Saturday, August 1, 2026

Tripundra Vibhuti Mahima - Durvasudi Katha - The Glory of Tripundra Vibhuti – The Story of Durvasa - త్రిపుండ్ర విభూతి మహిమ - దూర్వాసుడి కథ

త్రిపుండ్ర విభూతి మహిమ - దూర్వాసుడి కథ

నారదా! ఇక్కడొక ఇతిహాసం నీకు చెప్పాలి. ఒకప్పుడు దూర్వాసుడు శరీరంనిండా విభూతి ఆలంకరించుకుని రుద్రాక్షమాలికలు ధరించి పితృలోకానికి వెళ్ళాడు. శివా! శంకరా! సర్వాత్మకా!
జగన్మాతా! జగదంబికా! ఆంటూ పార్వతీపరమేశ్వరుల నామధేయాలను బిగ్గరగా జపిస్తూ వెళ్ళాడు. కవ్యవాలాదులైన పితృదేవతలు గౌరవపురస్పరంగా ఎదురువచ్చి నమస్కరించి తీసుకువెళ్ళి అతిథిమర్యాదలు జరిపి సముచితాసనంమీద కూర్చోబెట్టారు. కుశలప్రశ్నలతో కథలూ కబుర్లతో చాలాసేపు గడిపారు. అంతలోకీ - సమీపంలో ఉన్న కుంభీపాక నరకకూపంనుంచి ఆర్తనాదాలూ హాహాకారాలూ హృదయవిదారకంగా వినిపించాయి. దూర్వాసుడికి మనస్సు కలతపడింది. ఎవరివి ఈ అరుపులు? ఎక్కడినుంచి? ఆని ఆత్రంగా ప్రశ్నించాడు.

మునీశ్వరా! ఇక్కడికి చేరువలోనే సంయమినీపురం(యమలోకం) ఉంది. అక్కడ పాపాత్ములను శిక్షించడానికి యముడున్నాడు. అతని అధీనంలో వేలమంది యమదూతలున్నారు. నల్లగా బలిష్ఠంగా భయంకరంగా ఉంటారు. ఆ యమలోకంలో ఎనభయ్యారు నరకకూపాలు ఉన్నాయి. వాటిలోకెల్లా కుంభీపాకమనే కూపం అత్యంత భయంకరం. మహాపాపుల్ని తెచ్చి అందులో పడద్రోసి యమదూతలు ఘోరంగా శిక్షిస్తారు. ఆ యాతన వర్ణనాతీతం. నూరేళ్ళు వర్ణించినా తరగదు. శివుద్రోహులూ దేవీనిందకులూ విష్ణుద్రోహులూ వేదనిందకులూ సూర్యగణేశాదిదేవ నిందకులూ కామాచారులూ మాతృ పితృ గురు జ్యేష్ఠ భ్రాతృ - పురాణ స్మృతి నిందకులూ ఇంకా ఇలాంటి పాపాలు చేసినవారూ ధర్మం తప్పినవారూ కుంభీపాక కుండంలో పడి యమదూతలు పెట్టే బాధలు భరించలేక కుయ్యో మొర్రోమని దిక్కులు పగిలేలాగా అరిచి రోదిస్తుంటారు. శ్రవణ దారుణమైన ఈ హాహాకారాలు మేము రోజూ వినేవే. వీటిని ఒక్కసారి వింటేచాలు ఎవరికైనా వైరాగ్యం పుడుతుంది - ఆని పితృదేవతలు వివరించారు.

వింటూనే దూర్వాసుడు చటుక్కున లేచాడు. గబగబా నడుచుకుంటూ-అదేమిటో చూద్దామనిపించి ఆ నరకకూపం దగ్గరికి వెళ్ళాడు. గట్టున నిలిచి తలవంచి కూపంలోకి చూశాడు. ఆంతే, హహాకారాలు మాయమయ్యాయి. వహ్వాకారాలు మిన్నుముట్టాయి. ఆ కూపంలో ఉన్నవారు కేరింతలు కొడుతున్నారు. ఆడుతున్నారు. పాడుతున్నారు. పట్టరాని సుఖమేదో అనుభవిస్తున్నట్టు పరస్పరం ఆనందపరచుకుంటున్నారు. మృదంగ వీణా మురజ ఢక్కా దుందుభులు మోగిస్తూ చిందులు తొక్కుతున్నారు. స్వర్గాధికనుఖమంటే ఇదే కాబోలు అనిపించింది. వసంతవల్లీ పుష్పగంధాలూ శుకశారికాపికాలాపాలూ విజృంభించాయి. మునీశ్వరుడు విన్నది వేరు, ఇప్పుడిక్కడ కన్నది వేరు. ఆశ్చర్యంలో మునిగిపోయాడు.

యమదూతలకు ఇందంతా చాలా వింతగా విడ్డూరంగా కనిపించింది. జరగరానిదేదో జరిగిపోయిందని కలవరపడ్డారు. పరుగు పరుగున వెళ్ళి అధినాయకుడు యమధర్మరాజుకి విన్నవించారు. మహారాజా! ఇదేదో విడ్డూరంగా ఉంది. కుంభీపాకంలో మహాపాపులు స్వర్గసౌఖ్యాలు అనుభవిస్తున్నారు. కారణం ఏమిటో అంతుపట్టడంలేదు. ఆశ్చర్యం పట్టలేక నీకు విన్నవించుకుంటున్నాం - అన్నారు.

యమధర్మరాజు ఉలిక్కిపడి లేచాడు. మహిషం అధిరోహించి చకచకా వచ్చాడు. బయలుదేరబోతూ ఈ వార్తను దేవేంద్రుడికి దూతద్వారా పంపించాడు. ఇంద్రుడు దిక్పాలకులకూ బ్రహ్మదేవుడికీ, బ్రహ్మదేవుడు విష్ణుమూర్తికీ తెలియపరిచారు. అందరూ వెంటవెంటనే బయలుదేరి తమ తమ దివ్య వాహనాలమీద క్షణాలలో అక్కడికి చేరుకున్నారు. కుంభీపాకం చుట్టూ చేరారు. అందులో జీవులు ఆనందపరవశులై కేరింతలు కొట్టడం కళ్ళారా చూశారు. అహో! ఇది నరకకూవం కానేకాదు. పాపాత్ములకోసం నిర్మించిన భోగకూపంలా ఉందని విస్తుపోయారు. కారణం ఏమిటో ఎవరికీ స్ఫురించలేదు. ఇక సృష్టిలో పాపానికి భయపడేదెవడు? అందరూ పాపాలే చేసి ఇక్కడికి వచ్చిపడతారు. అక్కడా సుఖపడతారు. ఇక్కడా సుఖపడతారు. వేదమర్యాదలూ ధర్మమార్గాలూ ధ్వంసమైపోతాయి. ఎమిటి ఈ విపరీతం? తన సంకల్పాన్ని తానే వృధాపరచుకుంటున్నాడా ఆ భగవంతుడు! చాలా ఆశ్చర్యంగా ఉందే! - ఇలా తర్కించుకుంటున్నారు. కొందరు కారణమేమిటో తెలియక ఏమి మాట్లాడటానికీ తోచక తటస్థులై మౌనంగా నిలుచుండిపోయారు.

విష్ణుమూర్తి చతుర్ముఖ దేవేంద్ర యమధర్మరాజులతో చర్చించాడు. కారణం అంతుబట్టలేదు. క్షణంలో ఇంత మార్పు ఎలా జరిగిందో తెలియలేదు. సరే శివుణ్ణి అడుగుదామని మరికొందరు దిక్పాలకులనూ దేవముఖ్యులనూ వెంటబెట్టుకుని కైలాసానికి వెళ్ళాడు.

కోటిమన్మథసుందరాకారుడు. సదా షోడశవర్షీయసుడు. లావణ్య నిధి. నానాలంకారభూషితుడు. పార్వతీదేవిని లాలిస్తూ చంద్రమౌళి దర్శనమిచ్చాడు. హరి విరించి ప్రముఖులు నమస్కరించారు. కాలయాపన చెయ్యకుండా యమలోకపు వింత విన్నవించారు. కారణం తెలియక కొట్టుకుంటున్నాం. నువ్వు సర్వజ్ఞుడివి. కనక హేతువేమిటో చెప్పు - అని విష్ణుమూర్తి అభ్యర్థించాడు.

