Saturday, February 28, 2026

Speeches by Pritha regarding Dharma and Brahman - పృథుచక్రవర్తి సభాసదులకు సద్ధర్మముల నుపదేశించి బ్రాహ్మణ ప్రశంస సేయుట

పృథుచక్రవర్తి సభాసదులకు సద్ధర్మముల నుపదేశించి బ్రాహ్మణ ప్రశంస సేయుట

అలా చెప్పి ఇంకా ఇలా అన్నాడు. ఇలా విశేషగుణసంపద గలిగి, దోషరహితమై, సత్పురుషులచే సమ్మానింపబడిన పృథుచక్రవర్తి కీర్తిని తెలియజెప్పే మైత్రేయునితో భాగవతుడైన విదురుడిలా అన్నాడు.

మునిశ్రేష్ఠా! విను. పృథుచక్రవర్తి బ్రాహ్మణులచే రాజ్యపట్టాభిషిక్తుడై దేవతలచే సద్గుణాలుపొంది విష్ణుతేజంతో వెలిగిపోయాడు. ఆయన ఏయే పనులు చేశాడో పాపరహితుడా! నాకు తెలియజేయవయ్యా!. భూమి ఏ విధంగా గోరూపంలో స్థిరపడింది. ఎవరి పరాక్రమ దీప్తితో వెలుగొందిన పద్ధతిలో ప్రస్తుత రాజులందరు బ్రతుకుతున్నారో అట్టి పృథుచక్రవర్తి చరితాన్ని భూమిలో వివేకవంతుడైన వాడెవడైనా వినకుండా ఉంటాడా?

ఆ పలుకులు విని మైత్రేయుడు విదురునితో ఇలా అన్నాడు. పవిత్రమైన ప్రవర్తనచే పృథుచక్రవర్తి రాజుల పొగడ్తలు పొంది సంతోషంతో పాలనంచేశాడు.

ఆ పృథుచక్రవర్తి గంగాయమునల మధ్యప్రదేశంలో నివసించాడు. ప్రారబ్ధ కర్మఫలాలు వ్యయం కావాలని సర్వపుణ్యాలను తాననుభవించాడు. అన్నిదేశాలలో తన ఆజ్ఞకెదురు లేకుండా చేశాడు. సప్తద్వీపాలలో ఏకచ్చత్రాధిపత్యం వహించాడు. విష్ణుభక్తులైన బ్రాహ్మణులకు తప్ప మిగిలినవారి విషయంలో యమునివలె చండశాసనుడయ్యాడు. అలా కొంతకాలం పరిపాలించి దీర్ఘసత్రమనే యజ్ఞం చేయడానికి దీక్ష వహించాడు.

ఆ దీర్ఘసత్రానికి రాజర్షులు, దేవర్షులు, పితృదేవతలు, బ్రహ్మర్షులు విచ్చేసి శాస్త్రోక్తంగా సమ్మానాలందుకొన్నారు. అప్పుడు శుభలక్షణాలుగల ఆ పృథుచక్రవర్తి

పృథుచక్రవర్తి ఆకారవిశేషాలు వర్ణించబడ్డాయి. మహోన్నతుడు, ఎత్తైన భుజాలుగలవాడు, వికసించేముఖ శోభులవాడు, వికసించిన ఎర్ర తామరలవంటి కనులు గలవాడు, అందమైన ముక్కుపుటాలు గలవాడు, చిరునవ్వులు చిందించేవాడు. అందాలకురులు గలిగి శంఖంవంటి కంఠంగలిగి వెడల్పైన వక్షఃస్థలముకలిగి, మూడు ముడుతలుపడ్డ నడుము భాగంతో విశాలమైన పిరుదుభాగంతో సుడిగుండంవలె నాభీవివరం ప్రకాశించగా, బంగారు స్తంభాలవంటి తొడలతో, ఎర్రని పాదాలుకలిగి కొత్త పట్టువలువను ఉత్తరీయంగా ధరించి ఆ మహాకీర్తిమంతుడు వెలిగిపోయాడు.

మరియు వ్రతదీక్షచేపట్టినందున ఆభరణాలు వదలివేసినప్పటికీ శరీర సౌందర్యంతో ప్రకాశిస్తూ, జింకచర్మం ధరించి, లక్ష్మీశోభతో చేత దర్భలు పట్టుకొని ఉచితకర్మలు చేస్తూ సుందరమైన చూపులుగల పృథుచక్రవర్తి నక్షత్రమధ్యంలో చంద్రునివలె సకలజనులకు ఆహ్లాదం కలిగిస్తూ సభామధ్యంలో లేచి నిలబడి సభ్యులకు ఆనందం కలిగేలా చక్కని మాటలతో ప్రసన్నంగా, పరిశుభ్రంగా, గంభీరంగా మాట్లాడుతూ ఇలాఅన్నాడు.

ఓ సభ్యులారా! వినండి! ధర్మాన్ని ఎల్లప్పుడూ తెలుసుకోగోరిన మనుష్యుడు తన మనస్సులో ఉండే భావాన్ని ధీరులు, సజ్జనులు అయిన వారికి తలియజేయవలసిన అవసరం ఉంది.

నేను ఈ లోకాలను శాసిస్తున్నాను. ప్రజలకు ఆయావృత్తులను కల్పించి, దానమిస్తున్నాను. రక్షిస్తున్నాను. ప్రజలు ఆయా పనులలో హద్దులు మీరకుండా విధివిధానాలు స్థిరపరచడానికి బ్రహ్మచే నేను నియోగింపబడ్డాను. ప్రజాపాలన నా కర్మానుష్ఠానం. ఈ విధమైన కర్మానుష్ఠానమువలన కర్మసాక్షి అయిన ఆ పరమేశ్వరుడు ఏలాంటివానికి సంతోషం కలిగిస్తాడో, పండితులు అతనికి ఏ పుణ్యలోకం ప్రాప్తిస్తుందని అంటారో, అనుష్థానపరుడనైన నాకు కోరికలు పిదికేవి అయిన పుణ్యలోకాలు వరుసగా లభిస్తాయి.

ప్రజలను ధర్మంగా పాలించక, తన ప్రయోజనాలకై పన్నులు తీసుకొంటే, ఆ ప్రభువునకు తన ప్రజల పాపాలు సంక్రమిస్తాయి. కాంతిని కోల్పోయి రాజు నశిస్తాడు. ప్రజలుకూడా తమహితం కోసం రాజుహితం కోరాలి. అసూయలేకుండా కృష్ణార్పణంగా ధర్మాచరణ చేయాలి. మీరిలా చేస్తే అదే నన్ను అనుగ్రహించినట్లు. అంతేకాక, మీరు పితృదేవతలతో, ఋషులతో సమానులు. ఆలాంటిమీరు సమ్మతితో కర్తను, పాలకుడను, బ్రహ్మచే అనుమోదించువాడను అయిన నాకు పరలోకంలో ఏ ఫలం కలుగుతుందో ఆలాంటి ఫలం కలగటానికి తగిన కర్మను ఆచరించండి. ఆ విధంగా చేస్తే నేను సంతోషిస్తాను. అని అనగా, ఆ సదస్యులు మహారాజుతో ఇలా అన్నారు.

ఓ పృథుచక్రవర్తీ! ప్రజలందరు తమ పనులన్నీ భగవదర్పితంగా (వాసుదేవార్పణం) చేయాలని బోధించావు. వాసుదేవుడనేవాడు భూమిపై ఉన్నాడా?

(ఆ భగవంతుని రూపరేఖావిలాసాలు తెలియజేయుమని ప్రజలు ప్రభువును కోరారు.)

ఆ మాటలు విని ప్రజలతో పృథుచక్రవర్తి ఇలా అన్నాడు. ఓ యోగ్యులారా! వినండి! యజ్ఞేశ్వరుడు కొన్ని సిద్ధాంతాల ననుసరించి ఉన్నాడు. బుద్ధిమంతులారా! దీనికి విరుద్ధంగా మీరు భగవంతుడు లేడంటే ఆ భగవానుడు సృష్టించిన కాంతిమంతమైన ఈ ప్రపంచం, ఇందలి చిత్రవిచిత్రాలైన కర్మలు ఆయనలేకుంటే అసలులేవు కదా. అందువల్ల భగవంతుడున్నాడు.

అదీగాక, ఈ లోకంలోని చిత్రవిచిత్రాలు వాటికర్తయైన భగవంతుడు లేకున్నా కర్మవశంగా కలుగుతాయని అన్నారనుకోండి.

(కర్త అయిన ఈశ్వరుడు లేకున్నా కర్మలు జరుగుతాయనుకొనేవారు నాస్తికులు. శివుని ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదు అనుకొనేవారు ఆస్తికులు.)

ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, ధ్రువుడు, మనువు మొదలైనవారికి మా తాతగారైన అంగరాజునకు, మిగిలిన రాజలోకానికి, నారద, ప్రహ్లాద, బలిమొదలైన భాగవతోత్తములకు స్వర్గమోక్షాలు ప్రాప్తించేందుకు కారణభూతుడు ఆ భగవంతుడు. మృత్యువు మనుమడైన వేనుడు మొదలైన దురాత్ములకు తప్ప మిగిలినవారి కందరికీ కోరిన కోర్కెలిచ్చి ప్రసన్నవరదుడైనవాడు ఆ స్వామి.

ఈ విధంగా అనుభవజ్ఞాన సంపన్నులైన పండితుల అనుభవాన్నిబట్టి లోకం మేలుకోరే విష్ణువు లేడనడం జరగదు. అదీగాక

గొప్పతపస్సుచే ఒప్పునట్టి మునులపూజ, ఎవని పాదపద్మారాధన వల్ల వృద్ధిపొంది ఆయన పాదపద్మాలనుండి పుట్టిన గంగానదివలె అన్ని మానసిక పాపాలను పోగొట్టేదై పూర్వజన్మల సంసారబాధను పూర్తిగా పోగొట్టగలదా...?

పరమేశ్వరుని పాదపద్మాలమూలమును మందిరంగా భక్తితో ఎవ్వడు పొందగలడో వానికి సమస్త పాపాలు తొలగుతాయి. సజ్జనులు కీర్తించిన వైరాగ్యం, జ్ఞానం, ధైర్యం, వీర్యం ప్రాప్తిస్తాయి. ఎన్నడూ సంసార దుఃఖాన్ని పొందడు.

లోకాలకు మూలాధారమైన పరమేశ్వరుడు విష్ణువు. ఆయనకు సమానులు గాని, అధికులు గాని లేరు. రెండవ సమానమైనవాడు లేకపోవడంవల్ల ఆ విష్ణువు ధీరులలో శ్రేష్ఠుడు.

కర్మవలననే లోకం పుట్టి, పెరిగి, నశిస్తుందందామా? కర్మ అనేది జడకార్యం, చేతనం కాదు. అది ప్రపంచ సృష్టిలో కర్త అనడానికి వీలులేదు. ఈ లోకంలో జగత్సృష్టి రూపకర్మకు కార్య, కారణ సంబంధం ఆ భగవంతుడైన విష్ణువే.

మీరు ఆ పరమేశ్వరుణ్ణి మీమీ యోగ్యతననుసరించి కోర్కెలు సిద్ధించినవారై త్రికరణ శుద్ధిగా కాపట్యం లేని రీతిలో కీర్తన, నమస్కార సేవలను చేసి కోర్కెలను ఫలింపజేయడానికి ఆ పరమేశ్వరుని పాదపద్మాలు సేవించండి. అదీగాక

స్వరూపంచే ఈశ్వరుడు నిశ్చయంగా స్వచ్చమైన జ్ఞానపు ముద్ద. నిర్గుణుడు. అతనియందు కర్మమార్గం సాగుతుంది గాన అతడు సంకల్పించడు. ధాన్యపు కంకులలోని ధాన్యం తెల్లగా ఉంటుంది. అది పొట్టులో దాగి దంచినపుడు బయటపడుతుంది. అలానే మంత్రాల సామర్థ్యం నిబిడీకృతంగా ఉంటుంది. సత్కర్మవలన అది ప్రకటితమవుతుంది. యజ్ఞాని కుపయోగించే ద్రవ్యాలు అన్నీ పదార్ధ సంచయాలు. అందులో యజ్ఞం ఇమిడిఉంది. అలా ప్రకటితమైనపుడు ప్రత్యేక గుణాలతో వేర్వేరుగా వ్యక్తమవుతుంది. జ్యోతిష్టోమం మొదలైన పేర్లతో యజ్ఞరూపమై సమస్త జగత్తు వెలువడును.

అదీగాక కొయ్యలో పుట్టిన అగ్ని ఆ కొయ్య లక్షణాలైన పొడవు, వంకరల నాశ్రయిస్తుంది. దేహంలోని అంతర్యామి దేహధర్మాలను అనుసరించి వ్యక్తమవుతుంది. అవ్యక్తం, కలచేది అయిన కాలం, వాసన, అదృష్టం అయిన ధర్మం అంతర్లీనంగా దేహంలో ఉంటుంది. అని పలికి కొంచెమాగి పృథుచక్రవర్తి మరలా ఇలా బోధించాడు. "నామార్గం అనుసరించే నా ప్రజలు జీవితమే నిశ్చల దీక్షగా మెలగుతూ హరిని భజిస్తారు. ఈ సృష్టియజ్ఞాన్ని అనుభవించే అధిపతి, దాన్ని ఉపదేశించేవాడు నారాయణుడే. ప్రజలు తమతమ ధర్మాలను అనుసరించి ఇలా అర్చిస్తూ యోగస్థులై ఉంటారు. వారు నన్ను అనుగ్రహించే పద్ధతి ఆశ్చర్యకరం -అని పృథుచక్రవర్తి నారాయణ భక్తులను స్తుతించాడు. మరలా ఇలా అన్నాడు.

గొప్ప సిరిసంపదలతోనూ, మహత్తరమైన ప్రతాపంతోనూ, అఖండమైన వైభవంతోనూ ప్రకాశించే రాజుల తేజస్సు తపస్సుతోనూ, శమదమాదులతోనూ, క్షమాగుణంతోనూ విరాజిల్లే బ్రాహ్మణుల పైనా, విష్ణు భక్తులపైనా ఏ మాత్రం తన ప్రభావాన్ని చూపించలేదు.

(క్షాత్రధర్మలక్షణాలు సంపద, వైభవం, ఐశ్వర్యం. బ్రహ్మ ధర్మ లక్షణాలు తపస్సు, ఇంద్రియనిగ్రహం, క్షమావిద్యలు. ఆ క్షత్రియుల అధికారం విప్రులపై ఎప్పుడూ ప్రభావం చూడకుందుగాక!

పురాణ పురుషుడైన నారాయణుడు బ్రాహ్మణుల పాదపద్మరేణువులను ధరిస్తాడు. అతనికి బ్రాహ్మణులే దేవతలు. ఆ కారణంవల్లనే ఆ భగవంతుడు నిరంతరం తనతో ఉండే లక్ష్మీదేవిని పరిగ్రహించాడు సమస్తలోకాలలో పవిత్రకీర్తినీ, ఐశ్వర్యాన్నీ పొందగలిగాడు.

(సదానపాయిని, ఎల్లప్పుడూ విష్ణు వక్షస్థలవాసిని లక్ష్మీదేవి.)

బ్రాహ్మణసేవచే సమస్త సద్గుణాలు కలుగుతాయి. భగవంతుడు సంతోషిస్తాడు. అట్టి బ్రాహ్మణులను ఆ ధర్మాన్ని పాటించేవాడు గొప్ప నీతిమంతులై తప్పక సేవించరా? జ్ఞానవిద్యలో అభ్యాసపరుడు కాకున్నా బ్రాహ్మణ సేవవలన అతని మనస్సు నిర్మలమై మోక్షప్రాప్తికూడా సిద్ధిస్తుంది. అందుచేత ఉదాత్తచిత్తంతో బ్రాహ్మణ బృందాన్ని సేవించాలి.

ఆర్యమహాజనులారా! భగవంతుడు విజ్ఞాననిధి. తత్త్వజ్ఞాన సంపన్నులైనవారు ఇంద్రాది దేవతల్ని ఉద్దేశించి బ్రాహ్మణముఖంగా అర్పించే అన్నంవల్ల(హవిస్సు) తృప్తి చెందినట్లు, అచేతనమైన అగ్నిలో వేల్పిన హవిస్సువల్ల ఈశ్వరుడు తృప్తి పొందడు. కాబట్టి, లోకంలో అగ్ని ముఖంకంటె బ్రాహ్మణుల ముఖం పరిశుద్ధమైంది. అత్యంత ప్రధానమైంది. అందువల్ల సకల జనులూ బ్రాహ్మణులను సేవించాలి.

(యజ్ఞయాగాదులు దేవతలనుద్దేశించి చేస్తారు. అగ్నిముఖంగా దేవతలకు హవిస్సులు అందుతాయి. తద్ద్వారా పుణ్యలోకప్రాప్తి, ఇష్టఫలసిద్ధి కలుగుతుందని నమ్మకం. ఇక్కడ పృథుచక్రవర్తి బ్రాహ్మణసేవలోని ప్రాధాన్యం వివరించాడు.)

అదీగాక

ఓ చతురులారా! ఈ లోకమంతా ఏ వేదంలోనైనా అద్దంలో ప్రతిబింబించే వస్తువులవలె ప్రకాశిస్తుంది. ఆవిధమైన కళంకంలేనిది, నాశరహితమైనది సనాతనవేదం. దానిని శ్రద్ధతో అధ్యయనంచేసి, తపస్సుతో సాధించి, మౌనంతో క్రమబద్ధం చేసుకొని, ఇంద్రియ నిగ్రహంతో నిశ్చలం కావించి, సమాధి స్థితిలో ఉండేవారే బ్రాహ్మణులు. సత్యాసత్య నిర్ణయశక్తి వారికుంది. అలాంటి బ్రాహ్మణుల పాదరజాన్ని ధరించేవారికి సర్వపాపాలు నశించి సద్గుణాలు అలవడుతాయి.

అలాంటి బ్రాహ్మణుల పాదధూళిని నేను తలపై ధరిస్తాను. బ్రాహ్మణులను సేవించినవానికి సమస్తగుణాలు, శీలం, కృతజ్ఞతాభావం, సిద్ధిస్తాయి. అట్టి శ్రద్ధగల మహానుభావుని ఐశ్వర్యాలు వరిస్తాయి. గోబ్రాహ్మణులు, అనుచరులతోగూడి విష్ణువు నాకు ప్రసన్నుడగుగాక అని చెప్పిన పృథుచక్రవర్తిని చూసి పితృదేవ బ్రాహ్మణులు, సత్పురుషులు సంతోషంతో ఆశీర్వదించి ఇలా అన్నారు.

ఓ పృథుచక్రవర్తీ! నీ పుణ్యవిశేషంవలన ఎన్నడో బ్రహ్మదండంచే హతుడైన పాపి వెనరాజు నరకంనుండి తరించాడు. 

(వంశంలో ఒక పుణ్యాత్ముడు జన్మిస్తే వారివంశం తరిస్తుందనడానికి పృథుచక్రవర్తి గాథ ఉదాహరణ.

వేనుని పాపాలు పృథువుపవిత్రవర్తనతో నశించాయి. పుత్రుడంటే తండ్రియు మరొక రూపంలో జన్మిస్తాడు గాబట్టి పాపప్రవర్తనుడు సత్పుత్రునివల్ల పవిత్రుడవుతాడు.)

కుమారునివలన తండ్రి సర్వలోకాలను జయిస్తాడనే వేదవాక్యం నిశ్చయం.

ఓ రాజా! హిరణ్యకశిపుడనే రాక్షసరాజు విష్ణునిందచేసి, నరకానికి వెళ్లాలని సంకల్పించినా, గుణవంతుడు, భాగవతుడు, భక్తుడు అయిన సత్పుత్రుడు ప్రహ్లాదునివల్ల పవిత్రకీర్తిని గడించాడు. కాబట్టి, పాపాలు తొలగి నరకానికి వెళ్లలేదు.

అని చెప్పి వీరవరుడయిన పృథుచక్రవర్తిని పది వేలసంవత్సరాలు గొప్పగా జీవిస్తావని ఆశీర్వదించి మరీ ఇష్టం కలిగేలా

మరలా ఇలా అన్నారు, ఓరాజా! నీకు పరమేశ్వరుడైన విష్ణుపై భక్తిఉండటంవల్ల పరమోత్తముడు వేదవేద్యుడయిన ఆయన నుంచి కథలు మాకు తెలియజేస్తున్న నీవు మాకు రాజువు కావున మేము కూడా విష్ణుభక్తుల మయ్యాము. నీ ప్రజారంజక పరిపాలనం, ప్రజలపై అనురాగం దయాస్వభావులయిన మీవంటి వారికి సహజం. అందులో ఆశ్చర్యం లేదు. జ్ఞానాన్ని కోల్పోయి సంచరించేమేము దైవం పేర చేసే కర్మల వల్ల మా అజ్ఞానపుటవధిని తెలుసుకున్నాము. ఆ మహానుభావుడు బ్రాహ్మణుల నధిష్టించి క్షత్రియులను, వారిద్వారా బ్రాహ్మణులను, వారుభయుల ద్వారా ప్రపంచాన్ని భరిస్తాడు. అలాంటి బలసంపన్నుడు, సమస్తరూపుడు, మహోన్నతుడు అయిన పృథుచక్రవర్తికి విష్ణుడన్న భక్తితో నమస్కరిస్తున్నాము. అని చెప్పే సమయంలో

పృథు చక్రవర్తి యొద్దకు సనకాదు లరుగుదెంచుట

Lord Narayana Vishnu appeared before King Prithu and gave Blessings - నారాయణుండు ప్రసన్నుండై పృథు చక్రవర్తి ననుగ్రహించుట

నారాయణుండు ప్రసన్నుండై పృథు చక్రవర్తి ననుగ్రహించుట

అలా మాట్లాడే సమయంలో యాగభాగాలు స్వీకరించేవాడు, యాగాధిపతియైన సర్వేశ్వరుడు ఇంద్రునితోకలిసి అక్కడకు వచ్చి పృథుచక్రవర్తితో ఇలా అన్నాడు.

ఓ పృథుచక్రవర్తీ! లోకులు మెచ్చేలా నీవు చేసిన నూరో అశ్వమేధయాగానికి ఇప్పుడు ఈ దేవేంద్రుడు భంగం చేసినందువల్ల క్షమాపణ చెబుతున్నాడు చూశావా?

