నారదా! ఇక్కడొక ఇతిహాసం నీకు చెప్పాలి. ఒకప్పుడు దూర్వాసుడు శరీరంనిండా విభూతి ఆలంకరించుకుని రుద్రాక్షమాలికలు ధరించి పితృలోకానికి వెళ్ళాడు. శివా! శంకరా! సర్వాత్మకా!
జగన్మాతా! జగదంబికా! ఆంటూ పార్వతీపరమేశ్వరుల నామధేయాలను బిగ్గరగా జపిస్తూ వెళ్ళాడు. కవ్యవాలాదులైన పితృదేవతలు గౌరవపురస్పరంగా ఎదురువచ్చి నమస్కరించి తీసుకువెళ్ళి అతిథిమర్యాదలు జరిపి సముచితాసనంమీద కూర్చోబెట్టారు. కుశలప్రశ్నలతో కథలూ కబుర్లతో చాలాసేపు గడిపారు. అంతలోకీ - సమీపంలో ఉన్న కుంభీపాక నరకకూపంనుంచి ఆర్తనాదాలూ హాహాకారాలూ హృదయవిదారకంగా వినిపించాయి. దూర్వాసుడికి మనస్సు కలతపడింది. ఎవరివి ఈ అరుపులు? ఎక్కడినుంచి? ఆని ఆత్రంగా ప్రశ్నించాడు.
మునీశ్వరా! ఇక్కడికి చేరువలోనే సంయమినీపురం(యమలోకం) ఉంది. అక్కడ పాపాత్ములను శిక్షించడానికి యముడున్నాడు. అతని అధీనంలో వేలమంది యమదూతలున్నారు. నల్లగా బలిష్ఠంగా భయంకరంగా ఉంటారు. ఆ యమలోకంలో ఎనభయ్యారు నరకకూపాలు ఉన్నాయి. వాటిలోకెల్లా కుంభీపాకమనే కూపం అత్యంత భయంకరం. మహాపాపుల్ని తెచ్చి అందులో పడద్రోసి యమదూతలు ఘోరంగా శిక్షిస్తారు. ఆ యాతన వర్ణనాతీతం. నూరేళ్ళు వర్ణించినా తరగదు. శివుద్రోహులూ దేవీనిందకులూ విష్ణుద్రోహులూ వేదనిందకులూ సూర్యగణేశాదిదేవ నిందకులూ కామాచారులూ మాతృ పితృ గురు జ్యేష్ఠ భ్రాతృ - పురాణ స్మృతి నిందకులూ ఇంకా ఇలాంటి పాపాలు చేసినవారూ ధర్మం తప్పినవారూ కుంభీపాక కుండంలో పడి యమదూతలు పెట్టే బాధలు భరించలేక కుయ్యో మొర్రోమని దిక్కులు పగిలేలాగా అరిచి రోదిస్తుంటారు. శ్రవణ దారుణమైన ఈ హాహాకారాలు మేము రోజూ వినేవే. వీటిని ఒక్కసారి వింటేచాలు ఎవరికైనా వైరాగ్యం పుడుతుంది - ఆని పితృదేవతలు వివరించారు.
వింటూనే దూర్వాసుడు చటుక్కున లేచాడు. గబగబా నడుచుకుంటూ-అదేమిటో చూద్దామనిపించి ఆ నరకకూపం దగ్గరికి వెళ్ళాడు. గట్టున నిలిచి తలవంచి కూపంలోకి చూశాడు. ఆంతే, హహాకారాలు మాయమయ్యాయి. వహ్వాకారాలు మిన్నుముట్టాయి. ఆ కూపంలో ఉన్నవారు కేరింతలు కొడుతున్నారు. ఆడుతున్నారు. పాడుతున్నారు. పట్టరాని సుఖమేదో అనుభవిస్తున్నట్టు పరస్పరం ఆనందపరచుకుంటున్నారు. మృదంగ వీణా మురజ ఢక్కా దుందుభులు మోగిస్తూ చిందులు తొక్కుతున్నారు. స్వర్గాధికనుఖమంటే ఇదే కాబోలు అనిపించింది. వసంతవల్లీ పుష్పగంధాలూ శుకశారికాపికాలాపాలూ విజృంభించాయి. మునీశ్వరుడు విన్నది వేరు, ఇప్పుడిక్కడ కన్నది వేరు. ఆశ్చర్యంలో మునిగిపోయాడు.
యమదూతలకు ఇందంతా చాలా వింతగా విడ్డూరంగా కనిపించింది. జరగరానిదేదో జరిగిపోయిందని కలవరపడ్డారు. పరుగు పరుగున వెళ్ళి అధినాయకుడు యమధర్మరాజుకి విన్నవించారు. మహారాజా! ఇదేదో విడ్డూరంగా ఉంది. కుంభీపాకంలో మహాపాపులు స్వర్గసౌఖ్యాలు అనుభవిస్తున్నారు. కారణం ఏమిటో అంతుపట్టడంలేదు. ఆశ్చర్యం పట్టలేక నీకు విన్నవించుకుంటున్నాం - అన్నారు.
