Wednesday, May 6, 2026

Previous life of Sankhachudu - శంఖచూడుడి పూర్వజన్మ

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - శంఖచూడుడి పూర్వజన్మ

పద్మసంభవా! శంఖచూడుడు దానవేంద్రుడే కావచ్చు. దేవతలనందరినీ పారద్రోలి ఉండవచ్చు. కానీ అతడి వృత్తాంతం అంతా నాకు తెలుసు. అతడు పూర్వజన్మలో గోలోకవాసి. గోపకుడు. మహాతేజస్వి. అతడిపేరు సుదాముడు. నాకు పార్షదుడు. రాధాదేవి శాపంవల్ల దానవుడయ్యాడు.

ఒకనాడు నేను నా మందిరంనుంచి రాసమండలానికి వెళ్ళాను. నాతోపాటు ప్రాణాధికప్రియ విరజనుకూడా తీసుకు వెళ్ళాను. ఆక్కడ విరజతో నేను క్రీడిస్తున్న సంగతి దూతికద్వారా రాధకు తెలిసింది. కోపంగా వచ్చింది. నేను తిరోధానం చెందాను. విరజనుమాత్రం నదివైపామ్మని శపించింది. తన మందిరానికి వెళ్ళిపోయింది. అక్కడ సుదాముడితో సరససంభాషణచేస్తూ నేనున్నాను. రాధికను చూస్తూనే నేను మౌనం వహించాను. ఆయినా కోపం ఆపుకోలేని రాధ నన్ను నిష్టురంగా నిందించింది. చేపేవన్సీ చేస్తావు, ఏమీ ఎరగనట్టు కూచుంటావు. నిన్ను ఏమి చేసినా తప్పులేదని దెప్పి పొడిచింది. కానీ ఎన్నిసార్లు తప్పించుకుంటావో చూస్తాను, చిక్కకపోతావా ? అప్పుడు చెబుతాను నీపని అంటూ పళ్ళు బిగి చూపుడువేలుతో బెదిరించింది.

ఇదంతా చూస్తున్న సుదాముడు రాధికాదౌష్ట్యాన్ని భరించలేకపోయాడు. అతడికి నామీద భక్తి గౌరవం ప్రేమ ఎక్కువాయె. దానితో చర్రునలేచి రాధికను అదే స్థాయిలో అదే చూపుడు వేలుతో అలాగే బెదిరించాడు. రాధాదేవి కోపానికి ఆజ్యం పోసినట్టయ్యింది. కళ్ళు చింతనిపులయ్యాయి. నా సన్నిధిలో నా సేవకుడు తనను కించపరచడం అవమానించడం బెదిరించడం అస్సలు భరించలేకపోయింది. వీడి బయటకు నెట్టివెయ్యండి అని ఆజ్ఞాపించింది. రాధిక వెంట ఉన్న వేనవేల చెలికత్తెలు చుట్టుముట్టి, ఎదేదో ఇంకా వాగుతున్న ఆ తేజస్విని బైటకు లాక్కుపోయారు. ఉక్రోషం ఆపుకోలేక ఆ బలశాలి సుదాముడు చెలికత్తెల్లో చాలామందిని అందినమటుకు అందినట్టు చావబాదాడు. ఇది తెలిసి రాధాదేవి కోపం మరింత భగ్గుమంది. దానవజన్మ ఎత్తరా - అని దారుణంగా శపించింది.

ఆ సుదాముడు శప్తుడై, విలపిస్తూ, వెళ్ళిపోతూ, ఆగి ఆగి వెనక్కి చూస్తూ మాకు నమస్మరిస్తూంటే రాధికాదేవికి గుండె కరిగిపోయింది. కోపం రాలి వాత్సల్యం చిగురించింది. కళ్ళల్లో నీళ్ళు కమ్ముకున్నాయి.

వత్సా! ఆగు. ఆగు. ఎక్కడికి వెడతావంటూ తానూ వెంటబడింది. గోపికలు విలపిస్తూ అనుసరించారు. ఆప్పుడు నేను కల్పించుకుని అందరినీ నిలువరించి, అరక్షణంలో నీ శాపాన్ని ఆనుభవించి సుదాముడు హాయిగా తిరిగి ఇక్కడికి వస్తాడు. ఇంతలోకే బెంబేలుపడకు అని చెప్పి రాధికను ఓదార్చాను. వెనక్కి తీసుకువచ్చాను. అందరినీ సముదాయించాను. విరించీ! గోలోకంలో అరక్షణమంటే భూలోకంలో ఒక మన్వంతరం. నీకు తెలుసుగదా!

ఈ రకంగా సుదాముడు శంఖచూడుడై దానవవంశంలో జన్మించి మన్వంతరం గడిచింది. అతడీ అవతారం త్వరలోనే ముగియనుంది. అతడు యోగవిద్యా విశారదుడు. మహాబలిష్టుడు సర్వమాయా విశారదుడు. కనక - శివా! నీకొక శూలం ఇస్తాను. దానితో రాక్షస సంహారం చెయ్యి. శంఖచూడుడి మెడలో సర్వమంగళ కారకమైన నా కవచం ఉంటుంది. నిరంతరం ధరించే ఉంటాడు. అది ఉన్నంతవరకూ అతడిని ఎవరూ ఏమీ చెయ్యలేరు. విజయం ఎప్పుడూ అతనిదే. అంచేత నేను విప్రరూపంలో వెళ్ళి ఆ కవచాన్ని యాచించి స్వీకరిస్తాను.

చతుర్వదనా! మరొక విషయం. శంఖచూడుడికి నువ్వొక విచిత్రమైన వరం ఇచ్చావు. గుర్తుందా? ఇతడి భార్యకు శీలభంగం అయితే తప్ప శంఖచూడుడు మరణించడు. అది జరిగినప్పుడే ఇది జరుగుతుందనికదా నీ వరం!

అంచేత నేను వెళ్ళి రహస్యంగా తులసీగర్భంలో వీర్యనిక్షేపణం చేస్తాను. శంఖచూడుడు మరణిస్తాడు. అటుపైని తులసి దేహత్యాగం చేస్తుంది. గోలోకానికి విచ్చేసి మళ్ళీ నాప్రియ గోపిక అవుతుంది.

ఇంతగా వివరించి చెప్పి జగన్నాథుడు శివుణ్ణి పిలిచి శూలం అందించి తన అభ్యంతర మందిరంలోకి నిష్క్రమించాడు. బ్రహ్మ రుద్రాది దేవతలందరూ భారతభూమికి పయనమయ్యారు.

శివదూత రాయబారం


Tulsi - sankka chudula marriage - తులసీ - శంఖచూడుల పరిణయం

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - తులసీ - శంఖచూడుల పరిణయం

తులసీదేవి ఇక్కడికి ప్రసంగం చాలించింది. ఇద్దరూ క్షణకాలం మౌనంగా ఉండిపోయారు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి శంఖచూడా! ఏం చేస్తున్నావ్‌? కబుర్లు చెబుతూ కూర్చున్నావా? గాంధర్వ పద్ధతిలో తులసీదేవి పాణిగ్రహణం చెయ్యి. నువ్వు పురుషరత్నానివి, ఈవిడ స్త్రీరత్నం. నెరజాణకు నెరజాణతో కలయిక ఆనందప్రదమేకదా! నిర్విరోధంగా లభించే ఉత్తమ సుఖాన్ని ఎవరయివా వదులుకుంటారా? అలా వదులుకునేవాడు శుద్ధపశువు.

కాంతామణీ! ఇంకా ఎన్ని పరీక్షలు పెడతావు. ఎంతసేపు పరీక్షిస్తావు? ఇటువంటి గుణవంతుడు కోటికొక్కడుకూడా ఉండడు. దేవ దానవులను జయించిన మహావీరుడు. లక్ష్మీశ్రీహారులలాగా రాధాకృష్ణులలాగా నేనూసరస్వతిలాగా భవుడూభవానీలాగా ధరాదేవీవరాహమూర్తుల్లాగా అనసూయ అత్రిమహర్షుల్లాగా నలదమయంతులలాగా రోహిణీచంద్రుల్లాగా రతిమన్మథుల్లాగా దితికశ్యపుల్లాగా వసిష్ఠారుంధతుల్లాగా అహల్యాగౌతముల్లాగా కర్దమదేవహూతుల్లాగా తారాబృహస్పతుల్లాగా శతరూపామనువుల్లాగా దక్షిణాయజ్ఞదేవతల్లాగా స్వాహాహుతాశనుల్లాగా శచీదేవేంద్రుల్లాగా పుష్టిదేవీ గణపతుల్లాగా దేవసేనా షణ్ముఖుల్లాగా తులసీశంఖచూడులు మీరిద్దరూ దంపతులై సాభాగ్యసంపదలతో వర్ధిల్లండి. సుఖసంతోషాలను యథేచ్చగా అనుభవించండి. అటుపైని గోలోకం చేరుకుందురుగావి. తులసీ! నువ్వు అప్పుడు కృష్ణపరమాత్మను కలుసుకుందువుగాని అన్నాడు.

నారాయణమహర్షి ఇంతవరకూ చెప్పి కాసింత విశ్రాంతి తీసుకున్నాడు. నారదుడు మళ్ళీ మొదలుపెట్టాడు. మహర్షీ! నాకన్నీ సందేహాలే! అన్నీ సంశయాలే. నీవంటి జ్ఞాని దారికినప్పుడే అన్నీ తీర్చేసుకోవాలి. విసిగిస్తున్నాను అనుకోవద్దు. చాలా విచిత్రమైన ఉపాఖ్యానం చెప్పావు. ఇలాంటివి ఇప్పటికి చాలా చెప్పావు. అయినా నాకు తృప్తి కలగడంలేదు. తులసీ శంఖచూడుల కథ ఆటుపైని ఏమయ్యింది, ఆ విశేషాలు వినాలని ఉంది అని అడిగాడు. నారాయణుడు గొంతు సవరించుకుని మిగతా కథ చెప్పనారంభించాడు.

నారదా! బ్రహ్మదేవుడు అలా ఇద్దరినీ ఆశీర్వదించి తన లోకానికి వెళ్ళిపోయాడు. తులసీ  శంఖచూడులు గాంధర్వవివాహం చేసుకున్నారు. దేవలోకంలో దుందుభులు మ్రోగాయి. పారిజాత పుష్పవృష్టి కురిసింది. వివిధ శృంగారక్రీడల్లో తేలియాడారు. తులసీదేవి నవసంగమ సమ్మూర్చిత అయ్యింది. నీరులేని సుఖసాగరంలో మునిగితేలింది. కామశాస్త్రంలో చెప్పిన చతుష్షష్టి బంధ విశేషాలతో ఆ రసికదంపతుల కలయిక నిత్యనూతనంగా అనుక్షణమధురంగా సాగింది. అంగ ప్రత్యంగ సంశ్లేషాలతో సర్వాంగచుంబనలతో ప్రణయకలహాలతో పరస్పర సాంత్వనాలతో పుష్పోద్యాననదీతీరాలలో పొదరిళ్ళలో చందనచర్చలతో నిర్విరామంగా వారి సంభోగ శృంగార లతిక చిగురులు తొడిగింది. లీలావిలాసాలతో తులసీదేవి, రాసిక్యవైభవంతో శంఖచూడుడూ పరస్పరం మనస్సులు దోచుకున్నారు. కౌగిలింతలకు చందనచర్చలు పేటులెత్తాయి. స్వేదజలానికి సిందూరతిలకాలు చెమ్మగిల్లాయి. నఖక్షతాలతో దంతక్షతాలతో తులసీదేవి సర్వాంగీణంగా చిగురించిన తీగలాగా ఉంది. శంఖచూడుడి గుండెలమీద బుజాలమీద క్షతాలతోపాటు తులసీదేవి ధరించిన కంకణాద్యాభరణాలు ఒత్తుకుని గుర్తులేర్పడ్డాయి. ఆలింగన చుంబన జంఘాదిమర్దనలతో కవ్వింపులతో కొసరింతలతో బెదిరింపులతో చిరునవ్వులతో నిట్టూర్పులతో తాంబూలసేవనలతో పల్లటీ కూతలతో(మణిత ధ్వనులు) సంస్కారసంపన్నమైన శృంగారానుభవంతో రేయింబవళ్ళు సంతృప్తి చెందుతున్నారు. ఏపూటకాపూట విలువైన వస్త్రాలూ ఆభరణాలూ సుగంధానులేపనాలూ పుష్పాలంకరణలతో పరస్పరం కన్నులపండువు చేసుకుంటున్నారు.

జరారోగహరమైన పారిజాతకుసుమాన్నీ అమూల్య రత్నాంగుళీయకాన్నీ త్రిలోకదుర్లభమైన అనర్ఘమణినీ తులసీదేవి శంఖచూడుడికి బహూకరించిది. నీ దాసిని నేనని మాటిమాటికీ పలవరిస్తూ భక్తిగా పాదాభివందనం చేసింది. శంఖచూడుడు లేవనెత్తి గుచ్చి కౌగిలించుకున్నాడు. నేనే నీ దాసుణ్ణి అన్నాడు. వరుణదేవుడినుంచి జయించి తెచ్చిన అమూల్యవస్త్రాలనూ త్రిలోక దుర్లభమైన రత్నమాలికనూ మంజీరాలనూ కేయూర కుండలాలనూ కంకణాంగుళీయకాలనూ విశ్వకర్మ ఇచ్చిన అపూర్వశంఖాన్నీ పద్మపత్ర నిర్మితమైన శయ్యనూ తులసికి బహూకరించి ఆమె చిబుకం పట్టుకుని ముఖం పైకెత్తి కళ్ళల్లోకి చూస్తూ చిరునవ్వులు కురిపించాడు. ముద్దులతో నింపాడు. కబరీభరంలో మాంగళ్యభూషణాన్ని అలంకరించాడు. చందనకుంకుమబిందు నిర్మితమైన మకరికాపత్రాలను చెక్కిళ్ళపై చిత్రించాడు. సిందూర తిలకం దిద్దాడు. నల్లని జుట్టుమధ్య అది దీపంలా వెలిగిపోయింది.

పాదపద్మాలకు లత్తుక, గోళ్ళకు రంగు తీర్చిదిద్ది ఆ పాదాలను తన గుండెలకు హత్తుకుని దేవీ! నీ దాసుణ్ణి అంటూ మైమరిచి పలవరించాడు. మెల్లగా కౌగిలించుకున్నాడు. గుండెలపై పరుండబెట్టుకున్నాడు.

ఇలా ఎంతకాలం గడిచిందో వారికే తెలీదు. ఒకనాడు ఎందుకనో ఇద్దరూ కలిసి ఆ తపోవనాన్ని విడిచిపెట్టేసి మలయపర్వత సీమలకు వెళ్ళిపోయారు. అక్కడ ప్రతిశిఖరంమీద ప్రతి సానువులోనూ ప్రతి వనంలోనూ ప్రతి పొదరింటా ప్రతిగుహలోనూ ప్రతి సరస్సులోనూ ప్రతి నదీతీరంలోనూ ప్రతి పులినతలంమీద తామే అయి క్రీడించారు. పుష్పభద్రానదిలో జలక్రీడలు సాగించారు. అటునుంచి గంధమాదనంమీద మరికొంతకాలం వినోదించి నందనంలో విహరించారు. చంపక కేతకీ మాలతీ కుంద కుముద వనాలలో ఆనందించారు. ప్రతి కల్పవృక్షచ్భాయలోనూ నిర్జన కాంచన శిఖరాలమీదా వలపులు పండించుకున్నారు, పుంస్కోకిలల కలకూజితాలతో గండుతుమ్మెదల ఝంకారాలతో కోరికలు తీర్చుకున్నారు. అయివా కామం చల్లారలేదు. ఆజ్యంపోసినట్టు కామాగ్ని మరింతగా ప్రజ్వరిల్లింది.

దానవేంద్రుడు శంఖచూడుడు తులసీదేవితో తన రాజధానిలోకి ప్రవేశించాడు. మనోహర కేళీమందిరం కల్పించి అందులో ఇద్దరూ ఆనందించారు. అక్కడినుండే ఆ ప్రతాపశాలి సాధారణ పరిపాలన సాగించాడు. ఇలా ఒక మన్వంతరం గడిచింది. ఇంతకాలమూ దేవదానవ సంగ్రామాలు లేవు. అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. దానవవీరులూ తమ తమ ఇల్లాండ్రతో ఆనందాలనుభవించారు.

దానవుల చేతిలో పరాజితులై స్వర్గలోకాన్నీ అధికార భోగభాగ్యాలనూ కోల్పోయిన దేవతలు భిక్షుకులై సంచరిస్తున్నారు. వారంతా గుమికూడి బ్రహ్మదేవుడి సన్నిధికి వెళ్ళారు. తమ దుస్థితి విన్నవించి గొల్లుమన్నారు. బ్రహ్మతో కలిసి కైలాసానికి వెళ్ళి శివుణ్ణి తీసుకుని వైకుంఠానికి వెళ్ళారు.

అది వైకుంఠం. అత్యంతదుర్లభం. పరమపదం. జరామృత్యుహరం. దానిద్వారం దగ్గర ఇరువైపులా ద్వారపాలకులున్నారు. రత్న సింహాసనాలమీద కూర్చుని ఉన్నారు. రత్నాభరణాలతో పీతవస్త్రాలతో వన మాలికాలంకృతులై సాక్షాత్తు విష్ణుమూర్తుల్లాగా శ్యామసుందర విగ్రహులై చతుర్భుజులై గదాశంఖచక్ర పద్మధారులై పద్మనేత్రులై హసన్ముఖులై కావలికాస్తున్నారు. బ్రహ్మదేవుడు తమ రాకనూ కారణాలమా వారికి విన్నవించాడు. వారు అనుజ్ఞ ఇచ్చారు. ఆమీదట అందరూ లోపలికి ప్రవేశించారు. ఇలాంటి ద్వారాలు వరుసగా పదహారున్నాయి. ఆంతటా ఇదే పరిస్థితి, ఇదే అవస్థ. అన్నీ గడిచి ప్రధాన సభామంటపం చేరుకున్నారు. అక్కడ శ్రీమన్నారాయణుడు దేవర్షి పరివృతుడై కొలువుతీరి ఉన్నాడు. చతుర్భుజులూ నారాయణ స్వరూపులూ కౌస్తుభాలంకృతులూ అయిన పార్షదులు పరివేష్టించి ఉన్నారు. 

ఆ నభామంటపం చతురస్రాకారంలో ఉంది. చంద్రమండలంలాగా వెన్నెలలు వెదజల్లుతోంది. మణిమయహారాలు తోరణాలుగా వేలాడుతున్నాయి. అంతటా రత్నాలు పొదిగారు. శ్రీహరి కేవలం ఇచ్చామాత్రంతో సృష్టించినట్టుంది. ఎటుచూసినా మేలిమిముత్యాల అలంకరణలు. నేలంతా మణికుట్టిమం, జలభ్రాంతిని కలిగిస్తోంది. నాలుగువైపులా గోడలకు మండలాకార మణిదర్పణాలు. మధ్యమధ్య అపూర్వంగా చిత్రరేఖలు. పద్మరాగమణులతో శిల్పం చెక్కిన పద్మాలు. వాటిమీద ఎగురుతున్నట్టు ఇంద్రనీలమణులతో తుమ్మెదలు. చుట్టూ లోపలితట్టునే శ్యమంతక మణులతో నిర్మించిన విశాల సోపాన నిశ్రేణి. ఇంద్రనీలమణి స్తంభాలు. ప్రతిస్తంభం దగ్గరా రతమయ పూర్ణకుంభాలు. వాటినుంచి పట్టుదారాలతో పాకిస్తున్న చందన లతలు - వాటికి చిగుళ్ళు. 

సభామంటపానికి వెలుపల పారిజాతవృక్షాలు. వాటి పరిమళం చల్లగా మెల్లగా అంతటా వ్యాపిస్తోంది. లోపల కస్తూరీ కుంకుమ చందనాగురు సుగంధాలు విటితో పోటీపడుతున్నాయి.

సహస్రయోజన విస్తీర్ణమైన ఆ మహామంటపంలో ఒకవైపున విద్యాధరస్త్రీలు మనోహరంగా నృత్యాలు చేస్తున్నారు. మంద్రస్వరంతో విద్యాధరులు నేపథ్యగానం అందిస్తున్నారు. భవనానికి లోపలా వెలుపలా ఆయుధపాణులై హరికింకరులు కావలి తిరుగుతున్నారు.

