Sunday, March 29, 2026

Surya Eka Vimshati(21 Names) stotram - సూర్య ఏక వింశతి నామావళి(21 నామాలు)


సూర్య ఏక వింశతి నామావళి(21 నామాలు)

వికర్తనో వివస్వాంశ్చ మార్తాండో భాస్కరో రవిః ।
లోకప్రకాశకః శ్రీమాన్ లోకచక్షుర్మహేశ్వరః ।

లకసాక్షి త్రిలోకేశః కర్తా హర్తా తమిస్రహా । 
తపనస్తాపనశ్చైవ శుచిః సప్తాశ్వ వాహనః ।

గభస్తిహస్తో బ్రహ్మాణ్యో సర్వదేవ నమస్కృతః ।
ఏకవింశతి రిత్యేష స్తవ ఇష్టః సదా రావేః

॥ ఇతి శ్రీ సూర్య ఏకవింశతినామావళి సంపూర్ణం ॥

నామాల యొక్క అర్థం

1 వికర్తన         - అన్ని ప్రమాదాలను నాశనం చేసేవాడు
2 వివస్వన      - ప్రకాశవంతమైన
3 మార్తాండ     - బంగారు గుడ్డు నుండి ఉద్భవించినవాడు
4 భాస్కరుడు  - జ్ఞానోదయం కలిగించేవాడు
5 రవి               - గర్జించేవాడు
6 లోకప్రకాశక  - లోకానికి వెలుగును పంచేవాడు 
7 శ్రీమాన         - గొప్ప నైన
8 లోక చక్షు     - ప్రపంచపు కన్ను
9 గ్రహేశ్వర     - గ్రహాలన్నింటికీ అధిపతి
10 లోక సాక్షి    - ప్రపంచ సాక్షి
11 త్రిలోకేశ     - మూడు లోకాల ప్రభువు
12 కర్త              - కార్యనిర్వాహకుడు
13 హర్తా           - విధ్వంసకుడు
14 తమిస్రాహా - చీకటిని తొలగించేవాడు
15 తపన         - వేడెక్కేవాడు
16 తపన         - మండించేవాడు
17 శుచి            - పరిశుద్ధుడైనవాడు
18 సప్తశ్వవాహన - ఏడు గుర్రాలు లాగుతున్న 
రథాన్ని కలిగిన 
19 గభస్తిహస్త    - చేతులు కిరణాల వలె ఉన్నాయి
20 బ్రహ్మ          - సృష్టికర్త
21 సర్వదేవనమస్కృత - దేవతలందరి చేత పూజింపబడేవాడు 

నామాల వెనుక కథ:
సూర్య భగవానుడు జగత్తు శ్రేయస్సు కోసం అవతరించాడు, అందుకే పంచదేవోపాసనలో (పంచాయతనం) ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. 'ఆరోగ్య భాస్కరదిచ్చే' అంటే సూర్య భగవానుడిని ప్రార్థించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. సూర్యారాధన వల్ల మనిషి తేజస్సు, బలం, ఆయుష్షు మరియు కంటి కాంతి పెరుగుతాయి; మానవులకు దీర్ఘాయువు లభిస్తుంది. సూర్యుడు సమస్త కంటి మరియు చర్మ వ్యాధులను తొలగించే దైవం. 

శ్రీకృష్ణుని కుమారుడైన సాంబుడు తీవ్రమైన కుష్ఠు వ్యాధితో బాధపడుతున్నాడు.

శ్రీకృష్ణుడు మరియు జాంబవతి కుమారుడైన సాంబుడు చాలా శక్తిమంతుడు మరియు అందగాడు కూడా. తన అందంపై ఉన్న గర్వమే అతని పతనానికి కారణమైంది. ఒకసారి రుద్రావతార దుర్వాసముని ద్వారకాపురికి వచ్చారు. ధ్యానం వలన తీవ్రంగా బలహీనపడిన దుర్వాసుడిని చూసి సాంబుడు ఆయనను ఎగతాళి చేశాడు. కోపంతో, దుర్వాసముని 'నువ్వు కుష్ఠురోగివి అవ్వాలి' అని సాంబుడిని శపించాడు. శ్రీకృష్ణుని కుమారుడైన సాంబుడు తీవ్రమైన కుష్ఠురోగంతో బాధపడ్డాడు. ఆ వ్యాధిని నయం చేయడానికి అనేక పరిహారాలు చేసినప్పటికీ అతని కుష్ఠురోగం తొలగిపోలేదు.

కుష్ఠు వ్యాధిని నిర్మూలించాలని సాంబ ప్రార్థించాడు.

శ్రీకృష్ణ భగవానుడి ఆజ్ఞ మేరకు, సాంబ చంద్రభాగ నది ఒడ్డున సూర్యుడిని పూజించడం ప్రారంభించాడు. వ్యాధుల నుండి విముక్తి కోసం సాంబ సూర్య భగవానుడి సహస్రనామాన్ని పఠించేవాడు. ఒకరోజు సూర్య భగవానుడు సాంబకు కలలో కనిపించి ఇలా అన్నాడు – “నువ్వు నన్ను సహస్రనామంతో స్తుతించనవసరం లేదు. నేను నీకు నా అత్యంత పవిత్రమైన ఇరవై ఒక్క నామాలను చెబుతున్నాను. వాటిని పఠించడం ద్వారా నీకు సహస్రనామ ఫలం లభిస్తుంది. ఎవరైతే ప్రాతః సాయం సంధ్యా కాలాలలో ఈ స్తోత్రాన్ని పఠిస్తారో, వారు సకల పాపాల నుండి విముక్తి పొంది, కోరుకున్న ఫలాలు, ఆరోగ్యం, సంతానం మొదలైనవి పొంది, అన్ని వ్యాధుల నుండి విముక్తి పొందుతారు.”  అని పలికాడు.

సూర్య భగవానుడి ఆజ్ఞ మేరకు సాంబ ఇరవై ఒక్క నామాలను పఠించడం ప్రారంభించాడు. అతని భక్తి, తపస్సుకు సంతోషించిన సూర్యదేవుడు అతని వ్యాధిని తొలగించి, అతనికి పూర్వపు రూపాన్ని ప్రసాదించాడు.

శ్రీ సూర్య నారాయణ మేలుకో

ఆదిత్యహృదయం

ఆదిత్య కవచం

సూర్య ద్వాదశ నామాలు

సూర్య కవచం

శ్రీ సూర్యస్తోత్రం

సూర్యమండల స్తోత్రం

శ్రీ సూర్య పంజర స్తోత్రం

సూర్యాష్టకం

శ్రీ సూర్య అష్టోత్తరశతనామ స్తోత్రం

సూర్య సహస్ర నామ స్తోత్రం

ద్వాదశ ఆర్య స్తుతి

ద్వాదశ ఆదిత్య ధ్యాన శ్లోకాః

అరుణప్రశ్నః

సూర్య సూక్తం

మహా సౌర మంత్రం

చాక్షుషోపనిషద్ (చక్షుష్మతీ విద్యా)

శ్రీ సూర్య శతకం

శ్రీ సూర్యోపనిషద్

ద్వాదశాధిత్యులు

నిత్య స్తోత్రావళి

పంచాంగం

Puru dynasty (Paurava dynasty) - పూరు వంశం చరిత్ర(పౌరవ వంశం)

పూరు వంశం చరిత్ర(పౌరవ వంశం)

ఓ భరతవంశ సంభవా! పరీక్షిన్మహారాజా! పూర్వం మీది పూరు వంశమే. అటువంటి పూరువంశంలో జన్మించిన నీకు మీ పూర్వులు, చక్కని కీర్తియే అలంకారంగా గలవారు, ధీరులు, తమ ప్రతాపమే ధనంగా గలవారు అయిన వారిని గూర్చి వినిపిసాను.

పూరునికి జనమేజయుడు, జనమేజయునకు ప్రాచిన్వాంసుడు, ఆ ప్రాచిన్వాంసునికి ప్రవిరోధన మన్యువు అతడికి చారువు పుట్టారు. ఆ చారునకు సుద్యువు, అతనికి బహుగతుడు; అతనికి శర్యాతి, అతనికి సంయాతి, అతనికి రౌద్రాశ్వుడు, ఆ రౌద్రాశ్వునకు ఘృతాచి అనే అప్సరః కాంతవల్ల జగదాత్మభూతుడైన ప్రాణునకు పది ఇంద్రియాలవలె ఋతేపువు, కక్షేపువు, స్థలేపువు, కృతేపువు, జలేపువు, సన్నతేపువు, ధర్మేపువు, వ్రతేపువు, సత్యేపువు, వనేపువు అనే పదిమంది కొడుకులు పుట్టారు. వారిలో ఋతేపువునకు అతిసారుడు, అతిసారునకు సుమతి, ధ్రువుడు, అప్రతిరథుడు అనే ముగ్గురు పుత్రులు పుట్టారు. అప్రతిరథునకు కణ్వుడు, కణ్వునికి మేధాతిథి. అతడికి ప్రస్కందుడు మొదలైన బ్రాహ్మణులు జన్మించారు. ఆ సుమతికి రైభ్యుడు పుట్టాడు. రైభ్యునికి దుష్యంతుడు జన్మించాడు.

