Tuesday, April 7, 2026

Kaliya's wives Nagaamganalu praying to Lord Krishna - కాళియుని భార్యలైన నాగాంగనలు శ్రీకృష్ణుని నుతించుట

కాళయుని భార్యలైన నాగాంగనలు శ్రీకృష్ణుని నుతించుట

ఈ విధంగా శ్రీకృష్ణుడు కాళియుని పడగలమీద తాండవం చేయడంచేత, తీవ్రమైన ఆతని కాలితాపులకు కాళియుని పడగలన్నీ చితికిపోయాయి. కాళియుడు బాధతో కదలిక లేక శవంలాగ పడి ఉన్నాడు. అటువంటి దీనావస్థలో ఉన్న తమభర్తను చూచి, కాళియునిభార్యలమనస్సులు శోకంతో కలవారపాటుకు లోనయ్యాయి. 

కాళియుని భార్యలు శ్రీకృష్ణుణి దర్శించడానికి బయలుదేరారు. ఆ తొందరలో ముడుచుకొన్నవారి కొప్పులు విడివడి పోయాయి. అలంకారాలు చెదరిపోయాయి. పాలిండ్లబరువుకు తీగలాగ సన్నంగా సుకుమారంగా ఉన్న నడుములు అల్లాడిపోయాయి. పైటకొంగులు జారిపోయాయి. దిక్కుతోచక, భ్రాంతితో కలవరపడిపోయారు. ఏడుస్తూ ఉండే తమ పిల్లల్ని ముందుంచుకొని, జంకుగొంకులకు లోనవుతూ, భక్తిభావంతో, మంచి గుణాలు కలవాడయిన శ్రీకృష్ణుణ్ణి దర్శించారు.

కాళియునిభార్యలు శ్రీకృష్ణుణ్ణి దర్శించి, సాష్టాంగనమస్కారాలు చేసి, నుదుటిమీద చేతులు జోడించి, ఈ విధంగా విన్నవించుకొన్నారు.

సకలసద్గుణసంపన్నుడవైన ఓ శ్రీకృష్ణా! దుష్టశిక్షణ చేయడంకోసం భూమిమీద అవతరించినవాడివి నువ్వు, దుర్మార్గుడయిన ఈ కాళియుణ్ణి శిక్షించడం గుణమే కాని దోషం కాదు.

సర్వలోకాలకు ఆధారభూతుడవయిన ఓ పరమేశ్వరా! శత్రువుల కొడుకులయందు గూడ సమభావంతో దయ చూపే వాడవు. అట్టి నీకు ఎవరిమీదను పగ ఉండదు. దుష్టుల్ని శిక్షించడం లోకసంరక్షణంకోసం తప్ప మరేమీ కాదు.

విషం నోట్లోను, మనస్సులో కోపం ఉంచుకొని తిరిగేవారం అయిన మమ్మల్ని శిక్షించడం వాస్తవానికి దండనం కాదు. ఒకవిధంగా మాకు మేలు కలిగించడమే. నీవు చేసిన ఈ పనితో మాకు విషం కలవారమనే పొగరు దిగిపోయింది.

ఈ కాళియసర్పరాజు పూర్వజన్మంలో ఎంతగొప్పతపస్సు చేశాడో? ఎటువంటి పుణ్యకార్యాలు ఆచరించాడో? ఎటువంటి సత్యవాక్యాలు పలికాడో? ఎంతటి మహానుభావులకయినా ఒనగూడని పరమేశ్వరుడవైన నీవు వేడుకతో ఈతని పడగలమీద నాట్యం చేశావంటే అదెంతటి అదృష్టమో గదా!

ఓ పరమేశ్వరా! స్త్రీలందరిలోను శ్రేష్ఠురాలయిన లక్ష్మీదేవి నిన్ను పొందడంకోసం, చాలకాలం తపస్సుచేసి, ఎన్నో గొప్ప గొప్ప నోములు నోచి, మహాతేజస్సుతో ప్రకాశించే నీ పాదాల ధూళిలో ఒక కణాన్ని మాత్రమే స్పృశించే అర్హతను సంపాదించుకొనింది. ఈ కాళియుడు ఏ తపస్సు చేయకుండానే, ఏ నోములు నోచకుండానే, నీ పాదాల పూర్ణస్పర్శకు నోచుకొన్నాడంటే ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయం!

ఓ శ్రీకృష్ణా! మంచివీ, చక్కనివీ అయిన నీపాదాల ధూళికణాలు సోకాయి అంటే, ఇంక వారికి పుట్టుక ఉండదు. అట్టివారు పూర్ణకాములయి, ఇంక కోరదగినదేదీ లేని కృతార్థులౌతారు. అందువల్ల వారు దేవేంద్రపదవిని గాని, బ్రహ్మపదవినిగానీ, మహారాజపదవినిగానీ, పాతాళలోకాధిపత్యాన్ని గాని, హఠయోగ రాజయోగ సిద్ధులను గాని వేటినీ అంగీకరింపరు.

ఈ కాళియుడు తమోగుణం కలవాడు. క్రోధం కలవాడు. అయినప్పటికిని, చావుపుట్టుకలకు, కామక్రోధాదులకు, సుఖదుఃఖాలకు లోనవుతూ ఆలుబిడ్డలతో జీవించే సంసారు లెవ్వరికీ కోరడానికి కూడ శక్యం కానట్టి శ్రీకృష్ణపాదస్పర్శరూపమైన ప్రయోజనాన్ని ప్రత్యక్షంగా పొందింది.

దేవా! నీవు నశించే స్వభావంగల జీవులందరిలోనూ నశింపనివాడివై, అక్షరరూపుడవయి అంతర్యామి అనే పేరుతో ఉన్న పరమపురుషుడివి. దేశకాలవస్తువుల పరిమితులకు లోబడని మహాత్ముడవు. ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి అనే పంచభూతాలకును, వానిచే నేర్పడిన సకలవస్తు సముదాయాలకును ఆధారమైనవాడగుటవలన భూతావాసుడివి. పంచభూతాలే రూపంగా గలవాడవగుటచే భూతశబ్దమునకు అర్థమైనవాడివి. అన్ని కారణములకు కారణమయిన మూలప్రకృతికి గూడ అతీతమైన పరమాత్ముడవు. ఆత్మజ్ఞానం, ప్రాపంచికజ్ఞానంకూడ పరిపూర్ణంగా కలవాడివి. సత్త్వరజస్తమోగుణసంబంధం లేనివాడివి. పుట్టుట, పెరుగుట, రూపం మారుట, ముదురుట, తరుగుట, చచ్చుట అను ఆరువిధాలయిన వికారాలు లేని పరబ్రహ్మవు. మాయాశక్తిని అధీనంలో ఉంచుకొని, సృష్టి స్థితిలయాలు కొనసాగిస్తూ అనంతమైన సామర్థ్యం కలవాడవయి, ఆ మాయతో కొంచెంకూడ సంబంధం లేనివాడివి. అఖండమైన కాలాన్ని సంవత్సరాలు, అయనాలు, ఋతువులు, మాసాలు మొదలయిన భేదాలతో చక్రంలాగ త్రిప్పుతూ ఉన్నవాడివి. కాలస్వరూపుడవు. కాలశక్తికి ఆధారమైనవాడివి. సృష్టిస్థితి సంహారాలనే, కాలవిభాగాలయిన సంవత్సరాదులను గమనిస్తూ కూడ వానితో ఏ విధమైన సంబంధంలేకుండా ఉండే సర్వసాక్షివి. నీకు నమస్కరిస్తున్నాము. ఇంకా

మాయాతీతుడవైన ఓ శ్రీకృష్ణా! ఈ ప్రపంచం అంతా నీ రూపమే. దీనికి సృష్టికర్తవు నువ్వే, ఉదాసీనంగా ఉండి, దీనినంతనూ గమనిస్తూ ఉన్నవాడివీ నువ్వే ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి అనే పంచభూతాలు, వానికి విషయాలయిన శబ్దస్పర్శరూపరసగంధాలు, ప్రాణం, మనస్సు, బుద్ధి, చిత్తం అనే అంతఃకరణ భేదాలు అన్నీ నీ రూపమే. సత్త్వరజస్తమోగుణాలచేత ఆవరింపబడుతూ, నీ అంశలుగా పుట్టిన ప్రాణులకు సుఖదుఃఖానుభవం కలిగించేవాడివి నువ్వే, వాస్తవానికి సత్త్వరజస్తమోగుణాలకు లోబడక, ఏ విధమైన వికారాలు పొందకుండగా, ఇంద్రియాలకు గోచరించకుండా, సూక్ష్మరూపంలో ఏకరూపంగా ఉన్నవాడివి, సర్వజ్ఞుడవు. నీకు నమస్కరిస్తున్నాము. మా మనవి చిత్తగించు.

(కూటస్థుడు - పంచభూతాత్మకమైన శరీరంలోని జీవుణ్ణి నడిపించేవాడు = పరమాత్మ. అంటే ఏ వికారాలూ లేక నిశ్చలంగా ఉండే ఆత్మ కూటము= దాగలి. దీనిపై ఎన్ని వస్తువులు పెట్టి కొట్లూ - ఏ రూపాలుగా మారుస్తున్నా - వాటిగుణం కానీ, మార్పుకానీ చెందక, తన స్థితిలోనే నిర్వికారంగా ఉంటుంది. ఆత్మకూడా - దాగలి వంటిదే.)

ఓ శ్రీకృష్ణా! మాయకు లోబడిన ప్రజలు నిన్నుగురించి అనేకవిధాలవాదాలకు లోనవుతూ ఉంటారు. దేవుడు ఉన్నాడని భక్తులు మొదలయినవారివాదం. అసలే లేడని చార్వాకులు మొదలయినవారి వాదం. ఏకరూపుడు-కాదు అనేక రూపుడు, అన్నీ తెలిసినవాడుకాదు, కొంచెమే తెలిసిన జీవరూపుడు, మాయకు లోబడినవాడు కాదు, మాయకు అతీతుడు. ఈ విధంగా నీ మాయాప్రభావంవల్ల ఎందరో ఎన్నో విధాలుగా వాదిస్తూ ఉంటారు. అన్నివాదాలకు అనుకూలంగా ఉన్నట్లే కనబడుతూ ఉంటావు. పదాలు(సంకేతాలు), వాని అర్ధాలు, వాని స్వభావాలు, వానిలోని తారతమ్యాలు మొదలగువానిచేత సర్వజ్ఞత్వం, అల్పజ్ఞత్వం మొదలయిన మహిమలతో గూడినవాడివి. జ్ఞానసాధనాలయిన చక్షురాదులు అయిన ఇంద్రియాలు నీరూపమే. ఇంద్రియా పేక్షలేని జ్ఞానం ఉన్నవాడివగుటచే పరమాత్మవు. వేదాలను నిశ్శ్వాసరూపంగా వెలువరించావు కనుక వేదాలకు జన్మస్థానం నువ్వే ('శాస్త్రయోనిత్వాత్' - బాదరాయణుని వేదాంతసూత్రం) (యస్య ని
శ్శ్వాసితం వేదాః శ్రుతి). అంతఃకరణ దశా భేదాలయిన అహంకారం - బుద్ధి - మనస్సు- చిత్తం అనే వానికి అధిదేవతలయిన సంకర్షణుడు - వాసుదేవుడు - ప్రద్యుమ్నుడు - అనిరుద్దుడు అను నలుగురు నీ వ్యూహరూపాలవారే. భక్తజనుల్ని రక్షించేవాడివి నువ్వే. జీవులఅంతఃకరణాన్ని ఇంద్రియాలద్వారా విషయాలమీదకు మళ్లిస్తూ ఉంటావు. నిన్ను సేవించేవారికి తగిన ఫలాలు ఇవ్వడంకోసం సత్త్వరజస్తమోగుణాలతో ప్రపంచాన్ని ఆవరించి ఉన్నావు. సాత్త్విక - రాజసిక - తామసిక కర్మలకు తగిన సాత్త్విక - రాజసిక - తామసిక ఫలాలు ఇస్తూ ఉంటావు. జీవుల అంతఃకరణవృత్తులద్వారా తెలియదగిన సత్త్వరజస్తమో గుణాలకు సాక్షివిగా ఉంటూ, జనులకు గోచరించకుండా ఉంటావు. ఊహకందని అభివృద్ధి కలవాడివి కనుక బ్రహ్మవు. నిరాఘాటమైన ప్రవర్తన కలవాడవు. అవ్యక్తం మొదలుకొని సకలస్థావర జంగమ సృష్టికి కారణమైనవాడివి. మనస్సును ఇంద్రియాలద్వారా ప్రవర్తింపజేయడంవల్ల జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలకు నీవే అధిపతివి. జప మంత్ర యోగాదులచేత స్వాధీనంకాని ఆత్మయందే క్రీడిస్తూ ఉంటావు కనుక ఆత్మారాముడవు. మౌనాన్ని ఆశ్రయించిన వాడవు. స్థూల సూక్ష్మభూతాల గతులు గుర్తిస్తూ, దేనితోనూ సంబంధం లేకుండా ఉంటావు. ఈ ప్రపంచం నీ రూపం కాదు. కానీ సమస్తమూ నీవే. ఈ ప్రపంచంయొక్క స్థితిలయాలకు సాక్షివి నీవే. జ్ఞానాజ్ఞానాలకు నీవేకారణం. నీకు నమస్కారం.

సమస్త జగత్తులకు ప్రభువైన శ్రీకృష్ణా! నీవు యశస్సు, వీర్యం మొదలగు ఆరువిధాలయిన ఐశ్వర్యం కలవాడివి. కాలస్వరూపుడివి. ఏ విధమయిన కోరిక లేకుండానే లీలామాత్రంగా చతుర్ముఖబ్రహ్మ రూపం ధరించి విశ్వసృష్టినీ, విష్ణురూపం ధరించి స్థితినీ, రుద్రరూపం ధరించి నాశాన్నీ చేస్తూ ఉంటావు.

ఓ పరమేశ్వరా! ఈ శరీరాలు ఎంతకూ శాంతిలేనివి. అంతేకాక అజ్ఞానంతో కూడుకొన్న మూర్ఖమైన జన్మలు ఇవి. కాని నీవు ప్రశాంతతను అనుభవిస్తున్న మంచివాళ్లలోమాత్రమే ధర్మానికి మేలు కలిగించేందుకు అనుభవానికి వస్తూ ప్రకాశిస్తూ ఉంటావు.

కృపానిధీ! శ్రీకృష్ణా! నీలో ఏ తప్పు లేదు. తప్పు చేసిన మా భర్తను శిక్షించడం నీ తప్పు కాదు. మా పెనిమిటి ఆలోచనలలోను, చేతలలోనే పొరపాట్లు ఉన్నాయి. లోకంలో కుమారులు ఎటువంటి తప్పు చేసినా తల్లిదండ్రులు క్షమిస్తూ ఉంటారు గదా! రాజులు కూడ తప్పు చేసినవారిని ఒక్కొక్కసారి దండించకుండా విడిచిపెడుతూ ఉంటారు. నీవు జగత్తునకే ఈశ్వరుడవు. దయకు గనివంటివాడవు. అటువంటి నీవు మా భర్తను దయ తలచి కాపాడుమయ్యా!

మా పెనిమిటి మంచివాడని సమర్ధించలేము. ముమ్మాటికీ ఇతడు మూర్ఖుడు. ముక్కోపి,దుర్మార్గుడు. అయినప్పటకీ ఇతణ్ణి నీవు సంహరిస్తే మేము వైధవ్యదుఃఖం అనుభవించవలసి వస్తుంది. దాన్ని మేము భరించలేము. నీవు తప్ప మాకు మరొక దిక్కులేదు. కాబట్టి దయతో మా భర్తను మన్నించి, మా భర్త పడగలమీద కాళ్లతో త్రోక్కడం చాలించి, మాకు పతిభిక్షను ప్రసాదించు స్వామీ!

సర్వలోకాలవారు తమకు ఏ ఆపద వచ్చినా నిన్ను ఆశ్రయించవలసిందే. నీవు భక్తులకు అభయ మిచ్చేవాడివి. లక్ష్మీదేవికి భర్తవు. ఓ కృష్ణా! ఇదిగో చూడు. ఇప్పటికే మా భర్త శరీరం అంతా నలిగిపోయింది. పడగలన్నీ పగిలి పోయాయి. ప్రాణాలు వస్తూ పోతూ ఉన్నట్టుగా సొమ్మసిల్లి పోయాడు. ఇతణ్లి దయతో చూచి, ఇంక బాధించక విడిచి పెట్టవయ్యా!

భక్తులకు కోరిన వరాలిచ్చి అనుగ్రహించే ఓ శ్రీకృష్ణా! మా ప్రాణనాథుని ప్రాణాలు ప్రసాదించి, ఆతనితో మళ్లీ మాకు వివాహం జరిపించు. నీవు జరిపించే ఈ పెండ్లియే శాశ్వతంగా నిలిచేది. శుభాలు కలిగించేది. అంతేగాని మాకు చిన్నప్పుడు జరిగిన పెండ్లి పెండ్లే కాదు. (నిజమే కదా! మనం చేసే పెండ్లికంటే సర్వమంగళప్రదుడైన భగవంతుడు చేసేపెండ్లి శుభప్రదం, శాశ్వతం అవుతుంది. దంపతులు చిరకాలం వర్ధిల్లుతారు)

నీ మీద ఒట్టు పెట్టి మరీ చెబుతున్నాము. ఈనాటినుండి ఇంక ఎవ్వరినీ బాధించడు. ఇంతకు ముందులాగ భయపెట్టి పాపపు పనులు చేయడు. నీ చెప్పుచేతలలో ఉంటాడు. కాబట్టి మా పెనిమిటి ప్రాణాలు మాకు ప్రసాదించవయ్యా!

శరణుచొచ్చినవారిని రక్షించే స్వభావంకల శ్రీకృష్ణుడు - తమ భర్త జీవితాన్ని కోరే కాళియునిభార్యలను అనుగ్రహించాడు. కాళ్లతో తొక్కడం చాలించి, పక్కకు తప్పుకొన్నాడు. దాంతో కాళియుడు తన ప్రాణాల్ని, ఇంద్రియాల్ని పగిలిన పడగల్నీ చాలా కష్టంమీద కూడ తీసికొని, ఆయాసపడుతూ శ్రీకృష్ణునికి నమస్కారం చేసి, పశ్చాత్తాపంతో ఈ విధంగా అన్నాడు.

