Wednesday, July 22, 2026

Remedies for Jupiter-related afflictions - గురుగ్రహ దోష నివారణ

గురుగ్రహ దోష నివారణ

నవగ్రహాల్లో బృహస్పతి గ్రహం ఒకటి. దీన్నే గురుగ్రహం అని కూడా అంటారు. ఇది పురుష గ్రహం, బ్రాహ్మణ కులంగా కూడా చెబుతారు. సత్త్వగుణ ప్రధానమైన ఈ గ్రహం భూమిపై నివసించే జీవులపై, మానవులపై ప్రభావం చూపుతుంది.

ఈ గ్రహ ప్రాబల్యం బాగా ఉన్న వారికి విద్య, బుద్ధి, జ్ఞానం బాగా ఉంటుంది. ఈ గ్రహం బాగుంటే వారు అమితమైన తేజోవంతులుగానూ, ధనవంతులుగానూ ఉంటారని శాస్త్రం చెబుతోంది. 

జాతకంలో గురు గ్రహం (బృహస్పతి) బలహీనంగా ఉన్నప్పుడు లేదా అశుభ స్థానంలో ఉన్నప్పుడు "గురుగ్రహ దోషం" ఏర్పడుతుంది. దీనివల్ల విద్యలో ఆటంకాలు, వివాహంలో జాప్యం, సంతాన లేమి, ఆర్థిక సమస్యలు, మరియు సమాజంలో గౌరవం తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. మరియు కాలేయం, వెన్నుపూస, తొడలు, చెవులు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, మధుమేహం, నత్తి, మతిమరుపు, శరీరానికి నీరు పట్టడం, కఫం వంటి వ్యాధులు గురు గ్రహ ప్రభావంతో కలుగుతాయి.

అలాగే గౌరవహాని, పండితపామరులతో వివాదం, స్థానచలనం, అధికార నష్టం, తీర్థయాత్రలలో ఇబ్బందులు, స్వార్థం, సంతానదోషం, ధననష్టం, పుత్ర విరోధం, దైవ, గురు భక్తి లోపించడం ఇవి సామాన్యంగా గురు గ్రహ బలహీనతవలన కలిగే ఇబ్బందులు, లోపాలని శాస్త్రం చెబుతుంది.

అందుకే గురుగ్రహ దోషాలు, వ్యాధుల పరిహారం కోసం మంచి పుష్యరాగ మణిని గురువారం రోజు శివ పంచాక్షరి మంత్రం, గురుగ్రహ మంత్రంతో కలిపి జపించిన తర్వాత ధరించాలి. స్త్రీలు పాదాలకు ధరించే పసుపు, గడపలకు పసుపు రాయటం, పూజా కార్యక్రమాల్లోనూ, స్నానానికి మనం వినియోగించే పసుపు ఎన్నో వ్యాధుల్ని నివారించగలదు. కాబట్టి పసుపు రంగు వేయబడిన గది గోడల మధ్య నివాసం ఈ లోపాన్ని పూరిస్తుందని శాస్త్రం చెబుతోంది.

జాతకంలో గురువు బలహీనంగా ఉంటే, సంతాన సౌఖ్యత లేక పోవటం, కీర్తి గౌరవ ప్రతిష్టలకు నశించుట, నిత్యం వాహన ప్రమాదాలు దయాదాక్షిణ్యాలు లేక పోవుట, ఇతరులను కష్ట పెట్టే విధంగా నిర్మొహమాటంగా సత్యం చెప్పుట,నీష్ఠూరంగా మాట్లాడటం, షుగర్, క్యాన్సర్, మూత్ర రోగాలు, పెద్ద పొట్టతో కలిగిన దేహం, పరులను నమ్మి సెక్యూరిటీగా ఉండటం, గురువు జాతక చక్రంలో ఏ అవయవం మీద ఆదిపత్యం వహిస్తే ఆ అవయవ పరిమాణాన్ని పెంచి పెద్దది చేస్తాడు.

వ్యాధి వస్తే తొందరగా తగ్గదు. లైఫ్ లో ఎంజాయ్ మెంట్ ఉండదు. జీవితంలో సుఖం, సంతోషం లేక పోవుట, దైవంపై నమ్మకం లేకపోవుట, పెద్దల యందు గౌరవం లేకపోవుట, ఆచారములు పాటించకుండుట, ఉన్నత విద్యకు ఆటంకాలు, నియంతగా ప్రవర్తించుట, ధనమునకు ఇబ్బందులు కలుగుట, ఎన్ని పూజలు, వ్రతాలు చేసినా ఫలితం లేకపోవుట, జీర్ణశక్తి లేకపోవుట, లివర్‌కు సంబంధించిన వ్యాధులు కలుగుచున్నప్పుడు గురుగ్రహ దోషంగా గుర్తించి గురు గ్రహ అనుగ్రహం కొరకు గురుచరిత్ర పరాయణ చేయడం, గురువులను గౌరవించుట, దైవ క్షేత్రములు సందర్శించుట, శనగలు దానం చేయుట, పంచముఖ రుద్రాక్షను లేదా కనక పుష్యరాగమును ధరించవచ్చును.

గురు గ్రహ దోషనివారణకు పసుపు రంగు రాయి నీటిలో వేసుకొని ఆ నీటిని త్రాగిన దోష నివారణ కలుగును. పసుపు కొమ్ము గణపతిని, పసుపు రంగు(హరిద్రా)గణపతిని పూజిస్తే చాలా మంచిది. పూర్వ కాలం నందు గురుగ్రహ దోష నివారణకు ఇంద్రుడిని పూజించేవారు, ప్రస్తుతం దక్షిణామూర్తి, దత్తత్రేయ, హయగ్రీవుడిని పూజిస్తున్నారు.

ప్రతి గురువారం ఉదయం 6 గంటల నుంచి ఉదయం 7 గంటల సమయంలో దగ్గరలో ఉన్న దత్తాత్రేయ దేవాలయానికి వెళ్ళి 160 ప్రదక్షిణలు చేయాలి. 16 గురువారాలు నవగ్రహములకు 160 ప్రదక్షిణలు చేసి, పసుపు వస్త్రంలో ఐదు పావుల శనగలు పోసి, మూత కట్టి, దాన్ని దానం చేయాలి.

అలాగే గురువారం రోజున ఉడికించిన శనగలు పేదలకు పంచిపెట్టాలి. కుడి చేతి చూపుడు వేలుకి కనకపుష్యరాగం ఉన్న బంగారు ఉంగరాన్ని ధరించాలి. బ్రాహ్మణుడితో గురు గ్రహ జపం చేయించి శనగలు దానం చేయాలి. గురువారం నాడు గురుగ్రహం వద్ద 16 పసుపు రంగు వత్తులతో దీపారాధన చేసి పసుపు వస్త్రాన్ని దానం చేయాలి.

16 గురువారాలు ఉపవాసము ఉండి చివరి గురువారం దక్షిణామూర్తి పూజ, గురు అష్టోత్తర పూజ చేయాలి. ప్రతిరోజూ 160 మార్లు చొప్పున 160 రోజుల పాటు గురు ధ్యాన శ్లోకాన్ని పారాయణం చేయండి.16 గురువారముల పాటు గురు గాయత్రి మంత్రాన్ని 160 సార్లు పారాయణ చేయాలి. ప్రతి రోజూ దత్త శ్లోకాన్ని పారాయణ చేస్తూ, 40 రోజుల్లో 16.000 సార్లు గురు మంత్రాన్ని జపించండి. తీరిక లేనివారు కనీసం గురుశ్లోకములు 16 సార్లు లేదా గురు మంత్రాన్ని 160 సార్లు కాని పారాయణ చేయాలి. గురు పౌర్ణమి పర్వదినమున 18 సార్లు స్తవం పారాయణ చేయాలి.

జాతకంలో గురుగ్రహ దోషం ఉన్నవారు ప్రతిరోజు హయగ్రీవ స్తోత్రం చదివితే గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది.

భక్తి బావనలు, ఉన్నత విద్య, విదేశి విద్య కలగాలంటే గురుగ్రహ అనుగ్రహం ఉండాలి.

గురుగ్రహానికి అధిదేవత హయగ్రీవుడు. సకల విద్యాధి దేవతయైన శ్రీమన్నారాయణుడు ‘హయగ్రీవుని’గా అవతరించాడు.

సరస్వతీదేవి, వేదవ్యాసుడు హయగ్రీవుని నుండి విద్యాశక్తిని సముపార్జించారని ‘హయగ్రీవ స్తోత్రం’లో దేశికాచార్యులు పేర్కొన్నారు.

హయగ్రీవోపాసన వాక్ శక్తిని, విద్యాశక్తిని, జ్ఞానశక్తిని సిద్ధింపచేస్తుంది.

జ్ఞానానంద మయం దేవం, నిర్మలాస్ఫటికాకృతమ్ 

ఆధారం సర్వ విద్యానాం, హయగ్రీవ ముపాస్మహే


జ్ఞానం, ఆనందం, మూర్తీభవించిన దైవస్వరూపం హయగ్రీవుడు. నిర్మలమైన స్ఫటికాకృతి కలిగి సర్వవిద్యలకు ఆధారభూతమైన విద్యాధిదేవత హయగ్రీవునకు నమస్కారము.

హయగ్రీవుని పూజించడం వల్ల విద్య, ఐశ్వర్యం, అధికారం, ఆయువు మొదలైనవన్నీ లభిస్తాయి.

విద్యార్థులు హయగ్రీవుని పూజించడం వల్ల చదువు బాగా వస్తుంది. పిల్లలున్న ఇంట హయగ్రీవ పూజ పిల్లలకు విద్యాటంకాలు తొలగించి, ఉన్నత విద్యను అందిస్తుంది.


గురుగ్రహ దోష శాంతి కోసం చేయవలసిన మరియొక పరిహారం

మేష, సింహ, ధనుర్ మాసాల్లో.. ఆది, సోమ, మంగళ, గురువారాల్లో, పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాలు కలిసి వచ్చిన రోజు వైష్ణవాలయం పూజారిని రాత్రి 1.30 గంటలకు స్వగృహానికి పిలిపించాలి.

గృహ మధ్య హాలులో 9 మూరల పసుపు వస్త్రం పరిచి 9 దోసిళ్ళు శెనగలు పోసి, ఆ రాశిపై బంగారు లేక ఇత్తడి చెంబును కలశంగా స్థాపించి, కలశంపై అష్ట దిక్కులకు 8 తమలపాకులను పెట్టి, వాటిపై టెంకాయను పెట్టి, విష్ణు స్వరూపమగు పసుపు కుంకుమ రేఖలు నిలువుగా పెట్టి ఆ కలశం ఈశాన్య దిశాముఖంగా పెట్టాలి.

