Monday, August 24, 2026

Pradyumna Kumara Charitra Prarambhamu - ప్రద్యుమ్న కుమార చరిత్ర ప్రారంభము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
ప్రద్యుమ్న కుమార చరిత్ర ప్రారంభము

పూర్వం నారాయణాంశ ఉన్నప్పుడే మన్మథుడు శివునికంటిమంటల్లో భస్మమయ్యాడు. తర్వాత అతడు పరమేశ్వరుణ్ణిగూర్చి అనేకపర్యాయాలు శ్రద్ధతో తపస్సుచేశాడు. ఆ తపస్సుకు ఫలంగా రుక్మిణీకృష్ణులకు కుమారుడై పుట్టాడు. ఈ పునర్జన్మంలో మన్మథుడు శ్రీకృష్ణుని మరొకరూపమా అన్నట్లున్నాడు.

ఆ శిశువే తర్వాత ప్రద్యుమ్ను డనేపేరుతో ప్రసిద్ధికెక్కాడు. అయితే ఆ పసిగందును శంబరు డనేరాక్షసుడు తనశత్రువుగా పసిగట్టాడు. అందువల్ల ఆ బాలుణ్ణి ఒకనాడు పురిటింట్లో తల్లిసందిటిలో ఉన్నప్పుడు అపహరించి, సముద్రంలో పారవేసి తన ఇంటికి వెళ్లిపోయాడు. ఆ పిల్లవాడు సముద్రజలంలో అడుగుకు పడిపోగా ఒక పెద్దచేప అతణ్ణి పట్టుకొని మింగేసింది. ఆ సముద్రంలో

జాలరులు పట్టుకొంటా రనేభయంతో చేపలు - ఆ సముద్రంలో చిక్కకుండా పారిపోయేవి. అప్పుడు జాలరులు ఆగ్రహించి వాటిల్ని తప్పించుకొని పోనీకుండా అడ్డగించి, వలలు వేసి పట్టుకొనేవాళ్లు.

జాలరులు సముద్రంలో ప్రద్యుమ్నుణ్ణి మింగిన పెద్దచేపనూ, దానివెంట తిరిగేచేపలనూ పట్టీ తెచ్చి, శంబరాసురునికి కానుకగా సమర్పించారు. అతడు వాటిల్ని వండి తీసికొని రండని ఆజ్ఞ ఇచ్చి వంట ఇంటికి పంపాడు.

పరీక్షిన్మహారాజా! రాజాంతపురంలోని వంటవాళ్లు ఆపెద్దచేపపొట్టను చీల్చినప్పుడు, దానిలో వారికి ఒక రాచబిడ్డ కనిపించాడు. వెంటనే వా రీవిచిత్రాన్ని రతీదేవికి తెలియజేశారు.

ఒకనాడు నారదుడు శంబరుని అంతఃపురానికి వచ్చి ప్రద్యుమ్నుని జననమూ, శంబరుడు ఆ బాలుణ్ణి చంపటానికి చేసిన ప్రయత్నమూ, అతడు చేపకడుపులో ప్రవేశించటమూ రతికి వివరించాడు; 

ఇంతకు మునుపే ఆమె మాయావతి అనేపేరుతో శంబరుని అంతఃపురంలో పాతివ్రత్యం అవలంబిస్తూ, శివునికంటిమంటల్లో భస్మమైపోయిన తన భర్త మన్మథుడు తిరిగి ఎప్పుడు శరీరధారి అవుతాడో అని ఎదురుచూస్తూంది. అందువల్ల చేపపొట్టలో ఉన్నబాలుడు మన్మథుడే అని తెలుసుకోగలిగింది. 

ఆమె తొందరపాటు లేకుండా కొడుకుకోసం తపిస్తున్నదానిమాదిరిగా శంబరునిదగ్గరకువెళ్లి, అతని అంగీకారాన్ని పొంది, వంటవాళ్ల అదుపులో ఉన్న పిల్లవాణ్ణి తెచ్చి పెంచుతూ ఉంది. ఆ బాలుడు పూటపూటకూ పెరుగుతూ యౌవనవంతు డయ్యాడు.

రాజా! ఆ యువకుని సౌందర్యాన్నిగూర్చి ఏమని చెప్పేది? అందగత్తెలు ఎవరైనాసరే ఒకసారి అతనిరూపాన్ని కళ్లారా చూస్తేచాలు - అతనితో భోగించాలని నిశ్చయించి, అతణ్ణి సమీపించే ఆలోచనను, అతని సౌందర్యం వాళ్లకు జనింపజేస్తుంది.

(రూపం అనేది చాలా అర్థవంతమయిన శబ్దం. “రోపయతి విమోహయ తీతి రూపమ్‌! రుపు విమోహనే - మోహింపజేసేది” అని వ్యుత్పత్తి. మోహింపజేస్తుంది కాబట్టి, రూపం అనే పేరు కలిగింది.)

ఈ పడుచువాడు నిజంగా మన్మథుడే! మన్మథుడు గొప్ప అందగాళ్ల సొగసుతో పోల్చటానికి తగిన సుందరుడయ్యాడు. విరాగియై స్త్రీవైముఖ్యం కలిగిన శివుణ్ణి ఘోరతపస్సు చేసినపార్వతికి అర్ధశరీరం సమర్పించేటట్లు చేశాడు. 

సృష్టికర్త అయినబ్రహ్మ కన్నకూతురయిన సరస్వతికోసం వావీవరుసా వదలేటట్లు చేశాడు. దేవేంద్రుడు నిలువెల్లా వేయిమచ్చల గుర్తులు (కన్నులు) పొందటానికి మూలకారకుడయ్యాడు.

అతడు మునీశ్వరుల మనోనిగ్రహం ఏ పాటిదో తూకంవేస్తాడు. స్త్రీపురుషులు పరస్పరమూ ప్రేమించుకొనేటట్లు చేస్తాడు. వాడి వత్తలయ్యే పూలవింటితో మహావిజయాలు సాధిస్తాడు. గట్టితనం లేని చిగురాకుకత్తితో లోకాల్ని బాధిస్తాడు.

ఈ విధంగా ప్రజలందరూ మన్మథునిశక్తులను కొనియాడుతున్నారు. పద్మనేత్రుడూ, ఆజానుబాహుడూ, లోకమోహనస్వరూపుడూ అయిన అతణ్ణి సిగ్గూ, చిరునవ్వూ దాగినచూపులతో చూస్తూ, మాయావతి రతివాంఛను ప్రకటించింది. అప్పుడు ఆమెవాలకం చూచి ప్రద్యుమ్నుడు ఇట్లా అన్నాడు

(1. పంచబాణుడు అంటే అయిదుబాణాలు కలవాడని అర్ధం. తామరపూవు, అశోకము, మామిడి, మల్లె, నల్లగలువ అనేవి ఆ పంచబాణాలు - ఆ బాణాలు చేసే పనులు - సమ్మోహనం (ఆకర్షించునట్లు చేసేది), ఉన్మాదనం (వెరి పుట్టించేది), తాపనం (కాక ఎక్కించేది), శోషణం (శుష్కింపజేసేది), స్తంభనం (కొయ్యవారేటట్లు చేసేది.))

తల్లీ! ఇన్నాళ్లూ నా కొడుకని అందరికీ నన్నుగూర్చి చెప్పావు. ఇప్పుడు సిగ్గులేకుండా, మాతృత్వాన్ని మంటగలిపి, కాముకురాలివలె ఈ విలాసచేష్టలు చేస్తున్నావు. ఇది ఎంతపాడుపని? సత్ప్రవర్తనకు పేరుపొందిన నీవు నన్ను మోహించటం న్యాయంగాదు.

ఈ విధంగా పలికిన ప్రద్యుమ్నునితో రతీదేవి “నీవు విష్ణువునకు కుమారుడవు. మన్మథుడవు. నేను నీపత్నిని. రతీదేవిని. నీవు పసికందుగా ఉన్నప్పుడు శంబరుడనే రాక్షసుడు నిన్ను దొంగిలించి, తల్లినుండి వేరుచేసి సముద్రంలో పారవేశాడు. అప్పుడు పెద్దచేప నిన్ను మింగేసింది. ఆ తర్వాత దానిపొట్టనుండి నీవు బయటపడ్డావు. ఇక జరుగవలసిన పనేమిటో చెప్తాను. విను. (శంబరుడు - జటాసురుని కొడుకు)

ఈ శంబరుడు మాయలమారి. దుర్బుద్ధి. యుద్దాల్లో దేవతలనయినా జయిస్తాడు కాని తానుమాత్రం చావడు. కాబట్టి నీవు మాయాయుద్ధంలో మోహనం మొదలైన మాయలచేత వీణ్ణి సంహరించు.

పాపపుపనులు చేసే ఈ శంబరుడు నిన్ను ఇక్కడకు తీసుకొని వచ్చిన తర్వాత నిద్రలేచి, ఎన్నో నోములు నోచి నిన్ను కన్నతల్లి “దేవుడా! నాబీడ్డ ఎక్కడికి పోయాడు? వాణ్ణి, నన్నూ ఎడబాపావుగదా!” అని దూడకు దూరమైన ఆవువలె కిందబడి దుఃఖంతో, బాధతో కుయ్యోమొర్రో అని అనకుండా ఉంటుందా?

(శంబరునివల్ల ఏర్పడిన విద్యకు 'శాంబరీవిద్య' అని పేరు. ఇదొక ప్రత్యేకమైన మాయావిద్య.)

అనిచెప్పి, మాయావతి మహాతేజోవంతుడైన ప్రద్యుమ్నునికి విరోధులమాయ లన్నింటినీ మట్టుపెట్టే 'మహామాయ' అనేవిద్యను ఉపదేశించింది. ఈ విధంగా

మాయాయుద్ధనిపుణుడూ, ధనుర్భాణాలు ధరించినవాడూ అయిన ప్రద్యుమ్నుడు “ఓరీ రాక్షసా! ఆనాడు నన్ను సముద్రంలో పడవేశావు. ఈనాడు నిన్ను భయంకర యుద్ధంలో సంహరిస్తాను. తొందరగా రారా!” అని అన్నాడు. ఆ సమయంలో శంబరుడు మనోజ్ఞమైన దివ్యవస్త్రాలు ధరించి ఉన్నాడు. అతని సేనలు యుద్దానికి ఉత్సాహంతో కాలుదువ్వుతున్నాయి.

