Wednesday, July 22, 2026

Equivalent to the sin of killing a Brahmin - bramahatyasamanaalu - బ్రహ్మహత్యాసమానాలు

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - బ్రహ్మహత్యాసమానాలు

మానినీమణీ! ఇక్కడ మరొక విశేషం నువ్వు తెలుసుకోవాలి. బ్రహ్మహత్య అంటే బ్రాహ్మణుడిని చంపడం అనేకాదు ఇంకా చాలా రకాలున్నాయి. శ్రీకృష్ణాది దేవతలపట్ల భేదబుద్ధిని పాటించి ఆదరానాదరాలు చూపిస్తే అది బ్రహ్మహత్యా సదృశం. అలాగే ఇష్టదైవమూ గురువూ తల్లిదండ్రులు - వీరిపట్ల హెచ్చుతగ్గులు పాటించినా దైవభక్తులపట్ల భేదబుద్ధిని చూపించినా విప్రపాదోదక సాలగ్రామ శిలోదకాలమధ్య భేదం పాటించినా హరిహర నైవేద్యాల మధ్య తారతమ్యం పరిగణించినా హరిహరులమధ్య భేదబుద్ది పాటించినా శక్తిభక్తులనూ శక్తి శాస్త్రాలనూ ద్వేషించినా పితృదేవతార్చనను పరిత్యజించినా హరినీ హరిభక్తులని నిందించినా అర్చించకపోయినా సర్వశక్తిస్వరూప మహాదేవిని నిందించినా కృష్ణాష్టమి శ్రీరామనవమి శివరాత్రి ఏకాదశి (ముక్కోటి) రవివారవ్రతం - ఈ అయిదు పర్వదినాలనూ జరపకపోయినా అంబువాచీ భూఖననం చేసినా (ప్రతినెలా ఆర్ద్రానక్షత్రంలో ప్రథమపాదంనుంచి మూడురోజులపాటు భూదేవి రజస్వలగా ఉంటుంది. అంబువాచి అంటారు. ఆ సమయంలో భూమిని దున్నకూడదని ధర్మశాస్త్రం.) గురు మాతాపితృభార్యాపుత్రుల్ని పోషించకపోయినా అవివాహితుడుగా సంతానం పొందినా బ్రహ్మహత్య చేసినట్టే. ఇదే ఆతిదేశిక బ్రహ్మహత్య.

గోవును కొట్టినా కొడుతున్నవారిని అడ్డుకోకపోయినా రక్షించకపోయినా గోబ్రాహ్మణులకు మధ్యనుంచి నడిచినా గోవులకు ఉచ్చిష్టం పెట్టినా వృషవాహకుడి ఆహారం కాజేసినా అగ్నినీ గోవునూ కాలితో తన్నినా కాళ్ళుకడుక్కోకుండా ఇంటిలోకి వచ్చినా తడికాళ్ళతో భోజనం చేసినా నిద్రించినా సూర్యోదయకాలంలో భుజించినా అవీరాన్న వేశ్యాన్నాలను తిన్నా యోనిజీవ్యుడైనా (తార్పుడుగాడు) సంధ్యావందనం ఎగ్గొట్టినా భర్తకూ దేవుడికీ మధ్య ఇల్లాలు భేదం పాటించినా మగడు ఇల్లాలిని కొట్టినా దేవతాప్రసాదాలను పంచిపెట్టకపోయినా అన్నింటికీ నాస్తినాస్తి అన్నా దేవగురు మిత్రద్రోహాలు చేసినా దేవ - గురు - పితృవందనం చేయకపోయినా, నమస్కరించినవాడికి ఆశీస్పూ విద్యార్థికి చదువూ అందించకపోయినా అన్నపుష్పాది పవిత్ర వస్తువులను దాటినా గోహత్య చేసినట్టే. దీన్నే ఆతిదేశిక గోహత్య అంటారు.

