శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దుర్గమాసురనాశిని
పిమ్మట దుర్గమాసురుడు గొప్ప యల్లకల్లోలము జరుగుచున్నదని తన దూతవలన విని ససైన్య ముగ సాయుధుడై బయలుదేరెను. అతడు వేయి యక్షౌహిణుల సేనలతో వచ్చి వేగమున శరములు వదలుచు దేవి చెంత నున్న దేవసైన్యము నెదుర్కొనెను. మఱియు నతడు బ్రాహ్మణుల గుంపుల నడ్డగించెను.
అపుడు దేవగణములు గగ్గోలు పడెను. విప్రులుమను దేవతలను త్రాహి త్రాహీ యను కేకలు వేసిరి. శివాదేవి వారి మొఱ యాలించి దేవతల చుట్టు తేజోమయ చక్రము నిర్మించెను. అది వారికి శ్రీరామరక్షగ నుండెను. దేవి బయట నిర్బయముగ నిలుచుండెను. ఆపుడు దేవీ దైత్యుల మధ్య నిర్వురకు ఘోర సమరము సంఘటిల్లెను.
వారి బాణవర్షమువలన సూర్యమండలము కనిపించకుండెను. బాణముల యొండొంటి తాకుడువలన నిప్పురవ్వలు దుముకుచుండెను. వారి గట్టి యల్లెత్రాటి టంకారముతో దిక్కులకు చెవుడు వచ్చెను. అట్టి యుద్ధ సమయమునందు దేవి శరీరమునుండి పలుతీవ్రశక్తు లుద్బవించిరి. వారు కాళిక-తారిణి-బాల-త్రిపుర-భైరవి-రమ-బగళ-మాతంగి-త్రిపురసుందరి-కామాక్షి-తులజాదేవి-జంభిని-మోహిని-ఛిన్నమస్త-గుహ్యాకాళి-దశసహస్ర బాహుక-యనబరగువారు.
వీరుకాక మఱి ముప్పదిరెండు మంది-తర్వాత నరువదినల్గురు-నటుతర్వాత లెక్క పెట్టరానంత మంది- దేవి దివ్యావ యవములనుండి సాయుధలై యుద్బవించిరి. ఆ శక్తులందరవలన దైత్యుని నూఱక్షౌహిణుల సేన తుదముట్టెను. రణరంగమున మృదంగ-శంఖ-వీణాధ్వనులు మిన్ను ముట్టెను.
అపుడు సేనాపతియగు దుర్గమాసురుడు మొట్టమొదట ముందునకు దుమికి భిన్నశక్తులతో పోర తలపడెను. అట్లు పది దినములు జరిగిన భీకర యుద్ధములో కొన్ని యక్షౌహిణుల సైన్యము హత మయ్యెను. నెత్తురు టేర్లు ప్రవహించెను. అతడు పడునొకండవనాడు రక్తమాల్యంబరంబులు దాల్చి రక్తగంధము పూసికొనెను. అతడు పెద్ద పండుగ జరుపుకొని మహా సంరంభముతో రథమెక్కివచ్చి యెల్లశక్తుల నోడించెను.
అతడు పిదప తన రథమును శ్రీపరాశక్తి రథము నెట్ట యెదుటికి పోనిచ్చెను. అపుడు దేవి దైత్యుల మధ్య ద్వంద్వయుద్ధము జరిగెను. వారి మధ్య చూపఱు గుండె లవియునట్టుల పోరు ఘోరముగ రెండుజాములు జరిగెను. పిమ్మట దేవి పదునైదు తీవ్రబాణములు వదలెను. వానిలో నాల్గింటివలన నాల్గు గుఱ్ఱములు-నొక్క బాణమున సారథిని-రెంట వాని కండ్లను-రెంట భుజములు-నొక్కట టెక్కమును-ఐదింట వాని యెడదను-వ్రయ్యవ్రయ్యలుచేసి వేసెను.
వాడు నోట నెత్తురు గ్రక్కుచు శ్రీదేవి సన్నిధిలో నసు వాలు పాసెను. వానినుండి యొక దివ్యతేజము వెలువడి దేవిలో ప్రవేశించెను. బలశాలియగు దైత్యుడు చావగనే యెల్లలోక ములు సంతసిల్లెను. ఆ సమయంబున బ్రహ్మాదులు హరిహరాదులను ముందుంచుకొని పరాభక్తితో మధురవాక్కులతో జగ దంబిక నీ విధముగ నన్నుతించిరి.
