Friday, February 6, 2026

kunthi devi praying sri krishna Kunti Stuti - కుంతీదేవి శ్రీకృష్ణుని స్తుతించుట

కుంతీదేవి శ్రీకృష్ణుని స్తుతించుట

కృష్ణా! నీవే ఆదిపురుషుడవు. అందరిచేత స్మరింపబడేవాడవు. జగత్తుకన్న వేరుగా ఉండేవాడవు. నాశనం లేనివాడవు. సమస్తభూతములలో లోపల వెలువల ప్రకాశించేవాడవు. లోకేశ్వరుడవు. ప్రభువులకే ప్రభుడవు. అట్టి నీకు నమస్కారములు అర్పిస్తున్నాను.

అంతేకాక తెరచాటున నిలువబడి నాట్యాన్ని ప్రదర్శించే నటునిలా మాయ అనే తెరమాటున ప్రవర్తించు నీ మహిమ అవా
ఙ్మానస గోచరమైనది. పరమహంసలు, రాగద్వేషాలు లేనివారు, విమల మనస్కులు అయిన మునీశ్వరులకు గూడ నీవు కానరావు. పరిపూర్ణుడవు. అటువంటి నీవు అజ్ఞానులమై సంసారంలో మునిగిన మాకు ఎలా దర్శనమిస్తావు? శ్రీకృష్ణా! వసుదేవనందనా! దేవకీతనయా! నందగోపుని ముద్దుబిడ్డడా! గోవింద! పద్మనాభా! వనజమాలా విభూషితా! కమలలోచనా! అరవింద సదృశచరణయుగళా! హృషీకేశా! భక్తిపురస్సరంగా నీకు వందనమాచరించెద. నా విన్నప మాలకించు.

భగ భగ మండిపోతున్న లక్కయింట్లో నేను, నా బిడ్డలు కాలిభస్మమై పోకుండా కాపాడావు. దుర్యోధనుడు తినిపించిన కాలకూట విషపూరితాన్నంతో భీముడు మరణించకుండా రక్షించావు, ధృతరాష్టసూనుడు దుర్మదంతో కట్టుబట్టలొలువబోగా, ద్రౌపది అవమానం పాలుకాకుండా మానసంరక్షణం కావించావు. భీష్మద్రోణ కర్ణాదివీరాధి వీరులచే నా బిడ్డలు యుద్ధరంగంలో నలిగిపోకుండా చేశావు. ఉత్తర కడుపులో పెరుగుతున్న గర్భాన్ని అశ్వత్థామ బాణాగ్నిచే నాశనం కాకుండా చక్రం అడ్డువేశావు. పెక్కు విధాలుగా నన్నూ నా బిడ్డలను సంరక్షించావు. నిన్ను ఏమని వర్ణించగలనయ్యా!

జగదీశ్వరా! మహాబలవంతుడైన కంసునిచేత బాధపడుతున్న మీ తల్లిని కాపాడినట్లుగా, దుర్యోధనాదులచేత నేను బాధ పొందకుండా నీవే కాపాడావు. నీ అనంత గుణసముదాయాన్ని వర్ణించడానికి నేను ఏ పాటిదానను?

మాది గొప్ప వంశం లేదా గొప్ప కులం అనే ఆభిజాత్య మదం, ఐశ్వర్యమదం, ధనమదం, విద్యామదం కలిగినవారు దీనులకు మాత్రమే గోచరించే నిన్ను స్తుతించలేరు.

కృష్ణా! నీవు భక్తులకు కొంగుబంగారం వంటివాడవు. గుణవృత్తులైన ధర్మం, అర్థం, కామం అనే త్రివర్గం లేనివాడవు. రాగం, ద్వేషం ఇత్యాది ద్వంద్వాలు నీ చెంతకు రాలేవు. ముక్తిప్రదాతవు. కాలస్వరూపుడవు. యోగ్యతానుసారంగా సమస్తాన్ని నియమించేవాడవు. ఆది, అంతం లేకుండా ఉండేవాడవు. సృష్టి సర్వస్వాన్ని నీ అధికారంలో ఉంచినవాడవు. అందరియెడ సమభావంతో వర్తించేవాడవు. సకలప్రాణికోటులను శిక్షించడంలో, రక్షించడంలో కడు సమర్థుడవు. నిన్నుసదా మనస్సులో ధ్యానించి వందనాలు అర్పిస్తున్నాను.

అవతారపురుషుడవైనా, మానవ ప్రవృత్తులను అనుకరించే నీ లీలలు గ్రహించడం ఎవరికీ సాధ్యంకాదు. నీకు కావలసిన వారూ లేరు. అక్కరలేని వారూ లేరు. హితులూ లేరు. అహితులూ లేరు. జన్మకర్మలు అనేవి నీకు లేనేలేవు. తిర్యగ్జంతుజాలాలలో వరాహాదిరూపాలలోను, మానవులలో శ్రీరామాదిరూపంలోను, ఋషులలో వామనాది రూపాలలోను, జలచరాలలో మత్స్యాది రూపంలోను నీ వవతరించడం ఈ లోకంకోసమే కాని సత్యానికి నీకు జన్మమూలేదు. కర్మసంబంధాలు లేవు.

ఎంతటి మహానుభావుడవు నీవు? ఆనాడు చిన్నతనంలో ఒక పసిపాపడులా ఎలా ప్రవర్తించావయ్యా! ఒకనాడు యశోద కడుపారా పాలుత్రాగని నిన్ను ఒడిలోనుంచి, క్రిందకు దింపి, పొయ్యిపై పొంగుతున్న పాలకుండను దించుటకై లోనికేగగా, కోపంతో నీవు పెరుగుకుండను చిన్నరాతితో పగులగొట్టావు. తిరిగివచ్చి నేలపాలైన పెరుగును చూచి యశోద కుపితురాలయింది. ఒక త్రాటితో నిన్ను రోటికి కట్టివేసింది. నీవు ముఖం చిన్నబుచ్చుకొని, వెక్కి వెక్కి ఏడుస్తూ, కన్నుల కాటుక చెరిగిపోతూ ఉండగా, నయనాలు రుద్దుకొంటూ, గట్టిగా నిట్టూరుస్తూ ఒక చిన్నపిల్లవాడిగా నటించడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది కృష్ణా!

అనంతా! మలయగిరిపై మంచిగంధపు చెట్టు వెలసినట్లుగా ధర్మపుత్రుని కీర్తి వ్యాపింపజేయడానికై, పుట్టుకలేని హరి భూమిపై యాదవకులంలో అవతరించాడని కొందరంటారు.

పరాత్పరా! వసుదేవుడు, దేవకి పూర్వజన్మలో అధికమైన తపస్సుచేసి నిన్ను పుత్రునిగా జన్మించుమని కోరారు కదా! వారి ప్రార్ధన మన్నించి దానవసంహారానికై అవతరించావని మరికొందరు అంటారు.

లెక్కకందని గుణాలు గల స్వామీ! నడి సముద్రంలో మునిగిపోయే ఓడలా, భరించరాని భారంతో క్రుంగిపోయే భూమిని ఉద్ధరించడానికై బ్రహ్మదేవుడు ప్రార్ధించగా అవతరించావని వేరే కొందరు అంటారు.

జన్మరహితుడా! తమ కర్తవ్యమయిన స్వస్వరూప జ్ఞానాన్ని కొందరు జీవులు విస్మరిస్తారు. అజ్ఞానంలో మునిగి తేలుతారు. నిరంతరం కోరికలతో కర్మలు ఆచరిస్తారు. తత్ఫలితంగా సంసారచక్రంలో పరిభ్రమిస్తూ ఉంటారు. అటువంటి వారికి విముక్తి కలిగించడానికై, వారు తరించడానికి వీలుగా శ్రవణం, స్మరణం, వందనం, అర్చనం మున్నగు నవవిధ భక్తిమార్గాలు ప్రసాదించడానికై నీవు అవతరించావని మరికొందరు అంటూ ఉంటారు.

కృష్ణా! విశ్వేశ్వరా! విశ్వంభరా! నీవు బ్రహ్మాండాలనన్నింటినీ నియమించేవాడవు. అన్ని లోకాలను భరించేవాడవు. నీ పాదపద్మాలు అనంతజన్మ పరంపరలను అంతం చేసేవి. యోగీశ్వరులు నిత్యం వేదవాక్యాలతో ప్రస్తుతించేవి. నిన్ను స్మరిస్తూ, పొగడుతూ, గానం చేస్తూ నీ కథలు శ్రవణం చేస్తూ ఉండేవారు మాత్రమే నీ పాదపద్మాలను దర్శించగలుగుతారు. అన్యులు ఇతర మార్గాలద్వారా నీ పాదధూళిని కూడ వీక్షించలేరు.

కృష్ణా! మాకు నీకన్న వేరే రక్షకుడు లేడు. నీ పాదపద్మాలనే పూర్తిగా ఆశ్రయించి బ్రతుకుతున్నాము. మమ్ము విడిచిపెట్టి ద్వారకానగరం వెళ్లిపోతావా? నీవు నీ కరుణాకటాక్ష వీక్షణాలతో చూడకపోతే యాదవులుకాని, పాండవులు కాని బ్రతికి బట్టకట్టగలరా? ఇంద్రియాలు జీవుని విడిచి ప్రవర్తించగలవా? నీవులేనిచో మాకు నామరూపాలు లేవు. కీర్తిప్రతిష్టలు లేవు. ఇక మాకు హీనదశ రాకుండపోతుందా? పద్మం, వజ్రం, మత్స్యం ఇత్యాది మంగళ చిహ్నాలతో కూడుకొన్నవి నీ పాదాలు. అట్టి నీ అడుగులచే ఈ భూమండలమే పరమపవిత్రమయింది. నీవు మమ్మల్ని విడిచిపెడితే ఈ ప్రాంతం బోసిపోతుంది. కళావిహీనమయిపోతుంది. నీ దయార్ద్రమైన చూపులతో తడుపబడి ఇచ్చట జనప్రదేశాలు పూలతోను, పండ్లతోను నిండిన ఓషధులతోను, చెట్లతోను, తీగలతోను, పొదలతోను, నదీనదాలతోను కన్నుల పండువు చేస్తున్నాయి.

జగదీశ్వరా! పరమేశా! ఆత్మీయులైన యాదవులందు, పాండవులయందు నాకున్న అనురాగపాశాన్ని త్రెంచివేయి. మహాసముద్రంలో కలసిపోయే గంగాతరంగిణిలాగా నా మనస్సు నీ పాదసంస్మరణంలో లగ్నమయ్యేలా చేయవయ్యా!

శ్రీకృష్ణా! యదుకులాలంకారా! అర్జున ప్రాణమిత్రమా! శృంగారసముద్రా! లోకకంటకులైన రాజులను దహించేవాడా! జగదీశ్వరా! దేవతలను, బ్రాహ్మణులను, గోగణాలను ఆర్తినుంచి తొలగించేవాడా! మోక్షప్రదాయకా! కరుణాపయోనిధీ! నీకు నమస్కరిస్తున్నాను. నా భవబంధాలు ఖండించు.

కుంతీదేవి సత్యమధుర వాక్కులతో భగవంతుని ఈ విధంగా ప్రార్ధించగా, ఆయన ఆమె వచనాలను స్వీకరించాడు. తన మాయాపూరిత మందహాసంతో ఆమెను తిరిగి ప్రపంచంలో ప్రవర్తించేలాగా వ్యామోహానికి గురి చేశాడు. రథాన్ని అధిరోహించాడు. హస్తినాపురానికి కురుక్షేత్రం నుంచి పాండవసమేతంగా విచ్చేశాడు. కొంతకాలం అక్కడ ఉండి కుంతిని, సుభద్రను, తక్కినవారిని సెలవుగైకొని తనద్వారకకు వెళ్లడానికి పూనుకొన్నాడు. మరికొంతకాలం ఉండుమని ధర్మరాజు బతిమాలగా అచ్చటనే ఉండిపోయాడు.

