Monday, February 16, 2026

Vidura Went on a long Theerthayathra - విదురుండు తీర్థయాత్రసేయుట

విదురుండు తీర్థయాత్రసేయుట

పాండురాజకుమారులైన ధర్మరాజాదులు బాహువిక్రమంతో ధృతరాష్ష్రుని కొడుకులైన దుర్యోధనాదులను రణరంగంలో జయించారు. స్వచ్చమైన శరత్కాలపు పండు వెన్నెలలాంటి అఖండకీర్తిని ఆర్జించారు. అటువంటి యశస్సు అనే పూలమొగ్గలతో కౌరవరాజ్యలక్ష్మిని అలంకరించారు. ఈవిధంగా వారు విజయోల్లాసంతో రాజ్యపాలనం సాగించారు.

రాజా! యుద్దానికి ముందే విదురుడు విరక్తితో అడవికి వెళ్ళిపోయాడు. అక్కడ మునులందరూ కీర్తించే విధంగా తపస్సు చేసేవాడు, మంచి గుణాలకు విధేయుడై ఉండేవాడు అయిన మైత్రేయమహర్షిని దర్శించాడు.

ఆ మైత్రేయుని దర్శించి, ఆయన పాదాలకు తన నుదురు తగిలే విధంగా నమస్కరించి అడుగుతున్నాడు. మహర్షి! ప్రపంచాన్ని పవిత్రంచేసే ఆదర్శప్రాయమైన నడతతో అందరి ప్రశంసలు అందుకొనే శ్రీకృష్ణుడు పాండవుల మేలు కోరుకొన్నవాడై హస్తినాపురం చేరుకొని, అక్కడ కురుకులశ్రేష్టుడైన దుర్యోధనుని మందిరానికి వెళ్లలేదు.

భక్తవత్సలుడైన కృష్ణుడు దుర్యోధనుని మందిరానికి వెళ్ళక మా ఇంటికి అతిధిగా రావటానికి గల కారణం దయచేసి నాకు చెప్పవలసిందని విదురుడు మైత్రేయుని అడిగాడని శుకమహర్షి పరీక్షిన్మహారాజుకు చెప్పాడు. అలా చెప్పగా,

విదురుడు మైత్రేయుని అడిగిన విషయం విని పరీక్షిత్తు ఆశ్చర్యపోయాడు. అపుడా రాజు తనకు భాగవతకథను వినిపిస్తున్నవాడు, స్వచ్చమైన మనస్సు కలవాడు, అలసత ఎరుగనివాడు, సముద్రాన్ని చంద్రునివలె మునిజనుల మనస్సును పొంగించేవాడు, అసాధారణమైన హరిభక్తి కలవాడు అయిన శుకయోగీంద్రుని ఇలా అడిగాడు.

అటువంటి శుకయోగీంద్రుణ్ణి చూచి, పరీక్షిత్తు పలుకుతున్నాడు. మహార్షీ
! పుణ్యాత్ముడైన విదురుడు ఏయే రహస్య విషయాలను అడిగాడు? మైత్రేయముని ఏమని చెప్పాడు? ఇంకా విదురుడు ఏ విధంగా పుణ్యనదులలో స్నానాలు చేశాడు? ఎక్కడ తిరుగుతూ ఉండినాడు? 

స్వచ్చమైన మనస్సు కలిగి, విశేషమైన దయతోకూడిన విష్ణుమూర్తి పాదపద్మాలపై వ్రాలే తుమ్మెదవంటివాడవినీవు. గొప్ప గుణాలతో పాపాలనే చీకట్లను పోగొట్టే సూర్యునివంటివాడవైన ఓ శుకమునీ! నేనడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పండి. జ్ఞానార్థినైన నన్ను కృతార్థుని చేయుమని పరీక్షిత్తు శుకమునిని ప్రార్ధించాడు.

పరీక్షిత్తు అలా అడగ్గానే, శుకయోగీంద్రుడు చెపుతున్నాడు. రాజా! ధృతరాష్ట్రుడు తన పిల్లలను గారాబంగా పెంచుతున్నాడు. ఇదిలా ఉండగా ఆకస్మికంగా పాండురాజు మరణించటంతో తన తమ్ముని పిల్లలుకూడా పెదతండ్రియైన ఆ ధృతరాష్ట్రునే ఆశ్రయించి, ఆయన పంచకు చేరారు.

ఇలా వచ్చిన పాండవుల శౌర్యపరాక్రమాది విషయంలో అసూయాగ్రస్తులైన దుర్యోధనాదులు.

కౌరవులు వంకరబుద్ధి కలిగినవారై ధర్మమార్గం తప్పి పాండవులకు విషాన్నం పెట్టారు. త్రాళ్ళతో బంధించారు. గంగానదిలోకి నెట్టేశారు. రాజ్యంనుండి వెడలగొట్టారు.


లక్క ఇంటిలో పాండవులు నిద్రపోతుండగా వారిని చంపడమే పనిగా పెట్టుకొన్న దుర్మార్గులైన కౌరవులు ఆ ఇంటికి దారుణంగా నిప్పు పెట్టారు.

వివేకం కలవారంతా ప్రశంసించిన రాజసూయయాగంలో అపభృథమనే యాగాంతస్నానం చేయడంచేత పరమపావనమైన ద్రౌపదీదేవియొక్క అందమైన, దట్టమైన జుట్టు పట్టుకొని దుర్మార్గంగా కౌరవులు ఆమెను రాజసభలోకి ఈడ్చుకు వచ్చారు.

కౌరవులు పాండవులకు అపకారం చెయ్యని రోజంటూ లేదు. పుట్టినది మొదలు వారు అలా దురాగతాలను చేస్తున్నా ఏనాడూ ఇది తప్పని గ్రుడ్డివాడైన తమ తండ్రి వారిని మందలించలేదు.

మోసంతో జూదంలో పాండవులను ఓడించారు. వారి రాజ్యభాగాన్ని అన్యాయంగా ఆక్రమించారు. అడవులకు పంపించేశారు. వారు అలాగే అడవులకు పోయి, పదమూడేండ్ల గడువును పూర్తి చేసికొని, తిరిగి వచ్చి వారి రాజ్యాన్ని తిరిగి ఇమ్మంటే అంగీకరించలేదు.

కౌరవులు రాజ్యభాగాన్ని ఇవ్వకపోవడంచేత ధర్మరాజు సకలసృష్టికి నియంత, అందరికీ దిక్కైనవాడు, ఆశ్రితులకు పారిజాతంవంటివాడు, అంతంలేనివాడు, అంతులేని శక్తి కలవాడు, నందకమనే ఖడ్గాన్ని ధరించినవాడు, పద్మాలవంటి కన్నులు కలవాడు అయిన శ్రీకృష్ణుని రాయబారిగా పంపించాడు. అకళంకమైన భక్తికి మాత్రమే వశమయ్యై మనసు కలవాడైన వాసుదేవుడు ధర్మజుని పంపున ధృతరాష్షునివద్దకు

మహారాజా! అలా వెళ్ళిన వాసుదేవుడు అక్కడ భీష్ముడు, ద్రోణుడు, వాని కుమారుడైన అశ్వత్థామ, కృపాచార్యుడు, ఇంకా ఎందరో రాజులు విని అంగీకరించే విధంగా ధృతరాష్టమహారాజుతో ఇలా పలికాడు.

మహారాజా! (శ్రీకృష్ణుడు చెపుతున్నాడు) నీకు నీ కుమారులు, నీ తమ్ముని కొడుకులైన పాండవులు ఇరువురూ వేరు కాదు. ఒకలాంటివారే. అందువల్ల నీ కొడుకులను ఏదోవిధంగా ఒప్పించి, పాండవుల రాజ్యభాగాన్ని వారికి ఇచ్చినట్లయితే, రెండు పక్షములు హాయిగా బ్రతికి బట్టకట్టును.

శ్రీకృష్ణుడు ధర్మమార్గంలో చెప్పిన మాటలు కౌరవులకు చెవికి ఎక్కలేదు. అందువల్ల నీతికోవిదుడైన విదురుణ్ణి ఆ సభకు రప్పించుమన్నాడు వాసుదేవుడు. అప్పుడు విదురుడు ఆ సభకు చేరుకొన్నాడు.

విదురుడు కౌరవసభకు వచ్చాడు. అంతవరకు ఏమి జరిగిందో భీష్మాదులద్వారా తెలిసికొన్నాడు. అప్పుడు కౌరవపతితో ఇలా అంటున్నాడు.

కురుకుల శ్రేష్ఠుడవైన ఓ ధృతరాష్టమహారాజా! పాండురాజు ఎవరో కాదు, నీ తమ్ముడు. అందువల్ల అతని కుమారులకు చెందిన రాజ్యభాగం పంచి ఇవ్వటం ధర్మమూ, న్యాయమూ కూడ. అలా చేస్తే నీ వంశం అచంచలమైన గొప్ప సుఖాన్ని పొందుతుంది. మీ ఉభయులు కలసి మెలసి ఉండటంవల్ల శత్రువులవరూ మీవంక కన్నెత్తి చూడలేరు. అదీగాక అలా చేస్తే గోపాలచూడామణియైన శ్రీకృష్ణునికి ఆనందం కలిగించినవారౌతారు. అది చాలా క్షేమదాయకం.

