నారదా! శుద్ధమూ స్మార్తమూ పౌరాణమూ వైదికమూ తాంత్రికమూ శ్రౌతమూ ఆని ఆచమనం ఆరువిధాలు. మలమూత్రశౌచం తరవాత చెయ్యవలసినది శుద్ధాచమనం. ఆచాంతంలో (వైదికవిధుల్లో) స్మార్త పౌరాణికాచమనాలూ బ్రహ్మయజ్ఞాదుల్లో శ్రౌతవైద్దికాచమనాలూ ఆస్త్రవిద్యాదిసమయాల్లో తాంత్రికాచమనమూ చెయ్యాలి.
ఆచమించిన తరవాత ఓంకార గాయత్రిని జపిస్తూ శిఖను ముడివేసుకోవాలి. పునరాచమనం చేసి గుండెలనూ చేతులనూ బుజాలనూ మార్జించుకోవాలి. తుమ్మడం ఉమ్మడం పళ్ళుకుట్టుకోవడం అసత్యమాడటం పతితులతో సంభాషించడం - ఇలాంటివి చేసినప్పుడు కుడిచెవ్విని స్పృశించుకోవాలి, అగ్ని జల వాయుదేవతలూ సూర్యచంద్రులూ చతుర్వేదాలూ బ్రాహ్మణుడి కుడిచెవిలో ఉంటాయి.
అటుపైని నదికో నూతికో చెరువుకో వెళ్ళి ప్రాతఃస్నానం చెయ్యాలి. శరీరాన్ని పరిశుభ్రపరచుకోవాలి. నవద్యారాల్లోనూ మలినం ఉంటుంది. తోముకుని కడిగి శుభ్రపరచాలి. అగమ్యాగమన - ప్రతిగ్రహ - రహస్యాచరిత పాపాలన్నీ స్నానంతో ప్రక్షాళితమవుతాయి. స్నానం చెయ్యకుండా ఆచరించే సత్కర్మలన్నీ నిష్ఫలమవుతాయి. కనక నిత్యమూ ప్రాతఃస్నానం చెయ్యాలి. అదీ దర్భలు చేతబట్టుకునే చెయ్యాలి. హోమకాలం దాటిపోకుండా ప్రాతఃస్నానం ముగించుకోవాలి. స్నానంకాగానే సంధ్యావందనమాచరించాలి. ఏడురోజులపాటు ప్రాతఃస్నానం చెయ్యకపోయినా, మూడురోజులు సంధ్యవార్చకపోయినా, పన్నెండు రోజులు అగ్నికార్యం ఎగ్గొట్టినా ద్విజుడు కులభ్రష్టుడవుతాడు.
నారదా! గాయత్రికన్నా గొప్పమంత్రం ఇహపరాలలో ఎక్కడా లేదు. గానం చేసేవాడిని (జపించేవాడిని) కాపాడుతుంది. కనక గాయత్రి - అన్నారు.
ముమ్మారు ప్రాణాయామం చేసి ప్రణవాక్షర సహితంగా వ్యాహృతిత్రయ సమన్వితంగా (భూర్భువస్స్వః) గాయత్రీమంత్రాన్ని జపించాలి. స్వధర్మనిరతుడూ శ్రుతిసంపన్నుడూ అయిన బ్రాహ్మణుడు వైదికగాయత్రినే జపించాలి తప్ప లౌకికమంత్రాన్ని (వ్యాహృతిరహితం) జపించకూడదు. మంత్రజపంతో కలిపి ప్రాణాయామంచేస్తే అది సగర్భమవుతుంది. ఆమంత్రకంగా ధ్యానమాత్రంగా చేస్తే అగర్భమంటారు. స్నానాంగంగానే దేవ ఋషి పితృతర్పణాలు పూర్తిచేసి గట్టుకి వచ్చి శుభ్రవస్త్రాలు ధరించాలి. అప్పుడూ - విభూతి ధారణ, రుద్రాక్షధారణ. ఇదే వరసలో చెయ్యాలి.
No comments:
Post a Comment