Tuesday, August 25, 2026

Rugvedam & Yajurveda Upaakarma - ఋగ్వేదం & యజుర్వేద ఉపాకర్మ

ఋగ్వేదం & యజుర్వేద ఉపాకర్మ

ప్రతి సంవత్సరం, శ్రావణ మాసంలో శ్రావణ నక్షత్రం రోజున ఉపాకర్మ నిర్వహిస్తారు.

ఉపనయనం తరువాత, 
ఉపాకర్మ మొదటి రోజున వేద అధ్యయనం ప్రారంభమవుతుంది.

ఇప్పటికి వేదపాఠశాలలో ఈ విధానం పాటిస్తారు. తరువాతి పుష్య  మాసంలో ఉత్సర్జన కర్మ చేయబడుతుంది,  వేద అధ్యయనం నిలిపివేయబడుతుంది మరియు తరువాతి ఆరు నెలల పాటు, శిక్ష, వ్యాకరణ, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం మరియు కల్పసూత్రం అనే ఆరు వేదాంగాలలో సాధ్యమైనంత వరకు అధ్యయనం చేయబడుతుంది. 

ఆపై తరువాతి సంవత్సరం శ్రావణ మాసంలో, ఉపకర్మ రోజున, ఉపకర్మ నిర్వహించి వేద మంత్రాల అధ్యయనాన్ని తిరిగి ప్రారంభిస్తారు.

వేద అధ్యయనాన్ని ప్రారంభించే ఈ కర్మనే ఉపకర్మ అంటారు. ఈ విధంగా ఉపకర్మ నిర్వహిస్తేనే, మన వద్ద ఉన్న కొద్దిపాటి వేద మంత్రాలకు శక్తి లభిస్తుంది. లేకపోతే, అది భగవద్గీతలో వర్ణించబడిన ఆహారం వలె 'యతయామం' అవుతుంది.

యజుర్వేద ఉపకర్మ
వేదాలను ప్రారంభించి నేర్చుకోవడమే కాకుండా, ఉపాకర్మ రోజున, బ్రాహ్మణులు శ్రౌత కర్మలతో పాటు తమ నూతన యజ్ఞోపవీతం ధారణ చేస్తారు.

ఉపాకర్మ అనేది ఇప్పటికీ బ్రాహ్మణులు ఆచరించే వైదిక ఆచారం.
యజుర్వేదాన్ని అనుసరించే వారు శ్రావణ పూర్ణిమ రోజున అంటే శ్రావణ మాసంలోని పౌర్ణమి రోజున ఉపాకర్మను పాటిస్తారు.

ఋగ్వేద ఉపకర్మ
ఋగ్వేదాన్ని అనుసరించే వారు శ్రావణ మాసంలో శ్రావణ నక్షత్రం రోజున ఉపాకర్మను పాటిస్తారు.

సామవేద ఉపకర్మ
సామదాన్ని అనుసరించే వారు భాద్రపద మాసంలో హస్తా నక్షత్రం రోజున ఉపాకర్మను పాటిస్తారు.

సామవేద ఉపాకర్మ దినం సాధారణంగా యజుర్వేదం మరియు ఋగ్వేద ఉపాకర్మ పక్షం
రోజుల తర్వాత వస్తుంది.

అధర్వణవేద ఉపకర్మ
అధర్వణవేదాన్ని అనుసరించే వారు శ్రావణ పౌర్ణమి లేదా భాద్రపద పౌర్ణమి రోజున ఆచరిస్తారు.

దీని ప్రకారం, యజుర్వేదం మరియు ఋగ్వేదం అనుసరించే వారి ఉపకర్మ భిన్నంగా ఉండవచ్చు.

తమిళనాడులో ఉపకర్మను అవని అవిట్టం అంటారు. తమ మొదటి ఉపాకర్మను చేసే వారికి, దీనిని తలై అవని అవిట్టం అంటారు.

తెలుగువారు శ్రావణ పూర్ణిమలో జరిగే ఉపాకర్మ ఆచారాన్ని జంధ్యాల పూర్ణిమ అంటారు.

శ్రావణ పూర్ణిమ రోజు హయగ్రీవ జయంతితో కలిసి వస్తుంది కాబట్టి, బ్రాహ్మణులు వేద అధ్యయనాన్ని ప్రారంభించడానికి ఈ రోజు మంచిదిగా భావిస్తారు.

హయగ్రీవ అవతారం విష్ణువు యొక్క అవతారములలో ఒకటి. 
శ్రావణ పూర్ణిమ రోజు శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారం దాల్చాడు కావున ఆ రోజును హయగ్రీవ జయంతిగా చేస్తారు.

పురాణం:
శ్రావణ మాసంలోని పౌర్ణమి రోజున, మధు-కైటభ అనే దైత్యులు బ్రహ్మ నుండి దొంగిలించిన వేదాలను విష్ణువు(హయగ్రీవ రూపంలో ) తిరిగి ఇచ్చాడని పురాణం.

విష్ణువు తన నాభిపై ఉన్న పద్మం నుండి బ్రహ్మను సృష్టించిన తరువాత, తన చర్మంపై తమోగుణం(చీకటి) మరియు రజోగుణం(చలత్వం) గల రెండు చెమట బిందువులను సృష్టించాడు.

ఆ బిందువుల నుండి మధు, కైటభులు జన్మించారు. వారు మహాదేవిని తప్పస్సు తో మెప్పించి, తాము కోరుకున్నప్పుడు మాత్రమే మరణించే వరాన్ని పొందారు.

వరగర్వంతో, అహంకారంతో ఆ సోదరులు బ్రహ్మ నుండి వేదాలను దొంగిలించి, పాతాళంలో దాక్కున్నారు. నిస్సహాయుడైన బ్రహ్మ విష్ణువును ప్రార్థించాడు. 

అప్పటికే హయగ్రీవ రూపం దాల్చిన శ్రీమహావిష్ణువు ఆ సోదరులను ఎదుర్కొని వారితో యుద్ధం చేశాడు. వారి పరాక్రమానికి ముగ్ధుడైన విష్ణువు, ఆ సోదరులకు తమకు నచ్చిన వరాన్ని ఇస్తానని చెప్పాడు.

దేవీ వర మదంతో, ఆ దైత్యులు నవ్వి, బదులుగా తమను వరం అడగమని విష్ణువును కోరారు. ఆ శ్రీమహావిష్ణువు వారిని సంహరించగల సామర్థ్యాన్ని పొందే వరాన్ని కోరాడు. ఆశ్చర్యపోయిన ఆ సోదరులు, నీటిపై తప్ప మరెక్కడైనా వారిని చంపగల వరాన్ని ప్రసాదించారు. 

ఆ దైత్యులు పరిమాణంలో పెరుగుతుండగానే, విష్ణువు వాటిని పట్టుకుని, తన తొడలపై ఉంచి, తన దివ్య చక్రమైన సుదర్శన చక్రంతో వారిని శిరచ్ఛేదం చేశాడు. ఈ విధంగా, వేదాలు బ్రహ్మకు తిరిగి ఇవ్వబడ్డాయి.

శ్రావణ పూర్ణిమ రోజు శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారం దాల్చి వేదాలను రక్షించాడు కావున శ్రావణ పూర్ణిమ రోజును హయగ్రీవ జయంతిగా కూడా జరుపుకుంటారు.

ఉపాకర్మ అనేది వేదాల జ్ఞానాన్ని మానవాళికి అందించిన మరియు  పవిత్రమైన వేద మంత్రాలను మనకు వెల్లడించిన పురాతన ఋషులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆచరించే క్రియ.

ఉపాకర్మ మరుసటి రోజు గాయత్రీ జపంగా ఆచరిస్తారు.

హయగ్రీవుడు

Bhudevi Srikrishnuni Stuthinchuta - భూదేవి శ్రీకృష్ణుని స్తుతించుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
భూదేవి శ్రీకృష్ణుని స్తుతించుట

“అంభోజనాభున కంభోజనేత్రున కంభోజమాలాసమన్వితునకు
నంభోజపదున కనంతశక్తికి వాసుదేవునకును దేవదేవునకును
భక్తులు గోరినభంగి నే రూపైనఁ బొందువానికి నాదిపురుషునకును
నఖిలనిదానమై యాపూర్ణవిజ్ఞానుండైనవానికిఁ బరమాత్మునకును

ధాతఁ గన్న మేటితండ్రికి నజునికి, నీకు వందనంబు నే నొనర్తు
నిఖిలభూతరూప! నిరుపమ! యీశ! ప, రాపరాత్మమహిత! యమితచరిత!

అఖిలజీవస్వరూపా! నిరుపమానా! ఈశ్వరా! పరాపర ప్రకృతి దయరూపా! నిరవధికచరితా! శ్రీకృష్ణా! నీవు పద్మం నాభియందు కలవాడివి. కమలాలవంటి కన్నులు గలవాడివి. పద్మహారం కలవాడివి. పద్మాలవంటి చరణాలు కలవాడివి. అనంతశక్తి సంపన్నుడివి. 

