ఈ విధంగా శ్రీకృష్ణుడు కాళియుని పడగలమీద తాండవం చేయడంచేత, తీవ్రమైన ఆతని కాలితాపులకు కాళియుని పడగలన్నీ చితికిపోయాయి. కాళియుడు బాధతో కదలిక లేక శవంలాగ పడి ఉన్నాడు. అటువంటి దీనావస్థలో ఉన్న తమభర్తను చూచి, కాళియునిభార్యలమనస్సులు శోకంతో కలవారపాటుకు లోనయ్యాయి.
కాళియుని భార్యలు శ్రీకృష్ణుణి దర్శించడానికి బయలుదేరారు. ఆ తొందరలో ముడుచుకొన్నవారి కొప్పులు విడివడి పోయాయి. అలంకారాలు చెదరిపోయాయి. పాలిండ్లబరువుకు తీగలాగ సన్నంగా సుకుమారంగా ఉన్న నడుములు అల్లాడిపోయాయి. పైటకొంగులు జారిపోయాయి. దిక్కుతోచక, భ్రాంతితో కలవరపడిపోయారు. ఏడుస్తూ ఉండే తమ పిల్లల్ని ముందుంచుకొని, జంకుగొంకులకు లోనవుతూ, భక్తిభావంతో, మంచి గుణాలు కలవాడయిన శ్రీకృష్ణుణ్ణి దర్శించారు.
కాళియునిభార్యలు శ్రీకృష్ణుణ్ణి దర్శించి, సాష్టాంగనమస్కారాలు చేసి, నుదుటిమీద చేతులు జోడించి, ఈ విధంగా విన్నవించుకొన్నారు.
సకలసద్గుణసంపన్నుడవైన ఓ శ్రీకృష్ణా! దుష్టశిక్షణ చేయడంకోసం భూమిమీద అవతరించినవాడివి నువ్వు, దుర్మార్గుడయిన ఈ కాళియుణ్ణి శిక్షించడం గుణమే కాని దోషం కాదు.
సర్వలోకాలకు ఆధారభూతుడవయిన ఓ పరమేశ్వరా! శత్రువుల కొడుకులయందు గూడ సమభావంతో దయ చూపే వాడవు. అట్టి నీకు ఎవరిమీదను పగ ఉండదు. దుష్టుల్ని శిక్షించడం లోకసంరక్షణంకోసం తప్ప మరేమీ కాదు.
విషం నోట్లోను, మనస్సులో కోపం ఉంచుకొని తిరిగేవారం అయిన మమ్మల్ని శిక్షించడం వాస్తవానికి దండనం కాదు. ఒకవిధంగా మాకు మేలు కలిగించడమే. నీవు చేసిన ఈ పనితో మాకు విషం కలవారమనే పొగరు దిగిపోయింది.
ఈ కాళియసర్పరాజు పూర్వజన్మంలో ఎంతగొప్పతపస్సు చేశాడో? ఎటువంటి పుణ్యకార్యాలు ఆచరించాడో? ఎటువంటి సత్యవాక్యాలు పలికాడో? ఎంతటి మహానుభావులకయినా ఒనగూడని పరమేశ్వరుడవైన నీవు వేడుకతో ఈతని పడగలమీద నాట్యం చేశావంటే అదెంతటి అదృష్టమో గదా!
ఓ పరమేశ్వరా! స్త్రీలందరిలోను శ్రేష్ఠురాలయిన లక్ష్మీదేవి నిన్ను పొందడంకోసం, చాలకాలం తపస్సుచేసి, ఎన్నో గొప్ప గొప్ప నోములు నోచి, మహాతేజస్సుతో ప్రకాశించే నీ పాదాల ధూళిలో ఒక కణాన్ని మాత్రమే స్పృశించే అర్హతను సంపాదించుకొనింది. ఈ కాళియుడు ఏ తపస్సు చేయకుండానే, ఏ నోములు నోచకుండానే, నీ పాదాల పూర్ణస్పర్శకు నోచుకొన్నాడంటే ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయం!
