Friday, February 13, 2026

Narada Asked Brahma About Universe - నారదుండు బ్రహ్మను బ్రపంచ ప్రకారంబు నడుగుట

నారదుండు బ్రహ్మను బ్రపంచ ప్రకారంబు నడుగుట

నారదముని బ్రహ్మను ఇలా ప్రశ్నించాడు.

ఓ తండ్రీ! నీవు చతుర్ముఖుడవు. సురలలో పెద్దవు. లోకాలకు సృష్టికర్తవు, ఈ వేదాలన్నీ నీ  ముఖపద్మాలలోనే విరాజిల్లుతున్నాయి. వాగర్థమయమైన ఈ విశ్వమంతా నీ అరచేతి ఉసిరికపండువలె నీకు తేటతెల్లమై ఉన్నది. పైగా సరస్వతీదేవి నీకు ఇల్లాలు. ఇదిగో, ఈ నా సందేహం తీర్చు.

సరస్వతీనాథా! ఈ జగత్తుయొక్క సృష్టిని ప్రారంభించడాని కవసరమైన విజ్ఞానాన్ని నీకు ఎవడిస్తున్నాడు? ఆ ప్రారంభ సంపదకు మూలమేమి? ఈ సృష్టి నిర్మాణానికి హేతువేమి? దీనివల్ల ఒనగూడే ప్రయోజనమేమి? దీని స్వరూపమెట్టిది? సాలెపురుగులాగా విశ్రాంతి లేకుండా ఎల్లప్పుడూ సంసార నిర్మాణక్రమాన్ని కొనసాగిస్తున్నా నీకు శ్రమలేకుండా ఉన్నది. నీ జీవనవిధానం అందరికీ అందేది కాదు.

నా మట్టుకు నేను నీవే ప్రభుడవని భావిస్తున్నాను. నిజానికి నీకంటే అధికుడైన ప్రభువు మరొకడున్నాడా? నీవే అంతటికీ ప్రభుడవా? అయితే ఏ ప్రయోజనం ఆశించి నీ వీలోకాలు సృష్టిస్తున్నావు? ఈ జీవసముదాయం ఎక్కడ ఉద్భవిస్తున్నది? ఎక్కడ ఉంటున్నది? ఎక్కడ చివరకు లయమవుతున్నది? నిజం చెప్పు దేవా!

సత్తు (పరమాత్మ) అసత్తు (మాయ)ల కలయిక వల్ల నామరూపగుణాలతో గూడి కనిపించే ఈ జగత్తు నీ హృదయానికి అధీనమైనదే కదా! నీ కంటె అధికులు, నీతో సమానులూ ఎవరూ లేరు. నీ స్థానం మిక్కిలి దొడ్డది. ఇట్టి నీవు ఏ పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి నేర్పుతో తప మొనర్చావు? ఆ దారి ఏదో చెప్పవయ్యా!

పద్మజా! నీకు గూడా ఒక ఏలిక ఉన్నాడంటావా? అట్లైతే ఈ బ్రహ్మాండం ఏ ప్రభుని కటాక్షవిలాసంతో జనిస్తున్నదో, వర్ధిల్లుతున్నదో, గిట్టుతున్నదో ఆ ప్రభువును గూర్చి ఆయన స్వరూపమెట్టిదని ముచ్చటించుకోవడానికి వీలవుతుందా?

కమల సంభవా! ఈ విషయం నాకు తెలియపరచు. నా కిది బాగా అర్థమైతే నన్ననుసరించే నా పరివారానికి ఈ సత్యం తెలియజేస్తాను. వాళ్ళు ఇతర మార్గాలను అనుసరించకుండా ఉండునట్లు చేస్తాను.

స్వామీ! జరిగిన, జరుగనున్న జరుగుతున్న వ్యవహారాలన్నిటికీ నీవే కర్తవు. నీకు తెలియని విషయమేదీ లేదు. ఈ ప్రపంచ విధానం నాకు తెలియజెప్పు - అని నారదుడు అడిగాడు. అది విని విప్పారిన ముఖంతో విధాత ఇలా అన్నాడు.

పుత్రా! ఎందరు పండితులు నా వద్దకు రావడం లేదు! వారంతా వైరాగ్యం కలవారే కదా! అయినా వాళ్ళెవరూ నీవలె నన్ను ప్రశ్నించినవారు కారు. నీ మతం నాకు సంతసం కల్గించింది. ఆశ్చర్యం! నా ప్రభుని రహస్యమే నీవడిగావు.

నారదా! విను! నానా రూపాలతో ఉన్న ఈ చరాచర ప్రపంచాన్ని నాకు నేనై సృష్టించడానికి అవసరమైన తెలివి ఏ మాత్రం లేక నేను తొట్రుపడ్డాను. ఆ స్థితిలో పూర్వం ఈ సకల సృష్టినీ ఆరంభించడానికి అవసరమైన విజ్ఞానాన్ని నాకా ప్రభువు ఎంతో ఉదారంగా ప్రసాదించాడు. ఆ దేవుని ఆనతి లేకుంటే ఈ జగన్నిర్మాణశక్తి నాకెక్కడిది? 

కిల్బిషం లేని నారదా! ఈ జగత్తునంతటినీ ప్రకాశింపజేసే సామర్థ్యం నాకు లేదు. ఎవని ప్రకాశంవల్ల సూర్యుడు, చంద్రుడూ, అగ్నీ నక్షత్రాలూ, గ్రహాలు ఇంకా ఈ లోకాలన్నీ సముజ్వలంగా ప్రకాశింప చేయబడుతున్నవో, అట్టి దివ్యదీప్తితో విరాజిల్లే పరమేశ్వరునికి నేను సదా ప్రణమిల్లుతున్నాను. 

పుత్రా! ఇంకా ఈ విషయం విశదంగా వివరిస్తాను విను. మాయ ఈశ్వరుని దృష్టిపథంలో ప్రవేశించడానికి శంకించి సిగ్గుతో కుంచించుకుపోతుంది. దానివల్ల తమ తెలివి కుంఠితం కాగా బుద్ధిహీనులు నన్నే లోకానికంతా ప్రభువుగా భావించి నాకు నమస్కరిస్తూ ఉంటారు. అట్టి మూఢులను చూచి ఇది శ్రీహరి మాయవల్ల జరిగేపని కదా? అనుకొని నాలో నేను నవ్వుకొని వాళ్ళను, ధిక్కరిస్తుంటాను

అంతమాత్రమే కాదు. శరీర నిర్మాణానికి ఉపయోగపడే పృథివి మున్నగు ఐదు భూతాలూ, పుట్టుకకు హేతువులైన కర్మలూ, కర్మ ప్రవృత్తికి కారణమైన కాలమూ, దాని మార్పునకు కారణమైన స్వభావమూ, కర్మఫలం అనుభవించే జీవుడూ అంతా వాసుదేవ స్వరూపులే అని గ్రహించు. ఆ వాసుదేవునికంటె అన్యమైనదేదీ లేదు. ఇది నిజం. ఈ లోకాలన్నింటినీ నియమించేవాడు శ్రీమన్నారాయణుడే. వేల్పులందరూ ఆ దేవుని శరీరంనుండి పుట్టినవారే. వేదాలూ, యాగాలూ, తపస్సులూ, యోగాలూ, విజ్ఞానమూ అంతా నారాయణుని ఆరాధనారూపమైనవే. జ్ఞానసాధ్యమైన ఫలం కూడా నారాయణని అధీనంలోనే ఉన్నది. నిర్వికారుడూ, సర్వాంతర్యామీ, సర్వదర్శనుడు అయిన భగవానుని క్రీగంటి చూపువల్లనే నేను జన్మించాను. ఆయన కటాక్షంవల్లనే ప్రేరణ పొంది సృజింపదగిన విశ్వాన్ని సృష్టిస్తున్నాను. గుణరహితుడైన ఈశ్వరునుండి రజస్సత్త్వతమస్సులనే మూడుగుణాలు పుడుతున్నాయి. అవి ఉత్పత్తికీ, స్థితికీ లయానికీ హేతువులవుతున్నాయి. కార్యభావంలోనూ, కారణ భావంలోనూ, కర్తృభావంలోనూ ద్రవ్యాలైన పృథివ్యాది పంచభూతాలనూ, జ్ఞానరూపులైన బ్రవ్మాదిదేవతలనూ, క్రియారూపాలైన ఇంద్రియాలనూ ఆశ్రయిస్తున్నాయి. జీవుడు సదాముక్తుడే అయినా మాయతోకూడి ఉండడంవల్ల ఆ త్రిగుణాలు అతణ్ణి బంధిస్తున్నాయి. జీవుణ్ణి కప్పివేసే ఉపాధులైన ఈ మూడు గుణాలను కల్పించి తద్వారా ఈశ్వరుడు ఇతరులకు ఏ మాత్రం గోచరించక తనకు మాత్రమే గోచరించే తత్వంతో ఈ విధంగా వినోదిస్తూ ఉంటాడు.

కుమారా! ఆ పరమ్వేరుడు తుది లేనివాడు. ఆ శ్రీహరి ఈ లోకాలకూ, నాకూ, నీకూ, మాయకూ, ప్రాణివర్గానికీ ప్రభువు. ఆయనకంటె ఇతరమైనది ఈ జగత్తులో ఏదీ లేనే లేదు.

ఈశ్వరుడు మాయను నియమించేవాడు. ఆయనకు తనమాయవల్ల కాలమూ, జీవాదృష్టమూ, స్వభావం అప్రయత్నంగా సిద్ధించాయి. వాటిని ఆయన వివిధరూపాలుగా చేయాలని నిశ్చయించుకొని సృష్టికార్యానికి సహకారకాలుగా స్వీకరించాడు. ఈశ్వరుడధిష్ఠించిన మహత్తత్త్వం కారణంగా కాలంనుండి త్రిగుణాల భేదమూ, స్వభావంనుండి పరిణామమూ, జీవుని అదృష్టరూపమైన కర్మనుండి జన్మమూ సిద్ధించాయి.

రజోగుణంచేతా, సత్త్వగుణంచేతా వృద్ధిపొందిన మహత్తత్త్వం వికారానికి లోనయింది. దానినుండే తమోగుణ ప్రధానమై పంచభూతాలు, పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు రూపంగా కలదైన అహంకారం సంభవించింది. ఆ అహంకారం మరల వికృతిపొంది ద్రవ్యశక్తియైన తామసమనీ, క్రియాశక్తియైన రాజసమనీ, జ్ఞానశక్తియెన సాత్వికమనీ మూడురూపాలుగా పరిణమించింది.

పంచభూతాలకు మూలమైన తామసాహంకారంనుండి ఆకాశం పుట్టింది. ద్రష్ట అయిన ఆత్మకూ, దృశ్యమైన జగత్తుకూ బోధకమై సూక్ష్మరూపమై ఉన్న శబ్దం ఆకాశానికి గుణమయింది. వికారానికి లోనైన ఆకాశంనుండి స్పర్శగుణ ప్రధానమైన వాయువు పుట్టింది. తనకు కారణమైన ఆకాశంలోని శబ్దమూ, తనకు సహజమైన స్పర్శమూ అనే రెండు గుణాలు గాలికున్నాయి. ఆ గాలి శరీరాలలో ప్రాణరూపంలో ఉంటుంది. అది ఇంద్రియపటుత్వానికీ, మనోబలానికీ, శారీరకశక్తికీ హేతువవుతున్నది. వికారంపొందిన వాయువునుండే రూపం, స్పర్శం, శబ్దం-అనే మూడు గుణాలుగల్లిన తేజస్సు జనించింది. ఆ తేజస్సునుండి రసం, రూపం, స్పర్శం, శబ్దం అనే నాలుగు గుణాలతో గూడిన జలం కలిగింది. జలంనుండి గంధరసరూపస్పర్శశబ్దాలనే అయిదు గుణాలు గల పృథివి పుట్టింది. పై జెప్పినవన్నీ తామసాహంకారం నుండి కల్టినవే.

వికారానికి లోనైన సాత్వికాహంకారంనుండి మనస్సు జనించింది. దానికి చంద్రుడు అధిదేవత. ఆ సాత్వికాహంకారం నుండే దిక్కులూ, వాయువూ, సూర్యుడూ, వరుణుడూ, అశ్వినీదేవతలూ, అగ్ని ఇంద్రుడు, ఉపేంద్రుడూ, మిత్రుడూ, ప్రజాపతీ అనే పదిమంది దేవతలు ఉద్భవించారు.

తైజసమైన రాజసాహంకారం నుండి శ్రోత్రం మొదలైన ఐదు జ్ఞానేంద్రియాలూ, వాక్కు మున్నగు ఐదు కర్మేంద్రియాలూ, బుద్ధీ, ప్రాణమూ కలిగాయి. ఆ పదియింద్రియాల అధిదేవతల వివరమిది - శ్రోత్రేంద్రియానికి దిక్కులూ, త్వగింద్రియానికి వాయువూ, నేత్రేంద్రియానికి సూర్యుడూ, రసనేంద్రియానికి ప్రచేతసుడూ, ఘ్రాణేంద్రియానికి అశ్వినీ దేవతలూ, వాగింద్రియానికి అగ్నీ హస్తేంద్రియానికి ఇంద్రుడూ, పాదేంద్రియానికి ఉపేంద్రుడూ, గుదేంద్రియానికి మిత్రుడూ, ఉపస్థేంద్రియానికి ప్రజాపతి దేవతలుగా ఉన్నారు. బుద్ది జ్డానం కల్గించే అంతఃకరణంలో ఒక భాగం. ప్రాణం క్రియాహేతువైన అంతఃకరణం.

శ్రోత్రాదులగు దశేంద్రియాలతో గూడిన భూతాలు, ఇంద్రియాలు, మనస్సు, శబ్బస్పర్భాదులైన గుణాలు విడివిడిగా ఉన్నప్పుడు బ్రహ్మాండమనే శరీరాన్ని నిర్మించలేకపోయాయి. ఇల్లు కట్టాలంటే అనేక వస్తువులను ఒకచోట చేర్చితేగానీ సాధ్యం కాదు గదా! అదే రీతిగా పైన పేర్కొన్న భూతాలు, ఇంద్రియాలు, మనస్సు, గుణాలు, భగవంతుని శక్తివల్ల ఒకటిగా చేరాయి. సమష్టిగానూ, వ్యష్టిగానూ కలిసి చేతనాలనూ, అచేతనాలనూ, కల్పించాయి. అలా ఈ బ్రహ్మాండాన్ని నిర్మించాయి. ఆ విధంగా నిర్మించబడిన అండం కోటి సంవత్సరాల వరకూ నీళ్ళలోనే ఉండిపోయింది.

అందుమీదట కాలకర్మస్వభావాలకు లోబడనివాడూ, అన్నింటినీ ప్రాణవంతంగా చేయగలవాడూ అయిన ఈశ్వరుడు ప్రాణరహితమైనదాన్ని ప్రాణసహితంచేశాడు. కాలకర్మస్వభావాలకు ప్రేరకుడైన ఆ దేవుడు మహావరణ జలమధ్యంలో ఉండిన బ్రహ్మాండంలో జీవరూపంతో ప్రవేశించి దాన్ని మిక్కిలి విస్తృతమయ్యేటట్లు చేశాడు. చివరికి ఆ అండాన్ని భేదించుకొని వెలికి వచ్చాడు. అది ఎలా జరిగిందో వివరిస్తాను విను.

జగత్స్వరూపుడైన ఆ పరమేశ్వరుడు ఒక భవనాన్ని పోలివున్న ఈ బ్రహ్మాండాన్ని విడివిడిగా చేసి విపులమైన చతుర్దశ భువనాలుగా తీర్చిదిద్దాడు.

మేధావీ! ఆ భగవంతుడు పలుపాదాలూ, తొడలూ, భుజాలూ, ముఖాలూ, నేత్రాలూ, శిరస్సులూ, నొసళ్ళూ, చెవులూ కలిగివుంటాడు. అలా ఉంటూ అనేక ప్రాణుల శరీరాలలో నెలకొని విహరిస్తూ ఉంటాడు. పండితులు చక్కగా విమర్శించి ఆ భగవంతుని నానారూపాలైన అవయవాలలోనే సర్వ ప్రపంచపుటునికినీ ఊహిస్తూ ఉంటారు. మహనీయుడూ, ఆశ్చర్యకరమైన స్వరూపం కలవాడూ అయిన ఆ భగవంతుడు యోగుల హృదయాలచే పూజింపదగి ఉన్నాడు.

