Saturday, August 22, 2026

Revati Nakshatra - రేవతి నక్షత్రము

రేవతి నక్షత్రము

నక్షత్రం - రేవతి
అధిపతి - బుధుడు
గణము - దేవ
జాతి - పురుష
వృక్షం - విప్ప
జంతువు - ఏనుగు
నాడి - అంత్య
పక్షి - నెమలి
అధిదేవత - పూషణుడు
రాశి - మీనం
దే,/దో, /చా, /చీ

రేవతి నక్షత్ర జాతకుల గుణగణాలు
నక్షత్రములలో రేవతి నక్షత్రము 27వ నక్షత్రము. రేవతి నక్షత్ర అధిపతి బుధుడు, అధిదేవత పూషణుడు, గణము దేవగణం. ఈ నక్షత్రంలో పుట్టినవారు మేధావులు. ఆడంబరం తక్కువ. గణితంలో ప్రజ్ఞ కలిగి ఉంటారు. అనేక రకాల విజ్ఞాన గ్రంథాలను పఠిస్తారు.

కష్టపడే మనస్తత్వము ఉంటుంది. ప్రశాంతంగా నిదానంగా సమాధానాలను చెప్తారు. వ్యాపారంలో మోసం చేసే భాగస్వాముల నుండి తప్పించుకుంటారు. దూరప్రాంతాలలో చదువుకుని స్థిరపడడానికి బంధువుల సహకారం ఉంటుంది.

కీలకమైన అధికార పదవులలో వినూత్న వ్యాపారాలలో రాణిస్తారు. ప్రజలలో మంచి పేరు ఉంటుంది. నమ్ముకున్న వారిని కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు సహాయం చేస్తారు.

వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉన్నా సర్దుకుపోతారు. వీరికి సాహిత్య రంగంలో జ్ఞాపకశక్తి అధికం. పాడి పంటలకు సంబంధించిన వ్యాపారాలు కలసి వస్తాయి. సంతానాన్ని ప్రేమగా గౌరవంగా చూస్తారు.

మంచితనంతో జీవితంలో ముఖ్యమైన విషయాలను అనుకూలం చేసుకుంటారు. విద్యాభ్యాసంలో కలిగే అవరోధాలను అధిగమించి ముందుకు సాగితే రాణిస్తారు. బాల్యం నుండే తెలివితేటలను ప్రదర్శిస్తారు.

రేవతి నక్షత్రము మొదటి పాదము
రేవతి నక్షత్రము మొదటి పాదము ధనసురాశిలో ఉంటుంది. ధనసురాశి అధిపతి గురువు. రేవతి నక్షత్ర అధిపతి బుధుడు. ఈ నక్షత్రంలోని మొదటి పాదము జాతకుల మీద గురు బుధ గ్రహ ప్రభావం ఉంటుంది. ఇది దేవగణ నక్షత్రం. వీరికి ప్రధానంగా సత్వగుణం ఉంటుంది. అధ్యాత్మిక విశ్వాసం కలిగి ఉంటారు. వీరికి విద్యాసంస్థలు స్థాపించి నిర్వహించ గలిగే నేర్పు ఉంటుంది. విద్యా సంబంధిత వృత్తులు, వ్యాపారం, ఉద్యోగాలు అనుకూలం.

ఈ జాతకులకు 16 సంవత్సరాల వరకు బుధ దశ ఉంటుంది. వీరు విద్యారంభం నుంచి ప్రతిభ చూపిస్తారు.

16 సంవత్సరాల తరువాత ఏడు సంవత్సరాల కేతు దశ కాలంలో విద్యసాధన విషయంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ప్రయత్నపూర్వకంగా అడ్డంకులను అధిగమించి విజయం సాధించాలి. కేతు దశ అనుకూలిస్తే సమస్యలు ఉండవు. 

తరువాత 23 సంవత్సరాల శుక్ర దశ కాలంలో విద్యలో అభివృద్ధి ఉంటుంది. శుక్రదశ కాలంలో విద్య కంటే విలాసాల మీద ఆసక్తి అధికం. కాబట్టి పట్టుదలతో విద్య సాధనలో విజయం సాధించాల్సి ఉంటుంది. సకాలంలో జీవితంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. 

66 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. రాహు దశ అనుకూలిస్తే విదేశీ ఉద్యోగావకాశాలు, విదేశీ పర్యటనలు కలిసి వస్తాయి.

రేవతి నక్షత్ర రెండవ పాదము
వీరు ఆధ్యాత్మిక విశ్వాసం కలిగి ఉంటారు. వీరు శ్రమకు ఓర్చి పని చేయగలరు. వీరికి భూ సంబంధిత, వాయు సంబంధిత ఉద్యోగాలు, వృత్తులు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. వీరికి సాంకేతిక విద్య అనుకులిస్తుంది. న్యాయ సంబంధిత విద్య కూడా వీరికి అనుకూలిస్తుంది.

ఈ జాతకులకు 12 సంవత్సరాల వరకు బుధ దశ ఉంటుంది. వీరు మొదటి నుంచి విద్యాలో ప్రతిభ చూపిస్తారు. 

12 సంవత్సరాల తరువాత ఏడు సంవత్సరాల కేతు దశ కాలంలోవిద్యలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ప్రయత్నపూర్వకంగా అడ్డంకులను అధిగమించి విజయం సాధించాలి. కేతు దశ అనుకూలిస్తే సమస్యలు ఉండవు. 

19 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్ర దశ కాలంలో విద్యలో అభివృద్ధి ఉంటుంది. శుక్ర దశ కాలంలో విద్యకంటే విలాసాల మీద ఆసక్తి అధికం. కాబట్టి పట్టుదలతో మనసును విద్య వైపు మళ్ళించి విజయం సాధించాలి. ఇక వీరు సకాలంలోనే జీవితంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం అవుతుంది.

62 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. రాహు దశ అనుకూలిస్తే విదేశీఉద్యోగావకాశాలు, విదేశీపర్యటనలు కలిసి వస్తాయి. 

80 సంవత్సరాలకు వచ్చే 16 సంవత్సరాల గురు దశ కారణంగా జీవితం మళ్లీ గాడిలో పడుతుంది. ఇక వృద్ధాప్య దశ సాఫీగా సాగిపోతుంది.

రేవతి నక్షత్రము మూడవ పాదము
వీరు శ్రమకు ఓర్చి పని చేయగలరు. వీరికి భూసంబంధిత, వాయు సంబంధిత ఉద్యోగాలు, వృత్తులు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. వీరికి సాంకేతిక విద్య అనుకూలిస్తుంది. న్యాయ సంబంధిత విద్య కూడా వీరికి అనుకూలిస్తుంది. వీరు స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు.

ఈ జాతకులకు ఐదు సంవత్సరాల వరకు మాత్రమే బుధదశ ఉంటుంది. కనుక వీరికి విద్యారంభంలో ఆటంకాలు ఎదుర్కొంటారు. 

ఐదు సంవత్సరాల తరువాత ఏడు సంవత్సరాల కేతుదశ కాలంలోవిద్యలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ప్రయత్నపూర్వకంగా అడ్డంకులను అధిగమించి విజయం సాధించాలి. కేతుదశ అనుకూలిస్తే సమస్యలు ఉండవు. 

12 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్ర దశ కాలంలో విద్యలో అభివృద్ధి ఉంటుంది. శుక్రదశ కాలంలో విద్య కంటే విలాసాల మీదికే మనసు మళ్లుతుంది. కాబట్టి పట్టుదలతో మనసును విద్య వైపు మళ్ళించి సఫలం కావాలి. ఈ జాతకులు సకాలంలో జీవితంలో స్థిరపడతారు. వీరికి సకాలంలోనే వివాహం జరుగుతుంది. 55 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది. 

తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. రాహు దశ అనుకూలిస్తే విదేశీ ఉద్యోగావకాశాలు, విదేశీ పర్యటనలు కలిసి వస్తాయి. 

73 సంవత్సరాలకు వచ్చే 16 సంవత్సరాల గురు దశ కారణంగా జీవితంలో తిరిగి సుఖం వస్తుంది. వృద్ధాప్య దశ కూడా సౌఖ్యంగా గడుస్తుంది.

రేవతి నక్షత్రము నాలుగవ పాదము
వీరికి విద్య సంస్థలు స్థాపించి నిర్వహించ కలిగిన సామర్ధ్యం ఉంది. వీరికి విద్యా సంబంధిత వృత్తులు, వ్యాపారం, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. వీరికి నాలుగు సంవత్సరాల వరకు మాత్రమే బుధ దశ ఉంటుంది. కనుక వీరికి విద్యారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి.

నాలుగు సంవత్సరాల తరువాత ఏడు సంవత్సరాల కేతుదశ కాలంలో విద్యలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతు దశ అనుకూలిస్తే సమస్యలు ఉండవు. 

11 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్ర దశ కాలంలో విద్యలో అభివృద్ధి ఉంటుంది. శుక్రదశ కాలంలో విద్య కంటే విలాసాల మీద ఆసక్తి ఉంటుంది కనుక మనసును పట్టుదలతో విద్య వైపు మళ్ళించి విజయం సాధించాలి. ఇక వీరు సకాలంలో జీవితంలోనే స్థిరపడతారు. వివాహం కూడా సకాలంలో జరుగుతుంది. 54 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది. 

తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. రాహు దశ అనుకూలిస్తే విదేశీ ఉద్యోగావకాశాలు, విదేశీ పర్యటనలు కలిసి వస్తాయి. 

