Tuesday, August 4, 2026

Saayam Dandhya - Evening twilight - సాయం సంధ్య

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - సాయం సంధ్య

సాయంసంధ్యవల్ల మహామాయ అనుగ్రహం లభిస్తుంది. ఆచమించి ప్రాణాయామం చేసి పద్మాసనం వేసుకుని కూర్చోవాలి. శ్రౌతస్మార్తకర్మలకు సగర్భప్రాణాయామం, ధ్యానమాత్రానికి అగర్భ ప్రాణాయామం చెప్పబడ్డాయి. భూతశుద్ధి చేసుకోవాలి. సంధ్యాదేవిని ధ్యానించాలి.

ఈమె వృద్ధ సరస్వతి, కృష్ణాంగి, కృష్ణాంబరధారిణి, శంఖ చక్ర గదా పద్మహస్త, గరుడవాహన రత్నవిభూషిత, క్వణన్మంజీరమేఖలాలంకృత, రత్నకిరీటధారిణి, తారహారావళీయుత, తాటంకధారిణి. వాటి కాంతులతో చెక్కిళ్ళు మెరుస్తూ ఉంటాయి. పీతాంబరధరకూడా. సచ్చిదానందరూపిణి, సామవేదస్వరూపిణి, ఆదిత్యపథగామిని, స్వర్లోకనివాసిని. 

సూర్యమండలంనుంచి వస్తున్న మహాదేవిని ఆవాహన చేస్తున్నాను. ఇలా ధ్యానించి సంధ్యాసంకల్పం చెప్పుకోవాలి. ఆపోహిష్టా - అగ్నిశ్చేత్యాది మంత్రాలు పఠించాలి. సంప్రోక్షించుకోవాలి. ఆచమించాలి. మిగతాది అంతా ప్రాతస్సంధ్యలాగానే. 

గాయత్రీమంత్రాన్ని ఉచ్చరిస్తూ నారాయణ ప్రీతికోసమని సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. రెండుకాళ్లూ సరిగా దగ్గరకు పెట్టుకుని నిలబడి సూర్య భగవానుడిని ధ్యానిస్తూ తదభిముఖంగా జలాంజలి విడిచిపెట్టాలి. ఈ అర్ఘ్యం నీళ్ళల్లో విడవకూడదు. అలా విడిస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అసావాదిత్యేత్యాది మంత్రంతో సూర్యోపస్థానం చెయ్యాలి. 

పీటమీద కూర్చుని గాయత్రిని జపించాలి. సహస్రమో దానిలో సగమో. ఉపస్థాన తర్పణలన్నీ ప్రాతస్పంధ్యలాగానే. వసిష్ఠుడు ఋషి. విష్ణురూప సరస్వతి దేవత. ఛందస్సు సరస్వతి. సాయంకాలీన సంధ్యాతర్పణే వినియోగః. సామవేదపురుష హిరణ్యగర్భ సరస్వతీ సంకృతి వృద్ధసంధ్యా ఉషసి నిమృజి - ప్రభృతులకు గాయత్రీమంత్రంతో తర్పణలు ఇవ్వాలి.

ఈ సాయం సంధ్యోపాసన సర్వదుఃఖహరం. వ్యాధినాశకం. మోక్షప్రదం. సదాచారాలలో సంధ్యావందనానికున్నంత ప్రాధాన్యం దేనికీ లేదు. గాయత్రీమాత సంతోషించి భక్తులకు అభీష్టాలు అన్నీ ఇస్తుంది.

మంత్ర పురశ్చరణ




Brahma Yagnam Yajna - బ్రహ్మ యజ్ఞం

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - బ్రహ్మ యజ్ఞం

నారదా! ఇక బ్రహ్మయజ్ఞం గురించి చెబుతాను తెలుసుకో. (మూడు) రెండుసార్లు ఆచమించి రెండుసార్లు మార్జన చేసుకోవాలి. సవ్యపాణితో నీటిని స్పృశించాలి. పాదాలు శిరస్సు నేత్రాలు నాసిక చెవులు హృదయం మౌళి సంప్రోక్షించుకోవాలి. దేశకాలాలు చెబుతూ బ్రహ్మయజ్ఞం సంకల్పించాలి.

రెండు దర్భలు కుడిచేత మూడు ఎడమచేత కొన్ని పీటకింద కొన్ని శిఖమీద కొన్ని పాదమూలాలలోనూ ఉంచుకోవాలి. ఇవి సర్వపాపక్షయకరాలు. సూత్రోక్త దేవతాప్రీత్యై బ్రహ్మయజ్ఞం కరోమ్యహమ్‌ ఆని ఉదకం స్పృశించాలి. 

ముందుగా ముమ్మారు గాయత్రిని జపించాలి. అగ్నిమీళే పురోహితమ్‌, యదంగ, అగ్విర్వై ఇత్యాది మంత్రాలు పఠించాలి. మహావ్రతం చైష పంథా అని పలకాలి. మఘవత్‌, ఇషేత్వోర్జ, అగ్న ఆయాహి, శంనో దేవీః, వృద్ధిరాదైచ్‌, పంచసంవత్సర, యమరస తజభన, అథాతో ధర్మజిజ్ఞాసా, అథాతో బ్రహ్మజిజ్ఞాసా, తచ్చంయో, బ్రహ్మణేనమః - ఇత్యాదికంగా పఠిస్తూ ఆయా విధులు నిర్వహించాలి. 

