Wednesday, February 25, 2026

After Virabhadra Destroyed Daksha's Yagna, Demigods, Priests Approached Lord Brahma - దేవతలు వీరభద్రాదులచే బరాజితులై బ్రహ్మతో విన్నవించుట

దేవతలు వీరభద్రాదులచే బరాజితులై బ్రహ్మతో విన్నవించుట

శివుడి ప్రమథసేనలచే దేవతలంతా వాళ్ల కత్తులు, గదలు, చురకత్తులు వంటి పోటు ముట్టుల తాకిళ్లకు చీలి చివికిన ఒంటిచీకాకుతో హడలెత్తిపోయారు. ఆకులతతో బ్రహ్మను ఆశ్రయించారు. ఎవరికివారే ఒక్కుమ్మడిగా ఆతడి పాదాలకు సాగిలపడి మొక్కుకున్నారు. వినయంతో వంగినవారై

శివుడి ప్రమథభటులు నిర్దయతో బలాత్కారంగా తమను బాధించిన తీరునంతా ఆసాంతం దేవతలు వెళ్లగక్కుకున్నారు అని మైత్రేయుడు విదురుడితో చెప్పాడు. మళ్లీ

విశ్వం తానుగా ఉన్నవాడు, తామరసాక్షుడు అని పేర్కొనదగిన విష్ణువూ, బ్రహ్మా, వీళ్లిద్దరూ ఆ యాగం ఇలా భగ్నమవుతుందని ముందే గ్రహించినవారు. కాబట్టే వారు దక్షయజ్ఞం చూడటానికి ప్రత్యక్షంగా వెళ్ళలేదు.

దేవతల విన్నపం విని బ్రహ్మ వాళ్లతో తిరిగి ఇలా బదులు మాట్లాడాడు.

మహాతజస్స్వరూపుడైన పురుషుడు పొరపాటున తప్పు దొర్లినవాడు అయి ఉండవచ్చు. అంతమాత్రంచేత వారిపై ప్రతీకారానికి పూనుకుంటే ప్రజలకు లోకంలో మేలు అనేదే మిగులదు. మంచిగా మనలేరని భావం. పొరపాటున తప్పు జరిగినా హాని తలపెట్టక పోవడం పెద్దల లక్షణం.

అని బ్రహ్మ బోధించి, మళ్లీ దేవతల దృష్టిని మరలుస్తూ ఇలా అన్నాడు.

పశుపతీ, ఈశ్వరుడూ, అభవుడూ, శర్వుడూ అయిన శివుడు దక్షయాగాంశకు తగినవాడు. అయినా యాగాంశ పంపకంలో అతణ్ణి దూరంగా పెట్టారు. ఆ సభలో సభ్యులుగా మీరున్నందువల్ల మహాపరాధకులూ, దుర్బుద్ది కారకులూనూ, అగు

పనిపడి ఆ మహాదైవం మహాక్రోధుడయితే, ప్రజలు నామమాత్రానికి కూడా మిగలని వారవుతారు. అంతటి శివుడి ఎడ పుల్లవిరుపు మాటలనే బాణాలపొదితో గాయపడింది. సతీదేవి ఆత్మాహుతి చేసుకోవటంవల్ల భార్యా విరహమూ దానికి తోడయింది. ఆ యాగాన్ని తిరిగి సంధానింప చేయాలని మీ అందరి అభిలాష. అందుకుగాను ఆ పరమహృదయుని, త్రిపురాలను దగ్ధంచేసిన ఆ ఘనుని దరిచేరండి. నిర్మలమైన అంతఃకరణంతో ముందుగా ఆతడి పాదపద్మాలను విడవక గట్టిగా పట్టుకొనండి. భక్తిశ్రద్ధలతో శరణువేడండి. ఓ దేవతలారా! ఆ శివుడి కనికరం దక్కినట్లయితే మీ కోర్కె నెరవేరిన వారవుతారు.

(విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడు అను ముగ్గురు రాక్షసులు మూడుపురాలరూపంలో లోకానికి హాని కల్గిస్తుండగా శివుడు వారిని సంహరించిన కథ ఇక్కడ అనుసంధేయం.)

అని బ్రహ్మ దేవతలకు చెప్పి మరొక విషయాన్ని ఇలా చెప్పుకొచ్చాడు. ఆ మహామహుని సన్నిధికి పోవడానికి మాకు బెరుకు అని తలపోయకండి. ఆ శివుణ్ణి చేరుకునే ఉపాయం గ్రహించుకోవాలని ఉన్నట్లయితే ఈ మాటలు వినండి. నేను గాని, ఇంద్రుడుగాని, మునులుగాని, మీరుగాని ఇంకా జీవులు మరెవరైనాగాని ఆ పరమాత్ముడి యథార్థమైన రూపునూ, అతడి శక్తి వీర్యాల పరిమితిని తెలుసుకోవడానికి ఉన్నశక్తి చాలదు. ఆ శివుడు తనదైన మనస్తత్త్వంతో నడుచుకోగల స్వతంత్రుడు. ఆ వెరవు ఇది అని వెల్లడించుటం ఎవరివల్ల కాని పనే. అయినా సరే భక్తులకు లొంగి, శరణు కోరిన వారిని ఆదుకునే స్వభావం గల ఈశ్వరుణ్ణి కలసి రావడానికి ఈ పూటే బయలుదేరుదాం అని చెప్పి బ్రహ్మ, దేవతలనూ, పితృదేవతలనూ, ప్రజాపతులను అందరిని జట్టులుగా కూడగట్టుకొని నేరుగా కైలాసం దిశగా తరలిపోయాడు. చాలా దూరం సాగినాక

దేవతలు కైలాసపర్వతాన్ని చక్కగా కంటినిండుగా చూశారు. ఆ శైలం ప్రముఖంగా సేవకుల మదికి ఆనందమయమైంది. అది కిన్నరుల కేళీ విహారభూమి. అది నిచ్చలూ వైభవం కలది. అది శుభాలకు ఆలయమైంది. అది సిద్దులు, గుహ్యకులు వంటి దేవయోనులకు వాసస్థానమైంది. అది వెండి కాంతుల నేల కలది, అది స్వయం ప్రయుక్త ప్రకాశంలో కులపర్వతాలను మించిపోయిన గొప్ప ప్రత్యేకమైన శోభ కలది.

ఆ వెండికొండ కొమ్ములు రంగురంగుల గైరికాది ద్రవ్యాలతో, నిరంతరమైన రతనాల వన్నెల మిశ్రమంతో పైపైకి ఎంతో ఎత్తున ప్రకాశిస్తుంటాయి. ఆ కొండమీది విశాలసమ ప్రదేశాలు, కిన్నరులు, గంధర్వులు, కింపురుషులు, అచ్చరల గుంపులతో కిటకిటలాడుతుంటాయి. కొండప్రదేశాలు, మాన్యులు, విమానవిహారులు అయిన దేవదంపతుల వినోద విహారాలకు మేలుగా ఉంటాయి. కొండగుహలు, నవకమైన విరజాజి పూల తీగల కప్పుతో మనోహరంగా ఉంటాయి. పర్ణశాలలు, దేవతల సిద్ధుల ఇల్లాండ్రతో అందగిస్తుంటాయి. దేవతలగ్భహాలు, వారి వారి కలిమికి అనువుగా ఉంటాయి, వెరసి పెక్కువిధాలుగా ఒప్పే శుభసంపదలకు, మెప్పుగల మంచిపనులకు హారం వంటిది ఈ వెండికొండ.

(మతల్లి, మతల్లిక, మచర్చిక - పదములు శ్రేష్ఠతా వాచకాలు సమాసంలో ఉత్తరపదంగా వస్తుంటాయి.)

మందారాలు, పారిజాతాలు, తెల్లతెగడ, చీకటిమాను, మద్ది, తాడి, తక్కల, రక్తకాంచన, దిరిసెన, తెల్లమద్ది, మామిడి, కడిమి, ప్రబ్బలి, పొన్న సురపొన్న, సంపెగ, పాటలి, అశోక, పొగడ, మల్లె, ఎర్రగోరంట, పచ్చసంపెగ, మామిడి, తామర, మోదుగు, ఏలక్కాయ, లవంగ, జాజి, ఇప్ప, మల్లియ, పనస, గురివింద, కొండమల్లె, అత్తి, రావి, జువ్వి, మఱి, ఇంగువ, భుజపత్తిరి, పోక, రాజపూగ, నేరెడు, ఖర్జూరం, అంబాళం, ప్రియాళు, కొబ్బరి, గార, వెదురు, మొదలైన గాలికి గలగల మోగే చెట్లతో, రక రకాల ద్రుమాలతో, గుబురు పొదలతో, పూలమొక్కలతో ఆ వెండికొండ అలరారుతుంది. కోయిలలు, నెమళ్లు, ఊరబిచ్చుకలు, రాచిలుకలు, గండుతుమ్మెదలు వంటిభిన్న భిన్నపక్షుల కూహూ, కేగ్రో. కిచకిచ, ఝంకారాది కూతలు అన్ని వైపులనించి మరేదీ విన్పించనంతగా గింగురుమంటున్నాయి. సింహాలు, సివంగులు, ఏదుపండులు, ఎద్దులు, మీగండ్లమెకాలు, కోతులు, అడవి పందులు, పెద్ద పులులు, కుక్కలు, దుప్పులు, దున్నలు, తోడేళ్లు, లేళ్లు, మొదలైన అడవిజంతువులకు నెలవై శోభిస్తుంది. అరటి తోపులతోనూ, విచ్చుకున్న తామరలు, ఎర్ర, తెల్ల కలువపూల శోభతోనూ తిన్నని ఇసుకప్రదేశాలతోనూ అందగిస్తున్న మంచి కొలనులున్నూ, ఆ సరస్సుల్లో స్వేచ్చగా, అటు ఇటు తిరుగాడే రాయంచలు, కొంగలు, బెగ్గురులు, జక్కవ పిట్టలు, కొంగలు, నీటికోళ్లు మొదలుగా పోగయిన నీటి పిట్టల కలకలరవాలు, ఒక దానితో ఒకటి కలిసిపోయి చెవులు చిల్లులు పడేంత రొదలతో విరాజిల్లుతుంది. జలకాలాటల వేడుకల్లో సతీదేవి చక్కటి కుచ మండలాల్లో దట్టంగా పులుముకొన్న కస్తూరిపరిమళంతో పచ్చగంధం పరిమళం మేళవించిన నీటి ప్రవాహంతో గంగానది నిండుగా ఆనందాన్ని అందింపచేస్తోంది. ఆ కైలాస శిఖరాన్ని బ్రహ్మ, ఇంద్రుడు, మొదలైన దేవతలందరూ దర్శించి చెప్పలేనంత ఆశ్చర్యానందాల్లో మునిగి తేలారు. తమ ముందరే ముత్యాలు రవ్వలు పొదిగిన బంగారు విమానాలతో నిండి ఉన్నట్టి, పుణ్యకాంతలతో కళ కళలాడుతున్నట్టి అలకాపట్టణాన్ని దాటారు. ఆ అలకానగరానికి వెలుపలగా నంద, అలకనంద అనే రెండు నదులు జమిలిగా ప్రవహిస్తుంటాయి. అవి పుణ్యప్రదమైన తీర్ధపాదుడైన విష్ణుమూర్తి పాదపద్మాల ధూళిరేణువులతో పవిత్రమైనవి. శృంగార క్రీడాసక్తిగల జంటల బడలిక సేద తీర్చే ఓలలాటలకు అనువైనవి. ఆ జలవిహారాల్లో అటు ఇటు కదలాడే ఘనకుచాలమీది కుంకుమపూల/పూత కలసిపోయి గోరోజనం రంగుకు తిరిగిన నీటి వెల్లువ గల ఆ నదులను దాటి ముందుకు కదిలారు. ఆ తరువాత తెల్ల/ఎర్ర కలువపూల సౌగంధికవనం తమ ముందర అగపడింది. ఆ పెంపుడు తోటలో అడవి ఏనుగుల రాపిడివల్ల చందనంచెట్ల నుంచి ఘుమఘుమ సువాసనలు మోసుకొస్తున్న కొండగాలిని తడవలు తడవలుగా అనుభవిస్తూ తన్మయులయిపోతున్న యక్షిణుల మూక ఉంది. ఆ వనంలో పచ్చలు తాపిన మెట్లతో, పసిమిపూసిన కలువపూలతో, దిగుడు బావులు నిండుగా ముచ్చటగా ఉన్నాయి. ఆ పూలతోట కింపురుషుల సంచారాలకు అనువుగా ఉంది. ఈ పుష్పవనాన్ని ఆనుకొని

బ్రహ్మాదులు దక్షిణామూర్తి రూపుం డగు నీశ్వరుని స్తుతించుట

The destruction of Daksha’s yagna by Veera Bhadra Badra - శివుడు వీరభద్రుచే దక్షయజ్ఞంబు ధ్వంసంబు సేయించుట

శివుడు వీరభద్రుచే దక్షయజ్ఞంబు ధ్వంసంబు సేయించుట

మహోన్నతంగా, నిండుగా, భారీగా ప్రయాణించే కారుమేఘమా అన్పించేటటువంటి నల్లటి నిలువెత్తురూపంతో, కణకణమండే నిప్పుమంటల వరుసల వెలుగులవలె ఒప్పుతున్న తలజుత్తుతో, వేనవేల ఆయుధాల ధారణతో భయంకొల్పే అష్టదిగజాల తొండాల్లాంటి వేయి భుజదండాలతో, లోకుల కళ్లకు మిరుమిట్లు గొలిపే లోకవీక్షణుడి భగభగమండే ఎండవంటి మూడుకళ్ళతో, రంపం పళ్లలా పదనెక్కి ఉగ్రంగా ఉన్న కోరలతో, గట్టి పుచ్చెలదండలూ, ఎముకలపేరులూ, ఆకుల పూలమాలికలూ వేసుకున్న మెడతో వీరభద్రుడు లోకభయంకరుడుగా, మరొక శివుడుగా పుట్టుకొచ్చాడు.

