శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - యముడు చెప్పిన దేవీమహిమ
వెయ్యి వదనాలున్న ఆదిశేషుడు, అయిదు ముఖాలున్న పరమేశ్వరుడు, నాలుగు ముఖాలున్న బ్రహ్మదేవుడు, అన్నీ తెలిసిన విష్ణుమూర్తి, ఆరు ముఖాలున్న కార్తికేయుడు, యోగీంద్రులకు గురువైన గణేశుడు - విరే దేవీగుణకీర్తన సమగ్రంగా చెయ్యలేరంటే ఇక నేనా! సకలశాస్త్రాలూ, చతుర్వేదాలూ అమ్మవారి అనంతగుణ సందోహంలో ఒక్క అంశాన్ని కళామాత్రంగా తెలుసుకున్నాయేమో. సరస్వతీదేవి ఆయినా పూర్తిగా తెలుసుకోగలిగిందనీ చెప్పగలుగుతుందనీ నేననుకోను. ధర్మ సనకసనందన సనత్కుమార కపిల సూర్యాది బ్రహ్మమానస పుత్రులే దేవీగుణ సమగ్రవర్ణనకు సమర్థులు కారంటే ఇంక మిగతా జడబుద్ధుల గురించి చెప్పాలా! సిద్ధులకూ సాధ్యులకూ మునీంద్రులకూ యోగీంద్రులకూ సాధ్యంకానిది నావల్లమాత్రం అవుతుందా? బ్రహ్మ విష్ణు మహేశ్వరులే దేవిపాదపద్మాలను నిరంతరం ధ్యానిస్తూ ఉంటారంటే ఇక వేరే చెప్పవలసింది ఎముంది! దేవీభక్తులకుమాత్రమే ఆ తల్లి మహిమ తెలుస్తుంది. వారే ఏ కొంచెమో తద్గుణ కీర్తనం చెయ్యగలరు. అదికూడా ఆమె కరుణయే. వీరికన్నా కొంచెం ఎక్కువ తెలుసుకున్నవాడు బ్రహ్మ, అతడికన్నా ఇంకొంచెం ఎక్కువ తెలిసినవాడు జ్ఞానిగురువు గణేశుడు. అందరికన్నా ఎక్కువ తెలిసినవాడు సర్వజ్ఞుడైన శంకరుడు. పూర్వం ఒకప్పుడు శ్రీ కృష్ణపరమాత్మ గోలోకంలో నిర్జనారణ్యంలో రాసమండలంలో ఈ శివుడికి దేవిమాహాత్మ్యాన్ని గుట్టుగా ఉపదేశించాడు. శివుడేమో తనలోకంలో ధర్ముడికి చెప్పాడు. ధర్ముడు సూర్యుడికి తెలియచేశాడు. తపఃఫలంగా దేవీమహిమను తెలుసుకున్న నా తండ్రి సూర్యభగవానుడు నేను తపస్సులకు వెళ్ళబోతున్నవేళ ప్రేమగా పిలిచి నాకు ఉపదేశించాడు. ఇది నా గురుపరంపర. నాకు తెలిసిందే తక్కువ. ఆయినా నువ్వు అడిగావు కనక చెబుతున్నాను. నిజానికి ఆ తల్లి గుణగణాలు ఆవిడకే పూర్తిగా తెలియవు. ఇంక ఇతరులకు ఎలా తెలుస్తాయి? ఆకాశం ఎంత ఉన్నదో ఆకాశానికి తెలుసా?