శివుడి ముఖపద్మం వికసించింది. చతుర్భుజా! ఇందులో వింత ఏముంది? విడ్డూరం ఏముంది? అంతా విభూతి మహిమ. దానికి సాధ్యం కానిదేదీ లేదు. దూర్వాసుడు వచ్చాడుగదా! ఆతడు పరమమాహేశ్వరుడు. కుంభీపాకం గట్టున నిలబడి కిందికి తలవంచి చూశాడుగదా! మరింకేమి! అతడి నుదుటనున్న విభూతి రేణువులు దైవికంగా ఆ కుండంలో పడ్డాయి. అంతే, విభూతి మహిమ నరకకూపం స్వర్గలోకంగా మారిపోయింది. ఇప్పటినుంచీ అది పితృలోకవాసులకు తీర్థమవుతుంది. అందులో స్నానం చేసి పితృదేవతలు సుఖపడతారు. పితృతీర్థంగా విఖ్యాతి వహిస్తుంది. అక్కడ ఆలయం కట్టి మా దంపతుల్ని ప్రతిష్టించండి. పిత్రీశ్వరీ పిత్రీశ్వరులుగా విడిది చేస్తాం. పితృలోకనివాసుల పూజలు అందుకుంటాం. ముల్లోకాలలోనూ ఉన్న తీర్థాలన్నింటిలోకీ ఇది ఉత్తమోత్తమమవుతుంది - అని శంకరుడు స్వయంగా ప్రకటించాడు.

విష్ణుమూర్తీ ఆతడి అనుచరులూ సంతోషించి శివుడికి నమస్కరించి యమలోకానికి తిరిగివచ్చి అక్కడున్న మిగతా దేవతలకందరికీ ఈ విషయం చెప్పారు. అందరూ శిరసులూపి బాగుబాగని కొనియాడారు. విభూతి మహిమ ఇంతటిదా అని ఎంతగానో ప్రశంసించారు. తీర్థం లభించిందని పితృదేవతలు మరింతగా సంబరపడ్డారు. దాని చెంత శివపార్వతుల మూర్తులను ప్రతిష్టించారు. నిత్యమూ పూజలు చేయనారంభించారు. అప్పటిదాకా ఆ కుంభీపాక కూపంలో పడి ఉన్న ప్రాణికోటి అంతా దివ్యవిమానాలు అధిరోహించి కైలాసం చేరుకున్నారు. భద్రగణాలు అనే పేరుతో ఇప్పటికీ అక్కడే హాయిగా నివసిస్తున్నారు.

యముడూయమదూతలూ ఇక చేసేదిలేక ఆ తీర్థానికి సుదూరంగా మరొక కుంభిపాక కుండం కొత్తగా నిర్మించుకున్నారు. ఇక నేటినుంచీ శైవులెవ్వరూ దీని దరిదాపులకు రాకూడదని గట్టి నిషేధం విధించారు.

ఊర్ధ్వపుండ్ర ధారణ




Bhasma Snanam (Ritual bath with sacred ash) - భస్మస్నానం

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - భస్మస్నానం

ర్ధ్రస్నానం కన్నా భస్మస్నానమే ఉత్తమోత్తమం. ఎందుకంటే ఆర్ధ్రత ఆరిపోతుంది. అదీగాక ఆర్ధ్రస్నానం ప్రకృతిసిద్ధం. ప్రకృతి అంటే బంధనమేనని పెద్దలంటారు. కనక ప్రకృతిబంధ విమోచనంకోసం భస్మస్నానం చెయ్యాలి. సారాంశమేమంటే - ఆగ్నేయస్నానానికి సాటివచ్చేది ఈ ముల్లోకాలలోనూ మరొకటి లేదు. అందుచేతనే సకలదేవతలూ రక్షణకోరి పవిత్రతకోరి మంగళంకోరి ఈ విభూతిని ఆదిపరాశక్తికి ప్రేమతో కానుకగా అందించారు. అంతటి పవిత్రమైన ఈ ఆగ్నేయస్నానం అశీతివాత రోగాలనూ చతుష్టష్టిపిత్తరోగాలనూ సప్తత్రిపంచక శ్లేష్మరోగాలనూ వ్యాఘ్ర చోర దుష్టగ్రహ భయాలనూ తక్షణం తొలగిస్తుంది. సందేహం లేదు. సింహం చేతిలో ఏనుగుల్లాగా ఇవి మడిసిపోతాయి.

శీతలోదకాలతో స్నానంచేసి విభూతిని నెన్నొసట త్రిరేఖలుగా ధరించినవాడు పరబ్రహ్మను చేరుకుంటాడనడంలో సందేహం లేదు. భస్మస్నానంకూడా చేస్తే బ్రహ్మలోకంలో శాశ్వతంగా ఉండిపోతాడు అనడంలో అంతకన్నా సందేహం లేదు. లలాటలిఖితమైన బ్రహ్మరాతలలో పనికి రానివాటినీ హానికరమైనవాటినీ తుడిచివేసే శక్తి త్రిపుండ్రాలకుమాత్రమే ఉంది. ఆ బ్రహ్మకు కూడా లేని శక్తి ఇది. ఏ ఆవయవాన విభూతి పెట్టుకుంటే ఆ అవయవం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. గుండెలపై దాలిస్తే మనస్సు చేసే పాపాలు బొడ్డున ధరిస్తే మర్మాంగం చేసిన పాపాలూ అంతరిస్తాయి. కుడియెడమ పార్శ్వభాగాలలో ధరిస్తే పరకాంతాలింగనాది దోషాలు నశిస్తాయి. అందుచేత శరీరంలో ఎక్కడ దాల్చినా శ్రేయస్కరమే. మూడురేఖలుగా ధరిస్తే త్రిమూర్తులనూ ధరించినట్టే. త్రిగుణాలనూ ధరించినట్టే, త్రిలోకాలనూ ధరించినట్టే. ఒళ్ళంతా బూడిద పులుము కున్నవాడు సర్వపాపవిముక్తుడై సరాసరి మోక్షం పొందుతాడు. ఇతడినే ఆత్మనిష్ఠుడంటారు. భస్మదిగ్ధసర్వాంగుడూ భస్మదీప్త త్రిపుండ్రకుడూ భస్మశాయి అయిన పురుషుణ్ణి భస్మనిష్ఠుడు అంటారు. భూత ప్రేత పిశాచోరగాదులూ దుస్సహరోగాలూ భస్మనిష్ఠుణ్ణి చూస్తే పదిఆమడల దూరం పారిపోతాయి.

భాసిస్తుందికనక భసితమనీ, కల్మషాలను భక్షిస్తుంది కనక భస్మమనీ, విభూతిని(ఐశ్వర్యం) కలిగిస్తుంది కనక భూతి అనీ, రక్షిస్తుంది కనక రక్ష అనీ దీనికి పేర్లు ఏర్పడ్డాయి.

రుద్రుణ్ణి స్మరిస్తే పాపాలు నశించినట్టే త్రిపుండ్రాలను చూస్తే చాలు భూత ప్రేత పిశాచాలు పలాయనం చిత్తగిస్తాయి. ఆంతరిస్తాయి. అకృత్యాలు వెయ్యి చేసినా భస్మస్నానం చేస్తే అవన్నీ అగ్నిలో అడవిలా మాడిపోతాయి. కనీసం ప్రాణావసానదశలో అగ్నిస్నానం చేసినా పాపాలు తొలగి పుణ్యలోకాలు చేరుకుంటాడు. నిత్యమూ చేసేవాడు జితక్రోధుడై జితేంద్రియుడై శివసన్నిధికి వెడతాడు. అతడికింక పునర్జన్మ ఉండదు. పున్నమినాడు భస్మోద్దూళితశరీరుడై శంకరార్చన చేసినా చూసినా ముక్తీ పాపవిముక్తీ తప్పవు. ఆయుర్దాయం కావాలన్నా విద్య కావలన్నా కడకు మోక్షమే కావాలన్నా భస్మధారణమొక్కటే శరణ్యం.

కేవలజలస్నానం శరీరం పైని ఉండే మలినాన్ని ప్రక్షాళన చేస్తుంది. విభూతిస్నానమో బాహ్యాభ్య న్తరమలినాలను తొలగిస్తుంది. అంతశ్శుద్ధీ బహిశ్శు
ద్ధీ రెండూ సిద్ధిస్తాయి. కనక జలస్నానం చెయ్యకపోయినా ఫరవాలేదుగానీ భస్మస్నానం చేసితీరాలి. ఇది లేనిదే పవిత్రత లేదు. కాబట్టి వైదికకర్మలకన్నింటికీ ముందు విధిగా ఇది చేసితీరాలి. మలమూత్ర విసర్జనలు చేసినప్పుడు శౌచవిధులన్నీ నిర్వర్తించాక భస్మస్నానం చేస్తేనే పరిపూర్ణశౌచం లభిస్తుంది. అపానవాయువు విడిచినప్పుడూ ఆవులించినప్పుడూ దగ్గినప్పుడూ తుమ్మినప్పుడూ శ్లేష్మాన్ని ఉమ్మినప్పుడు శుద్దికోసం భస్మస్నానం చెయ్యాలి.

