Friday, July 31, 2026

Varieties of Bhasma - Bhasma Bhedalu - భస్మ భేదాలు

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - భస్మ భేదాలు

విరించిపుత్రా! శాంతిక పౌష్టిక కామదభేదాలతో ఈ భస్మం మూడు విధాలు. ఇది నీకు కుతూహలం కలిగించే విషయం. కనక వివరంగా చెబుతాను, ఆలకించు.

గోమయమంటే పరమపావనంకదా! మహాపాపక్షయకరమూ మహాకీర్తికరమూకదా! ఆ గోమయాన్ని - ఆవుతోక కిందభాగం నుంచి ఇవతలికి వచ్చీరాకుండానే - చేతితోనే స్వీకరించి యథావిధిగా బ్రాహ్మామంత్రాలతో(వేదమంత్రాలతో) హోమం చెయ్యగా సిద్ధించిన భస్మాన్ని శాంతికం అంటారు. గోమయాన్ని సావధానచిత్తుడై గ్రహించాలి. కిందపడకుండా మధ్యలోనే పట్టుకుని షడక్షరీమంత్రంతో హోమంచేస్తే సిద్ధించే విభూతిని పౌష్టికమంటారు. దాన్నే ప్రాసాదజపంతో (బీజాక్షరాలతో) హోమంచేస్తే వచ్చే భస్మాన్ని కామదమంటారు.

భస్మవ్రతపరుడు తెల్లవారుజామునే లేచి శుచియై గోశాలకు వెళ్ళి ఆవులకు నమస్కరించాలి. బ్రాహ్మణుడైతే తెల్ల అవుదీ, క్షత్రియుడైతే ఎర్ర ఆవుదీ, వైశ్యుడు పసుపురంగులో ఉన్న ఆవుదీ, శూద్రుడైతే కర్రిఆవుదీ పేడను తెచ్చుకోవాలి. పూర్ణిమనాడుగానీ అమావాస్యనాడుగాని అష్టమినాడుగానీ చిత్తశుద్ధితో ఈ పని చెయ్యాలి. తెచ్చాక ఆయా నిర్దిష్ట మంత్రాలు చదువుతూ చిట్టుగానీ పొట్టుగానీ(తుషేణ వా బుసైర్వాపి) కలుపుతూ ముద్దలు చేసి(చరిచి) శుచిప్రదేశంలో ఎండబెట్టాలి. అరణిని మథించి చేసిన అగ్నిగానీ శ్రోత్రియుల ఇంటినుంచి తెచ్చిన అగ్నిగానీ మంత్రపూర్వకంగా హోమకుండంలో వేసి ఈ పిడకలను పూర్వోక్త విధివిధానంగా హోమం చెయ్యాలి. అటు పైని కొత్తపాత్రను తెచ్చి ప్రాసాదమంత్ర పూర్వకంగా ఆందులోకి నింపాలి. చందన కాశ్మీరాది సుగంధద్రవ్యాలను కలపాలి. ఆ పాత్రను భద్రవరచుకోవాలి.

నిత్యమూ ముందుగా జలస్నానం చేసి తరవాత భస్మస్నానం చెయ్యాలి. జలస్నానానికి అశక్తుడైతే హస్తపాద ప్రక్షాళనం చేసుకుని ఈశానమంత్రంతో శిరస్సున చిలకరించుకోవాలి. తత్పురుషమంత్రంతో ముఖాన, అఘోరమంత్రంతో హృదయభాగాన, వామమంత్రంతో నాభిదేశాన, సద్యోమంత్రంతో సర్వాంగాలకూ విభూతి పెట్టుకోవాలి. దీన్ని భస్మస్నానం అంటారు. తరవాత పూర్వవస్త్రాన్ని విడిచి శుద్ధవస్త్రాన్ని ధరించాలి. హస్తపాదాలను మళ్ళీ కడుక్కొని ఆచమనం చెయ్యాలి. ఈ భస్మస్నానం కూడా చెయ్యలేనివారు త్రిపుండ్రధారణ చేస్తే చాలు. మధ్యాహ్నానికి ముందయితే విభూతిని తడిపి ధరించాలి. అటు పైని ఎవరైనాగానీ పాడిదే అలదుకోవాలి. తర్జన్యనామికామధ్యాంగుళులతో(బొటనవేలూ చిటికెనవేలూ కాక,మిగిలన మూడు వేళ్ళతో) త్రిపుండ్రంగా విభూతిని పెట్టుకోవాలి.

శిరస్సు లలాటం చెవులు కంఠం హృదయం బాహువులు - ఇవ్వి భస్మన్యాసానికి తావులని చెబుతారు. ప్రాసాదమంత్రం జపిస్తూ అయిదువేళ్ళతోనూ శిరస్సున జల్లుకోవాలి. శిరోమంత్రం పఠిస్తూ మూడువేళ్ళతో ఫాలభాగాన దిద్దుకోవాలి. సద్యోమంత్రంతో కుడిచెవికీ వామదేవమంత్రంతో ఎడమచెవికీ భస్మం అద్దాలి. అఘోరమంత్రం ధ్యానిస్తూ మధ్యవేలుతో కంఠంమీద, హృదయమంత్రాన్నే జపిస్తూ మూడువేళ్ళతోనూ హృదయంమిద, ఆలాగే మూడువేళ్ళతోనే శిఖామంత్రంతో దక్షిణబాహువుకీ, కవచ పఠనంతో వామబాహువుకీ విభూతిని అలంకరించాలి. ఈశానమంత్రం అంటూ మధ్యవేలితో నాభికి విభూతిని సోకించాలి. ఇదంతా తనకు తాను చేసుకోవచ్చు. లేదా గురువు శిష్యుడికి చెయ్యవచ్చు.

నొసట ధరించే త్రిపుండ్రాలు త్రిమూర్తులకు ప్రతీకలు. మొదటిరేఖ బ్రహ్మ మధ్యలోది విష్ణువు. ఆపైది మహేశ్వరుడు. ఒక్కవేలుతోనే పెట్టుకున్న విభూతి చుక్కకు ఈశ్వరుడే అధిదేవత.

నారదా! శిరోమధ్యంలో బ్రహ్మదేవుడూ, లలాటంలో శివుడూ చెవులకు అశ్వినీదేవతలూ కంఠస్థానంలో గణేశుడూ విభూతికి అధిష్టానదేవతలు. క్షత్రియ వైశ్య శూద్రులకు భస్మధారణమే తప్ప భస్మోద్దూళనం పనికిరాదు. తక్కిన జాతులవారు అందరూ అమంత్రకంగా విభూతి పెట్టుకోవచ్చు.

బ్రహ్మనందనా! అతిగోప్యమయినప్పటికీ సర్వకామఫలప్రదం కనక భస్మోద్దూళనఫలం ఏమిటో నీకు ఉపదేశిస్తున్నాను, శ్రద్ధగా గ్రహించు.






