దక్షప్రజాపతి యజ్ఞము చేయునపుడు దాక్షాయణి యచ్చటికింబోవుట
ఆ తర్వాత మామ దక్షుడికీ, అల్లుడు శివుడి పట్ల ద్వేషం వర్దిల్లుతూనే చాల కాలం దొర్లిపోయింది. అంతట్లో శివుడు లేకుండా యాగం మొదలుపెట్టి చేసినా చేయనట్లేనని దక్షుడికి తెలుసు. అయినా సరే శివుడితో ముందునుంచి కొనసాగిస్తున్న వైరంవల్లా, బ్రహ్మ, దక్షుణ్ణి 'ప్రజాపతులందరికీ ఏలిక' ను చేయడంవల్ల దక్షుడిలో అహం భావం ఏర్పడింది. బ్రహ్మ నిష్ఠులైన ఈశ్వరాదుల్ని లెక్కచేయక, దక్షుడు శివుడులేని 'వాజపేయయజ్ఞం' చేశాడు. ఆ తర్వాత 'బృహస్పతి సవనం' అనే పేరిట మరోయజ్ఞం చేయ మొదలుపెట్టాడు. ఆ యాగభూమికి క్రమంగా
(వాజపేయేనేష్ట్యా బృహస్పతిసవేన యజేత - అని శ్రుతి.
వాజపేయం అంటే నేతిని ఆహారంగా స్వీకరిస్తూ చేసే దైవకార్యం. 'వాజం పేయం అత్ర' అని వ్యుత్పత్తి. ఈ ధర్మకార్యంలో నేయి కేవలం దేహధారణకోసమే కాని, రుచికోసం స్వీకరించేది కాదు.
తిండి, తీర్ధం, పలకరింపులు ధర్మార్థకర్మలుగా కాక, స్వార్థ కర్మలుగా ప్రవర్తింపచేసేది బృహస్పతి సవనం. అయినా వీటిని ప్రసాదించే దేవతలు ఈ సవనకర్తను దీవించడం సంప్రదాయం.)
ఆ బృహస్పతి యాగం చూడాలనే ఆత్రంతో బ్రహ్మర్షులూ, ప్రజాపతులూ, నారదునివంటి దేవర్షులూ, తమ భార్యలతో కలసి క్రమంగా ఎంతో ఆసక్తితో తరలివచ్చారు. అందరూ దక్షుడికి శుభాలు కలగాలని దీవనలు పలికారు. దక్షుడి యాగదక్షిణలను యథార్హంగా స్వీకరించారు.
దక్షుడి కూతురు సతీదేవి తన నివాసం నుంచే తండ్రి చేసే యాగం గొప్పలను, గంధర్వుల స్తోత్రాల కలకలాన్ని ఆసక్తితో విన్నది. ఎంతో ఉత్సాహంగా ఆకాశంవైపు చూడగా
అదే సమయానికి ఆ దక్షుడు చేసే యాగం వేడుకలను కన్నులారా తిలకించాలనే ఉబలాటంతో అన్నివైపుల నుంచి ప్రజలు వెళ్తూ ఉన్నారు. ఆ వేళలో
మితిమించిన ఉత్కంఠతో తమ పతులతో జంటగా గగనచరులైన గంధర్వ, కిన్నర స్త్రీలు మన్ననతో విమానంలో పయనమై నింగికి పోతూ ఉండడం సతీదేవికి అవుపించింది. ఆ దివ్య స్త్రీల చెవిపోగుల నవరత్నాల ధగధగలు బుగ్గలమీద ప్రతిఫలిస్తున్నాయి. ఘనమైన బంగారుపతకం తళతళలు భుజాగ్రాలమీద ప్రసరిస్తున్నాయి. వాళ్లు కట్టుకున్న చీనీ పట్టుబట్టల తళతళలను మొలనూళ్ల వెలుగులు వేళాకోళం చేస్తున్నాయి. లేళ్ల చూపులవంటి వాళ్ల బెదురుచూపుల కాంతులు నలువైపులకు విస్తరిస్తున్నాయి.
సతీదేవి తన మగడైన శివుణ్ణి చూచి ఎంతో ఉత్సాహంగా ఇలా మాట్లాడింది. మీ మామగారు దక్షప్రజాపతి దీక్షతో యాగం చేస్తున్నాడట కదా. వింటిరా?
కాబట్టి ఆ యాగానికి దేవతలంతా ఇష్టంగా ఎలా పోతున్నారో చూడండి! ఓ దేవా! ఓ శివా! మనమిద్దరం కూడా ఆ యాగానికి వెళ్లివస్తే బాగుంటుందని నాకు ఉబలాటంగా ఉంది.