వసుదేవునికుమారుడివి. దేవతలకే దేవుడివి. భక్తులు కోరిన ఏ రూపమైనా ధరించేవాడివి. సృష్టికి పూర్వమే ఉండే పురుషుడివి. సర్వానికీ మూలకారణమైనవాడివి. పరిపూర్ణ విజ్ఞానివి. పరమాత్ముడివి. బ్రహ్మను కనిన గొప్పతండ్రివి. జననం లేనివాడివి. ఇట్టి నీకు నేను నమస్కరిస్తున్నాను.

దేవా! నీవు రజోగుణంతో కూడి బ్రహ్మవై లోకాలను సృష్టిస్తావు. సత్త్వగుణం కలిగి విష్ణువువై వాటిల్ని రక్షిస్తావు. తమోగుణాన్ని ధరించి వాటిల్ని నశింపజేస్తావు. నీవే కాలస్వరూపుడవు.

పరమాత్మవు; ప్రకృతి, పురుషుడు, మనస్సు, బుద్ధి, అహంకారం, పంచభూతాలు, జ్ఞానేంద్రియాలూ, కర్మేంద్రియాలూ, శబ్దరూపరసాదులూ - అనే పంచవింశతితత్వాలూ (25), ఇంద్రియాల అధిదేవతలూ, స్థావరజంగమాలతో కూడిన యావద్విశ్వమూ సాటిలేని నీయందే పుడుతున్నాము.

భక్తుల్ని చల్లని చూపులతో చూచేవాడా! జాలిగొలుపే వారిని కాపాడేవాడా! దయతో ఈ వైపు చూడవయ్యా!. వీడు నరకాసురుని కుమారుడు. నిన్ను చూచి భయపడుతున్నాడు. వీడు పసిబిడ్డ. దిక్కులేనివాడు. దుఃఖిస్తున్నాడు. ఏ ఆశ్రయం లేనివాడు. తండ్రిమాదిరిగా పరాక్రమంతో ఎదురు తిరుగడం తెలియనివాడు. నీ కాళ్ల దగ్గరకు చేరాడు.

ఈ విధంగా భూదేవి భక్తితో శ్రీకృష్ణునికి నమస్కరించి, మాటల పూలతో పూజచేసింది. భక్తానురాగం కలిగిన శ్రీకృష్ణుడు నరకాసురుని కుమారుడయిన భగదత్తునికి అభయప్రదానం చేసి, సర్వభాగ్యాలూ ప్రసాదించాడు. తర్వాత నరకునిభవనం ప్రవేశించి, దానిలో


శ్రీకృష్ణుడు పదాఱువేల కన్నియల వరించి దేవలోకమునకు బోయి పారిజాతము దెచ్చుట





Satyabhama Narakasurunitho Yuddhambu Seyuta - సత్యభామ నరకాసురునితో యుద్ధంబు సేయుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
సత్యభామ నరకాసురునితో యుద్ధంబు సేయుట

శ్రీకృష్ణుడు యుద్ధంలో దుర్మార్గులయిన రాక్షసుల్ని సంహరించటానికి వచ్చిన సత్యభామను చూచి, రసమయము లయిన మంచి మాటలతో

సత్యభామా! నేను రాక్షసుల్ని జయించలేనా? నీవెందుకు కయ్యానికి పూనుకొని లేచావు? ఈ ప్రక్కకు రా! లెమ్ము. యుద్ధప్రయత్నం మాను; మానుకోలేకపోతే నా ధనుస్సును చేతితో తీసికో! లే!

అని చెప్పి

శ్రీకృష్ణుడు దేవతలను ఆనందింపజేయునది, వీరులూ గట్టివారు అయిన రాక్షస సైన్యానికి భయం కలిగించేదీ, శత్రువుల అహంకారాన్ని పోగొట్టేదీ అయిన వింటిని సత్యభామకు ఇచ్చాడు.

సత్యభామ శ్రీకృష్ణుడు ఇచ్చిన వింటిని పుచ్చుకొనింది. వెంటనే ఆమె బలం పొందింది. ఆ బలంవల్ల మహాతేజస్సూ, ఆ తేజస్సుచేత మహాపరాక్రమమూ ఆమెలో కలిగాయి.

అప్పుడు ఆమెవైపు కన్నెత్తి చూడటానికి రాక్షసవీరులకు అశక్యమయింది. తర్వాత సత్యభామ యుద్ధంమీద గల తహతహపాటుతో రాక్షసస్త్రీల కంఠాలకున్న మంగళసూత్రాలు తెగిపోయేటట్లు తన వింటియందు అల్లెత్రాటిని బిగించింది.

(ఇక్కడ సత్యభామ ఒక తాడును బిగిస్తుంటే, అక్కడ మరొక తాడు తెగిపోతున్నది అనడం ఇందులోని చమత్కారం.)

సత్యభామ, శత్రుసైన్యం తత్తరపడే ధ్వని వ్యాపింపగా, ఏనుగులు మొదలయినవి మూర్చపడగా అల్లెత్రాటిని మ్రోగించింది.

సత్యభామ యుద్ధం చేసేటప్పుడు ఆమెబంగారుగాజుల ఝణఝణధ్వనీ, అల్లెత్రాటిధ్వనీ ఏకమయ్యాయి. ఆమె చెవిపోగులలో పొదిగిన మణుల ధగధగమనే కాంతులు చెక్కిళ్లకాంతులను కప్పివేశాయి. ఆమెకడగన్నుల తళతళమనే కాంతులు బాణాల కాంతులను అణచి వేశాయి.

ఆమె ఏయుచున్న బాణాల ఘుమఘుమారావం, సైనికుల కలకలాన్ని మాన్సింది. వీర-శృంగార-భయానక-రౌద్ర-అద్భుత రసాలు కలసి, ఈ వీరనారిగా రూపొందిందేమో అని అనుకొనునట్లుగా ఆమె కనబడుతూంది.

ఆమె ఎప్పుడు బాణాన్ని వింటియందు కూర్చుతూ ఉందో, ఎప్పుడు నారిని లాగుతూ ఉందో! ఎప్పుడు బాణాన్ని ప్రయోగిస్తుందో తెలియడం లేదు.

సత్యభామ ఒయ్యారపుపోకడలు పోతూ రోషంతో ఏర్పడిన బొమముడులతో, వీరరసం అతిశయించగా, వాడి అయిన అస్త్రాలను ప్రయోగిస్తూ నరకాసురుణ్ణి పీడించటానికి ప్రయత్నించింది.

అనురాగంవల్ల జనించిన చిరునవ్వులు చిందిస్తూ, శృంగారరసం ఉద్దీపింపగా; కన్నులలో సొగసు కనబడగా; రసమయములయిన చూపులను ప్రసరింపజేస్తూ భర్త అయిన శ్రీకృష్ణుణ్ణి ఆనందింపజేయటానికి ప్రయత్నించింది. ఇలా వీర శృంగారాల్ని ఒక్కట ప్రదర్శించిన వీర శృంగారనారి సత్యభామ.

సత్యభామ సొగసు - ఉట్టి పడేటట్లు రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు విలుకానివలె ఎడమకాలు ముందుంచి నిలిచింది. ఆమె ముంగురులు నొసలి చెమటలో చెదిరాయి. ఆమె చెవివరకు లాగిన అల్లెత్రాటిని పట్టుకొన్న చేతివేళ్ల గోళ్ల కాంతులూ, అమ్ముల వెనుక భాగపు కాంతులూ అంతటా వ్యాపిస్తున్నాయి.

ఆమె చూపు గురి తప్పలేదు. ఆమె నారిని లాగటంవల్ల గుండ్రంగా అయిన వింటినుండి బాణాలు వదలి శత్రువుల్ని సంహరించింది. ఇలా సత్యభామ తన యుద్ధవిద్యావైశారద్యాన్ని ప్రదర్శించింది.

బొమ్మల పెళ్లిళ్లకు వెళ్లటాని కంగీకరించని బాలిక యుద్ధరంగాని కేవిధంగా రావాలనుకొనింది? మగవాళ్ళను చూచి చాటుకు వెళ్లే మహిళ శత్రువుల్ని జయించాలని ఎట్లా నిశ్చయించింది? బంగరు టుయ్యాలల్ని ఎక్కటానికి భయపడే పిరికిది గరుత్మంతుని మూపు ఏ తీరుగా ఎక్కింది? 

చెలికత్తెల పెద్దరొదలను సహింతచని చిన్నది యుద్ధవాద్య భాంకారాలను ఏ రకంగా ఓర్చుకొన్నది? నెమళ్లకు నృత్యం నేర్పుతూ కొంచెం సేపటికే అలసిపోయే సుకుమారి ఆలీఢపాదాదిపద్ధతులతో శత్రువుల గర్వం అణచివేయటానికి ఏ విధంగా సిద్ధపడింది?

వీణను చక్కగా పట్టుకోలేని వనిత వింటిని ఏ విధంగా పట్టగలిగింది? తీగను చెట్టుకు కట్టలేని మహిళ ఏ విధంగా వింటిచివర అల్లెత్రాటిని బిగించింది? క్రమంగా ముత్యాలు గ్రుచ్చలేని అబల ఏవిధంగా అల్లెత్రాటితో బాణాన్ని సంధించింది? చిలుకకు పద్యం చెప్పలేని అశక్తురాలు అస్త్రమంత్రాలు ఎప్పుడు నేర్చుకొనింది? 

