Tuesday, March 31, 2026

Hamsaladeevi Sri Venugopala Swamy Temple - హంసలదీవి వేణుగోపాల స్వామి ఆలయం

హంసలదీవి వేణుగోపాల స్వామి ఆలయం

కృష్ణానది సముద్రంలో పాలకాయి తిప్ప వద్ద కలిసే పవిత్ర సాగరసంగమ ప్రదేశం హంసలదీవి. ఈ పవిత్ర సాగర సంగమ ప్రదేశంలో స్నానం చేస్తే కాకులు కూడా హంసలుగా మారి పోతాయన్న కథనం ఈ ప్రాంతంలో ప్రబలంగా విన్పిస్తోంది. అలాంటి అత్యంత పవిత్ర స్థలంలో కొలువైవున్నాడు వేణుగోపాల స్వామి.

హంసలదీవిలోని వేణుగోపాల స్వామి మందిరం గాలి గోపురం. శ్రీ వైష్ణవుల 108 దివ్యదేశాలలో ఈ ఆలయం ఒకటి కాకపోయినా, అద్భుతమైన మహిమాన్విత వైష్ణవ ఆలయం.

పూర్వకాలంలో కలుషహారిణి అయిన గంగామాత తనలో స్నానం చేసిన వారందరి పాపాలను నశింపచేస్తుండటం వలన తనకు అంటిన పాప పంకి లాన్ని పోగొట్టుకొనే మార్గం చెప్పవలసిందిగా శ్రీహరిని ప్రార్ధిం చింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన అంశతో ఉద్భవించిన కృష్ణానది సముద్రంలో కలిసే సంగమ ప్రదేశం లో కాకి రూపంలో వెళ్లి స్నానం చెయ్యి.

నీపాప తమస్సు పోయి హంసవలె మారతావని వరమిచ్చాడు. గంగాదేవి తన యందలి పాప తమస్సును కాకి వలె ధరించి కృష్ణా సాగ రసంగమ పవిత్ర ప్రదేశం లో మునిగింది. పాపప్రక్షాళన పొంది హంస వలె స్వఛ్ఛతను పొందింది. అంతటి మహిమ గల క్షేత్రం ఈ హంసల దీవి. ఎందరో మునులు ఈ ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ సంచరించేవారని, అటువంటి పరమహంసలు సంచరించిన ప్రదేశం కాబట్టే ఈ ప్రాంతాన్ని హంసలదీవి అన్నారని ఒక కథనం.

ఆలయ విశేషాలు
ఈ తీర్థక్షేత్రంలో వెలసిన దైవం రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామి. ఈ ఆలయం ఒక రాత్రిలో దేవతలు నిర్మించిందిగా స్థలపురాణం. దేవాలయ నిర్మాణం పూర్తయి, గాలిగోపురం నిర్మిస్తుండగా తెల్లవారిపోయిందని, దేవతలు వెళ్లి పోయారని, అందువల్ల అది అసంపూర్తిగా మిగిలి పోయిందని చెప్పేవారు. ఆ తరువాత దానిని ఐదంతస్తుల గాలిగోపురంగా నిర్మించారు. 1977లో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయరు స్వామి వారు దీన్ని ప్రారంభించారు.మౌర్య చక్రవర్తుల కాలంలో ఆలయ నిర్మాణం జరిగి ఉండ వచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు. ఆలయ ముఖమండపం స్తంభాలమీద అనేక శాసనాలు మనకు కన్పిస్తాయి.

క్షేత్రపురాణం
శ్రీ వేణుగోపాలస్వామి వారి ప్రాదుర్భావాన్ని గూర్చి కథ ఒకటి జనశృతిగా ప్రాచుర్యంలో ఉంది. పూర్వకాలం ఈ ప్రాంతంలో ఒక పెద్ద పుట్ట ఉండేదట. స్వామి దానిలో ఉండేవాడట. మేతమేసిన ఆవులు ఆ పుట్ట దగ్గరకు వచ్చి స్వామికి పుట్టలోకి పాలు కార్చేవట. సాయంత్రం ఆవులు పాలు ఇవ్వకపోవడంతో అనుమానమొచ్చి, మాటువేసి కారణం కనిపెట్టారు గోపాలురు. ఆవులు పుట్ట పైకి వెళ్లి పాలుకార్చడం చూచి, కోపం ఆపుకోలేక, చెత్తంతా పోగు చేసి పుట్టమీద వేసినిప్పుపెట్టారట. పుట్టలోని స్వామికి వేడితగలడం, ఇంతలో ఒకరికి పూనకం వచ్చి స్వామి ఉన్న విషయాన్ని చెప్పడం, క్షమాభిక్ష కోరుకున్న భక్తులు స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహించడం జరిగిపోయింది. కాలాంతరంలో ఆ విగ్రహం భిన్నమైపోగా, స్వామి గ్రామస్తులకు కలలో కన్పించి కాకరపఱ్ఱు మునసబు గారి దొడ్లో ఉన్నానని చెప్పడంతో కలలో కనిపించి చెప్పిన ప్రకారం కాకరప
ఱ్ఱు వెళ్ళి మునసబు గారి ఇంట్లో కాకరపాదు కింద భూమిలో వున్న స్వామివారి విగ్రహాన్ని వెలికితీశారు. ఈ కారణంగానే ఆ ఊరికి కూడా కాకరపర్తి అనే పేరు వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. ఇక్కడ బయటపడిన శ్రీ వేణుగోపాల స్వామిని హంసలదీవికి తెచ్చి ప్రతిష్ఠించారు. అయితే ప్రపంచంలో ఎక్కడా కనిపించని విధంగా ఈ విగ్రహం నీలమేఘ ఛాయలో ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు.గ్రామస్తులు వెళ్లి ఊరేగింపుగా స్వామి వారిని తీసుకొచ్చి ప్రతిష్టించారట. ఆ విగ్రహమే ఇప్పుడు పూజలందుకుంటున్నది. భిన్నమైన విగ్రహం ఇప్పటిక్కూడా అలంకరించబడిన మూలవిరాట్‌ ప్రక్కనే మనకు దర్శనమిస్తోంది.