ప్రద్యుమ్నుడు గద్దించి కఠినంగా పలికినమాటలకు శంబరుడు సంచలిస్తూ లేచాడు. కాళ్లతో తొక్కబడిన పాము మీదికి వచ్చినట్లుగా వేగంగా సమీపించి, వజ్రాయుధధ్వనివంటి సింహనాదం చేసి, బొబ్బలు పెడుతూ ప్రద్యుమ్నుణ్ణి గదతో కొట్టాడు.

శంబరుడు తనమీద ప్రయోగించిన గదను ప్రద్యుమ్నుడు తనగదచే అణగదొక్కి రక్కసులు బెదరగా సింహనాదం చేస్తూ తన గదను అతనిమీదికి విసరివేశాడు.

పిదప శంబరుడు కోపంతో మండిపోతూ మయునినుండి తాను గ్రహించిన రాక్షసమాయను తోడుచేసికొని ఆకాశాని కెగిరి, ప్రద్యుమ్నునిమీద బాణాలజడివానను కురిపించాడు. ప్రద్యుమ్నుడు బాధపడికూడా పట్టువదలక సర్వమాయలను ధ్వంసం చేసే సాత్త్వికమాయను శంబరునిమీద ప్రయోగించాడు. వాడు సర్ప -గుహ్యక-పిశాచమాయలను ప్రద్యుమ్నునిమీద ప్రయోగించాడు. ప్రద్యుమ్నుడు ఆ మాయలను పూర్తిగా తొలగద్రోసి

ఏమీ మాటాడకుండా ప్రద్యుమ్నుడు యమునివంటివాడై భయంకరఖడ్గంతో శంబరునితలను నరికాడు. కత్తిదెబ్బకు రాక్షసుని చెవిపోగులలోనూ, కిరీటంలోనూ పొదిగిన మణులు నేలమీద రాలిపోయాయి.

లేతచిగురాకుకత్తితో సర్వలోకాలలో నివసించేవారినీ అస్వతంత్రులుగా చేసే పట్టుదలగలవానికి ఉక్కుకత్తితో శత్రువును సంహరించటం ఒకలెక్కా?

పరీక్షిన్మహారాజా! శంబరుడు చనిపోవటంచేత దేవతలు నిర్భయంగా అతణ్ణి నిందించారు. ప్రద్యుమ్నుని ధైర్యశౌర్యాది గుణాలను స్తుతించారు. ఆనందంతో ఎడతెగకుండా పూలవాన కురియించారు.

రతీదేవి ప్రద్యుమ్నసహితయై గగనమార్గంబున ద్వారకకు బోవుట





Sree Maha Bhagavathamu Part 10 Utharabhagam - శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం

శ్రీరస్తు శ్రీమహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం

శ్రీకర! పరిశోషిత ర, త్నాకర! కమనీయగుణగణాకర! కారు
ణ్యాకర! భీకరశర ధా, రా కంపితదానవేంద్ర! రామనరేంద్రా!


అష్టైశ్వర్యాలూ అనుగ్రహించేవాడా!,సముద్రాన్ని ఇంకింపజేసినవాడా! మనస్సును ఆకర్షించే సర్వసద్గుణాలూ కలవాడా! దయకు గని అయినవాడా! భయం కలిగించే బాణపరంపరలు ప్రయోగించి, రావణాసురుణ్ణి నిలువెల్లా కంపింపజేసినవాడా! శ్రీరామచంద్రా!

(శ్రీకరుడు అంటే విష్ణువని అర్ధం. ధనం, ధాన్యం, వస్తువు, వాహనం, పుత్రుడు, మిత్రుడు, బంధువు, దాసుడు అనే ఎనిమిది విధాలైన సంపదను కలిగించేవాడా! అందువల్ల శ్రీకర! అనే సంబోధనకు సాక్షాద్విష్ణుమూర్తి అనే అర్ధం. రాముడు నారాయణుని అవతారం)

మహాగుణవంతులయిన శౌనకాదిమునీశ్వరులతో సకలపురాణాలనూ వ్యాఖ్యానింపగలిగిన సూతుడు ఈ విధంగా అన్నాడు. ప్రాయోపవేశం చేస్తున్న పరీక్షిన్మహారాజు “శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని వివాహం చేసుకొన్న తర్వాత జరిగినకథంతా చెప్పండని శుకమహర్షిని అడిగాడు. అప్పుడు ఆ మహాయోగి ఈ విధంగా అన్నాడు.

ప్రద్యుమ్న కుమార చరిత్ర ప్రారంభము







Srikrishnudu Rukminidevini Bendli Yaduta - శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని బెండ్లి యాడుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము - 
శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని బెండ్లి యాడుట

అప్పుడు యాదవశ్రేష్ఠుడైన ఆ శ్రీకృష్ణునినగరంలో పెళ్లివేడుకలు మొదలయ్యాయి. పాటలు, వాద్యాలు, ఆటలు ఎక్కడచూచినా జరుగుతున్నాయి. ప్రతి ఇంటిలోనూ స్త్రీ పురుషులు అందంగా అలంకరించుకొన్నారు. పెళ్లికి దేశదేశాల రాజులు ఆహ్వానింపబడ్డారు. 

వాళ్లు ఏనుగుల నెక్కి వస్తున్నారు. ఆ మదపుటేనుగుల చెక్కిళ్లనుండి మదజలం ధారగా స్రవిస్తూంది. ఆ ధారకు నగరవీథులు తడిసిపోయాయి. ప్రతివాకిలికీ మంగళతోరణాలు కట్టారు. పోక, అరటి బోదెల్ని వాకిళ్లకు అలంకరించారు. కర్పూరం, కుంకుమలతో అలంకారాలు తీర్చారు. 

అగరుపొగలతో పరిమళింపచేశారు. దీపాలు వెలిగించారు. పూర్ణకుంభాలు నిలిపారు. ప్రతి ఇంటి అరుగు, వాకిలి, గడప, స్తంభాలను రకరకాలుగా అలంకరించారు. రంగురంగుల అపూర్వ పుష్పాలనూ, వస్త్రాలనూ, రత్నాలనూ, తోరణాలనూ కట్టి అందగింపచేశారు. పతాకలు గాలికి ఎగురుతూ రెపరెపలాడుతూ ద్వారకానగరం విలసిల్లింది. ఆ సమయంలో

రుక్మిణి శ్రీకృష్ణుని మనస్సును దోచుకుంది. అభిమానవతి. సంపద ఉన్నది. నిబ్బరంగా వ్యవహరించేది. సర్వసంపదలనూ కలిగించేది. మంచివారైన బంధువులను సమ్మానించేది, పవిత్రమైన నడవడిక కలది. హీనమైన దరిద్రాన్ని కూడా పోగొట్ట గలిగింది. మంచి నగలను, వస్త్రాలనూ దాల్చింది. గుణవతులైన స్త్రీలకు తలమానికంవంటిది. ఇన్ని గుణాలున్న రు
క్మిణీదేవిని శ్రీకృష్ణుడు శాశ్వతమైన కీర్తి కలిగేలా వివాహం చేసుకున్నాడు.

అపుడు ప్రజలు తాము తమ భార్యలతో కలిసి వివాహానికి వచ్చి, దయాగుణంతో పైపైకి ఎదిగే లక్షణమున్నవాళ్లూ, పదిమంది చెప్పుకునేలా తేజస్సుతో వెలుగుతున్న వాళ్లూ అయిన రుక్మిణీ కృష్ణులను వారు సకుటుంబంగా దర్శించి, మంచి మనస్సులతో కానుకలను సమర్పించారు.

శ్రీకృష్ణుని వివాహానికి కేకయ, కురు, సృంజయ, యాదవ, విదర్భ, కుంతి రాజ్యాలనుండి వచ్చిన రాజులు చాలమంది నిశ్చయమైన అభిప్రాయంతో వచ్చి పరమానందం పొందారు.

అన్నిదిక్కుల్లో ఉన్న రాజులు, రాజకుమారులు శ్రీకృష్ణుడు ఈ విధంగా రు
క్మిణిని తెచ్చి పెళ్లి చేసుకోవడం అనన్య సామాన్యమైన కార్యమని ఆశ్చర్యపడ్డారు.

పాపరహితుడవైన పరీక్షిన్మహారాజా! ఆదిలక్ష్మీదేవి అవతారం అయిన రుక్మిణితో హాయిగా కాలం గడుపుతున్న శ్రీ కృష్ణుణ్ణి పురప్రజలందరూ దర్శించి 'భయంనుండి విముక్తులై' సంతోషంతో పొంగిపోయారు.

అని ఈ విధంగా రు
క్మిణీ శ్రీకృష్ణుల పరిణయగాథను చెప్పిన తరువాత. ఇంకా

భూమండలాన్ని రక్షించడంలో ఆసక్తికలవాడా! కలువరేకులవలె నీలపువన్నెగల సుకుమారమైన శరీరం కలవాడా! భూపాలకులకు శిరోభూషణమైనవాడా! భూప్రజలచేత పొగడబడే సుగుణరాశి కలవాడా! పద్మాలవంటి చేతులున్నవాడా! అన్నిలోకాలచేత పాగడబడినవాడా! 

సాటిలేనిమంగళస్వరూపా! స్వచ్చమైన, వన్నెకెక్కిన కీర్తి కలిగినవాడా! శత్రువుల గుండెలను చీల్చువాడా! భక్తుల సమూహానికి సహాయం చేసేవాడా; పెద్దవారినీ, పండితులను పోషించేవాడా! భయంకరమైన రాక్షసులను అణచివేసేవాడా!

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Sahodaruni Bhangamunaku Khinnayagu Rukminidevini Balabhadrum Duraarchuta - సహోదరుని భంగమునకు ఖిన్నయగు రుక్మిణీదేవిని బలభద్రుం డూరార్చుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము - 
సహోదరుని భంగమునకు ఖిన్నయగు రుక్మిణీదేవిని బలభద్రుం డూరార్చుట

ఈ విధంగా బలరాముడు ముందు వెనుకలు ఆలోచించి రుక్మిణీదేవిని గమనిస్తూ ఇలా అన్నాడు.

అమ్మా! రు
క్మిణీ! నీ తోడబుట్టినవానికి అవమానం జరిగిందని దిగులు పడకు. మా తమ్ముడైన శ్రీకృష్ణుణ్ణి తప్పు పట్టబోకు. ఇవన్నీ కర్మకు సంబంధించిన విషయాలు. కడచిన జన్మలో చేసిన కర్మనుబట్టి ఈ జన్మలో జీవికి మంచీ, చెడూ అనేవి కలుగుతూ ఉంటాయి. 

