Thursday, August 20, 2026

Srikrishnudu Kuberabhatundagu Shankhachuudundanu Guhyakuni Samharinchuta - శ్రీకృష్ణు౦డు కుబేరభటుండగు శంఖచూడుండను గుహ్యకుని సంహరించుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము - 
శ్రీకృష్ణు౦డు కుబేరభటుండగు శంఖచూడుండను గుహ్యకుని సంహరించుట

మరొక వెన్నెలరాత్రి బలరామకృష్ణులు ప్రకాశవంతమైన, స్వచ్చమైన వస్త్రాలను, హారాలను ధరించారు. చందనం పూసుకొన్నారు. ఆభరణాలు అలంకరించుకొన్నారు. బృందావనానికి వెళ్లి మల్లెలు మొదలైన పూల మకరందాన్ని ఆస్వాదించి మదించిన గండుతుమ్మెదల ఝంకారాలు వింటూ, వెన్నెలలో గోపస్త్రీలు తమచుట్టూ ఉండగా ఇంపుగా గానం చేశారు.

బలరామకృష్ణులు ఆలపించిన ఆ మధురగీతం చెవులు సోకినంతనే తమదేహాలస్పృహ ఏ మాత్రం లేనివారై, ఆ గోపికలు చూడడం, మాట్లాడడం మరిచిపోయి, ఆ బృందావన సీమలో పారవశ్యంలో మునిగిపోయారు.

ఈ విధంగా రామకృష్ణులు సర్వప్రాణులకు సమ్మోహం కలిగించే విధంగా గానంచేస్తూ, మత్తెక్కిన వారిమాదిరి, బృందావనంలో యథేచ్చాసంచారం చేస్తూ ఉన్నారు. ఇలా ఉండగా వారిరక్షణలో ఉన్న గోపకాంతలను శంఖచూడుడు అనే కుబేరభటుడు బలవంతంగా ఉత్తరదిక్కునకు తీసుకొని పోసాగాడు. ఆ గోపస్త్రీలు 'రామా!కృష్ణా! అని పిలుస్తూ పులిబారినపడిన గోవులవలె మొరపెట్టారు. వారి మొర విని

బలశాలురైన అన్నదమ్ములు రామకృష్ణులు ఇద్దరూ వెంటనే మద్దిచెట్లను చేత పట్టుకొని కాలమృత్యువులవలె వేగంగా వెళ్తూ 'ఓ ముగ్ధగోపికలారా! భయపడకండి' అని ధైర్యం చెప్పి ఆ యక్షునితో తలపడ్డారు. ఆ గుహ్యకుడు కలతచెంది గోపికలను వదలి, భీతుడై అతివేగంగా ఉత్తరదిశగా పరుగెత్తాడు.

ఈ విధంగా యక్షుని చేతినుండి విముక్తలైన గోపికలను రక్షిస్తూ ఉండమని బలరామునితో చెప్పి

బకాసురసంహారి అయిన శ్రీకృష్ణుడు “ఓరీ! యక్షుడా! పారిపోవద్దు! పారిపోవద్దు” అని క్రోధంగా పలుకుతూ, యక్షుడు ఏ రూపంలో ఎక్కడ ప్రవేశిస్తున్నాడో, ఎక్కడికి వెళుతున్నాడో తానూ వానితో అక్కడ ప్రవేశించాడు. అక్కడికి వెళ్లి వానిని పట్టుకొన్నాడు. సాటిలేని తన పిడికిటిపోటుతో వానితల తెగి పడేటట్లు పొడిచాడు. శౌర్యంతో ఆ యక్షవీరుని కిరీటంలో ప్రకాశించేరత్నాన్ని గోపికలు చూస్తూ ఉండగా గ్రహించాడు.

ఈ విధంగా శ్రీకృష్ణుడు శంఖచూడుణ్ణి చంపి, వాని శిరోరత్నం తెచ్చి బలరాముని కిచ్చి, అగ్రజుణ్ణి ఆనందింపజేశాడు. తర్వాత ఇంకొకరోజు కృష్ణుడు అడవులలోకి వెళ్లాడు. అప్పుడు అతనిలీలలను ఇండ్లలోనే పాడుకొంటూ విరహతాపానికి తాళలేక గోపికలు తమలో తాము ఇలా అనుకోసాగారు.

మనలను ఏలిన శ్రీకృష్ణుడు ఎడమభుజం పైన చెక్కు ఆనించి, కెమ్మోవిపై మురళిని ఆనించి, మధురస్వరం ఒలికేటట్లు వేణువును వాయిస్తూ తన వేళ్లను వేణురంధ్రాల మీద నేర్పుగా సారించి, చూపుతూ ఉంటే మింట నిలిచి చూస్తున్న అప్పరసలు తమ ప్రాణేశులు తమవద్దనే ఉన్నా పోకముళ్లు ఊడి పోతూ ఉండగా మదనవేదనపొందుతూ ఉంటారు గదా!

ఓ పడతీ! కొత్తరుచి కలిగిన కృష్ణునిమురళీనాదం అనే అమృతధారలు చెవులలో ప్రవేశించి, హృదయాల లోపల చేరగానే దూడలతో కూడా గోవులసమూహాలు తక్కిన జంతువులు అత్యాసక్తితో ఆకాశంవైపు మోరలెత్తి దేహానికి సంబంధించిన ఇంద్రియవ్యాపారాలన్నిటినీ వదలి వేస్తాయి.

ఓ పద్మనయనా! శ్రీకృష్ణుడు తళతళలాడే ముత్యాలహారం ధరించి, గాంధర్వవిద్యలో కుతూహలం అతిశయించగా, మనోజ్ఞంగా మురళిని వాయించినపుడు ఆ మురళీధ్వానం విన్న మేటినెమళ్లసమూహాలు కృష్ణుని మెరుపుతో కూడి శబ్దించే నల్లనిమేఘంగా భావించి పరవశంతో కేకారవాలు చేస్తాయి గదా!

ఓ యువతీ! ఎందుకు తెల్లవారిందే? తూర్పుకొండపైన సూర్యుడు ఎందుకు ఉదయించాడే? పగళ్లన్నిటినీ తెల్లవారని రాత్రులుగా బ్రహ్మదేవుడు ఎందుకు చేయడే? మదనుడుకూడా దయలేని వాడయ్యాడు. చిలుకలు వారింపరానివిగా ఉన్నాయి. ఎలాగే? రాత్రివేళ వస్తుందంటావా? పద్మనేత్రుడితో సుఖపడే అదృష్టం లభిస్తుందా?

ఓ సుందరీ! పొద్దు ఎప్పుడు కుంకుతుంది? ఆవులను మేపుకొని గోవిందుడు ఎప్పుడు గోకులానికి వస్తాడు? ఎప్పుడు నాకు ఆ స్వామి ముఖపద్మదర్శనం అవుతుంది? దగ్గరకు చేరి అతడు నన్ను ఎప్పుడు ఆదరిస్తాడు? నా విరహాగ్నిరాశికి అంతం ఎప్పుడు? చెప్పవమ్మా! మన్మథునిచేతలవల్ల నా హృదయం తల్లడిల్లిపోతూ ఉంది.

ఓ చెలీ! శ్రీకృష్ణుడు నన్ను వదిలిపెట్టి వనానికి వెళ్లినప్పుడు ఆయా క్షణాలు, అంతకంతకూ కొనసాగుతూ జాములై, దినాలై, పక్షాలై, నెలలై, సంవత్సరాలై, మహాయుగాలై, కల్పాలై నామనసులో తోస్తూ ఉన్నాయి.

ఈ విధంగా ఇంకా కృష్ణవియోగశోకంతో పలురీతులుగా పశ్చాత్తాపడుతూ గోపికలు సహనం కోల్పోయి ఎలాగో పగలు గడపి,

ఆ సాయంసంధ్యాసమయంలో “అదిగో! సూర్యుడు పడమటికొండకు చేరాడు. ఇదిగో సాయంకాలం అయింది. అల్లదే! గోధూళి ఒప్పిదంగా రేగుతోంది. బృందావనమార్గంలో ఎద్దులరంకెలు వినిపిస్తున్నాయి. మన ప్రియుడు వచ్చేశాడు. రండి” అని ఒకరినొకరు పిలుచుకొంటూ, సాయంవేళ తొట్రుపాటుగల హృదయాలతో తమ ప్రియుడైన కృష్ణునికి ఎదురేగుతారు.

ఇలా గోపికలు తనకెదురు రాగా, ఆసక్తితో వారిని కృష్ణుడు వారి ఇష్టానుసారంగా ప్రణయ సల్లాపాలతో ఆదరించాడు. ఆ తర్వాత ఒకనాడు

వృషభాసుర సంహారము


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Sarparupiyagu Sudarsanundanu Gandharvuni Shapavimochanamu - సర్పరూపియగు సుదర్శనుండను గంధర్వుని శాపవిమోచనము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము - 
సర్పరూపియగు సుదర్శనుండను గంధర్వుని శాపవిమోచనము

తరువాత ఒకరోజు నందుడుమొదలైన గోపాలకులు పశుపతి జాతరకోసం ఎడ్లబండ్ల నెక్కి అంబికావనానికి వెళ్లారు. అక్కడ వారు సరస్వతీనదిలో స్నానంచేసి, పార్వతీపరమేశ్వరులను పూజించి కానుకలు సమర్పించారు. 

బ్రాహ్మణులకు గోవులు, బంగారం, వస్త్రాలు, అన్నమూ దానం చేశారు. తాము నీరుమాత్రమే ఆహారంగా గ్రహించి, నియమనిష్ఠలతో ఉన్నారు.

అప్పుడు విధివిశాత్తూ ఆకలిగొన్న ఒక మహాసర్పం నిద్రపోతూ ఉండిన నందుణ్ణి కరచి మింగడానికి ప్రయత్నించింది. అతడు 'కృష్ణా! కృష్ణా! నన్ను విడిపించు' అంటూ మొరపెట్టుకున్నాడు. ఆ మొరను గోపాలకులు విని

రాజా! గోపాలకులందరూ మేల్కొన్నారు. కోపంతో ఆ పామును పెద్దపెద్ద దుడ్డుకర్రలతోనూ, కొరవులతోనూ మొత్తారు. అయినా ఆ క్రూరమైన మహాసర్పం నందుణ్ణి వదలకుండా పట్టుకొంది.

ఆ సమయంలో శ్రీకృష్ణుడు విజృంభించి, కాలితో ఆ పామును తన్ని ఒక తొక్కు తొక్కాడు. వెంటనే ఆ పాము తన సర్పరూపం విడిచి, ఒక గంధర్వని రూపం దాల్చింది. శ్రీకృష్ణుడు అతనితో ఇలా అన్నాడు.

ఓ పండితశ్రేష్ఠుడా! అలంకృతమైన రూపంతో, బంగారుహారంతో, శుభలక్షణాలతో విరాజిల్లే నీకు ఈ క్రూరమైన పెనుబామురూపం ఎందుకు వచ్చింది? నీవెవరు? నీ పేరేమి? ఏ కారణంగా ఈ జన్మ కలిగింది? ఒకటొకటే నాకు వివరంగా తెలుపు. నీవు నందుణ్ణి పట్టుకొన్న చర్య వింతగొలుపుతూ ఉంది.

శ్రీకృష్ణుని పలుకులకు అతడిలా అన్నాడు. నేను విద్యాధరుణ్ణి నా పేరు సుదర్శనుడు. నేను సౌందర్యగర్వంతో పుష్పకవిమానంపై దిక్కులు తిరుగుతూ ఉండేవాణ్ణి.

ఒకనాడు అంగిరసుని సంతతివారు, అందం లేనివాళ్లు అయిన ఋషులను చూచి పరిహాసంగా నవ్వాను. వారు 'సౌందర్యదర్పంతో నువ్వు మమ్ములను చూసి నవ్వావు కాబట్టి పెనుబామువై పడిఉండు మని శపించారు. నేను బతిమలాడగా ఇలా అనుగ్రహించారు.

'ఓ మూర్ఖుడా! భక్తుల భయాన్ని పోగొట్టడంకోసం శ్రీహరి యాదవకులంలో జన్మిస్తాడు. అతడు ఒకనాడు ఈ అడవికి వస్తాడు. అతనికాలితన్ను తిని నీవు సర్పరూపం విడిచి, నీ తొలిరూపమైన విద్యాధరరూపం పొందగలవు అని దయానిధులైన ఆ ఋషులు పలికారు.

ఓ పద్మనేత్రా! నిన్ను ధ్యానించినా, నీ మహిమలు విన్నాా నీ నామం కీర్తించినా పాపరాశి మొదలంటా కృశించి నశిస్తుందని అంటారు. నా మీద నీ పాదం మోపితే నాకు ఆ ఋషులశాపంవల్ల సంక్రమించిన వికారాకారం పోకుండా ఉంటుందా? నా సర్పరూపం పూర్తిగా పోయింది. నేను ఇక వెళతాను.

సుదర్శనుడు ఇలా మనవి చేసి, శ్రీకృష్ణునికి ప్రదక్షిణం చేసి, నమస్కరించి దేవలోకానికి తిరిగి వెళ్లిపోయాడు. నందగోపుడు సర్పంనుండి విముక్తి పొందాడు. ఈ సంగతి విన్న గోపకులు ఆశ్చర్యపోయారు. పశుపతిజాతరను గోపాలకులు సంపూర్తిగా నిర్వహించి తిరిగి తమ గోకులానికి మరలిపోయారు.

శ్రీకృష్ణు౦డు కుబేరభటుండగు శంఖచూడుండను గుహ్యకుని సంహరించుట


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Jalakridaabhivarnanamu - జలక్రీడాభివర్ణనము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము - జలక్రీడాభివర్ణనము

ఇలా నందనందనుడు రాసక్రీడ చాలించి వడగండ్లతో ఒప్పేమెరుపుతీగవలె చెమటబిందువులతో కూడిన ఆ గోప యువతులతో కూడి జలక్రీడలాడాలనే ఉత్సాహంతో యమునాజలాలలో ప్రవేశించాడు.

అతనికన్నా ముందే గోపికలు కాళిందిలో ప్రవేశించి ఇక్కడ అడుగులోతు, ఇక్కడ మోకాలులోతు, ఇక్కడ నడుంలోతు, ఇక్కడ రొమ్ములలోతు అంటూ ఆ నదినీటిలోనికి దిగారు.

ఆ రమణుల స్తనాలు చక్రవాకాలతోను, కండ్లు చేపలతోను, బొడ్డు సుడులతోను, తలవెండ్రుకలు నాచుతోను పోలి ఉండడంవల్ల వారుకూడా తనవంటివారే అని భావించి కౌగిలించుకోడానికి యమునానది చేతులు చాచినట్లుగా, అలలు ఎదురుగా వచ్చి వారిని స్పృశించాయి.

వారు ఉలికిపడ్డారు. నదిలోని బెగ్గురుపక్షులను పట్టాలని చూశారు. హంసలను తోలారు. అందాలుచిందే ఆ సుదతుల కుచాలకు సాటిరాగలం అని నీటిలో తపం చేస్తున్నాయా అన్నట్లు అక్కడ సంచరించే జక్కవపక్షులను వారు తరిమేశారు. 