అనంతరం తర్పణలు చెయ్యాలి. ప్రజాపతి, బ్రహ్మ దేవతలు, వేదాలు, ఋషులు, ఛందస్సులు, ఓంకారం, వషట్కారం, వ్యాహృతులు, సావిత్రి, గాయత్రి, యజ్ఞాలు, ఆకాశం, భూమి, ఆంతరిక్షం, అహోరాత్రాలు, త్రిసంధ్యలు, సిద్ధులు, సప్తసముద్రాలు, నదులు, సప్తకులవర్యతాలు, పుణ్యక్రేత్రాలు, ఓషధులు, వనస్పతులు, గంధర్వాప్సరోనాగయక్షాదులు, పక్షులు, గోవులు, సాధ్యులు, రాక్షసులు, మంత్రాలు, విప్రులు - వీరికి తర్పణాలు స్వీకరించే అర్హత ఉంది. కనక తర్పణాలు వదలాలి.

ఇది భూతతర్పణం. ఆ తరవాత నివీతం చేసుకుని ఋషితర్పణం. శతర్చి - మాధ్యమ - గృత్సమదులకూ, విశ్వామిత్ర వామదేవ అత్రి భరద్వాజ వసిష్ఠ ప్రగాథ పావమాన్యులకూ అలాగే క్షుద్రసూక్త మహాసూక్తాలకూ సనక సనందన - సనాతన - సనత్కుమార - కపిల - ఆసురి - వోహలి - పంచశీర్షకులకూ తర్పణాలు ఇవ్వాలి.

తరవాత ప్రాచీనావీతిగా సుమంత జైమిని వైశంపాయన పైల మహాభాష్య మహాభారత ధర్మాచార్యులకూ బాహవి గార్గ్య గౌతమ శాకల బాభ్రవ్య మాండవ్య మాండూకేయ గార్గీ వాచక్రవీ బడబా ప్రాతిథేయికా సులభా మైత్రేయీ, కహోళ కౌశీతక మహాకౌశీతక భారద్వాజ పైంగ్య మహా పైంగ్య సుయజ్ఞ సాంఖ్యాయన ఐతరేయ మహైతరేయ బాష్కల శాకల సుజాతవక్త్ర ఔదవాహి సౌజామి శౌనక ఆశ్వలాయన తర్పణలు చెయ్యాలి. 

ఇంకా తక్కిన ఆచార్యులందరికీ పేరు పేరునా ఇవ్వాలి. నా వంశంలో పుట్టి సగోత్రికులై అపుత్రకులై మరణించినవారికందరికీ చెందుగాక, స్వీకరింతురుగాక అని వస్త్రనిపీడనోదకం విడిచిపెట్టాలి.

ఇలాగ విధ్యుక్తంగా బ్రహ్మయజ్ఞం నిర్వహించాలి, సర్వవేదవేదాంగపఠనఫలం దక్కుతుంది. అటుపైని వైశ్వదేవం నిత్యశ్రాద్ధం చెయ్యాలి. అతిథులకు అన్నదానంకూడా నిత్యమూ చెయ్యాలి. గోవులకు గడ్డివేసి వచ్చి బ్రాహ్మణులతో కలిసి దినపంచమభాగంలో హాయిగా సుష్టుగా భోజనం చెయ్యాలి. 

ఇతిహాస పురాణాలతో షష్ఠ సప్తమ భాగాలను గడపాలి. అష్టమ ఘటికాకాలంలో లోకయాత్ర, బహిస్సంధ్య. అటుపైని సాయంసంధ్య వార్చాలి.

సాయం సంధ్య




Madhyaahna Sandhya - Afternoon twilight - మధ్యాహ్నసంధ్య

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - మధ్యాహ్నసంధ్య

ప్రాతస్సంధ్యోపాస్తి, అది అయ్యాక దేవీపూజ - చెప్పానుగదా! ఇప్పుడింక మధ్యాహ్న సంధ్యావందనం గురించి చెబుతాను ఆలకించు. ఇది అపూర్వమూ అత్యుత్తమమూ అయిన ఫలాలను ఇస్తుంది.

మధ్యాహ్న సమయాన సంధ్యాదేవత సావిత్రి, యువతి, శ్వేతవర్ణ, త్రిలోచన, అక్షమాలాధారిణి, త్రిశూల ధారిణి, 
వరద, అభయహస్త ముద్రాంచిత, వృషారూఢ, యజుర్వేద సంహితారూప, రుద్రదేవత, గుణయుత, భువర్లోక వ్యవస్థిత, ఆదిత్యమార్గ సంచారకర్త్రి, మాయామయి. ఇటువంటి ఆదిదేవికి నమస్కరిస్తున్నాను అని ధ్యానశ్లోకం పఠించాలి. 

ప్రాతస్సంధ్యలో లాగానే ఆచమనాదికం చెయ్యాలి. అటు పైని అర్ఘ్య ప్రదానం పువ్వులతో చెయ్యాలి. పువ్వులు లేకపోతే బిల్వపత్రాన్ని నీళ్ళల్లో ముంచి ఆ నీటిని సూర్యుడికి అభిముఖంగా ఆకాశంలోకి జల్లుతూ అర్ఘ్యాన్ని ప్రతిపాదించాలి. మిగతా కార్యక్రమమంతా ప్రాతస్సంధ్యలాగానే. 