Bhasmadharana - Sirowratham - భస్మధారణ - శిరోవ్రతం

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - భస్మధారణ - శిరోవ్రతం

నారదా! భస్మధారణకే శిరోవ్రతమని పేరు. దీన్ని ఆచరించినవారికే పరావిద్యకు అధికారం. విధివిధానంలో శ్రద్ధగా ఈ శిరోవ్రతాన్ని ఆచరించాలి. దీన్ని ఆచరించకుండా శ్రౌతస్మార్త సమాచారం ఎంత తెలుసుకున్నా అనుపకారకమే. శిరోవ్రతాచరణం వల్లనే బ్రహ్మాదులు దేవతలు కాగలిగారు. దీని మాహాత్మ్యాన్ని త్రిమూర్తులుకూడా పూర్తిగా వర్ణించి చెప్పలేరు. అధర్వణవేదంలో శిఖరాయమాణంగా చెప్పబడ్డ గొప్ప వ్రతమిది. ఇంతకన్నా గొప్ప వ్రతం మరొకటి లేదంటే లేదు. శాఖాభేదాలనుబట్టి ఈ వ్రతానికి చాలా పేర్లున్నాయి. పేరులూ దారులూ వేరైనా వస్తువు ఒక్కటే. శివాఖ్యం. సత్యచిద్ఘనం. కనక దీన్ని అందరూ ఆచరించాలి. ఎన్ని శాస్త్రాలూ ఎన్ని విద్యలూ నేర్చినా శిరోప్రత విహనుడైనట్టయితే అతడు సర్వధర్మ విహినుడికిందే లెక్క. ఇది పాపకాంతారదాహకం. సర్వవిద్యాసాధకం. నిత్యమూ ఆచరించాలని అధర్వణ శ్రుతి స్పష్టంగా చెబుతోంది.

ఆగ్నిరిత్యాది మంత్రాలు ఆరింటితో శుద్ధిచేసిన భస్మాన్ని శరీరంలో సర్వాంగాలకూ నిండా పులుముకోవాలి. సంగ్రహంగా శిరోవ్రతమంటే ఇదే.

సంధ్యాసమయాల్లో విద్యారంభాల్లో తప్పకుండా చెయ్యాలి. పన్నెండు రోజులనుంచి పన్నెండేళ్ళ వరకూ ఎంతకాలమైనా ఈ వ్రతాన్ని సంకల్పించుకోవచ్చు. కనిష్ట - గరిష్ట పరిమితులు మాత్రం అవ్వి. శిరోవ్రతస్నాతుడికి విద్యలనుగానీ మంత్రాలనుగానీ ఉపదేశించనివాడు ఆ విద్యల్ని కోల్పోతాడు. గురుశబ్దానికి అనర్హుడవుతాడు.

బ్రహ్మవిద్యాగురువంటే సాక్షాత్తూ పరమేశ్వరుడు. మునీశ్వరుడు. పరమదయామయుడై ఉండాలి గదా! వేనవేల జన్మల్లో ధర్మాచరణం చేసినవారికిగానీ బ్రహ్మవిద్యపట్ల శ్రద్ధకలగదు. కోరిక పుట్టదు. అందుచేత శిరోవ్రతం అనుష్ఠించి బ్రహ్మవిద్యను అభ్యర్థించినవారిని ఏ గురువూ తిరస్కరించకూడదు. ద్వేషించకూడదు. ద్వేషం ఎప్పుడూ అజ్ఞానసంభవమే. అతడికి ఆత్మజ్ఞానం లేదని అర్థం. ఇది గురుశిష్యులిద్దరికీ వర్తించేమాట.

శిరోవ్రతస్నాతులే బ్రహ్మవిద్యోపదేశానికి సాక్షాదధికారులు. మరింకెవ్వరూ కారు. ఈ ప్రతంతో అంతర్గతమైన పశుత్వాన్ని వదిలించుకోవాలి. పాశుపతుడు కావాలి. అటువంటివారికే బ్రహ్మవిద్యను ఉపదేశించాలని వేదానుశాసనం.

సతారమైన త్రియంబకమంత్రాన్ని జపిస్తూ త్రిపుండ్రాలుగా భస్మధారణ చేస్తే సరిపోతుందని జాబాలుల మతం. గృహస్థులు ఇలా చేస్తే చాలుననీ ఓంకారయుక్తంగా హంసమంత్రాన్ని ముమ్మారు ఉచ్చరిస్తూ త్రిపుండ్రాలను నిత్యమూ ధరించడం భిక్షుకులకు కర్తవ్యమనీ జాబాలికీశ్రుతి చెబుతోంది. సప్రణవమూ సశివమూ అయిన త్రియంబకమంత్రంతోనే గృహస్థులేకాదు వానప్రస్థులూ త్రిపుండ్రాలుగా భస్మధారణ చెయ్యాలి. మేధావీత్యాది మంత్రంతోకూడా బ్రహ్మచారి తడిపిన భస్మాన్ని త్రిపుండ్రాలుగా ధరించవచ్చు. ఏమైనా బ్రాహ్మణుడికి నొసట నిత్యమూ భస్మావగుంఠనం ఉండాలి, అప్పుడే బ్రాహ్మాణుడనిపించుకుంటాడు.

సన్యాసాశ్రమం స్వీకరించినవారు సతారమైన త్రియంబకమంత్రంతోగానీ పంచాక్షరితోగానీ ప్రణవంతోగానీ నొసటా హృదయంమిదా బాహువులపైనా విభూతిని త్రిపుండ్రాలుగా ధరించాలి. బ్రహ్మచారులు మేధావీత్యాది మంత్రంతోగానీ త్రియాయుష మంత్రంతోగానీ ధరించాలి. గౌణభస్మమైనా ధరించవచ్చు. శూద్రులు శివాయనమః అనే మంత్రంతో త్రిపుండ్రాలను ధరించాలి. మిగిలినవారికి ఏ మంత్రమూ అవసరంలేదు. భక్తితో భస్మోద్దూళనం చేసుకుంటే చాలు. విభూతిధారణచేస్తే సమస్తవిభూతులూ(ఐశ్వర్యాలూ) కలుగుతాయి. ఇది సర్వధర్మాలలోకీ వరేణ్యం. కనక నిత్యమూ ఆచరించాలి.

