Monday, February 23, 2026

Bakthi Yoga, Sankhya Yoga The teachings of Lord Kapila to his mother Devahuti - కపిలుండు దేవహూతికి భక్తి యోగమును తెలియంజేయుట

కపిలుండు దేవహూతికి భక్తి యోగమును తెలియంజేయుట

ప్రజల ఫలాశలు పలురకాలు. కాబట్టి వారి భక్తియోగపు పోకడలుకూడ అనేక విధాలు. చెపుతాను, వినుమన్నాడు కపిలుడు.

"తామసం, రాజసం, సాత్వికం అని భక్తిభేదాలు మూడురకాలు. వాటిలో తామసభక్తి ఎలాంటిదో చెపుతాను" అన్నాడు కపిలుడు.

పరులను బాధపెట్టటం, కపటవర్తనం, అసూయవంటి గుణాలుకల్గి, ఎల్లప్పుడు భేదదృష్టిగలవాడై, భగవంతునిపై భక్తిని ప్రదర్శించేవాడు తామసుడు. వాని భక్తి తామసభక్తి.

విషయభోగాలలో నైపుణ్యంగల్గి, సంపదకొరకు, కీర్తికొరకు పూజార్హుడనగు నన్ను కొలిచే భక్తుడు రజోగుణంగల రాజసభక్తుడు.

దోషకర్మల్ని నివారిస్తూ 'తన నడవడి లోకానికి ఆదర్శప్రాయమై వుండేటట్లు నడచుకొంటూ, కర్మల్ని భగవదర్పణంగా చేసే మనుజుడు సాత్త్వికయోగి అవుతాడు. అతని గుణాలు ప్రజాహితంగా వుంటాయి.

అమ్మా! మనుపుత్రీ! నేను పాపభావాలు లేనివాణ్ణి. కళ్యాణగుణాలతో విలసిల్లేవాణ్ణి. అంతేగాదు. పరమాత్మను. నా గుణాల్ని చెవులారా విని, భక్తితో నన్ను కొలిచే భక్తుల మనోభావాలు సముద్రాన్ని చేరే దేవగంగమాదిరి ఫలవంతమవుతాయి.

నేను నీచగుణాలకు దూరంగా ఉంటాను. నాపై ఉండవలసిన భక్తిభావన ఎలాంటిదో చెప్పాను. ఏ ఫలితాన్ని ఆశించకుండ నాయెడ చిరకాల భక్తిభావం గల్గియుండుము.

నా భక్తులనుసరించే భక్తి నిష్కామభక్తి. వారికి ఫలాపేక్ష ఉండదు. అలాంటివారికి సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుజ్యం అనేవి నాల్గు సాధనాలు. కాన నాల్గింటితో వెలసిన భక్తికి ఆత్యంతిక భక్తియనిపేరు. అన్యదేవతల్ని కొలుచుటవల్ల ఏర్పడే ఎలాంటి కోర్కెలనైనా, నన్నే ఆరాధించే నా భక్తులు తిరస్కరిస్తారు. అన్యకర్మల్ని వారు అపేక్షించరు. ఆత్యంతిక భక్తిభావంగల మనుజుడు త్రిగుణాలకతీతుడై 'నా ఆకారాన్ని' పొందగల్గుతాడు.

(శరణాగతికి 'భక్తియే' ఆలంబనం. దీని ఆసరాతో విశిష్టాద్వైతులు భగవత్సాయుజ్యాన్ని పొందగలమని విశ్వసిస్తారు. ఈ ఘట్టంలో కపిలాచార్యులు తల్లికి ప్రబోధించిన భక్తిమార్గం అయిదు విధాలుగా ఉంది.

1) తామస భక్తి; హింస, దంభం, మచ్చరం వీనివల్ల క్రోధాన్ని భేదదృష్టిని అవలంబించటం.

2) రాజస భక్తి: కీర్తి సంపదలు మున్నగువానికై విగ్రహారాధన చేయటం

3) దోషనివారణకు లేదా పాపవిముక్తికై శాస్త్రగతిని అనుసరించి భగవంతుని ప్రీతికొఱకై ప్రయత్నించటం.

4) నిర్గుణ భక్తి: ఫలాపేక్షగాని, పైనతెల్పిన మూడుగుణాలతో గాని నిమిత్తంలేని భక్తి.

5) ఆత్యంతిక భక్తి: భగవంతుని సేవ తప్ప తక్కిన దేన్నీ కోరని భక్తి,)

సంధ్యావందనాది నిత్యవిధులు, తిథి వారనక్షత్రాదుల ననుసరించి పితృతర్పణాలు, సాంవత్సరికాలు మున్నగు నిజధర్మాల్ని శ్రద్ధతో చేయాలి. పాంచరాత్ర క్రియాయోగంలో చెప్పబడిన శ్రీహరి ఆరాధన క్రియలు నిష్కామదృష్టితో చేయాలి. శ్రీమహావిష్ణుని విగ్రహాన్ని దర్శించి, స్తోత్రం, సాగిలపడటం, నమస్కరించటం, సేవించటం, ధ్యానించటం, శ్రవణం మొదలైన క్రియలు నిష్టతో నిర్వహించాలి. కర్మసాంగత్యం లేకుండటం, మంచివారిపట్ల ప్రేమ, దీనులయెడ దయ, తుల్యులైనవారితో స్నేహంగా మసలటం, మున్నగు నియమవిధులతో యోగసాధన కావించాలి. ఆధ్యాత్మికం, ఆధిభౌతికం, ఆధిదైవికం అనే మూడింటిని గూర్చి తెలిసికోవాలి. వాటిని గూర్చి ఇతరులకు ప్రవచించాలి.

(ముందటి వచనంలో 'ఆత్యంతికభక్తి' అనే పదముంది “అంతమతిక్రాంతో
త్యంతః స ఏవాత్యంతికః అని 'ఆత్యంతిక' శబ్దానికి నిర్వచనం. అంతవఱకు ఏ మాత్రం మిగులకుండ నిర్వహించడాన్ని 'ఆత్యంతికం' అంటారు. అంటే భగవంతుని పూజావిధానంలో అనుసరించవలసిన యే విధిని కూడ విస్మరించరాదు. విస్మరిస్తే కర్తకు ఏదోవిధమైన నష్టం కల్గుతుందని శాస్త్రవచనం. దీని పిండితార్థం 'అవినాశి' అని గుర్తుంచుకోవాలి.)

ఇంకా కపిలుడు ఇలా అంటున్నాడు,

భక్తుడు శ్రీమన్నారాయణుని గుణకీర్తన చేయాలి. భగవంతుని భక్తుల్ని ప్రేమతో మన్నించాలి. అహంకారం, చాంచల్యం లేకుండా మసలుకోవాలి. పైన చెప్పిన దైవారాధనకార్యాలలో నిమగ్నుడై, వానివల్ల ప్రేరణ పొందిన పుణ్యాత్ముడు మంచిమార్గంలో పయనిస్తాడు. స్వామి గుణగణాల్ని నిరంతరం కీర్తించే పుణ్యాత్ముడు 'అన్యాశ్రయుడు' కాకుండ గాలిలో కలిసిన పూలవాసన నాసారంధ్రాల్లో చొచ్చినట్లే కల్యాణగుణశోభితుడనైన నాలో ఐక్యమవుతాడు.

చరాచరభూతాల్లో నివసించే నన్ను ఏ మానవుడు లెక్కచేయకుండ, కేవలం నా విగ్రహాన్ని మాత్రమే కొలుస్తూ నాపై అనన్యభక్తిని ప్రదర్శింపడో, అలాంటివాడు బూడిదలో హవిస్సు వదలినయట్టి వాడవుతాడు - అనగా వ్యర్థజీవనుడని భావం.

"తల్లీ! సమస్తభూతాలలో ఉన్న నాకు ఈ భూతప్రపంచానికి విడదీయరాని సంబంధముంది. కుటిలాత్ములైన జనానికి ఇది తెలీదు. వారికి నాయందు, ఈ భూతాలయందు ఎల్లప్పుడు తేడాయే కన్పిస్తుంది. అలాంటి మాయావులకు ఎప్పటికీ శాంతి లేదు. వారు సామాన్యద్రవ్యంతో గాని విశేషద్రవ్యంతోగాని నన్ను పూజించినా, నాకు సంతోషం కలుగదు" అని చెప్పి, కపిలుడు గుణవతులలో అగ్రగణ్యయైన తల్లితో ఇంకా ఇలా అన్నాడు.

తల్లీ! అచేతన శరీరాలకంటె ప్రాణులు; ఆ ప్రాణుల్లో వృక్షాలకంటె రసవేదులైన జీవులు, వాటికంటె గంధవేదులైన తేనెటీగలు, తేనెటీగలకంటె శబ్దవేదులైన పాములు, వాటికంటె రూపవేదులైన కాకులు, కాకులకంటె పెక్కు పాదాలుగలవి, జీవులు శ్రేష్టమైనవి.

బహుపాదులకంటె, నాల్గుకాళ్ళ జంతువులు, వాటికంటె రెండుకాళ్ళుగల మానవులు మిక్కిలి శ్రేష్ఠులు. మానవుల్లో నాల్గుతెగలవారున్నారు.

మానవుల్లో నాలుగు జాతులు, ఆ జాతుల్లో బ్రాహ్మణులు, వారిలో వేదజ్ఞులు, వారికంటె వేదార్థం తెలిసినవారు, వారికంటె శాస్త్రసందేహాల్ని తీర్చగల మీమాంసకులు, వారికంటె స్వధర్మమెరిగినవారు, వారికంటె అనుభవజ్ఞులు, వారికంటె సంగవిముక్తులు, వారికంటె ఉత్తమధర్మపరాయణులు, వారికంటె కూడ ఎవడు అన్యదేవతారాధనల్ని త్యజించి, తనకర్మలన్నింటిని నన్నుద్ధేశించి చేస్తాడో, వాడు ఉత్తమోత్తముడు. వాడే నిజంగా సమభావంతో వర్తించే గొప్పవాడు.

సమదర్శియైన ఆ భక్తునిచూచి, భూతకోటి(సకలజాతులు) ఆనందవార్ధిలో మునిగి, ఆయనను గౌరవపురస్కారంగా వేనోళ్ళ స్తుతిస్తుంది.

జగత్కర్త సకల జీవకోటిలో ఆత్మరూపుడై వుంటాడు. పురుషుడు భక్తియోగంద్వారాగాని, అష్టాంగయోగమార్గంలో గాని, 'పరమాత్మ'ను దర్శిస్తాడు. ప్రకృతి మాత్రం 'పురుషస్వరూపంగా ఒక్కొక్కప్పుడు అందుకు భిన్నంగా ఉన్న దైవస్వరూపాన్ని పొంది 'క్రియలు' నిర్వర్తిస్తుంది. ఇదే భగవంతుని స్వరూపం. ఈ స్వరూపం వివిధరూపాలతో భాసించే కాలమని చెప్పబడుతుంది. కాలస్వరూపం మహత్తు మొదలైన ఏడుతత్త్వాలకు, వీటియందు తగుల్కొన్న ప్రాణికోటికి భీతిని కల్గిస్తుంది. భూతాలలో దాగి వాటిని నాశనం చేస్తుంది. విష్ణుమూర్తి యజ్ఞఫలాన్ని ఇచ్చేవాడు కాబట్టి, సమస్త విశ్వాన్ని తన గుప్పిట్లో వుంచుకొని అధికారం చెలాయిస్తుంటాడు. ఆయనకు బంధువులు గాని, శత్రుమిత్రులు గాని వుండరు. సకల ప్రాణికోటిలో ఆయన మేల్కొని, నిద్రావస్థలో వున్న ప్రాణుల్ని సంహరిస్తాడు. అతడంటే భయంతో గాలి వీస్తుంది. సూర్యుడు వెల్గుతాడు. ఇంద్రుడు వర్షిస్తాడు. తారకలు వెల్గుతాయి. చంద్రుడు చల్లగా వెన్నెల కురిపిస్తాడు. సముద్రాలు చెలియలికట్ట దాటవు. చెట్టు, తీగెలు ఋతుధర్మం తప్పక కాయలు కాస్తాయి. పూలు పూస్తాయి. నదులు ప్రవహిస్తాయి. అగ్ని మండుతుంది. కొండలతో కూడిన భూమి క్రుంగదు. ఆకాశం ఎల్లజీవులకు నెలవై వుంటుంది. జగత్తుకు మహత్తే బీజం కాబట్టి, అది ఏడు ఆవరణాలతో కూడిన తన ఉపాధిని విస్తరిస్తుంది. త్రిగుణాభిమానులైన బ్రహ్మాదులు సృష్టికార్యమునందు భగవంతునిచే నియోగింపబడి వారి పని వారు జాగ్రత్తగా చేస్తుంటారు. తల్లిదండ్రులు సంతానాన్ని ఉత్పత్తి చేస్తారు. కాలుడు మృత్యువుతో కలిసి ప్రాణికోటిని సంహరిస్తాడు. స్థావర జంగమాత్మకమైన సమస్త జగత్తు భగవంతుని అధీనంలోనే వుంటుంది” అని చెప్పి, కపిలుడు మరల అంటున్నాడు.

(భగవంతునికి మరో పేరు కాలం. 'కాలః కలయతామహం' అని భగవానుడే గీతలో అన్నాడు. అంటే శుభాశుభాల్ని వృద్ధి క్షయాల్ని చేస్తున్నవారిలో కాలస్వరూపుడు భగవంతుడే.)

ప్రభంజనపు తాకిడి ఎలావుంటుందో మేఘానికి తెలియనట్లే, జగత్కర్త బలమెంతటిదో ఎవ్వరికీ బోధపడదు.

అమ్మా! ఈ ప్రాణికోటి భగవంతుని మాయకు లోబడినట్టిదే. తమకు సుఖదాయకమైన సంపద చేతికందనందువల్ల ఎప్పుడూ బాధలకు గురియౌతుంటుంది.

('సుఖ హేతుకమగునర్థము' అనే మాట ఈ పద్యంలో వుంది. సుఖదాయకమైన అర్ధం (లేదా సొమ్ము) ఏదో కాదు- అది ఆత్మజ్ఞానమే. భౌతిక సుఖం కాదని తెలియాలి. ఆత్మజ్ఞునికి దుఃఖం లేదని భగవంతుడన్నాడు. ఆత్మజ్ఞాన సంపద అక్షయసుఖమని తెలిసికోవాలి.

అజ్ఞాని క్షణభంగురాలైన నివాసం, క్షేత్రం, పశుసంపదలు, భార్య, సంతానం, బంధువులు, అన్యపదార్థాలు మున్నగు అనిత్యవస్తువుల్ని నిత్య వస్తువులుగా నమ్మి జీవిస్తాడు. పెక్కు జంతుదేహాలలో ప్రవేశించాలని ఉబలాటపడతాడు. ఆతనికి వైరాగ్యభావన వుండదు. నరకకూపంలాంటి తన దేహాన్ని వదులుకోలేడు. అదే తనకు మిక్కిలి సుఖప్రదమని భావిస్తాడు. అతడు విష్ణమాయకు లోబడ్డవాడే.

భార్య, పిల్లలు, పశువులు, సొమ్ము, ఇల్లు, వాకిలి మొదలైనవాటి రక్షణ, వాటికి సంబంధించిన వ్యాపారాలలో తగుల్కొని, ప్రతినిత్యం దహ్యమానమైన శరీరం కలవాడవుతూ,

బుద్ధిహీనుడై పాపకర్మల్ని చేస్తూ భార్య చెప్పే రహస్యాలు, పిల్లల తియ్యని పల్కులు విని పరవశించే దౌర్భాగ్యుడవుతాడు

ఇంకా ఇంద్రియదాసుడైనవాడు వాని వెకలి చర్యలందే ఆసక్తుడవుతాడు. దుఃఖమే అతనికి సుఖంగా తోస్తుంది. వాటియందే అభిమానం కల్గివుంటాడు.

తాము సంపాదించిన ధనంతో గర్వించేవారు ఇతరులకు ఎల్లప్పుడు బాధలు కల్గిస్తూనే వుంటారు. వారు మహామూర్ఖులు. తమవారిని రక్షించుటే వారికి ముఖ్యం.

తమవారిని రక్షింపనెంచే మూర్ఖుడు ఆ పనిలోనే మునుగుతూ, తేలుతూ, వారు తినగా మిగిలినదానితో పొట్టపోసుకుంటూ, జీవితాన్ని సాగదీస్తాడు. వాడు పరభాగ్యోపజీవి. వానికి తన కుటుంబాన్ని పోషించే శక్తికూడ ఉండదు.

కుటుంబాన్ని రక్షించలేని దరిద్రుడు సిరిసంపదలకు దూరమై, చెడుబుద్ధి గలవాడై ఏ పని చేయజాలక వ్యర్ధప్రయత్నాలు చేస్తూ మూఢత్వంతో ప్రవర్తిస్తాడు. కృపణత్వంతో జీవిస్తాడు. అతనిది నిర్దయావస్థ. భార్య, పిల్లలు వాణ్ణి అశక్తుడని, తమని పెంచి పోషించలేని అధముడని నిందిస్తారు. వారు అతణ్ణి రైతు బక్కచిక్కిన ముసలెద్దుని చూచినట్లు చులకనగా చూస్తారు. ఆయనకు ఏ విధమైన సుఖం లేదు. ఒకప్పుడు తాను పోషించినవారే తనకింత పిడచపెడితే కాదనలేక బతుకుని వృద్ధాప్యంలో సాగదీస్తూ బాధలను అనుభవిస్తారు.

ఆ దీనుడు అవసానదశలో వికృతాకారుడై, బంధువులు ఏడుస్తుండగా, చావుకెదురుచూస్తూ, ఇంటిని వదలిపోలేక కుక్కమాదిరి ఎంగిలి కుడుస్తూ, శరీరం గజగజ వణుకుతుంటే జీవితాన్ని వెళ్ళదీస్తాడని ముగింపు.

దీనుడు అవసానదశలో రోగగ్రస్తుడవుతాడు. ఆకలి తగ్గిపోతుంది. ఒక్క ముద్ద కూడ ముట్టలేడు. అస్తమించే సమయానికి కళ్ళు తేలేస్తాడు. గొంతులో కఫం కమ్ముకుంటుంది. గొర గొర శబ్దం ఏర్పడుతుంది. అంతలోనే బంధువులు తన చుట్టుచేరి పిలుస్తుంటే ఉలుకూ పలుకూ ఉండదు. ఆయన్ని కాలపాశం బిగిస్తుంది. భార్యని, పిల్లల్ని పోషించగల పట్టు తప్పుతుంది. ఇంద్రియాలలో నిస్సత్తువ ఆవేశిస్తుంది. తెలివి దప్పిన అతనికి కష్టాలే దిక్కు

ఆ దీనునికి చావుదగ్గర పడగానే భయంకరమైన ఆకారాలు గలవారును, కొరకొర చూచే చూపులు గలవారును అయిన ఇద్దఱు యమదూతలు తన యెదుట నిలబడతారు. వారిని చూడగానే అతడు భయంతో మలమూత్రాలు విసర్జిస్తాడు. దూతలు యమపాశంతో వాని బొందినుండి ప్రాణం వెలువరిస్తారు. అంతట జీవుడు బాధలనుభవించవలసిన యాతనాశరీరాన్ని ధరిస్తాడు. రాజభటులు దోషిని శిక్షాస్తానానికి గుంజుకొని పోయినట్లు, యమభటులు బలాత్కారంగా అతణ్ణి బహుదూరం, వెళ్ళడానికి కూడా వీలుగాని భయంకరమైన త్రోవలో శిక్ష ననుభవింపజేయడానికి ఈడ్చుకొనిపోతారు.

యమలోకంలో దీనుని దశ ఎట్లుంటుందో కపిలుడు తల్లికి నివేదిస్తున్నాడు. దీనుని శరీరాన్ని అక్కడి జాగిలాలు పీక్కు తింటాయి. యమభటులు భయంకరంగా పెడబొబ్బలు పెట్టి భయగ్రస్తుణ్ణి చేస్తారు. వాని దేహం భయంతో వణికిపోతుంది. తాను పూర్వజన్మలో చేసిన పాపకార్యాల్ని తలపోసుకొంటూ వాడు స్పృహ కోల్పోతాడు.

ఆ దీనుడు ఆకలిదప్పులతో అలమటిస్తాడు. తుఫాను గాలికి హోరుమని రేగుతూ, ఎండకు మలమలమాడే ఇసుక గల దారిలో నడుస్తూ తపించినవాడౌతాడు. యమభటుల కొరడాదెబ్బలకు వీపు బద్దలవుతుంది. దేహం పట్టుతప్పుతుంది. మార్గమధ్యంలో స్పృహ దప్పినపుడు, నిరాశయమైన నీళ్ళలో మునుకలు వేస్తూ దారిసాగుతాడు. గతంలోని పాపపు చీకట్లు కమ్ముకుంటాయి. తొంబై తొమ్మిదివేల యోజనాలనిడివిగల ఆ యమపుర మార్గంలో భటులు వాణ్ణి ఈడ్చుకొని పోతారు.

మహాపాపి యమపురిమార్గంలో మూడు ముహూర్తాల కాలంలో సాగిపోగా, సామాన్యపాపి రెండు ముహూర్తాల కాలంలోనే ఆ దారిలో పోయి యమనగరం చెరి నరకబాధ లనుభవిస్తాడు.

యమభటులు పాపాత్ముల్ని కొఱవుల్లో పట్టుకుంటారు. కత్తివాదఱలకు గురిచేస్తారు. అగ్గి గుండాల్లో పడదోస్తారు. ఒళ్ళు నుగ్గయ్యేట్లు బడియలతో మోదుతారు.

యమభటులు పాపాత్ముణ్ణి కొఱవులతో కాలుస్తారు. సలసల కాగే నీటిలో ముంచుతారు. గదలతో మోది, కత్తులతో చీలుస్తారు. పేగుల్ని తెంచి, చిత్రవధ చేస్తారు. ఏనుగుల్తో త్రొక్కిస్తారు. పాములతో కరపిస్తారు. కాయంమీద గండశిలల్ని దొర్లిస్తారు. వాని కండలు కోసి వాని నోటితోనే తినిపిస్తారు.

పాపాత్ముడు అవసానదశలో పరివారం పోషిస్తుంటే, వారిచ్చిన తిండితో పొట్ట నింపుకొంటూ, పాడిదప్పి, నరకంలో పడి అలమటిస్తాడు. నిధి కోల్పోయి ఏడ్చే దీనుని మాదిరి, దాంపత్యదోషంవల్ల కల్టిన 'తామిస్రం, అంధతామిస్రం, రౌరవం' అనే ఘరనరక కూపాలలో పడిపోతాడు. తర్వాత పాపసంచయం వ్యయమైపోగా మరల మానవజన్మ నెత్తుతాడు అని కపిలుడు తల్లికి పాపాత్ముని చరిత్రను ఏ కరువు పెట్టాడు. మళ్ళీ, తన ప్రవచనం ఇలా కొనసాగించాడు.

కపిలుండు దేవహూతికి బిండోత్పత్తి క్రమంబు దెలువుట

Devahuti Attained Complete Tatva Jnanam (Knowledge of the Absolute Truth) by Receiving Instructions from her son, Kapila Muni - దేవహూతి పుత్త్రుండైన కపిలాచార్యుని వలన తత్పజ్ఞానంబు వడయుట

దేవహూతి పుత్త్రుండైన కపిలాచార్యుని వలన తత్పజ్ఞానంబు వడయుట

ఓ పుణ్యాత్ముడవైన కపిలమునీ! దుర్మార్గాలలో ప్రవర్తిస్తున్న ఇంద్రియాల పోరాటంచేత ఖిన్నురాలనై కుమిలిపోతున్న నాకు ఈ సాటిలేని మోహం అనే చీకటి నశించిపోవడం ఎలా కలుగుతుంది?

(ఇంద్రియాలు అసత్తులు. అవి కలిగించే సుఖాలు నిజమైన సుఖాలుగా భ్రాంతిపడుతూ ఉంటారు. సుఖాలను అనుభవించే కొద్దీ ఇంకా అనుభవించాలనే కోరిక కలుగుతూనే ఉంటుంది. ఇంద్రియ సుఖాలను గురించి ఆలోచించడం తోనే ఆయుస్సంతా గడచిపోతుంది. దీనిని గురించి తెలుసుకోలేకపోవడమే మోహం, అదే అజ్ఞానం. ఇప్పుడు దేవహూతి ఆ మోహాంధకారాన్ని లేదా ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకొనే ఉపాయాన్ని ఆన్వేషిస్తూ ఉంది.

పుణ్యాత్ముడవైన కపిలమునీ! దట్టమైన సందులేని కటిక చీకట్లతో ఆవరింపబడిన ఈ మహాప్రపంచానికి నీవు ఒక్కడవే ఒకేఒక్క నేత్రమై తీక్ష్ణమైన కాంతితో సూర్యునివలె విరాజిల్లుతూ ఉంటావు.