ఓ శ్రీకృష్ణా! మంచివీ, చక్కనివీ అయిన నీపాదాల ధూళికణాలు సోకాయి అంటే, ఇంక వారికి పుట్టుక ఉండదు. అట్టివారు పూర్ణకాములయి, ఇంక కోరదగినదేదీ లేని కృతార్థులౌతారు. అందువల్ల వారు దేవేంద్రపదవిని గాని, బ్రహ్మపదవినిగానీ, మహారాజపదవినిగానీ, పాతాళలోకాధిపత్యాన్ని గాని, హఠయోగ రాజయోగ సిద్ధులను గాని వేటినీ అంగీకరింపరు.
ఈ కాళియుడు తమోగుణం కలవాడు. క్రోధం కలవాడు. అయినప్పటికిని, చావుపుట్టుకలకు, కామక్రోధాదులకు, సుఖదుఃఖాలకు లోనవుతూ ఆలుబిడ్డలతో జీవించే సంసారు లెవ్వరికీ కోరడానికి కూడ శక్యం కానట్టి శ్రీకృష్ణపాదస్పర్శరూపమైన ప్రయోజనాన్ని ప్రత్యక్షంగా పొందింది.
దేవా! నీవు నశించే స్వభావంగల జీవులందరిలోనూ నశింపనివాడివై, అక్షరరూపుడవయి అంతర్యామి అనే పేరుతో ఉన్న పరమపురుషుడివి. దేశకాలవస్తువుల పరిమితులకు లోబడని మహాత్ముడవు. ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి అనే పంచభూతాలకును, వానిచే నేర్పడిన సకలవస్తు సముదాయాలకును ఆధారమైనవాడగుటవలన భూతావాసుడివి. పంచభూతాలే రూపంగా గలవాడవగుటచే భూతశబ్దమునకు అర్థమైనవాడివి. అన్ని కారణములకు కారణమయిన మూలప్రకృతికి గూడ అతీతమైన పరమాత్ముడవు. ఆత్మజ్ఞానం, ప్రాపంచికజ్ఞానంకూడ పరిపూర్ణంగా కలవాడివి. సత్త్వరజస్తమోగుణసంబంధం లేనివాడివి. పుట్టుట, పెరుగుట, రూపం మారుట, ముదురుట, తరుగుట, చచ్చుట అను ఆరువిధాలయిన వికారాలు లేని పరబ్రహ్మవు. మాయాశక్తిని అధీనంలో ఉంచుకొని, సృష్టి స్థితిలయాలు కొనసాగిస్తూ అనంతమైన సామర్థ్యం కలవాడవయి, ఆ మాయతో కొంచెంకూడ సంబంధం లేనివాడివి. అఖండమైన కాలాన్ని సంవత్సరాలు, అయనాలు, ఋతువులు, మాసాలు మొదలయిన భేదాలతో చక్రంలాగ త్రిప్పుతూ ఉన్నవాడివి. కాలస్వరూపుడవు. కాలశక్తికి ఆధారమైనవాడివి. సృష్టిస్థితి సంహారాలనే, కాలవిభాగాలయిన సంవత్సరాదులను గమనిస్తూ కూడ వానితో ఏ విధమైన సంబంధంలేకుండా ఉండే సర్వసాక్షివి. నీకు నమస్కరిస్తున్నాము. ఇంకా
మాయాతీతుడవైన ఓ శ్రీకృష్ణా! ఈ ప్రపంచం అంతా నీ రూపమే. దీనికి సృష్టికర్తవు నువ్వే, ఉదాసీనంగా ఉండి, దీనినంతనూ గమనిస్తూ ఉన్నవాడివీ నువ్వే ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి అనే పంచభూతాలు, వానికి విషయాలయిన శబ్దస్పర్శరూపరసగంధాలు, ప్రాణం, మనస్సు, బుద్ధి, చిత్తం అనే అంతఃకరణ భేదాలు అన్నీ నీ రూపమే. సత్త్వరజస్తమోగుణాలచేత ఆవరింపబడుతూ, నీ అంశలుగా పుట్టిన ప్రాణులకు సుఖదుఃఖానుభవం కలిగించేవాడివి నువ్వే, వాస్తవానికి సత్త్వరజస్తమోగుణాలకు లోబడక, ఏ విధమైన వికారాలు పొందకుండగా, ఇంద్రియాలకు గోచరించకుండా, సూక్ష్మరూపంలో ఏకరూపంగా ఉన్నవాడివి, సర్వజ్ఞుడవు. నీకు నమస్కరిస్తున్నాము. మా మనవి చిత్తగించు.