రాజా! నీ తమ్ముని కొడుకులకు వారి తండ్రి భాగాన్ని పంచి ఇయ్యి. నీ భాగాన్ని నీ కొడుకులందరికీ పంచిపెట్టు. పట్టుదలకు పోకుము. మంచిబుద్ధితో ప్రవర్తించి, వంశాన్ని నిలబెట్టుము.

రాజా! నామాట విను. వెయ్యిమాటలు చెప్పనవసరం లేదు. నీ కొడుకుల పేర్లు వింటేనే చాలు, భీముడు తోక త్రొక్కిన త్రాచువలె మండిపడుతున్నాడు. ఇదంతా ముందే నీకు చెప్పాను. ఎలాగైనా నీ కుమారులకు వాని చేతిలో చావు తప్పదు.

అంతే కాకుండగా

రాజా! నీ కొడుకుల వీరత్వం, భీష్మద్రోణకృపుల భుజబలం, కర్ణుని ప్రేలాపనలు ఇవన్నీ నిజమే అనుకొంటున్నావా? అలా అయితే నేను చెప్పేది విను.

మహారాజా! ఏ పరమేశ్వరుని అనుగ్రహంవల్ల ఈ లోకాలు స్థావరజంగమాలతో కూడి ప్రకాశిస్తున్నాయో; బ్రహ్మ, శంకరుడు మొదలైన దేవతలు, మహర్షులూ అందరూ ఏ ప్రభువు దివ్యకళలనుండి జన్మించారో; ఎవ్వడు అనంతుడో; ఎవ్వడు అచ్యుతుడో; ఆ పురుషోత్తముడే దయాపయోనిధి అయిన శ్రీకృష్ణుడు.

అటువంటి జగన్నివాసుడు, మురాసురుని చంపినవాడు, పరాపరస్వరూపుడు (సర్వశ్రేష్ఠుడు) అయిన శ్రీకృష్ణుడు పాండవులకు స్నేహితుడై, వియ్యంకుడై, బంధువై, గురుడై, ప్రభువై ఎంతో ప్రేమతో ఎల్లపుడూ కాపాడుతుంటాడు కదా! అటువంటి పాండవులను కనీసం వ్రేలెత్తి చూపించేందుకు ఎవరికైనా సాధ్యమవుతుందా?

అందువల్ల పాండవులను బాధపెట్టకుండా వారి రాజ్యభాగాన్ని వారికి ఇచ్చి, దేశాన్ని కులాన్ని కుమారులను, మిగిలిన బంధువర్గాన్ని రక్షించు. అలా కాకుండా లోభియైన దుర్మార్డుడైన దుర్యోధనుని మాట విన్నాా ఉదాసీనంగా వ్యవహరించినా దానివల్ల కులనాశం, బంధునాశం కూడా జరుగుతుంది.

మహారాజా! ఒక్కడికోసం మొత్తం వంశాన్ని పాడు చేసుకుంటావా? ఇది న్యాయమేనా? నా మాట విని, ఈ దుర్యోధనుణ్ణి విడిచిపెట్టి నీ కులాన్ని ఈ దేశాన్ని నీ పరువును, ప్రతిష్టను కాపాడుకో.

విదురుడు అలా చెప్పేసరికి దుర్యోధనుడు కోపంతో ఊగిపోయాడు. తనను తాను మరచిపోయాడు. వెంటనే కర్ణుణ్ణి, శకునిని, దుశ్శాసనుణ్ణి చూచి ఇలా అన్నాడు.

కర్ణశకుని దుశ్శాసనులారా! ఈ దాసీపుత్రుడు ఏదీ పట్టనట్లుగా ఒకమూల కూర్చోదగినవాడు. ఇతనిని ఇక్కడకు ఎందుకు రానిచ్చారు. వచ్చినవాడు మౌనంగా కూర్చోకుండా నోటికి వచ్చినట్లు ప్రేలుతున్నాడు. వెంటనే ఇతనిని బయటకు గెంటివేయండి అన్నాడు దుర్యోధనుడు.

ఈ విధంగా దుర్యోధనుడు అహంకారంతో మాట్లాడిన మాటలకు ఎంతో మానసిక వ్యధను అనుభవించాడు విదురుడు. వెంటనే ఆలోచించాడు. ధైర్యం వహించాడు. మరొకమాట మాట్లాడకుండా, విల్లమ్ములు అక్కడే విడిచిపెట్టి, కోపాన్ని అణచిపెట్టుకొని, అడవికి వెళ్ళిపోయాడు.

అలా అన్నీ విడిచిపెట్టి వెళ్ళిన విదురుడు శ్రీహరి స్వయంగా వెలసిన పవిత్ర ప్రదేశాలను, వైష్ణవ క్షేత్రాలను, దేవతలు నిర్మించిన దివ్యస్థలాలను, గంగ మొదలైన పుణ్యనదులను, పురాణ ప్రసిద్ధములైన సిద్ధాశ్రమాలను, తపోవనాలను, ఇంకా గంధమాదనంవంటి కొండచరియలను, అక్కడి చక్కని పొదరిండ్లను, వికసించిన కలువలు, చెంగలువలు, పద్మాలలోని మకరందాన్ని త్రాగి పరవశించిన తుమ్మెదలు చేసే ఝంకారాలకు మేలుకొన్న రాజహంసల విలాసాలతో అందగించుచున్న సరోవరాలను చూస్తూ ఉన్నాడు.

అంతేకాకుండగా మునుల ఆశ్రమాలను సందర్శించాడు విదురుడు. తపోవనాలు, నదులు, వాటికి దాపుననున్న చిన్న చిన్న వనాలు, నదాలు, బోయవారు నివసించే ప్రదేశాలు, కొండగుహలు, గోశాలలు, యజ్ఞవాటికలు, జనపదాలలోని దేవాలయాలు మరెన్నో పుణ్యభూములను చూస్తూ సంచరించాడు.

విదురుడు ఆయా ప్రదేశాలు తిరుగుతున్నాడు. ఆకులు, కూరలు, నీళ్ళు తప్ప వేరే ఆహారమేదీ తీసుకోవడం లేదు. శరీరసంస్కారంకూడా చేసుకోవడం లేదు. అవధూతవేషంలో అడవులలో సంచరిస్తున్నాడు.

పరీక్షిన్మహారాజా! (శుకమహర్షి చెప్పుచున్నాడు) విదురుడు సంతోషంతో కోపాది వికారాలు లేనివాడై, భరతఖండంలో ఉన్న పుణ్యనదీనదాలనన్నిటిని చూస్తూ సంచరించాడు.

విదురుడు అలా సంచరిస్తూ క్రమంగా ప్రభాసతీర్థానికి చేరుకొన్నాడు. అప్పుడు

విదురుడు అలా సంచరిస్తూ, శ్రీ కృష్ణుని దయవల్ల సంప్రాప్తమైన రాజ్యాన్ని ధర్మరాజు పాలిస్తున్న ప్రదేశానికి చేరుకొన్నాడు. అక్కడి మద్ది, మామిడి, గురివెంద, ఎర్రగోరింట, మాలతి, పొగడ మొదలైన చెట్లు, తీగలతోకూడిన ఒక నది ఒడ్డున నివసించాడు.

పరీక్షిన్మహారాజా! ధర్మరాజు పరిపాలిస్తున్న ప్రాంతానికి చేరువలోనున్న విదురుడు మహాభారత సంగ్రామం గురించి విన్నాడు. వెదుళ్లలో పుట్టిన అగ్ని మొత్తం అడవిని కాల్చివేసినట్టు, కారవపాండవుల మధ్య పుట్టిన కలహం దుర్యోధనుడాదిగా ఎందరో మహారాజులను పొట్టన బెట్టుకొన్నదని విని ఎంతో దుఃఖించాడు.

జ్ఞాతి (దాయాది) వర్గంలో పెక్కురు యుద్ధంలో మరణించారని తెలిసి, అక్కడ ఉండడానికి కాలు నిలువలేదు విదురునికి. ఋషికల్పుడైన అతడు అక్కడనుండి బయలుదేరి, సరస్వతీనదిలో స్నానం చేశాడు. అక్కడనుండి అగ్ని, సూర్య, శుక్ర, పృథు, త్రిత, సోమ, సుదాస, కుమార, వాయు, యమ నామధేయాలతో ప్రసిద్ది పొందిన అన్ని నదులలోనూ స్నానం చేస్తూ వేగంగా ప్రయాణం సాగించాడు.

విదురుడు పుణ్యస్టలాలను చూస్తున్నాడు. పవిత్ర తీర్థాలను సేవిస్తున్నాడు. మాధవుడు కొలువుండే దేవాలయాలను, రకరకాల మణులను పొదిగిన ఆ మందిరాల తలుపులను, గడపలను, రాజగృహాలను, గోపురాలను, విమానాలను చూస్తూ, గోవిందుని పాదపద్మాలనే స్మరించుకొంటూ క్రమంగా ముందుకు సాగిపోయాడు.

