Thursday, July 30, 2026

Vindhyavasini - వింధ్యవాసిని

శ్రీ దేవీ భాగవతం దశమ స్కంధము - వింధ్యవాసిని

శ్రీహరి నాభిపద్మం నుంచి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. ఆయన జగన్నిర్మాత. సృష్టికర్త. లోకపితామహుడు. చతుర్ముఖుడు. ఆ పరమేష్ఠినుంచి స్వాయంభువమనువు మానసపుత్రుడుగా అవతరించాడు. ఆ మనువుకి ధర్మపత్నిగా ధర్మస్వరూపిణి శతరూప ఆవిర్భవించింది. కొంతకాలం గడిచాక క్షీరసముద్రతీరంలో పరమపావన ప్రదేశంలో తపస్సు చేయనారంభించాడు. మహాభాగ్యప్రద దేవిని ఆరాధించాడు. మట్టితో దేవీమూర్తిని తయారుచేసి ఉపాసించాడు. వాణీబీజసహితంగా మహామంత్రాన్ని మనస్సులో జపించసాగాడు. నిరాహారుడై శ్వాసను బంధించి ఒంటికాలిమీద వర్షంలో నిలిచి నూరేళ్ళు తపస్సు చేశాడు. కామక్రోధాలను జయించాడు. నిరంతరం దేవీపాదపద్మాలనే హృదయంలో ధ్యానిస్తూ స్థావరమైపోయాడు. అమ్మవారికి అనుగ్రహం కలిగింది. దర్శనమిచ్చింది. వరంకోరుకోమంది. ఆ మహారాజు ఆనందపరవశుడు అయ్యాడు. అమరులకైనా అందని వరాలు ఆడిగాడు.

జయదేవి విశాలాక్షి జయ సర్వాంతరస్థితే ।
మాన్యే పూజ్యే జగద్దాత్రి సర్వమంగళమంగళే ॥

దేవీ! జయము జయము. విశాలాక్షీ! సర్వాంతర్యామీ! మాన్యా! పూజ్యా! జగన్మాతా! సర్వమంగళా! జయము - జయము. బ్రహ్మదేవుడు లోకాలను సృష్టించగలుగుతున్నాడన్నా శ్రీహరి పరిపాలిస్తున్నాడన్నా హరుడు సంహరించగలుగుతున్నాడన్నా ఇంద్రుడు ముల్లోకాలనూ శాసిస్తున్నాడన్నా - అంతా నీ కృపాకటాక్షమే. దిక్పాలకులతోసహా అందరూ నీ అంశలే. నీ వల్లనే వారంతా శక్తిమంతులవుతున్నారు. అటువంటి నువ్వు నాకు వరమిస్తానంటే నాజన్మ ధన్యమయ్యింది. నాదొక్కటే వరం. బ్రహ్మమానసపుత్రుడుగా నేను చెయ్యబోయే సృష్టి నిర్విఘ్నంగా కొనసాగుగాక! నేను జపించిన నీ మంత్రాన్ని ఎవరు ఉపాసించినా వారికి సత్వరంగా సకలసిద్దులూ కలుగుగాక! ఈ సంవాదాన్ని విన్నా చదివినా భుక్తిముక్తులు లభించుగాక! జాతి స్మరత్వం వక్తృత్వం సౌష్టవం జ్ఞానసిద్ధి కర్మమార్గసంసిద్ధి కలుగుగాక! పుత్రపౌత్రాదులతో వంశాభివృద్ది జరుగుగాక!

మహాదేవి ఈ వరాల నన్నింటినీ అనుగ్రహించింది. నీ రాజ్యం నిష్కంటకమగుగాక, నీ పుత్రులు వంశకరులగుదురుగాక, నీ భక్తి నిశ్చలంగా నిలిచి ముక్తినిచ్చుగాక అని ఆశీర్వదించి స్వాయంభువ మనువు చూస్తుండగానే వింధ్యపర్వతాలకు వెళ్ళిపోయింది.

నారదా! వింధ్యాద్రిని నువ్వు ఎరుగుదువుగదా! ఒకప్పుడు ఆకాశానికి ఎదిగి సూర్యుడి రథాన్ని అడ్డుకొని గమనాన్ని నిరోధించిన మహాపర్వతం. ఆ పర్వతంమీద అమ్మవారు నివసిస్తుంది. కనకనే వింధ్యవాసినీదేవి అనేపేరు ఏర్పడింది.

నారాయణమహర్షి మాటలుగా సూతుడు ఈ విషయాన్ని చెప్పేసరికి వింటున్న శౌనకాది మహామునులకు వింధ్యపర్వతం కథ తెలుసుకోవాలి అనిపించింది.

సూతమహార్షీ! వింధ్యాచలం ఏమిటీ, ఆకాశానికి ఎదగడమేమిటీ, సూర్యరథాన్ని ఆపడమేమిటి, ఎందుకు ఆపినట్టూ ఇవన్నీ చాలా వింతగా ఉన్నాయి. అలా ఎదిగిపోయిన పర్వతాన్ని మళ్ళీ ఎవరు కుదించారు? అంతా వివరంగా చెప్పు. నీ ముఖచంద్రమండలంనుంచి జాలువారుతున్న ఈ దేవీచరితమనే అమృతాన్ని ఎంతగ్రోలినా తృప్తి తీరడంలేదు. సవిస్తరంగా తెలియజెయ్యి అని అభ్యర్థించారు.

వింధ్యాచల వృత్తాంతం



SRI DEVI BHAGAVATHAM PART 10 - శ్రీ దేవీ భాగవతం దశమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం దశమ స్కంధము

శౌనకాది మహామునులారా! శ్రద్ధగా వింటున్నారుగదా! నారదుడు మరికొన్ని ప్రశ్నలు వేశాడు అంటూ సూతుడు తన కథనం నడిపించాడు.

