Friday, August 28, 2026

Hayagriva Jayanthi - హయగ్రీవ జయంతి

హయగ్రీవ జయంతి

శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారం దాల్చిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆయనకు కృతజ్ఞతగా జరుపుకునే విశేషమైన పండుగ హయగ్రీవ జయంతి.

శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారం ధరించడానికి ముఖ్య కారణం, వేదాలను బ్రహ్మకు తిరిగి అప్పగించడానికి. 

పూర్వం ఒకనాడు వేదాలు రాక్షసులచే బలవంతంగా అపహరించబడినవి. వేదాలను రక్షించడానికి శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారంలో వెళ్లి రాక్షసులను సంహరించి  తిరిగి బ్రహ్మకు అప్పగించాడు. హయగ్రీవుడిని జ్ఞానానికి అథిపతిగా పూజిస్తారు.  శ్రావణ మాసం పూర్ణిమ నాడు హయగ్రీవ అవతారం దాల్చాడు కాబట్టి ఆరోజు హయగ్రీవ జయంతిగా జరుపుకుంటారు.

హయగ్రీవ జయంతి ప్రాముఖ్యత:
హయగ్రీవుని స్వరూపం విశిష్టమైనది. అతని శిరస్సు గుర్రం లేదా హయం ఆకారంలో ఉంది. అందుకే హయగ్రీవుడు అని పిలువబడ్డాడు. అనేక ప్రాంతాలలో, హయగ్రీవడు చెడును నిరోధించడానికి కాపలాగా నిలిచే సంరక్షక దేవత. ఈ అవతారంలోని గుర్రపు తల ఉన్నత విద్య మరియు జ్ఞానానికి ప్రతీక. హయగ్రీవుని ఆశీస్సులు మనకు ఉన్నత శిఖరాలను పొందడంలో సహాయపడతాయి.

పురాణం:
పురాణాల ప్రకారం, హయగ్రీవుడు మరియు అతని రూపానికి సంబంధించి రెండు ఇతిహాసాలు ఉన్నాయి. మహాభారతంలోని శాంతి పర్వాలు మరియు పురాణాలు హయగ్రీవుని అవతారం గురించి ప్రస్తావించాయి. 

పురాణాల ప్రకారం, కశ్యప ప్రజాపతి కుమారుడు హయగ్రీవుడు తీవ్రమైన తపస్సు చేసి దుర్గాదేవి నుండి వరం పొందాడు, ఏ వ్యక్తి లేదా దేవుడు తనను ఓడించలేడు, అంతేకాక తనని మరొక హయగ్రీవుడు మాత్రమే ఓడించగలడు.

తరువాత, హయగ్రీవుడు తన శక్తిని దుర్వినియోగం చేయడం ప్రారంభించాడు. ప్రపంచ వ్యాప్తంగా వినాశనం మొదలైంది. యుద్ధభూమిలో దేవతలు హయగ్రీవుడిని ఓడించలేకపోయారు. అది చూసి శ్రీమహావిష్ణువు అలసి పోయి తన విల్లుపై తల వంచాడు. 

దురదృష్ట వశాత్తు తీగ తెగడంతో, విష్ణువు తల అతని శరీరం నుండి వేరు చేయబడింది. దేవతలు భయంతో వణికిపోయారు, కానీ దుర్గాదేవికి మాత్రమే కారణం తెలుసు. కావున, విష్ణువు శరీరానికి గుర్రం తలను అతికించమని ఆమె బ్రహ్మను కోరింది.

శ్రీమహావిష్ణువుకు హయం శిరశును అతికించడంతో శ్రీమహావిష్ణువు హయగ్రీవ రూపంలో హయగ్రీవ రాక్షసుని సంహరించి లోకాలను ఉద్దరించాడు.

మరొక పురాణంలో, హయగ్రీవుడు మధు, కైటభ అనే రాక్షసులచే దొంగిలించబడి, నీటిలో లోతుగా ఉంచబడిన వేదాలను తిరిగి పొందడానికి శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారం తీసుకున్నాడు. 

ఒకనాడు సృష్టి చేసి అలసిన బ్రహ్మదేవుడు నిద్రిస్తున్న సమయంలో మధు, కైటభ రాక్షషులు వేదాలను దొంగిలించారు. వేదాలను రక్షించడానికి విష్ణువు హయగ్రీవ అవతారాన్ని స్వీకరించాడు. అందుకే, హయగ్రీవ అవతారం  జ్ఞానంతో ముడిపడి ఉంది.

ఈనాటి ఆచారాలు:
హయగ్రీవుడు మానవ శరీరం, గుర్రం శిరస్సు, తెలుపు రంగు, తెల్లని దుస్తులు ధరించి, తెల్లని తామరపై కూర్చున్న విష్ణువుగా దర్శనమిస్తాడు.

ఈనాడు యజుర్వేద ఉపాకర్మ(అవని అవిట్టం) హయగ్రీవ జయంతి రోజున జరుపుకుంటారు.

అంతేకాక పాత యజ్ఞపవితము విసర్జించి నూతన యజ్ఞోపవీతం ధరిస్తారు. కావున, ఈరోజును జంధ్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు. 

ఈ రోజున గాయత్రీ దేవిని పూజిస్తారు. విద్యార్ధులు విజ్ఞానం మరియు జ్ఞానాన్ని పొందేందుకు హయగ్రీవుడిని ఆరాధిస్తారు. 

అస్సాంలోని హోజోలోని హయగ్రీవ దేవాలయం మరియు చెన్నైలోని నంగనల్లూర్ లోని హయగ్రీవ మాధవ దేవాలయం అని పిలువబడే హయగ్రీవ ఆలయంలో గొప్ప వేడుకలు జరుపుకుంటారు.

హయగ్రీవుడు

Thursday, August 27, 2026

Srikrishnudu Uddhavuni Yalochana Choppuna Dharmaraju Paliki Bovuta - శ్రీకృష్ణుడు ఉద్ధవుని యాలోచన చొప్పున ధర్మరాజు పాలికి బోవుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
శ్రీకృష్ణుడు ఉద్ధవుని యాలోచన చొప్పున ధర్మరాజు పాలికి బోవుట

పురుషశ్రేష్ఠుడా! గొప్పతెలివితేటలతో పదిమంది మెచ్చుకొనేవిధంగా మాటల నేర్పు పుష్కలంగా ఉన్న ఉద్ధవా! శ్రేష్ఠులైన పెద్దలు అంగీకరించే విధంగానూ, వాళ్లు మెచ్చుకొనేరీతిలోనూ కార్యం ఎలా నడపాలో దాన్ని చెప్పవయ్యా!

పుణ్యచారిత్రుడవై కొనియాడదగిన నడవడి గలవాడా! ఉద్ధవా! నీవు మాకు రెండు కన్నులవంటివాడివి. కాబట్టి నీవు చెప్పిన పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. చేయవలసిన పని చెప్పు.

ఈ విధంగా సర్వమూ తెలిసిన శ్రీకృష్ణుడు ఏమియు తెలియనివాడిలాగా ఉద్ధవుణ్ణి అడగ్గా ఉద్ధవుడు శ్రీకృష్ణుని మాటలకు ఆనందించి ఆ స్వామి పాదపద్మాలు మనస్సులో నిలుపుమని - పెద్దలందరూ మెచ్చే ఆలోచనను చెబుతాను విను. 

ఓ శ్రీకృష్ణా! నారదమహర్షి చెప్పినట్లు నీ ప్రియభక్తుడైన ధర్మరాజు చేసే రాజసూయయాగాన్ని రక్షించటం ముఖ్యకర్తవ్యం. రాజసూయయాగంలో అన్నిదిక్కుల్నీ జయించదం ప్రధానకార్యంగా ఉంటుంది. కాబట్టి, ఆ దిగ్విజయసందర్భంలోనే జరాసంధుణ్ణి సంహరించి వాని చెరలో నున్న రాజుల్ని విడిపించడం కూడా సమకూడుతుంది. పదివేలయేనుగుల బలమూ; నూరు అక్షౌహిణుల సైన్యమూ గల జరాసంధుణ్ణి జయించడం వాయుపుత్రుడైన మన భీమునికి తప్ప ఇతరులకెవరికీ సాధ్యంకాదు. ఇక ఆ జరాసంధుడు బ్రాహ్మణులు ఏది కోరినప్పటికీ సందేహించకుండా ఇస్తాడు. కాబట్టి, బ్రాహ్మణవేషంతో వెల్లి జరాసంధుణ్ణి యుద్ధమే భిక్షగా వేడినట్లయితే నీ సన్నిధానంలో భీముడు జరాసంధుని సంహరించడమూ; దానివలన చాలా పనులు కలిసిరావడమూ జరుగుతుంది అని ఉద్ధవుడు చెప్పగా, నారదుడు యాదవులు, సభాసదులు అందరూ అతణ్ణి మెచ్చుకొన్నారు. ఆ తర్వాత

మిక్కిలి చలిస్తూ, రంగురంగులతో చిత్రింపబడిందై ప్రకాశిస్తున్న గరుడధ్వజాలూ, దిగ్గజాలు బెదరిపోయేటట్లుగా ఘణఘణధ్వనులతో మ్రోగుతున్న రథచక్రాలకు కట్టిన గంటలును, అందమైనమేఘం, పుష్పకం, వలాహకం, శైబ్యం, సుగ్రీవం అనే ఐదు గుఱ్ఱాలను గల్గి ఉదయకాలసూర్యకాంతివలె ప్రకాశిస్తున్న బంగారురథాన్ని, దారుకుడనే సారథి తీసుకొని రాగా శ్రీకృష్ణుడు ఆ రథాన్ని అధిరోహించి బయలుదేరి వెళుతుండగా - శ్రీకృష్ణుని గౌరవానికి తగినట్లు, శంఖాలు, బూరాలు, తప్పెటలు, పెద్ద ఢక్కలు, డోలులు మున్నగు వాద్యములు ఒక్కుమ్మడి మ్రోగసాగాయి. వాటి ధ్వనులు దిక్కులు పిక్కటిల్లేటట్లు వ్యాపించాయి.

శ్రీకృష్ణుడు ఉగ్రసేనమహారాజుకు, బలరామునికి, పూజ్యులైన పెద్దలకు చెప్పి, వారియనుమతి తీసుకొని బంగారుతేరులు, ఏనుగులు, గుర్రాలు, భటులు మున్నగు చతురంగబలములు కొలువగా

వందిమాగధాదుల స్తుతులు, స్తోత్రపాఠాలధ్వనులు, బ్రాహ్మణుల ఆశీర్వాదవచనాల ధ్వనులు పరస్పరం కలిసి సందడిగా నుండగ మేడల పైభాగాలనుండి స్త్రీలు ముత్యాల తలంబ్రాలు పోయగా

శ్రీకృష్ణుడు వినోదంగా వాహ్యాళికై వెళ్లి, కొత్తపూల పండ్ల బరువుచే వంగిన కొమ్మలు గల కర్పూరపు చెట్లు, మద్దిచెట్టు, తియ్యమామిడి చెట్లుగల తోటలలో విడిదిచేశాడు.

ఆ సమయంలో శ్రీకృష్ణుని అంతఃపురంలో

విరిసి పూదేనెలతో, పరిమళంతో అలరారుతున్న మందారపుష్పాలను కొప్పులో తురుముకొని, కస్తూరి, పచ్చకర్పూరం మొదలైన పరిమళద్రవ్వాలు కలిపి తయారుచేసిన చందనపు మైపూతను పూసుకొని, బంగారు కుండలాలు, ధ్వనిస్తున్న కంకణాలు, అందెలు మొదలైన ఆభరణాలు ధరించి, ముత్యాలు అంచులందు కుట్టిన మెత్తని దివ్యాలంకారాలైన చీరలు కట్టుకొని, అరచందమామను బోలిన నొసటియందు కస్తూరితిలకాలను దిద్దుకొని, చంద్రుణ్ణిబోలిన ముఖబింబాలు గల ఆ అంతఃపురకాంతలు - వస్త్రభూషణ మాల్య అనులేపనాలనే నాల్గువిధాలైన అలంకారాలతో ఒప్పినవారైనారు.

కృష్ణునివద్దకు పోవాలనే తహతహతో అంతఃపురాంగనలు తగు పల్లకీలనెక్కి ద్వారపాలకులు చేత బెత్తాలు పట్టుకొని దారికి అడ్డంగా ఉంటూ చూడవచ్చిన పురజనుల్ని దూరంగా తొలగజేస్తూ ఉండగా పుత్రులతో సహా వస్తూ ఉండగా కృష్ణుని దగ్గరకు రాసాగారు.

మన్మథుడు ముథికి పోవునట్లు కడిగిన పూలబాణాలను వెక్కిరించేలా సుతిమెత్తవైన, తళతళలాడుతున్న శరీరాలు గల వేశ్యల సమూహం, పరిచారికల గుంపు తమ సంపద ప్రకటమగునట్లుగా

గుఱ్ఱాలను, కంచరగాడిదలను, ఏనుగులను ఎక్కి వేశ్యలు, దాసీజనాలు బయలుదేరగా, వివిధాలైన ఆయుధాలను ధరించి, నమ్మకమైన భటులు వెంటరాగా అంతఃపురస్త్రీలు శ్రీకృష్ణుని వద్దకు వచ్చారు.

