Wednesday, August 5, 2026

Gayatri Hridayam - గాయత్రీ హృదయం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - గాయత్రీ హృదయం

శ్రీ గాయత్రీ హృదయం
బ్రహ్మనందనా! ఇక ఇప్పుడు అత్యంత ప్రధానమైన గాయత్రీహృదయం చెబుతాను తెలుసుకో. సాధుకుడెవరైనాగానీ ఇష్టదేవతతో అభిన్నుడయ్యే అర్చించాలి. నాదేవో దేవమర్చయేత్‌ అని వేదం చెబుతోంది. కనక పిండబ్రహ్మాండాల సమైక్యాన్ని(అభిన్నతను) భావన చేస్తూ తన శరీరంలో దేవీరూపాన్ని ప్రతిష్టించుకోవాలి. గాయత్రీదేవి అంటే విరాడ్రూపిణి. మహాదేవి. వేదజనని. ఆ మూర్తిని సాధకుడు స్వశరీరంలో భావనామయంగా ప్రతిష్ఠించుకోవడమే గాయత్రీ హృదయమంటే.

పిండబ్రహ్మాండయోరైక్యాద్బావయేత్‌ స్వతనౌ తథా ।
దేవీరూపం నిజే దేహే తన్మయత్వాయ సాధకః ॥

నా
దేవోభ్యర్చయేద్దేవమితి వేదవిదో విదుః
తతో
భేదాయ కాయే స్వే భావయేద్దేవతా ఇమాః ॥

ఈ గాయత్రీహృదయానికి నారాయణుడు(అహమేవ) ఋషి. ఛందస్సు గాయత్రి. దేవత - పరమేశ్వరి. అంగషట్కం పూర్వోక్తమే. ఏకాంతంలో ఆసనబద్ధుడై ముందుగా ఏకాగ్రచిత్తంతో గాయత్రీదేవిని ధ్యానించాలి. అటుపైని అర్థన్యాసం - నా శిరస్సున ద్యులోకం, దంతపంక్తిలో అశ్వినులు, పెదవులలో ప్రాతస్సాయంసంధ్యలు, ముఖంలో ఆగ్ని, జిహ్వలో సరస్వతి, కంఠప్రదేశంలో బృహస్పతి, స్తనభాగంలో అష్టవసువులు, బాహువులలో మరుత్తులు(వాయువులు), హృదయంలో పర్జన్యుడు, ఉదరంలో ఆకాశం, నాభిలో అంతరిక్షం, కటిప్రదేశంలో ఇంద్రాగ్నులు, జఘనంలో విజ్ఞానఘనుడైన ప్రజాపతి, ఊరువులలో కైలాసమలయపర్వతాలు, జానువులలో విశ్వేదేవులు, జంఘలలో కౌశికుడు, గుహ్యంలో ఆయనాలు, ఊరువులలో పితృదేవతలు, పాదాలలో పృథివి, అంగుళులలో వనస్పతులు, రోమాలలో ఋషులు, గోళ్ళలో ముహూర్తాలు, ఎముకలలో గ్రహాలు, రక్తమాంసాలలో ఋతువులు, రెప్ప(పాటు)లలో సంవత్సరాహోరాత్రసూర్యచంద్రులు ప్రతిష్ఠింపబడుగాక - అని భావించాలి. సహస్రనేత్ర గాయత్రిని శరణువేడాలి.

ఓం తత్సవితుర్వరేణ్యాయ నమః, ఓం తత్పూర్వా జయాయ నమః, ఓం తత్ప్రాతరాదిత్యాయ నమః, ఓం తత్ప్రాతరాదిత్యప్రతిష్ఠాయ నమః - ఇలాగ నమస్కరించాలి. ప్రాతస్సంధ్యతో రాత్రిపాపమూ, సాయంసంధ్యతో పగటి పాపమూ నశించి సాయంప్రాతస్సంధ్యావందనాలు చేసినవాడు పాపరహితుడవుతాడు. సర్వతీర్థాలలోనూ స్నానంచేసిన పుణ్యాత్ముడవుతాడు. 

సకలదేవతలకూ పరిచితుడవుతాడు. అవాచ్యవచన ఆభక్ష్యభక్షణ అభోజ్యభోజన ఆచోష్యచోషణ అసాధ్యసాధన అగ్రాహ్యగ్రహణాది మహాపాపాలనుంచి విముక్తుడవుతాడు. దానప్రతిగ్రహదోషాలు తొలగిపోతాయి. పంక్తిదూషణ దోషం ఆంటదు. అనృతవచన దోషమూ అంతరిస్తుంది. అబ్రహ్మచారి బ్రహ్మచారి అవుతాడు. (అంతటి పవిత్రుడవుతాడని).

ఈ గాయత్రీ హృదయాన్ని అనుష్ఠించినవారేకాదు అధ్యయనం చేసినవారూ వెయ్యి యజ్ఞాలు చేసిన ఫలాన్నీ అరవైవేల మంత్రజపం చేసినపుణ్యాన్నీ చిటికెలో అనాయాసంగా పొందుతారు. ఎనమండుగురు బ్రాహ్మణులను చక్కగా పోషించిన ఫలం దక్కుతుంది. దీన్ని నిత్యమూ అధ్యయనం చేసిన బ్రాహ్మణుడు, బ్రహ్మలోకం చేరుకుంటాడు.