కొందరిక్కడ తదిత్యాది మంత్రంతో సావిత్రిని ధ్యానించాలి అంటున్నారుగానీ అది సంప్రదాయం కాదు. అసంప్రదాయం హానికరం. కనక ఉభయ సంధ్యల్లోనూ ఓంకారసహితమైన గాయత్రీ మంత్రంతోనే నీరు జల్లాలి. ఆకృష్ణేన - ఇత్యాది మంత్రంతో పుష్పమిశ్రితమైన జలం లేదా బిల్వదుర్వాది పత్రాలతో పూర్వోక్త పద్ధతిలో జల్లి అర్ఘ్యం ఇవ్వాలి. ఇది సంధ్యాసాఫల్యదాయకం. మందేహరాక్షస వినాశకం. 

ఆ తరవాత గాయత్రీమంత్రంతోనే యజుర్వేదపురుష హిరణ్యగర్భాదులకు తర్పణాలు విడిచి పెట్టాలి. ఉదుత్యమిత్యాది మంత్రాలతో సూర్యోపస్థానం చెయ్యాలి. అటుపైని గాయత్రీమంత్రజపం. 

దీనికీ మూడుపూటలకూ మూడు పద్ధతులున్నాయి. ప్రాతఃకాలంలో చేతులు పైకి త్రిప్పి, సాయంకాలంలో క్రిందికి త్రిప్పి మధ్యాహ్నసమయంలో గుండెల పై ఆన్చి గాయత్రిని జపించాలి.

గాయత్రీమంత్ర జప పరిగణనకుకూడా ఒక విధానం ఉంది. అనామిక మధ్య గణువుతో మొదలుపెట్టి చిటికెనవేలు గణుపులుమీదుగా చూపుడు వేలు మూలంవరకూ పదిగణుపులవుతాయి. వీటిని లెక్కించుకుంటూ గాయత్రిని జపిస్తే దశగాయత్రి అవుతుంది. దీన్ని కరమాల అంటారు.

ఇలా పదిసార్లు చేస్తే శతగాయత్రి. తర్జని మొదటి కణుపుదగ్గర (పైనుండే కణుపు) ఆపేస్తే ఎనిమిది. మొత్తం ఆష్టోత్తరశతగాయత్రి. రోజూ సహస్రగాయత్రి చేస్తే విశేషఫలితాలుంటాయి. గోహత్య పితృహత్య మాతృహత్య భ్రూణహత్య గురుపత్నీసంగమం బ్రహ్మహత్య సురాపానం ఇత్యాది మహాపాతకాలన్నీ అంతరిస్తాయి. పవిత్రుడవుతాడు. 

మానసిక వాచిక కాయిక దుష్కర్మలన్నీ తొలగిపోతాయి. గాయత్రీ మంత్రం తెలియని విప్రుడి జన్మ వ్యర్థం. నాలుగువేదాలూ చదివినా ఒక్కసారైనా గాయత్రిని జపించకపోతే ఆ చదువంతా కేవలం శ్రమమాత్రమే అవుతుంది. వేదావృత్తికన్నా గాయత్రీజపం ఉత్తమోత్తమం.

బ్రహ్మ యజ్ఞం




devimahima - bruhadradhudi puurvajanma sruthi - దేవీమహిమ - బృహద్రథుడి పూర్వజన్మ సృతి

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - దేవీమహిమ - బృహద్రథుడి పూర్వజన్మ సృతి

నారదా! ఇక్కడ నీకొక కథ చెప్పాలి విను. పూర్వం హిమాలయపర్యతాల్లో ఒక చక్రవాకపక్షి ఉండేది. అది ఆకాశమార్గాన ఆయాదేశాలపై ఎగురుతూ వచ్చి వచ్చి కాశీపట్టణం చేరుకుంది. ప్రారబ్ధం బాగుండి అన్నపూర్ణాదేవి మందిరం దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఏవో పడిఉన్న మెతుకుల్ని ఏరుకు తినే మిషతో తనకు తెలియకుండానే ఆ మందిరానికి ప్రదక్షిణ చేసింది. ఆ తరవాత అక్కడినుంచి ఎగిరి ఎటో వెళ్ళిపోయింది.

కాలాంతరాన మరణించింది. సరాసరి స్వర్గం చేరుకుంది. దివ్యరూపం దరించి రెండు కల్పాలపాటు దివ్యభోగాలు అనుభవించింది. భూలోకంలో క్షత్రియవంశాన మగబిడ్డగా పునర్జన్మ పొందింది. బృహద్రథుడు అనే పేరుతో ఆ మగబిడ్డ ఎదిగి యువకుడై పట్టాభిషక్తుడయ్యాడు. 

అతడికి త్రికాలజ్ఞత సహజంగానే సిద్దించింది. యజ్ఞయాగాదులు చేస్తూ సత్యవాదిగా జితేంద్రియుడుగా ధార్మికుడుగా ప్రజల ప్రశంసలు అందుకున్నాడు. అతి దుర్లభమైన పూర్వజన్మస్మృతి అతడికి ఉన్న విషయం ఎలాగో ప్రజలకు తెలిసి బాగా ప్రచారంలోకి వచ్చింది. 