ఆ సభామంటపానికి మధ్యభాగంలో శ్రీహరి చుక్కల్లో చంద్రుడులాగా వెలిగిపోతున్నాడు. అదొక సింహాసనం. అమూల్యరత్నసింహాసనం. దానిమీద శ్రీహరి. కిరీటి. కుండలి. వనమాలి. చందనచర్చిత నీల శరీరుడు. చేతిలో కేళీపద్మం. ఎట్టయెదుట నృత్యగీతాలను ఆస్వాదిస్తున్నాడు. చిరునవ్వులు ఆరబోస్తున్నాడు. శాంతన్వరూపుడై ఉన్నాడు. లక్ష్మీసరస్వతులు పాదాలు ఒత్తుతున్నారు. తాంబూలం సేవిస్తున్నాడు. ఆ పరిమళాలు వ్యాపిస్తున్నాయి. గంగాదేవి తెల్లని వింజామర వీస్తోంది.

సభాసదులందరూ భక్తివినమ్రులై స్తోత్రపాఠాలు చేస్తున్నారు. పరిపూర్ణతముడైన ఆ ప్రభువును దర్శించి బ్రహ్మేశానదేవతలందరూ శిరసువంచి నమస్కరించారు. బహుధా స్తుతించారు. అందరి తనువులూ పులకాంకురితాలే. అందరి గొంతులూ భక్తిగద్గదాలే. అందరి కన్నులూ అశ్రుజలపూర్ణాలే.

జగద్విధాత బ్రహ్మదేవుడు మరింత చేరువకి వెళ్ళి శిరస్సున అంజలిబంధంతో వినయంగా వంగి నిలబడి మెల్లగా యావద్వృత్తాంతమూ విన్నవించాడు. అంతా విన్న శ్రీహరి ఒక్క మందహాసం చేసి రహస్యంగా పలికాడు.

శంఖచూడుడి పూర్వజన్మ


Tuesday, May 5, 2026

Tulasi Sankha Chudula Sanvadam - తులసీ - శంఖచూడుల సంవాదం

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - తులసీ - శంఖచూడుల సంవాదం

అంతలోకీ శంఖచూడుడు అనే తరుణవయస్కుడు అటువైపు వచ్చాడు. పుష్కరక్షేత్రంలో జైగీషవ్యుని ఉపదేశంపై నిష్ఠగా తపస్సుచేసి శ్రీకృష్ణ మహామంత్రంవల్ల సిద్దుడైన యోగీశ్వరుడతడు. సర్వమంగళ ప్రదమైన కవచాన్ని కంఠసీమలో హారంగా ధరించి బ్రహ్మదేవుడి ఆజ్ఞమేరకు అక్కడికి వచ్చాడు. మనోవాంఛాసిద్ధిరస్తు - అని విరించి వరమిచ్చి ఆశీర్వదించి మరీ పంపించాడు.

తనవైపు నడిచివస్తున్న శంఖచూడుణ్ణి చూసింది తులసీదేవి. నవయౌవన సంపన్నుడు. సాక్షాత్కరించిన మన్మథుడు. సంపెంగ పువ్వులాగా ఉన్నాడు. రత్నభూషణభూషితుడు. శరత్పూర్ణిమనాటి చంద్రబింబంలాంటి ముఖం శరత్పంకజాల్లాంటి కన్నులు. దివ్యరత్నవిమానం నుంచి దిగివస్తున్నాడు. కదలాడుతున్న రత్నకుండలాల కాంతులు చెక్కిళ్ళ పై లాస్యం చేస్తున్నాయి. అలంకరించుకున్న పారిజాత పుష్పమాలికల పరిమళాలు బహుపరాకులు పలుకుతున్నాయి. చిరునవ్వులు చిందిస్తున్నాడు. నొసటనున్న బొట్టు కస్తూరీచందనగంధాలను వెదజల్లుతోంది. మదగజగమనంతో ఆ మనోహరుడు చేరువకి వచ్చి నిలబడ్డాడు.

తులసీదేవి తానెప్పుడు లేచి నిలబడిందో తనకే తెలియలేదు. మేలిముసుగులో ముఖం దాచుకుని తలవంచి చిరునవ్వులు చిందిస్తూ కాలికొనగోట నేలను గీరుతూ క్రీగంట పులుకుపులుకున తిలకిస్తూ పులకించిపోతోంది.

శంఖచూడుడు తులసీదేవిని సన్నిహితంగా చూశాడు. శరచ్చంద్రుణ్ఞి నిందించే ఆమె ముఖం. మాలతీపుష్పమాలికలు అలంకరించిన కబరీభారం. రత్నాలు పొదిగిన అమూల్య విచిత్ర కుండలాలు. ఆ కాంతులలో బుగ్గలు మరీ మెరిసిపోతున్నాయి. రత్నతారహారాలు పీనోన్నతవక్షఃస్తలంమీద నిట్టూర్పులకు కదలాడుతున్నాయి. రత్నకంకణాలు. రత్నకేయూరాలు. చిన్ని చిన్ని సంకులు కూర్చి కట్టిన దండ. (సంకువు = శంఖం). అన్నివేళ్ళకూ రత్నాంగుళీయకాలు. పాదాలకు మణిమయమంజీరాలు. కాలు కదుపుతూంటే మనోహరంగా సవ్వడి చేస్తున్నాయి. లాక్షాలంకృత పాదపద్మాలు. రాసిబోసిన సౌందర్యంలాగా ఉన్న ఆ లలితసుందరమూర్తిని ఆపాదమస్తకం తిలకించాడు. కామభావపరవశుడయ్యాడు. మధురంగా పలకరించాడు.

కల్యాణీ! ఎవరి అమ్మాయివి ? నీపేరేమిటి ? కన్యకామణులలోకెల్లా ధన్యురాలివి, మాన్యురాలివి, సర్వకల్యాణదాయినివిగా కనిపిస్తున్నావు. నేను నీ సేవకుణ్ణి. సుందరీ! దయచేసి సంభాషించి నన్ను అనుగ్రహించు.

కామవాంఛాపరిప్లుతుడై శంఖచూడుడు ఇలా పలకరించేసరికి ఆ వామలోచన తానూ ఆదే పరిస్థితిలో అదే ఉద్దేశంతో ఉంది కనక తలవంచుకునే బదులు పలికింది.

నేను ధర్మధ్వజుడి కన్నకూతిరిని. ఈ తపోవనంలో చాలాకాలం నుంచీ తపన్నుచేస్తూ తపస్వినిగానే ఉంటున్నాను. నువ్వు ఎవరివో! ఇటు ఎందుకు వచ్చావో! నీ దారిన నువ్వు సుఖంగా వెళ్ళు. ఉత్తమ వంశంలో పుట్టిన శీలవతులను ఏకాంతంలో ఇలా పలకరించడం నీవంటి సజ్జనులకు తగదు. ఇది శాస్త్ర విరుద్ధంకూడా,

వేదం తెలియనివాడూ లంపటుడూ ధర్మశాస్త్రాన్ని తిరస్కరించినవాడూ అసత్కులంలో పుట్టినవాడూ మాత్రమే ఇలా ఏకాంతంలో కాముకుడై కామినీమణులతో సంభాషణకు దిగుతాడు. ఆటువంటి పురుషులు మెచ్చుకునేదీ ఇష్టపడేదీ అటువంటి కాంతలనే.

నీకు తెలుసో తెలీదో, అసలు స్త్రీలు అంటేనే పయోముఖ విషకుంభాలు. ఆపాతమధురంగా మాట్లాడతారు. హృదయంలోమాత్రం మదమత్తలై ఉంటారు. వాళ్ళ మనస్సు మంగలికత్తిలా ఉంటుంది. వచస్సు పూలగుత్తిలా ఉంటుంది. తమ కోరికలు తీర్చుకోవడం తప్ప వారికి మరొక ధ్యాస ఉండదు.

పని ఉంది అంటే స్వామికి వశవర్తినులై ఉంటారు. పని తీరిపోయిందంటే తల ఎగరేస్తారు. హృదయంలో మాలిన్యమూ ముఖంలో మాటల్లో ప్రసన్నత వీరి లక్షణం. పురాణగాథలు చూడు. స్త్రీల చరిత్రలు ఎంత దూషితాలో తెలుస్తాయి. అటువంటి స్త్రీలను తెలివైనవాడు ఎవడూ నమ్మడు. నమ్మాడు అంటే వాడు మూర్ఖుడైనా అయ్యుండాలి, దుష్టుడైనా అయ్యుండాలి.

ఆడవారికి హితులూ అహితులూ అని రెండు విభాగాలు ఏమీ ఉండవు. ఎప్పటికప్పుడు కొత్తవాడు కావాలి. అందగాడూ యువకుడూ అయితే చాలు. శత్రువా మిత్రుడా అనే తేడా ఏమీ లేదు.

వీళ్ళు ప్రదర్శించే పాతివ్రత్యమంతా కేవలం బాహ్యాడంబరమే. ప్రయత్నపూర్వకంగా ఆ ప్రదర్శన చేస్తారు. మనసుల్లో నిరంతరం కామవాంఛలే. బాహ్యశరీరాన్ని లోకం కన్నుగప్పడానికి పాతివ్రత్యంతో ఖేదపరుచుకుంటూ అంతరంగంలో మదనక్రీడలు సాగిస్తుంటారు. రహస్యంగా ప్రియుడిమీదకి నవ్వులు రువ్వుతూ బహిరంగంలో సిగ్గరితనం నటిస్తుంటారు.

మైథునం లేనివేళ వీళ్ళకోపానికి అవధులుండవు. సివంగులై కయ్యాలకు దిగుతారు. సుదీర్ఘ సంభోగానికి సంతసిస్తారు. స్వల్పసంభోగానికి దుఃఖిస్తారు. మృష్టాన్నపానీయాదులకన్నా వీరు తహతహలాడేదీ ఆరాటపడేదీ సుందరుడూ రసికుడూ గుణవంతుడూ అయిన యువకుడికోసమే.

రసికుడంటే వీళ్ళకి కొడుకుమీదకన్నా ప్రేమ. సంభోగ కుశలుడైన ప్రియుడు వీళ్ళకి ప్రాణాధికుడు, మగడు ముసలివాడైనా సంభోగచతురుడు కాకపోయినా అతడే వీళ్ళకి ప్రథమశత్రువు. అనుక్షణమూ అతడిని తిట్టిపోస్తూ జగడాలాడుతుంటారు. పెనుసర్పం ఎలకపిల్లను తిన్నట్టు సూటిపోటిమాటలతో దెప్పరాలతో కొరుక్కుతినేస్తుంటారు. స్త్రీ అంటే దుస్సాహసస్వరూప. సర్వదోషాలకూ నిలయం. బ్రహ్మాది దేవతలకుకూడా దుస్సాధ్య. కేవలం మోహస్వరూపిణి. మోక్షద్వారానికి తలుపుచెక్క. తపస్సులకి అడ్డగడియ. విష్ణుభక్తికి అడ్డుపుల్ల. సమస్తమాయలకూ దాపుడుకుండ. సంసారకారాగారంలో ఇనపసంకెల. ఇంతి అంటే అదొక ఇంద్రజాలం. అదొక మిథ్య. అదొక స్వప్నం. పైకి కనిపించే అవయవాలన్నీ ఆందంగానే ఉంటాయి. లోపల అంతటా కుళ్ళే. మలమూత్రసంకులమై దుర్గంధభూయిష్టమై నెలకు మూడునాళ్ళు రక్తసిక్తమై సంస్కారవిరహితమై ఆ రహస్యాంగం కుత్సితంగా ఉంటుంది.

బ్రహ్మదేవుడు మాయావులకోసమని ఈ మాయారూపాన్ని సృష్టించాడు. అందుకే ముముక్షువులు ఈ స్త్రీని విషరూపంగా తిరస్కరిస్తారు. భోగలాలసులు మాత్రం కామవాంఛలతో ఎగబడి అందుకోలేక తృప్తిపాందలేక బోరగిలబడతారు.

నారదా! తులసీదేవి తాను స్త్రీఅయినా ఇంత సుదీర్హంగా స్త్రీనింద చేసింది. మనస్సులో అనురాగం ఉన్నా మాటల్లో కాఠిన్యాన్ని ప్రదర్శించింది. శంఖచూడుడు నిబ్బరంగా బదులు పలికాడు.

దేవీ! నువ్వు అన్నది పూర్తిగా అసత్యమూ కాదు, అలాగని పూర్తిగా సత్యమూ కాదు. సగం అదీ, సగం ఇదీ. కనక నేను చెప్పేదికూడా కొంచం విను.

బ్రహ్మదేవుడు స్త్రీలను రెండు రకాలుగా సృష్టించాడు. కొందరు సుగుణవతులు. కొందరు దుర్గుణవతులు. సృష్టి అన్నాక ఆన్ని రకాలూ ఉంటాయి. లక్ష్మి- సరస్వతి - దుర్గ - సావిత్రి - రాధిక వీరంతా స్త్రీరూప సృష్టికి ప్రథమావతారాలు. సృష్టిసూత్రస్వరూపిణులు. కాబట్టి నిజానికి సృష్టిలో స్త్రీ రూపం వీరి అంశమే. స్త్రీలందరూ వీరి అంశావతారాలే. కనక స్త్రీమూర్తి సర్వమంగళకారకం. శతరూప, దేవహూతి, స్వధాదేవి, స్వాహాదేవి, దక్షిణాదేవి, ఛాయావతి, రోహిణి, వరుణాని, శచి, కుబేరపత్ని, దితి, అదితి, లోపాముద్ర, అననూయ, తులసి, అహల్య, అరుంధతి, మేనాదేవి, తార, మందోదరి, దమయంతి, వేదవతి, గంగ, మనసాదేవి, పుష్టి తుష్టి సతి మేధా దేవతలు, కాళిక, వసుంధర, షష్టీదేవి, మంగళచండీక, ధర్మకామిని, స్వస్తి శ్రద్దా శాంతి కాంతి క్షాంతి దేవతలు, నిద్రా క్షుత్‌ పిపాసా సంధ్యా రాత్రి దేవతలు, సంపత్తి ధృతి కీర్తి క్రియా శోభా శివామూర్తులు - వీరంతా ఉత్తమాంగనలు. పతివ్రతలు. శక్తి స్వరూపిణులు. యుగయుగాలుగా వీరు స్త్రీమూర్తులై అవతరిస్తూనే ఉన్నారు. పవిత్రంగా జీవితాలు గడుపుతూనే ఉన్నారు. కానీ నువ్వన్నట్టు కొందరు పుంశ్చలీరూపిణులూ ఉన్నారు. వారిని నిందించడం తగునుగానీ సత్వగుణ ప్రధానలైన సాధ్వీమణులనుకూడా వారితో సమంగా జమచేసి మొత్తం స్త్రీజాతినే నిందించడం తగదుగాక తగదు.

స్త్రీలలోగానీ పురుషులలోగానీ గుణాధిక్యాన్ని బట్టి ఉత్తమ మధ్యమ అధమ భేదాలు ఏర్పడతాయి సత్త్వగుణ ప్రధానులది ఉత్తమశ్రేణి. రజోగుణులది మధ్యమశ్రేణి. తమోగుణులది అధమశ్రేణి. పండితుడై ఉత్తమవంశంలో పుట్టి సత్త్వగుణ ప్రధానుడైన వాడెవడూ ఎంతటి అవకాశం లభించినా పరస్త్రీ వాంఛించడు.

అయితే అథముడివా, ఇక్కడికి ఇలా ఎందుకు వచ్చావు? అని నువ్వు అడగవచ్చు. నా రాకకు తగినంత కారణం ఉంది. బ్రహ్మదేవుడి ఆజ్ఞమేరకు నేను వచ్చాను. నిన్ను గాంధర్వవివాహం చేసుకుంటాను. నేనే శంఖచూడుణ్ణి. ప్రస్తుతం దానవుణ్ణి. దేవతలకు శత్రువుని. పూర్వజన్మలో గోలోకాన హరి సాన్నిధ్యాన్ని అనుభవించిన సుదాముణ్జి. శ్రీకృష్ణుడికి అత్యంతాప్తులైన ఎనమండుగురు పార్షద గోపకులలో ఒకడిని, రాధికాదేవి శాపంవల్ల ఇప్పుడిలా రాక్షసుణ్ణి అయ్యాను. కృష్ణమంత్రప్రభావంవల్ల జాతిస్మరుణ్ణి. నువ్వూ జాతిస్మరవే. తులసివి. పూర్వజన్మలో శ్రీకృష్ణుని సాహచర్యాన్ని అనుభవించినదానవు. రాధికా శాపంవల్ల భూలోకంలో అవతరించావు.

గోలోకంలో ఉన్నప్పుడు నిన్ను చూసి ఎంతగానో అనురక్తుణ్ణి అయ్యాను. నీ దర్శనంకోపం నీ స్పర్శనంకోసం ఉవ్విళ్ళూరే మనస్సుతో అనుక్షణం పరితపించేవాడిని. అయితే రాధికాదేవికి భయవడి నా అనురాగాన్ని నాలోనే అణుచుకునేవాణ్ణి. దేవీ! నేనెవరో నువ్వెవరో రాధాశాపమేమిటో శ్రీకృష్ణుడి వరమేమిటో బ్రహ్మదేవుడి ఆజ్ఞ ఏమిటో అంతా వివరించాను. ఇక నీ ఇష్టం. నీదయ, నా ప్రాప్తం. - ఆని ముగించాడు శంఖచూడుడు.

తులసీదేవికి సందేహాలు తీరి సంతృప్తి కలిగింది. మరింత విలాసంగా నవ్వుతూ - దానవేంద్రా నీవంటి సజ్జనుడు ఎంతటి ప్రశంసకైనా అర్హుడు. ఇటువంటి అందగాడినే ఏ కాంతామణి అయినా కోరుకుంటుంది. ఇష్టపడుతుంది. నిజానికి ఇప్పుడు నువ్వు బుద్ధికుశలతతో నన్ను ఓడించావు. ఇది సత్యం అందుచేత సర్వాత్మనా అభినంద్యుడివి. ఇలాకాక - రూపవిలాసాలకు సమ్మోహితుడై స్త్రీ  చేతిలో ఓడిపోయి దాసుడుగా మారినవాడు పరమ నింద్యుడు. మిత్ర బంధు దేవగణాలందరూ అతడిని నిందిస్తారు. తల్లీ తండ్రీ సోదరులూ ఆంతా మనస్సులో అసహ్యించుకుంటారు. దూషిస్తారు.

పురుడు మైలలాంటి ఏ అశౌచాలు వచ్చినా బ్రాహ్మణుడు పదిరోజులకీ క్షత్రియుడు పన్నెండు రోజులకీ వైశ్యుడు పదిహేనురోజులకీ శూద్రుడు నెలనాళ్ళకీ శుద్ధిపాందుతారని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. స్త్రీజితుడు మాత్రం శ్మశానంలో కట్టెల్లో కాలేదాకా శుద్ధిపాందడు. ఆంతటిది సుమా ఆ అశౌచం. వాడుపెట్టిన పిండాలను పితృదేవతలు ముట్టరు. అతడిచ్చే పాద్యాలనూ నైవేద్యాలనూ దేవతలు స్వీకరించరు. పరస్త్రీ లంపటుడు ఎంత జ్ఞాని అయితేనేమీ ఎంత తపస్వి అయితేనేమీ! అతడి జపమూ తపమూ పూజలూ హోమాలూ చదువులూ పేరూ ప్రఖ్యాతీ అన్నీ వ్యర్థం.

