Friday, March 13, 2026

Jaya Vijayulu - జయ విజయలు

జయ విజయలు 

పురాణాల ప్రకారం జయ-విజయులు వైకుంఠంలో శ్రీమహావిష్ణువు యొక్క ద్వారపాలకులు వీరు ఎప్పుడూ విష్ణుమూర్తి సేవలో ఉంటూ, వైకుంఠ ద్వారం వద్ద కాపలా కాస్తుంటారు.

శాపం - కారణం
ఒకసారి బ్రహ్మ మానస పుత్రులైన సనకసనందనాది మునులు (నలుగురు కుమారులు) విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వైకుంఠానికి వస్తారు. వారు చిన్నపిల్లల రూపంలో ఉన్నప్పటికీ గొప్ప జ్ఞానులు. అయితే, జయవిజయులు వారిని గుర్తుపట్టక, విష్ణుమూర్తి విశ్రమిస్తున్నారని చెబుతూ లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటారు.

దీనితో కోపించిన మునులు, "భగవంతుడి భక్తులకు, ఇతర జీవులకు మధ్య భేదం చూపిస్తున్న మీరు వైకుంఠంలో ఉండటానికి అనర్హులు, భూలోకంలో అసురులుగా (రాక్షసులుగా) జన్మించండి" అని శపిస్తారు.

మూడు జన్మల రహస్యం
జయవిజయులు తమ తప్పు తెలుసుకుని క్షమించమని వేడుకోగా, విష్ణుమూర్తి వచ్చి వారికి రెండు మార్గాలు ఇస్తాడు.

ఏడు జన్మల పాటు విష్ణు భక్తులుగా పుట్టి తిరిగి రావడం. లేదా  మూడు జన్మల పాటు విష్ణువుకు శత్రువులుగా పుట్టి, ఆయన చేతిలోనే మరణించి త్వరగా వైకుంఠానికి చేరుకోవడం.

వారు భగవంతుడికి దూరంగా ఎక్కువ కాలం ఉండలేక, శత్రువులుగా మూడు జన్మలు ఎత్తడానికి మొగ్గు చూపుతారు. ఆ మూడు జన్మలు ఇవే:

జయ విజయుల మూడు జన్మలు - విష్ణువు అవతారాలు:
సత్య యుగం: హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు (వరాహ, నరసింహ అవతారాలు చంపాయి).

త్రేతా యుగం: రావణుడు, కుంభకర్ణుడు (శ్రీరాముడు చంపాడు).

ద్వాపర యుగం: శిశుపాలుడు, దంతవక్రుడు (శ్రీకృష్ణుడు చంపాడు).

వీరు నిరంతరం విష్ణువును సేవించే పరమ భక్తులు.

Thursday, March 12, 2026

Hiranyakashipu tortured his son Prahlad for worshipping Vishnu - హిరణ్యకశిపుండు ప్రహ్లాదుని వివిధోపాయంబుల హింసించుట

హిరణ్యకశిపుండు ప్రహ్లాదుని వివిధోపాయంబుల హింసించుట

వయస్సు అయిదేండ్లు, అయినా కన్నతండ్రి నయిన నా పద్ధతిని నిందిస్తున్నాడు, ఏ  కొద్దిభాయమూ లేకుండా నాకు శత్రువైన విష్ణువును పొగడుతున్నాడు, పిల్లవాడు గదా! అని వారిస్తే వినడు. వీడి తీరు చూడగా, కుమారునిరూపాన, శరీరంలో రోగం పుట్టినట్లుగా ఉంది. రాక్షసులారా! వీణ్ణి తీసికొనిపోయి చంపి రండి. మీ మీ సమర్థతలు వీణ్ణి సంహరించడంలో ప్రదర్శించండి.

(తనయుని మీద తండ్రికి కసి - ద్వేషం పెరిగింది. తన వంశనాశకుడైన వ్యక్తిని పనిగట్టుకొని కీర్తిస్తూ ముల్లోకాలలో ఎదురులేని తనను ధిక్కరిస్తూ, తృణీకరిస్తూ, ఆ అయిదేళ్ళ పిల్లవాడు తనకు ప్రత్యర్థిగా నిల్వడం రాక్షసరాజు జీర్ణించుకోలేకపోతున్నాడు మరి!)

వైద్యుడు రోగికి అవసరమైనపుడు, ఆతని శరీరంలో ఒక భాగానికి మాననిరోగం ఏర్పడినపుడు, ఆ రోగం కారణంగా మొత్తం శరీరమే రోగగ్రస్తమయ్యే ప్రమాదమున్నపుడు, ఆ రోగంవున్న అవయవాన్ని ఖండించి, తొలగించి, మిగిలిన శరీరభాగాన్నంతటినీ రక్షిస్తాడు. ఆ ఒక్కభాగం కారణంగా మొత్తం శరీరం పాడుగావడం సహించడు. అనుమతించడు. అదే విధంగా రాక్షసవంశాన నా తనయుని రూపంలో వ్యాధి ఒకటి పుట్టుకొచ్చింది. దీనిని ఈ విధంగా వదలివేస్తే, నా రాక్షసవంశ శరీరమంతా ఈ వ్యాధివ్యాపించి, మొదటికే మోసం జరగవచ్చు. కాబట్టి నా కులానికి పుండువంటి ఈ పుత్రుణ్ణి తెగటార్చి నా అన్వయాన్ని రక్షించుకుంటాను. కొడుకునైనా కులరక్షణకై కడతేర్చిన గొప్పవాడు అనే మహాకీర్తిని వహిస్తాను. కులాన్ని దోషరహితంచేసి తీరుతాను.

(వ్యక్తి తాను చేసే మంచిచెడ్డలకు కారణాలు చూపడానికి ప్రయత్నిస్తాడు. తాను ఉన్నతాసనం పైన ఉన్నపుడు, ఇక్కడ హిరణ్యకశిపుడు అదే చేస్తున్నాడు. తానుచేసే పుత్రవధను తాను సమర్థించుకొంటున్నాడు. ఇక్కడ 'వీరవ్రతం' పరిశీలించదగింది. సమరమని లేదా పోరాటమని నిశ్చయం అయ్యాక తన కెదురయినవారందరు విరోధులే. అహితులే. ఆ కారణంవలన ప్రహ్లాదుడు కూడా అహితుడే. పోరాటంలో అహితుణ్ణి తన బాటనుండి తప్పించడం సమరాలలో పాటించే వీరకృత్యం. ఇదే 'వీరవ్రతం'. ఈ 'వీరవ్రతం' కారణంగానే హిరణ్యకశిపుడు తపస్సు చేశాడు. 

కేశవుడు - శోభనమైన కేశములు కలవాడు, కేశి అను రాక్షసిని సంహరించినవాడు. విష్ణువు శివుడు తానే అయినవాడు. బ్రహ్మ రుద్రులు ఈయనయందు జన్మించారు. బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడైనవాడు.)

దనుజేంద్రుడు ప్రహ్లాదుని యెడ దయ చూపరాదంటున్నాడు, వీడు ముమ్మాటికి చంపవలసినవాడే. పోనీపాపం! రక్షిద్దామని అనుకోడానికిగూడ అర్హుడు గాడు. వాడు వెళ్ళవలసినది యమధర్మరాజుగ్భహానికి మాత్రమే. ఇంకెక్కడికీ కాదు. కాబట్టి, నిర్బంధంగా చంపిగాని మరలి రావద్దు.

అని రాక్షసరాజు పల్కినవెంటనే వాడికోరలున్న చాలమంది రాక్షసులు చేతుల్లో శూలాలను ధరించి ఉత్సాహంతో, నోళ్లు తెరచి పెడబొబ్బలు పెడుతూ, రాగిలోహంవంటి జుట్టుకలిగి ఒకేసారి గట్టిగా అరవడం, కొట్టడం, నరకడం చేస్తూ

మహారాజా! ఆ రాక్షసులందరు ప్రహ్లాదుని జూచి, అయ్యో! ఇతడు చిన్నపిల్లవాడు, రాజపుత్రుడు, పైగా దయాశీలి. కాబట్టి, చంపదగ్గవాడు కాడు-అని అనుకోకుండా క్రూరంగా భయంకర దూషణలతో ఏమరపాటులేకుండా తమ బల్లేలతో అతని అవయవాలను పొడిచి హింసించారు. ఆ హింసాచరణను హిరణ్యకశిపుడు ఏమాత్రం వద్దనలేదు.

(ప్రహ్లాదుడు అవధ్యుడనడానికి కారణాలుగా కవి అయిదు విశేషణాలు వాడాడు. అవి బాలుడు, రాజకుమారుడు, జనులపై దయగలవాడు. సాధుశీలం కలవాడు, సుశీలుడు. ఇవన్నీ ఏపాటి మనసున్నవాడైనా కనికరించి వదలివేయ దగ్గవే. మొదట అతడు బాలుడు. స్త్రీ బాలవృద్దులు అవధ్యులనేది జగమెరిగిన నీతి. చివరగా అతడు లోకం మెచ్చిన శీల సంపదగలవాడు. అయినా క్రూరచిత్తుల కది పట్టలేదు.)

ఎందరో దానవులు కలిసి శూలాలతో పొడిచినా ప్రహ్లాదుని ఒడలు ఏమాత్రం చిట్లలేదు. ఒడలిలోపలిభాగంలో అయినా రక్త ముబ్బలేదు. అసలు అతని దేహం కందనైనా కందలేదు. ఎముకలు విరుగలేదు, కంటిచూపు తగ్గలేదు. ముఖసౌందర్యం క్షీణించలేదు-చంద్రబింబంవంటి ముఖం కాంతిమంతంగానే ఉంది. బల్లెపుపోటులవల్ల కొత్తబాధయినా ఆ దేహాన పొడకట్టదు. ఇంత జరిగినా ఆ బాలునిలో దీనత్వం కనబడలేదు.

ఆ రాక్షససేన తనను ఆవిధంగా ఎంత పొడిచినా ఆ బాలుడు మాత్రం ఏడ్వడం లేదు, బెదరిపోయి వణకడం లేదు. పైగా మాటిమాటికి ఆ దేవదేవుని, ఓ పన్నగశాయీ! ఓ జగదీశా! ఓ ఆపన్నశరణ్యా! అంటూ పలువిధాల స్తుతిస్తున్నాడు.

రాక్షసుల బల్లైములకు చిక్కి బాధించబడే బాలుడు ప్రహ్లాదుడు, అక్కడినుండి లేచి అటు ఇటు పరుగెత్తడు. ఆ శూలాల పోట్లు తప్పించుకొనడానికి చేతులైనా అడ్డుపెట్టడు. దగ్గరున్న చుట్టాలగుంపులో దూరి ఆ పోటులనుండి రక్షణపొందడానికి ప్రయత్నించడు. రక్షణకోసం సమీపానగల రాణివాసం-బంగారుగ్భహంలోనికయినా వెళ్ళడు. 'రక్షించండి' అంటూ అరవనైనా అరవడు. అసలు ఆ శూలఘాతాలకు బాధపడుతున్నట్లయినా కన్పడడు. ఇంత హింసకు గురౌతున్నా అతనిలో కంటగింపు ఏమాత్రం కనబడదు. నిమ్మకు నీరెత్తినట్లు స్థిమితంగా ఉన్నాడు.

రాక్షససేన క్రూరకృత్యాలు ఒకవైపు ప్రహ్లాదుని శరీరంపై కొనసాగుతుండగా, ఆ భక్తుడు మాత్రం తన మనస్సును మహావిష్ణువునందు లగ్నంజేసి, తానే ఆ పరబ్రహ్మస్వరూపం వహించినట్లు, అంతటానిండి ఉండే పరమాత్మగా తానే మారిపోయినట్లు నిశ్చలంగా నిర్వికారంగా నిలిచి ఉన్నాడు. ఆ దృశ్యం చూచిన హిరణ్యకశిపుడు, పాపియెడ ప్రయుక్తాలయిన సత్క్రియలవలె తన మారణ ప్రయత్నాలన్నీ నిష్ఫలాలై నిలవడం చూస్తూ తనలో తాను ఇలా తలపోస్తున్నాడు.

వీడు పసివాడు. రాక్షసులు నిరంతరం శూలాలతో పొడిచి హింసించినా క్రిందపడడు. భయపడి పారిపోడు. బల్లెములతో పొడిచినా చావడు. తన తండ్రినైన నన్ను చేరి, శ్రీహరి పక్షం మానివేశాను అని అంటూ నా కాళ్ళమీద తన నొసలు ఆనించి నమస్కరించడు. ఇవన్నీ జరుగకున్నాా ఏ ఆపదా, గాయము లేకుండా ఎలా ఉండగల్గుతున్నాడు? దీనికి ఏమి కారణమో?

(ఇన్ని కష్టాలుపడుతున్నా ప్రహ్లాదుడు పరబ్రహ్మ స్వరూపమైన విష్ణువు తాను అనే భావంతో, తన్మయత్వంతో వుండడంచేత శారీరక శిక్షలేవి అతనికి అంటలేదు.)

అని ఇలా సందేహపడుతూ

ఏ విధంగానైనా, తప్పక చంపవలసిందే అనే తలపుతో రాక్షసరాజు తన కుమారుణ్ణి, దిగ్గజాల కాళ్ళక్రింద తొక్కించాడు. భయంకర విషసర్పాలతో కరిపించాడు. జ్వాలలుపైకెగసే నిప్పులో తోయించాడు. గట్లుదాకి పైకెగసిపడే అలలుగల సముద్రంలో ముంచేందుకు పంపాడు. విషం పెట్టి, నరికి, కొండలపైనుండి తోసి, కట్టిపడవేసి, హింసించి ఇలా నానావిధాల చంప జూచాడు.

హిరణ్యకశిపుడు కొడుకుపై పగబట్టి క్రోధంతో అనేకవిధాల నిర్బంధంగా చంపడానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నాలు ఇవి, ఒకసారి చేతబడులవంటి హోమాలతో, మరొకసారి మండుటెండలలో నిలబెట్టి, మరొక పర్యాయం వానలలో తడిపి తడిపి, ఇంకొకతూరి నవరంధ్రాలు మూసిపెట్టి, ఒకసారి తన మాయతో బెదరించి, ఇంకొకసారి మంచులో ఒంటరిగా నిలబెట్టి, ఒకసారి పెనుగాలులకు ఎదురునిల్పి, మరొకసారి భూమిలో పాతిపెట్టి, ఇంకొకవేళలో కూడు, నీళ్ళు లేకుండా జేసి, కొరడాలతో కొట్టించి, బండరాళ్ళు మీదికి త్రోయించి, గదలతో మోదించి, వాడిబాణాలతో పొడిపించి తనకు విరోధిగా మారిన కుమారుని చంప ప్రయత్నించాడు.

(హోమాలు అనేకరకాలు. తనకోసం, తనవారికోసం చేసేవి కొన్ని. ఆ విధంగా కాకుండా శత్రువులపట్ల ద్వేషంతో చేసే హింసాత్మకమయిన హోమం అభిచారహోమం. ఇటువంటివి రహస్యంగా ఆచరించేవారు.)

వర్ణించినవే గాక, ఇంకా ఏవేవో ఉపాయాలతో సాధనాలతో కుమారుని చంపబోయాడు తండ్రి. కాని తనయుడు పాపరహితుడు శ్రీహరిప్రియుడు గాబట్టి చావకపోగా చెక్కు చెదరలేదు. ఇది తండ్రికి కొడుకుమీద పగబట్టినవానికి దుఃఖకారణమైన చింతగా మారింది. ఆ చింతాభారంతో అలసిపోయిన ఆ రాక్షసరాజు తనలో తాను ఈ విధంగా తలపోయసాగాడు.

సముద్రాలలో ముంచాను, గదలతో మోదాను, కొండలపైనుండి క్రిందికి పడద్రోయించాను. ఆయుధాలతో పొడిపించాను, ఏనుగుల కాళ్ళకింద తొక్కించాను, ఛీత్కారంతో అసహ్యించుకున్నాను, తిట్టాను. భయంకరంగా అడవుల్లో నలుదిక్కులా కమ్ముకొనే నిప్పుల్లో త్రోయించాను, ఇంకా ఎన్నో హింసలపాలు జేశాను. అయినా వీడు చావడు. ఇదేమిటి విచిత్రంగా ఉంది!

(ప్రాణి చావడానికి అవసరమైన, జీవిని సంహరించడానికి కావలసిన అన్ని ఉపాయాలూ రాక్షసరాజు తన తనయుని పట్ల ప్రయోగించి చూచాడు. తన ఘోరక్రూరయత్నాలన్నీ ఆ అర్భకునిముందు కొరగానివిగా మిగిలిపోగా అతనిలో క్రోధం భయంగా మారబోతున్నది.)