కలశం ఎదుట ఎవ్వరూ కూర్చోకూడదు. వాయువ్య ముఖంగా వైష్ణవాలయ పూజారిని, ఆగ్నేయముఖంగా గృహస్థుడు అతని భార్య కూర్చొనాలి. తర్వాత మమ శనివర్గ జాతస్య.. లగ్నజాతకానుసారేన.. స్థాన స్థితి గురుగ్రహ పరిహారార్థం శతృరుణరోగపీడ పరిహారార్థం అని సంకల్పించాలి.

ఆ కలశమునకు పురుష సూక్త, నారాయణ సూక్తులతో ఆవాహన చేసి గురుగ్రహ సహిత శ్రీకృష్ణపర బ్రహ్మణే నమః పంచామృత అభిషేకం కరిష్యే అని చెప్పి కలశము ముందు భాగాన ఇత్తడి తట్టలో గురు గ్రహ పంచలోహ విగ్రహము, శ్రీకృష్ణుని బంగారు లేక పంచలోహ విగ్రహము పెట్టి పంచామృతములతో అభిషేకించి, కృష్ణ సహస్ర నామ, అష్టోత్తరములతో గురు అష్టోత్తరముతో పూజలు చేయాలి.

ఇలా రాత్రి మూడు గంటల వరకు పసుపు పువ్వులతో గంధాక్షత్రలతో పూజించి ఉద్వాసన పలకాలి. కలశ సహితంగా శెనగలు పసుపు, పువ్వులు, పసుపు రంగు వస్త్రం, రూ. 9 దక్షిణ ఇచ్చే మొత్తం సంఖ్య 9 వచ్చేలా చూసుకోవాలి.

ఇలా భార్యాభర్తలచే పూజపూర్తయ్యాక .. ఆ దంపతులు పూజారికి అన్నింటిని దానంగా ఇచ్చి సాష్టాంగ దండప్రణామములు ఆచరించి ఆశీర్వాదం పొందాలి. తర్వాత రాత్రి మూడు గంటల ప్రాంతాన అయ్యవారిని స్వగృహము నుంచి సాగనంపాలి. గురు గ్రహ పీడా పరిహారార్థం చేసినది కావున తీర్థప్రసాదములు తీసుకోరాదు. తర్వాత స్నానము చేయాలి.

గమనిక : ఈ పూజా కార్యక్రమము, అయ్యవారికి ఇచ్చే దానం కార్యక్రమాలు రాత్రి 3 గంటలలోపుగా ముగించాలి.

Equivalent to the sin of killing a Brahmin - bramahatyasamanaalu - బ్రహ్మహత్యాసమానాలు

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - బ్రహ్మహత్యాసమానాలు

మానినీమణీ! ఇక్కడ మరొక విశేషం నువ్వు తెలుసుకోవాలి. బ్రహ్మహత్య అంటే బ్రాహ్మణుడిని చంపడం అనేకాదు ఇంకా చాలా రకాలున్నాయి. శ్రీకృష్ణాది దేవతలపట్ల భేదబుద్ధిని పాటించి ఆదరానాదరాలు చూపిస్తే అది బ్రహ్మహత్యా సదృశం. అలాగే ఇష్టదైవమూ గురువూ తల్లిదండ్రులు - వీరిపట్ల హెచ్చుతగ్గులు పాటించినా దైవభక్తులపట్ల భేదబుద్ధిని చూపించినా విప్రపాదోదక సాలగ్రామ శిలోదకాలమధ్య భేదం పాటించినా హరిహర నైవేద్యాల మధ్య తారతమ్యం పరిగణించినా హరిహరులమధ్య భేదబుద్ది పాటించినా శక్తిభక్తులనూ శక్తి శాస్త్రాలనూ ద్వేషించినా పితృదేవతార్చనను పరిత్యజించినా హరినీ హరిభక్తులని నిందించినా అర్చించకపోయినా సర్వశక్తిస్వరూప మహాదేవిని నిందించినా కృష్ణాష్టమి శ్రీరామనవమి శివరాత్రి ఏకాదశి (ముక్కోటి) రవివారవ్రతం - ఈ అయిదు పర్వదినాలనూ జరపకపోయినా అంబువాచీ భూఖననం చేసినా (ప్రతినెలా ఆర్ద్రానక్షత్రంలో ప్రథమపాదంనుంచి మూడురోజులపాటు భూదేవి రజస్వలగా ఉంటుంది. అంబువాచి అంటారు. ఆ సమయంలో భూమిని దున్నకూడదని ధర్మశాస్త్రం.) గురు మాతాపితృభార్యాపుత్రుల్ని పోషించకపోయినా అవివాహితుడుగా సంతానం పొందినా బ్రహ్మహత్య చేసినట్టే. ఇదే ఆతిదేశిక బ్రహ్మహత్య.

గోవును కొట్టినా కొడుతున్నవారిని అడ్డుకోకపోయినా రక్షించకపోయినా గోబ్రాహ్మణులకు మధ్యనుంచి నడిచినా గోవులకు ఉచ్చిష్టం పెట్టినా వృషవాహకుడి ఆహారం కాజేసినా అగ్నినీ గోవునూ కాలితో తన్నినా కాళ్ళుకడుక్కోకుండా ఇంటిలోకి వచ్చినా తడికాళ్ళతో భోజనం చేసినా నిద్రించినా సూర్యోదయకాలంలో భుజించినా అవీరాన్న వేశ్యాన్నాలను తిన్నా యోనిజీవ్యుడైనా (తార్పుడుగాడు) సంధ్యావందనం ఎగ్గొట్టినా భర్తకూ దేవుడికీ మధ్య ఇల్లాలు భేదం పాటించినా మగడు ఇల్లాలిని కొట్టినా దేవతాప్రసాదాలను పంచిపెట్టకపోయినా అన్నింటికీ నాస్తినాస్తి అన్నా దేవగురు మిత్రద్రోహాలు చేసినా దేవ - గురు - పితృవందనం చేయకపోయినా, నమస్కరించినవాడికి ఆశీస్పూ విద్యార్థికి చదువూ అందించకపోయినా అన్నపుష్పాది పవిత్ర వస్తువులను దాటినా గోహత్య చేసినట్టే. దీన్నే ఆతిదేశిక గోహత్య అంటారు.

పురుషుడికి పరిణయమాడిన స్త్రీమాత్రమే గమ్య. తక్కిన వనితలందరూ అగమ్యులు. అంటే పొందుకోరరానివారు. అగమ్యాగమనం నూరు బ్రహ్మహత్యలతో సమానం. కుంభీపాక నరకమే శిక్ష అపరిశుద్ధుడుగా సంధ్యవార్చినా ఆసలు సంధ్యావందనమే చెయ్యకపోయినా అతడు సంధ్యాహీనుడు అవుతాడు. నరకానికి పోతాడు. వైష్ణవ శైవ శాక్త సౌర గాణప మహామంత్రాలలో ఎదో ఒకటి ఉపదేశంగా పొంది ఉపాసించాలి. అహంకరించి ఏ మంత్రోపదేశమూ పొందనివాడు అదీక్షితుడు. ఇతడికీ నరకం తప్పదు. పుణ్యక్షేత్రాలలో తీర్థాలలో అడిగి దానాలు పట్టేవాడు తీర్థవ్రతిగ్రాహి. దేవుడి పేరు చెప్పి పొట్టపోసుకునేవాడు దేవలుడు. సంధ్యాపూజాహీనుడిని ప్రమత్తుడు పతితుడు అంటారు. వీరూ వీరితోపాటు గ్రామయాజీ సూపకారుడూ (విప్రుడై ఇతరుల ఇంట భుజించేవాడు) కుంభీపాక నరకంలో పడతాడు ఇంకా ఎవరెవరు ఎయే కుండాలలో వెళ్ళిపడతారో చెబుతాను - సాధ్వీ! ఆలకించు.

సావిత్రీ! దేవతలను సేవించనిదే కర్మవినాశం కానేకాదు. సత్కర్మలు స్వర్గసుఖాలకూ జీవశుద్దికీ దుష్కర్మలు నరకయాతనలకూ దేహశుద్ధికీ హేతువులు.

వేశ్యాధనం అనుభవించేవాడూ వేశ్యాగమనం చేసిన బ్రాహ్మణుడూ కాలసూత్ర నరకకూపంలో శతవర్షాలు కష్టాలు అనుభవించి పై జన్మలో రోగపీడితుడై అటుపైని శుచి అవుతాడు. ప్రస్తావన వచ్చింది కనక స్త్రీలలో భేదాలు చెబుతాను. విను, ఒకడిని అగ్నిసాక్షిగా పరిణయమాడి త్రికరణశుద్ధిగా అతడితో జీవించేది పతివ్రత. రెండవ వాడితో సంపర్కం పెట్టుకుంటే కులట. ముగ్గురితోనైతే ధర్షిణి. నలుగురితో పుంశ్చలి. అయిదుగురితో వేశ్య. ఆర్గురితో పుంగి. ఎడుగురూ ఎనమండుగురూ ఇంకా ఆపైని పురుషులతో సంపర్కం చేస్తే మహావేశ్య. సర్వజాతుల్లోనూ ఇది అస్పృశ్య.

కులట నుంచి మహావేశ్యవరకూ ఎవరిని పొందినా ద్విజుడు కాలసూత్ర నరకానికి పోవడం తథ్యం. అటుపైని చేప కడుపున పుడతాడు. కులటాగామి ఒక శతాబ్దమూ ధర్షిణీ గామి నాలుగు శతాబ్దాలూ పుంశ్చలీగామి ఆరుశతాబ్దాలూ వేశ్యాగామి ఎనిమిది శతాబ్దాలూ పుంగీగామి పది శతాబ్దాలూ ఆ నరకంలో ఉంటాడు. మహావేశ్యాగామి నూరుశతాబ్దాలు నరకయాతన అనుభవిస్తాడు. అలాగే వీరు వరసగా - తిత్తిరి - వాయస - కోకిల - వృక - సూకర - శాల్మలీతరు జన్మలు ఏడేసి ఎత్తుతారు. 

సూర్యచంద్రగ్రహణాల రోజున జ్ఞానహీనుడై భోజనం చేసినవాడు అరుంతుదనరకంలో మెతుక్కి ఏడాదిగా దుఃఖాలు అనుభవిస్తాడు. అటు పైని ఉదరరోగపీడితుడుగా జన్మిస్తాడు. తనువంతా గుల్మాలతో (పుండ్లు) గుడ్డివాడుగా దంతహీనుడుగా దురపిల్లుతాడు. కడకు కర్మఫలం పూర్తయ్యి శుచి అవుతాడు.

