Friday, August 21, 2026

sri krishnundu kesivyomasurula samharinchuta - శ్రీ కృష్ణుండు కేశివ్యోమాసురుల సంహరించుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము - 
శ్రీ కృష్ణుండు కేశివ్యోమాసురుల సంహరించుట

అని చెప్పి రథమెక్కి అక్రూరుడు వెల్లిపోయాడు. కంసుడుకూడా సభాసదుల్ని వీడ్కొల్పి, తన అంతఃపురానికి వెళ్లిపోయాడు.

ఆ తర్వాత కంసప్రేరితుడై ఇంధ్రవరుణులను మించినవాడూ, పరాక్రమానికి సముద్రంవంటివాడూ అయిన కేశి అనే రాక్షసుడు కంసుని ప్రోత్సాహంతో గుర్రమై వాయువేగంతో నందుని మందలోకి ప్రవేశించి సంకటం కలిగించాడు. 

ఆ కేశిదానవుని దిట్టమైన గిట్టల తాకిడికి సంచలించిన భూమండలం నాగరాజైన ఆదిశేషునిపడగలకు బరువయింది. అతనిభయంకరమైన సకిలింతలకు మిక్కిలి భీతిచెంది ఆకాశంలో దేవతలు ఒకరినొకరు గట్టిగా పట్టుకున్నారు.

ఆ రాక్షసుడు తన జూలు అటూ ఇటూ ఆడించడంవల్ల జనించిన గాలికి మేఘాలు ఎగిరిపోయి దేవతలవిమానాలను కమ్ముకొన్నాయి. అతని బిలంవంటి నోరు తెరచినపుడు నోటిలోని పెద్దపండ్లు ప్రళయకాలంలోని అగ్నిజ్వాలలవలె ప్రకాశించాయి. అతనితోక యమపాశంవలె కనిపించింది.

దారుణమైన గుర్రం రూపంలో ఉన్నఆ కేశిరాక్షసునిసకిలింత వినేసరికి అక్కడి ఆవులు, దూడలు, గోపికలు, గోపాలకులు, పిల్లలు - అందరి హృదయాలూ దద్దరిల్లాయి. కృష్ణుడు చూస్తుండగానే మంద దీనంగా మొరపెట్టే పెద్దధ్వనిగా మారిపోయింది. ఆ సమయంలో

"శక్తిహీనులైన మందలోని గోపాలకులను భయపెట్టడం నీవంటి వీరునికి ధర్మం కాదు. ఈ గోకులంలో దానవనాశకుడైన కృష్ణుడెక్కడ?” అంటూ తనను వెదకుతున్న కేశిదానవుణ్ణి కృష్ణుడు చూశాడు. 

గోపాలురకు అడ్డం వచ్చి కృష్ణుడు "ఓరీ రాక్షసుడా! ఇక పోలేవు" అంటూ సింహంవలె గర్జించి వాణ్ణి యుద్దానికి పిలిచాడు. ఆ రాక్షసుడు కూడా గోవిందుణ్ణి ఎదిరించాడు.

అశ్వరూపంలోని కేశిదానవుడు భయంకరంగా, కర్కశంగా సింహనాదంచేస్తూ ఆకాశాన్ని మింగే విధంగా నోరు పెద్దదిగా తెరిచి, కృష్ణుణ్ణి కరవబోయాడు. వాని కాటును కృష్ణుడు తప్పించుకున్నాడు. దానవుడు కృష్ణుణ్ణి ఎగిరి తన్నినాడు.

జాగ్రత్తగా ఆ తన్ను తప్పించుకొని రాక్షసాంతకుడైన శ్రీకృష్ణుడు రణోత్సాహం పొందాడు. కండ్లలో ఎరుపుదనం అతిశయించగా ఆ అశ్వదానవునిగర్వం తరిగేటట్లు అతనికాళ్లు పట్టుకొని గరుత్మంతుడు పాముపిల్లను పట్టుకొని విసిరి పారవేసినట్లు నూరువిండ్ల దూరంలో విసిరి పారవేశాడు.

అలా కృష్ణుడు విసరిపడవేయగా, కేశిదానవుడు నేలపై పడి వెంటనే పైకి లేచి అహంకారంతో హుంకరిస్తూ, సంకోచం లేకుండా కృష్ణునిపైన పడ్డాడు. భయంకర సర్పాన్ని గుహలోనికి చొప్పించిన విధంగా కృష్ణుడు దిగ్గజం తొండంవలె బలిష్ఠమైన తన బాహుదండాన్ని కేశిదానవుని నోటిలోనికి చొప్పించాడు.

ఓ రాజశ్రేష్ఠుడవైన పరీక్షిన్మహారాజా! అఘాసురసంహారి అయిన శ్రీకృష్ణుడు వజ్రాయుధంవలె కఠినమై పైకి చాచబడిన స్తంభంవంటి తన ఎడమచేతిని రాక్షసుని దంతాలు చూర్ణమై రాలిపోయేటట్లు వాని కడుపులోనికి చొప్పించాడు. అలా చొప్పించిన చేతిని ఉత్సాహంతో పెంచుతూ ఆ దానవుని ప్రాణవాయువును నిరోధించాడు.

ఇలా కృష్ణుడు చేసినందువల్ల, పొట్టలోని గాలి వెలుపలికి వెడలక నిలిచిపోయింది. రాక్షసునిదేహం పై చెమటలుపట్టాయి. కనుగుడ్లు బైటికి వచ్చాయి. తన మాయలు చెడిపోయి, తన్నుకొంటూ, రొప్పుకుంటూ కేశి నేలపైన కూలిపోయాడు.

ఓ రాజా! ఇలా అశ్వాసురుని కడుపులో కృష్ణుని బాహువు పెరిగి పెరిగి పట్టక పోవడంతో, వాని కడుపు దోసపండువలె రెండుముక్కలుగా పగిలిపోయింది.

పద్మనేత్రుడైన శ్రీకృష్ణుడు వీరావేశీ, మాంసాశనుడూ, ఆనాటి లోకంలో నూతనశక్తిరాశిగా ఉన్నావాడూ, ఇంద్రవరుణులను ఓడించినవాడూ అయిన కేశిరాక్షసుణ్ణి అలవోకగా సంహరించాడు

ఆ ఆనందసమయంలో దేవతలు పూలవానలు కురిపించారు. శ్రీకృష్ణునిమహిమలను కొనియాడారు. అప్పుడు విష్ణుభక్తి విశారదుడైన నారదుడు వచ్చి, కృష్ణునిదర్భనం చేసుకొని, రహస్యంగా ఇలా అన్నాడు.

కృష్ణా! జగదీశ్వరా! అచింత్య ప్రభావంగల యోగీశ్వరా! అఖిల ప్రాణులకు ఆధారమైనవాడా! అంతటా నిండిన మహానుభావా! సర్వనియామకుడా! కట్టెలో నిక్షిప్తమై ఉన్న అగ్నివలె, సమస్తప్రాణులలో ప్రవేశించి ఎలాంటి వికారాలు లేక ఏకరూపుడవై విరాజిల్లుతున్నావు. 

ప్రాణుల హృదయగుహల్లో గూఢంగా ఉన్నావు. జీవులు చేసే పనులకు సాక్షిభూతుడవై ఉన్నావు. నీవు సర్వస్వతంత్రుడవు. నీకు అధీనమైన మాయాశక్తితోకూడి సత్త్వరజస్తమోగుణాలను కల్పిస్తున్నావు. ఈ త్రిగుణాల చేత బ్రహ్మ, విష్ణు, రుద్రరూపుడవై జగత్తును సృష్టిస్తున్నావు, రక్షిస్తున్నావు, సంహరిస్తున్నావు.

ఇలాంటి నీవు నేడు రాజుల ఆకారాలు ధరించి ఉండే రాక్షసులను సంహరించి, ఈ భూమండలాన్ని కాపాడడానికి అవతరించావు.

దేవా! ఇంకా నీచేత చాణూరుడు, ముప్టికుడు, గజాసురుడు, కంసుడు, శంఖుడు, యవనుడు, మురాసురుడు, నరకాసురుడు, పౌండ్రకవాసుదేవుడు, శిశుపాలుడు, దంతవక్త్రుడు, సాల్వుడు మొదలైనవారు సంహరించబడతారు.

దేవలోకంనుండి పారిజాతవ్బక్షాన్ని పెకలించి భూలోకానికి తెస్తావు. నీవల్ల నృగునికి శాపవిమోచనం కలుగుతుంది. శమంతకమణిని స్వీకరిస్తావు. మృతులైన బ్రాహ్మణకుమారులను తిరిగితెచ్చి ఇస్తావు. అర్జునునికి రథసారథివై కురుక్షేత్ర యుద్ధంలో పదునెనిమిదిఅక్షౌహిణుల సైన్యాన్ని సంహరిస్తావు. ఇంకా -

కృష్ణా! వర్ధనశీలుడైన విధాతకూడా నీవు చేసే ఘనకార్యాలను లెక్కించ లేడు. నీ వల్లనే సత్త్వరజస్తమోగుణాలు మూడూ పుడతాయి, వృద్ధి పొందుతాయి, నశిస్తాయి. నీరూపం మేరలేనిది. సర్వవ్యాపివీ, జయశీలివీ, సహనశీలివీ, పరమేశ్వరుడివీ, ప్రమాణరహితుడివీ, ప్రపంచనియామకుడివీ అయిన నీకు ప్రణమిల్లుతున్నాను.

ఇలా దేవదేవుణ్ణి ప్రస్తుతించి సెలవుతీసుకొని నారదుడు వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఒకనాడు గోపబాలకులు కృష్ణునితో కలసి పశువులను తోలుకొని అడవికి వెళ్లారు. అక్కడ పసులను మేపుకుంటూ దాగుడు మూతల్లాంటి - దొంగ - రక్షకుడు అనే ఆట ఆడడం ప్రారంభించారు.

గోపబాలురు తమలో కొందరు గొర్రెలుగా, కొందరు కాపరులుగా, మరికొందరు దుస్స్వభావంగల దొంగలుగా ఏర్పడి కనుమూసి గంతలాటను(దాగుడుమూతల్లాంటి) ఆడడానికి ఆరంభించారు.

అంతలో మయుడనే రాక్షసుని పెద్దకొడుకు వ్యోమాసురుడు గోపాలరూపం ధరించాడు. వాడు అడ్డులేని దొంగతనంతో ఆ ఆటలో గొఱ్ఱెలుగా నటిస్తున్న గొల్లపిల్లలలో నలుగురైదుగురిని తప్ప మిగతా బాలురనందరినీ మెల్లమెల్లగా ఆ కొండ గుహలోనికి తీసుకొని వెళ్లాడు.

ఇలా ఆ వ్యోమాసురుడు గోపబాలకులను మెల్లమెల్లగా కొండగుహలోనికి చేర్చి, ఒక పెద్దరాతితో ఆ గుహద్వారాన్ని మూసివేశాడు. అలా చేసిన తర్వాత ముందులాగా ఆ రాక్షసుడు రాగా

సర్వజ్ఞుడూ, రాక్షసాంతకుడూ, మహావీరుడూ అయిన శ్రీకృష్ణుడు నవ్వుతూ "ఓరీ! రాక్షసా! నీదొంగతనం గుట్టు బట్టబయలైంది. బలే దొంగవులే! యాదవ బాలకులందరినీ కొండగుహలో బంధించావు. మిగిలిన వారిని కూడా పట్టు కొందువుగాని రా! రారా! అంటూ సింహం తోడేలును పట్టుకున్నట్లు వాణ్ణి ఒడిసి పట్టుకొన్నాడు.