పురుషుడికి పరిణయమాడిన స్త్రీమాత్రమే గమ్య. తక్కిన వనితలందరూ అగమ్యులు. అంటే పొందుకోరరానివారు. అగమ్యాగమనం నూరు బ్రహ్మహత్యలతో సమానం. కుంభీపాక నరకమే శిక్ష అపరిశుద్ధుడుగా సంధ్యవార్చినా ఆసలు సంధ్యావందనమే చెయ్యకపోయినా అతడు సంధ్యాహీనుడు అవుతాడు. నరకానికి పోతాడు. వైష్ణవ శైవ శాక్త సౌర గాణప మహామంత్రాలలో ఎదో ఒకటి ఉపదేశంగా పొంది ఉపాసించాలి. అహంకరించి ఏ మంత్రోపదేశమూ పొందనివాడు అదీక్షితుడు. ఇతడికీ నరకం తప్పదు. పుణ్యక్షేత్రాలలో తీర్థాలలో అడిగి దానాలు పట్టేవాడు తీర్థవ్రతిగ్రాహి. దేవుడి పేరు చెప్పి పొట్టపోసుకునేవాడు దేవలుడు. సంధ్యాపూజాహీనుడిని ప్రమత్తుడు పతితుడు అంటారు. వీరూ వీరితోపాటు గ్రామయాజీ సూపకారుడూ (విప్రుడై ఇతరుల ఇంట భుజించేవాడు) కుంభీపాక నరకంలో పడతాడు ఇంకా ఎవరెవరు ఎయే కుండాలలో వెళ్ళిపడతారో చెబుతాను - సాధ్వీ! ఆలకించు.

సావిత్రీ! దేవతలను సేవించనిదే కర్మవినాశం కానేకాదు. సత్కర్మలు స్వర్గసుఖాలకూ జీవశుద్దికీ దుష్కర్మలు నరకయాతనలకూ దేహశుద్ధికీ హేతువులు.

వేశ్యాధనం అనుభవించేవాడూ వేశ్యాగమనం చేసిన బ్రాహ్మణుడూ కాలసూత్ర నరకకూపంలో శతవర్షాలు కష్టాలు అనుభవించి పై జన్మలో రోగపీడితుడై అటుపైని శుచి అవుతాడు. ప్రస్తావన వచ్చింది కనక స్త్రీలలో భేదాలు చెబుతాను. విను, ఒకడిని అగ్నిసాక్షిగా పరిణయమాడి త్రికరణశుద్ధిగా అతడితో జీవించేది పతివ్రత. రెండవ వాడితో సంపర్కం పెట్టుకుంటే కులట. ముగ్గురితోనైతే ధర్షిణి. నలుగురితో పుంశ్చలి. అయిదుగురితో వేశ్య. ఆర్గురితో పుంగి. ఎడుగురూ ఎనమండుగురూ ఇంకా ఆపైని పురుషులతో సంపర్కం చేస్తే మహావేశ్య. సర్వజాతుల్లోనూ ఇది అస్పృశ్య.

కులట నుంచి మహావేశ్యవరకూ ఎవరిని పొందినా ద్విజుడు కాలసూత్ర నరకానికి పోవడం తథ్యం. అటుపైని చేప కడుపున పుడతాడు. కులటాగామి ఒక శతాబ్దమూ ధర్షిణీ గామి నాలుగు శతాబ్దాలూ పుంశ్చలీగామి ఆరుశతాబ్దాలూ వేశ్యాగామి ఎనిమిది శతాబ్దాలూ పుంగీగామి పది శతాబ్దాలూ ఆ నరకంలో ఉంటాడు. మహావేశ్యాగామి నూరుశతాబ్దాలు నరకయాతన అనుభవిస్తాడు. అలాగే వీరు వరసగా - తిత్తిరి - వాయస - కోకిల - వృక - సూకర - శాల్మలీతరు జన్మలు ఏడేసి ఎత్తుతారు. 

సూర్యచంద్రగ్రహణాల రోజున జ్ఞానహీనుడై భోజనం చేసినవాడు అరుంతుదనరకంలో మెతుక్కి ఏడాదిగా దుఃఖాలు అనుభవిస్తాడు. అటు పైని ఉదరరోగపీడితుడుగా జన్మిస్తాడు. తనువంతా గుల్మాలతో (పుండ్లు) గుడ్డివాడుగా దంతహీనుడుగా దురపిల్లుతాడు. కడకు కర్మఫలం పూర్తయ్యి శుచి అవుతాడు.