అంతట అంతఃపురాంగనలు రాగా

అంతట శ్రీకృష్ణుడు నారదమహర్షిని సన్మానించి వీడ్కొల్పగా అతడును తన మనఃకమలంలో శ్రీకృష్ణుణ్ణి తలచుకొని నమస్కరిస్తూ ఆలస్యం చేయకుండా దేవలోకానికి వెళ్తాడు.

జరాసంధునిచెరలో ఉన్న రాజోత్తములచే పంపబడిన దూతకూడా శ్రీకృష్ణునిచే భయపడవలసినపనిలేదనే నమ్మకమైన మాటను గ్రహించి, ఆ రాజుల వద్దకు వెల్లి శ్రీకృష్ణుడిచ్చిన అభయాన్ని గూర్చి చెప్పి ఆ రాజుల హృదయాలకు సంతోషం కలిగించాడు.

అంతట శ్రీకృష్ణుడు తన భార్యలు, కొడుకులు, బంధువులు, మిత్రులు వెంటరాగా ప్రయాణమై పోతూ ఉండగా

చాపలు, వస్త్రాలు, రత్నకంబళ్లు, డేరాలు మొదలైనవి గల్గిన కుటీరాలు, మిక్కిలి ఉన్నతాలైన వింజామరల యొక్క ధ్వజాలూ, ధ్వజాలకు కట్టిన వస్త్రాలు, కిరీటాలు, తెల్లగొడుగులు, తళతళలాడే కత్తుల కాంతులు సూర్యకాంతిని అణచి వేస్తూ ఉండగా, వాద్యాల ధ్వనులు - తిమింగలాలు మొదలైన పెద్ద పెద్ద చేపలతో ఎగిసిపడుతున్న చప్పుళ్లూ, అలల సవ్వడులూ కలిసి సముద్రం రణగొణధ్వనులతో విస్తరించగా

శ్రీకృష్ణుడు చతురంగబలాలు తనను కొలిచిరాగా ఏరులు, ఉద్యానవనాలు, దుర్గప్రదేశాలు, కొలంకులు, పల్లెపట్టులు; పట్టణాలు; కిరాతకులు నివసించే అడవులు, పశువుల కొట్టాలు దాటి వెళ్లాడు.

ఈ విధంగ ప్రయాణం చేస్తూ శ్రీకృష్ణుడు ఆనర్తక సౌవీర మరుదేశాలు దాటి, ఇందుమతి, దృషద్వతి, సరస్వతి అనే నదులను దాటి, మత్స్య దేశం మీదుగా ఇంద్రప్రస్థనగరం పొలిమేరల్లోని తోటలో దిగగా


పాండవులు శ్రీకృష్ణు నెదుర్కొని తోడ్కొనిపోవుట







Naradudu Srikrishnunito Dharmaraju Rajasuyamu Neraverpumani Chepputa - నారదుడు శ్రీకృష్ణునితో ధర్మరాజు రాజసూయము నెరవేర్పుమని చెప్పుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
నారదుడు శ్రీకృష్ణునితో ధర్మరాజు రాజసూయము నెరవేర్పుమని చెప్పుట

వివేకవిశారదుడగు నారదుడు - శరత్కాలపువెన్నెలలో వెలుగే జింకలాగా ప్రకాశించే ఎర్రని జడముడితోను, శరత్కాలమేఘాలచే ఆవరింపబడిన మెరుపుతీగయా అన్నట్లున్న బంగారుమొలతాడుతోను, మనోహరమైన నిండు చంద్రునిలోని మృగచిహ్నమా అన్నట్లున్న జింకతోలు ప్రకాశించగా, కల్పవృక్షపు చిటారుకొమ్మన పూచి వేలాడుతూ ఉన్న పూలగుత్తివలె ఒప్పుతున్న జపమాల చేతిలో ధరించి, ఒక చేతిలో పుణ్యనదుల్లోని జలాలు నింపిన కమండలువు ఒప్పుతూ ఉండగా శ్రీకృష్ణుని సభామండపానికి వచ్చాడు.

ఆ విధంగా నారదమహాముని “సూర్యుడే విచ్చేసినాడా!” అన్నట్లు జనులు భ్రాంతిపడే విధంగా తన దేహకాంతులచే దిక్కులన్నింటిని ప్రకాశింపజేస్తూ రాగా - ఆ సభామండపంలో ఉన్న యాదవులు, శ్రీకృష్ణుడు గౌరవంతో తమ తమ ఆసనాలనుండి లేచి ఆనందంతో

శ్రీకృష్ణుడు, యాదవజనులు మిక్కిలి వినయంతో నారదునికి నమస్కరించి, బంగారు ఆసనంపై కూర్చుండబెట్టి ఆ మహాముని గౌరవానికి తగిన రీతిలో అనేక విధాలైన అర్చనలు చేసి, తృప్తి పరిచాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు అణకువతో నారదమహామునితో ఇలా అన్నాడు.

ఓ మహార్షీ! ఇప్పుడు మీరు ఎక్కడ నుండి ఇక్కడకు వచ్చారు? మీరు అన్నిలోకాలలో సంచరించేవారు - కాబట్టి ఈ ప్రపంచంలో మీకు తెలియని సంగతులు ఏవీ ఉండవని పెద్దలంటారు. కాబట్టి, మిమ్మల్ని ఒక విషయం అడగాలి.

పాండవులు ఇప్పుడు ఎక్కడ ఏ విధంగా ఉన్నారో తెలియజేయవలసిందిగా శ్రీకృష్ణుడు అడుగగా నారదుడు సద్భక్తితో చేతులు జోడించి నమస్కరించి పుండరీకాక్షునితో ఉత్సాహంగా ఇలా చెప్పసాగాడు.

దేవా! నీవు సృష్టికర్తవు. మాయాస్వరూపుడివి. కార్యములను పుట్టించువాడివి. కలిలో దాగిన అగ్నివలె కనబడకుండ ప్రకాశించువాడివి. సర్వమాయాస్వరూపుడవైన నీ మాయాకలాపాలు ఎన్నోసార్లు చూశాను. ఇది నాకు కొత్త కాదు. వింతకాదు. నీ సంకల్పంచేత పుట్టింది. నీ అధీనంలో ఉంది. నీకు ప్రియమైన వస్తువు ఇట్టిదని తెలియగల సమర్థు దెవరు?

ఏ పదార్థం వేదశాస్త్రప్రమాణంగా తోస్తుందో అది సర్వలోకాల్లో సమర్థుడవైన నీ రూపమే! అదిగాక ముక్తిమార్గం తెలియక సంసారసాగరంలో బడి కొట్టుమిట్టాడే జీవుల అజ్ఞానమనే చీకటిని పోగొట్టగల సమర్థుడివి. నానావిధాలైన లీలలను చూపునట్టి నీ అవతారాలలో నీకు గలిగిన యశస్సు అనే దీపాన్ని వెలిగించి అనుగ్రహించినట్టి నీకు మ్రొక్కెదను. ఈ సర్వసృష్టియందు నీకు తెలియని విషయం ఒకటి మిగిలి ఉందని నేను చెప్పగలవాడనా? అని నారదుడు శ్రీకృష్ణ స్వామితత్త్వాన్ని ప్రశంసించి - ఇంకను ఇలా చెప్పసాగాడు.

నీకు సర్వం తెలిసియున్నప్పటికీ నన్ను అడిగావు కాబట్టి చెబుతాను విను. పాండురాజు కొడుకైన ధర్మరాజు యజ్ఞం చేసి బ్రహ్మలోకాన్ని పొందాలనే కోరికతో రాజసూయ మహాయాగాన్ని చేయబోతున్నాడు. అట్లు ఆ యజ్ఞం చేయతలపెట్టడం లోకంలో ప్రసిద్ధి పొందడానికే గాని, సద్గతిని పొందడానికి నిన్ను సేవిస్తే చాలుగదా? నీవు దగ్గఱ చుట్టానివి, భక్తవత్సలుడవు, పరమపురుషుడవు, యజ్ఞరక్షకుడవు, యజ్ఞంలోని హవిస్సును స్వీకరించే కర్తవు కావున, నీ మేనత్తకొడుకగు ధర్మరాజు చేసే యజ్ఞానికి సర్వవైభవంతో నీవు తప్పక రావాలి సుమా!

ఓ శ్రీకృష్ణా! లోకాన్ని ప్రకాశింపజేసేవాడా! పద్మాలవంటి కన్నులుగలవాడా! నీ పేరు విన్నను, నీరూపానికన్నను పాపాలన్ని పటాపంచలైపోతాయి. నిన్ను భక్తితో కొలిచేవారికి ఈ భూలోకంలో పరలోకంలో సుఖాలు అధికంగా లభింపవా? (లభిస్తుంది!)

ఓ శ్రీకృష్ణా! నీ నిర్మలమైన కీర్తి దశదిశలలో ప్రకాశించేటట్లుగా నీ పాదాలయందు పుట్టిన నీళ్లు మిక్కిలి నిర్మలత్వంతో పాతాళలోకంలో భోగవతి అనే పేరుతో, భూలోకంలో గంగానది అనే పేరుతో, స్వర్గలోకంలో మందాకిని అనే పేరుతో - ముల్లోకాల్లో ప్రకాశిస్తున్నాయి కదా?

జరుగబోయే రాజసూయయజ్ఞంలో ఈ భూమిమీది గొప్పరాజులు, మునుల సమూహం నీ గొప్ప మహిమను చూచి, ఉత్తమస్థితి పొందగలరు.

అని నారదుడు పలుకగా శ్రీకృష్ణుడు ఆనందించి, చిరునవ్వు ముఖానికి కొత్త అందాన్ని చేకూర్చగా, నారదుని మాట మన్నించి ఉద్ధవునితో ఇలా చెప్పాడు.


శ్రీకృష్ణుడు ఉద్ధవుని యాలోచన చొప్పున ధర్మరాజు పాలికి బోవుట







Shodasasahasra (16000) Stri Sangatundaina Srikrishnuni Mahima Naradudu Telisikovadam - షోడశసహస్ర స్త్రీ సంగతుండైన శ్రీకృష్ణుని మహిమ నారదుడు తెలిసికోవడం

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
షోడశసహస్ర స్త్రీ సంగతుండైన శ్రీకృష్ణుని మహిమ నారదుడు తెలిసికోవడం

ఓ రాజా! శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి సంహరించి అతని భవనంలో బందీలుగా ఉన్న పదహారువేలమందిసుందరాంగుల్ని ఒకేమాటుగా తాను పదహారువేల రూపాలు ధరించి పెండ్లి చేసుకొన్న వృత్తాంతం ఒకనాడు నారదమహర్షి విని, ఆ వేడుక చూడాలి - అని

శ్రీకృష్ణుని పెండ్లివేడుకలు చూడాలనే ఆలోచనతో నారదుడు కృష్ణుడు కాపాడుతున్న ద్వారకానగరానికి వెళ్లి ఎదుటగా చిలుకలు, గోరువంకలు, నెమళ్లు, కోయిలలు అనే పక్షుల మనోహరమైన కలకలనాదాలతో, పువ్వులతో విలసిల్లే ఉద్యానవనాల సమూహాల్ని హంసలు, బెగ్గురుపక్షులువంటి నీటిపక్షులతోను, తామరలు, ఎర్రతామరలు, తెల్లకలువలు మొదలగు పుష్పాలతోనూ ప్రకాశిస్తున్న కొలకులనూ, వరి మొదలైన పైరులతో, చెఱకుతోటలతో అందంగా కనిపించే ఏటిఒడ్లను, కొండచరియలనుండి పడే సెలయేళ్ల నీటితుంపురులచే మంచుకురిసే హేమంతఋతువును తలపించే ప్రదేశాల్నీ బ్రహ్మ అనే కంసాలిచేత నవరత్నాలు పొదిగి చేయబడిన పురమనేలక్ష్మి చేతికి ఉండే బంగారుకడియమా? అనేట్లు ప్రకాశించే కోటగల ద్వారకాపట్టణాన్ని నారదుడు చూశాడు.