పద్మనేత్రుడైన శ్రీకృష్ణుడు ఇలా ఒడిసిపట్టగా అతడు గోపాలకునిరూపం వదిలి కొండలాంటిరాక్షసరూపంతో ఉప్పొంగి మిడిసిపడ్డాడు. కానీ విడిపించుకోవడానికి బలంచాలక, తన శక్తిమీద సందేహం గలిగి, ఎంతగానో గుంజులాడాడు. అపుడు ఆకాశంలో దేవతలు 'ఓహో' అని జయజయధ్వానాలు చేస్తుండగా కృష్ణుడు ఆ వ్యోమాసురుణ్ణి సంకోచం లేకుండా సంహరించాడు.

బలవంతుడైన శ్రీకృష్ణుడు ఆ భయంకరరాక్షసుణ్ణి సంహరించి, కొండగుహద్వారంలో అడ్డంగా ఉంచిన రాతిని పగిలిపోయేలా తన్నాడు. గుహలోపల చిక్కుబడిపోయి, తిరుగుతూ ఉన్న గోపబాలకులను కొండ గుహనుండి వెలుపలికి తీసుకొని వచ్చి గోకులానికి వెంటబెట్టుకుని వెళ్ళాడు.

ఆ తర్వాత, అక్రూరుడు ఆ రాత్రి మథురానగరంలో బసచేసి, నియమంలో ఉదయమే లేచి, నిత్యకర్మానుష్ఠానాలు తీర్చుకొని, రథమెక్కి కదలి నందునిగోకులానికి ప్రయాణిస్తూ, దారిలో తనలో తాను ఇలా అనుకున్నాడు.

కంసుని పంపున నక్రూరుండు బృందావనంబునకు జనుదెంచుట


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Vrushabhasura Samharamu - వృషభాసుర సంహారము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము - వృషభాసుర సంహారము

ఎవని మూపురం చూచి మేఘాలు కొండశిఖరం అని భ్రమించి ఆశ్రయిస్తాయో - ఎవనిరంకె చెవులకు సోకితే గర్భవతులకు గర్భస్రావం అవుతుందో - ఎవని పాదఘట్టనలచే ఎగసే ధూళిరేణువులు సూర్యుణ్ణి ఆవరిస్తాయో - ఎవడు కొమ్ములతో కోరాడి చిమ్మితే కొండలే పెల్లగిల్లుతాయో - అలాంటి వృషభాసురుడు అహంకరించి, తీగలాంటి తన వాలాన్ని ఎత్తి, పెద్దరంకె వేసి, కాలితో నేలను తవ్వుతూ, ఆవులమంద భీతిల్లేటట్లు వాడికొమ్ములు చాచి అతివేగంగా వచ్చిపడ్డాడు.

అలా వృషభాకారం దాల్చిన అరిష్టుడనే రాక్షసుడు హరికి కీడుచేయదలచి అతనిపైకి దూకగా
వెంటబడగా దూడలు ఆవులవద్దకు పరుగెత్తాయి. దూడలు, ఆవులుచేరి ఎద్దులలో వచ్చిపడ్డాయి. దూడలు, ఆవులు, ఎద్దులు ఏకమై గోపాలకుల వద్దకు పరుగెత్తాయి. గోపాలకులు, ఎద్దులూ, ఆవులూ, దూడలూ చెల్లాచెదరై పరుగెత్తడం గోవిందుడు చూశాడు.

ఈ విధంగా భయంతో పరిభ్రమిస్తూ తామూ, తమకాంతలూ కృష్ణ కృష్ణా! రక్షించు! అని మొరపెడతూ కృష్ణుణ్ణి శరణుచొచ్చారు. దీనరక్షకుడైన శ్రీకృష్ణుడు గోపాలకులకు అడ్డంవచ్చి రాక్షసునితో ఇలా అన్నాడు.

ఓరీ! వృషభాసురా! పిల్లలనూ, స్త్రీలనూ, పశువులనూ పారదోలడం పరాక్రమమా? నీ ప్రతాపం వారిమీద చాలించు. నీ బలం చూపెట్టి భయపెట్టడానికి మేము సామాన్యులమైన గోపగోపీజనులం కాదు. వెళ్లిపో! మీదికి వచ్చావంటే నేడు ఈ కృష్ణుడనే పెద్దపులి నీ కంఠం ఖండించకుండా, నిన్ను చంపకుండా విడిచిపెట్టడు సుమా!

ఇలా రాక్షసుణ్ణి ధిక్కరించి పలుకుతూ, అరచేతులతో చరుస్తూ, నవ్వుతూ, పట్టుదల అతిశయించగా, సర్పరాజంవలె భీతిగాలిపే బాహుదండాన్ని చాచి, శౌర్యంతో దనుజుని పక్కనే కృష్ణుడు నిలిచాడు.

ఆ సమయంలోనే...

ఆ వృషభాసురుడు గిట్టలతో నేలతవ్వుతూ, అడ్డులేని విధంగా తిప్పే తనతోకవల్ల ఏర్పడే గాలులకు మేఘాలు విచ్చిపోతుండగా, కొమ్ములు ఒడ్డుకొంటూ, కన్నులలో నిప్పులు రాలుతుండగా, దుస్సహమైన రూపంతో రివ్వురివ్వున వచ్చి, శత్రువుల దుర్గర్వాన్ని నశింపజేసే పద్మనేత్రుడయిన శ్రీకృష్ణుని ఎదుర్కొన్నాడు.

యాదవశ్రేష్ఠుడయిన కృష్ణుడు వృషభాసురుని రెండు కొమ్ములు పట్టి, పద్దెనిమిది అడుగులదూరం ఏనుగు మరో ఏనుగును పడదోసినట్లు తోసివేశాడు. ఆ రాక్షసుడు తల్లడిల్లి శరీరమంతా చెమటలు కమ్మగా సొమ్మసిల్లి నేలపైపడి, మళ్లీ తేరుకొని దనుజమర్దనుడైన కృష్ణుణ్ణి దుర్మదంతో ఢీకొట్టాడు.

రాజా! యదుసింహుడైన శ్రీకృష్ణుడు వృషభాసురునికొమ్ములు పట్టుకొని, భూమిమీద పడవేసి, కాలితో తొక్కిపట్టి రాక్షస వీరుల బలం అణగారగా, దేవతల ఉత్సాహం అతిశయించగా వానికొమ్ము ఊడబెరికి, దానితోనే వాణ్ణి కొట్టి చంపాడు.

వృషభాసురుడు బలముడిగి రొప్పుతూ, ముక్కులో, నోట్లో నెత్తురుకారుతూ ఉండగా, మలమూత్రాలు ఎక్కువగా విడుస్తూ ప్రజలకు ఆనందం కలిగేటట్లు ప్రాణాలు విడిచాడు.

ఈ విధంగా కృష్ణుడు వృషభాసురుణ్ణి చంపగా, దేవతలు గుంపులుకూడి, పూలుకురిపించారు. గోపాలకుల ఆనందించారు. స్త్రీలు ఉప్పాంగిపోయారు. అప్పుడు శ్రీకృష్ణుడు బలరామునితో కలిసి పరమానందంతో గోకులానికి వెళ్లాడు ఆ తర్వాత -

మహానుభావుడైన నారదుడు ఒకనాడు కంసునితో - “యశోద కూతురును కన్నది. శ్రీకృష్ణుడు దేవకీ గర్భసంజాతుడు. బలరాముడు రోహిణికుమారుడు. ఆ ప్రభువులిద్దరూ గోకులంలో ఉన్నారు” అని తెలియజెప్పాడు. ఆ మాటలు విన్న కంసుడు 'ఇదిమహాద్భుతం” అనుకుంటూ కోపావేశంతో కంపించిపోయాడు.

(నారదుడు చెప్పిన విషయాలన్నీ కంసునికి కొత్తవే. అందువల్లనే మహాద్భుతం అని ఆశ్చర్యపోయాడు. తనకు ప్రాణగండం అయిన దేవకీదేవి అష్టమగర్భం అయిన కృష్ణుడు బతికి ఉండడంతో కంసుడు ఆగ్రహావేశంతో కంపించిపోయాడు.)

బక్క చిక్కిన ఈ వసుదేవుడు కొడుకులను గోకులంలో దాచి, వంచనతో నన్ను మోసం చేశాడు. ఇతణ్ణి పట్టిచంపడమే సరైంది అంటూ కత్తి చేతబూని వసుదేవుణ్ణి సంహరించడానికి వడివడిగా వచ్చే కంసుణ్ణి చూచి, నారదుండు "ఆగు! ఆగు! వసుదేవుణ్ణి చంపడం భావ్యంకాదు" అని గట్టిగా చెప్పి, వారించి, దేవలోకానికి తరలిపోయాడు.

ఇంకా కంసునికి కోపం తీరక దేవకీవసుదేవులను ఉక్కుసంకెళ్లతో బంధింపబేశాడు. 'కేశి' అనేవాణ్ణి  పిలిచి బలరామకృష్ణులను చంపుమని పంపాడు. మంత్రులను, భటులను, మావటివాండ్రను; చాణూరుడు ముష్టికుడు అనే మల్ల యోధులను; సాల్వుడు కోసలుడు మొదలైన ప్రముఖులను రప్పించాడు. వారితో ఇలా అన్నాడు.

"నన్నెదిరించి పోరాడడానికి ఎక్కడైనా ఇంద్రాదులకు సైతం శక్తి చాలదు. బలరామకృష్ణులు అనే మదించిన యాదవ బాలురు ఇప్పుడు బృందావనం గోకులంలో పెరుగుతున్నారట! యుద్ధభూమిలో కంసుణ్ణి సంహరిస్తామంటూ గర్వోక్తులు పలుకుతున్నారట! మీరు ఈ వింతమాటలను విన్నారా”

మల్లయుద్ధం ఏర్పాటు చేయండి. మల్లరంగస్థలానికి నాలుగు వైపులా దట్టంగా మంచెలు వేయించండి. మధురానగరంలో మల్లయుద్ధం జరుగుతుందని చాటింపు చేయండి. పట్టణ ప్రజలందరూ చూస్తారు.

ఓ చాణూర ముప్టికులారా! మీరు నైపుణ్యాలతో మల్లయుద్ధం చేయగలవారు. మహాశౌర్య పరాక్రమసంపన్నులు. మేటిమల్లయుద్ధవీరులలో కీర్తివహించి అతిశయంతో విరాజిల్లేవారు. ఈ మధురాపుర జనులు పొగడగా ఆ బలరామకృృష్ణులను మల్లయుద్ధంలో మర్దించి నాకు ప్రీతిపాత్రులు అవండి.

ఓ మావటివాడా! ఇలారా! ఆ గోపాలకులైన బలరామకృష్ణులు ఎత్తెన మన భవనద్వారందగ్గర గడపవద్దనున్న స్తంభం దగ్గరకు రాగానే నీ ప్రతాపం ప్రదర్శించు. చెక్కిళ్లపై ఏర్పడిన మదధారల సువాసనలచేత గండుతుమ్మెదలసమూహాన్ని ఆశపెట్టి ఆకర్షించే నా కువలయాపీడమనే గజరాజాన్ని అదలించి, వారిమీదికి డీ కొలుపు! (ఢీ కొట్టించు)

మన విజయంకోసం చతుర్దశినాడు ధనుర్యాగం చెయ్యాలి. పశుపతికి ప్రీతిగా జంతుబలులు సమర్పించండి.

కంసుడు ఇలా చెప్పి, తనవాళ్లనందరినీ ఆయా పనులు చేయడానికి నియమించి, యాదవశ్రేష్ఠుడైన ఆక్రూరుణ్ణి పిలిపించాడు. అతనిచేతిని తన చేతిలో ఉంచుకొని ఇలా అన్నాడు.
(ఎవరినైనా చేయిపట్టుకుని ఆదరిస్తే రాజు అతణ్ణి సన్నిహితుడుగా భావిస్తున్నాడనడానికి సంకేతం.)

క్రౌర్యం లేకుండా నీవు మనుగడసాగిస్తూ ఉన్నందువల్ల నీకు అక్రూరుడనే సార్థకనామం సరిపోతూ ఉంది. నీతో మైత్రి చేయవచ్చు. నీవు కోపంలేనివాడివి. గోకులంలో బలరామకృష్ణులు అనే యాదవులు నన్ను చంపాలనే ఆసక్తితో ఉన్నారట. వారిని ఉపాయంతో తెచ్చి నాకప్పగించు!

