Sunday, June 14, 2026

Lalithambika Devi Temple, Thirumeeyachur, Tiruvarur District, Tamil Nadu - లలితాంబికాదేవి దేవాలయం, తిరుమీయచ్చూర్‌‌, తిరువారూర్‌ జిల్లా, తమిళనాడు

లలితాంబికాదేవి దేవాలయం, తిరుమీయచ్చూర్‌‌, తిరువారూర్‌ జిల్లా, తమిళనాడు

తమిళనాడులోని తిరువారూర్‌ జిల్లా తిరుమీయచ్చూర్‌‌లోని లలితాంబికాదేవి దేవాలయం ఎన్నో ప్రత్యేకతలను కలిగి భక్తులకు కొంగుబంగారంగా విలసిల్లుతోంది. మేఘనాథస్వామి పేరుతో పరమేశ్వరుడు, లలితాంబిక పేరుతో పార్వతీదేవి ఇక్కడ కొలువైవున్నారు. లలితాంబిక కొలువైన ఆలయ ప్రాంగణం ప్రతినిత్యం లలితా సహస్రనామ పారాయణాలతో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. శివుని మందిరం ఆయుష్‌ హోమాలతో, అరవై, ఎనభై సంవత్సరాల వృద్ధుల జన్మదిన ప్రత్యేక పూజలతో, అభిషేకాలతో, అర్చనలతో అలరారుతుంటుంది. ఈ దేవాలయ దర్శనం సర్వపాప ప్రక్షాళన గావిస్తుందంటారు. అంతేకాదు, ఇక్కడి స్వామిని ప్రార్థిస్తే పెళ్లికాని యువతులకు వెంటనే కళ్యాణప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. శనీశ్వరుడు, గరుడుడు, సూర్యరథసారధి అయిన అరణుడు, యముడు, వాలి, సుగ్రీవులు ఇక్కడ జన్మించారని భక్తుల నమ్మకం.

సకల భువనేశ్వరుడు, మేఘనాథుడు మొదలైన నామాలతో ఇక్కడ విరాజిల్లుతున్న పరమేశ్వరుడికి అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక సందర్భాలలో విశేష పూజలు జరుగుతుంటాయి.ఎంతోమంది తమ షష్ఠిపూర్తి ఉత్సవాలను, సహస్ర పూర్ణ చంద్రదర్శన పండుగ సమయాలు, ఆయుష్‌ హోమాలు, మృత్యుంజయ హోమాలు తిరుమీయచ్చూరులోని పరమేశ్వరుని సన్నిధిలో నిర్వహించి ఆ దేవదేవుని ఆశీస్సులనందుకుంటారు. ఈ దేవాలయం కావేరీ దక్షిణ తీరంలోని 56వ శివాలయంగా ఎంచబడింది. భక్తగ్రేసరుడైన జ్ఞానసంబందర్‌ తన ‘తేవరమ్‌’ స్తోత్రాలతో ఇక్కడి పరమేశ్వరుని స్తుతించారు. తిరుమీయచ్చూర్‌ దేవాలయంలో శివ పూజలు, అభిషేకాలు, లలితాంబికకు అర్చనలు జరగడంతో పాటు ప్రత్యేకంగా ‘రథసప్తమి’ పండుగ గొప్పగా నిర్వహించబడుతుంది. తమిళ మాసమైన చితిరాయ్‌ (ఏప్రిల్‌-మే)లో సూర్యకిరణాలు నేరుగా ఆలయంలోకి ప్రసరించి స్వామి చరణాలను తాకుతాయి.

ఈ దేవాలయంలో ఎన్నో ఉపాలయాలను చూడొచ్చు. ఇక్కడి కాళికాదేవి మందిరం కూడా దర్శించదగింది. ఎనిమిది చేతులతో మహిషాసురమర్ధినిగా ఉన్న ఆమెను దుర్గాదేవిగా శుకమహర్షి స్తోత్రం గావించాడు. వేదవ్యాసుని కుమారుడైన శుకమహర్షి చిలుక ముక్కు కలిగిన వాడు. భక్తుల కోరికలను కాళికాదేవి చిలుక ద్వారా లలితాంబికకు తెలియజేస్తుందని, అందుకే ప్రతి నిత్యం ఒక చిలుక సాయం సమయాలలో లలితాం
బిక గుడిపైన ఎగురుతుంది.