మిక్కిలి ఎత్తుగా కట్టబడిన రత్నాలమేడల కిటికీల నుండి బయటికి వ్యాపించే కర్పూరహారతుల అగరుధూపాల పొగల్ని చూచి మబ్బులనుకొని, ఆ పురమందలి స్త్రీలచేత పెంపబడి నృత్యం చేయడానికి సిద్ధమవుతున్న నెమళ్లగుంపులు గలదీ; చంద్రకాంతశిలలతోనూ, స్ఫటికాలతోనూ కట్టబడిన స్తంభాలతో నవరత్నాలు పొదిగి స్వర్ణమయంగా తీర్చి అంతస్తుల పైభాగం మీద పెట్టిన బంగారు కలశాలు - చాలామంది సూర్యులవలె ఒప్పుతున్నదీ; సమస్తమైన వస్తువులు పేర్చిన వైశ్యుల వీథులు అరుగులతో ఒప్పుచున్నదీ; తాపాన్ని పోగొట్టడానికి కట్టిన రంగు రంగుల టక్కెముల రెపరెపలు, వాటికి కట్టిన నెమళ్లు, వింటినారుల ధ్వనులతో దిక్కులన్నీ నిండినదీ; శ్రీకృష్ణుడు పూతన మొదలైన రాక్షసుల్ని చంపి, జయించిన విశేషాలు బంగారు రేకులమీద చెక్కబడిన అక్షరపంక్తులతో ప్రకాశిస్తున్న ద్వారబంధపు చూరులు గలదీ; కృష్ణుని దర్శనానికి ఆహ్వానించగా వచ్చిన రాజుల యేనుగులయొక్క మదజలం కారడంవల్ల బుదర బురదగా తయారైన ప్రదేశం - ఆ వచ్చిన రాజులు సమ్మర్దంతో వారి చేతుల కడియాలు ఒకరివి ఒకరికి ఒరుసుకుని ఆ కంకణాలలోని మణుల ధూళిరాలిపడడంవల్ల - ఈ బురద ఇంకి నేల బిగుసుకొన్నట్టిదీ, ఇళ్లముంగిళ్లన్నీ రత్నాలముగ్గులతో నిండి శుభసూచకాలతో ఒప్పునట్టిదీ, కంకుమాది పరిమళద్రవ్యాలు కలిపిన నీళ్లు చల్లుటచే తడిసిన అంగడివీథులు గలదీ, వంశచరిత్రల్ని కీర్తించే వందిమాగధుల; సంగీతగాయకుల - మేలైన ధ్వనులతో ఒప్పుతున్నదీ; సముద్రఘోషను తక్కువ చేయగల భేరీలు, నగారాలు, మద్దెలలు, మొదలైన తూర్యరావాల ధ్వనులతో కూడిందీ; ఇంద్రుడు మొదలగు దిక్పాలకుల పట్టణాలతో పోల్చదగిన గురుతులు గలిగి ఉగ్రసేనునిచేత పాలింపబడుతూ, వేదంలాగా, గ్రహమండలంలాగా, ప్రకాశిస్తూ, కల్యాణవేదికవలె, బలిచక్రవర్తి చేతివలె దానధారలతో కూడిందై ఒప్పుతున్న ఆ ద్వారకాపట్టణంలో ప్రవేశించి నారదుడు - ఆ నగరంలో విశ్వకర్మచే నిర్మింపబడిన పదియాఱువేల శ్రీకృష్ణుని పత్నుల మేడలలో

స్ఫటికాలతో చేసిన స్తంభాలు, పగడాలతో కుచ్చిన అడ్డకర్రలు, పచ్చలు తాపిన గోడలమీది కప్పులు ఒప్పగా వైడూర్యమణులతో, పద్మరాగమణులతో కూర్చిన బొగడలు అమరగా (గోడలమీద కోసుగా కట్టిన అలంకారాలు) జాతి వజ్రాల మేలైనకాంతితో ఒప్పే నీలాలు తాపిన మెట్లతో, గరుడపచ్చలతో ప్రకాశిస్తున్న చూరులు, అత్యంత కాంతిమంతాలైన చంద్రకాంతశిలామణులతో కట్టిన అరుగులు, ముత్యాలు తాపిన తలుపులు, మేలిమి బంగారంతో చేసిన సాలభంజికలూ, అవ్యక్తమధురమైన ధ్వనులతో క్రీడించే పావురాలజంటలగూళ్లు గలిగి

పరిచారికల సమూహంయొక్క కాలిఅందెల చప్పుళ్లు వ్యాపించిందీ; రత్నాలనే ద్వీపాలవరుసతో ప్రకాశించేదీ అయిన ఒక స్త్రీ మెడపై విలాసంగా ప్రకాశిస్తూ

పరిచారికలు తమ చేతులయందలి బంగారుగాజులు ఝణఝణమని మోగుచుండగా వీచే వింజామరలవల్ల బుట్టిన గాలిచేత కదలుతూండే ముంగురులుగలవాడూ, గోపికల ప్రియుడూ అయిన శ్రీకృష్ణుణ్ణి 

బంగారుకాసులదండలు మెడలో వేసుకొని, తలపాగాలు ధరించి, చొక్కాలు తొడుగుకొని, చెవులకు బంగారం పోగులు పెట్టుకొని, అంతఃపురంలో కలియ తిరుగుచున్న కావలివాండ్రూ, సమానమైన వయస్సు, చక్కదనం, మంచిగుణాలు వినోదచేష్టలు గలిగి ఉత్సాహంతో మెలగునట్టి వేడుకకత్తెలూ సేవిస్తూ ఉండగా బంగారుసింహాసనంపై కూర్చుని కొలువుతీరియున్న శ్రీకృష్ణుణ్ణి నారదుడు చూశాడు. ఆ కృష్ణుడును నారదుణ్ణి చూచి ఎదురేగి

ఆ మునిశ్రేష్ఠుడైన నారదుని పాదపద్మాలకు తన కిరీటంలో పొదగబడిన మణులు సోకునట్లుగా నమస్కరించి, తాను కూర్చున్న సింహాసనంమీద ఆ మహర్షిని కూర్చుండబెట్టి మిక్కిలి వినయంతో

ఎల్ల లోకాలను తన పాదంలో పుట్టిన గంగాజలంతో పవిత్రంగా చేయునట్టి ఆదిముని అయిన నారాయణఋషి అవతారమైనవాడూ, ఎల్లలోకాలకు తండ్రియైనవాడూ, అయిన ఆ శ్రీకృష్ణుడు నారదమహర్షియొక్క కాళ్లుకడిగిన నీళ్లను తన శిరస్సున చల్లుకొన్నాడు.

ఈ విధంగా వేదోక్తప్రకారంగా ధర్మాన్ని నడుపునట్టివాడూ; అర్జునునిస్నేహితుడూ అయిన శ్రీకృష్ణుడు - లోకాలలోని తీర్ధాలన్నిటితో పోల్చదగినంతటి పవిత్రమైన నారదమహాముని పాదతీర్థాన్ని శిరసున ధరించి, అమృతతుల్యమైన, మితమైన మాటలతో నారదునితో ఇలా అన్నాడు.

ఓ మునిశ్రేష్ఠ! మీరు ఏ పని చేయాలని ఆజ్ఞాపించినా ఆ పని చేస్తానని శ్రీకృష్ణుడు చెప్పగా, నారదుడు కృష్ణా! ఓ జ్ఞానస్వరూపా! నీవు అవతారమెత్తింది దుష్టుల్ని శిక్షించటానికే కదా! అన్నాడు.

అన్న లోకాలకు ముఖ్య ప్రభుడివి. మిక్కిలి దయగలవాడివి. సర్వలోక సంరక్షకుడివి. శాశ్వతంగా ఉండేవాడివి. కష్టాల్లో మునిగి ఉన్న వారిదుఃఖాన్ని పోగొట్టె చుట్టానివి తెప్పడం ఉంది.

బ్రహ్మరుద్రుడు, ఇంద్రాదిదేవతలచే పూజింపదగినవాడా! సంసారమనే మహాసముద్రాన్ని దాటించి, నాశనంలేని ఆనందాన్ని ముక్తిని ప్రసాదించే నీ పాదపద్మాల్ని ధ్యానించటాన్నే నా మనస్సులో ఎల్లప్పుడూ నిలిచేటట్లు చేయవయ్యా!

ఆ విధంగా శ్రీకృష్ణుని వేడుకొని ఆయన అనుగ్రహాన్ని పొంది, ఆ ఇల్లు విడిచి బయలుదేరి కృష్ణపరమాత్మ యోగమాయా మహిమను తెలుసుకోవాలనే కోరికతో మరియొక ఇల్లాలియింటికి వెళ్తాడు. అక్కడ ఉద్ధవునితో కలిసి జూదమాడుతున్న శ్రీకృష్ణుణ్ణి దర్శించి ఆశ్చర్యపడి శ్రీకృష్ణునిచే ఆ యింటిలో కూడా సన్మానం పొంది ఆ ఇంటినుండి బయలుదేరినవాడై

నారదమహర్షి మరియొక భార్య యింటికి పోయి, అచట జయశీలుడు, సర్వవిషయ సహనశీలుడు, కొనియాడబడిన గుణాలు కలవాడు, సర్వవ్యాపకుడునై కొడుకులతో కూడి వేడుకతోనున్న శ్రీకృష్ణుణి (నారదుడు) చూచాడు.

నారదుడు ఆ ఇంటినుండి మరొక పద్మముఖీ ఇంటికి పోయి అచట ముత్యాలహారాలు ధరించినవాడూ, రాక్షసులను సంహరించేవాడూ, లక్ష్మిదేవి మనస్సులో విహరించేవాడూ, మురాసురుణ్ణి సంహరించి మురారి అని ప్రసిద్ధి పొందినవాడూ, శూరునివంశజుడై శౌరిగా వ్యవహరింపబడేవాడూ అయిన శ్రీకృష్ణుణ్ణి చూచాడు.

నారదమహర్షి ఈ విధంగా ఒక్కొక్క సుందరాంగిగృహంలో శ్రీకృష్ణుడు ఒక్కొక్క వినోదంతో ఉండగా చూస్తూ పోతుండగా ఒకచోట శ్రీకృష్ణుడు ఆ మునీంద్రునికి ఎదురువచ్చి నమస్కరించి - మునీంద్రా! మీరు కోరికలన్నియు దీరిన మహానుభావులు. మేము కోరికలు తీరక వాటికై వెంపరలాడేవాళ్లం. మీ వంటివారిని మేము ఏ విధంగా పరితృప్తుల్ని చేయగలం? మీవంటి మునీంద్రుల దర్శనంచే సకల శుభాలూ పొందుతున్నాము అని ప్రియపూర్వకంగా చెప్పగా - ఆ మాటలు విని నారదుడు మనసులో ఆనందిస్తూ చిరునవ్వుతో మరికొన్ని ఇండ్లకు వెళ్లాడు.

నారదమహాముని - మరో ఉత్తమ స్త్రీ ఇంట వనవిహారంతో ఆనందిస్తున్నవాడూ, దేవతలచే మొక్కులు గైకొనేవాడూ, ఎఱ్ఱని పాదపద్మాలతో ప్రకాశించేవాడూ అయిన ఆ ముకుందుణ్ణి చూచాడు.

నారదమహాముని మరో సుందరాంగి ఇంటిలో పరబ్రహ్మయైన తన్ను తానే హృదయంలో ధ్యానిస్తున్నవాడూ, నరకాసురుని సంహరించిన శూరుడూ నందకుమారుడూ అయిన శ్రీకృష్ణుణ్ణి దర్శించాడు.

ఇంకనూ ముందుకు వెళ్ళగా

ఒకచోట సంధ్యావందనం చేస్తూ, ఒక ఇంట పురాణం వింటూ, మరొక తావున పంచమహాయజ్ఞాలు చేస్తూ, ఇంకొకయింట అమృతం సేవిస్తూ మరొక్కచోట స్నానం ఆచరిస్తూ, వేరొక తావున ఆభరణాలు ధరిస్తూ, మరొకచోట లేగదూడ తోడి ఆవును దానమిస్తూ, మరొక యింట కొడుకులతో కూడి ఆనందిస్తూ, వేరొక యింట సంగీతం వింటూ, ఇంకొక్కచోట మంచెలపై ఎక్కి వినోదిస్తూ, మరోచోట బలరామునితో కూడి తిరుగుతున్న శ్రీకృష్ణు
ణ్ణి నారదుడు చూచాడు.

సర్వవిషయాలు తెలిసినవాడు; మిక్కిలి కీర్తి కలవాడు, కరుణాసముద్రుడు, పుండరీకాక్షుడు, నిర్మలమైన మనస్సుగలవాడు, యోగీశ్వరులకు లోబడినవాడు, పాపము లేనివాడు అగు శ్రీకృష్ణపరమాత్మ ఆయా ఇండ్లలో ఉండే ప్రియురాళ్లతో తన ఇష్టానుసారం ఒకచోట ముచ్చటలాడుతూ, ఒకచోట సరసాలాడుతూ, ఒకచోట ప్రియురాలి కొప్పును పూలదండలతో అలంకరిస్తూ, ఒక ప్రేయసితో కలసి తాంబూలం సేవిస్తూ ఒకచోట పాటలు పాడుతూ, ఒకచోట సుఖంగా ప్రొద్దుపుచ్చుతూ, ఒకచోట సంతోషంతో విహరిస్తుంటాడు. శ్రీకృష్ణుడు పదహారువేలమంది యువతీజనంతో కొత్త కాపురాలు నడిపేవిధాన మిది.

నాల్గుముఖాలుగల బ్రహ్మదేవునికి పుత్రుడైననారదుడు శ్రీకృష్ణునియెడ గౌరవప్రదమైన బుద్ధితో ఒక యిల్లాలి యింటికి పోయి - అచట యజ్ఞకర్మలు నడుపుతూ, ఆశ్రితుల్ని కాపాడుతున్నట్టి, ఇంద్రునిచే సేవింపబడే పాదపద్మాలతో ప్రకాశించే శ్రీకృష్ణు
ణ్ణి చూచాడు.

దేవేంద్రునిచే కొనియాడబడెడువాడూ, పవిత్రుడూ, అంతంలేనివాడూ, సర్వశుభలక్షణో పేతుడూ అయిన శ్రీకృష్ణుడు

కొడుకులతో, మనుమలతో, కూతుళ్లతో భార్యలతో కూడియుండగా నారదుడు మరొక యింటిలో చూచాడు.

అందగత్తెయగు మఱియొక ప్రియురాలి యింటిలో సజ్జనులైనవారికి సంతోషాన్ని కలుగచేస్తూ, వేదాలచే తెలియబడువాడు, నందుణ్ణి ఆనందింప చేయువాడు, సనందునిచే నమస్కరింపబడే వాడు అయిన ముకుందుణ్ణి నారదుడు చూచాడు.

