Monday, April 20, 2026

Wife-selling - భార్యావిక్రయం

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - భార్యావిక్రయం

అని రాజు తల నేలకు వేసికొని చింతాతరుడై యుంటగని యతని భార్య కన్నీరుగార్చుచు డగ్గుత్తికతో నిట్టులనెను: ఓ మహారాజా! నీ ధర్మము నీవు పాలింపుము. దిగులు పడకుము. సత్యమును ధర్మమును మీఱినవాడు ప్రేతవలె విడువదగిన వాడు. ఓ పురుషవర్యా! సత్యమును నిలుపుకొనజాలడో వాని నిత్య్యాగ్ని హోత్రము-అధ్యయనము-దానాదిక్రియలు అన్నియును వ్యర్థములే. ధర్మశాస్త్రములం దీ సత్యమహిమ మెంతగనో వర్ఱింపబడినది. 

ఇది పుణ్యాత్ముల నుద్ధరించును. పావులనణగ ద్రొక్కును. యయాతి మహారాజు నూఱశ్వ మేధ ములు-రాజసూయము-నొనర్చెను. కాని యొక్కసారి పల్కిన యసత్యము నకు స్వర్గభ్రష్టుడయ్యెను. 

రాజిట్లనెను: ఓ గజగామినీ! ఈ మన పుత్రుడు వంశము నిల్పువాడు గదా! కనుక నీవు చెప్పదలచు కొన్నది స్పష్టముగ జెప్పుము.

భార్య యిట్లనెను: రాజా! స్త్రీ పురుషుల దాంపత్యము పుత్రులు గల్గుటకే కదా! మన కా కోర్కి దీరినది. కనుక నన్నె వరికైననమ్మి మునికి దక్షిణయిమ్ము. సత్యము నిలువబెట్టుము. ఈ మాటలు వినగానే రాజు మూర్ఛితుడై కొంత తడవునకు తెప్పరిల్లెను. పిమ్మట కడు వగచి యిట్లనెను. 

ఓ కల్యాణీ! నీవు పల్కిన పల్కులవలన నాకు తీరని దుఃఖము గల్గుచున్నది. ఇక నీ మందహాసపూర్వక సంభాషణముల నీ పాపి మరచిపోవలసినదేనా! ఓ భామినీ! పవిత్రమగు చిరునగవు దానా! నీ వింతటిమాట యెటులు పల్కితివి. అక్కట ! ఇంతటి వనరానిమాట వినవలసివచ్చెనే! అని పలికెను. 

రాజునకు తన భార్యనే యమ్ముకొనుట అను మాటకు గుండె చెదరెను. పిమ్మట అతడు దుఃఖితుడై మూర్చపోయెను. నేలపై మూర్ఛితుడై పడియున్న రాజునుగని రాణివాపోవుచు దీనముగ నిట్లనుకొనెను : హామహామహీపతీ! నీవే దైవపు చెడుతలంపుతో నిట్టిదుఃస్థితికి గురియైతివి. 

రాజభవనములో పరుండవలసిన నీ విపు డీ కటికినేలపై పడియుంటివా! హా కటా! ఏ నా పతి మునుపు విప్రులకు కోట్లధనము దాన మిచ్చెనో యా భూపతియే నేడు నైలపై పడియున్నాడే ! అక్కటా! చెడు దైవమా ! ఈ రాజు నీకు మును పేమి కీడొనరించెనో కదా! ఇంద్రోపేంద్రులబోలు రాజేంద్రు డిట్టి దీనదశలో నిన్ని యిక్కట్టుల పాలయ్యెను. 

అని పలికి తన పతి దుఃఖమోహమును సహింపజాలక రాణియును బాధపడి మూర్ఛితురాలై పడిపోయెను. ఇట్లు వారిర్వురును మూర్ఛితు లగుటగని రోహితుడు అమ్మా! అన్నము; నాయనా! అన్నమని పేరాకట నకనకలాడెను. అమ్మా! ఆకలిమంట యెక్కువైనది. నాలుకపిడచ గట్టుచున్నది. పట్టెడన్నము పెట్టుమమ్మా అనెను.

ఇంతలో యమునివలె క్రోధముతో మహాతపస్వియగు విశ్వామిత్రుడు తన ధనము యాచించుట కేగుదెంచెను. మునిని చూడగనే హరిశ్చంద్రుడు మూర్ఛితుడై నేల కొఱగెను. అపుడు రాజు మొగముపై నీరు చల్లి 

ముని రాజున కిట్లనెను: ఓయి రాజేంద్రా! లేలెమ్ము. నీ వీయవలసిన దక్షిణ యిమ్ము. అప్పున్నవానికి క్షణక్షణమును దుఃఖములు పెరుగుచునే యుండును. చల్లని నీటి తాకుడునకు రాజూరటజెంది తెలివొంది విశ్వామిత్రునితో నేదియో పలుకబోయెను. అంతలో రాజు మరల మోహవశుడై పడిపోయెను. 

అదిగాంచి ముని రాజు నూరార్చి తీవ్రకోపముతో నతని కిట్లనెను: నీవు సత్యము నిలుపు కొనదలచినచో నా దక్షిణ నాకిమ్ము. సూర్యుడు సత్యమువలననే వెల్గుచున్నాడు. ఈ భూమి సత్యబలమున స్థిరముగ నున్నది. స్వర్గమును సత్యముపై నాధారపడియుండును. సత్యము పరమధర్మమని పేర్కొనబడును. వేయి అశ్వమేధముల ఫలము కంటె సత్యఫలము గొప్పది. రెంటిని తులలో తూచుము. అపుడు నూఱశ్వమేధములకంటె సత్యమువైపు మొగ్గుండును నీ కిట్టి వట్టిమాటలతో నేమి పని? 

రాజా! నా కీయవలసిన దక్షిణ యీనాటి ప్రొద్దు గ్రుంకు లోపల నీయనిచో నిన్ను తప్పక శపించి వేయగలను. అని పలికి ముని వెళ్ళిపోయెను. నిఱుపేదయగు రాజు ముని పరుషములకు దుఃఖితుడై భయాతురుడై యేమి తోచక చింతించుచుండెను. అంతలోనే వేదవిదుడగు నొక విప్రుడు పెక్కురు బ్రాహ్మణులు వెంటరాగ తన గృహము వెడలి యచటి కేతెంచెను. వచ్చిన బ్రాహ్మణుని గాంచి రాణి రాజుతో ధర్మార్థములుగల మాటలతో నిటుపలికెను.

బ్రాహ్మణుడు మూడు వర్ణములు వారికిని తండ్రివంటివా డందురు. కనుక తండ్రి ద్రవ్యమును తనయుడు తప్పక తీసికొనవచ్చును. ఇతని నిపుడు మనము యాచించుట మంచిదని తలంతును. 

రాజిట్లనెను : ఓ ముదితా! నేను క్షత్రియుడను. ఇతని ముందు చేయి చాపను. విప్రులు యాచింపవచ్చును. కాని క్షత్రియులు యాచింపరాదు. ఎల్ల వర్ణముల వారికి విప్రుడు గురుడు. నిత్యము పూజనీయుడు. కనుక నట్టి గురువు నెవడును యాచింపరాదు. ఈ పని క్షత్రియులకు మొదలే తగదు. క్షత్రియులకు యజనము. అధ్యయనము. దానము శరణార్థుల కభయమిచ్చుట. ప్రజలను చక్కగ పాలిచుట అనునవి విధింపబడినవి. ఒకని ముందు దీనముగ దేహి యనుట రాజులకు దగని పని. 

ఓ దేవీ! నా హృదయమున నిత్య మిచ్చెదనను మాటయే నిలిచి యుండుత. నేనెక్కడి నుండి యైన ద్రవ్యము దెచ్చి మునికీయగలను. భార్య యిట్లనెను. కాల మొకనిని సమస్థితిలో మఱొకనిని విషమ స్థితిలో పడవేయును. ఒకనికి సమ్మానము వేరొకని కవమానము గల్గించును. ఒకనిని దాతగ నింకొకని బిచ్చగానిగ చేయును. అంతటి పండిత మునియే నిన్ను తీవ్ర కోపముతో రాజ్య సుఖములకు దూరము చేసెను. ఈ కాలము చేత లెంత చిత్రములో చూడుము. రాజిట్లనెను. వాడి కత్తితో నా నాల్కను రెండుగ చీల్చినప్పటికిని నేను క్షత్రియా భిమానము కోల్పోయి దేహియని యాచింపను. ఓ కల్యాణీ! నేను క్షత్రియుడను. నేనొకని నెంత మాత్రమును యాచింపను. నా చెమటోడ్చి పొందిన ధనమే యీయగలను. 