శిక్షించడానికీ, రక్షించడానికీ ఎవడూ కర్త అంటూ లేడు. నీ అన్నకూడా ఈ రోజు ఇక్కడ ఈ అవమానం పొందాడంటే, అదంతా అతడు చేసిన కర్మఫలమే తప్ప మరొకటి కాదు.

బంధువులు ఏదైనా తప్పుచేస్తే అది చంపవలసినంతటి తప్పైనా వాళ్లను చంపకూడదు. క్షమించి విడిచిపెట్టాలి. అది పద్ధతి. అలా కాకుండా చంపామనుకో, పాపం అనేది తప్పకుండా అంటుకుంటుంది. పైగా ముందే చచ్చినవాడిని మళ్లీ చంపవలసిన అవసరం కూడా లేదు.

సృష్టికర్త అయిన బ్రహ్మ రాజులకు ఈ ధర్మాన్ని సృష్టించాడు. రాజ్యాన్ని సొంతం చేసుకోవాలనే ఆశతో తన తోబుట్టువును తోడబుట్టినవాడే క్రూరహృదయుడై చంపుతుంటాడు.

రాజ్యంకోసం, ధనంకోసం, ధాన్యంకోసం, స్త్రీలకోసం, పరువుప్రతిష్ఠలకోసం, వైభవాలకోసం మానధనులైనవాళ్లు ఆరాటపడతారు. సంపద ఉందనే పొగరుతో ఇతరులను కూడా రెచ్చగొట్టి పోరాటాలకు దింపుతారు.

రుక్మిణీ! విను. లోకంలోని మానవులకు వీడు తనవాడు, వీడు పగవాడు, వీడు తటస్థుడు అనే దృష్టిభేదం దేహాభిమానంవల్ల కలుగుతుంది. ఆ దేహాభిమానం దైవమాయవల్ల కలుగుతుంది. చంద్రుడు, సూర్యుడు వంటివి నీళ్లలో, అద్దాలలో కనిపించి అనేకం ఉన్నాయనిపిస్తుంది. 

కుండలువంటి వాటిలో ఆకాశం కూడా అనేక ఆకాశాలుగా కనిపిస్తుంది. అదేవిధంగా ఆత్మ ఒక్కటే అయినా, ఎన్నో శరీరాలలో ఉండి అనేకంగా అనిపింపజేస్తుంది. ఈ శరీరం చావుపుట్టుకలతో కూడింది. ఇది పంచభూతాలతో, పంచప్రాణాలతో, త్రిగుణాలతో కూడింది.

ఈ శరీరం ఆత్మలో అజ్ఞానంచేత కల్పింపబడి జీవుడిని సంసారంలో తిప్పుతుంటుంది. సూర్యుడు దేనితోనూ సంబంధంలేక ఉదాసీనుడుగా ఉండగా దృష్టి, రూపం అనే వానివలె ఆత్మ ఉదాసీనంగా ఉండగా శరీరం, ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు ప్రకాశమానమవుతాయి.

ఆత్మ అనేదానికి మరొకదానితో కలయికగానీ, ఎడబాటుగానీ లేవు. పెరగడం, తరగడం అనేవి చంద్రకళలకే గానీ చంద్రునికి ఉండవు. అదేవిధంగా చావుపుట్టుకలు శరీరానికే గానీ, ఆత్మకు కాదు. నిద్రపోయినవాడు కలలో విషయాలవలన కలిగే సుఖదుఃఖాల్ని ఆత్మకు అనుభవింపచేస్తాడు. 

జ్ఞానహీనుడు అసత్యమైన విషయాలలో అనుభవాన్ని పొందుతుంటాడు. నిజానికి సుఖదుఃఖాలనేవి ఆత్మకు అంటవు.

పద్మంలాంటి ముఖం కలిగిన రు
క్మిణీ! దుఃఖమనేది తెలియనితనంవల్ల వస్తుంది. జ్ఞానమనే దృష్టితో ఆ దుఃఖాన్ని విడిచిపెట్టు. విశిష్టమైన జ్ఞానమున్నదానివైన నీవుకూడా అజ్ఞానులవలె శోకింపదగదు.

ఇలా బలరాముడు ప్రబోధించగా రు
క్మిణి దిగులు మానింది. అటుచూస్తే, రుక్మి పరిస్థితి భిన్నంగా ఉంది. శ్రీకృష్ణుడు అతణ్ణి కేవలం ప్రాణాలతో వదలిపెట్టాడు. కృష్ణుని వల్ల తనకు వికార రూపం రావడంతో దానికి రుక్మి చాలా దుఃఖించాడు. ఇంత అవమానం చేసిన శ్రీకృష్ణుని గెలిచి కాని తిరిగి తన పట్టణమైన కుండిన పురానికి పోనని ప్రతిజ్ఞ చేసి పట్టణ సమీపంలోనే ఉండిపోయాడు.

ఇలా పద్మాలవంటి నేత్రాలుకల శ్రీకృష్ణుడు రాజసంతో రాజలోకాలను గెలిచి వెలిగాడు. వెలుగులీనుతున్న తన నగరానికి చంద్రబింబంవంటి ముఖంగల రుక్మిణిని తెచ్చాడు అంటూ బంధువులందరూ శ్రీకృష్ణుని పొగడ్తలతో ముంచెత్తారు.

శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని బెండ్లి యాడుట


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Srikrishnudu Satruraajulu Chuchuchunda Rukminidevini Gonipovuta - శ్రీకృష్ణుడు శత్రురాజులు చూచుచుండ రుక్మిణీదేవిని గొనిపోవుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము - 
శ్రీకృష్ణుడు శత్రురాజులు చూచుచుండ రు
క్మిణీదేవిని గొనిపోవుట

ఆ రుక్మిణి శ్రీకృష్ణుని అందమైన ఆకృతిని చూచింది. ఆయనవయసునూ, శరీరపుమిసిమినీ, వైభవాన్ని గంభీర స్వభావాన్నీ నేర్పరితనాన్నీ కాంతినీ మొదలైన విశేషాలను గమనించింది. సంతోషించింది. ఆమె మన్మథబాణాలకు గురి అయింది.

తన రథాన్ని ఎక్కాలని ఆశపడుతున్న రుక్మిణిని శ్రీకృష్ణుడు చూచి శత్రురాజసమూహం చూస్తూండగా నక్కల మధ్యఉన్న మాంసభాగాన్ని సింహం ఎలా తెచ్చుకుంటుందో, అలా శ్రీకృష్ణుడు రుక్మిణిని తెచ్చి, అక్కడున్న రాజలోకాన్ని లెక్క చేయకుండా తన రథంమీద ఎక్కించుకున్నాడు.

భూమ్యాకాశాలు నిండిపోయే విధంగా అతడు పాంచజన్య శంఖం పూరించాడు. వెంట బలరాముడు వస్తుండగా ద్వారకానగరంవైపు రథాన్ని మళ్లించాడు. ఆ సమయంలో జరాసంధుడికి లొంగిఉన్న రాజులందరూ శ్రీకృష్ణుని ప్రతాపాన్నిగురించి విని భరించలేక

గొప్పసింహాలకు చెందిన కీర్తిని పనికిరాని నీచమృగాలు దొంగిలించుకుని పోయినట్లు ఈ గోపాలురు మనకీర్తిని, కొల్లగొట్టి మన కన్యను ఎత్తుకుని, అదిగో కావరంతో వెళుతున్నారు. ఇప్పుడు కాకపోతే ప్రతాపాలు ఇక ఎప్పుడు చూపాలి? 

మీ దగ్గర ఉన్న శస్త్రాలూ, అస్త్రాలూ ఎందుకు? తగలబెట్టడానికా? ఆ రుక్మిణిని వాళ్లబారినుండి విడిపించలేకపోతే ప్రజలు ఏమనుకుంటారు? సందుల్లో, గొందుల్లో చేరి మనగురించి చెప్పుకుని నవ్వుకోరా? (తప్పకుండా నవ్వుకొంటారని భావం)

అని పలుకుతూ ఒకరినొకరు హెచ్చరించుకుంటూ రాజులు మనసుల్లో కోపావేశాల్ని నిలుపుకున్నారు. ఆటోపంతో, కవచాల్ని ధరించి, ధనుస్సు మొదలైన ఆయుధాలను వెంటతీసుకొని వెళ్లారు. ప్రతిజ్ఞలు చేస్తూ, తమతమ రథగజ తురగపదాలైన సైన్యాల్ని వెంట తీసుకుని జరాసంధుడువంటివాళ్లు యాదవవీరుల వెంటపడ్డారు. వాళ్లను చేరి 'నిలబడండి నిలబడండి' అని ఎదిరించి పలికారు. 

బలంతో చెలరేగిపోయారు. కొండలమీద వానచినుకులు కురిపించే మేఘాలవలె యాదవసేనమీద రాజులు బాణాలను కురిపించారు. యాదవసేనానాయకులు ధనుస్సులను ఎక్కుపెట్టి, అల్లెత్రాళ్లను మోగిస్తూ నిలబడ్డారు. అప్పుడు-

శత్రువులు శ్రీకృష్ణుని సేనలను బాణాలతో కప్పివేయడం చూచి ఎక్కువగా భయపడి సింహంనడుమువంటి నడుమున్న రుక్మిణీదేవి సిగ్గుతో బెదిరిన జింక చూపులవంటి చూపులతో శ్రీకృష్ణుడిని ముఖంవైపు చూచింది

ఇలా రుక్మిణీదేవి చూస్తుండగా

కలువవంటి కన్నులుగల రు
క్మిణీ! అదిగో యాదవవీరులు వచ్చేస్తున్నారు. శత్రు సైన్యాన్నంతటినీ ముక్కలు ముక్కలుగా విరిచిపడేస్తారు. ఈ రోజు శత్రువులు బాగా దెబ్బతింటారు. చెల్లాచెదరైపోతారు. చచ్చిపోతారుకూడా. చూస్తూ ఉండు.

అని చెపుతూ శ్రీకృష్ణుడు రు
క్మిణీదేవికి సాంత్వన వాక్యాలు పలికాడు. అంతలో బలరాముడు మొదలైన యాదవవీరులు ప్రళయకాలంలో ఆకాశంలో అల్లుకుని పిడుగులు కురిపించే నల్లమబ్బులవలె చెలరేగిపోయారు. 