తామరరేకులవంటి కళ్లు గలవాడివి పరమేశ్వరుడివి, అయిన శ్రీ కృష్ణా! మా నడకలు తిన్ననైనవి కావు. మా నోళ్లలో భయంకరమైన విషం ఉంటుంది. దుర్మార్గులం. కోపం గర్వం కలిగి ఉంటాం. ఇటువంటి మేము మంచివాళ్లం ఎందుకు అవుతాం? ప్రాణులు పుట్టుకతో వచ్చినగుణాలను ఎక్కడయినా విడిచిపెడతాయా? మా మనోవికారాలు అందరికీ తెలిసినవే! సర్వజ్ఞుడవైన నీకు ఇవి వింతగా ఎందుకు కనబడతాయి? మాలో ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ దయతలచి మాకు ఉపకారం చేశావు.

సమస్తలోకాలకు ప్రభువయిన శ్రీకృష్ణా! అనేకవిధాలయింది ఈ ప్రపంచం. దీనికి నీవు సృష్టికర్తవు. జన్మ మొదలయిన షడ్భావవికారాలు, రూపాలు, శక్తులు, బీజరూపాలయిన సంస్కారాలు, ఆలోచనలు నీవు నిర్మించిన ఈ ప్రపంచంలోని అంశాలే - అన్నీ కూడా నీవే!. మేము కూడ ఆ ప్రపంచంలోని వాళ్లమే. మేము సహజంగా కోపస్వభావం కలవాళ్లం. ఎలాపడితే అలాగ ప్రాకులాడే స్వభావం కలవాళ్లం. మహాయోగులకు గూడ అంతుబట్టనిది నీ మాయ. అటువంటి దాన్ని మేము ఏవిధంగా దాటగలం? నువ్వు సర్వజ్ఞుడివి. మమ్మల్ని రక్షించాలి అనిపిస్తే రక్షించు. శిక్షించాలి అనిపిస్తే శిక్షించు. ఈ సమస్త విశ్వం నీదే. మాది అంటూ ఒకచోటు లేదు. నీవు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాము.

(పుట్టుట, ఉండుట, మారుట, పెరుగుట, తరుగుట, నశించుట అనేవి షడ్భావవికారాలు.)

ఓ శ్రీకృష్ణా! సనకాది మహాయోగీశ్వరులకు కూడా దుర్లభమైన నీ పాదధూళి నాకు లభించింది. నా భాగ్యం ఎంతటిదో కదా! ఇంక నేను ఎక్కడ ఉన్నా నాకు మంచే జరుగుతుంది.

ఈ విధంగా మనవి చేసిన కాళియునిమాటలు విన్న శ్రీకృష్ణుడు, కరుణతో స్థిరనిశ్చయానికి వచ్చి, అతనితో ఇలాగ అన్నాడు.

ఓ కాళియుడా! ఈ మడుగులోని నీటిని ఆవులమందలు, మనుష్యులు త్రాగుతూ ఉంటారు. నీవు ఇంక ఇక్కడ ఉండడానికి వీలు లేదు. ఈ వేళే నీవు -నీ భార్యలు, బిడ్డలు, బంధువులతో కలిసి సముద్రంలోకి వెళ్లిపొండి.

ఓ కాళియుడా! ఎవరైతే నేను నిన్ను శిక్షించిన ఈ కథను, నన్ను మనస్సులో ధ్యానం చేస్తూ ఉదయమూ, సాయంకాలమూ, పారాయణ చేస్తూ, స్తుతిస్తూ ఉంటారో, వారికి ఎప్పుడైనా, ఎక్కడైనా మీ సర్పజాతివల్ల భయం కలుగదు. మీ విషం వారికి ఏవిధమైన హానీ కలిగించదు.

ఈ క్షణంనుండి ఏ మానవులు ఈ యమునలోని కాళిందీ మడుగులో స్నానంచేసి, ఉపవాసం ఉండి, స్థిరభక్తితో నన్నే ధ్యానిస్తూ పూజిస్తూ దేవతలకు, పితరులకు, ఋషులకు తర్పణాలు విడుస్తూ ఉంటారో, వారు సర్వపాపాలనుండి విముక్తులయి, నిర్మలమైన మనస్సు కలవారయి మేలు పొందుతారు.

ఇంతకుమునుపు నీవు రమణక ద్వీపంలో ఉండేవాడవు. గరుత్మంతుడు నిన్ను పట్టుకొని తింటాడేమోననే భయంతో వచ్చి, అతనికి కనబడకుండా ఉండడంకోసం లోతైన ఈ మడుగులో దాగుకొన్నావు. నేను నీ మీద నాట్యం చేయడంవల్ల నా పాదాల ముద్రలు నీ పడగలమీద పడ్డాయి. వాటిల్ని చూచి, గరుత్మంతుడు ఇంక నీ జోలికి రాడు. నిర్భయంగా ఉండు.

ఎవరికీ అంతు చిక్కకుండా విహరించే శ్రీకృష్ణుడు ఈ విధంగా ఆజ్ఞాపించగానే, కాళియుడు అలా చేయడానికి అంగీకరించాడు. తన భార్యలతో కలిసి తాను క్రొత్తవి, దేవలోకంలో మాత్రమే లభ్యమటయ్యేవి అయిన వస్త్రాలు, ఆభరణాలు, మణిసరాలు బహుమతిగా ఇచ్చాడు. తుమ్మెదలకు ఆశ్రయమై, తేనెలు వెల్లివిరిసే నల్లకలువల దండను భక్తితో సమర్పించాడు. భార్యలు, కొడుకులు, స్నేహితులతో కలసి శ్రీ కృష్ణుణ్ణి చాలా పర్యాయాలు స్తోత్రం చేసి, సాష్టాంగ దండప్రణామ ప్రదక్షిణలుచేసి, లేచి నమస్కరించి, శ్రీకృష్ణునివద్ద సెలవు తీసుకొని, సముద్రంలోని ద్వీపానికి వెళ్లిపోయాడు. ఈ ప్రకారంగా

కాళియుణ్ణి యమునానదినుండి దూరంగా సముద్రంలోకి వెళ్లగొట్టడం ఎంతటి గొప్పవారికీ సాధ్యంకాని పని. అటువంటి పనిని శ్రీకృష్ణుడు అలవోకగా చేశాడు. దానితో యమునానది అమృతంవంటి నీటితో అందరికీ ప్రీతిపాత్రమై వెలుగొందింది.

కాళియుని పూర్వకథ

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

Vatuka Bhairava - Batuka Bhairava - వటుక భైరవుడు - బటుక భైరవ


వటుక భైరవుడు (బటుక భైరవ)

వటుక భైరవుడు (బటుక్ భైరవ్) శివుని భైరవ రూపం యొక్క సౌమ్యమైన, బాల స్వరూపం. ఈయన సాధకులకు రక్షకుడిగా మరియు సంరక్షకుడిగా ప్రసిద్ధి పొందాడు. ఆటంకాలను తొలగించడానికి, భయాన్ని తగ్గించడానికి మరియు దురదృష్టాలను అధిగమించడానికి పూజించబడే ఈ 'తామసిక' రూపం, తాంత్రిక సంప్రదాయంలో మరియు శాక్తోపాసనలో ప్రసిద్ధి చెందింది.

వటుక భైరవుని కీలక అంశాలు:
రూపం మరియు స్వరూపం: ఈయన రూపం యువ బాలుడిగా లేదా తేజోవంతమైన శిశువుగా ఉంటుంది. సామాన్యంగా వటుక భైరవుని రూపం నగ్నంగా ఒక కుక్కతో కూడి ఉంటుంది. స్వామి 'కాళి' కుమారుడు గా మరియు ఆమె భక్తుల సంరక్షకుడిగా పరిగణించబడతాడు.

ప్రాముఖ్యత: శీఘ్ర అనుగ్రహానికి, అపార కరుణకి మరియు రక్షణను ప్రసాదించడంలో ప్రసిద్ధి. స్వామితో భక్తులు ప్రేమపూర్వకమైన, పిల్లల వంటి బంధాన్ని ఏర్పరచుకోగలుగుతారు.

ఆరాధన - మంత్రం: విపత్తులను అధిగమించడానికి వటుక భైరవుని (బటుక్ భైరవ) మూల మంత్రం "ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణం కురు కురు  వటుకాయ 
వం హ్రీం ఓం స్వాహా

ఈయన శక్తోపాసన(దేవత ఆరాధన)లో ముఖ్యుడు.

అపదుద్ధరణ: భక్తులను కష్ట పరిస్థితుల నుండి రక్షించడానికి అపదుద్ధరణ వటుక భైరవ రూపాన్ని పూజిస్తారు.

సమయం: ఆయన ఉపాసనకు దుర్గాష్టమి మంచి సమయం.

ఈయనను దేవాలయాలలో క్షేత్రపాలకుడుగా దర్శనమిస్తాడు. అంతేకాక ఉపాసకుడి (సాధకుడి)మార్గంలోని అడ్డంకులను తొలగించడానికి శివుడు ఆయనను అవతరింపజేసాడని నమ్ముతారు.

రూపం: హిందూ ప్రతిమాశాస్త్రం(Iconography)లో బటుక భైరవుడు లేదా వటుక భైరవుడు శివుని యొక్క ఉగ్ర రూపం, ఇది ఆయన భైరవ అవతారం. తాంత్రిక సంప్రదాయంలో శివుని ఈ రూపాన్ని ఉగ్రమైన, నగ్న యువకుడిగా చిత్రిస్తారు, సాధారణంగా భైరవుడితో పాటు ఒక కుక్క కూడా ఉంటుంది.

రూపమండనం(శిల్పశాస్త్ర గ్రంథం)లో, బటుక భైరవుడిని ఎనిమిది చేతులతో చిత్రీకరించాలని నిర్దేశించబడింది. వాటిలో ఆరు చేతులు ఖట్వాంగం (గద), పాశం (కొరడా), శూలం (ఈటె), డమరుకం, కపాలం మరియు ఒక పామును పట్టుకొని ఉంటాయి. మిగిలిన రెండు చేతులు ఒక మాంసపు ముక్కను మోస్తూ అభయ ముద్రను ప్రదర్శిస్తాయి. దేవతామూర్తి రంగులోనే ఉన్న ఒక కుక్కను సమీపంలో చిత్రీకరించినట్లు పేర్కొనబడింది.

శారదాతిలక తంత్ర గ్రంథం దేవతల యొక్క సత్వ, రజో, మరియు తమో గుణాలను బట్టి వివిధ రకాల ఆకారాలను తెలుపుతుంది.

భైరవ అనేది గణం. పక్షి, మృగ, మనుష్య, రాక్షస జాతులు ఉన్నట్లే, భైరవ కూడా అలాంటి ఒక గణం.

భైరవ మాత్రమే కాదు – కాళి, చాముండ, భైరవి, డాకిని, లాకిని, కాకిని, యాకిని, రాకిని, హాకిని, పిశాచి, వేతాళి, పూతన, యక్షిణి, యోగిని, కట్టేరి, బ్రహ్మరాక్షసులు అనేవి దేవతల వంశ రూపాలు.

ప్రతి వంశం కింద, విభిన్న నామాలు, విభిన్న స్వభావాలు, విభిన్న మనస్తత్వాలు, విభిన్న పరిమాణాలు, విభిన్న రంగులు, విభిన్న రూపాలతో వాటికి లెక్కలేనన్ని రూపాలు ఉంటాయి; మనం 'మనుష్య' అనే వర్గంలో ఉన్నట్లే! కొన్నిసార్లు వాటికి ఒకే పేర్లు కూడా ఉంటాయి; కానీ అవి విభిన్నంగానే ఉంటాయి; మన పేరుతో ఇంకొకరు ఉన్నట్టు.

ఉదాహరణ కి మనం సాధారణంగా డాకిని అని పిలిచినప్పుడు ఏ డాకిని వస్తుందో మనకు తెలియదు. అలాగే మిగిలిన దేవతా స్వరూపాలకు కూడా వర్తిస్తుంది.

భైరవుడు – కాపాలిక వంశం క్రింద ఉన్న భైరవ కులానికి కాల భైరవుడు నాయకుడు. ఈ కాపాలికులు సమాజంతో అస్సలు సంబంధం కలిగి ఉండరు, ఎందుకంటే వారి నియమాలు లేదా వారి ఆచారాలు ఆధునిక సామాజిక కట్టుబాట్లకు విరుద్ధంగా ఉంటుంది. అంతేకాక, కాల భైరవుని క్రింద ఉన్న కాపాలిక వశం మనల్ని సంసారం నుండి బయటకు తీసుకురావడానికి సహాయపడుతుంది, కాబట్టి, అటువంటి సాధకులను సమాజంలో ఉండనివ్వరు, ఎందుకంటే ఆధునిక సమాజానికి సరిపడదు.

సమాజంలో నివసించే ప్రజలకు, భైరవ కులానికి సంబంధించిన స్వర్ణాకర్షణ భైరవుడు నాయకుడు.  మహా భైరవుడు అనే పదం కేవలం స్వర్ణాకర్షణ భైరవుడిని మాత్రమే సూచిస్తుంది, కాల భైరవుడిని కాదు. కాల భైరవుని విద్య గురించి మనం పూర్తిగా తెలుసుకోలేము. ఎందుకంటే, కాలభైరవుడు సామాన్యుల కోసం ఉద్దేశించినవాడు కాదు, అందుకే ఇది రహస్యంగా ఉంచబడింది. కానీ, వటుక భైరవుడు మరియు స్వర్ణాకర్షణ భైరవుడు గురించిన వివరాలు తెలుసుకోగలం. 

వటుక భైరవుడు ఎవరు?

శ్రీ విద్య మరియు కాళికా విద్యలలో వటుక భైరవునికి తనదైన స్థానం ఉంది. అందువల్ల, శ్రీ విద్యకు సంబంధించిన అనేక గ్రంథాలు అందుబాటులో ఉన్నందున, ఆచార్యులు ఆయనకు సంబంధించిన కొన్ని విద్యలను లిఖించారు. ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు సాగడానికి వటుక భైరవ విద్య తప్పనిసరి అని చెప్పబడినప్పటికీ, కొన్ని సంవత్సరాల సాధన తర్వాత మాత్రమే గురువులు వటుక భైరవ విద్యను ఉపదేశిస్తారు. మంత్రశాస్త్రంలో 
వటుక భైరవ విద్య మహత్త్వం మరియు ప్రాముఖ్యత అలాంటిది.

సామాన్యులకు స్వర్ణాకర్షణ భైరవుడు ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. మంత్రశాస్త్ర విద్యలలో దీక్ష పొందిన ఉపాసకులకు వటుక భైరవుడు ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు.

వటుక అంటే బాలుడు!. వటుక భైరవుడు అంటే కాల భైరవుని బాల రూపం; అందుకే వటుక భైరవ అనేది దీక్ష పొందిన ఉపాసకులకు మాత్రమే నిర్ధేశించబడింది.

భైరవుడు వటుక రూపమే కాదు, బ్రహ్మ, వేతాళ, విష్ణువు వటుక రూపాలను ధరించి తాంత్రిక విద్యలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. వటుక 
వేతాళ శ్మశాన కపాలిని కుమారుడు. అతను వటుక భైరవుడి వలె క్షిప్రప్రస్తి.

స్వర్ణాకర్షణ భైరవ యొక్క నివాసం భక్తుని యొక్క హ్రదయం. కాల భైరవ యొక్క నివాసం శ్మశానం. అందువలన, వటుక భైరవ యొక్క నివాసం కూడా 
శ్మశానం.

తాంత్రికవిద్యలో, స్వర్ణాకర్షణ భైరవ కూడా వటుక రూపాన్ని కలిగి ఉంటాడు.

ఈ వటుక భైరవ లేదా కాల భైరవులు క్షేత్రపాలకులుగా వుండరు.

క్షేత్ర పాలకుడు అనేది ఒక బిరుదు. కేవలం ఒక క్షేత్రాన్ని లేదా నిర్దిష్ట ప్రదేశాన్ని చూసుకునే వ్యక్తిని 
క్షేత్ర పాలకుడు అంటారు.

కాబట్టి, క్షేత్ర పాలకుడిని వటుక భైరవ లేదా కాల భైరవ అని సాధారణీకరించడం తప్పుడు అర్థం.

ఈ వటుక భైరవుడు కాపాలిక లేదా భైరవ విద్య యొక్క ప్రాణం కాగా, కాల భైరవుడు కాపాలిక లేదా భైరవ విద్య యొక్క నాయకుడు.

మనం నోటితో, మనస్సుతో తినే ఆహారంపైనే మన ఆలోచనలు ఎల్లప్పుడూ ఆధారపడి ఉంటాయి.. మన చర్యలే మన ఆలోచనలపై ఆధారపడి ఉంటాయి!!

అందువల్ల ఆహారాన్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి.

భైరవుడు వేతాళం యొక్క శక్తితో, వేడి మరియు చలి అనే తీవ్రమైన గుణాలతో భయంకరమైన రూపాన్ని కలిగి ఉంటాడు. అందువల్ల, వేతాళ మూర్తి, భైరవుని హృదయం వంటిది. అంతేకాక వేతాళం అనేది ఒక గోత్రనామం. ఈ వేతాళ మూర్తి ఆరు తలలు కలిగిన మహా వేతాళ స్వామి. ఈయన చరాచర వస్తువులను నాశనం చేయడంలో కాలాగ్ని రుద్రునికి ఏమాత్రం తీసిపోడు.

కాల భైరవగా గంభీరంగా నిలబడినప్పుడు, వటుక భైరవ అనేక అంబాలకు తండ్రిగా ఉంటాడు, అలాగే అనేక అంబాలకు కుమారుడు అవుతాడు. వటుక భైరవలో అపదుద్ధారణ వటుక భైరవ అనే ఒక ప్రత్యేక రూపం ఉంది. ఆయనను పూజించినప్పుడు, ఆయన చాముండ మాతృకతో పాటు వస్తాడు.