ఆ మహాయాగాన్ని చూడటానికి నా చెల్లెళ్లలందరూ తమతమ పతులతో సహా తప్పక విచ్చేస్తారు. మన జంటా పోయినట్లయితే అక్కడ, వాళ్లందరినీ నేను చూడగల్గుతాను.
దుష్టసంహారా! శివా! నీతో కలసి నా తండ్రి చేసే యాగానికి పోయి, పారిబర్హం పేరిట తల్లిదండ్రులు ఇచ్చే అలంకారాదిద్రవ్యాలను తెచ్చుకోవాలనే కుతూహలం నాలో కల్గింది.
నామీద అనురాగం చూపేమా అమ్మనూ, ఆ చెల్లెళ్ళనూ, సోదరీసమూహాన్ని, పిన్నమ్మలనూ, ఋషులు సిద్ధం చేసిన యాగానికి అలంకార ప్రాయమైన ధ్వజాన్నీ చూడాలనే ఉల్లాసం పుట్టుకొస్తోంది.
(గగనకేశ= ఆకాశంలో ఎగురుతున్న కేశాలుగలవాడా! శివుడి అష్టమూర్తుల్లో ఒకరైన సూర్యుడి కిరణాలే ఆకాశంలో ఎగిరే కేశాలు కనక శివుడిని గగనకేశుడంటారు. వ్యోమకేశుడని నామాంతరం.)
అంతేకాదు. ఓ ప్రభూ! ఈ ప్రపంచం సత్త్వరజస్తమోగుణాల స్వభావంకల్గి మహాద్భుతంగా ఉంటుంది. ఈ ప్రపంచం నీమాయ చేత సృష్టించబడింది. కాబట్టి నీకు అంత విచిత్రంగా అన్పించకపోవచ్చు. కానీ నేను నీ నిజస్థితిని గ్రహించుకునే శక్తిలేని దానిని. స్త్రీ సహజమైన నైజం కల దీనురాలిని. నా పుట్టినింటిని చూడాలని నా కోరిక. అంటూనే మళ్లీ ఇలా చెప్పింది.
ఏ సంబంధమూలేని అన్య స్త్రీలందరూ కూడ ఆ మహాయాగ వైభోగాన్ని చూడాలని గుంపులుకట్టి ఎంతో సంతోషంగా పోతున్నారు. ఆ స్త్రీలు అలంకరణలతో మెరిసిపోతున్నారు. తమ తమ భర్తలతో కలసి కలహంసల్లాగా ప్రకాశిస్తున్న విమానాల్లో బయలుదేరి ఆకాశంలో పోతున్నారు. అల్లదిగో చూడండి.
ఓ పుణ్యపురుషుడా! విను, ముల్లోకాల్లోనూ ప్రతి ఆడపిల్ల తమ పుట్టింటి మీది మమకారంతో ఆ ఇంట్లో జరిగే ప్రతి పుణ్యకార్యాలను తానుగా చూచి ఆనందించాలను కుంటుంది. అలా చూడని ఆమె శరీరం నిలకడగా ఎలా ఉంటుంది? ఉండదని భావం.
ఎపుడూ పిలవని వారింటికి పోవడం తగింది కాదు అని నువ్వు అనుకోవచ్చు. కాని ఉత్తములు 'తండ్రి, గురువు, మిత్రుడు, రాజు' పిలువకపోయినప్పటికీ వాళ్ల ఇళ్లకు వెళ్తూనే ఉంటారు.
సతీదేవి శివుణ్ణి ఇంకా ఇలా అడిగింది. ఓ దేవా! నాపై కనికరించు. నీవు నా కోరిక తీర్చదగుదువు. సర్వజ్ఞుడవైన నీచేత నేను నీ శరీరంలో సగభాగంగా గ్రహించబడ్డాను. అలాంటి నన్ను కరుణించవలసిందని వేడుకుంది. ఆ మాటలకు శివుడు, ముఖంలో చిరునవ్వు చిందించాడు. ప్రజాపతుల ఎదుట దక్షుడు తన జీవనాడుల్ని చీల్చుతూ పలికిన కపటపు మాటల బాణాలను స్మరిస్తూ శివుడు సతీదేవితో ఇలా అన్నాడు.