ఆ యువతుల చేతుల్లో చలిస్తూ ఉన్న జలాలలో ప్రతిఫలించిన చంద్రుడు అధికమైన ప్రకాశానికి ఉనికిపట్టులుగానున్న వారి వదనాలకు ఓడిపోయి సిగ్గుతో వెలవెలబోతూ, పట్టుదల విడిచి నీటిలో పడి వణకుతున్నాడా అన్నట్లున్నాడు. అలాంటి చంద్రున్నీ చూచి మెచ్చుకుంటూ గోపికలు పరవశించారు.

మకరందం తాగి మదించినతుమ్మెదల రెక్కలగాలికి రేగుతున్న కలువలు మొదలైన పూలయొక్క పుప్పొడి వారు నీటమునిగినపుడు పైకి చెదిరిన నీటి తుంపరలవల్ల అణిగి పోయింది. 

తమవదనపద్మ సౌరభానికి మూగి జుంజుమ్మనే తుమ్మెదలను చూచి వారు భీతి చెందారు. అవి పైకెగిరి పోయేటట్లు అరచేతులతో నీళ్లను చరిచారు. నీలిమేఘాలనుండి రాలిన నీటిధారలవలన తడిసిపోయే అందమైన పూలతీగలవలె ఆ గోపయువతులు శ్రీకృష్ణుడు దోసిటితో చల్లే నీటితుంపరలవల్ల సంపూర్ణంగా తడిసిపోయారు.

గుంపుగుంపుగా చేరి తొక్కిసలాడారు. మాలిన్యం పోయిన మన్మథుని పుష్పబాణాల్లాగా తళతళ మెరుస్తూ ఉన్న దేహాలతో గోపికాస్త్రీలు నీట మునగడానికి ఉత్సహించారు. వారు సరససల్లాపాలతో తుళ్లింతలాడుతూ, చేతుల నిండా నీరు ముంచుకొని తొట్రుపడుతూ గోవిందుని మీద చల్లారు. 

ఒకరికంటె ఒకరు ముందడుగువెేసి శ్రీకృష్ణుడు తమని దాటి పోకుండా అడ్డపడి వినోదించారు. ఆడఏనుగులు తొండాలతో చిమ్మిన నీటి తుంపరలతో తడిసిన మదపుటేనుగువలె శ్రీకృష్ణుడు గోపసుందరులు పైకి చిమ్మిన జలధారలతో తడిసి ముద్దయ్యాడు.

రేపల్లె యువతులు తమ చేతులతో హరిమీదికి ఎర్రకలువలను, తెల్లకలువలను విరజిమ్మారు. ఆ పూలపుప్పాడి ఆయన శరీరానికి అంటుకొని విభూతి ధరించిన పరమశివునివలె భాసించాడు.

ఆ సుందరులు చిగుళ్లవంటి తమ హస్తాలతో తామరపూలరేకులను తమప్రాణనాథుని మీదికి వెదజల్లారు. అప్పుడు కృష్ణుడు వేయికన్నుల దేవేంద్రుడుగా ప్రకాశించాడు.

ఆ రమణులు కుంకుమ అలదిన కుంభాలవంటి స్తనాలతో కృష్ణుణ్ణి కాగిలించుకోగా, అతడు బాలభాస్కరునివలె ప్రకాశించాడు. ఆ కాంతలు తమ కడగంటిచూపులను నాథునిమీద ప్రసరింపజేయగా, అతడు తుమ్మెదగుంపులు ముసిరిన పచ్చగంధపుచెట్టువలె విరాజిల్లాడు. 

ఆ పూబోండ్లు తమ చిరునవ్వులసిరులను తమ ప్రియునిపై పడేటట్లుచేయగా కృష్ణుడు వెన్నెలవెలుగులతో విలసిల్లే అంజనాద్రివలె విలసిల్లాడు తరువాత

అప్పుడు శ్రీకృష్ణుడు సుఖోన్నతుడైై, గోపయువతులతో పాటు యమునానదినీటినుండి వెలికివచ్చాడు. ఆభరణాలు ధరించి, మంచి గంధం అలదుకొని, పీతాంబరాలు ధరించి అలంకరించుకొన్నాడు. గజరాజు ఆడఏనుగులతో క్రీడించిన విధంగా పొదరిండ్లలో, చిక్కనిచెట్ల నీడలలో, పూలశయ్యలమీద వారితో క్రీడించి సంతోషపెట్టాడు.

ఈ విధంగా గోవిందుడు శరత్కాలంలో గోపికలతో వీర్యస్ఖలనం చేయకుండా రమించాడు అని చెప్పగా విని, శుకయోగీంద్రునితో పరీక్షిన్మహారాజు ఇలా అన్నాడు.

మహాత్మా పరమేశ్వరుడు ధర్మానికి కర్త. ధర్మానికి భర్త. ధర్మమే స్వరూపంగా కలవాడు. మంచిషనులు చేసేవాడు. ఆయన అధర్మాన్ని శిక్షించడానికి, ధర్మాన్ని రక్షించడానికి భూమండలంలో జన్మించినవాడు గదా! అలాంటప్పుడు, ఆ భగవంతుడే ఎలాంటి ధర్మమని పరసతులను కూడాడో దయచేసి నాకు చెప్పండి.

ఇలా పరీక్షిన్మహారాజు అడుగగా, శుకమహర్షి ఇలా అన్నాడు.

సర్వభక్షకుడైన అగ్నిదేవుడు విశ్వంలోని సమస్తవస్తువులను భక్షించికూడా దోషి కాడు. అలాగే తేజోవంతులైన చంద్రఇంద్రాదులు దోషంచేసి కూడా దోషస్థానాన్ని పొందరు.

(సర్వప్రాణులను హింసించి కాల్చి చంపడం అగ్నిచేసే పాపం. ఇది తినదగింది ఇది తినదగనిది అని కూడా చూడకుండా అన్నీ భక్షించడం దోషం.

గురుపత్నీగమనం చంద్రునిదోషం. చంద్రుడు తనగురువైన బృహస్పతి భార్యతో సంగమించి ఆ పాపం చేశాడు. పరపత్నీగమనం దేవేంద్రుని దోషం. అహల్యను కామించి ఆమెభర్తరూపంలో వచ్చి అనుభవించిన దోషం అతనిది.)

నరేంద్రా! ఈశ్వరుడు కానివాడు పరకాంతను తలచి ఎలా జీవించగలడు? గౌరీశ్వరుడు తప్ప ఇతరుడు లోకభయంకరమైన విషం తాగి జీవించగలడా?

(సర్వాత్మకుడైన దేవునికి ఏదిచేసినా చెల్లుతుంది. ఇతరులకు అది చెల్లదు. ఈశ్వరుడు శాస్త్రవశ్యుడుకాడు. శాస్త్రోక్త ధర్మాలను ఉల్లంఘించినా వారికి అది దోషం కాదు. శాస్త్రవశ్యుడు, కర్మవశ్యుడు అయిన సామాన్య మానవుడు దోషంచేస్తే అనుభవించవలసిందే!)

ఈశ్వరుల మాటలు ఒకటే సత్యం. అదే ప్రమాణం. వారు చెప్పిన మార్గాన్నే పెద్దలు నిత్యం అనుసరిస్తారు. ఒకొక్కప్పుడు ఈశ్వరుల నడవడి వారిమాటలకు విరుద్ధంగా ఉంటుంది. ఒకప్పుడు సత్యంగాను, మరొకసారి అసత్యంగాను ఉంటుంది. వారి నడవడి అంతా సత్యమని భావించి అనుసరించరాదు.

నరేంద్రా! మునులు ఏ దేవునియొక్క పాదపద్మాల పుప్పొడిని, ధ్యానించడంవల్ల పొందిన యోగనిరూఢత్వంచేత అధికులై యజ్ఞాదిమహాకర్మలు చేయకుండా, సంసారబంధాలు వదిలించుకొని అతిశయిస్తూ ఉంటారో- అలాంటి నిత్యశుభస్వరూపుడైన భగవంతుడు ఎలా నడచుకొంటే నేం? ఏమి చేసినా అతనికి ఎలాంటి బంధాలు ఉండవు.

గోపాలకులలో, గోపికలలో, సర్వప్రాణులలో అంతర్యామియై సంచరించే సర్వమయుడైన పరమాత్మకు పరాంగనలు ఎవరు? అన్నీ తానే కాబట్టి అలా క్రీడించాడు.

అని చెప్పి శుకమునీంద్రుడు మళ్లీ పరీక్షిన్మహారాజుతో ఇలా అన్నాడు. వెళ్లడం ఇష్టంలేకున్నా తెల్లవారు జామున గోపికలు తమ ఇండ్లకు వెళ్లారు. కృష్ణమాయామోహితులైన గోపాలురు గోపికలపై కోపం చూపలేకపోయారు.

(బ్రాహ్మీముహూర్తము= అరుణోదయానికి ముందు నలబై ఎన్నిది నిముషాలకాలం. (రెండు గడియలకాలం))

గోపాలకృష్ణుడూ, గోపకాంతలూ సలిపిన రాస క్రీడను ఏ నరుడు వర్ణిస్తాడో, ఏ నరుడు దర్శించి నిశ్చయించుకొంటాడో అతడు ఆ ప్రసంగంవల్ల సమస్త హృదయతాపాలనుండి విముక్తుడౌతాడు.

సర్పరూపియగు సుదర్శనుండను గంధర్వుని శాపవిమోచనము


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Rasa Cridaabhivarnanamu - రాస క్రీడాభివర్ణనము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము - రాస క్రీడాభివర్ణనము

ఆ శరత్సమయంలో లోకేశ్వరుడు, అనంతుడు అయిన శ్రీకృష్ణుడు చిత్రాకారుడై గోపకాంతలతో రాసక్రీడ సలపడానికి ప్రారంభించాడు. గోపరమణులు కృష్ణుని చుట్టూ వలయాకారంగా ఏర్పడి, ఒకరిచేతులు మరొకరు సవిలాసంగా పట్టుకొని తిరిగారు. 

ఎన్నోవిధాలుగా స్ఫురించే ముఖవిన్యాసాలతోను, కరవిన్యాసాలతోను, పాదవిన్యాసాలతోను ఆ రాసక్రీడ పరిఢవిల్లింది. గోపికా గోవిందుల రాసక్రీడను దర్శిస్తూ ఉన్న దేవతలకండ్లకు, మనస్సులకు వికాసం కల్గించి ఆనందం నింపింది.

ఈ విధంగా పలువిధగతులలో, తిరగడంలో నేర్పరి అయిన శ్రీకృష్ణుడు విజ్బంభించి రాసక్రీడకు ఉపక్రమించాడు. 

మచ్చలేని చంద్రబింబంవంటి ఇద్దరు ముగ్ధలు అలంకరించుకొని వీణలు చేతబట్టారు. వారిద్దరూ వీణను వాయించడంలో మిక్కిలి ప్రావీణ్యం కలవారు. మనోజ్ఞంగా, ఇంపుగా వీణ వాయిస్తూ ఆనందప్రవాహాన్ని వెల్లిగొలిపే గీతం గానం చేశారు. 

శ్రీకృష్ణుడు నిరంతర నిశ్చలమైన వేడుకతో సమ్మోహనమైన మురళిని సవిలాసంగా చేతబూనాడు. దాన్ని తన మధురమైన కెమ్మోవికి గదియించాదు. గోపభామలు తమ కొప్పులలో చెరువుకొన్న కలువపూల కమ్మని సువాసనను వీడని తన చిగుళ్లవంటి చేతివేళ్లను లయబద్ధంగా ఆ మురళీరంధ్రాల మీద సారిస్తూ వేణువు ఊదాడు. 

తామర రేకుల మధ్యన ఉండే దుద్దువలె గోపాంగనల మధ్యలో కృష్ణుడు మువ్వంపులతో మురిపెం ఒలికిస్తూ నిలుచున్నాడు.

ఎందరు గోపసుందరులో అందరికీ తాను ఒక్కడే అందరయ్యాడు. గోపికపక్క తానూ, తన పక్కన గోపిక ఉండే విధంగా నిలిచి రాసమండలం కల్పించాడు.

అది నృత్యవిద్యాసముద్రానికి చుట్టూ ఏర్పడిన చెలియలికట్టవలె సాంపు నింపింది. ఆ రాసమండలం సహస్రనేత్రుడైన దేవేంద్రుడికి సైతం ఆశ్చర్యం గొలిపింది. దేవతలు ఆనందంతో ఆకాశవీథినుండి పూలజల్లులు కురిపించారు. ఆ పూలగుత్తులలో తిరుగాడే తుమ్మెదల రంగును హేళనచేస్తూ పలువురు కృష్ణులు విరాజిల్లారు.

బంగారుమణులమధ్యలో ఉన్న ఇంద్రనీలమణులవలె విలసిల్లారు. ఆడఏనుగులతో విహరించడంలో అత్యాసక్తి వహించిన మగ ఏనుగుల అందాన్ని వారు చిందించారు.

చిగురించి పూచినతీగలతో ఆవరించబడిన కానుగచెట్ల అందచందాలను ఆ గోపాలమూర్తులు అంది పుచ్చుకున్నారు. మెరుపుతీగలతో కూడిన కరిమబ్బులవలె మెరిశారు.

జలజలా ప్రవహించే సెలయేళ్లతోనిండిన రోహణగిరి శిఖరాల పోలికతో వారు విరాజిల్లారు.

లోకాలను మోహింపజేసే కృష్ణుడు కెందామరలవలె ఎర్రనైనవీ, చంద్రరేఖలవలె గోళ్లు కలిగినవీ, వేదరమణులకు ఆభరణాలైనవీ- అయిన తన పాదాలను ఒకదానితో ఒకటి చేర్చాడు. అతడు సమంగా నిలిచి దోసిటితో పూలు విరజిమ్మాడు. 

ఎంతో సుందరాలై, పద్మాలవలె ప్రశస్తాలైన తన రెండుచేతులనూ తనకు ఈ వైపునా ఆ వైపునా ఉన్న గోపికల మెడలపై చేర్చాడు. పాటకు అనుగుణంగా, ఆశ్చర్యకరంగా అడుగులు వేశాడు- వలయాకారంలో ఉన్న రాసబంధాలతో అతడు నాట్యం చేశాడు.

శ్రీకృష్ణుడు ఆగోపసుందరులతో కలిసి శంఖం, పద్మం, వజ్రం, కందుకం, చతుర్ముఖం, చక్రవాళం, చతుర్భద్రం, సౌభద్రం, నాగం, నంద్యావర్తం, కుండలీకరణం, ఖురరీబంధం మొదలైన విశిష్ట రాసబంధాలతో నర్తించాడు.

ఆ రాసక్రీడలో వారు ఏకపాదం, సమపాదం, నివర్తితం, వినివర్తతం, గతాగతం, వలితం, వైశాఖం, మండలం, త్రిభంగి మొదలైన భంగిమలతో నిలిచారు. వారి పాదాలలోని బంగారుగజ్జెల చప్పుడు, మనోజ్ఞాలైన అందెలరవళులు జగత్తులోని జనులకందరికీ వీనుల విందులు చేశాయి. 