ఓ పరమేశ్వరీ! శాకంభరీ! శతాక్షీ! శివా ! బ్రహ్మాండగోళము లెల్ల భ్రమించి పరిభ్రమిం చుట నీవే మూలకారణము. సకలోపనిషత్తులచేత సుతింపబడు జ్ఞానస్రనూనాంబవు నీవే. ఓ దుర్గమాసుర విభంజనీ! జయ మంగళ స్వరూపిణీ! పంచకోశాంతర సంస్థితా! మాయేశ్వరీ ! నీ కివే మా వందనశతంబులు.
ఏ త్రిభువనేశ్వరి నెల్లమునులు నిర్మల-నిశ్చలచిత్తములతో నను ధ్యానింతురో యట్టి ప్రణవస్వరూపిణీ! జననీ! నీ కివే మా వందనశతంబులు. అనంతకోటి బ్రహ్మాండ జనయిత్రీ! బ్రహ్మవిష్ణ్వాదుల జననీ! దివ్యమంగళమూర్తియగు జగద్ధాత్రీ! నీ కివే మా వందనశతంబులు. నీవు దయామతల్లివి-పరమేశ్వరివి-విశ్వైకమాతవు-శతాక్షీ మాతవు.
కాబట్టి పామరులమైన మమ్ముజూచి యేడ్చితివి. నీవు తక్క సర్వేశ్వరుడు నట్లు చేయడు. అని బ్రహ్మవిష్ణువు మొదలుగాగల దేవతలు దేవిని నుతించి వివిధ ద్రవ్యములతో సంపూజించిరి. దేవి యదే క్షణమున సంతుష్టురాయ్యెను. పికభాషిణియగు దేవి ప్రసన్నయై వేదములు దెచ్చి విప్రుల కొసంగి
యిట్లు పలికెను: ఇవి నా యుత్తము శరీరమువంటివి. వీనిని చక్కగ భద్రముగ రక్షింపుకొనుడు. ఇవి లేనందున గల్గిన యనర్థము. మీ రిపుడే సనిదర్శనముగ జూచితిరి గదా. నన్ను నిరంతరముగ పూజింపుడు. సంసేవింపుడు. మీ మేలు వెల్గుగోరి నేనిదంతయును చెప్పుచున్నాను. నా యీ యుత్తమ దివ్యమహాత్మ్యమును మీరలు సతతము పఠించుడు. దానివలన నేను సంతుష్టిజెంది మీ కోరిక లెల్ల దీర్చగలను.
దుర్గమాసురుని దెగటార్చుటవలన గల్గిన దుర్గానామమును శతాక్షీనామము నుచ్చరించినవాడు మాయను దాటి పరమపదము జేరగలడు. వేయేల? ఒక ముఖ్య విషయ మేమన సురాసురు లెల్లరును నన్నే సదాగతిగ సతము సేవింపవలయును. అని సచ్చిదానంద స్వరూపిణి యెల్లవారికి సంతోషము గల్గించుచు నచటనే యెల్ల దేవతలు చూచుచుండగ నదృశ్య యయ్యెను.
ఈ విధముగ పరమకల్యాణకారకమగు శ్రీదేవి మహాత్మ్యము గూర్చిన రహస్యకథ నీకు వివరించితిని. దీనిని యత్నించి రహస్యముగ నుంచుము. ఎవ్వాడీ శ్రీదేవీ పరమాధ్యాయము విశ్వాత్మభావముతో భక్తిద్ధ్రలతో నాలించునో వాడిచట కోర్కె లెల్ల బడసి పిదప తప్పక శ్రీదేవీలోకము జేరలగలడు.
వ్యాసు డిట్లనియెను : ఈ ప్రకారముగ సూర్యచంద్రవంశము లందలి పేరుగాంచిన రాజులు యుత్తమ చరితములు నాచే కొంత వర్ణింపబడదగినవి గలవు.