ఓ కల్యాణీ! నీ మాటలు ఒప్పయినవే. బంధువర్గం ఆహ్వానించక పోయినా వారి మీద తనకు గల గౌరవం కొద్దీ ఇష్టపడి పోయి రావడమూ న్యాయమే. కాని ఆ చుట్టాల బుద్ధి శరీరం మీది దురభిమానం కొద్దీ పొగరు, అసహనం, కోపం పొందనంతవరకూ వెళ్లిరావడం సరి అయిందే అవుతుంది. అయితే ఒకటి విను. జ్ఞానం, తపస్సు, ధనం, ప్రాయం, అందం, ఆభిజాత్యం మంచివాళ్లకు మాత్రమే మంచి గుణాలు. ఇవే ధర్మాలు చెడ్డవారిలో చెడుకు కారణాలవుతాయి. వాళ్ల వివేకాన్ని కోల్పోయేలా చేస్తాయి. ఓ సతీ! ఆత్మాభిమానంవల్ల మందమతులు మహానుభావుల గొప్పను చూడలేని వారవుతారు.
అలాంటి కపట ప్రవర్తనగల దగ్గరి సంబంధికుల ఇళ్లకు బంధుత్వం ప్రధానంగా పెట్టుకుని పోవడం అసలు మంచిది కాదు. మర్యాదగలవారికి అది ఇంకా కూడని పని. అది ఎలా గంటే.
వక్రబుద్ధి పరులైన చెడ్డవారి ఇళ్లకు మర్యాదాపరులు వెళ్ళినట్లయితే వాళ్లు మన్నించరు. సరికదా కనుబొమలు చిట్లించి మరీ తీవ్రమైన కోపంతో చూస్తారు. అయినా ఓ సతీ! ఈ మాటను చెవిని పెట్టుకో.
మహాగర్వితుడైన పగవాడు గట్టిగా సారించి వదలిన బాణాలచే బాగా దెబ్బతిన్న శరీరంకల మనిషి ఆ బాధనంతా మరచిపోయి హాయిగా కునుకు తీస్తాడు. ఏ మాత్రం దిగులు పడడు. కాని ఓ ఉమ! తనకు దగ్గర వాళ్లనుకున్నవారి పుల్ల విరుపు మాటలు గుండెల్లో గుచ్చుకుంటాయి. అవి రాత్రనక పగలనక మనసును బాధపెడుతూ మనుష్యుని క్షీణింపజేస్తుంటాయి.
(ఉ= ఓ పార్వతి! మా= తపః మాస్తు(తపస్సు వద్దు) అని తల్లిచే వారించబడుటచే 'ఉమ' అనే పేరు వచ్చింది. (ఉమేతి మాత్రా తపసో నిషిద్దా పశ్చాదముఖ్యాం జగామ అని కాళిదాసు)
ఓ కాంతా! విను. లోకంలో అందరిలోనూ దక్షప్రజాపతి స్ధితి మంతుడు. అతడి పుత్రికా సంతానంలో నీవు అత్యంత ప్రీతి పాత్రమైన కుమార్తెవు. కాని నాతో నీకుగల సంబంధం వల్ల మీ తండ్రి నిన్ను మన్నింపజాలడు.
నాకు మీతోగల పెళ్లి సంబంధం వల్ల నాతండ్రి నన్ను గౌరవించకపోవడం ఏమిటి? అసలు అతనికీ మీకూగల పగకు కారణం ఎలాంటిది అంటావేమో (విను).
గర్వం లేని పాపరహితులైన సజ్జనుల పుణ్యమూ, పేరూ ప్రతిష్టల్ని కొంతమంది ఇష్టపడ్డారు. కాని ఆ ఉన్నతిని అందుకోగల సామర్థ్యం వారిలో ఉండదు. అందువల్ల వారి మనస్సు మండిపోతుంటుంది. దానితో ఇంద్రియ దుఃఖితులవుతారు. ఏమీ హేతువు లేకపోయినా పగ పెంచుకుంటారు. పరమ పురుషుడు, పరమాత్మ స్వరూపుడు అయిన విష్ణుమూర్తితో ద్వేషంకల రాక్షసుల మాదిరిగా కారణంలేని పగపూని ఉంటారు. ప్రతీకారేచ్చకు వారి వారి అశక్తతే మూలస్థానం అని తాత్పర్యం.
(చర్మం, కన్ను, చెవి, నాలుక, ముక్కు - జ్ఞానేంద్రియాలు. వాక్కు, పాణి, పాదం, పాయువు; ఉపస్థ- కర్మేంద్రియాలు. మనస్సు 11వ ఇంద్రియం)
అంతేకాదు నువ్వు 'పెద్దవాడుగా అతడికి నమస్కరించి ఆదరించకపోవడం తక్కువ చేసినట్లుగా అనుకుని ఉండవచ్చు అంటావేమో. మనుషులు ఒకరికొకరు ఎదురుగా వెళ్లి నమస్కరించుకోవడం లోకసహజం.
