Friday, July 31, 2026

Bhasmadharana - Sirowratham - భస్మధారణ - శిరోవ్రతం

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - భస్మధారణ - శిరోవ్రతం

నారదా! భస్మధారణకే శిరోవ్రతమని పేరు. దీన్ని ఆచరించినవారికే పరావిద్యకు అధికారం. విధివిధానంలో శ్రద్ధగా ఈ శిరోవ్రతాన్ని ఆచరించాలి. దీన్ని ఆచరించకుండా శ్రౌతస్మార్త సమాచారం ఎంత తెలుసుకున్నా అనుపకారకమే. శిరోవ్రతాచరణం వల్లనే బ్రహ్మాదులు దేవతలు కాగలిగారు. దీని మాహాత్మ్యాన్ని త్రిమూర్తులుకూడా పూర్తిగా వర్ణించి చెప్పలేరు. అధర్వణవేదంలో శిఖరాయమాణంగా చెప్పబడ్డ గొప్ప వ్రతమిది. ఇంతకన్నా గొప్ప వ్రతం మరొకటి లేదంటే లేదు. శాఖాభేదాలనుబట్టి ఈ వ్రతానికి చాలా పేర్లున్నాయి. పేరులూ దారులూ వేరైనా వస్తువు ఒక్కటే. శివాఖ్యం. సత్యచిద్ఘనం. కనక దీన్ని అందరూ ఆచరించాలి. ఎన్ని శాస్త్రాలూ ఎన్ని విద్యలూ నేర్చినా శిరోప్రత విహనుడైనట్టయితే అతడు సర్వధర్మ విహినుడికిందే లెక్క. ఇది పాపకాంతారదాహకం. సర్వవిద్యాసాధకం. నిత్యమూ ఆచరించాలని అధర్వణ శ్రుతి స్పష్టంగా చెబుతోంది.

ఆగ్నిరిత్యాది మంత్రాలు ఆరింటితో శుద్ధిచేసిన భస్మాన్ని శరీరంలో సర్వాంగాలకూ నిండా పులుముకోవాలి. సంగ్రహంగా శిరోవ్రతమంటే ఇదే.

సంధ్యాసమయాల్లో విద్యారంభాల్లో తప్పకుండా చెయ్యాలి. పన్నెండు రోజులనుంచి పన్నెండేళ్ళ వరకూ ఎంతకాలమైనా ఈ వ్రతాన్ని సంకల్పించుకోవచ్చు. కనిష్ట - గరిష్ట పరిమితులు మాత్రం అవ్వి. శిరోవ్రతస్నాతుడికి విద్యలనుగానీ మంత్రాలనుగానీ ఉపదేశించనివాడు ఆ విద్యల్ని కోల్పోతాడు. గురుశబ్దానికి అనర్హుడవుతాడు.

బ్రహ్మవిద్యాగురువంటే సాక్షాత్తూ పరమేశ్వరుడు. మునీశ్వరుడు. పరమదయామయుడై ఉండాలి గదా! వేనవేల జన్మల్లో ధర్మాచరణం చేసినవారికిగానీ బ్రహ్మవిద్యపట్ల శ్రద్ధకలగదు. కోరిక పుట్టదు. అందుచేత శిరోవ్రతం అనుష్ఠించి బ్రహ్మవిద్యను అభ్యర్థించినవారిని ఏ గురువూ తిరస్కరించకూడదు. ద్వేషించకూడదు. ద్వేషం ఎప్పుడూ అజ్ఞానసంభవమే. అతడికి ఆత్మజ్ఞానం లేదని అర్థం. ఇది గురుశిష్యులిద్దరికీ వర్తించేమాట.

శిరోవ్రతస్నాతులే బ్రహ్మవిద్యోపదేశానికి సాక్షాదధికారులు. మరింకెవ్వరూ కారు. ఈ ప్రతంతో అంతర్గతమైన పశుత్వాన్ని వదిలించుకోవాలి. పాశుపతుడు కావాలి. అటువంటివారికే బ్రహ్మవిద్యను ఉపదేశించాలని వేదానుశాసనం.

