Monday, August 10, 2026

Journey - ప్రస్థానం

రామాయణం సుందరకాండ మొదటి సర్గ - ప్రస్థానం

తతో రావణ నీతాయాః
సీతాయా శ్శత్రుకర్మనః।
ఇయేష పద మన్వేష్టం
చారణా చరితే పథి-॥

సర్వశత్రుమర్దన సమర్థుడయిన హనుమంతుడు దేవ గంధర్వాదులు విహరించే గగనమార్గాన బయలుదేరి, రావణుడు అపహరించిన సీతను అన్వేషించడానికి సన్నద్ధుడయాడు.

అసాధ్యమయిన పనిని సాధించడానికి ఉద్యుక్తుడై ఆ వానరయోధుడు మెడ నిక్కించి శిరసు పైకెత్తాడు. అప్పుడాయన మోరపైకెత్తిన ఆబోతువలె వున్నాడు.

వైడూర్యకాంతులీనే పచ్చిక బయళ్ళలో ఒక్కసారి యధేచ్చగా తిరిగి, పరిసరప్రాంతాల పక్షులకూ, జంతువులకూ భయం కలిగించే సింహంలా కనిపించాడు.


అయన ఎక్కిన పర్వతంమీద రంగు రంగుల, రాళ్ళు మనోహరంగా ఉన్నాయి. ఆ పర్వత సానువుల మీద చీని చీనాంబర ధారులయిన కామరూపులు యక్ష, కిన్నర, గంధర్వ, నాగజాతులవారు యధేచ్చగా విహరిస్తున్నారు.

మత్తేభయూధాల గుంపులో గజరాజులా వున్నాడాయన,

సూర్యునికీ, దేవేంద్రునికీ, బ్రహ్మదేవునికి చేతులు జోడించి స్మరించి తూర్పుగా తిరిగి తన జనకుడయిన వాయుదేవునికి ప్రణామాలర్పించి, దక్షిణ దిశగా తిరిగి ప్రయాణోన్ముఖుడై శరీరాన్ని పెంచడం ఆరంభించాడు. పర్వదినాలలో సముద్రంవలె ఆ శరీరం పొంగుతున్నది. దేహాన్ని పెంచి పెంచి ఒక్కసారి పాదాలతో పర్వతాన్ని కదిలించాడు. అది గజ గజ లాడింది.

ఆ ఊపుకి పర్యతంమీది చెట్ల పువ్యులన్నీ జలజల రాలాయి. పూలజల్లులతో నిండిన ఆ గిరి పుష్పగిరిలా ఉంది. ఆ తాకిడికి పర్వతం పగుళ్ళిచ్చి నీటి ఊట లుబికాయి.

అగ్నిగుండం మధ్యనుండి మంటలు లేస్తూ అటూ యిటూ పాగలు జిమ్ముతున్నట్లు మణిశిలలతో యితర రకాలతో రాళ్ళతో భాసించిందది.

కొండ గుహలలో విశ్రాంతి తీసుకునే మృగాలు భయభ్రాంతాలయి రోదనధ్వానాలతో బైెటపడుతున్నాయి. స్వస్తిక చిహ్నాలుగల పడగలు విప్పి కాకోలవిషం క్రక్కుతూ మహాసర్పాలు తమ వాడి కోరలతో బండశిలలను కరువగా మంటలురేగి రాళ్ళు పొడిపొడి అయిపోయాయి. సర్పవిషాన్ని హరించగల ఓషధులున్నా మంటలు రేగడంవల్ల ఆ మూలికలు కూడా మాడిపోయాయి.

ప్రశాంతంగా ప్రేయసీజనంతో విహరించే విద్యాధరులు ఈ రణగొణ ధ్వనికీ ప్రకంపనాలకూ జంకి ఎలావున్నవారు అలానే గగనవీధికి ఎగిరి పోయారు.

వారు పానంచేసే సువర్ణపాత్రలనూ, బంగారు కుండలనూ, రత్నపు పిడుల కరవాలాలనూ, వివిధ మాంసాహారాలనూ ఎక్కడి వక్కడే విడిచి ఎర్రపడిన కనులతో ఆకాశ మార్గం చేరారు. ఆశ్చర్యంతో ఎవరికివారు తమ ప్రియుల భుజసీనులను పట్టుకుని నిలబడ్డారు.

వారికి కొంచెం పైభాగాన వున్న సిద్దులూ, మహర్షులూ, ఆ దృశ్యాన్ని చూసి:

"ఓహో! పర్వత సమదేహుడయిన హనుమంతుడు రామ కార్యార్థియై భీకర మకరాలయ మయిన సముద్రం దాటడానికి సంకల్పించాడు, అని అనుకున్నారు".