(చీకటి అజ్ఞానంతో పోల్చబడుతూ ఉంటుంది. చీకటి పోవడానికి వెలుగుకావాలి. అజ్ఞానం పోవడానికి తత్త్వజ్ఞానం కావాలి. ఇక్కడ అజ్ఞానం దేవహూతిది. త
త్త్వజ్ఞాన ప్రదాత కపిలముని. ఆమె అజ్ఞానమనే చీకటిని కపిలముని సూర్యునివలె తన వెలుగు అనే జ్ఞానంతో పోగొడతాడని భావం.)

దోషంలేనివాడా, నిర్మలమైనవా
డా, ఎలాంటి వికారాలు(మార్పులు) లేనివాడా, సంసారమనే తీగకు కొడవలివంటివాడా, పండితవరేణ్యా!, సర్వులకూ శరణ్యమైనవాడా, ధర్మాన్ని విస్తరింపజేసేవాడా!, లోకాలన్నిటికి శుభాలు కలిగించువాడా, నిత్యవిభూతి అయిన వైకుంఠానికి నాయకుడైనవాడా ఓ కపిలమునీ! నా మోహమనే చీకటిని పోగొట్టడానికి సమర్థులు నీవు కాక అన్యులెవరున్నారు? లేరు.

(పై పదాలన్నీ శ్రీహరి స్వభావాన్ని తెలిపేవే. శ్రీహరిని గుర్తుచేసే ఈ పదాలు కపిలముని స్వభావాన్ని చెప్పడానికి కూడా వాడబడ్డాయి. కాబట్టి ఆయన శ్రీమన్నారాయణుని మరొక అవతారమని అర్ధమవుతుంది. దేవహూతి కపిలుని కేవలం తన కుమారుడని అనుకోవడం లేదు. సాక్షాత్తు భగవంతుడుగానే భావించి అలా స్తుతించింది. నిత్య= శాశ్వతమైన; విభూతి= ఐశ్వర్యం. లౌకిక జగత్తులో ఐశ్వర్యంగాని సంపదగాని ఎప్పటికీ శాశ్వతం కాదు. ఎవరూ ఎప్పుడూ ఐశ్వర్య వంతులు కారు. దేశాన్ని పాలించే రాజులుకూడా బతికినంతకాలం ఐశ్వర్యంతో ఉంటారని చెప్పడానికి వీలుగాదు. శ్రీహరి షడ్గుణాలలో ఎప్పుడూ ఐశ్వర్యం కలిగి ఉండడం ఒక గుణం. ఆయన వైకుంఠనాయకుడు కాబట్టి, ఆయనతో లక్ష్మి అనపాయినిగా ఉంటుంది కాబట్టి వైకుంఠం నిత్య ఐశ్వర్యయుక్తంగా ఉంటుంది. అయితే ఈ ఐశ్వర్యం లౌకికం కాదు. అలౌకికం. అక్కడికి చేరుకొన్న నిత్యసూరులు, ముక్తులు స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శిస్తూ అనవరతం ఆనందిస్తూ ఉంటారు. అందుకే వైకుంఠాన్ని నిత్యవిభూతి అని వైష్ణవులు విశ్వసిస్తారు.)

"ఓ నిష్మళంకమైన తపస్సుకు నిధివంటివాడా కపిలమునీ! నిన్ను శరణువేడుతున్నాను. నన్ను కాపాడు అని దేవహూతి వినయంగా స్తుతించి కపిలుని ప్రార్ధించింది. ఆయన సాటిలేని దయతో కారుణ్యం తొణికిసలాడుతుండగా సజ్జనులకు మోక్షం అనే ఫలాన్ని ఇవ్వడానికి తగిన తల్లిమాటలను ఆలకించాడు.

(జీవిత క్లేశాలు అనుభవించే వాళ్లకు తన్నివారకమైన మోక్షేచ్చ తీవ్రంగా ఏర్పడుతుంది. దేవహూతి ఇప్పుడు మోక్షానికి సాధనమైన తత్త్వజ్ఞానాన్ని కపిలుని వద్ద తెలుసుకోవాలనుకొంటున్నది. తదనుగుణమైన మాటలే మాట్లాడింది. కపిలునికి ఆమె ముందే శరణాగతి చేసింది. ఆమె దృష్టిలో ఆయన భగవంతుడే. తత్త్వజ్ఞానం పొందాలనుకొనేవాళ్లకు శరణాగతి చేయడమే మొదటి మెట్టు. ఆమె మాట్లాడిన మాటలు సజ్జనులకందరికి మోక్షమార్గాన్ని చూపగలవిగా అనిపించాయి కపిలునికి. ఆమె తెలుసుకోగోరిన విషయాలను వివరిస్తే ఆ వివరణలు ఆమెకేగాక మోక్షకాములందరికి కూడా బాగా ఉపయోగ పడతాయని పించింది. అందువల్లనే తల్లిమాటలను ఎంతో శ్రద్ధగా విన్నాడు.)

మాటలు విని కపిలముని మందహాస సుందరవదనారవిందుడై మనస్సులో సంతోషం అతిశయించగా, పరమశాంతుడై తన కన్నతల్లితో ఇలా అన్నాడు.

అమ్మా! గొప్పవైన సంసారబంధానికి, మోక్షానికి మానవుని మనస్సే కారణం. ఆ మనస్సు అతిశయించి సత్వరజస్తమస్సులనే మూడు గుణాలతో సంబంధం కలదైతే సంసారబంధానికి హేతువవుతుంది.

(అపవర్గమంటే మోక్షము. దుఃఖాదులను వర్ణించడం మోక్షం. మోక్షస్థితిలో దుఃఖాదులుండవు. సంసారంలో పడడం బంధం. సంసారం నుండి విడివడడం మోక్షం. ఒకటి సంకల్పం. మరొకటి వికల్పం. రెంటికీ మనస్సే కారణం. సంసారంలో ఉంటూనే అందులో మునిగిపోకుండా 'పద్మపత్రమివాంభసా' అన్నట్లు ఉండేవారు ఉంటారు. తామరాకు మీద ఉన్న నీటి బిందువు ఆకుకు తగలకుండా స్వతంత్రంగా ఎలా ఉండ గలుగుతుందో అలా ఉండేవాడే నిజమైన యోగి.

దృశ్య ప్రపంచమంతా త్రిగుణాలతోనే కూడి ఉంటుంది. త్రిగుణాలు అశాశ్వతాలు. వీటితో సంబంధం పెట్టుకొంటే మనిషి బంధాలలో చిక్కుకొంటాడు. ఆత్మ ఒక్కటే త్రిగుణాతీతం, సర్వోత్తమం. భగవద్దీత (2-45) త్రిగుణాలను త్యజించి సుఖదుఃఖాది ద్వంద్వాలు లేనివాడవు కమ్మని ప్రబోధించింది.)

ఆ మనస్సు శ్రీమన్నారాయణునిమీద సంసక్తమైనపుడు మోక్షానికి కారణమవుతుంది. అని మునికులం అనే సముద్రానికి చంద్రుడుగా ప్రకాశించే కపిలముని తల్లికి చెప్పి మళ్లీ సంతోషంతో ఇలా అన్నాడు.

నేను, నాది అనే అహంకారమమకారరూపమైన అభిమానంవల్ల కామం, లోభం మొదలైన దోషసమూహాలు ఆవిర్భవిస్తాయి. చిత్తం వాటికి లోనుగాకుండా విడివడినప్పుడు పరిశుద్ధమవుతుంది. చిత్తం పరిశుద్ధమైనపుడు సుఖం దుఃఖం పొందక ఒకే రూపంగా వెలుగొందుతుంది. ఏకరూపమైన అటువంటి చిత్తంలోనే పరమాత్మ సాక్షాత్కరిస్తాడు. ఆ పరమాత్మ ప్రకృతికంటే అతీతుడు, అభేద్యుడు, స్వయంప్రకాశమానుడు, సూక్ష్మరూపుడు, అపరిచ్చిన్నుడు, ఉదాసీనుడు. అటువంటి పరమాత్మను, ఆ పరమాత్మ తేజస్సుముందు నిస్తేజమైన ప్రపంచాన్ని యోగులు భక్తి జ్ఞానవైరాగ్యయుక్తమైన చిత్తంతో దర్శించి మోక్షప్రాప్తికి సర్వాంతర్యామి అయిన శ్రీమన్నారాయణునియందు సమర్పింపబడిన భక్తిమార్గమే ఉత్తమోత్తమమైనదని, ఇతర మార్గాలు దానికి సాటిరావని చెప్పారు.

ఇంద్రియార్థాలైన శబ్ద స్పర్శరూప రసగంధాలతో కూడిన సంబంధం పనికిరాని విషయమై దృఢమైన బంధానికి కారణమవుతుంది. ఆ సంబంధమే భగవంతుని సంబంధమై మంచి విషయమైనపుడు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే అంతఃకరణాల సంయమనానికి హేతుభూతమై సత్పురుషులకు తెరచిన మోక్షద్వారం అవుతుంది అని తెలుసుకొంటారు. సహన స్వభావం కలిగి అఖిలజీవులకూ స్నేహితులై, శాంతమూర్తులై, కరుణార్ద్రహృదయులై కర్మఫలాలను పరిత్యజించి, తనవారు, బంధువులు అనే అభిమానం విడిచి నా పాదాలను చక్కగా ఆశ్రయించినవారై, నా గుణగణాలను ధ్యానిస్తూ, నా కథల వివరణలతో నిండిన విషయాలను వీనులవిందుగా విని ఆనందిస్తూ, నా కథలనే చెప్పుకొంటూ, వింటూ, ఉండేవారు పరమభాగవతోత్తములు. అటువంటి వారిని ఆధ్యాత్మికం, ఆధిదైవకం, ఆధిభౌతికం అనే తాపత్రయాలు ఏమీ చేయలేవు. అటువంటి సర్వసంగపరిత్యాగులైన పరమభాగవతుల సాంగత్యం మాత్రమే కోరదగింది. ఆ సాంగత్యం సకల దోషాలను నివారిస్తుంది.

అట్టివాళ్ల సాంగత్యంతో సర్వప్రాణుల హృదయాలలో, చెవులలో సుధారసం చిందించే నా కథా చర్చలు వినిపిస్తాయి. నాగుణగానాలు వినడంవల్ల క్రమమార్గంలో శీఘ్రంగా మోక్షమార్గాలను ప్రసాదించే శ్రద్దాభక్తులు ఉద్భవిస్తాయి. అంతేగాక ఎవడైనా నేను కావించిన ఈ విశ్వసృష్టినీ, నాలీలావిహారాలను తలపోస్తూ అందువలన ప్రభవించిన భక్తిచేత ఇంద్రియసుఖాలకు; కనిపించేవి వినిపించేవి అయిన ఇహలోక పరలోక సుఖాలకు లోనుకాకుండా, మనోనిశ్చలత్వం కోసం చక్కని యోగమార్గాన్ని అవలంబిస్తాడో అతడు యోగి అని చెప్పబడతాడు. అటువంటి యోగి ప్రకృతి గుణాలను సేవించడం వల్లను వైరాగ్యగుణాలను పెంపొందించే జ్ఞానయోగం వల్లను ఆత్మార్పణ రూపమైన భక్తియోగంవల్లను సాక్షాత్కరించుకొన్న ఆత్మస్వరూపంగల నన్ను తన హృదయంలో నిలుపుకొంటాడు అని చెప్పగా విని కపిలమునితో దేవహూతి ఇట్లా అన్నది.

(ఇంద్రియాలు మనిషికి కలిగించే సుఖాలు దృష్ట-శ్రుతాలు అని రెండురకాలు - చూడగలిగేవి, వినగలిగేవి. ఐహికం అంటే ఈ లోకానికి సంబంధించిన సుఖాలు దృష్టాలు. ఆముష్మికం అంటే పరలోకం అంటే స్వర్గాది లోకసుఖాలు శ్రుతాలు. స్వయంజ్యోతి - స్వయంగా వెలిగే జ్యోతి. సృష్టిలోని సమస్త పదార్థాలు ఆ జ్యోతివలననే ప్రకాశిస్తాయి. ఆ జ్యోతి లేకుండా వీటికి ప్రకాశముందడదు.)

ఏ భక్తి నీగుణగణాలయందు ఆసక్తి కలిగి ఉంటుందో, ఏ భక్తి సాంసారికమైన పాపాలను నశింపజేసి శీఘ్రంగా మోక్షలక్ష్మీప్రాప్తిని కలిగిస్తుందో, ఆ భక్తివిధానం నాకు తెలిసేటట్లు దయచేసి చెప్పు అని దేవహూతి కపిలమునిని అడిగింది.

(పరమాత్మను గురించిన అనుభవం యోగంతో లభిస్తుంది. యోగాంగాలలో ప్రధానమైనది భక్తి. భక్తి సత్సంగంతో లభిస్తుంది. ఈ విషయాన్ని దేవహూతి కపిలముని నుండి విన్నది. ఆమెకు భక్తి స్వరూప విశేషాలను సమగ్రంగా తెలుసుకోవాలనే శ్రద్ధకలిగి కపిలుని ప్రశ్నించింది. ప్రశ్న సారాంశమేమిటంటే - ఎలాంటి భక్తి ముక్తిని సాధిస్తుంది? స్త్రీ అయిన ఆమెకు అనుష్టించడానికి తగిన భక్తిమార్గం ఏది? అనే విషయం ఆమెకు తెలియాలి. కపిలముని దేవహూతి నెపంగా లోకానికి భక్తి స్వరూపాన్ని గురించి వివరించడానికి ఆమె వేసిన ప్రశ్న ప్రధాన కారణం.)

అంతేకాకుండా నీచే చెప్పబడిన యోగవిద్యను, అందులోని విభాగాలను, అందులోగల తత్త్వల ఉపదేశాన్ని సంపూర్ణంగా, మొద్దుబుద్ధిగల నాకు స్పష్టంగా తెలిసేటట్లు దయతో చెప్పుమని దేవహూతి అడుగగా కపిలముని ఇలా అన్నాడు.

'మాతా! పలు మంచిగుణాలు గలదానా! యోగలక్షణసమేతా! విను. సమస్త పదార్ధాలకు సంబంధించిన పరిపూర్ణజ్ఞానంతో కూడి, తత్త్వం చక్కగా తెలిసి వేదాలలో చెప్పబడిన సకలకర్మలు కలిగి దేవతల సమూహం శ్రద్ధతో ప్రవర్తిస్తుంది. సహజమైన, కారణరహితమైన భగవత్సేవ మోక్షం కంటే గొప్పది. కావున తిన్న అన్నాన్ని జీర్ణంచేసే జఠరాగ్ని వలె ఆ భగవత్సేవ సూక్ష్మశరీరాన్ని నాశనం చేస్తుంది' అని తల్లికి చెప్పి ఇంకా విష్ణుభక్తి వైెభవాలను స్పష్టంగా వివరిస్తాను వినుమన్నాడు కపిలముని.

కొందరు మహాత్ములు నిర్మలమైన భక్తిభావంతో నా పాదపద్మాలను తమ హృదయాలలో నిలుపుకొని ఎంతో కుతూహలంతో పరస్పరం సంభాషించుకొంటూ ఆ సంభాషణల్లో నా దివ్యస్వరూపాన్ని నా క్రియా కలాపాలనూ కీర్తిస్తూ ఉంటారు. వాళ్లు సర్వదా తమ సమస్త కర్మఫలాలను నాకే సమర్పించి భక్తి పరవశులై మోక్షాన్ని కూడా మదిలో కోరరు.

పరిశీలిస్తే ఉత్తములైన కొందరు భాగవతులు ప్రసిద్ధి కక్కిన నా ప్రాచీన అవతారవిశేషాలను స్మరిస్తూ ఉంటారు. అందమైన ముఖం, కరుణనిండిన అరుణనేత్రాలు కలిగి భక్తులకు వరాలు ప్రసాదించే నా పవిత్రమైన అవతారాలనూ, వైభవవిశేషాలను మనస్సులో నిలుపుకొంటారు. తమ భక్తియోగమహత్త్వంవల్ల అప్పటి నా సంలాపాలను స్మరించుకొని కొనియాడుతూ ఉంటారు. నవనవోన్మేషమైన నా అవయవ సౌభాగ్యాన్ని సుందరమైన నా మందహాసాన్ని మనోహరాలైన నా మధుర వాక్కులనూ మననం చేసుకొంటూ, మనస్సును ప్రాణాన్ని లెక్కచేయకుండా మోక్షంమీద అపేక్షలేకుండా ఉంటారు.

పిమ్మట ఆ పరమభాగవతులు ప్రయత్నంతో మోక్షం విషయంలో ఆసక్తి లేకుండా అణిమాది అష్టవిభూతులచే సేవింపబడేది, శాశ్వతమైన ఆనందాన్ని కూర్చేది, గణించడానికి వీలుకానిది, మితిలేనిది, సంపూర్ణవైభవోపేతము, సకల సల్లక్షణాలతో కూడినది, అయిన వైకుంఠ లోకమనే పదవిని ఎంతో గొప్పగా అందుకొంటారు.

(ఇక్కడ వైకుంఠంయొక్క గొప్పతనం చెప్పబడింది. వైకుంఠం ఎనిమిది విధాలైన విభూతులతో కూడి ఉంటుంది. విభూతి అంటే ఐశ్వర్యం. ఈశ్వరభావం ఐశ్వర్యం. ఐశ్వర్యయుక్తుడు ఈశ్వరుడు. ప్రభుత్వం కలవాడు. కావున ఈశ్వరుడంటే ప్రభువు. విశ్వంలోని సర్వప్రాణులకు ఈశ్వరుడే. ఎనిమిది విభూతులు - అణిమ(సూక్ష్మమైనది), మహిమ(మహత్త్వం), గరిమ(గురుత్వం), లఘిమ (లఘుత్వం), ప్రాప్తి (ఇష్టప్రాప్తి), ప్రాకామ్యం (అడ్డులేని ఇచ్చ), ఈశత్వం(సర్వాతిశయత్వం), వశిత్వం (స్వాధీన ఇంద్రియత్వం).

వైకుంఠం నిత్యవిభూతి గలది. అక్కడ దుఃఖాదులుండవు. శాశ్వతంగా ఆనందమే ఉంటుంది. లౌకిక జగత్తులో అంటే లీలావిభూతిలో దుఃఖాదులుంటాయి. గణన అనే మాటకు అర్థం లెక్కించడమేకాక వర్ణించడం అని కూడా. వైకుంఠధామాన్ని వర్ణించడం సాధ్యంకాదు. లక్ష్మి అక్కడే స్వామితో కలసి ఉంటుంది కాబట్టీ వైకుంఠం సంపూర్ణ వైభవాలతో కూడి ఉంటుంది. సర్వలక్షణాలంటే ఎన్ని సల్లక్షణాలుంటే అవన్నీ. ఇలాంటి వైకుంఠ ధామాన్ని పొందడానికి పరమభాగవతులు ఎంతగానో భక్తియోగ పాధన చేయాలి.

తల్లీ! వైకుంఠధామాన్ని పొందిన ఆ పుణ్యాత్ములైన భాగవతులు నాకాలచక్రానికి మింగుడు పడనివారై నిరుపమానమైన శాశ్వతమైన సుఖాలతో ఆలరాలుతూ ఉంటారు. అది ఎలాగంటే -

సమభావంతో నేను వాళ్లతో స్నేహంవల్ల కుమారునివలె ప్రవర్తిస్తాను. వాళ్లపై విశ్వాసంతో స్నేహితుడువలె, వాళ్లకు హితం చెపుతూ నిస్స్వార్థపరుడైన హితునివలె, మంత్రం ఉపదేశించడంవల్ల ఆచార్యునివలె మెలగుతూ ఉంటాను. నిత్యం వాళ్లకు పూజింపదగిన ఇష్టదైవాన్నై కాలచక్రంవల్ల కలిగే భయాలను నివారించి వాళ్లను కాపాడుతూ ఉంటాను. అందువల్ల నా ఆయుధమైన కాలచక్రం వాళ్లను స్పృశింపలేదు.

అని ఈ విధంగా చెప్పి కపిలముని దేవహూతిలో మళ్లీ ఇట్లా అన్నాడు.

అమ్మా! వినుము. ఆత్మ పలుమార్లు భువికీ దివికీ మధ్య పరిభ్రమిస్తూనే ఉంటుంది. మానవుడు ధనం, పశువులు, పుత్రులు, మిత్రులు మగువలు అనువానిపై కోరికలను విడిచిపెట్టి, పాపాలంటనివాడను, ప్రపంచమంతటా వ్యాపించినవాడను అయిన నన్ను అనన్యచిత్తంతో ఆరాధించినట్లయితే వానిని మృత్యుమయమైన సంసార సముద్రంనుండి నేను దరికి చేరుస్తాను.

(భువిదివులు అంటే ఇహం పరం అని అర్ధం చేసుకోవాలి. భూమి ఆకాశం అని కూడా చెప్పవచ్చు. ఈ రెండిటిమధ్య ఆత్మ తిరుగుతుంది అంటే ఆత్మతో కూడిన శరీరం తిరుగుతుందని అర్ధం. ఇహపరాలలో ఉన్న సుఖభోగాలు ఆ రెండు లోకాలలో సంచరించే స్థూలసూక్ష్మ దేహాలు. వాటిపై ఉండే మమతలను, స్థూలదేహాన్ని అనుసరించి ఉండే ధన పశు పుత్రమిత్ర వనితాదులలోను, ఇతర ద్రవ్యాలలోను మమతలు వదలాలి. అలా మమతలు వదలిన తరువాతనే భగవత్పరమైన ఆలోచనలు వస్తాయి. అలాంటి సందర్భంలో ఇతరు లెవ్వరినీ ఆశ్రయించకుండా పరమాత్మను ఏకాగ్రచిత్తంతో ఆరాధించాలి. అలాంటి పరమభాగవతులను జననమరణ రూపమైన సాంసారికవ్యవస్థనుండి గడ్డకెక్కిస్తానని పరమాత్మ నిర్ద్వంద్వంగా ప్రకటిస్తున్నాడు. భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ సర్వధర్మాలను పరిత్యజించి నన్నే శరణు పొందితే మిమ్మల్ని(భక్తులను) సర్వపాపాలనుండి విముక్తులను చేస్తానని ప్రకటించిన విషయం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి.)

నిశ్చయంగా ప్రధానమనబడే ప్రకృతికి అధినాథుడైన పురుషుడను, భగవంతుడను, జగదీశ్వరుడను అయిన నన్నుగాక ఇతర దేవతలను ఆశ్రయిస్తే సంసారభయంలో పడిపోతారు. నా ఆనతిని అతిక్రమించడానికి భయపడడంవల్లనే గాలి వీస్తుంది. అగ్ని జ్వలిస్తుంది. సూర్యుడు వేడిని పుట్టిస్తాడు. ఇంద్రుడు వర్షిస్తాడు. మృత్యువు భయపడి పారిపోతుంది. కావున జ్ఞానవైరాగ్యాలతో కూడిన భక్తియోగంతో ఆ యోగీంద్రులు వైకుంఠంకోసం నా పాదాలను భజిస్తూ భయంలేనివారై ప్రవర్తిస్తారు.

(ప్రకృతి పురుషులను నియమించువాడు పరమాత్నే. సర్వభూతాలలో అంతర్యామిగా వర్తించేవాడూ పరమాత్మే. ప్రకృతి త్రైగుణ్యం అంటే సత్వరజస్తమోగుణ సంయుక్తం. ప్రకృతికి ప్రధానమని మరొక పేరుంది. ప్రకృతి తనపాటికి తానే ప్రపంచసృష్టి చేస్తున్నదని వాదించేవారు దీనికీ పేరు పెట్టారు. ప్రధానానికి నాయకుడు భగవంతుడు. ఆయన జగత్తుకు ప్రభువు. ఇహపరాలలో ఆయన అనుజ్ఞ లేనిదే ఏ కార్యమూ జరుగదు. దేవతలందరూ ఆయన ఆజ్ఞ ప్రకారమే నడుచుకొంటారు. అలా నడుచుకోకపోతే శిక్ష ఉంటుందని వాళ్లకు భయం. అందుకే గాలి అగ్ని మొదలైనభూతాలు చేయాల్సిన పనులు సక్రమంగా చేస్తున్నాయి. ఇలా సర్వ ప్రకృతికి ప్రభువు శ్రీహరి. ఆయనకే మోక్షమిచ్చే శక్తి ఉంది. ఇతర దేవతలకు లేదు.

తల్లీ! మనస్సు భక్తితో నన్ను సేవిస్తుంటే, ఈ ప్రపంచంలో సజ్జనులకు శాశ్వతమైన ముక్తి సమకూరుతుంది.

(ఉత్తములైనవారికి భవబంధవిముక్తి ఎట్లా ఒనగూడుతుందో కపిలమహర్షి తల్లికి నివేదిస్తున్నాడు. భక్తిభావమే మోక్షప్రాప్తికి అసలైన కుదురు. భక్తి లేక ఆరాధన సగుణమని నిర్గుణమని రెండురకాలు. ప్రారంభంలో భక్తిగలవారు దేవుణ్ణి పత్రఫలపుష్పాదులతో సేవిస్తారు. దీన్ని సగుణమంటారు. కాని చిత్తం వికాసదశను చేరుకోగానే క్రమక్రమంగా భక్తుడు సర్వాంతర్యామియైన పరమాత్మను మనఃపుష్పంచేతనే పూజిస్తాడు. దీన్నే నిర్గుణారాధన అంటారు. ఇక్కడ కపిలమహర్షి తల్లికి బోధించినభక్తి 'నిర్గుణభక్తి' యని గుర్తించాలి.

