Monday, March 2, 2026

The discourse between Sage Narada and King Prachinabarhi (Pracheena Barhi) - నారదుండు ప్రాచీన బర్హికి జ్ఞాన మార్గమును దెలియంజేయుట

నారదుండు ప్రాచీన బర్హికి జ్ఞాన మార్గమును దెలియంజేయుట

ప్రాచీనబర్హి అనే రాజు గొప్పవి అయిన యజ్ఞం మొదలైన కర్మలలో తగులుకొన్న చిత్తంతో ఉన్నాడు. అతని దగ్గరకు తత్త్వం తెలిసినవాడు, దయగలవాడూ అయిన నారదుడు వచ్చి అతనికి జ్ఞానాన్ని బోధించటం కోసం ఇలా అన్నాడు. రాజా! నీవు కోరుకొనే శ్రేయస్సు కీడులను తొలగించేదీ, ఇష్టాన్ని సమకూర్చేదీ కావాలి. కానీ అది ఈ కర్మలవలన కలుగదు అని పలుకగా ప్రాచీనబర్హి అతనితో ఇలా అన్నాడు.

పుణ్యాత్మా! మునివరా! మహాభాగా! నేను కర్మలచే నశించిన జ్ఞానం కలవాడనై మోక్షమంటే ఏమిటో తెలియని వాడనయ్యాను. ఇట్టి నాకు ఇప్పుడు స్వచ్చమైనదీ, కర్మబంధాలను నాశనం చేసేదీ అయిన జ్ఞానబోధచెయ్యి. దయాస్వరూపా! కపట ధర్మాలైన ఇల్లూ వాకిలీ ఆలూ, కొడుకూ, ధనమూ మొదలైనవన్నీ గొప్పపురుషార్థాలుగా తలపోసే బుద్ధిహీనుడు సంసారపు దారులలోనే దిక్కులేక గమ్యంలేక తిరుగుతూ ఉంటాడు. ప్రయత్నించి మోక్షపదాన్ని పొందలేడు.

అన్నంతనే ప్రాచీనబర్దితో నారదుడిలా అన్నాడు. పుణ్యాత్మా! ఈ యజ్ఞాలలో దయాదాక్షిణ్యాలు లేక నీవు చంపిన పశువులు వేలకొలదిగా ఉన్నాయి. చూడు.

కాబట్టి, నీవు యజ్ఞాలలో హింసించిన పశువులన్నీ నీ వల్ల కల్గిన హానిని స్మరిస్తూ నిన్ను చంపటానికి ఇనుపయంత్రాల కొమ్ములతో, నీవు ఎప్పుడు చనిపోతావో అని యెదురు చూస్తున్నాయి. ఇటువంటి పెద్ద ఆపద నీకు రాబోతున్నది. దీనినుండి దాటుకోవటానికి వీలు కలిగించే ఒక పాతకాలపుకథను నీకు చెబుతాను విను. అని ఇలా అన్నాడు.

పురంజనోపాఖ్యానము

Lord Rudra reciting the hymn called Yogadesh to the Prachetas - రుద్రుండు ప్రచేతసులకు యోగాదేశమను స్తోత్రముం దెల్పుట

రుద్రుండు ప్రచేతసులకు యోగాదేశమను స్తోత్రముం దెల్పుట

కాబట్టి భగవంతుడు, దేవదేవుడు అయిన ఆ పరమేశ్వరునితో కలయిక ఆ ప్రచేతసులకు ఏ విధంగా కలిగిందో ఆ తీరునంతటినీ నాకు చక్కగా తెలియజెప్పు.

అని పలుకగా విదురునికి మహర్షిశ్రేష్టుడగు మైత్రేయుడు ఇలా చెప్పాడు. ఆ ప్రచేతసులు సాధువైన బుద్ధి కలవారు. తమ తండ్రి చెప్పిన మంచిమాటలకు సమ్మతించారు.

తండ్రి ఆజ్ఞను తలదాల్చి పడమటి దిక్కుగా బయలుదేరారు. ఆ సమయంలో వారికి ఎదురుగా ఒక పెద్దసరస్సు కనపడినది. అందులో నిండుగా నిర్మలం, సుందరం అయిన నీరు ఉన్నది. సముద్రంకంటె మిక్కిలి వైశాల్యం కలిగి ఉంది.

ఆ కొలనిలో ఎర్రకలువలు, నల్లకలువలు, కమలాలు, సౌగంధికాలు చక్కగా వికసించి ఉన్నవి. పద్మాలలోని కేసరాలను ఇటు అటు కదిలిస్తూ ఆనందంగా మందమలయానిలాలు వీస్తున్నవి. ముద్దులు మాటగట్టే హంసలూ, బెగ్గురుపక్షులూ, చక్రవాకాలూ, కన్నెలేడిపిట్టలూ వీనులవిందుగా కూస్తున్నవి. మదించిన తుమ్మెదల మధురధ్వనులకు సంతోషంతో పులకరించినట్లుగా ఒడ్డున ఉన్న తీగలూ, చెట్లూ చిగురు తొడిగాయి. సిద్ధులు, చారణులు, గంధర్వులు అక్కడ విహరిస్తున్నారు. పుణ్యాలకు ఆలవాలమైన ఆ కొలనులోని నీరు శుచిగా తేటగా తియ్యగా ఉంది.

ఆ సరస్సు సజ్జనుని హృదయంలాగా నిర్మలంగా ఉన్నది. ఆకాశంలాగా దేవతలు సంచరించేదిగా ఉన్నది. గొప్పవాని భాగ్యంలాగా యోగ్యమైన జీవన విధానంకలిగి ఉన్నది. అభిమానవతి ప్రవర్తనలాగా గంభీరంగా ఉన్నది.

ప్రచేతసులు ముందుకు పోవుచుండగా వారికొక పెద్దసరస్సు కానవచ్చింది. అందులోని జలాలు చంద్రకిరణాలలాగా స్వచ్చంగా ఉన్నాయి. పాపాలను పోగొట్టే విష్ణుకథలలాగా మాలిన్యం లేకుండా ఉన్నాయి. అగ్నుల లాగా లోకాలను పవిత్రం చేసేవిగా ఉన్నాయి. అటువంటి నీళ్ళతో అది నిండి ఉన్నది.

ఆ విధంగా అందాలుచిందే ఆ గొప్ప సరస్సును చూచి అందులో ఒక్క దివ్యపురుషుని కనుగొన్నారు. అతడు

ఆ దివ్యపురుషుడు మదంతో ఒప్పారే ఇంపు సొంపులుగల మద్దెల, పిల్లనగ్రోవీ మొదలైన వాద్యాల మిక్కిలి ఇంపైన నాదంకలది, దివ్యుల మార్గాలలో సంచరించేవారి మనస్సులను రంజింపజేసేదీ అయి ఒప్పుచున్న మహనీయమైన గాంధర్వగానాన్ని ప్రీతితో వింటూ దాని మహిమకు అబ్బురం చెందుతూ ఇంకా వినాలి అనే వేడుకతో ఆ సరస్సునుండి వెలుపలికి వచ్చాడు.

ఇలా బయటికి రాగా

ఆ తాపస శ్రేష్ఠులైన ప్రచేతసులు అలా సరస్సునుండి వెలువడి వచ్చిన దివ్యపురుషుని చూచారు. ఆయన రుద్రుడు, పరమేశ్వరుడు, దేవతల లోకాలలో శ్రేష్ఠుడు; పుటంలో కాగిన బంగారంవంటి వన్నె కలవాడు. సనకాది మునులు ఆయనను గొప్పగా కీర్తిస్తున్నారు. మూడుకన్నులతో అలరారుతున్నాడు. భక్తులగుణాలను అనుసరించివారిని చేరుకుంటాడు. చాలా గొప్ప ఐశ్వర్యం కలవాడు. భక్తులను అనుగ్రహించే ప్రసన్నతతో విరాజిల్లే ముఖం కలవాడు. పాపాలను పటాపంచలు చేసుకొనేవారి సంపదలను కాపాడేవాడు.

ఆ తాపసవరులు ఆ రుద్రుని చూచి ప్రీతి, ఆశ్చర్యం ఎడతెరపి లేకుండా కలుగగా వినయం తెలియ వచ్చే తీరున ఆయన పాదాలనే పద్మాలకు మొక్కి భక్తికి వశమైన త్రికరణముల గతులుగల వారయ్యారు. అలా అవుతూ

భగవంతుడు, సర్వధర్మాలూ తెలిసినవాడూ, దయగలవాడూ, దర్శనమాత్రం చేత సర్వపాపాలనూ తొలగించివేసేవాడూ, భక్తులయందు పుత్రత్వప్రేమ కలవాడూ అయిన పరమేశ్వరుడు ప్రీతుడై, ప్రసన్నమైన అంతఃకరణం కలవారూ, ధర్మాలను ఎరిగినవారూ, శీల సంపదతో అలరారేవారూ, మిక్కిలి ప్రీతి పొందినవారూ అయిన ఆ తాపసులతో ఇలా అన్నాడు.

రాజకుమారులారా! వినండి. మీ మనస్సులో ఉన్న భావన అంతా నాకు తెలియ వచ్చింది. మీకు మేలు కలుగుతుంది. మీయందు దయగలబుద్ధితో నేను మీకు దర్శనం ఇచ్చాను. సూక్ష్మమైనదీ, మూడుగుణాలే స్వరూపంగా కలదీ అయిన ఆ ప్రకృతికంటె, భూమి మీద ప్రవర్తించే జీవునికంటే వేరైనవాడు వాసుదేవుడు. అతని పాదపద్మాలను ఉదాత్తభక్తితో కోరికోరి భజించేవారు నాకు చాలా ఇష్టులు. నీతి నడవడి కల ఓ సజ్జనులారా! వారి విషయంలో నేను కూడా ప్రీతికలవాడనై ఉంటాను. గొప్పమహిమతో ఒప్పారుతూ ఉంటాను. ఇంతేకాదు. మరొక్కమాట కూడా మీరు వినండి.

తన ధర్మంలో నిష్ఠగల పురుషుడు పెక్కు పూర్వజన్మల పుణ్యవిశేషాలచేత బ్రహ్మగా అవుతాడు. ఆ తరువాత పెరిగిపోయిన పుణ్యంతో నన్ను చేరుకుంటాడు. మా మా పదవీ బాధ్యతలు ముగిసినప్పుడు నేనూ, ఇతర దేవతల సముదాయాలూ ఆదిలో ఎట్టి వికారాలూ పొందని శ్రీహరి స్థానాన్ని పొందుతాము కదా! అట్టి స్థానాన్ని భగవద్భక్తుడు స్వయంగా పొందుతాడు. కాబట్టి మీరు భగవద్భక్తులయినవారు కనుక నాకు ఎంతో ప్రియమైనవారు. భగవంతునియందు భక్తి పండినవారికి నాకంటె ప్రియమైనవాడు లేడు. కాబట్టీ వివేకవంతమైనదీ, జపించదగినదీ, పవిత్రమైనదీ, శుభమైనదీ, మోక్షాన్ని ప్రసాదించేదీ అయిన నా మాటను ఆలకించండి. సృష్టి మొదట బ్రహ్మ తన కుమారులకు తెలియజేసిన శ్రీహరి స్తోత్రాన్ని మీకు తెలియజేస్తాను. వినండి. అది ఎటువంటిదంటే

బ్రహ్మదేవుడు తనకుమారులైన సనకుడు మొదలైన వారిని చూచి నాయనలారా! శ్రీ మహావిష్ణువునకు సంబంధించిన శుభప్రదమైన స్తోత్రాన్ని మీకు తెలుపుతాను. వినండి అన్నాడు.

ఇలా పలికి విష్ణువును గూర్చి వారలు వింటూ ఉండగా ఇలా పలికాడు. స్వామీ! ఆత్మతత్త్వం తెలిసినవారికి నీ మహిమ ఆత్మానందం అనే లాభాన్ని కలిగిస్తుంది; అట్టి ఆత్మానందం మాకు దొరకాలి. నీవు నిండైన ఆనందమే స్వరూపం అయినవాడవు. ఇట్టి సమస్తమూ స్వరూపంగా అయిన నీకు నమస్మారం చేస్తాను అని ఇంకా ఇలా పలికాడు.

(పరిపూర్ణానంద స్వరూపుడు- సత్తు, చిత్తు, ఆనందం అనేవి మూడూ పరమాత్మ స్వరూపాలు; ఏది సత్తో, ఏది చిత్తో, అదే ఆనందం అనే అనుభవమే పరిపూర్ణానందం. అట్టి ఆనందం తప్ప మరే ఇతర భావమూ లేనివాడు పరిపూర్ణానంద స్వరూపుడు.

నమస్కరించటం అంటే అయిదు జ్ఞానేంద్రియాలనూ, అయిదు కర్మేంద్రియాలనూ, మనస్సుతో పాటుగా కలిపి స్వామికి సమర్పించుకుంటున్న భావాన్ని చేతిముద్రద్వారా ప్రకటించటం.

స్వామీ! నీవు నాభిలో పద్మంగలవాడవు. సంకర్షణుడవు. శాంతుడవు. విశ్వానికి జ్ఞానాన్ని ఇచ్చేవాడవు. భూతాలూ, సూక్ష్మతత్త్వాలూ, ఇంద్రియాలూ స్వరూపంగా గలవాడవు; సూక్ష్మ దేహం ఆత్మగా అయినవాడవు. వాసుదేవుడవు. పూర్ణుడవు. పుణ్యుడవు. ఏ వికారాలూ లేనివాడవు. కర్మబంధంనుండి జీవులకు మోక్షం కలిగించేవాడవు. వేదాలను సంరక్షించేవాడవు. మూడు లోకాలను పాలించేవాడవు. చంద్రునివంటి రూపం కలవాడవు. తేజస్సుతో, బలంతో అంతటా పేరుపొందినవాడవు. నీ అంత నీవు వెలుగొందే వాడవు. దుష్టులను అంతం చేసేవాడవు. యజ్ఞాది కర్మల సాధనాలుగా అయ్యేవాడవు. సనాతనుదడవు. యజ్ఞాలకు భీజం అయినవాడవు. ప్రాణశక్తితో తృప్తి పొందేవాడవు. భూమి, లోకాలూ, ఆకాశమూ నీ స్వరూపాలే. నీవు ప్రళయ కారుడవు. విశ్వాలు నీ నుండియే పుట్టాయి. నీవు విష్ణుడవు, జిష్టుడవు. అట్టి నీకు నమస్కారం.

(ఇది గొప్పవిష్ణుస్తుతి. ఛందస్సు దేశీయమైనా భావన అంతా వేదాంతతత్తంలో నిండినది కనుక సంస్కృత వాక్యంగా పోతనగారు రచించారు. ఇందులో 'పంకజనాభాయ' అనేది మొదలుకొని 'జిష్టవే' అన్నంతవరకుగల ఇరవై ఎనిమిది పదాలు సంస్కృత భాషలో చతుర్ధి విభక్తి అంతమందుగల పదాలు. “నమః” అనేది ఎవరినుద్దేశించి చేయబడుతుందో అట్టివ్యక్తిని తెలిపేపదానికి చతుర్ధి విభక్తి కలగటం వ్యాకరణ నియమం. 'అస్తు' అనేది విధ్యర్థకక్రియ- అగుగాక! అనిదాని అర్థం.)

స్వామీ! నీవు స్వరానికీ, మోక్షానికీ మంచి ద్వారం అయినవాడవు. అన్ని రసాలూ స్వరూపం అయినవాడవు. పరమహంసవు. ధర్మపాలకుడవు. శ్రేష్ఠం, హితమూ అయిన ఫలమే రూపం అయినవాడవు. కృష్ణుడవు. ధర్మాత్ముడవు. సర్వశక్తులతో కూడిన వాడవు. గొప్పది అయిన సాంఖ్యయోగం పండించుకొన్నవారికి ప్రభుడవు. సువర్ణం నీ వీర్యం. రుద్రుడవు. ఉత్తమ శీలం కలవారికి రక్షకుడవు. దుష్టులకు శిక్షకుడవు. శూన్యమైన ప్రవృత్తి కలవాడవు. యజ్ఞాది కర్మలు నీవే, మృత్యుదేవతవు. విరాట్టు నీ శరీరం. సర్వధర్మస్వరూపుడవు. వాగ్వైభవమంతా నీవే. నివృత్తి నీతత్త్వం. గొప్ప పుణ్యంతో గొప్పది అయిన వర్చస్సు కలవాడవు. నీ దేహం అఖిల ధర్మాల స్వరూపం. ఆత్మవు. ఏ అడ్డూ ఆటంకమూ లేనివాడవు. పరిపూర్ణ స్వరూపుడవు. అట్టి నీకు నమస్కారం.

సర్వప్రాణి స్వరూపుడవు, దేవుడవు, అన్నింటి ఉనికినీ తన అధీనంలో పెట్టుకొన్నవాడు, వెలుపల, లోపల తానే అయి ఉన్నవాడు; కారణాత్ముడు, సమస్తమైన విషయాలను అభివ్యక్తం చేసేవాడు, నిర్గుణుడు, స్రష్ట మనోనిగ్రహం కలవాడై సాధువైనవాడు అయిన నీకు నమస్కారం.