అగ్నిహోత్రంనుంచిగానీ విరజామంత్రహోమాగ్నినుంచిగానీ ఆవిర్భవించిన భస్మాన్ని ఒక శుభ్రమైన పాత్రలోకి తీసుకోవాలి. కాళ్ళూ చేతులూ కడుక్కుని రెండుసార్లు ఆచమించి సమాహితచిత్తంతో పంచబ్రహ్మ మంత్రాలను చదువుతూ భస్మాన్ని మెల్లమెల్లగా కలపాలి. (ఈ మంత్రాలతోనే భస్మాన్ని పాత్రలోకి తియ్యాలని కొందరు) ముమ్మారు ప్రాణాయామంచేసి అగ్నిరిత్యాది మంత్రాలు ఏడింటితో మూడుసార్లు. అభిమంత్రించాలి. ఓమాపోజ్యోతిరిత్యాది మంత్రాలను పఠిస్తూ ఆ తెల్లని విభూతిని శరీరంమీద శీర్షాదిపాదపర్యంతం జల్లుకోవాలి. ఇలా చేసినవాడు విపాపుడూ విరజుడూ అవుతాడనడంలో ఏ సందేహమూ లేదు. అటుపైని జలాధిపుడైన జగన్నాథుణ్ణి శ్రీమహావిష్ణువును ధ్యానించి విభూతిలో నీటిచుక్కలు వేసి అగ్నిరిత్యాది మంత్రాలను మళ్ళీ పఠిస్తూ తడపాలి. అప్పుడు పార్వతీపరమేశ్వరులను ధ్యానిస్తూ బ్రహ్మచర్యాది ఆశ్రమాలకు నిర్దిష్టమైన ఆయా మంత్రాలను పఠిస్తూ ముందు శిరస్సున ధరించి, నొసటా హృదయానా బాహువులపైనా తిపుండ్రరేఖలుగా ధరించాలి. మధ్యమానామికాంగుష్ఠాలతో అనులోమ విలోమ మార్గాల్లో - త్రిసంధ్యల్లోనూ నిత్యమూ - భస్మత్రిపుండ్ర ధారణ చెయ్యాలి.

నారదా! ఆజ్ఞానధ్వంసకమూ జ్ఞానసాధకమూ అయిన ఈ విభూతి ఆగ్నేయమనీ గౌణమనీ రెండువిధాలు. ఇందులో మళ్ళీ గౌణం చాలా రకాలు. అగ్నిహోత్రభస్మం, విరజానలభస్మం, ఔ పాసనభస్మం, సమిదగ్నిభస్మం, పచనాగ్నిభస్మం, దావానలభస్మం - ఇవన్నీ గౌణాలు. బ్రాహ్మణ క్షత్రియవైశ్యులకు అగ్నిహోత్ర భస్మంగానీ విరజానలభస్మంగానీ ధరించదగినవి. ఔ పాసనాగ్నిభస్మాన్ని గృహస్థులకు విశేషంగా చెప్పారు. బ్రహ్మచారులు సమిదగ్నిభన్మం ధరించాలి. శూద్రులు శ్రోత్రియుల ఇళ్ళనుంచి పచనాగ్నిభస్మం తెచ్చుకుని ధరించాలి. తక్కినవారందరూ దావానలభస్మాన్ని ధరించాలి.

ఇంక శిరోవ్రతదీక్షావిధానమేమంటే - పూర్ణిమాతిథి మంచిది. స్వగృహంలోగానీ ఆరామంలోగానీ అరణ్యంలోగానీ దీక్ష తీసుకోవచ్చు. ఇవి ప్రశస్తాలు. శుభప్రదాలు. పూర్ణిమకు ముందటి త్రయోదశినాడు సుస్నాతుడై అగ్నికార్యం నిర్వర్తించి గురువును పూజించి పాదాభివందనం చేసి అనుమతి పొందాలి. అటు పైని వైశేషికపూజ నిర్వహించి పరిశుభ్రమైన తెల్లని వస్త్రాలు ధరించాలి. కొత్త యజ్ఞోపవీతం వేసుకోవాలి. తెల్లనిపూలు దండగుచ్చి ధరించాలి. మంచిగంధం అలంకరించుకోవాలి. దర్భాసనంమిద దర్భలు చేతబట్టి కూర్చోవాలి. తూర్పుముఖంగాగాని ఉత్తరముఖంగాగానీ కూర్చుని ముమ్మారు ప్రాణాయామం చెయ్యాలి. పార్వతీపరమేశ్వరులను ధ్యానించి వారికి విన్నపం చేసుకోవాలి. నేను ఈ వ్రతం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి. అప్పటికి వ్రతదిక్షితుడైనట్టు లెక్క. ఈ శిరోవ్రతం జన్మాంతంవరకూగానీ, పన్నెండేళ్ళపాటుగానీ ఆరేళ్ళపాటుగానీ మూడేళ్ళపాటు గానీ ఏణ్ణర్థంగానీ ఏడాదిగానీ ఆరునెలలుగానీ మూడునెలలుగాని నెలనాళ్ళేగానీ పన్నెండురోజులేగానీ ఆరురోజులేగానీ మూడునాళ్ళేగానీ ఆధమపక్షం ఒకరోజుగానీ చెయ్యవచ్చు. ఓపికను బట్టీ వీలునిబట్టీ సంకల్పావధిని నియమించుకోవచ్చు. విరజాహోమం చేసే అగ్నిని తెచ్చి ఆజ్యంతో సమిధలతో చరువుతో యథావిధిగా మంత్రయుక్తంగా హోమం చెయ్యాలి.

దీక్ష తీసుకునే రోజుకి ముందుగానే (పూతాహాత్పురతః 10-15) భూతశుద్దిని ఆకాంక్షించి మళ్ళీ సమిధలతో ఆజ్యంతో మంత్రాలతో హోమం చెయ్యాలి. నా దేహంలో ఈ తత్త్వాలు శుద్దిపాందుగాక అని స్మరిస్తూ హోమక్రియ సాగించాలి. పంచభూతాలూ పంచతన్మాత్రలూ పంచకర్మేంద్రియాలూ
పంచజ్ఞానేంద్రియాలూ పంచప్రాణవాయువులూ సప్తధాతువులూ సత్త్వరజస్తమోగుణాలూ మనోబుద్ధ్యహంకారాలూ ప్రకృతిపురుషులూ రాగమూ విద్య కళ నియతి కాలమూ మాయ శుద్ధవిద్య మహేశ్వరసదాశివులూ శక్తి శివతత్త్వమూ - వీటిని తత్త్వాలు అంటారు. వీటి శుద్ధిని ఆకాంక్షించి విరజామంత్రాలతో హోమంచేస్తే మానవుడు శుద్ధిపాంది విరజుడు అవుతాడు.