మునీశ్వరులకు తెలిసింది. వారు ఆశ్చర్యచకితులై దర్శనార్థం వచ్చారు. బృహద్రథుడు భక్తిశ్రద్ధలతో అతిథిమర్యాదలు జరిపాడు. కుశలప్రశ్నలు అయ్యాక మునీశ్వరులు తాము వచ్చిన పని ఎమిటో చెప్పారు.

మహారాజా! నీకు పూర్వజన్మస్మృతి ఉంది. త్రికాలజ్ఞత ఉంది. ఏ పుణ్యవిశేషంతో నీకు ఈ శక్తులు లభించాయి? తెలుసుకుందామని వచ్చాం. కాకపోతే, చెప్పదగినదే అయితే తెలియపరిచి మమ్మల్ని ఆనందింపజెయ్యి.

మునీంద్రులారా! ఇందులో రహస్యమేమీలేదు. అంతా అమ్మవారి దయ. పూర్వజన్మలో నేను ఒక చక్రవాకపక్షిని. అల్పజీవిని. కాశీలో అన్నపూర్ణ మందిరానికి ప్రదక్షిణం చేశాను. తెలిసి చేసింది కాదు. అయినా అమోఘఫలం దక్కింది. ఆ పుణ్యవిశేషం వల్ల స్వర్గసుఖాలు రెండు కల్పాలపాటు అనుభవించాను. ఈ జన్మలో మహారాజునూ సార్వభౌముడనూ అయ్యాను.

పూర్వజన్మ స్మృతితోపాటు భూత భవిష్యద్వర్తమానాలను తెలుసుకునే శక్తి అబ్బింది. జగదంబిక పాదాలను స్మరిస్తే ఎంత పుణ్యం లభిస్తుందో దానికి ఎంత ఫలం దక్కుతుందో ఎవరూ చెప్పలేరు, ఊహించలేరు. ఆ తల్లి మహిమను తలుచుకుంటే చాలు నాకు కళ్ళు చెమ్మగిల్లి ఆనందబాష్పాలు జాలువారతాయి. 

జగన్మాతను ఉపాసించనివారి జన్మలు వ్యర్థం. వారు తల్లిని మరిచిపోయిన కృతఘ్నులు. పాపాత్ములు. హరిహరోపాసనలు నిత్యవిధులు కావు. పరాదేవతోపాసన ఒక్కటే నిత్యమనీ సత్యమనీ శ్రుతి చెబుతోంది. మీవంటి జ్ఞానులకు నేను చెప్పేదేమిటి? భగవతి పాదాంభోజాలను నిరంతరం సేవించవలసిందే. ఇంతకన్నా ఈ జగత్తులో సేవించదగిన మరొక వస్తువు నిర్గుణంగానీ సగుణంగానీ ఏదీ లేదు.

బృహద్రథుడి సమాధానం మునిశ్వరుల సంశయాలను తీర్చింది. సంతృప్తులై ఆనందబాష్పాలు ఒత్తుకొంటూ తమతమ ఆశ్రమాలకు తిరిగివెళ్ళారు.

నారదా! ఇంతటి ప్రభావం కలది దేవీపూజ. దాని ఫలం ఎంత అని ఎవరైనా అడగగలరా? ఎవరైనా చెప్పగలరా? ఎవరి జన్మ సఫలమో వారికి ఈ పూజపట్ల శ్రద్ధ కలుగుతుంది. ఎవరి జన్మ సంకరమో నిష్ఫలమో వారికి శ్రద్ధ కలగదు. శ్రద్ధ కలగడానికైనా నోచుకుని ఉండాలి.

మధ్యాహ్నసంధ్య




Worship of Mahadevi - మహాదేవీ సమర్చన

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - మహాదేవీ సమర్చన

దేవిపూజావిధానం సమగ్రంగా మరొక్కసారి వినాలనుకుంటున్నాను చెప్పమని నారదుడు అడిగాడు. నారాయణమహర్షి ఆరంభించాడు. 

శ్రీమాతృపూజ భుక్తిముక్తిప్రదం. సమస్త ఆపదలనూ తొలగిస్తుంది. సకల భోగభాగ్యాలనూ కలిగిస్తుంది. నారదా! మౌనంగా ఆచమించి సంకల్పం చెప్పుకుని భూతశుద్ధ్యాదికమంతా నిర్వహించాలి. మాతృకాన్యాసపూర్వకంగా షడంగన్యాసం చెయ్యాలి. సామాన్యా ప్రదానాదికంతో శంఖస్థాపన చెయ్యాలి.

పూజాద్రవ్యాలను మంత్రోదకాలతో సంపప్రోక్షించాలి. గురువు అనుమతిపాంది పూజకు ఉపక్రమించాలి. పీఠపూజ చేసి దేవిని ధ్యానించాలి. ఆవాహన చేసి ఆసనాద్యుపచారాలు సమర్పించి పంచామృతరసాదులతో స్నానం చేయించాలి. 

పౌండ్రేక్షురసపూర్ణాలైన శతకుంభాలతో స్నానం చేయించినవాడికి పునర్జన్మ ఉండదు. వేదమంత్ర పారాయణంచేస్తూ చూతఫల రసంతోగానీ చెఱకు పానకంతోగానీ (ఇక్షురసం) అమ్మవారిని స్నానం చేయించినవారి ఇంటిలో సరస్వతీదేవి స్థిరంగా నివసిస్తుంది.

