Tuesday, March 3, 2026

Lord Vishnu Impressed The Prachetas Meditation and Gave Blessings/Boons - ప్రచేతసుల తపంబునకు భగవంతుండు మెచ్చివరంబు లిచ్చుట

ప్రచేతసుల తపంబునకు భగవంతుండు మెచ్చివరంబు లిచ్చుట

వారు దైవేచ్చ ననుసరించి శ్రీమహావిష్ణువునకు ఎల్లవేళలా ప్రియుడైన మహేశ్వరుని కలిసికొని అతని దయవలనమోక్షం పొందారని నీవు చెప్పి ఉన్నావు. అది నిజం. ఇంకా.

ఆ రాజకుమారులందరూ శ్రీహరిని దర్శించు కొనటానికి ముందు ఈ లోకంలో, పరలోకంలో ఏ గొప్ప ప్రయోజనాలను మిక్కిలి ఆసక్తితో పొందారు? మహర్షీ! మైత్రేయా! నాకు తెలియజెప్పు.

విదురా! విను. తండ్రి ఆజ్ఞను వారు సంతోషంతో స్వీకరించి సముద్రగర్భంలో ఉండి సాటిలేని జపయజ్ఞాన్ని అవలంబించి చక్కగా తపస్సు చేస్తూ సంతోషంతో ఉన్నారు. అలా ఉండగా

వారు చెదరనిస్థితితో పదివేల సంవత్సరాలు తపస్సు చేశారు. అప్పుడు దయతోనిండిన హృదయం కలవాడు, అభయం ఇచ్చేవాడూ, శాశ్వతుడూ అయిన శ్రీమహావిష్ణువు

(సనాతనుడు- సర్వకాలాలలో 'ఉండుటయే' లక్షణం అయినవాడు - నిత్యుడు - జీవులకులాగా చావు పుట్టుకలు లేని వాడు పరమాత్మ - అని అర్థం.)

ఆ సమయంలో అచ్యుతుడు తన సాటిలేని, శాంతములైన దేహప్రభలతో ఆ రాజకుమారుల తపస్సువలన కలిగిన దుఃఖాలను పోగొడుతూ స్పష్టంగా వారికి కానవచ్చాడు.

గొప్పదైన మేరుపర్వత శిఖరంతో కూడియున్న నీలమేఘం సొంపులతో గరుత్మంతుని మూపుపై ఉన్నవాడూ, చాలా అందమైన తన దేహకాంతితో చీల్చి వేయబడిన, భయంగొాలిపే, సర్వదిక్కులమధ్యనున్న అంధకారం కలవాడూ; చాలా గొప్పవి అయిన ఎనిమిది ఆయుధాలతో, దేవతలతో, మహర్షులతో, భక్తులతో, పరిజనులతో కూడియున్నవాడూ, ప్రకాశిస్తున్న సువర్ణ కుండలాలు బుజ్జగిస్తున్న చెక్కిళ్ళ తావులు కలవాడూ, సుందరమైన నవరత్నాలు గల దివ్యమైన కిరీటం ధరించినవాడూ, కాస్తుభమణి వేలాడుతున్న శుభమైన కంఠంకలవాడూ, సుకుమారమైన పచ్చని వస్త్రం ధరించినవాడూ, హారాలూ, అంగదాలు, కంకణాలు, అందెలు అనే ఆభరణాలతో అలరారుతున్నవాడూ.

(అష్టాయుధాలు : 1. శంఖం, 2. చక్రం, 3. డాలు, 4. ఖడ్గం, 5. గద, 6. బాణాలు, 7. విల్లు, 8. పాశం - ఈ ఎనిమిదింటినీ, ఎనిమిది చేతులలో ధరించి ఉన్నవాడు.)

ఆయన ఎనిమిది చేతులు సుకుమారంగా, పొడవుగా అలరారుతున్నాయి. ఆ చేతుల మధ్యభాగం ఒక వృత్తం ఆకారంతో ఒప్పుతున్నది. ఆ నడుమ శ్రీదేవి అలరారుతున్నది. ఆమె కాంతులతో పోటీపడుతున్నదా అన్నట్లు ప్రకాశిస్తున్న వైజయంతి అనే వనమాలతో ఆ స్వామి వెలుగొందుతున్నాడు.

(వనమాల- ఆకులు, పువ్వులు కలిపికూర్చిన పెద్దమాల. అది కంఠసీమనుండి పాదాలవరకు వ్యాపించి ఉంటుందని ప్రసిద్ధి.)

ఆయన కీర్తిని దేవతలు, గరుడులు, యక్షులు, కిన్నరులు, సాటిలేని విధంగా పాటలరూపంతో కొనియాడుతున్నారు. ఆ సవ్వడి అన్ని దిక్కుల మధ్యభాగాలను నింపివేస్తున్నది. అది ఆయన గొప్పతనాన్ని మనస్సునకు తెలియజేస్తున్నది. అట్టి సనాతన పురుషుడు విష్ణువు ప్రీతితో

లక్ష్మీపతి అయిన నారాయణుడు దయను వెలార్చే చూపులతో ఆ రాజకుమారులను చక్కగా చూచి ఉరుమువలె గంభీరంగా ఉండే తీయని మాటలను ప్రేమానురాగాలు ఉట్టిపడే విధంగా ఇలా పలికాడు.

(అంబుదగంభీరం అనటంచేత వరాలు కురుస్తాయి అనే అర్ధం స్ఫురిస్తుంది.)

తాపస శ్రేష్ఠులైన ప్రచేతసులారా! సంతోషంగా వినండి. మీరు చెలిమిలో ఒకే భావం కలవారు. అటువంటి మీ మంచితనానికి నాకు చాలా ఆనందం కలిగింది.

(సమతన్‌ - ఆత్మసామ్యంతో - తనయందు తనకు ఎంత ప్రీతి ఉంటుందో అటువంటి ప్రీతితో అని తాత్పర్యం.)