ఈ తెలివిడి ఉన్నదానను కనక నిన్ను పరీక్షిద్దామని స్త్రీనింద చేశాను. నిన్నూ నిష్టురాలు ఆడాను. పరీక్షించకుండా ఏ కామినీ ఎవ్వరినీ వరించదుగదా! కన్యకలేకాదు కన్యాదాతలుకూడా వరుణ్ణి పరీక్షించకుండా పిల్లనిచ్చి పెళ్ళిచేస్తారా? గుణహీనుడు వృద్ధుడు అజ్ఞాని దరిద్రుడు మూర్ఖుడు రోగిష్టి కుత్సితుడు కోపిష్టి దుర్ముఖుడు ఆంగవికలుడు కుంటివాడు అంధుడు బధిరుడు (చెవిటి) జడుడు (చైతన్యం లేనివాడు) మూగవాడు నపుంసకతుల్యుడు పాపాత్ముడు - ఇలాంటి వరుడికి కూతురు నిచ్చినవాడు బ్రహ్మహత్యా మహాపాతకి అవుతాడు. అందుచేత బాగా వాకబుచేసి పరీక్షించి శాంతస్వభావుడూ గుణవంతుడూ యువకుడూ పండితుడూ సజ్జనుడూ అయిన వరుడికే పిల్లను ఇవ్వాలి. ఆలా ఇచ్చి వివాహం జరిపించిన కన్యాదాత పది మహాయజ్ఞాలు చేసిన ఫలాన్ని పొందుతాడు.

కూతురిని పెంచి పెద్దచేసి ధనలోభంతో అమ్ముకునేవాడు కుంభీపాకనరకానికి పోతాడు. అక్కడ కన్యామూత్ర పురీషాలు తింటూ పురుగుకాట్లు భరిస్తూ కాకి పోట్లు చవిచూస్తూ - ఇంద్రులు పధ్నాలుగు మంది మారేటంతకాలం నరకయాతన ఆనుభవిస్తాడు. అటుపైని రోగిష్టిగా జన్మించి మాంసం అమ్ముకుంటూ నీచంగా జీవయాత్ర సాగిస్తాడు.

తులసీ - శంఖచూడుల పరిణయం


Tulsi story - తులసీ వృత్తాంతం

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - తులసీ వృత్తాంతం

నారదా! నువ్వడిగిన తులసీ వృత్తాంతం ఇప్పుడు చెబుతున్నాను విను. కుశధ్వజుడి సోదరుడున్నాడే ధర్మధ్వజుడు మాధవీదేవిని వివాహం చేసుకున్నాడు. గంధమాదనపర్వత గుహలలో అరణ్యాలలో పొదరిళ్ళలో సరస్సులలో ఆ దంపతులు కామకేళీపరవశులై విహరించారు. రేయింబవళ్ళు తేడాలేకుండా నూరు దివ్యసంవత్సరాలు శృంగారం లోతులు చూశారు. అప్పటికి రాజుగారికి తెలివి వచ్చింది. రాజ్యమూ పాలనమూ స్పృహలోకి వచ్చాయి. శృంగారక్రీడ చాలించి రాజధానికి వచ్చాడు. మాధవీదేవికి మాత్రం తనివి తీరలేదు. అయినా రాకతప్పిందికాదు. గర్భిణీ అయ్యింది. నెలలు నిండాయి. కార్తికపూర్ణిమా శుక్రవారంనాడు శుభముహూర్తాన ఆడపిల్లను ప్రసవించింది. సాక్షాత్తు లక్ష్మీదేవి అవతరించింది. ఆ కనుముక్కు తీరూ ఆ వర్చస్సూ ఆ సౌందర్యమూ ఎర్రని చేతులూ కాళ్ళూ బంగారు శరీరకాంతీ - సుందరీమణులలోకెల్లా సుందరీమణిగా ఉన్న ఆ బాలికను చూసినవారంతా ఆశ్చర్యపోతున్నారు. ముగ్దులవుతున్నారు. ఈమెకు సాటి ఇంకెవ్వరూ లేరంటే లేరు అని నిశ్చయించుకుంటున్నారు. అలా ఆ బిడ్డకు తుల (సాటి)లేనిది కనక తులసి అనే పేరు స్థిరపడింది. అందరూ ఆలాగే పిలవనారంభించారు.

తులసికూడా వేదవతిలాగే సద్యోయౌవనవతియై తపస్సు కోసమని బదరికావనానికి వెళ్ళింది. లక్ష దివ్యవత్సరాలు తపస్సు చేసింది. నారాయణుడే తనకు భర్తకావాలి ఆనే దృఢసంకల్పంతో తీవ్ర తపస్సు సాగించింది. గ్రీష్మంలో పంచాగ్నిమధ్యంలో నిలిచి, శీతర్తువులో తడిబట్టలు ధరించి, వర్షర్తువులో ఆరుబయట వానలో కూర్చుని, రేయింబవళ్ళు తపస్సు చేసింది. నీళ్ళూ పళ్ళూ తప్ప మరింక ఏ ఆహారామూ లేదు. ఒక ముప్ఫయివేల ఏళ్ళు కేవలం ఆకులు తిని, మరో నలభైవేల సంవత్సరాలు కేవలం వాయుభక్షణతోను, మరొక పదివేల వసంతాలు నిరాహారంగాను ఘోరతపస్సు చేసింది. శరీరాన్ని పూర్తిగా నిర్లక్ష్యంచేసి ఒంటికాలి బొటనవేలిమిద నిలబడి నిష్ఠగా తపస్సు చేస్తూంటే ఒకనాడు హఠాత్తుగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. తులసీదేవి సవినయంగా ఆ హంసవాహనుడికి నమస్కరించింది.

తులసీ! నీ తపస్సుకి మెచ్చాను. వరం ఇస్తాను. నీ ఇష్టం ఏదైనా కోరుకో. హరిభక్తి కావాలా? హరిదాస్యం కావాలా? అజరామరత్వం కావాలా? ఏది కావాలంటే అది ఇస్తాను. అడుగు - అన్నాడు చతుర్ముఖుడు.

తాతా! నా మనసులో ఉన్నమాట చెబుతున్నాను విను. నువ్వు సర్వజ్ఞుడివి. నీముందు దాపరికమేమిటి, సిగ్గు ఏమిటి? నేను తులసిని. ఒకప్పుడు గోలోకవాసినిని. గోపికను. గోవిందుడితో శృంగారక్రీడలో నేను పరవశించి ఉండగా రాసేశ్వరి రాధికాదేవి వచ్చి చూసింది. కోపావేశంతో గోవిందుణి బెదిరించింది. తనతో లాక్కుపోయింది. పోతూ నన్నుశపించింది. భూలోకంలో మానవకాంతగా పుట్టమంది. అప్పుడు గోవిందుడు నన్ను ఓదార్చుడు. నా అంశావతారమైన చతుర్భుజ నారాయణుడిని భర్తగా పొందుతావు. బ్రహ్మదేవుడు వరమిస్తాడు. భారతభూభాగాన తపస్సు చెయ్యి - అన్నాడు. అంతర్థానం చెందాడు. నేను రాధాదేవికి భయపడి తనువు చాలించాను. భూలోకాన మానవకాంతగా జన్మించాను, హే సృష్టికర్తా! శాంతసుందర విగ్రహుడైన శ్రీమన్నారాయణుడు నాకు భర్తగా లభించాలి. అదే నేను నిన్ను కోరుతున్న వరం. దయచేసి అనుగ్రహించు.

తులసీదేవీ! తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది. శ్రీకృష్ణాంగ సముద్భవుడైన గోపకుడు సుదాముడు గోలోకంలో ఉండేవాడు. గుర్తుందా? అతడిప్పుడు రాధికాశాపంవల్ల భూలోకంలో దనువంశంలో జన్మించాడు. మహాతేజస్వి. కృష్ణుడి అంశతో ఆవిర్భవించిన సుందరుడు. శంఖచూడుడు అనే పేరుతో ముల్లోకాలలోనూ విఖ్యాతి గడించాడు. గోలోకంలో ఉన్నప్పుడు ఇతడు (సుదాముడు), నిన్ను చూసి కామపరవశుడవుతూండేవాడు. రాధికాదేవికి భయపడి అప్పట్లో ఏ సాహసమూచెయ్యలేకపోయాడు. ప్రస్తుతం అతడు భూలోకాన జాతిస్మరుడు. నువ్వూ అలాగే జాతిస్మరవే. నిన్ను చూడగానే తప్పకుండా గుర్తుపడతాడు. కనక వెళ్ళు. ఇప్పటికి అతణ్జి భర్తగా స్వీకరించు. తరవాత సాక్షాత్తు నారాయణుడినే వరిద్దువుగాని.

గోపికా! మరొక విశేషం. నారాయణుడి శాపంవల్లా దైవయోగంవల్లా నువ్వు ఒక పవిత్రమైన వృక్షరూపాన్ని పాందుతావు. విశ్వపావనివి అవుతావు. నీ పువ్వులు విష్ణుమూర్తికి ప్రాణాధిక ప్రియాలు అవుతాయి. నువ్వులేవి పూజలన్నీ నిష్పలమవుతాయి. బృందావనంలో నీపేరు బృందావని. నీ దళాలతోనే గోపగోపీజనం మాధవుణ్ణి అర్చిస్తారు. నువ్వు వృక్షాధిదేవతవు అవుతావు. ఆ రూపంతో నిరంతరం స్వేచ్చగా శ్రీకృష్ణుడితో విహరిస్తావు. ఇది నా వరం. ఇక ఈ ఘోరతపస్సు చాలించు.

బ్రహ్మదేవుడి వరానికి సంతోషించి తులసీదేవి చిరునవ్వులు చిందించింది. మరొక్కసారి శిరసువంచి నమస్కరించింది. మెల్లగా తన అంతరంగం బయటపెట్టింది.

పరమేష్టీ! నిజం చెబుతున్నాను. ద్విభుజుడూ శ్యామసుందరుడూ అయిన గోలోక కృష్ణుడిమీదనే ఉంది నా మనను. అంతగా చతుర్భుజుడిమీద లేదు. అలనాడు శృంగారభంగమయ్యింది. అప్పటినుంచీ అసంతృప్తిగానే ఉంది. అయినా ఆ గోవిందుడే ఆజ్ఞాపించాడు అంటున్నావు కనక అంగీకరిస్తున్నాను. అదీకాక నీ వరానుగ్రహంవల్ల, సుదుర్లభుడైన ఆ గోలోక గోవిందుణ్ణి మళ్ళీ పాందగలుగుతాను కనక సమ్మతిస్తున్నాను. కానీ నా హృదయంలో నాటుకుపోయిన రాధాభయం ఇప్పటికీ వేధిస్తూనే ఉంది. దాన్ని తొలగించుకునే ఉపాయం చెప్పూ,

తులసీ! దానికి ఒక దివ్యమైన ఉపాయం ఉంది. షోడశాక్షరమైన రాధికామంత్రాన్ని ఉపదేశిస్తాను స్వీకరించు. ఈ మంత్రాన్ని జపిస్తే నువ్వు రాధికాదేవికి ప్రాణప్రియవు అవుతావు. రాధికా సమానురాలివై గోవిందుడికి ప్రీతిపాత్రవు అవుతావు. మీ ఇద్దరి రహస్య శృంగారాన్ని రాధిక తెలుసుకోలేదు - అని చెప్పి మంత్రాన్ని ఉపదేశించి స్తోత్రమూ కవచమూ పూజావిధానమూ వివరించి అంతర్జానం చెందాడు.

తులసీదేవి ఆ మంత్రాన్ని ఉపాసించి మహాలక్ష్మీ సమానురాలయ్యింది. మహాభోగాలన్నీ అందుబాటులోకి వచ్చాయి. తపఃక్లేశాన్ని మరచిపోయింది. ఫలం సిద్ధిస్తే దుఃఖంకూడా సుఖం అనిపిస్తుంది కదా 

ధర్మధ్వజ మహారాజుగారి కూతురు తులసీదేవి తపోవనంలోనే రాజభోగాలు అనుభవిస్తోంది. నిత్యమూ చెలికత్తెలతో విందులూ వినోదాలే. ఒకరోజు రాత్రి విందులు ఆరగించి పుష్పచందన చర్చితమైన మనోహరశయనంమీద మేను వాల్చింది.

నవయౌవనంలో ఒంటరిగా ఉన్న ఆ సుందరాంగిమీదకి మన్మథుడు నిర్దాక్షిణ్యంగా తన అయిదుబాణాలు గురిపెట్టాడు. ఆ దాడికి తట్టుకోలేక తులసీదేవి విలవిలలాడింది. శరీరం పులకించగా కన్నులు ఎరుపెక్కాయి. క్షణంలో మేను వాడిపోయింది. మూర్భపోయింది. క్షణంలో తేరుకుంది. క్షణం నిద్రపోయింది. మరుక్షణంలో మేలుకొంది. క్షణం ఉద్విగ్న అయ్యింది. క్షణంలో దహించుకొనిపోయింది. క్షణంలో ప్రసన్నురాలయ్యింది. క్షణకాలం చేతనత్వం, క్షణకాలం విషణ్ణత. క్షణం కూర్చోవడం, క్షణం లేచి నిలబడటం. క్షణం మేను వాల్చడం, క్షణం లేచి తిరగడం. క్షణం పరుగులు తియ్యడం, క్షణం స్థాణువు కావడం. ఏమి చేస్తోందో ఏమి జరుగుతోందో ఆమెకే తెలియడంలేదు. వుష్పచందనతల్పం కంటకశయనమయ్యింది. (కంటకం = ముల్లు). ఫలాలూ జలాలూ విషతుల్యమయ్యాయి. రాజమందిరం కొండగుహ అనిపించింది. సన్ననివస్త్రం అగ్నికీల అయ్యింది. చెక్కిలిమీద చిత్రించుకున్న సిందూరమకరికాపత్రం పుండులా బాధించింది.

ఒక సుందరాంగుడు రసికేశ్వరుడు యువకుడు చందనచర్చితుడు రత్నభూషణభూషితుడు పుష్పమాలికాసమలంకృతుడు ఎదురు వస్తున్నట్టూ తన ముఖపద్మాన్ని కన్నులతో ఆస్వాదిస్తున్నట్టూ చెవిలో రహస్యంగా మధురంగా రతికథాలాపాలు చేస్తున్నట్టూ తల్పంపైని తనను కౌగిలించుకొని అలరిస్తున్నట్టూ అంతలోనే లేచి వెళ్ళిపోతున్నట్టూ, నిలు నిలు ప్రాణేశా! ఎక్కడికి ఈ పయనం అంటూ తాను వెంటపడుతున్నట్టూ అతడు వెనుదిరిగి మళ్ళీ తన దగ్గరికి వస్తున్నట్టూ - భ్రాంతిలోనే అయినా ఏవేవో మధురానుభవాలు కలుగుతున్నాయి. ఇది అంతా వట్టి భ్రాంతి అని మరుక్షణంలో తెలిసివస్తోంది, ఆ తెలివిడి రాగానే ఆపుకోలేని దుఃఖంతో విలపిస్తోంది. ఇలా నవయౌవనం ఏడిపిస్తూంటే తులసీదేవికి ఆ రాత్రి గడవటం కష్టమయ్యింది. అలాగే విలపిస్తూ కూర్చుంది.

తులసీ - శంఖచూడుల సంవాదం


Sita - Chayasita - Draupadi - సీత - ఛాయాసీత - ద్రౌపది

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - సీత - ఛాయాసీత - ద్రౌపది

కాలం గడిచింది. కృతయుగం వెళ్ళి త్రేతాయుగం వచ్చింది. వేదవతి జనకమహారాజు ఇంట సీతాదేవిగా అవతరించింది. పూర్వజన్మ తపఃఫలంగా శ్రీరాముణ్జీ పరిణయమాడింది. సీతారాములిద్దరూ చాలాకాలం వివిధ కామోపభోగాలతో ఆనందించారు. గతజన్మ తపఃక్లేశాలకు విరుగుడుగా సీతమ్మ సుఖసంతోషాలు అనుభవించింది.

తండ్రి మాటను నిలబెట్టడంకోసం సత్యసంధుడైన రాముడు అరణ్యవాసం చేశాడు. కాలం బలీయంకదా! సీతాలక్ష్మణ సహితుడై దాశరథి సముద్ర తీరారణ్యంలో నివసిస్తుండగా ఒకనాడు అగ్నిదేవుడు విప్రవేషంలో వచ్చాడు. అడవుల్లో కష్టాలు పడుతున్న రాముణ్ణి చూసి ఎంతగానో దుఃఖించాడు. ఏకాంతంలో కలుసుకున్నాడు.

రామా! ఒక నిజం నీకు చెప్పి వెడదామని వచ్చాను. దైవం ఎవరికైనా దుర్నివార్యం. దైవం కన్నా బలీయమేదీ లేదు. కనక నేను చెప్పేది శ్రద్ధగా ఆలకించు. ఇది సీతాపహరణకాలం కాబట్టి ఈ జగన్మాతను నాకు అప్పగించు. ఛాయా సీతను నువ్వు కాపాడుకో. పరీక్షాసమయం వస్తుంది. అప్పుడు తిరిగి నీ సీతను నీకు అప్పగిస్తాను. దేవతలు పంపితే వచ్చాను నేను. కేవలం విప్రుణ్ణి కాదు. హంతాశనుణ్ణి.

రాముడు ఆలకించాడు. శ్రద్దగా ఆలకించాడు. ఏ మార్పూ ముఖంలో కనపడనివ్వలేదు. హృదయంలో మాత్రం కుమిలిపోయాడు. అగ్నిదేవుడు చెప్పినదానికి అంగీకరించాడు. హంతాశనుడు తన యోగశక్తితో ఛాయాసీతను సృష్టించి రాముడికి అప్పగించాడు. అసలు సీతను తీసుకుని వెళ్ళిపోయాడు. ఇది అత్యంతగోప్యంసుమా అని హెచ్చరిక చేసి మరీ వెళ్ళాడు. నారదా! ఈ రహ్యం లక్ష్మణుడికికూడా తెలియదంటే రాముడు ఎంత గోప్యంగా ఉంచాడో గ్రహించు.

అగ్నిదేవుడు అటు వెళ్ళాడో లేదో బంగారులేడి రాముడి కంటపడింది. దాన్ని పట్టి తెమ్మని సీతాదేవి రాముణ్ణి కోరింది. లక్ష్మణుడిని సీతకు కాపలాఉంచి రాముడు బయలుదేరాడు. బంగారులేడిని వెంబడించి చివరికి బాణం వేశాడు. అది “హా లక్ష్మణా!” అని రామకంఠంతో అరిచి ప్రాణాలు వదిలింది ప్రాణాలు వదిలే సమయంలో రాముణ్ణి దర్శించింది కనక దివ్యరూపంతో రత్నవిమానంలో వైకుంఠాన్ని చేరుకున్నాడు ఆ మాయామృగరూపధారి మారీచుడు. వైకుంఠ ద్వారపాలకులకు కింకరుడై అటుపైని వారి అనుమతితో లోపలికి ప్రవేశించాడు.

హా! లక్ష్మణా! అని వినిపించిన రామకంఠధ్వనిని విని సీతాదేవి భయపడింది. రాముడికి ఏదో ఆపద వచ్చింది సహాయపడమని లక్ష్మణుడిని పంపించింది. అతడు అలా వెళ్ళగా చూసి రావణుడు వచ్చి సీతను లంకకు అపహరించుకుపోయాడు.

రామలక్ష్మణులు అడవిలో కలుసుకున్నారు. లక్ష్మణుడిని చూసి రాముడు ఆశ్చర్యపోయాడు, ఇద్దరూ కలిసి ఆశ్రమానికి వచ్చారు. పర్ణశాల బోసిపోయింది. సీతమ్మ లేదు. రాముడు దుఃఖించి దుఃఖించి మూర్భపోయాడు. తేరుకున్నాడు. ఇద్దరూ అడవులన్నీ గాలించారు.

రావణుడు అపహరించుకుపోయాడనే వార్త గోదావరీతీరాన తెలిసింది. అటుపైని వానరులతో సఖ్యంచేసి సముద్రానికి వారధి కట్టి లంకలో ప్రవేశించిన రాముడు స్వయంగా బాణం సంధించి రావణుడిని సంహరించాడు.

సీతకు అగ్నిపరీక్ష పెట్టాడు. అప్పుడు అగ్నిదేవుడు అసలు సీతను పవిత్రంగా రాముడికి అందించాడు. ఛాయాసీత అగ్నిదేవుడికీ రామచంద్రుడికీ సవినయంగా నమస్కరించి నా కర్తవ్యమేమిటో ఉపదేశించండి అని అభ్యర్థించింది. పుష్కరక్షేత్రానికి వెళ్ళి తపస్సు చేసుకోమనీ అక్కడే స్వర్గలక్ష్మివి అవుతావు అనీ చెప్పి పంపించారు.