గాయత్రీ స్తోత్రం





Gayatri Kavacham - గాయత్రీ కవచం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - గాయత్రీ కవచం

గాయత్రీ కవచానికి బ్రహ్మవిష్ణుమహేశ్వరులే ఋషులు. ఋగ్యజుస్సామాధర్వణాలే ఛందస్సులు. బ్రహ్మరూపిణి గాయత్రీదేవియే అధిదేవత. కవచమిది తద్బీజకం. భర్గశక్తికం. ధీకీలకం. (ధియ ఇత్తి కీలకమ్‌). మోక్షార్థే వినియోగః. దీనిలో నాలుగు వర్ణాలు హృదయం. మూడు వర్ణాలు శిరస్సు. నాల్గింటితో శిఖ. తర్వాత మూడింటితో కవచం. అటుపైని నాల్గింటితో నేత్రం. తక్కిన నాల్లూ అస్త్రకం. ఇక దీని ధ్యానశ్లోకమేమిటంటే -

ముక్తావిద్రుమహేమనీల ధవళచ్చాయైర్ముఖైస్త్రీక్షణై
ర్యుక్తా మిందు నిబద్ద రత్నమకుటాం తత్త్వార్థవర్ణాత్మికామ్‌ ।

గాయత్రీం వరదాభయాంకుశకశాః శుభ్రం కపాలం గదామ్‌
శంఖం చక్రమధారవిందయుగళం హస్తైర్వహంతీం భజే॥

గాయత్రీదేవి తూర్పుదిక్కున రక్షించుగాక. సావిత్రి దక్షిణదిక్కునా, (బ్రహ్మ) సంధ్యాదేవి పశ్చిమదిక్కునా, సరస్వతీదేవి ఉత్తరదిక్కునా, పార్వతి ఆగ్నేయదిక్కునా జలశాయిని నైరృతిదిక్కునా పవమానవిలాసిని వాయవ్యదిక్కునా రుద్రాణి ఈశాన్యదిక్కునా బ్రహ్మాణి ఊర్ధ్వదిక్కునా వైష్ణవి అధోదిక్కునా - ఇలా దశదిశలా ఆ భువనేశ్వరి నన్ను రక్షించుగాక.

తత్పదం నా పాదాలనూ, సవితుః పదం జంఘలనూ, వరేణ్యం పదం కటిప్రదేశాన్నీ, భర్గః పదం నాభినీ, దేవస్య పదం హృదయాన్నీ ధీమహి పదం చెక్కిళ్ళనూ, ధియఃపదం నేత్రాలనూ, యఃపదం లలాటాన్ని, నః పదం శిరస్సునూ, ప్రచోదయాత్‌ పదం శిఖాభాగాన్నీ - రక్షించును గాక! ఇలాగే తత్‌వర్ణం శిరస్సునూ, సకారం ఫాలాన్నీ 'వి' వర్ణం నేత్రాలనూ, తుకారం కపోలాలనూ, వకారం నాసాపుటాలనూ, రేకారం ముఖాన్నీ, ణికారం పై పెదవిని, యమ్‌కారం కింది పెదవినీ, భకారం ఆస్య మధ్యభాగాన్నీ, ర్గోవర్ణం చిబుకాన్నీ, దేకారం కంఠప్రదేశాన్నీ, వకారం భుజస్కంధాలనూ, స్యకారం కుడి చేతినీ, ధీకారం ఎడమ చేతినీ, మకారం హృదయాన్నీ, హికారం ఉదరభాగాన్నీ, ధికారం నాభినీ, యోకారం కటి ప్రదేశాన్ని, మరొక యోకారం మర్మాంగా
న్నీ, నః వర్ణం రెండు తొడలనూ, ప్రకారం జానువులనూ, చోకారం జంఘలనూ, దకారం గుల్భాలనూ, యాకారం పాదాలనూ, తకారపు పొల్లు సర్వాంగాలనూ రక్షించుగాక!

నారదా! ఇది గాయత్రీ కవచం. దీన్ని ఇట్లా అనుసంధానం చేసుకున్నవారూ (ధరించినవారూ) విన్నవారూ అనంతకోటి బాధలనుంచి విముక్తి పొందుతారు. చతుష్షష్టి కళావేత్తలవుతారు. సర్వపాపవిముక్తులవుతారు. పరబ్రహ్మస్వరూపాన్ని అందుకుంటారు. సందేహంలేదు.

గాయత్రీ హృదయం





Gayatri Mantrakshara Mahima - గాయత్రీ మంత్రాక్షర మహిమ

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - గాయత్రీ మంత్రాక్షర మహిమ

నారదా! తక్కిన అనుష్ఠానాలను వేటిని చేసినా చెయ్యకపోయినా గాయత్రిని చేస్తే చాలు ద్విజుడు కృతకృత్యుడైనట్టే. మూడు సంధ్యల్లోనూ ఆర్ఘ్యమిచ్చి మూడువేలు గాయత్రీజపం చేస్తే ఆదే పదివేలు. దేవతలకుకూడా పూజ్యుడవుతాడు. అంగన్యాస కరన్యాసాదులు చెయ్యనీ మాననీ. సచ్చిదానందరూపిణి గాయత్రిని నిర్వ్యాజంగా ధ్యానించడం ముఖ్యం.

గాయత్రీమంత్రంలో ఒక్క అక్షరాన్ని సిద్దింపజేసుకుంటే చాలు ఆ సాధకుడు హరిహర హిరణ్యగర్భ సూర్యచంద్రాగ్నులతో పోటీపడతాడు. ఒక్కొక్క అక్షరమూ అంతంత ప్రభావం కలిగినవి. అందుకని ఆ అక్షరాల ఋషిచ్చందోదేవతలను అదేక్రమంలో అక్షరాలా చెబుతాను శ్రద్ధగా గ్రహించు. 

వామదేవుడు - అత్రి - వసిష్ఠుడు - శుక్రుడు - కణ్వుడు - పరాశరుడు - విశ్వామిత్రుడు - కపిలుడు - శౌనకుడు - యాజ్ఞవల్క్యుడు - భరద్వాజుడు - జమదగ్ని - గౌతముడు - ముధ్గలుడు - వేదవ్యాసుడు - లోమశుడు - అగస్త్యుడు - కౌశికుడు - వత్సుడు - పులస్త్యుడు - మాండూకుడు - దూర్వాసుడు - నారదుడు - కశ్యపుడు - ఈ ఇరవైనాలుగు మందీ వరసగా ఆ ఇరవైనాలుగు వర్ణాలకూ ఋషులు.

గాయత్రి - ఉష్ణిక్కు - అనుష్టుప్పు - బృహతి - పంక్తి - త్రిష్టుప్పు - జగతి - అతిజగతి - శక్వరి - అతిశక్వరి - ధృతి - అతిధృతి - విరాట్‌ - ప్రస్తారపంక్తి - కృతి - అతికృతి(ప్రకృతి) - ఆకృతి - వికృతి - సంకృతి - అక్షరపంక్తి - భూః - భువః - స్వః - జ్యోతిష్మతి - ఇవి ఇరవైనాలుగూ ఛందస్సులు. 