నారాయణమహర్షీ! దుర్గాదేవి మహిమలూ పూజాక్రమమూ తెలుసుకున్నాను. మన్వంతరాలన్నింటా ఆ మహాదేవి ఉంటుంది అన్నావు. ఏయే రూపాలతో ఉంటుంది? ఎలా ప్రాదుర్భవిస్తుంది? ఎలా పూజిస్తే ఏ కోరికలు తీరుస్తుంది? తెలియజెప్పి నావంటి భక్తులను అనుగ్రహించు - అని నారదుడు అభ్యర్థించాడు. నారాయణమహర్షి మునుపటిలాగానే మందహాసం చిందించి -

నారదా! సకలపాపాలనూ తొలగించి సర్వసంపదలూ కలిగించే దేవీచరితం ఎంత చెప్పినా తరగదు. ఎంత విన్నా తృప్తి కలగదు. మంచి ప్రశ్నలు వేశావు. వివరిస్తున్నాను ఆలకించు - అంటూ కొనసాగించాడు.

వింధ్యవాసిని














Worship of Goddess Durga - దుర్గారాధన

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - దుర్గారాధన

నారదా! ఇప్పుడింక దుర్గాదేవీ ఆరాధన విను. దుర్గను స్మరిస్తే చాలు ఆపదలు పారిపోతాయి. అందరూ హాయిగా ఉపాసించవచ్చు. జగన్మాత శైవి, శక్తి, మహాద్భుతశక్తి, సర్వబుద్ధి అధిదేవి, సర్వాంతర్యామిస్వరూపిణి, కఠిన సంకట విమోచని. అందుకే దుర్గ అయ్యింది. వైష్ణవులూ శైవులూ ఉపాసించదగిన పరాదేవత. మూలప్రకృతిరూప. సృష్టిస్థితిలయకారిణి. నవాక్షరమంత్రం చెప్పనా!

వాగ్భవం శంభువనితా కామబీజం తతఃపరమ్‌

చాముండాయై పదం పశ్చాద్విచ్చే ఇత్యక్షరద్వయమ్‌

ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే - అనే నవాక్షరమంత్రం భక్తులపాలిటి కల్పవృక్షం. దీనికి బ్రహ్మవిష్ణుమహేశ్వరులు ఋషులు. గాయత్రి ఉష్ణిక్కు అనుష్టుప్పులు ఛందస్సులు. మహాకాళీ మహాలక్షీ మహాసరస్వతులు దేవతలు. భ్రామరీ దుర్గా రక్తదంతికలు బీజాలు. నందా శాకంభరీ భీమాదేవీత్రయం శక్తులు. ధర్మార్థకామమోక్షాలలో వినియోగం.

ఋషులను మౌళియందు, ఛందస్సులను వదనంలోనూ దైవతాలను హృదయంలోనూ శక్తి బీజాలను స్తనాలలోనూ - ఇత్యాదిగా అంగన్యాస కరన్యాసాలతో మంత్రశాస్త్రంలో చెప్పబడిన విధానాలను అక్షరాలా పాటిస్తూ దుర్గాదేవిని అర్చించాలి. ఇలా ధ్యానించాలి -

ఖడ్గ చక్ర గదా బాణచాపాని పరిఘం తథా

శూలం భుశుండీం చ శిరః శంఖం సందధతీం కరైః ॥

మహాకాళీం త్రినయనాం నానాభూషణభూషితాం ।
నీలాంజన సమప్రఖ్యాం దశపాదాననాం భజే ॥

మధుకైటభనాశార్థం యాం తుష్టావాంబుజాసనః ।
ఏవం ధ్యాయేన్మహాకాళీం కామబీజస్వరూపిణీమ్‌


అక్షమాలాం చ పరశుం గదేషు కులిశాని చ ॥

పద్మం ధనుష్కుండికాం చ దడం శక్తిమసిం తథా ॥

చర్మాంబుజం తథా ఘంటా సురాపాత్రం చ శూలకమ్‌ ।
పాశం సుదర్శనం చైవ దధతీమరుణప్రభామ్‌


రక్తాంబుజాసవగతాం మాయాబీజస్వరూపిణీమ్‌ ।
మహాలక్ష్మీం భజేదేవం మహిషాసురమర్దినీమ్‌ ॥

ఘంటా శూలే హలం శంఖం ముసలం చ సుదర్శనమ్‌

ధనుర్బాణాన్ హస్తపద్మైర్దధానాం కుందసన్నిభామ్‌ ॥

శుంభాది దైత్యసంహర్త్రీం వాణీబీజస్వరూపిణీమ్‌

మహాసరస్వతీం ధ్యాయేత్‌ సచ్చిదానందవిగ్రవామ్‌ ॥ 

కామబీజస్వరూపిణిగా మహాకాళి, మాయాబీజస్వరూపిణిగా మహాలక్ష్మి, వాణీబీజస్వరూపిణిగా మహాసరస్వతి అయిన దుర్గాదేవిని ఇలా ధ్యానించి షట్కోణసంయుక్త - అష్టదళపద్మ - చతుర్వింశతి పత్రక - భూగృహసమాయుక్త - యంత్ర విచింతన చెయ్యాలి.