వటుక భైరవకు కాల వటుక భైరవ వంటి మరికొన్ని రూపాలు ఉన్నాయి. క్రోధ వటుక భైరవ, వీరా వటుక భైరవ, చండ వటుక భైరవ, వక్ర వటుక భైరవ, కపాలి వటుక భైరవ, భూతేశ వటుక భైరవ, ఘోర వటుక భైరవ, కాలవటుక భైరవ, విఘ్నా వటుక భైరవ, సిద్ధ వటుక భైరవ, ఆనంద వటుక భైరవ, అఘోర వటుక భైరవ, ధూమ్రేష వటుక భైరవ, శక్తి వటుక భైరవ, ఉచ్చిష్ట వటుక భైరవ, పిశాచ వటుక భైరవ; ఈ భైరవ తత్త్వం ఆధునిక సాధకుల అవగాహనకు అందనిది.

పైన పేర్కొన్న వటుక భైరవుల ప్రతి రూపాలకి ఆ స్వరూపానికి సంబంధించిన మంత్రం మరియు పూజలు ఉంటాయి.

వటుక భైరవుల ఈ రూపాలన్నింటికీ కఠినమైన బ్రహ్మచర్యం అవసరం. ఇక్కడ వామాచారం లేదా దక్షిణాచారం గురించి మాట్లాడకూడదు, ఎందుకంటే స్వామియే స్వయంగా కఠినమైన బ్రహ్మచర్య స్వరూపం. మనకు తెలియని భైరవ తత్త్వం ఎంతో ఉంది, దురదృష్టవశాత్తు, మనకు తెలిసినదే  నిజం అని భ్రమలో ఉంటాము, మనకు తెలియనిది, తెలుసుకోవలసినది చాలా ఉంది ఈ కారణంగానే, దత్తాత్రేయుడు మనల్ని జడ వస్తువు కన్నా కూడా హీనమైన వారమని అంటారు. ఎందుకంటే, మనకు చేతన వరం ఉన్నప్పటికీ, స్వామి పూర్తి చైతన్యాన్ని తెలుసుకోవడానికి సాధన చేయడానికి మనం ఇష్టపడము.

ఈ రూపాలన్నింటికీ శునకం వాహనం.

ఈ శునకానికి వర్ణన తాత్త్వికమైనది కాదు, ఆత్మరతికి సంబంధించినది కూడా కాదు; కానీ మన మంత్ర శాస్త్రం ప్రకారం

ఈ శునకానికి నాలుగు కాళ్ళు నాలుగు వేదాలు, తోక మీమాంస శాస్త్రం. హృదయం షట్ శాస్త్రం (షడ్-దర్శనాలు) ఏర్పడింది. దాని మెడ కాలజ్ఞానం; దాని రెండు కళ్ళు శివఆగమాలు; దాని రెండు చెవులు జ్యోతిష శాస్త్రాన్ని కలిగి ఉంటాయి మరియు ఈ శునకం ప్రళయాన్ని అధిగమించి సృష్టి, స్థితి మరియు సంహారాలకు సాక్షిగా నిలుస్తుంది.

ఈ విధంగా, ఈ శునకం ఒక్కటే సమస్త శత్రు బాధలు, గృహ ఉపద్రవాలు, వ్యాధులు, దారిద్య్రం  వంటి ప్రాపంచిక కష్టాల నుండి రక్షించి, ముక్తిని మరియు త్రికాల జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఇప్పుడు, ఈ శునక అధిపతి అయిన భైరవునికి ఎలాంటి పరాక్రమం ఉందో మీరే ఊహించుకోండి!

ఈ శునకం మంత్ర దృష్టి సాక్షాత్తు బ్రహ్మదేవుడే!!

పరశురామ కల్ప సూత్రోక్త తంత్రం, కేరళీయ తంత్రం, కాపాలిక తంత్రం మరియు మాంత్రిక క్రమం ప్రకారం, భైరవుల వివిధ రూపాలకు అనేక భైరవ పూజలు చేస్తారు.


కాలభైరవాష్టకం

తీక్షణ ద్రష్ట కాలభైరవ అష్టకం

దశ మహా విద్యలు

నిత్య స్తోత్రావళి

పంచాంగం

Monday, April 6, 2026

Lord Krishna performing Kaliyamardana - శ్రీకృష్ణుడు కాాళియమర్దనము గావించుట

శ్రీకృష్ణుడు కాాళియమర్దనము గావించుట

ఓ పరీక్షిన్మహారాజా! ఒకనాడు ఒక్క బలరాముడు తప్ప, శ్రీకృష్ణుడు మిగిలిన గొల్లపిల్లలు అందరు తన వెన్నంటి రాగా, ఆవులను తోలుకొని అడవికి వెళ్లాడు. ఎండలో తిరగడంచేత కొంత సమయం గడిచేటప్పటికి ఆవులకు గొల్లలకు దప్పిక కలిగింది. యమునానదికి వెళ్లి, నదిలోని విషం కలిగిన నీటిని తాగి, ప్రాణాలు పోగొట్టుకొన్నారు. వెంటనే కృష్ణుడు తన చూపులు అనే అమృతధారలను వారిపై కురిపించి, వారిని బ్రదికించాడు. అపుడు వారందరు శ్రీకృష్ణుని దయవల్లనే తాము బదికినట్లు తెలిసికొని, సంతోషంతో గొల్లపల్లెకు వెళ్లారు.

ఓ పరీక్షిన్మహారాజు! అపుడు శ్రీకృష్ణుడు కాళియసర్పవిషంచేత కలుషితమైన యమునానదిని స్వచ్చమైన దాన్ని చేయాలని సంకల్పించి ఆ కాళియుణ్జి ఆ నదినుండి దూరంగా తరిమివేశాడు.

అని శుకమహర్షి చెప్పగా విన్న పరీక్షిన్మహారాజు ఈ విధంగా ప్రశ్నించాడు. ఓ మునిశ్రేష్ఠా! చాలా లోతైన ఆ యమునానది మడుగులో ఉన్న పాముపొగరును శ్రీకృష్ణుడు ఏ విధంగా అణచాడు? ఎలా బయటకు వెళ్లగొట్టాడు? అక్కడే ఆ పాము చాలాకాలం ఉండడానికి కారణం ఏమిటి? అంతా వివరంగా తెలియజెప్పు.

ఓ శుకమహర్షీ! ఆవులను కాపాడిన శ్రీకృష్ణుని కథామృతాన్ని చెవులారా ఎంతవిన్నా అమాయకులకైనా కూడ తనివి తీరదంటే ఇంక మాబోటి భక్తుల విషయం చెప్పేదేమిటి? కావున మరింతగా విస్తరించి వినిపింపవయ్యా!

అని పరీక్షిన్మహారాజు పలుకగా శుకమహర్షి మళ్లీ ఈ విధంగా అన్నాడు.

ఓ పరీక్షిన్మహారాజా! యమునా నదిలో మిక్కిలి లోతైన పెద్దమడుగు ఉంది. అందులో కాళియుడు అనే పేరుగల పెద్ద పాము ఉంది. అది తన విషాగ్ని జ్వాలలతో, ఆ నదినీటిని మరుగుతూ ఉప్పాంగేలా చేస్తూ ఉంటుంది. ఆ మడుగుమీదుగా ఎగిరివెళ్లే పక్షులు ఆ వేడి సోకి అందులో పడి చచ్చిపోతూ ఉంటాయి. ఆ మడుగులోని కెరటాల మీదుగా వచ్చిన గాలి సోకిందంటే చాలు. ఎటువంటి బలం కల ప్రాణి అయినా సరే చచ్చిపోవలసిందే. దుష్టసంహారం చేయడంకోసం భూమిమీద అవతరించిన శ్రీకృష్ణుడు, సర్పవిషంతో కూడిన ఆ నదిలోని నీటిని, స్వచ్చమైన దాన్నిగా చేస్తాను అని సంకల్పించాడు.

ఈ విధంగా మనస్సులో నిశ్చయించుకొన్న వాడయి శ్రీకృష్ణుడు ఒడ్డున ఉన్న కడిమిచెట్టు మీదికి ఎక్కాడు. అది శ్రీకృష్ణుని అడుగుల స్పర్శను నోచుకోవడానికి తగినంత పుణ్యం గత జన్మలలో చేసికొని ఉంది. అది పెద్దవి చిన్నవి అయిన కొమ్మలతోను రెమ్మలతోను కూడుకొని ఉంది.

(ఈ మడుగు మీది విషపు గాలి తగిలి ఆకాశంలో ఎగిరిపోయే పక్షులే చచ్చిపోతున్నాయి కదా! అటువంటిది యమున ఒడ్డుమీద ఈ కడిమిచెట్టు ఎలా బతికి ఉంది అనే సందేహం కలుగవచ్చు. గత జన్మలో అది శ్రీకృష్ణుని అడుగులు సోకడానికి తగినంత పుణ్యం చేసుకుంది. పాదస్పర్శ జరగాలంటే అది జీవించి ఉండాలి. ఇంతకీ దాని పూర్వపుణ్యం కారణం. ఇదే కవి సమర్థనం.)

శ్రీకృష్ణుడు నడుముమీది బట్టను బిగించి కట్టుకొని, నెమిలి పింఛాన్ని జుట్టుముడితో బంధించి, ఉత్సాహంతో జబ్బలు చరుస్తూ, రెండు పాదాలు కూడతీసికొని, ఆ కడిమి చెట్టుకొమ్మ కొననుండి మడుగులోనికి దూకాడు. ఆ అదురుపాటుకు నాలుగు దిక్కులు పిక్కటిల్లాయి. మడుగులో గుభగుభ ధ్వనులు హెచ్చైపోయాయి.

మహాప్రతాపవంతుడైన శ్రీకృష్ణుడు దూకగానే, ఆ వేగానికి ఆ మడుగు కలతపడిపోయింది. విషమయమైన తరంగాలచేతను, కుతకుత ఉడికే నీటి బిందువులచేతను, నీటి బుడగలచేతను భయాన్ని కలిగిస్తూ కల్లోలమై పొంగుతూ నాల్గువందలమూరల మేర వ్యాపించింది.

పూర్వం మత్స్యావతారాన్ని ఎత్తి, సముద్రంలో బాగా ఈదిన అనుభవం ఉన్నవాడు కనుక శ్రీకృష్ణుడు ఆ మడుగులో పెద్ద పెద్ద అలలు పైకి లేచేటట్లు నదిని కలచివేస్తూ, అటూ ఇటూ భయంకరంగా ఈదాడు. దానితో కాళియుని మనస్సులో కోపాగ్ని జ్వాలలు ఎగదోసినట్లయింది.

ఆ సమయంలో, వీడు చిన్నపిల్లవాడు. పైగా ఒంటరివాడు. ఇటువంటివాడు అయివుండి, నా మడుగును క్షోభింపజేశాడు. నేను ఈ మడుగులోపల ఉన్నాననే సంగతి వీనికి తెలిసి ఉండదు. నాకు కోపం వచ్చిందంటే ఎంత తీవ్రంగా ఉంటుందో, లోకానికి తెలియజేయడానికి ఇదే అదను. నా క్రోధాగ్నిజ్వాలలతో ఇతణ్ణి బూడిద చేసి, వీనిప్రాణాలు తీస్తాను.

అని ఈ విధంగా అనుకొని, ఇంకా విజృంభిస్తూ, కాళియుడు సర్పసైన్యంతో కలిసి, విషాగ్ని జ్వాలలకాంతులు అంతట వ్యాపిస్తూ ఉండగా, వేగంగా వెళ్లి, శ్రీకృష్ణుణ్ణి కాటు వేశాడు. ఆ శ్రీకృష్ణుడు నీలమేఘంలా ఉన్నాడు. జంకు గొంకు లేకుండా ఆ మడుగునీళ్లలో స్వేచ్చగా విహరిస్తున్నాడు. ధైర్యగాంభీర్య గుణాలు కలిగి ఉన్నాడు. బంగారురంగు గల పట్టు వస్త్రాన్ని కట్టుకొని ఉన్నాడు.

సర్పరాజయిన కాళియుడు శ్రీ కృష్ణుణ్ణి కాటువేసి, అంతటితో ఊరుకోకుండా, తన నోటినుండి విషపుమంటలు వెలిగ్రక్కుతూ, జంకూ గొంకూ లేకుండా తన పొడవైన శరీరంతో శ్రీకృష్ణుణ్ణి వేగంగా బంధించివేశాడు.

ఈ రీతిగా శ్రీకృష్ణుడు కాళియసర్పంచేత బంధింపబడి, కాళ్లుచేతులు ఆడనందువల్ల కదలిక మెదలిక లేకుండా ఉండడం చూశారు గొల్లపిల్లలు. అతడు తమకు ప్రాణస్నేహితుడు. అతని మహిమలు వారికి తెలియవు. తమ సంపదలు, భార్యలు, కోరికలు మనస్సులు అన్నింటిని శ్రీకృష్ణునికి సమర్పించి, సర్వస్వం శ్రీకృష్ణుడే అని నమ్మినవారు కావున

అదిగో! ఆ పాము మన కృష్ణుణ్ణి కరచింది, అంతటితో వదలిపెట్టకుండా, పొగరుబోతు తనంతో అతని శరీరమంతా చుట్టుకొని కదలకుండా బంధించివేసింది. ఇంక ఇప్పుడేమి చేస్తాం? ఎక్కడికి వెళ్తాం? దీన్ని లొంగదీయగల సమర్థులెవరు? ఏమిటి ఉపాయం? అని గొల్లపిల్లలంతా శోకంతో బొబ్బలు పెడుతూ నేలమీద పడిపోయారు.

శ్రీకృష్ణుణ్ణి కాళియసర్పం కరవడంచూచిన ఆవులు, ఎద్దులు, దూడలు అన్నీ దుఃఖంతో మేత మేయడం మానేసి అరుస్తూ ఉండిపోయాయి.

ఓ రాజా! కాళియుడు శ్రీకృష్ణుణి కరచి చుట్టివేయడంతో, ఎన్నో ఉత్పాతాలు సంభవించాయి. భూమి కంపించింది. ఆకాశంనుండి నిప్పురవ్వలు రాలుతూ కనిపించాయి. గొల్లపల్లెలో ఉండే ఆడవారికి కుడికన్నులు, మగవారికి ఎడమ కన్నులు అశుభాన్ని సూచిస్తూ అదిరాయి.

గొల్లపల్లెలో ఉన్న నందుడు యశోద మొదలయిన గొల్లవారు ఆడవారు, మగవారు అందరు ఆ దుశ్శకునాలు చూచి, భయపడిపోయారు. శ్రీకృష్ణుని సామర్థ్యం తెలియక, గొల్లపిల్లలు ఆవులమందలతో కలిసి ఉన్న శ్రీకృష్ణుడు, ఎక్కడయినా ఆపదలో చిక్కుకొన్నాడేమో అని ఆరాటపడ్డారు. మిక్కిలి ప్రేమతో పిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరు పెద్దపెట్టున ఆక్రందన చేస్తూ గొల్లపల్లె నుండి బయలుదేరారు.

ఓ రాజా! ఈ విధంగా గొల్లపల్లెలోని వారంతా, శ్రీకృష్ణునిశక్తి తెలియక, అజ్ఞానంతో అతనిజాడ తెలుసుకొనడంకోసం వెడుతూ ఉంటే, అతనిశక్తి తెలిసినవాడైనా బలరాముడు వారిని ఆపు చెయ్యలేదు. పైగా పకపక నవ్వుకొంటూ, వారిని గమనిస్తూ ఊరుకున్నాడు.

బలరాముడు నందుడు మొదలయిన గొల్లలు అడవిదారిలో శ్రీకృష్ణుణ్ణి వెదుకుతూ వెళ్లుతున్నారు. ఆవులను కాచే గోపబాలుర అడుగుజాడలు, ఆవుల అడుగుజాడల నడుమ శ్రీకృష్ణుని అడుగుజాడలు కనబడుతున్నాయి. వాటి అడుగుల జాడలలో ఉత్తమ సాముద్రిక చిహ్నాలయిన యవరేఖ, అంకుశరేఖ, హలరేఖ, కమల రేఖ, కులిశరేఖ, చక్రరేఖ, చాపరేఖ, ధ్వజరేఖ మొదలయిన రేఖలు ఆ అడవిదారికి ఆభరణాలుగా అందంగా ఉన్నాయి. ఆ జాడల వెంబడి దారి తప్పకుండా వెళ్లి, కాళియుని భయంవల్ల అక్కడికి వెళ్లడానికి అందరూ భయపడే కాళిందీనది ఒడ్డుకు చేరారు. ఏటినడుమ ఎవరికీ లొంగని బలంకల కాళియుడు కరవడంచేత చేష్టలుడిగి, ఆ పాము శరీరంతో శరీరమంతా చుట్టుకొన్నందువల్ల, సొమ్మసిల్లిపడి ఉన్న శ్రీకృష్ణుణ్ణి చూచి, ఒడ్డున నిలబడి, దుఃఖం ఆపుకోలేక, కృష్ణా! కృష్ణా! అని గొంతెత్తి విలపిస్తూ తమ దురదృష్టాన్ని తిట్టుకొనే కృష్ణుని తోడివారయిన గొల్లకుఱ్ఱల్ని చూశారు. మేతలు మాని, రెప్ప వేయకుండా, దుఃఖంతో శ్రీకృష్ణుణ్ణే చూస్తూ ఉండే గోవుల్ని దూడల్ని చూశారు. (ఈ గొల్లపిల్లలు, ఆవులు ఆనాటి ఉదయమే శ్రీకృష్ణునితోబాటుగా, గొల్లపల్లినుండి అడవికి వచ్చినవారన్నమాట,) ఈ సన్నివేశం అంతా చూచిన గోపికలు యశోదను కౌగిలించుకొని, శ్రీ కృష్ణునిచేష్టలు తలచుకొని, ఈ విధంగా విలపిస్తున్నారు.

శ్రీకృష్ణా! మేము నీకు ఎదురుగా వస్తే నీవు మాకు ఎదురు వచ్చేవాడవు. ఈ వేళ మేము వచ్చినా నీవెందుకు ఎదురు రావడం లేదు? మేము నీకేసి చూస్తే చాలు. నీవు దయతో మా వైపునకు చూచేవాడవు. నేడు మేము నిన్ను చూస్తూ ఉన్నా నీవు మాకేసి చూడడం లేదు. మేము కృష్ణా! అని పిలిస్తే చాలు 'ఓ' అని వెంటనే గట్టిగా ఉత్సాహంతో బదులు పలికేవాడవు. నేడు మేము ఎంత పిలిచినా నీవు పలకడం లేదు. మేము నిన్ను తలచుకొంటే చాలు. మమ్మల్ని గురించి తలచేవాడవు. ఈనాడు ఆ ఆలోచనే నీకు రావడం లేదు అని గోపికలు భక్తితో పరవశించిన భక్తురాళ్లవలె పలికి ఒళ్లు మరచిపోయారు.

