Tuesday, August 4, 2026

Brahma Yagnam Yajna - బ్రహ్మ యజ్ఞం

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - బ్రహ్మ యజ్ఞం

నారదా! ఇక బ్రహ్మయజ్ఞం గురించి చెబుతాను తెలుసుకో. (మూడు) రెండుసార్లు ఆచమించి రెండుసార్లు మార్జన చేసుకోవాలి. సవ్యపాణితో నీటిని స్పృశించాలి. పాదాలు శిరస్సు నేత్రాలు నాసిక చెవులు హృదయం మౌళి సంప్రోక్షించుకోవాలి. దేశకాలాలు చెబుతూ బ్రహ్మయజ్ఞం సంకల్పించాలి.

రెండు దర్భలు కుడిచేత మూడు ఎడమచేత కొన్ని పీటకింద కొన్ని శిఖమీద కొన్ని పాదమూలాలలోనూ ఉంచుకోవాలి. ఇవి సర్వపాపక్షయకరాలు. సూత్రోక్త దేవతాప్రీత్యై బ్రహ్మయజ్ఞం కరోమ్యహమ్‌ ఆని ఉదకం స్పృశించాలి. 

ముందుగా ముమ్మారు గాయత్రిని జపించాలి. అగ్నిమీళే పురోహితమ్‌, యదంగ, అగ్విర్వై ఇత్యాది మంత్రాలు పఠించాలి. మహావ్రతం చైష పంథా అని పలకాలి. మఘవత్‌, ఇషేత్వోర్జ, అగ్న ఆయాహి, శంనో దేవీః, వృద్ధిరాదైచ్‌, పంచసంవత్సర, యమరస తజభన, అథాతో ధర్మజిజ్ఞాసా, అథాతో బ్రహ్మజిజ్ఞాసా, తచ్చంయో, బ్రహ్మణేనమః - ఇత్యాదికంగా పఠిస్తూ ఆయా విధులు నిర్వహించాలి. 

అనంతరం తర్పణలు చెయ్యాలి. ప్రజాపతి, బ్రహ్మ దేవతలు, వేదాలు, ఋషులు, ఛందస్సులు, ఓంకారం, వషట్కారం, వ్యాహృతులు, సావిత్రి, గాయత్రి, యజ్ఞాలు, ఆకాశం, భూమి, ఆంతరిక్షం, అహోరాత్రాలు, త్రిసంధ్యలు, సిద్ధులు, సప్తసముద్రాలు, నదులు, సప్తకులవర్యతాలు, పుణ్యక్రేత్రాలు, ఓషధులు, వనస్పతులు, గంధర్వాప్సరోనాగయక్షాదులు, పక్షులు, గోవులు, సాధ్యులు, రాక్షసులు, మంత్రాలు, విప్రులు - వీరికి తర్పణాలు స్వీకరించే అర్హత ఉంది. కనక తర్పణాలు వదలాలి.

ఇది భూతతర్పణం. ఆ తరవాత నివీతం చేసుకుని ఋషితర్పణం. శతర్చి - మాధ్యమ - గృత్సమదులకూ, విశ్వామిత్ర వామదేవ అత్రి భరద్వాజ వసిష్ఠ ప్రగాథ పావమాన్యులకూ అలాగే క్షుద్రసూక్త మహాసూక్తాలకూ సనక సనందన - సనాతన - సనత్కుమార - కపిల - ఆసురి - వోహలి - పంచశీర్షకులకూ తర్పణాలు ఇవ్వాలి.

తరవాత ప్రాచీనావీతిగా సుమంత జైమిని వైశంపాయన పైల మహాభాష్య మహాభారత ధర్మాచార్యులకూ బాహవి గార్గ్య గౌతమ శాకల బాభ్రవ్య మాండవ్య మాండూకేయ గార్గీ వాచక్రవీ బడబా ప్రాతిథేయికా సులభా మైత్రేయీ, కహోళ కౌశీతక మహాకౌశీతక భారద్వాజ పైంగ్య మహా పైంగ్య సుయజ్ఞ సాంఖ్యాయన ఐతరేయ మహైతరేయ బాష్కల శాకల సుజాతవక్త్ర ఔదవాహి సౌజామి శౌనక ఆశ్వలాయన తర్పణలు చెయ్యాలి. 

ఇంకా తక్కిన ఆచార్యులందరికీ పేరు పేరునా ఇవ్వాలి. నా వంశంలో పుట్టి సగోత్రికులై అపుత్రకులై మరణించినవారికందరికీ చెందుగాక, స్వీకరింతురుగాక అని వస్త్రనిపీడనోదకం విడిచిపెట్టాలి.

ఇలాగ విధ్యుక్తంగా బ్రహ్మయజ్ఞం నిర్వహించాలి, సర్వవేదవేదాంగపఠనఫలం దక్కుతుంది. అటుపైని వైశ్వదేవం నిత్యశ్రాద్ధం చెయ్యాలి. అతిథులకు అన్నదానంకూడా నిత్యమూ చెయ్యాలి. గోవులకు గడ్డివేసి వచ్చి బ్రాహ్మణులతో కలిసి దినపంచమభాగంలో హాయిగా సుష్టుగా భోజనం చెయ్యాలి. 

ఇతిహాస పురాణాలతో షష్ఠ సప్తమ భాగాలను గడపాలి. అష్టమ ఘటికాకాలంలో లోకయాత్ర, బహిస్సంధ్య. అటుపైని సాయంసంధ్య వార్చాలి.

సాయం సంధ్య




No comments:

Post a Comment