సముద్రంచే చుట్టబడిన విపులమైన భూభారాన్ని వహించే సామర్థ్యంగల తన కుడిచేయి శోభిల్లగా ఒకరోజున వేటయందు ఇష్టంగలవాడై ఖడ్గమృగాలు, సింహాలు, గండభేరుండాలు, కుందేళ్ళు, పాములు, అడవిపందులు, గొర్రెలు, లేళ్ళు, ఏనుగులు, పులులు, సివంగులు, భయంకరమైన శరభమనే మృగాలు, ముళ్ళపందులు, ఎలుగుబంట్లు, చమరీ మృగాలు తిరిగే అరణ్యంలో

శబ్దంచేస్తూ జంతువులను అదిలిస్తూ, పొదలలో వెదుకుతూ, వలలు త్రిప్పి అందులో జంతువులు పడేలా చేస్తూ, గురితప్పకుండా బాణాలతో జంతువులను కొడుతూ, వేటయందు ఆసక్తి ఒప్పగా

జంతువుల సమూహంవెనుక, చంద్ర సమాన సౌందర్యంగల దుష్యంతుడు, వేటయందు ఆసక్తితో, కొంతమంది వేటగాళ్ళు తనను సేవిస్తూ ఉండగా, సింహపరాక్రమం ఉట్టిపడే విధంగా వచ్చాడు.

దుష్యంతుడు క్రమక్రమంగా ముందుకు వెళ్ళి దైవయోగంవల్ల కణ్వమహాముని ఆశ్రమానికి చేరి.

బడలిక చెందిన పెనుబాముల జంటలకు తమ పింఛాలతో విసురుతున్న నెమళ్ళను, మదించిన ఏనుగులకు దయతో మేతపెట్టి ముద్దాడే సింహాలను, సివంగులు కాపలా కాస్తుండగా లేళ్ళతో కాపురంచేస్తున్న మగజింకలను, హోమధేనువుల గంగడోళ్లను మృదువుగా దువ్వే పులులను, తమలో తాము కలహించుకొన్న ఎలుకల జంటలకు స్నేహాన్ని కలిగించే గండుపిల్లులను, సహజంగా ఉండే జాతివైరాన్ని విడిచి కలసిమెలసి ఆటలు ఆడే జంతువులను ఆ కణ్వముని తపోవనంలో దుష్యంతుడు చూచాడు.

(ఆశ్రమవాతావరణం ఎంత గొప్పదో తెలుస్తున్నది. అది కణ్వముని తపోవనం. అక్కడ మృగాలకు జాతివైరం లేదు. అటువంటి వాతావరణం సమాజంలో కూడా నిర్మించుకొంటే, సర్వత్రా శాంతియుత వాతావరణం ఉంటుందని సందేశం.)

ఈ విధంగా సహజవైరంగల జంతువులు పొత్తుగూడి ఉండటం నేనెక్కడా చూడలేదని అబ్బురపడి దుష్యంతుడు తన మనస్సులో ఆ కణ్వమహాముని మహిమకు సంతోషించాడు.

దుష్యంతుడు చెంగలువలతోను, తామరపూలతోను, అలలమీదుగానూ, బాగా వికసించిన అడవిమల్లెలు, కొండమల్లెలు, మొల్లలు మొదలైన పూలమీదుగానూ వీచే మలయమారుతంతో సేదదీరినవాడై 

దుష్యంతుడు వచ్చే సమయంలో

ఓ చంద్రవంశరాజా దుష్యంతా! ఈ కణ్వాథమంలో లక్ష్మీదేవిని మించిన సౌందర్యంగల, తుమ్మెదలవంటి కురులు గల స్త్రీ ఉన్నది ఇక్కడే నీకు శుభం కలుగుతుంది. అని అన్నట్లుగా నల్లకలువలు వరుసగా పూచిన చోట తుమ్మెదలు శుభశబ్దాలు చేశాయి.

మా మన్మథుని బాణములు మామిడిపూలు. అందువల్ల ఈ మామిడిచెట్లు మాకు నిలయాలు అనేలా మామిడిచెట్ల చివరను చేరి కోకిలలు శబ్దాలు చేశాయి.

అంతట, ఈ ఆశ్రమంలో ఉన్న కణ్వమహర్షికి నమస్కరించి తిరిగివస్తాను. అనుకొని భటులను అందరిని అక్కడే ఉంచి దుష్యంతుడు ఆశ్రమానికి వెళ్ళి ఎదుట

ఆ కణ్వాశ్రమంలో, పద్మాలతో నిండిన సరస్సు ఉన్న ప్రాంతంలో, మామిడిచెట్ల నీడ, పూలతీగల మధ్య, అందమైన అరటిబోదెలతో కూడిన పొదరింట్లో, పూలతోనిండిన ప్రదేశంలో దుష్యంతుడు కనుబొమలవరకు అందంగా కదలాడుతున్న ముంగురులుగల శకుంతలను చూచాడు.

(శకుంతలయొక్క) ఒత్తైన కేశపాశం, ఎత్తెన చనుకట్టూ, బెదురుచూపులు, కదలాడే నడుము, తేనెలొలికే మోవి దుష్యంతుని మనస్సును ఉవ్విళ్ళూరిస్తూండగా

అంతట దుష్యంతుడు గణగణమని ధ్వనిచేసే మన్మథుని వింటి గంటల మోతలకు లోబడి తనమనసులో

అడవిలో దొరికే కందమూలాలు తింటూ, ఇంద్రియ నిగ్రహంతో జీవించే కణ్వునికి కొమరిత జన్మించడం ఏమిటి?! ఈ బెదురు చూపుల చిన్నది నిశ్చయంగా మునికుమారి కాదు. ఈమెపై నాకు మనసైంది. ఈమె తప్పక రాజకుమారే అయి ఉంటుంది. పురువంశంలో జన్మించిన నాకు మునికుమారిని కోరే దురాలోచన వస్తుందా! అన్యాయంగా మా పురువంశంలో వారు దేనిని కోరుకోరు కదా!

నీ వెవరి పుత్రివి అని అడిగినట్లయితే తన మనసు బాధపడేలా 'నేను రాకుమారినికాదు' అని చెప్తుందేమో అని చంద్రవదన శకుంతలను ఏమీ అడగకుండా ఆలోచిస్తూ దుష్యంతుడు కొంతసేపు తడబడ్డాడు.

మళ్లీ ఎలాగో చివరకు తన మనఃప్రేరణ నిజమయ్యేటట్లుగా భావించి ఇలా అన్నాడు.

ఓ పూర్ణచంద్రముఖీ! నీవు రాజకుమారివని (నా మనసునకు) అనిపించి నా మనసు నీపై లగ్నం అయింది. నీవారేరి? నీపేరేమి? ఇలా నిర్జన ప్రదేశంలో తిరగడం న్యాయమా!

ఇలా మాట్లాడున్న దుష్యంతుని ముఖచంద్ర చంద్రికలను తన నేత్రచకోరాలతో శకుంతల తాగుతూ తడబడుచున్నవేళ

మన్మథుడు శివునిచే నిర్వీర్యుడు అయ్యాడు అనుట అసత్యము. అతడు పూలబాణాలు తీసికొని, అల్లెతాటికి సంధించి శకుంతలపై ప్రయోగించి ఆమెను శ్రమకు గురి చేయడం ఎలా జరిగింది?

ఈ విధంగా మన్మథుని వాడివైన క్రొత్త పూలబాణాల వెడికి తాళలేక శకుంతల ఇలా అంది.

పూర్వం మేనక అనే అప్పరఃకాంత, విశ్వామిత్రుడనే రాజు అమోఘమైన తేజస్సుతో నన్ను కన్నారు. నన్ను కన్న మేనక నన్ను అడవిలో వదలి వెళ్ళిపోయింది. కణ్వమహర్షియే నన్ను పెంచిపెద్ద చేశాడు. నా జనన విషయం అంతా కణ్వమహర్షికి తెలుసు. నా అదృష్టంకొద్ది నిన్ను చూడగలిగాను. ఇకపై కృతార్ధను అవుతాను.

ఓ దుష్యంతమహారాజా! నీ పరివారము, ప్రజలు, మేము అందరును నీ వారమే నీకు సంబంధించిన వారమే. మా ఆశ్రమంలో ఈనాడు ఉండి నీవు నీ వారు కలిసి మా యింట్లో (ఆశమంలో) నివ్వరి అన్నాన్ని భుజించి మా పూజలందుకో.

ఈ విధంగా శకుంతల పలుకగా దుష్యంతుడు ఆనందపడి, చేపకన్నులవంటి కన్నులున్న శకుంతల మనసులోని ఇష్టాన్ని గ్రహించి ఇలా అన్నాడు.

ఓ పద్మాక్షీ! నీవు రాజకుమారివి అనడం సత్యం. మరొకమాట లేదు. ఓ చంద్రవదన! రాజకుమారి తనకు తగిన యువకుని పాణిగ్రహణం చేసికోవడం న్యాయమే కదా!

ఈ విధంగా తియ్యని ప్రేమపూర్వకమైన మాటలతో ఆ శకుంతలను అంగీకరింపజేసి

ప్రజలందరిచే పొగడ్తలు గొన్న గొప్ప కీర్తిగల దుష్యంతుడు, తగిన సమయం ఎరిగినవాడై, ఆ అడవిలో, ఆ మత్తేభగమన శకుంతలను, గాంధర్వ విధిప్రకారం వివాహం ఆడాడు.