నాకు భయపడి దేవతలు శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థించగా, అతడు యదువంశంలో వసుదేవునికి కృష్ణుడనే పేరుతో పుట్టాడని ఒక వార్త విన్నాను.

కాబట్టి నీవు గోపాలకులనుండి కప్పాలు పుచ్చుకొని, ధనుర్యాగం చూడడానికి రండి అని ఆ బలరామకృష్ణుల్ని తోడ్కొని రా. అలా వస్తే -

అక్రూరా! నా ఇంట్లో ఉండే కువలయాపీడం అనే గజరాజం తన దంతాల చివర్లతో కొండలనుకూడా కూలదోస్తుంది. మగటిమితో డీ కొంటే దండధరుడు అయిన యముణ్ణి అయినా కిందు పరుస్తుంది. అది బ్రహ్మాండాన్నయినా కదిలిస్తుంది. అలాంటి గజరాజుకు బలరామకృష్ణులను చీల్చి చెండాడడానికి ఎంతసేపు పడుతుంది? ఒక వేళ అదీ కాకుంటే -

చాణూరుడూ, ముప్టికుడూ సభలలో గణింపదగిన మల్లయోధులు. బలసంపదలో వారు వాయుదేవుణ్ణి కూడా లెక్కచేయరు. బాహాబాహి యుద్ధంలో వారు మిక్కిలి ప్రవీణులు. అలాంటివారు బలరామకృష్ణుల బలాధిక్యాన్ని సహిస్తారా? పోరాటంలో ప్రాణాలు తీసి వారిని సంహరిస్తారు. ఇది ముమ్మాటికీ నిజం.

ఆ బలరామకృష్ణులు అంతరించిన తర్వాత వసుదేవాదిప్రముఖులను తెగటారుస్తాను. సాహసంతో మెఅసి వృష్ణి, భోజ, దశార్హ జాతుల వీరులను సంహరిస్తాను. వృద్దుడు, రాజ్యకాముకుడు, నీచుడు అయిన మా అయ్య ఉగ్రసేనుణ్ణి, మాపినతండ్రి దేవకుణ్ణి చంపేస్తాను. 

ఇంకా మిగిలిన నాశత్రువులందరినీ నాశనంచేసి, నేను నామిత్రులైన జరాసంధుడు, నరకుడు, బాణుడు, శంబరుడు మొదలైనవారితో కలిసి భూమండలం అంతా పరిపాలిస్తాను. 

నువ్వు వెళ్లి వెంటనే బలరామకృష్ణుల్ని తీసుకొనిరా! యాగం పేరు చెప్పి శత్రువులను నాశనం చేసే మంత్రాంగం చేయాలి. వైరుల్ని వృద్ధి పొందనీయరాదు.

(కంసుడు చెడ్డకమారుడు. తండ్రిని రాజ్యకాముకుడు, ఖలుడు, ముదుకడు అని పరుషపదజాలంతో నిందించాడు. చంపుతానన్నాడు. భారతంలో దుర్యోధనుడు కూడా తన తండ్రిని అంధుడని, ముసలివాడని నిందించడమేకాక అతణ్ణి లెక్కచేయలేదు. అందుకే తగిన ఫలాన్ని అనుభవించాడు.

జరాసంధుడు, నరకుడు, బాణుడు, శంబరుడు కంసుని మిత్రులు. జరాసంధుని భీమునిచేత కృష్ణుడు చంపిస్తాడు. నరకుడు సత్యభామ చేతిలో సంహరింపబడతాడు. బాణుడు, శంబరుడు కృష్ణుని చేతిలో ప్రాణాలు కోల్పోతారు.)

ఇలా కంసుడనగా అక్రూరుడు ఇలా పలికాడు.

ఓ రాజా! నీవు పంపిస్తే పోక తప్పుతుందా? మానవులు తమశక్తిని సరిగ్గా ఊహించుకోలేరు. దైవలీలలను కొంచెం కూడా తెలుసుకోలేరు. తమకు తోచినట్టుగా నిర్భయంగా వ్యవహరిస్తుంటారు. దాన్ని కాదనవచ్చా? విధినిర్ణయం తప్పించలేము. నీకు విరోధి అయిన వసుదేవునిబిడ్డలైన బలరామకృష్ణుల్ని తోడ్కొని వస్తాను. వెళ్లి వస్తాను.

శ్రీ కృష్ణుండు కేశివ్యోమాసురుల సంహరించుట


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Thursday, August 20, 2026

Srikrishnudu Kuberabhatundagu Shankhachuudundanu Guhyakuni Samharinchuta - శ్రీకృష్ణు౦డు కుబేరభటుండగు శంఖచూడుండను గుహ్యకుని సంహరించుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము - 
శ్రీకృష్ణు౦డు కుబేరభటుండగు శంఖచూడుండను గుహ్యకుని సంహరించుట

మరొక వెన్నెలరాత్రి బలరామకృష్ణులు ప్రకాశవంతమైన, స్వచ్చమైన వస్త్రాలను, హారాలను ధరించారు. చందనం పూసుకొన్నారు. ఆభరణాలు అలంకరించుకొన్నారు. బృందావనానికి వెళ్లి మల్లెలు మొదలైన పూల మకరందాన్ని ఆస్వాదించి మదించిన గండుతుమ్మెదల ఝంకారాలు వింటూ, వెన్నెలలో గోపస్త్రీలు తమచుట్టూ ఉండగా ఇంపుగా గానం చేశారు.

బలరామకృష్ణులు ఆలపించిన ఆ మధురగీతం చెవులు సోకినంతనే తమదేహాలస్పృహ ఏ మాత్రం లేనివారై, ఆ గోపికలు చూడడం, మాట్లాడడం మరిచిపోయి, ఆ బృందావన సీమలో పారవశ్యంలో మునిగిపోయారు.

ఈ విధంగా రామకృష్ణులు సర్వప్రాణులకు సమ్మోహం కలిగించే విధంగా గానంచేస్తూ, మత్తెక్కిన వారిమాదిరి, బృందావనంలో యథేచ్చాసంచారం చేస్తూ ఉన్నారు. ఇలా ఉండగా వారిరక్షణలో ఉన్న గోపకాంతలను శంఖచూడుడు అనే కుబేరభటుడు బలవంతంగా ఉత్తరదిక్కునకు తీసుకొని పోసాగాడు. ఆ గోపస్త్రీలు 'రామా!కృష్ణా! అని పిలుస్తూ పులిబారినపడిన గోవులవలె మొరపెట్టారు. వారి మొర విని

బలశాలురైన అన్నదమ్ములు రామకృష్ణులు ఇద్దరూ వెంటనే మద్దిచెట్లను చేత పట్టుకొని కాలమృత్యువులవలె వేగంగా వెళ్తూ 'ఓ ముగ్ధగోపికలారా! భయపడకండి' అని ధైర్యం చెప్పి ఆ యక్షునితో తలపడ్డారు. ఆ గుహ్యకుడు కలతచెంది గోపికలను వదలి, భీతుడై అతివేగంగా ఉత్తరదిశగా పరుగెత్తాడు.

ఈ విధంగా యక్షుని చేతినుండి విముక్తలైన గోపికలను రక్షిస్తూ ఉండమని బలరామునితో చెప్పి

బకాసురసంహారి అయిన శ్రీకృష్ణుడు “ఓరీ! యక్షుడా! పారిపోవద్దు! పారిపోవద్దు” అని క్రోధంగా పలుకుతూ, యక్షుడు ఏ రూపంలో ఎక్కడ ప్రవేశిస్తున్నాడో, ఎక్కడికి వెళుతున్నాడో తానూ వానితో అక్కడ ప్రవేశించాడు. అక్కడికి వెళ్లి వానిని పట్టుకొన్నాడు. సాటిలేని తన పిడికిటిపోటుతో వానితల తెగి పడేటట్లు పొడిచాడు. శౌర్యంతో ఆ యక్షవీరుని కిరీటంలో ప్రకాశించేరత్నాన్ని గోపికలు చూస్తూ ఉండగా గ్రహించాడు.

ఈ విధంగా శ్రీకృష్ణుడు శంఖచూడుణ్ణి చంపి, వాని శిరోరత్నం తెచ్చి బలరాముని కిచ్చి, అగ్రజుణ్ణి ఆనందింపజేశాడు. తర్వాత ఇంకొకరోజు కృష్ణుడు అడవులలోకి వెళ్లాడు. అప్పుడు అతనిలీలలను ఇండ్లలోనే పాడుకొంటూ విరహతాపానికి తాళలేక గోపికలు తమలో తాము ఇలా అనుకోసాగారు.

మనలను ఏలిన శ్రీకృష్ణుడు ఎడమభుజం పైన చెక్కు ఆనించి, కెమ్మోవిపై మురళిని ఆనించి, మధురస్వరం ఒలికేటట్లు వేణువును వాయిస్తూ తన వేళ్లను వేణురంధ్రాల మీద నేర్పుగా సారించి, చూపుతూ ఉంటే మింట నిలిచి చూస్తున్న అప్పరసలు తమ ప్రాణేశులు తమవద్దనే ఉన్నా పోకముళ్లు ఊడి పోతూ ఉండగా మదనవేదనపొందుతూ ఉంటారు గదా!

ఓ పడతీ! కొత్తరుచి కలిగిన కృష్ణునిమురళీనాదం అనే అమృతధారలు చెవులలో ప్రవేశించి, హృదయాల లోపల చేరగానే దూడలతో కూడా గోవులసమూహాలు తక్కిన జంతువులు అత్యాసక్తితో ఆకాశంవైపు మోరలెత్తి దేహానికి సంబంధించిన ఇంద్రియవ్యాపారాలన్నిటినీ వదలి వేస్తాయి.

ఓ పద్మనయనా! శ్రీకృష్ణుడు తళతళలాడే ముత్యాలహారం ధరించి, గాంధర్వవిద్యలో కుతూహలం అతిశయించగా, మనోజ్ఞంగా మురళిని వాయించినపుడు ఆ మురళీధ్వానం విన్న మేటినెమళ్లసమూహాలు కృష్ణుని మెరుపుతో కూడి శబ్దించే నల్లనిమేఘంగా భావించి పరవశంతో కేకారవాలు చేస్తాయి గదా!

ఓ యువతీ! ఎందుకు తెల్లవారిందే? తూర్పుకొండపైన సూర్యుడు ఎందుకు ఉదయించాడే? పగళ్లన్నిటినీ తెల్లవారని రాత్రులుగా బ్రహ్మదేవుడు ఎందుకు చేయడే? మదనుడుకూడా దయలేని వాడయ్యాడు. చిలుకలు వారింపరానివిగా ఉన్నాయి. ఎలాగే? రాత్రివేళ వస్తుందంటావా? పద్మనేత్రుడితో సుఖపడే అదృష్టం లభిస్తుందా?

ఓ సుందరీ! పొద్దు ఎప్పుడు కుంకుతుంది? ఆవులను మేపుకొని గోవిందుడు ఎప్పుడు గోకులానికి వస్తాడు? ఎప్పుడు నాకు ఆ స్వామి ముఖపద్మదర్శనం అవుతుంది? దగ్గరకు చేరి అతడు నన్ను ఎప్పుడు ఆదరిస్తాడు? నా విరహాగ్నిరాశికి అంతం ఎప్పుడు? చెప్పవమ్మా! మన్మథునిచేతలవల్ల నా హృదయం తల్లడిల్లిపోతూ ఉంది.

ఓ చెలీ! శ్రీకృష్ణుడు నన్ను వదిలిపెట్టి వనానికి వెళ్లినప్పుడు ఆయా క్షణాలు, అంతకంతకూ కొనసాగుతూ జాములై, దినాలై, పక్షాలై, నెలలై, సంవత్సరాలై, మహాయుగాలై, కల్పాలై నామనసులో తోస్తూ ఉన్నాయి.