ఎన్నివీధాల చంపబోయినా చావకపోగా మీదు మిక్కిలి దేదీప్యమానంగా వెలుగొందుతున్నాడు. చావకుండ బదికే మందు లేమైనా తెలుసా అంటే, అదీ లేదు. వీడికి రక్షకులెవరూ ఇక్కడ లేరు. పెట్టే బాధలతో బెదరడమూ లేదు. ఒక క్షణమైనా బేలగా అసహాయుడుగా కనిపించడు. వీడిని నేను ఏవిధంగా చంపాలి? అలసిపోయాను. వీడి శక్తి ఏదో దివ్యంగా, అంతుపట్టనిదిగా ఉంది.

పూర్వకాలంలో అజీగర్తుడనే ముని, తనకొడుకును శునశ్శేపుడనేవాడిని, తన జీవికకై, యజ్ఞంలో చంపే బలిపశువుగా ఇచ్చేస్తాడు. వాడు నరకంలో యముని మెప్పించి బ్రతికి తిరిగి తండ్రిని చేరుతాడు. అయినా తనను తనతండ్రి పశువుగా అమ్మినట్లు భావించడు. వాడివలెనే వీడూ (ప్రహ్లాదుడుగూడ) తనను (రాక్షసరాజును) కీడు చేసినవాడినిగా చూడడం లేదు.

(కఠోపనిత్తులో చెప్పబడిన నచికేతుడు కూడ తండ్రి తనను యమునికి దానంచేసినప్పటికీ పితృభక్తిని కోల్పోక తండ్రి తనను స్వీకరించాలనే వరాన్ని కోరుతాడు. వేదకాలంలోని శున
శ్శేపునివలె, ఉపనిషత్కాలంలోని నచికేతునివలె ఇతిహాసకాలంలో శ్రీరామునివలె, పురాణకాలంలో ప్రహ్లాదుడు పితృభక్తి తత్పరుడు.)

నేను క్రోధంతో తనను అణచడానికి చేసిన, చేయగూడని క్రూరకర్మలన్నిటినీ మనస్సులో తనకు చేసిన ఉపకారాలుగానే భావిస్తాడు. కాని ఇతరులతోగూడ చెడుగా చెప్పడు. తాను బాధపడటమూ ఉండదు.

ప్రహ్లాదునితో పగకారణంగా హిరణ్యకశిపుడు, తనకు చావు గలుగుతుందని, ప్రహ్లాదుడు మహాశక్తి సంపన్నుడని నిశ్చయించుకొని ఖిన్నుడై చేష్టలుడిగి క్రిందిచూపులు చూస్తూ విషాదంలో మునిగి ఉండగా గురుపుత్రులు సమీపించి ఇలా అంటున్నారు.

(హిరణ్యకశిపుడు తాను వేయించిన శిక్షలకు లొంగని ప్రహ్లాదుని దైవాంశ సంభూతునిగా భావించి శాపం వలన తనకు మరణమాసన్నమైనదని మనస్సులో అనుకొని చింతిస్తున్నాడు.)

రాక్షసరాజా! నీ ప్రతాపం ఆశ్చర్యకరం. నీ కీర్తి స్వచ్చమై మెరుస్తున్నది! నీవు సామాన్యుడివి కావు. యుద్దాలలో నీ కనుబొమలు క్రోధంతో కదిలితే చాలు. దిక్పాలకులు బెదరిపోతారు. ఈ సమస్త విశ్వాన్ని ఎదరులేకుండా ఏలినవాడివి. అట్టి నీకు ఈ అర్భకుడెంత? వీడి అబద్ధపు సంభాషణలు నీవు లెక్కించదగినవి కావు సుమా!

నరుడు మొదట బాల్యంలో చెడుప్రవర్తన గలవాడైనా, పెద్దలైన గురువులవద్ద సేవ చేసి తన తెలివి తేటలను నీతి నియమాలనూ మార్చుకొని ప్రకాశిస్తాడు. ఆ తరువాత వయస్సు పెరిగి సక్రమంగా వ్యవహరిస్తాడు. ఈ బాలుడుగూడ మున్ముందు ఇంద్ర ద్వేషిగా మారగలడని(మార్చగలనని) భావించి నీ రోషాన్ని చాలించు. శుక్రాచార్యులు వచ్చిన తరువాత అంతా చక్కబడుతుంది. అంతవరకు ఈ ప్రహ్లాదుడు గూడ సరిగా నడుచుకుంటాడు.

హిరణ్యకశిపుని ఆజ్ఞానుసారం గురుపుత్రులు, ప్రహ్లాదునికి గృహస్థుడు ఆచరించదగ్గ ధర్మాలను, ధర్మం, అర్ధం, కామం అనువానిని-ధర్మప్రవర్తన, అర్థ ఆర్జన, కామతృప్తి అనువానిని బోధించారు. అయితే ప్రహ్లాదుడు వాటిని స్వీకరించలేదు. అవి ఇతరులకు దప్ప తనకు కావని, పైగా అవి నిష్ప్రయోజనాలని భావించాడు. ప్రయోజనరహితాలను ప్రయోజన సహితాలుగా ఎంచటం భ్రాంతికరంగూడ అని నిర్ధారణకువచ్చి, వారు బోధించిన అంశాలను ఉచితమైనవిగా గూడ భావించక, వారు గృహకార్యార్థం వెళ్ళిన సమయాలలో

ప్రహ్లాదుడు తన తోటి విద్యార్థులకు విష్ణు తత్త్వం గూర్చి వివరించుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

పంచాంగం

Prahlada Sent to Gurukula - ప్రహ్లాదుని విద్యాభ్యాసం

ప్రహ్లాదుని విద్యాభ్యాసం

ఓ నారద మహార్షీ! బాలుణ్ణి, కాంతిగల వాడిని, హరిపాద పద్మాలను అనుదినం చింతించేవాడిని, దయాస్వభావం గలవాడిని, సత్పురుషులకు గురువులకు నమస్కరించేవాడిని, స్వచ్చమైన సంపదలు గలవాడిని, సభ్యులందరి పొగడ్తలు పొందేవాడిని, మోహ లతలను త్రెంచుకొన్నవాడైన ప్రహ్లాదుణ్ణి తండ్రి ఎందుకు చంపించే ప్రయత్నం చేశాడు. ఈ విచిత్రం నాకు చెప్పవా! అని ధర్మరాజు ప్రశ్నించాడు.

అని పలికిన ధర్మరాజుతో నారదుడు ఇలా అన్నాడు.

రాక్షసరాజు హిరణ్యకశిపుడు ఒకరోజు తన కుమారుని చూచి ఆలోచించి ఆతృతతో ఈ ప్రహ్లాద కుమారుడు లభించిన రాక్షస రాజ్యపదవిపై ఆశచూపడు. ఎల్లప్పుడు మర్యాద తప్పక బలం లేని వానివలె నిశ్చైతన్యంగా రాక్షసబుద్ధి లేక సభ్యతతో ఉంటాడు. వీడు విద్యాభ్యాసంవల్ల గాని తీక్ష్ణ బుద్ధి కాలేడని అనుకొన్నాడు.

ఓ ప్రియకుమారా! విద్య నేర్వకున్నచో అజ్ఞాని అవుతాడు. విద్య నేర్చినవాడు విచక్షణా జ్ఞానం కలిగి నేర్పరి అవుతాడు. అందుకే అందరు తప్పక చదువుకొని తీరాలి. పెద్దలవద్ద నీకు విద్య నేర్పిస్తాను. బుద్ధిగా చదువుకో.

ఈ విధంగా సుతునితో హిరణ్యకశిపుడు పలికి, రాక్షసలోక పురోహితుడు, మిక్కిలి పూజ్యుడు అయిన శుక్రాచార్యుని కుమారులను, తీవ్రమైన విచారణ చేసే చండ, అమర్క అనేవారు ఇరువురిని పిలిచి, వారిని సత్కరించి ఇలా అన్నాడు.

మా ప్రహ్లాదకుమారుడు అజ్ఞానంతో అంధుడై ఉన్నాడు. దేనికి సమాధానం చెప్పడు. నా ప్రతాప క్రియల వాసన కూడా అతనికి తెలియదు. మీరు మాకు గురుదేవులు. దయగలవారు. మీరు మాకు మనఃపూర్వకమైన బంధువులు, మాన్యులు, మాకు పెద్దలు, మమ్మల్ని మన్నించి ఈ ప్రహ్లాదబాలుడి అనేక గ్రంథాలను చదివించి, రాజనీతిజ్ఞునిగా చేసి మమ్మల్ని రక్షించండి.

ఈ విధంగా హిరణ్యకశిపుడు గురువులతో పలికి ప్రహ్లాదుని వారికి అప్పగించి తీసికొని పొమ్మన్నాడు. చండామర్కులు కూడా ఈ ప్రహ్లాద కుమారునితోపాటు అతని వయస్సే గల మరికొంతమంది రాక్షస పుత్రులను అతనితో పాఠాలను వినేవారిని చేర్చి.

శుక్రాచార్యుని పుత్రులు ప్రహ్లాదుని తీసికొని దానవరాజ ప్రాసాదానికి సమీపంలో ఉన్న భవనంలోనికి ప్రవేశించారు. హిరణ్యకశిపునిపై భక్తి అతిశయించగా ప్రహ్లాదునకు తగిన రాజనీతి శాస్త్రములు చాల చదివించారు. ప్రహ్లాదుడు నిశ్చలమైన విష్ణుభక్తి గలవాడై, గురువులు చెప్పిన శాస్త్రవిద్యలు అన్నింటిని విని చక్కగా అధ్యయనం చేశాడు.

ప్రహ్లాదుని నిశ్చయమైన బుద్ధికి గురువులు చెప్పే శాస్త్రాలన్నీ అసత్యాలని, అవి నిజాలుగా ఆరోపింపబడుతున్నాయని తెలుసు. అయినప్పటికీ వినయ సంపన్నుడు కాబట్టి, ఆ ప్రహ్లాదుడు గురువులు ఎలా చెప్పారో అలాగే చెపుతాడు తప్ప 'అదికాదు ఇదీ' అని గాని 'ఇలా కాదు అలా' అని గాని గురువులను ఆక్షేపించడు.

విద్యనేర్చుకోవడానికి కొడుకును పంపిన కొన్నినాళ్ళకు, హిరణ్యకశిపునికి మనసులో శంక కలిగింది. తనకుమారుని గురువులు ఏ రీతిగా చదివించారో అమాయకుడైన ఈ పసిబాలుడు ఎలా చదివాడో? అనుకొంటూ, అతని విద్యాభ్యాస కృషిని తెలిసికొందామనే ఆలోచన కలిగి ఒకనాడు తన భవనంమధ్యలో ఆసీనుడై.

ఆ రాక్షస వంశశ్రేష్ఠుడైన హిరణ్యకశిపుడు సంసారసముద్రాన్ని దాటిన వాడిని, కామక్రోధలోభాది అరిషడ్వర్గాలను జయించినవాడిని, విష్ణు పదధ్యానమనే అమృతాన్ని నిరంతరం తాగటమే కఠోరవ్రతంగా గలవాడిని; పాపాలనే వృక్షాలుగల అరణ్యాన్ని ఖండించే గొడ్డలివంటివాడైన ప్రహ్లాద కుమారుని తనవద్దకు రమ్మని పిలిపించాడు.

ఈ విధంగా రాజభటులచేత పిలిపించిన ప్రహ్లాదుడు, తండ్రివద్దకురాగా

ఓ ప్రియపుత్రా! నీవు చేసే ప్రయత్నం ఉత్సాహ, ప్రభు, మంత్రశక్తుల మూడింటితో కలసిఉందా! జ్ఞానసంపన్నుడివైనావా! వేదాలు శాస్త్రాలు చదివావా! ఇలా దగ్గరకు రా. అని నిండైన వాత్సల్యంతో ప్రహ్లాదుని ఒడిలో చేర్చుకొని ఆసక్తితో హిరణ్యకశిపుడు ఇలా అన్నాడు.

(ఏ కార్యం నిర్వహించడానికైనా ఉత్సాహశక్తి, ప్రభుశక్తి, మంత్రశక్తి అనే మూడు శక్తులు అవసరం. మొదట పనిచేయాలనే ఉత్సాహం కావాలి. ఆ ఉత్సాహాన్ని తప్పుదారి పట్టించకుండా తప్పించే ప్రభుశక్తి కావాలి. తరువాత సరైన ఆలోచనా శక్తి కావాలి. ఈ మూడు చక్కగా సమన్వయం చేసుకున్నప్పుడే ప్రయత్నం సఫలం అవుతుంది. ఇక్కడ దానవరాజు ప్రహ్లాదుని 'విద్యాభ్యాస సమయంలో ఈ మూడింటిని పాటిస్తున్నావా?' అని ప్రశ్నిస్తున్నాడు.)

ఓ ప్రహ్లాదకుమారా! తమ తమ పుత్రులతో సంభాషించడం ఆ యా తల్లిదండ్రులకు నిరంతరం సంతోషం నింపుతుంది. అంతేకాదు. వారి సంభాషణలు శ్రమను, తాపాన్ని దుఃఖాన్ని నివారిస్తాయి. తల్లిదండ్రుల చెవులకు తమ పుత్రుల మాటలు వినడమే చెవులకు భూషణాలు ధరించుట వంటిది.

ఓ కుమారా! ఇంతవరకు నీవు చేసిన విద్యాభ్యాస విషయాలలో నీకు మంచిదని తోచిన అంశాన్ని చెప్పు అని ప్రియపుత్రుడైన ప్రహ్లాదుణ్ణి కన్నతండ్రి హిరణ్యకశిపుడు అడిగాడు. అపుడు ప్రహ్లాదుడు ఇలా అన్నాడు.

ఓ రాక్షసరాజా! మానవులందరూ వారి వారి ఇల్లు అనే చీకటి నూతిలో పడిపోకుండా, మీరు, మేము అనే భేదభావంతో అఖండతత్త్వ భావనను విడిచి ప్రవర్తించక ఈ సమస్త ప్రపంచం ఆ పరమాత్మ దివ్యమైన కళావిలాసమే అనే సత్యాన్ని గుర్తించి, విష్ణువులో తమ మనసును చేర్చి అడవులలో ఏకాంతంగా జీవించటం మేలు.

(సంసారం అనే చీకటి బావిలో పడరాదు. అభేద దర్శనం జ్ఞానం అన్న శాస్త్రోక్తిని అనుసరించి భేదదృష్టితో కాకుండా అందరినీ సమబుద్ధితో చూడాలి. ఈ విశ్వమంతా కూడా వాసుదేవుని దివ్యకళాత్మకమే అని భావించాలి.)

ఈ ప్రకారంగా ప్రహ్లాదుడు శత్రువైన విష్ణువును స్తుతించేలా మాట్లాడిన మాటలు విని హిరణ్యకశిపుడు నవ్వుతూ ఇలా అన్నాడు.

ఇతర రాక్షసపుత్రులు గురువులవద్ద చదువువారు ఎలా అడిగితే అలా సమాధానం చెపుతారు. ఇలా ఎదిరించి ఇది అది అది ఇది అని అనరు. నా పుత్రుడైన ప్రహ్లాదునకు శత్రుపక్షం పై అభిమానం కలిగేలా ఎవరు ఏ రీతిగా తల కెక్కేలా గట్టిగా చెప్పారో కదా!

ఓ ప్రహ్లాద కుమారా! నాకు చాల చిత్రంగా ఉంది. ఈ బుద్ధి నీకు స్వతహాగా కలిగిందా! ఇతరులు ఎవరైనా చెప్పారా! లేదా ఏకాంతంగా ఉన్నప్పుడు గురువులే బోధించారా! నిజానికి ఆ వైకుంఠ వాసుడైన విష్ణుమూర్తి మన రాక్షసులందరికి కీడు చేశాడు. బద్ధవిరోధి. అటువంటి విష్ణువును మరల మరల వర్ణించి చెపుతున్నావు. ఇది నీకు అనవసరం సుమా!

ఓ కుమారా! దేవతలను తరిమికొట్టడమో, దేవతానాయకులను అణగగొట్టడమో, సిద్ధులను వేధించడమో, మునులను బాధించడమో యక్ష కిన్నర, గంధర్వ, విహంగ, నాగ నాయకులను నాశనం చేయడమో చేయాలి తప్ప 'హరి గిరి' అంటూ మోహంతో కండ్లు మూసుకు పోయి మాట్లాడటం నీ కెందుకు?!

తండ్రి మాటలకు ప్రహ్లాదుడు పురోహితులను చూచి ఇలా అన్నాడు. మోహాన్ని విడిచిపెట్టి, పరమాత్మతో తాత్పర్య భావం కలిగిన, జ్ఞానంగల పురుషులకు, ఎవరి దయవలన "ఇతరులు తాము" అనే భేదభావం నశిస్తుందో అటువంటి పరమేశ్వరునికి నమస్కారం చేస్తాను.

