Thursday, July 30, 2026

The Story of Manasa Devi - మానసా దేవి కథ

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - మానసా దేవి కథ

నారదా! ఇప్పూడింక ఆవిడ కథ చెబుతాను విను. పూర్వం ఒకప్పుడు భూలోకంలో మానవులంతా సర్పభయాక్రాంతులయ్యారు. మహామునీశ్వరుడు కశ్యపుణ్జి శరణువేడారు. ఆయన తన తండ్రి బ్రహ్మదేవుడి సహాయంతో వేదాలనుంచి బీజాక్షరాలను ఏరి మంత్రాలు సృష్టించాడు. వాటికి అధిష్టానదేవతగా చతుర్ముఖుడు మనసాదేవిని సృష్టించాడు. ఆవిడ సద్యోయౌవనం పొంది శివుడి మందిరానికి వెళ్ళింది. భక్తితో పూజించి శంకరుణ్ణీ స్తుతించింది. వెయ్యి దివ్యవత్సరాలు సేవలు చేసింది. శివుడు అసలే ఆశుతోషుడుకదా!(వెంటనే సంతోషించే భోళాశంకరుడు) మనసకు మహాజ్ఞానం ఉపదేశించి సామవేదం అభ్యసింపచేశాడు. లక్ష్మీ మాయా కామబీజాక్షరాలతో కృష్ణాయస్వాహా అనే మంత్రరాజాన్ని ఉపదేశించాడు. పూజా పునశ్చర్యాదుల్ని చెప్పాడు. పుష్కరక్షేత్రానికి వెళ్ళి తపస్సు చెయ్యమని ఆజ్ఞాపించాడు.

మనసాదేవి మూడుయుగాలు నిష్ఠగా తపస్సు చేసింది. శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. సకలజన పూజితవు అవుతావని వరం ఇచ్చాడు. ప్రథమపూజ తానే చేశాడు. రెండవపూజ శంకరుడు చేశాడు. ఆటుపైని కశ్యపుడూ దేవతలూ మునులూ మనువులూ నాగజాతివారూ మానవజాతివారూ అందరూ పూజించారు. త్రిలోకవందిత అయ్యింది.

కశ్యపప్రజాపతి జరత్కారు మునీంద్రుడికి ఈ మనసాదేవిని కన్యాదానం చేశాడు. అయాచితంగా లభించిందనీ బ్రాహ్మణుడి ఆజ్ఞ అనీ ఆ మునీంద్రుడు కాదనకుండా స్వీకరించాడు. ఇద్దరికీ వివాహం జరిపించి కశ్యపుడు తపస్సులకి వెళ్ళిపోయాడు.

ఒకనాడు పుష్కరక్షేత్రంలో మర్రిచెట్టు నీడలో పరమనైష్ఠికుడు జరత్కారువు తన మనసాదేవి ఒడిలో తల అన్చి నిద్రాదేవిని ఆవాహన చేసుకుని గాఢంగా నిద్రపోయాడు. కొంతసేపటికి సూర్యుడు అస్తమించబోయాడు. సాయంసంధ్యాసమయం సమీపించింది. ఇప్పుడు లేచి సంధ్యావందనం చెయ్యకపోతే తన భర్తకు ధర్మలోపం వస్తుందే, ఎలాగా - అని మనసాదేవి కళవళపడింది.

బ్రాహ్మణుడికి ప్రాతస్సాయం సంధ్యావందనాలు నిత్యవిధులు. ఇవ్వి చెయ్యకపోతే బ్రహ్మహత్యా మహాపాతకం చుట్టుకుంటుంది. ఇక కర్మాచరణకూ పనికిరాడు. అశుచి అయిపోతాడు ఆని వేదం
చెబుతోంది.

మనసాదేవికి ఇవన్ని జ్ఞాపకం వచ్చాయి. భర్తను బ్రహ్మహత్యామహాపాతకిని చెయ్యడంకన్నా నిద్రాభంగం కలిగించిన పాపానికి తాను ఒడిగట్టడమే మేలు అనుకుంది. అనుకోవడమేమిటి జరత్కారువును నిద్రలేపింది. ఆ మహానుభావుడు తాడిచెట్టంత ఎత్తున అలిగాడు.