ఆ వీరభద్రుడు పగవారి శుభాలను హతమార్చి తన వేయిచేతులతో ఒక్కసారిగా దండం పెట్టాడు. అతి వినమ్రతతో నేను ఏమి చేయాలో తెలపండి. సెల విప్పించండి అని అడిగాడు. దానికి శివుడు వీరభద్రుడితో ఇలా అన్నాడు.

(వీరభద్రుడు: ప్రతివీరుడుగా భద్రం చేకూర్చేవాడు.)

గొప్ప జబ్బపుష్టిగల ఓ వీరభద్ర! యుద్ధకళాకుశల! నా సమస్తశూరగణానికి నువ్వే సైన్యాధిపతివి. ఆ ఆధిపత్యంతో నువ్వు దక్షయాగవాటికకు పో. చాల శ్రద్దాళువువై యాగంతో సహా దక్షుణ్ణి చంపు. ఆ యాగవాటికలో “బ్రాహ్మణతేజం” ఎదిరించ సాధ్యమా, అని నువ్వు ఏమాత్రం తలంచవద్దు. దుర్లభమైన నా అంశాన జన్మనెత్తిన నీకు సాధ్యంకానిది ఏచోటనైనా ఉంటుందా?

అంటూ శివుడు కోపపడి తీవ్రంగా ఆనతిచ్చిన క్షణాననే ఆ వీరభద్రుడు సరే! అట్లాగే అని చెప్పి

వీరభద్రుడు శివుడి దగ్గరకు పోయాడు. మహా ఆనందంగా శివుడికి ప్రదక్షిణం చేశాడు. పోయి వస్తానని సెలవు తీసుకున్నాడు. పట్టరానంత వేగంతో ఒక్క ఊపున కదిలాడు. ఆ వేగానికి నేల ఊగిపోయింది. కాలి మణిమంజీరాలు ఝళంఝళల మోతలు పెట్టాయి. భయంకరమైన కాంతులు విజృంభించాయి. యముడిని అంతం చేయగల పదునైన, మెరిసిపోతున్న శూలాన్ని బలంగా పైకెత్తి పట్టి మరింత పుంజుకున్న వేగంతో

అంతటి వేగిరపాటుగమనంతో సాగిపోతూ ఉన్న కాలిబంటుల పదాల తొక్కిడికి రేగిన దుమ్ము, ఉత్తరం పక్కన బూడిదవర్ణంగా అలముకుంది. ఆ ధూళి పొగను కొలువులోని సదస్యులూ, దక్షుడూ ఒక్కసారిగా చూచారు. ఎంత 'చిమ్మచీకటి' అనుకున్నారు. అంతలోనే కాదు అది కాలి ధూళి అంటూ అదరిపోయారు. తెలివిని కోలుపోయారు. మరియు

విడ్డూరంగా ఈ దుమ్ము ఇంత ఎత్తున ఎగయడానికి కారణం ఏమిటి? ప్రళయం నాటి విసురు గాలియా? ఈ అసమయంలో వీచదు కదా!, మరి చోరులగుంపు వచ్చిపడే సమయమా! గొప్ప చండశాసనుడైన ప్రాచీనబర్హిరాజు పరిపాలనంలో దొంగలముఠా దాడికి దిగేపని కాదు. మరి ఆలమందల గుంపులు వెనక్కి మళ్లిపోయే సమయమా? కాని ఇది గోధూలివేళ కాదు. కాన ఇపుడు విలయసమయం కావచ్చును. లేకపోతే ఇంతటి పెద్ద ఉపద్రవంగా ధూళి ఎక్కణ్ణుంచి వచ్చిపడుతుంది అనుకుంటూ ఆ ప్రదేశంలో పోగయిన మానవసమాజమూ, దేవతలూ, దక్షుడూ పెద్దగా వణకిపోయారు. ఈ లోగా ప్రసూతి (దక్షపత్ని)మొదలైన బ్రాహ్మణ స్త్రీలు మళ్లీ ఇలా అనుకున్నారు.

దక్షుడు తన తక్కిన ఆడుసంతానం ముందు ఏ అపరాధం ఎరుగని తన అమ్మాయి 'సతి'ని అన్యాయంగా అగౌరవించాడు. ఈ ఘోరానికి మారు ఫలితమే ఈ దుమారం కాబోలు నన్పిస్తుంది అని అంటూ

ఇంకా ఇలా చెప్పుకున్నారు. ఆగ్రహించిన దక్షుడు తన సొంతబిడ్డతో పగ చాలదన్నట్టు విశ్వవినాశకారకుడైన శివుడు చిటపటలాడేలా చేశాడు. ఆ పరమపురుషుడు ఎలాంటి వాడంటే, ప్రళయం ముంచుకొచ్చినపుడు మంచి పదనుగల తన త్రిశూలం మొనలతో దిగ్గజాలన్నింటిని గుదిగుచ్చుతాడు. అతిభీషణంగా, కర్ణకఠోరంగా ఉరుము గర్జిల్లినట్టు, దిక్కులు బద్దలై పోయేట్టు గంభీరంగా అట్టహాసం చేస్తాడు. వెఱపు పుట్టించేంత వెడల్పుగా విప్పిన కోరల దెబ్బలతో నక్షత్రరాశులను కుప్పలు పడేలా కిందికి జారుస్తాడు. చురుకైన భుజదండాలకు అలంకరణగా తళతళకాంతులు విరజిమ్మే రకరకాల ఆయుధాలు పట్టీ ఉంటాడు. మించిన కోపంతో కనుబొమలు ముడివేసినపుడు సహించశక్యంకాని తేజస్సుతో అతిశయించి ఉంటాడు. ఒత్తుగా కిందికి వేలాడుతున్న జుత్తు అల్లిన జడలముడి జారిపోయేంతగా ప్రళయానికి మూలభూతుడై తాండవం చేస్తాడు.

అలాంటి తాండవళివుడు, శ్రేష్ఠదేవుడు. త్రిపురాలనూ మట్టు పెట్టినవాడు, చంద్రకళాధరుడు, సత్త్వవంతుడు, పుట్టువు లేనివాడు. అంతటి శివుని మనస్సును కెలికి కోపింప చేస్తే క్షేమంగా ఉండగల్గడం చివరకు ఆ విధాతవల్లా కానిదే అవుతుంది. ఇక ఇతరుల గురించి మాటాడే పనేముంటుందని భావం.

మాటిమాటికి ఆ బ్రాహ్మణ స్త్రీలు ఈ క్రమాన భయంచేత చలిస్తున్న కండ్లతో మొరపెడుతూనే ఉన్నారు. ఆ తరుణంలో ఉదార స్వభావుడు అయిన దక్షుడికీ దడ పుట్టించేవిధంగా మహోపద్రవాలు నేలనించి నింగిదాకా వేల లెక్కన కంటికి తోస్తున్నాయి. ఆ సమయంలోనే శివప్రమథగణం రకరకాల ఆయుధాలను చేపట్టారు. వాళ్లు రకరకాల వికృత ఆకారాల్లో ఉన్నారు. చామనచాయ, పసిమిచాయవాళ్లు కొందరైతే, మరికొందరు పొట్టిగా ఉన్నారు. కొందరు మొసలి కడుపువలె బాన కడుపుతో ఉన్నారు. ఇంకొందరు మొసలి ముఖం (నోరు) వంటి ముఖం (నోరుతో ఉన్నారు. వీళ్లంతా దక్షయజ్ఞ వాటికలోకి ఉరుకుతూ దాదాపుగా చేరుకున్నారు. దక్షయాగస్థలం చుట్టూ ఉన్న కంచెలను, నడవలను, ఇళ్లభాగాలను అస్తవ్యస్తం చేసేస్తున్నారు. కొందరు ప్రధాన యాగగ్భహం వెన్నుగాడిని తన్నేవారు. కొందరు కొందరుగా ధర్మగేహినులుండే పాకను, సభతీర్చేపాకను, అగ్నివహులైన ఋత్విక్కులుండే పాకను, యాగయాజమాని పాకను, వంటశాలలనూ, కూల్చేవారు. కొంచెం ఆగి కొందరు అక్కడి యాగపాత్రలను వహ్నులను పాడుచేశారు. ఇంకా కొంచెం సేపటికి అగ్నిహోత్రాలను ఆర్పేశారు. కొందరు అగ్నిగుండాల్లో మూత్రాలను విసర్జించారు. కొందరు ఉత్తరం పక్కగా తీర్చిన వేదికల సోమసూత్రాలు తెంపేశారు. కొందరు మునుల్ని కష్టపెట్టారు. కొందరు మునిపత్నుల్ని గజగజలాడించారు. ఇంకొందరు దేవతలను నిలువరించారు. ఆ సమయంలో భృగుఋషిని మణిమంతుడూ, దక్షుణ్ణి వీరభద్రుడూ, పూషుణ్ణి చండీశుడు, భగమునిని నందీశ్వరుడూ నిర్భంధించారు. ఇలాగున సభ్యుల, దేవతల, ఋత్విక్కుల, వర్గాలపైకి రాళ్లు విసరి, మోకాళ్లతో కుమ్మీ, అరచేతులతో చరచి, మోచేతులతో పొడిచీ పెక్కురకాలుగా పీడించారు. వాళ్లంతా భయంతో దిక్కుతోచక తలకొక దిక్కుకు పరుగు తీశారు. తరువాత

అప్పట్లో యాగవాటికలో దక్షుడు శివుణ్ణి తిట్టిపోశాడు. అప్పుడు కనుసైగచేసిన భగుణ్ణి, ఇపుడు నందీశ్వరుడు పట్టి కట్టేశాడు. రెండుకళ్లూ పెరికి వేశాడు. ఇదంతా చూస్తున్న జనంలో ఆర్తనాదం చెలరేగింది.

దక్షుడు శివుణ్ణి దూషించినపుడు పూషుడు పల్లికిలిస్తూ నవ్వాడు. ఆకారణంగా ఇపుడు అలనాటి కళింగదేశం రాజు దంతవక్త్రుడి దంతాలు బలరాముడు కుతుకం కొద్దీ రాలగొట్టిన విధంగానే పూషుడి దంతాలను చండీశుడు ఊడపీకాడు.

దక్షుడు ధర్మం తప్పి ఆనాటి కొలువులో శివుని నిందించేటపుడు అక్కడ భృగుముని మీసం, గెడ్డం మెలిపెడ్తూ నవ్వాడట. ఆ ద్వేషంతో వీరభద్రుడు ఆ ముఖమీసం, గెడ్డం మెలి తిప్పి పెరికివేశాడు.

ఆ వీరభద్రుడు విర్రవీగినవాడై దక్షుణ్ణి అధీనం చేసుకున్నాడు. అతడి ఉదరభాగాన్ని తన కాలితో తొక్కిపట్టాడు. పదను దేరిన కొనలుగల కత్తిపట్టుకుని ఒళ్లంతా గాయపరచాడు. మంత్రపూతమైన శస్త్రశక్తితో దక్షుడిచర్మం చీల్చబడలేదు. దానికి వీరభద్రుడు ఎంతో విభ్రాంతి పొందాడు. అతణ్ణి చంపే ఉపాయం మనస్సున యోచించుకున్నాడు. గొంతు నులిమి చంపే మార్గం తట్టింది. అంతే దక్షుడి తలకాయ తెగిపడేలా నరికాడు. కోపం ఆపుకోలేక దక్షిణాగ్నికి ఆహుతి చేశాడు. ఆ వీరభద్రుడి పరివారం ఎగిరి గంతులేసింది. అక్కడే ఉన్న బ్రాహ్మణులందరూ లోలోపల కుమిలిపోతూ ఉండగా.