అని ఇంకా ఇలా అంటున్నాడు. నీవు ప్రద్యుమ్నుడవు, అంతరాత్మవు. సృష్టిలోని సర్వపదార్థాలూ నీ అంశలు. అవి ఏర్పడటానికి కారణమైనవాడవు. యజ్ఞాలలో నాలుగు విధాలుగా ఆయా కార్యాలు నిర్వహించే ఋత్విక్కులుగా అయ్యేవాడవు. సర్వాన్నీ లయం చేసేవాడవు. సర్వజ్ఞానమూర్తివి. జ్ఞాన క్రియలుగా గోచరించేవాడవు. సర్వజీవుల హృదయాలలో నివసించేవాడవు అయిన నీకు నమస్కరిస్తాను.

స్వామీ! పుణ్యపురుషా! నీ పాదాలను తృప్తిగా చూడాలనే కోరిక అధికమైన, వైష్ణవులు గొప్పగా సంభావించే నీ దర్శనాన్ని మాకు అనుగ్రహించవయ్యా!

ఆ నీదర్శనం ఎటువంటిదంటే

పుణ్యాత్మా! అది ఇంద్రియాలన్నింటి గుణాలైన శబ్దం మొదలగువాని స్పర్శ కలది, భక్తులకు ప్రియమైనది, నీలమేఘంవలె శ్యామలవర్ణం కలది, అందచందాలతో అలరారుతూ ఉండేది, పోలిక లేనిది, నిత్యమంగళాలను కూర్చేది.

దేవా! నీ సుందరమైనమూర్తి తుమ్మెదల గుంపువలె ఒప్పారే ముంగురులతో అలరారే చంద్రరేఖనుపోలెడు ముఖం కలది. ఒకే విధంగా ఉండే కర్ణభూషణాల కాంతులతో కూడి ఉన్నది. తీర్చిదిద్దినట్లున్న కనుబొమలతో, నాసికతో సుందరంగా ఉన్నది. చాలా సుకుమారమైన మల్లెమొగ్గలవంటి పలువరుసతో నిండి నిగనిగలాడుతున్న చెక్కిళ్ళ జంటతో ఒప్పుతున్నది. తామర రేకులవంటి అందమైన కన్నులు విరాజిల్లుతున్నాయి. చిరునగవుతో ఒప్పారే కంటికొనలతో సుందరంగా ఉన్నది. వికసించిన చూపులతో నిరంతరం ప్రసన్నంగా ఉంది మోము. శంఖంవలె సుందరమైన శుభమైన కంఠం కుదురుకొని ఉన్నది. సువర్ణమయహారాల, మణికుండలాల కాంతుల వెల్లువతో కూడిన అందమైన సింహం మూపులవంటి మూపులు కలిగి ఉన్నది.

ఆ భగవంతుని దివ్యరూపం ఈ విధంగా ఉన్నది. శంఖం, చక్రం, గద, పద్మాలతో విరాజిల్లుతున్న నాలుగు చేతులు, వైజయంతి అనే వనమాలతో, కౌస్తుభం అనే మణియొక్క శోభతో ప్రకాశిస్తున్నది. ఎప్పుడూ తన్ను వదలి ఉండని లక్ష్మీదేవి అనే సుందరీమణితో కూడిన చైతన్యంతో ఒప్పారుతున్నది. ఒరగంటిని కాదనగల్గిన రొమ్ము ప్రదేశంతో విరాజిల్లుతున్నది. పీల్చేగాలీ, వదలేగాలీ అనే వానితో అందంగా కదలుతున్న మూడుముడుతలతో సుందరంగా ప్రకాశిస్తున్న సన్నని నడుముతో అలరారుతున్నది. మునుపు వెలుపలికి వచ్చిన సమస్తమైన విశ్వాన్నీ మళ్లీ లోపలికి తీసుకుంటున్నదా అనిపించే నీటి సుడిలాగా ఉన్న లోతైన బొడ్డు ఒప్పారుతున్నది. పద్మంలోని కేసరాలవలె చక్కగా వెలుగొందుతన్న పట్టుబట్ట మీద కట్టబడిన బంగారు మొలతాటి పేటలతో అందగించిన నీలవర్ణంకలదీ, పెద్దదీ అయిన పిరుదుల భాగం శోభిల్లుతూ ఉన్నది. నల్లని అరటి బోదెలవంటి సుందరమైన రెండుతొడలతో అలరారుతున్నది, సమంగా సుందరంగా ఉన్న పిక్కలు కలిగి ఉన్నది. గంభీరమైన మోకాళ్ళ జంటతో ప్రకాశిస్తున్నది. తామరరేకువలె వెలుగొందుతున్న పాదాలజంటతో ప్రకాశిస్తున్నది. నాదైన మనస్సులోని చీకటిని ఆపివేసే చంద్రకళలవలె ఉన్నట్టి గోళ్ళు కలిగి ఉన్నది. కిరీటం, కుండలాలు, మెడలోని హారాలు, భుజకీర్తులు, వలయాలు, ఉంగరాలూ, మణినూపురాలు మొదలైన పెక్కుతీరులైన ఆభరణాలతో అలంకృతమై ఉన్నది. జనులందరి, అన్ని విధాలైన భయాలను తొలగించి వేస్తున్నది. భక్తజనులకు మనోహరంగా ఉన్నది, సర్వశుభాలకూ నిలయమై ఉన్నది. స్వామీ! అటువంటి నీ దివ్యమైన భగవత్స్వరూపాన్ని తామసగుణంతో నీచస్థితికి జారిపోయే జనాలకు కూడా సన్మార్గాన్ని చూపించేవాడవైన నీవు మాకు చూపి మమ్ములను నెరవేరిన ప్రయోజనం కలవారినిగా చెయ్యి అని ఇంకా ఇలా అన్నాడు.

ఓ పాపభావనలేని ప్రవృత్తి కలవాడా! తామర రేకులవంటి కన్నులున్నవాడా! అందరకు అలవరచుకోవలసిన మంచి చరిత్ర కలవాడా! స్వామీ! నిర్మలత్వాన్ని కోరేవారు ధ్యానించతగిన వస్తువు నీవు. గొప్పదైన స్వర్గరాజ్యానికి అభిషేకం పొందిన వానికైనా చాలా ఎక్కువగా ఆశపడదగినవాడవు నీవు. నిలుకడగా ఉండే భక్తితో కూడిన భక్తజనులకు నీవు సులభుడవు. దుష్టబుద్దులకు నీవు దొరకనే దొరకవు. ఆత్మను దర్శించవలె ననుకొనేవారికి పొందదగిన వాడవు నీవు. ఈ విధంగా ఒప్పారుతూ ఉంటావు. ఈ విధంగా ఎంతో శ్రమతో కానీ ఆరాధించటానికి వీలుకాని స్వామిని నిన్ను వర్ణించటం సుజనులకు కూడా సాధ్యం కాదు. నిన్ను పూజించేవాడు నిన్ను విడువగలడా?

(ఆత్మకు పరిశుద్ధి అంటే నశించే ప్రపంచ సంబంధమైన భోగాల మీద భావన లేకుండటం. ఆత్మదర్శనులు ఆ పరమాత్మ తత్త్వసంబంధం అయిన జ్ఞానం కలవారు.)

పెంపొందిన భక్తియోగంతో నీ పాదపద్మాలను నిరంతరమూ పొందకోరేవాడు వెరపుగొలిపే కోపమూ, భయం పుట్టించే వీర్య శౌర్యాలతో కూడిన బెదరింపు చేష్టలు అనే వాటితో లోకాలన్నింటినీ నాశనం చేసే ఆ సాటిలేని యమునివలన కలిగే భయాన్ని కూడా పొందడు. కాబట్టి

ఎక్కువ తక్కువలులేని ఆనందం కలవాడా! భూమినీ, గోవులనూ, వేదాలనూ, వాక్కులనూ సంతోషపెట్టేవాడా! అజ్ఞానాన్ని హరించేవాడా! ముక్తిని ప్రదానం చేసేవాడా! ఈ విధమైన మీ పాదాలను ఎవ్వడైనా పొంది పుణ్యాత్ముడైతే వాడు పొరపాటున కూడా మరొక దానిని వాంఛిస్తాడా? ఎన్నటికినీ వాంఛించడు.

హరీ! మీ భక్తుల ద్వారా సాటిలేని విధంగా చెలిమిచేసే అరనిముసం మాత్రంతోనైనా మోక్షం సరికాదు. అంటే క్షణభంగురమైన మానవ సుఖం సంగతి చెప్పటం ఎందుకు?

పాపాలను పటాపంచలు చేసే పాదాలనే పద్మాలుగల ఓ స్వామీ! నీ కీర్తి అనే తీర్ధపు నీటి బొట్టులతో వెలుపలలోపల తడిసిన స్టితి కలుగుటచేత రూపుమాసిన పాపాలుగల మానవులు భూమిమీద తీర్థాలుగా అయినవారే కాకుంటారా?

(తీర్థభూతులు ఆ తీర్ధం అంటే తరింపజేసేది. సంసార దుఃఖంనుండి గట్టెక్కించేవారు.)

ఆ విధంగా అన్ని ప్రాణులయందు అనురాగం ఉన్నవారు, రాగం మొదలైనవి లేని హృదయాలు కలవారు, వక్రబుద్ధులు లేకుండటం మొదలైన గుణాలతో కూడినవారు అయిన భగవంతునికి సర్వసమర్పణ చేసికొన్న భక్తజనులతో మాకు నిరంతరమూ మైత్రి ఉండే స్థితిని కలిగించు అని ఇంకా ఇలా పలికాడు.(బ్రహ్మ)

పద్మనాభా! సత్పురుషుల స్నేహంతో గొప్పగా ఏర్పడిన భక్తియోగం ప్రకాశిస్తూ ఉండగా నిర్మలమైన చిత్తం చంచలమైన వెలుపలి దేహాన్ని కానీ, ప్రపంచాన్ని కానీ చూడదు. పెద్దదైన చీకటే స్వరూపంగాగల సంసారమనే గుహలో ప్రవేశించదు. నీదైన మహిమగల తత్త్వాన్ని ఎల్లప్పుడూ చూడ గలుగుతుంది.

(సజ్జనుల సంగతివలన మూడు ప్రయోజనాలు. 1. అది పొందినవారికి ప్రపంచ సంబంధం తొలగిపోతుంది. 2. గాఢమైన అజ్ఞానం అతనిని లోగొనజాలదు. 3. పరమాత్మ దర్శనం శాశ్వతంగా లభిస్తుంది.

ఆ స్థితి ఏ విధమైనదంటే.

సరియైన చూపుతో చూస్తే ఏ తత్త్వంలో ఈ విశ్వమూ, ఈ విశ్వంలో ఏ తత్త్వం స్పష్టంగా తెలియవస్తూ ఉంటుందో ఆ పరమాత్మ తనంత తాను ప్రకాశిస్తూ ఉంటుంది. అది శాశ్వతమైనది. ఏ విధమైన మార్పులూ లేకుండా ఒకే విధంగా ఉంటుంది. ఆకాశంలాగా అణుమాత్రం కూడా వదలకుండా అంతటా వ్యాపించి ఉంటుంది. అటువంటి ఆత్మతత్త్వాన్ని చూస్తే అతడే ఆ పరబ్రహ్మం అవుతాడు అనిచెప్పి ఇంకా ఇలా అన్నాడు. ఆ పరమాత్మ నిజానికి ఏ వికారాలూ లేకుండా ఉండేవాడే. అయినా ఈ విశ్వాన్ని తనలో నుండియే సత్యమైన దానినిగా సృష్టించాడు. దానిని ప్రకృతి అంటారు. అది తన పనులు తాను చేసుకోలేనిది. పరమాత్మకంటె వేరుగా అయినది అనే బుద్దిని పుట్టించేది.

ఇంకా ఇంకా అనేక పర్యాయాలు ఈ విశ్వం పుట్టుకకూ, పెరుగుదలకూ, ప్రళయానికీ కారణమైన ఈశ్వరుడవై ప్రకాశించే నిన్ను ఆత్మతత్త్వంగా తెలుసుకుంటాము. యోగంపట్ల నిష్ఠగలవారు శ్రద్ధతో కూడినవారై యజ్ఞం మొదలైన క్రియల సముదాయంతో సూక్ష్మదేహంతో గుర్తింపదగిన నీ రూపాన్ని ఆరాధిస్తూ ఉంటారు. వారు వేదాల ఆగమాల తత్త్వాల జ్డానం కలవారు. నీవు సమస్త సృష్టికంటె ముందే ఉన్నవాడవు. నీవు ఆది లేనివాడవు. నీ వంటితత్వం మరొకటి లేదు. మాయాశక్తితో కూడినవాడవై విరాజిల్లుతూ ఉంటావు. ఆ మాయాశక్తి చేత

మాయాశక్తిచేత సత్వం, రజస్సు, తమస్సు అనే మూడుగుణాలు వరుసగా ఏర్పడ్డాయి. వాటి వలన మహత్తు, అహంకారం, ఐదయిన శబ్దం మొదలైన విషయాలు, ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి అనే అయిదు మహాభూతాలు కలిగాయి. మహర్షులు, దేవతలు, ప్రాణుల సముదాయాలుగా ఈ విశ్వమంతా వేరు వేరు రూపాలు కలది అయినది. నీ మాయ చేతనే నాలుగు విధాలైన రూపాలుగల పురాన్ని పురుషుడు ఆత్మాంశతో ప్రవేశిస్తున్నాడు. ఇంద్రియాలతో విషయసుఖాలను అనుభవిస్తున్నాడు. అతడు భూమిమీద తేనెటీగ రూపొందించిన తేనెలాగా ఆ పరమాత్మముందు మెలగుతూ ఉంటాడు. అతనినే జీవుడు అంటారు.

ఈ విధమైన జగత్తును సృష్టించిన నీవు, వాయుదేవుడు మేఘాల గుంపులను చెదరగొట్టినట్లుగా, భూతాల సముదాయాలను భూతాల సముదాయాలతోనే కదలాడిపోయే విధంగా చేస్తూ ఉంటావు. ఆ విధంగా పౌరుషం ప్రకాశించగా

(గాలి ఒక భూతం. అది పొగ, కాంతి, నీరు, గాలి అనే వాని సముదాయమైన మేఘాన్ని దూరంగా పోయేటట్లు చేస్తున్నది. ఈ విధంగా భూతాల సముదాయాలే భూతాల సముదాయాలను కదలిస్తూ ఉంటాయి. అయితే ఆ అన్నింటికి మూలపురుషుడు పరమాత్మ.)

ప్రభూ! నీవు ఆయా పనులకోసం ఏర్పడిన వేరువేరు రూపాలు కలవాడవు, గొప్పగా వెలుగొందుతూ ఉన్న దీప్తి కల వాడవూ, అతితీవ్రమైన వేగంగలవాడవూ అయి విసృతంగా వ్యాపించి ఉన్న భుజాల అతిశయమైన మహిమతో ఈ విశ్వాన్నంతా ఉపసంహరిస్తావు. ఇదంతా నీ సంకల్ప మహిమ.

ఆ సంహారకార్యం ఏ విధమైనది అంటే, ఈ సృష్టి అంతా ఇప్పుడిది చేయదగినపని అనే విచారం విషయంలో ఒడలు తెలియనిదవుతుంది. శబ్దం మొదలైన విషయాల అనుభవం మీదకు ఎగబ్రాకుతూ ఉంటుంది. అత్యధికమైన శక్తి గల లోభం కలది అవుతుంది. అటువంటి సృష్టిని నీవు పూనికతో లోపలికి తీసుకుంటావు.

పద్మనయనా! పుణ్యాత్మా! చాలా ఆకలితో కడుపు కాలిపోతూ ఉన్న మహాసర్పం తననోటి దగ్గరకు వచ్చిన ఎలుకను తినే విధంగా నీవు ఏమరుపాటులేని వాడవై ఈ సృష్టినంతా లోపలికి తీసుకుంటావు.

ఆది శేషతల్పం మీద శయనించే స్వామీ! భక్తులకు కల్పవృక్షం అయినవాడా! మాకు గురువైన బ్రహ్మదేవుడు, ఆ సుప్రసిద్ధులైన మనువులూ, తమ బుద్ధిలో ఏ మాత్రమూ సంశయాలు లేకుండా నీ పాదపద్మాలను మనస్సులో నిల్పుకొని సేవిస్తూ ఉంటారు. అటువంటి నీ పాదాలను విస్మరిస్తే నీ వలన అవమానం కలుగుతుంది అనే గొప్పవేదనను పొందే సజ్జనుడు నీ పాదపద్మాలను విడువగలడా?