మాట్లాడ మన్నప్పుడు ఎక్కువసేపు మాట్లాడలేని అమాయకురాలు ఏ విధంగా సింహనాదాలు చేసింది? - అని అనుకొనేటట్లుగా సద్గుణరాశీ, మనోజ్ఞకాంతిసంపన్న ఐన సత్యభామ ప్రకాశించింది.

సత్యభామ, అల్లైత్రాటిమోత ఉరుముగా, దేవతలు చాతకపక్షులుగా, ధనుస్సు ఇంద్రధనుస్సుగా, శ్రీకృష్ణుడు మేఘంగా, తాను మెఱపుతీగగా, బాణాలు నీటితుంపురులుగా, రాక్షసులు అనే కార్చిచ్చు ఆరిపోగా వర్షాకాలాన్ని సృష్టించింది.

శృంగారరసం అతిశయించటం చేత ప్రియుడయిన శ్రీకృష్ణునికి సత్యభామ ముఖం పూర్ణిమనాటి చంద్రబింబమై, చీరకొంగు మన్మథధ్వజమై, గుండ్రని విల్లు మన్మథుని కాంతిమండలమై, ఆమె సందర్శనం అమృత ప్రవాహమై, బాణవర్షం సంతోషదాయకమై గోచరించాయి.

వీరరసం విజ్బంభించటంవల్ల శత్రువయిన నరకాసురునికి సత్యభామ ముఖం సూర్యబింబంగా, పయ్యెదకొంగు అరిష్టహేతువయిన తోకచుక్కగ్గా; గుండ్రని విల్లు ప్రళయకాలం నాటి సూర్యుని ప్రభాపుంజంగా, ఆమెసందర్శనం అగ్నిజ్వాలాసమూహంగా, బాణవర్షం మహాకోపప్రదంగా కనబడింది. శృంగారవీరరసాల్ని ఇలా హరికి, అరికి మధ్య విస్తరింపజేసింది సత్య!

(ఈ నరకాసురవధాఘట్టాన్ని పోతన నాచనసోముని ఉత్తర హరివంశంనుండి గ్రహించి, రూపొందించాడు.)

ఈ తీరున

సత్యభామ ప్రయోగించిన వాడి బాణాలకు తాళజాలక పెంపుచెడి, సమృద్ది కోల్పోయి యుద్ధ ప్రయత్నాలు చేయలేక రాక్షససేనలు నరకాసురుని మరుగుజొచ్చాయి. చెదరిపోయాయి.

అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామను చూచి సంతోషం కలిగించేవాడు, దయతో చూచేవాడు; అమృతంవంటి మాటలు పలికేవాడు, ఆమె యుద్ధప్రయత్నాల్ని నివారించేవాడూ అయి ఇట్లా అన్నాడు.

సత్యా! రాక్షసరాజుసైన్యం యుద్ధరంగంనుండి పారిపోయింది. నీవు మహావిజయం పొందావు. నిన్ను మెచ్చాను. నీవు కోరిన సొమ్ములన్నీ ఇస్తాను. స్వీకరించు.

శ్రీకృష్ణుడు గౌరవాన్ని వెల్లడించేవీ, మోహాన్ని పుట్టించేవీ, మనస్సునందలి కలతలను దూరంచేసేవీ అయిన సరస సల్లాపాలతో కళావిశారద అయిన సత్యభామను బహుమానించి ఆమె చేతిలో ఉన్న వింటిని తిరిగి తీసుకొన్నాడు. అప్పుడు నరకాసురుడు అతనితో ఇలా అన్నాడు.

శ్రీకృష్ణా! ఆడుది మగవారిముందు పౌరుషం ప్రదర్శిస్తున్నప్పుడు నీవు యుద్ధం మానటం పౌరుష మనిపించుకోదు. రాక్షసులు వీరులకే వీరులు కావటంవల్ల అబలలతో యుద్ధం చేయరు.

నరకాసురు డారీతిగా పలుకగా శ్రీకృష్ణుడు ఈ విధంగా అన్నాడు.

ఓరీ నరకాసురా! దేవతాస్త్రీలు, కిన్నరాంగనలు చూచి సంతోషింపగా మహాభయంకరమైన శరీరం కలిగిన నిన్ను నేడే నా బాణాలతో సంహరిస్తాను.

శ్రీకృష్ణుడు 'శతఘ్ని' అనే లోకాతీతమయిన అస్త్రాన్ని నరకాసురుని భటులమీద వేయగా వారందరూ మహాక్షోభకు గురి అయ్యారు.

శ్రీకృష్ణుని బాణాలచేత ఖండించిన గుర్రాలూ; గదచేత బ్రద్దలుచేసిన ఏనుగులూ, చక్రంచేత అవయవాలు తెగకొట్టబడిన వీరులూ గలదైన రాక్షససైన్యం దురవస్థపాలై, దుర్బలమై, హీనదశకు వచ్చి, అతనియెదుట నిలువలేక హాహాకారాలు చేస్తూ పారిపోయింది.

ఆ సమయంలో

పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుడు రాక్షసయోధశ్రేష్ఠులు ప్రయోగించిన బాణాల్ని మూడుమూడు బాణాలను తడవ తడవకు వేసి, ముక్కముక్కలు చేశాడు.

పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుణ్ణి, సత్యభామను మూపున మోస్తూ, గరుత్మంతుడు యుద్దానికి సిద్ధపరచిన నరకాసురుని గజబలాన్ని గోళ్లతో రక్కాడు. ముక్కుతో పొడిచాడు. రెక్కలతో బాదాడు.

గరుత్మంతుడు రెక్కలాడించటంవల్ల పుట్టిన గాలితాకుడు సహింపలేక - చావగా మిగిలిన సైన్యం పట్టణంలో ప్రవేశించింది. ఇది చూచి నరకాసురుడు పూర్వం వజ్రాయుధాన్నే త్రిప్పికొట్టిన తనశక్త్యాయుధాన్ని గరుడునిమీద ప్రయోగించాడు. గరుత్మంతుడు పూలదండవ్రేటుకు చలింపని మదగజంమాదిరిగా ఆ శక్తిదెబ్బకు తట్టుకొని నిలబడగలిగాడు. అప్పుడు ఏనుగునెక్కి నరకాసురుడు యుద్ధరంగంలో

మదించిన ఏనుగు నెక్కి నరకాసురుడు శ్రీకృష్ణుణ్ణి కొట్టటానికి శూలం చేపట్టాడు. అతడు శూలాన్ని చేతితో అందుకొనే లోపల శ్రీకృష్ణుడు తన కాంతిపరంపరచే రాక్షసవీరుల్ని ధ్వంసంచేసే చక్రాన్ని చేపట్టి, రత్నకుండలాలతో కూడిన అతనితలను నరికాడు.

ఓ తల్లీ! "పూర్వం వరాహావతారసమయంలో నేను విష్ణువునకు భార్య నయ్యానని చాటుకొంటూ ఉంటావు. నిన్ను తలచి అయినా నన్ను కాపాడడు గదా! అయ్యో! నిర్దయుడై శిరస్సును ఖండించాడు" అని తల్లిని నిందిస్తున్నట్లు యుద్ధభూమిమీద రోదిస్తూ నరకాసురుడు పడిపోయాడు.

"నరకాసురుడు నేలగూలటం ఈ దినం కళ్లారా చూచాము. బ్రతికిపోయాము గదా!" అని దేవతలూ, మునులూ వెంటనే ఆకాశంనుండి పూలవాన కురిపిస్తూ, ఏ సందేహం లేకుండా శ్రీకృష్ణుణ్ణి స్తుతించారు.

పిమ్మట భూదేవి శ్రీకృష్ణుణ్ణి సమీపించి, బంగారపు రత్నకుండలాలను, వైజయంతి అనే వనమాలను, వరుణుడు ఇచ్చిన తెల్ల గొడుగును, ఒక మహారత్నాన్ని సమర్పించి, భక్తితాత్పర్యాలతో చేతులు జోడించి, దేవాధిదేవుడూ, పరమాత్మ అయిన శ్రీకృష్ణుణ్ణి ఈ రీతిగా స్తుతించింది.


భూదేవి శ్రీకృష్ణుని స్తుతించుట





Srikrishnudu Satyabhamato Guda Narigi Narakasuruni Vadhinchuta - శ్రీకృష్ణుడు సత్యభామతో గూడ నరిగి నరకాసురుని వధించుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
శ్రీకృష్ణుడు సత్యభామతో గూడ నరిగి నరకాసురుని వధించుట

స్వామీ! ప్రాణనాయకా! నీవు విజృంభించి రాక్షసగణాలను సంహరిస్తుండగా నీ యుద్ధచాతుర్యాన్ని చూడాలని కోరుకుంటానుగదా! ఇప్పుడు నన్నుమన్నించి నీవెంట తీసుకొనివెళ్లు. యుద్ధంలో వెల్లడయిన నీ ప్రతాపాధిక్యాలను చూచివచ్చి నీదేవేరుల కందరికీ ప్రకటిస్తాను.