స్థల పురాణం
తిరుమీయచ్చూరు మరో ప్రత్యేకత ఏమంటే, ఈ దేవాలయంలో రెండు శివమూర్తులు, రెండు పార్వతీమూర్తులు పూజలందుకోవడం. ఈ విశేషం తమిళనాట తిరుమీయచ్చూరు. తిరువారూరు, తిరుప్పగతూరు దేవాలయాల్లో మాత్రమే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ప్రదేశంలోనే సూర్యుడికి శాప విమోచనం కలిగిందని పెద్దలు చెబుతారు. సూర్య రథసారధి అయిన అరుణుని అవతారాన్ని సూర్యుడు హేళన చేయడంతో బాటు అతని శివపూజను అడ్డుకోవడంతో శివుడు కోపించి సూర్యుని శపించాడు. శాపవిమోచన కోసం సూర్యుడు ప్రార్థించగా, 7 నెలలు శివపార్వతులను ఏనుగుపై అధిష్ఠింపజేసి మేఘాలపై నుంచి, అర్చనగావించాలని అప్పుడే శాపం నుంచి విముక్తి లభిస్తుందని శివుడు పలుకగా, అదేవిధంగా చేసిన సూర్యుడు శాపం నుంచి విముక్తి పొందాడని అంటారు. దాని గుర్తుగా గజవృష్ట వాహనంపై అధిష్ఠించినట్టు చెక్కబడిన శివపార్వతుల విగ్రహాలను ఇక్కడ దర్శించవచ్చు.

రోడ్డు మార్గం: తిరువారూర్‌ జిల్లాలో మైలాడుదురైకి 12 కి.మీ దూరంలో తిరుమీయచ్చూరు ఉంది. మైలాడుదురై నుంచి బస్సు సౌకర్యం ఉంది. పేరాలం నుంచి 2. కి.మీ, తిరువారూరు నుండి 25 కి.మీ, కుంభకోణం నుంచి 33 కి.మీ దూరంలో ఉన్న తిరుమీయచ్చూర్‌కి బస్సు లేదా టాక్సీలలో చేరుకోవచ్చు.

రైలు మార్గం: 
మైలాడుదురై వరకు రైలు సోకర్యం కలదు.

విమాన మార్గం: చెన్నై లేదా పుదుచ్చేరి 

దర్శన వేళలు: ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12.30 గంటలు, సాయంత్రం 4.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు దేవాలయాన్ని దర్శించుకోవచ్చు.

దేవాలయ విశేషాలు:
తిరుమీయచ్చూర్‌ శ్రీ మేఘనాథస్వామి ఆలయంలోని ఈశ్వరుడు స్వయంభూనాధుడు. లలితాంబిక పేరుతో అమ్మవారు శ్రీ చక్రరాజ సింహాసనంపై అధిష్ఠించి భక్తులకు అభయమిస్తూ అభయముద్రలో ఠీవిగా మహారాణిలా ఆశీనురాలై, చిరునవ్వులు చిందిస్తూ కళకళలాడే మోముతో మనకు దర్శనమిస్తుంది. ఆమె ప్రాం గణంలో లలితా సహస్రనామాలు, లలితా నవరత్నమాలా పారాయణ చేసే వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయన్నది భక్తుల విశ్వాసం. అందుకే జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయంలో లలితా సహస్రనామ పారాయణ చేయాలని భక్తులు కోరుకుంటారు.

ఆలయ ప్రాశస్త్యం
తిరుమీయచూర్‌ ఆలయం వెయ్యి సంవత్సరాల పురాతనమైనదని చరిత్రకారుల భావన. 
పండాసురు అనే రాక్షసుడు ఋషులను, దేవతలను బాధిస్తుండగా వారంతా జగన్మాతకు విన్నవించుకున్నారు. వారి కోరికను మన్నించి ఆమె పండాసురునితో యుద్ధం చేసి అతన్ని సంహరించింది. రాక్షస వధానంతరం కూడా ఆమె కోపం తగ్గకపోవడంతో ఆమెను భూలోకానికి వెళ్లి మనోన్మణి పేరుతో తపస్సు చేయమని పరమేశ్వరుడు ఆదేశించగా ఆమె ఈ క్షేత్రానికి వచ్చి తపస్సు చేసి ప్రశాంతంగా కరుణామయిగా మారింది. ఆమే ఈ లలితాబింక అని పురాణకథనం. హయగ్రీవుడు లలితాదేవి భక్తుడు. లలితా సహస్రనామ మహత్యాన్ని అగస్త్య మహర్షికి తెలియజేశాడు హయగ్రీవుడు. అప్పుడు లలితా సహస్రనామ పారాయణకు అనువైన స్థలం తెలియజేయమని ఆగస్త్యుడు హయగ్రీవుని కోరాడు. హయగ్రీవుడు భూలోకంలో మనోన్మణి రూపంలో సౌందర్యనాయకి విరాజిల్లుతున్నదని అగస్త్యునికి తెలియజేస్తాడు. అనంతరం అగస్త్యుడు తన పత్ని లోపాముద్రతో కలసి తిరుమీయచ్చూర్‌ ఏతెంచి అక్కడ లలితాంబిక సన్నిధిలో లలితా సహస్రనామం, తను విరచించిన లలితా నవరత్నమాల పారాయణ గావించాడని ప్రాంతీయ కథనం.