(పరమాత్ముని దయగలవారికే, భేదదృప్టిలేని అఖండ చైతన్యజ్ఞానం లభిస్తుంది. సర్వం బ్రహ్మమయంగా గోచరిస్తుంది. అటువంటి దృక్పథం ఏర్పడాలంటే, ముందు మానవులు మోహాన్ని వదిలిపెట్టాలి. పరమాత్మయందు తాదాత్మ్యభావం కలిగి ఉండాలి. అప్పుడే వారికి భేదదృష్టి అనే అవిద్య నశిస్తుంది. సత్యచైతన్య జ్ఞానం కలుగుతుంది. అలా కలగజేసే పరమాత్మకు నమస్కారం అని ప్రహ్లాదుని భావం.)

కొందరు అజ్ఞానులు మేము వేరు, మీరు వేరు, అనే మాయలోపడి, ప్రజ్ఞవల్ల మాత్రమే అందునటువంటి సర్వాత్మకుడైన, పరమాత్మను, తమ మూర్ఖపు తెలివితేటలతో గుర్తించి మాట్లాడలేరు. సర్వభూతాంతరాత్మ అయిన ఆ భగవానుణ్ణి గుర్తించడానికి, వేదవేత్తలైన బ్రహ్మాదులు కూడా మూఢులవుతున్నారు. అటువంటి పరమాత్ముడైన విష్ణువును ఇతరులు దర్శించగలుగుతారా! ఎంతమాత్రం దర్శించలేరు.

ఓ బ్రాహ్మణోత్తమా! ఇనుము అయస్కాంతం వద్ద ఎలా ఆకర్షింపబడి ఉంటుందో ఆ విధంగా దైవయోగంవలన నా చిత్తంకూడా ఆకర్షింపబడుతూ, హృషీకేశుడైన విష్ణుమూర్తి సన్నిధిలో లీనమవుతోంది.

ఓ సుగుణ సంపన్నా! మహానుభావా! వేయిమాట లెందుకు! మందార మకరందంలోని తీపిని అనుభవించే తుమ్మెద ఉమ్మెత్తపూల జోలికిపోదు. స్వచ్చమైన గంగా తరంగాలపై తూగాడే రాజహంస, వాగుల వంకల వైపు పోనే పోదు. లలితంగా ఉండే తీపి మామిడి చిగుళ్ళు తిని గొంతు సవరించే కోయిల, కొండమల్లెల వద్దకు వెళ్ళదు. నిండు చందమామ వెన్నెలలో తిరుగాడే చకోరపక్షి మంచువద్దకు చేరనే చేరదు. పద్మనాభుడైన విష్ణుమూర్తి పదపద్మ ధ్యానమనే అమృతపానంచేత విశేషంగా మదించిన మనస్సు, ఐహిక విషయాలవైపు ఎలా చేరుతుంది చెప్పు. చేరనే చేరదు.

ఈ మాటలు విని రాజసేవకుడైన బ్రాహ్మణుడు ప్రహ్లాదుని ధిక్కరించి ఇలా అన్నాడు.

శత్రువులను గౌరవించి స్వజనులను దూషించే స్వభావంగల ఓ ప్రహ్లాదా! నిండా ఐదేళ్ల వయసు లేదు. చిన్న బాలుడవు; ఇంతైనా లేవు. తర్కవాక్యాలు మాట్లాడుతున్నావు. ఇంతవరకు మేము విద్యాభ్యాస కాలంలో శాస్త్రార్థం ఎలా చెప్పామో అలా చెప్పక రాక్షసరాజు ముందు మాకు తలవంపులు తెచ్చావు.

రాక్షసేంద్రునకు ఈ ప్రహ్లాదుడు కొడుకు కాదు, శత్రువు. రాక్షసకులం అనే శ్రీగంధపుతోటలో ఈతడు ముళ్ల చెట్టులాగా జన్మించాడు. నిత్యం రాక్షసుల శత్రువైన విష్ణువుని స్తుతిస్తూ ఉంటాడు. దండిస్తే తప్ప, వీడు, చెప్పిన మాట వినడు. వీణ్ణి బంధించి గట్టిగా కొట్టండి.

ఓ రాక్షసరాజా! విను! ఈ బిడ్డను మేము చదివిస్తాం. నీ పాదాలపై ప్రమాణం చేస్తున్నాం. బాగా చదివిస్తాం. ఇంతకు మునుపు కంటె జాగ్రత్తగా అతనిని దండిస్తాం. దయచేసి మాపై ఆగ్రహించవద్దు.

అని పలికి ఆ రాజపుత్రుని అనేక విధాలుగా భయపెట్టి, రాజువద్దనుండి బయటకు తమతో తీసికొని వెళ్ళి ఏకాంతంలో

ఓ రాజా! రాక్షసమార్గం తప్పకుండా నిరంతరం అనేక పర్యాయాలు ప్రహ్లాదునకు ఆ భార్గవసుతుడు ధర్మార్థకామములను గూర్చి బోధింపగా

గురువులు శిష్యుడైన ప్రహాదునకు సామ, దాన, భేద, దండోపాయములను పూర్తిగా తెలియజెప్పి, నీతికోవిదుడయ్యాడని నమ్మి, నిర్ణయించుకొని, ఆ విషయాన్ని ముందుగా ప్రహ్లాదుని తల్లికి తెలియజెప్పి, తల్లిచేత అతనికి అలంకారం చేయించి ఆ ప్రహ్లాదుని చూచి

ఓ ప్రహ్లాదా! మా మాటను విను. మేము చెప్పిన విషయాలు తప్పవద్దు. విస్తారాలైన ధర్మార్థకామాలను గూర్చిన పాఠాలను తప్పవద్దు. మన రాక్షసేంద్రుని ముందు మేము చెప్పిన రాజనీతిని తప్ప, మనకు శత్రువైనవాని నీతులను చెప్పవద్దు. చెడ్డవైన విష్ణుకథా చరిత్రలు వెల్లడించవద్దు.

అని ఈ ప్రకారంగా ప్రహ్లాదుణ్ణి బుజ్జగించి, గురువులు దానవరాజువద్దకు తీసుకొని రాగా!

అడుగుతీసి అడుగువేస్తే విష్ణుచింతన అనే అమృత మాధుర్యంలో మైమరచిపోయేవాడిని, బ్రహ్మాదులుకూడా నేర్వలేని, హరిభక్తి పురుషరూపం దాల్చినవాడిని ఎలా ఉంటుందో రూపుకట్టినవాడిని, తల్లికడుపులో ప్రాణం పోసుకున్నది మొదలు తన చిత్తం విష్ణువు మీదే నిలిపిన వాడిని, ఈ ప్రపంచం అంతా విష్ణమయమే అని తనలో భావించేవాడిని, వినయం, దయ, సద్బుద్ధి, వివేకం, సల్లక్షణాలకు నిలయమైనవాడిని, పండితులచే ప్రశంసలు పొందగల తన శిష్యుడైన ప్రహ్లాదుణ్జి, గురువు సమీపించి హిరణ్యకశిపుని ముందుకు తోసి 'తండ్రికి నమస్కరించు' మని అన్నాడు.

(ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారదుని ఉపదేశంవల్ల అతనికి విష్ణుభక్తి విశేషంగా పెంపొందింది. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు ప్రహ్లాదునిలో వినయ విధేయతాది లక్షణాలు బాల్యంనుండే వికసించాయి.)

ఓ రాక్షసాధీశ్వరా! నీ కుమారుని మేం చక్కగా శిక్షించాం. అతడు ఇతర పక్షాలు మాని నీతికోవిదుడయ్యాడు. నీ బిడ్డ విద్యాబలాన్ని నీవు పరీక్షించి చూచుకోవచ్చు.

అలా మాట్లాడిన, శుక్రాచార్య కుమారుని మాటలు విని, హిరణ్యకశిపుడు తనకు సాష్టాంగనమస్కారం చేసి నిలుచున్న తన కుమారుని దీవించి, తన బాహువును సాచి దగ్గరకు తీసికొని, గాఢంగా కౌగలించుకొని, ఒడిలోనికి తీసికొని, ముంగురులు దువ్వి, గడ్డాన్ని పుణికి, బుగ్గపై ముద్దు పెట్టి, శిరస్సును ఆఘ్రాణించి, అతిశయించిన ప్రేమవల్ల జనించిన ఆనందాశ్రువులతో కుమారుని ముఖారవిందాన్ని తడుపుచూ, మెల్లని తీయని మాటలతో ఇలా అన్నాడు.

నీవు గురువులవద్దకు వెళ్లి చాలకాలం అయింది. మీ గురువులు వెదికి వెదికి నీకు ఏ ఏ విషయాలు చెప్పారో, ఏ మార్గంలో ఎంతవరకు చదివించారో, నీ విద్యాసారం తెలిసికోవాలని ఉంది. నీవు నేర్చిన శాస్త్రంలో ఒక్క పద్యాన్ని చెప్పి దానికి, అర్థంతోపాటు తాత్పర్యాన్ని కూడ వివరించవయ్యా!

ఓ ప్రహ్లాదకుమారా! నీతో చదువుకొనే నీ సహాధ్యాయులైన రాక్షసబాలురు నేర్పుతో గ్రంథాలన్నీ పరికించి అన్నీ చక్కగా చెప్పగలరు. నీతిపాఠాల విషయంలో వారు నిన్ను మెచ్చరు కదా! నీవు ఎప్పుడు నీతి పారంగతుడ వవుతావో అని మిక్కిలి కోర్కెతో ఎదురు చూస్తున్నాను. నా కన్నతండ్రివి కదూ! ఏదీ నీ గొప్పదనాన్ని చూపించు.

అలా అనగా కన్నతండ్రికి ప్రియ పుత్రుడైన ప్రహ్లాదుడు ఇలా సమాధానం చెప్పాడు.

తండ్రీ! నన్ను మా గురువులు చక్కగా చదివించారు. ధర్మం, అర్ధం ప్రధానంగాగల శాస్త్రాలను నేను చదివాను. నేను చదివినవి చాల ఉన్నాయి. వేయిమాట లెందుకు! చదువులలో దాగి మర్మాన్ని నేను తెలుసుకున్నాను.

(ఇక్కడ ప్రహ్లాదుని తండ్రి బోధించమన్నది ధర్మార్ధకామాలు మాత్రమే. గురువులు అట్లే చెప్పారు. కాని తండ్రి అడిగినప్పుడు “చదివితి ధర్మార్ధ ముఖ్యశాస్త్రంబులు" అన్నాడు. ఈ మాటల్లో ధర్మం, అర్ధం ముఖ్యమైన శాస్త్రాలు అని అర్థం చెప్పినప్పుడు త్రివర్గంలోని ధర్మ, అర్థాలు మాత్రమే చదువుకున్నాడు అనిపిస్తుంది. అతనికి కామశాస్త్రం పై దృష్టిలేదు. మరొక అర్ధం ధర్మార్థముఖ్య అనేచోట ధర్మంయొక్క అర్ధాన్ని వివరించే అంశాలు చదువుకున్నాడని చెప్పవచ్చు. అప్పుడు అర్ధకామాలు రెండూ ఉండవు. కేవలం ధర్మమే ఉంటుంది. అదికూడా భగవత్పరమైనదిగా ప్రహ్లాదుని భావన. చదువుల రహస్యమంతా పరతత్త్వం బోధించడమేనని ప్రహ్లాదుని భావం.)

ఓ రాక్షస శ్రేష్ఠా! 1) స్నేహం, 2) శ్రవణం, ౩) దాస్యం, 4) వందనం, 5) అర్చనం, 6) సేవ, 7) ఆత్మలో అన్నిటిని గ్రహించునేర్పు 8) సంకీర్తనం 9) నిరంతరభావన అనే ఈ తొమ్మిది భక్తి మార్గాలను మనసా వాచా కర్మణా త్రికరణశుద్ధిగా పాటిస్తూ, సర్వాత్ముడైన విష్ణువును నమ్మి సజ్జనుడై సాధుపురుషుడై ఉండటం సత్యమని, శ్రేయస్కరమని భావిస్తున్నాను.

(శ్లో: శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం |
        అర్చనం వందనం దాస్యం సఖ్య మాత్మనివేదనం॥ 
నవవిధ భక్తిమార్గాలు కూడా త్రికరణశుద్ధిగా పాటించాలని 'తనుహృద్భాషలు' గా అని పోతన పేర్కొనడం విశేషం.)

గ్రుడ్దివానికి వెన్నెల విరిసినా తెలియదు. శంఖధ్వానము చెవిటివానికి వినిపించదు, మూగవాడు మంచి గ్రంథాలు చదివినా వాటిభావాలను వ్యక్తం చేయజాలడు. నపుంసకులు అందమైన స్త్రీలను వాంఛిస్తే నిరుపయోగం. కృతఘ్నులతో బంధుత్వం వహించుట పూర్తిగా వ్యర్థం. బూడిదలో హోమద్రవ్యాలు వేయటం నిరుపయోగం. లోభి వానివద్ద ఎంత సంపద ఉన్నా ఉపయోగం లేదు. సూకరానికి సుగంధాల ప్రయోజనం సిద్ధించదు. ఈ విషయాలు అన్నీ ఎలా నిరుపయోగాలో అలాగే విష్ణుమూర్తిపై భక్తిలేని జనుల జీవితాలు కూడా నిరర్ధకాలే.

ఓ తండ్రీ! విష్ణువును పూజించే చేతులే చేతులు. శ్రీనాథుని వర్ణించే నాలుకే నాలుక; దేవరక్షకుని చూచే చూపులే చూపులు. శేషశయనుడైన హరికి మ్రొక్కే శిరస్సే నిజమైన శిరస్సు. విష్ణుని గూర్చి వినే చెవులే చెవులు. మదుసూదనునియందు లగ్నమైన మనస్సే మనస్సు. భగవంతునికి ప్రదక్షిణ చేసే పదములే పదములు. పురుషోత్తముని మీది బుద్ధే నిజమైన బుద్ధి. పరదైవమైన విష్ణువును యోచించే దినమే దినము. చక్రధారిని ప్రకటించే చదువే చదువు. భూదేవి భర్తఅయిన శ్రీహరిని గూర్చి చెప్పేవాడే నిజమైన గురువు. హరిపదాలను ఆశ్రయించు అని చెప్పే తండ్రే నిజమైన తండ్రి.

పద్మాక్షుడైన విష్ణుమూర్తికి సేవచేయని శరీరం శరీరం కాదు. గాలితో నిండిన తోలు తిత్తిమాత్రమే. వైకుంఠవాసుడైన విష్ణుమూర్తిని స్తోత్రం చేయని నోరు నోరు కాదు. కేవలం ఢమ ఢమ అని ధ్వనించే చర్మపుఢక్క మాత్రమే. హరిని పూజించని చేయి చేయే కాదు. కేవలం చెట్టు కొమ్మతో చేసిన తెడ్డు మాత్రమే. ఇందిరాపతిని చూడని కన్నులు కన్నులా! శరీరమనే కిటికీరంధ్రాలు మాత్రమే. సుదర్శనాయుధుని చింతించని జన్మము జన్మమే కాదు. నీటిపైని కదిలే బుడగ మాత్రమే. విష్ణుభక్తిలేని పండితుడు పండితుడు కాదు. రెండు పాదాలతో నడిచే పశువు మాత్రమే.

(భగవంతుడు మనిషికి కరచరణాది అవయవాలు ప్రసాదించాడు. ఆ కారణంవల్ల మనిషి దేవునిపట్ల కృతజ్ఞుడై ఉండడం ఒక రకమైతే ఆ అవయవాలను విష్ణుసేవకు అర్పితం కావాలని ఇక్కడ  ప్రబోధిస్తున్నాడు. కంజాక్ష, వైకుంఠం, హరిపూజనం, కమలేశ, చక్రశబ్దాలు, విశిష్టార్థద్యోతకాలు.)

ఓ రాక్షసేశ్వరా! విష్ణుమూర్తి సేవ అనే పెనుగాలి వీచకపోతే ఈ జననమరణాలనే దట్టమైన సంసారమేఘం వీడిపోదు. విష్ణుమూర్తి సేవ అనే ఒక అమృతవర్షం కురియకపోతే తాపత్రయాలతో కూడిన ఈ దావాగ్నులు చల్లారవు. శ్రీహరిపైగల జ్ఞానం అనే బడబాగ్ని లేకపోతే పాపపుజలరాసులు ఇంకిపోవు. పుండరీకాక్షుని గూర్చిన ధ్యానమనే సూర్యకాంతులు లేకుంటే కష్టాలనే గాఢాంధకారం సమసిపోదు. శార్ఙమనే కోదండాన్ని ధరించిన విష్ణుచింతనం అనే కాటుక కనులకు పెట్టుకోకపోతే అపురూపమైన, తరగని, నిర్మలమైన ముక్తి అనే పెన్నిధిని చూడజాలం. ఈ మాటలు నీ కొఱకు నా కొఱకు మాత్రమే కాదు. సాక్షాత్‌ పద్మగర్భుడైన బ్రహ్మకుకూడా విష్ణుస్మరణ వినా ముక్తికి వేరొక మార్గం లేదు.

