Wednesday, April 8, 2026

Description of the autumn season - హేమంత ఋతువర్ణనము

హేమంత ఋతువర్ణనము

శ్రీమంతమైన హేమంతం ఒక్కసారిగా వచ్చిపడింది. చేమంతిపూల దండలు ధరించిన యువతుల స్తనాల వేడిమిచేత పురుషులకు చలిబాధ తీరింది. మన్మథుడు విరహులైన జనాన్ని వేధించాడు.

ఓ రాజా! ఉత్తరపు గాలులు వీచాయి, ఆకాశంలో చంద్రుడు బాధ కలిగిస్తున్నాడు. విడివిడిగా ఉన్న దంపతులు కలిసికొంటున్నారు. తామరపూలకు శోభ తరిగింది. అంతటా మంచు అలముకొంది.

ఓ రాజా! పగళ్ల పరిమాణం తగ్గింది. రాత్రులు పెరిగాయి. చలిమంటలు హాయి కలిగిస్తున్నాయి. చలివల్ల లోకం అంతా గజగజ వణికిపోతోంది.

ఆ చలికాలంలో చెలులచన్నులఅండ చూచుకొని, మగవారు బ్రదికిపోయారు కాని, ఆ చెలులచన్నులే వద్దనే పక్షంలో బ్రహ్మాదులయినా సరే చలికి తట్టుకొని బ్రదుకగలరా?

చలికి తట్టుకోలేక తిరిగేవారు గబగబా వెళ్లి, వెచ్చని చోటుకు చేరడం లోకసహజం. అదేవిధంగా లోకబాంధవుడయిన సూర్యుడు కూడ తూరుపుకొండమీద పొడిచింది మొదలు ఎక్కడ ఆగకుండా పరుగెత్తి గబగబా పడమటికొండ మరుగులో దూరిపోయాడు. కానీ అలా కాకుండ ఆలస్యం చేస్తూ మధ్యలో ఆగినపక్షంలో చలికి చిక్కి చిక్కులపాలయి ఉండేవాడు కదా!

ఓ పరీక్షిన్మహారాజా! ఎఱ్ఱ కలువల సువాసనను తనివితీరా ఆస్వాదించే తుమ్మెదలు పైకి రేగి, మన్మథాగ్నినుండి దట్టంగా వెలువడే పొగలలాగా ఉన్నాయి.

గార్హపత్యం, ఆహవనీయం, దక్షిణాగ్ని అనే మూడింటిలో ఒకటి శివుని కంటిలోను, మరియొకటి సముద్రంలోను, మరియొకటి మనుష్యుల ఇండ్లలోను తలదాచుకొన్నాయి. లేకపోయినట్లెతే ఆ అగ్నులు భయపడి, చలికి దాస్యం చేసేవే.

ఈ హేమంత ఋతువు చలిని జయించాలని అంటే భార్యల బిగికౌగిళ్లు తప్ప మరో మార్గం లేదని భావించిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాణీ లక్ష్మీపార్వతులను తమ శరీరాలలో చేర్చుకొన్నారు. కాకపోతే ఈ త్రిమూర్తులకు భార్యలతో విడదీయరాని సంబంధం ఎందుకు ఏర్పడుతుంది?

చలికాలం వచ్చేసింది. ఎలాగ గడపడం అని విష్ణువు భయపడుతూ ఉండగా లక్ష్మీదేవి స్తనాలు మేము ఉన్నాం కదా నీ కేవిధమైన భయమూ అక్కరలేదని ధైర్యం చెప్పాయి.

ఇటువంటి హేమంత ఋతువులో మొదటిదయిన మార్గశీర్షమాసంలో మొదటిరోజు శుక్షపక్షంలోని పాడ్యమినాడు, వ్రేపల్లెలోని గొల్లపడుచులు వేకువనే లేచి, యమునకు వెళ్లి స్నానంచేసి, ఒడ్డున ఇసుకతో పార్వతీదేవి బొమ్మను చేసి, ధూపదీప నైవేద్యాలు సమర్పించి,

షడ్గుణైశ్వర్య సంపన్నురాలవయిన ఓ పార్వతీ! మేము నిన్నీనాడు పూజించి నమస్కరిస్తున్నాము. మా కందరికీ శీఘ్రంగా శ్రీకృష్ణుడు భర్త అయ్యేటట్లు అనుగ్రహించు.

(భగము కలవాడు 'భగవంతుడు', భగము కలది 'భగవతి'. 'భగము' అనగా పరిమితం లేని, సమగ్రమైన జ్ఞానం, ఐశ్వర్యం, యశస్సు, వీర్యం, వైరాగ్యం, సంపదలు అని అర్థం. కత్యయనుని కూతురు - కాత్యాయని. మోక్షమార్గాలు ఎన్ని ఉన్నాయని విచారించేవాడు - కత్యయనుడు. కాత్యాయని బ్రహ్మవిద్యాస్వరూపిణి - పార్వతి. ఈమె ఒక జన్మలో కత్యయనుని పుత్రిక అయింది.)

ఓ తల్లీ! శ్రీకృష్ణుడు మాకు భర్తగా లభించిననాడు నీకు నేతితో వసంతాలాడుతూ భక్తితో జాతర చేస్తాము.

ఈ విధంగా కాత్యాయనీ దేవికి మ్రోక్కికొని పవిత్రమైన ఆహారం నియమంగా స్వీకరిస్తూ నెలనాళ్లు వ్రతం చేశారు. ఆ రోజులలో ఒకనాడు

(వ్రతమంటే - ఉపవాసంతో లేదా శాస్త్రం విధించిన ప్రకారం పాలు, పండ్లు మొదలైనవి స్వీకరించి, నియమంగా చేసే పూజ.)

గోపికా వస్త్రాపహరణము

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

Autumn Description - శరదృతు వర్ణనము

శరదృతు వర్ణనము

ఆ శరత్కాలంలో అడవులన్నీ గుబురులు గుబురులుగా పెరిగాయి. బురదలు ఎండిపోయాయి. నెమళ్లగుంపుల కేకలు ఆగిపోయాయి. ఉరుముల మెరుపుల అలజడలు ఆగిపోయాయి.