నారదా! భస్మస్నానమాహాత్మ్యం గురించి ఇప్పటికి ఒకవంతు మాత్రమే చెప్పాను. ఇంకా చాలా ఉంది. విను. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు ఉపనయనం ఉంది కనక వీరినే ద్విజులు అంటారు.
ద్విజులందరూ తప్పకుండా శ్రౌతపద్దతిలో విభూతి త్రిపుండ్రధారణ చెయ్యాలి. ఇది లేకుండా. గాయత్రీమంత్రాన్ని ఉపదేశించడానికిగానీ స్వీకరించడానికిగానీ వీలులేదు. అధికారం లేదు. కనక మరిచిపోకుండా విభూతిపెట్టుకునే గాయత్రీజపం చెయ్యాలి. విభూతి రేఖలే ద్విజత్వానికి చిహ్నాలు. రత్నాలూ మణులూ అలంకరించుకోవడంమీద ఎంత ప్రీతి సహజంగా ఉంటుందో, విభూతిని పెట్టుకోవడం మీదకూడా అంత ఆదరమూ అంత సహజంగానూ ఉండాలి. నొసట విభూతిలేకుండా ఏది తిన్నానరకానికి పోతారు. ఇక శూన్య లలాటంతో శివపూజ చేసినా వ్యర్థం. అతడు శివద్వేషితో సమానం. నరకానికి పోవడం ఖాయం. విభూతి పెట్టుకోకుండా శివుడికి బంగారు తులాభారం చేసినా నిష్ఫలం. నరకం తప్పదు. విభూతి లేని సంధ్యావందనం యజ్ఞోపవీతమే లేని సంధ్యావందనంతో సమానం. నిరర్ధకం. యజ్ఞోపవీతం పోతే ప్రత్యామ్నాయాలున్నాయి. జపాలూ ఉపవాసాలూ ఏవో ప్రాయశ్సిత్తాలున్నాయి. కానీ విభూతి ధారణను మరిచిపోతే ఏ ప్రత్యామ్నాయమూ లేదు. ఏ ప్రాయశ్చిత్తమూ లేదు. సరాసరి నరకలోకానికి పోవడమే.

అందుచేత ద్విజుడు తప్పనిసరిగా శ్రౌతభస్మను సంపాదించి పెట్టుకోవాలి. అది దొరక్కపోతే స్మార్తమూ అదీ దొరకకపోతే లౌకికమూ - ఏదో ఒక భస్మం ధరించితీరాలి. అది పవిత్ర భస్మమైతే చాలు. కుడిచేతి మధ్యాంగుళిత్రయంతో (బొటనవేలూ చిటికెనవేలూ కాక) నుదుట కనీసం ఆరంగుళాల పొడవు ఉండేట్టు ఈ కంటి కొసనుంచి ఆ కంటి కొసదాకా ఉండేట్టు త్రిరేఖలుగా విభూతి పెట్టుకోవాలి. వీటిలో ఆనామికను(చిటికెనవేలుకి ప్రక్కనున్నది) అకారమనీ, మధ్యమాంగుళిని (నడిమివేలు) ఉకారమనీ, తర్జనిని(చూపుడువేలు) మకారమనీ అంటారు. ఈ మూడింటి సంయోజనతో ఏర్పడిన త్రిపుండ్రం త్రిగుణాత్మకం, ప్రణవాత్మకం, (అ + ఉ + మ్‌ = ఓమ్‌). అట్టడుగు అనామికారేఖ బ్రహ్మతత్త్వం. కనక రజోగుణం. నట్టనడిమి మధ్యమాంగుళీరేఖ విష్ణుతత్వం. కనక సత్వగుణం. తుట్టతుది తర్జనీరేఖ శివతత్త్వం. కనక తమోగుణం. ఇలా త్రిపుండ్రం త్రిగుణాత్మకం, త్రిమూర్తి స్వరూపం.

త్రిపుండ్ర విభూతి మహిమ - దూర్వాసుడి కథ




Bhasmadharana Mahima - The Glory of Wearing Sacred Ash - భస్మధారణ మహిమ

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - భస్మధారణ మహిమ

నారదా! ఈ భస్మధారణ మాహాత్మ్యం ఎంత చెప్పినా తరగదు. ఇంకా ఉంది. విను. ఇప్పటికి జాబితాలోకెక్కిన పాతకాలేకాక ఇంకా మహాపాపాలు ఏమైనా ఉంటే అవ్వికూడా నశిస్తాయి భస్మోద్దూళన భస్మధారణలతో అనడం ముమ్మాటికీ సత్యం. ఇది యతీశ్వరులకు జ్ఞానాన్నీ, వానప్రస్థులకు విరక్తినీ, గృహస్థులకు ధర్మవృద్ధినీ, బ్రహ్మచారులకు స్వాధ్యాయశక్తినీ, శూద్రులకు పుణ్యాన్నీ, ఇతరులకు పాపక్షయాన్నీ అపారంగా కలిగిస్తుంది. సర్వభూతరక్షణకోసం విభూతిని ధరించాలనీ ఉద్దూళన చేసుకోవాలని వేదం చెబుతోంది. ఇది యజ్ఞంతో అన్నివిధాలా సరిసమానమంటోంది. మాహేశ్వరులకు ఇది చిహ్నం, సర్వులకూ విజ్ఞానప్రదం అని పేర్కొంటోంది. బ్రహ్మవిష్ణుమహేశ్వరులూ వారి అంశావతారాలూ ఇంద్రాది దేవతలూ వరుణాది దిక్పాలకులూ సరస్వతీ లక్ష్మీపార్వతులూ వారి అంశదేవీమూర్తులూ శచీప్రముఖ సకలదేవ కాంతలూ యక్ష రాక్షస గంధర్వ సిద్ధ సాధ్య విద్యాధరాది సమస్తజాతులవారూ మునులూ ఋషులూ యోగులూ తపస్వులూ చతుర్వర్ణాలవారూ సంకరజాతులవారూ అపభ్రంశులూ - వారూ వీరూ అని తేడా లేకుండా అందరూ భస్మోద్దూళన భస్మధారణలు చేసినవారే. చేస్తున్నవారే. చెయ్యవలసినవారే. శిష్టులు అంటే వీరే. ఇంకెవరూ కారు. ఒక్కమాటలో దీని మాహాత్మ్యం చెప్పాలంటే శివలింగంలాగా చింతామణిలాగా పంచాక్షరీ మంత్రంలాగా ఈ విభూతి అనేది మోక్షలక్ష్మిని వశీకరించుకునే దివ్యౌషధం.

విభూతిని ధరించివస్తే మూర్ఖుడా పండితుడా అనే ప్రశ్న లేదు. అతడికి భోజనం పెట్టాలి. అతడు భుజిస్తే పార్వతీపరమేశ్వరులు వచ్చి భుజించినట్టే

