Thursday, July 30, 2026

Radhika Aradhana - రాధికారాధన

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - రాధికారాధన

నారాయణమహర్షి! ప్రకృతిశక్తుల ఉపాఖ్యానాలన్నీ చెప్పావు. భుక్తిముక్తిప్రదాలు. విని ఆనందించాను. వేదాలలో నిగూఢంగా ఉన్న రెండు ఉపాఖ్యానాలు మిగిలిపోయాయి. వాటిని కూడా నీ ముఖతః వినాలని ఉంది. రాధాదేవి - దుర్గాదేవి. వీరి మహిమలు ఇప్పటికే చాలా చెప్పావు, చరాచరజగత్తు ఆంతా వారి అంశయే - ఆని తెలుసుకున్నాను. కానీ వారిని పూజించే విధానమేమిటో తెలియజెప్పలేదు. అదొక్కటి చెబితే విని తరిస్తాను.

నారదా! ఈ ఉపాఖ్యానం ఇంతవరకూ ఎవరూ నన్ను అడగలేదు. ఎవరికీ నేను చెప్పలేదు. నువ్వే అడిగావు. నీకే చెబుతున్నాను. ఇది పరమరహస్యం. సారాత్‌ సారం. పరాత్‌ పరం. గోప్యంగా ఉంచాలి. ఎవరికిబడితే వారికి చెప్పెయ్యకూడదుసుమా!

జగత్సృష్టికి మూలస్వరూపిణులు ఇద్దరు. ఒకరు ప్రాణశక్తి. ఒకరు బుద్ధిశక్తి, విరాడాది చరాచర జగత్తు అంతా ఈ రెండుశక్తులకూ అధీనమై ఉంటుంది. వీరి అనుగ్రహం కలగనంతవరకూ ఏ జీవికీ మోక్షం లేదు. అంచేత అందరూ ఈ ఇద్దరినీ సేవించవలసిందే. ముందుగా రాధికామంత్రం విను. 

శ్రీరాధాయై స్వాహా అనేది షడక్షరీ మూలమంత్రం. దీనికి ఆదిలో మాయాది మహాబీజాక్షరాలను వాంఛితాలకు అనుగుణంగా చేర్చుకోవచ్చు. అది చతుర్విధ పురుషార్థాలనూ కోరికలనూ తీర్చడంలో చింతామణి. కోటిముఖాలున్నా శతకోటి నాలుకలున్నా ఈ మంత్రం శక్తిని ఎవ్వరూ వర్ణించలేరు. గోలోకంలో రాసమండలంలో శ్రీ కృష్ణపరమాత్మ మూలమహాదేవి నుంచి ముమ్మోదటగా ఈ మహామంత్రాన్ని ఉపదేశంగా స్వీకరించాడు. ఆయన విష్ణువుకి ఆయన బ్రహ్మకూ ఆయన విరాట్పురుషుడికీ ఆయన ధర్ముడికి చెప్పారు. ధర్ముడు నాకు అనుగ్రహించాడు. ఇప్పటికీ నేను అదేమంత్రాన్ని జపిస్తున్నాను. అందుకే ఋషిని కాగలిగాను. బ్రహ్మాదిదేవతలుకూడా నిత్యమూ ఈ మంత్రాన్నీ ఈ మంత్రాధిదేవతనూ ఆరాధిస్తుంటారు. రాధాదేవిని అర్చించకు౦డా కృష్ణపరమాత్మను అర్చించడానికి ఎవ్వరికీ అధికారం లేదు. రాదు. అంచేత వైష్ణవులు విధిగా రాధార్చన చెయ్యాలి.

రాధాదేవి శ్రీకృష్ణుడికి ప్రాణాధిదేవి. కనక అతడు రాధికాధీనుడు. అతడికి రాధ నిత్యం రాసేశ్వరి, ఆవిడ లేకుండా అతడు ఉండడు. సకలకామాలనూ రాధిస్తుంది (తొలగిస్తుంది) కనక రాధ. 