72 సంవత్సరాలకు వచ్చే 16 సంవత్సరాల గురుదశ కారణంగా జీవితంలో తిరిగి సౌఖ్యం వస్తుంది. వృద్ధాప్యం సాఫీగా గడిచిపోతుంది.


రేవతి నక్షత్ర జాతకుల తారా ఫలాలు
తార నామం తారలు ఫలం

జన్మ తార ఆశ్లేష, జ్యేష్ట, రేవతి శరీరశ్రమ

సంపత్తార అశ్విని, మఖ, మూల ధన లాభం

విపత్తార భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ కార్యహాని

సంపత్తార కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ క్షేమం

ప్రత్యక్ తార రోహిణి, హస్త, శ్రవణం ప్రయత్న భంగం

సాధన తార మృగశిర, చిత్త, ధనిష్ట కార్య సిద్ధి, శుభం

నైత్య తార ఆరుద్ర, స్వాతి, శతభిష బంధనం

మిత్ర తార పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర సుఖం

అతిమిత్ర తార పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర సుఖం, లాభం

అంశ గుణాలు :
1) ఉత్పన్నాంశ : రేవతీ నక్షత్ర ప్రధమ పాదం గురువుది. ఈ జాతకులు శాస్త్రాలపైనా పట్టు గలవారు, నీతి నియమాలు కలవారు.

2) పాపాంశ : రేవతి నక్షత్ర ద్వితీయ పాదం శనిది. ఈ జాతకులు అవతలి వాళ్ళలోని గుణాలను గ్రహించగలిగే సామర్థ్యం కలవారు అవుతారు.

3) ఉగ్రాంశ : రేవతి నక్షత్ర తృతీయ పాదం శనిది. ఈ జాతకులు మంచి బుద్ధి కలవారు అగుదురు.

4) శోభనాంశ : రేవతి నక్షత్ర చతుర్ధ పాదం గురువుది. ఈ జాతకులు ఈ జాతకులు యజ్ఞ యాగాదులు చేయువారు, దైవ కార్యాలు చేయువారు, ధైర్యవంతులు అవుతారు.

నక్షత్ర శాంతి: 
పద్మములు, సువాసన గల పుష్పాలు, యాలుకులు, కస్తూరి, పునుగు, జవ్వాది ఇవన్ని ప్యాకింగ్ చేసి శివాలయంలో దానం చేయవలెను.

నక్షత్ర మంత్రం:
।। ఓం ।।
పూషా రేవత్యన్వే'తి పంథా”మ్ ।
పుష్టిపతీ' పశుపా వాజ' బస్త్యౌ ।
ఇమాని' హవ్యా ప్రయ'తా జుషాణా ।
సుగైర్నో యానైరుప’యాతాం యమ్ ।
క్షుద్రాన్ పశూన్ ర'క్షతు రేవతీ' నః ।
గావో' నో అశ్వాగ్మ్ అన్వే'తు పూషా ।
అన్నగం రక్షంతౌ బహుధా విరూ'పమ్ ।
వాజగ్మ్' సనుతాంయజ'మానాయ యజ్ఞమ్ ॥

నక్షత్ర గాయత్రి
ఓం విశ్వరూపాయ విద్మహే 
పూష్ణ దేహాయ ధీమహి 
తన్నో రేవతి ప్రచోదయాత్

దర్శించవలసిన ఆలయములు
మొదటి పాదం - భట్లపాలికలో వేంచేసి ఉన్న శ్రీ లోపాముద్ర సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి.
రెండవ పాదం - కాపులపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి.
మూడవ పాదం - పేకేరులో వేంచేసి ఉన్న శ్రీ లోపాముద్ర సమేత శ్రీఅగస్తేశ్వర స్వామి .
నాలుగవ పాదం - బాలాంత్రంలో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి.


Sravana Putrada Ekadasi - శ్రావణ పుత్రద ఏకాదశి

శ్రావణ పుత్రద ఏకాదశి

శ్రావణ పుత్రద ఏకాదశి , పవిత్రోపన ఏకాదశి మరియు పవిత్ర ఏకాదశి అని కూడా పిలుస్తారు.

ఇది శ్రావణ మాసంలో శుక్ల పక్షం ఏకాదశి నాడు వస్తుంది.

పౌష మాసం లోని  పుత్రదా ఏకాదశిని 
పౌష పుత్రదా ఏకాదశి అని పిలుస్తారు. ఇది శ్రావణ పుత్రద ఏకాదశి.

ఈ రోజున, ముఖ్యంగా వివాహం తర్వాత చాలా కాలం పాటు కుమారుడు కలగని భార్యాభర్తలు, మగబిడ్డ కలగడం కోసం (ఇతర ఏకాదశుల వలె) పూర్తి ఏకాదశి సమయం ఉపవాసం పాటిస్తారు అంతే కాక ఆ శ్రీ మహా విష్ణువుని పూజిస్తారు. ఈ రోజు 
వైష్ణవులకు చాల ముఖ్యం.

సమాజంలో కొడుకును చాలా ముఖ్యమైన వ్యక్తిగా పరిగణిస్తారు, ఎందుకంటే అతను జీవితంలో వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకుంటాడు మరియు శ్రాద్ధం (పితృ కర్మలు) చేయడం ద్వారా వారి మరణానంతర జీవితంలో వారి శ్రేయస్సును నిర్ధారిస్తాడు. 

ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేక పేరు మరియు నిర్దిష్ట లక్ష్యాలు ఉన్నప్పటికీ, కుమారులను పొందే లక్ష్యం చాలా గొప్పది కాబట్టి రెండు పుత్రద  ఏకాదశులు పుత్రులకొరకు ఏర్పడినవే.

ఈ ఏకాదశిని భక్తిశ్రద్ధలతో ఆచరించి శ్రీమహావిష్ణువును పూజిస్తే సంతానానికి సంబంధించిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.

అయితే పుత్రద ఏకాదశి అనేది కేవలం కుమారుడు జన్మించాలనే కోరికకు మాత్రమే పరిమితం కాదు. సంతానం కలగాలని కోరుకునే దంపతులు, తమ పిల్లల ఆరోగ్యం, ఆయురారోగ్యం, సుఖసంతోషాల కోసం కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. కుటుంబంలో శాంతి, సంతోషం నెలకొనాలని కోరుకుంటూ విష్ణుమూర్తిని పూజించడం ఈ రోజున ముఖ్యమైన ఆచారంగా భావిస్తారు.


వైష్ణువులు మరియు విష్ణు భక్తులు నియమంగా అన్ని ఏకాదశులు ఉపవాస దీక్ష చేస్తారు. అది వారి భక్తి తత్పరతకు చిహ్నం.

పురాణ కథనం ప్రకారం:
భవిష్య పురాణంలో, పవిత్రోపన ఏకాదశి గురించిన గాథను శ్రీకృష్ణుడు యుధిష్ఠిర మహారాజుకు వివరించాడు . మహిష్మతి రాజ్యానికి చెందిన మహిజిత్ మహారాజు ధనవంతుడు, శక్తిమంతుడు మరియు శక్తిమంతుడు. అతనికి సంతానం లేదు. 

తన సమస్యకు పరిష్కారం కనుగొనడానికి, అతను పండితులు, ఋషులు మరియు బ్రాహ్మణులతో కూడిన తన సభలో పరిష్కారం చూపమని పెద్దలతో ప్రస్తావించాడు.

పరిష్కారం కనుగొనలేక సర్వజ్ఞుడైన మునిపుంగవుడు లోమేషుడిని ఆశ్రయించారు. లోమేషుడు ధ్యానం చేసి, మహిజిత్ యొక్క దురదృష్టం అతని పూర్వజన్మలోని పాపాల ఫలితమేనని తెలుసుకున్నాడు. 

ఆ ఋషి చెప్పిన దాని ప్రకారం, మహిజిత్ తన పూర్వజన్మలో ఒక వర్తకునిగా ఉండేవాడు. ఒకసారి వ్యాపార నిమిత్తం ప్రయాణిస్తున్నప్పుడు, ఆ వర్తకునికి తీవ్రమైన దాహం వేసి ఒక చెరువు వద్దకు చేరుకున్నాడు. 

అక్కడ ఒక ఆవు, దాని దూడ నీరు తాగుతున్నాయి. ఆ వర్తకుడు వాటిని తరిమివేసి, తానే ఆ నీటిని తాగాడు. ఈ పాపం వల్ల అతనికి సంతానం కలగలేదు, 

కానీ అతని పుణ్యకార్యాల వల్ల ఈ జన్మలో రాజుగా జన్మించాడు. తన పాపం నుండి విముక్తి పొందడానికి, శ్రావణ మాసంలో పవిత్రోపన ఏకాదశి నాడు ఏకాదశి వ్రతం పాటించమని లోమేష మహాముని రాజుకు సలహా ఇచ్చాడు. 

ఆ ప్రకారం, రాజ దంపతులు మరియు వారి పౌరులు వ్రతం పాటించి, శ్రీమహా విష్ణువును పూజించి భక్తితో ఆయన నామాన్ని జపిస్తూ ఉపవాసం మరియు జాగరణ చేశారు. 

తదుపరి వారు పండితులకు బంగారం, ఆభరణాలు, వస్త్రాలు మరియు ధనం వారికీ దానం ఇచ్చాడు. 

కొంతకాలానికి వ్రత ఫలితంగా వారికి ఒక అందమైన కుమారుడు జన్మించి, తదనంతరం వారి రాజ్యానికి రాజు అయి రాజ్యాన్ని ప్రజలను చక్కగా పాలించాడు.