శరవర్షం కురిపించారు. జరాసంధుడు మొదలైన శత్రురాజసమూహంమీద మొక్కవోని ప్రతాపంతో అగ్నిజ్వాలల్లాంటి పదునైన ఇనుపముక్కుల బాణాలను, బల్లెములు మొదలైన రకరకాల బాణాలను తెరిపి లేకుండా కురిపించారు. ఆ దెబ్బకు సైన్యం కకావికలైంది.

మదపుటేనుగులు నరకబడ్డాయి. గుర్రాలు ముక్కలు ముక్కలైపోయాయి. ఎక్కడ చూచినా రథాల పైకప్పులు కుప్పలుగా పడ్డాయి. కాల్బలం దెబ్బతిని పడిపోయింది. గుర్రాలను, ఏనుగులను, రథాలను ఎక్కివస్తున్న వీరుల తలలు తెగి నేలకూలాయి. 

ముక్కలైపోయిన వక్షాలతోనూ, నడుములతోనూ, చెవులతోనూ, మెడలతోనూ, చెక్కిళ్లతోనూ, చేతులతోనూ రణరంగం భయంకరంగా కనించింది. మరణించినవాళ్ల వెండ్రుకలు నేలపై పరచుకుని పడిఉన్నాయి. పాదాలు, మోకాళ్లు, పిక్కలు ముక్కలైపడ్డాయి. వీరులు ధరించిన మంజీరాలు, భుజకీర్తులు విడివిడిగా చెదరిపడ్డాయి. 

చెవికమ్మలు, కిరీటాలు, హారాలు భ్రష్టమై పడ్డాయి. వీరులప్రలాపాలు వినిపించడం లేదు. గదలు, ఈటెలు, చిల్లకోలలు, గండ్రగొడ్డళ్లు, పట్టాకత్తులు, బల్లెములు, కత్తులు, శూలాలు, చక్రాలు, ధనుస్సులు అన్నీ నడిమికి విరిగి ముక్కలయ్యాయి. రథంపై ఉండే పతాకలు, రాజగౌరవాన్ని చాటే చామరాలు, గొడుగులు నేలకూలాయి.

కవచాలు చీల్చబడిన పీలికలైనాయి. గుర్రాలగుంపులు చెల్లాచెదురై పోయాయి. వాటిడెక్కలు తగిలి? నేలనుంచి దుమ్ము రేగింది. అప్పటిదాకా ఉరుకులెత్తిన తేరులవేగం మందగించింది. 

సూతులు, వంది మాగధులు పొగడడం ఆగిపోయింది. తెరిపిలేకుండా గుర్రాలు సకిలిస్తున్నాయి. తప్పెటలు మోగుతున్నాయి. ఏనుగులగుంపులు 'ఘీ' అని అరుస్తున్నాయి. రథచక్రాలకమ్ములు ఫటఫట శబ్దం చేస్తున్నాయి. గుర్రాలబొద్దులకు పక్కవేలాడుతున్న గంటలు ఘణఘణ మోగుతున్నాయి. 

విజృంభించిన వీరభటుల 'హుం' కారాలు వినిపిస్తున్నాయి. యుద్ధం చేస్తున్న వారిఆభరణాలు ఘణఘణ శబ్దం చేస్తున్నాయి. భేరీ వాద్యాలు ధణధణ మోగుతున్నాయి. మణులతో కూడిన కాలిఅందెలు 'క్రేం' కారం చేస్తున్నాయి. మువ్వల కుప్పలు కిణకిణ మోగుతున్నాయి.

అల్లెత్రాళ్లు 'టం' అని శబ్దం చేస్తున్నాయి. వీరభటులు ఒకరినొకరు తిరస్కరించుకుంటూ ఎదిరించేధ్వనులు వినిపిస్తున్నాయి. రాజుల గుంపులు భేదింపబడుతున్నాయి. రక్తం కాలువలుగట్టి పారడం కనిపిస్తున్నది. భూతాలు, పిశాచాలు కలకలం సృష్టిస్తున్నాయి.

నక్కలు, కాకులు, రాబందులు మొదలైనవి చెలరేగిపోతున్నాయి. గుంపులుగా ఉన్నాయి. అక్కడక్కడ తలలు తెగిన మొండెములు ఇంకా కదులుతున్నాయి.

మాంసం వాసన కమ్ముకుంటున్నది. కొవ్వు మాంసం తింటూ, రక్తం తాగుతూ డాకినీ పిశాచాలు యుద్ధరంగంలో తిరుగుతూ ఆనందిస్తున్నాయి. అప్పుడు

జరాసంధుడు మొదలైనవాళ్లు శ్రీకృష్ణుని ప్రతాపానికి బెదిరి యుద్ధభూమినుండి వెనుదిరిగి పారిపోయారు. అలా పరిగెత్తుతూ అందరూ ఒకచోట చేరారు. ఎదురుగా శిశుపాలుడు భార్యను పోగొట్టుకున్నవానివలె వేడి నిట్టూర్చులు విడుస్తున్నాడు. 

అతనిముఖం వాడిపోయి ఉంది. అలా ఉన్న శిశుపాలుని చూచి, తక్కినరాజులు శత్రువులచేతిలో పడకుండా ప్రాణాలతో బతికే ఉన్నావు గదా అని ఓదార్చారు.

అని ఈ విధంగా చెప్పినతర్వాత మళ్లీ ఇలా

చేదిరాజా శిశుపాలా! శరీరంలో ప్రాణాలంటూ ఉంటే ఎలాగోలా బతకవచ్చు. బతుకు కలిగిందంటే భార్య ఎక్కడో ఒకచోట దొరకక పోదు. నీవు బతికావు. ఇక నీ భార్య ఎక్కడుందన్న విషయం దేవుడికి తెలుసు. నీవు చింతించడం వద్దు వద్దు.

శిశుపాలా! వినుమని జరాసంధుడు ఇలా చెప్పాడు. మానవుడు తన ఇష్టాలను తానే తీర్చుకోదగినవాడు కాడు. కీలుబొమ్మల్ని ఆడించే తన చేతిలోని బొమ్మను ఆడించినట్లు ఈశ్వరుడు జీవుణ్ణి ఆడిస్తుంటాడు. ఒకసారి సంతోషిస్తాడు. మరోసారి దుఃఖిస్తాడు. ఇదంతా దైవం ఆడించేఆట.

ఇదివరలో నేను మథురానగరంపై పదిహేడుసార్లు దాడిచేశాను. ఏమయింది? శ్రీకృష్ణుడిచక్రాయుధం దెబ్బకు నా సమస్త సైన్యం నేలకూలింది. బలరాముడికి దొరికిపోయాను. అలా పట్టుపడిన నన్ను దయదలచి ఈ కృష్ణుడు విడిపించాడు.

నేను మళ్లీ ఇరవైమూడు అక్షౌహిణులు సైన్యాన్ని సమకూర్చుకొని పద్దెనిమిదోసారి దండయాత్ర చేశాను. శత్రువులను తరిమి కొట్టాను. గెలుపు సాధించాను. గెలుపు వస్తే పొంగిపోలేదు. ఓడిపోతే కుంగిపోలేదు.

ఈ రోజు మన పరిస్థితిని చూస్తే ఎలా ఉందంటే మన రాజులందరూ మూడోకన్ను ఉన్న ఆ శివునితో కూడి ఎదిరించినా మనం ఓడిపోతాం. అంతేకాదు. కాలం అనేది దైవంచేతిలో ఉంది. కాలంచేత ఈ లోకాలన్నీ తిప్పబడుతుంటాయి. అంతేకాదు.

నేడు ఆ యాదవులకు కాలం అనుకూలంగా ఉంది కాబట్టి, ముల్లోకాల్లోనూ మహావీరులమని పేరుపొందిన మనలను ఈ కృష్ణునిభుజబలంతో గెలువ గలిగారు. ఒకవేళ కాలం మనకు అనుకూలంగా వచ్చిందంటే, సమయం కనిపెట్టి, యుద్ధంలో మనంకూడా శత్రువులను జయించగలం.

ఇది చాలా చిన్నవిషయం. ఈ మాత్రందానికి నీవు మనసులో ఏవేవో సందేహాలు పెట్టుకోడం దేనికి?

ఈ విధంగా జరాసంధుడు, అతని అనుచరులైన రాజులు శిశుపాలుని మనోవేదనను తొలగించి తిరిగి తమతమ దేశాలకు వెళ్లారు. శిశుపాలుడు కూడా తన సైనికులతోపాటు తన నగరానికి వెళ్లాడు. 

ఇంతలో రుక్మిణి అన్న అయిన రుక్మి రాక్షసవివాహపద్ధతిలో తన చెల్లెలైనరుక్మిణిని శ్రీకృష్ణుడు అలా తీసుకుపోవడం ఓర్చుకోలేక ఒక అక్షౌహిణీసైన్యాన్ని తీసుకుని యుద్ధప్రయత్నంతో శ్రీకృష్ణుణ్ణి వెంబడిస్తూ తన సారథితో ఇలా అన్నాడు.

నేను భీష్మకుడనే మహారాజుపుత్రుణ్ణి. మహాబలవంతుణ్ణి. అలాంటి నన్ను చిన్న పిల్లవానివలె చులకన చేసి, నా చెల్లెలైన రు
క్మిణిని తీసుకుని ఏదో పెద్ద అసహాయశూరునివలె ఈ గొల్లవాడు వెళుతున్నాడు. 

మన రథాన్ని అతని దగ్గరగా పోనివ్వు; పదునెక్కి మెరుస్తున్న ఈ బల్లెములను వరుసగా ప్రయోగించి వాడి పొగరు అణచివేస్తాను. నా ప్రతాపమేమిటో చూపిస్తాను.

శ్రీకృష్ణునిశక్తిని తెలుసుకోలేక రు
క్మి సారథిని గద్దించి శ్రీకృష్ణునికి దగ్గరగా తనరథాన్ని తోలింపజేసి 'ఓ గోవులను కాచుకునేవాడా! వెన్నను దొంగిలించేవాడా! ఒక్కనిమిషం పాటు ఆగాగు' అని నిర్లక్ష్యంగా పలికి బలమైన తన ధనుస్సుకున్న అల్లెత్రాటిని లాగి మూడు పదునైన బాణాలను ప్రయోగించి శ్రీకృష్ణుణ్ణి బాధిస్తూ ఇలా అన్నాడు.