నారదుడు మరియొక స్త్రీ యింటిలో తుమ్మెదల్ని గెలువజాలిన నల్లని ముంగురులు గలవాణ్ణి, నీలమేఘశ్యాము
ణ్ణి లోభములేనివాణ్ణి, పద్మనాభుణ్ణి, భద్రజాతి ఏనుగులచే నమస్కారములు అందుకొంటున్న శ్రీకృష్ణుణ్ణి చూచాడు.

ఒక ఇంటిలో ఏనుగులను, గుఱ్ఱాలను ఎక్కి వినోదించే వాణ్ణి, ఒక యింటిలో భోజనం చేస్తూ, పదహారువేల స్త్రీల గృహాలలో తన మాయా ప్రభావం వల్ల ప్రకాశిస్తున్న - పవిత్రుణ్ణి, వరప్రదాత, వేదధర్మ ప్రవర్తకు
ణ్ణి, విరాట్పురుషుణ్ణి, బ్రహ్మచే సేవింపబడేవాడైన శ్రీకృష్ణుణ్ణి నారదుడు చూచాడు.

గొప్పప్రవర్తనకలవాడూ, ఎల్లదేవతలచే మ్రొక్కులందుకొనేవాడూ, ఉపనిషత్తుల్లో ప్రతిపాదింపబడిన పాదకమలాలు గలవాడూ, తనను ఆశ్రయించినవారి పాపాలన్నీ తొలగించేవాడూ, సర్వోత్తముడైన శ్రీకృష్ణుణ్ణి నారదుడు చూచాడు.

పరమభాగవతుల్లో ద్వితీయుడైనా అద్వితీయస్థానాన్ని ఆక్రమించిన నారదుడు (ప్రహ్లాదునికి అసలు గురువు. నారాయణ మంత్రోపదేశం చేసినవాడు) బ్రహ్మమానసపుత్రుడు. ఆ పరమభక్తాగ్రేసరుడు, సకల ఇంద్రియాలకు అధిపతియైన శ్రీకృష్ణపరమాత్మ, సాధారణమైన నరజన్మను ధరించి, మానవాతీతమైన గొప్పసుఖాలలో యోగమాయాప్రభావంతో జీవితాన్ని గడపడం చూచి, ఆయన సామర్థ్యానికి ఆత్మలో సంతోషించాడు.

ఔరా! శ్రీహరీ! వరదా! అమేయగుణాకరా! అంటూ ఆశ్చర్యంతో శ్రీకృష్ణుణ్ణి తన మనస్సులో మెచ్చుకొంటూ నారదమహర్షి సజ్జనవిధేయుడైన శ్రీకృష్ణు
ణ్ణి చూచి ఓ దేవా! మూడులోకాలలో నీ మాయ తెలియగలవా రున్నారా?

మూడు లోకాల్లో బుద్ధిమంతులై నీ మీది భక్తి అనే అమృతాన్ని సేవించి, వృద్ధిపొందే కృతార్థులు తప్ప, బ్రహ్మ ఇంద్రాదిదేవతలుగాని, మహర్షులుగాని నీ మాయాప్రభావాన్ని తెలుసుకోగలరా? (తెలిసికోలేరు అని తాత్పర్యం.)

ఇట్లు పలికి ఆనందిస్తూ దేవా! నేనిక మీనుండి సెలవు తీసుకొంటాను. ఎల్ల లోకాలను పావనంచేసేదీ, మంచివారికి హితం చేకూర్చేదీ అయిన నీ గొప్పతనాన్ని అన్నిలోకాల్లో తెలియపరుస్తాను అన్నాడు.

శ్రీకృష్ణుని అమృతతుల్యమగు మాటలతో ఆనందాన్ని పొందినవాడై, ఆ దేవదేవునిరూపాన్ని మనసులో నిల్పుకొని, హరిని కీర్తించడమే జీవితధ్యేయమని భావించిన పాండిత్యంగలవాడై నారదుడు బయలుదేరాడు.

ఓ రాజా! ముల్లోకాలలో విశేషంగా ప్రకాశించే నడవడిగల శ్రీకృష్ణపరమాత్మ లోకాలకు మేలు చేయాలనే ఆలోచనతో మానవుడుగా జన్మించి పదహారువేల స్త్రీలను ఆనందింప చేయడానికి బహురూపాలు ధరించి ప్రవర్తించాడు.

ఓ రాజా! ఈ రీతిగా శ్రీకృష్ణుడు పదియారువేల స్త్రీలను రతికేళి తేలించి సంతోషపెట్టిన మానవాతీతశక్తిని గూర్చి సమగ్రమైన భక్తితో ఎవరైతే విందురో, చదువుదురో వారికి శ్రీవిష్ణు పాదభక్తితోపాటు, వెలలేని ధనసంపద, గోసంపద, కొడుకులు, మిత్రులు, భార్యలు లభించి వారివలన అనేకసుఖాలు సమకూడుతాయి. (అని ఈ ఘట్టాన్ని విన్నా చదివినా లభించేదాన్ని ఫలశ్రుతిగా వివరించాడు శుకమహర్షి)

అని ఈ విధంగా చెప్పి, శుకమహర్షి పరీక్షిన్మహారాజుతో ఇంకా ఇలా చెప్పసాగాడు. ఆ నారదుడు వచ్చి వెళ్లిన మరునాటి తెల్లవారుజామున తామరతీగలకు వికాసం కల్పిస్తూ ముందుముందుగా సూర్యభగవానుడు వస్తున్నాడు అనేవార్తను తెలియజేస్తున్నయా? అన్నట్లు కలహంసలు, బెగ్గురుపక్షులు, చక్రవాకాలు వంటి నీటిపక్షుల కలధ్వనులు వినబడగా, అరుణోదయ సమయంలో మేలుకొలుపులు పాడేవారి పాటలు చెవులకు ఇంపు కొలుపుతూ ఉండగా, మద్దెలల, వీణల, వేణువుల వంటి వాద్యాల మనోహరమైన ధ్వనులు వినబడగా శ్రీకృష్ణుడు నిద్రలేచి - జ్ఞానానంద స్వరూపుడు, పరమాత్ముడు, నాశరహితుడు, అవికారుడు, అద్వితీయుడు, అజితుడు, తుదిలేనివాడు, జ్ఞానంనుండి జాఱనివాడు, ఏ కొలతలకు అందనివాడూ, చావు పుట్టుకలు లేనివాడైన పరబ్రహ్మ తనకు తాను ధ్యానించుకొని, కొంతసేపు గడపి పిమ్మట శత్రువులకు సంకోచం, భక్తులకు విరాగం కలిగేటట్లుగా, దోషాలనెడిచీకట్లను పోగొట్టే సూర్యునివంటి శ్రీకృష్ణుడు మూసినకన్నులు తెరచి మంచం దిగి వచ్చి తరువాత

మంచి గంధం, కస్తూరి మొదలైన పరిమళద్రవ్యాలు కలపడంచే సువాసనా భరితాలైన బంగారుకలశాలలోని జలాలతో స్నానం చేసి, కొత్తవి, మెత్తనివి దివ్యాలైన మంచివస్త్రాలు కుచ్చెళ్లు అందంగా పెట్టుకొని, కట్టుకొని మకర కుండలాలు, అందెలు, హారాలు, భుజకీర్తులు, కంకణాలువంటి ఆభరణాలు అలంకరించుకొని, పచ్చకర్పూరంతో కలిపి తయారు చేసిన చందనాన్ని ఒడలి నిండా పూసుకొని, కొత్తగా కోసిన పువ్వులను తలలో ముడుచుకొని, ఆకృతి పొందిన శృంగారరసమో, దయాసముద్రమో అన్నట్లు ప్రకాశిస్తూ తనసౌందర్యాన్ని నిలువుటద్దంలో చూచుకొని

సారథి పూనికతో తెచ్చిన బంగారు రథం మీద శ్రీకృష్ణుడు సాత్యకి తోడను తనకు హితుడూ, ఇష్టుడూ అయిన ఉద్ధవునితోను ఎక్కి తన శరీరకాంతి దిక్కులన్నిట వ్యాపించగా తూర్పుకొండపై ప్రకాశించే సూర్యునివలె ప్రకాశించాడు.

కొత్త అలంకారాలతో ప్రకాశిస్తూ తన శరీరకాంతులు అంతఃపురస్త్రీల కన్నులనే తామరలకు ఆనందాన్ని కూర్చగా, మనోహరమైన తన ముఖమనే చంద్రుని కాంతులు అనగా వెన్నెలలు పురజనులనే చకోరాలకు పండుగ చేస్తుండగా, మణులతో ప్రకాశించే తన బంగారుఆభరణాల కాంతిదిక్కులన్నిట వ్యాపిస్తుండగా, మెల్లమెల్లగా వచ్చి రథం దిగి - తన పాదాలందు గల - హలరేఖ, కులిశరేఖ, అంకుశరేఖ, జలజరేఖ, కలశరేఖలు భూదేవికి అలంకారాలుగా చేసి ఉద్ధవుని చేయి ఊతగా చేసుకొని నెమ్మదిగా నడచి సుధర్శి అను సభామధ్యంలో సింహాసనంపై సంతోషంతో కూర్చున్నాడు.

మిక్కిలి వైభవంతో తన శరీరకాంతి వెలుగగా - ఆప్తులు, పురోహితులు, రాజులు, స్నేహితులు, చుట్టాలు, పండితులు, తనయులు, స్తుతిపాఠకులు, మంత్రులు, సారథులు భక్తితో పరివేష్ఠించి సేవింపగా - నక్షత్రాలచే సేవింపబడుతున్న ఆ చుక్కల్లో చంద్రుడా అన్నట్లు శ్రీకృష్ణుడు ప్రకాశిస్తున్నాడు.

ప్రజలందరినీ దయతో కూడిన చల్లనిచూపులతో లెస్సగా పరిరక్షిస్తూ తన తెలివితో, చాతుర్యంతో వివిధ వ్యాపారాలు నిర్వర్తించే కళను ప్రదర్శిస్తూ, ఇష్టగోష్ఠి చేస్తూ ఎంతో ఆనందంతో రాజ్యభారాన్ని వహించి పరిపాలన సాగించే వాడవుతూ.

ఈ ప్రకారం శ్రీకృష్ణుడు కొలువు చేస్తుండగా ఒకనాడు మున్నెన్నడు చూచి ఎరుగని ఒక బ్రాహ్మణుడు వచ్చి, కొలువు కూటంలో కొలువున్న శ్రీకృష్ణు
ణ్ణి జూచి సాగిలబడి మ్రొక్కి అతివినయంతో చేతులు జోడించి, ఇలా పలికాడు.

తామరలవంటి కన్నులుగలవాడా! రాక్షసులను నాశనం చేసేవాడా! యోగీశ్వరుల మనస్సులకు జ్ఞానాంజనమైన వాడా! కాంతికి నిదర్శనమై 'వెలుగు' వాడా! బలరాముని తమ్ముడా! శ్రీకృష్ణా!

ఓ కృష్ణా! వినవయ్యా! జరాసంధుడు మిక్కిలిబలాఢ్యుడు. తనకు సాటి లేనివాడు; తన ఆజ్ఞకు అణగి తనకు నమస్కరించని రాజుల్ని వెదకి తెప్పించి గిరివ్రజమనే పట్టణంలో ఇరువది వేలమందిని చెఱసాలలో బంధించాడు.

ఓ పుణ్యాత్ముడా! రాజశ్రేష్ఠుడా! శ్రీకృష్ణా! ఆ రాజులు పంపగా వచ్చినవాణ్ణి నేను. వారు మనవి చేయుమన్న విషయాలు నేను నీకు విన్నవిస్తాను. నా మాటలు విన్న మీదట వారి అదృష్టానికి తగిన రీతిలో నీదయ వారికి లభించునుగాక!

అని చెప్పి, ఆ రాజులందరూ వచ్చి, మనవి చేసుకొన్నట్లే ఆ బ్రాహ్మణుడు వారిమాటలను విన్నవించాడు.

బొడ్డున పద్మంగలవాడివి, భక్తజనులయందు ప్రమగలవాడివి, దుష్టరాక్షసులను సంహరించినవాడివి, బ్రహ్మ, శివుడు మున్నగు దేవతలచే నమస్కరింపదగిన పాదపద్నాలు గలవాడివి, ఎల్లలోకాలలో కీర్తింపబడిన దివ్యప్రభావం గలవాడివి, సంసార సంబంధం లేనివాడివి, నందుని కుమారుడివి, లక్ష్మీదేవి ప్రాణనాయకుడవైన శ్రీకృష్ణా! మాధవా!

గొప్ప మహిమగలవాడా! భక్తుల భయాన్ని తొలగించేవాడా! పుణ్మాత్ముడా! సాంసారికబాధలచే దుఃఖీతులమైన మమ్మల్ని కాచి రక్షించవయ్యా! నిన్ను మదిలో స్తుతించి, నీకు మ్రొక్కుతున్నాము. నీ రెండుపాదాలే మాకు దిక్కు

జనన మరణాలు లేని ఓ శ్రీకృష్ణా! దుష్టులైన బలవంతుల్ని శిక్షించడానికి సాధువులైన బలహీనుల్ని రక్షించడానికి ఈ భూమిపై నీ లీలావిలాసాలకు తగిన రీతిలో యుగయుగంలో అవతరిస్తుంటావు కదా!