ఈ విధంగా ఇంకా కృష్ణవియోగశోకంతో పలురీతులుగా పశ్చాత్తాపడుతూ గోపికలు సహనం కోల్పోయి ఎలాగో పగలు గడపి,

ఆ సాయంసంధ్యాసమయంలో “అదిగో! సూర్యుడు పడమటికొండకు చేరాడు. ఇదిగో సాయంకాలం అయింది. అల్లదే! గోధూళి ఒప్పిదంగా రేగుతోంది. బృందావనమార్గంలో ఎద్దులరంకెలు వినిపిస్తున్నాయి. మన ప్రియుడు వచ్చేశాడు. రండి” అని ఒకరినొకరు పిలుచుకొంటూ, సాయంవేళ తొట్రుపాటుగల హృదయాలతో తమ ప్రియుడైన కృష్ణునికి ఎదురేగుతారు.

ఇలా గోపికలు తనకెదురు రాగా, ఆసక్తితో వారిని కృష్ణుడు వారి ఇష్టానుసారంగా ప్రణయ సల్లాపాలతో ఆదరించాడు. ఆ తర్వాత ఒకనాడు

వృషభాసుర సంహారము


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Sarparupiyagu Sudarsanundanu Gandharvuni Shapavimochanamu - సర్పరూపియగు సుదర్శనుండను గంధర్వుని శాపవిమోచనము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము - 
సర్పరూపియగు సుదర్శనుండను గంధర్వుని శాపవిమోచనము

తరువాత ఒకరోజు నందుడుమొదలైన గోపాలకులు పశుపతి జాతరకోసం ఎడ్లబండ్ల నెక్కి అంబికావనానికి వెళ్లారు. అక్కడ వారు సరస్వతీనదిలో స్నానంచేసి, పార్వతీపరమేశ్వరులను పూజించి కానుకలు సమర్పించారు. 

బ్రాహ్మణులకు గోవులు, బంగారం, వస్త్రాలు, అన్నమూ దానం చేశారు. తాము నీరుమాత్రమే ఆహారంగా గ్రహించి, నియమనిష్ఠలతో ఉన్నారు.

అప్పుడు విధివిశాత్తూ ఆకలిగొన్న ఒక మహాసర్పం నిద్రపోతూ ఉండిన నందుణ్ణి కరచి మింగడానికి ప్రయత్నించింది. అతడు 'కృష్ణా! కృష్ణా! నన్ను విడిపించు' అంటూ మొరపెట్టుకున్నాడు. ఆ మొరను గోపాలకులు విని

రాజా! గోపాలకులందరూ మేల్కొన్నారు. కోపంతో ఆ పామును పెద్దపెద్ద దుడ్డుకర్రలతోనూ, కొరవులతోనూ మొత్తారు. అయినా ఆ క్రూరమైన మహాసర్పం నందుణ్ణి వదలకుండా పట్టుకొంది.

ఆ సమయంలో శ్రీకృష్ణుడు విజృంభించి, కాలితో ఆ పామును తన్ని ఒక తొక్కు తొక్కాడు. వెంటనే ఆ పాము తన సర్పరూపం విడిచి, ఒక గంధర్వని రూపం దాల్చింది. శ్రీకృష్ణుడు అతనితో ఇలా అన్నాడు.

ఓ పండితశ్రేష్ఠుడా! అలంకృతమైన రూపంతో, బంగారుహారంతో, శుభలక్షణాలతో విరాజిల్లే నీకు ఈ క్రూరమైన పెనుబామురూపం ఎందుకు వచ్చింది? నీవెవరు? నీ పేరేమి? ఏ కారణంగా ఈ జన్మ కలిగింది? ఒకటొకటే నాకు వివరంగా తెలుపు. నీవు నందుణ్ణి పట్టుకొన్న చర్య వింతగొలుపుతూ ఉంది.

శ్రీకృష్ణుని పలుకులకు అతడిలా అన్నాడు. నేను విద్యాధరుణ్ణి నా పేరు సుదర్శనుడు. నేను సౌందర్యగర్వంతో పుష్పకవిమానంపై దిక్కులు తిరుగుతూ ఉండేవాణ్ణి.

ఒకనాడు అంగిరసుని సంతతివారు, అందం లేనివాళ్లు అయిన ఋషులను చూచి పరిహాసంగా నవ్వాను. వారు 'సౌందర్యదర్పంతో నువ్వు మమ్ములను చూసి నవ్వావు కాబట్టి పెనుబామువై పడిఉండు మని శపించారు. నేను బతిమలాడగా ఇలా అనుగ్రహించారు.

'ఓ మూర్ఖుడా! భక్తుల భయాన్ని పోగొట్టడంకోసం శ్రీహరి యాదవకులంలో జన్మిస్తాడు. అతడు ఒకనాడు ఈ అడవికి వస్తాడు. అతనికాలితన్ను తిని నీవు సర్పరూపం విడిచి, నీ తొలిరూపమైన విద్యాధరరూపం పొందగలవు అని దయానిధులైన ఆ ఋషులు పలికారు.

ఓ పద్మనేత్రా! నిన్ను ధ్యానించినా, నీ మహిమలు విన్నాా నీ నామం కీర్తించినా పాపరాశి మొదలంటా కృశించి నశిస్తుందని అంటారు. నా మీద నీ పాదం మోపితే నాకు ఆ ఋషులశాపంవల్ల సంక్రమించిన వికారాకారం పోకుండా ఉంటుందా? నా సర్పరూపం పూర్తిగా పోయింది. నేను ఇక వెళతాను.

సుదర్శనుడు ఇలా మనవి చేసి, శ్రీకృష్ణునికి ప్రదక్షిణం చేసి, నమస్కరించి దేవలోకానికి తిరిగి వెళ్లిపోయాడు. నందగోపుడు సర్పంనుండి విముక్తి పొందాడు. ఈ సంగతి విన్న గోపకులు ఆశ్చర్యపోయారు. పశుపతిజాతరను గోపాలకులు సంపూర్తిగా నిర్వహించి తిరిగి తమ గోకులానికి మరలిపోయారు.

శ్రీకృష్ణు౦డు కుబేరభటుండగు శంఖచూడుండను గుహ్యకుని సంహరించుట


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Jalakridaabhivarnanamu - జలక్రీడాభివర్ణనము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము - జలక్రీడాభివర్ణనము

ఇలా నందనందనుడు రాసక్రీడ చాలించి వడగండ్లతో ఒప్పేమెరుపుతీగవలె చెమటబిందువులతో కూడిన ఆ గోప యువతులతో కూడి జలక్రీడలాడాలనే ఉత్సాహంతో యమునాజలాలలో ప్రవేశించాడు.

అతనికన్నా ముందే గోపికలు కాళిందిలో ప్రవేశించి ఇక్కడ అడుగులోతు, ఇక్కడ మోకాలులోతు, ఇక్కడ నడుంలోతు, ఇక్కడ రొమ్ములలోతు అంటూ ఆ నదినీటిలోనికి దిగారు.

ఆ రమణుల స్తనాలు చక్రవాకాలతోను, కండ్లు చేపలతోను, బొడ్డు సుడులతోను, తలవెండ్రుకలు నాచుతోను పోలి ఉండడంవల్ల వారుకూడా తనవంటివారే అని భావించి కౌగిలించుకోడానికి యమునానది చేతులు చాచినట్లుగా, అలలు ఎదురుగా వచ్చి వారిని స్పృశించాయి.

వారు ఉలికిపడ్డారు. నదిలోని బెగ్గురుపక్షులను పట్టాలని చూశారు. హంసలను తోలారు. అందాలుచిందే ఆ సుదతుల కుచాలకు సాటిరాగలం అని నీటిలో తపం చేస్తున్నాయా అన్నట్లు అక్కడ సంచరించే జక్కవపక్షులను వారు తరిమేశారు. 

ఆ యువతుల చేతుల్లో చలిస్తూ ఉన్న జలాలలో ప్రతిఫలించిన చంద్రుడు అధికమైన ప్రకాశానికి ఉనికిపట్టులుగానున్న వారి వదనాలకు ఓడిపోయి సిగ్గుతో వెలవెలబోతూ, పట్టుదల విడిచి నీటిలో పడి వణకుతున్నాడా అన్నట్లున్నాడు. అలాంటి చంద్రున్నీ చూచి మెచ్చుకుంటూ గోపికలు పరవశించారు.

మకరందం తాగి మదించినతుమ్మెదల రెక్కలగాలికి రేగుతున్న కలువలు మొదలైన పూలయొక్క పుప్పొడి వారు నీటమునిగినపుడు పైకి చెదిరిన నీటి తుంపరలవల్ల అణిగి పోయింది. 

తమవదనపద్మ సౌరభానికి మూగి జుంజుమ్మనే తుమ్మెదలను చూచి వారు భీతి చెందారు. అవి పైకెగిరి పోయేటట్లు అరచేతులతో నీళ్లను చరిచారు. నీలిమేఘాలనుండి రాలిన నీటిధారలవలన తడిసిపోయే అందమైన పూలతీగలవలె ఆ గోపయువతులు శ్రీకృష్ణుడు దోసిటితో చల్లే నీటితుంపరలవల్ల సంపూర్ణంగా తడిసిపోయారు.

గుంపుగుంపుగా చేరి తొక్కిసలాడారు. మాలిన్యం పోయిన మన్మథుని పుష్పబాణాల్లాగా తళతళ మెరుస్తూ ఉన్న దేహాలతో గోపికాస్త్రీలు నీట మునగడానికి ఉత్సహించారు. వారు సరససల్లాపాలతో తుళ్లింతలాడుతూ, చేతుల నిండా నీరు ముంచుకొని తొట్రుపడుతూ గోవిందుని మీద చల్లారు. 

ఒకరికంటె ఒకరు ముందడుగువెేసి శ్రీకృష్ణుడు తమని దాటి పోకుండా అడ్డపడి వినోదించారు. ఆడఏనుగులు తొండాలతో చిమ్మిన నీటి తుంపరలతో తడిసిన మదపుటేనుగువలె శ్రీకృష్ణుడు గోపసుందరులు పైకి చిమ్మిన జలధారలతో తడిసి ముద్దయ్యాడు.

రేపల్లె యువతులు తమ చేతులతో హరిమీదికి ఎర్రకలువలను, తెల్లకలువలను విరజిమ్మారు. ఆ పూలపుప్పాడి ఆయన శరీరానికి అంటుకొని విభూతి ధరించిన పరమశివునివలె భాసించాడు.

ఆ సుందరులు చిగుళ్లవంటి తమ హస్తాలతో తామరపూలరేకులను తమప్రాణనాథుని మీదికి వెదజల్లారు. అప్పుడు కృష్ణుడు వేయికన్నుల దేవేంద్రుడుగా ప్రకాశించాడు.

ఆ రమణులు కుంకుమ అలదిన కుంభాలవంటి స్తనాలతో కృష్ణుణ్ణి కాగిలించుకోగా, అతడు బాలభాస్కరునివలె ప్రకాశించాడు. ఆ కాంతలు తమ కడగంటిచూపులను నాథునిమీద ప్రసరింపజేయగా, అతడు తుమ్మెదగుంపులు ముసిరిన పచ్చగంధపుచెట్టువలె విరాజిల్లాడు. 

ఆ పూబోండ్లు తమ చిరునవ్వులసిరులను తమ ప్రియునిపై పడేటట్లుచేయగా కృష్ణుడు వెన్నెలవెలుగులతో విలసిల్లే అంజనాద్రివలె విలసిల్లాడు తరువాత

అప్పుడు శ్రీకృష్ణుడు సుఖోన్నతుడైై, గోపయువతులతో పాటు యమునానదినీటినుండి వెలికివచ్చాడు. ఆభరణాలు ధరించి, మంచి గంధం అలదుకొని, పీతాంబరాలు ధరించి అలంకరించుకొన్నాడు. గజరాజు ఆడఏనుగులతో క్రీడించిన విధంగా పొదరిండ్లలో, చిక్కనిచెట్ల నీడలలో, పూలశయ్యలమీద వారితో క్రీడించి సంతోషపెట్టాడు.