మోక్షం పొందడానికి, పాపాలన్నీ తొలగిపోవడానికి, సంతానం (ముఖ్యంగా కుమారులు) కలగడం కోసం పుత్రద ఏకాదశితో సహా అన్ని ఏకాదశి రోజులలో విష్ణు పూజ చేయడం ఒక సాధారణ ఆచారం. 

ఈ రోజున కుమారుడు కలగాలని ఉపవాసం పాటించే భక్తులు, విష్ణువును పూజించే పూజాగదిలోనే ఉంటూ ఆరోజంతా నియమంగా ఉపవాసం మరియు జాగరణ చేస్తారు.

ఈ సందర్భంగా బ్రాహ్మణులకు భోజన సమారాధన చేసి వారికి తగిన ధనం, వస్త్రాలు దానంగా ఇవ్వడం సంప్రదాయం.

ఈ శ్రావణ పుత్రద ఏకాదశి ఉత్తర భారతదేశంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో ఎక్కువ ప్రాచుర్యం పొందింది, అయితే పౌష ఏకాదశి ఉత్తరాదిలో ప్రసిద్ధి చెందింది.

శ్రావణ పుత్రద ఏకాదశి(పవిత్రోపన్న ఏకాదశి)తో ప్రారంభమై, ఐదు రోజుల పాటు జరిగే ఝులన్ యాత్ర ఉత్సవాన్ని పౌర్ణమి వరకు జరుపుకుంటారు.

ఈ ఉత్సవాలలో భాగంగా ఉయ్యాలను అందమైన పువ్వులు, తీగలతో అలంకరిస్తారు. చివరి రోజున, ఉయ్యాలలో ఉంచిన రంగురంగుల వస్త్రాలు ధరించిన కృష్ణుడు, రాధల చిన్న ప్రతిమలకు పూజలు సమర్పిస్తారు. 

పూజా విధానం, నియమాలుఉపవాసం: భక్తులు వారి శక్తి కొలది నిర్జల (నీరు లేకుండా) లేదా ఫలహార (పాలు, పండ్లు) దీక్షను తమ ఆరోగ్యానికి తగినట్లుగా పాటిస్తారు.

నిషేధాలు: ఈ రోజున బియ్యం, ధాన్యాలు, పప్పులు, ఉల్లిపాయలు మరియు మాంసాహారం తీసుకోకూడదు.

విష్ణు పూజ: 
పుత్రద ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించాలి.

ఆ తర్వాత ఇంట్లోని పూజా స్థలాన్ని శుభ్రం చేయాలి.

ఒక పీటపై పసుపు రంగు వస్త్రాన్ని పరిచి, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి చిత్రపటాలను లేదా విగ్రహాలను ప్రతిష్టించాలి.

ముందుగా విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని స్మరించుకుంటూ ఉపవాస దీక్షను ప్రారంభించాలి.

అనంతరం గంగాజలంతో విష్ణుమూర్తికి అభిషేకం చేయాలి.

శ్రీమహావిష్ణువును తులసి దళాలతో, పూలతో పూజించి పుత్రద ఏకాదశి వ్రత కథను చదుకోవాలి.

స్వామి వారి పూజా సమయంలో విష్ణు సహస్ర నామం పఠించాలి.

‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే మంత్రాన్నికూడా జపించొచ్చు.

పండ్లను నైవేద్యంగా సమర్పించి, హారతి ఇవ్వాలి.

ఉపవాస విరమణ: ద్వాదశి తిథిలో నిర్ణీత సమయంలో బ్రాహ్మణునికి దానధర్మాలు చేసి భోజనం ద్వారా ఉపవాసం విరమించాలి.

Aruvadhinaalugu(64) Vidyalu (Kalalu) - (64)అరువదినాలుగు విద్యలు (కళలు)

అరువదినాలుగు విద్యలు (కళలు)

1) ఇతిహాసం 
2) ఆగమం 
3) కావ్యం 
4) అలంకారం 
5) నాటకం 
6) గానం 
7)కవిత్వం 
8) కామశాస్త్రం 
9) జూదం 
10) దేశభాషా లిపిజ్ఞానం 
11) లిపికర్మ 
12) వాచకం 
13) అవధానం 
14) స్వరశాస్త్రం 
15) శాకునం 
16) సాముద్రికం 
17) రత్నశాస్త్రం 
18) రథాశ్వగజకౌశలం 
19) మల్లశాస్త్రం 
20) సూదకర్మం (వంటపని) 
21) దోహదం 
22) గంధవాదం 
23) ధాతువాదం 
24) ఖనివాదం 
25) రసవాదం 
26) జలవాదం 
27) అగ్నిస్తంభం 
28) ఖడ్గస్తంభం 
29) జలస్తంభం 
30) వాక్‌స్తంభం 
౩1) వయస్తంభం 
32) వశ్యం 
33) ఆకర్షణం 
34) మోహనం 
35) విద్వేషణం 
36) ఉచ్చాటనం 
37) మారణం 
38) కాలవంచనం 
39) పరకాయ ప్రవేశం 
40) పాదుకాసిద్ధి 
41) వాక్సిద్ధి 
42) ఘుటికా సిద్ధి 
4౩) ఐంద్రజాలికం 
44) అంజనం 
45) దృష్టివంచనం 
46) స్వరవంచనం 
47) మణిమం త్రౌషధాదిసిద్ది 
48) చోరకర్మ 
49) చిత్రక్రియ 
50) దారుక్రియ 
51) అశ్మక్రియ 
52) మృత్క్రియ 
53) దారుక్రియ 
54) వేణుక్రియ 
55) చర్మక్రియ 
56) అంబరక్రియ 
57) అదృశ్య కరణం 
58) దూతీకరణం 
59) మృగయ (వేట) 
60) వాణిజ్యం 
61) పాశుపాల్యం 
62) కృషి 
63) ఆసనకర్మం 
64) ప్రాణిద్యూత కౌశలం (లావ, కుక్కుట, మేషాది యుద్ధ కారక కౌశలం) 

ఇవి చతుష్షష్టి కళలు-అనగా అరువై నాలుగు విద్యలు.

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Sri Krishnundu Kamsuni Vadhinchuta - శ్రీ కృష్ణుండు కంసుని వధించుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము - శ్రీ కృష్ణుండు కంసుని వధించుట

అంతట సభాసదుల కోలాహలాన్ని నివారించి, కంసుడు తన మంత్రులను చూచి ఈ విధంగా అన్నాడు.

ఈ గోపబాలకుల్ని పట్టణద్వారం దాటి వెళ్ళేటట్లు తోసివేయండి. ఈ గొల్లలను ముట్టడించండి. క్రూరుడైన నందుణ్ణి బంధించండి. లోకానికి వెల్లడి అయ్యేటట్లు ఇప్పుడే వసుదేవుణ్ణి చంపివేయండి. ఉగ్రసేనుణ్ణి రక్షించవద్దు. వీడు నాకు తండ్రి కాడు. ఎల్లవిధాలా నా విరోధులకు ఇష్టుడు.

అని కంసుడు మాట్లాడే వేళలో...

పిక్కబలంతో కొండ శిఖరాన తిరిగే ఏనుగును సంహరించడానికి కుప్పించి దుమికే సింహకిశోరంలాగా శ్రీకృష్ణుడు కంసుణ్ణి చంపదలచి గురిచూచి మంచెమీదికి రణోత్సాహంతో దుమికాడు. కొలువులో ఉన్న పురప్రజలంతా తల్లడిల్లారు.

కంసుడు కూర్చొన్న మంచెమీదికి దుమికిన యదుశ్రేష్ఠులలో లెక్కించదగిన శ్రీకృష్ణుణ్ణి జూచి, కంసమహారాజు కత్తిని చేబూని ఎదిరించాడు. అప్పుడు కంసునిపక్షంలోని వారంతా కంసుడు మహాశూరకోటిలో అగ్రగణ్యుడని శ్లాఘించారు.

శ్రీకృష్ణుడు పక్షులకు రాజైన గరుత్మంతుడు పామును ఒడిసి పట్టుకొన్న విధంగా, కంసుడి జుట్టు ముడిని సభలోని జనులంతా కలవరపడుతుండగా పట్టుకున్నాడు. ప్రళయకాలంలో నీలాకాశంనుంచి చుక్కలు నేల రాలినట్లు ఆ కంసుడి సిగ ముడినుంచి రత్నాలు నేలరాలగా కంసుడి యుద్ధసన్నాహాన్ని అణచివేసి, మల్లరంగ ప్రదేశంలో పడేటట్లు త్రోసివేశాడు.

కంసుడు మంచెమీదినుంచి మల్ల క్రీడారంగమధ్యంలోపడి ఎట్టి కదలికా లేక కట్టెలాగా బిగుసుకొని పోయాడు. అక్కడి జనులు అబ్బురపడుతూ చూస్తుండగా ఆ దుర్మతి అక్కడి కక్కడే మరణించాడు. పద్మపత్రాక్షుడైన శ్రీకృష్ణుడు భుజబలవిజ్బంభణంతో సింహం ఏనుగును ఈడ్చిన విధంగా అతణ్ణి ఈడ్చాడు.

ఓ పరీక్షిన్మహారాజా! కంసుడు రోషంలో, సంతోషంలో, నిద్రలో, సంభాషణ సమయాల్లో, భోజన వేళలో, నీళ్లుతాగే పట్టులో, చక్రాయుధుడైన శ్రీకృష్ణుణ్ణి దోషబుద్ధితోనే చూచాడు. అయినప్పటికీ అతడు భగవంతుణ్ణే పొందాడు. ఉత్తమగతిని అందుకొన్నాడు.