నిశ్చయతాంబూలాలు పుచ్చుకుని మరొకడికి కన్యాదానం చేసినవాడు పాంశుకుండనరకానికి పోతాడు. పాంశువులే తింటూ నూరేళ్ళు తల్లడిల్లుతాడు. వీడిని యమదూతలు శరతల్పంమీద పొర్లిస్తారు. పార్థివలింగం చేసి భక్తితో అర్చించని విప్రుడు శివుడి కోపానికి గురి అవుతాడు. శూలప్రోతనరకంలో శతాబ్దంపాటు క్లేశాలు కుడిచి శ్వాపదంగా ఏడు జన్మలెత్తుతాడు. అటుపైని దేవలుడుగా ఎడుజన్మలు ఎత్తి కర్మఫలానుభవం పూర్తిచేసుకుంటాడు. విప్రుణ్ణి భయపెట్టినవాడూ అతడి దేవతార్చనాది సత్కర్మలకు అడ్డుతగిలినవాడూ ప్రకంపననరకంలో విప్రరోమాబ్ద పర్యంతం విలపిస్తాడు. అధికారివైపు ధిక్కారంగా కోపంగా చూసినవాడూ కటువుగా ఎదిరించి పలికినవాడూ సోల్ముకనరకంలో పడతాడు. అక్కడ నా కింకరులు రోజూ అతడి నోటిలో ఉల్కలను పడవేస్తుంటారు. వాడి శరీరంమీద వెండ్రుకలన్ని సంవత్సరాలపాటు రోజూ దండతాడనలు రుచిచూస్తూ యాతనలు పడతాడు. అటుపైని ఏడు జన్మలు ఆడదిగా పుట్టి వితంతువు అవుతాడు. అప్పటికి గానీ కర్మఫలానుభవం పూర్తికాదు.

ఇతరుడితో సంపర్కం పెట్టుకున్న బ్రాహ్మణి అంధకూపనరకానికి పోతుంది. పధ్నాలుగుమంది ఇంద్రులు మారేదాకా యమకింకరుల బాధలు అనుభవిస్తుంది. ఆటుపైని కాకిగా వెయ్యి జన్మలు ఎత్తుతుంది. పందిగా నూరుజన్మలు సృగాలిగా కుక్కుటిగా పారావతిగా వానరిగా నూరేసీ ఎడేసీ జన్మలు ఎత్తి కడపటికి మళ్ళీ మానవిగా రజక గృహంలో పుట్టి క్షయరోగ పీడితురాలై పుంశ్చలిగా మారి కుష్ఠవ్యాధికిలోనై మరణిస్తుంది. అప్పటికి దుష్కర్మఫలం పూర్తి అవుతుంది. వేశ్యలకు వేధననరకం పుంగికి దండతాడననరకం ధర్షిణీకి జలరంధ్రనరకం కులటకు దేహచూర్ణికానరకం స్వైరిణికి (మహావేశ్య) దళనకూపం ధృష్టకు (పతివంచక) శోషణనరకం తప్పవు. శతాబ్దాలపాటు ఈ నరకకుండాల్లో వారు యమయాతనలు పడతారు. మన్వంతరకాలం విణ్మూత్రభక్షణ చేస్తారు. ఆపైని విట్‌కృమిగా (మలక్రిమి) లక్షసంవత్సరాలు జన్మలెత్తితేగానీ కర్మవిశుద్ధి లభించదు. సవర్ణపారదారికులు (ఏకులంవాడు ఆ కులం పరకాంతతో) కషాయనరకకుండంలో పార్లుతారు. కషాయ తప్తోదకం తాగుతూ నూరేళ్ళు యాతనపడతారు. అనులోమ విలోమ పారదారికులు (అగ్రవర్ణ నిమ్నవర్ణ పరకాంతా సంగమం) స్త్రీపురుషులిద్దరూ శూర్పకూపంలో శూ
ర్పకారకృమి దష్టులవుతారు. యమదూతలు కాగిన మూత్రం తాగిస్తారు. దండతాడనలు సరేసరి. అటు పైని వరాహంగా ఛాగలంగా ఏడేసి జన్మలు ఎత్తి కర్మ విశుద్ది పాందాలి.

తులసీదళాన్ని చేతితో పట్టుకుని ప్రతిజ్ఞచేసి మాట తప్పినవాడు జ్వాలాముఖ నరకకూపంలోనూ గంగాజలం గోవు విప్రుడు సాక్షిగా ఆడితప్పినవాడూ దేవప్రతిమ ఎదుట శపథంచేసి జారిపోయినవాడూ కుడిచేతిలో కుడిచెయ్యివేసి ఆడితప్పినవాడూ దేవాలయంలో మాటతప్పినవాడూ - వీళ్ళంతా అదే నరకకూపంలో మటమటలాడతారు. మిత్రద్రోహి కృతఘ్నుడు విశ్వాసఘాతకుడూ కూటసాక్ష్యం చెప్పేవాడూ వీళ్ళందరికీ జ్వాలాముఖ నరకకూపమే గతి. చతుర్దశేంద్రకాల పర్యంతం శిక్ష అనుభవించి మ్లెచ్చ విట్‌కృమి బ్రహ్మకృమి సర్ప దేవల వ్యాఘ్ర నకుల గండక మండూక జన్మలు ఒక్కక్కరూ ఏడేసిఎత్తి ఎప్పటికో పరిశుద్ధులవుతారు.

నిత్యనైమిత్తిక క్రియలకు ఎగనామం పెట్టి వేదవాక్యాలను పరిహసించి వ్రతోపవాసాలను పరిహరించి పెద్దలమాటలను పెడచెవినిబెట్టి చెడు తిరుగుళ్ళు మరిగిన విప్రుడు ధూమ్రాంధకూపంలో శతాబ్దంపాటు యాతనపడి అటూ ఇటూ ఏడుతరాలుచెడి జలజంతువుగా నూరు జన్మలెత్తి కడపటికి శుచి కాగలుగుతాడు. దేవబ్రాహ్మణ పరిహాసకుడుకూడా ఇలాగే అదే నరకయాతన అనుభవిస్తాడు. వీడివంశంలో అటు పదితరాలకూ ఇటు పదితరాలకూ వీడిపాపం అంటుకుంటుంది. అటుపైని మూషకజాతిలో ఏడు జన్మలు ఎత్తుతాడు. పక్షిగా క్రిమిగా చెట్టుగా పశువుగా అనేక జన్మలెత్తి మనిషి అవుతాడు.

బ్రాహ్మణుడు దైవజ్ఞజీవి వైద్యజీవి చికిత్సకుడు లాక్షాలోహాది వ్యాపారి రసాదివిక్రయి అయినట్టయితే నాగవేష్టనరకంలో పడి సర్పవేష్టితుడవుతాడు. అటుపైని నానావిధ పక్షిజాతుల్లో పుట్టి కడపటికి నరజన్మ పాందుతాడు. అప్పుడు గణకుడుగా వైద్యుడుగా గోపాలుడుగా కర్మకారుడుగా రంగకారుడుగా ఏడేసి జన్మలూ ఎత్తి శుచి అవుతాడు.

సాధ్వీ! ప్రసిద్ధ నరకకుండాలగురించీ వాటిలో పడేవారి గురించీ యాతనల గురించీ పునర్జన్మల గురించి వివరంగా చెప్పాను. ఇవి కాక ఇంకా అప్రసిద్ద నరకకూపాలు అనేకం ఉన్నాయి. అవి చిన్నచిన్నవి. వాటిలో పడే పాతకులూ ఉన్నారు. దుష్కర్మఫలాలు అనుభవించి అనేకజన్మలు దురవస్థలనుభవించి పరిశుద్ధులవుతారు. నేను ప్రత్యక్షంగా ఎరుగుదును కనక వాటికి అధిపతిని కనక స్పష్టంగా తెలియపరిచాను. ఇంకా ఏమి తెలుసుకోవాలనుకుంటున్నావ్‌ - అని ముగించాడు యమధర్మరాజు.

నరకనివారణ


Dushmarmafala Niruupana - దుష్మర్మఫల నిరూపణ

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - దుష్మర్మఫల నిరూపణ

సావిత్రీ ! శుభకర్మలు చేసుకున్నవారు రకరకాల స్వర్గాలకు వెళ్ళి పుణ్యఫలాలను అనుభవిస్తారు.

అవి చెల్లిపోగానే భూలోకంలో సజ్జనులై జన్మిస్తారు. వీరు ఏనాడూ నరకానికి పోరు. అలాగే దుష్కర్మలు చేసినవారు నానావిధ నరకాలకి పోతారు. ఆ నరకాలలో రకరకాల కుండాలు ఉంటాయి. లోతైన కూపాలు. ఏ దుష్కర్మకు ఏ కూపమో, దాన్ని వైశాల్యమూ లోతూ ఎంతో, ఆందులో ఎంతకాలం క్లేశాలు అనుభవించాలో అంతా శాస్త్రప్రమాణంగా నిర్ధారణ అయ్యిఉంది. అవ్వి అతిభయంకర కుండాలు, అమ్మా! ఆ గుంటలు పరమకుత్సితంగా ఉంటాయి. చూడక్కర్లేదు వింటేనే చాలు వొళ్ళు జలదరిస్తుంది.