కాబట్టి నీవు ఇతనిని (దేవేంద్రుని) క్షమింపుము. సత్పురుషులు దేహాభిమానంలేనివారు కనుక ప్రాణులకు అపకారం చేయరు. అందువల్ల నీ లాంటి సత్పురుషులు దైవికమైన మాయచేత జ్ఞానాన్ని కోల్పోయి ఇతరులకు బాధ కలిగిస్తే, ఎంతోకాలం నీవు చేసిన వృద్ధజన సేవ వ్యర్థమౌతుంది కదా.

ఈ దేహం అవిద్య, కోరిక, కర్మ - ఈ మూడింటిచేత మొదలైనదని తెలుసుకొని, ప్రాణిహింసచేయని మహాయోగులు దేహాభిమానం కలవారు కాకుండటం చేత, ఇల్లు, భార్య మున్నగు వానియందు వ్యామోహంలేనివారిని వేరే చెప్పాలా?

దేహంతో ఉన్న ఆత్మ సత్యం. స్వచ్చం, స్వయంప్రకాశకం. అది నిర్గుణమైనది, సద్గుణాన్ని ఆశ్రయించేది, వ్యాపించేది వ్యాపింపచేసేది, మూయవడనిది, అన్నింటికి సాక్షిగా నిలిచేది. ఇది దేహంకంటే భిన్నమైనదని ఎవడు తెలుసుకుంటాడో, అతడు నాయందు ఆసక్తిగలవాడు. కాబట్టి అతడు దేహాన్ని ధరించినవాడే అయినా, ఆ దేహలక్షణాలు పొందక ప్రవర్తిస్తాడు. అంతేకాదు. ఎవడు తన ధర్మాలను తాను నిర్వర్తిస్తూ, కోరికలులేనివాడై, శ్రద్ధతో కూడుకొన్నవాడై, ఎల్లప్పుడు నన్ను భజిస్తాడో, అతడి మనస్సు ప్రశాంతమౌతుంది. ఆ విధంగా ప్రశాంతమనస్కుడు, సత్వరజస్తమోగుణాలకు అతీతుడు, సమదృష్టికలవాడు అయిన వ్యక్తి నా పరిపూర్ణ స్వరూప శాంతస్థితిని పొందుతాడు. దానినే మోక్షమని అంటారు. ఈ ఆత్మ అన్ని కాలాల్లో ఒకే విధంగా ఉంటూ, దేనిని అంటి పట్టుకోకుండ తటస్థంగా ఉండేదే అయినా, దీని ద్రవ్యానికి, జ్ఞానానికి, క్రియకు, మనస్సుకు అధిపతిగా నన్ను ఎవడు తెలుసుకోగలడో వాడు పుట్టుకలెేని వాడౌతాడు.

ఈ జననమరణాలపరంపర పదార్ధాలు, పని, పనిచేయించునది, ప్రాణం తానే అయి వేరువేరుదేహాలు ఆధారంగా కలది కనుక, ప్రాప్తించిన ఆపదల్లో, సంపదల్లో నాయందు మనస్సు లగ్నం చేసిన మహాత్ములు మార్పుపొందరు. అందువల్ల నీవు సుఖదుఃఖాలను సమానంగా చూచే మనస్సుకలవాడవు, సమానమైన ఉత్తమ, మధ్యమ, అధమ స్థితులు కలవాడవు, జయించిన ఇంద్రియాలు మనస్సు కలవాడవు, విశేషంగా లభించిన మంత్రులందరితో కూడినవాడవు అయి అన్ని లోకాలను కాపాడు - అని, మరల ఇలా అన్నాడు.

ఓ రాజా! రాజోత్తములకు ప్రజలను కాపాడటం ఉత్తమధర్మం. ప్రజలుచేసే పుణ్యకార్యాలలో ఆరోభాగం లోకపాలకుడైన మహారాజుకు లభిస్తుంది. ప్రజలను కాపాడని రాజు పుణ్యాలు హరించబడతాయి. అంతేకాదు, అతడు ప్రజల పాపఫలాన్ని పొందుతాడు. బ్రాహ్మణ శ్రేష్ఠులు చెప్పినట్లు సంప్రదాయ ప్రకారం ధర్మకార్యాచరణ చేయాలి. ధర్మార్థకామాలపట్ల మెలకువతో మెలగాలి. వాటిపై ఆసక్తి చూపవద్దు.

ఈ విధంగా, ఓ రాజా! ప్రజలపట్ల ప్రేమగలవాడవై భూమిపై సమభావం కలిగి ఎల్లప్పుడు పరిపాలిస్తే నీయింటియందే సనకాదులను చూస్తావు.

ఓ రాజా! యోగము, తపస్సు, యజ్ఞాలచే సులభుడనుకాని నేను సమభావంగల సత్పురుషుల మనస్సులలో ఉండే వాడిని గాబట్టి నీ శాంతశీలానికి, మత్సరములేని కీర్తనలకు లోబడ్డాను. నీకు నేనొక వరం ఇస్తాను. వేడుకొమ్మనగా పృథుచక్రవర్తి సమస్తలోకాలకు గురువైన ఆ విష్ణుమూర్తి మృదుమధుర వచనాలు శిరసావహించి మనస్సులో ఆనందించినవాడై

తాను చేసిన పనులకు సిగ్గిల్లుతూ పృథుచక్రవర్తి కాళ్లకు భక్తితో వినమ్రుడై నమస్కరిస్తున్న దేవేంద్రుని చూచి ప్రేమపూర్వకంగా పృథువు కౌగిలించుకొన్నాడు.

(చేసిన తప్పుకు సిగ్గుపడటం, భక్తిభావంతో వినమ్రతను ప్రదర్శించడం ఇంద్రుని పశ్చాత్తాపానికి నిదర్శనం.)

అలా కౌగిలించుకొని పృథువుపై ద్వేషభావం లేనివాడైన తర్వాత.

విశ్వరూపుడు, భగవంతుడు అయిన ఆ విష్ణుమూర్తి, ఆ రాజు చేసిన పూజానమస్కారాలచే తృప్తి చెందిన మనస్సుగలవాడై, పృథువు తన కాళ్లకు నమస్కరించగా, ప్రయాణం కొనసాగించాలనుకొన్నప్పటికీ పృథువుపై దయతో నిలిచిపోయాడు.

ఈ విధంగా తనమీద దయతో ఆలసించడంతో విష్ణుని సందర్శించడంవల్ల కలిగిన ఆనందంతో కన్నీటి పర్యంతమై ఆ పరమేశ్వరుని మూర్తిని చూచి, స్పష్టంగా చూడలేక బొంగురుపోయిన గొంతుతో మాట్లాడలేక, ఎలాగో తన మనస్సులో ఆ దేవదేవుని భావించుకొని కౌగిలించుకొని, కన్నీటిధారలను తుడుచుకొని భగవంతుని దర్శిస్తూ, కళ్ళకు తృప్తి దీర అగుపించనివాడును, గరుడునిమూపుపై చేయిమోపి, నేలపై తన పాదపద్మాలు నిలిపి ఉన్నవాడును అయిన ఆ దేవతామూర్తితో ఆదిరాజైన పృథుచక్రవర్తి ఇలా అన్నాడు.

ఓ భగవంతుడా! వరదుడా! నిన్ను సజ్జనుడైనవాడు దేహాభిమానంతో భోగాలు అనుభవించాలని వరమెలా కోరతాడు. ఇహసుఖాలవరాలు నరకంలో ఉన్నవారికి కూడ లభిస్తాయి గదా! చెప్పవయ్యా!

ఓ మహాత్మా! ఓ పాపనాశకా! లక్ష్మీపతీ! పద్మనయనా! ఈ వరమే కాదు. మహానుభావులైనవారి వాక్కులనుండి వెలువడే తేనెలవంటి మీ పాదపద్మాలను గూర్చిన పొగడ్తలు విని సంతోషం పొందుతాను. అలా కాకుండ మోక్షాన్ని ప్రసాదించినా నేనంగీకరించను.

(భవబంధ విముక్త స్థితియే మోక్షం. అది ఒక విలక్షణ మానసిక పరిపక్వ దశావిశేషమే. అంతేగాని అదొక ప్రదేశం కాదు.)

ఓ పద్మనయనా! శ్రీహరీ! అందువలన స్వచ్చమైన నీ గొప్పకీర్తిని వినడానికి దయతో పదివేల చెవులు ప్రసాదించు. ఇప్పుడు అదే నా కోరిక.

పాపరహితా! పద్మనయనా! పెద్దలవాక్కులనుండి నీ పాదపద్మాలనుండి పుట్టిన అమృతకణాల వాయు తత్త్వమార్గం మరిచిన దుష్టయోగులను ఆ అమృతకణాలచే తత్త్వమార్దం వైపు మరలిస్తుంది. అలాంటి వరం అనుగ్రహించు. అది తప్ప ఇతరవరాలు నేను కోరను.

రాక్షసాంతకా! పరమపురుషా మంగళకరాలై సుప్రసిద్ధాలైన వైభవాలు కలవాడవు నీవు. నీ వైభవాలే ఈ సృష్టిలో సద్గుణాలు. అలాంటి గుణాలకై ఆశపడి లక్ష్మీదేవి నిన్నాశ్రయించింది. గుణాలను గ్రహించాలనే కుతూహలం ఆమెకుంది. అయినా ఆమె గుణాలను వరించలేదు. నిన్నే వరించింది.

ఈ విధంగా నీ ప్రసిద్ధి శుభప్రదమని ఆమెకు తెలుసు. ఆమె నిన్నుకోరి వరించింది. నీ గుణాల నొకమారు యాదృచ్చికంగానైనా చెవులార వినగలిగినవాడు నీ వెంటబడునుగాని, నీ గుణాలపట్ల విరక్తినెలా పొందుతాడు.

నీ గుణాలను నీ గుణాలుగా విన గలగటానికి సత్యదర్శనులైన వారి సాంగత్యం కావాలి. వారి అనుగ్రహమే నీ అనుగ్రహం.

తెలిసి ఒకమారు నీ గుణముల రుచి తెలిసికొన్నవాడు నీ వెంటపడకమానడు. ఎవడైనా మానితే వాడు పశువే. నేనును నీ గుణాలలో ఉత్సాహం చెందినవాడినే కాబట్టి, లక్ష్మీదేవి భజించిన పద్ధతిలోనే నేనూ నిన్ను భజిస్తాను.

ఈ విధంగా నీ సేవాసక్తిగల నేను, లక్ష్మీదేవి ఒకే విషయంపై కోరికతో పోటీ పడతాము గాబట్టి మా యిద్దరికీ ఒకరి తర్వాత ఒకరు తగవులేకుండా నిన్ను సేవించే అవకాశం ఇవ్వు. అలాకాక నీ పాదపద్మాలపై సేవాసక్తి గల మేము నేనంటే నేననే భావంతో తగవు రావచ్చు. దేవా! అయినా అలానే కానీ! అని మరలా ఇలా అన్నాడు.

దేవాధిదేవా! నీ పాదసేవ చేసే లక్ష్మీదేవి పనులను పాపరహితబుద్ధితో నేను కోరడంవల్ల ఆ లోకమాత అయిన లక్ష్మీదేవితో తగవు తప్పక వస్తుంది. దయాస్వభావుడవైన నీవు దీనులను బ్రోచేవాడివిగాన కొద్దిపాటి దానిని గూడ అధికం చేయగలవు. నీ నిజస్వరూపాన్ని చూపడంలో ఆసక్తిగల నీవు నన్ను ఆదరించినట్లు ఓ మహానుభావా! లక్ష్మీదేవి నాదరింపవు.

అందువల్ల సత్పురుషులు నిరంతరము నీ గుణాలను భజిస్తారు. వారు నీపాద సేవనం తప్ప మరొక ప్రయోజనం ఎరుగరు. ఓ దేవా! నీవు నీ సేవకులను వరాలు కోరుకొమ్మని మోహపూరితమైన మాటలు చెబుతావు. అలాంటి నీ మాటలకు లోబడని జనులు కోరికలతో పనులు ఎలా చేస్తారు? దేవా! నీ మాయాజాలంలో పడ్డ ప్రజలు ఏ కారణంతో నీ పాదసేవకంటె భిన్నమైన వాటిని కోరుతారు? అందువల్ల బిడ్డలయోగక్షేమాలను తనంతతానుగా కోరుకొనే తండ్రివలె నీవు నాకు మేలు చేకూర్చేందుకు సమర్థుడవు. అని పలికిన పృథుచక్రవర్తి మాటలు విని జగద్రక్షకుడైన ఆ విష్ణుమూర్తి సంతోషంతో కూడిన మనస్సుతో ఇలా అన్నాడు. "పృథుచక్రవర్తి! దైవానుగ్రహంవల్ల నా పట్ల నిశ్చలమైన భక్తి నీకు కలిగింది. దానివల్ల నీవు మాయనుండి బయటపడగలవు. నేను ఆదేశించిన విధంగా పనులు ఏమరుపాటులేకుండా చేస్తే నీకు శుభాలు కలుగుతాయి. నా భక్తులంతా స్వర్గమోక్షనరకాలను సమానంగా భావిస్తారు. నీ ప్రయత్నం కూడా అలాంటిదే. నా ఆదేశం ప్రకారం వదలిపెట్టలేని కోపాన్ని వదలుకొని నాపట్ల భక్తిని చూపించావు. అదేనాకు సంతోషం" అని పొగిడి, అనుగ్రహించి, పృథువు చేసిన పూజలు స్వీకరించి విష్ణువు బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు

నరులు, సిద్ధ, సాధ్య, కిన్నర, చారణ, గంధర్వ, ముని, నాగాదిజనులు, హరి పార్శ్వవర్తులు సంతోషహృదయాలతో యజ్ఞదీక్షాబుద్ధియైన పృథుచక్రవర్తి చేసిన సన్మానాలు సంతోషంగా స్వీకరించి తమతమ నెలవులకు వెళ్లారు. ఋత్విక్కులతో కూడిన పృథుచక్రవర్తిని ఆనందంతో చూస్తూ దేవతలందరూ తనను జయజయ నినాదాలతో స్తుతిస్తుండగా విష్ణుభగవానుడు వైకుంఠధామానికి వెళ్లాడు.

తర్వాత ఇంద్రియాలకు కనిపించకపోయినా, ఆత్మద్వారా దర్శింపగలిగినవాడైన ఆ పరమేశ్వరుడైన వాసుదేవునకు నమస్కరించి పృథుచక్రవర్తి తన నగరానికి వెళ్లిపోయాడు. ఆ సమయంలో నానావిధాలంకారాలతో స్వర్ణతోరణాలతో సుగంధవాసనలతో రత్నాల ముగ్గులతో ప్రకాశిస్తూ, ఫలపుష్పాదులు, అక్షతలు, దీపమాలికస్తంభాలు, పోకచెట్లబోదెలతో అన్ని ఇళ్ల ముంగిళ్లు వెలిగిపోతున్నాయి. కస్తూరి, పచ్చకర్పూరం, చందనం కలయంపిగా చల్లిన రాచమార్గాలు కన్పిస్తున్నాయి. అలా తరుపుష్పాలతో కూడిన నగరం ప్రవేశించాడు. రాజమార్గంలో నడుస్తుండగా రత్నకుండలకాంతులు ధగద్ధగాయమానంగా వెలిగిపోగా పౌరకాంతలు బంగారు పళ్లెరాలతో మంగళహారతులందించారు. శంఖనాదాలు, దుందుభితూర్యనాదాలు మారుమ్రోగాయి. వందిమాగధుల పొగడ్తల మధ్య పృథుచక్రవర్తి నిగర్వియై అంతఃపురంలోకి ప్రవేశించాడు. తర్వాత

ఆ పృథుచక్రవర్తి పౌరులచేతను, జానపదులచేతను మిక్కిలి ప్రీతితో రకరకాల పూజలందుకొని సంతోషించిన మనస్సుగలవాడై ప్రజలకు ఇష్టమైన కోర్కెలు తీర్చి, వారిని అనేకవిధాలుగా గౌరవించాడు. ఆ రకంగా మంచి గొప్ప పనులుచేస్తూ ప్రశస్తిపొంది గొప్పవాడని పేరుగాంచాడు. భూమండలాన్నంతా పరిపాలించి స్వచ్చమైన తనకీర్తిని భూలోకమంతా వ్యాపింపజేసి ఆ చక్రవర్తి సంతోషంతో పరమపద ప్రాప్తిని పొందాడు.

ఆ పృథుచక్రవర్తి కథను విదురునకు మైత్రేయ మహర్షి చెప్పెనని శుకమహర్షి పరీక్షిత్తునకు చెప్పిన విధానాన్ని శౌనకాదిమునులకు సూతుడు వివరించాడు.

పృథుచక్రవర్తి సభాసదులకు సద్ధర్మముల నుపదేశించి బ్రాహ్మణ ప్రశంస సేయుట

Indra obstructed King Prithu’s 100th Ashwamedha Yagna (horse sacrifice) - పృథుచక్రవర్తియశ్వమేధంబు సేయునెడ నింద్రుం డశ్వము నపహరించుట

పృథుచక్రవర్తియశ్వమేధంబు సేయునెడ నింద్రుం డశ్వము నపహరించుట

పృథుచక్రవర్తి చేస్తున్న అట్టి యజ్ఞానికి సాక్షాత్తూ భగవంతుడు, హరి, లక్ష్మీవల్లభుడు, విశ్వగురుడు, విశ్వాత్మకుడు, విశ్వవిభుడు, బ్రహ్మశివులతో కూడినవాడు, లోకాలను పాలించే సమస్తదేవతలచే అనుసరింపబడేవాడు, యజ్ఞస్వరూపుడు, అన్ని యజ్ఞాలకు మొదటి ప్రభువు అయిన విష్ణుదేవుడు - గంధర్వులు, మునులు, సిద్దులు, సాధ్యులు, విద్యాధరులు, అప్సరసలు, దైత్యులు, యక్షులు, దానవులు మొదలైనవారు కీర్తిస్తుండగా, గొప్పకీర్తిగలవాడై నందసునందాదులు సహచరులుగా కపిలనారద సనకాది ప్రముఖయోగీంద్రులచే స్తుతింపబడుతూ ప్రత్యక్షమైనాడు.

పరమభాగవతులచే సేవింపబడేవాడు, నారాయణాంశతో పుట్టినవాడు అయిన పృథుచక్రవర్తికి భూదేవి హవిస్సులు పిండియిస్తూ కోరినకోర్కెలను, సమస్త పదార్థాలను అందించేది. వృక్షాలు పెద్దగా పెరిగి పూలనుండి తేనెలు వర్షించాయి. చెరకు, ద్రాక్షజాతులు రసాలిచ్చాయి. పెరుగు, పాలు, నేయి, మజ్జిగ, పానకం మొదలైనవాటిని వర్షింపగా అవి నదులయ్యాయి. సముద్రాలు వజ్రాలను, రత్నజాతులను కల్పించాయి. పర్వతాలు నాలుగువిధాలైన ఆహారాలు కల్పించాయి. లోకపాలకులతో కలిసిమెలిసి సమస్తజనులు కానుకలు తెచ్చియిచ్చారు. ఇలా పరిపూర్ణవైభవంతో వెలుగొందుతూ అధోక్షజునిసేవయే దీక్షగా ధరించిన పృథుచక్రవర్తి తొంబైతొమ్మిది అశ్వమేధాలు చేశాడు. నూరవయాగంతో యజ్ఞాధిదేవతయైన విష్ణుని అర్చించడానికి సంకల్పించాడు, దానిని చూచి ఓర్చుకోలేక

దేవేంద్రుడు మిక్కిలి కోపంతో పాషండుని వేషంలో మాయారూపం ధరించి వచ్చి యజ్ఞాశ్వాన్ని హరించి ఆకాశానికి వెళ్లాడు.

అలా వెళుతుండగా పుణ్యాత్ముడైన పృథుని కుమారుడు అత్రిమహర్షిచే ప్రరేపితుడై వింటిని, బాణాలను ధరించి మిక్కిలి దర్పంతో దేవేంద్రుని వెంబడించి వెళ్లాడు.

ఈ విధంగా పృథుకుమారుడు యజ్ఞాశ్వాన్ని హరించిన ఇంద్రుని చంపడం ధర్మంగా భావించాడు. ఇంద్రుడు మాయారూప వేషధారియై అది అధర్మం అనిపించేలా చేశాడు. పృథుని పుత్రుడు ఇంద్రుని నిలునిలుమనివారించి వింటినారి శబ్దం చేశాడు. ఎదురుగా జడలు, భస్మము, ఎముకలు ధరించిన మూర్తి నిలబడ్డాడు. అతనిని ధర్మమూర్తిగా భావించి పృథుకుమారుడు బాణం వేయలేకపోయాడు. ఇంద్రుని చూపిస్తూ అత్రిమహర్షి రోషాతిశయంతో పృథుపుత్రునితో ఇలా అన్నాడు.

యజ్ఞాన్ని చెడగొట్టినవాడు, దేవతలలో అధముడు అయిన ఇంద్రుడితడు. కావున, నీవు ఇతని జయించుమని అత్రి వేనవంశజునితో మూడుమార్లు చెప్పాడు. అంతట, వేనుని వంశస్థుడు

ఆకాశమార్గంలో వెళ్లే ఇంద్రునిపైకి కోపంతో కూడిన చిత్తస్థైర్యంతో పృథుకుమారుడు మహాగజంపై లంఘించే సింహకిశోరంవలె దూకాడు. అప్పుడు యాగాశ్వాన్ని చేజిక్కించుకొన్న ఆ ఇంద్రుడు అశ్వాన్ని హరించడానికి ధరించిన రూపాన్నీ అశ్వాన్నీ వదలివేసి మాయమయ్యాడు.

వీరుడైన పృథురాజకుమారుడు తన యజ్ఞాశ్వాన్ని బలపరాక్రమాలతో దక్కించుకొని తండ్రియొక్క యాగ ప్రదేశానికి వచ్చాడు.