ద్రాక్షాఫలరస స్నానం చేయించినవారు రసబిందువులన్ని సంవత్సరాలు దేవీలోకంలో నివసిస్తారు. కర్పూర అగురు కాశ్మీర కస్తూరీ సమ్మిశ్రితమైన జలాలతో వేదమంత్రపూర్వకంగా జగదీశ్వరిని స్నానం చేయించినవారికి నూరు జన్మల పాపాలు భస్మీపటలమై పోతాయి. 

క్షీరాభిషేకం చేయిస్తే ఆ భక్తుడు కల్పాంతంవరకూ క్షీరసాగరమధ్యంలో అమ్మవారి సాన్నిధ్యాన్ని చూరగొంటాడు. పెరుగుతో తేనెతో నెయ్యితో పంచదార పానకంతో అభిషేకించినవారు ఆయా ద్రవ్యాలకూ ద్రవ్యప్రవాహాలకూ అధిపతులవుతారు.

భక్తితో సహస్ర కలశాభిషేకం చేస్తే ఇహపరలోక సుఖాలన్నీ ఆ భక్తుడివే. అటు పైని కాశ్మీర చందనం ఇచ్చి, కస్తూరి బొట్టు దిద్ది, సీమంతంలో సిందూరం సింగారించి, పాదాలకు లత్తుకను అలంకరించినవాడు ఇంద్రపదవిని ఆధిష్ఠిస్తాడు. రకరకాల పుష్పాలను ఈ పూజకు ఉపయోగించవచ్చు. పుష్పార్చన చేసినవాడు కైలాసం చేరుకుంటాడు.

బిల్వపత్రాలతో పూజచేస్తే అతడికి ఎప్పుడూ ఎక్కడా ఏ దుఃఖమూ ఉండదు. బిల్వపత్ర దళాలమీద రక్తచందనంతో మాయాబీజాక్షర త్రయాన్ని సుస్పష్టంగా సుందరంగా లిఖించాలి. ఆ బీజాక్షరాలతో కలిపి అమ్మవారి నామాన్ని చతుర్థ్యంతంగా పలికి నమః అంటూ (ఓం మహాదేవ్యై నమః. హ్రీం జగదీశ్వర్యై నమః - ఇత్యాదిగా) బిల్వపత్రాలను అమ్మవారి పాదాలచెంత ఉంచాలి. 

ఇలా బిల్వపత్రార్చన చేసినవారికి మనుత్వం లభిస్తుంది. లేతదళాలను కోసి తెచ్చి కోటి బిల్వార్చన చేసినవాడు బ్రహ్మాండాధిపతి అవుతాడు. కోటి కుందపుష్పార్చన చేస్తే ప్రాజాపత్యం దక్కుతుంది. కోటిసంఖ్యలో మల్లికా మాలతీపుష్పాలను సుంగంధ ద్రవ్యాలతో కలిపి అమ్మవారికి పూజచేస్తే బ్రహ్మత్వం, దశకోటి చేస్తే విష్ణుత్వం, శతకోటి చేస్తే సూత్రాత్మత్వం లభిస్తాయి. 

ఇప్పుడు ఆయా పదవుల్లో ఉన్నవారందరూ ఇలా అర్చించివవారే. జపా - బంధూక - దాడిమీ కుసుమాలుకూడా ఇలాగే అనంతపుణ్య ఫలాలను ఇస్తాయి. ఆయా ఋతువుల్లొ దొరికే పువ్వులతో సంవత్సరం పాడువువా అమ్మవారికి సహస్రనామార్చవ చేస్తే సర్వమహాపాతక - ఉప పాతకాలు అన్నీ నశించి ముక్తి లభిస్తుంది.

దేహాంతంలో శ్రీదేవీపదసన్నిధికి చేరుకుంటాడు. ఇది దేవతానాయకులకుకూడా దుర్లభమైన పదవి. కృష్ణాగురు కర్పూర చందన సిల్హిక ఆజ్య గుగ్గులు సమన్వితంగా ధూపంవేస్తే దేవి ప్రసన్నురాలై ముల్లోకాలనూ తెచ్చి ముంగిట నిలుపుతుంది. కర్పూరఖండాలతో నీరాజనమిస్తే సూర్యలోకనివాసం సిద్ధిస్తుంది. శతదీపార్చన సహస్రదీపార్చన కోటి దీపార్చనలు చేసినవారికీ ఇదే పుణ్యఫలం దక్కుతుంది.

అమ్మవారి ఎట్టయెదుట పర్వతాకారంలో నైవేద్యం నిలపాలి. షడ్రసోపేతమైన లేహ్యచోష్య పేయాలతో రకరకాల పిండివంటలతో రుచికరమైన ఫలాలతో బంగారు పాత్రల్లో అన్నరాశిని నివేదన చెయ్యాలి. అమ్మవారు తృప్తి చెందితే జగృత్త్రయం తృప్తి చెందుతుంది. ఎందుకంటే రజ్జువునందు సర్పత్వంలాగా జగత్త్రయమూ అమ్మవారే కనక.

నైవేద్యం పెట్టాక సుగంధభరితమైన చల్లని గంగాజలాన్ని కలశాలలో పానీయంగా సమర్పించాలి. తర్వాత కర్పూరతాంబూలం ఇవ్వాలి. ఏలకులూ లవంగాలూ వక్కపొడి ఇత్యాదులతో లేతతములపాకులు మడిచి ముఖసౌంగంధ్యవర్థకంగా అందివ్వాలి. అటు పైని మృదంగ వీణాది వాద్యాలతో మనోహరగానాలతో వేదపారాయణలతో పురాణపఠనలతో స్తోత్రపాఠాలతో జగన్మాతను అలరించాలి.