ధర్మరాజు తాను చేసిన కురుక్షేత్ర సంగ్రామాన్ని కన్నుల ముందుకు తెచ్చుకొని, ఆలోచనలోపడి దుఃఖంలో మునిగిపోయాడు. కృష్ణుడు, వ్యాసుడు, ధౌమ్యుడు ఎన్నివిధాల ఉపదేశం చేసినా, ఆతని మనస్సుకు ఊరట లభించలేదు. చుట్టాలనందరిని చంపివేశానన్న అతని శోకానికి వారి ఉపశమన వాక్యాలు ఓదార్పునందించలేకపోయాయి. అతనిలో జ్ఞానం అంతరించి అజ్ఞానం ఆవరించింది. ఇలా మనస్సులో భావించి అన్నాడు.

తన శరీర పోషణకోసం నోరులేని జీవాలైన మృగాలను చంపించే దుర్మార్డునికి, నాకు తేడా ఏముంది కనుక? రాజ్యకాంక్షతో గురువులను, పసివారిని, బ్రాహ్మణులను, సుతులను, సోదరులను సంహారం చేయించాను. నావంటి పాపాత్ముడు ఎందైన ఉంటాడా? ఎన్ని లక్షల సంవత్సరాల పర్యంతం నరకలోక వాసనలు అనుభవించినా ఈ పాపం అడుగంటుతుందా?

ప్రజలను న్యాయబుద్ధితో పరిపాలించే రాజేంద్రుడు ధర్మయుక్తంగా యుద్ధం కావించి వైరివీరులను చంపడంలో దోషంలేదని శాస్త్రాలు వక్కాణిస్తున్నాయి. ఆ మాట నాకు దుఃఖాన్ని పోగొట్టడంలేదు. రథగజతురగపదాతులనే చతురంగ బలాలతో కూడుకొన్న అక్షౌహిణులకొలది సైన్యాన్ని చంపించాను. నా రాజ్యకాంక్షే ఇంతటి అనర్దానికి దారి తీసింది. ఆత్మీయులనందరిని యుద్ధంలో చంపించి కులకాంతలకు తీరనిద్రోహం చేశాను. నా అపరాధానికి ప్రాయశ్చిత్తం లేదు. పాపనివృత్తికొరకై గృహస్థులకు కొన్ని ధర్మాలు, యాగాలు విధించబడిన మాట సత్యమే. అశ్వమేధయాగం మున్నగు యజ్ఞక్రియలద్వారా బ్రహ్మహత్యాది దోషాలు పరిహారమవుతాయని వేదాలు ఘోషిస్తున్నాయి. కాని బుద్ధిపూర్వకంగా చేసే జీవహింసకు పరిహారం ఉంటుందా? బురదచేత బురద నిండినచోటు పరిశుభ్రమవుతుందా? కల్లుచేత క
ల్లుకుండ శుద్ధమవుతుందా? కోరికలతో కూడుకొని మనఃపూర్వకంగా చేసే జీవహింసతో కూడుకొన్న యాగాలచేత మానవులపాపం పెరుగుతుందేకాని తరగదని నా సందేహం. అందులకై శోకిస్తున్నాను.

ధర్మపుత్రు డీవిధంగా యుద్ధం పేరుతో జనద్రోహం చేశానని, తన పాపానికి పరిహారంలేదని మనస్సులో శోకించాడు. భోజనం చేయాలనే సంకల్పంకూడ ఆయనకు కలగలేదు. ఒక్కసారి భీష్ముని సందర్శించి రావాలనే కాంక్ష ఆయనలో బయలుదేరింది. వెంటనె కురుక్షేత్రానికి పయనమయ్యాడు.

Sri Krishna Saves Uttara Unborn Son - శ్రీకృష్ణుం డుత్తరాగర్భస్థుండగు నర్భుకుని తన చక్రంబుచే రక్షించుట

శ్రీకృష్ణుం డుత్తరాగర్భస్థుండగు నర్భుకుని తన చక్రంబుచే రక్షించుట

అనంతరం శ్రీకృష్ణపరమాత్మను వ్యాసాదిమహర్షులు అర్చించారు. ఉద్ధవుడు, కృష్ణుడు సాత్యకి వెంటరాగా ద్వారకానగర ప్రయాణానికి ఉద్యుక్తుడయ్యాడు. పాండవులవద్ద సెలవు తీసుకొన్నాడు. రథం ఎక్కబోతున్న సమయంలో ఉత్తర గుండె బాదుకొంటూ పరుగెత్తుకొని వచ్చి, ఉత్తమ గుణాభీరాముడైన శ్రీకృష్ణుని ఈ విధంగా ప్రార్థించింది.

దేవదేవా! ఇదేదో ప్రళయాగ్నితో సమానమైన బాణం ఒకటి ఎక్కడనుండో వచ్చింది. నా కడుపులోనున్న పసిగుడ్డును భస్మం చేయాలని భయంకరమైన మంటలతో వస్తూ ఉంది. మిరుమిట్లు గొల్పే కాంతితో తేరిపార చూడడానికి సాధ్యం కాకుండా ఉంది. నీవు తప్ప నన్ను రక్షించే వారెవ్వరూ లేరు. నేను నీ పాదపద్మాలనే నమ్మి ఉన్నాను. వెంటనే ఈ బాణాగ్ని జ్వాలలను నివారించు.

శ్లాఘనీయ చరిత్రా! భరింపరాని బాణాగ్నితో నా కడుపులోనున్న పసిబిడ్డ తాపం మొదలుకాగా కసుగందిపోతున్నాడు. కారుణ్యదృష్టితో నన్ను రక్షించు.

ఓ విచ్చిన తామరపూలవంటి కన్నులు గల కృష్ణా! నేను నీ ముద్దుచెల్లెలైన సుభద్రయొక్క కోడలిని. నీ మేనల్లుడైన అభీమన్యుడు యుద్ధంలో శత్రువులచే అన్యాయంగా సంహరించబడ్డాడు. ఈ బాణాగ్నికీలలను పటాపంచలుచేసి నా పసిబిడ్డను బ్రదికించు.

పరమేశా! ఉదరంలో వందలకొలది బ్రహ్మాండాలను భరించే నీకు ఒక ఆడదాని గర్భాన్ని రక్షించడం ఏమంత బరువైన పని? దయతో నా గర్భసంరక్షణ భారమునకు పూనుకో.

ఆర్తత్రాణ పరాయణుడైన శ్రీకృష్ణుడు తన చెల్లెలయిన సుభద్రకోడలి దీనాలాపాలు ఆలకించాడు. అది అశ్వత్థామ "ఈ లోకంలో పాండవ వంశాకురం లేకుండుగాక!" అని ప్రయోగించిన దివ్యాస్తప్రభావమని గుర్తించాడు. ద్రోణపుత్రుని బ్రహ్మాస్రంనుంచి బయల్వెడలిన వాడిబాణాలు పాండవులకు ఎదురుగా వచ్చాయి. వారు కూడా భయపడకుండా తమపై వచ్చు అస్త్రాలను పనికిరాకుండా చేసే ప్రత్యస్త్రాలు చేపట్టి పోరాడే సమయంలో

పాండవులకు కృష్ణపరమాత్మను సేవించాలనే ఆసక్తి, ఆలోచనతప్ప అన్యచింతాసక్తి రవంతకూడ లేదు. వారు కృష్ణభక్తితో సత్పురుషులుగా కీర్తింపబడ్దారు. అందువల్ల వారిని రక్షించడం నిజకర్తవ్యంగా భావించి వాసుదేవుడు వారిపై ప్రీతి చూపించాడు. ద్రోణపుత్రుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని నిరోధించడంకోసమై, శత్రువులను వధించడంలో చెక్కుచెదరనిది, సమస్త దేవతాగణాలను రక్షించేది అయిన తన సుదర్శనచక్రాన్ని ప్రయోగించాడు.

పరమాత్మ చరాచర జంతుజగత్తులో అంతర్యామి రూపంలో హృదంతరాళంలో సూక్ష్మరూపుడై జ్యోతిర్మయుడై వెలుగొందుతూ ఉంటాడు. ఆ పరాత్పరుడు కురువంశాంకురం నాశనం కాకుండా ఉత్తరాగర్భాన్ని వైష్ణవ తేజస్సుచే కప్పివేశాడు. తన సుదర్శనచక్రాన్ని అశ్వత్థామచే ప్రయోగింపబడ్డ 
బ్రహ్మాస్త్రానికి అడ్డంగా పెట్టి స్వీయశక్తితో దానిని అణచివేశాడు.

నివారణోపాయం ఏదీలేని బ్రహ్మాస్త్రాన్ని అశ్వ
త్థామ ప్రయోగించినా, అది విష్ణుతేజస్సుముందు వ్యర్థమైపోయింది. తన మాయాశక్తిచే సకలలోకాలను సృష్టించి, పోషించి, లయింపజేసే వాసుదేవుడు ఒక విప్రుని అస్త్రాన్ని అడ్దుకోవటంలో ఆశ్చర్యం ఏముంది? పాండవ వంశాకురం నిలిచినందులకు కుంతి మిక్కిలి సంతోషించింది. పాండవులూ, ద్రౌపదీ వెంటరాగా శ్రీకృష్ణుని సమీపించింది. ద్వారకానగర ప్రయాణానికి సిద్ధపడిన ఆ పరాత్పరుని ఈ విధంగా స్తుతించింది.


శ్రీ మహా భాగవతము

Draupadi Ashwatthama Arguments - ద్రొపది యశ్వత్థామను జూచి సంభాపించుట

ద్రొపది యశ్వత్థామను జూచి సంభాపించుట

అర్జునుడు ఈ రీతిగా అశ్వత్థామను బంధించి తీసుకొనివచ్చాడు. అతడుకూడ చిన్నపిల్లలను చంపడంవల్ల సిగ్గుచే మొగం చాటేసుకొన్నాడు. ఆలాంటి కృపితనూజుని అశ్వత్థామను ద్రౌపది చూచి, సుశీలయైన ఆమె ఆ గురుపుత్రునకు నమస్కరించి ఇలా అన్నది.

పూర్వం ధనుర్విద్య నభ్యసించే సమయంలో నా భర్తలు అయిదుగురు బాణప్రయోగం, బాణోపసంహారం, మొదలైన సమస్త శస్త్రవిద్యలు నీ తండ్రియైన ద్రోణాచార్యులవద్ద అభ్యసించారు. నీవు పుత్రరూపంలోనున్న ద్రోణుడవు. పాందవులు నీకు శిష్యులవంటివారు. అట్టి శిష్యుల కుమారులను దయమాలి నరకివేయడం నీవంటివానికి న్యాయమా?

నాయనా! నీవు బ్రాహ్మణుడవు. బుద్ధి విచక్షణకు, దయాదాక్షిణ్యాలకు నీవు పెట్టినది పేరు. స్వచ్చమైన వీరాధివీరులలో నీవు అగ్రగణ్యుడవు. పసిపిల్లలను చంపడం రాక్షస కార్యంకదా! ఇది ధర్మమా? ఇటువంటి ఘోరకృత్యానికి నీవు ఎలా ఒడిగట్టావు?

నా కుమారులు ఆయుదాలుపట్టి ఆవేశంతో నీ మీదికి రాలేదే! యుద్ధరంగంలో కూడ లేరే! బలగర్వంతో నీకు ఆవంతకూడ అపకారం చేయలేదే! చీకట్లో, అందమైన ఆ చిన్నపిల్లలను, యుద్ధవిద్యలో ఆరితేరినవారు కానివారిని, గాఢనిద్రలో ఉన్నవారిని చంపటానికి అయ్యో! నీ చేతులెట్లాడాయో!

పుత్రమరణశోకం నన్నెంతో కలచివేసింది. నా హృదయం దుఃఖంతో నిండిపోయింది. నేను తల్లడిల్లిపోతున్నాను. అర్జునుడు యుద్ధంలో తాళ్లతో నిన్ను కట్టివేసి శిబిరానికి ఈడ్చుకొని వచ్చిన సంగతి తెలిసి అది సహింపలేక నీ తల్లి కూడ ఈ రోజు ఎచ్చట, ఏ రీతిగా, దుఃఖంతో నావలె ఎంతగా తల్లడిల్లిపోతోందో కదా!

ద్రౌపది ఈ రీతిగా అశ్వత్థామ హృదయంలో ములుకులవలె గ్రుచ్చుకొనే పలుకులు పలికి, కృష్ణార్జునులను ఉద్దేశించి ఇలా అన్నది.

