Tuesday, March 10, 2026

The Battle between the Demons (Asuras) and the Gods (Devas) in the absence of their preceptor, Brihaspati - దేవాసుర యుద్ధ ప్రారంభము

దేవాసుర యుద్ధ ప్రారంభము

'ఓ యోగీశ్వరా! ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. దేవతలపై బృహస్పతికి కోపం ఎందుకు వచ్చింది? విశ్వరూపుడు దేవతలకు కలిగిన ఏ ఆపదను తొలగించాడు? తెల్పు' మని పరీక్షిన్మహారాజు అడుగగా శుకుడు ఈ విధంగా చెప్తున్నాడు. 'ఇంద్రుడు త్రిలోకాధిపత్యగర్వంచేత సన్మార్గాన్ని లెక్కించకుండా, రంభాది అప్సరసలు నృత్యంచేస్తూ, గానంచేస్తూ తనను ప్రశంసిస్తూండగా, వసువులు, రుద్రులు, ఆదిత్యులు, మరుద్గణాలు, అశ్వినీదేవతలు, సిద్దులు, చారణులు, గంధర్వులు, మునులు తనను సేవిస్తూండగా సింహాసనం మీద గర్వంతో,

దేవేంద్రుని శిరస్సుపై పున్నమనాటి నిండు చంద్రునితో సరివచ్చే తెల్లగొడుగు ప్రకాశించగా, దేవకాంతలు చాతుర్యంతో విసిరే వింజామరల వరుసలు ఆకాశగంగా తరంగాలతో సమానంగా నెమ్మదిగా కదలుతూ ఉండగా, అనేక చింతామణి రత్నాలు పొదిగిన సింహాసనంమీద, తన ఊరువుపై శచీదేవి కూర్చొని ఉండగా; దిక్పాలకులు సేవిస్తూండగా సాటిలేని రాచఠీవితో, వైభవో పేతుడై ఇంద్రుడు కొలువు తీరాడు.

ఆ సమయంలో, నీతికోవిదుడు, దేవతలకు రహస్యాలోచనములలో మార్గదర్శకుడు, వాగ్వేత్త, దేవతలందరకును గురువు అయిన బృహస్పతి ఒకానొక ధర్మకార్యనిమిత్తంగా ఇంద్రసభకు వచ్చాడు.

గొప్ప తపస్సంపన్నుడు, దయాస్వభావుడు, వాక్పతి అయిన బృహస్పతిని చూచి కూడా ఇంద్రుడు రాజ్యగర్వంతో ఆ బృహస్పతికి ఎదురేగలేదు. కూర్చోమని ఆసనం చూపించలేదు. ఎటువంటి గౌరవాలు చెయ్యలేదు. ఆయనను ప్రసన్నుణ్ణి చేసుకోలేదు. చివరకు తన సింహాసనంనుండి లేవనైనాలేవలేదు. ఇదంతా దేవతల నిండు సభలో జరిగింది.

స్వర్గరాజ్యాధిపత్యంతో దేవేంద్రుని కన్నులు మూసుకుపోయాయి. దాని ఫలితమే బృహస్పతికి కలిగిన అవమానం. దానికి బృహస్పతి ఏ ప్రతీకారం చెయ్యకుండా చాలా బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు.

బృహస్పతి వచ్చినవాడు వచ్చినట్లు వెళ్ళిపోయేసరికి ఇంద్రునికి తాను అవివేకంచేత చేసిన గురుతిరస్కారం తెలిసొచ్చింది. జరిగినదానికి ఆశ్చర్యపోయాడు, భయపడ్డాడు, దుఃఖపడ్డాడు. ఇలా అన్నాడు. బృహస్పతి పరమపవిత్రుడు. శుభచరిత్రకలవాడు. ఆయన చరిత్రను లోకాలన్నీ స్తుతిస్తున్నాయి. ఎంతో ప్రభావంగల బృహస్పతియొక్క పాదపద్మాలను పూజింపక మూర్ఖత్వంతో చెయ్యరాని పని చేశాను.

నాయందు ప్రసన్నుడూ, సమర్థుడూ అయిన నా ఆచార్యునకు త్రిభువన సంపదలచే గర్వించిన నేను అసురభావంతో నాకు శుభాలు పోయేటట్లుగా అవమానం చేశాను.

ఎంతగొప్పవారు తన దగ్గరకు వచ్చినా చక్రవర్తి స్థానంలో ఉన్నవారు తమస్థానం నుండి లేవకూడదు అని చెప్పే పండితులను ధర్మవేత్తలుగా ఎవ్వరూ గుర్తించరు.