అదేక్రమంలో దేవతలనూ చెబుతాను. మొదటి అక్షరం అగ్నిదేవతాకం, రెండవది ప్రజాపతి దేవతాకం, మూడు సోమదేవతాకం, నాలుగు ఈశాన దేవతాకం, అయిదు సవితృదేవతాకం, ఆరు ఆదిత్యదేవతాకం, ఏడవది బృహస్పతి దేవతాకం, ఎనిమిదవది మిత్రావరుణ దేవతాకం, తొమ్మిది భగదేవతాకం, పదవది అర్యమదేవతాకం, పదకొండు గణేశదేవతాకం, పన్నెండు త్వష్టృదేవతాకం, పదమూడవది పౌష్ణదేవతాకం, పధ్నాల్గు ఇంద్రాగ్నిదేవతాకం, పదిహేనవది వాయవ్య దేవతాకం, పదహారవది వామదేవ దేవతాకం, పదిహేడవది మైత్రావరుణిదేవతాకం, పద్దెనిమిదవది వైశ్వదేవం, పంద్దొమ్మిదవది మాతృదేవతాకం, ఇరవై విష్ణుదేవతాకం, ఇరవైయొకటి వసుదేవతాకం, ఇరవై రెండవది రుద్రదేవతాకం, ఇరవైమూడవది కుబేరదేవతాకం ఇరవైనాల్గవది అశ్వినీదేవతాకం.

నారదా! ఇవీ గాయత్రీమంత్రంలో ఇరవైనాలుగక్షరాలకూ ఋషులూ ఛందస్సులూ దేవతలూ సంగ్రహంగా తెలియజేశాను. దీన్ని వింటేచాలు జపించినంత ఫలితమూ దక్కుతుంది.

ఈ వర్ణాలకు అధిదేవతలేకాదు అధిదేవీశక్తులూ ఉన్నాయి. మంత్రాక్షరాల క్రమంలో ఆ శక్తుల పేరు చెబుతాను. విను. వామదేవి - ప్రియ - సత్య - విశ్వ - భద్రవిలాసినీ - ప్రభావతి - జయ - శాంత - కాంత - దుర్గ - సరస్వతి - విద్రుమ - విశాలేశ - వ్యాపిని - విమల - తమోపహారిణి - సూక్ష్మ - విశ్వయోని - నిరయ - వశ - పద్మాలయ - పరశోభ - భద్ర - ద్రుపద - అనే ఇరవైనాలుగు శక్తులు ఆ అక్షరాలకు అధిదేవిమూర్తులు. 

ఇంక ఈ వర్ణాల వర్ణాలు(రంగులు) ఏమిటంటే - మొదటిది సంపంగిపువ్వురంగు, రెండవది అతసీవర్ణం, మూడవది పగడం రంగు, నాల్గవది స్ఫటికవర్ణం, అయిదవది పద్మం రంగు, ఆరవది తరుణాదిత్యసన్నిభం, ఏడవది శంఖచంద్రసమప్రభం, ఎనిమిదవది చిగురాకురంగు (ప్రవాళపద్మపత్రాభం), తొమ్మిదవది పద్మరాగవు రంగు, పదవది ఇంద్రనీలపు రంగు, పదకొండవది ముత్తెపురంగు, పన్నెండవది కుంకుమరంగు, పదమూడవది కాటుకరంగు, పధ్నాల్గవది రక్తవర్ణం, పదిహేనవది వైఢూర్య వర్ణం, పదహారవది క్షౌద్రవర్ణం. పదిహేడవది పసపురంగు, పద్ధెన్మిదవది మొల్లపువ్వు రంగు(కుంద దుగ్ధాభం), పంధొమ్మిదవది సూర్యకాంతి రంగు, ఇరవై చిలకతోక రంగు (శుకపుచ్చనిభం), ఇరవై యొకటి శతపత్రనిభం, ఇరవైరెండు కేతకీపుష్ప సంకాశం(మొగలిపువ్వు రంగు), ఇరవైమూడవది మల్లికాకుసుమం, ఇరవైనాల్గవ అక్షరానిది కరవీరవర్ణం.

ఈ వర్ణాలు ఇరవైనాల్గింటికీ ఇరవైనాలుగు తత్త్వాలున్నాయి. పృథివి - ఆపస్సు(జలం) - తేజస్సు - వాయువు - ఆకాశం - గంధం - రసం - రూపం - శబ్దం - స్పర్శ - ఉపస్థం - పాయువు - పాదం - పాణి - వాక్కు - ఘ్రాణం - జిహ్వ - చక్షుస్సు - త్వక్కు - శ్రోత్రం - ప్రాణం - అపానం - వ్యానం - సమానం - అనేవి వీటి తత్త్వాలు. 

ఇలాగే ఒక్కొక్క వర్ణానికీ ముద్రలున్నాయి. సుముఖం - సంపుటం - వితతం - విస్తృతం - ద్విముఖం - త్రిముఖం - చతుర్ముఖం - పంచముఖం - షణ్ముఖం - అధోముఖం - వ్యాపకాంజలికం - శకటం - యమపాశం - గ్రథితం - సన్ముఖోన్ముఖం - విలంబం - ముష్టికం - మత్స్యం - కూర్మం - వరాహం - సింహాక్రాంతం - మహాక్రాంతం - ముద్గరం - పల్లవం ఇవి ఇరవైనాలుగు ముద్రలు. 

త్రిశూలం - యోని - సురభి - అక్షమాల - లింగం - అంబుజం ఆనేవి ఆరూ మహాముద్రలు. తుర్యరూపాలు. ఇవన్నీ మహాపాపక్షయకరాలు. కీర్తి ప్రదాలు. కాంతి ప్రదాలు.

నారాయణమహర్షీ! స్వామీ! సర్వజగన్నాథా! చతుష్షష్టి కళాభిజ్ఞా! యోగవిద్యారహస్యవేత్తా! నాకొక్క సందేహం మిగిలిపోయింది. ఏ పుణ్యకార్యం చేస్తే మోక్షం వన్తుంది? బ్రహ్మరూపత్వం సిద్ధిస్తుంది? దేహం దేవతారూపాన్నీ మంత్రరూపాన్నీ పొందుతుంది? ఆ సత్కర్మ ఏమిటో దాని ఆచరణవిధానమేమిటో మంత్ర - ఋషి - చ్ఛందో - అధిదైవత - ధ్యానాలు ఏమిటో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. ప్రభూ! దయచేసి తెలియపరచవూ!