సాలగ్రామంలోగానీ మంగళకలశంలోగానీ యంత్రంలోగానీ ప్రతిమలలోగానీ బాణచిహ్నంలోగానీ సూర్యడిలోగానీ ఏకాగ్రచిత్తంతో దేవిని ఆవాహనచేసి ఉపాసించాలి. జయాదిశక్తియుతమైన పీఠంలో నిలిపి పూజించాలి. తూర్పుకోణంలో సరస్వతీసహితుడైన బ్రహ్మను, నైఋతికోణంలో శ్రీసహితుడైన హరిని, వాయుకోణంలో పార్వతీపరమేశ్వరులనూ, దేవికి ఉత్తరంగా సింహాన్నీ, వామభాగంలో మహిషాసురుణ్ణీ నిలిపి అర్చించాలి. నందజ - రక్తదంత - శాకంభరి - దుర్గ - భీమ - భ్రామరి - శక్తులను షట్కోణాలలో కొలవాలి. బ్రాహ్మి - మాహేశ్వరి - కౌమారి - వైష్ణవి - వారాహి - నారసింహి - ఐంద్రి - చాముండక - రూపాలను అష్టదళాలలో యజించాలి. అటు పైని చతుర్వింశతి తత్త్వపత్రాలలో విష్ణుమాయ - చేతన - బుద్ధి - నిద్ర - క్షుధ - ఛాయ - తృష్ణ - శాంతి - జాతి - లజ్జ - క్రాంతి - శ్రద్ధ - కీర్తి - లక్ష్మి - ధృతి - వృత్తి - శ్రుతి - స్మృతి - దయ - తుష్టి - పుష్టి - మాతృ - భ్రాంతి - పరలను అర్చించాలి. ఆ తరవాత భూపురకోణాలలో గణేశ క్షేత్రపాలక వటుక యోగినులను పూజించాలి. ఇంద్రాదిదేవతలనూ వజ్రాద్యాయుధాలనూ ఇలాగే వెలుపల ఆవాహనచేసి అర్చించాలి. సావరణంగా ఇలా అర్చించి రాజోపచారాలు చెయ్యాలి. నవార్ణమంత్రాన్ని జపించాలి. సప్తశతీస్తోత్రం పఠించాలి. ఇటువంటి స్తోత్రం ముల్లోకాలలోనూ లేదు. ఇలా నిత్యం చేసిన భక్తుడు చతుర్విధపురుషార్ధాలకూ ఆలయమవుతాడు.

నారదా! శ్రీదుర్గాపూజావిధానం సమగ్రంగా వివరించాను. చెప్పినందుకు నేనూ విన్నందుకు నువ్వూ కృతార్థులమయ్యాము. సకలదేవతలూ త్రిమూర్తులూ మనువులూ మునులూ జ్ఞానులూ యోగులూ ఆశ్రమవాసులూ లక్ష్మీసరస్వతులూ అందరూ దుర్గాదేవిని ధ్యానిస్తారు. అది కారణంగానే వారందరూ ఆయా పదవులలో నిలిచి కర్తవ్యాలు నిర్వహించడానికి సమర్థులు అవుతున్నారు. పంచప్రకృతులూ తదంశమూర్తుల గురించి రహస్యాతిరహస్యమైన ఆఖ్యానాలను నీకు వివరంగా తెలియజెప్పాను. దీన్ని విన్నవారికి చతుర్విధపురుషార్థాలూ సిద్ధిస్తాయి అనడంలో సందేహం లేదు. ఇది ముమ్మాటికీ సత్యం. తొమ్మిదిరాత్రుల పాటు దేవీసన్నిధిలో ఈ ఆఖ్యానాలను పఠించినవారికి తీరనికోరికలంటూ ఉండవు. రోజుకి ఒక అధ్యాయంగా పారాయణచేస్తే దుర్గాదేవి వశవర్తిని అవుతుంది. అతడు దేవీ ప్రియకరుడవుతాడు. మనోరథాన్ని సంకల్పించుకొని దేవీభాగవత గ్రంథపూజచేసి కుమారి చేతికిచ్చి లేదా వటువు చేతికిచ్చి తెరవమని - వచ్చిన అధ్యాయాన్ని చదివితే శభాశుభ శకునాలూ ఫలాలూ తెలిసిపోతాయి. ఉదాసీనుడికి ఉదాసీనంగానే ఉంటుందినుమా! అని చెప్పి నారాయణమహర్షి ముగించాడు.

శ్రీ దేవీ భాగవతం దశమ స్కంధము


Radhika Aradhana - రాధికారాధన

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - రాధికారాధన

నారాయణమహర్షి! ప్రకృతిశక్తుల ఉపాఖ్యానాలన్నీ చెప్పావు. భుక్తిముక్తిప్రదాలు. విని ఆనందించాను. వేదాలలో నిగూఢంగా ఉన్న రెండు ఉపాఖ్యానాలు మిగిలిపోయాయి. వాటిని కూడా నీ ముఖతః వినాలని ఉంది. రాధాదేవి - దుర్గాదేవి. వీరి మహిమలు ఇప్పటికే చాలా చెప్పావు, చరాచరజగత్తు ఆంతా వారి అంశయే - ఆని తెలుసుకున్నాను. కానీ వారిని పూజించే విధానమేమిటో తెలియజెప్పలేదు. అదొక్కటి చెబితే విని తరిస్తాను.

నారదా! ఈ ఉపాఖ్యానం ఇంతవరకూ ఎవరూ నన్ను అడగలేదు. ఎవరికీ నేను చెప్పలేదు. నువ్వే అడిగావు. నీకే చెబుతున్నాను. ఇది పరమరహస్యం. సారాత్‌ సారం. పరాత్‌ పరం. గోప్యంగా ఉంచాలి. ఎవరికిబడితే వారికి చెప్పెయ్యకూడదుసుమా!

జగత్సృష్టికి మూలస్వరూపిణులు ఇద్దరు. ఒకరు ప్రాణశక్తి. ఒకరు బుద్ధిశక్తి, విరాడాది చరాచర జగత్తు అంతా ఈ రెండుశక్తులకూ అధీనమై ఉంటుంది. వీరి అనుగ్రహం కలగనంతవరకూ ఏ జీవికీ మోక్షం లేదు. అంచేత అందరూ ఈ ఇద్దరినీ సేవించవలసిందే. ముందుగా రాధికామంత్రం విను. 