కాబట్టి నాకూ వివేక శీలం కల పండితులసముదాయానికీ పుట్టే అన్ని సంశయాలనూ తొలగించటానికీ, రక్షించటానికీ, అభివృద్ధి కలిగించటానికీ సరి అయిన దిక్కు నీవే అని కొనియాడినట్టి ఈ స్తోత్రాన్ని ప్రీతితో రుద్రుడు ప్రచేతసులకు తెలియజేశాడు.

పరమేశ్వరుడు ప్రచేతసులకు ఈ స్తోత్రాన్ని ప్రేమతో చెప్పి ఇంకా ఇలా అన్నాడు. ప్రచేతసులారా! ఇది 'యోగాదేశం' అనే పేరుగల స్తోత్రం. పెక్కుమారులు దీనిని జపించి మనస్సులో నిలుపుకోవాలి. చెదరని చిత్తంతో మీరందరూ మన్ననతో నమ్మకం కలిగి మీమీ ధర్మాలు ఆచరిస్తూ, భగవంతునియందు సమర్పించిన భావనలు కలవారై దీనిని జపించండి. సర్వభూతాల యందూ ఉన్నవాడు, తనయందే తాను రమించేవాడూ అయిన సర్వస్వామిని నుతిస్తూ ధ్యానంతో పూజించండి. పూర్వం ఈ స్తోత్రాన్ని భగవంతుడైన బ్రహ్మ సృష్టి చేయగోరినవాడై మాకూ, భృగువు మొదలైన మహర్షులకూ తెలియజేశాడు. మేమూ, భృగువు మొదలైనవారూ బ్రహ్మపేరణ పొంది ఈ స్తోత్రంతో సమస్తమైన తమోగుణాలు నశించిపోయినవారమై పెక్కుతీరులైన ప్రజల సృష్టిని చేశాము. చెదరని బుద్ధితో, వాసుదేవుడే పరమగతి అనే భావనతో ఈ స్తోత్రాన్ని జపించేవాడు శీఘ్రంగా శ్రేయస్సు పొందుతాడు. ఆ శ్రీహరికి సంబంధించిన జ్ఞానం అనే తెప్పతో కష్టాలకడలి (సముద్రం) అయిన సంసారాన్ని చాలా తేలికగా దాటుకుంటాడు. నేను ఉపదేశించిన ఈ స్తోత్రాన్ని పఠిస్తూ, సులభంగా ఆరాధించరాని శ్రీహరిని పూజించేవాడు, నేను చెప్పిన గానంతో సంతోషం పొందేవాడూ, ఒకే ఒక్క ఆశ్రయం అయినవాడూ అయిన శ్రీమన్నారాయణుని వలన కోరికలన్నింటినీ తీర్చుకొన్న వాడవుతాడు. వేకువజామున నిద్రనుండి లేచి చేతులు జోడించి, శ్రద్ధకలవాడై ఈ శుభమైన శ్రేష్ఠమైన స్తోత్రాన్ని వినేవాడూ, ఇతరులకు వినిపించేవాడూ కర్మబంధాల నుండి విడుదల పొందుతాడు. అని ఇంకా ఇలా చెప్పాడు.

రాజకుమారులారా! సర్వదేహధారులకును స్వామీ, పరమపురుషుడూ అయిన ఈశ్వరుని మంచి స్తోత్రాన్ని మీకు ఆదరంతో చెప్పాను. మీరు కూడా గొప్ప భక్తితో జపం చేయండి.

మీరు కూడా భావనలను చెదరకుండా నిగ్రహించుకొని జపం చేస్తూ ఒక దీక్షతో గొప్ప తపస్సును చేసినట్లైతే మీరు కోరిన మహాఫలం లభిస్తుంది.

ఈ విధంగా ఉపదేశంచేసి సదాశివుడు వారలు భక్తితో పూజలు చేయగా కైకొని వారు చూస్తూ ఉండగా అదృశ్యుడయ్యాడు.

సదాశివుడు అదృశ్యం అయిపోయిన తరువాత ఆ ప్రచేతసులు ఆ విష్ణుస్తోత్రాన్ని జపిస్తూ పదివేలయేండ్లు వారించటానికి అలవికాని నీటిలో నిలిచి ఘోరమైన తపస్సు చేస్తూ ఉన్న సమయంలో

నారదుండు ప్రాచీన బర్హికి జ్ఞాన మార్గమును దెలియంజేయుట

Maharaja Prithu attained liberation(Mukthi/Moksha) - పృథు చక్రవర్తిజ్ఞానవైరాగ్య వంతుండై ముక్తి నొందుట

పృథు చక్రవర్తిజ్ఞానవైరాగ్య వంతుండై ముక్తి నొందుట

మహాత్మా! విదురా! విను. ప్రసిద్ధుడైన ఆ పృథువు చెదరని మనస్సుతో పరమాత్మపట్ల నిష్ఠకలవాడైన తనను సంపాదించిన సర్వమైన కాంక్షలు కలవానినిగా సంభావించాడు.

(వైన్యుడు - వేనుని కుమారుడు - పృథువు; నిష్ట అంటే నియతమైన స్థితి - ఒకదానికి కట్టుబడి ఉండటం: అవాప్తకాముడు అంటే కోరికలు తీరినవాడు. ఇది వేదాంత విషయంలో ఒక పరిభాష వంటిది. ఏది పొందిన తరువాత పొందవలసింది మరొకటి ఉండదో అది పొందినవాడు అని భావం. అది పరమాత్మజ్ఞానం. ఏకాగ్రచిత్తుడు ఒకదానియందే లగ్నమైన చిత్తం కలవాడు. ఇది సాధనతో మాత్రమే కలుగుతుంది. ప్రకృతంలో ఏక శబ్దానికి పరమాత్మ అనే అర్థం తీసుకోవాలి. పరమాత్మలో నిలిచిన చిత్తం కలవాడని అర్ధం; ముఖ్యుడు అంటే దేహంలో ముఖానికున్న స్థానంవంటి స్థితి కలవాడని అర్ధం. తరువాత వివరిస్తున్న అతని ప్రవృత్తినిబట్టి ఈ పదం సాభివ్రాయంగా ప్రయోగించినట్లు తెలుస్తుంది.)

తరువాత, దేశానికీ కాలానికీ తగినవిధంగా బలాన్నీ ధనాన్నీ ఉపయోగిస్తూ యజ్ఞాలను, ఇతరధర్మాలను, ఫలాన్ని బ్రహ్మానికి సమర్పించే బుద్ధితో కర్మలయందు శ్రద్ధకలవాడై చేస్తూ ఉన్నాడు. ప్రకృతికంటె ఆవలిదైన పరమాత్మనుగా తననూ కర్మల సమూహాలకు సాక్షిగా బుద్ధిలో ప్రయత్నంతో భావిస్తూ కర్మలను ఆచరిస్తున్నాడు. అదేవిధంగా సామ్రాజ్య సంపదలైన దివాణాలల్లో, ఉద్యానవనాలల్లో, అరణ్యభూములల్లో రాజ్యమహిమ మెలగుతూ ఉండగా అహంకారాన్ని వదలిపెట్టి, మనస్సులో ఇంద్రియాల విషయాలైన శబ్బాదులల్లో తగులం పెట్టుకోకుండా మిక్కిలి గొప్ప ఉదారబుద్ధి కలిగి ఉన్నాడు.

(కర్మాసక్తుడు - నిజానికి కర్మలలో ఆసక్తి గుణం కాదు. కానీ బ్రహ్మార్పణబుద్ధితో చేయటంవల్ల అది గుణం అవుతుంది. ఇది శ్రద్ధను తెలియజేస్తుంది.

ప్రకృతి అంటే అవ్యక్తపరతత్త్వంనుండి వ్యక్తంగా రూపొందిన నామరూపాత్మకమైన విశ్వం. దానికి పరమైనది పరమాత్మ. "అహం బ్రహ్మా
స్మి” నేను ఆ బ్రహ్మమనే జ్ఞానంతో ప్రవర్తించాడు పృథుచక్రవర్తి అని తాత్పర్యం. పరమాత్మ సాక్షిమాత్రంగా ఉంటాడు. సాక్షాత్తుగా చూచువానిని సాక్షి అంటారు. సాక్షి అయినా ఫలం మొదలైనవాని సంబంధం లేకుండా కేవలుడుగా ఉండే తత్త్వాన్ని పరమాత్మ అంటారు. ఆ విధంగా పరమాత్మను సంభావించటమే జ్ఞానం. 

అహంకార రహితుండు - పరమాత్మకంటె వేరుగా దేహం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి మొదలైన వానితో అదే నేను అనేభావన కలిగి ఉండటం అహంకారం. అది అజ్ఞానం. దానివలన పరమాత్మను సాధకుడు పొందడు. కనుక పృథువు అహంకారరహితుడైనాడు.

సన్మహా+ఉదారుండు - ఉదారుడు అంటే ఇతరుల విషయంలో ఆర్ద్రమైన చిత్తంతో వ్యవహరించేవాడు. ఆ లక్షణం మంచిగా, గొప్పగా ఉన్నవాడు పృథువు. ఇది కూడా తాత్త్వికంగా పరమాత్మను అన్నింటిలో అందరిలో దర్శించే మహా విషయం.

ఇంద్రియ +అర్థాలు = చెవి, చర్మం, కన్ను నాలుక, ముక్కు అనేవి ఇంద్రియాలు. అవి గ్రహించే, శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అనేవి విషయాలు. ఇంద్రియాలను బంధిస్తాయి కట్టిపడవేస్తాయి కనుక వీనికి విషయాలు అనే వ్యవహారం కలిగింది.)

ఈ విధంగా ఆ పృథుచక్రవర్తి అధ్యాత్మమనే యోగంలో నిష్ఠకలవాడై కర్మలను శ్రద్ధతో చేస్తూ అర్చి అనే భార్యయందు విజితాశ్వుడు, ధూమ్రకేశుడు, హర్యశ్వుడు, ద్రవిణుడు, వృకుడు అనే కుమారులను ఐదుగురిని పొందాడు తరువాత 

(అధ్యాత్మయోగనిష్ఠుండు - ఆత్మ అంటే ఇక్కడ దేహం. అధ్యాత్మ అంటే దేహమునందున్న అని అర్ధం. యోగం అంటే కర్మములందు కౌశలం= నేర్పు. నిష్ఠ అంటే ఎన్ని విఘ్నాలు కలిగినా చెదరకుండటం. కనుక ఆత్మవిద్యలో గట్టిపట్టు సాధించినవాడు అని ఈ పదానికి తాత్పర్యం.

ఆత్మవిద్య కర్మలకంటె పైస్థాయికి చెందినది. అయినా కర్మ ఆత్మవిద్యకు అత్యవసరమైన చిత్తశుద్ధిని కలిగిస్తుంది. చిత్తశుద్ధిలేని ఆత్మవిద్య ఫలాన్నివ్వదు. చిత్తశుద్ధి నిరంతరంగా ఉండాలి కనుక కర్మలను నిరంతరంగా చేస్తూ ఉండవలసిందే.

విదురా! ఆ మహారాజు రాజనీతి ననుసరించి భూమియందలి ప్రజలనుండి కప్పం రూపంలో ధనాలు గ్రహించి మళ్లీ దానమనే నెపంతో వారికే ఇస్తూ సూర్యునివలె ప్రకాశించాడు.

(పృథువుకు సూర్యునితో పోలికను కవి ఇక్కడ చెప్పాడు. రాజు పన్నుల పేరుతో ప్రజలనుండి గ్రహించే ధనాన్ని వారి సంక్షేమానికే వెచ్చిస్తాడు. సూర్యుడు సముద్రం మొదలైన మహాజలాశయాలనుండి నీటిని తీసుకొని మేఘాలుగా రూపొందించి మళ్లీ పంటలకోసం వర్షరూపంతో ఇచ్చివేస్తూ ఉంటాడు. ఈ పోలికవల్ల పృథుచక్రవర్తి తన సుఖంకోసం, తనవారి సుఖంకోసం కాక ప్రజల సుఖంకోసమే పన్నులను గ్రహిస్తున్నాడు, తనకోసం ఏమీ మిగుల్చుకోలేదు అనే అర్థం ధ్వనిరూపంలో తెలియ వస్తున్నది.)

ఆ పృథుచక్రవర్తి అగ్నిదేవుని విధాన అణచరాని తేజస్సుకలవాడు. దేవేంద్రునిలాగా గెలువరానివాడు. భూదేవివలె అన్ని కాలాలలో సహనం కలవాడు, స్వర్గంలాగా కోరినవాటిని అన్నింటినీ ఇచ్చేవాడు. వర్షదేవతవలె కోరికలను కురిపించేవాడు. సముద్రునివలె లోతెరుగురాని లక్షణం కలవాడు. సువర్ణపర్వతంవలె గొప్ప దేహబలం కలవాడు. యమధర్మరాజువలె ప్రజలను శిక్షించేవాడు. స్వర్గలోకపు ప్రభువువలె మహాప్రభువుతనంతో అలరారేవాడు, కుబేరునివలె గొప్పధనసంపద కలవాడు, వరుణ దేవునివలె గుట్టుగా దాచుకొన్న సంపదలు కలవాడు. వాయుదేవునివలె అంతటా సంచారశక్తి కలవాడై బలం, దేహకాంతి పరాక్రమం మిన్నగా గలవాడు. రుద్రునివలె సహించశక్యం కాని వేడిమి కలవాడు. మన్మథునివలె గొప్ప సౌందర్యం కలవాడు. సింహంవలె మిక్కుటమైన విక్రమంతో కూడినవాడు. మనువువలె ప్రజలందరియందు కన్నబిడ్ణయందలి ప్రేమ కలవాడు. బ్రహ్మవలె రజోగుణాలతో కూడినవాడు. బృహస్పతివలె వేదవిద్యలో ఆరితేరివాడు, పరమేశ్వరునివలె ఇంద్రియాలను తన అదుపులో ఉంచుకొన్నవాడు. ఇటువంటివాడై విష్ణువునందే మనస్సు ఉంచి ప్రవర్తించే గోవులందూ, గురువులందూ, విద్వాసంపదగల బ్రాహ్మణులందు భక్తి కలిగి, పాడుపనులయెడ సిగ్గుతో, వినయంతో, మంచి స్వభావంతో మెలగటంలో ఇతరులకు ఉపకారం చేయటంలో సాటిలేనివాడై ఈ విధంగా లోకపాలుర వేరువేరుగుణాలన్నింటినీ తానొక్కడే తాల్చి ఉన్నాడు.

(ఈ వచనంలో చెప్పినదానిని బట్టి లోకపాలురలో ఉన్న ఒక్కొక్కగుణం ఇతనిలో కలిసి ఉండటంవలన లోకపాలురందరికంటె మహామహిమ కలవాడని చెప్పినట్లయింది. రాజు అష్టదిగ్రాజుల అంశ గలవాడు.)

పుణ్యాత్ముడా! ఆ గొప్పకీర్తితో మహానుభావుడై ఆ పృథుచక్రవర్తి సకలజనులూ కొనియాడే శ్రీరామచంద్రునివలె మంచితనం గల జనుల చెవులకు వినవస్తూ ఉండేవాడు.

సరసాలైన మాటల అర్థాలు గల మంచివారి సముదాయాలు ఒప్పైనవిధంగా ఆయన కీర్తిని గానం చేస్తున్నారు. ఆ కీర్తి సర్వకాలాలలో మార్పులు లేకుండా గొప్పగా ప్రవాహరూపంలో బుద్దిమంతుల చెవులలో చొచ్చుకొనిపోతూ ఉంది. అతని పలుకులలో, భావనలలో మంచితనమే గోచరిస్తూ ఉంటుంది. ఆ విధంగా ప్రజలందరియందు అనురాగం కలవాడై అతడు మరొక చంద్రుడా అన్నట్లు ప్రకాశిస్తున్నాడు.

అతడు పండిన జ్ఞానసంపదకలవాడు. చక్కగా పెంపొందించిన తాను పండించిన పంటలు, నిర్మించిన గ్రామాలూ పట్టణాలూ కలవాడు. ప్రజలను చక్కగా ఏలినవాడు. చరాచరాలకు కూడా స్థితిని కల్పించినవాడు. మంచివారి ధర్మాలను ఆచరించేవాడు, భగవంతుని శాసనాలను పొల్లుపోకుండా అమలుపరచినవాడు. అట్టి పృథుచక్రవర్తి ఒకనాడు తనముదిమిని గమనించాడు. తనబిడ్డ అయిన ప్పథ్విని తనకొడుకులకు అప్పగించాడు. ప్రజలందరు తన యెడబాటునకు కుమిలిపోతూ ఉండగా తనభార్యతో కలిసి, ఎట్టి విఘ్నాలకు చెడని నియమాలు కలవాడై వైఖానసులకు ఆదరించదగిన ఘోరమైన తపస్సులో, మునుపు దిగ్విజయం నడపేసమయంలో ఎలా ఉత్సాహంతో ప్రవర్తించాడో ఆ విధంగా ప్రవర్తిస్తూ తపస్సుకోసం అడవులకు పోయాడు. అక్కడ

(ఇందులో పృథువు ప్రవృత్తి ధర్మంలోనూ, నివృత్తి ధర్మంలోను సాధించిన పరిణతిని చక్కగా తెలియజెప్పాడు కవి. సాధారణంగా ఇహలోకసుఖాలను మరగినవాడు వాటినుండి తొలగటానికి ఇష్టపడడు. కానీ అతడు ఉదాత్తచిత్తుడు కనుక ముసలితనం వచ్చినవెంటనే ఇహలోక సుఖాలకు విముఖుడు కాగల్గాడు.