ఇలా భద్రంగా ఆ వీరభద్రుండు దక్షుడి అధ్వరాన్ని నాశనంచేసి తన కైలాసవాసానికి తిరిగిపోయాడు. అపుడు

Sathi Attended Her Father Daksha Yagna - దక్షప్రజాపతి యజ్ఞము చేయునపుడు దాక్షాయణి యచ్చటికింబోవుట

దక్షప్రజాపతి యజ్ఞము చేయునపుడు దాక్షాయణి యచ్చటికింబోవుట

ఆ తర్వాత మామ దక్షుడికీ, అల్లుడు శివుడి పట్ల ద్వేషం వర్దిల్లుతూనే చాల కాలం దొర్లిపోయింది. అంతట్లో శివుడు లేకుండా యాగం మొదలుపెట్టి చేసినా చేయనట్లేనని దక్షుడికి తెలుసు. అయినా సరే శివుడితో ముందునుంచి కొనసాగిస్తున్న వైరంవల్లా, బ్రహ్మ, దక్షుణ్ణి 'ప్రజాపతులందరికీ ఏలిక' ను చేయడంవల్ల దక్షుడిలో అహం భావం ఏర్పడింది. బ్రహ్మ నిష్ఠులైన ఈశ్వరాదుల్ని లెక్కచేయక, దక్షుడు శివుడులేని 'వాజపేయయజ్ఞం' చేశాడు. ఆ తర్వాత 'బృహస్పతి సవనం' అనే పేరిట మరోయజ్ఞం చేయ మొదలుపెట్టాడు. ఆ యాగభూమికి క్రమంగా

(వాజపేయేనేష్ట్యా బృహస్పతిసవేన యజేత - అని శ్రుతి.

వాజపేయం అంటే నేతిని ఆహారంగా స్వీకరిస్తూ చేసే దైవకార్యం. 'వాజం పేయం అత్ర' అని వ్యుత్పత్తి. ఈ ధర్మకార్యంలో నేయి కేవలం దేహధారణకోసమే కాని, రుచికోసం స్వీకరించేది కాదు.

తిండి, తీర్ధం, పలకరింపులు ధర్మార్థకర్మలుగా కాక, స్వార్థ కర్మలుగా ప్రవర్తింపచేసేది బృహస్పతి సవనం. అయినా వీటిని ప్రసాదించే దేవతలు ఈ సవనకర్తను దీవించడం సంప్రదాయం.)

ఆ బృహస్పతి యాగం చూడాలనే ఆత్రంతో బ్రహ్మర్షులూ, ప్రజాపతులూ, నారదునివంటి దేవర్షులూ, తమ భార్యలతో కలసి క్రమంగా ఎంతో ఆసక్తితో తరలివచ్చారు. అందరూ దక్షుడికి శుభాలు కలగాలని దీవనలు పలికారు. దక్షుడి యాగదక్షిణలను యథార్హంగా స్వీకరించారు.

దక్షుడి కూతురు సతీదేవి తన నివాసం నుంచే తండ్రి చేసే యాగం గొప్పలను, గంధర్వుల స్తోత్రాల కలకలాన్ని ఆసక్తితో విన్నది. ఎంతో ఉత్సాహంగా ఆకాశంవైపు చూడగా

అదే సమయానికి ఆ దక్షుడు చేసే యాగం వేడుకలను కన్నులారా తిలకించాలనే ఉబలాటంతో అన్నివైపుల నుంచి ప్రజలు వెళ్తూ ఉన్నారు. ఆ వేళలో

మితిమించిన ఉత్కంఠతో తమ పతులతో జంటగా గగనచరులైన గంధర్వ, కిన్నర స్త్రీలు మన్ననతో విమానంలో పయనమై నింగికి పోతూ ఉండడం సతీదేవికి అవుపించింది. ఆ దివ్య స్త్రీల చెవిపోగుల నవరత్నాల ధగధగలు బుగ్గలమీద ప్రతిఫలిస్తున్నాయి. ఘనమైన బంగారుపతకం తళతళలు భుజాగ్రాలమీద ప్రసరిస్తున్నాయి. వాళ్లు కట్టుకున్న చీనీ పట్టుబట్టల తళతళలను మొలనూళ్ల వెలుగులు వేళాకోళం చేస్తున్నాయి. లేళ్ల చూపులవంటి వాళ్ల బెదురుచూపుల కాంతులు నలువైపులకు విస్తరిస్తున్నాయి.

సతీదేవి తన మగడైన శివుణ్ణి చూచి ఎంతో ఉత్సాహంగా ఇలా మాట్లాడింది. మీ మామగారు దక్షప్రజాపతి దీక్షతో యాగం చేస్తున్నాడట కదా. వింటిరా?

కాబట్టి ఆ యాగానికి దేవతలంతా ఇష్టంగా ఎలా పోతున్నారో చూడండి! ఓ దేవా! ఓ శివా! మనమిద్దరం కూడా ఆ యాగానికి వెళ్లివస్తే బాగుంటుందని నాకు ఉబలాటంగా ఉంది.

ఆ మహాయాగాన్ని చూడటానికి నా చెల్లెళ్లలందరూ తమతమ పతులతో సహా తప్పక విచ్చేస్తారు. మన జంటా పోయినట్లయితే అక్కడ, వాళ్లందరినీ నేను చూడగల్గుతాను.

దుష్టసంహారా! శివా! నీతో కలసి నా తండ్రి చేసే యాగానికి పోయి, పారిబర్హం పేరిట తల్లిదండ్రులు ఇచ్చే అలంకారాదిద్రవ్యాలను తెచ్చుకోవాలనే కుతూహలం నాలో కల్గింది.

నామీద అనురాగం చూపేమా అమ్మనూ, ఆ చెల్లెళ్ళనూ, సోదరీసమూహాన్ని, పిన్నమ్మలనూ, ఋషులు సిద్ధం చేసిన యాగానికి అలంకార ప్రాయమైన ధ్వజాన్నీ చూడాలనే ఉల్లాసం పుట్టుకొస్తోంది.

(గగనకేశ= ఆకాశంలో ఎగురుతున్న కేశాలుగలవాడా! శివుడి అష్టమూర్తుల్లో ఒకరైన సూర్యుడి కిరణాలే ఆకాశంలో ఎగిరే కేశాలు కనక శివుడిని గగనకేశుడంటారు. వ్యోమకేశుడని నామాంతరం.)

అంతేకాదు. ఓ ప్రభూ! ఈ ప్రపంచం సత్త్వరజస్తమోగుణాల స్వభావంకల్గి మహాద్భుతంగా ఉంటుంది. ఈ ప్రపంచం నీమాయ చేత సృష్టించబడింది. కాబట్టి నీకు అంత విచిత్రంగా అన్పించకపోవచ్చు. కానీ నేను నీ నిజస్థితిని గ్రహించుకునే శక్తిలేని దానిని. స్త్రీ సహజమైన నైజం కల దీనురాలిని. నా పుట్టినింటిని చూడాలని నా కోరిక. అంటూనే మళ్లీ ఇలా చెప్పింది.

ఏ సంబంధమూలేని అన్య స్త్రీలందరూ కూడ ఆ మహాయాగ వైభోగాన్ని చూడాలని గుంపులుకట్టి ఎంతో సంతోషంగా పోతున్నారు. ఆ స్త్రీలు అలంకరణలతో మెరిసిపోతున్నారు. తమ తమ భర్తలతో కలసి కలహంసల్లాగా ప్రకాశిస్తున్న విమానాల్లో బయలుదేరి ఆకాశంలో పోతున్నారు. అల్లదిగో చూడండి.

ఓ పుణ్యపురుషుడా! విను, ముల్లోకాల్లోనూ ప్రతి ఆడపిల్ల తమ పుట్టింటి మీది మమకారంతో ఆ ఇంట్లో జరిగే ప్రతి పుణ్యకార్యాలను తానుగా చూచి ఆనందించాలను కుంటుంది. అలా చూడని ఆమె శరీరం నిలకడగా ఎలా ఉంటుంది? ఉండదని భావం.

ఎపుడూ పిలవని వారింటికి పోవడం తగింది కాదు అని నువ్వు అనుకోవచ్చు. కాని ఉత్తములు 'తండ్రి, గురువు, మిత్రుడు, రాజు' పిలువకపోయినప్పటికీ వాళ్ల ఇళ్లకు వెళ్తూనే ఉంటారు.

సతీదేవి శివుణ్ణి ఇంకా ఇలా అడిగింది. ఓ దేవా! నాపై కనికరించు. నీవు నా కోరిక తీర్చదగుదువు. సర్వజ్ఞుడవైన నీచేత నేను నీ శరీరంలో సగభాగంగా గ్రహించబడ్డాను. అలాంటి నన్ను కరుణించవలసిందని వేడుకుంది. ఆ మాటలకు శివుడు, ముఖంలో చిరునవ్వు చిందించాడు. ప్రజాపతుల ఎదుట దక్షుడు తన జీవనాడుల్ని చీల్చుతూ పలికిన కపటపు మాటల బాణాలను స్మరిస్తూ శివుడు సతీదేవితో ఇలా అన్నాడు.

ఓ కల్యాణీ! నీ మాటలు ఒప్పయినవే. బంధువర్గం ఆహ్వానించక పోయినా వారి మీద తనకు గల గౌరవం కొద్దీ ఇష్టపడి పోయి రావడమూ న్యాయమే. కాని ఆ చుట్టాల బుద్ధి శరీరం మీది దురభిమానం కొద్దీ పొగరు, అసహనం, కోపం పొందనంతవరకూ వెళ్లిరావడం సరి అయిందే అవుతుంది. అయితే ఒకటి విను. జ్ఞానం, తపస్సు, ధనం, ప్రాయం, అందం, ఆభిజాత్యం మంచివాళ్లకు మాత్రమే మంచి గుణాలు. ఇవే ధర్మాలు చెడ్డవారిలో చెడుకు కారణాలవుతాయి. వాళ్ల వివేకాన్ని కోల్పోయేలా చేస్తాయి. ఓ సతీ! ఆత్మాభిమానంవల్ల మందమతులు మహానుభావుల గొప్పను చూడలేని వారవుతారు.

అలాంటి కపట ప్రవర్తనగల దగ్గరి సంబంధికుల ఇళ్లకు బంధుత్వం ప్రధానంగా పెట్టుకుని పోవడం అసలు మంచిది కాదు. మర్యాదగలవారికి అది ఇంకా కూడని పని. అది ఎలా గంటే.

వక్రబుద్ధి పరులైన చెడ్డవారి ఇళ్లకు మర్యాదాపరులు వెళ్ళినట్లయితే వాళ్లు మన్నించరు. సరికదా కనుబొమలు చిట్లించి మరీ తీవ్రమైన కోపంతో చూస్తారు. అయినా ఓ సతీ! ఈ మాటను చెవిని పెట్టుకో.

మహాగర్వితుడైన పగవాడు గట్టిగా సారించి వదలిన బాణాలచే బాగా దెబ్బతిన్న శరీరంకల మనిషి ఆ బాధనంతా మరచిపోయి హాయిగా కునుకు తీస్తాడు. ఏ మాత్రం దిగులు పడడు. కాని ఓ ఉమ! తనకు దగ్గర వాళ్లనుకున్నవారి పుల్ల విరుపు మాటలు గుండెల్లో గుచ్చుకుంటాయి. అవి రాత్రనక పగలనక మనసును బాధపెడుతూ మనుష్యుని క్షీణింపజేస్తుంటాయి. 

(ఉ= ఓ పార్వతి! మా= తపః మాస్తు(తపస్సు వద్దు) అని తల్లిచే వారించబడుటచే 'ఉమ' అనే పేరు వచ్చింది. (ఉమేతి మాత్రా తపసో నిషిద్దా పశ్చాదముఖ్యాం జగామ అని కాళిదాసు)

ఓ కాంతా! విను. లోకంలో అందరిలోనూ దక్షప్రజాపతి స్ధితి మంతుడు. అతడి పుత్రికా సంతానంలో నీవు అత్యంత ప్రీతి పాత్రమైన కుమార్తెవు. కాని నాతో నీకుగల సంబంధం వల్ల మీ తండ్రి నిన్ను మన్నింపజాలడు.

నాకు మీతోగల పెళ్లి సంబంధం వల్ల నాతండ్రి నన్ను గౌరవించకపోవడం ఏమిటి? అసలు అతనికీ మీకూగల పగకు కారణం ఎలాంటిది అంటావేమో (విను).

