Friday, April 3, 2026

The story of Yashodamma catching and punishing Balakrishna for breaking butter pots - యశోద దధిభాండ వికలనాదులు సేసిన కృష్ణుని బట్టుకొనుట

యశోద దధిభాండ వికలనాదులు సేసిన కృష్ణుని బట్టుకొనుట

యశోద శ్రీకృష్ణునిపై పాటలు పాడుతూ, పెరుగును చిలకడం ప్రారంభించింది. ఆమె గాన మాధుర్యానికి చెట్లు చిగురిస్తున్నాయి. పద్నినీజాతి స్త్రీ అయిన ఆమెఅరచేతులు ఎర్రతామరలవలె వున్నాయి. ఆ ఎర్రనికాంతులు కవ్వం తాడును పగడపు తీగలా చేస్తున్నాయి. తాడును కుడిచేత్తో ఎడమచేతో క్రమంలో లాగుతూవుంటే ఆమె స్తనాలు విడివడి, ఒకదానితో ఒకటి ఒరుసుకుంటున్నాయి. అలా చేయడంతో ఆమె ఎదపై, స్తనాలపైనున్న పై కొంగు తొలగిపోవడంతో మెడలోనున్న హారాలన్నీ చిక్కుపడి బయటపడ్డాయి. చిలకడం అనే శ్రమవల్ల చిరుచెమట బిందువులతో ఒప్పే ఆమెముఖం మంచు బిందువులు చిందిన తామరపూవుకన్నా మనోహరంగా ఉంది. సన్ననినడుము కదలాడగా, గాజుల గలగలలతో, కొప్పువదులు కాగా, చెవిఆభరణాల కాంతులు ఒప్పగా, పాడుతూ యశోద పెరుగు చిలుకుతోంది.

అలా యశోద పెరుగు చిలుకుతూ వుండగా, బాలకృష్ణుడు తిరుగుతూ, లేచిపడుతూ, చిన్నగా మూలుగుతూ కోపంతో నిందిస్తూ, అల్లరి చేస్తూ యశోదతో 'అమ్మా' రా! పాలివ్వమని పిల్లిగంతులు వేస్తూ పెరుగుతోవున్న కుండ దగ్గరకు వచ్చి కవ్వాన్ని పట్టుకున్నాడు.

అలా వచ్చిన బాలకృష్ణుణ్ణి కమలాలవంటి కన్నులుగల యశోద దగ్గరగా తీసుకుంది. తొడపై కూర్చోపెట్టుకుంది. పిల్లజుట్టును వ్రేళ్ళతో దువ్వుతూ స్తన్యాన్ని అందించగా ఆ బాలుడు తన మూతితో స్తనంపై పొడుస్తూ అమ్మపాలు తాగాడు.

అలా తన ఒళ్ళో కూర్చుని పాలు పూర్తిగా తాగని కృష్ణుణ్ణి యశోద ఓ పీటపై కూర్చోబెట్టి, పొయ్యిపై పాలు పొంగుతూవుంటే ఆ పాలను దింపడానికి వెళ్ళింది. దాంతో చిన్నికృష్ణుడు తనను పూర్తిగా పాలు తాగనివ్వలేదని ఎక్కువ కోపంతో ఒక పదునుగలరాయితో ఆ పెరుగుకుండను పగులగొట్టాడు. అంతేకాదు, ధైర్యంతో ఆ కుండలోని వెన్న తిన్నాడు. తాను చేసిన దానికి అమ్మ ఎక్కడ కొడుతుందో అని ముందుగానే లేని కన్నీళ్ళు తెచ్చుకొని ఏడుస్తున్నట్లు ఉన్నాడు.

తరువాత యశోద పొంగే పాలను దింపి వచ్చేసరికి పెరుగుకుండ పగిలిపోయి, కుండపెంకులు కనబడ్డాయి. అలా అల్లరి చిన్ని కృష్ణుడు కోపంతో కుండ పగులగొట్టి వెన్న తిన్నాడనుకొన్నదై నవ్వుతూ చూస్తే అక్కడ కృష్ణుడు కనబడలేదు. దాంతో అతడికోసం అలా వెళ్ళి వెళ్ళి

యశోద బాలకృష్ణుణ్ణి వెదుకుతూ వెళ్తే మరో ఇంట్లో రోలును తిరగవేసి ఎక్కి ఉట్టిపైనున్న వెన్నకుండను అందుకుని, ఒక పక్కభయం నటిస్తూ ఆ వెన్నను ఒక కోతికి తినిపిస్తున్న చిన్నికృష్ణుణ్ణి చూచింది.

కృష్ణుని అలా చూచి ఓ నా కుమారా! అంటూ యశోద బెత్తం చేతపట్టుకొని 'నీ వింతవరకు ఎవరిచేతికీ చిక్కలేదు. ఏ రకమైన శిక్షను పొందలేదు ఎక్కడా ఎవరిచేతా అడ్డగింపబడలేదు. భయాన్ని గాని భ్రాంతిని గాని పొందలేదు. ఇలా అనుకొని నీవు నన్ను లక్ష్యపెట్టడంలేదు. కానీ ఈ రోజుమాత్రం అలా కుదరదు'.

అలా చిన్ని కృష్ణుణ్ణి బెత్తం పట్టుకుని భయపెడుతూ, కొడుకుప్రవర్తననుగూర్చి ఆలోచిస్తూ, సన్నని నడుము గల ఆ యశోద తన మనస్సులో

ఆ అల్లరి కృష్ణుణ్ణి చూచి, ఇలా పరిపరివిధాల భావిస్తోంది. ఇతడు చిన్న పిల్లవాడు అనుకుందునా పెద్దవారెవరూ చేయలేని పని వీడిది. పోనీ భయమంటే తెలిసేలా భయ పెడదామా అంటే లేక లేక పుట్టిన ఒక్క బిడ్డడే వీడు. ఇంకొకడు లేడు. భయపెట్టి మంచి బుద్ది కలిగేలా నాలుగు మాటలు చెబుదామా అంటే తనంత తానే బుద్ధి తప్పకుండా ఉన్నట్లుంటాడు. ఏమీ తెలియనివానిలా ఇంట్లోనే వుంటాడా అంటే తాను ప్రవేశించని చోటేలేదు. తనను గురించి ఎవరైనా తెలుసుకున్నారని పారిపోవాలనే ఆలోచనా లేదు. ఏ రకమైన భయం ఎరుగడు. అలాగని ఊరకనే కూర్చోడు. అందరితో ఎత్తిపొడుపు మాటలు, వంకరమాటలు మాట్లాడతాడు. వీణ్ణి పట్టుకొని ఎలా శిక్షించాలో అర్థం కావడంలేదు.

పైన చెప్పిన విధంగా, అన్ని విధాలా ఆలోచించి

పిల్లలను ముద్దు చేయడంవల్ల ఎన్నో అనర్థాలు ఏర్పడతాయి. వాళ్ళను శిక్షించేలా కొట్టడంవంటివి చేస్తేనే వాళ్ళకు క్రమంగా మంచి జరుగుతుంది. కాబట్టి ఆలోచించి చూస్తే పిల్లల్ని కొట్టడంవంటిదే మేలు చేస్తుంది. అదే వాళ్లకు హితమైన పద్దతి.

ఎప్పుడైతే యశోద బాలుణ్ణి దండించడమే మంచిదని నిశ్చయించుకొని తన చేతిలోవున్న బెత్తాన్ని ఒక్కసారి విదిల్చి, ఓరి బాలుడా! ఆగాగు, అక్కడే వుండు అంటూ భగ్గుమన్న కోపంతో బెదిరిస్తూ బాలుణ్ణి సమీపించేసరికి, కృష్ణుడు అంతవరకూ తాను చేస్తున్న చేష్టలన్నీ వీడి, భయపడ్డవాడిలా రోలుమీదినుండి కిందికురికి

ఎప్పుడైతే యశోద బాలకృష్ణా! ఆగు ఆగుమంటూ బెత్తం ఝళిపించి వచ్చిందో వెంటనే చిన్నికృష్ణుడు కాలిగజ్జెలు ఘల్లు ఘల్లుమంటుండగా, అక్కడ చిందులేయడం మాని, చుట్టూ ఉన్న గోపకాంతలు నవ్వుతూ ఉంటే, తల్లి యశోద అతడి వెంటే

అలా కృష్ణుడు పరుగెడుతూ ఉండగా యశోద అతని వెంట వెళ్తూవుంటే

పరిగెడుతున్న కృష్ణుణ్ణి యశోద వెంబడిస్తూ ముంగిలిలో తాను తిరుగుతోంది. ఆ సమయంలో పాలిండ్ల బరువుచేత అలసి, సంకోచించిన సన్నని నడుము కదలాడుతున్నది. పరుగెత్తిన అలసటవల్ల చెమటపట్టింది. కొప్పు కదలాడుతూవుంది, పైటజారిపోతున్నది. ఎంతో గొప్పవారైన యోగీశ్వరులమనస్సులుకూడా వెంబడించి పట్టుకోలేని ఆ లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణుణ్ణి పట్టుకునే ప్రయత్నంతో యశోద తిరుగాడుతోంది. ఏమి అదృష్టం!!