వైఖానస సమ్మతంబు - బ్రహ్మచర్యం, గృహస్థధర్మం, వాన ప్రస్థధర్మం, సన్యాసధర్మం అని నాలుగు జీవనదశలో మూడవదానిని వైఖానసం అనికూడా అంటారు. సంసారంనుండి విరక్తుడై కేవలం పరలోకసుఖాన్ని అపేక్షిస్తూ ధర్మపత్నితో కలిసిఉండి నియమబద్ధ జీవితాన్ని గడపటం వానప్రస్థధర్మం. దానినే ఇక్కడ 'వైఖానసం' అన్నారు.

పృథువు భూమిని పంటలకు యోగ్యమైనదిగా తనవింటి కొప్పుతో చేశాడు. కనుక అతనిపేరుతో దానికి పృథ్వి అనేపేరు కలిగింది. ఆ విధంగా భూమి అతనిపుత్రిక.

ఆ మహారాజు పెద్దకాలం దుంపలు, వేళ్లు, పండ్లుతింటూ తపస్సు అతికఠినంగా చేశాడు. తరువాత గడ్డిపరకలు, పండిరాలిన ఆకులు తిన్నాడు. అటుపిమ్మట నీరుమాత్రమే తాగుతూ తపస్సు చేశాడు. చివరకు అది కూడా మానివేసి గాలినిమాత్రం లోపలికి తీసుకుంటూ తపస్సు చేశాడు.

(తపస్సు అంటే కాలిపోవటం, గాఢమైన భావన అని రెండర్థాలు. ఏమేమి చేస్తే అది ఫలాన్నిచ్చేదవుతుందో ఈ పద్యంలో కవి వర్ణించాడు.

"అన్నమయం హి సౌమ్య మనః" మనస్సు అన్నాన్నిబట్టి ఏర్పడుతుంది అని ఉపనిషత్తు అంటున్నది. కనుక అన్నం విషయంలో లౌల్యం లేకపోతే మనస్సు నిలుకడగా ఉంటుంది. నిలుకడగల మనస్సే తపస్సుకు యోగ్యతను కలిగిస్తుంది. ఆ అన్నలౌల్యాన్ని చెదరని మనస్సుతో గెలవటాన్ని ఇక్కడ చెప్పారు.)

ఈ తీరున ప్రవర్తిస్తూ, ఆ రాజు ఘోరమైన మండు వేసవికాలంలో బాగుగా దరికొల్పబడిన అయిదు మంటలమధ్యలో ఉండి, ఆగకుండా ముసురుపట్టి కురిసే వానలకాలంలో ఒడలుమీద వస్త్రం కప్పుకోకుండా ఆరుబయట నిలబడి, జనులు తట్టుకోలేక ఉహుహ్హూ అంటూ వణకిపోయే చలివేళలో గొంతుక/పీక మునిగేదాకా ఉండే నీళ్లలో నివసించి, మంచు పెల్లుగా నలుదిక్కులా వ్యాపించే సమయంలో వట్టి నేలమీద దేహాన్ని నిలిపి విశ్రాంతి తీసుకొని గొప్పనిష్ఠతో, చలి ఎండ మొదలైన ప్రకృతి బాధలను సహించే లక్షణంకలవాడై, మాటలయందు జారుపాటులేనివాడై, ప్రాణాయామం సాధించినవాడై, బాహ్యేంద్రియాల కదలికలను నిలుపుచేసుకొన్నవాడై, బుద్దిని వెలుగొందజేస్తూ భగవంతునియందే కట్టిపడవెసినవాడైై, పాపాలు లేనివాడై, పైకి ప్రసరించే విధంగా వీర్యాన్ని పట్టుకోగలవాడై క్రమానికి తగినట్లుగా

మిక్కిలి కఠోరమైన తపస్సు చేశాడు. ఈ విధంగా వరుసగా పైపైకి వ్యాపించిన తపస్సుతో అన్ని పాపాలను రూపుమాపుకొని ప్రాణాయామాలచేత లోపలి పగవారిని ఆరుగురిని గెలిచి, బంధాలన్నింటిని తెంచి వైచుకొని పురుషులలో అత్యుత్తముడైన పృథువనే మహారాజు పరమపూజ్యుడైన సనత్కుమారుడు తెలిపిన యోగమార్గంతో పరమేశ్వరభజనం చేశాడు. ఇట్లు భగవద్ధర్మాలమీద మాత్రమే నిష్ఠ గలవాడై చక్కని ప్రవర్తన, శ్రద్ధ గలవాడయిన ఆ పృథువునకు శ్రీమహావిష్ణువునందు భక్తి మరొక భావనతో తగులులేనిదై వృద్ధిపొందింది. ఆ విధంగా

విదురా! భగవంతుని పరిచర్య అనే పూజ చేయటంచేత నిర్మలమైన హృదయం కలవాడయ్యాడు. అట్టి ఆ పృథువునకు విష్ణువుయొక్క నిరంతర స్మరణంచేత

(చెడ్డ భావాలు కదలాడుతూ ఉండటాన్ని మనోమాలిన్యం అంటారు. అది ఏ కొంచెం ఉన్నా భగవంతుని ఆరాధన సఫలం కాదు. మిక్కిలి శ్రేష్ఠమైన పరిచర్యా విధానంతో పృథువు దానిని రూపుమాపుకున్నాడు. శుద్ధమైన అంతకరణం కలవాడయ్యాడు. దానిచేత విష్ణుకథలు అతని హృదయంలో మరొక భావన అడ్దుపడకుండా నిలిచిపోతున్నాయి. సాధకుడు ఈ స్థితిని సాధించాలని వ్యంగ్యమైన ఉపదేశం.)

ఆ సంపూర్ణమైన భక్తివలన, అంతకుముందు చాలా ఎక్కువగా ఎల్లకాలంలో సందేహాలతో నిండినదై పెరిగిపోయిన హృదయపుముడిని తొలగించివేసే వైరాగ్యంతో కూడినబుద్ధి అతనికి కలిగింది.

విరక్తితో కూడిన బుద్ధి ఏర్పడగా అతనికి వెనువెంటనే దేహమే ఆత్మ అనే జ్ఞానం పూర్తిగా తెగిపోయింది. ఆత్మస్వరూపం ఏమిటో తెలియవచ్చింది. అప్పుడు శ్రీకృష్ణుని కథలయందు ఆసక్తి కలిగింది. యోగసిద్దులన్నింటియందూ కోరిక వదలిపోయింది. హృదయంలోని అజ్ఞానమనే ముడిని పటాపంచలుచెసే జ్ఞానమనే యోగం చక్కగా కలిగింది. అయితే జ్ఞానసిద్ధి కలిగింది కనుక దానినికూడా వదలివేశాడు. జీవుడుగా ఉన్న ఆత్మను, పరమాత్మతో కలిపివేశాడు. అప్పుడతడు బ్రహ్మమే అయిపోయాడు. ఇంక రక్తమాంసాదులతో ఉన్న దేహమనే కట్టెతో పనిలేదు కనుక దానిని వదలివేయాలని నిశ్చయించుకున్నాడు.

ఆ రాజు మడమలతో ముడ్దిదగ్గరితావును గట్టిగా నొక్కాడు. తరువాత ఆసనభాగాన్ని వదలివేసి కూర్చున్నాడు. (ఆసనానికి మడమలు తాకకుండా పైకి శరీరాన్ని ఎత్తి నిలిపాడని అర్థం). వెన్నుపూస ప్రారంభమయ్యే మొదటి భాగాన్ని మూలాధారం అంటారు. అక్కడినుండి వాయువును మెల్లగా పైకి పాకేట్లు చేశాడు. బొడ్దుదగ్గరకు చేర్చాడు. వరుసగా హృదయం, దానికి కొంచెం పైభాగం, కంఠదేశం అనే స్థానాలకు ప్రసరింపజేశాడు. అక్కడినుండి నడినెత్తిమీదికి - అంటే సహస్రారపద్మంలోనికి చొనిపాడు. ప్రాణం, అపానం మొదలైన ఐదు వాయువుల పనులను ఆపివేశాడు. తనలోని గాలిని గాలిలో, ఆకాశాన్ని ఆకాశంలో, అగ్నిని అగ్నిలో, నీటిని నీటిలో, మిగిలిన మాంసం మొదలైన ధాతువులతో కూడిన కట్టెను భూమిలో - అవి వాని మొదటి స్థానాలు కనుక - కలిపివేశాడు.

(యోగవిధానంలో ఇలా ప్రాణాలు వదలటం ఒక మహావిషయం. మన దేహం అయిదు భూతాలపదార్థాలతో కూడి ఉంటుంది. వెలుపల అయిదు మహాభూతాలు ఉన్నాయి. మనలో ఉన్నవి కొంచెంపాటివి. వెలుపల ఉన్నవి కొలతలకు అందనివి. అందువలన వాటిని మహాభూతాలు అంటారు. మనదేహాలలో ఉన్న మట్టి, నీరు, నిప్పు, గాలి, నింగి అనేవాని మొదటి తావులు ఆ పంచమహాభూతాలే.

ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం అనేవి అయిదు ప్రాణాలు. వానిని సాధనతో ఆయా పనులనుండి విరమింపజేయటం అనే ప్రక్రియను ఇక్కడ 'ప్రాణముల్‌ విడిచి' అన్న పదబంధంతో తెలియజేస్తున్నారు.)

ఆ సాధకుడైన పృథుచక్రవర్తి భూపదార్దాన్ని నీటిలో, నీటిని నిప్పులో, నిప్పును గాలిలో, గాలిని నింగిలో, నింగిని మనస్సులో, మనస్సును ఇంద్రియాలలో, ఇంద్రియాలను విషయాలలో, వాటిని అహంకారంలో, దానిని మహత్తులో ఆ సర్వకార్యాలకూ కారణమైన మహత్తును జీవునకు ఆధారంగా అయిన ప్రకృతిలో చేర్చి జీవుడుగా మాత్రం మిగిలిన అతడు జ్ఞానం, వైరాగ్యం అనే లక్షణాలచేత బ్రహ్మంలో ఎట్టి కదలికలూ, భేదాలూలేని స్థితిని పొందినవాడై మాయకు ఆధారభూమి అయిన జీవత్వాన్ని వదలివేసి ముక్తిని పొందాడు. అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు.

(సృష్టి ప్రారంభంనుండి పరిసమాప్తి దాకా అనులోమ విధానంలో ఉంటుంది. సృష్టి ఉపసంహారక్రమం ప్రతిలోమ విధానంలో ఉంటుంది.)

పృథుని ధర్మపత్ని అర్చి. పాదాలు నేలకు తాకితే కందిపోయే సుకుమారి. గొప్ప అందచందాలు కలది. సాటిలేని పతివ్రత. కాబట్టి, తనభర్త చేసిన గొప్పవ్రతమూ, తన గొప్పభక్తి, సేవ, ఋషులు నిర్దేశించిన జీవనవిధానాన్ని ఆచరించటం అనే లక్షణాలచే చాలా చిక్కిపోయింది. అయినా తనమగని దయగలచూపు, చేతిస్పర్శ మొదలైన సమ్మానాలవలన సుఖమైన నడవడినే భావిస్తున్నది. అలా ఉండి ఆ అడవులలో తన చిక్కిపోవటాన్ని మనస్సులో తలపకుండా తిరుగుతూ ఉన్నది.

ఆ పృథుని ఇల్లాలు అర్చి ఇంతకుముందెప్పుడూ ఏ దుఃఖమూ ఎరుగనిది. ఇప్పుడు తన భర్త ప్రాణాలు లేని దేహాన్ని చూచి చాలా దుఃఖపడింది. ఆ దుఃఖంతో ఆమెకు ప్రపంచసంబంధమైన దేనియందూ ఆసక్తిలేని స్థితి కలిగింది.

ప్రసిద్ధగల మందరపర్వతం చరియమీద చితిపై శవారోపణంచేసి ఏర్పాటు చేసుకొని, అందమైన మహానదీ జలాలలో చక్కగా స్నానంచేసి, చాలా గొప్ప పనులు ఆచరించిన మగనికి జలతర్పణం మొదలైన పనులు కావించి, గొప్పభక్తితో దేవతలకు ప్రణమిల్లి, అగ్నిదేవునకు మూడుమారులు ప్రదక్షిణంచేసి, భర్తపద్మాలవంటి పాదాలను మనస్సులో కుదుర్చుకొని, వీరులలో శ్రేష్ఠుడు మహారాజు అయిన పృథువువెంట పరలోకాలకు పోవటానికి సిద్ధంగా ఉన్న అర్చిని చూచి వేలకొలది దేవతా స్త్రీలు తమభర్తలతో కూడి చెలిమితో

(ప్రదక్షిణం అంటే తన కుడిభాగాన్ని పూజించదగిన దానివైపు ఉండే తీరున చుట్టిరావటం. మూడుమారులు చేయటంలో మూడు కరణాల - మనస్సు, మాట, చేష్ట అనేవాటి ఏకరూపస్థితి తెలియవస్తుంది. లేదా స్థూలదేహం, సూక్ష్మదేహం, కారణదేహం అనే మూడింటితో ప్రదక్షిణం చేయటం అనికూడా సంభావించవచ్చు. జాగ్రత్‌, స్వప్న సుషుప్తి దశలు మూడింటియందూ నాకు ఒకే భావన ఉంది అని తెలియజెప్పటాన్ని కూడా ఇది సూచిస్తుంది.)

అర్చి సహగమనం చేయబోతూ ఉంటే దేవకాంతలు తమ భర్తలతోపాటు గొప్పఉత్సాహంతో మందరపర్వతం చరియలమీద అప్పుడప్పుడే వికసించిన, పరిమళాలను వెదజల్లే మేలుజాతి మందారకుసుమాలను ఆపకుండా వర్షించారు.

అప్పరసలు నృత్యాలు చేశారు. దేవతలు శంఖాలను ఊదారు. వాద్యాలను మ్రోయించారు. కిన్నరజనులు పాటలు పాడారు. దేవతల వనితలు అందరూ సముదాయంగా ఏర్పడి స్తోత్రాలు చేశారు.

ఇంకా ఈ విధంగా అన్నారు.

ఆలోచించి చూస్తే ఇటువంటి ఆశ్చర్యం ఎక్కడైనా ఎవరైనా చూచారా? అర్చి అనే వనిత గొప్ప పుణ్యం మూటకట్టుకొన్న వ్యక్తికదా! శ్రీలక్ష్మీదేవి తనభర్త అయిన శ్రీమహావిష్ణువువెంట వెళ్ళేవిధంగా ఈమె తన పతితో కలసి సహగమనం చేసింది. తన హృదయ నాథుడైన పృథుచక్రవర్తినీ, ఊర్థ్వలోకాన్ని కూడ చేరుకుంటుంది. ఇది తప్పని మాట. ఈ గొప్పతనంతో ఈమె మహాయోగివర్యులకు కూడ ఊహించటానికి వీలుకాని దృఢమైన సత్కర్మంవలన, బంధాలన్నింటినీ దాటుకొని పృథుచక్రవర్తి వెంట వెళ్ళి ఊర్థ్వలోకానికి వెళ్ళేది అవుతుంది.

(సహగమనంవలన ప్రధానంగా పుణ్యలోకాలకు చేరుకోవటం జరుగుతుందని ఒకనాటి విశ్వాసం. దానిని దేవతల వాక్యాలనుబట్టి ఇందులో నిరూపిస్తున్నారు.)

కాబట్టి పతివ్రతలు సాధించలేనిది ఎక్కడైనా ఉన్నదా? అని ఇంకా బాగుగా ఆలోచించిచూస్తే మనుష్యుడు శ్రీమహావిష్ణువు స్థానాన్ని పొందే వివేకం ఎప్పుడూ హృదయంలో కదలుతూ ఉండేవిధంగా చేసుకుంటే భూమిమీద అతడు పొందరాని స్థానం ఏది ఉండదు.

ఆ విధమైన మోక్షాన్ని సాధించే మనుష్యస్థితిని పొందికూడా విషయాలలో చిక్కుకొని భూమిపై మెలగేవాడు నీతిమాలినవాడై తన్ను తాను మోసగించుకొనేవాడవుతాడు.

ఈ విధంగా ఆ దేవతలు తమంతతాము తనను ప్రశంసించగా అర్చి తన పతి అయిన పృథుచక్రవర్తి పొందిన అచ్యుతమైన పుణ్యలోకాన్ని సాటిలేని మహిమతో పొందింది అని విదురునకు మైత్రేయుడు చెప్పాడు.