ఆ రాసక్రీడలోవారు ఘటితం, మర్దితం, పార్శ్వగం మొదలైన పాదవిన్యాసాలు ప్రదర్శించారు. సమపాద, శకట, వదన, మతల్లీశుక్తి మొదలైన పార్ధివచారి విశేషాలను, అపక్రాంతం, డోలాపాదం, సూచి మొదలైన గగనచారి విన్యాసాలను ప్రకటించారు. 

కల్పవృక్షం కొమ్మలవలె మనోహరాలైనవీ, దిగ్గజాల తొండాలను పరిహసించేవీ. మూడులోకాలకు శుభకరాలైనవీ అయిన వారి హస్తాలలోని రత్నకంకణకాంతులు గగనవీథి నలుమూలలా వ్యాపించాయి.

ఇంకా, ఆ రాసక్రీడలోవారు అర్ధచంద్రం, కర్తరీముఖం, కపిత్ధం, కటకాముఖం, శుకతుండం, లాంగూలం, పద్మకోశం, పతాక మొదలైన హస్తాభినయాలను తమతమ మనోభావాలు ప్రతిబింబించే విధంగా ప్రదర్శించారు.

వారు తమ నడుములమీద ధరించిన బంగారురంగు పట్టు వస్త్రాల అంచులకాంతులు దిక్కులనే ముదితల ముఖాలకు పసుపు పూతలనే ముద్రలు వేశాయి, ఆస్కందితం, భ్రమరం, శకటాసనం మొదలైన జానుమండల భేదాలను; అలాతం, దండలాతం, లలితం, విచిత్రం మొదలైన దేవతల మండలాకారనృత్యాలను వారు ప్రదర్శించారు.

మనోహరాలైన శంఖాలవంటి మెడలకు అందాన్ని సమకూర్చేవీ, మిక్కిలి కాంతిపుంజం కలిగినవీ, ఇంద్రనీలాలు, వజ్రాలు, వైడూర్యాలలో కూర్చబడినవీ అయిన హారాలశోభలు లక్ష్మీ నివాస స్థానాలుగానున్న తమ వెడద వక్షస్థలాలపై సంచలించి, చిక్కుపడగా-వారు అంగాంతరం, బాహ్యలగ్నం, ఛత్రం మొదలైన భ్రమణ విధాలతో విరాజిల్లారు. 

తమ కాంతిచేత చంద్రమండలాన్ని జయించిన కుండలాల కాంతులు అద్దాలవలె నును పైన వారిచెక్కిళ్లపై తొణికిసలాడాయి.

ఆ రాసక్రీడలలో వారు కటిభ్రాంతం, దండరచితం, లలాటం, తిలకం, మయూరం, లలితం, చక్రమండలం, నికుంచితం, గంగావతరణం మొదలైన కరణాలను ఆచరించారు. 

తెల్లతామరలశోభతో ఒప్పారే వారిచూపులు దరిద్రులదైన్యాన్ని పారదోలుతూ ముగ్ధల కన్నులనే మీనాలకు వలలై ఆవరించగా లలితం, కుంచితం, వికాసం, ముకుళం మొదలైన చూడ్కులతో విలసిల్లారు. బహుపూర్ణ చంద్రబింబాల అందానికి గృహాలుగా అందగించిన తమ ముఖాలలో నిర్మలమైన అనురాగాన్ని వారు ప్రస్ఫుటీకరించారు.

ఒప్పిదమైన నెమలిఫించపుకాంతులు అకాలంలో కనిపించిన హరివిల్లుల అందాన్ని వెలువరించగా వారు నికుంచితం, ఆకుంచితం, కంపితం, ఆకంపితం, పరివాహితం, పరావృత్తం అనే శిరోభావాలను ప్రదర్శించారు. 

కస్తూరితిలకాలు దిద్దిన పలకలవంటి నుదుళ్లపై ముంగురులు ముసురుకొంటూ ఉండగా వారు అపరాజితం, సూచికావిద్ధం, పరిచ్చిన్నం, విష్కంభం, రేచితం మొదలైన అంగవిన్యాసాలు ప్రదర్శించారు.

అందుకు తగినట్లు అడుగులు, నడుములు, చేతులు, మెడలు ఆడించారు. అలా ఆరాసక్రీడ వీక్షకుల మనస్సులకు ఉత్తేజాన్ని కలిగించింది. అది దీప్తిగల ద్రవంతోడి క్షీరసాగరంవలె శృంగారరసంతో పొంగారింది. 

అనురాగభరితమైన రామరాజ్యంవలె శ్రీరాగం మొదలైన రాగాలతో నిండిపోయింది. కలువలకు ఆనందం సమకూర్చే నిండుచంద్రునివలె భూమండలానికి సంతోషాన్ని కలిగించింది.

భ్రమరం మొదలైన హస్తాభినయాలతో తుమ్మెదలగుంపుతో నందనవనంవలె విలసిల్లింది. అభ్యుదయంతో కూడిన అభిమానధనుని మనస్సువలె ఉత్తరోత్తరాభివృద్ధితో విరాజిల్లింది. 

బహువిధాలుగా ప్రబంధాలు కూర్చే నేర్పరి అయిన కవి విలాసంవలె ప్రకృష్టాలైన నాట్యబంధాలతో విలసిల్లింది. వసువులతో, దేవతలతో నందనవనంతో అలరారే దేవలోకంవలె వసుదేవనందనునితో పూజనీయమైంది.

సదాచారవంతుని నడవడివలె భూమండలానికి, ఆకాశమండలానికి భూషణమైంది. శరీరంపైన హారందాల్చిన సుందరివలె అవయవాలచలనంతో మనోహరమైంది.

గౌరీనిలయమైన హిమవంతంవలె నానావిధానాలుగల సంభారాలతో శోభిల్లింది. గుణవంతుడైన కుమారునివల్ల కులంప్రకాశించినట్లు వేణువిలాసంతో ఆ రాసక్రీడ భాసించింది.

గోపరమణులు నడుములు జవజవలాడగా, చిరునవ్వులు వ్యాపించగా, హారాలు మెలిపడగా, మొలనూళ్లు సడలగా చూపుల నిగ్గులు పాలయగా, చెమటలు కమ్మగా, ముంగురులు చెదరగా, చెవికమ్మలు ప్రకాశించగా, నీలిమబ్బుల నడుమ మెరుపుతీగెల కాంతితో దీపిస్తూ కృష్ణునితో కూడి ఉల్లాసంగా ఆడుతూ, పాడారు.

మచ్చలేని చంద్రునివంటి ముఖాలు గల ఆ గోపికలు కమలనేత్రుడైన కృష్ణునితో కూడి మనోహరంగా నాట్యం సలిపేవేళ- వారి నడుముల చిరుగంటలు, కాలిఅందెలు, కరకంకణాలు గల్లు గల్లుమని శబ్దంచేస్తూ వీనులవిందు చేశాయి.

పరీక్షిన్మహారాజా! లేడికన్నులవంటి కన్నులున్న ఆ గోపయువతులతో శ్రీకృష్ణుడు నిర్వహించిన ఆ రాసక్రీడను ఆకాశవీధిలో దేవతాశ్రేష్ఠులు వారిభార్యలతో కలసి బారులుదీరి విమానాలెక్కి దర్శించారు.

ఓ పరీక్షిన్మహారాజా! అప్పుడు పువ్వులవానలు కురిశాయి. భేరులుమోగాయి. ఆకాశంలో తమ భార్యలు తమ సరసనుండగా గంధర్వపతులు శ్రీకృష్ణుని స్తుతిస్తూ గానం చేశారు.

(సంగీతానికి గంధర్వులు ప్రసిద్ధి. సంగీతానికి “గాంధర్వం” అనే పేరు అందుకే వచ్చింది. వారు కృష్ణుని గుణగణాలను గానం చేయడం ఎంతైనా సమంజసంగా ఉంది.)

రాజేంద్రా! శ్రీకృష్ణుడు గోపభామినులతో రాసక్రీడ సలుపగా చూచి, స్వామిపై మోహంచెంది, ఖేచరస్త్రీలు పారవశ్యంతో తమ ప్రాణేశ్వరులమీద మూర్చిల్లి వాలిపోయారు

చంద్రునితో సామ్యం వహించిన ముఖాలు గలిగిన ఆ గొల్లభామలు, చంద్రవంశంలో జన్మించిన శ్రీకృష్ణునితో చేరి నటించగా, చుక్కలతోకూడి చంద్రుడు ఆ నాట్యాన్ని వీక్షిస్తూ ఉండడంచేత రాత్రి ఆలస్యంగా గడిచింది.

యమునానది నీటితుంపరలను చిలికిస్తూ, తామరపూల సురభిళాల్ని విరజిమ్ముతూ, సుందరీమణుల చెమటల్ని తగ్గిస్తూ రాసక్రీడవలన మదవతులకు కలిగిన శ్రమను పోగొడుతూ, రమణీమణుల మనసుల్లో కొత్తదైన, మేలైందైన సుఖం అనే సంపదను కలిగించేదై, పద్మనేత్రుడైన శ్రీకృష్ణుడు ఆనందించేట్లుగా, మంగళకరంగా మలయమారుతం వీచింది.

అపుడు ఒక గోపికారమణి శ్రీకృష్ణుడు పాడుతుండగా, వీణను చేతబట్టి సవిలాసంగా తీగెలుమీటింది. అతడు ఔను ఔను అని మెచ్చుకోగా, ఎండినచెట్లు చిగురించగా, నిలుకడగా ఒక స్వరస్థాయినందుకొని ఒకరాగాన్ని రమ్యంగా ఆలపించింది.

ఆ గోపరమణులలో ఒక రమణి కాలిఅందెలు గల్లుగల్లుమని మనోహరంగా ధ్వనిస్తూ ఉండగా ఆడుతూ పాడుతూ, పిరుదుల బరువుచేత అలసట గలిగిందై, శ్రీకృష్ణుని హస్తాన్ని తన కుచద్వయం సమీపానికి లాగింది.

ఓ రాజా! మంచిగంధంపూతతో, పద్మపరిమళంతో ఒప్పారుతూ ఉన్న తన బలమైన భుజాన్ని శ్రీకృష్ణుడు ఒక గోప రమణి భుజంమీద ఉంచగా, ఆమె చలించి పులకరించింది.

ఒక తరుణి కృష్ణునిచెక్కిలితో తన చెక్కిలి చేర్చగా అతడు తన పుక్కిటిలోని తాంబూలాన్ని ఆమె నోట ఉంచాడు. ఒక సుందరి ఆడుతూ అలసిపోగా, ప్రాణేశుడు స్తంభంవంటి ఉన్నతమైన తన బాహువును ఆమెకు ఆధారంగా చేశాడు. 

ఒక చక్కనిచుక్క చెమట కమ్మి తన దగ్గరికి చేరగా ఆమె చనుదోయిపై కమ్మిన చెమట బిందువులను ప్రియుడైన కృష్ణుడు కొనగోట చిమ్మాడు. ఒక బాలిక నుదుటి తిలకానికి అంటుకున్న ముంగురులను నాథుడైన కృష్ణుడు పక్కకు తీసి, కురులు దువ్వాడు. 

ఒక పడతి పాటపాడి అలసిపోగా ప్రాణేశుడైన కృష్ణుడు తన అధరామృతాన్ని ఇచ్చి సమాదరించాడు. ఒక చెలువకు హారం మూపున చిక్కుపడగా, ఆ హారాన్ని చక్కదిద్ది సుందరుడైన కృష్ణుడు దగ్గరకు లాక్కొని కౌగిలించుకున్నాడు.

రాజేంద్రా! గోవిందుడు రాసక్రీడలో అలసిన గోపరమణులను తన చిరునవ్వులతో, హస్తవిన్యాసాలతో, చూపులతో, రాగాలాపనలతో దయతో ఆదరించాడు.

ఆ గోపసుందరులు గోవిందుని తనూసంగమసుఖంతో మిక్కిలి పరవశలై తమ పైటలు, ధరించిన వస్త్రాలు జారిపోవడం కూడా గమనించలేక పోవడం ఆశ్చర్యం కాదు. దేవతాస్త్రీలు ఆకాశంనుండి ఆ రాసక్రీడావిలాసమంతా వీక్షించి కరిగి సమ్మోహితలయ్యారు.

ఈ విధంగా పరమాత్మ అయిన శ్రీకృష్ణుడు తాను ఆత్మారాముడైనా గోపసుందరులు ఎందరుంటే అందరికీ అంతమంది కృష్ణులై తన ప్రతిబింబాలతో ఆడుకునే పిల్లవాడువలె, రాసక్రీడ సాగించాడు.

గోపికలు నందనందనుడైన కృష్ణుడు తమతో కలసిమెలసి నవ్వుతూ, చూస్తూ, సల్లాపాలు సలుపుతూ మెలిగాడని కృష్ణుని మీది గౌరవంతో, తమపూర్వజన్మపుణ్యాలను మెచ్చుకున్నారు.

జలక్రీడాభివర్ణనము

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Gopikaa Gitalu - గోపికా గీతలు

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము - గోపికాగీతలు

ఓ నాధా! నీవు జన్మించిన కారణంగానే మా గోకులం సిరిసంపదలు అధికమై అలరారుతున్నది. నీవారైన గోపికలు నీ మీదనే ప్రాణాలుంచుకొని వెదకుతున్నారు, నీ రూపం చూపించు. 

అందగాడవైన ఓ కృష్ణా! శరత్కాల కమలాల గర్భంలోని జిగిని దొంగిలించే నీ చూపువల్ల నిన్ను వలచి జీతభత్యాలు లేని దాసులమయ్యాము. అలాంటి మమ్మల్ని ధీరుడవై నొప్పించడం నిజంగా చంపడమే కాదా?

ఓ స్వామీ! మమ్ములను కాళీయుని విషం కలిసిన యమునానదిలోని విషజలం నుండి కాపాడావు. సర్పరూపుడైన అఘాసురుని బారినుండి తప్పించావు. ఇంద్రుడు కురిపించిన రాళ్లవాననుండి రక్షించావు. అడవిలో చెలరేగిన కార్చిచ్చునుండి కాపాడావు. 

ఇలా మరిన్నొ ఆపదలనుండి తప్పించావు. మరి ఇప్పుడు ఇలా కుసుమబాణుడైన మన్మథునికి మమ్ములను అప్పగించి చంపడం నీకు భావ్యమా?

కమలనేత్రా! నీవు యశోదకొడుకువే కాదయ్యా! సర్వదేహధారుల బుద్ధికి సాక్షీభూతుడవైన అంతరాత్ముడవు, పరమేశ్వరుడవు. పూర్వం బ్రహ్మదేవుడు నిన్ను స్మరించి, లోకరక్షణ చేయుమని సన్నుతించగా, ఉత్తమమైన యదుకులంలో భూమండలాన్ని రక్షించడానికి నీవు జన్మించావు కదా!

