ఓ గిరీశా ! కంటికి కనంబడు వస్తువుల కంటెను కనబడని మాయ కంటెనూ నా స్వరూపము వేరైనది. అతీతమైనది. అద్ధమందున జలము నందున ప్రతిబింబము దోచు రీతిగ పితృలోక మందున సైతమాత్మ తేజము ప్రతిభాసించును. వెలుగు నీడల రూపము లెటుల కంటికి తేటగ కనింపిచునో యటులే ద్వైతములేని నా దివ్యలోకమున జ్ఞానజ్యోతి ప్రకాశించును.
వైరాగ్యము గల్గినప్పటికిని జ్ఞానము లేనివాడు చచ్చిప్రళయము వఱకు బ్రహ్మలోక మందు వసించును. ఈ పిదప శ్రీ మంతులు పుణ్యవంతులునగు వారి యిండ్లలో పుట్టి సాధన చేసి చేసి బ్రహ్మజ్ఞానము బడయగలడు.
ఓ గిరిరాజా! వేయేల ! ఎన్నో జన్మ కోటులకు గాని జ్ఞానము గలుగదు. జ్ఞానమొకే జన్మలో వచ్చి ఒడిలో పడునది గాదు. కనుక సాధకుడు తన కోపినంతవఱకు ప్రయత్నించి జ్ఞాన మొందువలయును. కానిచో గొప్ప యనర్థము చుట్టుకొనును. ఎందులకనగా నీ మానవ జన్మము వచ్చుట కడుంగడు దుర్లభము.
అందును బ్రహ్మణత్వము మఱి వేద ప్రాప్తియును దర్లభతరములు. శమాది షట్క సంపద - యోగసంసిద్ధి-ఉత్తమ గురుప్రాప్తి ఇవన్నియును దుర్లభతమములు. ఇంద్రియ నిగ్రహము- చిత్తసంస్కారము మిక్కిలి దుర్లభములు. అటు పిమ్మట నెన్నో పూర్వ జన్మల పుణ్యఫలమున గాని మోక్షేచ్చ గలుగదు.
ఈ శరీర మున్నపుడే సాధన చేసిన ఫలము లభించును. కానియింతటి శరీరము గల్గియును జ్ఞానమునకు ప్రయత్నించని వాని జన్మము వ్యర్థము.
కనుక ఓ శీతనగేశా ! యథాశక్తి జ్ఞాన సంపాదనమునకు ప్రయత్నింపవలయును. అట్టివానికి ప్రతియడుగున తప్పక అశ్వమేధఫలము చేకూరును. పాలయందు నేయి యున్నట్లు ప్రతి పాణి యందును విజ్ఞానపువెల్గుగలదు. దానిని మనస్సెనెడు కవ్వముతో నాత్మ విచారముతో మథించవలయును.
కేవలమొక జ్ఞానము వలననే జన్మ తరించి ధన్యత గాంచునని వేదాంతభేరి మ్రోగు చున్నది. ఇటుల నీ కంతయును సంక్షేపముగ తెలిపితిని. ఇంకేమి వినవలతువో తెలుపుము.
No comments:
Post a Comment