ఈ విధంగా గోవిందుడు శరత్కాలంలో గోపికలతో వీర్యస్ఖలనం చేయకుండా రమించాడు అని చెప్పగా విని, శుకయోగీంద్రునితో పరీక్షిన్మహారాజు ఇలా అన్నాడు.

మహాత్మా పరమేశ్వరుడు ధర్మానికి కర్త. ధర్మానికి భర్త. ధర్మమే స్వరూపంగా కలవాడు. మంచిషనులు చేసేవాడు. ఆయన అధర్మాన్ని శిక్షించడానికి, ధర్మాన్ని రక్షించడానికి భూమండలంలో జన్మించినవాడు గదా! అలాంటప్పుడు, ఆ భగవంతుడే ఎలాంటి ధర్మమని పరసతులను కూడాడో దయచేసి నాకు చెప్పండి.

ఇలా పరీక్షిన్మహారాజు అడుగగా, శుకమహర్షి ఇలా అన్నాడు.

సర్వభక్షకుడైన అగ్నిదేవుడు విశ్వంలోని సమస్తవస్తువులను భక్షించికూడా దోషి కాడు. అలాగే తేజోవంతులైన చంద్రఇంద్రాదులు దోషంచేసి కూడా దోషస్థానాన్ని పొందరు.

(సర్వప్రాణులను హింసించి కాల్చి చంపడం అగ్నిచేసే పాపం. ఇది తినదగింది ఇది తినదగనిది అని కూడా చూడకుండా అన్నీ భక్షించడం దోషం.

గురుపత్నీగమనం చంద్రునిదోషం. చంద్రుడు తనగురువైన బృహస్పతి భార్యతో సంగమించి ఆ పాపం చేశాడు. పరపత్నీగమనం దేవేంద్రుని దోషం. అహల్యను కామించి ఆమెభర్తరూపంలో వచ్చి అనుభవించిన దోషం అతనిది.)

నరేంద్రా! ఈశ్వరుడు కానివాడు పరకాంతను తలచి ఎలా జీవించగలడు? గౌరీశ్వరుడు తప్ప ఇతరుడు లోకభయంకరమైన విషం తాగి జీవించగలడా?

(సర్వాత్మకుడైన దేవునికి ఏదిచేసినా చెల్లుతుంది. ఇతరులకు అది చెల్లదు. ఈశ్వరుడు శాస్త్రవశ్యుడుకాడు. శాస్త్రోక్త ధర్మాలను ఉల్లంఘించినా వారికి అది దోషం కాదు. శాస్త్రవశ్యుడు, కర్మవశ్యుడు అయిన సామాన్య మానవుడు దోషంచేస్తే అనుభవించవలసిందే!)

ఈశ్వరుల మాటలు ఒకటే సత్యం. అదే ప్రమాణం. వారు చెప్పిన మార్గాన్నే పెద్దలు నిత్యం అనుసరిస్తారు. ఒకొక్కప్పుడు ఈశ్వరుల నడవడి వారిమాటలకు విరుద్ధంగా ఉంటుంది. ఒకప్పుడు సత్యంగాను, మరొకసారి అసత్యంగాను ఉంటుంది. వారి నడవడి అంతా సత్యమని భావించి అనుసరించరాదు.

నరేంద్రా! మునులు ఏ దేవునియొక్క పాదపద్మాల పుప్పొడిని, ధ్యానించడంవల్ల పొందిన యోగనిరూఢత్వంచేత అధికులై యజ్ఞాదిమహాకర్మలు చేయకుండా, సంసారబంధాలు వదిలించుకొని అతిశయిస్తూ ఉంటారో- అలాంటి నిత్యశుభస్వరూపుడైన భగవంతుడు ఎలా నడచుకొంటే నేం? ఏమి చేసినా అతనికి ఎలాంటి బంధాలు ఉండవు.

గోపాలకులలో, గోపికలలో, సర్వప్రాణులలో అంతర్యామియై సంచరించే సర్వమయుడైన పరమాత్మకు పరాంగనలు ఎవరు? అన్నీ తానే కాబట్టి అలా క్రీడించాడు.

అని చెప్పి శుకమునీంద్రుడు మళ్లీ పరీక్షిన్మహారాజుతో ఇలా అన్నాడు. వెళ్లడం ఇష్టంలేకున్నా తెల్లవారు జామున గోపికలు తమ ఇండ్లకు వెళ్లారు. కృష్ణమాయామోహితులైన గోపాలురు గోపికలపై కోపం చూపలేకపోయారు.

(బ్రాహ్మీముహూర్తము= అరుణోదయానికి ముందు నలబై ఎన్నిది నిముషాలకాలం. (రెండు గడియలకాలం))

గోపాలకృష్ణుడూ, గోపకాంతలూ సలిపిన రాస క్రీడను ఏ నరుడు వర్ణిస్తాడో, ఏ నరుడు దర్శించి నిశ్చయించుకొంటాడో అతడు ఆ ప్రసంగంవల్ల సమస్త హృదయతాపాలనుండి విముక్తుడౌతాడు.

సర్పరూపియగు సుదర్శనుండను గంధర్వుని శాపవిమోచనము


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Rasa Cridaabhivarnanamu - రాస క్రీడాభివర్ణనము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము - రాస క్రీడాభివర్ణనము

ఆ శరత్సమయంలో లోకేశ్వరుడు, అనంతుడు అయిన శ్రీకృష్ణుడు చిత్రాకారుడై గోపకాంతలతో రాసక్రీడ సలపడానికి ప్రారంభించాడు. గోపరమణులు కృష్ణుని చుట్టూ వలయాకారంగా ఏర్పడి, ఒకరిచేతులు మరొకరు సవిలాసంగా పట్టుకొని తిరిగారు. 

ఎన్నోవిధాలుగా స్ఫురించే ముఖవిన్యాసాలతోను, కరవిన్యాసాలతోను, పాదవిన్యాసాలతోను ఆ రాసక్రీడ పరిఢవిల్లింది. గోపికా గోవిందుల రాసక్రీడను దర్శిస్తూ ఉన్న దేవతలకండ్లకు, మనస్సులకు వికాసం కల్గించి ఆనందం నింపింది.

ఈ విధంగా పలువిధగతులలో, తిరగడంలో నేర్పరి అయిన శ్రీకృష్ణుడు విజ్బంభించి రాసక్రీడకు ఉపక్రమించాడు. 

మచ్చలేని చంద్రబింబంవంటి ఇద్దరు ముగ్ధలు అలంకరించుకొని వీణలు చేతబట్టారు. వారిద్దరూ వీణను వాయించడంలో మిక్కిలి ప్రావీణ్యం కలవారు. మనోజ్ఞంగా, ఇంపుగా వీణ వాయిస్తూ ఆనందప్రవాహాన్ని వెల్లిగొలిపే గీతం గానం చేశారు. 

శ్రీకృష్ణుడు నిరంతర నిశ్చలమైన వేడుకతో సమ్మోహనమైన మురళిని సవిలాసంగా చేతబూనాడు. దాన్ని తన మధురమైన కెమ్మోవికి గదియించాదు. గోపభామలు తమ కొప్పులలో చెరువుకొన్న కలువపూల కమ్మని సువాసనను వీడని తన చిగుళ్లవంటి చేతివేళ్లను లయబద్ధంగా ఆ మురళీరంధ్రాల మీద సారిస్తూ వేణువు ఊదాడు. 

తామర రేకుల మధ్యన ఉండే దుద్దువలె గోపాంగనల మధ్యలో కృష్ణుడు మువ్వంపులతో మురిపెం ఒలికిస్తూ నిలుచున్నాడు.

ఎందరు గోపసుందరులో అందరికీ తాను ఒక్కడే అందరయ్యాడు. గోపికపక్క తానూ, తన పక్కన గోపిక ఉండే విధంగా నిలిచి రాసమండలం కల్పించాడు.

అది నృత్యవిద్యాసముద్రానికి చుట్టూ ఏర్పడిన చెలియలికట్టవలె సాంపు నింపింది. ఆ రాసమండలం సహస్రనేత్రుడైన దేవేంద్రుడికి సైతం ఆశ్చర్యం గొలిపింది. దేవతలు ఆనందంతో ఆకాశవీథినుండి పూలజల్లులు కురిపించారు. ఆ పూలగుత్తులలో తిరుగాడే తుమ్మెదల రంగును హేళనచేస్తూ పలువురు కృష్ణులు విరాజిల్లారు.

బంగారుమణులమధ్యలో ఉన్న ఇంద్రనీలమణులవలె విలసిల్లారు. ఆడఏనుగులతో విహరించడంలో అత్యాసక్తి వహించిన మగ ఏనుగుల అందాన్ని వారు చిందించారు.

చిగురించి పూచినతీగలతో ఆవరించబడిన కానుగచెట్ల అందచందాలను ఆ గోపాలమూర్తులు అంది పుచ్చుకున్నారు. మెరుపుతీగలతో కూడిన కరిమబ్బులవలె మెరిశారు.

జలజలా ప్రవహించే సెలయేళ్లతోనిండిన రోహణగిరి శిఖరాల పోలికతో వారు విరాజిల్లారు.

లోకాలను మోహింపజేసే కృష్ణుడు కెందామరలవలె ఎర్రనైనవీ, చంద్రరేఖలవలె గోళ్లు కలిగినవీ, వేదరమణులకు ఆభరణాలైనవీ- అయిన తన పాదాలను ఒకదానితో ఒకటి చేర్చాడు. అతడు సమంగా నిలిచి దోసిటితో పూలు విరజిమ్మాడు. 

ఎంతో సుందరాలై, పద్మాలవలె ప్రశస్తాలైన తన రెండుచేతులనూ తనకు ఈ వైపునా ఆ వైపునా ఉన్న గోపికల మెడలపై చేర్చాడు. పాటకు అనుగుణంగా, ఆశ్చర్యకరంగా అడుగులు వేశాడు- వలయాకారంలో ఉన్న రాసబంధాలతో అతడు నాట్యం చేశాడు.

శ్రీకృష్ణుడు ఆగోపసుందరులతో కలిసి శంఖం, పద్మం, వజ్రం, కందుకం, చతుర్ముఖం, చక్రవాళం, చతుర్భద్రం, సౌభద్రం, నాగం, నంద్యావర్తం, కుండలీకరణం, ఖురరీబంధం మొదలైన విశిష్ట రాసబంధాలతో నర్తించాడు.

ఆ రాసక్రీడలో వారు ఏకపాదం, సమపాదం, నివర్తితం, వినివర్తతం, గతాగతం, వలితం, వైశాఖం, మండలం, త్రిభంగి మొదలైన భంగిమలతో నిలిచారు. వారి పాదాలలోని బంగారుగజ్జెల చప్పుడు, మనోజ్ఞాలైన అందెలరవళులు జగత్తులోని జనులకందరికీ వీనుల విందులు చేశాయి. 

ఆ రాసక్రీడలోవారు ఘటితం, మర్దితం, పార్శ్వగం మొదలైన పాదవిన్యాసాలు ప్రదర్శించారు. సమపాద, శకట, వదన, మతల్లీశుక్తి మొదలైన పార్ధివచారి విశేషాలను, అపక్రాంతం, డోలాపాదం, సూచి మొదలైన గగనచారి విన్యాసాలను ప్రకటించారు. 

కల్పవృక్షం కొమ్మలవలె మనోహరాలైనవీ, దిగ్గజాల తొండాలను పరిహసించేవీ. మూడులోకాలకు శుభకరాలైనవీ అయిన వారి హస్తాలలోని రత్నకంకణకాంతులు గగనవీథి నలుమూలలా వ్యాపించాయి.