భర్తయైన ద్రోణుడు మరణించినా, కృపి పుత్రప్రేమతో సహగమనం చేయకుండా ఇంట్లోనే ఒంటరిగా ఉండిపోయింది. మీరు ఈతనిని బంధించి ఈడ్చుకొని రావడంవల్ల ఆ ఇల్లాలు, నే నేవిధంగా పుత్రశోకంతో దుఃఖిస్తున్నానో, తానుకూడ అదేవిధంగా గుండెలు పగిలేలా ఎంతగానో విలపిస్తూ ఉంటుంది కదా! ఇతడా బ్రాహ్మణుడు. బంధితుడై యున్నాడు. ప్రాణాలు కోల్పోతే మనకు మహాపాపం. ఈతనిని హింసించడం మానండి.

ప్రజాపరిపాలన తత్పరులగు రాజులు బ్రాహ్మణులకు కోపం వచ్చేటట్లు చేయరాదు. వారు కోపిస్తే వారి క్రోధాగ్ని జ్వాలలకు భూమి కంపిస్తుంది. రాజవంశాలు అనే అడవులు సమూలంగా నాశనమైపోతాయి.

అని పలికిన పాంచాలి మాటలలో ధర్మం, దయ నిష్కపటం, సత్యం తొణికిసలాడాయి. అందరూ ఆమెను కొనియాడారు. ధర్మరాజు సంతసించాడు. నకులుడు, సహదేవుడు, సాత్యకి, అర్జునుడు, వాసుదేవుడు అంగీకారం తెలియజేశారు. భీముడు మాత్రం అందుకు అంగీకరించక ఇలా అన్నాడు.

కన్నకొడుకుల గొంతులు గోసి చంపినందులకు కోపం రాకపోగా, ఈ శిశుహంతను విడిచివేయండని అంటుందేమిటి ఈ ద్రౌపది? ఈమె వట్టి వెర్రిబాగులది. వీడు బ్రాహ్మణుడా? వీనిపై కనికరం చూపించడం పనికిరాదు. వెంటనే చంపివేయండి. నా మాటలు మీకు అంగీకారం కాకపోతే చెప్పండి. ఒక్క పిడికిటిపోటుతో ఈ దుష్టుని శిరస్సును ఛిన్నాభిన్నం చేసాను.

అని భీముడు రౌద్రంగా పలికి అశ్వత్థామ మీదకు ఉరకబోయాడు. ఆతనిని రక్షించడానికై ద్రౌపది అడ్డంగా వచ్చి నిలిచింది. భీముని ఆర్భాటాన్ని చూచాడు కృష్ణుడు. అన్నంత పని చేసేలా ఉన్నాడని భావించాడు. వెంటనే చతుర్భుజమూర్తి అయ్యాడు. రెండు చేతులతో వాయునందనుని గట్టిగా అదిమిపట్టుకొన్నాడు. మిగిలిన రెండు చేతులతో ద్రౌపదిని పక్కకు తప్పించాడు. అపుడు వాసుదేవుడు పవనపుత్రుని ఆవేశం తగ్గించేలా నవ్వుతూ ఇలా అన్నాడు.

పాండవవంశ భూషణుడవైన వాయునందనా! ఈ అశ్వత్థామ రక్షింపదగినవాడు కానే కాడు. శిశుహంత, దుష్టబుద్ధి. పరమ కిరాతకుడు. ముమ్మాటికీ చంపదగినవాడే. ఇది వికల్పం లేనిమాట. కాని “బ్రాహ్మణుడు చంపదగినవాడు కాడు” అని వేదం ద్వారా తెలియజేయబడుతోంది. ఈ సూక్ష్మధర్మప్రకారం అతడిని రక్షించడమే న్యాయమనిపిస్తోంది. యథార్థమేమిటో దానిని ఆచరించు.

కృష్ణుడు ఈ విధంగా సరసోక్తులతో భీముని శాంతింపజేశాడు. అర్జునుని చూచి “ద్రౌపదికి, నాకు, భీమునకు అంగీకారయోగ్యంగా, ముందుగా నీవు కావించిన శపథంకూడ నెరవేరేటట్లుగా నా ఆజ్ఞ పాలించు” అని హితోపదేశం చేశాడు. అప్పుడు కిరీటి గోవింద వచనానుసారంగా కర్తవ్యోన్ముఖుడయ్యాడు.

అర్జునుడు విశ్వంలో అందరిచేతా కొనియాడబడేవాడు. వీరాధివీరుడు. పైగా ఇంద్రనందనుడు. అటువంటివాడు భయంకరమైన కత్తి తీశాడు. అతని జుట్టులో ప్రకాశించే మణిని లాగుకొన్నాడు. కట్లు విప్పాడు. శిబిరభాగం నుంచి ఒక్క ఊపున గెంటివేశాడు.

అత్యంత సాహసంచేసి బాలురను వధించిన ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా స్వీయతేజస్సును, మణిని కోల్పోయి భరించరాని అవమానంతో తలవంచుకొన్నాడు. ఆతనిలో ఆవేదన అధికమయింది. సిగ్గుతో కుంచించుకొనిపోయాడు. అతని పొగరంతా క్షణంలో మాయమయ్యింది. మిక్కిలి వేగంగా అక్కడినుండి వెళ్లిపోయాడు.

సంపదలనైనా లాగుకోవాలి. అటుకాని పక్షంలో శిరోముండనమైనా కావించాలి. అదీకాని పక్షంలో ఇంటినుంచైనా వెళ్లగొట్టాలి. అంతేకాని చంపదగినట్టి ఘోరకృత్యం చేసినా, బ్రాహ్మణుని వధించడం రాజులకు ధర్మంకాదు.

అర్జునుడు ఈ ప్రకారంగా అశ్వత్థామను ప్రాణాలతో మిగిల్చి శిబిరం నుండి వెళ్లగొట్టాడు. పాండవులు ద్రౌపదీ సహితంగా చనిపోయిన కుమారులకై దుఃఖించారు. అనంతరం మృతులైన బంధువుల కందరకు దహనాది సంస్కారాలు కావించారు. స్త్రీజనాలు ముందు నడువగా అందరూ గంగానదికిపోయి ధర్మోదకాలు, తిలతర్పణాలు ఒనరించారు. మళ్లీ వాళ్లలో దుఃఖం పొంగిపొర్లింది. శ్రీహరి పాదారవిందసంజాతపుణ్య గంగాజలాలలో మరల స్నానాలు కావించి అందరూ శుద్ధులయ్యారు. పిమ్మట కృష్ణుడు, వ్యాసాది మహర్షులు పుత్ర మిత్రబంధు శోకార్తులైన గాంధారీ ధృతరాష్ట్రులను, కుంతీ 
ద్రౌపదులను ఓదార్చారు. వారి విచారాన్ని పోగొట్టారు. మనస్సులకు శాంతిని చేకూర్చారు.

ద్రౌపదిని కొప్పుపట్టి ఈడ్చడం మహాపాపం. ఆ ఘోరకృత్యాన్ని కౌరవులు ఆచరించారు. దానివల్లనే వారి ఆయువు క్షీణించింది. వారు దుర్మదాంధులు. అటువంటి ధృతరాష్ట్ర కుమారులనందరినీ, కృష్ణుడు యుద్ధరంగంలో సంహరింపజేశాడు. అన్నమాట ప్రకారంగా ధర్మరాజుకు రాజ్యం ఇప్పించాడు. మహావిఖ్యాతి చేకూర్చాడు. మహేంద్ర వైభవంతో మూడశ్వమేధాలు చేయించి పాండవుల కీర్తి దశదిశలా వ్యాపించేలా చేశాడు.

శ్రీకృష్ణుం డుత్తరాగర్భస్థుండగు నర్భుకుని తన చక్రంబుచే రక్షించుట

Arjun Cornered Ashwatthama - అర్జునుండు వుత్రఘాతియగు అశ్వత్థామ నవమానించుట

అర్జునుండు వుత్రఘాతియగు అశ్వత్థామ నవమానించుట

అని చెప్పి సూతుడు - రాజులలో ఋషివంటివాడైన పరీక్షిన్మహారాజు పుట్టుక, అతని ధర్మాధర్మకృత్యాలు, అతడు మోక్షము పొందుట, పాండవుల మహాప్రస్థానము, శ్రీకృష్ణ చరిత్ర వివరిస్తానన్నాడు. కౌరవులకు, ధృష్టద్యుమ్నుడు మొదలగువారికి జరిగిన కురుక్షేత్ర మహాసంగ్రామంలో వీరులంతా స్వర్గానికి వెళ్ళిన తరువాత, భీముని గదదెబ్బకు దుర్యోధనుడు తొడలు విరిగి నేలకూలగా, అశ్వత్థామ అతనికి సంతోషాన్ని కలిగించాలని నిద్రపోతున్న ద్రౌపదీపుత్రుల (ఉపపాండవుల) తలలు నరికి వాటిని తెచ్చి ఆ సుయోధనుడికి అర్పించాడు. అశ్వత్థామ చేసింది క్రూరకృత్యమని లోకులు నిందిసారు.

అశ్వత్థామ కరవాలానికి కన్నకొడుకుల తలలు తెగిపోయాయన్న వార్త ద్రౌపది చెవులపడింది. ఆమె చాలా కలత చెందింది. మిక్కిలి దుఃఖించింది. మనస్సులో జీర్ణించుకోలేకపోయింది. శోకంతో కన్నీళ్లు పెల్లుబికి వచ్చి చెక్కిళ్లపై ధారగా కారగా 
ఏడ్చి ఏడ్చి నేలపై వివశురాలై పడిపోయింది. ఆమెను చూచి అర్జునుడు చాలా జాలి పొందాడు. నేలపై పడిపోయిన పాంచాలిని లేవనెత్తాడు. సమయానికి తగిన ఓదార్చుతోకూడిన మధురమైన వచోవిన్యాసంతో ఊరటపరిచాడు. ఆమె తలవెండ్రుకలు నిమురుతూ ఇలా సాంత్వన వాక్యాలు పలికాడు.

చంద్రవదనా! నీవు ఒక క్షత్రియకాంతవు. అందులోను ద్రుపదమహారాజు కొమార్తెవు. అట్టి నీవు చనిపోయినవారిని గూర్చి ఇలా శోకించడం తగదు. దాక్షిణ్యం లేనివాడై ఆ అశ్వత్థామ మన బిడ్డలను నరకివేశాడు. ఆతనిని నేను వదలివేస్తాననుకొన్నావా? తగిన ప్రతీకారం చేస్తాను. ఈ గాండీవమనే నా వింటినుండి భయంకరంగా వెలువడే, చీల్చి చెండాడే అమ్ములతో వాని తల నరకివేస్తాను. దానిని నీకు కానుకగా తీసుకొనివస్తాను. ఆ తలను కాలితో తన్ని అటుపిమ్మటనే అశుచిస్నానం ఆచరించెదవు గాక!

అనీ ఈ విధంగా అర్జునుడు అనునయవాక్యాలతో 
ద్రౌపదిని సమ్మతింపజేశాడు. తనకు నిరంతరం ఆత్మీయుడు, యుద్ధసందర్భాలలో సారథియునైన శ్రీకృష్ణుడుకూడ అందులకు అంగీకరించి మేలుమేలని ప్రశంసించాడు. అర్జునుడు వెంటనే కవచాన్ని ధరించాడు. గాండీవాన్ని చేత దాల్చాడు. కపిధ్వజాన్ని రథంపై ఎత్తించాడు. అశ్వత్థామ పై స్యందనాన్ని తోలించాడు.

తనను ఏమైనాసరే సంహరిస్తానని ప్రతిజ్ఞచేసి సన్నద్దుడై మీదికి వస్తున్న అర్జునుణ్ణి చూశాడు ద్రోణసూనుడు. పసిబాలురను చంపిన పాపంతో పీడించబడినవాడు కాబట్టి ఆపదలోనున్న వాడయ్యాడు. ప్రాణభయంతో పరుగెత్తసాగాడు. పూర్వం బ్రహ్మదేవుడు తనచేతనే సృష్టించబడిన కన్యనే మోహించి క్రీడింప యత్నించిన సమయంలో రుద్రుడు తనవెంటబడగా భయభ్రాంతుడై  మృగరూపంతో పరుగెత్తినట్లుగా అశ్వత్థామ అర్జునుని చూచి పరుగులు తీశాడు.

