Saturday, March 28, 2026

The Chandra Vansha King Legends - చంద్రవంశ్యులగు రాజుల ఇతిహాసము

చంద్రవంశ్యులగు రాజుల ఇతిహాసము

ఓ రాజచంద్రా! చంద్రకాంతివలె తెల్లనైన చంద్రవంశంలో చంద్రునివలె తెల్లని కీర్తితో పుట్టి పుణ్యాత్ములైన ఐళాది రాజుల చరిత్రను ఇకపై విను.

వేయితలలు గల శ్రీహరి నాభికమలం నుండి ముందుగా చతుర్ముఖ బ్రహ్మ పుట్టాడు. సుగుణాలలో అతనితో పోల్చదగిన సమర్థుడైన అత్రి ఆ బ్రహ్మకు పుట్టాడు. అత్రి క్రీగంటి చూపులనుండి కలువల చెలికాడు చంద్రుడు పుట్టాడు. బ్రహ్మ ఆజ్ఞతో ఆ చంద్రుడు బ్రాహ్మణులకు, ఓషధులకు, నక్షత్రసమూహానికి రాజయ్యాడు. చంద్రుడు రాజసూయ యాగాన్నిచేసి, ముల్లోకాలను జయించి, మూర్ఖత్వంతో వెళ్లి, సౌందర్యవతి అయిన బృహస్పతి భార్య తారను ఆమె ఇంటినుండి తనతో తీసికొని వచ్చాడు. దేవగురువు బ్రతిమాలినా అతని భార్య తారను చంద్రుడు విడిచిపెట్టలేదు.

అప్పుడు దేవతలతో రాక్షసులకు యుద్ధం అయింది. బృహస్పతితో విరోధంవల్ల శుక్రాచార్యుడు రాక్షసులతో కలిసి చంద్రుని పక్షంచేరి బృహస్పతిని తరిమాడు. ఈశ్వరుడు తన భూతగణపరివారంతో బృహస్పతిపక్షాన నిలిచాడు. ఇంద్రుడు దేవతాసమూహంతో బృహస్పతికి సాయంగా నిలిచాడు. ఆ సమయంలో బృహస్పతిభార్య తార కారణంగా దేవతలకూ, రాక్షసులకూ వినాశం కలిగించే యుద్ధం జరిగింది. అంతలో బృహస్పతి తండ్రి అంగిరసుడు చెప్పగా బ్రహ్మ చంద్రునిపై కోపించి గర్భవతియైన తారను బృహస్పతికి తిరిగి ఇప్పించాడు. బృహస్పతి తారను చూచి ఇలా అన్నాడు.

ఓ దుష్టురాలా! ఏ మాత్రం సిగ్గు లేకుండా, వెలయాలివలె ధర్మాన్నీ, కీర్తిని మంటగలిపి జారుడైన చంద్రునితో పొందుకోరి గర్భాన్ని తెచ్చుకోవడం నీకు తప్పుగా తోచడం లేదా! ఇప్పుడే ఈ గర్భాన్ని దించుకో. నిన్ను కాల్చేస్తాను అసలు నిన్ను చూచి అభీమానవతులు మెచ్చుకుంటారా?

తారపై ఈ విధంగా బృహస్పతి ఆగ్రహిస్తుండగా, ఆ తారకు బంగరు రంగు గల ఒక కొడుకు పుట్టాడు. ఆ బిడ్డను చూచి మోహాన్ని పొందిన బృహస్పతి 'ఈ బిడ్డ నా బిడ్డ' అని, చంద్రుడు 'ఈ సుతుడు నా సుతుడే' అనీ వాదులాడుకున్నారు అప్పుడు

వారు వాదులాడుకోవడం ఆపు చేయడానికి వచ్చిన మునులు 'ఆ బిడ్డ ఎవరి బిడ్డ' అనే విషయాన్ని నిర్ణయించలేక, దేవతలను అడిగారు. ఈ విషయం ఆ వగలాడికి మాత్రమే తెలుస్తుంది తప్ప ఇతరులకు తెలియదన్నారు దేవతలు.

