విరించిపుత్రా! శాంతిక పౌష్టిక కామదభేదాలతో ఈ భస్మం మూడు విధాలు. ఇది నీకు కుతూహలం కలిగించే విషయం. కనక వివరంగా చెబుతాను, ఆలకించు.
గోమయమంటే పరమపావనంకదా! మహాపాపక్షయకరమూ మహాకీర్తికరమూకదా! ఆ గోమయాన్ని - ఆవుతోక కిందభాగం నుంచి ఇవతలికి వచ్చీరాకుండానే - చేతితోనే స్వీకరించి యథావిధిగా బ్రాహ్మామంత్రాలతో(వేదమంత్రాలతో) హోమం చెయ్యగా సిద్ధించిన భస్మాన్ని శాంతికం అంటారు. గోమయాన్ని సావధానచిత్తుడై గ్రహించాలి. కిందపడకుండా మధ్యలోనే పట్టుకుని షడక్షరీమంత్రంతో హోమంచేస్తే సిద్ధించే విభూతిని పౌష్టికమంటారు. దాన్నే ప్రాసాదజపంతో (బీజాక్షరాలతో) హోమంచేస్తే వచ్చే భస్మాన్ని కామదమంటారు.
భస్మవ్రతపరుడు తెల్లవారుజామునే లేచి శుచియై గోశాలకు వెళ్ళి ఆవులకు నమస్కరించాలి. బ్రాహ్మణుడైతే తెల్ల అవుదీ, క్షత్రియుడైతే ఎర్ర ఆవుదీ, వైశ్యుడు పసుపురంగులో ఉన్న ఆవుదీ, శూద్రుడైతే కర్రిఆవుదీ పేడను తెచ్చుకోవాలి. పూర్ణిమనాడుగానీ అమావాస్యనాడుగాని అష్టమినాడుగానీ చిత్తశుద్ధితో ఈ పని చెయ్యాలి. తెచ్చాక ఆయా నిర్దిష్ట మంత్రాలు చదువుతూ చిట్టుగానీ పొట్టుగానీ(తుషేణ వా బుసైర్వాపి) కలుపుతూ ముద్దలు చేసి(చరిచి) శుచిప్రదేశంలో ఎండబెట్టాలి. అరణిని మథించి చేసిన అగ్నిగానీ శ్రోత్రియుల ఇంటినుంచి తెచ్చిన అగ్నిగానీ మంత్రపూర్వకంగా హోమకుండంలో వేసి ఈ పిడకలను పూర్వోక్త విధివిధానంగా హోమం చెయ్యాలి. అటు పైని కొత్తపాత్రను తెచ్చి ప్రాసాదమంత్ర పూర్వకంగా ఆందులోకి నింపాలి. చందన కాశ్మీరాది సుగంధద్రవ్యాలను కలపాలి. ఆ పాత్రను భద్రవరచుకోవాలి.
నిత్యమూ ముందుగా జలస్నానం చేసి తరవాత భస్మస్నానం చెయ్యాలి. జలస్నానానికి అశక్తుడైతే హస్తపాద ప్రక్షాళనం చేసుకుని ఈశానమంత్రంతో శిరస్సున చిలకరించుకోవాలి. తత్పురుషమంత్రంతో ముఖాన, అఘోరమంత్రంతో హృదయభాగాన, వామమంత్రంతో నాభిదేశాన, సద్యోమంత్రంతో సర్వాంగాలకూ విభూతి పెట్టుకోవాలి. దీన్ని భస్మస్నానం అంటారు. తరవాత పూర్వవస్త్రాన్ని విడిచి శుద్ధవస్త్రాన్ని ధరించాలి. హస్తపాదాలను మళ్ళీ కడుక్కొని ఆచమనం చెయ్యాలి. ఈ భస్మస్నానం కూడా చెయ్యలేనివారు త్రిపుండ్రధారణ చేస్తే చాలు. మధ్యాహ్నానికి ముందయితే విభూతిని తడిపి ధరించాలి. అటు పైని ఎవరైనాగానీ పాడిదే అలదుకోవాలి. తర్జన్యనామికామధ్యాంగుళులతో(బొటనవేలూ చిటికెనవేలూ కాక,మిగిలన మూడు వేళ్ళతో) త్రిపుండ్రంగా విభూతిని పెట్టుకోవాలి.
శిరస్సు లలాటం చెవులు కంఠం హృదయం బాహువులు - ఇవ్వి భస్మన్యాసానికి తావులని చెబుతారు. ప్రాసాదమంత్రం జపిస్తూ అయిదువేళ్ళతోనూ శిరస్సున జల్లుకోవాలి. శిరోమంత్రం పఠిస్తూ మూడువేళ్ళతో ఫాలభాగాన దిద్దుకోవాలి. సద్యోమంత్రంతో కుడిచెవికీ వామదేవమంత్రంతో ఎడమచెవికీ భస్మం అద్దాలి. అఘోరమంత్రం ధ్యానిస్తూ మధ్యవేలుతో కంఠంమీద, హృదయమంత్రాన్నే జపిస్తూ మూడువేళ్ళతోనూ హృదయంమిద, ఆలాగే మూడువేళ్ళతోనే శిఖామంత్రంతో దక్షిణబాహువుకీ, కవచ పఠనంతో వామబాహువుకీ విభూతిని అలంకరించాలి. ఈశానమంత్రం అంటూ మధ్యవేలితో నాభికి విభూతిని సోకించాలి. ఇదంతా తనకు తాను చేసుకోవచ్చు. లేదా గురువు శిష్యుడికి చెయ్యవచ్చు.
నొసట ధరించే త్రిపుండ్రాలు త్రిమూర్తులకు ప్రతీకలు. మొదటిరేఖ బ్రహ్మ మధ్యలోది విష్ణువు. ఆపైది మహేశ్వరుడు. ఒక్కవేలుతోనే పెట్టుకున్న విభూతి చుక్కకు ఈశ్వరుడే అధిదేవత.
నారదా! శిరోమధ్యంలో బ్రహ్మదేవుడూ, లలాటంలో శివుడూ చెవులకు అశ్వినీదేవతలూ కంఠస్థానంలో గణేశుడూ విభూతికి అధిష్టానదేవతలు. క్షత్రియ వైశ్య శూద్రులకు భస్మధారణమే తప్ప భస్మోద్దూళనం పనికిరాదు. తక్కిన జాతులవారు అందరూ అమంత్రకంగా విభూతి పెట్టుకోవచ్చు.
బ్రహ్మనందనా! అతిగోప్యమయినప్పటికీ సర్వకామఫలప్రదం కనక భస్మోద్దూళనఫలం ఏమిటో నీకు ఉపదేశిస్తున్నాను, శ్రద్ధగా గ్రహించు.