Friday, July 31, 2026

Sadhaachaara Niruupana - సదాచార నిరూపణ

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - సదాచార నిరూపణ

నారదా! అడగవలసింది అడిగావు. సదాచారాన్ని అనుష్ఠిస్తే చాలు దేవి సంతోషిస్తుంది. తెల్లవారి లేచింది మొదలుకొని పడుకునే వరకూ సజ్జనులు చెయ్యవలసిన దినచర్య ఏమిటో చెబుతాను. విను, సూర్యోదయంనుంచి సూర్యాస్తమయంవరకూ పుట్టింది మొదలు గిట్టేవరకూ సత్కర్మలే ఆచరించాలి. నిత్యకర్మలూ నైమిత్తిక కర్మలూ కామ్యకర్మలూ ఉంటాయి. వీటిని శ్రద్ధగా చెయ్యాలి. నింద్యకర్మల జోలికి పోకూడదు. జీవికి కడదాకా సహాయంగా నిలిచేది ధర్మమొక్కటే. తల్లిదండ్రులుగానీ భార్యాపుత్రులుగానీ జ్ఞాతిమిత్రులుగానీ ఎవ్వరూ నిలవరు. తాను ఆచరించిన ధర్మమే తనకు సహాయకారి.

అందుచేత సాధనాలన్నింటినీ ఉపయోగించుకుని ధర్మాన్ని సమకూర్చుకోవాలి. అదే చీకటినుంచి వెలుగులోకి నడిపిస్తుంది. ఆచారమే ఉత్తమోత్తమ ధర్మం. ఆది ఆయుర్వర్ధకం, వంశవర్ధకం, సంపద్వర్థకం, పాపనాశకం, శుభప్రదం. ఆచారాన్ని మించిన ధర్మం లేదు. ఇహపరాలలో సుఖప్రదం. ఆజ్ఞానులై సంసారసాగరంలో కొట్టుమిట్టాడేవారికి ఇది ధర్మద్వీపం. ముక్తిమార్గప్రదర్శకం. ఆచారంవల్ల శ్రేష్ఠత లభిస్తుంది. ఆచారంవల్ల కర్మఫలిస్తుంది. దానివల్ల జ్ఞానం లభిస్తుంది. ఇది మనువు చెప్పిన వాక్యం. ఆచారమంటే ధర్మాలలోకెల్లా ఉత్తమోత్తమం. పరమతపస్సు. జ్ఞానాదిసర్వవిషయాలకూ అదే సాధకం.

శాస్త్రీయమనీ లౌకికమనీ ఈ ఆచారం రెండు విధాలు. రెండూ అనుష్టింపదగినవే, దేనినీ పరిత్యజించడానికి వీలులేదు. గ్రామ జాతి దేశ కులధర్మాలుంటాయి. వాటిని పాటించాలి ఉల్లంఘించకూడదు. దురాచారుణ్ణి లోకం నిందిస్తుంది. వాడు దుఃఖభాజనుడవుతాడు. వ్యాధి పీడితుడవుతాడు. ధర్మవిరుద్ధమైన అర్థకామాలను పరిత్యజించాలి. అలాగే లోకవిరుద్ధమైన ధర్మాన్నీ పరిత్యజించాలి. అది సుఖప్రదం కాదు కనక.

నారాయణమహర్షీ! మనకు శాస్త్రాలు అనేకం ఉన్నాయి. ధర్మమార్గాన్ని నిర్ణయించడంలో దేన్ని ప్రమాణంగా తీసుకోవాలి అనేది పెద్ద సందేహం.