సతారమైన త్రియంబకమంత్రాన్ని జపిస్తూ త్రిపుండ్రాలుగా భస్మధారణ చేస్తే సరిపోతుందని జాబాలుల మతం. గృహస్థులు ఇలా చేస్తే చాలుననీ ఓంకారయుక్తంగా హంసమంత్రాన్ని ముమ్మారు ఉచ్చరిస్తూ త్రిపుండ్రాలను నిత్యమూ ధరించడం భిక్షుకులకు కర్తవ్యమనీ జాబాలికీశ్రుతి చెబుతోంది. సప్రణవమూ సశివమూ అయిన త్రియంబకమంత్రంతోనే గృహస్థులేకాదు వానప్రస్థులూ త్రిపుండ్రాలుగా భస్మధారణ చెయ్యాలి. మేధావీత్యాది మంత్రంతోకూడా బ్రహ్మచారి తడిపిన భస్మాన్ని త్రిపుండ్రాలుగా ధరించవచ్చు. ఏమైనా బ్రాహ్మణుడికి నొసట నిత్యమూ భస్మావగుంఠనం ఉండాలి, అప్పుడే బ్రాహ్మాణుడనిపించుకుంటాడు.

సన్యాసాశ్రమం స్వీకరించినవారు సతారమైన త్రియంబకమంత్రంతోగానీ పంచాక్షరితోగానీ ప్రణవంతోగానీ నొసటా హృదయంమిదా బాహువులపైనా విభూతిని త్రిపుండ్రాలుగా ధరించాలి. బ్రహ్మచారులు మేధావీత్యాది మంత్రంతోగానీ త్రియాయుష మంత్రంతోగానీ ధరించాలి. గౌణభస్మమైనా ధరించవచ్చు. శూద్రులు శివాయనమః అనే మంత్రంతో త్రిపుండ్రాలను ధరించాలి. మిగిలినవారికి ఏ మంత్రమూ అవసరంలేదు. భక్తితో భస్మోద్దూళనం చేసుకుంటే చాలు. విభూతిధారణచేస్తే సమస్తవిభూతులూ(ఐశ్వర్యాలూ) కలుగుతాయి. ఇది సర్వధర్మాలలోకీ వరేణ్యం. కనక నిత్యమూ ఆచరించాలి.

అగ్నిహోత్రంనుంచిగానీ విరజామంత్రహోమాగ్నినుంచిగానీ ఆవిర్భవించిన భస్మాన్ని ఒక శుభ్రమైన పాత్రలోకి తీసుకోవాలి. కాళ్ళూ చేతులూ కడుక్కుని రెండుసార్లు ఆచమించి సమాహితచిత్తంతో పంచబ్రహ్మ మంత్రాలను చదువుతూ భస్మాన్ని మెల్లమెల్లగా కలపాలి. (ఈ మంత్రాలతోనే భస్మాన్ని పాత్రలోకి తియ్యాలని కొందరు) ముమ్మారు ప్రాణాయామంచేసి అగ్నిరిత్యాది మంత్రాలు ఏడింటితో మూడుసార్లు. అభిమంత్రించాలి. ఓమాపోజ్యోతిరిత్యాది మంత్రాలను పఠిస్తూ ఆ తెల్లని విభూతిని శరీరంమీద శీర్షాదిపాదపర్యంతం జల్లుకోవాలి. ఇలా చేసినవాడు విపాపుడూ విరజుడూ అవుతాడనడంలో ఏ సందేహమూ లేదు. అటుపైని జలాధిపుడైన జగన్నాథుణ్ణి శ్రీమహావిష్ణువును ధ్యానించి విభూతిలో నీటిచుక్కలు వేసి అగ్నిరిత్యాది మంత్రాలను మళ్ళీ పఠిస్తూ తడపాలి. అప్పుడు పార్వతీపరమేశ్వరులను ధ్యానిస్తూ బ్రహ్మచర్యాది ఆశ్రమాలకు నిర్దిష్టమైన ఆయా మంత్రాలను పఠిస్తూ ముందు శిరస్సున ధరించి, నొసటా హృదయానా బాహువులపైనా తిపుండ్రరేఖలుగా ధరించాలి. మధ్యమానామికాంగుష్ఠాలతో అనులోమ విలోమ మార్గాల్లో - త్రిసంధ్యల్లోనూ నిత్యమూ - భస్మత్రిపుండ్ర ధారణ చెయ్యాలి.