అటుపైని ఆవుపేడ తెచ్చి ముద్దలు చేసి అభిమంత్రించాలి. హోమాగ్నికుండంలో వేల్చి రోజంతా సంరక్షించాలి. హవిష్యంమాత్రమే భుజించి అగ్నికుండాన్ని చూసుకుంటూ ఉండాలి. చతుర్దశీ సుప్రభాతాన హోమక్రియలన్ని యథావిధిగా నడిపి ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. నిరాహారుడుగా గడపాలి. పూర్ణిమనాడు ప్రాతఃకాలంలో మళ్ళీ యథావిధిగా హోమం చెయ్యాలి. హోమాంతంలో రుద్రాగ్నిని ఉపసంహరించాలి. హోమకుండంనుంచి శ్రద్దగా పద్ధతిగా భస్మం తీసుకోవాలి. అప్పుడు ముండితుడో జటిలుడో శిఖావంతుడో అయ్యి స్నానం చెయ్యాలి. సిగ్గుపడనివాడైతే దిగంబరంగానూ, సిగ్గుపడేవాడైతే కాషాయాంబర చర్మాంబర వల్కలాలలో ఏదో ఒకటి కట్టుకోవాలి. ఏకాంబరుడే కావాలి. మొలనూలు చుట్టుకోవాలి. దండం పట్టుకోవాలి. కాళ్ళు కడుక్కుని రెండుసార్లు ఆచమించి ఆత్మనూ శరీరాన్నీ సంకలీకరించి విరజానలసంభవమైన ఆ భస్మాన్ని అగ్నిరిత్యాదికమైన ఆధర్వణమంత్రాలను ఆరింటిని చదువుతూ మూర్ధాదిచరణాంతంగా అన్ని అవయవాలకూ పులుముకోవాలి. అదే క్రమంలో భస్మంతో సముద్దూళనం చేసుకోవాలి. ప్రణవాన్నో శివనామాన్నో జపిన్తూ ఈ పని చెయ్యాలి. ఆ తరవాత త్రియాయుషమంత్రంతో త్రిపుండ్రాలు ధరించాలి. శివభావాన్ని పాంది శివభావాన్ని ఆచరించాలి. అనునిత్యమూ ముప్పాద్దులా ఇలా చేస్తే అది పాశుపతవ్రతమవుతుంది. ఇది పశుత్వాన్ని తొలగించడంతో పాటు భుక్తిముక్తి ప్రదమవుతుంది. ఇలా పాశుపతవ్రతంచేసి పశుత్వాన్ని తొలగించుకున్న మహానుభావుడు సాక్షాత్తూ మహాదేవుడూ లింగమూర్తీ సదాశివుడుగా పూజనీయుడు అవుతాడు.

నారదా! భస్మస్నానంవల్ల కలిగే మహాపుణ్యం సర్వసౌఖ్యకరం. ఆయురారోగ్యభోగభాగ్యబల పుష్టివర్ధనం. రక్షణకోసం మంగళార్థం సర్వసంపత్పమృద్ధికోసం మృత్యుభయ మహామారీభయ నివారణకోనం మనుష్యులు ఈ భస్మస్నానం చెయ్యాలి.

భస్మ భేదాలు




Bhuthasuddi - Purification of the elements - భూతశుద్ది

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - భూతశుద్ది

నారదా! సదాచారంలో భాగంగా ఇప్పుడు భూతశుద్ది గురించి చెబుతున్నాను. శ్రద్దగా ఆలకించు. మూలాధారచక్రం నుంచి మేల్కొని సుషుమ్నామార్గంద్వారా బ్రహ్మరంధ్రానికి చేరుకునే కుండలినీ పరదేవతను ఒక్కసారి స్మరించు. సాధకుడు హంసమంత్రంతో జీవుణ్ణి బ్రహ్మలో అనుసంధిస్తాడు. శరీరంలో పాదాది జానుపర్యంతం - భూమండలం. అది చతుష్కోణం. సవజ్రకం. లం బీజాఢ్యం. స్వర్ణవర్ణం. జాన్వాది నాభిపర్యంతం - జలమండలం. అది చంద్రార్దనిభం. పద్మద్వయాంకితం, వం బీజయుక్తం. శ్వేతవర్ణం. నాభిమొదలు హృదయపర్యంతం - అగ్నిమండలం. అది త్రికోణం. స్వస్తికాన్వితం. రం బీజయుక్తం. రక్తవర్ణం. హృదయం నుంచి భ్రూమధ్యపర్యంతం - వాయు మండలం. అది వృత్తాకారం. షడ్బీందులాంఛితం. యం బీజయుతం. ధూమ్రువర్ణం. భూమధ్యనుంచి బ్రహ్మరంధ్రపర్యంతం - ఆకాశమండలం. అదీ వృత్తాకారం. స్వచ్చం. మనోహరం. హం బీజయుక్తం. ఇలా ఒక్కొక్కమండలాన్నీ ప్రత్యేకంగా భావించి ఒకదానిలో ఒకటి నింపాలి. భూమిలో జలం, జలంలో అగ్ని, అగ్నిలో వాయువు, వాయువులో ఆకాశం నింపి, ఆకాశాన్ని అహంకారంలో, అహంకృతిని మహత్తత్త్వంలో, మహత్తత్త్వాన్ని ప్రకృతిలో, ప్రకృతిని మాయలో, మాయను ఆత్మలో అంతర్భవింపజెయ్యాలి. అప్పుడు సాధకుడు శుద్ధ సంవిన్మయుడవుతాడు. అయ్యాక - వామకుక్షిలో ఉండే పాపపురుషుణ్ణి స్మరించాలి. నల్లగా ఆంగుష్ఠపరిమాణంలో ఉంటాడు. బ్రహ్మహత్య శిరస్సుగా, సువర్ణస్తేయం బాహువులుగా, మదిరాపానమే హృదయంగా, గురుపత్నీ సంగమమే కటి ప్రదేశంగా, పాతకి స్నేహాలు పాదద్వయంగా, ఉపపాతకాలు మస్తకంగా ఖడ్గచర్మధరుడై అధోముఖుడై దుస్సహంగా ఉంటాడు పాపపురుషుడు. వాయుబీజ స్మరణతో మహావాయువును సృష్టించి ఈ పాపవురుషుణ్ణి ఎండగట్టాలి. వహ్నిబీజాన్ని స్మరించి మంటల్లో దహించివెయ్యాలి. ఆ బూడిదను కుంభకం ద్వారా స్వశరీరంనుంచి వెలుపలికి నెట్టి, వాయుబీజ రేచనతో పోగుపెట్టి, సుధాబీజ స్మరణతో తడిపి భూబీజస్మరణతో ముద్దచేసి, ఆకాశబీజస్మరణతో ఆ బంగారుముద్దను అద్దంలా విశుద్దిపరచి మూర్ధాదిపాదపర్యంతం అన్ని అవయవాలకూ పులుముకోవాలి.

అటుపైని ఆ భస్మం నుంచి ఆకాశాది పంచభూతాలనూ పునరుత్పాదన చేసి సో హం మంత్రోచ్చారణతో ఆత్మను హృదయాంబుజంలోకి తీసుకురావాలి. పరసంగంనుంచి సుధామయమైన కుండలినీ జీవాన్ని తెచ్చి హృదయాంభోజంలో సంస్థాపించి, మూలాధారంలో ఉండే శక్తిని ధ్యానించాలి. ఎర్రసముద్రంలో తెప్పలాగా(తెప్పమిద) ఉన్న అరుణ సరోజంమీద కూర్చుని, హస్తపద్మాలలో శూలమూ, తుమ్మెదలే ఆల్లెత్రాడుగాగల చెరకువిల్లూ, ఆంకుశమూ అయిదుబాణాలూ ఒక రక్తకపాలమూ ధరించినదీ, మూడు కన్నులుకలదీ, బలిష్ఠమైన వక్షోజాలు కలదీ, ఉదయిస్తున్న సూర్యబింబపు రంగులో ప్రకాశించేదీ ఆ మహాదేవి ఆ పరాంబిక ఆ ప్రాణశక్తి మాకు సుఖప్రద అగుగాక!