నేను తప్పక మీ కోరికను తీరుస్తాను. స్పష్టంగా చెప్పండి. మిమ్ములను సుఖంగా నిద్రకు పోయేసమయంలో తలచుకొనే నరుడు ఎల్లవెళలా అన్నదమ్ములయందు చెలిమీ, భూతదయా, స్వచ్చమైనబుద్ధీ, మంచివారియందు ప్రీతీ కలిగి, సమస్త పాపాలూ పోయినవాడై విశ్వంలో సుఖిస్తాడు.

ఇంకను, రుద్రుడు గానం చేసిన నా స్తోత్రాన్ని ప్రతిదినం చదివిన వారికి కోరిన వరాలిస్తాను. శుభాలను కలిగించే బుద్ధి విశేషాన్ని కూడా ఇస్తాను. మీరు సంతోషంతో కూడినవారై మీ తండ్రి ఆజ్ఞను అనుసరించటంవలన మీ కీర్తి లోకాలలో వ్యాపిస్తుంది. మీకు గొప్ప బ్రహ్మగుణాలు కలవాడూ, తన సంతతివల్ల మూడులోకాలను నిండించే మంచిగుణాలకు గనియైనవాడూ అయిన కుమారుడు జన్మిస్తాడు. కండుమహాముని తపస్సును పాడుచెయటానికి ఇంద్రుడు పంపిన ప్రమ్లోచ అనే అప్సరః కాంత గర్భం ధరించి ఆ మునివరుని వీడ్కొని స్వర్గానికి పోయేసమయంలో పుట్టిన ఆమె పుత్రికను చెట్లలో ఉంచి పోగా,

ఆ బిడ్డ అప్పుడు ఆకలితో నోరు పెద్దగా తెరచి ఏడువగా విని అక్కడకు వచ్చి రాజైన చంద్రుడు చక్కగా అమృతాన్ని కురిపించే తన చూపుడు వేలిని నోటిలో ఉంచాడు. దానితో ఆమె పెరిగింది. చంద్రునివంటి మోముతో అలరారుతున్న ఆ కన్యను, ఉత్తమస్త్రీని మీ తండ్రి ఆదేశాన్ననుసరించి మీరందరూ సంతానం కోసం పెండ్లి చేసుకోండి అని చెప్పి పద్మనయనుడైన విష్ణువు ఇంకా ఇలా అన్నాడు.

పుణ్యాత్ములారా! మీరు ఒకే విధమైన ధర్మాన్ని పాటించే శీలం కలవారు. కనుక మీకందరికీ ఈసన్నని నడుముగల సుందరి ఏకధర్మశీల, మీకు అర్పించుకొన్న మనస్సు కలదీ అయి భార్య అవుతుంది. మీ తేజస్సుకు ఎదురు ఉండదు. పెక్కువేల దివ్యవత్సరాలు భూలోక, దేవలోక సుఖాలు అనుభవిస్తారు. అటుపిమ్మట నాయందలి భక్తితో ఈ సుఖాలన్నీ నరకంవంటివి అని మీరు భావించి నిర్మలమైన మనస్సు కలవారై నా స్థానాన్ని చేరుకొంటారు అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు.

(భగవంతుని మీద భక్తి హృదయాన్ని మాలిన్యం లేనిదిగా చేస్తుంది. దానితో వారు సంసారంనుండి విముక్తి పొందుతారని తాత్పర్యం.)

రాజకుమారులారా! సంసారంలో ఉన్నవారయినా కర్మలను, కర్మఫలాలను నాకు సమర్పించుకొని మిక్కిలి మనోహరాలైన, అమృతం వంటి నాకథలను వినటంలో ఆసక్తి కల మనస్సుతో కాలం గడిపేవారయితే వారికి సంసారాలు తెంచుకోరాని భవబంధాలకు కారణాలు కావు.

నాయనలారా! ప్రచేతసులారా! బ్రహ్మమును గూర్చి మాత్రమే నిరంతరం వాక్కులను ఉపయోగించే మహాత్ములైన యోగిజనులు నిరంతరంగా నా కథలను గానం చేస్తూ ఉంటారు. అందు నాకు వేడుక ఎక్కువ. కాబట్టి, వారునా వారు. నేను ఎప్పటికప్పుడు నవీనంగా వారిలో నివసిస్తాను. ఆ మహిమవలన వారికి ఈ ఇళ్ళూ వాకిళ్ళూ మొదలైనవి సంసారబంధానికి కారణాలు కావు. ఇదంతా విచారించి చూస్తే సత్యం.

నేను రసస్వరూపుడను. కాబట్టి, నన్ను చేరుకొన్న మానవులకు శోకం, మోహం, సంతోషం మొదలైన భావాలు కలుగవు. కనుక పరిశీలిస్తే నేను ముగ్గురు పురుషులకు ప్రభుడను. బ్రహ్మము అయిన వాడను. 

అనీ ఈ విధంగా మాట్లాడుతున్న పురుషార్థాలను మానవులకు అందించే జనార్దనుని దర్శించి, ఆదర్శనంచేత మొత్తంగా నశించిన రజస్తమోగుణాలు కలవారైన ప్రచేతసులు

అందరికి రక్షకుడు, అప్రమేయుడు, లక్ష్మీపతి, జయించడమే సహజ లక్షణంగా గలవాడు, అంతం లేనివాడు, దోషాలు లేని చరిత్రకలవాడు, పరిశుద్దుడు, అచ్యుతుడు, పరుడు, పరమేశుడు, ఈశుడు, సంసారబంధాలనుండి జీవులకు విముక్తి కలిగించేవాడు, పద్మాలవంటి కన్నులున్నవాడు అయిన శ్రీహరిని ఆ ప్రచేతసులు పద్మాలవంటి చేతులను దగ్గరకు చేర్చుకొని గొంతుకనుండి స్వరం ఆనందపారవశ్యంతో చక్కగా రానిస్థితితో తెమల్చుకొంటూ ఇలా స్తుతించారు.