Yayati teaches the Basthopakhyaanam to Devayani - యయాతి దేవయానికి బస్తోపాఖ్యాన మనెడి వ్యాజంబున స్వవృత్తాంతంబు దెలుపుట

యయాతి దేవయానికి బస్తోపాఖ్యాన మనెడి వ్యాజంబున స్వవృత్తాంతంబు దెలుపుట

ఓ సుమధుర భాషిణీ! దేవయానీ! సరిగా మన చరిత్రవంటిదే గతంలో జరిగిన వృత్తాంతము ఒకటి ఉన్నది. దానిని పెద్దలు, మునులు విని సంతోషిస్తారు. నీవు కూడా మనసుపెట్టి విని అంగీకరించు.

అది ఎలాంటిదంటే

ఒక అడవిలో ఒక మేకపోతు తిరుగుతూ, కర్మవశాన నూతిలోనికి జారిపడి బాధపడుచున్న ఒక ఆడుమేకను చూచ్చి, దానిని కామించి, తన కొమ్ములతో ఆ ఆడుమేకను గట్టుమీదకు వచ్చేలా చేసింది. ఆ ఆడుమేక ఈ మేకపోతును భర్తగాకోరగా, అటులే అంగీకరించింది. ఆ ఆడుమేకతో తనను ఎన్ని మేకలు కామించి వెంట తిరిగాయో అన్నిటికీ ఈ మేకపోతు భర్తగా ఉంది. కూడియున్న ఆడుమేకలను అన్నివేళలయందు కామక్రీడలలో ముంచి, వాటన్నిటితో బాగాక్రీడించి, ఎంతో ఆనందపడి, మన్మథుడనే విడువని గ్రహం బారిపడి, మనసు మరచిపోయి, మత్తెక్కి దానికి (ఆ మన్మథ భయంకర భూతానికి) చిక్కింది.

మన్మథుని చిగురాకు బాకు దెబ్బలకులోనై, మిక్కిలి మోహంతో ఎడతెగకుండా స్త్రీల పొందునుగోరే మూర్ఖుడికి బుద్ధిచాతుర్యాలు ఎలా ఉంటాయి?

ఆ తరువాత ఆ మేకపోతు తనవెంట ఉన్న ఆడుమేకల సమూహంలో అందంగా ఉన్న ఒక ఆడుమెకపై మనసుపడి, దానితో ఇష్టంగా సంచరిస్తుండగా నూతిలోపడి రక్షింపబడిన ఆడుమేక, తనభర్త తనను ప్రేమగా చూడటంలేదనే విషయం గ్రహించి దైన్యాన్ని పొంది తన మనస్సులో

నేను మాట్లాడించినా, నాతో తిరిగి మాట్లాడటానికి ఇష్టంలేకుండా నా భర్త ఉన్నాడు. క్రొత్తగా దొరికిన ఈ ఆడుమేకను చూచి మిక్కిలి తొందరతో ఆమెనే కలవాలనిచూస్తూ, నిలుచున్నచోట నిలబడలేక తొట్రుపాటు పడుతున్నాడు. నాభర్త నిలువెల్లా మోసం చేయడమే లక్షణంగా కలిగి ఉన్నాడు. అయినా కామికి సత్యనిష్ఠ ఉండదుకదా!

ఇట్లుపలికి, ఆ ఆడుమేక విడిచిపోగా, ఆ మేకపోతు రతిక్రియయందు మిక్కిలి ఆసక్తితో శబ్దంచేస్తూ ఆ ఆడుమేక వెంటబడి దాన్ని అంగీకరింప జేయజాలక ఉంది. శబ్దంచేస్తూ ఆడుమేక కొరకు అల్లాడి పోతున్న ఆ మేకపోతు యజమాని అయిన బ్రాహ్మణుడు కోపంతో ఆ మేకపోతు అందములను రతిక్రియకు వీలుపడకుండేలా త్రెంచివేశాడు. ఆ మేకపోతు క్రిందామీదా పడి వేడుకొనేసరికి యోగవిదుడైన ఆ బ్రాహ్మణుడు పర్యవసానం గుర్తించి ఆ మేకపోతుకు అండాలు తిరిగి అతికించాడు.

ఈ విధంగా మేకపోతు తిరిగి తన వృషణాలను పొంది పటుత్వంతో తన ఆడుమేకతో విషయసుఖాలను పెక్కుకాలం అనుభవించికూడా వాటిపై ఆశవిడవలేక 'ఇకచాలు' అనే తృప్తి పొందలేక పోయాడు.

అని ఈ విధంగా యయాతి దేవయానికి తనసంగతినే కథారూపంలో తెలియజేసి ఇలా అన్నాడు.

(ఈ ఉపాఖ్యానానికి 'బస్తోపాఖ్యానము' అనిపేరు. బస్తము అనే శబ్దానికి ఛాగము, మేకపోతు అని అర్ధం. వివేకంగల యయాతి సంసార సుఖాల తృష్ణతీరని స్థితి గమనించి తన భార్య దేవయానితో చెప్పుచున్న విషయం ఇది. ఇందులో యయాతి మహారాజు మేకపోతు, దేవయాని కర్మవశాన నూతిలోపడిన ఆడుమేక, దానిని గట్టుకు చేర్చిన మేకపోతు యయాతి. ఆడుమేక దేవయాని కోరుకోగా మేకపోతు యయాతి వివాహం చేసికొన్నాడు. వెంటబడిన ఆడుమేకలు శర్మిష్ఠ ఆమెను ప్రేమతో చూచిన విషయాన్ని గమనించి దేవయాని కోపంపొందితే ఆమెను అనునయించే ప్రయత్నం యయాతి చేయగా శుక్రాచార్యుడు అతనికి యౌవనంలేకుండా ముదిమిని పొందుమని శపించడమే యజమాని ఛాగముయొక్క వృషణాలు తెగగొట్టడం. శాపాంతం చెప్పడమే యోగవిదుడైన బ్రాహ్మణుడు తిరిగి అండాలను అతికించడం. యయాతి విషయవాంఛల తుది చూడలేకపోవడమే ఈ బస్తోపాఖ్యానంలోని మేకపోతు మాటలు. బస్త్యతే హింస్యత ఇతిబస్తః బస్త అర్దనే. హింసింపబడునది అని 'బస్త' శబ్దానికి వ్యుత్పత్తి.)

ఓ భామినీ! దేవయానీ! దట్టమై జయించడానికి వీలులేని, సిగ్గుతో కూడిన నీక్రీగంటి చూపులనే బాణాల దెబ్బలకు ఎంతో బలమైన నా మనసు ముక్కలై దాని నైపుణ్యాన్ని కోలుపోయింది. చాలాబలం కలిగిన ఈ మన్మథుని బారినుండి నేనెలా తప్పించుకొని ఓర్చుకోగలను? చెరలో బడిన స్త్రీవలె నా పాపపు తృష్ణ అధికమై మిక్కిలి దుఃఖిస్తోంది. అయ్యో!

ఈ కోర్కెల దాహం ప్రాణాలు అల్లాడుతూ ఉన్నా చలించడంలేదు. శరీరావయవాలు వణకిపోతూ ఉన్నా కదలడంలేదు. శరీరానికి ఉన్న పొంకాలు వీడిపోయినా ఇది విడువడం లేదు ఈ తృష్ణకు సంతృప్తిలేదు. దీనిని (ఈ తృష్ణను) తుంచివేయాలి.

వికసించిన పద్మమువంటి ముఖం కలదానా! వేయి సంవత్సరాలుగా నిన్ను కూడి ఉన్నాను అయినా కామసుఖాల పట్ల ఆసక్తి తగ్గడంలేదు. కొంచెమైనా బడలిక కలగడంలేదు. ఈ తృష్ణ కొనసాగుతూ పెరుగుతూనే ఉంది.

దంతాలు ఊడినా, కేశాలు తెల్లబడినా శరీరం ముడతలుబడినా ఈ విధంగా ముసలితనం లక్షణాలు వచ్చినా బతకాలనే కాంక్ష ఇంద్రియ సుఖాలపట్లకోరిక ఈ రెండూ మాత్రం విడువలేదు.

ఓ పద్మాక్షీ! ఆశ అనే తీగకు అంతంలేదు. చూద్దామన్నా ఆశకు తుద కన్పట్టదు. తత్త్వజ్ఞానం గలవాళ్ళు మాత్రం ఆశకు అంతాన్ని చూడగలిగితే సంతోషంతో సంసారాన్ని తుదిముట్టగలరు (సార్ధకంగా జీవించగలరు).

భూషణాలు, బంగారం, పశువులు, ఏనుగులు, గుర్రాలు, స్త్రీలు, పసిడి, వస్త్రాలు, ధాన్యం మొదలైనవి ఎన్ని ఉన్నప్పటికీ, ఆశ అనే పాశాన్ని ఖండించలేవు, సరికదా ఎన్ని ఉన్నా ఏదో ఒకలోటు కన్పిస్తూనే ఉంటుంది.