పరమాత్మ స్వరూపిణి ఆ ప్రాణశక్తిని ఇలా ధ్యానించి విభూతిని ధరించాలి. విభూతిని ధరిస్తేనే వైదిక సత్కర్మాచరణకు అర్హత అధికారం సిద్ధిస్తుంది. శ్రుతి స్మృతి పురాణాలు చెప్పిన ప్రకారం విభూతిని ఎలా ధరించాలో ఏ మహాఫలాలు లభిస్తాయో అదికూడా తెలియజేస్తాను. తెలుసుకో.

భస్మధారణ - శిరోవ్రతం




Rudrakshalu - Adhidevathalu - రుద్రాక్షలు - అధిదేవతలు

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - రుద్రాక్షలు - అధిదేవతలు

నారదా! ఈ రుద్రాక్షల్లోకూడా చాలా భేదాలున్నాయి. ధాత్రీఫలమంత(ఉసిరిక) ఉండేవి ఉత్తమోత్తమాలు. వీటిని భద్రాక్షలు అంటారు. రేగుపండంత ఉండేవి మధ్యమాలు. సెనగగింజల్లాగా ఉండేవి అధమాలు. రుద్రాక్షల్లో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర జాతులున్నాయి. శ్వేతవర్ణంలో ఉండేవి బ్రాహ్మణజాతివి. రక్తవర్ణంలో ఉండేవి క్షత్రియజాతివి. పీతవర్ణంలోఉండేవి వైశ్యజాతివి. కృష్ణవర్ణంలో ఉండేవి శూద్రజాతివి. ఏజాతివాటిని ఆ జాతివారే ధరించాలి. ఆకారంలో సమానంగా ఉండి కంటకాలతో దృఢంగా నిగనిగలాడేవి శుభప్రదాలు. పురుగులు కొరికినవీ పగిలినవీ(ముళ్ళులేనివీ) కంటకాలు లేనివీ కుదపలు కట్టినవీ బాగా తెరుచుకున్నవీ పనికిరావు. స్వయంగా రంధ్రసహితమైన రుద్రాక్ష ఉత్తమం. మానవులు రంధ్రం చేసినది మధ్యమం. నికషంమిద రాస్తే బంగారుగీటు పడేది ఉత్తమోత్తమం. దీన్ని శివపూజా దురంధరులు ధరించాలి.

రుద్రాక్షలను రెండు పేటలుగాగానీ మూడు పేటలుగాగానీ ధరించవచ్చు. కుండలాలలో కిరీటాలలో కర్ణాభరణాలలో హారాలలో కేయూరాలలో కటకాలలో - ఇలా ఏ ఆభరణంలోనైనా పాదిగి ధరించవచ్చు. నిద్రపోతున్నా తింటున్నా తాగుతున్నా రుద్రాక్షమాలను తీసివెయ్యవలసిన అవసరంలేదు. శుచిగా ఉన్న అన్నివేళలా ధరించవచ్చు. మూడు వందలైతే అథమమనీ అయిదు వందలైతే మథ్యమమని వెయ్యి రుద్రాక్షలు ధరిస్తే ఉత్తమమనీ కొందరు చెప్పారు. ఎన్ని ఎక్కువ ధరించగలిగితే అంత మంచిది. కనీసం ఒక్కటైనా ధరించడం అవసరం.

శిరస్సున ధరించేటప్పుడు ఈశానమంత్రం, చెవులకు తత్పురుషమంత్రం, నొసటా గుండెలమీదా ధరించేటప్పుడు అఘోరమంత్రం, చేతులకు అఘోరబీజమంత్రం పఠించాలి. ఉదరాన ధరించేటప్పుడు వామదేవ మంత్రం జపించాలి. మూలమంత్రంతో సంప్రోక్షించిన రుద్రాక్షలనే ధరించాలి.

ఏకముఖీ రుద్రాక్షలు పరతత్త్వప్రకాశకాలు. ద్విముఖిని అర్ధనారీశ్వరమంటారు. త్రిముఖం అగ్నిదేవుడు. సర్వపాపవిదాహకం. ఇదే అగ్నిత్రయస్వరూపం. చతుర్ముఖరుద్రాక్షమంటే బ్రహ్మదేవుడే. దీన్ని ధరించిన వారికి ఆయురారోగ్యభోగభాగ్యాలూ జ్ఞానసంపత్తీ కలుగుతాయి. పంచముఖి రుద్రాక్ష సాక్షాత్తుగా పంచబ్రహ్మాత్మకం. దీన్ని ధరిస్తే శివప్రీతికరం. షడ్వక్త్ర రుద్రాక్షలో కార్తికేయుడే ఉంటాడు. వినాయకుడుంటాడని మరి కొందరన్నారు. సప్తముఖీరుద్రాక్షకు సప్తమాతృకలు అధిదేవతలు. ఇది సప్తాశ్వ - సప్తముని రూపకం. ఆరోగ్య - ఐశ్వర్యవర్థకం. జ్ఞానప్రదం. అష్టముఖీరుద్రాక్షకు అష్టమాతృకలు అధిదేవతలు. దీన్ని ధరించినవారిని ఆష్టవసువులూ గంగాదేవి ఆశీర్వదిస్తారు. నవముఖీరుద్రాక్షమంటే యమధర్మరాజు. దీన్ని ధరిస్తే యమభయం ఉండదు. దశముఖరుద్రాక్షకు దశదిశలూ అధిదేవతలు. దశదిశా ప్రీతికరం. ఏకాదశముఖీ రుద్రాక్షకు ఏకాదశరుద్రులూ అధిదేవతలు. దీనినే ఇంద్రదైవతమని కూడా అంటారు. అత్యంత సౌఖ్యప్రదం. ద్వాదశముఖ రుద్రాక్ష సాక్షాత్తూ మహావిష్ణుస్వరూపం. దీనికి ద్వాదశాదిత్యులు అధిదేవతలు. సర్వరోగనివారిణి. ఆరోగ్యప్రదాయిని. త్రయోదశముఖీ రుద్రాక్షకు మన్మథుడు అధిదేవత. దీన్ని ధరిస్తే తీరని కోరికలే ఉండవు. కామదేవుడు సర్వాత్మనా అనుగ్రహిస్తాడు. చతుర్దశముఖీ రుద్రాక్ష సాక్షాత్తూ రుద్రనేత్రంనుంచి ఆవిర్భవిస్తుంది. దీన్ని ధరిస్తే ఆధివ్యాధులు దరిచేరవు.