విదురుం డుద్ధవుంగని కృష్ణాదుల వృత్తాంతం బడుగుట 

Narayana Impressed Brahma Austerity Meditation And Gave Boons - నారాయణుండు బ్రహ్మతపంబునకు మెచ్చివరంబు లిచ్చుట

నారాయణుండు బ్రహ్మతపంబునకు మెచ్చివరంబు లిచ్చుట

శ్రీహరి పాదాలమీది భక్తిగల్గి ఉండడంలోని పరమరహస్యాన్ని ఉపదేశించినవాడూ, దేవతలకెల్ల అధినేతా అయిన బ్రహ్మదేవుడు యుగారంభంలో తనకు నెలవైన పద్మానికి మూలమేమిటో పరిశీలించాలనుకొన్నాడు. నీళ్ళలో వెదకడం ప్రారంభించాడు. ఎంత వెదకినా ఆ పద్మానికి మొదలు ఎక్కడ ఉందో తెలుసుకోలేకపోయాడు. చివరికి విసిగివేసారి మరలివచ్చి ఆ పద్మంలోనే ఆసీనుడయ్యాడు. జగత్తును సృష్టించాలనే సంకల్పం ఆయన హృదయంలో ఉదయించింది. ఎంతో ఆలోచించాడు. కాని సృష్టికి సంబంధించిన పరిజ్ఞానం ఆయన మనస్సుకు తోచక క్రిందుమీదయినాడు. అలసత్వం ఆవహించింది. లోకసృష్టి చేయలేకపోయాడు. అతని చిత్తం మోహగ్రస్తమయింది. చింతాక్రాంతుడయ్యాడు.

అప్పుడు నీటినడుమనుండి ఒక 'శబ్దం' వినిపించింది. 'క' మొదలు 'మ' వరకు ఉండే స్పర్శాక్షరాలలో (కాదయో మావసానాః స్పర్శాః) పదునారవదీ, ఇరువది యొకటవదీ అయిన 'తప' అనే రెండక్షరాల వల్ల ఆ శబ్దం ఏర్పడింది. 'తప' అనే ఆ శబ్దం మహర్షులకు అమూల్యమైన ధనం. ఆ మాట రెండుసార్లు 'తప తప' అని ఉచ్చరింపబడింది. బ్రహ్మ దాన్ని విన్నాడు. ఆ శబ్దాన్ని ఉచ్చరించిన పురుషుణ్ణి చూడాలనుకొన్నాడు. నాలుగు దిక్కులకూ వెళ్ళి వెదికాడు. కాని ఎక్కడా ఆ పురుషుడు గోచరించలేదు. తిరిగివచ్చి తన నివాసమైన పద్మంలోనే కూర్చున్నాడు. కొంతసేపు ఆలోచించాడు. తన్ను తపస్సు చేయుమని హెచ్చరించడానికే ఆ శబ్దం వినిపించిందని భావించాడు. ప్రాణాయామం చేశాడు. జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలను నిగ్రహించినాడు. చిత్తాన్ని ఏకాగ్రం చేసుకొని వెయ్యి దివ్యవర్షాలు తపస్సు చేశాడు. ఆ ఘోర తపస్సునకు లోకాలన్నీ తపించిపోయాయి. అప్పుడు శ్రీహరి ప్రసన్నుడై బ్రహ్మకు ప్రత్యక్షమయ్యాడు.

వెంటనే బ్రహ్మ వైకుంఠపురాన్ని దర్శించాడు. ఆ పురం రాజస తామసగుణాలకూ, ఆ గుణాలతో మిశ్రితమైన సత్వగుణానికీ అతీతంగా ఉన్నది. అది శుద్ధసత్త్వగుణానికి ఆవాసమయింది. కాలానికి అక్కడ ప్రాబల్యం లేదు. అది లోకాలకన్నింటికంటె ఉన్నతమైనది. సకలదేవతలకూ స్తుతింపదగినది. అక్కడ లోభ-మోహ-భయాలు లేవు. అక్కడికి పోయినవారు మళ్ళీ తిరిగి రావడమంటూ జరుగదు. తుదిలేని తేజస్సుతో అది ప్రకాశిస్తున్నది. అట్టి వైకుంఠాన్ని బ్రహ్మదేవుడు వీక్షించాడు.

ఆ వైకుంఠనగరంలో మేడలు, విమానాలు, గోపురాలు, మిద్దెలు, మండపాలు, దివ్యమణికాంతులతో దేదీప్యమానంగా తేజరిల్లుతున్నాయి. ఆ దీప్తి ముందు సూర్యచంద్రాగ్నుల తేజస్సులు వెలవెలబోతున్నాయి. ఇంకను ఆ నగరంలో పూలగత్తులతో నిండినవై కోరిన ఫలాలు ప్రసాదించే కల్పతరువుల గుంపులున్నాయి. బంగారు కర్రలకు తగిలించిన రంగురంగుల పతాకలు గాలి తాకిడికి రపరెపలాడుతున్నాయి. వికసించిన కలువల్లోనూ, కమలాల్లోనూ, మకరందరసం ఆస్వాదిస్తూ మధుకరబృందాలు ఆనందంతో ఝంకారం చేస్తున్నాయి. ఆ శబ్దానికి మేల్కొన్న కలహంసలతో అక్కడి సరస్సులు కనులపండువు గావిస్తున్నాయి.

అక్కడి రాచిల్కలు 'కేశవునికంటె పరదైవం మరి లేదు' అని పల్కుతున్నాయి. గోరువంకలు 'విశ్వమంతా విష్ణుమయం' అని పల్కుతున్నాయి. కోయిలలు 'పద్మాక్షా నీదే జయం' అని పాడుతున్నాయి. నెమళ్ళు 'మధుసూదనా నీకు మంగళం' అని అంటున్నాయి. తుమ్మెదల గుంపులు 'శౌషట్, వషట్‌, స్వధా, ఇత్యాది శబ్దాలతో ఝంకారం చేస్తున్నాయి. ఈ విధంగా వైభవోపేతమైన వైకుంఠ మందిరం సకల దివ్యమంగళ విలాసాలతో పరమ సుందరంగా భాసిస్తున్నది.

ఇంకను మేఘపంక్తిచే విరాజిల్లే ఆకాశంలాగా తేజరిల్లుతున్న ఆ దివ్యమందిరంలో సునందుడూ, నందుడు, అర్హణుడు, ప్రబలుడు మున్నగు సేవకులు భగవంతుణ్ణి భక్తితో సేవిస్తున్నారు. వారు నల్లకలువలవలె నీలమైన నిగనిగలాడే శరీరాలతో విరాజిల్లుతున్నారు. పచ్చని కొంగొత్త పట్టుపుట్టాలు కట్టుకొని ఉన్నారు. తెల్ల దామర రేకులవంటి కనులతో శోభిల్లుతున్నారు. వారివి సుకుమారమైన దేహాలు. వారు ధగధగలాడే రత్నాభరణాలూ, కంఠహారాలూ, కంకణాలూ, ముత్యాలసరాలూ, భుజకీర్తులూ, నూపురాలూ ధరించి ఉన్నారు. నిత్యయౌవనంతో భాసిస్తున్నారు. పవిత్రమైన నడవడి గల్గియున్నారు. అందరూ శ్రీహరి రూపాలు దాల్చి జాజ్వల్యమానంగా వెలుగొందుతున్నారు. వారు వైడూర్యాలతోనూ, పగడాలతోనూ, నిర్మలమైన తామర తూండ్లతోనూ సమానమైన తనువులు కల్గివున్నారు. అందరూ భక్తితో శ్రీమన్నారాయణుని భజిస్తున్నారు.

ఆ భగవానుని కోమలమైన పాదపద్మంనుండే సకలపాపాలనూ కడిగివేసే గంగానది ఉద్భవించింది. తన కడగంటి చూపుతో కలుములనన్నిటినీ ప్రసాదించే లక్ష్మీదేవి ఆయన వక్షస్థలంలో నివసిస్తున్నది. ఆ దేవుడు సూర్యచంద్రులు అనే సుందరమైన కన్నులు కలవాడు. ఆ కన్నులలో కరుణా తరంగాలు పొంగిపొరలుతూ ఉంటాయి. జగన్నిర్మాణ నిపుణుడగు విధాత ఆయన నాభికమలంనుంచే పుట్టాడు. శేషుడే ఆయనకు పడక. గరుడుడే వాహనం. ముక్కోటి దేవతలూ, మునులూ ఆయనను సేవిస్తూ ఉంటారు. ఆయన సకలలోకాలకూ తండ్రి. అట్టి పరమేశ్వరుణ్ణి బ్రహ్మ కన్నుల కరవుదీరా చూచాడు.

రూపరేఖా విలాసాలతో చక్కని చుక్కలాగా ఉన్న లక్ష్మీదేవి తన కోమలమైన పాణిపద్మాలతో తన ప్రాణనాథుడైన మహావిష్ణువుయొక్క పాదపద్మాలను ఒత్తుతున్నది.