నారదా! సందేహం ఏమీ లేదు. శ్రుతి స్మృతులు రెండూ రెండు కళ్ళు. పురాణమే హృదయం. ఇవి మూడూ చెప్పినదే ధర్మం. మరోటి కాదు. ఈ మూడింటిలోనూ పరస్పరవిరోధం కనిపిస్తే అక్కడ వేదానిదే తుది తీర్పు. స్మృతి పురాణాలకన్నా వేదం చెప్పినదే ప్రమాణం. వేదంలోనే ద్వైధీభావం కనిపిస్తే అప్పుడు అవి రెండూ ధర్మాలుగానే పరిగణించాలి. స్మృతులలో 
ద్వైధీభావం కనిపించినా ఇంతే. వేదంతో సరిచూసుకోవాలి. కొన్నిచోట్ల పురాణాలలోనూ తంత్ర గ్రంథాలలోనూ కనిపించేవాటి నికూడా యథాతథంగా ధర్మాలుగా స్వీకరించాలని కొందరు అంటున్నారు. కానీ అది సరికాదు. వేదవిరుద్ధం కానంతవరకే పురాణాలుగాని తంత్రగ్రంథాలుగానీ ప్రామాణికాలు. ప్రత్యక్షంగా శ్రుతివిరుద్ధమైన ధర్మం ఎవరు చెప్పినా అప్రామాణికమే. ధర్మమార్గ నిర్ణయంలో సర్వదా సర్వథా వేదమొక్కటే పరమప్రమాణం. దానికి అవిరుద్ధంగా ఉంటే స్మృతులూ పురాణాలూ తంత్ర గ్రంథాలూ చెప్పినవికూడా కొండొకచో ప్రామాణికాలు అవుతాయి. మరింకేదీ ప్రామాణికం కానేకాదు.

వేదధర్మాన్ని కాదని ఇతర ప్రమాణాలను పట్టుకుని ఆ మార్గాల్లో నడిచేవారికోసం యమలోకంలో నరకకుండాలు సిద్ధంగా ఉన్నాయి. అందుచేత వేదోక్తమే ధర్మం. దానినే ప్రయత్నపూర్వకంగా ఆచరించాలి. స్మృతులూ పురాణాలూ తంత్రాలూ శాస్త్రాలూ ఏది చెప్పినా వేదమూలమైనంతవరకే ప్రామాణికం. కొందరు ఏవేవో కుశాస్త్రాలను ప్రమాణాలుగా చూపించి ప్రజలను తప్పుదారి పట్టిస్తుంటారు. అటువంటివారు నరకానికి పోతారు. అక్కడ తలక్రిందులుగా వేలాడతారు. వేదవిరుద్ధమైన ధర్మాలను ఆచరించే వామాచారులూ పాశుపతులూ లింగధారులూ తప్తముద్రాంకితులైన వైఖానసులూ వగైరా అందరూ నరకలోకానిక పోతారు. అందుచేత వేదం ఒప్పుకున్నదే సద్ధర్మం. దానినే ఆచరించాలి. మరింక దేనిని అనుసరించినా నరకమే.

నారదా! మానవుడు పడుకోబోయేముందు ఆ రోజంతా తాను చేసినదీ చేయించినదీ, అన్నదీ అనిపించినదీ, ఇచ్చినదీ ఇప్పించినదీ ఒక్కసారి సమీక్షించుకోవాలి. ధర్మబద్ధంగా ఉన్నాయా లేదా పరీక్షించుకోవాలి. ధర్మబద్ధం కాని పనుల్ని మరుసటిరోజునుంచే పరిత్యజించాలి. నిద్రఅయ్యాక తెల్లవారు జామునే లేచి బ్రహ్మధ్యానం చెయ్యాలి. తొడల మీదకి కుడిఎడమలుగా అరికాళ్ళు పైకి వచ్చేట్టు బాసింపీట వేసుకుని కొంచెం ఎత్తయినచోట కూర్చోవాలి. నడుం నిటారుగా నిలబెట్టి వక్షస్సును నిగిడించాలి. కన్నులు మూసుకోవాలి. మనస్సును నిర్మలంగా ఉంచుకోవాలి. దంతాలను తాటించకూడదు. నాలుకను ఆడించకూడదు. ఇంద్రియాలను నిరోధించాలి. ఇలా కూర్చుని రెండుమూడుసార్లు ప్రాణాయామం చెయ్యాలి. హృదయంలో దీపంలాగా ఇష్టదైవాన్ని ధ్యానించాలి.

ప్రాణాయామం




No comments:

Post a Comment

Varieties of Bhasma - Bhasma Bhedalu - భస్మ భేదాలు

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - భస్మ భేదాలు విరించిపుత్రా! శాంతిక పౌష్టిక కామదభేదాలతో ఈ భస్మం మూడు విధాలు. ఇది నీకు కుతూహలం కలిగించే విషయం....