అప్పుడు అక్కడచేరిన ఋషిపుంగవులు అతడు చేసిన అద్భుత కార్యానికి ఆశ్చర్యపడి అతనికి 'జితాశ్వు' డనే సార్ధకనామంపెట్టారు. అప్పుడు

దేవేంద్రుడు తిరిగి చీకటిని సృష్టించి ఎవ్వరూ తనను చూడకుండా మాయా రూపంలో బంగారు పాశంతో యూపస్తంభానికి కట్టివేసిన గుర్రాన్ని వదిలించుకొని ఆకాశమార్గంలో వేగంగా వెళ్ళసాగాడు. ఆ వృత్తాంతం అత్రిమహర్షి చెప్పగా, పృథురాజకుమారుడు కపాలఖట్వాంగాయుధాలతో వేగంగా వెళ్లే ఇంద్రుని జయించలేక - మళ్లీ అత్రి మహర్షి చెప్పగా పృథురాజకుమారుడు తోక తొక్కిన పామువలె కోపించి బాణాన్ని ఎక్కుపెట్టాడు. అదిచూచి దేవేంద్రుడు గుర్రాన్ని మాయారూపాన్ని వదలి ఎప్పటివలె పారిపోయాడు.

అలా తీసుకెళ్లిన యాగాశ్వాన్ని తిరిగి తీసుకొని ఆ వీరశ్రేష్ఠుడు పితృయాగశాలకు వచ్చాడు.

ఇంద్రుడు యాగాశ్వాన్ని దొంగిలించడానికై ధరించి వదలిన అనేక అమంగళ కరములైన మారురూపాలను మూఢులైన జనులు ధరించారు. పాషండులగుర్తులు గల దిగంబరవేషధారులు జైనులుగా, కాషాయవస్త్రాలు ధరించినవారు బౌద్దులుగా జడలు, భస్మము, ఎముకలు ధరించిన వారు కాపాలికులుగా పేరుగాంచారు. ధర్మంతో సమానమైన అధర్మంపట్ల ఆసక్తిగల కొందరు అజ్జజనులు (తెలివిలేనివారు).

(పాషండులు వేదబాహ్యులు. వేదవిహిత ధర్మాలను విడిచినవారు.)

పాం షండయతి - పా+షండ+ఘఞ్. రక్షకమైన వేదధర్మమును వమ్ము చేసేవారు. “పాషండ ద్రుమషండ దావదహన శ్చార్వాక శైలాశనిః" పాషండ షండగిరి ఖండన వజ్రదండాః "పాషండసాగర మహాబడబాముఖాగ్నిః"  అని దాశరథి మొదలియాండాన్‌ చెప్పిన ధాటీపంచకంలోని శ్లోకపాదాలు.

పాషండులనగా వేదధర్మాలను ఆచరింపక ఫలహీనం చేసేవారు. దేహమనే యజ్ఞశాలలో అశ్వమనే ప్రాణమయకోశం కాపాడబడటం వేదోక్త ధర్మం)

ఆ విధంగా ఆయా వేషాలు వరుసక్రమంలో ధరించిన వారిని గూర్చి తెలుసుకొన్న పృథుచక్రవర్తి కోపించి విల్లెక్కుపెట్టి ఇంద్రునిపై బాణంవేయడానికి సిద్ధపడగా ఇంద్రుని చంపడానికి వేగంగా బయలుదేరిన అతనిని చూచి ఋత్విక్కులు ఇలా అన్నారు.

ఓ పృథుచక్రవర్తీ! వేదాలలో చెప్పిన రీతిగా యాగాలలో యాగపశువులను బంధించడం, హింసించడం తప్ప గొప్ప యాగదీక్ష స్వీకరించినవారు ఇతరులను చంపడం శాస్త్రసమ్మతం కాదని పండితులు చెబుతారు.

కాబట్టి, ఇప్పుడు నీవు ఇంద్రుని సంహరించే ప్రయత్నం మానుకో. నీ ధర్మాన్ని వ్యతిరేకించే ఇంద్రుని. ఓ రాజా! శక్తిమంతాలైన మంత్రాలతో ఇంద్రుని ఆహ్వానిస్తే అతడు ఇక్కడకు వస్తాడు. అలా వచ్చిన దేవేంద్రుని తగినవిధంగా పట్టుకోవచ్చు.

రాజా! ధైర్యం చెదిరేలా ఇంద్రుని బంధించి అగ్నికి ఆహుతిగా హోమంచేస్తే నీ విస్తారమైన తేజస్సుచే అతడు సామర్థ్యం కోల్పోయి చెడిపోతాడు.

ఋత్విక్కులు పృథుచక్రవర్తిని వారించి కోపించినవారై స్రుక్కులు స్రువాలు తీసుకొని యజ్ఞంలో వేల్చుటకు పూనుకొనెే సమయంలో బ్రహ్మ విచ్చేసి ఋత్విజులతో ఇలా అన్నాడు. యాగాలలో పూజించే దేవతలు ఇంద్రుని అంశాలు. అట్టి ఇంద్రునిది భగవదంశం. కాబట్టి, అతనిని మీరు వధింపరాదు. ఆయన భగవదంశలో పుట్టాడుగాబట్టి, ఇలాంటి యాగాలను నాశనం చేసే ధర్మవ్యతిరేకమైన పనులు ఆయన చేస్తున్నా చూస్తూవుండాలిగాని ప్రతీకారం చేయగూడదు. ఈ గొప్ప కీర్తిగల పృథుచక్రవర్తికి తొంభైతొమ్మిది యాగాల ఫలితం దక్కుతుంది. అని బ్రహ్మ పృథుచక్రవర్తితో ఇలా అన్నాడు.

రాజా! మోక్షధర్మం తెలిసిన నీవింక యజ్ఞాలు చేయనవసరం లేదు. ఎలాగైనా ఇంద్రునితో మంచి చేసుకొని అతనికి కోపం ఎక్కువగాకుండా ప్రవర్తించాలి. మీరిద్దరూ మంచివారు గాబట్టి, కలిసి తిరిగితే శుభమవుతుంది. నీ మనస్సులో చింతవీడి నా మాటలను ఆదరించి వినుము. భంగపరచబడ్డ యాగం మళ్లీ చేయడానికి ప్రయత్నించవద్దు. కోపంతో కలుషితమైన యాగం అజ్ఞాన కలితమవుతుంది - అన్నాడు బ్రహ్మ.

నీ యాగాన్ని నాశనం చేయడానికి యాగాశ్వాన్ని దొంగిలించిన ఇంద్రుడు దేవతలలో ఎక్కువ పట్టుదల గలవాడుగాన, అతనిచే ఏర్పడిన మనస్సు నాకర్షించే ఈ పాషండ ధర్మాలతో ధర్మానికి వ్యతిరేకం అవుతుంది. కాబట్టి, ఈ యాగం చాలించుమని బ్రహ్మ ఇలా అన్నాడు.

(ఇంద్రియతృప్తికై ప్రాకులాడటం చిత్తాకర్షకమైన పాషండధర్మం.)

ఓ పృథుచక్రవర్తీ! శుభాకారా! అదిగాక వినుము. మీ తండ్రి వేనుని దోషంవల్ల లోపించిన అనేక ధర్మాలను రక్షించడానికి నీవు వేనుని పుత్రుడిగా జన్మించావు. నారాయణాంశంలో జన్మించావు. నీవు మానవలోకంలో పుట్టిన పద్ధతినికూడా తలంచు. నిన్ను సృష్టించిన బ్రహ్మకోర్కెను నెరవేర్చు. ధర్మమార్గంలో పాలించు.

అని మరీ బ్రహ్మ ఇలా అన్నారు. అప్రధానాలైన ధర్మాలకు మూలము, భయంకరమైన వేదబాహ్య జీవితమార్గము అయిన ఇంద్రుని మాయను గెలవాలి. అని బ్రహ్మ ఆదేశించగా పృథుచక్రవర్తి ఇంద్రునితో మిక్కిలి స్నేహం కలవాడైనాడు. తర్వాత యజ్ఞాంత మంగళస్నానాలు పూర్తికాగా 
ప్రశంసార్హుడు పుణ్యపురుషుడు అయిన ఆ పృథుచక్రవర్తిచే భూరిదక్షిణలు పొందడంవల్ల సంతుష్టులయిన బ్రాహ్మణులు పెక్కు దీవెనలందించారు. ఆనందభరితులైన దేవతలందరు అనేక వరాలు ఇచ్చారు.

తరువాత అక్కడి జనులు ఇలా అన్నారు.

ఓ రాజా! ప్రజలందరు నీచేత ఆదరించబడినారు. దానం, గౌరవం పొంది, పితృదేవతలు, దేవతలు, ఋషులు, మానవులు పూజలు పొంది మిక్కిలి సంతోషించారు.

నారాయణుండు ప్రసన్నుండై పృథు చక్రవర్తి ననుగ్రహించుట

Prithu pursued the Earth Goddess and compelled her to resources - ప్రృథు చక్రవర్తి గోరూపిణి యగు భూమివలన, నోషధుల బిదుకుట

ప్రృథు చక్రవర్తి గోరూపిణి యగు భూమివలన, నోషధుల బిదుకుట

విదురుడు మైత్రేయమహర్షిని ఇలా అడిగాడు "ఓ పుణ్యచరిత్రా! గోరూపాన్ని భూమి ఎందుకు ధరించాల్సి వచ్చింది? గోరూపంలోనున్న భూమాతకు ఏది దూడగా అయింది? ఆ ఆవుపాలు పిదకడానికి తగిన పాత్రఏది? పాలుపిండే పృథుచక్రవర్తి ఏయే పదార్థాలను పిండాడు? సహజంగా భూమి మిట్టపల్లాలతో అసమతలంగా ఉంటుందిగదా! మరి అది సమతలరూపాన్ని ఏ విధంగా పొంద గలిగింది? ఆ యజ్ఞాశ్వాన్ని ఇంద్రుడు ఎందుకు దొంగిలించవలసి వచ్చింది? సనత్కుమారుని ద్వారా సమస్త విజ్ఞానాన్ని పొందిన పృథుచక్రవర్తికి ఎటువంటి సుగతి లభించింది?

మైత్రేయమహర్షీ! నీకూ, విష్ణు దేవునికీ భక్తుడనైన నాకు పరబ్రహ్మ స్వరూపుడూ, పుణ్యగాథలను వినేవాళ్లకు పుణ్యం ఇచ్చేవాడూ, సర్వేశ్వరుడూ, భగవంతుడూ అయిన శ్రీకృష్ణుని మిగిలిన అవతార గాథలను తెలియజేయండి. మరియూ ఆ పుండరీకాక్షుడు పృథుచక్రవర్తి అవతారం ధరించి గోరూపధారిణి అయిన భూమిని పిదకడం మొదలైన గాథల నన్నింటినీ వివరంగా చెప్పుమని విదురుడు అడిగాడు. ఆ సమయంలో విష్ణుగాథలపట్ల ఆసక్తిగల భక్తాగ్రేసరుడైన విదురుని పొగడుతూ మైత్రేయుడు ఇలా చెప్పడం మొదలెట్టాడు. బ్రాహ్మణవర్గంచే ఆ విధంగా పట్టాభిషిక్తుడై ప్రజారంజకంగా పరిపాలనలో నియుక్తుడైన పృథుచక్రవర్తి రాజ్యభారం మోస్తున్నాడు. ఆ సందర్భంలో సారవిహీనమైన భూమినుండి అన్నం దొరకక పోవడంవల్ల, ఆకలి బాధలవల్ల ప్రజలు క్రుంగి కృశించి పృథుచక్రవర్తికి ఇలా విన్నవించుకున్నారు.

ఓ మహారాజా! మేమంతా ఆకలిబాధలచే అధికంగా పీడింపబడుతున్నాం. మాపని ఎలాఉందంటే, చెట్టు తొర్రలో రగిలిన అగ్నిచే అంటుకొని మండే వృక్షాల పరిస్థితివలె ఉంది.

ఓ రాజా! దాసులకు రక్షకుడవైన నిన్ను మేము శరణుకోరుతున్నాం. దయతో మాకు అన్నం పెట్టి రక్షించమని ప్రజలు శిరస్సువంచి వేడుకోగా.

ఆ మాటలువిని పృథుచక్రవర్తి దానికి తగిన ఉపాయం ఆలోచించాడు. కోపంతో త్రిపురాసురసంహారం చేసిన రుద్రునివలె వింటికి బాణం సంధించాడు.

ఈ విధంగా బాణాలు సంధించిన రాజును చూచి భూదేవి గోరూపాన్ని ధరించింది. మోసంచేసే వేటగానిని చూచి అడవిలో పరుగెత్తే లేడి వలె పరుగు తీసింది.

ఈ విధంగా భూదేవి పరుగులు తీయగా, పృథువు కోపంతో ఎర్రబడ్డ కనులుగలవాడై వెంబడించాడు. దిక్కులలో, రెండుదిక్కుల నడుమలో, భూమ్యాకాశాల మధ్య, ఎక్కడికెళ్లినా వెంబండించి తరుమసాగాడు. విల్లంబులు ఎక్కుపెట్టి పరుగెత్తసాగాడు. ఆ సమయంలో భూదేవి మృత్యువు చేజిక్కిన మనుజులవలె దిక్కులేనిదై హృదయతాపంతో ఇలా అన్నది. "ఓ పృథుమహారాజా! నీయందు ధర్మము, వాత్సల్యము ఉన్నాయి. ఆపదలో నున్నవారిని రక్షించే స్వభావం ఉంది. జీవుల ప్రాణాలను కాపాడటంలో నిశ్చలత ఉంది. అయినా, దీనురాలైన నన్ను చంపడానికి పూనుకొన్నావు. నేను నీయందు కోరికగలదానను. నన్ను చంపడానికి వెంటపడటం ఎందుకు? ధర్మతత్త్వం తెలిసిన వారెవరూ స్త్రీలను చంపరు. తప్పుచేసినా జాలిపడి రక్షిస్తారు.

ఓ రాజేంద్రా! ఈ భూమిమీది జనసమూహానికి నేను నౌకవలె ఉన్నాను. గొప్పదైన, దృఢమైన శరీరాన్ని ధరించిన నేను ఎల్లప్పుడు ఆ జనసమూహానికి ఆధారంగా ఉంటాను కదా.

(ఘనత్వము, దృఢత్వము అనేవి పృథ్వీభూత తత్త్వాలు, ధర్మాలు.)

ఇలాంటి నన్ను దయతప్పి, ముక్కలుగా తుంచాలని సంకల్పించావు. నేను లేనిచో ఈ సకల జీవరాసులు నీటిలో మునిగిపోకుండా రక్షించడం నీకెలా సాధ్యము? అనగా పృథువు భూమాతకు ఈ విధంగా చెప్పాడు.

"ఓ భూదేవీ! నీవునా ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు, అంతేకాక, యజ్ఞాలలో హవిర్భాగాలను అనుభవిస్తూ కూడ ధాన్యాదులను పెంచకుండా ఉన్నావు. గోరూపాన్ని ధరించి, గడ్డిమేస్తూ పాలను ఇవ్వకుండా నీలోనే దాచుకొంటున్నావు. పూర్వం బ్రహ్మ నీలో సృష్టించిన ఓషధీబీజాలను నీ శరీరంలోనే అణచి పెట్టుకొని బయటకు రానీకుండా చేస్తున్నావు. నీవు మూర్ఖురాలవు, మందబుద్దివి. అపరాధం చేశావు గాబట్టి దురాత్మురాలవు. నిన్ను నా బాణాలతో తూట్లు పొడిచి చంపుతాను. నీ శరీరమాంసంతో ఈ దీనులైన జీవుల ఆకలిబాధ తీర్చి రక్షిస్తాను. "నీవు కామినిని అన్నావు. (స్త్రీ లను చంపరాదన్నావు. ధర్మం తెలిసినవారి కది తగదన్నావు.) జీవులపట్ల దయలేక తమని తాము పోషించుకొనేవారు జాలిలేనివారు. అట్టివారు జీవద్రోహులు". వాళ్లు స్త్రీలైనా, పురుషులైనా, నపుంసకులైనా చంపదగ్గవారే. రాజులు వారిని చంపినా అది పాపం కాదు. కాబట్టి, పాపం అంటదు. నీవు కామినివైనా మదంతో ప్రవర్తించావు. స్తబ్దస్వభావం కలిగివున్నావు. మాయాబలంతో ఇప్పుడు గోరూపంలో పారిపోతున్నావు. నిన్ను నువ్వు గింజలంత చిన్నచిన్న తునియలుచేసి నాయోగమహిమతో ప్రాణికోటిని ఉద్ధరిస్తాను." ఇలా రోషంగా మాట్లాడి భయంకర రూపం ధరించి, యమునివలె  ప్రవర్తిస్తున్న పృథుచక్రవర్తికి వణుకుతూ భూదేవి నమస్కరించి ఆయనను ఇలా స్తుతించింది.

ఓ రాజా! నీవు నిర్గుణుడవైన నారాయణుడవే అయినా, నీవు నీ మాయాగుణాలు పొందినకారణంగా సగుణుడవై నానావిధ దేహాలు ధరిస్తున్నావు. జ్ఞానులచే స్తుతింపబడుతున్నావు.

(పరమాత్మ నిర్గుణుడు; నిరాకారుడు; సర్వవ్యాపి, ఆయన తననే ఆశ్రయించి ఉన్న మాయవల్ల సగుణుడైనపుడు నా నా రూపాలతో ఈ సృష్టి సమస్తం ఏర్పడుతున్నదని తాత్త్విక వివరణ. ఈ తా
త్త్విక స్థితిని దర్శించినవారు జ్ఞానులు)

అటువంటి నీవు నన్ను సగుణమూర్తివై సకల జీవరాశులకు ఆధారంగా పూర్వం సృజించావు. అందువల్లే, నేను నాలుగు విధాలైన భూతసమూహాన్ని భరించవలసి వచ్చింది. అలా ఉండగా,

ఓ రాజేంద్ర! దయయే అలంకారంగా కలవాడా! సృజించిన నీవే నన్ను చంపడానికి ఆయుధమెత్తావు. నేను నిన్ను తప్ప మరెవరిని శరణువేడేది?

ఓ పుణ్యపురుషా! ఊహింపరాని మహిమతో కూడిన నీ మాయచే ఈ చరాచర ప్రపంచాన్ని సృష్టించావు. నీవు ధర్మరక్షకుడవు. వికసించే తామర రేకులవంటి కనులుగల ఓ ప్రభూ! నీ పరాక్రమాన్ని లోకు లెవ్వరూ జయించలేరు. నీవు సర్వతంత్ర స్వతంత్రుడవు. బ్రహ్మను పుట్టించావు. ఆ బ్రహ్మచే సకలలోకాలను సృజింపజేశావు. సౌందర్యమూర్తివైన ఓ పృథుచక్రవర్తీ! నీవు ఒక్కడవే అయినా పెక్కు విధాలుగా సమస్తంలో ప్రకాశిస్తావు.

అంతేకాక పంచభూతాలు, ఇంద్రియాలు కలుగుటకు కారణాలైన చైతన్యము, అహంకారము అనే శక్తులవల్ల ఈ లోకాలను సృష్టించి, పెంచి, నశింపచేస్తూ, అధికములైన విరుద్ధశక్తులుగల పురుషునకు నమస్కారం చేస్తాను. అటువంటి పరమాత్మ స్వరూపుడివైన నీవు నీచే నిర్మింపబడి పంచభూతాలు, ఇంద్రియాలు, మనస్సుతో నిండిన ఈ లోకాన్ని స్థిరంగా నిలుప ప్రయత్నించి

ఆ విధంగా పనిగట్టుకొని ఆదివరాహ రూపాన్ని ధరించి పాతాళంలో ఉన్న నన్ను దయతో పైకి లేవనెత్తావు. అలా ఎత్తిపట్టి మహాజలరాశిపై నావవలె నన్ను నిలిపావు. నాపై ప్రాణులను నిలిపావు. ప్రజారక్షణ కోసం నీవు పృథురూపం ధరించావు. ఇలా భూభారాన్ని వహించి ప్రజలను రక్షిస్తున్న నీవు కేవలం పాలకోసం నన్ను చంపాలని ఆలోచిస్తున్నావు. ఓ రాజచంద్రా! పుణ్యగుణాలప్రోవా! అనవద్యుడవు, వేదవేద్యుడవు, సకల చరాచరరక్షకుడవైన నీకిది ఆశ్చర్యంగా కనిపించడం లేదా?

భగవంతుని మహిమోపేతమైన మాయచే మోహం పొందిన మనస్సుగల మావంటి వారికి హరిభక్తుల చేష్టలు తెలుసుకోవడం శక్యం కాదు. అలాంటప్పుడు శ్రీహరి చర్యలను ఎలా తెలుసుకోగలం? అటువంటి యశోనిధులైన జితేంద్రియులకు, మహానుభావులకు మొక్కుతున్నాను - అని, ఈ విధంగా కోపంచే పెదవులు అదరుతున్న పృథుచక్రవర్తిని పొగిడి, ధైర్యం తెచ్చుకొని భూదేవత మళ్లీ ఇలా అన్నది.

ఓ నిర్మలమైన మనస్సుగల రాజా! పరమాత్మా! నాకు భయంలేకుండా ప్రవర్తించుము, మంచి మనస్సుతో కోపాన్ని దిగమింగు. దయతో నా మనవిని విను.

లోకంలో పువ్వులు కందిపోకుండా తేనెను మృదువుగా, తాగే గండు తుమ్మెదవలె పండితుడైన మానవుడు దేనినీ నొప్పించకుండా అన్నింటినుండి సారాంశాన్ని నేర్పుగా గ్రహిస్తాడు.

త్త్వదర్శనులైన మునులు ఈ లోకంలోను, పరలోకంలోను, పురుషులకు ఫలం చేకూర్చే కృషి అగ్నిహోత్రం మొదలైన ఉపాయాలను దర్శించి ఆచరించారు. ఆ విధంగా ఆ ఉపాయాలను ఆచరించేవాడు ఆ ఫలాన్ని పొందుతాడు. అలాంటి ఉపాయాన్ని లెక్కచేయకుండా తనకు తోచినట్లు చేసేవాడు, ఎంతటి పండితుడైనా అతనికి ఆయాసమేగాని ఫలం దక్కదు. పెక్కుమాటలెందుకు? ఎంతకాలం గడిచినా వానిస్థితి అంతే.

అని చెప్తూ భూదేవి మరలా ఈ విధంగా అన్నది. 