గర్వం లేని పాపరహితులైన సజ్జనుల పుణ్యమూ, పేరూ ప్రతిష్టల్ని కొంతమంది ఇష్టపడ్డారు. కాని ఆ ఉన్నతిని అందుకోగల సామర్థ్యం వారిలో ఉండదు. అందువల్ల వారి మనస్సు మండిపోతుంటుంది. దానితో ఇంద్రియ దుఃఖితులవుతారు. ఏమీ హేతువు లేకపోయినా పగ పెంచుకుంటారు. పరమ పురుషుడు, పరమాత్మ స్వరూపుడు అయిన విష్ణుమూర్తితో ద్వేషంకల రాక్షసుల మాదిరిగా కారణంలేని పగపూని ఉంటారు. ప్రతీకారేచ్చకు వారి వారి అశక్తతే మూలస్థానం అని తాత్పర్యం.

(చర్మం, కన్ను, చెవి, నాలుక, ముక్కు - జ్ఞానేంద్రియాలు. వాక్కు, పాణి, పాదం, పాయువు; ఉపస్థ- కర్మేంద్రియాలు. మనస్సు 11వ ఇంద్రియం)

అంతేకాదు నువ్వు 'పెద్దవాడుగా అతడికి నమస్కరించి ఆదరించకపోవడం తక్కువ చేసినట్లుగా అనుకుని ఉండవచ్చు అంటావేమో. మనుషులు ఒకరికొకరు ఎదురుగా వెళ్లి నమస్కరించుకోవడం లోకసహజం. 

పండితులు 'అందరిలో ఆత్మస్వరూపుడై అంతటా నిండి ఉండే ఆ పరమపురుషుడికి చేతులెత్తి నమస్కరించడం అనే కాయికమైన చర్య అనుచితం అయినట్టిది అనుకుంటారు. మనస్సులోనే నమస్కరిస్తారు. అందువల్ల శారీరకమైన ఈ చేష్టలను కాంక్షించేవాళ్లకు నమస్కరించరు.

కాబట్టి నేను, 'పరమేశ్వరపద ప్రసిద్ధుడూ, శుద్ధ సత్వరూపుడు, ఎపుడూ లోపలి మనసును మాత్రమే చుట్టి ఉండే సర్వవ్యాపి అయిన ఆ వాసుదేవ ఆరాధకుణ్ణి.

నన్ను దక్షుడు పూర్వం బ్రహ్మాదులు చేసిన క్రతువులో కటువు మాటలతో అవమాన పరచాడు. నాకు పగవాడు నన్ను ద్వేషించే నీ తండ్రి దక్షుడు, అతడి అనుయాయులు, గౌరవించదగ్గవారు కారు.

నా మాటలను కాదని నువ్వు వెళ్లినట్లయితే అక్కడ నీ కన్నవారింట్లో అవమానాల పాల పడ్తావు. ఈ భూప్రపంచంలో బంధువుల ఆదరణ పొందకపోవడం చావుతో సమానమే అవుతుంది కదా అని చెప్పాడు.

ఆ తర్వాత మళ్లీ ఈవిధంగాను ఆలోచించాడు. తన భార్యను ఆ మహోత్సవానికి వెళ్లిరమ్మని అంటే అక్కడ ఏమైనా అనుకోనిది జరుగుతుందేమో! అలా చెప్పక ఇక్కడే వారించి ఉంచినట్లయితే సతీదేవి, మానసికవేదనకు గురి అవుతుందేమో! అనుకుని శివుడు మౌనంగా ఊరుకున్నాడు. ఆ తర్వాత

ఆప్తుల్ని చూసి రావాలన్న కాంక్ష సతీదేవికి తీరలేదు. ఆ మనోవ్యథతో ఒళ్లంతా కంపించి పోతోంది. స్రవిస్తున్న కన్నీటి ధారలతో బుగ్గలు తడిసిపోతున్నాయి. పెద్దపెద్ద నిట్టూర్పుల వేడికే ఎదపైని (ముత్యాల) పేరులు మసక బార్తున్నాయి. కన్నవారింటికి పోలేదన్న రోషంతోనూ, భర్తమాట దాటిపోవాలన్న దుఃఖంతోనూ మనస్సు వ్యాకులిత మవుతున్నది. అంతలోకి వెనక్కి మరలుతుంటుంది. మళ్లీ 'కోపన' అవుతుంటుంది.

చివరకు తనతో సాటి లేనట్టి, తన శరీరాన్ని సగపాలు పంచినట్టి శివుణ్ణి వీడి, తనవారిని చూడాలనే ప్రబలమైన వ్యామోహంతో ఆ సతీదేవి భర్తను విడిచి వెళ్లింది.

ఇలా తొందర తొందరగా వెళుతుండగా

ఆ సతీదేవి అలా వెళ్తూ ఉండగా, వేల సంఖ్యలో మణిమంతుడూ, మదుడూ మొదలైన శివుడి సహచరులూ, యక్షులూ ఆ వెనుకనే బయలుదేరారు. వీళ్లకుముందు నందికేశ్వరుడు నడక సాగించాడు. ఆమె వహించే పూలబంతులు, పద్మాలు, గోరువంకలు, తాటాకు విసనకర్రలు, తెల్ల గొడుగులు, పూలమాలలు, బంగారునగలు, కస్తూరి చందనాది పరిమళద్రవ్యాలు వెంట తీసుకుని వెళ్లారు. నిర్భయంగా ఆమెను చేరుకున్నారు. గొప్పవాడైన నందికేశ్వరుణ్లి శర్వుడి భార్యకు వాహనంగా చేశారు. సంకువుల, భేరీల, పిల్లనగ్రోవుల మోతల సందడితో యజ్ఞస్థలం దిశగా పయనమై పోయి పోయి.

ఆ తర్వాత సతీదేవి ఎంతో సంతోషపడుతూ యజ్ఞవాటికను కళ్లారా చూసింది. ఆ భూమి, చెక్కతో, మట్టితో, బంగారంతో, దర్భలతో, లేడి చర్మంతో, ఇనుముతో చేసిన పాత్రలతో ఒప్పి ఉంది. శుద్ధమైన వేద ధ్వనులు, యాగ పశువును కట్టిన పూజ్యమైన యూపస్తంభం గల్గి ఉంది. ఆ ప్రదేశం మహర్షులు, దేవతలచేత ప్రకాశిస్తూ ఉంది. ఉవ్వెత్తు మంటలతో హోమం తేజరిల్లుతూ ఉంది.

ఆ యాగస్ధలాన్ని దర్శించి యజ్ఞవాటికలో ప్రవేశించగా

అలా చూస్తూ సంతోషంగా వచ్చిన ఆ సతీదేవిని అమ్మా, తోడపుట్టినవాళ్లు ఆదరించారు. ఆ సభతీర్చి ఉన్న మిగతా వాళ్లందరూ దక్షుడికి భయపడి తప్పనిపరిస్థితుల్లో ఆ సతీదేవిని గౌరవించలేకపోయారు.

అమ్మా పిన్నమ్మలు వరుసగా ఆమెను దగ్గరకు తీసుకున్నారు. ఆ ఆనందం పట్టలేక కంటనీరు పెట్టుకున్నారు. కంఠం బొంగురు పోయింది. గద్గదస్వరంతో ఆమె క్షేమసమాచారాలు అడిగి తెలుసుకున్నారు. అంతలో ఆ సతీదేవి తానుగా,

తండ్రి ఆదరణ కరవుకాగా ఆ సతీదేవి తోబుట్టువులు ఆప్యాయంగా తనకు తగిన విధంగా సమ్మానాలు చేసినప్పటికీ స్వీకరించలేకపోయింది. వారు అడిగిన కుశలప్రశ్నలకు ప్రతి సమాధానం చెప్పకుండా మిన్నకుండిపోయింది.

తండ్రి తాను చేసే యజ్ఞంలో తన మగనికి భాగం కల్పించలేదనీ, ఆహ్వానించక చిన్నచూపు చూశాడని గ్రహించుకుంది. ఈ ముల్లోకాల్ని బుగ్గి చేద్దామన్నంత కోపం తనలో రగులుకొంది. శివుడంటే గిట్టనివాడు, నేనే యజ్ఞకర్మను ఆచరిస్తున్నాననే పొగరుగల దక్షుణ్ణి చంపివేస్తామని శివుడి అనుచరులు పూనుకున్నారు. వాళ్లను వారించి, చాలా కోపంగా తండ్రితో ఇలా పలికింది. మహాదేవుడు, ప్రపంచంలోని శరీరధారులైన సమస్తజీవకోటికి ప్రియమైనవాడు. అలాంటి ఈశ్వరుడికి వీళ్లలో ఇష్టమైనవాళ్లు, ఇష్టంకాని వాళ్లు, అధికులు అనేవారే ఉండరు. సకల జగత్తుకీ కారణస్వరూపుడు, అసూయపడే తత్త్వం లేనివాడు అతడే. నీవు తప్ప మరెవ్వరూ శివుణ్ణి వ్యతిరేకించరు. (కాదనుకోరు)

అంతేకాదు మీబోటివాళ్లు ఇతరుల గుణాల్లో తప్పులు ఎంచుతుంటారు. కొందరు మధ్యస్థులు ఇతరుల దుర్గుణాల్లోని తప్పుల్ని ఎంచరు. కొందరు సత్పురుషులు అన్యుల దోషాలను కూడా సద్గుణాలే అంటారు. వీరిలో సజ్జనులు కొందరు మరీ మంచివాళ్లు ఎదుటివారిలోని దోషాల్ని పట్టించుకోకపోగా వారి నీచగుణాల్నికూడా మంచి గుణాలుగా గుర్తిస్తారు. వీరు మంచివాళ్లల్లో మంచివాళ్లు. అలాంటి సర్వోత్తముల్లో కూడా నీవు చెడ్డ బుద్ధిని ఆపాదించావు అంటూ ఆ సతీదేవి మళ్లీ ఇలా అనడం మొదలు పెట్టింది.

అలాంటి పుణ్యుల అడుగుల దుమ్ముముందు ఎందుకూ పనికిరాని తేజోవంతులూ, మొద్దుతనం గల దేహాన్న పరమాత్మగా అనుకునే దుష్టులూ, మహాత్ముల్ని తెగడడంలో వింత ఏముంటుంది! అది వారికి అర్హమైంది కాదు. అని మళ్లీ సతీదేవి ఇలా చెప్పింది.

'శివ' అనే రెండక్షరాలు ఇష్టంగా నోటపలికినా, మనసులో అనుకున్నా సమస్త ప్రాణికోటికి అశుభాలన్నీ తుడిచి పెట్టుకుపోతాయి. అలాంటి గొప్ప స్వభావం కలవాడు శివుడు. అమంగళుడవైన నీవు అతడికి శత్రువు కావడం నాకు వింతగా ఉంది. కాని ఒక్కమాట విను. బ్రహ్మవేత్తలు యుక్తాయుక్త విచక్షణతో 'బహ్మానందం' అనే తేనె యందలి అ పేక్షతో, హృదయాలనే తుమ్మెదలతో తాగి, శివుడి పాదపద్మాలను గూర్చి తెలిసికొని సంతృప్తులవుతుంటారు. అటువంటి స్వామికి నువ్వు ద్రోహం చేశావు. నిన్ను ఏమని అనగలను. (అనేందుకు ఏమీ లేదని భావం).

ఇంకా ఆ పరిపూర్ణాత్ముడి పాదపద్మాల జంట, చక్కగా సేవించే వారందరూ కోరుకునే కోరిక లన్నింటిని విడువక తీరుస్తుంటాయి. అలాంటి శివుణ్ణి దూషించడం తగునా?

చితి మీది ఎముకలు, బుగ్గి, మానవుల కపాలాలు, జడలు ధరించి శ్మశానంలో తిరుగుతుంటాడు. పిశాచాలతో కలసి ఉంటాడని నువ్వు తప్ప మరెవ్వరూ శివుణ్ణి అమంగళుడని తలంపరు. పైగా బ్రహ్మాది దేవతలంతా శివుని పాదపద్మాల పరాగపు ధూళిని బుద్ధిపూర్వకంగా శిరస్సున ధరిస్తారు.

ప్రయత్నపూర్వకంగా ధర్మరక్షణలో పరిశుద్దాత్ముడైన శివుణ్ణి దూషించే దురాత్ముడి నాలుకను తెగకోయడం తగినపనే అవుతుంది. అలా చేయను చేత కాకపోతే మరణించడం ఉత్తమం. ఈ రెంటికీ శక్తి చాలకపోతే చెవులు రెండూ గట్టిగా మూసుకుంటూ వెళ్లడం న్యాయం అని నీతిమంతులు చెప్తుంటారు.