ఈ పద్నాలుగు లోకాలలో పై ఏడులోకాలు మహావిష్ణువుయొక్క నడుమునుండి పై శరీరమంటారు. అట్లే క్రింది ఏడులోకాలూ నడుమునుండి క్రింది శరీరమంటారు. ఈ ప్రపంచమే భగవంతునికి శరీరం. ఆయన ముఖంనుండి బ్రహ్మకులమూ, బాహువులనుండి క్షత్రియకులమూ, తొడలనుండి వైశ్యకులమూ, పాదాలనుండి శూద్రకులమూ పుట్టాయని వర్ణిస్తారు.

ఆ మహావిష్ణువుకు కటిస్టలం భూలోకం, నాఖి భువర్లోకం, హృదయం సువర్లోకం, వక్షం మహర్లోకం, కంఠం జనలోకం, స్తనాలు తపోలోకం, శిరస్సు సనాతనమైన సత్యలోకం, జఘనం అతలం, తొడలు వితలం, మోకాళ్లు సుతలం, పిక్కలు తలాతలం, చీలమండలు మహాతలం, కాలిమునివ్రేళ్ళు రసాతలం, అరికాలు పాతాళం. ఈ కారణంవల్ల ఆ దేవుణ్ణి లోకమయుడని భావిస్తారు.

మరి కొంతమంది ఆయన పాదతలంనుండి భూలోకమూ, బొడ్డునుండి భువర్లోకమూ, శిరస్సునుండి సువర్లోకమూ పుట్టాయని మూడు లోకాల సృష్టినీ వివరిస్తారు.

శ్రీమన్నారాయణుని ముఖంనుండి సమస్త ప్రాణుల వాక్కులూ, వాక్కుల కధిష్ఠానమైన అగ్నీ పుట్టాయి. చర్మం, రక్తం, మాంసం, మెదడు, ఎముకలు, మజ్జ, శుక్లం - ఇవి యేడు ఆ దేవుని ఏడు ధాతువులంటారు. మరొక పద్ధతిలో రోమాలు, చర్మం, మాంసం, ఎముకలు, స్నాయువులు, మజ్జ, ప్రాణాలు- ఇవి ఏడు ధాతువులని వర్ణిస్తారు.

వాటిలో రోమాలు ఉష్ణిక్‌ ఛందస్సనీ, చర్మం ధాత్రీ ఛందస్సనీ, మాంసం త్రిష్టుప్‌ ఛందస్సనీ, స్నాయువులు అనుష్టుప్‌ ఛందస్సనీ, శల్యం జగతీ ఛందస్సనీ, మజ్జ 'పంక్తి' 
ఛందస్సనీ, ప్రాణం బృహతీ ఛందస్సనీ వ్యవహరిస్తారు.

దేవతల కర్పించే పురోడాశరూపమైన హవ్యానికీ, పితృదేవతల కిచ్చే చరురూపమైన కవ్యానికీ, అమృతాన్నానికీ, మధురాదులైన ఆరురసాలకీ, రసనేంద్రియానికీ, రసానికీ అధీశ్వరుడైన వరుణుడికీ విష్ణుని రసనేంద్రియమే జన్మస్థానం. అట్లే అన్ని ప్రాణాదులకూ, వాయువుకూ, విష్ణుని నాసారంధ్రం నెలవు. దగ్గరగానూ, దూరంగానూ వ్యాపించే గంధాలకూ, ఓషధులకూ, అశ్వినీ దేవతలకూ ఆ పరమేశ్వరుని ఘ్రాణేంద్రియం స్థానం.

దేవలోకానికీ, సత్యలోకానికీ, తేజస్సుకూ, సూర్యుడికీ, సకలనేత్రాలకూ లోకనేత్రుడైన పరమాత్ముని చక్షురింద్రియమే నివాసం. దిక్కులకూ, ఆకాశానికీ, శ్రవణాంశాలకూ, శబ్దానికీ, సర్వేశ్వరుని శ్రోత్రేంద్రియం జన్మభూమి. ప్రశస్తాలైన వస్తువులకూ, కొనియాడదగిన సౌందర్యాలకూ పరమ పురుషుని శరీరమే స్థానం.

స్పర్శానికీ, గాలికీ, నైగనిగ్యానికీ, ఆ దివ్యశరీరుని త్వగింద్రియమే గృహం. యాగపశువును బంధించే స్తంభాది యజ్ఞపరికరాలైన చెట్లూ, పొదలూ, తీగలూ, మొదలైన వాటికి పురుషోత్తముని రోమాలు స్థానాలు. రాళ్ళూ, లోహాలూ ఆ విశ్వాత్మునికి గోళ్ళు. మబ్బులు ఆయన శిరోజాలు. మెరుపులు సర్వేశుని మీసాలు, భూలోక భువర్లోక సువర్లోకాలను కాపాడే లోకపాలకుల పరాక్రమాలకు, భూలోకం మున్నగు లోకాల క్షేమానికీ, శరణానికీ నారాయణుని పరాక్రమం నట్టిల్లు. ఎల్ల కోరికలకూ, శ్రేష్ఠమైన వరాలకూ ఆ పవిత్రపాదుని పాదపద్మాలే నిలయాలు.

జలాలు, శుక్లం, పర్జన్యుడు, ప్రజాపతి సృష్టి - వీటన్నింటికీ ఆ సర్వేశ్వరుని పురుషాంగం జన్మస్థలం. సంతతికీ, కామం మున్నగు పురుషార్థాలకూ, మనస్సుకు సుఖం కలిగించే ఆనందాలకూ, శరీరసుఖానికీ అచ్యుతుని గుహ్యేంద్రియం స్థానం. యమునికీ, మిత్రునికీ, మల విసర్జనానికీ ఆ దేవుని పాయ్వింద్రియం ఇల్లు. హింసకూ, నిరృతికీ, మృత్యువుకూ, నరకానికీ ఆ సర్వరూపుని గుదం నెలవు. అవమానానికీ, అధర్మానికీ, అవిద్యకూ, చీకటికీ, అంతంలేని ఆ దేవుని పృష్ఠదేశం నివాసం. నదనదీసమూహాలకు ఆ ఈశ్వరుని నాడీసంఘం పుట్టిల్లు, కొండలకు ఆ దేవుని ఎముకలు జన్మస్టానాలు. ప్రకృతికీ, అన్నరసానికీ, సముద్రాలకూ, భూతాల విలయానికీ ఆ బ్రహ్మాండగర్భుని ఉదరమే ఉనికిపట్టు. మానసిక వ్యాపారరూపమైన లింగదేహనికి గొప్ప మహిమగల ఆ దేవుని హృదయం సృష్టి స్థానం. అంతే కాదు,

నారదా! వినుము. శివునికీ, నీకూ, నాకూ, సనత్కుమారుడు మున్నగు కుమారులకూ, ధర్మానికీ, సత్త్వానికీ, బుద్ధిత
త్త్వానికీ, (విజ్ఞానానికీ) శ్రేష్ఠమైన ఉనికిపట్టు ఆ పరమేశ్వరుని ఆత్మయే.

కుమారా? నరులూ, దేవతలూ, దానవులూ, పితరులూ, ఉరగులూ, గజాలూ, మృగాలూ, గంధర్వులూ, యక్షులూ, రాక్షసులూ, వృక్షాలూ, సిద్దులూ, విద్యాధరులూ, మేఘాలూ, చారణులూ, గ్రహాలూ, నక్షత్రాలూ, అచ్చరలూ, పక్షులూ, భూతగణాలూ, మెరుపులూ, వివిధ వస్తువులూ, నీవూ, శివుడూ, మునులూ, నేనూ, నీళ్లలోనూ, ఆకసంలోనూ, నేలమీదా చరించే వివిధప్రాణులతో గూడిన ఈ విశ్వమంతా విష్ణమయమే. పెక్కు మాటలేల? ఈ బ్రహ్మాండాలన్నీ అతని ఒక్క జేనలో ఇమిడిపోతాయి. బుద్ధిబలంతో ఆ భగవంతుణ్ణి తెలుసుకోలేము. కడచన్నవీ, ఇప్పుడున్నవీ, రానున్నవీ - అగు లోకాలన్నీ శ్రీవిష్ణుదేవునిలోనే ఉన్నాయి.

సూర్యుడు తన మండలంలోనే తానుంటూ లోకాలకు కాంతిని ప్రసాదిస్తున్నాడు. అట్లే అచ్యుతుడు బ్రహ్మాండంలో ఉంటూనే లోపలా, వెలుపలా ప్రకాశింపజేస్తున్నాడు.

అట్టి అనంతశక్తి సంపన్నుడైన విశ్వాత్ముని బొడ్డుతామరలో నేను పుట్టాను. నాకు యజ్ఞం చేయాలనే బుద్ధి పుట్టింది. కాని ఆ యజ్ఞాని కవసరమైన పదార్ధాలేవీ నాకు కనిపించలేదు. అప్పుడు మిగుల స్వచ్చమైన ఆ భగవంతుని స్వరూపాన్ని దృఢంగా బుద్ధిలో నిలిపి ధ్యానం చేశాను. అప్పుడు నా మనస్సులో ఒక ఉపాయం తోచింది.

యజ్ఞపశువులూ, యజ్ఞవాటికా, యూపస్తంభమూ, పాత్రలూ, మట్టికుండలూ, మూకుళ్ళూ, యాగకాలమైన వసంత ఋతువూ, నేయి, వడ్లు మున్నగు ఓషధులూ, వివిధాలైన లోహాలూ, నల్గురుహోతలతో నిర్వర్తింపదగిన దర్శపూర్ణమాసాది వైదికకర్మలూ, జ్యోతిష్టోమాదినామాలూ, మంత్రాలూ, సంకల్పమూ, ఋగ్యజుస్సామ వేదాలలోని వషట్కారాలతో గూడిన మంత్రాలూ, దక్షిణలూ, దేవతా ధ్యానం, దానికి తగిన తంత్రాలు, వ్రతాలూ, భూసురులూ, దేవతల నుద్దేశించి చేసే కర్మ సమర్పణలూ, బోధాయనాదుల కల్పగ్రంథాలలోని కర్మవిధానం, మొదలైన యజ్ఞోపకరణాలూ - ఇవన్నీ పరమేశ్వరుని అంగాలుగా సంకల్పించాను. ఆ మీదట శాస్రోక్త విధి ననుసరించాను.

యజ్ఞమే శరీరమైనవాడూ, యజ్ఞానికి ఫలమిచ్చేవాడూ, యజ్ఞప్రభువూ, యజ్ఞనిర్వాహకుడూ అయిన పరమాత్మను యజ్ఞపురుషుణ్జిగా భావించుకొని ఆ దేవునికే యజ్ఞఫలం సమర్పించాలన్న తలంపుతో మానసయజ్ఞం చేశాను.

అప్పుడు మరీచి మున్నగు ప్రజాపతులు నేను చేసిన మానసయజ్ఞం చూచి, తాము గూడ ఉత్సుకతతో ఆ దేవునికి ప్రీతి కలిగేటట్లు యజ్ఞం నిర్వర్తించారు.

ఆ ఘటనను చూచి స్వాయంభువాది మనువులూ, దేవతలూ, దానవులూ, రాజులూ, మనుజులూ - వీరంతా వాళ్ళ వాళ్ల కిష్టమైన దేవతలను సేవిస్తూ సాటిలేనివాడూ, యజ్ఞమూర్తీ అయిన లక్ష్మీరమణునికే ఫలం చెందేటట్లు మహానిష్ఠతో యజ్ఞాలు చేశారు.

స్పష్టమైన తంత్రరూపం కలవాడూ, ఇతరులకు వ్యక్తం కానివాడూ, అంతం లేనివాడూ, జన్మ లేనివాడూ, చ్యుతి లేనివాడూ, జగత్ప్రభువూ, అవ్యయుడూ అయిన శ్రీహరి దేవతలచే సేవింపదగినవాడూ, యజ్ఞఫలాలను ప్రసాదించేవాడూ కావడంవల్ల పై జెప్పినవారంతా ఆ దేవుణ్ణి ఉద్దేశించే యజ్ఞాలు చేశారు.

మంగళకరమైన చరిత్ర గల నారదా! పరమేశ్వరుడు నిర్గుణుడు. ఐనా జగన్నిర్మాణం చేయడానికి ఆయన మాయా ప్రభావం వల్ల నేర్పుతో గుణసహితుడవుతున్నాడు. అందువల్లనే ఆయన 'భగవంతుడు' అని చెప్పబడుతున్నాడు.

విశ్వానికి ఆత్మ అయినవాడూ, విశ్వప్రభువూ, విశ్వరూపుడూ, సమస్తానికీ నాయకుడూ, జననం లేనివాడూ అయిన విష్ణుదేవుడు ఈ విశ్వం తనలో మిక్కిలిగా వెలుగొందుతుండగా తాను విశ్వంలో ప్రకాశిస్తూ ఉంటాడు.

ఆ దేవుని ఆనతి ననుసరించి నేను చరాచర ప్రాణులతో గూడిన ఈ సృష్టిని విస్తారంగా సృజిస్తున్నాను. ప్రభావ సంపన్నుడైన, విష్ణువు దీనిని పోషిస్తున్నాడు. పార్వతీపతియైన శివుడు దీనిని లయింపజేస్తున్నాడు. పద్మనాభుడూ, మొదటివేల్పూ, అచ్యుతుడూ అగు శ్రీహరి సృష్టి స్థితిలయ శక్తులకు మూలహేతువై ఉన్నాడు.

కుమారా! నీవు నన్నిప్పుడడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాను, విను. ఈ సకల విశ్వానికీ ఆధారకారణమైనది ఒకే ఒక పరబ్రహ్మమే సుమా!

శ్రీహరి జ్ఞానం, బలం, ఐశ్వర్యం, వీర్యం, శక్తి తేజమనే షడ్గుణాలు కలవాడు, అంతం లేనివాడు. అతడే ఈ సృష్టికి చెందిన కార్యకారణాలకు మూలమైనవాడు. ఆలోచించి చూడగా ఆ ప్రభునికంటె ఉత్కృష్టుడైనవాడు మరొకడు లేడు.

ఇప్పుడు నేను చెప్పినదంతా నిజం. నేను అసత్యం పలకను. పండిత స్తుతికర్హుడవైన ఓ నారదా! విను. ఔత్సుక్యంతో ఆ భగవంతుని గుణాలను ధ్యానించడంవల్ల కలిగిన ప్రభావంతో నేనేమి పలికినా అదంతా నిజమే అవుతుంది. ఓ బుద్ధిమంతుడా! నా ఇంద్రియాలు ఎప్పుడుగానీ పొరపాటున గూడా అసత్యం వైపు పోవు. అంతే కాదు. నా శరీరం వేదతుల్యమైనది. దేవేంద్రునికి సైతం ఇది నమస్కరింపదగినది. సంసారమనే గొప్ప సముద్రాన్ని దాటించేదీ, శుభాలకు కారణమైనదీ, సకల సంపదలనూ సమకూర్చేదీ అయిన ఆ దేవదేవుని పాదపద్మానికి నేను నమస్కరిస్తున్నాను.

నేను ఆ పద్మనేత్రుని కుమారుడనైనా, బ్రహ్మనైనా, యోగవిద్యలో నిపుణుడనైనా, నా పుట్టుక ఎలా జరిగిందో నాకే తెలియదు. ఇక ఆ ప్రభుని ప్రదీప్త ప్రభావం ఎలా గ్రహించగలను? ఆ లక్ష్మీనాథుడు నిర్మించిన ఈ ప్రపంచం కొంచెం కొంచెమే నాకు గోచరిస్తున్నది.

మునివర్యా! నారదా! పలుమాటలేల? ఇది విను. విశ్వస్వరూపుడైన ఆ పరమేశ్వరుడు తన మాయా మహిమను నిజంగా తుదముట్ట తానే గ్రహించలేకున్నాడు. అట్టి స్థితిలో నేనుగానీ, మీరుగానీ, ఇంద్రాది దేవతలుగానీ, కడకు శివుడైనా జ్ఞాన ప్రక్రియకు చెందిన, యుక్తులతోనూ, (జ్ఞానంతో, క్రియలతో, యుక్తులతో) నిజం తెలుసుకోగలమా? తెలియలేమని తాత్పర్యం.

ఆ మహాత్ముడైన పద్మాక్షుడు సర్వజ్ఞుడు గదా! తన మహిమ ఆయన కెందుకు తెలియదు? అని నీవు అనవచ్చు. అది వివరిస్తాను, విను.

ఆకాశం తన అంతాన్ని తాను తెలుసుకోలేదు. అట్లే ఆ దేవుడు తన సమగ్రతను తానే ఎరుగజాలకున్నాడు. ఆకాశపుష్పం లేదన్నంతమాత్రాన సర్వజ్ఞత్వానికి భంగం కలుగుతుందా? అట్లే తన అంతు తనకే తెలియదన్నంత మాత్రాన భగవంతుని సర్వజ్ఞత్వానికి లోటు వాటిల్లదు.

