Thursday, July 30, 2026

The Story of Astika - ఆస్తీక వృత్తాంతం

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - ఆస్తీక వృత్తాంతం

వెళ్ళిందే కానీ అనుక్షణమూ అక్కడ దుఃఖిస్తూనే ఉంది. పార్వతీదేవి ధైర్యవచనాలు చెబుతూ ఊరడించింది. క్రమంగా నెలలునిండి సుముహూర్తాన పుత్రుణ్ణి ప్రసవించింది. తల్లి గర్భంలో ఉండి శంకరుడి నోటినుంచి వెలువడే జ్ఞానోపదేశాలను రోజూ విన్న ఆ శిశువు కాలక్రమాన యోగీంద్రుడూ జ్ఞానీంద్రుడూ అయ్యాడు. నారాయణాంశ సంభూతుడు.

శంకరుడే స్వయంగా జాతకర్మాదులు చేయించి ఉపనయనం జరిపించి వేదాలు నేర్పించాడు. పార్వతీ పరమేశ్వరులు బ్రాహ్మణులకు సువర్ణరత్నవస్త్రరాశులు పంచిపెట్టారు. వేదశాస్త్రాభ్యాసం అయ్యాక మృత్యుంజయమైన పరతత్త్వాన్నీ బ్రహ్మజ్ఞానాన్నీ ఉపదేశించాడు. కుర్రవాడికి గురువుపట్లా ఇష్టదేవత హరిపట్టా భక్తి అత్యధికంగా ఉండటాన్ని గుర్తించిన వారందరూ ఆస్తీకుడు ఆస్తీకుడు అన్నారు.

శంకరుడి ఆజ్ఞమీదట ఆస్తీకుడు తపస్సుకోసం పుష్కరక్షేత్రానికి వెళ్ళాడు. మూడులక్షల సంవత్సరాలు మహామంత్రాన్ని జపించి తపోధనుడై మహాయోగియై గురువు శంకరుణ్ణి నమస్కరించడానికి తిరిగివచ్చాడు. నమస్కరించి అక్కడే కొంతకాలం ఉండి తల్లితో బయలుదేరి తాతగారు కశ్యపుడి ఆశ్రమానికి చేరుకున్నారు. కశ్యపప్రజాపతి కూతురినీ మనుమడినీ చూసి ఆనందాశ్రువులు రాల్చాడు. బ్రాహ్మణులకు విందులు చేశాడు. నూరులక్షల రత్నాలు పంచిపెట్టాడు. కశ్యపుడి భార్యలు దితి - అదితి సంబరపడ్డారు. ఆశీర్వదించారు. తల్లీకొడుకులిద్దరూ చాలాకాలం అక్కడే నివసించారు.

ఆ కాలంలోనే అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్తు శృంగి అనే బ్రాహ్మణుడి శాపానికి గురి అయ్యాడు. ఇప్పటినుంచి ఏడు రోజుల్లోగా తక్షకుడనే సర్పరాజు నిన్ను కాటువేస్తాడని శృంగి శాపం. పరీక్షిత్తు భయపడిపోయి గాలీవెలుతురూ చొరని భవనంలో దూరి అన్ని రక్షణలూ ఏర్పాటు చేసుకుని రోజులు గడుపుతున్నాడు. ఆరురోజులు గడిచ్మాయి. ఏడవరోజు వచ్చింది.

పాతాళం నుంచి తక్షకుడు బయలుదేరాడు. రాజమందిరం దరిదాపుల్లో ధన్వంతరి కనిపించాడు, ఇద్దరికీ సంవాదం జరిగింది. ఇద్దరూ పరస్పరం సుప్రీతులయ్యారు. తక్షకుడిచ్చిన మణిని తీసుకు ధన్వంతరి వెళ్ళిపోయాడు. తక్షకుడు రాజగృహంలోకి చొరబడ్డాడు. మంచంమీద పడుకున్న పరీక్షిత్తుని కాటువేశాడు. అతడు మరణించాడు. పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు దారుణంగా దుఃఖించాడు. తండ్రికి అంతిమక్రియలు నిర్వహించాడు.

జనమేజయుడు సర్పజాతిమీద పగబట్టాడు. విప్రులతో చర్చించి సర్పయాగం ఆరంభించాడు. సృష్టిలో ఉన్న పాములన్నీ మంత్రశక్తిని తట్టుకోలేక గుంపులు గుంపులుగా హోమకుండంలో వచ్చిపడి మరణిస్తున్నాయి. తక్షకుడు భయాకులుడయ్యాడు. పరుగుపరుగున వెళ్ళి ఇంద్రుణ్ణి శరణువేడాడు. దేవేంద్రుడు అభయమిచ్చాడు. ఇది తెలిసిన జనమేజయుడి విప్రవర్గం ఇంద్రుడితో సహా తక్షకుణ్ణి హోమం చెయ్యడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. దానితో ఇంద్రాదిదేవతలు గడగడలాడారు. బృహస్పతి సలహాపై మనసాదేవిని ఉపాసించారు. ఆ తల్లి అనుగ్రహించి తన కుమారుడు ఆస్తీకుణ్ణి జనమేజయుడి సన్నిధికి పంపించింది.

ఆస్తీకుడంతటివాడు తన యజ్ఞానికి వచ్చాడని జనమేజయుడు సంబరపడ్డాడు. అతిథి మర్యాదలు చేశాడు. ఏమికావాలో కోరుకోమన్నాడు. ఇంద్ర తక్షకుల ప్రాణాలను కాపాడమని ఆస్తీకుడు అడిగాడు. విప్రులతో సంప్రదించి జనమేజయుడు అంగీకరించాడు. సర్పయాగాన్ని ముగించాడు. బ్రాహ్మణులందరికీ భూరిదక్షిణలిచ్చి కృతజ్ఞతలు చెల్లించి సాదరంగా సాగనంపాడు.

విప్రులూ మునిశ్వరులూ దేవతలూ వెళ్ళి మనసాదేవిని దర్శించారు. పూజలు చేశారు. ఎవరిమటుకు వారు స్తుతించారు. ఇంద్రుడు పూజాసంభారంతో వచ్చి శుచిగా భక్తిశ్రద్దలతో అర్చించాడు. షోడశోపచారాలూ చేశాడు. బ్రహ్మాదిదేవతలు ఆనందించారు.

నారదా! ఇదీ మనసాదేవి ఆఖ్యానం. ఏమన్నా సందేహాలున్నాయా? ఇంకా ఏదయినా వినాలనుకుంటున్నావా? అని కాసింత విశ్రాంతి తీసుకున్నాడు నారాయణమహర్షి.

ఇంద్రుడు చేసిన మానసా స్తోత్రం


No comments:

Post a Comment

Haridra Pasupu Ganapathi Pooja - (హరిద్రా) పసుపు గణపతి పూజ

శ్రీ పసుపు గణపతి పూజ. పూర్వాంగం ॥ అస్మిన్ హరిద్రాబింబే శ్రీ మహాగణపతిం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి ॥ ప్రాణప్రతిష్ఠ ఓం అసునీతే పునరస్మాసు చక్...