అంతేకాదు. శ్రీమహాలక్ష్మి రత్నపుకాంతులతో విరాజిల్లు బంగరుటూయెలలో ఊగుతూవున్నది. ఆమె కొప్పులో తురిమిన పుష్పమాలికల సుగంధంమీది ఆశతో గుమిగూడిన తుమ్మెదలు మనోజ్ఞంగా ఝంకారాలు చేస్తూ మూగుతున్నాయి. ఆ ఝంకారమే ఇంపైన శ్రుతిగా శ్రీదేవి శ్రీహరి మీద కీర్తనలు ఆలపిస్తున్నది.

ఆ విధమైన వైకుంఠంలో, అట్టి పరమపదంలో ఎల్లవేళలా జ్ఞానం, సంపద, కీర్తి బలం, ఐశ్వర్యం కలవాడూ, భువనాలకు ప్రభువూ, యజ్ఞానికి అధీశ్వరుడూ, తుదిలేనివాడు, చ్యుతిలేనివాడూ, వికసించునట్టి పద్మాలవంటి నేత్రాలు కలవాడూ, లక్ష్మీవల్లభుడూ, మొదలు, తుది అనే కొలమానాలు లేనివాడూ, దయాసముద్రుడూ, యాదవులకు అధినాథుడు, వృద్ధిశీలుడు, సహనశీలుడు, అంతటా వ్యాపించినవాడు, కల్యాణ గుణాలతో విరాజిల్లేవాడు, కాంతిమంతుడు  చిరునవ్వు అనే అమృతం నిండిన నెమ్మోము గలవాడూ, తన భక్తులను కాపాడడంలో ఆసక్తి గలవాడూ, ఎర్రతామర రేకులవంటి నేత్రాలు కలవాడూ, పీతాంబరుడూ, త్రిలోక సుందరుడూ, అందెలు, కిరీటం, మకర కుండలాలు మున్నగు మంచి సొమ్ములు దాల్చినవాడూ, యోగీశ్వరులకు ప్రభువూ, వక్షస్థలంలో లక్ష్మిని ధరించినవాడు, జ్ఞానస్వరూపుడూ, కృపామయుడూ, నాల్గుభుజాలు గలవాడూ అయిన విష్ణుదేవుని అమూల్యమైన రత్నమయ సింహానంలో కూర్చున్నవాడు, సునందుడు, నందుడు, కుముదుడు మొదలగు అనుచరుల సేవలు గైకొనువాడు, ప్రకృతి, పురుషుడు, మహత్తత్త్వం, అహంకారం అనే నాల్గుశక్తులు, వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థ అనే ఐదు కర్మేంద్రియాలు, శ్రోత్రం, త్వక్కు చక్షువు, జిహ్మ ఘ్రాణం అనే ఐదు జ్ఞానేంద్రియాలు, మనస్సు, పృథివి, జలం, తేజస్సు, వాయువు, ఆకాశం అనే ఐదు మహాభూతాలు ఈ పదునారు శక్తులు, శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం అనే ఐదు తన్మాత్రలు తనచుట్టూ చేరి కొలుస్తుండగా కోటి సూర్యుల కాంతితో వెలుగొందుతూ, ఇతరులకు అలభ్యమై, తనకు మాత్రమే సహజమైన సకలైశ్వర్యాలతో భాసించేవాడు, నిజస్వరూపంతో క్రీడించేవాడూ, అంతటికీ అధినాయకుడూ, పరమపురుషుడూ, పరమతశ్రేష్టుడూ, పద్మలోచనుడూ అయిన శ్రీమన్నారాయణుణ్ణి బ్రహ్మ దర్శించాడు. ఆయన హృదయకమలం అమితానందంతో వికసించింది. శరీరం గగుర్పాటు చెందింది. ఆయన చెక్కిళ్ళు ఆనందబాష్పాలతో తడిసిపోయాయి.

మహానుభావులగు పరమహంసలకు మాత్రమే చేరదగిన ఆ పరమ పురుషుని పాదపద్మాలకు బ్రహ్మదేవుడు తన నాలుగు శిరస్సులు తగులునట్లు ప్రణామాలు చేశాడు. అప్పుడు శ్రీహరి కూడా

తన నాభిపద్మంలో పుట్టిన ముద్దుల పెద్దకొడుకు, దేవతలలో జ్యేష్టుడు, ప్రాణి సమూహముల సృష్టికర్త, తన ఆజ్ఞననుసరించి మెలగేవాడు, అయిన బ్రహ్మ తనకు నమస్మరించేసరికి శ్రీహరికి దయ పొంగిపొరలింది. ఆనందంతో కూడిన మందహాసంతో ఆయన ముఖపద్మం వికసించింది. తన కరారవిందంతో బ్రహ్మ శరీరాన్ని మెల్లగా నిమురుతూ శ్రీమన్నారాయణుడిలా అన్నాడు.

పద్మజా! చిరకాలం నన్ను సేవించినప్పటికీ చిత్తశుద్ధి లేని మునులపట్ల నేను సంతోషం పొందను. బహుకాలం తపోనిష్టలో ఉండి జగత్సృష్టి చేయాలన్న కోరికతో ఉన్న నిన్ను మాత్రం నేను మెచ్చుకొంటున్నాను.

కమలగర్భా! నీకు మంగళమగుగాక! నీ కోరిక ఏమిటో చెప్పు. ఇప్పుడే నీకు వరం ప్రసాదిస్తాను. పాపరహితుడా! దేవ దేవుణ్ణి అయిన నా పాదసందర్శనంతో ఆపదలన్నీ అంతమైపోతాయి.

అరవిందోద్భవా! నీపై అనుగ్రహం కలిగి నీకు నా వైకుంఠలోకమంతా చూపాను. ఇలా చూపడానికి కారణం ఉన్నది. ఇది నా అపార కృపాకటాక్ష ప్రసారం వల్లనే జరిగింది గాని నీతపోవైభవం వల్ల జరుగలేదు. పద్మసంభవా! నీవు తపస్సు చేయడం కూడా నా మాటలను పాటించడంవల్లనే కదా!

తపస్సు అంటే నా స్వరూపమే, కాని మరేమీ కాదు. తపస్సు అనే చెట్టుకు ఫలం నేనే. కుమారా! ఆ తపస్సు వలననే నేను సృష్టి స్థితిలయాలు నిర్వహిస్తూ ఉంటాను.

కమలభవా! అందువల్ల నా మీద భక్తిని ఏ రీతిగా చూపినా దానికి తపస్సే మూలధనం. ఇది నీ మనస్సులో బాగా గుర్తించి తపస్సు చేశావు. అందుచేత నీ కర్మలూ, మోహం ఇంక తొలగిపోయాయి.

ఈ రీతిగా చెప్పి విష్ణుదేవుడు మరల “చతుర్ముఖా! నీ మనోభీష్టం ఏదైనా సరే ఇస్తాను. కోరుకో” అని అన్నాడు. ఆ మాటలు వినగానే విధాత మోము సంతోషాతిశయంతో విప్పారింది.

శ్రీహరి మాటలు హృదయానికి ఆనందం కల్లించగా బ్రహ్మ ఆయనతో ఇలా అన్నాడు. “పరమపద ప్రభుడవగు ఓ స్వామీ! యోగిజన హృదయాంతర్యామీ! ఈ సమస్తమైన ధరాతలంలో నీకు తెలియని విషయం ఏమైనా ఉంటుందా? ఐనా నా చిత్తంలో నెలకొన్న కోరిక నీకు మనవి చేస్తాను. దేవా! దయతో చిత్తగించు

“స్వామీ! నీవు భగవంతుడవై సకలప్రాణులలో అంతర్యామివై ఉన్నావు. ఇట్టి నీకు నమస్కరించి నా కోరిక నీకు విన్నవిస్తాను, అవధరించు. వ్యక్తం కాని రూపాలతో ప్రకాశించే నీ స్థూలసూక్ష్మ స్వరూపాలూ, వివిధ శక్తులలో వృద్ధినొంది విలసిల్లే బ్రహ్మమొదలైన వారి రూపాలు నీయంతట నీవే ధరిస్తున్నావు. సాలెపురుగులాగా జగత్తుయొక్క సృష్టినీ, స్థితినీ, లయాన్నీ నిర్వహిస్తున్నావు. నీ సంకల్పం వ్యర్థం కానిది. ఇలా ఈ జగత్తులో వినోదిస్తున్న నీ మహిమ గ్రహించే తెలివి నాకు ప్రసాదించు. నేను నీ ఆజ్ఞానుసారంగా జగత్తును నిర్మిస్తూ ఉంటాను. ఆ పని చేసేటప్పుడు నేను బ్రహ్మను కదా, అన్న అభిమానంతో నా మనస్సులో మహదహంకారాలు పొడసూపుతాయి. వాటిని నశింపజేయవలసిందిగా వేడుకొంటున్నాను. నన్ను దయార్ద్రమైన దృష్టితో చూచి అనుగ్రహించు అని బ్రహ్మదేవుడు చేసిన విన్నపం విని పద్మాక్షు డతనితో ఇలా అన్నాడు.

ఓ సరోజసంభవా! శాస్త్రాల అర్దాన్ని పరిశీలించే జ్ఞానం, భక్తి ఉత్తమమగు సాక్షాత్మారం-అనే ఈ మూడు లక్షణాలనూ నీ చిత్తంలో గట్టిగా నిల్పుకో!