భస్మధారిని అనుసరించినా స్తుతించినా శ్రద్ధగా సేవించినా పాపాలు తొలగిపోతాయి. పూజనీయుడవుతాడు. త్రిపుండ్రధారికి భిక్షవే స్తే సర్వవేదాలూ చదివినంత, సకలసత్కర్మలూ అనుష్ఠించినంత పుణ్యం వస్తుంది. నిత్యమూ శిరస్సున విభూతిని ధరించేవాడు అడవుల్లో ఉన్నా అరణ్యాల్లో ఉన్నా అది కాశీక్షేత్రమే. భస్మధారిలో మిగతా యోగ్యతలు పరిశీలనీయాలు కానేకాదు. అవగుణాలు ఎన్ని ఉన్నా పరిగణనీయాలు కానేకాదు. శివసంతతితో సమానుడు. పూజనీయుడు. ఒకవేళ దుశ్శీలుడయ్యుండి ఎదుటివారిని మోసగించడంకోసమనే విభూతి పెట్టుకున్నా ఒళ్ళంతా పులుముకున్నా అతడు ధన్యుడే. పావనుడే. నూరు యజ్ఞాలు చేసినవారు వెళ్ళే లోకాలకు తానూ వెడతాడు. అనుకోకుండా విభూతి వొంటికి తగిలినా క్రీడావినోదంగా ధరించినా భయపడి పెట్టుకున్నా అతడు శివుడితో సమానుడే. పూజనీయుడే. విభూతిధారణ ఏ కారణంగా ఎవరు ఎలా చేసినా ముగ్గురమ్మలకూ ముగ్గురయ్యలకూ తృప్తినీ ఆనందాన్నీ కలిగిస్తుంది. దాన యజ్ఞ తప స్తీర్థయాత్రలకు అందని పుణ్యం విభూతిధారణతో వచ్చి వాడిలో పడుతుంది. నిజం. అవి అందించే పుణ్యాలు ఈ పుణ్యంలో పదహారవవంతుకికూడా సాటిరావు. తన చిహ్నాలను ధరించిన ప్రజలను రాజుగారు ఎలా తనవాళ్ళని గుర్తిస్తాడో అలా శివుడు త్రిపుండ్రధారులను తనవాళ్ళుగా భావిస్తాడు. నిర్మలహృదయంతో విభూతిని ధరిస్తే సాక్షాత్తూ రుద్రుణ్ణి వశీకరించుకొన్నట్టే. మిగతా ఆచారాలూ అనుష్ఠానాలూ ఏమీ లేకపోయినా సరే నెన్నొసట విభూతితో అడ్డబొట్టు ఉంటేచాలు అతడు ముక్తిని పొందడం తథ్యం. కులమూ గోత్రమూ వ్రతమూ జ్ఞానమూ ఇత్యాదులతో పనీలేదు, పరీక్షా లేదు. నారదా! శివమంత్రంకన్నా గొప్ప మంత్రం లేదు. శివుడికన్నా గొప్ప దైవం లేడు. శివార్చనకన్నా గొప్ప పుణ్యం లేదు. విభూతి కన్నా గొప్ప తీర్థం లేదు. రుద్రవేత్రాగ్నికన్నా గొప్ప తీర్థం ఈ విభూతి. సర్వదుఃఖవిధ్వంసకం. సర్వపాప విమోచకం. విభూతిధారి - ఎవడైనా ఆగుగాక - ఎక్కడ ఉంటే అక్కడ సర్వభూతగణ - సర్వతీర్థగణ పరివృతులై పార్వతీపరమేశ్వరులుంటారు. పంచాక్షరీ శివమంత్ర పరిపూతమైన ఈ విభూతిని, శివుడుకోరి అలంకరించుకునే ఈ భస్మాన్ని నెన్నుదుట త్రిపుండ్రాలుగా ధరిస్తే చాలు - అక్కడ బ్రహ్మదేవుడు రాసిన చెడురాతలన్నీ చెరిగిపోతాయి.

నారదా! విభూతిని సర్వాంగాలకూ ఆలదుకొన్నవాడికి ధనం దానం చేస్తే ఆ దాత చేసుకున్న పాపాలన్నీ నశించిపోతాయి. శ్రుతులూ స్మృతులూ అఖిలపురాణాలూ విభూతి మహిమను ఎంతగానో కొనియాడుతున్నాయి. అంచేత ఆందరూ దీన్ని అలంకరించుకోవడం శ్రేయస్కరం. తెల్లని విభూతిని నుదట పెండెకట్టులుగా పెట్టుకుని మూడుపూటలా సంధ్యవార్చిన విప్రుడు శివలోకంలో శాశ్వతంగా నివసిస్తాడు. యోగీశ్వరుడు ఆపాదతలమస్తకంగా త్రిసంధ్యల్లోనూ భస్మస్నానం చేస్తే చాలు అతడికి యోగసిద్ది కల్గుతుంది. ఇది జలస్నానంకన్నా ఎన్నోరెట్లు గొప్పది. గృహస్థులకు వంశవర్ధకం. సర్వతీర్థాలలోనూ క్రుంకులాడిన పుణ్యఫలం ఒక భస్మస్నానంతో లభిస్తుంది. మహాపాతకాలూ ఉపపాతకాలూ అన్నీ మండుతున్న అగ్నిలో ఎండుకట్టెల్లాగా దహించుకుపోతాయి. భస్మస్నానానికి సాటివచ్చే స్నానమే లేదు. ఇలాగని శివుడే సాక్షాత్తుగా ప్రశంసించి తానూ స్వయంగా నిత్యమూ భస్మస్నానాన్ని చేస్తున్నాడు. అప్పటినుంచీ బ్రహ్మాదిదేవతలూ ఋషి ముని గణాలూ సకలసత్కర్మాచరణలకూ ఆరంభంలో పనిబూని భస్మస్నానం చేస్తున్నారు. అందుచేత ఈ ఆగ్నేయమైన భస్మస్నానాన్ని చేసినవారందరూ ఈ శరీరాలతోనే రుద్రులుగా పరిగణింపబడుతున్నారు. భస్మస్నాతులనూ భస్మధారులనూ సందర్శించినవారు సైతం దేవాసురమునీంద్రులచేత వంద్యులవుతున్నారు. దర్శించి గౌరవసూచకంగా లేచి నిలబడినవారికి దేవేంద్రుడంతటివాడు సాష్టాంగపడతాడు. భస్మధారులకు అభక్ష్యభక్షణాది దోషాలు ఏమీ అంటవు. అన్నీ హాయిగా ఆరగించవచ్చు. జలస్నానం చేసినా భస్మస్నానం కూడా చేస్తేనే బ్రహ్మచారులూ గృహస్థులూ వానప్రస్థులూ సర్వపాపవినిర్ముక్తులవుతారు. సద్గతి(ముక్తి) పొందుతారు. యతీశ్వరులకు ఈ ఆగ్నేయభస్మస్నానం మరీ విశేషంగా ఫలప్రదమవుతుంది.

భస్మస్నానం




Bhasmoddulanam - Smearing with sacred ash - భస్మోద్దూళనం

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - భస్మోద్దూళనం

కపిలగోవు పేడను నేలమీద పడకముందే పట్టుకోవాలి. ఒకవేళ నేలమీద పడిపోతే కడికి పైపేడనూ కిందపేడనూ వదిలేసి మధ్యలోది స్వీకరించాలి. అది దుర్గంధంతో ఉన్నా పుర్రుగా ఉన్నా మరీ గట్టిగా ఉన్నా పనికిరాదు. పట్టినపేడను ఇంటికి తెచ్చి చిట్టో పాట్టో కలిపి ముద్దలు చేసి ఎండబెట్టాలి. ఇదంతా ఆయా మంత్రాలతోనే చెయ్యాలి. హోమం చేసేటప్పుడూ భస్మం తీసేటప్పుడూ నియత మంత్రాలు పఠించాలి. నియమాలు శ్రద్ధగా పాటించాలి. కడిగి శుద్ధి చేసి తడిఆర్చిన గట్టిపాత్రలోకి కచికలు తీసి పరిశుభ్రవస్త్రం కప్పాలి. సమంత్రకంగా పరిమళద్రవ్యాలు కలపాలి. మంత్రయుక్తంగా పరిశుభ్రస్థలంలో భద్రపరచుకోవాలి. వెండి బంగారు కర్ర మట్టిపాత్రలు ఏవైనా పనికివస్తాయి. అందంగా శుభ్రంగా దృఢంగా ఉంటే చాలు. ధనవంతులైతే బంగారు పొత్రల్లోనే ఉంచుకోవచ్చు.

ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు విభూతిని స్వయంగా తీసుకువెళ్ళాలి. అనుచరులతోనైనా తెప్పించుకోవచ్చు. కానీ అశుచి చేతికి భస్మపాత్రను ఇవ్వకూడదు. అశుచి స్థలంలో ఉంచకూడదు. శరీరంలో నీచాంగాలకు తాకించకూడదు. పాత్రను విసరడం ఎగరవెయ్యడం దాటడం - ఇలాంటివి చెయ్యకూడదు. భక్తిశ్రద్ధలతో సమంత్రకంగా విభూతిని తయారుచేసుకోవాలి, రక్షించుకోవాలి, ధరించుకోవాలి. ఇది స్మృతులు చెప్పిన విభూతిధారణ విధానం. యథాతథంగా ఆచరించినవాడు శివుడితో సమానమవుతాడు.

శైవులు శివాలయాలలో సిద్ధం చేసుకున్న విభూతిని వైదికులు అడిగి తెచ్చుకోవచ్చు. భస్మాన్నేకాదు ఇచ్చిన వారినీ గౌరవించి పూజించాలి. తాంత్రికులు తంత్రమార్గంలో విభూతిని తయారుచేసుకొంటారు. ఒక వేళ ఎప్పుడైనా ఎక్కడైనా వాళ్ళు దాన్ని ఇవ్వజూపితే వైదికులు స్వీకరించకూడదు.