పెద్దవి ఎనభయ్యారుకి పైగా ఉన్నాయి. చిన్నవి ఇంకా చాలా ఉన్నాయి. వాటిలో ప్రసిద్దమైన పేర్లు కొన్ని చెబుతాను. ఆలకించు. వహ్నికుండం తప్తకుండం క్షారకుండం విట్కుండం (మలం) మూత్రకుండం శ్లేష్మకుండం గరకుండం దూషికుండం (పుసి) వసాకుండం శుక్రకుండం (10) అసృక్కుండం అశ్రుకుండం గాత్రమలకుండం కర్ణమలకుండం మజ్జాకుండం మాంసకుండం నఖకుండం రోమకుండం కేశకుండం అస్థికుండం (20) తామ్రకుండం లోహకుండం చర్మకుండం తప్తసురాకుండం కంటకకుండం విషకుండం తప్తతైలకుండం కుంతకుండం కృమికుండి (పురుగులు) పూయకుండం (30) సర్పకుండం మశక కుండం దంశకుండం గరళకుండం వజ్రదంష్టాకుండం వృశ్చికకుండం శరకుండం శూలకుండం పరశుకుండం ఖడ్గకుండం (40) గోళకుండం నక్రకుండం కాకకుండం మంథానకుండం బీజకుండం వజ్రకుండం తప్తపాషాణకుండం తీక్ష్ణపాషాణకుండం లాలాకుండం మసీకుండం (50) చూర్ణకుండం
చక్రకుండం వక్రకుండం కూర్మకుండం జ్వాలాకుండం భస్మకుండం దగ్ధకుండం ఇంకా ఇలాగే
తప్తసూచీ - అసిపత్ర - క్షురధారా (60) - సూచీముఖ - గోకాముఖ - నక్రముఖ - గజదంశ - గోముఖ -
కుంభీపాక - కాలసూత్ర - మత్స్యోద - కృమికందుక - పాంసుభోజ్య (70) - పాశవేష్ట - శూలప్రోత -
ప్రకంపన - ఉల్కాముఖ - అంధకూప - వేధన - తాడన - జాలరంధ్ర - దేహచూర్ణ - దేహదళన (80) -
దేహశోషణ - దేహకషణ - శూర్ప - జ్వాలాముఖ - ధూమాంధ - నాగవేష్టనకుండాలున్నాయి. (86)

ఇవ్వే కాదు పాపాత్ముల్ని హింసించడానికి చిన్నవీ పెద్దవీ ఇంకా చాలా కుండాలున్నాయి. కింకరులు జాగరూకులై వీటిని నిరంతరం రక్షిస్తుంటారు. వీరినే యమభటులు అంటారు. వీళ్ళందరూ దండహస్తులు. పాశహస్తులు. మదమత్తులు. అత్యంత భయంకరులు. శక్తిహస్తులు. గదాహస్తులు. అసిహస్తులు. అతిదారుణులు. తమోయుక్తులు. దయాహీనులు. అనివార్యులు. తేజస్వంతులు. శంకారహితులు. రక్తపింగళవేత్రులు. మృత్యువు ఆసన్నమైన పాపాత్ములకుమాత్రమే కనిపిస్తారు. పుణ్యాత్ములకూ యోగీశ్వరులకూ స్వధర్మనిరతులకూ వీరి దర్శనభాగ్యం లభించదు. ఇప్పటికి యమకుండాలగురించి చెప్పడమయ్యింది. ఇక ఏ పాపాత్ముడు ఏ కుండంలో పడతాడో చెబుతాను భయపడకుండా విను.

సాధ్వీలలామా ! హరిసేవారతుడూ అంతశ్శుద్దీ బహిశ్శుద్దీ ఉన్నవాడూ యోగసిద్ధుడూ
వ్రతాచరణతత్పరుడూ తపశ్శీలి బ్రహ్మచారీ - వీరు నరకం దరిదాపులకుకూడా వెళ్ళరు. ఇక మిగతావారి సంగతి చెబుతాను. బలగర్వంతో బంధువుల్ని కటువాక్కులతో హించించేవాడు ఆగ్నికుండంలో పడతాడు. తన శరీరంమీద ఎన్ని వెండ్రుకలున్నాయో అన్నేళ్ళు అందులో మాడతాడు. అటుపైని మూడు పశుజన్మలు ఎత్తుతాడు. ఆకలి దప్పులతో గుమ్మమెక్కిన బ్రాహ్మణుడికి భోజనం పెట్టకుండా పంపించిన మూఢుడు తప్తతుండకుండంలో పడతాడు. రోమప్రమాణాబ్దాలపాటు అందులో నరకయాతన అనుభవిస్తాడు. అటుపైని ఏడు జన్మలవరకూ వాడిది పక్షిబతుకే. రవివారంనాడుగానీ సంక్రాంతిరోజునగానీ అమావాస్యనాడుగానీ శ్రాద్ధసమయంలోగానీ వస్త్రాలకు క్షారసంయోగం చేస్తే (మురికి వదల్చడానికి సబ్బుసోడాలు పెట్టడం) క్షారకుండంలో పడి దారాలన్ని సంవత్సరాలపాటు దుఃఖాలు అనుభవించి మరుసటి ఏడు జన్మల్లోనూ రజకుడవుతాడు. వేద శాస్త్ర పురాణనింద చేసినా త్రిమూర్తుల్ని నిందించినా గౌరీవాణీలక్ష్ములను తూలనాడినా దేవీదూషణ చేసినా ఆ పాపాత్ముడు నిరయానికి వెళ్ళి ఎనభయ్యారింటిలోనూ అత్యంత భయానకమైన కుండంలో పడతాడు. అంతకన్నా దుఃఖప్రదమైన కుండం ఏ నరకంలోనూ ఉండదు. అనేక కల్పాలదాకా అందులో మగ్గి మగ్గి అటుపైని సర్పజాతిలో పుడతాడు. దేవతాదూషణలకు ఏవేవో ప్రాయశ్చిత్తాలున్నాయిగానీ దేవీనిందకు మాత్రం ఏ ప్రాయశ్చిత్తమూ లేదు. దేవీనిందాపరాధస్య ప్రాయశ్చిత్తం న విద్యతే.

స్వదత్తంగానీ పరదత్తంగానీ విప్రుడి సొత్తును ఆపహరించినవాడు అరవైవేల సంవత్సరాలు విట్కుండంలో పడి ఉంటాడు. అన్ని ఏళ్ళూ విడ్భోజనమే చేస్తాడు. అటుపైని విట్‌కృమిగా జన్మిస్తాడు. ఇతరుల చెరువులో తాను చెరువు తవ్విస్తే మూత్రకుండనివాసం ఫలం. రేణువులన్ని సంవత్సరాలు అదే తాగుతూ అదే తింటూ పడిఉంటాడు. పునర్జన్మలో నిండా నూరేళ్ళు వృషభమై భారతభూమిలో ఎవరికో ఒకరికి చాకిరీ చేస్తాడు. ఎవరికీ పెట్టకుండా మృష్టాన్నాన్ని ఒక్కడే తిన్నవాడు శ్లేష్మకూపంలో పడి కొట్టుకుంటాడు. నూరేళ్ళు అదే తింటూ అందులోనే పడి చస్తాడు. అటుపైని శ్లేష్మమలమూత్రాలు తినే కాకిగా జన్మించి నూరేళ్ళు బదికి పాపం వదిలించుకుని శుచి అవుతాడు.

తల్లిని తండ్రిని గురువును భార్యను సంతానాన్నీ పోషించకుండా అనాధలుగా వదిలేసినవాడు గరకుండంలో నూరేళ్ళు అదేతింటూ దుఃఖిస్తాడు. అటుపైన భూతజన్మఎత్తి మరో నూరేళ్ళు గడిపి పాప విశుద్ధుడవుతాడు. ఇంటికి వస్తున్న అతిథిని చూసి ఏవగించుకుంటూ కన్నులు చిట్లించుకున్నవాడు విడిచి పెట్టె తర్పణాలను పితృదేవతలు స్వీకరించరు సరిగదా వాడు నరకానికి పోతాడు. ఇంకా బ్రహ్మహత్యాది మహాపాతకాలు ఎవడు ఏది చేసినా దూషికాకుండంలో నూరేళ్ళు హింసలపాలై అటుపైని భూతజాతిలో జన్మించి మరో నూరేళ్ళు శోకించి కడపటికి పాపంనుంచి శుచి అవుతాడు. ఎరికైనాగాని ద్రవ్యం దానంగా ఇచ్చి మళ్ళీ వెనక్కి తీనుకున్నవాడు వసాకుండంలో శతాబ్దంపాటు అదే తింటూ కుళ్ళిపోతాడు. అటుపైని కృకలాసంగా (తొండ) ఎడుజన్మలెత్తుతాడు. తరవాత ఆతిరౌద్రుడూ ఆతి దరిద్రుడుగా ఆల్పాయుష్కుడై బతుకుతాడు. స్త్రీని పురుషుడుగానీ పురుషుణ్ణి స్త్రీగానీ శుక్లపానం చేయిస్తే శుక్లకుండపతనమే ఫలం, నూరేళ్ళ తరవాత ఏడు వ్యాఘ్రజన్మలు ఎత్తుతారు. అప్పటికి పాపశుద్ధిపాంది మానవులుగా పుడతారు.

శ్రీకృష్ణుడిమీద పాటలుకట్టి తన్మయత్వంతో పాడుకుంటున్నవాణ్ణీ చూసి కళ్ళలొ నీళ్ళు తిరిగేలాగా పరిహసించిన పాపాత్ముడు అశ్రుకుండనరకంలో శతసంవత్సరాలు పడిఉంటాడు. మరుజన్మలో చండాలవంశాన పుడతాడు. మిత్రద్రోహి గాత్రమలకూపంలో నూరేళ్ళు శిక్ష అనుభవించి అటుపైని గాడిదగా మూడు జన్మలెత్తి పాపశుద్ధి పొందుతాడు. చెవిటివారిని నిందించిన కఠినాత్ముడు కర్ణవిట్‌ కూపంలో (గులుగు) పడి అదే తింటూ నూరేళ్ళు రోదిస్తాడు. బధిరుడూ దరిద్రుడుగా ఏడు జన్మలెత్తుతాడు. మరో ఏడు జన్మలకూ అంగవిహీనుడై ఆపైని శుచి అవుతాడు. లోభంతోగానీ స్వలాభంకోసంగానీ జీవహింస చేసినవాడు మజ్జాకూపంలో లక్షసంవత్సరాలు మగ్గుతాడు. ఆపైని ఏడుజన్మలు శశకంగా, ఏడు జన్మలు మీనంగా పుడతాడు. మూడు జన్మలు వరాహంగా ఏడుజన్మలు కోడిగా ఏడుజన్మలు లేడిగా ఎత్తి ఎత్తి కడకు పాతకశుద్ధి పొందుతాడు. కూతురిని పెంచి పెద్దచేసి ధనలోభంతో అమ్ముకునేవాడు మాంసకుండంలో కన్యారోమాలన్ని ఏళ్ళు పడిఉంటాడు. యమభటులు నిత్యమూ దండతాడనం చేన్తుంటారు. మాంసభారాన్ని నెత్తిమీద పెట్టి మోయిస్తారు. అందులోంచి కారే రక్తాన్ని నాకిస్తారు. అటుపైని అరవైవేల సంవత్సరాలు కన్యావిట్‌క్రిమిగా జన్మలెత్తుతాడు. ఆపైని వ్యాధుడుగా (బోయ) ఏడు జన్మలెత్తుతాడు. వరాహంగా మూడుజన్మలు కోడిగా ఏడుజన్మలు కప్పగా జలగగా కాకిగా ఏడేసి జన్మలూ ఎత్తి శుద్దుడవుతాడు.