అశ్వత్హామ శక్తి ఉన్నంతమేరకు గుఱ్ఱాల నడుపుకొంటూ కొంతదూరం పరుగెత్తాడు. తనను వెన్నంటి తరుముతున్న పార్థుని చూశాడు. తన రథాశ్వాలు అలసిపోయినట్లగా గుర్తించాడు. తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఉపాయం ఏమి ఉందా? అని ఆలోచించాడు. ఒక్కక్షణం ఆగి ఆచమనంచేసి ధ్యానయోగావిష్ణుడయ్యాడు. తనకు ప్రయోగం తప్ప ఉపసంహారం తెలియకపోయినా బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రయోగమంత్రం జపించాడు. స్వీయ ప్రాణరక్షణార్థం దానిని అభిమంత్రించి అస్త్రంగా అర్జునునిపై ప్రయోగించాడు. అది భయంకరమైన తేజస్సుతో భూమ్యాకాశాల మధ్యభాగం వ్యాపించి సమస్త ప్రాణికోటికి భీతి కల్గించడం ప్రారంభించింది. ఆ సమయంలో విజయుడు శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు.

పుండరీకాక్షా! భక్తరక్షకా! శ్రీకృష్ణా! సంసారాగ్ని జ్వాలల్లో దహించబడుతున్న జనుల తాపాలను రూపుమాపడానికి నీకొక్కనికే శక్తి కలదు. నీవు కన్నులముందు సాక్షాత్కరించిన సగుణరూప పరబ్రహ్మవు. ఈ కనబడే ప్రకృతికన్న అవ్వల వెల్గువాడవు. నీవే ఆదిపురుషుడవు. నీవు నీ చిచ్చక్తిచే మాయను లోబఱచుకుని ఉంటావు. అఖండ సచ్చిదానందరూపమైన ఆత్మయందు మాయలో మునిగి జీవభావంలో జీవించేవారిని కృపతో కటాక్షిస్తావు. వారికి ధర్మమే ప్రధాన లక్ష్యమైన కల్యాణాన్ని ప్రసాదిస్తావు. జగన్నివాసా! సజ్జన రక్షణకోసమై ఈ భూమిపై అవతరిస్తావు.

దేవాధిదేవా! ఇదేదో ఒక కాంతిపుంజం. భూమ్యాకాశాలు, సమస్త దిక్కులు వ్యాపించి, ఎటుచూచినా, అదే, నాకెదురుగా వస్తున్నది. దీనిస్వరూపమేమిటో నాకర్థం కావడంలేదు. నాపై దయతో అదేమిటో స్పష్టంగా తెలియజేయుము.

అర్జును డీవిధంగా పలుకగా ప్రశ్నించగా, శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు.

వివ్వచ్చుడా! ద్రోణుని కుమారుడైన ఆ అశ్వత్థామ కుటిలవర్తనుడు. దుష్టశీలుడు. అతడు పరుగెత్తి పారిపోతూ చేసేదిలేక ఆత్మరక్షణార్థమై వక్రబుద్ధితో బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. ఈ భయంకరమైన తేజస్సు దానిదే. దానిని మరలించాలంటే బ్రహ్మాస్త్రానికి తప్ప మరొక్కదానికి ఆ సామర్థ్యంలేదు. దాని ఉపసంహారం ఆ ద్రోణపుత్రునికి తెలియదు. నీవు ఆలస్యం చేయకుండా దానిపై నీ బ్రహ్మాస్త్రాన్ని (ఉపసంహారాస్త్రంగా) ప్రయోగించు.

శ్రీకృష్ణుని వచనాలు వినగానే అర్జునుడు ఆచమించాడు. మంత్ర దేవతను స్మరించాడు. ఆ వాసుదేవునకు ప్రదక్షిణం చేశాడు. అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మా
స్త్రంపై తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు.

ఆ బ్రహ్మా
స్త్రాలు రెండూ భూమ్యాకాశాలమధ్యలో నిండిపోయాయి. సూర్యాగ్ని తేజస్సులతో తమలో తాము పరస్పరం పోరు సాగించాయి. ముజ్జగాలు భీతితో తల్లడిల్లిపోయాయి. సమస్త భూతాలు వారింప శక్యంకాని భయంతో ప్రళయకాలమేమోయని భావించాయి. ఆ సమయంలో శ్రీకృష్ణుని అనుమతిపై అర్జునుడు ఆ రెండు బ్రహ్మాస్తాలను ఉపసంహరించాడు.

అర్జునుడు ఆ రెండు అస్త్రాలను ఉపసంహరించాడు. అశ్వత్థామను వెన్నంటి తరిమిపట్టుకొన్నాడు. ఆతనిని చూచిన వెంటనే ధనంజయుని నేత్రాలు క్రోధంతో ఎరుపెక్కాయి. యజ్ఞకర్త త్రాటితోయాగ పశువును బంధించినట్లుగా ద్రోణపుత్రుని కట్టివేసి సేనాశిబిరానికి లాగుకొని వెళ్లాడు. ఆతనిని హింసించి తీరుతానని ఈడ్చుకొని వస్తున్న బీభత్సుని చూచి కృష్ణుడు ఇలా అన్నాడు.

అర్జునా! నీవైతే పాపకృత్యాలను ఆచరించేవాడవు కావు. ఈ బ్రాహ్మణుడు చూస్తే మహాపాపాత్ముడు. మీ కుమారులతనిని ఎదుర్కొనే శక్తిలేనివారు. అతనితో సమానమైన సామర్థ్యం లేనివారు. పైగా నిద్రిస్తున్నవారు. ధనుర్విద్యలో ఆరితేరనివారు. పోల్చిచూస్తే తనకంటె వయస్సులో చాల చిన్నవారు. అటువంటి చిన్నవాళ్లను రాత్రి సమయంలో క్రూరబుద్ధితో చంపేశాడు. అట్టి మహాపాతకుని విడిచిపుచ్చవలసిన అవసరం లేదు. అయినా ప్రాణాలపై ఆశతో వేడినిట్టూర్పులు విడుస్తూ పరుగెత్తాడు. నీవు దయాబుద్ధి నవలంబీంచి వీనిపై కనికరం చూపించు.

అర్జునా! భయపడినవానిని, దిగులుతో బుద్ధిమందగించినవానిని, నిద్రలో స్పృహలేనివానిని, ఆనందంతో మద్యపానంచేసి మైమరచినవానిని, యుద్ధరంగంలో పరాజితుడై పారిపోయినవానిని, మంచివానిని, కార్యోత్సాహం లేనివానిని, రక్షించుమని మొర పెట్టుకొన్నవానిని, స్త్రీలను వధించడం అనేది ధర్మం కాదు కదా!

అర్జునా! ఎవడు దయ, దాక్షిణ్యం వదలి తన ప్రాణాలు కాపాడుకోవడంకోసం ఇతరుల ప్రాణాలు బలి చేస్తాడో, అటువంటివాడు నరకలోక బాధలు అనుభవిస్తాడు. లేదా రాజదండనం ద్వారా శిక్ష అనుభవించి ఆ దుఃఖాలు పొందకుండా శ్రేయస్సును పొందుతాడు. కాని ఈ బ్రాహ్మణుడు మహాభయంతో పరితపిస్తున్నాడు. అటువంటి వానిని కఠినంగా శిక్షించడం ఎందులకు? ఒక్కసారి ఆలోచించి చూడు.

కృష్ణుడు ఈ విధంగా అర్జునునితో ధర్మశాస్త్రానుగుణంగా ప్రసంగించాడు. “తప్పు చేసినా విప్రుని దండింపకూడదు” అనే ధర్మాన్ని గుర్తు తెచ్చుకొని కిరీటి అశ్వత్థామను వధించలేదు. అయినా పాంచాలి సమక్షంలో తాను చేసిన ప్రతిజ్ఞ గుర్తు చేసుకొన్నాడు. త్రాళ్లతో కట్టివేయబడియున్న గురుపుత్రుని రథంపై పడవేశాడు. పార్థసారథి గుర్రాలను వడిగా త్రోలగా సేనలు ఉండే గుడారం కడకు కొనివచ్చాడు.

అంతులేని పుత్త్రశోకంతో ఉన్న ద్రౌపదికి, గట్టి త్రాటితో చేతులు కట్టివేయబడి, వణుకుతున్న అవయవాలతో ఉన్న అశ్వత్థామను అర్జునుడు చూపాడు.


ద్రొపది యశ్వత్థామను జూచి సంభాపించుట

Vyasuni Kadaku Naradudu vacchuta - వ్యాసునికడకు నారదుండు వచ్చుట

వ్యాసునికడకు నారదుండు వచ్చుట

నారదుడు ధరించే వీణ మహతి. ఆ విపంచిలోని తీగలపై నారాయణ నామం ఎల్లప్పుడు వినిపిస్తూ ఉండగా, ఆయన ముఖంనుండి హరిసంకీర్తనలు అమృతధారల్లా బయల్వెడలుతున్నాయి. ఆ గీతాలు విని మునీంద్రులు పారవశ్యం చెందుతున్నారు. జేగురు రంగుగల ఆయన జడలకాంతి దిక్కులలో ఉదయకాంతిని వెదజల్లుతోంది. ఆయన మెడలో ధరించిన తులసిమాలలసువాసనలు భూమ్యాకాశాల మధ్యభాగంలో వ్యాపిస్తున్నాయి. ఆయన లోకానికి క్షేమాన్ని కలిగించే, స్వచ్చమైన కీర్తిలో పారం ముట్టినవాడు. ప్రసిద్ధమైన వ్యావహారిక నీతిలో కడునేర్పరి. ఆయన ఏదో మాట్లాడే ప్రయత్నం ఆకాశంనుండి వ్యాసుని కడకు ఏతెంచాడు.

ఆ విధంగా వచ్చిన నారదుడు వినయశీలి, వేదవిభజనకళాపరమ సంతుష్టుడు, సంసారదుఃఖ విదూరుడు, మానసిక విజ్ఞానప్రకాశుడునైన వ్యాసుని సందర్శించాడు.

ఈ విధంగా తన ఆశ్రమానికి విచ్చేసిన నారదమహర్షిని గుర్తించి వ్యాసుడు శీఘ్రంగా లేచాడు. యథావిధిగా అర్చించాడు. చిరునవ్వు చిందే వదనంతో మెల్లగా వ్రేలితో వీణమీటుతూ ఇలా అన్నాడు.

పరాశరుని కుమారుడవైన వ్యాసమునీంద్రా! నీవు పురాణప్రపంచ నిర్మాణంలో బ్రహ్మవంటివాడవు. మహాభారతాన్ని పంచమవేదంగా నిర్మించినవాడవు. వేదాలలోని శబ్దాల అర్ధం తెలిసినవాడవు. కామం మున్నగు అంతశ్శత్రువులారింటిని జయించినవాడవు. పరబ్రహ్మతత్త్వాన్ని నిర్ణయించినవాడవు. యోగులలో అగ్రేసరుడవు. వినయసంపన్నుడవు. ఇటువంటి నీవు మనఃస్థైర్యం గోల్పోయి పిరికివానిలా విచారించడానికి కారణమేమిటయ్యా! ఆశ్చర్యంగా ఉందే!

అని పల్కిన నారదునితో వ్యాసుడిలా అన్నాడు.

"మునీశ్వరా! నీవు బ్రహ్మమానస పుత్రుడవు. శ్రీమన్నారాయణార్చనను స్వీకరించావు. దశదిశలా సంచరించావు. మిక్కిలి గొప్పదైన జ్ఞానోపదేశంలో పరాకాష్ట నందుకొన్నావు.

అంతేకాక నీవు సూర్యునివలె ముల్లోకాలలో సంచరిస్తావు. వాయువువలె సమస్త ప్రాణులలో మెలగుతావు. నీవన్నీ తెలిసినవాడవు. ఆ కారణంచే 

నారద మునీంద్రా! నీకు తెలియరాని ధర్మమంటూ లోకంలో ఏదీ ఉండదు. పెక్కు విషయాలను పరిశీలించి చూచినవాడవు. నాలో ఏర్పడిన కొరత ఏమిటో నా దిగులుకు కారణమేమిటో దయతో వివరించి చెప్పు.