పద్మసంభవా! నా స్వరూపం, స్వభావం, ప్రభావం, అవతారం, అందు నేను చేసే కర్మలూ- వాటి నన్నింటినీ గ్రహించే తత్త్వజ్ఞానం నా అనుగ్రహంవల్లనే నీకు కలుగుతుంది. సృష్టికిముందు నేను ఒక్కడుగానే ఉంటాను. అప్పుడు నాకు ఎట్టి కర్మసంబంధం ఉండదు. స్థూలరూపం, సూక్ష్మరూపం, వాటికీ హేతువగు ప్రకృతీ, నా అంశంలోనే లీనమై ఉంటాయి. అందువల్ల నేనొక్కడనే తప్ప నాకంటే వేరైన మరొక పదార్ధం లేదు, ఉండదు. కుమారా! సృష్టికాలంలో ఉద్భవించే జగత్తంతా నా స్వరూపమే అని గ్రహించుకో!

కమలోద్భవా! కల్పానికీ ప్రళయానికీ మధ్యకాలంలో నేను తుద, మొదలు లేనివాడనై, పరిపూర్ణంగా శాశ్వతమైన మహిమతో పరమాత్ముడనై ఉంటాను.

అంతే కాదు. నీ విందాక నన్ను జగన్నిర్మాణానికి హేతువైన మాయావిధానాన్ని గురించి అడిగావు. ఆ విషయం తెలియజేస్తాను. ముత్తెపుచిప్పను చూస్తే దానిలో వెండి లేకున్నా ఉన్నట్లు తోస్తుంది. అట్లే లేని వస్తువు ఉన్నట్లు తోచి విచారించి చూస్తే లేదని స్పష్టమవుతుంది. ఇది దేనివల్ల జరుగుతున్నదో అదే నా మాయావిశేషమని గ్రహించు.

అంతేకాక మాయాప్రభావం వల్ల లేనివస్తువు కనిపించడం, ఉన్నవస్తువు కనిపించకపోవడం జరుగుతూ ఉంటుంది. చంద్రుడొక్కడే అయినా ఇద్దరు చంద్రులున్నట్లు కనిపిస్తుంది కదా! ఇది లేని వస్తువు కనిపించడానికి దృష్టాంతం. రాహుగ్రహం ఉన్న వస్తువు కనిపించకపోవడానికి దృష్టాంతం. గ్రహమండలంలో రాహువనే గ్రహం ఉన్నా అది మనకు కనిపించదు గదా!

పృథివ్యాదులైన మహాభూతాలు, భౌతిక పదార్థాలైన ఘటం, పటం మొదలగు వస్తువులలో ప్రవేశించి ఉంటాయి. అట్లే నేను భూతాలలోనూ, భూత నిర్మితాలైన సమస్త భౌతిక పదార్థాలలోనూ సత్త్వది రూపాలతో ప్రవేశించి ఉంటాను.

పృథివ్యాది భూతాలలో ఘటపటాదులైన పదార్థాలు కారణావస్థను పొందుతాయి, అదేరీతిగా భూతాలూ, భౌతికాలూ ఇవన్నీ నాలో కారణావస్థను పొంది ఉంటాయి. అంతేకాని స్పష్టంగా అభివ్యక్తాలై ఉండవు. ఇంతవరకూ నిరూపితమైన ఈ పరబ్రహ్మస్వరూపం అన్ని దేశాలలో, అన్ని కాలాలలోనూ ఇట్లే ఉంటుంది. కాని మార్పు చెందదు. తత్త్వం తెలుసుకో గోరే మీబోంట్లకు నేనిప్పుడు చెప్పినదే తత్త్వస్వరూపమైన అర్థమని గ్రహించు. ఈ అర్ధమే అన్నింటికంటె శ్రేష్టమైనది. దీన్ని ఏకాగ్రమైన మనస్సుతో విని నీ హృదయంలో నిలుపుకో. అలా చేస్తే జగన్నిర్మాణాది కార్యాలు నిర్వహించేటప్పుడు మోహం నిన్నంటదు. ఈ విధంగా భగవంతుడైన పరమేశ్వరుడు బ్రహ్మకు ఆనతిచ్చాడు. అనంతరం తన వైకుంఠలోకంతో కూడా అంతర్దానమై పోయాడు అని శుకయోగి పరీక్షిత్తుతో చెబుతూ, మళ్ళీ ఈ రీతిగా అన్నాడు.

రాజా! ఈ విధంగా అంతర్దానం చెందిన పద్మలోచనుణ్ణి బ్రహ్మ తన హృదయంలో నిలుపుకొన్నాడు. ఎంతో ఆనందంతో ఆయనకు ప్రణమిల్లినాడు. ఆయన కృపకు పాత్రుడై పూర్వంలాగానే సమస్త విశ్వాన్నీ సృష్టించాడు. ధర్మప్రవర్తకుడూ, ప్రజాపతీ అయిన బ్రహ్మ మరొకమారు తన మేలుకోసం కాక సకల లోకాల క్షేమం కోరి సంతుష్టాంతరంగుడై యమనియమాలతో మహోన్నతమైన తపస్సు చేశాడు.

యమం - ప్రధానముగా ఇంద్రియాలను అదుపున ఉంచుకొనుట. యమం పది విధాలు సత్యం, దయ, క్షమ, ధృతి, మితాహారం, ఆర్జవం, బ్రహ్మచర్యం, అస్తేయం, అహింస, శౌచం.

నియమం - తపం, సంతోషం, ఆస్తిక్యం, దానం, భగవదర్చన, వేదాంత శ్రవణం, లజ్జ, మతి, జపం, వ్రతం - అను పదివిధాలుగల యోగాంగం.

ఆ సమయంలో బ్రహ్మ మానసపుత్రులైన సనందుడు మున్నగు మునులలో మొదటివాడూ, ఆయనకు మిక్కిలి ఇష్టుడూ అయిన నారదమహర్షి బ్రహ్మదేవుని చెంతకు వచ్చాడు.

 అలా వచ్చి తండ్రికి ప్రీతితో సపర్యలు చేశాడు. బ్రహ్మకూడా అతని పట్ల ప్రసన్నుడయ్యాడు. అప్పుడు నారదముని భగవంతునిమాయ ఎట్టిదో తెలుసుకోవడానికి ఉబలాటపడ్డాడు.

రాజా! నీవు నన్నడిగినట్లే పూర్వం నారదుడు తన తండ్రి నడిగాడు. అప్పుడు బ్రహ్మ ఉదారబుద్ధితో నారదునికి భగవానుడు, ఆశ్రితులపాటి కల్పవృక్షమూ అయిన శ్రీహరి తనకు తెలియజేసినదీ, లోకాలకు శుభం కలిగించేదీ, నాలుగు శ్లోకాలరూపంలో ఉన్నదీ, పదిలక్షణాలతో కూడినదీ అయిన భాగవతాన్ని ఉపదేశించాడు. నారదుడు ఆ భాగవత స్వరూపాన్ని మనోజ్ఞమైన సరస్వతీ నదీతీరంలో శ్రీహరి పాదాలను ధ్యానించడంలో నిపుణుడూ, ఆత్మతత్త్వజ్ఞుడూ, మహాతేజస్వీ అయిన వ్యాసమహర్షికి బోధించాడు. ఉదాత్త చరిత్రుడగు వ్యాసమునీంద్రుడు ప్రీతితో నాకు విస్తరించి బోధించాడు. నేను నీకు దాని నిప్పుడు ఉపదేశిస్తాను.

అంతే కాదు. ఇప్పుడు నీవు నన్ను "విరాట్పురుషుని నుండి ఈ లోకాలు ఎలా పుట్టాయి"? అని ఈలాంటి ప్రశ్నలు కొన్ని అడిగావు. వాటి కన్నీటికీ సమాధానంగా నేను నీకు ఈ మహాభాగవతం ఉపదేశిస్తాను, విను. ఈ మహాపురాణం నాలుగుశ్లోకాల రూపమై, పదిలక్షణాలు కలిగి సంగ్రహరూపంతో ఉన్నది. అందులో పదిలక్షణాలూ ఏవి? అనగా సర్గం, విసర్గం, స్థానం, పోషణం, ఊతులు, మన్వంతరాలు, ఈశానుచరిత్రాలు, నిరోధం, ముక్తి ఆశ్రయం అనేవి. వీనిలో పదవ లక్షణమైన ఆశ్రయమే బ్రహ్మం. ఆ బ్రహ్మతత్త్వ జ్ఞానంకొరకై చెప్పినవే మిగిలిన తొమ్మది లక్షణాలూ. వాటి స్వరూపం ఎట్టిదో వివరిస్తాను.