12 నాగమూర్తులు:
ఈ దేవాలయంలో నవగ్రహాలు లేకపోయినా, 12 రాశులకు చిహ్నంగా, 12 నాగమూర్తులు ఇక్కడ పూజలందుకుంటారు. ఇక్కడ దీపాలు వెలిగించి పూజలు సల్పితే అన్ని గ్రహదోషాల నుంచి విముక్తులవుతారని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో పుష్కరిణి ‘సూర్య తీర్థం’ పేరుతో విలసిల్లుతున్నది. తిరుమీయచ్చూర్‌ దేవాలయంలో శిల్పకళ ఉట్టిపడుతుంది. ప్రాంగణంలోని ‘శివశక్తి’ శిల్పం సందర్శకులనెంతో ఆకట్టుకొంటుంది. శివుడు కోపంతో ఉన్న పార్వతిని అనునయిస్తున్నట్టు చెక్కబడిన ఈ శిల్పం, ఆమె మోములో ఒక వైపు క్రోధం, మరోవైపు చిరునవ్వు కనువిందు కలిగిస్తూ శిల్పాచార్యుల నైపుణ్యానికి దర్పణంగా నిలిచింది. తిరుమీయచ్చూరు లలితాంబిక విగ్రహమూర్తి అద్భుతంగా జీవకళ ఉట్టిపడుతుంటుంది. భక్తుల పాలిట పెన్నిధిగా, శివపార్వతుల సన్నిధికి ఆలవాలమై, తిరుమీయచ్చూరు లలితా సహస్రనామాలకు పుట్టినిల్లుగా ప్రఖ్యాతిగాంచింది.


మన దేవాలయాలు చారిత్రక నగరాలూ

Friday, June 12, 2026

Visiting Temples for Business Growth - వ్యాపార అభివృద్ధికి దేవాలయాల దర్శనం:

వ్యాపార అభివృద్ధికి దేవాలయాల దర్శనం

వ్యాపార అభివృద్ధి, లాభాలు మరియు ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కడానికి మన దేశంలో కొన్ని ప్రత్యేకమైన దేవాలయాలు ప్రసిద్ధి చెందాయి. మీ నమ్మకాన్ని బట్టి ఈ క్షేత్రాలను దర్శించుకోవడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.

కనకదుర్గమ్మ దేవాలయం (విజయవాడ): వ్యాపారంలో ఐశ్వర్యం, అభివృద్ధి కలగాలని కోరుకునే వారు విజయవాడలోని కనకదుర్గమ్మను దర్శించుకుంటారు. అమ్మవారికి 'శ్రీచక్రార్చన' చేయించడం వల్ల వ్యాపార అడ్డంకులు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

తిరుమల వేంకటేశ్వర స్వామి (తిరుపతి): వ్యాపారస్తులు తమ లాభాల్లో కొంత భాగాన్ని స్వామివారికి మొక్కుబడిగా చెల్లిస్తుంటారు. కొలువు శ్రీనివాసుడిని దర్శించుకోవడం వల్ల వ్యాపార వృద్ధి కలుగుతుందని కోట్లాది మంది నమ్మకం.

అన్నవరం సత్యనారాయణ స్వామి: కొత్త వ్యాపారం మొదలుపెట్టే వారు లేదా ఉన్న వ్యాపారం బాగా సాగాలని కోరుకునే వారు అన్నవరం లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడం చాలా శ్రేయస్కరం.

కొన్ని ముఖ్యమైన సూచనలు:
శుక్రవారం: మహాలక్ష్మికి ప్రత్యేక పూజలు చేయండి.

వ్యాపార స్థలంలో: ప్రతిరోజూ ఉదయం దీపారాధన చేసి, 'శ్రీ సూక్తం' లేదా 'లక్ష్మీ అష్టోత్తరం' పఠించడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది.

వాస్తు: మీ వ్యాపార సంస్థలో వాస్తు దోషాలు లేకుండా చూసుకోవడం కూడా ముఖ్యం.

Significance of the Yamuna River - యమునా నది ప్రాముఖ్యత

యమునా నది ప్రాముఖ్యత

యమునా పుష్కరాలు: భారతదేశంలోని పన్నెండు పవిత్ర నదులలో ఒకటైన యమునా నదిని పూజించడానికి ఎంతో ముఖ్యమైన సమయం 
యమునా పుష్కరాలు. ఈ ఉత్సవాన్ని ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు.

ఈ కాలంలో, యమునా నదిలో స్నానం చేయడం మరియు దానధర్మాలు చేయడం వల్ల అపారమైన ఆధ్యాత్మిక పుణ్యం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ పండుగ బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో ఈ పుష్కరాలు ప్రారంభమయ్యాయి. నది ప్రవహించే  ప్రాంతాలు ప్రత్యేకించి బృందావనం వంటి ప్రదేశాలలో స్నానం మనల్ని ఎంతో ప్రభావితం చేస్తుంది.