(అర్చి తన పతి అయిన పృథునితోపాటు అచ్యుత(విష్ణు) లోకం పొందినది. అంటే వారిరువురూ పొందినది పుణ్యం క్షీణించిన తరువాత మరల భూమికి తిరిగి వచ్చే లోకం కాదన్నమాట. అందుకనే అనుపమ విభవం. సాటిలేని గొప్పతనం.)

మునిశ్రేష్ఠుడైన మైత్రేయుడు విదురునకు ఆ విధంగా చెప్పి ఇంకా ఇలా అన్నాడు. మహానుభావుడైన ఆ పృథువు ఎట్టిపాపాలు లేనివాడు. భగవంతులలో అందరికంటె మిన్న.

(మహానుభావుడు గొప్పవాడైన పరమాత్మ అనుభూతిని పొందినవాడు; అట్టివానికి కూడ పాపస్పర్శ ఉంటే మళ్ళీ సంసారబంధనం తప్పదు. అటువంటి పాపస్పర్శలేనివాడిని అనఘుడు అంటున్నారు.

ఇక్కడ భగవత్తముడు అంటే షడ్గుణైశ్వర్యాలుకలిగి పూజ్యులందరికంటె గొప్పవాడు అని తాత్పర్యార్థం.)

విదురా! ఈ పుణ్యం కలిగించే కథను నేను నీ కిప్పుడు చక్కగా చెప్పాను. గొప్పది, చెదరనిది అయిన బుద్ధితో, దాని మీదనే మనస్సుపెట్టి ఎవడైనా గొప్పభక్తితో, మహాత్మా! ఈ కథను విన్నా, చదివినా, వ్రాసినా, ఇతరులకు వినిపించినా, పృథుచక్రవర్తి ఉత్తమగతి పొందినట్లుగా ఎల్లవేళలా సర్వపాపాలూ నాశనమైపోగా విష్ణుపదానికి చేరుకుంటాడు.

(ఇదొక సోపానక్రమం. ముందు గురువుల వలన వినాలి. అభ్యాసంకోసం తాను స్వయంగా చదువుకోవాలి. గట్టిపడటంకోసం వ్రాయాలి. ఇంకా చెదరకుండా నిలిచిందో లేదో పరీక్షించుకోవటానికి ఇతరులకు వినిపించాలి. విద్య ఈ నాలుగుమెట్లద్వారా పరిణతస్థితికి చేరుకుంటుంది.)

నాలుగు వర్ణాలలో మొదటివాడైన బ్రాహ్మణుడు ఈ పృథుచరిత్రను శ్రద్ధగా చదివితే అతనికి బ్రహ్మవర్చస్సు పెంపొందుతుంది. క్షత్రియుడు కోరి చదివినా, విన్నా సామ్రాజ్యానికి అధిపతి అవుతాడు. వైశ్యుడు విని ధనవంతుడవుతాడు. శూద్రుడు వింటే గొప్పకీర్తి కలవాడౌతాడు. ఇంతేకాదు మూడుమారులు ఈ కథను చదివితే దరిద్రుడు కుబేరుడైపోతాడు. పేరు ప్రఖ్యాతులులేనివాడు గొప్పకీర్తి కలవాడౌతాడు. సంతానంలేనివాడు చాలమంది పిల్లలు కలవాడవుతాడు. ఏమీ తెలియని మూర్ఖుడు విజ్ఞానం, జ్ఞానం నిండారిన బుద్దిగలవాడౌతాడు. గొప్పకీర్తి ప్రతిష్టలు కలవారుకూడా అవుతారు.

ఈ లోకంలో మానవులకు శుభాన్ని కలిగించేది, అశుభాన్ని రాకుండా చేసేది, సంపదను ఇచ్చేది, కీర్తిని కలిగించేది, ఆయువును పెంపొందించేది, స్వర్గాన్ని అనుగ్రహించేది, కలిదోషాలను తొలగించేది అయిన ఈ పుణ్యచరిత్ర నాలుగుతీరులైన పురుషార్థాలను కోరేవారికి, నాలుగు పురుషార్థాలు కలగటానికి కారణం అవుతుంది. కాబట్టి దీనిని వినాలి. యుద్దానికి పోయేరాజు ఈ చరిత్రను మనస్సులో గట్టిగా నిలుపుకొని శత్రువును ఎదిరిస్తే ఆ శత్రువు, పృథుచక్రవర్తికి తక్కిన రాజులందరూ కప్పాలు చెల్లించినట్లుగా, కప్పాలు చెల్లిస్తాడు. మరొక తగులు లేని భగవద్భక్తుడు పుణ్యమూ, పృథువు మాహాత్యాన్ని తెలియజెప్పేది అయిన ఈ కథను వింటూ, చదువుతూ బుద్దిని చక్కగా రూపొందించుకొని ప్రతిదినం ఆదరంతో దీనిని అందరకూ తెలియజెపుతూ ఉంటే, సంసారసముద్రం దాటించటానికి నావగా అయిన పాదాలుగల పరమాత్మయందు చెక్కుచెదరని భక్తి పెంపొందుతుంది. అట్టివాడు పృథుచక్రవర్తి పొందిన విష్ణుపదాన్ని పొందుతాడు. అని ఈ పుణ్యకథను మైత్రేయమహర్షి విదురునకు తెలియజెప్పాడు. ఇంకా ఇలా అన్నాడు.

పృథువుకు అతని భార్య అర్చికి పుట్టిన కుమారుడు విజితాశ్వుడు. అతనికి గొప్పకీర్తియే మహాధనం. గొప్పవాడు. తండ్రికి తగిన తనయుడు. అతనిలో గొప్పగా శౌర్యధైర్యాలు ఉన్నాయి. అట్టివాడు పృథుచక్రవర్తి తరువాత భూమికి ఏలిక అయ్యాడు.

(శూరుడు= పరాక్రమించే భావసంపద పెల్లుగా కలవాడు; ధీరుడు= పరాక్రమించే సందర్భంలో బుద్ధిసంపదను నిండుగా వినియోగించగలవాడు.)

ఆ విజితాశ్వుడు దేవేంద్రునివలన ఎవరికీ కనపడకుండా నడిచే ఒక విద్యను మిక్కిలి నేర్పుతో సాధించాడు. కాబట్టి అతను అంతర్ధానుడు అనేపేరుతో ప్రసిద్ధికెక్కాడు.

(సునాసీరుడు అంటే నాగళ్ళను మిక్కిలిగా కదిలించేవాడు, వర్షాలు కురిపించి పంటలు పండించటానికి కారణం అవుతాడు కనుక అది సార్ధకం.)

ఆ మహానుభావుడు విజితాశ్వుడు చెదరని బుద్ధితో రాజ్యానికి అధిపతి అయ్యాడు. సమబుద్ధికలవాడు కనుక తన తమ్ములు నలుగురికి నాలుగుదిక్కుల రాజ్యాన్ని పంచిపెట్టాడు. హర్యశ్వునికి తూర్పుభాగం, ధూమ్రకేశునికి దక్షిణభాగం, వృకునకు పడమటిభాగం, ద్రవిణునకు ఉత్తరభాగం ఏర్పాటు చేశాడు. అతని భార్య శిఖండిని. వారిద్దరికి వసిష్ఠుని శాపంవలన మూడగ్నులు ముగ్గురు పుత్రులుగా జన్మించారు.

ఆ విజితాశ్వునకు శిఖండినికి పుట్టిన కుమారులు పావకుడు, పవమానుడు, శుచి అనే పేర్లు కలవారు. వారు మనుష్యగర్భంలో పుట్టినా తమ గొప్పతనంచేత మళ్ళీ అగ్నిస్వరూపం పొంది తమతావునకు వెళ్ళిపోయారు. అటుపిమ్మట

ఆ విజితాశ్వునకు రెండవభార్య నభస్వతి. ఆమెవలన అతనికి హవిర్థానుడు అనే కుమారుడు పుట్టాడు. తరువాత ఆ విజితాశ్వుడు శత్రువుల నందరిని తనకు లొంగిపోయేవిధంగా చేసికొని రాజ్యపరిపాలనంగురించి భావించాడు.

స్వచ్చమైన బుద్ధి విశేషంగల ఓ విదురా! కప్పం పుచ్చుకోవటం, దండనను నిర్వహించటం, ప్రజలనుండి ఆయాదోషాలకు పరిహారంగా ధనం రాబట్టటం మొదలైనవి చాలా క్రూరమైన పనులు అని భావించి మనస్సును దిటవుచేసికొని పెద్దకాలం చేయవలసిన ఒక యజ్ఞాన్ని నిమిత్తంగా చేసికొని రాజ్యపాలన అనే దానిని సమబుద్ధియై వదలివేశాడు.

ఇలా రాజ్యపాలన అనేదానిని వదలివేసి, ఆ విజితాశ్వుడు ఆత్మయందే చూపునిలిపి మిక్కిలి నేర్పుతో హంస, పరమాత్మ, అయిన సర్వేశ్వరుని ఆ యజ్ఞంలో ఆరాధించి గొప్ప నైపుణ్యంతోకూడిన ఆశ్చర్యం కలిగించే యోగసమాధిద్వారా ముక్తి పొందాడు.

విజితాశ్వుడు పరలోకాలకు వెళ్ళిన తరువాత అతని కుమారుడు హవిర్దానుడు హవిర్ధాని అనే తన భార్యవలన ఆరుగురు కుమారులను పొందాడు. వారు బర్హిష్మదుడు, గయుడు, శుక్లుడు, కృష్ణుడు, జితవ్రతుడు అనేవారు.

(ఇక్కడ పరలోకం అంటే స్వర్గం మొదలైనవి అని భావించరాదు. ముక్తి పొందినట్లుగా చెప్పిన కారణంగా పరమాత్మతో తాదాత్మ్యం అని భావించాలి.)

హవిర్థానుని కుమారుడు ప్రాచీనబర్హి అతడు ఎల్లవేళల యజ్ఞదీక్షలతోనే విరాజిల్లేవాడు. భూమినంతటినీ యజ్ఞాలకు యోగ్యమైన శాలలను వేరువేరుగా ఏర్పాటు చేశాడు. యజ్ఞాలు మానకుండా చేస్తూ చిరమైన కీర్తిని సంపాదించాడు. తూర్పుదిక్కునకు కొనలు ఉండేవిధంగా దర్భలను భూతలమంతా పరచాడు. ఆ విధంగా భూమి అంతా యజ్ఞశాలయే అయిపోయింది. ఇంకా అనేకమైన మంచి పనులను చేయటంలో మిక్కిలి నేర్పుకలవాడై హృదయంగమమైన యోగసమాధియందు నిష్ఠకలవాడై ప్రజాపతి అయిన బ్రహ్మయే ఇతడు కాగలడని ప్రజలందరూ కొనియాడుతుండగా చెలువొందిన మహానుభావుడు. తూర్పుదిక్కునకు కొనలు ఉండే విధంగా బర్హిస్సులను దర్భలను పరచి యాగాలు చేశాడు. కనుక అతనికి ప్రాచీనబర్హి అనే ప్రఖ్యాతి కలిగింది.

(యజ్ఞప్రక్రియ దేవతలను తృప్పిపరుస్తుంది. దానితో వారు భూలోకానికి కావలసిన వర్షాదులద్వారా పంటలను సమృద్ధిగా పండిస్తారు. ప్రజలు కరవుకాటకాదులు లేక సుఖశాంతులతో బ్రదుకు గడుపుతారు. దీనిని భగవంతుడు గీతలో ప్రత్యేకంగా ప్రకటించాడు.

హవిర్థానుని కుమారుడు 'హావిర్థాని' తద్ధిత ప్రత్యయం చేరినరూపం.)

ఇంకా ఆ ప్రాచీనబర్హి ఒక సుందరిని వివాహమాడాడు. ఆమె గొప్పసౌందర్యం కలది. వివాహ సమయంలో ఆమె వేగిరంగా అగ్నికి ప్రదక్షిణలు చేస్తూ ఉంటే అగ్నిదేవుడే మునుపు శుకిని చూచి కామోద్రేకం పొందిన విధంగా ఈమెను చూచికూడా గొప్ప వ్యామోహం పొందాడు. అట్టి ఆ వనిత లలితములైన, మిక్కిలి కొత్త ఆభరణాలతో చక్కగా అలంకరించుకొన్న మనోజ్ఞమైన మంగళమైన దేహం కలది. అంతేకాదు

(శుకిన్‌ చూచి - పూర్వం అగ్నిదేవుడు సప్తర్షుల భార్యలను చూచి మోహించాడు. అది గమనించింది అతని భార్య స్వాహాదేవి. తన పతికి పాపం అంటకుండా ఆ సప్తమహర్షుల భార్యలలో ఒక్క అరుంధతిని వదలి తక్కిన అందరి రూపాలను తానే తాల్చి అగ్నిదేవునితో రమించింది. ఆ సందర్భంగా జారిన రేతస్సును చిలుకరూపంలో గ్రహించి రెల్లుతోటలో నిక్షేపించింది.)

ఆ యువతి చక్కని పరువం పాకానికి వచ్చిన సమయంలో, చక్కగా నాదం చేస్తున్న మణులు తాపిన బంగారు మొలతాడు రవం ఒప్పారునట్లు విలాసంగా తిరుగుతూ ఉంటే సూర్యుని కాంతిరేఖ కదలాడుతున్నట్లుగా అనిపించేది. అట్టి ఆమెను చూచి దేవతలు, కిన్నరులు, సిద్దులు, సాధ్యులు, మునులు, నాగులు, పక్షులు మొదలగు జాతులలో గొప్పవారు కూడా మోహపడేవారు.

చక్కదనాల చుక్క సముద్రుని బిడ్డ అయిన ఆ శతధృతి అనే కన్యను బ్రహ్మశాసనాన్నిబట్టి ప్రాచీనబర్హి పెండ్లి చేసుకున్నాడు. ఆమె యందు అతనికి పదిమంది కొడుకులు పుట్టారు. వారందరూ ఒకేపేరు, ఒకేతీరు కలవారు. తండ్రి నాయనలారా! మీరు ప్రజలను సృష్టిచేయండి అని ఆదేశించాడు. వారు తపస్సు చేసుకొనే బుద్ధితో అరణ్యాలకు బయలుదేరారు. దారిలో వారికి శ్రీపరమేశ్వరుడు ప్రసన్న బుద్ధితో కనపడి ఒక మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రాన్ని జపంతో, ధ్యానంతో, పూజతో నియమం చెడకుండా వారు సేవిస్తూ పదివేల దివ్యవత్సరాలు తపస్సులకు పతి అయిన శ్రీమన్నారాయణుని సేవించుకున్నారు. అని చెప్పగా విదురుడు మైత్రేయునితో ఇలా అన్నాడు.

(సౌందర్యరాశి, సముద్రునిబిడ్డ అనటంచేత ఆమె శ్రీమహాలక్ష్మివంటిది అని తెలుస్తున్నది.

జపము - వాక్కులతో సేవ; ధ్యానము - మానసమైన సేవ; పూజ - కాయికమైనసేవ - ఇలా వారు మూడు కరణాలను ఏకం చేసుకొని పూజించారు.)

రుద్రుడు - జ్ఞానదాత.

ఓయి తాపసశ్రేష్ఠా! ప్రచేతసులకు ఆ అడవి దారిలో ఆ శివునితో సమావేశం ఎలా అయింది? దయగల శివుడు వారి ఏ కోరికనుబట్టి ఉపదేశం చేశాడు? ఈ జగత్తులో ప్రాణాలున్నవారికి ఆ శివునితో కలయిక మిక్కిలి దుర్లభమైనది. గట్టిగా విచారించి చూస్తే ఆ మహాత్ముడు గొప్పమునివర్యులకు కూడా ధ్యానం పండినప్పుడు మాత్రమే కనిపిస్తాడు. అంతేకానీ భూమిమీద సాధారణమైన కన్నులకు కనబడడు. అంతేకాదు, ఆయన ప్రపంచవాసనలులేని ఆత్మయందే నిరంతరం నెలకొని ఉంటాడు. విరూపాక్షుడు తన దైవశక్తితత్వంతో కలిసియే సర్వలోకాలను రక్షించటంకోసం సంచరిస్తూ ఉంటాడు.

(భర్గుడు ఆ అజ్ఞానాన్ని చీల్చివేసేవాడు; అంచిత ధ్యానం - ప్రపంచభావన ఏమాత్రమూ లేక నిరంతరం పరమాత్మయందే లగ్నమైన మనస్సు కలిగి ఉండటం. విరూపాక్షుడు ఆ సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనే మూడు మూడు కన్నులుగా, ఒకే స్వరూపంతో లేనివై, ఉన్నవాడు. ఆత్మశక్తి - ఇక్కడ శక్తి ఉమాదేవి. సర్వప్రపంచాన్ని కదిలించే ఒకానాక మహాతత్త్వం.)