కేశవా! నీవు ఎల్లప్పుడు ప్రాణులకు కలిగే కష్టాల నన్నింటిని నశింపజేసేవాడవు. ఎవరి మనస్సులకు, మాటలకు అందనివాడవు. నీ గుణాలు, నీ పేర్లూ, పెక్కు విధాలైన గొప్ప కోరికలకు కారణం అవుతూ ఉంటాయి. అన్నిలోకాల పుట్టుక, పెరుగుట, గిట్టుట అనే విషయాలను పట్టినిలిపే గొప్పది అయిన మాయా గుణం నీమూర్తి. ఇంద్రియ మార్గాలు గొప్పవే కానీ వానికి చిక్కని చక్కని దారి నీది. మిక్కిలి శాంతమైన మనస్సు కలవాడవు. సంసారమనే అజ్ఞానాన్ని హరించే మేధా సంపద నీది. నీవు దేవదేవుడవు. వాసుదేవుడవు. అన్ని నీలో నివసిస్తూ ఉంటాయి. నీవు సకల ప్రాణులలో ఉంటావు. సర్వసాక్షివి. అటువంటి కృష్ణా! నీకు నమస్కారం.

స్వామి బొడ్డులో పద్మం ఉంది. స్వామి సంసార దుఃఖాన్ని రూపుమాపువాడు. పరులకు ఈశ్వరుడు, పరుడైన ఈశ్వరుడు. తామర పూవులోని కేసరాలవంటి పచ్చనిది, స్వచ్చమైనది, దివ్యమైనది అయిన బంగారు వస్త్రం ధరించినవాడు. పద్మాలవంటి పాదాలు కలవాడు; పద్మమాలను తాల్చినవాడు, పరుడు, అపరుడు, గొప్ప మంచిగుణాలు కలవాడు; రక్కసులను సంహరించేవాడు, సృష్టికి కారణమైనవాడు అయిన మనోహరమైన నల్లని వన్నెతో అలరారుతున్న శ్రీమవావిష్ణువునకు నమస్కారం, నమస్కారం.

ఈ విధంగా స్తుతిచేసి పద్మదళనయనా! భక్తుల ప్రయోజనాలను చక్కగా అనుగ్రహించే స్వామీ! నీ దర్శనం మా దుఃఖాలన్నీ రూపుమాసి పోవటానికి కారణమైంది. తోలగించుకొనరానివీ, భరించటానికి అలవి కానివీ అయిన కష్టాల అవస్థతో దుఃఖం పొందుతున్న మాకు నీ గొప్పదైన మంచి కరుణను చూపటం కంటె మించిన అనుగ్రహం భావిస్తే లోకంలో మరొకటి ఏముంటుంది?

స్వామీ! నీవు అశుభాలను తొలగిస్తావు. ఐశ్వర్యంతో కూడిన వాడవు; మహాత్ముడవు. లోకాలనన్నింటినీ ఏలే దేవరవు. అట్టి నీవు దీనులను కాపాడుటయే పనిగా పెద్దకాలానికి ఆనందంతో వీళ్ళు మావాళ్ళు అని బుద్ధిలో అనుకొనటమే మాకు గొప్ప సత్కారం. అదే చాలు. కానీ, దానితో ఆగక స్వయంగా మాకు సాక్షాత్కరించినావు.

ప్రభూ! నీవు భక్తుల సముదాయాల హృదయాలలో ఉండే కోర్కెల నన్నింటినీ తీర్చేవాడవు. మోక్షానికి నడపించేవాడవు. భావన చేయగా చిన్నిప్రాణుల హృదయాలలో కూడా అంతరాత్మవై స్థిరంగా ఉంటావు. కాగా నీ పాదపద్మాల జంటను పూజించటం తప్ప మరొక పనిలేని మాకు శుభాలను కూర్చి నీవు మాకోరికలేవో తెలియనివాడవా?

వనజాక్షా! అయినా విను. నీవు మోక్షమార్గంలో భక్తులను నడిపించేవాడవు. పురుషార్థాల గొప్ప వ్యాప్తియే నీ స్వరూపం. అటువంటి నీవు మా యందు అనుగ్రహం చూపుతున్నావు. ఇంతకంటె కోరదగిన వరం మరొకటి లేదు. అయినా నీవు పరాపరుడవు. అట్టి నిన్ను ఏదైనా ఒక వరం కోరదామంటే నీ విభూతులకు అంతం లేదు. అందువలననే నిన్ను అనంతుడు అని తత్త్వం తెలిసినవారు అంటారు. పరమపురుషా! అట్టి నిన్ను ఏమి కోరగలం? దాహం కలిగిన పిల్లవాడు సముద్రజలాన్ని ఎంత తాగగలడు.

స్వామీ! మేమునీ పాదపద్మాల పాదులను ఆశ్రయించి ఉండేవారం. బుద్ధిసంపదకు నెలవైన ఓ దేవా! నీ చూపు కాక మరొక్క దానిని మేము కోరగలమా? మన్నన కెక్కిన పారిజాతపుష్పమకరందాన్ని పేరాసతో క్రోలి విరాజిల్లే తుమ్మెద వేరు పుష్పాలను చేరుతుందా?

స్వామీ! లక్ష్మీపతీ! మేము నీదైన మాయకు లోబడి ఎన్నో పనులు సంసారం కొరకు చేస్తున్నాం. మిక్కిలి ఆసక్తితో ఏది చివరి లక్ష్యంగా మేము తిరుగుతున్నామో అది లభించే వరకూ మాకు దొడ్డబుద్ధితో నీ పరమభక్తుల చెలిమిని ప్రసాదించు.

లక్ష్మీపతీ! సర్వమునిశ్రేష్ఠులు పూజించే పాద పద్మాలు కలవాడా! ఉత్తముల రసవంతములైన మాటలకు ఆనందించే బుద్ధికల దేవా! నీ భక్తుల చెలిమి ఎంత కొంచెమైనది అయినా, దానితో సమానంగా స్వర్గం మొదలైన సుఖాలను కూడా మేము భావించం. ఇక మానవలోక సుఖాలమాట చెప్పటం ఎందుకు?

అంతేకాదు, భగవంతుని భక్తుల తోడి సాంగత్యమందు దాహాన్ని రూపుమాపేవి అయిన సంతృప్తిని కలిగించే కథలు ఉంటాయి. కాబట్టి, వానిని వినటం వలన ఏ ప్రాణి యందూ పగగానీ, ఉడుకుమోతుతనంగానీ ఉండవు.