కపిలమహర్షి తల్లికి భక్తియే మోక్షప్రాప్తికి కుదురు అని బోధించి, విష్ణుభక్తియోగాన్ని బాగా పూసగ్రుచ్చినట్లు తెల్పి, మహాసంతోషంతో మరల ఇట్లన్నాడు.

భక్తియోగాన్ని గూర్చి వివరించిన తర్వాత కపిలమహర్షి తల్లియైన దేవహూతికి తాత్త్వికలక్షణాల్ని గూర్చి విశదీకరిస్తున్నాడు. తత్త్వశబ్దాన్ని విభజిస్తే 'తద్‌+త్వమ్‌' అవుతుంది. తత్‌ అంటే 'ఆ పరమాత్మ' అనీ, త్వం అనగా 'నీవు' అనీ అర్థం. పరమాత్మయే జీవులందు ఆత్మరూపుడై వున్నాడని పిండితార్థం. తత్త్వరహస్యం తెలిసికొంటే, మానవులు సంసారబంధంనుండి విడివడుతారు. ఆత్మావలోకనంవల్ల హృదయంలో చిక్కుముళ్ళుగా ఉండే సందేహాలు తెగి ముక్తిలభిస్తుంది. భగవంతుడికి 'తుదిమొదళ్ళు' లేవు. ఆయన సత్యస్వరూపుడు. స్వయంజ్యోతిస్స్వరూపుడు. ఆయన్ని 'పురుషుడు' అంటారు. ఆయన ఈ విశ్వమంతటిని ఆవరించియున్నాడు. ఆ పరమాత్మ ఆత్మరూపుడై త్రిగుణాలకు వశమైనట్టిది, తెలియబడనిది, భగవంతునికి వశమైనది అయిన ప్రకృతియందు అలవోకగాను, విలాసంగాను ప్రవేశించటంవల్ల, ఆ ప్రకృతి త్రిగుణాలకు వశమై ప్రజాసృష్టికి కారణమైనాడు.

అప్పుడా పురుషుడు ప్రకృతితో కలియటంవల్ల తనలో విజ్ఞానం నశించి ప్రాకృతిక లక్షణాలకు వశుడయ్యాడు. తర్వాత జరుగవలసిన జగత్కార్యాలకు తానే కర్తృత్వం వహించి, సంసారంలో తగుల్కొని అస్వతంత్రుడయ్యాడు. కాని యీ సందర్భంలో భగవంతుడు దేనికీ బాధ్యుడు కాడు. తన ప్రమేయమేమియు లేదు. ఆయన విశ్వసృష్టికి పర్యవేక్షకుడు మాత్రమే. ఏమైనా ఈ సృష్టికార్యం, కారణం, వీటి బాధ్యత అనేవి మూడున్నూ కేవలం ప్రకృతికి వశమై ఉంటాయి. సుఖం, దుఃఖం వీటి అనుభవం అనేది పురుషుని వశంలో ఉంటుంది. ఇది తత్త్వలక్షణమని కపిలుడు చెప్పగా, దేవహూతి “స్వామీ! ప్రకృతి మరియు పురుషుడు ఈ ఇర్వురు సత్యమైనట్టియు, మిథ్యయైనట్టియునగు జగత్తుకు మూలకారకులుగదా! వారి లక్షణాల్ని సదసద్విజ్ఞానంతో సహా వివరించండి. అని అడిగింది. కపిలుడు తర్వాత ఉపదేశానికి పూనుకొన్నాడు. 

(ఇక్కడ వ్యాసమహర్షి 'ప్రకృతి - పురుష' లక్షణాల్ని వివరించాడు. 'తత్త్వమసి' అనే మహావాక్యానికి వ్యాఖ్యాన ప్రాయంగా ఉన్న గద్యమిది. ఆ పరమాత్మయే నీవై వున్నావు. అని ఆ మహావాక్యానికి తాత్పర్యం. 'పరమాత్మయే ఆత్మ' అనే రహస్యం తెలిస్తే మానవులు సంసారబంధంనుండి విడివడి కైవల్యపదాన్ని చేరుకొంటారనేది ఆధ్యాత్మికబోధ. తత్త్వమసి అనే మహావాక్యం 'అద్వైతసిద్ధాంతానికి' ఆయువు పట్టు. 'ప్రకృతిం పురుషంచైవ విద్ధ్యనాదీ ఉభావపి' అనేది గీతావాక్యం. ప్రకృతి మరియు పురుషుడు ఈ ఇర్వురికి 'ఆది' లేదు. ఇక్కడ పురుషుడు అనే శబ్దాన్ని - 'ఆత్మ' యని 'పరమాత్మ'యని సందర్భాన్నిబట్టి అర్ధం చేసికోవాలి. ప్రకృతి మాయ. దీనికి మొదలేదో ఎవ్వరు చెప్పలేరు. రాత్రి నిద్రించిన తర్వాత జరిగే స్వప్నమెప్పుడు ప్రారంభింపబడిందో చెప్పజాలనట్లె ఈ 'మాయ'కు (ప్రకృతి) మొదలేదో చెప్పలేము. కానీ 'అంతం' ఎప్పుడో చెప్పగలం. కాబట్టి ప్రకృతి 'అనాది' కాని 'అనంతం' కాదు. అలాగే 'పురుషుడు' నిత్యశుద్ధుడు. అతడుకూడ 'అనాదియే కాని ఆయనకి 'అంతం' లేదు. అందువల్ల పురుషుడు(జీవుడు - లేదా పరమాత్మ 'అనంతుడు'.

ప్రకృతిని మాయ యని బంధమని పేర్కొంటాము. మానవునికి జ్ఞానోదయం కాగానే 'మాయ' లేదా బంధం విడిపోతుంది. 'వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతిసంభవాన్‌' అన్నది గీత. నిజానికి 'పురుషుడు'(ఆత్మ) ఏ విధమైన వికారాలు లేనివాడు. పరిశుద్దుడు కూడ. అయితే అతనికి కామం, క్రోధం, సుఖం, దుఃఖం, వ్యామోహం వంటి వికారాలు ప్రకృతి సాంగత్యం వల్లనే కల్గుతున్నాయి. ఈ ఆత్మ వికారాలనుండి తప్పించుకొని నిర్వికారమైన పరమపురుషుని చేరటానికి గొప్పప్రయత్నం చేయాలి. జీవుడు తనకు దుఃఖంగాని మనోవికారం కాని కల్గితే 'అవి' ప్రకృతికి సంబంధించినవే కాని తనవి కావని దృఢనిశ్చయం గలవాడై వుండాలి. సంసారబంధం, మనోవికారాలు పీడిస్తున్నంతదాక అతడు బద్ధుడై, అస్వతంత్రుడై వుంటాడు.

ఈ గద్యంలో “కార్యకారణ కర్తృత్వంబులు ప్రకృత్యధీనంబులు సుఖదుఃఖభోక్తృత్వంబులు ప్రకృతి విలక్షణుండైన పురుషునివి” అనే వాక్యముంది.

ఇక్కడ కార్యమంటే శరీరమని, కారణమంటే మనస్సు, బుద్ధి, అహంకారం, పంచభూతాలు, శబ్దాదులు అని గ్రహించాలి. వీటిని కల్గించేది ప్రకృతి. పురుషుడు చిద్రూపుడు మరియు అసంగుడు. కాబట్టి వాస్తవంగానైతే అతనికి సుఖదుఃఖాద్యనుభవం ఉండదు. అయితే ప్రకృతి సాంగత్యంవల్ల ఆ యా సుఖదుఃఖాల్ని అనుభవిస్తున్నట్లు తోస్తున్నాడు”. అని మహర్షి దేవహూతికి తత్త్వోపదేశం చేశాడు.)

ప్రకృతి అంటే సత్వరజస్తమోగుణాలు కలది. అది చావు లేనిది. అదే సత్యం. అదే మిథ్య. అభౌతికం కూడ. అది చాల ప్రశస్తమైందని తత్త్వజ్ఞులన్నారు.

ప్రకృతి ఇరవైనాల్గు తత్త్వాలతో కూడినది. అవి అయిదుభూతాలు, అయిదు తన్మాత్రలు, అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు. నాల్గు అంతరంగవిభాగాలు అన్ని కలిస్తే 24 అవుతున్నాయి. దీనినే సగుణ బ్రహ్మతత్త్వమంటారు. ఇక మరొకటి వుంది. దానినే 'పంచవింశకుడు' అంటారు. అంటే ఇరువదియైదవ తత్త్వమని తెలియాలి. కొందఱు దీన్ని పురుషుడని పిలువబడే ఆత్మయని, మరికొందఱు 'కాల' మని పేర్కొంటారు. ఆత్మ అనే జీవుడు ప్రకృతికి చిక్కి భయగ్రస్తుడవుతాడు. అతనికి ప్రకృతి గుణాలు అంటుతాయి.

భగవంతుని చేష్టని కాలమంటారు. అది జీవకోటిలో లోన దాగివుండటంచేత పురుషుడని, దాని వెలుపలివ్యాప్తి 'కాల'మని నిర్వచించటం జరిగింది. ఈ సమస్త జగత్తుకు మూలకారణం ప్రకృతియే. పరమపురుషుడు తన వీర్యాన్ని ప్రకృతియందు నిక్షేపించినందువల్ల. ఆ ప్రకృతి బంగారువన్నెగల (హిరణ్మయం) 'మహత్తు'ని కనింది. ఆ మహత్తే జగత్తు ఆవిర్భవించటానికి మూలహేతువు. సమస్త విశ్వసృష్టికి పరమేశ్వరుని రేతస్సే మూలం. ఈ విశ్వంలో ఆ పరమపురుషుడు ఆత్మరూపంతో వెలుగొందుతూ, ఆత్మని తనతేజస్సుతో కప్పి పుచ్చడానికి ప్రయత్నించే చీకటిని హరిస్తున్నాడు అనగా పరమపురుషుడు 'తమోహంత' అని తెలియాలి.

(ఈ గద్యంలో 'సాంఖ్యతత్త్వం' అభివర్ణింపబడింది. సంఖ్యతో కూడింది సాంఖ్యం. సాంఖ్యమంటే జ్ఞానమని అర్థం. జ్ఞానవిచారణలో అనాత్మ వస్తువుల్ని లెక్కించేటప్పుడు సంఖ్యని ఆశ్రయించవలసివస్తుంది. అందుకే దీన్ని సాంఖ్యమన్నారు. ప్రకృతియందున్న 24 లేదా 96 తత్త్వా
ల్ని బాగా శోధించి, ఆధ్యాత్మికవేత్తలు వాటిని 'అనాత్మరూపాలు' అని విభజించారు. వాటికి సాక్షిగా ఉన్న పరమాత్మను గ్రహించటమే సాంఖ్యవిద్య. ఆత్మానాత్మరూపమైన విజ్ఞానమే 'సాంఖ్య'మని గుర్తించాలి.

1) అనాత్మపదార్ధాలు:

1) పంచభూతాలు : భూమి, నీరు, అగ్ని గాలి, ఆకాశం: 5
(పృథివ్య ప్తేజోవాయ్వాకాశాలు)

2) పంచతన్మాత్రలు : గంధం, రసం, రూపం, స్పర్శ, శబ్దం: 5
(శబ్దస్పర్శరూప రసగంధాలు)

3) జ్ఞానేంద్రియాలు : చర్మం, కన్నులు, చెవులు, నాలుక, ముక్కు: 5
(త్యక్‌చక్షుశ్రోత్ర జిహ్వాఘ్రాణేంద్రియాలు)

4) కర్మేంద్రియాలు : చేతులు, కాళ్ళు, వాక్కు - గుదం - పాయువు(యోని/మేఢ్రం) :5
(వాక్పాణిపాదపాయూపస్థలు)

5) అంతరింద్రియాలు : మనస్సు - బుద్ధి - చిత్తం - అహంకారం - 4
దీన్ని చతుర్వింశతి అన్నారు. 24

2) ఆత్మ : పైన చెప్పిన ఇరువది నాల్గుతత్త్వాలకు సాక్షిభూతంగా ఉన్న పురుషుడే ఆత్మ. దీన్ని 'పంచవింశకుడు' అన్నారు. అనగా ఇరువదియైదవ త
త్త్వమని గుర్తించాలి. కొందఱు వేదాంతులు 25వ తత్త్వానికి కాలమని పేరుపెట్టారు. విశ్వగర్భంలో దాగినశక్తి పురుషుడని, బాహ్యంగా కన్పిస్తున్నది కాలమని వర్గీకరించటం జరిగింది.

3) విశ్వసృష్టి : పరమపురుషుడు(పంచవింశకుడు) తన ఇంద్రియాన్ని ప్రకృతియందు (చతుర్వింశతి) నిక్షేపించగా అందుండి హిరణ్మయమైన 'మహత్తు' ఉదయించింది. ఆ మహత్తునుండి 'భౌతికం - అభౌతికం' అయిన విశ్వం ఆవిర్భవించింది. ఈ 'విశ్వసృష్టికి' పరమేశ్వరుని 'బీజమే కారణం'. అని వేదాంతులన్నారు.)

'పూజ్యురాలా' మూడులోకాలలో పవిత్రమైనట్టిది, తప్పక ఆచరించదగినట్టిదైన 'భగవంతుని రూపవైభవాన్ని చెపుతాను' ఆ రూపం నాల్గువ్యూహాలతో కూడివుంది.

(వ్యూహచతుష్టయం: వ్యూహమనగా భగవంతుని రూపాన్ని కొలిచేపద్ధతి. అది నాల్గురకాలు.

1) వాసుదేవం : వసతి, దీవ్యతి ఇతి వాసుదేవం. ఏది సర్వకాల, సర్వావస్థల్లో ఉంటుందో, ఏది ఎల్లప్పుడు వెల్గుతూవుంటుందో అది వాసుదేవం. దీనినే అధిదైవం రూపం అంటారు. వసుదేవుని కుమారుడు వాసుదేవుడు శ్రీకృష్ణుడు. వాసుదేవం అంటే 'అధిదైవం' అని నిర్వచనం. శ్రీధరీయ వ్యాఖ్యలో దీనికి అధిభూతం అనగా 'లోకాధిష్ఠానరూపం' అని వివరణ వుంది. రోటికి కట్టివేయబడిన స్వామి అని అర్థం. అంతరంగచతుష్టయంలో దీన్ని ఆధ్యాత్మిక దృష్టితో 'చిత్తం'గా గ్రహించాలి.

2) ప్రద్యుమ్నం : ఇది వ్యూహచతుష్టయంలో రెండవది. దీన్ని ప్రద్యుమ్నమంటారు. దీనికి అధిష్ఠాత బ్రహ్మ. అంతరంగచతుష్టయంలో ఇది బుద్ధికి పర్యాయం.

3) అనిరుద్ధం: మనస్సుతో చేసే ఉపాసన 'అనిరుద్ధం'. దీని అధిష్ఠాత చంద్రుడు. కావున అంతరంగచతుష్టయంలో దీన్ని మానసికోపాసన అంటారు.

4) సంకర్షణం : దీనికి 'రుద్రుడు' అధి
ష్ఠాత. అంతరంగ చతుష్టయంలో ఇది అహంకారోపాసనగా గుర్తింపబడింది.

పైనాల్గు మనోబుద్ధిచిత్తాహంకారాలుగా విభజింపబడ్డాయని గ్రహించాలి.)

'మహత్తు'లో దాగిన వాసుదేవవ్యూహం సాత్త్వికగుణంగలది. మాలిన్యంలేనిది. కలతలేనిది. ఆకలి (బుభుక్ష), కోరిక, ఏడ్పు, ఆసక్తి ముసలితనం, చావు అనే ఆరింటిని జయించినది. వాత్సల్యం మొదలైన ఆరు మంచిగుణాలతో ఒప్పారునది వెలితిలేనిది. శాశ్వతమైనది. భక్తులచే కొనియాడబడునది. ఆ 'మహత్తు' నందే క్రియాశక్తి అనే 'అహంకారం' పుట్టింది. అది వైకారికం, తైజసం, తామసం అని మూడురకాలు. ఈ మూడింటిలో వైకారికమనేది మనస్సుకు, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలకు, పంచభూతాలకు సంబంధించినట్టిది.

(సాత్త్వికప్రధానం: వాసుదేవం త్రిగుణాలలో 'సత్వగుణప్రధాన'మైంది. అందుకే అది నిర్మలమైందని, శాంతమైందని చెప్పటం జరిగింది. అది నిత్యసత్యమైన శోభగలది. భక్తజనులకు పూజనీయమైంది. మహత్తులో క్రియాశక్తి పుడుతుంది. క్రియాశక్తి అంటే అహంకారమని అర్ధం. ఈ అహంకారం మూడురకాలు.

1) వైకారికం: ఇది వికారసంబంధి. మార్పుకు గురియౌతుంది. ఆ మార్పు సంకల్పమని వికల్పమని రెండు విధాలు. సంకల్పం సృష్టికి, వికల్పం ప్రళయానికి హేతువులు. దీనికి కామమే మూలం.

"యస్సంకల్పవికల్పాభ్యాం వర్తతేకామసంభవః,
యద్విదుర్హ్యనిరుద్దాఖ్యం హృషీకానామధీశ్వరమ్‌" - అని మూలశ్లోకం వివరిస్తోంది.

ఇంద్రియాలకు అధి
ష్ఠాతయైన అనిరుద్ధమే వైకారికమని మూలశ్లోకం వివరిస్తోంది.

2) తైజసం: ఇది 'మహత్తు'లోని రెండవలక్షణం. అనగా అహంకారంలోని రెండోదశ. ఇంద్రియాలలో దాగిన ప్రాణశక్తియే తైజసమని చెప్పబడుతుంది. తేజస్సుతో కూడింది తైజసం. ఈ తేజస్సు మిథ్యాజ్ఞానం(విపర్యయం), ప్రయాణజ్ఞానం(నిశ్చయం); నిద్రాజ్ఞానం(స్వాపం); స్మృతిజ్ఞానం (మేలుకొనుట) అనే నాల్గింటితో కూడివుంటుంది.

3) తామసం: తమో గుణసంబంధమైనది. ఇది భగవద్భక్తిచే ప్రేరేపింపబడినది. ఈ తామసాహంకారంవల్ల శబ్దమనే తన్మాత్ర ఉదయించింది. దానిచే ఆకాశం, దానివల్ల శ్రోత్రేంద్రియం జనించాయి.)

వైకారికమనే అహంకారం భగవంతుని స్వరూపం. తైజసమనే అహంకారం నిశ్చయజ్ఞానంతోను, ప్రాణం, అపానం, సమానం, ఉదానం, వ్యానం అనే అయిదు ప్రాణాలతో కూడి వుంటుంది. తామసాహంకారం జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలతో ముడివడి, ఇంద్రియజ్ఞానం గలదై వుంటుంది.

మహత్తునుండి, అహంకార ముదయించింది. అహంకారం వైకారికం, తైజసం, తామసమని మూడురకాలు పంచభాతాలు, మనస్సు, కర్మేంద్రియజ్ఞానేంద్రియాలు వైకారికసంబంధులు కాగా బుద్ది, మరియు పంచప్రాణాలు తైజససంబంధులు సత్వరజస్తమోగుణాలు మూడు తామస సంబంధులు.

ఈ అహంకారంనుండి పురుషుడు పుట్టాడు. ఆయన్ను వేయిపడగలతో విలసిల్లే అనంతుడని, సంకర్షణుడని అన్నారు. పంచభూతాలతో, పది ఇంద్రియాలతో, మానసేంద్రియంతో కూడిన రూపమాయనది. కర్త, కర్మ, కారణం, శాంతి, అశాంతి, మౌ
ఢ్యం మొదలైన లక్షణాలతో విలసిల్లేవడాయన. ఆయన రెండో వ్యూహం వైకారికంవల్ల గొప్ప వికారంగా పరిణతి చెందుతుంది. తత్కారణంగా 'అంతరంగ' చతుష్టయమేర్పడింది.

అవ : కపిలుడు తన తల్లి దేవహూతికి జ్ఞానోపదేశం చేసిన ఘట్టం. ఈ విశ్వం ప్రకృతి పురుషుల సంయోగంవల్ల పుట్టింది. పురుషుడు తన వీర్యాన్ని ప్రకృతి గర్భంలో నిక్షేపించినపుడు 'బంగారువన్నె' లో మహత్తు ఆవిర్భవించిందని, దానినుండి అహంకార ముదయించిందని, అది వైకారికం, తైజసం, తామసం అని మూడు విభాగాలని మహర్షి తల్లికి నివేదించాడు. తర్వాత ఆయన సృష్టిరహస్యాల్ని వాసుదేవుని రెండవ వ్యూహమైన 'వైకారికాన్ని' గూర్చి వివరిస్తున్నాడు.

కపిలుడు తల్లియైన దేవహూతితో ఇలా అంటున్నాడు -

“అమ్మా! జీవుని ఆలోచనలు పరిమితమైనవి, అపరిమితమైనవి అని రెండు రకాలు. వీటికి జీవుల మనోవృత్తి, భ్రాంతి అనేవి రెండు కారణాలు. ఇవన్ని కోరికలవల్ల కల్గుతాయి. మనసులో పుట్టె వికారాన్ని 'అనిరుద్ధ' మంటారు. అంటే అది ఒక అడ్డుపెట్టరాని ఊహ. అది దేహేంద్రియాలన్నింటిని శాసించే ప్రభువు. పరమయోగులు సైతం దాన్ని మన్నిస్తారు. అది శరత్కాలంలో వికసించే నల్లకలువమాదిరి నీలవర్ణం గలదై వుంటుంది.

అంతేగాదు. తేజస్సువల్ల నిశ్చయాత్మకమైన బుద్ధి జనిస్తుంది. ఆ బుద్ధికి వస్తుజ్జానం, ఇంద్రియాల్ని అనుమతించటం; సందేహం, భ్రాంతి, జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి అనే త్రివిధదశలు. నిర్ణయశక్తి, జ్ఞాపకశక్తి అనేవి లక్షణాలు. తేజస్సు అనేదొక అహంకారం. దానికి ముక్కు చెవి, కన్ను, నాలుక, చర్మం అనే అయిదు జ్ఞానేంద్రియాలు. వాక్కు, కాలు, చేయి, గుదం, జననేంద్రియం అనే అయిదు కర్మేంద్రియాలు, మరియు జ్ఞానేంద్రియక్రియలు, కర్మేంద్రియక్రియలు ఆధారంగా ఉంటాయి. ప్రాణానికి పనితనం, బుద్ధికి తెలివిడి వున్నందువల్ల ఈ పదిఇంద్రియాలు తేజస్సుగల్గి వుంటాయి.

ఇక తామసమనే అహంకారంవల్ల శబ్దమనే తన్మాత్ర పుట్టింది. దానివల్ల ఆకాశం, దానివల్ల శ్రోతమనే జ్ఞానేంద్రియం పుట్టాయి. ఈ శ్రోత్రం(చెవి) శబ్దాన్ని గ్రహించింది. శబ్దానికి అర్ధం ఏర్పడింది. అది వినేవాడికి జ్ఞానాన్ని కల్గించింది.

తర్వాత ఈ శబ్దరూపతన్మాత్ర అణురూపాకాశమై విశ్వంలో స్థావరజంగమాత్మకమైన పదార్జాలకు లోపలవెలుపల వసతి కల్పించింది. ఇక మనస్సు ప్రాణానికి, పది ఇంద్రియాలకు ఆశ్రయంగా వుంది. అయితే ఈ మనస్సు కాలగతిని బట్టి వికారానికి లోనవుతూ ఉంటుంది.

శబ్దతన్మాత్ర అనేది ఆకాశానికి లక్షణం. ఆకాశంవల్ల స్పర్శజ్ఞానం, దానివల్ల గాలి, గాలివల్ల చర్మజ్ఞానేంద్రియం పుట్టాయి. మెత్తదనం, చల్లదనం, వేడి, అనేవి స్పర్శలక్షణాలు. అంతేగాదు గాలికి కదలించి కూర్చుట, వస్తుగత శబ్దాధికరణం, ఇంద్రియాలలో స్థిరవాసం అనేవి లక్షణాలు.

గాలి స్పర్శతన్మాత్రలక్షణం గలది. దానివల్ల రూపం, రూపంవల్ల తేజస్సు, పుట్టాయి. కంటితో రూపాన్ని చూడటం జరిగింది. వస్తువులో సమత, పదార్థానికి ప్రాధాన్యము లేకపోవటం, అనే పదార్థంలోని కొలత. అనే మూడూ రూపవృత్తులవుతాయి. తేజస్సుకు ఆకృతియే లక్షణం. ప్రకాశం, వంట, నీరు, ఆకలి అనేవి తేజోవృత్తులు. దైవప్రేరణవల్ల ఏర్పడే రూపతన్మాత్రవల్లనూ, తేజస్సువల్లనూ నీరుపుట్టింది. నాలుక నీటిని గ్రహిస్తుంది. ఆ నీరు వస్తుతః ఏకాకృతిగలదైనప్పటికి భౌతికవికారంవల్ల ఒగరు, చేదు, కారం, పులుపు, తీపు అని పలురకాలవుతుంది. ఇంకా ద్రవ్యవికృతివల్ల తడియుట, గట్టిపడుట(ఘనీభావం), ఇంపుగొల్పుట, బ్రతుకుదెరువు నిచ్చుట, బాధల్ని నివారించుట, మెత్తదనం, వేడిమినిపోగొట్టుట. బావినీరు తోడుట, పైకి ఉబికేటట్లు చేయుట వంటివన్నీ నీటికి లక్షణాలు.

