నారదా! ఇప్పుడింక దక్షిణాదేవి వృత్తాంతం చెబుతాను. అదికూడా శ్రద్ధగా వినేసెయ్. గోలోకంలో సుశీల అని ఒక గోపిక ఉండేది. శ్రీహరికి ప్రేయసి. రూపయౌవన సౌందర్యాదులన్నింటా రాధాదేవిలాగానే ఉంటుంది. విద్యావతి, గుణవతి, కళావతి, కోమలాంగి. చక్కని పలువరుస కలిగిన సుందరీమణి(సుదతి). కమలలోచన. అవయవాల పాందికలో అద్వితీయ, నగుమోము, రత్నాలంకారాలు, దొండపండులాంటి పెదవి, యౌవనమధ్యస్థ(శ్యామ), లేడిచూపులు, హంసగమనం, కామశాస్త్రంలో ప్రవీణ, తెల్ల సంపంగి రంగు. కృష్ణుడి అంతరంగాన్ని ఎరిగి అలరించగల నెరజాణ, రసజ్ఞ, రసిక, రాసేశ్వరసోత్సుక, కృష్ణప్రియభామిని.
ఒకనాడు ఈ సుశీల ఒక పాదరింట్లో శ్రీకృష్ణుడితో క్రీడించి అలిసిపోయి అతడి ఒడిలో పడుకుని నిద్రపోయింది. అదే సమయానికి రాధాదేవి అటువైపు వచ్చింది. వీరిద్దరినీ చూసింది. కోపంతో భగ్గుమంది. కళ్ళు ఎర్రబడ్డాయి. ముఖం కందగడ్డలా మారింది. అధరం వొణుకుతోంది. శరీరం కోపం పట్టలేక ఊగిపోతోంది. తిట్టలేదు. కొట్టలేదు. చుర్రున చూసి గిర్రున తిరిగి విసవిసా నడచుకుంటూ వెళ్ళిపోయింది.
శ్రీకృష్ణుడు ముఖం దించుకున్నాడు. రాబోయే కలహాన్ని తలచుకుని భయపడ్డాడు. సుశీలను నిద్రలేపి చటుక్కున లేచి పారిపోయాడు. సుశీల వెంటబడింది. గోపగోపీజనం మూడులక్షల కోట్లమంది శ్రీకృష్ణుడిని అనుసరించారు. తమ పతి. తమ నాథుడు. తమను విడిచి వెళ్ళిపోతున్నాడు. అందరూ బోరుబోరున విలపిస్తూ వెంటబడ్డారు.
పారిపోతున్న కృష్ణుడినీ వెంటబడిన సుశీలనూ చూసింది రాధిక. కోపం ఆపుకోలేక సుశీలను శపించింది. ఈరోజునుంచీ సుశీల ఈ గోలోకంలో అడుగుపెట్టిందంటే భస్మమైపోతుంది - అనేసింది.
ఎంత బతిమాలినా ఆగకుండా కృష్ణుడు పారిపోయాడు. ఎటు వెళ్ళాడో ఎక్కడ దాక్కున్నాడో ఎవరికీ ఎంతకీ అంతుబట్టలేదు. ఉస్సురంటూ అందరూ తిరిగి వచ్చారు రాధమ్మను శరణువేడారు. కృష్ణుణ్ణి రప్పించమనీ కోపం ఉపసంహరించుకోమనీ పాదాలుపట్టి ప్రార్థించారు.
రాసేశ్వరి రాధాదేవి రాసమండలంలో నిలబడి శ్రీకృష్ణుడిని ఆవాహన చేసింది. కానీ కృష్ణుడు ప్రత్యక్షం కాలేదు. రాధాదేవి ఆ విరహం తట్టుకోలేకపోయింది. క్షణం ఒక్కొక్కటీ కోటియుగాలై బరువుగా సాగుతోంది.