నారదమహర్షి! తప్పకుండా తెలియపరుస్తాను. నువ్వు ఆడగడమూ నేను చెప్పకపోవడమూనా!గాయత్రీకవచమని అత్యంత గుహ్యం ఒకటి ఉంది. దాన్ని పఠించివా ధరించినా సర్వపాపాలూ నశిప్తాయి. కోరికలన్నీ తీరతాయి. అంతేకాదు - దేవీరూపుడవుతాడు.

గాయత్రీ కవచం





Peace Rituals (Shanti Homas) - శాంతి హోమాలు

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - శాంతి హోమాలు

నారదా! శమీసమిధలతో భూత రోగ గ్రహాదుల ఉపశమనంకోసం శాంతిహోమం చెయ్యాలి. పాలుగారే చెట్టునుంచి పచ్చి పేళ్ళు తెచ్చి హోమం చేస్తే ఇంకా మంచిది. శలలతో (మద్ది) చేసినా  భూతరోగశాంతి కలుగుతుంది. 

సూర్యుడికి ముందుగా జలతర్పణం చెయ్యాలి. మోకాలిబంటి నీటిలో నిలిచి. చేస్తే దోషాలన్నీ ఆంతరిస్తాయి. మెడబంటి లోతులో నిలబడి చేస్తే ప్రాణాంతకభయాలు తొలగిపోతాయి. శాంతికర్మలన్నింటికీ నీటిలో నిలిచి జపం చెయ్యడమే ఉత్తమం.

బంగారం వెండి రాగి మట్టి పాత్రల్లోగానీ బొడిపెలులేని కొయ్యపాత్రలోగానీ పంచగవ్యాన్ని నింపుకొని క్షీర వృక్షకాష్ఠాలతో జ్వలితాగ్నిలో సమంత్రకంగా హోమం చెయ్యాలి. సహస్రాహుతులు చెయ్యాలి. మిగిలిన పంచగవ్యంలో దర్భలు ముంచి ప్రదేశమంతా సంప్రోక్షించాలి. బలిప్రదానం చెయ్యాలి. పరదేవతను ధ్యానించాలి. అభిచారాలు పాపాలూ నశిస్తాయి. దేవ భూత పిశాచాదులు వశమవుతాయి. గృహ గ్రామ రాష్ట్రాలను విడిచి దుష్టగ్రహ పిశాచాదులు పారిపోతాయి.

మండలంలో శూలముద్ర లిఖించి అభిమంత్రించి ఇలాగే సహస్రహోమం చేసి నిఖనం చేస్తే సర్వశాంతులూ సిద్ధిస్తాయి. పూర్వోక్తమైన పాత్రకు సూత్రవేష్టనం చేసి నేలలోగానీ ఇసుకలోగానీ పాతిపెట్టి మంత్రజలాలు నింపి నాలుగు దిక్కులనుంచీ తీరజలాలను ఆవాహనచేసి వివిధపుష్పాలూ బిల్వపత్రాలూ బియ్యమూ నువ్వులూ ఆవాలూ పాలుగారే చెట్ల చిగురాకులూ అందులో వెయ్యాలి. 

కుశకూర్చంతో(దర్భలతో చేసిన పొడవుపాటి ముడి) మంత్రాలు చదువుతూ కలియద్రిప్పాలి. అటుపైని ఆనీరు జల్లుకోవాలి. బ్రాహ్మణులపై జల్లాలి. అందరూ పవిత్రులవుతారు. భూతరోగాదులూ చేతబడులూ(అభిచారాలు) తొలగిపోతాయి.

ఈ అభిషేకంతో విప్రుడు మృత్యువు నోటినుంచికూడా బయట పడగలడు. దీర్ఘాయుర్దాయం కోరుకునేవారందరూ ఈ అభిషేకం జరిపించుకోవాలి. ఇది చేసిన విప్రులకి నూరుగోవులూ సంతృప్తికరంగా దక్షిణలూ ఇవ్వాలి.

శనివారంనాడు రావిచెట్టు దగ్గర మంత్రజపం చెయ్యడం, భూతరోగాభిచారాది శాంతికరం. పాలుగారే గుడూచి సమిధలతో(తిప్పతీగ) హోమం చేస్తే సర్వరోగాలూ ఉపశమిస్తాయి. దీన్ని మృత్యుంజయహోమమంటారు.

ఇలాగే జ్వరశాంతికి చూతహోమం క్షయరోగోపశమనానికి వచాహోమం. రాచపుండు(రాజయక్ష్మ) తగ్గడానికి మధుత్రితయహోమం - చెప్పబడ్డాయి. అన్నంతో పాయసం వండి సూర్యుడికి నివేదించి హోమంచేసి మిగిలినదాన్ని భుజిస్తే రాజయక్ష్మ (రాచపుండు) తగ్గుతుంది.

తిప్పతీగ కణుపులతో సోమదేవతాకంగా హోమంచేస్తే క్షయరోగం ఉపశమిస్తుంది. శంఖవృక్ష పుష్పాలతో హోమం కుష్ఠురోగనివారిణి. అపామార్గ పుష్పాలను బియ్యంతోకలిపి చేసే హోమం అపస్మారరోగానికి ఉపశమనం. 

క్షీరవృక్ష సమిధలతో హోమం ఉన్మాదరోగ నివారకం. ఔదుంబర సమిధలతో చేసే హోమం ఆతిమేహరోగాన్ని నయం చేస్తుంది. ఇక్షుమధుహోమంతో ప్రమేహరోగశాంతి. మధుత్రితయహోమం మసూరికా నివారకం. కపిలాహోమంకూడా ఇంతే. 

ఇంటిలో చీమలూ దోమలూ వగైరా క్రిమి క్రీటకాలు నశించాలంటే శమీసమిధలు హోమం చెయ్యాలి. వనవేతనహోమం(అడవి పుబ్బలి) వారంరోజులు చేస్తే పిడుగుపాటుల నుంచీ భూకంపాలనుంచీ నివారణ లభిస్తుంది. శతమంత్రజపం చేసి లోష్టాన్ని తాకిన్తూ ఏ దిక్కున ఎంతదూరం వెడితే ఆ మార్గంలోని ప్రదేశాలన్నీ ఆగ్ని - మారుత - శత్రుభయ రహితాలవుతాయి. 