శ్రీరాధాయై స్వాహా అనేది షడక్షరీ మూలమంత్రం. దీనికి ఆదిలో మాయాది మహాబీజాక్షరాలను వాంఛితాలకు అనుగుణంగా చేర్చుకోవచ్చు. అది చతుర్విధ పురుషార్థాలనూ కోరికలనూ తీర్చడంలో చింతామణి. కోటిముఖాలున్నా శతకోటి నాలుకలున్నా ఈ మంత్రం శక్తిని ఎవ్వరూ వర్ణించలేరు. గోలోకంలో రాసమండలంలో శ్రీ కృష్ణపరమాత్మ మూలమహాదేవి నుంచి ముమ్మోదటగా ఈ మహామంత్రాన్ని ఉపదేశంగా స్వీకరించాడు. ఆయన విష్ణువుకి ఆయన బ్రహ్మకూ ఆయన విరాట్పురుషుడికీ ఆయన ధర్ముడికి చెప్పారు. ధర్ముడు నాకు అనుగ్రహించాడు. ఇప్పటికీ నేను అదేమంత్రాన్ని జపిస్తున్నాను. అందుకే ఋషిని కాగలిగాను. బ్రహ్మాదిదేవతలుకూడా నిత్యమూ ఈ మంత్రాన్నీ ఈ మంత్రాధిదేవతనూ ఆరాధిస్తుంటారు. రాధాదేవిని అర్చించకు౦డా కృష్ణపరమాత్మను అర్చించడానికి ఎవ్వరికీ అధికారం లేదు. రాదు. అంచేత వైష్ణవులు విధిగా రాధార్చన చెయ్యాలి.

రాధాదేవి శ్రీకృష్ణుడికి ప్రాణాధిదేవి. కనక అతడు రాధికాధీనుడు. అతడికి రాధ నిత్యం రాసేశ్వరి, ఆవిడ లేకుండా అతడు ఉండడు. సకలకామాలనూ రాధిస్తుంది (తొలగిస్తుంది) కనక రాధ. 

రాధా మంత్రానికి ఋషిని నేనే. ఛందస్సు గాయత్రి. దేవత - రాధిక. తారమే బీజం. శక్తిబీజం. మూలావృత్తితో షడంగాలు చెయ్యాలి. సామవేదంలో చెప్పబడినట్టు ధ్యానం చెయ్యాలి.

శ్వేతచంపకవర్ణాభాం శరదిందుసమాననామ్‌ ।
కోటిచంద్రప్రతీకాశాం శరదంభోజలోచనామ్‌ ॥

బింబాధరాం పృథుశ్రోణీం కాంచీయుతనితంబినీమ్‌ ।
కుందపంక్తిసమానాభ దంతపంక్తి విరాజితామ్‌ ॥

క్షామాంబరపరీధానాం వహ్నిశుద్దాంశుకాన్వితామ్‌ ।
ఈషద్దాస్యప్రసన్నాస్యాం కరికుంభయుగస్తనీమ్‌


సదా ద్వాదశవర్షియాం రత్నభూషణభూషితామ్‌ ।
శృంగారసింధులహరీం భక్తానుగ్రహకాతరామ్‌ ॥

మల్లికామాలతీమాలా కేశపాశవిరాజితామ్‌ ।
సుకుమారాంగలతికాం రాసమండలమధ్యగామ్‌ ॥

వరాభయకరాం శాంతాం శశ్వత్‌ సుస్థిరయౌవనామ్‌ ।
రత్నసింహాసనాసీనాం గోపీమండలనాయికామ్‌ ॥

కృష్ణప్రాణాధికాం వేదబోధితాం పరమేశ్యరీమ్‌


రాధాదేవి శ్వేతచంపకవర్ణంలో ఉంటుంది. ఆవిడ వదనం శరచ్చంద్ర సమానం. కోటిచంద్రుల కాంతిని వెదజల్లుతూంటుంది. కన్నులు శరత్కాలంలో వికసించిన పద్మాల్లాగా ఉంటాయి. అధరం దొండపండే. శ్రోణీభారం విశాలం. కటిసీమలో బంగారు మొలనూలు. చిరుమువ్వల సవ్వడి. తీర్చిదిద్దినట్టున్న పలువరుస మల్లెమొగ్గలు ఏరి పేర్చినట్టుంటుంది. తెల్లని చీర. ఆగ్నిజ్వాలలాంటి అంచుతో పైటచెంగు. ప్రసన్నవదనం. చిరునవ్వులు చిందిస్తూంటుంది. ఎత్తయిన వక్షఃస్థలం. ఎప్పుడూ పన్నెండేళ్ళవయస్సే. రత్నాభరణాలు. శృంగారసింధువులో ఎగసిపడే కెరటం. భక్తులను అనుగ్రహించడానికి ఎల్లవేళలా ఆరాటపడుతూ ఉంటుంది. మల్లికామాలతీమాలికలు తురిమిన కేశపాశం. పూలతీగలాంటి సుకుమారశరీరం. ఎప్పుడూ రాసమండలాన మధ్యలో ఉంటుంది. వరదహస్తమూ అభయహస్తమూ. శాంతస్వరూప. ఎప్పుడూ తరిగిపోని యౌవనం. రత్ససింహాసనంమీద కూర్చుంటుంది. గోపీమండలానికి నాయిక. కృష్ణుడికి ప్రాణాలకన్నా ఎక్కువ. వేదాలు చెప్పిన పరమేశ్వరి రాధికాదేవియే.