హేకృష్ణ! ప్రాణనాథా! ప్రాణేశా! చేరరావయ్యా! ప్రాణాధిక ప్రియా! ప్రాణాధిష్ఠానదేవతా! దర్శనం అనుగ్రహించు. నువ్వు కనిపించకపోతే సన్నిధిలో లేకపోతే ప్రాణాలు పోతున్నాయి. పతి సొభాగ్యంవల్లన కదా స్త్రీలకు గౌరవమూ గర్వమూ పెరిగేది! అందుకని సుఖంగా నిరంతరం ధర్మబద్ధంగా పత్తిని సేవించాలి. కులస్త్రీలకు మగడే బంధువు. ప్రాణాధిదేవత. సకల సంపత్స్వరూపుడు. మూర్తీభవించిన భోగం, సుఖప్రదుడు, ధర్మప్రదుడు, ప్రీతికరుడు, శాంతిదాయకుడు. సమ్మానించి ఆదరించి అందరిలోనూ మన్నన కలిగించేవాడు మగడే. కోపాన్నీ అవమానాన్నీ తొలగించేవాడూ మగడే. సంసారంలో సారం మగడే స్వామి మగడే. బంధువుల్లోకల్లా ఆత్మబంధువు మగడే. భర్తకు సాటివచ్చె బంధువు మరొకడు ఏ బంధువర్గంలోనూ దొరకడు. భరిస్తాడు కనక భర్త, పాలిస్తాడు కనక పతి. శరీరానికి అధిపతి కనక స్వామి, కోరికలు తీరుస్తాడు కనక కాంతుడు. సుఖాలు సమృద్ధిగా అందిస్తాడు కనక బంధువు. ప్రీతి కలిగిస్తాడు కనక ప్రియుడు. ఐశ్వర్యం కలిగిస్తాడు కనక ఈశ్వరుడు. ప్రాణాలకు ప్రభువు కనక ప్రాణేశ్వరుడు. రతి సుఖం పంచుతాడు కనక రమణుడు. మగడిని మించిన ప్రియుడు మగువుకు మరొకడు లేడు. ఉండడు. మగడి శుక్లంవల్ల జన్మిస్తాడు కనక పుత్రుడు ఇష్టుడవుతున్నాడు. కానీ మగనాండ్రకు వందమంది బిడ్డలకన్నా మగడే ప్రియుడు. అతడిమీద ప్రేమ అంత అధికం.
అసత్కాంతలు మగడి ప్రాధాన్యాన్ని తెలుసుకోలేరు. సకలతీర్థాలలోనూ స్నానాలు చేసినఫలం, భూరి దక్షిణలతో యజ్ఞాలు చేసిన ఫలం, భూమికి ప్రదక్షిణలు చేసిన ఫలం, సర్వతపస్సులూ వ్రతాలూ దానాలూ ఉపవాసాలూ గురు విప్ర వేదసేవలూ చేసిన ఫలం, ఇంకా ఏమేమి సత్కర్మలున్నాయో అవన్నీ చేసినందువల్ల వచ్చే ఫలం - ఇవన్ని కలిపినా పతిపాదసేవా ఫలంలో పదహారవవంతుకి సరితూగవు. గురువుకన్నా విప్రుడికన్నా ఇంద్రుడికన్నా దేవుడికన్నా మగడే గొప్పవాడు. ఆరాధనీయుడు. పురుషులకు విద్యాదాత ఎంతటివాడో మగనాండ్రకు మగడు అంతటివాడు. లక్షల కోట్ల గోపగోపీజనాలకూ అసంఖ్యాక బ్రహ్మాండాలకూ వాటిలో ఉన్న జీవరాశులకూ విశ్వాది సమస్తగోళాలకూ అధినాయికను కాగలిగానంటే ఇదంతా శ్రీకృష్ణపరమాత్ముని ప్రసాదమే. అహంకారంతో నా కాంతుణ్ణి నేను తెలుసుకోలేకపోయాను. స్త్రీస్వభావం అటువంటిది. ఎంతటివారికైనా దురతిక్రమంకదా !
రాధాదేవి పశ్చాత్తాపంతో కుమిలిపోయింది. కంటికీ మంటికీ ఏకధారగా విలపించింది. నాథా! నాథా! అంటూ దిక్కులు పగిలేలాగా ఎలుగెత్తి అరిచి పిలిచింది. దర్శనం దేహి అంటూ యాచించింది. అయినా ఫలితం లేకపోయింది. స్వామి కనిపించలేదు. రాధాదేవి విలపిస్తూనే ఉంది. కృష్ణుణ్ణి ధ్యానిస్తూనే ఉంది.