(కంసుడెంత పాపాత్ముడయినా నిరంతరం విరోధంచేతనైనా శ్రీకృష్ణుడిమీదనే ఆతని ధ్యానం. అందువల్లనే ఆతనిచేత కొట్టబడి ఆ స్వామినే పొందాడు.)

ఒక్క గొల్లపిల్లవాడు ప్రభువును సంహరించాడు. ఔరా! ఎంత ఆశ్చర్యం! వీణ్ణి పొడిచి చంపండి. ఇంకా ఆలస్యం ఎందుకు? అంటూ పరితాపంతో అగ్గలమైన కోపంతో పొగరుబోతులై

కంసుడి తోబుట్టువులు న్యగ్రోధుడు, కహ్వుడు మొదలయినవారు అనేకవిధాలైన యుద్ధపరికరాలతో కృష్ణుడి మీదికి విజ్బంభీంచారు. అప్పుడు మహాబలుడైన బలభద్రుడు రౌద్రమూర్తియై పరిఘ అనే ఆయుధం ధరించి మత్త మాతంగంలాగా ఒక్కొక్కరిని చెండాడి యముని సన్నిధికి పంపాడు.

(కంసుని తోబుట్టువులు ఎనమండుగురు. వారు : 1) న్యగ్రోధుడు 2) కహ్వుడు ౩) సునామకుడు 4)కంకుడు 5) సుభుడు 6) రాష్ట్రపాలుడు 7) విసృష్టుడు 8) తుష్టిమానుడు.)

చేతులతో తాళాలు వాయిస్తూ జుట్టుముడి వీడగా; నారద మహర్షి ఆనందంతో ఆకాశంలో కృష్ణా అంటూ పాటలు పాడుతూ నాట్యం చేశాడు.

పరీక్షిన్మహారాజా! బ్రహ్మ ఈశ్వరుడు మొదలైన వేల్పులు కొల్లలు కొల్లలుగా పూలజల్లులు కురిపిస్తూ, శ్రీకృష్ణుణ్ణి స్తోత్రం చేశారు. దేవదుందుభులు మోగాయి. దేవతాంగనలు అనేక విధాలుగా ఆకాశంలో నాట్యం చేశారు.

అంతట కంసుడు మొదలైనవారి పత్నులు భర్తల మృతివల్ల శోకాక్రాంతలై చేతులతో తలలు బాదుకొంటూ, కన్నీటి ధారలతో తడిసిన ముఖాలతో తమతమ మందిరాలనుంచి వచ్చారు. వచ్చి వీరశయ్యలందు దీర్ఘనిద్ర చెందిన తమ భర్తలను ఆలింగనం చేసుకుని గద్గదకంఠస్వరాలతో విలపించారు. వారిలో కంసుని భార్యలు ఇట్లన్నారు.

జీవితేశ్వరా! గోపాలుడనే సింహం కోపంతో వెడలివచ్చి గజేంద్రునివంటి నిన్ను హతమార్చింది. నాథా! యదునాథుడనే మారుతం దారుణవేగంతో వృక్షంలా నిన్ను నేలమీద వ్రాల్చింది. మహానుభావా! వాసుదేవుడనే సముద్రజలం చెలియలికట్టను దాటి, దీవిలా నిన్ను ఇప్పుడు ముంచివేసింది. మహారాజా! దేవకీ పుత్రుడనే దేవేంద్రుడు దేవతలు సంతోషించే విధంగా కొండవంటి నిన్ను చెండివేశాడు. అయ్యో! నీవిలా చనిపోయినప్పటికీ మేము బ్రతికి ఉన్నాము. అక్కటా! మావలె కఠిన హృదయం కలవారు భూమిమీద ఎక్కడైనా ఉన్నారా? (లేరని భావం)

ప్రాణులకు నీవు కీడు చేయగా - ఆ ప్రాణులే నీకు కీడు చేశాయి. ప్రాణులకు ద్రోహం చేసినవానికి మేలుకల్గదు. బ్రతుకంతా వ్యర్థమవుతుంది.

(సర్వత్ర సమభావం లేనందుకే కంసుడు దుర్గతి పాలయ్యాడు.)

మహారాజా! గోపాలకృష్ణుణ్ణి ఎదిరించి, ప్రాణాలు కోల్పోయినవారినిగురించి పూర్వం నీ సమక్షంలో పండితులు చెప్పలేదా? క్రోధమూ, జడత్వమూ విడిచి గోవిందుణ్ణి సేవిస్తే ఎంత బాగుండేది!

ఈ మాదిరిగా ఏడుస్తున్న రాచ ఇల్లాండ్రను ఓదార్చి లోకేశ్వరుడైన శ్రీకృష్ణుడు కంసుడు మొదలైనవారికి పారలౌకిక క్రియలు సల్పేందుకు ఆదేశించాడు. దేవకీవసుదేవులను చెర విడిపించి బలరాముడితో కూడి వారికి నమస్కారాలు చేశాడు.

శ్రీ కృష్ణుండు దేవకీ వసుదేవుల చెఱ మాన్పి యుగ్రసేనునికి పట్టము కట్టుట


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Srikrishna Balaramulu Chaanuura Mustikulanu Vadhinchuta - శ్రీకృష్ణ బలరాములు చాణూర ముష్టికులను వధించుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము - 
శ్రీకృష్ణ బలరాములు చాణూర ముష్టికులను వధించుట

ఈ విధంగా మాట్లాడుతూ పురప్రజలు రామకృష్ణులను చూస్తున్నారు. అప్పుడు చాణూరుడు రామకృష్ణులతో ఇలా అన్నాడు.

అడవి దారుల్లో గొల్ల బుడుతలతో కలసి దూడలు మేపుతూ జెట్టిపోరులో మిక్కిలి నెర్పు గడించారని ఈ పుడమిలోని జనులు చెప్పుకుంటూ ఉండగా విని, మా మహారాజు మల్లయుద్ధ క్రీడకు మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాడు. ఇప్పుడు ఇక్కడి మల్లరంగంలోని సభాసదులు చూస్తుండగా మనం మన పరాక్రమాలు కొంత ప్రదర్శించడం సముచితం.

వేగం, బలమూ బాగా ఉన్నాయా? సాములో నేర్పుందా? శరీరానికి రక్షణ కలదా? రాజుకు చెప్పి పాలు ఇప్పించాలా? పాళీలు మీకు ఇష్టమేనా? ఒరే! గొల్ల కుర్రవాడా నీవేం వజ్రాయుధానివా? యమదండానివా? ముక్కంటి కంటిమంటవా? నా పిడికిలి - మెక్కడానికి వెన్నముద్దలు కావుసుమా?

కృష్ణా! జనులు విద్యలు నేర్వడం ప్రభువుల మెప్పుకోసమే గదా! రాజూ, ఈ ప్రజలూ మెచ్చుకునేటట్లు మనం మల్ల యుద్ధంతో కొంత కాలక్షేపం చేద్దామా?

చాణూరుడి మాటలువిని శ్రీకృష్ణుడిలా అన్నాడు.

మాకు సాములు తెలియవు. మేము పిన్నవాళ్ళం. సత్తువ ఉందని చెప్పలేము. మీరో మల్లయుద్ధంలో నిష్ణాతులు. వజ్రాయుధం మాదిరి కరకైన శరీరాలు గలవారు. ఇట్టి మీతో మేమెట్లా తలపడగలం? మీ రాజుగారికి వేడుకను కలిగించే వాళ్ళమూ కాము. అయినా వినోదంకోసం మీరు పోరాటకు ఆహ్వానిస్తే కాదని ఎలా అంటాము?

నీతో నేనూ, ముష్టికుడితో మా అన్న బలరాముడూ ఉత్సాహంతో పెనుగులాడుతాం. భయంకర మల్లయుద్ధంలో ఈ భూమండలానికి ప్రభువైన కంసుడికి ప్రీతి కల్గిస్తాం.

శ్రీకృష్ణుని మాటలు విని చాణూరుడు ఇలా పలికాడు.

అవురా! ఓ గొల్లకుర్రా! నాతో పెనగులాడటానికి నీ వెంత వాడివి? నీవు నాకు సమానుడివా? నేను లోక ప్రసిద్దుణ్ణి శుద్ధమైన కులంలో పుట్టినవాణి. మంచిగుణాలు గలవాణ్ణి; సత్కర్మలాచరించే స్వభావం కలవాణ్ణి; నీకు, నా కుండే బలసంపదలున్నాయా? ఈ రాచవీటిలో పోరాటమంటే గొల్లల ముందు కుప్పిగంతులు వేయడం కాదుసుమా! బాగా ఆలోచించుకో!

ఈ చాణూరుడు ఈశ్వరుణ్ణి మెచ్చుకోడు. బ్రహ్మదేవుణ్ణి లెక్కచేయడు. విష్వక్సేనుణ్ణి గేలిచేస్తాడు. తనకు సాటిరాడని వాయుదేవుణ్ణి సైతం రణరంగానికి రమ్మని పిలవడు. మిక్కుటమైన భుజబలాతిరేకం తరగనివాడు. యుద్దానికి రేపు మాపు అనడు. చిత్రవిచిత్రంగా అలవోకగా కదనం చెస్తాడు. ఇట్టి జగజెట్టి చాణూరుడు ఒక గొల్లకుర్రని పనిపట్టడానికి చాలక పోతాడా?

ఓ గొల్లడా! ప్రగల్భాలెందుకు? నేను మహాబలవంతుణ్ణి. లోకంలో ప్రసిద్ధిచెందినవాణ్ణి. భూమండలంలో ఎక్కడగాని, ఓడిపోయి; నా చల్లాడం (గుడిగి) కింద దూరని జెట్టీలే లేరు సుమా!