ఈ మాటలు విని సిగ్గుతో నిలిచిన తారతో అందాల కుమారుడిలా అన్నాడు.

ఇంటి పరువు పోయేలా, బంధువులు తలవంచుకొనేలా, భర్త అసహ్యించుకొనేలా అన్యులవల్ల నన్ను ఎందుకు కన్నావు? తల్లీ! నా తండ్రి చంద్రుడా? బృహస్పతా?

ఇలా అడుగుతూ ఉన్న కొడుకునకు జవాబు చెప్పలేక నిలిచిన తారను బ్రహ్మ ఏకాంతానికి పిలిచి రహస్యంగా ఇలా అన్నాడు.

ఓ కాంతా! నీ సిగ్గు విడిచి ఈ చిన్ని బాలుని తండ్రి దేవగురుడో, చంద్రుడో చెప్పుము. ఎందుకు దాస్తావు? ఈ ఆలోచన నీకే పుట్టిందా? నిట్టూర్పులు విడవడం మాను. సహజంగా కాంతలు కాముకురాండ్రు కదా! మాట చెప్పినంత మాత్రాన నష్టం రాదు. నే నెవ్వరికీ చెప్పను. నిజం చెప్పుము.

అలా మాట్లాడిన బ్రహ్మకు ఎదురు చెప్పలేక తార రహస్యంగా ఈ బిడ్డను చంద్రునివల్ల కన్నాను అని చెప్పగా, ఆ బిడ్డకు బుధుడని పేరుపెట్టి ఆ బాలుని చంద్రునకిచ్చి బ్రహ్మ వెళ్ళిపోయాడు.

బుద్ధిమంతుడైన బుధుడు తన సుతుడుకాగా, చంద్రుడు వృద్ధి పొంది, ఆకాశాన్ని తాకాడు. జ్డానం కలిగిన కొడుకును కన్నతండ్రి ఆనందంతో ఉప్పాంగి ఆకాశాన్ని అందుకోడా?!

ఆ బుధునికి ఇంతకుమునుపు చెప్పినట్లు ఇళా కన్యకవల్ల పురూరవుడు జన్మించాడు. అతడి సౌందర్యాన్నీ శౌర్యాదిగుణాలను ఇంద్రసభలో ఊర్వశి నారదుడివల్ల విన్నది. మిత్రావరుణుల శాపంవల్ల ఆమె మనుష్య స్వరూపాన్ని ధరించి భూలోకానికి వచ్చింది.

ఊర్వశి తామరలవంటి కన్నులు కలవాడు, సింహం నడుమువంటి నడుము కలవాడు, వెడదఱొమ్ము కలవాడు, మహాభుజుడు, అందమైన చంద్రునివంటి కాంతిమంతమైన మొగము కలవాడు, సుకుమారుడు, పురుషశ్రేష్ఠుడయిన పురూరవుణ్ణి చూచి, మన్మథుడు వేసే పూల బాణాలకు మనసు చిన్నబోగా వివశురాలై నిలిచి ఉన్న సమయంలో

పురూరవుడు ఊర్వశిని చూచి ఇది మన్మథుని బాణమా? మబ్బును వదలిన మెరుపా? మోహినీ దేవతయా? ఆకాశలక్ష్మియా? దీనిచేయి పట్టకుంటే జీవితం ఎందుకు? అనుకుంటూ తామరాకు పై నీటిబొట్టులాగా మన్మథ బాణాలవల్ల చలించిపోయాడు.

ఈ విధంగా రాజపుత్రుడు పురూరవుడు మన్మథ బాణాలకు గురియై, ఎలాగో స్తిమితపడి ఊర్వశితో ఇలా అన్నాడు.