సర్వకారణకారణుడు సర్వాత్మకుడు సర్వభగవంతుడు సర్వేశ్వరుడు సర్వాద్యుడు సర్వవేత్త సర్వపరిపాలకుడు నిత్యరూపి నిత్యదేహి నిత్యానందుడు నిరాకృతి నిరంకుశుడు నిరాశంకుడు నిర్గుణుడు నిరామయుడు నిర్లిప్తుడు సర్వసాక్షి సర్వాధారుడూ అయిన పరాత్పరుడు (ప్రకృతి) మాయావిశిష్టుడై ప్రకృతిశబ్దవాచ్యుడు అవుతున్నాడు. ఈ ప్రకృతి పురుషులు పరస్పరం అభిన్నులు. ఆగ్ని - దాని దాహకశక్తిలాగా అవిభాజ్యులు. వీరి వికారాలే సర్వప్రాకృత రూపాలూను. ఆ ప్రకృతి శక్తినే మహామాయ అంటారు. సచ్చిదానంద రూపిణి. తాను రూపరహిత అయినా భక్తులను అనుగ్రహించడంకోసం రూపం ధరిస్తూ ఉంటుంది. మొట్టమొదటగా గోపాలసుందరీరూపాన్ని సృష్టించింది. వెంటనే అత్యంత మనోహరుడైన గోపసుందరుణ్ణి సృష్టించింది. ఆమె రాధాదేవి. అతడు శ్రీకృష్ణపరమాత్మ,
ఆ గోపకిశోరుడు నీలమేఘశ్యాముడు. కందర్పకోటి సుందరుడు. లీలాధాముడు, మనోహరుడు. వికసిత పుండరీకాక్షుడు. శరచ్చంద్రవదనుడు. రత్నభూషణవిరాజితుడు. నవ్వు రాజిల్లెడు మోమువాడు. పీతాంబరధారి. బ్రహ్మతేజోబంధురుడు. పరబ్రహ్మస్వరూపుడు. కంటికి హాయిగా ఉంటాడు. శాంతాకారుడు. రాధాకాంతుడు. రాసమండలంలో రత్నసింహాననంమిద ఇతడు కూర్చుని ఉంటే గోపికాగణం చూపులన్నీ ఇతడివైపే. చిరునవ్వులన్నీ ఇతడిమీదనే. మురళిని నిరంతరం మోగిన్తుంటాడు. ద్విభుజ నారాయణుడు. వనమాలికా విభూషితుడు. కౌస్తుభాలంకృతోరస్కుడు. మహోజ్జ్వలుడు.
కుంకుమాగురు కస్తూరీ చందనచర్చిత శరీరుడు. చంపకమాలతీపుష్పమాలికాలంకృతుడు. నెమలిపింఛం ధరించినవాడు. భక్తులు ఈ రూపంలో కృష్ణపరమాత్మను ధ్యానిస్తూ ఉంటారు.
ఈ కృష్ణపరబ్రహ్మ ఆజ్ఞకు భయపడి - బ్రహ్మదేవుడు సకల జీవరాశినీ తత్తత్కర్మానుసారం సృష్టిస్తుంటాడు. తపస్వులకు తపఃఫలాలను ఇస్తుంటాడు. చతుర్భుజ నారాయణుడు విష్ణుమూర్తి జగత్తులను పాలిస్తుంటాడు. కాలాగ్నిరూపుడై రుద్రుడు సంహరిస్తుంటాడు. ఈ శివుడు జ్ఞాని అయినదీ జ్ఞానదాత అయినదీ జ్ఞానులకు గురువైనదీ యోగీశ్వరుడైనదీ భక్తివైరాగ్య సంయుతుడైనదీ పరమానందసంయుక్తుడైనదీ ఆ కృష్ణపరమాత్మ అనుగ్రహంవల్లనే. ఇలా త్రిమూర్తులేకాదు పంచభూతాలూ అష్టదిక్పాలకులూ సూర్యచంద్రులూ నవగ్రహాలూ - సమస్తమూ తమ తమ విధులను నిర్వర్తించేది ఈ కృష్ణపరమాత్ముని ఆజ్ఞకు భయపడియే. సకాలంలో వృక్షాలు ఫలించేదీ లతలు పుష్పించేదీ జల - స్థల జంతుజాలం జీవించేదీ కాలం చెల్లగానే మరణించేదీ అంతా అతడి ఆజ్ఞప్రకారమే. విషమరంగంలో పోరాడుతున్నా అతడి ఆజ్ఞలేనిదే ఏ ప్రాణీ మరణించదు.