కృష్ణా! మచ్చరంతో నన్ను సమీపించిన తరువాత నీవు సాగరంలో ప్రవేశించడానికి సాధ్యంకాదు (మత్స్యావతారం). పర్వతం చెంత నిక్కి నిలవడానికి శక్యం గాదు (కూర్మావతారం). అలక్ష్యంతో భూమికిందికి దూరడానికి వీలులేదు (వరాహావతారం). సింహంవంటి పురుషుణ్ణి అని పొగరుగా తిరగడానికి కుదరదు (నరసింహావతారం). దగ్గరకు వస్తే పడదోస్తాను. 

కనుక చెయ్యి సాచడానికి సందు దొరకదు (వామనావతారం). పెనగి నా ఎదుట పెచ్చు పెరగటం అలవిగాని పని (త్రివిక్రమస్ఫురణ). నన్నుదాటి రాజును హింసించడం నీకు శక్యంకాదు. (పరశురామావతారం). గాలిస్తాను కనుక అరణ్యాలలో ప్రవేశించడానికి అవకాశం లేదు (శ్రీరామావతారం,). ప్రబలమైన ఆకారం కలవాడనని విర్రవీగడానికి వీలుండదు (బలరామావతారం). పుడమిలో నేను ప్రబుద్ధుణ్ణి అని భావించకు (బుద్ధావతారం); కల్కితనంతో (తెలివి తేటలతో) గర్వింపరాదు సుమా! (కల్క్యవతారం). నాతో యుద్ధం చెయ్యడం నీ తరంగాదు. తొలగిపో!
(కృష్ణా! నీవు దశావతారాలెత్తి నన్ను సాధింపదలచినా అది నీ తరం గాదు. కనుక దూరంగా తొలగుమని చాణూరుడు మాధవుణ్ణి హెచ్చరించడం, ఇక్కడ విషయం. ఇక్కడ నారాయణుని దశావతార చర్యలు వర్ణితం.)

అంతేగాక నేను శ్రీమన్నారాయణుణ్ణి అని అంటావా? అలాగయితే విను.

మహిమలు ప్రదర్శిస్తూ ఉండటానికి - ఇది వైకుంఠనగరంకాదు, కంసుడు పరిపాలించే మథురానగరం సుమా! గర్వంతో విర్రవీగుతూ ఉండటానికి - ఇది సంసార వాసన లేని నిత్యులుండే సభాభవనంగాదు; కంసుడియొక్క కొలువుకూటం సుమా! వీనులవిందుగా వినడానికి - ఇది నారద మహర్షియొక్క మహతి అనే వీణానాదంగాదు; చాణూరుని భుజాస్ఫాలన శబ్దం సుమా! 

నేరుపు మాటలాడటానికి ఇది లక్ష్మీదేవితోడి ప్రణయకలహంగాదు; జెట్టీలతోడి పోటు మాటలు సుమా! పేరు పెంపులు వహించి విహరించడానికి - ఇది వేదాంతవీథిగాదు; మథురానగరపు రాజవీథి సుమా! దాగి తప్పించుకొనడానికి ఇది మునీశ్వరుల మనసులలోని మూలస్థానం కాదు; మల్లయుద్ధరంగం సుమా! నీవు నిర్భయంగా చరించడానికి నీ భక్తుల కాలిజాడకాదు; భయంకరమైన జెట్టీలజాడసుమా! కృష్ణా! నా పాలబడిన నీవు తప్పించుకొని మరెక్కడికి వెళ్ళగలవు? (వెళ్లలేవని భావం)

మల్లుడైన చాణూరుడు గగనమండలం నిండేటట్లు భుజా
స్ఫాలనం చేశాడు. కోపమనే అగ్నినుంచి ప్రసరించే సన్నని పొగమాదిరిగా అతని తలపై పిలకజుట్టు ప్రకాశించింది. దిగ్గజాల తొండాలకు సమానమైన; పొడవైన చేతులు భీతిని కలిగిస్తున్నాయి. ప్రళజయకాలంలోని యమధర్మరాజు యొక్క పదునైన కోరల విధంగా పొడవైన కోరమీసాలు మెరుస్తున్నాయి. నల్లని నిడుపైన నడగొండలాగా భయంకరమైన నల్లటిదేహం పెల్లుబుకుతున్నది. అతని అడుగుల తాకిడికి భూమి దద్దరిల్లగా చాణూరమల్లుడు కృష్ణుడివైపు నడిచాడు. ఈ దృశ్యం పట్టణ ప్రజల హృదయాలకు బల్లెమయింది.

ఈ విధంగా మిక్కిలి పూనికతో సమీపించిన మల్లుణ్ణి గోపాలశేఖరుడు చూచాడు. మెల్లగా పరాక్రమాటోపం అతిశయిల్లగా, అతడుల్లాసంతో భుజమప్పళించాడు. ఆ నినాదం భూనభోంతరాళంలో నిండిపోయింది. అతడు జెట్టిపైకి ఉరికాడు. వారిద్దరూ మహావేగంతో హెచ్చు తగ్గైన స్థానాల్లో నిలిచి ఏనుగు ఏనుగుతో, సింహం సింహంతో, కొండ కొండతో డీకొన్నట్లు ఒకరితో ఒకరు తలపడ్డారు.

రెండు కార్చిచ్చులు తమతమ అగ్ని జ్వాలలతో పరస్పరం పీడించుకొన్నట్లుగానూ, రెండు మహామేఘాలు తమపై అన్యోన్యం పెద్ద పెద్ద పిడుగులు రాల్చుకొన్నట్లుగానూ, ప్రళయకాలంలోని రెండు సముద్రాలు ఒకదాని నొకటి సముత్తుంగ తరంగాలతో కొట్టుకున్నట్లుగానూ వారిద్దరూ రౌద్రంతో ఒకరినొకరు పిడికిళ్ళతో గుద్దుకున్నారు. తబ్బిబ్బుపడక ఇరువురూ దగ్గరకు చేరుకుని వేగంగా మల్లరంగంలో పరిభ్రమించారు.

అప్పుడు హరి విజృంభించాడు. బొబ్బరిస్తూ జెట్టిని పట్టిపడలాగాడు. కాళ్లు జోడించి, మిక్కిలి ఉల్లాసంతో ఆ మల్లుడు విజ్బంభించటం వీక్షించి, గోవిందుడు మెచ్చుకున్నాడు. చపలుడైన చాణూరుడు బాధితుడైనప్పటికీ మెడనిక్కించి తొలగిపోక మురారిని పొరలాడేటట్లు తోశాడు. అంతట కృష్ణుడు శరీరం ఉప్పాంగగా తటాలున అర్జాంగకంలో ఉన్నవాడై మోకాళ్ళతో వాణ్ణి ఒత్తాడు. 

వేగంగా “కరవడ” మనే ఒకమల్లబంధం పట్టులో ఉండినాడు. అపుడు దుర్నీతిపరుడైన మల్లుడు “డింభకా! మేలుమే"లని పల్కుతూ అలవోకగా కాలుచొప్పించి, శ్రీకృష్ణుణి పడదోశాడు. అప్పుడు వెన్నుడు చెలరేగి వేల్పులు ప్రస్తుతించగా చాతుర్యంతో వెనుకకు వెళ్లి చాణూరుని వీపుపై ఎక్కి నిక్కాడు. 

కంసుని భృత్యుడైన చాణూరుడు మదజలధారలచారికలతో నిండిన మదగజంవలె మాధవుడిపాదాన్ని తన పాదంతో, చేతిని తనచేతితో పెనవేసి పట్టుకుని నేర్పుతో మల్లరంగ భూమిలో తిరుగుతూ అటూ ఇటూ అదిలించివేశాడు.

కమలాక్షుడు దిట్టతనంతో దిటవు కోల్పోక తొలగి చెలరేగి జెట్టిని సమతలంమీద పడదోసి పెద్దదైనవానికడుపుమీద మోదాడు. తనకాలితో వాడి కాలిని మెలివేసి డొక్కరమనే మల్లబంధవిశేషాన్ని ప్రదర్శించాడు.

మల్ల విద్యాభ్యాసం కల చాణూరుడు సభలోనివారంతా తన్ను పొగడుతుండగా కృష్ణుణ్ణి వెనుకకు మరలించి తటాలున తన కాలితో అడ్డగించి తన్ను కాపాడుకున్నాడు. రాక్షసవిరోధి అయిన కృష్ణుడు చాణూరుని దట్టి పట్టి ఎత్తి ఒత్తి రాగెబంధంవేసి సందుపెట్టి నవ్వాడు. పగతుడైన మల్లుడు తనకాలిని కృష్ణుడి కాలితో చేర్చి బాధించి నిరోధించాడు. వాసుదేవుడు విరోధినిరోధాన్ని తప్పించుకుని, పట్టిసమనే మల్లబంధం వేసి అదిలించాడు. చాణూరుడు వెంటనే చెలరేగి శ్రీహరి బాహువు పట్టుకుని హుమ్మని హుంకరించి ముఖాన కాలుపెట్టి అధికుడై నిలిచాడు.

లీలామానుష బాలుడైన కృష్ణుడు చాణూరుడి కాలిని తన కాలితో అడ్డగించి, అతడి విజ్బంభణం అణచి అడ్డుకోరాని బలిమితో విదిలించుకొని లేచాడు. పగవాడి పాదాన్ని తొక్కిపట్టి వజ్రాయుధంవంటి పిడికిలితో వాడి ఎదమీద పొడిచాడు. వాడు పోడిమి చెడక చెలరేగాడు. చిలికే సమయంలో సాగరమధ్యంలో తిరిగే మందరగిరి మాదిరి వాడు నేలమీద గిరగిర తిరుగుతూ కృష్ణుణ్ణి తన్నాడు. వెన్నుడు కుప్పించి గగనానికి ఎగిరి వాడిపై దుమికాడు. శ్రీహరిపాదాలతాకిడికి తన పాదాల సంధిబంధాలు సడలగా వాడు ఎగిరి పైకిలేచి విజ్బంభించాడు.