(కూటస్థుడు - పంచభూతాత్మకమైన శరీరంలోని జీవుణ్ణి నడిపించేవాడు = పరమాత్మ. అంటే ఏ వికారాలూ లేక నిశ్చలంగా ఉండే ఆత్మ కూటము= దాగలి. దీనిపై ఎన్ని వస్తువులు పెట్టి కొట్లూ - ఏ రూపాలుగా మారుస్తున్నా - వాటిగుణం కానీ, మార్పుకానీ చెందక, తన స్థితిలోనే నిర్వికారంగా ఉంటుంది. ఆత్మకూడా - దాగలి వంటిదే.)
ఓ శ్రీకృష్ణా! మాయకు లోబడిన ప్రజలు నిన్నుగురించి అనేకవిధాలవాదాలకు లోనవుతూ ఉంటారు. దేవుడు ఉన్నాడని భక్తులు మొదలయినవారివాదం. అసలే లేడని చార్వాకులు మొదలయినవారి వాదం. ఏకరూపుడు-కాదు అనేక రూపుడు, అన్నీ తెలిసినవాడుకాదు, కొంచెమే తెలిసిన జీవరూపుడు, మాయకు లోబడినవాడు కాదు, మాయకు అతీతుడు. ఈ విధంగా నీ మాయాప్రభావంవల్ల ఎందరో ఎన్నో విధాలుగా వాదిస్తూ ఉంటారు. అన్నివాదాలకు అనుకూలంగా ఉన్నట్లే కనబడుతూ ఉంటావు. పదాలు(సంకేతాలు), వాని అర్ధాలు, వాని స్వభావాలు, వానిలోని తారతమ్యాలు మొదలగువానిచేత సర్వజ్ఞత్వం, అల్పజ్ఞత్వం మొదలయిన మహిమలతో గూడినవాడివి. జ్ఞానసాధనాలయిన చక్షురాదులు అయిన ఇంద్రియాలు నీరూపమే. ఇంద్రియా పేక్షలేని జ్ఞానం ఉన్నవాడివగుటచే పరమాత్మవు. వేదాలను నిశ్శ్వాసరూపంగా వెలువరించావు కనుక వేదాలకు జన్మస్థానం నువ్వే ('శాస్త్రయోనిత్వాత్' - బాదరాయణుని వేదాంతసూత్రం) (యస్య నిశ్శ్వాసితం వేదాః శ్రుతి). అంతఃకరణ దశా భేదాలయిన అహంకారం - బుద్ధి - మనస్సు- చిత్తం అనే వానికి అధిదేవతలయిన సంకర్షణుడు - వాసుదేవుడు - ప్రద్యుమ్నుడు - అనిరుద్దుడు అను నలుగురు నీ వ్యూహరూపాలవారే. భక్తజనుల్ని రక్షించేవాడివి నువ్వే. జీవులఅంతఃకరణాన్ని ఇంద్రియాలద్వారా విషయాలమీదకు మళ్లిస్తూ ఉంటావు. నిన్ను సేవించేవారికి తగిన ఫలాలు ఇవ్వడంకోసం సత్త్వరజస్తమోగుణాలతో ప్రపంచాన్ని ఆవరించి ఉన్నావు. సాత్త్విక - రాజసిక - తామసిక కర్మలకు తగిన సాత్త్విక - రాజసిక - తామసిక ఫలాలు ఇస్తూ ఉంటావు. జీవుల అంతఃకరణవృత్తులద్వారా తెలియదగిన సత్త్వరజస్తమో గుణాలకు సాక్షివిగా ఉంటూ, జనులకు గోచరించకుండా ఉంటావు. ఊహకందని అభివృద్ధి కలవాడివి కనుక బ్రహ్మవు. నిరాఘాటమైన ప్రవర్తన కలవాడవు. అవ్యక్తం మొదలుకొని సకలస్థావర జంగమ సృష్టికి కారణమైనవాడివి. మనస్సును ఇంద్రియాలద్వారా ప్రవర్తింపజేయడంవల్ల జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలకు నీవే అధిపతివి. జప మంత్ర యోగాదులచేత స్వాధీనంకాని ఆత్మయందే క్రీడిస్తూ ఉంటావు కనుక ఆత్మారాముడవు. మౌనాన్ని ఆశ్రయించిన వాడవు. స్థూల సూక్ష్మభూతాల గతులు గుర్తిస్తూ, దేనితోనూ సంబంధం లేకుండా ఉంటావు. ఈ ప్రపంచం నీ రూపం కాదు. కానీ సమస్తమూ నీవే. ఈ ప్రపంచంయొక్క స్థితిలయాలకు సాక్షివి నీవే. జ్ఞానాజ్ఞానాలకు నీవేకారణం. నీకు నమస్కారం.