కామసుఖాలు ఎన్నిమార్లు మానవుడు అనుభవించినా కోరిక మాత్రం అణగారదు. అగ్నిహోత్రుడు నేతిధారపోస్తే అణగుతాడా? అణగడు కదా!

ఓ తామరసాక్షి! అక్క తల్లి, చెల్లెలు తన కొమరిత ఉన్న పాన్పుపై కలసి మనం కూర్చుండరాదు కారణం ఏమంటే పరమయోగికైనా ఇంద్రియాల సమూహం అధికమైన కష్టాన్ని కలుగజేస్తుంది.

ఓ కమలముఖీ! ముక్తినికోరేవాడు మూర్ఖత్వానికి విత్తనం కాకుండా, తొట్రుపాటుతో చెడిపోకుండా, స్త్రీలతో విడువలేని స్నేహాన్ని సాన్నిహిత్యాల్ని వదలిపెట్టాలి.

అందువల్ల ఈనాటినుండి తృష్ణను వదిలి; విషయసుఖాలువీడి; అహంకారం విడిచి, మృగాలతో కలిసి అడవులలో తిరుగుతాను. పరబ్రహ్మలో నా చిత్తాన్ని చేరుస్తాను. బ్రహ్మనిష్ఠ మానవులందరికి ఆశను పోగొడుతుంది. అందుచేత నేను బ్రహ్మనిష్ఠలో మున్గి, ఆహారాన్ని నిద్ర మొదలైన వానిని పరిహరిస్తాను. ఆత్మజ్ఞానం గలిగి, సంసారం అంటే నాశనం పొందేది అని తెలిసికొన్నవాడే  పండితుడు అని గ్రహించి ఆ విధంగానే మాట్లాడి, పూరునివద్ద తీసికొన్న యౌవనాన్ని అతనికిచ్చి తన ముసలితనాన్ని తాను స్వీకరించి, లోభంలేనివాడై తన భుజపరాక్రమాలచే పాలింపబడుతున్న భూమిని విభజించి, ద్రుహ్యునకు తూర్పు, యదువునకు దక్షిణం, తుర్వసునకు పడమట, అనువునకు ఉత్తరదిక్కులందుగల భూములను చక్కగా రక్షించండని ఇచ్చి,
నాలుగు చెరగుల నేలను పాలించుమని పెద్దకొడుకులను ఆజ్ఞాపించి యయాతి పూరునకు సమస్త భూమండలాన్ని పరిపాలించుమని పట్టం గట్టాడు.

ఈ విధంగా పూరునికి రాజ్యంఇచ్చి చాల వత్సరాలుగా అనుభవిస్తూ వచ్చిన ఇంద్రియ సుఖాలను విడిచిపెట్టి. యయాతి తనకున్న అధికమైన అనుభవజ్ఞానంతో అరిషడ్వర్గాలను విడిచిపెట్టి, రెక్కలు వచ్చిన పక్షి తనగూటిని విడిచిపెట్టి ఎగిరిపోయే విధంగా తాను సంసార విముక్తుడై
పరమదయాళుడైన విష్ణుమూర్తి దయవల్ల యయాతి క్రూరములైన ఇంద్రియసుఖాలను గెలిచాడు. హరిదయ లేకుండా ఊరకే ఇంద్రియ నిగ్రహం గలవా డెవడుంటాడు?!

మరియు యయాతిభూపాలుడు అన్ని బంధాలను తెగగొట్టి, సత్త్పరజస్తమో గుణాలనే త్రిగుణాలనుదాటి, స్వచ్చమైన, ముఖ్యమైన వాసుదేవుడనే పేరుతో పిలువబడే పరబ్రహ్మంలో సహజంగా భాగవతులు పొందే పరమపదాన్ని పొంది వాసుదేవపరబ్రహ్మంలో లీనమయ్యాడు.

దేవయాని తనభర్త యయాతి పలికిన పలుకులు తేలికగా తీసికోక తన హృదయంలో నిలుపుకొని, చలివేంద్రంలో బాటసారులు చల్లదనానికై చేరి వారివారి మార్గాలవెంబడి పోయే జనులవలె, ఈ సంసారంలో కర్మబంధాలతో భార్యపిల్లలు మగడు అనే బంధాలతో కూడి ఉంటారు. అంతే తప్ప ఈ భార్యాది సంబంధాలు శాశ్వతంకాదు. ఇదంతా పరమేశ్వర మాయావిలాసం. ఈ సంసారాన్ని ఈ బంధాలను విడిచిపెట్టాలి. అదే న్యాయం అనే తెలివికలిగి నిద్రమేల్కొన్నవాడు ఎటువంటి నేర్పుతో ప్రవర్తించి (స్వప్నం నిజంకాదు అని గ్రహిస్తాడో అలా) హరిపదాలపై ధ్యానం నిలిపి ముక్తి పొందింది.

ఈ ప్రకారంగా పరీక్షిన్మహారాజునకు యయాతి చరిత్ర చెప్పి భగవంతుడు, అన్ని జీవులలో ఉండేవాడు, శాంతుడు, వేదమయుడు అయిన పరబ్రహ్మకు నమస్కరిస్తాను అని శుకమహర్షి పలికి ఇలా అన్నాడు.

పూరు వంశం చరిత్ర(పౌరవ వంశం)

Shukracharya curses Yayati - శుక్రాచార్యులు యయాతికి శాపం బొసంగుట

శుక్రాచార్యులు యయాతికి శాపం బొసంగుట

రాజైన యయాతి పూర్వం శుక్రాచార్యులు చెప్పిన మాటలు జవదాటరానివై గుర్తు ఉన్నప్పటికీ శర్మిష్ఠను జూచి మన్మథ బాధకు గురై ఆమెను మదనసుఖాలలో మురిపించాడు. దైవనిర్ణయాలు త్రోసివేయజాలం కదా! ఒక చక్రవర్తియైన యయాతి అందకత్తె అయిన శర్మి
ష్ఠతో సుఖించకుండా ఉండగలడా!

ఈ విధంగా యయాతివల్ల శర్మి
ష్ఠ గర్భవతియై ద్రుహ్యుడు, అనువు, పూరువు అనే పేర్లు గల ముగ్గురు కుమారులను కన్నది. దేవయాని ఈ విషయాన్ని గ్రహించి కోపించి తండ్రి శుక్రాచార్యుని వద్దకు వెళ్ళింది. ఒడలు తెలియని కోపాన్ని వహించిన దేవయాని వెంట యయాతి వెళ్ళి ఇలా అన్నాడు.

ఓ సరోజాక్షీ! దేవయానీ! ఈ విషయాన్ని మామ అయిన శుక్రాచార్యునికి చెప్పడమెందుకు? మానుము. నేను శర్మి
ష్ఠతో సంసారసుఖం అనుభవించి తప్పు చేశాను. కామంతో శర్మిష్ఠను పొందిన నన్ను కరుణించు. నీ తండ్రి మాటకంటె నా మాట వినడం నీకు తగినది.

ఈ విధంగా యయాతి పలికి దేవయాని పాదాలపై పడ్డాడు. అయినా దేవయాని ఒడంబడలేదు. ఈ విషయాన్ని తెలిసికొన్న శుక్రాచార్యుడు ఇలా అన్నాడు.

ఓ యయాతి మహారాజా! నేను నా వివాహ సమయంలో చెప్పిన మాటలు పెడచెవినిపెట్టి రాక్షస రాజ తనూజ శర్మి
ష్ఠతో సుఖించావు. నేను చెప్పిన మాట ఏమిటి? నీవు చేసిన పని ఏమిటి? కాముకులకు, విషయలంపటులకు సత్యవాక్యం పైని నియమం ఉంటుందా!

అని శుక్రాచార్యుడు పల్కి ఓ యయాతీ! నీవు స్త్రీలందరూ అసహ్వించుకొనే ముసలితనం పొందుతావు అని శపించేసరికి యయాతి ఇలా అన్నాడు.

ఓ మామా! నాపై కోపంవద్దు. నీ సుత అయిన దేవయానిపై నాకు వాంఛ తీరలేదు. ఆమెతో మరికొంత కాలం రమించి ఆ తరువాత నేను ముసలితనాన్ని అనుభవిస్తాను.

అని చెప్పి యయాతి శుక్రుని అనుజ్ఞనుపొంది దేవయానిని వెంటబెట్టుకొని నగరానికి వెళ్ళి పెద్దకొడుకు అయిన యదువును పిలిచి ఇలా అన్నాడు.

ఓ పుత్రా! యదునామధేయా! నా తండ్రీ! నా కుమారా! నీ తల్లినిగన్న శుక్రాచార్యునివల్ల నేను నేడే ముసలితనాన్ని పొందాను. నీ యౌవనాన్ని నాకు ఇమ్ము. నేను తృప్తి పొందేలా కొన్ని సంవత్సరాలు మన్మథ సౌఖ్యాలతో శృంగారినై తిరుగుతాను.

యయాతి పల్కులు విని తండ్రియైన యయాతితో కుమారుడైన యదువు ఇలా అన్నాడు.