అప్పుడు నందుడు యశోద మొదలైన గొల్లవారంతా అధికమైన శోకంతో శ్రీకృష్ణుణ్ణి చూచి, ఈ విధంగా అన్నారు.

తామరపూలవంటి కన్నులు గల ఓ శ్రీకృష్ణా! విషాన్ని రొమ్ములలో దాచుకొని వచ్చిన దుష్టరాక్షసి పూతన ఇచ్చిన పాలు త్రాగి అరిగించుకొన్న అద్భుతమైన శక్తి కలిగినవాడివి గదా! అటువంటి నీకు ఈ పాము విషం ఎక్కిందంటే ఎంత ఆశ్చర్యకరమైన విషయమో కదా!

అయ్యో! బిడ్డా! భయంకరమైన ఆ సర్పం కోపంతో నిన్ను కరుస్తూ ఉంటే ఎంతగా వణికిపోయావో? నీ దౌర్భాగ్యాన్ని ఎంతగా తిట్టుకొన్నావో? మాకోసం ఎంతగా పలవరించిపోయావో గదా?

బిడ్డా! ఈ పాము మమ్మల్ని కరవకుండా నిన్నెందుకు కరచిందో కదా! నీవు క్షేమంగా ఉంటే మాకు ఏ ఆపదలూ రాకుండా కాపాడుతూ ఉంటావు. నాయనా! నీకు ఆపద కలిగితే నిన్ను మేము రక్షించలేము కదా!

ఓ కృష్ణా! ఈ వేళ ఎప్పటిలాగ మమ్మల్ని గౌరవంగా ఎందుకు చూడవు? స్నేహితులతో ఏకాంతంగా ఎందుకు మాటాడవు? చెవులకు ఇంపుగా కాళ్లగజ్జెలు మ్రోగేవిధంగా తల్లుల ఎదుటకు వచ్చి ఎందుకు నాట్యం చేయవు? గొల్ల పడుచులచో పరిహాస ప్రసంగాలు ఎందుకు చేయవు?

తండ్రీ! కృష్ణా! నీవు ఈ విధంగా పాముకు చిక్కిపోయావే! ఇంక మా చెవులు సఫలములయ్యేలా మాతో ఎవరు మాటాడుతారు? మా కాళ్లు చేతులు ధన్యములయ్యే విధంగా ఎత్తుకోమని మా పైకి ఎవరు ఎగబ్రాకుతారు? మా కళ్లు చల్లగా ఎవరు చిరునవ్వులు చిందిస్తారు? నోటికింపుగా మా చేత మంచి పాటలు ఎవరు పాడిస్తారు? ఇటుపైన మా ఆలనా పాలనా చూచే వారెవరు? నీ యందే మా మనస్సులు లగ్నమైపోయాయి. నిన్ను విడిచి వెళ్లలేము. ఇంక మాకు ఇళ్లు వాకిళ్లు అక్కరలేదు. నీవు ఎక్కడ ఉంటే అదే మా ప్రపంచం. నీవు లేని ఈ లోకం మాకెందులకు?

ఈ విధంగా నందాదులయిన గొల్లవారంతా ఒకరి నొకరు పట్టుకొని దుఃఖిస్తున్నారు. కృష్ణుణ్ణి విడిచి బ్రతుకలేక దుఃఖంతో కాలిపోతూ అతనితో బాటే మనంకూడా మడుగులోపడి ప్రాణాలు విడిచి పెట్టేద్దాం - అని మడుగులో దూకడానికి సిద్ధమయ్యారు. భగవంతుని అంశావతారమైనవాడు, శ్రీకృష్ణునిశక్తిసామర్థ్యాలు తెలిసినవాడు అయిన బలరాముడు వారిని ఆపు జేసి, ముందు ముందు ఏమి జరుగబోతోందో మీకు తెలియదు. కనుక ధైర్యం విడిచి పెట్టకండి. ఓర్చుకొని వేచిచూడండి అని చెప్పాడు.

గొల్లపల్లెలో ఉండే గొల్లలందరు, తమ ఆలుబిడ్డలతో వచ్చి, తనకోసం విలపించడం చూచి, శ్రీకృష్ణడు ఏమీ చేతకాని సామాన్య మానవునివలె రెండుగడియల సమయంమాత్రం ఊరుకున్నాడు.

అపుడు శ్రీకృష్ణుడు తన శరీరాన్ని బాగా పెంచాడు. కాళియుని చుట్టలు విడిపోయాయి. పాము శరీరం బాగా వేడెక్కి పోయింది. దానితో కరవడం మానేశాడు. అలసిపోయాడు. పెద్దగా నిట్టూరుస్తూ పడగలు పైకెత్తాడు. ముక్కులనుండి విషం చిమ్ముతూ, ఏమీ చెయ్యలేక, కృష్ణుణ్ణి విడిచి, దూరంగా నిలబడ్డాడు. పాగచూరిన కట్టెలాగ కాంతిని కోలుపోయాడు.

మహాపరాక్రమ వంతుడయిన ఆ శ్రీకృష్ణుడు, జంకుగొంకు లేకుండా, ఆ పాముపడగలమీద చేతితో ఒక్క చరపు చరిచాడు. గరుత్మంతునివలె ఆ పాము రెండుదౌడలు చిక్కబట్టి. కళ్లనుండి విషాగ్నులు బయటకు ప్రసరిస్తూ ఉండగా, దాన్ని పైకెత్తి గిరగిర త్రిప్పి విసరివేశాడు. దానితో ఆ భయంకరమైన సర్పం యొక్క గర్వం చాలా భాగం అణగిపోయింది.

ఈ విధంగా పామును విసరికొట్టి, రెట్టించిన వేగంతో జగదేక వీరుడయిన శ్రీకృష్ణుడు కదిలాడు.

శ్రీకృష్ణుడు అనే ప్రసిద్ధనర్తకుడు కాళియుని పెద్ద పెద్ద పడగలమీదికి ఎక్కి మిక్కిలి నేర్పుతో నాట్యం చేశాడు. ఆ సమయంలో ఆ పాము పడగలు, కెంపులు మొదలయిన రతనాలు పొదిగిన విశాలమయిన నాట్యమండపంలా ప్రకాశించాయి. యమునానదిలోని పెద్దపెద్ద కెరటాలచప్పుళ్లు, ఆ నాట్యానికి సహకారం అందించే మద్దెలచప్పుళ్లవలె ఉన్నాయి. ఆ బృందావనంలో తిరిగే తుమ్మెదలయొక్క ఝంకారం, వీనులవిందుగా ప్రక్కనున్న గాయకులు అందించే సహకారగానంలా ఉంది. ఆ నదిలోని రాజహంసలు, బెగ్గురు పక్షులుచేసే శ్రావ్యమైన ధ్వనులు, తాళాల మ్రోతలవలె ఉన్నాయి. ఆ రమణీయ సన్నివేశాన్ని ఆకాశంలో ఉన్న దేవతలు, గంధర్వులు సభలో సుఖంగా కూర్చుండి, నాట్యం చూస్తూవున్న ప్రేకకులవలె ఉన్నారు.

తన కడుపులో లోకాలన్నీ దాచుకొన్న గోపాలకృష్ణుడు రాక్షస సంహారం చెయ్యడంకోసం భూమిమీద అవతరించాడు. అతడు కాళియునిపడగలను రంగస్థలంగా చేసుకొని, తరగనిదర్పంతో నాట్యం చేశాడు. ఆడాడు, పాడాడు, కేకలు వేశాడు, కేరింతలు కొట్టాడు. ఆతనిఅడుగుల తాకిడికి కాళియునితలప్రాణం తోకకు వచ్చినట్లయింది.

సిద్దులు, సాధ్యులు, చారణులు, గంధర్వులు, దేవతలు, మునులు, మున్నగువారి భార్యలు ఆ పిల్లనగ్రోవులు మొదలైనవి సంతోషం కలిగించేలా ఊదుతూ నాట్యం చేస్తున్న శ్రీకృష్ణునిమీద పూలవానలు కురిపించారు.

ఈ విధంగా దుర్మార్గులను శిక్షించడంలో యమునివంటివాడయిన శ్రీకృష్ణుడు. వడిగలిగిన కాళియుని పడగలమీద తాండవం చేశాడు. కాళియుని చేవ చచ్చింది. వరుసగా ఉన్న పడగలనుండి రక్తమాంసాలు వెలిగ్రక్కాడు. కళ్లనుండి విషం కారిపోయింది. చొరవ తగ్గి నీరసించిపోయాడు. ప్రాణాలు పైపైకి రాగా తనలో ఈ విధంగా అనుకొన్నాడు.

దేవతలైనా సరే! నా విషాగ్ని జ్వాలలు తాకాయంటే చాలు, గిలగిల లాడుతూ ప్రాణాలు విడిచిపెట్టేస్తారే! ఈ వేళ ఈ పిల్లవాడు ఇదేమిటి? భయంకరమైన నా విషాగ్ని జ్వాలలను సహించడంమాత్రమే కాక తిరిగి నా నూరు పడగలను చితికి చెల్లా చెదరు చేస్తూ, నిర్భయంగా నాట్యం కూడ చేస్తున్నాడే? ఎంతటి ఆశ్చర్యం?

ఓ పరీక్షిన్మహారాజా! బాగా అలసిపోయిన కాళియునికి వివేకం కలిగింది. ఈతడు సామాన్యబాలుడు కాదు. సమస్త చరాచరప్రాణికోటికి ప్రభువు. భగవంతుడు. భక్తికి సంతోషించేవాడు అయిన శ్రీమహావిష్ణువే అయి ఉంటాడని భావిస్తూ భయంతో అతణ్ణి శరణు వేడినాడు.

కాళియుని భార్యలైన నాగాంగనలు శ్రీకృష్ణుని నుతించుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

Balarama killing of the demon of Garthabakara Dhenukasura - గార్థభాకారుండైన ధేనుకాసురుని బలభద్రుండు వధించుట

గార్థభాకారుండైన ధేనుకాసురుని బలభద్రుండు వధించుట

ఓ బలరామకృష్ణులార! ఇక్కడికి చాలదూరంగా, ఒక పెద్దతాటితోపు ఉంది. ఆ చెట్లనుండి పండిన పండ్లు గుట్టలు గుట్టలుగా రాలుతూ ఉంటాయి. అందులో ధేనుకుడనే పేరుగల రాక్షసుడు ఉంటున్నాడు. వానిమూలంగా ఎంత ధైర్యవంతులయినా సరే, ఆ తాటితోపులో అడుగు పెట్టడానికి భయపడుతూ ఉంటారు.

ధేనునుకుడనే పేరుగల ఆ రాకాసి మహాపరాక్రమం కలవాడు, గాడిదరూపంతో ఉన్నవాడు, తనతో సమాన బలంగల తన దాయాదులతో కలిసి, ఆ వనంలో ప్రవేశించినవారిని పట్టుకొని తింటూ ఉంటాడు. అక్కడ కొత్తగా పండినవి, మంచివాసన కలవి అయిన తాటిపండ్లు రాసులు రాసులుగా ఉన్నాయి. ఇంకా వినండి.

ఆ పండ్లవాసన మా ముక్కు పుటాలగుండా మా మనస్సులలోకి ప్రవేశించి, వాటిని తినాలనే కోరిక పుట్టించి, క్షోభ కలిగించి, మా మనస్సుల్ని ఆ పండ్లవద్దకు లాగుకొని పోయింది. కావున ఏలాగైనా సరే! ఆ పండ్లు తినే అవకాశం మాకు కలిగించండి. అమితబలం కల మీకు ఆ రాక్షసులు ఒక లెక్కలోనివారా? (కారు కదా!)

ఈ విధంగా చెప్పిన స్నేహితుని మాటలు మన్నించి, శ్రద్ధగా విని, అంగీకార సూచకంగా నవ్వి, ఆ బలరామకృష్ణులు స్నేహితులతో కలిసి, ఎత్తైన తాటిచెట్లుగల ఆ తోపులో ప్రవేశించి

బలరాముడు మదగజంలాగ తన భుజబలంతో, ఆ తాటిచెట్లను అటూ ఇటూ వేగంగా ఊపి ఊపి, తాటిపండ్లను నేలమీద రాలగొట్టాడు.

అప్పుడు తాటిపండ్లు రాలగొట్టడంచేత కలిగిన చప్పుడు విని, ఉలికిపడి అసహనంతో ధేనుకాసురుడు శత్రువులను అణచివెయ్యాలనే కుతూహలంతో,

ఆ ధేనుకాసురుడు వడివడిగా అడుగులు వేయడంచేత, ఆ బరువుకు తాటిచెట్లతో కూడిన ఆ నేలంతా కంపించిపోయింది. కోపంతో పండ్లు కొరుకుతున్నాడు. కత్తిరించిన చెవులు నిక్కబొడుచుకొన్నాయి. తోక భయంకరంగా అటూ ఇటూ అల్లాడుతోంది. గర్వంతో చెలరేగిపోయాడు. గొల్లవారు అదిరిపోయేట్టుగా వెనుకకు దిరిగి, వెనుకకాళ్లతో బలరాముణ్ణి గుండె మీద తన్నాడు. (వెనుక కాళ్లతో తన్నడం గాడిద నైజం)

పిమ్మట ఆ ధేనుకాసురుడు బలరాముణ్జి కరవాలని ప్రయత్నించి, వీలు కాకపోవడంవల్ల, అతణ్ణి కోపంతో చుర చుర చూస్తూ తన్నబోయాడు. కానీ వానికి శక్తి చాల్లేదు. ఇటూ అటూ వట్టినేలను తన్నాడు. ఆ తాపులు బలరామునికి తగలలేదు.

అటుపిమ్మట బలరాముడు కోపావేశంతో ఆ ధేనుకాసురుని నాలుగుకాళ్లు ఒంటిచేతితో పట్టుకొని, గిరగిర త్రిప్పి, నేలకేసి కొట్టి, చంపి

బలరాముడు ఆ ధేనుకాసురుని కళేబరాన్ని ఒక తాటిచెట్టు కొనమీద పడేవిధంగా విసరగా, దాని దెబ్బకు ఆ తాటిచెట్టు విరిగి, మరొక తాటిచెట్టుకొనమీద పడింది. అది విరిగి మరో తాటిచెట్టు కొనమీద పడింది. ఈ విధంగా ఒకదాని మీద మరొకటి పడి, విరిగి, సుడిగాలి తాకిడికి కూలే విధంగా, ఆ తోపులోని తాటిచెట్లన్నీ కూలిపోయాయి.

పడుగు పేకగా అల్లుకొన్న దారాలనుండి బట్ట పుడుతోంది. అలాగే ఈ ప్రపంచమంతా విష్ణువునుండే పుడుతోంది. లోకనాయకుడైన మహావిష్ణువు యొక్క అంశ అయిన బలరాముడు, ఒక సామాన్యుడైన రాక్షసుణ్ణి సంహరించడంలో వింత ఏమీ లేదు. వాణ్ణి చంపడం చూచిన వానిబంధువులంతా గాడిదలుగా మారి

(బలరాముడు ఆదిశేషుని అవతారం. శ్రీకృష్ణుడు శ్రీమహావిష్ణువు అవతారం. విష్ణువుయొక్క అంశయే శేషుడు. కావున ఇక్కడ బలరాముణ్జి జగదీశునిగా చెప్పడంలో విరోధం లేదు.)

ఓ పరీక్షిన్మహారాజా! గాడిదలుగా మారిన ఆ ధేనుకాసురుని భటులంతా బలరామకృష్ణుల మీద కలియబడ్డారు. దానితో వారు బలంగల ఆ గాడిదల వెనుకకాళ్లు పట్టుకొని, తాటిచెట్ల కొనలమీదకు విసిరికొట్టి చంపారు.

అప్పుడు జరిగిన యుద్ధంలో తాటిచెట్టు, రాక్షసుల శరీరాలు ఖండఖండాలుగా తెగి, నేలమీద వరుసగా పడ్దాయి. వాటితోగూడిన యుద్ధభూమి వరుస మబ్బులతోగూడిన ఆకాశంలా కనిపించింది.

అపుడు ధేనుకాసురుణ్ణి సంహరించినవాడూ, భక్తులు కోరిన కోరికలు తీర్చడంలో కామధేనువూ అయిన బలరాముడు వారికి లభించడంచేత ఆ గొల్లలు ఆ తోపులోని తాటిపళ్లను తిన్నారు. ఆవులు తనివితీరా అక్కడ ఉన్న పచ్చగడ్డిని మేశాయి.

అప్పుడు దేవతలు పుష్పవృష్టి కురిపించి, భేరీలు మ్రోగించారు. గొల్లలంతా గొంతెత్తి తన కీర్తిని గానం చేస్తూండగా, శ్రీకృష్ణుడు అన్న బలరామునితో కలిసి, ఆవుల మందలను తోలుకొని, గొల్లపల్లెకు వెళ్లాడు. అప్పుడు

ఆవులకాళ్లచేత పైకి లేచినదుమ్ముతో కూడిన జుట్టుమీద నెమలిపింఛం కలవాడు, చిరునవ్వుతో కూడిన చల్లని చూపులుగల మొగం కలవాడు. అప్పుడే పూసిన పూలతో కట్టిన దండలు ఒంటినిండా ధరించినవాడు, గొల్లవారు సంతోషించేలా పిల్లనగ్రోవి ఊదేవాడు, అయిన శ్రీకృష్ణుణ్ణి అప్పుడు గోపకులు కన్నుల పండువుగా చూశారు.