స్వామీ! నీపాదసేవకులకు సంసారభయాన్ని తొలగించేదీ, లక్ష్మీదేవిహస్తాన్ని చేయూతగా కలిగిందీ, అభీష్టాలను తీర్చేదీ ఐన నీ కరకమలాన్ని మా శిరస్సులమీద ఉంచి బదికించు.

లక్ష్మీవల్లభా! నీ పాదపద్మం గోవులవెంట సంచరించేది. పూజించేవారి పాపసమూహాలను పోగొట్టెది. దుష్టసర్పమైన కాళియుని పడగలమీద నర్తించేది. అలాంటి నీ పాదపద్మాన్ని మా గుండెలపై మోపి, మాకు మన్మథుని పూలబాణాలవల్ల సంభవించిన బాధను పోగొట్టు. మమ్మల్ని స్వీకరించు.

స్వామీ! నీ పలుకు పండితులకు ఇంపు నింపుతుంది. స్పష్టంగా ఉచ్చరించబడుతుంది. తీయనైంది. అలాంటి నీ పలుకు మమ్మల్ని మరులు కొల్పింది. నీ అధరామృతం ఆస్వాదించేటట్లు చేసి మా మన్మథబాధను పోగొట్టవా?

పద్మనేత్రా! నీవు నీ భక్తుల భయాన్ని పోగొట్టేవాడవు. అలాంటి నీకు ఈ క్రూరత్వం తగునా? తగదుగాక తగదు. నీదాసులయిన మాకు మీ నగుమోము చూపి రక్షించు.

లక్ష్మీమనోహరా! నీ కథామృతం గొప్ప సిరితో కూడింది; వినడానికి శుభకరమైంది. కామం మొదలైన అరిషడ్వర్గాన్ని విధ్వంసం చేసేది. సనకాదిమునులచే స్తుతించబడేది. నిరంతరతపస్సుచేత తపిస్తూ ఉండే పురుషపుంగవులకు జీవనం కలిగించేది. అలాంటి నీ కథామృతం గొప్పగొప్పదానాలు చేసి, సుప్రసిద్దులైన వారికే అందుతుంది కానీ ఇతరులకు అందదు.

కృష్ణా! నీ నవ్వులు, నీ చూపులు, నీ నానావిహారాలు, నీ ధ్యానాలు, నీ పరిహాసవచనాలు మా మనసుల్లో నాటుకొనిపోయాయి. అవి ఈనాటికికూడా మరలి పోవడం లేదు.

పద్మనేత్రా! మందపట్టు వదిలి గోవులను మేపడానికి నీవు వెళ్లినప్పుడు పద్మాల్లాంటి నీపాదాలు గడ్డిమొక్కలూ, రాళ్లు తాకి ఎంత నొస్తాయో అని మా మనస్సులు కలత చెందుతూ ఉంటాయి.

ధీరజనోత్తమా! సాయంకాలం అయ్యేటప్పటికి నీవు బృందావనంమధ్యనుండి వచ్చి, గోవుల గిట్టలవల్ల రేగిన ధూలళిచే కప్పబడి, బూడిదరంగుతో ఒప్పే శిరోజాలు కలిగిన నీ ముఖం పద్మంలా ఒప్పారుతూ ఉంటుంది. అలాంటి ముఖం మాకు వేడ్కతో చూపి, క్రమక్రమంగా మా మనస్సులలో మన్మథుణ్ణి పొడసూపేటట్లు చేస్తావు.

రమణా! నీ పాదద్వయం భక్తులకోర్కెలను తీర్చేది. బ్రహ్మదేవునిచే పూజింపబడేది, భూమికి అలంకారమైంది. దుఃఖాన్ని పోగొట్టెది. శుభప్రదమైంది. అలాంటి నీ పాదద్వయాన్ని మా వక్షోజాలపై ఉంచకూడదా!

కృష్ణా! నీ అధరామృతం సంభోగప్రీతిని పెంపొందిస్తుంది. శోకాన్ని పోగొడుతుంది. మోగే మురళిని ముద్దులు గొంటుంది. ఇతరాలైన అనురాగాలను అతిశయింపజేస్తుంది. అలాంటి నీ అధరామృతంతో మా బాధను పోగొట్టు.

ఓ రమాపతీ! నీవు పగటివేళ బృందావనారణ్యంలో సంచరిస్తూ ఉండడంవల్ల ఉంగరాలు తిరిగిన ముంగురులచేత అందగించిన నీ నెమ్మోము తనివితీరా దర్శించలేకపోతున్నాం. అందువల్ల, మాకు క్షణాలు యుగాలుగా గడుస్తున్నాయి.

పోనీ, రాత్రి సమయాలలోనైనా నిన్ను నిరంతరాయంగా కన్నులనిండా దర్శిద్దామనుకుంటే క్రూరుడైన బ్రహ్మదేవుడు మాకండ్లకు రెప్పలు అడ్డంగా సృష్టించాడు గదా! ఇదెందుకో?

మనోవల్లభా! అయ్యో! మా బంధువులు, భర్తలు, అన్నలు, తమ్ములు, కొడుకులు మొదలైనవారు రాత్రిపూట ఇల్లువదలి వెళ్లవద్దని మమ్మల్ని అడ్డగిస్తున్నా వినకుండా నీ మెత్తని మధురగీతంయొక్క సవ్వడి మా చెవులలో పడి వెక్కసం కాగా, మోహంపొందిన వాళ్లమై వడివడిగా వచ్చాం. నీవు ఎక్కడ పోయావో! తెలియదు. ఇలాంటి నిర్దయుడు ఎక్కడైనా ఉంటాడా?

కృష్ణా! నీవు పలికే నర్మగర్భవచనాలు, నవరసాలొలికించే చూపులతో నిండిన నవ్వుమొగం, శ్రీదేవికి నివాసమైన విశాల వక్షస్థలం, మా మనసులను వశంచేసుకొని మమ్ము మురిపించాయి.

ఓ కృష్ణా! తామరలకంటే కోమలాలై అందాలుచిందే నీ పాదాలు కఠినమైన మాచన్నుల ఒత్తిడికి కందిపోతాయేమో నని బాధపడుతూ ఉంటాం. అలాంటిది ఈ కర్కశారణ్య భూముల్లో నీ సంచారం నీ ప్రేయసులమైన మాకు ప్రాణాంతకమైన శోకాన్ని కలిగించదా?

కృష్ణా! అకటా! మన్మథబాణాలు మమ్మల్ని నొచ్చేటట్లు నాటుకోగా, భీతిచెంది, నీపాదాలు పట్టుకోవడానికి వచ్చాం. అలాంటి మమ్ములను నట్టడవిలో వదిలి పోవడం నీకు న్యాయమా?

(పాదాలు పట్టుకోవడం శరణాగతిచిహ్నం. శరణాగతులను రక్షించడం భగవంతుని ధర్మం అని గుర్తు చేస్తున్నారు గోపికలు.)

ప్రాణేశ్వరా! మా మనసులను ముందుగా కోమలతరంగా చేసి, తరువాత వేరుగా నీ హృదయాన్ని మిక్కిలి కర్కశంగా చేసిన మా దురదృష్టం ఎక్కడైనా(ఎవరికైనా) ఉంటుందా?

దయానిధీ! రాక్షసులు ఒక్కపెట్టున పరాక్రమించి, ఎదుర్కొని పట్టుదలతో దేవతలపై వాడిబాణాలు ప్రయోగించేటప్పుడు అడ్డుపడి, ఆ రాక్షసుల్ని తునుమాడుతావని అంటారు. మరి, మేము నిన్ను నమ్ముకున్న అమాయికగోపికలం. అయ్యో! ఇలాంటి మమ్మల్ని పంచబాణుడు వెంటాడుతుంటే అడ్డుపడడం ఉచితం కాదా?

గోవిందా! ముకుందా! కృష్ణా! చెరకు విల్లుగా గలిగిన మన్మథుడు మమ్మల్ని ఎదిరించి, మా హృదయాలలో దూరిపోయేటట్లు బాణాలు ప్రయోగించాడు. మన పరస్పరసంబంధాన్ని భావించి, ఇకనైనా మా మొరాలకించవా స్వామీ! 

ఇలా అంటూ, గోపికలు మధుర స్వరంతో ప్రస్తుతిస్తూ పాడుతూ కృష్ణుణ్ణి రావే అని పిలిచి ఏడిచారు. విశ్వరక్షకుడు, ముల్లోకసుందరుడు, మన్మథమన్మథుడు, మనోహరాకారుడు, పీతాంబరధారి, హారాలు ధరించినవాడు అయిన కృష్ణుడు, వారిముందు ప్రత్యక్షమయ్యాడు.

('మన్మథమన్మథుడు' అనడం స్వామివారి అపురూప సౌందర్యం చెప్పడానికి.)

అలా వచ్చిన ప్రాణనాథుడైన కృష్ణుణ్ణి గోపకాంతలు దర్శించారు. విజయంచేశాడని వికసించిన ముఖాలుకలవారై పోయిన ప్రాణాలు మరల వచ్చిన దేహేంద్రియాలవలె

ఒక అబల భక్తితో దోసిలొగ్గి ప్రాణనాథునికెంగేలు పట్టుకొంది. మరొక ఇంతి జీవితేశ్వరునిబాహువు తన భుజంపైన వేసుకొని సంతోషించింది. ఒక వనిత భర్త నమిలిన తమ్మిని తనచేతితో అందుకొంది. ఒక సుందరి ప్రియుని పాదాలను విరహాగ్నితో తపించిన తన స్తనాలకు అద్దుకొంది. 

ఒక భామ కనుబొమముడివేసి ప్రణయభంగం చేశాడని కోపంగా మాట్లాడుతూ, పెదవి కొరుకుతూ, కొట్టేదానివలె కృష్ణుని వాడి చూపులతో చూచింది.

ఓ పరీక్షిన్మహారాజు! హరిపాదకమలం దర్శిస్తూ తనివి తీరని సత్పురుషునివలె ఒక తరుణి హరిముఖపద్మాన్ని రెప్పవేయకుండా చూస్తూ తనివి తీరందై ఉంది.

ఒక లతాంగి కృష్ణుని ప్రకాశవంతమైన రూపాన్ని చూపులనే తీగెలతో చిక్కేటుగా పట్టుకొని తన హృదయంలో బంధించింది. ఆ రూపం బయటికి వెళ్లకుండా కనురెప్పలు మూసివేసింది. పులకలు కమ్ముతుండగా కృష్ణుణ్ణి కౌగిలించింది. అలా స్వచ్చమైన అంతరంగంలోని రుచులతో ఆమె యోగివలె పరవశిస్తూ ఉండిపోయింది.

“ప్రాణనాథా! నన్ను మోసంచేసి ఎక్కడికి వెళ్లావు” అని ఒక సుందరి మిక్కిలి కోపంతో నిందించింది. “పద్మనేత్రా! నన్ను వదిలివెళ్లడానికి నీకు కాళ్లెట్లాడాయి?” అని ఒక సుందరి వాపోయింది. “ప్రభూ! నీవు వెళ్లినప్పటికీ ఇంకా నేను ప్రాణాలతోనే ఉన్నానే! ప్రేమంటే ఇదేనా?” అని ఒక గోపసుందరి వాపోయింది.

“ప్రియా! ఇంతవరకు మనలను పాపాత్ముడైన విధాత విడదీశాడు గదా” అని ఒక గోపిక విలపించింది; “నాథా! నన్ను వదిలి వెళ్లేంత తప్పు నెనేం చేశానో చెప్పు. నీ కిది న్యాయమా అని ఒక సుందరి నిలదీసింది” “మనోనాథా! ఏనోము ఫలమోకానీ, మళ్లీ నిన్ను దర్శించగలిగాను” అంటూ ఒక యువతి విహరించింది.

కమ్మని కంఠస్వరంగల ఒక సుందరి “నేను ముందుగా అతనితో మాట్లాడితే నా ప్రతిజ్ఞ భంగమవుతుంది - అతడు పలకరిస్తేనేగానీ పలుకను”. అంటూ తన మాటల్లో అమృతాలు కురిసినట్లు తన చెలికత్తెతో పలికింది.

పరీక్షిన్మహారాజా! ఒక నెరజాణ తన చెలిచేయి పట్టుకొని “ప్రాణేశుడు నాచేయి పట్టుకొంటేనే నేను ఆతని చేయిపట్టుకొంటాను”. అని ధైర్యంగా చెప్పింది. అయితే-ఆ ధైర్యమంతా మన్మథుని నివాసస్థానం అయింది(ఆమె ధైర్యాన్ని మన్మథుడు ఛిన్నాభిన్నం చేశాడు).

ఓ పరీక్ష్మిన్మహారాజా! రమణుడు తనకు చెప్పకుండా వెళ్లి పోయాడన్న విముఖతతో, అందువల్ల తాను ముందుగా అతణ్ణి చూడనని తలవంచుకొని ఉన్న ఓ అమాయకురాలు తన మనసులో మన్మథుడు ప్రేరేపించగా అట్లే తలవంచుకొని ఉండలేక తానే తలఎత్తింది.

ఈ విధంగా

కృష్ణుని సుందరకోమల రూపాన్ని సందర్శించిన తరుణులు విరహతాపజ్వరంనుంచి విముక్తలై భవబంధాలనుండి విముక్తి చెందిన భగవద్భక్తులవలె గొప్పవేడుక సలిపారు.

అప్పుడు బృందావనంలో గోపసుందరులు తన చుట్టూచేరి కొలువగా శ్రీకృష్ణుడు సర్వజ్ఞత్వం మొదలైన సమూహాలతో కూడిన శక్తిని పరమేశ్వరుడువలె ప్రకాశించాడు. వసుదేవనందనుడు ఆ గోపరమణులను వెంట బెట్టుకొని మందారాల, మొల్లపూల సువాసనలతో నిండి మందమారుతాలచే మన్నింపబడి మృదువుగా జుంజుమ్మని ఝంకారంచేసే తుమ్మెదల సమూహంగలదీ, శరత్మాల చంద్రకిరణాల సమూహాలచేత ఛిన్నాభిన్నమైన చీకట్లు కలదీ, యమునానది అలలచేత చేరిన మెత్తని ఇసుకతో విలసిల్లేదీ, అచ్చమైందీ అయిన సైకతస్థలానికి చేరుకున్నాడు. అక్మడ గోపికారమణులు జ్ఞానోదయ(సమయం)చేత పరమ్మాతను సందర్శించి, శ్రీ కృష్ణునివిరహంవల్ల ఇంతవరకూ ఉన్న తాపాన్ని పోగొట్టుకున్నారు. వారి కోరికలన్నీ పరిపూర్ణంగా నెరవేరాయి.

పరీక్షిన్మహారాజా! మీననేత్రలయిన ఆగోపరమణులు తమ హృదయసీమలలో ఉత్సాహాలు సందడించగా, తమ మెత్తని పైట చెరగులతో ప్రియుడైన శ్రీకృష్ణునికి ఆసనం కల్పించారు.

యోగీశ్వరులహృదయాలు అనే సుఖాసనాలమీద కూర్చునే ఆ పరమేశ్వరుడు ముల్లోకాలకు దేవేరి అయిన శ్రీమహాలక్ష్మి తన శరీరంమీద తేజరిల్లగా, గోపకాంతలు పయ్యెద కొంగులతో కల్పించిన ఆసనం మీద ఆసీనుడయ్యాడు.