భార్య యిట్లనెను: ఓ మహారాజా! ఒకనిని యాచించుటకు నీ మన సొప్పుకొనుట లేదు గదా! నేను నీ కింద్రాది దేవతల వలన న్యాయముగ నీయబడితిని గదా! కనుక నీ చేత శాసింపబడుటకు రక్షింపబడుటకు తగుదును. ఓ మహాద్యుతీ : నన్నమ్మి యా వచ్చిన ధనమును ముని కిమ్ము. అను నామె మాటలు విని హరిశ్చంద్ర రాజు హా! ఎంతటి కష్టముదాపురించెనే! యని యెంతయో దురపిల్లెను. 

రాణి మరల రాజుతో నిట్లనెను: నా మాట వినుము. విప్ర శాపాగ్మి కాహుతియై నీచత్వమేల పొందెదవు? నీవు నన్నొక జూదమునకుగాని త్రాగుడునుకగాని రాజ్యమునకుగాని భోగలకు గాని యమ్ముటలేదు. గురున కీయవలసిన ధనము కొఱకు నన్నమ్ముము. నీ సత్యత్రము సఫల మొనరింపుము.

వ్యాసుడిట్లనెను: రాజపత్ని తన్నమ్ముమని మాటిమాటికి ప్రేరేపించగ 

హరిశ్చంద్రుడామె కిట్లనెను: కల్యాణీ: నిన్ను దయమాలి యమ్మివేతునా! నీ కిట్టి బెట్టిదమైన మాట యిష్టమైనచో నేను సైతము మహాక్రూరులకు సాధ్యము గాని కఠినమైన పని చేయగలను. అని పలికి రాజు శోకాతురుడై తన భార్యను వెంటగొని నగరు లోని రాజ వీథిలో నిలువబడెను. 

కన్నీరు తొడిబడ తడపడు నుడులతో రాజిట్లనెను: ఓ పౌరులారా! మీరందఱు నా మాట నాలింపుడు. మీలో నెవనికైన దాసి కావల సినచోచెప్పుడు. నా ప్రాణప్రియ నమ్మగలను. నేను చెప్పినంతకు కొనుడు. నీ వెవరవు? నీ భార్యనేల యమ్ముచున్నావని పండితు లడిగిరి. 

రాజిట్లనెను: నీ వెవరవని నన్నేల యడిగెదరు. నేనొక క్రూరుడను. పశువును. నేను రాక్షసుడను. కఠినాత్ముడను. అందుచే నింత పాపము చేయుచున్నాను. అను రాజు మాటలు విని విశ్వామిత్రుడు వెంటనే విప్ర రూపమున వచ్చెను. ముని ముదుసలి విప్రురూపమునవచ్చి 

హరిశ్చంద్రునితో నిట్లు పలికెను: ఆదాసిని నాకిమ్ము. నేనుకొని నీకు వలసిన ధన మీయగలను. నాయొద్ద ధనము మూలుగుచున్నది. నాభార్య కడు సుకుమారి. ఇంటి పనులొక్కతెయే చేసుకొనలేకున్నది. కనుక నీమెను నా కమ్ముము. నేనీ దాసిని తీసికొందును. నీ కెంత ధన మీయవలయును. అని విప్రుడు హరిశ్చంద్ర నరపతితో బలకెను. అపుడు రాజు హృదయము దుఃఖముతో వ్రయ్యలయ్యెను. రాజునకు నోట మాట రాలేదు. 

విప్రుడిట్లనెను: నీ భార్య యొక్క వయస్సు - రూపు - శీలము - పని యన్నిట తగినవి. నీ భార్యకు తగిన ధనము తీసికొనుము. నాకు నీ బార్యనిమ్ము. ధర్మశాస్త్రములందు స్త్రీ పురుషులకు నిర్ణయింపబడిన వెల తెల్పుదు వినుము. ముప్పది రెండు లక్షణములు గల్గి-శీలగుణములు దక్షత గల యాడుది కోటి సువర్ణములు వెల చేయును. పురుషుడొక యర్బదము వెల చేయును. అను మాటలు విని హరిశ్చంద్ర రాజు మహాశోకములో నేమియు బలుకకుండెను.

పిదప విప్రుడు రాజు ముందొక వస్త్రముపై ధనముంచి రాణి తల వెండ్రుకలు పట్టిలాగెను. 

రాణి యిట్లనెను: ఓ విప్రా! వదలు - వదలుము. నా కొడుకు మొగమొకసారి చూడనిమ్ము. మరల నా కొడుకు దర్శనమగునో కాదో! ఆమె రాకుమారునితో నిట్లనెను. ఓ రాజపుత్రా! నీ తల్లి యిపుడొక దాసియైనది. నీవు నన్ను తాకకుము. నిన్ను తాకుటకును నేను తగను. పిదప తన తల్లిని ముని లాగుచుండుట జూచి బాలుడు వెంటనే అమ్మాయని కన్నుల నీరు నింపుకొని యేడ్చుచు తల్లిని జేరెను. బాలుడు తన తల్లి చీర చెఱగు పట్టుకొని లాగుచు నేడ్చుచుండుటగని విప్రుడతనిని కోపముతో కొట్టెను. అయినను బాలుడు తన పట్టిన పట్టు వదలక అమ్మాయని బావురుమని యేడ్చెను. 

విప్రునితో రాణి యిట్లనెను: బాలుని సైతముకొని నాకు సంతోషము గల్గించుము. నేను నా బాలుడు లేనిచో నీ పనులు చక్కగ చేయజాలను. కనుక నీ నిర్మాగ్యురాలి పట్లదయ బూని యితనిని కొనుము. 

రాజుతో బ్రాహ్మణుడిట్లనెను: ఇదిగో! ఈ ధనము తీసికొని బాలుని కూడ నాకిమ్ము. ధర్మశాస్త్రవిధులు స్త్రీ పురుషులకు వేర్వేరుగ వెలలు గట్టిరి. పండితులు స్త్రీల గుణములను బట్టి కొందఱికు నూఱు-వేయి-లక్షమఱి కొందఱికి కోటి వెల నిర్ణయించిరి. ఒక యువతి ముప్పదిరెండు శుభ లక్షణములు నేర్పుగల్గియుండవలెను. ఆమె కోటి బంగారు ముద్రల విలువ చేయును. ఇక పురుషుని వెల అర్బుదము. 

సూతుడిట్లనెను: విప్రుడు వస్త్రముపై పురుషుని వెల యంద ధనముంచెను. అతడు బాలుని తీసికొని యతని తల్లితో బంధించెను. ఇట్లు విప్రుడు ప్రమోదముతో వారిని తీసికొని తన యింటి కేగెను. రాణి వెళ్ళుటకు పూర్వము తన భర్తకు ప్రదక్షిణ మొనరించి యతని ముందు మోకరిల్లి కన్నీరు జలజలరాల దీన ముగ నిట్లు పలికెను. 

నేను పూర్వము చేసిన దానము గాని హోమముగాని బ్రాహ్మణ సంత్పరణముగాని యున్నచో దాని పుణ్యమున హరిశ్చంద్రుడు నాకు మరల భర్త యగుత. తనకు ప్రాణముల కన్న ప్రియురాలగు భార్య యట్లు తల పాదాలపై పడుట చూచి రాజు వ్యాకులచిత్తుడై అక్కట! యెంత కష్టము వచ్చెనే! యని వాపోయెను.