ఆ శరత్కాలంలో బ్రతుకుతెరువులు విడిచి, ఆత్మజ్ఞాన సిద్ధిచేత జీవన్ముక్తులయి యథేచ్చగా దేశాటనం చేసే యోగీశ్వరులవలె, మేఘాలు నీటిని జారవిడిచినందువల్ల మునుపటినలుపు విరిగి తెల్లబడి, గాలితాకిడికి చెల్లాచెదరై పోతున్నాయి. మేఘావరణం తొలగిపోవడంచేత అగస్త్యనక్షత్రంతో కూడిన ఆకాశం ఆత్మజ్ఞానం అనే దీపంతో ప్రకాశించే యోగీశ్వరుని హృదయంవలె చక్కగా ప్రకాశిస్తోంది. ఆకాశంలో ఉదయించిన నక్షత్రాలు నల్లనిమేలుకట్టుకు (చాందినీ) కూర్చికుట్టిన ముత్యాలవలె ప్రకాశిస్తున్నాయి. ఆ నక్షత్రాలకాంతుల్ని మించి ప్రకాశిస్తూ, బ్రహ్మాండమనే పెట్టెలో పేర్చిన కర్పూరపు పలుకుల్లాగ చంద్రకిరణాలు చెలువారుతున్నాయి. వెన్నెల సోకి నిండుగా పండిన పైరుల వెన్నులు పొట్టలు విచ్చి, పంట బరువుకి, చప్పుడు చేస్తూ వీచే పైరగాలి తాకిడికి, నేలమీదకు ఒరగిపోయాయి. అప్పుడు అవి తమను కోయబోయే రైతుల కరకు కొడవళ్ల పదును తలచి భయపడి, తమను రక్షించమని మొరపెట్టుకుంటూ తమ తల్లి అయిన భూదేవికి ప్రణామం చేస్తున్నాయా అన్నట్లుగా ఉన్నాయి. చిలుకలు ఓపినన్ని పైరుల వెన్నులను సంకోచం లేకుండ ముక్కులతో త్రుంచి నోటితో కరచి పెట్టుకొని, గూళ్లకు చేరి తమ పెంటులతోను, పిల్లలతోను కలిసి కడుపార మెక్కి చొక్కి పొగరెక్కి పంటచేలలోని ఎత్తైన మంచెలమీద వ్రాలుతున్నాయి. ఆ మంచెలమీదనుండి పైరులను కాచే కాపుపడుచుల కెమ్మోవులను చూచి అవి ఆరబండిన దొండపండ్లు అనుకొని కొరికాయి. వారు హఠాత్తుగా చేతిచరుపులతో ఎగురగొట్టగా కిలకిల చప్పుళ్లు చేస్తూ ఎగిరిపోయాయి. తేటనీటితో నిండిన సరస్సులలో కలహంసలు, చక్రవాకాలు, బెగ్గురుపక్షులు కలకలధ్వనులు చేస్తూ సంచరిస్తున్నాయి. తరిగిపోయే తమ ఆయుస్సును పట్టించుకోకుండగా భార్యాపిల్లలమీది వ్యామోహంతో సంచరించే మనుష్యులవలె ఇంకిపోయే నీటిని గుర్తించకుండ సరస్సులలో చేపలు మొదలయిన జలచరాలు సంచరిస్తున్నాయి. జలచరాలకు భయం కలిగిస్తూ నదులలోని నీరు ఎండిపోతోంది. ఆ నదులలో వేరు వేరు ఆకృతులుగా మేట వేసిన ఇసుకతిన్నెలు కర్పూరమండపాలవలె, మణులు పొదిగిన నేలలవలె, మేడమెట్ల మాదిరి కనబడుతున్నాయి. ఆ ఇసుక తిన్నెలమీద ఉదయసమయంలో మునులు స్పానసంధ్యావందనాది నిత్యకర్మానుష్ఠానంలో నిమగ్నులయ్యారు. అక్కడి తపోవనాలలోని గున్నమామిడిచెట్లపాదులలో మునికన్యకలు తమ చేతులతో బిందెలతో నీళ్లు మోసికొని వచ్చి పోస్తున్నారు. ఆ వనంలో సూర్యకిరణాలు గాని, గాలికెరటాలు కాని ప్రవేశించడానికి వీలుకానంత దట్టంగా మద్దిచెట్లు, అడవిమొల్లలు అల్లిబిల్లిగా అల్లుకుపోయాయి. అడవిలోని చెట్ల చివరలనుండెడి లేతఆకులను అలములను మేసిన అడవియేనుగులు పొగరెక్కి దంతాగ్రాలతో ఏటిగట్లు పెల్లగించి కోరాడుతున్నాయి. అచటి చెంచెతల సన్ననినడుములు - ఏనుగుల కుంభస్థలాలవలె, బంగారుకుండలవలె బరువైన వారి స్తనాలను భరించడం ఎలాగ అనే భయంతో వణుకుతున్నాయా అన్నట్లుగా ఉన్నాయి. చెంచితలకరకుటమ్ములు గుచ్చుకొనడంచేత సత్తువ చెడి కాళ్లు తడబడుతూ ఉండగా అడవిపందులు పెద్దపులులు పెద్ద పెద్ద గోతులలో పడిపోతున్నాయి. తామరలు కలువలు గోరంటలు మొదలైన పూవులలోని తేనెలు త్రాగి మత్తెక్కి సొక్కిన తుమ్మెదల గుంపులు జుంజుమ్మని రొద చేశాయి. కామంతో మదించిన మగజింకలు, ఆబోతులు తమ తమ మందల్ని విడిచిపెట్టి, వెదకి వెదకి ఎదకువచ్చిన ఆడలేళ్లను, ఆవుల్ని మన్మథతాపంతో దాటి చూలు కట్టిస్తున్నాయి. ఆ శరదృతువు కుందం, పద్మం అనే నిధులతో నిండిన కుబేరునిగృహంలాగ మొల్లలు, తామరలతో చూడ చక్కనిదయింది. శివశబ్దం వినడానికి నోచుకోని భాగ్యహీనుని చెవిలాగ నెమళ్లకేకలు లేనిదయింది (వర్షాకాలంలో మదించిన నెమళ్లుకేకలు పెడతాయి. శరత్కాలంలో వానిమదంతోబాటు కేకలు తగ్గుతాయి. వ్యాకరణశాస్త్రవేత్త హృదయంవలె సమస్త ప్రపంచము తేటతెల్లం అయినందువల్ల ఒప్పిదమయ్యింది (వర్షాకాలంలో కారుమబ్బులు కమ్ముకొని ఉండడంవల్ల భూమిమీద వస్తువులన్నీ తమ సహజకాంతుల్ని పూర్తిగా ప్రసరింపజేయలేవు. వర్షాకాలం గడచి మబ్బులు మాయమవడంవల్ల ప్రపంచంలోని వస్తువులన్నీ తమ తమ సహజగుణంతో ప్రకాశిస్తున్నాయి. అలా ప్రకాశింపజేసింది శరదృతువు). వింటితో విజృంభించిన రాముని యుద్ధంలాగ నల్లగోరింట వేగిసచెట్లతో వెలసింది. పాపచింతలేని యముని హృదయంలాగ బురద లేనిదయ్యింది. మహాపుణ్యం చేసినందువల్ల సత్యలోకం చేరిన మహారాజులతో కూడిన బ్రహ్మదేవుని సభామందిరంలాగ రాజహంసలతో విరాజిల్లింది. పాపసంపర్కం లేని ఉత్తమపురుషుని ప్రవర్తనలాగ బురదలేని నీటితో అలరారింది. కొండలనుండి పుట్టే నదులు వచ్చి చేరడంవల్ల సందడించే సముద్రంలాగ దండయాత్రలకు బయలుదేరే రాజుల చతురంగ బలాల కోలాహలంతో కూడిందయ్యింది. ఉత్తమురాలయిన ఇల్లాలి స్తనములు కనబడనట్లు మబ్బులు కనబడనిదయింది. ఆ శరదృతువు భూమండలానికి భూషణం అయింది. ఆ తర్వాత

ఓ పరీక్షిన్మహారాజా! శరదృతువు రాగానే రాజులందరు దిగ్విజయయాత్రకు బయలుదేరబోతూ తమ తమ వాహనాలకు హారతు లెత్తుతున్నారు. విజయయాత్రలు సాగిస్తున్నారు. లక్ష్మీపూజలు, దేవతలకు ఉత్సవములను జరిపిస్తున్నారు.

(దండయాత్రకు బయలు దేరేటప్పుడు గుఱ్ఱాలు మొదలయిన వాహనాలకు హారతులిస్తారు. ఆ సమయంలో జ్వాలలు ప్రదక్షిణక్రమంగా వెలిగాయంటే దాన్ని శుభసూచనగా భావిస్తారు.)

మన్మథుడు చేవగల తన చెఱకువింటియందు నల్లకలువ అనే తన అమ్మును సంధించి వియోగంతో ప్రజలను వడిగా బాధించసాగినాడు.

(మన్మథునికి ఉన్న అయిదు పుష్పబాణాలలో నల్లకలువ ఒకటి. మిగిలిన నాలుగు అరవిందం, అశోకం, చూతం (మామిడిపూవు), నవమల్లిక.)

ఈ విధంగా ఆ శరత్కాలపు రోజులలో శ్రీకృష్ణుడు బృందావనంలో చక్కగా ఆలమందలను మేపుతూ

చక్కగా నటించే నేర్పుగల ఆ శ్రీకృష్ణుడు పిల్లనగ్రోవి చేతబట్టి స,రి,గ,మ,ప,ద,ని అనే సప్తస్వరాలు చక్కగా వ్యక్తమయ్యే విధంగా వేదసంబంధమయిన గంధర్వగీతం ఆలపించాడు. సిగలో నెమలిపించెం, మెడలో పూలదండ అందంగా అలరిస్తున్నాయి. చెవులలోని కొండగోగుపూలరంగు చెక్కిళ్లమీద అంతట వ్యాపించి వానిశోభను ఇనుమడింపజేసింది. కనుబొమ్మల సొబగుతో ఎడమవైపునకు వంచబడిన మొగం లోకానికి మైమరపు కలిగిస్తోంది. సుకుమారమైన కుడిచేతివ్రేళ్లు పిల్లనగ్రోవిరంధ్రములమీద నటిస్తూ సప్తస్వరాలకు ధ్వనిరహస్యాలు నేర్పుతున్నాయి. ఎడమకాలిమీద అడ్డంగా చాచి ఉంచిన కుడికాలిగోళ్ల కాంతి నేలమీద అంతటా వ్యాపించింది.

ఈ విధంగా శ్రీకృష్ణుడు పిల్లనగ్రోవి ఊదాడు. కామోద్దీపకమైన ఆ పాట విన్న గోపికలు సిగ్గులు విడిచిపెట్టెశారు. వలపులు ఊరడంచేత సహనం కోల్పోయారు. తమ చెలికత్తెలతో కలిసి, అయిదుగురు, పదిమంది చొప్పున గుంపులు గుంపులుగా చేరి ముద్దుముచ్చట్లలో

ఓ చెలీ! శ్రీకృష్ణుడు చెవిలో కొండగోగుపువ్వును ధరించాడు. పసిడివన్ని బట్ట కట్టాడు. సిగలో నెమిలి పింఛం తురుముకున్నాడు. మెడలో తామరపూలదండ ధరించాడు. వేణువు నూదుతూ అడవిలో ఆవులవెంట తిరిగే శ్రీకృష్ణుణ్ణి చూచావా! ఎంత చక్కగా ఉన్నాడో!

ఓ సుందరీ! ఇటురా! చెలీ! నే చెప్పేది శ్రద్ధగా విను. శ్రీకృష్ణుడు బృందావనంలో విహరిస్తూ, ఎడమవైపునకు వంచిన ముఖంతో కనుబొమలు కదిలిస్తూ, వేణువుమీద వేళ్ల స్వరవిన్యాసాలు నెరపుతూ, ఆరితేరిన నటుని లాగ షడ్జస్వరప్రధానంగా గాంధర్వగీతాన్ని ఆలపిస్తున్నాడు.

ఓ చెలీ! శ్రీకృష్ణుని తీయని వేణుగానం చెవులలో బడిన వెంటనే నా మనస్సు వశం తప్పింది. ఇంక భయం ఎందుకు? దీన్ని గురించి ఆలోచించవే.

నా తోడ రావడానికి భయపడ వద్దు. నీ తోటివారు నిన్ను మెచ్చుకొనే విధంగా నిన్ను తీసికొని పోయి, శ్రీకృష్ణునితో మాటాడిస్తాను. నీమీద ఒట్టు సుమా!