శ్రీకృష్ణుడు ప్రియపత్నితో ఈ రీతిగా పలికాడు.

సత్యభామా! మహాగజముల ఘీంకారాలు మదించిన తుమ్మెదల జుమ్మనే రొదలు కావు. గుర్రాల గిట్టల కొనలవల్ల రేగిన ధూళులు గాలికి చెదరిన తామరల పుప్పొళ్లు కావు. శత్రువుల ధనుస్సుల నుండి వదలిన బాణాలు, నీటి అలల తుంపురుల జడివానలు గావు. 

రాక్షసరాజ సైన్యాలు - రాజహంసలూ, బెగ్గురు పక్షులూ కల సరస్సులు గావు. శత్రువులు ప్రయోగించే శూలాలూ, కత్తులు మొదలయిన యుద్ధపరికరాలు - తామరలూ కలువలూ కావు. నీవెక్కడ? యుద్ధప్రయాణ మెక్కడ? నేను తొందరగానే వస్తాను. నీవు ఇక్కడనే ఉండు. నా వెంట రానే రావద్దు.

శ్రీకృష్ణుడు పలికిన మాటలు విని సత్యభామ అతనికి ప్రేమ పుట్టునట్లుగా దగ్గరకు వచ్చి

ఆత్మాభిమానం గల సత్యభామ "దానవులయితే నాకేమి? దైత్యులయితే నాకేమి? నీ భుజాలు అనే కోటల చాటున ఉన్నప్పుడు అనుమానం కల్గుతుందా? నీవెంట వస్తాను" అని శ్రీకృష్ణుడు గౌరవపూర్వకమయిన చూపులతో చూస్తుండగా చేతులు మోడ్చి వంగి మొక్కింది.

శ్రీకృష్ణుడు తనకు నమస్కరించిన సత్యభామను పైకి లేవనెత్తి వెంటతీసుకొనిపోయి, గరుత్మంతుణ్ణి ఎక్కి ఆకాశమార్గాన ప్రాగ్జ్యోతిషపురంవైపు పయనించాడు. ఆ పట్టణం పర్వత, శస్త్ర, జల, అగ్ని వాయుదుర్గాలచేత చొరశక్యం గానట్టిది. అది మురాసురుడు కట్టిన త్రాళ్లచేత చుట్టబడింది. దాని దగ్గరకు చేరి

శ్రీకృష్ణుడు భయంకరుడై గదచేత పర్వతదుర్గాలను ముక్కలు ముక్కలు చేశాడు. వాడిగా ఉన్న బాణపరంపరలచేత శస్త్రదుర్గాలను నాశం చేశాడు. చక్రాయుధం దెబ్బతో వాయుజలాగ్ని దుర్గాలను రూపుమాపాడు. కత్తితో మురుడు చుట్టూ ఉన్న అగ్నిపాశాల్ని నరికాడు.

ఇంకనూ

మహారూపి అయిన శ్రీకృష్ణుడు గదాఘాతాలచే చుట్టుగోడనూ, దానిమీది యంత్రాలనూ పెకల్చినాడు. రాక్షసుల గుండెలు దిగులు పడేటట్లుగా ప్రళయకాల మేఘాల పిడుగుల వంటిదీ, జీవుల ఉసురులు దీసేదీ అయిన పాంచజన్యాన్ని పూరించాడు.

ప్రళయకాలమేఘగర్జవంటి పాంచజన్య ధ్వని విని, అయిదుతలలు గల మురాసురుడు నిద్రలేచాడు. ఆవులించాడు. ఒళ్లు విరుచుకొన్నాడు. నివాసస్థానమయిన నీటిని వదలి వచ్చి శ్రీకృష్ణుణ్ణి చూచాడు. ప్రళయకాలాగ్నివలె మండిపడుతూ చూడడానికి శక్యం కానివా డయ్యాడు. బొబ్బలు పెడుతూ, పంచభూతస్వరూపాలయిన లోకాలను పంచముఖాలతో మింగటానికి ప్రయత్నించే విధంగా దగ్గరకు వచ్చి, అగ్ని జ్వాలామయమయిన శూలాన్ని గరుత్మంతుని మీద ప్రయోగించాడు. భూమ్యాకాశమధ్య ప్రదేశాలు నిండేటట్లుగా పెడబొబ్బలు పెడుతూ

మురాసురుడు బిరబిరా పరుగెత్తికొని వచ్చి "శ్రీకృష్ణా! శ్రీకృష్ణా! ఆగు ఆగు!" అంటూ దగ్గరకు వచ్చాడు. శ్రీకృష్ణుడు కూడా "మురాసురా! మురాసురా! ఇదిగో! ఈనాటితో దేవతల దుఃఖాలు తొలగిపోతాయి" అని మాటల్లో మించిపోయాడు. ఆతడిపైకి చెలరేగాడు.

ఆ సమయాన

శ్రీకృష్ణుడు గరుత్మంతునిమీద పడబోవుతున్న మురుని శూలాన్ని మధ్యలోనే చేతులతో ఆకస్మికంగా పట్టుకొని మూడు ముక్కలు చేశాడు. తర్వాత ఆ రాక్షసుని అయిదు ముఖాలందు వాడియయిన బాణాల్ని వేగంగా చొప్పించాడు.

మురుడు శ్రీకృష్ణునిమీద గదను ప్రయోగించాడు. శ్రీకృష్ణుడు దాన్ని వేయిముక్కలు చేశాడు. తర్వాత మురాసురుడు చేతులు పైకెత్తికొని శ్రీకృష్ణునికి ఎదురుగా నడుస్తూ వేగంగా వచ్చాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వినోదప్రాయంగా చక్రం దెబ్బతో అతనితలలు ఐదింటినీ ఖండించాడు.

ఇంద్రుడు వజ్రాయుధంతో శిఖరాల్ని బ్రద్దలు చేసి, పర్వతాన్ని కూల్చినట్లుగా శ్రీకృష్ణుడు చక్రంతో తలలు నరికి మురాసురుణ్ణి పడగొట్టాడు. మురుడు నీళ్లల్లో కూలిపోయాడు.

అతనికి ఏడుగురు కొడుకులు. వారు తామ్రుడు, అంతరిక్షుడు, శ్రవణుడు, విభావసుడు, వసుడు, నభస్వంతుడు, అరుణుడు. వీరు తండ్రిచావుకు క్రోధం చెలరేగగా, శ్రీ కృష్ణుణ్ణి రణక్రీడలో చంపాలని నిశ్చయించారు.

శివుడు సప్తవిధవాయువులను ప్రళయకాలంలో ప్రేరేపించినట్లు, నరకాసురుడు మురుని కుమారులను ఏడుగురినీ రెచ్చగొట్టాడు. వారు పీఠుడనే సేనాపతి అండతో శ్రీ కృష్ణుణ్ణి ఎదిరించి నానావిధ యుద్ధసాధనాలను ప్రయోగింపగా

(సప్తవిధ వాయువులు - 1) ఆవహం 2) ప్రవహం 3) సంవహం 4) ఉద్వహం 5) నివహం 6) పరివహం 7) పరావహం.)

శ్రీకృష్ణుడు వాడి అమ్ములు ప్రయోగించి రాక్షసవీరుల ఆయుధాలన్నీ భూమిమీద విరిగి పడేటట్లు చేశాడు. అంతేకాకుండా వారిశరీరావయవాలు నువ్వు గింజలంత తునకలయి నేలమీద రాలేటట్లు ఖండించాడు.

శ్రీకృష్ణుని బాణాల వ్రేటులకూ, చక్రం దెబ్బలకూ, తనవారందరూ మరణించగా నరకాసురుడు ఆశ్చర్యం పొందాడు. కోపపడ్డాడు. శ్రీకృష్ణుణ్ణి తిట్టాడు. తన్ను తాను పొగడుకొన్నాడు. లెక్కసేయనివాడై చెవిపోగులు మొదలయిన నగలు ధరించి, యుద్దానికి బయలుదేరాడు. 

అతనివెంట ఏనుగులు గుంపులుకట్టి నడిచాయి. వానిచెక్కిళ్లనుండి మదజలం ధారాపాతంగా స్రవిస్తూంది. చెట్టుబోదెలవంటి వానితొండాలు మహాభయం కలిగిస్తున్నాయి.

బలశాలి అయిన నరకాసురుడు చంద్రబింబంమీద మెరపుతో కూడిన మేఘమేమో అనిన చందంగా గరుత్మంతుని మూపుమీద సత్యభామతో కలసి కయ్యపుముచ్చట్లలో మునిగి తేలుచున్న శ్రీకృష్ణుని చూచాడు. శ్రీకృష్ణుడు నల్లనిశరీరం కలవాడు. మంచి అమ్ములపొదులు కలవాడు. మాయాచాతుర్యం కలవాడు. యుద్ధంలో ఓడిపోనివాడు

నరకాసురుడు యుద్దానికి తలపడగా, సత్యభామ జంకూకొంకూ లేకుండా చూచి వేగిరపాటుతో

సత్యభామ జడను గట్టిచుట్టగా చుట్టింది. పోకముడిని గట్టిగా బిగించుకొనింది. నగలు సవరించుకొనింది. ముఖకాంతులు సర్వత్ర వ్యాపింపగా, ఒక మహావీరుని ఆటోపంతో లేచి తన ప్రాణనాయకుడైన శ్రీకృష్ణుని ముందు వీరవనితగా నిలబడింది.