వ్రతాలూ ఉపవాసాలూ శ్రాద్ధకర్మలూ జరిపేరోజుల్లో క్షురకర్మచేయించుకున్నవాడు నఖాదికుండాలలో ఆయా వ్రతాధిదేవతల ఆయుష్కాల పర్యంతం పడి ఉండి యమకింకరుల దండతాడనాలు అనుభవిస్తాడు. కేశదూషితంగా పార్థివలింగం తయారుచేసి ఆర్చించినవాడు రేణువులన్ని సంవత్సరాలు కేశకుండంలో తల్లడిల్లి తరువాత యవనజాతిలో పుడతాడు. హరుడికోపం తేలిగ్గా చల్లారదు. శతాబ్దం తరవాత రాక్షసజన్మఎత్తిస్తాడు. పితృదేవతలకు పిండం పెట్టనివాడు తన వెండ్రుకలన్ని యేళ్ళు అస్థికుండంలో శిక్ష అనుభవిస్తాడు. ఆపైని కుత్సితుడుగా కుంటివాడుగా (కుఖంజః) ఏడు జన్మలెత్తుతాడు. మహా దారిద్య్రం అనుభవించి శుద్ది పాందుతాడు.

గర్భిణిగా ఉన్న భార్యను కలిసినవాడు తామ్రకుండంలో నూరేళ్ళు దుఃఖాలు అనుభవిస్తాడు, అవీర (మగడూ బిడ్డలూ లేనిది) కానీ ఋతుస్నాత కానీ వండి పెట్టిన భోజనం తిన్న శ్రోత్రియుడు తప్తలోహకుండంలో శతాబ్దంపాటు ఇడుములు పడతాడు. ఏడుజన్మలు కాకిగా ఏడుజన్మలు చాకిగా (రజక) గడిపి మహావ్రణపీడుతుడై దరిద్రుడై అటు పైని పాపశుద్ధి పాందుతాడు. చర్మంతో చేసిన తొడుగులు తగిలించుకున్న చేతులతో దేవద్రవ్యాలను స్పృశించినవాడు శతవర్షాలపాటు చర్మకుండంలో శిక్షలు అనుభవిస్తాడు. భుజించరానివి భుజించిన నైష్ఠికుడు తప్తసురాకూపంలో శతాబ్దీకాలపర్యంతం పడి ఉండి ఆపైని ఏడుక్షుద్ర జన్మలు ఎత్తుతాడు. అటు పైని శుద్ది పొందుతాడు. ప్రభువును కొట్టినవాడికీ కటువుగా మాట్లాడినవాడికీ కంటకకూపనివాసమే శిక్ష. దెబ్బకు నాలుగు దెబ్బలుగా యమకింకరులు దండిస్తారు. ఆపైని గుర్రంగా ఏడు జన్మలెత్తి శుచి అవుతాడు. విషం పెట్టి జీవహింస చేసిన పాతకి విషకూపంలో వెయ్యేళ్ళు పొర్లుతాడు, అటుపైని మహావ్రణపీడితుడుగా రాజద్రోహిగా నూరుజన్మలు ఎత్తుతాడు. మరో ఏడు జన్మలు కుష్ఠురోగం అనుభవించి శుద్దుడవుతాడు.

ఆవునుగానీ ఎద్దునుగాని కర్రతో బాదిన వాడూ లేక బాదించినవాడూ తప్త తైలకుండంలో నాలుగు యుగాలపాటు మలమలావేగుతాడు. అటు పైని దాని శరీరంమీద ఉన్న వెండ్రుకలన్ని సంవత్సరాలపాటు భారతభూమిలో వృషభజన్మలు ఎత్తి ఎత్తి కడకు శుద్ది పాందుతాడు. కుంతం అనే ఆయుధంతోగాని వహ్నిలోహంతోగాని జీవహింస చేసిన పాపాత్ములు కుంతకుండంలో అయుతవత్సరాలు నివసిస్తారు. అటుపైని వ్యాధిపీడితుడుగా ఒక జన్మగడిపి పాపం నుంచి శుద్ధిపాందుతాడు.

ద్విజుడైపుట్టి లోభంతో మాంసభక్షణ చేసినవాడూ హరికి నివేదన చెయ్యకుండా పదార్థాలను భుజించినవాడూ కృమికుండంలో స్వరోమ సమవత్సరాలు శిక్ష అనుభవించి మరు జన్మలో మ్లేచ్చుడవుతాడు. బ్రాహ్మణుడైపుట్టి చేయరాని పనులు చేస్తే పూయకుండనరకంలో యమదండన అనుభవిస్తాడు. అటుపైని శూద్రుడుగా ఏడు జన్మలు ఎత్తుతాడు. మహారోగి దరిద్రుడూ బధిరుడూ అవుతాడు.

కృష్ణపాదపద్మ చిహ్నాలను పడగమీద ధరించిన జాతిపామును సంహరించిన పాపాత్ముడు స్వరోమసమవత్సరాలు సర్పకుండంలో కుందుతాడు. సర్పభక్షితుడూ యమకింకర తాడితుడూ అవుతాడు. అటుపైని సర్పజన్మ ఎత్తుతాడు. ఆ తరవాత అల్పాయుష్కమానవుడై దద్రురోగపీడ అనుభవిస్తాడు. సర్పదష్టుడై మరణిస్తాడు. అప్పటికి పాపశుద్ధి అవుతుంది.

అల్పప్రాణుల్ని పట్టుకుని హింసిస్తూ వినోదించేవారు దంశకూపంలోనూ మశీకూపంలోనూ శిక్షింపబడతారు. నిరాహారులై హాహాకారాలు చేస్తూ దంశబాధలు అనుభవిస్తారు. కాళ్ళూచేతులూ కట్టేసి యమకింకరులు దండతాడనం చేస్తారు. అటుపైని క్షుద్రజంతువులై పుడతారు. ఆపైన అంగవికల మానవజన్మ ఎత్తి పాపప్రక్షాళన పొందుతారు.

తేనెటీగలను చంపి అవి దాచుకున్న తేనెను భుజించేవాడు గరళకుండంలో గరళభక్షితుడవుతాడు. ఆపైని మక్షికాజాతిలో జన్మించి పాపకర్మ విముక్తి పొందుతాడు. నిరపరాధిని దండించినా బ్రాహ్మణుడిని హింసించినా ఆ పాపానికి ఫలం వజ్రదంష్ట్రాకూపనివాసం. యమకింకరుల దెబ్బలకు హాహాకారాలు చేస్తూ రోదిస్తూ రోమసంఖ్యాసమసంవత్సరాలు గడిపి, పందిగా ఏడు జన్మలు కాకిగా మూడు జన్మలూ ఎత్తి పాప ప్రక్షాళన చేసుకుంటాడు. ధనసంపాదనకోసం అమాయక ప్రజలను పీడించినవాడు వృశ్చికాకూపంలో పడతాడు. వృశ్చికంగా ఏడు జన్మలు ఎత్తుతాడు. అటుపైన అంగహీనుడై వ్యాధిపీడితుడై పాపశుద్ధి పాందుతాడు.

విప్రుడు శస్త్రజీవి అయినా సంధ్యావందన హరిభక్తి విహీనుడైనా స్వరోమాబ్దంగా అతడు శరకూపాదులో ఘోరశిక్షలు అనుభవిస్తాడు. కారాగారంలో బంధించి ప్రజలను ప్రమత్తుడై హింసించేవాడు గోళకుండ నరకానికి పోతాడు. అది సలసలకాగే నీటితో కుతకుతలాడే బురదతో భయంకరంగా ఉంటుండి వాడికోరలతో పెద్దపెద్ద పురుగులు ఎగురుతూ ఉంటాయి. అవి కుడుతూంటే ఆ కుండంలో ఉడుకుతాడు. హింసించిన ప్రజల శరీరాలమీద ఉన్న వెండ్రుకలన్ని సంవత్సరాలు ఈ శిక్ష అనుభవిస్తాడు. అటుపైని ప్రజలకు సేవకుడుగా జన్మించి పాపప్రక్షాళన చేసుకుంటాడు.

చెరువుల్లోనుంచి గాలికోసం ఒడ్డుకువచ్చిన మొసళ్ళనూ తాబేళ్ళనూ పట్టి హింసించేవాడు నక్రకంటక సమానాబ్దంగా నక్రకుండ మహానరకంలో హింసలు అనుభవిస్తాడు. అటుపైని తాను హింసించిన జంతువుల జాతిలో జన్మిస్తాడు.

పుణ్యక్షేత్రాలలోగానీ తీర్థస్నాననమయాలలోగానీ పరస్త్రీల గోప్యాంగాలను కాముకదృష్టితో చూసినవాడు కాకతుండకూపంలో పడి తన వెండ్రుకలన్ని సంవత్సరాలు హింసపడతాడు. కాకులు వాడీ కళ్ళు పీక్కుతింటాయి. అంధుడుగా మూడుజన్మలెత్తుతాడు. బంగారాన్ని దొంగిలించినవారు మంధానకూపంలో మథింపబడతారు. యమకింకరులు కళ్ళకు గంతలుకట్టి చావబాదుతారు. తన మలమూత్రాలను తానే తింటూ స్వరోమాబ్దకాలం గడిపి అటుపైని మూడుజన్మలూ అంధుడవుతాడు. ఏడు జన్మలు మహాదారిద్య్రం అనుభవించి స్వర్ణకారుడుగానో స్వర్ణవ్యాపారిగానో జన్మించి బంగారానికి సేవకుడవుతాడు. తామచౌర్యం లోహచౌర్యం చేసినవారు ఇలాగే బీజకుండంలో శిక్ష అనుభవిస్తారు. దేవతావిగ్రహాలను దొంగిలించినా దేవద్రవ్యాన్ని అపహరించినా స్వరోమాబ్దంగా వజ్రకుండ నరకంలో వజ్రాఘాతాలు తింటూ హాహాకారాలు చేస్తూ నిరాహారులై కింకరతాడితులై కడపటికి పాపకర్మ విముక్తులవుతారు. వెండినీ గోవులనూ వస్త్రాలనూ దొంగిలించేవారు తప్తపాషాణకుండంలో శిక్షింపబడతారు. మూడు జన్మలు బొల్లిరోగంతో పీడింపబడతారు. అటుపైని శ్వేతపక్షిగా జన్మిస్తారు. కాంస్యపాత్రలను ఆపహరించినవాడు తీక్ష్ణపాషాణ నరకంలో హింసలు అనుభవించి గుర్రంగా ఏడు జన్మలు ఎత్తి ఆపైని పాదరోగపీడితుడై పాతకవిముక్తి పాందుతాడు.