ఈ విధంగా గొల్లపడుచులు తమలో తాము చెప్పుకొంటూ, మాటి మాటికీ శ్రీకృష్ణుణ్ణి తమ మనస్సులోనే కౌగిలించుకొంటూ, బలరామ కృష్ణుల గురించి

ఓ చెలులారా! ఈ బలరామకృష్ణులు మామిడిచిగుళ్లు, నల్లకలువలు, నెమలిపింఛాలు, తామరపూలు దండలుగా చేసుకొని ధరించారు. మంచిబట్టలు కట్టుకొన్నారు. వేణువులు ఊదుతూ, అనేకవేషాలు వేస్తూ వినోదం కలిగిస్తూ సంతోషంతో బహువిధాలైన నాట్యాలు చేస్తున్నారు. చూడండి.

ఓ సుందరులారా! చక్కగా వినండి! వీరిని వర్ణించడానికి వందమాటలు పలకడం ఎందుకు? కళ్లున్నందుకు ఈ బలరామకృష్ణుల్ని చూడడమే ప్రయోజనం.

ఈ విధంగా మాటాడుకొన్నారు. వారిలో కొందరు శ్రీకృష్ణుణ్ణి గురించి

ఓ చెలియా! ఈ పిల్లనగ్రోవి అద్భష్టం ఎంతటిదో కదా! గోపికలకు కొంచెంకూడ మిగుల్చకుండ శ్రీకృష్ణుని అధరామృతం అంతా తనొక్కతే త్రాగేసోంది. చక్కగా మ్రోగుతోంది. తన పర్వాలను నేత్రపర్వంగా చూచుకొంటూ మిడిసిపడుతోంది. ఇది పూర్వం ఎంత తపస్సు చేసిందో కదా!

ఓ చెలీ! ఈ వేణువు పూర్వం ఏ నదీజల బిందువులవల్ల పెరిగి ఇంతటి మహాభాగ్యాన్ని పొందిందో కదా! కాని ఆ నదికి కలిగే సంతోషాన్ని వర్ణించగలమా? ఆ నది మంచి కొడుకును గన్న తల్లిలాగ తనలో విహరించే హంసల కల కల ధ్వనులే పాటగా, తన కెరటాల కదలికలే హస్తాభినయంగా నాట్యం చెయ్యదా! తప్పక చేస్తుంది.

తమ కులంలో పుట్టిన గొప్ప విష్ణుభక్తుణ్ణి చూచి, ఆ కులంలోని వారంతా సంతోషంతో ఆనందబాష్పాలు రాల్చెవిధంగా, శ్రీకృష్ణునిచేతిలోని వేణువు యొక్క రమణీయ రవళిని విని సంతోషించిన చెట్లు మకరందాన్ని వర్షిస్తున్నాయి.

అయ్యో! నేనెంత మోసపోయానో గదే! సఖీ! నేను పూర్వజన్మంలో నోములు నోచేటప్పుడు రాబోయేజన్మలో భూలోకంలో యమునానది ఒడ్డున వెదురుగా పుట్టాలని కోరుకున్నా బాగుండేది. అలా కోరుకొని ఉంటే నాకు శ్రీకృష్ణుని మోవితేనె దక్కేది కదా!

ఓ చెలీ! యమునాతీరంలో శ్రీకృష్ణుని అధరసుధను పానం చేసే వెదురుగా పుట్టాలంటే ఏమి నోము నోచాలో నాకు చెప్పు.

శ్రీకృష్ణుణి చూచి నల్లనిమేఘం అనీ, వేణురవం విని అది ఉరము చప్పుడు అనీ సంతోషంతో కేకలు వేస్తూ నెమళ్ల గుంపులు నాట్యం చేస్తున్నాయి చూచావా?

ఓ సఖీ! కొండలలో తిరిగే దేవ గంధర్వాది జాతులకు చెందిన దంపతులు శ్రీకృష్ణుని పాదముద్రలచే పవిత్రీకరింపబడి అందంగా కనిపించే బృందావనాన్ని అమరావతికంటె గొప్పదిగా భావిస్తూ చూస్తూ ఉండిపోతున్నారు.

ఓ సఖీ! అటు చూడు. దేవతాశ్రేష్ఠుల భార్యలు విమానాలమీద ఆకాశంలో విహరిస్తూ వెడుతూ మంగళకరమైన శ్రీకృష్ణునిరూపం చూశారు. ఆతని మురళీగానం మరీమరీ విన్నారు. అంతే! మన్మథావేశానికి లోనయి కోకముడులు వీడి పోతుండగా భర్తలకౌగిళ్లలో వాలిపోయారు.

ఓ సఖీ! ఈ అడవిలోని మృగాలజంటలు రసవంతమయిన శ్రీకృష్ణునివేణుగానాన్ని వింటున్నాయి. ఆ పాటలో స్వారస్యం గుర్తించే వివేకం వాటికి లేదు. అయినప్పటికీ పరవశించిపోయి, ఒళ్లుమరచి, మేతలు విడిచి, తిన్ననయిన చూపులతో శ్రీకృష్ణుణ్ణి అభినందిస్తున్నాయా అన్నట్టుగా ఉన్నాయి. గమనించు.

చెలులారా! లేగలు తల్లులపాలు త్రాగే సమయంలో, తమ చెవులలో తమకు ఇష్టమయిన శ్రీకృష్ణుని మురళీరవం అనే అమృతధార ప్రవేశించింది. అంతే, పరవశించిపోయి అవి, త్రుళ్లిపాటు విడిచిపెట్టి, పాలు త్రాగడం మాని, పొదుగులు కుమ్మకుండా చూపులు కృష్ణునిమీద లగ్నం చేసి నిలబడిపోయాయి. చూశారా!

తామరపూలవంటి కన్నులుగల ఓ చెలీ! ఆవులు మమకారంతో శ్రీకృష్ణునిరూపం మనస్సులో నిల్పుకొని, శ్రీకృష్ణుని మురళీగానామృతాన్ని ఆస్వాదిస్తూ మైమరచిపోయి, మోరలు చాచి, మేతలు మాని, ఆనందబాష్పాలు రాలుస్తూ బొమ్మలవలె నిలబడి పోయాయి. అదిగో చూశావా?

ఓ సఖీ! ఈ పక్షులు చెట్లకొమ్మలమీద కూర్చుండి, శ్రీకృష్ణునిమురళీగానామృతాన్ని చెవులారా ఆస్వాదిస్తూ, కళ్లు మూసుకొని పరవశించిపోతున్నాయి. ఆ కనులమూతలు తమ మనస్సులో లగ్నమైన శ్రీకృష్ణునిదివ్యసుందరరూపం బయటికి పోకుండగా బంధించి యోగీశ్వరులవలె బ్రహ్మానందం అనుభవిస్తున్నాయా అన్నట్లుగా ఉన్నాయి. చూశావా?

ఓ యువతీ! నదులన్నీ శ్రీకృష్ణుని వేణురవం విని, మన్మథవేదనకు లోనయ్యాయి. తమలోని సుడిగుండాలు మన్మథ బాణాల తాకిడివల్ల కలిగిన గాయాలా అన్నట్లుగా ఉన్నాయి. ఆ వేదననుండి బయటపడడానికి హంసలకలధ్వనులనే మిషతో శ్రీ కృష్ణుణ్ణి ఆహ్వానిస్తున్నాయా అన్నట్లుగా ఉన్నాయి. అలలనే చేతులతో శ్రీ కృష్ణుణ్ణి దగ్గరకు లాగికొని తామరపూల సమర్పణలతో శ్రీకృష్ణునిపాదాలు పూజిస్తున్నాయా అన్నట్లుగా ఉన్నాయి. చూశావా

రమణీ! నేడు శ్రీకృష్ణుని మురళీగానం విని మేఘం పూలవాన కురిపించింది. దానితో తెల్లబడి తన శరీరాన్నంతటినీ వెల్లగొడుగుగా మార్చి, శ్రీకృష్ణునికి ఎండ తగులకుండా నీడ కల్పించింది. చూశావా.

ఓ చెలీ! ఆ చెంచితలను చూడు. వారు నెమలియీకలు, చెట్లఆకులు కోకలుగా కట్టుకున్నారు. బాగా మాగిన పండ్లు తెచ్చి శ్రీకృష్ణుని చేతుల నిండా నింపి, ఆపైన ఆతనిచేతులు పట్టుకొని ఆనందంతో ఆడుతున్నారు.

ఓ సఖీ! అటు చూడు. ఒక ఆటవిక స్త్రీ బరువయిన తన పాలిండ్లను మోయలేక, నడుము జవజవలాడుతూ తొట్రుపాటుతో వచ్చి, ఒక చక్కని పూలదండను శ్రీకృష్ణునికి సమర్పిస్తోంది.

ఓ ముద్దలారా! శ్రీకృష్ణుని మురళీనాదామృతం సోకగానే కొండలన్నీ కరిగి నీరయ్యాయి. చెట్లన్నీ చిగురించాయి. దేవతలు మానవులు అందరు పరవశించిపోయారు. చూశావా?

ఓ పద్మముఖీ! ఎదురుగా ఉన్న ఈ కొండను చూడు. బలరామకృష్ణుల పాదన్యాసములచేత తనను ధన్యమైన దాన్ని భావించుకొంటోంది. పండ్లు పువ్వులు అనే కానుకలు వారికి సమర్పిస్తోంది. సంతోషంతో మిన్ను ముట్టుతోంది. నీటిని, గద్దిని సమృద్ధిగా కలిగించి ఆవులకు ఆప్యాయనం కలిగిస్తోంది. చక్కనైన చెట్లు అనే పులకాంకురాలతో అందగిస్తోంది.