అందువల్ల మానవుడు తెలియనితనంతో ఏహ్యం పుట్టించే ఇష్టంకాని తిండి పదార్థాల్ని తిన్నపుడు వెంటనే బయటకు కక్కించి శుద్ధుణ్జి చేస్తాం. అట్లే నీవు కుత్సితమతివి. పూజ్యుడైన శివుణ్ణి తిరస్కరించిన వాడివి. నీ ఆత్మజనుగా నన్ను చెప్పడం నేను సహించలేను. నీ వల్ల కల్గిన ఈ నీచమైన శరీరాన్ని వదిలిపెట్టి పవిత్రంగా ఉండదలిచాను

అంతేకాదు దేవుళ్లకు ఆకాశసంచారం, మానవులకు భూతలసంచారమూ అనేగతులూ సహజసిద్ధమైనవి. అదే రీతిగా ప్రవృత్తి రూప, నివృత్తి రూప, కర్మల్ని రాగ, వైరాగ్యాలకు తగినవని వేదాలు ఆదేశిస్తున్నాయి. సరాగులై కర్మజ్ఞులయిన భౌతిక జీవనులకూ, విరాగులై ఆత్మారాములయిన యోగి సముదాయాలకూ విధి, నిషేధరూపంలో వైదికకర్మలు పొందడం పొందకపోవడం అనేది ప్రకృతి ధర్మం. అందువల్ల తన ధర్మనిర్వహణలో స్థిరుడైన వారిని దూషించడం తగనిపని.

ఈ రెండూ కర్మ విధానాలను నిర్వహించనివాడూ, బ్రహ్మస్వరూపుడూ అయిన శివుణ్ణి పనీపాటలేనివాడని అవమానించడం గొప్ప పాపం.

నాన్నా! సంకల్ప మాత్రంగా కల్గేవి అణిమాది అష్టసిద్దులు. వీటిని మహాయోగులందరూ కొలుస్తుంటారు. అవి నీకు సిద్ధించవు. నీకు సంబంధించిన సంపత్తిని యాగాదికర్మలు ఆచరించేవారూ యాగవిధుల్లో ఆ అన్నపానాదులతో తృప్తి పొందేవారూ యజ్ఞశాలలో ఎంతగానో పొగడుతుంటారు. ఆ ప్రశంసలు నీ మనస్సులో భూరి సంపన్నుడనని గర్వింపచేస్తాయి. 'చితి మీది బూడిదను, బొమికల్ని దండలుగా వేసుకునే శివుడు పేదవాడ"ని విర్రవీగడం నీకు ఒప్పని పని. అని మాట్లాడి మళ్లీ ఇలా అంది.

(1. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశిత్వం, వశిత్వం అనేవి అష్టసిద్ధులు. 
 2. ధూమమార్గం : పుణ్యకార్యాలు చేసినవారు శరీరపతనానంతరం స్వర్గానికి వెళ్ళేమార్గాన్ని ధూమమార్గం అంటారు.)

ఆ నీలకంకఠుడికి ద్రోహం తలపెట్టిన నీ కూతురుగా పుట్టడమే చాలు. ఓ దుష్టాత్ముడా! నీ తనూజాతనని చెప్పుకోవడానికి బిడియపడ్తున్నాను. పరమ పురుషులకు అపకారం తలపెట్టెవారి పుటకలు పుటం పెట్టడానికి తప్ప ఎందుకూ కొరగావు.

ధర్మాత్ముడు, దైవం అయిన శివుడు నన్ను ఆదరంతోనో, ఎకసక్కెంగానో 'దక్షతనూభవ' అని పిలుస్తుంటాడు. ఆ మాటలకు నేను పరపురమని దుఃఖిస్తూ ఆ సంతోషాన్ని పొందలేను. ఆ మేలపు మాటల్లోని చిరునవ్వును పోగొట్టుకుంటున్నాను. నీ కూతురుగా దుఃఖించడంకంటే చావడం మేలనిపిస్తోంది.

అని ఈ విధంగా తీర్చి ఉన్న యాగసభలో అందరి మధ్యన సతీదేవి దక్షునితో ఇలా పలికి అరిషడ్వర్గాల్ని జయించిన ఆ సతీదేవి ఉత్తరంవైపుకి ముఖంపెట్టి నీటిని సమంత్రకంగా స్పృశించి పవిత్రురాలయింది. ఇంకా ఏమీ మాట్లాడదలచుకోనిదై తగిన యోగాసనంలో నేలమీద కూర్చుంది. యోగమార్గంలోనే శరీరాన్ని త్యజించాలని

వరుసగా ప్రాణవాయువు, అపానవాయువుల్ని సమానంచేసి, ధ్యానమును నాభిస్థానంలో నిలిపి, ఆ తర్వాత ఉదానవాయువుని బొడ్డు పైకి నెట్టి, క్రమంగా హృదయంలో పట్టి ఉంచింది. వాటిని క్రమంగా కంఠంనుంచి కనుబొమల నడుమకు పంపించింది.

ఆ సతీదేవి, శివుని పాదపద్మాలమీది ధ్యాసతో పతిని తప్ప మరొకటి చూడజాలకపోయింది. ఆ మహాదేవుడి ఒడిలో మన్నన పొందిన దేహాన్ని దక్షుడి అపరాధ హేతువుగా విడిచి పెట్టాలనుకుంది. శరీరంలో గాలి, అగ్నుల ఉత్పత్తికి తగిన ధ్యానం చేసింది.

ఆ విధంగా సతీదేవి యోగాగ్నిని వహించడంవల్ల నిర్మలమైన దేహం, ఆ యోగనిష్ఠవల్ల పుట్టిన నిప్పుల్లో ఆ మరుక్షణమే మాడి మసైపోయింది. ఆ తర్వాత

దాన్ని చూసిన మనుష్యులూ, దేవతలూ హాహాకారాలు చేశారు. అయ్యో! మంచి లక్షణవతి అయిన సతీదేవి దక్షుడితో వైరంవల్ల ప్రాణాలు పోగొట్టుకుంది కదా! అంటూ వాపోయారు.

మళ్లీ ఇంకా ఇలా అన్నారు. స్థావర జంగమాత్మకమైన ఈ సకల ప్రాణిలోకాన్ని పుట్టించేవాడు దక్షుడు. ఇతడి గారాబుపట్టి సతీదేవి. మానం, మర్యాదగల బిడ్డ. ఇలాంటి తన కన్న కూతురు తన వల్లనే పరాభవం పొందింది. తన కళ్లముందటే తనువు చాలించింది. అయినా కళ్లు తెరుచుకుని చూస్తూ ఉండిపోయాడు తప్ప కన్నకూతురు చావును అభ్యంతరం పెట్టని ఇలాంటి పాపిష్టి తండ్రి ఎక్కడన్నా ఉంటాడా అని తిట్టుకుంటూ ముక్కుమీద వేలేసుకున్నారు. అంతటితో ఊరుకోలేదు. శాపనార్జాలూ పెట్టారు. ఇంతటి పరమకిరాతుడు, ఇంతటి భ్రష్టబ్రాహ్మడు ఇక మీదటన్నూ తానుగా అప్రతిష్ఠుడు కావాలి. ఎన్నెన్నో లేనిపోని నిందలు కాయాలి. ఆపై నరకాన్ని కళ్లచూడాలి అని ఏవగించుకుంటూ అనేకరకాలుగా ఆడిపోస్తున్నారు. ఆ సమయంలో

శివుడి ప్రమథగణాలు అలా సతీదేవి శరీరం వీడడాన్ని కళ్లారా చూశారు. తమరెక్కల పుష్టి బయలుపడేలా ఆ ద్రోహి దక్షుణ్ణి నరికి పోగులుపెట్టడానికి కత్తులూ గదలూ చేతపట్టారు. పూనికగా ఒక్కపెట్టున లేచి నిలబడినారు.

(పార్షదులు= సహచరులు, చండీశ్వరుడు, నంది, భృంగి, వీరభద్రుడు మొ॥ శివుడి అనుచరగణం.)

అదే సమయాన భృగుముని ఆ గొడవనంతా గమనించాడు. మండిపోయాడు. యాగం పాడుచేయాలనుకున్న శివసేన శక్తిని చంపి యాగాన్ని రక్షించే “అభిచారక” హోమాన్ని తొందరతొందరగా కానిచ్చాడు.

(అభిచార హోమం = క్రతుసంహారమారకహోమం; ఇది యజ్ఞనాశకుల హింసార్థం యాగరక్షణార్థం చేసే హోమం. అపహతమ్‌, రక్షమొదలైన యజుర్వేద మంత్రాల్ని పఠిస్తూ దక్షిణాగ్నిలో ఆహుతి చేసేది. యాగధ్వంసకుల శక్తిని క్షీణింపచేయడం, తద్వారా యాగధర్మం కాపాడడం ఈ హోమప్రయోజనం.

ఆ సమయంలో భృగువు ఏమాత్రం జాగుచేయకుండా దక్షిణానలంలో హోమద్రవ్యాలు వేల్చాడు. తమ తపోమహిమచే ఏనాటినుంచో చంద్రలోకంలో ఉంటున్న ఋభువులనే దేవతలు ఆ హోమగుండంనుంచి వేలలెక్కన పుట్టుకొచ్చారు. వాళ్లంతా బ్రహ్మతేజస్సులతో ఉట్టిపడుతున్నారు. ఈ ఋభువులు దేవతల ఆకాశరథాలు ఎక్కి కొఱవులను కొరముట్టులుగా పట్టారు. రుద్రానుచరులైన ప్రమథుల, గుహ్యకుల మూకలను వెంటాడి తరిమికొట్టారు. ఆ యా గణాలన్నీ ఒక్కుమ్మడిగా ఓడిపోయాయి. ఆపైన కన్నతండ్రి వల్ల పొందిన అమర్యాదవల్ల కల్గిన సతీదేవి చావువార్తా ఋభుదేవతలు ప్రమథసేనలను జయించిన సంగతీ, నారదముని మాటల్లో శివుడు విని

ఆ తొలిదైవం, ఆ రుద్రుడు, ఆ నీలగళుడు, ఆ గజాసురసంహారి, పట్టలేని కోపంకొద్దీ మునిపళ్లతో పెదవిని కొరికాడు. మత్తుగొన్న సింహంవలె కఠోరంగా గర్జించాడు. అత్యంత భీకరంగా పగలబడి నవ్వాడు. మెరుపులవంటి అగ్ని కీలల పరంపరల అన్వయకాంతితో ప్రకాశిస్తున్నట్టి, అప్పటికోపతీవ్రతతో ఊగుతున్నట్టి ఒక జటను సర్రున పీకి భూమిపైన విసరికొట్టాడు.

అలా గట్టిగా ఊడలాగి విసరుగా నేలకేసి కొట్టిన శివుడి జటనుంచి

శివుడు వీరభద్రుచే దక్షయజ్ఞంబు ధ్వంసంబు సేయించుట

The Rivalry Between Daksha and Shiva stemmed from Daksha's immense ego - ఈశ్వరునకు దక్షప్రజాపతికిని విరోధము సంభవించుట

ఈశ్వరునకు దక్షప్రజాపతికిని విరోధము సంభవించుట

దక్షప్రజాపతి కుమార్తె సతి. ఆమె భవుడి భార్య. ఆమె ఎంతో పతిభక్తి కలది. అయినా సంతానయోగం లేదు. తన మగడంటే పడని తన తండ్రిమీది కోపం కొద్దీ మరొకదారి లేక అమాయకంగా యోగమార్గంతో దేహాన్ని చాలించింది అంటూ మైత్రేయుడు విదురుడితో చెప్పాడు. అది విన్న విదురుడికి ఎంతో ఆశ్చర్యం అయింది. ఆ సంగతంతా తెలుసుకోవాలనే ఉబలాటంతో ఆ మైత్రేయుణ్లి చూసి ఇలా పలికాడు.

నేర్పరివైన ఓ మైత్రేయ మహర్షీ! దక్షుడికి కూతుళ్లంటే ప్రాణం. అంతటి ప్రేమైక మూర్తి అయిన దక్షుడు 'సతీదేవి'ని మన్నించక పోవడానికి మూలకారణం ఏమై ఉంటుంది. శివుడు చరాచర ప్రపంచాని కంతటికీ తండ్రి. శత్రుభావన లేనివాడు. ప్రసన్నమూర్తి. మహోన్నతుడు. సమస్తలోకాలకు దైవం. ఆత్మారాముడు. సజ్జనుల్లో మేటి. అలాంటి మహాదేవుడి మీద దక్షుడికి వైరం ఎందుకు కల్గి ఉంటుంది? ఏ కారణంగా సతీదేవి విడువదగని తన ప్రాణాలు విడిచింది? మామ అల్లుళ్ల మధ్యగల ద్వేషభావాన్ని నాకు తెలిసేటట్లు వివరించండి.

అలా అడిగిన విదురుడితో, మైత్రేయుడు చాల కుతూహలంగా చెప్పసాగాడు. ఓ విదురా! పూర్వకాలంలో నవబ్రహ్మలు సత్రయాగం చేయ తలపెట్టారు. ఆ యజ్ఞాన్ని ప్రజలంతా ఇష్టపడేలా చేయాలని వాళ్ల తలంపు. దాన్ని చూడడానికి

(బ్రహ్మలు తొమ్మిదిమంది. భృగువు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, అంగిరసుడు, దక్షుడు, అత్రి, మరీచి, వశిష్ఠుడు అనేవారిని నవబ్రహ్మలంటారు.)