ఒక చెట్టు నీడ చెట్టు నెన్నడును వీడదు. మఱి సత్యశీల గుణముల గల యీమె యెట్లు వియోగము చెందును. ఇట్లు భార్యతో రాగానుబంధము గల మాటలాడి పిదప 

రాజు తన కొడుకునుద్దేశించి యిట్లనెను : నీవు నన్ను వదిలి యెట కేగుదువు? ఇక నాకేది దిక్కు! నా దుఃఖము బాపు వాడెవడు! ఓ బ్రాహ్మణుడా! నాకు రాజ్యము వదిలనపుడు గాని వన వాసమున గాని దుఃఖము గలుగలేదు. కాని యీ పుత్త్ర వియోగమున నాకు మిక్కిలి దుఃఖము గల్గుచున్నది. లోకమున సద్బావము గల భర్త యున్నచో నతని భర్యకు సుఖము గల్గును. 

ఓ కల్యాణీ! ఇక్ష్వాకు వంశజాతుడు సకల రాజ్య సుఖములకు తగినవాడు దుఃఖార్తుడునైన నా వంటి రాజుచే దుఃఖితురాలవైతివి. ఇట్టి నన్ను పతిగ బొంది నీవు వేరొకనికి దాసి వైతివి. ఇట్లు నేనెంతయో శోకసాగరమున మునిగితిని. దేవి : నాకు పురాణకథలు వినిపించి నన్నుద్ధరించు వాడెవడు? అని రాజు పలికి చూచుచుండగనే విప్రుడామెను బెత్తాలతో గొట్టెను. అట్లు కొట్టుచు విప్రు డామెను కొనిపోసాగెను. 

అట్లు తన భార్యాపుత్రులు కొనిపోబడుట రాజు చూచెను. రాజు దుఃఖార్తితో వేడి నిట్టూర్పులు నిగుడించుచు భోరున నేడ్చెను. నా భార్యను వాయువు గాని సూర్యుడు గాని చంద్రుడు గాని ఇతరులు గాని చూడజాలరు. అట్టి చూడబడని నా భార్యనేడొకనికి దాసియయ్యెనే! అకట! ఈ సుకుమారుడు సూర్యవంశజుడు-మెత్తని చేతి వ్రేళ్ళుగలాడు-ఇట్టి బాలుడమ్ముడు పోయెనే! నేనెంత దుర్మతిని. వ్యర్థుడను: ఓ ప్రియురాలా: ఓ కుమారకా! అనార్యుడనగు నా వలన మీ కెం దుర్గతి వచ్చెనే! దైవము వలన నింతటి దుర్దశ బొందియును నేను చావకున్నానే అని రాజు విలపించుచుండగనే విప్రుడు అదృశ్యుడయ్యెను. 

ఇట్లువిప్రుడు పొడవైన చెట్లు మేడలు దాని వారినిగొని త్వరగవెళ్ళెను. అంతలో మహాతపుడగు విశ్వామిత్రుడచటి కేతెంచెను. అతడు క్రూరమైన చూపులతో నిష్టురముగ శిష్యులను వెంటగొని వచ్చెను. 

విశ్వామిత్రు డిట్లనెను: ఓ రాజా! మున్ను నీవు రాజసూయ దక్షిణ యిత్తునని మాటయిచ్చితివి. ఓ మహానుభావా! నీవు సత్యవంతుడవైనచో దక్షిణ యిమ్ము.

హరిశ్చంద్రు డిట్లనెను: రాజర్షీ! నీకు నమస్కారము ఈ దక్షిణ స్వీకరింపుము. అనఘా మునుపు నేను రాజ సూయ యాగమునకు దక్షిణ యిత్తునంటిని. విశ్వామిత్రు డిట్లనెను. ఈ దక్షిణగ నిచ్చు ధన మెచట లభించెను. రాజేంద్రా ! నీ వెట్లు ధనము గడించితివో నాకు తెల్పుము. 

రాజిట్లనెను: అనఘా! మహానుభావా! దానిని గూర్చి చెప్పుటేల! సువ్రతా! విప్రా! దానిని వినిన కొలది శోకమే పెల్లుబుకుచుండును. ఋషి యిట్లనెను. నేను న్యాయార్జితమైన ధనమే గ్రహింతునుగాని అన్యాయార్జితమును గ్రహింపను. రాజా! ఈ ధనమెట్లు వచ్చెనో నిజము తెలుపుము. 

రాజిట్లనెను: నా భార్యను కోటి సువర్ణముల కమ్మితిమి. నా రోహితుడను కొడు కర్బదమున కమ్ముడుపోయెను. విప్రా ! నీవీ పదునొకండు కొట్ల సువర్ణము గ్రహింపుము. సూతుడిట్లనెను. భార్యాపుత్రుల నమ్మి సంపాదించిన ధనము స్వల్పమైనది. అని ముని పలుకగనే రాజుమఱల శోక సంతప్తు డయ్యెను. 

ముని కోపించి యిట్లనెను: ఇది రాజసూయ యజ్ఞమునకు దక్షిణ గాదు. ఇంక కొంత సంపాదింపుము. దానివలన దక్షిణ పూర్తిగా గలదు. ఓరీ! క్షత్రియాధమా! ఈ నీ ధనము దక్షిణకు సరిపోవువని తలతువేని వెంటనే నా తపోబలము చూతువుగానిలే. నా నిర్మల తపోవీర్యము-బ్రాహ్మణ ప్రభావము-అధ్యయన బలము-నాశక్తి చూతు గానిలే! 

రాజిట్లనెను: ఓ భగవానుడా! నీ కింకను ధన మీయగలను. కొంతకాల మోపిక పట్టుము. ఇపుడే నా భార్యాపుత్రుల నమ్మితిని గదా! 

విశ్వామిత్రు డిట్లనెను: ఓ రాజా! దినము లోని నాల్గవ భాగము మాత్రకు నేనెదురు చూడవలసియున్నది. అది గడచిన పిదప నీతో బలుకవలసిన పని నాకు లేదు.

Rajyadanam - రాజ్యదానం

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - రాజ్యదానం

కాని మునికి విరుద్ధముగ మాటాడలేదు. పిదప ముని త్రోవ జూపగ రాజు తన నగర మేగెను. విశ్వామిత్రుడును రాజును వంచించి తన యాశ్రమ మేగును. వివాహ విధి జరిపిన పిమ్మట 

విశ్వామిత్రుడు రాజుతో నిట్లనెను : ఓ రాజా! ఈ యజ్ఞవేదికపై నేను కోరిన దానమిమ్ము. 

రాజిట్లనెను: ఓ బ్రాహ్మణోత్తమా! నీ కోరిక యేమి తెల్పుము. తప్పక తీర్తును. నేను కీర్తికాముడను. ఈ ప్రపంచమం దసాధ్యమైనదైన తప్పక యీయగలను. ఎంత ధనమున్నను కీర్తిలేనిచో వ్యర్థమే గదా! కనుక పరలోకసుఖము గల్గించు యశము సంపాదింపనిచో వ్యర్థమే.

విశ్వామిత్రు డిట్లనెను : ఓ మహారాజా! మీ సర్వస్వమును నీ రాజ్యమంతయును దానమిమ్ము. ఈ పవిత్రవేదిక సమీపమున గజాశ్వరథరత్నములన్నియు దానమిమ్ము. అను ముని వాక్కులకు రాజు మాయామోహితుడయ్యెను. రాజు ముందువెనుక లాలోచింపకయే స్వేచ్ఛగ దానమిచ్చితి ననెను. 

విశ్వామిత్రుడు పుచ్చుకొంటిననుచు నిష్ఠురముగ నిట్లు పలికెను. రాజేంద్రా! మహామనీషీ! దానమునకు యోగ్యమగు దక్షిణనిమ్ము. దక్షిణలేని దానము వ్యర్థమైనదని మనువు పలికెను. కనుక నీవు దానమునకు తగినంత దక్షిణ నిమ్ము. అను ముని వాక్కులకు విస్మయమంది 

రాజు ముని కిట్లనెను: స్వామీ! సాధూ! ఇపుడు నన్ను దక్షిణ నీయగలను. నిశ్చితంగ నుండుము. అది విని 

ముని రాజున కిట్లనెను: ఇప్పుడు నాకు రెండున్నర బరువుల బంగార మిమ్ము. అనగనే రాజు విస్మయమంది యిచ్చితినని మునికి మాట యిచ్చెను. అదే సమయమున సైనికులు రాజును వెదుకుచు వచ్చి చూచి సంతోషించిరి. వారు చింతాతురుడగు రాజునుగాంచి పొగడిరి. 