ఈ విధంగా గొల్లపడుచులు బృందావనంలో విహరిస్తూ ఉన్న శ్రీకృష్ణుణ్ణి చూచి, కామవికారానికి లోనయి ఏకాంత ప్రదేశాలలో అతణ్ణే ధ్యానం చేస్తూ ఉండిపోయారు.

హేమంత ఋతువర్ణనము

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

Tuesday, April 7, 2026

Ksheeraramam - Palakollu - క్షీరారామం - పాలకొల్లు

క్షీరారామం - పాలకొల్లు

పంచారామాలలో ఒకటైన క్షీరారామం - పాలకొల్లు

క్షీరారామం పార్వతీ సమేతుడై 'శ్రీ రామలింగేశ్వరుడు వెలసిన పుణ్య క్షేత్రం. ఇది ఆంధ్రప్రదేశ్‌లో పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన 5 పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో వుంది. దీనినే క్షీరారామలింగేశ్వరస్వామి దేవాలయం అంటారు. ఈ మందిరాన్ని చాళుక్యుల కాలంలో, 10 - 11 శతాబ్దాలలో నిర్మించారు. ఈ దేవాలయ స్తంభంపైనున్న 13వ శతాబ్దపు శాసనం ప్రకారం, ఈ గుడిని సృష్టించిన శిల్పాచార్యుడు బ్రహ్మశ్రీ కాశె శూలాచార్య. ఈ గుడి గోపురం 9 అంతస్తులతో 125 అడుగుల ఎత్తుతో దర్శనమిస్తుంది. దీనికి కొద్ది దూరంలో ఒక చెరువు ఉన్నది గోపుర నిర్మాణసమయంలో ఒక్కొక్క అంతస్తు నిర్మితమైన తరువాత దాని చుట్టూ మట్టినిపోస్తూ దానిపై రాకపోకలతో రెండవ అంతస్తు నిర్మాణం చేసేవారట ఆవిధంగా మట్టి తీయగా ఏర్పడినదే. ఆంధ్రప్రదేశ్‌లో ఎత్తయిన, చోళ రాజుల శిల్పకళా రీతులను అద్భుతంగా చూపే గోపురాలలో ఇది ఒకటి.

ఆలయ ప్రశస్తి
ఇక్కడి శివలింగం చిక్కని పాలవలే తెల్లగా మెరుస్తూ భక్తులకు కనువిందు చేస్తుంటుంది. శ్రీమహావిష్ణువుచే శివలింగం ప్రతిష్ఠించబడిన ఈ పుణ్య క్షేత్రానికి విష్ణుమూర్తే క్షేత్రపాలకుడు. ఆదిశంకరాచార్యుడు ఈ క్షేత్రాన్ని దర్శించి శ్రీ చక్రం ప్రతిష్ఠించాడు. శివలింగం పైభాగం మొనదేలి ఉండటం వలన ఇక్కడి స్వామివారిని కొప్పు రామలింగేశ్వరుడు అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో పరమశివునితో పార్వతిదేవి పూజలందుకుంటుంది. ఇది కుమారస్వామి ఛేదించిన ఆత్మలింగపు పైభాగమని తలచి పూజిస్తారు. స్వామివారికి ఎదురుగా ఉన్న ప్రాకార మంటపంలో పార్వతీ దేవి కొలువై ఉంటుంది. ఆ ప్రక్కనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, ఋణహర గణపతి ఆలయాలు కనిపిస్తాయి. ఈ ఋణహర గణపతిని దర్శించడం వలన అప్పుల బాధల నుంచి బయటపడటం జరుగుతుందని భక్తులు భావిస్తుంటారు.

చరిత్ర
వెలనాటి చోళరాజు భార్య గుండాంబిక 1157లో క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయానికి అఖండదీపానికి దానం ఇచ్చింది. ఇక్కడి నాట్యమంటపానికి 1276లో కోన గణపతిదేవ మహారాజు కంచు తలుపులు పెట్టించారు. 150 అడుగుల ఎత్తైన ఆలయ గోపురాన్ని 1415న అల్లాడ రెడ్డిభూపాలుడు నిర్మించారని శిలాశాసనం పేర్కొంటోంది. చెళ్ళపిన్నమనేని నరహరినేని ఆలయ కళ్యాణమండపం నిర్మించారు. 1777లో బచ్చు అమ్మయ్య మూడు వందల సంవత్సరాల నాడు ప్రారంభించిన గోపురాన్ని పూర్తిచేయించారు.

స్థలపురాణం
పూర్వం ఉపమన్యుడు అనే శివభక్తుడైన బాలకుడి కోసం శివుడు తన త్రిశూలంతో నేలపై గుచ్చగా అక్కడి నుంచి పాలధారలు పొంగి పొర్లాయని, ఈ కారణంగానే ఈ ప్రాంతానికి క్షీరపురి, పాలకొలను ఉపమన్యుపురంగా ప్రసిద్ధి చెందినట్లు స్థలపురాణం చెబుతోంది. క్షీరం అంటే పాలు. ఆ పేరు మీదుగానే పట్టణానికి పాలకొల్లు అనే పేరు వచ్చింది. పాలకొల్లును పూర్వము క్షీరపురి, ఉపమన్యుపురం, పాలకొలను అని పిలిచేవారు. ప్రతిరోజూ చేయబడే అభిషేక క్షీరంతో ఈ చెరువు నిండిపోయి పాలకొలను అను పేరున పిలువబడుతూ ఆప్రాంతమునకు కూడా వర్తించి ఉండ వచ్చని ఒక కథనం.

రవాణాసౌకర్యం:
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల నుండి నర్సాపూర్ లేదా భీమవరం వైపు వెళ్లే బస్సులు పాలకొల్లుకు అందుబాటులో ఉంటాయి.

రావులపాలెం దాటిన తర్వాత, నర్సాపూర్ వెళ్లే మార్గం నుండి సిద్ధాంతం మరియు మార్తేరు (మార్టేరు) మీదుగా పాలకొల్లుకు కేవలం 45 నిమిషాల ప్రయాణం. 

రావులపాలెం మరియు వైజాగ్ మధ్య దూరం 230 కి.మీ మరియు రాజమండ్రి నుండి 70 కి.మీ.

కాకినాడ, యానం మరియు అమలాపురం మీదుగా రాజోలు. అక్కడ నుండి పాలకొల్లు. 
కాకినాడ నుండి, రామచంద్రపురం మరియు రావులపాలెం మీదుగా కూడా పాలకొల్లు చేరుకోవచ్చు. గోదావరి నదిని దాటడానికి కేవలం రెండు వంతెనలు మాత్రమే ఉన్నాయి, ఒకటి యానం వద్ద, మరొకటి రావులపాలెం సమీపంలో.

రైలు మార్గం:
కోల్‌కతా వైపు నుండి వచ్చే రైళ్లు భీమవరం (జంక్షన్) మీదుగా పాలకొల్లు చేరచ్చు. నర్సాపూర్‌ వెళ్లే రైళ్లు కొన్ని ఆగుతాయి. టిక్కెట్లు బుక్ చేసుకునే ముందు నిర్ధారించుకోండి. పర్యాటకులు భీమవరంలో దిగి, పాలకొల్లు చేరుకోవడానికి ప్రైవేట్ వాహనంలో గానీ లేదా బస్సులో గానీ ప్రయాణించాలి. విశాఖపట్నం నుండి పాలకొల్లుకు బస్సులో ప్రయాణించడానికి మొత్తం 7 గంటల సమయం పడుతుంది. నర్సాపూర్ మరియు భీమవరం మధ్య పాలకొల్లు మీదుగా ప్రైవేట్ బస్సు రవాణా సౌకర్యం ఉంది.

ఆలయ సమయాలు ఉదయం 5.30 నుండి 11.30 వరకు మరియు సాయంత్రం 4.00 నుండి రాత్రి 8.30 వరకు. 

ఇతర దేవాలయాలు:
భీమవరం, ద్రాక్షారామ, అన్నవరం, తలుపులమ్మ తల్లి, రాజమండ్రి, అంతర్వేది, ర్యాలి మరియు వాడపల్లి వంటి పాలకొల్లు చుట్టుపక్కల అదనపు దర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో పర్యాటకులు బస చేసేందుకు వసతి  సౌకర్యం అందుబాటులో ఉంది.
 
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ పంచారామాలను బస్సులో ఒక్కరోజులో దర్శించే యాత్రా సౌకర్యాన్ని కలిగిస్తున్నది. సుమారు 700 కి.మీ. సాగే ఈ యాత్ర ప్రతిరోజు రాత్రి 8.00 గంటలకు మొదలై మళ్ళీ మరునాడు రాత్రి 8.00 గంటలకు ముగుస్తుంది.

Daksharamam - Bhimeswara temple - ద్రాక్షారామ - భీమేశ్వరాలయం

ద్రాక్షారామ - భీమేశ్వరాలయం

పంచారామాలలో ఒకటైన ద్రాక్షారామం

పంచారామ క్షేత్రాలలో ద్రాక్షారామ ఆలయం భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లా, రామచంద్రపురం మండలం, ద్రాక్షారామం గ్రామంలో, గోదావరి నది తూర్పు ఒడ్డున ఉంది. ఈ ఆలయంలో ప్రధాన మూర్తి శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి

వ్యుత్పత్తి శాస్త్రం
ఈ పట్టణాన్ని పూర్వం ధక్షతపోవన మరియు ధాక్షవాటిక అని పిలిచేవారు. దక్ష ప్రజాపతి అయిన దక్షుడు "నిరీశ్వర యాగం" అనే యజ్ఞం చేసిన ప్రదేశం ఇది. ఈ ప్రదేశం యొక్క పూర్వపు నామం 'దక్ష ఆరామం'. దీని అర్థం 'దక్ష నివాసం'. '
దక్ష ఆరామం' గా పిలువబడి కాలక్రమేణా అది ద్రాక్షారామంగా మారింది. ఈ ప్రదేశాన్ని జగద్గురు ఆది శంకరాచార్య మహాశక్తి పీఠ శ్లోకంలో 'మాణిక్యే దక్షవాటిక' 'ద్రాక్షారామ మాణిక్యాంబ దేవి' ని సూచించే దక్షవాటిక అని కూడా పేర్కొన్నారు. దక్షుడు 'నీరీశ్వర యాగం' చేసిన ప్రదేశాన్ని ఇప్పటికీ ఇక్కడ భక్తులు సందర్శిస్తారు.