తండ్రీ! స్త్రీలు సహించనిది, చెడుమాటలకు నిలయమైనది, భరింపరాని కందూతితో కూడినది, చింతకు మూలమైనది, పడిసెమనే రోగంతో కూడినది, చెమట, కురుపులు వణకు, శ్రమ, బొబ్బలు మొదలైన జబ్బులు గలది ముసలితనం. అటువంటి ముదిమిని ఎవరైనా ఇష్టపడి సుఖానుకూలమైన యౌవననిధిని ఊరకే ఇతరులకు ఇవ్వగలరా?

యదువు తండ్రి మాటలకు అంగీకరింపలేదు. యయాతి తన మిగిలిన పుత్రులు తుర్వసుడు, ద్రుహ్యుడు అనేవారిని అడుగగా వారుకూడా యదువు చెప్పినట్లే సమాధానం చెప్పారు. అప్పుడు యయాతి కడగొట్టు కుమారుడైన పూరువుతో ఇలా అన్నాడు.

ఓ కుమారా! నీవు వయసులో పిన్నవాడవు కాని బుద్ధులలో పెద్దవాడవు. నీవు నా ఆజ్ఞను దాటవు కదా! నీవు వినయ సంపన్నుడవు. నీవు నీ అన్నలు చెప్పినట్లు ఎదురు చెప్పకు. నా ముసలితనాన్ని నీవు స్వీకరించి నీ యౌవనాన్ని నాకు అందించు.

తండ్రి యయాతి మాటలువిని పెద్దలపై భక్తిగల పూరుడు ఇలా అన్నాడు.

ఓ తండ్రీ! నీవు నన్ను ఇంతగా ప్రార్థించాలా! నీ యాజ్ఞను అతిక్రమించి పనులు చేయడానికి, నీకెదురు మాట్లాడటానికి నేను న్యాయం తెలియనివాడనా? నీ ముసలితనాన్ని నేను ఇష్టంగా వహించి నా యౌవనాన్ని నీకిస్తాను తండ్రి ఆజ్ఞను తలదాల్బక తగువులాడే పుత్రుడు క్రిమితో సమానుడు కాడా?

(యయాతి తన ముసలితనాన్ని స్వీకరించి యావనాన్ని ఇమ్మని సుతులను కోరాడు. కుమారులెవ్వరు అంగీకరించలేదు. పూరుడుమాత్రం అంగీకరించాడు. యయాతి తనసుతులను యౌవనాన్ని ఇమ్మనికోరడం సమంజసమా, కాదా అన్న అంశాన్ని అలా ఉంచితే, ఇస్తానని అంగీకరించడం పూరువు గొప్పతనం. పైగాకోరింది తారుణ్యాన్ని. వృద్ధత్వాన్ని ధరించవలసింది కుమారుడు. ముదిమి ఎటువంటిదో ముందు పద్యాలలో చెప్పబడింది. 'జన్మ కష్టం జరాకష్టం' అని పెద్దలు చెప్పనే చెప్పారు. ముసలితనం కడుభయంకరమైన కష్టం. ఎన్నో చేయాలని ఉన్నా చేయలేని అశక్తతా, చింత, ఆశ ఇత్యాదిలక్షణాలతో ఉండేది ముదిమి. తెలిసికూడా పూరువు తనతండ్రి యయాతి ముదిమిని స్వీకరిస్తానన్నాడు; దాన్ని కూడా నెయ్యంతో స్వీకరిస్తానన్నాడు. అంతేకాదు తండ్రిమాట శిరసావహింపని కుమారుడు క్రిమితో సమానుడన్నాడు. ఎప్పుడో జరిగిన ఈ చరిత్ర ఇప్పటికీ మనం జ్ఞప్తిలో ఉంచుకోవాలి. తల్లిదండ్రుల ముసలితనాన్ని మనం స్వీకరించి మనయౌవనం వారికివ్వలేకపోయినా, యౌవనంతో ఉన్న మనం వృద్ధులైన తల్లిదండ్రుల బాధ్యతను ప్రేమతో స్వీకరిస్తే మనం కూడా పూరువు అంతటి వాళ్ళం అవుతాము. ఇంత మాత్రపు ఆలోచన యువకులకు కలిగితే భాగవత పఠనం సార్ధకం అయినట్లే.)

అదే కాకుండా, ఓ రాజా! మంచి మార్గమును పొందడానికి మునివృత్తిని అనుసరించి, కృశించవలసిన పనిలేదు. కన్నతండ్రి ఆజ్ఞను తలదాల్చినవానికి ఆ సుగతి కొంగుబంగారం కదా!

(కొంగులోనే ఉన్న బంగారాన్ని వెదుకవలసిన పనిలేదు. తేలికగా చేతికి అందేది అనేసందర్భంలో ఈ జాతీయం వాడుతూ ఉంటారు. ఉత్తమ మార్గాన్ని పొందడానికి తండ్రిమాట తలదాల్చడం ఒక్కటి చేస్తే సరిపోతుంది. వేరే శ్రమపడవలసిన అవసరంలేదు అని భావం.)

ఓ తండ్రీ! ఉత్తములైన పుత్రులు తమతండ్రి ఆజ్ఞాపింపకయే వారికి కావలసిన పనులు చేస్తారు. మధ్యములైన పుత్రులు తండ్రి ఆజ్ఞాపింపగా వారికి అవసరమైన పనులు సమకూరుస్తారు. కాని తండ్రి కోరి ఆజ్ఞాపించినా ఎల్లవేళలా ఎదురుమాటాడి పనిచేయని కుమారులు అధములు.

అని పలికి పూరుడు యయాతియొక్క ముసలితనాన్ని స్వీకరించి తన పిన్నవయస్సును యయాతికిచ్చాడు. యయాతి యౌవనంగలవాడై

ఏడు ఖండాలుగా ఉన్న భూమండలాన్ని ఏడు వీథులుగా ఉన్న ఒక పెద్ద పట్టణంగా పరిపాలిస్తూ, ప్రజలందరికి ఏవి ఏవి అవసరమో వాటిని వెదకివెదకి సమకూర్చిరక్షిస్తూ, తోడుగా దేవయాని నిలువగా, వివిధ మన్మథ సుఖసంతోషాలలో మునిగితేలుతూ యయాతి క్రీడించాడు. ఆయా క్రీడా విశేషాలలో

దేవయాని వివిధములైన గుట్టుమట్టులతో, సాధ్వీధర్మాన్ని తప్పకుండా, ప్రాణేశుడైన యయాతిని ప్రియవాక్యాలతో, త్రికరణ శుద్ధిగా, వేరు ఆలోచన లేకుండా ఆనందపరచింది.

ఆకాశంలో మేఘాల సముదాయం దట్టమై, పలుచనై, పొడవై, ఏకమై, వివిధాకృతులుగా మారి అణగిపోయినట్లు; ఏ పరమాత్మయొక్క గర్భంలో ఈ లోకాల సముదాయం పుట్టి, ప్రవర్తిల్లి, నశించిపోతాయో ఆ పరమాత్ముడైన హరినిగూర్చి యయాతి మహారాజు విస్తారంగా యాగాలు చేశాడు.

అంతేగాక, యయాతి మహారాజు తన స్నేహితులు, గజాలు, రథాలు, భటుల సముదాయం, గుర్రాలు మొదలైనవాటిని కలలో కన్న సంపదలతో సమానంగా చూస్తూ, తనభార్య దేవయానితో వేలకొలది సంవత్సరాలు మన్మథభోగాల ప్రవాహంలో తేలిన వాడైనప్పటికీ అధికమైన తృష్ణకు అంతాన్ని కనలేక అనేక బంధాలలో చిక్కి బాధపడుతూ

ఒకనాడు యయాతి మహారాజు తన ఆత్మ జ్ఞానంవల్ల తన భార్య దేవయాని కారణంగా వంచనకు గురికావడం తెలిసికొని ఎక్కువ దుఃఖాన్నిపొంది దేవయానితో ఇలా అన్నాడు.

యయాతి దేవయానికి బస్తోపాఖ్యాన మనెడి వ్యాజంబున స్వవృత్తాంతంబు దెలుపుట

Devayani Engagement With Yayati - దేవయాని యయాతిని వరించుట

దేవయాని యయాతిని వరించుట

యయాతి మహారాజు దేవయానికి 
చూచి ముందుగా తన పై బట్టను ఇచ్చి, ఏడు సముద్రాలు ఒడ్డాణంగా చుట్టుకొని ఉన్న భూమి అనే కన్యను రక్షించడంలో సామర్థ్యంగల తన కుడిచేతిని ఆలంబనంగా ఇచ్చి, స్వేదంతో ఒడలంతా తడిసినది, సఖీజనులకు కామధేనువు వంటిదైన భృగువంశంలో జన్మించిన దేవయానిని నూతినుండి పైకి తీశాడు.

(సర్వం సహత ఇతి సర్వం సహా. సర్వమునూ సహించునదికనుక భూమికి ఈ పేరున్నది.)

ఈ విధంగా తనను నూతినుండి బైటకు తీసిన యయాతి మహారాజుతో చంద్రముఖి దేవయాని ఇలా అన్నది.