ఈ రీతిగా కృష్ణుణ్ణి పట్టుకోవడానికి వెంట వెళ్ళి

యశోద కృష్ణుణ్ణి వెంబడిస్తూవుంటే తప్పించుకుంటున్న కృష్ణునికి అక్కడి స్తంభాదులు అడ్డుగా ఉంటే, వాటిమధ్యలో అటూ ఇటూ తిరుగుతూ పట్టుకోవడానికి వీలివ్వడంలేదు. ఈ ఒక్క తప్పు క్షమించమ్మా! ఇంకెప్పుడూ దొంగతనం చేయనంటూ తనను పట్టుకోకుండానే ఏడుపు ప్రారంభించాడు. కళ్ళకు పెట్టిన కాటుక ముఖమంతా అయ్యేటట్లు కళ్ళు నలుపుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. అమ్మ ఎటు వైపునుండి వచ్చి పట్టుకుంటుందో అని పదే పదే తప్పించుకుంటూ, దాగుతూ, ఓరగంట చూస్తున్నాడు. చివరకు యశోద అతనితో కూడా పరుగెత్తి పట్టుకొని, భయపెడుతూ మా చిన్న వెన్న దొంగ దొరికిపోయాడంటూ, కోపంతో కొట్టడానికి చేతులురాక, ఆమె బాలకృష్ణుణ్ణి కట్టేద్దామని భావించి

కృష్ణుణ్ణి పరిహాసం చేస్తూ యశోద ఎత్తిపొడుపుగా ఆడుతున్నమాటలు. ఎవరండీ ఈ పెద్దమనిషి? శ్రీకృష్ణమూర్తి గారేనా? పాపం వీరికి వెన్నంటే తెలియదట. ఎప్పుడూ చూడలేదట. అంతేకాదు, దొంగతనం అనేది కొంచెమైనా తెలియని వారట! లోకంలో ఇంతటి నియమవ్రతులు ఎక్కడైనా ఉన్నారా?

ఓ నా చిన్ని కృష్ణా! పట్టుకుందామన్నా పట్టుటకు దొరకని నిన్ను, పట్టుకుని తీరుతాను అని పట్టుదలగా ప్రయత్నిస్తే నిన్ను పట్టుకోవడం అదేమైనా పెద్ద ఘనకార్యమా! కాదు. నీవు ఎవరికినీ పట్టుబడవు అంటారు. అట్టి నిన్ను పట్టుకోవడం నాకు తప్ప ఇంకెవరికీ సాధ్యం కాదు.

యశోద తనకు పట్టుబడిన చిన్ని కృష్ణునితో, ఓ నా బిడ్డా! నీకు ఒక చోటంటూలేదు! ఎక్కడ పడితే అక్కడ తిరుగుతావు! ఒక చోటంటూ, ఎక్కడా మంచి గుణాలు కలిగి ఉండవు కదా! నీకు నియమం, పద్ధతి ఎక్కడుంది? నీ సంగతి గనుక మరచిపోతే ఎలా పడితే అలా అనేకమార్గాలలో తిరుగుతూ పోతావు. (విష్ణువే కృష్ణుడు కనుక అన్ని మార్గాలలో, అంతటా తానే ఉంటాడు)

ఓ నా కృష్ణా! నీళ్ళంటే భయంలేకుండా అందులో దిగుతావు. కొండనైనా, బండనైనా ఎత్తడానికి చూస్తావు. మట్టితో ఆడుకుంటూ, ఒంటిపై పోసుకుంటావు. పెద్ద పెద్ద స్తంభాలను కదిపేలా ప్రయత్నిస్తావు. ఇతరులనుండి స్వల్పమైన వస్తువును యాచిస్తావు. రాచవారిలా వేటంటూ చేసి మాటపడతావు. ప్రవహించే నీటికి అడ్డుకట్ట వేద్దామనుకుంటావు, నాగలిని రోకలిలాంటిదాన్ని పట్టుకొని సేద్యం చేద్దామనుకుంటావు. కట్టుకోడానికి వస్త్రాన్నడుగకుండా దిగంబరంగా తిరుగుతావు. ఇంకా ఇట్టి నేర్పరితనంతో కూడిన చేష్టలు ఎన్ని చేస్తావో? నిన్ను నేను లొంగదీసుకోవడంలో అసమర్థురాలనని గుర్తించావేమో! ఇలా కిందా మీదా తెలియక ప్రవర్తిస్తున్నావు.

ఉలూఖలబంధన యమళార్జున భంజనాద్యభివర్ణనము

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

Yashodana Previous birth story - యశోదానందుల పూర్వజనృవృత్తాంతము

యశోదానందుల పూర్వజనృవృత్తాంతము

ఓ పరీక్షిన్మహారాజా! అష్టవసువులలో ముఖ్యుడైనవాడు ద్రోణుడు, అతని భార్య ధర. బ్రహ్మ వారిద్దరినీ భూలోకంలో జన్మించండి అంటే వారు బ్రహ్మతో మాకు భూలోకంలో విష్ణుభక్తితో శ్రీహరిని సేవించేలా అనుగ్రహిస్తేనే మేము భూలోకంలో పుడతాం అనగానే అలాగే అవుతుంది అని బ్రహ్మ చెప్పగా వారిద్దరూ నందయశోదలుగా జన్మించారు. విష్ణుమూర్తి బ్రహ్మామాట ప్రకారం గోకులంలో యశోదానందులను తల్లిదండ్రులుగా గౌరవిస్తూవుంటే, వారిద్దరూ ఎంతో ఆనందంతో ఒప్పారు - అని శుకమహర్షి యశోదానందుల పూర్వజన్మవృత్తాంతాన్ని పరీక్షిత్తుకు తెలియజేశాడు.

కృష్ణునినోటిలో విశ్వాన్ని చూచి ఆశ్చర్యపడి, కృష్ణుని మాయచే మరల సామాన్యయశోద రూపంలోనికి వచ్చిన యశోద ఒకనాడు తనఇంటివద్దగల యువతులందరూ వాళ్లకు నిర్దేశించిన పనులకు వెళ్ళిపోగా, వెంటనే పెరుగు చిలకాలనే భావంతో ఒక పెరుగు కుండను కుదురుగా వుంచి, అందులో మెరిసిపోయే మీగడ పెరుగును పోసి, పెరుగు చిలికేలా కవ్వాన్ని ఆ స్తంభానికి తాడుతో బిగించింది.

యశోద దధిభాండ వికలనాదులు సేసిన కృష్ణుని బట్టుకొనుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

Mridbhakshan Vishwarupa Demonstration Description - మృద్భక్షణ విశ్వరూప ప్రదర్శనాద్యభివర్ణనము

మృద్భక్షణ విశ్వరూప ప్రదర్శనాద్యభివర్ణనము

గోపకాంతలు తాను చేసిన పనులన్నీ తల్లితో చెప్పేసరికి భయపడిన చిన్ని కృష్ణుడు ఏమీ ఎరుగనట్లు ఎంతో శాంతమూర్తిలా సత్ప్రవర్తనతో సాధువులా, అమాయకునిలా, తనపై చెప్పినవన్నీ అసత్యాలన్నట్లు ఆశ్చర్యంతో నిశ్చేష్టుడైనవాడిలా, మొహం పెట్టి, కేవలం తల్లిని తప్ప మరేవిధమైన విషయం తెలియనివాడిలా అమ్మవక్షఃస్థలం పై తలపెట్టుకొని ఆడుకుంటూ ఉన్నాడు.

ఒక రోజు బలరాముడు, మరికొంతమంది గోపబాలురు కృష్ణుడు మన్ను తిన్నాడని యశోదతో చెప్పగా ఆమె కృష్ణుని చెయ్యిపట్టుకొని ఇలా అంటోంది.

యశోద కృష్ణుణ్ణి చేరదీసి, "నాన్నా! మన్నెందుకురా తింటావు? నే చెప్పినవన్నీ ఎందుకు పాటించవు? మీ అన్నయ్య, మీ చెలికాండ్రు వచ్చి నువ్వు మన్ను తిన్నావని చెప్పారు. మన్నెందుకురా తినడం! తినడానికి మనింట వేరే వస్తువులు లేవా?" అంటూ అడిగింది.

ఎంతో అమాయకంగా ఓ సామాన్యస్త్రీలా, మన్నెందుకు తిన్నావని అడిగిన తల్లి అయిన యశోదతో నేర్పరితనంలో ఎంతో దిట్ట అయిన కృష్ణుడు ఇలా అంటున్నాడు.

