Monday, March 2, 2026

Maharaja Prithu attained liberation(Mukthi/Moksha) - పృథు చక్రవర్తిజ్ఞానవైరాగ్య వంతుండై ముక్తి నొందుట

పృథు చక్రవర్తిజ్ఞానవైరాగ్య వంతుండై ముక్తి నొందుట

మహాత్మా! విదురా! విను. ప్రసిద్ధుడైన ఆ పృథువు చెదరని మనస్సుతో పరమాత్మపట్ల నిష్ఠకలవాడైన తనను సంపాదించిన సర్వమైన కాంక్షలు కలవానినిగా సంభావించాడు.

(వైన్యుడు - వేనుని కుమారుడు - పృథువు; నిష్ట అంటే నియతమైన స్థితి - ఒకదానికి కట్టుబడి ఉండటం: అవాప్తకాముడు అంటే కోరికలు తీరినవాడు. ఇది వేదాంత విషయంలో ఒక పరిభాష వంటిది. ఏది పొందిన తరువాత పొందవలసింది మరొకటి ఉండదో అది పొందినవాడు అని భావం. అది పరమాత్మజ్ఞానం. ఏకాగ్రచిత్తుడు ఒకదానియందే లగ్నమైన చిత్తం కలవాడు. ఇది సాధనతో మాత్రమే కలుగుతుంది. ప్రకృతంలో ఏక శబ్దానికి పరమాత్మ అనే అర్థం తీసుకోవాలి. పరమాత్మలో నిలిచిన చిత్తం కలవాడని అర్ధం; ముఖ్యుడు అంటే దేహంలో ముఖానికున్న స్థానంవంటి స్థితి కలవాడని అర్ధం. తరువాత వివరిస్తున్న అతని ప్రవృత్తినిబట్టి ఈ పదం సాభివ్రాయంగా ప్రయోగించినట్లు తెలుస్తుంది.)

తరువాత, దేశానికీ కాలానికీ తగినవిధంగా బలాన్నీ ధనాన్నీ ఉపయోగిస్తూ యజ్ఞాలను, ఇతరధర్మాలను, ఫలాన్ని బ్రహ్మానికి సమర్పించే బుద్ధితో కర్మలయందు శ్రద్ధకలవాడై చేస్తూ ఉన్నాడు. ప్రకృతికంటె ఆవలిదైన పరమాత్మనుగా తననూ కర్మల సమూహాలకు సాక్షిగా బుద్ధిలో ప్రయత్నంతో భావిస్తూ కర్మలను ఆచరిస్తున్నాడు. అదేవిధంగా సామ్రాజ్య సంపదలైన దివాణాలల్లో, ఉద్యానవనాలల్లో, అరణ్యభూములల్లో రాజ్యమహిమ మెలగుతూ ఉండగా అహంకారాన్ని వదలిపెట్టి, మనస్సులో ఇంద్రియాల విషయాలైన శబ్బాదులల్లో తగులం పెట్టుకోకుండా మిక్కిలి గొప్ప ఉదారబుద్ధి కలిగి ఉన్నాడు.

(కర్మాసక్తుడు - నిజానికి కర్మలలో ఆసక్తి గుణం కాదు. కానీ బ్రహ్మార్పణబుద్ధితో చేయటంవల్ల అది గుణం అవుతుంది. ఇది శ్రద్ధను తెలియజేస్తుంది.

ప్రకృతి అంటే అవ్యక్తపరతత్త్వంనుండి వ్యక్తంగా రూపొందిన నామరూపాత్మకమైన విశ్వం. దానికి పరమైనది పరమాత్మ. "అహం బ్రహ్మా
స్మి” నేను ఆ బ్రహ్మమనే జ్ఞానంతో ప్రవర్తించాడు పృథుచక్రవర్తి అని తాత్పర్యం. పరమాత్మ సాక్షిమాత్రంగా ఉంటాడు. సాక్షాత్తుగా చూచువానిని సాక్షి అంటారు. సాక్షి అయినా ఫలం మొదలైనవాని సంబంధం లేకుండా కేవలుడుగా ఉండే తత్త్వాన్ని పరమాత్మ అంటారు. ఆ విధంగా పరమాత్మను సంభావించటమే జ్ఞానం. 

అహంకార రహితుండు - పరమాత్మకంటె వేరుగా దేహం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి మొదలైన వానితో అదే నేను అనేభావన కలిగి ఉండటం అహంకారం. అది అజ్ఞానం. దానివలన పరమాత్మను సాధకుడు పొందడు. కనుక పృథువు అహంకారరహితుడైనాడు.

సన్మహా+ఉదారుండు - ఉదారుడు అంటే ఇతరుల విషయంలో ఆర్ద్రమైన చిత్తంతో వ్యవహరించేవాడు. ఆ లక్షణం మంచిగా, గొప్పగా ఉన్నవాడు పృథువు. ఇది కూడా తాత్త్వికంగా పరమాత్మను అన్నింటిలో అందరిలో దర్శించే మహా విషయం.

ఇంద్రియ +అర్థాలు = చెవి, చర్మం, కన్ను నాలుక, ముక్కు అనేవి ఇంద్రియాలు. అవి గ్రహించే, శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అనేవి విషయాలు. ఇంద్రియాలను బంధిస్తాయి కట్టిపడవేస్తాయి కనుక వీనికి విషయాలు అనే వ్యవహారం కలిగింది.)

ఈ విధంగా ఆ పృథుచక్రవర్తి అధ్యాత్మమనే యోగంలో నిష్ఠకలవాడై కర్మలను శ్రద్ధతో చేస్తూ అర్చి అనే భార్యయందు విజితాశ్వుడు, ధూమ్రకేశుడు, హర్యశ్వుడు, ద్రవిణుడు, వృకుడు అనే కుమారులను ఐదుగురిని పొందాడు తరువాత 

(అధ్యాత్మయోగనిష్ఠుండు - ఆత్మ అంటే ఇక్కడ దేహం. అధ్యాత్మ అంటే దేహమునందున్న అని అర్ధం. యోగం అంటే కర్మములందు కౌశలం= నేర్పు. నిష్ఠ అంటే ఎన్ని విఘ్నాలు కలిగినా చెదరకుండటం. కనుక ఆత్మవిద్యలో గట్టిపట్టు సాధించినవాడు అని ఈ పదానికి తాత్పర్యం.