బలరాముడు, ముష్టికుడు తమ తమ శక్తులు వ్యక్తమయ్యేటట్లు చేతులు చేతులు కల్పి ప్రళయ సమయంలోని అగ్నుల వలె పలురీతులైన మల్లయుద్ధ నైపుణ్య ప్రదర్శనలు చేస్తూ పోట్టాడారు.

నిక్కిన చెక్కిళ్లుగలవారూ, దిగ్గజాల తొండాలను భేదించే తీగలవంటి చేతులు గలవారూ, శత్రువుల మనస్సులకు బల్లెములవంటివారూ, గోపకుల సమూహానికి భయంకల్గించేవారూ అయిన ఆ మల్లురతో గోపాల బాలకులు బలరామకృష్ణులు పోట్లాడారు.

బలరామకృష్ణులు మల్లులతో పెనగులాడే సమయంలో పట్టణస్త్రీలంతా గుంపులుగాచేరి, వేడి నిట్టూర్పులు విడుస్తూ, తమలో ఈ విధంగా ముచ్చటించుకొన్నారు.

ఔరా! పూలవలె మృదువైన శరీరాలుగల మంచి బాలురను రప్పించి, వజ్రసారులూ, పర్వతాలవలె కఠోరులూ అయిన వీరులతో మల్లయుద్ధం చేయిస్తూ రాజు వినోదం చూస్తున్నాడు. ఇందులో మంచి ఏ కొంచెంకూడా లేదు. పోరు మానండి అని పలుకడు. ఇలాంటి దుర్మార్గుణ్ణి మునుపు ఎన్నడైనా విన్నామా? కన్నామా?

సభాసదులు చూస్తున్నారే కాని ఈ పసిపిల్లలకూ, ఈ మల్లురకూ జోడు కుదరదని రాజుకు చెప్పలేకున్నారు ఇది అధర్మం. ఇది తమకు (తమ రాజుకు) శోకం కలిగించక పోదు.

మనం పిలనగ్రోవులమై ఉంటే మాధవుడు కెమ్మోవిసుధ లిచ్చి మన్నించేవాడు. నెమలిపురి దండలమై ఉంటే గోవిందుడు శిరసున ధరించేవాడు. పీతాంబరాలమైఉంటే బుజాలపై విడువక ధరించి ఉండేవాడు. వనమాలికలమై ఉంటే కమలాక్షుడు మిక్కిలి ఆసక్తితో కంఠాన అలంకరించుకొనేవాడు. అందమైన బృందావనంలో వృక్షాలమై ఉంటే కృష్ణుడు ఆనందంతో చెంతకు జేరి క్రీడించేవాడు. ఓ యమ్మా! పూర్వజన్మలలో ఎట్టివ్రతాలనైనా ఆచరించి, ఇలా ఎందుకు కాలేకపోయామో! ఇపుడు ఇంకేమి చేయగలం?

పాపాత్ముడైన బ్రహ్మ మునుపే మనల్ని ఆ వ్రేపల్లెలో పుట్టించి ఉండగూడదా? ఈ మథురలో ఎందుకు పుట్టించాడో! ఆ గొల్ల పల్లెల్లోనే పుట్టించి ఉంటే ఈ సుందరాంగుణ్ణి పొందే సౌభాగ్యం, సంతోషం ఎల్లప్పుడు మనకు సమకూడి ఉండేవి గదా! ఈ గోపకుమారుణ్ణి పొందడానికి ఆ గోపికలు పూర్వం ఎట్టి నోములు నోచారో!

గోపాలకృష్ణుడితో చేరి గోవులను మేపుతూ సంచరించే గొల్లలు ఎంత అదృష్టవంతులో? మరి భూపాలకులకైనా ఈ గోపాలురకుండే ఘనవైభవం లేదు.

(గోపాల శబ్దం రెండుర్థాలుగల మాట; గొల్ల అని, రాజు అని అర్థం. గో అంటే గోవు, భూమి మొదలగు అర్థాలున్నాయి.)

మంచునీటి చుక్కలతో తడిసి మనోహరంగా ఉండే పద్మం మాదిరి, కమలాక్షుడి ముఖకమలం చెమట బిందువులచే తడిసి ప్రకాశిస్తున్నది.

సభకు వెళ్ళరాదు; వెళ్ళితే సభలోనివారుచేసే తప్పిదాలను తెలిసి ఉపేక్షించినప్పటికీ, ఆ దోషాలు తెలుసుకోలేక పోయినప్పటికీ, దోషాలు తెలిసికూడా న్యాయవిరుద్ధంగా పలికిన ఎంత పండితుడయినా పాపం అనుభవించి తీరుతాడు.

ఈ విధంగా సభలో ఉన్న పలువురు పలువిధాల మాట్లాడుతుండగా ఆ ముష్టియుద్ధంలో

సాటిలేని సంసారమనే సముద్రాన్ని దాటడానికి నౌకవంటివాడూ, శత్రుపట్టణాలను ధ్వంస మొనర్చినవాడూ, కువలయాపీడగజాన్ని జయించినవాడూ, గోవర్ధనగిరిని ఎత్తినవాడూ, విస్తారమైన సింహగర్జనంతో పర్వత గుహలను పూరించినవాడూ అయిన శ్రీకృష్ణుడికి చాణూరుడు ధైర్యం చెడి లోబడిపోయాడు.

పగవాడైన చాణూరుడు కృష్ణుడికి లోబడినప్పటికీ, భయపడక మహాభయంకరమైన పిడికిలితో వెన్నుని రొమ్మును పొడిచాడు. పూలదండచే కొట్టబడిన ఏనుగు లాగా ఆ పోటును లెక్కచెయ్యక శ్రీహరి యుద్ధంలో విజృంభించి, పరాక్రమం చూపాడు.

పరాక్రమవంతుడూ, యుద్ధమందు గంభీరుడూ, భీతి గొలిపేవాడూ, దొడ్డదేహకలవాడూ, వీరుడూ అయిన చాణూరుణ్ణి, కృష్ణుడు చొచ్చుకొని పోయి కర్కశంగా వాడిచేతులు పట్టుకొని గిరగిర తిప్పి నెలపై కొట్టాడు

ఆ విధంగా అచ్యుతుడిచేత గిరగిర తిప్పబడిన చాణూరుడు బాగా నలిగినవాడై నోటినుంచి నెత్తురు కారగా పుడమి మీద బడి ప్రాణాలు విడిచాడు. అతడి ప్రాణం పోగానే కంసుని ప్రాణం కలకబారింది.

బలభద్రుడు నిజంగా బలభద్రుడే-బలంచే క్షేమం కలవాడే అంటూ లోకులు అంటుండగా, ఇంద్రుడు మేలు మేలని మెచ్చుకోగా, బలరాముడు అపారమైన బాహుబలంతో శక్తిశాలియైన ముప్టికుణ్ణి పట్టుకుని, ఇటూ అటూ త్రిప్పాడు. అది చూచి కంసుడిసేన బెదిరింది.

బలరాముడు అలా తిప్పి తిప్పి నేలపై దబ్బున పడవేయగా ముష్టికుడి గుహవంటి నోటినుంచి నెత్తురు వరదలై పారింది. బలరాముడి భయంకరమైన ముష్టిఘాతంతో ముష్టికుడు సత్తువ గోల్పోయి పెనుగాలివల్ల మహావృక్షం కూలినట్లు నేలపై కూలాడు.

గొప్ప భుజబలాటోపంగలవాడూ, రాజుకు చీడపురుగులాంటివాడూ, కల్లరీడూ, వదరుబోతూ, మిక్కిలి భయంకరమైన నుదురుగలవాడూ అయిన కూటుడనే మల్లుణ్ణి; బలభద్రుడు దిటవైన తన పిడికిలితో సూటిగా పడబొడిచాడు.

అటుతర్వాత రాక్షసులకు అంతకుడైన బలరాముడు ముప్టికుడి మిత్రులైన కూటుడు, తోసలుడు, శలుడు అనే వాళ్ళను తన కాలిదెబ్బలతో తలలు పగులగొట్టి యముడిచెంతకు పంపించాడు.

కేవలం గోపాలబాలకులనే భావంతో వారితో యుద్ధంచేసిన మనమల్లశ్రేష్ఠులు మరణించారు. రామకృష్ణులు బలవంతులు; తొలగండి తొలగండి అంటూ మిగిలిన మల్లురు చెల్లాచెదరై పారిపోయారు.

మల్లురను సంహరించి గొల్లలమధ్య సింహాలవలె శోభిల్లుతూ పద్మాలవంటి పాదాలలో అందెలు మ్రోగుతూ ఉండగా వస్తూన్న గొల్లలరాజైన నందుడి నందనులను బ్రాహ్మణులు మొదలైన వారందరూ రెప్పవాల్చక చూచి ప్రీతితో పొగిడారు. ఒక్క కంసుడు మాత్రం మచ్చరంతో వారిని మెచ్చుకోలేదు.