సర్వరక్షకుడవై ఈశ్వరా! భక్తజనులపాలిటికల్పవృక్షమా! ముల్లోకాలను రక్షించే కృష్ణా! నీ మనస్సుకు తోచని విషయం ఈ భూమిపై ఉందా? నీవన్నీ తెలిసినవాడివి. దీనుల్ని రక్షించవయ్యా!

లక్ష్మీనాథుడవైన ఓ శ్రీకృష్ణా! నీవు చెప్పిన పనిని చేయక పోవడం బ్రహ్మాదిదేవతలకైనా శక్యంకాదు. కాబట్టి, నిన్ను శరణు జొచ్చినవారిని చేపట్టి, వారిని నిర్భంధంనుండి విముక్తుల్ని చేసి, కాపాడవయ్యా!

అందరి దుఃఖములను పోగొట్టేవాడివైన శ్రీకృష్ణా! నీవు పుట్టుక లేనివాడవైనా భూమిపై పుట్టడం కేవలం ఒక వేడుక కోసం మాత్రమే. నిజానికి ఇది పుట్టడం కాదు. కాబట్టి, బ్రహ్మాది దేవతా ప్రభువులందరికీ రాజువైన నీవు భయాత్ములమైన మమ్మల్ని కాచి రక్షించాలి. మా భయం తొలగించి తీరాలి! ఎందుకంటే నీవు ఆర్తిహరుడివి కదా!

ఇంతకుముందు జరాసంధుడు యుద్ధంలో నిన్ను నిలువరించలేక తన పరాక్రమం తగ్గిపోగా నీ భుజబలానికి తట్టుకోలేక రాజులందరు నవ్వుతుండగా భయంతో పారిపోలేదా?

తాను పొందిన అవమానాన్ని గుర్తుంచుకోక, జరాసంధుడు మదించిన ఏనుగుల్ని నిర్బంధించి హింసించే సింహంలాగా మమ్మల్ని చెరసాలలో పెట్టి బాధిస్తున్నాడు. ఈ పాపాత్ముణ్ణి సంహరించడానికి నీవు తప్ప వేరెవరూ రక్షకులు లేని మమ్మల్ని రక్షించి, మా పుత్రులతో, భార్యలతో, మిత్రులతో మమ్ము చేర్చవలసిందని ఆ రాజులు మనవి చేసుకొన్నారని వారు పంపగా వచ్చిన బ్రాహ్మణుడు చెప్పుచుండగా


నారదుడు శ్రీకృష్ణునితో ధర్మరాజు రాజసూయము నెరవేర్పుమని చెప్పుట







Balaramudu Hastinaapuramunu Gangalo Droya Boonuta - బలరాముడు హస్తినాపురమును గంగలో ద్రోయ బూనుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
బలరాముడు హస్తినాపురమును గంగలో ద్రోయ బూనుట

శ్రీకృష్ణుని కుమారుడైన సాంబుడు - (సాంబుడు జాంబవతి శ్రీకృష్ణుల తనయుడు) దుర్యోధనునికూతురు శుభ లక్షణములు గల లక్షణ అనే పేరుగల కన్యకను - ఆమెవివాహసమయంలో అతిసాహసంతో ఎత్తుకొని పోగా - దుర్యోధనాదులైన కౌరవులందఱు ఒక కుర్రవాడు ఇలా వివాహమండపంనుండి మన కన్నెపిల్లను దొంగిలించుకొని పోతూఉంటే మనం చూస్తూ ఉపేక్షించడం పారుషం కాదు. కాబట్టి, ఆ కుర్రవాణ్ణి పట్టి తీసుకొనివచ్చి చెరలో పెడదాం. ఆ తరువాత యాదవులైన శ్రీకృష్ణాదులు ఏమి చేస్తారో చూద్దాం! అనే ఆలోచనతో తమపెద్దల అనుమతిని పొందినవారై

ఇలా ప్రయత్నంతో యుద్దానికి సిద్ధపడిన బలవంతులు, పరాక్రమవంతులు అయిన కర్ణుడు, శల్యుడు, భూరిశ్రవనుడు, యజ్ఞకేతుడు, దుర్యోధనుడు మొదలైన కౌరవులు మిక్కిలి ఎత్తైన రథాల్ని అధిరోహించి, సాంబుని సమీపానికి వెళ్లి అతణ్ణి అదిలించి, నిలువు నిలువు మంటూ చుట్టుముట్టినా - వీరిని చూచి సాంబుడు భయపడక రత్నఖచితమై ప్రకాశిస్తున్న వింటిని ధరించి సింహంలా గర్జిస్తూ

అట్లు ఎదిరించిన సాంబునిమీద కౌరవులు తీక్ష్ణములైన బాణాలూ ఎడతెగక ప్రయోగించి కొండపై మంచుకమ్మినట్లు సాంబుని రథాన్ని బాణాలతో కప్పివేశారు.

ఇంకనూ

ఉత్సాహంతో కూడినశూరత్వంతో విజృంభించి మేరుపర్వతమా అన్నట్లు చలింపక నిలిచి ఉన్న సాంబునిమీద లెక్కలేనన్ని బాణాలు ప్రయోగించారు. కానీ, సాంబుడు శక్యంగాని పరాక్రమోపేతుడై విజృంభించి వాడియైన బాణాలు గుప్పించి శత్రువుల బాణాలనన్నింటినీ ధ్వంసం చేశాడు. 

అతనివీరకృత్యాన్ని ఆకాశంనుంచి చూస్తున్న దేవతలు ఆనందంతో వాద్యాలను వాయించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆ సాంబుడు ఇంకా అతిశయించిన శౌర్యంతో

ఈ తీరుగా యుద్ధరంగంలో ఉండేవారినందర్నీ తానొక్కడే ఎదిరించడానికి పూనుకొని (అనేకబాణాలతో) వారి రథాలు, సారథులు, జెండాకర్రలు, జెండాలు, గొడుగులు అన్నింటినీ నుగ్గుచేసి, వారు ధరించిన కవచాలన్నింటికీ చిల్లులు పడేలా చేయగా, కౌరవులు పూచినఎర్రనిమోదుగులనుపోలిన నెత్తుటితో పూయబడిన దేహాలు కలవారయ్యారు. అటు పిమ్మట

ఆ కౌరవులు తాము సంఖ్యాబలంచే అనేకులుండికూడా, బలవంతులైనప్పటికీ, ఎన్నో యుద్దాల్లో నేర్పు ప్రదర్శించి గడితేరిన వారైనా, ఒంటివాడైన సాంబుణ్ణి ఏమీ చేయలేక వానికి భయపడి, సిగ్గుపడి, ఎంతో విచారంతో ఒకరితో ఒకరు చేరి ఆలోచిస్తూ మనవల్ల కావటంలేదని తొలగిపోతూ, మళ్లీ కలుస్తూ దుఃఖంతో వేడి నిట్టూర్పులు విడుస్తూ ఏమి చేయాలి అంటూ ఆలోచిస్తూ

ఆ కౌరవులు తిరిగి యుద్ధం చేయడానికి తొందరపడి

కౌరవులందరూ ఒక్కసారిగా గుమిగూడి సాంబుణ్ణి చుట్టుముట్టి వాడియైనబాణాలు అదేపనిగా ప్రయోగించి, ఎడతెరపి లేకుండా యుద్ధంచేసి అతణ్ణి ఆ బాణపరంపరలో ముంచివేశారు. 

అంతేకాక, వెంటవెంటనే వాడియైన బాణాలు ప్రయోగించి, రథాన్ని గుర్రాల్ని సారథిని, వింటినికూడా తెగనరికారు. రథం ధ్వంసం కావడంతో సాంబుడు ఎటూ వెళ్లలేక నిలిచి ఉండగా వాణ్ణి సమీపించి పట్టుకోగా

కౌరవుల విజ్బంభణకు ఆ సాంబుడు ఏ విధంగానూ తప్పించుకోవడానికి గాని, ఏదైనా చేయడానికి గాని శక్యంగాక పోవడంతో వీరికి పట్టుబడ్డాడు. కౌరవులు ఆనందంతో వేడుకతో సాంబుడిని తమ ఆడపడుచు లక్షణతో పాటుగా హస్తినాపురానికి తీసుకొనివచ్చి తమ వైభవాన్ని ప్రకటిస్తూ

ఇక్కడ సాంబుడి స్థితి ఇలా కౌరవులచే పట్టుబడి ఉండగా అక్కడ ద్వారకానగరంలో

జాంబవతికుమారుడైన సాంబుడు కౌరవులచేత చిక్కాడనే విషయాన్ని త్రిలోకసంచారి అయిన నారదమహర్షి చెప్పగా విన్న యాదవులమనస్సులలో కౌరవులతో యుద్ధం చేయాలనే వేడుక పుట్టడమే కాదు - కౌరవకులాన్నంతా ఒకేసారి సంహరించాలి అన్నంత కోపంతో - ఉగసేనమహారాజుఅనుమతి తీసుకుని, సకలసైన్యాల్నీ

తమవారందరూ సేనను కూర్చుకొని ఆవిధంగా దండు వెడలడం చూచి బలరాముడు - ధృతరాష్ట్రునికొడుకులు మనకు ఎంతో దగ్గరిచుట్టాలు కదా! వారిమీదికి మీరిలా కోపంతో దండెత్తి వెళ్లడం న్యాయమా? అని ప్రశ్నించాడు.

బలరాముడు - దగ్గరబంధువులైన దుర్యోధనాదులమీద దండెత్తి పోవడం తగదని సైన్యాన్ని ఆపి, బంధుప్రీతిగలవాడై వెంటనే బయలుదేరి - అగ్నివలె, సూర్యునివలె ప్రకాశిస్తున్న బంగారురథాన్ని ఎక్కి తనకు ప్రియమైన బ్రాహ్మణులు, ఉద్ధవుడు మొదలైన కులవృద్దులునూ వెంటరాగా హస్తినాపురానికి వెళ్లి, ఆ పట్టణం పొలిమేరలో ఉన్న ఒక తోపులో విడిది చేశాడు. 

ఆ తోపులో - పరిమళభరితాలయిన పూలతో, పళ్లతో నిండినచెట్లనీడల్లో చంద్రకాంతశిలలతో నిర్మించిన అరుగులమీద విశ్రమించి, తాము వచ్చిన పనిని కౌరవులకు తెలియజేయడానికి బుద్ధిమంతుడైన ఉద్ధవుణ్ణి పంపాడు. ఉద్ధవుడు కౌరవులవద్దకు వెళ్లి, ముందుగా ధృతరాష్ట్రునికి నమస్కరించి, ఆ తరువాత ద్రోణునికి, భీష్మునికి, దుర్యోధనునికీ నమస్కరించి, మొక్కి వారి ప్రశంసలందుకొని ఇలా చెప్పాడు.

విశేషమైన కీర్తియే ధనంగాగల ప్రభువులారా! బలరాముడు మీ పట్టణం పొలిమేరలోగల తోటలో విడిది చేశాడు - అని ఉద్ధవుడు చెప్పగానే కారవులు చాలా ఉత్సాహంతో బలరాముణ్ణి చూడాలి అనే కుతూహలంతో తగిన కానుకలు పట్టుకొని, బలరాముణ్ణి చేరి ఆయనకు అర్ఘ్యపాద్యాదిమర్యాదలు చేసి, గోవును ఇచ్చి, సన్మానించి - అందరూ పదేపదే అతనికి నమస్కరించి, తగిన విధంగా కూర్చున్నారు. అప్పుడు బలరాముడు దుర్యోధనుణ్ణి చూచి - కుశలప్రశ్నలు అడిగాడు. మీరంతా క్షేమమేకదా! మేము క్షేమమే అని, అక్కడి జనులందరికీ స్పష్టంగా తెలిసేటట్లు ఇలా అన్నాడు.

మీరు మా రాజైన ఉగ్రసేనుని ఉత్తరువును శిరసావహించి తప్పక ఆచరించాలి. మీరు ఎంతోమంది మహాయోధులు ఒక్కుమ్మడిగా ఒంటరిగాడైన మా పిల్లవానితో పోరి, చుట్టుముట్టి యుద్ధంలో గెలవడం మీ తప్పు. మీరు ఇంత ఆదర్మంగా చేసిన యుద్దాన్ని అది తప్పిదమే అయినా, మా రాజు మన్నించాడు. మా రాజు బంధుప్రీతి కలవాడు కావడం వల్ల మీ తప్పుల్ని సహించాడు - అన్నాడు - బలరాముడు.

బలరాముడు చెప్పిన మాటలు విన్న దుర్యోధనుడు మనస్సులో చాల కోపించినవాడై యాదవులతో, “చాలును మీ మర్యాద ఔరా! ఏమి ఈ కాలవైపరీత్యం! - దీన్ని ఏమనగలం! కాలికింద ఉండవలసిన పాదరక్షలు తమంతట తామే తలకెక్కాయి. మన సేవకులుగా ఉండవలసినయాదవులు మనల్నే హెచ్చరిస్తున్నారు - ఏమి కాలగతి?” అన్నాడు.

మనము బంధుప్రీతితో గౌరవించడంవల్లనే కదా యాదవులు రాజ్యభోగాలు అనుభవించడమూ, పేరుప్రతిష్ఠలు గల్గి ప్రసిద్ధి పొందడం జరిగింది. నిజానికి వారికి అనుభవించే అవకాశం లేనట్టి

మనం బంధుప్రీతితో గౌరవించడం చేతనేకదా!, ఈ యాదవులు రాజ్యభోగాలు అనుభవించడం? తమకంటూ పేరు ప్రతిష్టలు ఏర్పడడం, వారికి అనుభవించడానికి తగిన తెల్లగొడుగులు, వింజామరలు, శంఖాలు, కిరీటాలు, పానుపులు, సింహాసనాలు, మేడలు పొంది సుఖిస్తుండడం? 

