సాయంసంధ్యవల్ల మహామాయ అనుగ్రహం లభిస్తుంది. ఆచమించి ప్రాణాయామం చేసి పద్మాసనం వేసుకుని కూర్చోవాలి. శ్రౌతస్మార్తకర్మలకు సగర్భప్రాణాయామం, ధ్యానమాత్రానికి అగర్భ ప్రాణాయామం చెప్పబడ్డాయి. భూతశుద్ధి చేసుకోవాలి. సంధ్యాదేవిని ధ్యానించాలి.
ఈమె వృద్ధ సరస్వతి, కృష్ణాంగి, కృష్ణాంబరధారిణి, శంఖ చక్ర గదా పద్మహస్త, గరుడవాహన రత్నవిభూషిత, క్వణన్మంజీరమేఖలాలంకృత, రత్నకిరీటధారిణి, తారహారావళీయుత, తాటంకధారిణి. వాటి కాంతులతో చెక్కిళ్ళు మెరుస్తూ ఉంటాయి. పీతాంబరధరకూడా. సచ్చిదానందరూపిణి, సామవేదస్వరూపిణి, ఆదిత్యపథగామిని, స్వర్లోకనివాసిని.
సూర్యమండలంనుంచి వస్తున్న మహాదేవిని ఆవాహన చేస్తున్నాను. ఇలా ధ్యానించి సంధ్యాసంకల్పం చెప్పుకోవాలి. ఆపోహిష్టా - అగ్నిశ్చేత్యాది మంత్రాలు పఠించాలి. సంప్రోక్షించుకోవాలి. ఆచమించాలి. మిగతాది అంతా ప్రాతస్సంధ్యలాగానే.
గాయత్రీమంత్రాన్ని ఉచ్చరిస్తూ నారాయణ ప్రీతికోసమని సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. రెండుకాళ్లూ సరిగా దగ్గరకు పెట్టుకుని నిలబడి సూర్య భగవానుడిని ధ్యానిస్తూ తదభిముఖంగా జలాంజలి విడిచిపెట్టాలి. ఈ అర్ఘ్యం నీళ్ళల్లో విడవకూడదు. అలా విడిస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అసావాదిత్యేత్యాది మంత్రంతో సూర్యోపస్థానం చెయ్యాలి.
పీటమీద కూర్చుని గాయత్రిని జపించాలి. సహస్రమో దానిలో సగమో. ఉపస్థాన తర్పణలన్నీ ప్రాతస్పంధ్యలాగానే. వసిష్ఠుడు ఋషి. విష్ణురూప సరస్వతి దేవత. ఛందస్సు సరస్వతి. సాయంకాలీన సంధ్యాతర్పణే వినియోగః. సామవేదపురుష హిరణ్యగర్భ సరస్వతీ సంకృతి వృద్ధసంధ్యా ఉషసి నిమృజి - ప్రభృతులకు గాయత్రీమంత్రంతో తర్పణలు ఇవ్వాలి.
ఈ సాయం సంధ్యోపాసన సర్వదుఃఖహరం. వ్యాధినాశకం. మోక్షప్రదం. సదాచారాలలో సంధ్యావందనానికున్నంత ప్రాధాన్యం దేనికీ లేదు. గాయత్రీమాత సంతోషించి భక్తులకు అభీష్టాలు అన్నీ ఇస్తుంది.