వాయువు సముద్రాన్ని మోసినా, సముద్రం కూర్మాన్ని మోసినా, కూర్మం అనంతుణ్ణి మోసినా, అనంతుడు ధరణిని మోసినా, ధరణి రత్నరాశులనూ సముద్రాలనూ పర్వతాలనూ సకల చరాచర ప్రాణికోటినీ ఓర్పుతో భరిస్తున్నా - ఇదంతా పరమాత్ముని ఆజ్ఞయే.
డెబ్భైయ్యొక్క దివ్యయుగాలు ఇంద్రుడి ఆయుర్దాయం. ఇరవై ఎనిమిదిమంది ఇంద్రులు గతిస్తే బ్రహ్మదేవుడికి ఒక పగలూ రేయీ, ఇలా ముప్ఫయి రోజులతో మాసం, రెండు మాసాలతో ఋతువు, ఆరు ఋతువులతో సంవత్సరం ఏర్పడుతుంది.
బ్రహ్మాయుష్షు పూర్తి అయితే అది శ్రీకృష్ణుడికి ఒక రెప్పపాటుకాలం. ఆయన చక్షుర్నిమీలనం చేస్తే అది ప్రాకృతప్రళయం. అప్పుడు సర్వదేవతలూ చరాచరజంతువస్తుజాలమూ సృష్టికర్త అందరూ శ్రీకృష్ణుడి నాభిపంకజంలోకి ఉపసంహారం పొందుతారు. లీనమవుతారు.
వైకుంఠంలో క్షీరసముద్రమధ్యాన శేషతల్పంమిద శయనించే చతుర్భుజ నారాయణుడు సైతం శ్రీకృష్ణపరమాత్ముని వామపార్యంలో లినమవుతాడు. జ్ఞానాధిదేవత శివుడు శ్రీ కృష్ణుడి జ్ఞానంలో లీనమవుతాడు. సృష్టిలోని సర్వశక్తిస్వరూపిణులూ కృష్ణమాయా స్వరూపిణి దుర్గలో కలిసిపోతారు. ఆవిడ బుద్ధికి అధిష్టాత్రి అతడి బుద్ధిలో లినమవుతుంది. నారాయణుడి అంశ కుమారస్వామి ఆ శ్రీకృష్ణుడి వక్షఃస్థలంలో. కృష్ణుడి అంశ గణేశుడు అతడి బాహువుల్లో కలిసిపోతారు. లక్ష్మీదేవి అంశలన్నీ లక్ష్మిలోకీ, లక్ష్మీదేవి రాధాదేవిలోకీ అంతరిస్తారు. సకల గోపికలూ దేవకాంతలూ రాధలోనే లీనమవుతారు. రాధాదేవి ఆంటే కృష్ణుడి ప్రాణాధిదేవత. అతడి ప్రాణాల్లోనే ప్రాణంగా ఉంటుంది. వేదశాస్త్రాలు సావిత్రిలోకీ, సావిత్రి సరస్వతిలోకీ, సరస్వతి శ్రీకృష్ణుడి జిహ్వాభాగంలోకీ అంతర్భవిస్తారు. గోలోక గోపకులు అతడి రోమాలలోకీ వారి ప్రాణాలు అతడి ప్రాణాలలోకీ, అగ్నిదేవుడు జఠరాగ్నిలోకీ సకలజలాలూ రసనాగ్రభాగంలోకీ వైష్ణవులు అతడి పాదపద్మాలలోకీ - ఇలా విరాడంశలన్నీ శ్రీకృష్ణమహావిరాడ్రూపంలో లీనమైపోతాయి. సకలవిద్యలూ అతడి రోమకూపాలలో దాక్కుంటాయి. అతడికి రెప్పపాటు కాలమంటే మిగతా సృష్టికి మహాప్రళయం. ఇదే ప్రాకృతప్రళయం.