వారి మాటలు విని రాజు మంచిచెడ్డ లేమియు బలుకక తన చేసిన పనికి చింతించుచు తన యంతిపురము జేరెను. నేనెంత పని చేసితిని! నా సర్వస్వమును దానము చేసితిని. ముని దొంగవానివలె నన్ను వంచించెను. మునికి నా సకల రాజ్యమును రెండున్నర బరువుల బంగారమును దాన మిచ్చెదనని ప్రతిన బూనితిని. 

నా మతి చలించినది. ముని కపటనాటక మెఱుగనైతిని. తబిసి-బాపడు-నగు మునిచే మోసపోతిని. ఇపుడేమి చేతును. దైవయాగ మెఱుగలేకపోతిని. హా! దైవమా! ఇంకేమి జరుగునో! అని విచారించుచు వికలచిత్తముతో రాజు తన యింటి కేగెను.

తన పతి చింతాపరుడగుటగని రాణి కారణ మడిగెను. ఏమి ఫ్రభూ! విచారముగ నున్నారేం? దిగులేల? నా కిపుడు తెలుపుము. ఆ నాడు వరుణుని వలన భయముచే వనములకేగిన మన కుమారుడు వనమునుండి తిరిగి వచ్చెను. మీరు రాజసూయ మొనరించితిరి గదా! 

రాజేంద్రా! ఇక శోకకారణ మేమి? వంతయేలోకో తెల్పుము. నీకు బలశీలిగాని దుర్బలుడు గాని యగు శత్రువులేడు. వరుణుడును నీయెడ ప్రసన్నుడయ్యెను. నీవీ భూతలమున ధన్యభాగుడవు. ఇక దిగులువదలుము. 

నరవరా! చింతచే శరీరము క్షీణించును. చింత చావువంటిది. కనుక చింత వదలుము. వివేకముతో నిశ్చింతగ నుండుము. అను తన ప్రియురాలి మాటలువిని రాజు తన చింతయొక్క మంచిచెడుల కారణము తెలిపెను. రాజు చింతాపరవశుడగుట వలన నతనికి భోజనము రుచించుటలేదు.

మెత్తని సెజ్జపై పరుండినను కంటినిండ నిద్దుర పట్టుట లేదు. మరునాడు వేకువనే రాజు లేచి సంధ్యావందనాదులు నిర్విర్తించుకొనుచున్నంతలో నచటికి విశ్వామిత్రుడేతెంచెను. సర్వము హరించిన మునితన రాక రాజునకు తెలిపెను. రాజు వచ్చి మాటిమాటికి మునికి మ్రొక్కెను. 

అపుడు ముని రాజున కిట్లనెను: రాజా! నీ రాజ్యము వదలుము. నీవు మాట యిచ్చినది నాకిమ్ము. రాజేంద్రా! బంగారము నొసంగుము. సత్యశీలివిగమ్ము. 

హరిశ్చంద్రు డిట్లనెను : విశ్వామిత్ర మునీ! స్వామి! నా రాజ్యమంతయును నీకు దానము చేసితిని గదా! దిగులొందకుము. ఇది వదలి మఱొకచోటి కేగుదును. బ్రాహ్మణుడా! విభూ! నా సర్వస్వమును నీవు గ్రహించితివి. ఇపుడు నేను బంగారమును దక్షిణగ నిచ్చు కశక్తుడను. నాకు దైవయోగమున ధనము లభించినచో నీకు తప్పక దక్షిణ చెల్లింపగలను.

మరియు రాజు మాధవి యను తన భార్యతో తన కొడుకుతో నిట్లనెను. నేనీ మునికి యజ్ఞవేదిక యందు నా రాజ్యము దానము చేసితిని. నా రథ-గజ-తురగములు-బంగారము-రత్నములు సర్వమును సమర్పించితిని. కాని మన మూడు శరీరము లతని కీయలేదు. 

కనుక మన మిపుడీ యయోధ్యవదలి యడవు లందలి గుహలకు వెళ్ళుదుము. ముని సకల సమృద్ధమగు రాజ్యమును గ్రహించుగాక. అని హరిశ్చంద్రుడు తన భార్యాపుత్రులతో బలికి తన భవనము వదిలి ధర్మబుద్ధితో మునిని గౌరవించుచు బయలువెడలెను. అట్లు రాజు వెడలుటగని యతని భార్యాపుత్రులును చింతాతురులై దీన ముఖములతో రాజు వెంట నడచిరి. 

వారట్లు వెడలుట గనిన పౌరులు హాహాకారములు చేసిరి. సాకేతపురవాసు లందఱును గొల్లున విలపించిరి. ఓ రాజా! ఎంత పని జరిగినది! నీకెక్కడి యాపద దాపురించెను! మంచిచెడు లెఱుగని దైవమే నిన్ను వంచించినది గదా! ఇట్లు రాజును నతని భార్యను మహాశయుడగు రాజపుత్రుని చూచిన యన్ని జాతులవారు కడు దుఃఖించిరి. 

పురములోని బ్రాహ్మణులు మున్నగువారు దుఃఖార్తులై ముని దురాచారుడు మోసగాడు అని నిందించిరి. నగరు వెడలి వెళ్ళుచున్న రాజును వెంబడించి 

విశ్వామిత్రు డతనిష్ఠురముగ నిట్లనెను: ఓయి నరపతీ! నాకు దక్షిణక్రింద బంగారమిచ్చి కదలుము. లేదా నాకు చేతకాదని యనుము. నిన్ను వదిలిపెట్టుదును. నీ గుండెలో లోభమున్నచో నీ రాజ్యము తిలిగి నీవే తీసికొనుము. నిజముగ నిచ్చితినని తలంచినచో నీ మాట నిలువబెట్టుకొనుము. 

ఇట్లు విశ్వామిత్రుడు పలుకుచుండగ హరిశ్చంద్రుడు కడు దీనముగ జోడించి నమస్కరించి ముని కిట్లనెను.

హరిశ్చంద్రు డిట్లనెను: ఓ మునివర్యా! నీకు దక్షిణ చెల్లించక భోజనము చేయను. ఇది నా ప్రతిన. ఇక విచారము మానుము. నేను సూర్యవంశజుడను-క్షత్రియుడను-రాజసూయయాగ మొనరించినవాడను. ఎల్లకోర్కెలు దీర్చువాడను. 

ఓ స్వామీ! ఓ ద్విజవరా! నేను మనఃపూర్తిగ దాన మిచ్చితిని. ఇక దక్షిణ యీయ కెట్లుందును? నీ ఋణము తప్పక తీర్చగలను. నీ యష్టానుసారమే బంగార మీయగలను. నాకు ధనము చేతికి వచ్చునంతవఱ కోపిక పట్టుము. దిగు లొందకుము. 

విశ్వామిత్రు డిట్లనెను: ఓ రాజా! నీ రాజ్యము-నీ కోశము- నీ బలము-సర్వము - నిన్ను వదిలిపోయెనే! ఇక నీకు ధన మెక్కడినుండి వచ్చును? రాజా! ధనమును గూర్చిన రిత్తయాస లేల? నీ విపుడు లేనివాడవైతివి. ఇపుడు నేను మాత్రమేమి చేయగలను? నేను మాత్రము నిన్నింతగ లోభముతో నేల పీడింతును? 

కనుక రాజా! నే నిపుడీయలేనని యొక్క మాట చెప్పుము. నా కొండొంతయాస వదలుకొని స్వేచ్ఛగ వెళ్ళుదును. ఇపుడు నా యెద్ద ధనము లేదు. ఇక మీ కేమి యీయగలనను నొక్కమాట పల్కి నీ భార్యాపుత్రులతో స్వేచ్ఛగ నరుగుము. రాజు వెళ్ళిపోవుచు మునినుండి మరల ఈ మాటలు విని 

ముని కిట్లనెను: ఓ బ్రాహ్మణోత్తమా! ధైర్యము పూనుము. తప్పకిత్తును. నా దేహము-భార్యా దేహము-కొడుకు దేహము- ఇవి యే రోగములు లేకున్నవి. వీని నమ్మి నీ ఋణము దీర్చుకొందును. ఓ విప్రవరా! ఈ పవిత్ర కాశీపురిలో మమ్ము కొను వాని నెవనినైన చూడుము. అతనికి నేను నా భార్యాపుత్రులతో నమ్ముడుపోదును. మమ్మెవరికైన నమ్మి నీ రెండున్నర బరువుల బంగారము తీసికొమ్ము. మా యెడల ప్రసన్నుడవు గమ్ము.