అని వ్యాసుడు ప్రాధేయపడగా నారదుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు.

వ్యాసమునీంద్రా! నీవు పెద్దల పూజలందుకొనేవాడవు. విశేషంగా ప్రకాశించే ధార్మిక విషయాలు ఎన్నో చెప్పావు. కాని అందులో విష్ణుకథలు కొంచెం కొంచెం మాత్రమే చెప్పావు. వాసుదేవుని సగుణాత్మక సద్గుణ మహిమలను వర్ణిస్తే తప్ప ఎన్ని ధర్మాలు సోదాహరణంగా చెప్పినా భగవంతుడు సంతసించడు. నీకు ఈ మనోవేదన రావడానికి కారణం హరినామ సంకీర్తనం సమగ్రంగా చేయకపోవటంవల్లనే సుమా!

మానససరోవరం బంగారురంగు పద్మాలతోను, హంసల గుంపులతోను నిండి ఉంటుంది. శ్రీహరినామ మహిమను వ్యక్తపరచే గ్రంథం ఆ స్వచ్చమైన మానససరస్సులా ప్రకాశిస్తుంది. హరిసంకీర్తన లేని గ్రంథంలో ఎన్ని చిత్రవిచిత్రాలైన అర్థాలున్నా అది శోభాకరం కాదు. అది పొగరుతో కూస్తున్న నల్లకాకులతో కూడుకొని, ఉపయోగించటానికి పనికిరాని నీటిగుంటలాంటిది.

ద్వైపాయన మహార్షీ! నీవు భగవంతుని తత్త్వం తెలిసినవాడవు కదయ్యా! శ్రీహరి అనంతకల్యాణ గుణసంపన్నుడు కదా! ఆయనను ఎట్లు వర్ణించగలం? స్తుతించే సమయంలో అపశబ్దాలు దొర్లుతాయేమో అనుశంక అవసరం లేదయ్యా! అపభ్రంశ శబ్దాలతో కూడుకొన్న వాక్యాలతో హరిచరిత్ర వ్రాసినా, సర్వపాపాలు పటాపంచలవుతాయి. కాబట్టి సజ్జనులైన భక్తులు, యోగీశ్వరులు ఆ విష్ణువునే మనస్సులో ఎప్పుడూ తలపోస్తూ ఉంటారు. ఆయన లీలలనే గానం చేస్తూ ఉంటారు. ఆయన నామాన్నే జపిస్తారు. ఆయన గాథలను నిరంతరం శ్రవణం చేస్తారు. నిత్యం ఆయనను కీర్తిస్తారు. ఈ విధంగా వారు తమ జన్మలను సార్థకం చేసుకొంటారయ్యా! ఒక్కసారి సావధానంగా ఆలోచించవయ్యా!

జ్ఞానం నిష్కర్మతారూపం, నిరుపాధికం. జ్ఞానం కలిగిన సమయంలో సమస్తకర్మలనుంచి విముక్తి ఏర్పడుతుంది. అట్లే ఉపాధిభావం కూడ తొలగిపోతుంది. అయినా జ్ఞాని ఇంకా దేహత్యాగం చేయడు, ప్రారబ్ధం పూర్తయ్యేవరకు జీవించే ఉంటాడు. కాని జీవన్ముక్తుడై ఉంటాడు. ఆ సమయంలో అతడు ఆచరించే కర్మ విషయవాసనలకు లోనుగాకుండా ఉంటుంది. ఉపాధిభూతమైన అజ్ఞానాన్ని తొలగించి విడుదల అయ్యే స్థితిలో ఉంటుంది. అయినా జ్ఞానోత్పత్తి అయిన పిమ్మటకూడా హరిభక్తి లేకపోతే కర్మ పరిపూర్ణంగా శోభించదు.

కర్మలు రెండురకాలు. కామ్యకర్మలు. నిష్కామకర్మ్శ్మలు. ఫలాపేక్షతో చేసే కర్మలు కామ్యకర్మలు. ని
ష్కామకర్మలు కూడ రెండురకాలు. అవి శుభకారణాలు. భగవంతునికి అర్పించకుండా, ఏ కోరిక లేకుండా ఉండి చేసే కర్మ ఒకటి. ఏ కోరిక లేకుండ భగవంతుని ఉపాసిస్తూ, తదర్పణ కావించే కర్మ వేరొకటి. ఫలాన్ని వాంఛించకుండా పరోపకార పారీణతతో చేసే కర్మలు సత్ఫలితాలనే ఈయవచ్చు. ఈయకపోవచ్చు. అయినా ఈశ్వరునకు సమర్పించే కర్మమాత్రమే ఉత్కృష్టకర్మ అవుతుంది. కారణం దైవం కర్మఫలప్రదాత కాబట్టి. భగవంతునికి సమర్పించే కర్మలో లోపం ఉన్నా తొలగిపోతుంది.

భగవద్బక్తి లేని జ్ఞానం శుష్క జ్ఞానం. భక్తిలేనట్టి వాక్కులు తార్కికవాక్కులు. భక్తివిరహితమైన కర్మ దుష్కర్మ. భక్తిలేని జ్ఞానం, వాక్కు కర్మ ఎంత గొప్పవైనా నిరర్ధకాలే.

కాబట్టి, వ్యాసమహార్షీ! నీవు ఏమీ తక్కువవాడవు కావు. బుద్ది నిశ్చయంలో గొప్పవాడవు. సత్యాన్ని దర్శించేవాడవు. దిగంతముల వరకు వ్యాపించిన స్వచ్చమైన కీర్తి కలవాడవు. సత్యమునందు అనురక్తి కలవాడవు. వ్రతానుష్టానపరుడవు. నీకు కావలసినదీ లేదు. కోరదగినదీ లేదు. అయినా సమస్త మానవులయొక్క బంధవిముక్తికోసమై వాసుదేవుని సృష్టిలీలలను భక్తియుక్తంగా వర్ణించవయ్యా! శ్రీహరిని వర్ణించకుండా వేరొకవిధంగా భీన్నార్థాలు కల్పించి, ఇతరవర్జనలు చేయడంవల్ల ఫలితం ఉండదు. అట్లు భిన్నదృష్టి కలవారికి నామరూపాత్మకమైన ప్రపంచం గోచరిస్తుంది తప్ప అభేదదృష్టి కలుగదు. అటువంటివారి బుద్ది సుడిగాలిచే గిరగిర త్రిప్పబడి కొట్టుకొనిపోయే నావలాగా తీరం చేరలేదు.

సామాన్య మానవులకు కామ్యకర్మలపై ఆసక్తి ఎక్కువ. వారు చేయవలసిన ధర్మాలేవో చెప్పి శాసించడం నీవంటి వానికి తగదు. ఎందువల్లనంటే మూఢులు అదే ప్రధానమని భావించి కలుషితాలైన కామ్యకర్మలకే అలవాటు పడిపోతారు. అప్పుడు వారు పరమార్ధాన్ని మరచిపోతారు. కాబట్టి వారి బుద్ధి పెడదారిపట్టకుండా తత్త్వోపదేశదృష్టి కలవాడవై జ్ఞానాన్ని అందించి వారి తాపత్రయ బాధలు నివారించుమని చెప్పి నారదుడు ఇంకా ఇలా అంటున్నాడు.

సదసద్వివేక విచక్షణుడైనవాడు సకల క్రియావ్యాపారాలను వదలివెస్తాడు. శ్రీ మహావిష్ణువుయొక్క నిర్వికల్పాత్మకమైన సచ్చిదానంద రూపాన్ని సంపూర్ణంగా దర్శిస్తాడు. ఆ స్వరూపంపై ఆనుకూల్యదృష్టి కలిగి భగవదనుభవం ప్రదర్శిస్తాడు. ఆ వివేకం లేనివాడు త్రిగుణాలకు లోనయినవాడై, జననమరణరూప సంసార చక్రంలో పరిభ్రమిస్తూ ఉంటాడు. తాను కాని దేహంపై “ఈ దేహమే నేను” అనే అహంకారంతో, తనవికాని సంపదలపై “ఇవి నావి” అనే మమకారంతో అజ్ఞానంలో సంచరిస్తూ ఉంటాడు. అటువంటి అజ్ఞానికి భగవంతుని లీలలు స్పష్టంగా అర్ధమయ్యేలా వివరింపుము.

మానవులు తమ వంశాన్ని అనుసరించి, ఆశ్రమాన్నిబట్టి అనుష్టించవలసిన ధర్మాలు ఎన్నో ఉన్నాయి. అవి తప్పకుండా చేయవలసిందే. ఎవడైనా ఏ కారణంవల్లనైనా వాటిని చేయలేని స్థితిలో వాటిని విడిచి గోవింద పదారవిందాలను భక్తితో సేవిస్తే ఆ సేవ సిద్ధి పొందక మరణించినా, అతడికి నష్టమేమీ కలుగదు. అతడు ఈ జన్మలో కాకపోయినా, మరో జన్మలోనైనా తాను చేసిన దానికి ఫలం పొందుతాడు. అలా కాకుండా విష్ణుసేవకు దూరమై కులధర్మాలను పరమనిష్టతో ఆచరించినా, అవి సంసారహేతువులు కాబట్టి, వాడు ఎన్ని జన్మలెత్తినా కృతార్థుడు (మోక్షగామి) కాలేడు. 

ఇట్టి సత్యాన్ని తెలుసుకొన్న మానవుడు కర్మమార్గం పై అత్యంత ప్రీతి ప్రకటించకుండా ఎల్లప్పుడూ శ్రీహరిని సేవించడానికై ప్రయత్నం చేయడం చాలామంచిది. కాలానుసారంగా సుఖాలు కలుగుతూ ఉంటాయి. అప్పుడు సుఖాల్లో మునిగిపోయి మత్తుడై శ్రీహరిని విస్మరించడం తగదు. అలాగే దుఃఖాలు వస్తూ ఉంటే ఆ కష్టాలు భరించలేక హరిని సేవించడం మానరాదు. అందువల్ల, పైనున్న బ్రహ్మ మొదలుకొని అధోలోకంలోని స్థావరాలవరకు పరిభ్రమించే జీవకోటికి హరిసేవ కర్తవ్యం. హరిసేవాపరాయణుడు ఒకవేళ తిరిగి జన్మనొందినా, అతడు సామాన్య మానవునిలా సంసారబంధంలో తగుల్కొనడు. ఆ సంస్కారంతో భక్త్యానంద సాగరంలో మునిగినవాడై శ్రీహరిసేవను విడిచిపెట్టకుండా జీవితం కొనసాగిస్తాడు.

ఈ ప్రపంచమంతా విష్ణుమయం. ఈ విశాలవిశ్వంలో విష్ణువుకన్న భిన్నమయింది ఏదీలేదు. ఆ భగవంతుని సంకల్పంవల్లనే సృష్టిస్థితి సంహారాలు ఏర్పడుతున్నాయి. వ్యాసమహర్షి! నీవు సర్వం తెలిసినవాడవే కదా! ఈ విషయాన్నంతా అక్కడక్కడ మహాభారతం మున్నగువాటిలో నీవు చెప్పియున్నట్టిదే! విశ్వకల్యాణంకోసమై శ్రీహరి అంశతో అవతరించిన వాడవు నీవని గుర్తు ఉంచుకో. మహావైభవంగా ఆ గోవిందుని శౌర్యాదులను సంపూర్ణంగా వర్ణించు. మానవునకు ఉండే పాండిత్యం, వేదాధ్యయనం, దాతృత్వం, ధర్మానుష్టానం, తపస్సు, ధైర్యం, సంపద మున్నగు వాటికన్నింటికి పరిపూర్ణఫలం పవిత్ర కీర్తనుడైన పద్మనాభుని స్తుతించడమే కదా!

Narada's Past Life - నారదుని పూర్వజన్మవృత్తాంతము

నారదుని పూర్వజన్మవృత్తాంతము

నారదుడు తన పూర్వజన్మ వృత్తాంతం ఇలా చెప్పుతున్నాడు. ఓ మహానుభావా! గడచిపోయిన బ్రహ్మకల్పంలో నాదైన పూర్వజన్మలో నేనొక దాసీపుత్రుణ్జి. నా తల్లి వేదవిచారణ చేసే శ్రోత్రియుల ఇండ్లలో పనిచేస్తూ ఉండేది. నేను చిన్నవాడుగా ఉన్నప్పుడు ఆ వేదవేత్తలు వానకాలంలో ఒకేచోట చాతుర్మాస్యవ్రతం చేస్తున్న యోగులకు సేవ చేయటానికి నన్ను పంపారు. నేను సేవ చేస్తుండగా.