యమధర్మరాజు ఉలిక్కిపడి లేచాడు. మహిషం అధిరోహించి చకచకా వచ్చాడు. బయలుదేరబోతూ ఈ వార్తను దేవేంద్రుడికి దూతద్వారా పంపించాడు. ఇంద్రుడు దిక్పాలకులకూ బ్రహ్మదేవుడికీ, బ్రహ్మదేవుడు విష్ణుమూర్తికీ తెలియపరిచారు. అందరూ వెంటవెంటనే బయలుదేరి తమ తమ దివ్య వాహనాలమీద క్షణాలలో అక్కడికి చేరుకున్నారు. కుంభీపాకం చుట్టూ చేరారు. అందులో జీవులు ఆనందపరవశులై కేరింతలు కొట్టడం కళ్ళారా చూశారు. అహో! ఇది నరకకూవం కానేకాదు. పాపాత్ములకోసం నిర్మించిన భోగకూపంలా ఉందని విస్తుపోయారు. కారణం ఏమిటో ఎవరికీ స్ఫురించలేదు. ఇక సృష్టిలో పాపానికి భయపడేదెవడు? అందరూ పాపాలే చేసి ఇక్కడికి వచ్చిపడతారు. అక్కడా సుఖపడతారు. ఇక్కడా సుఖపడతారు. వేదమర్యాదలూ ధర్మమార్గాలూ ధ్వంసమైపోతాయి. ఎమిటి ఈ విపరీతం? తన సంకల్పాన్ని తానే వృధాపరచుకుంటున్నాడా ఆ భగవంతుడు! చాలా ఆశ్చర్యంగా ఉందే! - ఇలా తర్కించుకుంటున్నారు. కొందరు కారణమేమిటో తెలియక ఏమి మాట్లాడటానికీ తోచక తటస్థులై మౌనంగా నిలుచుండిపోయారు.
విష్ణుమూర్తి చతుర్ముఖ దేవేంద్ర యమధర్మరాజులతో చర్చించాడు. కారణం అంతుబట్టలేదు. క్షణంలో ఇంత మార్పు ఎలా జరిగిందో తెలియలేదు. సరే శివుణ్ణి అడుగుదామని మరికొందరు దిక్పాలకులనూ దేవముఖ్యులనూ వెంటబెట్టుకుని కైలాసానికి వెళ్ళాడు.
కోటిమన్మథసుందరాకారుడు. సదా షోడశవర్షీయసుడు. లావణ్య నిధి. నానాలంకారభూషితుడు. పార్వతీదేవిని లాలిస్తూ చంద్రమౌళి దర్శనమిచ్చాడు. హరి విరించి ప్రముఖులు నమస్కరించారు. కాలయాపన చెయ్యకుండా యమలోకపు వింత విన్నవించారు. కారణం తెలియక కొట్టుకుంటున్నాం. నువ్వు సర్వజ్ఞుడివి. కనక హేతువేమిటో చెప్పు - అని విష్ణుమూర్తి అభ్యర్థించాడు.
శివుడి ముఖపద్మం వికసించింది. చతుర్భుజా! ఇందులో వింత ఏముంది? విడ్డూరం ఏముంది? అంతా విభూతి మహిమ. దానికి సాధ్యం కానిదేదీ లేదు. దూర్వాసుడు వచ్చాడుగదా! ఆతడు పరమమాహేశ్వరుడు. కుంభీపాకం గట్టున నిలబడి కిందికి తలవంచి చూశాడుగదా! మరింకేమి! అతడి నుదుటనున్న విభూతి రేణువులు దైవికంగా ఆ కుండంలో పడ్డాయి. అంతే, విభూతి మహిమ నరకకూపం స్వర్గలోకంగా మారిపోయింది. ఇప్పటినుంచీ అది పితృలోకవాసులకు తీర్థమవుతుంది. అందులో స్నానం చేసి పితృదేవతలు సుఖపడతారు. పితృతీర్థంగా విఖ్యాతి వహిస్తుంది. అక్కడ ఆలయం కట్టి మా దంపతుల్ని ప్రతిష్టించండి. పిత్రీశ్వరీ పిత్రీశ్వరులుగా విడిది చేస్తాం. పితృలోకనివాసుల పూజలు అందుకుంటాం. ముల్లోకాలలోనూ ఉన్న తీర్థాలన్నింటిలోకీ ఇది ఉత్తమోత్తమమవుతుంది - అని శంకరుడు స్వయంగా ప్రకటించాడు.
విష్ణుమూర్తీ ఆతడి అనుచరులూ సంతోషించి శివుడికి నమస్కరించి యమలోకానికి తిరిగివచ్చి అక్కడున్న మిగతా దేవతలకందరికీ ఈ విషయం చెప్పారు. అందరూ శిరసులూపి బాగుబాగని కొనియాడారు. విభూతి మహిమ ఇంతటిదా అని ఎంతగానో ప్రశంసించారు. తీర్థం లభించిందని పితృదేవతలు మరింతగా సంబరపడ్డారు. దాని చెంత శివపార్వతుల మూర్తులను ప్రతిష్టించారు. నిత్యమూ పూజలు చేయనారంభించారు. అప్పటిదాకా ఆ కుంభీపాక కూపంలో పడి ఉన్న ప్రాణికోటి అంతా దివ్యవిమానాలు అధిరోహించి కైలాసం చేరుకున్నారు. భద్రగణాలు అనే పేరుతో ఇప్పటికీ అక్కడే హాయిగా నివసిస్తున్నారు.
యముడూయమదూతలూ ఇక చేసేదిలేక ఆ తీర్థానికి సుదూరంగా మరొక కుంభిపాక కుండం కొత్తగా నిర్మించుకున్నారు. ఇక నేటినుంచీ శైవులెవ్వరూ దీని దరిదాపులకు రాకూడదని గట్టి నిషేధం విధించారు.