ఓ అబలా! నీవు ఎక్కడనుండి వస్తున్నావు? మనకిద్దరికి ఈడు జోడు సరిపోతుంది. నీకు నేను దక్కాను. మన్మథుని బాణపు దెబ్బలతో నాకు దిక్కు తోచడం లేదు. నేను అసత్యం ఆడటం లేదు. నా శరీరానికి నీ శరీరాన్ని నా చేతికి నీ చేతిని, నా చెక్కిలికి నీ చెక్కిలిని చేర్చి తగినరీతిగా ఆపదలోనున్న నన్ను కాపాడు.

పురూరవుని పలుకులు విని, ప్రాఢురాలైన ఊర్వశి ఇలా అంది.

చంద్రవంశ సంజాత శ్రేష్ఠా! విశేష విలాసాలను కోరే పురూరవా! ఈ రెండు పొట్టేళ్ళు నాకు చాలా ఇష్టమైనవి. వీటిని ఎల్లప్పుడు నీవు రక్షించాలి. నా వద్ద నీ వెప్పుడూ దిగంబరుడవై ఉండకూడదు. నేను భుజించే నేయి నీవు కూడా తినాలి. ఈ అంశాలకు నీవు అంగీకరిస్తే నేను నిన్ను మన్మథ వినోదాలలో ఓలలాడిస్తాను. నీకు అంగీకారమేనా?

ఇలా పల్కిన దేవవేశ్య ఊర్వశి పలుకులకు తన అంగీకారాన్ని పురూరవుడు తెలిపి తన మనసులో (ఇలా అనుకున్నాడు)

ఈమె ఆకారం సుందరం, అనురాగం అనుకూలం, దేవవేశ్య, మన్మథునిచే మనసు చంచలంకాగా నన్నుకామించింది. ఇంతకంటె మేలు ఉంటుందా?

ఈ విధంగా ఒక నిశ్చయానికి వచ్చి, పురూరవుడు చంద్రముఖి ఊర్వశిని బంగారు మేడలలో, చెట్ల నీడలలో, తోటలలో రత్నాల చావిళ్ళలో, సరస్సులలో పర్వత పార్శ్వాలలో శృంగార క్రీడలలో ముంచి తేల్చాడు.

అలా అన్నిచోట్ల రతిక్రీడాసక్తులైన ఆ ఊర్వశీపురూరవులకు విడదీయరాని అనుబంధం ఏర్పడగా

ఒకప్రక్కకే వా రుభయులు వెళ్ళి, ఒకచోటనే ఉండి, తమ ఇరువురి మనసులలో ఒక విషయాన్నే ఆలోచిస్తూ, ఒక్క నిమిషం కూడా ఒకరి నొకరు వదలక ఊర్వశీ పురూరవులు ఉంటారు.

ఊర్వశీపురూరవుల మధ్య ఉండే స్నేహం, ప్రేమ, సత్యశీలత, దాంపత్య ధర్మం దేవునికి మాత్రమే తెలుసు. ఇద్దరికి మధ్య పైటకొంగు అడ్డమైనా 'ప్రాణాలు వదిలేస్తారా' అన్నంతగా కలిసి ఉండేవారు.

ఈ విధంగా ఊర్వశీ పురూరవులు ఇరువురు ఒకరిపై ఒకరికి ప్రేమ అధికంకాగా పగలనక రేయనక అన్నిచోట్ల విహరిస్తూ ఉండగా, ఒకరోజు దేవలోకంలో దేవేంద్రుడు కొలువు తీరి ఉన్నవేళ సభలో ఊర్వశి లేకపోవడంచూచి.

