నారదా! ఆలాగే చెబుతాను. ఆలకించు. వేదజనని సావిత్రిని ముమ్మోదటగా బ్రహ్మదేవుడు ఆరాధించాడు. తరవాత వేదాలు ఉపాసించాయి. ఆపైని పండితబృందాలు అర్చించాయి. అటుపై భారతభూభాగంలో అశ్వపతి అనే మహారాజు పూజలు చేశాడు. అక్కడినుంచి చతుర్వర్ణాలవారు యథాశక్తిగా పూజిస్తూనే ఉన్నారు.
మద్రదేశానికి మహారాజు అశ్వవతి. శత్రుసంహారకుడు. మిత్రసమ్మోదకుడు. మాలతీదేవి ఆతని పట్టమహిషి. ధర్మచారిణి. సాధ్వి. ఇద్దరూ లక్ష్మీనారాయణుల్లాగా కాపురం చేస్తున్నారు. ఎంతకాలానికి సంతానం కలగలేదు. వసిష్ఠుడి ఉపదేశంమీద భక్తిప్రపత్తులతో సావిత్రిని ఆరాధించింది. అయినా ఫలితం లేకపోయింది. సావిత్రి అనుగ్రహించలేదు. దర్శనం ఇవ్వలేదు. మాలతీదేవి ఎంతగానో దుఃఖించింది. రాజుగారి ఓదార్పులూ నయోపదేశాలూ ఊరట కలిగించలేకపోయాయి. అప్పుడింక అశ్వపతిమహారాజే స్వయంగా సావిత్రీ తపస్సుకోసం పుష్కరక్షేత్రానికి వెళ్ళాడు. జితేంద్రియుడై ఏకాగ్రచిత్తంతో నూరేళ్ళు తపస్సు చేశాడు. అయినా సావిత్రీమాత ప్రత్యక్షంకాలేదు. తిరస్కారమే మిగిలింది. అయో అని అశ్వపతి కుమిలిపోయాడు. అప్పుడు ఆకాశంనుంచి అశరీరవాణి వినిపించింది. దశలక్ష గాయత్రీ మంత్రజపం చెయ్యమంది.
సరిగ్గా అదే సమయానికి పరాశరమహర్షి అక్కడికి వచ్చాడు. అశ్వపతి సాష్టాంగ నమస్కారం చేశాడు. మహర్షి సంతోషించి నాయనా! అశ్వపతీ! గాయత్రీమంత్రాన్ని ఒక్కసారి జపిస్తే చాలు పగలంతా చేసిన పాపాలన్నీ హరిస్తాయి. పదిసార్లు జపిస్తే రేయింబవళ్ళు చేసిన కిల్బిషాలు అంతరిస్తాయి. నూరుమార్లు జపిస్తే మాసార్జిత పాపమూ, వెయ్యిసార్లు జపిస్తే సంవత్సరార్జిత పాపమూ, లక్షసార్లు జపిస్తే ఇహ జన్మార్జిత పాపమూ, పదిలక్షలసార్లయితే పూర్వజన్మార్జితపాపమూ, నూరులక్షలు జపిస్తే సర్వజన్మార్జిత పాపమూ నిశ్చయంగా నశిస్తుంది. ఇంతకు పదిరెట్లు జపిస్తే ముక్తి లభిస్తుంది. తూర్పుముఖంగా కూర్చుని వెన్నుపూస నిలబెట్టి అరచేతుల్ని పాముపడగల్తా విప్పార్చి రంధ్రముద్రతో నిశ్చలంగా జపించాలి. అనామిక (చిటికెన వేలుకి ప్రక్కది) నడిమి కణుపునుంచి అధోవక్రక్రమంగా తర్జని మూలందాకా (చూపుడువేలులో క్రింది కణుపు) లెక్కించుకుంటూ చెయ్యాలి. దశగాయత్రి అవుతుంది. తెల్లతామర విత్తనాలతోగానీ సృటికాలతోగాని జపమాలను తయారుచేసుకుని దేవాలయాల్లోనూ తీర్థప్రదేశాల్లోనూ గృహాల్లోనూ గాయత్రి జపం చేసుకోవచ్చు. ముందుగా ఆ జపమాలను అశ్వత్థపత్రంలోగానీ పద్మంలోగానీ ఉంచి గోరోచనం చల్లి గాయత్రీమంత్రోదకంతో స్నానం చేయించాలి. శతగాయత్రిని పఠించాలి. పంచగవ్యంతోగానీ గంగోదకంతోగానీ స్నపనం చేయించినా జపమాలను సంస్కరించినట్టవుతుంది. అలా సంస్కరించిన జపమాల స్వీకరించి దశలక్ష గాయత్రీజపం చెయ్యి. మూడు జన్మల మహాపాపాలు నశిస్తాయి. గాయత్రీదేవి దర్శనం ఆనుగ్రహిస్తుంది. రోజూ మూడు సంజలలోనూ సంధ్యావందనం చేస్తున్నావుగదా! ఆది చెయ్యనివాడు ఏ పూజలు చేసినా ఎన్ని యజ్ఞయాగాలు చేసినా వ్యర్థం. అతడు అశుచి. కనక శుభకర్మలకి అయోగ్యుడు. అనర్హుడు. బ్రాహ్మాణకర్మలకు సుతరామూ పనికిరాడు. యావజ్జీవితమూ ముప్పాద్దులా సంధ్యవార్చిన విప్రుడు తపస్తేజస్సుతో సూర్యసమానుడవుతాడు.