మనస్సులోనే ఈ జపం చేస్తే బంధవిమోచన కలుగుతుంది. అభిమంత్రితజలపానం భూతపిశాచవిమోచకం. అలాగే అభిమంత్రించి విభూతి పెట్టినా శిరసున జల్లినా సర్వవ్యాధులూ సర్వభయాలూ తొలగిపోతాయి. నూరేళ్ళు సుఖంగా జీవిస్తాడు.

ఈ హోమాలన్నీ ఎవరికివారే చేసుకోవడం ఉత్తమం. అశక్తులు భూరిదక్షిణలిచ్చి బ్రాహ్మణులతో చేయించుకోవచ్చు. పుష్పాలతో చేసే హోమాలు కొన్ని ఉన్నాయి. అవి పుష్టికరాలు. లక్ష్మీప్రదాలు. 

ఎర్రకలువలతో హోమం చేస్తే సంపదలు పెరుగుతాయి. బంగారం దొరుకుతుంది. బిల్వపత్ర, బిల్వపుష్ప, బిల్వఫల, బిల్వ సమిధలతో చేసే హోమాలు ఏవైనా సంపత్ప్రదాలే. వీటిని నేతితో అభిమంత్రించి నూరుచొప్పున సప్తాహహోమం చేస్తే లక్ష్మీదేవి స్వయంగా వచ్చి ఇంటిలో తిష్ఠవేస్తుంది. 

త్రిమధులాజహోమం(పేలాలు) కన్యాలాభం కలిగిస్తుంది. ఇదే స్త్రీలు చేస్తే కోరిన వరుడు లభిస్తాడు. సూర్యదేవతాకంగా జలహోమం చేస్తే నీటిలో పడిపోయిన బంగారం చేతికందుతుంది. అన్నహోమం అన్నవర్ధకం. వ్రీహిహోమం(బియ్యం) వ్రీహివర్ధకం. పిడకలతో చేసే హోమాలు పశుసంపదను పెంచుతాయి. 

ప్రియంగు - పాయస - ఆజ్యహోమాలు సంతాన ప్రాప్తికరాలు. భాస్కరుడికి హోమంచేసి మిగిలిన పాయసాన్నం ఋతుస్నాతలు భుజిస్తే గర్భధారణ జరుగుతుంది. పుత్రసంతానం కలుగుతుంది. మొలకలు వచ్చిన తడిగింజలతో హోమం ఆయుర్వర్ధకం. ఇటువంటి ఎర్రగింజలూ మధుత్రయమూ వ్రీహి - కలిపి శతహోమం చేస్తే పట్టిందల్లా బంగారమవుతుంది. ఆయుర్దాయం పెరుగుతుంది.

సువర్ణకుట్మలాలు(సంపంగి మొగ్గలు) హోమం చేసినా కర్తకు ఆయుర్దాయం పెరుగుతుంది. గరిక పాలు తేనె నెయ్యి - సప్తాహహోమం చేస్తే అపమృత్యువు తొలగిపోతుంది. అన్నమూ పాలూ నెయ్యి వీటితో చేసిన హోమానికీ ఇదే ఫలం. న్యగ్రోధసమిధలూ(మర్రి) పాయసమూ రోజుకి నూరుగా ఏడురోజులు హోమం చేసి ఆ ఏడురోజులూ పాలుత్రాగి గడిపి మంత్రజపం చేస్తే మృత్యువును జయిస్తాడు.

నిరాహారుడై మౌనియై మూడురేయింబవళ్ళు జపించినా యముడు దరిదాపులకి రాడు. నీటిలోదిగి జపించినా బిల్వవృక్ష సన్నిధిలో జపించినా విశేషఫలితాలుంటాయి. ఒక్క నెలపాటు ఇలా జపిస్తే చాలు వాడు రాజ్యాధికారి అవుతాడు. సమూలఫల పల్లవంగా బిల్వవృక్షాన్ని హోమంచేసినా రాజ్యం దక్కుతుంది. నూరు పద్మాల చొప్పున నెలనాళ్ళు చేసినా ఈ ఫలం లభిస్తుంది. 

గంజితోహోమం చేస్తే పంటలు పండే గ్రామం దక్కుతుంది. యుద్దాలకు వెళ్ళబోయేముందు రావి సమిధలతో హోమం నిర్వహిస్తే విజయం వరించి వస్తుంది. పాలతో కలిపి వేతసపత్రపుష్ప హోమం సప్తాహదీక్షగా చేస్తే వానలు కురుస్తాయి. బొడ్డులోతు నీళ్ళల్లో నిలిచి మంత్రజపం ఏడురోజులు చేస్తే వానలు పడతాయి. నీటితో విభూతి శతహోమం చేసి అతివృష్టిని నివారించవచ్చు.

మోదుగు సమిధలతో చేసే హోమం బ్రహ్మవర్చస్సును అందిస్తుంది. పలాశకుసుమాలతో హోమం సర్వాభీష్టప్రదాయకం. పాలతో హోమం మేధాశక్తినీ నేతితో హోమం బుద్ధిశక్తినీ పెంపాందిస్తాయి. ఉప్పూ తేనె కలిపి హోమం చేస్తే కోరిన వస్తువునల్లా వశపరుచుకోవచ్చు. 

ఇలాగా కోరికలు తీర్చే హోమాలు చాలా ఉన్నాయి. ఆయా నియమాలను పాటిస్తూ మంత్రాలను ఉచ్చరిస్తూ నిర్వహించాలి. బ్రాహ్మణుడు తనకోసంగానీ ఇతరులకోసంగానీ వీటిని చెయ్యవచ్చు. అన్యులకోసం చేసినా ఇవి విప్రుడికీ పుష్టిదాయకాలేకావడం మరీ విశేషం.