సత్యభామ నరకాసురునితో యుద్ధంబు సేయుట





Srikrishnudu Kalindi Mitravinda Nagnajiti Bhadra Lakshana Yanu Varala Barinayamaaduta - శ్రీకృష్ణుడు కాళింది మిత్రవింద నాగ్నజితి భద్ర లక్షణ యను వారల బరిణయమాడుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
శ్రీకృష్ణుడు కాళింది మిత్రవింద నాగ్నజితి భద్ర లక్షణ యను వారల బరిణయమాడుట

తర్వాత శ్రీకృష్ణుడు ధర్మరాజు మున్నగువారిని వీడ్కొని, సాత్యకి మొదలైన అనుచరులతో పాటు ద్వారకకు వచ్చి బంధువులను మిత్రులను ఆనందింపజేస్తూ ఒక మంచిరోజు సుముహూర్తంలో కాళిందిని వివాహమాడాడు.

రాజాధిదేవి శ్రీకృష్ణుని మేనత్త. విందుడు, అనువిందుడు ఆమె కుమారులు. అవంతిదేశాధిపతులు. దుర్యోధనునికి అధీనులు. వారు తమ చెల్లెలికి(మిత్రవిందకు) పెండ్లి చేయాలని నిశ్చయించి స్వయంవరం చాటింపగా

రాజులు చూస్తుండగా శ్రీకృష్ణుడు శూరత్వంతో మిత్రవిందను పెండ్లిచేసికొన్నాడు. మిత్రవింద ఎప్పుడూ సజ్జనులను సంతోషపెడుతుంది. ఆమె నల్లని తలవెండ్రుకలు కాంతితో నల్లని తుమ్మెదలను జయించాయి. మిత్రవింద శిరోజాలు తుమ్మెదల నల్లదనాన్ని మించిన నలుపురంగు కలవని భావం.

పరీక్షిన్మహారాజా! కోసలదేశాన్ని పరిపాలించే నగ్నజిత్తు అనేరాజు ఒక డున్నాడు. అతడు మంచి మనస్సు కలవాడు. ధర్మాన్ని పాటించేవాడు. అతని కొక కూతురుంది. ఆమెపేరు నాగ్నజితి.

సద్గుణవతి అయిన ఆమెను వివాహమాడటానికి రాజులు రాగా నగ్నజిత్తు వారితో "వాడి కొమ్ములు కలవీ, వీరుల వాసన తగిలితే చాలు ఎదుర్కొనేవీ, మదించినవీ అయిన ఏడు ఆబోతులను పట్టి బంధించినవాడే నా కొమార్తెకు భర్త అవుతా" డని ప్రకటించాడు.

వచ్చినవారు ఆబోతులను పట్టుకొని కట్టివేయలేక భయంతో ఇంటిమొగం పట్టేవారు.

ఆబోతులను గెలిచినవాడే నాగ్నజితికి భర్త అవుతాడని, విన్న శ్రీకృష్ణుడు కోసలదేశరాజధానికి సేనతో కూడి వెళ్లాడు. కోసలరాజు నగ్నజిత్తు శ్రీకృష్ణునికి ఎదురువచ్చి శాస్త్రోక్త ప్రకారంగా పూజించాడు. ఆసనం సమర్పించాడు. తర్వాత శ్రీకృష్ణుడు కూడా నగ్నజిత్తును కొనియాడాడు.

పరీక్షిన్మహారాజు! నాగ్నజితి కమలాలవంటి కన్నులు కలవాడూ, మోహం పుట్టించు స్వరూపం కలవాడూ, మూడు లోకాల వారిచేత ఆరాధింపబడినవాడు అయిన శ్రీకృష్ణుణ్ణి తనకు పూజ్యుడగు భర్తగా కోరింది.

మరియూ ఆ ఉత్తమకన్య తనమదిలో

విశ్వవ్యాపకుడూ, నాశరహితుడూ భర్త కావలెనని నేను పూర్వజన్మంలో చేసిన వ్రతం ఫలిస్తే కనుక శత్రుసంహారకుడు, చక్రధారి అయిన శ్రీకృష్ణుడు తప్పక నన్ను పెండ్లిచేసుకుంటాడు.

లక్షి, బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు మొదలగు దిక్పాలకులు ఎవని పాదధూళిని శిరస్సులపై ధరిస్తారో, ఎవడు భూభారాన్ని తొలగించుటకై వినోదంకొరకు అవతారాలెత్తుతాడో అలాంటి శ్రీకృష్ణుడు నాపట్ల ఏ విధంగా నడచుకొంటాడో?

ఈ విధంగా నాగ్నజితి ఆలోచిస్తూ ఉండగా శ్రీకృష్ణుడు నగ్నజిత్తును చూచి మేఘగంభీర స్వరంతో ఈ రీతిగా అన్నాడు.

రాజా! క్షత్రియపుత్రులు ఇతరులను ఏమియూ అడుగరు. మంచితనంతో వచ్చాను. నీ కొమార్తెను కోరుచున్నాను. నాకిచ్చి పెండ్లి చేయవయ్యా! కాకపోతే మేము కన్యాశుల్కం ఇచ్చేవాళ్లం కాము సుమా!

(ఇందులో ఆనాటి కన్యాశుల్క సంప్రదాయమూ శ్రీకృష్ణుని వ్యక్తిత్వం వ్యక్తమౌతున్నాయి.)

అని శ్రీకృష్ణుడు పలుకగా నగ్నజిత్తు ఇట్లన్నాడు.

ఈ పదునాల్గు లోకాలలో నాకొమార్తెను వివాహమాడుటకు నీకంటె గొప్పవాడు ఇంకొకడు ఎవడున్నాడు? నీ కల్యాణ గుణాలకు ఆశ్చర్యపడి లక్ష్మి ఇతర ప్రయత్నాలకు స్వస్తి చెప్పి, నీయందే ఆసక్తి కలిగి, నీ వక్షఃస్థలంలో అనపాయినియై(విడువనిదై) కృతార్జురాలైనది గదా!

ఎవడు పొగరు కలిగిన ఆబోతులు ఏడింటివిజ్బంభణాన్ని ఓర్చుకొని, వాటిల్ని గెలుస్తాడో, ఆ శూరునికి నా పుత్రికను ఇస్తానని నేను బలగర్వులయిన రాజకుమారులను రప్పించాను. వారు ఆ ఆబోతుల కాళ్లతన్నులకూ, కొమ్ములపోటులకూ కొంచెంసేపయినా పోరాటంలో నిలబడలేక దెబ్బతిన్న శరీరాలతో వైదొలగిపోతారు.

శ్రీకృష్ణా! సూర్యుడు చీకట్లను పారదోలినట్లు నీవు భయంకరమయిన యుద్ధంలో శత్రువుల్ని తరిమివేశావు. అసామాన్యమయిన రణచాతుర్యం కలవాడివి. ఇప్పుడు ఏడు ఆబోతులను పోరాటంలో జయించి ప్రకాశిస్తున్నవాడివై మా పుత్రికను పెండ్లిచేసుకో!

అని నగ్నజిత్తు తన కూతురు పెండ్లికి విధించిన కట్టుబాటు చెప్పగా విని

అఘాసురునికి శత్రువూ, వత్సబకాసురులనూ, కంసుణ్ణీ సంహరించినవాడూ; దుష్టులను దండించినవాడూ, అయిన శ్రీకృష్ణుడు ఆబోతులను చూచాడు. ఆ ఆబోతులు పాపకార్యాలు చేసేవి. అవి ఇంతింతనరాని పరాక్రమం కలిగినవి. వాడియైన కొమ్ములతో పరాక్రమవంతుల ముఖాలమీది కండలను పీకివేసేవి. మారణకార్యాలు స్వభావంగా చెలరేగేవి. మహాక్రూరా లైనవి.

శ్రీకృష్ణుడు నడుముకు వస్త్రం బిగించి కట్టుకొని, ఏడురూపాలు ధరించి, బాలకుడు ఏడుచెక్కబొమ్మలను పట్టుకొన్నట్లుగా, కొండలవంటి ఆబోతులను పట్టుకొని, గ్రుద్ది నేలమీద పడేటట్లు త్రోచి రాజులు మెచ్చగా ఈడ్చాడు.

ఈ విధంగా ఆబోతులను పట్టి కట్టి ఈడ్చిన శ్రీకృష్ణునికి నగ్నజిత్తు తన కొమార్తెను నాగ్నజితిని ఇచ్చి పెండ్లిచేశాడు. శ్రీకృష్ణుడు అల్లుడయినందులకు రాణులు సంతోషించారు. ఆ సమయంలో బ్రాహ్మణులదీవనలూ, వివిధవాద్యాల ధ్వనులూ అతిశయించాయి. 