సమస్త జగత్తులకు ప్రభువైన శ్రీకృష్ణా! నీవు యశస్సు, వీర్యం మొదలగు ఆరువిధాలయిన ఐశ్వర్యం కలవాడివి. కాలస్వరూపుడివి. ఏ విధమయిన కోరిక లేకుండానే లీలామాత్రంగా చతుర్ముఖబ్రహ్మ రూపం ధరించి విశ్వసృష్టినీ, విష్ణురూపం ధరించి స్థితినీ, రుద్రరూపం ధరించి నాశాన్నీ చేస్తూ ఉంటావు.
ఓ పరమేశ్వరా! ఈ శరీరాలు ఎంతకూ శాంతిలేనివి. అంతేకాక అజ్ఞానంతో కూడుకొన్న మూర్ఖమైన జన్మలు ఇవి. కాని నీవు ప్రశాంతతను అనుభవిస్తున్న మంచివాళ్లలోమాత్రమే ధర్మానికి మేలు కలిగించేందుకు అనుభవానికి వస్తూ ప్రకాశిస్తూ ఉంటావు.
కృపానిధీ! శ్రీకృష్ణా! నీలో ఏ తప్పు లేదు. తప్పు చేసిన మా భర్తను శిక్షించడం నీ తప్పు కాదు. మా పెనిమిటి ఆలోచనలలోను, చేతలలోనే పొరపాట్లు ఉన్నాయి. లోకంలో కుమారులు ఎటువంటి తప్పు చేసినా తల్లిదండ్రులు క్షమిస్తూ ఉంటారు గదా! రాజులు కూడ తప్పు చేసినవారిని ఒక్కొక్కసారి దండించకుండా విడిచిపెడుతూ ఉంటారు. నీవు జగత్తునకే ఈశ్వరుడవు. దయకు గనివంటివాడవు. అటువంటి నీవు మా భర్తను దయ తలచి కాపాడుమయ్యా!
మా పెనిమిటి మంచివాడని సమర్ధించలేము. ముమ్మాటికీ ఇతడు మూర్ఖుడు. ముక్కోపి,దుర్మార్గుడు. అయినప్పటకీ ఇతణ్ణి నీవు సంహరిస్తే మేము వైధవ్యదుఃఖం అనుభవించవలసి వస్తుంది. దాన్ని మేము భరించలేము. నీవు తప్ప మాకు మరొక దిక్కులేదు. కాబట్టి దయతో మా భర్తను మన్నించి, మా భర్త పడగలమీద కాళ్లతో త్రోక్కడం చాలించి, మాకు పతిభిక్షను ప్రసాదించు స్వామీ!
సర్వలోకాలవారు తమకు ఏ ఆపద వచ్చినా నిన్ను ఆశ్రయించవలసిందే. నీవు భక్తులకు అభయ మిచ్చేవాడివి. లక్ష్మీదేవికి భర్తవు. ఓ కృష్ణా! ఇదిగో చూడు. ఇప్పటికే మా భర్త శరీరం అంతా నలిగిపోయింది. పడగలన్నీ పగిలి పోయాయి. ప్రాణాలు వస్తూ పోతూ ఉన్నట్టుగా సొమ్మసిల్లి పోయాడు. ఇతణ్లి దయతో చూచి, ఇంక బాధించక విడిచి పెట్టవయ్యా!