పూర్వం బ్రహ్మదేవుడు అధికంగా సృజించిన పైర్లను, పాపాత్ములైన దుర్జనులు దుర్బుద్ధితో దోచుకొని అనుభవిస్తుంటే వీరులైన రాజులు వాళ్ళను అడ్దుకోకుండా చూస్తూ ఊరుకుంటే నేను రక్షణలేనిదాననై దొంగలవల్ల పెక్కుమార్లు బాధలకు గురి అయి కృశించిపోయాను. అంతేకాక

ఓ రాజా! శ్రేష్ఠాలైన యజ్ఞక్రియలు ఎప్పుడు లేనందువల్ల నేను నిరాదరణకు గురి అయి, ఈ లోకం పెద్ద పెద్ద దొంగలతో నిండి ఉండటం చూచి, ఓ రాజా! యజ్ఞాది సత్కార్యాలకు ఉపయోగపడే ఆ ఓషధులను దొంగలు ఎత్తుక పోకుండా నేను వాటిని మింగాను. అవి నాలో జీర్ణమైపోయాయి.

ఓ రాజేంద్రా! గొప్ప ప్రవర్తనగల పృథుచక్రవర్తీ! వినుము. మరల ఆ ఓషధులను ఒక ఉపాయంతో పొందవచ్చు. నీ వాత్సల్యం పొందినదానిని గాబట్టి నీకాపద్ధతి చెబుతాను.

(వత్సలురాలు అనగా సంతానవతి.)

రాజా! నీవు తప్పక నాకొక దూడను, చక్కని పాలపాత్రను, పాలుపిదికే వానిని కల్పించుము. అలా అయితే ఈ జీవులకు

ప్రభూ! నా మాటలు వినండి. నీవు నాకు తగిన దూడను, పాలుపిదికేవాడిని సమకూరిస్తే ఈ ప్రాణులకు ఇష్టమై బలవర్ధకాలై, పాలు, అన్నం రూపంలో ఉండే కోర్కెలను ప్రసాదిస్తాను. నా మాటలు నమ్ము.

ఓ రాజా! ఇప్పుడు నాది ఎగుడుదిగుడుగా మిట్టపల్లాలుగల ప్రదేశాలు కలిగిన స్థితి. నన్ను నీవు చదునుచేసి సమతల ప్రదేశం కలదానినిగా చేస్తే మేఘాలు వర్షించే సమయంలో మాత్రమే జలం లభించడంగాక, వర్షాకాలం తర్వాత కూడ ఆ జలాలు ఇంకిపోక నిలబడి ఉండేస్థితి ఏర్పడుతుంది

భూదేవి ఈ విధంగా పలికిన మధుర వాక్యాలను విని తన మనస్సులో అనురాగం పొందిన పృథుచక్రవర్తి కర్తవ్యోన్ముఖుడాయెను.

అప్పుడు పృథుచక్రవర్తి మనువును గోవత్సంగాను, తనచేతిని పాత్రగాను చేసి, తాను పిండే వాడుగా భూమినుండి సకలమైన ఓషధులను పిదికాడు. ఈ విధంగా పృథుచక్రవర్తి వాత్సల్యం కలిగి గోరూప ధారిణియైన భూమినుండి అందరు తమ ఇష్టమైన కోర్కెలను పొందారు.

ఋషులంతా ఒకచోట చేరి బృహస్పతిని దూడగా చేసి ఆహ్వానించారు. తమ ఇంద్రియాలనే పాత్రలో ఛందోమయమైన క్షీరాన్ని పిండారు. దేవతలు ఇంద్రుని దూడగా బంగారు పాత్రలో ఓజోబల వీర్యామృతమైన క్షీరాన్ని పిండారు. దైత్యదానవులు గుణవంతుడైన ప్రహ్లాదుని దూడగా సురాసవమైన క్షీరాన్ని పిండారు. అప్సరసలు, గంధర్వులు, విశ్వావసువును దూడగా చేసి పద్మమయమైన పాత్రలో మాధుర్య సౌందర్యాలతో కూడిన గాంధర్వమనే క్షీరాన్ని పిదుకుకొన్నారు.

ఋషులు బృహస్పతిని దూడగా చేసుకొని ఇంద్రియాలనే పాత్రలో వేదమయమైన క్షీరాన్ని పిదుకుతున్నారు. అలానే దేవతలు ఇంద్రుడు దూడగా బంగారు పాత్రలో ఓజోబల వీర్యామృతమయమైన క్షీరాన్ని, దైత్యదానవులు గుణవంతుడైన ప్రహ్లాదుడు దూడగా, ఇనుప పాత్రలో సురాసమయవమైన క్షీరాన్ని అప్సరసలు, గంధర్వులు, విశ్వావసువు దూడగా పద్మమయమైన పాత్రలో మాధుర్య సౌందర్యాలతో గూడిన గాంధర్వమనే క్షీరాన్ని పిదుకుకొన్నారు. పితృదేవతలు సూర్యుడు దూడగా ఆమపాత్రంలో కవ్యమనే క్షీరాన్ని సిద్దులు కపిలుడు దూడగా ఆకాశపాత్రలో సంకల్పనారూపమైన 'అణిమాదిసిద్ధి' అనే క్షీరాన్ని విద్యాధరులు మొదలైనవారు కపిలుడు దూడగా, ఆకాశపాత్రంలో ఖేచరత్వాది విద్యామయమైన క్షీరాన్ని, కింపురుషాదులు మయుడు దూడగా ఆత్మపాత్రంలో సంకల్పమాత్ర ప్రభావం, అంతర్ధాన రూపం, అద్భుతాత్మకం అయిన 'మాయ' అనే క్షీరాన్ని యక్షరక్షోభూత పిశాచాలు రుద్రుడు దూడగా, కపాలపాత్రలో రుధిర స్వరూపమైన క్షీరాన్ని అహి దందశూక, సర్పనాగాలు తక్షకుడు దూడగా, బిలపాత్రలో విషరూపమైన క్షీరాన్ని, పశువులు ఆబోతు దూడగా అరణ్యపాత్రలో తృణమనే క్షీరాన్ని, క్రూరమృగాలు సింహం దూడగా స్వకళేబరపాత్రలో మాంసం అనే క్షిరాన్ని పక్షులు గరుత్మంతుడు దూడగా స్వదేహపాత్రలో కీటకాలు, ఫలాదులు అనే క్షీరాన్ని పిదుకుకొన్నారు. ఈ విధంగా సమస్త చరాచర ప్రపంచం తమలో శ్రేష్టులు దూడలుగా, తమకు తగిన పాత్రలలో తమకు తగిన క్షీరాలను భూమినుండి పిండుకున్నారు. మరియు

ఈ ప్రకారం క్రమక్రమంగా పృథువు మొదలైనవారు వేరువేరు వత్సాలను, పాత్రలను కల్పించుకొని తమతమ కోర్కెలనే వేరువేరు క్షీరాలను పితుకుకున్నారు.

అప్పుడు పృథుచక్రవర్తి ఎంతో సంతోషించి అన్ని కోర్కెలను తీర్చే భూమాతను పుత్రికగా స్వీకరించాడు. తన వింటి కొప్పుతో పెద్దపెద్ద పర్వత శిఖరాలను పొడిపొడి చేశాడు. ఋగ్వేదంలో “భూమత" యే "కామదుఘా” అని ప్రశంసింపబడింది.

భయంకరమైన తన బాహుబలంతో భూమండలాన్ని చదునుచేసి ఆ పృథుచక్రవర్తి శాశ్వత కీర్తిని పొందాడు. తన ప్రజలకు తాను తండ్రివలె, జీవన ప్రదాతవలె వ్యవహరించాడు.

క్రమంగా అక్కడక్కడ పూర్వం లేని జనపదాలు, పట్టణాలు, దుర్గాలు, కొండ పల్లెలు, చెంచుపల్లెలు, బోయపల్లెలు, గొల్లపల్లెలు కల్పించాడు. అనేకరకాలైన నివాసస్థానాలు కల్పించాడు.

ప్రజలు భయము లేకుండా ఆయా నివాసాలలో ఎల్లప్పుడు సుఖసంపదలతో తులతూగుతూ బ్రతుకుతున్నారు. అలాంటి పృథుచక్రవర్తిని కీర్తించటం ఎవరికీ శక్యం కాదు.

మైత్రేయుడిలా వివరించి, ఇంకా విదురునితో ఇలా అన్నాడు. రాజర్షియైన పృథుచక్రవర్తి సత్సంకల్పంతో నూరు అశ్వమేధయాగాలను చేస్తానని దీక్షబూనాడు. బ్రహ్మావర్తదేశంలోని మనుక్షేత్రంలో సరస్వతీ నదీతీరంలో అతడు గొప్పగా చేయబోయే యజ్ఞఫలితం మహత్తరంగా ఉంటుందని భావించి ఇంద్రుడు సహింపలేక పోయాడు.

సరస్వతి, దృషద్వతి అనే రెండు నదుల నడిమి ప్రదేశాన్నే “బ్రహ్మావర్త" మంటారని మనుస్మృతి. (2-17)

Angaputrundagu Venuni Charitra History - అంగపుత్రుండగు వేనుని చరిత్ర

అంగపుత్రుండగు వేనుని చరిత్ర

మహాత్మా! రాజర్షియైన అంగమహీపతి అశ్వమేధయాగం చేయడం మొదలు పెట్టగా ఋత్విక్కులంతా మంత్రాలతో దేవతల్ని ఆహ్వానించారు. అయితే హవిస్సులు స్వీకరించడానికి దేవతలు దిగిరాలేదు. ఋత్విక్కులు ఆశ్చర్యపోయారు. వారు యజ్ఞకర్త అయిన అంగరాజుతో ఇలా అన్నారు. రాజా! ఈ దేవతలు మనం పిలిచినా రావడం లేదు. హోమంలో ఏ విధమైన లోపమూ లేదు. వారు రాకపోవడానికి కారణం తెలియటం లేదు. ఈ హోమం చెడ్డది కాదు గదా.

ఈ వేదవాదులంతా శ్రద్ధతో దీక్షబూని ప్రయోగించిన వేదాలు శక్తిమంతాలైనవి. ఇందులో, దేవతలపట్ల ఏ విధమైన దోషమూ లేదు. జరిగే ఈ వేదకర్మలన్నిటికీ దేవతలే సాక్షులు. వారు తమ తమ భాగాలను స్వీకరించకపోవడానికి కారణమేమో తెలియడంలేదని ఋత్విక్కులు చెప్పగా అంగరాజు దుఃఖీంచాడు. దానికి కారణమేమిటో సదస్యులను అడిగి తెలుసుకోదలచి వారి అనుమతితో మౌనాన్ని వీడి ఇలా అన్నాడు.

ఓ మహనీయులారా! నేను చేస్తున్న యజ్ఞంలో మనం దేవతలను ఆహ్వానించినా వారు వారి భాగాలను స్వీకరించడంలేదు. దీనికి నేను చేసిన అపరాధమేమిటి? అని అడుగగా వారు ఇలా సమాధానమిచ్చారు. ఓ రాజా! ఇది ఇప్పుడు జరిగిన దోషంకాదు. పూర్వజన్మలో చేసిన పాపము. పుణ్యాత్ముడవైన నీకు సవిస్తరంగా చెబుతాము - అన్నారు సదస్యులు.

నీ వింత గొప్పవాడవైనా నీకు సంతానం లేనందువల్ల దేవతలు నీవుచేసిన ఈ యజ్ఞంలో హవిర్భాగాలు స్వీకరించడంలేదు. దీనికి నీవు "పుత్రకామేష్టి అనే యాగాన్ని చేసి కుమారుని పొందినట్లైతే, దేవతలంతా తమభాగాలను స్వీకరిస్తారు. అలాంటి యజ్ఞపురుషుడైన శ్రీ మహావిష్ణువును సేవిస్తే నీకు అన్నిపనులు సమకూరుతా" యని సదస్యులు చెప్పారు.

సభలోనివారు ఇలా చెప్పగా అంగరాజు సంతానం కోసం శిపివిష్టుడనే పేరుగల విష్ణుదేవుణ్ణి నాహ్వానించి పురోడాశాన్ని హోమంలో అర్పించాడు. ఆ హోమగుండంనుండి జ్యోతిర్మయాలైన బంగారు మాలలు, అంబరాలు, ఆభరణాలు ధరించిన యజ్ఞపురుషుడు బంగారుపాత్రలో సిద్ధంచేసిన పాయసాన్ని తీసుకొని బయల్వెడలాడు. అంగరాజు బ్రాహ్మణుల అనుమతితో ఆ పాయసాన్ని స్వీకరించి సంతోషంతో భార్యకిచ్చాడు. ఆ తరువాత

ఆ అంగుని భార్య కుతూహలంతో ఆ పాయసాన్ని సేవించి భర్తతో దాంపత్య సుఖాన్ని పొంది గర్భం ధరించి కుమారుని ప్రసవించింది. అతడు అధర్మమార్గంలో భూమిపై తిరుగుతూ మాతామహుడైన మృత్యువులాగా తిరుగసాగాడు. అతడే వేనుడు.

(వేనుని తల్లి సునీథ, మృత్యువు పుత్రిక - అందువల్ల వేనునికి మాతామహలక్షణాలు కలిగాయి.)

ఆ వేనుడు బాల్యం నుండి దుష్టస్వభావం కలవాడు. తనయీడు బాలురను ఆటపాటలకని పిలిచి గుంపులు గుంపులుగా చేర్చి విల్లమ్ములు ధరించి వారినందరిని చంపేవాడు. జంతువులను వేటాడు బోయవానివలె వేనుడు అట్టి పాప కృత్యంపై కుతూహలంతో తిరుగుతూ మృగాలను దుష్టమార్గంలో చంపేవాడు.

వేనుని తల్లి సునీథ. ఆమె తండ్రి మృత్యువు చేసిన మహాదోషాల ఫలితంగా వేనుడు ఇలా తయారయ్యాడు. అంగరాజు పాపవర్తనుడైన కుమారుని అనేక విధాలుగా శాసించడానికి, దండించడానికి విఫల ప్రయత్నం చేశాడు. అతని చెడ్డపనులు మాన్పలేక మనసులో చాలా దుఃఖించాడు.

దుష్టుడగు పుత్రునివల్ల బాధపడడం కంటే సంతానం లేనివాడు కావడమే మేలు. అలా బాధపడే సంతానం లేనివాడు మహావిష్ణువును సేవించినట్టివాడే అవుతాడు.

అని మరలా ఇలా అన్నాడు.

చెడ్డకుమారునివలన అపకీర్తి అధర్మం కలుగుతాయి. అందరితో విరోధం, మానసిక బాధ తప్పక ప్రాప్తిస్తాయి. చెడ్డకుమారునిపై వ్యామోహం విడిచిపెట్టలేక, వానిని ప్రేమగా చూడటానికి ప్రయత్నిస్తూ ఎవడు కాలక్షేపం చేస్తాడో అతని ఇల్లు సకల దుఃఖాలకు స్థానమవుతుంది. అని మళ్లీ ఇలా అనుకొన్నాడు. 'శోకం కలిగించే పుత్రుని వల్ల అనేక కష్టాలు కలుగుతాయి. తండ్రి ఇంటిని కూడా విడిచి వెళ్లిపోతాడు. అందుచేత, జ్ఞానహీనుడైన చెడ్డకొడుకునే మంచి కొడుకుగా భావిస్తున్నాను' అని ఆ రాజు దుఃఖించాడు

అధికమైన సంపదలతో అభివృద్ధి చెందే తన నివాసాన్ని కొడుకును, ప్రజలను, నిద్రించే భార్యనుకూడ వదలిపెట్టి అర్ధరాత్రివేళ అంగరాజు ఎక్కడికో వెళ్లిపోయాడు.

అంగరాజు ఇల్లు వదలి వెళ్లాడనే విషయం తెలిసిన స్నేహితులు, బంధువులు, పురోహితులు, మంత్రులు మొదలైన ప్రజలంతా దుఃఖించారు. లోకమంతా వెదకించారు. ప్రయోజనం లేకపోయింది. సర్వజీవులలో అంతర్యామి అయిన పరమాత్ముని తెలుసుకోలేని భ్రష్టయోగివలె రాజును కనిపట్టలేక అందరు నిరాశులై, నగరానికి తిరిగివచ్చారు. ఆ తరువాత.

బ్రహ్మనిష్ఠాపరులైన మహానుభావులగు భృగువు మొదలైన మహర్షులు లోకాలను రక్షించాలనే ఏకాగ్రబుద్ధితో ఆలోచించారు. కాపాడే రాజు లేకపోతే జనం పశుప్రాయులై ప్రవర్తించటం చూచారు. వేనుని తల్లియైన సునీథతో సంప్రదించి వేనుని రాజ్యపట్టాభిషిక్తుని చేశారు. కాని, ప్రజలకు ఆయన రాజ్యాధికారం ఇష్టం లేదు. ఆ వార్త విని పాములవల్ల భయంతో పారిపోయే ఎలుకలవలె, దేశంలోని దొంగలందరూ అడవులలోకి పారిపోయారు.

(రాజ్యానికి ప్రభువు లేకుండుట మంచిదికాదు. దుష్టుడైన ప్రభువునైనా తాత్కాలికంగా నియమిస్తే ప్రజలకు కొంత ఊరట.)

అష్ట దిక్పాలకుల వైభవం పొంది లోక పరిపాలన చేసే వైభవాన్ని పొందినా, నీచుడైన వేన మహారాజునకు రాజసహజమైన గర్వము బలసింది. నిత్యం రాజ్యంలో పూజార్హులు, గౌరవభాజనులు అయిన సజ్జనులందరినీ అతడు పరాభవించసాగాడు.

(దిక్పాలకులు : వీరు ఎనిమిదిమంది. ఎనిమిది దిక్కులకు అధిపతులు 1. ఇంద్రుడు, 2. అగ్ని 3.యముడు, 4 నిరృతి, 5. వరుణుడు, 6. వాయువు, 7. కుబేరుడు, 8. ఈశానుడు.)

ఆ వేనరాజు భూమ్యాకాశ మార్గాలలో ఒంటరిగా రథంపై తిరిగేవాడు. నిరంకుశుడై మదగజంవలె సంచరిస్తూ పెద్దలు అసహ్యించుకొనేవిధంగా ప్రవర్తించేవాడు. నిరంతరం సజ్జనులకపరాధం చేయడంలో మనసు లగ్నం చేసేవాడు.

దేవతలు భయపడేలా, భూమ్యాకాశాలు బద్దలయ్యేలా భేరిని వాయింపజేసి వేనుడు ఇలా చాటింపు వేయించాడు. "బ్రాహ్మణులు యజ్ఞాలు చేయకూడదు, దానాలు చేయకూడదు, హోమాలు చేయకూడదు."

ఈ విధమైన చాటింపుతో అన్ని ధర్మాలను నిషేధింపగా, అవినీతిపరుడైన వేనుని చెడు ప్రవర్తన ప్రజలకు భయం కలిగించగా మునులు చూచి దయతో ఈ విధంగా అన్నారు. రాజువల్ల, చోరులవల్ల అధికంగా కలుగుతున్న భయాలు ఈ దేశప్రజలను కొయ్యకు ఇరువైపుల ఎక్కువగా అంటుకొన్న అగ్నివలె బాధిస్తున్నాయి

రాజులేకుండా ఉండటం మహాభయంకరమని భావించి, దానిని నివారించడానికై, తెలియక ఈ నీచుని రాజుగా చేశాము. పాలుపోసి పెంచిన పామువల్ల భయం దానిని పోషించినవానికే కలిగినట్లుగా ఈ దుష్కర్మఫలం ప్రజలకు ప్రాప్తించింది.

అంతేగాక, ఈ వేనరాజు ముందుగా సునీథాదేవి కడుపున పుట్టిన వాడైనా, చెడు ప్రవర్తనతో ప్రవర్తించసాగాడు. ప్రభుస్థానాన్ని ఆక్రమించాడు. ప్రజలను హింసిస్తున్నాడు.

ఈ వేనుడు జ్ఞానసంపన్నులమైన మనచేత రాజుగా చేయబడ్డాడు. కాబట్టి, ఇప్పుడు వీనిని ప్రార్ధించడం ఒక్కటే మార్గం. లోకరక్షణ బుద్ధితో మనం చేస్తున్నాం కాబట్టి, ఆ దుష్టుని ప్రార్థిస్తే ఆ దోషం మనకు సంక్రమించదు. సమాధానపడే విధంగా వీనిని మంచిమాటలతో చల్లబరచే ప్రయత్నం చేద్దాం. అతడు వినకుంటే, ఇంతకుముందే ప్రజల తిరస్కారాగ్నికి దగ్దుడగుచున్న వీనిని మన ఆత్మతేజస్సుతో భస్మం చేద్దామని పెద్దలు తమ రోషాన్ని దాచుకొని వేనుని దగ్గరికి వెళ్ళారు.

వారు ఇంపుగా "ఓ రాజా! నీకు ఆయువు, సంపద, బలము, కీర్తి సమకూరుగాక! నీవు ఐశ్వర్యంతో వర్ధిల్లెదవుగాక!" అని వేనుని ఆశీర్వదించారు. అంతేగాక మిక్కిలి వినయంతో 

పెద్దలందరూ ఇలా ఆశీర్వదిస్తూ వేనునికి ఇలా విన్నవించారు. "రాజా! మాదొక మనవి. కొంచెం శ్రద్ధగా విను. 'మానవుడికి మనస్సు, వాక్కు శరీరము'-అని త్రికరణాలు. ఈ మూడింటిద్వారా పరిశుద్ధంగా చేసేవి ధర్మయుక్తాలైన కర్మలు. అవి అన్నిలోకాలను శోకరహితమైన స్థితిలో నిలుపుతాయి. కోరికలు లేకుండా పనిచేసేవారికి ఈ ధర్మాలే మోక్షాన్ని ఇస్తాయి. ధర్మమే సమస్త ప్రజలకు క్షేమదాయకం. కాబట్టి, అలాంటి ధర్మం నీలో చెడకుండుగాక. ఒకవేళ ఆ ధర్మం నశిస్తే ఆ రాజు ఐశ్వర్యం నశిస్తుంది. దుష్టులైన మంత్రులవల్లగాని, దొంగలవల్లగాని ప్రజలు నశించకుండా రక్షించేవాడే ప్రభువు. అలా రక్షించడానికే న్యాయంగా అతడు పన్ను స్వీకరిస్తాడు. ఇలాంటి రాజు ఇహపరసాఖ్యాలు పొందుతాడు.

