజాతులైన సిద్ధులు, చారణులు, గంధర్వులు కృష్ణలీలలను గానంచేశారు. అప్సరసలు నాట్యం చేశారు. గొప్పదైన కుసుమ వృష్టిని దేవతలు కురిపించారు. ముల్లోకాలు సంతోషం పొందాయి. తొలిచూలు ఆవుల పొదుగులనుండి వాటంతట అవే పాలు ధారాపాతంగా స్రవించాయి. చెట్లన్నీ తేనెలు వర్షించాయి. తీగెలు పూలు, పండ్లతో విరాజిల్లాయి. పర్వతాలు మణులకాంతులతో ఒప్పాయి. ప్రాణులకన్నింటికి తమలోని వైరాలు అంతరించాయి.
(జగతికి మేలు జరిగే సందర్భంలో కనిపించే శుభచిహ్నాలనన్నింటిని కవి వర్ణించాడు. శ్రీకృష్ణుడు సర్వలోక రక్షకుడు. అతని అభిషేక సమయం అందరికీ శుభసమయమే. అందుకే నారదుడు, తుంబురుడు, సిద్దులు, చారణులు, గంధర్వులు పాడడం. అప్సరసలు ఆడడం. అప్రాణులైన చెట్లు లతలు కూడా సంతోషించాయి. స్వామికి ప్రాణి అప్రాణి భేదం లేదు. గోవులను రక్షించేవాని అభిషేక సమయం కాబట్టి తొలిచూలు ఆవులు క్షీరం స్రవించాయి. పర్వతాలు రత్నాలతో తళుక్కున మెరిశాయి. నదులు ఉప్పాంగాయి. ప్రాణులు తమ జాతి వైరాన్ని మరిచాయి.)
దేవేంద్రుడు ఇలా శ్రీకృష్ణుని గోపకులకు, గోవులకు అధినేతగా అభిషిక్తుని చేసి, వీడ్కొలు తీసుకొని, తన దేవగణాలతో స్వర్గానికి తిరిగి వెళ్ళాడు. ఆ తర్వాత
శ్రీకృష్ణమూర్తినందుని వరుణనగరమునుండి కొనితెచ్చుట
శ్రీ మహా భాగవతము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము
శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము
శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము
శ్రీ మహా భాగవతము నవమస్కంధము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
పంచాంగం
శ్రీ మహా భాగవతము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము
శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము
శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము
శ్రీ మహా భాగవతము నవమస్కంధము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
పంచాంగం