ఆ మహామహుడు జగద్రక్షణకు పూనుకొని ఆయా అవతారాలలో చేసిన పనులు మాబోట్లం వేయివిధాల ప్రశంసిస్తూ ఉంటాం. మహామహుడూ, తుదిలేనివాడూ, చిదచిత్స్వరూపుడూ, మొదటివాడూ, తనకు ప్రభువులేనివాడూ, తానే అంతటికీ ప్రభువైనవాడూ, అయిన ఆ దేవుని ఎంత ప్రయత్నించినా మనం తెలుసుకోగలమా? దివ్యచరిత్రుడైన ఆ దేవునకు నేను ప్రణమిల్లుతున్నాను.

పుట్టుకలేని ఆ పరమాత్ముడు ప్రతికల్పంలోనూ ఈ విశ్వాన్ని సృష్టిస్తాడు, పోషిస్తాడు, లయింపజేస్తాడు. పాపరహితుడూ, బ్రహ్మస్వరూపుడూ, శాశ్వతుడూ, జగమంతా నిండినవాడూ, కేవలుడూ, సాటిలేనివాడూ, నిర్మలజ్ఞానవంతుడూ, సర్వాంతర్యామీ, తుదిమొదళ్ళు లేనివాడూ, గుణరహితుడూ, శాశ్వతమూర్తీ అయిన పరమేశ్వరుణ్ణి నేను ధ్యానిస్తాను.

నారదమునీ! మునీశ్వరులు తమ శరీరం, ఇంద్రియాలు, మనస్సు నిర్మలంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ దేవుని మహిత కళామయమైన స్వరూపం చూడగలరు. ఎప్పుడు వాళ్ళు కుత్సితమగు తర్కవితర్కాలనే తమస్సుకు లోబడి అజ్ఞానోపహతులవుతారో అప్పుడు ఆ దేవుని దివ్యస్వరూపాన్ని దర్శించలేరు.

అని చెప్పి మళ్ళీ బ్రహ్మ నారదునితో ఇలా అన్నాడు "పాపరహితుడా! వేయితలలు, వేయినేత్రాలు, వేయిపాదాలూ కలిగి ప్రకృతిని ప్రవర్తింపజేసే ఆదిపురుషుని రూపమే మహాతేజస్వి అయిన ఆ దేవదేవుని మొదటి అవతారం. అట్టి అవతారస్వరూపంనుండి కాలం, స్వభావం అనే రెండు శక్తులు పుట్టాయి. అందుండి కార్యకారణరూపమైన ప్రకృతి పుట్టింది. ఆ ప్రకృతినుండి మహత్తత్త్వం జనించింది. దానినుండి రాజసాహంకారం, సాత్త్వికాహంకారం, తామసాహంకారం అనే మూడు అహంకారాలు ఉద్భవించాయి. వాటిలో రాజసాహంకారంనుండి ఇంద్రియాలు కలిగాయి. సాత్త్వికాహంకారంనుండి ఇంద్రియగుణాలు ప్రధానంగాకల ఇంద్రాది దేవతలు జనించారు. తామసాహంకారంనుండి పంచభూతాలకు హేతువులైన శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం అనే పంచతన్మాత్రలు పుట్టాయి. వాటినుండి ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి అనే పంచభూతాలు ప్రభవించాయి. వాటినుండి త్వక్కు, చక్షువు, శోత్రం, జిహ్వ, ఘ్రాణం అనే జ్ఞానేంద్రియాలు, వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థం అనే కర్మేంద్రియాలూ, మనస్సూ జనించాయి.

వీటన్నింటి చేరికవల్ల విశ్వస్వరూపుడైన విరాట్పురుషుడు ఉదయించాడు. అతనినుండి స్వయంప్రకాశుడైన స్వరాట్పురుషుడు ఆవిర్భవించాడు. అతనినుండి చరాచరరూపాలతో స్థావరజంగమాత్మకమైన జగత్తు జనించింది. అందుండి సత్త్వగుణస్వరూపుడైన విష్ణుడూ, రజోగుణస్వరూపుడనై హిరణ్యగర్భుడనబడే నేనూ, తమోగుణ స్వరూపుడైన రుద్రుడూ జన్మించాము. అందుండే సృష్టియొక్క ఉత్పత్తికి హేతువైన నాల్గుముఖాల బ్రహ్మ పుట్టాడు. ఆయనవల్ల దక్షుడు మున్నగు తొమ్మిదిమంది ప్రజాపతులు జనించారు. వారినుండి నీవూ, సనకాదులను యోగీశ్వరులూ, స్వర్గలోకంలో ఉండే ఇంద్రాదులు, పక్షిలోకరక్షకులైన గరుడాదులు, మానవలోకం పాలించే మనువు, మాంధాత మున్నగువారూ, తలలోకాన్ని పాలించే అనంతుడు, వాసుకి మున్నగువారూ, ఇంకా గంధర్వులు, సిద్దులు, విద్యాధరులు, చారణులు, సాధ్యులు, రాక్షసులు, యక్షులు, ఉరగులు, నాగులు నివసించే లోకాలను పాలించేవారూ, ఋషులు, పితరులు, దైత్యులు, దానవులు, భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, కూశ్మాండులు మరియు పశువులు, మృగాదులు సంభవించాయి.

ఇట్టి జగత్తుయొక్క మొట్టమొదటి పుట్టుకను మహత్తత్త్వసృష్టి అంటారు. రెండవది అండగతసృష్టి మూడవది సకలభూతగతమైన సృష్టి అందులో ఐశ్వర్యం, తేజస్సు, బలంగల పురుషులు సర్వాంతర్యామి అయిన శ్రీమన్నారాయణుని అంశయందు పుట్టినవారని గ్రహించు. ఆ పద్మాక్షుని లీలావతారాలకు అంతమే లేదు. ఆ అవతారాలలో ఆయన చేసే సత్కర్మలు లెక్కించడం ఎవరికీ శక్యం కాదు, అయినా నాకు తోచినంతవరకూ నీకు వినిపిస్తాను, విను.

శ్రీ మన్నారాయణుని లీలావతారంబుల యభివర్ణనము

Thursday, February 12, 2026

Shuka Maharshi Explaining Bhakti A Way For Mukthi - శుకుడు పరీక్షిత్తునకు భక్తిమార్గంబె ముఖ్యంబని తెలుపుట

శుకుడు పరీక్షిత్తునకు భక్తిమార్గంబె ముఖ్యంబని తెలుపుట

రాజా! ఇది ఇంకా వివరంగా చెబుతాను, విను. పూర్వం బ్రహ్మ మనస్సులో ధర్మనీతి పరాయణమైన దృష్టితో మూడు పర్యాయాలు వేదాన్ని పరామర్శించాడు. అలా పరామర్శించి భక్తితో తప్ప మరొక మార్గాన మోక్షం లభించదని నిశ్చయించుకొన్నాడు. ఆ మార్గాన్నే తరణోపాయంగా నిర్ణయించుకొని వికారానికి లోబడకుండా ఆత్మస్వరూపుడైన జనార్దనుణ్ణి భక్తితో ధ్యానించాడు.

రాజా! జగదీశ్వరుడైన శ్రీహరి సకల జీవులలో సదా ఆత్మరూపుడై ఉన్నాడు. బుద్ధి మొదలయిన లక్షణాలతో ఆ దేవుడు మనకు గోచరిస్తాడు. ఉత్తములకు ఆయన సేవింపదగినవాడు. సకలవేళలా నమస్కరింపదగినవాడు. భక్తులపై వాత్సల్యం కలవాడు. నియమనిష్ఠలు కలిగి ఏకాగ్రమైన బుద్ధితో ఆత్మస్వరూపుడగు శ్రీహరి కథాసుధను తనివి దీరా, చెవులారా గ్రోలేవారు ధన్యులు. అట్టివారు కుటిలమైన పలువిషయాలతో చెడిపోయిన తమ శరీరాలను పరిత్యజించి విష్ణుదేవుని పాదపద్మాలను చేరుకొంటారు. ఇది సిద్ధమైన విషయం.

రాజా! మానవులుగా జన్మించిన వారూ, మరణం ఆసన్నమైనవారూ, మహాజ్ఞానులూ, చేయవలసిన కర్తవ్యం ఇలా చెప్పడమైనది.

రాజా! విను. బ్రహ్మవర్చస్సు కోరేవాడు వేదవిభుడగు చతుర్ముఖ బ్రహ్మను సేవించాలి. అట్లే ఇంద్రియశక్తి కోరేవాడు ఇంద్రుణ్ణీ, సంతతికోరేవాడు దక్షుడు మొదలయిన ప్రజాపతులనూ, భోజనం ఆశించేవాడు అదితినీ పూజించాలి. స్వర్గాభిలాషి ఆదిత్యులనూ, రాజ్యాభిలాషి విశ్వదేవతలనూ, దేశప్రజలనూ, సంపదనూ స్వాధీనం చేసుకోగోరేవాడు సాధ్యులనూ, సిరిని వరించేవాడు దుర్గనూ ఉపాసించాలి. తేజస్సు కోరేవాడు అగ్నినీ, ధనాభిలాషి వసువులనూ, వీర్యార్థి రుద్రులనూ, ఆయువు అభిలషించేవాడు అశ్వినీదేవతలనూ, పుష్టికామి భూమినీ అర్చించాలి. ప్రతిష్టను అపేక్షించేవాడు లోకమాతలగు ఆకాశభూదేవతలనూ, అందచందాలు కోరేవాడు గంధర్వులనూ, కామినులను కామించేవాడు అప్పరసయైన ఊర్వశినీ, సర్వాధికారం కాంక్షించేవాడు పరమేష్ఠినీ భజించాలి. కీర్తికోరువాడు యజ్ఞమూర్తియైన విష్ణువునూ, ధనంకోరేవాడు వరుణుణ్ణీ, విద్యార్థి శివుణ్ణీ, దాంపత్య సుఖాభీలాషి పార్వతినీ కొలవాలి. ధర్మార్ధాలపై అభీలాష కలవాడు పుణ్యచరిత్రుడైన విష్ణువునూ, సంతానార్థి పితృదేవతలనూ, రక్షణ కోరేవాడు యక్షులనూ, బలం కోరేవాడు మరుద్గణాలనూ, రాచరికంపై అభిలాష గలవాడు మను రూపంలో ఉన్న దేవతలనూ, శత్రుమరణం వాంఛించేవాడు నిరృతినీ, భోగాభిలాషి చంద్రుణ్ణీ ఆరాధించాలి ఇంకా,
(వసువులు ఎనమండుగురు. 1. ఆపుడు 2. ధ్రువుడు 3. సోముడు 4. అధ్వరుడు 5. అనిలుడు 6. ప్రత్యూషుడు 7. అనలుడు 8. ప్రభాసుడు. వీర్యప్రదులగు రుద్రులు పదునొకండుగురు. 1. అజుడు 2.ఏకపాదుడు 3. అహిర్బుధ్న్యుడు 4 త్వష్ట 5. రుద్రుడు 6. హరుడు 7. శంభుడు 8. త్య్రంబకుడు 9.అపరాజితుడు 10. ఈశానుడు 11. త్రిభువనుడు.)

రాజా! పై చెప్పిన వాటినన్నింటినీ కోరినా, కోరకున్నా, పరతత్త్వసాధనలో నేర్పుగలవాడు మోక్షం మాత్రం తప్పక అభిలషిస్తాడు. తదనుగుణంగా తన హృదయంలో పరమేశ్వరుణ్ణి నెలకొల్పి భజిస్తాడు.

రాజా! పెక్కుమాట లెందుకు? పైని వివరించిన కోరికలతో ఇంద్రాది దేవతలను సేవించినట్లే, పద్మపత్రనేత్రుడైన విష్ణుని భజిస్తే నిర్మలమైన, జ్ఞానం, వైరాగ్యం, మోక్షం సిద్ధిస్తాయి. ఆ లక్ష్మీనాథుని కథాసుధారసం నిండుగా ఉన్ననదీ తరంగాలలో ఓలలాడడం గొప్పఅదృష్టం. శ్రీహరికథలు చెవులపండువు చేయకుండా ఉండునా?

ఈ రీతిగా పరీక్షిన్మహారాజుకు శుకయోగి చెప్పాడని సూతుడు పలుకగా ఆకర్ణించిన శౌనక మహర్షి ఆ సూతునితో ఇలా అన్నాడు.

ఈ రీతిగా శుకుడు పలికిన పలుకులను మిక్కిలి శ్రద్ధతో విన్న పరీక్షిత్తు శ్రేయోభిలాషతో వెనువెంటనే ఏమని ప్రశ్నించినాడో విశదీకరించి చెప్పు.

చవులూరేటట్లుగా ఉన్న మనోహరమైన నీమాటలు వింటుంటే ఇంకా ఏలాంటి మంచి మంచి విష్ణుకథలు చెపుతాడో అని మా మనస్సులలో ఉబలాటం పెల్లుబుకుతున్నది.

శౌనకు డావిధంగా చెప్పడం విని, సూతు డీరీతిగా అన్నాడు.

మునులారా! ఆ పరీక్షిత్తు బాల్యంలో సైతం తూలిపడే జులపాల జుట్టుతో తోడిబాలురతో గూడి ఆడుకొనే దినాలలో గూడ శ్రద్ధతో హరిపాదాలను అర్చించేవాడు.

అలాంటి భాగవతశ్రేష్ఠుడైన పరీక్షిత్తుతో వాసుదేవుని భక్తుడైన శుకయోగి ఇలా చెప్పాడు.

ఏ పుణ్యాత్ముడు భగవంతుని ఖ్యాతిని ప్రకటించే కథలు వింటూ కాలం గడుపుతాడో, అతని ఆయుస్సు తప్ప ఇతరుల ఆయువును సూర్యుడు ఉదయాస్తమయాలతో మోసగించి లాగుకొనిపోతుంటాడు. ఆ సంగతి గ్రహింపక మూఢుడు "నేను తప్పక చాలా సంవత్సరాలు జీవిస్తాను" అనుకుంటాడు. సంసారానికి హేతువులైన ఆలుబిడ్డలు, ఇల్లువాకిళ్ళు, తోటలు, దొడ్డు, ధనం మొదలైన వాటి తగులంలో చిక్కుకుంటాడు. అతనికి ఆయువుతీరగానే యమభటులు వచ్చి వాణ్ణి నానావిధబాధలకు గురిచేస్తూ యమపురికి తీసుకుపోతారు. అప్పుడు వాడు "అయ్యో! నేను పుణ్యం చేయలేదే! పాపం చేశానే!" అంటూ గోడు గోడున ఏడుస్తాడు.

ఆ కారణం వల్ల.

ఓ రాజా! పూగుత్తులతో ఆకసమంటుతూ అడవులలో చెట్లు జీవించడం లేదా? ఆహార మైథునాది వాంఛలతో పశువులు పల్లెసీమల్లో బ్రతకడం లేదా? కొలిమి తిత్తులు గూడా ఎడతెరపిలేకుండా ఊపిరి లోనికి వెలికి పీల్చుకొని వదలటాన్ని సాగిస్తున్నాయి గదా! ఊరపందులు, కుక్కలు గుంపులు గుంపులుగా ఇల్లిల్లు తిరుగుతూ దిక్కుమాలి దీనంగా తిరగడం లేదా! ఒంటెలు, గాడిదలు పెద్దపెద్ద బరువులు మోస్తున్నాయి కదా! అదేరీతిగా పద్మనేత్రుడైన శ్రీమన్నారాయణుని తెలియనేరని నరపశువులు అడవులందో, గృహాలందో సంసార విషయాలలో ఆసక్తిగల్గి జీవిస్తున్నారు. వారి బ్రతుకు వ్యర్థం.

భూపతీ! విష్ణుని నామసంకీర్తనలు వినని వీనులు కొండగుహలు. కురునాథా! చక్రధారి మీద పద్యాలు చదువని నాలుకలు కప్పల నాలుకలు. కీర్తిప్రియుడా! శ్రీకాంతుని చూడలేని కన్నులు నెమలిఈకల కన్నులు. సత్యవచనుడా! పద్మనేత్రుని పూజకు ఉపకరించని చేతులు పీనుగుయొక్క చేతులు. రాజర్షీ! శ్రీహరి చరణాలమీది తులసీదళాల పరిమళం ఆఘ్రాణించని ముక్కు పందిముక్కు పాపరహితా! గరుడవాహనుని సేవకు వెళ్లని పాదాలు చెట్ల వ్రేళ్ళు, విష్ణు పరం గాని చెవులు, నాలుకలు, మొదలయినవి వ్యర్థమైనవని తాత్పర్యం.