దుష్టమార్గంలో ఉండి చెడ్డమాటలు పలికేవారి ఉపదేశాలను అనుసరించేవారు ఉపదేశాలు చేసేవారి తత్త్వం తెలిసినా చేసిన దుష్కార్యాలను దిద్దుకోలేక తమ తప్పు లేకపోయినా రాతి పడవవలె అధోగతిపాలవుతారు.

చెడ్డమార్గంలో పయనించేవాడు అధఃపతితుడౌతాడు. నేనావిధంగా కాకుండా ప్రజలచేత నమస్కరింపబడేవాడు; కార్యవిదుడు అయిన బృహస్పతి ఇంటికి వెడతాను. వారి పాదపద్మాలకు కిరీటం తాకేవిధంగా నమస్కరిస్తాను. వారిని సేవిస్తాను. వారి మనస్సు నాకు సుముఖంగా ఉండేటట్లు వారికి నా యందు దయకలిగేటట్లూ చేస్తాను. అని ఆలోచించి ఆ దేవేంద్రుడు శీఘ్రంగా బృహస్పతి గృహానికి వెళ్లాడు.

దేవేంద్రుడు తన ఇంటికి వస్తున్నాడని తెలిసి బృహస్పతి తన మాయాశక్తి నుపయోగించి అదృశ్యడైపోయాడు. దేవేంద్రుడు బృహస్పతి గృహాన్ని బాగా పరిశీలించికూడా బృహస్పతి జాడతెలిసికోలేకపోయాడు. చాలా దుఃఖపడ్డాడు. చిన్నబుచ్చుకున్నాడు. ఈ విషయం అంతా రాక్షసులకు వేగులవలన తెలిసింది. ఇదే అదనని వారు భావించి అందరూ కలిసికట్టుగా శుక్రాచార్యుణ్ణి ఆశ్రయించారు. శుక్రుని దయ వల్ల రాక్షసులశక్తి బాగాపెరిగింది. దేవతలమీద దాడికి వారు త్రోవతీసి

రాక్షసులు వంచకులు. సమస్త పాపాలరూపాలు. అధర్మమార్గంలో సంచరించేవారు. అవినీతిలో పేరుగడించినవారు. అటువంటి రాక్షసులు దేవతలమీద యుద్దానికి వెళ్లారు.

రాక్షస సమూహాలు గొప్పపరాక్రమంతో బ్రహ్మాండం బ్రద్దలయ్యేంతగా భయంకరమయిన జయ జయ ధ్వనులు చేస్తూ ధనుర్బాణాలతో, రథాలతో, గుర్రాలతో, ఏనుగులతో దేవతలపై దండెత్తారు. దేవతలు ప్రసిద్ధ పద్ధతిలో దర్పంతో రాక్షసులతో తలపడ్డారు.

దేవతలు, రాక్షసులు ద్వేషాలు పెరిగిపోగా ఒకరి సంపదలు ఒకరు పొందాలని మదంతో యుద్ధం చేశారు. దేవతలు విజృంభించి అస్త్రం ప్రయోగిస్తే శుక్రాచార్యుల మంత్రప్రభావంచేత విశేషశక్తి పొందిన రాక్షసులు మరీ విజృంభించి గుంపులు గుంపులుగా బాణాలు నాటించేసరికి దేవతలు ముఖాముఖి యుద్దానికి శక్తిలేక పలాయనం చిత్తగించారు.

అద్భుతబలంకల దేవతలు రాక్షసవీరులు ప్రయోగించిన దివ్యాస్త్రాలచేత గాయపడి, ప్రాణాలు పోగొట్టుకోలేక ఎవరో శపించినట్లుగా పలాయనం చిత్తగించారు.

(మహాత్ముల పట్ల చేసిన అపరాధమే దేవతల ఓటమికి కారణం అని ఈ సన్నివేశం సూచిస్తోంది.)

రాక్షసులందరు తమను ఢీకొనేసరికి దేవతలు ఓడిపోయి భయవశులై కకావికలై నలుదిక్కులకూ పారిపోయారు.

రాక్షసుల గర్వం, వారి బాణ విజృంభణం, వారి ద్వేషం, వారి బలపరాక్రమాలు దేవతలకు సిగ్గు, కీడు, భయం, నిశ్చేష్టతలను కలిగించేయి. ఆ దుఃఖంతో వారు రాక్షసులను ఎదిరించలేక (దేవతలు) పారిపోయారు.