స్వామీ! నీవు అడవులలో భౌతిక సంబంధాల అంటు సొంటులు లేకుండా తిరిగే మునులు కొనియాడుతూ ఉండగా ప్రకాశిస్తూ ఉంటావు. కాబట్టి, భూమిమీద పుణ్యతీర్థాలలాగా పవిత్రం చేయబూని కాలి నడకతో తిరుగాడుతూ భూమిపై సంచరించే నీ భక్తులతో సహవాసం ఘోరమైన సంసారభయంలో ఉన్నవాని బుద్ధికి ఎలా ఇష్టం కాకపోతుంది?

తామర రేకులవంటి చక్కని కన్నులున్న స్వామీ! ప్రభూ! నీప్రాణమిత్రమైన పరమేశ్వరునితోడి క్షణమాత్రమైన చెలిమి కలిగిన సమాగమం వలన పెద్దపుండు అనదగినదై చికిత్సకు అసాధ్యమైన జన్మరోగాన్ని మానిపే మేటి వైద్యుడవైన నిన్ను దర్శించి కృతార్ధులమయ్యాం. బాగా బతుకుతున్నాం.

(నీ సందర్శనం వల్ల మా సంసారజాడ్యం రూపుమాసిపోతుందని ప్రచేతసుల హృదయం. వారికి ఈ భాగ్యం పరమేశ్వరుని వలన కలిగింది. శివకేశవులు పరస్పరం సఖులు అంటే ఏకప్రాణులు. వారియందు భేదబుద్ధిని పెట్టుకోవటం ఆత్మవినాశన కారణం అవుతుందని ఇక్కడ ధ్వని.)

దేవా! మా వేదాల అధ్యయనం, గురువుల అనుగ్రహమూ, విప్రలైన జ్ఞానవృద్దుల నడవడిని బట్టి మెలగటమూ, మహాత్ములకు నమస్కరించటమూ, సకల ప్రాణులయందు అసూయ లేకుండుటయూ, ఆహారం తీసుకోకుండా చాలాకాలం నీళ్ళలో నిలిచి శరీరాన్ని ఎండగట్టి తపస్సు చేయటమూ అనే ఇవన్నీ సనాతనుడవైన నీకు సంతోషాన్ని కలిగించుగాక అని మేము విన్నవించుకుంటున్నాం- అని ఇంకా ఇలా అన్నారు.

అసూయ అంటే గుణాలను దోషాలుగా చెప్పటం. అది బుద్ధిని పాడుచేస్తుంది. కాబట్టి, అసూయను మూలముట్టుగా 
రూపుమాపుకోవాలి.

దేవా! వరదా! మనువు, బ్రహ్మ, శివుడు మొదలైన గొప్ప ప్రజ్ఞకల మహానుభావులు, తపస్సు, జ్ఞానం, సత్త్వం అనే మహాగుణాలు పుష్కలంగా ఉన్నవారు కూడా పూర్వం నీ మహిమను తుది దాకా స్తుతించలేకపోయారు. అయినా శక్తి ననుసరించి స్తుతించారు. మేము కూడా అలాగే కోరికోరి మా బుద్ధి శక్తుల ననుసరించి నిన్ను స్తుతించుకుంటూ ఉంటాము.

(భగవంతుని మహిమను తుదిముట్టా తెలిసినవాడు భగవంతుడు మాత్రమే. అయితే అమృతభాండం నుండి ఒక బొట్టు పుచ్చుకున్నా అమృతఫలం సిద్ధిస్తుంది.)

స్వామీ నీవు అందరియందూ ఏకరూపంగా ప్రవర్తించేవాడవు. సనాతనుడవు, పరిశుద్దుడవు, శ్రేష్ఠుడవు, వాసుదేవుడవు, సత్త్వమే మూర్తి అయిన వాడవు, భగవంతుండవు- అట్టి నీకు నమస్కరించెదము. అని యిట్లు ఆ ప్రచేతసులు స్తుతించగా శరణుకోరినవారియందు వాత్సల్యంగల మహావిష్ణువు తృప్తి పొందిన భావనకలవాడై వారు కోరినవరాలు ఇచ్చాడు.

(1. సముడు- 'మా' అంటే లక్ష్మి. ఆమెతో కూడినవాడు అని విశేషార్థం.

2. ఆదిపురుషుదు- సృష్టికి పూర్వం నుండి ఉన్న 'సత్' పదవాచ్యుడు.

3. శుద్దుడు- పుట్టుక, ఉండటం, గిట్టటం అనేవి ప్రాణులకు కర్మబంధదోషాలవలన ఏర్పడేవి. అట్టి దోషాలు లేనివాడు.

4. పరుడు- లోకాలు, లోకేశులు, లోకస్థులు అయినవారికి అతీతంగా పెనుచీకటికి ఆవల ఉండేవాడు.

5. వాసుదేవుడు- వస్‌ అంటే ఉండటం, దివ్‌ అంటే విరాజిలటం- అందరిలో ఉంటూ విరాజిల్లే వాడు. అందరూ అతనిలో ఉంటారు అని వాసుదేవపదానికి అర్ధం అని శ్రీమహాభారతం.

6. 'సత్త్వం' అంటే ఉండటం. రజస్సు తమస్సు అనే గుణాలు లేని నిర్మలతత్త్వం. అదే ఆయనమూర్తి)

ఆ రాజకుమారులు సంతోషం పొంగి పొరలగా మరిమరీ సన్నుతి చేయగా లక్ష్మీపతి అయిన శ్రీమన్నారాయణుడు మనస్సులో నిండుమోదం పొంది భక్తులను పాలించే శీలం కలవాడు కనుక ఆ పని ముగించి, తన్ను చూడటమందే గొప్ప కోరికగల ఆభక్తులు తృప్తి తీరని వారై చూస్తూ ఉండగా తన స్టానానికి వడివడిగా పోయాడు.