ఓ రాజా! ఈ నూతిలోనుండి నన్ను పైకి తీస్తూ నీవు నా కరగ్రహణం చేశావు. నీవే నా భర్తవు. ఇది దైవికమైన యోగం. పురుష ప్రయత్నానికి కూడా నా వాక్యం సిద్ధమైనదే. సర్వసుఖాలకు నిలయమైన నిన్ను వదిలి వేరొక వరుణ్ణి నేను కోరుకుంటానా? పద్మాల మకరందాన్ని తాగ మరగిన తుమ్మెద మరొక పుష్పమకరందాన్ని కోరుకోదు కదా!

అంతేకాక, ఓ గుణవంతుడా! వినుము. నేను శుక్రాచార్యుని కూతురు అయిన దేవయానిని. పూర్వం బృహస్పతి కుమారుడు కచుడు మా తండ్రి వద్ద మృతసంజీవని విద్య అభ్యసించే సమయంలో, నేను అతనిని కామించాను. అతడు అంగీకరించని కారణంగా అతడు నేర్చిన మృతసంజీవనీ విద్య నశించిపోవాలని నేను శపించాను. అతడు నీకు బ్రాహ్మణుడు భర్త కాకుండా పోతాడు అని శపించాడు. ఆ కారణంగా నాకు బ్రాహ్మణుడు ప్రాణనాథుడు కాడు. నీవే నా పతివి అని పలుకగా తాను దేవయానిపై మనసు పడి తొందరపాటు ఏమాత్రం లేకుండా ఆలోచించి

దైవయోగం కాకపోతే, నా మనస్సు బ్రాహ్మణసుతను వరిస్తుందా? ఈశ్వరాజ్ఞ కూడా ఈ విషయంలో ఇలాగే ఉంది కాబోలు! అని భావించి రాజైన యయాతి దేవయానిని వరించాడు. ధీరబుద్ధులకు చేయవలసిన పనులు చేయకూడని పనులు అనే సందేహం కలిగినప్పుడు వారి వారి మనస్సులే అందుకు ప్రమాణం.

ఈ విధంగా యయాతి వరించి వెళ్ళిన తరువాత దేవయాని తండ్రివద్దకు వచ్చి శర్మిష్ఠ అన్నమాటలు చేసిన చేష్టల సమాచారం అంతా చెప్పి విలపించగా

క్రూరాత్ముల ఇళ్ళలో పురోహిత వృత్తి చేస్తూ జీవనం సాగించడంకంటె పావురాలలాగా రాళ్ళు తిని బతకడం ఇంతకంటె చాలా ఉచితంగా ఉంటుంది.

(పావురాలు ఆహారం జీర్ణం అవడానికి గులకరాళ్ళు తింటాయని ప్రతీతి. పావురాలలాగా బతకడం అంటే దేనినీ ఆశించక ఏది దొరికితే దాన్ని తిని జీవించడం అని భావం.)

ఈ విధంగా వృషపర్వునివద్ద ఉండడం తప్పని భావించి శుక్రాచార్యుడు తన కొమార్తెను తీసికొని వృషపర్వపురాన్ని వదిలి వెళ్ళుతూ ఉండగా, ఈ విషయం తెలిసిన వృషపర్వుడు శుక్రాచార్యుని వలన మాత్రమే దేవతలను గెలవగలం అని తెలిసినవాడు కాబట్టి శుక్రాచార్యుని దారి కడ్డుపడి పాదాలపై బడి శుక్రాచార్యుణ్ణి ప్రసన్నం చేసికోగా, కోపం విడిచిన శుక్రాచార్యుడు శిష్యుడైన వృషపర్వునితో ఇలా అన్నాడు.

కూతురైన శర్మిష్ఠ తన చెలికత్తెలు వేయిమందితో నా కూతురికి దాస్యం చేస్తే నా కోపం తీరుతుంది. అలా చేస్తేనే నా కూతురుతో నీ రాజ్యానికి వస్తాను అనగానే వృషపర్వుడు సఖీబ్బందంతో కూడిన శర్మిష్ఠను దేవయానికి సేవ చేయడానికి వెంటనే నియోగించాడు.

తండ్రియైన వృషపర్వుడు తన్ను ఆదేశించగా, ఇంక పట్టుదల ఎందులకని నిష్ఠతో, సఖీజన సహస్రంతో, శర్మి
ష్ఠ కోపాగ్నిచే బాధపడుతూ, గర్వానికి నిలయమైన దేవయానిని సమీపించి ఆమె పగ చల్లారేలా ఆమెకు దాసి అయ్యింది.

అటు తరువాత, అతిశయించిన వేడుకతో వృషపర్వుని మంత్రియైన శుక్రుడు రాక్షస రాజు కొమార్తెతో కూడిన తన సుతను పిలిచి, ప్రీతితో, అధిక ఐశ్వర్య సంపన్నుడు, క్షత్రియుడు, నిర్భయుడు, సాధువిధేయుడు, అచ్చమైన కీర్తి గలవాడు దుష్టశత్రువుల పీచమణచ గలవాడు అయిన యయాతికిచ్చి పెండ్లి చేశాడు.

ఈ విధంగా యయాతికి శుక్రాచార్యుడు తన కొమార్తె అయిన దేవయానిని ఇచ్చి పెండ్లిచేసి, శర్మి
ష్ఠతో మాత్రం నీవు కలుసుకో కూడదు అని నిబంధన చేసి వెళ్ళిపోయాడు. పిదప ఆ దేవయాని యయాతివల్ల యదువు, తుర్వసుడు అనే కుమారులను కని, ఒకనాటి రాత్రి ఋతుమతియై బయట ఉండగా, శర్మిష్ఠ అదనుకోసం ఎదురుచూచి, ఒంటరిగా ఉన్న యయాతి దగ్గరకువచ్చి, మన్మథ ఆవేశానికి లోనై తన కోరికను తెలియజేయగా

శుక్రాచార్యులు యయాతికి శాపం బొసంగుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

పంచాంగం

Yayati Charitramu - యయాతి చరిత్రము

యయాతి చరిత్రము

రాజైన యయాతి అల్లుడుగను, భృగువంశ్రేష్ఠుడు, బ్రహ్మఋషి అయిన శుక్రాచార్యుడు మామగా అవడం ఏ విధంగా జరిగింది? క్షత్రియుడు క్షత్రియ కన్యను వివాహమాడుటకు కోరవచ్చు గాని విప్రకన్యను (బ్రాహ్మణకన్యను) స్వీకరించుట తగునా?

ఆ పరీక్షిత్తు ప్రశ్నకు శుకమహర్షి ఇలా బదులు చెప్పాడు.

ఒకనాడు ప్రొద్దు గడవక దానవ రాజపుత్రిక శర్మిష్ఠ గురుపుత్రిక దేవయానితో వేలమంది సఖీజనులు వెంటరాగా, బాగా పూచి ఉన్న ఉద్యానవనంలో గుబురుగా ఎదిగిన మామిడిచెట్ల సమీపంలో ఉన్న సరోవరానికి వెళ్ళి, ఆ సరోవరంలోని పద్మాల మకరందాన్ని గ్రోలుతూ ఉన్న తుమ్మెదలు చేసే శబ్దానికి గంతులువేస్తూ కట్టిన చీరలు విడిచి సరస్సులోనికి దిగి ఒకరిపై ఒకరు నీళ్ళు చిమ్ముకుంటూ అందరూ ఆనందిస్తూ ఉండగా అటుగా నంది వాహనుడు తలపై చంద్రకాంతి చిమ్ముతూ ఉండగా పార్వతితో కూడి ఈశ్వరుడు ఆ ప్రాంతానికి వచ్చాడు.

పరమేశ్వరుని చూచి ఆ సరస్సులో స్నానం చేస్తున్నవారంతా సిగ్గుపడి, తత్తరపాటుతో గట్టుపైకి వచ్చి, వస్త్రాలు కట్టుకొంటున్న సమయంలో రాక్షస రాజపుత్రిక శర్మి
ష్ఠ రాక్షస గురువైన శుక్రాచార్యుని కొమార్తె దేవయాని వస్త్రాన్ని ధరించింది. అది చూచి దేవయాని తెలిసి తెలిసి దాసివైన నీవు నా వస్త్రాన్ని ఎలా ధరించావు అంటూ ఎత్తిపొడుపు మాటలు పలుకుతూ ఇంకా
దేవయాని ఇలా అంది.

పరమాత్మ ముఖంనుండి బ్రాహ్మణకులం ఉద్భవించింది. ఈ బ్రాహ్మణులందరు లోకానికి మేలు కలిగించే వైదిక ధర్మమార్గాలు తెలిపేవారుగా కీర్తి పొంది ఆకాశాన్ని అందే ఎత్తు ఎదిగారు. అందులో భార్గవులు గొప్ప నడవడి గలవారు. అందునా శుక్రుడు బుద్ధిమంతులచే సేవింపదగినవాడు. నేను వాని పుత్రికను. రాక్షస వంశంలో జన్మించిన ఓ సేవకురాలా ఇంత గొప్పదాననైన నా వస్త్రాన్ని నీవెలా కట్టుకున్నావు?

ఎంతో మహిమ గల బ్రాహ్మణ స్త్రీల సంపదలు ఇతర స్త్రీలకు లభిస్తాయా? కుక్కలకు బంగారపు గొలుసులు వేసినంత మాత్రంచేత దేవతలకు దక్కవలసిన హవిర్భాగాలు కుక్కలకు లభిస్తాయా?