దేవతలు రాక్షసులనే బోయల చేతిలో చమరమృగాలైపోయారు. రాక్షసుల బాణాలతో గాయపడిన దేవతల శరీరాలు దుఃఖంతో తిరుగుడుపడుతున్నాయి. యుద్ధం విడిచిపెట్టి వారు దుఃఖంతో, భయంతో బ్రహ్మ దగ్గరకు వెళ్ళారు.

అపుడు దేవతలకు సంపదల నిచ్చేవాడూ, పుణ్యాత్ములయందనురాగంకలవాడూ, సర్వలోకాలకూ శ్రేయస్సును కూర్చేవాడూ, వేదోక్త ధర్మమార్గాన్ని నిర్ణయించేవాడూ, గొప్ప సంపదలకు నాయకుడూ, సర్వజగత్తులనూ జయించే మన్మథునకు సోదరుడూ, పవిత్రులయిన యోగిజనుల మనస్సులను జయించినవాడూ అయిన బ్రహ్మకు దేవతలు నమస్కరించారు.

బ్రహ్మ చిరునవ్వుతో, చెడని, నిండయిన, దయతో కూడిన మాటల జలంతో ఇంద్రాది దేవతల బడలికలు పోగొట్టాడు.

బ్రహ్మదేవుడు దయాతిశయంతో దేవతలకు అభయం ఇచ్చి ఈ విధంగా అన్నాడు.

మీరు పుట్టిననాటి నుండి మీకు జ్ఞానాన్నిచ్చి, లోకాలను పరిపాలించడానికి రాజ్యాభిషేకంచేసి మిమ్మల్ని పెంచిన దయాళువు, బ్రహ్మజ్ఞాన నిధి అయిన బృహస్పతిని లక్ష్య పెట్టక, నిగ్రహం కోల్పోయి ఐశ్వర్యం వలన పొట్టలు పెరిగి కొవ్వుపట్టి పూనికతో పాపపుపని చేసి తప్పుచేశారు. ఏం చెప్పేది?

బ్రహ్మ జ్ఞానినీ బ్రాహ్మణుడూ అయిన ఆచార్యుణ్ణి సరకుసేయక మీరు గురుద్రోహం చేశారు. ఆ దోషం శత్రురూపంలో వెంటనే దాని ఫలాన్ని అనుభవింప చేసింది. బలవంతులైన మిమ్మల్ని బలహీనులయిన రాక్షసులు జయించడం తమ ఆచార్యుడయిన శుక్రుణ్ణి ఆరాధించి ఆయన మంత్రప్రభావంతో బలవంతులు కావటం వల్లనే వారునా సత్యలోకాన్ని కూడా ఆక్రమించే సామర్థ్యం కలిగి గర్వంతో ఉన్నారు. వారికి స్వర్గాన్ని ఆక్రమించడం తృణప్రాయం. గొప్ప మంత్రబలంకల శుక్రాచార్యునకు వారు శిష్యులైన కారణంగా విప్రుల, గోవిందుని, గోవుల, ఈశ్వరుని అనుగ్రహం కలవారు మినహా మిగిలిన రాజులకు అరిష్టం తప్పదు. అందువలన మీరు త్వష్టమనువుపుత్రుడయిన విశ్వరూపుడనే మునిని ఆరాధించండి. ఆయన గొప్ప తపోమహిమకలవాడు. సత్త్వస్వభావుడు. మీరు కోరిన దానిని సమకూర్పగలడు. ఎంతటి ఆపదలనైనా తొలగింపగలడు. ఈ విధంగా బ్రహ్మ చెప్పేసరికి దేవతలకు శాంతి కలిగింది. వారు బ్రహ్మాదేవుని దగ్గర సెలవు తీసికొని విశ్వరూపుని దగ్గరకు వెళ్ళి ఈ విధంగా అన్నారు.

నాయనా! నీకు శుభం. నిన్ను ఒకటి అడగడంకోసం నీ ఇంటికి వచ్చాం. తండ్రులతో సమానులమైన మా కోరిక తీర్చి కీర్తి సంపాదించు.

కొడుకులకు తండ్రిసేవ మహాపుణ్యాన్నిస్తుంది. కొడుకులు ఉన్నతగుణాలు కలిగినవారై బ్రహ్మచారులుగానే ఉండిపోయినా, అంతేగాక ఆచార్యుడు పరబ్రహ్మస్వరూపం. తండ్రి బ్రహ్మాదేవుని రూపం. సోదరుడు ఇంద్ర స్వరూపం; తల్లి భూదేవి రూపం. సోదరి కరుణ రూపం. అతిథి ధర్మస్వరూపుడు. అభ్యాగతుడు అగ్నిదేవుని రూపం; సర్వప్రాణులు విష్ణు స్వరూపం; అందువలన నాయనా! కడు దుఃఖితులము, నీకు తండ్రితో సమానులము అయిన మమ్ము చల్లగాచూచి శత్రుభయం పోగొట్టుము. అఖండ తపస్సుతో విరాజిల్లు. మమ్ము బ్రతికించు.