రాధా మంత్రానికి ఋషిని నేనే. ఛందస్సు గాయత్రి. దేవత - రాధిక. తారమే బీజం. శక్తిబీజం. మూలావృత్తితో షడంగాలు చెయ్యాలి. సామవేదంలో చెప్పబడినట్టు ధ్యానం చెయ్యాలి.

శ్వేతచంపకవర్ణాభాం శరదిందుసమాననామ్‌ ।
కోటిచంద్రప్రతీకాశాం శరదంభోజలోచనామ్‌ ॥

బింబాధరాం పృథుశ్రోణీం కాంచీయుతనితంబినీమ్‌ ।
కుందపంక్తిసమానాభ దంతపంక్తి విరాజితామ్‌ ॥

క్షామాంబరపరీధానాం వహ్నిశుద్దాంశుకాన్వితామ్‌ ।
ఈషద్దాస్యప్రసన్నాస్యాం కరికుంభయుగస్తనీమ్‌


సదా ద్వాదశవర్షియాం రత్నభూషణభూషితామ్‌ ।
శృంగారసింధులహరీం భక్తానుగ్రహకాతరామ్‌ ॥

మల్లికామాలతీమాలా కేశపాశవిరాజితామ్‌ ।
సుకుమారాంగలతికాం రాసమండలమధ్యగామ్‌ ॥

వరాభయకరాం శాంతాం శశ్వత్‌ సుస్థిరయౌవనామ్‌ ।
రత్నసింహాసనాసీనాం గోపీమండలనాయికామ్‌ ॥

కృష్ణప్రాణాధికాం వేదబోధితాం పరమేశ్యరీమ్‌


రాధాదేవి శ్వేతచంపకవర్ణంలో ఉంటుంది. ఆవిడ వదనం శరచ్చంద్ర సమానం. కోటిచంద్రుల కాంతిని వెదజల్లుతూంటుంది. కన్నులు శరత్కాలంలో వికసించిన పద్మాల్లాగా ఉంటాయి. అధరం దొండపండే. శ్రోణీభారం విశాలం. కటిసీమలో బంగారు మొలనూలు. చిరుమువ్వల సవ్వడి. తీర్చిదిద్దినట్టున్న పలువరుస మల్లెమొగ్గలు ఏరి పేర్చినట్టుంటుంది. తెల్లని చీర. ఆగ్నిజ్వాలలాంటి అంచుతో పైటచెంగు. ప్రసన్నవదనం. చిరునవ్వులు చిందిస్తూంటుంది. ఎత్తయిన వక్షఃస్థలం. ఎప్పుడూ పన్నెండేళ్ళవయస్సే. రత్నాభరణాలు. శృంగారసింధువులో ఎగసిపడే కెరటం. భక్తులను అనుగ్రహించడానికి ఎల్లవేళలా ఆరాటపడుతూ ఉంటుంది. మల్లికామాలతీమాలికలు తురిమిన కేశపాశం. పూలతీగలాంటి సుకుమారశరీరం. ఎప్పుడూ రాసమండలాన మధ్యలో ఉంటుంది. వరదహస్తమూ అభయహస్తమూ. శాంతస్వరూప. ఎప్పుడూ తరిగిపోని యౌవనం. రత్ససింహాసనంమీద కూర్చుంటుంది. గోపీమండలానికి నాయిక. కృష్ణుడికి ప్రాణాలకన్నా ఎక్కువ. వేదాలు చెప్పిన పరమేశ్వరి రాధికాదేవియే.