'చతుశ్ల్శోకి' గా ప్రసిద్ధమైన గ్రంథభాగం ఇది. ఈ పదిలక్షణాలు ఇకపై క్రమంగా వివరించడమైనది

యావానహం యథా భావో యద్రూపగుణకర్మశః,
తథైవ తత్త్వవిజ్ఞాన మస్తుతే మదనుగ్రహాత్‌. 
 01  

అహమేవాసమేవాగ్రే నాన్యద్యత్సదసత్పరమ్‌,
పశ్చాదహం యదేతచ్చ యో
వశిష్యేత సోஉస్మ్యహమ్‌.  02  

ఋతే
ర్థం యత్ప్రతీయేత న ప్రతీయేత చాత్మని,
తద్విద్యాదాత్మనో మాయాం యథా
భాసో యథా తమః  03  

యథా మహాంతి భూతాని భూతేషూచ్చావచేష్వపి,
ప్రవిష్టాన్యప్రవిష్ణాని తథా తేషు న తేష్వహమ్‌.
  04  

రాజా! మహత్తత్త్వం, అహంకారం, శబ్దస్పర్శరూప రసగంధాలనే ఐదు తన్మాత్రలు, ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి - అనే పంచభూతాలు, ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మనస్సు -ఇవి అన్నీ భగవంతునిలో కనిపించడమే సర్గం.

(ఐదు కర్మేంద్రియాలు: త్వక్కు పాణి, పాదం, పాయువు, ఉపస్థ.
ఐదు జ్ఞానేంద్రియాలు: చెవి, చర్మం, కన్ను నాలుక, నాసిక.)

భరతవంశంలో జనించిన రాజా! చతుర్ముఖబ్రహ్మ విరాట్పురుషుని నుండి ఆవిర్భవించి అపారమైన చరాచరసృష్టిని నిర్వహించడాన్ని 'విసర్గ' మంటారు.

రాజా! లోకద్రోహులైన రాజసమూహాన్ని చంపి జగత్తును ఉద్ధరించిన ఆ విష్ణుని విజయాన్నే 'స్థానం' అంటారు.

సర్వేశ్వరుడూ, అంతం లేనివాడూ, సాటిలేని మంగళస్వరూపుడైన శ్రీహరి తన భక్తులను ఉద్ధరించడమే 'పోషణం'. నరనాథా! జన్మాంతరాలనుండి జీవుల ననుసరించి వచ్చే వారివారి కర్మవాసనలనే 'ఊతు' లంటారు.

రాజా! ఆ పద్మనాభుని కృపాకటాక్షం వల్ల సకలలోకాలనూ పరిపాలించే మహాభాగ్యం పొందిన మహనీయుల ధర్మాలను విపులంగా వర్ణించడాన్నే 'మన్వంతరా'లంటారు.

సౌజన్యమూర్తివైన నరేంద్రా! అబ్జనాభుని అవతారాలు వర్ణించడాన్నీ, ఆయనను అనుసరించి ఉండడాన్నీ ఆ దేవుని చరిత్రలనూ, విస్తృతంగా వివరించే కథలనూ 'ఈశాను కథలు' అని వ్యవహరిస్తారు.

భూనాథా! సర్వానికీ ప్రభువూ, చిత్తు, అచిత్తు, ఆనందం మేళవించిన స్వరూపం గలవాడూ అయిన గోవిందుడు సుందరమైన తన ఉపాధికి సంబంధించిన శక్తులతో గూడినవాడై, వైకుంఠంలోని తన మందిరంలో మెత్తని శేషశయ్యపై సుఖంగా యోగనిద్రలో ఉంటాడు. అప్పుడు సకలజీవులూ తమ తమ తేజస్సులు కోల్పోయి క్రియా శూన్యులవుతారు. అప్పటి ఆ అవస్థావిశేషాల నన్నింటినీ స్పష్టంగా తెలియునట్లు చెప్పడమే “నిరోధం”. దీన్నే “అవాంతర ప్రళయం” అని కూడా అంటారు. రాజా! ఇక 'ముక్తి' అంటే ఏమిటో విను.

పాపరహితుడా! జీవుడు భగవానుని దయవల్ల శరీరధర్మాలై పలు జన్మలనుండి పరంపరగా వచ్చిన జరామరణాలను తప్పించుకొంటాడు. అట్లే ఆత్మధర్మాలైన పుణ్యపాపాలనుండి కూడా విడివడుతాడు. ముందటివైన 'అపహతపాప్మవత్త్వం' మొదలగు ఎనిమిది గుణాలు కలవాడై భగవంతునికి శరీరభూతుడవుతాడు, భగవత్పరతంత్రమైన బుద్ధితో ప్రకాశిస్తాడు. దివ్యగంధాలతో ఒప్పే దివ్యశరీరం కలవాడవుతాడు. ఇలా జీవుడు హరిస్వరూపం పొందడమే 'ముక్తి'.

ఇక ఉత్పత్తి స్ధితి సంహారాలనేవి ఎక్కడ జరుగుతాయో దానినే 'ఆశ్రయ'మంటారు. అదే పరమాత్మ 'బ్రహ్మ' శబ్దంచేత చెప్పబడేదీ అదే. దానిని ప్రత్యక్షానుభవంతో తెలియబేయడానికై ఆత్మకు ఆధ్యాత్మికాది విభాగం చెప్పడమయింది. అది ఎలా అంటే-

ఆత్మ ఆధ్యాత్మికమనీ, ఆధిదైవికమనీ, ఆధిభౌతికమనీ, మూడు విధాలు. నేత్రం మొదలైన గోళకాలలో ఉంటూ తెలియబడడేది ఆధ్యాత్మికం. నేత్రాదీంద్రియాభిమానం కల్గి ద్రష్ట అవుతున్న జీవుడే ఆధిదైవికుడు. నేత్రాదులైన అధిష్ఠనాలలో అభిమానం కల దేవతయై, సూర్యాదితేజస్సులే శరీరంగా కలవాడైన ఎవనిలో, ఆధ్యాత్మిక ఆధిదైవికాలనే ఈ రెండు విభాగాలూ సంభవిస్తాయో, అతడే ఆధిభౌతికుడూ, విరాట్స్వరూపుడుగూడా అవుతున్నాడు. అందువల్ల చూచువాడు, చూపు, చూడదగినది-అనబడు ఈ మూడింటిలోనూ ఏ ఒక్కటి లేకున్నా మరొక్కటి కనిపించదు. త్రిపుటి అనబడే ఈ మూడింటినీ ఎవడు తెలుసుకొంటాడో, అతడే సర్వలోకాలకూ ఆశ్రయమైనవాడు. పరమాత్మకూడా అతడే.

వినోదార్థం జగత్తును సృష్టించాలనే తలంపు ఆ మహాత్ముడికి కలిగింది. ఆ సంకల్పంతో ఆయన బ్రహ్మాండాన్ని నిర్భేదించాడు. తనకు సుఖస్థానం కోరి మొదట పరిశుద్ధమైన నీళ్ళను సృష్టించాడు. ఆయన సహజంగానే పరిశుద్దుడు. అందువల్ల తాను సృష్టించిన అపార పారావార రూపంలో ఉన్న జలరాశిలో శయనించాడు. అందువల్లనే

ఆపో నారా ఇతి ప్రోక్తా ఆపో వై నరసూనవః।
తా యదస్యాయనం పూర్వం తేన నారాయణః స్మృతః॥

అనగా నరుడనే నామాంతరం కల భగవంతుడు జలాలను సృష్టించాడు. అందుకే నీళ్ళకు 'నారములు' అని పేరు. అట్టి నారములు స్థానంగా కల్గివుండడంవల్ల ఆయనకు 'నారాయణుడు' అన్న పేరు కల్గింది. ఈ ప్రమాణాన్ని బట్టి ఆయన 'నారాయణ' శబ్దవాచ్యుడవుతున్నాడు. అట్టి నారాయణుని ప్రభావాన్ని వర్ణించడం వీలుగాని పని. 

ఉపాదాన కారణమైన ద్రవ్యం, సంచితం, ప్రారబ్ధం, ఆగామి అనే మూడు విధాలైన కర్మమూ, కళ, కాష్ఠ మున్నగు ఉపాధులచే భిన్నమైన కాలం, జ్ఞానం మొదలగు జీవుని స్వభావం, అనుభవించే జీవుడూ-ఇవన్నీ ఆయన అనుగ్రహంవల్ల ఏర్పడినవే. ఆయన ఉపేక్షిస్తే వాటికి ఉనికి లేదు. అట్టి మహిమ గలవాడు సర్వేశ్వరుడు. 

తాను మొదట ఒక్కడైనా ఆ పరమాత్ముడు దేవమనుజాది రూపాలతో అనేకం కావాలని సంకల్పించాడు. స్వాత్మానుభవ రూపమైన యోగశయనంలో మేల్కొని ఉండి తన సంకల్పంతో హిరణ్మయమైన తన శరీరాన్ని అధిదైవతం, అధ్యాత్మికం, అధిభూతం - అనే పేర్లతో మూడు విధాలుగా సృష్టించాడు.