రోజుకి వెయ్యిగా నెలనాళ్ళు మంత్రజపం చేస్తే ఆయుష్కాముడి కోరిక నెరవేరుతుంది. ఆయురారోగ్యాలు రెండూ కావాలనుకుంటే రెండు నెలలు జపం చెయ్యాలి. సంపదలుకూడా కావలిస్తే మూడునెలలు, దారపుత్రులుకూడా కావలిస్తే నాలుగునెలలూ, వారికీ ఆరోగ్యం కావాలంటే అయిదునెలలు, వారికీ సంపదలు కావాలంటే ఆరునెలలు, వారికీ విద్యలు కావాలంటే ఏడునెలలు - ఇలాగ కోరికలు పెరుగుతున్నకొద్దీ మంత్రజపం చెయ్యాల్సిన నెలలూ పెరుగుతుంటాయి. 

ఒంటికాలుమీద నిలబడి చేతులు పైకెత్తి నిరాశ్రయుడుగా నిలిచి మూడునెలలు రోజుకి మూడువందలు చొప్పున మహామంత్రం జపిస్తే ఆ విప్రుడికింక తీరని కోరికలంటూ ఉండవు. అలాగే శతోత్తర సహస్రం చొప్పున(పదకొండువందలు) జపించగలిగితే సిద్ధించనిదంటూ ఉండదు. 

నీటిలో మునిగి నూరుచొప్పున నెలనాళ్ళు జపిస్తే ఇష్టఫలావాప్తి. మూడువందల చొప్పున జపిస్తే సర్వవాంఛిత సిద్ధి. రాత్రిపూట భోజనం చేస్తూ ఇదే పద్దతిలో ఏడాదిపాటు మంత్రం జపిస్తే ఋషి అవుతాడు. రెండేళ్ళు జపిస్తే అమోఘవాక్కు అవుతాడు. మూడేళ్ళు జపిస్తే త్రికాలవేత్త అవుతాడు. నాలుగేళ్ళు జపిస్తే భగవంతుడు తోడై నిలుస్తాడు. అయిదేళ్ళకి అణిమాది శక్తులు సిద్ధిస్తాయి. ఆరేళ్ళకి కామరూపధారణశక్తి వస్తుంది. ఏడేళ్ళకి అమరత్వం లభిస్తుంది. తొమ్మిదేళ్ళకి మనుత్వం, పదేళ్ళకి ఇంద్రత్వం, పదకొండేళ్ళకి ప్రజాపతిత్వం, పన్నెండేళ్ళకి బ్రహ్మత్వం సిద్ధిస్తాయి. 

ఈ తపస్సుతోనే నీవంటివారు లోకాలను జయిస్తున్నారు. కొందరు శాకాలు తిని, కొందరు కందమూలాలు తిని, కొందరు ఫలాలు తిని, కొందరు పయస్సులుగ్రోలి, కొందరు నెయ్యిత్రాగి, కొందరు సోమరసం పుచ్చుకుని, కొందరు చరువు(హవిష్యం) ఆరగించి, కొందరు పదిహేను రోజులకు ఒక్కసారి మాత్రమే భుజించి, కొందరు భిక్షాన్నం తిని - ఇలాగ కఠోర నియమాలతో తపస్సులు చేస్తున్నారు. మహర్షు లనిపించుకుంటున్నారు.

ఇటువంటి దీక్షతో మంత్రజపం మూడువేలు చేస్తే రహస్యంగా చేసిన పాపాలు తొలగిపోతాయి. వెయ్యిచొప్పున నెలనాళ్ళు చేస్తే బంగారం దొంగిలించిన పాపమైనా అంతరిస్తుంది. మూడువేలు చొప్పున నెలనాళ్ళు చేస్తే సురాపానదోషం నశిస్తుంది. గురుపత్నీ సంగమదోషమైనా తొలగిపోతుంది. 

అడవిలో పర్జశాల వేసుకుని ఇలా జపం చేస్తే బ్రహ్మహత్యాపాతకమూ అంతరిస్తుంది. నీళ్ళల్లో మునిగి రోజుకి వెయ్యి చొప్పున పన్నెండురోజులు జపిస్తే సర్వమహాపాతకాలూ తొలగిపోయి విప్రుడు విశుద్ధుడవుతాడు.

ప్రాణాయామానికికూడా ఇంతటి శక్తి ఉంది. అది సర్వపాప వినాశకం. నూరు ప్రాణాయామాలు చేస్తే అన్ని పాపాలూ తొలగి శుచి అవుతాడు. పర్ణశాలలో ఉంటూ రోజుకి వెయ్యిచొప్పున నెలవాళ్ళు ఉపవాసం ఉండి మంత్రజపం చేసినవాడిని నిత్యజాపి అంటారు. అతడు పవిత్రుడు. 

ఇరవైనాలుగు వేలు చేస్తే అది కృచ్భసంజ్ఞితం. అరవైనాలుగువేలు చేస్తే చాంద్రాయణసమానం. ఉభయ సంధ్యల్లోనూ ప్రాణాయామం చేసి కనీసం నూరుసార్లు(గాయత్రి) మంత్రజపం చెయ్యాలి. ఇది గృహస్థుకి కర్తవ్యం తదిత్యాదిఋక్కు సర్వపాపహారం. 

నీటిలోమునిగి ఈ ఋక్కును రోజుకి నూరుసార్లు జపించాలి. జపిస్తూ సూర్యరూప గాయత్రీదేవిని ధ్యానిస్తే సర్వపాప విముక్తి కలుగుతుంది. 

నారదా! శాంతి శుద్ధ్యాది కల్పాలన్నీ రహస్యాతిరహస్యాలైనా నీకు సవిస్తరంగా సవ్యాఖ్యానంగా తెలియజేశాను. ఇది సదాచార సంగ్రహం. క్లుప్తంగా చెప్పాను. ఈ పద్దతిలో జీవిక సాగించినవారిని మాయాదుర్గ అనుగ్రహిస్తుంది. నిత్య - నైమిత్తిక - కామ్యకర్మలన్నింటినీ యథావిధిగా ఆచరించినవారికి భుక్తిముక్తిఫలాలు కొంగుబంగారాలు. 

ఆచారమే మొట్టమొదటి ధర్మం. ధర్మానికి ప్రభువు(రక్షణ) జగదీశ్వరి అని సర్వశాస్తాలూ ఆచార ఫలాన్నీ మహత్తునూ శతధా కొనియాడుతున్నాయి. ఆచారవంతుడు ఎప్పుడూ పరిపూతుడే. అతడే సుఖి. అతడే ధన్యుడు. ఇది సత్యం. 