పిమ్మట ఆలస్యం చేయకుండా ప్రచేతసులు భగవంతుని ఆజ్ఞను భక్తితో పాటించి సముద్రజలాల నుండి వెలుపలికి వచ్చి, ఆ రాజకుమారులు స్వర్గద్వారానికి అడ్డం వచ్చే విధంగా పెద్ద ఎత్తున బాగుగా పెరిగినవి, భూమినంతటినీ కప్పివేసినవీ అయిన ఆ చెట్లను చూచి ఆ ప్రచేతసులకు చాలా తీవ్రమైనకోపం వచ్చింది. ప్రళయ కాలపు శివుని వలె భయంకరులయ్యారు. భూచక్రాన్నంతటినీ చెట్లు లేనిదిగా చేయాలని సంకల్పించారు. వారి పద్మాలవంటి ముఖాలనుండి అగ్నిని చిమ్మే గాలులు పుట్టుకొని వచ్చాయి. ఆ చెట్ల నన్నింటినీ దహించబోతూ ఉండగా

(కుజము- కు అంటే భూమి- దానినుండి పుట్టినది- చెట్టు.)

అప్పుడు బ్రహ్మదేవుడు ఆ చెట్లకు కలుగబోతున్న ఘోరమైన వినాశనాన్ని గమనించాడు. అక్కడికి వచ్చి ఆ రాజకుమారులను మంచి మాటలతో శాంతింపజేస్తూ ప్రేమతో మాట్లాడి ఆ రాజకుమారుల కోప తీవ్రతను పోగొట్టిన తరువాత.

మిగిలిన చెట్లన్నీ భయపడి బ్రహ్మ ఆజ్జననుసరించి మారిష అనే ఉత్తమురాలైన తమకూతురిని ఆ ప్రచేతసులకు భార్యగా ఇచ్చినవి. మునుపు దక్షుడు ఈశ్వరుని విషయంలో చేసిన అపరాధానికి అతడు రాజుగా పుట్టవలసి వచ్చినది. దానికి కారణం అయినది యీ మారిషయే. అట్టి ఆ కాంతను ప్రచేతసులందరూ వరుసగా శాస్త్రవిధానాన్ని అనుసరించి పెండ్లి చేసుకున్నారు. దైవసంకల్పాన్ని ఎవరూ ఎక్కడా దాటలేరు కదా?

(పూర్వం దక్షుడు ఒక యాగం చేసి అందులో శివుణ్ణి అవమానించాడు. ఆ కారణంగా బ్రహ్మపుత్రుడైన దక్షుడు ఈ మారిష అనే స్త్రీయందు రాజుగా పుట్టవలసి వచ్చింది- ఇది పూర్వగాథ)

లోకంలో వినటానికైనా ఇటువంటిది ఎక్కడైనా ఉన్నదా? ఒక స్త్రీ విషయంలో పదిమంది రాజులకు పొంతన కుదురుతుందా? ఇదంతా బ్రహ్మాదేవుని గొప్పమాయ. దాని వలన కలిగే ఆశ్చర్యాలకు నమస్కారాలు చేయవలసినదెే.

చాక్సుషమన్వంతరంలో దైవం ఏర్పాటు చేయగా తనకు ఇష్టమైన విధంగా ప్రజలను సృష్టిస్తూ ప్రసిద్ధుడైన దక్షుడు వెనుకటిదేహం కాలాన్ననుసరించి జారిపోగా ప్రచేతసులకు ఆ మారిష అనే ఇల్లాలియందు మళ్ళీ పుట్టాడు. అతని తేజస్సులో గొప్పగొప్పవారి తేజస్సులు అణగిపోయాయి. కార్యాలను దక్షతతో చేస్తాడు కనుక దక్షుడు అయ్యాడు. అతనిని బ్రహ్మ సృష్టికార్యంలో నియోగించాడు. అతడు మరీచి మొదలైన ప్రజాపతులను ఆయా పనులలో నియోగించి ఉన్నాడు. అప్పుడు

(మరీచి మొదలైనవారు తొమ్మండుగురు. వీరిని నవబ్రహ్మలు అంటారు- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరిచి.)

ఆ ప్రచేతసులకు విజ్ఞానం నిండుగా కలిగింది. వెంటనే నారాయణుని పలుకును స్మరించారు. తమ కొడుకు దగ్గర ఇల్లాలిని ఉంచారు. అడవులలో నివాసం ఏర్పరచుకొన్నారు. పూర్వం జాబాలి అనే మునిశ్రేష్ఠుడు తపస్సిద్ధి పొందిన గొప్పది అయిన పడమటి సముద్రం తీరంలో ఆత్మ విజ్ఞానం గురించి విశేషంగా భావన చేయటానికి సంకల్పించారు. అప్పుడు వారి దగ్గరకు వివేకం పండించుకొన్నవాడు, నరులు, దేవతలు, రక్కసులు, యక్షులు, కిన్నరులు మొదలగువారిచే గొప్పగా పూజించబడుతున్నవాడు, వివేకశీలి అయిన నారదుడు ఏతెంచాడు.

నారదుడు ఆ రాజకుమారుల దగ్గరకు వచ్చాడు. వారు ప్రాణ, మనో, వాక్‌ శక్తుల్ని దర్శించి పూర్తిగా తమ అదుపులో ఉంచుకొనిన ఋషులు. ఆసననిష్ఠకల శాంతులు. సాటిలేని ఆకారం గలవారు. పరబ్రహ్మమునందు నెలకొల్పిన అంతఃకరణం కలవారు.

వచ్చిన నారదమునిని చూచి రాజకుమారులు లేచి వేడుకతో నమ్రులై చక్కని వినయంతో మిక్కిలి యోగ్యమైన పూజనములతో అతనికి సంతోషం కలుగజేశారు.

(పూజ్యులు వచ్చినపుడు లేచి ఎదురువెళ్ళీ మంచిమాటలు మొదలైన వానితో సత్కరించి కూర్చుండబెట్టటం సదాచారం.)

పుణ్యాత్మా! మునిశ్రేష్ఠా! లోకపావనా! పూజ్యులైన తమరి రాక అన్ని లోకాలకూ మంగళాన్ని కలిగించేది. మా అదృష్ట విశేషం చేత ఈనాడు తమరిని చూడగలిగితిమి. తమరు లోకాలలో సంచరిస్తూ ఉంటారు. దానిని అడ్డుకొనే శక్తి ఎవరికీ లేదు. సూర్యుని గమనం లాగా ప్రాణులందరి అన్ని భయాలను అది తీసివేస్తుంది.