కానీ శూద్ర కాపాలిక పాషండాదులు ఇస్తే తీసుకోవచ్చు, ధరించవచ్చు. విభూతిని ఏనాడూ ఎవ్వరూ ఎట్టిపరిస్థితుల్గొనూ తిరస్కరించకూడదు. కించపరచకూడదు. అసలు అటువంటి ఊహలే రాకూడదు. కించపరిచినా విభూతిధారణను విడిచిపుచ్చినా పతితుడవుతాడు. త్రిపుండ్రధారణమూ దేహావగుంఠనమూ భక్తిశ్రద్దలతో మంత్రపూర్వకంగా రోజూ ముప్పొద్దులా చేసుకోవాలి. లేకపోతే మోక్షం లేదు. కోటిజన్మలెత్తినా భవబంధ విమోచనం కలగదు. విభూతి ధరించనివాడి జన్మ నిష్ఫలం. మరుసటి జన్మలో పందిగా పుడతాడు. త్రిపుండ్రాలంకరణ లేని మానవ శరీరం శ్మశానసదృశం. పుణ్యాత్ములు వాడిని చూడనేకూడదు. విభూతి లేని ఫాలమూ, శివాలయం లేని గ్రామమూ, ఈశ్వరార్చన లేని జన్మమూ, శివాశ్రయం కాని చదువూ(విద్య) పరమనింద్యాలు.

విభూతిని నిందిస్తున్నాడంటే శివుణ్ణి నిందిస్తున్నట్లే, ధరిస్తున్నాడంటే శివుణ్ణి ధరిస్తున్నట్లే. వస్తు సామగ్రి ఎంత పుష్కలంగా ఉన్నా సాధనసంపత్తి ఎంత అధికంగా ఉన్నా విభూతిలేని శివార్చన (అగ్ని లేని పర్వతంలా?) శోభించదుగాక శోభించదు. ఉద్దూళన త్రిపుండ్రధారణలు శ్రద్ధగా ఆచరించనివారికి పూర్వజన్మ సంచితపుణ్యాలన్నీ నశిస్తాయి. స్మార్తులు వేదోచితాచారాలను పాటిస్తూ వేదమంత్రాలతోనే త్రిపుండ్రధారణ చెయ్యాలి. లేనినాడు అనర్ధదాయకమవుతుంది. విభూతి పెట్టుకోనివాడు ఏ మంచిపని చేసినా అది చెయ్యనట్టే, ఏ పవిత్ర విషయం విన్నా అది విననట్టే, ఏ గొప్పవిద్య నేర్చినా అది నేర్వనట్టే. ఆతడి వేదాలూ యజ్ఞాలూ దానాలూ తపస్సులూ వ్రతాలూ పూజలూ ఉపవాసాలూ అన్నీ వృధా వృధా - భస్మధారణ చెయ్యకుండా ముక్తి కావాలని కోరుకోవడం విషం తాగినా బ్రతకాలనుకోవడం.

అసలు, సృష్టికర్త నొసలును సృష్టించడమే త్రిపుండ్రధారణకోసం. అందుకే అడ్డంగా విశాలంగా సృష్టించాడు. లేకపోతే గుండ్రంగానే సృష్టించి ఉండేవాడు. అదీగాక సహజసిద్ధంగానే నొసట అడ్డగీతలు ఉంటాయి. ఆవంకన నిత్యమూ జ్ఞాపకం చేస్తున్నాడు. అయినా విభూతి పెట్టుకోకపోతే పరమమూర్ఖులు గాక మరేమిటి!

నొసట తిర్యగ్రేఖలుగా విభూతి పెట్టుకోని విప్రుడు చేసే ధ్యానం ధ్యానమే కాదు, జ్ఞానం జ్ఞానమే కాదు, మోక్షం మోక్షమేకాదు, తపస్సు తపస్సేకాదు. వేదాధ్యయనానికి శూద్రుడు అధికారి కానట్టే త్రిపుండ్రధారణలేని విప్రుడు శివార్చనకు పనికిరాడు.

తూర్పుదిక్కుకి అభిముఖంగా నిలిచి కాళ్ళూ చేతులూ కడుక్కుని ఆచమించి ప్రాణాయామంచేసి సంకల్పం చెప్పుకుని భస్మస్నానం చెయ్యాలి. అగ్నిహోత్రంనుంచి పరిశుభ్రమైన విభూతిని తీసుకువి ఈశాన మంత్రంతో నెత్తిమీద జల్లుకోవాలి. పురుషమంత్రంతో నొసట దిద్దుకోవాలి. అఘోరమంత్రంతో హృదయం మీదా వామ మంత్రంతో గుహ్యప్రదేశంలోనూ సద్యోజాతమంత్రంతో కాళ్ళమీదా ప్రణవోచ్చారణతో సర్వాంగాలకూ అలంకరించుకోవాలి. అటుపైని ఉద్దూళనం చేసుకోవాలి. దీన్ని ఆగ్నేయక భస్మస్నానమంటారు. ఏ వైదికకర్మను ఆచరించాలన్నా ప్రారంభంలో ఇది చెయ్యాలి. తరవాత మళ్ళీ కాళ్ళూచేతులూ కడుక్కుని యథావిధిగా ఆచమించి లలాట హృదయ కంఠ ప్రదేశాలలో పంచబ్రహ్మమంత్రాలతో త్రిపుండ్రాలు ధరించాలి. అప్పటికి. కర్మానుష్ఠానానికి కావలసిన పవిత్రత సిద్దిస్తుంది. సత్కర్మలు ఫలిస్తాయి. లేకపోతే ఫలించవు. సత్య శౌచ జప హోమ తీర్థ దేవపూజాదులన్నీ వ్యర్థమే అవుతాయి. రుద్రాక్షలూ త్రిపుండ్రాలూ ధరించిన విప్రుడు దురిత - రోగ - దుర్భిక్ష - తస్కరభయాదుల్ని తొలగించగలుగుతాడు. అపునర్భవంగా బ్రహ్మత్వం పొందుతాడు. పంక్తి పావనుడు అవుతాడు. దేవవిప్ర పూజ్యుడవుతాడు. శ్రాద్ధ - యజ్ఞ - జప - హోమ - వైశ్వదేవ - సురార్చనల్లో విభూతిని ధరించినవాడు పూతాత్ముడు  మృత్యుంజయుడు.

భస్మధారణ మహిమ




Friday, July 31, 2026

Varieties of Bhasma - Bhasma Bhedalu - భస్మ భేదాలు

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - భస్మ భేదాలు

విరించిపుత్రా! శాంతిక పౌష్టిక కామదభేదాలతో ఈ భస్మం మూడు విధాలు. ఇది నీకు కుతూహలం కలిగించే విషయం. కనక వివరంగా చెబుతాను, ఆలకించు.

గోమయమంటే పరమపావనంకదా! మహాపాపక్షయకరమూ మహాకీర్తికరమూకదా! ఆ గోమయాన్ని - ఆవుతోక కిందభాగం నుంచి ఇవతలికి వచ్చీరాకుండానే - చేతితోనే స్వీకరించి యథావిధిగా బ్రాహ్మామంత్రాలతో(వేదమంత్రాలతో) హోమం చెయ్యగా సిద్ధించిన భస్మాన్ని శాంతికం అంటారు. గోమయాన్ని సావధానచిత్తుడై గ్రహించాలి. కిందపడకుండా మధ్యలోనే పట్టుకుని షడక్షరీమంత్రంతో హోమంచేస్తే సిద్ధించే విభూతిని పౌష్టికమంటారు. దాన్నే ప్రాసాదజపంతో (బీజాక్షరాలతో) హోమంచేస్తే వచ్చే భస్మాన్ని కామదమంటారు.

భస్మవ్రతపరుడు తెల్లవారుజామునే లేచి శుచియై గోశాలకు వెళ్ళి ఆవులకు నమస్కరించాలి. బ్రాహ్మణుడైతే తెల్ల అవుదీ, క్షత్రియుడైతే ఎర్ర ఆవుదీ, వైశ్యుడు పసుపురంగులో ఉన్న ఆవుదీ, శూద్రుడైతే కర్రిఆవుదీ పేడను తెచ్చుకోవాలి. పూర్ణిమనాడుగానీ అమావాస్యనాడుగాని అష్టమినాడుగానీ చిత్తశుద్ధితో ఈ పని చెయ్యాలి. తెచ్చాక ఆయా నిర్దిష్ట మంత్రాలు చదువుతూ చిట్టుగానీ పొట్టుగానీ(తుషేణ వా బుసైర్వాపి) కలుపుతూ ముద్దలు చేసి(చరిచి) శుచిప్రదేశంలో ఎండబెట్టాలి. అరణిని మథించి చేసిన అగ్నిగానీ శ్రోత్రియుల ఇంటినుంచి తెచ్చిన అగ్నిగానీ మంత్రపూర్వకంగా హోమకుండంలో వేసి ఈ పిడకలను పూర్వోక్త విధివిధానంగా హోమం చెయ్యాలి. అటు పైని కొత్తపాత్రను తెచ్చి ప్రాసాదమంత్ర పూర్వకంగా ఆందులోకి నింపాలి. చందన కాశ్మీరాది సుగంధద్రవ్యాలను కలపాలి. ఆ పాత్రను భద్రవరచుకోవాలి.