ఆ మాటలు విని దిగువనున్న విద్యాధరులు కన్నులు విస్పారించి హనుమంతుని చూశారు. మహాపర్వతంలా గోచరించాడు హనుమంతుడు.

ఒక్కసారి తన దేహాన్ని ఊగిసలాడించగా రోమ రోమం కదలింది. ఒక్క సింహనాదం చేశాడు. కారుమేఘం ఉరిమినట్టుంది. తన వాలాన్ని మరింత దీర్ఘంగా పాడిగించాడు.

నేలకు ఆని కూర్చున్నాడు. చేతులు ముడిచాడు, కంఠం ఉగ్గబట్టాడు.

బల, పరాక్రమ, సామర్థ్యాలను క్రేంద్రీకరించాడు. ప్రాణాన్ని హృదయంలో నిబంధించాడు. ఆకాశంలోకి చూపు పోనిచ్చాడు. చెవులు ముకుళించాడు. పాదాలు తొక్కిపట్టాడు. లేవబోతూ, లేవబోతూ తన స్నేహితుల వైపు తిరిగి:

"వాయు వేగంతో సాగే రామబాణంలా లంకానగరానికి వెడతాను. అక్కడ సీతాదేవి కనిపించకపోతే దేవలోకొనికి వెడతాను. అక్కడా అమ్మవారు లేకపోతే తిరిగి లంకచేరి రావణుని బంధించి తెస్తాను. రావణ సమేతం లంకను పెల్లగించి తీసుకు వసాను".

అంటూ ఒక్క ఊపులో పైకి ఎగిరాడు. ఆ క్షణంలో అయన గరుత్మంతునివలె వున్నాడు.

ఆయన గమనవేగానికి పర్వతంమీది వృక్షాలు ఊగిసలాడి సమూలం కదిలి ఆయనతో కొంతదూరం పోయాయి. ఆత్మీయులు ప్రయాణం అవుతూంటే సాగనంపే బంధుజనంలా, మహారాజును అనుసరించి పోయే సేనలా ఉన్నాయి.

కొంతదూరం సాగి సముద్రంలో పడుతూ అవి ఇంద్రభీతితో సాగరంలో మునిగే పర్వతాలను తలపింపజేశాయి. ఎర్రని చివుళ్ళతో, మొగ్గలతో వున్న ఆ వృక్షాల మధ్య హనువుంతుడు మిణుగురులు నిండిన పర్వతంలా వున్నాడు.

కదిలిన తరువులన్నీ సముద్రప్రాంతం చేరగానే క్రింద పడిపోవడం చూస్తే స్నేహితులను జలాశయం దాకా సాగనంపుతున్నట్లనిపించింది.

రంగు రంగుల పూలకాంతుల మధ్య హనుమంతుడు మెరపు తీవెలు నిండిన మేఘంలా వున్నాడు.

రాలిన పూలతో నిండిన సముద్రం తారా తోరణాలంకృత గగనవిధిలా ఉంది.

బారసాచిన చేతులు అయిదు పడగల పాముల్లా ఉన్నాయి. చూస్తూంటే ఆ మహాకపి ఆకాశాన్ని కబళించి, సాగరాన్ని ఔపోసనం పట్టేలా ఉన్నాడు. ఎరుపెక్కిన కన్నులు పర్యతంమీద అగ్నిగోళాలవలె ఉన్నాయి. ఉదయించే సమయంలో చంద్ర, సూర్యబింబాలవలె కనిపిస్తున్నాయి ఆ కన్నులు.

ఎరుపెక్కిన ముఖం మరింత ఎర్రని వదనం సంధ్యారాగ రంజిత మయిన సూర్యమండలమేమో అనిపిస్తున్నాయి.

ఆ వాలం ఇంద్రధ్వజంలా ఉంది. అప్పుడప్పుడు అయన తోక వలయాకృతిలోకి వచ్చి చుట్టూ గుడి కట్టిన సూర్యునివలె తోపింపజేస్తున్నది. తోక పైకి లేచినపుడు ఆ ఎరుపు చూస్తే పెల్లగించిన జేగురురాతి పర్వతంలా ఉంది, హనుమంతుని దేహం. కదులుతూన్నప్పుడు చలించే గాలి ఉరుముల ధ్వనితో వస్తున్నది.