(అంజనం - దూరంగా ఉన్న వస్తువును కనుగొనేందుకు కన్నులకు పెట్టుకునే కాటుక.)

ఈ విధంగా జంకు గొంకులేకుండా భయం విడిచి మాట్లాడిన కొడుకు మాటలు చెవులకు ములుకులవలె తాకగా, చెక్కిళ్ళు అదిరిపోగా, కోపంతో పెదవి కరుస్తూ అదిరిపడి గురుపుత్రుని చూచి, శత్రువుకు సంబంధించిన కథలను నా పుత్రునకు నేర్పావని కోపంతో రాక్షసరాజు ఇలా అన్నాడు.

నా కుమారుని నీతిశాస్త్ర పారంగతుని చేస్తానని నీవు తీసికొని వెళ్ళి వానికి అర్హంగాని విరోధిశాస్త్రాలు కుటిల బుద్ధితో నూరిపోసి మోసం చేశావు. నేను నిన్ను భృగువంశంలో గొప్పవాడవని నమ్మినాను. అయ్యయ్యో! నీవు బ్రాహ్మణుని ఆకారంలో ఉన్నావుగాని నిజమైన బ్రాహ్మణుడవు కాదు.

ఓ బ్రాహ్మణా! ఆ యా జనులను బాధించి, రహస్యంగా చేసే చెడ్డపనులు దుర్మార్గపు పనులు చేసేవారిని రోగాలు పట్టి పీడిస్తాయి. అలాగే అధర్మవర్తనులను, కుటిలబుద్దులను పాపాలు చేరి బాధిస్తాయి.

అని పలికిన ఆ రాక్షసరాజునకు, పురోహితుడు ఇలా చెప్పాడు.

ఓ రాక్షసరాజా! మావల్ల ఏ దోషాలు జరగలేదు. మేము విరోధుల కథలు గాథలు చెప్పలేదు. మేమే కాదు. ఇతరులు కూడా చెప్పలేదు. మీ పాదాలపై ఒట్టు సుమా! ఇది మీ కుమారుని సహజమైన బుద్ది విశేషం మాత్రమే. ఎవ్వరు చెప్పినది కాదు. జరిగింది జరిగిపోయింది. నేర్పుతో ఇప్పుడు ప్రతిక్రియ ఏమి చేయాలో ఆలోచించు.

ఓ దైత్యవంశాంబుధి చంద్రమా! చక్కగా విను. మేం నీకు మిత్రులం. పురోహితులమై నీ మేలు కోరేవాళ్లం. తగినవారం. అంతేగాక, నీ కులానికి గురువులైన భృగువంశంలో జన్మించినాము. ఇటువంటి మేం నీ కుమారునికి ఇలా విరోధిశాస్త్రాలు చెపుతామా! అలా చేయడానికి మేం నీకు శత్రువులమా చెప్పు!

ఈ విధంగా గురుపుత్రుడు పలుకగా, ఆ గురుపుత్రుడైన ఆచార్యుని పై ఆగ్రహింపక, ఆ దానవరాజు కొడుకునుచూచి ఇలా అన్నాడు.

ఓ కుమారా! నీకు ఉపాధ్యాయులు బోధించని ఈ విషయాలు నా పుత్రుడవైన నీకు ఎవరివల్ల తెలిశాయి? ఎవరు నీకు ఈ వైరి విషయాలు చెప్పారో, వారెవరో ఇప్పుడు నా ఎదురుగా చెప్పు.

అలా మాట్లాడిన తండ్రి హిరణ్యకశిపునితో, ప్రహ్లాదుడు ఇలా అన్నాడు.

కానరాని కటిక చీకటిలోపడి, ఇల్లే వ్రతంగా భావిస్తూ, ఇంద్రియసుఖాలకు లోబడి, జనన మరణ చక్రంలో అక్కడే తిరుగులాడుచున్న వారికి, హరికి సంబంధించిన జ్ఞానం లభించదు. అటువంటివారికి ఏమిచ్చి చెబుదామన్నాా అడవులలోకి వెళ్లినా హరికి సంబంధించిన భక్తిజ్ఞానాలు సిద్ధించవు. ఎవరు చెప్పినా, తమకు కావాలని కోరుకున్నా ఏదో ఒకటి బహుమానంగా ఇచ్చి చెబుదామన్నాా అడవులలోకి దూరినా 'హరిని పూజించాలి, హరిని కీర్తించాలి' అనే జ్ఞానం తొందరగా ప్రాప్తించదు.

ఓ దానవరాజా! గుడ్డివానిని ఊతగా గొని మరొక గుడ్డివాడు విశేషవస్తువులను చూడలేడు గదా! అలాగే కర్మాచరణమే ప్రధానంగా ఉండేవారు, కర్మలకు కట్టుబడేవారు, విష్ణువును దర్శించలేరు. మరికొంతమంది ఉన్నారు, వారు కర్మలను చేయక, ఒకవేళ చేసినా, నిష్కామ కర్మచేస్తూ లేదా కర్మఫలాన్ని పరమాత్మకే సమర్పిస్తారు. వారికి ఈ శక్తి నిష్కాములైన విష్ణుభక్తుల పాదధూలిని తమ శిరస్సుపై ధరించి కర్మసంబంధం లేనివారు కావడంవల్ల వచ్చింది. వారు మాత్రమే విష్ణువును కాంచగలరు, ఇతరులు కానలేరు.

(కేవల కర్మబద్ధుల సాంగత్యంకంటే నిష్కాములైన విష్ణుభక్తుల సాంగత్యం వల్ల విష్ణుదర్శనం లభిస్తుంది.)

ఓ రాక్షసరాజా! వేయి మాటలు, వేయి గాథలు త్రవ్వవలసిన పనిలేదు. అన్ని శాస్త్రాలు శోధించి చెప్పుచున్న విషయం ఇది. ఈ సంసారం అనే సముద్రం చాల విస్తారమైనది. లోతనైది. ఘోరమైనది. ఈ సముద్రంలో సుతులు సతులు పెద్ద పెద్ద చేపలు భయంకరమైన కోర్కులు, మదం, క్రోధం, ఎత్తుగా ఎగిరే అలలు. ఇటువంటి సంసార సముద్రాన్ని కేవలం విష్ణుమూర్తికి సంబంధించిన జ్ఞానమనే నావతో మాత్రమే దాటగలం తప్ప సామాన్యమైన జ్ఞానంతో దుష్టపు ఆలోచనలతో దాటలేం సుమా!

('మాధవ శేముషీ తరణి సాంగత్యంబునన్‌ గాక' - అనే వాక్యం కీలకమైంది. 170వ సీసపద్యంలోని “విష్ణుభక్తిలేని విబుధుండు” అనే మాటను తాకుతున్నది.)

అలా మాట్లాడిన కొడుకును ధిక్కరించి, ప్రేమను చూపక, రాక్షసరాజు ప్రహ్లాదుని తన ఒడినుండి క్రిందకు తోసివేశాడు. పట్టలేని కోపం వచ్చింది. ఆ కోపంవల్ల అతని వేడిచూపులు ఆకాశంలో మంటలు రేపాయి. మంత్రులతో ఇలా అన్నాడు.

విష్ణుమూర్తి సూకర రూపాన్ని ధరించివచ్చి తన పిన తండ్రిని చంపాడు గదా. ఆ విషయం తెలిసిన వీడు మనసులో విష్ణువుపై క్రోధం వహించి అతనిని ద్వేషించి, వదలి వేయాలి గదా! అలా చేయకుండా ఆ హరికి బంటుగా భక్తుడై, నా శత్రువు పక్షాన మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడటానికి భయపడటం లేదు. అరె! నా ప్రాణవాయువులకు బాధకలిగిస్తున్నాడు. నావంటి తండ్రితో వైరం వహిస్తున్నాడు. ఇలా తండ్రికి ద్రోహం తలపెట్టే కొడుకును ఈ సమస్త భూమండలంలో ఎక్కడైనా చూచారా!

అంటూ, రాక్షసవీరులను చూచి హిరణ్యకశిపుడు ఇలా అన్నాడు.

హిరణ్యకశిపుండు ప్రహ్లాదుని వివిధోపాయంబుల హింసించుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

పంచాంగం

The Story of Prahlada - ప్రహ్లాద చరిత్రము

ప్రహ్లాద చరిత్రము

ఓ ధర్మరాజా! రాక్షస కుమారుడైన ప్రహ్లాదుడు సమస్త జీవులను తనతో సమానంగా భావించేవాడు. పెద్దలు కనిపిస్తే సేవకునిలా వారిని చేరి నమస్కరించే తత్త్వం గలవాడు. ఇతర స్త్రీలు కన్పడ్డ వేళ మాతృభావంతో వారినుండి భక్తితో దూరంగా వెళ్ళేవాడు. దీనులను తలిదండ్రులమాదిరిగా వాత్సల్యంతో ఆదరించేవాడు. స్నేహితులను సోదరులుగా భావించేవాడు. గురువులను దైవాలుగా భావించేవాడు. ఆడే మాటల్లో అసత్యాలు పలుకని వాడు. ఇటువంటి చక్కని మర్యాద కలవాడు ప్రహ్లాదుడు.

(ధర్మవత్సలత ఆ సంస్కారసంపన్నుడైన మానవుడికి సంబంధించిన అనేకాంశాలు ప్రహ్లాదుని నెపంతో వ్యాసభగవానుడు అందించగా పోతన వాటికి మెరుగులు దిద్ది 'ధర్మవత్సలత' అనే పదాన్ని కొత్తగా చేర్చాడు. కన్న సంతానంపై వాత్సల్యం ఉండడం సహజం. ఏ దిక్కులేనివారిని, దీనులను తల్లిదండ్రులవలె కాపాడి పోషించేవాడు ధర్మవాత్సల్యం కలవాడని పోతన అభిప్రాయం. ఈ ధర్మవాత్సల్యం అనే పదాన్ని పోతనగారే తొలిసారి ప్రయోగించారు. ప్రపంచ సాహిత్యంలోనే మొట్టమొదటగా ఇటువంటి పదప్రయోగం జరిగిందని విజ్ఞుల అభిప్రాయం. ఏ వయస్సు వారికైనా ఇవే గుణాలుండాలని వ్యాసుల నిర్ణయం.)

అంతేగాక, ధర్మరాజా! ఆకారంలో జన్మలో విద్యలో సంపదలో ప్రహ్లాదుడు గొప్పవాడైనప్పటికీ అతడు ఎన్నడూ గర్విష్ఠికాడు. అనేక విషయభోగాలు తన ముందున్నప్పటికీ అతడు పంచేంద్రియాలకు లొంగడు. యౌవన ప్రాభవం తనకున్నప్పటికీ కామరోషాదులకు లొంగిపోడు. స్త్రీలు మొదలైన భోగములెన్ని ఉన్నా అతడు వ్యసనాలకు లోనుగాడు. ప్రపంచంలో తాను ఎన్ని విషయాలు చూచినా విన్నా అతడు ఆ విషయాలను కోరుకోడు. అతడు సర్వదా బ్రహ్మ భావనలోనే ఉంటాడు. అంతేకాక హరిపై మాత్రమే లగ్నమనస్కుడై ఇతర విషయాసక్తుడు కాకుండా ఉంటాడు.

ఓ నిర్మలమైన అంతఃకరణంగల ధర్మరాజా! సమస్త సద్గుణాలు గుంపులు గుంపులుగా వచ్చి రాక్షస కుమారుడైన ప్రహ్లాదుణ్ణి చేరాయి. అవి యీ నాటికీ విష్ణుమూర్తిని వదిలిపెట్టని విధంగానే అతనిని ఆశ్రయించి ఉన్నాయి అవి తొలగిపోవు.

ఓ ధర్శజా! ప్రహ్లాదుణ్ణి, శత్రుపక్షంవారైన దేవతాశ్రేష్ఠులు కూడా వారి వారి ప్రసంగాల్లో "ప్రహ్లాదునితో సమానమైన దైవభక్తులను మే మెరుగము" అంటూ సాధుపురుషుల గాథలను ప్రశంసించే సందర్భంలో ప్రహ్లాదునిగూడా అతని గుణగణ ప్రశంసలు చేయు వృత్తాలతో గాథలుగా కీర్తిస్తుంటారు. ప్రహ్లాదుని వివిధ ఛందోబంధాలతో కీర్తిస్తారని కూడా చెప్పవచ్చు. (మత్తేభ, చంపకమాల, ఉత్పలమాలాది వృత్తాలతో) అలాంటప్పుడు మీబోటి భగవద్భక్తులు దానవపుత్రుడైన ప్రహ్లాదుని గొప్పవానినిగా గణనచేసి కీర్తింపక ఉండగలరా!

సుగుణములకు నెలవైన ప్రహ్లాదుని గుణములు అనేకము లున్నాయి. ఆ గుణాలెన్ని ఉన్నాయంటే ఎంతకాలం లెక్కించినా ఆదిశేషునకు గాని, బృహస్పతికి గాని, చదువులతల్లిభర్త బ్రహ్మకు గాని శక్యం గావు.

సుగుణశ్రేష్ఠుడయిన ప్రహ్లాద కుమారుడు నిరంతరం భగవానుడైన విష్ణుమూర్తిపై భక్తి సహజంగా ఏర్పడి పెరిగి పెద్దదయిన విష్ణుధ్యానంలో మాత్రమే ఆసక్తి గలవాడై.

శ్రీమహావిష్ణువు తనను చేరినట్లు భావించినప్పుడు ప్రహ్లాదుడు తన స్నేహితుల దగ్గరకు వెళ్ళడం మరిచిపోతాడు. ఆ దైత్యాంతకుడైన విష్ణువు తనముందు ఆడినట్లు అనిపించగా రాక్షసబాలురతో ఆటలకు వెళ్ళడం మరచిపోతాడు. భక్తులంటే దయగల స్వామి తనతో మాట్లాడుతున్నట్లు భావించినప్పుడు ఇతరుల మాటలకు సమాధానాలు ఇవ్వడం మరిచిపోతాడు. దేవతా బృందంచేత నమస్కారాలు స్వీకరించే విష్ణుమూర్తిని తనలో చూచినట్లు భావన పొందినప్పుడు ఇతర ప్రపంచాన్ని విస్మరిస్తాడు. తన అంతరంగం శ్రీహరియొక్క పదపద్మచింతన అనే అమృతంతో నిండిపోగా అతడు నిత్యపూర్ణుడై అన్నిటిని మరచి తనకు జడత్వం లేకపోయినా జడునిగా ఉండిపోతాడు.

ఓ ధర్మరాజా! ప్రహ్లాద కుమారుడు. పానీయాలు త్రాగినా, భోజనాదులు చేసినా, మాట్లాడినా, ఆటపాటలలో, నిద్రించే వేళలలో, అటు ఇటు తిరిగేటప్పుడూ, సర్వకాల సర్వావస్థలయందు శ్రీమన్నారాయణమూర్తి పాదపద్మ ద్వయాన్ని తన హృదయంతో అనుసంధానం చేస్తూ బాహ్యంగా కన్పడే ఈ సమస్త ప్రపంచాన్ని మరచిపోయాడు.

ప్రహ్లాదుడు ఒక్కొక్కచోట విష్ణుమూర్తిని గూర్చి యోచించే స్థితిలో ఉండి ఇతర క్రియలు మాని విలపిస్తూ ఉంటాడు. నిరంతరం హరిని ధ్యానించటం మాత్రమే మనసులో నిలుపుకొని ఒక్కొక్కచోట ఉప్పాంగి పాడుతూ ఉంటాడు. విష్ణువు ఒక్కడే ఇంతే సుమా! వేరొకటి లేదని ఒకచోట నవ్వుతూ ఉంటాడు. పద్మాక్షుడనే పెన్నిధిని కనులార కన్నానని ఒకచోట హర్షాతిశయంతో గంతులు వేస్తుంటాడు. ఒకచోట పరమేశ్వరుడైన విష్ణువుపై ప్రేమభావంవల్ల మేను గగుర్పాటును పొందగా, ఆనందాశ్రువులు రాలుతుండగా, కండ్లు మూసుకొని పాడుతూ ఉంటాడు. ఒకచోట మౌనంగా నిలబడి ఉంటాడు. ఇలా హరిభావనతో చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తాడు ప్రహ్లాదుడు.