పండితులు 'అందరిలో ఆత్మస్వరూపుడై అంతటా నిండి ఉండే ఆ పరమపురుషుడికి చేతులెత్తి నమస్కరించడం అనే కాయికమైన చర్య అనుచితం అయినట్టిది అనుకుంటారు. మనస్సులోనే నమస్కరిస్తారు. అందువల్ల శారీరకమైన ఈ చేష్టలను కాంక్షించేవాళ్లకు నమస్కరించరు.
కాబట్టి నేను, 'పరమేశ్వరపద ప్రసిద్ధుడూ, శుద్ధ సత్వరూపుడు, ఎపుడూ లోపలి మనసును మాత్రమే చుట్టి ఉండే సర్వవ్యాపి అయిన ఆ వాసుదేవ ఆరాధకుణ్ణి.
నన్ను దక్షుడు పూర్వం బ్రహ్మాదులు చేసిన క్రతువులో కటువు మాటలతో అవమాన పరచాడు. నాకు పగవాడు నన్ను ద్వేషించే నీ తండ్రి దక్షుడు, అతడి అనుయాయులు, గౌరవించదగ్గవారు కారు.
నా మాటలను కాదని నువ్వు వెళ్లినట్లయితే అక్కడ నీ కన్నవారింట్లో అవమానాల పాల పడ్తావు. ఈ భూప్రపంచంలో బంధువుల ఆదరణ పొందకపోవడం చావుతో సమానమే అవుతుంది కదా అని చెప్పాడు.
ఆ తర్వాత మళ్లీ ఈవిధంగాను ఆలోచించాడు. తన భార్యను ఆ మహోత్సవానికి వెళ్లిరమ్మని అంటే అక్కడ ఏమైనా అనుకోనిది జరుగుతుందేమో! అలా చెప్పక ఇక్కడే వారించి ఉంచినట్లయితే సతీదేవి, మానసికవేదనకు గురి అవుతుందేమో! అనుకుని శివుడు మౌనంగా ఊరుకున్నాడు. ఆ తర్వాత
ఆప్తుల్ని చూసి రావాలన్న కాంక్ష సతీదేవికి తీరలేదు. ఆ మనోవ్యథతో ఒళ్లంతా కంపించి పోతోంది. స్రవిస్తున్న కన్నీటి ధారలతో బుగ్గలు తడిసిపోతున్నాయి. పెద్దపెద్ద నిట్టూర్పుల వేడికే ఎదపైని (ముత్యాల) పేరులు మసక బార్తున్నాయి. కన్నవారింటికి పోలేదన్న రోషంతోనూ, భర్తమాట దాటిపోవాలన్న దుఃఖంతోనూ మనస్సు వ్యాకులిత మవుతున్నది. అంతలోకి వెనక్కి మరలుతుంటుంది. మళ్లీ 'కోపన' అవుతుంటుంది.
చివరకు తనతో సాటి లేనట్టి, తన శరీరాన్ని సగపాలు పంచినట్టి శివుణ్ణి వీడి, తనవారిని చూడాలనే ప్రబలమైన వ్యామోహంతో ఆ సతీదేవి భర్తను విడిచి వెళ్లింది.
ఇలా తొందర తొందరగా వెళుతుండగా
ఆ సతీదేవి అలా వెళ్తూ ఉండగా, వేల సంఖ్యలో మణిమంతుడూ, మదుడూ మొదలైన శివుడి సహచరులూ, యక్షులూ ఆ వెనుకనే బయలుదేరారు. వీళ్లకుముందు నందికేశ్వరుడు నడక సాగించాడు. ఆమె వహించే పూలబంతులు, పద్మాలు, గోరువంకలు, తాటాకు విసనకర్రలు, తెల్ల గొడుగులు, పూలమాలలు, బంగారునగలు, కస్తూరి చందనాది పరిమళద్రవ్యాలు వెంట తీసుకుని వెళ్లారు. నిర్భయంగా ఆమెను చేరుకున్నారు. గొప్పవాడైన నందికేశ్వరుణ్లి శర్వుడి భార్యకు వాహనంగా చేశారు. సంకువుల, భేరీల, పిల్లనగ్రోవుల మోతల సందడితో యజ్ఞస్థలం దిశగా పయనమై పోయి పోయి.