(యోగీశ్వరులహృదయాలు గోపకాంతల పయ్యెదకొంగులు పరమాత్మకు ఆసనాలయ్యాయి. గోపికలు త్రేతాయుగంలో మునీశ్వరులు అనే అంశం ఇక్కడ స్ఫురిస్తున్నది.)

ఆ ముగ్ధలు మరులు పెంపొందిస్తూ ఉన్న రమణునికి సమ్మానం చేస్తూ నవ్వుతో కూడినచూపులలో శృంగారం ఒలకపోస్తూ ఆయనపాదాలను చేతులతో ఒత్తుతూ, ఆయనశరీరాన్ని స్పృశిస్తూ, తూలనాడుతూ, పరిహాసవచనాలు పలుకుతూ, కొద్దిగా కోపం తెచ్చుకున్నందువల్ల ప్రకాశించే ముఖాలు గలవారై ప్రేమతో ఇలా పలికారు.

నందనందనా! కొందరు తమను సేవించిన వారినే సేవిస్తారు. మరికొందరు తమను సేవించని వారినికూడా సేవిస్తారు. ఇక కొందరు సంతోషంతో తమను సేవించేవారినీ, సేవించనివారినికూడా సేవించరు. (వీరిలో నీ వెలాంటి వాడవో తెలుపు)

ఇలా తనను ఉద్దేశించి నర్మగర్భంగా పలికిన గోపసుందరుల పలుకులు విని గోపసుందరుడు ఇలా పలికాడు.

ఓ గోపికలారా! పశువులను ఫలం ఆశించి కొలిచిన విధంగా కొందరు కొలుస్తారు. వారు తమసొంతప్రయోజనమే కోరుకునేవారు. వారికి స్వార్ధమే పరమావధి. కొలిస్తేనే తిరిగి కొలవడం స్నేహధర్మంకాదు.

ఇక కొందరు దయగలవారు. మంచి మనసున్నవారు. తండ్రులు ఎలాగయితే తమను కొలువని కుమారులనూ కొలుస్తారో అలాగా తమను కొలువనివారిని కూడా కొలుస్తారు. వారి స్నేహధర్మాలు ప్రతిఫలం ఆశించనివి. 

మరికొందరు ఇతరులను కొలిచే ఉద్దేశంలేనివారు. వీరు తమను కొలిచేవారినైనా, కొలువని వారినైనా కొలువరు. వారు ఆత్మయందే రమించేవారు, భోగేచ్చలేనివారు. మరికొందరు మూర్ఖులు. మిక్కిలి కఠినహృదయులు. వారిలో నన్ను ఈ చివరితెగకు చెందినవానినిగా భావించి మీరు ఇలా పలుకుతున్నారు. ఔనా?

ఓ తరుణులారా! నేను పైన చెప్పిన వారిలో ఎవ్వడనూ కాను. పరమకరుణార్ణ హృదయుడను. మీకు ఆత్మబంధువును. మీకు నిరంతరధ్యానం సమకూర్చడానికే కనిపించకుండా వెళ్లాను సుమా!

(దగ్గరనే ఉంటే గోపికలకు నిరంతరధ్యానం కుదరదు. దూరంగా ఉంటేనే వారికి కృష్ణునిమీద నిరంతరధ్యానం సిద్ధిస్తుంది.)

నన్ను సేవిస్తూ ఉండేవారికి నేను నారూపం చూపించను. ఎందుకంటే నన్ను దర్శించిన తర్వాత గర్వించి నన్ను కొలవడం మానేస్తారేమోనని. తనకున్న డబ్బుపోయినప్పుడు దరిద్రుడైనవాడు నిరంతరం డబ్బు చింతలోనే మునిగి పోయినట్లు నన్ను చూడకుండా ఉంటేనే నన్ను కోరే భక్తులు నా రూపాన్ని నిరంతరం ధ్యానిస్తూ ఉంటారు.

న్యాయమూ, ధర్మమూ పట్టించుకోకుండా మీ తల్లిదండ్రులను, బంధువులను, భర్తలను, బిడ్డలను వదిలివచ్చి, నాయందు మనసులు లగ్నంచేసిన మిమ్మల్ని వదిలివెళ్లడం న్యాయం కాదు. అలా వదిలి వెళ్లినందుకు నన్ను మన్నించండి. నా వియోగభారంతో చింతిస్తూ మీరు పలికిన పలుకులను వింటూనే ఉన్నాను.

(కృష్ణుడు గోపికలకు క్షమాపణ చెప్పడం ఆయన గొప్పమనస్సుకు, దయార్దహృదయానికి సాక్ష్యం.)

ఓ భామినులారా! విడిపోని సంసారమనే సంకెళ్లను తొలగించుకొని నాయందే నిరంతరాయంగా మనస్సును నిమగ్నంచేసిన మీకు, ఎన్నియుగాలైనా ప్రత్యుపకారం చేయలేను. (అంటే అంతటి గొప్ప ప్రేమమీది) నేను మిమ్ములను వదిలివెళ్లడం కృతజ్ఞత లేనందువల్ల కాదు, 

నన్ను మీరు నిరంతరం ధ్యానంచేస్తూ ఉండాలనే. ఇదే నేను మీకు చేసిన ప్రత్యుపకారంగా భావించి, నేను వదిలి వెళ్లడాన్ని తప్పుగా భావించక, దయతో మీ కోపాన్ని తగ్గించండి.

(ప్రేయసులను బతిమలాడుకునే సామాన్యప్రేమికుడిగా కృష్ణుడు క్షమాపణ చెప్పుకోవడం ఆయన లీలగానే భావించాలి.)

ఓ పరీక్షిన్మహారాజా! ఇలా మనోజ్ఞంగా పలికిన కృష్ణుని మాటలాలకించి తీవెబోడులైన గోపరమణులు అతని చక్కని మాటలతోను, సంగమంతోను, తమ హృదయాలలో ఇంతవరకూ నిండి ఉండే విరహవేదనలను, ఒక్కసారిగా వదిలేశారు.

రాస క్రీడాభివర్ణనము

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Sharadratri Gana Monarchu Krishnu Sannidhiki Gopikalu Vacchuta - శరద్రాత్రి గాన మొనర్చు కృష్ణు సన్నిధికి గోపికలు వచ్చుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
శరద్రాత్రి గాన మొనర్చు కృష్ణు సన్నిధికి గోపికలు వచ్చుట

ఈ విధంగా ఉదయించి కొత్త కుంకుమతో అలదిన శ్రీలక్షీముఖమండలంలాగా పరిపూర్ణమైన చంద్రమండలాన్ని గోపికలు దర్శించారు. కమలనేత్రుడైన శ్రీకృష్ణుడు యమునాతీరవనంలో లోకసమ్మోహనంగా ఒక పాట పాడాడు. 

ఆ గానం విన్న గోపికలు తదేక మనస్కలయ్యారు. తత్తరపడుతున్న గోపికలకు పనులు చేయడానికి చేతులాడ లేదు. గోవులవద్దకు దూడలను విడువలేదు. విడిచినా పాలుపిదుకలేదు. పాలుపిదికినా కాచలేదు. కాచినా కాగినపాలు దించలేదు. దించినా పాలు పిల్లలకు పోయ లేదు. పోసినా భర్తలకు సపర్యలు చేయ లేదు. చేసినా భోజనాలు చేయ లేదు. చేసినా పూలు కొప్పుల్లో ముడువలేదు. ముడిచినా వస్త్రాలు ఆభరణాలు ధరించ లేదు. ధరించినా, ఇండ్లలో నిలువ లేదు. నిలిచినా పాయసాలు వండ లేదు. 

ఉన్నచోట ఉండడం లేదు. కాటుకలు సరిగా పెట్టుకోలేదు. కురులు చక్కగా దువ్వుకోలేదు. స్తనాలమీద గంధాలు పూసుకోలేదు. జారినపయ్యెదలు కప్పుకోలేదు. చెలులకు చెప్పలేదు. అన్నదమ్ములు, భర్తలు, మామలు, మరదులు, బిడ్దలు అడ్డంవచ్చి అడ్డుకొంటున్నా లెక్కచేయకుండా చలించి పోతూ మన్మథుని పూలబాణాలజల్లుకు తల్లడిల్లారు.

దీనులయ్యారు. మేఘాలవరుసనుండి వెలువడి ఉల్లసిల్లే మెరుపుతీగలలాగా మందగమనలైన గోపికలు వడివడి నడకలతో మందనుండి బయటపడి శ్రీకృష్ణ సందర్భనానికి వెళ్ళారు. అప్పుడు

కొందరు గోపికలు తమ ఇంటివారినిర్బంధంవల్ల ఇండ్లు విడిచి బయటకు రాలేక శ్రీకృష్ణుని విరహంవల్ల తపిస్తూ, మనస్సులలోనే జారుడని భావిస్తూ కూడా శ్రీ కృష్ణుణ్ణి తమకౌగిళ్ళలో నింపుకున్నారు. పరవశించి, బంధవిమోచనలై త్రిగుణాత్మకాలైన దేహాలు విడిచి ముక్తి పొందారు.

(గోపికల భౌతికదేహాలు అలాగే ఉన్నా వారి గుణాధారదేహాలు విడిచిపెట్టినందువల్ల భర్త, బిడ్డలు మొదలైనవారి సంబంధాలు వదిలి ముక్తలయ్యారు అని భావం.)

ఇలా శుకుడు చెప్పగా పరీక్షిన్మహారాజు ఇలా అన్నాడు.

ఆ మాటవిని పరీక్షిన్మహారాజు ఇలా అన్నాడు. ఓ శుకమహర్షీ! ఆ గోపస్త్రీలు కృష్ణుణ్ణి కేవలం తమ జారునిగా భావించారే కానీ, మహిమాన్వితుడైన పరబ్రహ్మం అని భావించలేదు కదా! అలాంటి గోపికలు త్రిగుణమయమైన శరీరాలను ఎలా వదిలి ముక్తిపొందారో తెలపండి.

ఇలా పరీక్షిత్తు అడుగగా శుకుడు ఇలా అన్నాడు.

రాజశ్రేష్ఠా! ఇంతకుముందే నేను నీకు చెప్పి ఉన్నాను - విష్ణువుకు విరోధి, మూర్ఖుడు అయిన శిశుపాలుడే ముక్తిపదవిని పొందగలిగాడని. మరి నారాయణునికి ప్రేయసులైనవారు పొందరాని పదవి ఏదైనా ఉందా? 

పాపరహితుడు, తరగని శక్తిగలవాడు, వాక్కుకు మనస్సుకు గోచరించనివాడు, త్రిగుణాతీతుడు అయిన శ్రీకృష్ణుని స్వరూపం భక్తజనానికి ముక్తిదాయిని అనడంలో సందేహం లేదు. ఇది సత్యం.

(ఎవరివద్దనైనా విరోధంతో పొందగలిగిన దానికంటే, ప్రేమతో అధికంగా సంపాదించుకోగలగడం లోకసహజం. ఆ లోకసహజమైన అంశాన్ని శ్రీకృష్ణునికి ఆపాదించి, హరికి సంబంధించిన నిత్యసత్యాన్ని కవి ఆవిష్కరించాడు. చక్రికి పగవాడై ముక్తిపొందినవాడు శిశుపాలుడు. ప్రేమతో ముక్తి పొందినవారు గోపికలు.)

బంధుత్వంతోనైనా, విరోధంతోనైనా, ప్రేమతోనైనా, చింతతోనైనా, ప్రాణభయంతోనైనా భక్తితోనైనా హరిధ్యానపరతంత్రులై ఉండే జనులు ముక్తిని పొందుతారు.

కాబట్టి, పురుషోత్తముడు, పుట్టుకలేనివాడు, యోగీశ్వరేశ్వరుడు అయిన శ్రీహరిని స్పృశించినంతమాత్రాన అచేతనాలైన కొండలు, చెట్లు వంటివికూడా ముక్తిని పొందగలవు. ఈ విధంగా

అధికుడూ శుభగుణాలు కలవాడూ, చతురుడూ అయిన శ్రీకృష్ణుడు మహిమగలిగిన తన తీయని పాట శబ్దం విని వచ్చిన గోపస్త్రీలను చూచి, తన మాటల నేర్పు తేటపడగా ఇలా పలికాడు.

ఓ లతాంగులారా! మీకు కుశలమా? మీ మందకు భయం లేదుగదా! సింహాలు, పులులు, ఏనుగుమున్నగు క్రూరజంతువులు తిరుగుతూ ఉంటాయి. దూరప్రయాణాలు మీరు రావచ్చునా? ఇక్కడ తిరగవచ్చునా? చాలుచాలు! మీ గోకులానికి సంతృప్తితో మరలి వెళ్లండి.

(అతిథులు వస్తూనే 'క్షేమం' అడగడం మనసంప్రదాయం. ఆ సంప్రదాయాన్నే కృష్ణుని నోటివెంట పలికించడంవల్ల అందరూ అలాంటి మర్యాదను పాటించాలి అని ధ్వని.)

మీరు వెళ్లినజాడ తెలియక విచారంతో మీ తల్లిదండ్రులూ, భర్తలూ, మరదులూ, కొడుకులూ, కులపెద్దలూ, తోబుట్టువులూ, బంధువులూ మీరు హద్దుమీరి ప్రవర్తించి వెళ్లిపోయారని వ్రేపల్లెలో ఎక్కడెక్కడ వెదకుతున్నారో? ఏమోగదా! ఇలాంటి సాహసప్రయత్నాలు మీకు తగినవికావు.

కుటుంబమర్యాదను బూడిదలో కలిపి, భర్తలను సిగ్గుపడేటట్లు చేసి, అత్తమామలను పరితాపానికి గురిచేసి, సోదరుల మర్యాదను పోగొట్టి, తల్లిదండ్రుల ఆశలు అడియాసలు చేసి, చుట్టాలకు అసహ్యం కలిగిస్తూ, సత్కులంలో జన్మించిన స్త్రీలు మారుమగలమీది కోర్కెలతో హద్దుమీరి రావచ్చా? అలావస్తే లోకులు ఆ ప్రవర్తనను చూచి, మెచ్చుకుంటారా?

సాధ్వి అయిన స్త్రీకి జారునితోడి సంగమం కోరదగిందికాదు. ఎందుకంటే భర్తకు తెలిస్తే ప్రాణంతీసేందుకు తెగిస్తాడు. రాజుకు తెలిస్తే దండిస్తాడు. మామకు తెలిస్తే కాపురం చెడుతుంది. తలారికి తెలిస్తే నిర్బంధిస్తాడు. తలిదండ్రులకు తెలిస్తే సంఘంలో తలెత్తుకోలేరు. తోడికోడలుకు తెలిస్తే ఎత్తిపొడుస్తుంది. కొడుకులకు తెలిస్తే అసహ్వించుకొంటారు. బంధువులకు తెలిస్తే వెలివేస్తారు. ఇరుగు పొరుగువారికి, ఇతరజనులకు తెలిస్తే చులకనగా చూస్తారు. జారిణి అయిన స్త్రీకి ఇటు ఇహంలోకాని, అటు పరంలోకాని సుఖం లేదు. కీర్తి లేదు. ఆనందమూ లేదు. అందువల్ల సాధ్వి అయినస్త్రీ విటుణ్ణి చేరడానికి వెళ్ళడం సరికాదు.