Sunday, March 1, 2026

The visit of the Sanakadi Rishis to King Prithu - పృథు చక్రవర్తి యొద్దకు సనకాదు లరుగుదెంచుట

పృథు చక్రవర్తి యొద్దకు సనకాదు లరుగుదెంచుట

ప్రజల పొగడ్తలందిన ఓ మహారాజా! అప్పుడు ఆకాశమార్గం నుండి నెమ్మదిగా ఉదయసూర్యప్రకాశతేజులు, మునిశ్రేష్ఠులు, శేముషీ ధురంధరులు, బుద్ధిమంతులు అయిన సనకాదిమునులు వచ్చారు.

ఈ విధంగా పుణ్యాత్ములు అతిథుల రూపంలో రాగా గృహస్థుని ప్రాణాలు పైకి లేస్తాయి. వారికి ఎదురేగి నమస్కరించడం చేత మళ్లీ లేచిన ప్రాణాలు యథాస్థానం చేరుకుంటాయంటూ

అలా వినిపించే మాటలప్రకారం పైకిపోయే ప్రాణాలను తిరిగి పొందగోరేవానివలె పృథుచక్రవర్తి తన అనుచరులతోను, ఋత్వికగణంతోను సదస్యులతోను గూడినవాడై అంతలో

జీవుడు గంధాది గుణాలనుద్దేశించి చేయునట్లే భక్తితో రాజు వారికి స్వాగతసన్నాహం చేయగోరి ఉత్సాహంతో భక్తితో ఎదురుకోలు నడిపాడు.

అత్యంత గౌరవంతో మునిజనుల మనస్సులచే ఆకర్షింపబడిన ఆరాజు సభ్యతతో వారికిష్టుడై వినయ వినమితమైన కంఠంగలవాడై ఆ పరమయోగీశ్వరుల్ని ఆహ్వానించి

పృథుమహారాజు వారిని ఉచితాసనాలపై కూర్చుండబెట్టి వారికి వైదికోక్తంగా పూజలుచేసి వారి పాదప్రక్షాళన జలాలు శిరస్సుపై జల్లుకొన్నాడు. బంగారు సింహాసనాలపై కూర్చొని వేదికమీది అగ్నులవలె వెలిగే బ్రహ్మమానస పుత్రులైన, శివునికి అగ్రజన్ములైన సనకాదిమునులను చూసి మిక్కిలి శ్రద్ధాసక్తులతో పరమసంతుష్టుడై ఇలా అన్నాడు.

"ఓ శుభవర్తనులార! నేను చేసిన పూర్వపుణ్యకర్మచే ఇప్పుడు మిమ్మల్ని చూడగలిగాను".

(సనక, సనందన, సనాతన, సనత్కుమారులు - ఈ నలుగురు బ్రహ్మమానస పుత్రులు. వారెప్పుడూ ఐదేండ్లప్రాయంలోనే ఉంటారు. విష్ణుభక్తులు. వెకుంఠంలో నివసిస్తుంటారు. విష్ణువు అంతరంగ అభిలాష ననుసరించి ప్రవర్తించేవారు. బాలభావంతో ఉంటారు గనుక అవధూత సంప్రదాయం వీరినుండే పుట్టింది. శివునికి కూడా వారు అగ్రజులుగా ఉన్నారు.)

మరియు ఈ లోకంలో బ్రాహ్మణులు, శివుడు, విష్ణుదేవుడు, ఆయన భక్తులు ఎవరిపట్ల ప్రసన్నమవుతారో వారికి ఈ లోకంలో, స్వర్గంలో సాధ్యం కాని పనులంటూ ఉండవు.

పుణ్యాత్ములార! ప్రపంచాన్ని దర్శిస్తూ తిరిగే మిమ్మల్ని లోకం చూడజాలదు. సమస్తలోకాన్ని చూడగలిగిన ఆత్మను దృశ్యం చూడలేనట్లే వారు చూడలేక పోతున్నారు. మహాత్ములయిన మిమ్మల్ని దర్శించడంతో నేను ధన్యుడనయ్యాను. అదీగాక

ఎవని ఇంటికి పూజనీయులు, మహానుభావులు అయిన వ్యక్తులు వచ్చి ఆ ఇంటిలోని వారి సేవలను అంగీకరిస్తారో, ఆ ఇంటిలో యథేచ్చగా సంచరిస్తారో, అల్పమైన ఆహారాన్నీ జలాన్నీ స్వీకరిస్తారో ఆ ఇంటియజమాని పేదవాడైనా లోకంలో అతడే ధన్యాత్ముడు. మీవంటి పెద్దల రాకచే నాకు విశేషశుభాలు లభిస్తాయి అన్నాడు పృథువు.

అదీగాక ఓ శ్రేష్ఠమైన ధిషణగలవారలారా! ఎవని ఇల్లు విష్ణువును మనస్సులో గలవారై విచ్చేసిన భాగవతుల పాదజలాలతో తడువదో ఆ యజమాని మహాధనవంతుడైనప్పటికీ అతని ఇల్లు పాములు చుట్టుకొన్న చెట్టును పోలి ఉంటుందని విజ్ఞులు చెపుతారు.

అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు, అతి పవిత్రులైన మునులారా! లోకైకకుశలులారా! మీరు బాల్యంనుండి మోక్షాన్ని కాంక్షించి ఆదరం, శ్రద్ధ మొదలైన సద్గుణాలుగలవారు. ధైర్యం, మోక్షబుద్ధి మీకు అతిసహజాలు. మీ రాకకు స్వాగతం. నిరంతరం వారింపరాని సంసారసాగరంలో మునిగి మేము చేసిన పనులలో మునిగి తేలి ఇంద్రియాల వాంఛలే పురుషార్థాలని భావించే మాకు కుశలం కలదా?

(సంసారలంపటులైనవారు విషయసుఖవాంఛాభోగులవుతారు. ముముక్షువుల దర్శనం, సజ్జన సాంగత్యం వారిని ఆ దారి నుండి మళ్లిస్తుంది. ఇక్కడ సనకసనందనుల ఆగమనం పృథువునకు శుభసూచకం.)

మీరు ఆత్మానందం పొందినవారు కాన మీపట్ల యోగక్షేమాల ప్రశ్న ఉదయించదు. నేను మిక్కిలి నమ్మకంతో బాధాతప్తులకు స్నేహితులైన మిమ్ము సంసారంలో నాకు త్వరగా ఏ విధంగా క్షేమం కలుగుతుందని అడుగుతున్నాను. ఆత్మజ్ఞానంగల మీవంటివారు ఈ లోకంలో తిరిగే భగవంతులుగా సిద్ధరూపంలో ఉంటారు అన్నాడు పృథువు. అతని మాటలలోని అర్థగౌరవం, క్షేమప్రసక్తి ధర్మసమ్మత మితభాషణం, వినసొంపైన మాటలు విని ఆనందించిన హృదయంతో నవ్వుమోముతో సనత్కుమారు డిలా అన్నాడు.

ఓ రాజశ్రేష్ఠ! సమస్తప్రాణుల మంచికోరే ధర్మబుద్ధి, ఐశ్వర్యమూ గల నీవంటి మంచివారినుండి వెలువడే లోకోత్తరమైన ప్రశ్నలు పరంపరగా వస్తున్నాయి. సచ్చరిత్రలనగా ఇట్టివే కదా!

ఓ రాజా! భూమిపై సత్పురుషులతో చెలిమి ఇరువురికీ సమ్మతమవుతుంది. వారు చేసే సరసమైన ప్రశ్నల ధోరణి సమస్తలోకాలకు సుఖదాయక మవుతుంది.

అని ప్రశంసించి మోక్షసాధనోపాయాన్ని తెలుసుకోగోరిన పృథుచక్రవర్తితో ఇలా అన్నాడు.

ఓ రాజా! విష్ణుని పాదపద్మాలపై ధ్యానంచేత దోషాలను తొలగించుకొనే వైరాగ్యబుద్ధి లోకోత్తరుడవైన నీలోకనిపిస్తోంది. నీవు నిజంగా మహనీయుడవు. చక్కని ఆత్మవిమర్శ, శాస్త్రచర్చ జనులకు క్షేమకరం. ఆత్మజ్ఞానానికి వ్యతిరేకమైన వస్తువులపట్ల అనురాగం పనికిరాదు. ఆత్మయందు ఆసక్తి ఉండాలి. జనక్షేమానికి ఇవే కారణాలు.

నీవు చేయవలసిన పనియందు ఆసక్తి భగవద్దర్మాచరణ, విశేషాలు తెలుసుకోవాలనే కోరిక, ఆత్మయోగస్థితిని చెందే ప్రయత్నంలో దీక్ష యోగులను ఉపాసించుట, పుణ్యకర్మలు ఆచరించడం ప్రధానం. వారియందలి దైవాన్నిగూర్చి వింటున్నానని తెలుసుకోవాలి. అట్టి నారాయణుని గాథల్ని నోరార కీర్తించాలి. ధనంతోను, ఇంద్రియాలతోను చెలగాటమాడే వారితో స్నేహం విసర్జించాలి. భగవంతుని గుణాలను కీర్తించడం అమృతపానం వంటిది. దానిని అభ్యసించి ఇతరపదార్దాలపై వైరాగ్య మభ్యసించాలి. అంతర్యామిపై మనసు నిలపాలి. ఏకాంత ప్రదేశాలపై అభిలాషపడాలి. అహింస, శమదమాదిగుణాలు ప్రధానంగా పాటించి జీవించాలి. తనకేది మేలో తెలిసినపుడు దానిని అవలంబించాలి. భగవంతుని కథలను మరల మరల స్మరించుకోవాలి. యమనియమాలు అభ్యసించాలి. యోగక్షేమ పరమైన అనవసరకార్యాలను మానుకోవాలి. చల్లదనం, వేడి మొదలైన ద్వంద్వాలు సహించే స్వభావం అలవరచుకోవాలి. భక్తులతో వారి చెవికింపైన భగవద్గుణాల ప్రసక్తి తేవాలి. తద్వారా భక్తియోగాలు. దానివలన ఆత్మకాని వస్తువులపట్ల సంగం తొలగుతుంది. కార్యకారణరూపంలో ఉన్నది అంతర్యామియైన నిర్గుణ బ్రహ్మమే. దానిలో నిశ్చలత సాధన వలన కలుగుతుంది. అది కలిగిననాడు నిజమైన గురువు లభించి అనుగ్రహప్రసారం జరుగుతుంది. ఈషణత్రయం తొలగిపోతుంది. అప్పుడు సాధకుడు ప్రకృతిని చేరక తాను వేరుగా నిలుస్తాడు. అలాంటి అనుభవమే జ్ఞానం. జ్ఞానంతో వైరాగ్యం వేగమై సాధన పూర్తికాగలదు.

(1) ఈషణత్రయం -దారేషణ, ధనేషణ, పుత్రేషణ. భార్య, ధనం, పుత్రులపైగల కోరిక ఈషణత్రయం. (ఏషణత్రయం - సరైన వ్యాకరణ సమ్మతమైన రూపం. కాని, వ్యవహారంలో ఈషణత్రయమనే రూఢికెక్కింది. )

2) యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధ్యానం, ధారణం, సమాధి - ఇవి అష్టాంగయోగం.)

ఇలా సాధన చేసిన వారికి భక్తియోగం కుదురుతుంది. అందులోంచి యోగాగ్నిగా జ్ఞానం పుడుతుంది. జీవునితో ముడిపడిన ఆత్మముడి దగ్ధమవుతుంది. ఆత్మ భాసిస్తుంది. అరణిని కూడా అగ్ని దహించినట్లు జ్ఞానాగ్నిలో హృదయగ్రంథి దగ్ధమవుతుంది. చిత్తవృత్తులు దహించబడతాయి. గుణాలు మాయమై, 'తాను' మిగులుతుంది. లోపల, వెలుపల అనే తెర తొలగిపోతుంది. వెలుపలి కుండలలోను, లోపలి సుఖదుఃఖాలలోను తానే నిండియున్నాడని తెలుస్తుంది. దానితో దేహంలో దేహబుద్ధి నశిస్తుంది. దేహం తనకు ఆధారం అనే భ్రమ తొలగిపోతుంది.

(దేహం ఆధారమనే భ్రమ తొలగిపోతే, మట్టియందు కల్పింపబడిన కుండ అనేది మట్టికంటె వేరుగా ఉందనే భ్రమ తొలగిపోతుంది. మట్టియే కుండకు ఆధారమని తెలుస్తుంది. ఈ తెలివియే ఉపాధివినాశం. జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః ॥ - గీత.)

ఆత్మ జీవుని అంతర్గతంగా మరుగునబడిపోగా ఏది కంటికి కనబడుతున్నదో అదే సత్యమనే భ్రమను కల్పించే భౌతిక దృష్టియే జీవులను మోసగిస్తూ ఎల్లప్పుడూ ఆడే ఆట! ఈ ఆట తత్త్వం తెలుసుకోవాలి. కనబడేదంతా సత్యం కాదు. తత్త్వం లోపల దాగి ఉన్నది. దాన్ని పట్టుకోవాలి. మానవుడు నిద్రలో కనిన కలలలో తాను రాజైనట్లు, రాజ్యాలేలినట్లు, సిరిసంపదలతో తూగినట్లు ఆనందాలు అనుభవిస్తాడు. అప్పుడు రాజు, భృత్యుడు అనే గుణాలు తెలుస్తాయి. కలలు కరిగిపోయి తెలివిగలిగి లేచినపుడు ఆ తేడాలు లేనట్లుగా మిథ్యగా తోస్తాయి. అట్లే వెలుపల, బయట అనే ఆంతర్యాలు జ్ఞానదశలో కన్పించవు.

చూచువాడు తాను. చూడబడేది తనకంటె వేరగు దృశ్యం, అహంకారం ఈ రెంటికి సంబంధించిన హేతువు. అది అంతఃకరణంలో జాగ్రత్‌ స్వప్న దశల్లో ఈ భేదాన్ని చూస్తుంది. సుషుప్తిలో అంతఃకరణం ఉండదు. అందువల్ల జలమో, అద్దమో లేనప్పుడు బింబ ప్రతిబింబాలకు భేదం తెలియదు. సుషుప్తిలో దృశ్యభేదం లేదు. అంతఃకరణం లేకపోవడమే ఇందుకు కారణం.

విషయ సుఖాలతో ఆకర్షించబడిన ఇంద్రియాలలో మనస్సు తగులుకొని విచారణాశక్తిని కోల్పోతుంది. నీటిమడుగులో ఉండే రెల్లు, దర్భలు, అందులో నీటిని పీల్చివేసినట్లే అటువంటి మనస్సు దేహమందలి విచారశక్తిని హరిస్తుంది. దానిచే లోపలి భావనా సామర్ధ్యము తరిగిపోతుంది. ముందువెనుకలను అనుసంధానంచేసే స్మరణశక్తి నశిస్తుంది. అంతట తనలో తనకు మెలకువ ఉండదు. అంతట యథార్థజ్ఞానం నశిస్తుంది. దానినే ఆత్మ మరుగునపడిపోతుందని పెద్దలు అంటారు.

బాహ్యాభ్యంతర తత్త్వసమన్వయం పొంది అద్వయమైన జ్ఞానంలో జీవుడు నిమగ్నమైనప్పుడు సమస్త జగత్తూ యోగియైన జ్ఞానికీ ప్రియమే అవుతుంది. అనే వేదవాక్యాన్నిబట్టి విషయవాంఛలపై ప్రీతి ఆత్మజ్ఞానాన్ని మరుగు పరుస్తుంది. ఆత్మజ్ఞానం మరుగు కావడంవల్ల కలిగే స్వార్థనాశనాన్ని మించిన ఆత్మనాశం మరొకటి లేదు. అది ఎలా అంటే సమస్తసంపదలు నశించడానికి స్థైర్యాన్ని కల్గించే అర్థకామాలచింతచే ప్రత్యక్ష పరోక్ష రూపజ్ఞానం నశిస్తుంది. తనను మరుగు పరచడం కంటె గొప్పదగు సమస్త సంపదలనాశం మరొకటి లేదు. అని ఇంకా ఇలా అన్నాడు.

ఓ పుణ్యాత్మా! ఈ సంసారాన్ని దాటడానికి నిశ్చయించుకున్నవాడు ధర్మార్థకామమోక్షాలకు విఘాతం కలిగించే అంశంతో పొత్తుపెట్టుకోరాదు. అలాంటి ధర్మార్ధ కామమోక్షాలలో మొదటి మూడు యముని కోపానికి గురి కావడంవల్ల మోక్షమార్గమే ముఖ్యప్రయోజనకారియని పెద్దలు పేర్కొంటారు. భూమిపై గుణాల కలయికవలన జన్మించిన బ్రహ్మమొదలైన వారికి గూడ కాలగతిచే వినాశం తప్పదు. క్షేమం కలుగదు. విను.