నిత్యమూ ముందుగా జలస్నానం చేసి తరవాత భస్మస్నానం చెయ్యాలి. జలస్నానానికి అశక్తుడైతే హస్తపాద ప్రక్షాళనం చేసుకుని ఈశానమంత్రంతో శిరస్సున చిలకరించుకోవాలి. తత్పురుషమంత్రంతో ముఖాన, అఘోరమంత్రంతో హృదయభాగాన, వామమంత్రంతో నాభిదేశాన, సద్యోమంత్రంతో సర్వాంగాలకూ విభూతి పెట్టుకోవాలి. దీన్ని భస్మస్నానం అంటారు. తరవాత పూర్వవస్త్రాన్ని విడిచి శుద్ధవస్త్రాన్ని ధరించాలి. హస్తపాదాలను మళ్ళీ కడుక్కొని ఆచమనం చెయ్యాలి. ఈ భస్మస్నానం కూడా చెయ్యలేనివారు త్రిపుండ్రధారణ చేస్తే చాలు. మధ్యాహ్నానికి ముందయితే విభూతిని తడిపి ధరించాలి. అటు పైని ఎవరైనాగానీ పాడిదే అలదుకోవాలి. తర్జన్యనామికామధ్యాంగుళులతో(బొటనవేలూ చిటికెనవేలూ కాక,మిగిలన మూడు వేళ్ళతో) త్రిపుండ్రంగా విభూతిని పెట్టుకోవాలి.

శిరస్సు లలాటం చెవులు కంఠం హృదయం బాహువులు - ఇవ్వి భస్మన్యాసానికి తావులని చెబుతారు. ప్రాసాదమంత్రం జపిస్తూ అయిదువేళ్ళతోనూ శిరస్సున జల్లుకోవాలి. శిరోమంత్రం పఠిస్తూ మూడువేళ్ళతో ఫాలభాగాన దిద్దుకోవాలి. సద్యోమంత్రంతో కుడిచెవికీ వామదేవమంత్రంతో ఎడమచెవికీ భస్మం అద్దాలి. అఘోరమంత్రం ధ్యానిస్తూ మధ్యవేలుతో కంఠంమీద, హృదయమంత్రాన్నే జపిస్తూ మూడువేళ్ళతోనూ హృదయంమిద, ఆలాగే మూడువేళ్ళతోనే శిఖామంత్రంతో దక్షిణబాహువుకీ, కవచ పఠనంతో వామబాహువుకీ విభూతిని అలంకరించాలి. ఈశానమంత్రం అంటూ మధ్యవేలితో నాభికి విభూతిని సోకించాలి. ఇదంతా తనకు తాను చేసుకోవచ్చు. లేదా గురువు శిష్యుడికి చెయ్యవచ్చు.

నొసట ధరించే త్రిపుండ్రాలు త్రిమూర్తులకు ప్రతీకలు. మొదటిరేఖ బ్రహ్మ మధ్యలోది విష్ణువు. ఆపైది మహేశ్వరుడు. ఒక్కవేలుతోనే పెట్టుకున్న విభూతి చుక్కకు ఈశ్వరుడే అధిదేవత.

నారదా! శిరోమధ్యంలో బ్రహ్మదేవుడూ, లలాటంలో శివుడూ చెవులకు అశ్వినీదేవతలూ కంఠస్థానంలో గణేశుడూ విభూతికి అధిష్టానదేవతలు. క్షత్రియ వైశ్య శూద్రులకు భస్మధారణమే తప్ప భస్మోద్దూళనం పనికిరాదు. తక్కిన జాతులవారు అందరూ అమంత్రకంగా విభూతి పెట్టుకోవచ్చు.

బ్రహ్మనందనా! అతిగోప్యమయినప్పటికీ సర్వకామఫలప్రదం కనక భస్మోద్దూళనఫలం ఏమిటో నీకు ఉపదేశిస్తున్నాను, శ్రద్ధగా గ్రహించు.

భస్మోద్దూళనం




Bhasmadharana - Sirowratham - భస్మధారణ - శిరోవ్రతం

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - భస్మధారణ - శిరోవ్రతం

నారదా! భస్మధారణకే శిరోవ్రతమని పేరు. దీన్ని ఆచరించినవారికే పరావిద్యకు అధికారం. విధివిధానంలో శ్రద్ధగా ఈ శిరోవ్రతాన్ని ఆచరించాలి. దీన్ని ఆచరించకుండా శ్రౌతస్మార్త సమాచారం ఎంత తెలుసుకున్నా అనుపకారకమే. శిరోవ్రతాచరణం వల్లనే బ్రహ్మాదులు దేవతలు కాగలిగారు. దీని మాహాత్మ్యాన్ని త్రిమూర్తులుకూడా పూర్తిగా వర్ణించి చెప్పలేరు. అధర్వణవేదంలో శిఖరాయమాణంగా చెప్పబడ్డ గొప్ప వ్రతమిది. ఇంతకన్నా గొప్ప వ్రతం మరొకటి లేదంటే లేదు. శాఖాభేదాలనుబట్టి ఈ వ్రతానికి చాలా పేర్లున్నాయి. పేరులూ దారులూ వేరైనా వస్తువు ఒక్కటే. శివాఖ్యం. సత్యచిద్ఘనం. కనక దీన్ని అందరూ ఆచరించాలి. ఎన్ని శాస్త్రాలూ ఎన్ని విద్యలూ నేర్చినా శిరోప్రత విహనుడైనట్టయితే అతడు సర్వధర్మ విహినుడికిందే లెక్క. ఇది పాపకాంతారదాహకం. సర్వవిద్యాసాధకం. నిత్యమూ ఆచరించాలని అధర్వణ శ్రుతి స్పష్టంగా చెబుతోంది.

ఆగ్నిరిత్యాది మంత్రాలు ఆరింటితో శుద్ధిచేసిన భస్మాన్ని శరీరంలో సర్వాంగాలకూ నిండా పులుముకోవాలి. సంగ్రహంగా శిరోవ్రతమంటే ఇదే.

సంధ్యాసమయాల్లో విద్యారంభాల్లో తప్పకుండా చెయ్యాలి. పన్నెండు రోజులనుంచి పన్నెండేళ్ళ వరకూ ఎంతకాలమైనా ఈ వ్రతాన్ని సంకల్పించుకోవచ్చు. కనిష్ట - గరిష్ట పరిమితులు మాత్రం అవ్వి. శిరోవ్రతస్నాతుడికి విద్యలనుగానీ మంత్రాలనుగానీ ఉపదేశించనివాడు ఆ విద్యల్ని కోల్పోతాడు. గురుశబ్దానికి అనర్హుడవుతాడు.

బ్రహ్మవిద్యాగురువంటే సాక్షాత్తూ పరమేశ్వరుడు. మునీశ్వరుడు. పరమదయామయుడై ఉండాలి గదా! వేనవేల జన్మల్లో ధర్మాచరణం చేసినవారికిగానీ బ్రహ్మవిద్యపట్ల శ్రద్ధకలగదు. కోరిక పుట్టదు. అందుచేత శిరోవ్రతం అనుష్ఠించి బ్రహ్మవిద్యను అభ్యర్థించినవారిని ఏ గురువూ తిరస్కరించకూడదు. ద్వేషించకూడదు. ద్వేషం ఎప్పుడూ అజ్ఞానసంభవమే. అతడికి ఆత్మజ్ఞానం లేదని అర్థం. ఇది గురుశిష్యులిద్దరికీ వర్తించేమాట.

శిరోవ్రతస్నాతులే బ్రహ్మవిద్యోపదేశానికి సాక్షాదధికారులు. మరింకెవ్వరూ కారు. ఈ ప్రతంతో అంతర్గతమైన పశుత్వాన్ని వదిలించుకోవాలి. పాశుపతుడు కావాలి. అటువంటివారికే బ్రహ్మవిద్యను ఉపదేశించాలని వేదానుశాసనం.

సతారమైన త్రియంబకమంత్రాన్ని జపిస్తూ త్రిపుండ్రాలుగా భస్మధారణ చేస్తే సరిపోతుందని జాబాలుల మతం. గృహస్థులు ఇలా చేస్తే చాలుననీ ఓంకారయుక్తంగా హంసమంత్రాన్ని ముమ్మారు ఉచ్చరిస్తూ త్రిపుండ్రాలను నిత్యమూ ధరించడం భిక్షుకులకు కర్తవ్యమనీ జాబాలికీశ్రుతి చెబుతోంది. సప్రణవమూ సశివమూ అయిన త్రియంబకమంత్రంతోనే గృహస్థులేకాదు వానప్రస్థులూ త్రిపుండ్రాలుగా భస్మధారణ చెయ్యాలి. మేధావీత్యాది మంత్రంతోకూడా బ్రహ్మచారి తడిపిన భస్మాన్ని త్రిపుండ్రాలుగా ధరించవచ్చు. ఏమైనా బ్రాహ్మణుడికి నొసట నిత్యమూ భస్మావగుంఠనం ఉండాలి, అప్పుడే బ్రాహ్మాణుడనిపించుకుంటాడు.