యమునా నది ప్రాముఖ్యత:
యమునా దేవి, యమధర్మరాజుకి స్వయాన సోదరి. అందువల్ల యమునా నదిలో పుష్కర స్నానం ఆచరిస్తే యమ బాధలు తొలుగుతాయని విశ్వాసం. సూర్యుడి సంతానంలో యముడు, యమున, శని ప్రాధాన్యత ఎంతో ప్రత్యేకం. ఈ భూమ్మీద మానవుడు చేసే పాప పుణ్యాల కర్మను శని భగవానుడు అనుభవింపజేస్తాడు. జీవుడు ప్రస్తుత జన్మలో, అనేక జన్మల ద్వారా ఏర్పడిన పాప పుణ్య కర్మల ఫలితాలను మరణం తర్వాత యమధర్మరాజు చూస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ యమ బాధలు, పాపాల నుంచి విముక్తి పొందేందుకు యమునా నది స్నానం ఉత్తమమైనదని పేర్కొంటున్నాయి. అందువల్లే, శ్రీకృష్ణుడు స్వయంగా యమునా నది ఒడ్డున జన్మించడంతో పాటు ఈ నదితో ముడిపడి అనేక పురాణ విషయాలు ఉండటం యమున వైభవాన్ని, ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి.

దానాలు:
పుష్కరస్నానం అనంతరం దానం (అన్నదానం, గోదానం, భూదానం, సువర్ణదానం, లవణదానం, పుస్తక దానం వంటివి) చేస్తే విశేష పుణ్యఫలం లభిస్తుంది. యజ్ఞ యాగాదులు, హోమాలు వంటివి నిర్వహించడం లేదా ఆయా పవిత్ర కార్యాల్లో పాల్గొనడం వంటివి ఆచరిస్తే పుణ్యం కలుగుతుంది.

పుష్కరాల సమయంలో పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు ఆచరించడం వల్ల వారికి సద్గతులు ప్రాప్తిస్తాయని విశ్వాసం.

ఆచారాలు మరియు ప్రార్థనలు:
యమునా పుష్కరాల సమయంలో, భక్తులు దైవ అనుగ్రహం మరియు ఆత్మ శుద్ధి కోసం వివిధ పూజలు మరియు ప్రార్థనలలో పాల్గొంటారు.

తీర్థ స్నానం (పవిత్ర స్నానం): యమునా నది పవిత్ర జలాల్లో స్నానం చేయడం వల్ల భక్తుల పాపాలు తొలగిపోయి ఆధ్యాత్మిక పుణ్యం లభిస్తుందని నమ్ముతారు.

తర్పణ మరియు పిండ దాన: భక్తులు తమ పూర్వీకుల ఆశీస్సులు మరియు వారి ఆత్మ తృప్తి కొరకు వారికీ తర్పణములు మరియు పిండప్రదానం చేసి వారికి పరలోక ప్రయాణంలో ఆకలి దప్పులు లేకుండా ఉండాలని చేస్తారు.

శ్రాద్ధం: మరణించిన పూర్వీకులను గౌరవించడానికి శ్రాద్ధం నిర్వహిస్తారు.

ఆధ్యాత్మిక ప్రసంగాలు, భజనలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక వృద్ధిని మరియు దైవిక సహవాసాన్ని ప్రోత్సహించడానికి నిర్వహించబడతాయి.

పుష్కరాలకు వెళ్లలేని వారు ఈ పుష్కర సమయంలో ఇంటిలో గాని, సరోవరంలో గాని, దగ్గరలో వున్న నదులలో యమునా నది తలచి స్నానం చేసిన కూడా తగిన ఫలితం లభిస్తుంది.

యమునా దేవ్యై నమః 

Nandishwara - నందీశ్వరుడు

నందీశ్వరుడు

శివాలయంలో నందీశ్వరునికి ఉన్న ప్రాధాన్యత మిగిలిన దేవాలయాల్లో ఆయా దేవుళ్ళ వాహనాలకు ఉండదు.

నందీశ్వర నమస్తుభ్యం, సాంబానంద ప్రదాయకం

శివ దర్శనం చేసుకునేముందు నందీశ్వర దర్శనం తప్పనిసరి అని చెప్తారు. మొదటగా నందీశ్వరుని స్పృష్ట భాగాన్ని శృసించి, అయన శృంగములు (కొమ్ములు) మధ్యనుంచి శివ దర్శనం చేసుకోవాలి అని చెప్తారు. మన కోరికలు కూడా మొదట నందీశ్వరుని చెవిలోని విన్పించాలి అంటుంటారు.

అసలు నంది కి అంత ప్రాముఖ్యత ఎలా లభించింది? అంటే పురాణపరంగా, శాస్త్రపరంగా అనేక రకాలైన ఆసక్తికర విశ్లేషణలు ఉన్నాయి. 

మొదట పురాణపరమైన కారణాలు:
శిలాదుడు అనే మహర్షి కి నంది శివ ప్రసాదంగా లభిస్తాడు. అయితే నంది అల్పాయాష్కుడు అని కొంత మంది మునుల ద్వారా తెల్సుకున్న శిలాదుడు ఆందోళన చెందుతాడు. అయితే నంది మాత్రం శివానుగ్రహం వల్ల తన తలరాతను మార్చతలచి తపస్సుకి పూనుకుంటాడు. నంది తపస్సుకి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా, ఆ మహానుభావుని దివ్యదర్శనానికి పులకరించి పోయిన నంది, ఆయుష్షు కాకుండా నిరంతరం శివసాన్నిధ్యం అని గొప్ప వరాన్ని అడుగుతాడు.