శ్రీ కృష్ణుండు కంసుని వధించుట


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Sri Krishnudu Kuvalayapida Manu Gajambunu Vadhinchuta - శ్రీ కృష్ణుడు కువలయాపీడ మను గజంబును వధించుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము - 
శ్రీ కృష్ణుడు కువలయాపీడ మను గజంబును వధించుట

ఓరీ మావటీ! మా వైపు ఈ మత్త మాతంగాన్ని తోలవలసిన పనిలేదు. దీన్ని వెనుకకు మరలించు. డీ కొలిపినావా పోరాటంలో నీ మదపుటేనుగుతోపాటు నిన్నూ గంభీరమైన, దారుణమైన, పిడుగు పాటులవంటి నా పిడిగ్రుద్దులతో పొడిచి చంపుతాను. యముడిపాలికి ఇపుడే పంపుతాను. ఇది నిజం.

అందమైన జుట్టుముడిని చక్క చేసుకుని, మెల్లగా పీతాంబరాన్ని దట్టిగా బిగించి కట్టుకుని, నుదుట వ్రేలాడే ముంగురులను పైకి తోసుకుంటూ, యుద్ధకార్య నైపుణ్యంతో బాలుడైన శ్రీకృష్ణుడు చూచేవారు సెబాసని తన్ను మెచ్చుకుంటుండగా తొండంతో కొండలను పిండిచేసే ఆ మత్త వేదండాన్ని సమీపించాడు.

ఓ రాజోత్తమా! మావటివాడు - బాలుడని కూడా సందేహించక, కరుణమాలి కంసుడిఆజ్ఞానుసారం గోపకుల శ్రేష్ఠుడైన శ్రీకృష్ణుడిమీదికి ఏనుగును డీ కొలిపాడు.

ఇంకా పలువురు మావంతులు ఆ కువలయా పీడాన్ని పురికొలిపారు. పెనుగాలి గుంపుచేత పైకెగసిన ప్రళయకాలంలోని అగ్నిజ్వాలవిధంగా, ఆ మదపుటేనుగు త్రుళ్ళిపడుతూ మృత్యుదేవతమాదిరీ, కాలపురుషునికైవడీ, యముడితీరునా కృష్ణుణ్ణి ఎదుర్కొనింది. తన మదజలంమీది ఆశతో చుట్టూ తిరుగాడే తుమ్మెదలనే గాయకుల ఝంకారంవల్ల ఆ గజం అహంకరించింది. 

అది కులపర్వత గుహలనే కుంభాలను తన ఘీంకారంతో పూరించింది. ఆగ్రహోదగ్రుడైన ఆదిశేషుడి పడగవలె భయం కలిగించే తన తొండంతో నిర్లక్ష్యంగా శౌరిని పట్టుకుంది. అసాధ్యుడైన హరి అంతట అటూ ఇటూ పెనగి రాహువుముఖగహ్వరం నుంచి తప్పించుకొని వెలికురికే సూర్యుని మాదిరి చెంగున ఎగిరి, దానికాళ్ళసందున దూరి దాక్కొన్నాడు. 

గోవిందుడు కనిపించకపోయేసరికి కువలయాపీడానికి క్రోధం పెల్లుబికింది. మహాసాగరమధ్యంలో పరిభ్రమించే మందరగిరిలాగా అది గిరగిర తిరుగాడింది. గాలివల్ల వాసన పసికట్టి కృష్ణుడున్నచోటు తెలుసుకొని ఉప్పొంగి పోయింది. ప్రళయ కాలంలోని యమదండంలాగా ప్రచండమైన తన తొండాన్ని క్రిందికి వంచి అది పద్మలోచనుణ్ణి వంచించి చుట్టిపట్టుకుని పడమొత్తడానికి ప్రయత్నించింది. 

మాధవుడు చలించక తెంపుతో దాని వెనుకవైపునకు ఉరికాడు. రాహువుతోకను పట్టిలాగే జగజెట్టి గరుడుని చందంగా శ్రీకృష్ణుడు ఒక్కఎగురు ఎగిరి, ఆ ఏనుగువాలాన్ని చేతితో ఒడిసిపట్టుకున్నాడు. పరాక్రమంతో వందమూరలదూరానికి దాన్ని గిరగిర త్రిప్పి విసరివేశాడు.

ఆ మదేభం అడ్డుకొనరానిదై, అవక్రపరాక్రమంతో పోరాటానికి వెనుదీయక కుడిఎడమలుగా తిరుగుతూ మళ్ళీ మాధవుడిమీదికి ఉరికింది. అప్పుడు కృష్ణుడు కుంజరం కుడిప్రక్కకు తిరిగినప్పుడు తాను ఎడమప్రక్కకూ, అది ఎడమవైపునకు తిరిగినప్పుడు తాను కుడివైపునకూ తిరుగుతూ దానికి బాగా రొప్పు తెప్పించాడు.

శ్రీకృష్ణుడు కాఠిన్యం వహించి దానిపైకి చెంగలించాడు. ప్రళయకాల మేఘాలనుంచి పడిన కఠోరమైన పిడుగులాంటి తన పిడికిలి బిగించి ఈడ్చి ఆ గజకుంభస్థలాన్ని గుద్దాడు. ఎత్తయిన అంజనగిరిశిఖరంలాంటి దానికుంభస్థలం పగిలి ముక్కలుచెక్కలై ఎగిరిపడింది.

ఆ ఏనుగు కుంభస్థలంనుంచి నెత్తుటితో తడిసి చెదరి నేలరాలిన ముత్యాలు సంజకెంజాయలో ఎర్రటి నక్షత్రాలతో కప్పబడిన మింటిసొగసును ధరణికి సంతరించాయి. ఆ శుండాలం అంతటితో ఆగక మ్రొగ్గి మోకరిల్లి సంబాళించుకుని వెంటనే లేచింది. అటూ, ఇటూ చూచింది. ముందుకు ఉరవడించింది. 

ప్రళయవేళలో సముద్రాల సముత్తుంగతరంగాలచే కొట్టబడిన కులపర్వతం మాదిరి అది మళ్ళీ భుజబలసమేతుడైన శ్రీకృష్ణునిచే కొట్టబడింది. మిక్కుటమైన కోపంతో కువలయా పీడం గోవిందుణ్ణి ఒక్కుమ్మడిగా తన దంతాలతో చిమ్మింది. నందసుతుడు హస్తలాఘవం హెచ్చగా బాహాబాహియుద్ధంలో మిక్కిలి విజృంభించి దాన్ని తల్లడిల్ల జేశాడు.

అప్పుడు ఆ మదగజం మొక్కవోని ముక్కంటి బల్లెంతో భగ్నమైన త్రిపురాసురుల పురంలాగా, సముద్రంలో తీవ్రమైన ఝంఝామారుతంవల్ల పాడైన ఓడలాగా శక్తి గోల్పోయింది. బక్కచిక్కి స్రుక్కింది. దానోదకధారలులేని పిసినారి చెయ్యివిధంగా అది చెక్కిటి మదజలధారలు లేనిదయింది. 

ఎడతెగని మదనుడి పోరుగల వియోగి హృదయంలాగా ఎడతెగక మదిలో జనించిన విరోధం కలది అయింది. పరాధీనుడైన ప్రభాకరుడుగల గ్రహణవేళమాదిరి ఎండినతొండం గలది అయింది. పూచిన తామరలుగల సూర్యోదయంలాగా తొండపు కొనగలది అయింది. ప్రకాశించని పద్మాలుగల చంద్రప్రకాశం తీరున వెలవెలపోయిన ముఖమందలి బిందువులు గలది అయింది.

గోపాలశేఖరుడూ, వీరశిరోరత్నమూ అయిన శ్రీకృష్ణుడు పర్వతరాజంతో సమానమైంది, ప్రాణాలమీద ఆశగలదీ, అయిన ఆ మదపుటేనుగును మహాసింహంమాదిరి సవిలాసంగా నవ్వుతూ, కాలితో త్రొక్కి చేతితో భయంకరమైన దాని దంతాలు పెరికి బక్కచిక్కేటట్లు బాది ప్రాణాలు తీశాడు.

శ్రీకృష్ణుడు కువలయా పీడమనే ఏనుగుయొక్క దంతాలను ఊడబెరికి, వాటితోనే కొట్టి మావటివాళ్ళను అందరినీ చంపి ఆ ప్రదేశం నుంచి బయలుదేరి

కదనరంగంలో కాలు గదపక పోరాడే ఆ రామకృష్ణులు ఏనుగుదంతాలు తమ భుజాలపై మెరుస్తుండగా స్వేదబిందువులు ముఖాల్లో నిండగా, గోపాలకులు తమరి పరివేష్టించగా బయలుదేరి వచ్చి, మల్లభూమిని చూచారు. అది దేవమానవాదుల హృదయాలను మహాభయంకరమైన ఆడంబరంతో కలవరపెడుతూ ఉంది.

శ్రీకృష్ణుడు బలరాముడితో మల్లరంగం మధ్య నవరసా లొలికిస్తూ, ప్రకాశించాడు. ఎలాగంటే అతడు జెట్టీలకు పిడుగై రౌద్రరసాన్నీ ప్రజలకు నాథుడై అద్భుత రసాన్ని పట్టణ స్త్రీలకు మన్మథుడై శృంగారరసాన్నీ కంసుడిపాలిటి మృత్యువై భయానకరసాన్నీ, వికటుడై మూఢులహృదయాలలో భీభత్సరసాన్నీ, వసుదేవుడికి పుత్రుడై అతడిహృదయంలో కరుణ రసాన్నీ ఖలులను దండించడంచేత వీరరసాన్నీ తనతోడి గోపకులకు స్వకులస్థుడు కావడంవల్ల హాస్యరసాన్నీ బంధువలైన యాదవుల్లో ప్రేమరసాన్నీ దేవుడై యోగులందు శాంతరసాన్నీ నింపాడు.