ఈ నిరీశ్వర యజ్ఞానికి తన భర్తకి ఆహ్వానం లేకపోయినప్పటికీ పుట్టింటిపై ప్రేమతో ఆ యజ్ఞానికి వచ్చి అవమాన పడిన పరమశివుని సతి సతీదేవి ఆత్మాహుతి చేసుకున్న ప్రదేశం ఇదే. తన భార్యను అవమాన పరిచినందుకు గాను శివుడు వీరభద్రుడిని సృష్టించి దక్షుడి తల నరికించాడు.

సతీదేవి వియోగ వివశత్వం నుంచి శివుడిని బయటపడేయడం కోసం శ్రీ మహా విష్ణువు ఆమె శరీరాన్ని 18 ఖండాలుగా చేశాడు. ఆమె శరీర అవయవాలు పడిన ప్రదేశాలు అష్టాదశ శక్తిపీఠాలుగా అవతరించాయి.

ద్రాక్షారామం ఆలయాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఈ ఆలయం శివ పంచారామాలలో ఒకటి, 18 శక్తి పీఠాలలో ఒకటి. కనుక ఇది శివ క్షేత్రంగానూ, శక్తి క్షేత్రంగానూ ప్రసిద్ధి చెందింది.

ఆలయ చరిత్ర
ఆలయంలోని శాసనాలు 9వ మరియు 10వ శతాబ్దాల మధ్య తూర్పు చాళుక్యుల రాజు భీమునిచే నిర్మించబడినట్లు తెలుపుతున్నాయి. దేవాలయం యొక్క పెద్ద మండపాన్ని ఒడిశాకు చెందిన తూర్పు గంగా రాజవంశ రాజు నరసింగ దేవ I యొక్క కోడలు గంగా మహాదేవి నిర్మించారు. వాస్తుపరంగా మరియు శిల్పపరంగా, ఈ ఆలయం చాళుక్యుల మరియు చోళ శైలుల సమ్మేళనాన్ని ప్రతిబింబిస్తుంది.

ఈ ఆలయం చారిత్రాత్మకంగా ప్రముఖమైనది. ఈ ప్రాంతాన్ని పాలించిన తూర్పు చాళుక్యులు దీనిని నిర్మించారు. ఇది 892 CE మరియు 922 CE మధ్య నిర్మించబడిన సామర్లకోట (సామల్కోట్) లోని భీమేశ్వరస్వామి ఆలయానికి పూర్వం నిర్మించబడిందని నమ్ముతారు.

పురాణం
దక్షారామం దక్ష యజ్ఞం జరిగిన ప్రదేశంగా పరిగణించబడుతుంది. వీరభద్రుడు ఈ ప్రదేశంలో చేసిన విధ్వంసం మరియు మారణహోమం తరువాత శివుడు ఈ స్థలాన్ని పవిత్రం చేశాడు.

పూర్వం తారకాసురుడు అను రాక్షసుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేయగా, శివుడు సాక్షాత్కరించాడు. ఆ రాక్షసుడు శివుని ఆత్మలింగాన్ని వరంగా కోరగా శివుడు ఆత్మలింగాన్ని ప్రసాదించాడు. క్రూర స్వభావం కలిగిన ఆ తారకాసురుడు, ఆ లింగ శక్తి వలన దేవతలను, ఋషులను, సత్పురుషులను నానా ఇబ్బందులు పెట్టుచుండగా ఆ బాధలు భరించలేక వీరంతా విష్ణుమూర్తిని ప్రార్థించారు. అపుడు విష్ణువు ఆ లింగం తొలగితేగాని ఆ రాక్షసుని శక్తి నశించదనీ, ఈశ్వరుడి అంశతో జన్మించిన వానితో తప్ప మరెవ్వరి వలనా తనకు మరణం లేకుండా వరం పొంది ఉన్నాడని చెబుతాడు. మన్మథ ప్రేరేపణచేత పార్వతీ కళ్యాణం, అనంతరం 'కుమార సంభవం' జరుగగా, ఆ కుమారస్వామి రుద్ర గణములకు నాయకత్వం వహించి తారకాసురుడితో యుద్ధం చేసినప్పుడు, స్వామి విసిరిన బాణం ఆ ఆత్మలింగానికి తగిలి అయిదు ముక్కలై, అది భూమి మీద అయిదు చోట్ల పడ్డాయి. అవే పంచారామ క్షేత్రాలుగా అవతరించాయి. వాటిలో ఒకటి ద్రాక్షారామం.

ఆలయ స్వరూప విశేషాలు
ఇక్కడి మూలవిరాట్ శ్రీ భీమేశ్వర స్వామి స్వయంభుగా వెలసిన 14 అడుగుల శివలింగం, శుద్ధ స్ఫటికాకార లింగం. రెండు అంతస్తుల పాటు లింగం విస్తరించి ఉంటుంది. ఒక మెట్ల మార్గంతో గర్భగుడి పై అంతస్తుకు చేరుకోవచ్చు. ద్రాక్షారామంలోని శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. తెల్లవారుజామున లేత సూర్యకాంతి శివలింగంపై పడుతుంది. శివలింగం పైభాగంలో నల్లటి చారలు మనకు కనిపిస్తాయి. శివుడు అర్జునుడితో యుద్ధం చేసినప్పుడు వేటగాడి వేషంలో ఉన్నప్పుడు ధరించిన పులి చర్మానికి సంబంధించిన గుర్తులని భక్తులు నమ్మకం.

భీమేశ్వర స్వామి దేవాలయం 
7–8 శతాబ్దాల మధ్య తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తొంది. ఆలయంలో "సప్త గోదావరి" అని పిలువబడే పుష్కరిణి ఉంది, ఇక్కడ సప్త ఋషులు ఏడు వేర్వేరు నదుల నుండి నీటిని తీసుకువచ్చారు. సప్త గోదావరి పుష్కరిణిలో ఉన్న చిన్న మంటపంలో సప్తఋషులను చూడవచ్చు. వ్యాసుడు నిర్మించిన కాశీ విశ్వేశర ఆలయాన్ని మరియు అగస్త్య మహర్షి పూజించిన అగస్త్యేశ్వర స్వామిని సందర్శించవచ్చు. ఆలయ ప్రాంగణంలో కూడా కొన్ని మంటపాలు అందుబాటులో ఉన్నాయి. ఆలయం చుట్టూ నాలుగు గోపురాలు మరియు ఆలయ ప్రాంగణం లోపల కాల భైరవ, వీర భద్ర మరియు వటుక భైరవ ఆలయాలు వంటి కొన్ని ఆలయాలను ఉన్నాయి.

మాణిక్యాంబా దేవి శక్తి పీఠం
ద్రాక్షారామ భీమేశ్వరాలయ ప్రాకారంలో ఈశాన్యంలో అష్టాదశ శక్తి పీఠాలలో 12వ శక్తిపీఠం మాణిక్యాంబ ఆలయం కొలువై ఉంది.

శ్రీ మాణిక్యంబా అమ్మవారు యావత్భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన అష్టాదశ శక్తి పీఠాలలో 12 వ శక్తిపీఠంగా వెలసింది.తెలుగుకు ఆ పేరు త్రిలింగ అన్న పదం నుంచి ఏర్పడిందని కొందరి భావన. ఆ త్రిలింగమనే పదం ఏర్పడేందుకు కారణమైన క్షేత్ర త్రయంలో ద్రాక్షారామం ఒకటి. మిగిలిన రెండు క్షేత్రాలలో ఒకటి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం కాగా, మరొకటి శ్రీశైలం. త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా, అష్తాదశ శక్తిపీఠాలలో ద్వాదశ పీఠంగా, దక్షిణ కాశీగా, వ్యాస కాశీగా ద్రాక్షారామానికి ప్రశస్తి ఉంది.

శాతవాహన రాజైన హాలుని కాలానికే ఈ ఆలయం ఉన్నట్లు లీలావతీ గ్రంథం అన్న ప్రాకృతభాషా కావ్యంలో పేర్కొన్నారు. ఈ ఆలయాన్ని, సామర్లకోట లోని భీమేశ్వరాలయాన్ని కూడా చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని చెబుతారు. అందుకే ఈ రెండు గుడులు ఒకే రీతిగా ఉండటమేగాక, రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయికూడ ఒకటేరకంగా ఉంటుంది. ఈ క్షేత్రాన్ని గురించిన ప్రశంస శ్రీనాథకవి భీమేశ్వర పురాణంలో వివరించాడు. దుష్యంతుడు, భరతుడు, నలుడు, నహషుడు ఈ స్వామిని అర్చించారని వ్రాశాడు. తిట్టుకవిగా ప్రసిద్ధి నందిన వేములవాడ భీమకవి "ఘనుడన్ వేములవాడ వంశజుడ, ద్రాక్షారామ భీమేశునందనుడన్.... " అని చెప్పుకొన్నాడు.