నారదా! ఆజ్ఞానధ్వంసకమూ జ్ఞానసాధకమూ అయిన ఈ విభూతి ఆగ్నేయమనీ గౌణమనీ రెండువిధాలు. ఇందులో మళ్ళీ గౌణం చాలా రకాలు. అగ్నిహోత్రభస్మం, విరజానలభస్మం, ఔ పాసనభస్మం, సమిదగ్నిభస్మం, పచనాగ్నిభస్మం, దావానలభస్మం - ఇవన్నీ గౌణాలు. బ్రాహ్మణ క్షత్రియవైశ్యులకు అగ్నిహోత్ర భస్మంగానీ విరజానలభస్మంగానీ ధరించదగినవి. ఔ పాసనాగ్నిభస్మాన్ని గృహస్థులకు విశేషంగా చెప్పారు. బ్రహ్మచారులు సమిదగ్నిభన్మం ధరించాలి. శూద్రులు శ్రోత్రియుల ఇళ్ళనుంచి పచనాగ్నిభస్మం తెచ్చుకుని ధరించాలి. తక్కినవారందరూ దావానలభస్మాన్ని ధరించాలి.

ఇంక శిరోవ్రతదీక్షావిధానమేమంటే - పూర్ణిమాతిథి మంచిది. స్వగృహంలోగానీ ఆరామంలోగానీ అరణ్యంలోగానీ దీక్ష తీసుకోవచ్చు. ఇవి ప్రశస్తాలు. శుభప్రదాలు. పూర్ణిమకు ముందటి త్రయోదశినాడు సుస్నాతుడై అగ్నికార్యం నిర్వర్తించి గురువును పూజించి పాదాభివందనం చేసి అనుమతి పొందాలి. అటు పైని వైశేషికపూజ నిర్వహించి పరిశుభ్రమైన తెల్లని వస్త్రాలు ధరించాలి. కొత్త యజ్ఞోపవీతం వేసుకోవాలి. తెల్లనిపూలు దండగుచ్చి ధరించాలి. మంచిగంధం అలంకరించుకోవాలి. దర్భాసనంమిద దర్భలు చేతబట్టి కూర్చోవాలి. తూర్పుముఖంగాగాని ఉత్తరముఖంగాగానీ కూర్చుని ముమ్మారు ప్రాణాయామం చెయ్యాలి. పార్వతీపరమేశ్వరులను ధ్యానించి వారికి విన్నపం చేసుకోవాలి. నేను ఈ వ్రతం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి. అప్పటికి వ్రతదిక్షితుడైనట్టు లెక్క. ఈ శిరోవ్రతం జన్మాంతంవరకూగానీ, పన్నెండేళ్ళపాటుగానీ ఆరేళ్ళపాటుగానీ మూడేళ్ళపాటు గానీ ఏణ్ణర్థంగానీ ఏడాదిగానీ ఆరునెలలుగానీ మూడునెలలుగాని నెలనాళ్ళేగానీ పన్నెండురోజులేగానీ ఆరురోజులేగానీ మూడునాళ్ళేగానీ ఆధమపక్షం ఒకరోజుగానీ చెయ్యవచ్చు. ఓపికను బట్టీ వీలునిబట్టీ సంకల్పావధిని నియమించుకోవచ్చు. విరజాహోమం చేసే అగ్నిని తెచ్చి ఆజ్యంతో సమిధలతో చరువుతో యథావిధిగా మంత్రయుక్తంగా హోమం చెయ్యాలి.