తన భర్తయొక్క ప్రవర్తన బాగాలేకున్నా అతడు శక్తిహీనుడైనా, అందంలేనివాడైనా, మందబుద్ధి అయినా, రోగి అయినా, అతణ్ణి వదిలివేయడం సాధ్వికి మర్యాద కాదు.

ఓ అమాయకపు గోపికలారా! ఇది యమునా నదీ జలాలతో ప్రోదిచేయబడిన చిగుళ్లు, పూలు, ఆకులతో విరాజిల్లే బృందావనం. మీ మనస్సులు హద్దుల్ని అతిక్రమించాయేమో! గోకులానికి మరలిపొండి. వెళ్లి ఏడుస్తున్న పిల్లలకు పాలు పోయండి. గోవులవద్ద పాలుతాగడానికి దూడలను విడవండి. ఒప్పిదం అయ్యేవిధంగా మీమీ భర్తలకు పరిచర్యలు చేయండి.

ఓ కాంతలారా! నన్నుకోరి ఇక్కడికి వచ్చారు. మీకే కొరతా లేదు. శుభాలు కలుగుతాయి. సృష్టిలోని సమస్తప్రాణులు నాకు ప్రియమైనవే (అలాగే మీరుకూడా నాకు ప్రియమైనవారే) ఐనా, మీరు ఇక్కడ ఉండడం భావ్యం కాదు. స్త్రీలు భర్తలకు పరిచర్యలు చేయడమే ప్రాచీనకాలంనుండి విధించబడిన ధర్మం. ఆమాట పెద్దలు సర్వత్ర చెపుతూనే ఉంటారు. 

(నాకు సర్వప్రాణులూ ప్రియమైనవి అని చెప్పింది మహావిష్ణువే. బాలుడైన శ్రీకృష్ణుడు కాదు. సర్వప్రాణులలో గోపికలూ చేరతారు. వారికి సనాతనధర్మం గుర్తుచేయడం లోకకల్యాణంకోసమే.)

మానవతులారా! నన్ను గూర్చి ధ్యానించడం, నన్నుగురించి వినడం, నన్ను దర్శించడం, నన్ను గురించి పాడడం(అనేవాటిద్వారా) నాపై మనసుపెడితే చాలు మీరు ధన్యత్వం కలిగినవారవుతారు. మీ ఇండ్లకు మరలి వెళ్లండి.

బృందావనంలో వేణుగానం చేస్తున్న శ్రీకృష్ణపరమాత్మ వద్దకు విచ్చేసిన గోపకాంతలకు సరైన మార్గనిర్దేశనం చేయగా వారు విని
(అని శ్రీకృష్ణుడు చెప్పగావిని).

విరహాగ్నిశిఖలతో కలిసి వెడలిన నిట్టూర్పులు సోకి వారిపెదవులు ఎండిపోయాయి. కన్నులనుంచి స్రవించే కాటుక కన్నీరు అలంకారంగా వారు స్తనాలమీద అలదుకొన్న కుంకుమ చెదరిపోయే విధంగా ప్రవహించింది. (విచారంతోవారు) చెక్కులమీద చేర్చిన చేతులవేడివల్ల వారివదనపద్మాలఅందం కందిపోయింది. ఎడతెరపిలేకుండా తాకుతున్న మన్మథబాణాలకు గోపికల ధైర్యం చెదరి పోయింది. మిక్కుటమైన శోకంవల్ల మాటలు తడబడ్డాయి. తమకు ప్రియమైన పలుకులు పలకని ప్రియుడైన శ్రీకృష్ణుణ్ణి చూచి వారు భయపడి, పాదాలతో నేలమీద రాస్తూ చింతలో మునిగిపోయారు.

ఇలా (గోపికలు) పలికారు.

అయ్యో! శ్రీకృష్ణా! నిన్ను నమ్ముకొన్నాం. నిన్ను క్రూరుడనలేము. మా ఇండ్లలోని పనులన్నిటిని వదిలివేసి, పద్మాలవంటి నీ పాదాలు పూజించడానికి తప్పించుకొని వచ్చాము. నీవు పరమేశ్వరుడివి. సంపన్నుడివి. ముక్తిమీద ఆసక్తి కలవారిని కాపాడినట్లు మమ్ములను కూడా కాపాడు! భ్రమకు గురైన కాంతలను వదలడం నీకు తగదు.

(గోపికల మాటల్లో మోక్షాసక్తి ధ్వనిస్తున్నది. శృంగారాసక్తికాదు.)

ధర్మజ్ఞుడవైన శ్రీకృష్ణా! భర్తలను, బిడ్డలను, బంధువులను అనువర్తించడమే సాధ్వీమణులకు ధర్మం అన్నావు. ధర్మవేత్తవైన నీవే ఆలోచించు. భర్త, పుత్రుడు మొదలైన బంధువులపేర్లు ధరించిన వాడివై ప్రకాశించే నీయందు దేహధారిణులైన స్త్రీలు పతిపుత్రాదులపట్ల తమకుగల కోరికలు తీర్చుకోవడం అన్యాయమంటావా?

(శ్రీహరే అన్నిప్రాణులకు పతి, పుత్రుడు, గురుడు, బంధువు అయినప్పుడు తాము ఆయాసంబంధాలు ఆపాదించుకొని స్వామివారిని అనువర్తించడం అన్యాయం కాదని గోపభామినులు తమచర్యను సమర్థించుకొన్నారు.)

శాస్త్రనిపుణులైనవారు అంతర్యామివైన నీయందే ఆసక్తి కలిగి ఉంటారు. నీవు ఎడతెగని ప్రేమను కలిగించేవాడివి. కాబట్టి దుఃఖం కలిగించే భర్త పిల్లలు మొదలైన వారిని ఎందుకు మాకు చూపుతావు? మా మహనీయ జీవితాశలు నీచుట్టె అల్లుకొని ఉన్నాయి. వాటిని ఎందుకు తుంచివేస్తావు? మా పరితాపం పోగొట్టు స్వామీ!

(ముగ్ధలైన గోపికలు భగవంతుని మీది ఆసక్తి బ్రహ్మానంద జనకమని తెలుసుకొన్నారు. ఎవరిద్వారా అంటే నేర్పరుల ద్వారా! అందువల్ల సుఖంతో పాటు దుఃఖాన్ని కూడా కలిగించే పతి పుత్రాదిక సంబంధం వ్యర్థం అంటున్నారు. వారి జీవితాశలు స్వామిచుట్టే అల్లుకొని ఉన్నాయి. తీగెను చెట్టునుండి విడదీస్తే తునిగి తీగే వాడిపోతుంది. అలాగే తమ జీవితాశలు అనే తీగెలు తెగిపోతే బతకలేము అన్నారు.)

కృష్ణా! నీ పాదపద్మాలను ప్రీతితో చేరడానికి తప్ప తిరిగి వెళ్లడానికి మాకు కాళ్లు రావు. నీ కరకమలాలను స్పృశించడానికి తప్ప ఇతరపనులకు మాచేతులు పూనుకోవు. నీ మాటల అమృతప్రవాహాన్ని ఆస్వాదించడానికి తప్ప మా చెవులు ఇతరాలైన మాటలను వినవు. 

నీ అందమైన రూపాన్ని సంపూర్ణంగా చూడడానికే కాని మా కనులు ఇతరాలను చూడవు. మా నాలుకలు నిన్ను గురించి పలుకుతాయే కాని ఇతరాలైన మాటలు పలుకవు. నీవు 'మిమ్ములను ఒల్లను' అని పలకడానికి సందేహించడం లేదు. మామనసులను మరిపించుకొని దొంగిలించావు. ఇప్పుడు ఏమి చేయగలం?

(ప్రాణుల జ్ఞానేంద్రియాలు ఇహలోక సంబంధి పనులు మానివేసి, పరలోక సంబంధి పనులవైపు మళ్లితే ముక్తికి దగ్గరైనట్లే.)

శ్రీమహాలక్ష్మి తన తొడలమీద స్వామివారి పాదాలుంచుకొని ఒత్తుతూ ఉంటుంది. స్వామివారి పాదపద్మాలు పవిత్రమైన గుర్తులను చేస్తూ ఉంటాయి. మా తపస్సంపదతో నీ వద్దకు ఎట్లో చేరగలిగాము. మేము నిన్ను వదలి మరలివెళ్లలేము. మా భర్తల మాటలను ఇష్టపడము. పద్మసువాసనలు మరిగిన తుమ్మెదలు ఇతరకుసుమాలవద్దకు వెళ్లడానికి ఇష్ట పడతాయా? (పడవు).

(గోపికలు స్వామివారి చెంతకు చేరడంలో వారి 'తపము సంపద' కారణమని భావిస్తున్నారు. గోపికలు త్రేతాయుగంలో ఋషులు. శ్రీరాముని అందాన్ని వలచారు. శ్రీకృష్ణావతారంలో గోపికలుగా పుట్టి, మీ కోరికను తీర్చుకో వచ్చునన్నాడు - శ్రీరాముడు. అప్పటి ఆ ఋషుల తపస్సంపదే ఇప్పటి గోపికల తపోస్సంపదగా చెప్పబడింది.)

ఓ కృష్ణా! లక్ష్మీదేవి నీ విశాల వక్షస్థ్సలం పైన, తులసీతో కలసి ఉండడానికి ఓ స్వామీ! నాకు అవకాశం ఇవ్వండి అని అభ్యర్థిస్తూ, నీ పాదకమలాల పుప్పొడిని కోరుకుంటూ ఉంటుంది గదా!

(తులసి లక్ష్మీదేవి స్వరూపమే. సరస్వతీదేవి శాపంవల్ల లక్ష్మీదేవి తులసిగా మాధవీ ధర్మధ్వజులకు కుమార్తెగా జన్మిస్తుంది. శంఖచూడుని రూపంలో విష్ణువు ఈమెను వివాహమాడతాడు (బ్రహ్మవైవర్తపురాణం))

ఓ పురుషభూషణా! మా అత్తలూ, మామలూ చింతిస్తుండగా, నిందకు భయపడకుండా, మా భర్తలను దుఃఖాలపాలుచేసి, కుటుంబమర్యాదలు మంటగలిపి, నీ నవ్వులకు, మెత్తనిపలుకులుకు ఇష్టపడి, మన్మథుడు పట్టుదలతో బాధించగా మేము వచ్చాము. ఏ ఇతరసంబంధాలూ మాకు వద్దు. మీ పరిచర్యలు చేసే అవకాశం ఇచ్చి రక్షించుము.

పూర్వం స్త్రీలు భర్తల్ని ప్రేమించలేదా? భర్తలు వారిని ఆదరంతో తృప్తిపరచలేదా? అనురాగాలు మాకు మాత్రమే పుట్టినవా? నీ మాటలు మగవారికి తగినవేనా? (తగినవికావు) ఓ పుణ్యాత్మకా! మమ్మల్ని కౌగిలించు. నీకు పుణ్యం ఉంటుంది.

కృష్ణా! నీ చెక్కిళ్లు చెవికుండలాల ప్రకాశంతో ఒప్పారుతున్నాయి. నీ నుదురు ముసురుకొన్న ముంగురులతో అందంగా ఉంది. నీ చిగురుమోవి అమృతం చిందుతూ ఉంది. నీ చూపులు మనోజ్ఞమైన చిరునవ్వుతో సొంపారుతున్నాయి. ఇలాంటి నీ వదనం చూస్తూ - మేం నిలువగలమా? మన్మథుడు తన చెరకువింటినుండి వదిలిన బాణాలకు దాసులమైపోయాం. మమ్మల్ని రక్షించు.

ప్రభూ! మా చెంతకు చేరి నీ అధరామృతధారలను మా చిగురు పెదవులపైన చిలికించు. నీ విశాలమైన రమ్యతరమైన నిర్మలమైన ఎదను మా చను మొగ్గలపైన గదించు. నీ రమణీయ హస్తపద్మాలను మా కేశపాశంపైన చేర్చు. నీ దయార్ద్రమైన చూపులను మా నెమ్మొగాలమీద ప్రసరింపజేయి. నీ నవీనమైన, ఆదరణీయమైన సల్లాపంతో మా చెవులను కప్పివేయి. (అలా చేయకపోతే) మేం ఎలా జీవించగలం? ఎక్కడికి వెళ్లగలం? స్త్రీల మొరలు విన నర్హం కావా?

ప్రాణేశ్వరా! నీ పాదాలమీద ఒట్టువేసి చెపుతున్నాము. నీ చూపులు, నీ నవ్వులు, నీ పాటలవల్ల పుట్టి పేట్రేగిన మన్మథాగ్నులను నీ చిగురుమోవినుండి స్రవించే అమృతధారలతో చల్లార్చు. అలా చల్లార్చకపోతే నీ ఎడబాటు మంటల్లో భస్మమైపోయి నిన్నే తలచుకుంటూ నీ పాదద్వయాన్నే చేరతాము.

మిక్కిలి ప్రకాశించే నిన్ను చూచినా, నీ సంగీతం విన్నా - చెట్టూ, మృగాలూ, పక్షులూ, ఆవుల గుంపులూ కరగి పులకించి పోతాయి. మరి అబలలు అయిన స్త్రీలు నిన్ను చూచి, నీ గానం విని ద్రవించిపోరా?

ఓ యశోదాకుమారా! మానినులధైర్యహారా! నీ మధురమైన మాటలు అనే జడివాన కురియకుంటే ఈ మన్మథాగ్నిని ఎలా చల్లార్చగలం? నీ చూపు అనే నావ లేకుంటే ఈ మన్మథసాగరాన్ని ఎలా దాటగలం? నీ చిరునవ్వు అనే వెన్నెల లేకుంటే ఈ కామాంధకారాన్ని ఎలా పారదోలగలం? నీ నవాధరామృతం చిలుకకుంటే ఈ మదనజ్వరాన్ని ఎలా పోగొట్టుకోగలం? నీవు కరుణించి కౌగిలించుకొనకుంటే మా బతుకు ఎలా సాగించగలం? మాగతి ఏమిటి? దయలేనివాడైన మన్మథుడు మమ్ములను బతకనిస్తాడా?

ఓ పద్మనేత్రా! దేవతలను శ్రీహరి రక్షించినట్లు - మేము మూర్చపోకుండా నీ అభయహస్తాన్ని మా హృదయాలమీదా, మాశిరస్సులమీదా ఉంచు.

బాలకృష్ణా! దయానిధీ! తరుణులను దట్టమైన నీ విరహాగ్నికీలలు తలమునుకలుగా బాధించగా (దయతో) పలుకరించవు, చూడవు, నువ్వు ఎంత క్రూరుడివో గదా!