రసతన్మాత్ర వికారంచెందటంవల్ల జలమైంది. జలంవల్ల గంధమనే తన్మాత్ర కల్గింది. దానివల్ల భూమి ఏర్పడింది. నాసిక వాసనని గ్రహించింది. ఆ వాసన ఇంగువ, పేలపిండి, దుర్వాసన, కర్పూరంవంటి సువాసన, ఆహ్లాదకరమైన వాసన; వెల్లుల్లివాసన చద్దివాసన, పుల్లదనంవంటి పెక్కురకాలుగా మార్పుచెందుతుంది. ఇందుకు పెక్కుపదార్థాల కలయికయే కారణం.

బొమ్మలుగా నేర్పడుట; జలం, అగ్ని వాయువు అనే మూడింటితో సంబంధం లేనిస్థితి; జలానికి ఆధారమగుట, ఆకాశానికి భిన్నంగా ఉండుట, అన్నిరకాల జీవుల్లోని పురుషలక్షణాన్ని బహిర్గతంచేయుట అనేవి భూమి లక్షణాలు.

ఇంకా ఇలా చెపుతున్నాడు కపిలుడు.

శబ్దగుణం గలది ఆకాశం. స్పర్శగుణం గలది వాయువు. తేజోగుణంగలది అగ్ని. రసగుణంగలది జలం. గంధలక్షణం గలది భూమి. శబ్దానికి చెవి, స్పర్శకు చర్మం (త్వక్‌); రూపానికి అగ్ని; రసానికి నాలుక; గంధానికి ముక్కు(నాసిక) ఆధారంగా ఉన్నాయి. 

పంచభూతాలు : పంచతన్మాత్రలు - 1. భూమి - గంధం; 2. నీరు - రసం; 3. అగ్ని - రూపం; 4. గాలి - స్పర్శ; 5. ఆకాశం - శబ్దం.

మహత్తు, అహంకారం, భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం అనేవి ఏడుతత్త్వాలు. ఇవి ఒకదానితో వేరొకటి సంబంధం కలవై వుంటాయి. భోగాలకు అనువైనవి. వీటివల్ల పురుషాకృతి ఏర్పడటానికి వీలులేకపోవటంవల్ల విశ్వకారకుడును, సత్త్వరజస్తమోగుణాలతో కూడినవాడును, విశ్వశాసకుడును, నిర్దోషియునైన సర్వేశ్వరుడు పై ఏడుతత్త్వాల్లో ప్రవేశించాడు. అప్పుడు మహదాదుల ప్రభావంవల్ల చైతన్యంలేని ఒక్క అండం (గ్రుడ్డు) వాటినుండి పుట్టింది.

ఆ గ్రుడ్డునుండి మహాశక్తిగల విరాట్‌పురుషు డవతరించాడు. ఆ పురుషుణ్ణి ఏడు ఆవరణాలు (మహత్తు, అహంకారం, పృథివి, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశం) అందొక్క ఆవరణానికి జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు పది ఆవరణాలు - చుట్టుకొనివున్నాయి. అవి పదునాల్గులోకాలకు ఉల్లెడపట్టినట్లున్నాయి. అందులో పద్మనాభుని రూపం విరాజిల్లుతున్నది. నీటిలో తేలియాడుతున్న ఆ బంగారుమయమైన గుడ్డులో మహాత్ముడైన నారాయణమూర్తి ప్రవేశించి 'ఆకాశాన్ని' తెరిచాడు. అందులో -

(ఇక్కడ విరాట్పురుషుని ప్రస్తావనవుంది. ఆ పురుషుడు దివ్యశక్తితో కూడినవాడు. ఆ శక్తిని ఆవరించి సస్తావరణాలున్నాయి - అవి 'మహత్తు, అహంకారం, నీరు, అగ్ని, నేల, గాలి, ఆకసం అనేవి. వీటిలో ఒక్కొక్కటి దశావరణాలు కల్గివున్నాయి. అవి చెవి, కన్ను, ముక్కు, నాలుక, చర్మం అనే జ్ఞానేంద్రియాలతోను, మాట, కాళ్ళు, చేతులు, జననేంద్రియం, గుదం అనేక కర్మేంద్రియాలతోను వెరసి పది ఇంద్రియాలతో ఆవరించివుంది. ఈ ఏడు ఆవరణాలు, పదిఇంద్రియాలు కలిసి విశ్వసృష్టి అనే మేడకు మెట్టు, ఆ బంగారువన్నె గుడ్డులోనికి నారాయణుడు ప్రవేశించి 'బ్రహ్మాండాన్ని' తెరిచాడు. చతుర్దశభువనాలకు ఆధారమైనది ఆకాశమే అనే విశ్వసత్యం ఈ పద్యంలో అభివ్యక్తమైంది.

విష్ణుపదం : విష్ణుమూర్తికి పాదపీఠంకాబట్టి ఆకాశానికి ఆ పేరు వచ్చింది. అభవుడు అనగా పుట్టుకలేనివాడు. శ్రీమన్నారాయణుడని అర్ధం. భగవంతునికి చావుపుట్టుకలుండవు. ఆయన హేమాండంలోనికి స్వస్వరూపంతోనే ప్రవేశించాడు.)

ఆ విరాట్పురుషుడు దేదీప్యమానంగా వెల్గుతున్నాడు. ఆయన ముఖంనుండి వాక్కు; వాక్కునుండి  అగ్ని; నాసికనుండి ప్రాణాలతోకూడిన ఘ్రాణేంద్రియం ఆవిర్భవించాయి. 
ఘ్రాణేంద్రియంనుండి వాయువులు, అయిదు ప్రాణవాయువులు; వాటిలో కళ్ళు; కళ్ళనుండి సూర్యుడు, సూర్యుని ధ్యానించగా అందుండి చెవులు; చెవులనుండి శ్రోత్రేంద్రియం, అలాగే దిక్కులు ఏర్పడ్డాయి త్వగింద్రియం (చర్మం) నుండి మీసాలు, తక్కిన వెండ్రుకలు; ఓషధులు పుట్టాయి.

రోమరాజిలో శిశ్నం కన్పించింది. దానిలోని ఇంద్రియమే నీరు. పురీషంనుండి అపానం కల్గింది. దానినుండి మృత్యు వేర్పడింది.

చేతులనుండి శక్తి ఏర్పడింది. వాటినుండి ఇంద్రుడు ఉద్భవించాడు. పాదాలమూలంగా 'గమనక్రియ' ఏర్పడింది. వాటినుండి ఉపేంద్రుడు (హరి) పుట్టాడు.

నాడులవల్ల నెత్తురు, నెత్తురువల్ల నదులు ఏర్పడ్డాయి. కడుపులో ఆకలిదప్పులు పుట్టాయి. ఆ రెండింటి నుండియే సముద్రాలేర్పడ్డాయి.

'అమ్మా! వినండి. హృదయంనుండి మనస్సు కల్గింది. మనస్సువల్ల చంద్రుడు, బుద్ది కల్గారు. చిత్తం నుండి బ్రహ్మ మఱియు బుద్ధి ఆవిర్భవించారు. అహంకారంనుండి రుద్రుడు చిత్తం నుండి చైత్యుడు (క్షేత్రజ్ఞుడు) పుట్టారు.

విరాట్పురుషుడు సమష్టిరూపం. ఆ రూపంనుండి వ్యష్టిరూపాలైన భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం అనే పంచభూతాలు, శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అనే అయిదు తన్మాత్రలు, వాక్కు, కాళ్ళు, చేతులు, గుదం, జననేంద్రియం అనే అయిదు కర్మేంద్రియాలు, చర్మం, కన్నులు, చెవులు, నాలుక, ముక్కు అనే అయిదు జ్ఞానేంద్రియాలు, వాటి అధిదేవతలును సమష్టిరూపుడైన క్షేత్రజ్ఞుణ్ణి తమంతతామే కార్యోన్ముఖుణ్ని చేయజాలవు. (ఆత్మ సమ
ష్టిరూపమైనప్పటికి భూతాదుల ఆసరాలేకుండా ప్రవర్తించదని భావం); భగవంతుని అధీనంలో ఉన్న ఇంద్రియాలు వ్యష్టిగా ఆయన్ని పురికొల్పలేక క్రమంగా తమ అధిష్ఠానాల్ని ఆసరాగా చేసికొన్నాయి, వాటిలో అగ్ని వాక్‌ అనే కర్మేంద్రియంతో కలిసి ముఖాన్ని చేరింది. ముఖం ద్వారా తన పనిచేయటంవల్ల వ్యష్టిశరీరంలోని 'విరాట్‌కార్యం' స్తబ్ధమైంది. తర్వాత నాసిక(ముక్కు), ఘ్రాణమనే జ్ఞానేంద్రియంతో కలిసి గాలితో కూడుకొనింది. ఆదిత్యుడు(అగ్ని సూర్యుడు) 'చక్షువు' అనే జ్ఞానేంద్రియంతో కన్నుల్ని ప్రవేశించగా దాని భూతశక్తి వ్యర్థమైంది. దిక్కులు దేవతగాకల్గిన చెవులు 'శ్రోత్ర'మనే జ్ఞానేంద్రియంతో కలువగా విరాట్‌కార్యప్రేరణ అంతరించింది. ధాతువులు వెంట్రుకలద్వారా 'త్వక్‌ (చర్మం) అనే జ్ఞానేంద్రియాన్ని చేరగా ఉడిగిపోయాయి.' 'అప్‌(నీరు) దైవమైన జననేంద్రియం (శిశ్నం) ఇంద్రియాన్ని చేరుకోగా జలం తనపనిచేయజాలనిదైంది. తర్వాత గుదం(పురీషరంధ్రం)
మిత్తితోకూడి అపానమనే ప్రాణేంద్రియాన్ని చేరగా, అతినీచంగా మారింది. విష్ణుమూర్తి అధీనంలోని 'పాదాలు' గతిధర్మం గల వైనందువల్ల 'అధీశ్వరత్వాని' కోలుపోయాయి. ఇంద్రుని అధీనంలోని చేతులు (పాణీంద్రియాలు) అనే కర్మేంద్రియాలు శక్తిని పుంజుకోగా నిష్పలమయ్యాయి. నాడులు నదులతో కలిసి ఎఱుపు - పసుపు వన్నెతో నొప్పి ప్రయోజనం లేనివయ్యాయి. కడుపు సముద్రాలుగా మారి ఆకలిదప్పులుగల దగుటవల్ల వ్యర్థమైంది. గుండె మనస్సుతోపాటు చంద్రుని చేరి శాంతించింది. బ్రహ్మ అధిదేవతగా గల్గిన బుద్ది హృదయాన్ని చేరి ఫలితం లేనిదైంది. చిత్తం అహంకారంతో రుద్రున్ని చేరగా విరాట్‌ పురుషుని పని స్తంభించింది. అప్పుడు చైత్యుడనే పేరుగల క్షేత్రజ్ఞుడు(ఆత్మ) ఎదలో చేరి చిత్తంతో ప్రవేశింపగా విరాట్‌పురుషుడు జలభూతమైన బ్రహ్మాండాన్ని పొంది కార్యోన్ముఖుడయ్యాడు. పంచప్రాణేంద్రియాలు నిద్రగూరిన విరాట్‌ పురుషుని నిద్రావస్థనుండి మేల్కొల్ప జాలనట్లే, అగ్నిమొదలైన పంచభూతాలు అధిదేవతలుగల ఇంద్రియాలతో సహ దైవికశక్తి గలవైనప్పటికి సత్తువ లేనివవుతాయి.

అయితే ఆత్మజ్ఞులైన ఋషులు సన్న్యసించి, ఎడతెగని భక్తిభావం గలవారై విరాట్‌ పురుషుణ్ణి కొలుస్తారు. ఈ ప్రకృతి పురుషజ్ఞానం మోక్షాన్ని కల్గిస్తుంది. ప్రకృతి సంబంధంవల్ల సంసారబంధం కల్గుతుంది" అని కపిలుడు తల్లి దేవహూతికి చెప్పి, మళ్ళీ ఇలా అన్నాడు.

(శ్రీమద్భాగవతంలో ఈ 'కపిలాచార్యతత్త్వబోధ' భారతీయ సాంఖ్యయోగానికి నిలువుటద్దంగా భాసించే ఘట్టం. కపిలుడు తన తల్లియైన దేవహూతికి తత్త్వజ్ఞానోపదేశం చేయడమే ఈ ఘట్టంలోని ఇతివృత్తం. దీనిలో విశ్వంయొక్క సమష్టి వ్యష్టిస్వరూపం, భక్తియోగవిశిష్టత, జీవుల పిండోత్పత్తిక్రమం, గర్భస్థశిశువులేకజీవుడు భగవంతుని స్తుతించుట అనే అంశాలు వివరింపబడ్డాయి.

ఈ ఘట్టంలో 887 - 94 మధ్య పద్యాల్లో విశ్వసృష్టికి సంబంధించిన భౌతికస్వరూపం అభివర్ణితమైంది. విశ్వమంతా 'మహత్తు, అహంకారం, పృథివి, జలం, అగ్ని, గాలి, ఆకాశం' అనే ఏడుతత్త్వాలతో కూడి వుంది. ఇవి ఒక్కొక్కటి వ్యష్టిగా పురుషుణ్ణి ఉత్పాదించలేకపోయాయి. అప్పుడు జగత్కారణుదైన సర్వేశ్వరుడు ఆ యేడింటిలో ప్రవేశించినపుడు ఏడుతత్త్వాలు ఒండొంటితో కలియగా చేతనరహితమైన ఒక్క అండం బంగారువన్నెతో పుట్టింది. దానినుండి 'విరాట్‌పురుషుడు' ఆవిర్భవించాడు.

అనగా విశ్వస్వరూపమేర్పడింది. విశ్వరూపం పంచభూతాలతో నొప్పింది. అవి ఒక్కొక్కటి పదిఆవరణాలుగా (జ్ఞానేంద్రియకర్మేంద్రియాలు) విభజింపబడ్డాయి. ఈ ఆవరణాలు లోకాలన్నింటికి మెట్లవరసలయ్యాయి. అవన్నీ విష్ణమయమైన రూపాలే. నీటిలో తేలియాడుతున్న ఆ గ్రుడ్డులో దేవదేవుడైన నారాయణుడు ప్రవేశించి ఆకాశాన్ని తెరిచాడు. అందులో విశ్వస్వరూపం వెలుగొందింది. అది 'పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు, తన్మాత్రలు, కర్మేంద్రియాలు, అంతరంగచతుష్టయం అనే ఇరువదినాల్గు(చతుర్వింశతి) సమష్టితత్త్వాలుగా భాసించింది. కాని సమష్టిగా ఉన్న ఈ విశ్వరూపుడు స్వయంగా ప్రవృత్తినిర్వహణ చేయజాలని పరిస్థితి యేర్పడింది.' అప్పుడు పంచభూతాలు, దశేంద్రియాలు వ్యష్టిగా(పృథక్‌భావం) అధిదేవతల సహాయంతో ప్రవృత్తిని ఆరంభీంచాయి. అనంతరం నారాయణాంశ 'ప్రత్యగాత్మ' రూపంతో ఆ యేడుతత్త్వాలలో ప్రవేశించింది. సత్త్వరజస్తమోగుణాల ప్రేరణతో పురుషుడు ప్రకృతిగర్భంలో భీజావాపం చేశాడు. తత్కారణంగా పిండోత్పత్తియి, అందుండి జీవరూపమేర్పడింది. ఆ జీవరూపం మానవులు, పశుపక్ష్యాదులుగా ఏర్పడింది. రూపం సజీవమని, నిర్జివమని రెందు రకాలు. మానవులు, పశుపక్ష్యాదులు సజీవరూపాలు కాగా నదులు, సముద్రాలు, పర్వతారణ్యాదులు వగైరా నిర్జివరూపాలు. ఏ తత్వానికి ఏది అధిష్ఠానమో వచన తాత్పర్యంలో వివరించడమైంది.

తన్మాత్రలు : తద్‌+మాత్రలు= తన్మాత్రలు. అంటే 'దానికి మాత్రమే పరిమితమైంది' అని అర్ధం. ఆకాశం, వాయువు, తేజస్సు (అగ్ని), నీరు, భూమి అనే పంచభూతాలకు అధిష్టానాలు వరుసగా చెవి, చర్మం, కన్ను నాలుక, ముక్కు అనేవి. వీటియొక్క తన్మాత్రలు వరుసగా శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం. ఇవి ఒక్కొక్కటి తమపని మాత్రమే చేస్తాయి. ఒకదానిపని మరొకటి చేయదు. అందుకే ఇవి తన్మాత్రలు. ఉదాహరణకు చెవి శబ్దాన్ని గ్రహిస్తుంది. తక్కిన నేత్రాదులు శబ్దగ్రహణం చేయలేవు. ఇట్లే తక్కినవి కూడ. తన్మాత్రలు జ్ఞానేంద్రియాలకు మాత్రమే వర్తిస్తాయి.

క్షేత్రజ్ఞుడు: సాంఖ్యయోగాన్ని అనుసరించి 5 భూతాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 తన్మాత్రలు, 4 అంతరంగాలు కలిసి ఈ ఇర్వదినాల్లు 'చతుర్వింశతితత్వాలు'. వీటినే 'క్షేత్రం' అని ఆధ్యాత్మికులంటారు. ఇవి అంతరిస్తాయి. అంతరించనిది, అవినాశియైనది ఇర్వదియైదవతత్తం - దానినే 'క్షేత్రజ్ఞుడు' అంటారు. ఇర్వదినాల్గుతత్వాలు 'పొలం'కాగా ఇర్వదియైదవతత్త్వం 'పొలంకాపరి' అని సాధారణపరిభాషగా గ్రహించాలి. ఈ క్షేత్రజ్ఞుణ్ణి ఆత్మయని ప్రత్యగాత్మయని, అవినాశియని, పేర్కొంటారు. క్షేత్రాన్ని ఉపాధియని, శరీరమని, అనాత్మయని, వినాశియని పే
ర్కొనటం కద్దు. వివరణకోసం భగవద్గీతలోని 18వ అధ్యాయాన్ని పరిశీలించాలి.

ఈ క్షేత్రజ్ఞుడు లేక ఆత్మ పాంచభౌతికమైన ఉపాధిలో నిశ్చలంగా నిర్వికారంగా వుంటూ, ఉపాధిచేసే క్రియని, దానిగతిని పర్యవేక్షిస్తూ కాపలాదారుగా ఉంటుందని, ఉపాధి అంతరించగానే, ఆత్మ దాని స్వస్థానమైన పరమాత్మలో విలీనమౌతుందనేది ఆధ్యాత్మిక సిద్ధాంతం.

అద్వైతం : ఆత్మ పరమాత్మల ఐక్యమే అద్వైతం(రెండూ ఒకటే). శంకరభగవత్పాదులు ప్రతిపాదించిన సిద్ధాంతమిది. పరమాత్మలోని ఏకాంశం ఆత్మయని, అది భౌతికరూపంలో నిగూఢంగా దాగి, దాని చర్యని పర్యవేక్షిస్తూ వుంటుందని, ఉపాధి అంతరించగానే, ఆ బొందిని వదలి మూలస్థానమైన పరమాత్మలో అంతర్భూతమౌతుందని భగవత్పాదులు సిద్ధాంతీకరించారు. ఆయన ప్రవచించిన సిద్ధాంతం 'అద్వైతంగా' వాసిక్కింది.

పంచభూతాలు : 'ఆకాశా ద్వాయుః, వాయోరగ్నిః, అగ్నేరాపః, అద్భ్యః, పృథివీ, పృథివ్యాః ఓషధయః' అని శ్రుతి. ఆకాశంనుండి వాయువు, వాయువునుండి అగ్ని, అగ్నినుండి జలం, జలంనుండి భూమి, భూమినుండి తక్కిన ఓషధులు సంభవించాయని పై శాస్త్రవాక్యానికి అర్ధం. పంచభూతాల ఉత్పత్తి క్రమాన్ని చెప్పే వాక్యమది.)

జనంచే పొగడ్తలనొందే ఓ తల్లీ! విను. పరమాత్మ సత్త్వం, రజస్సు, తమస్సు అనే ఈ మూడుగుణాలకు నెలవైన ప్రకృతికి వశుడైనప్పటికి, దాని సుఖదుఃఖాలకు, వ్యామోహానికి ఆకర్షితుడు కాదు. కాని ప్రకృతి వికారాలకు, త్రిగుణాలకు చిక్కకుండా, నీటిపై తేలియాడే సూర్యుని మాదిరి స్వచ్చంగా వుండే ఆత్మమాత్రం మహదాదులకు, ఏకాదశేంద్రియాలకు, తన్మాత్రలకు చిక్కి అహంకారంతో తెలివి తప్పి, 'ఈ సమస్త భౌతిక - భౌతికేతరమైన ప్రకృతికి నేను అధిపతి' నని విజృంభించి ప్రాకృతిక దోషాల్ని మూటగట్టుకొంటాడు.

(ఈ పద్యంలో 'పరమాత్మ ఆత్మ' లనే రెండింటికి కొంచెం భేదం ఉన్నట్లు చెప్పబడింది. పరమాత్మ త్రిగుణాతీతుడు. సుఖదుఃఖమోహాలకు అతీతుడు. ప్రకృతిశక్తులన్నింట తానున్నప్పటికి, వాటికి చిక్కడు. ఈ సమస్త పదార్థాలపైన, తత్త్వాలపైన, ప్రాకృతిక శక్తులపైన ఆధిపత్యం కల్గివుంటాడు. పరమాత్మలోని ఏకాంశయైన ఆత్మకూడ మానసిక వికారాలుగాని, త్రిగుణాల బంధంగాని లేనిదే. స్వచ్చమైన నీటిపై ప్రతిఫలించే సూర్యునిపోలిందే. కాని దానికి మహదాదులతోను, ఏకాదశేంద్రియాలతోను, తన్మాత్రలతోను అనుబంధమేర్పడ్డకారణంచేత, నేనే సర్వప్రకృతికి నేతను అనే అహంకారంతో కొంతదోషం మాటగట్టుకొంటుంది. ఉపాధిస్పర్శవల్ల ఆత్మఒకింత కలుషితమౌతుందని భాగవతం అంటోంది. ఇది కపిలసాంఖ్యసిద్దాంతం.)

ఆత్మ కర్మసాంగత్యంవల్ల వివిధజాతులైన దేవతలు, పశుపక్ష్యాదులు, మానవులు, చలనంలేని కొండలు వగైరా రూపాలెత్తి వాటిల్లో పడి సంసారాన్ని తలకెత్తుకుంటుంది.

భ్రాంతికి లోనైనవాడు ఇంద్రియవిషయాల్ని గూర్చి ఆలోచిస్తూ, కలలో కైవసమైన నిధిలాగ భ్రాంతికి లోనై దారితప్పి నడుస్తాడు.

మోక్షం కోరేవ్యక్తి అన్నింట ఆసక్తి వదలి, భక్తియోగంద్వారా యమం, నియమం మున్నగు యోగాంగాల అభ్యాసం చేస్తూ, మనస్సును అదుపులో ఉంచుకోవాలి.

(అష్టాంగయోగాలు : ఇవి ఎనిమిది. యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధ్యానం, ధారణ, సమాధి. ఇవి మనస్సుని అదుపులోనుంచే సాధనాలు. వీటి వివరణ ఇదే స్కంధంలోని 'యజ్ఞవరాహ ఘట్టంలో చూడవచ్చు.

భక్తి : అనురక్తిః పరే తత్వే భక్తిరిత్యభిధీయతే ।

పరమాత్మయందుగల ఆసక్తియే భక్తియని నిర్వచనం. భగవంతునియం దనురక్తిగలవాడే భక్తుడు. గీతలో 12వ అధ్యాయం భక్తియోగం. ఇందులో ముప్పదియైదు భక్తుని లక్షణాలు చెప్పబడ్డాయి. భక్తియోగములోని 18వ శ్లోకంనుండి 19వ శ్లోకం వఱకు చెప్పబడినవి.)

మోక్షార్ధి శ్రద్ధాళువై ఉండాలి. నన్ను స్మరిస్తుండటం, నా పాదపూజ, నా కథల్ని వినటం, జీవులయెడ సమభావం, పగలేమి, బ్రహ్మచర్యం, గొప్పమౌనం అనేవి ధార్మికపద్ధతులు. వీటితో నిత్యసంబంధం కల్గివుండాలి. ఆలాగ వుండేవాడు ఆనందంగా ఉంటాడు. పరిమితంగా తింటాడు ఒంటరిగా ఉంటాడు ఎల్లప్పుడూ దైవచింత గలవాడుగా విజ్ఞానిగా, ఈర్ష్యాద్వేషాలు లేనివాడుగా వర్తిస్తాడు. శరీర పరిగ్రహమంటే ఆగ్రహిస్తాడు.