శ్రీకృష్ణపరమాత్మ రెప్పవాలిస్తే ప్రాకృత ప్రళయం. రెప్పతెరిస్తే పునస్సృష్టి. బ్రహ్మాదిదేవతలు ఆవిర్భవించి తమ విధులు నిర్వర్తిస్వారు. సృష్టి అంతా మళ్ళీ కళకళలాడుతుంది. ఇలా ఎన్నిసార్లు సృష్టిలయాలు జరిగాయో ఎవరూ లెక్కించి చెప్పలేరు. భూగోళంలో ఎన్ని మట్టిరేణువులున్నాయంటే ఎవరైనా చెప్పగలరా? శ్రీకృష్ణపరమాత్మ ఎన్నిసార్లు రెప్పవాల్చాడో తెరిచాడో ఎవరు చెబుతారు? ఎప్పుడు వాలుస్తాడో ఎప్పుడు తెరుస్తాడో మాత్రం ఎవరు చెప్పగలరు? అంతా అతడి ఇష్టం. ఈశ్వరేచ్చ. సృష్టిలయాలు తదనుగుణంగా జరుగుతూనే ఉంటాయి.
(శ్రీకృష్ణుడు రెప్పవేస్తే ప్రాకృత ప్రళయమన్నారా, బ్రహ్మదేవుడికి నూరేళ్ళు నిండితే (దేవమానం ప్రకారం శతాబ్దం గడవాలి) అది సూత్రప్రళయం. దాన్నే బ్రహ్మప్రళయమంటారు. ఇప్పటికి ఎందరు బ్రహ్మలు లయించి పునరుద్భవించారో ఎవరూ చెప్పలేరు).
ఇలా ప్రళయం సంభవించినప్పుడు సమస్తమూ శ్రీకృష్ణుడిలో లీనమైతే శ్రీకృష్ణుడు ప్రకృతిలో లీనమవుతాడు. ఒక్కటే పరాశక్తి. ఒక్కడే పరాత్పరుడు నిర్గుణుడు. ఆగ్ర ఆసీత్ అని వేదాలు చెప్పేది ఇదే. అవ్యక్తమూలప్రకృతి. అవ్యాకృతపదవాచ్య. చిదభిన్న ప్రళయంలో తానే మిగులుతుంది. ఆ పరాశక్తి గుణాలను కీర్తించడం ఈ బ్రహ్మాండంలో ఎవరివల్లా కాదు.
సావిత్రీ! వేదాలు నిర్వచించిన ముక్తులు నాలుగువిధాలు, సాలోక్య - సారూప్య - సామీప్య - నిర్వాణాలు, దేవీభక్తి వీటన్నింటికన్నా గొప్పది. అందుకే దేవీ మంత్రోపాసకులు ఈ ముక్తుల్ని కోరుకోరు. దేవీసేవనే కోరుకుంటారు. శివత్వ - అమరత్వ - బ్రహ్మత్వసిద్ధులూ జన్మ మృత్యు జరా వ్యాధి భయ శోకాది రాహిత్యం దివ్యరూపధారణం - వీటిని నిర్వాణమనీ మోక్షమనీ అంటుంటారు. ముక్తి ఆంటే సేవారహిత స్థితి. భక్తి అంటే సేవావివర్దని. భక్తిముక్తులకు ఇదీ తేడా. చేసిన శుభాశుభకర్మల ఫలాలను అనుభవించడమే నిషేకమంటే. దాన్ని ఖండించగలిగినది శ్రీకృష్ణభక్తిమాత్రమే. కనక సృష్టిలయాలకూ జన్మమృత్యువులకూ అతీతంగాని శివత్వాదిసిద్ది రూపమైన ఆ ముక్తికన్నా కర్మఫలానుభవత్యాగరూపమూ (నిషేకఖండనం) శ్రీవిభు సేవారూపమూ అయిన భక్తినే జ్ఞానులు కోరుకుంటారు. వేదాలు చెప్పే స్థిరమైన తత్త్వజ్ఞానం ఇదే, శుభప్రదమైన తత్త్వజ్ఞానాన్ని నిర్విఘ్నంగా నీకు ఉపదేశించాను. నీ భర్తను పునరుజ్జీవితుణ్ణి చేశాను. ఇక వెళ్ళిరా. నీకు శుభమగుగాక - అని ఆశీర్వదించి యమధర్మరాజు తన లోకానికి బయలుదేరబోయాడు, కానీ సావిత్రి కదలనివ్వలేదు. పాదాలు పట్టుకుని విలపించదొడగింది. ఎందుకో ఏమిటో చెప్పకుండా మౌనంగా రోదించింది. యముడికే జాలి కలిగింది. సంతృప్తి కలిగింది. కళ్ళు చెమ్మగిల్లాయి.