భక్తులకు కోరిన వరాలిచ్చి అనుగ్రహించే ఓ శ్రీకృష్ణా! మా ప్రాణనాథుని ప్రాణాలు ప్రసాదించి, ఆతనితో మళ్లీ మాకు వివాహం జరిపించు. నీవు జరిపించే ఈ పెండ్లియే శాశ్వతంగా నిలిచేది. శుభాలు కలిగించేది. అంతేగాని మాకు చిన్నప్పుడు జరిగిన పెండ్లి పెండ్లే కాదు. (నిజమే కదా! మనం చేసే పెండ్లికంటే సర్వమంగళప్రదుడైన భగవంతుడు చేసేపెండ్లి శుభప్రదం, శాశ్వతం అవుతుంది. దంపతులు చిరకాలం వర్ధిల్లుతారు)
నీ మీద ఒట్టు పెట్టి మరీ చెబుతున్నాము. ఈనాటినుండి ఇంక ఎవ్వరినీ బాధించడు. ఇంతకు ముందులాగ భయపెట్టి పాపపు పనులు చేయడు. నీ చెప్పుచేతలలో ఉంటాడు. కాబట్టి మా పెనిమిటి ప్రాణాలు మాకు ప్రసాదించవయ్యా!
శరణుచొచ్చినవారిని రక్షించే స్వభావంకల శ్రీకృష్ణుడు - తమ భర్త జీవితాన్ని కోరే కాళియునిభార్యలను అనుగ్రహించాడు. కాళ్లతో తొక్కడం చాలించి, పక్కకు తప్పుకొన్నాడు. దాంతో కాళియుడు తన ప్రాణాల్ని, ఇంద్రియాల్ని పగిలిన పడగల్నీ చాలా కష్టంమీద కూడ తీసికొని, ఆయాసపడుతూ శ్రీకృష్ణునికి నమస్కారం చేసి, పశ్చాత్తాపంతో ఈ విధంగా అన్నాడు.
తామరరేకులవంటి కళ్లు గలవాడివి పరమేశ్వరుడివి, అయిన శ్రీ కృష్ణా! మా నడకలు తిన్ననైనవి కావు. మా నోళ్లలో భయంకరమైన విషం ఉంటుంది. దుర్మార్గులం. కోపం గర్వం కలిగి ఉంటాం. ఇటువంటి మేము మంచివాళ్లం ఎందుకు అవుతాం? ప్రాణులు పుట్టుకతో వచ్చినగుణాలను ఎక్కడయినా విడిచిపెడతాయా? మా మనోవికారాలు అందరికీ తెలిసినవే! సర్వజ్ఞుడవైన నీకు ఇవి వింతగా ఎందుకు కనబడతాయి? మాలో ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ దయతలచి మాకు ఉపకారం చేశావు.
సమస్తలోకాలకు ప్రభువయిన శ్రీకృష్ణా! అనేకవిధాలయింది ఈ ప్రపంచం. దీనికి నీవు సృష్టికర్తవు. జన్మ మొదలయిన షడ్భావవికారాలు, రూపాలు, శక్తులు, బీజరూపాలయిన సంస్కారాలు, ఆలోచనలు నీవు నిర్మించిన ఈ ప్రపంచంలోని అంశాలే - అన్నీ కూడా నీవే!. మేము కూడ ఆ ప్రపంచంలోని వాళ్లమే. మేము సహజంగా కోపస్వభావం కలవాళ్లం. ఎలాపడితే అలాగ ప్రాకులాడే స్వభావం కలవాళ్లం. మహాయోగులకు గూడ అంతుబట్టనిది నీ మాయ. అటువంటి దాన్ని మేము ఏవిధంగా దాటగలం? నువ్వు సర్వజ్ఞుడివి. మమ్మల్ని రక్షించాలి అనిపిస్తే రక్షించు. శిక్షించాలి అనిపిస్తే శిక్షించు. ఈ సమస్త విశ్వం నీదే. మాది అంటూ ఒకచోటు లేదు. నీవు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాము.
(పుట్టుట, ఉండుట, మారుట, పెరుగుట, తరుగుట, నశించుట అనేవి షడ్భావవికారాలు.)