మనం వారి విషయం పట్టించుకోక ఉపేక్షించడంవల్లనే వారు గర్వంతో ఈనాడు తమ స్దానం మరచి, మనతో సరిసమానులైన వారివలె ప్రవర్తిస్తున్నారు. యాదవులతో బంధుత్వాలు, సంబంధాలు, స్నేహాలు ఇంతమట్టుకు చాలు. పాములకు పాలుపోసి పెంచినా వాటివిషం పోదుకదా! 

అలాగే వీరు మనల్ని ఇప్పుడు వాళ్ల ఆజ్ఞను పాటించి నడుచుకోవాలంటున్నారు. సిగ్గు లేకపోబట్టే కదా ఆ మాటలు! పై పెచ్చు అస్త్రవిద్యల్లో ఆరితేరిన భీష్మదోణకృపాశ్వత్ధామకర్ణాదులయిన వీరవరులచేత చిక్కినవాణ్ణి విడిపించడం మహేంద్రునికైనా సాధ్యమా? 

ఈ పనికిమాలినమాటలతో ప్రయోజనం లేదు అంటూ నిందావాక్యాలు పల్కుతూ దుర్యోధనుడు దిగ్గనలేచి తన మందిరానికి వెళ్లిపోయాడు. దుర్యోధనునిమాటలకు బలరాముడు ఉలికిపడి

దుర్యోధనుడు అలా మంచీ మర్యాదా లేకుండా మాట్లాడిన మాటలకు బలరామునికి మనస్సులో పట్టరానికోపం వచ్చి - ప్రళయకాలసూర్యునిలాగా ఎర్రనైన కండ్లతో మండిపడుతూ - తనవారైన యాదవులలోని పెద్దవారిని చూచి - మించిన రాజ్యసంపదమదంతో; కన్నుమిన్ను కానక దుర్యోధనుడు వాగినవాగుడు మీరుకూడా చక్కగా విన్నారుకదా! అని అన్నాడు బలరాముడు.

ఎక్కడైనా ఐశ్వర్యంవల్ల కన్ను కానక కొవ్విఉండే దుష్టులు కేవలం మంచితనంతో బాగుపడతారా? వేటాడే బోయవాడు మృగాలమీద చూపే ఉగ్రతవలె - యుద్ధంలో భుజబలం ప్రదర్శించి పరాక్రమం చూపవలసిందే! సామంతో చక్కబడే సందర్భం కాదిది. యుద్ధనైపుణి ప్రదర్శించి ఎదుటివారిపొగరు అణచవలసిందే! - అని బలరాముని భావం!

కౌరవులను చంపాలి అనే ఉత్సాహంతో యదువీరాగ్రగణ్యులూ శ్రీకృష్ణుడూ సన్నద్ధులై బయలుదేరుతుండగా, కౌరవులూ మనవాళ్లు బంధువులు అనే వాత్సల్యభావంతో నేను వారందరినీ నివారించి - నేను వచ్చాను గదా!

ఏ దేవుణ్ణి ఇంద్రుడు మున్నగు దిక్పాలకులు వరుసగా సేవకులై సేవిస్తుంటారో, కోరిన కోర్కెల్ని తీర్చే కల్పవృక్షం, సుధర్మ అనే పేరుగల సుందరసభాసంపద ఏ దేవుని ఇంటిలో ఉందో, ఎల్ల లోకాలకు తల్లియైన లక్ష్మీదేవి ఏ దేవుని పాదపద్మాల్ని నిరంతరం సేవిస్తూ ఉంటుందో, ఏ దేవుని దివ్యకళలో అంశాలుగా బ్రహ్మ, రుద్రుడు, నేను ఉద్భవించామో, అటువంటి దేవుడు, దుష్టసంహారకుడు, పాపాలన్నింటినీ హరించే శ్రీకృష్ణుడు చెప్పిన పనులు ఉగ్రసేనమహారాజు చేస్తూండగా - ఆయన పాలించే సమస్తరాజ్యసంపద ఈ కౌరవులు దయతో మనకు ఇచ్చిందట! విన్నారా? -

అంతేగాక ఏ దేవునియొక్క పాదధూళిని ఇంద్రుడు మొదలగు దిక్పాలకులు తమ కిరీటాలకు అలంకారంగా గ్రహిస్తున్నారో - (కిరీటాలు గల తలలు వంచి ఆయాదేవతలు శ్రీకృష్ణునికి పాదనమస్కారం చేయగా ఆ దేవుని పాదధూళి కిరిటాలకు మరింత సొంపుకూర్చిందని తాత్పర్యం). ఏ దేవుని పాదధూళి భూలోకంలోని నదుల్ని, నీటి కొలనుల్ని అత్యంత పవిత్రీకరిస్తుందో అట్టి శ్రీకృష్ణదేవునిఅనుగ్రహంవలన పొంది, అభివృద్ధి చెందుతున్న రాజ్యంగల మేము రాజ్యచిహ్నాల్ని ధరించకూడదు అనటం ఎంత ఆశ్చర్యంగా ఉందో! (చూచారా! యని బలరాముని మాట).

ఈ నీచబుద్ధిగల దుర్యోధనుడు ఆడినమాటలు ఎట్లున్నాయో చూడండి! కౌరవులు తలలట! మేము కాళ్ళకు తొడుగుకొనే పాదరక్షలమట! రాజ్యసంపదతో క్రొవ్వెక్కి ఈ అధముడైన ఈ దుర్యోధనుడు పలికిన మాటకు ఏమి అనగలం?

ఆవిధంగా చెబుతూ కోపంతో కూడిన మనస్సుగలవాడై బలరాముడు అప్పుడు

'ఇకపై భూమిమీద కౌరవులు అనే పేరు లేకుండ చేయక తప్పదు అని బలరాముడు నిశ్చయించుకొని, భయంక రాకారుడై అతి బలగర్వాలతో తన ఆయుధమైన నాగలిని గ్రహించి, అతిశయిస్తూ

ఈ విధంగా బలరాముడు తన హలాయుధపుమొనను హస్తినాపురానికి ఒక చివర, అడుగుదాకా చొప్పించి, ప్రయత్నపూర్వకంగా పట్టణం మొత్తం పెల్లగించి, గంగలో పడవెయ్యడానికి లాగి ఎత్తాడు. అతని ప్రయత్నానికి ఆ పట్టణం మొత్తం సముద్రమధ్యంలో చిక్కుకున్న ఓడలా అల్లాడిపోతూ - గోపురాలు, ప్రాకారాలు, కోటలు, కోటలమీది కట్టడాలు, రాజుల మేడలు, వీథులు, గోడలు, తలుపులు, ద్వారబంధాలు సమస్తమూ ఒక పక్కకు ఒరిగిపోగా, పట్టణంలోని జనులకు నేలమీద కాలు నిలపడానికి వీలు లేకపోయింది. 

ప్రజలందరూ ఆందోళనతో, భయంతో 'కుయ్యోమొర్రో' అని మొరపెట్టసాగారు. ఈ ఉపద్రవానికి బలరాముని కోపమే కారణమని తెలుసుకొని భీష్ముడు, దుర్యోధనుడు మొదలైన కౌరవులందరూ - ఏమీ ప్రతిక్రియ చేయలేక బలరాముని పాదాలనే శరణువేడడం మంచిదని నిర్ణయించుకొని - తమ కన్యతోకూడా సాంబునికి మణిమయ భూషణాలూ, వస్త్రాలు బహుమానంగా తీసుకొని బలరాముని సన్నిధికి చేరి, ఆయనకు సాగిలబడి మొక్కి చేతులు జోడించి ఇలా అన్నారు.

(ఈ ఘట్టంలో సంకర్షణుడైన బలరాముని దైవికమైన అతిమానుష శక్తిసామర్థ్యాలు మహాభాగవత పురాణం వెల్లడి చేసింది. పాంచరాత్ర ఆగమంలోని నాల్గువ్యూహాలలో రెండవ వ్యూహం సంకర్షణం ఆ సంకర్షణుడే బలరాముడు. ఆయన పేరులోనే 'బల' ముంది. 'బలదేవుడని' శ్రీవైష్ణవ సంప్రదాయం. సంకర్షణుడు లయకారకుడు. వేదాలు ఆయనవల్లనే నిలచి ఉన్నాయి. ఆయనే ఆదిశేషుడు. సృష్టిలో తొట్టతొలి జీవుడు. వేదవ్యాఖ్యాత. నారాయణతత్త్వం యొక్క మూలబీజం సంకర్షణ వ్యూహగతమై ఉంది.)

మేలైన మంచి ముత్యాల సరాల్ని పోలిన తెల్లని, కీర్తిగలవాడా! చంద్రుని కాంతివంటి స్వచ్చమైన, ఆహ్లాదకరమైన దేహకాంతి కలవాడా! జయానికి హద్దుగా కలవాడా! లోకంలోని ఉత్తమగుణాలకు నిలయమైనవాడా! రాజులలో శ్రేష్ఠుడైనవాడా! బలరామా!”

ఓ బలరామా! నీవు అందరికీ నాయకుడవి. ముల్లోకాలకీ మేలు చేసేవాడివి. రాగద్వేషాలు లేని బుద్ధిమంతుడివి. ఇట్టి నీ మహిమలు తెలుసుకొని పొగడటానికి మేమెంత వాళ్లం? ఏ మాత్రం తెలివిలేని మమ్మల్ని ఈ ఆపదనుండి రక్షించవయ్యా! - అని ప్రార్థించారు.

అంతశ్శత్రువుల్నీ, బాహ్యశత్రువుల్నీ జయించిన ఓ బలరామా! ఈ భూమండలాన్ని సదా మోసే ఆదిశేషునిఅంశలో పుట్టినవాడిని. విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణునికి అన్నవు. కనుక, మాబోటి తెలివిమాలిన వాళ్లు చెసే నీచకార్యాలు మాన్పటం నీకు తగిందే!

ఆదిశేషుని అవతారంగా పుట్టిన ఓ బలరామా! నీవు ఎల్ల దేవతలచే మొక్కులందు కొనేవాడివి. రాక్షసులకు విషసదృశుడవై నొసట కన్నుగల రుద్రునివలె భస్మం చేయగలవాడివైన దేవా! నీవలన మేము భయాతురులమై ఉన్నాం. మమ్మల్ని ఆదరించి కాపాడవయ్యా, కాపాడు అని ప్రార్ధించారు.

ఓ! బలదేవా! స్వామీ! ఇదిగాక చరాచరజంతువులతో కూడి ఈ లోకాల్ని నీవు వేడుకగా సృష్టించి, వాటితో ఆట్లాడుతుంటావు. దుష్టజనుల్ని శిక్షించడం, సజ్జనుల్ని రక్షించడం నీ వినోదంలో భాగాలే. ఈ ప్రపంచం పుట్టడానికి, పెరగడానికి, నాశం కావడానికి నీవే మూలకారణభూతుడవు అటువంటి మహాత్ముడివైన నీకు మేము మ్రొక్కుతున్నాము. మమ్మల్ని కాపాడు అంటూ ఇంకా ఇలా చెప్పసాగారు.

ఓ బలరామదేవా! నీవు నాశనం లేనివాడివి, సకలజీవుల ఆత్మస్వరూపుడివి, సర్వశక్తులు గలవాడివి, సర్వకాల సర్వావస్థలలో ఉండేవాడివి, సృష్టిస్టతిలయాలనే క్రియలతో ప్రపంచాన్ని నడిపేవాడివి, భక్తుల అజ్ఞానాన్ని పోగొట్టే సద్గురుడివి, విమలమూర్తివి అయిన నిన్ను పొగడడం బ్రహ్మతరంకూడా కాదు.

అని కౌరవులు భయభక్తులతో ప్రార్ధించగా బలరాముడు ప్రీతుడై ఆ కౌరవులతో మీరు ఇక భయపడవద్దు. మీరు మీ పనిలోని పట్టుదలతో మమ్మల్ని నిర్లక్ష్యంచేసి చిన్నచూపు చూడడం వల్ల నేను ఈ విధంగా ప్రవర్తించాను కాని, వేరే కాదు. 'ఇక భయపడకుండా పొండి' అన్నాడు. ఆ మాటలు విని దుర్యోధనుడు వినయంతో తన అల్లుడగు సాంబుణ్ణి తన కూతురు లక్షణను ఒప్పునట్లుగా

తన కూతురు లక్షణను, అల్లుడు సాంబుణ్ణి బలరాముని వెంట పంపుతూ, దుర్యోధనుడు వేయిమందిపరిచారికల్నీ, లక్షగుర్రాల్ని, రెండులక్షల ఏనుగుల్ని, ఆరువేలబంగారు రథాల్ని - అరణంగా ఆనందంతో ఇచ్చాడు.