నగ్నజిత్తు నూతనదంపతులను రథమెక్కించి సాగనంపాడు. అతడు పదివేల ఆవులనూ, విచిత్రమయిన వస్త్రాభరణాలు ధరించిన మూడువేలమంది యువతులనూ, తొమ్మిదివేల ఏనుగులనూ, వాటికంటె నూరురెట్లు ఎక్కువయిన రథాలనూ, రథాలకంటె నూరు రెట్లు అధికమయిన గుర్రాలనూ, గుర్రాలకంటె నూరురెట్లు మించిన వీరభటులనూ కట్నంగా సమర్పించాడు. శ్రీకృష్ణుడు నాగ్నజితితో కూడి ద్వారకకు వెళ్లేటప్పుడు

ఇంతకు ముందు నాగ్నజితిని వివాహం చేసికోవాలని వచ్చి, ఆబోతులచేత ఓడిపోయి, వెళ్లినరాజులందరూ శ్రీకృష్ణు డామెను పెండ్లాడె నని గూఢచారులద్వారా విని, దారిలో శత్రువులపొగరు అణచివేసే అతణ్ణి ఎదుర్కొన్నారు.

శత్రువులయిన రాజులందరూ ప్రతాపంతో శ్రీకృష్ణుణ్ణి ఎదిరించారు. అప్పుడు అర్జునుడు అడ్డుపడి రణరంగంలో గాండీవంనుండి వదలిన బాణాలతో సింహం కుందేళ్లను చంపేటట్లు బంధువులందరూ స్తుతింపగా శత్రువులనందరినీ సంహరించాడు.

శ్రీకృష్ణుడు ఈ విధంగా నాగ్నజాతిని వివాహమాడి కట్నాలూ, కానుకలూ తీసుకొని ద్వారకకు వచ్చి సత్యభామతో వినోదిస్తున్నాడు. ఆ పిమ్మట

శ్రీకృష్ణుడు వైరులు భీతిచెందగా భద్రను పెండ్లిచేసికొన్నాడు. భద్ర శ్రీకృష్ణుని మేనత్త అయిన శ్రుతకీర్తికీ, కేకయరాజుకూ కూతురు. సందర్శన రాజు మున్నగువారి సోదరి. 

ఆమె జనులు స్తుతింపదగింది. తల్లిచేత సంతోషపెట్టబడేది. యౌవనవతి. నిర్మలాలై చలించే కంటికొనలు కలదీ, నీతిపట్ల జాగ్రత్త కలదీ, అపారమైన సద్గుణాలు కలదీ అయిన ఉత్తమురాలు.

తరువాత

శ్రీకృష్ణుడు, దేవతలను తరిమి పాములపాలిటి యముడయిన గరుత్మంతుడు అమృతం తెచ్చినట్లుగా, పొగరెక్కి మిన్నూ మన్నూ కానని రాజులను జయించి, మద్రరాజకుమారిని లక్షణను పరిగ్రహించి తెచ్చాడు. లక్షణ మదించిన లేడి కన్నులవంటి కన్నులు కలది. నీతి వివేకం కలది. శుభప్రదమైన లక్షణాలు కలది.

ఈ విధంగా రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్షణ లనే వారు శ్రీకృష్ణునికి అష్టమహిషులయ్యారు. తరువాత నరకాసురుణ్ణి చంపి, అతడు చెరసాలలో పెట్టిన పదారువేలమంది కన్యలనూ, రోహిణి మొదలగువారినీ; శ్రీకృష్ణుడు స్వీకరించాడు - అని చెప్పగా విని

శ్రీకృష్ణుడు భూదేవికి గారాబుబిడ్డ అయిన నరకాసురుణ్ణి ఏ కారణంచేత సంహరించాడు? నరకాసురుడు సౌందర్యవతులయిన ఆ యువతులను ఏ కారణంగా చెరసాలలో పెట్టాడు?

శుకమహాముని పరీక్షిత్తుతో ఇట్లా అన్నాడు. అదితి నరకాసురుని మూలంగా చెవికమ్మలూ, వరుణునిగొడుగూ, మేరుపర్వతభాగమయిన మణిపర్వతమూ కోల్పోగా - ఇంద్రుడు వచ్చి శ్రీకృష్ణునికి విజ్ఞప్తిచేశాడు. శ్రీకృష్ణుడు గరుత్మంతుణ్ణి ఎక్కి నరకాసురుణ్ణి సంహరించటానికి బయలుదేరాడు. అప్పుడు సత్యభామ అతనితో ఈ విధంగా పలికింది.

శ్రీకృష్ణుడు సత్యభామతో గూడ నరిగి నరకాసురుని వధించుట





Srikrishnudu Indraprastha Purambuna Karugudenchuta - శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థ పురంబున కరుగుదెంచుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థ పురంబున కరుగుదెంచుట

ఒకనాడు శ్రీకృష్ణుడు పాండవులను చూడాలని నిశ్చయించి, సాత్యకి మొదలయిన యాదవులతో ఇంద్రప్రస్థపురానికి వచ్చాడు. ఆ పరమాత్మను చూడగానే పాండవులకు పోయినప్రాణాలు తిరిగి వచ్చినట్లయింది. 

వారు శ్రీకృష్ణుణి కౌగిలించుకొనటంచేత సర్వపాపాలనుండి విముక్తి పొందారు. ప్రేమ దరహాసాలతో కూడిన అతనిముఖకమలాన్ని చూచి ఆనందించాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుకూ, భీమునికీ పాదప్రణామం చేశాడు. 

అర్జునుణ్ణి కౌగిలించుకొన్నాడు. తన కాళ్లకు మ్రొక్కిన నకులసహదేవులను రెండుచేతులతో పట్టి పైకి లేవనెత్తి, ఒక ఉత్తమపీఠంమీద కూర్చున్నాడు. అప్పుడు

స్తనభారంవల్ల ముడుచుకొనిపోయిన శరీరం గలదీ, క్రొత్తగా పెండ్లికావటంచేత కొంచెం కొంచెం సిగ్గు పొందిందీ అగు ద్రౌపది శ్రీకృష్ణునికి నమస్కరించింది.

తర్వాత సాత్యకి పాండవులచేత పూజలు పొంది ఉచితాసనంమీద కూర్చున్నాడు. మిగిలిన అనుయాయులుకూడ పాండవులు మర్యాదలు చేసిన తర్వాత సేవిస్తూ ఉన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు కుంతీదేవిని సమీపించి ఈ విధంగా అన్నాడు.

అత్తా! కొడుకులూ, కోడలూ నీవుచెప్పిన పనులు నీ మనస్సుకు సంతోషం కల్గిస్తూ చేస్తున్నారు కదా! నీ మనసుకు నచ్చినట్లు నడుచుకొంటూ, నీయాజ్ఞలు తలదాల్చేటట్లు చేయగల మంచితనం మొదలయిన గుణాలు కలిగి హాయిగా బ్రతుకు పండించుకొంటున్నావా?

శ్రీకృష్ణుని మాటలు విన్నతర్వాత కుంతి ప్రేమోద్వేగానికి లోనయింది. ఆమె కన్నులనిండా దుఃఖాశ్రువులు వ్యాపించాయి. ఆమెకు దుర్యోధనుడు చేసిన అపకారం జ్ఞప్తికి వచ్చింది. తడబడుచున్న గొంతుతో అనుభవించిన దుఃఖాలన్నీ వివరించింది. శ్రీకృష్ణుని పెద్దదిక్కుగా భావించి అతనితో ఈ విధంగా చెప్పింది.

మహాపుణ్యాత్మా! యాదవోత్తమా! దేవతాగ్రణీ! నాయనా! శ్రీకృష్ణా! మరచిపోకుండా నీ చుట్టపక్కాలను కాపాడుతుంటావు. నీవు అనురాగంతో పంపగా మా అన్న అక్రూరుడు వచ్చి మా యోగక్షేమాలు తెలుసుకొని వెళ్లాడు.

నీ అండదండలవల్లనే మేము బ్రతుకుతున్నాము. ఈనాటినుండి నాబిడ్డలకూ, నాకూ నీవు గాకుండా వేరేదిక్కు ఎవరైనా ఉన్నారా? సర్వజీవరాశికీ నీవే ఆత్మవు. అందువల్ల వీరు పరాయివారు, వీరు నావారు అనే భేదబుద్ధి నీకు లేదయ్యా! నా అదృష్టం ఎటువంటిదో కాని, నీవు ఎప్పుడూ మా మనస్సుల్లో నిలిచి మా కష్టాలన్నింటినీ తొలగిస్తున్నావు కదా!

పైవిధంగా కుంతి పలికిన తర్వాత ధర్మరాజు ఇట్లా అన్నాడు.

సర్వేశ్వరా! సనకుడు, సనందుడు మొదలయిన మహర్షులుకూడా ఏ ఆధ్యాత్మికమార్గాలలో చరించినా నిన్ను తెలుసుకోలేరు. నీవు అట్టి గుణసంపన్నుడవు. శుభప్రదమయిన నడవడి కలవాడివి. ఇప్పుడు మా బాంధవుడివై వస్తున్నావు. హీనులమైన మమ్ము చేరదీసి కాపాడుతున్నావు. మేము పూర్వజన్మల్లో ఎంతగొప్పతపస్సు చేశామో!

