రామాయణం సుందరకాండ 44, 45, సర్గలు - మంత్రి పుత్రులు
అగ్ని సమతేజస్వులయిన రాక్షస మంత్రి నందనులు ఏడుగురూ సేనాసమేతులై, ధనుర్బాణాలు చేబూని, రథారూఢులై బయలుదేరారు. పరమ సంతోషంతో ధనుష్టంకారం చేస్తూ వారు వస్తున్నారు.
అంతకు ముందే కింకరగణం నిహతమయిందని విని వున్న నారీజనం వీరిని చూచి దుఃఖించింది.
ఆ కుమారులు నేరుగా వచ్చి ద్వార తోరణం మీద వున్న హనుమంతుని సమీపిస్తున్నారు. బాణవర్షంతో రాక్షసనందన మేఘాలు చుట్టుముట్టగా మబ్బు క్రమ్మిన మహాపర్వతం అయాడు మారుతి.
క్షణాల వ్యవధిలో నిర్మలాకాశంలో ప్రవేశించి వారి రథగమనాన్ని నిరోధించి, ఇంద్రధనుస్సుతో అలరారే మబ్బుల గుంపుతో క్రీడించే వాయువువలె కనిపించాడు.
ఆడుతూ ఆడుతూ కొందరిని పాదాలతో, కొందరిని అరికాళ్ళతో తన్ని నేలకూల్చి, మరికొందరిని పిడికిలి పోట్లతో, వాడిగోళ్ళతో హతమారుస్తూ, రొమ్ముతో తాడించి మరికొందరిని మట్టి కరిపించాడు.
నేల కూలినవారు కూలగా మిగిలిన సైనికులు భయభ్రాంతులై దిక్కులు పట్టిపోయారు.
హనుమంతుని ధాటికి తాళలేక ఏనుగులు రోధించాయి, గుర్రాలు విలవిలలాడాయి. రథాలు విరిగాయి, ధ్వజాలు ముక్కలయాయి. ఆ ప్రాణుల రక్తం నదీ ప్రవాహాన్ని తలపించింది.
లంకానగరం ఆర్తస్వరాలతో నిండింది.
హనుమంతుడు ప్రశాంతంగా తన ద్వారతోరణం మీద కూర్చుని రాబోయే రాక్షసులను నేల కూల్చడానికి ఎదురు చూస్తున్నాడు.
సేనాపతులు
No comments:
Post a Comment