ఆత్మవిద్య కర్మలకంటె పైస్థాయికి చెందినది. అయినా కర్మ ఆత్మవిద్యకు అత్యవసరమైన చిత్తశుద్ధిని కలిగిస్తుంది. చిత్తశుద్ధిలేని ఆత్మవిద్య ఫలాన్నివ్వదు. చిత్తశుద్ధి నిరంతరంగా ఉండాలి కనుక కర్మలను నిరంతరంగా చేస్తూ ఉండవలసిందే.

విదురా! ఆ మహారాజు రాజనీతి ననుసరించి భూమియందలి ప్రజలనుండి కప్పం రూపంలో ధనాలు గ్రహించి మళ్లీ దానమనే నెపంతో వారికే ఇస్తూ సూర్యునివలె ప్రకాశించాడు.

(పృథువుకు సూర్యునితో పోలికను కవి ఇక్కడ చెప్పాడు. రాజు పన్నుల పేరుతో ప్రజలనుండి గ్రహించే ధనాన్ని వారి సంక్షేమానికే వెచ్చిస్తాడు. సూర్యుడు సముద్రం మొదలైన మహాజలాశయాలనుండి నీటిని తీసుకొని మేఘాలుగా రూపొందించి మళ్లీ పంటలకోసం వర్షరూపంతో ఇచ్చివేస్తూ ఉంటాడు. ఈ పోలికవల్ల పృథుచక్రవర్తి తన సుఖంకోసం, తనవారి సుఖంకోసం కాక ప్రజల సుఖంకోసమే పన్నులను గ్రహిస్తున్నాడు, తనకోసం ఏమీ మిగుల్చుకోలేదు అనే అర్థం ధ్వనిరూపంలో తెలియ వస్తున్నది.)

ఆ పృథుచక్రవర్తి అగ్నిదేవుని విధాన అణచరాని తేజస్సుకలవాడు. దేవేంద్రునిలాగా గెలువరానివాడు. భూదేవివలె అన్ని కాలాలలో సహనం కలవాడు, స్వర్గంలాగా కోరినవాటిని అన్నింటినీ ఇచ్చేవాడు. వర్షదేవతవలె కోరికలను కురిపించేవాడు. సముద్రునివలె లోతెరుగురాని లక్షణం కలవాడు. సువర్ణపర్వతంవలె గొప్ప దేహబలం కలవాడు. యమధర్మరాజువలె ప్రజలను శిక్షించేవాడు. స్వర్గలోకపు ప్రభువువలె మహాప్రభువుతనంతో అలరారేవాడు, కుబేరునివలె గొప్పధనసంపద కలవాడు, వరుణ దేవునివలె గుట్టుగా దాచుకొన్న సంపదలు కలవాడు. వాయుదేవునివలె అంతటా సంచారశక్తి కలవాడై బలం, దేహకాంతి పరాక్రమం మిన్నగా గలవాడు. రుద్రునివలె సహించశక్యం కాని వేడిమి కలవాడు. మన్మథునివలె గొప్ప సౌందర్యం కలవాడు. సింహంవలె మిక్కుటమైన విక్రమంతో కూడినవాడు. మనువువలె ప్రజలందరియందు కన్నబిడ్ణయందలి ప్రేమ కలవాడు. బ్రహ్మవలె రజోగుణాలతో కూడినవాడు. బృహస్పతివలె వేదవిద్యలో ఆరితేరివాడు, పరమేశ్వరునివలె ఇంద్రియాలను తన అదుపులో ఉంచుకొన్నవాడు. ఇటువంటివాడై విష్ణువునందే మనస్సు ఉంచి ప్రవర్తించే గోవులందూ, గురువులందూ, విద్వాసంపదగల బ్రాహ్మణులందు భక్తి కలిగి, పాడుపనులయెడ సిగ్గుతో, వినయంతో, మంచి స్వభావంతో మెలగటంలో ఇతరులకు ఉపకారం చేయటంలో సాటిలేనివాడై ఈ విధంగా లోకపాలుర వేరువేరుగుణాలన్నింటినీ తానొక్కడే తాల్చి ఉన్నాడు.

(ఈ వచనంలో చెప్పినదానిని బట్టి లోకపాలురలో ఉన్న ఒక్కొక్కగుణం ఇతనిలో కలిసి ఉండటంవలన లోకపాలురందరికంటె మహామహిమ కలవాడని చెప్పినట్లయింది. రాజు అష్టదిగ్రాజుల అంశ గలవాడు.)

పుణ్యాత్ముడా! ఆ గొప్పకీర్తితో మహానుభావుడై ఆ పృథుచక్రవర్తి సకలజనులూ కొనియాడే శ్రీరామచంద్రునివలె మంచితనం గల జనుల చెవులకు వినవస్తూ ఉండేవాడు.

సరసాలైన మాటల అర్థాలు గల మంచివారి సముదాయాలు ఒప్పైనవిధంగా ఆయన కీర్తిని గానం చేస్తున్నారు. ఆ కీర్తి సర్వకాలాలలో మార్పులు లేకుండా గొప్పగా ప్రవాహరూపంలో బుద్దిమంతుల చెవులలో చొచ్చుకొనిపోతూ ఉంది. అతని పలుకులలో, భావనలలో మంచితనమే గోచరిస్తూ ఉంటుంది. ఆ విధంగా ప్రజలందరియందు అనురాగం కలవాడై అతడు మరొక చంద్రుడా అన్నట్లు ప్రకాశిస్తున్నాడు.