ధర్మరాజు తన్ను వేడగా శ్రీకృష్ణుడు పౌరులకు కనులపండువు చేస్తూ ఇంద్రప్రస్థపురంలో కొన్ని నెలలు నివసించాడు. ఆ నగరంలో ఉన్నప్పుడు ఒకరోజున

అర్జునుడు కవచాన్నీ వింటినీ, అమ్ములపోదినీ, బాణాలనూ గ్రహించి, ఒకమంచి గుర్రమెక్కి శ్రీకృష్ణుడితో అడవికి వెళ్లి జింకలు, దుప్పులు, పందులు, దున్నలు, సింహాలు, సివంగులు, పెద్దపులులు, ఖడ్గమృగాలు, సవరపుమెకాలు మొదలయిన వాటిల్ని వేటాడినాడు.

పరీక్షిన్మహారాజా! చనిపోయినప్పటికీ పరిశుద్ధంగా ఉన్న అడవిమెకాలను - అర్జునుణ్ణి సేవిస్తున్న సేవకులు శీఘ్రంగా తీసుకొనివచ్చి మెచ్చుకొనేటట్లు అతడికి సమర్పించారు.

వేటాడిన అర్జునుడు దప్పికచేత బడలిక చెందాడు. అపుడు కృష్ణార్దునులు యమునానదికి వెళ్లి ఆచమించి నీరుత్రాగి

ఒక ఇసుక దిబ్బమీద ఉండి

కృష్ణార్జునులు దగ్గరకు చేరి చలిస్తున్న నల్లని యమునానది అలలలో సూర్యసుత అయిన కాళిందిని చూచారు. కాళింది తల వెండ్రుకలు మిగులనల్లనివై తుమ్మెదలవరుసను హేళనచేస్తున్నాయి. ఆమెనొసలు నెలవంకవెలుగు కలిగిఉన్నాయి. ఆమెచెక్కిలిపట్టులు మన్మథునిఅద్దంవలె ఉన్నాయి.

శ్రీకృష్ణుడు పంపగా అర్జునుడు వెళ్లి ఆ కన్యతో ఈ రీతిగా అన్నాడు.

ఓ కన్యామణీ! మృగాక్షీ! నీవెవరిపుత్రికవు? ఏమి కోరి ఇక్కడికి వచ్చావు? నీపేరేమి? నీకోరిక ఏమి? పెండ్లికొరకై ఇక్కడికి వచ్చినట్లుంది. నీరాక కృతార్థమైంది. నీ పుట్టుపూర్వోత్తరాలు చెప్పమ్మా!

ఇట్లు అడిగిన అర్జునునితో కాళింది ఈవిధంగా అనింది.

మానవ వీరాగ్రణీ! నేను సూర్యుని పుత్రికను. నాపేరు కాళింది. యమునానదిలో సూర్యుడు నిశ్చయించిన గృహంలో ఉండి, కృష్ణుణ్ణి భర్తగా కోరి నేను తపస్సు చేస్తుంటాను. మరొకణ్ణి వివాహమాడను. వేటమీది అభిలాషతో శ్రీకృష్ణుడు వచ్చి, నన్ను పెండ్లాడుతాడని నాతండ్రి నాకు చెప్పాడు.

అర్జునుడు కాళింది అనినమాటలు శ్రీకృష్ణునికి చెప్పాడు. సర్వమూ తెలిసిన శ్రీకృష్ణుడు కాళిందిని రథంమీద ధర్మరాజు దగ్గరకు తీసుకొనివెళ్లాడు. పాండవులు కోరగా విశ్వకర్మను రప్పించి, ఇంద్రప్రస్థాన్ని సుందరనగరంగా తీర్చిదిద్దించాడు.

శ్రీకృష్ణుడు దేవేంద్రుని ఖాండవ వనాన్ని అగ్నికి ఇవ్వడానికి నిర్ణయించాడు. తా ననుకొనింది నెరవేరటానికి అర్జునుణ్ణి రథయోధునిగా చేసి, అతనిమీద ఉన్న ప్రేమతో సారథి అయ్యాడు.

ఈ విధంగా శ్రీకృష్ణార్దునులు తోడుగా అగ్ని ఖాండవవనాన్ని బూడిదచేసి పరమానందం పొందాడు. కృతజ్ఞతతో అర్జునునికి తరుగని అమ్ములపొదులూ, భేదించుటకు సాధ్యంగాని కవచమూ, గాండీవ మను విల్లూ, దేవతా సంబంధమయిన రథమూ, తెల్లని గుర్రాలూ సమర్పించాడు. ఆ ఖాండవవనంలో

అర్జునుడు కారణంగా తనకు అగ్నిబాధలు తొలగగా ఆనందించి మయుడు అద్భుతమయిన సభాగ్భహాన్ని నిర్మించి, అతనికి కానుకగా సమర్పించాడు. ఇవి నీళ్లూ, ఇది నేలా అని గ్రహించే జ్ఞానం లేని దుర్యోధనుడు రాకపోకలు సాగించినప్పటికీ ఆ సభామందిరంలో సంతోషం పొందలేకపోయాడు.

శ్రీకృష్ణుడు కాళింది మిత్రవింద నాగ్నజితి భద్ర లక్షణ యను వారల బరిణయమాడుట





Sathadhanvudu Satrajittuni Jampi Mani Napaharinchuta - శతధన్వుడు సత్రాజిత్తుని జంపి మణి నపహరించుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
శతధన్వుడు సత్రాజిత్తుని జంపి మణి నపహరించుట

మహారాజా! అక్రూరుడూ, కృతవర్మా శతధన్వుని దగ్గరకు వచ్చి హితం చెప్పేవారివలె "సత్రాజిత్తు తన కొమార్తెను ముందు మన కిస్తానని చెప్పి, తర్వాత శ్రీకృష్ణుని కిచ్చి పెండ్లిచేసి నీతి తప్పాడు. నీవు నీ అభిప్రాయం వెల్లడించి ఏ రీతిగానైనా సరే స్యమంతకమణిని తీసుకో!” అని అతణ్ణి రెచ్చగొట్టారు.

ఒకనాడు ఆ శతధన్వుడు సత్రాజిత్తు నిద్రిస్తుండగా అతణ్ణి కసాయివాడు మేకను చంపినట్టు చంపాడు. అతనిభార్య లందరూ మొర పెట్టుకుంటుండగా స్యమంతకమణిని తీసుకొని వెళ్లిపోయాడు.

సత్యభామ సత్రాజిత్తు చనిపోయిన తీరు తెలిసికొని దుఃఖించి, అతణ్ణి నూనెతొట్టిలో పెట్టించి, హస్తినాపురానికి వెళ్లి, సర్వజ్ఞుడయిన హరికి కన్నతండ్రిచావుకబురు చెప్పింది. ఆ మరణవార్త విని బలరామకృష్ణులు సర్వనియామకులయినప్పటికీ సామాన్య మానవులమాదిరిగా దుఃఖించారు. 

తర్వాత శ్రీకృష్ణుడు బలరామునితో, సత్యభామతో కలసి ద్వారకకు వచ్చి, శతధన్వుణ్ణి చంపాలని నిశ్చయించాడు. శ్రీకృష్ణునినిశ్చయం తెలిసికొన్న శతధన్వుడు తనకు చావుమూడిందని భయపడి, కృతవర్మ ఇంటికి వెళ్లి, సహాయం చేయుమని అర్ధించాడు. అప్పుడు కృతవర్మ ఈ విధంగా అన్నాడు.

అయ్యో! ఎంత తెలివి తక్కువ వాడివయ్యావు? బలరాముడూ; శ్రీకృష్ణుడూ సామాన్యులా? వారు మహాత్ములు. ఎవడు వారికి కీడు చేయగలుగుతాడు? నీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. విను. ఇంతకు ముందు బలరామకృష్ణుల్ని ఎదిరించి, కంసుడు చుట్టపక్కాలతోపాటు సర్వనాశం గాలేదా? జరాసంధుడు దండెత్తి, పదిహేడుసారులు సైన్యాలతో కూడా దిక్కులు పట్టిపోలేదా? ఆ అన్నదమ్ములశక్తి మనకు కొత్తదా?

కృతవర్మ చెప్పినమాట విని శతధన్వుడు అక్రూరునియింంటికి వెళ్లి, శ్రీకృష్ణునిపై పగబట్టటానికి తోడు రమ్మన్నాడు. అక్రూరుడు శ్రీకృష్ణుని బలపరాక్రమాదులు ప్రకటించి, ఇంకా ఇట్లా అన్నాడు.

శ్రీకృష్ణుడు సామాన్యుడు గాడు. త్రిమూర్తులవలె వినోదార్థం ప్రపంచాన్ని సృష్టించి, రక్షించి, నాశం చేస్తాడు. బ్రహ్మాదులు సైతం అతని నడతను అర్ధంచేసుకోలేరు. అతని మాయ లోకాన్ని భ్రమపెడుతుంది. అతడు ఏడేళ్ల పిల్లవాడుగా ఉన్నప్పుడే ఆవుల్ని రక్షించటానికి ఒకచేతితో కొండను పైకెత్తాడు.