ఈ విధంగా పుష్పబాణుని బాణపరంపరలకు సొమ్మసిల్లి ఓపికలు లేకుండా పలికిన గోపికల దీనమైన పలుకులు విని, నవ్వి, యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు ఆత్మలో క్రీడించువాడై గోపికలతో రమించాడు. అప్పుడు

కృష్ణుడు తన కరుణాకటాక్ష వీక్షణాలతోను; చీరచెరుగులను, కేశపాశాలను లాగడంతోను; మొలనూళ్లు, చేతులు, భుజాలు, కుచాల స్పర్శలతోను; గోటిగిచ్చుల గుర్తులతోను; పరిహాసవాక్కులు, కౌగిళ్లతోను మన్మథుణ్ణి తిరస్కరిస్తూ గోపికలను రతిక్రీడలతో పరవశింపజేశాడు.

వికసించిన ముఖాలు గలిగిన గోపకాంతలు సంప్రీతితో తనను భజించగా, శ్రీకృష్ణుడు చిరునవ్వు వెన్నెలతో చుక్కల మధ్య విలసిల్లే నిండుచంద్రునివలె భాసిల్లాడు.

గోపికలు తననుగురించి పాటలు పాడుతుండగా, ప్రీతితో నర్తిస్తూ, వందలకొలదీ గోపికలు తనను కొలువగా మెడలోని వైజయంతిమాలతో పద్మనేత్రుడైన కృష్ణుడు బృందావనానికి అలంకారమయ్యాడు.

పరమేశ్వరుడై ఎవరికీ చిక్కకుండా, ఎదుటివారిని చిక్కులపాలు జేసే మాయలమారి అయిన కృష్ణునికి చిక్కి గోపయువతులు ధన్యురాండ్రై, మన్మథకేళిలో పరవశించిపోయారు. అలా ఉండగా కల్యాణగుణశాలి అయిన కృష్ణప్రభువు గోపికల కామోత్కంఠతను ఉపశమింపజేయడానికి, ఆ తర్వాత ఆదరంగా దగ్గరికి తీసుకోడానికి అనువుగా అపుడు అదృశ్యమయ్యాడు.

ఇలా కృష్ణుడు అద్భశ్యుడై వెళ్లిపోగా, మగ ఏనుగును కానక తిరిగే ఆడు ఏనుగుల మందలాగా, తమ హృదయాలు తల్లడిల్లిపోగా, గోపకాంతలు శ్రీకృష్ణుని నడక, నవ్వు, విలాసం, దృష్టి విహారం, పలుకు, నేర్పు, అనురాగాల స్మృతిలో తమ మనసులు పోగొట్టుకున్నారు. వివిధ చేష్టలకు పాల్పడి, తన్మయత్వంతో "నేను కృష్ణుణ్ణి” అని ఒకరు అంటే 'కాదు! నేనే కృష్ణుణ్ణి' అని మరొకరు వాదులాడుకుంటూ, కృష్ణునిగుణాలు వారిలో ఆవేశించగా తిరుగుతూ -

ఓ పరీక్షిన్మహారాజు! చరాచరాలైన సమస్తభూతాల లోపలా, వెలుపలా విలసిల్లే వాసుదేవుణ్ణి గోపకాంతలు యమునాతీరవన మధ్య ప్రాంతాలలో ప్రేమతో పాడుతూ వెదకడానికి వెళ్లారు.

ఓ పున్నాగ వృక్షమా! పురుష శ్రేష్ఠుల నమస్మారాలందుకొనే వాణ్ణి చూశావా? ఓ బొట్టుగచెట్టా! నొసట తిలకం ధరించేవానిని దర్శించావా? ఓ కర్పూర వృక్షమా! మహాబలంతో విలసిల్లే వాణ్ణి చూడలేదా? ఓ మంకెన వృక్షమా! బంధవులకు మిత్రుడైన వాణ్ణి చూశావా? ఓ వెలగమానూ! మన్మథ రూపుణ్ణి సందర్శించలేదా? ఓ వెదురు వృక్షమా! వేణుధరుణ్జి చూడలేదా? 

చందనవ్ఫక్షమా! చందనంలాగా చల్లనైనవాణ్ణి సందర్శించలేదా? ఓ మొల్లతీగా! మొల్లమొగ్గల్లాంటి దంతాలుగలవాణ్ణి కాంచలేదా? ఓ దేవదారువృక్షమా! దేవేంద్రవైెభవంతో విలసిల్లేవాణ్ణి కనలేదా? ఓ రేగుచెట్టూ! భూమండలానికి అధీశుడైనవాణ్ణి ఆలోకించలేదా? ఓ ప్రేంకణవృక్షమా! ప్రియవిహారంతో విరాజిల్లేవాణ్ణి చూడలేదా? -అంటూ పద్మముఖులైన గోపస్త్రీలు కృష్ణుణ్ణి వెదికారు.

ఇంకనూ...

ఓ మల్లియలారా! నీలమేఘశ్యాముడు, కమలనేత్రుడు, దయారసం చిలికించేవాడు, సిగపైన వ్యాపించిన నెమలిపింఛం గలవాడు, చిరునవ్వు చిందించే సుందరవదనుడు అయిన ఒక కుర్రవాడు గోపికల మానధనం దోచి తెచ్చాడు. మీ పొదల మాటున లేడుగదమ్మా! చెప్పండి.

ఓ లవంగతరువులారా! మాదీఫలవృక్షాల్లారా! నారింజవృక్షాల్లారా! దర్శించిన మాత్రాన్న మన్మథుణ్ణి అయినా చిత్తానికి ఇంపుగలిగించి పరవశింపజేసేవాడు, సిరికి నివాసమైన వక్షంవాడు, తీయనైన వేణునాదంతో విలసిల్లేవాడు అయిన శ్రీకృష్ణుడు మమ్మల్ని మన్మథుని పూలబాణాలకు అప్పగించి, మీ వద్దకు రాలేదు గదా! ఒకవేళ వచ్చి ఉంటే దయతో చూపండి!

మనోజ్ఞాలూ, గొప్పవీ అయిన కొడిసె వృక్షాల్లారా! రమణుల పాలిటి మన్మథుడైన లక్ష్మీశుణ్ణి చూడలేదా? సుందరమైన, సుదీర్ఘమైన మద్దివృక్షాల్లారా! సుందరుడూ, ఉదారుడూ, వత్సరాక్షసుణ్ణి సంహరించినవాడు అయిన హరిని కాంచలేదా? సమున్నతాలై ఒప్పిదమైన కంకేళీ వృుక్షాల్లారా! సుందరాలు, దీరాలెన కొమ్మలతో కూడిన జంట మదిచెట్లను పడగొటిన కృష్ణుణ్ణి చూడలేదా? 

నూతనమైన, ఒప్పిదమైన సంపెంగలారా! మహిమతో ప్రకాశిస్తూ దుఃఖరహితుడై విలసిల్లుతున్న కమలనేత్రుణ్ణి దర్శించలేదా? ఎఱ్ఱగోరింట చెట్టులారా! నవ్యమై, అందంగా ఉన్న బంగారు కిరీటధారి అయిన నందనందనుణ్ణి బృందావనమధ్యంలో సందర్శించలేదా? ఓ సుందరమైన అడవిమొల్లలారా! అందమైన నెల్లి చెట్టుల్లారా! బృందావనంలోని ఎర్రగోరింట పొదల్లో తిరిగే శ్రీకృష్ణుని చూడలేదా? (చూచి ఉంటే దయతో చెప్పండి? అనీ భావం)

అదిగో! నందుని తనయుడైన కృష్ణుడు ఉన్నట్లుండి అదృశ్యమయ్యాడు. ఓ కలిగొట్టు వృక్షాలారా! పట్టుకొనండమ్మా! 'కృష్ణా! విలాసవతులైన గోపకాంతలను ఎందుకు వదిలివేశావు' అని ఓ బుడమ తీగెలారా! అతణ్ణి అడగండి. ఓ మామిడి గుబురులారా! కమలాక్షుడు ఇక్కడికి వచ్చి దాగుకోలేదు గదా! చూడండమ్మా! ఓ పూలగురివెంద లతలారా! తరుణులపాలిటి మన్మథుడైన కృష్ణునికి మారాక చెప్పి మమ్మల్ని బతికించండమ్మా! జాజిలతలారా! కులకాంతులను వదిలివెళ్లడం హరికి నీతిగాదని దిక్కుల్లో చాటండమ్మా! ఓ అరటి చెట్టుల్లారా! మీరు వెళ్లి నెమలిపింఛం శిఖలో ధరించిన పద్మనేత్రుణ్ణి కదలించుకొని తెచ్చి దయతో మాకు చూపండమ్మా!

ఓ తులసీ! శ్రీహరిపాదాలకు ప్రియమైనదానివై, హరినిన్ను సమాదరించగా, నీవు శుభాలు అందుకొంటున్నావు. కృష్ణుడు నీ వైపు రాలేదుగదా? కృష్ణునిజాడ తెలిపి శుభాలు అందించవమ్మా!

పొగడలారా! పొగడదగిన పురుషోత్తముడైన కృష్ణుణ్ణి చూడలేదా; ఓ ఎర్రకిత్తలి చెట్టులారా! సాటిలేనిక్తీర్తిగల కృష్ణప్రభును చూపండి; మొల్లలారా! సర్వవ్యాపితకీర్తిగలవాడైన కృష్ణుడు ఎక్కడున్నాడు? ఓ మోదుగుచెట్టులారా! శుకునిచే స్తుతించబడిన వనమాలి ఏడీ? చెప్పండి.

ఓ ఆడుజింకా! (హరిణీ) తరుణులు తమస్తనాలపై అలదుకొన్నకుంకుమ పూతలు అంటుకొని హరికంఠంలోని పుష్పమాలికా పరిమళం సర్వత్ర వ్యాపించగా- అలాంటి గోపాలుణ్జి చూచినట్లు నీ చూపులు తలపిస్తున్నాయి. శ్రీకృష్ణుని జాడ తెలుపు. నీకు పుణ్యముంటుంది.

ఓ భూదేవీ! వరాహావతారం దాల్చినప్పుడు నిన్ను కౌగిట్లో చేర్చుకొన్నాడు. వామనావతారమెత్తి త్రివిక్రమస్వరూపుడై పాదాలతో నిన్ను కొలిచాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడై నీమీద పాదాలగుర్తులుంచాడు! పూర్వజన్మలో ఏమి నోములు నోచావోగదా!

ఇలా అంటూ గోపకాంతలు మన్మథుని ప్రేరణతో వెర్రెత్తినట్లు ప్రవర్తిస్తూ, కృష్ణతాదాత్మ్యాన్ని పొంది, ఆయన లీలలను అనుకరిస్తూ

గోపికల్లో ఒక రమణి పూతనవలె ప్రవర్తించగా, కృష్ణునివలె అభినయిస్తున్న ఒక సుందరి పాలు తాగినట్లు నటించింది. ఒక గోపిక తనను శిశువుగా భావించుకొని పాలకు రోదిస్తూ, శకటాసురుడులాగా నటించే మరొక సుందరిని కాలితో తన్నింది. ఒక అందగత్తె తృణావర్తుడులాగా నర్తిస్తూ, నేను కృష్ణుణ్ణి అనే మరొకగోపకాంతను పైకి ఎగరవేసుక పోయింది.

ఒక గోపకాంత నేను బకాసురుణ్ణి అని విజ్బంభించగా, నేను వాసుదేవుణ్ణి అంటూ మరొకగోపిక ఆమెను పరాభవించింది. ఇద్దరు తరుణులు రామకృష్ణులుగా నటించగా, మరికొందరు గోపకులు, దూడలు అయ్యారు. 'మేము పసులము' అంటూ పలుకుతున్న సుందరులను 'నేను అసురవైరిని' అని మరొక గోపిక పిలిచింది.

(ఇక్కడ కృష్ణతాదాత్మ్యంతో గోపకాంతలు కృష్ణలీలలను అభినయించే దృశ్యం మనోహరం.)

ప్రఖ్యాతచరిత్రుడవైన ఓ పరీక్షిన్మహారాజు! ఒక గోపకాంత హరియై విశ్వమంతా నా ఉదరంలోనే ఉంది చూడు అంటూ యశోదమ్మలా నటించే మరో గోపకాంతకు నోరు విప్పి చూపింది.

ఒక గోపకాంత వెన్నలు దొంగిలించి తినే కృష్ణుణ్ణి నేను అని చెప్పింది. వెంటనే వేరొక గోపిక తాను యశోదనంటూ చేతితో సైగలుచేస్తూ పూలదండతో (కృష్ణునివలె నటించే) ఆమెను కట్టివేసింది.

నరేంద్రా! “ఇది కాళియసర్పం. వీరు అతనిభార్యలు. నాకు వందనాలు చేస్తున్నారు. నేను గోపకుమారుడనైన కృష్ణుణ్ణి” అంటూ ఒక గోపకాంత కృష్ణునివలె విలాసంగా నర్తించింది.

ఓ రాజా! ఒక గోపకాంత కొందరు గోపతరుణులను చూపి “వీరు గోపాలకులు. ఇదిగో ఇంద్రుడు వాన కురిపిస్తున్నాడు. నేను శ్రీకృష్ణుణ్ణి. గోవర్ధనగిరి నెత్తి మిమ్మల్ని రక్షిస్తాను” అంటూ తన కెంగేలితో చీరచెరగు ఎత్తి పట్టుకొంది.

నరేంద్రా! ఒక గోపకాంత "నేను శ్రీకృష్ణుణ్ణి! మీరు గోపాలకులు. దావాగ్ని వస్తూ ఉంది. అటు చూడకండి. నేను దాన్ని నివారిస్తాను” అంటూ వట్టి బయలునే మింగింది.

ఇలా గోపసుందరులు పరవశంతో బృందావనంలో ఉండే చెట్లు, తీగెలు మొదలైనవాటిల్ని హరినిగురించి అడుగుతూ, సంచరించడానికి వీలుకాని అడవిదారుల్లో తిరుగుతున్నారు. అలా తిరిగేటప్పుడు శ్రీకృష్ణుని శుభలక్షణ లక్షితాలయిన పాదాల తీరును(అడుగుల ముద్రలద్వారా) గమనించారు. ఆ పాదాలు పద్మం, ధ్వజం, నాగలి, వజ్రం, కలశం, అంకుశం మొదలైన శుభలక్షణాలు కలిగినవి. వాటిల్ని గురించి చెప్పుకొంటూ తమ మనస్సులలో ఇలా భావించారు.

(పద్మం, ధ్వజం, నాగలి, కులిశం, అంకుశం మొదలైన చిహ్నాలు పాదాలలో ఉండడం ఉత్తమపురుషలక్షణం.)

ఇక్కడ ఒక సుందరికోసం కృష్ణుడు పూలుకోసినాడు కాబోలు - మునివేళ్లుమాత్రమే నేలపై మోపినాడు, ఇక్కడ ప్రీతితో కలికి నెత్తుకొని ముందుకు వెళ్లాడు కాబోలు - ఈ పచ్చికమైదానంపై ఆమెఅడుగులు అగుపించడంలేదు. ఇక్కడ ఒక మదవతి కొప్పు సవరించి చక్కదిద్దాడు కాబోలు - ఇద్దరూ కూర్చున్న ప్రదేశం సుందరంగా ఉంది. 