అతడు పండిన జ్ఞానసంపదకలవాడు. చక్కగా పెంపొందించిన తాను పండించిన పంటలు, నిర్మించిన గ్రామాలూ పట్టణాలూ కలవాడు. ప్రజలను చక్కగా ఏలినవాడు. చరాచరాలకు కూడా స్థితిని కల్పించినవాడు. మంచివారి ధర్మాలను ఆచరించేవాడు, భగవంతుని శాసనాలను పొల్లుపోకుండా అమలుపరచినవాడు. అట్టి పృథుచక్రవర్తి ఒకనాడు తనముదిమిని గమనించాడు. తనబిడ్డ అయిన ప్పథ్విని తనకొడుకులకు అప్పగించాడు. ప్రజలందరు తన యెడబాటునకు కుమిలిపోతూ ఉండగా తనభార్యతో కలిసి, ఎట్టి విఘ్నాలకు చెడని నియమాలు కలవాడై వైఖానసులకు ఆదరించదగిన ఘోరమైన తపస్సులో, మునుపు దిగ్విజయం నడపేసమయంలో ఎలా ఉత్సాహంతో ప్రవర్తించాడో ఆ విధంగా ప్రవర్తిస్తూ తపస్సుకోసం అడవులకు పోయాడు. అక్కడ

(ఇందులో పృథువు ప్రవృత్తి ధర్మంలోనూ, నివృత్తి ధర్మంలోను సాధించిన పరిణతిని చక్కగా తెలియజెప్పాడు కవి. సాధారణంగా ఇహలోకసుఖాలను మరగినవాడు వాటినుండి తొలగటానికి ఇష్టపడడు. కానీ అతడు ఉదాత్తచిత్తుడు కనుక ముసలితనం వచ్చినవెంటనే ఇహలోక సుఖాలకు విముఖుడు కాగల్గాడు.

వైఖానస సమ్మతంబు - బ్రహ్మచర్యం, గృహస్థధర్మం, వాన ప్రస్థధర్మం, సన్యాసధర్మం అని నాలుగు జీవనదశలో మూడవదానిని వైఖానసం అనికూడా అంటారు. సంసారంనుండి విరక్తుడై కేవలం పరలోకసుఖాన్ని అపేక్షిస్తూ ధర్మపత్నితో కలిసిఉండి నియమబద్ధ జీవితాన్ని గడపటం వానప్రస్థధర్మం. దానినే ఇక్కడ 'వైఖానసం' అన్నారు.

పృథువు భూమిని పంటలకు యోగ్యమైనదిగా తనవింటి కొప్పుతో చేశాడు. కనుక అతనిపేరుతో దానికి పృథ్వి అనేపేరు కలిగింది. ఆ విధంగా భూమి అతనిపుత్రిక.

ఆ మహారాజు పెద్దకాలం దుంపలు, వేళ్లు, పండ్లుతింటూ తపస్సు అతికఠినంగా చేశాడు. తరువాత గడ్డిపరకలు, పండిరాలిన ఆకులు తిన్నాడు. అటుపిమ్మట నీరుమాత్రమే తాగుతూ తపస్సు చేశాడు. చివరకు అది కూడా మానివేసి గాలినిమాత్రం లోపలికి తీసుకుంటూ తపస్సు చేశాడు.

(తపస్సు అంటే కాలిపోవటం, గాఢమైన భావన అని రెండర్థాలు. ఏమేమి చేస్తే అది ఫలాన్నిచ్చేదవుతుందో ఈ పద్యంలో కవి వర్ణించాడు.

"అన్నమయం హి సౌమ్య మనః" మనస్సు అన్నాన్నిబట్టి ఏర్పడుతుంది అని ఉపనిషత్తు అంటున్నది. కనుక అన్నం విషయంలో లౌల్యం లేకపోతే మనస్సు నిలుకడగా ఉంటుంది. నిలుకడగల మనస్సే తపస్సుకు యోగ్యతను కలిగిస్తుంది. ఆ అన్నలౌల్యాన్ని చెదరని మనస్సుతో గెలవటాన్ని ఇక్కడ చెప్పారు.)

ఈ తీరున ప్రవర్తిస్తూ, ఆ రాజు ఘోరమైన మండు వేసవికాలంలో బాగుగా దరికొల్పబడిన అయిదు మంటలమధ్యలో ఉండి, ఆగకుండా ముసురుపట్టి కురిసే వానలకాలంలో ఒడలుమీద వస్త్రం కప్పుకోకుండా ఆరుబయట నిలబడి, జనులు తట్టుకోలేక ఉహుహ్హూ అంటూ వణకిపోయే చలివేళలో గొంతుక/పీక మునిగేదాకా ఉండే నీళ్లలో నివసించి, మంచు పెల్లుగా నలుదిక్కులా వ్యాపించే సమయంలో వట్టి నేలమీద దేహాన్ని నిలిపి విశ్రాంతి తీసుకొని గొప్పనిష్ఠతో, చలి ఎండ మొదలైన ప్రకృతి బాధలను సహించే లక్షణంకలవాడై, మాటలయందు జారుపాటులేనివాడై, ప్రాణాయామం సాధించినవాడై, బాహ్యేంద్రియాల కదలికలను నిలుపుచేసుకొన్నవాడై, బుద్దిని వెలుగొందజేస్తూ భగవంతునియందే కట్టిపడవెసినవాడైై, పాపాలు లేనివాడై, పైకి ప్రసరించే విధంగా వీర్యాన్ని పట్టుకోగలవాడై క్రమానికి తగినట్లుగా

మిక్కిలి కఠోరమైన తపస్సు చేశాడు. ఈ విధంగా వరుసగా పైపైకి వ్యాపించిన తపస్సుతో అన్ని పాపాలను రూపుమాపుకొని ప్రాణాయామాలచేత లోపలి పగవారిని ఆరుగురిని గెలిచి, బంధాలన్నింటిని తెంచి వైచుకొని పురుషులలో అత్యుత్తముడైన పృథువనే మహారాజు పరమపూజ్యుడైన సనత్కుమారుడు తెలిపిన యోగమార్గంతో పరమేశ్వరభజనం చేశాడు. ఇట్లు భగవద్ధర్మాలమీద మాత్రమే నిష్ఠ గలవాడై చక్కని ప్రవర్తన, శ్రద్ధ గలవాడయిన ఆ పృథువునకు శ్రీమహావిష్ణువునందు భక్తి మరొక భావనతో తగులులేనిదై వృద్ధిపొందింది. ఆ విధంగా