రెండేసి ఛత్రచామరాలు సమర్పించాలి. రాజోపచారాలు అన్నీ చెయ్యాలి. ప్రదక్షిణ నమస్కారాలు చెయ్యాలి. లెంపలు వేసుకుంటూ క్షమాపణలు చెప్పాలి. ఒక్కసారి ఒక్క ఉపచారం చేస్తేనే అమ్మవారు అనుగ్రహిస్తుంది. అలాంటిది అన్ని ఉపచారాలూ నిత్యమూ భక్తితో చేస్తే అమ్మవారి ఆనందానికీ అనుగ్రహానికీ అవధులు ఉంటాయా!

ఆవిడ జగన్మాత కనక పుత్రులపట్ల సహజంగానే ప్రేమ దయ ఉంటాయి. భక్తితో అర్చనచేసే పుత్రుడంటే అవి ఎంత విశేషంగా ప్రవహిస్తాయో వేరే చెప్పాలా!

దేవీమహిమ - బృహద్రథుడి పూర్వజన్మ సృతి




Panchayatana Puja - పంచాయతన పూజ

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - పంచాయతన పూజ

సంధ్యావిధానం సమగ్రంగా తెలియజేశాను. ద్విజులందరూ ప్రాతఃకాలంలో తప్పనిసరిగా ఆచరించాలి. ఇది అయ్యాక స్వయంగా అగ్నిహోత్రం(అగ్నికార్యం) చేసుకోవాలి. అటు పైని పంచాయతన పూజ. శివ శివా గణపతి సూర్య విష్ణు పూజలు. (పురుషకృత) శ్లోకాలతోగానీ అపౌరుషేయ మంత్రాలతోగానీ(వ్యాహృతులు) ఈ పంచాయతనపూజ చేసుకోవచ్చు. హ్రీశ్చతే ఇత్యాదికమైన మూలమంత్రాలు ఉన్నాయి. వాటితోనూ చెయ్యవచ్చు. ఎవరి ఆచారాన్నిబట్టివారు చేసుకోవాలి. పార్వతీదేవిని మధ్యలోఉంచి, ఈశాన్యంలో శ్రీమహావిష్ణువునుంచి, ఆగ్నేయంలో శివుణ్ణి ఉంచి, నైరృతిదిశలో గణపతిని నిల్పి, వాయవ్యంలో సూర్యుణ్ణి నిల్పి - పంచాయతన పూజ చెయ్యాలి. ముందుగా పార్వతీదేవిని అర్చించి తరవాత తక్కిన దేవతలకు పూజలు చెయ్యాలనేది క్రమం. షోడశమంత్రాలతో షోడశోపచారాలు అందరికీ చెయ్యాలి. విష్ణుమూర్తిని అక్షతలతోనూ, గణేశ్వరుణ్ణి తులసితోనూ, దుర్గామాతను గరికపోచలతోనూ(దూర్వా) శివుణ్ణి మొగలి పువ్వులతోనూ అర్చించకూడదంటారు.

మల్లికా - జాతి - కుటజ - పనస - కింశుక - వకుళ - కుంద - లోధ్ర - కరవీరక - శింశుపా - అపరాజిత - బంధూక - అగస్త్య - మదంత - సింధువార - పలాశ - దూర్వాంకుర - బిల్వదళ - కుశమంజరికా - శల్లకీ - మాధవి - అర్క - మందార - కేతకి - కర్ణికార - కదంబ - పున్నాగ - చంపక - యూథికా - తగర ప్రముఖ పత్రపుష్పాలు జగదీశ్వరికి అత్యంతప్రీతికరాలు. గుగ్గులంతో ధూపమూ నువ్వులనూనెతో దీపమూ అమ్మవారికి ఇష్టం. వీటితో పూజించి మూలమంత్రం జపించి అటు పైని విప్రుడు వేదాభ్యాసం చెయ్యాలి. ఇక అప్పటినుంచీ కుటుంబ పోషణకు అవసరమైన పనులు చేసుకోవాలి. తృతీయ దినభాగాన్నంతటినీ వీటికి ఉపయోగించుకోవచ్చు. 