మా చెల్లెలిని తీసుకు పోవడానికి నీవు మాతో తులతూగ గలిగిన వాడివా? నీ వెంతమాత్రపువాడివి? నీ వంశమేది? ఎక్కడ పుట్టావు? ఎక్కడ పెరిగావు? నీ నడవడిక ఎలాంటిదో? ఎవ్వరికీ తెలియదు. నీకు మాన మర్యాదలు లేవు. మోసం చేసిగాని ఎదుటపడవు. 

నీ శత్రువులమీదికి నీ అసలు రూపంతో వెళ్లవు. (అన్నీ మారువేషాలే అని అర్ధం). నీవు రాజువు కావు. వావివరుసలు లేవు. మా అమ్మాయిని తిరిగి ఇవ్వు. నీవు గణాలు లేనివాడవు. మా పాపను వదిలిపెట్టు. అలా వదలకపోతే ప్రళయకాలంలోని అగ్నిజ్వాలలతో సమానమైన వాడిబాణాలతో యుద్ధరంగంలో నీ గర్వాన్నంతటినీ హరించి వేస్తాను.

రుక్మి ఇలా మాట్లాడుతుండగానే గోవర్ధనగిరినెత్తిన శ్రీకృష్ణుడు నవ్వాడు. ఒకే ఒక్కబాణంతో అతని ధనుస్సును ముక్కలు చేశాడు. ఆరు బాణాలు వేసి, అతని శరీరంలోంచి దూసుకుపోయేలా చేశాడు. ఎనిమిదిబాణాలతో రథానికి కట్టిన గుర్రాలను కూల్చేశాడు. 

రెండు బాణాలు వేసి రథాన్ని నడిపేవాడిని చంపేశాడు. మూడు బాణాలు వేసి రథంపై ఉన్న పతాకను కూల్చాడు. రుక్మి ఇదంతా చూచి, మరో విల్లు అందుకున్నాడు. అలా అందుకోగానే శ్రీకృష్ణుడు దాన్ని ముక్కలు చేశాడు. రుక్మి మళ్లా ఇంకొక ధనుస్సును చేతపట్టాడు.

శ్రీకృష్ణుడు దాన్నికూడా విరిచేశాడు. ఇలా వరుసగా ఇనుపగద, అడ్డకత్తి, శూలం, డాలు, కత్తి, శక్తి, తోమరం వంటి ఆయుధాలను రుక్మి చేత పట్టుకున్నాడు. అతడు అలా పట్టుకోగానే శ్రీకృష్ణుడు వాటిల్ని ఛిన్నాభిన్నం చేశాడు. అప్పటికీ రుక్మి ఊరుకోలేదు. 

తన రథం దిగి, కత్తి చేతిలో పట్టుకుని శ్రీకృష్ణుని పైకి దూకాడు. పెద్ద పెద్ద జ్వాలలతో అడవి అడవంతా మంటలతో ఎగసి పడుతూంటే - ఆ మంటల మీదికి ఒక మిడుత దాడి చేస్తే ఎలా ఉంటుందో - రుక్మి శ్రీకృష్ణునిపై దూకడం అలా ఉండింది. 

అలా వస్తే - శ్రీకృష్ణుడు అతడి కత్తినీ, కవచాలనూ పొడిపొడి చేశాడు. తన కత్తి తళతళ మెరుస్తూండగా, సర్రున పైకి లాగి రుక్మి కళ్లముందు ఝళిపించాడు. అతడితలను నరుకుతా నని ముందుకు నడిచాడు. అలా నడుస్తూన్న శ్రీకృష్ణునికి రుక్మిణి అడ్డు వచ్చింది. 

శ్రీకృష్ణుని పాదారవిందాలను పట్టుకుని ఇలా ప్రాధేయపడింది.

గొప్పవాళ్ల చేత పొగడబడిన శాశ్వతమైన కీర్తివల్ల వెలుగొందుతున్నవాడా! లోకాలకన్నిటినీ బ్రోచేవాడా! ఏ దిక్కూలేనివారికి దిక్కయినవాడా! దయకు నెలవైనవాడా! సర్వాధికారివి, దేవతలకే దేవుడవు అయిన నిన్ను ఎంతటివాడివో నిశ్చయించుకోలేక నేడు మా అన్న రు
క్మి నీ పట్ల ఎంతో అపచారం చేశాడు. నన్ను దయతో మన్నించి మా అన్నను రక్షించు;

నాథా! సర్వశక్తిమంతుడా! రు
క్మి చేసినపనిలో తప్పులేదని నేను విన్నవించుకోవడం లేదు. ఇతడు దుర్మార్గుడే! కానీ, ఇతణ్ణి చంపితే, మా అమ్మానాన్నలకు కొడుకు పోయాడన్న దుఃఖం కలుగుతుంది. సర్వశక్తి సంపదలూ కలిగిన శ్రీమహావిష్ణువు అల్లుడు అయ్యాడన్న సంతోషంకంటె వారిని పుత్రశోకం కృశింప చేస్తుంది.

అని ఈ విధంగా బొంగురుపోతున్న గొంతుతో రు
క్మిణి ప్రార్థించింది. ఆమె కృష్ణునితో మాట్లాడ్డానికి గొప్పభయంతో ఉంది. ఒళ్లంతా గజగజ వణుకుతున్నది. తల వంచుకుంది. ముఖం వాడిపోయి ఉంది. మాటాడుతూంటే, చెవులమీదనుంచి జడపాయ జారుతున్నది. 

రెండుకళ్లలో కన్నీరు ఉబుకుతున్నది. ఇలాగ ఆ కన్యాతిలకమైనరుక్మిణి - శ్రీకృష్ణునికి నమస్కరించింది. అపుడు తేజోమూర్తి అయిన విష్ణువు ఆమె విన్నపాన్ని మన్నించి రుక్మిని చంపకుండా వెనుతిరిగాడు.

ఇలా రు
క్మిణి ప్రార్ధనను విని, శ్రీకృష్ణుడు రుక్మిని చంపకుండా వదిలేశాడు. 'బావా! ఇటు రా అని చిరునవ్వు నవ్వుతూ దగ్గరికి తీసుకున్నాడు. అతణ్ణి పట్టుకుని బంధించాడు. ఒక పదునైన కత్తిలాంటి బాణాన్ని తీసుకున్నాడు. అతడి మీసాలు, గడ్డం, తలవెండ్రుకలను పాయలు పాయలుగా గొరిగి వికారరూపుణ్ణి చేశాడు. 

ఆ సమయంలో శత్రు సైన్యాన్ని తరిమేసిన యాదవవీరులు శ్రీకృష్ణుని దగ్గరికి వచ్చారు. అప్పుడు బలరాముడు జీవచ్చవమై బంధింపబడి ఉన్న రుక్మిని చూచి దయతో అతడికట్టుతాళ్లను విప్పించి శ్రీకృష్ణుని దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు.

మహాత్ముడైన శ్రీకృష్ణా! భీష్మకుని కొడుకైన ఈ రు
క్మిని 'తొలగిపో' అని చెప్పకుండా తలనూ, మూతినీ గొఱగడం ఏమైనా బాగుందా? బంధువైనవాడి తలనూ, మూతినీ గొరగడం తలనరకడం కంటె నీచాతినీచం కదా!

ఆదిమధ్యాంతరహితా! శ్రీకృష్ణా! నీకు అందరూ సమానులే. వీడు శత్రువని హాని కలిగించవు. మరొకడు మిత్రుడని మంచిని చేకూర్చవు. అంతటా సమదృష్టితోనే ఉంటావు. ఇది సత్యం. అలాంటి నీవు మరి ఈ రు
క్మి విషయంలో ఎందుకు భేదబుద్ధిని చూపావు?

సహోదరుని భంగమునకు ఖిన్నయగు రుక్మిణీదేవిని బలభద్రుం డూరార్చుట


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Rukminidevi Anidyothanuniki Namaskarinchuta - రుక్మిణీదేవి అగ్నిద్యోతనునికి నమస్కరించుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము - 
రు
క్మిణీదేవి అగ్నిద్యోతనునికి నమస్కరించుట

బ్రాహ్మణవంశానికే రత్నంవంటివాడా; నీ బంధువులపాలిటి చింతామణివంటివాడా! పద్మాలవంటికండ్లున్న శ్రీకృష్ణునికి నా సందేశాన్ని వినిపించి; ఆయనను వెంట తీసుకుని వచ్చావు. నా మనసులోని మాటను కృష్ణునికి చెప్పి నన్ను ప్రాణాలతో నిలబెట్టావు.

నీ దయవల్ల నేను బతికాను. నీలాంటి పుణ్యాత్ములెక్కడైనా ఉంటారా! ఇంత సహాయంచేసిన నీకు నేను ఎలాంటి ఉపకారాన్నీ తిరిగి చేయాలో? నాకు తెలియడం లేదు, కృతాజ్ఞలాగా రెండు చేతులూ చేర్చి నమస్కరిస్తాను.

ఇలా పలికి రుక్మిణి చేతులు జోడించి నమస్కరించింది. తర్వాత, ఆమెతండ్రి భీష్మకుడు తనకూతురు పెళ్లికి బలరామకృష్ణులు వచ్చారని విన్నాడు. వెంటనే మంగళవాద్యాలధ్వనులతో వారికి ఎదురుగా వెళ్లి, ఆహ్వానించాడు. వారికి మధుపర్కం సమర్పించి గౌరవించాడు. 

వాళ్లకు వస్త్రాలూ, నగలూ కానుకలుగా ఇచ్చాడు. బంధువులతోనూ, సైన్యంతోనూ వచ్చిన ఆ బలరామకృష్ణులకు అన్నిరకాల సౌకర్యాలతోనూ ఉన్న విడిదిగ్భహాలను ఏర్పాటు చేశాడు.

ఇలాగే ఈ ఉత్సవానికి ఎందరో రాజులు వచ్చారు. వాళ్లు వయసులోనూ, ప్రతాపంలోనూ, శక్తిలోనూ, ధనసంపదలలోనూ గొప్పవాళ్లు. కనుక వాళ్ల వాళ్ల హోదాలకు తగిన రీతిలో, రాజు అన్ని పదార్థాలను ఇప్పించి, వాళ్లను గౌరవించాడు. 