అమ్మా! మన్ను తినడానికి నేనేమైనా పసివాడినా? మరి నేనేమైనా ఆకలితో వున్నానా? లేదా తెలివిలేనివాడనా? అన్నయ్య, ఈ గోపబాలురు నీతో చెప్పిన ఈ మాటలను నమ్మకమ్మా! నన్ను నీవు కొట్టాలని వాళ్లలా చెప్పారు. ఒకవేళనా మాట నమ్మకపోతే నా నోరు వాసన చూడమ్మా! అప్పుడు నేననింది తప్పైతే తప్పకుండా శిక్షించవచ్చు.

పయి రీతిని అమ్మతో అని, ఆమెకు తనపై ప్రేమ పుట్టేలా మెల్లగా తల్లిని తానన్నమాట నిజమని నమ్మేలా చేసి, సామాన్య మనిషిలా కాకుండా, లోక కల్యాణార్థం విలాసంగా, చిన్ని కృష్ణుడుగా పుట్టిన ఆ కృష్ణపరమాత్మ తల్లికి తన నోరు తెరచి ముఖాన్ని చూపగానే

తల్లితో తననోరు చూడమని చెప్పగా చూసిన యశోద ఆ బాలకృష్ణుని నోట్లో కొండలు, అడవులు, భూగోళం, అగ్ని సూర్యచంద్రులు, అష్టదిక్పాలకులు ఇలా అన్నింటికి ఆధారమైన ఒక బరణి పెట్టెలావుండే బ్రహ్మాండ స్పరూపాన్నంతా దర్శించింది.

చిన్నికృష్ణుని నోట్లో బ్రహ్మాండాన్ని చూచిన యశోద పరిపరివిధాల ఆలోచనలకు గురి అయింది. నేనేమైనా కలగన్నానా? లేదా ఇది విష్ణమాయా? మరి ఇందులో వేరే సంకల్పాలవల్ల ఏర్పడిన విషయమైందేదైనా ఉందా? నిజమేనా? ఇదీ అని ఊహించలేక పోతున్నాను. అసలు నేను యశోదనేనా? ఇది మేమున్న ప్రదేశంకాక వేరే చోటా? ఈ పసిబాలుడెంతటివాడు? ఇతనిముఖంలో కన్పించి, ప్రకాశిస్తున్న బ్రహ్మాండం ఉండడానికి కారణం ఏమో ఆలోచిస్తూవుంటే ఆశ్చర్యంగా ఉంది.

సామాన్యమైన గోపబాలుడుగా లీలారూపంలో ఉండే ఇతనిముఖంలో సమస్త చరాచర ప్రపంచం ఎలా ఇమిడి ఉంటుంది? కాబట్టి ఇతడు పసివాడులా కనబడుతున్నాడు కానీ విశాల విశ్వాన్నంతటినీ తనలో ఇముడ్చుకున్న పురాణ పురుషుడైన విష్ణుమూర్తి అయి ఉంటాడు. ఇదే వాస్తవం!

ఏ మహిమగలవానిచే ఈ విశాలవిశ్వం కన్నించి, నా బుద్ధి భ్రమించిందో అట్టి సకల లోకాధారుడైన, మహా మహిమాన్వితుడైన, విశ్వవ్యాపకుడైన, ఆ విష్ణుమూర్తినే నా బాధలన్నీ పోవడానికి ఆశ్రయిస్తాను, సేవిస్తాను.

నేనూ, నాతో పాటు నా పెనిమిటి, ఆవులు, గొల్లపల్లె, గోపాలకులు అందరూ ఈ చిన్న బాలుని అందమైన ముఖాన్ని చూస్తూ, అసలు విషయం తెలుసుకోలేక మోహంలో పడ్డాము కానీ మాకు ఇతడే ప్రభువు!

అలా యశోద యథార్థం గుర్తించి, చిన్నికృష్ణుణ్ణి జగన్నాటక సూత్రధారియెన శ్రీ మహావిష్ణువుగా ఎప్పుడైతే భావించిందో, అందులోంచి ఆమెను మళ్లీ సామాన్యలోకంలోకి మళ్ళించడానికి మళ్లీ వైష్ణవమాయను ప్రసరింపజేయగా

పరీక్షిన్మహారాజా! యశోద జడత్వం పొంది, జ్ఞానం కోల్పోయి విశ్వాధారుడు అతడని చెప్పక, ఆ కృష్ణుణ్ణి తన చిన్న కొడుకే అంటూ తొడపై కూర్చోపెట్టుకొని, ఎంతో కుతూహలంతో ముద్దులాడింది.

అని చెప్పగా పరీక్షిత్తు ఇలా అన్నాడు.

నిత్యానందాన్ని అనుభవించే శుకమహర్షీ! విశ్వాధారుడైన ఈ విష్ణుమూర్తికి తన చనుబాలిచ్చే తల్లిగా యశోద ఎలాంటి పుణ్యవ్రతాలు ఆచరించిందో! అలాగే ఆ కృష్ణుణ్ణి పోషించి పెద్దజేసేతండ్రిగా ఈ నందుడు ఏ తపస్సు చేశాడో!

ఓ మహర్షీ! లోకంలో ఆ విష్ణుభక్తితో శ్రీహరిపై కవులు కావ్యరచనలు చేసి, మోక్షలక్ష్మీ కటాక్షానికి పాత్రులవుతారట! మరి అట్టి శ్రీహరిని పోషించే తల్లిదండ్రులుగావున్న ఈ యశోదానందులకు ఇంకెంతటి మహోన్నత స్థితి కలుగుతుందో కదా?

యశోదానందుల పూర్వజనృవృత్తాంతము

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

Gopikas complained to Yashoda about Krishna's mischievous acts - గోపికలు శ్రీకృష్ణుని దుడుకు జేతలు యశోదా దేవితో జెప్పుట

గోపికలు శ్రీకృష్ణుని దుడుకు జేతలు యశోదా దేవితో జెప్పుట

ఓ యశోదమ్మా! మా ఇళ్ళలోని బాలింతలు తమ బిడ్డలకు పాలు లేవు కాబట్టి కృష్ణునితో దూడలను ఆవుల వద్దకు వదిలిపెట్టొద్దు అని గోల పెట్టినా వినకుండా పకవకా నవ్వి వాళ్ళను పరిహసిస్తూ, ఆవులవద్దకు దూడలను వదిలిపెట్టాడమ్మా!

తల్లీ! యశోదా! ఈ నీ కొడుకు మేము మా ఇండ్లలోని, కుండలలో చక్కగా మరగపెట్టి ఉంచిన పాలను తనతో ఉండే గోపబాలురందరకూ తాగడానికి పోసి, పోయగా మిగిలిన పాలనైనా ఉంచాడా అంటే అలా కాకుండా ఆ కుండలను పగలగొట్టి పోయాడమ్మా!; ఇలా చేస్తే అతణ్ణి దండిస్తావో! లేదో!

యశోదమ్మా! మీ చిన్ని కృష్ణుడు మా ఇండ్లలోకి పాలకోసం వచ్చి, తృప్తితీర పాలు తాగడానికి పాలు కనబడకుంటే కోపంతో మా పసిపాపలను ఏడ్చేటట్లు కొట్టుకుంటూ వచ్చేశాడమ్మా!

నిన్నగాక మొన్న పుట్టాడో లేదో అపుడే దొంగతనాలు మొదలు పెట్టాడు. అవికూడ మామూలు దొంగతనాలుగా ఉన్నాయా? మా యింట్లో జొరబడి ఉట్టి అందకపోతే రోళ్ళు, పీటలు ఒకదానిమీద ఒకటి ఎక్కించి అందుకోవాలని ప్రయత్నించాడు. చేయి పెట్టడానికి వాడికి సాధ్యం కాలేదు. క్రిందనుంచే కుండకు పెద్ద చిల్లిపెట్టి, మీగడపాలు దోసిళ్ళతో పట్టి తాగాడు. ఇంత సన్ననికడుపు గలదానవు. అంతపెద్ద పొట్టగల బిడ్డను ఎలా కన్నావమ్మా?

ఓ యశోదా! నీ కొడుకు ఆడుకోడానికి వెళ్ళి, ఇదిగో ఈ యింటివారి పెరుగంతా తాగి, చివరగా కొంచెం పెరుగును (పడుకునివున్న) ఆ యింటికోడలిమూతికి రాసిపోయాడు. అత్త కోడలిమూతిని చూచి, కోడలే పెరుగు తాగినదొంగ అంటూ ఆమెను కొట్టసాగింది.