మహాదేవీ సమర్చన




Aksharanyasa and Mudras - అక్షరన్యాసమూ ముద్రలూ

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - అక్షరన్యాసమూ ముద్రలూ

నారదా! గాయత్రీవర్ణాలతో చేసే అక్షరన్యాసంకూడా ఉంది. ఆది సర్వపాపహరం. కనక చెబుతాను, గ్రహించు. ముందుగా ఓంకారాన్ని ఉచ్చరించి తత్కారాన్ని పాదాంగుష్ఠాల్లో న్యాసం చెయ్యాలి. సకారం గుల్ఫాలలో, వికారం జంఘలలో, తుకారం జానువులలో, వకారం ఊరువులలో, రేకారం గుదప్రదేశంలో, ణికారం లింగదేశంలో, యకారం కటిలో, భకారం నాభిమండలంలో, గోకారం హృదయంలో, దేకారం స్తనద్వయంలో, వకారం హృదయంలో, స్యకారం కంఠకూపంలో, ధీకారం ముఖదేశంలో, మకారం తాలువులలో, హికారం నాసికాగ్రంలో, ధికారం నేత్రమండలంలో, యోకారం భ్రూమధ్యంలో, యోకారం లలాటదేశంలో, నకారం పూర్వముఖంలో, ప్రకారం దక్షిణముఖంలో, చోకారం పశ్చిమముఖంలో, దకారం ఉత్తరముఖంలో, యాకారం మూర్ధభాగంలో నిన్యసించి తకారాన్ని వ్యాపకంగా న్యాసం చెయ్యాలి. ఈ న్యాసవిధానాన్ని కొందరు జపతత్పరులు ఇష్టపడరు. అటు పైని జగదంబిక గాయత్రిని ధ్యానించాలి.

భాస్వజ్జపా ప్రసూనాభాం కుమారీం పరమేశ్వరీమ్‌ ।
రక్తాంబుజాసనారూఢాం రక్తగంధానులేపనామ్‌ ॥

రక్తమాల్యాంబరధరాం చతురాస్యాం చతుర్భుజామ్‌ ।
ద్వినేత్రాం స్రుక్‌ స్రువౌ మాలాం కుండికాం చైవ బిభ్రతీమ్‌ ॥

సర్వాభరణ సందీష్తాం ఋగ్వేదాధ్యాయినిం పరామ్‌ ।
హంసపత్రామాహవనీయమధ్యస్థాం బ్రహ్మదేవతామ్‌ ॥

చతుష్పదామష్టకుక్షిం సప్తశీర్షాం మహేశ్వరీమ్‌ ।
అగ్నివక్త్రాం రుద్రశిఖాం విష్ణుచిత్తాం తు భావయేత్‌ ॥

బ్రహ్మకవచ, సాంఖ్యాయనగోత్రసంభవ, ఆదిత్యమండల మధ్యవర్తిని గాయత్రీ మహేశ్వరిని ఇలా ధ్యానించాలి. (ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్చాయైః - ఇత్యాది ధ్యానశ్లోకమే సుప్రసిద్ధం) ధ్యానమయ్యాక దేవికి ప్రీతికరమైన సమ్ముఖ - సంపుట - వితత - విస్తృత - ద్విముఖ - త్రిముఖ - చతుష్క - పంచక - షణ్ముఖ - ఆధోముఖ - వ్యాపకాంజలిక - శకట - యమపాశ - గ్రథిత - సమ్ముఖోన్ముఖ - విలంబ - ముష్టిక - మత్స్య - కూర్మ- వరాహక - సింహాక్రాంత - మహాక్రాంత - ముద్గర - పల్లవ - చతుర్వింశతి ముద్రలను పట్టాలి. గాయత్రీమంత్రంలో ఇరవైనాలుగు అక్షరాలున్నాయి కనక ఇరవైనాలుగు ముద్రలు. జాతవేదసమంత్రాన్ని పఠించాలి. త్య్రంబకఋక్కును ఆవర్తించాలి. అలా శతాక్షర గాయత్రిని జపించాలి. అటు పైని ఓంకారపూర్వకంగా భూర్భువస్స్వః అనే వ్యాహృతిత్రయంతో చతుర్వింశతి గాయత్రిని ఉచ్చరించాలి. విఫ్రులందరూ నిత్యమూ ఇలా గాయత్రీజపం చేస్తే సంధ్యాదేవి ఆనందించి సమగ్రపుణ్యఫలాలను అనుగ్రహిస్తుంది.

బ్రహ్మనందనా! భిన్నపాదంగా గాయత్రీమంత్రాన్ని ఉచ్చరించాలి. బ్రహ్మహత్యాది దోషాలుకూడా తొలగిపోతాయి. అభిన్న పాదంగా (పాదాలు కలిపేస్తూ) ఉచ్చరిస్తే అంతటిదోషమూ సంక్రమిస్తుంది. కోటి కల్పాలు అధోముఖులుగా ఉండిపోతారు. సంపుటైకషడోంకారాది భేదాలు చాలా ఉన్నాయనీ పంచప్రణవ సంయుక్తమైన గాయత్రినే జపించాలనీ జపసంఖ్యలో ఎనిమిదవభాగం చివర తురీయపాదాన్ని జపించాలనీ, సంపుటైక షడోంకార గాయత్రులు ఊర్ధ్వరేతస్కులకనీ, బ్రహ్మచారులకూ గృహస్థులకూ మోక్షార్ధులకూ తురీయగాయత్రి అనీ ఇత్యాదిగా అభిప్రాయాలు శాస్త్రపురాణేతిహాసాల్లో కనపడుతున్నాయి. ఇక్కడ చెప్పుకోవలసిన మరొక ధ్యానశ్లోకముంది -