'పుణ్యాత్మా! భగవంతులైన విష్ణువు శంకరుడు ఉపదేశించిన ఆత్మతత్త్వం సంసారంలో ఉన్న మాకు మరపునపడింది. అట్టి తత్త్వార్దాన్ని ప్రకాశింపజేసేదీ, పెద్దదీ, భయంకరమైనదీ అయిన సంసారసముద్రాన్ని తరింపజేసేదీ అయి మిక్కిలి ఒప్పారే ఆత్మతత్త్వాన్ని ఇప్పుడు మాకు సుస్థిరమైన దయాబుద్ధితో మాలో వెలుగొందునట్లు చేయండి' అని ఇట్లు పలుకగా నిరంతరం భగవంతునియందే సమర్పించిన హృదయం కలవాడు, మిక్కిలి ఉత్తమములైన గుణాలు కలవాడు, సర్వలోకాలలో లోకకల్యాణంకోసం సంచరిస్తూ ఉండేవాడు అయిన నారదుడు ఆ రాజకుమారులతో ఇలా పలికాడు.

నాయనలారా! మానవులకు భగవంతుడు పుట్టుక, సంస్కారాలు, ఆయువు, మనస్సు, మాట ఇచ్చాడు. వానిని దేవదేవుడైన గోవిందుని సేవకు వినియోగించినపుడె సార్ధకత కలుగుతుంది. బ్రహ్మపుట్టుకకు కారణమైన పద్మం నాభియందు గల శ్రీమహావిష్ణువు సేవకు కాని జాతకర్మం, ఉపనయనం మొదలైన సంస్కారకార్యాలతో ఏర్పడిన పుట్టుకలు వ్యర్థం. 'పెద్దకాలం బదకటం వృథా. వేదం చేయమంటున్న యజ్ఞాది కర్మలు పనికిమాలినవి అవుతాయి. జపం, తపం, విద్య, చక్కగా మాట్లాడగలగటం మొదలైనవన్నీ ప్రయోజనం లేనివి. పెక్కింటి మీద ఏక కాలంలో బుద్ధి నిలపడంలో నేర్పు వ్యర్థం.

విష్ణుభావనలేని ఇంద్రియాల గొప్పశక్తీ, ఆరితేరిన బుద్ధీ, ప్రాణాయామం మొదలైన యోగమూ, దేహం మొదలైన వానికంటె వేరయిన జ్ఞానమూ, సన్న్యాసమూ, వేదాల పఠనమూ, తక్కిన వ్రతాలు, వైరాగ్యాలూ మొదలైన శ్రేయస్సును సాధించే కార్యాలూ పనికి మాలినవి. భగవంతుడు సర్వశ్రేయస్సుల స్వరూపమైనవాడు. సమస్తశ్రేయస్సులకు చిట్ట చివరిహద్దు. సర్వభూతాలకు నెలవైనవాడు. సర్వభూతాలకు బుద్ధి శక్తులను ప్రసాదించేవాడు. సర్వభూతాలకు ప్రియమైనవాడు. అంతటా వ్యాపించి ఉండేవాడు. కాబట్టి

రాజకుమారులారా! నిండైన ప్రీతితో శ్రీమహావిష్ణువును పూజ చేయటం ప్రాణాలను సమర్పించుకోవటం తృప్తికి కారణం. బుద్ధితో భావనచేస్తే చెట్టు పాదులో నీరు నింపటం ఎక్కడనో పై భాగాన ఉన్న కొమ్మల పుష్టికి కారణమైన విధంగా ఆ విష్ణుపూజ సర్వదేవతా సమర్చన విధానమై అలరారుతుంది.

(కొమ్మలకు పుష్టి కావాలంటే పాదులో నీళ్ళు నిండుగా పోయాలి. అలాగే దేవతలందరు కొమ్మలవంటివారు. శ్రీమహావిష్ణువు ఆలవాలం. కాబట్టి అతడు తృప్తి పొందితే దేవతలందరూ తృప్తి పొందుతారు.)

వర్షాకాలంలో సూర్యునివలన ఆవిరై మేఘంగా మారిన నీరు భూమికి వస్తుంది. తిరిగి ఆ నీరే ఎండలకాలంలో మరల సూర్యుని యందే లయమవుతుంది. ఆ విధంగా భూమి నుండి పుట్టిన చరాచర ప్రాణికోట్లు భూమిలోనే కలసిపోవటం చూస్తూ ఉన్నాం. అలాగే శ్రీహరినుండి పుట్టిన విశ్వమంతా శ్రీహరియందే లయం పొందుతుంది. అది ఎలా అంటే-

(సృష్టి అంతా చరాచరాలైన ప్రాణికోటితో నిండి ఉన్నది.)

చూడగా చూడగా ఆకాశంలో దట్టంగా మబ్బులు పట్టినప్పుడు చీకట్లు కమ్ముకుంటాయి. కొంచెం సేపట్లో ఆ చీకట్లు అక్కడనే అణగిపోతాయి. అలాగే సత్త్వం, రజస్సు, తమస్సు అనే గుణాలు ప్రవాహాలలాగా సాగిపోతూ ఉండగా వాని శక్తులు కూడా బ్రహ్మంనుండి ఏర్పడతాయి. మళ్ళీ హరియైన విష్ణువులో కలసిపోతాయి.