బ్రహ్మ, శివుడు, యోగులు, దేవతలు, మునులు, మహర్షులు, అగ్ని నవ బ్రహ్మలు ఆసక్తితో విచ్చేశారు. సూర్య ప్రభలతో సాటి కాగల తేజం గల దక్షప్రజాపతి అరుదెంచాడు. అతడు రాగానే బ్రహ్మ, శివుడు తప్ప సభలోని మిగతా వాళ్లంతా గౌరవంగా లేచి నిలబడ్డారు.

అట్లా విచ్చేసిన దక్షుడు బ్రహ్మకు నమస్కరించాడు. సభాసదులంతా చేసిన సత్కారాల్ని అందుకున్నాడు. తనకు తగిన పీఠం మీద ఆసీనుడయ్యాడు.

తాను రాగానే అందరూ లేచినా శివుడు మాత్రం తన ఆసనం దిగలేదు. అది చూసి దక్షుడు రోషపడ్డాడు. కంటికొనల్లో అలముకొన్న చురచుర చూపులు తళుక్కుమన్నాయి. వాళ్లతో ఇలా సంభాషించాడు.

విబుధులారా! మహర్షులారా! అగ్నిమొదలగు దేవతలారా! మీరంతా మీ మాటలు మాని నా మాటలు ఆలకించండి. నా వచనాలు కేవలం తెలివిమాలి ఈర్ష్యతో పలికేవి కావు అంటూ శివుణ్ణి వేలెత్తి చూపిస్తూ

ఆలోచించి చూడగా శివుడు అష్టదిక్పాలకుల ప్రతిష్టను మంటగలుపుతున్నాడు. వైదికంగా పనీపాటాలేని ఇతడివల్ల సచ్చీలుర పంథా పాడయిపోయింది. పట్టి చూస్తే సిగ్గు లేనివాడు కూడ. మరొక సావిత్రి అనదగిన నా బిడ్డను పెద్దల సమక్షంలో పెళ్లాడాడు. నా కూతురు పరమసాధ్వి, బెదురుచూపులు కలది. అమాయకురాలు. శివుడివి కోతిచూపులు. ఈ రీతి శిష్యుడు కావటాన్ని బట్టి అయినా భావించి ఎదురువచ్చి నమస్కరించకపోతే పోనీ. నన్ను చూడగానే చిన్నపలుకు పలికే మాత్రానికి తన నోటికి ఏమి తక్కువయింది?

ఈ శివుడు యాగక్రియానుష్థానాదులు ఎపుడూ చేసి ఎరుగనివాడు. ఆత్మాభిమానం లేనివాడు. అహంకారంతో తిరిగేవాడు. వెఱివాళ్లకు హితుడు. దిసమొలవాడు. భూతపిశాచాదులు ఇతడిచుట్టూ ఉంటాయి. తామస ప్రవృత్తిగల శివభటులకూ, భూతగణాలకూ ఇతడు ఏలిక. ఒళ్లంతా బూడిద పులుముకుంటాడు. ఎముకలే ఇతడి నగలు. శుచిని పాటించనివాడు. పిచ్చివాళ్లకు ఇతడు మారాజు. దుష్టమనస్వి. భీతి పుట్టే ఆకారం కలవాడు. శ్మశానమే ఇతడి నివాసస్థానం. విరియబోసిన (జారిన) జుత్తు కల్గి ఉంటాడు. ఇతడికి శివుడనే పేరు దేశమంతా ఎలా వ్యాప్తి చెందిందో? కాని ఈ అమంగళుడైన శివుడికి, తెలిసి తెలిసి శూద్రుడి చేతిలో వేదం పెట్టినట్లు

ఇలాంటివాడికి నా బిడ్డను కట్టబెట్టాను. అంతా విధిప్రేరితం.

ఓ పుణ్యమనస్కుడా! ఈ తీరున తిరస్కరపుమాటలు మాట్లాడి దక్షుడు శివుణ్ణి శపించడానికి పూనుకున్నాడు. చేత నీళ్లుపట్టి నిలిచి రోషంగా ఇలా అన్నాడు.

శివుడి చుట్టూ ఇంద్రుడు, విష్ణువులుండగా "యజ్ఞసమయంలో మిగతా దేవతలతోపాటు హవిర్భాగం లభించకుందుగాక" అని శపించాడు.

ఈ తీరున దక్షుడి దూషణల్లోని వాక్యాలు ఎక్కువగా నిందించినవి అయినప్పటికీ ఆ మహాదేవుడి విషయంగా అర్థాంతరంలో ఆ నిందలు స్తుతులుగానే పరిణమించాయి. ఆ తర్వాత శివుణ్ణి  శపించిన కారణంగా దక్షుణ్ణి, సభలో ముఖ్యమైన వాళ్లందరూ ఇది తగని పని అని వారించారు. ఆ అడ్డగింత దక్షుడిలో కోపాన్ని మరింత హెచ్చించింది. ఏమీ అనలేక ఇంటికి వెళ్ళిపోయాడు.

ఆ పిమ్మట శివుడి కింకరుల్లో మొదట లెక్కించదగ్గ నందికేశ్వరుడు 'శివుణ్ణి శపించడం, శివుణ్ణి గూర్చిన అనుచితవాక్యాలు' విన్నాడు. కోపంతో అతని కళ్లు ఎర్రబారగా. ఇట్లా అన్నాడు. ఈ దక్షుడు నశించే స్వభావంగల మానవ శరీరాన్నే ఉత్కృష్టమైందిగా భావించాడు. తిరిగి చెడుచేయ తలపెట్టని శివుడిపట్ల వేర్పాటుధోరణి కలవాడై అతడికి ద్రోహం తలపెట్టాడు. ఇలాంటి జడుడు, పరతత్త్వజ్ఞానం పట్ల అనాసక్తుడవుతాడు. కపటాచారాల నివాసాలలో, స్త్రీ కామనతో విధినిషేధ రూప భేదాలవల్ల మతి తప్పి కర్మసిద్దాంతాల్ని విస్తరింపచేస్తాడు.

ఇతడు శరీరాదుల్నే మేల్తరంగా యోచించాడు. అందువల్ల ఇతడు పరాత్పరుడి తత్త్వాన్ని గ్రహించుకోలేని పశుతుల్యుడు. స్త్రీవ్యామోహితుడు. ఇతడు మిక్కిలి తొందరలోనే మేకముఖం కలవాడవుతాడు.

ఈ దక్షుడు తనలోపలి అవిద్యనే ముఖ్య తత్త్వజ్ఞానంగా ఎపుడూ భావిస్తుంటాడు. ఇతడు శివుణ్ణి  అవమానించిన దుష్టుడు. ఇతడి మార్గాన్ని ఆమోదించేవాడు ఇతడితోపాటు ఎపుడూ సంసారకర్మల్లోపడి పుడుతూ చస్తూ మళ్లీ మళ్లీ పుడుతూ ఉంటాడు.

అంతేకాక ఈ శివద్రోహులు విధినిషేధ రూపంలో ప్రతిపాదితమైన విషయాన్ని బలపరచే, స్తుతి వచనాల నుండి దూరమైనందు వల్ల కల్లు, తేనెల వంటి స్వర్గ సౌఖ్య పురుషులతో మనోవికలురై కర్మకాండల మీద మోజు కల్గిన వారవుతారు. ఇంకా 'ఇవి తినదగ్గవి, ఇవి తినగూడనివి' అనే యోచన లేనివారవుతారు. కేవలం దేహధారణ కోసమే విద్య, తపస్సు, వ్రతాలు ఆచరిస్తారు. ధనం, దేహం, ఇంద్రియాల సుఖాన్నే ప్రీతిగా భావిస్తారు. వేడుకపడి భిక్షాటనం చేస్తారు అంటూ నందికేశ్వరుడు బ్రాహ్మణుల్ని శపించాడు. వీటిని విన్న భృగుడు ప్రతిశాపం పెట్ట పూనుకుని ఇలా అంటాడు.

ఈ దేశంలో శివదీక్షాపరులూ, వీళ్లపక్షం ఉండేవాళ్లూ ఉత్తమ శాస్త్రాలన్నింటిని వ్యతిరేకించే వాళ్లూ 'పాషండులు' అవుతారు అని శపించాడు.

(ధూర్దటి= బరువైన జడలు కలవాడు వ్యుత్పత్తి, శివుడు(అమరకోశం) పాషండుడనగా కర్మభ్రష్టుడు)

వేదం అన్ని వర్ణాలవారి ఆచారాలకు పెన్నిధి. ప్రపంచానికి మేలుకల్గించేది. సనాతనమయింది. పూర్వపు మునుల సమ్మతి కలది. విష్ణువే ప్రమాణదైవంగా కలది. ఎప్పటికీ నశించనిది. పవిత్రమయింది. శుభకరమైంది. శిష్టుల పంథా ననుసరించేది. అలాంటి వేదాన్సీ బ్రాహ్మణజాతినీ దూషించిన కారణంగా శివవ్రతులు ఎవరికైనా మధ్యమజనులచే పూజింపబడే భూతపతే దైవం అవుతాడు. ఇట్టివారు బూడిద, జడ, ఎముకలనూ ధరిస్తారు. మూఢులుగా, శుచీ శుభ్రం పాటించని వేద బాహ్యులుగా అంతం అవుతారు అని భృగుమహర్షి శపించాడు.

(జనైః అర్హతే - యాచ్యతే ఇతి జనార్దనః - జనులచే పురుషార్థ విషయమై కోరబడేవాడు, జనాన్‌ అర్దయతి= పీడయతి= కోరికలు తీర్చేందుకు జనంచే యాచించబడేవాడు, జన్మల్ని నశింపచేసేవాడు.

నందికేశ్వరుడు, భృగుమహర్షి ఒకరినాకరు శపించుకున్నా దైవకృపవల్ల వారు ఎలాంటి నాశాన్ని పొందలేదు. అయినా శివుడు వికల మనస్కుడై తన అనుచరులతో సహా అక్కణ్ణుంచి వెళ్లిపోయాడు.

(విమనస్కుడు అంటే జరిగిన సంఘటనను మనస్సునకు పట్టించుకోనివాడై అనే అర్ధాన్ని సంభావించటం సముచితం.)

ఏ యాగకర్మకైనా విష్ణువే సర్వపూజ్యుడు. అలాంటి యాగాన్ని బ్రహ్మదేవుడు వెయ్యేళ్లపాటు చక్కగా అనుష్ఠించాడు. 'సురనది గంగానది, యమునానది సంగమ స్థలం' అయిన ప్రయాగలో యజ్ఞసమాప్తి స్నానం ఎంతో భక్తితో చేశారు. అందు పాల్గొన్నవారు గతంలోని పాపాలన్నీ తుడిపేసుకొని నిర్మలులుగా ఘనత పొందారు. వాళ్లంతా తమ తమ ఆశ్రమభూములకు ఎంతో సంతోషంతో వినోదంగా తరలి వెళ్లారు అంటూ విదురుడికి మైత్రేయుడు తేటతెల్లంగా వినిపించి, మళ్లీ ఇలా అన్నాడు.

దక్షప్రజాపతి యజ్ఞము చేయునపుడు దాక్షాయణి యచ్చటికింబోవుట

Genealogical History of Daksha Prajapati - దక్షప్రజాపతిసంతతి

దక్షప్రజాపతిసంతతి

బ్రహ్మ కొడుకు దక్షుడు. మనువు కూతురు 'ప్రసూతి'. వీళ్ళిద్దరికి పదహారుమంది కన్యలు పుట్టారు.

ఇలా పుట్టిన కన్యల్లో శ్రద్ధ, మైత్రి, దయ, శాంతి, తుష్టి, పుష్టి, ప్రియ, ఉన్నతి, బుద్ధి, మేధ, తితిక్ష హ్రీ, మూర్తి అనే పదముగ్గురిని 
ధర్మునికిచ్చి పెళ్లి చేశాడు. ఒక కుమార్తెను అగ్నిదేవుడికి, ఇంకొక కూతురిని పితృదేవతలకు, మరో అమ్మాయిని శివుడికీ ఇచ్చి పెళ్లి చేసి పంపాడు. శివుడు జననమరణాదులను తొలగించువాడు.