పుణ్యాత్మా! నేను భయభక్తులతో అన్నివేళల ఆ పరమహంసలను సేవించాను. ఓర్పు చూపించి నా నేర్పు ప్రకటించాను. చిన్నవయస్సయినా, ఆటపాటలపై ఆసక్తి ఉండే ప్రాయమయినా, నాతోడి బాలురతో ఆవంకకుపోకుండా మనస్సు కట్టడి చేసుకొని, ఎలాంటి సంబంధం ఎవరితో పెట్టుకోకుండా శ్రద్ధాభక్తులతో వారిని ఆరాధించాను.

ఆ సన్న్యాసులు భిక్షాపాత్రలలో మిగిల్చివేసిన ఎంగిలి పదార్థాలను భుజిస్తూ ఉండేవాడిని. ఆ ఉచ్చిష్టం సకలపాపనాశకం, సమస్త మంగళకరమని భావించేవాడిని. వానలో తడిసినా, ఎండలో మాడినా వెనుకాడకుండ వారికి సేవ చేశాను. వారు ఏమి ఆజ్ఞాపిస్తారో అని నిరంతరం వారిముందు నియమనిష్టలతో నిలబడి ఉండేవాడిని. వివేకం ఉన్న వాడనయినా వారేమి చెప్పినా ఇదికాదు, అదికాదని మారుమాటాడక ఒక వెట్టివానిలా ప్రవ ర్తించి పనులు నెరవేరుస్తూ ఉండేవాడిని.

ఈ రీతిగా వర్షాకాల శరత్కాలాలు నాలుగు నెలలూ వారిని భక్తితో ఆరాధించాను. ఆ మహానుభావులు కూడా నాపై దయ చూపించారు. ఆ సమయంలో.

ఆ పరమహంసలు నిత్యం కృష్ణచరిత్రను పఠిస్తూ ఉండేవారు. విశేష వ్యాఖ్యానంతో వివరిస్తూ ఉండేవారు. ఒక్కొక్క సమయంలో నామసంకీర్తనం చేస్తూ ఉండేవారు. ఆ ధ్వనులు అమృతరస ప్రవాహాలై నా చెవులలో నిత్యమూ నిండిపోయాయి. నా హృదయం ఆనందంతో సంతృప్తి చెందింది. క్రమక్రమంగా ఇతర చింతలన్నీ వదలి వేశాను. భక్తితో నారాయణ సేవ ప్రారంభించాను.

ఈ విధంగా నేను అనుష్టించిన విష్ణుభక్తివల్ల నేను ప్రాపంచిక వాసనలకు దూరమయ్యాను. ప్రపంచాతీతుణ్ణిగా మారి బ్రహ్మస్వరూపుడను అయ్యాను. స్త్టూలసూక్ష్మరూపమైన శరీరం నాయందు మాయచే ఆరోపించబడిందని తెలుసుకొన్నాను. ఒక్క విష్ణుభక్తివల్లనే నాకిటువంటి శుద్ధజ్ఞానం ఏర్పడింది. ఆ యోగీంద్రుల అనుగ్రహంవల్ల లోభకారణమైన రజస్సు, అజ్ఞాన హేతువైన తమస్సు అంతరించాయి. ఆ మహానుభావుల చాతుర్మాస్యవ్రతం కూడ పూర్తి అయింది. వారు ఆ ప్రదేశం విడిచి మరోప్రదేశానికి వెళ్లడానికి ఉద్యుక్తులయ్యారు.

బాల్యానికి సహజమైన చపలత్వాన్ని వీడి, భక్తితో ఆ పెద్దలకు పరిచర్యలు చేయగా, వారు సంతృప్తిచెంది, వాత్సల్యంతో, దయతో, అరకొరలు లేకుండ అమోఘం, అతిరహస్యమైన బ్రహ్మవిజ్ఞానాన్ని నాకు ఉపదేశించారు.

నేను కూడా ఆ మహాత్ముల దివ్యోపదేశంవల్ల దేవదేవుడైన వాసుదేవుని మాయాప్రభావాన్ని తెలుసుకొన్నాను. మానవులు ఆచరించే కర్మలు మంచివయితే సత్ఫలితాలను, చెడువయితే దుష్ఫలితాలను అందజేస్తాయి. అవే ఆధ్యాత్మికం, ఆధిదైవికం, ఆధిభౌతికం అనే తాపత్రయాలకు మూలకారణాలు అవుతాయి. జీవులు ఆ కర్మఫలితాలను ఈశ్వర సమర్పణం చేస్తే ఈ మూడురకాల తాపాలు రూపుమాపే పరమౌషధం అవుతుంది. అంటే ఫలేచ్చతో చేసే యజ్ఞాదికర్మలు జన్మకారకాలు అవుతున్నాయి. ఫలకాంక్ష వదలి చేస్తే సమస్త కర్మలు ఈశ్వర సమర్పణంగా కావిస్తే సంసార మోక్షానికి కారణమవుతున్నాయని దీని భావం.

ఈ లోకంలో ఏ పదార్థం తినడంవల్ల ఏ రోగం పుడుతుందో, ఆ పదార్థం మితిమీరి భక్షించడంవల్ల ఆ జబ్బు వృద్ధి పొందుతుందే కాని రూపుమాసిపోదు. కాని అదే పదార్ధాన్ని వేరే పదార్ధంతో కలిపినప్పుడు చికిత్స జరిగి అది ఔషధంగా మారి, తినేవాని రోగం పోగొడుతుంది. ఆ విధంగా సంసారాన్ని ఏర్పరచే కర్మ ఈశ్వరార్పణ బుద్ధితో మిళితమై సంసార నివృత్తి చెసుకోవడానికి కారణమై తన అస్తిత్వాన్ని కోల్పోతుంది.

భగవంతునియందు ఫలసమర్పణచేసే సమస్త కర్మ జ్ఞానప్రాప్తికి కారణ మవుతుంది. ఈశ్వరునకు ఆనందాన్ని కలుగజేస్తుంది. అనన్య నిష్కళంక భక్తియోగాన్ని అనుగ్రహిస్తుంది.

ఈశ్వరాను గ్రహంవల్ల కర్మలాచరించేవారు శ్రీమహావిష్టు గుణనామవర్ణన స్మరణం కావిస్తారు. “ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం అనిరుద్దాయ 
నమః అని భగవంతుని చతుర్వ్యూహాలకు సంబంధించిన మంత్రాలు నాలుగింటిని మహాభక్తితో పురశ్చరణ చేస్తూ వందనం సమర్పిస్తారు. మంత్రాలే స్వరూపంగా గల్గిన భగవంతుని, భక్తులను అనుగ్రహించడానికి మూర్తిమంతుడైనా, వాస్తవానికి మూర్తరూపంలేని భగవంతుని, “యజ్ఞోవైవిష్ణుః" కావున యజ్ఞస్వరూపుడైన భగవంతుని ఆరాధించి పురుషుడు సమ్యగ్దర్శనం కలిగి ఆత్మజ్ఞాని అవుతాడు.

వ్యాసమునీంద్రా! నేను ఉపాసించిన భక్తియోగానికి నారాయణుడు సంతసించి నాకు తన స్వరూప జ్ఞానాన్ని అనుగ్రహించాడు. నా అనుష్ఠానవిధానం ఆ భగవంతునకు తెలుసు. నీవుకూడా ఆ మార్గంలో శ్రీ మహావిష్ణువును ఉపాసించు.

నీవు మహర్షి మండలిలో అగ్రగణ్యుడవు. గొప్పజ్ఞానం కలవాడవు. నీవు నారాయణ సంకీర్తన ప్రతిదినం కావిస్తూ ఉంటే, వినే సమస్త మానవుల (జీవుల) దుఃఖాలన్నీ పటాపంచలైపోతాయి.

ఈ విధంగా నారదుడు దాసీపుత్రుడుగా జన్మించడం, ఆ జన్మలో ఆతడొనర్చిన సమస్తకార్యాలూ విని, వ్యాసమహర్షి ఇలా అన్నాడు.

నారదమునీంద్రా! నీవా బాలుడవన్నావు. దాసీపుత్రుడవన్నావు. ఆ యతిపుంగవులు నీకు చిన్నతనంలోనే బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించి వెల్లిపోయారన్నావు. ఆ తరువాత నీ వెంతకాలం జీవించావు? నీ బాల్యం ఎలా గడిచింది? ముసలితనంలో ఏ రీతిగా సంచరించావు? ఎవరికైనా పూర్వజన్మస్మృతి కలగడమే కష్టం. కాని నీకు పూర్వకల్ప స్మరణం కలిగింది. అది నీకు ఏ విధంగా స్ఫురించింది? దాసీపుత్రుడవైన నీవు ఏ విధంగా శరీరాన్ని వదలిపెట్టావు. ఆ వృత్తాంతాన్ని అంతా వివరించు.

వ్యాసుడు ఈ విధంగా ప్రశ్నించగా, నారదుడు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఒక దాసీతనూజుడనైన నేను ఆ యతీంద్రులవల్ల ఈశ్వరజ్ఞానాన్ని పొందియుండగా ఇలా జరిగింది.

నా తల్లి తన పనికి మాత్రమే అంకితమైన ఉత్తమవ్యక్తి మమ్ము పోషించేవారి ఇండ్లలోని పనులన్నీ ఒకదాని తరువాత ఒకటి వరుసగా చేసుకొనిపోయేది. తన దాస్యాన్ని గూర్చికాని, తన పరాధీనతను గూర్చికాని ఆమె కించిత్తూ కించపడేది కాదు. నేనంటే నా తల్లికి పంచప్రాణాలు. నేనుకూడా ఆ యజమానులకు అటూ ఇటూ సేవచేస్తూ అలసిపోయానని, సొలసిపోయానని, ఆకలిని పొందానని వాపోయేది. ఉదయం, సాయంకాలం పుత్రప్రేమతో నన్ను ముద్దాడేది. జుట్టు దువ్వేది. మేను నిమిరేది. ఆప్యాయతతో అక్కున చేర్చుకొనేది. ఇట్లు నన్ను ఆదరంతో పెంచుతూ ఉండగా, చేసేది దాస్యమనే విషయం విస్మరించి, ఆమెను విడిచిపోలేక ఇంట్లోనే ఉండిపోయాను. ఆ తల్లి అనురాగంలో నేను సంసారవ్యామోహంలో మాత్రం చిక్కుకోలేదు. కలిగిన ఆత్మజ్ఞానాన్ని విస్మరించలేదు. వేరే ధ్యాసలేక, ఎవరితోను మాట్లాడక, నా తల్లి దగ్గరే కొద్దిరోజులు కాలం గడిపాను. అప్పటికి నాకు ఐదేండ్ల వయస్సు మాత్రమే.

వ్యాసమునీంద్రా! ఒకనాడు నా తల్లి ఇంటినుండి బయలుదేరింది. రాత్రి సమయం. కటిక చీకటి. అలవాటుపడిన మార్గం కాబట్టి దారి తప్పకుండాపోయి ఆవును పాలు పిండబోయింది. దారిలో ఆమె ఒక పామును తొక్కింది. ఆ సర్పం నా తల్లి కాలిమీద కాటు వేసింది.

ఆ సర్పం కాలనాగం. అది చాలా పొడవైనది. దాని పడగకూడ చాలా పెద్దది. దాని ముఖంనుంచి విషాగ్ని జ్వాలామాలికలు వెలువడ్డాయి. ఆ విషంచే దహింపబడి నా తల్లి నేల వ్రాలిపోయింది.

మా అమ్మ నేలపై వ్రాలిపోయి విలవిల తన్నుకొంటూ, బుద్ధి వశం తప్పిపోగా ప్రాణాలు విడిచింది. అప్పుడు నేను ఏమాత్రం కలవరం చెందలేదు. నాతల్లి ప్రాణం పోవటాన్ని కళ్లారా చూచినా నేను వికారాన్ని పొందలేదు. మాతృప్రేమతో వ్యామోహంతో చింతించలేదు. నాకు బంధం తెగిపోయిందని, చాల మేలు జరిగిందని భావించి విష్ణు పాదసేవ చేసుకోవాలని నిర్ణయించుకొన్నాను.