ప్రత్యేక పూజలు
ఈ ఆలయంలో వేణుగోపాలస్వామి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేతుడై పూజలు అందుకుంటూ ఉన్నాడు. ఇక్కడి దేవాలయ కుడ్యాలపై రామాయణ ఘట్టాలు అందంగా చెక్కబడి ఉన్నాయి. తూర్పు చాళుక్యుల శిల్పకళా వైభవానికి అద్దం పడుతుంటాయి. ప్రతి యేడు మాఘ శుద్ధ నవమి నుంచి బహుళ పాడ్యమి వరకూ స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా వేలసంఖ్యలో వచ్చిన ప్రజలు స్వామివారిని దర్శించుకుంటారు. ఆ తరువాత అక్కడికి దగ్గరలో ఉన్న సాగరంలో కృష్ణానది (తుంగ - భద్ర నదులను తనలో కలుపుకున్న కృష్ణవేణి ఇక్కడే సముద్రంలో కలుస్తుంది) క్షేత్రంలో స్నానం చేసి తరిస్తుంటారు.

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, మాఘ పౌర్ణమికి వైభవంగా నిర్వహించెదరు. మాఘ శుద్ధ త్రయోదశినాడు ఉదయం స్వామివారిని శాస్త్రోక్తంగా పెళ్ళికుమారునిచేసి ప్రత్యేకపూజలు నిర్వహించెదరు. చతుర్దశినాడు ఉదయం శ్రీ రాజ్యలక్ష్మీ అమ్మవారికి కుంకుమపూజను రాత్రికి స్వామివారి కళ్యాణం నిర్వహించెదరు. పౌర్ణమినాడు రథోత్సవం మరుసటిరోజున చక్రస్నానం (వసంతోత్సవం) మొదలగు కార్యక్రమాలు నిర్వహించెదరు.

సరిగంగ స్నానాలు
ఈ ఆలయంలో వివాహం చేసుకొని, సాగరసంగమ ప్రదేశంలో సరిగంగ స్నానాలు చేస్తే ఆ జంటలు సుఖంగా నూరేళ్ళు జీవిస్తారనేది భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో నిద్ర చేస్తే సంతానం లేనివారికి సంతానభాగ్యం కలుగుతుందని చెపుతారు. ఆలయం చుట్టూ ఉన్న కుడ్యాలలో ఎన్నో అందమైన శిల్పాలు కొలువుదీరి ఉన్నాయి. ఆలయానికి ఈశాన్యంలో పురాతన కట్టుబడితో కళ్యాణమండపం కన్పిస్తుంది.

ఎక్కడుంది?
కృష్ణాజిల్లా కోడూరు నుండి 15 కి.మీ దూరం లోనూ, మోపిదేవి నుండి 28 కి.మీ దూరం లోను బంగాళాఖాతం అంచున ఈ పుణ్యక్షేత్రం ఉంది. ఇక్కడికి రోడ్డు మార్గం ఉంది. చివరిలో బీచి వెంట ఉన్న కాలిమార్గం సముద్రం పోటు సమయంలో అంత క్షేమం కాదు.

దగ్గరలో ఉన్న ఒక భవంతి పైనుండి సుందరమైన సాగర సంగమం దృశ్యాన్ని చూడవచ్చును. పాలకాయతిప్ప వద్ద కృష్ణానదీ బంగాళాఖాతం సాగరసంగమ దృశ్యం చూడాలంటే రోడ్డు మార్గంలో 3 కిలోమీటర్లు ప్రయాణించి చేరుకోవచ్చు. అక్కడ విహంగ వీక్షణం చేయడానికి వీలూగా నిర్మించిన నిర్మాణం పైకి చేరుకుంటే కృష్ణాజలాలు సాగరంలో కలవడాన్ని చూడవచ్చు.1977 తుఫానులో ఇక్కడ వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

హంసల దీవికి విజయవాడ నుండి, గుడివాడ నుండి బస్సు ద్వారా చేరుకోవచ్చును. కొత్తమాజేరు, నాగాయలంక నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; గుంటూరు 88 కి.మీ

ఈ దేవాలయం, విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివారి దేవాలయానికి దత్తత దేవాలయంగా ఉంది.

No comments:

Post a Comment

The incarnation of Lord Krishna - శ్రీ కృష్ణావతార ఘట్టము

శ్రీ కృష్ణావతార ఘట్టము దేవకీదేవి ప్రసవవేదన పడుతుండగా దుర్జనుల మనస్సుల్లో బాధ కలగటం, సజ్జనుల్లో బాధలు తొలగటం అగుపించింది. దేవకీదేవి దేవదేవుడై...