ఆ తర్వాత సతీదేవి ఎంతో సంతోషపడుతూ యజ్ఞవాటికను కళ్లారా చూసింది. ఆ భూమి, చెక్కతో, మట్టితో, బంగారంతో, దర్భలతో, లేడి చర్మంతో, ఇనుముతో చేసిన పాత్రలతో ఒప్పి ఉంది. శుద్ధమైన వేద ధ్వనులు, యాగ పశువును కట్టిన పూజ్యమైన యూపస్తంభం గల్గి ఉంది. ఆ ప్రదేశం మహర్షులు, దేవతలచేత ప్రకాశిస్తూ ఉంది. ఉవ్వెత్తు మంటలతో హోమం తేజరిల్లుతూ ఉంది.
ఆ యాగస్ధలాన్ని దర్శించి యజ్ఞవాటికలో ప్రవేశించగా
అలా చూస్తూ సంతోషంగా వచ్చిన ఆ సతీదేవిని అమ్మా, తోడపుట్టినవాళ్లు ఆదరించారు. ఆ సభతీర్చి ఉన్న మిగతా వాళ్లందరూ దక్షుడికి భయపడి తప్పనిపరిస్థితుల్లో ఆ సతీదేవిని గౌరవించలేకపోయారు.
అమ్మా పిన్నమ్మలు వరుసగా ఆమెను దగ్గరకు తీసుకున్నారు. ఆ ఆనందం పట్టలేక కంటనీరు పెట్టుకున్నారు. కంఠం బొంగురు పోయింది. గద్గదస్వరంతో ఆమె క్షేమసమాచారాలు అడిగి తెలుసుకున్నారు. అంతలో ఆ సతీదేవి తానుగా,
తండ్రి ఆదరణ కరవుకాగా ఆ సతీదేవి తోబుట్టువులు ఆప్యాయంగా తనకు తగిన విధంగా సమ్మానాలు చేసినప్పటికీ స్వీకరించలేకపోయింది. వారు అడిగిన కుశలప్రశ్నలకు ప్రతి సమాధానం చెప్పకుండా మిన్నకుండిపోయింది.
తండ్రి తాను చేసే యజ్ఞంలో తన మగనికి భాగం కల్పించలేదనీ, ఆహ్వానించక చిన్నచూపు చూశాడని గ్రహించుకుంది. ఈ ముల్లోకాల్ని బుగ్గి చేద్దామన్నంత కోపం తనలో రగులుకొంది. శివుడంటే గిట్టనివాడు, నేనే యజ్ఞకర్మను ఆచరిస్తున్నాననే పొగరుగల దక్షుణ్ణి చంపివేస్తామని శివుడి అనుచరులు పూనుకున్నారు. వాళ్లను వారించి, చాలా కోపంగా తండ్రితో ఇలా పలికింది. మహాదేవుడు, ప్రపంచంలోని శరీరధారులైన సమస్తజీవకోటికి ప్రియమైనవాడు. అలాంటి ఈశ్వరుడికి వీళ్లలో ఇష్టమైనవాళ్లు, ఇష్టంకాని వాళ్లు, అధికులు అనేవారే ఉండరు. సకల జగత్తుకీ కారణస్వరూపుడు, అసూయపడే తత్త్వం లేనివాడు అతడే. నీవు తప్ప మరెవ్వరూ శివుణ్ణి వ్యతిరేకించరు. (కాదనుకోరు)
అంతేకాదు మీబోటివాళ్లు ఇతరుల గుణాల్లో తప్పులు ఎంచుతుంటారు. కొందరు మధ్యస్థులు ఇతరుల దుర్గుణాల్లోని తప్పుల్ని ఎంచరు. కొందరు సత్పురుషులు అన్యుల దోషాలను కూడా సద్గుణాలే అంటారు. వీరిలో సజ్జనులు కొందరు మరీ మంచివాళ్లు ఎదుటివారిలోని దోషాల్ని పట్టించుకోకపోగా వారి నీచగుణాల్నికూడా మంచి గుణాలుగా గుర్తిస్తారు. వీరు మంచివాళ్లల్లో మంచివాళ్లు. అలాంటి సర్వోత్తముల్లో కూడా నీవు చెడ్డ బుద్ధిని ఆపాదించావు అంటూ ఆ సతీదేవి మళ్లీ ఇలా అనడం మొదలు పెట్టింది.
అలాంటి పుణ్యుల అడుగుల దుమ్ముముందు ఎందుకూ పనికిరాని తేజోవంతులూ, మొద్దుతనం గల దేహాన్న పరమాత్మగా అనుకునే దుష్టులూ, మహాత్ముల్ని తెగడడంలో వింత ఏముంటుంది! అది వారికి అర్హమైంది కాదు. అని మళ్లీ సతీదేవి ఇలా చెప్పింది.