ఇట్లు పలికి అన్నపూర్ణతో విశ్వేశ్వరుడు వసించు కాశికి రాజు తన భార్యపుత్రులతో నేగెను. ఆ రమ్యమైన మనసున కింపైన కాశీనగరమును గని నే నీ కాశిని దర్శించి-ధన్యభాగుడనైతినని రాజు తలంచెను. అటు పిమ్మట హరిశ్ఛంద్రు పావనగంగలో మునిగి పితృదేవతలకు తర్పణమిడి దేవతార్చన చేసికొని నలువైపుల కలయజూచెను. 

రాజు దివ్యకాశీపట్టణముజేరి దీనిని శూలపాణియగు విశ్వేశ్వరుడే పాలించగలడు గాని నరమాత్రుడు పాలించలేడు. అని తలంచి దుఃఖార్తితో తన భార్యాపుత్రులతో కాలి నడకను కాశీపురి ప్రవేశించి యందు నివసింపదలంచెను. ఇంతలో దక్షిణకోరు మునివరుడు తన వెంటవచ్చుట గనెను. 

హరిశ్చంద్రుడు మహామునికి దోసిలోగ్గి యిట్లనెను: ఇవిగో ఇవి నా ప్రాణములు. ఈమె నా భార్య. ఇతడు నా కొడుకు. ఓ ద్విజవర్యా! మాలో నెవరివలన నీ పని నెఱవేరునో వారిని తీసికొనుము. కాదేని మమ్మేమి చేయుమందువో చెప్పుము. 

విశ్వామిత్రు డిట్లనెను: రాజా! నీవు పెట్టిన నెలగడువు నిండినది. అపుడు నా కిచ్చిన మాట జ్ఞాపకమున్నచో ఇపుడు నాకు దక్షిణ యిమ్ము. 

రాజిట్లనెను: జ్ఞానతపోబలా! నెల పూర్తి కాలేదు. ఇంకను సగము దినము మిగిలియున్నది. అదియు పూర్తియగువఱ కెదురుచూడుము. అటు తరువాకాదు.

విశ్వామిత్రు డిట్లనెను: రాజా! సరే! అట్లే కానిమ్ము. మఱల వత్తును. ఈసారి ఈయకున్నచో శాప మీయగలను. అని ముని వెళ్లగనే రాజిట్లు చింతింపసాగెను. ఇతనికి నేనెట్లు దక్షిణ చెల్లింపగలను. దక్షిణ యిత్తునని మాట యిచ్చి యుంటినే! కాశీపురిలో ధనము బొందుటకు నాకు నెచ్చెలికాండ్రెవరును లేరే! నే నొకనిని యాచింపరాదే! ఒకనిముందెట్లు చేయి చాపగలను? 

రాజులకు ధర్మశాస్త్రాముసారముగ యజనము-అధ్యయనము-దానము-అను మూడు ముఖ్య కర్తవ్యములు. ఇతనికి దక్షణ యీయక నేను ప్రాణములు వదలినచో నమగును? అపుడు నేను వచ్చు జన్మములో బ్రహ్మ హంత-కీటకము-పాపి-అధమాధముడను గాగలను. అవి కానిచో పిశాచము నగుదును-వీటన్నిటికంటె నేనెవనికైన అమ్ముడుపోవుట మంచిది. 

భార్యావిక్రయం

శ్రీ దేవీ భాగవతం ప్రథమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము

శ్రీ దేవీ భాగవతం పంచమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Maya Sukaram - మాయాసూకరం

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - మాయాసూకరం

ఇట్లు విశ్వామిత్రడు వెళ్ళి రాజు తన పట్ల చేసిన పని మంచిది గాదని మనసులో తలంచెను. ఆనాడు వసిష్ఠునితో వాదము ఈనాడు రాజు వలన తపో విఘ్నము జరిగెను. 

కనుక విశ్వామిత్రుడు కోపావేశముతో ప్రతీకారముచే పగ తీర్చు కొనదలచెను. అతడు ఘోర విగ్రహముగల దానవుని తలచెను. ఆ దానపు నొక పంది యాకారమున హరిశ్చంద్రుని దేశము మీదకు ప్రయోగించెను. 

అది రాజుగారి యుద్యానవనముజేరి వనపాలకులను భయపెట్టెను. అది కదంబ-మాలతీ వృక్షము లను విఱుగగొట్టెను. అది కొన్నిచోట్ల మాటిమాటికి యూధికా వృక్షముల నరుసలు కదలించుచు కోఱలతో నేల పెళ్ళగించుచు చెట్లు పీకి వేసెను. 

అది కొన్ని యెడలనుండి గేదగి చెట్లను మల్లెచట్లను ఉశీరకరవీర వృక్షములనుత్రవ్వి పెకలించెను. వనమందున్న అశోక ముచుకుంద వకుల తిలకవృక్షములు సమూలముగ పెకలించి చిందర వందర చేసెను. 

తోటకాపరులు శస్త్రములు చేతదాల్చి దానిమీదకు పరుగెత్తిరి. మాలలు గట్టువారు భయాతురులై హహాకారములు చేసిరి. వనరక్షకులు దానిని బాణములతో నెంతగనో కొట్టిరి. కాని యది వెఱవక కాలునివలె తిరిగి వారిని బాధ పెట్టెను. వారు మిక్కిలి భయకంపితులై రాజును శరణువేడి కాపాడుమని మొఱపెట్టకొనిరి. 

అట్లు భయార్తులై వచ్చిన వారిని రాజు చూచి మీకెవని వలన భయము గల్గెనో నాకు తెల్పుడని యడిగెను. రక్షకులాలా! నేను దేవతలకు రాక్షసులకు భయపడను. ఇక మీకెవనివలన భయము గల్గెనో నాకు తెలుపుడు. 

ఏ పాపి- యే దుష్టుడు- నాకు పగవాడయ్యెనో చెప్పుడు; వాని యొకేయొక బాణమున తెగటార్పగలను. నా శత్రువు దేవుడో-దానవుడోవాని బలమెంతటిదో-వాని రూపేదియో - వాడెక్కడ గలడో- అన్నియా నాకు తెల్పినచో వానిని వాడిబాణముతో చంపుదును.

మాలలు కట్టువా రిట్లనిరి: రాజా! దేవ-దానవ-యక్ష-కిన్నరులలో నెవ్వడును కాడు. ఒక్క మహాకాయముగల పంది మీ వనమునందున్నది. ఆ మహావేగముగల పంది మెత్తని పూలచెట్లు కోరలతో పెకలించి వనమంతయును చిందర వందర చేసెను. 

రాజా! మేము బాణములతో కర్రలతో రాళ్లతో దాని నెంత కొట్టినను అది జంకుకొంకులులేక తిరిగి మమ్మే చంపుటకు వచ్చినది. అనువారి మాటలువిని రాజు మహాకోపముతో సత్వరమే గుఱ్ఱమెక్కి యుపవనము దెస కరిగెను. 

రాజు వెంట గజాశ్వరధసేనలు-పదాతి ధళములు-తోటవైపు వెళ్ళెను. అట ఘురఘుర శబ్దముతో భయంకరమైన పందిని భగ్నమైన తోటను చూడగనే రాజునకు కోపము వచ్చెను. రాజు వెంటానే వింటియందు బాణ మెక్కుపెట్టి నారి సారించి పాప రూపమైన పందిని చంపుటకు పూనుకొనెను. 

రాజు అతడు విల్లునమ్ములతో తన వైపు మహా రోషముతో వచ్చుటగని పంది భీకరముగ ఘురఘుర శబ్దము చేయుచు నతనివైపు పరిగెత్తెను. అది పెద్దగ నోరు తెఱచుకొని వచ్చుటచూచి రాజు దానిని చంపుటకు బాణం వదలెను. కాని పంది వెంటనే బాణము తప్పించుకొని మహా వేగముతో రాజును దాటి పారిపోయెను. 