అట్టి విరాట్పురుషుని శరీరం లోపలి ఆకాశంనుండి ప్రవృత్తి, సామర్థ్యరూపమైన ఓజస్సు, వేగశక్తి, బలం-అనే ధర్మాలు కలిగాయి. సూక్ష్మరూపమగు క్రియాశక్తినుండి ప్రాణం పుట్టింది. అదే ముఖ్య ప్రాణమనబడింది. యజమాని ననుసరించి పోవు సేవకులవలె ప్రాణాలు శరీరంనుండి వెలువడిపోయే జీవిననుసరించిపోతూ ఉంటాయి. విరాట్పురుషునకు జఠరాగ్ని దీపించగానే ఆకలిదప్పికలు ఏర్పడ్డాయి. ముఖంనుండి దవడలు, నాలుక మున్నగునవి జనించాయి. అందుండే ఆరు రకాల రసాలు పుట్టాయి. అవన్నీ నాలుకచే గ్రహింపబడుతున్నాయి. ముఖంనుండి జీవుడు మాట్లాడాలని అభిలషిస్తాడు. అట్టి ముఖం నుండి-

ముఖం నుండి వాక్కు అనే ఇంద్రియం పుట్టింది. దానికి అగ్ని అధిష్టానదేవత. వాగింద్రియం నుండీ, అగ్నినుండీ, సంభాషణం పుట్టింది. జగత్తంతా జలవ్యాప్తం కావడంవల్ల అగ్నికి జలంవల్ల నిరోధం కల్గింది. అందువల్ల అగ్నికి జలమే ప్రతిబంధకమయింది. మిక్కిలిగా చలించే మహావాయువునుండి ఘ్రాణం పుట్టింది. దానికి వాయువు అధిదేవత. ఆ ఘ్రాణేంద్రియం గంధాన్ని గ్రహించడంలో నేర్పుగలదయింది. విరాట్పురుషుడు కంటికి కనిపించని ఆత్మను తనలో చూడగోరాడు. అప్పుడు సూర్యుడు దేవతగా కలవీ, రూపం గ్రహించేవీ అయిన నేత్రాలు రెండూ తేజస్సునుండి పుట్టాయి.

మునులందరూ భగవంతుని ప్రార్ధించగా ఆయన దిక్కులు దేవతగా కలిగి, శబ్దాన్ని గ్రహించే శ్రోత్రేందియాన్ని ఉద్భవింపజేశాడు.

సృష్టికర్తయైన పురుషుని నుండి త్వగింద్రియానికి అధిష్ఠానమైన చర్మం పుట్టింది. ఆ చర్మం ఆయా వస్తువులలోని మృదుత్వాన్నీ, కాఠిన్యాన్నీ, తేలికతనాన్నీ, బరువునూ, వేడిమినీ, చల్లదనాన్నీ, గ్రహిస్తుంది. చర్మమునుండి వెండ్రుకలు పుట్టాయి. వాటికి చెట్లు అధిదేవతలయ్యాయి.

త్వగింద్రియాన్ని అధిష్ఠించినవాడూ, స్పర్శమనే గుణం కలవాడూ, లోపలా వెలుపలా వ్యాపించినవాడూ అయిన వాయువునుండి హస్తాలు పుట్టాయి. అవి బలం కలవీ, వస్తుగ్రహణంలో నేర్పుకలవీ, అనేకమైన పనులు చేయగలవీ అయ్యాయి. వాటికి ఇంద్రుడు అధిదేవత.

తనకు ఇచ్చ వచ్చిన చోటికి పోయే సామర్థ్యం కల ఈశ్వరుని నుండి పాదాలు పుట్టాయి. వాటికి విష్ణువు అధిదేవత.

ప్రజానంద మనే అమృతం కాంక్షించే భగవంతుని నుండి పురుషాంగం, ఉపస్థ (స్త్రీ అంగం) జనించాయి. వాటికి అధిదేవత ప్రజాపతి. స్త్రీ సంభోగం మొదలైనవి వాటి పనులు. మిత్రుడు అధిదేవతగా గల 'పాయువు' అనే ఇంద్రియాన్ని 'గుదం' అని కూడ అంటారు. అది భుక్తపదార్థాలలోని నిస్సారమైన అంశాన్ని త్యజించటానికి సాధనమవుతుంది. అది ఉభయ మలాలనూ వర్ణిస్తుంది.

ఒక శరీరం వదలి మరొక శరీరం ధరింప గోరినప్పుడు మొదటి శరీరం వదలడానికి సాధనంగా 'బొడ్డు' అనే ద్వారం పుట్టింది. ప్రాణం, అపానం బంధింపబడే స్థానం అదే. ఆ బంధం విడిపోవడమే మృత్యువు. పై శరీరాన్ని క్రింది శరీరాన్నీ వేరు చేసేది గూడా ఆ నాభిస్థానమే. ఆహారపానీయాదులను ధరించడానికి పేగులు, పొట్ట, నాడీ సమూహం కల్పితములైనాయి. వాటికి నదులూ, సముద్రాలూ అధిదేవతలు. వాటివల్ల తుష్టి పుష్టి అనే ఉదరాన్ని భరించే రసపరిణామాలు కలిగాయి.

ఆ విరాట్పురుషుడు తన మాయను ధ్యానించేటప్పుడు కామానికీ, సంకల్పాదులకూ స్థానమైన హృదయం పుట్టింది. ఆ హృదయం నుండి మనస్ఫూ, చంద్రుడూ, కాముడూ, సంకల్పమూ పుట్టాయి.

ఆపైన జగత్తును సృష్టించే విరాట్పురుషుని శరీరంలో త్వక్కు, చర్మం, మాంసం, రక్తం, మేదస్సు, మజ్జ, ఎముకలు అనే ఏడు ధాతువులూ, పృథివీ జల తేజోరూపాలైన ఏడుప్రాణాలూ, ఆకాశజలవాయువులనుండి జనించిన గుణస్వరూపాలైన ఇంద్రియాలు, అహంకారాన్ని కలిగించే గుణాలూ, అన్ని వికారాలూ స్వరూపంగా కల మనస్సూ, విజ్ఞాన రూపమైన బుద్ధీ జనించాయి. ఇదంతా ఆ సర్వేశ్వరుని స్థూల శరీరమే. ఇంతే కాదు.

ఆ స్థూలవిగ్రహం క్రమంగా పృథివి, జలం, తేజస్సు, వాయువు, గగనం, అహంకారం, మహత్తత్త్వం, అవ్యక్తం అనే ఎనిమిది ఆవరణాలలో వ్యాప్తమై ఉన్నది. సంపూర్ణమైన వైభవంతో బ్రహ్మాండాన్ని మించిన స్ఫూర్తితో మిక్కిలిగా ప్రకాశిస్తున్నది.

ఆ విరాట్పురుషుని సూక్ష్మరూపం స్థిరమై, అత్యంత విలక్షణమై యొప్పునది. దానికి మొదలు, తుది లేవు. అది నిత్యమైనది. మనస్సుకూ, వాక్కుకూ గోచరం కానిది.

రాజా! మహాతేజస్సుతో నిండిన భగవంతుని స్వరూపాన్ని గురించి నేనిప్పుడు నీకు చెప్పాను. స్థూలమనీ, సూక్ష్మమనీ రెండు రూపాలతో విరాజిల్లే ఆ భగవదాకారాన్ని ఆ పరమాత్ముని ప్రభావంచేత దేవర్షులు గూడా తెలియజాలకున్నారు. వాచ్యమై, వాచకమై నామ రూపక్రియలు దాల్చిన ఈశ్వరుడు సమస్తలోకాలకూ నియామకుడై భాసిస్తున్నాడు. జ్ఞానస్వరూపుడైన ఆ దేవుడే ప్రజాపతులనూ, ఋషులనూ, పితృదేవతలనూ ప్రీతితో సృష్టిస్తున్నాడు.

ఇంకా విను, రాజా! జీవులు తాము చేసిన నానావిధ కర్మలననుసరించి సురలు, సిద్దులు, సాధ్యులు, కిన్నరులు, నరులు, చారణులు, గరుడులు, గంధర్వులు, రాక్షసులు, పిశాచాలు, భూతాలు, బేతాళాలు, కింపురుషులు, కూశ్మాండులు, గుహ్యకులు, డాకినులు, యక్షులు, యాతుధానులు, విద్యాధరులు, అప్సరసలు, నాగులు, గ్రహాలు, మాతృగణాలు, తోడేళ్ళు, సింహాలు, పందులు, పక్షులు, మృగాలు, ఎలుగుబంట్లు, చేపలు, పశువులు, చెట్లు- వీటి జాతులలో సంభవిస్తారు. నీటిలోనూ, ఆకాశంలోనూ, నేలమీదా సంచరిస్తారు. సత్వరజస్తమో గుణాలు గల్గి ఉంటారు. ఈ ప్రాణిజాతమంతా తిర్యక్కులు, సురలు, అసురులు, నరులు, గిరులు - ఇత్యాది భిన్నభిన్న రూపాలతో ఉంటుంది.

లక్ష్మీరమణుడు చతుర్ముఖుడై జగత్తును సృష్టిస్తాడు. విష్ణుస్వరూపుడై దాన్ని రక్షిస్తాడు. సంహారకాలంలో హరునికి అంతర్యామిగా నుండి గాలి మబ్బులను హరించినట్లే సమస్త విశ్వాన్ని సంహరిస్తాడు.

ఈ విధంగా ఆ పరమాత్ముడు ధర్మస్వరూపుడై తానే పశుపక్ష్యాదులు, నరులు, సురలు మున్నగు రూపాలు ధరిస్తాడు. తానే ఈ విశ్వాన్ని సృష్టిస్తాడు. రక్షిస్తాడు, తుదకు సంహరిస్తాడు.