ఆ తర్వాత ఆ ధర్ముని పత్నులవల్ల పుట్టినవారు వీరు. 
శ్రద్ధవల్ల శ్రుతమూ, మైత్రివల్ల ప్రసాదమూ, దయవల్ల అభయమూ, శాంతివల్ల సుఖమూ, తుష్టివల్ల ముదమూ, పుష్టివల్ల స్మయమూ, క్రియవల్ల యోగమూ, ఉన్నతివల్ల దర్పమూ, బుద్ధివల్ల అర్థమూ, మేధవల్ల స్మృతీ, తితిక్ష వల్ల క్షేమమూ, హ్రీవల్ల ప్రశ్రయమూ, మూర్తివల్ల నరనారాయణులు అవతరించారు. ఈ నరనారాయణులు అన్ని మంచి గుణాల ఉత్పత్తికి నెలవైనవారు. వీళ్లు పుట్టిన సమయంలో

ఓ శుభచరిత్రా! నరనారాయణులు పుట్టినసమయంలో లోకమంతా శుభంగా ఉంది. గాలి మెల్లమెల్లగా అనుకూలంగా వీచింది. నాలుగుదిక్కులూ తేటపడ్డాయి. సమస్తలోకం సంతోషించింది. దేవలోకంలో బాజాలు మార్మ్రోగాయి. సముద్రాల క్షోభ తగ్గింది. ఏరులన్నీ పొంగి ప్రవహించాయి. గంధర్వుల, కిన్నరుల గానాలు వినవచ్చాయి. అప్పరసలు ఉత్సహించి నాట్యాలు చేశారు. దేవతలు చెదురుమదురుగా పూలజల్లులు కురిపించారు. మునులంతా పట్టరాని సంతోషంతో స్తుతించారు.

అదే సమయంలో బ్రహ్మ మొదలైన దేవతలందరు ఆ పుణ్యపురుషులను చేరుకొని ఇలా నుతించారు.

ఆకాశంలో కనిపించే గంధర్వాది నగరాల వివిధరూపాల మాదిరి రూఢం చేసి ప్రతి ఆత్మను మాయతో కప్పి ఈ ప్రపంచం సృజించబడింది. అలాంటి ఆత్మ ప్రకాశం కోసం యముడి ఇంట జన్మనెత్తావు. అలాంటి ఓ ఉత్తమ పురుషా! నీకు మా నమోవాకాలు. అంతేకాక ఈ ప్రజాఉత్పత్తిలో చెడుకర్మకు తావు లేకుండా ఉండేందుకు సత్వగుణంతో మమ్మల్ని పుట్టించావు. అలాంటి మాకు  లక్ష్మీనివాసం అయిన పద్మకాంతిని కూడ పరిహసించు నీ కరుణాకటాక్షాన్ని ప్రసాదించు.

(నరనారాయణులిద్దరు. కానీ బ్రహ్మాదులు వారి ఏకాత్ములుగా దర్శించుకుంటున్నారు. అందువలననే పరమపురుషా; నీకు, నీ ఇత్యాదిగా ఏకవచన ప్రయోగం సరిపడుతుంది.)

ఆ తీరుగా దేవతలంతా నరనారాయణుల్ని స్తుతించారు. వారిమీద వారిద్దరి కృపాదృష్టి ప్రసరించింది. అపుడు ఆ నరనారాయణు లిద్దరివల్ల తండ్రియైన ధర్ముని సంతోషం మూడింతలు అయింది. ఆ ఇద్దరూ గంధమాదన పర్వతంవైపు వెళ్ళిపోయారు.

('ముప్పిరిగొను' ఒక జాతీయం. దారం మూడు పొరలతో పేనగా అది బాగా బలపడుతుంది. మూడును కలసి పటిష్ఠం కావడం, అధికమవడం అనేది ఈ పలుకుబడి పరమార్థం. మూడు+పిరి= ముప్పిరి.)

ఆ నరనారాయణులలో భూ భారాన్ని తేలిక పరచడానికి నరుడు అర్జునుడుగా కురువంశంలో పుట్టాడు. కృష్ణుడు యదువంశంలో అవతరించాడు. వీళ్లిద్దరూ సత్త్వగుణసంపన్నులు.

ఇంకా అగ్నిదేవుడికీ, దక్షుడి కూతురు 'స్వాహాదేవి'కి పావకుడు, పవమానుడు, శుచి అనే ముగ్గురు కొడుకులు కలిగారు. వీళ్లవల్ల నలభై ఐదుగురు అగ్నిదేవులు పుట్టుకొచ్చారు. ఈ విధంగా తండ్రి తాతలతో కలుపుకుంటే ఈ అగ్నులు మొత్తం నలభై తొమ్మిది మంది. యాగ విధుల్లో ఈ అగ్నులు దేవతలుగా ఉంటూ, కోరిన కోరికలు తీరుస్తూ ఆ యా పేర్ల మీద బ్రహ్మనిష్ఠులచే అనుష్ఠించబడుతూ ఉంటారు. ఈ అగ్నులు 'అగ్నిష్వాత్తులు, బర్హిషదులు, సౌమ్యులు, పితలు, ఆజ్యపులు, సాగ్నులు, నిరగ్నులు' అని ఏడు రకాలుగా ఉన్నారు. ఈ అగ్నులకు, దక్షుడి కూతురు 'స్వధ'కు వయున, ధారిణి అనే ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. ఈ పిల్లలిద్దరూ జ్ఞానవిజ్ఞానాలను తుదముట్టిన బ్రహ్మవాదినులుగా ఘనత పొందారు.

ఈశ్వరునకు దక్షప్రజాపతికిని విరోధము సంభవించుట

Genealogical History of Kardama Prajapati - కర్దమప్రజాపతి సంతతి

కర్దమప్రజాపతి సంతతి

కర్దమప్రజాపతి కూతురు 'కళ'. 'మరీచికళ'లకు కశ్యపుడనే మగబిడ్డా, పూర్ణిమ అనే ఆడుబిడ్డా పుట్టారు. వీళ్లకు క్రమంగా పుట్టిన తరతరాలసంతతి వల్ల పద్నాలుగు లోకాలూ నిండిపోయాయి. ఈ 'పూర్ణిమే' మరోజన్మలో విష్ణుపాదాలు కడిగిన నీళ్లవల్ల 'గంగ' అనే పేరుతో పుట్టింది. ఈ గంగ 'దేవకుల్య' అనే ఒక కుమార్తెనూ, 'విరజుడ'నే కొడుకునూ పొందింది. ఈ విరజుడు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినాడు.

(భూలోక, భువర్లోక, సువ
ర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోక, అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలు పద్నాలుగు లోకాలు. ఇవే 'భువనంబులు'. వీటిల్లో మొదటి ఏడూ ఊర్ధ్వలోకాలు. తర్వాత ఏడూ అధోలోకాలు.

మూలంలో 'పూర్ణిమ' కొడుకు. తెనిగింపులో కూతురు. ఆ పూర్ణముడికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. అనువాదంలో ఒక కొడుకు. ఒక కూతురు దేవకుల్య గంగ. తెనిగింపులో పూర్ణిమ గంగ; ఈ గంగ కూతురు దేవకుల్య.

అత్రి మహాముని, అనసూయవలన (కర్దముడి కూతురు) వల్ల బ్రహ్మ, విష్ణు, శివాంశలతో ముగ్గురు కొడుకులను మిగుల ప్రీతితో కన్నాడు.

(అత్రి = ఇతడు సప్తర్షుల్లో మూడవముని. పురసూదనుడు= త్రిపురాలను దహించిన వాడని - మహేశ్వరుడని వ్యుత్పత్తి. దత్తాత్రేయుడు, దుర్వాసుడు, చంద్రుడు అత్రి కొడుకులు.)

విదురుడు మైత్రేయుణ్ణి ఇలా అడిగాడు. ఓ మునివరా! సృష్టికీ, పోషణకూ, లయానికీ కారణమైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వీరు అత్రిమహాముని ఇంట అనసూయకు త్రిమూర్తులు ఉన్నత గుణవంతులైన చక్కటి కొడుకులుగా పుట్టడానికి అసలు కారణం ఏమై ఉంటుందని విదురుడు ప్రశ్నించాడు. అతడితో మైత్రేయుడు ఇలా చెప్పసాగాడు.

ఓ మునివరా! విను. దైవప్రేరణతో అత్రిమహర్షి అనసూయతో కలిసి ఋక్షమనే కులపర్వతానికి వెళ్లి తపస్సు చేశాడు. ఆ కొండచరియల్లో నిర్వింధ్యానది పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. దాని అలల రొదలు ఊదినట్లుగా ఉంటాయి. ఆ నీటిలో ఏపుగా పెరిగిన అశోక చెట్లు, మోదుగు చెట్లు గల ఒక వనం అక్కడ ఉంది. ఆ చెట్లు విరబూసిన పూల గుత్తులతో అందంగా ఉంటాయి. అక్కడనే ఆ ముని ఒంటికాలిమీద నిలబడి గాలి ఆహారంగా ప్రాణాయామంతో సుఖదుఃఖాలను శీతోష్టాలను జయించినవాడై వంద దివ్యసంవత్సరాలు తపస్సు చేశాడు.

(ప్రాణవాయువుని నియమబద్ధంగా నిరోధించడాన్ని ప్రాణాయామం అంటారు. 

మానవులకు ఒక ఏడాది దేవతలకు ఒకరోజు. అలాంటి 30 ఏళ్లు దేవతలకు ఒక నెల. ఇలాంటి 12 నెలలు (1,29,600ల రోజులు) దేవతలకు ఒక ఏడాది. దీనినే 'దివ్యవర్షం' అంటారు. 

మహేంద్రం, మలయం, సహ్యం, మాల్యవంతం, బిక్షం, వింధ్యం, పారియాత్రం. ఈ ఏడింటిని 'కులపర్వతా'లంటారు.

కష్టనష్టాలు, నిందాస్తుతులు, ఆకలిదప్పులు, మానావమానాలు, రాగద్వేషాలు, సుఖదుఃఖాలు, శీతోష్టాలు మొదలైనవి 'ద్వంద్వాలు'. వీనికి లోబడనివాడు 'ద్వంద్వాతీతుడు'.)

ఇలా భయంకరమయిన తపస్సు చేస్తూ, తన మనస్సులో జగన్నాథుడయిన ఆ దైవాన్ని శరణు కోరుతాను. అతడు, నామీది ఔదార్యంతో 'తనకు సమానులైన' సంతతిని ప్రసాదించు గాక, అని అత్రిమహాముని అనుకునేంతలో

ఆ అత్రిముని శిరస్సుమీది అగ్నిజ్వాలలకు ముల్లోకాలూ ఉడికి పోవడం కళ్లారా చూశారు త్రిమూర్తులు. వారు అప్సరసలు, సురలు, సిద్ధులు, సాధ్యులు తమ కీర్తిని స్తుతిస్తుండగా ఆ మహాముని ఆశ్రమానికి వెళ్ళారు.

అలా త్రిమూర్తులు అత్రిమహర్షిఆశ్రమం చేరుకోబోతుండగా

పసిమిఛాయతో మిలమిల మెరిసిపోతున్న బ్రహ్మ చేతిలో కమండలం ఉంది. ఆయన హంస మీద వచ్చాడు. నల్లటిమబ్బు ఛాయతో ఒప్పుతున్న విష్ణువు చేతిలో సుదర్శనచక్రం ఉంది. ఆయన గరుత్మంతుడిమీద వచ్చాడు. వెన్నెల్లా తెల్లటి ఛాయగల శివుని చేతిలో త్రిశూలం ఉంది. ఆయన ఆబోతుమీద వచ్చాడు. ఇలా త్రిమూర్తులైన వాక్పతినీ, లక్ష్మీపతినీ, పార్వతీపతినీ అత్రిమహాముని కళ్లారా చూశాడు. ఆ ముని మహాతపస్సంపన్నుడు.

చల్లని చూపులతో చిరునవ్వులు చిందించే ముఖాలుగల త్రిమూర్తుల్ని అత్రిమహర్షి కనులారా చూశాడు. మహానందంతో ఎంతో పొంగిపోయాడు. సాష్టాంగ పడ్డాడు. పూలదోసిళ్లు పట్టాడు. చేతులెత్తి మొక్కాడు. వాళ్ల కాంతుల ధగధగల్లో కళ్లు చెదరి తేరిపార చూడలేక పోయాడు. ఆ మిలమిలలకు కంటిరెప్పలు మూతపడిపోయాయి. వాళ్ళ పాదాలమీదే ధ్యాస నిలిపాడు. అందరి మెప్పు పొందే చక్కటి కమ్మని లోతైన మాటలతో ఇలా స్తోత్రం చేశాడు.

ఓ పుణ్యమనస్కులార! ఇది చెప్పవలసింది. మీరు ముగ్గురూ ప్రతికల్పంలోనూ లోకాలన్నిటిని సృష్టిస్తుంటారు. పోషిస్తుంటారు. లయింప చేస్తుంటారు. మాయాగుణ వికారమైన శరీరాలు ధరిస్తుంటారు. మీరు త్రిమూర్త్యాత్మకులు. అలాంటి మీ పాదపద్మాలకు వినయపూర్వకంగా ప్రణమిల్లుతున్నాను. మీరు సకల జీవుల మనస్సులకు గోచరించనివారు. అందనివారు. మీ ముగ్గురిలో నేను పిలిచిన ఆ ఒక్కరు ఎవ్వరు. ఒక్కరిని పిలిస్తే, మీరు ముగ్గురూ ఒక్కసారిగా ప్రత్యక్షమవడం నాకు చాల ఆశ్చర్యంగా ఉంది.