నాయనలారా! ఆ పరమాత్మ అన్ని విధాల దేహాలు కలవారికి ఆత్మ అయినవాడు, అన్నింటికి కారణమైనవాడు, అతనికి పోలిక చెప్పటానికి వీలయిన మరొక వ్యక్తి కానీ వస్తువు కానీ లేదు. ఎల్లవేళల ప్రకాశిస్తూ ఉంటాడు. అతడు ప్రధానమనే తత్త్వం అయిన పరమపురుషుడు. తన తేజస్సు చేత రూపు మాసిపోయిన గుణాలప్రవాహం కలవాడు. మనస్సు, బుద్ది, సుఖం, కోరిక, ద్వేషం మొదలైన రెండు తీరుల వ్యవహారాలు లేనివాడు. జీవులను బంధించి నిలిపే గుణాల అంటుసొంటులు అతనికి లేవు. దేహమే ఆత్మ అనేది భ్రమ. అంటే సత్యం కాని జ్ఞానం. దానిని తొలగించుకోవటమే అతనిని పొందటానికి సాధనం. ఆయనకు జీవులకు వలె పుట్టుక, ఉనికి, చావు అనే వికారాలు లేవు. ఎల్లవేళలా ఆనందంగా ఉండటమే ఆయన స్వరూపం. సర్వమును సర్వులను ఎఱిగిన జ్ఞానస్వరూపుడు. పరమప్రభువు. అట్టి నారాయణుని భేదం లేని బుద్ధితో సేవించండి. సర్వప్రాణులయందు గొప్ప దయగలవారూ, ఏది దొరికితే దానితో మాత్రమే సంతోషపడేవారూ, ఇంద్రియవికారాల నన్నింటినీ అణచివేసుకొన్నవారూ అయిన మానవులవిషయంలో ఆ స్వామి సంతుష్టుడై ఉంటాడు- అని పలికి ఇంకా ఇలా అన్నాడు.

ఆ భగవంతుడు సజ్జనులు తొలగించుకొన్న కోరికలన్నింటి చేత స్వచ్చమైన అంతరంగంలో కలసిపోయి ఉంటాడు. ఇదిగో నీకు దగ్గరలోనే నీలోనే ఉన్నాను అన్నట్లు ఉంటాడు. ఆయన గుణాలన్నీ అంత సులభంగా అర్థమయ్యేవి కావు. అందుకే గంభీరమైనవి. అయినా దయకు గనులవంటివి. అంటే భక్తులకు అర్థంకావటానికి అయిన అనుగ్రహం కలిగినవి. ఇవి గమనించి తనను ఆశ్రయించిన భక్తులకు పరతంత్రుడై ఉంటాడు. ఎల్లవేళల భక్తుల యందే విడువకుండా ఉంటాడు.

కొందరికి విద్యవలన, మఱికొందరికి ధనంవలన, ఇంకా కొందరికి కులధర్మాలవలన పొగరు పెరిగిపోయి ఉంటుంది. దానితో ఉత్తములైన భగవద్భక్తులకు కీడు చేస్తూ ఉంటారు. ఆ విధంగా బుద్దిని పాడు చేసుకొన్న నీచులు ఒకవేళ ఆ విష్ణువునకు కోరికోరి పూజలు చేసినా స్వామి ఎప్పుడూ, ఎక్కడా వానిని పట్టించుకోడు.

నాయనలారా! మీ బుద్ధి చాలా రమణీయమైనది. రాజపుత్రులారా! ఆ లక్ష్మీదేవి సర్వకాలాలలో శ్రీమహావిష్ణువును వదలక మెలగుతూ ఉంటుంది. ఆమెకు సంబంధించిన సంపదలను గట్టిగా కోరుతూ దేవేంద్రుడు మొదలగువారు ఆమె వెంటబడి తిరుగుతూ ఉంటారు. కృతజ్ఞతగల భక్తుడు వారిని అనుసరించడు. (ఎందుకంటే బిచ్చగాణ్సి వేడుకొనే బిచ్చగాని ప్రవృత్తి వంటిది అది) కనుక నిరంతరం తన బుద్ధిలో శ్రీమన్నారాయణుని సేవించక ఉండలేడు. ఆయన సర్వస్వతంత్రుడు. తన భక్తులకు కోరినది ఇస్తాడు. దీనులయందు తల్లిలాగా వ్యవహరిస్తాడు. గుణాలన్నింటికి మహాప్రభువు. ఎందును పుట్టుక అనేది లేనివాడు. ఉత్తమపురుషుడు అయి పరమాత్మగా తెలియువాడు. లోకాలన్నింటినీ తనలో నింపుకొన్నవాడు. సర్వేశ్వరుడు. నారాయణుడు. పండిన జ్ఞానమే ఆనంద స్వరూపం అయినవాడు. అపజయంలేనివాడు. చ్యుతి లేనివాడు. తెల్లతామరలవంటి వెడదకన్నులుకలవాడు. కనుక నిజమైన భక్తిరసం రుచిమరగినవాడు నిలువెల్లా ఆనందమే కాగా ఆయనను సేవించక ఎలా ఉంటాడు?

అని నారదుడు ఇంకా ఇలా చెప్పాడు. మీ వంశ గౌరవాన్ని చక్కగా పెంపొందించిన చిత్రరథుడనే ధ్రువుడు సవతి తల్లి పలుకుల ములుకులకు వికలమైన మనస్సు కలవాడై అయిదేండ్ల పసితనంలోనే తపోవనానికి పోతుండగా దారిలో నేను ఉపదేశించిన విధంగా భగవంతుడైన పుండరీకాక్షుని ఆరాధించాడు. దానివలన ఇతరులకెవ్వరకు అందరాని సర్వోన్నతమైన పదానికి చేరుకున్నాడు. కాబట్టి, మీరుకూడా రుద్రదేవుడు ఉపదేశించిన పద్ధతితో సర్వభూతాలలో సంచరించే పరమాత్మను సంసారబంధాలు తెగిపోవటం కోసం ఆరాధించండి.

అని ఈ విధంగా నారదమహర్షి రాజకుమారులకు సంతోషం ఉప్పొంగే విధంగా శ్రీమహావిష్ణువు మెలగిన గొప్ప విధానాన్ని వినిపించి తన తండ్రియగు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు.

అలా చెప్పి నారదుడు వెళ్ళిన వెంటనే రాజకుమారులు ప్రచేతసులు నారదుని మోమునుండి వెలువడిన మనోహరం, మంగళకరం, పుణ్యం, లోకుల అజ్ఞానం అనే మాలిన్యాన్ని తొలగించేదీ అయిన శ్రీమహావిష్ణువు గొప్ప యశస్సును భక్తితో స్తోత్రం చేసి, నారాయణునే భావించటం అనే సాటిలేని భక్తిని పొంది, గొప్పగా శ్రీహరి శాశ్వతస్టానాన్ని చేరుకున్నారు.