నందుని ఇల్లాలైన ఓ యశోదా! నీ కొడుకు అదిగో వారింట్లో కుండల్లో నిండుగా ఉండే నేతిని తాగి, ఆ ఖాళీ నేతి కుండల్ని ఇదిగో వీరింట్లో ఉంచగా, వారే నేతిని దొంగిలించారని వీరికీ వారికీ పెద్ద తగాదా అయిందమ్మా!

ఓ యశోదమ్మా! మా ఇంటిగోడలపై మేము చిత్రించుకున్న దేవతల బొమ్మలు చూచి, వీళ్ళు దేవతలా? నా కన్నా వేరే దేవుడున్నాడా? అంటూ నవ్వుతూ, వేలుపుల చిత్రాలున్న మా గోడలపై ఎంగిలి ఉమ్మేశాడమ్మా!

చంద్రముఖీ! యశోదా! నీ కొడుకు మా యింట్లోకి వచ్చి వెన్న తింటూ వుంటే చూచి మా(కోడలుపిల్ల) చిన్నది ఇతడు పారిపోకుండా అడ్డంగా నిల్చుని, వాడిచేయిపట్టుకొని వెనక్కులాగగా, ఆ చిన్నదాని స్తనం పట్టుకొని గోటితో గీరాడమ్మా! ఇవి చిన్న పిల్లవాడు చేసే పనులా?

అమ్మా! నీ బిడ్డడు ఒకరింటిముందు తిరుగాడుతుంటే చూచి, ఆ ఇంటి యిల్లాలు పిలిచి బాబూ! నీ పేరేమిటి? అని అడిగింది. వెంటనే నీ కొడుకు ఎర్రనైన ఆమెపెదవిని కొరికి కాటు చేసి, వేగంగా పారిపోయాడు. ఇది చిన్న పిల్లవాడు చేసే పనంటావా? నీ బిడ్డడు చిన్నవాడంటావా? చెప్పవమ్మా.

ఓ యశోదా! నీ కొడుకు తనచేతిలో వున్న బంతి ఎగిరి మా ఇంట్లో పడిందంటూ మా ఇంట్లోకి వచ్చాడు. మా పెరట్లో స్నానం చేస్తున్న మా ఆడుబిడ్డ పక్కన పెట్టిన వస్త్రాన్ని పట్టుకొనిపోయాడు. ఇలాంటి పనులు ఏమైనా బాగున్నాయా?

ఓ యశోదా! ఈ చిన్నిబిడ్డడు ఇదిగో ఈ స్త్రీని చూచి - నిన్ను దొంగిలించి బాగా తీసుకొని పారిపోతాను నాతో వస్తావా? అని అడిగాడట. ఎక్కడైనా ఇటువంటి వింత ఉందా?

ఓ యశోదమ్మా! ఈ వింత విను. ఓ ఇల్లాలు తనకు పిల్లలు లేరని బాధపడుతూవుంటే నీ కొడుకు ఆమెతో తనను మగనిగా చేసుకొంటే పిల్లలు పుడతారంటూ ఆమె మీద పడ్డాడు. ఇటువంటివి నీ కొడుకు కృష్ణునివంటి పసిపిల్లవాడు చేసే పనులా? చూడు.

ఓ హరిణాక్షీ! యశోదా! నీ కొడుకుతో ఓ యువతి “నేను బహిష్ఠను నన్ను తాకకూడదు - దూరంగా పో బాబూ" అంటే ఆమె సిగ్గుతో చితికిపోయేలా, నీవు బహిష్ఠు అయిన చోటేది? అంటూ కొంటెగా తల ఊపాడు. ఇదేమైనా న్యాయంగా ఉందా తల్లీ?

(భగవంతుని విషయంలో స్పృశ్య, అస్పృశ్యతలకు తావులేదు. అతనికీ అన్నీ పవిత్రమైనవే!)

పూర్ణబింబంవంటి ముఖంగల ఓ యశోదా! నీ కొడుకు ఒక ఇల్లాలి వడిలో పడడానికి రాగా, ఆమె "నేను గర్భవతిని. దూరంగా పో బాబూ" అంది. అప్పుడు నీ బిడ్డడు గర్భం రావడానికి కారణం ఏమిటో చెప్పమన్నాడు. ఏ ఇల్లాలైనా చెప్పగలదా! తల్లీ?

యశోదమ్మా! మా భర్తలు కొంచెం దూరంగా వెళ్ళడం చూచి, నీ కొడుకు మాతో రహస్యంగా మాట్లాడేలా పిలిచి మా పొందును కోరాడు. ఏ లోకంలోనైనా పూర్వం ఇట్టి బిడ్డడున్నట్లు తెలిసిందా?

ఓ యశోదమ్మా! కృష్ణునితో ఆడుతూ పాడుతూ, మన కృష్ణుడే కదా అని నమ్మకంతో నా బిడ్డ నిద్రపోతే అతడి జుట్టును దూడతోకతో ముడివేసి, వీథులలో దూడను తోలాడమ్మా! నా బిడ్డది ఎంత బాధ! మా రేపల్లెకు రాజైన నందుని కుమారుడైనంత మాత్రాన ఇలాంటి చేష్టలు తగునా?

తీగెవలె చక్కనిశరీరంతో ఒప్పే ఓ యశోదా! నీ కొడుకు నా కొడుక్కు పొట్టనిండిపోగా పైకి వచ్చేటంతగా బానెడు వెన్నముద్దలు పట్టించాడు. నా బిడ్డకు ఊపిరాడడం లేదు. ఏమైనా జరిగితే దానికి నీవే బాధ్యత వహించాలిసుమా!

యశోదా! ఒక స్త్రీ నిద్రపోతూవుంటే ఆమె వస్త్రాన్ని విప్పి, ఒక పెద్ద తేలుతో కరిపించాడు. ఆమె బాధతో వివస్త్రగా పరిగెడుతూవుంటే, నీ కొడుకు పక పక నవ్వాడు. ఇదేమైనా బాగుందా? (బాగులేదు)

గుణవతిగా పేరు గాంచిన ఓ యశోదా! నా కొడుకూ, కోడలూ ఇంట్లో ఏకాంతంగా సుఖిస్తూవుంటే నీ కొడుకు వారిద్దరి మధ్యలో ఒక పామును తెచ్చి పడవేశాడు. దాంతో భయపడి వారిద్దరూ ఒంటిమీద బట్టలు లేవనే సంగతి కూడా మరచి పరిగెడుతూ ఉంటే - నీ బిడ్డడు నవ్వుతూ కేకలు వేశాడు. ఇదేమైనా మంచిపనా తల్లీ?

ఓ యశోదా! ఒక గోపకాంత కుండలో పెరుగు చిలికి, ముందుకు వంగి వెన్న తీస్తూవుంటే, పక్కన పొంచి ఉన్న నీ కొడుకు ఆమె వెనుక చేరి శృంగారపరమైన మగవారు చేసే చేష్టలు చేయసాగాడు. ఇట్టి నీ కొడుకును చక్కదిద్దుకోవడం నీకు ఉచితం గదా!

ఓ యశోదమ్మా! మా వాడలో వున్న గోపకాంతల మందరం కూడుకొని, నీ బిడ్డ వస్తాడేమో నని పాలు, పెరుగు అంతటినీ మా ఇండ్లలోపల పెట్టి, ఆ గదులకు తాళాలు వేసి, వాటిపైన గుర్తులు పెట్టి, తాను వచ్చే దారివైపే చూస్తూ ఉన్నాం. ఎలా వచ్చాడో తెలియదుగాని, మేము వేసిన తాళాలు, ముద్రలు వేసినవి వేసినట్లే వున్నాయి. కానీ నీ బిడ్డడు ఒక ఇంటిలో ఆడుతూ, మరో ఇంటిలో పాడుతూ, ఇంకోచోట నవ్వుతూ, మరోచోట తిడుతూ, ఇంకోచోట వెక్కిరిస్తూ, ఇంకో ఇంటిలో జంతువుల్లా, పక్షుల్లా ధ్వనులు చేస్తూ, ఇలా చేసి చేసి ఎలా వెళ్ళిపోతాడో తెలియదు, కనబడడు. తీరా మేము లోపలికి వెళ్ళిచూస్తే మా ఇండ్లలో పాలు, పెరుగులేని ఖాళీ కుండలే ఉంటాయి.

ఓ చంద్ర బింబంవంటి మోముతో ఒప్పే యశోదా! నీ వంటి రాచకాంతలకు మిక్కిలి సంపదవుంటే, మంచి మంచి పదార్థాలను తినవచ్చు, ఖరీదైన వస్త్రాలను కట్టుకోవచ్చు. కానీ పరిహాసంగా ఎక్కడైనా తమ బిడ్డలను పేదవారిఇండ్లపై పడి, బాధించండని విడిచిపెడతారా!

ఓ యశోదతల్లీ! నీ బిడ్డడు మా ఇండ్లలో పాలు పెరుగు ఉండనివ్వడం లేదు. మా అన్నలయొక్క గోవులమీద సాక్షిగా ఒట్టుపెట్టి చెపుతున్నామమ్మా! మేము వేరే ఎక్కడికైనా పోతాము.