ఇంతలో పెళ్లికి శ్రీకృష్ణుడు వచ్చాడనే వార్త విదర్బనగరప్రజలకు తెలిసింది. ఆయన్ను చూడాలని వాళ్లు వచ్చారు. తమ కళ్లు అనే దోసిళ్లతో ఆయన ముఖపద్మంలోని మకరందాన్ని ఆస్వాదిస్తూ (వాళ్లు ఇలా అన్నారు.)

చక్రాన్ని ఆయుధంగా కల ఈ శ్రీకృష్ణుడు విదర్భరాజకుమారికి తగినవాడు. అలాగే విదర్భరాజపుత్రికూడా శ్రీకృష్ణునికి సరైన జోడు. భార్యభర్తల జత ఇంత అందంగా ఉంటుందా? 

ఈ ఇద్దరినీ జతకూర్చిన బ్రహ్మ మంచినేర్పరి కదా! శత్రువుల గర్వాన్ని అణచివేసి, శ్రీ కృష్ణుడు ఈ అందాలరాశికి మగడు కావాలి. మా పుణ్యఫలంవల్ల వీరిద్దరూ దంపతులు అగుదురుగాక!

(జనం వచ్చింది శ్రీకృష్ణుణ్ణి చూడాలని. కానీ చూస్తున్నది రుక్మిణీ కృష్ణులను. ఎంత మంచిజంట అంటున్నారు. పైగా ఇలాంటి జంటను కూర్చిన బ్రహ్మ 'నేర్పరి' అంటున్నారు. వీళ్లపెళ్లి మా పుణ్యఫలం. ఈ వేడుకను చూడడం మా భాగ్యం అనుకోవడంలో భక్తి, ప్రేమలు పెనవేసుకున్నాయి.)

ఈ విధంగా అందరూ అన్నారు. ఆ సమయంలో

పెళ్లిమంటపంనుంచి రుక్మిణి బయలుదేరింది. ఊరిబయట ఉన్న పార్వతీదేవిఆలయానికి వెళుతూంది. ఎలాంటి ప్రమాదపరిస్థితి ఎదురైనా సరే, ఎదుర్కొని పోరాడడానికి ఆమెకు రక్షణగా చాలమంది భటులు బయలుదేరారు. వాళ్ల చేతుల్లో రకరకాల ఆయుధాలు ఉన్నాయి.

ఇంతటి రక్షణమధ్య, ముందువైపు గుంపులుగా వేశ్యలు వెళ్తున్నారు. వాళ్ల చేతుల్లో నైవేద్యాలు, ముడుపులు ఉన్నాయి. వాళ్ల అలా వెళ్తుండగా, బ్రాహ్మణసువాసినులు పూలు, గంధం, మంచి వస్త్రాలు, నగలు కలిగినవాళ్లై, మంగళప్రదమైన పాటలుపాడుతూ నడిచారు. 

ఉడుక, మద్దెల, శంఖం, తప్పెట, బాకా, పిల్లనగ్రోవి, భేరి మొదలైన వాద్యాల ధ్వనులు హోరెత్తించి, ఆకాశమంతా అలముకున్నాయి. చెలికత్తెలు తనను సేవిస్తుండగా, తనను పెంచిన తల్లులు, బంధువుల భార్యలు వెంటరాగా నుదుట ముంగురులతో కన్యరుక్మిణి పార్వతీదేవికి మొక్కడానికి వినయంగా అంతఃపురంనుండి వెడలి నడిచింది. ఆ రుక్మిణి నుదురును ముంగురులు కప్పేస్తున్నాయి.

రుక్మిణీదేవి గౌరీఆలయానికి వస్తూ ఉంది. ఆమెవెంట సూతులు, వందిమాగధులు, గాయకులు, పాఠకజనం వస్తున్నారు. వాళ్లు ఆమె వంశకీర్తినీ, ప్రతాపాన్ని వంశాన్ని గురించి ప్రశంసిస్తున్నారు. అలా అందరూ వెంటవస్తూ ఉండగా ఆమె నెమ్మదిగా నడుస్తూన్నది. 

శ్రీకృష్ణునిపాదకమలాలను మనసులో స్మరిస్తూ పార్వతిదేవిగుడికి చేరింది. కాళ్లూ చేతులా నీటిధారలతో శుభ్రం చేసుకున్నది. ఆచమనం చేసి శుచియై గౌరీదేవిదగ్గరకు వెళ్లింది. అపుడు బ్రాహ్మణ ముత్తైదువలు శివునితో కూడిన పార్వతికి అభిషేకం చేయించారు. 

గంధాక్షతలను సమర్పించారు. వస్త్రాలతో, పుష్పాలతో, నగలతో అలంకరింపజేశారు. ధూపదీపాలను ఇచ్చారు. రకరకాలైన నైవేద్యాలను నివేదింపజేశారు. కానుకల అర్పించారు. దీపమాలికలతో హారతులెత్తినారు. పిదప రుక్మిణీదేవితో దుర్గాదేవికి మొక్కింపచేశారు. అప్పుడు

నమ్మితి నా మనంబున సనాతనులైన యుమామహేశులన్ 
మిమ్ముఁ బురాణదంపతుల మేలు భజింతు గదమ్మ! మేటి పె
ద్దమ్మ దయాంబురాశివి గదమ్మ హరిం బతి సేయు మమ్మ నిన్
నమ్మినవారి కెన్నడును నాశము లేదు గదమ్మ యీశ్వరీ 

సర్వశక్తిమంతురాలివైన గౌరీదేవి! ఎప్పటికీ ఉండే పురాతనదంపతులైన ఉమామహేశ్వరులు మీరు. మిమ్ములను పూజిస్తున్నాను. అమ్మా! మంచి చేకూర్చు. నీవు అందరికీ పూజనీయురాలివి. దయకు సముద్రంలాంటి దానివి కదమ్మా! శ్రీకృష్ణుణ్ణి నాకు భర్తగా చేయమ్మా! నిన్ను నమ్ముకున్నవారికి నష్టమనేది లేదుకదమ్మా!

('సదాభవః సదాతనః సనాతన శ్చ' - నాశనం లేనిది సనాతనం. సనాతునులైన ఆదిదంపతులు పార్వతీపరమేశ్వరులు. వారిని ప్రార్థిస్తున్న, రు
క్మిణి. 'ఉమా' శబ్దప్రయోగంతో తనను రక్షించుమని వేడుకుంటున్న. 'అవతీత్యుమా' రక్షించేది ఉమ. పద్యమంతటా 'అమ్మా' అని పిలుస్తున్నట్లే ఉంది. పైగా ప్రాసాక్షరం ద్విత్వమకారం కావడంతో శిశువు తల్లి వెంటబడి వెళుతూ 'అమ్మా అమ్మా' అని వేడుకుంటున్నట్లే ఉంది.)

ఈ విధంగా పలికి, పార్వతీదేవికి ఆమె మొక్కింది. ఆ తర్వాత పతీసమేతంగా ఉన్న బ్రాహ్మణముత్తెదువలకు ఉప్పుతోకూడిన పిండివంటలు, తాంబూలం, మెడలో వేసుకునే పసుపు దారాలూ, చెఱకుగడలు ఇచ్చి, రుక్మిణీదేవివాళ్లను భక్తితో పూజించింది.

ఆ ముత్తెదువలు సంతోషంతో పొంగిపోయారు. మనసారా దీవించారు. అక్షతలు వేశారు. రుక్మిణీదేవి తన తలపై అక్షతలను ధరించి, పరమశివునిసతి పార్వతిదేవికి మొక్కింది. మౌనవ్రతాన్ని చాలించి మందిరంనుండి బయటకు వెళ్లింది.

ఈ విధంగా వస్తున్న రు
క్మిణి మేఘాల మధ్యనుండి వెలువడిన తొలకరి వర్షాకాలపు మెరుపుతీగలా మెరుస్తున్నది. చంద్రబింబంనుండి బయటికి వచ్చి తిరుగుతున్న జింకవలె ఉంది. బ్రహ్మదేవుడు అనే నటుడు నాటకరంగంలోని తెర పైకి ఎత్తితే రంగంమీద ప్రత్యక్షమైన మోహినీదేవతవలె ఉంది.

దేవతలు, రాక్షసులు ఒకానొకప్పుడు మందరపర్వతాన్ని కవ్వంగా చేసుకుని, వాసుకి అనే పామును తాడుగా చుట్టి అటూ ఇటూ లాగి పాలసముద్రాన్ని చిలికారు. ఆ సమయంలో ఘుమఘుమ అని శబ్దం చేస్తున్న సముద్రంనుండి పుట్టిన లక్ష్మీదేవిలా ఉంది - రుక్మిణి. రకరకాల నగలు ధరించి రుక్మిణి ప్రకాశిస్తూంది. 

మెల్లగా గౌరీదేవ్యాలయంనుండి బయటికి వచ్చింది. మానససరస్సులో బంగారు తామరపూల మధ్య విహరిస్తున్న రాజహంసలా ఉంది. పసిడికుండలజంటను పోలిన కఠిన వక్షోజాల బరువుతో ఆమె నడుము వణకిపోతున్నది. ఆమెచేతులకు ఉంగరాలున్నాయి, వాటిపై రత్నాలు పొదగబడి ఉన్నాయి.

అలాంటి ఎర్రటిచేతులతో ఒక ఇష్టసఖిచేతిని ఆసరాగా పట్టుకుంది. రుక్మిణిచెవులకు బంగారు లోలాకులున్నాయి. వాటివెలుగులకిరణాలు ఆమెచెక్కిళ్లపై పడి మెరుస్తున్నాయి. ఉంగరాల ముంగురులు ఆమెముఖంమీద తారాడుతున్నాయి. అది పద్మాలపరిమళాల పై ఆసక్తితో గండుతుమ్మెదలు మూగుతున్నట్లుంది. ఆమె అందంగా చిరునవ్వు నవ్వుతున్నది. 

ఆ నవ్వుల వెలుగులు దిక్కులంతటా లేత వెన్నెలకాంతులతో నింపుతున్నాయి. ఆమెపెదవులు దొండపండ్లవలె ఎర్రగా ఉన్నాయి. పలువరుస మొల్లమొగ్గల్లా ఉన్నాయి. పెదవుల ఎరుపు సోకి పలువరసకు ఎరుపువన్నె కలుగుతోంది. కదులుతున్న పైట మన్మథుని పతాకంలా ఉంది.