'శివ' అనే రెండక్షరాలు ఇష్టంగా నోటపలికినా, మనసులో అనుకున్నా సమస్త ప్రాణికోటికి అశుభాలన్నీ తుడిచి పెట్టుకుపోతాయి. అలాంటి గొప్ప స్వభావం కలవాడు శివుడు. అమంగళుడవైన నీవు అతడికి శత్రువు కావడం నాకు వింతగా ఉంది. కాని ఒక్కమాట విను. బ్రహ్మవేత్తలు యుక్తాయుక్త విచక్షణతో 'బహ్మానందం' అనే తేనె యందలి అ పేక్షతో, హృదయాలనే తుమ్మెదలతో తాగి, శివుడి పాదపద్మాలను గూర్చి తెలిసికొని సంతృప్తులవుతుంటారు. అటువంటి స్వామికి నువ్వు ద్రోహం చేశావు. నిన్ను ఏమని అనగలను. (అనేందుకు ఏమీ లేదని భావం).
ఇంకా ఆ పరిపూర్ణాత్ముడి పాదపద్మాల జంట, చక్కగా సేవించే వారందరూ కోరుకునే కోరిక లన్నింటిని విడువక తీరుస్తుంటాయి. అలాంటి శివుణ్ణి దూషించడం తగునా?
చితి మీది ఎముకలు, బుగ్గి, మానవుల కపాలాలు, జడలు ధరించి శ్మశానంలో తిరుగుతుంటాడు. పిశాచాలతో కలసి ఉంటాడని నువ్వు తప్ప మరెవ్వరూ శివుణ్ణి అమంగళుడని తలంపరు. పైగా బ్రహ్మాది దేవతలంతా శివుని పాదపద్మాల పరాగపు ధూళిని బుద్ధిపూర్వకంగా శిరస్సున ధరిస్తారు.
ప్రయత్నపూర్వకంగా ధర్మరక్షణలో పరిశుద్దాత్ముడైన శివుణ్ణి దూషించే దురాత్ముడి నాలుకను తెగకోయడం తగినపనే అవుతుంది. అలా చేయను చేత కాకపోతే మరణించడం ఉత్తమం. ఈ రెంటికీ శక్తి చాలకపోతే చెవులు రెండూ గట్టిగా మూసుకుంటూ వెళ్లడం న్యాయం అని నీతిమంతులు చెప్తుంటారు.
అందువల్ల మానవుడు తెలియనితనంతో ఏహ్యం పుట్టించే ఇష్టంకాని తిండి పదార్థాల్ని తిన్నపుడు వెంటనే బయటకు కక్కించి శుద్ధుణ్జి చేస్తాం. అట్లే నీవు కుత్సితమతివి. పూజ్యుడైన శివుణ్ణి తిరస్కరించిన వాడివి. నీ ఆత్మజనుగా నన్ను చెప్పడం నేను సహించలేను. నీ వల్ల కల్గిన ఈ నీచమైన శరీరాన్ని వదిలిపెట్టి పవిత్రంగా ఉండదలిచాను
అంతేకాదు దేవుళ్లకు ఆకాశసంచారం, మానవులకు భూతలసంచారమూ అనేగతులూ సహజసిద్ధమైనవి. అదే రీతిగా ప్రవృత్తి రూప, నివృత్తి రూప, కర్మల్ని రాగ, వైరాగ్యాలకు తగినవని వేదాలు ఆదేశిస్తున్నాయి. సరాగులై కర్మజ్ఞులయిన భౌతిక జీవనులకూ, విరాగులై ఆత్మారాములయిన యోగి సముదాయాలకూ విధి, నిషేధరూపంలో వైదికకర్మలు పొందడం పొందకపోవడం అనేది ప్రకృతి ధర్మం. అందువల్ల తన ధర్మనిర్వహణలో స్థిరుడైన వారిని దూషించడం తగనిపని.
ఈ రెండూ కర్మ విధానాలను నిర్వహించనివాడూ, బ్రహ్మస్వరూపుడూ అయిన శివుణ్ణి పనీపాటలేనివాడని అవమానించడం గొప్ప పాపం.