అది తప్పించుకొని పోవుట చూచి రాజు మరింత కోపముతో ధనువు లాగి పందిపై బాణము లేసెను. అది యొక్క క్షణములో రాజునకు కనిపించకయు పెక్కు రీతుల ఘురఘురమనుచు పరుగెతైను. 

హరిశ్చంద్రుడును కోపోద్రేకముతో వాయువేగము గల గుఱ్ఱమెక్కి ధనువు లాగుచు పంది వెంటబడెను.

అపుడు సేనలు వనమంతయును చెల్లాచెదరై క్రుమ్మరుచుండెను. రాజోక్కడే పుట్టపురుగులేని కుట్ర నట్టడవిలో డస్సి యాకలిదప్పులచే నకనకలాడెను. అతని వాహనము సైత మలసిపోయెను. పంది తప్పించుకొని పోయినందున రాజు దిక్కులేని వానివలె నడవిలో దారితప్పి వెతగుందుచుండెను. 

నే నిపుడేమి చేతును? ఎక్కడి కేగుదును? ఈ వనమున నాకు బాటయు తెలియదే. ఇపుడెట్లని రాజు వగచెను. ఇట్లు చింతాతురుడై యొంటిగ రాజు విచారించుచుండగ నతనికి నిర్మలమైన నీరుగల యొక కొలను కనిపించెను. అది గని రాజు ప్రసన్నుడై గుఱ్ఱముదిగి దానికి నీరు పెట్టి తాను నిర్మలజలము త్రాగెను. రాజు నీరుగ్రోలి శాంతిజెంది తన పురి కేగదలచెను. 

కాని యతడు దారితెన్ను తెలియక మోహితుడయ్యెను. అంతలో విశ్వా మిత్రుడొక వృద్ధ బ్రాహ్మణ రూపమున వచ్చెను. రాజు బ్రాహ్మణునిగని భక్తిమీర నమస్కరించెను. తన్ను నమస్కరించు చున్న రాజుతో 

విశ్వామిత్రు డిట్లనెను: రాజా! నీకు మేలగుత! ఇచటి కేల వచ్చితివి. ఈ విజన ప్రదేశమున కొంటిగ నేమి ప్రయోజనము గోరి వచ్చితివి? ఈ కారణములన్నియును నాకు నిలుకడతో చెప్పుము. 

రాజిట్లమెను: ఒక బలముగల మహాకాయమగు పంది నా పూలతోటలో బడి మెత్తని పూలచెట్ల నన్నిటిని త్రెంపి వేసెను. 

విప్రవర్యా! నే నా చెడుపందిని చంపుటకు విల్లునంబులుబూని సైన్యమే వెంటరాగా నగరు వెడలి వచ్చితిని. ఆ మాయవి-పాపిష్ఠమగు పంది నా కండ్లకు కానరాక వేగమెటకో పరుగెత్తెను. దాని వెంట నేను బడితిని. నా సైన్య మెటు పోయెనో తెలియుటలేదు. నే నాకలిదప్పులచే భాదపడి యిచటికి వచ్చితిని. నా సైన్య మేమయ్యెనో తెలియదు. 

నగరపు బాట యును తెలియుటలేదు. ఓ విభూ! నా యదృష్టమువలననే నీ వీ నిర్జనప్రదేశమున కేతెంచితివి. నాకు మార్గము చూపింపుము. నా పురి కేగగలను. నే నయోధ్యాపతిని. నన్ను హరిశ్చంద్రుడందురు. రాజసూయము చేసినవాడను. యాచకుల కోర్కెలు దీర్చువాడను. 

ద్విజవర్యా! నీకు యజ్ఞమునకు ధనము కావలసినచో నా వెంట నయోధ్యకు రమ్ము. నీకు కావలసి నంత ధన మీయగలను.

హరిశ్చంద్రుని మాటలువిని నవ్వి విశ్వామిత్రు డతని కిట్లనెను. రాజా! మహాశయా! ఇది పాపనాశకమగు పావనపుణ్యతీర్థము. ఇచట స్నానముచేసి పితృతర్పణము చేయుము. నేడు పర్వదినము. ఇది పవిత్రమైన పుణ్యతీర్థము. ఇందు స్నానముచేసి నీ శక్తి యున్నంతగ దానము చేయుము. 

ఏదైన పుణ్యతీర్థమున కేగిన వాడందు స్నానము చేయక వెళ్ళినచో నతడాత్మఘాతుకుడగునని మనువు వాక్క్రుచ్చెను. కనుక రాజా! ఈ శ్రేష్ఠమైన తీర్థ రాజమున నీ శక్తి కొలదిగ పుణ్యము చేసికొనుము. నీకు తరువాత మార్గము చూపింతును. నగరమునకు వెళ్లవచ్చును. 

కాకుత్థ్సా! అనఘా! నీ దానమునకు సంతోషించి నేను నీకు బాట చూపించుటకు నీవెంట రాగలను. కపట మండితమగు ముని వాక్కులువిని రాజు తనపై నున్న వస్త్రములు విడిచి యథావిధిగ స్నాన మాడుటకు నదిని జేరెను. ముని వాక్యములకు మోహితుడై అతనికి వశుడైన రాజు చెట్టునకు గుఱ్ఱమును కట్టివేసి రాగలదైన యోగమును తప్పించుకొనలేకున్నందున చక్కగ స్నాన విధి నెఱవేర్చుకొని పితృదేవతలకు తర్పణము విడిచి 

విశ్వామిత్రునితో నిట్లనెను: స్వామి! నీకు దాన మొసంగుదును. మహాత్మా! నీ విపుడేది కోరిన దాని నిత్తును. ఆవులో! భూమియో! బంగారమో! గజాశ్వరథవాహనములో! కోరుకొనుము. రాజసూయయాగ మపుడు మునుల సమక్షమున దానవ్రతము పట్టితిని. 

కనుక నే నీయజాలని వస్తువేదియును లేదు. మునీశా! నీ వా పుణ్యతీర్థరాజమున కనబడితివి. నీ కోర్కి యేదియో తెలుపుము. దానిని తప్పక తీర్పగలను.

విశ్వామిత్రు డిట్లనెను : ''రాజా! మున్నొ కప్పుడు నేను వసిష్ఠునివలన నిన్ను గూర్చి వింటిని. ఈ భూమండలమున హరిశ్చంద్రునిబోలు దాత-కీర్తిశాలి-లేనేలేడు. హరిశ్చంద్రుడు సూర్యవంశమందలి మహారాజు. ఆ రాజునుబోలు దాత మున్ను లేదు. ముందుండబోడు. 

అతడు త్రిశంకు కుమారుడు. పరమోదారుడు. అని అతడనెను. అట్టి నిన్ను ప్రార్థించుచున్నాను. 

రాజా! నేనొక వివాహము జరుపవలయును. మహానుభావా! నా కొడుకు పెండ్లి. కనుక ధనమిమ్ము. 

రాజిట్లనెను : విప్రవర్యా! వివాహము జరిపించుకొనుము. నీవు కోరిన దిత్తును. నీవెంత ధనము కోరుదువో యంతధనము నీ కీయగలను. విశ్వామిత్రుడు రాజును వంచింపదలచెను. ముని గాంధర్వమాయ పన్ని యొక సుకుమార కుమారుని పదియేండ్ల కన్నియును రాజునకు చూపి 

రాజా! వీరిర్వురికి పెండ్లి జరుపవలయును. పెండ్లి చేయుటచే రాజసూయ యజ్ఞముకంటె గొప్పపుణ్యము. పెండ్లిచేసి యిల్లు నిలువబెట్టుట మంచిది గదా! ఇపుడీ విప్రకుమారుని పెండ్లివలన నీకు పున్నెము గల్గును. అను ముని వాక్కులకు రాజు మాయామోహితుడయ్యెను. ఆతడు సరేయని మాట యిచ్చెను. 