శ్రీ లక్ష్మీనారాయణుడు ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడిగా ఉన్నాడు. ద్రాక్షారామం త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా, పంచారామాల్లో ఒకటిగా, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రాన్ని గురించి శ్రీనాథ కవి సార్వభౌముడు తన కావ్యాల్లో పేర్కొన్నాడు. ఇక్కడి స్వామివారిని అభిషేకించడానికి సప్తఋషులు కలిసి గోదావరిని తీసుకు వచ్చారనీ పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి. అందువలన అంతర్వాహినిగా ప్రవహించే ఈ గోదావరిని సప్త గోదావరి' అని పిలుస్తూ వుంటారు. ఇక్కడి పంచలోహ విగ్రహాలు తామ్ర మూర్తులు 8 వ శతాబ్దం నుంచి ఉన్నవిగా భావిస్తున్నారు.

అష్ట సోమేశ్వరములు
ఈ భీమేశ్వరుడికి ఎనిమిది దిక్కులలోను ఎనిమిది శివలింగాలను చంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించాడని విశ్వసించబడుతుంది. వీటిని అష్టలింగములు లేదా అష్ట సోమేశ్వరములు అంటారు. తూర్పున కోలంక, పడమర వెంటూరు, 'దక్షిణాన కోటిపల్లి ఉత్తరాన వెల్ల ఆగ్నేయంలో దంగేరు. నైరుతిలో కోరుమిల్లి వాయువ్యంలో సోమేశ్వరం ఈశాన్యాన పెనుమళ్ళ ప్రాంతాలలో ఈ అష్ట సోమేశ్వర ఆలయాలు ఉన్నాయి. ఈ భీమేశ్వర ఆలయ ప్రాంగణంలో ఇంద్రేశ్వర, యజ్ఞేశ్వర, సిద్దేశ్వర, యోగీశ్వర, యమేశ్వర, కాళేశ్వర వీరభద్రేశ్వర లింగాలు దర్శనమిస్తాయి. ఇక తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ దిశగా ఉన్న ఒక్కో గాలి గోపురాన్ని ఒక్కో అమ్మవారు పర్యవేక్షిస్తున్నట్టు స్థలపురాణం వివరిస్తుంది.

రవాణా సౌకర్యం 
ద్రాక్షారామము అమలాపురం నుండి 25 కిమీ , కాకినాడ నుండి 28 కిమీ , రాజమండ్రి నుండి 50 కిమీ దూరంలో ఉంది. రైలులో రాజమండ్రి మరియు కాకినాడ చేరుకుని అక్కడి నుండి రోడ్డు మార్గంలో దాక్షారామం చేరుకోవచ్చు. రాష్ట్ర రహదారి భారతదేశంలోని అన్ని ప్రధాన పట్టణాలు మరియు నగరాలతో కలుపుతుంది. తరచుగా బస్సు సేవలు అందుబాటులో ఉన్నాయి. సమీప విమానాశ్రయం రాజమండ్రి విమానాశ్రయం.

రోడ్డు మార్గం:
రాజమండ్రి చేరుకుని బస్సులో రామచంద్రపురం వెళ్లవచ్చు లేదా రావులపాలెం చేరుకుని రామచంద్రపురం వరకు బస్సులో వెళ్లవచ్చు. రామచంద్రపురం నుండి కోటిపల్లి లేదా యానాం మరియు ఇతర బస్సులలో ద్రాక్షారామ చేరుకోవాలి.

రైలు మార్గం:
ఒకరు కాకినాడ చేరుకుని ద్రాక్షారామకు రైలులో ప్రయాణించవచ్చు కానీ ఇప్పుడు ఒక రైలు బస్సు మాత్రమే నడుస్తోంది మరియు అది నిరంతరం నడవదు.

వాయు మార్గం:

రాజమండ్రి వరకు ప్రయాణించి, విమానాశ్రయం నుండి క్యాబ్లో ఒకటిన్నర గంటలో ద్రాక్షారామ చేరుకోవచ్చు.

ఉత్సవాలు:
ప్రతీ ఏకాదశీ పర్వదినములలో ఏకాంతసేవ, పవళింపుసేవ. ప్రతీ మాసశివరాత్రి పర్వదినములలో గ్రామోత్సవం. ప్రతీ కార్తీక పూర్ణిమతో కూడిన క్రృత్తికా నక్షత్రం రోజున జ్వాలాతోరణ మహోత్సవం.

ప్రతీ మార్గశిర శుద్ధ చతుర్ధశి రోజున శ్రీ స్వామివార్ల జన్మ దినోత్సవం. ప్రతీ ధనుర్మాసంలోనూ క్షేత్రపాలకులు అయిన శ్రీ లక్ష్మీ సమేత శ్రీ నారాయణ స్వామి వార్లకు ధనుర్మాస పూజలు
ప్రతీ మాఘశుద్ధ ఏకాదశీ ( భీష్మ ఏకాదశి ) రోజున శ్రీ స్వామి వారి, అమ్మవార్లకు దివ్య కల్యాణ మహోత్సవం జరుగుతాయి.

ప్రతీ మహాశివరాత్రి పర్వదినాలలో శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి.
శరన్నవరాత్రులు (దేవీనవరాత్రులు) - ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు జరుగుతాయి
కార్తీక మాసం ప్రత్యేక ఉత్సవాలు - జ్వాలాతోరణం (కార్తీక పున్నమి నాడు)
సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవం- మార్గశిరశుద్ధ షష్ఠి నాడు.

వసతి సౌకర్యాలు, అన్నదాన సత్రాలు అందుబాటులో ఉన్నాయి.

మన దేవాలయాలు చారిత్రక నగరాలూ

Samalkota Kumara Bhimarama - సామర్లకోట - కుమారభీమారామం

సామర్లకోట - కుమారభీమారామం

పంచారామాలలో ఒకటైన కుమారభీమారామం - సామర్లకోట

పంచారామాలలో ఒకటయిన ఈ 'కుమారభీమారామం' క్షేత్రం ప్రశాంతంగా చుట్టూ పచ్చని పంటచేలతో సామర్లకోటకు కిలోమీటరు దూరంలో ఉంటుంది. ఇక్కడ లింగం కూడా 14 అడుగుల ఎత్తున రెండంతస్తుల మండపంగా ఉంటుంది. పై అంతస్తులోకి వెళ్ళి పూజలు జరపాలి. మహాశివరాత్రి ఉత్సవం ఇక్కడ ముఖ్యమైన పర్వదినం.

చరిత్ర
సామర్లకోట లోని భీమేశ్వరాలయాన్ని చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించబడింది. ఈయనే ద్రాక్షారామ దేవాలయాన్నీ నిర్మించింది. అందుకే ఈ రెండు గుళ్ళు ఒకే రీతిగా వుండటమేగాక, రెండిటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకటేరకంగా, నిర్మాణ శైలికూడా ఒకే విధంగా వుంటుంది.

ఈ మందిరం నిర్మాణం సా.శ. 892 లో ప్రారంభమై సుమారు సా.శ. 922 వరకు సాగింది. ఆలయం నిర్మాణం చాలా చక్కని శిల్ప కళ కలిగి ఇప్పటికీ పగుళ్ళు లేకుండా ఉంది. ఇక్కడి శివలింగం తెల్లని రంగులో ఉంది. 1340-1466 మధ్యకాలంలో రాజ్యం చేసిన కాకతీయులు ఈ మందిరాన్ని కొంత పునర్మిర్మించారు. ఇక్కడ కాకతీయుల నాటి శిల్ప కళను, అంతకు పూర్వపు తూర్పు చాళుక్యులనాటి శిల్ప కళను తేలికగా గుర్తించవచ్చును. ఇక్కడి అమ్మవారు బాలాత్రిపురసుందరి. శివుడు కాలభైరవుని రూపంలో కూడా ఉన్నాడు. 1147 - 1494 మధ్యకాలంలో ఆలయానికి సమర్పించిన విరాళాల గురించిన శాసనాలున్నాయి. తెలుగు భాషకి సంబంధించిన అత్యంత ప్రాచీన శిలాశాసనాలలో ఇది ఒకటిగా భావిస్తున్నారు.

ఆలయం
ఇక్కడ ఆలయంలోని ఈశ్వరుడు కుమార భీమేశ్వరుడుగా ప్రసిద్ధిచెందగా, అమ్మవారు బాలాత్రిపురసుందరిగా పూజలు అందుకుంటోంది. విశాలమైన ప్రాకారాలతో, నాలుగు ద్వారాలతో, కోనేటి జలాలతో, చాళుక్యుల శిల్పకళా నైపుణ్యంతో అలరారుతోన్న ఈ క్షేత్రాన్ని దర్శించగానే మనసుకి ఎంతో ఆహ్లాదం, ఆనందం కలుగుతాయి. దేవాలయం లోపలి ప్రాకారంలో వినాయకుడు, కాల భైరవుడు, వీరభద్రుడు, మహాకాళి, శనేశ్వరుడు, నవగ్రహాలు కొలువుతీరి కనిపిస్తాయి. ప్రధాన ద్వారానికి ఎడమవైపున బాలాత్రిపురసుందరి అమ్మవారు కుడి వైపున ఊయల మంటపం కనిపిస్తాయి. గర్భగుడిలో రెండో అంతస్తు వరకూ పెరిగిన 14 అడుగుల భీమేశ్వరుడి శివలింగం నయనానందాన్ని కలిగిస్తుంటుంది. నిర్మాణ సమయంలోనే ఈ శివలింగం అంతకంతకు పెరిగిపోతుండటం గమనించి శిల్పులు శివలింగం పైభాగాన చీల కొట్టారనే కథ స్థానికంగా వినిపిస్తూ వుంటుంది. (ఇదే కథ ఈ ఆలయానికి పది కిలోమీటర్ల దూరంలోని పెదబ్రహ్మదేవం పొలాలలో నెలవైన మాణిక్యాంబ సమేత రాజరాజేశ్వరుని విషయంలోను వినబడుతూ ఉంది.) ఎదురుగా ఆరు అడుగుల ఎత్తులో నందీశ్వరుడు ఆసీనుడై ఉంటాడు.