బ్రహ్మజ్ఞానివైన నిన్ను ఆచార్యునిగా స్వీకరించి నీ ప్రభావంతో శత్రువుల్ని సంహరిస్తాం. తనకోసం తనకంటె చిన్నవానికి పాద నమస్కారం చెయ్యడంలో తప్పులేదని వేదాలు చెప్తున్నాయి. నమస్కారం చేస్తున్న దేవతలమైన మమ్మల్ని అంగీకరించి మాకు పురోహితునిగా ఉండడానికి అంగీకరించు అనగానే ఆ విశ్వరూపుడు గట్టిగానవ్వి ఈ విధంగా అన్నాడు.

వీరుకోరిన పౌరోహిత్యం బ్రహ్మతేజస్సును నశింపచేసేది, ధర్మశీలురచే నిందింపబడేది అని తెలిసిన నావంటి తపస్వితో ఈ దేవతలు ఇంత తేటతెల్లంగా తియ్యగా ఎలా చెప్పారో!

ప్రత్యేకంగా, శిష్యులు గురువులకు దక్షిణ రూపంలో ధనం ఈయవలసిన ఆవశ్యకతలేదు. గురూపదేశంపొంది, మంత్రవిదులై, ధర్మాన్ని అనుష్టించే శిష్యులే గురువులకు సంపదలు.

ధనహీనులైనవారికి శిలోంఛనవృత్తియే ధనం. దానిచేతనే సత్పురుషులకాతిథ్య మిచ్చి తృప్తిపడుతారు. నీచమైన పద్ధతిలో పౌరోహిత్యం వలన ధనం సంపాదింపనవసరంలేదు. కాని మీ ఆజ్ఞ ననుసరించి మీకాచార్యుడుగా ఉండటానికి అంగీకరించాను. ప్రాణాలను ధనమును దాచుకొనక మీకభీష్టమును సమకూరుస్తాను. అని విశ్వరూపుడు శపథంచేసి ఏకాగ్రతతో దేవతలకు పౌరోహిత్యాన్ని చేశాడు.

(శిలవృత్తియనగా మళ్లలోని ధాన్యపు కంకులనేరుకొని బతకడం. ఉంఛమనగా రోళ్లమొదట పడ్డ గింజలనేరుకొని జీవించడం. కొందరు శిలోంఛనమును ఒకటిగానే చెప్పటం కూడా ఉన్నది.)

శుక్రాచార్యుల నీతిచేత స్వర్గసంపదలు రాక్షసులకు వశమయ్యాయి. స్వర్గసంపదలు కలిసి రాక్షససంపదలు రెట్టింపయ్యాయి. వాటికి శుక్రాచార్యులవారి నీతియే రక్ష విశ్వరూపుడు అడ్డులేని విష్ణుమాయ ప్రభావంతో ఆ సంపదలను తెచ్చి ఇంద్రుని వశం చేశాడు.

విశ్వరూపుడు ఏ విద్యచేత ఇంద్రునికి రక్షణ కల్పించాడో, ఇంద్రుడు యుద్ధంలో రాక్షసుల్ని జయించాడో విష్ణుమాయగా ప్రసిద్ధమయిన ఆ విద్యను విశ్వరూపుడు ఇంద్రునకుపదేశించాడు.

శుకమహర్షి ఇట్లనగా పాండవ వంశీయుడైన పరీక్షిన్మహారాజు అత్యంత విశ్వాసంకల భక్తితో జగత్తులకు నివాసమైనవాడూ తామరరేకులవంటి కన్నులు కలవాడూ అయిన కృష్ణుణ్ణి మనస్సులో ధ్యానించి ఇలా అన్నాడు. దేవతలచే నమస్కరింపబడే ఓ దేవఋషీ! విశ్వరూపుడు ఏ విధంగా ఆ పవిత్రవిద్యను దేవేంద్రున కిచ్చాడో తెల్పుము.

ఓ మునీంద్రా! దేనివలన ఇంద్రుడు సర్వత్ర రక్షణపొంది అనాయసంగా రాక్షస సేనను సంహరించి దేవతలు నిర్భయంగా సుఖించే విధంగా కోరిన సంపదలు పొంది అన్నిలోకాల్నీ జయించి పరిపాలించాడో ఆ విద్యను చెప్పు. వీనులవిందుగా విని సంతోషపడతాను.

No comments:

Post a Comment