ఛాయాసీత పుష్కరక్షేత్రంలో మూడులక్షల దివ్యసంవత్సరాలు తపస్సుచేసి స్వర్గలక్ష్మి అయ్యింది. ఆమెయే అటుతరవాత ద్వాపరయుగంలో ద్రుపదుడి ఇంట యజ్ఞకుండంనుంచి ఆవిర్భవింది ద్రౌపది అయ్యింది. ఇలా మూడు యుగాలలోనూ ఉంది కనక ఈమెకు త్రిహాయణి అనే పేరు ఏర్పడింది.

పుష్కరక్షేత్రంలో ఛాయాసీత తపస్సు చేస్తున్నప్పుడు శంకరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. ఆమె కామాతురయై పతిని ఇయ్యి పతిని ఇయ్యి ఆని ఆవేశంగా అయిదుసార్లు అంది. రసికేశ్వరుడైన శివుడు పగలబడి నవ్వి “ప్రియా! నీకు అయిదుగురు భర్తలుంటా” రని వరమిచ్చి అదృశ్యుడయ్యాడు.

నారదా! అందుచేతనే ద్రౌపదికి పాండవులు అయిదుగురూ భర్తలయ్యారు. ప్రస్తావనలో వచ్చిందీ కనక ఈ విషయమూ చెప్పాను. అదిసరే.

అసలు సీతను స్వీకరించి, లంకారాజ్యానికి విభీషణుడిని పట్టాభిషిక్తుణ్ణి చేసి రాముడు ఆయోధ్యకు తిరిగివచ్చాడు. పదకొండువేల సంవత్సరాలపాటు రాజ్యం పరిపాలించాడు. అటు పైని సర్వలోకాలతో పాటూ తానూ వైకుంఠానికి వెళ్ళిపోయాడు. లక్ష్మీదేవి అంశయైన వేదవతి లక్ష్మీదేవిలో ప్రవేశించింది. చతుర్వేదాలూ మూర్తిమంతాలై వేదవతి నాల్కమీద నాట్యమాడుతూ ఉండేవిట! అతి పవిత్రమూ పాపనాశకమూ పుణ్యప్రదమూ అయిన వేదవతీ వృత్తాంతం చెప్పాను. తరువాత కథ ఆలకించు.

తులసీ వృత్తాంతం


Monday, May 4, 2026

Mahabaleshwar Temple - Mahabaleshwar- Maharashtra - మహాబలేశ్వర్ దేవాలయం - మహాబలేశ్వర్ - మహారాష్ట్ర

మహాబలేశ్వర్ దేవాలయం, మహాబలేశ్వర్, మహారాష్ట్ర
మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఉన్న మహాబలేశ్వర్ ఆలయం (పాత మహాబలేశ్వర్) 16వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ స్వయంభూ శైవ క్షేత్రం. హేమాద్‌పంతి శైలిలో నిర్మితమైన ఈ దేవాలయంలో 6అడుగుల నల్ల రాతి శివలింగం (మహాబలి) ప్రధాన ఆకర్షణ. ఇది దట్టమైన అడవుల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో ఉంది.

మహాబలేశ్వర్ లో ఉన్న మహాబలేశ్వర్ స్వయంభూ దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రంలోని విశిష్టత ఏమిటంటే, ఇక్కడి శివలింగం రుద్రాక్ష ఆకారంలో ఉండటం. దీనినే 'మహాలింగం' అని కూడా పిలుస్తారు. దీని ప్రాచీన వాస్తుశిల్పం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, బయట ఎలాంటి అలంకరణ లేకుండా పిరమిడ్ ఆకారంలో ఉన్న గోపురం ఉంటుంది. లోపలి భాగాలు శిల్పాలతో అలంకరించబడి ఉంటాయి. ఈ ఆలయం హేమడ్ పంతి(హేమదంత) శైలిలో నిర్మించబడింది. ఇక్కడ నంది మరియు కాలభైరవుల విగ్రహాలు మరియు శిల్పాలు ఉన్నాయి. ఆలయం యొక్క నిరాడంబరతకు, దాని వెనుక ఉన్న గంభీరమైన సహ్యాద్రి పర్వత శ్రేణులు మరింత శోభను చేకూరుస్తాయి.

ఆలయ చరిత్ర మరియు విశేషాలు:
ఇది సుమారు 6 అడుగుల పొడవు ఉంటుంది. కానీ నేల పైకి కేవలం చిన్న భాగం మాత్రమే కనిపిస్తుంది. ఈ లింగం ఉపరితలం రుద్రాక్ష కాయ లాగా గరుకుగా, ఎగుడుదిగుడుగా ఉంటుంది. అందుకే దీనిని రుద్రాక్ష శివలింగం అంటారు.

దీనిని త్రిగుణాత్మక లింగంగా భావిస్తారు (అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ ఈ లింగంలోనే ఉన్నారని నమ్మకం).

పురాణ గాథ (చరిత్ర):
శివలింగం ఆవిర్భావం వెనుక ఉన్న పౌరాణిక కథ యొక్క ప్రస్తావన స్కంద పురాణంలోని సహ్యాద్రి విభాగం యొక్క మొదటి మరియు రెండవ అధ్యాయాలలో చూడవచ్చు. 

పురాణాల ప్రకారం, పద్మకల్పంలో, మానవుల సృష్టి కోసం బ్రహ్మదేవుడు సహ్యాద్రి అడవులలో తపస్సు చేస్తున్నప్పుడు, మహాబలి, అతిబలి అనే ఇద్దరు రాక్షస సోదరులు ఇక్కడ తపస్సు చేసి శివుడిని మెప్పించారు. అయితే వారు మునులు, ఋషులను మరియు ప్రజలను హింసించేవారు.

వారి దురాగతాలు పరాకాష్టకు చేరడంతో, ఆ ప్రాంత వాసులను రక్షించడానికి విష్ణుమూర్తి వారితో పోరాడవలసి వచ్చింది. కానీ, మహాబలుడు ఇచ్చామరణం వరం పొందినందున, విష్ణుమూర్తి అతిబలుడిని మాత్రమే సంహరించగలిగాడు.

మహాబలుడి బారి నుండి విముక్తి కలిగించమని బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు శివుడిని, ఆదిమయ దేవిని ప్రార్థించారు. ఆదిమయ దేవి తన సౌందర్యంతో మహాబలుడిని మంత్రముగ్ధుడిని చేసి, బంధించింది. చివరగా మహాబలి తన తప్పు తెలుసుకుని తన పేరు మీద ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందాలని శివుడు ఈ ప్రదేశంలో తనతో శాశ్వతంగా నివసించాలనే షరతుపై అతను తన ప్రాణాలను అర్పించడానికి అంగీకరించాడు. అలా ఈ ప్రాంతానికి 'మహాబలేశ్వర్' అనే పేరు వచ్చింది.

మహాబలుడి కోరిక మేరకు శివుడు అతనితో ఉండటానికి రుద్రాక్ష శివలింగం రూపంలో అవతరించాడు, ఈ కారణంగానే మహాబలేశ్వర్ ఆలయంలో మంచం, త్రిశూలం, డమరుకం మరియు రుద్రాక్ష ఉన్నాయి. జానపద కథల ప్రకారం, ప్రతి ఉదయం మంచం నలిగిపోయి కనిపించడం వల్ల, శివుడు ప్రతి రాత్రి ఆలయాన్ని సందర్శిస్తాడు అని విశ్వాసం.

ఆలయ నిర్మాణం:
13వ శతాబ్దానికి చెందిన ఒక యాదవ పాలకుడు కృష్ణా నది మూలం వద్ద క్రీ.శ. 1215 లో ఒక చిన్న ఆలయాన్ని మరియు నీటి ట్యాంక్‌ను నిర్మించాడని ఒక ఇతిహాసం చెబుతుంది . మహాబలేశ్వర్ చుట్టుపక్కల ప్రాంతమైన జావళి లోయను , బీజాపూర్ ఆదిల్‌షాహీ సుల్తానేట్‌కు సామంతులుగా ఉన్న మోరే (వంశం) పాలించారు . ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని 16వ శతాబ్దంలో జావళి లోయ పాలకుడు రాజు చందా రావు మోర్ నిర్మించగా, 1656లో, మరాఠా సామ్రాజ్య స్థాపకుడు, ఛత్రపతి శివాజీ, చంద్రారావు మోరేను చంపి , ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేశారు. ఆ సమయంలో శివాజీ మహాబలేశ్వర్ సమీపంలో ప్రతాప్‌గడ్ కోట అనే కొండ కోటను కూడా నిర్మించారు.

ఇతర ఆసక్తికర విషయాలు:
ఛత్రపతి శివాజీ మహారాజ్ తన తల్లి జిజాబాయి గారి కోరిక మేరకు ఇక్కడే బంగారంతో 'తులదానం' నిర్వహించి, ఆ బంగారాన్ని పేదలకు పంచారని చరిత్ర చెబుతోంది.

పంచగంగ ఆలయం: ఈ ఆలయానికి సమీపంలోనే కృష్ణ, కోయ్న, వెన్న, సావిత్రి మరియు గాయత్రి అనే ఐదు నదులు కలిసే 'పంచగంగ' దేవాలయం కూడా ఉంది.

ముఖ్యమైన విశేషాలు:
మహాబలేశ్వర్ అనేది మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఉన్న ఒక చిన్న పట్టణం. హిందువులు పవిత్రంగా భావించే కృష్ణా నది దాని ఐదు ఉప నదులతో పాటు ఇక్కడే ఉద్భవించిన పుణ్యస్థలం. బ్రిటిష్ పాలకులు ఈ పట్టణాన్ని ఒకహిల్ స్టేషన్‌గా అభివృద్ధి చేసి బొంబాయి ప్రెసిడెన్సీకి వేసవి రాజధానిగా నిర్మించారు.

మహాబలేశ్వర్ భారతదేశ పశ్చిమ తీరం వెంబడి ఉత్తరం నుండి దక్షిణం వరకు విస్తరించి ఉన్న పశ్చిమ కనుమల యొక్క సహ్యాద్రి పర్వత శ్రేణిలో ఉంది . మహాబలేశ్వర్ 150 చదరపు కిలోమీటర్ల (58 చదరపు మైళ్ళు ) విస్తీర్ణం గల ఒక విశాలమైన పీఠభూమి , దీనికి అన్ని వైపులా లోయలు ఉన్నాయి. ఇది సముద్ర మట్టానికి 1,439 మీటర్ల (4,721 అడుగులు) ఎత్తులో ఉన్న తన ఎత్తైన శిఖరాన్ని విల్సన్/సన్‌రైజ్ పాయింట్ అని పిలుస్తారు. ఈ పట్టణం పూణేకు నైరుతి దిశలో సుమారు 122 కిలోమీటర్లు (76 మైళ్ళు) మరియు ముంబై నుండి 285 కిలోమీటర్లు (177 మైళ్ళు) దూరంలో ఉంది .

మహాబలేశ్వర్‌లో 
మూడు గ్రామాలు ఉన్నాయి. మాల్కం పేఠ్, పాత మహాబలేశ్వర్, మరియు షిందోలా గ్రామంలోని కొంత భాగం.

మహాబలేశ్వర్ ప్రాంతం కృష్ణా నదికి మూలం. ఈ నది మహారాష్ట్ర, కర్ణాటక , తెలంగాణ, మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది . కృష్ణా నది యొక్క మూడు ఉపనదులైన కోయినా , వెన్నా (వేణి) , మరియు గాయత్రి కూడా మహాబలేశ్వర్ ప్రాంతంలోనే ఉద్భవిస్తాయి. నాల్గవ నది అయిన సావిత్రి కూడా ఈ ప్రాంతంలోనే ఉద్భవిస్తుంది, కానీ మహాద్ మీదుగా పశ్చిమ దిశగా అరేబియా సముద్రంలోకి ప్రవహిస్తుంది.

ఈ ప్రాంతంలోని వాతావరణం స్ట్రాబెర్రీల సాగుకు అనుకూలంగా ఉంటుంది; దేశంలోని మొత్తం స్ట్రాబెర్రీ ఉత్పత్తిలో మహాబలేశ్వర్ స్ట్రాబెర్రీ సుమారు 85 శాతం వాటాను కలిగి ఉంది.

పాత మహాబలేశ్వర్‌లోని పంచగంగ దేవాలయం, 1850లలో

1819లో, మరాఠా సామ్రాజ్యం పతనమైన తరువాత, బ్రిటిష్ ప్రభుత్వం మహాబలేశ్వర్ చుట్టూ ఉన్న కొండలను సతారా అనే సామంతుల రాజ్యానికి అప్పగించింది . కల్నల్ లాడ్విక్ (తరువాత జనరల్ సర్ లాడ్విక్) మహాబలేశ్వర్ సమీపంలోని పర్వతాలను అధిరోహించిన తరువాత, బొంబాయి ప్రెసిడెన్సీ గవర్నర్ సర్ జాన్ మాల్కమ్‌కు బ్రిటిష్ దళాల కోసం ఆ ప్రదేశాన్ని ఒక ఆరోగ్య కేంద్రంగా సిఫార్సు చేశారు . 1828 లో బ్రిటిష్ వారికి మహాబలేశ్వర్ దక్కినందుకు బదులుగా సతారా రాజుకు ఇతర గ్రామాలు మంజూరు చేయబడ్డాయి. పాత రికార్డులలో మహాబలేశ్వర్‌ను గవర్నర్ పేరు మీద మాల్కమ్ పేఠ్ అని కూడా పిలిచేవారు.

సర్ మౌంట్‌స్టువర్ట్ ఎల్ఫిన్‌స్టోన్ , ఆర్థర్ మాలెట్ (ఇతని పేరు మీదుగానే "పాయింట్ ఆర్థర్" వద్ద ఉన్న పీఠానికి పేరు వచ్చింది), కార్నాక్ మరియు అనేక ఇతర బొంబాయి ప్రెసిడెన్సీ బ్రిటిష్ అధికారులు తరచుగా సందర్శకులుగా మారినప్పుడు మహాబలేశ్వర్ ప్రాముఖ్యతను సంతరించుకోవడం ప్రారంభించింది . నిరంతరం ప్రవహించే నీటి బుగ్గల నుండి నీటిని సేకరించడానికి 1842లో వెన్నా సరస్సును నిర్మించారు; ఈ సరస్సు నుండి వెన్నా నది ప్రవహిస్తుంది. 1850లలో సతారా కమీషనర్ అయిన బార్ట్లీ ఫ్రేర్, సతారా నుండి మహాబలేశ్వర్ వరకు రహదారిని నిర్మించాడు . 1800ల మధ్యలో, మహాబలేశ్వర్‌ను బొంబాయి ప్రెసిడెన్సీకి వేసవి రాజధానిగా చేశారు . ప్రభుత్వ వ్యయం ఈ ప్రాంతం యొక్క వేగవంతమైన అభివృద్ధికి దారితీసింది.

బ్రిటిష్ అధికారులు సంవత్సరంలో కొంత భాగాన్ని ఈ ప్రాంతంలో గడిపేవారు. వారి భార్యలు మహాబలేశ్వర్ మరియు సమీపంలోని పంచగనిలోని స్థానిక బోర్డింగ్ పాఠశాలల్లో ఉన్న తమ పిల్లలతో ఉండటానికి సంవత్సరంలో ఎక్కువ కాలం ఈ ప్రాంతంలో గడిపేవారు . బ్రిటిష్ పాలకులు హిల్ స్టేషన్లలో ఇంగ్లీష్ ప్రకృతి దృశ్యాన్ని పునఃసృష్టించాలని కోరుకున్నారు మరియు ఆ లక్ష్యంతో, మహాబలేశ్వర్‌లో స్ట్రాబెర్రీలు వంటి యూరోపియన్ వృక్షజాలాన్ని ప్రవేశపెట్టారు మరియు గ్రంథాలయాలు, థియేటర్లు, బోటింగ్ సరస్సులు మరియు క్రీడా మైదానాలు వంటి సౌకర్యాలను నిర్మించారు.

అనేక అద్భుతమైన సుందరమైన ప్రదేశాలతో పాటు, మహాబలేశ్వర్ పీఠభూమిలోని నిరంతర సెలయేళ్ళు, ప్రవాహాలు మరియు జలపాతాలు, అలాగే ఏడాది పొడవునా ఉండే అద్భుతమైన వాతావరణం ఆంగ్లేయులను మరియు ఇతరులను మహాబలేశ్వర్‌కు ఆకర్షించాయి. 19వ శతాబ్దం చివరి నాటికి, ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆకర్షణీయమైన, ప్రసిద్ధ హిల్ స్టేషన్‌గా మారింది. మహారాష్ట్ర గవర్నర్ వేసవి నివాసమైన రాజ్ భవన్ కూడా ఇక్కడే ఉంది. "ది టెర్రసెస్" అనే పాత భవనాన్ని 1884లో కొనుగోలు చేసి, 1886లో గిరి దర్శన్‌గా పేరు మార్చారు.

"బాబింగ్టన్ హౌస్" అనే శిలువ ఆకారంలో, లోతైన వరండా, విస్తృతమైన లోహపు పనితో కూడిన రెయిలింగ్ మరియు విశాలమైన బయటి గదులతో నిర్మించబడిన అద్భుతమైన భవంతి. 1970ల ప్రారంభంలో దీనిని రాహేజాలకు అమ్మే ముందు, ఇది బొంబాయికి చెందిన పార్శీ ఓడల సామాగ్రి వ్యాపార రాజవంశమైన దుబాష్ కుటుంబం యొక్క గ్రామీణ నివాసాలలో ఒకటిగా ఉండేది. దీనిలో 24 మంది కూర్చునే విలాసవంతమైన బల్లతో కూడిన ఒక భోజనశాల మరియు దుబాష్ కుటుంబం, ముఖ్యంగా పుస్తక ప్రియుడు మరియు కళా సేకరణకర్త అయిన జంషెడ్జీ "జిమ్మీ" కవాస్జీ దుబాష్ సేకరించిన మొదటి ముద్రణ పుస్తకాలతో కూడిన ఒక గ్రంథాలయ మండపం ఉన్నాయి.

విల్లిసన్ పాయింట్ సూర్యోదయం
మహారాష్ట్రలో మహాబలేశ్వర్ ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఇక్కడి ఆకర్షణలలో బాంబే పాయింట్, ఆర్థర్ సీట్, కేట్స్ పాయింట్, లాడ్విక్-విల్సన్ పాయింట్, మరియు ఎల్ఫిన్‌స్టన్ పాయింట్ వంటి అనేక కొండప్రాంత వీక్షణ కేంద్రాలు ఉన్నాయి, ఇక్కడ నుండి చుట్టుపక్కల కొండలు, లోయలు మరియు అడవుల దృశ్యాలు కనిపిస్తాయి. మహాబలేశ్వర్‌లో సూర్యోదయం మరియు సూర్యాస్తమయం రెండూ కనిపించే ఏకైక ప్రదేశం విల్సన్ పాయింట్. 

ఈ పట్టణంలో బ్రిటిష్ కాలం నాటి వెన్నా సరస్సు అనే మానవ నిర్మిత సరస్సు కూడా ఉంది . ఈ సరస్సు బోటింగ్ కోసం ఒక ప్రసిద్ధ ప్రదేశం. దీని చుట్టూ పర్యాటకులను ఆకర్షించే మార్కెట్ మరియు ఆహార దుకాణాలు ఉన్నాయి. ఇతర ఆకర్షణలలో లింగమల జలపాతం కూడా ఉంది. పాత మహాబలేశ్వర్ దాని మహాదేవ్ ఆలయంతో ఒక పుణ్యక్షేత్రం. 

ఇది సహజంగా చల్లని ప్రదేశం కావడంతో, మహాబలేశ్వర్ మరియు చుట్టుపక్కల కొండలలో స్ట్రాబెర్రీలు, రాస్ప్బెర్రీలు మరియు మల్బెర్రీలు వంటి అనేక సమశీతోష్ణ ప్రాంత పంటలను పండిస్తారు. ఈ పంటలలో ప్రధానమైనది స్ట్రాబెర్రీలు. స్ట్రాబెర్రీ తోటలు మరియు వాటి ఉత్పత్తులు కూడా ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. 

