శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - నరకనివారణ
పరేతరాజా! మహాభాగా! వేదవేదాంగపారగా! వేదశాస్త్ర పురాణేతిహాససారమూ సకలప్రియమూ సర్వసమ్మతమూ కర్మబంధ విచ్చేదకమూ ప్రశస్తమూ సుఖప్రదమూ సర్వసిద్ధిదాయకమూ సర్వమంగళ కారకమూ దుఃఖ భయ నిరాసకమూ యమకుండ దర్శన పతన నివారకమూ అయిన సత్కర్మ ఏదైనా ఉంటే అదేమిటో తెలియజేయి. ఆచరించి ఆందరూ ముక్తులవుతారు.
నరకకుండాలగురించి చెప్పావు. వాటి ఆకృతులు ఎమిటి? వేటితో నిర్మిస్తారు? ఏ పాపాత్ములు ఏ రూపాలతో వాటిలో ఉంటారు? భూలోకంలో మరణించాక దేహం భస్మమైపోతుంది. మట్టిలో కలిసిపోతుంది. ఆపైని ఏ రూపంతో లోకాంతరాలకు వెళ్ళి శుభాశుభకర్మలను అనుభవించడం జరుగుతుంది ? అంతంతకాలం నరకయాతనలు అనుభవిసోంటే దేహం నశించకుండా ఎలా ఉంటుంది ? అసలు ఆ దేహం ఏమిటి ? ఇవన్నీ నాలో కలుగుతున్న సందేహాలు. దయచేసి సమాధానాలు చెప్పు.
నారదా! సావిత్రీదేవి ఇలా అడిగేసరికి యముడు ఒక్కసారి మనస్సులో మళ్ళీ హరిని స్మరించి కర్మబంధవిమోచకమైన రహస్యాన్ని వివరించనారంభించాడు - అంటూ నారాయణమహర్షి కొనసాగించాడు.
పతివ్రతా తిలకమా! నీ మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా తేలిక. అటువంటి తరణోపాయం ఒక్కటే ఒక్కటి - పంచదేవార్చన. పంచదేవార్చకులకు నరకకుండాలు కలలోకికూడా రావు. దేవీభక్తులు నరకం దరిదాపులకైనా రారు. శ్రీహరిని నిత్యం ఆర్చించేవారు యమలోకంవైపు చూడరు. ముప్పాద్దులా సంధ్యవారుస్తూ శుద్దాచారులై దేవిని ఆరాధించేవారు యమదూతలకు భయపడవలసిన అవసరంలేదు. మా కింకరులు పారపాటునకూడా వారి దరిదాపులకైనా వెళ్ళరు. ఒకవేళ తెలియక వెళ్ళబోతే నేను వెంటనే వారిస్తాను. శివభక్తులను చూస్తే మావాళ్ళు భయపడతారు. గరుడుణ్ణి చూసిన పాముల్లాగా పారిపోతారు. దేవీమంత్రోపాసకుల పేర్లను చిత్రగుప్తుడు చిట్టాలోంచి నఖలేఖినితో తొలగిస్తాడు. కొట్టివేస్తాడు.
అంతేకాదు వారు ఊర్థ్వలోకానికి వస్తున్నప్పుడు ఎదురు వెళ్ళి మధుపర్కాలు అందిస్తాడు. వారంతా యమలోకం పైనుంచి లంఘించి బ్రహ్మలోకం చేరుకుంటారు. దేవీభక్తుల స్పర్శతో దురితాలు నశిస్తాయి. వారి వంశాలలో అటూ ఇటూ వెయ్యి తరాలు భాగ్యవంతులవుతారు. అరిషడ్వర్గాలు భయపడి పారిపోతాయి. జరామృత్యురోగశోకభయాదులు దరిదాపులకి రావు. పంచదేవార్చకులకి సకలకర్మలూ సకలకాలాలూ హర్షభోగ ప్రీతిదాయకాలుగానే ఉంటాయి. ఇక దేహస్వరూపం వివరిస్తున్నాను తెలుసుకో-
స్టూలశరీరం పంచభూతాత్మకం. అది కృత్రిమదేహం. కనక నశ్వరం - బూడిద అయిపోతుంది. మట్టిలో కలిసిపోతుంది. పంచభూతాలూ పంచభూతాలలో కలిసిపోతాయి, అటు పైని అంగుష్ఠ ప్రమాణంలో జీవుడు మిగులుతాడు. ఇది సూక్ష్మదేహం. దీనితోనే శుభాశుభకర్మఫలాలు అనుభవిస్తాడు. ఇది నశించదు. శిధిలంకాదు. అగ్నిదగ్ధంకాదు. శస్త్రాస్త్రాలకు లొంగదు. తప్తద్రవ తప్తతైల తప్తపాషాణాది కూపాల్లో ఎంతకాలం ఎన్ని శిక్షలు వేసినా చెక్కుచెదరదు. దుఃఖాలనుమాత్రం అనుభవిస్తూంటుంది.
No comments:
Post a Comment