వత్సా! లక్షసంవత్సరాలు నీ భర్తతో సుఖసంతోషాలు అనుభవించి పుణ్యక్షేత్రంలో తనువు చాలించి దేవీలోకం చేరుకుందువుగాని. ఇప్పటికి ఇక ఇంటికి వెళ్ళు. వెళ్ళి సావిత్రీవ్రతం ఆరంభించు. అది పద్నాలుగేళ్ళ వ్రతం. స్త్రీలకు మోక్షదాయకం. జ్యేష్ట శుక్షచతుర్దశినాడు ఆరంభించడం శుభప్రదం. భాద్రపద శుక్లాష్టమినాడు మహాలక్ష్మీవతం ప్రారంభించు. ఇది పదహారేళ్ళ నోము. సౌభాగ్యసంపత్ప్రదం. ప్రతి మంగళవారంనాడూ మంగళ ప్రదాయి శ్రీదేవిని ఉపాసించు. ప్రతి మాసంలోనూ శుక్షషష్టినాడు షష్టీదేవిని, ఆషాఢ సంక్రాంతినాడు మనసాదేవిని, కార్తికమాసంలో రాసాధిదేవత రాధను, ప్రతినెలా శుక్లాష్టమినాడు ఉపవాసపూర్వకంగా విష్ణుమాయా స్వరూపిణి దుర్గతినాశిని అయిన దుర్గాదేవిని ఆరాధించు. ఈవిడ పరప్రకృతి. పతిపుత్రవతులైన పతివ్రతలలో యంత్రాలలో ప్రతిమలలో ఈ దుర్గామాతను సందర్శించి ఆరాధించేవారికి సకల సంపదలూ సుఖసంతోషాలూ సిద్ధిస్తాయి. వైకుంఠం కరతలామలకంలాగా లభిస్తుంది. దేవివిభూతిని గుర్తించి పూజించడం సాధకుల ప్రథమకర్తవ్యం. సర్వరూప అయిన పరమేశ్వరిని సర్వకాల సర్వావస్థలలోనూ ఉపాసించాలి. ఇంతకన్నా మానవజన్మకు సార్థక్యం లేదు. కృతకృత్యత్వం లేదు - అని చెప్పేసి యముడు ఇక క్షణం ఆగకుండా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు.
సావిత్రీ సత్యవంతులు ఇంటికి తిరిగివచ్చారు. జరిగిన విచిత్రాలు చెప్పారు. సావిత్రి తండ్రి కాలక్రమాన పుత్రవంతుడయ్యాడు. మామగారికి చూపు వచ్చింది. రాజ్యం దక్కింది. సావిత్రి సంతానవతి అయ్యింది. లక్ష సంవత్సరాలు భోగభాగ్యాలు అనుభవిస్తూ, యమధర్మరాజు ఉపదేశించిన నోములన్సీ చేస్తూ, దేవీపాదపద్మార్చనను ఏమరకుండా చేస్తూ కాలం గడిపింది. కట్టకడపట ఒక పుణ్యక్షేత్రంలో తనువు చాలించి దేవలోకం చేరుకుంది.
నారదా! సావిత్రి అంటే సూర్యాధిదేవత, సూర్యమంత్రాధిష్టానదేవత. వేదమాత. వేదసవిత్రి. కనకనే సావిత్రి అయ్యింది.
జీవకర్మవిపాకాన్ని గురించి ప్రధానంగా తెలియజేసే సావిత్రి ఉపాఖ్యానం సవిస్తరంగా వినిపించాను. ఇంకా ఏమి కావాలో అడుగు - అని ముగించాడు నారాయణమహర్షి