ఇంకా, ఆ రాసక్రీడలోవారు అర్ధచంద్రం, కర్తరీముఖం, కపిత్ధం, కటకాముఖం, శుకతుండం, లాంగూలం, పద్మకోశం, పతాక మొదలైన హస్తాభినయాలను తమతమ మనోభావాలు ప్రతిబింబించే విధంగా ప్రదర్శించారు.

వారు తమ నడుములమీద ధరించిన బంగారురంగు పట్టు వస్త్రాల అంచులకాంతులు దిక్కులనే ముదితల ముఖాలకు పసుపు పూతలనే ముద్రలు వేశాయి, ఆస్కందితం, భ్రమరం, శకటాసనం మొదలైన జానుమండల భేదాలను; అలాతం, దండలాతం, లలితం, విచిత్రం మొదలైన దేవతల మండలాకారనృత్యాలను వారు ప్రదర్శించారు.

మనోహరాలైన శంఖాలవంటి మెడలకు అందాన్ని సమకూర్చేవీ, మిక్కిలి కాంతిపుంజం కలిగినవీ, ఇంద్రనీలాలు, వజ్రాలు, వైడూర్యాలలో కూర్చబడినవీ అయిన హారాలశోభలు లక్ష్మీ నివాస స్థానాలుగానున్న తమ వెడద వక్షస్థలాలపై సంచలించి, చిక్కుపడగా-వారు అంగాంతరం, బాహ్యలగ్నం, ఛత్రం మొదలైన భ్రమణ విధాలతో విరాజిల్లారు. 

తమ కాంతిచేత చంద్రమండలాన్ని జయించిన కుండలాల కాంతులు అద్దాలవలె నును పైన వారిచెక్కిళ్లపై తొణికిసలాడాయి.

ఆ రాసక్రీడలలో వారు కటిభ్రాంతం, దండరచితం, లలాటం, తిలకం, మయూరం, లలితం, చక్రమండలం, నికుంచితం, గంగావతరణం మొదలైన కరణాలను ఆచరించారు. 

తెల్లతామరలశోభతో ఒప్పారే వారిచూపులు దరిద్రులదైన్యాన్ని పారదోలుతూ ముగ్ధల కన్నులనే మీనాలకు వలలై ఆవరించగా లలితం, కుంచితం, వికాసం, ముకుళం మొదలైన చూడ్కులతో విలసిల్లారు. బహుపూర్ణ చంద్రబింబాల అందానికి గృహాలుగా అందగించిన తమ ముఖాలలో నిర్మలమైన అనురాగాన్ని వారు ప్రస్ఫుటీకరించారు.

ఒప్పిదమైన నెమలిఫించపుకాంతులు అకాలంలో కనిపించిన హరివిల్లుల అందాన్ని వెలువరించగా వారు నికుంచితం, ఆకుంచితం, కంపితం, ఆకంపితం, పరివాహితం, పరావృత్తం అనే శిరోభావాలను ప్రదర్శించారు. 

కస్తూరితిలకాలు దిద్దిన పలకలవంటి నుదుళ్లపై ముంగురులు ముసురుకొంటూ ఉండగా వారు అపరాజితం, సూచికావిద్ధం, పరిచ్చిన్నం, విష్కంభం, రేచితం మొదలైన అంగవిన్యాసాలు ప్రదర్శించారు.

అందుకు తగినట్లు అడుగులు, నడుములు, చేతులు, మెడలు ఆడించారు. అలా ఆరాసక్రీడ వీక్షకుల మనస్సులకు ఉత్తేజాన్ని కలిగించింది. అది దీప్తిగల ద్రవంతోడి క్షీరసాగరంవలె శృంగారరసంతో పొంగారింది. 

అనురాగభరితమైన రామరాజ్యంవలె శ్రీరాగం మొదలైన రాగాలతో నిండిపోయింది. కలువలకు ఆనందం సమకూర్చే నిండుచంద్రునివలె భూమండలానికి సంతోషాన్ని కలిగించింది.

భ్రమరం మొదలైన హస్తాభినయాలతో తుమ్మెదలగుంపుతో నందనవనంవలె విలసిల్లింది. అభ్యుదయంతో కూడిన అభిమానధనుని మనస్సువలె ఉత్తరోత్తరాభివృద్ధితో విరాజిల్లింది. 

బహువిధాలుగా ప్రబంధాలు కూర్చే నేర్పరి అయిన కవి విలాసంవలె ప్రకృష్టాలైన నాట్యబంధాలతో విలసిల్లింది. వసువులతో, దేవతలతో నందనవనంతో అలరారే దేవలోకంవలె వసుదేవనందనునితో పూజనీయమైంది.

సదాచారవంతుని నడవడివలె భూమండలానికి, ఆకాశమండలానికి భూషణమైంది. శరీరంపైన హారందాల్చిన సుందరివలె అవయవాలచలనంతో మనోహరమైంది.

గౌరీనిలయమైన హిమవంతంవలె నానావిధానాలుగల సంభారాలతో శోభిల్లింది. గుణవంతుడైన కుమారునివల్ల కులంప్రకాశించినట్లు వేణువిలాసంతో ఆ రాసక్రీడ భాసించింది.

గోపరమణులు నడుములు జవజవలాడగా, చిరునవ్వులు వ్యాపించగా, హారాలు మెలిపడగా, మొలనూళ్లు సడలగా చూపుల నిగ్గులు పాలయగా, చెమటలు కమ్మగా, ముంగురులు చెదరగా, చెవికమ్మలు ప్రకాశించగా, నీలిమబ్బుల నడుమ మెరుపుతీగెల కాంతితో దీపిస్తూ కృష్ణునితో కూడి ఉల్లాసంగా ఆడుతూ, పాడారు.

మచ్చలేని చంద్రునివంటి ముఖాలు గల ఆ గోపికలు కమలనేత్రుడైన కృష్ణునితో కూడి మనోహరంగా నాట్యం సలిపేవేళ- వారి నడుముల చిరుగంటలు, కాలిఅందెలు, కరకంకణాలు గల్లు గల్లుమని శబ్దంచేస్తూ వీనులవిందు చేశాయి.

పరీక్షిన్మహారాజా! లేడికన్నులవంటి కన్నులున్న ఆ గోపయువతులతో శ్రీకృష్ణుడు నిర్వహించిన ఆ రాసక్రీడను ఆకాశవీధిలో దేవతాశ్రేష్ఠులు వారిభార్యలతో కలసి బారులుదీరి విమానాలెక్కి దర్శించారు.

ఓ పరీక్షిన్మహారాజా! అప్పుడు పువ్వులవానలు కురిశాయి. భేరులుమోగాయి. ఆకాశంలో తమ భార్యలు తమ సరసనుండగా గంధర్వపతులు శ్రీకృష్ణుని స్తుతిస్తూ గానం చేశారు.

(సంగీతానికి గంధర్వులు ప్రసిద్ధి. సంగీతానికి “గాంధర్వం” అనే పేరు అందుకే వచ్చింది. వారు కృష్ణుని గుణగణాలను గానం చేయడం ఎంతైనా సమంజసంగా ఉంది.)

రాజేంద్రా! శ్రీకృష్ణుడు గోపభామినులతో రాసక్రీడ సలుపగా చూచి, స్వామిపై మోహంచెంది, ఖేచరస్త్రీలు పారవశ్యంతో తమ ప్రాణేశ్వరులమీద మూర్చిల్లి వాలిపోయారు

చంద్రునితో సామ్యం వహించిన ముఖాలు గలిగిన ఆ గొల్లభామలు, చంద్రవంశంలో జన్మించిన శ్రీకృష్ణునితో చేరి నటించగా, చుక్కలతోకూడి చంద్రుడు ఆ నాట్యాన్ని వీక్షిస్తూ ఉండడంచేత రాత్రి ఆలస్యంగా గడిచింది.

యమునానది నీటితుంపరలను చిలికిస్తూ, తామరపూల సురభిళాల్ని విరజిమ్ముతూ, సుందరీమణుల చెమటల్ని తగ్గిస్తూ రాసక్రీడవలన మదవతులకు కలిగిన శ్రమను పోగొడుతూ, రమణీమణుల మనసుల్లో కొత్తదైన, మేలైందైన సుఖం అనే సంపదను కలిగించేదై, పద్మనేత్రుడైన శ్రీకృష్ణుడు ఆనందించేట్లుగా, మంగళకరంగా మలయమారుతం వీచింది.

అపుడు ఒక గోపికారమణి శ్రీకృష్ణుడు పాడుతుండగా, వీణను చేతబట్టి సవిలాసంగా తీగెలుమీటింది. అతడు ఔను ఔను అని మెచ్చుకోగా, ఎండినచెట్లు చిగురించగా, నిలుకడగా ఒక స్వరస్థాయినందుకొని ఒకరాగాన్ని రమ్యంగా ఆలపించింది.

ఆ గోపరమణులలో ఒక రమణి కాలిఅందెలు గల్లుగల్లుమని మనోహరంగా ధ్వనిస్తూ ఉండగా ఆడుతూ పాడుతూ, పిరుదుల బరువుచేత అలసట గలిగిందై, శ్రీకృష్ణుని హస్తాన్ని తన కుచద్వయం సమీపానికి లాగింది.

ఓ రాజా! మంచిగంధంపూతతో, పద్మపరిమళంతో ఒప్పారుతూ ఉన్న తన బలమైన భుజాన్ని శ్రీకృష్ణుడు ఒక గోప రమణి భుజంమీద ఉంచగా, ఆమె చలించి పులకరించింది.

ఒక తరుణి కృష్ణునిచెక్కిలితో తన చెక్కిలి చేర్చగా అతడు తన పుక్కిటిలోని తాంబూలాన్ని ఆమె నోట ఉంచాడు. ఒక సుందరి ఆడుతూ అలసిపోగా, ప్రాణేశుడు స్తంభంవంటి ఉన్నతమైన తన బాహువును ఆమెకు ఆధారంగా చేశాడు. 

ఒక చక్కనిచుక్క చెమట కమ్మి తన దగ్గరికి చేరగా ఆమె చనుదోయిపై కమ్మిన చెమట బిందువులను ప్రియుడైన కృష్ణుడు కొనగోట చిమ్మాడు. ఒక బాలిక నుదుటి తిలకానికి అంటుకున్న ముంగురులను నాథుడైన కృష్ణుడు పక్కకు తీసి, కురులు దువ్వాడు. 

ఒక పడతి పాటపాడి అలసిపోగా ప్రాణేశుడైన కృష్ణుడు తన అధరామృతాన్ని ఇచ్చి సమాదరించాడు. ఒక చెలువకు హారం మూపున చిక్కుపడగా, ఆ హారాన్ని చక్కదిద్ది సుందరుడైన కృష్ణుడు దగ్గరకు లాక్కొని కౌగిలించుకున్నాడు.

రాజేంద్రా! గోవిందుడు రాసక్రీడలో అలసిన గోపరమణులను తన చిరునవ్వులతో, హస్తవిన్యాసాలతో, చూపులతో, రాగాలాపనలతో దయతో ఆదరించాడు.

ఆ గోపసుందరులు గోవిందుని తనూసంగమసుఖంతో మిక్కిలి పరవశలై తమ పైటలు, ధరించిన వస్త్రాలు జారిపోవడం కూడా గమనించలేక పోవడం ఆశ్చర్యం కాదు. దేవతాస్త్రీలు ఆకాశంనుండి ఆ రాసక్రీడావిలాసమంతా వీక్షించి కరిగి సమ్మోహితలయ్యారు.

ఈ విధంగా పరమాత్మ అయిన శ్రీకృష్ణుడు తాను ఆత్మారాముడైనా గోపసుందరులు ఎందరుంటే అందరికీ అంతమంది కృష్ణులై తన ప్రతిబింబాలతో ఆడుకునే పిల్లవాడువలె, రాసక్రీడ సాగించాడు.

గోపికలు నందనందనుడైన కృష్ణుడు తమతో కలసిమెలసి నవ్వుతూ, చూస్తూ, సల్లాపాలు సలుపుతూ మెలిగాడని కృష్ణుని మీది గౌరవంతో, తమపూర్వజన్మపుణ్యాలను మెచ్చుకున్నారు.