నిశ్చయతాంబూలాలు పుచ్చుకుని మరొకడికి కన్యాదానం చేసినవాడు పాంశుకుండనరకానికి పోతాడు. పాంశువులే తింటూ నూరేళ్ళు తల్లడిల్లుతాడు. వీడిని యమదూతలు శరతల్పంమీద పొర్లిస్తారు. పార్థివలింగం చేసి భక్తితో అర్చించని విప్రుడు శివుడి కోపానికి గురి అవుతాడు. శూలప్రోతనరకంలో శతాబ్దంపాటు క్లేశాలు కుడిచి శ్వాపదంగా ఏడు జన్మలెత్తుతాడు. అటుపైని దేవలుడుగా ఎడుజన్మలు ఎత్తి కర్మఫలానుభవం పూర్తిచేసుకుంటాడు. విప్రుణ్ణి భయపెట్టినవాడూ అతడి దేవతార్చనాది సత్కర్మలకు అడ్డుతగిలినవాడూ ప్రకంపననరకంలో విప్రరోమాబ్ద పర్యంతం విలపిస్తాడు. అధికారివైపు ధిక్కారంగా కోపంగా చూసినవాడూ కటువుగా ఎదిరించి పలికినవాడూ సోల్ముకనరకంలో పడతాడు. అక్కడ నా కింకరులు రోజూ అతడి నోటిలో ఉల్కలను పడవేస్తుంటారు. వాడి శరీరంమీద వెండ్రుకలన్ని సంవత్సరాలపాటు రోజూ దండతాడనలు రుచిచూస్తూ యాతనలు పడతాడు. అటుపైని ఏడు జన్మలు ఆడదిగా పుట్టి వితంతువు అవుతాడు. అప్పటికి గానీ కర్మఫలానుభవం పూర్తికాదు.

ఇతరుడితో సంపర్కం పెట్టుకున్న బ్రాహ్మణి అంధకూపనరకానికి పోతుంది. పధ్నాలుగుమంది ఇంద్రులు మారేదాకా యమకింకరుల బాధలు అనుభవిస్తుంది. ఆటుపైని కాకిగా వెయ్యి జన్మలు ఎత్తుతుంది. పందిగా నూరుజన్మలు సృగాలిగా కుక్కుటిగా పారావతిగా వానరిగా నూరేసీ ఎడేసీ జన్మలు ఎత్తి కడపటికి మళ్ళీ మానవిగా రజక గృహంలో పుట్టి క్షయరోగ పీడితురాలై పుంశ్చలిగా మారి కుష్ఠవ్యాధికిలోనై మరణిస్తుంది. అప్పటికి దుష్కర్మఫలం పూర్తి అవుతుంది. వేశ్యలకు వేధననరకం పుంగికి దండతాడననరకం ధర్షిణీకి జలరంధ్రనరకం కులటకు దేహచూర్ణికానరకం స్వైరిణికి (మహావేశ్య) దళనకూపం ధృష్టకు (పతివంచక) శోషణనరకం తప్పవు. శతాబ్దాలపాటు ఈ నరకకుండాల్లో వారు యమయాతనలు పడతారు. మన్వంతరకాలం విణ్మూత్రభక్షణ చేస్తారు. ఆపైని విట్‌కృమిగా (మలక్రిమి) లక్షసంవత్సరాలు జన్మలెత్తితేగానీ కర్మవిశుద్ధి లభించదు. సవర్ణపారదారికులు (ఏకులంవాడు ఆ కులం పరకాంతతో) కషాయనరకకుండంలో పార్లుతారు. కషాయ తప్తోదకం తాగుతూ నూరేళ్ళు యాతనపడతారు. అనులోమ విలోమ పారదారికులు (అగ్రవర్ణ నిమ్నవర్ణ పరకాంతా సంగమం) స్త్రీపురుషులిద్దరూ శూర్పకూపంలో శూ
ర్పకారకృమి దష్టులవుతారు. యమదూతలు కాగిన మూత్రం తాగిస్తారు. దండతాడనలు సరేసరి. అటు పైని వరాహంగా ఛాగలంగా ఏడేసి జన్మలు ఎత్తి కర్మ విశుద్ది పాందాలి.