నేను ప్రశస్తమైనదిగా భావించి ఉత్తరదిక్కుగా బయలుదేరాను. విశాలదేశాలు, నగరాలు, పట్టణాలు, గ్రామాలు, పల్లెలు, వ్రేపల్లెలు బోయగూడెములు, భిల్లవాటికలు క్రమంగా దాటిపోయాను. వనాలు, ఉపవనాలు, గైరికాదిధాతు చిత్రితాలైన పర్వతాలు, మదించిన ఏనుగులచే విరుగగొట్టబడిన వృక్షాలు, బాటసారుల మార్గాయాసాన్ని తొలగించే తటాకాలు, బహువిధాలైన పక్షుల కలకల ధ్వనులతో మనోహరాలై, వికసించిన తామరపూలలోని మకరందాన్ని త్రాగి మత్తెక్కి పరిభ్రమించే తుమ్మెదలతో నిండిన సరోవరాలు అతిక్రమించాను. ఆకలి, దప్పిక నాకు ఎక్కువ అయ్యాయి. ఒక నది మడుగులో స్నానంచేసి, శుచినై, నీరుత్రాగి శ్రమను పోగొట్టుకొన్నాను.

ఒక అరణ్యం యొక్క నడిమిభాగంలో కాలుపెట్టాను. ఎటుచూచినా తోడేళ్లు, కోతులు, ఎలుగులు, అడవిపందులు, ఏనుగులు, అడవిదున్నలు, ఏదుపందులు, గుడ్లగూబలు, శరభమృగాలు, పెద్దపులులు, కుందేళ్లు, గవయమృగాలు, ఖడ్గమృగాలు, క్రూరసర్పాలు, కొండచిలువలు మున్నగునవే దర్శనమిచ్చాయి.

ఏ పక్కచూచినా దాటశక్యంకాని గడ్డి తుప్పలతో కూడుకొన్న వెదురుడొంకలు, హోరుగాలితో కూడుకొన్న వెదురువనాలు, పెద్ద పెద్ద తుప్పులు, అల్లుకుపోయిన తీగలు, పెద్ద పెద్ద గుహలు కనిపించాయి. ఒక గుహదగ్గర రావిచెట్టు మూలంలో కూర్చున్నాను. ఆ పరమహంస పరివ్రాజకులు నాకు ఉపదేశించిన భగవత్తత్వాన్ని మననం చేసుకొన్నాను. హృదయమధ్యంలో ఉన్న అంతర్యామి స్వరూపుడైన విష్ణువును ధ్యానం చేశాను.

నా నేత్రాలలో ఆనందబాష్పాలు పొంగిపొర్లాయి. నా శరీరంలో రోమాలు పులకించగా గగుర్పాటు ఏర్పడింది. ఆ సర్వేశ్వరుడే నా గుండెలలో పూర్తిగా నిండిపోయాడు. తదేకధ్యానంతో మునిగిపోయిన నాకు ఆ పరమాత్మ సాక్షాత్కరించినట్లు తోచింది. నేను ఆనందసాగరంలో మునిగి తబ్బిబ్బులయ్యాను. ఆ సమయంలో నేను ఏమిటో నాకు తోచలేదు. హృదయస్థితుడైన పరమాత్మ కూడ కాన్పించలేదు. ఆ స్వరూపం మాయమైపోయింది. అనేక దుఃఖాలను పటాపంచలు చేసే ఆ విష్ణుస్వరూపం కనుమరగైపోయింది. నాకు ఇక దిక్కుతోచలేదు.

హఠాత్తుగా ధ్యానావస్థ నుండి లేచి నిలబడ్డాను. మళ్లీ ఆ దేవదేవుని హృదయంలో దర్శించాలనే ఉత్కంఠతో మళ్లీ ప్రయత్నం చేశాను. గుండెలలో ఆ రూపాన్ని నింపుకొన్నాను. నా యత్నం సిద్ధించలేదు. దుఃఖమే మిగిలింది. చూచికూడా దర్శనం పొందలేకపోయాను. జనసంచారంలేని ఆ అడవిలో పిచ్చిపట్టినవానివలె తిరిగాను. నా పరిస్థితిని శ్రీహరి గమనించాడు. వాక్కులకు గోచరుడు కాని ఆ నారాయణుడు గంభీర మధుర వాక్యాలతో నా దుఃఖాన్ని ఉపశమింపజేస్తూ ఇట్లు పలికాడు.

నాయనా! శరీరాన్ని ఏల శుష్కింపజేసుకొంటావు? వృథాగా మనస్సులో ఏల ఆయాసపడతావు? నీవు ఎంత ప్రయత్నించినా ఈ జన్మలో నా భగవత్స్వరూపాన్ని దర్శించలేవు. కామం మున్నగు అరిషడ్వర్గాన్ని పూర్తిగా జయించి, ప్రారబ్ధకర్మ సంపూర్ణంగా నశింపజేసుకొన్న, మునిముఖ్యులే నన్ను దర్శించగలరు. కాని జితేంద్రియులు కాని యోగులు నన్ను సాక్షాత్కరింపజేసుకోలేరు. నీ మనస్సులోని ఆకాంక్ష కొనసాగుటకై క్షణకాలం నా సగుణరూపన్ని నీకు స్ఫురింపజేశాను.

నన్ను ఉద్ధేశించి కల్గిన అభిలాష వ్యర్థంకాదు. అది సమస్త దోషాలను నాశనం చేస్తుంది. నన్ను సేవించడంవల్ల భక్తి శీఘ్రంగా నీ మనస్సులో పదిల మవుతుంది. స్పష్టంగా విన్నావు కదా!

కుమారా! నాయందు లగ్నమైన నీ బుద్ది జన్మాంతరాలలో కూడా వదలిపోయేది కాదు. నీవీ శరీరం విడిచి మరుసటి జన్మలో నా ఆజ్ఞపై నా భక్తునిగా జన్మిస్తావు.

ఈ మొత్తం సృష్టి నశించి, వేయి మహాయుగాలైన కాలము బ్రహ్మదేవునికి ఒక రాత్రి అయి గడిచిపోతుంది. ఆ రాత్రి కాలం గడిచిపోయిన తరువాత మళ్ళీ సృష్టి మొదలౌతుంది. ఆ సమయాన దోషాలు తొలగి, పూర్వజన్మ జ్ఞానంతో పుట్టి, నా దయతో శుద్ధసాత్వికులలో గణింపదగినవాడవై గొప్పతనాన్ని పొందుతావు.

ఆకాశమే ఆకారంగా, ఋగ్వేదాదులే నిశ్శ్వాసాలుగా ప్రకాశించి, విశ్వమంతటిని నియంత్రించే విష్ణువుయొక్క మహాతేజం - ఈ మాటలు పలికి ఊరకుండగా, నేను ఆ దివ్యతేజస్సుకు శిరస్సువంచి నమస్కరించాను. ఆయన కారుణ్యానికి మిక్కిలి సంతసించాను. కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలను పారద్రోలాను. సిగ్గు వదలివేశాను. ఆ అనంతుని అనేక నామాలను పురశ్చరణ చేశాను. పరమకల్యాణదాయకాలైన హరిగాథావిశేషాలను స్మరించాను. నిత్యసంతుష్టుడనై కాలం గడిపాను. ఆ పరమాత్మను బుద్ధిలో సుప్రతిష్టితం చేసుకొన్నాను. చిత్తవృత్తులను శమింపజేశాను. విషయవాసనలపట్ల వైరాగ్యం అవలంబించాను. కాలంకోసమై ఎదురుచూడసాగాను. ప్రపంచమంతా సంచరించాను. ఇంతలో ఆ శుభసమయం ఆసన్నమయింది. ఒక్కసారి మెరుపు మెరిసినట్లయింది. హఠాత్తుగా మృత్యుదేవత ఎదురైంది. పంచభూతాత్మకమైన, ప్రారబ్ధకర్మానుభవరూపమైన ఆ దేహాన్ని విడిచిపెట్టాను. సత్వగుణాత్మకమైన భాగవతదేహంలో ప్రవేశించాను. అటుపిమ్మట ఏర్పడిన దైనందిన ప్రళయంలో త్రిలోకాలు ఏకార్ణవమైన స్థితిలో శ్రీమన్నారాయణుడు జలరాశి మధ్యంలో శయనించియున్న సమయంలో, నిద్రకు ఉపక్రమించే బ్రహ్మదేవుని ఊర్పులతోపాటు ఆయన ఉదరంలో ప్రవేశించాను. అలా వేయి మహాయుగాలు గడచిపోయాయి. పరమాత్మ అనుమతితో చతుర్ముఖ బ్రహ్మపునఃసృష్టి ప్రారంభించాడు. బ్రహ్మ నిశ్వాసంలోనుంచి, ప్రాణాలలో నుంచి, ఇంద్రియాలలోనుంచి మరీచ్యాది మహర్షులు, నేనూ జన్మించాము. వారిలో నేను అస్ఖలిత బ్రహ్మచారినై సంచరించాను. త్రికాలలోను లోపలా, బయటా పరమేశ్వరుని అనుగ్రహంవల్ల విహరిస్తున్నాను. ఈశ్వరదత్తమైన దేవదత్తమనే నామాంతరంగల “మహతి” అనే వీణపై పరబ్రహ్మను అభివ్యక్తంచేసే సప్తస్వరాలు తమంతట తాము మోగుతూ ఉండగా, హరికథాగానాన్ని అనుసంధానం చేస్తూ ఇలా లోకసంచారం చేస్తున్నాను.

వ్యాసమునీంద్రా! పరమపవిత్రాలైన పుణ్యతీర్థాలు పాదాలందు గల దేవుడు శ్రీ మహావిష్ణువు. ఆయనయందు మనస్సు లగ్నంచేసి ఆయన లీలలను గానం చేస్తూ ఉండగా, పిలిచినట్లుగా వచ్చి ఆ పరమపురుషుడు నా గుండెలలో నిండిపోయేవాడు.

మహర్షీ! ఈ సంసారమనే సముద్రంలో మునిగితేలుతూ, విషయవాంఛలతో కర్మలు ఆచరిస్తూ మనోవేదన అనుభవించేవాడికి గోవిందనామ సంకీర్తనం, దాన్ని తరించడానికి ఉపయోగపడే తెప్పవంటిది సుమా!

మునిగణాభరణుడవైన ద్వైపాయనా! కొందరు మనస్సును నియంత్రించడానికి యమం, నియమం మున్నగు యోగసాధనలు కావిస్తారు. కాని అది నిరోధింపబడ్డట్లు కనబడుతుందే కాని కామం, క్రోధం మున్నగు వాటిచేత పునః ప్రేరేపింపబడి సాధన వ్యర్థమైపోతుంది. ఒక్క నారాయణ సేవద్వారా మాత్రమే ఇంద్రియాలు క్రమంగా శాంతి వహించి, చిత్తానికి ఉపశమనం చేకూరుతుంది. నీవు వివరింపుమని కోరగా నా జన్మరహస్యం, కర్మరహస్యం అంతా తెలియజేశాను. 

అనీ ఈ విధంగా నారదుడు వ్యాసునకు చెప్పవలసిందంతా చెప్పి వీడ్కోలు తీసుకొని వీణ వాయించుకొంటూ తనదారిని తాను వెళ్లిపోయాడు. అనంతరం సూతుడు శౌనకాదులతో ఇలా అన్నాడు.

నిరంతరం తన మహతీవీణపై స్వరరాగాలను పలికిస్తాడు. ఆ నాదానుకూలంగా హరిక్తీర్తనలు ఆలపిస్తాడు. ముజ్జగాలకు వీనులవిందు కావిస్తాడు. సమస్త పాపాలు తొలగిస్తాడు. అటువంటి మేటి భక్తుడు మరెందైనా ఉన్నాడా? ఆ నారదమహర్షికి సాటి మరెవ్వరూ లేరు.