సాధ్వీ! ఆదమరిచి సుఖంగా నిద్రపోతున్నాను. ఎందుకని నిద్రాభంగం కలిగించావు? భర్తకు అపకారంచేస్తే నోములూ వ్రతాలూ దానధార్మలూ అన్నీ నిష్ఫలమవుతాయని తెలియదా? భర్తను పూజిస్తే శ్రీకృష్ణపరమాత్మను పూజించినట్టే అన్నారు పెద్దలు. పతివ్రతావ్రతంకోసమే స్త్రీలకు భర్తరూపంలో శ్రీహరి స్వయంగా లభించేది. స్త్రీలు చేసే దాన - ధర్మ - యజ్ఞ - తీర్థస్నాన - వ్రత - తపో - దేవపూజా - సత్య - ఉపవాసాదికాలు అన్నీ కలిపినా పతిసేవాఫలంలో పదహారవవంతుకి సాటిరావు. భారతదేశంలో పతిసేవా పరాయణగా జన్మగడిపిన ఇల్లాలు భర్తతోసహా వైకుంఠానికీ బ్రహ్మలోకానికీ చేరుకుంటుంది. అప్రియం చేసినా పలికినా కుంభీపాకంలో ఆచంద్రార్కం నరకయాతనలు పడుతుంది. మరుజన్మలో పతిపుత్రరహితగా నీచపడుతుంది.

జరత్కారుడి కోపంచూసి మనసాదేవి గడగడలాడింది. మాటపెగలలేదు. స్వామీ! సంధ్యాలోప భయంతో నిద్రలేపాను. దుష్టురాలిని క్షమించు. శృంగార - ఆహార - నిద్రాభంగాలు చేసినవారు కాలసూత్ర నరకానికి పోతారని తెలుసు. అయినా సాహసించాను. శాంతించు - అని వేడుకొంది. పాదాలపై పడి వలవలా విలపించింది. అయినా జరత్కారుడు శాంతించలేదు. శపిస్తాను అంటూ కమండలూదకం చేతిలో పోసుకోబోయాడు.

సూర్యభగవానుడు సంధ్యాదేవీ సహితుడై ప్రత్యక్షమయ్యాడు. వినయంగానూ భయంభయంగానూ పలికాడు - మునీంద్రా! సూర్యాస్తమయం చూసి ధర్మలోపభయంతో నిన్ను నిద్రలేపింది ఈ సాధ్వి. నీ సుఖాన్ని పాడుచేద్దామనే ఉద్దేశంతో కాదు. కనక క్షమించు. శపించకు. ఆమె పక్షాన నేను శరణువేడుతున్నాను. బ్రాహ్మణుల హృదయం వెన్నలాగా ఉంటుందిట. వారికోపం క్షణికమట. ఆ క్షణంలోనే జగత్తును భస్మం చేసెయ్యగలరట. మళ్ళీ సృష్టించనూగలరట. బ్రాహ్మణుడికన్నా తేజస్వి లేడంటారు. నువ్వు బ్రహ్మదేవుడి వంశంలో పుట్టిన బ్రాహ్మణుడివి. బ్రహ్మతేజస్సుతో ప్రకాశిస్తున్నవాడివి. నువ్వే క్రోధవివశుడవైతే ఎలాగ? శాంతించు. శాంతించి శ్రీ కృష్ణపరమాత్మను ఉపాసించు.

సూర్యుడి ప్రబోధంతో జరత్కారువు కోపం చల్లారింది. శాంతించాడు. సంధ్యాసూర్యులను ఆశీర్వదించి పంపించాడు.

మనసా! శపిస్తాను అన్నానుకదా! శపించలేను. ప్రతిజ్ఞాభంగమూ చేసుకోలేను. కనక నిన్ను పరిత్యజిస్తున్నాను. ఈ క్షణంనుంచీ నీకూ నాకూ ఏ సంబంధమూ లేదు. వెళ్ళిపో - అన్నాడు. మనసాదేవికి నెత్తిమీద పిడుగువడినంతపని అయ్యింది. ఏమి చెయ్యడానికీ తోచలేదు. వెంటనే తన గురువు శంకరుడిని తన దేవుడు శ్రీహరినీ తన తండ్రి కశ్యపుడినీ సృష్టకర్తనూ స్మరించింది. వెంటనే ముగ్గురూ ప్రత్యక్షమయ్యారు. జరత్కారుడు ఆశ్చర్యపోయాడు. అందరినీ స్తుతించి పాదాభివందనాలు చేశాడు. ఒక్కసారిగా అందరూ ఇలా అనుగ్రహించారు. ఏమిటి ఆజ్ఞ - అన్నాడు.