జలక్రీడాభివర్ణనము

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Gopikaa Gitalu - గోపికా గీతలు

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము - గోపికాగీతలు

ఓ నాధా! నీవు జన్మించిన కారణంగానే మా గోకులం సిరిసంపదలు అధికమై అలరారుతున్నది. నీవారైన గోపికలు నీ మీదనే ప్రాణాలుంచుకొని వెదకుతున్నారు, నీ రూపం చూపించు. 

అందగాడవైన ఓ కృష్ణా! శరత్కాల కమలాల గర్భంలోని జిగిని దొంగిలించే నీ చూపువల్ల నిన్ను వలచి జీతభత్యాలు లేని దాసులమయ్యాము. అలాంటి మమ్మల్ని ధీరుడవై నొప్పించడం నిజంగా చంపడమే కాదా?

ఓ స్వామీ! మమ్ములను కాళీయుని విషం కలిసిన యమునానదిలోని విషజలం నుండి కాపాడావు. సర్పరూపుడైన అఘాసురుని బారినుండి తప్పించావు. ఇంద్రుడు కురిపించిన రాళ్లవాననుండి రక్షించావు. అడవిలో చెలరేగిన కార్చిచ్చునుండి కాపాడావు. 

ఇలా మరిన్నొ ఆపదలనుండి తప్పించావు. మరి ఇప్పుడు ఇలా కుసుమబాణుడైన మన్మథునికి మమ్ములను అప్పగించి చంపడం నీకు భావ్యమా?

కమలనేత్రా! నీవు యశోదకొడుకువే కాదయ్యా! సర్వదేహధారుల బుద్ధికి సాక్షీభూతుడవైన అంతరాత్ముడవు, పరమేశ్వరుడవు. పూర్వం బ్రహ్మదేవుడు నిన్ను స్మరించి, లోకరక్షణ చేయుమని సన్నుతించగా, ఉత్తమమైన యదుకులంలో భూమండలాన్ని రక్షించడానికి నీవు జన్మించావు కదా!

స్వామీ! నీపాదసేవకులకు సంసారభయాన్ని తొలగించేదీ, లక్ష్మీదేవిహస్తాన్ని చేయూతగా కలిగిందీ, అభీష్టాలను తీర్చేదీ ఐన నీ కరకమలాన్ని మా శిరస్సులమీద ఉంచి బదికించు.

లక్ష్మీవల్లభా! నీ పాదపద్మం గోవులవెంట సంచరించేది. పూజించేవారి పాపసమూహాలను పోగొట్టెది. దుష్టసర్పమైన కాళియుని పడగలమీద నర్తించేది. అలాంటి నీ పాదపద్మాన్ని మా గుండెలపై మోపి, మాకు మన్మథుని పూలబాణాలవల్ల సంభవించిన బాధను పోగొట్టు. మమ్మల్ని స్వీకరించు.

స్వామీ! నీ పలుకు పండితులకు ఇంపు నింపుతుంది. స్పష్టంగా ఉచ్చరించబడుతుంది. తీయనైంది. అలాంటి నీ పలుకు మమ్మల్ని మరులు కొల్పింది. నీ అధరామృతం ఆస్వాదించేటట్లు చేసి మా మన్మథబాధను పోగొట్టవా?

పద్మనేత్రా! నీవు నీ భక్తుల భయాన్ని పోగొట్టేవాడవు. అలాంటి నీకు ఈ క్రూరత్వం తగునా? తగదుగాక తగదు. నీదాసులయిన మాకు మీ నగుమోము చూపి రక్షించు.

లక్ష్మీమనోహరా! నీ కథామృతం గొప్ప సిరితో కూడింది; వినడానికి శుభకరమైంది. కామం మొదలైన అరిషడ్వర్గాన్ని విధ్వంసం చేసేది. సనకాదిమునులచే స్తుతించబడేది. నిరంతరతపస్సుచేత తపిస్తూ ఉండే పురుషపుంగవులకు జీవనం కలిగించేది. అలాంటి నీ కథామృతం గొప్పగొప్పదానాలు చేసి, సుప్రసిద్దులైన వారికే అందుతుంది కానీ ఇతరులకు అందదు.

కృష్ణా! నీ నవ్వులు, నీ చూపులు, నీ నానావిహారాలు, నీ ధ్యానాలు, నీ పరిహాసవచనాలు మా మనసుల్లో నాటుకొనిపోయాయి. అవి ఈనాటికికూడా మరలి పోవడం లేదు.

పద్మనేత్రా! మందపట్టు వదిలి గోవులను మేపడానికి నీవు వెళ్లినప్పుడు పద్మాల్లాంటి నీపాదాలు గడ్డిమొక్కలూ, రాళ్లు తాకి ఎంత నొస్తాయో అని మా మనస్సులు కలత చెందుతూ ఉంటాయి.

ధీరజనోత్తమా! సాయంకాలం అయ్యేటప్పటికి నీవు బృందావనంమధ్యనుండి వచ్చి, గోవుల గిట్టలవల్ల రేగిన ధూలళిచే కప్పబడి, బూడిదరంగుతో ఒప్పే శిరోజాలు కలిగిన నీ ముఖం పద్మంలా ఒప్పారుతూ ఉంటుంది. అలాంటి ముఖం మాకు వేడ్కతో చూపి, క్రమక్రమంగా మా మనస్సులలో మన్మథుణ్ణి పొడసూపేటట్లు చేస్తావు.

రమణా! నీ పాదద్వయం భక్తులకోర్కెలను తీర్చేది. బ్రహ్మదేవునిచే పూజింపబడేది, భూమికి అలంకారమైంది. దుఃఖాన్ని పోగొట్టెది. శుభప్రదమైంది. అలాంటి నీ పాదద్వయాన్ని మా వక్షోజాలపై ఉంచకూడదా!

కృష్ణా! నీ అధరామృతం సంభోగప్రీతిని పెంపొందిస్తుంది. శోకాన్ని పోగొడుతుంది. మోగే మురళిని ముద్దులు గొంటుంది. ఇతరాలైన అనురాగాలను అతిశయింపజేస్తుంది. అలాంటి నీ అధరామృతంతో మా బాధను పోగొట్టు.

ఓ రమాపతీ! నీవు పగటివేళ బృందావనారణ్యంలో సంచరిస్తూ ఉండడంవల్ల ఉంగరాలు తిరిగిన ముంగురులచేత అందగించిన నీ నెమ్మోము తనివితీరా దర్శించలేకపోతున్నాం. అందువల్ల, మాకు క్షణాలు యుగాలుగా గడుస్తున్నాయి.

పోనీ, రాత్రి సమయాలలోనైనా నిన్ను నిరంతరాయంగా కన్నులనిండా దర్శిద్దామనుకుంటే క్రూరుడైన బ్రహ్మదేవుడు మాకండ్లకు రెప్పలు అడ్డంగా సృష్టించాడు గదా! ఇదెందుకో?

మనోవల్లభా! అయ్యో! మా బంధువులు, భర్తలు, అన్నలు, తమ్ములు, కొడుకులు మొదలైనవారు రాత్రిపూట ఇల్లువదలి వెళ్లవద్దని మమ్మల్ని అడ్డగిస్తున్నా వినకుండా నీ మెత్తని మధురగీతంయొక్క సవ్వడి మా చెవులలో పడి వెక్కసం కాగా, మోహంపొందిన వాళ్లమై వడివడిగా వచ్చాం. నీవు ఎక్కడ పోయావో! తెలియదు. ఇలాంటి నిర్దయుడు ఎక్కడైనా ఉంటాడా?

కృష్ణా! నీవు పలికే నర్మగర్భవచనాలు, నవరసాలొలికించే చూపులతో నిండిన నవ్వుమొగం, శ్రీదేవికి నివాసమైన విశాల వక్షస్థలం, మా మనసులను వశంచేసుకొని మమ్ము మురిపించాయి.

ఓ కృష్ణా! తామరలకంటే కోమలాలై అందాలుచిందే నీ పాదాలు కఠినమైన మాచన్నుల ఒత్తిడికి కందిపోతాయేమో నని బాధపడుతూ ఉంటాం. అలాంటిది ఈ కర్కశారణ్య భూముల్లో నీ సంచారం నీ ప్రేయసులమైన మాకు ప్రాణాంతకమైన శోకాన్ని కలిగించదా?

కృష్ణా! అకటా! మన్మథబాణాలు మమ్మల్ని నొచ్చేటట్లు నాటుకోగా, భీతిచెంది, నీపాదాలు పట్టుకోవడానికి వచ్చాం. అలాంటి మమ్ములను నట్టడవిలో వదిలి పోవడం నీకు న్యాయమా?

(పాదాలు పట్టుకోవడం శరణాగతిచిహ్నం. శరణాగతులను రక్షించడం భగవంతుని ధర్మం అని గుర్తు చేస్తున్నారు గోపికలు.)

ప్రాణేశ్వరా! మా మనసులను ముందుగా కోమలతరంగా చేసి, తరువాత వేరుగా నీ హృదయాన్ని మిక్కిలి కర్కశంగా చేసిన మా దురదృష్టం ఎక్కడైనా(ఎవరికైనా) ఉంటుందా?

దయానిధీ! రాక్షసులు ఒక్కపెట్టున పరాక్రమించి, ఎదుర్కొని పట్టుదలతో దేవతలపై వాడిబాణాలు ప్రయోగించేటప్పుడు అడ్డుపడి, ఆ రాక్షసుల్ని తునుమాడుతావని అంటారు. మరి, మేము నిన్ను నమ్ముకున్న అమాయికగోపికలం. అయ్యో! ఇలాంటి మమ్మల్ని పంచబాణుడు వెంటాడుతుంటే అడ్డుపడడం ఉచితం కాదా?

గోవిందా! ముకుందా! కృష్ణా! చెరకు విల్లుగా గలిగిన మన్మథుడు మమ్మల్ని ఎదిరించి, మా హృదయాలలో దూరిపోయేటట్లు బాణాలు ప్రయోగించాడు. మన పరస్పరసంబంధాన్ని భావించి, ఇకనైనా మా మొరాలకించవా స్వామీ! 

ఇలా అంటూ, గోపికలు మధుర స్వరంతో ప్రస్తుతిస్తూ పాడుతూ కృష్ణుణ్ణి రావే అని పిలిచి ఏడిచారు. విశ్వరక్షకుడు, ముల్లోకసుందరుడు, మన్మథమన్మథుడు, మనోహరాకారుడు, పీతాంబరధారి, హారాలు ధరించినవాడు అయిన కృష్ణుడు, వారిముందు ప్రత్యక్షమయ్యాడు.

('మన్మథమన్మథుడు' అనడం స్వామివారి అపురూప సౌందర్యం చెప్పడానికి.)

అలా వచ్చిన ప్రాణనాథుడైన కృష్ణుణ్ణి గోపకాంతలు దర్శించారు. విజయంచేశాడని వికసించిన ముఖాలుకలవారై పోయిన ప్రాణాలు మరల వచ్చిన దేహేంద్రియాలవలె

ఒక అబల భక్తితో దోసిలొగ్గి ప్రాణనాథునికెంగేలు పట్టుకొంది. మరొక ఇంతి జీవితేశ్వరునిబాహువు తన భుజంపైన వేసుకొని సంతోషించింది. ఒక వనిత భర్త నమిలిన తమ్మిని తనచేతితో అందుకొంది. ఒక సుందరి ప్రియుని పాదాలను విరహాగ్నితో తపించిన తన స్తనాలకు అద్దుకొంది. 

ఒక భామ కనుబొమముడివేసి ప్రణయభంగం చేశాడని కోపంగా మాట్లాడుతూ, పెదవి కొరుకుతూ, కొట్టేదానివలె కృష్ణుని వాడి చూపులతో చూచింది.