అంతేకాదు. నేను సంతానంమీద అపేక్షతో ఎన్నోవిధాల పూజలు చేశాను. కాని నామనసులో స్థిరంగా ఉన్న మహానుభావుడు ఒక్కడే. అనగానే, ఆ త్రిమూర్తులు మువ్వరూ అత్రిమహామునిని చూస్తూ ఇలా తీయటి మాటలు మాట్లాడారు.

అత్రి మునీ! ఆలకించు. మేం ముగ్గురమే అయినా నిజానికి బుద్ధిపెట్టి ఆలోచించి చూస్తే మేం ఒక్కరమే. నువ్వు మనసులో కోరుకున్న కోరిక తప్పక నెరవేర్తుంది సుమా!

మా ముగ్గురియొక్క అంశాలతో మతిమంతులైన కొడుకులు పుడతారు. వారు త్రిలోకాల్లో నీ యశస్సును వ్యాప్తి గావించగల సమర్థులై ఉంటారు. ఇది నిశ్చయం సుమా!

అలా చెప్పిన సురేశ్వరులు అత్రి మహాముని మనోభీష్టాన్ని తీర్చారు. ఆ మునిచంద్రుని పూజలకు తృప్తి చెందినవారై ఇష్టానుసారంగా తిరిగి వెళ్లిపోయారు.

సుచరిత్రులు ఆ అత్రి దంపతులు. వాళ్లకు బ్రహ్మ అంశంచే చంద్రుడు పుట్టాడు. విష్ణ్వంశతో యోగవిద్యావిశారదుడైన దత్తాత్రేయుడు పుట్టాడు. శివుడి అంశతో దుర్వాసుడు పుట్టాడు. ఈ ముగ్గురూ వేలెత్తి చూపలేని పరిశుద్ధమైన చరిత్ర కలవాళ్లు.

ఓ విదురా! అంగిరసుడు అనే మునికి, శ్రద్ధ అనే కులకాంతకు పుట్టిన పుత్రికలు నల్గురు. వాళ్లు మంచి లక్షణాలుగల పిల్లలు. చక్కటి అందగత్తెలు.

ఆ నల్గురు కూతుల పేర్లు సినీవాలి, కుహువు, రాక, అనుమతి. ఆ తర్వాత అంగిరస, శ్రద్ధలకు ఇద్దరు కొడుకులు పుట్టారు. వారు స్వారోచిష మన్వంతరంలో పేరు ప్రఖ్యాతులు పొందారు.

(సినీవాలి= చంద్రకళ కన్పించే అమావాస్య(కృష్ణచతుర్దశి). అంటే అంతకుముందు వేకువన చంద్రకళ సన్నగా కన్పించగా ఆ రోజు గడచివచ్చిన అమావాస్య రాత్రిని 'సినీవాలి' అంటారు. కిందటి తెల్లవారుజామున చంద్రకళ కనుపించని అమావాస్యను 'కుహువు' అంటారు. రాకా= పూర్ణిమ, అనుమతి= శుక్ష చతుర్దశి. ఇవి దర్శ పూర్ణమాసలు మొదలైన వైదిక కర్మలకు ప్రధానమైన కాలాలకు ప్రతీకలు.)

ఆ పుత్రసంతానం భగవంతుడైన ఉచథ్యుడూ, బ్రహ్మనిష్ఠుడైన బృహస్పతి అనేవారు. వీళ్లిద్దరూ చాలా ప్రసిద్ధిక్కినవారు.

పులస్త్యుడు, హవిర్భుక్కు దంపతులకు పుట్టిన మగబిడ్డ అగస్త్వుడు. ఇతడు జన్మాంతరంలో జఠరాగ్నిగా ఉన్నాడు. ఆ తర్వాత ఈ మునికే విశ్రవసుడు అనే మరో కొడుకు పుట్టాడు.

ఆ విశ్రవసుడికి ఇలబిలకు కుబేరుడు పుట్టాడు. మరోభార్య కైకసి కడుపున రావణ, కుంభకర్ణ, విభీషణులు జన్మించారు.

పులహుడివల్ల గతి అనే కాంత, కర్మశ్రేష్ఠుడు, వరీయాంసుడు, సహిష్ణువు అనే ముగ్గురు మగపిల్లల్ని కన్నది. 

క్రతువుకి క్రియ అనే పత్నికి కల్గిన సంతానం అరవై వేలమంది. వీళ్ళు బ్రహ్మవర్చస్సుగల వాలఖిల్యులనే మహామునులు.

వసిష్ఠుడు ఊర్జ(అరుంధతి మారు పేరు) అనే మునిదంపతులకు కల్గిన సంతానం ఏడుగురు. వారు చిత్రకేతుడు, సురోచి, విరజుడు, మిత్రుడు, ఉల్బణుడు, వసుభృద్ధ్యానుడు, ద్యుమంతుడు. ఈయనే మరొక భార్యవల్ల 'శక్తి' మొదలైన పుత్రుల్ని పుట్టించాడు.

అథర్వుని భార్య చిత్తి గర్భాన దధ్యంచుడు పుట్టాడు. గుర్రం తలవంటి తల కల ఇతణ్ణి  అశ్వశిరసుడనీ అంటారు. ఇతడు ధృతవ్రతుడు.

భృగుమహర్షికి ఖ్యాతి అనే పత్నివల్ల పొందిన సంతతి ధాత, విధాత అనే ఇద్దరు కుమారులు. శ్రీ అనే ఒక కూతురు. ఈమె భగవత్పరాయణ.

ఈ కొడుకులిద్దరూ మేరువు కుమార్తెలు. ఆయతి, నియతలవల్ల మృకండుడు, ప్రాణుడు అనే కుమారుల్ని పొందారు. మృకండుడి కొడుకే మార్కండేయుడు. ప్రాణుడి కొడుకు వేదశిరసుడు. భృగువు ఉశనల కొడుకు 'కవి'.

ఈ తీరున కర్దమ ప్రజాపతి తొమ్మిదిమంది కూతుర్ల, కుమారుల సంతానపరంపరలతో ఈ భూప్రపంచం వర్ధిల్లింది. అలాంటి కర్దమముని సంతతి క్షణాల్లో పాపాల్ని తుడిచి పెడ్తుంది. ఉత్తమోత్తమం అయినది. ఆ ముని వరుససంతతి వివరాలు చాల శ్రద్ధపెట్టి వింటున్న నీకు చెప్పాను.


ఇక దక్షప్రజాపతి వంశక్రమాన్ని తెలియచెప్తాను. విను.

దక్షప్రజాపతిసంతతి

Genealogical History of Swayambhuva Manu - మైత్రేయుండు విదురునకు స్వాయంభువ మనువుత్రికల వంశవిస్తారంబు దెలువుట

మైత్రేయుండు విదురునకు స్వాయంభువ మనువుత్రికల వంశవిస్తారంబు దెలువుట

ఓ రాజా! వినండి. విదురుడితో మైత్రేయమునీంద్రుడు తిరిగి ఇలా చెప్పసాగాడు. స్వాయంభువ, శతరూప దంపతులకు ముగ్గురు కూతుళ్లూ, ఇద్దరు కొడుకులూ ఎంతో ఇంపుగా పుట్టారు. వారు ఆకూతి, దేవహూతి, ప్రసూతి, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. వీళ్లల్లో తొలిబిడ్డ ఆకూతిని మనువు, రుచి అనే ప్రజాపతికి ధర్మపత్నిగా చేశాడు. మనుమలు, మునిమనుమల పరంపర కోసం కలుపుకుంటున్న ఈ సంబంధాన్ని శతరూప కూడా సంతోషంగా సమ్మతించింది.

(సుమహిత భ్రాతృమతిని - శ్రేష్ఠులగు సోదరులుగల దానిని - అని ఆకూతిని వర్ణించడం గమనార్హం. పితా న జ్ఞాయతే యస్యా భ్రాతా యదినవిద్యతే,
నోపయిచ్చేత్తు తాం కన్యాం ధర్మలోపభయాత్యుధీః 
అన్న ధర్మశాస్త్రోక్తి ననుసరించి సోదరుడు గల కన్యను పెండ్లాడడం సముచితమన్న దృష్టితో ఇలా వర్ణించడమైనది.)

అలా పెళ్లి జరిగిన రుచిప్రజాపతి, బ్రహ్మతేజస్వి, ఉన్నతుడు, సమబుద్ధితో మనస్సును లోబరుచుకోగలవాడు అవడం వల్ల ఆకూతి కడుపున విష్ణువు అంశతో యజ్ఞుడనే మగవాడూ, విష్ణుమూర్తిని ఎపుడూ విడిచి ఉండని(ఎడబాటు ఎరుగని) జగన్మాత ఆదిలక్ష్మి అంశతో 'దక్షిణ' అనే పడుచూ జంటగా పుట్టారు. మంచివర్చస్సు కలవాడూ, విష్ణుమూర్తి స్వరూపుడూ, తన దౌహిత్రుడూ అయిన యజ్ఞుణ్ణి, స్వాయంభువమనువు ఎంతో సంతోషపడుతూ తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. సత్వ ప్రకృతిగల తన కూతురు 'దక్షిణ'ను రుచిప్రజాపతి తనయొద్దనే ఉంచుకున్నాడు. సకల మంత్రాధిదేవత అయిన శ్రీయజ్ఞుడు, తననే వరించాలనే ఉద్దేశంతో ఉన్న 'దక్షిణ'ను పెళ్లాడాడు. వాళ్లు ఆది దంపతులు కాబట్టి అన్నాచెల్లెళ్ల వరుసగల ఆ ఇద్దరి పెళ్లి ఎవరికీ నిషేధింపదగినది కాలేదు. (సరికాదనిగాని జరుగరానిదని కాని అనిపించనిదని భావం) అని చెప్పి మైత్రేయుడు మళ్లీ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు.

(ఈ విశిష్టవివాహవిధి నిషేధింపతగినది కాదని భావం. ఎందుకంటే తరువాతతరువాత వధూవర కులగోత్రాల నియమాలు అప్పటికి ఏర్పడినవి కావు.)

ఓ విదురా! దేవతలచేత పొగడబడిన పుణ్యదంపతులు దక్షిణాశ్రీయజ్ఞులకు అతిబలవంతులైన “యామ” అనే పేర్లుగల పిల్లలు కలిగారు.

(యామములు అంటే జాములు అని అర్ధం. ఒక రోజులోని (పగలు, రాత్రి) 12 కాలభాగాలు. ఒక్కొక్క భాగం ఒకరాశి ప్రమాణంతో ఉంటుంది.)

తోషుడు, ప్రతోషుడు, సంతోషుడు, భద్రుడు, శాంతి, ఇడస్పతి, ఇధ్ముడు, కవి, విభుడు, వహ్ని, సుదేవుడు, రోచనుడు అనే పన్నెండుమంది పిల్లలు పుట్టారు. వీళ్లే స్వాయంభువ మన్వంతర కాలంలో 'తుషితులు' అనే పేరుతో దేవతలుగా ప్రసిద్ధిని పొందారు. ఇంకా ఆ మన్వంతరంలోనే మరీచి మొదలైన మునినాథులూ, యజ్ఞుడూ, ఇంద్రుడూ ఇంకా కాంతిమంతులైన ప్రియవ్రత ఉత్తానపాదులునూ ఆ కొడుకులూ, మనుమలూ, ముని మనుమలతో వ్యాపించి వృద్ధిపొందారు.

మనువు రెండో కూతురైన దేవహూతిని కర్దమునికి అప్పగించి ఆ వంశాన్ని వృద్ధి చేశారని ముందే తెలిపాను. ఇక ఆ మనువు మూడవ సంతానం అయిన 'ప్రసూతి' అనే కన్యకను బ్రహ్మకొడుకు దక్షుడి కిచ్చాడు. ఆ దక్షప్రసూతులకు కల్గిన సంతతి తరతరానికి పెరిగి పోయి ముల్లోకాలకూ వ్యాపించింది. ఇక కర్దముడి ఆడపిల్లలందరూ బ్రహ్మర్షులకు భార్య లయ్యారు. వాళ్ల సంతానక్రమాన్ని వివరిస్తాను.

After Virabhadra Destroyed Daksha's Yagna, Demigods, Priests Approached Lord Brahma - దేవతలు వీరభద్రాదులచే బరాజితులై బ్రహ్మతో విన్నవించుట

దేవతలు వీరభద్రాదులచే బరాజితులై బ్రహ్మతో విన్నవించుట శివుడి ప్రమథసేనలచే దేవతలంతా వాళ్ల కత్తులు, గదలు, చురకత్తులు వంటి పోటు ముట్టుల తాకిళ్లకు ...