విదురా! భగవంతుని పరిచర్య అనే పూజ చేయటంచేత నిర్మలమైన హృదయం కలవాడయ్యాడు. అట్టి ఆ పృథువునకు విష్ణువుయొక్క నిరంతర స్మరణంచేత

(చెడ్డ భావాలు కదలాడుతూ ఉండటాన్ని మనోమాలిన్యం అంటారు. అది ఏ కొంచెం ఉన్నా భగవంతుని ఆరాధన సఫలం కాదు. మిక్కిలి శ్రేష్ఠమైన పరిచర్యా విధానంతో పృథువు దానిని రూపుమాపుకున్నాడు. శుద్ధమైన అంతకరణం కలవాడయ్యాడు. దానిచేత విష్ణుకథలు అతని హృదయంలో మరొక భావన అడ్దుపడకుండా నిలిచిపోతున్నాయి. సాధకుడు ఈ స్థితిని సాధించాలని వ్యంగ్యమైన ఉపదేశం.)

ఆ సంపూర్ణమైన భక్తివలన, అంతకుముందు చాలా ఎక్కువగా ఎల్లకాలంలో సందేహాలతో నిండినదై పెరిగిపోయిన హృదయపుముడిని తొలగించివేసే వైరాగ్యంతో కూడినబుద్ధి అతనికి కలిగింది.

విరక్తితో కూడిన బుద్ధి ఏర్పడగా అతనికి వెనువెంటనే దేహమే ఆత్మ అనే జ్ఞానం పూర్తిగా తెగిపోయింది. ఆత్మస్వరూపం ఏమిటో తెలియవచ్చింది. అప్పుడు శ్రీకృష్ణుని కథలయందు ఆసక్తి కలిగింది. యోగసిద్దులన్నింటియందూ కోరిక వదలిపోయింది. హృదయంలోని అజ్ఞానమనే ముడిని పటాపంచలుచెసే జ్ఞానమనే యోగం చక్కగా కలిగింది. అయితే జ్ఞానసిద్ధి కలిగింది కనుక దానినికూడా వదలివేశాడు. జీవుడుగా ఉన్న ఆత్మను, పరమాత్మతో కలిపివేశాడు. అప్పుడతడు బ్రహ్మమే అయిపోయాడు. ఇంక రక్తమాంసాదులతో ఉన్న దేహమనే కట్టెతో పనిలేదు కనుక దానిని వదలివేయాలని నిశ్చయించుకున్నాడు.

ఆ రాజు మడమలతో ముడ్దిదగ్గరితావును గట్టిగా నొక్కాడు. తరువాత ఆసనభాగాన్ని వదలివేసి కూర్చున్నాడు. (ఆసనానికి మడమలు తాకకుండా పైకి శరీరాన్ని ఎత్తి నిలిపాడని అర్థం). వెన్నుపూస ప్రారంభమయ్యే మొదటి భాగాన్ని మూలాధారం అంటారు. అక్కడినుండి వాయువును మెల్లగా పైకి పాకేట్లు చేశాడు. బొడ్దుదగ్గరకు చేర్చాడు. వరుసగా హృదయం, దానికి కొంచెం పైభాగం, కంఠదేశం అనే స్థానాలకు ప్రసరింపజేశాడు. అక్కడినుండి నడినెత్తిమీదికి - అంటే సహస్రారపద్మంలోనికి చొనిపాడు. ప్రాణం, అపానం మొదలైన ఐదు వాయువుల పనులను ఆపివేశాడు. తనలోని గాలిని గాలిలో, ఆకాశాన్ని ఆకాశంలో, అగ్నిని అగ్నిలో, నీటిని నీటిలో, మిగిలిన మాంసం మొదలైన ధాతువులతో కూడిన కట్టెను భూమిలో - అవి వాని మొదటి స్థానాలు కనుక - కలిపివేశాడు.

(యోగవిధానంలో ఇలా ప్రాణాలు వదలటం ఒక మహావిషయం. మన దేహం అయిదు భూతాలపదార్థాలతో కూడి ఉంటుంది. వెలుపల అయిదు మహాభూతాలు ఉన్నాయి. మనలో ఉన్నవి కొంచెంపాటివి. వెలుపల ఉన్నవి కొలతలకు అందనివి. అందువలన వాటిని మహాభూతాలు అంటారు. మనదేహాలలో ఉన్న మట్టి, నీరు, నిప్పు, గాలి, నింగి అనేవాని మొదటి తావులు ఆ పంచమహాభూతాలే.

ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం అనేవి అయిదు ప్రాణాలు. వానిని సాధనతో ఆయా పనులనుండి విరమింపజేయటం అనే ప్రక్రియను ఇక్కడ 'ప్రాణముల్‌ విడిచి' అన్న పదబంధంతో తెలియజేస్తున్నారు.)

ఆ సాధకుడైన పృథుచక్రవర్తి భూపదార్దాన్ని నీటిలో, నీటిని నిప్పులో, నిప్పును గాలిలో, గాలిని నింగిలో, నింగిని మనస్సులో, మనస్సును ఇంద్రియాలలో, ఇంద్రియాలను విషయాలలో, వాటిని అహంకారంలో, దానిని మహత్తులో ఆ సర్వకార్యాలకూ కారణమైన మహత్తును జీవునకు ఆధారంగా అయిన ప్రకృతిలో చేర్చి జీవుడుగా మాత్రం మిగిలిన అతడు జ్ఞానం, వైరాగ్యం అనే లక్షణాలచేత బ్రహ్మంలో ఎట్టి కదలికలూ, భేదాలూలేని స్థితిని పొందినవాడై మాయకు ఆధారభూమి అయిన జీవత్వాన్ని వదలివేసి ముక్తిని పొందాడు. అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు.

