Friday, July 31, 2026

Rudrakshamahimalu - Gaardhabhagaadha - రుద్రాక్షమహిమలు - గార్ధభగాథ

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - రుద్రాక్షమహిమలు - గార్ధభగాథ

నారదా! శివుడు కుమారస్వామికి చెప్పిన రుద్రాక్షమహిమలు ఇంకా ఏమిటంటే - అంటూ నారాయణమహర్షి కొనసాగించాడు.

దేవతలుసైతం రుద్రాక్షమహిమలో పదహారవకళకయినా సాటిరారు. పురుషులలో విష్ణుమూర్తి, గ్రహాలలో సూర్యుడు, నదులలో గంగ, మునులలో కశ్యపుడు, గుర్రాలలో ఉచ్చైః శ్రవమూ, దేవుళ్ళలో ఈశ్వరుడు, దేవీమూర్తులలో గౌరి ఎలాంటివారో సమస్తవస్తువుల్లోనూ రుద్రాక్ష అటువంటిది. రుద్రాక్షధారణను మించిన తపస్సు లేదు. స్తోత్రం లేదు. వ్రతం లేదు. అక్షయ్యదానాలలో రుద్రాక్షదానం బహువిధాల విశిష్టం. శాంతచిత్తుడైన శివభక్తుడికి రుద్రాక్షను దానం చేస్తే లభించే పుణ్యఫలం ఎంతటిదో ఈశ్వరుడు కూడా చెప్పలేకపోయాడు. రుద్రాక్షధారికి అన్నదానం చేసినవారు ఇటూ అటూ ఏడేసి తరాలు తరించి శివలోకం చేరుకుంటారు. నొసట విభూతి, తనువున రుద్రాక్ష, శివాలయంలో పూజ - విటికి నోచుకోని విప్రుడు శ్వపచుడితో సమానం. మద్యపాన - మాంసభక్షణ - వేశ్యాసంగమాది మహాపాతకాలు రుద్రాక్ష శిరోధారణతో పటాపంచలవుతాయి. యజ్ఞయాగాలు చెయ్యకపోయినా వేదాలు చదవకపోయినా ఏ దానాలూ చెయ్యకపోయినా అన్నీ చేసిన ఫలం లభిస్తుంది. పురాణపఠన తీర్ధసేవన శాస్త్రాభ్యసన పుణ్యఫలాలు దీనికి సాటిరావు. రుద్రాక్షను ధరించి ప్రయాణమధ్యంలో దిక్కులేని చావు చచ్చినా అతడు శివత్వం పొందుతాడు. అతడి వంశంలో ఇరవైయొక్క తరాలు తరిస్తాయి. రుద్రలోకంలో నివసిస్తాయి. ఏ కులంలో పుట్టినా ఎలాంటి దురభ్యాసాలకు లోనైనా నిర్గుణుడైనా సగుణుడైనా రుద్రాక్షధారి రుద్రుడితో సమానుడే. శిరస్సున ధరిస్తే కోటిరెట్లు, చెవులకు ధరిస్తే దశకోట్లు, మెడలో ధరిస్తే శతకోట్లు, మూర్ధమున ధరిస్తే సహస్రకోట్లు, జంధ్యానికి ధరిస్తే అయుతకోట్లు, బుజాలకో మణికట్టుకో దాలిస్తే లక్షకోట్లు అధికంగా ఫలాన్ని ఇస్తుంది. రుద్రాక్షను మించిన మోక్షసాధనం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. రుద్రాక్షను ధరిస్తే చాలు భక్తి ఉన్నా లేకపోయినా వైదికకర్మలను చేసినా చెయ్యకపోయినా ముక్తి లభించడం తథ్యం. రుద్రాక్షను ధరించాలి అనే కోరిక గాఢంగా ఉంటే చాలు, ఒకవేళ ధరించలేకపోయినా శివలింగంలాగా వందనీయుడే, అవిద్యుడా సవిద్యుడా అనే విచారణతో పనిలేదు. రుద్రాక్షధారి రుద్రత్వం పాంది తీరుతాడు. రుద్రలోకం చేరి తీరుతాడు. వెనకటికి ఒక గాడిద ఇలాగే రుద్రత్వం పొందింది.

నారదా! షణ్ముఖుడు వెంటనే ఆ గాడిద కథ చెప్పమన్నాడు. శివుడు చెప్పాడు. అదేమిటంటే - వింధ్యారణ్యంలో ఒక గాడిద ఉండేది. ఒకనాడు ఒక పథికుడు దానిమీద ఆది మొయ్యలేనన్ని రుద్రాక్షలు బస్తాలు కట్టి వేశాడు. ఓపిక తెచ్చుకుని చాలాదూరం మోసింది. ఇక మొయ్యలేక నేలకు ఒరిగిపోయింది. ప్రాణాలు విడిచింది. శివుడి అనుగ్రహానికి పాత్రమై శివలోకం చేరుకుంది. మోసిన రుద్రాక్షలు ఎన్నో ఒక్కొక్క దానికీ ఎన్ని ముఖాలున్నాయో అన్ని వేల సంవత్సరాలు శివలోకంలో
నివసించింది.

బ్రహ్మనందనా! ఈ రుద్రాక్ష మహిమను ఎవరికిబడితే వారికి చెప్పకూడదు. అశిష్యులకూ అభక్తులకూ మూర్ఖులకూ అస్సలు చెప్పకూడదు. అయితే - రుద్రాక్షను ధరించాలి అనుకునేవాడికి ఎవడికైనాసరే చెప్పవచ్చు.

రుద్రాక్ష మహిమలను వర్ణించిచెప్పడం, రుద్రాక్షలను ధరింపజెయ్యడం - ఇదొక వ్రతంగా ఆచరించినవారు సమకూర్చుకునే పుణ్యరాశికి కొలతలేదు. వెయ్యి రుద్రాక్షలను ధరింపజేస్తే అతడికి దేవతలు కూడా నమస్కరిస్తారు. వెయ్యి సాధ్యం కాకపోతే బుజానికి పదహారు, శిఖకు ఒకటి, చేతికి పన్నెండు, మెడలో ముప్ఫయిరెండు, శిరస్సున ఇరవైనాలుగు, చెవికి ఒకటి, మరోపన్నెండు వక్షఃస్థలాన - ఇలాగ నూటయెనిమిది ధరింపజేసినా అతడు రుద్రుడిలా దేవమానవ పూజ్యుడవుతాడు. ముత్యాలతో పగడాలతో స్పటికాలతో వైడూర్యాలతో కలిపి రుద్రాక్షలను వెండితీగకుగానీ బంగారుతీగకుగానీ చుట్టి ధరిస్తే అతడు సాక్షాత్కరించిన శివుడే. రుద్రాక్షలకు వెండి లేదా బంగారు తొడుగులను చేయించి ధరించినా అధికపుణ్యప్రదమే. ఏ కోరికా లేకపోయినా, ఏ భక్తీ లేకపోయినా యథాలాపంగా ధరించినా అతడిని ఏ పాపాలు సోకవు. సూర్యుడికి చీకట్లు సోకుతాయా!

గుణనిధికథ




No comments:

Post a Comment