ఓ రాజా! వీరెల్లరును శ్రీపరాశక్తి ప్రసాదము వలననే యింతగ మహనీయత్వముబడసిరని తెలిసికొనుము. ఎచ్చటెచ్చట మహదైశ్వర్యములు-ఓజోగుణము-విభూతిమత్త్వవము నుండునో యచ్చటచ్చట నదంతయును శ్రీపరాశక్త్యంశమువలననే కల్గినదని నిక్క మెఱుంగుము. వీరును మఱి తక్కిన రాజులును శ్రీయాదిపరాశక్తి నుపాసించిన వారనియు సంసార వృక్షమూలమును ఛేదించు గొడ్డలివంటి వారనియు తెలియుము.
కనుక ధాన్యార్థియైన ప్రతివాడు వడ్లపొట్టునువలె సంసార విషయములను వదలి శ్రీత్రిభువనేశ్వరి నెల్లవిధముల సంసేవింపవలయును. ఓ రాజా! ఈ సకల వేదములనెడు పాలసంద్రలను మథించి మథించి తుదకు శ్రీజగదంబికా పాదకమలములనెడు జాతిరత్నములు పడసి ధన్యభాగ్యుడ నైతిని. పంచబ్రహ్మాసనారూఢ-శ్రీపరాశక్తి యొక్కతెయే - మఱవ్వరునుగారు.
కనుక నామెకు బ్రహ్మ-విష్ణు-రుద్ర-శివ-ఈశ్వర-సదాశివులు వరుసగ భూమి-జలము-అగ్ని-వాయువు-ఆకాశము అను భూతముల కధిపతులు. ఈ పంచ తత్త్వములకంటె ఇతరమగునది వేదములందవ్యక్తమని చెప్పబడును. ఆమె మణులందు దారమువలె నంతట వ్యాపించియుండుటచే త్రిభువనేశ్వరి యయ్యెను.
రాజా! శ్రీమాతృదేవత నెఱుగక జీవుడు జన్మకోటులకైన మోక్షసుఖ మందజాలడు. నీలాల నింగిని తోలుతో గప్పలేము గదా! అటులే శ్రీమంగళ##దేవత నెఱుగక మానవులు సుఖములు పడయరు. కనుకనే శ్వేతాశ్వతర శాఖీయులు త్రిగుణములచేత నిగూఢయగు సర్వదేవతాత్మకశక్తిని నెఱుంగగలుగుదురని శ్రుతులయందు ప్రవచించున్నారు.
కనుక మానవుడు తన జన్మము తరించుట కెల్ల ప్రయత్నములతో సిగ్గుచేగాని భీతిచేగాని భక్తిచేగాని ప్రేమచేగాని సర్వసంగములు వదలి మనస్సును హృదయమున నిలుపవలయును. శ్రీదేవీ నిష్ఠుడు శ్రీమాతృపూజా తత్పరుడై యుండవలయునని వేదాంతభేరి మ్రోగుచున్నది. ప్రతివాడు నెట్టి నెపముతోనైనను నిదురించుచు నడచుచు నిలుచుండుచు శ్రీదేవిని దలచవల యును.
శ్రీదేవిని నిరంతరము కీర్తించవలయును. బంధములను బాయవలయును. కనుక రాజా! సర్వప్రయత్నముతో శ్రీమహేశ్వరినే భజింపవలయును. మొదట శ్రీదేవతయొక్క విరాడ్రూపమును తర్వాత సూక్ష్మరూపము నటుతర్వాత సర్వాంతర్యామి స్వరూపమును మెల్లమెల్లగ మెట్టు లెక్కునట్టుల గనవలయును. అపుడు చిత్తము నిశ్చలము నిర్మలము నగును.
అపుడీ ప్రపంచ విషయ వానస లుజ్జగించి శ్రీపరాశక్తి-పరబ్రహ్మ స్వరూపిణి-యగు సచ్చిదానంద స్వరూపిణి నారాధింపుము. రాజా! ఆ తల్లియందు చిత్తము లయ మొనర్చుటే భక్తి-యారాధన-యగును. అట్టివారే పరాశక్తి భక్తులు. వారే ధార్మికులు. సూర్యచంద్రవంశజులు-మహామనస్వులు రాజులునైన వారి మహత్త్వ పూర్ణచరిత్రము నిటుల వర్ణించితిని. ఇది పావనము-కీర్తిమంతయు-ధర్మబుద్ధిని-సద్గతిని-నొసంగునది. పుణ్యప్రదము. రాజా! దీనితర్వాత నీ కింకేమి విన కుతూహల మగుచున్నదో తెల్పుము.
హరిహరులకు గర్వభంగం