గుడిలో స్వామి వారికి ఎదురుగా మండపంలో వున్న నంది విగ్రహం ఏక శిలచే చెక్కబడింది.ఆలయంలోని మండపం నూరు రాతిస్తంభాలనుకలిగి ఉంటుంది.రెండో అంతస్తువరకు దాదాపు 14 అడుగులున్న శివ లింగం, సున్నపు రాయి చే నిర్మితమై శివలింగఆధారం క్రింది గదిలో వుండగా, లింగ అగ్రభాగం పై కప్పును చీల్చుకొని మొదటి అంతస్తు వరకుండును. భక్తులు పూజలు, అర్చనలు ఇక్కడే చేయుదురు. మొదట మొదటి అంతస్తులో వున్న లింగ దర్శనం తరువాత క్రిందవున్న లింగ పాద భాగాన్ని భక్తులు దర్శించుకుంటారు. మొదటి అంతస్తుకు చేరుటకు ఇరువైపులనుండి మెట్లు వున్నవి.

ఈ దేవాలయ నిర్మాణం పంచారామాలలో ఒక్కటైన ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయాన్ని పోలివుంటుంది.అక్కడిలానే ఈ దేవాలయం చుట్టు రెండు ఎత్తయిన రెండు ప్రాకారాలను కలిగివుంది.ప్రాకారాపు గోడలు ఇసుక రాయి (sand stone) చే కట్టబడ్డాయి. వెలుపలి ప్రాకారపు గోడకు నాలుగుదిక్కులలో నాలుగు ప్రవేశ మార్గాలున్నాయి. ప్రదాన ప్రవేశ ద్వారాన్ని సూర్య ద్వారం అంటారు.గుడిలోని స్తంభాల మీద అప్సర బొమ్మలు చెక్కబడివున్నవి. చాళుక్య వంశానికి చెందిన విక్రమాదిత్యుని పుత్రుడు చాళుక్య భీమేశ్వర కుమరరామ పేరుమీదుగా ఇక్కడి శివున్ని కుమారారామ అని వ్యవహారంలోకి వచ్చినట్లు తెలుస్తుంది

ఉత్సవాలు పూజలు
ఇక (చైత్రమాసం) (చైత్ర) వైశాఖ మాసాల్లో సూర్య కిరణాలు ఉదయం వేళలో స్వామివారి పాదాలను సాయంత్రం సమయంలో అమ్మవారి పాదాలను తాకడం ఇక్కడి విశేషంగా చెప్పుకుంటారు. శివరాత్రికి ముందు వచ్చే ఏకాదశి రోజున భీమేశ్వరస్వామికి బాలత్రిపురసుందరికి వైభవంగా వివాహ మహోత్సవం జరిపిస్తారు. అయిదు రోజులపాటు జరిగే ఈ వేడుకల్లో స్వామివారిని నందివాహనంపై అమ్మవారిని సింహవాహనంపై ఊరేగిస్తారు. ఈ కల్యాణాన్ని తిలకించడానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలంతా వస్తుంటారు. ఇక కార్తీక మాసంలో కూడా ఇక్కడ పూజలు . అభిషేకాలు, ఉత్సవాలు విరివిగా జరుగుతూ వుంటాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ భక్తులు పునీతులవుతుంటారు.

ప్రయాణ వసతులు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ వారు పంచారామాలను బస్సులో ఒక్కరోజులో దర్శించే యాత్రా సౌకర్యాన్ని కలిగిస్తారు. సుమారు 700 కి.మీ. సాగే ఈ యాత్ర ప్రతిరోజు రాత్రి 8.00 గంటలకు మొదలై మళ్ళీ మరునాడు రాత్రి 8.00 గంటలకు ముగుస్తుంది.

మన దేవాలయాలు చారిత్రక నగరాలూ

Bhimavaram - Somaram (Bhimaram) - భీమవరం - సోమారామం (భీమారామం)

భీమవరం - సోమారామం (భీమారామం)

పంచారామాల్లో ఒకటైన సోమారామం - 
భీమారామం

చంద్ర ప్రతిష్ఠ భీమారామం, భీమవరం పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరం గునుపూడి లో ఉంది. ఇక్కడి శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడని స్థలపురాణంలో చెప్పబడింది. చంద్రుని పేరున దీనిని సోమేశ్వరక్షేత్రమని పిలుస్తారు. ఇక్కడ ప్రతీ కార్తీకమాసంలో ఉత్సవాలు జరుగుతాయి.

స్థలపురాణం:
త్రిపురాసుర సంగ్రామంలో కుమారస్వామి చేత విరుగగొట్టబడిన శివలింగం ముక్కలలో ఒకటి ఇక్కడ పడిందని, అందువలన ఇది పంచారామాలలో ఒకటి అయిందని పురాణ కథనం. ఈ లింగం చంద్రప్రతిష్ఠితమని విశ్వసించబడుతుంది. ఈ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించడం వెనుక కూడా ఓ పురాణ కథ ఉంది. చంద్రుడు తన గురువైన బృహస్పతి భార్య తారను మోహించాడు. గురువు భార్యను మోహించిన పాపానికి ప్రాయశ్చిత్తంగా చంద్రుడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని విశ్వసిస్తారు.

చరిత్ర:
చాళుక్య భీముడు ఈ దేవాలయానికి ప్రాకారాలను, గోపురాన్నినిర్మించాడనటానికి చారిత్రక ఆధారాలు కనిపిస్తున్నాయి. అందువలన ఇది భీమారామంగా పిలుస్తున్నారు.ఇక్కడి శివలింగ చంద్రప్రయిష్టితం కనుక సోమేశ్వరం అనికూడా పిలుస్తారు.

ఆలయ విశేషాలు:
దేవాలయంలో శ్వేతవర్ణంలో కనిపించే శివలింగం క్రమంగా అమావాస్య వచ్చే సరికి బూడిద లేదా గోధుమ వర్ణానికు మారిపోతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యదాతధంగా శ్వేతవర్ణంలో కనిపిస్తుంది. ఈ దేవాలయంలోని లింగం చంద్రునిచే ప్రతిష్ఠించిన చంద్రశిల కనుక ఈ మార్పులు కలుగుతున్నాయని అంటుంటారు.. ఈ ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది. ఆదిదేవుడు సోమేశ్వరుడు క్రింది అంతస్తులో ఉంటే, అదే గర్భాలయ పైభాగాన ఉన్న రెండవ అంతస్తులోని గర్భాలయంలో అన్నపూర్ణాదేవి ఉంటుంది.

ఆలయపు ముందు కోనేరు ఉంది. ఈ క్షేత్రంలోని చంద్ర పుష్కరిణిలో స్నానం చేస్తే పాపాలు పోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ కోనేరు గట్టున రాతి స్తంభంపై ఒక నందీశ్వరుని విగ్రహం ఉంది. ఈ నందీశ్వరుని నుండి చూస్తే శివాలయంలోని లింగాకారం కనిపిస్తుంది. అదే దేవాలయం ముందున్న రాతి గట్టు నుండి చూస్తే శివలింగానికి బదులు అన్నపూర్ణాదేవి కనిపిస్తుంది.

దేవాలయం ముందు భాగంలో రెండు నందులు ఉన్నాయి.మరో రెండు నందులు ఒకటి ధ్వజస్తంభం వద్ద, ఇంకో నంది ఆలయ ప్రాంగణంలో ఉంది. దేవాలయం ఎదురుగా ఉన్న చంద్రపుష్కరిణిలో మరో నంది ఉంది.ఆలయం ప్రాంగణంలో మొత్తం ఐదు నందులు ఉండడం వల్ల పంచ నందీశ్వరాలయంగా ఈ ఆలయానికి మరో పేరు ఉంది. దేశంలో ఉన్న స్పటికలింగాల్లో ఇది ఒకటి.

ప్రతి ఏడాది ఇక్కడ మహా శివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవాలు అయిదు రోజులపాటు జరుగుతాయి. అలాగే దేవీనవరాత్రులు కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తుంటారు.

మన దేవాలయాలు చారిత్రక నగరాలూ

Description of the monsoon - వర్షర్తు వర్ణనము

వర్షర్తు వర్ణనము

చేలు దున్నుకొంటూ జీవించే రైతులకు ఆనందం కలిగిస్తూ వానాకాలం వచ్చింది. తూరుపు గాలులు ఎక్కువయ్యాయి. ఇంద్రధనుస్సు కనిపించింది. సూర్యునిచుట్టూ ఆవరించిన గాలి గుడి కట్టింది. ఉత్తరాన మెరుపులు మెరుస్తున్నాయి. మబ్బులు దక్షిణంగా సాగుతున్నాయి. నీటి చేరికచేత చేపలు మొదలయిన జలచరాలకు సంతోషం కలిగింది. వానకోయిలల దప్పిక తీరింది. కార్చిచ్చులు కనబడకుండా పోయాయి. ఎండాకాలంలో సూర్యుడు తన కిరణాలతో త్రాగిన నీటినంతా వానాకాలంలో తిరిగి ఇచ్చేస్తున్నాడు.