ప్రహ్లాదునకు పూర్వజన్మలోగల పరమ భాగవతులతోడి స్నేహం వలన విష్ణు పదకమల సేవాభాగ్యంబు అధికమై ముముక్షుమార్గంలో ప్రయాణింప చేసింది. ఈ ప్రహ్లాద జన్మలో దుర్జనరాక్షసుల స్నేహంవల్ల తన మనసు ఇతర విషయాల మీదకు పోనివ్వకుండా తన అధీనంలోనే ఉంచుకొని, ప్రమాదరహితుడై, సంసారంనుండి విడివడి, పండితులకు అణకువగా ఉంటూ మంచి అదృష్టవంతుడై, సుగుణమణులచే గొప్పవాడై, గొప్ప భగవద్భక్తులలో ఉత్తముడై కర్మబంధాలనే లతలను తెంచుకొని, పవిత్రుడుగా ఉన్నాడు ప్రహ్లాదుడు. అటువంటి పుత్రునిపై హిరణ్యకశిపుడు శత్రుత్వం వహించి దయ లేకుండా కన్న కొడుకును చంపటానికి భటులను పంపాడు అని నారదుడు చెప్పగా ధర్మరాజు ఇలా అన్నాడు.

లోకంలో తలిదండ్రులు తమ కుమారులు విద్యాది విషయాలను నేర్చుకున్నా, నేర్వకున్నా పోషిస్తారు. ఎప్పుడూ స్నేహభావాన్ని వహిస్తూ మంచి బుద్దులు చెప్పి తమ పిల్లల పాపపు బుద్ధిని నివారిస్తారు. ఎటువంటి శత్రుత్వం వహించరు. అటువంటిది అనంత సుగుణాల నిలయుడు, లోక పవిత్రుడు అయిన ప్రహ్లాద కుమారుణ్ణి కష్టపెట్టడానికి తండ్రికి మనసెలా ఒప్పిందో!

Lord Brahma granted a powerful boon to the demon king Hiranyakashipu - బ్రహ్మదేవుండు హిరణ్యకశిపునకు వరంబు లిచ్చుట

బ్రహ్మదేవుండు హిరణ్యకశిపునకు వరంబు లిచ్చుట

దేవతలందరూ బ్రహ్మవద్దకు వచ్చి మొరపెట్టారు; దేవతలలో అగ్రగణ్యుడు అయిన చతుర్ముఖబ్రహ్మ భృగువు దక్షుడు మొదలైన వారితో మందర పర్వతం వద్దకు వచ్చాడు. అక్కడ హిరణ్యకశిపుడు నియమనిష్ఠలతో ఉన్నాడు చీమలు అతని మజ్జనూ మాంసాన్ని చర్మాన్ని రక్తాన్ని పూర్తిగా తినివేశాయి. అతనిపైన పుట్టలు పెట్టాయి. గడ్డి మొలిచింది. వెదురు పొదలు పెరిగాయి. అతడు చేసిన మహాతపః ప్రభావంవల్ల దట్టమైన మేఘాల మధ్యలో ఉన్న సూర్యునివలె పుట్టలమధ్య ప్రకాశిస్తున్నాడు. అటువంటి హిరణ్యకశిపుడనే రాక్షసుని చూచి చతుర్ముఖబ్రహ్మ ఆశ్చర్యపడి నవ్వుతూ ఇలా అన్నాడు.

ఓ రాక్షస రాజేంద్రా! నీవలె తీవ్రమైన తపస్సు చేసినవారు ఇంతకు పూర్వం ఎవరూ లేరు. ఇకపై చేయగలిగినవారు లేరు. నీ తపస్సమాధికి మెచ్చుకొన్నాను. ఓ మహాత్మా! నీ వేమి కోరుకుంటావో అవి అన్నీ ఇస్తాను. ఇంకా ఆయాసపడవలసిన పని లేదు. తపస్సుతో కష్టపడవలసిన పని లేదు. తొందరగా లే! నీ కోరికలు ఏమిటో కోరుకో.

అడవిఈగలతో చీమలతో నీ రక్తమాంస మజ్జాదులు పూర్తిగా తినివేయబడ్డాయి. ఇక నీవు ఎముకల గూడుగా మాత్రం నిలిచి ఉన్నావు. నీ పైని వెదురుపొదలు గడ్డిదుబ్బులు మొలిచాయి. నీ చుట్టూ పెట్టిన పెద్దపుట్టలో ఇంద్రియాల చలనం రవంత కూడా లేకుండా నీవు ఉన్నావు. అసలు ఈ స్థితిలోకూడా నీకు ప్రాణాలు ఎలా నిలబడ్డాయో ఆశ్చర్యంగా ఉంది.

(కేవలం తపోనిష్టలో ఉండడంవల్ల శరీరం సర్వాత్మనా జీర్ణమైనప్పటికీ ఇంద్రియభ్రంశం లేకుండా ప్రాణాలకు నిలకడ సంభవించడం ఆశ్చర్యకరం. రాక్షసులు తమ ఆశయసాధన కోసం ఎన్ని కష్టాలైనా భరిస్తారు అందుకే రాకాసిపట్టు, రక్కసితాల్మి అనే పదబంధాలు ఏర్పడ్డాయి.)

ఓ రాక్షసరాజా! ఆహార పానీయాలను మాని ఎంతో సడలని ఆసక్తితో ఈ విధంగా నూరు దివ్యవర్షాలు తపస్సు చేశావు. అయినా ప్రాణవాయువులు నిలబెట్టుకొన్నావు. ఇదెలా సాధ్యం. మాకు చాలా ఆనందం అయింది. నీ తీవ్రమైన తపస్సుతో మమ్ము జయించావు. వాత్సల్యంతో నిన్ను కలవాలని వచ్చాను. నీ కోరికలు అన్నీ తీరుస్తాను.

బ్రహ్మ హిరణ్యకశిపునితో ఈ విధంగా మాట్లాడిన పిదప ఈగలు, చీమలచే పూర్తిగా తినివేయబడిన రాక్షసరాజు దేహంమీద తన కమండలం నీటిని ప్రోక్షించాడు. ఆ హిరణ్యకశిపుడు బ్రహ్మ హస్తపద్మంలో ఉన్న బంగారు కమండలంలోని మహిమాన్వితమై తిరుగులేని నీటిధారచే తడుపబడి. తపస్సు విరమించాడు. మహాసౌందర్యవంతమైన యౌవనంతో వజ్రంతో సమానమైన దృఢ దేహంతో పుటం పెట్టబడిన బంగారమువంటి శరీరకాంతితో ఎండుకట్టెలను మంట వేస్తే వచ్చే అగ్నివలె కాంతులీనుతూ హిరణ్యకశిపుడు తన చుట్టూ దట్టంగా మొలచిన వెదుళ్ళ పొదల పుట్టలనుండి బయటకు వచ్చాడు.

సరస్వతీమనోనాథుడు, మంచి ఉత్సవాన్ని కలిగించేవాడు, భక్తులను కాపాడేవాడు, చక్కటి తపస్సు చేసే తాపసుల కోర్కెలు తీర్చేవాడు, జగములను సృష్టించేవాడు, ప్రాణికోటి నుదిటిపై వారి వారి జీవనగమనాలను వ్రాసే మహావిద్యానిపుణుడు అయిన బ్రహ్మదేవుని చూచి దేవతలందరికీ శత్రువైన హిరణ్యకశిపుడు మొక్కాడు.

ఈ విధంగా రాక్షసరాజు హిరణ్యకశిపుడు ఆకాశంలో అగుపించిన బ్రహ్మదేవునకు భూమిమీద నుండి సాష్టాంగదండ ప్రణామాలు చేసి, సంతోషంతో ఆనందాశ్రువులు నిండగా, శరీరం పులకలెత్తగా, నమస్కారం చేసి బ్రహ్మపై చూపు నిలిపి గద్గద స్వరంతో ఈ విధంగా స్తోత్రం చేశాడు.

ఈ ప్రపంచం అంతా కల్పాంత కాలంలో అంధకార మగ్నం కాగా, ఎవడు తన కాంతితో ఈ లోకంలో వెలుగులు నింపుతాడో, రజస్సత్త్వ తమోగుణాలతో కూడి ఎవడు సృష్టి, స్థితి, లయకార్యాలు నిర్వహిస్తాడో, ఎవడు ఆద్యుడో, ఎవ్వడు అన్నిటికీ కారణ భూతుడో, స్వయం ప్రకాశంతో వెలుగొందుతూ ఉంటాడో, ఎవడు ప్రాభవంతో ఒప్పారుతూ ఉంటాడో, మరల సృష్టికాలం రాగా మనస్సు, ప్రాణం, బుద్ధి, ఇంద్రియాలతో ఎవడు గొప్ప ప్రభావంతో ఉంటాడో, అటువంటి సచ్చిదానందమయుడైన వానికి నేను భక్తితో నమస్కరిస్తాను.

ఓ దేవా! నీవు ముఖ్య ప్రాణం అయిన కారణంగా ప్రజాపతివి. మనస్సు, బుద్ది, చిత్తం, ఇంద్రియాలు అనే వాటికి అధినాయకునివి. సమస్త ప్రాణికోటికి నీవు ఆధారమైనవాడివి. వేద శరీరంతో యజ్ఞక్రియలు అధికం చేస్తావు. ఈ లోకంలో ఉండే సమస్త విద్యలు నీ శరీరమే. సర్వార్ధసాధనం కోరే వారికి నీవే సాధనీయుడవు. ఆత్మనిష్ఠాగరిష్ఠులు పొందదగిన ఆత్మవు నీవే. నీవే కాలస్వరూపుడవై ప్రాణికోటి ఆయువును నశింపచేస్తావు. నీవు జ్ఞానమూర్తివి. విజ్ఞానమూర్తివి కూడా నీవే. నీవు ఆద్యంత రహితుడవు. అందరి అంతరాత్మ నీవే. బ్రహ్మవిష్ణు మహేశ్వరులకు మూలమైన పరమాత్మవు నీవే. నీవే జీవలోకానికి జీవాత్మవు. ఈ సమస్త ప్రపంచం నీవే. నీవు కాకుండా ఈ విశ్వంలో రవంతకూడా లేదు. అందరికి తెలిసేలా వ్యక్తుడవుగా ఉండక పరమాత్మవై, సనాతనుడవై, అనంతుండవై నీవు ప్రాణ ఇంద్రియ మనోబుద్ధి గుణాలను స్వీకరించి, పరమేశక్తి అనే విశేషమైన పదవిలో ఉండి స్థూలశరీరంతో ఈ ప్రపంచమంతా విస్తరిస్తావు. భగవంతుడవైన నీకు నమస్కరిస్తాను. అంటూ మరియు ఇలా అన్నాడు.

ఓ దయానిలయా! అభవా! బ్రహ్మదేవా! నీవలె కోరిన వారి కోర్కులు తీర్చి నేరుపుతో నిలబెట్టెవారు ఎవ్వరూ లేరు. నీ విచ్చే పక్షంలో కోరికలు నేను కోరుతాను.

ఓ భువనాధీశ! గాలిలో గాని, భూమిపై గాని; అగ్నిలో గాని; నీటిలో గాని ఆకాశంలో గాని; అష్టదిక్కులలో గాని; రేయింబవళ్ళలో గాని; చీకటి వెలుగులలో గాని; గ్రహాలు, రాక్షసులు, మృగాలు, సర్పాలు, దేవతలు, నరులు మొదలైన వారితో యుద్ధసమయంలో గాని, వివిధములైన అస్త్రశస్త్ర సమూహంచే గాని మృత్యువు లేని, రాని జీవనాన్ని నాకు అనుగ్రహించు.

అంతేకాక, హిరణ్యకశిపుడు యుద్దాలలో తనకు ఎదురులేని పరాక్రమాన్ని లోకపాలురను తృణీకరించగలిగే మహిమను, ముల్లోకాలను జయించే శక్తిని కోరాడు. అతని తపస్సుకు సంతసించిన బ్రహ్మ అసాధ్యాలైనప్పటికీ హిరణ్యకశిపుడు కోరిన వరాలను ఇచ్చి, అతనిని కరుణించి ఇలా అన్నాడు.

అన్నా! ఓ కశ్యప కుమారా! నీవు కోరిన ఈ వరాలు ఎవ్వరికీ సాధ్య పడేవి కావు. ఇటువంటి వరాలు పూర్వం ఎవ్వరూ కోరలేదు. నీ తపాన్ని చూచి సంతోషించి నీవు కోరిన వరాలన్నీ ఇస్తున్నాను. మంచి మనసుతో, ప్రపంచానికి శ్రేయస్సు కలిగించే నడవడికతో, నైపుణ్యంతో, బుద్ధి సంపదకలిగి చక్కగా జీవించుమా!

ఈ విధంగా బ్రహ్మ తిరుగులేని వరాలు ఇచ్చి ఆ దితిపుత్రుడైన హిరణ్యకశిపునిచే పూజలందుకొని, బ్రహ్మ దేవతలు సమూహాలుగా చేరి నమస్కరిస్తూండగా తన నివాసానికి చేరాడు. ఈ ప్రకారంగా ఆ రాక్షసాధిపతి హిరణ్యకశిపుడు వరాల కొల్లలుగా సంపాదించుకుని

ఓ మహారాజా! తన సోదరుడైన హిరణ్యాక్షుని విష్ణువు సంహరించినందుకుగాను పగబూని రవంత అయిన ఆదరం లేకుండా రాక్షసరాజు హిరణ్యకశిపుడు విష్ణుమూర్తిపై మదంతో విరోధాన్ని పెంచుకొన్నాడు.

దితికుమారుడైన హిరణ్యకశిపుడు ఎదిరించుటకు వీలులేని పరాక్రమంతో ఒకరోజు గంధర్వ సమూహాన్ని సంహరిస్తాడు. ఒకరోజు దేవతలను తరిమి కొడతాడు. ఒకరోజు సర్పాలను సుఖపడకుండా చేస్తాడు. ఒకనాడు నవగ్రహాలను కట్టి పడేస్తాడు. ఒకనాడు యక్షులను భయంకరంగా శిక్షిస్తాడు. ఒకనాడు పక్షులను ఎగరకుండా పట్టుకుంటాడు. ఒకరోజు సిద్ధులను ఓడించి బంధిస్తాడు. ఒకరోజు మనుష్యుల మదాన్ని అణచివేస్తాడు. ఒకరోజు కిన్నరులు, ఖేచరులు, సాధ్యులు, చారణులు, ప్రేతాలు, భూతాలు, పిశాచాలు, అడవిమృగాలు, విద్యాధరులు మొదలైన వారిని సంహరిస్తూ, రోజు కొక్కరకంగా అందరిని బాధిస్తున్నాడు.

ఓ రాజా! హిరణ్యకశిపుడు మిక్కిలి కోపంతో, బురుజులతో సహా కోటలన్నిటిని ధ్వంసం చేసి రాక్షసులు చుట్టూరా మోహరింపగా, అష్టదిక్పాలకుల నగరాలను వశపరచుకొన్నాడు.

ఓ పుణ్యాత్ముడా! రాక్షసరాజైన హిరణ్యకశిపుని తీవ్రమైన ఆజ్ఞకు లోబడి, చిక్కి దుర్దశ పొంది, రేయిం బవళ్ళు, దిక్కులు దైన్యంతో కట్టుబడ్డాయి.

పగడాలతో నిర్మించబడిన మెట్లుకలది, మరకతాలనే పచ్చరాళ్ళుగల ప్రాంతాలు గలది, వైడూర్య రత్నస్తంభాలతో కూడినది, వెన్నెలతో సమానమైన తెల్లని స్పటికాలతో చేయబడిన గోడలు కలది, పద్మరాగ పీఠాలతో, బంగారంతో చేయబడిన తలుపులు, గదులు, గూళ్ళు, కిటికీలు కలది, వ్రేలాడు ముత్యాలదండలతో శోభించే తెల్లని పాన్సులు కలది, వివిధాలైన విచిత్రాలైన విమానాలు కలది, ఎల్లప్పుడు సువాసనలు వెదజల్లే పూలతో పళ్ళతో కూడిన చెట్లుగల తోటలు కలది; బంగారు పద్మాలతో, సౌగంధిక పుష్పాలతో నిండిన సరస్సులు కలది, రమణీయాలైన రత్నభవనాలు గలదియు, మనసుకు ఆనందం కలిగించే చల్లని సువాసనాభరిత మందవాయువులు కలది, సుకుమార మధురశబ్దాలు చేయు చిలుకల కోకిలల సమూహం కలది అయిన విశ్వకర్మ నిర్మితమై త్రిలోకరాజ్యలక్ష్మీ శోభితమైన మహేంద్రుని భవనంలో ఆ దానవరాజు హిరణ్యకశిపుడు ప్రవేశించి

దితియొక్క కుమారుడైన హిరణ్యకశిపుడు ముల్లోకాలకు ప్రభువై దేవేంద్ర సింహాసనం అధిష్టించి ఉండగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తప్ప మిగిలిన యక్ష్మ కిన్నరులు, మరుత్తులు, గంధర్వులు, సిద్దులు మొదలైనవారంతా భయంతో కలిసికట్టుగా అతనిని కొలిచి పాదాభివందనాలు ఆచరిస్తూ కానుకలు సమర్పిస్తున్నారు.