ఇలా ధ్యానించి సాలగ్రామంలోగానీ కలశంలోగానీ అష్టదళయంత్రంలోగానీ దేవిని స్థాపించి పూజించాలి. అటుపైని దేవతలను ఆవాహనచేసి ఆసనాదులను సమర్పించాలి. అన్నీ మూలమంత్రోచ్చారణతోనే చెయ్యాలి. పాదాలకు పాద్యం శిరస్సుపై అర్ఘ్యం ముఖానికి ఆచమనీయం రెండేసిసార్లు మంత్రపూర్వకంగా సమర్పించాలి. మధుపర్కం ఇవ్వాలి. పాడి ఆవును ఇవ్వాలి. అటు పైని స్నానశాలకు తీసుకువెళ్ళాలి. అభ్యంగనస్నానం చేయించాలి. నూతనవస్త్రాలు ఇవ్వాలి. అలంకారపూర్వకంగా చందనచర్చ జరపాలి. తులసీదళాలు పొదిగిన పుష్పమాల అలంకరించాలి. ఆందులో పారిజాతాలూ పద్మాలూ ఉండాలి. ఈ అర్చన ఆయ్యాక పరివార దేవతలను అర్చించాలి. నాలుగు విదిక్కుల నడుమ అంగపూజ చెయ్యాలి. అష్టదళ పద్మంలో దక్షిణావర్తంగా పరివారదేవతలను నిలపాలి. తూర్పు దళంలో మాలావతిని, ఆగ్నేయదళంలో మాధవిని, దక్షిణదళంలో రత్నమాలను, నైఋతికోణంలో సుశీలను, పశ్చిమదళంలో శశికళను, వాయవ్యకోణంలో పారిజాతను, ఉత్తరదళంలో పరావతినీ ఈశాన్యకోణంలో సుందరిని ఆవాహన చెయ్యాలి. వీరికి వెనకతట్టున దిక్పాలకులను నిలపాలి. వారివారి ఆయుధాలనూ ఆవాహన చెయ్యాలి. అప్పుడు ఆవరణసహిత రాధాదేవిని గంధాదులతో దేవోపచార రాజోపచారాలతో అర్చించాలి.

తతో దేవీం సావరణాం గంధాద్యైరుపచారకైః

రాజోపచారసహితైః పూజయేన్మతిమాన్నరః


ఇది అయ్యాక సహస్రనామార్చన చెయ్యాలి. ఇలా చేసిన భక్తుడు సాక్షాత్తూ విష్ణుతుల్యుడు అవుతాడు. గోలోకనివాసం పొందుతాడు. కార్తికపూర్ణిమనాడు రాధాజన్మోత్సవం చేస్తే రాసేశ్వరి సాన్నిధ్యాన్ని అనుగ్రహిస్తుంది. మంత్రాలను వర్ణసంఖ్యా విధానంగా పునశ్చరణ చెయ్యాలి. దశాంశం తిలాహోమం చెయ్యాలి. ఇంక రాధాస్తోత్రమేమిటంటే -

నమస్తే పరమేశాని రాసమండలవాసిని

రాసేశ్వరి నమస్తే
స్తు కృష్ణప్రాణాధిక ప్రియే ॥

నమస్త్రైలోక్యజనని ప్రసీద కరుణార్ణవే ।
బ్రహ్మవిష్ణ్వాదిభిర్దేవైః వంద్యమానపదాంబుజే ॥

నమః సరస్వతీరూపే నమస్సావిత్రి శంకరి ।
గంగాపద్మావతీరూపే షష్ఠిమంగళచండికే


నమస్తే తులసీరూపే నమో లక్ష్మీస్వరూపిణి

నమో దుర్గే భగవతి నమస్తే సర్వరూపిణి ॥

మూలప్రకృతిరూపాం త్వాం భజామః కరుణార్ణవామ్‌

సంసారసాగరాదస్మాత్‌ ఉద్దరాంబ దయాం కురు ॥

ఈ స్తోత్రాన్ని ముప్పొద్దులా పఠించేవారికి దుర్లభమన్నదే లేదు. జన్మాంతంలో గోలోక రాసమండలనివాసం తప్పదు.

దుర్గారాధన


The Story of Surabhi - సురభి చరితం

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - సురభి చరితం

నారాయణమహర్షీ! ఇంతకీ ఈ సురభి ఎవరు? గోలోకంనుంచి వచ్చిందన్నావుగదా! ఆ గోవు చరిత్రను తెలియజెప్పమన్నాడు నారదుడు.

నారదా! సురభి అంటే గోమాత. గోవులకు అధిష్టానదేవత. గోవులకు కన్నతల్లి. సృష్టిలో మొట్టమొదటి గోవు. గోలోకంలో ఆవిర్భవించింది.

సృష్టి తొలినాళ్ళల్లో శ్రీకృష్ణుడు గోలోకంలో రాధికాసహితుడై గోపాంగనా పరివృతుడై బృందావనానికి వెళ్ళాడు. రహఃక్రీడలతో వినోదించసాగాడు. అలసిపోయాడు. పాలుతాగాలి అనిపించింది. అనిపించడమేమిటీ వెంటనే తన శరీరంలో ఎడమభాగం నుంచి లీలావిలాసంగా దూడతోసహా ఒక పాడిఆవును సృష్టించాడు, కొత్త కుండలోకి పాలు పితికాడు. అమృతంకన్నా రుచికరమైన పాలు. జన్మ మృత్యు జరా వ్యాధి నివారకమైన క్షీరం. కడుపునిండా పుచ్చుకున్నాడు. మిగిలిన పాలతో కుండను ఒక చదువైన ప్రదేశంలో విడిచిపెట్టాడు. అక్కడ శతయోజన విస్తీర్ణమైన క్షీరసరోవరం ఏర్పడింది. చుట్టూ రత్నాలు తాపించిన గట్లు, బంగారుమెట్లు. రాధాదేవికీ గోపికా బృందానికీ అది క్రీడా సరోవరమయ్యింది.