శ్రీమన్నారాయణుని యొక్క పవిత్రనామాక్షరస్మరణతో ద్రవించనివి మనస్సులు కావు, అవి కరకుబండలు. పద్మనాభుని కథలకు ఆనందబాష్పాలు రాలగా పొంగి పులకించనిది శరీరం కాదు, అది కదలని మెదలని వట్టి మొద్దు. పరమాత్మునికి ప్రణమిల్లని మూఢుని తలమీదిది బంగారు కిరీటం కిరీటం కాదు, అది కట్టెలమోపు. భగవంతునికి అర్పితం కాని మానవుని ఐశ్వర్యం ఐశ్వర్యం కాదు, అది అడవిగాసిన వెన్నెల. వాసుదేవుని సేవింపనివాడు. ప్రాణవాయువు లోపల ఉండి కదిలే పీనుగు. పద్మనాభుని పాదాల నాశ్రయింపనివాని జీవితం పొత్తినూలికాయలోని సాలెపురుగు జీవితం.

ఈ రీతిగా పలికిన శుకయోగి పలుకులకు పరీక్షిత్తు చిత్తం వికసించింది. అతడు నిర్మలమైన బుద్ధి విశేషం కలవాడై.

ఆరాజు బిడ్డలనూ, హితులనూ, బంధువులనూ, భార్యనూ, ఇతర పరిజనాన్ని, ధనాన్సీ జడత్వాన్నీ వదలిపెట్టినాడు. కమలనేత్రుడైన మాధవునిపై చిత్తం నిలిపాడు.

ఈ రీతిగా మరణభయాన్ని విడనాడి, ధర్మార్ధకామాలనే త్రివర్గాన్ని తిరస్కరించి, పరమ పురుషునియందే మనస్సును కేంద్రీకరించి శ్రీహరి లీలావిశేషాలను శుకుడు వర్ణిస్తుండగా వినాలనే తలంపుతో పరీక్షిన్మహారాజు ఇలా అన్నాడు.

విప్రోత్తమా! సర్వమూ తెలిసిన నీవు సర్వానికీ ఆత్మ అయిన వాసుదేవుణ్ణి కీర్తించేసరికి నాకుగల భ్రాంతులన్నీ తొలగిపోయాయి. నా మనస్సు సంతోష పరవశమయింది.

మునివర్యా! సర్వేశ్వరుడూ, సర్వవ్యాపీ అయిన శ్రీహరి ఈ జగత్తును ఏ రీతిగా సృష్టిస్తూ, రక్షిస్తూ, సంహరిస్తున్నాడు? అవ్యయుడైన ఆ దేవుడు అనేక శక్తులు కలిగినవాడు. అతడు మొదట ఏ శక్తుల సాయంతో బ్రహ్మ ఇంద్రుడు మొదలైన రూపాలు దాల్చి వినోదించాడు? ఆయన సత్త్వరజస్తమస్సులనే ప్రకృతికి సంబంధించిన గుణాలను, పరిగ్రహించడం క్రమంగా జరుగుతుందా? లేక ఒకే సమయంలో జరుగుతుందా? ఏకమూర్తి అయిన ఈశ్వరుడు అనేక మూర్తులు ధరించి ఎందుకలా అనేక విధాల ప్రవర్తిస్తాడు? అలా ప్రవర్తించకపోతే ఆయనకు వచ్చే నష్టమేమి? నీవు అంతా తెలిసిన మహానుభావుడవు. నా కీవిషయాలు తెలియ జెప్పు.

పరీక్షిన్మహారాజు ఆ విధంగా అడిగే సరికి మౌనం వహించకుండా తగిన సమాధానం చెప్పాలన్న కుతూహలంతో ఉత్తమగుణ సంపన్నుడైన శుకుడు తన మనస్సులో ఇలా భగవంతుణ్ణి ప్రార్ధించాడు.

ప్రకృతికంటే, జీవునికంటె భీన్నుడై, (శ్రేష్ఠుడై), అంతటికీ అధిపతియై, గొప్ప మహిమలుగలవాడై, సృష్టిస్థితి సంహారాలనే క్రీడలు గావించువాడై, త్రిమూర్తుల శక్తులు గలవాడై, అందరికీ అంతరాత్మగా వెలుగొందుచున్నవాడై, బ్రహ్మ మున్నగు దేవాధిపులు అందుకోజాలని దుస్తరపథంలో ప్రకాశించేవాడైన శ్రీహరికి నేను తత్త్వప్రాప్తి మీద అభిలాషగలిగి ప్రణమిల్లుతున్నాను.

సజ్జనుల పాపాలను పరిహరించేవాడూ, దుర్జన శిక్షకుడూ, అన్ని రూపాలూ తన రూపమే అయినవాడూ, పరమహంసా శ్రమంలో ఉండే మునుల హృదయపద్మం మధ్య వెలుగొందేవాడూ, యదుకుల తిలకుడూ, సకల కల్యాణ గుణశోభితుడూ, ఉత్తమభక్తులకు సులభమైనవాడూ, భక్తిలేనివారికి దుర్లభుడూ, అత్యుత్తమమూ, అనుపమమూ, అనంతమూ అయిన ప్రవర్తన గలవాడూ, స్వస్వరూపమయిన బ్రహ్మంలో విహరించేవాడూ అయిన ఆ పరమేశ్వరునికి ప్రణమిల్లుతున్నాను.

ఏ పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి చేసే ప్రణామం, పూజ, ధ్యానం, నామసంకీర్తనం అమోఘమైనవో, ఏ ప్రభుని లీలలు వింటే దోషాలన్నీ తొలగి లోకం మంగళాయతనమవుతుందని పెద్దలు చెబుతున్నారో, అట్టి పాపరాశిపరిహారకుడూ, భద్రమయ కీర్తనుడూ అయిన భగవంతుణ్ణి ఆశ్రయిస్తున్నాను.

ఏ పరమాత్ముని చరణయుగళిని ఎల్లకాలాల్లోనూ కోరి సేవించి నిపుణులైనవారు అంతర్ముఖమైన బుద్ధితో ఇహపరలోకాలకు చెందిన జాడ్యం వదలుకొని ఏ విధమైన తాపం లేనివారై పరబ్రహ్మను పొందుటకుపాయమైన మార్గంలో శ్రమలేకుండా చరిస్తారో, అట్టి పాపసంఘవినాశకుడూ, మంగళప్రదకీర్తనుడూ అయిన పరమేశ్వరునికి నేను ప్రణామం చేస్తున్నాను.

ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని దానాలాచరించినా, ఎన్ని జపాలు నిర్వహించినా వాటివల్ల కలిగే ఫలాలను ఏ పరమేశ్వరుడికి సమర్పించకుంటే అవన్నీ నిందాస్పదాలై ఆపదలతో గూడీనట్లు పరిణమించునో, అట్టి పాపనివారకుడూ, మంగళకీర్తనుడూ, పరిమితి లేనివాడూ అయిన పరమేశ్వరుణ్ణి సేవిస్తాను.

యవనులు, కిరాతులు, పుళిందులు, హూణులు, శకులు, కంకులు, ఆభీరులు, చండాలురు అనే వారికి చెందిన జాతులలో జనించినవారునూ, మిగిలిన పాపశీలురునూ ఏ పరమ పావనుడైన భగవానుని సేవించి, ఉత్తములైన భాగవతులను ఆశ్రయించి శుద్ధశరీరులై, మంగళాకారులై ఉంటారో అట్టి వికారరహితుడూ, సర్వసమర్థుడూ అయిన పరమాత్మకు సదా నమస్కరిస్తాను.

తపస్సులతోనో, చిత్తనిగ్రహంతోనో, నానా దానాలతోనో, వ్రతాలతోనో, జపాలతోనో, మంత్రాలతోనో, శ్రుతిస్మృతుల అధ్యయనంవల్లనో, లేక ఉత్తమ భక్తితోనో, ఇలా దేనివల్ల ఆయన దివ్యచరణాలు లభిస్తాయి? అని బ్రహ్మరుద్రాదులు ఏ పరమాత్ముణ్ణి భావిస్తుంటారో ఆ మోక్షవిభుడూ, ఆత్మస్వరూపుడూ నాకు సదా సులభుడవుగాక!

లక్ష్మీదేవికీ, యజ్ఞానికీ, ప్రజలకూ, బుద్ధికీ, జగత్తుకూ, భూమికీ, యాదవకులానికీ పతీ గతీ అయిన భగవంతుణ్ణి నేను భజిస్తాను.

ఆ దేవుడు అణుస్వరూపుడా? లేక విభుస్వరూపుడా? దిక్కాలాదులచే పరిచ్చిన్నుడా? లేక అపరిచ్చిన్నుడా? సగుణుడా? నిర్గుణుడా అంటూ పండితులు తమ తత్పాన్వేషణ ప్రయత్నం విఫలం కాగా, ఏ దేవుని చరణకమలసేవా పరాయణులై తత్త్వాన్ని దర్శిస్తున్నారో అట్టి సర్వోత్కృష్టుడూ, విశ్వాత్ముడూ అయిన విష్ణుదేవుని నేను భజిస్తాను.

బ్రహ్మకు జగన్నిర్మాణం చేయాలన్న బుద్ది పుట్టించాలని ఏ భగవానుడు పూర్వం సరస్వతిని పంపగా ఆమె బ్రహ్మను తనకు భర్తగా స్వీకరించి లోకసామ్రాజ్యంలో ఆయనను సృష్టి నిపుణుణ్జిగా చేసిందో, అట్టి సగుణుదైన భగవంతుణ్ణి సేవించుట కుపక్రమిస్తాను.

తాను పరిపూర్ణుడై అంతటా వ్యాపించి ఉండికూడా పృథివ్యాదులగు ఐదు మహాభూతాలను కలిపి శరీరాలనే పురాలను నిర్మించి వాటిలో పురుషుడనే పేరుతో ఎవడు ధీరుడై ప్రకాశిస్తుంటాడో, పంచభూతాలనూ, పదునొకండు ఇంద్రియాలనూ, ప్రకాశించునట్లు చేసి మహామహిమతో షోడశకళాస్వరూపుడై వెలుగొందుతూ ఎవడు జీవత్వమనే నృత్తకళావిలాసం ప్రదర్శిస్తుంటాడో, అట్టి అవ్యయుడూ, అచ్యుతుడూ అయిన భగవంతుడు మనోజ్ఞమైన నవరసాలనే తేనెలు జాలువారగా నా మనస్సునుండి పుట్టిన వాక్కులనే పూలదండలతో సజ్జనుల హృదయసీమల నలరించుగాక!

పదునొకండింద్రియములు- వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థ అనేవి ఐదు కర్మేంద్రియాలు, శ్రోత్రం, చర్మం, చక్షువు, జిహ్మ, ఘ్రాణం-అనేవి ఐదు జ్ఞానేంద్రియాలు, మనస్సు చేరి పదునొకండింద్రియాలు.

నవరసాలు : శృంగారం, హాస్యం, కరుణం, రౌద్రం, వీరం, భయానకం, బీభత్సం, అద్భుతం, శాంతం-అనేవి నవరసాలు. నర్తకులు నృత్తస్తమయంలో నవరసాలు ఒలికిస్తూ సామాజికుల హృదయాలను రంజింప జేస్తారన్న ప్రక్రియ ఇక్కడ నిర్ధేశించబడింది.

మానమే ధనంగా గలవారూ, మహితాత్ములూ, సమాధి నిపుణులూ అయినవారు ఏ మహనీయుని ముఖపద్మధ్యానమనే తేనె నాస్వాదిస్తూ, భయరహితులై భవబంధ విముక్తులై విరాజిల్లుతారో, అట్టి ముని జనాగ్రగణ్యుడూ, గాఢమైన అజ్ఞానమనే చీకటికి సూర్యుడూ, సజ్జనులలో ముఖ్యుడూ అయిన వేదవ్యాస భగవానునికి నేను నమస్కరిస్తాను.

ఇలా శ్రీహరికీ వ్యాసభగవానునికీ ప్రణామాలు సమర్పించి శుకయోగి పరీక్షిన్మహారాజుతో ఇలా అన్నాడు.

మనుజేంద్రా! ఇప్పుడు నీవు నన్నడిగిన విషయాన్నే పూర్వం బ్రహ్మ నారాయణుని ద్వారా విన్నాడు. నారదుడు ప్రశ్నిస్తే దానినే ఆయన వివరించాడు. తదుపరి నారదుడు నాకది ఎరిగించాడు. వినదగినదీ, ఆశ్చర్యావహమైనదీ, సంశయం తొలగించేదీ అయిన ఆ విషయం నీకు చెబుతాను విను.


నారదుండు బ్రహ్మను బ్రపంచ ప్రకారంబు నడుగుట

Shuka Maharshi Explaining Mukthi Margam - శుకుడు పరీక్షిత్తునకు ముక్తి మార్గంబుందెల్పుట

శుకుడు పరీక్షిత్తునకు ముక్తి మార్గంబుందెల్పుట

రాజా! నీ విప్పుడడిగిన ప్రశ్న చాలా మేలైనది. ఎంతో సమంజసమైన, పరిపక్వమైన ప్రశ్న ఇది. ఆత్మతత్త్వం తెలిసినవాళ్ళు ఈ ప్రశ్నను అభినందిస్తారు. ఇది సకలశుభాలనూ చేకూరుస్తుంది. లోకంలో వినదగినవిషయాలు వేలకొలదిగా ఉన్నాయి. అందులో ఇది మిక్కిలి ముఖ్యమైనది. సంసారంలో మునిగి తేలే గృహస్థులకు ఆత్మతత్త్వం ఏ మాత్రం తెలియదు. వాళ్ళకు స్త్రీసంగమంతోనూ, నిద్రతోనూ రాత్రికాలం గడచిపోతుంది. పగలంతా కుటుంబవ్యవహారాలతో, ధనార్జనబుద్ధితో సరిపోతుంది. పశువులూ, భార్యలూ, బిడ్డలూ, చుట్టాలూ, శరీరమూ ఇత్యాదిగాగల పరివారమంతా శాశ్వతమని నమ్మి వాళ్ళు కాపురాలు సాగిస్తారు. చివరికొకనాడు శాశ్వతంగా కన్నుమూసి కాటిపాలవుతారు. అంత్యకాలానికి చెందిన ఈ దుఃస్థితి తెలిసికూడా తెలియనివారుగానే ఉండిపోతారు.

రాజా! మోక్షాపేక్షగలవానికి అన్నింటికి ఆత్మ అయినవాడు, మహావైభవం కలవాడూ, సర్వవ్వాపీ, జగదీశ్వరుడూ అయిన విష్ణువే వినడానికీ, సేవించడానికీ, వర్ణించడానికీ, భావించడానికీ అన్నివిధాలా తగినవాడు.

ఆత్మానాత్మవివేకమనే సాంఖ్యయోగంతోకానీ, ధర్మానుష్టానంతోకానీ చివరికాలంలో శ్రీహరిని చింతించాలి. అలా చేయడమే మానవజన్మ దాల్చినందుకు ఫలం.

రాజా! ఉత్తమమూ, నిర్మలమూ అయిన బుద్ధిగల మహాత్ములు శాస్త్రంలో చెప్పిన విధినిషేధాలు వర్జించి గుణరహితమైన పరబ్రహ్మాన్ని ఆశ్రయిస్తారు. మనస్సులో ఎల్లవేళలా శ్రీహరిగుణాలను చింతిస్తూ ఉంటారు.

నా తండ్రి వ్యాసభగవానుడు. ద్వాపరయుగంలో భాగవతం నాచేత చదివించాడు. నేను పరబ్రహ్మంలో లగ్నమైన చిత్తం కలిగి భగవంతుని అవతారలీలలు నన్నాకర్షించడంవల్ల దీన్ని పఠించాను. నీవు పంకజాక్షుని పాదపద్మాలను ఆశ్రయించిన భక్తుడివి. అందుచేత నీకు భాగవతతత్త్వం వివరిస్తాను. వినవయ్యా మహారాజా! భాగవతశ్రవణంవల్ల విష్ణువును సేవించాలనే బుద్ధి విస్తరిస్తుంది. మోక్షం కోరేవాడికి ముక్తి లభిస్తుంది. జన్మ జరామరణాది సంసారభయాలన్నీ సమసి పోతాయి. యోగివర్యులకు వాసుదేవుని నామకీర్తనలు ఉత్తమమైన వ్రతాలు.

రాజా! విష్ణుదేవుని తెలుసుకోకుండా మత్తెక్కి సంసారంలో అనేక సంవత్సరాలతరబడి పొర్లుతూ సతమతమవుతుండే అవివేకి ముక్తికెలా పోగలడు? వాడు సంసారంనుండి ఎన్నటికీ ముక్తుడు కాలేడు. ఇది నిక్కం. ఒక్క ముహూర్తకాలమైనా హరిని స్మరిస్తే చాలు, అది ముక్తిని ప్రసాదిస్తుంది.