(సృష్టి ప్రారంభంనుండి పరిసమాప్తి దాకా అనులోమ విధానంలో ఉంటుంది. సృష్టి ఉపసంహారక్రమం ప్రతిలోమ విధానంలో ఉంటుంది.)

పృథుని ధర్మపత్ని అర్చి. పాదాలు నేలకు తాకితే కందిపోయే సుకుమారి. గొప్ప అందచందాలు కలది. సాటిలేని పతివ్రత. కాబట్టి, తనభర్త చేసిన గొప్పవ్రతమూ, తన గొప్పభక్తి, సేవ, ఋషులు నిర్దేశించిన జీవనవిధానాన్ని ఆచరించటం అనే లక్షణాలచే చాలా చిక్కిపోయింది. అయినా తనమగని దయగలచూపు, చేతిస్పర్శ మొదలైన సమ్మానాలవలన సుఖమైన నడవడినే భావిస్తున్నది. అలా ఉండి ఆ అడవులలో తన చిక్కిపోవటాన్ని మనస్సులో తలపకుండా తిరుగుతూ ఉన్నది.

ఆ పృథుని ఇల్లాలు అర్చి ఇంతకుముందెప్పుడూ ఏ దుఃఖమూ ఎరుగనిది. ఇప్పుడు తన భర్త ప్రాణాలు లేని దేహాన్ని చూచి చాలా దుఃఖపడింది. ఆ దుఃఖంతో ఆమెకు ప్రపంచసంబంధమైన దేనియందూ ఆసక్తిలేని స్థితి కలిగింది.

ప్రసిద్ధగల మందరపర్వతం చరియమీద చితిపై శవారోపణంచేసి ఏర్పాటు చేసుకొని, అందమైన మహానదీ జలాలలో చక్కగా స్నానంచేసి, చాలా గొప్ప పనులు ఆచరించిన మగనికి జలతర్పణం మొదలైన పనులు కావించి, గొప్పభక్తితో దేవతలకు ప్రణమిల్లి, అగ్నిదేవునకు మూడుమారులు ప్రదక్షిణంచేసి, భర్తపద్మాలవంటి పాదాలను మనస్సులో కుదుర్చుకొని, వీరులలో శ్రేష్ఠుడు మహారాజు అయిన పృథువువెంట పరలోకాలకు పోవటానికి సిద్ధంగా ఉన్న అర్చిని చూచి వేలకొలది దేవతా స్త్రీలు తమభర్తలతో కూడి చెలిమితో

(ప్రదక్షిణం అంటే తన కుడిభాగాన్ని పూజించదగిన దానివైపు ఉండే తీరున చుట్టిరావటం. మూడుమారులు చేయటంలో మూడు కరణాల - మనస్సు, మాట, చేష్ట అనేవాటి ఏకరూపస్థితి తెలియవస్తుంది. లేదా స్థూలదేహం, సూక్ష్మదేహం, కారణదేహం అనే మూడింటితో ప్రదక్షిణం చేయటం అనికూడా సంభావించవచ్చు. జాగ్రత్‌, స్వప్న సుషుప్తి దశలు మూడింటియందూ నాకు ఒకే భావన ఉంది అని తెలియజెప్పటాన్ని కూడా ఇది సూచిస్తుంది.)

అర్చి సహగమనం చేయబోతూ ఉంటే దేవకాంతలు తమ భర్తలతోపాటు గొప్పఉత్సాహంతో మందరపర్వతం చరియలమీద అప్పుడప్పుడే వికసించిన, పరిమళాలను వెదజల్లే మేలుజాతి మందారకుసుమాలను ఆపకుండా వర్షించారు.

అప్పరసలు నృత్యాలు చేశారు. దేవతలు శంఖాలను ఊదారు. వాద్యాలను మ్రోయించారు. కిన్నరజనులు పాటలు పాడారు. దేవతల వనితలు అందరూ సముదాయంగా ఏర్పడి స్తోత్రాలు చేశారు.

ఇంకా ఈ విధంగా అన్నారు.

ఆలోచించి చూస్తే ఇటువంటి ఆశ్చర్యం ఎక్కడైనా ఎవరైనా చూచారా? అర్చి అనే వనిత గొప్ప పుణ్యం మూటకట్టుకొన్న వ్యక్తికదా! శ్రీలక్ష్మీదేవి తనభర్త అయిన శ్రీమహావిష్ణువువెంట వెళ్ళేవిధంగా ఈమె తన పతితో కలసి సహగమనం చేసింది. తన హృదయ నాథుడైన పృథుచక్రవర్తినీ, ఊర్థ్వలోకాన్ని కూడ చేరుకుంటుంది. ఇది తప్పని మాట. ఈ గొప్పతనంతో ఈమె మహాయోగివర్యులకు కూడ ఊహించటానికి వీలుకాని దృఢమైన సత్కర్మంవలన, బంధాలన్నింటినీ దాటుకొని పృథుచక్రవర్తి వెంట వెళ్ళి ఊర్థ్వలోకానికి వెళ్ళేది అవుతుంది.

(సహగమనంవలన ప్రధానంగా పుణ్యలోకాలకు చేరుకోవటం జరుగుతుందని ఒకనాటి విశ్వాసం. దానిని దేవతల వాక్యాలనుబట్టి ఇందులో నిరూపిస్తున్నారు.)

కాబట్టి పతివ్రతలు సాధించలేనిది ఎక్కడైనా ఉన్నదా? అని ఇంకా బాగుగా ఆలోచించిచూస్తే మనుష్యుడు శ్రీమహావిష్ణువు స్థానాన్ని పొందే వివేకం ఎప్పుడూ హృదయంలో కదలుతూ ఉండేవిధంగా చేసుకుంటే భూమిమీద అతడు పొందరాని స్థానం ఏది ఉండదు.

ఆ విధమైన మోక్షాన్ని సాధించే మనుష్యస్థితిని పొందికూడా విషయాలలో చిక్కుకొని భూమిపై మెలగేవాడు నీతిమాలినవాడై తన్ను తాను మోసగించుకొనేవాడవుతాడు.