వాలం నిటారుగా వచ్చినపుడు పొడుగయిన తోకచుక్కలా ఉన్నాడు. మధ్యగా వచ్చి వ్రాలిన తోకతో ఆయన దీర్ఘరజ్జుబంధితమైన మత్తేభంలా భాసిస్తున్నాడు. వాయువశమయిన పెద్ద నౌకలా సాగుతున్నాడు.

ఆయన ముందుకు సాగుతూంటే ఆ వాయువేగానికి సముద్రం అల్లకల్లోల మవుతున్నది.

ఆ కపిశార్దూలుడు తన బాహువులతో సముద్రాన్ని చిమ్ముతూ ముందుకు సాగుతున్నట్లనిపించింది.

ఆ తీవ్రవేగానికి పైకిలేచిన తరంగాలు మేఘమండలాన్ని చేరి శరత్కాల మేఘంలా ప్రకాశిస్తున్నాయి. అప్పుడు తరంగాలలో బయటపడిన జలచరాలు వస్త్రహీనులయిన మానవులను తలపింపజేశాయి,

సాగరంలోని సర్పాలకు ఆకాశంలోని హనుమంతుడు గరుత్మంతుడేమో అనిపించింది. ఆయన నీడ బహువిశాల ప్రాంతాన్ని ఆక్రమించింది. నీటిలో ఆ నీడ కదిలే మేఘంలా ఉంది. వాయుపథంలో సాగే హనుమంతుడు రెక్కల పర్వతంలా వున్నాడు. సాగుతున్నంతమేరా క్రింది
సముద్రంలో గాలి ఒత్తిడి కలిగి అది దోనెలా అవుతున్నది,

మేఘమండలంలో చంద్రునివలె సాగుతున్నాడు. దారికి అడ్డువచ్చి చెల్లాచెదరయిన మేఘాలు రక రకాల కాంతులీనుతున్నాయి.

హనువుంతుని తీవ్రగమనాన్ని తిలకించి దేవ, గంధర్వగణాలు పూలవాన కురిపించాయి.

ప్రయాణంలో వాయువు సహకరించాడు. సూర్యుడు చల్లచల్లగా ఉన్నాడు. గగన సంచారులెందరో ప్రశంసావర్షం కురిపించారు.

అనాయాసంగా ఆకాశమార్గాన సాగే ఆ మహాకపిని అభినందించారు, వారు.

ఇక్ష్వాకువంశీయులయిన సగరులవల్ల వృద్ధిపాందిన సాగరుడు ఆ హనుమంతునికి ఏదోవిధంగా సాయపడడం తన కృతజ్ఞతకు అవకాశంగా భావించాడు.

ఈ సాహసయాత్రలో హనుమంతునికి కొంత విశ్రాంతి యివ్వగలిగితే మరింత సుఖంగా సముద్రం అవలి ఒడ్డును చేరగలడనుకున్నాడు.

తనలో మునిగి ఉన్న హిరణ్యనాభుడయిన మైనాకుని పిలిచి, పాతాళంలోని రాక్షసులు వెలుపలకు రాకుండా దేవేంద్రుడు నిన్నిక్కడ అడ్డుగా ఉంచాడు. ఇప్పుడు నువ్వు కామరూపశక్తితో పైకి పెరిగితే నీకూ, నాకు ఎంతో మేలు కలుగుతుంది. ఇక్ష్వాకువంశీయుడయిన శ్రీరామచంద్రునికి సేవా ధర్మంతో హనుమంతుడు వెడుతున్నాడు. నువ్వు పైకి పెరిగితే కొంతసేపు విశ్రాంతి తీసుకుంటాడు. ఆలస్యం చెయ్యకు. ఆయనకు ఆతిథ్యం ఇచ్చి మన కర్తవ్యం మనం నిర్వర్తించి పెద్దల మన్ననలు పొందుదాం.

ప్రవాసంలో ఉన్న సీతను అన్వేషించడానికి వెళ్ళే ఈ వానర వీరునికి శ్రమలేకుండా సాయపడాలి, అనగా విని మైనాకుడు, మేఘమండలాన్ని చీల్చుకు వచ్చే సూర్యునివలె సముద్రంనుండి పైకి లేచాడు.

కాగి కాగి కరగిన బంగారు కాంతుల శిఖరాలతో లేచిన మైనాకం కాంతితో నీలాకాశం పసిడిశోభ లీనింది.

పెరిగి పెరిగి తన మీదికి వచ్చే మైనాకాన్ని చూచి, హనుమంతుడు తన ప్రయాణానికి ఏదో అడ్డం వస్తున్నదని భావించి, తీవ్రవేగంతో శిఖరాన్ని ఢీకొన్నాడు.