ఈ విధంగా చిన్ని కృష్ణుని కొంటె చేష్టలన్నింటినీ రకరకాలుగా వివరిస్తున్నారు - గోపకాంతలు. అవన్నీ తమపై చూపే మహాప్రసాదాలని తెలుసుకోలేక నిందాపూర్వకంగా చెపుతున్నవారితో యశోద ఇలా అనింది.

ఓ గోపకాంతలారా! నా ఈ చిన్ని కృష్ణుడు నా ఒళ్లో ఉండి పాలుతాగడం మాని ఎక్కడికీ వెళ్ళడంలేదు. అసలు మా ఇల్లు తప్ప - ఇరుగు పొరుగు ఇండ్లకు దారే తెలియదు - వాడికి. అంతేకాదు, ఇప్పటికీ ఇంకా కండ్లు పూర్తిగా విప్పని ఇంత చిన్నబాలుణ్ణి పట్టుకుని వీనిపై నిందలు మోపడం మీకు తగునా? (తగదని భావం.)

ముల్లోకాలలో అందమైన గోపవనితలారా!, చక్కనిగుణములుగల ఆడువారిలో శ్రేష్ఠలారా! ఈ నా చిన్ని కృష్ణుడు తనంతట తానేదో కూర్చుని ఆడుకుంటాడే తప్ప - ఇతర విషయాలేమీ తెలియనివాడమ్మా! మావాడని కాదుకానీ, ఇతడెంతో మంచి బాలుడమ్మా! ఎందుకు అనవసరంగా ఈ నా బిడ్డడిపై నిందలు మోపుతూ రచ్చ చేస్తారు? ఇది మానండమ్మా!

తన చిన్నికృష్ణునిపై నిందలువేస్తూ వచ్చిన ఆ గోపకాంతలకు యశోద నచ్చచెప్పి, వాళ్లను సమాధానపరచి పంపివేసింది. కానీ కొడుకుమీదమాత్రం కోపించలేకపోయింది. ఈ విధంగా

మృద్భక్షణ విశ్వరూప ప్రదర్శనాద్యభివర్ణనము

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

Sri Krishna and Balarama’s childhood Plays Discription - శ్రీ కృష్ణబలరాముల బాల్యక్రీడాభివర్ణనము

శ్రీ కృష్ణబలరాముల బాల్యక్రీడాభివర్ణనము

బలరాముడు, శ్రీకృష్ణుడు బాల్య క్రీడలతో అందరినీ ఆనందపరుస్తున్నారు. పిల్లలు వచ్చీ రాని అడుగులు వేసుకుంటూ మోకాళ్లపై వచ్చి పడిపోతూ, మళ్లీ లేస్తూ అటూ ఇటూ తిరగడం, తల్లులపైటలు లాగిపట్టుకుని ఉయ్యాలలూగడం, ఆవుదూడలతోకలు పట్టుకొని అవి ముందుకు పరుగిడడంతో తోకలు వదలలేక వాటితోపాటు వీళ్లూ పరుగెత్తడం, అలా పరుగెత్తి బురదలో పడడం, తల్లులు ఎత్తుకొని చనుబాలిస్తున్నప్పుడు రెండుచేతులతో పాలిండ్లను తడుముతూ, మూతితో పొడుస్తూ, పాలు ఎక్కువగా చేపడంతో గుక్క గుక్కకూ తాగడం, వచ్చీ రాని ముద్దు మాటలాడుతూ చేతులను, పాదాలను అటూ ఇటూ తిప్పుతూ ఆడుకోవడం - ఇవన్నీ అంతటా చిన్న పిల్లలు చేసే చేష్టలే. బలరామకృష్ణులు కూడా అలాగే బాల్యచేష్టలుచేస్తూ చూసేవారికి ఆనందం కలిగిస్తున్నారు.

ఇలా వ్రేపల్లెలో బలరామశ్రీకృష్ణులు బాల్యచేష్టలు చేస్తూవుంటే పై లోకంలో వున్న రంభ ఊర్వశి మొదలగు అప్సరసలు ఆ బాలురచేష్టలకు ముచ్చటపడి వారూ తమకిష్టమైన నృత్యం చేయడం ప్రారంభించారు. ఇక శత్రువులు అప్పటికే పూతనాది రాక్షససంహారం చేసిన బాలునిగా శ్రీకృష్ణుణ్ణి గురించి వినడంవల్ల భయంతో తడబడ్డారు. మహర్షులు దుష్టశిక్షణం, శిష్టరక్షణం జరిగే సమయం ప్రారంభమయిందన్న సంతోషంతో వాళ్లలో వాళ్లు ఏకాంతంగా ముచ్చటించుకున్నారు.

చిన్నపిల్లలు బోర్లాపడుకొని తలలు పైకి నిలుపుతారు. అలా రామకృష్ణులు తలలు పైకెత్తి ఆదే సమయంలో ఆదిశేషుడు మొదలైన సర్పరాజులు పడగలెత్తినట్లు ఉన్నారు. ఏనుగులకు ఒంటిపై మట్టి జల్లుకోవడం సరదా. దానిని 'వప్రకీడ' అంటారు. అలాగే ఈ బాలురు శరీరానికి బురద అంటించుకోగా ఒళ్ళంతా మట్టి జల్లుకున్న పిల్లఏనుగుల్లా కనబడుతున్నారు. ఉత్సాహంతో ముందుకు ఉరుకుతూఉంటే సింహంపిల్లలు దూకుతున్న శోభను వహిస్తున్నారు. రోజు రోజుకూ ముఖకాంతులు పెరుగుతూవుంటే ఉదయిస్తున్న బాలసూర్యచంద్రులవలె ప్రకాశిస్తున్నారు. తల్లుల చనుబాలు తాగుతూ జోగుతూవుంటే ఎంతో సాధనచేసి మోక్షానందమనే అమృతం గ్రోలి పరవశిస్తున్న యోగీశ్వరులవలె ముచ్చట గొలుపుతున్నారు. ఇలా చూచే జనులందరికీ ఒక్కొక్కసమయంలో వారిచేష్టలనుబట్టి ఆయా రూపాలుగా రామకృష్ణులు కనబడుతూ చూపరులకు ఆనందం కలిగిస్తున్నారు.

తనవైపు చూడనివారిని ఎప్పుడూ తాను చూడకుండా, తనచూపులతో ముల్లోకాలనూ తిరిగేటట్లు చూచే ఆ బాలకృష్ణుడు తనను చూస్తున్నవారిని క్రమంగా గుర్తుపట్టడం ప్రారంభించాడు. (ఇక్కడి నుండి కేవలం బాలకృష్ణుని రూపాన్ని చేష్టలను వర్ణిస్తున్నాడు పోతన. ఒక వైపు పరమాత్మతత్త్వం, ఒక వైపు సామాన్య బాలకుల లక్షణాన్ని చూపుతున్నాడు. విష్ణువు తన నెవరైతే భావిస్తారో వాళ్లకు సులభుడు. అలా కానివారికి ఆయన కానరాడు)

బాలకృష్ణుడు లీలామానుష విగ్రహుడు. ఆయన నవ్వితే జ్ఞానం ప్రకాశించి, అజ్ఞానం పటాపంచలైపోతుంది. అట్టి బాలకుడు తన వద్దకు వచ్చి నవ్వుతున్న ముఖాలుగల గోపకాంతల్ని చూచి తానూ నవ్వసాగాడు.

త్రిమూర్తులకు అతీతంగా ఉండే శ్రీమన్నారాయణుడు జన్మలు లేనివాడు గనుక “అమ్మ” అంటూ ఆయన కెవరూ లేరు. ఆ పరమపురుషు డిప్పుడు బాలకుడై తన అమ్మలకు ఆనందం కలిగేటట్లు “అమ్మా” “అమ్మా” అని పిలవడం నేర్చుకున్నాడు.

సహస్రాక్షుడైన పరమాత్ముడు సహస్రపాదుడు కూడా. అట్టివేయి అడుగుల శ్రీమహావిష్ణువు వామనావతారంలో ఒక అడుగుతో భూలోకాన్ని మరో అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించాడు. అతడే బాలకృష్ణుడై అడుగులు వేయటం ప్రారంభించడంతో, వామనునిమూడవపాదంతో బలి పాతాళానికేగినట్లు ఇప్పుడు శత్రువులు కూడా నేలకూలి పాతాళానికి వెళ్తున్నారు.