ప్రతాప్‌గడ్:
ఛత్రపతి శివాజీ నిర్మించిన చారిత్రాత్మక ప్రతాప్‌గడ్ కోట సందర్శించడానికి ఒక ప్రసిద్ధ ప్రదేశం . ఇది శివాజీ మహారాజ్ మరియు బీజాపూర్ సేనాపతి అఫ్జల్ ఖాన్ మధ్య జరిగిన పోరాటానికి వేదిక , ఇక్కడ అఫ్జల్ ఖాన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ చేతిలో ఓడిపోయి మరణించాడు. ఇక్కడ చిన్న దుకాణాలు, రెస్టారెంట్లు మరియు ఒక హస్తకళల దుకాణం ఉన్నాయి. అనేక పాఠశాలలు కూడా ఈ కోటకు విద్యా యాత్రలను ఏర్పాటు చేస్తాయి. ఈ కోట ఆ ప్రాంతంలోని అనేక ట్రెక్కింగ్ మార్గాలలో కూడా ఉంది.

విల్సన్ పాయింట్:
మహాబలేశ్వర్ యొక్క అత్యంత ఎత్తైన ప్రదేశం 1439 మీటర్ల ఎత్తులో ఉంది. దీనికి బొంబాయి ప్రెసిడెన్సీ గవర్నర్ లెస్లీ విల్సన్ (10 డిసెంబర్ 1923 - 8 డిసెంబర్ 1928) పేరు పెట్టారు. ఇక్కడ సూర్యోదయం చూడటానికి పర్యాటకులు విశేషంగా వస్తారు. ముఖ్యంగా సూర్యోదయం సమయంలో అద్భుతమైన దృశ్యాలను అందిస్తుంది.

దర్శన సమయాలు: ఉదయం 5:00 నుండి రాత్రి 9:00 వరకు

సందర్శనకు ఉత్తమ కాలం: నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మహాశివరాత్రి సమయంలో ఇక్కడ ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి.

హిల్ స్టేషన్ అందాలను ఆస్వాదిస్తూ ఆధ్యాత్మిక అనుభూతిని పొందడానికి ఈ ఆలయం ఉత్తమమైన ప్రదేశం

వసతి: మహాబలేశ్వర్‌లో వివిధ బడ్జెట్‌లకు సరిపోయే హోటళ్లు మరియు వసతి సౌకర్యాలు ఉన్నాయి.

రోడ్డు మార్గం: మహాబలేశ్వర్ బస్ స్టాండ్ నుండి పాత మహాబలేశ్వర్ సుమారు 6 కి.మీ దూరంలో ఉంది. టాక్సీ లేదా స్థానిక వాహనాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు.

రైలు మార్గం: మహాబలేశ్వర్‌కు అత్యంత సమీప రైల్వే స్టేషన్ సతారా, ఇది 60 కి.మీ. దూరంలో ఉంది. సమీపంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో పూణే (120 కి.మీ.), సాంగ్లీ రైల్వే స్టేషన్ (170 కి.మీ.) ఉన్నాయి. ఈ ప్రదేశాల నుండి మహాబలేశ్వర్‌కు ప్రభుత్వ బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఖేడ్ సమీపంలోని కొంకణ్ రైల్వేపై ఉన్న దివాన్ ఖవతి రైల్వే స్టేషన్ నుండి పోలాద్‌పూర్ మీదుగా మహాబలేశ్వర్‌కు 60 కి.మీ. మార్గం ఉంది.

వాయు మార్గం: మహాబలేశ్వర్ నుండి 120 కి.మీ. దూరంలో ఉన్న పూణే నగరానికి సేవలు అందించే పూణే అంతర్జాతీయ విమానాశ్రయం సమీప విమానాశ్రయం . ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం 270 కి.మీ. దూరంలో ఉంది.

మన దేవాలయాలు చారిత్రక నగరాలూ

Mantram Moola Mantram - మంత్రం మూలమంత్రం

సిద్ధి మంత్రం:

సిద్ధిం మే సంవిధాస్యంతి దేవాస్సర్షిగణాస్త్విహ 


బ్రహ్మాస్వయంభూర్భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే 

సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృత్ 


వరుణః పాశహస్తశ్చ సోమాదిత్యౌ తథైవ చ 

అశ్వినౌ చ మహాత్మానౌ మరుతశ్శర్వ ఏవ చ 


సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవ యః ప్రభుః 

దాస్యంతి మమ యే చాన్యే హ్యదృష్టాః పథి గోచరాః 

సరస్వతీ మూలమంత్రం
ఓం - ఐం - హ్రీం - క్లీం - శ్రీం సరస్వత్యై స్వాహా(4 లక్షలు)

తులసి మూల మంత్రం:
ఓం శ్రీం హ్రీం శ్రీం ఐం బృంధాన్యై స్వాహ

పృథివీదేవి మూలమంత్రం
ఓం - హ్రీం - శ్రీం - క్లీం వసుధాయై స్వాహా

మహా లక్ష్మీ మూల మంత్రం:
"ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః"

వటుక భైరవ మూల మంత్రం
ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం స్వాహా

దుర్గా మూల మంత్రం :
"ఓం దుం దుర్గాయై నమః"

ఓం శ్రాం శ్రాంకర్యే స్వాహా

ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః

కామాక్షి మూల మంత్రం: 
ఓం హ్రీం శ్రీం క్లీం కామేశ్వరీ కామాక్షి క్లీం శ్రీం హ్రీం స్వాహా

చాముండా మూలమంత్రం:
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వాహా

భద్రకాళి మూల మంత్రం:
ఓం హ్రీం శ్రీం భద్రకల్యై నమః

ఓం జయంతి మంగళ కాళీ భద్రకాళి కపాలిని, దుర్గా శివ క్షమా ధాత్రీ నారాయణి నమోస్తుతే"

Goddess Lakshmi as Vedavati - వేదవతిగా లక్ష్మీదేవి

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - వేదవతిగా లక్ష్మీదేవి

నారదా! దక్షసావర్ణి అని ఒక మనువు ఉన్నాడు. చాలా పుణ్యాత్ముడు. వైష్ణవుడు, శుచిశీలి, యశస్వి, విష్ణుమూర్తి అంశతో అవతరించాడు. ఆయనగారికి ఒక కుమారుడున్నాడు. బ్రహ్మసావర్ణి ఆని పేరు. అతడూ ధర్మాత్ముడే. విష్ణుభక్తి పరాయణుడే. అతని కుమారుడు ధర్మసావర్ణి. ఇతడూ వైష్ణపుడే. జితేంద్రియుడే. ఇతనికి రుద్రసావర్ణి, అతనికి దేవసావర్ణి, అతనికి ఇంద్రసావర్డి పుత్రులుగా జన్మించారు. అందరూ వైష్ణవులు. అందరూ ధర్మాత్ములు. అందరూ జితేంద్రియులు. ఆందరూ మహాతపస్వులు. వీరిలో ఇంద్రసావర్ణి కుమారుని పేరు వృషధ్వజుడు. పేరుకి తగ్గట్టే ఇతడు శివభక్తుడు. పరమ మాహేశ్వరుడు. ఇతడి ఆశ్రమంలో సాక్షాత్తు శివుడు మూడు దేవయుగాలపాటు ఉన్నాడంటే ఇక ఇతని శివభక్తిని గూర్చి వేరేచెప్పాలా! శివుడికికూడా వృషధ్వజుడంటే పుత్రాధిక వాత్సల్యం. స్నేహం, ప్రేమ. దానికి లొంగిపోయిన వృషధ్వజుడు నారాయణాది దేవతాపూజలనూ యజ్ఞయాగాదులనూ పరిత్యజించాడు. వాణీ లక్ష్మీపూజలను కూడా దూరం చేశాడు. అంతే కాదు వాటిని నిందించనారంబించాడు. అది భరించలేకపోయాడు సూర్యభగవానుడు. సర్వసంపదలూ తొలగి భ్రష్టుడివైపామ్మని శపించాడు. ఆది విన్న శివుడు త్రిశూలం పుచ్చుకుని సూర్యుడి వెంటబడ్డాడు. సూర్యుడూ అతడి తండ్రీ బయపడి పరుగు లంకించుకున్నారు. బ్రహ్మదేవుణ్జి శరణువేడారు. శివుడు అలాగే వెంబడించి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. దానితో బ్రహ్మదేవుడికీ హడలెత్తింది. సూర్యుడితో సహా వైకుంఠానికి పరుగెత్తాడు. బ్రహ్మ - కశ్యప - మార్తాండులు ముగ్గురికీ భయంతో నోళ్ళు ఎండిపోయాయి. మాట పెగలలేదు. శ్రీమన్నారాయణుడి పాదాలమీద పడ్డారు. శరణు శరణు అన్నారు. బహుధాస్తుతించారు. జరిగినదంతా చెప్పారు. నారాయణుడు దయతలచి అభయమిచ్చాడు. నేనున్నాను భయపడకండి అన్నాడు. భయార్తులై ఎవరు నన్ను స్మరించినా నేను చక్రధారినై అక్కడ ప్రత్యక్షమవుతాను. రక్షిస్తాను. ఇది నా వ్రతం. ఈ జగత్తులకు రక్షకుణ్ణి నేను. బ్రహ్మరూపంలో సృష్టిచేసేది నేను. శివరూపంతో సంహరించేది నేను. నువ్వూ శివుడూ సూర్యుడూ అన్ని నేనే. త్రిగుణాత్మకుణ్ణి. అనేక రూపాలూ అవతారాలూ ధరిస్తూ ఈ సృష్టిని కాపాడుతూ ఉంటాను.

అందుచేత మీరు నిర్భయంగా జీవించండి. వెళ్ళండి. శివుడివల్ల మీకు ఈరోజు నుంచీ ఏ భయమూలేకుండా వరం ఇస్తున్నాను. శంకరుడు సజ్జనుడు. సర్వేశ్వరుడు. భక్తపరాధీనుడు. భక్తవత్సలుడు. సుదర్శనమన్నా శివుడన్నా నాకు ప్రాణాధికప్రియం. సుదర్శన శివులకన్నా తేజస్వి ఈ బ్రహ్మాండంలో నాస్తి.

చతుర్ముఖా! మరో రహస్యం నీకు తెలుసా? శివుడు తలుచుకుంటే చిటికెలో కోటి సూర్యుల్ని సృష్టించగలడు. నీలాంటి బ్రహ్మదేవుళ్ళను కోటిమందిని కల్పించగలడు. అతడికి అసాధ్యమంటూ ఎదీ లేదు. ఆతడు రేయింబవళ్ళు నన్నే ధ్యానిస్తూ ఉంటాడు. నా మంత్రాన్ని నా గుణగణాలనూ బక్తితో అయిదుముఖాల గానం చేస్తూ ఉంటాడు. అతడు జ్ఞాని. జ్ఞానాధిదేవత. నేనుకూడా నిరంతరం అతడి మేలునే ఆకాంక్షిస్తూ ఉంటాను. ఎవరు ఎలా నన్ను ధ్యానిస్తే వారిని అలా నేను సేవిస్తుంటాను, రక్షిస్తుంటాను. (యథా చ మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్‌) సకల శుభాలూ అతడి అధీనంలో ఉంటాయి. శివం కలిగించేవాడు కనకనే శివుడన్నారు. శుభస్వరూపమే అతడు.

శ్రీహరి ఇలా ప్రసంగిస్తుండగానే త్రిశూలధారియై శివుడు కోపంతో ఊగిపోతూ ఎరుపెక్కిన కన్నులతో వృషభ వాహనం మీద అక్కడికి వచ్చాడు. వస్తూనే వాహనం దిగాడు. చక్రికి శిరసువంచి భక్తిగా నమస్కరించాడు. ఒక్కసారి తలెత్తి తేరిపారజూశాడు.

రత్నసింహాసనంమీద రత్నాలంకార భూషితుడై కిరీట కుండలాలంకృతుడై వనమాలికాధారియై చక్రహస్తుడై చతుర్భుజుడై నవనీరదశ్యాముడై చందనచర్చిత సర్వాంగుడై పీతాంబరుడై లక్ష్మీప్రదత్త తాంబూలచర్వణపరాయణుడై అప్పరశ్చామరగ్రాహిణీ సంసేవితుడై విద్యాధరీ నృత్యగీతాస్వాదనరసికుడై విరాజిల్లుతున్న శ్రీమన్నారాయణుడు ఎట్టయెదుట కనివిందుచేశాడు.

ఈశ్వరుడు మరొక్కసారి నమస్కరించాడు. బ్రహ్మదేవుడు నిర్భయంగా నిలబడి భక్తితో శిరసువంచాడు. సూర్యుడూ కశ్యపుడూ అంజలిఘటించారు.

శ్రీ హరి చిరునవ్వులతో శివుణ్ణి ఆహ్వానించి సమున్నత సుఖాసనం చూపించాడు. శివుడు దానిమీద కూర్చున్నాడు. విష్ణుపార్షదులు వచ్చి ఇరువైపులా నిలిచి వింజామరలు వీచారు. మకరందంకవ్నా మధురంగా మధుసూదనుడు పలకరించాడు.

మహాదేవా! కుశలమా? చాలాకాలమయ్యింది నిన్ను చూసీ, నీతో సంభాషించీ. పోవీలే ఇప్పటికైనా తీరుబాటుచేసుకుని వచ్చావు. కాసేపు హాయిగా గడుపుదాం. ఏదైనా పనిమీద వచ్చి ఉంటే చెప్పు. ముందు అది చూసి తరవాత కబుర్లకి దిగుదాం. అవునూ, నీ ముఖం ఏమిటి కొత్తగా ఉంది. ఎక్కడో కాసింత కోపరేఖ కనపడుతున్నట్టుంది - అంటూ మందహాసం విసిరాడు.

శివుడుకూడా ప్రతిగా చిరునవ్వులు చిందించాడు. శ్రీహరీ! నువ్వన్నది నిజమే. నా కోపానికి కారణం ఉంది. వృషధ్వజుడని నా భక్తుడున్నాడు. భక్తుడే కాదు నాకు ప్రాణాధికప్రియుడు. అతడిని సూర్యుడు శపించాడు. అందుకని నాకు సూర్యుడిమీద కోపం వచ్చింది. త్రిశూలంతో తరుముకుంటూవచ్చాను. నా పుత్రవాత్చల్యం దెబ్బతింది. సూర్యుణ్ణి సంహరించాలనుకున్నాను. అతడు వెళ్ళి బ్రహ్మను. శరణువేడాడు. బ్రహ్మదేవుడు వచ్చి నిన్ను శరణుజొచ్చాడు. మనస్సుతోకానీ మాటతోకానీ నిన్ను శరణు కన్నవాడికి ఇక ఏ ఆపదలూ ఉండవుకదా! జరామృత్యుభయాలుకూడా దరిజేరవాయె. వాడు నిర్భయంగా నిశ్శంకగా సంచరించవచ్చు. అటువంటిది ప్రత్యక్షంగా వచ్చి నిన్ను శరణువేడుకొన్న విరించి సూర్యకశ్యపులను నేనే కాదు ఎవడుమాత్రం ఏమి చెయ్యగలడు? హరినామస్మరణ సర్వకాల సర్వావస్థలలోనూ అభయప్రదమూ మంగళప్రదమూను. నువ్వు జగన్నాథుడవు. అన్నీ తెలిసినవాడవవు. ధర్మ స్వరూపుడవు. నా భక్తుడి సంగతి ఏమిటో చెప్పు. వృషధ్వజుడు నాకు పుత్రనిర్విశేషుడు. ఈ సూర్యుడి శాపంవల్ల శ్రీవిహీనుడయ్యాడు. అతడిని ఎలా ఉద్ధరిస్తావో ఏమి చేస్తావో ఏమి చెయ్యమంటావో - అంతా నీ ఇష్టం ఆని ముగించాడు శివుడు.

శంభూ! నువ్వు గమనించలేదుగానీ సూర్యుడు శపించిన నాటినుంచి ఇప్పటికి ఇరవైయొక్క యుగాల కాలం గతించింది. వైకుంఠంలో గంటన్నర కాలమంటే భూలోకంలో కొన్ని యుగాలు. నువ్వు వెంటనే నీ కైలాసానికి వెళ్ళు. వృషధ్వజుడు కాలధర్మం చెందాడు. కాలమనేది ఆతి దారుణమూ అని వార్యమూకదా! అతడి కొడుకు రథధ్వజుడూ అస్తమించాడు. ఇతడి కొడుకులు ధర్మధ్వజ - కుశధ్వజులిద్దరూ ప్రస్తుతం జీవించి ఉన్నారు. సూర్యుడి శాపం కారణంగా అప్పటినుంచీ వీరందరూ ధనసంపద్విరహితులై గర్భదారిద్య్రం అనుభవిస్తున్నారు. అయితే ధర్మధ్వజ కుశధ్వజులిద్దరూ పరమవైష్టవులు. ప్రస్తుతం రాజ్యభ్రష్టులు. శ్రీవిరహితులు. ఇద్దరూ లక్ష్మీదేవిని ఉపాసిస్తున్నారు. కనక త్వరలోనే వారిద్దరి భార్యలకూ లక్ష్మీదేవి తన అంశనూ తన కళనూ అందిస్తుంది. పుత్రికగా జన్మిస్తుంది. అప్పుడు సంపన్నులవుతారు. రాజ్యం పొందుతారు. రాజశ్రేష్ఠులవుతారు. శివా! ఇక నువ్వు వెళ్ళు. నీ సేవకుడు మరణించి చాలా కాలమయ్యింది - అని ఆజ్ఞాపించి శ్రీహరి కొలువు చాలించాడు. అభ్యంతరమందిరానికి వెళ్ళిపోయాడు. శివుడు తపస్సుకోసమని తన లోకానికి వెళ్ళిపోయాడు, బ్రహ్మదేవుడూ నిష్క్రమించాడు. సూర్యకశ్యపులూ సెలవుతీసుకున్నారు.

నారదా! ధర్మధ్వజ కుశధ్వజులు లక్ష్మీదేవిని ఆరాధిస్తూ చాలాకాలం తపస్సు చేశారు. ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులయ్యారు. పోయిన రాజ్యాలనూ సంపదలనూ తిరిగి పొందారు. పుత్రవంతులూ అయ్యారు. వారిలో కుశధ్వజమహారాజుగారి ఇల్లాలు మాలావతి మళ్ళీ నీళ్ళుపోసుకుంది. పదినెలలూ మోసి ఆడపిల్లను ప్రసవించింది. ఆ బిడ్డ పుడుతూనే వేదధ్వని చేసింది. సద్యోయౌవనవతియై పురిటిమంచం నుంచి లేచి వచ్చింది. పుట్టగానే వేదాలు వల్లించింది కనక ఆ కన్యకకు వేదవతి అని నామకరణం చేశారు.

పురిటి గదినుంచి ఈవలికి వచ్చి స్నానం చేసి తపస్సు చేసుకుంటానంటూ అడవుల బయలుదేరింది. తల్లిదండ్రులూ పెద్దలూ ఎంత వారించినా వినిపించుకోలేదు. నిమిషం ఆగలేక పుష్కరక్షేత్రానికి వెళ్ళి ఒక మన్వంతరకాలం తీవ్ర తసస్సు చేసింది. అయినా ఆమె శరీరం బడలిపోలే వొడిలి పోలేదు. నవయౌవనం అలాగే నిలిచింది. అప్పుడొక అశరీరవాక్కు వినిపించింది-

వేదవతీ! పై జన్మలో నీ తపస్సు ఫలిస్తుంది. నీ కోరిక నెరవేరుతుంది. బ్రహ్మాదులకే అందని శ్రీహరిని పతిగా వాంఛిస్తున్నావు. వచ్చే జన్మలో శ్రీహరి నీకు భర్త అవుతాడు.

ఈ మాటలకు వేదవతి సంతోషించింది. అక్కడి నుంచి బయలుదేరి గంధమాదనపర్వతశిఖరం మీద అత్యంత నిర్జన ప్రదేశంలో మళ్ళీ తపస్సు కొనసాగించింది.