మైనాకుడు హనుమంతుని తీవ్రవేగశక్తికి సంతోషించి:

వానరోత్తమా! అనన్యసాధ్యమయిన ఈ సాగరతరణంలో కొంతసేపు నా శిఖరంమీద విశ్రాంతితీసుకో. నువ్వు రామకార్యార్థివై వెడుతున్నావు. ఆ రామచంద్రుని ప్రపితామహులయిన సగరులవల్ల యింతవాడయిన సాగరుడు తన కృతజ్ఞత తెలుపుకోవాలని నన్ను పంపాడు. ఉపకారానికి
ప్రత్యుపకారం చెయ్యడం సర్వప్రాణిధర్మం. నా సానువులమీద సువాసనలీనే, అతిమధురమయిన కందమూలఫలాలున్నాయి. వాటిని ఆరగించి, విశ్రాంతి తీసుకుని వెళ్ళు.

ఎంతటి సామాన్యుడయినా అతిధిని పూజించాలి. అటువంటప్పుడు నీవంటివాని విషయంలో వేరే ఆలోచన అవసరంలేదు. దేవతా శ్రేష్ఠుడయిన వాయువుకి కుమారుడవు. నీ తండ్రి అంతవేగంగా పయనించగల శక్తి సంపన్నుడవు.

నీకు జరిపే సత్కారం వాయుదేవునికే చెందుతుంది. ముఖ్యంగా నీకీ అతిథిముర్యాద జరపడంలో నా కృతజ్ఞతకూడా వెల్లడించుకుంటున్నాను,

కృతయుగంలో మా పర్వతాలకు రెక్కలుండేవని వినివుంటావు. వాటితో అవి గరుత్మంతునివలె వాయువేగంతో ప్రయాణాలు చేసేవి. అవి ఏ ప్రాంతాన పడతాయో అని అందరూ భయపడుతూంటే దేవేంద్రుడు వజ్రాయుధంతో వాటి రెక్కలు ముక్కలు చేశాడు.

ఆ సమయంలో వాయుదేవుడు నన్ను ఈ సముద్రంలో పడవేశాడు. ఆయనవల్ల నా రెక్కలు సురక్షితంగా వున్నాయి, ఇప్పుడు తెలిసిందా. నేనెందుకింత ఆదరం చూపుతున్నానో. నా సత్కారాలు పొంది అనుగ్రహించు, అన్నాడు.

మైనాకా! నీ ఆదరవచనాలే నా కెంతో సంతోషం కలిగించాయి అయితే యిప్పుడు నేను ఆగడానికి వీలులేదు. సూర్యాస్తమయం కాకుండా నేను ఆవలితీరం చెరాలి, మరొక విధంగా నువ్వు భావించకు. అతిథి సత్కారం అందినట్లే విశ్వసించు, అని తన చేతితో గిరిశిఖరం స్పృశించి ముందుకు సాగాడు.

సాగరుడు, మైనాకుడు హనుమంతుని ఆశీర్వదించారు. దేవేంద్రుడు మైనాకుని ప్రశంసించాడు.

వాయువీధిని వీడి విమల వినీలాంబర వీధిలో వెడుతున్నాడు.

సిద్ద, సాధ్య, దేవ ఋషి సంఘాలు హనుమంతుని అభినందిస్తున్నాయి. ఆ సమయంలో వారు నాగమాత సురసను పిలిచి: ఈ హనుమంతుడు సాహసపరాక్రమోపేతుడు. దానికితోడు ధీశక్తి ఉన్నదో లెదో పరీక్షించాలి, అనగా ఆమె భయంకర రాక్షసాకారంతో బయలుదేరి హనుమంతునికి అడ్డుగాపోయి:

మా ప్రభువులు నిన్ను నాకు భోజనంగా యిచ్చారు. నువ్వు మర్యాదగా నా వదనగహ్వరంలో ప్రవేశించు. హాయిగా ఆరగిస్తాను, అంది.

అప్పుడాయన: దశరథనందను డయిన రాముడు భార్యసీతతో, తమ్ముడు లక్ష్మణునితో వనవాసానికి వచ్చాడు. అక్కడ సాధుజనరక్షణ కార్యమగ్నుడు కాగా రాక్షసులకు వీరిమీద ద్వేషం కలిగింది.