అంతేకాక, ఎవని రాజ్యంలో, ఏ నగరంలో యజ్ఞాలకు అధిపతి అయిన భగవంతుడు, తమతమ వర్ణాశ్రమధర్మాలను పాటించేవారిచేత పూజింపబడుతాడో, ప్రజలు వర్ణాశ్రమ ధర్మాలను ఆచరించేటట్లు ఏ రాజు తన శాసనాన్ని అమలుపరుస్తాడో, ఆ రాజువలన అన్ని భూతాలను తనలో భావించేవాడు, మహావైభవంకలవాడు, భగవంతుడు, అన్ని లోకాలకు అధిపతి అయిన పరమాత్మ సంతోషిస్తే - ఆ రాజుకు అన్ని సుఖాలు కలుగుతాయి. ప్రజాపాలకులైన ప్రభువులు ఆ సర్వేశ్వరుని కొరకు బలిదానాలు చేస్తారు. అన్ని లోకాల దేవతల యజ్ఞాదులను గ్రహించేవాడు, అన్ని వేదాల్లో, అన్ని వస్తువుల్లో, అన్ని తపస్సుల్లో నిండి ఉన్నటువంటివాడు అయిన నారాయణుని, ఆశ్చర్యకరాలైన యజ్ఞాలతో పూజిస్తే నీకు భయంలేని స్ధితి ఏర్పడుతుంది. మోక్షం కలుగుతుంది. అందువల్ల నీ రాజ్యంలో యజ్ఞాలు చేయవలసినదని ఆజ్ఞాపించు. ఆ యజ్ఞాలవల్ల విష్ణుకళతో కూడిన దేవతా సమూహాలు ఇష్టంగా సంతుష్టి చెంది నీ కోర్కెలను తీరుస్తారు. దేవతలను తిరస్కరించటం నీకు తగదు. వేదోక్త ధర్మాలపట్ల ఆసక్తి కలవాడవగుము". అని చెప్పగా, ఆ వేనరాజు మహర్షులతో ఇలా అన్నాడు.

"మునులారా! మీరు నాకు ఏమేమో బోధించారు. మీ మాటలు బుద్ధి పరిపాకం లేనివిగా ఉన్నాయి. మీ మాటలలో అధర్మముంది. అసలు ధర్మమనేది ఎక్కడవుందో చెప్పండి?

మూఢులారా! మీకు ప్రభు రూపంలో వచ్చిన నన్ను భగవంతుడని గుర్తించ లేకపోతున్నారు. వ్యభిచారిణి అయిన స్త్రీ తనభర్త కన్ను గప్పి ఇంకొకనిని భర్తగా భావించి, వ్యభిచరించినట్లు మీ ఎదుట కన్పించే నన్ను గుర్తించక ఎవడో నారాయణుడని ఇంకొకరిని సేవిస్తున్నారు. అలా చేస్తే మీకు ఇహపరసౌఖ్యా ఎన్నటికీ ఉండవు.

అని మరీ ఇలా అన్నాడు. యజ్ఞపురుషుడనగా ఎవడు? మీకు ఎవరిపై ప్రేమ, భక్తి కలిగాయి? చెడ్డస్త్రీలు భర్తప్రేమకు దూరమై అంకుమగనిపట్ల చూపే విధంగా మీరు మాట్లాడుతున్నారు. అదీగాక 

త్రిమూర్తులు, దిక్పాలురు, సూర్యచంద్రాదులు అయిన దేవతలంతా రాజు శరీరాన్ని ఒకమూర్తిగా ప్రజలకు సూచించడానికి రాజులో ఉంటారు.

ఆలోచించి నన్ను కొలవండి. రాజు దేవతలందరి అంశలతో కూడినవాడు. ఈర్ష్యను వదలి పెట్టండి. ఈ నేలమీద నాకంటె మరొకడు ప్రథమ పూజకు తగినవాడు లేడు.

కావున, పూజా పునస్కారాలూ, బలులు - అన్నీ నాకే సమర్పించండి" - అని పాపాత్ముడు, దుర్మార్గుడు, అమంగళుడు, అజ్ఞాని అయిన వేనుడు విపరీతబుద్ధితో మునుల మాటలు నిరాకరిస్తూ మాట్లాడాడు. అప్పుడు, మునులు తమ ప్రయత్నం వృథా అయిందని పరస్పరం ఇలా అనుకున్నారు. భయంకరకృత్యాలు చేస్తున్న ఈ పాపాత్ముడు నశించాలి. వీడు బ్రతికివుంటే వీనివల్ల ఈ లోకాలన్నీ నశిస్తాయి. దురాచారపరుడైన వీడు రాజ్య సింహాసనం అధిష్టించడానికి అర్హుడు కాడు. ఏ భగవంతుని అనుగ్రహంవల్ల వీడు ఇటువంటి భోగభాగ్యాలను పొందాడో ఆ యజ్ఞభర్త అయిన శ్రియఃపతినే వీడు నిందిస్తున్నాడు. కావున, సిగ్గుమాలి శ్రీహరిని నిందించే వీనిని హతమార్చాలని మునులు తమలో పెల్లుబికిన కోపంతో హుంకరించారు. ఆ మహర్షుల హుంకారానికి భగవన్నిందకు పాల్పడిన వేనుని ప్రాణాలు పోయాయి. ఆ తర్వాత 

వేనుని తల్లియగు సునీథ చాల దుఃఖించి, కుమారుని శరీరంపై వ్యామోహం వదలలేక తన యోగశక్తితో ఆ శరీరం చెడిపోకుండా కాపాడింది.

ఆ తర్వాత ఒకరోజు మునులంతా సరస్వతీ నదీ జలాలలో స్నానం చేసి నదీ తీరంలో నియమంగా అగ్నిహోత్రాలు ప్రారంభించారు. సత్పురుషుల కథాగానాలతో వినోదించారు. ఇంతలో లోకోపద్రవకారకాలైన అపశకునాలు కనిపించాయి. 'లోకాలకు అశుభాలు కలగకుండుగాక' అని అనుకొంటూ ఉండగానే భీకరంగా అన్ని దిక్కులా ధూళివర్షం కురిసింది. అదే తడవుగా దొంగలు ప్రజల సంపదలను దోచుకొన్నారు.

ఇలా లోకానికి కష్టం కలుగగా వారంతా దానిని గమనించి చూస్తూ ఉండిపోయారు. రాజు చనిపోవడంతో గ్రామాలు అరాచకమై జనాలు ఒకరినొకరు హింసించుకోసాగారు. దొంగల బాధలు అధికమయ్యాయి. దానిని నివారించటానికి సమర్థులైనప్పటికీ మునులు చూస్తూ ఊరకుండిపోయారు. సమదర్శనం గలవాడు, శాంతస్వభావి, పరిస్థితి నర్ధంచేసుకొనేవాడైన బ్రాహ్మణుడు దీనులైన ప్రజలకు బాధలు కలిగినపుడు చూస్తూ మిన్నకుండరాదు. అలాచేస్తే వాని తపస్సు పగిలిపోయిన కుండలో పాలవలె నశిస్తుంది. అంతేగాక, అంగరాజు వంశకర్తలైన పూర్వీకులు విష్ణుభక్తులు. కాబట్టి, వేనుని వంటి వాడు పుట్టినంత మాత్రాన వంశనాశనం కాకూడదని తమలో తాము తర్కించుకొని ఆ మునులంతా ఆ వంశాన్ని నిలబెట్టడానికి బద్ధకంకణులయ్యారు. వేనుని కళేబరంవద్దకు వెళ్లి తొడను మథించారు. అందులో

అప్పుడు వేనుని తొడనుండి నల్లని మబ్బురంగు, కాకిరంగుగల ఒకనిషాదుడు పుట్టాడు. మఱుగుజ్జు అవయవాలు, కురచచేతులు, కురచపాదాలు, పొట్టి చేతులు, కాళ్లు, సొట్టముక్కు ఎర్రని కండ్లు, రాగిరంగు వెంట్రుకలు, మీసాలు కలిగిన అతని ముఖం నిస్సహాయస్థితిని తెలుపుతోంది. అతడు “నేనేమి చేసే"దని దీనంగా అడుగగా. మునులు వానిని చూసి 'నిషీద' అన్నారు. ఆ మాటతో వాడు నిషాదుడను పేరుగలవాడైనాడు. ఆ నిషాదుని వంశం వారంతా కొండ కోనల్లో తిరుగుతూ వేనరాజు పాపాన్ని ప్రచారం చేయసాగారు.

ఆ మునులంతా మళ్లీ బిడ్డలులేని ఆ వేనరాజు బాహువులను మథించారు. అందులో నుంచి పవిత్రులైన దంపతుల పుట్టారు. లోకమంతా సంతోషించింది.

ఆ బాహుమథనం వల్ల నారాయణుని అంశలో ఒక పురుషుడు, వానిని ఎల్లప్పుడూ వీడని లక్ష్మీదేవి అంశగల ఒక అందగత్తె జన్మించింది. ఆమె సద్గుణాలకు అలంకారాలకు శోభ కల్గించింది. పెద్ద చెవులు, గొప్పకీర్తిగల అతడు 'పృథుచక్రవర్తి' అనే పేరుతో ప్రసిద్ధికెక్కాడు. ఆమె 'అర్చి' అనే పేరుతో దిన దిన ప్రవర్థమానయై అతణ్జి వివాహమాడింది. అప్పుడు

ముని శ్రేష్ఠులు సంతోషించేవిధంగా దేవతలు అంతటా పూలవాన కురిపించారు. అమరావతీ పట్టణంలో అప్సరసల నృత్యాలు ఆనందంగా కొనసాగాయి. కిన్నర బృందాల గీతాలు చెవులకింపుగా వినిపించాయి. దేవతలు నగారామోత కొనసాగించారు. ఋషుల స్తోత్రాలు అధికమైనాయి. అగ్నిగుండాలలో అగ్నులు వెలిగాయి. అప్పుడు అక్కడికి గరుడ గంధర్వ కిన్నరగణాలతో సంతోషంగా చతుర్ముఖుడు వచ్చాడు.

వేనుని కుమారుడైన పృథుచక్రవర్తి కుడిచేతియందు విష్ణుమూర్తి ఆయుధాల గుర్తులు గల రేఖలు కనిపించాయి. పాదాలలో హల, అంకుశ, వజ్ర, ధనుస్సు, పద్మ, శంఖరేఖలు విస్పష్టంగా ముద్రించబడి ఉండటం చూచి బ్రహ్మాదులు ఎంతో ఆశ్చర్యం చెందారు.

ఈ పృథుచక్రవర్తి నారాయణుని అంశలో పుట్టాడు. ఈయన భార్య అర్చి లక్ష్మీదేవి అంశలో పుట్టిందని నిర్ణయించి వేదవేత్తలైన బ్రాహ్మణులు ఆయనకు శాస్రోక్తంగా రాజ్యాభిషేకం చేశారు. ఆ తరువాత

నదులు, సముద్రాలు, మృగాలు, పక్షులు, భూమి, ఆకాశం, పర్వతాలు మొదలైన సర్వ జీవరాశులన్నీ పృథుచక్రవర్తికి క్రమంగా కానుకలు తెచ్చియిచ్చాయి.

అధికమైన కీర్తిగల ఆ పృథుచక్రవర్తి తన భార్య అర్చితో కలిసి దివ్యవస్త్రాలు, గంధమాల్యాభరణాలు ధరించి అగ్నిహోత్రునివలె ధగద్ధగాయమానంగా ప్రకాశించాడు.

మరియు ఆ పృథుమహారాజుకు కుబేరుడు బంగారుతో జేసిన వీరోచిత సింహాసనాన్ని వరుణుడు నీటి బిందువులు జాలువారే పూర్ణచంద్రునివంటి గొడుగును, వాయుదేవుడు చామరాలు, ధర్మువు కీర్తిమయ నూత్న పుష్పమాలిక, ఇంద్రుడు కిరీటం, యముడు సర్వజీవులను నియమించే రాజదండం. చతుర్ముఖ బ్రహ్మ వేదమయ కవచం, సరస్వతి నిర్మలహారాన్ని కానుకలుగా ఇచ్చారు.

పద్మపాణియైన విష్ణువు సుదర్శనచక్రాన్ని లక్ష్మీదేవి అధికసంపదలను, శివుడు అర్ధచంద్రరేఖగల ఒరగల ఖడ్గాన్ని అంబిక శత చంద్రమనే డాలును, చంద్రుడు అమృతమయమైన తెల్లనిగుర్రాలను, త్వష్ట రథాన్ని సూర్యుడు కిరణమయమైన వెండి బాణాలను, మేక, ఎద్దుకొమ్ములతో నిర్మితమైన అజగవమనే ధనుస్సును అగ్నిహోత్రుడు, భూదేవి దివ్యపాదుకలను, ఖేచరులు గీతాలను కానుకలుగా అర్చించారు.

(అజ - గవ - అస్థి వికారత్వాద్‌ అజగవః - మేక, ఎద్దు ఎముకలతో చేసిన శివుని ధనుస్సు.)

మరియు ఆకాశం రోజూ పూలు కురిపించింది. ఋషులు సత్యవాక్కులతో ఆశీర్వదించారు. సముద్రుడు శంఖాన్ని ఇవ్వగా నదినదాలు, పర్వతాలు రథానికి దారి ఇచ్చాయి. వందిమాగధులు, సూతులు కీర్తించారు. ప్రతాపశాలియైన పృథుచక్రవర్తి చిరునవ్వుముఖంతో అందంగా కనిపించాడు. చమత్కారభరిత భాషణలతో మేఘగంభీర నిస్వనంతో ఇలా అన్నాడు.

ఓ వందిమాగధ సూతశ్రేష్ఠులారా!, నాలో మెచ్చుకొనే గుణాలు ఉంటే మీరు స్తుతించడం తగును. అలాంటి గుణాలు నాలో లేవు. అందువలన మీ పొగడ్తలు వ్యర్థం. మీకు సద్గుణాలను పొగడాలని ఉంటే సభాసదుల అనుమతితో మీ చాతుర్యాన్ని చూపి విష్ణుని స్తుతించండి. ఆయన సుగుణాలు పొగడ శక్యంకానివి.

ఎవరైనా మహాత్ముల గుణాలను తమయందు ఉన్నట్లు భావించి అలాంటి గౌరవం పొందినా, మహాత్ముల గుణాలు ప్రసిద్ధాలు కాబట్టి వాళ్లతో సమానంగా ఎలా నుతించడానికి సాధ్యం అవుతుంది? శాస్త్రాలు చదవడంవల్ల తనకు విద్యాతపోయోగ గుణాలు కలిగాయని ఎవడైనా అన్నా అతనిని చూచి సభ్యులు నవ్వుకొంటారు. చెడ్డస్వభావం కలవాడు ఆ విషయాన్ని తెలుసుకోలేడు.

అధికమైన ఖ్యాతి కలిగి, వినయపూర్వకలజ్జ కలిగిన విశాలహృదయులు, నిర్మలస్వభావులు, ఆత్మస్తుతి, పరనింద నీచములైనవని మనసులో ఎప్పుడూ భావిస్తారు.

లోకంలో నిత్యం రాజులను పొగడే వంది మాగధులకు మంచి పనులంటే ఏమో తెలియని రాజులను సంతోషపెట్టటం అవసరమే అయినా, చిన్నపిల్లలవలె పొగడకూడదు.

సూత వందిమాగధజనులు ఆ పృథుచక్రవర్తి మాటలు వినికూడా మునులచే ప్రేరేపింపబడినవారై తిరిగి ప్రేమలు మొలకలెత్తగా ఆ రాజును అమృతంతో సమానమైన తియ్యని మాటలతో ఇలా అన్నారు.

"నీవు వేనుని పుత్రుడవు. విష్ణుని కళాంశంతో జన్మించినవాడవు. శాశ్వత గుణాలతో సన్మానయోగ్యుడవు. ఊహకు కూడ అందని నీ గొప్పతనాన్ని పొగడ మాతరమా!"

అని, మరల ఈ విధంగా అన్నారు. "అయినా, నీ గొప్పచరిత్ర అనే అమృతాన్ని తాగి, ఈ మహర్షుల మాటలు విని మిమ్మల్ని సంతోషపెట్టటానికి మరొకమార్గం ఉంది.

పొగడదగిన నీ గాథలను మేము పొగడుతామని ఇలా అన్నారు.

ఈ పృథుచక్రవర్తి అన్ని లోకాలను ధర్మమార్గంలో నడుపుతాడు. ధర్మప్రభువులలో ధన్యుడై ఎంతో ఆసక్తితో ధర్మసేతువును రక్షిస్తాడు. అష్టదిక్పాలుర అంశలు ధరించి ధర్మాన్ని వ్యతిరేకించేవారిని దండిస్తాడు. ఆయాకాలాలలో మంచి మాటలతో దానాలతో ప్రజారంజకుడవుతాడు. యజ్ఞయాగాలుచేసి చక్కని వర్షాలు కురిపించి ఇహపరలోకాలకు ప్రీతిని కలిగిస్తాడు. సూర్యుడు జలాన్ని పీల్చి మేఘంగా మార్చి వాన కురిపించే విధంగా ఈ రాజు ప్రజలనుండి పన్నురూపంలో ధనం పుచ్చుకొని, అవసర సమయంలో ఆ ధనాన్ని మళ్లీ వాళ్లకిచ్చి రక్షిస్తాడు.

(సూర్యుడు వేసవికాలంలో జలాలు గ్రహించి మళ్లీ వర్షాలు కురిపిస్తాడు. సూర్యుడే నరజాతికి ఆత్మ తేజస్సుగా అవతరించి ప్రభువై పాలనచేస్తాడు. అష్టదిక్పాలకుల అంశలతో బ్రహ్మదేవుడు, రాజును సృష్టించినాడని మనుస్మృతి (7-3,4) లో చెప్పబడినది.

ఇంకా పృథుచక్రవర్తి అన్ని ప్రాణులపట్ల సమానుడుగా వర్తిస్తాడు. ధర్మ వ్యతిరేకులయినవారిని, తప్పులు చేసినవారిని శాంతితో సహిస్తాడు. బాధలలో నున్నవారిని దయతో చూస్తాడు. మానవరూపంలో ఉండే విష్ణుమూర్తి గాబట్టి, వర్షాలతో ఇంద్రుడు ప్రజలను రక్షించినట్లు రక్షిస్తాడు. చంద్రునితో సమానమైన ముఖపద్మంతో, చిరునవ్వుతో ప్రేమాభిమానాలు కలిగిన చూపులతో ప్రజలందరికి సంతోషం కల్గిస్తాడు. ఆయన మనస్సు తెలుసుకోవడం దుష్కరం. శత్రువులకు అతడు అసాధ్యుడు.

(సూర్యుని లక్షణాలు అందరిని సమానంగా చూడటం. ప్రజలకు సంతోషం కలిగించేవాడు చంద్రుడు. రెండు లక్షణాలు రాజుకుండాలి. సూర్యునివలె తీక్ష్ణంగాను, చంద్రునివలె ప్రజలయెడ ప్రసన్నంగానూ ఉండాలి. సూర్యచంద్రాత్మకుడై పాలించేవాడు ప్రభువు. "నా విష్ణుః పృథివీపతిః" అని ధర్మశాస్త్రం.)

రహస్యంగా, నేర్పుగా కార్యక్రమాలు నిర్వహించేవాడు, లెక్కలేనన్ని గొప్పగుణాలు కలవాడు, సముద్రునివలె గంభీరమైన మనస్సు గలవాడు, చక్కగా దాచిన సంపదకలవాడు, వరుణునివల అగుపించని ఆత్మకలవాడు, శత్రువులకు సహింపరాని శౌర్యంతో కూడినవాడు, సమీపించడానికి సాధ్యంకానివాడు, దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నవానివలె నడచుకొనేవాడు, వేనరాజు అనే అరణియందు జన్మించిన అగ్నికావటంచేత అన్యులు స్పృశింపసాధ్యం కానివాడు అయిన పృథు చక్రవర్తి - వేగులవలన సకలప్రాణులు బాహ్యంగా, రహస్యంగా జరిపే చర్యలు తెలుసుకొంటూ, దేహధారులకు ఆత్మవంటివాడైై, అందరిని ఆడించే సూత్రధారి అయిన వాయువువలె ప్రవర్తిస్తూ, స్తుతి నిందలను పట్టించుకోకుండ, ధర్మమార్గంలో వ్యవహరిస్తూ, తన ఆత్మీయులు, మిత్రులు, బంధువులు తప్పుచేసినా దండిస్తూ తనకు శత్రువులైనా దండించతగనివారిని దండించకుండా ధర్మమార్గాన నడుస్తూ, తన ఆజ్ఞలు తిరుగులేనివై మానసాచలం వరకు వర్తిల్లగా, సూర్యుడు తన కిరణాలతో ఎంత దూరం భూమిని ప్రకాశింపచేస్తాడో, అంతదూరం తన సుగుణాలచేత లోకాలను సంతోషపరుస్తూ, ప్రజారంజకాలైన గుణాలచేత కఠిన నియమాలుకలవాడై, సత్యాన్నే చెప్పేవాడై, బ్రహ్మజ్ఞానంకలవాడై, సమస్త జీవులు శరణువేడదగినవాడై, పెద్దలను సేవించేవాడుగా, వారికి మర్యాద ఇచ్చేవాడుగా, దీనులపట్ల దయచూపేవాడుగా, పరస్త్రీలయందు మాతృభావన కలవాడుగా, (అర్ధనారీశ్వరునివలె) తన భార్యను తన శరీరంలో సగభాగంగా భావించేవాడుగా, ప్రజలను తండ్రివలె ప్రేమతో రక్షింపసాగాడు. అంతేకాక

(1. సముద్రావరణంచేత వరుణుని లాగా నాల్గు సముద్రాలచే లేక జలప్రాకారాదులచే పరివేష్టిత మూర్తి అని వీరరాఘవ వ్యాఖ్య.

2. సూత్రాధిపుడైన వాయువులాగా - లోపల ప్రవేశించి వాయువులాగా చరించేవాడు.