సన్యాసాశ్రమం స్వీకరించినవారు సతారమైన త్రియంబకమంత్రంతోగానీ పంచాక్షరితోగానీ ప్రణవంతోగానీ నొసటా హృదయంమిదా బాహువులపైనా విభూతిని త్రిపుండ్రాలుగా ధరించాలి. బ్రహ్మచారులు మేధావీత్యాది మంత్రంతోగానీ త్రియాయుష మంత్రంతోగానీ ధరించాలి. గౌణభస్మమైనా ధరించవచ్చు. శూద్రులు శివాయనమః అనే మంత్రంతో త్రిపుండ్రాలను ధరించాలి. మిగిలినవారికి ఏ మంత్రమూ అవసరంలేదు. భక్తితో భస్మోద్దూళనం చేసుకుంటే చాలు. విభూతిధారణచేస్తే సమస్తవిభూతులూ(ఐశ్వర్యాలూ) కలుగుతాయి. ఇది సర్వధర్మాలలోకీ వరేణ్యం. కనక నిత్యమూ ఆచరించాలి.

అగ్నిహోత్రంనుంచిగానీ విరజామంత్రహోమాగ్నినుంచిగానీ ఆవిర్భవించిన భస్మాన్ని ఒక శుభ్రమైన పాత్రలోకి తీసుకోవాలి. కాళ్ళూ చేతులూ కడుక్కుని రెండుసార్లు ఆచమించి సమాహితచిత్తంతో పంచబ్రహ్మ మంత్రాలను చదువుతూ భస్మాన్ని మెల్లమెల్లగా కలపాలి. (ఈ మంత్రాలతోనే భస్మాన్ని పాత్రలోకి తియ్యాలని కొందరు) ముమ్మారు ప్రాణాయామంచేసి అగ్నిరిత్యాది మంత్రాలు ఏడింటితో మూడుసార్లు. అభిమంత్రించాలి. ఓమాపోజ్యోతిరిత్యాది మంత్రాలను పఠిస్తూ ఆ తెల్లని విభూతిని శరీరంమీద శీర్షాదిపాదపర్యంతం జల్లుకోవాలి. ఇలా చేసినవాడు విపాపుడూ విరజుడూ అవుతాడనడంలో ఏ సందేహమూ లేదు. అటుపైని జలాధిపుడైన జగన్నాథుణ్ణి శ్రీమహావిష్ణువును ధ్యానించి విభూతిలో నీటిచుక్కలు వేసి అగ్నిరిత్యాది మంత్రాలను మళ్ళీ పఠిస్తూ తడపాలి. అప్పుడు పార్వతీపరమేశ్వరులను ధ్యానిస్తూ బ్రహ్మచర్యాది ఆశ్రమాలకు నిర్దిష్టమైన ఆయా మంత్రాలను పఠిస్తూ ముందు శిరస్సున ధరించి, నొసటా హృదయానా బాహువులపైనా తిపుండ్రరేఖలుగా ధరించాలి. మధ్యమానామికాంగుష్ఠాలతో అనులోమ విలోమ మార్గాల్లో - త్రిసంధ్యల్లోనూ నిత్యమూ - భస్మత్రిపుండ్ర ధారణ చెయ్యాలి.

నారదా! ఆజ్ఞానధ్వంసకమూ జ్ఞానసాధకమూ అయిన ఈ విభూతి ఆగ్నేయమనీ గౌణమనీ రెండువిధాలు. ఇందులో మళ్ళీ గౌణం చాలా రకాలు. అగ్నిహోత్రభస్మం, విరజానలభస్మం, ఔ పాసనభస్మం, సమిదగ్నిభస్మం, పచనాగ్నిభస్మం, దావానలభస్మం - ఇవన్నీ గౌణాలు. బ్రాహ్మణ క్షత్రియవైశ్యులకు అగ్నిహోత్ర భస్మంగానీ విరజానలభస్మంగానీ ధరించదగినవి. ఔ పాసనాగ్నిభస్మాన్ని గృహస్థులకు విశేషంగా చెప్పారు. బ్రహ్మచారులు సమిదగ్నిభన్మం ధరించాలి. శూద్రులు శ్రోత్రియుల ఇళ్ళనుంచి పచనాగ్నిభస్మం తెచ్చుకుని ధరించాలి. తక్కినవారందరూ దావానలభస్మాన్ని ధరించాలి.

ఇంక శిరోవ్రతదీక్షావిధానమేమంటే - పూర్ణిమాతిథి మంచిది. స్వగృహంలోగానీ ఆరామంలోగానీ అరణ్యంలోగానీ దీక్ష తీసుకోవచ్చు. ఇవి ప్రశస్తాలు. శుభప్రదాలు. పూర్ణిమకు ముందటి త్రయోదశినాడు సుస్నాతుడై అగ్నికార్యం నిర్వర్తించి గురువును పూజించి పాదాభివందనం చేసి అనుమతి పొందాలి. అటు పైని వైశేషికపూజ నిర్వహించి పరిశుభ్రమైన తెల్లని వస్త్రాలు ధరించాలి. కొత్త యజ్ఞోపవీతం వేసుకోవాలి. తెల్లనిపూలు దండగుచ్చి ధరించాలి. మంచిగంధం అలంకరించుకోవాలి. దర్భాసనంమిద దర్భలు చేతబట్టి కూర్చోవాలి. తూర్పుముఖంగాగాని ఉత్తరముఖంగాగానీ కూర్చుని ముమ్మారు ప్రాణాయామం చెయ్యాలి. పార్వతీపరమేశ్వరులను ధ్యానించి వారికి విన్నపం చేసుకోవాలి. నేను ఈ వ్రతం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి. అప్పటికి వ్రతదిక్షితుడైనట్టు లెక్క. ఈ శిరోవ్రతం జన్మాంతంవరకూగానీ, పన్నెండేళ్ళపాటుగానీ ఆరేళ్ళపాటుగానీ మూడేళ్ళపాటు గానీ ఏణ్ణర్థంగానీ ఏడాదిగానీ ఆరునెలలుగానీ మూడునెలలుగాని నెలనాళ్ళేగానీ పన్నెండురోజులేగానీ ఆరురోజులేగానీ మూడునాళ్ళేగానీ ఆధమపక్షం ఒకరోజుగానీ చెయ్యవచ్చు. ఓపికను బట్టీ వీలునిబట్టీ సంకల్పావధిని నియమించుకోవచ్చు. విరజాహోమం చేసే అగ్నిని తెచ్చి ఆజ్యంతో సమిధలతో చరువుతో యథావిధిగా మంత్రయుక్తంగా హోమం చెయ్యాలి.

దీక్ష తీసుకునే రోజుకి ముందుగానే (పూతాహాత్పురతః 10-15) భూతశుద్దిని ఆకాంక్షించి మళ్ళీ సమిధలతో ఆజ్యంతో మంత్రాలతో హోమం చెయ్యాలి. నా దేహంలో ఈ తత్త్వాలు శుద్దిపాందుగాక అని స్మరిస్తూ హోమక్రియ సాగించాలి. పంచభూతాలూ పంచతన్మాత్రలూ పంచకర్మేంద్రియాలూ
పంచజ్ఞానేంద్రియాలూ పంచప్రాణవాయువులూ సప్తధాతువులూ సత్త్వరజస్తమోగుణాలూ మనోబుద్ధ్యహంకారాలూ ప్రకృతిపురుషులూ రాగమూ విద్య కళ నియతి కాలమూ మాయ శుద్ధవిద్య మహేశ్వరసదాశివులూ శక్తి శివతత్త్వమూ - వీటిని తత్త్వాలు అంటారు. వీటి శుద్ధిని ఆకాంక్షించి విరజామంత్రాలతో హోమంచేస్తే మానవుడు శుద్ధిపాంది విరజుడు అవుతాడు.