కౌరవనాథా! పూర్వం ఖట్వాంగుడనేరాజు సప్తద్వీపాలనూ పరిపాలిస్తుండేవాడు. ఇంద్రాదిదేవతలు యుద్ధభూమిలో భయంకరులైన దానవులచే ఓడిపోయారు. ఓడి ఆ రాజుచెంతకు వచ్చి తమకు సాయం చేయుమని అర్థించారు. ఆయన భువినుండి దివికేగి దానవేశ్వరులనందరినీ సంహరించాడు. అందుకు సంతసించిన దేవతలు ఖట్వాంగుణ్ణి ఏదైనా వరం కోరుకొమ్మన్నారు. "నే నెంతకాలం జీవిస్తానో చెప్పండి! ఇదే నేను కోరే వరం, వేరేవరంనా కక్కరలేదు" అని అతడన్నాడు. "నీకు ఆయువింక ఒక్క ముహూర్తకాలం (రెండుగడియలు) మాత్రమే ఉన్నది" అని ఆ వేల్పులన్నారు. వెనువెంటనే ఆ భూపాలుడు విమానయానంతో భూలోకానికి వచ్చాడు.

అలా దివినుంది వచ్చిన ఖట్వాంగమహారాజు కొండలవంటి గజాలనూ, గుర్రాలనూ, ప్రాణప్రియలైన సుందరీమణులనూ, సన్నిహితులైన హితులనూ, పండిత శ్రేష్ఠులనూ ప్రగాఢమైన వైరాగ్యంతో పరిత్యజించాడు.

ఆ రీతిగా సర్వసంగ పరిత్యాగం చేసిన ఖట్వాంగమహారాజు గోవిందనామ సంకీర్తన చేస్తూ, మరణభయం వదలిపెట్టి రెండు గడియలకాలంలోనే ముక్తిపొందాడు.

రాజా! విను. నీకు ఏడుదినాల తరువాతనే కదా మరణం! అప్పటివరకూ పరలోకసాధనమైన పరమశుభాన్ని ఆర్జించడానికి ఎంతో అవకాశం ఉంది. అవసానసమయం సమీపించగానే భయపడకుండా దేహధారి అయినవాడు శరీరం, పుత్రులు, భార్య మొదలయిన వారిపైగల మోహమనే వృక్షాన్ని నిష్కామమనే ఖడ్గంతో తెగనరకాలి. ఇల్లు వదలిపోయి పావనమైన తీర్ధజలాలలో స్నానమాడుతూ ప్రశాంతమైన ఏకాంతప్రదేశం చేరుకోవాలి. అక్కడ శాస్త్రం విధించినట్లు దర్భలూ, జింకచర్మం, వస్త్రం పరచుకొని కూర్చోవాలి. జగమంతా పవిత్రం చేయగలదీ, అకార-ఉకార-మకారాలనే మూడక్షరాలతో కూడినది, బ్రహ్మబీజం అయిన ఓంకారాన్ని మనస్సులో స్మరిస్తూ ఉచ్చ్వాస నిశ్వాసాలను వశపరచుకోవాలి. ఆపై విషయాలను వెన్నంటి పరుగిడే ఇంద్రియాలను బుద్ది అనే సారధితోనూ, మనస్సు అనే పగ్గంతోనూ బిగబట్టి నిగ్రహించాలి. గట్టి కర్మబంధాలలో చిక్కుకొని ఊగిసలాడే చిత్తాన్ని ప్రజ్ఞాబలంతో నిరోధించి భగవంతునిమీద నిశ్చలంగా నిలపాలి. విషయచింతలులేని చిత్తంతో ఆ దేవుని కరచరణాదులైన అవయవాలను క్రమంగా ధ్యానించాలి. రజోగుణ తమోగుణాలచేత ఆకర్షింపంబడి మోహానికి లోనయ్యే మనస్సును ఆ గుణాలవల్ల కల్గిన మాలిన్యాలనూ ధారణతో తొలగించి నిర్మలం చేయాలి. అలా చేసినవాడు సర్వోత్కృష్టమైన విష్ణుపదం చేరుకుంటాడు. ధారణానియమం సిద్ధిస్తే అతడు సుఖమయమైన విషయాన్ని దర్శిస్తాడు. అట్టి యోగి భక్తిలక్షణమైన యోగాన్ని ఆశ్రయించి మోక్షం చూరగొంటాడు. ఈ విధంగా పలికిన శుకయోగీంద్రునితో పరీక్షిన్నరేంద్రుడు ఇలా అన్నాడు.

మునివర్యా! ధారణ ఎలా నిలుస్తుంది? ధారణ స్వరూపం ఎలాంటిది? ధారణ అంటే ఏమిటి? అది జీవుని చిత్తమాలిన్యాన్ని ఎలా పరిహరిస్తుంది? దయతో ఈ విషయం నాకు తెలపండి!

రాజు చెప్పిన మాటలు విని అవధూతల్లో మేటి అయిన శుకయోగి ఆ రాజునుద్దేశించి ఇలా పలికాడు.

అక్షరత్వా ద్వరేణ్యత్వా ద్ధూతసంసారబంధనాత్‌ 

తత్త్వమస్యర్థ సిద్ధత్వా దవధూతో
భిధీయతే ॥

క్షరం(వినాశం) లేని ఆత్మస్వరూపుడు, శ్రేష్ఠపురుషుడు, సంసారబంధం వదలించుకొన్నవాడు "తత్వమసి" అన్న మహావాక్యార్థాన్ని అనుభవంలోకి తెచ్చుకొన్నవాడు అవధూత అవుతాడు. పై లక్షణ శ్లోకంలో ప్రథమపాదం మొదట 'అ' అనీ, ఆ పాదం మధ్యలో 'వ' అనీ, రెండవపాదం మొదటి 'ధూ' అనీ, మూడవపాదం మొదట 'త' అని ఉన్న నాలుగక్షరాలను కలిపితే 'అవధూత' శబ్దం సిద్ధిస్తుంది. అవధూతలు ఆత్మ వినాశనం లేనిదని గ్రహించి, సంసారాన్ని వదలించుకొని 'తత్‌+త్వం+అసి' అను ఉపదేశరూపమైన మహావాక్యాన్ని అనుభవంలోకి తెచ్చుకొంటారు. అందుచే వారు శ్రేష్ఠపురుషులు.

పండితుడైనవాడు శ్వాసవాయువుల నరికట్టి సంసారంతోడి సంగాన్ని త్యజించాలి. ఇంద్రియాలను జయించాలి. ఆపై బుద్ధిబలంతో మనస్సును విష్ణుదేవుని విశాలమైన రూపంమీదే స్థిరంగా నిలపాలి. 

రాజా! విను. భగవానుడైన విష్ణుని విరాట్‌ విగ్రహంలో జరిగిన, జరుగనున్న జరుగుతున్న ప్రపంచమంతా గోచరిస్తుంది. భూమి, జలం, అగ్ని వాయువు, ఆకాశం, అహంకారం, మహత్తత్త్వం అనే ఏడు ఆవరణాలు మహాండకోశమైన విరాట్పురుషుని శరీరాన్ని కప్పి ఉన్నాయి. ఆ శరీరంలో ధారణకు ఆశ్రయమై వైరాజపురుషుడు భాసిస్తున్నాడు. ఆ మహాత్మునికి పాతాళం అరికాలు; రసాతలం కాలిమడమ, మునివ్రేళ్ళు; మహాతలం చీలమండలు; తలాతలం పిక్కలు; సుతలం మోకాళ్ళ జంట; వితలం అతలం తొడలు; భూతలం పిరుదు; ఆకసం బొడ్డు; గ్రహాలూ, తారకలూ, జ్యోతిస్సమూహంతో కూడిన నక్షత్రలోకం వక్షఃస్థలం; మహర్లోకం మెడ; జనలోకం ముఖం; తపోలోకం నొసలు; సత్యలోకం శిరస్సు; ఇంద్రాదులు భుజదండాలు; దిక్కులు చెవులు; శబ్దం శ్రోత్రేంద్రియం; అశ్వినీదేవతలు ముక్కుపుటాలు; గంధం ఘ్రాణేంద్రియం; అగ్ని నోరు; అంతరిక్షం కళ్ళు, సూర్యుడు నేత్రేంద్రియం, రేపవళ్ళు కనురెప్పలు, బ్రహ్మపదం కనుబొమలు, జలాలు దవడలు, రసం జిహ్వేంద్రియం. సకలవేదాలు భాషణాలు, యముడు కోరలు, పుత్రాదులమీది స్నేహ కళలు దంతాలు, జనులకు పిచ్చి కల్గించే మాయావిలాసాలు నవ్వులు, తుదిలేని సృష్టులే కడగంటి చూపులు; సిగ్గు, లోభం పెదవులు, ధర్మమార్గాలు రొమ్ములు; అధర్మమార్గం వెన్ను, ప్రజాపతి పురుషాంగం, మిత్రావరుణులు వృషణాలు, సముద్రాలు కడుపు, కొండలు ఎముకలు, నదులు నాడులు, చెట్లు రోమాలు, గాడ్పు నిట్టూర్పులు, కడలేని కాలమే ప్రాయం. పలువిధాలైన ప్రాణులతో గూడిన సంసారాలు కర్మలు, మబ్బులు శిరోజాలు, సంధ్యలు కట్టుబట్టలు, ప్రధానం హృదయం, చంద్రుడు వికారాల కన్నింటికి స్థానమైన మనస్సు. మహత్తత్వం చిత్తం. రుద్రుడు అహంకారం, గుర్రాలు, కంచరగాడిదలు, ఒంటెలు, ఏనుగులు గోళ్ళు; పశువులు, మృగాదులు కటిప్రదేశం, పక్షులు చిత్రమైన మాటలనేర్పులు, మనువు బుద్ది, పురుషుడు నివాసం, గంధర్వులు, విద్యాధరులు, చారణులు, అప్సరసలు షడ్జం మొదలయిన స్వరాలు; ప్రహ్లాదుడు స్మృతి, దైత్యులు, దానవులు వీర్యం. అంతేకాదు, ఆ మహాప్రభువునకు బ్రాహ్మణులు ముఖం, క్షత్రియులు భుజాలు, వైశ్యులు తొడలు, శూద్రులు పాదాలు, వసువులు రుద్రులు, హవిర్భాగాలు ద్రవ్యాలు, యజ్ఞప్రయోగాలు కర్మలవుతున్నాయి. ఇట్టి విశ్వమయుడైన విరాట్పురుషుని విగ్రహాన్ని మోక్షం కోరేవాడు తన మనస్సులో అనుసంధానం చేసుకోవాలి అని చెప్పి శ్రీశుకమహర్షి ఇంకా ఇలా చెప్పినాడు.

వంశపావనుడవైన ఓ పరీక్షిన్మహారాజా! ఈ విశ్వమంతా విష్ణమయమే. విష్ణుదేవుడు విశ్వమయుడు. ఇందులో ఏ మాత్రం సందేహించ వలసిన పనిలేదు. విష్ణమయం కాని వస్తువు ఈ జగత్తులో ఒక్క పరమాణువు గూడా లేదు.

రాజా! జీవుడు కలలో తనకంతవరకూ తీరని కోరికలమీది ఉబలాటంతో పలుశరీరాలు ధరిస్తాడు. పలుపేర్లతో వ్యవహరింపబడతాడు. తన ఇంద్రియాలతో విశేషా లన్నింటినీ గమనిస్తాడు. ఆ మీదట తన్ను తెలుసుకొంటాడు. ఇట్లే అంతటికీ అంతరాత్మయయిన పరమాత్మ అన్నిప్రాణుల హృదయాలలో ఉండి ప్రజ్ఞతో బుద్ధి వృత్తులనన్నింటినీ పరిశీలిస్తాడు. తానే అన్నిటికీ ప్రభువు కావడంవల్ల దేనికీ బద్దుడు కాడు. ఆయన సత్యస్వరూపుడూ, ఆనందపరిపూర్ణుడూ అయిన విజ్ఞానమూర్తి. ఆయనను సేవించినప్పుడే ముక్తి సిద్ధిస్తుంది. తదితరుల సేవతో మోక్షం సిద్ధించదు. ఈ సంసారబంధం వీడదు.

రాజా! పూర్వం బ్రహ్మ జగత్తును సృష్టించాలనుకొన్నాడు. పలు సంవత్సరాలు అందుకై ప్రయత్నించాడు. అయినా అందుకు తగిన నేర్పు బ్రహ్మకు సిద్ధించలేదు. ఆపై హరిని ఏకాగ్రమైన చిత్తంతో ప్రార్ధించాడు. ఆ హరి కృపవల్ల మళ్ళీ సృష్టి క్రమాన్ని స్మరించగలిగాడు. ఆ ధారణతో ప్రాణులను సృష్టించే విధానంలో నేర్పు గడించాడు. ఫలప్రదమైన, పూజనీయమైన బుద్ధివికాసంతో ఈ జగన్నిర్మాణంలో సమర్థుడై విహరించాడు.

అవివేకియైన మానవుడు శబ్దప్రధానమైన వేదంలోని కర్మకాండ బోధించినట్లు నిరర్ధకాలైన స్వర్గాదిసుఖాలు కోరుతాడు. నిద్రించేవాడు పూర్వసంస్కారంతో కలలు కన్నట్లు మాయామయమైన మార్గంలో పరిభ్రమిస్తాడు. అంతేకాని శాశ్వతమైన మోక్షసుఖం పొందలేడు. వివేకవంతుడు అలా చేయడు. అతడు నిస్సారమైన భోగాలలో శరీరధారణకు అవసరమైనంత మేరకే భోగస్వీకారం చేస్తాడు. కడు జాగరూకుడై ఉంటాడు. సంసారం సుఖమని భావించడు. దాని కతీతమైన త్రోవలో పోతేనే సిద్ధి కల్గుతుందని భావించి అలా ప్రవర్తిస్తాడు.

సంసారంపట్ల విరక్తుడైన వివేకవంతుడు ఇలా భావన చేస్తాడు: పడుకోవడానికి తగినంత చదునైన చక్కని నేల ఉండగా దూదిపరుపు లెందుకు? పుట్టుకతో వచ్చిన దోసిళ్ళు ఉన్నాయి కదా? మరి భుజించడానికి కంచాలు మొదలైనవి ఎందుకు? నారచీరలూ, జింకచర్మాలూ, దర్భచాపలూ ఉన్నవి కదా! ఇక కట్టుకోవడానికి పట్టు పుట్టాలందుకు? నివసించడానికనువైన కొండ గుహలున్నాయి కదా! ఇక మేడలూ, రాజప్రాసాదాలూ ఎందుకు? చెట్లు తగినట్లు ఫలరసాలను ప్రసాదిస్తున్నాయి కదా! నదులలో తియ్యని నీటికి లోటు లేదుకదా! పుణ్యస్త్రీలు పుష్కలంగా భిక్షలిస్తూనే ఉన్నారు కదా! ఇవన్నీ ఉండగా తపోధనులైనవారు, ధనమదంతో కన్నూ మిన్నూ కానని సంపన్నులను ఎందుకు సేవించాలి?

దిక్కులేని వారికి దిక్కై తాను కాపాడుతానంటూ చక్రధారియైన శౌరి తానున్నాడు. అలాంటప్పుడు ఆత్మజ్ఞులైన వివేకవంతులు అసమర్థుడైన ఒక మనుజుణ్ణి రక్షించుమంటూ ప్రార్ధింపవలసిన అవసర మేమున్నది?

ఈ విధంగా భావించి బుద్ధిమంతుడైనవాడు, జీవుల హృదయంలో స్వతస్సిద్ధంగా ఉన్నవాడూ, అంతర్యామీ, ప్రీతిపాత్రుడూ, నిత్యుడైనవాడూ, సత్యస్వరూపుడూ, షడ్గుణైశ్వర్యసంపన్నుడైన భగవానుడగు వాసుదేవుణ్ణి సేవిస్తాడు. ఆ సేవవలన కలిగే ఆనందం అనుభవిస్తాడు. తద్ద్వారా సంసారానికి హేతువైన అవిద్య అనే ప్రకృతినుండి విడుదల పొందుతాడు కాబట్టి-

నృపశ్రేష్ఠా! శ్రీహరిని ధ్యానించకుండా మదోన్మత్తచిత్తుడై విషయభోగాలనే చింతిస్తూ దినాలు గడిపేవాడికి యమభటుల గదల దెబ్బలు తప్పవు. అతడు యమపురద్వారం వద్ద వైతరణీనదిలోని అగ్ని జ్వాలల్లోపడి మలమల మాడిపోతాడు.