మొలనూళ్ల పై ఉన్న మణులు మెరుస్తున్నాయి. ఆ మెరుపులు అకాలంలో హరివిల్లును సృష్టిస్తున్నాయి. మన్మథుడు ఒరనుండి పైకితీసి సానపెట్టిన - మెరుస్తున్న బాణాలవలె ఆమెచూపులు వాడిగా ఉన్నాయి. అవి రాజవీరుల హృదయాలను ముక్కలు చేస్తున్నాయి. కాలిమువ్వలసవ్వడి కమనీయంగా ఉండి, చెవులకు విందు చేస్తున్నాయి. అలా ఉండే ఆమె శ్రీకృష్ణునికోసం ఎదురుచూస్తూ కాలినడకతో వస్తున్నది.

రుక్మిణికురులు తుమ్మెదలవలె నల్లగా ఉన్నాయి. ముఖం చంద్రబింబంలా ఉంది. ఆమెచూపులు జింక చూపులవలె ఉన్నాయి. పెదవి పగడంవలె అరుణవర్ణంలో ఒప్పారుతూ ఉంది. కంఠస్వరం ఆవ్యక్తమధురంగా ఉంది. కొత్త చిగురుటాకులవలె ఆమె పాదాలజంట శోభిస్తున్నది. 

మదించిన ఏనుగుకుంభస్థలాలవలె వక్షోజాలున్నాయి. పిరుదులు ఇసుకతిన్నెలవలె ఉన్నాయి. ఆమెనడకగజరాజగమనాన్ని పోలి ఉంది. చేతులు ఎర్రతామరలను పోలి ఉన్నాయి. ఆమె శరీరంనుండి పద్మాల పరిమళం వెలువడుతున్నది.

ఆమె నడుము సింహం నడుమువలె సన్నగా ఉంది. ఇలాంటి సౌందర్యంతో ఉన్న రుక్మిణిని అక్కడ ఉన్న వారందరూ చూచి ఆశ్చర్య మనస్కులయ్యారు.

అంతేకాదు, ఆ రుక్మిణి చిరునవ్వును, సిగ్గుతోకూడిన చూపులను, చూచి ఆ రాజలోకానికి మనసులు చలించాయి. ధైర్యం జారిపోయింది. తమ పెద్దరికాలను విడిచిపెట్టారు. తాము గొప్పవాళ్లమనే విషయాన్ని మరచిపోయారు. చేతలు ఉడిగిపోయారు. బుద్ది పని చేయలేదు. 

ఆయుధాలను పడేశారు. ఏనుగులను, గుర్రాలను, రథాలను ఎక్కకుండా రాజులందరూ నేలకు వాలారు. ఆ జింక కన్నులవంటి కన్నులున్న రుక్మిణి తన ఎడమచేతి గోళ్లతో ముంగురులను ఎగదోసుకుంటూ, పైటను సవరించుకుంటూ ఆ రాజలోకాన్ని కడగంటిచూపులతో చూస్తూ

రుక్మిణి శ్రీకృష్ణుణి దర్శించింది. ఆయన చంద్రబింబంలాగా చల్లని వెలుగులీనుతున్న ముఖంతో ఉన్నాడు. శ్రేష్ఠమైన సింహం నడుమువంటి సన్నని నడుముతో ఉన్నాడు. క్రొత్తగా అప్పుడే విచ్చుకున్న తామర పూలరేకులవలె ఆయనకళ్లు ఉన్నాయి. ఆయనవక్షం చూడసొంపుగా ఉంది. 

మేఘం వన్నెలాంటి వన్నెతో ఆయన శరీరం ప్రకాశిస్తూంది. కొండలకు శత్రువైన ఇంద్రుని ఏనుగు - ఐరావతంయొక్క తొండంవలె బలిష్ఠంగా శ్రీకృష్ణుడిచేతులు ఉన్నాయి. అతడు చక్రాయుధంతో ఉన్నాడు. 

పసుపుపచ్చని పట్టువస్త్రాన్ని ధరించి ఉన్నాడు. గొప్పనగలతో అలంకరింపబడి ఉన్నాడు. ఆయనకంఠం శంఖంవలె అందంగా ఉంది. గెలుపు సాధించాలనే ఆసక్తితో ఉన్నాడు. ప్రపంచాన్ని సమ్మోహపరుస్తున్నాడు.

శ్రీకృష్ణుడు శత్రురాజులు చూచుచుండ రుక్మిణీదేవిని గొనిపోవుట


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Srikrishnudu Kundina Nagarambunaku Ratharudhudai Chanuta - శ్రీకృష్ణుడు కుండిన నగరంబునకు రథారూఢుడై చనుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము - 
శ్రీకృష్ణుడు కుండిన నగరంబునకు రథారూఢుడై చనుట

అని ఈ విధంగా బ్రాహ్మణునిద్వారా రుక్మిణి చెప్పిపంపిన సందేశాన్ని శ్రీకృష్ణుడు విన్నాడు. అతనిద్వారా ఆమె అందమైన ఆకృతిని, చక్కదనం మొదలైన వివరాలను మనసుపెట్టి తెలుసుకున్నాడు. పిదప తనచేతితో అతని చేతిని పట్టుకొని నవ్వుతూ, ఆ యాదవ శ్రేష్ఠుడైన శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు.

విద్వాంసులచేత ప్రశంసింపబడేవాడా! ఆ కన్య రు
క్మిణిమీద నాకు ఎంతగానో కోరిక ఉంది. రాత్రివేళల్లో ఆమెను గురించి ఆలోచనలతో నిద్రపట్టదు. నా పెళ్లి రుక్మిణితో జరగడాన్ని ఆమెఅన్న రుక్మి ఓర్వలేక నాకు హాని చేయాలని భావిస్తున్నాడు.

ఈ విషయం నాకు ముందే తెలుసు. చెట్టును మధించి కొత్త అగ్నిజ్వాలను పుట్టించి, తెచ్చినట్లుగా ఎదిరించిన శత్రువుల గుంపులను సంహరించి, రుక్మిణిని తీసుకుని వస్తాను.

విదర్భదేశానికి వస్తాను. ఆ దేశాధిపతి అయిన భీష్మకునినగరాన్ని ప్రవేశిస్తాను. అందమైనరీతిలో బాలామణి రుక్మిణిని చిటికెలో తెస్తాను. శత్రువులు అడ్డం వచ్చినట్లతే యుద్ధంలో వాళ్లను ముక్కలు చేస్తాను.

అని చెప్పి, రుక్మిణీదేవి పెళ్లినక్షత్రాన్నీ ముహూర్తసమయాన్నీ శ్రీకృష్ణుడు తెలుసుకున్నాడు. తన సారథి దారుకుణ్ణి రథాన్ని సిద్ధం చేయమని ఆజ్ఞాపించాడు. దారుకుడు శైబ్యం, సుగ్రీవం, మేఘపుష్పం, వలాహకం అనే పేర్లుగల నాలుగు గుర్రాలను కట్టి రథాన్ని సిద్ధం చేశాడు.

దృఢమైన కోరికగల శ్రీకృష్ణుడు, ఆ అగ్నిద్యోతనుడనే బ్రాహ్మణునితో పాటు రథమెక్కాడు. ఒకే రాత్రిలో ఆనర్తకదేశాలను దాటాడు. విదర్భదేశానికి వెళ్లాడు. అక్కడ కుండినమనే నగరానికి భీష్మకుడు రాజు.

అతడు తనకొడుకైన రుక్మిమాటలకు లొంగిపోయి, రుక్మిణిని శిశుపాలునికిచ్చి పెళ్లిచేద్దామనుకుని మంగళప్రదమైన కార్యక్రమాల ప్రయత్నాలను చేయిస్తున్నాడు. ఆ సమయంలో

పెళ్లివేడుకలకై నగరాన్ని అంతా అలంకారం చేశారు. మండపాలు, చిన్నసందులు, రాజమార్గాలు, అంగళ్లుండే ప్రదేశాలు అన్నిటినీ శుభ్రపరిచారు. చందనంనీళ్లతో కళ్లాపి చల్లారు. కలువపూలను దండలుగా కూర్చి తోరణాలుగా కట్టారు. నగరంలోని ఇళ్లన్నిటినీ తీర్చిదిద్దారు.

కర్పూరంతో, కుంకుమతో అలంకరించారు. అగరుపొగలతో పరిమళింప చేశారు. రకరకాల వస్త్రాలతో, రకరకాల పూలమాలలతో అలంకరించుకుని ఆడవాళ్లు, మగవాళ్లు పరిమళాలను అద్దుకుని కనిపిస్తున్నారు. ఎంతో ఇష్టంతో వాద్యాలను మ్రోగిస్తున్నారు. నగరమంతా ఉత్సవంతో అందంగా ఉంది.

తర్వాత భీష్మకుడు శాస్త్రంలో చెప్పినవిధంగా పితృదేవతలకు పూజలు చేశాడు. బ్రాహ్మణులకు భోజనాలు పెట్టించాడు. వారినుండి ఆశీర్వాదాలు గ్రహించాడు. రు
క్మిణీదేవికి తలంటుస్నానం చేయించి ఆమెకు వస్త్రాలు, ఆభరణాలు ఇచ్చి, అలంకరింపచేశాడు. 

ఋక్‌ - యజుస్‌ - సామ - అథర్వణవేదాల మంత్రాలతో శుభకార్యాలు జరిపించి, బ్రాహ్మణులు రక్షలు కట్టారు. పురోహితుడు గ్రహశాంతికోసం పద్ధతిప్రకారం హోమం చేయించాడు. కొత్తదంపతులకు మేలు కలగాలని భీష్మకుడు నువ్వులు, గోవులు, వెండి, బంగారం, వస్త్రాలు మొదలైనవి బ్రాహ్మణులకు దానం చేశాడు.

ఆ సమయంలో విదర్భరాజపుత్రిని చేపడతానంటూ మదోన్మత్తుడైన శిశుపాలుడు భటుల పటాలంతో, తేరులబారుతో, భద్రజాతికి చెందిన కుంజర బృందంతో, కడువడిగా పరుగిడే గుఱ్ఱాల పౌజుతో బంధుమిత్ర సమేతంగా మహాటోపంతో కుండిన నగరానికి వచ్చాడు.

