Friday, July 31, 2026

Bhuthasuddi - Purification of the elements - భూతశుద్ది

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - భూతశుద్ది

నారదా! సదాచారంలో భాగంగా ఇప్పుడు భూతశుద్ది గురించి చెబుతున్నాను. శ్రద్దగా ఆలకించు. మూలాధారచక్రం నుంచి మేల్కొని సుషుమ్నామార్గంద్వారా బ్రహ్మరంధ్రానికి చేరుకునే కుండలినీ పరదేవతను ఒక్కసారి స్మరించు. సాధకుడు హంసమంత్రంతో జీవుణ్ణి బ్రహ్మలో అనుసంధిస్తాడు. శరీరంలో పాదాది జానుపర్యంతం - భూమండలం. అది చతుష్కోణం. సవజ్రకం. లం బీజాఢ్యం. స్వర్ణవర్ణం. జాన్వాది నాభిపర్యంతం - జలమండలం. అది చంద్రార్దనిభం. పద్మద్వయాంకితం, వం బీజయుక్తం. శ్వేతవర్ణం. నాభిమొదలు హృదయపర్యంతం - అగ్నిమండలం. అది త్రికోణం. స్వస్తికాన్వితం. రం బీజయుక్తం. రక్తవర్ణం. హృదయం నుంచి భ్రూమధ్యపర్యంతం - వాయు మండలం. అది వృత్తాకారం. షడ్బీందులాంఛితం. యం బీజయుతం. ధూమ్రువర్ణం. భూమధ్యనుంచి బ్రహ్మరంధ్రపర్యంతం - ఆకాశమండలం. అదీ వృత్తాకారం. స్వచ్చం. మనోహరం. హం బీజయుక్తం. ఇలా ఒక్కొక్కమండలాన్నీ ప్రత్యేకంగా భావించి ఒకదానిలో ఒకటి నింపాలి. భూమిలో జలం, జలంలో అగ్ని, అగ్నిలో వాయువు, వాయువులో ఆకాశం నింపి, ఆకాశాన్ని అహంకారంలో, అహంకృతిని మహత్తత్త్వంలో, మహత్తత్త్వాన్ని ప్రకృతిలో, ప్రకృతిని మాయలో, మాయను ఆత్మలో అంతర్భవింపజెయ్యాలి. అప్పుడు సాధకుడు శుద్ధ సంవిన్మయుడవుతాడు. అయ్యాక - వామకుక్షిలో ఉండే పాపపురుషుణ్ణి స్మరించాలి. నల్లగా ఆంగుష్ఠపరిమాణంలో ఉంటాడు. బ్రహ్మహత్య శిరస్సుగా, సువర్ణస్తేయం బాహువులుగా, మదిరాపానమే హృదయంగా, గురుపత్నీ సంగమమే కటి ప్రదేశంగా, పాతకి స్నేహాలు పాదద్వయంగా, ఉపపాతకాలు మస్తకంగా ఖడ్గచర్మధరుడై అధోముఖుడై దుస్సహంగా ఉంటాడు పాపపురుషుడు. వాయుబీజ స్మరణతో మహావాయువును సృష్టించి ఈ పాపవురుషుణ్ణి ఎండగట్టాలి. వహ్నిబీజాన్ని స్మరించి మంటల్లో దహించివెయ్యాలి. ఆ బూడిదను కుంభకం ద్వారా స్వశరీరంనుంచి వెలుపలికి నెట్టి, వాయుబీజ రేచనతో పోగుపెట్టి, సుధాబీజ స్మరణతో తడిపి భూబీజస్మరణతో ముద్దచేసి, ఆకాశబీజస్మరణతో ఆ బంగారుముద్దను అద్దంలా విశుద్దిపరచి మూర్ధాదిపాదపర్యంతం అన్ని అవయవాలకూ పులుముకోవాలి.

అటుపైని ఆ భస్మం నుంచి ఆకాశాది పంచభూతాలనూ పునరుత్పాదన చేసి సో హం మంత్రోచ్చారణతో ఆత్మను హృదయాంబుజంలోకి తీసుకురావాలి. పరసంగంనుంచి సుధామయమైన కుండలినీ జీవాన్ని తెచ్చి హృదయాంభోజంలో సంస్థాపించి, మూలాధారంలో ఉండే శక్తిని ధ్యానించాలి. ఎర్రసముద్రంలో తెప్పలాగా(తెప్పమిద) ఉన్న అరుణ సరోజంమీద కూర్చుని, హస్తపద్మాలలో శూలమూ, తుమ్మెదలే ఆల్లెత్రాడుగాగల చెరకువిల్లూ, ఆంకుశమూ అయిదుబాణాలూ ఒక రక్తకపాలమూ ధరించినదీ, మూడు కన్నులుకలదీ, బలిష్ఠమైన వక్షోజాలు కలదీ, ఉదయిస్తున్న సూర్యబింబపు రంగులో ప్రకాశించేదీ ఆ మహాదేవి ఆ పరాంబిక ఆ ప్రాణశక్తి మాకు సుఖప్రద అగుగాక!

పరమాత్మ స్వరూపిణి ఆ ప్రాణశక్తిని ఇలా ధ్యానించి విభూతిని ధరించాలి. విభూతిని ధరిస్తేనే వైదిక సత్కర్మాచరణకు అర్హత అధికారం సిద్ధిస్తుంది. శ్రుతి స్మృతి పురాణాలు చెప్పిన ప్రకారం విభూతిని ఎలా ధరించాలో ఏ మహాఫలాలు లభిస్తాయో అదికూడా తెలియజేస్తాను. తెలుసుకో.

భస్మధారణ - శిరోవ్రతం




No comments:

Post a Comment