సూతమహర్షి నారదుని హరికథాగానాన్ని ప్రశంసించాడు. ఆ మహర్షి చెప్పిన మాటలను శౌనకుడు ఆలకించి ఆయనను ఒక ప్రశ్న వేశాడు. నారదుని పుట్టుపూర్వోత్తరాలు, ఆయన ఉపదేశాలు విన్న వ్యాసుడు ఆ తరువాత ఏం చేశాడని అడిగాడు. దానికి సూతుడు ఇలా సమాధానం చెబుతున్నాడు. నదులలోకెల్ల సరస్వతీనది పరమపవిత్రమైనది. అది బ్రహ్మదేవతాకమైన నది. ఆ కారణంచే  యజ్ఞాదులకు, జపతపాలకు ఆలవాలమై బ్రహ్మవేత్తలకు కూడ నిరంతర స్నానయోగ్యమైనది అయింది. ఆ నదికి పడమటితీరంలో “శమ్యాప్రాసం” అనే ప్రసిద్ధమైన ఋష్యాశ్రమం ఒకటి ఉంది. అది విష్ణువుచే రక్షించబడి ఉంటుంది. ఆ కారణంవల్ల సదాచార సంపన్నులైన మునీశ్వరులకు అది నిలయంగా భాసిస్తుంది. అది పెక్కు రేగుచెట్లచే అలంకరించబడి దర్శనీయమై ప్రకాశిస్తుంది. అట్టి పవిత్ర ప్రదేశంలో ఆ నదీజలాలను ఆచమించి, వ్యాసుడు సుఖాసనంలో కూర్చున్నాడు. మనస్సును పదిలపరచుకొన్నాడు. తదేకనిష్ఠతో ధ్యానం కావించాడు. చిత్తంలో అంతర్యామి రూపంలోనున్న పరమాత్మను దర్శించాడు. ఆ పరాత్పరుని అధీనంలో మాయ ఉన్నట్లుగా గ్రహించాడు. కాని జీవుడు మాత్రం ఆ మాయయొక్క అధీనంలో ఉన్నట్లుగా గుర్తించాడు. జీవుడు మాయాసంబంధం కలిగి ఇంద్రియాలతో సంబంధం పెట్టుకొంటున్నాడని తెలుసుకొన్నాడు. త్రిగుణాలకు అతీతుడైన జీవుడు మాయాప్రభావంచే త్రిగుణాభిమానం కలవాడవుతున్నాడని, ఆ అభిమానం వల్లనే “నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను” అనే కర్తృత్వభోక్తృత్వ రూపమైన అహంకారాన్ని పొందుతున్నాడని నిర్ణయించాడు. ఆ అనర్ధం ఉపశమించాలంటే “హరిభక్తి” అనే యోగం తప్ప మరొక్కటి ఏదీ లేదని నిశ్చయించాడు.

ఈ భూమండలంలో ఏ మానవుడు ఏ గ్రంథంలోని విషయాన్ని శ్రవణం చేసినంతమాత్రంచేతనే శ్రీమహావిష్ణువు పై అచంచలమైన భక్తి కలిగి జన్మబంధాలు తొలగిపోతాయో, అట్టి సమస్తలోక కల్యాణప్రదమైన “భాగవతం” అనే మహాగ్రంథాన్ని వ్యాసమహర్షి ఎంతో నేర్పుతో రచించాడు.

వ్యాసుడు ఆ విధంగా భాగవతం వ్రాసి ముముక్షువైన శుకునిచే చదివించాడని సూతుడు చెప్పగా, శౌనకుడు ఇలా అన్నాడు. శుకపరబ్రహ్మం కేవలం స్వస్వరూప జ్ఞానంకలవాడు కదా! విశ్వంలోని సమస్త విషయాలపట్ల ఉపేక్షాభావం వహించేవాడు కదా! అట్టివాడు భాగవత గ్రంథాధ్యయనం మాత్రం ఎలా చేశాడు? చాలా ఆశ్చర్యంగా ఉందయ్యా! అని ప్రశ్నించగా సూతమహర్షి ఇలా సమాధానమిచ్చాడు.

పవిత్ర చరిత్రా! భగవంతునియందే తప్ప మరే విషయంలోను ఆసక్తిలేనివారు, ప్రాపంచిక విషయాలయందు అనురక్తిలేనివారు, ఆత్మయందే రమించేవారు అయిన యోగీంద్రులు నిర్వ్యాజమైన భక్తితో హరి సంకీర్తనం చేస్తూ ఉంటారు. శ్రీమన్నారాయణుడు అట్టి యోగ్యత కలవాడు.

శుకయోగి శ్రీహరి దివ్యనామాలను, గుణాలను గానం చేయుటయందు ఆసక్తి కలవాడు. ఆయనయందే ఏకాగ్రమైన చిత్తం కలవాడు. ఆయన భాగవతసంహితను మూడులోకాలకు శుభదాయకమయినదిగా భావించాడు. శుభం కలగాలనే, దాన్ని అధ్యయనం చేశాడు.

శౌనకమునిపండితా! వేలకొలదిగానున్న వేదశాఖలనన్నింటిని అధ్యయనం చేసినా ముక్తిసంపద సులభంగా లభించేది కాదు. కాని భాగవతసంహితను అభ్యసిస్తే కైవల్యం సులభంగా లభిస్తుంది.

అర్జునుండు వుత్రఘాతియగు అశ్వత్థామ నవమానించుట

Thursday, February 5, 2026

Vyasudu Vyakula Chittundai Chinthinchuta - వ్యాసుండు వ్యాకులచిత్తుండై చింతించుట

వ్యాసుండు వ్యాకులచిత్తుండై చింతించుట

ఈ విధంగా శౌనకుడు మున్నగు మునిచంద్రులు అడుగగా, వారికి సూతమహర్షి ఇలా సమాధానమిచ్చాడు. ఒక మహాయుగంలో భాగాలైన కృతత్రేతాయుగాలు గడచి, మూడోదైన ద్వాపరయుగం పూర్తయ్యే సమయంలో ఒక వృత్తాంతం జరిగింది. ఉపరిచరవసువనే ఒకరాజు ఉండెడివాడు. ఇంద్రుడిచ్చిన విమానంలో ఆకాశంలో సంచరించే వసువు కావున ఆయనకు ఉపరిచర వసువనే పేరు సార్ధకమయింది. ఆయనే వసుమహారాజు. ఆ వసువు తేజస్సువల్ల ఉద్భవించిన కన్య కావున “వాసవి” అనే పేరుతో వాసింక్కింది సత్యవతి. ఆ పవిత్రక్షేతంలో పరాశర మహర్షివల్ల నారాయణాంశతో వ్యాసుడు జన్మించాడు. ఆయన మహాజ్ఞాని. వేదవిభాగం కావించి వేదవ్యాసుడుగా ప్రసిద్ధింక్కాడు. సరస్వతీనది ప్రవహించే స్థలంలో ఆయన నివాసం. అదే బదరికాశ్రమం. ఆయన ఒకనాడు ఆ నదీజలాలలో స్నానంచేసి కాలోచిత కర్మలాచరించి పరమపవిత్రుడై ఉన్నాడు. ఏకాంతస్థలంలో ఒంటరిగా కూర్చుండి ధ్యానముద్రలో ఉన్నాడు. అంతలో సూర్యోదయమయింది. భూతభవిష్యద్వర్తమానాలు తెలిసిన ఆ ఋషి కనబడకుండా కడువేగంతో పరుగుపెట్టే కాలగమనంలో ఏర్పడే మార్పులను గమనించాడు. భూలోకంలో యుగధర్మాలు సాంకర్యం పొందుతాయని గ్రహించాడు. యుగపరిణామంవల్ల పాంచభౌతిక శరీరాలలో శక్తి సన్నగిల్లుతుందని, మానవులు సత్తువలేనివారు, ధైర్యగుణం లేనివారు, ధారణాశక్తి లేనివారవుతారని భావించాడు. అంతేకాదు. అల్పాయుష్ములు అవుతారని, బలహీనులవుతారని నిశ్చయించాడు. తన తపోదృష్టితో అంతా పరీక్షించి సర్వవర్జాలవారికి, అన్ని ఆశ్రమాల వారికి మేలు చేకూర్చాలని నిర్ణయించాడు. హోత, ఉద్గాత, అధ్వర్యుడు, బ్రహ్మ అనే నల్గురు ఋత్విక్కులద్వారా, ఆచరించడానికి వీలుండే వైదిక కర్మలద్వారా ప్రజలకు క్షేమంకరాలైన యజ్ఞాలు నిరంతరం కొనసాగాలని దృష్టి నిలిపాడు. అంతవరకు ఒక్కటిగా ఉన్న వేదాన్ని ఋక్కు, యజుస్సు, సామం, అథర్వం అనే నాలుగు భాగాలుగా విభజించాడు. ఇతిహాస పురాణాలను పంచమవేదంగా పేర్కొని, వాటికి ప్రామాణ్యాన్ని సంతరించాడు.

పైలుడు ఋగ్వేదం, జైమిని సామవేదం, వైశంపాయనుడు యజుర్వేదం, సుమంతుడు అథర్వవేదం అధ్యయనం చేశారు. నా తండ్రి రోమహర్షణుడు ఇతిహాసాలను, పురాణాలను అభ్యసించాడు. ఈ ఋషులందరు తాము నేర్చుకొన్న వేదాలను వేర్వేరుగా తమ శిష్యులకు బోధించారు. ఆ శిష్యులు అదేవిధంగా తమ తమ శిష్యులకు విభజించి ఉపదేశించారు. ఈ విధంగా భూమండలంపై బ్రాహ్మణసమూహంలో వేదవృక్షం శాఖోపశాఖలై విస్తరిల్లింది.

ఈ విధంగా క్రమక్రమంగా వేదం విభజింపబడి ఏకంగాకాక 
భిన్నభిన్న శాఖలుగా ప్రజ్ఞాపటిమ పూర్తిగాలేని వారిచే ధారణ చేయబడింది. స్త్రీలు, కర్మసంస్కారంలేని శూద్రులు, కర్మసంస్కారమున్నా ఆచరించకుండా వ్యవహరించే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు వేదాలకు, తద్విహిత ధర్మాలకు దూరంగా ఉండిపోయారు. అటువంటివారికి వేదం శ్రవణయోగ్యం కాదు. కాబట్టి సామాన్యులందరికి మేలు కలిగేలా వ్యాసుడు భారతమనే ఇతిహాసం రచించాడు. విశ్వశ్రేయస్సుకై తానింత చేసినా, ఆయన మనస్సు ఎందుకో సంతుష్టి పొందలేదు. తన అసంతృప్తికి హేతువేమిటోయని ఆయన సరస్వతీ నదీతీరంలో ఏకాంతంగా కూర్చుండి ఆలోచించసాగాడు. తనలో తాను ఈ విధంగా అనుకొన్నాడు.

కఠోరమైన బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించాను. వేదాలను విభజించాను. అగ్నులను వ్రేల్చను. పూజ్యులను గౌరవించాను. శాస్త్రవిహితాలైన కర్మలను ఆచరించాను. వేదార్డాన్ని, దాని ఆంతర్యాన్ని మహాభారతరూపంలో వెల్లడించాను. స్త్రీశూద్రాదులు ఒనరించే ధర్మాలన్నీ వివరించాను. ఇంత చేసినా, నా అంతరాత్మ శాంతి పొందడంలేదు. అయ్యో! నా మనస్సులో అంతరాత్మ పరమాత్మతో ఐక్యం కానట్లు, సంతుష్టుడు కానట్లు తోస్తున్నది. అన్నీ ఒనరించాను. కాని విష్ణువునకు, హరిభక్తులకు అత్యంత ప్రియాన్ని చేకూర్చే భాగవత స్వరూపాన్ని ప్రతిపాదించలేకపోయాను. పొరపాటు జరిగిపోయింది. తెలివితక్కువ పని చేశాను. ఎంత విస్మృతిపాలయ్యాను? అని వ్యాసుడు విచారించే సమయంలో

kunthi devi praying sri krishna Kunti Stuti - కుంతీదేవి శ్రీకృష్ణుని స్తుతించుట

కుంతీదేవి శ్రీకృష్ణుని స్తుతించుట కృష్ణా! నీవే ఆదిపురుషుడవు. అందరిచేత స్మరింపబడేవాడవు. జగత్తుకన్న వేరుగా ఉండేవాడవు. నాశనం లేనివాడవు. సమస్తభూ...