ఇలా ధ్యానించి సాలగ్రామంలోగానీ కలశంలోగానీ అష్టదళయంత్రంలోగానీ దేవిని స్థాపించి పూజించాలి. అటుపైని దేవతలను ఆవాహనచేసి ఆసనాదులను సమర్పించాలి. అన్నీ మూలమంత్రోచ్చారణతోనే చెయ్యాలి. పాదాలకు పాద్యం శిరస్సుపై అర్ఘ్యం ముఖానికి ఆచమనీయం రెండేసిసార్లు మంత్రపూర్వకంగా సమర్పించాలి. మధుపర్కం ఇవ్వాలి. పాడి ఆవును ఇవ్వాలి. అటు పైని స్నానశాలకు తీసుకువెళ్ళాలి. అభ్యంగనస్నానం చేయించాలి. నూతనవస్త్రాలు ఇవ్వాలి. అలంకారపూర్వకంగా చందనచర్చ జరపాలి. తులసీదళాలు పొదిగిన పుష్పమాల అలంకరించాలి. ఆందులో పారిజాతాలూ పద్మాలూ ఉండాలి. ఈ అర్చన ఆయ్యాక పరివార దేవతలను అర్చించాలి. నాలుగు విదిక్కుల నడుమ అంగపూజ చెయ్యాలి. అష్టదళ పద్మంలో దక్షిణావర్తంగా పరివారదేవతలను నిలపాలి. తూర్పు దళంలో మాలావతిని, ఆగ్నేయదళంలో మాధవిని, దక్షిణదళంలో రత్నమాలను, నైఋతికోణంలో సుశీలను, పశ్చిమదళంలో శశికళను, వాయవ్యకోణంలో పారిజాతను, ఉత్తరదళంలో పరావతినీ ఈశాన్యకోణంలో సుందరిని ఆవాహన చెయ్యాలి. వీరికి వెనకతట్టున దిక్పాలకులను నిలపాలి. వారివారి ఆయుధాలనూ ఆవాహన చెయ్యాలి. అప్పుడు ఆవరణసహిత రాధాదేవిని గంధాదులతో దేవోపచార రాజోపచారాలతో అర్చించాలి.

తతో దేవీం సావరణాం గంధాద్యైరుపచారకైః

రాజోపచారసహితైః పూజయేన్మతిమాన్నరః


ఇది అయ్యాక సహస్రనామార్చన చెయ్యాలి. ఇలా చేసిన భక్తుడు సాక్షాత్తూ విష్ణుతుల్యుడు అవుతాడు. గోలోకనివాసం పొందుతాడు. కార్తికపూర్ణిమనాడు రాధాజన్మోత్సవం చేస్తే రాసేశ్వరి సాన్నిధ్యాన్ని అనుగ్రహిస్తుంది. మంత్రాలను వర్ణసంఖ్యా విధానంగా పునశ్చరణ చెయ్యాలి. దశాంశం తిలాహోమం చెయ్యాలి. ఇంక రాధాస్తోత్రమేమిటంటే -

నమస్తే పరమేశాని రాసమండలవాసిని

రాసేశ్వరి నమస్తే
స్తు కృష్ణప్రాణాధిక ప్రియే ॥

నమస్త్రైలోక్యజనని ప్రసీద కరుణార్ణవే ।
బ్రహ్మవిష్ణ్వాదిభిర్దేవైః వంద్యమానపదాంబుజే ॥

నమః సరస్వతీరూపే నమస్సావిత్రి శంకరి ।
గంగాపద్మావతీరూపే షష్ఠిమంగళచండికే


నమస్తే తులసీరూపే నమో లక్ష్మీస్వరూపిణి

నమో దుర్గే భగవతి నమస్తే సర్వరూపిణి ॥

మూలప్రకృతిరూపాం త్వాం భజామః కరుణార్ణవామ్‌

సంసారసాగరాదస్మాత్‌ ఉద్దరాంబ దయాం కురు ॥

ఈ స్తోత్రాన్ని ముప్పొద్దులా పఠించేవారికి దుర్లభమన్నదే లేదు. జన్మాంతంలో గోలోక రాసమండలనివాసం తప్పదు.

దుర్గారాధన


No comments:

Post a Comment

Vindhyavasini - వింధ్యవాసిని

శ్రీ దేవీ భాగవతం దశమ స్కంధము -  వింధ్యవాసిని శ్రీహరి నాభిపద్మం నుంచి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. ఆయన జగన్నిర్మాత. సృష్టికర్త. లోకపితామహుడు. ...