శివుడు తధాస్తు అని నిరంతరం తనతోపాటు ఉండి, తనకి వాహనంగా ఉండే వరాన్ని అనుగ్రహిస్తాడు. అంతే కాకుండా నందిని ప్రమథ గణాలకి అధిపతిగా కూడా నియమిస్తాడు. ఈ విధంగా నిరంతరం శివుడిని అంటిపెట్టుకుని ఉండే అవకాశాన్ని నంది తన తఫఫలంగా పొందాడు అని చెప్పవచ్చు.

ఇక వృషభం(ఎద్దు) అపరిమితమైన బలానికి, అంతులేని సహనానికి, లైంగిక పటుత్వానికి ప్రతీక. నిజం చెప్పాలంటే ఈ మూడు గుణాలు ఒకే వ్యక్తిలో ఉండడం అసాధ్యం(సాధారణ వ్యక్తులకి). ఎంత బలమున్నా, ఎదిగి ఉండాలి అని చెప్పడం, కామం ఉన్నా ధర్మంగా,సంతానోత్పత్తికి మాత్రమే ఉపయోగించుకోవాలని నంది విగ్రహం ఒక సందేశం ఇస్తుంది.

శివాలయంలో నంది ఎక్కువగా ధ్యాన ముద్రలో దర్శనమిస్తాడు. అయన శివుడితో ఏమి చెప్పుకోడు. కళ్ళ ముందే ఉంటూ ఆయన్నే ధ్యానిస్తూ ఉంటాడు. అలాగే మనం కూడా, కేవలం ధ్యానిస్తే చాలు, ఈశ్వరుడే ఐశ్వర్యాలను అందిస్తాడు. ప్రార్ధన, ధ్యానం రెండూ వేరు వేరు.

ఇక నందికి, శివునికి మధ్యలో ఎవర్ని నిలబడవద్దు అని పూజారి వారిస్తారు. దానికి అర్ధం మీరు నిరంతరం శివ ధ్యానంలో ఉండాలి, మీకు, ఆ శివునికి మధ్యలో ఎటువంటి అడ్డు ఉండకూడదు, అంటే రకరకాల ఆకర్షణలు లేకుండా, మనస్సు లో శివుడిని ఉంచుకోవాలి అని చెప్పడం. అలాగే శ్రీ మహావిష్ణువు కి గరుత్మంతుడు, వినాయకునికి మూషికుడు, సుబ్రహ్మమాన్యుడికి కుక్కుటం, దుర్గ దేవికి సింహం. ఇలా వేరు వేరు దేవతా రూపాలకి వేరు వేరు జంతువులు, పక్షులు వాహనాలుగా ఉన్నాయి. ఒక్కో వాహనానికి ఒక్కో విశిష్టత, ఎంతో మహోత్తరమైన సందేశాలు ఉన్నాయి. హిందూ ధర్మం లో గొప్పతనం అదే.

Visit to the Navagraha Temples - నవగ్రహ దేవాలయ దర్శనం

నవగ్రహ దేవాలయ దర్శనం

నవగ్రహ దేవాలయానికి వెళ్ళడం వలన జీవితంలో ఎదురయ్యే సమస్యలను మరియు నవగ్రహ దోషాలను అధిగమించడానికి, గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి, మంచి ఆరోగ్యాన్ని, సంపదను, శ్రేయస్సును పొందడానికి, అలాగే మానసిక ప్రశాంతతను పొందడానికి నమ్ముతారు.

నవగ్రహ దేవాలయాలకు వెళ్ళడానికి గల కొన్ని ముఖ్య కారణాలు:

గ్రహాల అనుగ్రహం:
నవగ్రహాలు (సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహువు, కేతువు) మానవ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని నమ్ముతారు. ఈ గ్రహాల అనుగ్రహం పొందడానికి, వారి చెడు ప్రభావాలను తగ్గించడానికి నవగ్రహ ఆలయాలను సందర్శిస్తారు.

సమస్యల నివారణ:
నవగ్రహాల పూజలు చేయడం వలన ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అనేక సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చని నమ్ముతారు.

ఆధ్యాత్మిక ప్రయోజనాలు:
నవగ్రహ ఆలయాలను సందర్శించడం వలన ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తుంది, మానసిక ఒత్తిడి తగ్గుతుంది.

మంచి ఫలితాలు:
నవగ్రహాల పూజలు చేయడం వలన మంచి ఆరోగ్యం, సంపద, శ్రేయస్సు, అదృష్టం కలుగుతాయని నమ్ముతారు.

నవగ్రహాలకు సంబంధించిన కొన్ని సాధారణ నమ్మకాలు:
సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహువు, కేతువు అనే తొమ్మిది గ్రహాలు నవగ్రహాలు.

ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది మరియు అది వ్యక్తి యొక్క జీవితంలో వివిధ అంశాలను ప్రభావితం చేస్తుంది.