హిరణ్యకశిపుడు ఈ రోజు ఏ దిక్పాలకుని మీద కోపగించుకుంటాడో, ఏ దేవుని బంధిస్తాడో; ఏ దిగ్భాగంమీద దాడి చేస్తాడో, ఏ ప్రాణులను చంపుతాడో అనుకుంటూ దేవతలందరూ తాము ఎవరికి వారు భయంతో గగుర్పాటు పొందిన శరీరాలతో వారి వారి ఆస్థానాలలో ఉండే వేదికలపైకి ఎక్కి దేవేంద్రాది దేవతలు రహస్యంగా నిక్కి చూస్తుంటారు.

ఓ ధర్మరాజా! దేవతలకు శత్రువైన హిరణ్యకశిపుడు పరిశుద్ధమైన కర్పూరంతో పరిమళభరితమైన తీయని నూతనమైన మధువును తాగుటచేత సుఖంలో మునిగి ఉన్నాడు. అలజడిగా కాక శాంతిగా వుండడానికి దేవతలారా! మీరు కలకలం మానండి. తాపసులారా! మీరు దీవించండి; ఓ సర్పశ్రేష్ఠులారా! గర్వంతో మీ పడగల నెత్తకండి. దిక్పాలులారా! మీరు చక్కగా నమస్కరించి వెళ్ళండి. ఓ గంధర్వ శ్రేష్ఠులారా! మీరు గానం చేయండి. సాధ్యులారా! మీరు సందడి చేయకండి. అప్సరఃకాంతలారా! మీరు చక్కని నృత్యాలు చేయండి. ఓ సిద్దులారా! మీరు ఈ హిరణ్యకశిపుని చేరి మొక్కండి. అంటూ వేగులు నిత్యం హెచ్చరిస్తుంటారు.

ఓ ధర్మరాజా! దేవతలను ద్వేషించే ఆ హిరణ్యకశిపుడు లీలావతులతోకూడి ఉద్యానవనాలలో విహరిస్తూ మధువును సేవించడంవల్ల అతిశయించిన మదంతో చంచలమై తిరుగుతున్న ఎఱ్ఱటి కన్నులతో, కేళీవిలాసాలలో తేలుచున్నప్పుడు నారదుడినైన నేను, తుంబురుడు అతనిని (ఆ హిరణ్యకశిపుని) మా మా సంగీత ప్రసంగాలతో తప్పనిసరి పరిస్థితులలో ఆనందింప చేస్తుంటాం.

భూమిపై పలుచోట్ల పండితోత్తములు యజ్ఞయాగాది క్రియలు చేస్తుండగా, ఆ హిరణ్యకశిపుడు తానే వేగంగా అక్కడికి వచ్చి, ఆ హవిర్భాగాలు దేవతలకు ఇవ్వక దోచుకొంటున్నాడు.

అష్టదిక్పాలకుల గుణాలన్నీ ఆ రాక్షసరాజైన హిరణ్యకశిపుడే గైకొని ముల్లోకాలపై ఆధిపత్యం వహించి వృద్ధిలో ఉన్నవేళ సమస్త ద్వీపాలతో కూడియున్న భూభాగం దున్నకుండానే పంటలను ఇస్తున్నవి. ఆకాశం కామధేనువు మొదలైన వాటి వలె (కల్పవృక్షం, చింతామణి, కల్పలత వంటివివలె) యాచించే వారి కోరికలు సమృద్ధిగా కురుస్తున్నాయి. సప్తసముద్రాలు, నదులు వాటి తరంగాలచే రత్నాలను మోసుకొస్తున్నవి. వృక్షసముదాయం అన్నివేళల్లో అన్ని ఋతువుల గుణాలను కలిగి ఉన్నవి. అన్ని కాలాలలో అన్ని పూవులు పూస్తూ అన్ని పండ్లు పండుచున్నవి. పర్వతాలు మంచినీటితో బాగా నిండిన లోయలతో ఒప్పారి ఉన్నవి.

ఇట్లు అన్ని దిక్కులను హిరణ్యకశిపుడు జయించాడు. అన్ని లోకాలకు నాయకు డయ్యాడు. తన ఇష్టానుసారంగా ఇంద్రియ భోగాలను అనుభవించి తనివి తీరక ధర్మమార్గాన్ని అతిక్రమంచి, బ్రహ్మ ఇచ్చిన వరగర్వంతో జనించిన అధికమైన అహంకారంతో హిరణ్యకశిపుడు ఐశ్వర్యం కలవాడై చాలకాలం రాజ్యం చేస్తున్న సమయంలో

దేవ, కిన్నర, సిద్ధ, సాధ్య, ముని, ఖేచరుల అధిపతులు అందరు, మాకు శరణు ఎప్పుడు దొరుకుతుంది? ఆ రాక్షసుడైన హిరణ్యకశిపుని బాధ మాకు ఎప్పుడు తొలగిపోతుంది? మాకు అభివృద్ధి ఎప్పుడు లభిస్తుంది? మాకు రక్షకులు ఎవరున్నారు? అనుకుంటూ ఆ శేషశాయిని, భవ బంధములు త్రెంచువానిని, శేషతల్పుడు, పద్మాక్షుడైన విష్ణుమూర్తిని శరణు వేడారు.

ఈ విధంగా హిరణ్యకశిపుని భయంకరమైన శిక్షలకు భయపడి మరెవ్వరిని శరణువేడక రహస్యంగా అందరూ కూడుకొన్నారు.

సకలజగదీశ్వరుడు ఎక్కడ ఉన్నాడు? ఆత్మస్వరూపుడైన శ్రీపతి ఎక్కడకు వెళ్ళాడు? పరమశాంతులు, మునిశ్రేష్ఠులు, సన్యాసులు - ఏ దివ్యపదానికి వెళ్ళి తిరిగిరారో ఆ పరమపదంలో ఉండే పరంధామునికి, దిక్కులన్నిటికి దిక్కైన దివ్యమూర్తికి, చివరకు విశ్వమంతటినీ తనలో విలీనం చేసుకొనే ఆ దేవదేవునికి మేము అంజలి ఘటించి మమ్ము రక్షించవలసినదిగా మొక్కుతున్నాము.

అని యీ ప్రకారంగా ఆహారం నిద్ర విడిచి మనసు ఇతర విషయములపై నిలపక, కుదురుకొన్న బుద్ది గలవారై భగవంతుడు, మహాపురుషుడు, మహాత్ముడు, నిర్మలజ్ఞానానందస్వరూపుడు అయిన హృషీకేశునకు నమస్కరించే సమయంలో మేఘధ్వనితో సమానమైన శబ్దంతో దిక్కులు ప్రతిధ్వనించేలా సత్పురుషులకు అభయం ప్రసాదిస్తూ కనులకు కనబడకుండా పరమేశ్వరుడైన హరి ఇలా అన్నాడు.

ఓ దేవతలారా! మీరు భయాన్ని పొందకండి. మీకు భద్రం కలుగుతుంది నా దర్శన భాగ్యంచేత జీవకోటికి జయ లాభాలు సమృద్ధిగా కలుగుతాయి. హిరణ్యకశిపుని క్రియలు అసంబద్ధమైన మాటలు అన్నీ నేను ఎరుగుదును. కాలం కలసివచ్చినపుడు అతనిని నేను సంహరిస్తాను. అంతవరకు మీ మీ మార్గాలలో మీరు సంచరించండి.

సత్పురుషులపై, దేవతలపై, వేదాలపై, గోవులపై, బ్రాహ్మణులపై ధర్మమార్గంపై విష్ణువైన నాపై ఆ రాక్షసుడెప్పుడు కోపించి వైరాన్ని పొందుతాడో ఆనాడే ఆ రక్కసుడు హింసను పొందుతాడు.

తన కన్న కొడుకు ప్రహ్లాదుడు శమదమాది సద్గుణ సంపన్నుడనీ, అజాత శత్రువని భావించక ఆ హిరణ్యకశిపుడు ఆ ప్రహ్లాదునికి రోషంతో ఎప్పుడు ఆపదకలిగిస్తాడో ఆనాడే ఆ రక్కసుని నేను పట్టి సంహరిస్తాను.

ఈ హిరణ్యకశిపుడు బ్రహ్మ ఇచ్చిన వరబలం వల్ల ఇంతవాడై మిమ్మల్ని బాధపెడుతున్నాడు. ఇది నాకు తెలుసు. తెలిసినా ఇది సమయం కాదని ఇన్నాళ్ళు నేను సహించాను. ఇకపై వీనిని సంహరిస్తాను. మీరు నిర్భయంగా మీ మీ స్థావరాలకు వెళ్ళండి.

(భగవంతునికైనా సరే కాలనియతిని తప్పించ తరముకాదు. కనుకనే విష్ణువు దేవతలతో 'మీరు వేచి చూడండి. ఆ సమయం వచ్చినప్పుడు తప్పక సంహరిస్తాను'. అని మాట ఇచ్చాడు.)

ఈ ప్రకారంగా రాక్షసాంతకుడైన శ్రీమహావిష్ణువు దేవతలకు అభయమిచ్చాడు దేవతలు గుంపులు గుంపులుగా పరమాత్మకు మొక్కినారు. హిరణ్యకశిపుడు మరణించుట తథ్యమని వాళ్ళ వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళిపోయారు. హిరణ్యకశిపునకు విచిత్రమైన నడవడిగల నలుగురు పుత్రులు జన్మించారు. వారిలో


ప్రహ్లాద చరిత్రము

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

పంచాంగం

Disguised as a child by yama and said the story of suyagnu - బాలవేషము దాల్చిన యముండు దెలిపెడు సుయజ్ఞోపాఖ్యానము

బాలవేషము దాల్చిన యముండు దెలిపెడు సుయజ్ఞోపాఖ్యానము

తల్లీ! పరమాత్మ ఏ లక్షణాలు లేనివాడైనప్పటికీ, లక్షణాలు కలవానివలె, కర్మలతో కలిసియుండుటచే యోగాన్ని వియోగాన్ని పొందుతాడు. జన్మము, మరణము, దుఃఖము, వివేకము, అజ్ఞానము, చింత, స్మరణము అనేవి పలురకములుగా ఉంటాయి. ఈ పరమార్థాన్ని చెప్పే సందర్భంలో పెద్దలైనవారు ప్రేతబంధు యమసంవాదమనే ఇతిహాసాన్ని చెపుతూ ఉంటారు. ఆ కథను చెపుతాను విను.

ఉశీనరదేశంలో సుయజ్ఞు డనే రాజు ఉన్నాడు. అతడు యుద్ధంలో శత్రువులచే మరణాన్ని పొంది ఉన్న సమయంలో

చినిగిన రత్నకవచం, రాలిన ఆభరణాలు, బాణాలచే కొట్టబడిన వక్షఃస్థలం, కారుతున్న రక్తం, చెదిరి జారిన జుట్టుముడి, కోపంతో పెదవుల్ని పంటితో కొరుకుతూ, రెప్పపడని నేత్రాలు, దుమ్ము ధూళితో ఉన్న ముఖపద్మం, తెగిపడిన బాహుదండాలు కలిగి జీవం లేని ఉశీనరరాజును బంధువులు చుట్టుముట్టారు. అతని భార్యలు భయంతో కూడి

ఆ రాజు భార్యలందఱూ జుట్టు ముడులు వీడిపోగా, తాము ధరించిన హారాలు తెగిపడగా, చేతులతో గుండెలపై బాదుకుంటూ, ఓ నాథా! అంటూ, గతంలో అతనితో కలిసిమెలసి ఉన్న వేళలలో జరిగిన అనేక అంశాలను గుర్తు చేసుకుంటూ, తమ వక్షాలపై రాసికొన్న ఎర్రని కుంకుమ కన్నీటితో కరిగి అతని పాదాలపై వర్షించగా, విలపించారు.

ఓ పుణ్యాత్ముడా! పూర్వం బ్రహ్మదేవుడు నిన్ను, ఉశీనర దేశప్రజలకు సంపదలతో ఆనందం కల్గించడానికి సృష్టించి; ఇప్పుడు నిర్దయుడై నిన్ను తొలగించాడే! ఈ ప్రజలకు, సుతులకు, మాకు నీవు తప్ప దిక్కుఉందా! ఓ రాజా! సోదరులను, మిత్రులను, పుత్రులను వదలిపోవడం నీ వంటివానికి తగునా!

ఓ నృపాలా! మాకు నిన్ను విడిచిన క్షణాలు యుగాలుగా ఉంటాయి కదా! (నిమిషం సంవత్సరంలా గడుస్తుంది కదా!) ఇలా నీవు తిరిగిరాకుండా పరలోకానికి వెళ్ళిపోతే, మేము ఈ లోకంలో ఎలా ఉండగలం?! ఈ ప్రపంచంలో నీవు లేకుండా బతకడానికి మేము ఇష్టపడం. నీ పాదద్వయాన్ని చూచే నిమిత్తం మేము కూడా ఈ చితిమంటలలో దుముకుతాము.

ఈ ప్రకారంగా ఆ సుయజ్ఞుని భార్యలు భర్త శవందగ్గర విలపిస్తుండగా, సూర్యాస్తమయ సమయంలో వారి దుఃఖవాక్యాలు విని యముడు బ్రాహ్మణ బాలకుని రూపంలో వచ్చి ఆ శవంయొక్క బంధువులతో ఇలా అన్నాడు.

ప్రాణికోటికి సహజమైన విషయం ఒక్కటి ఉన్నది. ఎక్కువగా మక్కువ పెంచుకోవడం ఒక విచిత్రం. ప్రాణులు పుడుతూ చస్తూ ఉంటారు. అయినా చనిపోయినవారి కొరకు వీళ్లు చావనివాళ్లలాగా దుఃఖపడుతూ ఉంటారు. చావును ఎవరైనా తప్పించుకో గలరా! ప్రాణులన్నీ ఎక్కడ నుండి పుట్టాయో అక్కడికే వెళ్ళడం సహజమైన విషయం కదా!

(ఈ పద్యమే మానవుల నైజగుణాన్ని ఒక సూక్తిగా మలచి వ్రాసినాడు పోతన. ఇది ఒక వేదాంతార్థసూక్తి! “చచ్చినవారికేడ్చెదరు చావక మానెడు వారి భంగి" అనే వాక్యం, దుఃఖమనేది వాస్తవికమైన మృత్యువు ముందు ఎంత హాస్యాస్పదమో నిరూపిస్తున్నది.)

తల్లిదండ్రులను విడిచికూడా పసిపిల్లలమై వుండి, తోడేళ్ళవంటి మృగాల బారినపడకుండా అడవులలో అయినా బ్రదుకగలం. ఎందుకంటే భూమిపైకి రాకముందు తల్లిగర్భంలో ఉండగా మనలను ఎవడు పోషించడం వల్ల బ్రదికి ఉన్నామో. ఆ పరమాత్మయే నిజమైన పోషకుడు.

ఈ సమస్త ప్రపంచాన్ని సృష్టించి, రక్షించి, నశింప చేసే వాడెవడో ఆ అనంతశక్తి సంపన్నుడు ఎవడో, ఈ విశ్వానికి ప్రభువు ఎవడో, అతడే లీలావిలాసంతో ఈ లోకాలను రక్షిస్తూ పోషిస్తూ ఉంటాడు.

దైవయోగం బాగున్నప్పుడు మన ధనం బైట పారవైచినా సురక్షితంగా ఉంటుంది. అలా కానప్పుడు ఇంట్లో మూల భద్రంగా దాచినా మటు మాయమై పోతుంది. బలహీనుడు కూడా దైవయోగం బాగుంటే అడవిలో ఉన్నా హాయిగా బతికే ఉంటాడు. అలా కాని పక్షంలో భవనంలో రక్షణతో భద్రంగా ఉన్నా వాడు మరణిస్తాడు.

ప్రాణులన్నీ కాలకర్మవశాలై పుడతాయి, జీవిస్తాయి, మరణిస్తాయి . ఇది ప్రకృతిలో జరిగే అంశం. కాని ఆత్మమయుడైన పరమాత్మ ఆ ప్రకృతి గుణాలు అంటనివాడై, అగమ్యుడై అనగా ఎవ్వరును చేరలేనివాడై ఉంటాడు.

పంచభూతాలతో కూడిన ఈ దేహము ఒక భవనం వంటిది. అందులో ఆత్మ అనే పురుషుడు పురాకృత కర్మల కారణంగా ఒక్కసమయంలో ఉంటాడు, వెలుగుతాడు, సమయం వస్తే వెళ్ళిపోతాడు. శరీరం నశిస్తుంది తప్ప, అందులో వున్న ఆత్మ(పురుషుడు) నశించదు. ఆత్మకు రవంతకూడా చేటు రాదు. పురుషునకు దేహానికి భేదం ఉంది కాని, ఆ రెండూ ఒకటి కావు. కట్టెలలో అగ్ని ఉన్నట్లుగా, శరీరాలలో గాలి కదులుతున్నట్లుగా, తామరతూడులో శూన్యం ఉన్నట్లుగా, దేహికి దేహానికి గల భేదాన్ని తెలుసుకోవాలి.