గతిలేక వాళ్ళు అమ్ముకుని జీవించే పుంశ్చలిని దోచుకునేవాడు స్వరోమాబ్దంగా లాలకుండంలో మునుగుతాడు. అటుపైని కంటిరోగంతోనూ శూలరోగంతోనూ పీడింపబడతాడు. ఎప్పటికో పాపవిశుద్ది పాందుతాడు. మసీజీవనం సాగించే విప్రుడు మసీకుండనరకంలో దుఃఖిస్తాడు. అటుపైని నల్లని పశువుగా మూడుజన్మలు ఎత్తుతాడు. మూడు జన్మలు నల్లగొర్రె అవుతాడు. ఆపైని తాడిచెట్టుగా పుడతాడు, కడపటికి విశుద్ధుడవుతాడు. ధాన్యాది సస్యాలనూ తాంబూలాన్నీ ఆసన తల్పాలను అపహరించేవాళ్ళు చూర్ణకుండ నరకకూపంలో యమబాధలు అనుభవిస్తారు. మేషజాతిలోనూ కుక్కుటజాతిలోనూ మూడేసి జన్మలు ఎత్తుతారు. ఆ పైని వానరజన్మ కాసవ్యాధిపిడ. దారిద్య్రం. అల్పాయుర్దాయం. వంశహాని. చివరికి పాపవిశుద్ధి. విప్రుల సొమ్ము హరించి (గానుగ) చక్రం చేయించుకున్నవాడు చక్రకుండనరకంలో శతాబ్దకాలం హింసలు అనుభవిస్తాడు. అటు పైని తైలకారుడుగా మూడు జన్మలు ఎత్తుతాడు. వ్యాధిపీడితుడూ వంశహీనుడూ అయ్యి పాపవిమోచనం పొందుతాడు. విప్రుల గో ధనాల విషయంలో వంకరగా వ్యవహరిస్తే వక్రకుండ నరకానికి పోతారు. ఆపైని వంకరటింకర అవయవాలతో పుడతారు. ఇలా ఏడు జన్మలయ్యాక గ్రద్దగా పందిగా పిల్లిగా నెమలిగా మూడు జన్మలు ఎత్తుతారు. అప్పటికి గానీ పాపభారం తరగదు. బ్రాహ్మణుడై పుట్టి కూర్మమాంసం తింటే కూర్మకుండంలో శతాబ్దంపాటు కూర్మాలతో భక్షింపబడతాడు. మూడు కూర్మజన్మలెత్తుతాడు. పందిగా బిడాలంగా నెమలిగా మూడేసి జన్మలు ఎత్తి క్రమంగా పాపపంకిలం వదిలించుకుంటాడు. నెయ్యిగానీ నూనెగానీ అపహరించినవాళ్ళు జ్వాలాకుండంలోనూ భస్మకుండంలోనూ నరకయాతన అనుభవిస్తారు. మత్స్యమూషక జన్మలు ఏడేసి ఎత్తి పాపభారం తొలగించుకుంటారు. సుగంధ ద్రవ్యాపహర్తలు దగ్ధకుండనరకంలో దివారాత్రాలు దగ్ధులవుతారు. అటుపైని దుర్గంధికులుగా ఏడు జన్మలెత్తుతారు. మృగనాభిగా(కస్తూరి) మూడు జన్మలు తప్పవు. ఏడు మంథాన జన్మలూ తప్పవు. అప్పటికి పాపఫలానుభవం పూర్తి అవుతుంది. బలప్రయోగంతోగానీ మోసం చేసిగానీ ఇతరుల పిత్రార్జితభూమిని కాజేసినవాళ్ళు తప్తసూచీకూపంలో పడిదగ్ధులవుతారు. ఏడు మన్వంతరాలు ఈ నరకం అనుభవించి అరవైవేల సంవత్సరాలు కృమికీటకమై తిరిగి స్వజాతిలో జన్మిస్తారు. పాపకర్మల ఫలంగా నరకయాతనలు అనుభవించి పరిశుద్ధులై స్వీయజాతిలో జన్మించాక శుభకర్మలు ఆచరించాలి. శుభఫలాలు దక్కుతాయి. మళ్ళీ పాపాలే చేస్తే ఇలాగే నరకయాతనలు తప్పవు.

సావిత్రీ ! ధనలోభంతో ఎదుటివాడి శిరస్సును కత్తితో నరికిన హంతకుడు అసిపత్రనరకంలో యాతనపడతాడు. పధ్నాలుగుమంది ఇంద్రులు మారేటంతకాలం అందులో కత్తికోత అనుభవిస్తాడు. బ్రాహ్మణుడిని చంపినవాడు శతమన్వంతరాలు అదే నరకంలో శిక్షింపబడతాడు. అటు పైని శతసూకరజన్మలూ సప్తకుక్కుట జన్మలూ సప్తసృగాల జన్మలూ సప్తవ్యాఘ్రజన్మలూ మూడు వృకజన్మలూ సప్తమండూక జన్మలూ ఎత్తుతాడు. అటుపైని ఒక మహిష జన్మఎత్తి పాపవిముక్తి పొందుతాడు. పల్లెలూ పట్టణాలూ తగులబెట్టేవారు క్షురధారానరకకూపంలో మూడు యుగాలపాటు యమబాధలు పడతారు. తరవాత ప్రేతాకారంలో మరిన్ని సంవత్సరాలు తిరుగుతారు. ఆపైని ఏడు జన్మలు మలభక్షకులై ఏడు జన్మలు కపోతాలై ఏడు జన్మలు శూలవ్యాధిపీడితులై ఏడు జన్మలు కుష్ఠువ్యాధి అనుభవించి శుద్ధిపాందుతారు, పరనిందాపరుడూ పరదోష ప్రచారకుడూ దేవ బ్రాహ్మణ నిందకుడూ సూచీముఖ నరకంలో యుగత్రయకాలం వేదనలు అనుభవిస్తారు. వృశ్చిక వజ్రకీట భస్మకీటజన్మలు ఏడేసి ఎత్తి మానవుడై మహావ్యాధి పీడితుడై మరణించి శుద్ధిపాందుతాడు, గోడలకు కన్నంవేసి తలుపులు బద్దలు చేసి ఇళ్ళల్లో చొరబడి వస్తువుల్ని దొంగిలించేవారు గోకాముఖనరకంలో మూడుయుగాలు యమకింకర బాధలు అనుభవిస్తారు. గిత్తలూ గొర్రెపాటేళ్ళూ మేకపోతులూ కొమ్ములతో కుమ్ముతోంటే గిట్టలతో మట్టగిస్తోంటే హాహాకారాలు చేస్తారు. ఆపైని వ్యాధిగ్రస్తమైన ఎద్దుగా ఏడుజన్మలూ మేషజాతిలో మూడుజన్మలూ ఛాగజాతిలో మూడు జన్మలూ ఎత్తి మానవుడుగా దారిద్య్రం నిత్యరోగం భార్యావియోగం బంధువియోగం అన్నీ అనుభవించి పాపకర్మ విముక్తుడవుతాడు. ఏ రకమైన ద్రవ్యాన్ని ఎవరినుంచి కాజేసినా చోరుడు నక్రముఖ కుండంలో నలిగిపోవలసిందే. మూడు శతాబ్దాలపాటు యమభటుల దండతాడనలు తినవలసిందే. ఆపైని రోగిష్ఠి ఎద్దుగా ఏడు జన్మలు దుఃఖించి మానవుడై మహారోగిగా అందరితోనూ ఏవగింపబడి కడపటికి పరిశుద్ధి పొందుతాడు. ఏనుగుల్నీ గుర్రాల్నీ పశువుల్ని చంపినవాడు గజదంశకూపంలో మూడుయుగాలపాటు యాతనలు అనుభవిస్తాడు. నాగదంతాలతో యమకింకరులు కుళ్ళబొడుస్తుంటే కుయ్యోం మొర్రోమని పెడబొబ్బలు పెడతాడు. అటుపైని ఆయా జంతువులుగా మూడేసి జన్మలు ఎత్తుతాడు. నరుడై శుచి అవుతాడు.

దప్పికతో వచ్చి నీళ్ళు తాగుతున్న గోవును తరిమివేసిన మానవుడు గోముఖనరకంలోపడి పురుగులతో కాగుతున్న నీళ్ళల్లో మగ్గుతాడు. మన్వంతరకాలం ఈ శిక్ష అనుభవిస్తాడు. నరజన్మ ఎత్తి మహారోగపీడతో మరణించి పాపప్రక్షాళన పొందుతాడు, గోహత్య బ్రాహ్మణహత్య స్త్రీహత్య భిక్షుహత్య భృణహత్య(గర్భస్రావం) చేసినవారూ పొందుకోరరాని స్త్రీని పొందినవారూ కుంభీపాకనరకంలో చతుర్దశేంద్రసమకాలం హింసలు ఆనుభవిస్తారు. యమదూతలు నలిపేస్తారు. నిప్పుల్లో తోస్తారు. ఇనపముళ్ళ పొదల్లోకి విసురుతారు. కాగుతున్న నూనెలో ముంచుతారు. సలసలలాడుతున్న తామ్ర లోహద్రవంలో వేపుతారు. ఇన్నీ అనుభవించి నూరు గ్రద్దజన్మలూ నూరు పందిజన్మలూ ఏడు కాకిజన్మలూ ఏడు సర్పజన్మలూ ఎత్తి అరవైవేల సంవత్సరాలపాటు విట్‌కృమిగా జీవించి ఆపైని ఎద్దుగా ఏడుజన్మలు ఎత్తి మనిషైపుట్టి దరిద్రుడై కుష్ఠురోగపీడితుడై అప్పటికి పాపభారం తొలగించుకుంటాడు.

బ్రహ్మహత్యాసమానాలు


Tuesday, July 21, 2026

Zodiac signs favored by Goddess Lakshmi - లక్ష్మీదేవికి ఇష్టమైన రాశులు

లక్ష్మీదేవికి ఇష్టమైన రాశులు

సనాతన ధర్మంలో లక్ష్మీదేవిని సంపదల దేవతగా కొలుస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం తనపై ఎప్పటికీ ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే కొన్ని రాశులపై లక్ష్మీదేవి చల్లని చూపు ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతారు.

చంద్రుడు, గురుడు మరియు శుక్రుడు అధిపతులుగా కలిగిన రాశుల మీద లక్ష్మీ దేవి చూపు చల్లగా ఉంటుంది.