రాజ్యదానం

Harishchandrudiki Parikshalu - హరిశ్చంద్రుడికి పరీక్షలు

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - హరిశ్చంద్రుడికి పరీక్షలు

వాసుడిట్లనెను : ఒకానొకప్పుడు హరిశ్చంద్రుడు వేట కడవి కేగెను. అతడట చారెడేసి కన్నులు గల్గి యేడ్చు చున్న యొక సుందరిని జూచెను. 

మహారాజు దయాపరుడై విశాలాక్షి యగు ఆ కామినితో నిట్లనెను: వరాననా! ఏడ్చెదవేల? నిన్ను బాధ పెట్టిన వాడెవడు? నీ దుఃఖ కారణమేమి? ఈ జనము తిరుగనిచోట నీ వేల యుంటివి? నీ తండ్రి యెవరు? నీ పతి యెవరు ! 

సుందరీ! నా యేలుబడిలో రాక్షసుడు గూడ పర స్త్రీని బాధింపడు. నిన్ను బాధపెట్టిన వాడెనడో తెల్పుము. వానినిపుడే తును మాడుదును. తలోదరీ! వరారోహా! నా రాజ్యమున పాపాత్ముడుండుటకు వీలులేదు. నీ దుఃఖమేమిటో తెల్పి నిశ్చింతగ నుండుము ఆను రాజు మాటలు విని యువతి తన చెక్కిళ్ళపై జారు కన్నీటి బొట్లు తుడుచు కొనుచు 

హరిశ్చంద్ర నరపతితో నిట్లనెను: ఓ రాజా! విశ్వామిత్రముని నన్నింతగ బాధించుచున్నాడు. నన్ను బొందుటకు ఘెరతప మాచరించుచున్నాడు. సత్యవ్రతా! నేను నీ రాజ్యమందతని వలననే యింత దుఃఖ మొందుచున్నాను. నేనా మునిచే కామింపబడిన కాంతనని నన్నెఱుంగుము. 

రాజిట్లనెను: విశాలాక్షీ? నేనా తపోనిరతుడగు ముని తపమును వారింపజేతును. నీకిక దుఃఖము గలుగదు. నిశ్చింతగ నుండుము. ఇట్లు రాజు యువతి నూరడించి ముని సన్నిధికేగి తలయొగ్గి యతనికి నమస్కరించి యిట్లనెను. 

స్వామీ! మహామతీ? నీవీ శరీరము నేల తపింపజేయుచున్నావు. ఏ మహా కార్యసాధన కింతగ కఠోర తప మొనర్చుచున్నావో నిజము తెల్పుము. 

విశ్వామిత్రా! నీ కోరిక సఫల మొనర్పగలను. ఇంక తపము చాలు: వేగమే లేలెమ్ము. సర్వజ్ఞా! నా రాజ్యమందెవ్వడును లోకబాధ గల్గించు ఘోర దారుణ తప మొనరింపరాదు. 

ఇట్లు రాజు విశ్వామిత్రుని వారించి తన యింటి కేగెను. విశ్వామిత్రుడు మనస్సులో కోపముంచుకొని తన యాశ్రమ మేగెను.

మాయాసూకరం

Vasishta-Visvamitra Samvadam - వసిష్ట- విశ్వామిత్ర సంవాదం

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - వసిష్ట- విశ్వామిత్ర సంవాదం

అటు పిమ్మట రాజు రాజసూయయాగ మొనరించెను. అందు అతడు వసిష్ఠుని హోతగ నియమించెను. యాగము పరిసమాప్తమైన పిమ్మట వసిష్ఠుడు ఘనముగ సత్కరింపబడెను. 

ఒకనాడు వసిష్ఠుడు సగౌరముగ నింద్రుని భవనము చేరెను. అదేచోటికి విశ్వామిత్రుడేతెంచి వసిష్ఠుని గలిసెను అట్లు వారిర్వురును దైవసభలో గలిసికొనిరి. అపుడు పూజలందుకొని వెలుగొందున్న వసిష్ఠుని విశ్వామిత్రుడు జూచెను.

అటు లింద్రసభలో వసిష్ఠుని గాంచి విస్మయము చెంది విశ్వామిత్రుడిట్లనెను: మునిసత్తమా! ఈ ఘనసత్కార మెచట బొందితివి? నిన్నే మహానుభావుడింతగ పూజింతెనో నిజము పలుకుము. అన 

వసిష్ఠు డిట్లనెను: నాకు ప్రతాపశాలియగు హరిశ్చంద్ర మహారాజు యజమానుడు. ఆ రాజు ఘనముగ దక్షిణలిచ్చి రాజసూయయాగము జరిపెను. అంతటి సత్యవాది నియతవ్రతుడగు రాజు మరెవ్వడులేడు. 

అతడు మహాదాత. ధర్మశీలి. ప్రజాపాలన తత్పరుడు. విశ్వామిత్రానే నతని యజ్ఞమున పూజింపబడితిని. ద్విజవరా! నన్ను నిజము చెప్పుమని యింకేల పట్టు పట్టెదవు? సత్యహరిశ్చంద్రుని వంటి రాజు మున్నులేడు. ముందుండబోడు. అను వసిష్ఠుని వాక్కులు విని 

విశ్వమిత్రుడు గ్రుడ్లెఱ్ఱ జేసి యతని కిట్లనెను: హరిశ్చంద్రుడు మిధ్యావాది కపటప్రియుడు. అతడు వరుణునకు మాట యిచ్చి యతనిని వంచిచెను. 

అతనినే పొగడుచున్నావా! మహామతీ! నా పుట్టినప్పటినుండి సంపాదించిన తపఃఫలము అధ్యయనపుణ్యము నీ పుట్టిననాట గోలె సంపాదించిన నీ తపఃఫలము అధ్యయనపుణ్యము పణముగ నుంచుదము. 

నీవే దుష్టుడు - లుబ్ధుడునకు రాజును సత్య వాదిగ బతికితివో నేనతని ననత్యవాదిగ చేయగలను. అట్లు చేయనిచో నా జన్మార్జిత పుణ్యమంతయా నశించును గాక! చేసినచో నీపున్నెమంతయునశించును. 

ఇదే మరకు పణము. ఇటులా యిర్వురు మునులును మహా కోపముతో వాదించు కొనుచు స్వర్గము వీడి తమ తమ యాశ్రమములకేగిరి.

హరిశ్చంద్రుడికి పరీక్షలు

Vishwamitra was the father of Sunashshepa - శునశ్శేపుడికి తండ్రి విశ్వామిత్రుడే

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - శునశ్శేపుడికి తండ్రి విశ్వామిత్రుడే

అపుడు శునఃశేపుడు దోయిలించి సభాసదుల కిట్లనెను: ధర్మనిర్ణేతలగు సభ్యులారా! వేదశాస్త్రను సారముగ సత్యము బల్కువారలారా? మీరిపుడు నాకు ధర్మమార్గము చెప్పుడు.

ఓ సర్వజ్ఞులారా! నా కిపుడు పూజ్యతము డగు తండ్రి యెవడు? నేనెవని కుమారుడను? మీ పెద్దలమాట చొప్పున మీ చెప్పినవాని నాశ్రయింతును. అని బాలుడు పలుకగనే సభ్యులెల్లరును తమలోతా మిట్లనుకొనిరి. 

అతడజీగర్తుని కుమారుడు. ఇత డితరుని కొడుకెట్లు గాగలడు? ఇత డజీగర్తుని ప్రత్యంగమునుండి పుట్టి యతనిచేత చక్కగ పెంచబడెను. ఇతడితరుని కొడుకెట్లగును? ఇతడతని కొడుకే యగు ననిరి. వారి మాటలు విని 

వామదేవుడను నతడు వారలకిట్లనెను: ఇతడు ధనాశగల తన తండ్రిచే నమ్ముడుపోయెను. కనుక నితడు తన్ను డబ్బిచ్చి కొన్న రాజు కొడు కగును. కానిచో బంధముక్తి గల్గించిన వరుణుని కొడుకైన గావలయును. 

అన్నము పెట్టినవాడు భయము బో గొట్టినవాడు చదువు చెప్పినవాడు ధనమిచ్చినవాడు ననువారు తండ్రులని చెప్పబడుదురు. అట్లా బాలుని కొంద ఱజీగర్తుని కొడుకని మఱికొందరు రాజు కొడుకని వేరొక కొందఱు వరుణుని కొడుకని పలుకసాగిరి.