జీవేశ్వరుల తత్త్వం తెలిసిన బుద్ది(నిశ్చయజ్ఞానంగల అంతరంగం) జాగ్రదవస్థను పొంది; తక్కిన దేన్ని చూడకుండ, ఆత్మజ్ఞానసహాయంతో, కంటితో సూర్యుణ్ణి చూచినట్లు పరమాత్మను చూస్తుంది. ఉపాధికి భిన్నంగా జీవునిలో దాగివున్న ఆ ఆత్మ సత్యస్వరూపుడును, కార్యకరణాలకు అధిష్టాతయు, పరిపూర్ణుడును అయిన పరబ్రహ్మాన్ని చేరుకొంటాడు.

(ఈ వచనంలో యోగి పరమాత్మనెట్లా దర్శిస్తాడో చెప్పబడింది. సూర్యుడు అధిదేవతగా వున్న కంటితోనే ఆకాశంపై వెలుగుతున్న సూర్యుణ్ణి చూచినట్లే యోగికూడ అహంకారాన్ని వదలి ఆత్మద్వారా పరమాత్ముని చూస్తాడు. చిట్టచివర, శరీరాదుల్ని(ఉపాధిని) విడిచి అహంకారం మొదలైన అసత్యపదార్దాల్లోనే వెలుగుతున్న సత్స్వరూపుడైన పరబ్రహ్మాన్ని పొందుతాడు. ఇది పిండితార్థం.)

ఆత్మజ్ఞానులకు నారాయణుని దివ్యరూపం ఎలా కన్పిస్తుందో కపిలుడు తల్లికి నివేదిస్తున్నాడు. ఈ విషయం ఒక దృష్టాంత సహాయంతో చెప్పబడింది. ఆకాశమందున్న సూర్యుని ప్రతిబింబం నీటిలో పడుతుంది. దాని ప్రతిబింబం గోడలందలి కిటికీలద్వారా ఇంటి గోడలపైన పడుతుంది. ఇంట్లోవున్న వాళ్ళు మొదట గోడమీది ప్రతిబింబాన్ని నీటిలోపడ్డ ప్రతిబింబాన్ని చూసి, ఆ పైన ఆకాశంలో వెల్గుతున్న సూర్యుణ్ణి దర్శిస్తారు. అలాగే యోగులు, పంచభూతాలు, పది ఇంద్రియాలు, అంతరంగ స్వరూపంగా అమరి, త్రిగుణాత్మకమైన అహంకారమందు ప్రతిబింబించిన పరమాత్మస్వరూపాన్ని 'అహంకారం' నుండే చూస్తారు.

జీవుని గాఢనిద్రావస్థలోకూడ ఆత్మ మేల్కొనే వుంటుంది. సూక్ష్మభూతాలు, ఏకాదశేంద్రియాలు(11), మనస్సు, బుద్ది పనిచేయవు. ప్రకృతియందు కేవలం వాటి వాసనలు మాత్రమే మిగిలి వుంటాయి. గాఢ నిద్రావస్థలో కూడ జీవుడు మేల్కొనివుండి, భూతాదులు తన్ను కప్పినప్పటికి, 'పరమాత్మను' చూస్తూనే వుంటాడు అని కపిలుడు చెప్పగా విని దేవహూతి మళ్ళీ యిలా ప్రశ్నించింది.

(కపిల దేవహూతి ఉపాఖ్యానం
ఈ ఉపాఖ్యానంలో 887వ వచనంనుండి 903వ వఱకు సాగిన ఇతివృత్తం ప్రధానంగా కపిలసాంఖ్యయోగలక్షణాలతో కూడివుంది. ఇది జటిలమైన భారతీయ వేదాంతరహస్యాలతో ఒప్పుతున్నది. ఈ ఘట్టం పద్యసాహిత్యంతో ముడివడి ఉన్నందువల్ల సామాన్యపాఠకుడు అలవోకగా దీన్ని చదివి పూర్వాపరాల్ని సమన్వయించుకోలేడు. అందువల్ల ఈ అంశాల్ని దిగువపట్టిక ద్వారా వివరిస్తే, సులభగ్రాహ్యంగా ఉంటుందని భావించి ఇక్కడ పొందుపరచడమైంది.

ప్రకృతి - పురుషుడు - ఈ ఇర్వురు వేరు వేరు.

ప్రకృతికి మూడుగుణాలు : సత్వం - రజస్సు - తమస్సు.

పురుషుడు పై మూడుగుణాలచే ఆకర్షితుడవుతాడు. సుఖదుఃఖాల్ని అనుభవిస్తుంటాడు.

ప్రకృతి లక్షణాలు త్రిగుణాత్మకం బ్రహ్మం కాదు. అది అవ్యక్తం. నిత్యం - సత్తు - అసత్తులతో కూడుకొనివుంటుంది. కార్యకారణ రూపంకూడ.

భూతాలు అయిదు. భూమి, నీరు, అగ్ని గాలి, ఆకాశం.

తన్మాత్రలు అయిదు. గంధం, రసం, రూపం, స్పర్శ, శబ్దం.

కర్మేంద్రియాలు అయిదు. వాక్కు పాదాలు, చేతులు, పాయువు, ఉపస్ట. 

జ్ఞానేంద్రియాలు అయిదు చర్మం, కన్నులు, చెవులు, ముక్కు నాలుక.

అంతఃకరణచతుష్టయం: మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం.

చతుర్వింశతి: 24. పైన తెల్పిన భూతాలు, తన్మాత్రలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతఃకరణాలు కలిసినట్టిది. ఈ ఇరువది నాల్టింటిని 'ప్రకృతి' అంటారు.

పంచవింశకుండు: ఇరువదియైదవతత్త్వం. ఇది రెండురకాలు 1) కాలం 2) భగవంతుడు.

పురుషుడు 'చిత్‌' రూపమైన తనవీర్యాన్ని ప్రకృతి గర్భంలో నిక్షేపిస్తాడు. అపుడు ప్రకృతినుండి 'మహత్తు' మహత్తునుండి 'అహంకారం' ఉదయిస్తాయి.

అహంకారం మూడురకాలు 1. వికారం 2. తైజసం 3. తామసం.

(మనస్తత్త్వం - అనిరుద్దుడు) (బుద్ధి - ఇంద్రియాలు - ప్రద్యుమ్నుడు)

తన్మాత్రలు: 
1. శబ్దం: ఆకాశలక్షణం గలది. 'చెవి' అధిష్ఠానం

2 స్పర్శ: మృదుత్వం, కాఠిన్యం, చల్లదనం, వేడిమి దాని లక్షణాలు(వాయువు) చర్మం అధిష్ఠానం

3. రూపం: (కన్ను) - తేజస్సు - అగ్ని అధి
ష్ఠానం

4 రసం: (నాలుక) - నీరు - నాలుక అధి
ష్ఠానం

5. గంధం: (భూమి) ముక్కు అధి
ష్ఠానం.

శబ్దధర్మాలు వాయువు, భూమి మున్నగు వానిలో కూడ కన్పిస్తాయి.

మహదాదులు : ఇవి ఏడు. 1) మహత్తు 2) అహంకారం 3) భూమి 4)నీరు 5) తేజస్సు 6) వాయువు 7)ఆకాశం ఈ యేడూ కలిస్తే పురుషుడు అవుతాడు. భగవంతుడు వాటిలో ప్రవేశించినపుడు అవి క్షోభచెంది వాటినుండి అచేతనమైన ఒక అండం (గ్రుడ్డు) ఏర్పడుతుంది. చాలకాలం నీటిలో వుంటుంది.

విరాట్పురుషుడు : గ్రుడ్డునుండి లేచిన మహాశక్తి. ఆ పురుషుని ఇంద్రియాలు - అధిదేవతలు దిగువరీతి ఏర్పడ్డాయి.

ముఖం (నోరు): అగ్ని
ముక్కురంధ్రాలు : వాయువు
నయనాలు (కన్నులు): సూర్యుడు
చెవులు (శ్రవణేంద్రియం) :దిగ్దేవతలు
చర్మం (త్వక్కు): ఓషధులు
మేఢ్రం లేదా శిశ్నం (ఉపస్థ): జలం
గుదం(అపానేంద్రియం) : మృత్యువు(దుర్వాసన)
కాళ్ళు (చరణాలు): ఉపేంద్రుడు
చేతులు (పాణీంద్రియాలు) : ఇంద్రుడు.
నాడులు (రక్తం) : నదులు
కడుపు= ఆకలిదప్పులు : సముద్రం
హృదయం - మనస్సు : చంద్రుడు
హృదయం - బుద్ధి :బ్రహ్మ
హృదయం అహంకారం : రుద్రుడు
హృదయం చిత్తం : క్షేత్రజ్ఞుడు(ప్రత్యగాత్మ)

నీటిలో ప్రతిబింబించే సూర్యునికి నీటిలక్షణాలు సోకనట్లే, ప్రకృతిలో వున్న పురుషునికి ప్రాకృతిక గుణాలు అంటవు. అతడు నిర్గుణుడు. అయినా ప్రకృతి గుణాలతో నిత్యసంబంధం పెట్టుకుంటాడు కాబట్టి అహంకారంచేత ఆకర్షితుడవుతాడు. కర్మదోషకారణంగా అతడు దేవతలు, పశుపక్ష్యాదులు, మానవులు వగైరా జన్మలెత్తి సంసారచక్రంలో తిరుగుతుంటాడు.

సంసారం: ఇదొక కలవంటిది. దీనికి అస్తిత్వం లేదు. ఉన్నట్లు అన్పిస్తుంది. కాబట్టి అది భ్రాంతి.)

మహాత్మా! ఓ పరమపురుషా! భూమికి గంధంతోనూ, నీటికి రసంతోను విడదీయరాని సాంగత్యమున్నట్లే, ప్రకృతి పురుషులకు కూడ నిత్యసాంగత్యం ఉందిగదా! మరి పురుషుడు ప్రకృతినుండిగాని, ప్రకృతి పురుషునినుండిగాని విడదీయబడటం ఎట్లవుతుంది? తత్త్వజ్ఞానమాత్రంచేత సాంసారిక బాధలు లేదా భయాలు ఎలా తొలగిపోతాయి? చచ్చిన జీవికి పునర్జన్మలేని స్థితి యేది? వివరింపుమని దేవహూతి కుమారుణ్ణి అడిగింది.

నిర్నిమిత్తమైన తన ధర్మం స్వచ్చమైన అంతరంగం, అనన్యభక్తి, భగవంతుని సత్కథల్ని శ్రవణం చేయటం, వైరాగ్యం, కామంపట్ల అనాసక్తి ప్రకృతి పురుషతత్త్వం
 వాస్తవంగా తెలిసివుండటం, తపోయోగం, చిత్తమందు ఏకాగ్రత అనేవి పురుష లక్షణాలు. ఈ గుణాల ఆసరాతో పురుషుడు ప్రకృతిని వదలగలడు. ఎలా? అరణినుండి పుట్టిన అగ్ని అరణిని కాలుస్తుందిగదా! అలాగే పురుషుడుకూడ ప్రకృతిని వశపరచుకొని, భోగభాగ్యాలు అనుభవించి పరిత్యజిస్తాడు.

పురుషుడు 'విశ్వనాథుడు' ఆయనకు సహజమైన మహిమవుంది. తనతో నిత్యసాంగత్యం ఉన్నప్పటికి ప్రకృతి పురుషునికి ఎలాంటి అశుభాన్ని కల్గింపజాలదు.

నిద్రపోయినవానికి కలలు ఎన్నో అనర్ధాలు కల్గిస్తాయి. మేలుకోగానె అవన్నీ వట్టివైపోతాయి. మిథ్యలౌతాయి. అట్లే ప్రకృతి అజ్ఞానికి సాంసారికమైన ఎన్నో ఉపద్రవాల్ని కల్గిస్తుంది. కాని ఆత్మస్వరూపుడును, జగత్కర్తయు, కర్మలకు సాక్షియు, నైన పరమ పురుషుణ్ణి ప్రకృతి యేమియు చేయలేదు.

ప్రకృతివల్ల పురుషుని కేవిధమైన అనర్థాలు కల్గవని అంటూ మళ్ళీ ఇలా అంటున్నాడు కపిలమహర్షి

అమ్మా! పుణ్యాత్మురాలా! జ్ఞానియైనవాడు భగవంతునిపై తన చిత్తాన్ని కేంద్రీకరిస్తే, ప్రకృతి అతణ్ణి ఏమీచేయలేదు. కాని కేవలం ఆధ్యాత్మికజ్ఞానంతో అతడు ఆత్మారాముడైనప్పటికి అనేక జన్మలు ఎత్తుతూనే వుంటాడు. అంతవఱకు అతనికి బ్రహ్మలోక ప్రాప్తిమాత్రమే. తర్వాత నా భక్తులప్రబోధంచేత మేల్కొని, నాయందు బద్దానురాగుడై నా దివ్యసన్నిధికి చేరుకొంటాడు. అతనికి శాశ్వత మోక్షపదవి లభిస్తుంది. అంతటితో అతని లింగ శరీరం అంతరిస్తుంది.

అణిమాది అష్టైశ్వర్యాలు మోక్షపదవికి అడ్డు తగులుతాయి. అందువల్ల జ్ఞాని ఆ సంపదలకు చిక్కకుండ, విరాగియై, శ్రీమన్నారాయణుని పవిత్ర పాదపద్మాల్ని స్మరిస్తూ శాశ్వత మోక్షపదవిని అందుకోవాలి. అలాంటివానిని మృత్యుదేవత ఏమీ చేయలేదు అని చెప్పి, ఆ స్వాయంభువపుత్రియైన దేవహూతితో కపిలుడు యోగలక్షణాల గూర్చి చెపుతాను వినుమన్నాడు.

(అ
ష్టైశ్వర్యాలు: ఇవి 8 రకాలు. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం. వీటినే 'అష్టసిద్ధులు', 'అష్టభూతులు' అని అంటారు.)

తల్లీ! యోగాచరణతో మనసు నిర్మల మౌతుందంటారు జ్ఞానులు. మోక్షపదవిని పొందటానికి సాధనమైన ఆ యోగధర్మాల్ని వివరిస్తాను.

యోగి శక్తికొలది స్వధర్మాన్ని పాటించాలి. శాస్త్రం నిషేధించిన కర్మలు చేయరాదు. దైవకృపవల్ల లభించిన ధనంతో తృప్తిపడాలి. భగవద్భక్తుల పాదాల్ని పూజించాలి. సంస్కారంలేని ధర్మాల్ని త్యజించాలి. మోక్షకాంక్ష కల్గివుండాలి. మితాహారిగా ఉండాలి. ఏకాంతవాసం, అహింస, సత్యం, చౌర్యం లేకుండుట, అవసరానికి తగినంత సొమ్ము పరిగ్రహించడం, ఇంద్రియ విజయం, తపస్సు, శుభ్రత, వేదపఠనం, దైవార్చన, మౌనం, స్థైర్యం, ప్రాణవాయువుని అదుపులో నుంచుకొనుట మున్నగునవి అతడు తప్పక పాటించాలి.

ఇంద్రియ విషయాలపట్ల అనాసక్తుడై 'ప్రత్యాహారాన్ని' అభ్యసించాలి. భగవత్కథల్ని వింటుండాలి. మూలాధారం మొదలైన షట్‌చక్రాల్లో మనస్సుతో కలిసిన హృదయాన్ని ప్రయాణించేటట్లు చేయాలి.

ఈ లక్షణాలే గాదు. తక్కినవికూడ ఆచరించవలసినవి వున్నాయి. వ్రతాలు చేయటం, అర్హులకు దానమివ్వటం, చెడ్డదారుల్లో నడవకుండటం, ప్రాణాలుగ్గబట్టి శుభమైన స్థలంలో దర్భలూ, దానిపై జింకతోలు, దానిపైన, తెల్లని బట్టకప్పి పద్మాసనంలో కూర్చోవాలి. పూరకం, రేచకం, కుంభకం అనే మూడురకాల ప్రాణాయామం నిర్వహించాలి. అందువల్ల అతనికి రక్తశుద్ధి అవుతాయి. యమమనే యోగం పాటించటంవల్ల పుటంబెట్టిన బంగారుకెనయైన శుద్ధసాత్వికగుణం కైవసమౌతుంది. ప్రాణాయామంవల్ల వాతం, పిత్తం, శ్లేష్మం అనే మూడురోగాలు నివృత్తమౌతాయి. ప్రత్యాహారాన్ని పాటించటంవల్ల, సాంగత్యదోషాల్ని నివారించవచ్చును. ధ్యానంవల్ల, రజోగుణాన్ని తమోగుణాన్ని హతమార్చవచ్చును. ధ్యానసమయంలో యోగి తనదృష్టిని నాసాగ్రంపైన కేంద్రీకరించాలి.

(అష్టాంగయోగం:- అష్టాంగ యోగం అంటే ఎనిమిది అంగాలుగల యోగం. అవి 1 యమం 2)నియమం 3) ఆసనం 4) ప్రాణాయామం 5) ప్రత్యాహారం 6) ధారణ 7) ధ్యానం 8) సమాధి. వీటిలో 'యమనియమాలు' చాలా ముఖ్యమైనవి.

1) యమం : 
అహింసా సత్యమస్తేయం బ్రహ్మచర్యం దయార్జవమ్‌।
క్షమా, ధృతి ర్మితాహార శౌచం చేతి యమా దశ ॥

హింసింపకుండటం, సత్యం పల్కటం, దొంగలింపకుండటం, ఇంద్రియనిగ్రహం, కరుణ, ఋజువర్తనం, ఓర్పు, స్థిరత్వం, అల్పాహారం తినటం, శుద్ధి, అనే పది యమమనే యోగం లక్షణాలు.

2) నియమం : 
తప స్సంతోష మాస్తిక్యం దాన మీశ్వరపూజనమ్‌ ।
వేదాంతశ్రవణం చైవ హ్రీర్మతిశ్చ జపో వ్రతమ్‌ ॥

తపస్సు, ఆత్మతృప్తి, నమ్మకం కల్గివుండటం, దానం, ఈశ్వరార్చన, వేదాంత శ్రవణం, లజ్జ, తెలివి, జపం(మంత్రోపాసన). వ్రతం అనే పది నియమయోగ లక్షణాలు.

3) ఆసనం : ఇది అనేకవిధాలు. వాటిలో సిద్ధాసనం, పద్మాసనం శ్రేష్ఠమైనవి. వీటిని ముముక్షువులు తప్పక అభ్యసించాలి. ఇంకా పశ్చిమోత్తాసనం, బ్రహ్మాసనం కూడ మిక్కిలి శ్రే
ష్ఠమైనవి.

4) ప్రాణాయామం : ఇది ప్రధానంగా రేచకం, పూరకం, కుంభకం అని మూడురకాలు. ఊపిరితిత్తులనుండి ప్రాణవాయువును బయటికి వదలుట రేచకం. బయటి వాయువును ముక్కు రంధ్రాలద్వారా లోపలికి తీసుకొనుట పూరకం. నిర్వికారుడై సమస్తవృత్తుల్ని లయపరచి, స్వయం ప్రకాశమే తానని భావించి, గ్రహించిన వాయువును లోపలనే అదిమివుంచుట 'కుంభకం' అదిమిన గాలి దైహికమైన అన్ని రంధ్రాలనుండి నిర్గమించాలి. ఈ చర్యను సాధకుడు గురుముఖంగా
అభ్యసించవలసి వుంటుంది.

5) ప్రత్యాహారం : అంతరింద్రియాల్ని స్వాధీనంలో నుంచి, స్వస్వరూపధ్యానం చేయటమే ప్రత్యాహారం.

6) ధారణ : పరమాత్మస్వరూపాన్ని హృదయగుహయందు నిక్షేపించుట. ఇందుకు 'ప్రణవనాదం' సహకారిగా వుంటుంది.

7) ధ్యానం : ఇతర చింతల్ని మనస్సులోనికి రానీకుండా, స్వబోధ ప్రజ్ఞయైన ఆత్మతో బుద్ధిని లయపరచుట ధ్యానమనబడును.

8) సమాధి: ధ్యానం, ధ్యాత, ధ్యేయం అనే త్రిపుటి కన్పించకుండా ఉదయసాయం సంధ్యల్లో, శీతోష్టాదిగుణాలు, ఆకలిదప్పులు తెలియక బ్రహ్మాకారస్థితిలో నుండుట సమాధి యౌతుంది. ఈ అవస్థయే జీవన్ముక్తి. ఇదే నిజమైన విదేహ కైవల్యం. ధారణ ధ్యానం, సమాధి అనే మూడూ, మోక్షానికి అంతరంగ సాధనాలు-

సమాధిలక్షణం లేని యోగికి బ్రహ్మానందపదవి లభించదు. వల లేకుండ చేపలు, శస్త్రా
స్త్రాలు లేకుండ మృగాలు, ఓషధం లేకుండ రోగాలు, దీపం లేకుండ చీకటి, తిండి లేకుండ ఆకలి, బిగ్గరగా పేరు చెపితే ఎలా లోబడవో అలాగే నేను రాజయోగిని - అహం బ్రహ్మాస్మి, శివోహం, సోహం) అని కోటిసార్లు గొంతెత్తి అరచినా, ఆ అరుపులు నిష్ప్రయోజనాలే. సాధనే ముఖ్యం.)

శ్రీమన్నారాయణుని కళ్ళు తామరరేకుల్లా అందంగా ఉన్నాయి. ఆయన రొమ్ముపై శ్రీవత్సమనే మచ్చ చూడముచ్చటగా వుంది. ఆయన దేహకాంతి నీలమేఘాన్ని, నల్లకలువను పోలివుంది. ఆయన ధరించిన తోమాలెపై గండుతుమ్మెదలు ముసురుతున్నాయి. మెడలో కౌస్తుభమణితో ముత్యాలహారం మెరిసిపోతున్నది. ఆ స్వామి యోగులకు అందుబాటులోనే వుంటాడు. ఆయన ప్రసన్న వదనంలో ఎల్లప్పుడూ చిరునవ్వు తాండవిస్తుంటుంది. ఆయన కోటిసూర్యుల తేజస్సుతో ప్రకాశిస్తుంటాడు. విలువైన రత్నాలు తాపిన చెవిపోగులు, కిరీటం, రత్నహారాలు, ముంజేతికడియాలు, కాళ్ళకడియాలు, భుజకీర్తులు, రత్నాంగుళీయకాలు, ఘలుఘల్లుమనే గజ్జెలు ఆయన ధరించే ఆభరణాలు. ఆయన నడుం గజ్జెలమొలనూలితో రవళిస్తుంది. ఆయన నిత్యవిధి భక్తసంరక్షణ.

మఱియు ఆ నారాయణుడు తామరపూవు కేసరాల వన్నెతో నిగనిగలాడుతున్న పచ్చని పట్టుపుట్టం ధరిస్తాడు. చతుర్దశభువనాల్లో వ్యాప్తిరూపంలో ఉంటాడు. శత్రువులకు వెఱపు గొల్పే చక్రం, శంఖం, గద, పద్మం ధరించివుంటాడు. మోహం లేనివాడు, భక్తుల హృదయాల్లో, కన్నుల్లో మెదలుతుంటాడు. సద్గుణాలకు నెలవైనవాడు. కౌమారదశలో వెలుగొందుతుంటాడు. గొప్పకీర్తిగలవాడు. సుందరాకారుడు. లోకులెల్లరు ఆయన పాదపద్మాలపై మోకరిల్లుతారు. భక్తుల్ని చేరదీయటం ఆయనకు పెట్టింది పేరు. ఆయనరూపం చూడముచ్చటైంది. ఎల్లకోర్మెల్ని నెరవేర్చగల ప్రభువాయన. ఆయనక్రీర్తి లోకవిశ్రుతం.

మఱియు ఆ శ్రీహరి సద్గుణపరిపూర్ణుడు. దోషరహితుడు. స్థిరబుద్ధిగా లోకసంచారిగా, ఒకచోట నిలిచి చూస్తున్నవాడుగా, ఒకచోట పరుండినవాడుగా దర్శనమిస్తాడు. అంతేగాక ఆయన భక్తులహృదయాల్లో తిష్ఠవేసుకొంటాడు. అట్టి అనంతుడైన ఆ సర్వేశ్వరుడు స్తుతింపదగిన మంచి చరిత్ర గలిగినవాడు.

ఆ పరమాత్మను స్వచ్చమైన మనోవీధిలోను, ఆత్మలోను పాదుకొల్పి, ఆయన మూర్తిని ధ్యానించాలి. ఆ స్వామివారు చేసే క్రియల్ని పరిశీలించి, ఆయన అవయవాలన్నింటిమీద మనసు లగ్నమైనట్లు తెలిసిన తర్వాత పాదాలనుండి ముఖం వఱకు ధ్యానించాలి.