వృషభ రాశి
వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు సంపద, సౌందర్యం, విలాసం, సౌభాగ్యానికి కారక గ్రహంగా భావిస్తారు. అందువల్ల ఈ రాశివారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎక్కువగా ఉంటుందని సంప్రదాయ జ్యోతిష్యం చెబుతుంది.

కర్కాటక రాశి
ఈ రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనశ్శాంతి, కుటుంబ సౌఖ్యం, పోషణకు ప్రతీక. కుటుంబాన్ని గౌరవించే స్వభావం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని విశ్వసిస్తారు.

తులా రాశి
తులా రాశికి కూడా శుక్రుడే అధిపతి. సమతుల్యత, అందం, మంచి సంబంధాలు, ఆర్థిక ప్రణాళిక వంటి లక్షణాలు ఈ రాశివారిలో ఎక్కువగా ఉంటాయని జ్యోతిష్యం చెబుతుంది. అందుకే ఐశ్వర్య యోగాలు కలుగుతాయని భావిస్తారు.

ధనుస్సు రాశి
ఈ రాశికి అధిపతి గురుడు. గురుడు జ్ఞానం, ధర్మం, పుణ్యానికి సూచిక. ధర్మమార్గంలో నడిచేవారిపై లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని ఆధ్యాత్మిక విశ్వాసం.

మీన రాశి
మీన రాశికి కూడా గురుడే అధిపతి. భక్తి, దయ, దానం, ఆధ్యాత్మికత ఈ రాశివారి ప్రధాన లక్షణాలుగా భావిస్తారు. ఈ గుణాలు లక్ష్మీదేవి అనుగ్రహానికి కారణమవుతాయని జ్యోతిష్య సంప్రదాయం చెబుతుంది.

లక్ష్మీదేవి అనుగ్రహం కేవలం రాశిని బట్టి మాత్రమే కాదు. భక్తి, నిజాయితీ, పరిశుభ్రత, దానం, ధర్మాచరణ, కష్టపడి పనిచేసే స్వభావం ఉన్న ప్రతి ఒక్కరిపై ఆమె కటాక్షం ఉంటుందని పురాణాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు తెలియజేస్తాయి. రాశి ఒక సూచిక మాత్రమే, సత్కర్మలే లక్ష్మీ కటాక్షానికి నిజమైన మార్గం.

Monday, July 20, 2026

Henna in the month of Ashadha - ఆషాఢ మాసంలో గోరింటాకు

ఆషాఢ మాసంలో గోరింటాకు

ఆషాడ మాసంలో ఈ గోరింటాకుకు ఓ ప్రత్యేకత ఉంది. మిగతా రోజుల్లో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా, ఆషాడంలో ప్రతి ఆడపిల్ల తమ చేతులు, కాళ్ళకి అందంగా గోరింటాకు పెట్టుకుంటారు. అది ఎర్రగా పండితే మురిసిపోతుంటారు. అయితే, ఇది కేవలం అందంగా కనిపించేందుకు మాత్రమే కాదు.. దీని వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.

వేసవి నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది.. జోరుగా వర్షాలు దంచి కొడుతుంటాయి. ఇలాంటి మార్పు మొదలైన కాలంను ఆషాడం మాసం అని పిలుస్తాం. ఆషాడం వచ్చిదంటే చాలు వర్షాలు పడుతుంటాయి. దీంతో వతావరణం అంతా చల్లగా మారుతుంది. అంతేనా, సూక్ష్మక్రిములు పెరిగి అంటురోగాలు వ్యాపిస్తుంటాయి. అయితే, వర్షాలు ఎక్కువగా పడడం వల్ల వాతావరణం చల్లబడుతుంది కానీ, ఒంట్లో వేడి అలానే ఉంటుంది. బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారిపోతుంది. దీంతో మన శరీరంలో కొంత చికాకుగా ఉంటుంది.

గోరింటాకులో వేడిని తగ్గించే అద్భుతమై గుణం ఉంటుంది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచి.. రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవాలని మన పెద్దలు సూచిస్తుంటారు.

ఆషాఢంలోనే ఎందుకు:
ఆషాఢంలో కొత్త పెళ్లి కూతుళ్లు తమ పుట్టింటికి చేరుకోవడం తరతరాలుగా ఆనవాయితీగా వస్తోంది. ఆ సమయంలో తమ చేతులకు గోరింటాకు పెట్టుకుని,పెట్టుకున్న గోరింటాకు ఇచ్చే రంగును చూసుకుని మురిసిపోతూ వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తుచేస్తుంది. పుట్టింట ఉన్న మనసు మెట్టినింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తుంది. వేళ్లకి గోరింట పెట్టుకోవడం వల్ల కంటికి అందంగానే కాకుండా గోళ్లు పెళుసుబారి పోకుండా, గోరుచుట్టు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

గోరింటాకు ఎర్రగా పండాలంటే చిట్కలు:
ఇక గోరింటాకు ఎర్రగా పండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలంటున్నారు. గోరింటాకు మెత్తగా రుబ్బిన తర్వాత అందులో నిమ్మరసం కలపాలి. వీటితో పాటు గోరింటాకు రుబ్బేటప్పుడు కొద్దిగా చింతపండు వేసినా మంచి ఉపయోగం ఉంటుంది. అదే విధంగా గోరింటాకును పెట్టుకున్నాక, అది పూర్తిగా చేతిపై ఎండిపోయి రాలిపోయే స్థితిలోకి వచ్చాక తీసేయాలి. అలా తీసేసిన వెంటనే చేతులని శుభ్రం చేసుకోవద్దు.. కనీసం ఓ అరగంట అయినా ఉంచాలి. ఆ తర్వాత చేతులని శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత కొద్దిగా కొబ్బరి నూనె తీసుకుని చేతులకి రాసుకుంటే ఎర్రగా మెరిసిపోతూ కనిపిస్తుంది.

Murudeshwar, Bhatkal Taluk, Uttara Kannada District, Karnataka State - మురుడేశ్వర్, భట్కల్ తాలుకా, ఉత్తర కన్నడ జిల్లా, కర్ణాటక రాష్ట్రం

మురుడేశ్వర్, భట్కల్ తాలుకా, ఉత్తర కన్నడ జిల్లా, కర్ణాటక రాష్ట్రం

కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో అరేబియా సముద్ర తీరాన ఉంది. ఇది ప్రపంచంలోనే రెండవ ఎత్తైన 123 అడుగుల భారీ శివ విగ్రహానికి మరియు 20 అంతస్తుల (237 అడుగులు) రాజగోపురానికి ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ సముదాయం కందుక కొండపై ఉంది, ఇక్కడ సముద్రపు అలల హోరు మధ్య శివ దర్శనం ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది.

శివయ్యకు ప్రత్యెక్కించిన ఈ దేవాలయం పేరు మురుడేశ్వర్. మురుడేశ్వర్ అనేది శివయ్య పేరు.

ఇది ప్రపంచంలోనే రెండవ ఎత్తైన శివుని విగ్రహం అని పండితులు చెబుతున్నారు.ఈ శివుని విగ్రహాన్ని తయారు చేయడానికి దాదాపు రెండు సంవత్సరాల సమయం పట్టింది.

ఈ దేవాలయాన్ని సందర్శించేందుకు దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు.

పురాణ కథనం:
మురుడేశ్వర పట్టణ ఇతిహాసం త్రేతాయుగం వరకు ఉంది. రావణాసురుడు, శివుని గురించి అకుంఠిత తపస్సు చేసి మెప్పించి ఆత్మలింగాన్ని భూలోకానికి తెస్తాడు. కాని శివుడిచ్చిన ఆత్మలింగం స్వభావం ప్రకారం భూమిమీద ఆలింగం ఎక్కడ పెడితే అక్కడ స్థాపితం అయి, అక్కడ నుండి తిరిగి ఎత్త శక్యం కాదని శివుడు చెబుతాడు. రావణాసురుడు ఆత్మలింగాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే ప్రతికూల చర్యలు జరుగుతాయని భావించి దేవతలు విష్ణువును వేడుకొనగా విష్ణువు తనమాయతో సూర్యాస్తమయం అయ్యేటట్లు చేస్తాడు. అప్పుడు రావణుడు సూర్యాస్తమయం అయిందని భావించి సంధ్యవార్చుకోవడానికి సంసిద్ధుడు అవుతాడు.

ఈ విషయం తెలుపుకొన్న నారదుడు వినాయకుని వద్దకు వెళ్ళి రావణాసురుడి వద్ద నుండి ఆత్మలింగం తీసుకొని భూమి మీద పెట్టాలని చెబుతాడు.అప్పుడు వినాయకుడు నారదుడు కోరినట్లు రావణాసురుడు సంధ్యవార్చుకొనే సమయానికి బ్రాహ్మణ వేషం లో వెడతాడు. ఆ బ్రాహ్మణ బాలకుడిని చూసిన వెంటనే రావణాసురుడు తాను సంధ్యవార్చుకొనవలసిన కారణమున ఆ బాలకుడిని లింగాన్ని పట్టుకొనవలసిందిగా కోరుతాడు. అప్పుడు వినాయకుడు లింగం చాలా బరువు ఉంటే తాను ఎక్కువ సేపు మోయలేనని, మోయలేకపోయే సమయం వచ్చినప్పుడు మూడు సార్లు పిలుస్తానని రావణాసురుడు రాకపోతే ఆలింగాన్ని భూమి పైన పెడతానని చెబుతాడు.

రావణాసురుడు అందుకు అంగీకరించగా, వినాయకుడు లింగాన్ని తన చేతులలోకి తీసుకొంటాడు.రావణాసురుడు సంధ్యవార్చుకోవడానికి వెళ్ళగానే గణపతి లింగాన్ని మోయలేక పోతున్నట్లు మూడు సార్లు పిలుస్తాడు. సంధ్య మధ్యలో ఉండడంతో రావణాసురుడు అక్కడకు వచ్చేటప్పటికే వినాయకుడు లింగాన్ని భూమి మీద నిలుపుతాడు. రావణాసురుడు వచ్చి లింగాన్ని భూమి మీద నిలిపినందుకు గణపటి నెత్తిమీద మొట్టుతాడు, గణపటి నెత్తికి గుంట పడుతుంది.వినాయకుడు భూమి మీద నిలిపిన స్థలం గోకర్ణ, మురుడేశ్వర లింగం పడిన భాగాలలో ఒక ప్రదేశం.