ఒకనాడు అక్కడికి రావణాసురుడు వచ్చాడు. వేదవతి యథావిధిగా అతిథి మర్యాదలు చేసింది పళ్ళూ ఫలాలూ అర్ఘ్యపాద్యాలూ శీతలోదకాలూ భక్తితో సమర్పించింది. అన్నింటినీ స్వీకరించి పాపాత్ముడు మరింత చేరువకి వెళ్ళి వెకిలిగా కుశలప్రశ్నలు వేశాడు. ఆమె సౌందర్యానికి చలిం కామబాణ పీడితుడయ్యాడు. చటుక్కున చెయ్యిపట్టుకుని కౌగిలించుకోబోయాడు. వేదవతి కోపంతో  బుసకొట్టింది. కళ్ళల్లో నిప్పులు రాల్చింది. అతడిని శిలాప్రతిమలా నిశ్చేష్టుణ్డి చేసింది. రావణుడు రాతిబొమ్మ అయిపోయాడు. కాలూ చేయీ ఆడలేదు. నోటమాటలేదు. జడీభూతుడయ్యాడు.

వేదవతి కన్నులు మూసుకుని మనస్సులో మహాదేవిని స్మరించింది. స్తుతించింది. కళ్ళు తెరిచింది. రావణుణ్ణి శపించింది. రావణా! నా కారణంగానే నువ్వు నశిస్తావు. సపుత్రబాంధవంగ అంతరిస్తావు. నువ్వు కాముకుడవై నన్ను స్పృశించావు. కౌగిటిలోకి లాక్కోబోయావు. నీ బలం ఎమిటో ఎంతో చూపించు - అంటూ యోగశక్తితో దేహం చాలించి వెళ్ళిపోయింది. నిశ్చేష్టుడై చూస్తూ నిలబడ్డ  రావణాసురుడు కొంత సేపటికి తెప్పరిల్లాడు. ఆమె శరీరాన్ని గంగానదిలో విడిచిపెట్టి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆశ్చర్యం నుంచి తేరుకోలేక వేదవతీరూపాన్నీ సాహసాన్నీ మరిచిపోలేక చాలాకాలం విలపించాడు.

సీత - ఛాయాసీత - ద్రౌపది


The marriage of Ganga and Vaikuntha - గంగా-వైకుంఠుల పరిణయం

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - గంగా-వైకుంఠుల పరిణయం

శానకాదిమహామునులారా! శ్రద్ధగా వింటున్నారుకదా అని మరొకసారి హెచ్చరించి సూతుడు తరవాత కథను కొనసాగించాడు. అప్పుడు నారదుడు మళ్ళీ నారాయణమహర్షిని అడిగాడు -

మహర్షీ! గంగాదేవి వైకుంఠానికి వెళ్ళింది అన్నావేతప్ప అక్కడ చతుర్భుజుడికి ఎలా ఇల్లాలయ్యిందో చెప్పలేదు. ఆ పుణ్యకథ వినాలని ఉంది. చెప్పపూ - అని నారదుడు అభ్యర్థించాడు. నారాయణ మహర్షి సరే అని ప్రారంభించాడు.

నారదా! గంగాదేవి వైకుంఠానికి బయలుదేరిందికదా! ఆవిడవెంట బ్రహ్మదేవుడు వెళ్ళాడు. వెళ్ళి వైకుంఠంలో ఉన్న చతుర్భుజ నారాయణుడికి విషయమంతా వివరించి చెప్పాడు. రాధాకృష్ణుల శరీరాలనుంచి ద్రవరూపంగా గంగాదేవి ఆవిర్భవించడమూ రాధమ్మకు భయపడి శ్రీకృష్ణుడి పాదపద్మంలో దాక్కోవడమూ రాధాదేవి అలిగి జలపానం చెయ్యడమూ తామందరూ గోలోకానికి వెళ్ళి శ్రీకృష్ణపరమాత్మను శరణువేడటమూ ఆయన దయతలిచి గంగను తన పాదంనుంచి విడిచిపెట్టడమూ అప్పూడు ఆ గంగాదేవిని వైకుంఠానికి వెళ్లమనడమూ, అక్కడ చతుర్భుజనారాయణుడికి ఇల్లాలివి కమ్మనడమూ - మొత్తం జరిగిన వృత్తాంతాన్ని వివరంగా చెప్పాడు.

చతుర్భుజనారాయణా! వైకుంఠాధిపా! ఈవిడ పరమ పావని. రాధాకృష్టాంగసంభూత. జలాధిష్ఠాన దేవత. నవయౌవన సంపన్న సుశీల సుందరాంగి శుద్ధసత్త్వస్వరూప. క్రోధాహంకార వివర్జిత. నిన్ను తప్ప ఈ వైకుంఠంలో మరెవ్వరినీ వరించదు. ఈవిడకు రాధికామంత్రాన్ని ఉపదేశించి ఇక్కడకి తీసుకువచ్చాను. గాంధర్వవివాహ పద్దతిలో నువ్వు ఈమెను స్వీకరించు. నువ్వు సురేశ్వరుడవు. రసికుడవు. ఈమె సురేశ్వరి. రసీక. అందుచేత మీ ఇద్దరి సమాగమమూ పరస్పరం ఆనందదాయకంగా అనురూపంగా ఉంటుంది. నువ్వు పురుషులలో రత్నానివి. ఈవిడ స్త్రీరత్నం. నెరజాణకు నెరజాణతో సంగమం గుణోన్నతంగా ఉంటుంది. పైగా - స్వయంగా వరించి వచ్చిన కన్యను తిరస్కరించినవాడిమీద లక్ష్మీదేవి అలుగుతుంది. విడిచి వెళ్లిపోతుంది. ఇది నిశ్చయం. పామరుడేకాదు పండితుడైనా ప్రకృతిని ఆవమానించడు. స్త్రీ అంటే ప్రకృతి కళాస్వరూపిణి. పురుషుడంటే ప్రాకృతికుడు.

నువ్వేమో జగన్నాథుడివి. నిర్గుణుడివి. ప్రకృతికి అతీతుడివి. శ్రీకృష్ణపరమాత్మ ద్విభుజుడైతే  అతనిలో సగభాగమైన నువ్వు చతుర్భుజుడివి. కృష్ణుడి వామాంగంనుంచి ఆవిర్భవించిన మహశక్తి  స్వరూపిణి రాధాదేవి. అందులో దక్షిణాంశ రాధాదేవికాగా వామాంశ లక్ష్మీదేవి. అంతా కలిపిచూస్తే ఈ గంగాదేవి నీ శరీరంనుంచి పుట్టినదే. అందుకే నిన్ను వరిస్తోంది. స్త్రీ పురుషులు అంటే ప్రకృతిపురుషులు అంతా ఎకాంగమే. కాబట్టి స్వీకరించు.

అని బ్రహ్మదేవుడు వైకుంఠనాథుణ్ణి ఒడబరిచి గంగాదేవిని అప్పగించి వెళ్ళిపోయారు, వైకుంఠనాథుడు గాంధర్వపద్ధతిలో గంగను వివాహం చేసుకున్నాడు. చందనచర్చలతో పుష్పమాలికలకో ఇద్దరూ శృంగారక్రీడల్లో మునిగితేలారు. నవసంగమసౌఖ్యానికి పరవశించిన గంగాదేవి మూర్చపోయింది రసికేశ్వరుడి సమాగమం రసికురాలికి అంతట పారవశ్యాన్ని కలిగించడం సహజమేకదా! 

నారదా! ఇలా ఆనందిస్తున్న గంగాదేవిని చూసి నిత్యమూ సరస్వతీదేవి ఈర్ష్యపడుతూ ఉండేది. గంగ - లక్ష్మి - సరస్వతి - తులసి - నలుగురూ శ్రీహరికి భార్యలుగదా! సరస్వతిని చూసి గంగమ్మమాత్రం ఈర్ష్యపడేదికాదు. చివరికి భరించలేక ఒకనాడు గంగాదేవి సరస్వతిని శపించింది. భూలోకానికి పొమ్మంది ఈ కథ అంతా నీకు తెలిసిందే.

నారాయణ మహర్షి ఇక్కడకి ఆగి రవ్వంత ఊపిరి పీల్చుకున్నాడు. ఈసారి నారదుడికి తులసీకథ వినాలి అనిపించింది. ఆవిడ ఎక్కడ పుట్టింది? పూర్వజన్మ ఎమిటి? ఎవరి అమ్మాయి? ఏ తపస్సులు చేసి శ్రీహరిని భర్తగా పొందింది? వృక్షత్వం ఎలా వచ్చింది? ఇలాంటి సందేహాలన్నీ ఏకరువుపెట్టాడు. నారాయణమహర్షి ఓపికగా బదులు పలికాడు.

వేదవతిగా లక్ష్మీదేవి


Ganga Devi Vishnu Padodbhava - గంగాదేవి విష్ణుపాదోద్భవ

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - గంగాదేవి విష్ణుపాదోద్భవ

నారదా! నువ్వు అడగడమూ నేను చెప్పకపోవడమూనా? తప్పకుండా చెబుతాను, విను. గోలోకంలో రాధాకృష్ణుల శరీరాలనుంచి గంగాదేవి ద్రవరూపిణిగా ఆవిర్భవించింది అని చెప్పానుకదా! అప్పటి నుంచీ ఆవిడ జలాధిష్ఠానదేవత అయ్యింది. అద్వితీయ సౌందర్యంతో సర్వాభరణభూషితయై నిత్య యౌవనవిలాసంతో చిరునవ్వులు చిందిస్తూ ఆ పద్మముఖి విరాజిల్లింది. బంగారురంగు మేనిఛాయ. శరచ్చంద్రబింబంలాంటి ముఖం. నిగనిగలాడే శరీరకాంతి. విశాలమైన కటిప్రదేశం. పీనోన్నత వక్షఃస్థలం, విశాలమైన కన్నులు, చంచలమైన వాలుచూపులు, మాలతీపుష్పమాలలతో ఘుమఘుమలాడే కబరీభరం, చెక్కిళ్ళమీద మకరికాపత్రాలు. మంకెన పువ్వుల్లాంటి పెదవులు. దానిమ్మగింజల్లాంటి దంతపంక్తి. తళతళలాడే పరిశుభ్రవస్త్రాలు. ఈ సుందరాంగి ఒకనాడు శ్రీకృష్ణుడి సరసన సిగ్గులు మూటగడుతూ విలాసంగా నిలబడింది. మేలిముసుగులో ముఖం దాచుకుని ఒయ్యారంగా శ్రీ కృష్ణుడిమీదకి వాలుచూపులు నిగుడించింది. రెప్పవెయ్యకుండా కృష్ణుడి సౌందర్యాన్ని ఆస్వాదిస్తోంది. కామోద్రేకంతో ముఖం వికసించింది. తనువంతా పులకించింది. సంభోగవాంఛ బలంగా పొటమరించింది. పరవశించిపోతోంది.

ఈ దశలో రాధాదేవి హఠాత్తుగా వచ్చింది. చూసింది. పట్టరానంత కోపం వచ్చింది. ఒక్కసారిగా ముఖమూ కన్నులూ ఎర్రకలువలైపోయాయి. విమానంనుంచి దిగింది. శ్రీకృష్ణుడిచ్చిన ఆర్ఘ్యపాద్యాలతో తడితడిగా ఉన్నాయి ఆవిడ పాదపద్మాలు. విస విసా నడుచుకుంటూ వెళ్ళి రత్నసింహాసనం అధిష్టించి కూర్చుంది. ఆమె వెంట గోపగోపీజన సహస్రమూ మహర్షిబృందమూ వెల్లగొడుగులు పడుతూ వింజామరలు వీన్తూ వచ్చారు. వారంతా రత్న సింహాసవానికి ఇరువైపులా బారులుతిరి నిలబడ్డారు.

సింహాసనంమీద కూర్చున్న రాధాదేవికి కోపంతో చెమటలు పోశాయి. సిందూరం చెమ్మగిల్లింది, నుదుటిబొట్టు జారింది. పెదవులు అదురుతున్నాయి. నిట్టూర్పులతో తారహారాలు ఎగురుతున్నాయి, కొప్పులో తురుముకున్న పారిజాత పుష్పమాలికలు కదులుతున్నాయి.

శ్రీకృష్ణుడు సాదరంగా ఎదురువెళ్ళాడు. బెదురుతున్న గుండెలను చిక్కబట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ మధురంగా పలకరించాడు. కుశలప్రశ్నలు వేశాడు. గోపగోపీజనం కృష్ణుడికి నమస్కరించింది. స్తుతించింది. వెంటనే శ్రీకృష్ణుడు రాధాదేవిని స్తుతించాడు. గంగాదేవికూడా భయపడుతూనే చేరవచ్చి కుశలప్రశ్నలు వేసి అద్భుతంగా స్తుతించింది. ఎండిపోతున్న గొంతునీ పెదవులనూ తడుపుకుంటూ భయం భయంగా తలవంచుకుని నిలుచుంది. శ్రీకృష్ణుడి పాదపద్మాలనే ధ్యానించుకుంటూ ధైర్యం చెప్పుకుంటోంది. శ్రీకృష్ణుడు అది గమనించి రహస్యంగా గంగాదేవికి అభయమిచ్చాడు. దానితో ధైర్యం తెచ్చుకున్న గంగమ్మ తల ఎత్తి సింహాసనంమీద ఉన్న రాధాదేవిని తేరిపార చూసింది.

తళతళలాడుతున్న కాంతిపుంజంలాగా ఉంది రాధాదేవి. చూపులకు హాయిగా ఉంది. బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తోంది. అసంఖ్యాక బ్రహ్మలకు ఆవిడ సృష్టికారిణి. సృష్టికే ఆది సృష్టి. సనాతని. ఎప్పుడూ పన్నెండేళ్ళ ప్రాయంలోనే ఉండే ప్రారంభయౌవన. నిత్యకన్య, రూపగుణాలలో ఈ విశ్వంలో సాటిలేనిది. శాంతస్వరూప. సౌందర్యరాశి. ఆద్యంతరహిత. స్వామి సౌభాగ్యసంయుత. శుభప్రద. సుభద్ర. కృష్ణుడి అర్థాంగి. వయస్సులో తేజస్సులో కాంతిలో అన్నింటా కృష్ణుడికి సమానురాలు. లక్ష్మీ శ్రీహరులతో అర్చింపబడే మహాలక్ష్మి తన కాంతితో గోలోక సభామంటపాన్ని ప్రకాశవంతం చేస్తోంది. చెలికత్తె అందించిన తాంబూలాన్ని విలాసంగా ఆస్వాదిస్తోంది. పుట్టుక లేనిది. కానీ సర్వస్నష్టికీ తానే జనని. కృష్ణప్రాణాధిదేవత. ప్రాణప్రియ. రాసేశ్వరి సురేశ్వరి అయిన ఆ రాధాదేవిని గంగాదేవి రెప్పవెయ్యకుండా తదేకదీక్షతో చూస్తోంది. కన్నులే దోసిళ్ళుగా ఆ సౌందర్యరాశిని గ్రోలుతోంది. ఎంతకీ తనివితీరడం లేదు.

రాధాదేవి ముఖంలో కోపం శాంతించింది. చిరునవ్వు వెల్లివిరిసింది. మధురంగా శ్రీకృష్ణుడిని అడిగింది - ప్రాణేశ్వరా! ఈ కల్యాణి ఎవరు? ఇందాక నీ పక్కనే నిలబడి కాముకదృష్టితో నీ ముఖపద్మ సౌందర్యాన్ని ఆస్వాదిస్తోంది. వాలుచూపులు నిగుడిస్తూ పులకించి పరవశించిపోతోంది. మేలిముసుగులో ముఖం కప్పుకుని రెప్పవాల్చకుండా చూస్తోంది. నువ్వుకూడా అలాగే కామివై చూస్తూ పరవశించిపోతున్నావు. చిరునవ్వులు చిందిస్తున్నావు, ఎమిటి ఇదంతా? నేను బతికి ఉండగానే ఈ గోలోకంలో ఇలాంటి దుర్మార్గం జరగడమా? నువ్వే మాటిమాటికీ ఇలాంటి చెడ్డపనులు చేన్తున్నావు. నేనేమో ఆడదాన్ని కనక మనస్సు మెత్తన కనక నీ మీద ప్రేమతో ఓరిమి వహిస్తున్నాను. ఇక భరించలేను. పద, నువ్వూ నేనూ ఈ గోలోకంనుంచి వెళ్ళిపోదాం. లేకపోతే నువ్వు నాకు దక్కేట్టులేవు. నీకు ఇక్కడ భద్రతలేదు. పద, నన్ను తీసుకుపో. నువ్వు లంపటుడివి.

ఒకప్పుడు చందనారణ్యంలో విరజతో కనిపించావు. చెలికత్తెలు చెప్పారని ఊరుకున్నాను. నా అలికిడి విని నువ్వు అప్పుడు అదృశ్యమయ్యావు. పాపం ఆ విరజాదేవి శరీరం విడిచిపెట్టి నదిగా మారిపోయింది. ఇప్పటికీ నీ సత్కీర్తికి చిహ్నమై ప్రవహిస్తూనే ఉంది. నేను ఇంటికి వెళ్ళిపోయాక నువ్వు మళ్ళీ ఆ చందనారణ్యానికి వెళ్ళి విరజా! విరజా! అంటూ పరితపించావు. నీ వేదన చూడలేక యోగశక్తితో ప్రవాహం నుంచి బయటికి వచ్చి విరజాదేవి సాలంకృతమూర్తియై నీకు దర్శనమిచ్చింది. ఆమెను కౌగిలించుకుని సుఖించావు. నీ కలయికతో ఆవిడ గర్భం ధరించింది. సప్త సముద్రాలను ప్రసవించింది.

మరొకసారి చంపకారణ్యంలో శోభ అనే గోపికతో కనిపించావు. అప్పుడూ అంతే నా అలికిడి విని కంటికి కనిపించకుండా పారిపోయావు. ఆ గోపిక శరీరం విడిచిపెట్టి చంద్రమండలంలోకి శోభగా వెళ్ళిపోయింది. నువ్వు గుండెను రాయిచేసుకుని ఆవిడ తేజస్సుని విభజించి కొంత రత్నానికీ, కొంత బంగారానికీ, కొంత స్త్రీల ముఖాలకీ, కొంత రాజులకీ, కొంత చిగురాకులకీ, కొంత పువ్వులకీ, కొంత పక్వఫలాలకీ, కొంత పంటలకీ, కొంత రాజదేవమందిరాలకీ, కొంత శిశువులకీ, కొంత క్షీరానికీ పంచిపెట్టావు.

ఇంకొకసారి నువ్వు ప్రభ అనే గోపికతో బృందావనంలో పొదపొదలోనూ కనిపించావు. అప్పుడూ అలాగే నా అలికిడికి మాయమయ్యావు. పాపం ఆ ప్రభ శరీరం విడిచిపెట్టింది. సూర్యమండలానికి వెళ్ళిపోయింది. నువ్వేమో విలపించి విలపించి సిగ్గుతోనూ నా భయంతోనూ ఆ ప్రభను కొంత నీ కన్నుల్లో దాచుకున్నావు. కొంత అగ్నికీ, కొంత యక్షులకీ, కొంత పురుషసింహాలకీ, కొంత దేవతలకీ, కొంత విష్ణుజనులకూ, కొంత నాగజాతికీ, కొంత బ్రాహ్మణులకూ, కొంత మునులకీ, కొంత తపస్వులకూ కొంత సౌభాగ్యవతులకూ, కొంత యశస్వంతులకూ విభజించి ఇచ్చావు.

ఒక వసంత ఋతువులో రాసమండలాన నువ్వు శాంతి అనే గోపికతో పుష్పశయ్యమీద కనిపించావు. రత్నదీపాలంకృతమైన మందిరాలలో కనిపించావు. ఆవిడ ఇచ్చిన తాంబూలాన్ని ఆస్వాదిస్తూ పుష్పమాలికలతో చందనచర్చలతో ఆనందించావు. నా అలికిడి విని కనుమరుగయ్యావు. శాంతి శరీరం విడిచిపెట్టి నిలో లీనమయ్యింది. నువ్వు ఎంతగానో రోదించావు. అప్పుడూ అలాగే ఆ శాంతిని విభజించి కొంత బ్రహ్మకూ, కొంత నాకూ, కొంత లక్ష్మీదేవికీ, కొంత నీ మంత్రోపాసకులకూ, కొంత శాక్తేయులకూ, కొంత తపస్వులకూ, కొంత ధర్ముడికీ పంచిపెట్టావు.