సత్యం, సదాచారం పాటించడంకన్నా దేవీ అనుగ్రహ సంపాదనకు మరొక సులభమార్గం లేదు. దీన్ని వినడంకూడా సంపత్తి సాఖ్యదాయకమే. సదాచారంవల్ల ఐహికాముష్మిక సుఖాలు అన్నీ చేకూరుతాయనడం సారాంశం. అదే నీకు చెప్పాను, మరింకేమి వినాలనుకుంటున్నావో చెప్పు అని నారాయణమహర్షి ముగించాడు.

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము




SRI DEVI BHAGAVATHAM PART 12 - శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము

శౌనకాది మహమునులారా ! నారాయణమహర్షి ఇంతవరకూ చెప్పిన సదాచారాన్ని శ్రద్ధగా విన్న నారదుడు మరొక ప్రశ్న వేశాడు. వారిద్దరి సంభాషణగానే దాన్ని వినడం ఆందంగా ఉంటుంది. కనక అలాగీ చెబుతాను వినండి - అంటూ సూతుడు కొనసాగించాడు.

నారాయణమహర్షీ | సదాచారం గురించి సవివరంగా తెలియజేశావు. చాంద్రాయణజాది వ్రతాలగురించీ చెప్పావు. కానీ అవన్నీ ఆచరణకు కష్టసాధ్యాలు. మాలాంటివారికి దేవి అనుగ్రహం లభించేట్టూ, సుఖంగా తేలికగా అనుష్టించడానికి తగినట్టూ ఏమైనా వ్రత విధానాలుంటే తెలియజెయ్యి. గాయత్రీవిధి చెప్పావు. అనుష్టానం చాలా ఉంది. వాటిల్లో ముఖ్యాతిముఖ్యం అత్యధిక పుణ్యప్రదం ఏమిటి? గాయత్రీమంత్రానికి ఇరవైనాలుగక్షరాలన్నావు. వాటికి బుషులు ఎవరు ? ఛందస్సు లేమిటి ? దేవతలెవరు ? ఇవన్నీ సమగ్రంగా తెలియజేసి నావంటి అలనుల్ని తరింపజెయ్యి - అని నారదుడు ప్రార్థించాడు. నారాయణ మహర్షి చిరునవ్వులు చిందిస్తూ ఆరంభించాడు.

గాయత్రీ మంత్రాక్షర మహిమ










Prajapatyam - ప్రాజాపత్యం

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - ప్రాజాపత్యం

వేదాధ్యయనానికి ముందు ప్రాజాపత్యం చెయ్యాలి, గుండు కొట్టించుకుని మీసాలు తీయించుకుని గోళ్ళు తొలగించుకుని శుచి అవ్వాలి. ఒక పగలూ రేయీ మౌనంగా ఉండాలి. వ్యాహృతులు జపించాలి, ఆపోహిష్ఠాది మంత్రాలతో సంప్రోక్షించుకోవాలి. ఆద్యంతాలలో పునంతీ, స్వస్తిమతీ, పావమానేత్యాది మంత్రాలతో ఆయావిధులు నిర్వర్తించాలి.

సహస్రగాయత్రి చెయ్యాలి. కనీనం నూరు - లేదా వంద చెయ్యాలి. తర్పణలు విడిచి పెట్టాలి. అసంభాష్యులతో భాషించకూడధు. సత్యవాఙ్నియమం పాటించాలి. ప్రాజాపత్య సాంతపన పరాక చాంద్రాయణాదులకు ఈ నియమాలు సమానం. 

ఇలా చేస్తే పంచమహాపాతక విముక్తి కలుగుతుంది. మూడు చాంద్రాయణాలతో బ్రహ్మలోకం లభిస్తుంది. ఎనిమిదింటితో దేవతాసాక్షాత్కారం. పదింటితో సర్వచ్చందఃపరిజ్ఞానం,ర్వకామ సమువలబ్ధి.

మూడునాళ్ళు ప్రాతఃకాలంలోనూ మూడునాళ్ళు సాయంకాలంలోనూ అయాచితాన్నం తింటూ మరిమూడునాళ్ళు ఉపోష్యం ఉండి ప్రాజాపత్యం చెయ్యాలి. గోమూత్రం గోమయం గోక్షీరం గోదధి ఆవునెయ్యి వీటితో ఉపవాసం ఉండి ఏకరాత్రం గడిపితే అది సాంతపనం.

రోజుకి ఒక్కముద్దమాత్రమే తింటూ మూడునాళ్ళు ఉపవాసం చేస్తే అది మహాసాంతపనం. జలక్షీర ఘృతానిలాలను ప్రతిమూడునాళ్ళకూ ఒక్కసారి గ్రహిస్తూ జలాహారిగా ద్వాదశాహాలు ఉపవాసం చేస్తే అది పరాకవ్రతం. 

శుక్షపక్షంలో రోజుకి ఒకముద్ద చొప్పున పెంచుకొంటూ వెళ్ళి కృష్ణపక్షంలో (అలా తగ్గించుకుంటూ వచ్చి) ఒక్కొక్కటీ తింటూ అమావాస్యనాడు అస్సలు ఏమీ తినకండా ఉపోష్యం ఉంటే అది చాంద్రాయణవ్రతం.

ప్రాతఃకాలాన ఆహ్నికక్రియలు నిర్వర్తించి నాలుగుముద్దలూ, సాయంకాలాన విధులు నిర్వర్తించి సూర్యాస్తమయం అయ్యాక నాలుగు ముద్దలూ తింటూ నెలగడపడం శిశుచాంద్రాయణ వ్రతం. మధ్యాహ్నంపూట ఎనిమిదేసి హవిష్యపిండాలను తిని ఉపవాసాలుండటం యతిచాంద్రాయణం. 

ఈ వ్రతాలు ఒక్కొక్కటీ సప్తరాత్రకాల వ్యవధిలో త్వక్‌ - అసృక్‌ - పిశిత - అస్థి - మేదో - మజ్జా - వసాభాగాలను శుద్ధి చేస్తాయి. ఇలా శరీరాన్నీ ఆత్మనూ శుద్ధి పరచుకుని పురశ్చరణ స్వాధ్యాయాది కర్మలు ఆరంభించాలి. నియతాత్ముడై ఆచరించాలి. అప్పుడు ఇష్టకామ్యాలు అన్నీ సిద్ధిస్తాయి. 