నాన్నా! సంకల్ప మాత్రంగా కల్గేవి అణిమాది అష్టసిద్దులు. వీటిని మహాయోగులందరూ కొలుస్తుంటారు. అవి నీకు సిద్ధించవు. నీకు సంబంధించిన సంపత్తిని యాగాదికర్మలు ఆచరించేవారూ యాగవిధుల్లో ఆ అన్నపానాదులతో తృప్తి పొందేవారూ యజ్ఞశాలలో ఎంతగానో పొగడుతుంటారు. ఆ ప్రశంసలు నీ మనస్సులో భూరి సంపన్నుడనని గర్వింపచేస్తాయి. 'చితి మీది బూడిదను, బొమికల్ని దండలుగా వేసుకునే శివుడు పేదవాడ"ని విర్రవీగడం నీకు ఒప్పని పని. అని మాట్లాడి మళ్లీ ఇలా అంది.
(1. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశిత్వం, వశిత్వం అనేవి అష్టసిద్ధులు.
2. ధూమమార్గం : పుణ్యకార్యాలు చేసినవారు శరీరపతనానంతరం స్వర్గానికి వెళ్ళేమార్గాన్ని ధూమమార్గం అంటారు.)
ఆ నీలకంకఠుడికి ద్రోహం తలపెట్టిన నీ కూతురుగా పుట్టడమే చాలు. ఓ దుష్టాత్ముడా! నీ తనూజాతనని చెప్పుకోవడానికి బిడియపడ్తున్నాను. పరమ పురుషులకు అపకారం తలపెట్టెవారి పుటకలు పుటం పెట్టడానికి తప్ప ఎందుకూ కొరగావు.
ధర్మాత్ముడు, దైవం అయిన శివుడు నన్ను ఆదరంతోనో, ఎకసక్కెంగానో 'దక్షతనూభవ' అని పిలుస్తుంటాడు. ఆ మాటలకు నేను పరపురమని దుఃఖిస్తూ ఆ సంతోషాన్ని పొందలేను. ఆ మేలపు మాటల్లోని చిరునవ్వును పోగొట్టుకుంటున్నాను. నీ కూతురుగా దుఃఖించడంకంటే చావడం మేలనిపిస్తోంది.
అని ఈ విధంగా తీర్చి ఉన్న యాగసభలో అందరి మధ్యన సతీదేవి దక్షునితో ఇలా పలికి అరిషడ్వర్గాల్ని జయించిన ఆ సతీదేవి ఉత్తరంవైపుకి ముఖంపెట్టి నీటిని సమంత్రకంగా స్పృశించి పవిత్రురాలయింది. ఇంకా ఏమీ మాట్లాడదలచుకోనిదై తగిన యోగాసనంలో నేలమీద కూర్చుంది. యోగమార్గంలోనే శరీరాన్ని త్యజించాలని
వరుసగా ప్రాణవాయువు, అపానవాయువుల్ని సమానంచేసి, ధ్యానమును నాభిస్థానంలో నిలిపి, ఆ తర్వాత ఉదానవాయువుని బొడ్డు పైకి నెట్టి, క్రమంగా హృదయంలో పట్టి ఉంచింది. వాటిని క్రమంగా కంఠంనుంచి కనుబొమల నడుమకు పంపించింది.
ఆ సతీదేవి, శివుని పాదపద్మాలమీది ధ్యాసతో పతిని తప్ప మరొకటి చూడజాలకపోయింది. ఆ మహాదేవుడి ఒడిలో మన్నన పొందిన దేహాన్ని దక్షుడి అపరాధ హేతువుగా విడిచి పెట్టాలనుకుంది. శరీరంలో గాలి, అగ్నుల ఉత్పత్తికి తగిన ధ్యానం చేసింది.
ఆ విధంగా సతీదేవి యోగాగ్నిని వహించడంవల్ల నిర్మలమైన దేహం, ఆ యోగనిష్ఠవల్ల పుట్టిన నిప్పుల్లో ఆ మరుక్షణమే మాడి మసైపోయింది. ఆ తర్వాత
దాన్ని చూసిన మనుష్యులూ, దేవతలూ హాహాకారాలు చేశారు. అయ్యో! మంచి లక్షణవతి అయిన సతీదేవి దక్షుడితో వైరంవల్ల ప్రాణాలు పోగొట్టుకుంది కదా! అంటూ వాపోయారు.