భగవచ్చింతనలేని పాషండులను యమకింకరులు గదలతో మోదుతారు. వాళ్ళ దేహాలను మంటలపాలు చేసి మాడుస్తారు. వాటిని ముక్కలు ముక్కలయ్యేటట్లు పిసికి ఆపై వాటిలోకి చురకత్తులు దూరుస్తారు.

అంతేకాదు. శ్రీహరి పాదపద్మాలలోని పరిమళం మకరందానికున్న మాధుర్యం చవిచూడడానికి విముఖులైనవాళ్ళు తమతమ కర్మబంధాలలో చిక్కుకొంటారు. తద్ద్వారా యమనగరద్వారంవద్ద ప్రవహించే వైతరణీనదిలోని భగభగమండే అగ్ని జ్వాలల్లో కాలిపోతున్న వాళ్ళతో జతగూడుతారు. విశిష్టజ్ఞానులై జీవించే శరణాగతులు మాయకు లోబడక నేర్పుతో తమ తమ హృదయాలలోని భగవంతుని ధ్యానిస్తారు.

ఆ భగవానుడు జుత్తెడు కొలతగల శరీరం కలవాడు, దిగ్గజాల తొండాలలాగా పొడవైన నాలుగు చేతులుగలవాడు, చక్కదనంలో కోటి మంది మన్మథులకు దీటైనవాడు, మందరగిరిని ధరించినవాడు, పున్నమ నాటి జాబిల్లిని పోలిన మోము కలవాడు, సౌభాగ్యానికి నెలవైనవాడు, ప్రాతఃకాలపు సూర్య బింబంలాగా ప్రకాశించే పద్మరాగమణులు పొదిగిన కిరీట కుండలాలు తాల్చినవాడు, వక్షఃస్థలంలో శ్రీవత్సమనే పుట్టుమచ్చ గలవాడు, కమనీయమైన కౌస్తుభరత్నం పొదిగిన కంఠాభరణం మెడలో అలంకరించుకొన్నవాడు. ఎప్పుడూ సువాసన లీనే వనమాలతో ఒప్పారేవాడు, పలువిధాలైన పెద్ద పెద్దహారాలూ, భుజకీర్తులూ, కడియాలూ, మురుగులూ, మొలనూలూ, ఉంగరాలూ మొదలగు సొమ్ములతో శోభిల్లేవాడు, నొసట ముసురుకొన్న నిగనిగలాడే నీలి ముంగురులు గలవాడు, రాకాచంద్రుని వెన్నెలవలె తెల్లని మందహాసం కలవాడు, కరుణామయమైన కడగంటి చూపులతోడి భ్రూవిలాసాలతో భక్తులపై పరమానుగ్రహం ప్రసరింపజేసేవాడు, మహాయోగీశ్వరుల హృదయపద్మాలలో చివుళ్ళవంటి తన అడుగులు మోపినవాడు, సదా ఆనందస్వరూపుడు, వేయికోట్ల సూర్యులతో సమానమైనవాడు, లోకాలకు ప్రభువు అయిన ఆ పరమేశ్వరుణ్ణి విజ్ఞాన సంపన్నులు మనోధారణతో చిక్కబట్టి ఆ దేవుని చీలమండలు, అడుగులు, మోకాళ్ళు, పిక్కలు మున్నగు అవయవాలలో ఒక్కొక్కదానిని అనుక్షణం క్రమంగా ధ్యానిస్తారు. అచంచలమైన పూర్ణభక్తియోగం సిద్ధించేవరకూ ఆ పరమేశ్వరుని ధ్యానంలో నిమగ్నులై ఉంటారు. 

ఇలా చెప్పి శుకుడు మళ్ళీ ఈ రీతిగా అన్నాడు.

రాజా! ప్రారబ్ధకర్మ తీరేసరికి శరీరం పరిత్యజించాలనుకొన్న సన్న్యాసి దేశకాలాల కోసం ఎదురుచూడడు. మరణించాలన్న భావన కల్గగానే అతడు సుఖాసనస్థు డవుతాడు. మనస్సుతో ప్రాణవాయువును నిగ్రహిస్తాడు. మనోవేగాన్ని బుద్ధితో అరికడతాడు. బుద్ధిని క్షేత్రజ్ఞుడనబడే జీవాత్మతో పొందుపరుస్తాడు. జీవాత్మను శుద్దాత్మలో చేరుస్తాడు. శుద్దాత్మను పరమాత్మలో లీనం చేస్తాడు. అలాచేసి శాంతుడై పనులన్నింటినీ వదలిపెడతాడు. ఆపై శాశ్వతసుఖం కావాలని అభిలషిస్తాడు.

రాజా! విను. పరమాత్మయైన పరబ్రహ్మానికి తప్ప కాలానికి లోబడిన బ్రహ్మాదులైన దేవతలకూ, సత్త్వం, రజస్సు, తమస్సు అనే గుణాలకూ, అహంకారానికీ, మహత్తత్త్వనికీ, సమస్త సృష్టికీ మూలమైన ప్రధానమనబడే ప్రకృతికీ ఎట్టి ఆధిపత్యమూ లేదు. అందుచేత పరమాత్మకంటె భిన్నమైన పదార్థమేదీ లేదు. సత్పురుషులు శరీరాదులపై ఆత్మభావన వదలుతారు. ఇతర విషయాలపై వ్యామోహం విడనాడుతారు. పూజనీయమైన మాధవుని పాదపద్మాలను మనస్సులో అనుక్షణమూ నిల్పుకొని ఉంటారు. వైకుంఠమే అన్నిటికంటె ఉత్తమ స్థానమని గ్రహిస్తారు. ఈ రీతిగా శాస్త్రజ్ఞాన బలమనే మంటలో విషయవాసనలను తగులబెట్టి వారు దేనిపైనా అపేక్ష లేకుండా ఉంటారు.

రాజా! యోగియైనవాడు కాలిమడమతో మూలాధార చక్రాన్నీ గుదస్థానాన్ని అదిమిపడతాడు. ఆ మీదట ప్రాణ వాయువును బిగబట్టి బొడ్డు వద్దగల మణిపూరక చక్రానికి తీసుకుపోతాడు. అక్కడనుండి హృదయంలోని అనాహతచక్రానికీ, అందుండి వక్షఃస్థలంలోని విశుద్ధచక్రానికీ, అక్కడనుండి తాలుమూలానికీ, అచ్చటనుండి కనుబొమ్మల మధ్యగల ఆజ్ఞాచక్రానికీ ప్రాణవాయువును తరలిస్తాడు. ఆపై కళ్ళు, చెవులు, ముక్కు నోరు ఇవి మూసుకొని ఏ కోరికలూ లేనివాడై అర్ధముహూర్తసమయంలో ఇంద్రియాలతో ఎట్టి సంబంధమూ లేకుండా ప్రాణాలను నిగ్రహిస్తాడు. పిదప నెత్తిపై గల బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకొని బ్రహ్మంలో లీనమై పోతాడు.

శరీరం పరిత్యజించే వేళలో ఇంద్రియాలతో సంబంధం వీడనివాడు వాటితో కూడ గుణమయమైన బ్రహ్మాండంలో ఖేచరులు, సిద్దులు విహరించడానికి తగినదీ, అణిమ, మహిమ మొదలయిన ఐశ్వర్యాలన్నింటితో గూడినదీ అయిన బ్రహ్మలోకం చేరుకొంటాడు. విద్య, తపస్సు, యోగం, సమాధి-వీటిని అనుష్ఠిస్తూ లింగశరీరాన్ని వాయువులో లీనం చేసిన యోగివర్యులు బ్రహ్మాండం లోపలా, వెలుపలా సంచరిస్తూ ఉంటారని పెద్దలంటారు. కేవలం కర్మలతో అట్టిగతిని ఎవరూ పొందలేరు. బ్రహ్మలోకాభిముఖుడైన యోగి సుషుమ్నానాడి ద్వారా బయలుదేరి ఆకసంలో పయనిస్తూ అగ్ని దేవతను చేరుకొంటాడు. అక్కడ జ్యోతిర్మయమైన ప్రకాశంతో పుణ్యపాపాలు తొలగించుకొని నిర్మలుడై భాసిస్తాడు. అతడు దేనిలోనూ తగులువడడు. నక్షత్రపథం అతిక్రమించి పోతాడు. ఆపైన సూర్యమండలం మొదలు ధ్రువమండలం వరకూ అన్ని మండలాలనూ వరుసగా దాటుకొంటాడు. చివరికి విష్ణుసంబంధమైన శింశుమార చక్రం చేరుతాడు. అక్కడ ఒంటరిగా పరమాణుస్వరూపమైన లింగశరీరంతో బ్రహ్మవేత్తలకు నెలవైన మహర్షోకం ప్రవేశిస్తాడు. అక్కడే ఉండి మహాకల్పకాలం వరకూ క్రీడిస్తాడు. కల్పాంత కాలంలో అనంతుని వదనంనుండి వెలువడే కరాళాగ్ని జ్వాలల్లో దగ్ధమవుతున్న ముల్లోకాలనూ చూస్తాడు. అందువల్ల కలిగే అగ్నిదాహం సహించలేక అక్కడనుండి బ్రహ్మలోకం చేరుకొంటాడు.

భూలోకంలో పదునలుగురు మనువులూ పుట్టి గిట్టె కాలమంతా కలిస్తే బ్రహ్మలోకంలో ఒక్కదిన మవుతుంది. అక్కడ మహనీయులైన సిద్దుల విమానాలు సూర్యతేజంతో విరాజిల్లుతుంటాయి. శోకం, వార్ధక్యం, చావు, కృశత్వం, భయం, దుఃఖం, ఇలాంటి బాధలు లేని చోటది. హరిచరణాలను ధ్యానించాలనే తెలివిలేక మూఢులైనవారి శోకస్థితిని ఆ లోకంనుండి చూడవచ్చు. శ్రేష్ఠులైన సిద్ధులూ, యోగులూ అక్కడ అమృతప్రాయంగా మాట్లాడుకోవడాన్ని చెవుల పండువుగా వినవచ్చు. రాజేంద్రా! అట్టి బ్రహ్మలోకంలో అతడు నివసిస్తాడు. ఆ లోకంనుండి మళ్ళీ తిరిగిరాడు.

ఇంకనూ ఒక విశేషం ఉన్నది. గొప్ప పుణ్యంవల్ల బ్రహ్మలోకం చేరినవారు మరొక కల్పంలో తమ సుకృతంయొక్క హెచ్చుతగ్గుల ననుసరించి ఆ యా అధికారాలు పొందుతారు. బ్రహ్మాదిదేవతలను భజించి శరీరత్యాగం చేసినవారు ఆ బ్రహ్మ జీవించినంతకాలం బ్రహ్మలోకంలో జీవించి ఆపై ముక్తిపొందుతారు. శ్రీహరి పాదపద్మాలపై మిక్కిలి భక్తి గలిగి దేహం వీడినవారు స్వేచ్చతో నిరాటంకంగా పయనించి బ్రహ్మాండాన్ని ఛేదించుకొని అత్యున్నతమైన వైష్ణవస్థాన మధిష్టించి ప్రకాశిస్తారు. ఈశ్వరుడధిష్టించిన ప్రకృతి యొక్క అంశంనుండి మహత్తత్త్వం జనిస్తుంది. మహత్తత్త్వాంశతో అహంకారం కల్గుతుంది. అహంకారాంశనుండి శబ్దతన్మాత్ర ఉదయిస్తుంది. శబ్దతన్మాత్రాంశం నుండి ఆకాశం పుడుతుంది. ఆకాశంలో స్పర్శతన్మాత్ర ప్రభవిస్తుంది. స్పర్శతన్మాత్రఅంశం నుండి వాయువు జనిస్తుంది. వాయువు అంశం నుండి రూపతన్మాత్ర కల్గుతుంది. రూపతన్మాత్రాంశం నుండి తేజస్సు జనిస్తుంది. తేజోంశం నుండి రసతన్మాత్ర కల్గుతుంది. రసతన్మాత్ర అంశం నుండి జలం జనిస్తుంది. జలాంశంనుండి గంధతన్మాత్ర కల్గుతుంది. గంధతన్మాత్రాంశం నుండి పృథ్వి ఉదయిస్తుంది. వీటన్నింటి కలయికవల్ల పదునాల్గు భువనాలతో గూడిన విరాట్‌ స్వరూపం ఉద్భవిస్తుంది. ఆ రూపానికి కోటి యోజనాల విస్తీర్ణమైన పెద్ద బానవంటిది మొదటి ఆవరణమైన భూమి అవుతుంది. కొందరు దీన్ని ఏబది కోట్ల యోజనాల వైశాల్యం కలదని వర్ణిస్తారు. ఈ ఆవరణం మీద జలం, తేజం, వాయువు, ఆకాశం, అహంకారం, మహత్తత్త్వం అనే ఆరు ఆవరణాలున్నాయి. అవి క్రమంగా ఒకదానికంటె ఒకటి పదేసిరెట్లు పెద్దవి. ఆ ఏడావరణాల మీద ఎనిమిదవదైన ప్రకృత్యావరణం గొప్పగా వ్యాపించి ఉన్నది.

ఈ బ్రహ్మాండాన్ని ఛేదించుకొని విష్ణుపదం అధిస్టించినవాడు మరణాది భయంలేని వాడవుతాడు. అతడు మెల్లమెల్లగా లింగశరీరంతో పృథివీతత్త్వం పొందుతాడు. ఆ తత్త్వంలో ఘ్రాణేంద్రియంతో గంధం గ్రహిస్తాడు. జలస్వరూపుడై రసనేంద్రియంతో రసాన్ని ఆస్వాదిస్తాడు. తేజోరూపుడై నేత్రేంద్రియంతో రూపాన్ని గ్రహిస్తాడు. వాయుస్వరూపుడై త్వగింద్రియంతో స్పర్శాన్ని గ్రహిస్తాడు. గగన స్వరూపుడై శ్రోత్రేంద్రియంతో శబ్దగ్రహణం చేస్తాడు. అన్నింటినీ అతిక్రమించి ఆ యోగి ఆకాశాదులైన పంచభూతాలకూ, సూక్ష్మేంద్రియాలకూ లయస్థానమైన అహంకారావరణం చేరుకుంటాడు. అక్కడ మనోమయమూ, దేవమయమూ ఐన సాత్త్వికాహంకారంతో మహత్తత్త్వంలో ప్రవేశిస్తాడు. ఆపై సత్వరజస్తమోగుణాలు లయించిన ప్రకృతిని పొందుతాడు. ఆ ప్రకృత్యాత్మకత్వంతో దేహాన్నీ ఉపాధి పరంపరలన్నీ ముగిసిన తరువాత ప్రకృతినీ పరిత్యజించి ఆనందమయు డవుతాడు. ఆ ఆనందంతో పరమాత్మ స్వరూపమైన వాసుదేవ పరబ్రహ్మంలో లీనమవుతాడు. ఈ విధంగా చెప్పి శుకయోగి పరీక్షిన్నరేంద్రునితో ఇంకా ఇలా అన్నాడు.

కౌరవశ్రేష్ఠా! ఇది భాగవతోత్తములు అనుసరించే త్రోవ. ఈ మార్గాన పయనించిన యోగి వందలాది యుగాలు గడచినా మళ్ళీ తిరిగి రాడు. ఇందులో సందేహం లేదు.

రాజా! సద్యోముక్తి, క్రమముక్తి అనే రెండు మార్గాలను గురించి నీవు నన్నడిగావు. ఇవి రెండు వేదగీతలలో వివరింపబడి ఉన్నాయి. పూర్వం బ్రహ్మదేవుడు తన్ను ఆరాధింపగా విష్ణుదేవుడు ఆయనకు వీటిని గురించి బోధించాడు. సంసారంలో ప్రవేశించినవానికి, తపస్సు, యోగం మొదలయిన ఎన్నో మోక్షమార్గాలు ఉన్నాయి. అన్నింటికంటె భక్తిమార్గం సులభమైనది.