పరీక్షిన్మహారాజా! ఆ సమయంలో చచ్చిన కువలయాపీడాన్నీ, వచ్చిన రామకృష్ణుల్నీ క్రమంగా చూచి భోజవంశశ్రేష్ఠుడైన కంసుడు నొచ్చిన మనసుతో మిక్కిలి భయపడ్డాడు.

ధీరులూ, వస్త్రాలు, పూలదండలు, రత్నాలతో ప్రకాశించే నగలు ధరించినవారూ, నటుల వేషంలో ఉన్నవారూ, సకలజగాలకూ క్షేమం కల్గించేవారూ, మగవారియొక్క మగువలయొక్క మనసులు ఆకర్షించేవారూ, మల్లరంగంలో విహరిస్తున్నవారూ, మహావీరులూ అయిన ఆ గోపకుమారులను జనులందరూ చూచి చూచి తనివిదీరక...

అందమైన రామకృష్ణుల ముఖ చంద్రబీంబాలనుంచి ప్రసరించే అమృతరసాన్ని కన్నులతో త్రాగేవిధంగా చూస్తూ, నాలుకలతో చప్పరించి చవి చూచే విధంగా స్తుతిస్తూ, చేతులతో కౌగిలించే విధంగా మున్ముందుకు పొడవుగా చేతులు చాచుతూ, ఒకరితో ఒకరు గుజగుజలు పోయా

బలరామకృష్ణులు మహావిష్టుని తేజోవిలాసంతో భూమిని కాపాడటానికి వసుదేవుడిగృహంలో జన్మించారట! దేవతా శ్రేష్ఠులైన వీరిని పసిపాప లనడం ఏ మాత్రం యుక్తం కాదు.

తామరలవంటికండ్లు కలవాడూ, మంగళకరమైన అంగసౌష్ఠవం కలవాడూ, గొప్పతేజస్సు కలవాడూ, దిగ్గజేంద్రానికి దీటైనవాడూ, లక్ష్మికి పతి అయిన శ్రీకృష్ణుడు రక్కసియైన పూతనను పట్టి చంపాడు. సుడిగాలి అయిన తృణావర్తుణ్ణి హతమార్చాడు. మద్దిమాకుల్ని పడగూల్చాడు. 

బకాసురుణ్ణి సంహరించాడు. అఘుడనే రాక్షసుణ్జి అంతం చేశాడు. విజ్బంభించి వత్సాసురుణ్ణి వధించాడు. గోవర్ధన గిరిని పైకెత్తి దేవేంద్రుణ్ణి అవమానించాడు. కాళియుడనే నాగరాజును మర్దించాడు. కార్చిచ్చును తాగాడు. కేశి అనే దానవుణ్ణి యముడి చెంతకు పంపాడు.

మయుని కొడుకైన వ్యోమాసురుణ్ణి నిర్మూలించాడు. ఇంకా ఎందరో రాక్షస వీరుల్ని దునుమాడి గోపకులను కాపాడాడు. గొల్లచేడెల మనసులోని కోరికలను ఈడేర్పాడు. ఆలోచించగా ఇతడు సామాన్య మానవుడు కాడు.

శ్రీకృష్ణ బలరాములు చాణూర ముష్టికులను వధించుట


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Suryodaya Varnanamu - సూర్యోదయ వర్ణనము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము - సూర్యోదయ వర్ణనము

సూర్యుడనే సింహం గోళ్ళతో చీల్చగా దట్టమైన చీకటి అనే గజరాజుయొక్క కుంభస్థలమనే కొండకొమ్మునుండి వెలువడ్డ నెత్తుటితోగూడిన ముత్యాలో అన్నట్లు తూర్పుదిక్కులో ఎర్రదనంతో చుక్కలు ప్రకాశించాయి.
(ఏనుగుల కుంభస్థలాల్లో మంచి ముత్యాలుంటాయని పెద్దలు చెప్తారు.)

సూర్యబింబం తూర్పు కొండమీద ఉదయించింది. శచీదేవి తన పిల్లవాడి పానుపుమీద కనిపించేటట్లు చిలుకల పందిరికి అమర్చిన పగడాల బంతియా అన్నట్లుంది. ఆయుస్సనే ధనం వ్యయమై పోతున్నది అని గట్టిగా చాటుతున్న కాలమనే వార్తాహరుడిచేతిలోని గంటా అన్నట్లుంది. 

బ్రహ్మదేవుడు ప్రాణుల జీవితకాలమనే ధాన్యరాశుల్ని కొలవడానికి ఎత్తిన బంగారు కుంచమా అన్నట్లుంది. పడమటిదిక్కు అనే అంగన అలంకరించుకునేటప్పుడు ముందుంచుకున్న అద్దమా అన్నట్లుంది. జక్కవ పిట్టల పరితాపం మాన్పే దివ్యమైన మందుగుళికయా అన్నట్లుంది. పద్మిని అనే నాయిక వ్రతఫలమా అన్నట్లుంది. ముమ్మూర్తుల వెలుగుముద్దయా అన్నట్లుంది.

సూర్యోదయ సమయంలో చల్లని గాలులు వీచాయి. పద్మాలు పూచాయి. చీకట్లు పటాపంచలై గుహలలో దూరాయి. తుమ్మెదలు తమ్మిపూదేనెను తాగి ఆనందించాయి.

తూరుపు కొండమీద ఉదయించిన సూర్యుని కిరణాల అరుణిమతో నిండినదై బ్రహ్మాండం కుంకుమ నీటితో కూడిన బుడ్డివలె శోభిల్లింది.

ఆ తరువాత

కంసభూపతి మల్లయుద్దానికి సిద్ధపరచిన క్రీడారంగం రాళ్ళు, పుట్టలు, బురదలేనిదై, మెత్తని బంగారు వన్నె మట్టితో ఒప్పింది. అది కమ్మనికస్తూరిజలంతో తడుపబడింది. దానికి చుట్టూ గందపుకర్రలతో కంచె ఏర్పరచబడింది. గొప్ప పూలదండలతో, పతాకలతో, తోరణాలతో ఆ క్రీడారంగం అలంకరించబడింది. ఎత్తైన ఆసనాలమధ్య ఆ రంగం నిర్మించబడింది. 

బ్రాహ్మణులు, క్షత్రియులు మొదలైన పురప్రజల కోలాహలంతో రంగస్థలం నిండిపోయింది. ఎడతెగకుండా మ్రోగుతున్న వాద్యద్వనులతో ఆ ప్రదేశం ఎసలారింది. అది పుణ్యపురుషుని మనస్సు మాదిరి మాలిన్యం లేనిదై, సమమై, కంటక రహితమై శోభిల్లింది. కంసుడి సైన్యంతో ఉన్నతమై వన్నెమీరింది. జనుల హృదయాలకు సంతోషం సమకూరుస్తున్నది.

ఆ మల్లరంగానికి చేరువలో ఉన్న ఉన్నతాసనంలో భోజరాజేంద్రుడైన కంసుడు మాన్యులగు మంత్రులతోగూడి సామంతరాజులు తన్ను సేవిస్తుండగా దుఃఖపడుతూ కూర్చుని ఉన్నాడు.

సమస్త సముద్రాలు మొలనూలుగా ఉన్న భూమండలాన్ని మోయడం మానుకొని, నడిచి వస్తున్న దిగ్గజాలలాగా, కులపర్వతాల మాదిరి ఒప్పుతూ, తగినట్లు అలంకరించుకొని చాణూరుడూ, ముష్టికుడూ, శలుడూ, తోసలుడూ తమ ఉపాధ్యాయులను కొలుస్తూ, నానావిధాలైన వాద్యశబ్దాలకు బహువిధాలఉద్రేకం చెలరేగగా రంగస్థలానికి వచ్చారు.

(కుల+అగంబులు= కులపర్వతాలు. ఇవి ఏడు. మహేంద్రం, మలయం, సహ్యం, శుక్తిమంతం, గంధమాదనం, వింధ్యం, పారియాత్రం అని.)

నందుడు మొదలైన గోపాలకు లందరూవెళ్ళి, కంసరాజును సందర్శించి, కానుకలు సమర్పించి, ఆతనిఅనుజ్ఞతో పెద్దపెద్ద ఆసనాలమీద వరుసగా కూర్చున్నారు.

అంతట బలరామకృష్ణులు అలంకరించుకొని జెట్టీల భేరీ నినాదాలు విని, మల్లరంగం చూడటానికి ఉబలాటపడ్డారు.

రామకృష్ణులు జంకూ గొంకూ లేకుండా రంగస్థలం వాకిలిదగ్గరకు వెళ్ళి మదంతో కూడిన కువలయా పీడమనే ఏనుగును చూచారు. అది గ్రొచ్చి కోరాడటంలో ఇతర గజాలను క్రిందుపరుస్తుంది. ఆ మత్తేభం అధికమదంతో గగుర్పొడిచిన ముందల కలది.

అరిభయంకరుడైన శ్రీహరి ఆ మదగజాన్ని అవలోకించి, మేఘగర్జనంవలె గంభీరమైన కంఠంతో మావటివాళ్ళకు నాయకుడైనవాణ్ణి చూచి ఇట్లన్నాడు.

శ్రీ కృష్ణుడు కువలయాపీడ మను గజంబును వధించుట


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Revati Nakshatra - రేవతి నక్షత్రము

రేవతి నక్షత్రము నక్షత్రం - రేవతి అధిపతి - బుధుడు గణము - దేవ జాతి - పురుష వృక్షం - విప్ప జంతువు - ఏనుగు నాడి - అంత్య పక్షి - నెమలి అధిదేవత - ...