ఇన్నాళ్ళవలె నా సభాంతరములోని వేదిక ఊర్వశి లేకపోవడంచేత వన్నె తగ్గిన పైడిలా తెల్లబోయి ఉంది అంటూ

ఇంద్రుడు గంధర్వులను పంపించగా, వారు అర్ధరాత్రమున చీకటిలో వెళ్ళి, ఊర్వశి పెంచుకుంటున్న పొట్టేళ్ళను బంధించారు. అవి రెండు మొర పెట్టాయి. ఆ ఆర్తనాదాలను విని శృంగార క్రీడలలో అలసి నిద్రిస్తున్న పురూరవుని ఆలింగనంలో ఉన్న ఊర్వశి ఇలా అంది.

నా బిడ్డలైన పొట్టేళ్ళను దొంగలువచ్చి, అహంకారంతో, మదంతో తీసికొనిపోతున్నారు. ఆ దొంగలకు అడ్డుపడలేక ఈ మగపంద నిద్రలో కళ్ళు మూసికొని నా కౌగిలి వదలకుండా పడి నిద్రపోతున్నాడు అయ్యో!

శత్రువులు దొంగలను పంపితే, వారిపై తన పౌరుషాన్ని చూపలేక, ఆడువారి కౌగిళ్ళలో మగతనాన్ని చూపే మగాడు, పురుషుడుగా ఉండటంకంటె ఆడుదిగా ఉంటే బాగుంటుంది.

తక్కువతనము గలవానికి భార్య కావడంకంటె అధిక గుణసంపన్నుని ఇంటిలో దాసిగా ఉండటం ఆడవారికి మేలు. నీచుణ్జి పొంది ఆడుతనాన్ని హింసించడంకంటె పొందుకోరక ఊరకే ఉండటమే మంచిది.

నీ రాచరికం ఎందుకు? ఒక ఆడుది మొరపెడుతూ ఉంటే, పశువులు ఆతురపడుతూ ఉంటే, ఆడుది పిలుస్తోంది కదా అని లేవవు, దొంగలను దూరంగా తరిమికొట్టవు. శవంలా పడి ఉంటావు.

విని కూడా ఏమీ విననట్లుగా ఉంటావు; యుద్ధభీతి గలవాడిని, మనుజులలో అధముని, ఎల్లప్పుడు నిద్రపోయేవాడిని మందుడు అయిన నిన్ను చక్రవర్తిని చేసిన బ్రహ్మకంటె వెర్రివాడు ఉంటాడా (ఉండడు అని భావం).

అని ఈ ప్రకారంగా ఆ ఊర్వశి కఠినపు మాటలనే కత్తులు చెవిలో చొప్పించగా, రాజశ్రేష్ఠుడైన పురూరవుడు అంకుశపు పోట్లకు విజ్బంభించే మత్తేభంవలె, బట్టమరచి, దిగంబరుడై, కత్తి చేతబట్టి, ఆ అర్ధరాత్రంలో, దొంగలను నరకి, పొట్టేళ్ళను విడిపించుకొని, తిరిగివచ్చే సమయంలో

దిగంబరంగా ఉన్న పురూరవుణ్ణి ఊర్వశి చూచింది. అనుకున్న మాట ప్రకారంగా ఊర్వశి అతనికి కనపడకుండా వెళ్ళిపోయింది. ఆమె అదృశ్యం కాగా, పురూరవుడు వెఱ్ఱివాడిలా తనను తాను స్వాధీనపరచుకోలేక మిక్కిలి దుఃఖించి అవస్థ పడ్డాడు.

పురూరవుడు మన్మథుని బాధకు తాళలేక ఊర్వశి కొరకు అన్వేషిస్తూ, సరస్వతీ నదీతీరంలో సఖీజనంతో కూడి ఉన్న ఊర్వశిని చూచి వికసించిన మోముతో ఇలా అన్నాడు.

ఓ ఊర్వశీ ఇలా నన్ను విడచి రావడం నీకు ధర్మమా! సంతోషమా! మనం కొన్ని ఒడంబడికలు చేసికొన్నాము కదా! అవి మేర తప్పటం బాగున్నదా! నిన్ను నేను విడిచినప్పటినుండి నా శరీరం నా స్వాధీనంలో లేదు. ఈ శరీరం భూమిపై పడకపూర్వమే (చనిపోక పూర్వమే) నన్ను దయాదృష్టితో వీక్షించు.