నవగ్రహాలను పూజించడం ద్వారా, వారి అనుగ్రహాన్ని పొందవచ్చు మరియు వారి ప్రతికూల ప్రభావాలను నివారించవచ్చు.

నవగ్రహాలు అంటే ఎక్కడో ఆకాశంలో ఉండేవి మాత్రమే కాదు, మన ప్రవర్తనలోనే ఉంటాయి! మనం చేసే మంచి పనులే మనకు గ్రహ అనుకూలతను ఇస్తాయి. ఈ చిన్న విషయాలను గుర్తుపెట్టుకుని తప్పులు సరిదిద్దుకుంటే.. ఆ నవగ్రహాల ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ఉంటాయి. అవి ఏంటో తెలుసుకుందాం..

సూర్యుడు: పితృ దేవతలని దూషిస్తే రవికి కోపము. నమస్కార ప్రియుడు. తర్పణ గ్రహీత.సూర్య దేవునికి ఎదురుగా మల మూత్ర విసర్జన దంతావధానం చేయకూడదట.

చంద్రుడు: అద్దం పుట్టడానికి చంద్రుడు కారణం.అందుకే అద్దములో దిగంబరముగా చూచుకొనుట, వెక్కిరించుట చేయకూడదు.

కుజుడు: ఎవరికైనా అప్పు ఇచ్చి ఎగ్గొడితే కుజుడికి విపరీతమైన కోపం వస్తుంది. అలాగే వ్యవసాయ పరంగా భూమిని లేదా రైతును మోసం చేస్తే ఆయన అస్సలు ఊరుకోడు.

బుధుడు: బుధుడికి చెవిలో వేలు పెట్టి తిప్పుకుంటే కోపం. అందునా బుధవారం రోజున ఈ పని అస్సలు చేయకూడదు. వ్యాపారాన్ని అశ్రద్ధ చేసినా, నాకు జ్ఞానం ఉందని విర్రవీగినా బుధుడు ఆగ్రహిస్తాడు.

గురువు: సర్వ శాస్త్రములు తెలిసిన గురువు బృహస్పతి, ఎవరైనా గురువుని కించపరచితే గురుదేవునికి అగ్రహము కలుగుతుంది. గురువులని పూజిస్తే బృహస్పతి అనుగ్రహం కలిగుతుంది.

శుక్రుడు: శుక్రుడికి భార్య/భర్త అగౌరవ పరచుకుంటే కోపము. ప్రేమకారకుడు. లక్ష్మీ దేవి కృప లేకపోతే శుక్ర కృప కష్టమే.శుచి శుభ్రత లేని ఇళ్లు మనుషులు నచ్చరు, గొడవలు లేని ఇల్లు ఇష్టము.

శని: శనికి పెద్దల్ని కించపరచిన, మరుగుదొడ్లు శుచిగా లేకపోయినా కోపము. తల్లితండ్రిని చులకన చేసిన సహించడు.సేవక వృత్తి చేసిన, సేవ చేసిన వారిని కాపాడతాడు.

రాహువు: రాహు వైద్య వృత్తి పేరుతో మోసగించినా, సర్పములని ఏమైనా చేసిన ఆయనకి కోపము కలుగును.ఈయన భ్రమ మాయకి కారణము..!!

కేతువు: జ్ఞానం ఉండి కూడా పంచడానికి వెనకాడిన, మోక్ష కారకుడు అయిన కేతువుకి పెద్దలకు మరణాంతరము చేయవలసిన కార్యములు చేయకపోతే కోపిస్తాడు.

నవ గ్రహ స్తోత్రం

నవగ్రహ బీజ మంత్రములు

నిత్య స్తోత్రావళి

పంచాంగం

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

One should not eat a meal while wearing footwear - చెప్పులు వేసుకొని అన్నం తినకూడదు

చెప్పులు వేసుకొని అన్నం తినకూడదు

మన పూర్వీకులు నిర్ణయించిన మరియు పాటించిన సంప్రదాయాలకు ఎన్నో కారణాలు మరియు శాస్త్రీయత వుంది.

ఈ భరతభూమిలో పుట్టిన సర్వమానవులూ బ్రాహ్మణుణ్ణి చూచి, ఆచారాలు నేర్చుకోండి — అని వ్యాసమహర్షి/మనువు చెప్పారు.

అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ 

అని భగవద్గీతలో చెప్పారు.

మన అందరి ఉదరంలోనూ వైశ్వానరాగ్ని (జఠరాగ్ని) ఉన్నది .

భోజనం గూడా ఒక యజ్ఞమే. ప్రాణాహుతులను ఆ వైశ్వానరాగ్నిలో వేల్చడం భోజనం చేయడంలో తొలి ప్రక్రియ.

మంత్రోచ్చారణతో తినబోయే ఆహారాన్ని సంప్రోక్షణ చేసి, ప్రాణాహుతులు ఉదరంలో ఉన్న అగ్నికి సమర్పిస్తున్నాం . భోజనానంతరం గూడా ఆ యజ్ఞవిధిపూరణమంత్రాలు ఉచ్చరించడం పాటిస్తూ ఉన్న విధిలో భాగమే.