నారదా! రుద్రాక్షలు ధరించినవారు మద్య మాంస లశున(వెల్లుల్లి) పలాండు(నీరుల్లి) శిగ్ను(మునగ) శ్లేష్మాతక(విరిగి) విడ్వరాహ భక్షణం చెయ్యకూడదు. గ్రహణకాలంలో, విషువత్తున(రేయింబవళ్ళు సమంగా ఉండేరోజు) సంక్రమణ సమయంలో అయనకాలంలో అమావాన్య(దర్శ) పౌర్ణిమలలో ఇంకా ఇలాంటి పుణ్యదినాలలో పర్వాలలో రుద్రాక్షలను ధరిస్తేవిశేషవలితం ఉంటుంది. వెంటనే పాపవిమోచనం కలుగుతుంది.

భూతశుద్ది




The Story of Gunanidhi - గుణనిధికథ

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - గుణనిధికథ

రుద్రాక్షమాలతో మంత్రజపం చేస్తే కోటిరెట్లు అధికంగా వేగంగా ఫలం సిద్ధిస్తుంది. శరీరంమీద ఒక్కరుద్రాక్ష అయినా లేని నరుడి జన్మ వ్యర్థమంటే వ్యర్థం. రుద్రాక్షను శిరస్సున పెట్టుకుని స్నానం చేస్తే గంగాస్నానఫలం దక్కితీరుతుంది. ఎకముఖ - పంచముఖ - ఏకాదశముఖ - చతుర్దశముఖ రుద్రాక్షలు లోకపూజితాలు. రుద్రాక్షను నిత్యమూ భక్తితో పూజిస్తే శంకరుణ్ణి పూజించినబ్దే. రుద్రుడికీ రుద్రాక్షకూ రుద్రాక్షధారికీ భేదంలేదు. దరిద్రుణ్ణి ధనవంతుణ్ణి చేసే శక్తి ఒక్క రుద్రాక్షకే ఉంది. దీనికి నిదర్శనంగా ఒక పురాణకథ చెబుతాను - విను,

కోసలదేశంలో గిరినాథుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. వేదవేదాంగపారంగతుడు. మహాధనవంతుడు. ధర్మాత్ముడు. యజ్ఞయాగాలు అన్నీ చేసినవాడు. అతనికి గుణనిధి అని ఒక పుత్రుడున్నాడు. మన్మథుడిలా బహుసుందరుడు. సుధిషణుడు అనే గురువు దగ్గర చదువుకుంటున్నాడు. కోడెవయసు కూతలు పెట్టింది. గురుపత్ని ముక్తావళికి వలవిసిరాడు. రూపయౌవనాలకు సమ్మోహితురాలయ్యింది. కొంతకాలం కథ రహస్యంగా సాగింది. ఎప్పటికయినా గురువుగారికి తెలియకమానదు. శపిస్తాడు అని భయపడ్డాడు గుణనిధి. దానితో గురువుకి విషంపెట్టి అడ్డు తొలగించుకొన్నాడు. ఇక స్వేచ్చగా నిర్భయంగా ముక్తావళితో కాపురం సాగించాడు. ఆనోటా ఆనోటా వ్యాపించి గిరినాథునికి తెలిసింది. ఎంతగానో నొచ్చుకున్నాడు. గుణనిధిని పిలిపించి తల్లిడండ్రులిద్దరూ గట్టిగా మందలించారు. దానితో ఆ దుష్టుడు అలిగి వారికే విషంపెట్టాడు. తండ్రికూడబెట్టిన ధనసంపదలతో ముక్తావళిని భోగభాగ్యాలలో ముంచితేల్చాడు. సురాపాన మాంసభక్షణలకు అలవాటు పడ్డాడు. కాలం గడిచింది. సంపదలు తరిగిపోయాయి. ఆస్తులు కరిగిపోయాయి. ధనంకోసం దొంగతనాలకు దిగాడు. గ్రామస్థులంతా మేల్కొన్నారు. సంఘ బహిష్కారం విధించారు. ఇక చేసేది లేక ముక్తావళీ గుణనిధులు అడవులకు పోయారు. దారిదోపిడీలు చేశాడు. అడవిగుండా వెళ్ళే ప్రతిమనిషినీ చంపి సామ్ములు దోచుకున్నాడు. ముక్తావళితో మురిపాలు తీర్చుకున్నాడు. చాలాకాలం సాగింది.

ఒకనాడు హఠాత్తుగా గుణనిధి మరణించాడు. యమదూతలు వేలసంఖ్యలో వచ్చిపడ్డారు. శివలోకంనుంచి శివగణాలూ వచ్చాయి. రెండు వర్గాలకూ వాదం జరిగింది. ఇతడు చేసిన పుణ్యకార్యం ఒక్కటయినా ఉందా? అని యమదూతలు ప్రశ్నించారు. ఇతడిని తీసుకువెళ్ళటానికి శివదూతలుగదా మీరు రావడమేమిటని పరిహసించారు. దానికి శివదూతలు చెప్పిన సమాధానం ఎమిటంటే -

యమదూతలారా! ఈ గుణనిధి మరణించినచోట నేలలో పదిమూరల లోతున రుద్రాక్ష ఉంది. దాని ప్రభావంవల్ల ఇతడి పాపాలన్నీ అంతరించాయి. శివసన్నిధికి యోగ్యుడయ్యాడు. అందుకని తీసుకువెళ్ళడానికి వచ్చాం - అన్నారు. యమదూతలు కిమ్మనకుండా తిరుగుముఖం పట్టారు.

గుణనిధి దివ్యవిమానం అధిరోహించాడు. దివ్యరూపధరుడు అయ్యాడు. శివదూతలతో కలిసి శంకరుడి సన్నిధికి చేరుకున్నాడు.

రుద్రాక్ష మహిమ ఇంతటిది. వర్ణనాతీతం - అని శివుడు షణ్ముఖుడికి వివరించాడు. షణ్ముఖుడు కృతార్థుడనయ్యానని సంబరపడ్డాడు. నారదా! సదాచార ప్రసంగంలో రుద్రాక్షను గురించి నేనింత గొప్పగా చెప్పడానికి ఇదే కారణం. అది సర్వపావక్షయకరం, సర్వపుణ్యప్రదం.

రుద్రాక్షలు - అధిదేవతలు




Rudrakshamahimalu - Gaardhabhagaadha - రుద్రాక్షమహిమలు - గార్ధభగాథ

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - రుద్రాక్షమహిమలు - గార్ధభగాథ

నారదా! శివుడు కుమారస్వామికి చెప్పిన రుద్రాక్షమహిమలు ఇంకా ఏమిటంటే - అంటూ నారాయణమహర్షి కొనసాగించాడు.