పురూరవుని పలుకులు విని ఊర్వశి ఇలా అన్నది.

స్త్రీలకు ఇంతగా లొంగిపోతావు. నీవసలు మగవాడవేనా? ఇలా మృగంలా దుఃఖించడం నీకు న్యాయమా? మనుష్యరూపంలో ఉన్న పశువును చూచి పశుజాతి “మనకంటె వీళ్ళు అజ్ఞానంగా ఉన్నారే” అనే భావంతో అసపహ్యించుకుంటాయి తప్ప కనీసం ఆహారంగానైనా స్వీకరించవు.

అంతేకాకుండా, వెలయాండ్ర ఆలోచనలు అగ్నిహోత్రాలవలె మంటలెగసిపడుతున్నాా మాటలు తీయని అమృతవర్షంలా ఉంటాయి. సాక్షాత్తుగా మన్మథుడే భర్త అయినా మెచ్చే లక్షణం వీరికి ఉండదు. అంతటి అందగాడైన మన్మథునే మెచ్చని వీరు ఇతరులను ప్రేమిస్తారా? కృతజ్ఞతలేక, క్రూరమైన భావాలు కలిగి తనకు తోడునీడగా ఉండే భర్తనైనా చంపడానికి వెనుకాడరు. ధర్మం లేనివారు, దయలేనివారు, చంచలమైన మానసిక స్థితిగలవారు వీరు. అటువంటి వేశ్యల మాటలు జ్ఞానాన్ని ఉపదేశించే వేదాంతసూక్తా లనుకొన్నావా?

ఓ రాజా! పురూరవా! ఇంకొక సంవత్సరం గడిచాక ఆ తరువాతి రోజు రాత్రి నీవు నా సంగమానికి వచ్చి శుభలక్షణ లక్షితులయిన కుమారులను కంటావు. ఏ మాత్రము నా మాటలను శంకించవద్దు అని ఊర్వశి పలుకగా రాజు పురూరవుడు ఊర్వశిని గర్భవతిగా భావించి మనసులో ఏ మాత్రం సంకోచించక తన పట్టణానికి వెళ్ళాడు.

ఇలా వెళ్ళి తన పట్టణంలో ఒక సంవత్సరం ఉండి, తరువాత ఊర్వశి దగ్గరకు వెళ్ళి ఒక రాత్రి ఆమెవద్ద ఉండగా, ఊర్వశి 'నీవు గంధర్వులను వేడుకో. వారు నన్ను నీకు ఇస్తారు' అని చెప్పగా పురూరవుడు గంధర్వులను ప్రార్ధించగా, గంధర్వులు పురూరవుని పొగడ్తలకు మెచ్చుకొని, ఒక అగ్నిస్థాలిని (కుంపటిని) పురూరవునకు ఇవ్వగా, ఆ అగ్నిస్థాలిని ఊర్వశిగా భావించి దానితో అడవంతా తిరిగి ఒకరోజు అది ఊర్వశి కాదు అగ్నిస్థాలి అని గ్రహించి, దానిని అడవిలో విడిచి, ఇంటికి వెళ్ళి, నిత్యం ఊర్వశినే చింతిస్తూ ఉండగా, త్రేతాయుగం వచ్చింది. ఆ రాజైన పురూరవునకు కర్మానుష్ఠానాన్ని బోధించే మూడు మార్గాలుగా వేదాలు తోచాయి. అంత పురూరవుడు అడవిలోని అగ్నిస్థాలి వద్దకు వెళ్ళి అక్కడ జమ్మిచెట్టు నుండి పుట్టిన రావిచెట్టును చూచి, ఆ రావి కొమ్మలతో అగ్నిని మథించే రెండు కొయ్యలు తయారు చేశాడు. (వాటిని అరణులు అంటారు) అందులో మొదటి అరణిని తానుగా, రెండవ అరణిని ఊర్వశిగా, మధ్యనున్న కాష్ఠాన్ని పుత్రుడుగా భావన చేస్తూ మంత్రజపం చేస్తూ ఆ అరణులను మథిస్తుండగా జాతవేదుడనే పేరుగల అగ్ని పుట్టాడు. ఆ అగ్ని మంత్రారాధన పూర్వక సంస్కారంతో ఆహవనీయాది మూడురూపాలుగా ప్రవర్తిల్లి పురూరవుని పుత్రుడుగా చెప్పబడ్డాడు. పురూరవుని పుత్రుడుగా చెప్పబడ్డ ఆ అగ్ని పురూరవుణ్ణి పుణ్యలోకాలకు పంపుటకు కారణం అవడంచేత