శ్రీహరినుండి ఆకాశం పుట్టింది. ఆకాశంనుండి వాయువు పుట్టింది. వాయువునుండి అగ్ని పుట్టింది. అగ్నినుండి నీరు పుట్టింది. నీటినుండి భూమి పుట్టింది. భూమినుండి నానావిధ జీవసంతతి పుట్టింది. ఇంతటికీ మూలమై ప్రకాళించేవాడు, ఆ శ్రీమన్నారాయణుడే. ఆయన జ్ఞానానందస్వరూపుడు, అవ్యయుడు, పుట్టుకలేనివాడు, అంతంలేనివాడు, ఐశ్వర్యవంతుడు, ఆదిమధ్యాంతాలు లేనివాడు, చావుపుట్టుకలు లేనివాడు, రాజా! ఆయననుండి జనించిన ఈ సృష్టికి హేతువేమిటో, దాని స్వరూపమెట్టిదో ఎంతగా పరీక్షించినా ఎంతటి మునీశ్వరులైనా తెలుసుకోలేకున్నారు.

అంతే కాదు. నృపశ్రేష్ఠా! ఈ విధంగా ప్రాణులను సృష్టించి రక్షిస్తున్న ఆ శ్రీహరి సృష్టికర్తృత్వం తనపై ఆపాదించుకోడు. ఇదంతా తనలోని మాయాశక్తికే ఆరోపిస్తాడు. తాను నిరవద్యుడు, నిరంజనుడు, పరుడు, నిష్కించనుడు, ఢ్యుడు, నిరపేక్షుడు, నిష్కళంకుడు అయినవాడై శాశ్వతత్వాన్ని పొందుతాడు.

బ్రహ్మకు సంబంధించిన ఈ కల్పస్వరూపాన్ని అవాంతర కల్పంతో గూడ సంగ్రహంగా చెప్పాను. ఇట్టి బ్రహ్మకల్పంలో ఉన్న ప్రాకృతాలు, వైకృతాలూ అయిన కల్పాల విధానాలూ, వాటి పరిమాణాలూ, కాలలక్షణాలూ, కల్పలక్షణాలూ, అవాంతరకల్పాలు, మన్వంతరాలూ మొదలగువాని భేదాలూ, విభాగాలూ విపులంగా వివరిస్తాను, విను. దాన్ని కూడా 'పద్మకల్పం' అని వ్యవహరిస్తారు అని భగవానుడైన శుకయోగి పరీక్షిత్తునకు చెప్పినట్లు సూతుడు శౌనకాది మునులకు తెలియజెప్పాడు.

సూతుడు చెప్పినది విని శౌనకుడు ఆయనను చూచి ఇలా అన్నాడు. “సూతమునీ! కరుణాసాంద్రా! జనులు శ్లాఘించే సద్గుణసమూహం కలవాడా! అఖండ పుణ్యరాశీ! పాపరహితా!

మహాభాగవతులలో శ్రేష్ఠుడైన విదురుడు బంధువులనూ, మిత్రబృందాన్నీ వదలిపెట్టి సకలలోకపావనాలూ, స్తుతిపాత్రాలూ ఐన తీర్ధాలూ, లెక్కకు మిక్కిలిగానున్న పుణ్యక్షేత్రాలూ సందర్శించాడనీ, మళ్ళీ తిరిగివచ్చి కౌషారవి(కుషారవి పుత్రుడు) అయిన మైత్రేయ మహామునిని సందర్శించి ఆయననుండి ఆత్మతత్త్వజ్ఞానం పొందాడని వింటున్నాము. అదంతా మాకు వివరించిచెప్పు మని అడుగగా సూతుడు శౌనకాది మునులతో ఇలా చెప్పాడు.

మునులారా! వినండి! మీరు నన్నిపు డడిగినట్లే మునీంద్రస్తుతి పాత్రుడైన శుకయోగిని పరీక్షిన్మహారాజు ప్రశ్నించాడు అప్పుడు శుకుడు ఆ రాజునకు చెప్పిన విషయాలను మీకు నేను తెలియపరుస్తాను.

అవధానంతో ఆ విషయాలను ఆలకించండి!

శ్రీరామా! నీవు కల్యాణగుణ సాంద్రుడవు, సూర్యవంశమనే సముద్రానికి చంద్రుడవు, నీలమేఘశ్యాముడవు, రావణాసురుని భీకర సైన్యాన్ని అంతమొందించినవాడవు, రాక్షసులనే పర్వతాలకు వజ్రాయుధధారివి, సుబాహుని బాహుబల గర్వం అనే చీకటికి సూర్యుడవు, కోరికలు లేనివాడవు, నరపతులకు అలంకారమైనవాడవు, పార్వతిచే స్తుతింపబడిన నామం కలవాడవు, రఘువంశజుడవు-

వాలిని నేలకూల్చినవాడా! సుగ్రీవుని రాజ్యాభిషిక్తుని గావించినవాడా! సంసారమనే అంధకారం పాలిటి సూర్యుడా! నృపశ్రేష్ఠ! సకలదేవతా సార్వభౌమా! దశరథ పుత్రుడవైన శ్రీరామచంద్రా!

సాటిలేని గుణాలు గలవాడా! స్వచ్చమైన ఆనందంలో ఓలలాడువాడా! పాపాలనే మబ్బులకు మేఘంవంటివాడా! దుష్టులైన రక్కసులను దునుమాడినవాడా! సముద్రుని మదాన్ని రూపుమాపినవాడా! మంచిగుణాలతో అలరారే సద్భక్తులను పరిపాలించువాడా! పద్మదళాలవంటి కన్నులు గలవాడా! శిష్టజనుల స్తుతులకు పాత్రమైన శ్రీరామచంద్రా!

ఇది శ్రీ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ప్రాప్తించిన అత్యద్భుతమైన కవిత్వం కలవాడూ, కేసనమంత్రి కుమారుడూ, సహజమైన పాండిత్యం కలవాడూ అయిన పోతనామాత్యుడు రచించిన శ్రీమహాభాగవతపురాణం.

అందులో పరీక్షిన్మహారాజుతో శుకయోగి కావించిన సంభాషణం, భాగవత పురాణప్రశస్తీ, ఖట్వాంగుడు మోక్షం పొందిన విధానం, ధారణా యోగానికి విషయమైన మహావిష్ణుదేవుని శ్రీ పాదాలు మొదలైన అవయవాలలో సమస్తలోకాలు ఉన్న పద్ధతీ, సత్పురుషవర్తనం, మోక్షంకంటె భిన్నమైన సమస్త కర్మఫలాలనూ ఇచ్చే దేవతలను భజించే రీతీ, మోక్షప్రదాత శ్రీహరి ఒక్కడే అనడం, హరిసేవ చేయని ప్రజలకు హీనత్వాపాదనం, రాజు ప్రశ్నించడం, శుకయోగి శ్రీహరిని స్తుతించడం, వాసుదేవుని అనుగ్రహంవల్ల బ్రహ్మ బ్రహ్మలోకాధిపత్యం వహించడం, శ్రీహరినుండి బ్రహ్మ రుద్రుడు మొదలైనవారి లోకాలు జనించడం, శ్రీమన్నారాయణుని దివ్యలీలావతారాల వైభవవార్తలను సూచించడం, భాగవత ప్రాముఖ్యం, పరీక్షిత్తు శుకయోగిని ప్రపంచం మొదలైన వాటిని గూర్చి ప్రశ్నించడం, అందులో శ్రీహరి అన్నిటికీ ముఖ్యకర్త అని ఆయన వృత్తాంతాన్ని ప్రతిపాదించడం, భగవద్భక్తి ప్రాశస్త్యం, బ్రహ్మ చేసిన తపస్సుకు మెచ్చి శ్రీహరి వైకుంఠంతో సహా ఆయనకు ప్రత్యక్షం కావడం, బ్రహ్మవిష్ణువును స్తుతించి ఆయన అనుగ్రహంవల్ల ఆయన మహిమను ఆలకించడం, వాసుదేవుడు చెప్పినట్లే బ్రహ్మనారదుడికి భాగవతపురాణానికి సంబంధించిన ప్రధానమైన పది లక్షణాలను వివరించడం, శ్రీమన్నారాయణుని వైభవం, జీవుడు మొదలైన తత్త్వాల సృష్టీ వాసుదేవుని నిత్యవిభూతి మొదలైన వాటి వర్ణనంకల్పప్రకారం మొదలైన వాటి సూచనా, శౌనకుడు విదురునికీ మైత్రేయునికీ జరిగిన సంవాదం చెప్పుమని సూతుని అడగడం అనే కథలు గల ద్వితీయస్మంధం సమాప్తం 

శ్రీ కృష్ణార్పణమస్తు 

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

పంచాంగం

Vidura Went on a long Theerthayathra - విదురుండు తీర్థయాత్రసేయుట

విదురుండు తీర్థయాత్రసేయుట పాండురాజకుమారులైన ధర్మరాజాదులు బాహువిక్రమంతో ధృతరాష్ష్రుని కొడుకులైన దుర్యోధనాదులను రణరంగంలో జయించారు. స్వచ్చమైన శ...