ఆ గోవే కామధేనువు. సురభి. దాని రోమకూపాలనుంచి కోట్ల సంఖ్యలో కామధేనువులు ఆవిర్భవించాయి. ఒక్కొక్క గోపకుడికీ ఒక్కొక్క సురభిగా అవతరించాయి. కాలక్రమాన దూడలు పుట్టి పెరిగి అసంఖ్యాకంగా అభివృద్ధి చెందాయి.

శ్రీకృష్ణుడే మొట్టమొదటిసారిగా సురభిని పూజించాడు. అటుపైని ముల్లోకాలలోనూ గోపూజ ఆచారంగా స్థిరపడింది. ధ్యానమూ స్తోత్రమూ మూలమంత్రమూ పూజావిధానమూ - ఇత్యాదులన్మీ వేదోక్తంగా ఉన్నాయి. చెబుతాను గ్రహించు.

ఓం సురభ్యై నమః అనేది షడక్షరమూలమంత్రం. లక్షసార్లు జపిస్తే సిద్ది కలుగుతుంది. బుద్ధి వృద్ధులను కలిగించే ధ్యానశ్లోకాలున్నాయి.

లక్ష్మీస్వరూపాం పరమాం రాధాసహచరీం పరామ్‌ ।
గవామధిష్ఠాతృదేవీం గవామాద్యాం గవాం ప్రసూమ్‌ ॥

పవిత్రరూపాం పూతాం చ భక్తానాం సర్వకామదామ్‌ ।
యయా పూతం సర్యవిశ్వం తాం దేవీం సురభిం భజే ॥

ఘటంలోగానీ ధేనుశిరస్సునగానీ కట్టుగొయ్యనుగానీ(బంధస్తంభం) సాలగ్రామంలోగానీ సురభిని ఆవాహనచేసి పూజించాలి. ప్రాతస్సాయంసంధ్యల్లో ఈ పూజ నిర్వహించాలి.

వరాహావతారకాలంలో విష్ణుమాయవల్ల సురభులు ఒక్కసారిగా అన్నీ వట్టిపోయాయి. పాలచుక్క దొరక్క దేవతలు కటకటలాడారు. నెయ్యిలేక యజ్ఞాలు ఆగిపోయాయి. అందరూ వెళ్ళి బ్రహ్మతో మొరపెట్టుకున్నారు. ఆయన చెప్పిన ఉపాయం ప్రకారం దేవేంద్రుడు సురభిని స్తుతించాడు.

నమో దేవ్యై మహాదేవ్యై సురభ్యై చ నమో నమః

గవాం బీజస్వరూపాయై నమస్తే జగదంబికే ॥

నమో రాధాప్రియాయై చ పద్మాంశాయై నమో నమః ।
నమః కృష్ణప్రియాయై చ గవాం మాత్రే నమో నమః ॥

కల్పవృక్ష స్వరూపాయై సర్వేషాం సతతం పరే ।
క్షీరదాయై ధనదాయై బుద్దిదాయై నమో నమః ॥

శుభాయై చ సుభద్రాయై గోపప్రదాయై నమో వమః

యశోదాయై కీర్తిదాయై ధర్మదాయై నమో నమః ॥

ఈ స్తోత్రానికి సురభి సంతుష్టి చెందింది. ప్రత్యక్షమై ఇంద్రుడికి వాంఛితార్థసిద్ధిగా వరమిచ్చి గోలోకానికి వెళ్ళిపోయింది. దేవతలు తమ లోకానికి వచ్చేశారు. సురభులన్నీ మళ్ళీ పాడి ఆవులై క్షీరధారలు కురిపించాయి. దేవతల యజ్ఞయాగాదులు హాయిగా సాగాయి.

ఈ స్తోత్రాన్ని భక్తితో పఠించిన వారికి గో ధన ధాన్య సమృద్ధి లభిస్తుంది. కీర్తి లభిస్తుంది. పుత్రపౌత్రాభివృద్దిగా వంశం పరిఢవిల్లుతుంది. పరలోకంలో కృష్ణమందిరంలో నివాసమూ కృష్ణసేవాభాగ్యమూ దొరుకుతాయి.

రాధికారాధన


The Manasa Stotram composed by Indra - ఇంద్రుడు చేసిన మానసా స్తోత్రం

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - ఇంద్రుడు చేసిన మానసా స్తోత్రం

మహర్షీ అంటూ మళ్ళీ అందుకున్నాడు నారదుడు. ఇంద్రుడు చేసిన మానసా స్తోత్రం పూజాక్రమం తెలియజెప్పమన్నాడు. నారాయణమహర్షి అలాగే అని చెప్పనారంభించాడు.

ఇంద్రుడు సుస్నాతుడై ధౌతవస్త్రాలు ధరించి శుచిగా నానావిధ పూజాద్రవ్యాలతో వచ్చాడు. వస్తూనే మనసాదేవికి సాష్టాంగ నమస్కారం చేశాడు. రత్నసింహాసనంమీద కూర్చుండబెట్టాడు. రత్నకుంభాలతో తెచ్చిన గంగాజలంతో వేదమంత్రపూర్వకంగా స్నానం చేయించాడు. అగ్నిజ్వాలల్లాంటి వస్త్రాలను సమర్పించాడు. చందనం అందించాడు. అర్ఘ్యపాద్యాలు ఇచ్చాడు. గణేశ దినేశ వహ్ని విష్ణు పార్వతీ పరమేశ్వరులను(దేవషట్కం) ముందుగా అర్చించాడు.

ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవ్యై స్వాహా అనే మూలమంత్రాన్ని జపిస్తూ పారిజాత పుష్పాలతో పాదపూజ చేశాడు. ఇతరులకు ఎవ్వరికీ అందనంతటి విలువైన వస్తువులతో శ్రద్దగా షోడశోపచారాలూ జరిపాడు. నృత్యవాద్యసంగీతాలతో ఆనందపరిచాడు. ఈ పూజను చూడటానికి త్రిమూర్తులూ సతీసమేతులై వచ్చారు. పులకాంకితగాత్రుడై సాశ్రునేత్రుడై మనసాదేవిని స్తుతించాడు.