ఈ విధంగా ఆ దేవతలు తమంతతాము తనను ప్రశంసించగా అర్చి తన పతి అయిన పృథుచక్రవర్తి పొందిన అచ్యుతమైన పుణ్యలోకాన్ని సాటిలేని మహిమతో పొందింది అని విదురునకు మైత్రేయుడు చెప్పాడు.

(అర్చి తన పతి అయిన పృథునితోపాటు అచ్యుత(విష్ణు) లోకం పొందినది. అంటే వారిరువురూ పొందినది పుణ్యం క్షీణించిన తరువాత మరల భూమికి తిరిగి వచ్చే లోకం కాదన్నమాట. అందుకనే అనుపమ విభవం. సాటిలేని గొప్పతనం.)

మునిశ్రేష్ఠుడైన మైత్రేయుడు విదురునకు ఆ విధంగా చెప్పి ఇంకా ఇలా అన్నాడు. మహానుభావుడైన ఆ పృథువు ఎట్టిపాపాలు లేనివాడు. భగవంతులలో అందరికంటె మిన్న.

(మహానుభావుడు గొప్పవాడైన పరమాత్మ అనుభూతిని పొందినవాడు; అట్టివానికి కూడ పాపస్పర్శ ఉంటే మళ్ళీ సంసారబంధనం తప్పదు. అటువంటి పాపస్పర్శలేనివాడిని అనఘుడు అంటున్నారు.

ఇక్కడ భగవత్తముడు అంటే షడ్గుణైశ్వర్యాలుకలిగి పూజ్యులందరికంటె గొప్పవాడు అని తాత్పర్యార్థం.)

విదురా! ఈ పుణ్యం కలిగించే కథను నేను నీ కిప్పుడు చక్కగా చెప్పాను. గొప్పది, చెదరనిది అయిన బుద్ధితో, దాని మీదనే మనస్సుపెట్టి ఎవడైనా గొప్పభక్తితో, మహాత్మా! ఈ కథను విన్నా, చదివినా, వ్రాసినా, ఇతరులకు వినిపించినా, పృథుచక్రవర్తి ఉత్తమగతి పొందినట్లుగా ఎల్లవేళలా సర్వపాపాలూ నాశనమైపోగా విష్ణుపదానికి చేరుకుంటాడు.

(ఇదొక సోపానక్రమం. ముందు గురువుల వలన వినాలి. అభ్యాసంకోసం తాను స్వయంగా చదువుకోవాలి. గట్టిపడటంకోసం వ్రాయాలి. ఇంకా చెదరకుండా నిలిచిందో లేదో పరీక్షించుకోవటానికి ఇతరులకు వినిపించాలి. విద్య ఈ నాలుగుమెట్లద్వారా పరిణతస్థితికి చేరుకుంటుంది.)

నాలుగు వర్ణాలలో మొదటివాడైన బ్రాహ్మణుడు ఈ పృథుచరిత్రను శ్రద్ధగా చదివితే అతనికి బ్రహ్మవర్చస్సు పెంపొందుతుంది. క్షత్రియుడు కోరి చదివినా, విన్నా సామ్రాజ్యానికి అధిపతి అవుతాడు. వైశ్యుడు విని ధనవంతుడవుతాడు. శూద్రుడు వింటే గొప్పకీర్తి కలవాడౌతాడు. ఇంతేకాదు మూడుమారులు ఈ కథను చదివితే దరిద్రుడు కుబేరుడైపోతాడు. పేరు ప్రఖ్యాతులులేనివాడు గొప్పకీర్తి కలవాడౌతాడు. సంతానంలేనివాడు చాలమంది పిల్లలు కలవాడవుతాడు. ఏమీ తెలియని మూర్ఖుడు విజ్ఞానం, జ్ఞానం నిండారిన బుద్దిగలవాడౌతాడు. గొప్పకీర్తి ప్రతిష్టలు కలవారుకూడా అవుతారు.

ఈ లోకంలో మానవులకు శుభాన్ని కలిగించేది, అశుభాన్ని రాకుండా చేసేది, సంపదను ఇచ్చేది, కీర్తిని కలిగించేది, ఆయువును పెంపొందించేది, స్వర్గాన్ని అనుగ్రహించేది, కలిదోషాలను తొలగించేది అయిన ఈ పుణ్యచరిత్ర నాలుగుతీరులైన పురుషార్థాలను కోరేవారికి, నాలుగు పురుషార్థాలు కలగటానికి కారణం అవుతుంది. కాబట్టి దీనిని వినాలి. యుద్దానికి పోయేరాజు ఈ చరిత్రను మనస్సులో గట్టిగా నిలుపుకొని శత్రువును ఎదిరిస్తే ఆ శత్రువు, పృథుచక్రవర్తికి తక్కిన రాజులందరూ కప్పాలు చెల్లించినట్లుగా, కప్పాలు చెల్లిస్తాడు. మరొక తగులు లేని భగవద్భక్తుడు పుణ్యమూ, పృథువు మాహాత్యాన్ని తెలియజెప్పేది అయిన ఈ కథను వింటూ, చదువుతూ బుద్దిని చక్కగా రూపొందించుకొని ప్రతిదినం ఆదరంతో దీనిని అందరకూ తెలియజెపుతూ ఉంటే, సంసారసముద్రం దాటించటానికి నావగా అయిన పాదాలుగల పరమాత్మయందు చెక్కుచెదరని భక్తి పెంపొందుతుంది. అట్టివాడు పృథుచక్రవర్తి పొందిన విష్ణుపదాన్ని పొందుతాడు. అని ఈ పుణ్యకథను మైత్రేయమహర్షి విదురునకు తెలియజెప్పాడు. ఇంకా ఇలా అన్నాడు.

పృథువుకు అతని భార్య అర్చికి పుట్టిన కుమారుడు విజితాశ్వుడు. అతనికి గొప్పకీర్తియే మహాధనం. గొప్పవాడు. తండ్రికి తగిన తనయుడు. అతనిలో గొప్పగా శౌర్యధైర్యాలు ఉన్నాయి. అట్టివాడు పృథుచక్రవర్తి తరువాత భూమికి ఏలిక అయ్యాడు.