బ్రహ్మదేవుడు శ్రీ హరికి పాదాభివందనంచేసి సమయోచితంగా పలికాడు. యోగీంద్రా! మనసాదేవి పతివ్రత. నీ ధర్మపత్ని. ఈవిడకు పుత్రభిక్ష పెట్టకుండా పరిత్యజించడం ధర్మమేనా? అన్నీ తెలిసినవాడవు. ధర్మపాలన చెయ్యి. ముందు పుత్రవతిని చెయ్యి. ఆ తరువాత నీ ఇష్టం. విడిచిపెట్టాలనుకుంటే విడిచి పెట్టు. అపుత్రకుడై వైరాగ్యంతో ధర్మపత్నిని పరిత్యజించినవాడి పుణ్యాలు జల్లెడలో నీళ్ళల్లాగా జారిపోతాయి.

బ్రహ్మోపదేశం పనిచేసింది. జరత్కారువు క్షణకాలం ఆలోచించాడు. ఇల్లాలికి దగ్గరగా వెళ్ళాడు, మంత్రపూర్వకంగా నాభిసంస్పర్శనం చేశాడు. మనసా! నువ్విప్పుడు గర్భవతివయ్యావు. పుత్రుడు జన్మిస్తాడు. జితేంద్రియుడు, ధార్మికుడు, బ్రహ్మవాది, తేజస్వి, తపస్వి, యశస్వి, గుణవంతుడు, వేదవేత్త, జ్ఞాని, యోగి, విష్ణుభక్తుడూ అవుతాడు. నూర్గురు కొడుకులకి తండ్రి అవుతాడు. వంశాన్ని ఉద్ధరిస్తాడు. పితృదేవతలు ఆనందంతో నృత్యంచేస్తారు.

ప్రియా! నువ్వు పతివ్రతవు, సుశీలవు, నాకు ప్రియవాదినివి, ప్రియకారిణివి, ధర్మిష్ఠవు, కులస్త్రీవి, కులపాలితవు. ఇప్పుడిక సత్పుత్రజనయిత్రివి. ఇంతకన్నా జీవితానికి ఏమికావాలి! సంతృప్తి చెందావుకదా!

మనోహారిణీ! మరొక రహస్యం చెబుతాను, శ్రద్ధగా విను. జీవితంలో మనకి నిజమైన బంధువు ఎవరంటే - హరిభక్తిని ప్రబోధించేవాడే. అంతేగానీ అభీష్టసుఖాలను ఇచ్చేవాడు కాదు. హరిభక్తి మార్గాన్ని చూపించేవాడే అసలైన తండ్రి. గర్భవాసవిమోచన కలిగించేదే అసలైన తల్లి. యమభీతిని తొలగించే దయామయియే అసలైన సోదరి. విష్ణుమంత్రాన్ని ఉపదేశించి విష్ణుభక్తిని ప్రసాదించినవాడే సినలైన గురువు. కృష్ణభావనరూపమైనదే నిజమైన జ్ఞానం. దాన్ని కలిగి స్త్రీనే గురువు. బ్రహ్మాది స్తంబపర్యంత౦ ఈ చరాచరజగత్తు అంతా ఆ శ్రీకృష్ణపరమాత్మనుంచే ఆవిర్భవిస్తోంది. అతనిలోనే లీనమవుతోంది. ఇది తెలుసుకోవడంకన్నా జ్ఞానం వేరే లేదు. వేదాలు చెప్పనీ, యజ్ఞాలు ఇవ్వనీ అన్నింటి సారమూ హరిసేవనమే. తత్త్వలన్నింటికీ సారభూతుడు శ్రీ హరి. తక్కినవన్నీ వట్టి విడంబనలు. ఈ జ్ఞానాన్ని నీకు ఉపదేశిస్తున్నాను నీ స్వామిని కనక. జ్ఞానంవల్ల బంధనాలు తెగిపోతాయి. కనక అదే మన మిత్రం. బంధాలను కలిగించేది ఏదైనా ఎవరైనా శత్రుసమానమే. విష్ణు భక్తియుతమైన జ్ఞానాన్ని ఇవ్వలేనివాడు గురువుకాదు - రిపువు. బంధనాలు తెంచలేడు కనక శిష్యఘాతకుడు, అటువంటివాడు గురువూ కాదు, తండ్రీకాదు, బంధువూ కాదు. పరమానందరూపమూ అనశ్వరమూ అయిన కృష్ణభక్తిమార్గాన్ని చూపించలేనివాడు ఏమి బంధువు!