(ఇక్కడ దేహమనగా 'ప్రకృతి' చే నిర్మించబడిన పాంచభౌతిక దేహం. 'దిహ ఉపచయే' అని ధాతువు. వృద్ధిపొందే లక్షణం కలది దేహం. దేహియైన జీవుడు నివసించేది దేహం. ఇది ప్రాకృతికమైనది. 'ప్రకృతి'లో పరిణామం సహజం. అందుచేత కాలగతిలో శరీరం నశిస్తుంది. దేహాన్ని ఆశ్రయించిన దేహి (జీవుడు)కి మరణం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే - ఎటువంటి వికారాలు మార్పులు లేనిది జీవాత్మ! అది మరోశరీరాన్ని ఆశ్రయిస్తుంది. 'షడ్భావవికారములు గలది శరీరం' అవి ఉన్నది, పుడుతున్నది, పెరుగుతున్నది, మారుతున్నది, క్షీణిస్తున్నది, నశిస్తున్నది. 'దేహంబు సెడుంగాని పురుషుండు సెడండాతనికి నింత సేటు లేదు' అన్నవాక్యంలో దేహం= శరీరం నశించేది; పురుషుడు= దేహి (జీవుండు) నశింపడు.

అని పలుకుతూ ఇంకా ఇలా అన్నాడు.

ఓ వెర్రులారా! ఈ రాజు నిద్రిస్తుంటే ఎందుకు దుఃఖిస్తారు! మాటలు మాట్లాడే, వినే జీవుడు ఎప్పుడో వెళ్ళిపోయాడు; ప్రాణభూతంగా ఉన్న వాయువు ఉన్నా, అది విడిగా భాషించడం కాని, వినడం గాని చేయలేదు. జీవుడు ప్రాణికి దేహానికి వేరుగా ఉండి అతడే ప్రధానుడై ఇంద్రియ ప్రభావంతో ఉంటాడు. పంచభూతాలు, ఇంద్రియాలు మనసులతో లింగదేహాలను అతడు కలుస్తూ ఉంటాడు. విడుస్తూ ఉంటాడు. అసలు ఈ వ్యాపారానికి ప్రభువు మరొకడున్నాడు. అతడే పరమాత్మ. ఈ రాజు మరణించాడని మీరు బాధ పడవలసిన పని లేదు. దుఃఖంతో దొర్లవలసిన పని కూడా లేదు.

ఆత్మ, దేహంతో ఎంతవరకు కలసి ఉంటుందో అంతవరకే ఈ కర్మయోగ సంబంధం ఉంటుంది. ఆత్మ, దేహాన్ని విడిచిన తరువాత ఈ సంబంధాలు ఉండవు. మాయకు గురియై ఎందుకు వ్యర్థంగా చింతిస్తారు?!

మహామాయా మోహితులైన కొందరు - స్నేహితులు, తల్లులు, తండ్రులు, కుమారులు, ఆశ్రితులు, భార్యలు మంచి గృహాలు అంటూ కొన్ని ఏర్పరుచుకుంటారు. స్వప్నంలో కనిపించిన అర్థాలు (విషయాలు) సత్యాలా! కాదు కదా! నిజానికి కర్మబంధంవల్లనే కలయిక, కర్మ నశిస్తే నిస్సంగం కలుగుతూ ఉంటాయి.

ఈ మాయాప్రపంచ లక్షణం ఎరిగిన, తత్వం తెలిసిన మహాత్ములు నిత్యమైన వాటికి సుఖం పొందరు. అనిత్యం అయినవాటికి దుఃఖం పొందరు. కొందరు అజ్ఞానులు మాత్రమే ఈ సంయోగ వియోగాలకు సుఖ దుఃఖాలు పొందుతారు. పూర్వం ఒక భయంకరారణ్యంలో ఒక బోయవాడు పక్షులను సంహరించేవాడు. అతడు ఒకనాడు సూర్యోదయాన లేచి, వేటాడాలనే ఆసక్తితో, బయలుదేరాడు.

వలలు, ఉచ్చులు, జిగురు కండెలు, చద్ది అన్నపుమూట, చిక్కము తీసుకున్నాడు. ఇంకా విల్లంబులు తీసుకొని, పక్షులను వేటాడే ఉత్సాహంతో బాణాలు వేసికొంటూ అడవిలోకి వెళ్లాడు.

ఈ విధంగా అడవికి వెళ్లాడు. ఆ అరణ్యంలో

మిక్కిలి ఆగ్రహంతో, పొదల మాటున, ఉరిగోలలతో పిట్టలను పట్టుకొని, కఠినంగా వాటి రెక్కలను విరిచి చిక్కెంలో వేసికొంటూ లోకభయంకరంగా ఆ అడవిలో ఆ కిరాతుడు సంచరించాడు.

మరియు అన్ని విధాల పక్షులను చంపుతూ పక్షులను సంహరించడానికి ఒడిగట్టిన ఆ కిరాతుడు తన ముందు దైవవశాన ఎగిరి సంచరిస్తున్న అడవి పిచ్చుక జంటలో ఆడపక్షిని ఉరిగోల వేసి పట్టుకొని తన చిక్కంలో వేసుకున్నాడు. అది జూచి మగపక్షి దుఃఖిస్తూ ఇలా అంది.

ఇతరులకు ఎవ్వరికీ ఏ కష్టం కలిగించకుండా, అడవులలో మేతమేసి సంచరించే మనకు, కఠినాత్ముడైన బ్రహ్మ ఈ బోయవాని చేతిలో పడే వ్రాతను మన నుదుట వ్రాశాడు. పాడుదైవం చూపులకు, మన బ్రదుకు ఇంత బరువయ్యిందా? ఓ ప్రియురాలా! అయ్యో! ఇంకేమి చెప్పమంటావు!

ఈ బోయవాని వలలో మనం అందరం ఒకే మారు పడేలా చేయకుండా, వంచన చేయడంలో నేర్పరియైన దైవం నిన్నొక్కదానినే ఈ బోయవాని వలలో పడేలా చేశాడు. ఈ విధి వికృత చేష్టలను ఏమని చెప్పగలను?

పిల్లలకు ఇంకా రెక్కలు రానే రాలేదు. తెల్లవారేసరికి ఆకలి వేస్తే దుఃఖిస్తాయి, తప్ప గూటినుండి ఎగరలేవు. నా తల్లి ఈ వైపునుండి వస్తుంది కదా అని చూపులు త్రిప్పకుండా మెడను పైకెత్తి దీనత్వంతో చూస్తూ ఉంటాయి. ఎలా నేను భరించగలను?!

అని ఈ విధంగా పలుకుతుండగా గొంతు ఎండిపోయేలా గద్గద స్వరంతో, బాధ పడుతున్న ఆ మగపక్షిని కూడా పట్టి చంపే ఆసక్తితో వున్న బోయవాడు ఒక్క బాణంతో గురితప్పకుండా నేల కూలేలా కొట్టాడు.

ఎంతటి సుగుణ సంపన్నులైనా కాలం సమీపించినట్లయితే, నేలకూలక తప్పదు గదా! అలాగే అంత్యకాలం చేరువ కాగానే ఈ మగపక్షి ఆ బోయవాని బాణపు దెబ్బకు పెద్దధ్వనితో నేల గూలింది.

ఓ దుఃఖితులైన కాంతలారా! మీరు కూడా మీ మరణ సమయాన్ని గుర్తించ లేరు. నేలగూలి మరణించిన ఈ రాజు దేహంపై పడి ఏడ్చినా, వందేళ్లకైనా మీరు అతనిని చేరలేరు. వెళ్ళిపొండి. అయినా చనిపోయిన వారు తిరిగి వస్తారా!

ఈ ప్రకారంగా మాయాబాలుడై అక్కడ తిరుగుతున్న యముని ఓదార్పు మాటలు విని సుయజ్ఞుని బంధువులంతా ఆశ్చర్యపడ్డారు. ఈసమస్త ప్రపంచం అశాశ్వతం అని తెలిసికొని, దుఃఖపడకుండా సుయజ్ఞునికి ఉత్తరక్రియలు జరిపించి వెళ్ళిపోయారు. ఆ తరువాత యముడు అదృశ్యం అయిపోయాడు. అంటూ హిరణ్యకశిపుడు తన తల్లిని, తమ్ముని భార్యలను చూచి ఇలా అన్నాడు.

వీళ్ళు పరాయివాళ్ళు, వీళ్ళు మనవాళ్ళు అని అనుకుంటారు గాని, పరికించి సత్యం గుర్తిస్తే, అందరూ ఒక్కటే. ఈ తత్త్వం తెలియక పోవడంవల్లనే ప్రాణులందరికీ “వారు - మేము” అని భేదభావం కలుగుతున్నది.

అని హిరణ్యకశిపుడు స్పష్టంగా చెప్పగా తల్లి దితి, కోడళ్ళు, దుఃఖాన్ని దిగమింగి, తత్త్వాన్ని గ్రహించారు. పరలోకానికి చేరిన హిరణ్యాక్షుని గూర్చి దుఃఖపడకుండా వెళ్లారు. అని చెప్పి, నారదుడు ధర్మరాజుతో ఇంకా ఇలా అన్నాడు.

హిరణ్యకశిపుడు మరణం, ముసలితనం లేని స్థితిని, ఎదురులేని ముల్లోకాధిపత్యం, ఇతరులందరినీ జయించగల భుజబలం, సింహబలం కావాలని కోరుకున్నాడు.

ఇటువంటి వరాలుకోరి హిరణ్యకశిపుడు మందరాచలంయొక్క కొండపల్లపు ప్రాంతానికి చేరి, అక్కడ తన కాలిబొటన వ్రేలుపై నిలబడి, చేతులు పైకెత్తి, ఆకాశం వైపు చూస్తూ తీవ్రమైన కిరణాలతో కూడిన ప్రళయకాల భాస్కరునివలె పొడవైన ఎరుపురంగు జటలతో, ఎవ్వరు తేరిపార చూడలేనట్లుగా పరమఘోరమైన తపస్సు చేస్తున్నాడు. దేవతలంతా చేష్టలుడిగి వారివారి స్థానాలలో ఉండి చూస్తున్నారు. ఇలా ఉండగా,

అతికష్టమైన ఆచారంతో హిరణ్యకశిపుడు తపస్సు చేయగా, పర్వతాలతో సహా భూమి అదిరింది. సప్తసముద్రాలు కల్లోలమయ్యాయి. గ్రహాలన్నీ ఉమ్మడిగా దిక్కులు పగిలి మండాయి. హిరణ్యకశిపుని తపస్సుయొక్క వేడిమితో అతని శిరస్సునుండి పొగతో కూడి, ఎగిసి పడే మంటలకు జంతుకోటి గుండెలు అదిరిపోయాయి.

ఈ విధంగా రాక్షసరాజు హిరణ్యకశిపుని తపస్సుయొక్క తీవ్రత మూడులోకాలను బాధించగా, దేవతలు సహింపలేక స్వర్గాన్ని విడిచి బ్రహ్మలోకానికి వెళ్ళి సకలలోక పాలకుడైన బ్రహ్మకు నమస్కరించి ఇలా విన్నవించారు.

ఓ దేవ దేవా! కరుణానిలయా! బ్రహ్మదేవా! దితి పుత్రుడు హిరణ్యకశిపుడు చేస్తున్న తపోదీక్షవల్ల వచ్చిన వేడిచేత మేమందరం బాగా తపించి పోయాం. ఆందోళనతో ఈ అమరావతిలో ఉండలేం. మాకు దిక్కు తెలియక ఉన్నాం.

ఓ దేవా! మూడులోకాలను నశింపచేయాలనో, దేవతలను అణగద్రొక్కాలనో, వేదశాస్రాల వినాశనమో కోరి ఈ హిరణ్యకశిపుడు ఈ తీవ్రమైన తపస్సు ప్రారంభించాడు. ఇందులో రవంతైనా సందేహం లేదు. ఈ హిరణ్యకశిపుని ఆలోచనకు ప్రతీకారం ఏమి చేస్తే బాగుంటుందో ఆలోచించు!

ఓ ప్రభూ! నీవు నీ తపోబలంతో దేవపాలకులందరికంటె గొప్పవాడవై జగత్తులను సృష్టించి సంపదతో శోభిస్తుంటే ఈ హిరణ్యకశిపుడు తన తపస్సుతో ఈ లోకాలన్నిటిని హింసించి ఇంకొక క్రొత్త ప్రపంచనిర్మాణం చేసే శక్తిని మనసులో కోరుతున్నాడు.

అంతేగాక కాలానికి అధీనమైన జీవులు అశాశ్వతులు కనుక; తపస్సు, యోగము, సమాధి బలంతో తనకు శాశ్వతత్వం కలగాలని హిరణ్యకశిపుడు అనుకుంటున్నాడు అంటూ, ఇంకా ఇలా అన్నారు.

ఓ లోకాధీశ్వరా! నీ మహోన్నతమైన బ్రహ్మపీఠాన్ని కొనియాడబడే నీ ఐశ్వర్యాన్ని విజయాన్ని సౌఖ్యాన్ని సంతోషాన్ని లోకులపాలు చేయడానికి సిద్ధపడిన ఈ హిరణ్యకశిపుని తపస్సును నివారించి నీ పరిపూర్ణమైన దయతో ఈ లోకాలను కాపాడు.

Sanaka, Sanandana, Sanatana, and Sanatkumara (the Four Kumaras) cursed Vishnu’s gatekeepers, Jaya and Vijaya - శ్రీహరి ద్వారపాలకులకు సనకాదుల వలన శాపంబు గల్లుట

శ్రీహరి ద్వారపాలకులకు సనకాదుల వలన శాపంబు గల్లుట

ధర్మరాజా చాలమంది కామం, ద్వేషం, భయం, స్నేహం, సేవ అనే లక్షణాలలో ఏదో ఒకటి మిక్కుటం కాగా శ్రీహరి సంబంధం పెట్టుకొని ఆయనలో ఐక్యమయ్యారు. శ్రీహరిని గూర్చి పైన చెప్పిన క్రోధాదులైదింటిలో ఒక్క లక్షణమైనను లేకపోవడంచేత వేనుడు వ్యర్జుడై భ్రష్టుడై నశించాడు.

మీ పినతల్లి కుమారులైన శిశుపాల దంతవక్త్రులు పూర్వం విష్ణుమూర్తి మందిరానికి ద్వారపాలకులు. బ్రాహ్మణశాపం వల్ల వారు వారి పదవులను కోల్పోయి భూలోకంలో జన్మించారు. అని నారదుడు చెప్పగా విని ధర్మరాజు నారదునితో ఇలా అన్నాడు.

ఓ నారదా! బ్రాహ్మణోత్తములు ఈ ద్వారపాలకులపై కోపించడానికి కారణం ఏమిటి? ఆ విప్రులు ఎవరు? నిత్యవైకుంఠ నివాసులైన ఈ ద్వారపాలకులు సామాన్యులు కారని వీరు విష్ణువుపై స్థిరభక్తిగలవారు, విష్ణువే పరతత్త్వంగా ఆరాధించే అనన్య భక్తిపరులు, అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహం గలవారు, సంసారబంధానికి చిక్కనివారు, నిరంతరం పరమాత్మను అనుసరించి ప్రవర్తించేవారు అని నేను విని ఉన్నాను. అటువంటి వారికి ఇటువంటి నీచజన్మలు ఎలా ప్రాప్తించాయి. వినాలని కుతూహలంగా ఉంది (అన్నాడు ధర్మరాజు).

నారదుడు ధర్మరాజుతో ఇలా చెప్పాడు. ఒకనాడు బ్రహ్మమానస పుత్రులైన సనకసనందనాదులు దైవవశాన మూడులోకాలు తిరుగుతూ ఐదారేండ్ల బాలకులలాగా దిగంబరులై హరిమందిరం అయిన వైకుంఠానికి వచ్చారు. వాళ్లు లోనికి ప్రవేశించే సమయంలో ద్వారం ముందు కాపలా ఉన్న ఇద్దరు పురుషులు ఈ బాలకులను చూచి

ఓ ధర్మరాజా! మిక్కిలి దైవవిశ్వాసంతో, స్వామిగుణకీర్తనం ఆసక్తితో చేస్తూ, నిర్మల మనస్సుగల బాలరూపంతో, వున్న సనకసనందనాదులను, విష్ణుమూర్తి నివాసంలోనికి వెళ్ళనీయకుండా ఆ ద్వారపాలకులు తరిమివేశారు.