(శూరుడు= పరాక్రమించే భావసంపద పెల్లుగా కలవాడు; ధీరుడు= పరాక్రమించే సందర్భంలో బుద్ధిసంపదను నిండుగా వినియోగించగలవాడు.)

ఆ విజితాశ్వుడు దేవేంద్రునివలన ఎవరికీ కనపడకుండా నడిచే ఒక విద్యను మిక్కిలి నేర్పుతో సాధించాడు. కాబట్టి అతను అంతర్ధానుడు అనేపేరుతో ప్రసిద్ధికెక్కాడు.

(సునాసీరుడు అంటే నాగళ్ళను మిక్కిలిగా కదిలించేవాడు, వర్షాలు కురిపించి పంటలు పండించటానికి కారణం అవుతాడు కనుక అది సార్ధకం.)

ఆ మహానుభావుడు విజితాశ్వుడు చెదరని బుద్ధితో రాజ్యానికి అధిపతి అయ్యాడు. సమబుద్ధికలవాడు కనుక తన తమ్ములు నలుగురికి నాలుగుదిక్కుల రాజ్యాన్ని పంచిపెట్టాడు. హర్యశ్వునికి తూర్పుభాగం, ధూమ్రకేశునికి దక్షిణభాగం, వృకునకు పడమటిభాగం, ద్రవిణునకు ఉత్తరభాగం ఏర్పాటు చేశాడు. అతని భార్య శిఖండిని. వారిద్దరికి వసిష్ఠుని శాపంవలన మూడగ్నులు ముగ్గురు పుత్రులుగా జన్మించారు.

ఆ విజితాశ్వునకు శిఖండినికి పుట్టిన కుమారులు పావకుడు, పవమానుడు, శుచి అనే పేర్లు కలవారు. వారు మనుష్యగర్భంలో పుట్టినా తమ గొప్పతనంచేత మళ్ళీ అగ్నిస్వరూపం పొంది తమతావునకు వెళ్ళిపోయారు. అటుపిమ్మట

ఆ విజితాశ్వునకు రెండవభార్య నభస్వతి. ఆమెవలన అతనికి హవిర్థానుడు అనే కుమారుడు పుట్టాడు. తరువాత ఆ విజితాశ్వుడు శత్రువుల నందరిని తనకు లొంగిపోయేవిధంగా చేసికొని రాజ్యపరిపాలనంగురించి భావించాడు.

స్వచ్చమైన బుద్ధి విశేషంగల ఓ విదురా! కప్పం పుచ్చుకోవటం, దండనను నిర్వహించటం, ప్రజలనుండి ఆయాదోషాలకు పరిహారంగా ధనం రాబట్టటం మొదలైనవి చాలా క్రూరమైన పనులు అని భావించి మనస్సును దిటవుచేసికొని పెద్దకాలం చేయవలసిన ఒక యజ్ఞాన్ని నిమిత్తంగా చేసికొని రాజ్యపాలన అనే దానిని సమబుద్ధియై వదలివేశాడు.

ఇలా రాజ్యపాలన అనేదానిని వదలివేసి, ఆ విజితాశ్వుడు ఆత్మయందే చూపునిలిపి మిక్కిలి నేర్పుతో హంస, పరమాత్మ, అయిన సర్వేశ్వరుని ఆ యజ్ఞంలో ఆరాధించి గొప్ప నైపుణ్యంతోకూడిన ఆశ్చర్యం కలిగించే యోగసమాధిద్వారా ముక్తి పొందాడు.

విజితాశ్వుడు పరలోకాలకు వెళ్ళిన తరువాత అతని కుమారుడు హవిర్దానుడు హవిర్ధాని అనే తన భార్యవలన ఆరుగురు కుమారులను పొందాడు. వారు బర్హిష్మదుడు, గయుడు, శుక్లుడు, కృష్ణుడు, జితవ్రతుడు అనేవారు.

(ఇక్కడ పరలోకం అంటే స్వర్గం మొదలైనవి అని భావించరాదు. ముక్తి పొందినట్లుగా చెప్పిన కారణంగా పరమాత్మతో తాదాత్మ్యం అని భావించాలి.)

హవిర్థానుని కుమారుడు ప్రాచీనబర్హి అతడు ఎల్లవేళల యజ్ఞదీక్షలతోనే విరాజిల్లేవాడు. భూమినంతటినీ యజ్ఞాలకు యోగ్యమైన శాలలను వేరువేరుగా ఏర్పాటు చేశాడు. యజ్ఞాలు మానకుండా చేస్తూ చిరమైన కీర్తిని సంపాదించాడు. తూర్పుదిక్కునకు కొనలు ఉండేవిధంగా దర్భలను భూతలమంతా పరచాడు. ఆ విధంగా భూమి అంతా యజ్ఞశాలయే అయిపోయింది. ఇంకా అనేకమైన మంచి పనులను చేయటంలో మిక్కిలి నేర్పుకలవాడై హృదయంగమమైన యోగసమాధియందు నిష్ఠకలవాడై ప్రజాపతి అయిన బ్రహ్మయే ఇతడు కాగలడని ప్రజలందరూ కొనియాడుతుండగా చెలువొందిన మహానుభావుడు. తూర్పుదిక్కునకు కొనలు ఉండే విధంగా బర్హిస్సులను దర్భలను పరచి యాగాలు చేశాడు. కనుక అతనికి ప్రాచీనబర్హి అనే ప్రఖ్యాతి కలిగింది.

(యజ్ఞప్రక్రియ దేవతలను తృప్పిపరుస్తుంది. దానితో వారు భూలోకానికి కావలసిన వర్షాదులద్వారా పంటలను సమృద్ధిగా పండిస్తారు. ప్రజలు కరవుకాటకాదులు లేక సుఖశాంతులతో బ్రదుకు గడుపుతారు. దీనిని భగవంతుడు గీతలో ప్రత్యేకంగా ప్రకటించాడు.