దేవతలుసైతం రుద్రాక్షమహిమలో పదహారవకళకయినా సాటిరారు. పురుషులలో విష్ణుమూర్తి, గ్రహాలలో సూర్యుడు, నదులలో గంగ, మునులలో కశ్యపుడు, గుర్రాలలో ఉచ్చైః శ్రవమూ, దేవుళ్ళలో ఈశ్వరుడు, దేవీమూర్తులలో గౌరి ఎలాంటివారో సమస్తవస్తువుల్లోనూ రుద్రాక్ష అటువంటిది. రుద్రాక్షధారణను మించిన తపస్సు లేదు. స్తోత్రం లేదు. వ్రతం లేదు. అక్షయ్యదానాలలో రుద్రాక్షదానం బహువిధాల విశిష్టం. శాంతచిత్తుడైన శివభక్తుడికి రుద్రాక్షను దానం చేస్తే లభించే పుణ్యఫలం ఎంతటిదో ఈశ్వరుడు కూడా చెప్పలేకపోయాడు. రుద్రాక్షధారికి అన్నదానం చేసినవారు ఇటూ అటూ ఏడేసి తరాలు తరించి శివలోకం చేరుకుంటారు. నొసట విభూతి, తనువున రుద్రాక్ష, శివాలయంలో పూజ - విటికి నోచుకోని విప్రుడు శ్వపచుడితో సమానం. మద్యపాన - మాంసభక్షణ - వేశ్యాసంగమాది మహాపాతకాలు రుద్రాక్ష శిరోధారణతో పటాపంచలవుతాయి. యజ్ఞయాగాలు చెయ్యకపోయినా వేదాలు చదవకపోయినా ఏ దానాలూ చెయ్యకపోయినా అన్నీ చేసిన ఫలం లభిస్తుంది. పురాణపఠన తీర్ధసేవన శాస్త్రాభ్యసన పుణ్యఫలాలు దీనికి సాటిరావు. రుద్రాక్షను ధరించి ప్రయాణమధ్యంలో దిక్కులేని చావు చచ్చినా అతడు శివత్వం పొందుతాడు. అతడి వంశంలో ఇరవైయొక్క తరాలు తరిస్తాయి. రుద్రలోకంలో నివసిస్తాయి. ఏ కులంలో పుట్టినా ఎలాంటి దురభ్యాసాలకు లోనైనా నిర్గుణుడైనా సగుణుడైనా రుద్రాక్షధారి రుద్రుడితో సమానుడే. శిరస్సున ధరిస్తే కోటిరెట్లు, చెవులకు ధరిస్తే దశకోట్లు, మెడలో ధరిస్తే శతకోట్లు, మూర్ధమున ధరిస్తే సహస్రకోట్లు, జంధ్యానికి ధరిస్తే అయుతకోట్లు, బుజాలకో మణికట్టుకో దాలిస్తే లక్షకోట్లు అధికంగా ఫలాన్ని ఇస్తుంది. రుద్రాక్షను మించిన మోక్షసాధనం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. రుద్రాక్షను ధరిస్తే చాలు భక్తి ఉన్నా లేకపోయినా వైదికకర్మలను చేసినా చెయ్యకపోయినా ముక్తి లభించడం తథ్యం. రుద్రాక్షను ధరించాలి అనే కోరిక గాఢంగా ఉంటే చాలు, ఒకవేళ ధరించలేకపోయినా శివలింగంలాగా వందనీయుడే, అవిద్యుడా సవిద్యుడా అనే విచారణతో పనిలేదు. రుద్రాక్షధారి రుద్రత్వం పాంది తీరుతాడు. రుద్రలోకం చేరి తీరుతాడు. వెనకటికి ఒక గాడిద ఇలాగే రుద్రత్వం పొందింది.

నారదా! షణ్ముఖుడు వెంటనే ఆ గాడిద కథ చెప్పమన్నాడు. శివుడు చెప్పాడు. అదేమిటంటే - వింధ్యారణ్యంలో ఒక గాడిద ఉండేది. ఒకనాడు ఒక పథికుడు దానిమీద ఆది మొయ్యలేనన్ని రుద్రాక్షలు బస్తాలు కట్టి వేశాడు. ఓపిక తెచ్చుకుని చాలాదూరం మోసింది. ఇక మొయ్యలేక నేలకు ఒరిగిపోయింది. ప్రాణాలు విడిచింది. శివుడి అనుగ్రహానికి పాత్రమై శివలోకం చేరుకుంది. మోసిన రుద్రాక్షలు ఎన్నో ఒక్కొక్క దానికీ ఎన్ని ముఖాలున్నాయో అన్ని వేల సంవత్సరాలు శివలోకంలో
నివసించింది.

బ్రహ్మనందనా! ఈ రుద్రాక్ష మహిమను ఎవరికిబడితే వారికి చెప్పకూడదు. అశిష్యులకూ అభక్తులకూ మూర్ఖులకూ అస్సలు చెప్పకూడదు. అయితే - రుద్రాక్షను ధరించాలి అనుకునేవాడికి ఎవడికైనాసరే చెప్పవచ్చు.

రుద్రాక్ష మహిమలను వర్ణించిచెప్పడం, రుద్రాక్షలను ధరింపజెయ్యడం - ఇదొక వ్రతంగా ఆచరించినవారు సమకూర్చుకునే పుణ్యరాశికి కొలతలేదు. వెయ్యి రుద్రాక్షలను ధరింపజేస్తే అతడికి దేవతలు కూడా నమస్కరిస్తారు. వెయ్యి సాధ్యం కాకపోతే బుజానికి పదహారు, శిఖకు ఒకటి, చేతికి పన్నెండు, మెడలో ముప్ఫయిరెండు, శిరస్సున ఇరవైనాలుగు, చెవికి ఒకటి, మరోపన్నెండు వక్షఃస్థలాన - ఇలాగ నూటయెనిమిది ధరింపజేసినా అతడు రుద్రుడిలా దేవమానవ పూజ్యుడవుతాడు. ముత్యాలతో పగడాలతో స్పటికాలతో వైడూర్యాలతో కలిపి రుద్రాక్షలను వెండితీగకుగానీ బంగారుతీగకుగానీ చుట్టి ధరిస్తే అతడు సాక్షాత్కరించిన శివుడే. రుద్రాక్షలకు వెండి లేదా బంగారు తొడుగులను చేయించి ధరించినా అధికపుణ్యప్రదమే. ఏ కోరికా లేకపోయినా, ఏ భక్తీ లేకపోయినా యథాలాపంగా ధరించినా అతడిని ఏ పాపాలు సోకవు. సూర్యుడికి చీకట్లు సోకుతాయా!