ఆ ఆపాదమస్తకమూర్తి ఎలాంటిదనగా

శ్రీహరి పాదపద్మాలు నాగలి, వజ్రం, అంకుశం, పద్మం, ధ్వజం, గొడుగు మొదలైన చిహ్నాలు కలిగివున్నాయి. గోళ్ళు చంద్రవంకలవలె తెల్లగా నుండి, భక్తుల మనోమాలిన్యాన్ని తుడిచి వేస్తున్నట్లున్నాయి. అడుగుల బొటనవ్రేళ్ళనుండి పెల్లుబికిన గంగాజలం శివజటాజూటానికి అలంకారంగా వుంది. ధ్యానమగ్నులైన మనుజుల కలుషపర్వతాల్ని ఛేదించే వజ్రాయుధంలా వున్నాయి ఆ పాదాలు. దాసుల కోర్కెల్ని నెరవేరుస్తాయి. యోగీశ్వరుల హృదయపద్మాలకు తుమ్మెదలవలె వున్నాయి. అంత మహిమగల ఆ పాదపద్మాల్ని అన్యచింత వీడి ధ్యానించాలి.

శ్రీలక్ష్మి బ్రహ్మదేవునికి తల్లి. ఆమెను దేవతలెల్లరు నిరంతరం కొలుస్తారు. ఆమె కన్నులు తామరరేకుల్ని పోలివుంటాయి. హృదయేశ్వరుడైన శ్రీహరిపై ఆమెకు ఎనలేని భక్తి. ఆ స్వామి పాదపద్మాలను ఆమె తన ఒడిలో ఉంచుకొని ఒత్తుతూ వుంటుంది. అలాంటి స్వామివారి పాదాల్ని భక్తులు నిరంతరం కొలుస్తూవుండాలి.

అమ్మా! మానినీమణీ! ఆ నారాయణుని తొడలు అందగాడైన ఆ గరుత్మంతుని భుజాలపై వెలుగొందుతుంటాయి. అవి అవిసెపూవన్నెతో మెరుస్తుంటాయి. అలాంటి ఆ స్వామివారి ఊరుద్వయాన్ని మునీశ్వరులు మనసార కొలుస్తారు.

తల్లీ! స్వామి నడుమునకు మెత్తని పట్టువస్త్రం ధరించాడు. దానిపై నున్న మొలనూలి మువ్వలు గల్లుమంటున్నాయి. ఆ పురుషోత్తముని నడుమును ప్రీతితో తప్పక సేవించాలి.

సర్వలోకాల సృష్టికి మూలమైన ఆ బ్రహ్మసృష్టికి కారణమైన తామరపువ్వును ధరించిన శ్రీహరిబొడ్డు మిక్కిలి ధ్యానయోగ్యమైంది.

స్వామి వక్షఃస్థలం పచ్చరాలు తాపిన ప్రదేశంలాగా వెలిగిపోతున్నది. ముత్యాలహారాల కాంతులతో ఒప్పారుతున్నది. ఇందిరాదేవికి నెలవై యలరారుతున్నది. అటువంటి విక్షఃస్థలాన్ని ధ్యానించాలి.

ఆ నారాయణుని మెడలో యోగుల మనసులకు నేత్రాలకు ఆహ్లాదాన్ని గొల్పే కౌస్తుభమణి మెరుస్తున్నది. యోగీంద్రులకు నిత్యస్తుతి పాత్రుడైన ఆ స్వామి కంధరాన్ని అనన్యచింతనులై ధ్యానించాలి.

సానబట్టిన రత్నాలు పొదివిన బంగారు భుజకీర్తులతో, స్వామివారి భుజాలు వెల్గుతున్నాయి. మందరపర్వత ఘర్షణచే ప్రకాశింపజేయబడిన స్వర్ణరత్నాంగదాలు కల్గివున్నాయి. అష్టదిక్పతుల్ని మోయగల్గుతున్నాయి. ఆ భుజాల్ని ధ్యానించాలి.

ఇంకా ధ్యానించవలసిన స్వామివారి అవయవాల్ని, సాధనాల్ని కపిలుడు తల్లికి నివేదిస్తున్నాడు.

ఆ స్వామి ధరించిన వేయంచుల సుదర్శనచక్రం వైరులకు బెంబేలు పుట్టిస్తుంది. ఆయన చేతుల్లో రాయంచవన్నె శంఖ ముంది. విరోధుల రక్తమంటిన కౌమోదకి అనే గద వుంది. సువాసనచే ఆకర్షింపబడి జుమ్మని నాదంచేసే తుమ్మెదలు మూగుతున్న వనమాల మెడలో వుంది. ఆత్మతత్త్వానికి మారుపేరైన కౌస్తుభం వక్షస్థ్సలంలో వుంది. వీటిని విడివిడిగా భక్తులు ధ్యానించాలి. భక్తులను సంరక్షించడానికి ఆయన స్వీకరించిన దివ్యమంగళమూర్తికి తగినట్లుగా ఆయన ముఖమండలం ఒప్పుతున్నది. ఆయన చెవులకు ధరించిన మకరకుండలములందలి మణులకాంతితో ప్రకాశించు అద్దాలవంటి నిర్మలమైన చెక్కిళ్ళుగల్గి వున్నాడు. నిరంతర లక్ష్మీ నిలయాలైన నేత్రపద్మాలను కల్గివున్నాడు. సుందరములైన తీవలవంటి కనుబొమలు కల్గివున్నాడు. తుమ్మెదల బారులా నిగనిగలాడే ముంగురులు గల్గివున్నాడు. అలాంటి ఆ దేవదేవుని మోమును ధ్యానించాలి.

భయంకరమైన సాంసారిక బాధల నివృత్తికై, శ్రీహరి కరుణాపూర్ణమైన చూపుల్ని నిర్మలబుద్ధితో స్మరించడం కర్తవ్యం.

మాతా! యోగీశ్వరులు భగవంతుని అనుగ్రహానికి పాత్రులై ఎల్లప్పుడు, ఆయన అనుగ్రహాన్ని మనస్సులో పాదుకొల్పి ధ్యానించాలి.

ఆ హరి దరహాసం భక్తుల కన్నీటిని తుడిచి వేయగలదు. అంతేగాక అది ఎంతో అనుగ్రహాన్ని ప్రసాదించేది. భక్తజనం దాన్ని నిరంతరం తలచుకోవాలి.

విష్ణుమాయావిలాసంగల శ్రీహరి బొమముడి అటు మునీశ్వరులకు, తన కుమారుడైన మన్మథునికి మోహాన్ని పుట్టింపగలదు. ఆయన చిర్నగవు మౌనుల హృదయాలకు అమితానందాన్ని కల్గిస్తుంది. ఆ పలువరుస క్రాంజిగురును పోలిన పెదవుల ఎర్రనికాంతి సోకి, మొల్లమొగ్గల్ని పోలివుంది. ఆ స్వామి ఒక్కొక్క అవయవం, ఆ రూపంలోని స్వామి ధరించిన ఆభరణాలన్నీ ధ్యానయోగానికి సాధనాలే అని యిలా చెప్పి, ఇంకా కపిలుడు తల్లితో ఇట్లన్నాడు.

పాపరహితమైన ప్రవృత్తిగల ఆత్మవేత్త సర్వేశ్వరుడైన శ్రీహరి ప్రేమను చూరగొని, చిరకాలభక్తిచేత పులకితగాత్రుడవుతాడు. అపుడతని కంటినుండి ఆనందబాష్పాలు రాలుతాయి. అంతటితో తాను సంతోషమనే జలధిలో మునిగితేలి, తనకు భగవంతునికి తేడా లేదని భావించి, సంసార లంపటాన్ని లాగిపారవేసేవాడై; ధ్యేయరూపమైన పరబ్రహ్మమందు మనస్సును నిల్పి కైవల్యపదవిని అందుకొంటాడు.

ఆత్మవేత్త ఇంద్రియవిషయాల బారి పడకుండా, భగవంతునికి వేరైన ఆశ్రయాన్ని వదలిపెట్టి తన మనస్సుని కేవల భగవదాయత్తం చేస్తాడు. అప్పుడతనికి వైరాగ్యభావన కల్గుతుంది. ఇతర చింతలేవి లేకుండా సూక్ష్మతేజం మహాతేజంతో ఏకమైనట్టి మోక్షపదవి నందుకొని అక్కడ పరంజ్యోతి స్వరూపంతో ఐక్యమవుతాడు.

“అమ్మా! వినండి. ఆత్మజ్ఞాని చరమలక్ష్యాన్ని చెపుతాను. అతడు అన్యవిషయాలపై ఆసక్తిని వదలి మనస్సును భగవద్ధ్యానమందే లగ్నం చేస్తాడు. సుఖదుఃఖాల్ని గూర్చిన చింత అతని కుండదు. వాటిని అహంకార ధర్మాలని భావిస్తాడు. ఆత్మ సాక్షాత్కారమందే నిమగ్నుడవుతాడు. ప్రాజ్ఞు లతణ్ణి జీవన్ముక్తు డంటారు”. అతడెలా ఉంటాడంటే 'తల్లీ ఆ జ్ఞాని' నిలవటం, కదలటం, విశ్రమించటం అనే చర్యలుగూడా తెలియని స్థితిలో నిర్వికారుడుగా ఉంటాడని అన్నాడు.

జీవన్ముక్తుని లక్షణం ఇంకా వివరిస్తున్నాడు కపిలాచార్యుడు. మద్యం సేవించినవానికి తన ఒడలిమీద బట్ట వుందో లేదో తెలియదు. జీవన్ముక్తుడు కూడ అలాగే తనదేహం దైవాధీనమగుటవల్ల నశ్వరమని భావిస్తాడు. శరీరం(శీర్యతే ఇతి) నశిస్తుంది. కావున యోగి దాన్ని సరకుచేయడు. తన మనస్సును ఆత్మాయత్తం చేస్తాడు. కర్మఫలానుభవం కల్గునంతకాలం స్వప్నంలో కనిపించే శరీరంతో భార్యాపుత్రుల సంబంధంవలె మ్రగ్గి, తర్వాత ఆత్మజ్ఞానసంపన్నుడై పుత్రదారసంబంధంనుండి ముక్తుడవుతాడు.

మానవుడు తన భార్యాపుత్రులు, స్నేహితులు, అన్నదమ్ములు మున్నగు వారికంటె వేఱుగా ఉన్నట్లును, అగ్నిదేవుడు తననుండి పైకి ఎగిసే కణాలు, కొరువులు వగైరాకంటె వేరుగా ఉన్నట్లును, జీవాత్మ తన్నావరించిన శరీరానికంటె భిన్నుడుగా ఉన్నాడు. ద్రష్ట అయిన సమస్త భూతాలలో తానుదాగి, తనలో అంతర్బూతంగా ఉన్న సమస్త భూతజాలాన్ని చూస్తూ ద్రష్ట అయిన బ్రహ్మగా భాసిస్తూవుంటాడు.

('మానవుడు దారపుత్రాదులకంటె వేరు, అగ్ని విస్ఫులింగాదులకంటె వేరు. కపిలమహర్షి ఆత్మానాత్మ విభాగాన్ని తల్లికి బోధించాడు. 'దృశ్యం, ద్రష్ట దర్శనం' ఇదొక త్రిపుటి. మన చర్మచక్షువుకు కన్పిస్తున్నదంతా దృశ్యం. దీన్ని దర్శిస్తున్నవాడు ద్రష్ట(ఆత్ముడు). చరాచరవిశ్వానికి ఆవల నేకాకృతితో చూడడమే దర్శనం. ఆత్మ, భూతపంచకం, జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు, తన్మాత్రలు, అంతరంగచతుష్టయం అనే 24 తత్త్వాలలో అంతర్నిగూఢంగా దాగివుంది. ఈ తత్త్వాలన్నింటిని పర్యవేక్షించే ద్రష్ట ఆయన. ఇర్వదినాల్టు తత్త్వాలతో కూడిన దృశ్యం నశ్వరమైంది. అంటే అంతరిస్తుంది. ఆపైన ద్రష్ట భౌతికకాయాన్ని కలిసిపోతాడని ఆధ్యాత్మిక సిద్దాంతం.)

స్థావరజంగమాది భూతాలు భిన్నభిన్నమైనవి. వీటిల్లో పరంజ్యోతి స్వరూపమైన ఆత్మకూడ భిన్నరూపాలు గలదిగా తోస్తుంది. కాని అది భిన్నమైంది కాదు. ఒకే స్వరూపమే. దేహాదుల పొడవు - పొట్టి అనే భిన్న ప్రకృతుల్నిబట్టి, ఆత్మ ఒక్కటే అయినప్పటికి పెక్కురకాలైనట్లు తోస్తుంది. భూతాలు, ఇంద్రియాలు, అంతఃకరణాలు నాల్గు అనే జీవసముదాయంకంటె ఆత్మ భిన్నమైంది. అనగా జీవాత్మ వేరు. పరమాత్మ వేరు. అలాగే ప్రకృతి వేరు. దాన్ని నడిపే భగవంతుడు వేరు.

ఆత్మ ఉన్నదిగా, లేనిదిగా భాసిస్తుంది. దానికి మాయాశక్తి వుంది. దాని శక్తి ఊహ కందదు. ప్రకృతితో కలిసినట్లే ఉంటుంది. కాని దానికి భిన్నంగానే ఉంటుంది.

ఇట్లా కపిలుడు బోధించిన తర్వాత, దేవహూతి మళ్ళీ అడిగింది. “మహాత్మా! మహత్తు, అహంకారం, భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం అనే ఏడింటికిగల అన్యోన్యసంబంధం, ప్రకృతి పురుషుల లక్షణాలు, వాటి నిజస్వరూపం మొదలైన అంశాలనుగూర్చి వివరించావు. ఇక సాంఖ్యశాస్త్రం, భక్తియోగ విశిష్టత, పురుషుని విరక్తిభావన, కాలస్వరూపుడవైన నీ నిజస్వరూపం వీటిని గూర్చి నాకు చెప్పు"మని అడిగింది. మరియు ఆమె కుమారునితో 'నీకు భయపడి ప్రజలు ధర్మకార్యాలు చేస్తున్నారు. మానవునికి మిథ్యాభూతమైన శరీరంపై అభిమానముంది. మూర్ఖత్వంతో కర్మాసక్తుడై సంసారమనే. చీకటిగుహలోనే మ్రగ్గుతున్నాడు అలాంటి మానవుణ్ణి నిద్రావస్థనుండి మేల్కొల్పడానికి నీవు యోగరూపం దాల్చి పుట్టిన పుణ్యాత్ముడవు. కావున ఈ అన్ని విషయాల్ని నాకు వివరించు మని కోరింది.

కపిలుండు దేవహూతికి భక్తి యోగమును తెలియంజేయుట

Vishnu took birth as Kapila (Kapilacharya), the son of Devahuti and the sage Kardama Prajapati - దేవహూతి గర్భంబున విష్ణుండు గపిలాచార్యుండుగా నుదయించుట

దేవహూతి గర్భంబున విష్ణుండు గపిలాచార్యుండుగా నుదయించుట

అని కర్దముడు చెప్పగా వినిన దేవహూతి మనస్సులో సంతోషపడింది. ఆ మునివరుని మాటల ప్రకారం పరుడు, అనంతుడు, పద్మలోచనుడు, హరి, విష్ణువు అయిన భగవంతుని పూజిస్తూ ఉండగా కొన్ని సంవత్సరాలు గడచిపోయాయి. తరువాత దానవాంతకుడైన శ్రీహరి క
ర్దముని తేజస్సును ధరించి దనుజారి అయిన శ్రీహరి జమ్మిచెట్టు తొర్రనుండి అగ్ని పుట్టిన విధంగా దేవహూతి గర్భంనుండి ఆవిర్భవించాడు.

(శమీవృక్షం వృక్షాలలో పవిత్రమైంది. 'శమయతి దోషాన్‌ శమీ' అని వ్యుత్పత్తి. దోషాలను పోగొట్టి శాంతిని కలుగజేసేది శమీవృక్షం. దోషాలను పోగొట్టడంవల్ల శమీవృక్షం శుభస్వరూపమైనదిగా భావిస్తారు. శమీవృక్షం అనగా జమ్మిచెట్టు ఎంత పవిత్రమైనదో దేవహూతి గర్భంకూడా అంత పవిత్రమైనది. శమీవృక్షం నుండి ఉదయించిన అగ్ని ఊర్ధ్వముఖంగా ప్రసరించి అశుభాలను దగ్ధంచేసినట్లు దేవహూతి గర్భంనుండి పుట్టిన శ్రీహరి ఆమె శంకాగ్రంథులను విచ్చేదించి ఆమెకు తత్త్వజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అరణియందు అగ్నివలె ఆమె గర్భం నుండి జన్మించెను అని మూలం. అరణి అంటే అగ్నిని పుట్టించడానికి మరొక కర్రతో మథింప యోగ్యమైన దారువు. ఇక్కడ అరణి శమీతరువు. అరణిలో అగ్ని ఎప్పుడూ ఉంటుంది. మధించినపుడు బయటకు వస్తుంది. అలాగే భగవంతుడు క
ర్దమ తేజస్సులో ప్రవేశించెనని చెప్పడంవల్ల అంతకుముందు లేడని సందేహపడకూడదు. భగవంతుడు సర్వవస్తువులలో సర్వకాలాలలో నిండి ఉంటాడు. అయితే నిర్వికారుడుగా ఉంటాడు. భక్తులను అనుగ్రహించడానికి కరుణతో బాహ్యంగా ఒక స్వరూపం ధరించి అవతరిస్తాడు. తల్లి అయినా దేవహూతి స్వామికి భక్తురాలు. ఆమెను ఉద్ధరించడానికి ఆమెకే పుత్రుడుగా జన్మించడం ఆమె అదృష్టవిశేషం.)

భగవంతుడు కపిలాచార్యుడుగా జన్మించిన సమయంలో ఆకాశంలో దివ్యమంగళవాద్యాలు సందడిగా ధ్వనించాయి. ఆనందపడిన దేవతల సమూహాలు మందారపుష్పవర్షం కురిపించారు. గంధర్వులూ కిన్నరులూ పాటలుపాడారు. అప్సరసలు నృత్యంచేశారు. క్రమంగా దిక్కులన్నీ ప్రసన్నమైనాయి. సముద్రాలు ప్రశాంతమైనాయి. సజ్జనుల మనస్సులు సంతోషపడినాయి. హోమాగ్నులు తేజస్సుతో అతిశయంగా వెలిగాయి. చెట్లన్నీ పుష్పఫలభరితాలైనాయి. లోకంలో (పొలాలలో) అన్నిరకాల పైరులు అతిశయంగా పండాయి.

కపిలుడు ఆవిర్భవించిన ఆ మహోత్సవ సమయంలో దేవహూతికి తత్త్వజ్ఞానాన్ని బోధించడానికి ఆమె గర్భంలో జన్మించిన పరబ్రహ్మస్వరూపుడైన శ్రీమన్నారాయణుని దర్శించడంకోసం మరీచి మొదలైన మునిగణాలతో కూడి బ్రహ్మదేవుడు వచ్చాడు. కపిలుని దర్శనంచేసి కర్దమదేవహూతులను చూచి ఇలా అన్నాడు.

స్తోత్రార్హమైన చరిత్రగల ఓ దంపతులారా! మీరిద్దరు కృతార్థులయ్యారు. నిజమైన భక్తితో మదిలో కపటం లేకుండా విష్ణుపూజ చేశారు. ఆ పూజకు తగిన ఫలం మీకు చేకూరింది.

ఆశ్రయించినవారి భయాన్ని పోగొట్టేవాడు, మునులచే స్తుతింపబడేవాడు, పరమాత్ముడు అయిన భగవంతుడు మీ కోర్కెను చక్కగా నెరవేర్చినాడు. మీ జన్మసార్థకమైంది.

నీతి పారంగతులైన దంపతులారా! వినండి. ఇచ్చతో, అద్వితీయమైన భక్తితో శ్రీహరిని పూజిస్తే ఆ పూజే మోక్షసంపాదనకు సరిపోతుంది. మీపుణ్యాన్ని ఏమని పొగడగలను?

అని చెప్పి మళ్లీ కర్దముని చూచి బ్రహ్మ ఇలా అన్నాడు. “మునీంద్రా! నీ పుత్రికలను పేరొందిన ఉత్తమ స్వభావులూ, సదాచారసంపన్నులూ అయిన మునిశ్రేష్ఠులకు ఇచ్చి వివాహం చెయ్యి. అలా అయితే వారివల్ల బిడ్డలను సృజించడం అనేక విధాలుగా అభివృద్ధి పొందుతుంది”. అని చెప్పి మళ్లీ ఇలా అన్నాడు.

ఓ పుణ్యాత్ముడవైన కర్దమా! ఈ ఘనుడు సమస్త ప్రాణుల హృదయాలలోని కోరికలను నెరవేర్చేవాడు కావున ఘనుడైన ఈ నీ కుమారుడు మహాతేజోవిరాజితుడు. ఈ మహాత్ముని పరమేశ్వరుడుగా, ప్రభువుగా, జయింపరానివాడుగా, నలినాక్షుడైన పురుషోత్తముడుగా, పరిమితిలేనివాడుగా, చ్యుతి లేనివాడుగా, గొప్పవాడుగా, అంతంలేనివాడుగా, మొదటివాడుగా, షడ్విధ పరిణామములు లేనివాడుగా, శాశ్వతుడుగా తలంచు.

(శ్రీహరి దేవహూతీ క
ర్దములకు కపిలనామధేయంతో పుట్టిన విషయం కర్దమునికి తెలుసు. తాను పుడుతున్న విషయం శ్రీహరి కర్దమునికి స్వయంగానే చెప్పాడు. అయినా బ్రహ్మదేవుడు మరల ఈ విషయం కర్దమునికి చెప్పి ఆ పుట్టినది శ్రీహరి అంశతో ఉన్న కపిలుడని తెలిపాడు. ఆయనను ఆద్యంతాలులేని అచ్యుతుడైన మహాపురుషుడుగా భావించుమన్నాడు.

అజిత, అమేయ, అచ్యుత, అనంత, ఆద్య, అవికార, అక్షర మొదలైన పదాలన్నీ విష్ణువును తెలిపేవే. 'అచ్యుత' అనేమాట శ్రీకృష్ణునికి రూఢిగా వాడబడేమాట. 'నాస్తిచ్యుతం స్ఖలనం స్వపదా ద్యస్యసః' అని దీని వ్యుత్పత్తి. తన చోటునుండి భ్రంశము పొందనివాడని అర్థం.)

దేవహూతీ! మాననీయమైన జ్ఞానవిజ్ఞాన యోగాలనే ఉపాయాలచే కర్మజీవులను ఉద్ధరించడానికి శ్రీహరి నీ కడుపున పుడతాడు. బంగారురంగు తలవెండ్రుకలు కలవాడు, వికసించిన కమలాలవంటి కన్నులు కలవాడు, మనోజ్ఞమైన పద్మం, హలం, వజ్రాయుధం, అంకుశం రేఖలు గల అరికాళ్లతో కూడినవాడు, సత్త్వగుణసంపన్నుడు అయి ఇప్పుడు నీగర్భంలో ఉదయించిన అలాంటి మహాత్ముడు నీకు తత్త్వబోధచేస్తాడు. నీ మనస్సులోని సందేహాలన్నింటిని పోగొడతాడు.

(జ్ఞానమంటే తత్త్వజ్ఞానం. మోక్షవిషయకమైన బుద్ది. విజ్ఞానమంటే విశేషజ్ఞానం, శాస్త్రసంబంధమైన జ్ఞానం. 'తత్త్వం' అనే మాటకు అనేకార్థాలున్నాయి. ఈ మాట వేదాంత పరిభాషలో తరచుగా వినబడే మాట. బ్రహ్మం అనేది ఒక ప్రధానార్థం. ఈ మాటకు అద్వైతులు బ్రహ్మం అని అర్ధం చెపితే, ద్వైతులు స్వతంత్రమని అస్వతంత్రమని అర్ధం చెప్పారు. చిత్తు, అచిత్తు, ఈశ్వర రూపాలన్నారు విశిష్టాద్వైతులు. ఈ మూడింటి మధ్యగల సంబంధమే వీళ్ల దృష్టిలో తత్త్వజ్ఞానం. తత్త్వబోధ చేయడమంటే ఈ మూడింటిని గురించి వివరించడమే.)

మీరు కన్న ఇతడు పేరుపొందినవాడై, సిద్ధపురుషులచే సేవింపబడుతూ, మహనీయమైన సాంఖ్యయోగంతో విరాజిల్లే పరతత్త్వమందు సుస్థిరుడై, కపిలుడనే పేరుతో ప్రసిద్దుడై ఈ మూడులోకాలలోనూ సంచరిస్తాడు.

(అణిమాది సిద్ధిగలవారు సిద్దులు. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఇవి ఎనిమిదీ అణిమాదులు. సాధారణవ్యక్తులకు లేని అతీంద్రియశక్తులు గలవారు సిద్దులు. ఈ సిద్దులు ఐదురకాలని పతంజలియోగశాస్త్రంలో చెప్పబడింది. పూర్వజన్మలో సాధనవల్ల కలిగేవి, దేవతలకు జన్మచేతనే కలిగేవి జన్మసిద్దులు. కొన్ని మంత్రాలవల్ల కలిగేవి మంత్రసిద్దులు. తపస్సులవల్ల కలిగే సిద్దులు నాలుగోరకం. సమాధిస్థితివల్ల కలిగేవి సమాధిసిద్దులు. మానవులలో కూడా ఇలాంటి సిద్దులు కలవారు కొందరు కనపడుతూ ఉంటారు. నవనాథసిద్ధులు ఇలాంటివాళ్లే. సిద్ధపురుషులచేత సేవింపబడడంవల్ల కపిలుడు దైవస్వరూపుడనే విషయం విదితమవుతూ ఉంది.