హవిర్థానుని కుమారుడు 'హావిర్థాని' తద్ధిత ప్రత్యయం చేరినరూపం.)

ఇంకా ఆ ప్రాచీనబర్హి ఒక సుందరిని వివాహమాడాడు. ఆమె గొప్పసౌందర్యం కలది. వివాహ సమయంలో ఆమె వేగిరంగా అగ్నికి ప్రదక్షిణలు చేస్తూ ఉంటే అగ్నిదేవుడే మునుపు శుకిని చూచి కామోద్రేకం పొందిన విధంగా ఈమెను చూచికూడా గొప్ప వ్యామోహం పొందాడు. అట్టి ఆ వనిత లలితములైన, మిక్కిలి కొత్త ఆభరణాలతో చక్కగా అలంకరించుకొన్న మనోజ్ఞమైన మంగళమైన దేహం కలది. అంతేకాదు

(శుకిన్‌ చూచి - పూర్వం అగ్నిదేవుడు సప్తర్షుల భార్యలను చూచి మోహించాడు. అది గమనించింది అతని భార్య స్వాహాదేవి. తన పతికి పాపం అంటకుండా ఆ సప్తమహర్షుల భార్యలలో ఒక్క అరుంధతిని వదలి తక్కిన అందరి రూపాలను తానే తాల్చి అగ్నిదేవునితో రమించింది. ఆ సందర్భంగా జారిన రేతస్సును చిలుకరూపంలో గ్రహించి రెల్లుతోటలో నిక్షేపించింది.)

ఆ యువతి చక్కని పరువం పాకానికి వచ్చిన సమయంలో, చక్కగా నాదం చేస్తున్న మణులు తాపిన బంగారు మొలతాడు రవం ఒప్పారునట్లు విలాసంగా తిరుగుతూ ఉంటే సూర్యుని కాంతిరేఖ కదలాడుతున్నట్లుగా అనిపించేది. అట్టి ఆమెను చూచి దేవతలు, కిన్నరులు, సిద్దులు, సాధ్యులు, మునులు, నాగులు, పక్షులు మొదలగు జాతులలో గొప్పవారు కూడా మోహపడేవారు.

చక్కదనాల చుక్క సముద్రుని బిడ్డ అయిన ఆ శతధృతి అనే కన్యను బ్రహ్మశాసనాన్నిబట్టి ప్రాచీనబర్హి పెండ్లి చేసుకున్నాడు. ఆమె యందు అతనికి పదిమంది కొడుకులు పుట్టారు. వారందరూ ఒకేపేరు, ఒకేతీరు కలవారు. తండ్రి నాయనలారా! మీరు ప్రజలను సృష్టిచేయండి అని ఆదేశించాడు. వారు తపస్సు చేసుకొనే బుద్ధితో అరణ్యాలకు బయలుదేరారు. దారిలో వారికి శ్రీపరమేశ్వరుడు ప్రసన్న బుద్ధితో కనపడి ఒక మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రాన్ని జపంతో, ధ్యానంతో, పూజతో నియమం చెడకుండా వారు సేవిస్తూ పదివేల దివ్యవత్సరాలు తపస్సులకు పతి అయిన శ్రీమన్నారాయణుని సేవించుకున్నారు. అని చెప్పగా విదురుడు మైత్రేయునితో ఇలా అన్నాడు.

(సౌందర్యరాశి, సముద్రునిబిడ్డ అనటంచేత ఆమె శ్రీమహాలక్ష్మివంటిది అని తెలుస్తున్నది.

జపము - వాక్కులతో సేవ; ధ్యానము - మానసమైన సేవ; పూజ - కాయికమైనసేవ - ఇలా వారు మూడు కరణాలను ఏకం చేసుకొని పూజించారు.)

రుద్రుడు - జ్ఞానదాత.

ఓయి తాపసశ్రేష్ఠా! ప్రచేతసులకు ఆ అడవి దారిలో ఆ శివునితో సమావేశం ఎలా అయింది? దయగల శివుడు వారి ఏ కోరికనుబట్టి ఉపదేశం చేశాడు? ఈ జగత్తులో ప్రాణాలున్నవారికి ఆ శివునితో కలయిక మిక్కిలి దుర్లభమైనది. గట్టిగా విచారించి చూస్తే ఆ మహాత్ముడు గొప్పమునివర్యులకు కూడా ధ్యానం పండినప్పుడు మాత్రమే కనిపిస్తాడు. అంతేకానీ భూమిమీద సాధారణమైన కన్నులకు కనబడడు. అంతేకాదు, ఆయన ప్రపంచవాసనలులేని ఆత్మయందే నిరంతరం నెలకొని ఉంటాడు. విరూపాక్షుడు తన దైవశక్తితత్వంతో కలిసియే సర్వలోకాలను రక్షించటంకోసం సంచరిస్తూ ఉంటాడు.

(భర్గుడు ఆ అజ్ఞానాన్ని చీల్చివేసేవాడు; అంచిత ధ్యానం - ప్రపంచభావన ఏమాత్రమూ లేక నిరంతరం పరమాత్మయందే లగ్నమైన మనస్సు కలిగి ఉండటం. విరూపాక్షుడు ఆ సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనే మూడు మూడు కన్నులుగా, ఒకే స్వరూపంతో లేనివై, ఉన్నవాడు. ఆత్మశక్తి - ఇక్కడ శక్తి ఉమాదేవి. సర్వప్రపంచాన్ని కదిలించే ఒకానాక మహాతత్త్వం.)

No comments:

Post a Comment

The discourse between Sage Narada and King Prachinabarhi (Pracheena Barhi) - నారదుండు ప్రాచీన బర్హికి జ్ఞాన మార్గమును దెలియంజేయుట

నారదుండు ప్రాచీన బర్హికి జ్ఞాన మార్గమును దెలియంజేయుట ప్రాచీనబర్హి అనే రాజు గొప్పవి అయిన యజ్ఞం మొదలైన కర్మలలో తగులుకొన్న చిత్తంతో ఉన్నాడు. అ...