భోజనాన్ని గూడా యజ్ఞంగా భావనచేయడమే ఈ చర్యల వెనక ఉన్న ఆంతర్యం.

యజమాని శుచియై (పాదప్రక్షాళన అనంతరం) కింద కూర్చుండి యజ్ఞం ఆరంభిస్తాడు. అపుడు చెప్పులు ధరించడం చేయరు.

అది మంత్రోచ్చారణ చేసే సమయం కాబట్టి చెప్పులు విప్పేయడం చేస్తున్నాం.

అందుచేతనే కనీసం భోజనానికి ముందు పాదప్రక్షాళనైనా చేసుకోమని పెద్దలు చెబుతూ ఉంటారు

ఆ పూర్వసంప్రదాయాన్నే యథాశక్తి అందరూ భోజనవిధిలో పాటిస్తున్నారు.

ప్రాణాహుతులు అగ్నిలో వేల్చేవి గాబట్టి నేతితో తడిపి సమర్పించవలె. అందుకోసమే వడ్డించిన అన్నం మీద నెయ్యి వేసి , ఆ తర్వాత దాన్ని మంత్ర పూర్వకంగా(రుచి చూడకుండా), నోట్లో వేసుకొంటున్నాం.

ఇంత విధానం తెలియక పోయినా, నెయ్యి వేసిన తర్వాతే భోజనం ఆరంభించడం మాత్రం అన్ని వర్ణాల వారూ హోటళ్ళలో గూడా నేటికీ పాటిస్తున్నారు.

బ్రాహ్మణాచారాలపై గౌరవంతోనే వాటిని అనుసరించడం జరుతున్నది.


Sri Krishna Temple, Vrindavan, Mathura District, Uttar Pradesh - శ్రీకృష్ణ ఆలయం బృందావనము, మధుర జిల్లా, ఉత్తరప్రదేశ్

శ్రీకృష్ణ ఆలయం బృందావనము, మధుర జిల్లా, ఉత్తరప్రదేశ్

ఉత్తరప్రదేశ్ లోని మథుర జిల్లాలో ఉన్న బృందావనం శ్రీకృష్ణుని బాల్య లీలలకు ప్రసిద్ధి చెందిన అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ దాదాపు 5,500 వరకు శ్రీకృష్ణ దేవాలయాలు ఉన్నాయి. వీటిలో అత్యంత ప్రాముఖ్యమైన, ప్రసిద్ధి చెందిన ప్రధాన దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి

ద్వారకా నాథ్ మందిరము, మదన మోహన మందిరము, బంకె బిహారి మందిరము, రాధారమణ మందిరము, గోపీనాథ్ మందిరము, షాహాజీ మందిరము, రంగనాథ మందిరము ( దక్షిణ దేశమునగల శ్రీ రంగనాథుని వలె నుండును ), గోవర్ధన గిరి దిగువన శ్రీరామానుజులు దయచేసిన రీతులలో అర్చనాదులు జరుప బడుచున్న లక్ష్మీ నారాయణ మందిరము, ఇంకను ఎన్నియో మందిరములు గలవు . దర్శించి నంతనే జన్మ ధన్యమగును .

బాంకే బిహారీ ఆలయం (Banke Bihari Temple): బృందావనంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయం ఇది. ఇక్కడ శ్రీకృష్ణుడిని చిన్నపిల్లవాడిగా (నల్లటి విగ్రహ రూపంలో) పూజిస్తారు. ఇక్కడ విగ్రహానికి తెరలు అడ్డం పెట్టడం, తొలగించడం ద్వారా భక్తులకు దర్శనమివ్వడం ఈ ఆలయ ప్రత్యేకత.

ఇస్కాన్ ఆలయం (కృష్ణ బలరామ మందిరం - ISKCON Temple): స్వామి ప్రభుపాదచే 1975లో నిర్మితమైన ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు, బలరాముడు మరియు రాధాకృష్ణుల విగ్రహాలను చూడవచ్చు. ఇక్కడి భజనలు, సంకీర్తనలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తాయి.

AC భక్తివేదాంత స్వామి ప్రభుపాద , (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ వ్యవస్థాపకుడు- ఆచార్య), కృష్ణ బలరామ మందిరాన్ని ప్రారంభించి, కృష్ణుడు - బలరాముడు , రాధా - శ్యామసుందర్ , గోపికలు లలితా దేవి మరియు విశాఖ దేవి మరియు గౌర మూర్తులు స్థాపించారు.

రాధాష్టమి నాడు ఆలయంలో రాధా శ్యామసుందర్
ఆలయ ప్రధాన దేవతలు మధ్య బలిపీఠం వద్ద కృష్ణుడు మరియు బలరాముడు . కుడి బలిపీఠం వద్ద శ్రీ శ్రీ రాధా శ్యామసుందర్ రూపంలో రాధా కృష్ణుడు, లలిత మరియు విశాఖ అనే గోపికలతో ఉన్నారు. ఎడమ బలిపీఠం వద్ద చైతన్య మహాప్రభు నిత్యానందతో , మరియు ఇస్కాన్ వ్యవస్థాపకుడు ఎ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాద మరియు అతని గురువు భక్తిసిద్ధాంత సరస్వతి ఉన్నారు.