మీ తండ్రి శిష్యుడు. మా తండ్రి గురువు. అందుచే నీవు నన్ను ఎంతో గౌరవంగా చూడాలి. కొంచెమైనా ప్రేమ లేకుండా ప్రీతి కలిగించకుండా, నీ దుశ్శీలంతో నన్ను అవమానపరుస్తావా?!

ఆ విధంగా మండిపడుతున్న దేవయాని మాటలు విని శర్మి
ష్ఠ పెద్దగా అరుస్తూ బుసకొడుతున్న ఆడుపాములా నిట్టూర్పులు విడుస్తూ పెదవులు కొరుకుతూ ఇలా అంది.

మా తండ్రిని మీ తండ్రి ఐన శుక్రాచార్యుడు బిచ్చగానివలె దయాధర్మ భిక్షం అడుగగా, మా తండ్రి మిమ్మల్ని సంరక్షిస్తున్నాడు. చివరికి ఆశ్చర్యంగా ఒడలు మరచి రాజసుతవలె సుగుణవతిని, రాక్షస రాజపుత్రికను ఐన నాతో సమానంగా పేలుతోంది. ఓ చెలికత్తెలారా! దీనిని కడుపు పగిలేలా నూతిలోనికి తోయండి.

అని పలికి, చెలికత్తెల బృందంతో పట్టించి, గర్వంతో, రాక్షస రాజపుత్రిక శర్మి
ష్ఠ వస్త్రం ఈయకుండా దేవయానిని నూతిలోనికి దుఃఖించేలా తోయించింది.

ఈ విధంగా శర్మి
ష్ఠ దేవయానిని నూతిలోనికి త్రోసిపోయిన పిమ్మట యయాతి మహారాజు వేటాడుతూ అడవి అంతా తిరుగుతూ అదృష్టం కొలదీ దేవయాని ఉన్న నూతివద్దకు వచ్చి అందులో

నూతి నీళ్ళలో పడి వస్త్రం లేక బంధువులనందరిని పిలుస్తూ బయటకు రావడానికి వీలులేక బావిలో చిక్కుకొనిపోయి సిగ్గు అనే సముద్రంలో మునిగిపోయిన దేవయానిని చూచాడు యయాతి మహారాజు.


దేవయాని యయాతిని వరించుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

పంచాంగం

Vishwamitra Charitra - విశ్వమిత్రుని చరిత్రము

విశ్వమిత్రుని చరిత్రము

గాధికి అగ్నితో సమానమైన తేజస్సుగల విశ్వామిత్రుడు జన్మించాడు. ఈ విశ్వామిత్రుడు రాజు అయినప్పటికి తన రాజధర్మాన్ని, క్షాత్రధర్మాన్ని వదిలి తన తపోబలంతో బ్రహ్మర్షి అయ్యాడు. నూర్గురు సుతులను కన్నాడు.

భృగువంశంలో జన్మించిన అజీగర్తుడు అనే వానికొడుకు శునశ్శేపుడు హరిశ్చంద్రునికి తన తల్లిదండ్రులచే యజ్ఞపశువుగా అమ్మబడ్డాడు. అతడు యజ్ఞస్తంభానికి కట్టివేయబడగా బ్రహ్మ మొదలైన దేవతలను స్తుతించి, మెప్పించి పితృదేవతల చేత బంధవిముక్తుడయ్యాడు. ఆ శునశ్శేఫునియందు దయగలిగిన విశ్వామిత్రుడు తన పుత్రులతో ఇలా అన్నాడు.

(అజీగర్తుడు భృగువంశంలో జన్మించాడు. ఒక సమయంలో క్షామం వచ్చింది. ఆహారంలేక అందరూ బాధపడుతున్నవేళ ఈ అజీగర్తుడు తన కుమారుడైన శునశ్శేపుణ్ణి హరిశ్చంద్రునకు అమ్మివేసినాడు. హరిశ్చంద్రుడు ఈ శునశ్శేపుణ్ణి యాగపశువును చేసి యూపస్తంభానికి కట్టాడు. ఈ శునశ్శేఫుడు తనను యజ్ఞపశువుగా బలి చేస్తారనే భయంతో బ్రహ్మాది దేవతలను ప్రార్ధించాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. పితృదేవతలచే శునశ్శేపునకు బ్రహ్మ దయవల్ల బంధవిముక్తి అయ్యింది. హరిశ్చంద్రునకు యాగఫలం లభించేలా చేశాడు. బ్రహ్మ దేవతలు వచ్చి ఈ శునశ్శేఫుని విడిపించారు. కాబట్టి ఇతనికి దేవరాతుడనే పేరు వచ్చింది. ఈ శునశ్శేఫుడనే దేవరాతునిమీద విశ్వామిత్రునకు ప్రేమ కలిగింది.

శునశ్శేఫుని అమ్మిన కారణంగా తదుపరి అజీగర్తునకు పిశాచత్వం వచ్చింది. తన మూలంగా తండ్రికి పిశాచత్వం వచ్చిందని తెలిసికొన్న శునశ్శేపుడు గౌతమీతీరంలో తపస్సు చేశాడు. శివుడు విష్ణువు ప్రత్యక్షం అయ్యారు. వారి అనుగ్రహంతో ఈ శునశ్శేఫుడు తన తండ్రికి వచ్చిన పిశాచత్వాన్ని పోగొట్టాడు.)

ఈ శునశ్శేఫుణ్ణి నేను కళ్ళారా చూచాను. ఇతడు నాకు ప్రియమైన కుమారుడు. వీనిని మీరందరూ ప్రేమతో అన్న అన్న అని పిలవండి. ఇతణ్ణి గౌరవించండి అని విశ్వామిత్రుడు తన కొడుకులతో అనగా వారు మదించిన వారై

ఇతడు మాకు అన్న అగునా! బాగు బాగు. మేము ధన్యులమయ్యాం అంటూ గేలి చేస్తున్న తన కుమారులను చూచి, సంయమనం విడిచి "మీరు మ్లేచ్చులు అయిపొండి" అని శపించి వెళ్ళిపోతూ ఉండగా

ఆ సమయంలో తండ్రి ఇచ్చిన శాపానికి భయపడి విశ్వామిత్రసుతులలో నడిమివాడైన మధుచ్చందుడనే వాడు యాభైమంది సోదరులతోవచ్చి తండ్రికి నమస్కారంచేసి 'ఓ తండ్రీ నీవు చెప్పిన విధంగా ఈ శునశ్శేపుని మేము మాకు అన్నగా భావించి మన్నించి నమస్కరిస్తాము అని అనగా విశ్వామిత్రుడు ఆనందించి మంత్రద్రష్ట్ర అయిన శునశ్శేపుని వారిలో పెద్దవాణ్ణి చేసి (ఆ యాభై మందికి అగ్రజుని గావించి) మధుచ్చందునితో ఇలా అన్నాడు.

ఓ కుమారులారా! తండ్రిమాటను వినాలనే ధర్మం మీరు తప్పని కారణంగా ఈ శునశ్శేఫుడు నాకు కొడుకయ్యాడు. మీరంతా ఈ దేవరాతునితో ప్రేమతో ప్రవర్తించి మీరు కడుపారా సుతులను పొందండి.

అలా విశ్వామిత్రుడు మధుచ్చందాదులతో చెప్పాడు. శునశ్శేఫుడు దేవతలచేత విముక్తి పొందడంచేత దేవరాతుడని పేరు పొందాడు. మధుచ్చందుడు మొదలైన ఏబదిమంది దేవరాతునకు సోదరులయ్యారు. పెద్దవాళ్ళైన అష్టక, హారీత, జయంత, సమదులు మొదలైనవారు ఏబదిమంది వేరుగా వెళ్ళిపోయారు. ఈ క్రమంలో విశ్వామిత్రుని సుతులు, రెండు విధాలుకాగా విశ్వామిత్ర సుతులలోనే మరొక ప్రవర కలిగింది అని చెప్పి భాగవతాన్ని పరీక్షిత్తుకు చెప్పే శుకుడు ఇలా అన్నాడు.

ఆ పురూరవుని కొడుకైన ఆయువునకు నహుషుడు, క్షత్రవృద్దుడు, రజి, రంభుడు, అనేనస్సు అనేవారు జన్మించారు. వారిలో క్షత్ర వృద్దుడు అనేవానికి కుమారుడైన సుహోత్రునకు కాశ్యుడు, కుశుడు కృత్స్నమదుడు అనే ముగ్గురు సుతులు కలిగారు. ఆ కృత్స్నమదునకు శునకుడు, శునకునకు శౌనకుడు, గొప్పవాడైన శౌనకునకు బహ్వృచ ప్రవరుడు జన్మించారు. ఆ బహ్వృచప్రవరుడు నియమవంతుడై తపస్సు చేసికోవడానికి వెళ్ళాడు.

ఇక కాశ్యుడు అనేవానికి కాశి, కాశికి రాష్ట్రుడు, రాష్ట్రునకు దీర్ఘతపుడు అనేవారు జన్మించారు.