శ్రీకృష్ణభగవానుడు నిర్వికారుడు. జగన్నియామకుడు. అద్భుత కార్యనిర్వాహకుడు. సర్వక్రియాసాక్షి - అటువంటి మహానుభావునికి మేము చేయెత్తి మొక్కుతాము. ఆయనతో విరోధం పెట్టుకోటానికి భయపడతాం. అంగీకరించం. నీవు వేరేదారిని పో! నీ పొత్తువల్ల చాలా నష్టం కలిగింది. అది చాలు.

ఈ విధంగా అక్రూరుడు సమాధానం చెప్పిన తర్వాత శతధన్వుడు అతని దగ్గర స్యమంతమణిని దాచి, భయంతో గుర్రమెక్కి నూరామడలదూరం వెళ్లాడు. 

బలరాముడూ, కృష్ణుడూ గరుడధ్వజంతో అలంకరించిన రథమెక్కి అతని వెనుక వెళ్లారు. చివరకు శతధ్వనుడు మిథిలానగరం చేరి, దాని సమీపంలో గుర్రం దిగి, భయపడుతూ కాలినడకతోనే పరుగెత్తాడు. 

శ్రీకృష్ణుడు వెళ్లకు మని వారిస్తూ అతనిని కలిసికొన్నాడు. తర్వాత శతధన్వునితల తెగిపడేటట్లుగా - రాక్షసగణాలను సంహరించిందీ, తన కాంతిపుంజంచేత ఇంద్రాది దేవతలను సంతోషపెట్టేదీ అయిన చక్రాయుధాన్ని ప్రయోగించాడు.

శ్రీకృష్ణుడు శతధన్వుని చంపి, మణికోసం అతని దుస్తులలో వెదికాడు. కానీ, మణి ఎక్కడా కనబడలేదు. అప్పుడు హరి బలరామునికడకు వచ్చి "శతధన్వుణ్ణి వ్యర్థంగా చంపాను. అతనిదగ్గర మణి లేదు" అని చెప్పాడు. ఈ మాటలు విని బలరాముడు ఈ కింది విధంగా అన్నాడు.

"శతధన్వుడు స్యమంతకమణిని నిజంగానే, దొంగిలించాడు. వాడు దాచిపెట్టుమని ఎవరిచేతికయినా ఇచ్చాడేమో? వెంటనే నీవు ద్వారకకు వెళ్లి వెదకు. నాకు జనకుణ్ణి చూడాలనే కోరిక కలిగింది. నేను వెళ్లివస్తాను. నీవూ వెళ్లు” అని బలరాముడు చెప్పి, 

శ్రీకృష్ణుణ్ణి వీడ్కొలిపి తర్వాత మిథిలకు వెళ్లాడు. అతనిరాక తెలిసి జనకుడు ఎదురువచ్చి అతణ్ణి పూజించి, కోరినవెల్లా ఇచ్చి, మిథిలలో ఉండండని అర్ధించాడు. బలరాముడు కొన్నేళ్లు ఆ నగరంలోనే నివసించాడు.

తర్వాత దుర్యోధనుడు మిథిలానగరానికి వచ్చి, జనకునిచేత సకలగౌరవాలూ పొంది

ఆశ్రితులకు కల్పవృక్షమయినవాడూ, మూడులోకాలలోని మహావీరుల పూజలు పొందేవాడూ అయిన బలరామునినుండి దుర్యోధనుడు పట్టుదలతో తన ఆశయానుగుణమైన గదాయుద్ధ నైపుణ్యం ఆర్జించాడు.

("త్రైలోక్య వీరభటగణబలిచేన్‌ = మూడు లోకాలలోని వీరభటుల సమూహాలను మృత్యుదేవతకు బలిపశువులుగా సమర్పించేవానిచేత" అనికూడా అర్ధం చెప్పవచ్చు.)

శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్లి శతధన్వుడు చనిపోవటం, స్యమంతకమణి కనబడకుండటం సత్యభామకు చెప్పాడు. సత్యభామకు ప్రీతికలిగించేవాడు కనుక సత్రాజిత్తుకు ఉత్తరకర్మలు చేయించాడు. 

శతధన్వునిచావు తెలిసిన అక్రూరుడూ, కృతవర్మా ద్వారక వదలి సుదూర ప్రాంతానికి వెల్లిపోయారు. అక్రూరుడు లేకపోవటంవల్ల ద్వారకానివాసులకు రకరకాల ఉపద్రవాలు కలిగాయి. అప్పుడు ఆ పట్టణంలోని వృద్దులు శ్రీకృష్ణునికి ఇలా చెప్పారు.

శ్రీకృష్ణపురమాత్మా! ఒకప్పుడు కాశీరాజు రాజ్యంలో వానలు పడలేదు. అనావృష్టి బెడద తొలగించుకొనటానికి అతడు శ్వఫల్కుణి తీసుకొనిపోయి, తన కొమార్తె అయిన కాందిని నిచ్చి పెండ్లిచేసి సత్కరించాడు.

అప్పుడు ఆ రాజ్యంలో వానలు కురిశాయి. శ్వఫల్కుణి కుమారుడు అక్రూరుడుకూడా తండ్రియంత గొప్పవాడే. అతడు ద్వారకకు తిరిగివస్తేనే వర్షాలు కురిసి ఆపదలు తొలగిపోతాయి. నీవు అక్రూరుని తప్పు క్షమించు. ఇక్కడకు అతణ్ణి రప్పించు. ప్రజలబాధలు తొలగిపోవటం ముఖ్యం.

పెద్దల మాటలు విని శ్రీకృష్ణుడు దూతలను పంపి అక్రూరుణ్ణి రప్పించి, పూజించాడు. అతనికి ప్రీతి కలిగించే కథలు కొన్ని చెప్పాడు. సర్వజనుల స్వభావాలు తెలిసినవాడు కాబట్టి మెత్తగా, తియ్యగా అక్రూరునితో ఇలా మాటాడాడు.

అక్రూరా! శతధన్వుడు పోయేటప్పుడు మీయింటిలో మణిని దాచినమాట నిజం. అది నాకు తెలుసు. సత్రాజిత్తుకు కొడుకులు లేరు. కొమార్తెలే అతనికి చేయదగిన పనులన్నీ చేసి ఆస్తినీ, అప్పునూ పంచుకొంటారు. సత్రాజిత్తు వైరుల మూలంగా రాజుల కుచితంగాని మరణం పొందాడు.

ఇక ముందు అతనికొరకు ఉత్తమకర్మలు చేయాలి. నీవే స్యమంతకమణిని ఉంచుకో! నేను మణికై వెంపరలాడుతున్నా నని బలరాముడు నన్ను శంకిస్తాడు. అనురాగంతో చుట్టాలందరికీ మణిని ఒకసారి చూపు. ఈ ఉదారబుద్ధివల్ల నీవు పుణ్యాత్ముడవై బంగారు తిన్నెలమీద కూర్చుండి యజ్ఞాలు చేసేంతటి గొప్పవాడి వవుతావు.

ఈ విధంగా శ్రీకృష్ణుడు నచ్చజెప్పగా అక్రూరుడు గుడ్డతో కప్పిన స్యమంతకమణిని తీసుకొనివచ్చి అతనికివ్వగా

శ్రీకృష్ణుడు - మంటికీ మింటికీ నడుమను చీకట్లను పారదోలే వెలుగులుకలదీ, బారువులకొలది బంగారాన్ని తెంపులేకుండా ఇస్తూ - దేవతలనూ, మానవులనూ ఆశ్చర్యపరచేదీ, దిగంతాల దాకా వ్యాపించిన పేరు కలిగిందీ అయిన స్యమంతకమణిని చుట్టపక్కాలందరికీ చూపాడు.

ఈ విధంగా శ్రీకృష్ణుడు స్పష్టంగా తనసౌమ్యతను అందరకూ తెలిపి, దయతో అక్రూరునకు తిరిగి మణిని ఇచ్చాడు.

సర్వోన్నతుడూ, భగవానుడూ, పరమాత్మా, పుణ్యశాలీ అయిన శ్రీకృష్ణుడు మణిని తెచ్చిఇచ్చిన కథను విన్నాా చదివినా, జ్ఞప్తికి తెచ్చుకొన్నా మానవులకు చెడ్డపేరూ, పాపసమూహమూ నశించిపోతాయి.

శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థ పురంబున కరుగుదెంచుట





Rugvedam & Yajurveda Upaakarma - ఋగ్వేదం & యజుర్వేద ఉపాకర్మ

ఋగ్వేదం & యజుర్వేద ఉపాకర్మ ప్రతి సంవత్సరం, శ్రావణ మాసంలో శ్రావణ నక్షత్రం రోజున ఉపాకర్మ నిర్వహిస్తారు. ఉపనయనం తరువాత,  ఉపాకర్మ  మొదటి రోజ...