3. పృథుచక్రవర్తియొక్క ఆజ్ఞాచక్రం, రథచక్రం అప్రతిహతాలై మానసాచలందాకా వ్యాపించి ఉంది. (వీరరాఘవవ్యాఖ్య))

బ్రహ్మవిద్యాపారంగతుల కితడు దాసుడు. సమస్తజీవుల శరీరాలలో తానే ఉన్నట్లు ఆప్తులకు, మిత్రులకు, జనులకు ఆనందాన్ని కలిగిస్తాడు. సంసార బంధంతోకూడిన కామ్యకర్మలతో సంబంధంలేని మహానుభావుల సత్సాంగత్యాన్ని ఇష్టపడతాడు. దుష్టులకు యమునివలె భయంకరుడు. ప్రకృతినీ, జీవులను ఆవేశించి ఉండేవాడు దేవుని అవతారంగా ప్రసిద్దుడు. అందంగా ఉన్న పృథువు అలా సంతోషంతో తిరుగుతాడు.

ఇతడు త్రిగుణాలకు అధిపతి. మూలపురుషుడు. పరమాత్మ పరబ్రహ్మతత్వమే రూపుదాల్చినవాడు అని పెద్దలు గ్రహిస్తారు.

ఈ పృథుచక్రవర్తి ఉదయపర్వతం హద్దుగాగొని సమస్త భూతలాన్ని ఏకైకవీరుడై రక్షిస్తాడు. ఇంకొకనాడు విల్లంబులు ధరించి మణిమయ రథారూఢుడై శత్రురాజులనే చీకట్లను పారద్రోలుతూ భూప్రదక్షిణ చేస్తాడు. అలా అతడు విజయయాత్ర చేసే సమయంలో సర్వదిక్పాలకులతోకూడిన, రాజులందరూ కానుకలిచ్చి విష్ణుమూర్తితో సమానమైన మొదటి చక్రవర్తివని స్తుతిస్తారు.

ఈ రాజు భూచక్రాన్ని ధేనువుగా చేసి సమస్త వస్తుజాలాన్ని పిండుతాడు. విద్వాంసులు తనను గౌరవింపగా ప్రజలకు జీవనోపాధులు సమకూరుస్తాడు.

ఇతడు ఇంద్రుడు కొండలను కొట్టినట్లు శత్రురాజుల వంశాలను నశింపచేస్తాడు. అజగవమను పేరు గల తన వింటి అల్లెతాటిని ధ్వనింపజేసి, శత్రువులను భయపెట్టి అవక్రపరాక్రమంతో సింహసముడై తిరుగుతాడు.

(పృథువును ఇంద్రునితో పోలుస్తూ గోత్రభేదనము-అనేమాటను కవివాడాడు. ఇక్కడ శేష పర్వతములు, రాజుల గోత్రములు అని రెండర్దాలు చెప్పవలె. శత్రురాజుల గోత్రాలు బ్రద్దలుగొట్టడంలో ఇంద్రసమానుడు. మేక ఎముకతోను, ఎద్దు ఎముకతోను, తయారుచేయబడిన విల్లు పేరు అజగవం.)

ఈ పృథుచక్రవర్తి సమస్తలోకాలచే స్తుతింపబడి గొప్ప యశస్సు గడిస్తాడు. పరమపవిత్రమైన సరస్వతీ నదీతీర ప్రదేశంలో నూరు అశ్వమేథయాగాలు చేస్తాడు. చివరియాగసమయంలో యజ్ఞాశ్వాన్ని దేవేంద్రుడు నేర్పుగా, హఠాత్తుగా హరించివెస్తాడు.

ఒకరోజు ఆ పృథువు తన మందిర సమీపంలోని ఉద్యానవనంలో మహనీయుడైన సనత్కుమారుని దర్శించి, ఆయన బ్రహ్మకుమారుడని తెలిసి భక్తితో పూజించి. ఆయన ద్వారా ఉత్తమ జ్ఞానాన్ని పొందుతాడు. అక్కడుండిన బ్రహ్మవేత్తలు సనత్కుమారుని ఉపదేశంతో తత్త్వజ్ఞానం పొంది ప్రవర్తిస్తారు. ఈ మహారాజు భూమిపై ప్రసిద్ధిపొందిన పరాక్రమంగల వీరుడై తన వీరగాథలను లోకులు ప్రస్తుతిస్తూ ఉండగా అక్కడక్కడా వింటూ, శౌర్యంతో అన్ని దిక్కుల్ని జయించి శాశ్వతమైన కీర్తితో సంచరిస్తాడు.

(సనక, సనందన, సనాతన, సనత్కుమారులు నలుగురు బ్రహ్మమానసపుత్రులు.)

ఈ విధంగా శత్రువులనే శల్యాలను తొలగించినవాడు పృథువు. దేవదానవులచే కీర్తింపబడ్డ వైభవంతో పృథుచక్రవర్తి భూమినంతా పరిపాలించాడు. ఆ సమయంలో తనను పొగడిన వందిమాగధ సూతజనులను సన్మానించాడు. బ్రాహ్మణులను, సేవకులను, మంత్రులను, పురోహితులను, పురజనులను, జానపదులను అభ్యంగనం చేయించేవారిని, తాంబూలా లందించేవారిని మొదలైనవారిని తగినవిధంగా గౌరవించాడని మైత్రేయుడు విదురునితో చెప్పాడు.

ప్రృథు చక్రవర్తి గోరూపిణి యగు భూమివలన, నోషధుల బిదుకుట

The war between Dhruva and the Yakshas - ధ్రువుండు కుబేరానుచరులైన గుహ్యకులతో యుద్ధము సేయుట

ధ్రువుండు కుబేరానుచరులైన గుహ్యకులతో యుద్ధము సేయుట

మహాపరాక్రమశాలియైన ధ్రువుడు అన్ని దిక్కులలో ఆకాశంలో అతిశయించిన ఘనపరాక్రమంతో దిక్కులు పిక్కటిల్లున్నట్లు శంఖాన్ని పూరించగా, ఆ శబ్దాన్ని విని యక్షిణులు భయభ్రాంతలైరి. ఆ సమయంలో శక్తిమంతాలైన ఆయుధాలతో యక్షభటులు పురం వీడి బయలుదేరారు.

ఆ విధంగా బయలుదేరిన సేనలు ధ్రువునితో యుద్ధము చేయబూనగా 

మహాపరాక్రమ సంపన్నుడైన ధనుర్ధారియగు ధ్రువుడు తన నెదిరించిన పదమూడువేల యక్షబలగాన్ని ఏ మాత్రమూ లక్ష్యపెట్టక ఎదిరించి ఒకేసారి వాడియైన మూడేసి బాణాలను వారిపై ప్రయోగించి నొప్పించారు.

(ధ్రువుడు మహారథుడుగా చెప్పబడినాడు. మహారథుడంటే - “తన మేను, రథము, రథ్యముల సారథిగాచి యని సేయువాడు మహారథుండు” అని ధనుర్విద్యావిలాసం (3-88).)

ధ్రువుని బాణప్రయోగంచే నొసళ్లు పగిలిన యక్షవీరులు మూర్చిల్లారు. కొంతసేపటికి తేరుకొని, ఆ మహాబలుని ధైర్యపరాక్రమాలు, హస్తలాఘవాన్ని పలుమార్లు మెచ్చుకొన్నారు. కాళ్లతో తొక్కబడ్డ కాలసర్పాలు పట్టరాని కోపంతో పైకెగసినట్లు భయంకరాకారాలతో వారు విజృంభించారు.

యక్షవీరులందరూ ఒక్కుమ్మడిగా మహాశూరుడైన ధ్రువుణ్ణి చుట్టుముట్టేశారు. ధ్రువుని అవయవాల నన్నిటినీ ఆరు ఆరు బాణాలతో నొప్పించారు. పెక్కురకాలైన గదలు, బాణాలు, చురకత్తులు, పట్టిసాలు, చిల్లకోలలు, శూలాలు, ఖడ్గాలు వంటి తీవ్రమైన ఆయుధాలను రథియైన ద్రువుడిపైనా, ఆయన రథసారథిపైనా వర్షధారల్లా కురిపించారు.

ఆ విధంగా బాణవర్షం కురిపించగా ఆ సమయంలో ధ్రువుడు నిరంతర వర్షధారలతో కప్పబడిన కొండవలె యక్షసమూహం కురిపించిన ఆయుధ వర్షంలో మునిగిపోయినట్లు కనిపించాడు. ఆ సన్నివేశాన్ని చూసి ఆకాశంలోని సిద్ధగణాలు భయకంపితులయ్యారు.

ఆ సమయంలో సిద్దులు మొదలైన దేవగణాలు ఆర్తనాదాలు చేశారు. ధ్రువమహారాజనే సూర్యుడు, రాక్షససైన్యమనే సముద్రంలో మునిగినాడా అయ్యో! అనే సందేహాన్ని పొందారు. (పద్మాలనే ప్రజలకు ఆప్తుడైన సూర్యునివంటి ధ్రువమహారాజు - సముద్రంలో సూర్యుడస్తమించేటట్టు, దైత్యసమూహమనే సాగరంలో మునిగిపోయాడా?)

అని బాధపడుతున్న సమయంలో ఆ యక్షులు తాము ఆ మనువంశంలో పుట్టిన ధ్రువుని నిజముగా కబళించామని భావించి సంతోషించారు. ఇంతలో మంచు పొరలను ఉదయకాలంలో మాయంచేసే సూర్యునివలె ధ్రువుడు రథంపై కనిపించాడు.

ధ్రువుడు శత్రువులకు దుఃఖభాజనంగా పరాక్రమాటోపంతో విల్లును మళ్లీ పట్టుకొన్నాడు. భయంకరంగా బాణాలను పరంపరగా ప్రయోగించాడు. తనను చుట్టు ముట్టిన శస్రాలను నుగ్గుజేసి, ఉప్పెనగాలికి మేఘాలు దూదిపింజలవలె విసిరివేయబడినట్లు గుహ్యకులను భుజాల విలాసంతో చిందరవందరబేశాడు

అసమాన పరాక్రమశాలియైన ధ్రువుడు బాణపరంపర ప్రయోగించగా, అవి తగిలి విరోధుల కవచాలు పగిలి తునాతునకలైనాయి. అవయవాలు తెగిపడ్డాయి. ఆయన అమ్ములకు గట్టిన ఈకలు తాకిన వేగానికి శత్రువుల బాణాలు వీగిపోయాయి. ఆ సన్నివేశం ఎలా కనిపించిందంటే, పూర్వం మహేంద్రుడు తన వజ్రాయుధంతో కొండల రెక్కలు తెగగొట్టినట్లుగా కనిపించింది.

(ఇంద్రుడు పర్వతాల రెక్కలు విరగగొట్టడంవెనుక కథ ;

పర్వతాలు తమయిష్టంవచ్చిన చోటికి ఎగిరిపోయి ఎక్కడంటే అక్కడ వాలుతుండేవి. అలాచేయడంవల్ల ప్రజలకు, భూమికి బాధలు కలిగేవి. ఆ కష్టాన్ని నివారించడానికి ఇంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతాల రెక్కలు తెగగొట్టాడు. ఆ రెక్కలే మేఘాలుగా మారాయి. ఇదీ ఐతిహ్యం. ఈ ఐతిహ్యాన్ని పోతన ఇక్కడ సందర్భోచితంగా వాడుకొన్నారు.)

అత్యంత పరాక్రమశాలియైన ధ్రువునిచే, బాణోపహతులై వికలాంగులైన వీరుల తలలు కిరీటాలతో, కుండలాలతో సహా తెగి కుప్పలు కుప్పలుగా పడిపోయాయి. అలా తెగిపడిన చేతులు మణికంకణాలతో, భుజకీర్తులతో తళుక్కుమని ఎగిరి పడుతున్నాయి. వీరుల లక్షణాలను ధ్రువుడు ఒక్క చోటగా కుప్పబోసినట్టుగా యుద్ధభూమి అత్యంత మనోహరంగా కనిపించింది.

ఉత్తమ పరాక్రమాతిశయంగల మనువు మనుమడైన ధ్రువునిచే ఆ విధంగా వికలాంగులైన వీరులు యుద్ధరంగాన్ని వీడి పెడమొగమై సింహరాజాన్ని చూసి ఏనుగుల గుంపులు ఒకదాని నొకటి మడమలు తొక్కుకొంటూ పారిపోయినట్లు యుద్ధరంగాన్ని వీడి వెనుదిరిగారు.

ధ్రువుని అసమాన పరాక్రమం సహించలేక రాక్షసమాయలు ప్రసరింపజేశారు. ధ్రువునికి వారి మాయాజాలం అర్థంకాలేదు. వారి అడుగుజాడలు కనిపెట్టడం కష్టమైంది. ధ్రువుడు తన సారథిని చూసి ఇలా అన్నాడు.

మాయదారి పనులుచేసేవారి విధానాలను ఎంత ఊహించినా, తెలుసుకోవడం ఎవరికి సాధ్యం అని పలుకుతూ ఆ పట్టణాన్ని ప్రవేశించడానికి చాలా ప్రయత్నించి తిరిగాడు. కాని, అది అదృశ్యం కావడంవల్ల ప్రవేశించే ప్రయత్నాన్ని ధ్రువుడు పూర్తిగా మనుకొన్నాడు.

చిత్రమైన రథాన్ని ఎక్కి నగరంలో ప్రవేశించడం మానుకొని తిరుగుతున్న ధ్రువుడు ఎదుటి శత్రువుల ప్రయోగ పద్ధతులను గూర్చి సందేహిస్తూ నిలబడి చూస్తున్నాడు. ఇంతలో మహాసముద్రంనుండి వెలువడే రొదవలె పెద్దపెద్ద శబ్దాలు వినిపించాయి. దిక్కుల నలుమూలలా గాలులు వీస్తూ ధూళి ఎగిసి తెరలుగా కప్పివేసింది. ఇంతలో ఆకాశంలో మేఘాలు కన్పించాయి. అందులో మెరుపులు తళుక్కుమని కనిపించాయి. మేఘాలు భయంకరంగా గర్జించాయి. ఆ మేఘాలు గాలిలో తేలిపోక వర్షం కురిపించాయి.

ఆ విధంగా రాక్షసులచే కల్పింపబడిన మాయలు అలా వేగంగా ధ్రువునిపై నానావిధాలైన దుర్గంధ భూయిష్ట పదార్దాలను - పుర్రెలు, ఎముకలు, మెదడు, మలమూత్రాలు - ఎడతెరపిలేకుండా కురిపించాయి. వరుసవరుసగా విండ్లు, అమ్ములు, కత్తులు, బల్లెములు, గదలు, చక్రాలు, త్రిశూలాలు - మొదలైన ఆయుధాలను వర్షించాయి. పర్వతాలముక్కలను, పాములను, ధ్రువునిపై వర్షించాయి.

ఇంకా మదించిన ఏనుగులు, సింహాలు, పులులు గర్జిస్తూ మీదికి దుమికాయి. అంతలో నాలుగు ప్రక్కలనుండి సముద్రజలాలు పొంగిపొరలాయి. ప్రళయకాలంలోవలె మొత్తం భీకరమైన పెద్దమడుగు కన్పించింది. ఇలా అనేక విధాలైన భయంకరదృశ్యాలు ఎడతెరిపి లేకుండా వచ్చేలా రాక్షసమాయలు కల్పించి, యక్షులు ధ్రువునిపై ప్రయోగించారు.

ఆ యక్షులు మాటి మాటికి చేస్తున్న మహామాయలు గమనించి, మునిసముదాయము ధ్రువుని దగ్గరకువచ్చి చిరంజీవివి కమ్ము అని ఆశీర్వదించి ఆయన సమక్షానికి

మునులంతా వచ్చి ధ్రువుని ఈ విధంగా ప్రబోధించారు. "ఓ పుణ్యాత్మా! శ్రీహరి దివ్య నామాన్ని విన్నా, స్మరించినా తరింపరాని మృత్యువునుకూడా జనం దాటగలరు. భక్తుల బాధలను పోగొట్టే ఆశ్రీహరి, ఆ భగవానుడు, ఆ పరమాత్మ, ఆ జగన్నాయకుడు నీ శత్రువులను సంహరించుగాక!" - ఈ విధంగా మాట్లాడుతున్న ఋషుల వచనాలను విని ధ్రువుడు ఆచమనంచేసి శ్రీహరి పాదపద్మాలను స్మరించి శత్రుభయంకరమగు నారాయణాస్త్రాన్ని వింటినారికి సంధించాడు.

ఆ విధంగా ధ్రువుడు నారాయణాస్త్రాన్ని సంధించగానే వివేకం పొడమినవెంటనే రాగాదులు మాసిపోయినట్లు యక్షమాయలనే కారు చీకట్లు క్షణకాలంలో చెల్లాచెదరైనాయి.

వారించడానికి శక్యంకాని ఆ నారాయణాస్త్రం నుండి బంగారు పిడులు, రాయంచ రెక్కలవంటి రెక్కలుగల వాడిబాణాలు వేలకొద్దీ పుట్టి అడవినిచుట్టిన అగ్నిజ్వాలలవలె భయంకరధ్వనితో శత్రుసేనలపై ఎడతెగకుండా వచ్చిపడ్డాయి.

ధ్రువుడు ప్రయోగించిన దృఢములైన, వాడి ఆయుధాల వర్షంతో యక్షులు వికలాంగులై మళ్లీ పట్టుదలతో పెద్ద ఆయుధాలను ధరించి, మళ్ళీ సైన్యాలను సమీకరించుకొని ధ్రువునితో యుద్ధం చేయడానికి పరుగులెత్తారు. ఆ దృశ్యాన్ని చూస్తే మహాసర్పాలు గుంపులై గరుత్మంతుణ్ణి ఎదిరించడానికి బయలుదేరినట్లున్నది. (హాస్యాస్పదమని భావన)

ఆ విధంగా మళ్లీ తన మీదకు దండెత్తి వచ్చిన గుహ్యకుల నందరినీ, తన బాణ ప్రయోగంచే పాదాలు, పిక్కలు, తొడలు, మెడలు, కళ్లు, చేతులు, చెవులు, కడుపులు ఎక్కడికక్కడ ముక్కలుగా నరికి పారవైచి యోగి సూర్యమండలాన్ని ఒక్కసారిగా భేదించుకోని ఏ ఉత్తమస్థానం చేరుకొనేటట్లుంటాడో, అట్టి స్థానాన్ని చేరేటట్లువారిని పంపాడు.

ఈ విధంగా చిత్రరథుడైన ధ్రువునిచే చంపబడ్డ నిరపరాధులైన గుహ్యకులను చూసి, ధ్రువుని తాత అయిన స్వాయంభవమనువు చాలా బాధపడ్డాడు. ఋషిగణాలను తీసుకొనివచ్చి ధ్రువునితో ఇలా అన్నాడు. "నాయనా! ఏ తప్పు చేయని ఈ గుహ్యకులను ఎలాంటి రోషంతో వధించావు! ఈ రోషమంతా నరకహేతువే! నీ సోదరునిపై నీకు ప్రేమవుండవచ్చు. నీ సోదరుడు చనిపోయాడని బాధావుండవచ్చు. కాని నీవు చేసింది తప్పు. ఇంక నీ ప్రయత్నంమాను!" అన్నాడు.

(గుహ్యకులు : కుబేరుని సేవకులు, అనుచరులను గుహ్వకులని పిలుస్తారు.)

ధ్రువకుమారా! మనుకులంలో పుట్టిన అనఘుడవునీవు. నీ కిది తగని పని. ఒకరికోసం అనేకుల్ని సంహరించావు. ఇట్టిపని నీవు చేయకూడదు. విరమించు.

(మానవులు మనువంశంలోనివారు. వారెలా నడచుకోవాలో వారవలంబించాల్సిన ధర్మస్వరూప మెలాంటిదో ఇక్కడ చెప్పబడింది.

దేహం మీది అభిమానంతో పశువులవలె ప్రాణిహింస చేయడం శ్రీహరిభక్తులైన సజ్జనులకు తగదు. నీవు సర్వప్రాణులను నీవలె భావించి సర్వప్రాణిస్వరూపుడైన శ్రీహరిని సేవించి, ఆయన స్థానాన్ని పొందావు. ఆయన మనస్సున కెక్కావు. హరిభక్తులందరినీ మెప్పించగలిగావు. నీ నడవడిక మంచిది. అలాంటి నీవు ఈ పాపకార్యం చేయడానికెలా ప్రయత్నించావు?

తనకంటె గొప్పవారియందు సహనభావం, తనతో సమానులయందు స్నేహభావం, తనకంటె తక్కువవారియందు దయ, మిగిలిన సమస్త ప్రాణులయందు సమభావం కలిగి వర్తించేవానిని సర్వాంతర్యామి అయిన ఆ పరమాత్మ రక్షిస్తాడు. భగవంతుడు కరుణిస్తే ప్రకృతి సహజగుణాలనుండి విముక్తుడై లింగశరీరాన్ని విడిచి బ్రహ్మానందాన్ని పొందుతారు.

అయస్కాంతం దగ్గర ఇనుము భ్రమించినట్లు భగవత్సాన్నిధ్యంలో కార్యకారణ స్వరూపమైన ప్రపంచం భ్రమిస్తుంటుంది. సర్వేశ్వరుడు కేవలం నిమిత్తమాత్రంగా చూస్తుంటాడు. అట్టి భగవంతుని మాయాగుణ సంబంధంవల్ల పంచభూతాలవల్ల దేహాది ఆకారాలను పొందిన స్త్రీపురుషుల కలయికచే స్త్రీపురుష సంతతి ఉత్పత్తి అవుతుంది. ఈ విధంగా సృష్టిస్టితిలయాలు జరుగుతాయి. ఊహించడానికి అలవిగానంతగా కాలశక్తి ద్వారా జనాలనుండి జనాలను పుట్టించడంవల్ల ఆద్యుడు, నశింపజేయడంవల్ల అంతకుడు, అనాది కావడంవల్ల అవ్యయుడు అయి పరమాత్మ జగత్కారకు డవుతున్నాడు. అందుచే సృష్టిస్థితిలయాలను ఏమీ చేయనట్లే నటిస్తూంటాడు.