అంతేకాదు, బాలకృష్ణునిఒంటికి పట్టిన దుమ్ముతోపాటు, పెట్టిన అలంకారాలు అన్నీ అతనిలో శివస్వరూపాన్నికూడా స్పురింపజేస్తున్నాయి. శరీరాని కంటిన నేలధూళి శివునిశరీరంపై నిండిన విభూతిలాగా తల్లి బాలుని ముంగురులెత్తి పట్టి ఓ ముత్యాలహారాన్ని చుట్టగా, అది శివుని బాలచంద్రరేఖరూపం దాల్చగా, నుదుట పెట్టిన ఎర్రనితిలకం మన్మథుణ్ణి బూడిద చేసిన శివుని చిచ్చర కన్నులా ఉండగా; మెడలోనిహారం మధ్యలో నల్లగా ప్రకాశించే నాయకమణిగా వెలుగొందే నీలం శివునికంఠంమీది హాలాహలంమచ్చవలె కనబడగా; మెడలోని హారాలు శివుని సర్పభూషణాలుగా ప్రకాశించగా; బాలునిరూపంలో ఉన్న ఆ విష్ణుస్వరూపుడైన బాలుడు (కృష్ణుడు) తనకూ శివునికీ భేదం లేదని తెలియజేస్తున్నాడా అన్నట్లు శివస్వరూపంతో ప్రకాశించాడు.

బలరామకృష్ణుల విలాసచేష్టలను చూస్తూవుంటే ఆ గోపకాంతలకు ఎంతమధురంగా అనిపిస్తోందో! అందుకే ఏ రకమైన భయం, సంకోచం లేకుండా చేయవలసిన పనులన్నీ మరచి కేవలం ఆ బాలురనే చూస్తూ ఉండిపోయారు.

అప్పుడు బలరామకృష్ణుల తల్లులు చక్కని జాగ్రత్తలతో తమ బాలురను పెంచుతూ వచ్చారు. గోళ్ళు, కోరలు, కొమ్ములు, ఉన్న జంతువులనుండి, నీళ్ళు, నిప్పు, ముళ్ళు మొదలైన వానినుండి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తపడ్డారు. ఆయా ఋతువులకు తగినవిధంగా రక్షించుకుంటూ వస్తున్నారు. హృదయాలలో బాలకులపై ప్రేమానురాగాలు ఉప్పాంగిపోతూ ఉండగా ఆనందంగా కాలం గడపుతున్నారు. అంతలో

తన వయస్సే కలిగిన గోపాలబాలకులు కృష్ణుణ్ణి తమనాయకుడన్నట్లుగా భావిస్తూ కలసి మెలసి ఆడుకొంటూ ఉన్నారు. బలరామునితో కలసి చిన్నచిన్న అడుగులతో కృష్ణుడు తృప్తి పొందుతున్నాడు. అలా ఆడుతున్న కృష్ణుణ్ణి చూస్తూ గోపకాంతలు ఆనందిస్తూ ఉండగా అతడు నల్లనిశరీరకాంతితో ప్రకాశించాడు.

ఆ బాలకృష్ణుడు రోజురోజుకు ఆ ప్రాంతంలో తిరగడంలోను, మాట్లాడడంలోను సమర్థుడై

అల్లరి చేస్తున్న బాలకృష్ణునితో తల్లి అలా చేయవద్దని బెదిరిస్తే అలకతో దూరంగా పోతాడు. మళ్లీ తల్లి చేయిజాపి నా ముద్దుల బాబు వచ్చాడంటూ ప్రేమతో పిలిస్తే తల్లి దగ్గరకు వచ్చి, హత్తుకొని, మళ్ళీ ఎప్పటిలాగే అల్లరిచేస్తూ, మొలనున్న గంట చక్కగా శబ్దంచేస్తూ ఉంటే ఆనందంతో వచ్చి చిన్ని కృష్ణుడు చనుబాలు తాగుతాడు.

చిన్ని కృష్ణుడు గోపవనితల ఇళ్ళలోని వెన్నంతా మెక్కి ఏమి తెలియనివాడిలా అమ్మదగ్గరికి వచ్చి, అమ్మా! పాలివ్వమంటూ తల్లి చుట్టూ తిరుగుతాడు.

బాలకృష్ణుడు తన చుట్టూవున్న గోపబాలురతో ఆటలాడుతున్నప్పుడు వారితో 'నేను ఆబోతును మీరు ఆవులు' అంటూ పెద్దగా రంకెవేస్తూ, ఆబోతులా వంగి ఆడతాడు. 'నేను రాజును, మీరు సేవకులు. అందరూ ఇలా రండి రండంటూ తన అధికారాన్ని చూపుతూ పనులు పురమాయిస్తాడు. 'మీరు ఇంటివాళ్ళు, నేను దొంగను' అని వాళ్లందరినీ నిద్రపోయేట్లుగా చేసి వాళ్ళనగలు దొంగిలించి దాక్కుంటాడు. 'నేను మీ అందర్నీ నడిపేవాడను, మీరు నేను చెప్పినట్లుగా నడిచేవారం' టూ వారందరినీ ఆటాడిస్తాడు. మూలమూలలకు వెళ్తాడు. దాగుడు మూతలాడతాడు. ఉయ్యాల లూగుతాడు, బంతులతో ఆడతాడు, జారులరూపంతో, దొంగల రూపంతో అంతటా తిరుగుతాడు.

అలా కృష్ణుడు మాయారూపంతో ఉండినబాల్యంలో జారుడులాగా, దొంగలాగా ఆడుతూ ఉంటే గొల్లభామలు అతని ఆగడాలను సహించలేక యశోదతో ఇలా అన్నారు.

గోపికలు శ్రీకృష్ణుని దుడుకు జేతలు యశోదా దేవితో జెప్పుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

The demon Trinavarta came to Nandavraja in the form of a whirlwind and abducted the infant Krishna - తృణావర్తుండను రాక్షసుండు సుడిగాలియై కృష్ణు నెత్తుకొని పోవుట

తృణావర్తుండను రాక్షసుండు సుడిగాలియై కృష్ణు నెత్తుకొని పోవుట

బరువెక్కిన కొడుకును మోయలేక యశోదాదేవి బిడ్డను క్రిందికి దించి, ఇతడు భూమిని ఉద్ధరించటానికి పుట్టిన మహాపురుషుడేమో అని మనస్సులో అనుకొంది.

ఆ సమయంలో

కఠినాత్ముడైన కంసుడు ఆజ్ఞాపించగా, తృణావర్తుడనే రాక్షసుడు భూమిమీదికి వచ్చి, అకస్మాత్తుగా సుడిగాలిగా అయి, బిసబస అని శబ్దం చేస్తూ, అందరు ఇలాంటి గాలిని ముందెన్నడు చూడలేదని ఆశ్చర్యపడుతుండగా క్రమ్ముకొని వీచి, బాలకృష్ణుణ్ణి ఎత్తుకొనిపోయాడు.

ఓ పరీక్షిన్మహారాజా! ఎవరివల్లనూ తిరుగుడువడని శ్రీహరి (బాలకృష్ణుడు) ఇప్పుడు తిరుగుడు పడ్డాడు. సుడిగాలి రూపంలో వచ్చిన రాక్షసుడు విసరిన సుడిగాలివల్ల రేగిన దుమ్ము కళ్ళనిండా క్రమ్ముకోగా, గోపకులంతా భయపడి గుండ్రంగా తిరుగుతూ పడ్డారు.

అంతేకాక, ఆ సుడిగాలిరాక్షసుడు తృణావర్తుడు ప్రళయకాలవాయువువలె చెలరేగి, చుట్టుముట్టి, వీచిన సుడిగాలిలో పుట్టినదుమ్ము, పైకెగసి సూర్యుకిరణాలను కప్పివేసింది. భయంకరమై దట్టమైన చీకటి పదిదిక్కులను ఆవరించింది. వ్రేపల్లెమొత్తం కలవరపాటు నొందింది. ఒకరికొకరు అగుపడనిస్థితి ఏర్పడింది. దిక్కు తెలియనిస్థితిలో జనులంతా భయపడ్డారు. ఆ సుడిగాలి తిరిగే వేగానికి, భయంకరధ్వనికి దిక్కుల చివరలు చెవిటివయ్యాయి. ఒక ముహూర్తకాలం లోకాలకు భయంకరస్థితి ఏర్పడింది. అప్పుడు

యశోదకు బాలకృష్ణుడు అగుపడక పోయేసరికి, ఆపద కలిగినట్లుగా భావించి, కలతనొంది 'ఓ బిడ్డా! బాలభానునివంటి కాంతికలవాడా! బాలురందరిలో శ్రేష్ఠుడా! ఈ రోజు గాలిచేతిలో చిక్కువడితివా? అంటూ, బాలుణ్ణి పిలుస్తూ ఈ స్థితి కలిగించినందుకు దేవుణ్ణి దూషిస్తూ, దుఃఖంతో క్రుంగి కృశించి గట్టిగా కేకలు పెట్టుతూ.