ఆలయానికి సమీపంలో, సముదాయ ప్రవేశ ద్వారం వద్ద, తెల్ల పాలరాయితో నిర్మించిన ప్రభుపాద సమాధి మందిరం ఉంది.

ప్రేమ్ మందిర్ (Prem Mandir): భారీ పాలరాతితో నిర్మించబడిన ఈ ఆలయం దాని అద్భుతమైన శిల్పకళకు మరియు రాత్రి పూట రంగు రంగుల విద్యుత్ దీపాల కాంతులకు ప్రసిద్ధి చెందింది. రాధాకృష్ణుల దివ్య లీలలను తెలిపే దృశ్యాలు ఆలయం చుట్టూ ఆకర్షణీయంగా ఉంటాయి.

శ్రీ కృష్ణ జన్మభూమి ఆలయం (శ్రీ కృష్ణ జన్మస్థాన్): ఇది బృందావనానికి సుమారు 12 కి.మీ దూరంలో మధురలో ఉంది. శ్రీకృష్ణుడు చెరసాలలో జన్మించిన ప్రదేశంగా దీనిని అత్యంత పవిత్రంగా భావిస్తారు.

పండుగలు

కృష్ణ జన్మాష్టమి - కృష్ణుని జన్మదినోత్సవం

రాధాష్టమి - రాధా జన్మదినం

బలరామ పూర్ణిమ - బలరాముని జన్మదినోత్సవం

గౌర పూర్ణిమ - చైతన్య మహాప్రభు జన్మదినోత్సవం

నిత్యానంద త్రయోదశి - నిత్యానంద జన్మదిన వార్షికోత్సవం

గోపాష్టమి - గోవులతో కృష్ణుని లీలలకు అంకితం చేయబడిన పండుగ

హోలీ - ప్రేమ మరియు రంగుల పండుగ, రాధాకృష్ణుల లీలలతో ముడిపడి ఉన్న ప్రధాన పండుగ

శరత్ పూర్ణిమ - రాధా కృష్ణులు మరియు గోపికల మహారాసులతో ముడిపడి ఉన్న పండుగ .

కార్తీక పౌర్ణమి - రాధాకృష్ణులు మరియు గోపికల కలయికతో ముడిపడి ఉన్న పండుగ.

చతుర్మాస్

కార్తీక దామోదర మాసం - రాధా కృష్ణుల ఆరాధనకు అత్యంత పవిత్రమైన మాసంగా భావించే కార్తీక మాస వేడుక.

దీపావళి - సీతారాములకు (రాధా కృష్ణుని మరొక రూపం) అంకితం చేయబడిన ప్రధాన హిందూ పండుగ .

వైష్ణవ ఆచార్యులు మరియు సాధువుల ఆవిర్భావ మరియు తిరోగమన దినాలు (పుట్టిన మరియు మరణించిన రోజులు).

ముఖ్యమైన వివరాలు:

ఎలా చేరుకోవాలి: 

విమానాశ్రయం: ఆగ్రా లేదా ఢిల్లీ

రైల్వే స్టేషన్: ఆగ్రా లేదా ఢిల్లీ

రోడ్డు మార్గం: ఢిల్లీ నుండి రోడ్డు మార్గం ద్వారా బృందావనం సుమారు 2-3 గంటల ప్రయాణ దూరంలో ఉంటుంది.

సందర్శించడానికి ఉత్తమ సమయం: అక్టోబర్ నుండి మార్చి వరకు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. శ్రీకృష్ణాష్టమి మరియు హోలీ పండుగలను ఇక్కడ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.

వేసవి నెలల్లో, సందర్శకులు ఉదయం 5:30 నుండి మధ్యాహ్నం వరకు, మరియు సాయంత్రం 4:00 నుండి 9:00 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు. శీతాకాలంలో భక్తులు ఉదయం 6:00 నుండి మధ్యాహ్నం వరకు, మరియు సాయంత్రం 3:00 నుండి 8:00 గంటల వరకు ఆలయాన్ని సందర్శించవచ్చు.

మన దేవాలయాలు చారిత్రక నగరాలూ

Lalithambika Devi Temple, Thirumeeyachur, Tiruvarur District, Tamil Nadu - లలితాంబికాదేవి దేవాలయం, తిరుమీయచ్చూర్‌‌, తిరువారూర్‌ జిల్లా, తమిళనాడు

లలితాంబికాదేవి దేవాలయం, తిరుమీయచ్చూర్‌‌, తిరువారూర్‌ జిల్లా, తమిళనాడు తమిళనాడులోని తిరువారూర్‌ జిల్లా తిరుమీయచ్చూర్‌‌లోని లలితాంబికాదేవి దేవ...