ఇలా మృత్యుస్వరూపుడు, పరుడు, సమవర్తి అయిన భగవంతుడికి తనవారు, పరులు అనే భేదం లేదు. కర్మలకు లోబడిన జీవులు స్వతంత్రతలేనివారై ధూళికణాలు గాలి ననుసరించి వెళ్లినట్లుగా భగవంతుని అనుసరిస్తారు. ఆయుర్దాయాలు సమకూర్చడం, నాశనంజేయడం లేకుండా స్వస్థుడైన భగవానుడు ప్రాణుల ఆయుస్సులకు హానివృద్దులు సమకూరుస్తాడు. ఆ సర్వేశ్వరుడే కర్మసాక్షి

మహానుభావా! కర్మసాక్షియైన సర్వేశ్వరుని కొందరు 'స్వభావం' అంటారు. కొందరు 'కర్మ' అంటారు. కొందరు 'కాలం' అంటారు. కొందరు 'దైవం' అంటారు. మరికొందరు 'కామం' అంటారు.

నిర్గుణుడు, అప్రమేయుడు అనేకశక్తులకు హేతుభూతుడు అయిన భగవానుడు చేసే పనులను బ్రహ్మరుద్రాదులు సైతం తెలుసుకోలేరు. ఇక ఆ భగవంతుని తత్త్వాన్ని ఎవరు తెలుసుకోగలరు? కాబట్టి, కుమారా! పుట్టుకకు, చావుకు దైవమే కారణం. అందుచేత ఈ కుబేరుని భటులు నీ తమ్ముని చంపారని కోపించవద్దు. భూతాత్మకుడు, భూతేశుడు, భూతభావనుడు, సర్వేశ్వరుడు, పరాత్పరుడు అయిన భగవానుడు తన మాయచే సృష్టి స్థితి లయాలను చేస్తూవుంటాడు. అయినా అహంకార రాహిత్యంవల్ల గుణకర్మలకు అంటరానివాడై ఉంటాడు. ముక్కు తాళ్లతో కట్టివేసిన పశువుల్లాగా, ఈ ప్రజాపతులు భగవదాజ్ఞలు పాటిస్తారు కాబట్టి, దుష్టులకు మృత్యుస్వరూపుడూ, శిష్టులకు అమృతస్వరూపుడూ, సర్వాత్మకుడూ, జగత్పరాయణుడు అయిన భగవంతుణ్ణి అన్ని విధాలా శరణు పొందు

పుణ్యాత్మా! నీవు ఐదేండ్ల వయస్సులోనే పినతల్లి పలికిన మాటలకు మనస్సు విరిగి, తల్లిని వదలి అడవులకు వెళ్లి తపస్సుజేశావు. స్వచ్చమైన భక్తితో ఈశ్వరుణ్ణి పూజించావు. మహావైభవంతో ముల్లోకాల కతీతమైన పదవిని సాధించావు. అనేక రూపాల మార్పుతో ఈ ప్రపంచం ఎవనియందు కనిపిస్తున్నదో, అతణ్ణి గూర్చి ప్రతిదినం (ధ్యానంచేయాలి).

భగవంతుడు ప్రత్యగాత్మ స్వరూపుడు, పరబ్రహ్మ స్వరూపుడు, ఆనందమయుడు, శాశ్వతుడు, సకలశక్తి సంపన్నుడు, గుణసహితుడు, పుట్టుకలేనివాడు అయిన పరమేశ్వరునియందు శ్రేష్ఠమైన భక్తి కలిగి ఉండాలి. సమభావంతో ఉంటూ అహంకార మమకార సహితమై వృద్ధిపొందిన అవిద్య అనే గ్రంథిని నీవు తెంచివేశావు. కాబట్టి బుద్ధిమంతుడా! మంగళాలను హరించే రోగం వద్దు!!.

మందులచే రోగాలు ఏ విధంగా నశిస్తాయో, అట్లే రోషహృదయునివల్ల లోకాలు నశిస్తాయి. కాబట్టి రోషాన్ని పోగొట్టుకో!

ఓ పుణ్యాత్మా! నీ తమ్ముని చంపినవారనే కోపంతో ఈయక్షులను నీవు వధించావు. శివుని సోదరుడైన కుబేరునిపట్ల అపచారం చేశావు కావున

(సదాశివభ్రాతయైన యర్ధవిభునకు: శివునితో కైలాసంతో ఉన్న పార్వతీదేవి సౌందర్యాన్ని అసూయాదృష్టితో చూచిన ఐలబిలుని(కుబేరుని అసలుపేరు) పార్వతి కురూపివి కమ్మని శపించింది. దానితో 'ఐలబిలుడు' కుత్సితమైన బేరం(శరీరం)గల కుబేరుడయ్యాడు. పశ్చాత్తాపంతో శివుని శరణాగతి పొందగా శివుడు కుబేరుని తన తమ్మునిగా స్వీకరించాడు. శివునికి తమ్ముడైతే కుబేరునికి పార్వతి వదిన అవుతుంది. మరిదికి వదిన తల్లితో సమానం అని మనుస్మృతి. ఆ విధంగా సదాశివభ్రాతయై యర్థవిభుడైన కుబేరుడు దుర్బుద్దిని మానుకొని సత్ప్రవర్తన గలవాడయ్యాడు.

నీవు ఆ కుబేరుణ్లి వెంటనే నమస్కారాలతో, సోత్రాలతో ప్రసన్నుణ్ణి చేసుకొమ్మని చెప్పి, మనువు దయామయుడై కర్తవ్యం ఉపదేశించి, ధ్రువునిచే ప్రశంసింపబడి ఋషులతో కలసి వెళ్లాడు.

ఆ తర్వాత

యక్షులు, సిద్ధచారణులు, విద్యాధరులు మొదలగువారిచే స్తుతింపబడుతూ కుబేరుడే ధ్రువుని వద్దకు బయలుదేరి వచ్చాడు. ధ్రువుడు గుహ్యకులను చంపడం మానివేశాడనీ, మహారోషాన్ని విడిచిపెట్టాడనీ సంతోషించి చూడటానికి వచ్చాడు.

నమస్కరించి నిలబడ్డ ధ్రువుణ్ణిచూసి, ముచ్చటపడి కుబేరుడిలా అన్నాడు. రాజకుమారా! ప్రబలవిరోధాన్ని విడిచిపెట్టడం చాలాకష్టం. అయినా మీ తాతగారి ఉపదేశంతో నీవు దానిని విడిచిపెట్టావు. నేను నీయెడ అనుగ్రహపరుణ్ణి అయినాను. జీవుల పుట్టుకకు, నాశనానికి కాలమే కర్తగాని, మరెవ్వరూ కారు. నీ తమ్ముణ్ణి చంపింది ఈ యక్షులు కారు. వారిని చంపింది నీవున్నూ కావు.

దేహాభిమానం కారణంగా స్వప్నంలోవలె నేను, నీవు అనే దేహబుద్ధి పురుషునికి అజ్ఞానంవల్ల కలుగుతుంది. దానివల్ల బంధం, దుఃఖం మొదలైనవి సంభవిస్తాయి. కాబట్టి, అధోక్షజుడు, సర్వభూతస్వరూపుడు, సంసారబంధ విమోచకుడు అయిన భగవంతుణ్ణి సేవించు. ఆయన పాదపద్మాలు భజింపదగ్గవి. ఆయన త్రిగుణాత్మక మాయకు అతీతుడు. నీకు మేలు కలుగుతుంది. నీ మనసులోని కోర్కెను కోరుకో! నీవు శ్రీహరి పాదసేవను స్థిరబుద్ధితో చేస్తావు. కాబట్టి, వరాలు పొందడానికి అర్హుడవు.

కుబేరుని ఆ ప్రోత్సాహవాక్యాలు విని బుద్ధిమంతుడు, భాగవతోత్తముడైన ధ్రువుడు ఏ హరి స్మరణంవల్ల దురంతం, దుస్తరమైన అజ్ఞానాన్ని అవలీలగా తరింపగలుగుతామో ఆ శ్రీహరి స్మరణం నా మనస్సులో స్థిరంగా ఉండేటట్లు వరం ఇమ్మని అర్ధించాడు. ధ్రువుడు కోరినట్లే కుబేరు డతనికి శ్రీహరి స్మరణను అనుగ్రహించి ప్రీతాత్ముడై అంతర్థానం చెందాడు. ఆ తరువాత ధ్రువుడు యక్షులు, కిన్నరులు, కింపురుషులు తన వైభవాన్ని కీర్తిస్తుండగా తన రాజధానికి తిరిగివచ్చాడు.

ప్రశస్తమైన నడవడిగల విదురా! విను. ఇలా తన నగరానికి మరలి వచ్చి ధ్రువుడు అపారమైన దక్షిణలతో యజ్ఞాలు చేశాడు. అనేక ద్రవ్యాలు, ఆచరింపబడే క్రియలు విష్ణుమూర్తి రూపాలుగా చూపబడ్డాయి. కాబట్టి అంతర్లీనమై నిర్వహించిన విష్ణువే అధిదేవతయై సత్కర్మఫలాలను పుష్కలంగా పంచిపెట్టాడు. ధ్రువుని బుద్ధి ఇన్నింటిపై నిలవలేదు. ఇవన్నీ ఉపాధులు. వాని కతీతుడైన నారాయణునిపై తనకు గల భక్తి అఖండమై, ప్రవాహరూపమై ప్రకాశించింది. ఈ విధంగా జడము, చేతనము సమ్మిశ్రంగా ఉన్న సృష్టిలో ఆనందమయుడైన లక్ష్మీపతిని ఒక్కడినే చూస్తూ ధ్రువుడు జీవితాన్ని నడిపాడు.

ఈ విధంగా సుశీలసంపన్నుడు, పరబ్రహ్మపై నిష్ఠగలవాడు, ధర్మమనే వంతెనను రక్షించేవాడు, దీనులను కాపాడేవాడైన ధ్రువుడు తనను ప్రజలు తండ్రిగా భావిస్తుండగా, అరువది ఆరువేల సంవత్సరాలు రాజ్యం చేసి ఆ రాజ్యకాలంలో తన ఐశ్వర్యానుభవాల వల్ల పుణ్యక్షయాన్ని యాగాదులతో అశుభక్షయాన్ని సాధించాడు. ఎంతోకాలం, ధర్మార్థకామాలను సాధనాలుగా చేసుకొని కుమారునికి రాజ్యపట్టం కట్టాడు. ఇంద్రియ లౌల్యం లేనివాడయ్యాడు. అజ్ఞానంతో నిర్మితమైన కలలో చూచిన గంధర్వుల పట్టణంతో పోల్చదగిన శరీరాదికమగు భౌతికలోకం భగవంతుని మాయచే సృష్టించబడిందని మనస్సులో భావించాడు.

సేవకులు, మంత్రి, పురోహితులు, బంధుమిత్రులు, పుత్రులు, పశువులు, ధనరత్నాలు, స్త్రీలు, ఇండ్లు, విహార ప్రదేశాలైన పర్వతాలు మొదలుగా ఈ సముద్రాల నడుమ ఉండే భూభాగం, దిగ్గజాలు మొదలైన సమస్త పదార్థాలు అనిత్యాలైన రూపాలే అని భావించి మనువుతో సమానుడైన ధ్రువుడు వైరాగ్యభావం పొందాడు.

అతడు తన నగరంనుండి వెలువడి పుణ్యక్షేత్రాలకు తీర్థయాత్రలు చేశాడు. బదరికాశ్రమాన్ని దర్శించి, విశాలానదీ పుణ్యతీర్ధాలలో స్నానంచేసి, ఇంద్రియాలను శుద్దిచేసుకొని పద్మాసనాసీనుడయ్యాడు. ప్రాణాయామంతో వాయుగతులను నిలిపి పరిపూర్ణుడయ్యాడు. కళ్లుమూసుకొని హరియొక్క రూపవైభవాన్ని ధ్యానం చేశాడు. భక్తి నిశ్చలం కాగా ఆనందబాష్పాలు ప్రవహించాయి. శరీరం పులకించింది.

(పవనుని బంధించటం అంటే ప్రాణాయామం చేయటం.)

తన సాధనలో క్లేశాలు తొలగి, లింగశరీరం అంతరించియున్న ధ్రువుడు తన్నుతాను మరచిన స్థితిలో ఉన్నాడు. అప్పుడు ఉదయిస్తున్న పూర్ణిమా చంద్రునివలె పదిదిక్కులను వెలిగిస్తూ ఆకాశంనుండి ఒక విమానం వచ్చింది. అందులో ఇద్దరు దేవతా శ్రేష్ఠులు చతుర్భుజులై, ఎర్రతామరరేకులవంటి కనులతో, నీలమేఘచ్చాయతో మెరసిపోతున్నారు. వారు పీతాంబరధారులై గదలు పట్టుకొని నిలబడిఉన్నారు. కిరీటాలు, హారాలు, కుండలాలు, భుజకీర్తులు ధరించి యుక్తవయస్సులో కనిపిస్తున్నారు.

వారిని చూచి విష్ణుకింకరులని గ్రహించి ధ్రువుడు తొట్రుపాటుతో లేచి నిలబడ్డాడు. భగవంతుని వివిధ నామాలను స్మరిస్తూ సాష్టాంగదండప్రణామాలుచేసి నమస్కరించి వినమితగాత్రుడై విష్ణుని పాదాలపై హృదయాన్ని న్యాసం చేసి నిలబడ్డాడు. అతనిని చూచి సునందుడు, నందుడు అనే విష్ణుకింకరు లిద్దరూ ప్రీతితో చిరునవ్వుతో ఇలా అన్నారు.

ఓ మహారాజా! నీకు శుభమగుగాక! మా మాటలు శ్రద్ధగా విను. ఐదేండ్ల వయస్సులోనే నీవు తెలివితేటలతో, బుద్ధిబలంతో ఘోరతపస్సుచేసి, తేజోమూర్తి, ధర్మాత్ముడు అయిన విష్ణుమూర్తిని సంతృప్తిపరచావు.

అట్టి సమస్తలోక నాథుడైన విష్ణుమూర్తి మా ఇద్దరినీ పంపాడు. నిన్ను విష్ణులోకానికి తీసుకపోవడానికి వచ్చాము. భగవవత్సాన్నిధ్యం నీకు లభించగలదు.

నిన్ను తీసుకొని వెళ్లడానికి వచ్చాము. ఏ స్థానాన్ని పండితులైనవారు అన్నిటికంటె శ్రేష్ఠమైనదిగా భావించి పొందుతారో, సూర్యచంద్రులు, గ్రహాలు, నక్షత్ర సముదాయం ఏ పదానికి ప్రదక్షిణం చేస్తుంటాయో, దేనిని మీ తండ్రితాతలు, ఇతరులు పొందలేకపోయారో, ఏది సర్వలోకపూజ్యమో, దేనిని భక్తులు కానివారు పొందజాలరో, ఆ విష్ణుపదాన్ని నీవు పొందబోతున్నావు. ఓ ధ్రువా! ఇదుగో! రమ్ము! శ్రేష్ఠమైన ఈ విమానాన్ని నీ కోసం పురుషోత్తముడైన శ్రీహరి పంపాడు. దీని నెక్కడానికి నీవు అర్హుడవని విష్ణుదూతలు తెలుపగా, ధ్రువుడు వారి తియ్యని మాటలకు ఆనందించి, స్నానమాచరించి వచ్చి అక్కడి ఋషులకు నమస్కరించాడు. వారి ఆశీర్వచనాలు పొందాడు. విమానరాజానికి ప్రదక్షిణ చేసి అర్పించాడు. విష్ణుసేవకులైన సునందనందులకు నమస్మారం చేశాడు. భగవత్‌ స్వరూపంలో తన దృష్టినీ, మనస్సునూ నిలిపి విమానాన్ని ఎక్కడానికి తేజోరూపం తాల్చాడు.

(పెద్దగా కనిపించేవి నక్షత్రాలు. చిన్నగా కనిపించేవి తారలు.)

దేవతలు మ్రోగించే దుందుభులు మొదలైన వాద్యాల శబ్దాలు వినిపించసాగాయి. పూలవాన కురిసింది. కిన్నరులు, గంధర్వులు మంగళగీతాలు పాడారు.

(దుందుభి/ పణవ/ ఆనక/ మురజ -

1) దుందుశబ్దేన భా తీతి దుందుభిః | భాదీప్తౌ - దుందుం అని శబ్దించేది.

2) స్తోత్రం చేసేటప్పుడు వాయించేది పణవం.

3) స్వరవిశేషం ఉజ్జీవింపచేసేది ఆనకం.

4) ముర్ముర ధ్వని చేసే చర్మవాద్యం మురజం.)

ఆ సమయంలో ధ్రువుడు ఇతరులకు ప్రవేశించడానికి అసాధ్యమైన దేవలోకానికి వెళుతూ, దీనురాలైన తన తల్లిని వదలి ఎలా వెళ్ళడం అని చింతిస్తూండగా అది గమనించిన విష్ణుభక్తులు ధ్రువునికంటె ముందు వెరే విమానంలో కూర్చొని ముందుగా పోతున్న ఆయన తల్లిని చూపించారు. అప్పుడు ధ్రువుడు పరమానందం చెందాడు.

తల్లియైన సునీతిని విమానంలో ముందుగా వెళ్లడం చూచి ధ్రువుడు విమానమెక్కాడు. దేవతలతనిపై నిరంతరంగా పూలవాన కురిపించారు. అప్పుడతడు సంతోషంతో,

అలా పోయిపోయి శీఘ్రంగా స్వల్పకాలంలో గ్రహమండలాన్ని దాటాడు. ముల్లోకాలు దాటాడు. సప్తర్షిమండలాన్ని దాటి దానికి పైవైపుగా ప్రయాణించి ఎంతో సంతోషంతో హరిపదం చేరుకొన్నాడు.

ఆ విష్ణులోకం ముల్లోకాలను ప్రకాశింపజేస్తోంది. ఆ లోకం దయాగుణం లేనివారికి చేరరానిది. శాంతమూర్తులు, జీవులయందు సమదృష్టిగలవారు, పరిశుద్ధ ప్రవర్తనగలవారు, సర్వజీవులను సంతోషపెట్టెవారు, విష్ణుభక్తులకు చుట్టాలుగా తిరిగేవారు, ఇతరులకు శుభం కలిగించే పనులు చేసేవారు అయిన జీవులకు రెప్పపాటుగాని, ఏమరుపాటుగాని ఉండవు. జ్యోతిశ్చక్రమంతా దాని చుట్టూ కట్టుగుంజకు కట్టిన గోవులగుంపువలె ఎక్కడ పరిభ్రమిస్తూ ఉంటుందో అలాంటి విష్ణుపదాన్ని పొంది ధ్రువుడు ప్రకాశించాడు. అతడు ముల్లోకాలకు చూడామణియైనాడు. అట్టి ధ్రువుని మహిమను చూచి నారదమహర్షి సంతోషంతో ప్రచేతసులనే దేవర్షుల యజ్ఞశాలలో వీణవాయిస్తూ

మహాపతివ్రతయైన సునీతి కుమారుడైన ధ్రువుడు తపస్సుచేసి సాధించిన మహాఫలాన్ని బ్రహ్మర్షులు కూడా పొందలేరంటే క్షత్రియవంశంలో జన్మించినవారి మాట చెప్పాల్సిన అవసరంలేదు. ఈ ధ్రువుడు ఐదేండ్ల చిరుప్రాయంలో సవతితల్లియెన సురుచి పలికిన చెడుమాటలచే మనసు నొచ్చుకొని నా ఉపదేశాన్ని పాటించి అరణ్యానికేగి భక్తిపారవశ్యంతో శ్రీహరిని మెప్పించాడు. తన అధీనంలో ఉండేలా చేసుకొన్నాడు. విష్ణుస్థానాన్ని పొందాడు. ఆ విధంగా హరిపదం సాధించడం ఎవరికీ సాధ్యంకాదు. సునీతి పతిభక్తి, ధ్రువుని విష్ణుభక్తి రెండూ పరమోత్కృష్టమైనవని అర్ధం.

గొప్పదైన ధ్రువుని చరిత్రను నారదు డీవిధంగా గానంచేశాడని చెప్పి, మైత్రేయ మహర్షి పుణ్యాత్ముడైన విదురునితో ఇలా అన్నాడు.

ధ్రువుని చరిత్ర సజ్జనులు సమ్మతించేది, ధన్యతనుగూర్చి స్వర్గాన్ని అందించేది. యశస్సును, ఆయుష్షును, పుణ్యాన్ని శుభాలను కలిగించి పాపాలను తొలగించి దేవతావిభూతిని, ప్రశంసాపాత్రతను, ధ్రువపదానుగ్రవాన్ని కలిగించేది. అట్టి ఉపాఖ్యానాన్ని నీకు చెప్పాను. ఆ విష్ణుని పాదపద్మాలను ఆశ్రయించి సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలలోను, అమావాస్యా పూర్ణిమ కాలాలలోను మరియు ద్వాదశిరోజు, ఆదివారాలలో, శ్రవణానక్షత్రంలో, శూన్యతిథిలో, సంక్రమణదినాలలో, వ్యతీపాతయోగంలో భక్తితో వినే సజ్జనులకు

(ధ్రువుని కథ సత్ప్రవర్తనం, వినయ విధేయతలు, ధర్మస్వరూపం మొదలైన విషయాలను ఉపదేశించే సన్నివేశాలు కలది.)

పై చెప్పిన విధంగా చేస్తే దుఃఖం తొలగిపోతుంది. భగవద్భక్తి, శీలసంపద కలుగుతుంది. తేజస్సు కోరుకొనేవానికి తేజస్సు, మనస్సును కోరుకొనేవానికి మనస్సును కోరికలులేనివానికి తత్త్వజ్ఞానం లభిస్తుంది. దీనిని వినిపించే వారికి దైవానుగ్రహం లభిస్తుంది. అట్టి కథను నీకు చెప్పానని మైత్రేయుడు విదురునకు చెప్పిన విధంగా, శుకమహర్షి పరీక్షిన్మహారాజుకు చెప్పిన విధంగా సూతుడు శౌనకాది మహర్షులకు వినిపించాడు. అలా చెప్పిన మైత్రేయునితో విదురుడిలా అన్నాడు.