గోపికలందరు శ్రీకృష్ణునిముఖం అనే కమలంలో ఉన్న సౌందర్యం అనే మకరందాన్ని తమ కన్నులనే తుమ్మెదలతో తనివితీరా త్రాగి, పగటివేళ శ్రీకృష్ణునితోడి ఎడబాటువల్ల కలిగినతాపాన్ని పోగొట్టుకొన్నారు. (శ్రీకృష్ణుడు ఆవుల మందలతో పగటివేళ మెపడానికి అడవికి వెళ్లినందువల్ల వ్రేపల్లెలో ఉన్న గోపికలకు శ్రీకృష్ణునితో వియోగం కలిగింది. ఇప్పుడు అతణ్ణి తనివితీరా చూచి ఆ బాధను పోగొట్టుకొన్నారు. )

ఈ విధంగా గోపికలంతా ఆదరంతో తనను చూస్తూ ఉండగా, ఆటలలో మేటి అయిన శ్రీకృష్ణుడు వారి చూపులలోని సిగ్గు నవ్వు వినయం అనే భావాలను వీక్షిస్తూ వ్రేపల్లెలో ప్రవేశించాడు. అపుడు రోహిణీ యశోదలు తమ కొడుకులయిన బలరామకృష్ణులందు పత్రప్రేమ అతిశయించగా, తమకు నచ్చిన రీతిలో వారికి దీవెనలిచ్చారు. తల్లులు చేసిన ఉపచారాలను బలరామకృష్ణులు స్వీకరించారు. నలుగులు పెట్టించుకొన్నారు. స్నానం చేశారు. పరిమళాలు వెదజల్లే పూలదండలు అలంకరించుకొన్నారు. అందమైన బట్టలు కట్టుకొన్నారు. తీపి, పులుపు మొదలయిన ఆరురుచులతో కూడిన భక్ష్య - లేహ్య - చోప్య - పానీయాలనే నాలుగు విధాలయిన ఆహారాలు ఆరగించారు. ఎగుడుదిగుళ్లు లేక మెత్తగా అమర్చిన పాన్పులమీద హాయిగా పవ్వళించారు. దినచర్య ఈ విధంగా నడుస్తూ ఉన్న కాలంలో

శ్రీకృష్ణుడు కాాళియమర్దనము గావించుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

The gopas (cowherd boys) and calves are released from the illusion created by Lord Brahma - గోపబాలురులకు బ్రహ్మ మాయ తొలగుట

గోపబాలురులకు బ్రహ్మ మాయ తొలగుట

పరీక్షిన్మహారాజా! బ్రహ్మ మోసంతో తమను మాయచేసి దాచి ఉంచిన సంవత్సరకాలాన్ని ఆ గోపబాలురు శ్రీకృష్ణ మాయవల్ల ఎంతో అల్పసమయంగా, రెప్పపాటు కాలంలా భావించారు.

ఈ విశాలవిశ్వమంతాకూడా ఏ మహామహిమాన్వితుడైన విష్ణవుయొక్కమాయలో మోహం చెంది మునిగిపోయి ఉంటుందో, అట్టి భగవంతునిమాయవలననే, ఈ గోపబాలురుకూడా ఒక సంవత్సరకాలం తాము దాగి ఉన్నారన్న విషయం తెలుసుకోలేక పోయారనడంలో ఆశ్చర్యమేముంది?

ఆ గొల్లపిల్లలందరూ కృష్ణుణ్ణి చేరి మిత్రమా! వచ్చావా! మన దూడలన్నీ అడవి మృగాల బాధలేకుండా క్షేమంగా వాటి స్థానాలను చేరుకున్నాయి. నీవు దూడలను వెదకడానికి వెళ్లావు కదా! నీవు వచ్చేవరకూ ఈ పిల్లలెవరూ కూడా కొంచెమైనా చల్దులు తినలేదు చూడు. రా! అంటూ శ్రీకృష్ణుడు నవ్వుతూ ఉండగా అక్కడ వారంతా ముచ్చటలాడుకుంటూ, చల్ది తిన్నారు.

ఈ రీతిగా సరదాగా మాట్లాడుకుంటూ, ఆ గొల్లబాలురతో కలిసి చల్ది ఆరగించి, దారిలో తానింతకు మునుపు కొండచిలువరూపంలో వచ్చిన అఘాసురుణ్ని సంహరించి ఉండగా అక్కడ పడి ఎండిన ఆ కొండచిలువతోలును చూపిస్తూ అడవినుండి మరలివస్తూ

శ్రీకృష్ణుడు తలలో పూలు, నెమలి పింఛం ధరించాడు. వాటి కాంతులు అంతటా ప్రతిఫలించి అతని శరీరభాగాలను అలంకరిస్తున్నాయి. కృష్ణుని కొమ్ముబూరామోత, అతని వేణుగానం అందరికీ పరిచయమైనవి. అవి వినపడగానే లోకమంతా పరవశమై ఆకర్షింపబడుతుంది. గోపబాలురు సంతోషంతో కృష్ణుని బాహుబలాన్ని స్తుతించారు. కృష్ణుడు గోపబాలురతోకూడి ఉల్లాసంగా మందకు చేరుకుంటూ ఉంటే గోపకులందరూ ఆనందించారు.

అలా మందకు కృష్ణుడు గొల్లపిల్లలతో వస్తూ ఉంటే ఆ గోపబాలురందరూ, అరణ్యంలో మా అందరినీ ఒక కొండచిలువ మింగేస్తే నందుని కొడుకైన ఈ చిన్ని కృష్ణుడు ఆ కొండచిలువను చంపి, మా అందరినీ ప్రాణాలతో కాపాడాడు అంటూ గొల్లపల్లె అంతా చాటి చెప్పారు.

శుకమహర్షిద్వారా విషయం అంతా విన్న పరీక్షిన్మహారాజు శుకమహర్షితో తిరిగి ఇలా అన్నాడు.

పండితులలో శ్రేష్ఠుడవైన ఓ శుకమహార్షీ! ఆ గొల్లపల్లెలోని గొల్లవారి కందరికీ తాము కని, చక్కగా చూస్తూ, ఎత్తుకుంటూ, పెంచుతున్న తమ కన్నకొడుకుల కన్నా నందగోపునికొడుకైన శ్రీకృష్ణుడు అంత ప్రేమపాత్రుడెలా అయ్యాడో తెలియజేయండి.

పరీక్షిన్మహారాజు ఎంతో ఆశ్చర్యంతో పై విధంగా అడిగేసరికి శుకమహర్షి దానికి సమాధానం చెప్పనారంభించాడు.

శుకుడు పరీక్షిన్మహారాజుతో ఇలా చెపుతున్నాడు "సృష్టిలోని సకలజీవరాశికి తనకు తాను ప్రియమైనట్లు తమ బిడ్డలుగాని, ఇండ్లుగాని, బంగారంవంటి వస్తువులు కాని ఏవీకూడా ప్రియం కావు. సకల ప్రాణికోటికీ పరమాత్ముడే ప్రాణం కాబట్టి, ఈ గొల్లపల్లెలోని వారందరికీకూడా అతడు ప్రేమాస్పదుడైనాడు. ముల్లోకాలకు మేలు చేయడానికే భగవంతుడు ప్రకృతిరూపమాయతో కలిసి దేహధారియై, క్రియారూపాల్లో, భవతి, అనే భూధాతువు ఎలాగైతే ఇతర ధాతుగణాలకు ప్రధానంగా అన్వయిస్తూ ఒప్పుతోందో అలాగే ఎల్ల జీవరాశులలో ఉన్నాడు".

విష్ణుమూర్తిపాదం అనే పడవను ఆశ్రయించిన సుజ్ఞానులు ఒక చిన్నదూడ ఒక అంగవేసి దాటినట్లు, ఈ భవసాగారాన్ని దాటి ఏ ఆపదలూ లేని వారై, మోక్షపదాన్ని చేరుకుంటారు.

కృష్ణుడు అఘాసురుణ్ణి సంహరించడం, తన కెంతో ప్రేమాస్పదమైన గోపబాలురతో చల్ది తినడం, పద్మసంభవుడైన బ్రహ్మకు తన లీలలను - బ్రహ్మ దూడలను పిల్లలను దాచినా, ఆ విషయాన్ని కృష్ణుడెలా నిర్వహించాడో అనే వృత్తాంతాన్ని చదివిన వారికీ, విన్నవారికీ వారికోరిక నెరవేరుతుంది. (ఇది ఫలశ్రుతిగా అన్నమాట.)

మహారాజా! బలరాముడు శ్రీకృష్ణుడు ఎంతో ఆసక్తితో ఆయిదేండ్లు దాటి పౌగండమనే ఆరేళ్ళ వయస్సులో ఉన్నవారై, పశువులను మేపే గోపాలకుల వృత్తితో ఆ బృందావన ప్రాంతంలో పశువులను మేపారు.

ఒకనాడు కృష్ణుడు సూర్యోదయానికి ముందే మేల్కొని, వేణుగానం చేశాడు. గోపకుమారులందరూ వెంటనే మేల్కొని, లేగల మందలను తోలుకొని కృష్ణునివద్దకు చేరారు. కృష్ణుడు బలరామునితో కలసి గోపబాలకులు తనను పదే పదే పొగడుతూ ఉండగా, ఆవుల మందలను తోలుకుంటూ అడవికి బయలుదేరాడు. ఆ అడవిలో అన్ని ఋతువులలోనూ పళ్లు, పూలు, చిగుళ్లు లభిస్తాయి. పూవులలో తేనెలు పొంగిపొరలుతూ ఉంటే ఆ తీయని తేనెలను తాగడానికి వచ్చి, జుమ్ము జుమ్మని ధ్వనులు చేసే తుమ్మెదల గుంపులు ఆనందం కలిగిస్తూ ఉన్నాయి. కడిమి మొదలైన అనేకవిధాల చెట్టు, తీగెలు, పొదరిండ్లు ఆ అడవినిండా అడుగడుగునా ఉన్నాయి. అక్కడి జంతువులు, పక్షులు తమ తమ జాతి సహజమైన శత్రుత్వాలను మరచిపోయి ప్రవర్తిస్తూ ఉన్నాయి. అక్కడి సరస్సులలోని నీళ్ళు తామరపూల పుప్పొడిచేత చక్కని పరిమళం వెదజల్లుతూ ఉన్నాయి. ఆ అడవిలో ఉత్సాహంగా ఆడుకోవాలని కృష్ణుడు నిశ్చయించుకున్నాడు. అన్నగారైన బలరామునితో ఇలా అన్నాడు.

ఆ వనంలో చెట్లన్నీ కొమ్మల, పూవుల, పండ్ల అధికభారంతో బాగా వంగి ఉన్నాయి. కొమ్మలమీద చిలుకలు అందంగా పలుకుతున్నాయి. ఈ దృశ్యాన్ని చూచిన కృష్ణుడు దానిని అందంగా ఊహిస్తూ, అన్న బలరామునితో ఇలా అంటున్నాడు. అన్నా! చూశావా! ఇలా ఈ భారంతో వంగిన వృక్షాలు చిలుకపలుకుల నెపంతో, సృష్టిలో చరించలేని స్థావర రూపమైన మా యీ వృక్షత్వాన్ని పోగొట్టమంటూ నీకు తెలియజేస్తున్నాయి. ఎలా? కొమ్మలనే తమ హస్తాలతో నీకు పండ్లూ పూలూ సమర్పిస్తూ ఈ చెట్లన్నీ నీ పాదపద్మాలకు మొక్కుతున్నాయి అన్నాడు.

ఈ తుమ్మెదలు తమ ఝంకారంతో అన్నిటిని పవిత్రం చేయగల నీ యశస్సును గానంచేస్తూ నీవెంట వస్తున్నాయి. అరణ్యంలో రహస్యంగా ఉన్న ఈశ్వరుడవు నీవేనంటూ మునులబ్బందం లేదా ఋషిపక్షులు చుట్టూ చేరి సేవించడానికి వస్తున్నా(రు)యి. నీవు నల్లని వస్త్రం ధరించడంతో నీలమేఘంలా ఉన్న నిన్ను చూచి నెమళ్లు నాట్యం చేయడం ప్రారంభించాయి. గోపవనిత లెలా ప్రియంతో చూస్తారో అలాగే ఈ ఆడులేళ్ళుకూడా నిన్ను చూస్తున్నాయి. నీవు మా అతిథివి అంటూ కోకిలలు మంచి పలుకులు వినిపిస్తున్నాయి. ఈ వనచరులందరూ నీవు అడవికి రావడంతో ధన్యులయ్యారు కదా!

(పరీభృతములు = ఇతరులచే పెంచబడేవి అని వ్యుత్పత్తి. కోయిలలకు గ్రుడ్లు పెట్టడం తెలుసుకానీ వాటిల్ని పొదగడం తెలీదు. కాకికి తానెన్ని గ్రుడ్లు పెట్టిందో తెలీదు. కోయిల తన గ్రుడ్లు తీసుకెళ్లి, కాకి గ్రుడ్లతో చేరుస్తుంది. కాకి అన్నిట్నీ పొదుగుతుంది. అవి పిల్లలయ్యాక కొన్నాళ్లకు 'కుహూ' అంటూ కోయిల పిల్ల లరుస్తాయి. అప్పుడు కోయిల వెళ్లి వాటిల్ని తెచ్చుకొంటుంది. ఇలా కాకులచే పెంచబడేవి కనుక కోయిలలకు పరభృతాలని పేరు.)

కృష్ణుడు బలరాముడితో అన్నా! ఈనాడు నీ పాదస్పర్శతో చివురుకొమ్మలతో, పచ్చికగుబురులతో ఉండే ఈ నేల పవిత్రమయింది. నీ గోటి తాకిడిచే తీగల, చెట్లగుంపులన్నీ ధన్యత చెందాయి. నీ దయాద్బప్టిచే లేళ్లు, యమునానది మొదలు గోవర్ధనాదిపర్వతాలు, హంస, శుక, పిక, మయురాలు, లేళ్ళు, నెమళ్ళు, కుందేళ్ళు మొదలగు జంతువులు విశిష్ట కాంతిని సంతరించుకున్నాయి. నీ విశాల వక్షఃస్థలం తగులగా గోపకాంతల పుట్టుక సఫలమయింది. ఇలా అంటూ ఆ అడవిలో తన గొల్ల చెలికాండ్రూ, తానూ పసులను మేపుకుంటూ, పద్మాక్షుడైన శ్రీకృష్ణుడు సెలయేళ్ళల్లో, కొండల్లో విహరించాడు.

అలా ఆ వనంలో విహరిస్తున్న కృష్ణుడు పూదేనెను తాగి మత్తెక్కిన తుమ్మెదలు జుమ్మని శబ్దం చేస్తూ ఉంటే తనూ జుమ్మని ధ్వని చేస్తున్నాడు. రాజహంసల కేంకారాలతో సమానంగా అతడూ కేంకారాలు చేస్తున్నాడు. నెమళ్లు నాట్యం చేస్తుండగా తానూ పద్మాల్లాంటి చేతులు తిప్పుతూ నాట్యం చేస్తున్నాడు. అడవి ఏనుగుల నడకలతో సమానంగా తానూ గజగమనుడవుతున్నాడు. క్రౌంచ, చక్రవాక పక్షులు కూస్తుంటే అలాగే తానూ పలుకుతున్నాడు. పులులు, సింహాలు తిరిగే చోట తానూ లేళ్ళలో కలిసి పరిగెడుతున్నాడు.

శ్రీకృష్ణుడు అరణ్యంలో దూరంగా మేస్తున్న ఆవుల నుద్దేశించి, వాటికి గల అందమైన పేర్లతో, మేఘ గంభీర స్వరంతో, గొల్లవారంతా తనను కొనియాడుతూ ఉంటే రా! రమ్ము! అంటూ గోవుల్ని పిలుస్తున్నాడు.

(తెలుగువారు గో మహాలక్ష్మి అంటూ పూజించటం సంప్రదాయం. అలాగే పిల్లలకు కూడా భగవంతుని పేర్లు పెట్టడం, గోవులకు పేరుపెట్టుకోవడం, ఆ పేర్లతో వాటిల్ని పిలవడం పూర్వాచారం.)

ఓ రాజా! అరణ్యంలో తిరగడంతో అలసిపోయి ఆ గోపాలకులతొడలపై పడుకునేవాడైన, అన్న బలరాముణ్ణి కృష్ణుడు గౌరవంగా కాళ్ళు, చేతులు ఒత్తుతూ సంతోషింప జేస్తున్నాడు.

బలరామకృష్ణులు ఇద్దరూ ఒకచోట ఉండి, గోపాలకులు పాడుతూ ఆటలు ఆడుతూ ఒకరినొకరు తోసుకుంటూ, ఒకరిపై మరొకరు చేతులేసుకుంటూ ఉంటే తామూ వారితో కలిసి ఆడుకుంటున్నారు.

ఉపనిషత్ప్రతిపాద్యుడుగా తిరిగే నేర్పరి అరణ్యంలో తిరుగుతున్నాడు. ఆదిశేషుడు శయనంగా పవళించే స్వామి చిగురుటాకుల పక్కపై పడుకుంటున్నాడు. గొప్ప గొప్ప యోగివరులైన వారిహృదయాలలో సంచరించే ప్రభువు కొండ గుహలలో తిరుగాడుతున్నాడు. లక్ష్మీదేవితో సరస క్రీడలాడి అలసిసౌలసే శృంగారి గొల్లవాండ్రతో ఆడి అలసిపోతున్నాడు. చతుర్దశభువనాధారుడైన ధీరుడు అలసి చెట్ల నీడను ఆశ్రయిస్తున్నాడు. యజ్ఞంలో హవిర్భాగాన్ని ఆహారంగా స్వీకరించే యాగపురుషుడు అడవిలో దొరికే పండ్లను భుజిస్తున్నాడు.

కృష్ణుడు అడవిలో అలా గోపాలురతో పశువుల్ని కాస్తున్న సమయంలో అలసి ఉంటే కొందరు గోపాలురు అతణ్ణి తమ వీపు మీద ఎక్కించుకుని పోతారు. బడలికతో నిద్రపోదామనుకుంటే మరికొందరు ప్రేమతో తమ తొడలనే పాన్పులుగా చేస్తారు. చెమట పట్టినట్లైతే సంతోషంతో చివురాకులతో విసరుతారు. దూరంగా వెళ్ళీ నిల్చుంటే మిక్కిలి బంధుత్వంతో, స్నేహంతో, కొందరు పాదాలు పిసుకుతారు. ఇలా గోపాలకులు వాళ్ల పూర్వజన్మ లెన్నింటిలోనో చేసిన పాపాలన్నీ నశించిపోయేలా శ్రీకృష్ణునికి పరిపరివిధాల సేవలు చేస్తున్నారు.