విష్ణువు తన మాయని తొలగించగా వెంటనే సూర్యుడు ఆకాశంలో మళ్ళి కనిపిస్తాడు.ఈ విషయాన్ని గ్రహించి రావణుడు ఎంతో కోపోద్రిక్తుడై ఆత్మలింగాన్ని తన చేతులతో పెకలించ ప్రయత్నం చేస్తాడు. ఆత్మలింగం పైనున్న కవచాన్ని విచ్ఛిన్నం చేసి విసిరివేస్తే గోకర్ణకు 23 కి.మి. దూరంలో సజ్జేశ్వర అనే ప్రదేశంలో పడుతుంది. లింగం పై నున్న మూత తొలగించి విసిరి వేస్తే అది గోకర్ణకు 27 కి.మి దూరంలో ఉన్న గుణేశ్వరలో పడుతుంది. లింగం పైనున్న వస్త్రాన్ని విసిరివేస్తే అది కందుక పర్వతం పై నున్న మృదేశ్వరలో పడుతుంది. ఆపేరు కాలక్రమంలో మురుడేశ్వరగా మారింది.

చరిత్ర:

ఆత్మలింగం: త్రేతాయుగంలో రావణాసురుడు శివుని కోసం తపస్సు చేసి సాధించిన ఆత్మలింగం ఈ ప్రదేశంతో ముడిపడి ఉంది.

భారీ శివ విగ్రహం: కొండపై భాగంలో ఉన్న ఈ 123 అడుగుల శివుని విగ్రహం సూర్యకాంతిలో మెరుస్తూ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

రాజగోపురం: ఆలయం వద్ద నిర్మించిన 237 అడుగుల రాజగోపురానికి లిఫ్ట్ సౌకర్యం ఉంది. దీని పైభాగానికి వెళ్లి చూస్తే అరేబియా సముద్రం మరియు మురుడేశ్వర్ పరిసరాల సుందర దృశ్యాలు కనిపిస్తాయి.

ఇతర విశేషాలు:
మురుడేశ్వర దేవాలయం: ఈ దేవాలయం కందుక పర్వతం మీద ఉంది.మూడు వైపుల అరేబియా సముద్రం ఆవరించి ఉంది.ఈ దేవాలయ గాలి గోపురం 20 అంతస్తులు ఉంది. దేవాలయానికి వెళ్ళే మార్గంలో రెండు నిజమైన ఏనుగులు ఉన్నాయి.

మురుడేశ్వర కోట: ఈ కోట మురుడేశ్వర దేవాలయం వెనుక భాగంలో ఉంది. ఈ కోటని మన హిందూ రాజులు పునరుద్ధరించాడు.

శివుని విగ్రహం: ఆలయ సముదాయంలో నున్న ఈ శివుని విగ్రహం చాలా దూరం నుండి కనిపిస్తుంది. ఆధారాల ప్రకారం ఈ విగ్రహం ప్రపంచం లోనే అతి పెద్ద శివుని విగ్రహం.
123 అడుగుల (37 మీటర్ల) ఎత్తు కలిగిన ఈ విగ్రహాన్ని చెక్కడానికి 2 ఏండ్లు పట్టింది. శివమొగ్గకు చెందిన కాశీనాథ్, ఆయన కుమారుడు శ్రీధర్, ఇతర శిల్పులు కలిసి కోటి రూపాయల ఖర్చుతో ఈ విగ్రహాన్ని చెక్కించారు. ఈ విగ్రహంలో మరో ప్రత్యేకత ఏమనగా సూర్యరశ్మి పడినప్పుడు ఈ విగ్రహం మెరుస్తుంది.

ఈ మురుడేశ్వర్ దేవాలయం బెంగళూరుకి 497 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.ఇంకా చెప్పాలంటే ఈ దేవాలయం భక్తి జ్ఞాన కేంద్రంగా వెలిసింది.

ఈ దేవాలయంలోనీ 123 అడుగులు ఎత్తైన మహా శివుడిని దర్శించుకోవడం ఆధ్యాత్మికం అని భక్తులు చెబుతూ ఉంటారు.అంతే కాకుండా ఈ దేవాలయానికి మూడు వైపులా సముద్రం ఉంటుంది.అంతే కాకుండా ఇక్కడ సూర్యాస్తమయం, బీచ్, కొల్లూరు టెంపుల్ తప్పక చూడదగిన ప్రదేశాలు అని స్థానికులు చెబుతున్నారు.

రోడ్డు మార్గం:
హొన్నావర్-భట్కల్ మధ్య నున్న జాతీయ రహదారి-17 మీద మురుదేశ్వర అని ఒక తోరణం స్వాగతం పలుకుతుంది. తోరణం నుండి ఒక కి.మీ. దూరం తూర్పు వైపు వెడితే మురుదేశ్వర పట్టణం వస్తుంది. బెంగళూరు నుండి జాతీయ రహదారి-206 ద్వారా హొన్నావర్ చేరుకొని అక్కడ నుండి జాతీయ రహదారి -17 తీసుకొంటే మురుదేశ్వర వస్తుంది.బెంగళూరు నుండి 455 కి.మీ. దూరంలో మురుదెశ్వర వస్తుంది.మంగళూరు నుండి 180 కి.మీ. దూరంలో ఉంది.

రైలు మార్గం:
మురుడేశ్వర రైలు స్టేషను కొంకణ్ రైల్వే లైను మీద ఉంది. ఈ రైలు స్టేషనులో ముఖ్యంగా ప్యాసింజర్ బండ్లు మాత్రమే ఆగుతాయి. మంగళూరు నుండి మార్మగోవా వరకు నడిచే ప్యాసింజర్ రైలు ఇక్కడ నిలుస్తుంది. బెంగళూరు నుండి మురుదేశ్వరకు సరాసరి రైలు సౌకర్యం లేదు. భట్కల్ వరకు రైలు మీద వచ్చి అక్కడ నుండి కొంకణ్ రైల్వే లైను మీద మురుదేశ్వర చేరుకోవచ్చు.

విమాన మార్గం:
మురుడేశ్వరకి దగ్గర లోని విమానాశ్రయం మంగళూరు 165 కి.మీ. దూరంలో ఉంది. హుబ్లీ, పనాజీ విమానాశ్రయాలు దగ్గరలో ఉన్న వేరే విమానాశ్రయాలు.

మన దేవాలయాలు చారిత్రక నగరాలూ

Bonalu - బోనాలు

బోనాలు

బోనాలు అమ్మవారుని పూజించే హిందువుల పండుగ. ఈ పండుగ ప్రధానంగా హైదరాబాదు, సికింద్రాబాదు, తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకుంటారు. సాధారణంగా జూలై లేక ఆగష్టులో వచ్చు ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు. పండుగ మొదటి, చివరి రోజులలో ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. బోనం అంటే భోజనం దేవికి సమర్పించే నైవేద్యం అని అర్థం.

బోనాలు తెలంగాణకు చెందిన మహంకాళి దేవి సాంప్రదాయ హిందూ పండుగ. ఈ పండుగను ప్రతి సంవత్సరం హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాలలో అలాగే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో జరుపుకుంటారు. ఇది ఆషాడ మాసం నెలలో జరుపుకుంటారు. పండుగ యొక్క మొదటి మరియు చివరి రోజున యెల్లమ్మ (మహాకాళి యొక్క అనేక ప్రాంతీయ రూపాలలో ఒకటి) కోసం ప్రత్యేక "పూజలు" (పూజలు/ వేడుకలు) నిర్వహిస్తారు. ప్రతిజ్ఞలను నెరవేర్చినందుకు దేవతకు కృతజ్ఞతలు తెలిపే పండుగగా కూడా ఈ పండుగ పరిగణించబడుతుంది.

బోనం అనే పదం భోజనం అనే పదం యొక్క సంకోచం , ఇది సంస్కృత రుణ పదం, దీని అర్థం తెలుగులో భోజనం లేదా విందు. ఇది మాతృమూర్తికి సమర్పించే నైవేద్యం. మహిళలు తమ తలపై కుండలను మోస్తూ, ఆలయాల మీదుగా ఉన్న అమ్మవారికి పసుపు-కుంకం, కంకణాలు మరియు చీరలతో పాటు బోనం సమర్పిస్తారు.బోనాలలో మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ, నూకలమ్మ వంటి ప్రాంతీయ రూపాలలో మాతృమూర్తిని పూజిస్తారు.

ఆషాడ మాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం; అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనేగాక, ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ తంతును ఊరడి అంటారు. వేర్వేరు ప్రాంతాల్లో పెద్ద పండుగ, ఊరపండుగ వంటి పేర్లతో పిలిచేవారు. ఊరడే తర్వాతి కాలంలో బోనాలుగా మారింది.

బోనాల సందర్భంగా వనస్థలిపురంలో పొట్టేళ్ళ రథం పై అమ్మవారి ఊరేగింపు
పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్టశక్తులను పారద్రోలటానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి ఇచ్చేవారు. నేడు దున్నపోతులకు బదులు కోడి పుంజులను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది. కొంతమంది స్త్రీలు తలపై కుండని (బోనం) మోస్తూ డప్పుగాళ్ళ లయబద్ధమైన మోతలకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ నర్తిస్తారు.

పోతురాజు
పురాణాల ప్రకారం, పోతరాజు మాతృదేవత సోదరుడు. ఊరేగింపులో అతని పాత్రను చక్కగా కట్టుకున్న, ఒట్టి శరీరంతో, చిన్నగా గట్టిగా కప్పబడిన ఎర్రని ధోతీని ధరించి, తన చీలమండలపై గంటలు, మరియు అతని శరీరంపై పసుపు మరియు అతని నుదుటి పై నుంచి అభిషేకం చేస్తారు. ఊరేగింపులో డప్పు వాయిద్యాలకు అనుగుణంగా నృత్యం చేస్తాడు.

పోతరాజు ఎప్పుడూ ఊరేగింపు ముందు నృత్యం చేస్తాడు. అతను ఉత్సవాల ప్రారంభకుడిగా మరియు సమాజ రక్షకుడిగా పరిగణించబడ్డాడు. అతను మాతృ దేవత ( షిగామ్ అని పిలుస్తారు) మంత్రముగ్ధులను చేసే మహిళా నృత్యకారులను, కొరడా దెబ్బలు మరియు పచ్చ వేప ఆకులను (మార్గోసా) వారి నడుము చుట్టూ కట్టి, బాకాలు మరియు డప్పులతో ఆలయానికి నడిపిస్తాడు.

Remedies for Jupiter-related afflictions - గురుగ్రహ దోష నివారణ

గురుగ్రహ దోష నివారణ నవగ్రహాల్లో బృహస్పతి గ్రహం ఒకటి. దీన్నే గురుగ్రహం అని కూడా అంటారు. ఇది పురుష గ్రహం, బ్రాహ్మణ కులంగా కూడా చెబుతారు. సత్త్...