ఓ పుణ్యాత్మా! నారదమహర్షి ఈ ధ్రువుని గాథను ప్రచేతసులు నిర్వహించిన సత్త్రయాగంలో అధికంగా కీర్తించాడని చెప్పారు. ఈ ప్రచేతసులు ఎవ్వరు? ఎవరి కుమారులు? ఏ వంశంలో జన్మించారు? యజ్ఞాన్ని ఎక్కడ నిర్వహించారు? యజ్ఞపురుషుణ్ణి యజ్ఞంలో ప్రచేతసులు ఎలా కొలిచారు? విష్ణుపదసేవా పరాయణుడు, భాగవతోత్తముడు, దైవదర్శనంగలవాడు అయిన ఆ దివ్యయోగి నారదుడు విష్ణుకథాగానం ఎలా చేశాడు?

దయామయా! మైత్రేయ మహర్షీ! కీర్తించదగినవాడైన ధ్రువుని చరిత్ర అనే అమృతాన్ని చెవులనే దోసిళ్ళతో ఎంత త్రాగినా నా మనస్సు తృప్తి చెందకుండా ఉన్నది. ఆ చరిత్ర నా కిప్పుడు చెప్పండి.

అని అడిగిన విదురుని చూచి మైత్రేయుడు ఇలా అన్నాడు. ధ్రువుడు ప్రయత్నపూర్వకంగా అడవికి వెళ్లగా అతని కుమారుడైన ఉత్కళుడు పాపాలు తొలగి

ఉత్కళుడు నిష్కళంకుడు. పుట్టుకతోనే శాంతమూర్తి ఏమీ అంటనివాడు. అందరినీ సమభావంతో చూచేవాడు, తనలో లోకాలను, లోకాలలో తనను చూస్తూ యోగాభ్యాసం అనే అగ్నిలో కర్మవాసనలను దహింపజేశాడు. మందబుద్దివలె, గ్రుడ్డివానివలె, మూగవానివలె, చెవిటివానివలె ప్రవర్తించాడు. అతడు సర్వజ్ఞుడు కావడంవల్ల మంటలు చల్లారి నివురు గప్పిన నిప్పువలె ఉండేవాడు. శాంతము, జ్ఞానమయమూ అయిన బ్రహ్మస్వరూపాన్ని మనస్సులో భావిస్తూ ఉన్నాడు.

అతడు తనకంటె ఇతరం ఎరుగక జీవిస్తున్నాడు. సార్వభౌమపదవి మనస్సులో కోరుకోడు. అతని స్థితిని చూచి మంత్రులు, కులవృద్ధులు ఉత్కలుని పిచ్చివానిగా భావించి అతని తమ్ముడైన వత్సరునికి పట్టంగట్టారు. ఆ వత్సరునికి సర్వర్థి అనే భార్యవల్ల పుష్పార్ణుడు, చంద్రకేతుడు, ఇషుడు, ఊర్జుడు, వసువు, జయుడు అనే ఆరుగురు కొడుకులు కలిగారు. వారిలో పుష్పార్ణునకు ప్రభ, దోష అనేవారు ఇద్దరు భార్యలు. అందులో ప్రభకు ప్రాతర్మధ్యందినసాయములు అనే ముగ్గురు కొడుకులు జన్మించారు. దోషకు ప్రదోషుడు, నిశీథుడు, వ్యుష్టుడు అనే ముగ్గురు కొడుకులు పుట్టారు. అందులో, వ్యుష్టుడనే వానికి పుష్కరిణి అనే భార్యవల్ల సర్వతేజుడు అనేకొడుకు పుట్టాడు.

ఆ సర్వతేజునకు "ఆకూతి అనే భార్యద్వారా చక్షుస్సు అనేపేరుగల మనువు జన్మించాడు. చక్షుస్సునకు నడ్వల అనే భార్యయందు పురువు, కుత్సుడు, త్రితుడు, ద్యుమ్నుడు, సత్యవంతుడు, ఋతుడు, వ్రతుడు, అగ్నిష్టోముడు, అతిరాత్రుడు, సుద్యుమ్నుడు, శిబి, ఉల్ముకుడు అనే పన్నెండుమంది పుత్రులు జన్మించారు. వారిలో ఉల్ముకునికి పుష్కరిణి అనే భార్యవల్ల అంగుడు, సుమనసుడు, ఖ్యాతి, క్రతువు, అంగిరసుడు, గయుడు అనే ఆరుగురు కొడుకులు కలిగారు. అందులో అంగునికి సునీథ అనే భార్యద్వారా వేనుడు అనే కొడుకు పుట్టాడు.

ఉత్తమ ప్రభువైన అంగరాజు తనకుమారుడైన వేనుని చెడునడవడికకు బాధపడి ఎవ్వరితో చెప్పకుండా రాజధాని నగరాన్ని వదలి ఎక్కడికో వెళ్లిపోయాడు. ఆపైన వేనుని అక్రమపరిపాలనాన్ని సహించని మునీశ్వరులు కోపించి వజ్రసమానమైన వాక్కులతో వేనుని “చావు”మని శపించగా అతడు మరణించాడు.

ఆ సమయంలో రాజ్యం రాజు లేనిదైంది. ప్రజలు దొంగలబాధచే తల్లడిల్లారు. అదిచూచి దుఃఖించిన మునులు పూనిక వహించి మరణించిన వేనుని కుడిభుజాన్ని మర్దించారు. అప్పుడు నారాయణాంశతో తొలిచక్రవర్తి అయిన పృథువు జన్మించాడు.

విదురు డామాటలు విని మైత్రేయునితో ఇలా అన్నాడు. ఓ పుణ్యాత్ముడా! సత్ప్రవర్తనగలవాడు, సజ్జనుడు, సుశీలుడు, వేదవిదుడు అయిన అంగరాజుకు చెడు సంతానం ఎలా కలిగింది? ఆ అంగరాజు ఏ కారణంతో మనస్సు వికలమై పురం వదలి వెళ్లిపోయాడు. ధర్మం తెలిసిన మునులు దండనను వ్రతంగాగల వేనుని చంపారన్నావు. అతనిపై ఎలాంటి నేరారోపణంచేసి బ్రహ్మదండంతో చంపారు? రాజులైనవారు, లోకపాలకుల తేజస్సునుకలిగి ప్రజాపాలనలో ఆసక్తిగలవారుగా ఉండాలి. అలాంటివారిలో పాపం వుంటే వారికి తప్పక ప్రజలనుండి అవమానం కలుగుతుంది. ఇహపరలోకాల రహస్యాలు కూలంకషంగా తెలిసిన నీవుమాత్రమే ఇందులో విశేషాలు చెప్పగలవు. కాబట్టి, వేనుని చరిత్రను ఆసక్తిని భక్తిని కలిగిన నాకు వివరంగా చెప్పుమని విదురుడు కోరగా మైత్రేయుడిలా అన్నాడు.

అంగపుత్రుండగు వేనుని చరిత్ర

Friday, February 27, 2026

After receiving blessings for his devotion and an exalted position, a mature Dhruva returns to his kingdom to be welcomed by his father, King Uttanapada - ధ్రువుండు మరల దన పురంబునకు వచ్చుట

ధ్రువుండు మరల దన పురంబునకు వచ్చుట

అంటూ ఆ ధ్రువుడు దుఖపడ్డాడు. ఆ మైత్రేయముని విదురుడితో ఇలా చెప్పాడు. మనోహరమైన శ్రీహరి పదపద్మరేణువులచే సంస్కరింపబడిన శరీరాలు గలవారు. అనుకోకుండా లభించిన దానివలన, తృప్తి పడుతూ సంతోషంగా జీవిస్తుంటారు. అలాంటి మీ బోటివాళ్లు ఆ వెన్నుని పాదపద్మసేవ తప్ప మిగతావాటిని తలవనైనా తలవరు సరికదా మరొకదానిని దేనినీ పొరపాటున కూడ ఇచ్చగించరు. మనువు వర్తనవంటి నడవడి కలవాడా! ఈ రీతిని విష్ణుదయను పొందిన తన కన్న కొడుకు ధ్రువుడు తిరిగివస్తున్నవార్తను ఉత్తానపాదుడు చారునివల్ల విన్నాడు. ఆ సమయంలో.
మనసులో ఇలా అనుకున్నాడు.

ప్రాణం పోయినవాళ్లు మళ్లీ తిరిగి రావడమా? అదే కాక ఇలాంటి వృత్తాంతాలు ఎక్కడన్నా జరిగి ఉంటాయా? ఎపుడూ మేలు ఎరుగనట్టి నాకు అంతటి శుభాలు వాటిల్లుతాయా? అని ఆలోచించాడు నమ్మకం కుదర లేదు. అయినా 'అతి తొందరలో నీ కుమారుడు తిరిగి రాగలడు' అన్న నారదముని మాటలు గుర్తుకు వచ్చాయి. ఆ మాటలమీద గురి ఏర్పడింది. కృతార్థత సమకూరిన వాడయ్యాడు.

తన కొడుకు వస్తున్నాడనే శుభవార్తను తెచ్చిన ఆ ఘనుడికి(చారుడికి) ధనాన్ని ముత్యాలపేరులను మనస్సు హర్షిల్లగా కానుకలుగా ఇచ్చాడు. తన పుత్రుణ్ణి చూడాలనే ఆనందంలో లోపల చుట్టుముట్టుగా

ధ్రువుడికై ఎదురు చూపులుచూస్తున్న ఉత్తానపాదుడు కొడుకును చూడాలనే ఉబలాటంతో ఉత్తమజాతి అశ్వాలను కట్టిన పసిడి తేరును ఎక్కాడు. కులవృద్దులు, బంధువర్గం, మంత్రులు దానిచుట్టువారు రాసాగారు. వేదమంత్ర ఘోషలు, శంఖం, బాకా, వేణువువంటి ఊదే వాద్యాల ధ్వనులు, మంగళ వాద్యాలమోతలు పిక్కటిల్లాయి. నగలు సింగారించుకుని పల్లకీలు ఎక్కివచ్చిన సునీతి, సురుచి, ఉత్తముడితో కూడ వెంటపోయారు. ఇలా అట్టహాసంతో ఆ పట్టణం పొలిమేరల్లో అంతా కలియగూడి వేగవంతంగా వెళుతూ నగర ఉద్యానవనం దరిగా వస్తున్న ధ్రువుణ్ణి చూసి ఆ రాజు స్వయంగా.

కొడుకును చూచి పొంగిన మమకారంతో ఉత్సహించి గబగబా రథం దిగాడు. విష్ణుపదసేవతో పాపాలన్ని పోగొట్టు కున్నవాడు, ఈశ్వరానుగ్రహంతో అన్ని కోరికలు తీరినవాడు తన కొడుకు అని పులకించి పోయాడు. ఆ ఆనంద పారవశ్యంలో

ఆ రాజు గట్టిగా కవుగలించుకున్నాడు. ముఖమంతా నిమిరాడు. తలను మూచూచాడు. గడ్డాన్ని చేతి మునివేళ్లతో పట్టుకున్నాడు. మోదించాడు. ఆ కన్నీటి ధారాపాతంలో ముంచెత్తాడు దీవించాడు. అప్పుడు శాశ్వత యశోవంతుడైన ఆ ధ్రువుడు

తండ్రి ఆశీస్సులు పదే పదే అందుకున్నాడు. ఆ సంతోషం పట్టలేకపోయాడు. కన్నతండ్రి అడుగులకు తన నొసలు అంటేటట్లుగా నమస్కరించాడు. తండ్రి సేవలో తన్మయుడై పోయాడు.

(ధ్రువుడు మునుపు తండ్రివలన పొందిన అవమానాన్ని స్మరింపకపోవటం గమనింపదగిన విషయం)

ఆవల మంచివాళ్లల్లో ముందటివాడైన ధ్రువుడు తల్లులిద్దరికీ వినమ్రుడై మొక్కాడు. సురుచికి వేరుగా నమస్కరించాడు. ఆమె కుమారుణ్ణి అలా చూసి పైకి ఎత్తి, నవ్వుతూ అక్కున చేర్చుకుంది

ఆ సురుచి సంతోషాతిరేకంవల్ల బొంగురుపోయిన గొంతుతో 'వందేళ్లు జీవించు' అంటూ దీవించింది. నీరు పల్లం వైపుకి ప్రసరించే విధాన ఆ భగవంతుడు వాత్సల్యంతో ఎవరిపట్ల మిత్రభావంతో ఉంటాడో, ఎవరిమీద దయ చూపి ప్రసన్నుడవుతాడో వాని పట్ల ఈ భూమిలోని సర్వ ప్రాణికోటి తనంతాతానే మిక్కిలి అనుకూలంగా వుంటుంది. అలాంటిదే సురుచిన్ని. ఆమె వెనకటి వృత్తాంతాన్ని తలవకనే ఆ ధ్రువుడి ఘనతపై ప్రీతి చూపింది. ఈ నేలమీది విష్ణుభక్తి నిండినవారు పరిశుద్దాత్ము లవడంవల్ల వాళ్లపై ఎవరూ కోపంతో ఉండరు.

ఉత్తముడూ, ధ్రువుడూ ఎంతో ప్రేమగా ఒకరినొకరు కౌగిలించుకొన్నారు. ఒంటి పులకరింతలతో; ఆనందబాష్పాలతో తడిసి ముద్దయిపోయారు. అంతలో సునీతి కూడ తన ప్రాణంలో ప్రాణమైన తన తనయుని అక్కున చేర్చుకుంది. ఆ తనుస్పర్శానుభూతితో ఎంతో ఆనందపడింది. వెనకటి బాధనంతా వెనక్కి పెట్టింది. ఆ సంతోషపు కన్నీటి ధారలతో తడిసిపోయిన ఆమె పాలిండ్ల స్తన్యమున్నూ కన్నీటితో కలసిపారింది.

ఆ నగర పౌరులందరూ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతూ ఆ ధ్రువుడి తల్లిని తృప్తికరంగా దర్శించారు. నీకు వాటిల్లిన ఇన్నాళ్ల దుఃఖాన్ని తొలగించినవాడు నీ కొడుకు. ఎక్కడికో ఏనాడో వెళ్లి, ఇంతవరకు కనపడని నీ కుమారుణ్ణి ఈ దినాన నీ పుణ్యం కొద్దీ తిరిగి పొందగల్గావు. ఈ ధ్రువుడు తన గొప్పమహిమతో ఈ భూభాగాన్నంతా పరిపాలిస్తాడు. ఆ తామరసాక్షుని స్మరించే గొప్ప గొప్ప యోగులు జయింప శక్యంకాని మృతిని సైతం జయించగల్గుతారు. అలాంటి వినయశీలుల పీడలను తీర్చే ఆ విష్ణుమూర్తిని కొలవగల్గడం నీ వల్లనే అయింది అనేది సత్యమైన మాట. అని నుతించారు. అలా పౌరజనంచే అనునయించబడ్డ ధ్రువుణ్ణి ఉత్తానపాదుడు ఉత్తముడితోపాటు గజారూఢుని చేశాడు. స్తోత్రపాఠాలు వింటూ మనస్సున గొప్పగా ఆనందపడుతూ తన రాజధానికి చేరుకున్నాడు.

ఆ నగరం బంగారు తాపడంగల ఇళ్ళ పైకప్పులు, అచ్చమైన గోడలు, తలవాకిళ్లు, అందమైనగోపురాలు, చక్కనైన ప్రాకారాలు కల్గి ఉంది. పళ్లు, పూలగుత్తులు వేలాడుతున్న అరటిబోదెలు, లేతపోకచెట్లు మొదలైన అలంకరణలతో విశేషంగా ఉంది. కర్పూరం, కస్తురి, చందనంవంటి పరిమళద్రవ్యాలు కలబోసిన నీళ్లతో ఒత్తుగా కలయంపి చల్లిన బాటలుగల అంగళ్లు కలిగి ఉంది. ప్రీతి పుట్టించే నవరత్నఖచిత రంగవల్లులతో ప్రతి ఇంటి ముంగిలి కళకళలాడుతున్నది. పుణ్యనదీజలంతో నిండిన మంగళ కలశాలతో ఒప్పుతూ ఉంది. బీయ్యం, సువర్ణపుష్పాలు, పేలాలు, యవలు/పసుపు కలిపిన బీయ్యం, పువ్వులు, పళ్సు, వంటి పూజోపహారాల సముచ్చయంతో విలసిల్లుతూ ఉంది. ఇలా అన్ని ప్రక్కలా అలంకరణలతో ఆ పట్టణం పండుగదనంతో చూడచక్కగా ఉంది.

పురంలోకి ప్రవేశించి రాచబాటలో వేంచేస్తూ ఉండగా అదే సమయంలో సింహాలవలె సన్నటి నడుములుగల ఆ నగర రమణులు మేడలపైన వరుసలుకట్టి నిల్చున్నారు. ఆ భగవద్భక్త పుంగవునిపై మెరుస్తున్న తెల్లఆవాలు, పళ్లు, అక్షతలు, పూలు, చల్లుతున్నారు. లేతగడ్డిపరకల కట్టలతో పెరుగు కలిపిన నీటిని చిలుకరిస్తున్నారు. ఆ చిలకరింపుల్లో వాళ్ల చేతుల బంగారు గాజుల ఝణ ఝణ ధ్వనులు ఇంపుగొల్పుతున్నాయి.

ఈ విధంగా వాత్సల్యంతో చల్లుతూ నిక్కమైన పలుకులతో ఆ స్త్రీలు ఆశీర్వాదం చేశారు. పసిడిపళ్లాల్లో సమకూర్చిన మణిదిపాలతో హారతులు పట్టారు. పట్టణప్రజలు, పల్లెలప్రజలు, స్నేహితులు, మంత్రులు, బంధువర్గం మొదలైన వాళ్లంతా చుట్టూ నడుస్తుండగా ధ్రువుడు రాజప్రాసాదానికి పోసాగాడు.

ఆ రాజభవనాలు, పచ్చలు తాపిన బంగారు గోడలతో; రత్నాలరాసుల గుట్టలతో మిలమిల లాడ్తున్నాయి. పాలనురుగులవలె తెల్లనైన, బంగారు పరికరాలతో కూర్చిన, విలువైన వస్త్రాలు పరచిన పరుపులు ఇంపుగా ఉన్నాయి. పూలతోటలు, 'చక్కటి కల్పవృక్షాలతో, చిలుకలు, కోకిలల కలరవాలతో, తుమ్మెదజంటల ఝుంకారాలతో అలరిస్తున్నాయి. దిగుడుబావులు, ఎంతో విలువైన వైడూర్యాలతో కూర్చిన మెట్లతో, తళతళమనే స్వచ్చమైన నీటితో నిండుగా ఉన్నాయి. కొలనులు, విరబూసిన ఎర్రకలువలతో, అప్పుడప్పుడే వికసిస్తున్న తామరపూలతో, తెల్లకలువలతోనూ, కొంగలు, జక్కవలు, రాజహంసలు, బెగ్గురులు, కణుజు పిట్టల కిలకిల నాదాలతో ఆహ్లాదింపచేస్తున్నాయి.

ఇంకా ముచ్చటగొల్పే రకరకాల వస్తువులతో నిండుగా ఉన్నట్టి, స్త్రీ పరిజనంతో కూడు కున్నట్టిది, పుష్కలత్వంలో అమిత ప్రీతిదాయకంగా ఒప్పి ఉన్నట్టిది, అయిన తన తండ్రి మందిరాన్ని సంతోషంగా స్వర్గంలో ప్రవేశించే దేవేంద్రుడి వలె ధ్రువుడు తన తండ్రి యింట ప్రవేశించాడు.

ధ్రువుడు అపరదేవేంద్రుడిలా జనకుని గృహంలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత రాజర్షియగు ఆ ఉత్తానపాదుడు కుమారుడి అద్భుతమైన మహిమను చెవులారా విన్నాడు. కళ్లారా చూచాడు. మనసులో ఎంతో విస్తుపోయాడు. ధ్రువుడికి ప్రజలపైగల మమకారం, ప్రజలకు ధ్రువుడిపట్ల అభిమానం, యువక ప్రాయం పూర్తిగా నిండినవాడునూ అయిన ధ్రువునికి యౌవరాజ్య పట్టాభిషేకం చేశాడు. వయస్సుపై బడ్డట్టుగా తనను తానే గమనించుకొని, ఆత్మ తత్త్వాన్ని తెలుసుకోవాలను కున్నాడు. విరాగియై అడవుల్లోకి వెళ్లిపోయాడు. ఆ తరువాత ఆ ధ్రువుడు శింశుమార ప్రజాపతి కూతురు 'భ్రమి'ని వివాహమాడాడు. ఆమెవల్ల కల్పుడు, వత్సరుడనే ఇద్దరు పుత్రుల్ని కన్నాడు. ఇంకా వాయుపుత్రిక అయిన 'ఇల' వల్ల 'ఉత్కలుడు' అనే పేరుగల కొడుకును, మిక్కిలి సాగసుగల కన్యకను పొందాడు. ఆ లోపల అవివాహితుడిగా ఉన్న తన సోదరుడు ఉత్తముడు వేటకై అడవికి వెళ్లి హిమవత్పర్వతం మీద ఒక యక్షునిచే చంపబడ్డాడు. ఆతడి తల్లికూడా ఆ కడుపుశోకంతో వనంలోకి వెళ్లి ఆ అడవిమంటల్లో చిక్కుకుని చనిపోయింది. ధ్రువుడు సోదరుడి చావువార్త విని రోషపడి ఓర్మిలేనివాడై ఆ దుఃఖంతో కలవరపడి పోయాడు. జైత్రం అనే రథం ఎక్కి ఉత్తరం వైపుకి వెళ్లాడు. హిమవత్పర్వత సానువుల్లోని అలకాపట్టణాన్ని చూశాడు. ఈ పట్టణం భూతగణాలతో కొలువబడుతుంది. యక్షులతో పరివ్యాప్తమై ఉంది. గొప్ప భుజ బలంగల ఆ ధ్రువుడు.

ధ్రువుండు కుబేరానుచరులైన గుహ్యకులతో యుద్ధము సేయుట

Speeches by Pritha regarding Dharma and Brahman - పృథుచక్రవర్తి సభాసదులకు సద్ధర్మముల నుపదేశించి బ్రాహ్మణ ప్రశంస సేయుట

పృథుచక్రవర్తి సభాసదులకు సద్ధర్మముల నుపదేశించి బ్రాహ్మణ ప్రశంస సేయుట అలా చెప్పి ఇంకా ఇలా అన్నాడు. ఇలా విశేషగుణసంపద గలిగి, దోషరహితమై, సత్పురుష...