(మోక్షమార్గమే ఉత్తమ లక్ష్యమని తెలిసినవారు చెబుతారు. బ్రహ్మాదులు కూడా త్రిగుణాల కలయికతో పుట్టినవారే. త్రివర్గాలలో ఏది క్షేమాన్ని కూర్చలేదు. ధర్మార్థకామమోక్షాలకు భంగం కలిగించే పనులు చేయరాదు. అర్ధకామాలకోసం ధర్మాన్ని ఆచరించేవాడు మోక్షాన్ని పొందడు.)

మోక్షమే పురుషార్థాలలో శ్రేష్ఠమైనదని చెబుతూ ఇంకా ఇలా అన్నాడు. ఓ రాజా! దేహం, ఇంద్రియ ప్రాణాలు, బుద్ధి, అహంకారం అనే వాటితో ఏర్పడిన చరాచర ప్రాణుల హృదయాలలో నిండి కంటికి కనిపించే రూపంగల భగవంతుడు మన లోపల నివసిస్తూ వెలుగుతూ ఉంటాడు. విష్ణుని ఈ సత్యరూపం తెలుసుకొమ్మని మరలా ఇలా అన్నాడు.

రాజేంద్రా! ఈ సమస్త విశ్వమూ ఆ పరమేశ్వరునియందు లీనాలీనభావంతో, మాయాప్రభావంతో, వివేకాన్ని నిరోధించే సర్పమాలాభ్రాంతితో విశేషంగా ప్రకాశిస్తూ ఉంటుంది.

దుష్టులను శిక్షించి, ప్రజలను రక్షించే ఓ రాజా! అంతర్యామిత్వం, నిత్యముక్తత్వం, తత్త్వజ్ఞత, సర్వవ్యాపిత్వం అనే లక్షణాలతో కూడినవాడై విష్ణుమూర్తి ఉన్నాడు. ప్రకృతి కర్మలను, వాటిఫలాలను తిరస్కరించే ఉత్తమప్రవర్తన, దయ, సద్గుణాలు కలిగి ఉన్నాడు. అట్టి భగవంతుని మనస్సులో స్మరించు.

రాజా! సజ్జనులు భగవానుని పాదపద్మాలపై భక్తిగలిగి ఆ భక్తిస్మరణ ప్రభావంచే కర్మలతో ముడివడిన అహంకారమనే హృదయ గ్రంథిని నశింపజేసుకొంటారు. విషయ చింతలేనివారు, ఇంద్రియాలనరికట్టినవారు నగు యతులకు చేరరాని ఆది పురుషుడను పరమేశ్వరుణ్ణి శరణుసొచ్చి ఆ దేవుని పాదపద్మాలు భక్తితో సేవించు.

అరిషడ్వర్గం అనే గొప్పతరంగాలు అనే మొసళ్ల సముదాయం తిరుగుతుండటంవల్ల కల్లోలంగా ఉన్న సముద్రం వంటిది సంసారం. దానిని దాటడానికి హరినామ సంస్మరణం అనే నావ లేకుండా సాధ్యం కాదు. దానిని ఆశ్రయించడం మాని పాపాలు పోగొట్టుకోవడానికై తీవ్రయోగాభ్యాసాదులు చేసేవారికి ఈ మహాసాగరాన్ని తరించడం అసంభవం.

(కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం - అనే ఆరు దుర్గుణాలను అరిష
డ్వర్గ మంటారు.)

ఓ రాజేంద్రా! నీవు అత్యంత భక్తి ప్రపత్తులతో శ్రీమహావిష్టు పాదపద్మాలనే నావను సమకూర్చుకొని దుర్భరమైన బాధలకు నెలవై భయంకరమై దాటరాని సంసారసముద్రాన్ని ఉత్సాహంతో దాటు.

ఇలా బ్రహ్మజ్ఞుడైన సనత్కుమారుడు మహాతత్త్వవేత్తయైన పృథువునకు బ్రహ్మతత్త్వాన్ని గూర్చి బోధించాడు. ఆ రాజు ఆ తత్త్వం గ్రహించాడు.

పృథుచక్రవర్తి సనత్కుమారుని స్తుతించి ఇలా అన్నాడు. "నేను గతజన్మలో నిజంగా నారాయణుని దివ్యానుగ్రహాన్ని పొందినమాట వాస్తవం. ఆయన దీనుల్ని రక్షించే మహానుభావుడుకదా.)

ఆ విధంగా అనుగ్రహం పొందడానికి దయాస్వభావులు, పుణ్యాత్ములు, భాగవతశ్రేష్ఠులు, ఉత్తములు అయిన మీరు విచ్చేశారు.

సాటిలేని గుణసాంద్రా! మునివంశచంద్రా! నిరంతరం నాలో ఉద్భవించిన సర్వసంపదలు రాజ్యంతో, దేహంతో సహా మంచి బ్రాహ్మణులు అనుగ్రహించినవే. పరివారం, ధనాగారం, సైన్యబలం, భూమి, రాజ్యాధికారం, స్పగృహం, స్వీయవైభవాలు, పత్ని, నా ప్రాణంకూడా నావి అని ధైర్యంగా అనుకోలేను. రాజమర్యాదలైన తాంబూలాదులు ఆహారతృప్తి మొదలైన ఉపచారాలు రాజుకు సేవకులు ఏవిధంగా సమర్పిస్తారో అలా నేను భక్తిభావంతో విప్రులకు సమర్పిస్తున్నాను. మరి అలాంటి నేను మీకు ఎలా ఉపచారాలు, మర్యాదలు చేయగలను.

(సర్వం రాజ్యాదికం మదీయం సాధూచ్చిష్టం సత్‌ మహ్యం ప్రసాదరూపేణ దత్తం. అతస్తత్రమమ స్వత్వాభావాత్‌ గురుదక్షిణార్థం కిం దదే - శ్రీధరీయం (4-22-23).

నివేదనం తదీయన్యైవ తస్మై సమర్పణం - శ్రీధరీయ వ్యాఖ్య (4-22-44)

రాజు యాచకుడికి చేసిన దానం వేరు. సేవకుడు ప్రభువుకు చేసిన సేవవలె పృథువు దానంచేశాడు. దానస్వీకర్త ఆదినారాయణుడని తెలిసి, గౌరవంగా చేసేదే దానం. దానగుణమాహాత్యాన్ని పృథువు ఇందులో వివరంగా చెప్పాడు.)

రాజ్యమంతా బ్రాహ్మణుల అధీనం ఎలా అయిందంటారా? సేవలను నడిపించడం, రాజ్యపాలన, దండనాధికారం, మూడులోకాలకు ఆధిపత్యం, వేదశాస్త్రాలు తెలిసినవానికే సాధ్యం. అవి తెలిసినవాడే బ్రాహ్మణుడు. అందువల్ల వారి సొత్తుగా సమస్తరాజ్యసంపద భావించబడటంవల్ల లోకానికి మేలు చేకూరుతుంది. రాజ్యంలో అన్నవస్త్రాదులు సద్బ్రాహ్మణుల సొంతవస్తువులు. క్షత్రియాదులు అన్నం మాత్రమే సొంతంగా భావించాలి. మిగతా విషయాలలో వారికి స్వాతంత్య్రం లేదు. కాబట్టి మీకు గురుదక్షిణగా ఇవ్వడానికి నా వద్ద ఏమీ లేదు. మీరు సర్వస్వతంత్రులు. ఆధ్యాత్మవిద్యాగురువులు, వేదాంతం తెలిసినవారు. భగవద్భక్తి నుపదేశించేవారు. మీవంటివారికి దక్షిణ ఇవ్వాలనుకొన్నవాడు హాస్యాస్పదుడవుతాడు. నమస్కారం మాత్రమే సమర్పించుకోగలను. మీకు ప్రతిఫలంగా ఈయగలిగినది ఏమీ లేదు. ఇలా మాట్లాడుతున్న ఆదిరాజయిన పృథుచక్రవర్తిచే పూజితులై సనకాదులు అతని స్వభావాన్ని గూర్చి ప్రశంసగా మాట్లాడుకొన్నారు. ఆత్మయోగంలో నిష్ఠగల ఆ సనకాదులు ఆ సదస్యుల ముందే ఆకాశగమనంలో వెళ్లిపోయారు.

పృథు చక్రవర్తిజ్ఞానవైరాగ్య వంతుండై ముక్తి నొందుట

Upma for Health - ఉప్మా తింటే కలిగే ప్రయోజనాలు

ఉప్మా తింటే కలిగే ప్రయోజనాలు

చాలామంది ఉప్మా తినడానికి అంత ఆసక్తి చూపరు అయితే ఉప్మా తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఎప్పుడు మనం తెలుసుకుందాం..

ఉప్మాను తింటే సాఫీగా జీర్ణం అవుతుందట. అలాగే జీర్ణ సమస్యలను కూడా ఉప్మా మెరుగు పరుస్తుందని చెబుతున్నారు. దీంతో కడుపులో మంట, గ్యాస్ వంటి సమస్యలు కూడా ఉండవట.

మల బద్ధకం సమస్య కూడా తగ్గిపోతుందని చెబుతున్నారు. అలాగే ఉప్మాను మంచి డైట్ ఫుడ్ గా తీసుకోవచ్చట. రోజులో ఒకసారి ఉప్మా తిన్నా బరువు తగ్గేందుకు సహాయపడుతుందని చెబుతున్నారు.

ఉప్మాలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కొంచెం తిన్నా కూడా కడుపు నిండిన భావన కలుగుతుంది.

ఉప్మా తినడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయట. ఉప్మాలో ఉండే ఆహార పదార్థాల వల్ల బాడీలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందట.

అల్లం, క్యారెట్, జీలకర్ర ఆవాలు, కరివేపాకు, కొత్తి మీర, ఉల్లిపాయ, టమాటా, పల్లీలు, పచ్చి మిర్చి వీటి వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అందుతాయని నిపుణులు చెబుతున్నారు.


ఆరోగ్యచిట్కాలు

After Getting Food Donts - ఆహారం తిన్న వెంటనే చేయకూడని పనులు

ఆహారం తిన్న వెంటనే చేయకూడని పనులు

ఆహారం తిన్న వెంటనే పడుకోవడం వలన జీర్ణక్రియ మందగిస్తుంది. ఇది గ్యాస్, ఎసిడిటీ, గుండెల్లో మంట వంటి సమస్యలకు దారితీస్తుంది. భోజనం తర్వాత కనీసం 2-3 గంటల విరామం ఇవ్వాలి.

భోజనం చేసిన వెంటనే పండ్లు తింటే, అవి పేగుల్లో త్వరగా జీర్ణం కాకుండా ఉండి, అజీర్ణం, కడుపు ఉబ్బరానికి కారణమవుతాయి. భోజనానికి ముందు లేదా తర్వాత ఒక గంట విరామం ఇవ్వాలి.

ఎక్కువగా నీరు తాగడం వల్ల జీర్ణరసాలు (Digestive Juices) పలుచబడతాయి. దీంతో ఆహారం సరిగా జీర్ణం కాదు. కొద్దికొద్దిగా నీరు తాగవచ్చు, కానీ ఎక్కువగా తాగకూడదు.

భోజనం తర్వాత ధూమపానం చేయడం వలన జీర్ణవ్యవస్థపై దాని ప్రభావం 10 రెట్లు ఎక్కువగా ఉంటుందని చెబుతారు. ఇది ప్రేగుల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది.

తిన్న వెంటనే కష్టమైన వ్యాయామాలు, కఠినమైన శారీరక శ్రమ చేయడం వలన జీర్ణవ్యవస్థకు వెళ్లాల్సిన రక్తం కండరాలకు మళ్లి, జీర్ణక్రియ మందగిస్తుంది.

భోజనం తర్వాత స్నానం చేస్తే, శరీర ఉష్ణోగ్రత మారి, రక్తం శరీర ఉపరితలం వైపు మళ్లుతుంది. దీంతో కడుపులో జీర్ణక్రియకు అవసరమైన రక్త ప్రసరణ తగ్గి, జీర్ణం ఆలస్యం అవుతుంది.


ఆరోగ్యచిట్కాలు

Saturday, February 28, 2026

Speeches by Pritha regarding Dharma and Brahman - పృథుచక్రవర్తి సభాసదులకు సద్ధర్మముల నుపదేశించి బ్రాహ్మణ ప్రశంస సేయుట

పృథుచక్రవర్తి సభాసదులకు సద్ధర్మముల నుపదేశించి బ్రాహ్మణ ప్రశంస సేయుట

అలా చెప్పి ఇంకా ఇలా అన్నాడు. ఇలా విశేషగుణసంపద గలిగి, దోషరహితమై, సత్పురుషులచే సమ్మానింపబడిన పృథుచక్రవర్తి కీర్తిని తెలియజెప్పే మైత్రేయునితో భాగవతుడైన విదురుడిలా అన్నాడు.

మునిశ్రేష్ఠా! విను. పృథుచక్రవర్తి బ్రాహ్మణులచే రాజ్యపట్టాభిషిక్తుడై దేవతలచే సద్గుణాలుపొంది విష్ణుతేజంతో వెలిగిపోయాడు. ఆయన ఏయే పనులు చేశాడో పాపరహితుడా! నాకు తెలియజేయవయ్యా!. భూమి ఏ విధంగా గోరూపంలో స్థిరపడింది. ఎవరి పరాక్రమ దీప్తితో వెలుగొందిన పద్ధతిలో ప్రస్తుత రాజులందరు బ్రతుకుతున్నారో అట్టి పృథుచక్రవర్తి చరితాన్ని భూమిలో వివేకవంతుడైన వాడెవడైనా వినకుండా ఉంటాడా?

ఆ పలుకులు విని మైత్రేయుడు విదురునితో ఇలా అన్నాడు. పవిత్రమైన ప్రవర్తనచే పృథుచక్రవర్తి రాజుల పొగడ్తలు పొంది సంతోషంతో పాలనంచేశాడు.

ఆ పృథుచక్రవర్తి గంగాయమునల మధ్యప్రదేశంలో నివసించాడు. ప్రారబ్ధ కర్మఫలాలు వ్యయం కావాలని సర్వపుణ్యాలను తాననుభవించాడు. అన్నిదేశాలలో తన ఆజ్ఞకెదురు లేకుండా చేశాడు. సప్తద్వీపాలలో ఏకచ్చత్రాధిపత్యం వహించాడు. విష్ణుభక్తులైన బ్రాహ్మణులకు తప్ప మిగిలినవారి విషయంలో యమునివలె చండశాసనుడయ్యాడు. అలా కొంతకాలం పరిపాలించి దీర్ఘసత్రమనే యజ్ఞం చేయడానికి దీక్ష వహించాడు.

ఆ దీర్ఘసత్రానికి రాజర్షులు, దేవర్షులు, పితృదేవతలు, బ్రహ్మర్షులు విచ్చేసి శాస్త్రోక్తంగా సమ్మానాలందుకొన్నారు. అప్పుడు శుభలక్షణాలుగల ఆ పృథుచక్రవర్తి

పృథుచక్రవర్తి ఆకారవిశేషాలు వర్ణించబడ్డాయి. మహోన్నతుడు, ఎత్తైన భుజాలుగలవాడు, వికసించేముఖ శోభులవాడు, వికసించిన ఎర్ర తామరలవంటి కనులు గలవాడు, అందమైన ముక్కుపుటాలు గలవాడు, చిరునవ్వులు చిందించేవాడు. అందాలకురులు గలిగి శంఖంవంటి కంఠంగలిగి వెడల్పైన వక్షఃస్థలముకలిగి, మూడు ముడుతలుపడ్డ నడుము భాగంతో విశాలమైన పిరుదుభాగంతో సుడిగుండంవలె నాభీవివరం ప్రకాశించగా, బంగారు స్తంభాలవంటి తొడలతో, ఎర్రని పాదాలుకలిగి కొత్త పట్టువలువను ఉత్తరీయంగా ధరించి ఆ మహాకీర్తిమంతుడు వెలిగిపోయాడు.

మరియు వ్రతదీక్షచేపట్టినందున ఆభరణాలు వదలివేసినప్పటికీ శరీర సౌందర్యంతో ప్రకాశిస్తూ, జింకచర్మం ధరించి, లక్ష్మీశోభతో చేత దర్భలు పట్టుకొని ఉచితకర్మలు చేస్తూ సుందరమైన చూపులుగల పృథుచక్రవర్తి నక్షత్రమధ్యంలో చంద్రునివలె సకలజనులకు ఆహ్లాదం కలిగిస్తూ సభామధ్యంలో లేచి నిలబడి సభ్యులకు ఆనందం కలిగేలా చక్కని మాటలతో ప్రసన్నంగా, పరిశుభ్రంగా, గంభీరంగా మాట్లాడుతూ ఇలాఅన్నాడు.

ఓ సభ్యులారా! వినండి! ధర్మాన్ని ఎల్లప్పుడూ తెలుసుకోగోరిన మనుష్యుడు తన మనస్సులో ఉండే భావాన్ని ధీరులు, సజ్జనులు అయిన వారికి తలియజేయవలసిన అవసరం ఉంది.