(విశ్వామిత్రుని కొడుకులు రెండు భాగాలుగా విడిపోయారు. తండ్రి మాట విని శునశ్శేఫుని సోదరునిగా గ్రహించిన మధుచ్చందాదులు ఒకవర్గం, తండ్రి మాట వినక శాపగ్రస్తులైన అష్టక హారీత జయంత సమదాదులు వేరొక వర్గంగా ఏర్పడ్డారు. ఈ విధంగా విశ్వామిత్ర సుతులలో రెండు ప్రవరలు ఏర్పడ్డాయి. ప్రవర అంటే పై తరాల చరిత్ర.)

ఆ దీర్ఘతపుడనేవానికి విష్ణుమూర్తి అంశతో ఆయుర్వేదం తెలిసినవాడు, ఎల్లరు కొలువదగినవాడు అయిన 'ధన్వంతరి' జన్మించాడు. ఆ ధన్వంతరిని కీర్తనచేస్తే కష్టాలు బాధలు తీరుతాయి.

శ్రీ విష్ణుమూర్తి అంశతో జన్మించిన ధన్వంతరి యజ్ఞంలోని హవిస్సులు స్వీకరింప అర్హుడు. ధన్వంతరికి కేతుమంతుడు, అతనికి భూమరథుడు, భూమరథునకు దివోదాసుడని చెప్పబడే ద్యుమంతుడు జన్మించారు. ఆ ద్యుమంతునకు ప్రతర్దనుడు జన్మించాడు. ఆ ప్రతర్దనుడు శత్రుజిత్తని, ఋతధ్వజుడని పిలువబడ్డాడు. ఆ ప్రతర్దనునకు కువలయాశ్వుడు జన్మించాడు.

ఓ పరీక్షన్మహారాజా! కువలయాశ్వుడనే రాజు లలిత పుణ్యుడైన అలర్కుని కన్నాడు. ఆ అలర్కుడు భూమిని అరవై ఆరువేల ఏండ్లు పాలించాడు. అలర్కునివలె భూమిని పాలించినవారు లేరు.

ఆ అలర్కునకు సన్నతి, వానికి సునీతుడు, వానికి సుకేతనుడు, వానికి ధర్మకేతువు వానికి సత్యకేతువు, వానికి ధృష్టకేతువు, అతనికి సుకుమారుడు, అతనికి వీతిహోత్రుడు, అతనికి భర్గుడు, ఆ భర్గునకు భార్గభూమి జన్మించారు.

ఓ వంశశ్రేష్ఠా! కాశ్యవసుమతీశుని నుండి ఈ భార్గభూమి వరకు గల రాజులు క్షత్రవృద్ధుని వంశంలో పుట్టినవారై, కాశులనే పేరుతో భూమిపై ప్రసిద్ధి పొందారు.

క్షత్రవృద్దుని రెండవ కొడుకైన కుశునకు ప్రీతి, వానికి సంజయుడు, వానికి జయుడు, వానికి కృతుడు, వానికి హర్యధ్వనుడు, వానికి సహదేవుడు, వానికి భీముడు, వానికి జయత్సేనుడు, వానికి సంకృతి, వానికి జయుడు వానికి క్షత్రధర్ముడు పుట్టారు. వీరంతా క్షత్రవృద్దుని వంశంలోగల రాజులు.

రంభునికి రభసుడు, వానికి గంభీరుడు, వానికి కృతుడు జన్మించారు. ఆ కృతునకు బ్రహ్మకులం పుట్టింది. అనేనసునకు శుద్ధుడు, వానికి శుచి, శుచికి బ్రహ్మకు సారథ్యంచేసే త్రికకుత్తు జన్మించారు. ఆ త్రికకుత్తుకు శాంతరజుడు పుట్టాడు. ఆ శాంతరజుడు విజ్ఞాని, కృతకృత్యుడు విరక్తుడు.

ఓ పరీక్షన్మహారాజా! రజి అనేవానికి అధికమైన బలంగల ఐదువందల మంది కొడుకులు జన్మించారు. దేవతల ప్రార్ధనలు విని రజి ఎందరో రాక్షసులను చంపి స్వర్గాన్ని దేవేంద్రునకు ఇచ్చాడు. దేవేంద్రుడు కృతజ్ఞతగా రజి పాదాలకు నమస్కరించి, అతనికి దేవతాశరీరాన్ని ఇచ్చాడు. సంతోషంగా రజిని అర్చించాడు. కొంతకాలానికి రజి మృతి చెందాడు. అతని ఐదువందలమంది సుతులు దేవేంద్రుడు ప్రార్థించినా వినకుండా స్వర్గలోకాన్ని తామే పాలించారు. గర్వంతో యజ్ఞయాగాదులలో హవిస్సులను కూడా వారు స్వీకరించారు.

దేవతల రాజు ఇంద్రుడు దేవగురువైన బృహస్పతిచే హోమం చేయించి, ఆ హోమప్రభావంతో బలాన్నిపొంది తన వజ్రాయుధంతో రజి కుమారులను ఐదువందల మందినీ చంపి స్వర్గాన్ని తన హస్తగతం చేసికొన్నాడు.

అది అలా ఉండగా నహుషునకు యతి, యయాతి, సంయాతి, ఆయాతి, వియతి, కృతి అనబడే ఆరుగురు కొడుకులు ప్రాణికి, పంచేంద్రియాలు మరియు మనస్సు అనే ఆరు ఇంద్రియాలవలె జన్మించారు. వారిలో పెద్ద కొడుకైన యతికి నహుషుడు రాజ్యం ఇయ్యగా అతడు విరాగియై

(విశ్వామిత్రుడు సృష్టికి ప్రతి సృష్టి చేసినవాడు. వైదికచ్చందం తర్వాత సృష్టించబడింది లౌకికచ్చందం. విశ్వామిత్ర సంభవుడు (కొడుకు) మధుచ్చంద. ఆయన వంశపరంపరలో యతి, యయాతి, సంయాతి, నాయాతి, వియతి, కృతి అనే వారు సంభవిస్తారు. ఇవన్నీ లౌకికఛందస్సంబంధితమైన పేర్లుకావటం విశేషం. మధుచ్చంద అనగా స్రవించే మధువు, ఛందంకూడా అంతే. యతులతో ఒప్పారి కృతి చివరగా కృతి ఉద్భవిస్తుంది.)

రాజ్యం పాపానికి మొదలు. ఈ రాజ్యం వస్తే ఒళ్ళు తెలియని గర్వం వస్తుంది. ఎంతటి జ్ఞానియైన రాజ్యాధికారం వస్తే ఎవరు పూజింపదగినవారో వారిని గుర్తించలేడు. అయినా ముక్తికోరేవారికి ఈ రాజ్యాలు గీజ్యాలు అవసరం లేదు కదా!

ఈ విధంగా మాట్లాడి యతి అనేవాడు రాజ్యాన్ని వదలి వెళ్ళిపోయాడు.

ఆ నహుషుడు నూరు యజ్ఞాలుచేసి, ఇంద్రపదవిని పొంది, ఇంద్రుని భార్య శచీదేవిని పొంద గోరి, మహర్షులు మోసే పల్లకినుండి సర్పమై జారి భూమిపై పడ్డాడు.

(నహుషుడు నూరు యజ్ఞాలు చేశాడు. దాని ఫలితంగా ఇంద్ర పదవి లభించింది. యజ్ఞం అనేది పవిత్ర కార్యం. అటువంటి నూరు యజ్ఞాలు చేయడం అందరివల్లా సాధ్యం కాదు. ఇన్ని యజ్ఞాలు చేసినా ఇంద్రపదవి పొందినా నహుషుని మనసులో పావిత్య్రం లేదు. తాను ఇంద్రపదవి పొందాడు. కాన ఇంద్రుని భార్య పరమపతివ్రత శచీదేవిని పొందగోరాడు. మహర్షులు పల్లకిపై నహుషుని శచీదేవి వద్దకు తీసికొనిపోతున్నారు. ఆ మహర్షులలో అగస్త్యుని శాపంవల్ల నహుషుడు సర్పమై నేలకూలాడు.

ఎంత జ్ఞానం ఉన్నా ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎంత ఎత్తుకు ఎదిగి ఇంద్ర పదవినందినా మానసిక పావిత్య్రం లేనివానికి అధోగతి తప్పదు అని నహుషుని కథ అందరికి తెలియజేస్తుంది.)

అన్న అయిన యతి విరక్తుడు కాగా, తండ్రి అయిన నహుషుడు ఇంద్రలోకమున కేగగా యయాతి రాజై తన నలుగురు సోదరులకు నాల్గుదిక్కుల రాజ్యాన్ని భాగంగా ఇచ్చి, శుక్రుని కొమరితను, వృషపర్వుని కూతురును (ఇద్దరిని) వివాహమాడి న్యాయవర్తనుడైన యయాతి రాజ్యభారాన్ని వహించాడు.

అనగా విని పరీక్షిత్తు అనే రాజు ఇలా అన్నాడు.

యయాతి చరిత్రము

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

పంచాంగం

Surya Eka Vimshati(21 Names) stotram - సూర్య ఏక వింశతి నామావళి(21 నామాలు)

సూర్య ఏక వింశతి నామావళి( 21 నామాలు) వికర్తనో వివస్వాంశ్చ మార్తాండో భాస్కరో రవిః । లోకప్రకాశకః శ్రీమాన్ లోకచక్షుర్మహేశ్వరః । లకసాక్షి త్రిలోక...