నారదా! శ్రుతిసారమైన పురశ్చర్యావిధానం సవిస్తరంగా నీకు తెలియజేశాను. ఇది అత్యంత గోప్యంసుమా!

నారాయణమహర్షి! పురశ్చర్యావిధానం తెలిసింది. దానితోపాటు ప్రాజాపత్యాదివ్రతాలూ తెలిసాయి. మరి శాంతిప్రయోగాలుకూడా తెలియజేస్తే ధన్యుణ్ణి అవుతాను - అన్నాడు నారదుడు. సరే అని నారాయణుడు ఆరంభించాడు.

శాంతి హోమాలు




Tuesday, August 4, 2026

Brahmacharyam - బ్రహ్మచర్యం

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - బ్రహ్మచర్యం

అధఃశయానుడూ(నేలమీద పడుకునేవాడు). ధర్మాత్ముడూ జితేంద్రియుడూ వినయవంతుడూ మితాహారీ శాంతచిత్తుడూ నిత్య త్రిషవణస్నాయీ నిత్యశుభభాషణుడూ పాపిష్ఠస్నేహదూరుడూ - ఉత్తమోత్తముడు. 

జపహోమాది సమయాల్లో మౌనంగా ఉండాలి. ఏ సంభాషణమూ చెయ్యకూడదు. మైథునాలాపాలు (బూతులు) అస్సలు చెయ్యకూడదు. మనోవాక్కాయకర్మలలో సర్వకాలసర్వావస్థలలో మైథునప్రసక్తిని పరిత్యజించడమే బ్రహ్మచర్యమంటేను.

బ్రాహ్మణక్షత్రియులు గృహాస్థాశ్రమంలోకూడా బ్రహ్మచర్యం పాటించవచ్చు. సంస్కారవంతురాలైన సవర్ణస్త్రీని వివాహం చేసుకుని నిషిద్ధ సమయాలలో కలయికను పూర్తిగా పరిత్యజించి, అనుమతించిన దినాలలో రాత్రిపూటమాత్రమే సంగమిస్తూ సంసారం సాగిస్తే అది బ్రహ్మచర్యమే. 

దేవ పితృ ఋషి ఋణాలను తీర్చుకునే ప్రయత్నం చెయ్యనివాడికి ముక్తి లభించదు. అతడి జన్మ అజాగళస్తనంలాగా వ్యర్థమే. యజ్ఞయాగాదులతో దేవఋణం, తిలోదకాలతో పితౄణం, బ్రహ్మచర్యంతో ఋషిబుణం తీరుతుంది. అలా తీర్చేందుకే ఆశ్రమధర్మాలను పాటించడం. 

క్షీరాహారిగానీ ఫలాహారిగానీ శాకాహారిగానీ హవిష్యాహారిగానీ భిక్షాహారిగానీ చాంద్రాయణ వ్రతధారిగానీ అవుతూ మంత్రజపం చెయ్యాలి. క్షార లవణ ఆమ్ల తాంబూలాదులూ రాత్రిభోజనమూ దుష్టసహవాసమూ మద్య సేవనమూ శ్రౌతస్మార్తవిధులకు సుతరామూ పనికిరావు. అలాగే రాత్రిపూట మంత్రజపం చెయ్యకూడదు. (జపం రాత్రౌ వివర్జయేత్).

ద్యూతక్రీడలతో స్త్రీగోష్ఠులతో నిద్రతో వాదవివాదాలతో వృథాకాలయాపన చెయ్యకూడదు. దేవతా పూజలూ స్తోత్రపఠనలూ ఆగమశాస్త్ర గ్రంథ పరిశీలనలూ - వీటితో కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

భూశయనం బ్రహ్మచర్యం మౌనదీక్ష నిత్యమూ త్రిషవణస్నానం శూద్రకర్మవివర్జన నిత్యపూజ నిత్యదానం ఆనందం స్తుతికీర్తనం నైమిత్తికార్చనం దేవతలపట్ల విశ్వాసం గురువులపట్ల విశ్వాసం ఇవి పన్నెండూ జపనిష్ఠుడి ధర్మాలు. సిద్ధిదాయకాలు.

నిత్యమూ సూర్యుడికి అభిముఖంగా సూర్యోపస్థానం చేసి గాయత్రిని జపించాలి. దేవతా ప్రతిమల ముందుగానీ అర్చించిన ఆగ్నిముందుగానీ చెయ్యవచ్చు. 

బ్రాహ్మణుడు స్నాన పూజా జప ధ్యాన హోమతర్పణ తత్పరుడై నిష్కామంగా సత్కర్మలనన్నింటినీ ఆచరించి బ్రహ్మార్పణం చేస్తూ నియమం తప్పకుండా ఆయా పురశ్చరణలు చేస్తూ కాలం గడపాలి. ఆత్మకు ప్రసన్నత సిద్ధిన్తుంది. జపహోమాలపట్ల ఏకాగ్రత కుదురుతుంది. 

తపస్సుకీ ఆధ్యయనానికీ అంకితమైనవారికి భూతదయ సహజంగా ఉదయిస్తుంది. ఈ తపస్సే స్వర్గసంపాదకం. ఈ తపస్సే మహత్త్వసాధకం. తపస్వికి సాధ్యం కానిది ఏదీ లేదు. ఏయే దేవతలు ఏయే ఫలాలను ఇస్తారని ఋషులు చెప్పారో ఆదేవతలను ఆ రీతిలో ఉపాసిస్తే ఆ కోరికలు నెరవేరతాయి. పురశ్చరణమనేది సర్వకర్మలకూ సిద్ధికారకం. కనక ఆరంభంలో చెయ్యాలి.

ప్రాజాపత్యం




Gayatri Hridayam - గాయత్రీ హృదయం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - గాయత్రీ హృదయం శ్రీ గాయత్రీ హృదయం బ్రహ్మనందనా! ఇక ఇప్పుడు అత్యంత ప్రధానమైన గాయత్రీహృదయం చెబుతాను తెలుసుకో. ...