నేను ఈ లోకాలను శాసిస్తున్నాను. ప్రజలకు ఆయావృత్తులను కల్పించి, దానమిస్తున్నాను. రక్షిస్తున్నాను. ప్రజలు ఆయా పనులలో హద్దులు మీరకుండా విధివిధానాలు స్థిరపరచడానికి బ్రహ్మచే నేను నియోగింపబడ్డాను. ప్రజాపాలన నా కర్మానుష్ఠానం. ఈ విధమైన కర్మానుష్ఠానమువలన కర్మసాక్షి అయిన ఆ పరమేశ్వరుడు ఏలాంటివానికి సంతోషం కలిగిస్తాడో, పండితులు అతనికి ఏ పుణ్యలోకం ప్రాప్తిస్తుందని అంటారో, అనుష్థానపరుడనైన నాకు కోరికలు పిదికేవి అయిన పుణ్యలోకాలు వరుసగా లభిస్తాయి.

ప్రజలను ధర్మంగా పాలించక, తన ప్రయోజనాలకై పన్నులు తీసుకొంటే, ఆ ప్రభువునకు తన ప్రజల పాపాలు సంక్రమిస్తాయి. కాంతిని కోల్పోయి రాజు నశిస్తాడు. ప్రజలుకూడా తమహితం కోసం రాజుహితం కోరాలి. అసూయలేకుండా కృష్ణార్పణంగా ధర్మాచరణ చేయాలి. మీరిలా చేస్తే అదే నన్ను అనుగ్రహించినట్లు. అంతేకాక, మీరు పితృదేవతలతో, ఋషులతో సమానులు. ఆలాంటిమీరు సమ్మతితో కర్తను, పాలకుడను, బ్రహ్మచే అనుమోదించువాడను అయిన నాకు పరలోకంలో ఏ ఫలం కలుగుతుందో ఆలాంటి ఫలం కలగటానికి తగిన కర్మను ఆచరించండి. ఆ విధంగా చేస్తే నేను సంతోషిస్తాను. అని అనగా, ఆ సదస్యులు మహారాజుతో ఇలా అన్నారు.

ఓ పృథుచక్రవర్తీ! ప్రజలందరు తమ పనులన్నీ భగవదర్పితంగా (వాసుదేవార్పణం) చేయాలని బోధించావు. వాసుదేవుడనేవాడు భూమిపై ఉన్నాడా?

(ఆ భగవంతుని రూపరేఖావిలాసాలు తెలియజేయుమని ప్రజలు ప్రభువును కోరారు.)

ఆ మాటలు విని ప్రజలతో పృథుచక్రవర్తి ఇలా అన్నాడు. ఓ యోగ్యులారా! వినండి! యజ్ఞేశ్వరుడు కొన్ని సిద్ధాంతాల ననుసరించి ఉన్నాడు. బుద్ధిమంతులారా! దీనికి విరుద్ధంగా మీరు భగవంతుడు లేడంటే ఆ భగవానుడు సృష్టించిన కాంతిమంతమైన ఈ ప్రపంచం, ఇందలి చిత్రవిచిత్రాలైన కర్మలు ఆయనలేకుంటే అసలులేవు కదా. అందువల్ల భగవంతుడున్నాడు.

అదీగాక, ఈ లోకంలోని చిత్రవిచిత్రాలు వాటికర్తయైన భగవంతుడు లేకున్నా కర్మవశంగా కలుగుతాయని అన్నారనుకోండి.

(కర్త అయిన ఈశ్వరుడు లేకున్నా కర్మలు జరుగుతాయనుకొనేవారు నాస్తికులు. శివుని ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదు అనుకొనేవారు ఆస్తికులు.)

ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, ధ్రువుడు, మనువు మొదలైనవారికి మా తాతగారైన అంగరాజునకు, మిగిలిన రాజలోకానికి, నారద, ప్రహ్లాద, బలిమొదలైన భాగవతోత్తములకు స్వర్గమోక్షాలు ప్రాప్తించేందుకు కారణభూతుడు ఆ భగవంతుడు. మృత్యువు మనుమడైన వేనుడు మొదలైన దురాత్ములకు తప్ప మిగిలినవారి కందరికీ కోరిన కోర్కెలిచ్చి ప్రసన్నవరదుడైనవాడు ఆ స్వామి.

ఈ విధంగా అనుభవజ్ఞాన సంపన్నులైన పండితుల అనుభవాన్నిబట్టి లోకం మేలుకోరే విష్ణువు లేడనడం జరగదు. అదీగాక

గొప్పతపస్సుచే ఒప్పునట్టి మునులపూజ, ఎవని పాదపద్మారాధన వల్ల వృద్ధిపొంది ఆయన పాదపద్మాలనుండి పుట్టిన గంగానదివలె అన్ని మానసిక పాపాలను పోగొట్టేదై పూర్వజన్మల సంసారబాధను పూర్తిగా పోగొట్టగలదా...?

పరమేశ్వరుని పాదపద్మాలమూలమును మందిరంగా భక్తితో ఎవ్వడు పొందగలడో వానికి సమస్త పాపాలు తొలగుతాయి. సజ్జనులు కీర్తించిన వైరాగ్యం, జ్ఞానం, ధైర్యం, వీర్యం ప్రాప్తిస్తాయి. ఎన్నడూ సంసార దుఃఖాన్ని పొందడు.

లోకాలకు మూలాధారమైన పరమేశ్వరుడు విష్ణువు. ఆయనకు సమానులు గాని, అధికులు గాని లేరు. రెండవ సమానమైనవాడు లేకపోవడంవల్ల ఆ విష్ణువు ధీరులలో శ్రేష్ఠుడు.

కర్మవలననే లోకం పుట్టి, పెరిగి, నశిస్తుందందామా? కర్మ అనేది జడకార్యం, చేతనం కాదు. అది ప్రపంచ సృష్టిలో కర్త అనడానికి వీలులేదు. ఈ లోకంలో జగత్సృష్టి రూపకర్మకు కార్య, కారణ సంబంధం ఆ భగవంతుడైన విష్ణువే.

మీరు ఆ పరమేశ్వరుణ్ణి మీమీ యోగ్యతననుసరించి కోర్కెలు సిద్ధించినవారై త్రికరణ శుద్ధిగా కాపట్యం లేని రీతిలో కీర్తన, నమస్కార సేవలను చేసి కోర్కెలను ఫలింపజేయడానికి ఆ పరమేశ్వరుని పాదపద్మాలు సేవించండి. అదీగాక

స్వరూపంచే ఈశ్వరుడు నిశ్చయంగా స్వచ్చమైన జ్ఞానపు ముద్ద. నిర్గుణుడు. అతనియందు కర్మమార్గం సాగుతుంది గాన అతడు సంకల్పించడు. ధాన్యపు కంకులలోని ధాన్యం తెల్లగా ఉంటుంది. అది పొట్టులో దాగి దంచినపుడు బయటపడుతుంది. అలానే మంత్రాల సామర్థ్యం నిబిడీకృతంగా ఉంటుంది. సత్కర్మవలన అది ప్రకటితమవుతుంది. యజ్ఞాని కుపయోగించే ద్రవ్యాలు అన్నీ పదార్ధ సంచయాలు. అందులో యజ్ఞం ఇమిడిఉంది. అలా ప్రకటితమైనపుడు ప్రత్యేక గుణాలతో వేర్వేరుగా వ్యక్తమవుతుంది. జ్యోతిష్టోమం మొదలైన పేర్లతో యజ్ఞరూపమై సమస్త జగత్తు వెలువడును.

అదీగాక కొయ్యలో పుట్టిన అగ్ని ఆ కొయ్య లక్షణాలైన పొడవు, వంకరల నాశ్రయిస్తుంది. దేహంలోని అంతర్యామి దేహధర్మాలను అనుసరించి వ్యక్తమవుతుంది. అవ్యక్తం, కలచేది అయిన కాలం, వాసన, అదృష్టం అయిన ధర్మం అంతర్లీనంగా దేహంలో ఉంటుంది. అని పలికి కొంచెమాగి పృథుచక్రవర్తి మరలా ఇలా బోధించాడు. "నామార్గం అనుసరించే నా ప్రజలు జీవితమే నిశ్చల దీక్షగా మెలగుతూ హరిని భజిస్తారు. ఈ సృష్టియజ్ఞాన్ని అనుభవించే అధిపతి, దాన్ని ఉపదేశించేవాడు నారాయణుడే. ప్రజలు తమతమ ధర్మాలను అనుసరించి ఇలా అర్చిస్తూ యోగస్థులై ఉంటారు. వారు నన్ను అనుగ్రహించే పద్ధతి ఆశ్చర్యకరం -అని పృథుచక్రవర్తి నారాయణ భక్తులను స్తుతించాడు. మరలా ఇలా అన్నాడు.

గొప్ప సిరిసంపదలతోనూ, మహత్తరమైన ప్రతాపంతోనూ, అఖండమైన వైభవంతోనూ ప్రకాశించే రాజుల తేజస్సు తపస్సుతోనూ, శమదమాదులతోనూ, క్షమాగుణంతోనూ విరాజిల్లే బ్రాహ్మణుల పైనా, విష్ణు భక్తులపైనా ఏ మాత్రం తన ప్రభావాన్ని చూపించలేదు.

(క్షాత్రధర్మలక్షణాలు సంపద, వైభవం, ఐశ్వర్యం. బ్రహ్మ ధర్మ లక్షణాలు తపస్సు, ఇంద్రియనిగ్రహం, క్షమావిద్యలు. ఆ క్షత్రియుల అధికారం విప్రులపై ఎప్పుడూ ప్రభావం చూడకుందుగాక!

పురాణ పురుషుడైన నారాయణుడు బ్రాహ్మణుల పాదపద్మరేణువులను ధరిస్తాడు. అతనికి బ్రాహ్మణులే దేవతలు. ఆ కారణంవల్లనే ఆ భగవంతుడు నిరంతరం తనతో ఉండే లక్ష్మీదేవిని పరిగ్రహించాడు సమస్తలోకాలలో పవిత్రకీర్తినీ, ఐశ్వర్యాన్నీ పొందగలిగాడు.

(సదానపాయిని, ఎల్లప్పుడూ విష్ణు వక్షస్థలవాసిని లక్ష్మీదేవి.)

బ్రాహ్మణసేవచే సమస్త సద్గుణాలు కలుగుతాయి. భగవంతుడు సంతోషిస్తాడు. అట్టి బ్రాహ్మణులను ఆ ధర్మాన్ని పాటించేవాడు గొప్ప నీతిమంతులై తప్పక సేవించరా? జ్ఞానవిద్యలో అభ్యాసపరుడు కాకున్నా బ్రాహ్మణ సేవవలన అతని మనస్సు నిర్మలమై మోక్షప్రాప్తికూడా సిద్ధిస్తుంది. అందుచేత ఉదాత్తచిత్తంతో బ్రాహ్మణ బృందాన్ని సేవించాలి.

ఆర్యమహాజనులారా! భగవంతుడు విజ్ఞాననిధి. తత్త్వజ్ఞాన సంపన్నులైనవారు ఇంద్రాది దేవతల్ని ఉద్దేశించి బ్రాహ్మణముఖంగా అర్పించే అన్నంవల్ల(హవిస్సు) తృప్తి చెందినట్లు, అచేతనమైన అగ్నిలో వేల్పిన హవిస్సువల్ల ఈశ్వరుడు తృప్తి పొందడు. కాబట్టి, లోకంలో అగ్ని ముఖంకంటె బ్రాహ్మణుల ముఖం పరిశుద్ధమైంది. అత్యంత ప్రధానమైంది. అందువల్ల సకల జనులూ బ్రాహ్మణులను సేవించాలి.

(యజ్ఞయాగాదులు దేవతలనుద్దేశించి చేస్తారు. అగ్నిముఖంగా దేవతలకు హవిస్సులు అందుతాయి. తద్ద్వారా పుణ్యలోకప్రాప్తి, ఇష్టఫలసిద్ధి కలుగుతుందని నమ్మకం. ఇక్కడ పృథుచక్రవర్తి బ్రాహ్మణసేవలోని ప్రాధాన్యం వివరించాడు.)

అదీగాక

ఓ చతురులారా! ఈ లోకమంతా ఏ వేదంలోనైనా అద్దంలో ప్రతిబింబించే వస్తువులవలె ప్రకాశిస్తుంది. ఆవిధమైన కళంకంలేనిది, నాశరహితమైనది సనాతనవేదం. దానిని శ్రద్ధతో అధ్యయనంచేసి, తపస్సుతో సాధించి, మౌనంతో క్రమబద్ధం చేసుకొని, ఇంద్రియ నిగ్రహంతో నిశ్చలం కావించి, సమాధి స్థితిలో ఉండేవారే బ్రాహ్మణులు. సత్యాసత్య నిర్ణయశక్తి వారికుంది. అలాంటి బ్రాహ్మణుల పాదరజాన్ని ధరించేవారికి సర్వపాపాలు నశించి సద్గుణాలు అలవడుతాయి.

అలాంటి బ్రాహ్మణుల పాదధూళిని నేను తలపై ధరిస్తాను. బ్రాహ్మణులను సేవించినవానికి సమస్తగుణాలు, శీలం, కృతజ్ఞతాభావం, సిద్ధిస్తాయి. అట్టి శ్రద్ధగల మహానుభావుని ఐశ్వర్యాలు వరిస్తాయి. గోబ్రాహ్మణులు, అనుచరులతోగూడి విష్ణువు నాకు ప్రసన్నుడగుగాక అని చెప్పిన పృథుచక్రవర్తిని చూసి పితృదేవ బ్రాహ్మణులు, సత్పురుషులు సంతోషంతో ఆశీర్వదించి ఇలా అన్నారు.

ఓ పృథుచక్రవర్తీ! నీ పుణ్యవిశేషంవలన ఎన్నడో బ్రహ్మదండంచే హతుడైన పాపి వెనరాజు నరకంనుండి తరించాడు. 

(వంశంలో ఒక పుణ్యాత్ముడు జన్మిస్తే వారివంశం తరిస్తుందనడానికి పృథుచక్రవర్తి గాథ ఉదాహరణ.

వేనుని పాపాలు పృథువుపవిత్రవర్తనతో నశించాయి. పుత్రుడంటే తండ్రియు మరొక రూపంలో జన్మిస్తాడు గాబట్టి పాపప్రవర్తనుడు సత్పుత్రునివల్ల పవిత్రుడవుతాడు.)

కుమారునివలన తండ్రి సర్వలోకాలను జయిస్తాడనే వేదవాక్యం నిశ్చయం.

ఓ రాజా! హిరణ్యకశిపుడనే రాక్షసరాజు విష్ణునిందచేసి, నరకానికి వెళ్లాలని సంకల్పించినా, గుణవంతుడు, భాగవతుడు, భక్తుడు అయిన సత్పుత్రుడు ప్రహ్లాదునివల్ల పవిత్రకీర్తిని గడించాడు. కాబట్టి, పాపాలు తొలగి నరకానికి వెళ్లలేదు.

అని చెప్పి వీరవరుడయిన పృథుచక్రవర్తిని పది వేలసంవత్సరాలు గొప్పగా జీవిస్తావని ఆశీర్వదించి మరీ ఇష్టం కలిగేలా

మరలా ఇలా అన్నారు, ఓరాజా! నీకు పరమేశ్వరుడైన విష్ణుపై భక్తిఉండటంవల్ల పరమోత్తముడు వేదవేద్యుడయిన ఆయన నుంచి కథలు మాకు తెలియజేస్తున్న నీవు మాకు రాజువు కావున మేము కూడా విష్ణుభక్తుల మయ్యాము. నీ ప్రజారంజక పరిపాలనం, ప్రజలపై అనురాగం దయాస్వభావులయిన మీవంటి వారికి సహజం. అందులో ఆశ్చర్యం లేదు. జ్ఞానాన్ని కోల్పోయి సంచరించేమేము దైవం పేర చేసే కర్మల వల్ల మా అజ్ఞానపుటవధిని తెలుసుకున్నాము. ఆ మహానుభావుడు బ్రాహ్మణుల నధిష్టించి క్షత్రియులను, వారిద్వారా బ్రాహ్మణులను, వారుభయుల ద్వారా ప్రపంచాన్ని భరిస్తాడు. అలాంటి బలసంపన్నుడు, సమస్తరూపుడు, మహోన్నతుడు అయిన పృథుచక్రవర్తికి విష్ణుడన్న భక్తితో నమస్కరిస్తున్నాము. అని చెప్పే సమయంలో

పృథు చక్రవర్తి యొద్దకు సనకాదు లరుగుదెంచుట

The discourse between Sage Narada and King Prachinabarhi (Pracheena Barhi) - నారదుండు ప్రాచీన బర్హికి జ్ఞాన మార్గమును దెలియంజేయుట

నారదుండు ప్రాచీన బర్హికి జ్ఞాన మార్గమును దెలియంజేయుట ప్రాచీనబర్హి అనే రాజు గొప్పవి అయిన యజ్ఞం మొదలైన కర్మలలో తగులుకొన్న చిత్తంతో ఉన్నాడు. అ...