మరొకసారి క్షమ అనే మరో గోపికతో ఆనందించి ఆవిడ కౌగిటిలో పరవశించి అలాగే  పుష్పశయ్య మీద నిద్రించావు. ఆమెకూడా అలాగే మైమరిచి నిద్రించింది. నేను వచ్చి మీ ఇద్దరినీ నిద్ర లేపాను. గుర్తు తెచ్చుకో. నీ పట్టువస్త్రాన్ని మురళినీ వనమాలనూ కౌస్తుభహారాన్నీ రత్నకుండలాలనూ ఊడలాక్కున్నాను. తరవాత నా సఖీజనం గోలపెడితే పోనీలే అని నీమీద ప్రేమతో తిరిగి ఇచ్చేశాను. గుర్తుందా? నువ్వు ఆ సిగ్గుతోనో ఆ పాపంతోనో మరీ కృష్ణవర్ణుడివైపోయావు ఆ క్షణంలో.

క్షమాదేవి సిగ్గుతో ప్రాణాలు విడిచి భూమిలో కలిసిపోయింది. మునుపటి సంఘటనల్లోలాగానే  ఆవిడ శరీరం గుణశ్రేష్ఠమయ్యింది. నువ్వు ఆవిడమీద ప్రేమతో విలపించి విలపించి ఆ క్షమను కొంత విష్ణువుకీ, కొంత వైష్ణవులకూ, కొంత ధార్మికులకూ, కొంత ధర్ముడికీ, కొంత దుర్బలులకీ, కొంత తపస్వులకూ, కొంత వేదపండితులకూ పంచి ఇచ్చావు.

మహాప్రభూ! ఇవ్వి నీ కథలు. ఇంకా ఉన్నాయి, వినాలనుకుంటే చెప్పు ఒక్కొటొక్కటీ గుర్తు చేస్తాను. నీ కథలు అన్నీ తెలిశాయి కానీ నీ గుణంమాత్రం అంతుబట్టడం లేదు,

ఇలా రాధాదేవి సున్నితంగా శ్రీ కృష్ణుణ్ణి దెప్పిపాడుస్తూంటే గంగాదేవి సిగ్గుతో ముడుచుకుపోయి తలవంచుకుని నేలగీరుతూ నిల్చుంది. రాధమ్మ గంగవైపు తిరిగింది. ఎదో మాట్లాడబోయింది. ఆది గమనించిన గంగమ్మ తన యోగశక్తితో మాయమై జలప్రవేశం చేసింది. సిద్ధయోగినియైన రాధాదేవి అది గుర్తించి సృష్టిలో ఎక్కడెక్కడ ఉన్న జలాన్నీ త్రాగివెయ్యడానికి ఉపక్రమించింది. ఈ రహస్యాన్ని గుర్తించిన గంగమ్మ అదృశ్యరూపంతో వచ్చి శ్రీ కృష్ణుడి పాదపద్మంలో ప్రవేశించి శరణువేడింది.

రాధాదేవి విజృంభించి గోలోక వైకుంఠలోక బ్రహ్మలోకాల్లో ఉన్న గంగాజలాన్ని అంతటినీ త్రాగేసింది. గంగాదేవి కనిపించలేదు. లోకాలన్నీ జలశూన్యమైపోయాయి. భూగోళం ఎండిపోయిన తామర పువ్వు అయ్యింది. ఎక్కడ చూసినా జలజంతు మృతదేహాలే. బ్రహ్మవిష్ణుమహేశ్వరాది దేవతలూ మునులూ మనువులూ ఎండిపోతున్న గొంతుకలతో దాహార్తులై గోలోకానికి వచ్చి పడ్డారు. కనిపించని గోలోక గోవిందుడికి సాష్టాంగ పడ్డారు. గోవిందా! సర్వేశా! పరప్రకృతీ! వరేణ్య! వరదా! వరిష్ఠా! వరకారణా! గోపికావల్లభా! గోపనాయకా! ప్రభూ! నిరీహా! నిరాకారా! నిర్లిప్తా! నిరాశ్రయా! నిర్గుణా! నిరుత్పాహా! నిర్వికారా! నిరంజనా! స్వేచ్చామయా! సాకారా! సత్త్వస్వరూపా! సత్యంశా! సాక్షీరూపా! సనాతనా! పరమాత్మా! పరమా! పాహి, పాహి అంటూ వేడుకున్నారు. దర్శనం ఇమ్మని ప్రార్థించారు. వారి ప్రార్థనలకు సంతోషించిన శ్రీకృష్ణుడు - గోపగోపీజన సంసేవ్యమానుడై రాధికా వక్షఃస్థలంమీద పరుండి ఆమె అందిస్తున్న తాంబూలాన్ని ఆస్వాదిస్తూ ప్రత్యక్షమయ్యాడు.

బ్రహ్మాదిదేవతలంతా సంతోషించారు. ఎవరు చెప్పాలి, ఎమి చెప్పాలి అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అందరూ కలిసి బ్రహ్మను ముందుకు నెట్టారు. విష్ణుమూర్తినీ వామదేవుణ్ణి కుడి ఎడమల తోడుగా నిలుపుకుని బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుడి సన్నిధికి వెళ్ళాడు. ఆ రాసమండలంలో బ్రహ్మదేవుడికి అంతా కృష్ణమయంగా కనిపించింది, అందరిదీ ఒకే వేషం, ఒకే రూపం, ఒకే అలంకరణ, ఒకే వయస్సు, ఒకే ఆసనం. అందరూ ద్విభుజులే. మురళీహస్తూలే. వనమాలాధారులే. మయూరపింఛాలంకృతులే. కౌస్తుభభూషితులే. అందరూ శ్రీకృష్టపరమాత్మలే. ఎవరు సేవ్యులో ఎవరు సేవకులో తెలియలేదు. ఎవరికి చెప్పాలో ఏమి చెప్పాలో తోచలేదు. క్షణకాలం తేజస్ప్వరూపం కనపడుతోంది. మరుక్షణంలో రూపం కనపడుతోంది. ఇంకో క్షణంలో నిరాకారం, మరో క్షణంలో సాకారం. ఇంకొక క్షణంలో నిరాకార సాకార సంయుతం. ఒక క్షణంలో శ్రీకృష్ణుడు ఒంటరిగా కనపడుతున్నాడు. మరుక్షణంలో రాధాసమేతుడై కనపడుతున్నాడు. రాధారూపంలో కృష్ణుడూ, కృష్ణరూపంలో రాధ కనపడుతున్నారు. ఎది స్త్రీ రూపం? ఏది పురుషరూపం? బ్రహ్మదేవుడే పోల్చుకోలేకపోయాడు. ఇక ఇదికాదు పద్ధతి అనుకొని కళ్ళుమూసుకుని హృదయపద్మంలో ఉన్న శ్రీ కృష్ణపరమాత్మను ధ్యానించాడు. భక్తితో స్తుతించాడు. అతడి ఆజ్ఞతో కన్నులు తెరిచి ఎట్టయెదుట రాధావక్షఃస్థలస్థితుడైన శ్రీ కృష్ణుణ్ణి దర్శించాడు. మళ్ళీ నమస్కరించి స్తుతించాడు.

బ్రహ్మాదిదేవతలు ఎందుకు వచ్చారో వారు చెప్పకుండానే గ్రహించిన శ్రీకృష్ణుడు చిద్విలాసంగా ఆప్యాయంగా పలకరించాడు. విరించీ! కుశలమా? దా. కమలాపతీ? క్షేమమా? పైకిరా. మహాదేవా! బాగున్నావా? ఇటు రా. మహాభాగులు మీరంతా వచ్చారు గంగకోనమని. కదూ! రాధాదేవికి భయపడి గంగమ్మ నన్ను శరణువేడింది. నా పాదపద్మంలో దాక్కొంది. మీకు ఇస్తాను. కానీ ఆవిడ భయాన్ని తొలగించండి - అన్నాడు.

ఈ మాటలకు బ్రహ్మదేవుడి ముఖంలో అప్రయత్నంగా చిరునవ్వు విరిసింది. వెంటనే చతుర్వదనాలతో చతుర్వేదాలతో రాధాదేవిని స్తుతించాడు. అమ్మా! రాధికా! ఈ గంగ రాసమండలంలో నీ శరీరంనుంచి జన్మించింది. శంకరుడి సంగీతానికి కరిగిపోయిన మీ దంపతులే ఈ రూపం. కృష్ణాంశతోనూ నీ అంశతోనూ అవతరించింది. మీకు అత్యంత ప్రీతిపాత్రయైన కన్యక. నీ మంత్రాన్ని స్వీకరించి భక్తితో నిన్ను పూజిస్తుంది. వైకుంఠేశ్వరుడైన చతుర్భుజుడు ఈమెకు భర్త అవుతాడు. భూలోకంలో ప్రవహించే ఈవిడ కళకు సముద్రుడు వల్లభుడవుతాడు. గోలోకంలో ఊన్న గంగమ్మయే సర్వలోకాలలోనూ ఉంటుంది. అవన్నీ కళాంశరూపాలు. నువ్వు సాక్షాత్తూ కన్నతల్లివి. దేవేశివి. ఈ గంగ నీకు కూతురులాంటిది.

బ్రహ్మదేవుడి ప్రసంగానికి రాధాదేవి సంతోషించింది. కోపం విడిచిపెట్టి చిరునవ్వులతో ప్రసన్నురాలయ్యింది. అప్పుడు గంగాదేవి శ్రీకృష్ణుడి పాదాంగుష్టం నుంచి బయలువెడలింది. అందరూ అమెను సత్కరించి గౌరవించారు. ఆ జలాధిష్టానదేవత ఆ సభాస్థలంలో మౌనంగా నిలచింది, మెల్లగా జలరూపాన నదిగా మారింది. ఆ నీటిని కొంచెం తన కమండలువులోకి తీసుకున్నాడు బ్రహ్మ. చంద్ర శేఖరుడు కొంచెం శిరస్సుమీద నిల్పుకున్నాడు.

అటుపైని చతుర్ముఖుడు గంగాదేవికి రాధామంత్రాన్ని స్తోత్ర కవచ ధ్యాన పూజావిధానాలళో సహా ఉపదేశించాడు. అది అంతా సామవేదోక్తం. మంత్రోపదేశం పొంది గంగాదేవి రాధికను పూజిం వైకుంఠానికి వెళ్ళిపోయింది. లక్ష్మి - తులసి - గంగ - సరస్వతి - వీరు నలుగురూ నారాయణుడికి  ప్రియాంగనలు.

అప్పుడు శ్రీ కృష్ణపరమాత్మ మేఘగంభీరస్వరంతో ప్రసంగించాడు. బ్రహ్మ విష్ణుమహేశ్వరులారా! దేవతలారా! మునులారా! మనువులారా! అందరూ వినండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మీరంతా అదృష్టవంతులు. భాగ్యశాలులు. మీరంతా కాలచక్రంతో నిమిత్తంలేకుండా ఈ గోలోకంలో శాశ్వతంగా నివసిస్తారు. ఇప్పుడు కల్పాంతమయ్యింది. సృష్టి అంతా జలమయమయ్యింది. ఇతర విశ్వాలూ ఆ విశ్వాలలో ఉన్న బ్రహ్మాదులూ అందరూ జలమగ్నులయ్యారు. వైకుంఠం తప్ప అన్నీ జలమయమైపోయాయి, చతుర్వదనా! నువ్వు వెంటనే వెళ్ళి పునస్సృష్టి చెయ్యి. బ్రహ్మలోకంతో మొదలుపెట్టి సర్వలోకాలమా సృష్టించు. అటుపైని గంగాదేవి వస్తుంది. ఇలాగే ఇతర విశ్వాలనూ అక్కడ బ్రహ్మాదులనూ నేను సృష్టిచేస్తాను. నువ్వు ఈ దేవతలతో కలిసి వెంటనే వెళ్ళు. ఇప్పటికి చాలాకాలం గడిచింది. చాలామండి చతుర్ముఖులు ఆంతరించారు. మళ్ళీ ఆవిర్భవించారు. ఇది కాలరహస్యం. నాకుమాత్రమే తెలుసు - అని చెప్పి రాధాసహితుడై అంతఃపురంలోకి  నిష్క్రమించాడు.

బ్రహ్మాది దేవతలు పునస్సృష్టికి ఉద్యుక్తులై బయలుదేరారు. గోలోకంలో ఉన్న గంగ బహ్మదేవుడు సృష్టించిన ప్రతిలోకానికీ క్రమక్రమంగా వెళ్ళింది. ముందుగా వైకుంఠానికి అటుసైని శివలోకానికీ ఆపైని బ్రహ్మలోకానికీ అటుతరువాత భూమ్యాదిలోకాలకూ ప్రవహించింది.

నారదా! విష్ణుపాదంలోనుంచి ఆవిర్భవించి విష్ణుపదిగా కీర్తింపషబడిన గంగాదేవి పుణ్యగాథ ఇది. మరింక ఏ మంగళప్రదమైన వృత్తాంతాన్ని. వినాలనుకుంటున్నావో చెప్పు తెలియజేస్తాను. అని  ముగించాడు నారాయణ మహర్షి.

గంగా-వైకుంఠుల పరిణయం


Sunday, May 3, 2026

Radha Devi is Ganga Devi - రాధాదేవియే గంగాదేవి

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - రాధాదేవియే గంగాదేవి

మహర్షీ! గంగానదికి “త్రిపథగ” అనేపేరు ఉంది అన్నావు. అది ఎలా ఎర్చడింది ? ఎలా ఎక్కడెక్కడ ఆ నది మూడు మార్గాలలో ప్రవహించింది? అక్కడి ప్రజలు ఎవరు? ఈ విశేషాలు తెలుసుకోవాలని ఉంది - అన్నాడు నారదుడు. వెంటనే నారాయణమహర్షి ఆరంభించాడు-

గోలోకంలో ఒక కార్తికపూర్ణిమనాడు రాధామహోత్సవం జరిగింది. రాసమండలంలో రాధాదేవిని పూజించి శ్రీకృష్ణుడు ఆమె సన్నిధిలో మహోల్లాసంగా ఉన్నాడు. రాధాదేవికూడా పూజలు అందుకొన్న ఆనందంలో ఉత్సాహంగా ఉంది. బ్రహ్మాదిదేవతలూ సనకననందనాది మహర్షులూ రాధాకృష్ణులను పరివేష్టించి కొలువుతీరి కూర్చున్నారు. అంతలోకి సరస్వతీదేవి తన వీణను శ్రుతిచేసి కృష్ణస్తుతిరూపమైన సంగీతాన్ని అత్యద్భుతంగా వినిపించింది. అందరూ సంతోషించారు. కానుకలు కురిపించారు. బ్రహ్మ దేవుడు రత్నహారాన్నీ, శివుడు మణిహారాన్నీ కృష్ణుడు కౌస్తుభహారాన్నీ, రాధాదేవి మాణిక్యహారాన్నీ, నారాయణుడు మరో మనోహరమాలికనూ, లక్ష్మి కనకకుండలాలనూ, దుర్గాదేవి బ్రహ్మభక్తినీ, ధర్ముడు ధర్మబుద్దిని, అగ్నిదేవుడు పరిశుభ్రవస్త్రాన్నీ, వాయుదేవుడు మణినూపురాలనూ కానుకలుగా మెచ్చి సమర్పించారు.

బ్రహ్మదేవుడు శివుణ్ణి ప్రేరేపించి నువ్వుకూడా కృష్ణసంగీతం వినిపించు అని కోరాడు. శివుడు విజృంభించి గానం చేశాడు. శ్రోతలందరూ పరవశించి మైమరిచిపోయారు. శిలాప్రతిమలైపోయారు. ఆ పారవశ్యంనుంచి నెమ్మదిగా తేరుకుని కళ్ళు తెరిచి చూసేసరికి గోలోకమంతా జలమయమై కనిపించింది రాధాకృష్ణులు ఏమైపోయారో కనపడలేదు. అందరూ అంతటా వెదికి వేసారారు. దుఃఖం పట్టలేక గోపగోపీజనమూ దేవతలూ పెద్దపెట్టున విలపించారు. ఏమి జరిగిందో తెలుసుకుందామని బ్రహ్మదేవుడు ధ్యానంలో కూర్చుని అంతర్దృష్టిని సారించాడు. శివుడి సంగీతానికి కరిగిపోయి రాధాకృష్ణులు ద్రవరూపం చెందారని గ్రహించాడు.

ఆ విషయాన్ని విష్ణు మహేశ్వరులకు తెలియజెప్పాడు. అందరూ కలిసి రాధాకృష్ణుల సందర్శనం కోసమని పరాత్పరుణ్ణి స్తుతించారు. అంతలోకీ అశరీరవాణి వినిపించింది. అది శ్రీకృష్ణుడి కంఠమే.

బ్రహ్మాది దేవతలారా! ఈ జలమంతా మా స్వరూపమే. దీన్ని మీరు ఉపాసించండి, ఆరాధించండి. పూర్ణరూపాలలో మమ్మల్ని చూడాలనుకుంటే శివుడు నా ఆజ్ఞను పాటించాలి. వేదశాస్త్రాలను అవలోడించి అపూర్వ మంత్రాలను సేకరించి స్తోత్రాలను నిర్మించి ధ్యానమంత్రస్తోత్ర కవచయుతంగా పూజావిధానం ఏర్పరిచి నన్ను పూజించాలి. అది నా మంత్రం కావాలి. ఆ మంత్రాన్నీ ఆ పూజావిధానాన్నీ గోప్యంగా ఉంచాలి, లక్షకు ఒకడుమాత్రమే మన్మంత్రోపాసకుడు కావాలి. అతడు గోలోకవాసి అవుతాడు. కొందరు భూలోకవాసులూ కొందరు స్వర్గలోకవాసులూగా ఏర్పాటు ఉండాలి. లేకపోతే సృష్టి అంతా నిష్ఫలమవుతుంది. ప్రతిజ్ఞాపూర్వకంగా శివుడు ఈ పూజను ఆచరిస్తే మేము మీకు దర్శనం ఇస్తాం. లేకపోతే లేదు.

అశరీరవాణిగా శ్రీకృష్ణుడు వినిపించిన ఆజ్ఞను శివుడు శిరసావహించాడు. అతడు జ్ఞానానికి అధిదేవత. వెంటనే అక్కడి జలాన్ని దోసిటిలోకి తీసుకుని విష్ణుమాయామహామంత్రాలను జపించి స్తోత్రాలను సమకూర్చి అర్చించాడు. ఈ నీటిని స్పృశించి అసత్యం పలికినవాళ్ళు శాశ్వతంగా కాలసూత్రమనే నరకానికి పోతారు అని ప్రతిజ్ఞ చేశాడు.

శంకరుడు ఇలా పలకగానే రాధాకృష్ణులు ప్రత్యక్షమయ్యారు. గోపగోపీసురబృందాలు ఆనందంతో కేరింతలు కొట్టారు. మళ్ళీ మహోత్సవం జరిపారు. అటుపైని శివుడు ముక్తిదీపాన్ని వెలిగించాడు.

నారదా! ద్రవరూపం చెందిన రాధాదేవియే ఈ గంగానది. రాధాకృష్ణుల సంయుక్తరూవంగా గోలోకంలో ఆ నది అర్చింపబడుతోంది. భుక్తిముక్తి ప్రద. శ్రీకృష్ణుడు లోకానుగ్రహకాంక్షతో ఈ గంగానదిని ముల్లోకాలకూ ప్రవహింపజేసి అక్కడక్కడ నిలువరించాడు. కృష్ణస్వరూపగా సర్వబ్రహ్మాండపూజిత అయ్యింది ఈ పవిత్ర నదీమతల్లి. 

నారాయణ మహర్షి! కలియుగంలో అయిదువేల సంవత్సరాలు గడిచాక మరి ఈ గంగానది ఎక్కడికి వెళ్ళింది ?

నారదా! సరస్వతి శాపంవల్లకదా గంగాదేవి భారతభూభాగానికి వచ్చింది. అయిదువేల సంవత్సరాల తరవాత శాపవిమోచనమై మళ్ళీ వైకుంఠానికే వెళ్ళిపోయింది. అలాగే సరస్వతీ పద్మావతీనదులూ లక్ష్మీదేవి తులసి వీరంతా హరిసన్నిధికే చేరుకున్నారు. గంగా లక్ష్మీసరస్వతులతోపాటు నాల్గవదిగా తులసి కూడా నారాయణప్రియ అయ్యింది.