దేవీ! పతివ్రతా శిరోమణీ! నిన్ను స్తుతించాలి అనుకొంటున్నానుగానీ నాకు శక్తి సరిపోవడం లేదు. స్వభావాన్ని వర్ణించడమే స్తోత్రలక్షణమని వేదం చెబుతోంది. (స్తోత్రాణాం లక్షణం వేదే స్వభావాఖ్యానతత్పరమ్‌) నువ్వు పరాత్పరవు. ప్రకృతి స్వరూపిణివి. నీ గుణగణాలను వర్ణించడం నా తరమా! శుద్దసత్త్వస్వరూపవు. కోపక్రోధవివర్జితవు. శంకర ప్రియశిష్యవు. నాకు సోదరివి. నిన్ను విడిచిపెట్టి వెళ్ళడానికి అశక్తుడై మా బావగారు జరత్కారుడంతటివాడు నీ అనుమతినే యాచించాడు. అదితిలాగా నువ్వు నా తల్లివి, సోదరివిగా దయారూపవు. కన్నతల్లిలాగా క్షమారూపవు. నా ప్రాణాలను కాపాడావు. కుటుంబాన్ని రక్షించావు. బంధుమిత్ర పరివారాన్ని ఆపదలో ఆదుకున్నావు. నువ్వు సురేశ్వరివి. జగదంబికవు. నిన్ను నిత్యమూ పూజించాలి. ఇప్పుడు చేస్తున్న ఈ పూజతో ఆనందించి ఇంకా మాపట్ల దయామయివి అవుతావని ఆకాంక్షిస్తున్నాను.

ఆషాఢంలో సంక్రమణంనాడుగానీ నెలనెలా పంచమీనవముల్లోగానీ మాసాంతంలోగాని (పూర్ణిమ - అమావాస్య) ఇంతెందుకు నిత్యమూ నిన్ను అర్చించినవారికి పుత్రపౌత్రాభివృద్ధిగా ధనధాన్య సమృద్ధి కలుగుతుంది. కీర్తిమంతులూ విద్యావంతులూ గుణవంతులూ అవుతారు. అజ్ఞానంతో నిన్ను నిందించినవారికి సర్పభయం తప్పదు. దరిద్రులవుతారు. నువ్వు స్వయంగా సర్వలక్ష్మివి. వైకుంఠంలో మహాలక్ష్మివి. జరత్కారుడు నారాయణాంశ సంభూతుడు కనక నిన్ను చేపట్టాడు. బ్రహ్మదేవుడు నిన్ను తన తేజస్సునంతా ఉపయోగించి మనస్సుతో సృష్టించాడు. కనకనే మనసాదేవివయ్యావు. పరమపావనమూర్తివి. మమ్మల్ని రక్షించడానికే నువ్వు అవతరించావు. నీ అంతట నువ్వు సిద్దయోగినివి. సత్యస్వరూపవు. సత్యాన్ని ఉపాసిస్తే నిన్ను ఉపాసించినట్టే. నేటినుంచీ దేవతలూ త్రిలోకవాసులూ భక్తితో నిన్ను అర్చిస్తారు. అభీష్టవరాలు పొందుతారు.

దేవేంద్రుడు మనసాదేవిని మనసారా స్తుతించి భగినీపతి జరత్కారువును వెంటదీసుకుని స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. సుతుడు అస్తీకుడితో మనసాదేవి కశ్యవుడి ఆశ్రమంలో సుఖంగా నివసించింది. సోదరుల పూజలు అందుకుంటోంది. అందరూ అర్చనలు చేస్తున్నారు.

గోలోకంనుంచి(కామధేనువు) సురభివచ్చి మనసాదేవికి క్షీరాభిషేకం జరిపింది. ఆత్యంత గోప్యమూ సర్వజన దుర్లభమూ అయిన జ్ఞానాన్ని ఉపదేశించింది. ఇంద్రలోకానికి తిరిగివెళ్ళింది.

ఇంద్రుడు చేసిన మనసాస్తోత్రాన్ని పఠించినవారికి నాగభయం ఉండదు. విషంకూడా అమృతోపమం అవుతుంది. వంశవృద్ధి జరుగుతుంది. అయిదులక్షలసార్లు పఠిస్తే స్తోత్రసిద్ది కలుగుతుంది. అతడు సర్పాలపై సవారీ చెయ్యగలడు. సర్పాలపై విశ్రమించగలడు.

సురభి చరితం


The Story of Astika - ఆస్తీక వృత్తాంతం

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - ఆస్తీక వృత్తాంతం

వెళ్ళిందే కానీ అనుక్షణమూ అక్కడ దుఃఖిస్తూనే ఉంది. పార్వతీదేవి ధైర్యవచనాలు చెబుతూ ఊరడించింది. క్రమంగా నెలలునిండి సుముహూర్తాన పుత్రుణ్ణి ప్రసవించింది. తల్లి గర్భంలో ఉండి శంకరుడి నోటినుంచి వెలువడే జ్ఞానోపదేశాలను రోజూ విన్న ఆ శిశువు కాలక్రమాన యోగీంద్రుడూ జ్ఞానీంద్రుడూ అయ్యాడు. నారాయణాంశ సంభూతుడు.

శంకరుడే స్వయంగా జాతకర్మాదులు చేయించి ఉపనయనం జరిపించి వేదాలు నేర్పించాడు. పార్వతీ పరమేశ్వరులు బ్రాహ్మణులకు సువర్ణరత్నవస్త్రరాశులు పంచిపెట్టారు. వేదశాస్త్రాభ్యాసం అయ్యాక మృత్యుంజయమైన పరతత్త్వాన్నీ బ్రహ్మజ్ఞానాన్నీ ఉపదేశించాడు. కుర్రవాడికి గురువుపట్లా ఇష్టదేవత హరిపట్టా భక్తి అత్యధికంగా ఉండటాన్ని గుర్తించిన వారందరూ ఆస్తీకుడు ఆస్తీకుడు అన్నారు.