సాధ్వీ! శ్రీకృష్ణుడు అచ్యుతుడు. నిర్గుణుడు. పరబ్రహ్మ అతడిని సేవిస్తే కర్మబంధనాలు పటాపంచలవుతాయి. హృదయేశ్వరీ! ఎదో వంకపెట్టి నిన్ను పరిత్యజిస్తున్నాను. దీన్ని క్షమించు. నీవంటి పతివ్రతలు ఓర్పూ సహనాలకు పెట్టింది పేరు. సత్త్వగుణానికి పుట్టిళ్ళు. అంచేత క్రోధాన్ని ఇట్టే జయించగలకు.

మనసాదేవీ! పుష్కరక్షేత్రంలో తపస్సుకి వెడుతున్నాను. మరింక నీ ఇష్టం. ఎక్కడికైనా వెళ్ళు. నీకు సుఖమగుగాక! నావంటి నిస్ఫృహుల కోరికలు శ్రీకృష్ణుడి పాదపద్మాలపైనేకదా!

జరత్కారుడి ఉపదేశం మనసాదేవి మనస్సుకు ఎక్కింది. అయినా దుఃఖం ఉపశమించలేదు. కన్నీరు జాలువారుతూనే ఉంది. మెల్లగా కూడదీసుకుని -

ప్రాణవల్లభా! పరిత్యజించవలసినంతటి నేరం నేనేమీ చెయ్యలేదు. నిద్రాభంగం చేశానంటే నీ మంచికోసమే. అయినా పరిత్యజిస్తున్నావు. నీ ఇష్టం. సరే, నాకొక వరం ఇయ్యి. నేను స్మరించినప్పుడల్లా నువ్వు దర్శనం ఇవ్యాలి. బంధువియోగం కన్నా పుత్రవియోగం బాధాకరం. భర్తృవియోగం అన్నింటికన్నా ప్రాణాంతకం. పతివ్రతలకు భర్త అంటే శతపుత్రాధికంగా ప్రీతిపాత్రుడు. స్త్రీలకు మగడికన్నా ప్రీతిపాత్రం ఈ సృష్టిలోనే లేదంటారు అందుకే.

వైష్ణవులకు విష్ణుమూర్తిమీద ఒకే పుత్రుడున్న వారికి ఏకైకపుత్రుడిమీద, ఒంటికన్నువారికి ఆ కన్నుమీద దప్పికగొన్నవారికి నీటిమీద, ఆకొన్నవారికి అన్నంమీద, కాముకులకు మైథునంమిద, దొంగలకు పరాయిసాత్తుమీద, కులటలకు జారుడిమీద, పండితులకు శాస్త్రంమీద, వణిజులకు వ్యాపారంమీద ఎంతమోజు ఉంటుందో సాధ్వీమణులకు భర్తమీద అంత మనసుంటుంది. కాబట్టి కనీసం ఈ వరమైనా అనుగ్రహించు - అని కాళ్ళమీద వ్రాలి ప్రాధేయపడింది.

జరత్కారుడు మనసాదేవిని చటుక్కున గుండెలకు హత్తుకున్నాడు. ఆపుకోలేని కన్నీటితో తడిపి ముద్దచేశాడు. వియోగభీతితో మనసాదేవీ అలాగే అతడి గుండెల్ని బాష్పధారలతో తడిపేసింది. క్షణకాలం విలపించి తేరుకున్నారు. జ్ఞానశక్తితో శోకాన్ని తొలగించుకున్నారు. ఎవరికివారే ఊరడించుకున్నారు.

మెల్లగా విడిచి పెట్టి మనసకు ధైర్యంచెప్పి, శ్రీ కృష్ణుడి పాదపద్మాలను తలుచుకుంటూ జరత్కారుడు వెళ్ళిపోయాడు. మనసాదేవి గుండెదిటవు చేసుకుని తన గురువు శంకరుడి మందిరానికి వెళ్ళిపోయింది.

ఆస్తీక వృత్తాంతం


No comments:

Post a Comment

Vindhyavasini - వింధ్యవాసిని

శ్రీ దేవీ భాగవతం దశమ స్కంధము -  వింధ్యవాసిని శ్రీహరి నాభిపద్మం నుంచి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. ఆయన జగన్నిర్మాత. సృష్టికర్త. లోకపితామహుడు. ...