ఇలా గోపాలురందరూ శ్రీకృష్ణునికి పలు పలు విధాల సేవలుచేస్తూ తమ జన్మలను పునీతం చేసుకుంటున్న సమయంలో శ్రీదాముడనే పేరు గల ఒక గోపాలకుడు బలరామకృష్ణులతో ఇలా అన్నాడు.

గార్థభాకారుండైన ధేనుకాసురుని బలభద్రుండు వధించుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

Lord Brahma's prayers to Krishna - శ్రీకృష్ణమూర్తిని బ్రహ్మస్తుతించుట

శ్రీకృష్ణమూర్తిని బ్రహ్మస్తుతించుట

శ్రీ కృష్ణుని మహిమను గుర్తించి, అతణ్ణి సర్వేశ్వరుడుగా దర్శించి, చేతులు జోడించి నమస్కరిస్తూ బ్రహ్మ ఇలా స్తోత్రం చేస్తున్నాడు.

ఓ పద్మాక్షా! నీవు మెరుపుతీగతోకూడిన నీలమేఘంవంటి శరీరం కలవాడవు. మెరుస్తున్న ఉత్తరీయం కలవాడవు, చేతిలో మృదువైన చల్ది ముద్ద, బెత్తం, బూరకొమ్ము, పిల్లనగ్రోవి, లాంఛనాలతో ప్రకాశించే వాడవు. గురివెంద గింజలతో చేసిన కర్ణాభరణాలతో, శిరస్సు చుట్టూ నెమలి పింఛంతో కూడినవాడవు. అడవిపూలమాలతో అలంకరించిన కంఠంతో, పద్మంలా మెత్తని పాదాలతో ఒప్పేవాడివి. దయపొంగి ప్రవహించేలా కడకన్నులతో చూచేవాడివి, గొల్లపిల్లవాడిలా ఒప్పేవాడివి, సృష్టి చేయడం కోసం నీ నాభికమలంలో నన్ను పుట్టించినవాడివి, అట్టి నిన్ను నమస్కరించి సేవిస్తాను.

ఓ పరమాత్మా! నన్ను మన్నించావు. నీ వాళ్లైన గోపాలురకు ఎంతో ఆనందం కలిగించావు. అట్టి ఈ చిన్నికృష్ణుని రూపం నా మనస్సులో ఆలోచించడానికి కూడా సాధ్యం కావడం లేదు. ప్రకాశవంతమైన నీ విరాడ్రూపం తెలియడానికి ఎవడు సమర్థుడు? కేవల మోక్షదాయకమై, పరమాత్మకు సంబంధించిన విజ్ఞానంతో తెలియదగినట్టి పరబ్రహ్మ స్వరూపమైన నీ విభవంయొక్క తీరు ఎటువంటిదో!

ఓ దేవా! నీకు పరాజయం లేదు. అయినా ఎవరైతే తమ స్థానమందున్న వారై సత్పురుషులచే గానంచేయబడి, తమ చెవిన పడిన నీ గాథను మనోవాక్కాయాలతో సత్కరిస్తూ జీవిస్తారో వారు బహుశః నిన్ను జయిస్తారు, నిన్ను పొందుతారు. నీ అనుగ్రహమే నిన్ను తెలుసుకొనే మార్గం. వాళ్ళకది తెలియదు. అట్టి నీ అనుగ్రహం కలిగినప్పుడు ఏమీ తెలియని వాళ్లుకూడా ఎవరిచేతా జయింపబడని నిన్ను జయిస్తారు. అంటే వారికి నీవు అధీనుడవవుతావు.

భక్తి మార్గంలో భగవంతుణ్ణి సేవించిన వారికి అన్ని శుభాలు కలుగుతాయి. అంతే కాని కేవలం జ్ఞానం పొందడానికే తపస్సు చేయడం నిరుపయోగం. అది ఎలాంటిదంటే బియ్యంపైన ఉండే పొల్లు అనబడే ఊక ఎంత ఉన్నా సరే దానివల్ల రాబడి ఉంటుందా, ప్రయోజనం ఉంటుందా! (ఉండదు.)

ఓ ప్రభూ! నీ స్వరూపాన్ని తత్త్వాన్ని తెలుసుకొన గోరే సజ్జనులు మొదట తమ కోరికలన్నింటినీ నీయందే అర్పించి, తాము చేసిన సత్కర్మలచే లభించిన భక్తివల్ల నీకు సంబంధించిన పవిత్ర గాథలను వింటూ, నీ వుండే నీ ప్రధాన స్థానాన్ని చేరుకో గలిగారు.

(సూర్యుడు గాని, చంద్రుడుగాని, అగ్నిగాని ఏ స్థానాన్ని ప్రకాశింపజేయలేరో, దేన్ని పొందితే జీవులు మరల తిరిగి రారో, అదే నాయొక్క శ్రేష్ఠమైన స్థానం, అని భగవద్గీత పురుషోత్తమప్రాప్తియోగంలో (15 అధ్యా. 6 శ్లో) గీతాచార్యుడు వివరించాడు. అదే పరమపురుషుని మొదలిటెంకి. అనన్య భక్తితో సేవించిన భక్తులు ఆ స్థానాన్ని పొందుతారు.)

ఓ స్వామీ! నీ త్రిగుణరహితమైన సచ్చిదానందపరబ్రహ్మస్వరూపాన్ని, వికారాలు లేకుండా, ఒకే రీతిగా ఉండి, విషయానుభవం లేక, స్వరూపానుసంధానవృత్తిరూపంగా, అఖండాకారమై, సర్వోత్కృష్టమై అపరోక్షంగా ఒప్పే అనుభవ జ్ఞానం కలిగినదై, బాహ్యమార్గాలలో వ్యాపించక, స్థిరంగా రాగద్వేషాలు లేని ఇంద్రియాలచేత అతి కష్టంగా తెలుసుకోవచ్చుగాని, త్రిగుణాత్మక, సత్త్వరజస్తమోరూప త్రిగుణ విలాసాత్మకమైన స్థావర జంగమాది ప్రపంచ స్వరూపాన్ని నీవు వహించినప్పుడు నీ గుణాలు హద్దులేనివిగా కనబడతాయి. కాబట్టి నీ స్వరూప స్వభావాలు తెలుసుకోవడం దుర్లభం.

ఇంతటివాడు, అంతటివాడు, అని లెక్కింపరాని మహిమగల ఓ శ్రీకృష్ణా! పండితులు, జ్ఞానులు ఎంతో కష్టపడైనా నక్షత్రాల, మంచు తుంపరల, నేలమీది దుమ్మురేణువుల సంఖ్యనైనా లెక్కింపగలరు గాని, భూభారాన్ని అణచి వేయడానికి సమర్థుడవగు నీ అనంత కల్యాణగుణాలనుమాత్రం లెక్కపెట్ట సమర్థులు కారు.

ఓ స్వామీ! ఆ శ్రీహరికెప్పుడు నాయందు దయకల్గుతుందో, నేనెప్పుడు ఆ స్వామిని దర్శించగలుగుతానో, అంటూ భక్తవరేణ్యుడు తన వ్యాపారాలన్నింటినీ నీయందే చేర్చి, తన పూర్వ ఆగామి, సంచిత, ప్రారబ్ధ కర్మలన్నింటినీ మొదలంటు నశింపజేస్తూ నీ దయకు పాత్రుడ్రై, మనోవాకాయకర్మలతో నీ సేవను ఏమరకుండా ఉన్న విజ్ఞానవంతుడైన వాడే పరమపద అధినాథునికి సంబంధించిన మోక్షలక్ష్మిని పొందగలడు. అటువంటివాడు తప్ప ఇతరులు మోక్షలక్ష్మిని పొందటం శక్యం కాదు.

యోగీశ్వరుల, పాటలతో, స్తుతి వాక్కులతో స్తుతింపబడే ఓ స్వామీ! ఎవరు కపటంగా ప్రవర్తిస్తారో వాళ్ళను నీ మాయలో పడేలా చేసే నేర్పరివి - నీవు. అటువంటి నిన్ను నేను నా మాయతో కలత పెట్టి, నీ మాహాత్యం ఎంతటిదో చూద్దామంటూ చేయరాని నేరం చేశాను. ఏ కార్చిచ్చు నుండి పుట్టిన చిన్న అగ్నిజ్వాల ఆ కార్చిచ్చును మించేలా ప్రకాశింప గలదా! నీ మహిమ కార్చిచ్చు ప్రకాశం అంతటిది. నా మాయ అందులో పుట్టిన ఓ చిన్న అగ్నికీల వంటిది. కాబట్టి ప్రభూ! నా పట్ల దయచూపి, నన్ను కాపాడు.

ఓ సర్వాత్మకా! నీ వల్ల ఏర్పడే సత్త్వరజస్తమోగుణాలలో ఒకటైన రజోగుణంనుండి పుట్టినవాడిని. విజ్ఞానం ఏమీ లేనివాడను. ఇట్టి వాడనైన నేను ప్రభువునంటూ వెర్రి అహంకారంతో గర్వించి, దానివల్ల గుడ్డివాడనైనాను. నన్ను దయతో అనుగ్రహించు. అవ్యక్తం, మహత్తు, అహంకారం, ఆకాశం, గాలి, నిప్పు, నీరు, భూమి అనే ఈ ఎనిమిది ఆవరణాలచేత నిండిన బ్రహ్మాండభాండంలో, ఏడుజేనలశరీరంతో కూడివున్న నేనెక్కడ? ఎవరికీ లెక్కింప అలవికానన్ని ఇలాంటి బ్రహ్మాండాలు ఎన్నింటినో నిత్యం ఒకదానివెంట ఒకటిగా నీ శరీరంలోని రోమకుపాలలో పరమాణువులుగా ధరిస్తూ ఉన్న నీ వెక్కడ? నేనెక్కడ? ఎక్కడిక్కడి పోలిక?

ఓ ప్రభూ! లోకంలో తల్లి తన గర్భంలోని శిశువు కాలితో తంతూ ఉంటే కోపంతో మండిపడి, ఆ బిడ్డను కొడుతుందా? కొట్టనే కొట్టదు. స్థుల, సూక్ష్మరూపాలై, కార్య, కారణ సంబంధంతో అణగి ఉండే ఈ సకల ప్రపంచం నీ కడుపులో ఉన్నదే కదా! అటువంటప్పుడు ఆ నీ కడుపులో ఉన్న నేను నీ బిడ్డడినే! తన్నిన పిల్లవాడిని తల్లి ఎలాగైతే కోపగించి దండించదో, అలాగే తప్పుచేసిన నన్ను నీ పిల్లవాణ్ణి కాబట్టి దండింపతగదు.

మహాప్రళయ సమయంలో ఆ సముద్రజలం నడుమ నిద్రిస్తూ ఉన్న నారాయణునిబొడ్దుతామర నుండి బ్రహ్మదేవుడు పుట్టినాడు అనే మాట సత్యం. నేను పుట్టినప్పుడే నాతోపాటు నా ఓటమికూడా పుట్టింది.

ఓ కమలనేత్రా! నీవు త్రిమూర్తులకు మూలపురుషుడవైన ఆదినారాయణుడవు. జలానికి, నరసముదాయానికి 'నారము' అని పేరు. నారములలో నీవు ఉండడంవల్ల, నీయందు అవి ఉండడంవల్ల నీకు నారాయణుడనే పేరు ఏర్పడింది. సమస్త ప్రాణకోటికీ సాక్షీభూతుడవు. సర్వానికి ప్రభుడవు. సముద్రంలో మఱ్ఱాకుపై నిద్రించే నారాయణుడవు. అదే నీ నిజరూపం అనడానికి వీలులేదు. నేను పూర్వం తామరతూడుద్వారా నడచి, ఎంతో ప్రయత్నంతో వంద సంవత్సరాలు వెదికాను. కానీ నిన్ను చూడలేక పోయాను. ఒకచోట ఉండే వాడవుకావు. అనేక రూపకాంతులతో ప్రకాశిస్తూఉంటావు. జగత్తులో నీ వుంటావు. నీలో జగాలుంటాయి. ఇది చాలా ఆశ్చర్యం. నీ మాయవల్ల ఎలాగైనా అవగలవు, ఉండగలవు.

ఓ ప్రభూ! బయట ప్రత్యక్షంగా కనబడే ఈ జగత్తంతా నీ మాయకాక నిజమే అయినట్లయితే యశోద కనులారా నీ కడుపులో ఈ విశ్వాన్ని ఎలా చూచింది? చూచిందే అనుకో, మళ్లీ ఏనాడైనా అది అలా చూడగలిగిందా? నీ కడగంటి చూపుతో ఈ ప్రపంచమంతా నీ లోపలా ఉంటుంది, నీ బయటా ఉంటుంది. అలా కాకుంటే ఆ రెండిటికంటే వేరైందవుతుంది.

ప్రభూ! మొదట ఒక్కడుగానే ఉన్నావు. గోపబాలురలో, దూడలలో వెలుగొందావు. అనంతరం, అందరిచేతా నమస్కారాలు స్వీకరిస్తున్న నాలుగుభుజాల విష్ణువురూపాల్లో కనిపించావు. ఆపై బ్రహ్మాండాలన్నీ చూపించావు. అలా ఇష్టం లేక మళ్ళీ ఈ కృష్ణుడుగా ఒక్కడవై కనిపిస్తున్నావు. ఇన్నాళ్ళకు ఈ రకమైన నీ లీలావిశేషాలన్నీ చూశాను కదా!

స్వామీ! నీవు ప్రకృతితో కూడిన మాయతో కలిసి లోకాన్ని సృష్టించడంలో నా వలె, రక్షించడంలో విష్ణువైన నీ వలె, లయం చేయడంలో శివునివలె నిన్ను తెలియని ఆ అజ్ఞానులకు కనబడతావు.

నీవు దుర్మార్గులను శిక్షించడానికీ, సజ్జనులను ప్రేమతో రక్షించడానికీ, జలచరాలుగా, మృగాలుగా, బ్రాహ్మణులుగా, సాధారణమానవులుగా ఎన్నో అవతారాలు ధరించావు. నీ మార్గాలు ఈ విధంగా ఉంటాయని ఊహించడం సాధ్యం కాదు. నీ వలెనే నీ మార్గాలుకూడా అంతం లేనివి.

దేవ దేవా! యోగమాయచే లోకాన్ని అజ్ఞాన ఆవరణం అనే చీకటిలో ముంచి నిద్రిస్తూ ఉంటావు. ఓ పరబ్రహ్మరూపా! యోగులలో శ్రేష్ఠుడా! నీ లీలలు ఎలా ఉంటాయి! ఎన్ని? వాటిపరిమాణమెంత? ఏ సమయాలలో, ఎక్కడ ప్రదర్శిస్తావో అనే విషయాలు ఎవరికి తెలుసు? (ఎవరికీ తెలియదు.)

స్వామీ! నీ అసలు రూపం ఇదే అనడానికి వీలు కాదు. ఈ జగత్తంతా కలవంటిది. ఎన్నోరకాల దుఃఖాలతో నిండి ఉంటుంది. అజ్ఞానంలో మునిగి ఉంటుంది. నీ వైతే నిత్య స్వరూపుడవై, అంతం లేనివాడవై వర్తిస్తూ, ప్రకృతి రూపమాయవల్ల పుట్టినట్లు, జీవిస్తున్నట్లు, నశిస్తున్నట్లు ఉంటావు. నీవు ఒక్కడివే ఇతర ఉపాధులు లేనివాడవు. అంతటికీ ఆద్యుడవూ నీవే. నీవు మృతిలేనివాడవు, శాశ్వతుడవు, నీకు సాటియైన రెండవవాడు లేని అద్వయుడవు, స్వయం ప్రకాశకుడవు, ప్రాచీనులలో ప్రాచీనుడవైన మొట్టమొదటి పురుషుడవు, సంపూర్ణమైన సుఖానికి అనంత ఆనందానికి నిధివి, నిత్య సత్య స్వరూపుడవు, ఇటువంటి నిన్ను ఇట్టి వాడని ఊహించడం శక్యమా! శక్యంకాదు.

దేవా! సకల ప్రాణులలో ఆత్మస్వరూపుడవై ఉన్నావు. ఎవరైతే గురువు అనే సూర్యునినుండి వేదాంతజ్ఞానమనే దివ్యనేత్రాన్ని సంపాదించి నిన్ను తన ఆత్మ స్వరూపునిగా దర్శిస్తారో వారు సంసారమనే మిథ్యాసముద్రాన్ని తరించిన వారవుతారు. మానవుడు తన స్వరూపాన్ని యథాతథంగా తెలియక పోవడంచేతనే తాడునందు పాము కనబడినట్లుగా, ఈ ప్రపంచమంతా ఉన్నట్లు కనపడుతుంది. జ్ఞానం పొందినవానికి తాడునందు పాము అనే భావం పోయినట్లే ఆత్మ పరమాత్మల ఐక్యం తెలుస్తుంది. సంసారబంధం, మోక్షం, అనేవి రెండూ ప్రసిద్దాలే కాని అవి అజ్ఞానంవల్ల కలిగిన నామాలుమాత్రమే! ఆత్మ నిత్యజ్ఞానస్వరూపమే, రెండవది లేనిది, ప్రకృతికి అతీతమైంది అనే ఆలోచనతో ఆత్మతత్త్వాన్ని విచారిస్తే పరిశీలిస్తే సూర్యునియందు రాత్రింబవళ్ళు లేనట్లే, ఈ బంధమోక్షాలు వేరుగా లేనే లేవు. అజ్ఞానులైన జనులు ఆత్మరూపుడవగు నిన్ను ఇతరునిగాను, ఆత్మకాని దేహాదులను అత్మగాను తలచి, ఆత్మరూపుడవగు నిన్ను తమకంటే బయటే వెదకుతూ ఉంటారు. వారిఅజ్ఞానం ఎంతటిదో కదా! విజ్ఞానులు తమ తమ దేహాలలోనే సచ్చిదానందస్వరూపుడవైన నిన్ను వెదకి తెలుసుకొని నిరతిశయానందంలో ఓలలాడుతూ ఉంటారు. కాబట్టి

ఓ ప్రభూ! నీ మహామహిమను ఊహించాలంటే, నీ పాదములనుండి అనుగ్రహించబడిన ధూళికణంవలనమాత్రమే సాధ్యం కాని, లేకపోతే ఎవరికి సాధ్యం? నీ వారుగా జీవించగల ధన్యులలో నేను ఒకడనుగా ఉండి నిన్ను సేవించుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించు. ఈశ్వరా! ఈ జన్మలో కాకపోతే మరో జన్మలోనైనా సరే ఆ మహాభాగ్యం నాకు ప్రసాదించు.