శుకుడు పరీక్షిత్తునకు భక్తిమార్గంబె ముఖ్యంబని తెలుపుట

Wednesday, February 11, 2026

Sree Maha Bhagavathamu Part 2 - శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

Shuka Maharshi Came To Parikshith Place - శుకమహర్షి పరీక్షిన్మహారాజు నొద్ద కేతెంచుట

శుకమహర్షి పరీక్షిన్మహారాజు నొద్ద కేతెంచుట

అనుక్షణం అంతర్ముఖంగా పరబ్రహ్మ స్వరూపాన్ని చూచి పరవశించిన హృదయంతో బాహ్యప్రపంచాన్ని మరచినవాడు, తామరపైన గండుతుమ్మెదలవలె ముద్దులు మూటగట్టే మొగంపై ముంగురులు ముసురుకొన్నవాడు, గీతగీసి మాయను సమ్మతింపని విధంగా వస్త్రాలు ధరింపక దిగంబరుడై తిరిగేవాడు, ఇతడు సర్వసంగపరిత్యాగియైన యోగి అని చాటుతున్నట్లు పరిహాసాలు పలికే బాలురు వెంట వచ్చేవాడును, సహజసుందరములైన కాళ్లు, పిక్కలు, తొడలు, నడుము, చేతులు, భుజములు, ఉరము, కంఠము, ముఖము, నొసలు, వీనులు, కన్నులు, ముక్కు చెక్కిళ్లు, తల కలిగిన ఒక అవధూత అనుకోకుండా అచ్చటికి విచ్చేశాడు.

ఇవ్వలేదని లోకులపై కోపించి ఎగ్గులు పలుకడు. కావలెనని ఏ కోరికలను కోరడు. జనసమూహంలో చేరడు. వ్యర్థమైన సంభాషణలను చేయడు. అంతేకాదు వ్యర్థమైన ప్రపంచ విషయాలలో ప్రవేశింపడు. దైవవశమున తనకు కలిగిన దానితో సంతృప్తి చెంది, ఏమీ తెలియని అమాయకునివలె సామాన్యంగా కనిపిస్తాడు. 

ఆ మహాత్ముని పదునారేండ్ల నవయౌవనం, ఆ సుందరమందగమనం, ఆ గుణవిశేషాలు, ఆ విలాసం, ఆ నేర్పులు చూచి ముక్తియే ముచ్చటపడి మోహింపగా, ఇక ఇతర కాంతల విషయం చెప్పవలసిన దేమున్నది?

వెఱ్ఱితనం లేక పూర్తిగా విజ్ఞానమూర్తియై బ్రహ్మజ్ఞానస్ఫూర్తితో తిరిగే శుకమహర్షిని వెఱ్ఱివాడని భావించి, అతనివెంట వెఱ్ఱియెత్తినట్లు స్త్రీలు, బాలకులు వెంటనంటి వస్తున్నారు.

ఈ విధంగా వ్యాసుని పుత్రుడైన శుకమహర్షి అక్కడికి రాగా ఆ మహానుభావుని మహత్త్యం తెలిసిన మునివర్యులందరూ తమ తమ ఆసనాలనుండి లేచి ఎదురు వచ్చి స్వాగతమిచ్చినారు. పాండవపొత్త్రుడైన పరీక్షిత్తు ఆ మహాయోగీశ్వరునికి అతిథి సత్కారాలుచేసి, సాగిలబడి మ్రొక్కి పూజలు గావించినాడు. గ్రహ నక్షత్ర తారకల నడుమ మిక్కిలి వెలుగు లీను పున్నమనాటి చంద్రునివలె అక్కడ ఉన్న బ్రహ్మర్షి దేవర్షి రాజర్షుల మధ్య శుకయోగీంద్రుడు విరాజిల్లినాడు.

కురుకుల శ్రేష్ఠుడైన పరీక్షిత్తు భయభక్తులతో మరల నెన్నుదురునేల తాకేట్లు నమస్కారంచేసి చేతులు జోడించి ఇలా విన్నవించుకొన్నాడు. "మహానుభావా! వివేకమే ఆభరణమైనవాడా! దివ్యములైన భాషణములు కలవాడా! నా అదృష్టమెటువంటిదో కాని నీవు పావనమూర్తివి, పుణ్యకీర్తివి సరియైన సమయానికి నీ విప్పుడు విజయం చేసినావు.

అవధూతలలో శ్రేష్ఠుడా! నీ ఆగమనంవల్ల ధన్యుణ్ణి అయినాను. నీ సందర్శనంవల్ల నా జన్మ తరించింది. నీవంటి బ్రహ్మజ్ఞాని పావననామం ఉచ్చరించిన మాత్రాన చేసిన పాపాలన్నీ భస్మీపటలమౌతాయి. ఇక నిన్ను దర్శించి, నీ మాటలు విని, నిన్ను అర్చించి, నీ కాళ్ళు కడిగి నీళ్ళు మీద చల్లుకొని, నిన్ను స్పృశించి, నీ సేవ చేసుకునే మహాభాగ్యం లభించిన నావంటి వానికి మోక్షం సంప్రాప్తించడంలో ఆశ్చర్యమేముంటుంది?

భగవంతుడైన వాసుదేవునివలన లోకకంటకులైన నిశాచరులు నశించినట్లే పరమయోగివైన నీ పాదస్పర్శ వలన మా మహాపాపాలు మొత్తం రూపు మాసిపోతాయి.

ఏ మహానుభావుడు ప్రియమైన మఱదియై, మంత్రియై మా పితామహులైన పాండవులను నాల్గు సముద్రముల తీర రేఖలు గల విశాలమైన ఈ ధరణీచక్రానికి చక్రవర్తులను గావించెనో, ఆ మహామహుడు, లోకేశ్వరుడు, ఆ చక్రాయుధుడు అందరికి రక్షకుడై ఉన్నాడు. ఆపదలో ఉన్నవారిని ఆదుకొని ఆదరాభిమానాలతో కాపాడే రక్షకుడు ఆయన తప్ప అన్యులు ఎవ్వరున్నారు? ఆ సర్వసద్గుణ సంపన్నుని, కారుణ్యపయోనిధిని భక్తితో వేడుకొంటున్నాను. 

అయ్యా! నీవు అవధూతలలో అగ్రగణ్యుడవు. అవ్యక్తమైన గతి కలవాడవు. నీ దర్శనం వ్యర్థం కాదు. నా అభిమతం తప్పక ముమ్మాటికి ఫలించి తీరుతుంది. ఈనాడో రేపో ఈ దేహాన్ని త్యజించటానికి సంసిద్ధంగా ఉన్న జీవికి సంసారబంధాలు సమసి మోక్షం ప్రాప్తించటానికి, చింతింపవలసింది, జపింపవలసింది, చేయవలసింది, వినవలసింది, సేవలందింపవలసింది ఏమేమి కలవో దయదలచి విశదీకరించండి అని వేడుకొంటున్నాను. నీవు జగద్గురుడవు, యోగీశ్వరుడవు, నీకు తెలియందేముంది? గోవును పాలు పిదికేంత సేపు తప్ప అంతకంటె ఎక్కువసేపు ఎక్కడగాని ఉండవు. దయగల తండ్రీ! మోక్షమార్గాన్ని నాకు తెలియజెప్పు.

ఈ విధంగా పరీక్షిన్మహారాజు శుకయోగీంద్రుని ప్రశ్నించినాడు.

తామర రేకులవంటి కన్నులు కలవాడా! రాజాధిరాజుల కిరీటాలలో చెక్కిన రత్నాల కాంతులచే ప్రకాశించే పాదపద్మాలు కలవాడా! భువిలోని జనులకు కల్పవృక్షము అయినవాడా! నిరంతర విశ్వకల్యాణ భావనకలవాడా, నిత్యధర్మచింతన కలవాడా!

సాటిలేని కల్యాణ గుణాలే పుష్పమాల అయినవాడా! చంపబడుతున్న వైరి వీరులు కలవాడా! లోక జన వినుత విహారా! సీతామానసచోరా, రాక్షసమేఘాలకు సమీరమైనవాడా, దానవ వైభవాన్ని చీల్చి చెండాడినవాడా, కఠిన పాపాత్ములకు కఠోరమైనవాడా! సముద్రుని గర్వాన్ని అపహరించినవాడా!

ఇది శ్రీ పరమేశ్వరుని అనుగ్రహంవల్ల ప్రాప్తించిన అద్భుతమైన కవిత్వం కలవాడూ, కేసనమంత్రి కుమారుడూ, సహజమైన పాండిత్యం కలవాడూ అయిన పోతనామాత్యుడు రచించిన శ్రీ మహాభాగవత పురాణం. అందులో నైమిశారణ్య వర్ణన, శౌనకాదిమునుల సంప్రశ్నము, సూతుని నారాయణ కథాసూచన, వ్యాసుల వారి విచారం. నారదాగమనం, ఆయన పూర్వజన్మ వృత్తాంతం, ద్రౌపదీ పుత్రశోకం, అర్జునుడు అశ్వత్థామను బంధించి తేవడం, అశ్వత్థామ గర్వపరిహారం. భీష్మ నిర్యాణం, ధర్మరాజు పట్టాభిషేకం, శ్రీకృష్ణుని ద్వారకాగమనం, ఉత్తరాగర్భస్థుడైన అర్భకుని అశ్వత్ధామయొక్క అస్ర జ్వాలలనుండి శ్రీకృష్ణుడు కాపాడటం, పరీక్షిత్తు జననం, గాంధారీ ధృతరాష్ట్ర విదురుల నిష్మమణం, నారదుడు ధర్మరాజుకు చేసిన కాలసూచన, శ్రీ కృష్ణనిర్యాణం, పాండవుల మహాప్రస్థానం, పరీక్షిత్తు దిగ్విజయం, కలి గర్వభంజనం, ధరణీధర్శదేవుల సముద్ధరణం, పరీక్షిత్తుకు శృంగి శాపం, గంగాతీరంలో పరీక్షిత్తు ప్రాయోపవేశం, శ్రీ శుకసందర్శనం, మోక్షమార్గాన్ని పరీక్షిత్తు అభ్యర్థించడం అనే కథలతో కూడిన ప్రథమస్మంధం సమాప్తం.

శ్రీ కృష్ణార్పణమస్తు

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

Parikshit Prepared For Prayopavesam - పరీక్షితుండు విప్రశాపం బెఱింగి ప్రాయోపవిష్టుండగుట

పరీక్షితుండు విప్రశాపం బెఱింగి ప్రాయోపవిష్టుండగుట

నేను వేటకై అడవికి ఎందుకుపోవాలి? ఆ మహాముని నిశ్చల ధ్యానంలో నిమగ్నుడై ఉన్నప్పుడు చచ్చినపామును తెచ్చి ఆయన మెడలో ఎందుకు వేశాను? ఈ విధమైన పాపాకార్యాలు ఎందుకు చేశాను? ఇది కలి ప్రభావమే. దైవసంకల్పాన్ని ఎవరూ దాటలేరు. ఇది తప్పదు. నేను చేసిన పాపానికి ఫలితం అనుభవించి తీరవలసిందే.

తక్షకుని విషాగ్ని జ్వాలలకు నా ప్రాణాలు పోయినా పోనిమ్ము. ఈ సామ్రాజ్యం, ఇందలి భోగభాగ్యాలు ఇప్పుడే నశించినా నశించనీ. మెరుపుతీగెవంటి బ్రతుకు శాశ్వతమని యెంచి, నివారించటానికి సాధ్యంకాని ఆ మునిసత్తముని పుత్రుని నేను ఏమని తిరిగి శపించగలను?

నేను మహారాజును గదా! అని అహంకారంతో వారి తపోవనాన్ని ప్రవేశించి తండ్రిపై చచ్చిన పామును పడవేయగా కొడుకు నన్ను చనిపోవునట్లు శపింపక ఊరక నోరు మూసికొని కూర్చుంటాడా? నిజానికి ఆ బాలుని తప్పు ఏమున్నది?

గోవులకు బ్రాహ్మణులకు, దేవతలకు కారణం లేకుండా దుస్సాహసంతో కీడు కలిగించే దుష్టబుద్ధిని ఏ విధంగా పుట్టకుండ నివారిస్తాను? అని తనలో తాను విశేషంగా తర్కించుకొన్నాడు.

శ్రీకృష్ణభగవానుని పాదపద్మములపై భక్తి ప్రపత్తులు గల పరీక్షిత్తు కామక్రోధాదులైన అంతశ్శత్రువులను జయించినవాడు కావటంవలన కరుణామయుడై తనను శపించిన శృంగిపై ఆగ్రహింపలేదు. శపించు శక్తి సామర్థ్యములుండియు పరమశాంతచిత్తుడు అయినాడు.

మునికుమారుడు శృంగి రాజును శపించిన వార్తను విని తక్షకుడు సమయానికై ఎదురుచూస్తున్నాడు. పరీక్షిత్తు తనకు ఏడవనాడు తక్షకుని దారుణవిషాగ్నిజ్వాలలవల్ల మరణం తప్పదని నిర్ణయించుకొనినాడు. భూలోకభోగాలు, స్వర్గలోకసౌఖ్యాలు పూర్తిగా విడువదగినవని భావించాడు. రాజ్యాన్ని పరిత్యజించినాడు. నిరాహారదీక్షను సాగించటానికి నిశ్చయించుకొన్నాడు.

తులసీదళాలతో విరాజిల్లే శ్రీమహావిష్ణుపాదపద్మాల పుప్పొడితో కలిసి మిక్కిలి ప్రకాశంతో ప్రవహిస్తూ దిక్పాలకులకు సకలసౌభాగ్యసంపదలు కలిగించి, సమస్తదోషాలను కడిగివేసే గంగానదీతీరంలో ప్రాయోపవేశంతో ప్రాణాలు విడవడానికి ప్రభువు సంకల్పించాడు.

ఆ రాజసత్తముడైన పరీక్షిత్తు తన చిత్తమును గోవిందుని పాదములందు నిలిపి, సర్వసంగ పరిత్యాగియై లోపల ఎట్టి వికారాలూ లేకుండా మౌనంతో ఉండినాడు.

ఈ విధంగా పాండవపౌత్రుడైన పరీక్షిత్తు హరిచరణారవిందములకు ప్రణమిల్లుతూ ఆనందాన్ని పొందిన హృదయపద్మం కలవాడై, విష్ణుపాదాలనుండి పుట్టిన గంగ గట్టున ప్రాయోపవిష్టుడై ఉన్నాడన్న సంగతి విన్నవారై, సకలలోక పవిత్రులై, మహోదార చరిత్రులై, తీర్థములకు తీర్ధత్వమును ప్రసాదించే సర్వసమర్దులైన, అత్రి, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, భృగువు, వసిష్టుడు, పరాశరుడు, చ్యవనుడు, భరద్వాజుడు, పరశురాముడు, దేవలుడు, పర్వతుడు, నారదుడు మొదలైన బ్రహ్మర్షులు, దేవ
ర్షులు, రాజర్షులు, అరుణుడు మొదలగు కాండర్షులు ఇంకను వివిధ గోత్రాలలో పుట్టిన మహర్షులు శిష్యులతో ప్రశిష్యులతో కలిసి అచ్చటికి విచ్చేసినారు. పరీక్షిన్నరేంద్రుడు ఆ విధంగా అక్కడికి వచ్చిన మునీంద్రులకు ఎదురేగి, అర్ఘ్యపాద్యాదులిచ్చి, అర్చించి, సాష్టాంగ నమస్మారాలు చేసి, సుఖాసీనులను గావించినాడు.

ఆ మహారాజు ఆనందబాష్పాలు పొంగిపారలగా, మరల ఆ మునీశ్వరులముందు చేతులు మోడ్చి ఈ విధంగా విన్నవించుకొన్నాడు.

దయానిధులైన తపోధనులారా! నేను ఓర్పును కోల్పోయి, కోపాన్ని ఆపుకోలేక చచ్చిన పామును తెచ్చి మునీంద్రుని మూపుపై వేసిన క్రూరచిత్తుణ్ణి, మదించినవాడను, మహాపాపిని మీరు పాపాలనే గడ్డిని దహించే అగ్నిహోత్రులు, ఉత్తములు, సంయమిసత్తములు. అయ్యలారా! నా పాపం పరిహారమయ్యే దారిని నిర్ణయించి చెప్పండి.

మహీసురులారా! మహనీయులైన మహర్షుల పాదధూళి లేశమైనను మహీపతుల పాపాలను పారద్రోలి పవిత్రులను చేస్తుంది. మీ పాదరేణువులు తగిలినంతనే నా పాపం పటాపంచలయింది. నేను కృతార్థుడ నయ్యాను. ఇప్పుడు నేనేమి చేస్తే వెంటనే నాకు ముక్తి లభిస్తుందో దయచేసి తెలపండి.

మిక్కిలి భయంకరమైన సంసారబంధంలో చిక్కుకొన్న చీకాకుతో, విసిగి వేసారి, త్వరగా శరీరం విడిచే దారి వెదకుతున్న నాకు తక్షకుని మహావిషం మోక్షహేతువైనది.

అతిశయించిన అహంకారపు నడవడితో సంసారంలో మునిగి ఉన్ననాకు నా పాలిటి భగవంతుడు బ్రాహ్మణ శాపం అనే మిషతో సంసారబంధ ముక్తిని ప్రసాదించినాడు.