అంతతో వారి ప్రభువయిన రావణుడు దొంగచాటుగా సీతను అపహరించుకుపోయాడు. ఇప్పుడు నేను సీతాన్వేషణకు వెడుతున్నాను. ఆ పని పూర్తికాగానే వస్తాను. నన్ను నమ్ము అన్నాడు.

మాటలు కట్టిపెట్టు. ఈ భువన భవనంలో నన్ను అతిక్రమించి పోగలవారు లేకుండా వరమిచ్చారు దేవతలు నాకు, అంది.

హనువముంతుడు: సరే, నా శరీరం పట్టేటంత విశాలంగా నీ నోరు తెరుస్తావా; అంటూ దేహాన్ని పెంచుతున్నాడు.

సురస తన వదన గహ్వారం విశాలం చేస్తున్నది. ఆయన ఎంత పెరిగితే అంతకు రెట్టింపు నోరు పెంచుతున్నది.

అలా పెరిగి పెరిగి ఒక్కలిప్తలో అంగుష్ఠమాత్రదేహుడై మరొక లిప్తవ్యవధిలో ఆమె ఉదరంలోకి పోయి పెకివచ్చి: ఓ దాక్షాయణీ, మరి నాకు సెలవా, అన్నాడు.

సురస, నాయనా సంతోషం. సుఖంగా కార్యసాధనచేసి రామచంద్రునికి సంతోషం కలిగించు, అంది.

గరుత్మంతునివలె సాగుతున్నాడు, హనుమంతుడు.

సింహ శార్దూల, పక్షి, సర్పవాహనాలమీద విహారయాత్ర చేసే విద్యాధరాది గణాలన్నీ సంతోషిస్తున్నాయి. చంద్ర, సూర్యసంచార యోగ్యమయిన మంగళ పథంలో వెడుతున్నాడు.

సాగుతూ సాగుతూండగా హనుముంతుని గమనం ఆకస్మికంగా ఆగిపోయింది.

ఏమిటా అని క్రిందికి చూశాడు, సముద్రంలో ఛాయాగ్రాహిణి సింహిక కనిపించింది. అది సముద్రంలోపలి నుండి నోరు తెరిచి పైకి లేవడం చూశాడు. సీతాన్వేషణకు బయలుదేరే సమయంలో సుగ్రీవుడు చెప్పాడు.

దక్షిణ సముద్రంమీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అందులో ఒక రాక్షసి ఉంది. దానిమీద పడిన నీడ ఆధారంగా ఆ ప్రాణిని క్రిందికి లాగుతుంది, అని,

అది గుర్తుకు రాగా తన శరీరాన్ని వర్షాకాలమేఘంలా విశాలంగా పెంచాడు. సింహిక తన నోరు మరింత విశాలంచేసి లాగుతున్నది. తెరిచిన వేదనంలోంచి దాని మర్మస్థానాలు చూశాడు హనుమంతుడు.

చూస్తూనే క్రిందికి దిగుతూ తన శరీరాన్ని సంకోచింపజోసి దాని వదనంలోనుండి ఉదరంలోకిపోయి, వాడిగోళ్ళతో మర్మస్థానాలు చీల్చి ఒక్క ఊపులో గగనవీధికి చేరాడు.

సింహిక సముద్రంమీద తేలిపోయింది, చచ్చిపడి.

సిద్ధ, సాధ్య, విద్యాధర, గంధర్వగణాలు హనుమంతుని ధీశక్తినీ, ధీరత్వాన్నీ అభినందించాయి.

సాగి సాగి సముద్రం అవ్వలి ఒడ్డు చేరాడు. అక్కడ వనాలూ, సముద్రంలో ప్రవేశించే నదీ ముఖద్వారాలూ చూశాడు.

పర్వతంమీద దిగుతూ: నేను యింత విశాల దేహంతో ఉంటే రాక్షసులందరూ నన్ను చూడాలనే
కాంక్షతో రావచ్చు. అది కార్యభంగ హేతువవుతుంది, అనుకుంటూ శరీరాన్ని బాగా కుంచించాడు. బలిచక్రవర్తిని వంచించడానికి త్రివిక్రమ రూపం ధరించిన మహావిష్టువువలె పెరిగిన హనునుంతుడు వామనాకృతి ధరించాడు.

ఆ కొండమీద విహరిస్తూ లంకానగరాన్ని చూశాడు. ఆ నగరం అమరావతిలా వెలుగుతున్నది.

(మహర్షి వాల్మీకి విరచిత రామాయణం సుందరకాండ మొదటి సర్గ సమాప్తం)


రామాయణం సుందరకాండ

No comments:

Post a Comment