సంధ్యావందన పరిపూతుడైన బ్రాహ్మణుడి పాదధూళితో భూదేవి పవిత్రురాలవుతుంది. ఆతని స్పర్శతో నదీజలాలు పావనమవుతాయి. గరుత్మంతుణ్ణి చూసిన పాముల్లాగా పాపాలు పారిపోతాయి. సంధ్యావందనం చెయ్యనివాడు అందించే పిండతర్పణాలను పితృదేవతలు స్వీకరించరు. పూజా నైవేద్యాలను దేవతలు అంగీకరించరు. అటువంటి విప్రుడు విషంలేదన్నమాటేగానీ పాములాంటివాడు. విష్ణుమంత్ర విహీనుడూ, త్రిసంధ్యారహితుడూ, శ్రీహరి ప్రసాదం తిరస్కరించినవాడూ, వృషవాహకుడూ, కన్యావిక్రయి, భగవన్నామవిక్రయి. ఋతుస్నాతాన్నభోజి, భగజీవి, వార్దుషికుడూ(వడ్డివ్యాపారి), విద్యావిక్రయి, సూర్యోదయ సమయంలో నిద్రపోయేవాడూ, చేపలు తినేవాడూ - ఈ విప్రులందరూ మానవరూపంలో ఉన్న విషహీనసర్పాలే.
అందుచేత ఓ అశ్వపతీ! ముందుగా నువ్వు గాయత్రిని ఉపాసించు. ఆ తరువాత సావిత్రిని ధ్యానించు. ఫలిస్తుంది - అని ఉపదేశించి పరాశరుడు సెలవుతీసుకున్నాడు. పరాశరుడు చెప్పిన సావిత్రీపూజా విధానమేమిటంటే -
జ్యేష్ఠమాసంలో కృష్ణపక్షం త్రయోదశినాడు శుభముహూర్తాన తలంటుపోసుకుని సావిత్రీవ్రతారంభం చెయ్యాలి. చతుర్దశినాడు వ్రతం ముగించాలి. ఇలా పధ్నాలుగు సంవత్సరాలు చెయ్యాలి. పధ్నాలుగు రకాల ఫలాలూ పధ్నాలుగు నైవేద్యాలూ సమర్పించాలి. ధూపదీపాలూ నూతనవస్త్ర యజ్ఞోపవితాలూ యథావిధిగా షోడశోపచారాలూ నిర్వహించాలి. ఫలశాఖాసమన్వితంగా మంగళకలశం స్థాపించాలి. గణేశ దినేశ వహ్ని విష్ణు శివ శివాదేవతలను ఆరాధించాలి. అందరినీ మంగళకలశంలోకి ఆవాహన చెయ్యాలి, మధ్యాహ్నకాలంలో చెయ్యవలసిన సావిత్రీధ్యానమూ స్తోత్రమూ యథాతథంగా ఉపదేశిస్తున్నాను గ్రహించు.
బ్రహ్మతేజస్సుతో తప్తకాంచన వర్ణంలో గ్రీష్మమధ్యాహ్న మార్తాండ సహస్ర సన్నిభంగా ప్రకాశించే సావిత్రీమాతకు నమస్కారం. చిరునవ్వులు చిందించే ముఖంతో ప్రసన్నంగా కనిపించే భక్తానుగ్రహ కాతరకు వందనాలు. రత్నభూషణభూషితయై వహ్నిశుద్దాంశుక ధారిణియైన బ్రహ్మపత్నికి నతులు. ముక్తిప్రద, సుఖప్రద, శాంతస్వరూప, సర్వసంపత్స్వరూప, సర్వసంపత్ప్రదాయిని, వేదశాస్త్ర రూపిణి, వేదాధిష్టానదేవత, వేదబీజస్వరూప అయిన వేదమాతకు సాష్టాంగాలు.
ఇలా ధ్యానించి నైవేద్యం సమర్పించి నెత్తిమీద చెయ్యి ఆనించుకుని మళ్ళీ ధ్యానించాలి. మంగళకలశంలోకి భక్తిగా సావిత్రిని ఆవాహన చెయ్యాలి. వేదోక్త మంత్రపూర్వకంగా షోడశోపచారాలూ అందించి సాష్టాంగపడాలి.