మహర్షీ! నాది మరొక చిన్న సందేహం. గంగాదేవిని విష్ణుపాదోద్భవ అంటారుకదా! ఒకసారి ఎప్పుడో బ్రహ్మదేవుడి కమండలువులో బందీ అయ్యిందిట. ఎవరో చెప్పగా విన్నాను. ఆ వృత్తాంతం సమగ్రంగా తెలుసుకోవాలని ఉంది. తెలియజెప్పవూ!

గంగాదేవి విష్ణుపాదోద్భవ


The story of the descent of Ganga - గంగావతరణగాథ

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - గంగావతరణగాథ

హిరణ్యగర్భతనయా! సూర్యవంశంలో సగరుడు అనే మహారాజు ఉన్నాడు. అతడికి వైదర్భి శైబ్య అని ఇద్దరు భార్యలు. శైబ్యకు అసమంజుడు అనే కుమారుడు జన్మించాడు. వైదర్భి సంతానం కోనం శివుణ్ణి ఆరాధించింది. శివుడి అనుగ్రహంతో గర్భిణి అయ్యింది. నూరేళ్ళు మోసి ఒక మాంసపిండాన్ని ప్రసవించింది. ఆ పిండాన్ని చూసి వైదర్భి చలించిపోయింది. దారుణంగా విలపిస్తూ శివుణ్ణి ధ్యానించింది. శివుడు బ్రాహ్మణరూపంలో వచ్చి ఆ పిండాన్ని ఆరవైవేల తునకలు చేసి ప్రాణాలు పోశాడు. అందరూ మహాబలపరాక్రమసంపన్నులైన పుత్రులు అయ్యారు. ఒక్కొక్కడూ గ్రీష్మమార్తాండుడిలా ప్రజ్వరిల్లుతున్నారు. ఒకనాడు కపిలనుహార్షి శాపంవల్ల అందరూ భస్మమైపోయారు. సగరుడు దుఃఖం పట్టలేక రాజ్యం వదిలిపెట్టి అరణ్యాలకు వెళ్ళిపోయాడు గంగానదిని ఆ భస్మరాశులపై ప్రవహింపజేస్తే తన సోదరులు సజీవులవుతారని తెలుసుకున్న అసమంజుడు గంగాదేవికోసం తపస్సు ప్రారంభించాడు. లక్ష సంవత్సరాలు తపస్సు చేసి కాలధర్మం చెందాడు. అతడి కొడుకు అంశుమంతుడు ఇదే దీక్షతో తపస్సు కొనసాగించాడు.

అతడూ ఒక లక్ష సంవత్సరాలు తపస్సు చేసి గతించాడు. అటుపైని అతడి పుత్రుడు భగీరథుడు తపస్సు చేశాడు. ఇతడికి శ్రీకృష్ణుడు కోటిసూర్యప్రభలతో దర్శనమిచ్చాడు. ద్విభుజుడై మురళీ ధరుడై కిశోరగోపవేషంలో త్రిమూర్తి సంస్తుతుడై దర్శనమిచ్చిన ఆ స్వేచ్చామయపరబ్రహ్మను పరిపూర్ణతమ ప్రభువును చిరునవ్వులు చిందిస్తున్న ఆ నిర్లిప్త నిర్గుణ పరప్రకృతిని చూస్తూనే భగీరథుడు మోకరిల్లి భక్తి ప్రపత్తులతో స్తుతించాడు. తన వాంఛితాన్ని విన్నవించాడు. సగరపుత్రులను ఉద్ధరించి వంశాన్ని తరింపజెయ్యమని ప్రార్థించాడు.

అప్పుడు శ్రీ కృష్ణపరమాత్మ గంగాదేవిని ఆజ్ఞాపించాడు. హే గంగే! సరస్వతీశాపం ఉందికదా! వెంటనే బయలుదేరి భారతభూమికి అవతరించు. సగరపుత్రులను ఊద్ధరించు. ఇది నా ఆజ్ఞ. నీ నీరు సోకినా నీ గాలి తాకినా అందరూ పరిపూతులవుతారు. కోటిజన్మార్జితాలైన పాపాలు నశిస్తాయి. నా రూపాలు పొంది నాలోకంలో విహరిస్తారు. మౌసలస్నానం చేస్తే చాలు బ్రహ్మహత్యాది మహాపాతకాలుకూడా అంతరిస్తాయి. పుణ్యాహస్నానానికి ఉన్న ఫలమెంతో వేదాలుకాదు త్రిమూర్తులైనా చెప్పలేరు. సామాన్య దివసస్నానంకన్నా మౌసలస్నానం వల్ల పుణ్యం పదింతలు ఎక్కువ లభిస్తుంది. సూర్యసంక్రమణం నాడు గంగాస్నానం చేస్తే ముప్ఫయిరెట్లు అధికంగా పుణ్యం వస్తుంది. అమావాస్యనాడైనా అంతే. దక్షిణాయన పుణ్యదినాన చేస్తే ద్విగుణంగా పుణ్యం చేకూరుతుంది. ఉత్తరాయణకాలంలో అయితే పదిరెట్లు అధికపుణ్యం. చాతుర్మాస్యదీక్షలో పున్నమినాడయితే అనంతంగా లభిస్తుంది. అక్షయ పుణ్యదినాన అక్షయపుణ్యమే. ఉగాది మాఘసప్తమి భీష్మాష్టమి అశోకాష్టమి హరినవమి సూర్యచంద్రగ్రహణాల రోజున పట్టు విడుపుల నమయాలలోనూ చేసే గంగాస్నానాలు అశేష పుణ్యప్రదాలు. గంగా! ఇవి నీకు నేను ఇస్తున్న వరాలు - అని చెప్పి శ్రీకృష్ణుడు విరమించాడు.

ఈ మాటలు విన్న గంగాదేవి సవినయంగా తన సందేహాన్ని వెలిబుచ్చింది. నాథా! సరన్వతీశాపం వల్లనైతేనేమి ఈ రాజేంద్రుల తపన్సువల్లనైతేనేమి నీ ఆజ్ఞమేరకు నేను భరతభూమికి వెడతాను. బాగానే ఉంది. అయితే నేను అక్కడ ఎంతకాలం ఉండాలి? మళ్ళీ నీ సన్నిధికి రావడం ఎప్పుడు? పాపాత్ములందరూ వచ్చి నాలో మునిగి పాపాలు సమర్పిస్తూంటే నాకు వాటినుంచి విముక్తి ఎలాగ? ఇంకా నా మనస్సులో ఉన్న సంశయాలేమిటో అన్నీ ఎరిగినవాడవు. నువ్వే తగిన ఉపాయం ఉపదేశించు - ఆంది.

గంగాదేవి! నీ వాంఛితమేమిటో నాకు తెలుసు. ద్రవరూపంలో భూమికి అవతరిస్తున్న నీకు అక్కడ సముద్రుడు భర్త అవుతాడు. సముద్రుడు నా అంశావతారమే. నువ్వు లక్ష్మీస్వరూపిణివే. నెరజాణకు నెరజాణ దొరకడం ఆనందదాయకమేకదా! భారతభూభాగాన సరస్వతీ ప్రభృతి నదులు ఎంతకాలం ఉంటాయో అంతకాలమూ నువ్వూ వారితోపాటు సౌభాగ్యసంపదలతో ఉంటావు. దేవీ! ఈనాటినుంచి కలియుగంలో అయిదువేల సంవత్సరాలు గడిచేవరకూ నువ్వు భారతావనిలో ఉండక తప్పదు. నిత్యమూ నీకు సముద్రుడితో రహస్య సంగమం జరుగుతూనే ఉంటుంది. అతడు రసికుడు, నువ్వు రసికవు.

భారతీయులందరూ నిన్ను భాగీరథిగా స్తుతిస్తారు. అర్చిస్తారు. కణ్వశాఖోక్తపద్ధతిలో ధ్యానిస్తారు, పూజిస్తారు. నిన్ను స్తుతించిన వారికి అశ్వమేథఫలం లభిస్తుంది. స్తుతించలేక దర్శించలేక యోజనాల దూరంనుంచే గంగా! గంగా! అంటే చాలు అతడు పాపవిముక్తుడై వైకుంఠం చేరుకుంటాడు.

వెయ్యిమంది పాపాత్ములు నీలో మునగనీ. ఒక్క విష్ణుభక్తుడు మునిగితే చాలు నువ్వు మళ్ళీ పరిపూతవు అవుతావు. ఎన్ని శవాలు నీలో తేలినా విష్ణు మంత్రోపాసకుడి స్నానంతో పాపప్రక్షాళన అవుతుంది. దోషాలన్నీ తొలగిపోతాయి. నువ్వు అఘమోచనకు అధిష్టాత్రివి. నిన్ను తలుచుకుంటూ ఏ నదిలో ఏ రేవులో మునిగినా అది గంగాతీర్థమే అవుతుంది. నీ రేణువు సోకితే చాలు మహాపాతకికూడా పరిపూతుడవుతాడు. జ్ఞానులు నా నామాన్ని జపిస్తూ నీలో మునిగి ప్రాణాలు వదిలితే సరాసరి నా సాయుజ్యం పొందుతారు. నాకు శాశ్వతంగా పార్షదులవుతారు. ఎంతో పుణ్యం చేసుకున్నవాడి శవమే నీలో కలుస్తుంది. అతడు సరాసరి వైకుంఠం చేరుకుంటాడు. అతడికి సారూప్యం ఇచ్చి పార్షదుణ్ణి చేసుకుంటాను. తెలియక ఆజ్ఞానంతో నీలో మునిగినా నీలో ప్రాణాలు విడిచినా అతడికీ సాలోక్యం ఇస్తాను. పార్షదుణ్ణి చేస్తాను. నీపేరు జపిస్తూ ఎక్కడ ప్రాణాలు విడిచినా వారికికూడా శాశ్వతంగా సాలోక్యం అనుగ్రహిస్తాను. రత్నాల పల్లకీలో గోలోకానికి తోడ్కొని వెడతాను. నా మంత్రాన్ని ఉపాసించేవారూ నాకు నివేదన చేసి భుజించేవారూ ముల్లోకాలనూ పవిత్రం చెయ్యగల సమర్థులు. వారినీ ఇలాగే రత్నాలపల్లకిలో గోలోకానికి తీసుకువెడతాను. వారి బంధువులూ వారి పెంపుడు జంతువులూ వారి సేవకులూ అందరికీ ఇదే మన్నన జరుగుతుంది.

ఇలా శ్రీకృష్ణుడు గంగాదేవిని ఊరడించి భగీరథా! ఈ గంగాదేవిని భక్తితో స్తుతించు. శ్రద్ధతో అర్చించు అన్నాడు. భగీరథుడు భక్తిశ్రద్దలతో స్తుతిపూజనలు నిర్వహించాడు. కాథుమశాఖోక్తంగా సామవేద మంత్రాలతో మళ్ళీ మళ్ళీ స్తుతించాడు. శ్రీకృష్ణపరమాత్మనూ స్తుతింతి ప్రణమిల్లాడు. గంగాదేవీ స్తుతించి నమస్కరించింది. శ్రీకృష్ణుడు ఆంతర్జానం చెందాడు - అని నారాయణమహర్షి చెప్పగానే, భగీరథుడు చేసిన పూజావిధానాన్నీ స్తుతినీ తెలియజెప్పమని నారదుడు అభ్యర్థించాడు.

నారదా! భగీరథుడు స్నానంచేసి ధౌతవస్త్రాలు ధరించి శుచిగా నిత్యక్రియలు అనుష్టించి ఏకాగ్ర చిత్తంతో భక్తితో దేవషట్కాన్ని ఆరాధించి అప్పుడు గంగాదేవిని స్తుతించాడు. విఘ్నవినాశం కోనం గణేశ్వరుణ్ణి, ఆరోగ్యంకోసం సూర్యుణ్ణి, శౌచంకోసం అగ్నినీ, లక్ష్మికోసం విష్ణువునూ, జ్ఞానంకోసం శివుణ్ణి ముక్తికోసం శివానినీ పూజించాలి. ఈ ఆరుగురు దేవతలనూ ముందుగా పూజించినవాడికే ఏ పూజ చెయ్యడానికైనా అధికారం లభిస్తుంది. లేకపోతే విషమఫలితాలు తప్పవు.

కణ్వశాఖోక్తమైన గంగాధ్యానం పాపప్రణాశకం. గంగాదేవి తెల్లకలువలాగా ఉంటుంది. కృష్ణమూర్తి నుంచి ఆవిర్భవించింది. కృష్ణతుల్య. అగ్నిజ్వాలలాంటి ఆంశుకాన్ని ధరిస్తుంది. రత్నభూషణాలు ఆలంకరించుకొంటుంది. ఒక్కసారిగా శరత్పూర్ణిమా చంద్రబింబాలు నూరు ఉదయించినంత ఆహ్లాదకరంగా ఉంటుంది. చిరునవ్వులు పండిస్తూ ఉంటుంది. ఎప్పుడూ యౌవనంలోనే ఉంటుంది. నారాయణప్రియ, శాంతన్వరూప, సౌభాగ్యసమన్విత, విశాలమైన కబరీభారం అందులో మాలతీపుష్పమాలికలు. చెక్కిళ్ళమీవ సిందూర చందన కస్తూరీ బిందువులతో మకరికా పత్రాలంకరణ. దొండపండుల్లాంటి పెదవులు. ముత్యాలకోవలాంటి పలువరుస. అందమైన ముఖం. అందమైన బొట్టు. అందమైన కన్నులు. క్రీగంటి వాలుచూపులతో మరింత మనోహరంగా ఉంటుంది. ఉన్నతమైన వక్షఃస్థలం. విశాలమైన జఘనభాగం. మెట్టతామరలవంటి పాదాలు. వాటికి రత్నపాదుకలు. లత్తుకతో పారాణి దిద్దిన పాదాలు. దేవేంద్రుడి శిరస్సుమీద ఉన్న మందారపుష్పం నుంచి జారిపడిన ఎర్రని మకరంద బిందువుతో పారాణి దిద్దుకున్నట్టుంటుంది.

సురసిద్ధమునింద్రగణాలు సమర్పించిన అర్ఘ్యలతో ఆర్ద్రంగా ఉండే పాదపద్మాలు. తపస్వుల శిరస్సులు అనే తుమ్మెదలు బారులుతీరి మూగే పాదపద్మాలు. ముముక్షువులకు ముక్తిప్రదాలు. బుభుక్షువులకు భోగప్రదాలు. వరేణ్య, వరద, భక్తానుగ్రహకారిణి. శ్రీ విష్ణుపదదాత్రి. విష్ణుపది. అటువంటి గంగాదేవికి నమస్కరిస్తున్నాను - అనే ధ్యానశ్లోకాలతో ఆ త్రిపథగను ధ్యానించాలి. షోడశోపచారాలు చెయ్యాలి. ఆసన - పాద్య - అర్ఘ్య - స్నాన - అనులేపన - ధూప - దీప - నైవేద్య - తాంబూల - శీతోదక - వసన - భూషణ - మాల్య - గంధ - ఆచమనీయ - తల్ప సమర్పణలు షోడశోపచారాలు.

వీటిని చేసి భక్తితో సాష్టాంగనమస్కారం చెయ్యాలి. ఇలా పూజ చేస్తే అది అశ్వమేధ ఫలాన్ని ఇస్తుంది. నారదా! ఇరవైయొక్క శ్లోకాలలో విష్ణుమూర్తి చేసిన గంగాస్తవం మరింత పుణ్యప్రదం. ఆలకించు -

శివుడి సంగీతానికి పరవశించిన విష్ణుమూర్తి శరీరంనుంచి ఆవిర్భవించింది. రాధాశరీరంనుంచి జాలువారిన జలంతో వరదగట్టింది. సృష్టికన్నా ముందు గోలోకంలో రాసమండలంలో శంకరుడి సన్నిధానంలో జన్మించింది. గోపగోపీజనంతో కోలాహలంగా జరుగుతున్న రాధామహోత్సవంలో కార్తిక పూర్ణిమ రోజున అవతరించింది. కోటియోజన విస్తీర్ణమూ అంతకన్నా లక్షరెట్లు పొడుగూ ఉండి గోలోకమంతటా వ్యాపించిన గంగమ్మకు వందనాలు.

ఆరవైలక్షల యోజనాల విస్తీర్ణమూ అంతకు నాలుగురెట్లు పాడవూగా వైకుంఠంలో వ్యాపించిన గంగమ్మకు దండాలు. ముప్పయి లక్షల యోజనాల విస్తీర్ణమూ అంతకు అయిదు రెట్లు పాడవుగా బ్రహ్మలోకంలో ప్రవహించే గంగమ్మకు ఏటికోళ్ళు. అంతే విస్తీర్ణమూ అంతకు నాలుగురెట్లు పాడవుతో శివలోకంలో సంచరించే గంగమ్మకు నమస్సులు. ఇలాగే ధ్రువలోక - చంద్రలోక - సూర్యలోక - తపోలోక - జనలోక - మహర్లోక - కైలాస - ఇంద్రలోక - పాతాళలోకాలలో ప్రవహించే గంగాదేవికి నమోవాకాలు. ఇంద్రలోకంలో మందాకినిగా పాతాళంలో భోగవతిగా కీర్తింపబడే గంగాభవానికి నమస్కారాలు. ఒక క్రోశమాత్ర విస్తీర్ణంతో అక్కడక్కడా ఇంకా క్షీణించి అలకనందగా భూలోకంలో ప్రవహించే గంగమ్మకు డింగిడీలు.

సత్యయుగంలో పాలనురువులాగా, త్రేతాయుగంలో వెన్నెలలాగా, ద్వాపరయుగంలో మంచిగంధంలాగా, కలియుగంలో నీళ్ళలాగా, స్వర్గంలోమాత్రం అన్నియుగాల్లొనూ పాలలాగా ప్రవహించే గంగమ్మకు నతులు. గంగా జలకణాన్ని రవ్వంత స్పృశిస్తే చాలు పాపాత్ములకుకూడా జ్ఞానోదయమవుతుంది. కోటి జన్మల పాపాలు నశిస్తాయి, బ్రహ్మహత్యామహాపాతకంకూడా అంతరిస్తుంది.

నారదా! ఈ గంగాలహరిని (లహరి = స్తోత్రం) నిత్యం భక్తితో పఠించి గంగమ్మను అర్చించినవారికి అశ్వమేధయాగఫలం దక్కుతుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది. అవివాహితులకు వివాహమవుతుంది. రోగులకు ఉపశమనం రోగవిముక్తి లభిస్తాయి. మూర్ఖుడుకూడా పండితుడవుతాడు. యశస్వి అవుతాడు. ప్రాతఃకాలంలో పఠిస్తే దుఃస్వప్నదోషాలు నశిస్తాయి. గంగాస్నానఫలం దక్కుతుంది.

శ్రీకృష్ణుడి ఆజ్ఞ ప్రకారం భగీరథుడు ఇదే స్తోత్రాన్ని చేసి గంగానదిని తన వెంట తీసుకువెళ్ళాడు. సగరపుత్రుల చితాభస్మాలమోద ప్రవహింపజేశాడు. వెంటనే వారందరూ వైకుంఠానికి చేరుకున్నారు. భగీరథుడు తెచ్చాడు కనక అప్పటినుంచీ ఈ నదికి భాగీరథి అనే పేరు ఏర్పడింది. బ్రహ్మనందనా! ఇది గంగావతరణ గాథ. పుణ్యప్రదం, మోక్షప్రదం. ఇంకా ఏమేమి కథాసారాలు తెలుసుకోవాలనుకుంటున్నావో అడుగు, చెబుతాను - అని ముగించాడు నారాయణ మహర్షి

రాధాదేవియే గంగాదేవి


Previous life of Sankhachudu - శంఖచూడుడి పూర్వజన్మ

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము -  శంఖచూడుడి పూర్వజన్మ పద్మసంభవా! శంఖచూడుడు దానవేంద్రుడే కావచ్చు. దేవతలనందరినీ పారద్రోలి ఉండవచ్చు. కానీ అతడి వృ...