హృది వికసితపద్మం సార్కసోమాగ్నిబింబం
ప్రణవమయమచింత్యం యస్య పీఠం ప్రకల్ప్యమ్‌


అచల పరమసూక్ష్మం జ్యోతిరాకాశసారమ్‌
భవతు మమ ముదే
உసౌ సచ్చిదానందరూపః

త్రిశూల - యోని - సురభి - అక్షమాల - లింగ - అంబుజ - మహాముద్రలు ఏడింటినీ ప్రదర్శించాలి. సంధ్యాదేవియే గాయత్రీదేవి. కనక భక్తి శ్రద్ధలతో ఉపాసించాలి. అటుపైని పంచోపచారపూజ చెయ్యాలి. లం పృథివ్యాత్మనే నమోనమః గంధమర్పయామి. హం ఆకాశాత్మనే నమోనమః పుష్పమర్పయామి. యం వాయ్వాత్మనే నమోనమః ధూపమాఘ్రాపయామి. రం వహ్న్యాత్మనే నమోనమః దీపం దర్శయామి. వమ్‌ అమృతాత్మనే నమోనమః నైవేద్యం సమర్పయామి. యం - రం - లం - వం - హం - పుష్పాంజలిం సమర్పయామి. ఈ పూజ అయ్యాక మళ్ళీ ముద్రలు ప్రదర్శించాలి. మనస్సులో దేవిని ధ్యానించాలి.

మంత్రం ఉచ్చరించేటప్పుడుగానీ ధ్యానించేటప్పుడుగానీ శిరస్సు కదలకూడదు. మెడ వంగకూడదు. దంతాలు కనిపించకూడదు. అష్టోత్తరశతంగాని అష్టవింశతి (28)గానీ, మరీ అశక్తుడైతే కనీసం పదిసార్లుగాని గాయత్రిని జపించాలి. ఇంతకు తక్కువగా ఎప్పుడూ చెయ్యకూడదు. అంతా అయ్యాక ఉత్తమే శిఖరే జాతే అనే శ్లోకాన్ని పఠిస్తూ గాయత్రీమాతకు ఉద్వాసన చెప్పాలి. నారదా! గాయత్రీదేవి అగ్నిముఖి కనక జలమధ్యంలో నిలిచి జపించకూడదని కొందరు మహర్షులు అంటున్నారు.

న గాయత్రీం జపేద్విద్యాన్‌ జలమధ్యే కథంచన

యతస్సాగ్నిముఖీ ప్రోక్తేత్యాహుః కేచిన్మహర్షయః ॥

సురభి - జ్ఞాన - శూర్ప - కూర్మ - యోని - పద్మ - లింగ - నిర్వాణకాలనే ఆష్టముద్రలను జపాంతంలో ప్రదర్శించాలి. ధ్యానమంత్ర పూజావిధుల్లో ఉచ్చారణదోషాలు ఏమైనా దొర్లితే క్షమించమని ప్రార్థిస్తూ గాయత్రీతర్పణం విడిచిపెట్టాలి.

ఈ మంత్రానికి ఛందస్సు గాయత్రి, విశ్వామిత్రుడు ఋషి, సూర్యుడు దేవత. తర్పణే వినియోగః. భూః అని ఉచ్చరించి ఋగ్వేదపురుషుణ్ణీ, భువశ్శబ్దంతో యజుర్వేదపురుషుణ్ణీ, స్వః అనే వ్యాహృతితో సామవేద పురుషుణ్ణీ, మహశ్శబ్దంతో అధర్వణవేద పురుషుణ్ణీ, స్మరిస్తూ తర్పణాలు విడిచి పెట్టాలి. 

అటుపైని జనః పదంతో ఇతిహాసపురాణాలనూ, తపశ్శబ్దంతో సర్వాగమాలనూ, సత్యం శబ్దంతో సత్యలోకపురుషుణ్ణీ, ఓం భూః - భూలోకపురుషం తర్పయామి తర్పయామి అంటూ నీళ్ళు వదిలిపెట్టాలి. భువశ్చేతి భువర్లోకపురుషం తర్పయామి. స్వః స్వర్లోకపురుషం తర్పయామి. 

ఇలాగే గాయత్రీతర్పణలు. ఓం భూరేకపదాం గాయత్రీం తర్పయామి. ఓం భువః ద్విపదాం ..... ఓం స్వః త్రిపదాం గాయత్రీం ..... ఓం భూర్భువః స్వశ్చేతి చతుష్పదాం గాయత్రీం తర్పయామి. ఉషసీ గాయత్రీ సావిత్రీ సరస్వతీ వేదజననీ పృథ్వీ అజాకౌశికీ సాంకృతి సార్వజితి భేదాలతో గాయత్రికి తర్పణలు ఇవ్వాలి. ఇలా వేదపురుష - లోకపురుష - గాయత్రీ తర్పణాలు అయ్యాక శాంతికరంగా జాతవేదసమంత్రం పఠించాలి. మానస్తోకమంత్రంకూడా జపించాలి. త్య్రంబకమంత్రం మరింత శాంతికరంగా ప్రసిద్ధం. తచ్చంయోరిత్యాది మంత్రమూ ఇటువంటిదే. శాంతికరమంత్ర పఠనమయ్యాక అతోదేవా మంత్రద్వయంతో సర్వాంగ స్పర్శనం చేసుకోవాలి. స్యోనాపృథివి మంత్రంతో భూమికి మ్రొక్కాలి. యథావిధిగా గోత్రనామాలు చెప్పుకోవాలి.

పంచాయతన పూజ




Saayam Dandhya - Evening twilight - సాయం సంధ్య

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - సాయం సంధ్య సాయంసంధ్యవల్ల మహామాయ అనుగ్రహం లభిస్తుంది. ఆచమించి ప్రాణాయామం చేసి పద్మాసనం వేసుకుని కూర్చోవాలి. ...