దయాసముద్రుడవైన ఓ స్వామీ! శతాధికయజ్ఞాలలోని హవిర్భాగంతో నిండినకదుపు నీది. అట్టి నీవు ఇలా దూడలుగా, గోపబాలకులుగా రూపొంది, గోపస్త్రీల స్తన్యాన్ని పానంచేస్తూ, చొక్కుతూ, ఆడుతూ, ఉల్లాసంగా తిరుగుతూ ఉంటే, ఆ దూడలకూ, బాలురకూ తల్లులైన ఆ గోపవనితల ధన్యత ఇట్టిదని చెప్పడానికి నేను సమర్థుడనా స్వామీ! (సమర్థుడను కాను.)

సర్వవ్యాపకమై, అనాదిలై, ఆనందస్వరూపం అయిన, పరబ్రహ్మస్వరూపుడు చెలికాడుగా పొందిన, నందగోపకులంలో నివసించే ఈ గొల్లవారి అదృష్టం ఆలోచిస్తే ఎంత అరుదో కదా!

పద్మాక్షా! భక్తవరదా! సర్వేశా! పురుషోత్తమా! ఓ స్వామీ! చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు, వాక్కు, హస్తం, పాదం, గుదం, గుహం, మనస్సు, బుద్ధి, అహంకారం అనే పదమూడింద్రియాలకూ వరుసగా దిక్కులు, గాలి, సూర్యుడు, వరుణుడు, అశ్వినులు, అగ్ని, దేవేంద్రుడు, విష్ణువు, మృత్యువు, ప్రజాపతి, చంద్రుడు, చతుర్ముఖబ్రహ్మ, రుద్రుడు అనే పదముగ్గురమూ ఇంద్రియ అధిష్టాన దేవతలము. మేమందరం ఇంద్రియాలనే పానపాత్రలద్వారా నీ పాదకమలం నుండి స్రవించే తేనెను అమృతం తాగినట్లు తాగి, ఒక్కొక్కరం ఒక్కొక్క ఇంద్రియాభిమానులమయినా, ఎంతో ధన్యత పొందిన వారమయ్యాము. అటువంటిది తమ సర్వేంద్రియవ్యాపారాలన్నిటినీ నీమీదే ఉంచి తిరిగే ఈ గొల్లపల్లెలోని గోపాలుర, గోపవనితల గొప్పదైన, ప్రత్యేకతతో నిండిన అదృష్టంగా ఉన్న కలిమిని విచారించి స్తుతించడం ఎవ్వరికీ శక్యంగాదు.

చతుర్వేదాలు సైతం దర్శింపలేని నీ రూపాన్ని ఈ భూలోకంలో, ఈ అడవిలో, గోకులంలో, కృష్ణా! కృష్ణా! అంటూ సంభాషణలు మొదలు సర్వ వ్యాపారాలనూ నీయందే సమర్పించిన ఈ గోపబాలురలో ఏ ఒక్కడి పాదాలకంటిన ధూళి అణువులు నా శరీరాన్ని ముట్టినా చాలును. ఆ బాలురవంటి అదృష్టం లేనప్పుడు ఎందుకు నాకీ బ్రహ్మ పదవి?

శరణాగత సంరక్షకా! కృష్ణా! నీకు కీడు తలపెట్ట వచ్చిన పూతన మొదలగు దుష్టరాక్షసులకు నీదైన పరమపదాన్ని ప్రసాదించావు. అటువంటిది పూతనలా వంచించే స్వభావం లేకుండా, తమ గృహ, దార, పుత్ర గోవులతోడి సర్వసంపదలను నీకు అర్పించి తమ ప్రాణాలనుసైతం నీ వశంలో ఉంచినట్టి ఈ గొల్లవారికి ఎంతటి ఉత్తమస్థానా న్నిస్తావో అని సంశయం కలుగుతోంది.

ఓ పుండరీకాక్షా! భక్తితో నిన్నెంతకాలం స్మరించకుండా కేవలం దేహేంద్రియాభిమానంతో ఎవరుంటారో వారిదేహం చెరసాలే! మోహం ఇనుపసంకెలే! రాగద్వేషాదులు శత్రువ్యూహాలే అవుతాయి.

విశ్వాత్మకుడా! నీ కంటూ నిజంగా ఓ ప్రపంచం అనేది లేదు. నీవు అప్రపంచకుడవు. అయినా నిన్ను భక్తితో సేవించే వారికి ఆనందం అందించాలనుకొని నానావిధలీలలతో ప్రపంచాన్ని సృష్టించి నడిపిస్తుంటావు.

కల్యాణగుణరత్నాకరా! ఇన్ని మాటలు అవసరం లేదు. నీ స్వరూపస్వభావాలను జ్ఞానులైన బ్రహ్మవెత్తలే తెలుసుకొంటారు. అంతే కాని తెలుసుకోవడానికి కేవలం మనస్సు, వాక్కులుమాత్రం చాలవు.

సకలలోకేశా! అన్నీ తెలిసినవాడివి. సమస్తవిషయాలను దర్శించేవాడివి నీవే! లోకానికంతటికీ ప్రభుడవు నీవే! అపరాధినైన నన్ను దయచూడు. నేనింక వెళ్ళివస్తాను.

కృష్ణా! నీవు జయశీలుడివి. రాక్షస సంహారకుడివి. వృశ్ణికులమనే పద్మానికి సూర్యునివంటివాడివి. బ్రాహ్మణులు, దేవతలు, గోవులు, విష్ణుభక్తులనే సముద్రానికి చంద్రునివంటివాడవు. వేదధర్మానికి విరుద్ధమైన కార్యాలు ఆచరించే పాషండుల ఇళ్ళకు కార్చిచ్చువంటివాడివి.

ఓ కృష్ణమూర్తి! ఈ కల్పపర్యంతం నీకు నమస్కరిస్తూనే ఉంటాను అని స్తుతించి, మూడుసార్లు ప్రదక్షిణంచేసి, పాదాలకు మొక్కి సెలవు తీసుకొని బ్రహ్మ తన లోకానికి వెల్లిపోయాడు. బ్రహ్మను అలా గౌరవించిన కృష్ణుడు పూర్వం తమ బాగు చెడి మరలి వచ్చిన దూడలను బాలగోపాలకులను గ్రహించి, వాళ్ళందరీనీ యిసుకదిబ్బదగ్గరకు చేర్చాడు. ఈ విధంగా

గోపబాలురులకు బ్రహ్మ మాయ తొలగుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

Brahma "kidnapping" the cows and gopalas - బ్రహ్మ గోవత్సములను గోపబాలకులను నంతర్ధానంబుసేయుట

బ్రహ్మ గోవత్సములను గోపబాలకులను నంతర్ధానంబుసేయుట

గోపబాలురతో నేను వెళ్ళి దూడలను తీసుకొని వస్తానని పలికి

కృష్ణుడు గోపబాలురతో అలా చెప్పి, దూడలను వెతకడానికై దూరంగా ఉన్న అడవికి ఎంతో వేగంగా వెళ్లాడు. అప్పుడు కృష్ణుడు ఎలా ఉన్నాడంటే; జులపాలు చెవులవరకు వేలాడుతున్నాయి. మెడలో రత్నాలహారపంక్తులు మెరుస్తున్నాయి. చేతిలో వెదురు కర్ర బంగారుకాంతితో ప్రకాశిస్తోంది. శిరస్సుమీద నెమలిఫించం దండలా వుంది. ఎంత ఉత్సాహంతో వెళ్తున్నాడంటే తిందామనుకుని చేతనున్న అన్నం ముద్దను అలాగే పట్టుకున్నాడు. చెయ్యి వికసించిన పద్మంలా ఎర్రగా ప్రకాశిస్తూ వుంటే అన్నంముద్ద తెల్లగా వెలుగుతోంది.

అలా కృష్ణుడు దూడలకోసం అడవిలో దూరంగా వెళ్తున్నవాడై

అడవిదారిలో వెళ్తున్న శ్రీకృష్ణునికి దూడలఅడుగుజాడలు కనబడ్డాయి, వాటిల్ని బట్టి ఇక్కడ గడ్డిమేశాయి, ఇక్కడ నీళ్ళు తాగాయి, ఇక్కడనుండి వెళ్లాయి. ఇక్కడ మందగా నిలిచాయి, ఇక్కడనుండి విడిపోయాయి, దూడలు వెళ్ళిన తోవ ఇదిగో ఇదే ఇదే అంటూ కృష్ణుడు దూడలను వెదకుతూ ముందుకు వెళ్తున్నాడు.

పద్మదళాలవంటి విశాలమైన కళ్ళుగలవాడు కాబట్టే ఏ మాత్రం వెనుకాడకుండా, గడ్డితో ఎంతో ఒత్తుగా పెరిగివున్న చోటా, భయంకరమైన అడవిజంతువులుండే పొదలలోనూ, చెట్లదగ్గరా, కొండప్రాంతాలలోనూ, సరస్సులలోనూ, ఏళ్ళలోనూ, దూడలను వెదికాడు.

ఇలా అంతటా కృష్ణుడు దూడలను వనమంతా వెదకుతూ ఉండగా

అప్పుడు బ్రహ్మ ఇలా అనుకున్నాడు. ఈ శ్రీకృష్ణుడు చూస్తే చిన్నపిల్లవాడు. ఇట్టివాడు అఘాసురుడు దూడలను, గోపబాలురను చంపినప్పుడు ఎలా వాటిని, వాళ్ళను బతికించాడో! భూలోకంలో ఇట్టిది వింతే! అనుకొని వచ్చి ఆ కపట మానవరూపుడైన ఆ శ్రీకృష్ణుని బలం ఎంతటిదో చూడాలనుకుని, అడవిలోకి దూరంగా పోయిన దూడలను, అక్కడ చల్ది కుడుస్తున్న గోపబాలురను ఒకచోట దాచివేశాడు.

అలా అడవిలో దూడలను వెతుకుతున్న కృష్ణుడు, వాటిజాడ తెలియక పోవడంతో దారి తప్పి, తాను గోపాలకులతో చల్ది తిన్న కొలనువద్దకు వచ్చి చూస్తే అక్కడ గోపబాలురూ లేరు. పిలిస్తే ఎవరూ పలుకలేదు. అప్పుడు శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడు కాబట్టి ఆలోచించి, ఇలా దూడలను, గోపాలకులను మాయం చేయడం బ్రహ్మ చేసిన మోసమే అని తెలిసినవాడై అక్కడి నుండి వెళుతూ

శ్రీకృష్ణుడు అనుకుంటున్నాడు - బ్రహ్మకు నన్ను మోసగించే అవసరం లేదు. అయినా, ఇక్కడ దూడలనూ, గొల్ల పిల్లలనూ, నాకు కనబడకుండా మోసపుచ్చాడు. నేను తిరిగి అతణ్ణి మోసపుచ్చడం అదేమంత పనా? అది ఆశ్చర్యం కాదు. మనకెందుకు? లేగలను, గోపబాలురను మరల తీసుకొని రావడానికి బ్రహ్మను వంచించాల్సిన పనేముంది? అనుకొంటూ బ్రహ్మాండాలనే వంచించగల, మరలించగల సామర్థ్యముండే శ్రీకృష్ణుడు విలాసంగా నవ్వుతూ

నేను బృందావనానికి వెళ్ళి, గోపస్త్రీలతో మీ పిల్లలు లేరు, ఏమయ్యారో తెలీదు అంటూ చెప్పడం దేనికి? ఆ గోపబాలుర తల్లిదండ్రులు సంతోషించేలా నేనే గోపబాలురులా, దూడల్లా వాళ్ళ రూపాలతో తిరుగుతూ వుంటాను. ఇలా శ్రీకృష్ణుడు అనుకున్నవాడై

శ్రీకృష్ణుడు పై రీతిగా భావించినవాడై గోపబాలుర, దూడల రూపాలను తానే ధరించాడు. ఆ ధరించడంలో ఏ మాత్రం తేడా లేకుండా, వాళ్లచేతులు, కాళ్ళు, ముఖాలు, నడుములు, వక్షఃస్థలాలు, నాసికలు, నేత్రాలు, చెవులు, మొదలైన శరీరఅవయవాలన్నీ ఆ విధంగానే ఉండేటట్లుగానూ, వాళ్ళచేతికర్రలు, కట్టుకున్నబట్టలు, వేసుకున్న పూలమాలలు, పట్టుకున్న కొమ్ముబూరలు, అలంకారాలు, వయస్సు, మాట్లాడే మాటతీరు, స్వభావాలు, పూర్వం జరిగిన వృత్తాంతాలను చెప్పేతీరు, వారి వారి కున్న ఆసక్తులు, ఎక్కడా మారుపడకుండా, దూడల రూపాలనూ, గొల్ల పిల్లల రూపాలను శ్రీకృష్ణుడే ధరించాడు.

ఈ చరాచరమైన సమస్తజగత్తులో ఉండే రూపాలన్నీ తానే. అట్టి అన్నిరూపాలలో కనిపించే భగవంతుడు ఇలా గోపబాలురుగా, దూడలుగా రూపం పొంది, అతిశయించడంలో ఆశ్చర్యం ఏముంది? అంతేకాదు, ఆలోచించి చూస్తే ఆ సర్వాత్మకునికి ఇతర రూపమేదైనా లోకంలో ఉందా? ఆ పరమాత్మకు మించి అన్యమైన ఏ రూపం లేదు.

ఓ పరీక్షిన్మహారాజా! దూడలను మళ్ళించండి అనేవాడూ, అలా చెప్పగా మళ్ళించే గోపబాలురూ, దాంతో వెనక్కి మళ్ళిన దూడలూ, అన్నీ తానే అయి శ్రీకృష్ణుడు అడవినుండి బృందావనానికి తిరిగి బయలు దేరాడు.

ఈ రీతిగా శ్రీకృష్ణుడు తానే బాలుర, దూడల రూపాలు ధరించి చరిస్తూ, బృందావనం చేరి, ఎవరెవరిపశువుల దొడ్లలో వారి వారికి చెందిన దూడలను - అంతకు ముందు ఎక్కడెక్కడ వుండేవో అక్కడే నిలిపాడు. అలాగే ఆయా బాలుర రూపాలతో వారివారిఇండ్లలో చేరి, పిల్లనగ్రోవులు ఊదగా

ఇలా కృష్ణుడే గోపబాలుర వేషం ధరించి, వేణువు ఊదుతూ ఉంటే ఆ ధ్వనులు ఒక్కసారిగా తమ చెవులకు ఎంతో ఇంపు కావడంతో తల్లులు లేచి, పిల్లలను ఎత్తుకొని, వాళ్ళశిరస్సులను ప్రేమగా మూర్కొని, దగ్గరగా తీసుకోవడంతో, వాళ్ళలోని మాతృత్వం ఒక్కసారిగా పెల్లుబికింది. దాంతో పాలిండ్లు బాగా చేపుకు వచ్చాయి. అమృతంతో సమానంగా ఉండే తమ స్తన్యాన్ని ఎంతో ఉత్సాహంతో తమ తమ పిల్లలు తాగేలా ఇచ్చారు.

అంతే కాకుండా ఆ బాలుర తల్లులు తమ తమ హృదయాలలో ముంపు గొనేలా వచ్చే ఉత్సాహాలతో, తమ తమ బిడ్డలకు నలుగు పిండితో ఒంటికి నలుగు పెట్టారు. చక్కగా స్నానాలు చేయించారు. మంచి గంధం పూశారు. అలంకారాలు తొడిగారు. నుదుట రక్షా తిలకాలుగా కావిరి బొట్లు పెట్టారు. షడ్రసోపేతమైన పదార్థాలతో భోజనాలు పెట్టారు. ఎంతో ఎక్కువగా ఆదరించారు.

ఓ రాజా! కృష్ణుడు ఈ విధంగా వత్సల, బాలకుల రూపాలను పొందక మునుపు అసలైన ఆ పిల్లలు తమ తమ తల్లులకు ఏ విధంగా ఆనందం కలిగించేవారో ఇప్పుడు కూడా ఆ బాలకులు ఆ తల్లులకు అదే రీతిలో ఆనందం కలుగ జేశారు.

ఆవులన్నీ మిక్కిలి సంతోషంతో తమను కట్టివేసిన చోట్లకు పోయి, అంబే అంటూ అరుస్తున్నాయి. హుంకారం చేస్తున్నాయి. దూడలను మూచూస్తూ మూత్రాన్ని విడిచిపెడుతున్నాయి. దూడల్ని నాకుతూ, అందువల్ల ఎడతెగని రీతిగా ఎక్కువగా కారుతున్న పాలను తమ దూడలకు అభిముఖంగా ఉండి దూడలన్నిటికీ ఇచ్చాయి.

గోపికలకూ, గోవులకూ కూడా తమతమ బిడ్డల రూపంలో ఉన్న కృష్ణునిమీద మాతృప్రేమ ఎంతో కలిగింది. అలాగే కృష్ణుడు కూడా వారిని తల్లులంటూ ఎంతో స్వచ్చమైన ప్రేమతో వారిమధ్య మిక్కిలి పసితనంతో ప్రవర్తించాడు.

ఆ గొల్లపల్లెలోని వారందరికీ పూర్వం శ్రీకృష్ణునిమీద తమకు ఎల్లప్పుడూ కొత్త కొత్తగా ప్రీతి కలిగినట్లు, ఇప్పుడు తమ బిడ్డలమీద కూడా అటువంటి ప్రీతి రోజు రోజుకూ అధికం కాసాగింది.

ఈ విధంగా కృష్ణుడు తానే దూడల రూపాన్నీ బాలుర రూపాన్నీ ధరించి, తనను తానే రక్షించుకుంటూ, అటు బృందావనంలోనూ, ఇటు అడవిలోనూ గొప్ప మహిమతో ఓ సంవత్సరం నటించాడు. సంవత్సరానికి ఇంకో అయిదారురోజులు తక్కువయి ఉన్నప్పుడు బలరామునితో కలసి శ్రీకృష్ణుడు అడవికి వెళ్లాడు. బృందావనానికి దగ్గరలో దూడలు మేస్తున్నాయి. అక్కడికి చాలా దూరంలో వున్న గోవర్ధనపర్వతశిఖరంమీద గడ్డి మేస్తున్న ఆవులు ఈ దూడల్నీ చూచి

దూడలను చూచిన ఆ ఆవులు, సంతోషంతో హుంకారం చేస్తూ మూపురాల పై దాకా మెడలు పైకెత్తి చాచుతూ, నాలుగు కాళ్ళూ రెండే అయినట్లు దగ్గరగా చేర్చి దాటుతూ, ముఖాలను పొడవైన తోకలను పైకెత్తి పరిగెత్తి వచ్చి దూడలను మింగేస్తాయా అన్నట్లు మూతులతో నాకుతూ తమపాలు తాగించాయి.