గుణనిధికథ




Rudrakshajapamaala - రుద్రాక్షజపమాల

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - రుద్రాక్షజపమాల

నారదా! జపమాలికాలక్షణం చెబుతాను. గ్రహించు. ప్రతిరుద్రాక్షలోనూ ముఖభాగం బ్రహ్మదేవుడు. బిందుభాగం (ముళ్ళు) రుద్రుడు. పుచ్చభాగం శ్రీమహావిష్ణువు. పంచముఖీ రుద్రాక్షలు పాతికతో జపమాల చేసుకోవడం మంచిది. అవ్వి కంటకాలతో గరుకుగా ఉండాలి. ఎరుపు - తెలుపు - లేదా మిశ్రవర్ణంలో ఉండాలి. రంధ్రాలు చెయ్యాలి. ముఖభాగం ముఖభాగంతో పుచ్చభాగం పుచ్చభాగంతో కలిసేట్టు రుద్రాక్షలు గ్రుచ్చాలి. ఆవుతోకను చుట్టినట్టుండాలి. మేరువును అన్నింటికీ పైని గ్రుచ్చాలి. ఇలాంటి అక్షమాలను నాగపాశమంటారు. ఇది మంత్రసిద్ధిప్రదాయిని. దీన్ని ముందుగా సుగంధజలాలలో శుభ్రంగా కడగాలి. అటుపైని పంచగవ్యాలు జల్లాలి. మళ్ళీ పవిత్రోదకస్నానం చేయించాలి. అప్పుడు మంత్రాలను న్యాసం చెయ్యాలి. శివాస్త్రమంత్రం జపిస్తూ ప్రతిరుద్రాక్షనూ స్పృశించాలి. కవచంతో అవకుంఠన చెయ్యాలి. మూలమంత్రాన్ని న్యసించి మళ్ళీ శుద్దోదకసాన్ననాదులు చేయించాలి. సద్యోజాతాది సంప్రోక్షణలతో నూటయెనిమిది పర్యాయాలు మూలమంత్రాన్ని పఠించి రుద్రాక్షమాలను పరిశుభ్ర పీఠంమీద ఉంచాలి. అప్పుడు పార్వతీపరమేశ్వరులను ఆవాహన చెయ్యాలి. అప్పటికి అది ప్రతిష్ఠితమాల అవుతుంది. సర్వవాంఛా ప్రదమవుతుంది. ఈ జపమాలతో ఏ దేవతామంత్రాన్నయినా జపించుకోవచ్చు.

శిరస్సునగాని మెడలోగానీ కర్ణాభరణంగా గానీ ధరించవచ్చు. జపం ఏదైనా ఎప్పుడూ రుద్రాక్ష్రమాలతోనే చెయ్యాలి. జపం కాగానే కన్నులకద్దుకుని యథావిధిగా ధరించాలి. స్నాన - దాన - జప - హోమ - వైశ్వదేవ - సురార్చనా - ప్రాయశ్చిత్త - శ్రాద్ధ - దీక్షాకాలాలలో రుద్రాక్షధారణ విశేషఫలితాలను ఇస్తుంది. ఇది లేకుండా వైదికకర్మలు చేసిన విప్రుడు నరకానికి పోతాడు. మరొకరు ధరించిన రుద్రాక్షమాలను తానెప్పుడూ ధరించకూడదు. అశౌచసమయాలలో ధరించకూడదు.

రుద్రాక్షతరువునుంచి వచ్చిన గాలిసోకితే చాలు గడ్డి పరకలు సైతం పుణ్యలోకాలకు చేరుకుంటాయి. మానవులకు ఇది సర్వపాపవిమోచకమనడంలో సందేహం లేదు. రుద్రాక్షను ధరిస్తే పశువులుకూడా రుద్రత్వం పొందుతాయి. ఇక మానవుల మాట చెప్పాలా - అంటోంది జాబాలశ్రుతి. అందుచేత కనీసం ఒక్క రుద్రాక్షనైనా ధరించడం అవసరం. దీన్ని ధరించి శివనామాలను జపించేవారే నిజమైన భాగవతోత్తములు. శ్రేయస్కాములు తప్పక ధరిస్తారు. జపిస్తారు. తరిస్తారు. బ్రహ్మవిష్ణు మహేశ్వరులూ వారి అంశావతారాలూ సకలదేవతలూ రుద్రాక్షధారులే. ఋషులూ మునులూ యోగులూ సరేసరి. మహాతపస్వులకు ఎన్నో జన్మలకుగానీ లభించని ముక్తి, రుద్రాక్షధారులకు చటుక్కున లభిస్తుంది. రుద్రాక్షలు ధరిస్తే శ్రద్ధపెరుగుతుంది. మోక్షమునందిచ్చ పొడముతుంది. శివుడి అనుగ్రహం ఉంటేనే రుద్రాక్షధారణం మీద కోరిక కలుగుతుంది. ధరించాడూ అంటే శివానుగ్రహానికి పాత్రుడు అయ్యాడన్నమాటే. అందుకే దీని మాహాత్మ్యాన్ని జాబాలేయులూ మునులూ నిరంతరం పఠిస్తూ ఉంటారు. రుద్రాక్షలను కంటితో చూస్తే చాలు పుణ్యం వస్తుంది. స్పృశిస్తే కోటిరెట్టూ ధరిస్తే నూరుకోట్ల రెట్లూ పుణ్యం దక్కుతుంది.

రుద్రాక్షమాలతో జపం చేస్తే లక్షకోటిశతాలూ లక్షకోటిసహస్రాలుగా పుణ్యం లభిస్తుంది అనడంలో ఏ సందేహమూ లేదు. చేతులకూ గుండెలకూ మెడకూ చెవులకూ శిరస్సుకూ రుద్రాక్షలను ధరించినవాడు సాక్షాత్తూ రుద్రుడవుతాడనడమూ నిశ్చయమే. రుద్రుడిలా అవధ్యుడై శివుడిలా సురాసురులకు సైతం వందనీయుడవుతాడు. రుద్రాక్షధారికి నమస్కరిస్తే శివుడికి నమస్కరించినట్టే. సర్వపాపవిముక్తి ఉభయులకూ దక్కేఫలం. రుద్రాక్షను ధరించి మరణిస్తే కుక్కసైతం ముక్తిపొందుతుందంటే ఇక నరులమాట చెప్పాలా! జపధ్యాన విహీమడైనానరే రుద్రాక్షను ధరిస్తేచాలు. సర్వపాపాలనుంచీ విముక్తి పొందుతాడు. సద్గతులకు అర్హుడవుతాడు. అందుచేత విశ్వప్రయత్నం చేసయినాసరే కనీసం ఒక్కరుద్రాక్షను సంపాదించి ధరించాలి. ఇరవైయొక్కటి సంపాదించి ధరించగలిగితే చాలు శివలోకం ఖాయం.

రుద్రాక్షమహిమలు - గార్ధభగాథ




Varieties of Bhasma - Bhasma Bhedalu - భస్మ భేదాలు

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - భస్మ భేదాలు విరించిపుత్రా! శాంతిక పౌష్టిక కామదభేదాలతో ఈ భస్మం మూడు విధాలు. ఇది నీకు కుతూహలం కలిగించే విషయం....