ఇలా మైత్రేయుడు విదురునకు తెలియజెప్పి ఇంకా ఇలా అన్నాడు. మహాత్మా! నీవు నన్నడిగిన ప్రచేతసులకు నారదునితో సంవాదంగా అయిన శ్రీహరి మాహాత్యాన్నీ, మనువు కుమారుడైన ఉత్తానపాదుని వంశం వరుసనూ నీకు చెప్పాను. అని ఇంకా ఇలా అన్నాడు. నారదుడు ఉపదేశించగా ప్రియవ్రతుడు ఆత్మవిజ్ఞానం పొంది భూవలయాన్ని పాలించి తరువాత రాజ్యం భాగాలుగా చేసి కొడుకులకు ఇచ్చి పరలోకానికి వెళ్ళాడు అని చెప్పగా

(“ఆత్మవిజ్ఞానం పొంది, మహీమండలంబు పరిపాలించి” అనటంలో ఒక విశేషం ఉన్నది. ఎంత జ్ఞాన సంపన్నునికైనా 'స్వధర్మం' విధ్యుక్తంగా నిర్వహించకపోతే కలిగేది దుర్గతియే అని చెప్పటం ఇక్కడ తాత్పర్యం.)

విదురుడు తాపసులలో గొప్పవాడైన మైత్రేయుని మహిమగల పాదాలను తన తలమీదా, శ్రీ మహావిష్ణుని పాదపద్మాలను హృదయంలోనూ నిలుపుకొని మైత్రేయునితో ఇలా అన్నాడు.

మహర్షి వరేణ్యా! దయాశాలీ! భక్తవత్సలుడైన శ్రీమన్నారాయణుని తత్త్వాన్ని నీ వలన తెలుసుకున్నాను అని ఆయన పాదాలకు మరొకసారి నమస్కరించి వినయంతో

ఆ మహర్షిచేత ఆహ్వానింపబడినవాడై ఆనందం నిండుగా కలుగగా బుద్ధిశాలి అయిన విదురుడు హస్తిపురానికి బంధుజనులను చూడాలి అనే కోరికతో వెళ్ళాడు.

అని శుకమహర్షి దయతో పరీక్షిన్నమహారాజునకు ఈ ఉపాఖ్యానాన్ని తెలియజెప్పాడు. దీన్ని విన్నవానికి ఐశ్వర్యం, ఆయువు, సంపద, కీర్తి, శుభం, సద్గతి కలుగుతాయి.

ఈ విధంగా శుకమహర్షి పరీక్షిన్మహారాజునకు చెప్పిన కథను సూతమహర్షి పరమానందంతో శౌనకుడు మొదలైన మహర్షులకు తెలియజేసినాడు.

రసవంతాలైన వాక్కులతో విరాజిల్లు స్వామీ! గుణాలకు సముద్రమైనవాడా! సాగరమే మొలనూలుగాగల భూమిని భరించే ఎట్టి బరువునైనా అలవోకగా తాల్చగల మేలైన భుజం అనే సర్పరాజు (శేషుడు) కలవాడా! రాజులలో శ్రేష్ఠుడా! ఖరుడు దూషణుడు మొదలైన రాక్షసులు అనే దట్టమైన చీకట్లకు మిక్కిలి తీవ్రమైన కాంతికిరణాలుగల సూర్యుడా! శివుని వింటిని విరవటం క్రీడగా అయినవాడా! భక్తులను కాపాడే ప్రభూ!

(ఇందులో భగవంతుని మూడు కర్తవ్యాలైన శిష్టరక్షణ, దుష్టశిక్షణ, ధర్మస్థాపన అనేవి ప్రసక్తాలయ్యాయి. శివధనుర్భంగం మొదలైనవి లీలలు. భుజాన్ని శేషునితో అభిన్నంగా చెప్పటం వలన రూపకం. అలాగే ఖరదూషణాదుల విషయంలో దట్టమైన చీకట్లను, రాముని విషయంలో భాస్కరత్వాన్నీ రూపించారు.)

స్వామీ! శ్రీరామచంద్రా! నీవు ఒక బాణంతో మారీచుడనే మాయలేడిని మట్టుబెట్టావు. నీ కంటి కొనలో కారుణ్యం ఎల్లవేళలా జాలువారుతూ ఉంటుంది. భక్తులు ఒక పెద్ద సముద్రం అయితే దాని అలవు నీవు. పాపాలనే చీకట్లకు నీవు భాస్కరుడవు. దొడ్డ ఇల్లాలు సీతాదేవితో సంగం కలవాడా! సముద్రుని అహంకారాన్ని అణచినవాడా!

(తరంగం సముద్రాన్ని విడిచి ఉండనట్లే భగవంతుడు భక్తులను వదలి ఉండడు.)

స్వామీ శ్రీరామచంద్రా! నీవు పెక్కండ్రు రక్కసులను మట్టుపెట్టిన వాడవు. సుందరి అంటే సీతగా అవతరించిన లక్ష్మియే. ఆమెకు నీవే మన్మథుడవు. రసహృదయులైన విద్వాంసులు నిన్ను మహావిద్వాంసునిగా కొనియాడుతారు. సర్వలోకాలకూ ఉపకారం చేసే శీలం నీది. నీ గుణాలవంటి గుణాలు లోకంలో మరెందూ లేవు. వానితో నీవు చక్కగా అలంకరించబడిన వాడవు. (మహోదాత్తగుణాలతో అందరి హృదయాలను ఆకట్టు కొంటావు). నిర్మలమైన ఆనందాన్ని భక్తులకు కలిగిస్తావు. గొప్పయుద్ధంలో విలాసంగా సంచరించగల మహిమ నీకు ఉన్నది. అతిక్రూరచిత్తులైన రక్కసులను చంపివేశావు.


 శ్రీ కృష్ణార్పణమస్తు  


శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

No comments:

Post a Comment

Ranga Panchami Deva Panchami - రంగ పంచమి దేవ పంచమి

రంగ పంచమి దేవ పంచమి దీపావళిని ఎలా అయితే 5 రోజుల పాటు చేసుకుంటారో. అలానే కొన్ని ప్రాంతాలలో హోలీని కూడా ఐదు రోజులు జరుపుకుంటారు. వాటిల్లో చివర...