ఓ శ్రీకృష్ణా! సనకాది మహాయోగీశ్వరులకు కూడా దుర్లభమైన నీ పాదధూళి నాకు లభించింది. నా భాగ్యం ఎంతటిదో కదా! ఇంక నేను ఎక్కడ ఉన్నా నాకు మంచే జరుగుతుంది.
ఈ విధంగా మనవి చేసిన కాళియునిమాటలు విన్న శ్రీకృష్ణుడు, కరుణతో స్థిరనిశ్చయానికి వచ్చి, అతనితో ఇలాగ అన్నాడు.
ఓ కాళియుడా! ఈ మడుగులోని నీటిని ఆవులమందలు, మనుష్యులు త్రాగుతూ ఉంటారు. నీవు ఇంక ఇక్కడ ఉండడానికి వీలు లేదు. ఈ వేళే నీవు -నీ భార్యలు, బిడ్డలు, బంధువులతో కలిసి సముద్రంలోకి వెళ్లిపొండి.
ఓ కాళియుడా! ఎవరైతే నేను నిన్ను శిక్షించిన ఈ కథను, నన్ను మనస్సులో ధ్యానం చేస్తూ ఉదయమూ, సాయంకాలమూ, పారాయణ చేస్తూ, స్తుతిస్తూ ఉంటారో, వారికి ఎప్పుడైనా, ఎక్కడైనా మీ సర్పజాతివల్ల భయం కలుగదు. మీ విషం వారికి ఏవిధమైన హానీ కలిగించదు.
ఈ క్షణంనుండి ఏ మానవులు ఈ యమునలోని కాళిందీ మడుగులో స్నానంచేసి, ఉపవాసం ఉండి, స్థిరభక్తితో నన్నే ధ్యానిస్తూ పూజిస్తూ దేవతలకు, పితరులకు, ఋషులకు తర్పణాలు విడుస్తూ ఉంటారో, వారు సర్వపాపాలనుండి విముక్తులయి, నిర్మలమైన మనస్సు కలవారయి మేలు పొందుతారు.
ఇంతకుమునుపు నీవు రమణక ద్వీపంలో ఉండేవాడవు. గరుత్మంతుడు నిన్ను పట్టుకొని తింటాడేమోననే భయంతో వచ్చి, అతనికి కనబడకుండా ఉండడంకోసం లోతైన ఈ మడుగులో దాగుకొన్నావు. నేను నీ మీద నాట్యం చేయడంవల్ల నా పాదాల ముద్రలు నీ పడగలమీద పడ్డాయి. వాటిల్ని చూచి, గరుత్మంతుడు ఇంక నీ జోలికి రాడు. నిర్భయంగా ఉండు.
ఎవరికీ అంతు చిక్కకుండా విహరించే శ్రీకృష్ణుడు ఈ విధంగా ఆజ్ఞాపించగానే, కాళియుడు అలా చేయడానికి అంగీకరించాడు. తన భార్యలతో కలిసి తాను క్రొత్తవి, దేవలోకంలో మాత్రమే లభ్యమటయ్యేవి అయిన వస్త్రాలు, ఆభరణాలు, మణిసరాలు బహుమతిగా ఇచ్చాడు. తుమ్మెదలకు ఆశ్రయమై, తేనెలు వెల్లివిరిసే నల్లకలువల దండను భక్తితో సమర్పించాడు. భార్యలు, కొడుకులు, స్నేహితులతో కలసి శ్రీ కృష్ణుణ్ణి చాలా పర్యాయాలు స్తోత్రం చేసి, సాష్టాంగ దండప్రణామ ప్రదక్షిణలుచేసి, లేచి నమస్కరించి, శ్రీకృష్ణునివద్ద సెలవు తీసుకొని, సముద్రంలోని ద్వీపానికి వెళ్లిపోయాడు. ఈ ప్రకారంగా
కాళియుణ్ణి యమునానదినుండి దూరంగా సముద్రంలోకి వెళ్లగొట్టడం ఎంతటి గొప్పవారికీ సాధ్యంకాని పని. అటువంటి పనిని శ్రీకృష్ణుడు అలవోకగా చేశాడు. దానితో యమునానది అమృతంవంటి నీటితో అందరికీ ప్రీతిపాత్రమై వెలుగొందింది.