ఈ ప్రకారంగా దుర్యోధనుడు అరణమిచ్చి, కొత్త దంపతుల్ని పంపగా బలరాముడు కొడుకును కోడలిని వెంటబెట్టుకుని ద్వారకానగరానికి వచ్చి, అచటి తమవారితో తాను హస్తినాపురానికి వెళ్లడం, దుర్యోధనాదుల దుష్ప్రలాపాలూ చెప్పి, ఆ మాటలకు ప్రతిక్రియగా తాను హస్తినాపురాన్ని నాగలితో పెకలించి గంగలో పడవేయబోవడం, కౌరవులు ఆ దెబ్బకు గజగజలాడి క్షమను కోరడం వివరించి చెప్పి, సుఖంగా కాలం గడపసాగాడు.

నేటికీ హస్తినాపురంమాత్రం దక్షిణపుతట్టు ఎత్తుగాను, ఉత్తరపుతట్టు గంగవైపు మొగ్గి ఉండి, బలరామునిమహిమను తెలియజేస్తూ ఉంది. ఆ మహాత్ముని భుజబలం ఎదురులేనిది అని శుకమహర్షి పరీక్షిత్తు మహారాజుకు చెప్పి ఇంకా ఇట్లన్నాడు.

షోడశసహస్ర స్త్రీ సంగతుండైన శ్రీకృష్ణుని మహిమ నారదుడు తెలిసికోవడం







Balaramudu Dvividhudanu Vaanaruni Samharinchuta - బలరాముడు ద్వివిదుడను వానరుని సంహరించుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
బలరాముడు ద్వివిదుడను వానరుని సంహరించుట

దైవత్వంగల ఓ శుకమహర్షీ! బలరాముడు ఎంతో గొప్పవాడు, సర్వాధికుడు, అంతంలేనివాడు. అతణ్ణి గురించి, అతడుచేసిన అద్భుతమైన పనుల్ని గురించి ఎంత విన్నప్పటికీ నాకు తనివి తీరడంలేదు. ఆ బలరాముణ్ణి గురించి మరికొన్నివిశేషాలు నాకు విశదీకరించి తెలియజేయండి - అని పరీక్షిన్మహారాజు కోరాడు.

(ఇక్కడ బలరాముడికి - అప్రమేయుడు, అలఘుడు, అనంతుడు - అనే మూడువిశేషణాలు. వీటిలో అనంతుడు అనేది సాభిప్రాయవిశేషణం. అనంతుడు అంటే శ్రీహరికి పాన్పుగా ఉన్న ఫణిరాజు అనికూడా అర్థం. బలరాముడు శేషునిఅవతారం. ఆ అర్థాన్నికూడా ఇక్కడ సమన్వయించుకోవాలి. మూలంలోని 'అనంతస్యాప్రమేయస్య' - అనే ప్రయోగంలోని చమత్కారాన్ని గమనించి, పోతన యథాతథంగా అనుసరించారు.)

బలరాముని విశేషాలు మరికొన్ని చెప్పుమన్న రాజుతో శుకమహర్షి ఇలా చెప్పాడు.

ఓ రాజా! సుగ్రీవునిమంత్రి, మైందునికి తోడబుట్టినవాడు అయిన ద్వివిదుడు అనే వానరశ్రేష్ఠుడు నరకాసురునికి చెలికాడు కావడంతో మిక్కిలి గర్వితుడై

(ఇక్కడ ప్రస్తావింపబడిన సుగ్రీవుడు - మైందుడు - ద్వివిదుడు - త్రేతాయుగంలో శ్రీరాముని వానరసేనలోనివారే. సుగ్రీవుడు రామునికి ప్రియమిత్రుడు.)

ద్వివిదుడు తన స్నేహితుడైన నరకుణ్ణి శ్రీకృష్ణుడు చంపినందుకు శ్రీకృష్ణునిమీద పగదీర్చుకోదలచాడు. అందుకై కృష్ణుడు పరిపాలించే పట్టణాల్లోనూ, పల్లెల్లోనూ ప్రవేశించి వాటిల్ని పాడుచేస్తూ, దహించివేస్తూ, రాజులు నివసించే అంతపురాలను పడగొట్టి, అగడ్తలు పూడ్చివేసి, నదుల్ని, ఉద్యానవనాల్ని, కొలనుల్ని తవ్విపోసి, స్త్రీపురుషుల్ని పట్టుకుని తీసుకుపోయి కొండగుహల్లో బంధించి, గుహల వాకిళ్లు మూసివేసి నానావిధాలయిన బాధలుపెట్టి, బాగా పండినచెట్లను విరిచివేసి, సాధువుల్ని హింసించి - భూమినంతా బహురీతులుగా మాత్సర్యంతో బాధలుపెడుతూ ఆ వానరుడు ఒకనాడు

మిక్కిలి మనోజ్ఞమయిన లలితగీతంయొక్క సవ్వడి వినబడగా, ఆ పాట వినబడిన దిక్కుగా రైవతపర్వతం గుహదగ్గరకు వడివడిగా వెళ్ళి, అక్కడ పాచికలాడుతున్నవాణ్ణి

మనోహరమైన నీలపువస్త్రాలు ధరించినవాడూ, వేడుక కత్తెలయిన యువతులతో కూడుకున్నవాడూ, స్వచ్చమైన వెన్నెలకాంతివంటి కాంతిగల తెల్లనిదేహంగలవాడూ, మణిమయాలైన బంగారుసొమ్ములు అలంకరించుకొన్నవాడూ, కాదంబరీ అనే మద్యపానంచేత తిరుగుడుపడుతున్న కన్నులుగలవాడూ, నాగలితో శత్రురాజుల పట్టణాలను ధ్వంసం చేసినవాడూ; మన్మథుణ్ణి పాలించినవాడూ అయిన బలరాముణ్ణి చూశాడు.

ఆ బలరాముణ్ణి చూచి, ఆయనకు ఎదుట ఉండే మాకులెక్కి దానికొమ్మల్ని ఊగులాడించడం, పండ్లిగిలించి, యేమరించి ఏదో ఎత్తుకొనిపోవడం, ముడ్డిచూపడం, చెట్లపళ్లను కొఱికి కొఱికి పారవేయడం మొదలయిన కోతిచేష్టలు చేస్తూండగా బలరాముడు కోపించి ఒక గుండెత్తి ఆ కోతిపై వేశాడు. 

ఆ కోతి ఆ గుండుదెబ్బను తప్పించుకొని దుష్టత్వంతో బలరాముణ్ణి వెక్కిరిస్తూ ఆ ద్వివిదుడు అక్కడగల బలరాముని మద్యపుకుండను ఎత్తుకొని ఒక చెట్టుకొమ్మ మీదికిపోయి అక్కడనుండి నేలమీదకు పడవేసి పగులగొట్టాడు - కల్లుకుండ ఛిన్నాభిన్నమై పడిఉండటాన్ని చూచిన బలరాముడు మిక్కిలి కోపంతో

ఇంకనూ

ద్వివిదుడు బలరాముణ్ణి ఏ కొంచెంకూడా లక్ష్య పెట్టక, సమీపానికి వచ్చి, ఆయన ధరించిన వస్త్రాలు చింపాడు. ఆ చర్యకు బలరాముడు కోపించి, ఈ ద్వివిదునివలని బాధలు భూమిమీది ప్రజలకందరికీ లేకుండ చేయదలచినవాడై

(చీర =  వస్త్రవిశేషం. ఒకప్పుడు పురుషులూ, స్త్రీలూ అనే భేదం లేకుండా అందరూ ధరించే పెద్దవస్త్రాన్ని చీర అనే పేర్కొనేవారు. ఆధునికకాలంలో “చీర' - అనేది స్త్రీలు ధరించే వస్త్రానికే పరిమితమయింది.)

బలరాముడు అప్పుడు తన ముసలాయుధాన్నీ, హలాయుధాన్నీ ధరించి, సమస్తప్రాణికోటిని నశింపచేసే ప్రళయకాలంలోని యమునిలాగా ఆ వానరుణ్ణి అదిలించి, ఎదురు నిలిచాడు. ద్వివిదుడుకూడా బలరాముణ్ణి లక్ష్య పెట్టక పరాక్రమాతిశయంతో తనకు చేతివాటు దూరంలోని ఒక్క వృక్షాన్ని పెళ్లగించుకొని వచ్చి, బలరాముణ్ణి తలమీద మోదాడు.

ఈ విధంగా ఆ వానరుడు కొట్టగా బలరాముడు ఆ సమయంలో

కర్రతో కొట్టబడిన పెద్దపాము మిక్కిలి వేగంగా ఒక్కసారిగా ఎగసిపడినట్లు, అంతులేని వీరరసం విజ్బంభించినట్లు బలరాముడు ప్రకాశిస్తూ, సునందం అనే పేరుగలది, బంగారపుకట్లువేసి తయారు చేయబడినదీ అయిన రోకలితో - ఒకవైపు దేవతలందరూ కోయని కేకలువేస్తూ, పొగడుతూ ఉండగా, ద్వివిదుని మెడమీద కొట్టాడు. ఆ దెబ్బతో వాడు ఎర్రని చారికలుగల కొండవలె ఒంటినిండా నెత్తురు క్రమ్మగా నేలమీద చదికిలబడ్డాడు.

అంతట ఆ ద్వివిదుడు కొంచెంసేపు మూర్చపొంది ఉంది, వెంటనే తేరుకొని అణపలేని ఆటోపంతో తన భుజబలం మెరసేటట్లు ఒక చెట్టును పెరికి బలరామునిపై వేశాడు. అంతట బలరాముడు ఆ మాను తనమీద పడకముందే అది తునాతునకలై నేలపడేటట్లుగాగొట్టి తనయొక్క పరాక్రమాతిశయాన్ని ప్రకాశింపజేశాడు.

అంతటితో తనపట్టుదలను వదలక ఆ వానరుడు ఒకచెట్టును పెరికి తనపై ప్రయోగించగా బలరాముడు దాన్ని లెక్కచేయక నరికేశాడు. వానరుడుకూడా ఆగక బలరాముడు విరగ గొట్టుతుండగా, అదేపనిగా మాకులు పెల్లగించి వేయసాగాడు.

ఆ వానరుడు ఆ విధంగా చెట్లన్నీ పెరికివేసి, అన్నీ అయిపోగా ఒకసారి పరిస్థితిని గమనించి, బలరామునిపై రాళ్లవానను కురిపించాడు. దేవతలు పొగిడేలా

అప్పుడు బలరాముడు ఆ రాళ్లన్నీ పొడిపొడియై నేలరాలేటట్లుగా చేసి, సింహనాదం చేశాడు. అది విని ఆ వానరుడు వెనుదీయక తాటిచెట్టునుబోలిన తన నిడుపాటి చేతులు రెండింటితోను భయంకరుడై

ద్వివిదుడు పిడుగుతో సమానమయిన తన పిడికిటితో పొడువగా బలరాముడు ఏ మాత్రం వెనుకకు తగ్గక రోకటిని, నాగేటిని వదలివేసి, ఆ వానరునిమెడను పట్టుకొని కనుగుడ్లు ఉబికి బయటికి వచ్చేవిధంగా మెల్లమెల్లగా బిగించడం ప్రారంభించాడు. (కనుగ్రుడ్డు ఊడిపడేలా మెడను బిగించా డన్నమాట.)

ఓ రాజా! నోటినుండీ, చెవులనుండీ నెత్తురు, క్రొవ్వు అదేపనిగా కారుతుండగా ఆ వానరుడు నేలమీద చదికిలబడి తిరిగి లేవలేక చనిపోయాడు.

ఆ సమయంలో ద్వివిదుడు పడి మరణించినపుడు ఆ బరువుకు ఆ రైవతకపర్వతం తనమీది అడవులతోగూడ గడగడవడకింది. దేవతలు మిక్కిలి సంతోషించి, సువాసనలతో నిండిన పూలవాన కురిపించారు.

ఈ విధంగా లోకంలోని జనులందరినీ బాధిస్తున్న ఆ వానరుణ్ణి భూమికి బలి ఇచ్చి, సకలజనులు తనను ఎంతో ఆనందంతో పొగడుతూండగా బలరాముడు తనపట్టణానికి విజయుడై వచ్చా డని శుకమహర్షి రాజుతో చెప్పాడు.

బలరాముడు హస్తినాపురమును గంగలో ద్రోయ బూనుట







Krishnudu Poundrakavasudevunimida Dandethipoyi Vaanim Jamputa - కృష్ణుడు పౌండ్రకవాసుదేవునిమీద దండెత్తిపోయి వానిం జంపుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
కృష్ణుడు పౌండ్రకవాసుదేవునిమీద దండెత్తిపోయి వానిం జంపుట

పౌండ్రక వాసుదేవుడు బలంవల్ల కలిగిన పొగరుతో పిచ్చివాడై భూమిపై వాసుదేవుడనే పేరు నాకు ఒక్కడికే కాక ఇతరులకు తగునా? కృష్ణుడు తాను వాసుదేవుణ్ణి అని అనుకొంటున్నట్లు తెలిసింది అని తన రాయబారిని పిలిచి, కృష్ణుని దగ్గరకు పంపాడు. 

ఆ రాయబారి కృష్ణుడు రాజసభలో ఉండగా జంకకవెళ్ళి, పౌండ్రకునిమాటలుగా ఇలా చెప్పాడు. 'కృష్ణా! భూమిని కాపాడేందుకు వాసుదేవుడని పేరు కలిగిన నేను ఉండగా - సిగ్గులేనివాడవై - నీవు
నా నామాల్ని, లాంఛనాల్ని దాల్చి సంచరిస్తున్నావు. ఈ పనిలో నీకు నాతో పోటీయా? గొల్లవానికి రాచమర్యాద ఏ తీరున తెలుస్తుంది?