సాంఖ్యయోగం - సంఖ్యతో కూడినది సాంఖ్యయోగం. సాంఖ్యమంటే జ్ఞానం. జ్ఞానవిచారణలో అనాత్మవస్తువులను లెక్కించునపుడు సంఖ్యను ఆశ్రయించవలసి వస్తుంది కనుక అది సాంఖ్యమనబడింది. ప్రకృతి యందుగల 24 తత్త్వాలను, లేక 96 తత్త్వాలను లెస్సగా శోధించి, అవి అనాత్మరూపాలని త్యజించి వాటికి సాక్షిగా ఉన్న పరమాత్మను గ్రహించుటే సాంఖ్యవిద్య. ఆత్మానాత్మవివేక రూపమగు విజ్ఞానమే సాంఖ్యం. సాంఖ్యవేదాంత తత్త్వపద్ధతిని నెలకొల్పినవాడు కపిలుడు. ఇతడు విష్ణ్వంశతో జన్మించినవాడు.)

అలా కపిలుని గురించి చెప్పి, వివాహనిమిత్తం మరీచిమహర్షిని అక్కడే ఉండమని బ్రహ్మదేవుడు తన కుమారులైన నారదుడు సనకుడు మొదలైన వారితో కలసి తన నివాసస్థానానికి వెళ్లాడు.

బ్రహ్మదేవుడు వెళ్లినతరువాత కర్దముడు బ్రహ్మాదేవుని ఆజ్ఞానుసారం తన యోగ్యతకు తగినట్లుగా తన కుమార్తెలకు పెండ్లిండ్లు చేయాలని నిర్ణయించాడు. తన కుమార్తెలలో కళను మరీచిమహర్షికి, అనసూయను అత్రిమహర్షికి, శ్రద్ధను అంగిరసమహర్షికి, హవిర్భువును పులస్త్యమహర్షికి, గతిని పులహమహర్షికి, క్రియను క్రతువు అనే మహర్షికి, ఖ్యాతిని భృగుమహర్షికి, అరుంధతిని వశిష్ఠమహర్షికి, శాంతిని అధర్వుడు అనే మహర్షికి ఇచ్చి తన కులాచారం ప్రకారం తన తొమ్మండుగురు కొమార్తెల పెండిండ్లు యథావిధిగా జరిపించాడు. ఆ తొమ్మండుగురు మహర్షులు భార్యలను గ్రహించి, క
ర్దముడు సమర్పించిన కానుకలను అందుకొని ఆయన అనుమతితో భార్యలతో కలసి తమతమ ఆశ్రమ ప్రాంతాలకు వెళ్లారు. తరువాత కర్దముడు దేవాధిదేవుడైన విష్ణువు తన గృహంలో పుట్టి పెరుగుతూ ఉన్న విషయం తెలుసుకొన్నాడు. ఏకాంత ప్రదేశానికి వెళ్లి అక్కడ కపిలావతారంలో ఉన్న శ్రీహరికి నమస్కరించి ఇలా అన్నాడు.

ప్రజ్ఞగల ఓ మహాత్మా! వినండి. తాముచేసిన అశుభకరాలైన పనులు అనే కార్చిచ్చు మంటల్లో ఎక్కువగా దహింపబడుతున్నవారైన ప్రాణులందరూ పూర్తిగా బయటపడలేక ఎడతెగని సంసారబంధాలలో బంధింపబడినవారై ఉంటారు. ఎంతోకాలం ఇలా గడచిపోతూ ఉంది. సకలదేవతల అనుగ్రహంవల్ల, అనేక జన్మలలో ఏర్పడిన పరిచయంవల్ల ప్రాప్తించిన దీర్ఘమైన సమాధియోగముయొక్క తపోనిష్ఠతో ఒంటరి ప్రదేశాలలో యోగీశ్వరులు ధైర్యంతో ఏమరక ఏ మహానుభావుని దర్శిస్తారో అటువంటి దివ్యపురుషరత్నమైన దేవాధిదేవా! నీవునా గృహంలో జన్మించావు.

సంసారచక్రంలో నిలువనీక గిరగిర తిప్పబడుతూ పామరులుగా ఉన్న మాప్రవర్తనలను లెక్కించకుండా మొదట ప్రతిజ్ఞచేయబడినవైన నీ మాటలను తప్పకుండా మమ్ము అనుగ్రహించటానికి మా ఇంటిలో పుట్టావని చెప్పి కర్దముడు మళ్లీ ఇలా అన్నాడు.

(పై వచనంలోని విషయం క
ర్దముడు కపిలావతారంలో ఉన్న శ్రీహరికి చెప్పినది. 'ప్రతిశ్రుతంబులయిన భవదీయవాక్యంబులు' ముందెప్పుడో శ్రీహరి కర్దమునికి చెప్పినవి. తరువాత జరగబోయే విషయాన్ని శ్రీహరి ఆనాడు కర్దమునికి చెప్పాడు. ఆ విషయం తప్పకుండా జరిగి తీరాలి కనుక ఆ విషయాన్ని వ్యక్తం చేసిన మాటలు ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్పినవే. ఈ స్మంధంలోనే పూర్వం శ్రీహరి కర్దమునికి ఇలా చెప్పాడు. "స్వయంభువమనువు తన కూతురు దేవహూతిని తోడ్కొని నీ ఆశ్రమానికి వచ్చి ఆమెతో నీకు వివాహం జరిపిస్తాడు. ఆమె ద్వారా నీకు తొమ్మండుగురు పుత్రికలు పుడతారు. నా ఆజ్ఞానుసారం నీవు చేసే సమస్తకార్యాలు నాకే సమర్పిస్తూ ఉండు. నాలోనే లోకాలన్నీ ఉన్నాయని, నీలో నేనున్నానని తెలుసుకొని నన్ను ఆరాధిస్తూ ఉండు. చివర నీవు నా సన్నిధికి చేరగలవు. నీ తేజస్సువల్ల నేనునీ భార్య కడుపులో ప్రవేశించి నా కళాంశతో నీకు కుమారుడనై జన్న్మిస్తాను" అని చెప్పినమాట శ్రీహరి తప్పకుండా ఈనాడు నెరవేర్చాడు. ఈ విషయాన్ని కర్దముడు భక్తితో తలచుకొంటున్నాడు.)

ఓ పరమపురుషా! మహాత్మా! ప్రకృతికి సంబంధించని బలంతోకూడిన నాల్గుబాహువులు మొదలైనవిగల నీ అవతారాలు నీకు తగినవైనవిగా అలరాలుతూ ఉన్నాయి.

(చతుర్బుజుడంటే నాలుగు చేతులు గలవాడైన శ్రీమహావిష్ణువు. మూలమూర్తి అయిన శ్రీమన్నారాయణుడు. నిత్యవిభూతికి చెందిన శ్రీవైకుంఠంలో నిత్యులకు, ముక్తులకు దర్శనం ప్రసాదిస్తూ ఉంటాడు. వివిధ ప్రయోజనాలకోసం మూలమూర్తి అనేక అవతారాలు ధరిస్తూ వచ్చినప్పుడు ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క ప్రత్యేకత కనిపిస్తూ ఉంటుంది. ఆయా కాలాలు కూడా వేరువేరు ధర్మాలతో కూడి ఉంటాయి. అవతారమూర్తులందరూ లీలా విభూతికి చెందినవారు. ఒక్కొక్క అవతారమూర్తి ఏయే లోకధర్మ రక్షణకోసం వచ్చాడో ఆయన ఆ ధర్మాన్ని రక్షించడంకోసం అనేక కార్యాలు చేపట్టవలసి వస్తుంది. అవతార ధర్మాన్ని కూడా మరుగు పరచవలసి వస్తుంది. అవతారకాలంలో అవసరం ఏర్పడినప్పుడు మూలమూర్తి స్వరూపాన్ని గ్రహించినపుడు చతుర్భుజాలు గోచరిస్తాయి. దీనికి శ్రీకృష్ణావతారం మంచి ఉదాహరణం. మూలమూర్తికున్న చతుర్భుజాలు ఆవతారమూర్తులకు కూడా అనురూపాలుగా ఒప్పారుతూ ఉంటాయి. శ్రీహరిని స్తుతించడంలో భాగంగా కర్దముడు చెప్పిన విషయమిది.)

ఓ శ్రీహరీ! అనవరతమూ నిన్ను ఆశ్రయించే ఆర్తజనరక్షణకోసం అంగీకారంతో నీవు ధరించే మానవరూపాలు నీ కెప్పుడూ అనుగుణమైన రూపాలే అవుతాయికదా!

గొప్ప తత్త్వాల నిజస్వరూపాన్ని గురించిన జ్ఞానంకోసం అనుభవజ్ఞానులు ప్రయత్నపూర్వకంగా నమస్కరించే పాదపీఠంగల నిన్ను స్తుతించడానికి, నిన్ను గురించి వివరించడానికి ఎవరికి శక్యం?

భక్తవరదా! అపారమైన షడ్గుణాలైన జ్ఞానబల ఐశ్వర్యవీర్య తేజశ్శక్తులకు నీవు కారణభూతుడవు. పరమేశ్వరుడవు. ప్రకృతి పురుషుడు, మహత్తత్త్వం, అహంకారత్త
త్త్వం, పంచతన్మాత్రలు నీవే. వీటిని క్షోభింప చేయడానికి కారణమైన కాలస్వరూపం కూడా నీవే. అంతేకాదు ఈ అన్నింటికీ నీవు ప్రసిద్ధమైన పట్టుగొమ్మవు. ప్రపంచమే నీ స్వరూపం. నీవే జ్ఞాన స్వరూపుడవు. పొట్టలో సర్వప్రపంచాన్ని ఉంచుకొన్న సర్వజ్ఞుడవు. స్వతంత్రమైన శక్తితో కూడినవాడవు. సర్వసాక్షివి. అటువంటి నీవు 'కపిలుడు' అనే పేరుతో ప్రకాశిస్తున్నావు. ఓ మహానుభావా! నీకు నమస్కరిస్తున్నాను. నీవు నాకు కొడుకుగా పుట్టడంవల్ల నేను దేవ, ఋషి, పితృ ఋణాల నుండి విముక్తి పొందాను.

(జ్ఞానబలైశ్వర్యాదులు భగవంతుని షడ్గుణాలు. ఈ గుణాలే భగవంతుని ఐశ్వర్యాలుకూడా. ఈ గుణాలన్నీ ప్రకృతిలో ఉన్నవే. అయితే ఇవి ముందు శ్రీహరివి. ఆయన నుండి లోకానికి ప్రసరించినవి. ప్రకృతిలోని సమస్త ఐశ్వర్యం భగవంతునిదే. 'భగం' అంటే ఐశ్వర్యం. అది కలవాడు భగవంతుడు. ఇవి షడ్గుణాలు. ఇవన్నీ ప్రకృతిలో ఉన్నా ఏ ప్రాణిలోనూ సమగ్రంగా ఉండవు. కొన్నిగుణాలు లోపించే ఉంటాయి. ఇవి సమగ్రంగా ఉండేది భగవంతునిలోనే. అందుకే ఆయన 'సమధిక షడ్గుణైశ్వర్యవంతుడు'. ఐశ్వర్యం, వైరాగ్యం, యశస్సు, పరిపూర్ణజ్ఞానం, వీర్యం, తేజస్సులు 
షడ్గుణైశ్వర్యాలని కొందరు చెపుతారు. ఇవన్నీ కలిస్తే భగవత్‌ స్వరూపం ఏర్పడుతుంది. ప్రకృతికి ప్రధానమని మరొకపేరు. ప్రధానమే భగవంతుని శరీరం. ప్రకృతిని నియమించే పురుషుడు కూడా పరమాత్మయే. అహంకారం ఈశ్వరరూపం. ప్రధానమైన ప్రకృతిని అహంకారం క్షోభింపజేస్తుంది. జ్డాన స్వరూపుడు కాబట్టి భగవంతుడు సమస్త ప్రపంచాన్ని తనలో ఉంచుకొని ప్రకృతి క్షోభలను నియమిస్తూ ఉంటాడు. 

ఋణత్రయం - మనిషికి పుట్టుకతోనే మూడు ఋణాలు ఉంటాయని శాస్త్రవచనం. ఇవి మూడు.

1. ఋషిబుణం - మానవాళి శ్రేయస్సుకోసం శాస్త్రాది గ్రంథాలను ప్రసాదించిన ఋషులఋణం అధ్యయనంవల్ల అధ్యాపనంవల్ల తర్పణాదులవల్ల తీరుతుంది.

2. దేవఋణం - దేవతలు మనకు చేసే అనేక ఉపకారాలవల్ల ఏర్పడే ఋణమిది. ఇది యజ్ఞయాగాదుల నిర్వహణవల్ల తీరుతుంది.

3. పితృ (మానవ) ఋణం - జన్మనిచ్చి పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులకు సేవ చేయడంవల్ల, సంతానాన్ని కని వంశం కొనసాగడానికి దోహదపడినందువల్ల ఈ ఋణం తీరుతుంది.)

ఉత్తమమైన వ్రతాలు, యోగాలు - వీటితో ఏర్పడిన సమాధిస్థితిలో నిలుకడ కలవాడినై, నీ పాదాలను మనస్సులో నిలుపుకొని శోకాలను దూరం చేసుకొని ప్రసిద్ద తీర్థాలలో సంచరిస్తాను.

ప్రసిద్ధ తీర్థాలలో సంచరిస్తానని మనవి చేశాడు కర్దముడు. ఆయన మాటలు విని భగవంతుడు, మహాత్ముడు అయిన కపిలుడు ప్రీతితో ఇలా చెప్పాడు.

కర్టమ మునిశ్రేష్ఠా! నేను నీకు ముందు చెప్పిన ప్రతిజ్ఞాపూర్వకమైన మాటలను అతిక్రమించకుండా కారణం లేకుండానే గొప్ప దయతో నీ గృహంలో జన్మించాను. అవాప్త కాముడనైన నాకు కోరికలంటూ ఏవీ లేవు. నేనీ మునివేషం ధరించడం నాకోసం కాదు. చెపుతాను విను. మహాత్ములైన మునులకు పరమాత్మ సంబంధమైన గొప్ప పరమవివేకాన్ని వివరణాత్మకంగా తెలియజేసే తత్త్వబోధ చేయడంకోసం పవిత్రమైన వ్యక్తమార్గంగా ధరించిన శరీరమిది అని తెలుసుకో. భక్తితో నాపాదాలను ధ్యానించు. మహిమతో విరాజిల్లే నీ బుద్ధిని నాయందు లగ్నంచెయ్యి.

నీవు అధికమైన నిష్ఠకలవాడవై యోగమార్గాన్ని అనుసరించు. సమస్త కర్మలను నాకే వదలిపెట్టు. మోహాన్ని విడిచిపెట్టు. ముక్తికోసం భక్తితో నన్ను సేవించు.

పరమేశ్వరుడు, పరంజ్యోతి, అనఘుడు, అనంతుడు, దేవదేవుడు సకలప్రాణుల హృదయాలలో ఉండేవాడు, ఆద్యుడు, అజుడు, ఆద్యంతశూన్యుడు, దురిత విదూరుడు అయిన నన్ను -

అనఘా! నీ మనస్సు అనే పద్మమధ్యంలో నన్ను(పరమాత్మను - కపిలుని) స్థిరంగా నిలిపి జితేంద్రియుడవై క్రమంగా మనోనేత్రంతో నన్ను దర్శించు.

జితేంద్రియుడవై క్రమంగా నన్ను నీ మనోనేత్రంతో దర్శిస్తూ ఉంటే ముక్తిని పొందగలవని కపిలుడు క
ర్దమునికి చెప్పాడు. కర్దముడు ఆ మునికుల తిలకుడైన కపిలునికి ప్రదక్షిణం చేసి మిక్కిలి భక్తితో నమస్కారాలు సమర్పించాడు. ఎంతో ఉత్సుకత కలవాడైనాడు.

కర్దముడు మునులు సేవిస్తున్న అరణ్యానికి వెళ్లాడు. అక్కడ మౌనంతో లోకసంబంధాలన్నీ త్యజించాడు. హోమాది అగ్నికార్యాలు విడిచి పెట్టాడు. ఒకచోట నిలువకుండా అంతటా తిరుగుతూ తనలోని పరమాత్మనే శరణుజొచ్చాడు.

కర్దముడు మునిజన నివాసయోగ్యమైన అరణ్యానికి వెళ్లాడు. అక్కడ పరబ్రహ్మమునే మనస్సులో నిలుపుకొని నేను నాది అనే భావాన్ని వదలి వేశాడు. దయామయ హృదయంతో సకల ప్రాణులను సమానంగా చూస్తూ ప్రశాంత స్వభావం కలవాడైనాడు. అలలు లేని సముద్రంవలె చాంచల్యరహితుడై సమస్త ప్రపంచాన్నీ వాసుదేవమయంగా భావిస్తూ భక్తియోగంతో విష్ణుభక్తులు పొందే పరమపదాన్ని అందుకొన్నాడు. ఈ విషయం చెప్పిన మైత్రేయమహర్షి విదురునితో ఇంకా ఇలా అన్నాడు “కర్దముడు అడవికి వెళ్లిన తరువాత మాతృవాత్సల్యం కల కపిలుడు బిందుసరోవరం దగ్గర నివసించి ఉండగా దేవహూతి తత్త్వమార్గాన్ని దర్శింపజేయగలవాడైన కుమారుని చూచి ముందు బ్రహ్మ చెప్పిన మాటలు జ్ఞప్తికి తెచ్చుకొంటూ ఇలా అన్నది”.

దేవహూతి పుత్త్రుండైన కపిలాచార్యుని వలన తత్పజ్ఞానంబు వడయుట

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

Sunday, February 22, 2026

Kardama Created Self-Moving Aerial Mansion (Vimana) with Yogic Powers For his Wife - కర్దమప్రజాపతి యోగప్రభావంబుచే విమానంబు గల్పించి భార్యతో గూడి విహరించుట

కర్దమప్రజాపతి యోగప్రభావంబుచే విమానంబు గల్పించి భార్యతో గూడి విహరించుట

ఈ విధంగా స్వాయంభువమనువు తన కుమార్తె దేవహూతిని కర్దమమునికిచ్చి పెండ్లి జరిపించి తిరిగి తన నగరానికి వెళ్లిపోయాడు. అటు తరువాత దేవహూతి పతిభక్తితో పార్వతీదేవి పరమేశ్వరునికి పరిచర్య చేసినట్లు భర్తయైన క
ర్దమునికి సేవచేయనారంభించింది. భర్తయే తనకు దిక్కు అని భావించింది. భర్త మనస్సులోని అభిప్రాయాలకు అనుగుణంగా రోజురోజుకు ద్విగుణీకృతయైన భక్తి శ్రద్ధలతో, అనురాగంతో మిక్కుటమైన తేజస్సుతో ప్రకాశిస్తూ పతిని సేవిస్తున్నది. కామం క్రోధం కపటం లోభం మొదలైన దుర్గుణాలు లేకుండా శరీరాన్ని పరిశుభ్రంగా, సౌందర్యవంతంగా ఉంచుకొంటూ, చాతుర్యంతో ఆదరణతో ప్రేమతో భర్తనే భగవంతుడుగా భావించి మృదువుగా మధురంగా ఆయనతో మాట్లాడుతూ సేవలో ఎలాంటి ఉపేక్ష లేకుండా ప్రవరిస్తూ ఉన్నది. దైవేచ్చను సైతం తప్పింప సమర్ధుడైన కర్దమముని తనను సేవించడంలో కలిగిన కష్టంతో చిక్కిపోయిన శరీరంగల దేవహూతిని కరుణారసం పొంగిపొరలే కడకన్నులతో చూచి శ్రావ్యమైన మాటలతో ఇలా అన్నాడు.

తనకు శుశ్రూష చేసిన భార్యపై దయతో క
ర్దముడు ఇలా అంటున్నాడు. దేవహూతీ! మాననీయమైన ధర్మమార్గం వల్ల మహిమ కలుగుతుంది. ఆ మహిమాతిశయంవల్ల గొప్పతపస్సు, దానివల్ల ఏకాగ్రత కలుగుతాయి. వాటివల్ల ఆత్మజ్ఞానం లభిస్తుంది. దానివల్ల ఆత్మయోగం సిద్ధిస్తుంది. ఆత్మయోగంతో భగవత్కటాక్షం సమకూడుంది. ఆ కారణంగా పాపరహితమై విరాజిల్లే గొప్ప ఐశ్వర్యాలతో కూడిన అనంతాలైన శుభపరంపరలు సంప్రాప్తిస్తాయి. ఈ విధంగా నాకు సమకూడిన ఐశ్వర్యపరంపరలు నన్ను భక్తితో సేవించిన నీకు సంక్రమిస్తాయి. అంతేగాక నీకు తిరుగులేని దివ్యదృష్టిని కూడా అనుగ్రహిస్తున్నాను.

(క
ర్దముని వర్ణాశ్రమధర్మాలకు ఏ లోపమూ రానీకుండా నియమానుసారంగా దేవహూతి ఆయనను సేవించింది. దానితో కర్దముడు ధ్యాన ఉపాసనాదులు సక్రమంగా అనుష్టించడానికి వీలైంది. ఆ ఉపాసనాదులవల్ల ఆయనకు భగవత్ప్రసాదం, దానివల్ల అనంతాలైన శుభాలు, సంపదలు చేకూరినాయి. ఆయనను సర్వాత్మనా సేవించడంవల్ల అవన్నీ ఆమెకు కూడా లభించాయి. ఆ సిద్దులన్నిటినీ ప్రత్యక్షంగా చూడడానికి కావలసిన దివ్యదృష్టిని ప్రసాదిస్తానంటున్నాడు కర్దముడు.

భవభవానీ దాంపత్య ఉపమానంవలన వారు అర్ధనారీశ్వర తత్త్వానుసంధానం కలవారయ్యారుకనుక తపస్సు మొదలైనవాని ఫలాన్ని ఏకరూపంగా పొందారు.)

ఓ సుందరీ! నేనిచ్చిన ఆ దివ్యదృష్టివల్ల సర్వమూ నీకు కనిపిస్తుంది చూడు. భగవద్దత్తాలుకాని ఇతర నీచమైన ఐశ్వర్యాలు విష్ణుదేవుడు కనుబొమలు చిట్లించినంత మాత్రాననే నశించిపోతాయి. ఇక ఇతర విషయాలను గురించి వేరే చెప్పడమెందుకు?

(ఇంద్రియాలకు గోచరించనివాటిని కూడా చూడగలిగేశక్తి దివ్యదృష్టి. ఇది దైవసంబంధమైన శక్తి. ఇలాంటి శక్తిగలవారు దివ్యులు. సృష్టి సమస్తం శ్రియః పతి ఆజ్ఞాబద్ధమై ఉంటుందని, ఆయన ఆజ్ఞ లేనిది తృణమైనా చలించదని 'కమలపత్రనయను బొమముడి మాత్రాన నాశమందు' అనడంవల్ల దృఢమవుతున్నది.

'సాటిలేని రాజ్యవైభవాలతో గర్వంతో కనులుమూసుకుపోయి పాప మార్గాలలో పయనించే రాజులు పొందలేని ఈ దివ్యభోగాలు నీ పాతివ్రత్య మహిమవల్ల నీకు లభించాయి. వాటిని సమబుద్ధితో అనుభవించు. నీకు కార్యసిద్ధికూడా కలుగుతుంది' అని యోగమాయలందు సమర్ధుడైన క
ర్దముడు చెప్పగా దేవహూతి తన భర్తను తిలకించింది. ఆమె మనోవ్యథ తొలగిపోయింది. కడకన్నులతో, పాడమిన సిగ్గుతో మోము వంచుకొంది. వినయంతో చనువుతో పారవశ్యంతో ముద్దుముద్దుగా తన భర్తతో ఇలా అన్నది.

'ఓ పుణ్యస్వరూపా! నీవు అమోఘమైన యోగమాయలకు అధిపతివి. సర్వసమర్జుడవు. నీయందు సాటిలేని దివ్య భోగాలుండడం సత్యం. అది నాకు తెలుసు. నీ సాంగత్యంవల్ల ఆ భోగాలన్నీ నాకు లభిస్తాయి. అయినప్పటికీ దేవా! నీవు సంతానం కలిగేవరకే నాతో శరీరసంగమం కలిగి ఉంటానని ఆనాడు ఒక నియమం ఏర్పరచావు. ఆ నియమాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని నీ సాంగత్యాన్ని నాకు దయతో అనుగ్రహించు. నీ సంయోగాభిలాషతో చిక్కిపోయిన ఈ తనువు స్నానపాన భోజనాలవల్ల ఎలా తుష్టిపొందుతుందో. అలాంటి నా కోరికను తీర్చడానికి రతిరహస్యాలను తెలియజేసే కామశాస్త్రపద్ధతులను నాకు బాగా నేర్పు. అందుకు తగిన అనేకవిధాలైన వస్త్రాలు, ఆభరణాలు, పూలదండలు, మైపూతలు, శయనమందిరాలు, ఉద్యానవనాలు మొదలైన ముఖ్యవస్తువులను విరివిగా సమకూర్చి నన్ను దయచూడు' అని పలికిన దేవహూతి మాటలు విని గొప్పవాడైన ఆ క
ర్దముడు తన యోగమాయాబలంతో ఆ క్షణంలోనే ఒక దివ్యవిమానాన్ని సృష్టించాడు.