'సుడిగాలి వచ్చి నిన్ను చుట్టుకొని ఆకాశానికి ఎత్తుకు పోయింది. ఆకాశంలో సుడితిరుగుతూ, భయపడుతున్న ఓ ముద్దుల కొడుకా! ఏమంటున్నావు? ఇది ఘోరం'- అని (దేవకీదేవి) అంటూ

'కుమారుణ్ణి ఇక్కడే కూర్చోపెట్టాను. వాడు ఇక్కడే ఆడుకొంటూ ఉన్నాడు. ఇంతలోనే ఈ మాయదారి సుడిగాలి ఎటునుండి వచ్చిందో? బిడ్డ ఏ త్రోవపట్టిపోయాడో? నేను ఎక్కడికని వెళ్ళివెదికేది' అంటూ యశోద, దూడను వదలిపెట్టి దుఃఖంతో నేలమీద కూలే ఆవులాగా నేలమీద పడిపోయింది.

బిడ్డకోసం ఈ విధంగా దుఃఖిస్తున్న యశోదాదేవిని చూచి గోపాలుర భార్యలందరు ఆర్తితో కలతపడి దుఃఖించగా వాళ్ళకళ్ళనిండా నీళ్ళునిండాయి.

అంతలోపల ఆ సుడిగాలి రాక్షసుడు తృణావర్తుడు మితిమీరిన అహంకారంతో బాలకృష్ణుణ్ణి ఆకాశానికి ఎత్తుకొని పోయాడు. కాని, ఆ బాలుడిబరువును మోయలేక గమనవేగం తగ్గి, కదలలేక 'ఇంతకుముందు ఇలాంటి బిడ్డను ఎక్కడా చూడనే లేదు. ఇక మీదట నా గతి ఏమౌతుందో' అని చింతింపసాగాడు.

అని పై విధంగా సుడిగాలి రాక్షసుడు చింతిస్తున సమయంలో

పరీక్షిన్మహారాజా! బాలకృష్ణుడు పిల్లఏనుగుల తొండాలవంటి తన రెండుచేతులతో తృణావర్తరాక్షసుని కుత్తుక నాళాన్ని బిగియపట్టి, ఒక కొండవలె బరువై వ్రేలాడాడు.

తన మెడను బిగియపట్టి ఒక కొండలా వ్రేలాడుతున్న బాలకృష్ణుని పట్టునుండి బయటపడలేక ఆ రాక్షసుడు, మెడకు ఉచ్చుబిగుసుకొన్న పక్షివలె భయపడసాగాడు.

దేవతల శత్రువైన కంసునిబంటు తృణావర్తుడు, విష్ణుస్వరూపుడైన శ్రీకృష్ణునిఅరచేతిరాపిడికి స్వాధీనం తప్పినవాడై, త్రిపురాంతకుడైన పరమశివుని బాణంతో కూలిపోయిన పురంవలె, అవయవాలన్నీ విరిగి రాళ్ళమీద పడ్డాడు.

అప్పుడు గోపకాంతలు జరిగిందంతా చూచి, ఏడ్పులు మాని, సంతోషంతో రాక్షసుని వక్షఃస్థలం మీద ఉల్లాసంగా, చూడముచ్చటగా, ఇది వరకటి బరువులేక వ్రేలాడుతున్న బాలకృష్ణుణ్ణి ఎత్తుకొనివచ్చి, చింతాక్రాంతురాలై ఉన్న యశోదాదేవి కిచ్చారు. తరువాత అందరు గోపకులు, గోపికలు తమలో తాము ఈ విధంగా అనుకొన్నారు.

సాధుశీలుడు సమబుద్ధి కలిగి ఉంటాడు కనుక రక్షణలేకపోయినా కష్టాలు కలిగినపుడు రక్షింపబడుతాడు. దుర్మార్గుడికి వెయ్యి రక్షణలున్నా అతడు పాపాత్ముడు కనుక తప్పక శిక్షింపబడుతాడు.

గత జన్మలలో ఏ యేనోములు నోచామో, ఏ యేయాగాలు చేశామో, ఏయే సత్పురుషులకు ఏమేమి దానా లిచ్చామో, ఏ యే మంచి విషయాలమీద మనస్సు నిలిపి కాలం గడిపామో, ఏ యే సత్యాలు పలికామో; ఏ యే పుణ్యక్షేత్రాలలో సంచరించామా! ఆ పుణ్యఫలంగా ఇప్పుడిక్కడ భయం లేని బాలకృష్ణుణ్ణి దర్శించగలిగాము.

అని పలికి గోపకుల మాటలు విన్న నందుడు, చాల ముందుగానే వసుదేవుడు తనతో తెలిపిన విషయాలకు ఆశ్చర్యపడుతూ ఉండినాడు. ఇంకా,

ఓ పరీక్షిన్మహారాజా! ఒక రోజు యశోద పాలిండ్లు చేపునకు రాగా, చిన్నారి ముద్దుల కృష్ణుణ్ణి దగ్గరికి తీసుకొని, తొడలమీద ఉంచుకొని, ముద్దుపెట్టుకొని చనుబాలు త్రావించింది. ప్రేమగా ముఖాన్ని నిమిరింది. అప్పుడు మెల్లగా నవ్వుతూ బాలుడు ఆవులించాడు. ఆ బాలకృష్ణునినోరు ఆమెకొక పెద్దగుహలాగా అగుపించింది. అందులో ఆమె సముద్రాలను, దిక్కులను, భూమిని, అడవులను, ద్వీపాలను, పర్వతాలను, నదులను, వాయువును, సూర్యచంద్రులను, అగ్నిని, ఆకాశాన్ని గ్రహనక్షత్రాలను, అఖిలలోకాలను, చరాచరాలైన భూతగణాలను దర్శించి, కన్నులు మూసుకొని, ఆశ్చర్యచకితురాలైంది.

(బాల్యంలోనే కృష్ణుడు ఆవులించి యశోదమ్మకు తననోట విశ్వరూపదర్శనభాగ్యమిచ్చాడు.)

తరువాత ఒకరోజు వసుదేవుని ఆజ్ఞమేరకు యాదవుల పురోహితుడైన గర్గమహాముని వ్రేపల్లెకురాగా, నందుడు ఆయనను చూచి లేచి నిలబడి నమస్కరించి,

ఉత్తమగుణాలు, నడవడులు, సత్పురుషులసాంగత్యం కలిగి, శివారాధకుడై, అరిషడ్వర్గాన్ని పారద్రోలి, నీచజనుల్ని దగ్గరకు రానీయనట్టి ఆ గర్గమహామునిని నందుడు అతిప్రీతితో సేవించాడు.

వచ్చిన గర్గమహామునికి తగిన సత్కారాలు చేసిన పిదప నందుడు ఇలా అన్నాడు.

మహాత్మా! ఓ గర్గమహామునీ! గొప్పవారు ఏ కారణం లేకుండా ఒక చోటికిగాని, ఒకరి దగ్గరికిగాని రారు. తక్కవవారిఇండ్ల దగ్గరికి వచ్చారంటే-వారి రాకలు శుభాలకు కారణాలు. ఇప్పటి మీ రాక మాకు శుభాన్ని సమకూరుస్తుంది. ఇది సత్యం.

ఓ గర్గమహామునీ! నీవు జ్యోతిశ్శాస్త్ర పండితులందరిలో శ్రేష్ఠుడివి. మిక్కిలి తేజోమూర్తివి. అన్నిదిక్కుల చివరలదాకా వ్యాపించి వెలిగే కీర్తి కలవాడివి. బ్రహ్మజ్ఞాన సంపన్నుడివి. నా మనవి విను. వేదజ్ఞుడైన బ్రాహ్మణ శ్రేష్ఠుడే మానవులకు నిర్ణయింపబడిన గురువని పెద్దలంటారు. నీవు నేర్పుగ ఈ కుమారులిద్దరికి నామకరణాదిసంస్కారాలు వేదోక్తంగా జరిపించు.

అని నందుడు చెప్పి బలరామకృష్ణులను చూపగా, ఆ గర్గమహాముని ఇదివరకు కంసునిచేత వ్రేటువడి ఆకాశానికి ఎగసిపోయిన యోగమాయ చెప్పినమాటలను నందునికి వివరించి, కృష్ణుడు దేవకీదేవికొడుకు అని కంసుడు తలచి, ప్రమాదం చేయవచ్చు కనుక, పిల్లలకు నామకరణాది సంస్కారాలు రహస్యంగా చేయటం మంచిదని సూచించాడు. నందుడు అందుకు సమ్మతించాడు. అప్పుడు ఆ మహాముని రోహిణికొడుకును గురించి

ఓ పరీక్షిన్నమారాజా! ప్రజలు ఆనందించేట్టు మెలిగే పద్ధతి కలవాడు కనుక రాముడనీ, ఒక గర్భంనుండి లాగబడి మరాక గర్భంలో ప్రవేశపెట్టబడినవాడు కావటంచేత సంకర్షణుడనీ, గొప్పబలం కలవాడు కావటంచేత బలుడనీ నామకరణం చేశాడు.