అలా ఎప్పుడైతే ఒక్కసారిగా దూకుతూ అవులు వెళ్లాయో, వాటిల్ని మేపుతున్న గొల్లవారు వాటిల్ని అడ్డగించడానికి శక్యం కాకపోవడంతో, కోపంతో కూడి ఎంతో లజ్జించినవారై చొర శక్యంకాని వాటిమార్గంలో తామూ శీఘ్రంగా వాటి వెంటే వచ్చి అక్కడ దూడలను మేపుతున్న తమ పిల్లలను చూచి

అలా తమ బిడ్డలను చూచిన ఆ గోపకులు మా కన్నతండ్రులను చూశామంటూ దగ్గరకు వచ్చి గగుర్పాటు పొందారు. బిడ్డలను ఎత్తుకొంటూ, ఆనందిస్తూ, కౌగిలించుకున్నారు. మనస్సులు నిండిన ఆనందంతో ఆ బిడ్డల శిరస్సులను ఆఘ్రాణించి, ముద్దుచేశారు. ఆ గోపకులు ఎంతగానో ఉప్పొంగి పోయారు. నిలకడ అయిన వారిసంతోషం ఆ దేవుడికే తెలియాలి.

ఈ రీతిగా పిల్లలను దగ్గరగా తీసుకొని కౌగిలించుకొని ఆనందబాష్పాలు నిండిన కనులతో గోపకులు తమ గోవులను మళ్ళించుకొని పోగా, వాళ్ళను చూచి బలరాముడు ఇలా అనుకున్నాడు.

బలరాముడు ఈ సన్నివేశాన్ని చూచి, ఇలా భావిస్తున్నాడు. స్తన్యపానం విడిచిన వయస్సుగల ఈ పిల్లల పైనా, దూడలమీదా గోపాలకులకూ, గోవులకూ ఇంతటి ప్రేమ ఏ కారణంగా పుట్టింది? ఇదివరకు కృష్ణునిపై ఎంత మమకారంతో ఉండేవారో, ఇప్పుడు తమబిడ్డలపై ఆ విధమైన ప్రేమనే చూపుతున్నారు. నాకుకూడా ఈ పిల్లలను, దూడలను చూస్తూవుంటే కృష్ణుణ్ణి చూచినట్లే ప్రేమ కలుగుతోంది. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంతకు ముందు ఇటువంటిది ఎన్నడూ ఎరుగను. ఒక వేళ ఇది మానవుల, లేక దేవతల, లేదా రాక్షసుల మాయ అయి ఉంటుందా? లేకుంటే నా స్వామి అయిన ఆ విష్ణుమూర్తిమాయేనా! ఇతరులు కల్పించే మాయ అయితే నన్ను ఈ విధంగా కలవరపెట్టదు. ఇది నిజంగా విష్ణుమాయే కావచ్చు.

ఓ రాజా! బలరాముడు మొదట సామాన్యబుద్ధితో ఏమీ తెలియనట్లు ఆలోచించి, తరువాత జ్ఞానదృష్టితో చూశాడు. ఇంకేముంది! అసలు విషయం బయటపడింది. ఇలా తనతో ఉండే గొల్లపిల్లలూ, దూడలూ కూడా శ్రీకృష్ణునిరూపాలే అని తెలుసుకొన్నాడు.

యోగద్భష్టితో బలరాముడు బాలురను, దూడలను కృష్ణుని రూపాలుగానే తెలుసుకొనికూడా కంగారుపడుతూ, కృష్ణుణ్ణి చూచి ఇలా అడిగాడు. 'మహానుభావా! ఇంతకుముందు ఈ దూడలన్నీ మహర్షుల అంశలతో పుట్టినవనీ, సంశయం లేకుండా గోపాలకులందరూ దేవతల అంశలతో జన్మించినవారనీ అనిపించేది. ఇపుడు బాలుర, దూడల సమూహాలు అన్నీ నీవే అనిపిస్తోంది. ఏమిటిదంతా?' అని అడిగిన అన్న బలరామునితో కృష్ణుడు ఎంతో గౌరవంగా అసలు విషయాన్ని తెలియజేశాడు. బలరాముడికి విషయం అంతా అర్ధమయింది. ఇలా శ్రీకృష్ణుడు దూడల రూపమూ, బాలుర రూపమూ తానే అయి వ్యవహరించిన సంవత్సర కాలం బ్రహ్మదేవునికి తన కాలమాన ప్రకారం ఒక క్షణంమాత్రమే కాగా, బ్రహ్మ అచటికి వచ్చి, దూడల, గోపబాలుర రూపుడైన బాలకృష్ణుణ్ణి చూచి, నివ్వెరపోయి తనలో ఇలా ఆలోచించాడు.

ఈ గొల్లపల్లెలో ఉండే దూడలూ, గోపబాలురూ కూడా నా మాయాగుహలో నిద్రపోతున్నారు. ఎక్కడికీ వెళ్లరు. ఇప్పుడే లేవరు. అలాంటప్పుడు వీళ్లను వేరుగా సృష్టించడానికి నాకంటే వేరే ఇతరబ్రహ్మలు ఎవరూ లేరు. మరి ఈ బాలురు, దూడలు ఎవరో, ఎక్కడనుండి వచ్చారో, కృష్ణునితో కలిసి తిరుగుతున్నారు. ఆలోచిస్తే భూలోకంలో నేటికి సంవత్సరం అయింది - నేను వీళ్ళను మాయం చేసి. ఇలా అనుకుంటున్నాడు - బ్రహ్మ

ఏ లోకంలో నైనా ప్రాణికోటి బ్రహ్మ సృష్టిస్తేనే పుడుతుంది. బ్రహ్మ అనేవాణ్ణి నేనొక్కణ్ణే గాని సృష్టికర్తగా మరో బ్రహ్మ లేడు. బ్రహ్మగా వీళ్ళను నేను సృష్టించాను. మరి వేరే ఈ బాలుర, దూడల సమూహం ఏ బ్రహ్మ సృష్టిస్తే ఏర్పడింది? విచారించి చూస్తే ఇందరిలో ఒక్కడుగా ఉన్న పరబ్రహ్మే ఇలా రూపొందించాడేమో ననిపిస్తుంది.

అన్ని విషయాలను సులభంగా తెలుసుకోగల నేర్పరియైన ఆ పితామహుడు, జ్ఞానవృద్దుడు. అయిన బ్రహ్మ ఆశ్చర్యపడి వెంటనే ఎంతో సేపు విచారించి ముందు చేయవలసిన కార్యం తెలియక పోవడంతో ఆందోళనపడుతూ,

ఏ రకమైన భ్రమ లేకుండా, జగత్తులన్నిటినీ మోహింపజేయగల విష్ణువును మాయలోపడేటట్లు చేద్దామనుకొని, బ్రహ్మ భ్రమతో తానే మోహంలో పడ్డాడు.

మిణుగురు పురుగుల కాంతి పగటివేళ అణగిపోతుందే కాని ప్రకాశించదు. రాత్రివేళ మంచు చీకట్లో కలిసిపోయి మాయమవుతుంది. విష్ణువు మాయకు పుట్టినిల్లు అటువంటి విష్ణువుపై ఇతరుల మాయలు పనిచేస్తాయా? ఆ మాయలు పన్నిన దొరల గౌరవాన్ని అవి చెడగొట్టేస్తాయేగాని పనిచేయవు.

అంతే కాకుండా, ఇంకా

విష్ణుదేవుని నాభికమలంనుండి ఏనాడో పుట్టాను, మంచిజ్ఞానం పొందాను, లోకాలను సృష్టించాను, వయసా? సగం గడచిపోయింది. కానీ భూలోకంలో ఇట్టి నూతనసృష్టులు, ఇటువంటి మాయాచేష్టలు పుట్టడం ఆశ్చర్యం! నాముందే ఇలాంటి మాయలా?

సకలవిద్యాస్వరూపిణి అయిన వాణి తన ముఖంలో ఉందనే గర్వంతో ఉన్న మాయావి అయిన ఆ చతుర్ముఖ బ్రహ్మ తన మనస్సులో పరిపరివిధాల తర్కించి ఆలోచిస్తున్న సమయంలో, అతనికి ఆ గోపబాలురు ఇలా కనబడ్డారు. నీల మేఘశ్యాముడైన ఆ విష్ణుస్వరూపంగానే వీళ్ళూ ఉన్నారు. హారాలతో, మకరకుండలాలతో, స్వర్ణకటకాలు, కంకణాలు, బంగారు మొలతాళ్ళతో, శిరస్సునుండి పాదాలవరకున్న తులసిమాలలతో; చక్కని ఉంగరాలతో, శంఖం, చక్రం, గద, పద్మంతో కూడినచేతులతో, నాలుగుభుజాలతో, పచ్చని పట్టువస్త్రాలతో, వెన్నెలవంటి స్వచ్చమైన నవ్వులతో, దయా స్వభావంగల చూపులతో, కోటిసూర్యుల తేజస్సుతో, అంతం లేని సత్య, జ్ఞాన, ఆనంద రూపాలతో, అణిమాదిగుణాలతో, జాతిభేదం లేనివారై ; శ్రీమహావిష్ణుస్వరూపంతో సమానమైన దేహంతో కూడినవారుగా వారున్నారు. అంతే కాదు, వారు తమకు అధీనం అయిన ఆట పాట మొదలైన సేవాకార్యక్రమాలలో చేరి, ప్రవర్తిస్తున్న ఆకారం పొందిన బ్రహ్మ మొదలు సకల జంగమ స్థావరరూపాలు, అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం అనే అప్టసిద్దులు, పరాశక్తితోపాటు ఆది, జ్ఞాన, ఇచ్చా, క్రియాశక్తులు, మహత్తు, బుద్ధి, మనస్సు, అహంకారంతోపాటు పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచతన్మాత్రలు, ఇలా ఇరవైనాలుగుతత్త్వాలు, సత్త్వరజస్తమోగుణాలు, కలత, కాలం, దానిమార్పు, కారణం, సంస్కారం, కామం, కర్మలు అనే గుణాలు, ఇలా ఇవన్నీ సేవిస్తూ ఉండగా, వేద వేదాంతవిజ్ఞానపరులైన బ్రహ్మవేత్తలకు కూడా తెలియరానివిధంగా ప్రకాశిస్తూ బ్రహ్మకు కనబడ్డారు. వారిని చూస్తూ స్వయంభువుడైన బ్రహ్మదేవునికి గోపబాలురు, గోవులు అన్నీ ఏకకాలంలో పరబ్రహ్మరూపులుగా కనబడగా చూచి

“నా చేష్టకు లోబడక తప్పించుకున్న బాలురను ముందునుంచీ చూస్తూనే ఉన్నాను. వారు చూడగా చూడగా గొప్ప తేజస్సుతో కనబడుతున్నారు. ఆ తేజస్సు మహాప్రవాహంలాగా చూపులతోనైనా సమీపించడానికి వీలు కాకుండా ఉంది. వారి వర్చస్సు చూడటానికి నా చూపులకు శక్తి చాలడంలేదు. దీని కంతటికీ మూలకారణ మేమిటి? ఇప్పుడు నే నేమిటి చేయడం? ఆహా! సృష్టికర్త అయిన బ్రహ్మకే మోసం వచ్చింది గదా!”

ఇలా అనుకున్న వాడైన బ్రహ్మకు ఆ బాలురరూపాలు మనస్సుతో పాటు పంచజ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలకు భరింప శక్యంకాకపోవడంతో చేష్టలు దక్కి బాగా అలసిపోయినవాడై

సర్వేశ్వరుడైన ఏ భగవంతునితేజస్సుచే ఈ జంగమ స్థావర రూపమైన సకల జగత్తు ప్రకాశిస్తోందో, అట్టి పరమాత్మ స్వరూపుడైన శ్రీకృష్ణుని తేజస్సును చూడడానికి సమర్థుడుకాక, సర్వేంద్రియాలశక్తి క్షీణించి, పారవశ్యంతో బ్రహ్మ నిశ్చేష్టుడై నిలచాడు. అప్పుడతడెలా ఉన్నాడంటే, ఒక చిత్తరువులో వేసినచిత్రం ఎలాగైతే చలనం లేకుండా ఉంటుందో అలా ఉన్నాడు.

అవ్యక్త రూపమైన మాయకు లోబడనివాడును, ఉపనిషదర్థవిచారంచేసే విజ్ఞానంచేతకూడా పొంద శక్యం కానివాడును, తనంతట తానే వెలిగే వెలుగుతో అధికంగా ఆనందించేవాడును అయినట్టి శ్రీకృష్ణుని విరాడ్రూపాన్ని చూచి, నిశ్చేష్టుడై ఉన్న బ్రహ్మను చూచి శ్రీకృష్ణమూర్తి

శ్రీకృష్ణుడు బ్రహ్మను చూచి, 'పాపం ఈ చతుర్ముఖుడు బాలభావంతో తానే సృష్టిఅంతటికీ మూలం అయిన బ్రహ్మననే అభిమానగర్వంతో తెలివిదప్పి, నా మహిమను చూద్దామని వచ్చాడు. నా మాహాత్యాన్ని చూడడానికి అతడెంతటివాడు?' అనుకొంటూ జగత్తంతటినీ క్రీడగా చేసి చూపే ఆ శ్రీకృష్ణుడు తాను పన్నిన ఆ మాయ అనే వలను విడదీసి, తనలీలారూపాలైన గొల్ల పిల్లలను, దూడలను అక్కడ మరుగుపరచాడు.

ఆ సమయంలో బ్రహ్మ చచ్చిపోయినవాడు బ్రతికినట్లుగా తేరుకొని ఒక్కసారి ఒళ్ళు తెలుసుకొని సమాళించుకున్నాడు. కాళ్లూ చేతులు కదిలించాడు, కళ్ళు విప్పి చూచే స్థితికి వచ్చాడు. ముందుకు, వెనుకకు, మీదికి, అన్ని దిక్కులకూ దృష్టి సారించాడు. అప్పుడు తన ముందుభాగంలోనే శ్రీకృష్ణమూర్తి ఉండడం కారణంగా నరులు, పక్షులు, జంతువులు తమ జాతిసహజమైన శత్రుత్వాలను మరచి తిరుగుతూ ఉండడం గమనించాడు. ఆ బృందావనంలో సంపద ఉంది. అందులో ఉన్నవారికెవరికీ కామక్రోధాలు లేవు. అలాంటి బృందావనం చూశాడు - బ్రహ్మ. ఆ బృందావనంలోనే

తనకంటె వేరేమియు లేక సృష్టి స్ధితి, లయాదులకు కర్తలైన త్రిమూర్తులకు మూలపురుషుడైన వాడూ, ఆవుదూడలను వెదకుచున్నవాడూ; సర్వజ్ఞుడై ఒంటరివాడుగా ఉన్నా అజ్ఞానాకారంతో పెక్కుమంది స్నేహితులను పిలిచేవాడూ, బయట, లోపల, ఆది, మధ్య అనే భావాలు లేనివాడైనా అక్కడక్కడా లేగల అడుగుజాడలను వెదికేవాడు, ఎంతో గంభీరుడైనా అటూ, ఇటూ పరిగెడుతూ ఆటలాడేవాడూ, జాతిభేదాలు లేనివాడైనా గొల్లపిల్లాడిస్వభావం అచ్చుపడే శరీరంతో ఒప్పేవాడూ, చేతిలో చల్దిముద్దతో ఉన్నవాడూ అయిన శ్రీకృష్ణుణ్ణి సరస్వతీదేవి భర్త అయిన బ్రహ్మ చూశాడు.

అలా శ్రీకృష్ణుని చూసి, తడబాటుతో బ్రహ్మ ఒక్కసారి తన వాహనం హంస పై నుండి దభాలున భూమిపైకి దుమికి, బంగారు దండంలా కోమలంగా వున్నతన శరీరంతో నేలపై సాష్టాంగపడ్డాడు. తన కిరీటం కొనలో వున్న రత్నాది మణుల కాంతులు ఆ బాలకృష్ణుని పాదాలు సోకేలా నమస్కరించాడు. ఆనందం ఎక్కువ కావడంతో కళ్ళనుండి జారే కన్నీటి ప్రవాహంతో అతని పాదాలను కడిగాడు ఇంకా

ఓ పరీక్షిన్మహారాజా! బ్రహ్మ శ్రీకృష్ణునిపాదాలపై పడుతూ లేస్తున్నాడు. మళ్ళీ పడుతున్నాడు లేస్తున్నాడు. ముందు తాను చూచిన శ్రీకృష్ణునిమాహాత్యం అనే సముద్రంలో తన ఉద్ధతిని అణచివేశాడు. తాను చేసిన తప్పిదాన్ని అణచుకున్నాడన్న మాట.

అనంతరం బ్రహ్మ మెల్ల మెల్లగా లేచి నిలుచున్నవాడై కమలాలవంటి కళ్ళు తెరచి, శ్రీకృష్ణుణి చక్కగా దర్శించి, నాలుగు ముఖాలు వంచి, రెండు చేతులూ జోడించి నమస్కరిస్తూ, గొంతు కొంత తడబడగా, ఏకాగ్ర చిత్తంతో, నాలుగుముఖాలతో ఇలా సోత్రం చేశాడు.

శ్రీకృష్ణమూర్తిని బ్రహ్మస్తుతించుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

Kaliya's wives Nagaamganalu praying to Lord Krishna - కాళియుని భార్యలైన నాగాంగనలు శ్రీకృష్ణుని నుతించుట

కాళయుని భార్యలైన నాగాంగనలు శ్రీకృష్ణుని నుతించుట ఈ విధంగా శ్రీకృష్ణుడు కాళియుని పడగలమీద తాండవం చేయడంచేత, తీవ్రమైన ఆతని కాలితాపులకు కాళియుని ...