Friday, July 31, 2026

The Story of Gunanidhi - గుణనిధికథ

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - గుణనిధికథ

రుద్రాక్షమాలతో మంత్రజపం చేస్తే కోటిరెట్లు అధికంగా వేగంగా ఫలం సిద్ధిస్తుంది. శరీరంమీద ఒక్కరుద్రాక్ష అయినా లేని నరుడి జన్మ వ్యర్థమంటే వ్యర్థం. రుద్రాక్షను శిరస్సున పెట్టుకుని స్నానం చేస్తే గంగాస్నానఫలం దక్కితీరుతుంది. ఎకముఖ - పంచముఖ - ఏకాదశముఖ - చతుర్దశముఖ రుద్రాక్షలు లోకపూజితాలు. రుద్రాక్షను నిత్యమూ భక్తితో పూజిస్తే శంకరుణ్ణి పూజించినబ్దే. రుద్రుడికీ రుద్రాక్షకూ రుద్రాక్షధారికీ భేదంలేదు. దరిద్రుణ్ణి ధనవంతుణ్ణి చేసే శక్తి ఒక్క రుద్రాక్షకే ఉంది. దీనికి నిదర్శనంగా ఒక పురాణకథ చెబుతాను - విను,

కోసలదేశంలో గిరినాథుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. వేదవేదాంగపారంగతుడు. మహాధనవంతుడు. ధర్మాత్ముడు. యజ్ఞయాగాలు అన్నీ చేసినవాడు. అతనికి గుణనిధి అని ఒక పుత్రుడున్నాడు. మన్మథుడిలా బహుసుందరుడు. సుధిషణుడు అనే గురువు దగ్గర చదువుకుంటున్నాడు. కోడెవయసు కూతలు పెట్టింది. గురుపత్ని ముక్తావళికి వలవిసిరాడు. రూపయౌవనాలకు సమ్మోహితురాలయ్యింది. కొంతకాలం కథ రహస్యంగా సాగింది. ఎప్పటికయినా గురువుగారికి తెలియకమానదు. శపిస్తాడు అని భయపడ్డాడు గుణనిధి. దానితో గురువుకి విషంపెట్టి అడ్డు తొలగించుకొన్నాడు. ఇక స్వేచ్చగా నిర్భయంగా ముక్తావళితో కాపురం సాగించాడు. ఆనోటా ఆనోటా వ్యాపించి గిరినాథునికి తెలిసింది. ఎంతగానో నొచ్చుకున్నాడు. గుణనిధిని పిలిపించి తల్లిడండ్రులిద్దరూ గట్టిగా మందలించారు. దానితో ఆ దుష్టుడు అలిగి వారికే విషంపెట్టాడు. తండ్రికూడబెట్టిన ధనసంపదలతో ముక్తావళిని భోగభాగ్యాలలో ముంచితేల్చాడు. సురాపాన మాంసభక్షణలకు అలవాటు పడ్డాడు. కాలం గడిచింది. సంపదలు తరిగిపోయాయి. ఆస్తులు కరిగిపోయాయి. ధనంకోసం దొంగతనాలకు దిగాడు. గ్రామస్థులంతా మేల్కొన్నారు. సంఘ బహిష్కారం విధించారు. ఇక చేసేది లేక ముక్తావళీ గుణనిధులు అడవులకు పోయారు. దారిదోపిడీలు చేశాడు. అడవిగుండా వెళ్ళే ప్రతిమనిషినీ చంపి సామ్ములు దోచుకున్నాడు. ముక్తావళితో మురిపాలు తీర్చుకున్నాడు. చాలాకాలం సాగింది.

ఒకనాడు హఠాత్తుగా గుణనిధి మరణించాడు. యమదూతలు వేలసంఖ్యలో వచ్చిపడ్డారు. శివలోకంనుంచి శివగణాలూ వచ్చాయి. రెండు వర్గాలకూ వాదం జరిగింది. ఇతడు చేసిన పుణ్యకార్యం ఒక్కటయినా ఉందా? అని యమదూతలు ప్రశ్నించారు. ఇతడిని తీసుకువెళ్ళటానికి శివదూతలుగదా మీరు రావడమేమిటని పరిహసించారు. దానికి శివదూతలు చెప్పిన సమాధానం ఎమిటంటే -

యమదూతలారా! ఈ గుణనిధి మరణించినచోట నేలలో పదిమూరల లోతున రుద్రాక్ష ఉంది. దాని ప్రభావంవల్ల ఇతడి పాపాలన్నీ అంతరించాయి. శివసన్నిధికి యోగ్యుడయ్యాడు. అందుకని తీసుకువెళ్ళడానికి వచ్చాం - అన్నారు. యమదూతలు కిమ్మనకుండా తిరుగుముఖం పట్టారు.

గుణనిధి దివ్యవిమానం అధిరోహించాడు. దివ్యరూపధరుడు అయ్యాడు. శివదూతలతో కలిసి శంకరుడి సన్నిధికి చేరుకున్నాడు.

రుద్రాక్ష మహిమ ఇంతటిది. వర్ణనాతీతం - అని శివుడు షణ్ముఖుడికి వివరించాడు. షణ్ముఖుడు కృతార్థుడనయ్యానని సంబరపడ్డాడు. నారదా! సదాచార ప్రసంగంలో రుద్రాక్షను గురించి నేనింత గొప్పగా చెప్పడానికి ఇదే కారణం. అది సర్వపావక్షయకరం, సర్వపుణ్యప్రదం.

రుద్రాక్షలు - అధిదేవతలు




No comments:

Post a Comment

Varieties of Bhasma - Bhasma Bhedalu - భస్మ భేదాలు

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - భస్మ భేదాలు విరించిపుత్రా! శాంతిక పౌష్టిక కామదభేదాలతో ఈ భస్మం మూడు విధాలు. ఇది నీకు కుతూహలం కలిగించే విషయం....