దారునిర్మితంగానీ హేమనిర్మితంగానీ ఆసనం సమర్పించాలి. పూజాంగంగా పరిశుభ్రమైన తీర్థోదకాన్ని పాద్యమివ్వాలి. గరికపోచలతో కలిపి శంఖజలాన్ని ఆర్ఘ్యంగా అందించాలి. సుగంధ జలాలతో స్నానోపచారం చెయ్యాలి. సర్వమంగళప్రదమూ పరిమళబంధురమూ అయిన ధూపాన్నీ, అంధకారనాశకమూ జగద్దర్శకమూ అయిన దీపాన్ని చూపించాలి. రుచికరమూ ప్రీతికరమూ తుష్టి పుష్టి వర్ధకమూ క్షున్నివారకమూ నైవేద్యం పెట్టాలి. కస్తూరీ కర్పూర సమ్మిశ్రితంగా తాంబూలం ఇవ్వాలి. దాహం తీరేందుకు జగజ్జీవన కారణమైన శీతోదకాన్ని అందించాలి. అందాన్ని పెంచేదీ సభలో శోభను చేకూర్చేదీ పట్టువస్త్రాన్ని సమర్పించాలి. రత్నాలు పొదిగిన సువర్ణాభరణాన్ని కానుకపెట్టాలి. వివిధ వృక్షాలనుంచి ఏరి ఏరి కోసితెచ్చిన ఫలాలను నివేదన చెయ్యాలి. సమస్త మంగళప్రదమూ సమస్త పుష్పసమన్వితమూ శోభాకరమూ ప్రీతికరమూ మాలికను మెడలో వెయ్యాలి. గంధాన్ని తనువుపై చిలకరించాలి. అలంకరణల్లోకెల్లా అత్యుత్తమమైన సిందూరాన్ని నొసట దిద్దాలి. విశుద్ధగ్రంధిసంయుక్తమూ వేదమంత్రపరిపూతమూ అయిన యజ్ఞోపవీతాన్ని సమర్పించాలి. ఇలా షోడశోపచారాలూ చేసి సావిత్రీమాతను స్తుతించాలి. అటుపైని సద్బ్రాహ్మణుడికి దక్షిణ ఇచ్చి సంతృప్తి పరచాలి.
లక్ష్మీ - మాయా - కామ బీజాక్షరాలు మూడింటితో కలిపి (హ్రీం క్లీం ఓం) సావిత్రై స్వాహా అనే అష్టాక్షర మహామంత్రాన్ని నిష్ఠగా జపించాలి.
ఒకప్పుడు గోలోకంలో గోవిందుడు సావిత్రీదేవిని బ్రహ్మకు సమర్పించాడు. అయితే ఆవిడ గోలోకం విడిచిపెట్టి బ్రహ్మదేవునివెంట బ్రహ్మలోకానికి రావడానికి నిరాకరించింది. అప్పుడు శ్రీకృష్ణుడి ఆజ్ఞ ప్రకారం చతుర్ముఖుడు ఆ వేదమాతను బహువిధాల స్తుతించాడు. అప్పుడు ప్రసన్నురాలై బ్రహ్మను వరించింది. బ్రహ్మలోకానికి వెంట వచ్చింది. బ్రహ్మచేసిన అలనాటి మాధ్యందిన సావిత్రీస్తుతిని యథాక్షరంగా చెబుతున్నాను విని ధారణ చెయ్యి.
సచ్చిదానందరూపిణీ! మూలప్రకృతీ! హిరణ్యగర్భరూపా! సుందరీ! ప్రసన్నురాలివి కమ్ము తేజస్స్వరూపా! పరమానందరూపా! ద్విజాతిస్వరూపా! నిత్యా! నిత్యపియా! దేవి! నిత్యానంద స్వరూపిణీ! సర్వమంగళరూపా! ప్రసన్నురాలివి కమ్ము. సర్వస్వరూపా! మంత్రస్వరూపా! పరాత్పరా! సుఖదా! మోక్షదా! దేవీ ప్రసన్నవు కమ్ము పాపకాష్ఠాలను దహించడానికి అగ్నిశిఖ వంటిదానా! బ్రహ్మతేజఃప్రదా! దేవీ! ప్రసన్నవు కమ్ము. మనోవాక్కాయకర్మలతో మానవుడు చేసే సమస్త దురితాలూ నీ నామస్మరణమాత్రంచేత భస్మమైపోతాయి.
ఇలా స్తుతించి బ్రహ్మదేవుడు ఆ సభామంటపంలో నిశ్చలంగా నిలబడ్డాడు. సావిత్రీదేవి ప్రసన్నవదనంతో తనంతతానుగా చెంతకువచ్చి బ్రహ్మను వరించింది. బ్రహ్మలోకానికి తరలివెళ్ళింది.
నారదా! పరాశరుడుపదేశించిన పూజావిధానాన్ని ఆచరించి ఈ బ్రహ్మకృత సావిత్రీ స్తోత్రాన్ని అక్షరశః ధారణచేసి అశ్వపతి ఆ వేదమాత అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. సావిత్రీదేవి ప్రత్యక్షమై కోరకనే వరం ప్రసాదించింది. ఈ స్తవరాజాన్ని సంధ్యావందనం తరువాత నిత్యమూ పఠించే విప్రుడు చతుర్వేదాధ్యయన ఫలాన్ని పాందుతాడు.