బంధువులతో కలిసి శ్రీకృష్ణుడు, బలరాముడు, వచ్చినా, వాళ్లను పారిపోయేలా తరిమి, నిరాటంకంగా రు
క్మిణిని శిశుపాలుని కిచ్చి పెండ్లి జరిపిస్తామని ఏనుగులు కాల్బలం, గుర్రాలు, రథాలతో కూడిన సైన్యంతో జరాసంధుడు, దంతవక్త్రుడు, సాల్వుడు, విదూరకుడు, పౌండ్రకుడు మొదలైనవాళ్లంతా వచ్చారు.

తర్వాత ఎన్నోదేశాలను పరిపాలిస్తున్న రాజులు చాలమంది వచ్చారు. వాళ్లు శిశుపాలునికి ఎదురుగా వెళ్లి పూజించారు. భీష్మకుడు అతనికి ఒక ప్రత్యేక నివాసస్థానాన్ని ఏర్పరిచి, అక్కడ విడిది చేయించాడు. అంతలో ఆ సమాచారమంతా విని,

'శ్రీకృష్ణుడు ఒంటరిగా వెళ్లాడు. జరాసంధుడు మొదలైనవాళ్లు, శిశుపాలునికి మేలు జరగాలని అతణ్ణి అనుసరిస్తున్న ఎందరో రాజులు వెళ్లారు. కన్యను తెచ్చే చోట యుద్ధం జరగవచ్చు. శ్రీకృష్ణునికి సహాయం కావాలి - అనుకొని వెంటనే బలరాముడు అసంఖ్యాకమైన సైన్యంతో శ్రీకృష్ణుడు వెళ్లినమార్గంలో తానూ వెళ్లాడు

అంతలో రుక్మిణి ఏకాంతమందిరంలో ఆలోచిస్తూంది. విశాలమైన ఆమెనేత్రాలు అటూ ఇటూ చలిస్తున్నాయి. లోకానికి కన్నులాంటివాడైన శ్రీకృష్ణుడు తన సందేశాన్ని తిలకించి తన దగ్గరకు వస్తాడో రాడో అనే సందేహంతో

రేపే ముహూర్తం. పెళ్లికూడా దగ్గరపడింది. ఎందుకు శ్రీకృష్ణు డింకా రాలేదు? మనసంతా కలవరంగా ఉంది. ఈ పెళ్లిగురించి సమాచారాన్ని విన్నాడో లేదో. అగ్నిద్యోతనుడు ఎందుకు ఆలస్యం చేశాడు? నా ప్రయత్నం ఫలిస్తుందో లేక వికటిస్తుందో? బ్రహ్మదేవుని సంకల్పం ఎలా ఉందో!

ఆ మహాత్ముడైన బ్రాహ్మణుడు వెళ్లాడో? లేక నడిదారిలోనే నడచినడచి అలసి ఆగిపోయాడో? లేక బ్రాహ్మణుడు సందేశాన్ని తెలపగానే శ్రీకృష్ణుడు విని తప్పుగా భావించాడో? లేక ఈ పాటికే ఇక్కడికి వచ్చినాడేమో? పరమేశ్వరుడు నాకు అనుకూలం కలిగించాలని తలుస్తాడో? తలచడో? పార్వతీదేవికి నన్ను రక్షించాలని తెలుసునో! తెలియదో! తెలియదు. ఇంతకూ నా అదృష్టం ఎలా ఉందో?

రు
క్మిణి మనసులో సందేహాలూ, విశ్వాసాలూ పెనవేసుకుని ఉన్నాయి. ఔను - కాదుల మధ్య మనసు ఊగిసలాడుతూ ఉంది.

సందేశహరుడైన అగ్నిద్యోతనుడు శ్రీకృష్ణుని దగ్గరకుపోయి ఉండడు అనుకుంటుంది. శ్రీకృష్ణుడుకూడా ఇక్కడికి రాడు అనుకుంటుంది. మళ్లీ ద్వారకకువెళ్లి శ్రీకృష్ణుణి పిలిచే ఆత్మబంధువు ఎవడూ లేడే అనుకుంటుంది. 

నా అన్న రుక్మికి ఈ విషయంలో నీతి, న్యాయం తెలియదు అనుకుంటుంది. చేదిరాజైన శిశుపాలునికి నన్ను ఇస్తానని ఉన్నాడు - అనుకుంటుంది అయ్యో! సర్వశక్తి స్వరూపిణి అయిన పార్వతికి కూడా నా పైన ఈ రోజు దయలేదు - అనుకుంటుంది.

రు
క్మిణి తనమనసులోని చెలరేగే వేదనను తల్లికికూడా చెప్పుకోదు. దిక్కులలో చిరునవ్వు వెన్నెల నింపదు. తన ముఖం నుండి వెలువడే పరిమళానికి తుమ్మెదలు మూగుతున్నా వాటిని తోలదు. నిద్రపోదు. వక్షంపై హారాలు ఒకదానిపై ఒకటి పెనవేసుకుని ఉన్నా వాటిని సరిచేసుకోదు. శ్రీకృష్ణుడు వస్తాడని ఎదురుచూచే దారిపై నిలిపిన తన చూపును మాత్రం ఎప్పటికీ పక్కకు తిప్పదు.

ఈ వేదనవలన రు
క్మిణికళ్లలో కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి. వాటిని తుడవనైనా తుడవదు. కొప్పు సవరించుకొని సరిగా ముడవదు. తన ఇష్టసఖిని కలిసి ఏదో సరససల్లాపాలకైనా వెళ్లదు. ఏ మాత్రంకూడా అన్నం తినదు. నీళ్లుకూడా తాగదు. ప్రియమైన రామచిలుక వద్ద చేరి, పద్యాన్ని చెప్పించదు. వీణతీగను మీటి వినోదించదు. ఎవరివద్దకూ వెళ్లదు.

పరిమళించే వనమాలను ధరించిన శ్రీకృష్ణుడు కొంచెమైనా న్యాయం లేకుండా నన్ను ఆదరించి దయచూపకుండా ఉన్నాడే! నన్ను చేపట్టడానికి రాడే! అని రుక్మిణి వేదనపడుతూ ఉంది. 

సింహంనడుమువంటి సన్నని నడుముగల ఆమె కస్తూరి పూసుకోవడం లేదు. పద్మంవలె పరిమళించే ఆమె జలకాలాడడం లేదు. అద్దంవంటి ముఖం కల ఆమె అద్దం చూడడం లేదు. పూలవంటి సున్నితమైన శరీరమున్న స్త్రీ ఆమె పూలను పెట్టుకోడం లేదు. 

కలువపూలవంటి కండ్లున్న ఆ రుక్మిణి వనవిహారం చేయడం లేదు. హంసవలె ఒయ్యారంగా నడిచే ఆమె హంసలను చేరదీయడం లేదు. తీగవలె నాజూకైన శరీరంకల ఆమె తీగలను పెంచడం లేదు. నగలకే నగవంటి ఆమె ఏ నగనూ పెట్టుకోవడం లేదు. 

తిలకం పెట్టుకునే స్త్రీలందరికీ తిలకంవంటి ఆమె నొసట తిలకం పెట్టుకోదు. పద్మాలవంటి చేతులున్న ఆమె కమలాలతో ఉన్న కొలనులోకి ప్రవేశించదు.

ఇంకా

రుక్మిణీదేవి మన్మథాగ్నిజ్వాలల్లో తపించిపోతున్న శరీరంకలదై - సుకుమారంగా, నెమ్మదిగా వీస్తున్న చల్లగాలికి ఆమె దూరంగా తొలగిపోతూంది. మత్తెక్కిన తుమ్మెదలు ఝంకారాలతో తిరుగుతూంటే, పక్కకు వెళ్లిపోతుంది. కోయిల కూతకు కోపగించుకుంటుంది. రామచిలుకలనుంచి ముద్దుమాటలు పుట్టుకొస్తూంటే మదనవేదనతో ఉలికిపడుతుంది. వెన్నెల వేడికి అలసిపోతుంది. చిరుమామిడికొమ్మల లేతనీడలకు దూరంగాపోతుంది.

రుక్మిణి ఈ విధంగా విచారిస్తూ ఉంది. శ్రీకృష్ణుడు ఎపుడు వస్తాడా అని ఎదురుచూస్తూ ఉంది. ఏ పని చేయడానికే ఆమెకు ఆసక్తి లేదు. మనసులో మదనాగ్ని చెలరేగుతూ ఉంది. ఆమె దుఃఖపడుతూ ఉంది. అలాంటి స్థితిలో ఆమెకు మంచివార్తను చెప్పే విధంగా ఎడమకన్ను ఎడమభుజం అదిరాయి. 

అంతలో శ్రీకృష్ణుడు ఆనతిచ్చిన రీతిలో అగ్నిద్యోతనుడు తిరిగి వచ్చాడు. అతనిముఖలక్షణాలను గమనించింది - రుక్షిణి. ఆ లక్షణాలు తనకు శుభాన్ని చెపుతున్నాయి. మధురమైన కంఠస్వరంగల రుక్మిణి శ్రీ కృష్ణుణ్ణి ఎప్పుడు చూస్తానా అనే అడ్డుతొలగడంతో ముఖంలో చిరునవ్వు చిందులాడగా ఆ బ్రాహ్మణునికి ఎదురువెళ్లి నిలబడింది. అపుడు ఆ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు.

అమ్మాయీ! సుదర్శనచక్రాన్ని ఆయుధంగా కల్గిన శ్రీకృష్ణుడు అదిగో తానే వచ్చాడు. నీ ఉత్తమగణగణాలను మెచ్చాడు. నాకు అంతులేని ధనరాసులను కూడా ఇచ్చాడు. 

దేవతలూ, రాక్షసులూ నిరోధించినా అతనికి లెక్కలేదు. రాక్షసవివాహపద్ధతిలో నిన్ను తీసుకొనిపోతాడు. నీ మంచివ్రవర్తన, నీ అదృష్టం అన్నీకూడా నేటికి ఫలించాయి.

అలా అగ్నిద్యోతనుడు అన్న మాటకు విదర్భరాజపుత్రి అయిన రుక్మిణి ఇలా అంది.

రుక్మిణీదేవి అగ్నిద్యోతనునికి నమస్కరించుట


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Pradyumna Kumara Charitra Prarambhamu - ప్రద్యుమ్న కుమార చరిత్ర ప్రారంభము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం -  ప్రద్యుమ్న కుమార చరిత్ర ప్రారంభము పూర్వం నారాయణాంశ ఉన్నప్పుడే మన్మథుడు శివునికంటిమంటల్లో భస్మమయ్యా...