ఇది ఇలా ఉండగా శాపగ్రస్తురాలైన ఆ సుశీల గోలోకంనుంచి వెళ్ళిపోయి చిరకాలం తపస్సుచేసి మహాలక్ష్మి శరీరంలో లీనమయ్యింది.
ఆ సమయంలోనే దేవతలందరూ కలిసి ఒక మహాయజ్ఞాన్ని నియమనిష్ఠలతో నిర్వహించారు. యజ్ఞం పూర్తి అయ్యిందిగానీ ఫలం దక్కలేదు. విషణ్ణులయ్యారు. ఎందుకిలా జరిగిందో తెలియక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన శ్రీహరిని ధ్యానించి సమాధానం పాందాడు. శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మీ శరీరంలో దక్షిణాంసంనుంచి సుశీలను తీసి దక్షిణాదేవి అని పేరుపెట్టి బ్రహ్మకు అప్పగించాడు. బ్రహ్మ యజ్ఞపురుషుడికి ఇచ్చాడు. యజ్ఞుడు యథావిధిగా దక్షిణాదేవికి పూజలుచేసి స్తుతించాడు.
కాగిన బంగారపు రంగులో ఉంది దక్షిణాదేవి. కోటిచంద్రులకాంతిని ప్రసవిస్తోంది. అత్యంత కమనీయంగా సుందరంగా ఉంది. మనోహరంగా ఉంది. కమలాస్య, కోమలాంగి, కమలాయతలోచన, కమలాంగసముద్భవ. కమలాసన పూజిత(బ్రహ్మార్చిత), వహ్నిశిఖలాంటి వస్త్రం ధరించింది. దొండపండుల్లాంటి పెదవులు, తీరిన పలువరుస, మాలతీపుష్పమాలికలు జడలో తురుముకుంది. చిరునవ్వులతో ముఖం ప్రసన్నంగా ఉంది. రత్నభూషణాలు దాల్చింది. సముచిత సుందరవేషం. సుస్నాత(తలంటుపోసుకుంది), మునీశ్వరుల మనస్సులకే సమ్మోహకంగా ఉంది. నొసట కస్తూరిబొట్టు, చందనపు చుక్క, పాపట సిందూరం ఉజ్వలంగా ఉంది. కటి జఘన భాగాలు బంధురంగా ఉన్నాయి. ఎత్తయిన వక్షస్థలం. కామదేవుడికి ఆధారదేవతలాగా ఉంది. కామబాణపీడిత.
ఈ దక్షిణాదేవిని దగ్గరగా చూసి యజ్ఞపురుషుడు సమ్మోహితుడై మూర్చిల్లాడు. బ్రహ్మదేవుడి ప్రబోధంతో తేరుకున్నాడు. పాణిగ్రహణం చేశాడు. నూరేళ్ళు నిర్జన ప్రదేశాలలో కామక్రీడలు సాగించారు. దక్షిణాదేవి గర్భవతి అయ్యింది. పన్నెండేళ్ళు మోసింది. సర్వయజ్ఞకర్మలకూ ఫలస్వరూపుడైన పుత్రుణ్ణి ప్రసవించింది. యజ్ఞయాగాది క్రతువులు పరిపూర్ణం కాగానే ఆయా ఫలాలను ఈ పుత్రుడు యజమానులకు అందిస్తాడు. దక్షిణాదేవితోనూ ఫలరూపుడైన పుత్రుడితోనూ కలిసి యజ్ఞుడు యజమాన యాజకాదులకు యజ్ఞకర్మఫలాలను అందిస్తుంటాడని వేదాలూ వేదవేత్తలూ చెప్పేమాట. ఆ ప్రకారం దేవతలకు యజ్ఞఫలాన్ని పంచిపెట్టాడు. అందరూ సంతృప్తి చెందారు. ఎవరి లోకాలకూ నెలవులకూ వారు వెళ్ళారు.
దక్షిణ లేని దానధర్మాలా
No comments:
Post a Comment