ఇక్కడ ఒక సుందరికి కమ్మోవి ఇచ్చాడు కాబోలు - ఆమె నిక్కినతీరు తేటతెల్లం అవుతూ ఉంది. ఒక కుందరదనతో ఇక్కడ ఈ కొలనునీటిలో దిగాడు కాబోలు - నీటినుండి వెలువడిన తావులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక కొమరాలిని మన్మథక్రీడలో తనియించాడు కాబోలు - ఇద్దరూ అనగి పెనగిన చిహ్నాలు అందగా విలసిల్లుతున్నాయి.

అంతే కాకుండా...

ఇక్కడ నందనందనుడు ఒక తరుణి చేయిపట్టుకొని నడిచాడు కాబోలు నాలుగుపాదాలున్నాయి. ఒక అందగత్తెతో ఇక్కడ ఒదిగాడు కాబోలు, పురుషునిజాడలో స్త్రీజాడ కనిపిస్తూ ఉంది. ఒక యువతి వందనం చేయగా ఇక్కడ ఒడిసి పట్టుకున్నాడు కాబోలు ఇక్కడ ఎదురెదురుగా పాదాల గుర్తులు ఏర్పాడ్డాయి. ఒక సుందరి వెంటబడగా నిలువకుండా వెళ్ళిపోయాడు కాబోలు కృష్ణునిఅడుగుల మీద ఆ అందగత్తె అడుగులు అమరి ఉన్నాయి. ఇరువైపులా ఇద్దరుతరుణులు రాగా తిరిగాడు కాబోలు ఇక్కడ ఆరుఅడుగుల గుర్తులున్నాయి.

ఓ చంద్రముఖీ! ఈ పాదాలే సనకసనందనాదిమునీశ్వరుల ధ్యానమార్గంలో వెలుగుతూ ఉండేవి; ఓ యువతీ! ఈ పాదాలే వేదాలనే కాంతల పాపట్లలో విరాజిల్లేవి ఓ మత్తగజయానా! ఈ పాదపద్మాలే క్షీరసాగరకన్య అయిన లక్ష్మీదేవికి ఆధారాలు. 

ఓ కలువకంటీ! ఈ అందమైన పాదాలే ముక్తికాంతమనస్సుకు సమ్మోహనకరాలు. ఓ సుందరీ! ఈ పాదాల ధూళియే బ్రహ్మ ఈశ్వరుడు మొదలైన దేవతాశ్రేష్ఠులు నడితలపై ధరించెవి. అంటూ కొందరు యువతులు కృష్ణుడు వెళ్లిన దారిని గుర్తించికూడా అతణ్ణి కనుగొనలేకపోయారు.

ఆ సమయంలో నాథులు తమకాంతలకు లొంగిపోయి పొందే దీనత్వాన్నీ, తరుణులు చూపే క్రూరత్వాన్నీ తెలపడానికి కృష్ణుడు ఒక సుందరితో కలిసిమెలసి విహరించాడు. అంతలో ఆ సుందరి తక్కిన యువతులందరినీ వదిలి నాథుడు తన, వద్దనే ఉన్నాడని విర్రవీగింది. 

ఆ గర్వంతోనే ఆమె “ఓ కమలనేత్రా! ఇక నడచి రాలేకున్నాను. నన్ను నీ భుజంపైన ఎక్కించుకో!” అని పలికింది. ఆ మాట అన్నవెంటనే కృష్ణుడు అదృశ్యమయ్యాడు. అప్పుడు ఆ వనిత పరితాపం పొంది "ఓ కృష్ణా! వల్లభా! ప్రాణేశ్వరా! ఎక్కడికి వెళ్లావు! నీకు పాదదాసినవుతాను నిలు నిలు” అంటూ పలవరించింది. అపుడు కొందరు యువతులు ఆ తరుణిని చూచి, మగనిచేత మన్ననలు పొంది, దర్పించి, ఈ పద్మనేత్ర ఇప్పుడు ఇటువంటి కష్టాలకు లోనయింది” అని విస్మయం పొందారు.

ఇంకా, ఓ పరీక్షిన్మహారాజా! గోపకాంతల వింత చేష్టలనుగురించి ఇంకా విను. ఈ పొదరింటిలో ఇందాక కృష్ణుడు నాతో మన్మథక్రీడసలిపాడు. ఈ చాటుప్రదేశంలో ఇంతవరకూ వల్లభుడు నన్ను గాఢంగా హత్తుకున్నాడు. ఈ చెట్టునీడలోనే ఇందాక సౌభాగ్యవంతుడు శృంగారచేష్టలతో నా సిగ్గును హరించాడు. 

ఈ పూలతీగవద్దనే ఇందాక మనోహరుడు నన్ను సమీపించి అధరామృతం ఆస్వాదించాడు. ఈ పూలతిన్నెమీద ఇందాక రమణుడు నా కొప్పులో పూలదండలను అలంకరించాడు అంటూ కొందరు యువతులు శ్రీకృష్ణుడు ఇంతకు ముందు సలిపిన శృంగారచేష్టలను కొనియాడారు.

ఈ విధంగా లతాంగులైన గోపికలు బృందావనంలో పరమాత్ముడైన శ్రీకృష్ణునికి వెదకి వెదకి దర్శించలేకపోయారు. ఆ విభుని గుణాల్ని చేష్టల్ని వర్ణిస్తూ, గానంచేస్తూ మనోవాక్కర్మలను ఆ లక్ష్మీశునిపైన్నే చేర్చ, తమతమ ఇండ్లకు వెళ్లాలనే కోర్కెలను వదలి, ఆ యమునాతీరంలోని ఇసుక తిన్నెలమీదికి త్వరత్వరగా వెళ్లారు.

అలా యమునా తీరంలోని ఇసుకతిన్నెల మీదికి వెళ్లిన గోపయువతులు, కృష్ణుణ్ణి ఉద్దేశించి ఇలా పలికారు.

గోపికాగీతలు

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Bringing nanda from Varuna Nagaram by Lord Krishna - శ్రీకృష్ణమూర్తినందుని వరుణనగరమునుండి కొనితెచ్చుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
శ్రీకృష్ణమూర్తినందుని వరుణనగరమునుండి కొనితెచ్చుట

నందగోపుడు ఏకాదశినాడు ఉపవాసవ్రతం చేసి, శ్రీహరిపూజచేసి, రాక్షసులు సంచరించేవేళ అని తెలియక, వేకువజాము కాకముందే ద్వాదశీస్నానం చేయడానికి యమునానదినీటిలో ప్రవేశించాడు. అప్పుడు వరుణునిదూత నందుణ్ణి వరుణనగరానికి కొనిపోయాడు. తక్కిన గోపకులు నందగోపుడు కనబడనందున కలతచెంది, బలరామకృష్ణులను పేర్లతో పిలుస్తూ శబ్దాలు చేశారు. ఈశ్వరుడైన కృష్ణుడు తన తండ్రిని మోసంతో వరుణదూత తీసుకొనిపోయి వరుణుని దగ్గర చేర్చడం తెలుసుకొని, వెంటనే వరుణుని నగరానికి వెళ్ళాడు.

(సాయంసంధ్యలు పొద్దుకుంకే సమయాన్ని 'అసురసంధ్య' అంటారు. అలాగే వేకువజాముకు ముందు అసురులు సంచరించే వేళ అంటారు. ఆ సమయాల్లో ఏ శుభకార్యమూ చేయరు.)

ఇలా వచ్చిన శ్రీకృష్ణునిచూచి వడివడిగా శ్రీకృష్ణుణ్ణి పూజించి వినమ్రుడై, ఓ దేవా! నా యింటికి విచ్చేశావు అని ఆప్యాయంగా పలికాడు.

మాధవా! ఎన్నడూ, ఎవరూ పొందశక్యంగాని పెనుత్రోవలో ఏ విభుని పాదపద్మాలను ఆసక్తితో ధ్యానించేవారు నడుస్తారో, అలాంటి భక్తులకు సంతోషం ప్రసాదించే స్వామివి నీవు. నీవు రావడంవల్ల నా మనసు పరమానందంతో నిండి పోయింది. నా కోరికలు ఫలించాయి. నీ సేవలో నా శరీరం పావనమైంది.

(ఆనందం పొందేవి రెండు. అటు శరీరం ఇటు మనసు. ఇవి రెండూ సంతోషం పొందాయి అంటే వరుణుడు స్వామిదర్శనంతో ధన్యుడయినట్లే!)

ఈ జగాలన్నిటినీ కప్పినమాయ ఏ పరమేశుడవైన నిన్ను కప్పలేక నీకు దాస్యం చేస్తూ ఉంటుందో, అలాంటి మహాత్మా! సుజనులను రక్షించేవాడివి, దేదీప్యమానశుభమూర్తివి, సుజన రక్షకుండవు, తపస్సే ధనంగా గలిగినవారికి చక్రవర్తివి అయిన నీకు నా శరీరతాపం తొలగించుకోవడానికి వందనాలు సమర్పిస్తున్నాను.

ఓ జనక వత్సలా! నిర్మల భక్తవత్సలా! ఈ నా భటుడు కొంతైనా మనసులో వివేకంలేనివాడై, నీ తండ్రిని వరుణలోకానికి తీసుకొని వచ్చాడు. నీ తండ్రిని దయతో తీసుకొని పొమ్ము! వీడు చేసినద్రోహాన్ని మరచిపొండి! నన్నూ ఈ భటుణ్ణి మన్నించండి. నీ క్షమాగుణంవల్లనే నేను బతికిపోతాను.

ఇలా పలుకుతూ ఉన్న వరుణుణ్ణి శ్రీకృష్ణుడు కరుణించాడు. ఆయన తనతండ్రి అయిన నందుణ్ణి తోడుకొని గోకులానికి తిరిగివచ్చాడు. అప్పుడు నందరాజు కృష్ణుడు తనను వరుణపురంనుండి విడిపించుకొని తీసుకొనివచ్చిన విషయాన్ని సమగ్రంగా బంధువులకు వర్ణించి చెప్పాడు. బంధువులు శ్రీకృష్ణుణి సాక్షాత్తూ పరమాత్ముడు అని భావించారు. సర్వజ్ఞుడైన శ్రీకృష్ణుడు కూడా తన బంధువుల భావాన్ని గ్రహించాడు. వారి కోరికను నెరవేర్చడానికి యమునానదిలో ఓ మడుగైన బ్రహ్మకుండంలో ముంచెతాడు.

ప్రకృతి సంబంధమైన కామకర్మలలో పరవశం పొందుతూ, ఉత్తమ అధమ స్థితులకు లోనవుతూ, భ్రాంతిలో జీవిస్తున్న ఈ జనం ఇహలోకంలో అసాధారణమైన నా నిజస్థితి విశేషాలను తెలుసుకోలేకుండా ఉన్నారు - అని కృష్ణుడు తలంచాడు.

అని ఇలా ఆలోచించినవాడైన శ్రీకృష్ణుడు దయాస్వభావంగలవాడై వ్రేపల్లెవాసులకు మాయకులో పడనిదీ, తేజోరూపమైందీ, నిరూపించవీలుగానిదీ, సత్యమైందీ, జ్ఞానస్వరూపమైందీ, ఆనందమయమైందీ, అంతటానిండినదీ, పాపరహితులు గణాతీతస్థితిని పొందిన తరువాత పొందేదీ, స్వామివారికీ ఆత్మీయమైందిగా ఉండేది అయిన శాశ్వతమైన తన లోకాన్ని చూపించాడు.

ఈ విధంగా శ్రీకృష్ణుడు - ముందు అక్రూరుడు పొందిన పుణ్యలోకాన్ని పూర్తిగా చూపి, బ్రహ్మలోకాన్ని గూడా నందాదులకు కనిపింపజేశాడు. వారు ఆనందించి ఆశ్చర్యపడుతూ పరమాత్మ స్వరూపుడైన శ్రీకృష్ణమూర్తిని స్తోత్రం చేస్తూ పూజించారు. ఆ తర్వాత

ఆ సమయంలో శరదృతువు వచ్చింది. శరద్రాత్రులు కలువలకు మేలుగలిగే సమయాలుగా, మన్మథుడికి యుద్ధస్థానాలుగా, విరహాలకు తలలు వాల్చిన వేళలుగా, చక్రవాకపక్షులకు రతిసమయాలుగా, యువతులు విషయాలలో చిక్కుకొనే వేళలుగా, శరత్‌చంద్రుని దట్టమైన వెన్నెలలో దిక్కులు ప్రకాశించేవిగా, జారులకు దుర్దశలుగా అయ్యాయి.

శరదృతువులోని పున్నమిరాత్రి నిండుచంద్రుడు కలిగిందై ఆ మన్మథశాస్త్రానికి వ్యాఖ్యానంగా, కలువపూలకు వికాసం ఇచ్చేదిగా, మన్మథుని విజృంభణం కలిగిందిగా, జారుల నిబ్బరాన్ని పోగొట్టెదిగా, భయపడిన చక్రవాకాలు కలిగిందిగా, అందరికీ ప్రీతిని గలిగించేదిగా వచ్చింది.

ఓ పరీక్షిన్మహారాజా! భర్త తన భార్యముఖంమీద కుంకుమపూత పూసినట్లుగా చంద్రుడు తన ఉదయవేళలోని ఒప్పిదమైన కిరణాల ఎరుపుదనంతో తూర్పుదిక్కు అనే స్త్రీ యొక్క ముఖాన్ని రంజింపజేశాడు.

ఆ సమయంలో మన్మథుడు విటులసేనపైన దండెత్తడానికి సిద్ధంచేసుకొన్న గుడారం మీద మెరిసే బంగారుకలశమో అన్నట్లుగా నునుపై - ఆ మన్మథుడు కాముకులయొక్క ధైర్యం అనే తీగను తెగగొట్టడానికి ఎత్తిన విష్ణుచక్రమో అన్నట్లుగా గుండ్రనిదై - ఆ మదనుడు బాటసారుల ప్రణయకోపాలను కాల్చడానికి ప్రోగుచేసిన నిప్పుల కుప్పో అన్నట్లుగా ఎర్రనిదై - ఆ పంచబాణుడు విరహిణులు అనే మృగాలను వేటాడడానికి తనవెంట తెచ్చుకొన్న మోహపుదీపమో అన్నట్లుగా కాంతిగలదై, చకోరాలు సంతసించగా, ఆకాశమండలంలో, ఉదయ పర్వతం చెంత పున్నమినాటి చంద్రబింబం ఉదయించింది.

శరద్రాత్రి గాన మొనర్చు కృష్ణు సన్నిధికి గోపికలు వచ్చుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Srikrishnudu Kuberabhatundagu Shankhachuudundanu Guhyakuni Samharinchuta - శ్రీకృష్ణు౦డు కుబేరభటుండగు శంఖచూడుండను గుహ్యకుని సంహరించుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము -  శ్రీకృష్ణు౦డు కుబేరభటుండగు శంఖచూడుండను గుహ్యకుని సంహరించుట మరొక వెన్నెలరాత్రి బలరామకృష్ణులు ప్రకా...