దీక్ష తీసుకునే రోజుకి ముందుగానే (పూతాహాత్పురతః 10-15) భూతశుద్దిని ఆకాంక్షించి మళ్ళీ సమిధలతో ఆజ్యంతో మంత్రాలతో హోమం చెయ్యాలి. నా దేహంలో ఈ తత్త్వాలు శుద్దిపాందుగాక అని స్మరిస్తూ హోమక్రియ సాగించాలి. పంచభూతాలూ పంచతన్మాత్రలూ పంచకర్మేంద్రియాలూ
పంచజ్ఞానేంద్రియాలూ పంచప్రాణవాయువులూ సప్తధాతువులూ సత్త్వరజస్తమోగుణాలూ మనోబుద్ధ్యహంకారాలూ ప్రకృతిపురుషులూ రాగమూ విద్య కళ నియతి కాలమూ మాయ శుద్ధవిద్య మహేశ్వరసదాశివులూ శక్తి శివతత్త్వమూ - వీటిని తత్త్వాలు అంటారు. వీటి శుద్ధిని ఆకాంక్షించి విరజామంత్రాలతో హోమంచేస్తే మానవుడు శుద్ధిపాంది విరజుడు అవుతాడు.

అటుపైని ఆవుపేడ తెచ్చి ముద్దలు చేసి అభిమంత్రించాలి. హోమాగ్నికుండంలో వేల్చి రోజంతా సంరక్షించాలి. హవిష్యంమాత్రమే భుజించి అగ్నికుండాన్ని చూసుకుంటూ ఉండాలి. చతుర్దశీ సుప్రభాతాన హోమక్రియలన్ని యథావిధిగా నడిపి ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. నిరాహారుడుగా గడపాలి. పూర్ణిమనాడు ప్రాతఃకాలంలో మళ్ళీ యథావిధిగా హోమం చెయ్యాలి. హోమాంతంలో రుద్రాగ్నిని ఉపసంహరించాలి. హోమకుండంనుంచి శ్రద్దగా పద్ధతిగా భస్మం తీసుకోవాలి. అప్పుడు ముండితుడో జటిలుడో శిఖావంతుడో అయ్యి స్నానం చెయ్యాలి. సిగ్గుపడనివాడైతే దిగంబరంగానూ, సిగ్గుపడేవాడైతే కాషాయాంబర చర్మాంబర వల్కలాలలో ఏదో ఒకటి కట్టుకోవాలి. ఏకాంబరుడే కావాలి. మొలనూలు చుట్టుకోవాలి. దండం పట్టుకోవాలి. కాళ్ళు కడుక్కుని రెండుసార్లు ఆచమించి ఆత్మనూ శరీరాన్నీ సంకలీకరించి విరజానలసంభవమైన ఆ భస్మాన్ని అగ్నిరిత్యాదికమైన ఆధర్వణమంత్రాలను ఆరింటిని చదువుతూ మూర్ధాదిచరణాంతంగా అన్ని అవయవాలకూ పులుముకోవాలి. అదే క్రమంలో భస్మంతో సముద్దూళనం చేసుకోవాలి. ప్రణవాన్నో శివనామాన్నో జపిన్తూ ఈ పని చెయ్యాలి. ఆ తరవాత త్రియాయుషమంత్రంతో త్రిపుండ్రాలు ధరించాలి. శివభావాన్ని పాంది శివభావాన్ని ఆచరించాలి. అనునిత్యమూ ముప్పాద్దులా ఇలా చేస్తే అది పాశుపతవ్రతమవుతుంది. ఇది పశుత్వాన్ని తొలగించడంతో పాటు భుక్తిముక్తి ప్రదమవుతుంది. ఇలా పాశుపతవ్రతంచేసి పశుత్వాన్ని తొలగించుకున్న మహానుభావుడు సాక్షాత్తూ మహాదేవుడూ లింగమూర్తీ సదాశివుడుగా పూజనీయుడు అవుతాడు.

నారదా! భస్మస్నానంవల్ల కలిగే మహాపుణ్యం సర్వసౌఖ్యకరం. ఆయురారోగ్యభోగభాగ్యబల పుష్టివర్ధనం. రక్షణకోసం మంగళార్థం సర్వసంపత్పమృద్ధికోసం మృత్యుభయ మహామారీభయ నివారణకోనం మనుష్యులు ఈ భస్మస్నానం చెయ్యాలి.

భస్మ భేదాలు




No comments:

Post a Comment