తరువాత గర్గమహాముని యశోదకొడుకును ఉద్దేశించి 'ఈ శిశువు పూర్వం తెలుపు, ఎరుపు, పసుపు రంగులలో ఉండేవాడు. ఇప్పుడు నల్లగా ఉన్నాడు కనుక కృష్ణుడని పిలవండి. ఇతడు ఒకానొక ప్రదేశంలో వసుదేవునికి జన్మించాడు కనుక వాసుదేవుడనికూడ ఇతణ్జి పిలువవచ్చు. ఈ బాలుడికి అనేకగుణాలు, రూపాలు, కర్మలు ఉండటంచేత ఇంకా ఎన్నో పేర్లు వస్తాయి. ఈ బీడ్డవల్ల మీరు అన్ని దుఃఖాలనుండీ గట్టెక్కుతారు. అంతేకాదు. ఈ బాలుడివల్ల దుష్టశిక్షణం, శిష్ట రక్షణం కూడా జరుగుతుంది. ఈ కుమారుడు శ్రీమహావిష్ణువుతో సమానమైనవాడు అని చెప్పి తన ఇంటికి వెళ్ళాడు. అది విని నందుడుకూడా పరమానంద భరితుడయ్యాడు. ఆ తర్వాత

శ్రీ కృష్ణబలరాముల బాల్యక్రీడాభివర్ణనము

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

Balakrishnudu (Baby Krishna) kicked and bucked a cart with his feet - బాలకృష్ణుడు శకటముం దన పాదమున గూల దన్నుట

బాలకృష్ణుడు శకటముం దన పాదమున గూల దన్నుట

యశోదాదేవి తన బిడ్డడు బాలకృష్ణుడు ఒత్తిగిలి బోర్లపడటం నేర్చుకొన్నాడని ఎంతో సంతోషించి, కొడుకు జన్మనక్షత్రాన ఒకరోజు వేడుకగా అతడికి స్నానం చేయించటానికి గోపికలను పేరంటానికి పిలిచింది. మంగళవాద్యాలు మ్రోగగా, గోపికలు పాటలుపాడగా, బ్రాహ్మణుల వేదమంత్రాలతో బిడ్డకు అభిషేకాదులు చేయించింది. ఆ వేదవిప్రుల ఆశీర్వచనాలు అందుకొని, వారికి ఆవుల నిచ్చింది. విందుభోజనం పెట్టింది. వస్త్రా లిచ్చింది. అడిగినవారికి అడిగినట్టుగ ఇచ్చింది. బాలకృష్ణుణ్ణి ప్రియమార పానుపుమీద పడుకోబెట్టి నిద్రపుచ్చింది. గోపాలురకు, గోపికలకు పూజలుచేస్తూ ఆమె బిడ్డ విషయం మరచింది.

చిన్ని కృష్ణుడు నిద్రపోయిన సంగతి మరచిన సమయంలో

నిద్రపోతున్న బాలకృష్ణుడు ఆకలి గొని, మేల్కొని, కాళ్ళుచేతులు ఆడిస్తూ, ఒడలు విరుచుకొంటూ, పాలకొరకు చన్నుకోరుకొని, అది దొరకకపోయే సరికి ఆగ్రహించి, చిగురుటాకువలె మృదువై, చక్రరేఖలు, ధనుస్సు రేఖలు మున్నగు సాముద్రిక లక్షణాలుండే తన పాదంతో ప్రక్కనున్న ఒక బండిని బలంగా తన్నాడు.

బాలకృష్ణుడు తన్నగానే ఆ బండి, గోపకులందరు చూస్తుండగా, ఆశ్చర్యకరంగా ఆకాశాని కెగిరింది. ఇరుసు బరువుకు దాని చక్రాలు ఆకారం మారినవై నేలమీద పడ్డాయి.

అప్పుడు యశోద, నందుడు మొదలైన ముఖ్యగోపికలు, గోపకులు ఆ బండిలో ఉన్నట్టి మధుర పదార్థాలన్నీ నేలపాలై నిరుపయోగాలు కావటంచూచి, ఆశ్చర్యచకితులై తాము చేస్తున్న పనులు వదలిపెట్టి, పండుగలు మాని, సంతోషాన్ని కోల్పోయి, భయాలు నిండిన మనస్సులతో

కారణం లేకుండా బండి ఆకాశానికి ఎగురదు కదా! పక్కమీద పడుకొని ఉన్న ఈ చిన్నిబిడ్దడు ఆ బండిని తన్నటానికి సమర్ధుడు కాడు. మరి ఏ విధంగా ఇది ఎగిరిందో! ఇది అలా ఎగరడమేమిటి?; దీనికి కారణం ఎలాంటిదో!

అని పై విధంగా చర్చించుకుంటున్న సమయంలో

బాలకృష్ణుడు ఆకలిగొని ఏడుస్తూ కాలు ఎత్తగా, ఆ కాలు తగిలి బండి ఆకాశాని కెగిరింది గాని, అది ఎగరటానికి ఇతర కారణ మేదీ లేదని, కృష్ణుని పాన్పుకు దగ్గరలో ఆడుకొంటున్న పిల్లలు చెప్పారు.

అని పై విధంగా చిన్న పిల్లలు పలికిన మాటలను విన్న తర్వాత

'ఈ పసిబాలుడేమిటి! ఇంత పెద్ద బండి ఏమిటి! ఇతడు దాన్ని తన్నటమేమిటి! అది ఆకాశాని కెగిరి ముక్కలు ముక్కలుగ విరగడమేమిటి! ఈ ఆడుకొనే పిల్లలు అబద్ధం చెప్పారు. ఇంత తెలివి తక్కువమాట ముల్లోకాల్లో ఎక్కడైనా చెప్పబడుతుందా? ఇదంతా ఏ విధంగా జరిగిందో' అని అనుకొంటూ, సందేహాలతో సతమతమౌతూ గోపాలురు, గోపికలు అందరూ, ఆశ్చర్య చకితులయ్యారు (వ్రే= గొల్లకులానికి చెందినవాడు, వ్రేలు= గోపాలురు (బహువచనరూపం)).

అప్పుడు ఆ చిన్ని కృష్ణుని ఏడ్పును విన్న యశోద పరుగెత్తుకొని వచ్చింది.

'అన్నా! అలసిపోయావు కదన్నా!; ఆకలితో ఉన్నావు కదన్నా!; మంచివాడివి కదన్నా!; ఏడుపు మానుమన్నా!; నా చనుబాలు త్రావుమన్నా!; సంతోషంగా ఉండుమన్నా!' - అంటూ యశోదాదేవి ఆ బాలకృష్ణునికి తన చనుబాలిచ్చింది.

ఆ తరువాత బాలకృష్ణునికి పిల్లలను పట్టి హింసించే చెడుగ్రహం ఏదో సోకిందని, గోపకులు చాలామంది ఆ గ్రహపీడ తొలగటానికి అనేక బలిదానాలు చేశారు. బ్రాహ్మణులు పెరుగుతో, దర్భలతో, అక్షతలతో అనేకహోమాలు చేశారు. ఋగ్వేద, యజుర్వేద, సామవేద మంత్రాలతో అభిషేకాలు చేయించి, శుభాన్ని పుణ్యాన్ని కలిగించే స్వస్తివాచనాలు, పుణ్యాహవాచనాలు చదివించి, కుమారుడికి మేలు జరగాలని నందుడు అలంకరించిన పాడిఆవులను పండితులకిచ్చి, వారి ఆశీర్వాదాలు పొంది, ఆనందించాడని చెప్పి, శుకుడు ఇంకా ఇలా అన్నాడు.

ఓ పరీక్షిన్మహారాజా! ఒకరోజు యశోదాదేవి కొడుకును తొడమీద కూర్చోపెట్టుకొని ముద్దాడి దేహాన్ని ప్రేమతో అలా నిమురుతూ ఉండగా, పెద్దకొండ శిఖరంవలె బాలకృష్ణుడు బరువెక్కిపోయాడు.

తృణావర్తుండను రాక్షసుండు సుడిగాలియై కృష్ణు నెత్తుకొని పోవుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

The story of Yashodamma catching and punishing Balakrishna for breaking butter pots - యశోద దధిభాండ వికలనాదులు సేసిన కృష్ణుని బట్టుకొనుట

యశోద దధిభాండ వికలనాదులు సేసిన కృష్ణుని బట్టుకొనుట యశోద శ్రీకృష్ణునిపై పాటలు పాడుతూ, పెరుగును చిలకడం ప్రారంభించింది. ఆమె గాన మాధుర్యానికి చెట...