ఇప్పటినుండైనా తన శక్తినీ, ఎదుటివారిశక్తినీ తెలుసుకొని నా చిహ్నాలనన్నింటిని వదలి, నన్ను సేవించి బతకమని చెప్పు. అలా కానట్లయితే భయంకరమైన యుద్ధంలో ఎదుర్కోమను, చూద్దాం.

రాయబారిప్రలాపాలు విని, సభ్యులు పరస్పరం ఒకరిముఖాన్ని ఒకరు చూచుకొన్నారు. సభ్యులారా! మనం - ఎలాంటి కొత్తమాటలు వింటున్నాం. ఈ రాయబారిమాటలను బాగుగ విన్నారుకదా! అనగా

ఆ సందర్భంలో కృష్ణుడు పౌండ్రకుని రాయబారితో ఇలా చెప్పాడు.

ఓరీ! విను. "మీరాజు పొండ్రకుడు చెప్పిన చిహ్నాలతో వచ్చి, భయంకరయుద్ధంలో వాటిల్ని ప్రయోగించగా తాను భూమిపైబడి అవయవాలను పోగొట్టుకొని రాబందులు, గద్దలు, మూగగా కుక్కల గుంపులకు ఆహారమౌతావని మీరాజు పౌండ్రకునితో నేను చెప్పినట్లు చెప్పు” అని కృష్ణుడు పలికాడు.

కృష్ణుడు ఆవేశంతో పల్కిన మాటలకు భయపడి హృదయం కలతపడుతుండగా తన ప్రభువయిన పొం
డ్రకునికి విపరీతభావం కల్గేట్టుగా చెప్పాడు.

కృష్ణుడు కదనకుతూహులుడడై దారుకుడు తెచ్చిన రథాన్ని అధిరోహించాడు. పొండ్రకుడూ రెండుఅక్షౌహిణుల సైన్యంతో మిత్రుడు, కాశీరాజు మూడు అక్షౌహిణుల సైన్యంతో కదనరంగానికి వెళ్ళారు.

(1. అక్షౌహిణి అనగా- 21870 రథాలూ, 21870 ఏనుగులూ; 65610 అశ్వములూ, 109850 పదాతులును కలిగినసేన. ఒక అక్షౌహిణి అంటే - 218700ల సేనతో కూడింది.)

శంఖం, చక్రం, గద, శార్ఙ్గాలనే ఆయుధాలను పొండ్రకుడు ధరించాడు. కృత్రిమకౌస్తుభమణిని వక్షఃస్థ్సలంలో ధరించాడు. మకరకుండలాలు, హారాలు, కంకణాలు, రత్నపుటుంగరాలు, మెడలో వనమాల ధరించాడు. గరుడకేతనాన్ని రథంపై కూర్చాడు. పీతాంబరాన్ని ధరించాడు.

వేగంగల గుర్రాల్ని కట్టిన రథాన్ని అధిరోహించాడు. ప్రకాశించే కిరీటాన్ని ధరించాడు. అట్టి పౌండ్రకుణ్ణి చూచి నాటక రంగంపై విహరించే నటుణ్ణిగా భావించి, శ్రీకృష్ణుడు నవ్వాడు. ఆ నవ్వు చూచి పౌండ్రకునికి కోపం కలిగి

పరిఘ, శరాసన, పట్టిస, శర, ముద్గర, ముసల, కుంత, చక్ర, గద, తోమర, భిందిపాల, శక్తి, క్షురిక, అసి, ప్రాస, శూలాది ఆయుధాలతో వేగంగా

శ్రీకృష్ణుడు ఆయుధాల్ని వేగంగా విసరి పౌండ్రకునిపై, శత్రువుల ఆయుధాల్ని తుంచి, వాళ్లను వణికించే పాంచజన్యం పూరించాడు.

కృష్ణుడు తగ్గని కోపంతో విజృంభించాడు. మృత్యుదేవత చెలగాటమాడినట్లు శత్రు సైన్యాలు శవాల గుట్టలయ్యాయి. రథాలు నేలపై పడ్డాయి. గుర్రాలు కూలాయి. ఏనుగులు ఒరిగాయి. వీరులైన భటులు మరణించారు. మిగిలినవారు చావు తప్పించుకొన్నారు.

ఆ సమయంలో రక్తప్రవాహంలో క్రొవ్వు, మాంసంపడి బురదగా అయింది. యుద్ధభూమి మిక్కిలి భయంకరమయింది. అట్టి సమయంలో తగవుకు సిద్ధపడుతున్న పౌండ్రకుణ్ణి చూచి పిలిచి కృష్ణుడు ఈ విధంగా చెప్పాడు.

రాజాధమా! పౌండ్రరాజకుమారా! నీ పౌరుషాన్ని నేటియుద్ధంలో రూపుమాపేటట్లు చేస్తాను. ఎద్దు కొవ్వెక్కి ఆబోతు పై రంకెలు వేసినట్లుగా నీ మాటలు ఉన్నాయి. నీవు ఆక్షేపించిన నా పేరు, చిహ్నాలు మంటలు కురిపిస్తుండగా నేటియుద్ధంలో నీపై ప్రయోగిస్తాను.

నేను నీ శరణును తరువాత వేడుకొంటాను. నీవు బలపరాక్రమ సంపద కలిగినవాడివి అయితే యుద్ధంలో స్థిరంగా పలుకుతూ వాడి అయిన బాణాలు

కృష్ణుడు విజృంభించి పౌండ్రకుని రథాన్ని గుర్రాల్ని సారథిని చంపి, భయంకరమయిన పరాక్రమంతో ప్రళయకాల సూర్యునివలె మంటలు కక్కే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఆ చక్రం దెబ్బతో పౌం
డ్రకుడు వజ్రాయుధం దెబ్బకు కూలిన పర్వతంవలె నేలకూలాడు.

కాశీరాజు శిరస్సును శ్రీకృష్ణుడు ఖండించాడు. ఆ శిరస్సును ఎగురకొడుతూ కాశీపట్టణంలో పడేటట్లు చేశాడు. ఒకదానివెనుక మరోబాణం చివర్ల గుచ్చుకొనేట్లు సాగే బాణాలను ప్రయోగించాడు. ఈ విధంగా కృష్ణుడు శత్రువుల్ని జయించి ఆనందిస్తూ

సుర, గంధర్వ, గరుడ, ఉరగ, సిద్ద సాధ్య గణాలు తనను ప్రశంసిస్తూ ఉండగా తిరిగివచ్చి, కృష్ణుడు తన నగరంలో మిక్కిలి వైభవంతో సుఖంగా ఉన్నాడు.

కృష్ణుని లాంఛనాలు ధరించడంచేత, మత్సరబుద్ధితో కృష్ణుణ్ణి సర్వకాల సర్వావస్థల్లో స్మరించడంవల్ల, పౌం
డ్రకునికి మోక్షం లభించింది.

పౌండ్రకుని మరణాని కాయన భార్యలు, బంధువులు, మిక్కిలి పరితపించారు. పౌం
డ్రకుని కుమారుడగు సుదక్షిణుడు శాస్త్రోక్తంగా తండ్రికి పరలోకక్రియలు చేశాడు. యుద్ధంలో తండ్రిని వధించిన కృష్ణుణ్ణి నుగ్గు చేసేందుకు తగిన ఉపాయం ఆలోచించి, అందుకు నేర్పరి అయిన తన పురోహితుణ్ణి ఆహ్వానించాడు.

రాజపురోహితుడూ, సుదక్షిణుడూ శివునిపాదపద్మాలకు మొక్కి ఆ దేవుణ్ణి అనేకవిధాలుగా సేవించగా, శివుడు దయకలిగి

'మీరు నన్ను సేవలతో మెప్పించారు. మీరు కోరే కోరిక తప్పక తీరుస్తాను' అని శివుడు అంటే సుదక్షిణుడు శివా! అభవా! పురహరా! తనవాడు పరవాడు అనే భేదంలేకుండా ప్రేమతో మమల్ని రక్షించేవాడివి నువ్వే!

ఓ శివా! నా తండ్రిని కృష్ణుడు యుద్ధంలో చంపాడు. నేను కృష్ణుణ్ణి యుద్ధభూమిలో ఏ విధంగా గెలుస్తానో చెప్పుమని సుదక్షిణుడు పలికాడు.

సుదక్షిణుని కోరిక విని, శివు డాతనితో ఈ విధంగా చెప్పాడు. పుణ్యాత్ముడా! నీవూ, ఋత్విజులగు బ్రాహ్మణులూ తృప్తిగా అభిచారహోమం చేస్తే భూతాలతో కూడిన అగ్ని నీ కోరికను తీరుస్తాడు.

శివుడు చెప్పిన విధంగా సుదక్షిణుడు అధికమైన నియమాలతో మారణహోమం చేశాడు. అగ్నిదేవుడు తృప్తి చెంది ప్రదక్షిణంగా తిరుగుతున్న జ్వాలలతో ప్రకాశించాడు.

మారణహోమాగ్ని ఉన్న హోమకుండం నుండి కృత్య భయంకర రూపంతో, రక్తంతో కూడిన నాలుకతో పెదవులను నాకుకొంటూ వచ్చి, అగ్నిజ్వాలవంటి శూలాన్ని ధరించి, తన పాదఘట్టనవల్ల దుమ్ము వ్యాపిస్తుండగా భూతాలు తనను సేవిస్తూండగా, కన్నులనుండి రాలే మంటలతో దిక్కులను కాలుస్తూ, మిక్కిలి వేగంగా కృష్ణుడుండే ద్వారకానగరం చేరింది. 

ద్వారకావాసులు భయపడి రక్షించు రక్షించుమని కృష్ణుణ్ణి వేడారు. కృష్ణుడు పారిపోకుడని వారికి ధైర్యం చెబుతూ, తన దివ్యదృష్టితో విషయం తెలుసుకొన్నాడు. ఈ పని సుదక్షిణుడు చేసిన మారణహోమఫలం అని తెలిసికొని, కృత్యను అడ్డగించెందుకు సుదర్శనచక్రాన్ని పంపాడు.

(కృత్య శత్రుసంహారంకోసం - అందుకు తగిన మంత్రాలతో, వస్తువులో హోమంచేస్తే ఆ హోమంనుండి పుట్టే క్షుద్రదేవతా శక్తి. 'కృత్య' - ఆజ్ఞాపించినపనిని చేసేది అని వ్యుత్పత్తి.)

కృష్ణుడు భయంకరమైన శత్రువులను చంపేట్టిదీ, సూర్యకాంతిని ధిక్కరించేకాంతి కలదీ, అన్ని దిక్కులకు పోగలిగినట్టిదీ, శాశ్వతమైందీ, వేదాలచే స్తుతింపదగిందీ, సుజనులచే స్తుతింపబడేదీ, భక్తులచేత సేవింపబడేదీ, దేవతలచే నమస్కరింపబడేదీ, రాక్షససంహారం చేసేదీ, ప్రళయకాలంలో శివునిఫాలనేత్రంనుంచి వెలువడిన మంటలవలె భయంకరమై తన జూలు అనెడి అగ్నిజ్వాలలతో ప్రాణులకు భయాన్ని కల్గించేదీ అయిన సుదర్శనచక్రాన్ని కృత్యపైకి పంపాడు.

ఆ చక్రాయుధం ప్రళయకాలంనాటి మేఘాలనుంచి పుట్టిన ధ్వనివంటి భయంకర ధ్వనితో, ఆకాశాన్నంటుతున్న అగ్నిజ్వాలలతో, సకలదేవతలు జయ జయధ్వానాలు చేస్తుండగా, అమిత తేజస్సుతో వెలుగొందుతూ కృత్యను సమీపించింది. తనను చూచి తడబడకుండా కంటిగించుకుంటున్న కృత్యను గెంటివేసి వెంటబడింది. 

అప్పుడు కృత్య తన పూర్వపు రౌద్రరూపాన్ని వదలి తిరిగి కాశీపురంలో దూరింది. మరలి వచ్చిన కృత్యను చూచి పౌరులంతా భయపడి శోకిస్తుండగా ఆ కృత్య రోషభీషణమైన ఆకారంతో ఋత్విజులతోపాటు సుదక్షిణుణ్ణి దహించివేసింది.

అప్పుడు శ్రీకృష్ణుని చక్రాయుధం సౌధగోపుర ప్రాకారాలతో పాటు ఆ నగరాన్ని భస్మీపటలం చేసింది. దేవతలంతా ఆశ్చర్యపడేట్లు శ్రీకృష్ణునిచెంతకు చేరింది అని శుకమహర్షి పరీక్షిత్తు మహారాజుతో చెప్పి, కృష్ణగాథను ఇంకా కొనసాగించాడు.

పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణు విజయం అనే పేరుగల ఈ చరిత్రను చదివినా, విన్నా భగవంతుని కృపచే పుణ్యాత్ములై ఇహపరలోక సుఖాలను పొందుతారు.

రాజయోగియగు పరీక్షిన్మహారాజు శుకునితో ఇలా అన్నాడు.

బలరాముడు ద్వివిదుడను వానరుని సంహరించుట







Hayagriva Jayanthi - హయగ్రీవ జయంతి

హయగ్రీవ జయంతి శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారం దాల్చిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆయనకు కృతజ్ఞతగా జరుపుకునే విశేషమైన పండుగ హయగ్రీవ జయంతి. శ్ర...