ఈ విధముగ సభ్యులు తమలోతాము సందేహములతో వాదించుకొనుచుండగ సర్వపూజితుడు సర్వజ్ఞుడు నగు వసిష్ఠుడు వారి కిట్లనెను. 

మహాత్ములారా! వేదసమ్మతమగు నిర్ణయము వినుడు. ఈ బాలుని తండ్రి దయమాలి యితనిని డబ్బున కమ్ముకొనెను. ఇతని తండ్రి ధనాశాపరుడు. కనుక నితని కితని తండ్రితో సంబంధము తెగిపోయెను. హరిశ్చంద్రుడితనిని కొనుటవలన నితడతనికి కొన్నకొడుకే యగును. 

హరిశ్ఛంద్రు డితనిని యూపస్తభమునకు గట్టుటవలన నితడు రాజు కొడుకు గాడు. ఇతడు వరుణుని నుతించుటవలన వరుణు డితనిని విడుదల గావించెను. మహాశయులారా: అందుచే నితడు వరుణుని కుమారుడు గాజాలడు. ఏలన నే మంత్రమున నే దేవుడు స్తుతింపబడునో యతడు సంతసించును. ఆ దేవుడు తన్ను సుతించువానికి ధనప్రాణములు-పశురాజ్యములు కామమోక్షములు ప్రసాదించును. 

కనుక నితడు విశ్వామిత్రుని కొడుకే. ఏలన నతనిచేత నితడాపదలో రక్షింపబడెను. విశ్వామిత్రుడు వరుణమంత్ర మొసంగి యతనిని గాపాడెను గదా! అను వశిష్ఠుని వాక్కులు విని సభ్యులెల్లరు సమ్మతించిరి. 

అంత విశ్వామత్రు డా బాలుని కుడిచేయి పట్టుకొని నాయనా! ఇంటికి పోదము ర్మని ప్రేమ పులకితుడై పలికెను. శునఃశేపుడు వెంటనే విశ్వామిత్రునివెంట నరిగెను. వరుణుడును ప్రసన్నుడై తన నిలయమున కరిగెను. ఋత్విజులును సభ్యులును తమ తమ నెలపుల కరిగిరి. హరిశ్చంద్రుడును రోగ ముక్తుడై సుఖముండెను.

రాజు ప్రసన్నుడై ప్రజలను కన్నబిడ్డలవలె పాలించెను. అపుడు రోహితుడు జరిగిన వరుణుని వృత్తాంతమంత యును వినెను. అతడు సంతోషించి దుర్గమవన పర్వతములు విడిచి తన యింటి కేతెంచును. 

అపుడొక దూత రాజుతో రాకొమరుని రాక వెల్లడించెను. కోసలాధిపతి ప్రమోదమున తన కొడుకున కెదురేగెను. తండ్రిని చూడగనే రోహితునిలో ప్రేమ సంభ్రమము లొక్కుమ్మడి పెల్లుబికెను. అతడు కన్నీట తడిసిన మోముతో తన తండ్రికి దండప్రమాణమము లాచరించెను. 

రాజు తన కొడుకును లేవనెత్తి పుత్రగాత్ర పరిష్వంగసుఖము బడసెను. తనకొడుకు శిరము మూర్కొని కుశల మడిగి తొడపై నిడుకొని ప్రమోదభరితు డయ్యెను. వెచ్చని కన్నీట తన కొడుకు నభిషేకించెను. తన ముద్దులకొడుకుతో చక్కగా రాజ్యమేలెను. 

నరమేధ వృత్తాంతమంతయును తనకొడుకుతో జెప్పెను. 

వసిష్ట- విశ్వామిత్ర సంవాదం

Varuna Deva kind to Sunashshepa - శునశ్శేపుడికి వరుణకటాక్షం

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - శునశ్శేపుడికి వరుణకటాక్షం

వ్యాసుడిట్లనెను: అట్లు దుఃఖార్తితో విలపించున్న శునఃశేపుని గని విశ్వామిత్రుడు దయాంతరంగుడై బాలుని చెంత కేగి యిట్లునెను. 

''ఓ పుత్రాకా! నా వలన వరుణదేవుని మంత్రము గ్రహింపుము. దానిని నెమ్మనమున స్మరించుచు జపించినతో నీకు తప్పక మేలు గల్గును.'' అను విశ్వామిత్రుని వాక్కులు విని దుఃఖితుడగు శునఃశేవుడు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రమును మదిలో జపించెను. 

ఆ మంత్రమును జపించెనంతలోనే వరుణుడు దయాకరుడై ప్రసన్నడై విప్రకోమరు మెదుట ప్రత్యక్షమయ్యెను. వరుణదేవుడే స్వయముగా వచ్చి దర్మనవిచ్చి నందుల కెల్లరు నాశ్చర్యమొంది ప్రమోద మొందిరి. 

రోగాతురుడగు రాజు పరమ విస్మయమొంది తన ముందన్న దేవునకు దోసిలొగ్గి పాదములపైబడి నమస్కరించి యిట్లనెను. 

దేవాదేవా! దయాసాగరా! నేను వట్టి మందమతిని. పాపని. లోభిని. అపరాధిని. నన్ను పవ్రితుని జేయుము. నేను సంతతి లేక కడు దుఃఖమొందితిని. పుత్ర వ్యామోహమున నిన్ను తూలనాడితిని. నేను దుర్మతిని. నన్ను క్షమింపుము. 

ప్రభూ! దేవాదేవా! యాచకుడెప్పుడును దోసము లక్క చేయడు నేను పున్నామ నరక భయమున పుత్రునిగోరి నిన్ను మిక్కిలి మోసగించితిని. పుత్రులు లేని వారికి స్వర్గప్రాప్తి లేనే లేదను మాటకు భయపడి నిన్ను చుల్కనగ జూచితిని. 

ఓ విభూ! నీవు జ్ఞానివి. నే నజ్ఞానిని. పుత్ర వ్యామోహమున మునిగితిని. రోగపీడితును దుర్జనుడను కనుక నా దోష మెన్నదగదు. ఓ ప్రభూ? దయానిధీ! నా కొడుకెక్కడికి వెళ్ళెనో నాకే తెలియదు. అతడు చావునకు వెఱచి నన్ను వంచించి వనముల కేగెను. 

ఇపుడు నేనీ విప్ర బాలునకు డబ్బిచ్చి కొని తెచ్చితిని. ఈ కొన్న కొడుకుతో నిన్ను మెప్పించుట కీ జన్నము మొదలైనది. నీవు ప్రసన్నడవై దర్శనభాగ్య మొసంగితివి. ఇపుడు నా జలోదర వ్యాధి పూర్తిగ తొలగిపోయినది.

రోగార్తుడగు రాజు మాటలువిని వరుణుడు దయాశుడై యతని కిట్లనెను. రాజా! ఈ శునఃశేపుడు తన బ్రతుకు తీపిచే నన్ను జపించుచున్నాడు. ఇతనిని విడిచిపెట్టుము. నీ యజ్ఞము పూర్తి యయ్యెను. నీవు రోగముక్తుడవైతివి. అని యచటి ప్రజలెల్లరును చూచుచుండగనే వరుణుడు రాజును రోగముక్తుని గావించెను. 

అట్లు విప్రబాలుడు మహితాత్ముడగు వరుణుని దయవలన బంధముక్తుడయ్యెను. అంత సభయందంతట జయజయధ్వానములు మిన్నుముట్టెను. ఇట్లు రాజు దారుణరోగమునుండి ముక్తడయ్యెను. శునఃశేపుడును బంధముక్తుడై సుఖముండెను. రాజు పిమ్మట సవినయముగ యజ్ఞము పూర్ణము గావించెను. 

శునశ్శేపుడికి తండ్రి విశ్వామిత్రుడే

శ్రీ దేవీ భాగవతం ప్రథమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము

శ్రీ దేవీ భాగవతం పంచమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Wife-selling - భార్యావిక్రయం

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - భార్యావిక్రయం అని రాజు తల నేలకు వేసికొని చింతాతరుడై యుంటగని యతని భార్య కన్నీరుగార్చుచు డగ్గుత్తికతో నిట్టుల...