తక్షక విషాగ్నికి నా దేహమును తప్పక అప్పగిస్తాను. ఇందులో సందేహంలేదు. ఈశ్వర సంకల్పం నేడు జరిగి తీరుతుంది. రాబోయే అనేక జన్మలలో శ్రీకృష్ణుని(హరి) చింతనయందు ఆసక్తి, శ్రీకృష్ణుని స్తోత్ర వాఙ్మయ శ్రవణాభిలాష, శ్రీకృష్ణచరణ కమలసేవకలిగి ఉండేట్లు మీరు అనుగ్రహించండి.

మీరు నా శ్రేయస్సును కాంక్షించండి. ఆ గోవిందుని మీది గీతాలు పాడండి. హరిభక్తుల చరిత్రలు వినిపించండి. ఏడుదినాలలో నాకు కైవల్యప్రాప్తి కలిగించండి.

అమ్మా! గంగమ్మా! నీ అలలు ఎంత అందంగా ఉన్నాయి తల్లీ! నిన్ను దర్శించిన వారిని దయతో దారి తెలిపి మోక్షానికి చేరుస్తావని విన్నాను. కదలిపైకి లేచి రావమ్మా! నీ రూపంతో ఎదురుగా వచ్చి సాక్షాత్కరింపవమ్మా!

ఆ విధంగా రాబోయే జన్మలలో తనకు భగవద్భక్తి సౌజన్యాలు ప్రాప్తించుగాక అని ప్రార్ధించినాడు. అప్పుడు తన తనయుడైన జనమేజయుని రప్పించి రాజ్యభారం అతనికి అప్పగించినాడు. గంగానదీ దక్షిణ తీరంలో తూర్పువైపు దర్భల కొనలు ఉండేట్లుగా ఆసనం వేయించి, దానిపై ఉత్తరాభిముఖంగా కూర్చున్నాడు. తన చిత్తాన్ని సంసారబంధాల నుంచి మరలించి పరమేశ్వరాయత్తం కావించినాడు. ఇలా భాగవతోత్తముడైన పాండవపౌత్త్రుడు ప్రాయోపవిష్టుడై ఉన్న సమయంలో.

దేవతలు ఆకాశంనుండి పూలవానలు కురిపించినారు. అంతేకాదు ఎంతో పొగడుతూ, గుణగణాలుగానం చేస్తూ, దుందుభులు మ్రోగించినారు.

ఆ సందర్భమున సభలో కూర్చున్న మహర్షులు ఆ రాజర్షితో ఇట్లు పలికినారు.

రాజశ్రేష్ఠ! నీ చరిత్ర చిత్రమైనది మీ పితామహులు మహాతపస్సంపన్నులు, వారు వాసుదేవుని నిత్య సాన్నిధ్యాన్ని వాంఛించి, నానా రాజకిరీట రత్నప్రభారాజితో రాజిల్లే రాజపీఠాన్ని విడిచి మహాత్యాగ విరాజితులైనారు. వారెంతో ఉన్నతులు అనుకొంటిమి కాని నిరంతర నారాయణ నామ పారాయణుడవైన నీవు వారికంటె మహోన్నతుడవు.

మహీపాలా! నీవు మనుష్యదేహాన్ని వదలి, శోకం, వ్యసనం, రజోగుణంలేని పుణ్యలోకాన్ని చేరేంతవరకు, మేము ఎక్కడికి పోము. నీ మాటలు వింటూ నీ దివ్యప్రభావాన్ని తిలకిస్తూ ఇక్కడనే ఉంటాము.

అని యిట్లు నిష్పక్షపాతంగా మహర్షులు పలికిన మధురగంభీరాలైన మంచిమాటలు విని, ముల్లోకములకు అవతల గల సత్యలోకంలో ఆకృతులు దాల్చి వెలుగు వేదములవలె విరాజిల్లు మహర్షులకు మహారాజు నమస్కరించి విష్ణుకథలు లీలలు వినే ఆసక్తితో ఇట్లు అన్నాడు.

తండ్రులారా! వేదవాక్యాలు బాగా పరిశీలించి ఏడు దినాలలో ఏ విధంగా ముక్తి పొందవచ్చునో తెలపండి. గురుతరమైన ఈ సంసార క్రీడనుండి ఎల్లా విడివడాలో ఆలోచించి ఆదుకొనండి.

(మా తండ్రులారా!) మీరు ఆర్యులు, ఆనందస్వరూపులు, బ్రహ్మజ్ఞానపారీణులు, ఆత్మ తేజోవిరాజిత విజ్ఞానులు, ఆత్మతత్త్వజ్ఞులు, దయార్ద్ర హృదయులు, మనస్సులో దాచబడిన సకలార్థ సమూహం కలవారు. మీరు తపశ్శక్తిచేత అన్నింటిని స్పష్టంగా చూడగలవారు. ఏడు దినాలలో మోక్షం ప్రాప్తించే ఉపాయాన్ని బాగా విచారణ చేసి నాకు తెలపండి.

అని పలుకుతున్న ఉత్తరానందనుని ప్రశ్నలకు సరియైన ప్రత్యుత్తర మివ్వడానికి మహ
ర్షులందరు సమాలోచనలు జరుపుతున్నారు. ఆ సందర్భంలో ధైవయోగం వలన

Shringi Rishi maharshi Curses King Parikshit - శమీకపుత్త్రుండగు శృంగి పరీక్షితుని శపించుట

శమీకపుత్త్రుండగు శృంగి పరీక్షితుని శపించుట

తండ్రీ! భటులు, ఏనుగులు, రథాలు, గుఱ్ఱాలు గల సేనతో రాజ్యాన్ని ఏలే రాజొకడు వచ్చి, నీటికోసమై తహతహపడి, మంచి చెడ్డ ఆలోచింపక నీ తండ్రిమెడలో పామును వేసివెళ్లినాడు.

ఆ మాటలు విని, ముని కుమారులతో ఆడుతున్న శృంగి, కొమ్ములతో రూపం దాల్చినట్లు విజృంభించి, రోషావేశంతో అదరిపడుతూ ఇట్లన్నాడు "ఈ రాజులు బలి పెట్టిన పిండాలు తిని బలిసిన కాకులు. ద్వారాల కడ కాచుకొని ఉన్న కుక్కలు! దాసులైన ఈ క్షత్రియులమని అనుకొనేవారిని భూసురోత్తములు తమ గృహరక్షకులుగా ఎట్లు నియమించినారు? ద్వారపాలకులుగా మాత్రమే ఉండదగినవారు వంట యింటిలో ప్రవేశించి వండిన అన్నం తినటానికి ఎలా అర్హులౌతారు? వారు చేసే ద్రోహకార్యాలకు యజమాని ఎందుకు బాధ్యుడౌతాడు?

మాతండ్రి తనను నిందింపలేదు. ఆశ్రమవాసులతోనే గాని శత్రువులతో కూడలేదు. కందమూలాలు తిని, నిశ్చల సమాధిలో అంతర్దృష్టిని విడువక నిరంతరం తన ఇష్టదైవాన్ని తప్ప అన్య ప్రపంచాన్ని చూడకుండ తానేమో, తన లోకమేమో అన్నట్లున్న ఆయనపై ఆ రాచవాడు అరాజకంగా పామును మెడలో చుట్టడం ఎందుకు?

రాజుల కడకు మేము హిరణ్యదానాలు గ్రహించటానికి పోలేదు. ధనములు తేలేదు. ఆశీర్వాదములని చెప్పి మోసంచేసి వారి ద్వారాల కడ నిలిచి విసిగించలేదు. ఇండ్లపై కూడ ఆసక్తిని వీడి ఆడవులలో పడి ఉన్నాము. అట్టియెడ బ్రహ్మర్షి అయిన మా తండ్రిమెడలో పామును వేయటం తగునా?

ప్రాజ్య సామ్రాజ్యాన్ని ఏలే సమ్రాట్టులు తమ్ము ప్రజలు పొగడగా పంచభక్ష్యపరమాన్నాలు భుజింపవచ్చు. విలువగల వలువలు ధరించవచ్చు. అంతేకాని అడవులలో ఇడుమలుపడే బడుగు (తాపసుల) జడదారుల మెడలో చచ్చిన పామును చుడతారా?

భగవంతుడు శ్రీకృష్ణుడు లోకాన్ని విడిచి వెళ్లిన అనంతరం సమర్థుడైన శాసకుడు లేకపోవటం వలన దుర్మార్గులు చెలరేగి నిరపరాధులైన సాధువులను బాధిస్తున్నారు.

బాలకులారా! నే నిప్పుడే ఆ రాజుకు శాపం పెడతాను అని మునిబాలకుడైన శృంగి ముల్లోకాలను ఏలే వారికే అదరుపాటు కలిగేట్లుగా వడివడిగా వెడలినాడు.

కౌశికి నదికి రోషంతో వెళ్లి, నీళ్లు చేతిలోకి తీసికొన్నాడు.

లేశమైన సంకోచం లేకుండ చచ్చిన పామును తీసికొని వచ్చి మా తండ్రి భుజంపై పడవేసి దురహంకారంతో కన్ను మిన్ను కానని ఆ రాజు హరిహరులు అడ్డుపడినా నేటికి ఏడవ దినం తక్షకుని విషాగ్ని జ్వాలలకు దగ్ధమయిపోతాడు.

అని శమీక మునీంద్రుని కొడుకు పరీక్షిన్మహారాజును శపించి ఆశ్రమం చేరి ధ్యాన నిమగ్నుడైన తండ్రిని చూచినాడు. అప్పుడు ఆయన మెడలో ఆ చచ్చినపాము వ్రేలాడుతూనే ఉన్నది.

అయ్యో! తండ్రీ! ఈ సందర్భంలో నీ మెడలో చచ్చిన పామును పడవేసిన ఆ దొరగారిని ఏమి చేస్తాను? రాజులకు స్నేహధర్మాలు లేవు సుమా!

ఓ తాపసులారా! ఎవరో రాజు వేటకైవచ్చి నిరపరాధియైన నా తండ్రిమీద నిష్కారణంగా నిర్దయుడై ఈ చచ్చిన పామును మెడలో పడవెసి వెళ్ళినాడు. భయంకరమైన సర్పం మరలా బ్రతుకుతుందో ఏమో! క్రూరమైన కోరలతో కాటు వేస్తుందో ఏమో! మీకు నమస్కరిస్తున్నాను. రండి, ఈ పామును తీసి పారవేయండి. మా తండ్రిని కాపాడండి.

అట్లు పలుకుతూ భయంతో ఆ పామును తొలగించే నేర్పు లేక బిగరగా కొడుకు ఏడ్చినాడు. ఆ కుమారుని ఆక్రందన ధ్వని విని, శమీక మహాముని తన సమాధి చాలించి మెల్లగా కన్నులు తెరచినాడు. భుజంపై వ్రేలాడుతున్న భుజంగాన్ని తీసి దూరంగా పారవేసి, కొడుకును జూచి

నాయనా! మనం ఎవరికీ ఏ కీడు చేసినవారము కాము. లోకులందరినీ సమానంగా ఆదరిస్తాము. నీవు ఎందుకు ఏడుస్తున్నావు? ఈ సర్పం నా మెడకు ఎలా వచ్చింది?

అనీ ప్రశ్నించినాడు. అప్పుడు కుమారుడు శృంగి, రాజు వచ్చి పాము వేయటం, తాను ఆ రాజును శపించటం తెలిపినాడు. వెంటనే శమీకుడు తన దివ్యదృష్టితో ఆ రాజు పరీక్షిన్మహారాజని తెలుసుకొని, కొడుకు చేసిన పనికి బాధపడి ఇట్లన్నాడు.

కుమారా! ఇంతటి కఠోర శాపాన్ని పెట్టటానికి అంతటి గొప్ప కీడు ఆ మహారాజు ఏమీ చేయలేదు. తక్షక విషాగ్ని జ్వాలలపాలు కమ్మని ఆ ధరణీనాథుని అయ్యయ్యో! ఎందుకు శపించినావు?

సమర్థుడవైన బ్రహ్మచారీ! పాపము! పరీక్షిత్తు తన తల్లి గర్భమునందే దహింపబడి, శ్రీకృష్ణుని అనుగ్రహంతో బతికి బయటపడినాడు. ఇప్పుడు పరాక్రమంతో ప్రజలను పరిపాలిస్తున్నాడు. అటువంటి రాజును శపించవచ్చునా?

బాలకా! ప్రభువైన కృష్ణుడు లేకపోవటంచేత లోకము పుష్టిని కోల్పోయి ఏపు చెడినది. ప్రజలు కాపరిలేని గొర్రెలవలె కడగండ్లకు లోనైనారు. దొంగలు, దుండగులు విచ్చలవిడిగా చెలరేగినారు. ఇట్టి స్థితిలో మహారాజు అందరిని సమదృష్టితో ఎంతో సమర్థంగా పాలిస్తున్నాడు. ఏదో జరిగిన చిన్న తప్పిదానికి అయ్యో! రాజును ఎందుకు శపించినావు?

కుమారా! నీ మూలంగా మనకు పాపం ప్రాప్తించింది. రాజు మరణింపగా ఆ రాజ్యంలో అరాచకం హద్దులు మీరుతుంది. బలం కలవాడు బలంలేని వానిపైబడి అతని సర్వస్వాన్నీ అపహరిస్తాడు. జారులు, చోరులు ఎచ్చట చూచినా బారులు తీరి విచ్చలవిడిగా విహరిస్తారు. ప్రజల్లో పరస్పర కలహాలు పెరిగిపోతాయి. వైదికములైన వర్ణాశ్రమములు, ధర్మాలు పూర్తిగా నశిస్తాయి. ధర్మం నశించిపోగా అర్ధ కామాలపై ఆసక్తి పెరుగుతుంది. చివరకు రాజ్యమంతటా కోతుల్లో, కుక్కల్లోవలె వర్ణసంకరం ఏర్పడుతుంది.

ఆ రాజు పవిత్రమైన భారత వంశంలో పుట్టినవాడు. పరమ భాగవతుడుగా పేరు కెక్కినవాడు, అశ్వమేధం చేసినవాడు, సదాచార సంపన్నుడు. గొప్ప రాజనీతిజ్ఞుడు. రాజకులాలంకారుడు అంతటి మహారాజు దప్పిక చెంది నీటికోసం మన తపోవనానికి విచ్చేయగా ఎంతో ఆదరంతో అతిథిసత్కారాలు చేయక ఊరక పంపటం ఉచితం కాదు. సత్కారం చేయకపోగా శపించటం యేమి న్యాయం? ఇది ధర్మమా?

ఓ పరమేశ్వరా! శ్రీకృష్ణా! హరీ! మా పిల్లవాడు బుద్ధిచాపల్యంతో నిరపరాధియైన పరీక్షిన్మహారాజునకు శాపం పెట్టి పాపం కట్టుకొన్నాడు. వీడు చేసిన దోషాన్ని తొలగించుము తండ్రీ!

కుమారా! పరమభక్తులైనవారు కొట్టినా, తిట్టినా శాంతంతో సహిస్తారే కాని ప్రతీకారం చేయటానికి సమ్మతింపరు. ఆ మహారాజు నీకు కించిత్తుకూడా కీడు చేయడు.

సాధుస్వభావంగల సజ్జనులు ఇతరులు చేసిన ఉపకారానికి పొంగిపోరు, అపకారానికి క్రుంగిపోరు. మహనీయుల ఆత్మలను సుఖదుఃఖాలు ఆవహింపవు.

అని ఈ విధంగా శమీక మహాముని తన కుమారుడు గావించిన తిరుగులేని శాపరూపమైన పాపానికి మిక్కిలి తాపం చెందినాడు. వెంటనే తన శిష్యుడైన ఒక మునిపుత్రుని పిలిచి జరిగిన వృత్తాంతమంతా మహారాజుకు తెలిపి రమ్మని పంపినాడు. అభిమన్యుని కుమారుడైన పరీక్షిత్తు మునిశిష్యునివలన శమీక మహామునికుమారుని శాపవృత్తాంతం విని, కామ క్రోధాది విషయజాలంలో తగుల్కొన్న తనకు తక్షకుని విషజ్వలనజ్వాలలు వైరాగ్యానికి మూలమైనవని భావించి, హస్తినాపురి చేరి ఒంటరిగా ఉండినాడు.

Narada Asked Brahma About Universe - నారదుండు బ్రహ్మను బ్రపంచ ప్రకారంబు నడుగుట

నారదుండు బ్రహ్మను బ్రపంచ ప్రకారంబు నడుగుట నారదముని బ్రహ్మను ఇలా ప్రశ్నించాడు. ఓ తండ్రీ! నీవు చతుర్ముఖుడవు. సురలలో పెద్దవు. లోకాలకు సృష్టికర్...