తులసీదళాన్ని చేతితో పట్టుకుని ప్రతిజ్ఞచేసి మాట తప్పినవాడు జ్వాలాముఖ నరకకూపంలోనూ గంగాజలం గోవు విప్రుడు సాక్షిగా ఆడితప్పినవాడూ దేవప్రతిమ ఎదుట శపథంచేసి జారిపోయినవాడూ కుడిచేతిలో కుడిచెయ్యివేసి ఆడితప్పినవాడూ దేవాలయంలో మాటతప్పినవాడూ - వీళ్ళంతా అదే నరకకూపంలో మటమటలాడతారు. మిత్రద్రోహి కృతఘ్నుడు విశ్వాసఘాతకుడూ కూటసాక్ష్యం చెప్పేవాడూ వీళ్ళందరికీ జ్వాలాముఖ నరకకూపమే గతి. చతుర్దశేంద్రకాల పర్యంతం శిక్ష అనుభవించి మ్లెచ్చ విట్‌కృమి బ్రహ్మకృమి సర్ప దేవల వ్యాఘ్ర నకుల గండక మండూక జన్మలు ఒక్కక్కరూ ఏడేసిఎత్తి ఎప్పటికో పరిశుద్ధులవుతారు.

నిత్యనైమిత్తిక క్రియలకు ఎగనామం పెట్టి వేదవాక్యాలను పరిహసించి వ్రతోపవాసాలను పరిహరించి పెద్దలమాటలను పెడచెవినిబెట్టి చెడు తిరుగుళ్ళు మరిగిన విప్రుడు ధూమ్రాంధకూపంలో శతాబ్దంపాటు యాతనపడి అటూ ఇటూ ఏడుతరాలుచెడి జలజంతువుగా నూరు జన్మలెత్తి కడపటికి శుచి కాగలుగుతాడు. దేవబ్రాహ్మణ పరిహాసకుడుకూడా ఇలాగే అదే నరకయాతన అనుభవిస్తాడు. వీడివంశంలో అటు పదితరాలకూ ఇటు పదితరాలకూ వీడిపాపం అంటుకుంటుంది. అటుపైని మూషకజాతిలో ఏడు జన్మలు ఎత్తుతాడు. పక్షిగా క్రిమిగా చెట్టుగా పశువుగా అనేక జన్మలెత్తి మనిషి అవుతాడు.

బ్రాహ్మణుడు దైవజ్ఞజీవి వైద్యజీవి చికిత్సకుడు లాక్షాలోహాది వ్యాపారి రసాదివిక్రయి అయినట్టయితే నాగవేష్టనరకంలో పడి సర్పవేష్టితుడవుతాడు. అటుపైని నానావిధ పక్షిజాతుల్లో పుట్టి కడపటికి నరజన్మ పాందుతాడు. అప్పుడు గణకుడుగా వైద్యుడుగా గోపాలుడుగా కర్మకారుడుగా రంగకారుడుగా ఏడేసి జన్మలూ ఎత్తి శుచి అవుతాడు.

సాధ్వీ! ప్రసిద్ధ నరకకుండాలగురించీ వాటిలో పడేవారి గురించీ యాతనల గురించీ పునర్జన్మల గురించి వివరంగా చెప్పాను. ఇవి కాక ఇంకా అప్రసిద్ద నరకకూపాలు అనేకం ఉన్నాయి. అవి చిన్నచిన్నవి. వాటిలో పడే పాతకులూ ఉన్నారు. దుష్కర్మఫలాలు అనుభవించి అనేకజన్మలు దురవస్థలనుభవించి పరిశుద్ధులవుతారు. నేను ప్రత్యక్షంగా ఎరుగుదును కనక వాటికి అధిపతిని కనక స్పష్టంగా తెలియపరిచాను. ఇంకా ఏమి తెలుసుకోవాలనుకుంటున్నావ్‌ - అని ముగించాడు యమధర్మరాజు.

నరకనివారణ


No comments:

Post a Comment

Remedies for Jupiter-related afflictions - గురుగ్రహ దోష నివారణ

గురుగ్రహ దోష నివారణ నవగ్రహాల్లో బృహస్పతి గ్రహం ఒకటి. దీన్నే గురుగ్రహం అని కూడా అంటారు. ఇది పురుష గ్రహం, బ్రాహ్మణ కులంగా కూడా చెబుతారు. సత్త్...