సుగుణాన్వితుడైన పురూరవుడు తన పుత్రునిగా చెప్పబడ్డ అగ్నిచేత అనంతుడు, హరి, వేదమయుడు, లక్ష్మీదేవితో కూడినవానిని గూర్చి యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం చేయడం తన ప్రియురాలైన ఊర్వశిని చూడడానికి వెళ్ళాలనే కోరికతో చేశాడు.

త్రేతాయుగంలో అగ్ని ఒకే రూపంతో ఉండేవాడు. దైవమైన పురుషోత్తముడు ఒకేరూపంలో ఉండేవాడు. సమస్త భాషాస్వరూపమైన వేదము ఒకటిగానే ఉండేది. నిత్యనూతనంగా ప్రకాశించే ఓంకార ప్రణవాక్షరము ఒక్కటిగా ఉండేది. ఒకే ఒక్క ఆకారంలో ఉన్న పై అంశాలు సామాన్యులకు తేలికగా అవగతం అవడంకోసం పురూరవుడు తన అమితమైన ధీశక్తితో మూడు మూడుగా విభాగం చేశాడు.

ఈ విధంగా వేదవిభాగంచేసి, యాగంచేసి, పురూరవుడు ఊర్వశి ఉన్న గంధర్వ లోకానికి వెళ్ళాడు, ఆ పురూరవుడు అనే రాజుకు ఊర్వశివల్ల ఆయువు, శ్రుతాయువు, సత్యాయువు, రయుడు, జయుడు, విజయుడు అనే ఆర్గురు కొడుకులు పుట్టారు. ఆ ఆరుగురిలో శ్రుతాయువునకు వసుమంతుడు, సత్యాయువు అనేవానికి ద్రుతంజయుడు, రయుడు అనేవానికి శ్రుతుడు, ఏకుడు అనే ఇద్దరు జన్మించారు. జయునకు అమితుడనేవాడు, విజయుడు అనేవానికి భీముడు జన్మించారు. ఆ భీమునికి కాంచనుడు, కాంచనుడికి హోత్రకుడు, హోత్రకునకు గంగాప్రవాహాన్ని తన నోటిపుక్కిలిలో బంధించిన జహ్నుడు, ఆ జహ్నుడికి పూరుడు, పూరునకు బాలకుడు, ఆ బాలకునికి అజకుడు ఆ అజకునికి కుశుడు, ఆ కుశునికి కుశాంబుడు, ధూర్తయుడు, వసువు, కుశనాభుడు అనే నలుగురు జన్మించారు. అందులో కుశాంబుడు అనేవానికి గాధి పుట్టాడు. ఆ గాధి రాజ్యం చేసే సమయంలో

గాధిరాజు కుమార్తె సత్యవతిని ఋచికుడనే బ్రాహ్మణుడు తనకిచ్చి వివాహం చేయుమని అడిగాడు. గాధి ఈ ఋచికుడు తన కుమార్తెకు ఈడు కాడు అనే ఆలోచనతో తెల్లగా సుకుమారంగా ఉండే శరీరాలు, నల్లటి చెవులు గలవేయి గుఱ్ఱలు కన్యాశుల్కంగా ఇస్తే నీకు నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానన్నాడు. ఋచికుడు వరుణుని దగ్గరకు వెళ్ళి గాధి కోరినవిధంగా వేయి గుఱ్ఱలను తెచ్చి ఇచ్చాడు. గాధి ఋచికునకు తన కూతురు సత్యవతినిచ్చి వివాహం చేశాడు.