మళ్లీ ఇంకా ఇలా అన్నారు. స్థావర జంగమాత్మకమైన ఈ సకల ప్రాణిలోకాన్ని పుట్టించేవాడు దక్షుడు. ఇతడి గారాబుపట్టి సతీదేవి. మానం, మర్యాదగల బిడ్డ. ఇలాంటి తన కన్న కూతురు తన వల్లనే పరాభవం పొందింది. తన కళ్లముందటే తనువు చాలించింది. అయినా కళ్లు తెరుచుకుని చూస్తూ ఉండిపోయాడు తప్ప కన్నకూతురు చావును అభ్యంతరం పెట్టని ఇలాంటి పాపిష్టి తండ్రి ఎక్కడన్నా ఉంటాడా అని తిట్టుకుంటూ ముక్కుమీద వేలేసుకున్నారు. అంతటితో ఊరుకోలేదు. శాపనార్జాలూ పెట్టారు. ఇంతటి పరమకిరాతుడు, ఇంతటి భ్రష్టబ్రాహ్మడు ఇక మీదటన్నూ తానుగా అప్రతిష్ఠుడు కావాలి. ఎన్నెన్నో లేనిపోని నిందలు కాయాలి. ఆపై నరకాన్ని కళ్లచూడాలి అని ఏవగించుకుంటూ అనేకరకాలుగా ఆడిపోస్తున్నారు. ఆ సమయంలో
శివుడి ప్రమథగణాలు అలా సతీదేవి శరీరం వీడడాన్ని కళ్లారా చూశారు. తమరెక్కల పుష్టి బయలుపడేలా ఆ ద్రోహి దక్షుణ్ణి నరికి పోగులుపెట్టడానికి కత్తులూ గదలూ చేతపట్టారు. పూనికగా ఒక్కపెట్టున లేచి నిలబడినారు.
(పార్షదులు= సహచరులు, చండీశ్వరుడు, నంది, భృంగి, వీరభద్రుడు మొ॥ శివుడి అనుచరగణం.)
అదే సమయాన భృగుముని ఆ గొడవనంతా గమనించాడు. మండిపోయాడు. యాగం పాడుచేయాలనుకున్న శివసేన శక్తిని చంపి యాగాన్ని రక్షించే “అభిచారక” హోమాన్ని తొందరతొందరగా కానిచ్చాడు.
(అభిచార హోమం = క్రతుసంహారమారకహోమం; ఇది యజ్ఞనాశకుల హింసార్థం యాగరక్షణార్థం చేసే హోమం. అపహతమ్, రక్షమొదలైన యజుర్వేద మంత్రాల్ని పఠిస్తూ దక్షిణాగ్నిలో ఆహుతి చేసేది. యాగధ్వంసకుల శక్తిని క్షీణింపచేయడం, తద్వారా యాగధర్మం కాపాడడం ఈ హోమప్రయోజనం.
ఆ సమయంలో భృగువు ఏమాత్రం జాగుచేయకుండా దక్షిణానలంలో హోమద్రవ్యాలు వేల్చాడు. తమ తపోమహిమచే ఏనాటినుంచో చంద్రలోకంలో ఉంటున్న ఋభువులనే దేవతలు ఆ హోమగుండంనుంచి వేలలెక్కన పుట్టుకొచ్చారు. వాళ్లంతా బ్రహ్మతేజస్సులతో ఉట్టిపడుతున్నారు. ఈ ఋభువులు దేవతల ఆకాశరథాలు ఎక్కి కొఱవులను కొరముట్టులుగా పట్టారు. రుద్రానుచరులైన ప్రమథుల, గుహ్యకుల మూకలను వెంటాడి తరిమికొట్టారు. ఆ యా గణాలన్నీ ఒక్కుమ్మడిగా ఓడిపోయాయి. ఆపైన కన్నతండ్రి వల్ల పొందిన అమర్యాదవల్ల కల్గిన సతీదేవి చావువార్తా ఋభుదేవతలు ప్రమథసేనలను జయించిన సంగతీ, నారదముని మాటల్లో శివుడు విని
ఆ తొలిదైవం, ఆ రుద్రుడు, ఆ నీలగళుడు, ఆ గజాసురసంహారి, పట్టలేని కోపంకొద్దీ మునిపళ్లతో పెదవిని కొరికాడు. మత్తుగొన్న సింహంవలె కఠోరంగా గర్జించాడు. అత్యంత భీకరంగా పగలబడి నవ్వాడు. మెరుపులవంటి అగ్ని కీలల పరంపరల అన్వయకాంతితో ప్రకాశిస్తున్నట్టి, అప్పటికోపతీవ్రతతో ఊగుతున్నట్టి ఒక జటను సర్రున పీకి భూమిపైన విసరికొట్టాడు.
అలా గట్టిగా ఊడలాగి విసరుగా నేలకేసి కొట్టిన శివుడి జటనుంచి
శివుడు వీరభద్రుచే దక్షయజ్ఞంబు ధ్వంసంబు సేయించుట