శంకరుడి ఆజ్ఞమీదట ఆస్తీకుడు తపస్సుకోసం పుష్కరక్షేత్రానికి వెళ్ళాడు. మూడులక్షల సంవత్సరాలు మహామంత్రాన్ని జపించి తపోధనుడై మహాయోగియై గురువు శంకరుణ్ణి నమస్కరించడానికి తిరిగివచ్చాడు. నమస్కరించి అక్కడే కొంతకాలం ఉండి తల్లితో బయలుదేరి తాతగారు కశ్యపుడి ఆశ్రమానికి చేరుకున్నారు. కశ్యపప్రజాపతి కూతురినీ మనుమడినీ చూసి ఆనందాశ్రువులు రాల్చాడు. బ్రాహ్మణులకు విందులు చేశాడు. నూరులక్షల రత్నాలు పంచిపెట్టాడు. కశ్యపుడి భార్యలు దితి - అదితి సంబరపడ్డారు. ఆశీర్వదించారు. తల్లీకొడుకులిద్దరూ చాలాకాలం అక్కడే నివసించారు.

ఆ కాలంలోనే అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్తు శృంగి అనే బ్రాహ్మణుడి శాపానికి గురి అయ్యాడు. ఇప్పటినుంచి ఏడు రోజుల్లోగా తక్షకుడనే సర్పరాజు నిన్ను కాటువేస్తాడని శృంగి శాపం. పరీక్షిత్తు భయపడిపోయి గాలీవెలుతురూ చొరని భవనంలో దూరి అన్ని రక్షణలూ ఏర్పాటు చేసుకుని రోజులు గడుపుతున్నాడు. ఆరురోజులు గడిచ్మాయి. ఏడవరోజు వచ్చింది.

పాతాళం నుంచి తక్షకుడు బయలుదేరాడు. రాజమందిరం దరిదాపుల్లో ధన్వంతరి కనిపించాడు, ఇద్దరికీ సంవాదం జరిగింది. ఇద్దరూ పరస్పరం సుప్రీతులయ్యారు. తక్షకుడిచ్చిన మణిని తీసుకు ధన్వంతరి వెళ్ళిపోయాడు. తక్షకుడు రాజగృహంలోకి చొరబడ్డాడు. మంచంమీద పడుకున్న పరీక్షిత్తుని కాటువేశాడు. అతడు మరణించాడు. పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు దారుణంగా దుఃఖించాడు. తండ్రికి అంతిమక్రియలు నిర్వహించాడు.

జనమేజయుడు సర్పజాతిమీద పగబట్టాడు. విప్రులతో చర్చించి సర్పయాగం ఆరంభించాడు. సృష్టిలో ఉన్న పాములన్నీ మంత్రశక్తిని తట్టుకోలేక గుంపులు గుంపులుగా హోమకుండంలో వచ్చిపడి మరణిస్తున్నాయి. తక్షకుడు భయాకులుడయ్యాడు. పరుగుపరుగున వెళ్ళి ఇంద్రుణ్ణి శరణువేడాడు. దేవేంద్రుడు అభయమిచ్చాడు. ఇది తెలిసిన జనమేజయుడి విప్రవర్గం ఇంద్రుడితో సహా తక్షకుణ్ణి హోమం చెయ్యడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. దానితో ఇంద్రాదిదేవతలు గడగడలాడారు. బృహస్పతి సలహాపై మనసాదేవిని ఉపాసించారు. ఆ తల్లి అనుగ్రహించి తన కుమారుడు ఆస్తీకుణ్ణి జనమేజయుడి సన్నిధికి పంపించింది.

ఆస్తీకుడంతటివాడు తన యజ్ఞానికి వచ్చాడని జనమేజయుడు సంబరపడ్డాడు. అతిథి మర్యాదలు చేశాడు. ఏమికావాలో కోరుకోమన్నాడు. ఇంద్ర తక్షకుల ప్రాణాలను కాపాడమని ఆస్తీకుడు అడిగాడు. విప్రులతో సంప్రదించి జనమేజయుడు అంగీకరించాడు. సర్పయాగాన్ని ముగించాడు. బ్రాహ్మణులందరికీ భూరిదక్షిణలిచ్చి కృతజ్ఞతలు చెల్లించి సాదరంగా సాగనంపాడు.

విప్రులూ మునిశ్వరులూ దేవతలూ వెళ్ళి మనసాదేవిని దర్శించారు. పూజలు చేశారు. ఎవరిమటుకు వారు స్తుతించారు. ఇంద్రుడు పూజాసంభారంతో వచ్చి శుచిగా భక్తిశ్రద్దలతో అర్చించాడు. షోడశోపచారాలూ చేశాడు. బ్రహ్మాదిదేవతలు ఆనందించారు.

నారదా! ఇదీ మనసాదేవి ఆఖ్యానం. ఏమన్నా సందేహాలున్నాయా? ఇంకా ఏదయినా వినాలనుకుంటున్నావా? అని కాసింత విశ్రాంతి తీసుకున్నాడు నారాయణమహర్షి.

ఇంద్రుడు చేసిన మానసా స్తోత్రం


Vindhyavasini - వింధ్యవాసిని

శ్రీ దేవీ భాగవతం దశమ స్కంధము -  వింధ్యవాసిని శ్రీహరి నాభిపద్మం నుంచి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. ఆయన జగన్నిర్మాత. సృష్టికర్త. లోకపితామహుడు. ...