ధర్మరాజా! ద్వారపాలకులు సనకసనందనాదులను లోనికి వెళ్ళకుండ అడ్డగించగా; విష్ణుదర్శనం చేసికోవాలన్న కుతూహలంతో ఉన్న విప్రులు సహించలేక "మీరు తప్పక రాక్షసయోనిలో జన్మింతురు గాక" అని ఆవేశంతో(తిట్టారు) శపించారు.

బాలకులు జ్ఞానవృద్దులు అయిన సనకసనందనాదులు ఆ ద్వారపాలకులను చూచి, మీరిద్దరు ఇక్కడ ఉండటానికి అర్హులు కారు. విష్ణుచరణాలను విడిచిపెట్టి రజోగుణతమోగుణాలు కలిగిన రాక్షసవంశంలో పుట్టుండని శపించారు. వారు ఆ శాపంవల్ల ద్వారపాలక పదవినుండి భ్రష్టులై, సనకసనందనాదులను ప్రార్ధింపగా, ఆ మహాత్ములు దయగలవారై వెంటనే కరుణించి, "మీకు మూడు జన్మలలో విష్ణువుపై వైరంతో భగవత్‌ సాన్నిధ్యం లభిస్తుంది" అని చెప్పి వెళ్ళిపోయారు.

ఆ విధంగా శాపంవల్ల మొదటి జన్మలో ద్వారపాలకులు ఇద్దరూ దితికి హిరణ్యాక్ష హిరణ్యకశిపులనే పేర్లతో జన్మించారు. వారిద్దరిలో హిరణ్యాక్షుణ్జి, హరి వరాహరూపంతో సంహరించాడు. హిరణ్యకశిపుడు నరసింహరూపం ధరించిన విష్ణువు చేతిలో మరణించాడు. ఆ హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు, తండ్రి హింసించినా కూడా మానకుండా నారాయణ పదార్చనాతత్పరుడై శాశ్వతకీర్తిని పరమపదాన్ని పొందాడు.

రెండవజన్మలో ఆ ద్వారపాలకులు కైకసి అనే రాక్షసికి, రావణ కుంభకర్ణులై జన్మించగా, విష్ణుమూర్తి రఘుకులంలో శ్రీరామచంద్రుడై అవతరించి వారిని సంహరించాడు. ఆ రాముని అమోఘపరాక్రమాన్ని మార్కండేయమహర్షి ద్వారా నీవు వింటావు.

పిదప మూడవజన్మలో వారిరువురు మీ పినతల్లికి శిశుపాలదంతవక్త్రులనే పేర్లతో జన్మించారు.

ఆ ద్వారపాలకులు మూడు జన్మలలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, రావణ కుంభకర్ణులుగా, చివరగా శిశుపాల దంతవక్త్రులుగాను జన్మించి, తీవ్రమైన పగతో, విష్ణుమూర్తిపై ఎప్పుడూ క్రోధాన్ని చూపుతూ, ఆ కోపంలో నిత్యం ఆయననే స్మరిస్తూ, వారి పాపాలన్నీ ఆ విష్ణుస్మరణంతో నశించగా, శ్రీకృష్ణునిచక్రంచేత శిరస్సులు ఖండింపబడగా, అప్పటికి వారికి సనకసనందనాదులు ఇచ్చిన శాపంయొక్క గడువు పూర్తికాగా, వైకుంఠంలో విష్ణుమూర్తికి సమానమైన రూపాలతో సమీపవర్తులై చరించారు.

అని నారదుడు పలుకగా విన్న ధర్మరాజు ఇలా అన్నాడు.

ఓ మహాత్మా! నారదా! తన సుతుడు చిన్న వయసువాడు కదా! నిరంతరహరిపదధ్యానతత్పరుడు, గుణవంతుడు, మంచి బుద్దిగలవాడు అయిన కుమారుని చూచి సంతోషించక, హిరణ్యకశిపుడు ఎందుకు శిక్షించాడు?

నరసింహస్వామి చరిత్ర కథనాలు, అందరి వ్యథలను పోగొట్టగలవు. అగాధమైన సంసారసముద్రాన్ని పూర్తిగా మథించగల నేర్పుగలిగినవి. దేవతలు యక్షులు నాగులు మొదలైన సమస్త జాతుల స్త్రీపురుషులను రక్షించగలవి (కాబట్టి ఆ నరసింహుని గూర్చి వినాలన్న కుతూహలం ఇక్కడ స్పష్టమవుతోంది.)

మునీంద్రా! నాకు వినిపించు అనగా నారదుడు ఇలా అన్నాడు. విష్ణుమూర్తి చేతిలో తన సోదరుడైన హిరణ్యాక్షుడు చనిపోయాడని విని, హిరణ్యకశిపుడు కోపంతో, దుఃఖంతో కుమిలిపోతూ భయంకరమైన కార్చిచ్చు జ్వాలలవంటి చూపులతో ఆకాశంలో పొగలు ఎగిసిపడేలాగా చూచి, మెరుపులు మెరుస్తున్నట్లుగా మిరుమిట్లు గొలిపేలా, పెదవులు కొరుకుతూ, కనుబొమలు ముడివడి భయం గొలిపే ఫాలభాగంతో, ఆపడానికి వీలులేని తీవ్రమైన కోపంతో కాంతులు చిందే శూలాన్ని చేతబట్టి, సభలో నిలబడి త్రిమస్తక, త్రిలోచన, శకుని, శంబర, శతబాహు, నముచి, హయగ్రీవ, పులోమ, విప్రచిత్తి మొదలైన రాక్షసులను చూచి ఇలా అన్నాడు.

ఓ దానవ మిత్రులారా! ఈ కఠోరవార్తను విన్నారా? నా సోదరుడు, మీ స్నేహితుడు, యుద్ధ విద్యానిపుణుడు బాహుబలంతో దేవయక్షులను ఓడించినవాడు అయిన హిరణ్యాక్షుణ్ణి, అతని భార్యల సౌఖ్యాలు వ్యర్థం అయ్యేలా శ్రీహరి మహావరాహరూపాన్ని ధరించి వధించి పోయాడట!

వరాహరూపంగా - ఈ వరాహరూపంగాడు అడవులలో, నీళ్ళలో ఉంటాడు. అవిసె చెట్లలో చరిస్తాడు. ఇతడి పుట్టుక ఎవ్వరికీ తెలియదు. వీడి అడుగుల జాడలుకూడా తెలియవు. సమీపిస్తే ఎదుర్కొంటాడు, కృషిస్తేగాని దొరకడు. కనుక ఏదో ఒక ఉపాయంతో మనమందరం వాడికి దొరకకుండా వాడే మనకు దొరకాలంటే ఏం చేయాలి?

విష్ణురూపంగా ఘోణికాడు - ఇతడు సామాన్య వరాహం కాదు. నారాయణుడు కనుక ఎప్పుడూ నీళ్ళల్లోనే ఉంటాడు. మునీశ్వరుల హృదయాలలో సంచరిస్తాడు. ఇతని జన్మ కర్మ రహస్యాలు ఎవ్వరికీ తెలియవు. ఇతని ఉనికి ఒకింతయు ఎక్కడో తెలియదు. ఇతన్ని ఆశ్రయిస్తేనే ఇతడు లభిస్తాడు. మన మనస్సు ఈయనకు లోబడితేనే ఈయన మనకు దొరుకుతాడు.

(జాగ్రత్తగా పరిశీలించి చూస్తే హిరణ్యకశిపుడు వరాహావతారాన్ని ధరించిన విష్ణువును నిందిస్తున్నట్లు కనిపిస్తున్నా ఆంతర్యంలో విష్ణుమూర్తి సర్వవ్యాపకత్వం అనే నిజస్థితి కన్పడుతుంది. 'ఘోణిగాండు అన్న మాట నిందార్థకం. దానికిది వ్యంజకం. “వ్యాజస్తుతిర్ముఖేనిందా స్తుతిర్వారూఢిరన్యధా” పైకి నిందగా కన్పిస్తున్న ఈ పద్యంలో, అంతర్వాహినిగా విష్ణుతత్త్వం  ప్రవహిస్తూంది. సంస్కృత మూలంలో లేని క్రొత్తపోకడగా ఈ పద్యం మనకు కానవస్తుంది.)

ఆ విష్ణుమూర్తి నాతో యుద్ధం చేయడానికి భయపడి భూమిపై నిలువలేక సముద్రంలో మునిగి (మత్స్యం మాదిరి) దాగవచ్చునుగాక. చలించని నా సంభ్రమానికి పరుగెత్తి వెన్నిచ్చి (తాబేలు) పారిపోవుగాక. నాతో పోరాడలేక సౌకర్యంగా (పంది) భూమికింద దాగిన దాగుగాక. ఈ పై విధములుగా కాకుండా పౌరుషంతో నాపై సింహం(నరసింహ రూపం) లాగా నాతో యుద్ధంచేసినా చేయుగాక. ఏది ఏ విధంగా జరిగినాసరే కఠినంగా, పదనుగా ఉండే నా శూలంతో విష్ణువు కంఠాన్ని తెగనరికి; వాని రక్తంతో నా సోదరుడైన హిరణ్యాక్షునికి తర్పణం చేసి నా ప్రతాపంతో తిరిగివస్తాను. ఓ రాక్షసమిత్రులారా! మీకు క్షేమాన్ని కలిగిస్తాను.

(ఈ పద్యం పోతన కవిత్వచాతుర్యానికి తార్కాణం. హిరణ్యకశిపుని పలుకులలో పైకి విష్ణుమూర్తిపై గల క్రోధాన్ని తెలియజేస్తున్నట్లున్నా పరిశీలించి చూస్తే విష్ణుమూర్తియొక్క అవతార విశేషాలు ధ్వనిస్తాయి. అది ఎలాగో గమనిద్దాం. మొదటిపాదంలో 'మున్నీట మునిగిన మునుగుగాక' అనేవాక్యం విష్ణుమూర్తియొక్క మత్స్యావతారాన్ని ధ్వనింపజేస్తుంది.

రెండవపాదంలో 'అచల సంభ్రమము' అనేచోట 'అచలము' అను పదానికి 'పర్వతం' అనే అర్ధం ప్రతీయమానమై 'వెన్నిచ్చిన ఇచ్చుగాక' అనుచోట మంథర పర్వతాన్ని మోయడానికి 'వెన్నును ఇచ్చిన కూర్మావతారం' ధ్వనిస్తోంది.

మూడవపాదంలో 'సౌకర్యకాంక్షియై' అనేచోట సూకరశబ్దం వరాహపర్యాయపదం గాబట్టి 'సౌకర్యకాంక్షియై' “యిలక్రింద నీంగిన నీంగుంగాక” అను పదాలవల్ల ఇలను పైకెత్తిన వరాహావతారం స్ఫురిస్తోంది. నాల్గవపాదంలో 'కొంతపౌరుషమున' అనుచోట కొంతమేర(నరుడు) పురుషుడుగా కన్పించి “హరిభంగి” అనే పదం ద్వారా “సింహం” స్ఫురించి సమీప 'నరసింహ' అవతారం ధ్వనిస్తోంది.)

ఒక వృక్షం మూలాన్ని ఖండించేసరికి దాని కొమ్మలు అన్నీ శక్తిహీనమై ఎండిపోయినట్లుగానే; యుద్ధంలో విష్ణువు ఓడిపోగా, అతడే వారందరికీ ప్రాణసమానుడుగాన దేవతలందరూ కూడా యుద్ధంలో ఓడిపోతారు.

ఓ రాక్షసులారా! మీరందరు గుంపులు గుంపులుగా బ్రాహ్మణులు నివసించే ప్రాంతాలకు పొండి. యజ్ఞము, తపస్సు, స్వాధ్యాయాలతో ఉన్న వారిని, మౌనవ్రతం చేసేవారిని వెదకి చంపండి. విష్ణువు అనగా వేరు కాదు. యజ్ఞం, వేదం విష్ణువే. బ్రాహ్మణుల క్రియాకలాపాలకు అతడే ఆధారం. ఆ విష్ణువే, దేవలోక, ఋషిలోక, పితృలోకాలకు, ధర్మాలకు అతడే గొప్ప ఆధారం. ఏ ఏ ప్రాంతాలలో గోవులు, బ్రాహ్మణులు, వేదాలు, వర్ణధర్మాలు ఆశ్రమధర్మాలు ఆచరింపబడుతూ ఉంటాయో ఆ యా ప్రాంతాలకు మీరువెళ్ళి మీ గర్వం ఉట్టిపడేలా వాటిని బుగ్గిపాలు చేసిరండి.

హిరణ్యకశిపుడు ఈ విధంగా ఆదేశించగా అతని ఆజ్ఞలు తలదాల్చి రక్కసులు భూలోకానికి వెళ్ళి,

రాక్షసులు భూమిలోగల గ్రామాలు, పెద్దనగరాలు, పుణ్యక్షేత్రాలు, చిన్నగ్రామాలు, వాడలు, పల్లెలు, తోటలు మొదలైనవన్నీ వెదికి, సరస్సులు పాడుచేసి, పెద్ద ప్రహరీలు, గోపురాలు, వారధులు త్రవ్వి, జమ్మి, మారేడు మొదలైన పవిత్ర వృక్షసమూహాలు నరికి, పెద్ద పెద్ద భవనాలు, చలివేంద్రాలు, గృహాలు, పర్ణశాలలు పాడుచేసి, సాధుసమూహం, గోసమూహం, బ్రాహ్మణసమూహాలకు కీడు కలిగించి, వేదమార్గాలు చెడగొట్టి, భూతలాన్నంతటినీ ఆటోపంతో పాడుచేయగా, దేవతలందఱు  తమ తమ ఆకారాలు చెడినవారై స్వర్గాన్ని విడిచి అరణ్యాలలో ప్రవేశించారు.

హిరణ్యకశిపుడు చాలా దుఃఖించి చనిపోయిన తనసోదరుడు హిరణ్యాక్షునికి తిలోదకాలు మొదలైన ఉత్తరక్రియలు చేశాడు. హిరణ్యాక్షుని కుమారులైన శకుని, శంబర, కాలనాభ, మదోత్కచ మొదలైనవాళ్ళను ఓదార్చాడు. వాళ్ళ తల్లిని, హిరణ్యాక్షుని మిగిలిన భార్యలను పిలిపించాడు. తమ తల్లియైన దితిని చూచి ఇలా అన్నాడు.

ఓ తల్లీ! ఈ ప్రపంచంలోని జనులందరూ చలువపందిరిలో కలుసుకొని కొంతసేపు కలిసియుండి తరువాత ఎవరికి వారు వెళ్ళిపోయేవారే. ఒకే చోటనే ఎల్లకాలం కలసి ఉండటం జరుగని పని. ఇది సత్యం. నీ కుమారుడైన హిరణ్యాక్షుడు మహాశూరుడు. అతడు వీరులు ప్రయాణించే మార్గంలో వెళ్ళాడు. అతని మరణానికి నీవు దుఃఖించే పనిలేదు.

(నదీ ప్రవాహంలో రెండు కట్టెలు కొంతదూరం కలసి విడిపోతాయి. అలానే సంసార ప్రవాహంలో ఎందరో కలుస్తుంటారు. విడిపోతుంటారు.)

పరమాత్మ సర్వజ్ఞుడు, ప్రభువు, సర్వాత్ముడు, నాశము లేనివాడు, స్వచ్చమైనవాడు, సత్యస్వరూపుడు, అంతము లేనివాడు, శ్రేష్ఠుడు ఎల్లప్పుడు ఆత్మరూపంతో తన మాయాప్రవర్తనవల్ల త్రిగుణాలను కల్పించి వాటి కలయికతో లింగశరీరాన్ని ధరిస్తూ ఉంటాడు. కదులుతూ ఉన్న నీటిలో పడిన చెట్లనీడలు కదలుచూ ఉన్నట్లు కనబడినట్లుగా, భ్రమకు లోనైన మానవుని కళ్లకు భూమి కదలుతున్నట్లు కనబడినట్లుగా, వికలభావాలు లేని ఆ ఆత్మమయుడు తాను కదలని వాడైనప్పటికీ కదలుతూ ఉన్న అంతరంగాలలో కదులుతూ ఉన్నట్లు కనిపిస్తాడు. అంతే తప్ప వాస్తవానికి అతడు కదలిక లేని అచలుడు.

(ఇక్కడ హిరణ్యకశిపుడు తల్లిని ఓదారుస్తూ భగవంతుని లీలావిభూతి తత్త్వాన్ని వివరించాడు.)

Jaya Vijayulu - జయ విజయలు

జయ విజయలు  పురాణాల ప్రకారం జయ-విజయులు వైకుంఠంలో శ్రీమహావిష్ణువు యొక్క ద్వారపాలకులు వీరు ఎప్పుడూ విష్ణుమూర్తి సేవలో ఉంటూ, వైకుంఠ ద్వారం వద్ద ...