సత్యవతి, సత్యవతి తల్లి ఇద్దరు ఋచికుని తమకు కొడుకులు కావాలని కోరారు. ఋచికుడు అంగీకరించి బ్రహ్మ మంత్రాలతో, రాజమంత్రాలతో యజ్ఞంచేసి హవ్యాన్ని తయారుచేసి నదీస్నానానికి వెళ్ళాడు.

(పురాణకాలంలో కూడా 'ఉంకువ' (కన్యాశుల్మం) ఇవ్వటం ఉందని తెలుస్తున్నది.)

ఆ ఋచికుడు స్నానానికి వెళ్ళిన సమయంలో సత్యవతి తన తల్లి కోరిన ప్రకారంగా బ్రాహ్మణ మంత్రాలతో యజ్ఞం చేసిన యజ్ఞ ప్రసాదాన్ని తల్లికిచ్చి, క్షత్రియ మంత్రాలతో తన తల్లికి తయారు చేయించిన హోమద్రవ్యాన్ని తాను స్వీకరించింది. ఇంతలో ముని వచ్చాడు. ఒకరి చరువును మరొకరు తీసికోవడాన్ని తెలిసికొని భార్య సత్యవతితో ఇలా అన్నాడు.

ఓ చంచలాక్షీ! సత్యవతీ! నీ కొరకు తయారుచేసిన చరువు నీ తల్లికిచ్చి ఆమెకొరకు తయారుచేసిన చరువు నీవు ఎందుకు తీసికొన్నావు? విను. నీకు క్రూరమైన ఆలోచనలుగల కొడుకు, నీ తల్లికి బ్రహ్మజ్ఞాని పుడుతారు.

ఋచికుడు తన భార్యను ప్రశ్నించేసరికి సత్యవతి భయపడి, మ్రోక్కి వినయంగా మాట్లాడగా, ఆ మాటలకు ఋచికుడు జాలిపడ్డాడు. నీ కొడుకు సాధువై, నీ మనుమడు క్రూర కర్ముడవుతాడని దయదలచి పలికాడు. సత్యవతికి సాధువైన జమదగ్ని పుట్టాడు. సత్యవతి కౌశికీనదిగా మారి లోకాలను పవిత్రం చేస్తూ ప్రవహించింది. ఆ జమదగ్ని రేణువనే వాని కుమార్తె రేణుకను పెండ్లి చేసుకొని వసుమనాది పుత్రులను కన్నాడు. అందులో

విష్ణుమూర్తి యొక్క అంశతో జమదగ్నికి పరశురాముడు జన్మించాడు. అతడు తనచేతి గొడ్డలితో రాజుల శిరములను ఇరువదియొక్క మార్లు నరికాడు.

ఆ మాటలు ఆలకించి పరీక్షిత్తు శుకమహర్షితో ఇట్లన్నాడు.


పరశురాముని చరిత్రము

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

పంచాంగం

No comments:

Post a Comment

The Chandra Vansha King Legends - చంద్రవంశ్యులగు రాజుల ఇతిహాసము

చంద్రవంశ్యులగు రాజుల ఇతిహాసము ఓ రాజచంద్రా! చంద్రకాంతివలె తెల్లనైన చంద్రవంశంలో చంద్రునివలె తెల్లని కీర్తితో పుట్టి పుణ్యాత్ములైన ఐళాది రాజుల ...