ఓ పరీక్షిన్మహారాజు! హరిపాదకమలం దర్శిస్తూ తనివి తీరని సత్పురుషునివలె ఒక తరుణి హరిముఖపద్మాన్ని రెప్పవేయకుండా చూస్తూ తనివి తీరందై ఉంది.

ఒక లతాంగి కృష్ణుని ప్రకాశవంతమైన రూపాన్ని చూపులనే తీగెలతో చిక్కేటుగా పట్టుకొని తన హృదయంలో బంధించింది. ఆ రూపం బయటికి వెళ్లకుండా కనురెప్పలు మూసివేసింది. పులకలు కమ్ముతుండగా కృష్ణుణ్ణి కౌగిలించింది. అలా స్వచ్చమైన అంతరంగంలోని రుచులతో ఆమె యోగివలె పరవశిస్తూ ఉండిపోయింది.

“ప్రాణనాథా! నన్ను మోసంచేసి ఎక్కడికి వెళ్లావు” అని ఒక సుందరి మిక్కిలి కోపంతో నిందించింది. “పద్మనేత్రా! నన్ను వదిలివెళ్లడానికి నీకు కాళ్లెట్లాడాయి?” అని ఒక సుందరి వాపోయింది. “ప్రభూ! నీవు వెళ్లినప్పటికీ ఇంకా నేను ప్రాణాలతోనే ఉన్నానే! ప్రేమంటే ఇదేనా?” అని ఒక గోపసుందరి వాపోయింది.

“ప్రియా! ఇంతవరకు మనలను పాపాత్ముడైన విధాత విడదీశాడు గదా” అని ఒక గోపిక విలపించింది; “నాథా! నన్ను వదిలి వెళ్లేంత తప్పు నెనేం చేశానో చెప్పు. నీ కిది న్యాయమా అని ఒక సుందరి నిలదీసింది” “మనోనాథా! ఏనోము ఫలమోకానీ, మళ్లీ నిన్ను దర్శించగలిగాను” అంటూ ఒక యువతి విహరించింది.

కమ్మని కంఠస్వరంగల ఒక సుందరి “నేను ముందుగా అతనితో మాట్లాడితే నా ప్రతిజ్ఞ భంగమవుతుంది - అతడు పలకరిస్తేనేగానీ పలుకను”. అంటూ తన మాటల్లో అమృతాలు కురిసినట్లు తన చెలికత్తెతో పలికింది.

పరీక్షిన్మహారాజా! ఒక నెరజాణ తన చెలిచేయి పట్టుకొని “ప్రాణేశుడు నాచేయి పట్టుకొంటేనే నేను ఆతని చేయిపట్టుకొంటాను”. అని ధైర్యంగా చెప్పింది. అయితే-ఆ ధైర్యమంతా మన్మథుని నివాసస్థానం అయింది(ఆమె ధైర్యాన్ని మన్మథుడు ఛిన్నాభిన్నం చేశాడు).

ఓ పరీక్ష్మిన్మహారాజా! రమణుడు తనకు చెప్పకుండా వెళ్లి పోయాడన్న విముఖతతో, అందువల్ల తాను ముందుగా అతణ్ణి చూడనని తలవంచుకొని ఉన్న ఓ అమాయకురాలు తన మనసులో మన్మథుడు ప్రేరేపించగా అట్లే తలవంచుకొని ఉండలేక తానే తలఎత్తింది.

ఈ విధంగా

కృష్ణుని సుందరకోమల రూపాన్ని సందర్శించిన తరుణులు విరహతాపజ్వరంనుంచి విముక్తలై భవబంధాలనుండి విముక్తి చెందిన భగవద్భక్తులవలె గొప్పవేడుక సలిపారు.

అప్పుడు బృందావనంలో గోపసుందరులు తన చుట్టూచేరి కొలువగా శ్రీకృష్ణుడు సర్వజ్ఞత్వం మొదలైన సమూహాలతో కూడిన శక్తిని పరమేశ్వరుడువలె ప్రకాశించాడు. వసుదేవనందనుడు ఆ గోపరమణులను వెంట బెట్టుకొని మందారాల, మొల్లపూల సువాసనలతో నిండి మందమారుతాలచే మన్నింపబడి మృదువుగా జుంజుమ్మని ఝంకారంచేసే తుమ్మెదల సమూహంగలదీ, శరత్మాల చంద్రకిరణాల సమూహాలచేత ఛిన్నాభిన్నమైన చీకట్లు కలదీ, యమునానది అలలచేత చేరిన మెత్తని ఇసుకతో విలసిల్లేదీ, అచ్చమైందీ అయిన సైకతస్థలానికి చేరుకున్నాడు. అక్మడ గోపికారమణులు జ్ఞానోదయ(సమయం)చేత పరమ్మాతను సందర్శించి, శ్రీ కృష్ణునివిరహంవల్ల ఇంతవరకూ ఉన్న తాపాన్ని పోగొట్టుకున్నారు. వారి కోరికలన్నీ పరిపూర్ణంగా నెరవేరాయి.

పరీక్షిన్మహారాజా! మీననేత్రలయిన ఆగోపరమణులు తమ హృదయసీమలలో ఉత్సాహాలు సందడించగా, తమ మెత్తని పైట చెరగులతో ప్రియుడైన శ్రీకృష్ణునికి ఆసనం కల్పించారు.

యోగీశ్వరులహృదయాలు అనే సుఖాసనాలమీద కూర్చునే ఆ పరమేశ్వరుడు ముల్లోకాలకు దేవేరి అయిన శ్రీమహాలక్ష్మి తన శరీరంమీద తేజరిల్లగా, గోపకాంతలు పయ్యెద కొంగులతో కల్పించిన ఆసనం మీద ఆసీనుడయ్యాడు.

(యోగీశ్వరులహృదయాలు గోపకాంతల పయ్యెదకొంగులు పరమాత్మకు ఆసనాలయ్యాయి. గోపికలు త్రేతాయుగంలో మునీశ్వరులు అనే అంశం ఇక్కడ స్ఫురిస్తున్నది.)

ఆ ముగ్ధలు మరులు పెంపొందిస్తూ ఉన్న రమణునికి సమ్మానం చేస్తూ నవ్వుతో కూడినచూపులలో శృంగారం ఒలకపోస్తూ ఆయనపాదాలను చేతులతో ఒత్తుతూ, ఆయనశరీరాన్ని స్పృశిస్తూ, తూలనాడుతూ, పరిహాసవచనాలు పలుకుతూ, కొద్దిగా కోపం తెచ్చుకున్నందువల్ల ప్రకాశించే ముఖాలు గలవారై ప్రేమతో ఇలా పలికారు.

నందనందనా! కొందరు తమను సేవించిన వారినే సేవిస్తారు. మరికొందరు తమను సేవించని వారినికూడా సేవిస్తారు. ఇక కొందరు సంతోషంతో తమను సేవించేవారినీ, సేవించనివారినికూడా సేవించరు. (వీరిలో నీ వెలాంటి వాడవో తెలుపు)

ఇలా తనను ఉద్దేశించి నర్మగర్భంగా పలికిన గోపసుందరుల పలుకులు విని గోపసుందరుడు ఇలా పలికాడు.

ఓ గోపికలారా! పశువులను ఫలం ఆశించి కొలిచిన విధంగా కొందరు కొలుస్తారు. వారు తమసొంతప్రయోజనమే కోరుకునేవారు. వారికి స్వార్ధమే పరమావధి. కొలిస్తేనే తిరిగి కొలవడం స్నేహధర్మంకాదు.

ఇక కొందరు దయగలవారు. మంచి మనసున్నవారు. తండ్రులు ఎలాగయితే తమను కొలువని కుమారులనూ కొలుస్తారో అలాగా తమను కొలువనివారిని కూడా కొలుస్తారు. వారి స్నేహధర్మాలు ప్రతిఫలం ఆశించనివి. 

మరికొందరు ఇతరులను కొలిచే ఉద్దేశంలేనివారు. వీరు తమను కొలిచేవారినైనా, కొలువని వారినైనా కొలువరు. వారు ఆత్మయందే రమించేవారు, భోగేచ్చలేనివారు. మరికొందరు మూర్ఖులు. మిక్కిలి కఠినహృదయులు. వారిలో నన్ను ఈ చివరితెగకు చెందినవానినిగా భావించి మీరు ఇలా పలుకుతున్నారు. ఔనా?

ఓ తరుణులారా! నేను పైన చెప్పిన వారిలో ఎవ్వడనూ కాను. పరమకరుణార్ణ హృదయుడను. మీకు ఆత్మబంధువును. మీకు నిరంతరధ్యానం సమకూర్చడానికే కనిపించకుండా వెళ్లాను సుమా!

(దగ్గరనే ఉంటే గోపికలకు నిరంతరధ్యానం కుదరదు. దూరంగా ఉంటేనే వారికి కృష్ణునిమీద నిరంతరధ్యానం సిద్ధిస్తుంది.)

నన్ను సేవిస్తూ ఉండేవారికి నేను నారూపం చూపించను. ఎందుకంటే నన్ను దర్శించిన తర్వాత గర్వించి నన్ను కొలవడం మానేస్తారేమోనని. తనకున్న డబ్బుపోయినప్పుడు దరిద్రుడైనవాడు నిరంతరం డబ్బు చింతలోనే మునిగి పోయినట్లు నన్ను చూడకుండా ఉంటేనే నన్ను కోరే భక్తులు నా రూపాన్ని నిరంతరం ధ్యానిస్తూ ఉంటారు.

న్యాయమూ, ధర్మమూ పట్టించుకోకుండా మీ తల్లిదండ్రులను, బంధువులను, భర్తలను, బిడ్డలను వదిలివచ్చి, నాయందు మనసులు లగ్నంచేసిన మిమ్మల్ని వదిలివెళ్లడం న్యాయం కాదు. అలా వదిలి వెళ్లినందుకు నన్ను మన్నించండి. నా వియోగభారంతో చింతిస్తూ మీరు పలికిన పలుకులను వింటూనే ఉన్నాను.

(కృష్ణుడు గోపికలకు క్షమాపణ చెప్పడం ఆయన గొప్పమనస్సుకు, దయార్దహృదయానికి సాక్ష్యం.)

ఓ భామినులారా! విడిపోని సంసారమనే సంకెళ్లను తొలగించుకొని నాయందే నిరంతరాయంగా మనస్సును నిమగ్నంచేసిన మీకు, ఎన్నియుగాలైనా ప్రత్యుపకారం చేయలేను. (అంటే అంతటి గొప్ప ప్రేమమీది) నేను మిమ్ములను వదిలివెళ్లడం కృతజ్ఞత లేనందువల్ల కాదు, 

నన్ను మీరు నిరంతరం ధ్యానంచేస్తూ ఉండాలనే. ఇదే నేను మీకు చేసిన ప్రత్యుపకారంగా భావించి, నేను వదిలి వెళ్లడాన్ని తప్పుగా భావించక, దయతో మీ కోపాన్ని తగ్గించండి.

(ప్రేయసులను బతిమలాడుకునే సామాన్యప్రేమికుడిగా కృష్ణుడు క్షమాపణ చెప్పుకోవడం ఆయన లీలగానే భావించాలి.)

ఓ పరీక్షిన్మహారాజా! ఇలా మనోజ్ఞంగా పలికిన కృష్ణుని మాటలాలకించి తీవెబోడులైన గోపరమణులు అతని చక్కని మాటలతోను, సంగమంతోను, తమ హృదయాలలో ఇంతవరకూ నిండి ఉండే విరహవేదనలను, ఒక్కసారిగా వదిలేశారు.

రాస క్రీడాభివర్ణనము

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

sri krishnundu kesivyomasurula samharinchuta - శ్రీ కృష్ణుండు కేశివ్యోమాసురుల సంహరించుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము -  శ్రీ కృష్ణుండు కేశివ్యోమాసురుల సంహరించుట అని చెప్పి రథమెక్కి అక్రూరుడు వెల్లిపోయాడు. కంసుడుకూడా స...