ఆ విమానంలో అందమైన వివిధ మందిరాలు ఉన్నాయి. ఆ మందిరాలన్నీ మణిమయ స్తంభాల కాంతులతో విలసిల్లుతూ ఉన్నాయి. గరుడపచ్చలు పొదిగిన నడవలతో, మంచిరకం వజ్రాలు తాపిన గోడలు తలుపులతో, పగడాలు తాపిన గడపలుగల వీథులతో చూడముచ్చటగా ఉన్నాయి. ఆ మందిరాలపై ఇంద్రనీలమణుల శకలాలు పొదుగబడి మెలిమిబంగారుతో నిర్మితమైన కలశాలు అమర్చబడి ఉన్నాయి. ఆ కలశాలు ధగధగమని మెరుస్తూ ఉన్నాయి. ఆ మెరుపులకు తగినట్లు పద్మరాగాల మొగ్గలు చెక్కిన వైడూర్యపు చూరులు సొగసుగా ఉన్నాయి. మందిరాలపై గాలికి రెపరెపలాడుతూ జెండాలు అమరి ఉన్నాయి. కర్ణపేయంగా ఝంకారం చేసే తుమ్మెదల బృందంతో కూడి వ్రేలాడుతున్న పూలదండల తోరణాలతో ఆ మందిరాలు మనోహరంగా అలరారుతున్నాయి.

(క
ర్దమమహాముని క్షణంలోనే సృష్టించిన దివ్యవిమానంలో అందమైన మందిరాలున్నాయి. ఆ మందిర నిర్మాణంలో వాడబడినవి - మణులు, మరకతాలు, వజ్రాలు, విద్రుమాలు, హరినీలాలు, పద్మరాగాలు, వైడూర్యాలు. ఇవన్నీ ఎంతో విలువైన రత్నాలు. ఇవి నవరత్నాలలోనివి. ఆ మందిరాల నిర్మాణంలో వాడినవి నవరత్నాలలో ఏడుమాత్రమే. ఇక మిగిలిన రెండు - కెంపులు, గోమేధికాలు. భార్య కోరిక మేరకు సృష్టింపబడిన మందిరాలు ఎంత అందంగా ఉంటే ఆమెకంత సంతోషంగా ఉంటుందని భావించి కర్దముడు చేసిన అపూర్వ సృష్టి అది.)

ఆ విమానంలోగల మందిరాలలోని గదులలో జిలుగువస్త్రాలు, చీనాదేశపు పట్టువస్త్రాలు, పట్టు చీరలు, పలురకాలైన వస్త్రాలు అందంగా కనిపిస్తున్నాయి. ఆశ్చర్యకరమైన రంగురంగుల పట్టెమంచాలు అమర్చబడి ఉన్నాయి.

(చీనాంబరమంటే సాధారణంగా పట్టువస్త్రమని అర్థం. చీనా (చైనా) దేశంలో తయారైనది కావడంవల్లనే చీనాంబరమని పేరేర్పడింది. ప్రాచీనకాలంలో తూర్పు ప్రాచ్యదేశాలనుండి అరుదైన వస్తువులను దిగుమతి చేసుకొనేవారు. అలాంటి వస్తువులలో చీనాంబరం ముఖ్యమైంది. ప్రాచీన సాహిత్యంలో చీనాంబరాల ప్రస్తావన కనిపిస్తున్నది.)

అక్కడ సుందరమైన ఉద్యానవనాలలో విలాసంగా విహరిస్తున్న రాజహంసలు, కోయిలలు, పావురాళ్లు, జక్కవపిట్టలు, నెమళ్లు మొదలైన పక్షులు మందిరాల గోడలమీద చెక్కబడిన కృత్రిమపక్షులను చూచి తమ జాతికి చెందిన నిజమైన పక్షులుగానే భావించి ఎంతో ఉత్కంఠతో వాటిని పలుకరిస్తూ అక్కడగల చెట్లకొమ్మల పై అటూ ఇటూ దాటుతూ కేరింతలు కొడుతూ ఆడుతూ ఉంటాయి.

(మూలంలో హంసలు, పావురాళ్లు మాత్రమే చెప్పబడగా పోతన ఇంకా కోయిలలను, చక్రవాకాలను, చిలుకలను, నెమళ్లను కూడా చేర్చి చెప్పడంవల్ల ఆ పక్షులన్నింటి కృత్రిమ రూపాలను గోడలమీద చెక్కినట్లు అర్థమవుతుంది. అందువల్ల మందిరాలగోడలు అందంగా కనిపించాయి. మూలంలో 'వికూజితం' అని ఒకేమాటలో పక్షులు శబ్దం చేస్తున్నాయని వ్యక్తం చేయబడగా పోతన 'కుతూహలియై పల్కుచు నాడుచుండున్‌' అని వ్యాఖ్యానప్రాయంగా వ్రాశాడు.)

ఇంకా ఆ విమానంలోపలి భవనాలు శయ్యలతో, గద్దెలతో, క్రీడాగ్భహాలతో, కల్పితమైన క్రీడాపర్వతాలతో, పాలరాతిభవనాలతో ఫలవృక్షాల వనాలతో కూడి ఉన్నవి.

సమస్తఋతువులశోభలతో, సకలసుఖాలతో, సర్వసంపదలతో సమస్త సుఖాలు అనుభవించడానికి యోగ్యమై, ఎల్ల కోరికలను నెరవేర్చగలదై, అందమైన అలంకారాలతో ఒప్పుతున్నది.

అలాంటి సర్వసంపదలతో, అలంకారాలతో ఒప్పుతున్న మహిమాన్వితమైన విమానాన్ని సృష్టించిన క
ర్దమమహాముని అందులో కంటికింపైన చిత్రచిత్రపు శోభావిశేషాలను నిర్మాణం చేసిన తానుకూడా తెలుసుకోలేనంతటి ఆశ్చర్యకరమై నిర్మాణపు పనితనం గలిగిన ఆ విమానాన్ని తనభార్య దేవహూతికి చూపించాడు. ముగ్ధయైన దేవహూతి ఆ విమానాన్ని చూచి సంతోషపడలేదు. ఆ విషయం తెలిసి సమస్తప్రాణుల అంతరంగాలలోగల అభిప్రాయాలను గ్రహించగలవాడూ, సంతోష హృదయుడూ అయిన కర్దమమహాముని దేవహూతితో ఇలా అన్నాడు.

ఓ సుందరీ! భగవంతుడు నిర్మించినది, సమస్తశుభాలకు ఆకరమైనది అయిన ఈ జలాశయం బిందుసరోవరమనే సరస్సు. ఆసక్తితో ఈ సరస్సులో స్నానం చేసిన ప్రాణులకు కోరిన కోరికలు నెరవేరుతాయి. కావున నీవు కూడా.

'దేవహూతీ! సిగ్గుపడకు. నీవు ఈ సరస్సు నీళ్లలో ఎంతో భక్తితో స్నానంచేసి సంతోషంగా ఈ విమానాన్ని అధిరోహించు' అని క
ర్దమమహాముని బుజ్జగిస్తూ పలికాడు.

కలువరేకులవంటి కనులుగల దేవహూతి భర్తమాటలు విన్నది. ఆమె పతిని సేవించడంలో అలసిపోయింది. చీరమాసిపోయి ఉంది. వెండ్రుకలు జడలు కట్టినాయి. శరీరం ధూళిధూసరితమై కృశించింది. వక్షస్థ్సలం వివర్ణమైపోయింది(ఎండిపోయినట్లయింది). తన భర్త ఆజ్జననుసరించి ఆమె సరస్వతీనది జలాలతోను, జలచరాలతోను నిండిన బిందుసరోవరంలో స్నానం చెయ్యడానికి దిగింది. ఆ సమయంలో ఆ జలప్రవాహంలో అందమైన వలిపములు కట్టుకొన్నవారూ, నవయౌవనంలో ఉన్నవారూ, కలువపూల పరిమళం కలవారూ అయిన కన్యలు వేలమంది దేవహూతిని చూచి ఆమెతో ఇలా అన్నారు.

ఓ యువతీ! మేము ధర్మకార్యాలను ఆచరిస్తూ ఉంటాం. నీకు నిర్మలమైన భక్తితో సేవ చేయగలం. మమ్ములను దయతో కూడిన చూపులతో వీక్షించు.

(వేలమంది కన్యలు పరిచారికలుగా దేవహూతికి సేవలు చేస్తామన్నారు. ఆ సేవకూడా ధర్మాచరణే. వాళ్లదగ్గర సంచిత ధర్మముంది. ఎప్పుడూ ధర్మాచరణ చేస్తూ ఉంటారు కాబట్టి ధర్మం వాళ్లదగ్గర మిగిలే ఉంటుంది. అలా మిగిలిన ధర్మం సంచిత (కూడబెట్టుకొన్న) ధర్మంగా ఉంటుంది.)

సేవలు చేస్తామని చెప్పిన కన్యలు దేవహూతి వద్దకు వెళ్లారు. ఆమెకు నలుగు పెట్టారు. బంగారు బిందెలలో నింపిన చందన కర్పూర పరిమళాలు వెదజల్లే నీళ్లతో ఆమెకు స్నానం చేయించారు. శరీరంమీద తడిని తెల్లని వస్త్రాలతో తుడిచారు. అగరు ధూపం వేశారు. కస్తూరి పంకంతో ఒడలికి పూతలు పూశారు. మధురంగా ధ్వనించే మణిమంజీరాలు పాదాలకు తొడిగారు. చిరుగంటల సవ్వడితో కూడిన ఒడ్డాణం నడుముకు అలంకరించాడు. రత్నాలు తాపిన ఆభరణాలను చెవులకు అలంకరించారు. ఉంగరాలు, కంకణాలు మొదలైన సముచితమైన విలువైన బంగారు ఆభరణాలను కైసేశారు. మంగళప్రదమైన పూలమాలలు సమర్పించారు. మైపూతలు, విలువైన వస్త్రాలు ఇచ్చారు. షడ్రసోపేతమైన పలురకాల భోజనంతో సంతృప్తి పరిచారు.

డ్రసోపేత భోజనంతో దేవహూతిని సంతృప్తిపరిచి ఆ కన్యలు ఆమెకు బంగారు పళ్లెరాలలో శాంత్యుదకాలు నింపి అందులో కర్పూరం వెలిగించి హారతులు పట్టారు. మనోహరమైన పీఠంమీద కూర్చుండబెట్టి అద్దం చేతికిచ్చారు. దేవహూతి ఆ అద్దంలో ప్రతిఫలించిన తన రూపం చూచుకొని భర్తయైన కర్దముని మనస్సులో భావించింది. ఆ క్షణంలోనే కర్దముడూ, వేల కన్యలూ ఆమెముందు సాక్షాత్కరించారు. తన భర్త యోగమాయా ప్రభావానికి ఆమెకు ఆశ్చర్యం కలిగింది. అప్పుడు కర్దముడు స్నానం చేసి ఉన్న దేవహూతిని చూచాడు. పెండ్లికి ముందు ఆమె ఏ విధంగా ఉండినదో ఇప్పుడూ అలాగే చక్కదనంతో ఉన్నందుకు కర్దముడు ఆనందభరితుడయ్యాడు. కన్యలందరూ భార్యనూ, తననూ సేవిస్తూ ఉండగా సతీసమేతుడై తన విమానం ఎక్కి చుక్కలతో చుట్టబడిన రోహిణీ సహితుడైన చంద్రుని వలె ప్రకాశించాడు. ఆ తరువాత-

నిత్య మంగళస్వరూపుడైన ఆ క
ర్దమముని సమస్త దిక్పాలురూ విహరించడానికి యోగ్యమైనది, మనోహరంగా వీచే మందమారుతంతో శోభించేది, సమీపంలో గైరికాది ధాతుమయములైన సెలయేళ్ల నీళ్లతో ప్రవహించే నీళ్లతోనూ, చల్లని మంచుతోనూ ఒప్పునట్టి మేరుపర్వత గుహకు వెళ్లి దేవవనితలతో కూడిన కుబేరునివలె విహరించాడు.

(కుబేరుడు యక్షరాజు. యక్షుడు అంటే పూజింపబడువాడు. ఇతనికి ధనాధిపుడని మరొకపేరు. ధనాధిపుడంటే ధనాన్ని రక్షించువాడని అర్థం. పైగా శివుని సఖుడు. అందువల్లనే క
ర్దముడు కుబేరునివలె విహరించాడని చెప్పబడింది.

ప్రధాతునిర్ఝర - సెలయేరు కొండలపై నుండి గైరికాది ధాతువులను తనలో కలుపుకొని క్రిందికి ప్రవహిస్తుంది. గిరౌ భవం గైరికం(పర్వతమున పుట్టినది) అని గైరిక శబ్దానికి వ్యుత్పత్తి. హరిదళం, గంధకం మొదలైన శిలావికారాలు ధాతువులు. హరిదళం ఎరుపుగా, గంధకం పసుపుపచ్చగా ఉంటాయి కాబట్టి గైరికాది ధాతువులంటే పర్వతాలమీద గల ఎర్రని పసుపుపచ్చని మట్టి విశేషాలని చెప్పవచ్చు.)

ర్దమమహాముని భార్యాసమేతుడై కామగమనంగల విమానం ఎక్కి దేవతల ఉద్యానవన భూములను తిలకించాడు. కొత్త పూదోటలున్న ప్రదేశాలు సందర్శించాడు. వికసించిన కలువలతో పద్మాలతో విరాజిల్లుతూ ఉన్న మానససరోవర తీరాలను చూచాడు. మదికింపైన పొదరిండ్లను అవలోకించాడు. కుబేరుని ఉద్యానవనమైన చైత్రరథాన్ని సంతోషంతో దర్శించాడు.

(దేవతల ఉద్యానవనం నందనవనం. నందనవనం దేవేంద్రుని స్వాధీనంలో ఉంటుంది. ఈ వనంలోకి వెళితే ఆనందం కలుగుతుంది. అందుకని దీనికి నందన(నందయతీతి నందనం = సంతోషింపజేయునట్టిది) వనమనిపేరు. ఇక్కడ చెప్పబడినవన్నీ విహారానికి అనువైన ఆరామాలు, పూపొదరిండ్లు, సరోవరతీరాలు. భర్తతో కలసి విహరించాలనే కోరికగల దేవహూతిని ఈ విహారయోగ్యమైన ప్రదేశాలకే క
ర్దముడు తీసుకొని వచ్చాడు. విస్రంభంతో, నెయ్యంతో చూచాడనడం ఎందుకంటే తొందరలేకుండా, ఎవరి బెదిరింపు లేకుండా సావకాశంగా తిలకించాడని చెప్పడానికి.)

ఈ విధంగా క
ర్దముడు భార్యతో కలసి విమానంమీద వాయువేగంతో, కలయదిరిగి విమానమెక్కి సంచరించేవాళ్లందరిని మించి లోకాలన్నీ సంచరించాడు. మోక్షప్రదాత, పరమపూజ్యుడు అయిన విష్ణుదేవుని స్తుతించి సేవించే పుణ్యాత్ములకు పొందరాని వస్తువులుంటాయా? ఇలా కర్దముడు దేవహూతికి సమస్త భూమండలం చూపించి మరల తన నివాసానికి తీసుకొని వచ్చాడు. తనభార్య కామకేళీ వినోదానికి ఇష్టపడుతున్నట్లు గుర్తించాడు. రతిక్రీడాపరాయణుడైనాడు. ఆ దంపతులు పలువిధాలైన సుఖభోగాలను అనుభవిస్తూ అనేక సంవత్సరాలు క్షణాలవలె గడిపారు. సరసమైన చూపులతో, తగిన కౌగిలింతలతో, సంభాషణలతో, కాలం గడవడమే తెలియకుండా వారు నూరేండ్లు గడిపారు.

ఒకనాడు క
ర్దమముని కుతూహలంతో తనదేహాన్ని తొమ్మిది దేహాలుగా చేసుకొని క్రమంగా తన వీర్యాన్ని తన భార్య దేవహూతి గర్భంలో తొమ్మిది విధాలుగా నిలిచేటట్లు చేశాడు.

ఆ కారణంగా క
ర్దమమునివల్ల దేవహూతి తొమ్మిదిమంది కూతుండ్రను కన్నది. ఆమె తనమనస్సులో ఎంతో సంతోషించింది. తరువాత కర్దమముని -

దేవహూతి తొమ్మండుగురు కూతుళ్లను కన్నతరువాత క
ర్దమముని సన్యాసం తీసుకోవాలనుకొన్నాడు. ఆ విషయం తెలుసుకొన్న దేవహూతికి మనస్సులో ఆవేదన అధికమైంది. చింత కలిగింది. చెక్కిలిమీద చేయిచేర్చి కాలివేళ్లతో నేలపై రాస్తూ భర్తతో ఇలా అన్నది.

అనఘా! సంతానం కలిగేవరకు నాతో కలసి ఉంటానని ముందు నీవు చెప్పావు. కొమార్తెలను ప్రసాదించావు. ఇప్పుడు ఈ యువతులు తమకు తామే భర్తలను ఎలా వెదకుకోగలరని భయపడుతున్నాను. కావున ఈ పుత్రికలకు తగిన పెండ్లికొడుకులను వెదకి వాళ్లకు పెండ్లిండ్లు చేసి, నాకు తత్త్వవిషయాలు తెలియజేయగల కుమారుని ప్రసాదించు. సాధుజనస్తవనీయా! సంసారదుఃఖాన్ని తొలగించడానికి సమర్థుడవు నీవే. గడచిన కాలమంతా కామసుఖంపైగల మోహంతో ముక్తిమార్గాన్ని గురించి ఆలోచించకుండా వ్యర్థంగా గడచిపోయింది.

మహాత్మా! నాకు ఈ లోకసంబంధాలైన సుఖానుభవాలలో ఆసక్తి నశించింది. ముందు నేను చంచలభావంతో నీతో రతిసాంగత్యాన్ని అపేక్షించి స్వచ్చమైన నీ భావాన్ని తెలుసుకోలేక ఏ వేవో కోరాను. ఆ కోరికలను తీర్చావు. నిన్ను నిర్మలమైన భక్తితో సేవిస్తే ముక్తి లభించదా? తప్పక లభిస్తుంది.

('అచ్చపుందలంపు' అంటే క
ర్దముని యోగమాయాతత్త్వం. దాన్ని పూర్తిగా తెలుసుకోవడం. అన్ని సంవత్సరాలు కర్దమునితో కలసిఉన్నా దేవహూతికి ఆయన మహత్తు పూర్తిగా తెలియలేదు. దానికి కారణం ఆమెకుగల కామభోగాసక్తత. ఆయనను కామదృష్టితోనే ఇన్నాళ్లూ చూచింది. ఇప్పుడామెకు భోగదృష్టి పోయింది. అనుభవించాలనే ఆసక్తి నశించింది. ఆమె మనోనేత్రం మేలుకొంది. గడచినకాలం ఎంత వృథాగా పోయిందో అర్థమైంది. అప్పుడామెకున్నది చంచలస్వభావం. ఇప్పుడు ముక్తిని గురించి ఆలోచించే స్థిరచిత్తంతో ఉంది. కర్దముడే ముక్తి నివ్వగల మహత్తు కలవాడని గ్రహించగలిగింది.)

అంతేగాక అందరియెడల సమానబుద్ధితో ప్రవర్తించే సజ్జనులమైత్రి ఉత్తమగతికి కారణమవుతుంది. అల్పబుద్ధిగల చంచలచిత్తులైన దుష్టపురుషుల మైత్రి దుర్గతికి కారణమవుతుంది. యోగిజనసన్నుతా! ఈ విషయాన్ని మనస్సులో భావించి నిన్ను నేను సేవిస్తాను. ప్రాణుల సమాగమంవల్లనే ఎట్టివారికైనా పుణ్యాలో పాపాలో ప్రాప్తిస్తాయి.

(దేవహూతి వైరాగ్యభావంతో మాట్లాడుతూ ఉంది. సజ్జనులతో సాంగత్యం కలిగి ఉంటే అది పుణ్యహేతువు అవుతుంది. అంటే- సంసార క్లేశనివారణ హేతువవుతుంది. అదే అసజ్జనులతో సాంగత్యం ఏర్పరచుకొంటే ఆ సంబంధం పాపానికి దారితీస్తుంది. అంటే - సంసార దుఃఖం కలుగుతుంది. అందరి దుఃఖాన్ని నిశ్శేషంగా నశింపజేసి వారికి ఆనందాన్ని ఇవ్వగల సమర్థుడు కర్దముడు. ఇన్నాళ్లూ ఆయనతో కలసి ఉండినా ముక్తిని గురించి మాట్లాడక పోవడం ఎంతో దుఃఖం కలిగించే విషయమని దేవహూతి బాధపడుతూ ఉంది.)

ఇలా మిక్కిలి బాధతో పరితపిస్తూ పలికిన దేవహూతిని చూచి శ్రీహరి మాటలు తలపుకు తెచ్చుకొని కర్దముడు ఆమెతో ఇలా అన్నాడు.

దేవహూతీ! నీవు మనస్సులో దుఃఖించవద్దు. భగవంతుడు, అనఘుడు, అక్షరుడు, జనార్దనుడు అయిన శ్రీహరి అచిరకాలంలోనే తప్పక నీ గర్భంలో ప్రవేశిస్తాడు.

(తన కాలమంతా వృథాగా గడచిపోయిందని, ముక్తిమార్గాన్ని గురించి తెలుసుకొనే అవకాశాన్ని ఉపయోగించుకోలేక పోయానని పరితపిస్తూ ఉన్న దేవహూతికి క
ర్దముడు కలిగించిన సాంత్వనమిది. ఆమె తనకు తత్త్వబోధ చేయగల కొడుకును ప్రసాదించమన్నది. శ్రీహరే ఆమెకు కుమారుడుగా అవతరింబోతున్నాడని చెప్పి కర్దముడు ఆమెను సంతోషపరిచాడు.)

నీవు ఉత్తమనియమాలు, వ్రతాలు, నిష్ఠలు - ఇవన్నీ ఆచరించు. గొప్ప నిగ్రహంతో కూడిన మనస్సు కలదానివై నిండైన తపస్సు, ధనత్యాగం, దానం చేస్తూ శ్రద్ధాభక్తులతో కూడినది కాగా.

(తపోధన - అన్నపుడు తపోధనం అని అర్ధం చెప్పవచ్చు. ఇలా చెప్పడమే సమంజసంగా కూడా ఉంటుంది. అయితే మూలంలో 'తపోద్రవిణదానైశ్చ' అని తపస్సు, ధనం (ద్రవిణం) దానం వేరువేరుగా స్ఫురింపజేయడంవల్ల ప్రతిపదార్థంలో తపస్సు, ధనం వేరువేరుగా చూపబడినాయి. ఇవన్నీ 'నియుక్త అంతరంగంతో' నిర్వర్తించుమని ఉండడంవల్ల ధనం సంగ్రహించుకోవడం కాకుండా ఉన్నధనాన్ని కూడా వదిలించుకోవలసిన అవసరముంది. బాహ్యేంద్రియ నియమం, ఆంతరికమైన నియమం కలసి నియుక్త అంతరంగం. ఇలాంటి అంతరంగాన్ని సాధించాలంటే ధనత్యాగం చేయాలి. అందుకని 'ధన' కు ధనత్యాగం అని అర్థవివరణ చేయబడింది.)

శ్రీమన్నారాయణుని పాద పద్మాలను నిండైన భక్తితో పూజించు పురుషోత్తముడైన ఆ భగవంతుడు మనస్సులో నీ పూజకు సంతృప్తిచెంది నీ గర్భంలో నివసించి (నీ పుత్రుడుగాపుట్టి) నీ మనస్సులో ఏర్పడిన సందేహాల ముడులను ఛేదిస్తాడు.

(ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకొని ముక్తిమార్గానుగాములైన వాళ్లకు మనస్సులో అనేక సందేహాలుంటాయి. ప్రతి సందేహమూ ఒక ముడిలాంటిదే. ఒక సందేహంతీరితే మరొక సందేహం కలుగుతుంది. అందుకే శంకాగ్రంథిని సందేహాలముడులు అనడం.)

దేవహూతి గర్భంబున విష్ణుండు గపిలాచార్యుండుగా నుదయించుట

Bakthi Yoga, Sankhya Yoga The teachings of Lord Kapila to his mother Devahuti - కపిలుండు దేవహూతికి భక్తి యోగమును తెలియంజేయుట

కపిలుండు దేవహూతికి భక్తి యోగమును తెలియంజేయుట ప్రజల ఫలాశలు పలురకాలు. కాబట్టి వారి భక్తియోగపు పోకడలుకూడ అనేక విధాలు. చెపుతాను, వినుమన్నాడు కపి...