అడవులచివర చెట్టూ పుట్టా లేకుండా సమతలంగా ఉండే చేలను దున్ని రైతులు పంటలు పండిస్తూ ఉంటారు. ఆ చేలలోని నాగటిచాళ్లు, వర్షఋతువు అనే రసికుడు భూమి అనే పడతిమీద చేసిన కొత్త గోళ్లగీతలా! అన్నట్లుగా ఉన్నాయి.

ఓ పరీక్షిన్మహారాజా! వర్షాకాలమనే ప్రియుడు సమీపించడంచేత, పుడమిపడతికి కల్గిన గగురుపాటు అనునట్లుగా మొలచి తలలెత్తి పెరుగుచున్న పైరులు అందగించాయి.

ఆ వానాకాలంలో తీవ్రమయిన గాలుల తాకిడికి కదలివచ్చిన మబ్బులు ఆకాశం నిండా అలముకొన్నాయి. లెక్కకు మిక్కిలిగా వచ్చిన ఆ మబ్బులు రెక్కలుగల కాటుక కొండలా అన్నట్లు ఎడం లేకుండా దట్టంగా కమ్ముకొన్నాయి. సూర్యచంద్రుల కాంతుల్ని అడ్డుకొన్నాయి. వర్షఋతువు అనే ప్రియుడు మదించి భూకాంతవక్షస్థ్సలం మీద నేర్పుగా జల్లిన కర్పూరపు పలుకులా అన్నట్లు గా మబ్బులనుండి వడగళ్లు రాలిపడ్డాయి. ఆ వడగళ్ల వెంబడి నల్లత్రాచుల తీరున, ఇంద్రనీల హారాలవిధంగా ఎడతెరపిలేకుండా వర్షధారలు కురిశాయి. ఆ జలధారలతో తడిసినకొండలు మద జలధారలతో నిండుగా తడిసిన మత్తగజాలవలె కనబడుతున్నాయి. కొండకొమ్ములనుండి బండ రాళ్లమీద పడుతున్న సెలయేటి నీటిధారలు చెల్లాచెదురయిన నీటితుంపరలు నలుగడలా పడుతున్నాయి. ఆ తుంపరలకు చెమ్మగిలిన నేల చిత చితలాడుతూ అడుసు అయింది. అందులో నడిచేటప్పుడు చితుకు చితుకుమని చప్పుడవుతోంది. ఆ బురదల మీదుగా పారిన నీరు వరద గట్టింది. వాగులు వంకలు ఏకమై ప్రవహించాయి. గుంపుగట్టిన రెక్కల చేపలు ఆ వరదనీటికి ఎదురీదాయి. చేపలవంటి కన్నులుగల చెలువల నెమ్మేని తళుకుబెళుకులకు తాళలేక, కళవళపడి, వణుకుతూ పారిపోతున్నవా అన్నట్లుగా మెరుపులు మేఘాలమధ్య మెరసి మాయమై పోయాయి. మెరపులవలె చపలచిత్తలయిన చెలువలు పురుషులచెంత నిలుకడగా నిలువరు సుమా అని ప్రజలకు వినబడేలాగున బ్రహ్మదేవుడు ఎలుగెత్తి చాటుతున్నాడా అన్నట్లుగా ఉరుములు ఉరిమాయి. ఆ ఉరుముల చప్పుళ్లకు నెమళ్లు జంకులేక పురులు విప్పుకొని నాట్యం చేశాయి. కేకలు పెట్టాయి. భయంకరమైన ఆ కేకలకు తాళలేక ప్రణయకలహంవల్ల విరహంతో వేగుతున్న దంపతులు పట్టుదలలు మాని ఒకరికొకరు దాసులై దగ్గరయ్యారు. కారుమబ్బులు కమ్మినందువల్ల ఇదిరేయి; ఇదిపగలు అని గుర్తించడానికి వీలులేకుండా పోయింది. అయినప్పటికి జాజిపూలు పూసి సాయంసమయాన్ని తెలియజేశాయి. చీకటి పడేటప్పటికి మిణుగురుపురుగులు మినుకుమని మెరుస్తూ మింట తారట్లాడాయి. ఎడతెరిపిలేకుండా కురిసే జడివానలో చలికి వణుకుతూ, ఎప్పుడు సూర్యోదయం అవుతుందో అని ఎదురుచూస్తూ, వంటను వండుకొని తినే వీలులేక, ఖర్జూరపుపండ్లు నేరేడుపండ్లు తిని ఆటవికులు ఆకలి తీర్చుకున్నారు. విటులపొత్తు వీడని వేశ్యవిధంగా మిన్నాగు పాములపొత్తు వీడని మొగలిపూగుత్తులు ఆటవికులకు సంతోషం కలిగించాయి. అడవిదారులు విరబూచిన మొగలి కడిమి అడవిమొల్ల కొండమల్లె పూలతావులతో నిండిపోయాయి. గరుడపచ్చల కాంతులు వెలిగ్రక్కుతూ పచ్చిక అంతటా గుబురుగా పెరిగింది. ఆ పచ్చికలు మేసిన ఆవులు బలిసి మిసమిస లాడుతున్నాయి. పాలతో నిండిన పొదుగుల బరువు వల్ల ఇటూ అటూ తిరగలేక నిలబడి నెమరు వేస్తున్నాయి. వర్షఋతువు క్షీరసమృద్ధిగల ఆవుల మందలాగ జలసమృద్ధ మయ్యింది. జింకతో నిండుగా కనబడే శివునిచేతిలాగ వానకోయిలలతో నిండుగా కనబడింది. విష్ణువనే బాణానికి ఆసనం (విల్లు) అయిన మేరుపర్వతంలాగ ఇంద్రధనుస్సుతో ప్రకాశించింది. ఎడతెగకుండా హరినామాన్ని సంకీర్తించే విభీషణుని హృదయంలాగ కప్పల బెకబెకల ధ్వనులతో కూడుకొని ఉంది. ఇంద్రోపేంద్రాదులకుగూడా ఐశ్వర్యాన్ని అనుగ్రహించే శివపూజలాగ ఆరుద్రపురుగులతో అలరారింది. సీతాదేవి చరిత్రతో జనకచక్రవర్తియాగంలాగున నాగలిచాళ్లతో అందగించింది. బహుసంవత్సరాలు కలిగిన కృతయుగంలాగ అధికమైన వర్షలతో నిండిపోయింది.

ఎండక, నేలమీద వ్రాలిపోక, చీడపీడలు సోకక, బలుపునకు గుర్తుగా నల్లనిచారలు గలిగి, చక్కగా పైరులు పెరిగాయి. జనులకు కష్టాలు గట్టెక్కాయి.

ఓ పరీక్షిన్మహారాజా! ఎంత సంపదగలిగి ఉన్నప్పటికీ గొప్పవాడు గర్వంతో మిడిసి పడడు. ఆ తీరుగా నదులలోని నీరంతా వచ్చి తనలో చేరుతున్నా సముద్రుడు హద్దు మీరక అణగి ఉన్నాడు.

ఆ వర్షాకాలంలో శ్రీకృష్ణుడు అడవుల చివరలలో ఆవులను మేపుతూ, బలరామునితోను, గోపాలకులతోను గూడినవాడై కందమూలఫలాలు తింటూ, మడుగులగట్లమీద, రాతిచట్టులమీద కూర్చుండి ప్రీతిగా చలుదులు భుజించాడు.

అలాంటి వేళలో, బృందావనం అనే ఆకాశంలో శ్రీకృష్ణుడనే మేఘం అందగించింది. లోకాలకు మైమరపుకలిగించె పిల్లనగ్రోవి పాటయే ఆ మేఘానికి రసవంతమయిన గంభీరమైన ఉరుము అయ్యింది. చక్కనైన చిరునవ్వు కాంతియే మెరుపుతీగ అయింది. తలచుట్టు చక్కగా ఉన్న నెమలిపురి దండయే ఇంద్రధనుస్సు అయ్యింది. దయతోగూడిన కడకంటి చూపులనుండి వెల్లిగొనే అమృతవర్షమే జలధారల జడివాన అయింది. ఈ విధంగా భాసించిన శ్రీకృష్ణుడు అనే నీలమేఘం తన వెన్నంటివచ్చే గోపాలురు, మునులు అనే చాతకపక్షుల తాపాలు తొలగించింది.

ఓ రాజా! శ్రీకృష్ణుడు తాను లక్ష్మీదేవికి భర్తయగు విష్ణువే అయినా, లోకమర్యాదను అనుసరించి, ముందుగా ఆవులను, ఎద్దును, దూడలను పూజించి, తరువాత వర్షాకాలసంపదకు అధిదేవత అగు లక్ష్మీదేవిని పూజించాడు.

ఈ విధంగా శ్రీకృష్ణుడు వర్షాకాలానికి అనుగుణంగా ప్రవర్తిస్తూ కాలం గడిపాడు. అపుడు

శరదృతు వర్ణనము

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

Description of the autumn season - హేమంత ఋతువర్ణనము

హేమంత ఋతువర్ణనము శ్రీమంతమైన హేమంతం ఒక్కసారిగా వచ్చిపడింది. చేమంతిపూల దండలు ధరించిన యువతుల స్తనాల వేడిమిచేత పురుషులకు చలిబాధ తీరింది. మన్మథుడ...