అటుపైని ఆవుపేడ తెచ్చి ముద్దలు చేసి అభిమంత్రించాలి. హోమాగ్నికుండంలో వేల్చి రోజంతా సంరక్షించాలి. హవిష్యంమాత్రమే భుజించి అగ్నికుండాన్ని చూసుకుంటూ ఉండాలి. చతుర్దశీ సుప్రభాతాన హోమక్రియలన్ని యథావిధిగా నడిపి ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. నిరాహారుడుగా గడపాలి. పూర్ణిమనాడు ప్రాతఃకాలంలో మళ్ళీ యథావిధిగా హోమం చెయ్యాలి. హోమాంతంలో రుద్రాగ్నిని ఉపసంహరించాలి. హోమకుండంనుంచి శ్రద్దగా పద్ధతిగా భస్మం తీసుకోవాలి. అప్పుడు ముండితుడో జటిలుడో శిఖావంతుడో అయ్యి స్నానం చెయ్యాలి. సిగ్గుపడనివాడైతే దిగంబరంగానూ, సిగ్గుపడేవాడైతే కాషాయాంబర చర్మాంబర వల్కలాలలో ఏదో ఒకటి కట్టుకోవాలి. ఏకాంబరుడే కావాలి. మొలనూలు చుట్టుకోవాలి. దండం పట్టుకోవాలి. కాళ్ళు కడుక్కుని రెండుసార్లు ఆచమించి ఆత్మనూ శరీరాన్నీ సంకలీకరించి విరజానలసంభవమైన ఆ భస్మాన్ని అగ్నిరిత్యాదికమైన ఆధర్వణమంత్రాలను ఆరింటిని చదువుతూ మూర్ధాదిచరణాంతంగా అన్ని అవయవాలకూ పులుముకోవాలి. అదే క్రమంలో భస్మంతో సముద్దూళనం చేసుకోవాలి. ప్రణవాన్నో శివనామాన్నో జపిన్తూ ఈ పని చెయ్యాలి. ఆ తరవాత త్రియాయుషమంత్రంతో త్రిపుండ్రాలు ధరించాలి. శివభావాన్ని పాంది శివభావాన్ని ఆచరించాలి. అనునిత్యమూ ముప్పాద్దులా ఇలా చేస్తే అది పాశుపతవ్రతమవుతుంది. ఇది పశుత్వాన్ని తొలగించడంతో పాటు భుక్తిముక్తి ప్రదమవుతుంది. ఇలా పాశుపతవ్రతంచేసి పశుత్వాన్ని తొలగించుకున్న మహానుభావుడు సాక్షాత్తూ మహాదేవుడూ లింగమూర్తీ సదాశివుడుగా పూజనీయుడు అవుతాడు.

నారదా! భస్మస్నానంవల్ల కలిగే మహాపుణ్యం సర్వసౌఖ్యకరం. ఆయురారోగ్యభోగభాగ్యబల పుష్టివర్ధనం. రక్షణకోసం మంగళార్థం సర్వసంపత్పమృద్ధికోసం మృత్యుభయ మహామారీభయ నివారణకోనం మనుష్యులు ఈ భస్మస్నానం చెయ్యాలి.

భస్మ భేదాలు




Bhuthasuddi - Purification of the elements - భూతశుద్ది

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - భూతశుద్ది

నారదా! సదాచారంలో భాగంగా ఇప్పుడు భూతశుద్ది గురించి చెబుతున్నాను. శ్రద్దగా ఆలకించు. మూలాధారచక్రం నుంచి మేల్కొని సుషుమ్నామార్గంద్వారా బ్రహ్మరంధ్రానికి చేరుకునే కుండలినీ పరదేవతను ఒక్కసారి స్మరించు. సాధకుడు హంసమంత్రంతో జీవుణ్ణి బ్రహ్మలో అనుసంధిస్తాడు. శరీరంలో పాదాది జానుపర్యంతం - భూమండలం. అది చతుష్కోణం. సవజ్రకం. లం బీజాఢ్యం. స్వర్ణవర్ణం. జాన్వాది నాభిపర్యంతం - జలమండలం. అది చంద్రార్దనిభం. పద్మద్వయాంకితం, వం బీజయుక్తం. శ్వేతవర్ణం. నాభిమొదలు హృదయపర్యంతం - అగ్నిమండలం. అది త్రికోణం. స్వస్తికాన్వితం. రం బీజయుక్తం. రక్తవర్ణం. హృదయం నుంచి భ్రూమధ్యపర్యంతం - వాయు మండలం. అది వృత్తాకారం. షడ్బీందులాంఛితం. యం బీజయుతం. ధూమ్రువర్ణం. భూమధ్యనుంచి బ్రహ్మరంధ్రపర్యంతం - ఆకాశమండలం. అదీ వృత్తాకారం. స్వచ్చం. మనోహరం. హం బీజయుక్తం. ఇలా ఒక్కొక్కమండలాన్నీ ప్రత్యేకంగా భావించి ఒకదానిలో ఒకటి నింపాలి. భూమిలో జలం, జలంలో అగ్ని, అగ్నిలో వాయువు, వాయువులో ఆకాశం నింపి, ఆకాశాన్ని అహంకారంలో, అహంకృతిని మహత్తత్త్వంలో, మహత్తత్త్వాన్ని ప్రకృతిలో, ప్రకృతిని మాయలో, మాయను ఆత్మలో అంతర్భవింపజెయ్యాలి. అప్పుడు సాధకుడు శుద్ధ సంవిన్మయుడవుతాడు. అయ్యాక - వామకుక్షిలో ఉండే పాపపురుషుణ్ణి స్మరించాలి. నల్లగా ఆంగుష్ఠపరిమాణంలో ఉంటాడు. బ్రహ్మహత్య శిరస్సుగా, సువర్ణస్తేయం బాహువులుగా, మదిరాపానమే హృదయంగా, గురుపత్నీ సంగమమే కటి ప్రదేశంగా, పాతకి స్నేహాలు పాదద్వయంగా, ఉపపాతకాలు మస్తకంగా ఖడ్గచర్మధరుడై అధోముఖుడై దుస్సహంగా ఉంటాడు పాపపురుషుడు. వాయుబీజ స్మరణతో మహావాయువును సృష్టించి ఈ పాపవురుషుణ్ణి ఎండగట్టాలి. వహ్నిబీజాన్ని స్మరించి మంటల్లో దహించివెయ్యాలి. ఆ బూడిదను కుంభకం ద్వారా స్వశరీరంనుంచి వెలుపలికి నెట్టి, వాయుబీజ రేచనతో పోగుపెట్టి, సుధాబీజ స్మరణతో తడిపి భూబీజస్మరణతో ముద్దచేసి, ఆకాశబీజస్మరణతో ఆ బంగారుముద్దను అద్దంలా విశుద్దిపరచి మూర్ధాదిపాదపర్యంతం అన్ని అవయవాలకూ పులుముకోవాలి.

అటుపైని ఆ భస్మం నుంచి ఆకాశాది పంచభూతాలనూ పునరుత్పాదన చేసి సో హం మంత్రోచ్చారణతో ఆత్మను హృదయాంబుజంలోకి తీసుకురావాలి. పరసంగంనుంచి సుధామయమైన కుండలినీ జీవాన్ని తెచ్చి హృదయాంభోజంలో సంస్థాపించి, మూలాధారంలో ఉండే శక్తిని ధ్యానించాలి. ఎర్రసముద్రంలో తెప్పలాగా(తెప్పమిద) ఉన్న అరుణ సరోజంమీద కూర్చుని, హస్తపద్మాలలో శూలమూ, తుమ్మెదలే ఆల్లెత్రాడుగాగల చెరకువిల్లూ, ఆంకుశమూ అయిదుబాణాలూ ఒక రక్తకపాలమూ ధరించినదీ, మూడు కన్నులుకలదీ, బలిష్ఠమైన వక్షోజాలు కలదీ, ఉదయిస్తున్న సూర్యబింబపు రంగులో ప్రకాశించేదీ ఆ మహాదేవి ఆ పరాంబిక ఆ ప్రాణశక్తి మాకు సుఖప్రద అగుగాక!

పరమాత్మ స్వరూపిణి ఆ ప్రాణశక్తిని ఇలా ధ్యానించి విభూతిని ధరించాలి. విభూతిని ధరిస్తేనే వైదిక సత్కర్మాచరణకు అర్హత అధికారం సిద్ధిస్తుంది. శ్రుతి స్మృతి పురాణాలు చెప్పిన ప్రకారం విభూతిని ఎలా ధరించాలో ఏ మహాఫలాలు లభిస్తాయో అదికూడా తెలియజేస్తాను. తెలుసుకో.

భస్మధారణ - శిరోవ్రతం




Tripundra Vibhuti Mahima - Durvasudi Katha - The Glory of Tripundra Vibhuti – The Story of Durvasa - త్రిపుండ్ర విభూతి మహిమ - దూర్వాసుడి కథ

త్రిపుండ్ర విభూతి మహిమ - దూర్వాసుడి కథ నారదా! ఇక్కడొక ఇతిహాసం నీకు చెప్పాలి. ఒకప్పుడు దూర్వాసుడు శరీరంనిండా విభూతి ఆలంకరించుకుని రుద్రాక్షమా...